breaking news
SPSR Nellore
-
‘అక్రమ కేసులు పెట్టడంలో పోలీసులు హుషారుగా ఉన్నారు’
నెల్లూరు జిల్లా: ఏపీలో లా అండ్ ఆర్డర్ను పక్కను పెట్టిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం హుషారుగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తల దగ్గర్నుంచీ మాజీ మంత్రులు వరకూ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని మండిపడ్డారు. కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటికి వెళ్లిన కాకాణి.. మీడియాతో మాట్లాడారు. ‘ కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం. ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పడం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు..అక్రమ కేసులు పెట్టటంలో హూషారుగా ఉన్నారు.. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా?, అక్రమ మైనింగ్ జరుగుతుంటే నే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా?, ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చూపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది’ అని ధ్వజమెత్తారు. -
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో యూనెక్స్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అండర్ – 15 పోటీలను శుక్రవారం ప్రారంభించారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎండీ వేమిరెడ్డి భాస్కర్రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, చౌదరి జ్యూవెలర్స్ ఎండీ రాజేష్ చౌదరి, 27వ డివిజన్ కార్పొరేటర్ మురహరి అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ పి.అంకమ్మ చౌదరి మాట్లాడుతూ 238 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయికి ఎంపికవుతారన్నారు. కార్యక్రమంలో అసోసియేన్ జాయింట్ సెక్రటరీ మద్దిపాటి ప్రసాద్రావు, ట్రెజరర్ గాధంశెట్టి శ్రీకాంత్, కోచ్లు, అంపైర్లు పాల్గొన్నారు. -
హామీలెప్పుడు నెరవేరుస్తారు?
● కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు’ అని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రశ్నించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తీక్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రూ.6,400 కోట్లను విడుదల చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లును పెంచాలన్నారు. అర్హులైన వారికి తల్లికి వందనం రూ.15 వేలు ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ డిగ్రీ కళాశాలను పునఃప్రారంభించాలని, ఎయిడెడ్ కొనసాగించాలన్నారు. యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే జీఓలను రద్దు చేయాలన్నారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా సంఘం ఆదేశాల ప్రకారం రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం నుంచి రెండురోజులపాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. శనివారం ఉదయం ప్రారంభోత్సవం, ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా క్రీడాకారులతోపాటు అధికారులు, అంపైర్లు హాజరవుతారని తెలిపారు. కావలిలో చైన్నె వాసి మృతికావలి(జలదంకి): చైన్నెకు చెందిన కమలనాథన్ అనే వ్యక్తి కావలి మండలం మద్దూరుపాడులో చనిపోయాడు. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. కమలనాథన్కు మతిస్థిమితం లేదు. కొంతకాలంగా మద్దూరుపాడు సమీపంలో ఉంటున్నాడు. ఎవరైనా ఆహారం అందిస్తే తింటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎన్హెచ్ – 16 పక్కన సర్వీసు రోడ్డులో పెట్రోల్ బంకు ముందు చనిపోయి ఉన్నాడు. మృతుడికి సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోంచి పడి..● గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత కొడవలూరు: రైల్లోంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై కె.వెంకటేశ్వరరావు కథనం మేరకు.. ఓ వ్యక్తి హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న రైల్లో నుంచి 184 – 3 – 5 పోస్టుల మధ్య ఎగువ లైన్ వద్ద ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయాడని భావిస్తున్నారు. అతని వయసు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఎరుపు రంగు టీషర్టు, నలుపు, తెలుపు రంగుల డిజైన్ కలిగిన షార్ట్ ధరించి ఉన్నాడు. -
‘కూటమి’ నిర్లక్ష్యం
● నిలిచిన రిటైనింగ్ వాల్ పనులు ● పైసా ఇవ్వని ప్రభుత్వం ● పేరుకుపోతున్న చెత్తాచెదారంనెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులకు నిధులు ఇవ్వడం లేదు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ప్రజాప్రతినిధులు మైకు ముందు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నాడు ఇలా.. పెన్నానది నుంచి నెల్లూరు సిటీ గుండా 20 కిలోమీటర్ల మేర సర్వేపల్లి కాలువ ఉంది. దీని ద్వారా 47 వేల ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతుంది. ఎక్కువగా నీరు, వరదలు వచ్చినప్పుడు కాలువ పొంగడం, గట్టుపై ఉన్న ఇళ్లకు ప్రమాదాలను నివారించేందుకు 2021 సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.99 కోట్ల అంచనాలతో రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. 0.6 కిలోమీటర్ శెట్టిగుంటరోడ్డు నుంచి 0.30 కి.మీ ముత్తుకూరు రోడ్డు బ్రిడ్జి వరకు కాలువకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇంత వరకు రూ.54.19 కోట్లు బిల్లులు చెల్లించగా 56 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇంకా 1.5 కి.మీ పని మిగిలి ఉంది. నిధులివ్వకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ కాలువ నిర్మాణానికి నయాపైసా విదల్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. పనులు పూర్తి కాకుండానే పంట కాలువకు నీరు వదలడంతో సిటీ పరిధిలో కాలువలో కొన్నిచోట్ల గండ్లు పడి ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పంటలకు నీరు వదిలినా మధ్యలో ఉన్న ఖాళీల్లో చెత్తాచెదారం విపరీతంగా చేరిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కాలువపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పనులు, ఆక్రమణలపై ఏఈ డి.మహేశ్వర్ స్పందిస్తూ కొత్తగా బాధ్యతలు చేపట్టాననని, ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రయోగశాలకు గుర్తింపు
నెల్లూరు(పొగతోట): నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు, సూచనలు అందించినందుకు నేషనల్ బోర్డు ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ గుర్తింపు దక్కింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్ ల్యాబ్కు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆనంద్ అభినందించారు. -
ఎన్ఐఓటీతో ఒప్పందం విద్యార్థులకు వరం
● వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ (ఎన్ఐఓటీ) మధ్య కుదిరిన ఒప్పందం విద్యార్థులకు వరమని వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని వీఎస్యూలో వీసీ ఇతర అధికారులతో కలిసి ఒప్పందానికి సంబంధించిన పత్రాలను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఎస్యూ, ఎన్ఐఓటీ మధ్య ఈనెల 20వ తేదీన ఒప్పందం కుదిరిందని చెప్పారు. మనిషి సముద్రంపై అవగాహన పెంచుకోవడంలో విఫలం చెందాడన్నారు. ఎన్నో ఖనిజాలకు నెలవైన సముద్రాన్ని అన్వేషించడం దేశ ఆర్థిక ప్రగతి మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలియజేశారు. గుజరాత్ రాష్ట్రం అత్యధిక తీర ప్రాంతంతో మొదటి స్థానంలో ఉంటే, మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. పరిశోధనలు ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ రూ.4,500 కోట్లతో సముద్రయాన్ పథకాన్ని రూపొందించారని, ఇది మైరెన్ బయాలజీ విభాగం విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా మారుతుందన్నారు. ఒప్పందం కింద మైరెన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. సమావేశంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, మైరెన్ బయాలజీ విభాగం హెడ్ డాక్టర్ హనుమారెడ్డి, సీహెచ్ వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు. -
కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినా నేరమే
సాక్షి, టాస్క్ఫోర్స్: బిట్రగుంట పోలీసులు భారతీయ న్యాయసంహితకు కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనల్లో భాగంగా శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినా నేరమేనంటూ వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం శుక్రవారం కలకలం రేపింది. జలదంకి మండలం అన్నవరం క్వారీలో డ్రోన్ ఘటన తర్వాత అధికార పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసినా, రోడ్డెక్కి రచ్చ చేసినా కన్నెత్తి చూడని ఖాకీలు, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినందుకు వైఎస్సార్సీపీ నాయకులను అదుపులోకి తీసుకోవడం, స్పష్టమైన కారణాలు చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘుతోపాటు పలువురు కార్యకర్తలను శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి ఏడు గంటల వరకూ విడిచి పెట్టలేదు, అదుపులోకి తీసుకోవడానికి సరైన కారణాలు చూపించలేదు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను భంగ పరిచేలా ఉదయం నుంచి రాత్రి వరకు అక్రమంగా అదుపులో ఉంచుకోవడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులను అదుపులోకి తీసుకోవడంపై పోలీసులను సంప్రదించగా అనుమతులు లేకుండా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల నోటీసులు దగదర్తి: మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎటువంటి ర్యాలీలు ధర్నాలు చేపట్టకూడదంటూ మండలంలోని వైఎస్సార్సీపీ నేతలకు ముందస్తుగా శుక్రవారం పోలీసులు నోటీసులు అందజేశారు. ఆ పార్టీ మండల కన్వీనర్ వెలినేని మహేష్నాయుడు, మండల ఉపాధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, తాళ్లూరి రాజశేఖర్ నాయుడు, తడకలూరు పంచాయతీ సర్పంచ్ ఆత్మకూరు గిరినాయుడుకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి, సోషల్ మీడియా వ్యక్తులపై అక్రమ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ కేసులకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దగదర్తి మండలంలో నిరసనలు ర్యాలీలు నిర్వహించకుండా ముందస్తుగా పోలీసులు స్థానిక వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు అందజేశారు. -
29 మంది ఎంఈఓలకు షోకాజు నోటీసుల జారీ
నెల్లూరు (టౌన్): జిల్లాలో 29 మంది ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎంఈఓలు ప్రతి రోజు ఉదయం 9 గంటల్లోపు ఫేస్ రికగ్నిషన్ యాప్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే గురువారం జిల్లాలో 29 మంది సమయానికి రికగ్నిషన్ యాప్లో హాజరు నమోదు చేసుకోకపోవడం డీఈఓ ఆర్.బాలాజీరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. రెండో రోజుల్లో వివరణ పంపాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38 మంది ఎంఈఓలు ఉన్నారు. వీరిలో 29 మంది సకాలంలో యాప్లో హాజరు నమోదు చేసుకోకపోవడం చూస్తే విధుల్లో వారికున్న చిత్తశుద్ధికి అద్దపడుతోంది. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన అధికారులే అలసత్వం ప్రదర్శించడంపై పలువురు మండి పడుతున్నారు. హెల్త్ కేర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరంలో రెండేళ్ల హెల్త్ కేర్ డిప్లొమా కోర్సులు చదివేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరుతోపాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అయితే లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోపు కళాశాల పనిదినాల్లో తమ దరఖాస్తులను అందజేయాలని కోరారు. దరఖాస్తు రుసుం రూ.100 ఉంటుందన్నారు. దరఖాస్తులు, ఇతర వివరాలకోసం ఎస్పీఎస్నెల్లూరు.ఏపీ.జీఓవీ.ఇన్/నోటీసు/రిక్రూట్మెంట్ అనే వెబ్సైట్లో పరిశీలించుకోవాలన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరుకావాలి నెల్లూరు (టౌన్): డీఎస్సీ–2025కు సంబంధించి వివిధ కేటగిరీల పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ను అందించనున్నట్లు డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వదంతులు, దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్, క్యాండిడెట్ లాగిన్లో విడుదల చేస్తారన్నారు. అక్రమ గ్రావెల్ రవాణాపై మైనింగ్ ఏడీ తనిఖీ దగదర్తి: మండలంలోని తిరువీధిపాడు గ్రామానికి చెందిన ఓ రైతు తమ పట్టా భూముల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం గ్రావెల్ తరలింపు ప్రదేశాన్ని మైనింగ్ ఏడీ వాణిశ్రీ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తిరువీధిపాడులో సర్వే నంబర్ 118లో స్థానిక రైతు మోపూరు భక్తవత్సలరెడ్డి చెందిన పట్టా భూమి ఉంది. తన భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఇటీవల స్థానిక పోలీసులకు, తహసీల్దార్, మైనింగ్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రావెల్ తరలింపును నిలిపివేయాలన్న ఆదేశాలిచ్చినా అక్రమార్కులు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ చేసేదేమీ లేక ఆ రైతు కలెక్టర్ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ ఏడీ గ్రావెల్ తరలింపు ప్రదేశాన్ని తనిఖీ చేసి ఎవరైనా ఈ భూమిలో గ్రావెల్ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తిరకాసు త్రాసు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో గల్లీ దుకాణం నుంచి సూపర్ మార్ట్ల వరకు సరుకుల తూకాల్లో మోసాలు పెరుగుతున్నా.. పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన తూనికలు కొలతల శాఖాధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు, ప్రొవిజన్ స్టోర్స్, ఇతర సరుకులు, బంగారం.. ఇలా తూకాలతో వ్యాపారాలు చేసే దుకాణాలు సుమారుగా 3.70 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే తూనికల కొలతల శాఖ గడిచిన ఐదేళ్ల లెక్కలు చూస్తే.. ఏడాదికి 200 మించి తుకాల్లో మోసాలపై కేసులు నమోదు చేయలేదంటే వీరి తీరును అంచనా వేయొచ్చు. వీరు నమోదు చేసిన కేసుల లెక్కలు చూస్తే అంతా ధర్మబద్ధంగా తుకాలు తూసి వినియోగదారులకు ఇస్తున్నట్లే అనుకోవాలా?. నెల్లూరు నగరంలోని ప్రధాన ఏసీ కూరగాయల మార్కెట్లో ఠక్కరి తూకాలకు పాల్పడుతున్న విషయం జగద్వితమే. ఇక చికెన్, మటన్, చేపల దుకాణాల్లో అయితే అంతకు మించి తుకాల్లో కేటుతనం చూపిస్తున్నారు. ఈ కోవలోనే పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ స్థాయిలో తుకాల్లో మోసాలు జరుగుతుంటే.. ఈ శాఖాధికారులు ఠంఛన్గా రూ.వేల్లో జీతాలు, వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ శాఖాధికారులు ప్రతి దుకాణాన్ని తనిఖీ చేయడంతో పాటు వారి నుంచి స్టాంపింగ్, కాంపౌండ్ ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే వీరికి టార్గెట్లు లేకపోవడంతో కార్యాలయాల్లో కుర్చీలకే పరిమితమై అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు. ఐదేళ్ల క్రితం స్టాంపింగ్, కాంపౌండ్ ఫీజులు ఎంత వసూలు చేశారో.. ఐదేళ్ల తర్వాత కూడా అంతే మొత్తంలో వసూలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఐదేళ్లలో వ్యాపార దుకాణాలు విస్తరణ జరగలేదా? లేక.. విధులు వదిలేసి లంచాలతో విలాసాలు చేస్తున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఆప్షన్స్’తో గోల్మాల్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లో మొత్తం నాలుగు ఆప్షన్లు ఉంటాయి. కిలోకు 100–150 గ్రాముల తక్కువగా ఉండేలా సెట్ చేస్తున్నారు. ఎవరైనా కేజీ సరుకు అడిగితే.. తూకం మెషిన్లో కేజీకి మించి మొగ్గుగా చూపిస్తారు. ధర్మకాటాలో తూస్తే 850–900 గ్రాములే బరువు ఉంటుంది. అదే మెషిన్పై కిలో నికర బరువు ఉంచితే 1100–1150 గ్రాములు చూపుతోంది. అంటే ఏ రకంగా వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారో అర్థమవుతోంది. ప్యాకింగ్లో సైతం మార్కెట్లో లభించే వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లు కూడా నిర్దేశించిన బరువు కంటే తక్కువగా ఉంటున్నాయి. లీటర్ ప్యాకేజ్డ్ నిబంధన ప్రకారం 910 మి.లీ. ఉండాలి. కానీ 800–850 మి.లీ. మించడం లేదు. ఇక ఐదు లీటర్ల ప్యాకేజ్డ్ బాటిల్లో 200–280 గ్రా. 15 లీటర్ల ప్యాకేజ్డ్ డబ్బాలో 250–300 మి.లీ.తక్కువగా ఉంటుంది. పసిడి తూకంలోనూ మోసం నగరంలోని పెద్ద పెద్ద దుకాణాల్లో మినహా మిగతా సాధారణంగా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటారు. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్ల బంగారంతో మాత్రమే ఉంటుంది. వ్యాపారులు 18 క్యారెట్ల ఆభరణాన్ని వినియోగదారులకు 22 క్యారెట్లకు బిల్లు వసూలు చేస్తున్నారు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.700 వరకు తేడా ఉంటుంది. ఈ లెక్కన కనీసం 10 గ్రాములకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు మోసం చేస్తున్నారు. బంగారం తూచే ఎలక్ట్రానిక్ కాటాల వెను త్రాసును నియంత్రించే వీల్స్ బేరింగ్లను మార్పు చేసే అవకాశం ఉంటుంది. బంగారం నాణ్యతను తెలిపే మెషిన్ లేకపోవడంతో వినియోగదారులు మోసాలకు గురవుతున్నారు. ఆర్టీసీ పార్శిల్ విభాగంలో.. ఆర్టీసీ ఆన్లైన్ పార్శిల్ విభాగంలో కూడా మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా పార్శిల్ పంపుకొవాలంటే కేజీల వంతున వసూలు చేసే వారు. దీంతో అక్కడ వెయింగ్ మెషిన్లో భారీగా తేడాలు ఉంచి మోసం చేస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు చేస్తే విస్తుపోవాల్సి వచ్చింది. 50 కేజీల బరువు ఉన్న లగేజీ 60 కిలోలు చూపించింది. ఇలా తూకం ఎక్కువగా చూపించి మోసం చేయడం వెలుగులోకి వచ్చింది. నగరంలో వస్తు విక్రయాల్లో నిలువు దోపిడీ నిండా మునుగుతున్న వినియోగదారులు సాధారణ కాటా, ఎలక్ట్రానిక్ మెషీన్లలోనూ చేతివాటం తూచేది కేజీ.. ఉండేది 850 గ్రాములే ప్యాకింగ్ సరుకుల్లోనూ అంతే.. గల్లీ దుకాణం నుంచి సూపర్ మార్ట్ల వరకు మోసాలు ఫిర్యాదులు వస్తేనే తనిఖీలు తూకాల్లో మోసానికి కాదేది అనర్హం అన్నట్లుగా నిత్యావసర సరుకుల నుంచి నిత్యం వినియోగించే ఆహార పదార్థాల వరకు, ఆఖరికి బంగారం తూకంలోనూ వ్యాపారులు మోసాలకు తెగబడుతున్నారు. నెల్లూరు నగరంలో కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసినా, మాంసం, చేపలు తీసుకున్నా కాటాల్లో కేటుతనం చూపిస్తున్నారు. ప్యాక్డ్ నూనె, పప్పులు, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్లోనూ అదే గోల్మాల్. సాధారణ త్రాసుల్లోనూ, ఎలక్ట్రానిక్ మెషీన్లలోనూ సెట్టింగ్లు చేసి వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తేనే అధికారులు తనిఖీలకు వెళ్తున్నారు. మొదటిసారి పట్టుబడితే జరిమానా, మళ్లీ పట్టుబడితే కేసులంటూ హెచ్చరిస్తున్నా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కేసులే కానీ.. శిక్షల్లేవ్.. తూకాల్లో మోసం, నిబంధనల ఉల్లంఘనలపై మొదటి సారి జరిమానా విధిస్తారు. అదే తప్పు తిరిగి చేస్తే కేసు నమోదు చేసి కోర్టుకు సిఫార్సు చేస్తారు. కోర్టు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే కొన్నేళ్లలో తూనికలు కొలతల శాఖ అధికారులు నమోదు చేసిన కేసుల్లో ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవంటే వీరు నమోదు చేసే కేసులు కోర్టు వరకు వెళ్లకుండానే అమ్యామ్యాలతో మాఫీ చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక వేళ ఒకటీ.. అరా కోర్టు వరకు వెళ్లి కేసుల్లోనూ మోసగాళ్లకు శిక్ష పడకుండా కేసును నీరుగార్చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తక్కువ తూకం వేస్తే తూనికలు, కొలతల శాఖ ఎన్ఫోర్స్మెంట్ 2009 యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం కనీసం రూ.1000 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. ప్యాకేజీ కమోడిటి యాక్ట్ 30 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా వేస్తారు. లక్షల్లో దుకాణాలు.. రెండొందలు దాటని కేసులు జిల్లాలోపెద్ద, చిన్న చితకా వ్యాపార సంస్థలన్ని కలిపి దాదాపు 3.70 లక్షల దుకాణాలు ఉంటే.. ఒక్క నెల్లూరు నగరంలోనే సుమారు 1.50 లక్షలకు పైగా ఉంటాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి మోసాలను అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖ అధికారులపై ఉంది. అయితే వీరు సుమోటోగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాల్సి ఉండగా, తమ విధులకు స్వస్తి చెప్పి.. కార్యాలయాల్లో కూర్చొని అవినీతి మత్తులో తూగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలుదారులు ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తున్నారనేదానికి గడిచిన ఐదేళ్లలో వీరు నమోదు చేసిన కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. సం శ్రీశ్రీ స్టాంపింగ్ ఫీజు కాంపౌండ్ ఫీజు డబ్ల్యూఅండ్ఎం ప్యాకింగ్ మొత్తం (రూ.ల్లో) (రూ.ల్లో) కమోడిటి 2019–20 75,73,840 26,01,100 114 75 189 2020–21 83,63,610 26,78,500 108 46 154 2021–22 92,90,566 24,25,000 195 56 251 2022–23 80,39,852 21,72,000 201 48 249 2023–24 95,85,701 26,92,500 123 84 207 -
మీటర్ పెట్టినా షాకే
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తాము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే చార్జీలు తగ్గిస్తామని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకరిస్తున్నామని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగుల కొట్టండని గతంలో చంద్రబాబు, లోకేశ్లు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక సర్ చార్జీలు, టూఅప్ చార్జీలు (ఇంధన సర్దుబాటు చార్జీలు) పేరుతో మూడేళ్ల క్రితం వాడుకుని చెల్లించిన విద్యుత్ ల్లులకు తాజాగా విద్యుత్ చార్జీలు అమాంతం పెంచి రూ. వేల కోట్లు భారం వేసి ప్రజల నడ్డి విరుస్తోంది. వాడుకున్న విద్యుత్ కంటే ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో వచ్చే బిల్లులే ఎక్కువ కావడంతో ప్రజలు షాక్కు గురవుతున్నారు. గతంలో చెప్పిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వేగవంతం చేస్తోంది. ఈ మీటర్లు పెట్టుకుంటే రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టారిఫ్, మధ్యాహ్నం నుంచి ఒక టారిఫ్, సాయంత్రం నుంచి మరో టారిఫ్లతో బిల్లుల మోత మోగుతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న వారు కరెంట్ కావాలంటే ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త మీటర్లకు చార్జీలు భారీగా పెంపు ఈ షాక్లు ప్రజలకు సరిపోవన్నట్లుగా ప్రభుత్వం ప్రజలపై మరో పెద్ద షాక్ వేసింది. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్ కావాలనుకునే ప్రజలకు ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి. నూతనంగా విద్యుత్ సర్వీసు కావాలనుకుంటే గృహ వినియోగదారులు కేటగిరీ–1లో ఒక కిలో వాట్ విద్యుత్ కనెక్షన్కు గతంలో రూ.1,850 ఉంటే ఇప్పుడు రూ.4150లకు పెంచారు. రెండు కిలో వాట్కు అయితే రూ.3,750 నుంచి రూ.7,800 వరకు పెంచేసింది. వ్యాపార, వాణిజ్య వినియోగదారులు కేటగిరీ–2లో ఒక కిలో వాట్కు రూ.2,250 ఉంటే.. ఇప్పుడు రూ.5,300 వరకు పెంచటం జరిగింది. అదే రెండు కిలో వాట్కు రూ.4,500 నుంచి రూ.9,800 వరకు పెంచారు. గతంలో నూతన విద్యుత్ సర్వీసు కనెక్షన్ కోసం ప్రజలు విద్యుత్ సంస్థకు చెల్లించే రుసుం కంటే ప్రస్తుతం వంద రెట్లకు పైగా వసూలు చేస్తుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ పరిణామాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. సామాన్యులపై కూటమి ప్రభుత్వం మరో భారం ట్రూఅప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లతో ఇప్పటికే దోపిడీ తాజాగా కొత్త మీటర్లకు వంద శాతం పైగా పెంపు -
అశ్వవాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి
వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో కొలువైన భగవాన్ వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం వెంకయ్యస్వామి ఆలయంలో నిత్య పూజలనంతరం స్వామి వారిని అశ్వవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూలాలంకరణ చేశారు. భక్తులు భుజాలపై స్వామి వారిని ఆలయం చుట్టూ తిప్పారు. ఆ తర్వాత ట్రాక్టర్పై స్వామి వారిని ఆశీనులను చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతినిచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ గ్రామోత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. ఉత్సవం ముందు మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులు భారీగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అశ్వవాహనసేవకు నెల్లూరుకు చెందిన గుదె శ్రీధర్, అరుణమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కనుల పండవగా పెదశేష వాహన సేవ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పెద శేష వాహనసేవ నిర్వహించారు. స్వామివారిని పెద శేషవాహనంపై ఆశీనులను చేసి విద్యుద్దీపాలంకరణ చేశారు. పెదశేష వాహనసేవ గొలగమూడి వీధుల్లో వేడుకగా సాగింది. ఉత్సవం వెంట భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో నేడు వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. -
వీరందరూ అనర్హులంట..
కాలు, చేయి విరిగిన వారు.. శరీరం కాలినా.. మానసిక వికలత్వం కలిగినా.. బధిరులు.. ఇతర వైకల్యం ఉన్న వారిని పింఛన్లకు అనర్హులుగా ప్రకటించారు. వీరెవర్ని కదిలించినా ఆవేదనే కనిపిస్తోంది. అనర్హుల ఏరివేత పేరిట తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చారనే వేదన వీరి నుంచి వ్యక్తమవుతోంది. పరిశీలన వివరాలు గోప్యం జిల్లాలో 3.16 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా, వీరికి ప్రతి నెలా రూ.130 కోట్లకుపైగా అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులు 33 వేల మంది ఉండగా, వీరందరికీ నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. పరిశీలన అనంతరం వివరాలను గోప్యంగా ఉంచారు. చివరికి ప్రభుత్వం ఆదేశించడంతో అనర్హుల జాబితాను విడుదల చేశారు. పది నుంచి 20 ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న వారికి మొండిచేయి చూపారు. ● సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి సుమారు 832 మంది దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ నోటీసులను జారీ చేశారు. ● ఉదయగరి నియోజకవర్గంలో దివ్యాంగ పింఛన్లు 4672 ఉండగా, ఇందులో 996ను తొలగించారు. -
సుస్థిరాభివృద్ధే ధ్యేయం
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అవసరమైన చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సూచించారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎమ్సీఓలు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా సీడీజీఎస్ను విభజించారని, దీనికి తగిన విధంగా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారని వెల్లడించారు. పంచాయతీల పనితీరును కేంద్ర ప్రభుత్వం అంచనా వేసేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్ను రూపొందించారని, సమాచారాన్ని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని ఆధారంగా పంచాయతీలను అవార్డులకు ఎంపిక చేయనున్నారని తెలిపారు. జెడ్పీ సీఈఓ మోహన్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మా పొట్ట కొట్టొద్దు’
సోమశిల: కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని నేతలు అన్నారు. అనంతసాగరం మండల కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఆటో కార్మికుల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి రాజా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోల్లో ప్రయాణించే వారు తగ్గిపోయారన్నారు. కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించాలని ప్రశ్నించారు. వాహనమిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేశ్ పాదయాత్ర సమయంలో ఆటో కార్మికులతో నడిచి కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వాలన్నారు. ఆ సంఘం గౌరవాధ్యక్షుడిగా అన్వర్బాషా, అధ్యక్షుడిగా నాయబ్ జానీ, కార్యదర్శిగా మస్తాన్ నియమితులయ్యారు. -
నాడొకమాట.. నేడు మరోమాట
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టాలని నాడు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని ఏర్పాటు చేస్తున్నారు. నాడొకలా.. నేడు మరోలా వ్యవహరిస్తున్నారు’ అని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్లో గురువారం వామపక్షాలు, పలు ప్రజాసంఘాల నాయకులు విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, సీపీఐ ఎంఎల్ నాయకుడు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూ.15,500 కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయొద్దని విద్యుత్ శాఖ మంత్రి ఆదేశాలిచ్చినా అదానీ, విద్యుత్ సిబ్బంది దొంగచాటుగా మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ధర రూ.2.40లకు కొంటే టీడీపీ గగ్గోలు పెట్టారన్నారు. నేడు అదే యూనిట్ విద్యుత్ను రూ.3.60లకు కొంటున్నారన్నారు. టీడీపీకి రూ.40 కోట్లు కరేడు గ్రామంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కు చెందిన ఇండోల్సోల్ సోలార్ కంపెనీకి 8,400 ఎకరాల భూమిని అప్పగించేందుకు వారు బాండ్స్ రూపంలో టీడీపీకి రూ.40 కోట్లు అందజేసినట్లు నేతలు ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి సింగిల్ఫేజ్ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.9 వేలు, త్రీఫేజ్ వినియోగదారుల నుంచి రూ.14 వేలు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసే పోరాటాలకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో ప్రజల నుంచి సంతకాల సేకరణ, సదస్సులు, సభలు నిర్వహిస్తామన్నారు. నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, పుల్లయ్య, శ్రీరాములు, వెంకమరాజు, షాన్వాజ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడిన నేతలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం -
పాలనను గాలికొదిలి.. కక్షసాధింపులకే పరిమితం
● వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ● అక్రమ కేసులపై డీఎస్పీకి వినతిపత్రం అందజేత నెల్లూరు(క్రైమ్): పాలనను కూటమి ప్రభుత్వం గాలికొదిలి.. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. పార్టీ నేతలపై జిల్లాలో అక్రమ కేసులు బనాయిస్తున్న విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు గానూ జిల్లా పోలీస్ కార్యాలయానికి కారుమూరితో పాటు పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వెంకటగిరి, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య గురువారం వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డీటీసీ డీఎస్పీ గిరిధర్రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే అక్రమ కేసులు, అరెస్ట్లను కొనసాగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇటీవల చేపట్టిన జిల్లా పర్యటనలో పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు పన్నిన కుట్రలు అందరికీ తెలిసినవేనన్నారు. ఆయన్ను కలిసేందుకు వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను బనాయించారని మండిపడ్డారు. ప్రశాంతమైన జిల్లాలో కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలు కూటమి పెద్దలు సూచించిన తమ పార్టీ నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారని చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల చేతుల్లో పోలీస్ శాఖ కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా తమ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేసి కిందపడేసి.. తిరిగి వారిపైనే కేసులు బనాయించడం సిగ్గుచేటని విమర్శించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, అనిల్కుమార్యాదవ్ ఇలా ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తమపైనా ఎక్కడ కేసులు పెడతారోనని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, పోలీసులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. -
కమిషనర్ x శానిటరీ ఇన్స్పెక్టర్
టేస్ట్ అదుర్స్ కూల్డ్రింక్స్కు డిమాండ్ ఎక్కువ. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ బ్రాండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు సెంట్రల్ జైల్ రహదారి సమీపంలో జనం పడేసిన బాటిళ్లను వానరాలు తీసుకుని ఆఖరిబొట్లు ఆస్వాదిస్తుండగా తీసిన చిత్రాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు కందుకూరు: కందుకూరు మున్సిపాలిటీలో కమిషనర్ కె.అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్యల మధ్య విభేదాలు బజారుకెక్కాయి. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దళితుడినని కమిషనర్ కక్ష కట్టి వేధిస్తున్నారని, నాలుగు నెలల నుంచి విధుల్లో ఉన్నా.. లేనట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు కొండయ్య ఆరోపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే.. ‘రోజూ పారిశుధ్య కార్మికుల హాజరు కూడా తీసుకుంటున్నా. ఇంకా పట్టణంలో పారిశుధ్య పనులు కూడా చేయిస్తున్నాను. అయితే కమిషనర్ చెప్పినట్లు తలాడించడం లేదనే కారణంతో ఇబ్బందులు పెడుతున్నారు. మేనేజర్ చంద్రమౌళి రోజువారి హాజరుపట్టీలో నేను సంతకాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. రిజిస్టర్ ఇచ్చే ప్రసక్తే లేదని, దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. విధుల్లో లేకపోతే రోజూ కార్మికుల వద్ద హాజరు ఎలా తీసుకుంటున్నా?. నా వద్ద ఉండే రిజిస్టర్లో సంతకాలు ఎలా చేస్తా’ అని కొండయ్య ప్రశ్నిస్తున్నారు. ఇదీ వివాదం మున్సిపాలిటీలో గతేడాది సెప్టెంబర్ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్గా దారా కొండయ్య పనిచేస్తున్నారు. మే నెలలో ఆయన్ను గుడూరు మున్సిపాలిటీకి డిప్యుటేషన్ వేశారు. ఉత్తర్వులను తీసుకునేందుకు కొండయ్య నిరాకరించడంతో తన గదికి అంటించారు. అయితే డిప్యుటేషన్ తనకు తెలియకుండా వేశారని, కమిషనర్ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని భావించిన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు డిప్యుటేషన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయన తిరిగి కందుకూరు మున్సిపాలిటీలోనే కొనసాగించే విధంగా మున్సిపల్ శాఖ డీఎంఏ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కమిషనర్ కూడా రీ జాయిన్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆయన్ను శాఖాపరమైన వాట్సప్ గ్రూపుల నుంచి తొలగించారు. అలా చేయడంతో రోజూ ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం లేదని కొండయ్య చెబుతున్నారు. ఉన్నతాధికారుల వద్ద తేల్చుకుంటా.. కమిషనర్, మేనేజర్ తీరు వల్ల ఏప్రిల్ నెల నుంచి జీతాలు రావడం లేదని, దీనిపై ఇప్పటికే మున్సిపల్ శాఖ డీఎంఏకి, ఆర్డీకి ఫిర్యాదు చేశానని కొండయ్య చెబుతున్నారు. వారు ప్రశ్నించడంతో విధుల్లో లేనట్లు రెండు రోజుల క్రితం తన చేతిలో కాగితం పెట్టారంటున్నారు. వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. పారిశుధ్య పనులకు సంబంధించిన వస్తువులు వంటి తాను ఇవ్వాల్సి ఉందని, కానీ సంబంధం లేకుండా అనధికారికంగా ఇంజినీరింగ్ సెక్షన్లో అడ్మిన్ సెక్రటరీగా పనిచేసే బాలాజీ అనే ఉద్యోగితో చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి పనులు చేయనందుకే తనను వేధిస్తున్నారని చెప్పారు. తీవ్ర ఇబ్బందులు నాలుగు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె చికిత్స కూడా డబ్బుల్లేని పరిస్థితి ఉందన్నారు. కందుకూరులో ఉంటున్న గదికి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం కార్మికుల హాజరు తీసుకుని భవనంలోని ఓ గదిలో ఉంటున్నట్లు వాపోయారు.మున్సిపల్ కార్యాలయం మున్సిపాలిటీలో అంతర్గత పోరు ఇన్స్పెక్టర్ కొండయ్యపై కక్ష సాధింపునకు దిగిన కమిషనర్ నాలుగు నెలలుగా జీతం రాకుండా కొర్రీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు దళితుడైనందునే ఇలా చేస్తున్నారని బాధితుడి ఆరోపణ -
సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తాం
● నెల్లూరు, ప్రకాశం డీసీహెచ్ఎస్లు ● ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాల పరిశీలన ● సమయపాలన పాటించడం లేదని ఆగ్రహంఉలవపాడు: వైద్యులు, సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తామని నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైద్యవిధాన పరిషత్ కో–ఆర్డినేటర్లు పరిమళ, శ్రీనివాస నాయక్ హెచ్చరించారు. ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలను గురువారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆగ్రహించారు. రికార్డులను పరిశీలించారు. వైద్యశాల పనితీరు ఎలా ఉందని స్థానికులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని వారు డీసీహెచ్ఎస్లకు తెలియజేశారు. 8 మంది వైద్యులున్నా అధిక శాతం మంది సెలవులోనే వెళ్లారని, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. సెలవులు ఒకేసారి ఇంతమందికి ఎలా ఇస్తారని అడిగారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన చాలా దారుణంగా ఉందన్నారు. రాత్రివేళ సిబ్బంది కనిపించడం లేదు రాత్రివేళ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది వార్డులో ఉండకుండా వెళ్లి రూమ్లో పడుకుంటున్నారని.. వారిని లేపే సరికి దాదాపు 15 నిమిషాలు పడుతుందని రోగులు తెలియజేశారు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో వైద్యాధికారులుగా శోభారాణి, సతీష్లు ఉన్నప్పుడు వైద్యశాల బాగుంది. తర్వాత నుంచి పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు స్థానికులు తెలియజేశారు. ఇక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్ట్ మెటర్నటీ లీవ్ పెట్టి వెళ్లారు.. కానీ కందుకూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మాత్రం పనిచేస్తున్నట్లు తెలిపారు. వీటిపై అధికారులు డాక్టర్లను ప్రశ్నించగా వారు మౌనం వహించారు. దీంతో డీసీహెచ్ఎస్లు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరిగితే సహించేది లేదని సస్పెండ్ చేస్తామన్నారు. వారంరోజుల్లో మళ్లీ తనిఖీకి వస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరు కోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు హరీష్, చిన్నపిల్లల వైద్యనిపుణులు ప్రదీప్కుమార్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు. -
డ్రోన్తో విజువల్స్.. ఐదుగురిపై కేసు నమోదు
కావలి (జలదంకి): జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద డ్రోన్తో విజువల్స్ తీస్తూ కావలి ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారనే కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇస్కారపు వేణు, గోళ్ల వినోద్కుమార్, దామెర్ల శ్రావణ్కుమార్, ఆత్మకూరు రాజేష్, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డికి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డికి రాజకీయ శత్రుత్వం ఉంది. దీంతో కృష్ణారెడ్డిని హతమార్చాలని ఏ5 ప్రతాప్కుమార్రెడ్డి ఆదేశాల మేరకు ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులు అన్నవరం క్వారీ వద్ద ఎమ్మెల్యే రాకను గమనించి అంతమొందించాలని డ్రోన్తో పరిశీలిస్తుండగా క్రషర్లో పని చేసే ఏడుకొండలతో పాటు సిబ్బంది డ్రోన్ను పసిగట్టి అడ్డుకున్నారు. దీంతో నలుగురు నిందితులు క్రషర్ సిబ్బందిపై కత్తులు, రాళ్లతో దాడులు చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. జలదంకి ఎస్సై లతీపున్నీసా ఏ1, ఏ2 నిందితులైన వేణు, వినోద్లను బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జమ్మలపాళెం వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్ నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ కళాశాలల కన్వీనర్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అడ్మిషన్లకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 27వ తేదీలోపు ఏదైనా ఐటీఐలో సర్టిఫికెట్లు ధ్రువీకరణ చేయించుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐని సంప్రదించాలన్నారు.విద్యార్థిని మృతిపై ఫోర్ మెన్ కమిటీ నియామకం● విచారించి వారంలో నివేదిక ఇవ్వాలన్న కలెక్టర్నెల్లూరు (టౌన్): నగరంలోని అన్నమయ్య సర్కిల్లో ఉన్న ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్య ఘటనపై ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. విద్యార్థిని మృతిపై విచారించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆనంద్ బుధవారం ఫోర్మెన్ కమిటీని నియమించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ కార్పొరేషన్ (ఎంఐసీ) పీడీ, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి, డీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులను కమిటీలో సభ్యులుగా నియమించారు. విద్యార్థినీ హేమశ్రీ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి వారంలోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.‘సాక్షి’ కథనంపై సుమోటోగా తీసుకున్న హైకోర్టుఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థినీ హేమశ్రీ మృతిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థినీ మృతిపై రాష్ట్ర ఇంటర్ బోర్డు, జిల్లా శిశు సంక్షేమ శాఖ, లోక్ అదాలత్, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శాఖల అధికారులకు నోటీసులు జారీ చేశారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వీడియోల సాక్ష్యాలను అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం.సీతారామపురం తహసీల్దార్ సస్పెన్షన్సీతారామపురం : సీతారామపురం తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 68–5లోని సమస్యాత్మకమైన 0.40 సెంట్ల భూమిని నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేశారనే ఆరోపణపై కలెక్టర్ విచారణ జరిపి తహసీల్దార్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. సదరు సర్వే నంబర్ 68–5లో తోట నరసింహులుకు చెందిన 0.81 సెంట్ల భూమి కోసం అతని సంబంధీకులైన ఇరువర్గాల వారి మధ్య కొంత కాలం నుంచి విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేశారని ఆరోపిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రస్తుత ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడని, అటువంటి నీచ సంస్కృతిని విడనాడకపోతే అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతామని కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ జరుగుతుండడంతో విజువల్స్ తీసేందుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకుని, దారుణంగా హింసించడమే కాకుండా వారిని హంతుకులుగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బరి తెగింపునకు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. సౌమ్యుడు, మితభాషి అయిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నీచ సంస్కృతి, రౌడీ రాజకీయం చేసే నీలాంటి వాడిని చంపించే ప్రయత్నం చేశారంటూ నువ్వు చేస్తున్న ప్రచారం చూసి నియోజకవర్గ ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. కుట్రలకు, కుతంత్రాలతో ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడానికి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని బయట పెట్టాలకున్న సోషల్ మీడియా సభ్యులను కొట్టి, వారి చేతుల్లో కత్తులు పెట్టించి బెదిరించి ప్రతాప్కుమార్రెడ్డి పంపిస్తే కృష్ణారెడ్డిని చంపడానికి వచ్చామని వీడియో రికార్డు చేయించారన్నారు. పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి మాట్లాడుతూ కావలిలో ఏదో జరిగిపోయింది, ఎమ్మెల్యేపై హత్యాయత్నం అంటూ అంబేడ్కర్ విగ్రహం వద్ద కొంత మంది ఏడుపులు, పెడబొబ్బలు పెట్టారని, అసలు జరిగింది తెలుసుకోకుండా, పోలీసులు విషయాన్ని తెలపకుండానే నలుగురు చిడతల విలేకరులు స్క్రోలింగ్ పెడితే అదే వాస్తవమని ఇలా దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నా రో తెలుసుకోవాలన్నారు. ముసునూరు మనీ స్కాంలో ఎమ్మెల్యేకు ఎంత ముడుపులు అందాయో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఇసుక దందా, రేషన్ దందా ఎలా నిర్వహిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి అవినీతి దందాలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి నిత్యం ఎండగడుతుండడంతో ఎమ్మెల్యే అసహనంతో ఊగిపోతూ వీధి రౌడీలా మాట్లాడిన మాటలను ప్రజలను తెలుసుకున్నారన్నారు. జలదంకిలో డ్రోన్ సాయంతో అక్రమ మైనింగ్పై విజువల్స్ తీసిన అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం చూస్తుంటే రక్తచరిత్ర సినిమాను మించి దర్శకత్వం చేసినట్లు ఉందన్నారు. మాజీ ఎంపీపీ మహేశ్వరమ్మ మాట్లాడుతూ అధికారం నీటి బుడగతో సమానం అని, కక్ష రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పార్టీ నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి వెంకటనారాయణ, మద్దిబోయిన వీరరఘు, వాయిల తిరుపతి, నెల్లూరు వెంకటేశ్వర్లురెడ్డి, పరుసు మాల్యాద్రి, కుందుర్తి కామయ్య, కనపర్తి రాజశేఖర్, చైతన్య, మహేష్నాయుడు, దండే కృష్ణారెడ్డి, బీద రమేష్, కొమారి రాజు, చెన్ను ప్రసాద్రెడ్డి, నాగాచారి, ఏగూరి పుల్ల య్య, గుడ్లూరి మాల్యాద్రి, ఏసుదాస్, శశిధర్, జీవీ, గిరి, చల్లా శ్రీనివాసులరెడ్డి, కళ్యాణి పాల్గొన్నారు. ప్రతాప్కుమార్రెడ్డి వ్యక్తిత్వం, కృష్ణారెడ్డి వైఖరి ఏమిటో అందరికీ తెలుసు దాడులు, అక్రమ కేసులే టీడీపీ పాలనా విధానం అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతాం అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధం -
నిధుల గోల్మాల్పై డీఎల్పీఓ విచారణ
సీతారామపురం: మండలంలో విధులు నిర్వహిస్తూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ రూ.11 లక్షలకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 2న ‘సాక్షి’లో ‘నిధుల గోల్మాల్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జెడ్పీ సీఈఓ మోహన్రావు ఆత్మకూరు డీఎల్పీఓ టి.రమణయ్యను విచారణ అధికారిగా నియమించారు. ఆయన బుధవారం సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టారు. నిధులకు సంబంధించి జరిపిన బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను పరిశీలించారు. బిల్లులు, ఓచర్లు, ఎవరితో నగదు డ్రా చేయించారు తదితర విషయాలతోపాటు, కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలపై కూడా ఆరా తీసి సమగ్ర వివరాలు సేకరించారు. తుది నివేదికను జెడ్పీ సీఈఓకు అందిస్తామన్నారు. అనంతరం అయ్యవారిపల్లి, బసినేనిపల్లి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయనతోపాటు ఎంపీడీఓ సాయిప్రసాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
అభిమానాన్ని అడ్డుకోలేని ఆంక్షలు
● జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి విడుదల ● బయటకు వచ్చాక అడుగడుగునా అభిమానుల కోలాహలం వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి 86 రోజుల తర్వాత బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు సోమవారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ గూడూరు కోర్టు నుంచి బెయిల్ మంజూరు పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో మంగళవారం జైలు నుంచి విడుదల కాలేకపోయారు. మంగళవారం కాకాణి జైలు నుంచి విడుదలవుతారని తెలియడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వస్తారని పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయినప్పటికీ ముఖ్యనేతలతోపాటు అభిమానులు జైలు పరిసర ప్రాంతాలకు చేరుకుని సాయంత్రం 6.30 గంటల వరకు ఎదురు చూశారు. అయితే సాంకేతిక కారణాలతో విడుదల జాప్యం జరగడంతో కాకాణి బుధవారం విడుదలవుతారని తెలియయడంతో నిరాశగా వెనుతిరిగారు. అయితే బుధవారం ఉదయం 8 గంటల అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తదితరులు వేలాది మంది జిల్లా సెంట్రల్ వద్దకు చేరుకున్నారు. జైలుకు వెళ్లే రోడ్డు మార్గాల్లో వేలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు చేరుకోవడాన్ని చూసి పోలీసులు ముఖ్య నేతలను మినహా, మిగతా అందరిని జైలు పరిసర ప్రాంతాల్లో లేకుండా తరిమేశారు. కాకాణి బయటకు రావడంతో.. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉదయం 10.20 గంటలకు జైల్లో నుంచి బయటకు రావడంతో అంత వరకు ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులు పోలీసుల ఆంక్షలను దాటుకుని జయహో గోవర్ధనన్న, జై జగన్, జై కాకాణి అంటూ నినాదాలు హోరెత్తించారు. కాకాణిని నాయకుల భుజాలపైకి ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నంత సేపు అనేక ఆంక్షలు విధించిన పోలీసులు, ఒక్కసారిగా వచ్చిన అభిమానాలను చూసి అడ్డుకోలేకపోయారు. కాకాణి గోవర్ధన్రెడ్డి తన కుమార్తె పూజిత, మనుమడు, ఇతర కుటుంబ సభ్యులతోపాటుగా, వైఎస్సార్సీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. జైలు వద్ద నుంచి కారులో బయలుదేరిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి దారిపొడవునా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానాలు ఆత్మీయ స్వాగతం చేశారు. కొందరు శాలువాలతో సన్మానించారు. జైలు వద్ద నుంచి నక్కలకాలనీ, మీదుగా, జాతీయ రహదారిపై కారులో వెళుతూ ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరునా పలకరిస్తూ వెళ్లారు. -
కల్వర్టును ఢీకొన్న బొలెరో
లింగాలఘణపురం: బొలెరో అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో దంపతులు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడిన ఘటన జనగామ – సూర్యాపేట జాతీయ రహదారి 365పై జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం వడ్లపూడికి చెందిన దద్దోజు సురేశ్ (35), దివ్య దంపతులు (32), కుమారుడు మోక్షజ్ఞ, కుమార్తె లోక్షణతో కలిసి స్వగ్రామం నుంచి బొలెరోలో తాను పని చేసే కరీంనగర్కు బయల్దేరారు. ఈ క్రమంలో నిద్రమత్తులో సురేశ్ డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి వడిచర్ల సమీపంలో కల్వర్టును ఢీకొంది. ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లలు స్వల్పంగా గాయపడటంతో 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కరీంనగర్లోని ఓ గ్రానైట్ కంపెనీలో సురేశ్ పనిచేస్తున్నారని సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా, ఏమి జరిగిందో తెలియని స్థితిలో ఉన్న ఆ చిన్నారులను చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. విషయాన్ని చెప్పలేక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సను అందిస్తున్నారు. -
పోర్టు ఆధారిత పరిశ్రమలతో ఉపాధి
● కలెక్టర్ ఆనంద్ కందుకూరు: రామాయపట్నం పోర్టు ఆధారంగా ఏర్పడుతున్న పరిశ్రమలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గుడ్లూరు మండలం చేవూరు పరిధిలో ఏర్పాటైన ఇండోసోల్ కంపెనీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములిచ్చిన రైతు కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఇండోసోల్, బీపీసీఎల్ కంపెనీల ఏర్పాటుతో స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. ఇండోసోల్ కంపెనీలో 68 మందికి ఉద్యోగాలను ప్రస్తుతం కల్పిస్తున్నారని తెలిపారు. ఇతరులకు సైతం వారి విద్యార్హత ఆధారంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించనున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడారు. కాకినాడ, విశాఖపట్నం పోర్టుల తరహాలో రామాయపట్నం పోర్టూ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి ఇండోసోల్ కంపెనీలో ఉద్యోగాల కోసం అర్హత గల యువత దరఖాస్తు చేసుకోవాలని, వీటిని కంపెనీ కార్యాలయం లేదా ఈ మెయిల్కు పంపొచ్చని సంస్థ హెచ్ఆర్ ప్రతినిధి, కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి భారతి పేర్కొన్నారు. అభ్యర్థుల అర్హతల మేరకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తామని, శిక్షణ కార్యక్రమాలను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, ఇండోసోల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాలచందర్కృష్ణన్, బైరెడ్డి రంగారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా హౌసింగ్ స్టీల్ తరలింపు
దుత్తలూరు: దుత్తలూరు హౌసింగ్ బోర్డు గోదాము వద్ద ఉన్న హౌసింగ్కు సంబంధించిన స్టీల్ను సొంత శాఖ వారే అక్రమంగా తరలిస్తూ బుధవారం పట్టుబడ్డారు. వివరాలు.. గృహ నిర్మాణాలకు ఉపయోగించే స్టీల్ను స్థానిక ఏసీ కాలనీ సమీపంలోని హౌసింగ్ గోదాము వద్ద ఓ వాహనంలో లోడ్ చేస్తుండగా, అనుమానమొచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఫొటోలు తీసి హౌసింగ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు వారు సమాచారమివ్వడంతో పరిసర మండలాల పీఎస్లకు తెలియజేశారు. సీతారామపురం మండలం పోలంగారిపల్లి వద్ద వాహనాన్ని గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్టీల్తో పాటు వాహనాన్ని దుత్తలూరు పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై హౌసింగ్ ఏఈ ఫిర్యాదు చేశారు. ఉదయగిరి మండలానికి చెందిన హౌసింగ్ అధికారి తన వాహనాన్ని బాడుగకు పిలిచారని, ఈ కారణంగానే వచ్చానని విచారణలో డ్రైవర్ తెలిపారు. సుమారు 900 కిలోల బరువుండి.. రూ.55 వేల విలువజేసే స్టీల్ను తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న హౌసింగ్ ఈఈ నారాయణరెడ్డి, డీఈ పీరాన్ దుత్తలూరుకు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిపై శాఖాపరంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఈఈ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి రోజే చివరి రోజు
మనుబోలు: వివాహ వేడుక నిమిత్తం స్వగ్రామానికి వచ్చి వారం పాటు సరదాగా గడిపారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి సేదదీరారు. తమ పెళ్లి రోజు సందర్భంగా తిరిగి ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి పగబట్టింది. మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఈ ఘటనతో మండలంలోని వడ్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన దద్దోలు పెంచలయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సురేశ్ కరీంనగర్లోని ఓ గ్రానైట్ కంపెనీలో మార్కర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటున్నారు. వారం క్రితం బంధువుల పెళ్లి ఉండటంతో సురేశ్ దివ్య (32) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వడ్లపూడికి వచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపి.. పొదలకూరులో సెకండ్ షో సినిమాకు మంగళవారం వెళ్లారు. బుధవారం వారి పెళ్లి రోజు కావడంతో వేకువజామునే కారులో బయల్దేరారు. నిద్రమత్తులో కల్వర్టును వాహనం ఢీకొనడంతో తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల వద్ద వీరు మృత్యువాత పడ్డారు. ఘటనతో వడ్లపూడి విషాదంలో మునిగిపోయింది. తమ ముందు సంతోషంగా తిరిగిన జంట ఇక లేరని తెలిసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. -
సహకార సంఘ సభ్యులకు శిక్షణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు రూరల్ వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘ సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని డీసీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ గుర్రప్ప మాట్లాడారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వ్యవసాయంలో సాంకేతికత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చామని వివరించారు. అనంతరం సంఘ సభ్యులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నిబంధనావళి ప్రతలను అందజేశారు. డీసీఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి, సీనియర్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పెరోల్ రచ్చ.. అరుణ అరెస్ట్
కోవూరు: రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కుదిపేస్తున్న నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నేపథ్యంలో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ఈ కేసులో సంచలనానికి కేంద్రబిందువైన శ్రీకాంత్ స్నేహితురాలు నిడిగంటి అరుణ మంగళవారం టీడీపీ నేతల బాగోతాలన్ని బయటపెడతానంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరలైంది. ఇది జరిగిన 24 గంటలు గడవక ముందే అరుణను కట్టడి చేసేందుకు ఈ కేసుకు సంబంధించి కాకుండా ఎప్పటిదో వేరే కేసును తిరగదోడి బుధవారం అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. బిల్డర్ నుంచి బలవంతంగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యత్నించింటూ అరుణతో పాటు మరో ముగ్గుర్ని కోవూరు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.ఇదీ కేసు..బిల్డర్ మునగ వెంకట మురళీకృష్ణమోహన్ 2010లో పెద్దపడుగుపాడులో సాయి ఎన్క్లేవ్ పేరుతో 15 ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్ నిర్మించారు. అందులో 14 ప్లాట్లు విక్రయించగా, 503 ఫ్లాట్ను తన ఆధీనంలో ఉంచుకున్నారు. 2020 డిసెంబర్లో నిడిగుంట అరుణ ఆ ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. అనంతరం ఆ ఫ్లాట్ తన తండ్రి పేరిట రిజిస్టర్ చేసుకోవాలని 2022 అక్టోబర్లో ఒప్పందం చేసుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. మిగిలిన రూ.25 లక్షలు 2023 ఫిబ్రవరి నాటికి చెల్లిస్తానని అంగీకారం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోగా అద్దెను కూడా నిలిపివేసింది. ఈ వ్యవహారమై కోర్టులో కేసు కొనసాగుతుండగా అరుణ తన అనుచరులు పల్లం వేణు, అంకెం రాజా, శీరం ఎలీషాతో కలిసి వెంకట మురళీకృష్ణమోహన్ను బెదిరించి పెళ్లకూరు కాలనీలోకి తీసుకెళ్లి తాను రూ.25 లక్షలు చెల్లించినట్లు పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఆపై తరచూ ఫ్లాట్ రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెంచారు. మాట వినకపోతే ప్రాణాలతో ఉండవని హెచ్చరించారు.పెరోల్ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు..అరుణ స్నేహితుడు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయడానికి అరుణపై ఉన్న ఈ కేసును బయటకు తోడారు. అరుణతోపాటు పల్లం వేణు, అంకెం రాజా, శీరం ఎలీషాను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సౌజన్య, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కోవూరు సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై రంగనాథ్గౌడ్ ప్రత్యేక బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు అరుణ మంగళవారం రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, అద్దంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులలో అరుణతో పాటు వేణు, రాజా, అన్సర్, ముసబీర్, గణేష్, ఎలీషా ఉన్నారు. అయితే అస్సర్, ముసబీర్, గణేష్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని నెల్లూరు కోర్టులో హాజరుపర్చారుఒంగోలు జిల్లా జైలుకు..ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అతడి సన్నిహితురాలు అరుణను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. కావలి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు రాత్రి పది గంటలకు నెల్లూరు పోలీసులు తరలించారు. -
గుట్టురట్టు కాకుండా అరుణ అరెస్ట్.. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
సాక్షి టాస్క్ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం గుట్టు రట్టు కాకుండా అత్యవసరంగా ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగా శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగంటి అరుణను ప్రభుత్వం ఆగమేఘాలపై అరెస్ట్ చేయించింది. కోవూరులో బిల్డర్ నుంచి అపార్ట్మెంట్ కొనుగోలు వ్యవహారంలో అరుణ.. శ్రీకాంత్ స్నేహితులను అడ్డుపెట్టుకుని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించిందని మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయించింది.హైదరాబాద్కు వెళ్తున్న ఆమెను బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు. అంతకు ముందు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కారు డిక్కీలో వేశారు. ‘నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. నా కారులో గంజాయి పెట్టాలని నా కారు డ్రైవర్కు చెబుతున్నారు. నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏమేమి కేసులు పెడుతున్నారు? నేను చేసిన తప్పేంటి? నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. మీడియా నన్ను కాపాడాలి’ అంటూ డిక్కీలోంచి సెల్ఫీ వీడియో తీసి బయటకు పంపింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దలు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై మరిన్ని కేసులు నమోదు చేసి.. ఇప్పుడప్పుడే బయటకు రాకుండా చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. అవును.. సిఫార్సు లేఖ ఇచ్చాను జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్కు తాను సిఫార్సు లేఖ ఇచ్చింది నిజమేనని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడిని చూడాలని ఉందంటూ తనకు ప్రజా విజ్ఞప్తుల్లో ఓ మహిళ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఆ తర్వాత పెరోల్ రద్దు కావడం తెలిసిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడ అరుణ అనే మహిళ ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని పెరోల్కు తామే సహకరించినట్లు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. పెరోల్ రద్దుతో వివాదం సమసిపోయిందన్నారు.రూ.2 కోట్లు ఎవరికి ఇచ్చినట్లు?శ్రీకాంత్ 2014లో టీడీపీ హయాంలో జైలు నుంచి తప్పించుకుని నాలుగేళ్ల పాటు డాన్గా ఎదిగాడు. వంద మందికి పైగా రౌడీషీటర్లను సైనికుల్లా పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో నెల్లూరులో సెటిల్మెంట్లు, దందాలు, హత్యాకాండలు సాగించాడు. నాలుగేళ్ల తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోయాక కూడా అదే తరహాలో జైలు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వం అతడికి పెరోల్ మంజూరు చేసి.. అతని నేరాలకు రాచబాట వేసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పెరోల్ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమను వాడుకుని వదిలేశారని, అందరి గుట్టు విప్పుతానని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పెరోల్ వెనుక అసలు గుట్టుతోపాటు అతని నేర చరిత్రలో భాగస్వాములుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల అసలు రంగు బయట పడుతుందని ప్రభుత్వం బెంబేలెత్తిపోయి హడావుడిగా ఆమెను అరెస్ట్ చేయించింది. కాగా, పెరోల్ కోసం హోం శాఖలో ముఖ్యులొకరికి అరుణ రూ.2 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో విచారణలో తేలుస్తారా?ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్జీవిత ఖైదీ శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్న సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్లో శ్రీకాంత్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేరారు. నెల రోజులకు పైగా అయన హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో సన్నిహితురాలు అరుణతో మసాజ్ చేయించుకుంటూ, డ్యాన్స్లు చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో దీనిపై విచారణ జరిపిన ఎస్పీ.. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఖాజా మొహిద్దీన్, ఖలీల్ను విధుల నుంచి తొలగించారు. శ్రీకాంత్, అరుణ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు వారికి సహకరించారో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. -
మాజీ మంత్రి కాకాణిని వెంటాడిన పోలీసులు
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాంకూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా, జెడ్పీ చైర్పర్సన్గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు. ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. -
జైళ్లు అడ్డంకి కాదు.. సోమిరెడ్డి దోపిడీని అడ్డుకుంటాం: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదు. నెల్లూరు జిల్లా ప్రజలే నా ఆస్తి. మాజీ మంత్రి(నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి) ఇంటిపై దాడి దుర్మార్గం. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం’’ అని కాకాణి అన్నారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా.. కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు పెట్టిందని వైఎస్సార్సీపీ అంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాణి జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా.. ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. -
శ్రీకాంత్ ఎపిసోడ్.. అరుణ అరెస్ట్
సాక్షి, నెల్లూరు: జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. తన అరెస్ట్కు ముందు.. ఆమె కారు డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీసి అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. తనను మీడియానే కాపాడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వీడియోలో మాట్లాడుతూ..‘నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు. నా ప్రాణాలు ఉంచుతారో, తీస్తారో కూడా తెలియదు. నేను కారు డిక్కీలో దాక్కుని మాట్లాడుతున్నాను. నా కారులో గంజాయి పెట్టి అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఏ అక్రమ కేసులో ఇరికిస్తున్నారో తెలియడం లేదు. నన్ను మీడియానే కాపాడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్కు కూటమి ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకి పొక్కడంతో పెరోల్ రద్దు చేశారు. అయితే, శ్రీకాంత్ పెరోల్ మంజూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోం శాఖ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. అరుణ సంచలన వ్యాఖ్యలు.. అంతకుముందు నిడిగుంట అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అని తెలిపారు.జీవిత ఖైదీ శ్రీకాంత్తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్బుక్లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ..‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్ బాధపడుతుంటే శ్రీకాంత్ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కుదిపేస్తున్న శ్రీకాంత్ వ్యవహారం హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉంటూనే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, టీడీపీ క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న అతను ఆ పార్టీ కీలక నేతల సహకారంతో తరచూ పెరోల్పై బయటకు వస్తున్న వైనం ఇప్పుడు అధికార పార్టీని, ప్రభుత్వ పెద్దల నుంచి హోంశాఖను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు హోంశాఖ స్థాయిలో కథ నడిపించారనేది స్పష్టం కావడంతో ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన ఐదు రోజుల్లోనే దానిని రద్దు చేసి, ఖైదీని జైలుకు తరలించారు.అండగా ఓ మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు అరుణ పోస్టు ప్రకారం ఒక మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆమెకు అండగా ఉన్నారనే కొత్త కోణం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలకు, క్రిమినల్స్కు మధ్య సంబంధాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. -
టూరిజం భవనాల పరిశీలన
ఉదయగిరి: పట్టణంలోని ఆనకట్ట సమీపంలో నిర్మించిన ఏపీ టూరిజం శాఖ భవనాలను జిల్లా పర్యాటక శాఖ మేనేజర్ ఉషశ్రీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక శాఖకు సంబంధించిన భవనాలను ఇటీవల టెండర్ ద్వారా అద్దె ప్రాతిపదికన ఎన్.తులసీరామ్ అనే వ్యక్తికి అప్పగించామన్నారు. దీంతో భవనాల మరమ్మతు పనులు ఎంతమేర జరిగాయో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు వచ్చినట్లు వివరించారు. పనులు పూర్తయిన వెంటనే ఆయా భవనాల్లో అతిథి గృహం, రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పాజీ, ఎకై ్సజ్ ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కూటమి నేతలకు 30 యాక్ట్ వర్తించదా?
● కరేడు రైతుల మండిపాటు ఉలవపాడు: కూటమి నేతలకు, కార్యకర్తలకు పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు వర్తించవా? అని కరేడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరేడు ర్యాంపు నుంచి కరేడు మీదుగా చేవూరు వరకు రూ.2.45 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంగళవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సాధారణంగా శంకుస్థాపనను రోడ్డు మొదలయ్యే చోట ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా కరేడు వద్ద చేశారు. ఊరిలో ఈనెల 31 వరకు పోలీస్ 30 యాక్ట్ ఉందని, బయట వ్యక్తులు రాకూడదని, 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చ ఎప్పారు. అయితే ఈ కార్యక్రమానికి బయటి నుంచి వ్యక్తులు వచ్చినా చూస్తూ ఉండటంతో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోతున్న వారికి అండగా వివిధ పా ర్టీల నాయకులు వస్తుంటే పోలీస్ శాఖ అడ్డుకుని అరెస్టు చేస్తూ నిర్బంధించింది. టీడీపీ కార్యకర్తలకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయమా అని ఉద్యమ నాయకుడు, 139 బీసీ కులాల జెఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే కరేడు, అలగాయపాళెం సచివాయాలను తనిఖీ చేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలకే పనిచేయాలని సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. -
సకాలంలో వ్యవసాయ సర్వీసుల మంజూరు
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వెంటనే మంజూరు చేయాలి. రైతులు, వినియోగదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే పద్ధతికి స్వస్తి పలకాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు అన్నారు. జిల్లాలోని కావలి పట్టణంలో స్పందన ఫంక్షన్ హాల్లో మంగళవారం కావలి డివిజన్ విద్యుత్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా విద్యుత్ శాఖ వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో కావలి డివిజన్లోని బోగోలు, కావలి రూరల్ సెక్షన్ల పనితీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందా?, లోఓల్టేజీ సమస్యలు ఉన్నాయా?, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అనే మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వం వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుందన్నారు. అయితే బోగోలు, కావలి రూరల్ సెక్షన్ల నుంచి వినియోగదారులకు సంతృప్తికర సేవలు అందడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పీఎం సూర్యఘర్కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు యుద్ధప్రాతిపదికన అంగీకారపత్రాలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్టీఎస్ఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామికీకరణ కోసం రూ.400 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయన్నారు. నూతనంగా 336 వ్యవసాయ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది హెడ్క్వార్టర్స్లోనే నివాసం ఉండాలని, లేకపోతే హెచ్ఆర్ఏ కట్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్, జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్, కావలి ఈఈ బెనర్జీ, డీఈఈ, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉదయగిరిలో ఈదురుగాలుల బీభత్సం
ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలో వారంరోజులుగా ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలికి మంగళవారం పట్టణ సమీపంలోని స్టీట్పేటలో విద్యుత్ తీగ తెగి పడిపోగా త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని తొలగించి లైను సరిచేశారు. చెట్లకొమ్మలు, హోర్డింగులు నేల వాలిపోతున్నాయి. గాలులకు ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 29న శ్రీవారికి చందనాలంకారంరాపూరు: మండలంలోని పెంచలకోలనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి 29వ తేదీన చందనాలంకరణలో దర్శనమివ్వనున్నట్లు దేవస్థాన అధికారులు మంగళవారం తెలిపారు. ఆరోజు స్వాతి నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం కావడంతో ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 9 గంటలకు శాంతి హోమం, 10 గంటలకు కల్యాణం, రాత్రి 7 గంటలకు బంగారు గరుడసేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలనసోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల గ్రామంలో ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మత్స్యశాఖాధికారి సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపయోగంలో ఉన్న ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు జంగిల్ క్లియరెన్స్కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది చివరన ఉత్పత్తి చేసిన చేప పిల్లలను సోమశిల జలాశయంలో వదులుతామన్నారు. ఆయన వెంట మత్స్యశాఖ సిబ్బంది ఖలీల్, లోకేశ్ ఉన్నారు. -
స్టాఫ్ నర్సుల విధుల బహిష్కరణ
నెల్లూరు(అర్బన్): మేల్ నర్సు వెంకటప్పయ్యపై దాడి చేసిన జూనియర్ డాక్టర్ శ్రీతేజ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విధులను బహిష్కరించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ అసోసియేషన్ సమన్వయకర్త మాధురి మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం క్యాజువాలిటీలో రద్దీగా ఉండటంతో రోగికి వైద్యం త్వరగా చేయాలని శ్రీతేజను వెంకటప్పయ్య కోరాడన్నారు. ఈ క్రమంలో వచ్చిన స్పల్ప విభేదాలను దృష్టిలో ఉంచుకుని వెంకటప్పయ్య డాక్టర్కు క్షమాపణ చెప్పాడన్నారు. అయినా శిక్షణలో ఉన్న 15 మంది జూనియర్ డాక్టర్లను వెంట బెట్టుకుని మద్యం మత్తులో శ్రీతేజ సోమవారం రాత్రి విధుల్లో ఉన్న వెంకటప్పయ్యను తిడుతూ దాడి చేశాడన్నారు. అడ్డుపడిన కల్యాణ్ అనే మరో నర్సుపై దాడి చేశారన్నారు. సీనియర్ స్టాఫ్ నర్సు శాంతిని తోసేసి బెదిరించారన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాధవికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఎమర్జెన్సీ మినహా మిగిలిన చోట్ల విధులు బహిష్కరించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు. కేసు నమోదు స్టాఫ్ నర్సులు నాలుగో నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీతేజ, సందీప్, దినేష్, గగన్, భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు శాంతి, శ్రీలత, లావణ్య, వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ సరుకులు తరలిస్తుండగా..
● పట్టుకున్న గ్రామస్తులు ● వేరేచోట భద్రపరిచేందుకన్న కార్యకర్త పొదలకూరు: పట్టణానికి సమీపంలోని తెలుగుగంగ పునరావాస కేంద్రం(వెంకటేశ్వరనగర్) అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు చెందిన సరుకులను మంగళవారం కార్యకర్త తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని సీడీపీఓ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల కథనం మేరకు.. కార్యకర్తగా పనిచేస్తున్న సునీత పిల్లలకు అందజేయాల్సిన కోడిగుడ్లు, బాలామృతం తదితర సుమారు రూ.15 వేలు విలువైన సరుకులను తరలిస్తుండగా అటకాయించారు. ఆటోతో సహా నిలిపివేసి పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే సరుకులను అక్కడే ఉంచి వెంకటాచలం సీడీపీఓకు సమాచారం అందించారు. అంగన్వాడీ టీచర్ మాత్రం సరుకులను వేరే ఇంట్లో భద్రపరిచేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పుకొస్తున్నారు. సీడీపీఓ విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం చిన్నది.. ప్రమాదం పెద్దది
అవగాహన పెంచాలి దోమలు నివారణ జరగాలంటే ప్రజల్లో అవగాహన పెంచాలి. వాటి ద్వారా వచ్చే డెంగీ లాంటి జబ్బుల్లో కొన్ని రకాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చికిత్సకే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలు ఇంట్లో, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా మెస్లు ఏర్పాటు చేయించుకోవాలి. – డాక్టర్ ఎంవీ రమణయ్య, ప్రజారోగ్యవేదిక రాష్ట్రాధ్యక్షుడు చర్యలు తీసుకున్నాం జిల్లాలో దోమల నిర్మూలనకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. అన్ని హాస్టళ్లలో మలాథియాన్ స్ప్రే చేశాం. నీటి గుంతల్లో దోమ లార్వాలను తినే గంబూసియా చేపలను వదిలిపెడుతున్నాం. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు ప్రజల వద్దకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా మలేరియా, డెంగీ కేసులు నమోదైనట్టు తెలిస్నే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. – హుస్సేనమ్మ, జిల్లా మలేరియా నివారణాధికారిణి నెల్లూరు(అర్బన్): డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా.. ఇవి రావడానికి ప్రధాన కారణం దోమ కాటు. వర్షాకాలంలో వీటి బెడద విపరీతంగా ఉంటూ సమాజాన్ని వణికిస్తాయి. లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. చికిత్స నిమిత్తం పెద్ద మొత్తంలో నగదు ఖర్చయి ఆర్థికంగా నష్టపోతున్న వారు కూడా ఉన్నారు. మరికొందరికి డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. బుధవారం దోమల నివారణ దినం సందర్భంగా జిల్లాలో కూడా వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ సదస్సులు నిర్వహించనున్నారు. మలేరియా నిర్మూలన కోసం పోరాటాన్ని వేగవంతం చేయడం, మరింత సమానమైన ప్రపంచం కోసం అనే థీమ్ను ఈ ఏడాది ప్రకటించారు. విజృంభిస్తున్న వ్యాధులు జిల్లాలో దోమలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు ప్రమాదకరమైన జపనీస్ ఎన్సెఫలైటిస్, పసుపు జ్వరం, జికా వైరస్లు అప్పుడప్పుడూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ జబ్బులకు గురైన పలువురు చికిత్సకు స్పందించక చనిపోతున్నారు. కొద్దిరోజులుగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. వర్షపునీరు ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేరింది. నెల్లూరు నగరంలో ఖాళీ ప్లాట్లు, మురుగు కాలువలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో జ్వరపీడితుల సంఖ్య పెరిగింది. అలా వస్తేనే.. జిల్లాలో 52 పీహెచ్సీలు, 10 సీహెచ్సీలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, నగరంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 450 వరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు నడుస్తున్నాయి. అన్నిచోట్లా రోగులు పెరుగుతున్నారు. రామచంద్రారెడ్డి, జయభారత్, నారాయణ, మెడికవర్ ఇలా పలు హాస్పిటళ్లలో డెంగీ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్లో చేసే పరీక్షలను వైద్యశాఖ అంగీకరించడం లేదు. ప్రభుత్వాస్పత్రిలో చేసే ఎలీసా టెస్ట్ల్లో పాజిటివ్ వస్తేనే డెంగీ లాంటి జబ్బులను అంగీకరిస్తున్నారు. దీంతో వైద్యశాఖలో డెంగీ, మలేరియా కేసులు లేనట్టు.. ఒకటో రెండో వచ్చినట్టు కాకి లెక్కలు రాస్తున్నారు. గత సంవత్సరంలో డెంగీ 130, మలేరియా 6, చికున్గున్యా 2 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జూలై నెల వరకు డెంగీ 19, మలేరియా 3, చికున్గున్యా 2 కేసులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన చర్యలు ఇంట్లో, ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, పూలకుండీలు, డ్రమ్ములు వంటి వాటిలో నీరు ఉంటే పారబోయాలి. మురికి కూపాలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. దోమతెరలు వాడాలి. దోమల నియంత్రణకు స్ప్రేలు వినియోగించాలి. అలాగే తులసి, వేప లాంటి మొక్కలను పెంచడం ద్వారా కొంతమేరకు దోమలను తగ్గించుకోవచ్చు.సమాజాన్ని వణికిస్తున్న దోమలు ఒక్కోదఫా ప్రాణాంతకంగా మారుతున్న జబ్బులు అవగాహన, జాగ్రత్తలతోనే నివారణ నేడు ప్రపంచ దోమల నివారణ దినం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు -
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం
వెంకటాచలం: ఆరాధనోత్సవాల్లో భాగంగా గొలగమూడిలోని భగవాన్ వెంకయ్యస్వామి సూర్యప్రభ వాహనంపై మంగళవారం దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, అభిషేకాలను జరిపారు. చంద్రప్రభ వాహనసేవను రాత్రి నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు. ఉత్సవాల్లో నేడు ఉత్సవాల్లో భాగంగా హనుమంత, హంసవాహన సేవను బుధవారం నిర్వహించనున్నారు. పొగాకు సగటు ధర రూ.196.62 మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 184 బేళ్లను మంగళవారం విక్రయించామని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సగటున రూ.196.62 ధర లభించింది. వేలానికి 336 బేళ్లు రాగా 184ను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని తెలిపారు. వేలంలో 21,528.3 కిలోల పొగాకును విక్రయించారు. గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.140 ధర లభించింది. ఉన్నత విద్యకు ఉపకార వేతనాలు నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఉన్నత విద్యనభ్యసించాలనే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలను నేషనల్ ఫెలోషిప్, నేషనల్ స్కాలప్షి ప్ పథకాల ద్వారా అందజేస్తున్నారని ఐటీడీఏ పీఓ మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు నేషనల్ ఫెలోషిప్ స్కాలర్షిప్కు అర్హులని చెప్పారు. ● డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు ఎంపిక చేసిన కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు నేషనల్ స్కాలర్షిప్ పథకానికి అర్హులని వివరించారు. వీరి వార్షికాదాయం రూ.ఆరు లక్షలకు మించరాదన్నారు. ఆన్లైన్లో వచ్చే నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ఫీజు గడువు పొడిగింపు నెల్లూరు (టౌన్): ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశానికి రూ.200 అపరాధ రుసుముతో ఫీజు గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించారని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని, వివరాలకు 89194 28319 నంబర్ను సంప్రదించాలని సూచించారు. యథేచ్ఛగా గ్రావెల్ దందా కావలి (జలదంకి): కావలి మండలంలోని చలంచర్లలో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. చెరువులో రెండు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలించారు. ఎలాంటి అనుమతుల్లేకుండా తెలుగు తమ్ముళ్లు ఇలా వ్యవహరిస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. -
‘బార్ టెండర్లలో పాల్గొనబోం’
● నెలకు రూ.పది లక్షల నష్టం తప్పదు ● బార్ యజమానుల అసహనం నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీపై బార్ల యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో నెలకు రూ.పది లక్షల నష్టం వస్తుందని, ఈ తరుణంలో టెండర్లలో తాము పాల్గొనబోమంటూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్కు లిఖితపూర్వకంగా మంగళవారం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో ఉంటున్న తమకు నూతన లాటరీ విధానంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రస్తుతం యజమానులుగా ఉన్న తాము లైసెన్స్లను పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు. ఎంత తేడా.. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏడాదికి రూ.40 లక్షల బార్ లైసెన్స్ ఫీజు, 22 శాతం మార్జిన్ ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో ఏడాదికి రూ.75 లక్షల ఫీజుతో పాటు మూడేళ్ల కాలపరిమితి ఇవ్వడంతో తమకు వ్యాపార భద్రత కరువవుతుందని తెలిపారు. రూ.99 బ్రాండ్ ఇవ్వకపోతే తాము నష్టపోతామని, మద్యం దుకాణాలకు పర్మిట్ రూములను ఇవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెప్పారు. గడిచిన ఏడాదే నగరంలో ఒక్కో బార్ యజమాని దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నష్టపోయిన అంశాన్ని ప్రస్తావించారు. -
కాకాణి విడుదల్లో జాప్యం
వెంకటాచలం: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డికి హైకోర్టు బెయిలిచ్చినా, మంజూరు పత్రాలను ఇవ్వడంలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో జైలు నుంచి మంగళవారం ఆయన విడుదల కాలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకాణిపై ఎనిమిది అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపారు. ఏడు కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించగా, తాజాగా మిగిలిన దాంట్లో సోమవారం మంజూరైంది. దీంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి మంగళవారం విడుదలవుతారని భావించారు. అయితే బెయిల్ మంజూరు పత్రాలను ఆలస్యంగా ఇవ్వడంతో అవి అధికారులకు సకాలంలో అందలేదు. దీంతో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు తమ అభిమాన నేత కాకాణి గోవర్ధన్రెడ్డి విడుదలవుతారని తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు జిల్లా కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్నారు. కొందరు తమ అభిమానాన్ని చాటుతూ జైలుకెళ్లే మార్గంలో కాకాణికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని తొలగించడమే కాకుండా జైలు వద్ద ఉన్న శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. కొందరు ఏదో మార్గంలో వెళ్తుంటే, ఖాకీలు అత్యుత్సాహంతో బైక్లను ఆపి తాళాలను లాక్కొన్నారు. నిరాశగా వెనుదిరిగి.. చెముడుగుంట పంచాయతీ పవన్కాలనీ నుంచి బుజబుజనెల్లూరు వరకు నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో వేలాది మంది పార్టీ శ్రేణులు కాకాణి రాక కోసం గంటల తరబడి వేచి చూశారు. చివరికి ఆయన విడుదల కావడంలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. జాప్యం బాధాకరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మంగళవారం విడుదల కాకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో సంతోషంగా జైలు వద్దకొచ్చామని, అయితే గూడూరు కోర్టు నుంచి 5.30 తర్వాత బెయిల్ మంజూరు పత్రాలివ్వడంతో విడుదల ఆలస్యమైందని చెప్పా రు. అనంతరం కాకాణి కుమార్తె, పార్టీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత మాట్లాడారు. తన తండ్రి జైలుకెళ్లాక, ఏనాడూ ఇక్కడికి రాలేదని, ఈ రోజు విడుదలవుతున్నారనే సంతోషంతో రాగా, జాప్యం కావడం బాధగా ఉందని తెలిపారు. బెయిల్ మంజూరు పత్రాలను సకాలంలో కోర్టు వద్దకు చేర్చడంలో మా తప్పు లేకపోయినా, ఎప్పుడు విడుదలవుతారనే విషయమై స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. బుధవారం ఏ సమయంలో విడుదల చేస్తారనే విషయమై సమాధానం చెప్పేవారే లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు పత్రాలివ్వడంలో ఆలస్యం కలిసేందుకు వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జైలు వద్దకు వెళ్లనీయకుండా పోలీసుల ఆంక్షలు నేడు బయటకు.. నెల్లూరు (లీగల్): జిల్లా కేంద్ర కారాగారం నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బుధవారం ఉదయం విడుదల కానున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన విడుదల కోసం రూ.రెండు లక్షల ఆస్తి కలిగిన ఇద్దరు జామీన్దార్లతో పత్రాలను గూడూరు ఇన్చార్జి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కోర్టులో రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమయ్యాయి. జిల్లా కేంద్ర కారాగార నిబంధనల మేరకు రిలీజింగ్ ఆర్డర్స్కు సమయం మించిపోవడంతో మంగళవారం విడుదల కాలేకపోయారు. -
అక్టోబర్ నాటికి ప్లాంటేషన్లు పూర్తి
ఉదయగిరి: జిల్లాలో ప్లాంటేషన్ ప్రక్రియను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్బాషా పేర్కొన్నారు. పట్టణంలోని చెక్క నగిషీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం అక్కడి మహిళలు, నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఐదు అటవీ రేంజ్ల పరిధిలో 960.48 హెక్టార్లలో మొక్కల పెంపకం లక్ష్యమన్నారు. నర్సరీల్లో 20.65 లక్షల మొక్కలను పెంచుతున్నామని వివరించారు. వర్షాల నేపథ్యంలో ఐదు అటవీ రేంజ్ల పరిధిలో మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్లను సిద్ధం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే 60 హెక్టార్లలో మొక్కలు నాటడాన్ని పూర్తి చేశామన్నారు. చెక్క నగిషీ కేంద్రంలో వస్తువుల తయారీకి ఉపయోగించే వివిధ రకాల దేవదారు, కలివి, నెర్ది, బల్లనెర్ది కలప అందుబాటులో లేవని, వీటిని అటవీ శాఖ ప్లాంటేషన్లలో పెంచి తయారీదారులకు సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందులో భాగంగా జిల్లాలోని నగరవనంలో స్టాళ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం దుర్గంపల్లె నర్సరీ, సర్వరాబాద్ ప్లాంటేషన్ను పరిశీలించారు. రేంజ్ అధికారి కుమార్రాజా, ఎఫ్ఎస్ఓ చిన్న వెంకటయ్య, ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు, కేంద్ర నిర్వాహకుడు జాకీర్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
భూముల ఆక్రమణపై విజిలెన్స్
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని వవ్వేరులో గల కనిగిరి చెరువు వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు, భూముల ఆక్రమణపై విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. కనిగిరి రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న భూముల్లో గ్రావెల్ మాఫియా కొన్ని రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వేసింది. వీటిని విక్రయించి రూ.కోట్లు గడించడమే కాకుండా ఆయా భూములను చదును చేసి ఆక్రమించారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. వ్యవహారం జిల్లా విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. కనిగిరి రిజర్వాయర్ వద్ద గ్రావెల్ తవ్విన ప్రదేశాలు, ఆక్రమణకు గురైన స్థలాలను పరిశీలించారు. 920 సర్వే నంబర్లో వందలాది ఎకరాలు అక్రమార్కుల చెరలో ఉన్నాయనే అంశాన్ని గుర్తించారు. గ్రామస్తులను అడిగి పలు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడారు. భూముల ఆక్రమణ, గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నామని చెప్పారు. సంబంధమున్న వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు
●అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు. కార్పొరేట్ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ నోటీసులను మరోసారి జారీ చేస్తాం అనుమతుల్లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న యాజ మాన్యాలకు గతంలో నోటీసులను జారీ చేసి వివరణ కోరాం. మరికొందరు పంపాల్సి ఉంది. మరోసారి నోటీసులను జారీ చేస్తాం. పాఠశాలలకు అనుమతి ఉండాల్సిందే. – బాలాజీరావు, డీఈఓ -
యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
దుత్తలూరు: జిల్లాకు ఈ సీజన్లో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. దుత్తలూరు బిట్ – 1 సచివాలయంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జామాయిల్ తోటలు సాగుచేసే వారికి యూరియాను ఇవ్వడంలేదని, వీరు కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. పంటలను పరిశీలించి అవసరమైన వారికి యూరియాను అందిచాలని కోరారు. ఈ – పంట నమోదు చేయించుకోవాలని, అన్నదాత సుఖీభవ పథకం అందని వారికి ఏమైనా సమస్యలుంటే రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గానికి కందులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు తమ సమీప కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు. మున్ముందు మినుములూ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు, వ్యవసాయ శాస్త్రవేత్త కిరణ్కుమార్రెడ్డి, ఉదయగిరి ఏడీఏ లక్ష్మీమాధవి, వ్యవసాయాధికారులు వెంకటసుబ్బారెడ్డి, మదన్మోహన్, చెన్నారెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
కావలి ఎమ్మెల్యే క్రూర ‘కావ్య’o
సాక్షి టాస్క్ ఫోర్స్ : కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి తన క్వారీల్లో క్రూర ‘కావ్య’ం ప్రదర్శించారు. ఆయన అక్రమ మైనింగ్ దందాను బయటపెట్టేందుకు ప్రయత్నించిన టీవీ జర్నలిస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా దాడి చే యించారు. బిహార్లోని పరిస్థితులను తలపించే లా హింసాత్మకంగా ప్రవర్తించారు. వారి చేతుల్లో కత్తులు పెట్టి... వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పంపడంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని చంపడానికి వచ్చామని చెప్పిస్తూ వీడియో తీసి, అక్రమ కేసులు పెట్టి పోలీసులకు అప్పగించారు. మనీ స్కాం.. అక్రమ మైనింగ్ జలదంకి మండలం అన్నవరంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురురాఘవేంద్ర స్టోన్ క్రషర్ పేరుతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ, కరెంట్ చార్జీలు ఎగవేశారు. అనధికారికంగా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో మెటల్ తవ్వుతూ రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు. మొత్తమ్మీద రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఈ ఏడాది కావలిలో రూ.వందల కోట్ల మనీ స్కామ్ జరిగింది. పెద్దల పాత్ర ఉండడంతో ఎమ్మెల్యే, పోలీసులు దీన్ని పక్కదోవ పట్టించారు. ఇందుకుగాను ఎమ్మెల్యేకు రూ.250 కోట్ల ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కక్షపూరిత రాజకీయాలతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందిపెట్టసాగారు. రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని అసభ్యంగా దూషిస్తూ అంతు చూస్తానని బహిరంగంగానే బెదిరించారు. అయినా, వెనక్కుతగ్గని ప్రతాప్కుమార్రెడ్డి... ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీలు, దాషీ్టకాలు, అక్రమాలను తరచూ మీడియాకు వెల్లడిస్తున్నారు. మనీ స్కామ్ బాధితులకు అండగా తన కార్యాలయంలో టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరుగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామాలతో కావ్య కృష్ణారెడ్డి పన్నాగం పన్నారు. రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు వెళ్తే... అన్నవరంలోని ఎమ్మెల్యే క్వారీల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ను కావలి సోషల్ మీడియా యాక్టివిస్టు వేణు, అన్నవరం వాసి శ్రావణ్కుమార్, అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వినోద్ వీడియో తీస్తుండగా క్వారీ క్రషర్ సిబ్బంది గుర్తించి ఎమ్మెల్యేకు చెప్పారు. శ్రావణ్కుమార్ పారిపోగా మిగిలిన ఇద్దరిని చెట్టుకు కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఉదయం 12.30 నుంచి 3 గంటలపాటు తీవ్రంగా హింసించారు. చంపేస్తామంటూ భయపెట్టారు. అనంతరం తమ క్రషర్ వద్దకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి రౌడీలను పంపించారంటూ జలదంకి ఎస్ఐ లతీఫున్నీసాకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వచ్చి.. ఇద్దరిని స్టేషన్కు తరలించారు. నిమిషాల్లోనే పోలీసులు వారిని కారులో కలిగిరి సీఐ కార్యాలయానికి, అక్కడినుంచి వివిధ స్టేషన్లకు తిప్పినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై ఎస్ఐ లతీఫున్నీసాను వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు. -
వాడుకుని వదిలేశారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ మంగళవారం కొందరు విలేకరుల వద్ద కుండబద్దలు కొట్టారు జీవిత ఖైదీ శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగుంట అరుణ. జీవిత ఖైదీ శ్రీకాంత్తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్బుక్లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ ఏమని వ్యాఖ్యానించారంటే.. ‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్ బాధపడుతుంటే శ్రీకాంత్ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుదిపేస్తున్న శ్రీకాంత్ వ్యవహారం హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉంటూనే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, టీడీపీ క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న అతను ఆ పార్టీ కీలక నేతల సహకారంతో తరచూ పెరోల్పై బయటకు వస్తున్న వైనం ఇప్పుడు అధికార పార్టీని, ప్రభుత్వ పెద్దల నుంచి హోంశాఖను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు హోంశాఖ స్థాయిలో కథ నడిపించారనేది స్పష్టం కావడంతో ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన ఐదు రోజుల్లోనే దానిని రద్దు చేసి, ఖైదీని జైలుకు తరలించారు. అండగా ఓ మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు అరుణ పోస్టు ప్రకారం ఒక మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆమెకు అండగా ఉన్నారనే కొత్త కోణం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. అ«ధికార పార్టీకి చెందిన నేతలకు, క్రిమినల్స్కు మధ్య సంబంధాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే అరుణ, శ్రీకాంత్తో తమకు ప్రాణ హాని ఉందని.. నెల్లూరు, గూడూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు 15 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆమె సన్నిహితుడు శ్రీకాంత్ జైల్లోనే ఉండి నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఆయనకు ఎస్కార్ట్గా ఉన్న ఇద్దరు ఏఆర్ పోలీసులు సహకరించడం, తరచూ పెరోల్పై బయట తిరగడం వంటి అంశాలపై జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్కు పెరోల్ ఇచ్చింది మా ప్రభుత్వమే హోం మంత్రి వంగలపూడి అనిత సాక్షి, అమరావతి: శ్రీకాంత్కు తమ ప్రభుత్వమే పెరోల్ ఇచ్చిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అనిత మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీకాంత్ పెరోల్ కోసం నెల్లూరుకు చెందిన అరుణ నుంచి హోం శాఖ పేషీకి ఫోన్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆమె వెనుక ఎవరున్నారనే విషయం గురించి ఆరా తీస్తున్నామన్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ వచ్చిందని జైలు అధికారులు చెప్పగానే ఆ పెరోల్ను రద్దు చేశామన్నారు. శ్రీకాంత్ వ్యవహారంలో ఎస్కార్ట్ సిబ్బందిపైనా చర్యలు చేపడతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలతో పెరోల్ మంజూరు చేయాలని మీరే సిఫారసు చేశారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా..ఆ విషయాలన్నీ పోస్ట్మార్టం చేయవద్దని మంత్రి వ్యాఖానించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామన్నారు. -
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా పడింది. కోర్టు ఆర్డర్స్ ఆలస్యంతో కాకాణి ఆలస్యమైంది. గూడూరు కోర్టులో ఉదయమే ఆర్డర్స్ కోసం కాకాణి లాయర్లు అప్లై చేశారు. సాయంత్రం 5:30 గంటలు దాటాక కోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. జైలు రిలీజింగ్ సమయం ముగిసిందని జైలు అధికారులు తెలిపారు.వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసుల మీద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్నిచ్చిన సంగతి తెలిసిందే. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పు ఇచ్చింది.‘సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు చేశారు. సహ నిందితుని వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోలేం. దాదాపు 36 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. కాబట్టి సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆందోళన ఎంత మాత్రం అవసరం లేదు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఏమీ లేదు. దర్యాప్తులో ప్రాథమిక భాగమంతా పూర్తయింది. కాబట్టి దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం లేదు.కాకాణి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. కాబట్టి ట్రయల్ సందర్భంగా ఆయన హాజరుకాకపోవడం అంటూ జరగదు. కాకాణిపై నమోదైన 14 కేసుల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసులన్నింటినీ కూడా సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగా నమోదు చేసినవే. కాకాణి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే. ఈ కేసులో సాక్ష్యం ఇచ్చింది మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే. ఒకే నియోజకవర్గానికి చెందిన రెండు పార్టీలకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న న్యాయ, రాజకీయ పోరాటం ఇది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.కాకాణిపై 13 కేసులు ఉన్నాయని, ఆయనకు బెయిలిస్తే దర్యాప్తులో జోక్యం చేసుకోవడంతోపాటు సాక్షులను బెదిరిస్తారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నంత మాత్రాన దానిని నేర చరిత ఉన్నట్లుగా భావించలేమని, ఈ కారణంగా బెయిల్ను నిరాకరించలేమని తేల్చి చెప్పారు. కాకాణిపై నమోదైన దాదాపు అన్నీ కేసుల్లోనూ బెయిల్ వచి్చందని, బెయిల్ షరతులను దుర్వినియోగం చేసినట్లు గానీ, సాక్ష్యాలను తారుమారు చేసినట్లు, సాక్షులను బెదిరించినట్లు గానీ ఎలాంటి ఫిర్యాదులు లేవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.బెయిల్ ఇస్తే ట్రయల్ సందర్భంగా కాకాణిని కోర్టు ముందు హాజరుపరచడం కష్టమవుతుందన్న వాదననూ న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాకాణి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. బెయిల్ మంజూరు చేస్తే కాకాణి సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న వాదననూ తిరస్కరించారు. అరెస్ట్కు ముందు ఆయన సాక్షులను బెదిరించినట్లు ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. -
జీవిత ఖైదీకి పెరోల్ వెనుక హోంశాఖ!
సాక్షి టాస్క్ఫోర్స్: హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరోల్పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్కు గురైంది. ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్సీపీకి అంటగట్టే య త్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది.జైలు నుంచి పారిపోయిన చరిత్ర సొంతం..ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. టీడీపీ నేతల అండదండలు ఉండడంతో శ్రీకాంత్ నాలుగున్నరేళ్లు ఎక్కడున్నాడు? ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.అడుగడుగునా అధికార పార్టీ అండ..జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి ఎదిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలువరించే సాహసం చేయలేకపోయారు.పోలీసు ఉన్నతాధికారుల మాట కాదని..ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెరోల్ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత కనుస న్నల్లోనే 30 రోజుల పెరోల్ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు. హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్ పెరోల్పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం. బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్ని రద్దు చేసింది.నాకు రక్షణ కల్పించాలి శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తనకు కొందరితో ఆపద పొంచి ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరినట్లు సమాచారం. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అసత్య కథనాలు ప్రచురించిన ఓ చానల్పై చర్యలు తీసుకోవాలని పోలీసు అ«ధికారులను కోరారు. అంతక్రితం పెరోల్కు సంబంధించి ఆమె తెలిపిన వివరాలు ఇలా... ‘‘పెరోల్ అర్జీని హోం మంత్రికి పంపారు. ఆమె నుంచి వచ్చిన ఫైలే సర్క్యులేట్ అయి పెరోల్ మంజూరైంది.హోంమంత్రికి తెలియకుండా జరిగిందా? తెలిసి జరిగిందా అనేది మాత్రం తెలియదు. పెరోల్ రద్దు వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ అఫిషియల్గా సెన్సిటివ్ విషయం ఉందని అందుకే రద్దు చేస్తున్నట్లు జీఓలో పొందుపరిచారు. పెరోల్ జీవోను రద్దు చేయడం హోంశాఖ చరిత్రలోనే ఫస్ట్ కేసు. నాపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదు. శ్రీకాంత్ అంటే నాకు ఇష్టం. మేం పెళ్లిచేసుకోబోతున్నాం. శ్రీకాంత్ పెరోల్పై ఆయన తండ్రి పెట్టుకున్న వినతిపత్రాన్ని ప్రభుత్వం ఆమోదించిందే తప్ప దీనివెనుక నేను చక్రం తిప్పిందేమిలేదు’’, అని పేర్కొన్నారు. -
ప్రభుత్వ భూమిలో జామాయిల్ నరికివేత
● విలువ సుమారు రూ.15 లక్షలు ● రెవెన్యూ అధికారుల పాత్రపై ప్రచారం ● అధికార పార్టీ అండతోనే..వింజమూరు(ఉదయగిరి): వింజమూరు – ఉదయగిరి హైవే మార్గంలో వింజమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 839లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న జామాయిల్ను అక్రమార్కులు నరికి సొమ్ము చేసుకున్నారు. మూడురోజుల క్రితం వింజమూరుకు చెందిన ఓ వ్యాపారి జామాయిల్ కర్రను పట్టపగలే నరికించి వాహనాల్లో తరలించినట్లుగా తెలిసింది. దీని విలువ సుమారు రూ.15 లక్షలని చెబుతున్నారు. ఈ తంతు వెనుక రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రచారం ఉంది. తహసీల్దార్ కార్యాలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూమిలో జామాయిల్ నరికి తరలిస్తున్నా అధికారులు మాకు తెలియదని చెప్పడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ వారి పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ ఎస్కే హమీద్ను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపామన్నారు. జామాయిల్ నరికిన మాట వాస్తవమేనన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఆ భూముల్లోనే సోమవారం పొట్టును వాహనంలో తరలిస్తున్నా రెవెన్యూ సిబ్బంది వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. -
మేల్ నర్సులపై జూనియర్ డాక్టర్ దాడి
● సర్వజన ఆస్పత్రిలో ఉద్రిక్తత నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న మేల్ నర్సు వెంకటప్ప అలియాస్ వెంకట్పై సోమవారం రాత్రి ఇంటర్నషిప్ (జూనియర్) డాక్టర్ ఒకరు దాడి చేశాడు. మరో మేల్ నర్సు కల్యాణ్ అడ్డుపడగా అతడిపై కూడా దాడి చేశాడు. ఆ డాక్టర్కు మరో జూనియర్ అండగా ఉండి దాడి చేశారని సమాచారం. ఈ విషయమై పలువురు మేల్, ఫిమేల్ నర్సులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు. దాడికి గురైన మేల్ నర్సులిద్దరూ తాము అడ్మిట్ అవుతామని, దాడికి కారణమైన వారిపై మెడికల్ లీగల్ కేసు నమోదు చేయాలని కోరగా క్యాజువాలిటీలో ఉన్న డ్యూటీ డాక్టర్ కిరణ్ తిరస్కరించాడు. దీంతో చాలాసేపు ఆందోళన జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దర్గామిట్ట పోలీసుస్టేషన్లో దాడి చేసిన జూనియర్ డాక్టర్పై కేసు పెట్టేందుకు మేల్ నర్సులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గొడవకు కారణాలపై ఆరాతీశారు. -
రైల్లోంచి జారిపడి..
● హెల్త్ అసిస్టెంట్ మృతి కొడవలూరు: ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి హెల్త్ అసిస్టెంట్ మృతిచెందిన ఘటన మండలంలోని తలమంచి – కొడవలూరు రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు కథనం మేరకు.. బోగోలు మండలం కోవూరుపల్లి పీహెచ్సీలో హెచ్ఏగా పనిచేసే ఎన్.రామ్కుమార్ ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సమీపంలో నివాసముంటున్నాడు. రోజూ అక్కడి నుంచే విధులకు వస్తుంటాడు. సోమవారం కూడా రైల్లో బయలుదేరాడు. తలమంచి సమీపంలో 188 – 9 – 7 పోస్టుల మధ్య ఎగువలైన్లో రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చెక్పోస్ట్ పాయింట్ను ఢీకొన్న లారీమర్రిపాడు: మండలంలోని జిల్లా సరిహద్దు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సరిహద్దు వద్దనున్న చెక్పోస్ట్ పాయింట్ను లారీ ఢీకొనడంతో అది పూర్తిగా నేలమట్టమైంది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. నంద్యాల నుంచి తడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
పోటెత్తి.. వినతులందించి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 426 అర్జీల అందజేత నెల్లూరు రూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, డ్వామా పీడీ గంగా భవాని, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. అధికంగా రెవెన్యూ శాఖవి 129, మున్సిపల్ శాఖవి 31, సర్వేవి 34, పంచాయతీరాజ్ శాఖవి 57, పోలీసు శాఖవి 79, సివిల్ సప్లయ్స్వి 7, ఇతర శాఖలకు సంబంధించి 426 అర్జీలను ప్రజలు అందజేశారు. రిజర్వేషన్ల అమలు కోసం.. చంద్రబాబు గతంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో శాతం రిజర్వేషన్ అమలు చేయాలటూ బీఎస్పీ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకి ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. పింఛన్ల తొలగింపు దారుణం రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగా దివ్యాంగుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం తొలగించిందని, ఇది దారుణమని ఆ సంఘం జిల్లా నాయకుడు ఆవుల నాగేంద్ర అన్నారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధైర్యముంటే ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లను అరెస్ట్ చేయాలన్నారు. అన్ని అర్హతలున్న వారిని కూడా పెన్షన్ రాకుండా చేయడం దారుణమన్నారు. ఈ–క్రాప్పై చర్యలకు.. మరో వారం, పదిరోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయని, ఇంత వరకు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారుతుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినయ్ నారాయణ కోరారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కక్షతో జీతం ఆపేసిన వైద్యాధికారి కక్ష కట్టి జలదంకి వైద్యాధికారి శ్రీనివాసులు రెండు సంవత్సరాల నుంచి జీతం ఆపేశారని కావలికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ కలెక్టర్కు వినతిపత్రమిచ్చారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాసులు, ఆయన భార్య డాక్టర్ లక్ష్మి వేధిస్తున్నట్లు ఆరోపించారు. జీతాలు చెల్లించాలని డీఎంహెచ్ఓ ఆర్డర్ ఇస్తే పెడచెవిన పెట్టి నువ్వు ఎలా తెచ్చుకుంటావో చూస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. లేబర్ కమిషన్ ఆర్డర్ను కూడా పట్టించుకోలేదన్నారు. హెల్త్ డైరెక్టర్ విచారణ రిపోర్ట్లో జీతం జలదంకిలోనే చెల్లించాలని చెప్పిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన తనకు రెండేళ్లుగా జీతం లేదని, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టులు భర్తీ చేయాలంటూ.. మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 203 పోస్టులను 2025 డీఎస్సీలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ నోటిఫికేషన్లో నెల్లూరు కార్పొరేషన్లో 16 ఖాళీలను మాత్రమే చూపించారన్నారు. అయితే 203 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జి.కృష్ణప్రసాద్, పి.నాగరాజు, కిశోర్, మస్తాన్, కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికెళ్లొస్తూ కానరాని లోకాలకు..
● ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొన్న టాటా ఏస్ ● ఇద్దరి మృతి, ఒకరికి తీవ్రగాయాలు ● బాధితులంతా చైన్నె వాసులుకొడవలూరు: టాటా ఏస్లో పెళ్లికెళ్లి.. తిరిగి సొంతూరికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని నాయుడుపాళెం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చైన్నెకి చెందిన వారు కావలిలో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లికి టాటా ఏస్ వాహనంలో వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక అదే వాహనంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చైన్నెకి బయలుదేరారు. కొడవలూరు మండలం నాయుడుపాళెం వద్దకు రాగా ఇక్కడ ఆగిఉన్న టిప్పర్ను టాటాఏస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ నడుపుతున్న హుస్సేన్ (38), పక్క సీట్లో కూర్చున మాధవరావు (55)లు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కులో కూర్చున్న సుందరం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా చైన్నె వాసులే. సుందరాన్ని నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆస్తి రాయించుకుని గెంటేశాడు
● కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ● సమస్యలు తెలుసుకున్న ఎస్పీ కృష్ణకాంత్ ● న్యాయం చేస్తామని భరోసానెల్లూరు(క్రైమ్): ‘నా చిన్న కుమారుడు ఆస్తి రాయించుకుని నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. విచారించి న్యాయం చేయాలి’ అని నెల్లూరు సంతపేటకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ఉద్యోగం పేరిట నగదు తీసుకుని మోసగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిరాకరించాడు.. కుమారుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 78 మంది విచ్చేసి తమ సమస్యలపై ఎస్పీ జి.కృష్ణకాంత్కు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. రాత్రిపూట బస్టాండ్లో ఉంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కావలికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● లింక్డిన్ ద్వారా మాధురి, వెంకటరమణ, చేతన్లు పరిచయమయ్యారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.34 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుడా, నగదు తిరిగివ్వకుండా మోసగించారని పొదలకూరుకు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు. ● హైదరాబాద్కు చెందిన సుదర్శన్ క్రిప్టో ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆరునెలల నుంచి ప్రాఫిట్ ఇవ్వకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్కు చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు. ● నా కుమారుడికి 15 సంవత్సరాలు. అతడితో ఆత్మకూరుకు చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుంది. పదిరోజుల క్రితం కుమారుడిని తీసుకెళ్లి బలవంతంగా పెళ్లిచేసుకుని దాచిపెట్టింది. ఆచూకీ కనుక్కోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. ● ఉదయగిరికి చెందిన వెంకటకుమార్ ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. ఇదేమని అడిగితే సోషల్ మీడియాలో ఫొటోలు ఆప్లోడ్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి విజ్ఞప్తి చేశారు. ● నా కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. -
ఘనంగా వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
వెంకటాచలం: గొలగమూడిలో కొలువైన భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, అభిషేకం, రక్షాబంధన పూజ, దీక్ష వస్త్ర సమర్పణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సర్వభూపాల, కల్పవృక్ష వాహనసేవలను నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు. గొలగమూడి గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఉత్సవాల్లో నేడు ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలను మంగళవారం నిర్వహించనున్నారు. కాకాణికి హైకోర్టులో ఊరట ● రుస్తుం మైనింగ్ కేసులో బెయిల్ నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. రుస్తుం మైన్లో జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని నెల్లూరు రూరల్ డీఎస్పీ విచారణాధికారిగా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ (ఎస్సీ, ఎస్టీ) కేసులో కాకాణి 4వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాకాణి బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు ఓ మనోహర్ రెడ్డి, చేజర్ల శుబోద్ తమ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్కరు రూ. 2 లక్షలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దారులు పూచీకత్తు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి నెల్లూరు జిల్లాలో ఉండకూడని, పాస్ పోర్టు సరెండర్ చేయాలని, ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు విచారణాధికారి వద్ద హాజరు కావాలని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లడానికి వీల్లేదని, కేసు విషయాలపై మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గిరిజనులకు రాజకీయ నమ్మక ద్రోహం
కోవూరు: ‘రాణి తలుచుకుంటే.. గంటల వ్యవధిలో జీఓలే మారిపోతాయి’. అధికార యంత్రాంగం సైతం రిజర్వేషన్ నిబంధనలకు పాతరేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. అత్యధిక గిరిజన జనాభా ఉన్న కోవూరు నియోజకవర్గంలో రాజ్యాంగం నిర్దేశించిన రొటేషన్ విధానంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి ఈ దఫా గిరిజనులకు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఈ పదవిని ఎస్టీ జనరల్కు రిజర్వేషన్ ఖరారు చేస్తూ కలెక్టర్ ఆనంద్ ఆర్సీ నంబరు 168/ఎస్ఎంఏ/2024 ప్రకారం ఈ నెల 14వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు బయటకు వచ్చిన కొద్ది సేపటికే అదే ఉత్తర్వును సవరిస్తూ కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవిని ఓసీ జనరల్కు కేటాయిస్తూ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. దీని వెనుక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రాంగం నడిపారని కలెక్టరేట్లోని విశ్వసనీయ వర్గాల తెలిసింది. రాజకీయంగా ఎదగడం ఇష్టంలేకే.. అనేక సంవత్సరాల తర్వాత రొటేషన్ విధానంలో మొదటగా గిరిజనులకు వచ్చిన అవకాశాన్ని చివరి నిమిషంలో రద్దు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేవలం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. రైతుల జీవితాలతో ముడిపడి ఉండే ఈ పదవి ఎంతో ప్రభావవంతమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే ఈ పదవి గిరిజన నేతలకు దక్కి ఉంటే రాజకీయాల్లో వారి ప్రాతినిథ్యం పెరిగేది. కానీ దాన్ని అడ్డుకుని మళ్లీ సంపన్న వర్గాలకే కట్టబెట్టడం ద్వారా గిరిజనుల ఎదుగుదలకు సమాధి కట్టినట్టే అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం గిరిజనులపై ప్రేమ చూపించే ప్రభుత్వానికి, పదవులు మాత్రం పెత్తందార్లకే కట్టబెట్టడంపై స్థానిక గిరిజన నేతలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఓటు వేయడానికి మాత్రమేనా? అధికారంలో భాగస్వామ్యం కోసం కాదా? అంటూ నిలదీస్తున్నారు. మాటల్లో గిరిజన సంక్షేమం అంటూ నినదించే అధికార కూటమి, ఆచరణలో మాత్రం నమ్మక ద్రోహం చేస్తోందని వాస్తవం మరోసారి బయటపడింది. విడవలూరు టీడీపీ నేతకు కట్టబెట్టేందుకే.. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పదవిపై టీడీపీలోని అగ్రకుల నేతలు కన్నేశారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గాల్లో కోవూరు ఒకటి. వాస్తవంగా కోవూరు ఏఎంసీ పదవి రొటేషన్ పద్ధతిలో ఈ దఫా గిరిజనులకు కేటాయించాల్సి ఉంది. ఈ పదవిని దక్కించుకునేందుకు రాజకీయ కుతంత్రాలకు తెరతీశారు. ఈ పదవికి ఎంతో మంది పోటీపడుతున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన విడవలూరు మండలానికి చెందిన ఓ నేతకు ఈ పట్టం కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చక్రం తిప్పారని స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్ చర్చ జరుగుతోంది. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు కేటాయిస్తూ సాక్షాత్తు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు.. మరి కొద్ది సేపటికే మార్చేస్తూ ఈ పదవిని ఓసీ జనరల్కు కేటాయించడం వెనుక రాజకీయ ఒత్తిడి కనిపిస్తోందని స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో రిజర్వేషన్కు పాతర గంట వ్యవధిలోనే ఓసీ జనరల్ చేస్తూ మరో ఉత్తర్వు గిరిజన హక్కులను కాలరాస్తూ చక్రం తిప్పిన వైనం ఓట్ల కోసమే వారిపై ప్రేమ.. పదవులు మాత్రం పెత్తందార్లకు ఏఎంసీ రిజర్వేషన్ మార్పుపై గిరిజన సంఘాల మండిపాటు కూటమి నేతల కుట్ర రాజకీయాలపై ఉద్యమించాలని నిర్ణయం ఏఎంసీ పీఠం కోసం తమ్ముళ్ల మధ్య పోటీ కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంతో మంది ఆశావహులు ఈ దఫా గిరిజనులకే దక్కుతుందని భావించి సైలెంట్ అయిపోయారు. తాజాగా ఏఎంసీ పీఠం ఓసీ జనరల్కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో నియోజకవర్గంలోని ఆశావహులు ఆ పదవిని దక్కించుకునేందుకు పైరవీలు చేసుకుంటున్నారనే సమాచారం. కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి ముందు క్యూకడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి పదవి కట్టబెట్టినా మరొకరు అలకబూనే అవకాశం ఉండడంతో ఈ పరిణామాలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి తలనొప్పిగా పరిణమించాయి. కోవూరు ఏఎంసీ గిరిజనులకు కేటాయిస్తూ తొలుత ఉత్తర్వులు అధికార పీఠం కోసం గిరిజన జపం చేసే పాలకులు అధికారం దక్కగానే తమ స్వప్రయోజనాల కోసం అగ్రకుల సంపన్నులకు కట్టబెట్టేందుకు గిరిజనులకు నమ్మక ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలకు కోవూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఉదాహరణగా నిలుస్తోంది. చరిత్రాత్మకంగా గిరిజనులకిచ్చే అవకాశాన్ని అడ్డుకోవడం, వారిని మరోసారి పక్కన పెట్టడం మాత్రమే కాకుండా, వారి భవిష్యత్కు సమాధి చేయడమే అని గిరిజనులు, ఆ సంఘ నాయకులు మండిపడుతున్నారు. కూటమి నేతల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనలకు చేస్తున్న రాజకీయ ద్రోహంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమించడానికి గిరిజన సంఘాలు ఉద్యుక్తమవుతున్నాయి. -
బార్ల ఏర్పాటుకు గెజిట్ విడుదల
నెల్లూరు (క్రైమ్): నూతన పాలసీకి అనుగుణంగా జిల్లాలో 2025 – 28 సంవత్సరానికి గానూ ఓపెన్ కేటగిరీ కింద 50 బార్ల ఏర్పాటుకు గెజిట్ను కలెక్టర్ ఆనంద్ సోమవారం విడుదల చేశారు. ఆన్లైన్ / ఆఫ్లైన్ / హెబ్రిడ్ విధానాల్లో సోమవారం నుంచి 26వ తేదీ సాయంత్రం ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ.. కలెక్టర్ సమక్షంలో 28న లాటరీ తీసి ప్రొవిజనల్ లైసెన్స్లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తన కార్యాలయంలో డీపీఈఓ శ్రీనివాసులునాయుడితో కలిసి వెల్లడించారు. జిల్లాలో ఇలా.. మూడేళ్ల కాలపరిమితితో నగరంలో 38.. కావలిలో ఏడు.. కందుకూరులో మూడు.. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున 50 బార్లు ఏర్పాటు కానున్నాయి. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో లైసెన్స్ ఫీజులను ఖరారు చేశారు. నగరంలో రూ.75 లక్షలు.. కావలి, కందుకూరులో రూ.55 లక్షలు.. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీల్లో రూ.35 లక్షలుగా నిర్ణయించారు. ఏటా పది శాతం లైసెన్స్ ఫీజును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని రూపేణా తొలి ఏడాది రూ.36.17 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది. దరఖాస్తు ప్రక్రియ.. ● నూతన బార్ పాలసీలో దరఖాస్తు ఫీజుగా రూ.ఐదు లక్షలు (నాన్ రీఫండబుల్)ను ఖరారు చేశారు. ● ఆన్లైన్లో oc. hpfsproject. com ద్వారా ఎక్కడి నుంచైనా ఫారం – బీ (ఆర్)లోని వివరాలను నింపి దరఖాస్తును సమర్పించొచ్చు. దరఖాస్తు రుసుము, ప్రొసెసింగ్ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ● ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో సమర్పి ంచాలి. దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ ఫీజు రూ.ఐదు లక్షలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పేరుపై, రూ.పది వేలు కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పేరుపై సమర్పించాలి. దీనికి గానూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ● ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. నూతన బార్లు సెప్టెంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. గీత కులాలకు ఐదు బార్లు జిల్లాలో గీత కులాల కోసం ఐదు బార్లను ప్రత్యేకంగా కేటాయించారు. నెల్లూరు నగరపాలక సంస్థలో గౌడ కులస్తులకు రెండు బార్లను కేటాయించగా, లైసెన్స్ ఫీజుగా రూ.37.50 లక్షలను నిర్ణయించారు. కావలి మున్సిపాల్టీలో గమళ్ల.. కందుకూరులో గౌడ కులస్తులకు కేటాయించి.. లైసెన్స్ ఫీజుగా రూ 27.5 లక్షలను ఖరారు చేశారు. అల్లూరు నగర పంచాయతీలో గౌడ కులస్తులకు ఒక బార్ను కేటాయించి.. లైసెన్స్ ఫీజుగా రూ 17.5 లక్షలను నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ 20న విడుదల కానుంది. అదే రోజు నుంచి 29వ తేది సాయంత్రం ఐదు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 30న లాటరీ విధానంలో బార్లను కేటాయించనున్నామని డీసీ తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్లు రమేష్, కిశోర్, శ్రీనివాసరావు, ఎస్సై ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 50కు అనుమతులు ఆన్లైన్ / ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 26తో ముగియనున్న గడువు 28న కలెక్టర్ సమక్షంలో లాటరీ -
వైఎస్సార్సీపీ నేత బిరదవోలుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు : రుస్తుం మైన్స్ అక్రమ కేసులో అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన అస్వస్థతకు లోనవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. జిల్లా సెంట్రల్ జైల్ నుండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటు వచ్చిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత నెల 21వ ేతేదీన అరెస్టైన వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డి.. అదే రోజు అర్థరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.రుస్తుం మైన్స్ అక్రమ కేసులో బిరదవోలు శ్రీకాంత్రెడ్డి నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న శ్రీకాంత్రెడ్డిని గత నెలలో నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్రీకాంత్రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేశారు కూడా. ఏ సమాచారం ఇవ్వకుండా తన భర్తను తీసుకెళ్లారని ఆమె విమర్శించారు. -
బరితెగించిన గంజాయి స్మగ్లర్
నెల్లూరు (క్రైమ్): సినీఫక్కీలో ఓ గంజాయి స్మగ్లర్ తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను కారుతో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరపడంతో కారు వదిలి పరుగుతీశాడు. పోలీసులు వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం నుంచి ఓ వ్యక్తి కారులో 22 కిలోల గంజాయిని నెల్లూరులోని విక్రేతలకు సరఫరా చేసేందుకు తీసుకొస్తున్నాడని సమాచారం అందడంతో బాలాజీనగర్ పోలీస్స్టేషన్ సీఐ కె.సాంబశివరావు తన సిబ్బంది, ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్తో కలిసి జాతీయ రహదారిపై కాపు కాశారు. గంజాయి తీసుకొస్తున్న కారును గుర్తించి పెన్నా బ్రిడ్జి అవతలి వైపు నుంచి వెంబడించారు. నిందితుడు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఇద్దరికి గంజాయి ఇచ్చేందుకు కారును స్లో చేశాడు. ఒక్కసారిగా పోలీసులు కారును చుట్టుముట్టగా, గంజాయి తీసుకునేందుకు వచి్చన వ్యక్తులు పారిపోయారు. గంజాయి స్మగ్లర్ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించి దూసుకువెళ్లాడు. దీంతో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్కు గాయాలయ్యాయి. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు ఆ కారును వెంబడిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కారు అద్దాలు పగిలిపోయాయి. స్మగ్లర్ ఎన్టీఆర్ నగర్లోకి వెళ్లి అక్కడ కారును వదిలి పారిపోతుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడ్ని బాలాజీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. నిందితుడిని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బీరక ప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ గా గుర్తించారు. అతని నుంచి కారు, 22 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ను జీజీహెచ్లో చేర్పించారు.నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నిందితుడు బీరక ప్రకాష్ కారు డ్రైవర్గా పని చేస్తుంటాడని, చాలా ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని వివిధ ప్రాంతాల్లోని విక్రేతలకు సరఫరా చేస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. అతనిపై నెల్లూరు సంతపేట, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, ఏలూరు ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడని గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరులో జాకీరాబీ అనే విక్రేతకు గంజాయి సరఫరా చేసేందుకు వచ్చినట్లు తేలింది. ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ నెల్లూరుకు వచ్చి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్ను పరామర్శించారు. అనంతరం ఘటనాస్థలాన్ని, నిందితుడు ఉపయోగించిన కారును పరిశీలించారు. -
తేలుకాటుతో బాలుడి మృతి
కావలి (జలదంకి): తేలుకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కావలి రూరల్ మండలం గౌరవరం ఎస్టీ కాలనీకి చెందిన చౌటూరి చిన్నయ్య పట్టణంలోని పుల్లారెడ్డినగర్లో గల వాటర్ ప్లాంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఆయన రెండో కుమారుడు శ్రీనివాసుడు (11) స్థానికంగా ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ కొంతకాలంగా స్కూల్కు వెళ్లడంలేదు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న తాటి చెటెక్కి పండ్లు కోస్తుండగా, తేలు కుట్టింది. దీంతో జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కావలి రూరల్ ఎస్సై బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీని ఢీకొన్న బస్సు ● క్లీనర్ దుర్మరణం గుడ్లూరు: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందిన ఘటన తెట్టు ఫ్లయ్ఓవర్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సు క్లీనర్ ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందారు. మృతుడ్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాలకు చెందిన వారిగా గుర్తించారు. పోస్ట్మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలిచారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకట్రావు తెలిపారు. -
రైల్లోంచి జారిపడి ముగ్గురి దుర్మరణం
గుర్తుతెలియని వ్యక్తి.. కావలి (జలదంకి): రైల్లోంచి జారిపడటంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కావలి రైల్వేస్టేషన్ పరిధిలోని ముసునూరు సమీపంలో దిగువ లైన్లో చోటుచేసుకుంది. కావలి రైల్వే ఎస్సై వెంకట్రావ్ వివరాల మేరకు.. మృతుడు తెలుపు చొక్కా, తెలుపు రంగు కట్ బనియన్, బ్లూ ప్యాంట్ను ధరించి ఉన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కావలి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు 94406 27648 నంబర్ను సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాల్లో రైల్లోంచి జారి పడి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, కావలి సమీపంలో జరిగిన ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మరణించారు. తలుపు వద్ద మాట్లాడుకుంటూ.. నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన పోలయ్య (24), అర్షద్ (19), వెంకటేష్ స్నేహితులు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ క్లీనర్గా పోలయ్య.. మెకానిక్గా అర్షద్ పనిచేస్తున్నారు. స్నేహితుడి తమ్ముడి కుమార్తె ఫంక్షన్ నిమిత్తం విజయవాడకు ఈ నెల 14న రైల్లో వీరు బయల్దేరారు. బోగీ తలుపు వద్ద పోలయ్య, అర్షద్ కూర్చొని మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో కొండాయపాలెం గేట్ సమీపంలో వీరి జారిపడ్డారు. కొద్దిసేపటికి వీరు కనిపించకపోవడంతో నెల్లూరులో రైలు దిగి చుట్టుపక్కల వెంకటేష్ గాలించారు. అనంతరం చెన్నూరెళ్లి జరిగిన విషయాన్ని స్నేహితుల కుటుంబసభ్యులకు తెలియజేశారు. అందరూ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులకు ఓ మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కొండాయపాళెం గేట్ సమీపంలోని చెట్లలో దుర్గంధం వస్తుండటాన్ని రైల్వే సిబ్బంది శనివారం గమనించారు. పరిశీలించగా మృతదేహం కనిపించింది. ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు.. అర్షద్గా గుర్తించారు. ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అక్కడే ఉన్న మరో మృతదేహాన్ని బాధిత కుటుంబసభ్యులకు చూపించగా అది పోలయ్యదని గుర్తించారు. రైల్వే ఎస్సై హరిచందన దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అర్షద్, పోలయ్య (ఫైల్) -
ఇస్కాన్లో వేడుకగా కృష్ణాష్టమి
నెల్లూరు(బృందావనం): ఇస్కాన్ సిటీలోని ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. మందిరంలో కొలువైన రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను విశేషంగా జరిపారు. జగన్నాథ, సుభద్ర, బలరాములు విశేషాలంకారంలో దర్శనమిచ్చారు. కృష్ణ భగవానుడికి ఊంజల్సేవను నిర్వహించారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముద్రించిన సావనీర్ను మందిరాధ్యక్షుడు శుఖదేవస్వామి ఆవిష్కరించి, భక్తులకు అందజేశారు. కృష్ణ భగవానుడికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించి 108 వంటకాలతో నివేదన చేసి మహా హారతినిచ్చారు. శ్రీలప్రభుపాద వ్యాసపూజ నేడు ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీలప్రభుపాద వ్యాస పూజను ఆదివారం నిర్వహించనున్నామని శుఖదేవస్వామి తెలిపారు. హారతి, 56 వంటకాలతో నివేదన తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నామని, భక్తులు తరలిరావాలని కోరారు. ● పూజా కార్యక్రమాలకు ఎస్పీ కృష్ణకాంత్ దంపతులు హాజరయ్యారు. -
విద్యార్థులకు అభినందన
నెల్లూరు (టౌన్): పార్థసారథినగర్లోని జెనెక్స్ బీ స్కూల్లో క్యాంపస్ డ్రైవ్ను బెంగళూరుకు చెందిన ఐటీ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న విద్యార్థులను స్కూల్లో శనివారం అభినందించిన అనంతరం చైర్మన్ వెంగళ్రెడ్డి, డైరెక్టర్ కొండలరావు మాట్లాడారు. ఇప్పటి వరకు అనేక డ్రైవ్లను నిర్వహించి 150 మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించామని వెల్లడించారు. కంపెనీ హెచ్ఆర్ శ్రీకన్య, పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్తేజ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనిల్, ప్లేస్మెంట్ హెడ్ చరణ్తేజ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): అలంకార్ సెంటర్లో ఇటీవల దారుణ హత్యకు గురైన లైఖ్ కేసులో నిందితులను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వెల్లడించారు. కేటరింగ్ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న కసాయివీధికి చెందిన లైఖ్ (36) వద్ద కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డుకు చెందిన నూరుద్దీన్ అలియాస్ నూర్ పనిచేస్తున్నారు. తన భార్యతో చనువుగా ఉండేందుకు లైఖ్ యత్నించడంతో పాటుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నూర్ జీర్ణించుకోలేకపోయారు. లైఖ్ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని విషయాన్ని వైఎస్సార్నగర్కు చెందిన తన స్నేహితుడు ఉస్మాన్ అలియాస్ దావూకు చెప్పారు. నిందితులిద్దరూ కలిసి విక్టోరియా గార్డెన్స్ వద్ద లైఖ్ను ఈ నెల 13న హత్య చేసి పరారయ్యారు. మృతుడి అన్న రఫీ ఫిర్యాదు మేరకు హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఇన్స్పెక్టర్ ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భగత్సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు కత్తులు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో 20 కుటుంబాల చేరిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): టీడీపీని 20 కుటుంబాలు వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ పదో డివిజన్ నేత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీరు పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామ్జీనగర్లోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతరం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బలోపేతానికి పనిచేయాలని సూచించారు. జగనన్నను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా వ్యవహరించాలని కోరారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యమిస్తామని చెప్పారు. -
గౌతు లచ్చన్న జీవితం ఆచరణీయం
నెల్లూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి తరానికి ఆచరణీయమని జేసీ కార్తీక్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గౌతు లచ్చన్న జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, మత్స్యశాఖ జేడీ శాంతి, బీసీ నేతలు జనార్దన్రాజు, జనార్దన్గౌడ్, ఉప్పు భాస్కర్, పద్మజాయాదవ్, శ్రీనివాసులు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో.. నెల్లూరు(క్రైమ్): నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ కృష్ణకాంత్ నివాళులర్పించారు. -
తమిళ బోట్లను తరిమికొడుదాం
● జువ్వలదిన్నెలో నాలుగు జిల్లాల్లోని 134 మత్స్యకార గ్రామాల కాపుల సమావేశం ● పట్టుబడిన కడలూరు, కారైకల్ బోట్లను గస్తీకి వినియోగించాలని నిర్ణయం బిట్రగుంట: రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాల్లో మత్స్య సంపదను కొల్లగొడుతూ తీరప్రాంత గ్రామాలకు ఉపాధి లేకుండా చేస్తున్న తమిళనాడు బోట్లను సమష్టిగా అడ్డుకోవాలని నాలుగు జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తమకు పట్టుబడి జువ్వలదిన్నె హార్బర్లో ఉన్న కడలూరు, కారైకల్ బోట్లను గస్తీకి వినియోగించాలని నిర్ణయించారు. మత్స్యకార గ్రామకాపుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని మత్స్యకార కాపులు జువ్వలదిన్నెలో శనివారం రెండో విడత సమావేశమయ్యారు. పెద్దబోట్లు, వలలతో వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారుల ఉపాధికి గండికొడుతున్న తమిళనాడు బోట్లను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, మైరెన్ పోలీస్లు ఎవరూ చొరవ తీసుకోవడం లేదని, ఫలితంగా స్థానిక మత్స్యకారులపై దాడులు చేయడం, వలలు ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ పదేళ్ల నుంచి తమిళనాడు బోట్లు (పెద్ద బోట్లు) రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని తీరంలో వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నాయన్నారు. పెద్ద వలలు, నిషేధిత వలలతో వేట సాగిస్తూ చిన్నచిన్న చేపలను కూడా పట్టుబడి చేస్తుండడంతో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోయి మత్స్యసంపద లభించడం కష్టంగా మారిందన్నారు. వీరు వేట సాగించే సమయంలో స్థానిక మత్స్యకారుల వలలు, పడవలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. మత్స్య సంపదకు చేటు తెస్తున్న తమిళనాడు బోట్లను అడ్డుకోవాలని పదేపదే అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో 2023లో సుమా రు వంద గ్రామాల కాపులతో ఇస్కపల్లిలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జూలై 31న ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం సమీపంలో తీరానికి చొచ్చుకు వచ్చి వేట సాగిస్తున్న కడలూరు, కారైకల్ బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారని వివరించారు. ఈ బోట్లను స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్కు చేర్చడం జరిగిందన్నారు. పట్టుబడిన ఈ బోట్లనే గస్తీకి వినియోగించి తమిళనాడు బోట్లను పూర్తిగా అడ్డుకోవాలని తాజా సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశా రు. తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని లక్ష్యంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
అంతా అయోమయం
ఉచిత బస్సు ప్రయాణం కొందరికే.. నెల్లూరు సిటీ: ఏడాదికిపైగా ఊరించిన ఉచిత బస్సు పథకం ఉస్సూరుమనిపిస్తోంది. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూనే కొర్రీలు, మెలికలు పెట్టి షరతులు విధించింది. కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయదు. ఒక వేళ చేస్తే మాత్రం ప్రచారం ఆర్భాటంగా ఉంటుంది. ఉపయోగం మాత్రం ఉండదు అనేదానికి సీ్త్రశక్తి (ఉచిత బస్సు పథకం) ఉదాహరణగా నిలుస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణం ఉచితం అంటూనే ఆయా రూట్లలో తొలి రోజునే సర్వీసులు కుదించేసింది. ఇక ఒక ఎక్స్ప్రెస్లో ఉచితం, మరో ఎక్స్ప్రెస్లో సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టడం చూసి ప్రయాణికులు నివ్వెరపోతున్నారు. ప్రస్తుతానికి రద్దీ లేకపోవడంతో పరిస్థితి ఏమిటనేదా ఇంకా అర్థం కాలేదు. రెండు.. మూడు రోజులు గడిస్తే కానీ ఎలా ఉంటుందో చెప్పలేమంటూ ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఘాట్ రూట్ బస్సుల్లో టికెట్ కొనాల్సిందే.. జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి రాజంపేట మధ్య ప్రతి రోజు 10 ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి 5 బస్సులు, రాజంపేట డిపో నుంచి 5 బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఘాట్ రూట్లో నడిచే ఈ బస్సు సర్వీసుల్లో సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. ఇంటర్ స్టేట్ బస్సుల్లోనూ అంతే.. నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు డిపోల నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు కొన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతున్నారు. ఇవి ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదని చెబుతున్నారు. నెల్లూరు నుంచి చైన్నె వెళ్లే బస్సులు గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ప్రధాన స్టాపింగ్లు ఉన్నాయి. కనీసం నెల్లూరులో ఎక్కి గూడూరులో దిగాలన్నా.. గూడూరులో ఎక్కి నాయుడుపేటలో దిగాలన్నా.. సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ చెబుతున్నారు. ఈ బస్సుల్లో కనీసం జిల్లా పరిధిలోనూ ప్రయాణించేందుకు అవకాశం లేకపోవడంతో మహిళా ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. అన్ని డిపోల నుంచి తిరిగే బస్సుల్లోనూ ఇవే నిబంధనలు వర్తించడంతో మహిళల ప్రయాణానికి ఉపయోగపడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గూడూరు వరకే ఆర్డినరీలు.. నెల్లూరు నుంచి నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, సూళ్లూరుపేట, తడ వరకు వెళ్లే ప్రయాణికులకు ఆర్డినరీ బస్సులే లేవు. నెల్లూరు నుంచి గూడూరు వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి నాయుడుపేట వైపు ఆర్డి నరీ బస్సులే లేవు. ఇటు దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, అటు పెళ్లకూరు, శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్లాంటే ఉచిత ప్రయాణం దుర్లభమే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చంటూ చంద్రబాబు అండ్ కూటమి కో చేస్తున్న ఆర్భాటంగా చేసిన ప్రచారానికి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఉచిత బస్సు అంటూనే షరతులు వర్తిస్తాయంటూ ‘కూటమి’ మార్కుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒరిజినల్ కార్డు లేకపోతే టికెట్ కొనాల్సిందే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఆంక్షలతో మహిళలకు ఉచిత ప్రయాణం లేకుండా కొత్త ఎత్తులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను చూపించాలని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆయా కార్డులు తప్పనిసరిగా ఒరిజనల్ కార్డు చేత పట్టుకుని రావాలని కండక్టర్లు హెచ్చరిస్తున్నారు. జెరాక్స్లు, ఫోన్లో కార్డులను చూపిస్తే చెల్లుబాటు కావని అధికారులు తెలుపుతున్నారు. ఉదయగిరి: ఉదయగిరి డిపో పరిధిలో ఉన్న 57 బస్సుల్లో 39 సర్వీస్ల్లోనే సీ్త్ర శక్తి పథకం వర్తిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పిన చంద్రబాబు అమల్లోకి వచ్చే సరికి కేవలం కొన్ని సర్వీసులకు మాత్రమే వర్తింప చేస్తూ మోసం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి డిపో నుంచి 5 సర్వీసులు చైన్నెకు వెళ్తున్నా.. వీటిల్లో ఉచిత ప్రయాణం అమలు చేయడం లేదు. ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. కనీసం జిల్లా, రాష్ట్ర పరిధిలోనూ ఉచితంగా ప్రయాణించే వీలు లేదనడం విడ్డూరమని మహిళలు మండి పడుతున్నారు. ఉదయగిరి డిపో నుంచి నెల్లూరుకు ఉదయం 7.30 గంటల తర్వాత 9 గంటల వరకు ఉచితంగా ప్రయాణించేందుకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులే లేవు. ఈ సమయంలో చైన్నె సర్వీ సు ఉన్నప్పటికీ టికెట్ కొని ప్రయాణించాల్సిందే. ఉన్న బస్సులు కుదించి ఉచిత ప్రయాణం అంటే ఎలా అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి డిపో నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత నెల్లూరు వైపు వెళ్లే సర్వీసులు చైన్నెకు వెళ్లేవి కావడంతో టికెట్లు కొని ప్రయాణించాల్సిందే. అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 90 శాతం పల్లెలకు బస్సులు లేవు. మరి పల్లెల్లో ఉండే మహిళలకు ఉపయోగం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే ఎరుక. ఉదయగిరి నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఉచిత సర్వీసు కూడా లేదు. మరి ఆ సమయం తర్వాత వెళ్లే మహిళలు తిరిగే బస్సుల్లో టికెట్లు కొని ప్రయాణించాల్సిందే. ఉదయగిరి నుంచి నెల్లూరు, కావలి, బద్వేల్, పామూరు వైపు వెళ్లే ఫ్రీ సర్వీసులు పరిమితంగా ఉండడంతో ఉదయగిరిలోనే బస్సులు నిండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టేజీల్లో ఎక్కే ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయాల్సిందే. ఉచిత సర్వీసులు పెంచితే ఈ సమస్య ఉండదు. ఆత్మకూరురూరల్: కూటమి ఆర్భాటంగా ప్రచారం చేసుకొని ప్రారంభించిన సీ్త్రశక్తి ఉచిత బస్సు పథకంపై మహిళల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణించవచ్చని ఇటీవల ప్రభుత్వం విధి విధానాలు ప్రకటిస్తూ ఆర్భాటంగా చెప్పింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వయా అన్నవరం వరకు మహిళలు ఉచిత బస్సుల్లో వెళ్లి తీర్థయాత్రలు చేసుకోవచ్చని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మహిళలు గుర్తు చేసుకున్నారు. వాస్తవంలోకి వస్తే అనేక ఆంక్షలు, కొర్రీలతో ప్రయాణానికి అడ్డంకులు సృష్టించిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో మొత్తం 67 బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఆత్మకూరు డిపో నుంచి చైన్నె, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో జిల్లా పరిధిలో కానీ, రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలకు ప్రయాణించడానికి సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ నిబంధనలు విధించారు. ఇక పల్లెవెలుగు బస్సుల్లోనూ కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సుల్లో షరతులు వర్తిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ ఫ్రీ బస్సుల్లో షరతులు వర్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూనే మెలికలు పెట్టింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది. ఆర్టీసీ బస్సుల్లో పెట్టిన నిబంధనలతో డిపో నుంచి డిపో వరకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు–కావలి, నెల్లూరు– గూడూరు మధ్య నడిచే బస్సులన్నీ ఎక్స్ప్రెస్లే అయినా నాన్స్టాప్ సర్వీస్లో ఉచితం లేదంటూ షరతులు అమలు చేస్తోంది. జిల్లాలోని డిపోల నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ రాష్ట్ర పరిధి వరకు కాదు కనీసం జిల్లా పరిధిలోనూ సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. ప్రధానంగా నెల్లూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేటకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచితం లేదంటూ నిబంధనలు పెట్టింది. ఎక్స్ప్రెస్ల్లోనూ ఎక్కలేరు నెల్లూరు టు రాజంపేట బస్సులో సీ్త్రశక్తి వర్తించదు జిల్లా నుంచి వెళ్లే ఇంటర్ స్టేట్ బస్సుల్లోనే ఇదే రూల్ నాన్స్టాప్ సర్వీస్ల్లోనూ అంతే అన్నీ నాన్స్టాప్లే.. వీటిల్లోనూ ఇదే రూల్ నెల్లూరు– కావలి, నెల్లూరు–గూడూరు మధ్య ఎక్స్ప్రెస్ బస్సులను నాన్స్టాప్ చేశారు. ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. వీటిల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదంటూ ఆంక్షలు పెట్టారు. ఇక నెల్లూరు నుంచి తిరుపతికి కూడా అన్నీ నాన్స్టాప్లే వీటిల్లోనూ ఎక్కి వీలులేకపోవడంతో మహిళలు ఉస్సూరుమంటున్నారు. ఉన్న అరకొర బస్సుల్లో ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణానికి కొర్రీలు, మెలికలు పెడుతోంది. ఫ్రీ టికెట్ .. కొన్ని బస్సుల్లోనే..కూటమి ప్రభుత్వం ఈ నెల 15న సాయంత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం శనివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే ఆంక్షలు మహిళా ప్రయాణికులకు అయోమయం, గందగోళంగా మారింది. జిల్లాలోని 7 ఆర్టీసీ డిపోల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 492 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కలిపి 61 బస్సులు, కందుకూరు డిపో పరిధిలో 60, కావలిలో 90, నెల్లూరు–1 డిపో పరిధిలో 91, నెల్లూరు–2 డిపో పరిధిలో 90, రాపూరు డిపో పరిధిలో 49, ఉదయగిరి డిపో పరిధిలో 51 బస్సులను మహిళల ప్రయాణానికి ఏర్పాటు చేశారు. ఏ బస్సుల్లో ఫీ ఉందో.. ఏ బస్సులో లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. శనివారం నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ మహిళలకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. చాలా మంది మహిళలు ఆయా బస్సుల్లోకి ఎక్కాక.. ఈ బస్సులో టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్లు చెప్పడంతో దిగేస్తూ.. కూటమి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. శనివారం నెల్లూరు నుంచి వాకాడుకు వెళ్లేందుకు వాకాడు డిపోకు చెందిన ఓ ఎక్స్ప్రెస్ బస్సు ప్లాట్ఫాం మీదకు వచ్చింది. అందులో ప్రయాణికులు ఎక్కాక కదిలి వెళ్లిపోయింది. వెంటనే అదే రూట్లో నడిచే మరో ఎక్స్ప్రెస్ బస్సును ప్లాట్ఫాం మీదకు తెచ్చారు. ప్రయాణికులు అందులోకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ బస్సులో మహిళలు టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇదీ ఎక్స్ప్రెస్.. అదీ ఎక్స్ప్రెస్సే కదా అని బస్సు సిబ్బందిని అడిగితే మాకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. ప్రచారమే తప్ప ప్రయోజనం శూన్యం మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రచారం తప్ప.. ఆచరణ, ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అయితే ఎటువెళ్లిన పాతిక, ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశమే లేదు. పల్లెవెలుగుల్లోనే ప్రయాణించాలంటే.. డీసీపల్లి నుంచి నెల్లూరుకు రెండు బస్సులు మారి పోవాల్సిందే. రాష్ట్ర పరిధి దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని చెప్పడం మహిళలను మోసం చేయడమే. కనీసం ఆ బస్సుల్లో రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలకు కూడా వెళ్లకూడదని పేర్కొనడం మరీ విడ్డూరం. – రెడ్డి శాంతమ్మ, డీసీపల్లి, మర్రిపాడు -
తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేయాలి
● ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తుకూరు (పొదలకూరు) : రెండు తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేసుకుంటే తద్వారా ప్రభుత్వాలతోపాటు, వ్యాపారులకు ఆదాయం వస్తుందని ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం అసోసియేషన్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారుల వల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతున్నట్టు అభిప్రాయపడ్డారు. పంటపాళెంలోని పామాయిల్ ఫ్యాక్టరీల నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు బల్క్గా 5 వేలు, 10 వేల టన్నుల పామాయిల్ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధరల్లో తేడాలు వచ్చిన సమయంలో వారే మనకు విక్రయిస్తున్నందున వ్యాపారులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఈ అంశంపై తమ అసోసియేషన్ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఎలా అధిగమించాలనే ఆలోచనలతో కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. గత నెల 29న కడపలో వ్యాపారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఈ నెల 1 నుంచి ఏపీ బ్రోకర్స్ ద్వారా వర్తకులు రీ–సేల్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బిల్స్ ఉంటేనే పామాయిల్ కొనుగోలు చేసే విధంగా వ్యాపారులకు తెలియజేశామన్నారు. లోకల్ ట్రేడ్ సర్వీస్ వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటహరినాథ్, ట్రెజరర్ చక్రపాణి తదితరులు మాట్లాడారు. ‘చలో కరేడు’ పోస్టర్లు తొలగించడం దారుణం ● ఇది ఎమ్మెల్యే, పోలీసుల దుశ్చర్య ● ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోన్న కూటమి ప్రభుత్వం నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఉలవపాడు మండలం కరేడు రైతులకు మద్దతుగా ఈ నెల 18న ‘చలో కరేడు’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యేతో కలిసి పోలీసులు దుర్చశ్యకు పాల్పడ్డారని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆరోపించారు. శనివారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుని ప్రైవేట్ సోలార్ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని ఈ చర్యను నిరసిస్తూ వామపక్షాలు, పలు రైతు సంఘ నాయకులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ‘చలో కరేడు’ కార్యక్రమ ప్రచార పోస్టర్లను ఆ గ్రామంతోపాటు సమీప ప్రాంతాల్లోనూ గోడల కు అంటించామన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు కరేడులో ఏర్పాటు చేసిన పోస్టర్స్ను శనివారం రాత్రి తొలగించారన్నారు. శనివారం రాత్రి ‘చలో కరేడు’ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న స్థానికుడైన అంకమరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. విజయ్కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు యత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసన తెలిపే హక్కులను కాలరాసే దుశ్చర్యలను ప్రభుత్వ పెద్దలు, పోలీసులు మానుకోకపోతే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు ప్రతిఘటన మరో స్థాయిలో చూడాల్సి వస్తుందని రమేష్ హెచ్చరించారు. పోస్టర్లు తొలగించినంత మాత్రాన ఉద్యమాన్ని అణిచి వేయలేరని, రైతులను, ప్రజలను రెచ్చగొట్టితే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడిగా లక్ష్మీ నరసింహుడు రాపూరు: మండలంలోని పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి శనివారం రాత్రి భక్తులకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారి అలంకార మండపంలో శేషవాహనంపై పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీ ఉత్సవర్లను కొలువుదీర్చారు. స్వామివారిని శ్రీకృష్ణుడిగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోన మాఢవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవి గ్రహాలకు పాలు, తేనే, పెరుగు, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్నపన తిరుమంజనం, హోమం, కల్యాణం నిర్వహించారు. సా యంత్రం ఉట్టి మహోత్సవం నిర్వహించారు. -
వేమిరెడ్డితో బెడిసిందా!
● రూప్కుమార్ ఫ్లెక్సీల్లో వీపీఆర్ ఫొటో లేకపోవడంపై చర్చ సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లా పాలిటిక్స్లో ప్రధానంగా టీడీపీలో ఒక చర్చ నడుస్తోంది. ఇది ప్రస్తుత తరుణంలో హాట్టాపిక్గా మారింది. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని తీసుకెళ్లడంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ మంత్రాంగం నడిపించారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో మైనింగ్ వ్యవహారంలో కూడా రూప్కుమార్ పార్టీ అధిష్టానం వద్ద ఎంపీ వేమిరెడ్డిని ముందు పెట్టి వెనుక నుంచి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఏడాది కాలంగా జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. జిల్లాలోని మొత్తం మైన్లను తన గుప్పెట్లో పెట్టుకుని రూప్కుమార్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నట్టు ఉండి.. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తాను మైనింగ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్టన్లు ప్రెస్మీట్ పెట్టి బహిరంగంగా ప్రకటించారు. వేమిరెడ్డి కోటరీలో కీలక నేతగా ఉన్న రూప్కుమార్ కొద్ది రోజులుగా మరో కోటరీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రూప్కుమార్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఆయన అభిమానులు నగరంలో ఫ్లెకీలను నింపేశారు. అందులో పార్టీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్, డీసీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, ఎన్టీఆర్ ఫొటోలు ఉన్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఫొటో లేకపోవడంపై టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా రెండు రోజులుగా రూప్కుమార్ మంత్రి నారాయణ వెంటనే కార్యక్రమాల్లో పాల్గొంటుండడం కూడా ఈ చర్చకు అద్దం పడుతోంది. వేమిరెడ్డి, రూప్కుమార్ మధ్య ఏమన్నా బెడిసిందా ఏమిటి అనే చర్చ సొంత పార్టీ లోనే హాట్టాపిక్గా మారింది. -
తిరంగా.. మదినిండా..
నెల్లూరు(అర్బన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పెహల్గాం ఘటనపై కోవూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 70 మంది విద్యార్థినులు ప్రదర్శన ఇచ్చారు. కావలి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలికల జయహో.. జయహో, నగరంలోని ఎస్ఆర్కే నెక్ట్స్ జనరేషన్ ఇస్కాన్ సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థుల హమ్ ఇండియా వాలా ప్రదర్శనలు దేశ గొప్పతనాన్ని చాటాయి. ● విద్యాశాఖ శకటం ప్రథమ బహుమతి, నెల్లూరు నగరపాలక సంస్థ శకటం రెండో స్థానం, వ్యవసాయ అనుబంధ శాఖ శకటం తృతీయ స్థానంలో నిలిచాయి. ● ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లకు సంబంధించిన 55 మంది మాజీ సైనికులకు 180 ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలుగా అందజేశారు. ● వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పరిశీలించారు. ● డీఆర్డీఏ ఆధ్వర్యంలో 10 మంది చిరు వ్యాపారులకు చేయూతనిచ్చారు. అలాగే ఐటీడీఏ ఆధ్వర్యంలో కుట్టుమెషీన్లు, జ్యూట్ బ్యాగ్ కుట్టుమెషీన్లు, చేపలు పట్టేవారికి సైకిళ్లు, వలలు పంపిణీ చేశారు. -
పోలీస్ శాఖలో..
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్లు ప్రశంసాపత్రాలను అందజేశారు. సేవా పతకం అందుకున్న హోంగార్డ్స్ ఆర్ఐ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా జిల్లా హోంగార్డ్స్ ఆర్ఐ వై.పౌల్రాజు సేవా పతకం అందుకున్నారు. ఆయనకు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. -
‘నాన్నా.. నేనిక బతకను’
● రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుమారుడు ● తండ్రి 108 పైలట్ ● అంబులెన్స్లో తీసుకెళ్తుండగా మృతి ● మైనర్ బాలుడి నిర్వాకం పొదలకూరు: ఆ యువకుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇంతలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108 పైలట్గా వెళ్తున్న తండ్రి కుమారుడిని తన అంబులెన్స్లో తరలిస్తుండగా తుదిశ్వాస విడిచిన హృదయ విషాదరక ఘటన గురువారం రాత్రి మరుపూరు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పొదలకూరు శింగయ్య చేనువీధికి చెందిన మందాటి సురేష్ ఆదూరుపల్లి 108 అంబులెన్స్ పైలట్. ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఆయన పెద్ద కుమారుడు మందాటి బాలసు బ్రహ్మణ్యం (20) సొంతంగా కారు నడుపుతూ కుటుంబానికి అండగా ఉన్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి బాలసుబ్రహ్మణ్యం తన కారులో నెల్లూరుకు డ్రాపింగ్కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. సురేష్ ఒకరిని నెల్లూరు ఆస్పత్రిలో చేర్చి వస్తూ కుమారుడి కారును చూశాడు. అంబులెన్స్, కారు పొదలకూరుకు బయలుదేరాయి. డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు నెల్లూరు వైపు అతి వేగంగా కారులో వెళ్తున్నాడు. సురేష్ అంబులెన్స్ను బాలుడి కారు ఢీకొనే క్రమంలో ప్రమాదం తప్పింది. తన కుమారుడి కారు వెనుక వస్తున్నందున సురేష్ వెంటనే ఫోన్ చేశాడు. అతను లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ చేశాడు. మరో యువకుడు ఫోన్ లిఫ్ట్ చేసి కారు ప్రమాదం జరిగినట్లు చెప్పాడు. సురేష్ వెంటనే అంబులెన్స్ను వెనక్కు తిప్పి ఘటనా స్థలానికి వెళ్లాడు. మరుపూరుకు సమీపంలో మద్యం తాగి అతివేగంగా వెళుతున్న బాలుడు బాలసుబ్రహ్మణ్యం కారును ఢీకొనడంతో దెబ్బతింది. తీవ్రంగా గాయపడిన కుమారుడిని సురేష్ నెల్లూరుకు తరలిస్తూ డైకస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం తన తండ్రితో ‘నాన్నా నేను ఇక బతకను’ అంటూ తుదిశ్వాస విడిచాడు. మైనర్కు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. క్షతగాత్రుడిని పొదలకూరు పోలీసులు జీజీహెచ్కు తరలించారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం చేతుల మీదుగా ఐపీఎం స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): విజయవాడ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరిరావు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం) స్వీకరించారు. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది శ్రీహరిరావును పలువురు పోలీసు అధికారులు అభినందించారు. అసిస్టెంట్ కమిషనర్కు అవార్డునెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఏసీ (అసిస్టెంట్ కమిషనర్) పి.దయాసాగర్, హెడ్కానిస్టేబుల్ ఎం.కిరణ్సింగ్కు అవార్డులు వరించాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. 50 మద్యం బాటిళ్ల స్వాధీనంవెంకటాచలం: అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని 50 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలోని చవటపాళెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారని వెంకటాచలం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో గ్రామానికి వెళ్లి రామాలయం వద్ద ఉన్న రావుల ఉదయ్కుమార్ అనే వ్యక్తిని విచారించారు. అతని వద్ద సుమారు రూ.6,500 విలువైన 50 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వాటిని నెల్లూరు నగరంలోని మందాకిని షాప్ నుంచి తీసుకొస్తున్నానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశిష్ట సేవలకు ప్రశంసలు
నెల్లూరు(అర్బన్): వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆద్విక రమ్య, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ, నెల్లూరు సుదేష్ణ, డీఈ, నెల్లూరు నగరపాలక సంస్థ వేణుగోపాల్, పీఎంపీ జిల్లా అధ్యక్షుడురామనిర్మల, అకౌంటెంట్, కార్పొరేషన్అలేఖ్య, బీసీ కార్పొరేషన్ ఆర్.ప్రదీప్ కుమార్, డీఆర్వో సీసీ -
పోలీసుల స్పెషల్ డ్రైవ్
● నిబంధనల ఉల్లంఘనులకు భారీగా జరిమానాలు నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనులపై కొరడా ఝళిపించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న 100 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,06,500లు జరిమానా విధించారు. అదేక్రమంలో నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలోని 54 లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వారిని ఎక్కడి నుంచి వచ్చారు?, ఎందుకు వచ్చారు?, ఏం చేస్తున్నారు తదితర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మితిమిరీన వేగం, ట్రిపుల్, మైనర్ రైడింగ్, ఓవర్లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్కు పాల్పడుతున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి భారీగా జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనచోదకులు విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దుకాణం దగ్ధం
● రూ.20 లక్షల ఆస్తి నష్టం ● లబోదిబోమంటున్న బాధితులు వింజమూరు(ఉదయగిరి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆటో స్పేర్స్ దుకాణం దగ్ధమైంది. ఈ ఘటన వింజమూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ సమీపంలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. బుజ్జమ్మ కొన్ని సంవత్సరాలుగా ఆటో స్పేర్స్, వివిధ రకాల వాహనాలకు సీటు కవర్లు, ఆయిల్ విక్రయిన్నారు. ఇటీవల భారీగా సరుకు నిల్వ ఉంచారు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఉన్న ఒక గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. మొత్తం సామగ్రి కాలిపోయింది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా వారొచ్చి మంటలు ఆర్పారు. దీంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించలేదు. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రైలు కొద్దిదూరం లాక్కెళ్లడంతో ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున మాగుంట లేఅవుట్ అండర్బ్రిడ్జి సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చు. తెలుపు, గులాబీ రంగులు మిళితమైన హాఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.● జారిపడి.. గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడిన ఘటన శుక్రవారం బుజబుజనెల్లూరు సమీపంలో నెల్లూరువైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. అతడిని రైల్వే ట్రాక్మెన్ జి.భార్గవ్బాబు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడు నలుపు రంగు ఫుల్హ్యాండ్స్ టీషర్టు, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
సగర్వంగా.. త్రివర్ణ వీచికలు
నెల్లూరు (అర్బన్): సంక్షేమంతోపాటు అభివృద్ధే ధ్యేయంగా జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్లో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం శాంతికపోతాలను, బెలూన్లను ఎగుర వేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర సాధన కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామన్నారు. ఈ ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన పీ4 విధానం ద్వారా జిల్లాలో 38,465 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమగ్రాభివృద్ధికి కృషి జిల్లాలోని రైతులకు అండగా అన్నదాత సుఖీభవ పథకం కింద 1.96 లక్షల మందికి రూ.132 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 1,454 రైతులకు రూ.6.8 కోట్ల విలువైన యంత్రపరికరాలను రూ 2.83 కోట్ల సబ్సిడీతో అందించామన్నారు. 80 శాతం సబ్సిడీతో 33 వ్యవసాయ డ్రోన్లను సరఫరా చేశామన్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్– ఆయిల్ పామ్ పథకం కింద రూ.7.62 కోట్ల రాయితీని 3,685 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 14,820 ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్య పరికరాలను అమర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. మెట్ట ప్రాంత వరప్రదాయిని ఆనం సంజీవరెడ్డి సోమశిల ఎత్తిపోతల పథకం ఫేజ్–1 కింద రూ.854 కోట్ల అగ్రిమెంట్కు రూ.533 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ద్వారా రూ.15 కోట్లతో చేపట్టిన 244 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు 850 ఎకరాల విస్తీర్ణంలో రామాయపట్నంపోర్టు రూ.3,700 కోట్లతో నిర్మాణంలో ఉందన్నారు. ఆరు వేల మంది ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50లకే సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రూ.37.26 కోట్లతో 1.62 లక్షల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 2.90 లక్షల మందికి రూ.434.56 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పరిశ్రమల స్థాపనకు చేయూత జిల్లాలో 42 భారీ పరిశ్రమలు, రూ.41 వేల కోట్ల పెట్టుబడితో 19 వేల మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించామన్నారు. 53 వేల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రలు ఉన్నాయన్నారు. వీటన్నింటికి ప్రభుత్వం పరంగా చేయూతనిస్తున్నామన్నారు. ఆత్మకూరు నారంపేట వద్ద 173.67 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి పరిచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం 789 ప్లాట్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జేసీ కార్తీక్, డీఆర్వో హుస్సేన్సాహెబ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని తదతరులు పాల్గొన్నారు. మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిన ప్రదర్శనలు విశిష్ట సేవలందించిన 332 మందికి అవార్డుల ప్రదానం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ గర్వగాథలతో స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఆకాశ వీధుల్లో మువ్వన్నెల వీచికలు దేశపు గర్వ ధ్వజమై రెపరెపలాడాయి. త్రివర్ణ తరంగం తరం తరం గౌరవానికి ప్రతీకగా.. వీధివీధిన అలరారగా, పట్టణం నుంచి పల్లె వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దేశభక్తి గర్వగీతమై ఉప్పొంగింది. పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి నారాయణ, కలెక్టర్, ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. చిన్నారులు మహనీయుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు (క్రైమ్): దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు. శుక్రవారం79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ క్యాంపు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో సిబ్బంది విధులకు పునరంకితం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కుటుంబ సభ్యులు, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని డీటీసీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిధర్రావు, ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, ఆర్ఐ డి. శ్రీనివాసరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత దర్జాగా కబ్జా
వింజమూరు (ఉదయగిరి): ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. వాగు, వంక, శ్మశాన భూమి, పోరంబోకా, అనాధీనమా? అనేది కూడా చూడడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ఆక్రమిస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రశ్నస్తే దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటననే వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ వెంకట్రాదిపాళెంలో జరుగుతోంది. మండలంలోని వెంకట్రాదిపాళెం గ్రామ సర్వే నంబరు 253లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి గ్రామ ఎస్సీ కాలనీకి అనుకుని తారు రోడ్డుకు పక్కనే ఉంది. ఈ భూమి ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సీ కాలనీ వాసులు తమ ఉమ్మడి అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇళ్ల స్థలాల పట్టాల కోసం గతంలో ప్రభుత్వ అధికారులకు అర్జీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత విలువైన ఈ భూమిపై కన్నేశారు. తన పలుకుబడితో నిబంధనలకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుని పాత మ్యానువల్ అడంగళ్లలో సదరు నేతకు అనుకూలమైన పేరు రాయించుకున్నారు. దీనిని ఆసరా చేసుకుని పట్టదారు పాస్పుస్తకాలు తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహరంలో పెద్ద మొత్తంలో మడుపులు చేతులు మారినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా గుంభనంగా ఉన్న సదరు నేత ఇటీవల ఆ భూమి కబ్జా చేసే ప్రక్రియ మొదలు పెట్టి చెట్లు తొలగించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా ఆ నేత పనులు ఆపకుండా బెదిరింపులకు దిగారు. దీంతో కాలనీ వాసులు స్థానిక వీఆర్వో, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం సదరు నేత ట్రాక్టర్ ద్వారా నాగలి తెచ్చి దున్నకం చేశశారు. జేసీబీని ఉపయోగించి నేలను చదును చేసే పనులు చేపట్టారు. దీంతో స్థానికులు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దూషణకు దిగారు. దీంతో వారు తహసీల్దార్కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఆయన వీఆర్వోకు తెలిపమని చెప్పి పెట్టేశారని ఎస్సీ కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేశారు. ఐదెకరాల భూమిని గుట్టుచప్పుడు కాకుండా కాజేస్తున్న వైనం రెవెన్యూ అధికారులను లోబర్చుకుని రికార్డుల తారుమారు ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నా.. లెక్కచేయని వైనం పట్టించుకోని రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం గ్రామ 253 సర్వే నంబరుకు సంబంధించి మాన్యువల్, ఆన్లైన్ అడంగళ్లో పేర్లు ఉన్నాయి. గతంలో ఉన్న అధికారులు పట్టాదారుపాస్ పుస్తకాలు ఇచ్చారు. వీటిని లోతుగా పరిశీలించి ఫేక్, లేక ఒరినల్ అనే విషయాలు తేల్చాలి. అప్పటి వరకు ఎవరు ఈ భూమిలో ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – రవితేజ, వీఆర్వో మాకు సెంట్ వ్యవసాయ భూమి లేదు మా కాలనీలో చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. ఈ భూమి కబ్జా చేస్తున్న వ్యక్తికి 150 ఎకరాల భూమి ఉంది. ఇదే కాకుండా గ్రామంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేసి స్వాధీనం చేసుకున్నారు. మా లాంటి పేదలకు మాత్రం సెంట్ భూమి లేదు. మేము అడిగితే బెదిరింపులు తప్పుడం లేదు. అధికారం మాది అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. – వెంకటమ్మ ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలి మా గ్రామ సర్వే నంబరు 253లో సుమారు 5 ఎకరాలు ప్రభుత్వ భూమి మా కాలనీ అనుకొని ఉంది. అనాదిగా కాలనీ అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఈ స్థలాన్ని నివేశాలకు పట్టాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. ఈ భూమి విలువైనది కావడంతో మా గ్రామానికి చెందిన టీడీపీ నేత నకిలీ రికార్డులు సృష్టించి కబ్జా చేస్తున్నారు. ఈ భూమి పోతే మేము ఇక్కడ ఉంటే పరిిస్థిది లేదు. – వడ్లపల్లి చిన్నహజరత్, ఎస్సీ కాలనీ -
జాతీయ పతాకానికి అవమానం
● జనార్ధనపురం పాఠశాలలో ఉల్టాగా కట్టి ఎగురవేసిన వైనం వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండలం జనార్ధనపురం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. జాతీయ పతాకాన్ని ఉల్టాగా కట్టి ఎగువ వేయడంతో కషాయం కిందకు, ఆకు పచ్చ పైకి ఉండేలా ఎగురుతూ కనిపించింది. బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు ఆవుల రాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జాతీయ పతాకం ఎగురవేసిన సమయంలో అయినా తప్పును గుర్తించి తిరిగి ఎగురవేయాల్సిన సదరు ఉపాధ్యాయుడు బాధ్యతారాహిత్యంగా జెండా వందనం చేయడం గమనార్హం. జాతీయ పతాకం ఎగురవేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చినిగిపోయినా, రంగు వెలిసిన జెండాలను వినియోగించకూడదనే తెలిసినా.. చివరన చినిగిపోయిన జెండానే ఎగురవేయడంతో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. జాతీయ జెండాకు అవమానం జరిగిన తీరును గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వింజమూరు ఎంఈఓ రమేష్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎంఈఓను వివరణ కోరగా, జెండా తిరగేసి కట్టిన మాట వాస్తవమే అని తెలిపారు. ఉన్నతాధికారులు అదేశాలు ఇస్తే విచారణ చేస్తామని తెలిపారు. -
కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలు
నెల్లూరు రూరల్ : 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని జాతిపిత విగ్రహానికి కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్ఓ హుస్సేన్సాహెబ్, పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 100 అడుగుల స్థూపం వద్ద జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు కలెక్టర్ మిఠాయిలు పంచి పెట్టారు. కలెక్టరేట్ ఏఓ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీసీఓ గుర్రప్ప, సమాచార పౌరసంబంధాల అధికారి ఎ.శివశంకర్రావు, పౌర సరఫరాలశాఖ అధికారి విజయ్కుమార్, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఘనంగా జెండా పండగ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వతంత్రానికి పూజ్య బాపూజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకువస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలకులు ఆంగ్లేయులను తలదన్నే రీతిలో నియంతల్లా పాలిస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అటవీక రాజ్యాన్ని తలపిస్తున్నాయన్నారు. టీడీపీ అకృత్యాలను చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తోపాటు కొంతమంది మహనీయులు కృషితో భారతదేశానికి గొప్ప రాజ్యాంగం తీసుకు వచ్చి ప్రజాస్వామ్య విలువలను సంరక్షించేలా విధానాలు రూపొందిస్తే ఈ రోజు ఆ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. పులివెందుల ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరు దుర్మార్గమన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీడియా గొంతు నొక్కి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసిన అరాచకం ప్రజలందరూ చూశారన్నారు. -
విద్యార్థుల ఆకలి కేకలు
● ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో.. సాక్షి టాస్క్ఫోర్స్: పట్టణంలో డీఎల్ఎన్నార్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి కనీసం అల్పాహారం కూడా లేక అలమటించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులందరూ అల్పాహారం కూడా తినకుండా ఉదయం 7 గంటలకే వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులు గ్రౌండ్కు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రావడం ఆలస్యం కావడంతో ఆమె కోసం ఎదురు చూసి చూసి అసహనానికి గురయ్యారు. దాదాపు 10 గంటలకు మొదలైన కార్యక్రమం 1.10 గంటల వరకు సాగింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదు. ఇంకేం చేయలేక ఆకలి కేకలతోనే విద్యార్థులు వెనుదిరిగారు. సాంస్కతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం మిగిలి ఉండగానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కమిషనర్, కౌన్సిలర్లు విద్యార్థులు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. సీ్త్ర శక్తి పథకం ప్రారంభం నెల్లూరు సిటీ: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో సీ్త్ర శక్తి పథకాన్ని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నవాబుపేట వరకు ర్యాలీగా ప్రారంభమైన బస్సుల్లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్రెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, నాయకులు గిరిధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్, ఆర్టీసీ ఈడీ నాగేంద్రప్రసాద్, జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్ ప్రయాణించారు. కాగా ఈ పథకానికి సంబంధించి మహిళల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. సాంఘిక సంక్షేమ శాఖకు దక్కని ప్రశంసలునెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లాలోని 71 ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన 332 మందికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలను అందజేశారు. అయితే జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్ రెండింటికి ఒక్కటంటే ఒక్క ప్రసాంశ పత్రం కూడా రాలేదు. ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం తాండవిస్తున్న నేపథ్యంలో ఈ దఫా ఈ శాఖలో ఏ ఉద్యోగికి కూడా ప్రశంసలు లేవంటే, విశిష్ట సేవలు దేవుడు ఎరుగు కనీస సేవలు కూడా అందించలేదని స్పష్టమవుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా, కార్పొరేషన్ ఈడీగా ఒకరే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖలో 71 హాస్టళ్లల్లో 71 వార్డెన్లు, నలుగురు ఏఎస్డబ్ల్యూఓలు, కార్యాలయంలో 15 మందికి పైగా, కార్పొరేషన్ కార్యాలయంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 150 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయినా ఒక్కరికీ కూడా స్వాతంత్య్ర దినోత్సవ ప్రశంస అందలేదంటే ఆ శాఖ పనిచేస్తున్న తీరుపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారి వద్ద నుంచి వార్డెన్ల పనితీరు, ఇటీవల ట్రాన్స్ఫర్పై వచ్చిన ఆరోపణలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై వ్యవహరిస్తున్న తీరు ఇందుకు కారణమై ఉండొచ్చు అని శాఖలో పనిచేస్తున్న వారే అంటున్నారు. ఈ విషయమై సోషల్ వెల్ఫేర్ డీడీకి ఫోన్ చేసినా స్పందించలేదు. భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు బిట్రగుంట: దగదర్తి, బోగోలు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం, కప్పరాళ్లతిప్ప సమీపంలోని పలు ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, టిప్పర్ల సాయంతో గ్రావెల్ తరలిస్తుండడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు సిండికేట్గా మారి రాత్రిళ్లు గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీసుల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతోపాటు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులతోపాటు మీడియాకు ముడుపులు ముట్టచెబుతున్నామని చెబుతూ అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆరు లేన్లున్నా.. ఆర్తనాదాలే
ప్రమాద ఘంటికలు దారుణ వైఫల్యం ● 11 నెలల్లో 15 మంది మృతి.. 54 మందికి గాయాలు ● ఇటీవల ఏడుగురి దుర్మరణం ● అతివేగం, నిద్రమత్తే కారణం ● ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం ● ఉలవపాడులోని జాతీయ రహదారిపై ఇదీ పరిస్థితిఅటు.. ఇటు మూడు వరుసలు.. వాహనాలు వెళ్లేందుకు వీలుగా తీర్చిదిద్దిన జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆరు లేన్లుగా ఉన్నా.. ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతివేగం, నిద్రమత్తు తదితర కారణాలతో హైవేపై జరుగుతున్న యాక్సిడెంట్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరాయకొండ నుంచి తెట్టు వరకు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. – ఉలవపాడు ఇటీవల జరిగిన ప్రమాదాలు -
బలవంతపు భూసేకరణ దారుణం
మాట్లాడుతున్న అజయ్కుమార్ ఉదయగిరి: పరిశ్రమల పేరిట రాష్ట్రంలోని రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుండటం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో కార్యకర్తలతో సమావేశాన్ని గురువారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, ప్రజల పొట్టగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కరేడులో ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలను కట్టబెట్టేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. తమ భూములను ఇవ్వబోమంటూ నెల రోజులుగా రైతులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. లింగసముద్రం మండలం మాలకొండ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల పరిసర భూముల్లో 19 చదరపు కిలోమీటర్ల మేర ఇనుప ఖనిజం ఉందని, వీటిని జిందాల్ కంపెనీకి కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లె తిప్పపై ఇచ్చిన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలతో కలిసి చలో కరేడు కార్యక్రమాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నామని వెల్లడించారు. సీపీఎం నేతలు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, ఫరిద్దీన్బాషా, వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మైనింగ్తో నాకెలాంటి సంబంధం లేదు నెల్లూరు రూరల్: భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1077, 79955 76699, 0861 – 2331261 కంట్రోల్ రూమ్ నంబర్లు, డివిజన్, మండల కేంద్రాల్లోని కాల్ సెంటర్లు, స్థానిక సచివాలయాలను సంప్రదించాలని కోరారు. డీఆర్వో హుస్సేన్న్సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, మత్స్యశాఖ జేడీ శాంతి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎస్ఈలు దేశ్నాయక్, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డీపీఓ శ్రీధర్రెడ్డి, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విచారణలో బిరదవోలు వెల్లడి సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసును కూటమి నేతలు బనాయించారని, మైనింగ్తో తనకెలాంటి సంబంధం లేదంటూ పోలీసుల కస్టడీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారని సమాచారం. పొదలకూరు మండలం తాటిపర్తి మైనింగ్ కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ గురువారంతో ముగిసింది. చివరి రోజున డీటీసీలో పోలీస్ అధికారులు ఆయనకు 23 ప్రశ్నలేయగా, లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తనది మనుబోలు మండలం మడమనూరు అని.. రాజకీయంగా మాజీ మంత్రులు అనిల్కుమార్యాదవ్, కాకాణి గోవర్ధన్రెడ్డితో పరిచయమని.. తమ ఊరి సమస్యలపై వీరితో మాట్లాడేవాడినని.. రుస్తుం మైన్స్తో పాటూ క్వార్ట్జ్ వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసని బిరదవోలు వెల్లడించారని తెలిసింది. -
ఇచ్చేదే అరకొర.. అందులోనూ కోతే
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కోచ్లు, నాలుగో తరగతి ఉద్యోగులు ఏడాదిగా జీతాల్లేక అవస్థ పడుతున్నారు. వీరి కష్టాన్ని గుర్తించి ప్రతి నెలా అందజేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా వీరికి మరో షాక్ ఇచ్చింది. ఏడాదికి సంబంధించిన జీతాల్లో సగాన్నే జమ చేసి గందరగోళానికి గురిచేసింది. అసలు ఇలా ఎందుకు వ్యవహరించారనే అంశంపై ఎవరి వద్దా స్పష్టత లేకపోవడం గమనార్హం. ● డీఎస్ఏ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు ● ఏడాదిగా జీతాల్లేక ఆర్తనాదాలు ● ఎట్టకేలకు జమచేసినా.. అదీ సగమే ● క్రీడారంగ అభివృద్ధెలా..? నెల్లూరు(స్టోన్హౌస్పేట): క్రీడాప్రాధికార సంస్థ నిర్వహణ తీరు లోపభూయిష్టంగా మారింది. వాస్తవానికి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కోచ్లు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇచ్చే జీతమే స్వల్పం. ఈ మొత్తాన్నీ ఏడాది పాటు నిలిపి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై కలెక్టర్ మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఈ అంశమై ‘జీతాల్లేవ్.. క్రీడల్లో శిక్షణ ఇచ్చేదెలా’ అనే శీర్షికన సాక్షిలో జూన్ 29న కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులు రెండు నెలల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి జీతాలిస్తామని ప్రకటించారు. అకౌంట్ చూసి.. నిర్ఘాంతపోయి..! ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాల్లో జీతాలు బుధవారం రాత్రి జమయ్యాయి. అయితే సగమే పడటంతో నిర్ఘాంతపోవడం వారి వంతైంది. ఇలా ఎందుకు వ్యవహరించారనే విషయమై రాష్ట్ర, జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ అధికారులు నోరు మెదపడంలేదు. జమైంది ఇలా.. డీఎస్ఏలో పనిచేసే కోచ్లకు జీతం రూ.21,500 కాగా, జమైంది రూ.12 వేలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆకౌంటెంట్లకు రూ.20 వేల జీతం కాగా, వచ్చింది రూ.15 వేలే. ఆఫీస్ సబార్డినేట్, గ్రౌండ్స్ మార్కర్, స్వీపర్, వాచ్మెన్, ఇండోర్ స్టేడియం అటెండర్లు, క్లీనర్లకు రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.ఎనిమిది వేలను అందజేశారు. స్విమ్మింగ్ పూల్ స్వీపర్లు, వాచ్మెన్లు, ఎలక్ట్రీషియన్, వెంకటగిరి, గూడూరు సబ్ సెంటర్ల కేర్ టేకర్లు, ఓజిలి సబ్ సెంటర్ వాచ్మెన్కు ఇచ్చే జీతం రూ.15 వేలు కాగా, రూ.ఎనిమిది వేలనే జమ చేశారు. అప్పులను ఎలా తీర్చాలో..? వీరికిచ్చే జీతాలు అంతంతమాత్రమే. ఏడాది పాటు వేతనాలను నిలిపి అందులోనూ సగమే జమచేయడంతో ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పులను ఎలా తీర్చాలో పాలుపోక వీరు సతమతమవుతున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో క్రీడా రంగం అస్తవ్యస్థంగా మారే ప్రమాదం ఉంది. జీవితాలు బాగుండాలంటే క్రీడల్లో పాల్గొనాలని చెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులు వీరిని విస్మరిస్తున్నారు. ఈ ఏడాది క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధికి ఎలాంటి ఆర్థిక సాయం చేయని కూటమి ప్రభుత్వం ఉద్యోగులనూ విస్మరించి తన మార్కును ప్రదర్శించింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం శాప్ అధికారులకు తెలియజేశాం సగం జీతాలే జమయ్యాయనే అంశాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులకు తెలియజేశాం. పూర్తిగా జీతాలొచ్చేందుకు అధికారులతో కలిసి యత్నిస్తాం. – యతిరాజ్, డీఎస్డీఓ -
18న చలో కరేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తలపెట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని బాలాజీనగర్లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు ఇచ్చేది లేదని గ్రామసభలో రైతులు తే ల్చిచెప్పారన్నారు. అయితే ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామ రైతుల మధ్య చీలిక తెచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన కోరారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో నాయకులు రాంబాబు, చండ్ర రాజగోపాల్, దామా అంకయ్య, షాన్వాజ్, మాదాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలుతిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన కె.నరసింహులుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీకాంత్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, రఘు, ఫారెస్ట్ అధికారి చక్రపాణి తెలిపిన వివరాల మేరకు.. 2014 మార్చి 5వ తేదీ నెల్లూరు డివిజన్, రాపూర్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది సైదురాజులపల్లి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో గూడ్స్ క్యారియర్ వాహనం ఫారెస్ట్ సిబ్బందిని చూసి వారికి దూరంగా ఆగింది. ఆ వాహనంలోని ముగ్గురు పరారయ్యారు. అయితే వారిలో నిందితుడు నరసింహులును మాత్రం ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 436 కిలోల 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నరసింహులును విచారించగా మరో ఇద్దరి పేర్లను తెలిపాడు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం నరసింహులుపై మాత్రం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టేస్తూ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీసీ నిర్మల వాదించారు. నెల్లూరు జైలుకు తరలింపు నెల్లూరు(అర్బన్): కోర్టు శిక్ష విధించిన నరసింహులును నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు ఫారెస్ట్ రాపూరు రేంజర్ రవీంద్ర తెలిపారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించినా, రవాణాకు సహకరించినా కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
● రూ.8 లక్షల ఆస్తి నష్టం ● లబోదిబోమంటున్న బాధితులు కొడవలూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధమవడంతో ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఈ ఘటన మండలంలోని గండవరం పూలతోట గాడికయ్యల్లో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోళ్ల ప్రసాద్, లక్ష్మి దంపతులు కూలీ పనులకు వెళ్తుంటారు. రోజూలాగే గురువారం ఉదయం పనికెళ్లారు. వారింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. వస్తువులు పూర్తిగా తగులబడే వరకూ చుట్టుపక్కల వారు గుర్తించలేకపోయారు. కొంతసేపటి తర్వాత వాసన రావడం, కిటికీలో నుంచి పొగ వస్తుండటంతో గుర్తించి బాధితులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకోగా అప్పటికే బీరువా, రిఫ్రిజిరేటర్, మంచం, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. పనికెళ్లి పొదుపు చేసి బీరువాలో దాచిన రూ.3 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, రూ.2 లక్షల విలువైన సామగ్రి తగులబడిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వారిని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
పరేడ్ గ్రౌండ్లో చేసిన ఏర్పాట్లుకవాతు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు(క్రైమ్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం సిద్ధమైంది. పోలీస్ వందనం స్వీకరణ, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గురువారం ఎస్పీ జి.కృష్ణకాంత్ సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. కవాతు రిహార్సల్స్ను పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలిచ్చారు. శుక్రవారం జెండా వందనానికి విచ్చేసే ముఖ్యఅతిథులకు గౌరవార్థం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరిని డీఎంఎఫ్డీ ద్వారా తనిఖీ చేయాలన్నారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ, ఏఆర్ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, ఎస్.చంద్రమోహన్, ఆర్ఐలు అంకమరావు, రాజారావు, హరిబాబు, పౌల్రాజు, శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
భలే కేటుగాళ్లు
తిరుపతి క్రైమ్: సెల్ఫోన్లు చోరీ చేసి అందులోని బ్యాంక్ ఖాతా నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కాసిరెడ్డి ముఠాగా ఏర్పడి నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవారు. వాటిలో ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడ వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమీషన్ కూడా ఇస్తామని నమ్మిస్తారు. ఇలా చెప్పి వీరంతా రూ.3.6 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై హేమాద్రి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సెల్ఫోన్లు చోరీ చేసి బ్యాంక్ ఖాతాల్లో నగదు హాంఫట్ ముగ్గురి అరెస్ట్ నిందితులు హైదరాబాద్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు వాసులు -
డివిజన్లు విద్యుత్ సర్వీసులు స్మార్ట్ మీటర్లు
● ఇప్పటికే పలు ప్రభుత్వ, వాణిజ్య సంస్థల్లో మీటర్ల ఏర్పాటు ● మాకొద్దు మహాప్రభో అంటున్నా పట్టించుకోని సర్కార్ ● పూటపూటకూ మారనున్న టారిఫ్తో ప్రజల బెంబేలు ● రీచార్జి చేస్తేనే ఇంట్లో కరెంట్ నెల్లూరు (వీఆర్సీసెంటర్): సీఎం చంద్రబాబు మార్కు మోసాల్లో తాజాగా మరొకటి చేరింది. స్మా ర్ట్ మీటర్లను బిగించబోమంటూ గతంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆయన తాజాగా వీటి ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. ఈ పరిణామం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలీ స్మార్ట్ మీటర్ల గోల ఏమిటానని వారు ఆందోళనకు గురవుతున్నారు. గుడ్లు తేలేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. తదనంతరం 200 యూనిట్లు వాడే ప్రతి గృహంలోనూ బిగించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నెలకొల్పారు. పాత మీటర్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేశాక, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీనిపై వినియోగదారులతో పాటు వామపక్ష పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. సబ్స్టేషన్ల వద్ద ధర్నాలనూ చేపడుతున్నారు. నాలుగింతలు అధికంగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్ సర్వీసులు 9,64,379 ఉండగా, ఇందులో వ్యవసాయ సర్వీసులు 1,46,185. ప్రస్తుతానికి వీటిని మాత్రం స్మార్ట్ మీటర్ల నుంచి మినహాయించారు. నగరంలోని ఓ పిండిమిల్లు యజమానికి గతంలో నెలకు రూ.ఆరు బిల్లొచ్చేది. అయితే స్మార్ట్ మీటర్ను ఏర్పాటు చేశాక, ఏకంగా రూ.26 వేలొచ్చింది. మరో దుకాణ యజమానికి నెలకు రూ.మూడు వేల బిల్లు వస్తుండగా, ఆపై ఇది రూ.ఐదు వేలకు పెరిగింది. టారిఫ్ తంటాలు ఈ విధానంతో టారిఫ్ సైతం మారనుంది. గతంలో పాత మీటర్లు ఉన్న సమయంలో రోజంతా ఒకే టారిఫ్తో నెల బిల్లొచ్చేది. అయితే వినియోగించే యూనిట్లు అధికమయ్యే కొద్దీ ఇది మారుతూ ఉండేది. 0 – 30 యూనిట్ల వరకు ఒక టారిఫ్.. 31 – 75.. 76 – 125.. 126 – 225.. 226 – 400.. 400 –500 యూనిట్ల వరకు ఉండేది. అయితే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకలా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరోలా.. సాయంత్రం నుంచి తెల్లవారు వరకు మరో టారిఫ్లో బిల్లులొచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ మీటర్ ధర రూ.20 వేలకుపైగా ఉంటుంది. ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి ఎలాంటి నగదును కట్టించుకోకుండా, మీటర్ ధర మొత్తాన్ని బిల్లులో కలుపుతారేమోననే అనుమానం తలెత్తుతోంది. ఇక అంతా ప్రీపెయిడే.. వాస్తవానికి గతంలో నెలంతా వాడుకున్న యూనిట్లకు లెక్క కట్టి రీడింగ్ తీసి బిల్లులిచ్చేవారు. దీన్ని 15 రోజుల్లో చెల్లించే వెసులుబాటు ఉండేది. అయితే ఇక నుంచి ఈ అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లలో ప్రీపెయిడ్ తరహాలో ఇక ముందే రీచార్జి చేసుకోవాలి. ఒకవేళ ఇది పూర్తయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదమూ ఉంది. ఇది సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోత మోగుతున్న విద్యుత్ బిల్లులు ‘విద్యుత్ స్మార్ట్ మీటర్లకు తాము వ్యతిరేకం.. వీటిని ఏర్పాటు చేస్తే పగలగొట్టండి’ అంటూ గతంలో టీడీపీ నేతలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రక్రియను ఉపసంహరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలనూ గుప్పించారు. తీరా కొలువుదీరాక, వీటిని బిగించే ప్రక్రియను ముమ్మరం చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు వీటిని ఏర్పాటు చేశారు. ఆపై గృహాల్లోనూ బిగించేందుకు ఉపక్రమించడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నియామకం
నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది అన్వర్బాషాను నెల్లూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను వాదించనున్నారు. పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280 బుధవారం లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 379 బేళ్లను తీసుకురాగా, 200 బేళ్లను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 179ను తిరస్కరించారు. కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280.. కనిష్ట ధర రూ.140.. సరాసరిగా రూ.197.69 లభించిందని వేలం నిర్వహణాధికారి శివకుమార్ వివరించారు. 19 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. డీసీపల్లిలో 125 బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 125 బేళ్లను బుధవారం విక్రయించామని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 263 బేళ్లు రాగా, వీటిలో 125ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 14287.1 కిలోల పొగాకును విక్రయించగా, రూ.31,67,732.60 వ్యాపారం జరిగిందన్నారు. గరిష్ట ధర కిలో రూ.280.. కనిష్ట ధర రూ.140.. సగటు ధర రూ.221.72గా నమోదైందని వివరించారు. వేలానికి పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు. మైనింగ్ అనుమతులపై ఆందోళన వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీలోని జంగంరెడ్డిపల్లి భాస్కరాపురం కొండ తిప్పను మైనింగ్ కోసం ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడాన్ని రైతు కూలీ, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు ఖండించారు. వరికుంటపాడు, జంగంరెడ్డిపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణను బుధవారం నిర్వహించారు. తిప్పను మైనింగ్కు ఇస్తే నివాస ప్రాంతం ప్రమాదంలో పడుతుందని.. మేకలు, పశువులు తిరగలేకపోతాయని.. పేలుళ్లకు ఇళ్లు దెబ్బతినడంతో పాటు పంటలు నాశనమవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ నేత లక్ష్మీరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేయడాన్ని మానుకోవాలని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ● రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ చైర్మన్ ప్రసాద్ను వరికుంటపాడు పంచాయతీ మేధావుల ఫోరం ప్రతినిధులు విజయవాడలో కలిసి అర్జీని అందజేశారు. అనుమతులను తక్షణమే నిలిపేయాలని కోరారు. రైతులకు విరివిగా రుణాల మంజూరు ఉదయగిరి: ఉదయగిరిలోని వివిధ బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ పేర్కొన్నారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన గడువులోపు నూరు శాతం సాధించాలని సూచించారు. డెయిరీ ఫామ్ను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో రుణాలివ్వాలన్నారు. రికవరీ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జన సురక్ష పథకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు ఇతర శాఖల అధికారులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కోరారు. మెరుగైన సేవలందించాలని సూచించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించేలా అధికారులు చూడాలని కోరారు. సమావేశంలో అధికారులు కాశయ్య, రవిశంకర్ జయదేవ్, ఎంపీడీఓలు అప్పాజీ, గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు(అర్బన్): డీఎంహెచ్ఓ సుజాత ఆదేశాల మేరకు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి (డీఐఓ) ఉమామహేశ్వరి బుధవారం హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెల్లూరులోని విజయానంద్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి, సుమ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్, లక్ష్మి ఆర్థోకేర్ సెంటర్, ఆకర్ష్ హాస్పిటల్ తదితరాలకు వెళ్లారు. ఏపీ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం ఆస్పత్రి నిర్వహణ జరుగుతుందో? లేదా? పరిశీలించారు. రికార్డులు చూశారు. ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. స్కానింగ్ వివరాల నివేదికను ప్రతి నెలా వైద్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు లేకుండా ఎవరైనా వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏంటిది అధ్యక్షా..
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ బుధవారం నెల్లూరుకు విచ్చేశారు. ఆ పార్టీ సమావేశం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి కస్తూర్బా వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల ఓ ప్రైవేట్ అంబులెన్స్ చిక్కుకుపోయింది. అలాగే వీఆర్సీ వద్ద నడిరోడ్డుపై బాణసంచా కాల్చడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్ -
చీకటి జీఓలు రద్దు చేయాలంటూ..
నెల్లూరు(టౌన్): ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీఓలను రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ డిమాండ్ చేశారు. బుధవారం వీఆర్సీ సెంటర్లో జీఓలను రద్దు చేయాలంటూ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏడాదిగా విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జీఓను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షారూఖ్, ఆశిర్, ఖాదర్ మస్తాన్, నవీన్, చరణ్, వంశీ పాల్గొన్నారు. -
తల్లి, కుమారుడి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): తల్లి, కుమారుడు అదృశ్యం ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. భక్తవత్సలనగర్లో ప్రకాష్ కుటుంబం నివాసం ఉంటోంది. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈనెల నాలుగో తేదీన భార్య, చిన్నకుమారుడు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. జాడ తెలియరాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.స్వగ్రామానికి వెళ్తుండగా.. ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఆత్మకూరు: మండలంలోని వాశిలి గ్రామం వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీ, స్థానికుల కథనం మేరకు.. వాశిలి గ్రామానికి చెందిన షేక్ అన్వర్ (59) అనే వ్యక్తి నవరంగ మేళం బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. బుధవారం ఉద యం ఆత్మకూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి టీవీఎస్ మోపెడ్పై వస్తున్నాడు. గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తుండగా నెల్లూరు నుంచి బద్వేల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వాహనాలు రోడ్డు పక్కన గుంతలో పడిపోయాయి. అన్వర్ అక్కడికక్కడే మృతిచెందా డు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ ఘట నా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంటి పెద్ద అన్వర్ మృతి చెందడంతో ఆ కుటుంబీకులు తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రభుత్వంఆదుకోవాలని కోరారు. చోరీ సొత్తు రికవరీఉదయగిరి: ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోరీకి పాల్పడిన బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. జూన్ 10వ తేదీ రాత్రి ఏఎంసీ కార్యాలయ కిటికీలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి కంప్యూటర్లు, ఇతర సామగ్రి చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పట్టణంలోని షబ్బీర్ కాలనీకి చెందిన ఓ బాలుడు చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని జువనైల్ కోర్టులో హాజరుపరిచామని ఎస్సై తెలిపారు.492 బస్సుల కేటాయింపునెల్లూరు సిటీ: మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జిల్లాలో 492 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కలిపి 61, కందుకూరులో 60, కావలిలో 90, నెల్లూరు డిపో–1లో 91, డిపో–2లో 90, రాపూరులో 49, ఉదయగిరిలో 51 బస్సులను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి నారాయణ ఈ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. త్వరలో విజయవాడలో యానాది గర్జననెల్లూరు(స్టోన్హౌస్పేట): ఎస్టీ వర్గీకరణ కోసం త్వరలో విజయవాడలో యానాది గర్జన నిర్వహిస్తామని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య తెలిపారు. నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించి తీర్మానాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణపై, యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు బాపట్ల బ్రహ్మయ్య, తలపల చెంచు మల్లికార్జునరావు, బాకుల మురళి, తిరువెళ్ల శీను, నీలం సురేంద్ర, మానికల మురళి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కల్తీపై తనిఖీలు
నెల్లూరు(అర్బన్): వ్యవసాయ పంటలకే పరిమితం కాకుండా వివిధ రంగాల ఉత్పత్తుల్లో కల్తీ చేస్తున్న యూరియాను కనుగొనేందుకు పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యూరియాను ప్లయ్ ఉడ్, పెయింట్ పరిశ్రమలు, పశువుల దాణా తదితరాల్లో అక్రమంగా వినియోగిస్తున్నారనే వార్తలొస్తున్న తరుణంలో, తనిఖీలు చేయాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో వ్యవసాయ, విజిలెన్స్, ఇండస్ట్రీస్, రవాణా, పొల్యూషన్ బోర్డు, ఎకై ్సజ్ శాఖల నుంచి ప్రతినిధులను తీసుకొని ఒక టీమ్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. యూరియాను వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తుల్లో వినియోగించారని తేలితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
ప్లాస్టిక్ భూతం అంతమెప్పటికో..?
నెల్లూరు(బారకాసు): నగరంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ తీవ్రమవుతోంది. దీన్ని ఉపయోగిస్తే ప్రమాదం సంభవిస్తుందనే అంశంపై విస్తృతంగా ప్రచారం చేసిన నగరపాలక సంస్థ తదనంతరం మిన్నకుండిపోయింది. మొదట్లో ప్లాస్టిక్ విక్రేతలు తదితరులపై దాడులు జరిపి జరిమానాలు విధించిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో కొన్నాళ్ల పాటు తగ్గిన ఈ ప్రక్రియ తిరిగి యథాస్థితికి చేరుకుంది. నగరంలో ఇలా.. నగరంలోని స్టోన్హౌస్పేట, రేబాలవారివీధి, చిన్నబజార్, పెద్దబజార్, పణతులవారివీధి తదితర ప్రాంతాల్లో హోల్సేల్ ప్లాస్టిక్ దుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచి భారీగా వ్యాపారం జరుగుతోంది. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, పూల దుకాణాలు, కూరగాయల మార్కెట్ తదితరులు నిషేధిత ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వస్త్ర సంచులను వినియోగించాలని ఎంతో మంది ప్రచారం చేస్తున్నా, ఎలాంటి ప్రయోజనం కానరావడంలేదు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తగ్గుముఖం పట్టిన తనిఖీలు పుంజుకుంటున్న వినియోగం పర్యావరణ పరిరక్షణ ప్రశ్నార్థకం..? చర్యలు చేపడతాం ప్లాస్టిక్ నియంత్రణకు త్వరలోనే చర్యలు చేపడతాం. నిషేధిత ప్లాస్టిక్ను ఎవరూ వినియోగించరాదు. డ్రైవ్లను తర చూ చేపట్టి ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. వీటికి దూరంగా ఉండాలి. – కనకాద్రి, ఎంహెచ్ఓ, నగరపాలక సంస్థ -
సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు
నెల్లూరు రూరల్: భారత్లో సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులను జపాన్ తదితర దేశాలు పెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. తిరుపతిలోని టెక్నాలజీ పార్కులో రూ.400 కోట్లతో పరిశ్రమను స్థాపించనున్నారని తెలిపారు. కార్యకర్తలను కలిసి చాయ్ పే కార్యక్రమంలో అందర్నీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో యాత్రను చేపడుతున్నామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రవిచంద్రరెడ్డి, కందికట్ల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధరకు ధాన్యం కొనాలి
● జేసీ కార్తీక్ను కోరిన రైతు సంఘాల నాయకులు నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎడగారు వరి పంటకు సంబంధించి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు జేసీ కార్తీక్ను కోరారు. బుధవారం జేసీ అన్ని పార్టీల రైతు సంఘాల నాయకులు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు, అధికారులతో నెల్లూరు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, రైతు నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలపాలని ఆయన కోరారు. దీంతో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందన్నారు. కేవలం లక్ష టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకొందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం జిల్లాలో పండిస్తున్న కేఎన్ఎం 733, ఎంటీయూ 1010 లాంటి రకాలన్ని కూడా ఏ–గ్రేడ్కు చెందినవేనన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి రూ.19,770కు మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూడా సమయం లేదని వివరించారు. ఈ సాకుతో మిల్లర్లు మద్దతు ధర తగ్గించకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సాగు ఖర్చు ఈ ఏడాది 20 శాతం అదనంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం మాత్రం 3 శాతమే మద్దతు ధర పెంచిందన్నారు. ఈ స్థితిలో రైతులు నష్టపోతున్నారన్నారు. ఇంకా నష్టపోకుండా ఉండాలంటే ప్రస్తుత మద్దతు ధరకు మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. ఇదే విషయాన్ని ఏకగ్రీవంగా ఇతర నాయకులు కూడా తెలిపారు. దీంతో జేసీ స్పందిస్తూ మిల్లర్లకు తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చండ్ర రాజగోపాల్, మూలె వెంగయ్య, శ్రీనివాసులు, రమణయ్య, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్న నాయకులు, అధికారులు -
మహాసభల జయప్రదానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు నగరంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే సీపీఐ జిల్లా మహాసభలు, 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. కోటమిట్ట షాదీమంజిల్లో జిల్లా సభలు జరుగుతాయన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్, మధు, షాన్వాజ్, మహిళా సంఘం నాయకురాలు శిరీషా, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తానెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం వద్ద డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడి ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కారు ముత్తుకూరు వైపు వేగంగా వెళ్తోంది. డ్రైవర్ దానిని అదుపు చేయలేకపోవడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. వాహనంలోని నలుగురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కారు బోల్తా పడిన సమయంలో ఎదురు నుంచి వాహనాలు రాకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందలేదు. చుండి మోడల్ స్కూల్ ఎంపికవలేటివారిపాలెం: ఉత్తమ పాఠశాలగా మండలంలోని చుండి మోడల్ స్కూల్ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పడమటి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది పాఠశాలలను ఎంపిక చేయగా అందులో చుండి స్కూల్ ఉందన్నారు. యాజమాన్యాల వారీగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత, అత్యధిక సరాసరి మార్కులు సాధించిన స్కూళ్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం అవార్డు ప్రదానం చేస్తారన్నారు.కండలేరులో 26.8 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 26.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,900 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,800, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రయాణికుడి ముసుగులో నేరాలు
నెల్లూరు(క్రైమ్): ప్రయాణికుడి ముసుగులో రైళ్లలో నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాడిని నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ స్థానిక కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బంది, ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్లు పి.రమేష్గౌడ్, హజరిలాల్ గుర్జార్తో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో నేరాల నియంత్రణ, మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడిలో భాగంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆ బృందాలు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టాయి. జనశతాబ్ది రైలు దిగి అనుమానాస్పదంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన కె.గోవర్ధన్ అలియాస్ కార్తీక్ అర్వింద్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావలి, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో రైళ్లలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రూ.12 లక్షల విలువైన 143 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్టాప్లను స్వాధీ నం చేసుకున్నారు. చిన్నతనం నుంచే.. నిందితుడు చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై సులభ మార్గంలో నగదు సంపాదించేందుకు రైళ్లలో ప్రయాణికరుని ముసుగులో చోరీలకు పాల్పడసాగాడు. జనరల్ టికెట్ తీసుకుని దివ్యాంగులు, జనరల్ బోగిల్లో ఎక్కేవాడు. అదును చూసి ఏసీ బోగిల్లోకి వెళ్లి నిద్రిస్తున్న ప్రయాణికుల నగల బ్యాగ్లు, ల్యాప్టాప్లను చోరీ చేసేవాడు. అతనిపై హైదరాబాద్తోపాటు నంద్యాల, కర్నూలు, విజయవాడ, తిరుపతిల్లో కేసులున్నాయి. నిదితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సీఐ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు, నెల్లూరు, గూడూరు రైల్వే ఎస్సైలు హరిచందన, చెన్నకేశవ, సిబ్బంది దయాకర్, మణికంఠ, కిరణ్ తదితరులను డీఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర నేరగాడి అరెస్ట్ రూ.12 లక్షల సొత్తు స్వాధీనం -
సర్వేపల్లి కాలువలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ (పీఎస్ఆర్ బస్టాండ్) సమీప సర్వేపల్లి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హాఫ్హ్యాండ్స్ టీషర్ట్, బ్లాక్ లోయర్ ధరించి ఉన్నాడు. మృతదేహం ఉబ్చి దుర్ఘంధం వెదజల్లుతోంది. దీంతో చనిపోయి రెండు రోజులై ఉండొచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా?, ఆత్మహత్య చేసుకున్నాడా?, ఇతర కారణం ఉందా? అనేది పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్కు తెలియజేయాలని నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
జెడ్పీలో ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. జెడ్పీలో పని చేస్తూ మరణించిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియమకాల కింద ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్రావు మంగళవారం అందజేశారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన 2021 నుంచి ఇప్పటి వరకు 137 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతలు, 83 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ నెలఖారులోపు 25 మంది రికార్డు అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్కాకుల పెంచలయ్య, వి దేవప్రస్నకుమార్ చైర్పర్సన్ అరుణమ్మ, సీఈఓ మోహన్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ అధికారులు రవికుమార్, సుబ్రహ్మణ్యం, వాసుదేవరావు, ఉద్యోగులు ముజీర్, అనిల్కుమార్, భీమ్రెడ్డి పాల్గొన్నారు. -
రూ.4 కోట్ల చావిడి స్థలానికి ఎసరు
సాక్షి టాస్క్ఫోర్స్: పొదలకూరు పట్టణ నడిబొ డ్డున పోలీస్ స్టేషన్, బిట్–2 సచివాలయం బిల్డింగ్ మధ్యలో ఉన్న రూ.4 కోట్ల విలువైన 34 అంకణాల ప్రభుత్వ స్థలాన్ని ప్రస్తుతం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేసేందుకు ఆ వ్యక్తి విఫలయత్నమయ్యాడు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చివరి నిమిషంలో రికార్డుల పరిశీలనలో ఈ విషయం తెలియడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. సదరు తహసీల్దార్ తనకు స్వయాన బావమరిది అయిన వ్యక్తితో కలిసి ప్రభుత్వ భూమిని కాజేసే కుట్రకు బరి తెగించాడు. ప్రభుత్వ స్థలాన్ని తన బావమరిదికి కట్టబెట్టేందుకు ఆ స్థలాన్ని పిత్రార్జితంగా మార్చేందుకు డెత్ సర్టిఫికెట్లతో నకిలీ పత్రాలను సృష్టించారు. అయితే డాక్యుమెంట్లు నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్న వైనం తాజాగా బయటపడింది. దశాబ్దాలుగా చావిడి స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో పోలీస్స్టేషన్ పక్కనున్న సర్వే నంబరు 191– 1ఏ లోని 34 అంకణాల స్థలం దశాబ్దాలుగా రెవె న్యూ రికార్డుల్లో గ్రామ చావిడి భూమిగా ఉంది. ప్రస్తు తం ఈ స్థలం విలువ బహిరంగ మార్కె ట్లో రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. దాదాపు పదేళ్ల క్రితం వరకు ఇక్కడ చావిడి ఉండేది. ఈ స్థలంలో వీఆర్వోలు తమ విశ్రాంతి గదులను నిర్మించుకునేందుకు ప్రయత్నించడంతో అప్పట్లో పెద్ద గొడవ కూడా జరిగింది. ఈ స్థలం రెవెన్యూదా? లేక పంచాయతీరాజ్దా? తేల్చుకునేందుకు రెండు శాఖల అధికారులు పెద్ద కసరత్తు కూడా చేశారు. స్థల వివాదంపై అప్పట్లో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవిశేఖర్, అప్పటి సర్పంచ్ నిర్మలమ్మ, ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య మధ్య వివాదం నెలకొని పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడంతో అక్కడ రెవెన్యూ భవనం నిర్మించుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో భవనం నిర్మించుకునేందుకు కలెక్టర్ నుంచి అనుమతులు కూడా పొందారు. పిత్రార్జితమంటూ రంగంలోకి.. అయితే పట్టణానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి ఆ స్థలం తమ పిత్రార్జితమని 2023 సెప్టెంబరులో రంగంలోకి దిగాడు. డెత్ సర్టిఫికెట్లు తయారు చేసుకుని ఆ స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని సబ్రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న నకిలీ డాక్యుమెంట్లను సమర్పించాడు. సబ్రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అనుమా నం వచ్చి నిలిపివేశారు. అయితే విజయకుమార్ ఎలాగైనా విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని వెంటనే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి విలువైన స్థలాన్ని కాపాడాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్కు విఫలయత్నం ఆ స్థలం గ్రామ చావిడిగా దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో.. న్యాయపరమైన చిక్కులు లేకుండా తిరుపతి జిల్లా తహసీల్దార్ సలహాలు సదరు అధికారి అండదండలతో స్థలం కబ్జాకు కుయుక్తులు -
వైఎస్ జగన్కు రాఖీ కట్టిన కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, డాక్టర్ అశ్వంత్రెడ్డి దంపతులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డిని కాకాణి పూజిత శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి రాఖీ కట్టారు. జిల్లా అధికారులు, ఎంపీడీఓలకు రేపు శిక్షణ నెల్లూరు (పొగతోట): పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇన్డెక్స్పై ఈ నెల 14వ తేదీన లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఉప మండల పరిషత్ అధికారులు, కంప్యూటర్ ఆపరేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 14న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమానికి అందరు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. సీఐడీ కేసులో కాకాణికి బెయిల్ మంజూరు నెల్లూరు (లీగల్): ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్.శారదారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దారులు పూచీకత్తు, రూ.25 వేలు వ్యక్తిగత బాండు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ పోలీసుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి. ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో గోవర్ధన్రెడ్డిని 14వ నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ మాల్యాద్రి వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు దశలో ఉందని కాకాణికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి గోవర్ధన్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బీజేపీ జేబు సంస్థగా ఈసీ నెల్లూరు (వీఆర్సీసెంటర్): కేంద్ర ఎన్నికల కమిషన్ను బీజేపీ తన జేబు సంస్థగా మార్చేసుకుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. నగరంలోని ఇందిరాభవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు చోరీకి గురవుతోందని రాహుల్గాంధీ ఆధారాలతో నిరూపించి శాంతియుతంగా నిరసన చేస్తుండగా, పలువురు ఎంపీలను అరెస్ట్ చేయడం ప్రజాసామ్యంలో చీకటి రోజు అన్నారు. దేశ ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసే క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీ ర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్కుమార్, ఉపాధ్యక్షుడు తలారి బాసుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కితే.. చలాన్ వాతే
రోడ్డెక్కిన వాహనదారులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల పేరుతో రూ.కోట్లను ఖజానాలో వేసుకుంది. కార్డులు జారీ చేయకుండా చలాన్ పేరుతో రూ.కోట్ల దోపిడీ చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీకి తానే ఆధ్యుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు, తిరిగి ఫిజికల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫిజికల్ గా కార్డు లేకపోయినా .. యాప్ ఓపెన్ చేసి చూపించినా సరిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చి దోపిడీకి తెర తీసింది. ఒక వైపు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరో వైపు చలానాలు రాస్తూ వాహనచోదకుల జేబులకు చిల్లు పెడుతోంది.నెల్లూరు(టౌన్): డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మా రింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి. రవాణాశాఖలో సేవలు సులభతరం చేశామని, కార్యాలయానికి రా కుండానే అన్ని సేవలు మీ ముంగిట పొందవచ్చని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుంది. వాహనం రోడ్డు ఎక్కితే చాలు లైసెన్స్, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖాధికారు లు, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని, కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా.. చలానా రాసి చేతిలో పెడుతున్నారు. కొంత మంది వ్యాలెట్ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న కార్డును చూపితే అది ఒరిజనల్ లేక డూప్లికేటా మాకు తెలియదు కార్డు ఉంటే చూపించు వదిలివేస్తామని చెబుతున్నారు.కార్డుల భారం తగ్గించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంజిల్లాలో నెల్లూరు ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంతోపాటు ఆత్మకూరు, కావలి, కందుకూరుల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా సగటున 500కు పైగా వాహన రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్స్లు జారీ చేస్తుంటారు. ఫిజికల్ కార్డుల కోసం ప్రభుత్వాలు అదనంగా ప్రతి కార్డుకు రూ.235 వసూలు చేసేవి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలిగించింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను సెల్ఫోన్లో వ్యాలెట్ యాప్లో అందుబాటులో ఉంచింది. పోలీసు, రవాణా అధికారులకు అడిగినప్పుడు సేవ్ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుంది. పొరపాటున కార్డు మరిచిపోతే వాహనచోదకులపై చలాన్లు రాసే పరిస్థితి ఉండడంతో ఈ విధానానికి స్వస్తి పలికింది. డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.వాహనదారులపై అధికారుల వేధింపులువాహనం రోడ్డు ఎక్కితే చాలు పోలీసు, రవాణా అధికారులు తనిఖీ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించమని వేధింపులు ఎక్కువయ్యాయంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డులకు డబ్బులు చెల్లించినా డౌన్లోడ్ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుందనే ప్రభుత్వ మార్గదర్శకాలు ఎక్కడా లేకపోవడంతో ఫిజికల్ కార్డులు చూపించాలని, లేదంటే కేసులు, చలాన్ రాస్తామని చెబుతున్నారు. కొంత మంది అధికారులు వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్న కార్డులు చూపిస్తే మిన్నకుంటున్నారు. ఎక్కువ మంది అధికారులు ఫైన్ విధిస్తుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికై నా కార్డు లు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కనీసం సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. కార్డులను త్వరగా ముద్రించి వాహనదారులకు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.డీఎల్, ఆర్సీ కార్డుల పేరుతో ఖజానాకు ‘రూ.కోట్ల’లైసెన్స్, ఆర్సీ కార్డుకు రూ.235 చెల్లింపుడిజిటల్ టెక్నాలజీకి తానే ఆధ్యుడనని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన డిజిటల్ విధానాన్ని స్వస్తి పలికడమే కాకుండా వాహనదారులను దోచుకుంటున్నారు. గతేడాది నవంబరు నుంచి మళ్లీ కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించుకోవడం ప్రారంభించారు. లైసెన్స్ జారీ, రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 వసూళ్లు చేస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి డబ్బులు చెల్లించినా వాహనదారులకు ఇంత వరకు కార్డులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షకు పైగా లైసెన్స్, ఆర్సీ కార్డులు రావాల్సి ఉందని రవాణా అధికారులు చెబుతున్నారు. దాదాపు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్టుల కోసం రూ.2.35 కోట్లకు పైగా డబ్బులు చెల్లించారు. ఇదంతా వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. కార్డుల విషయంలో నేటికి రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కార్డుల ముద్రణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా లేదా ఏదైనా సంస్థకు అప్పజెప్పాలా అనే సందిగ్ధంతలో ఉంది. కార్డులు ఎప్పుడు ముద్రిస్తారా మాకు ఎప్పుడు వస్తాయో అంటూ వాహనదారులు మండిపడుతున్నారు.కార్డులు ఇంకా రాలేదుడ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇంకా రాలేదు. కార్డులను ముద్రించాల్సి ఉంది. త్వరలోనే వాటిని ముద్రించి ఆయా జిల్లాలకు పంపుతారు. కార్డులు వచ్చిన వెంటనే వాహనదారులు ఇచ్చిన అడ్రస్కు వారి ఇళ్లకే పంపుతాం. కార్డుల కోసం రవాణా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. – చందర్, డీటీసీ, నెల్లూరు -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
వరికుంటపాడు: ఖాళీ భూములు కనిపిస్తే అంగబలం, ఆర్థిక బలం ఉన్నోళ్లు విలువైన ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. తాజాగా మండలంలోని తూర్పుబోయమడుగుల అలివేలు మంగాపురం రెవెన్యూ పరిధిలో బీసీ కాలనీకి ఆనుకొని తారురోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 140, 141లోని విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం భూమి రూ.5 లక్షలపైమాటే. స్థానికేతరుడైన పావూలూరి మాల్యాద్రి అనే వ్యక్తి ఇటీవల ఈ భూమికి పక్కనే కొంత భూమిని కొనుగోలు చేశాడు. తాజాగా దాని పక్కనే ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మంగళవారం జేసీబీలతో ముళ్లచెట్లు తొలగిస్తూ, భూమిని చదును చేశారు. మండల రెవెన్యూ అధికారులు, స్థానిక అధికార పార్టీ నేతల సహ కారం లేకుండా అతను ఇంత సాహసం చేయగలడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులకు ఈ విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘మేము ఇక్కడ పుట్టి పెరిగినా మా గ్రామంలో మాకు ఒక్క గజం భూమి కూడా లేదు. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి తనకు ఉన్న భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఎలాంటి పత్రాలు లేకుండా ఆక్రమించడం అన్యాయం అని మండిపడ్డారు. భూ ఆక్రమణపై గ్రామస్తులు రెవెన్యూ సిబ్బందికి తీసుకెళ్లినా కనీసం స్పందించి అటువైపు కూడా రాలేదు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కబ్జాను ఆపి ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులు, కనిపించని రెవెన్యూ అధికారులు -
ప్రో కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: యువ ఆంధ్ర ప్రో కబడ్డీ సీజన్–1 రెఫరీగా కరేడు గ్రామానికి చెందిన సాదం శ్రీనివాసరావు ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరిగే సీజన్–1లో రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డు నుంచి ఎంపిక చేసినట్లు తెలిపారు. అసోసియేషన్ రెఫరీస్ బోర్డు చైర్మన్ మురళీకుమార్, కన్వీనర్ రవీంద్ర, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు, సెక్రటరీ పూర్ణచంద్రరావులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. -
రెవెన్యూ శాఖ వినతులే అధికం
నెల్లూరు రూరల్: ప్రతి వారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నాయి. ఈ సోమవారం జేసీ కె.కార్తీక్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 411 వినతులందాయి. రెవెన్యూ శాఖవి 141, పోలీస్ శాఖవి 62, మున్సిపల్ శాఖవి 40, సర్వేవి 30, పంచాయతీరాజ్ శాఖవి 38 తదితరాలున్నాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు వినతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో హుస్సేన్ సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఎంహెచ్ఓ సుజాత, హార్టికల్చ ర్ ఏడీ సుబ్బారెడ్డి, విద్యుత్ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, పాస్టర్లపై దాడులు, అక్రమ కేసులను అరికట్టాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద నెల్లూరు క్రైస్తవ సమాఖ్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ ఎండీ ప్రకాశం మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఇంత కాలమైనా నిరాకరించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమన్నారు. దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ ఎలీషాకుమార్ కలివెల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాస్టర్లు, సిస్టర్లపై, చర్చిలపై దాడులను, అక్రమ కేసులు బనాయించడాన్ని అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డేనియల్, బెనహర్ బాబు, డేవిడ్, దయాసాగర్, క్రాంతికుమార్, ప్రభుకుమార్, రాజశేఖర్, హృదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. సూపర్సిక్స్ కోసం.. సూపర్సిక్స్ పథకాలను మంజూరు చేయాలని జిల్లా అంధుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్కే జకావుల్లా, ఉపాధ్యక్షుడు దుర్గాబాబు, షేక్ మస్తాన్, ఎస్కే సనావుల్లా, ఎస్కే జిలానీ తదితరులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులందరికీ ఇండిపెండెంట్ రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు. గృహాలను ప్రభుత్వం నిర్మించాలన్నారు. అక్రమ మైనింగ్పై చర్యలకు డిమాండ్ సైదాపురం, గూడూరుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ నిర్వహించే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ, అక్రమ మైనింగ్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎం.రాజేష్ కుమార్ వినతిపత్రం అందజేశారు. సైదాపురంలోని కేఎస్ఆర్, సిద్ధి వినాయక, షిర్డీ సాయి, శోభారాణి, వెంకటకనకదుర్గ, ఉమామహేశ్వర మైకా మైన్స్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అధికారులు తనిఖీలు చేసి నోటీసులిచ్చినా మాఫియా లెక్కచేయడం లేదన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. సమితి గౌరవాధ్యక్షుడు పి.శ్రీనివాసులురెడ్డి, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, శివకుమార్, పాల్రాజ్, షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ 411 వినతుల అందజేత -
నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు..
నెల్లూరు(క్రైమ్): ‘నంద్యాలకు చెందిన కె.రమేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడుగుతుండగా మొహం చాటేసి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరుకు చెందిన ఓ యువతి కోరారు. ‘వింజమూరు ప్రాంతానికి చెందిన బాబు ప్రేమిస్తున్నాని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరం కలిసి సహజీవనం చేశాం. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరిస్తున్నాడు’ అని ఉదయగిరికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 98 మంది విచ్చేసి తమ ఫిర్యాదులను ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచు రామారావు, డీటీసీ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫిర్యాదుల్లో కొన్ని..⇒ కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తానని అనంతసాగరానికి చెందిన తులసీధర్ నమ్మించాడు. రూ.3 లక్షల నగదు తీసుకుని కువైట్కు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వలేదు. ఇటీవల నిలదీయగా చంపుతానని బెదిరిస్తున్నాడని అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.⇒ నా భర్త మరణించాడు. అత్తింటివారు ఆయన ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాకు జీవనాధారం కష్టమైంది. అవస్థలు పడుతున్నానని కొండాపురానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు.⇒ నా కుమార్తె ఈనెల రెండో తేదీ నుంచి కనిపించడం లేదు. మా మండలానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం ఉంది. విచారించి కుమార్తె ఆచూకీని తెలియజేయాలని లింగసముద్రంకు చెందిన ఓ మహిళ కోరారు.⇒నాకు ముగ్గురు కుమారులు. నా పేరుపైనున్న ఆస్తులు పంచాలని కొడుకులు, కోడళ్లు వేధిస్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు.⇒ నెల్లూరుకు చెందిన పృథ్వీరాజ్తో నాకు వివాహమైంది. అతను వ్యసనాలకు బానిసై అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.⇒ నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. చైన్నెలో మరో వివాహం చేసుకున్నట్లు ఫొటోలు పంపాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రంకు చెందిన ఓ వివాహిత కోరారు. -
కారు బోల్తా పడి..
● వృద్ధుడి మృతి, ముగ్గురికి గాయాలు దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి సమీపంలో అటవీ ప్రాంతం వద్ద హైవేపై సోమవారం కావలి వైపు వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి తెనాలికి కారులో రత్నరాజు, అతని భార్య విజయకుమారి, కోడలు సుహాసిని, అల్లుడు వంశీ ప్రయాణిస్తున్నారు. వంశీ వాహనం నడుపుతున్నాడు. అటవీ ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. రత్నరాజు (83) అక్కడికక్కడే మృతిచెందాడు. విజయకుమారి చేతికి తీవ్ర గాయమైంది. సుహాసిని, వంశీ స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ నేడు
నెల్లూరు రూరల్: జిల్లాలో 1 – 19 సంవత్సరాల మధ్య వయసున్న వారికి నులిపురుగుల నివారణ మాత్రలను తప్పకుండా అందించాలని కలెక్టర్ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. పూరిల్లు దగ్ధమై ఆస్తి నష్టంమనుబోలు: పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని నాయుడుపాళెం గ్రామంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రావూరు సుబ్బారాయుడు, వెంకటరమణమ్మ దంపతులు ఇంటికి తాళం వేసి పని నిమిత్తం వెంకటాచలం మండలం కురిచెర్లపాడుకు వెళ్లారు. తిరిగొచ్చేలోపు పూరింటి పైనున్న 11 కేవీ ఎల్టీ లైన్ వైర్లు ఒకదానికొకటి రాసుకుని నిప్పురవ్వలు ఇంటిపై పడి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. పొదలకూరు నుంచి వచ్చిన ఫైరింజిన్ మంటలను ఆర్పినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, మూడున్నర సవర్ల నల్లపూసల దండ, రెండు ఉంగరాలు, రెండు పుట్ల ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. నిత్యావసర వస్తువులు, దుస్తులు, 100 కేజీల బియ్యం కాలిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ఒక్క రాత్రిలోనే..
● సీజ్ చేసిన మైన్ నుంచి వైట్ క్వార్ట్ ్జ తరలింపు ● రెవెన్యూ అధికారులకు సమాచారం ● దీంతో ఆగిన తంతుపొదలకూరు: సీజ్ చేసిన అటవీ భూముల్లోని వైట్ క్వార్ట్ ్జను గుర్తుతెలియని వ్యక్తులు నాలుగురోజుల క్రితం రాత్రివేళ టిప్పర్లలో తరలించారు. ఈ ఖనిజానికి డిమాండ్ ఉంది. ఇక్కడ నాణ్యమైంది లభ్యమవుతుండటంతో జేసీబీతో నాలుగు టిప్పర్లలో లోడ్ చేసి తరలించారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు తెలియడంతో తిరిగి రాయిని తరలించే ప్రయత్నాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. గతంలో మండలంలోని మొగళ్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూముల్లో మైనింగ్ చేస్తుండగా అధికారులు దాడులు నిర్వహించారు. వెలికి తీసిన రాయితోపాటు, మైన్ను సీజ్ చేశారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ మైన్పై కేసులు కూడా నడుస్తున్నాయి. మైనింగ్ అధికారులు అప్పట్లో నోటీసులను సైతం అందజేశారు. అయితే మైనింగ్కు అలవాటు పడిన గూడూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి నాణ్యత కలిగిన రాయిని వదులుకునేందుకు ఇష్టం లేక కొంతకాలంగా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా ఎవరూ సహకరించకపోవడంతో ఆ వ్యక్తి సాహసించలేకపోయాడు. నాలుగురోజుల క్రితం కొందరు ముందుకురావడంతో ఒక్క రాత్రే ట్రెంచ్ కొట్టిన మైన్ వద్దనున్న రాయిని తరలించాడు. ఆరోజు రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో కాపలా ఉన్న వారు ఇళ్లకు వెళ్లడంతో క్వార్ట్ ్జను తరలించేందుకు అనుకూలంగా మారినట్టు తెలిసింది. మరుసటిరోజు సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మైన్ వద్ద కాపలాను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.నిఘా పెంచాం వైట్ క్వార్ట్ ్జను గుర్తుతెలియని వ్యక్తులు తరలించినట్టు సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో నిఘా పెంచాం. తలారులను రాత్రి వేళ కూడా కాపలా ఉండాలని ఆదేశించాం. మైనింగ్ అధికారులకు సమాచారం అందజేయడం జరుగుతుంది. – బి.శివకృష్ణయ్య, తహసీల్దార్, పొదలకూరు -
ప్రేమ పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): ‘నంద్యాలకు చెందిన కె.రమేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడుగుతుండగా మొహం చాటేసి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరుకు చెందిన ఓ యువతి కోరారు. ‘వింజమూరు ప్రాంతానికి చెందిన బాబు ప్రేమిస్తున్నాని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరం కలిసి సహజీవనం చేశాం. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరిస్తున్నాడు’ అని ఉదయగిరికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 98 మంది విచ్చేసి తమ ఫిర్యాదులను ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచు రామారావు, డీటీసీ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తానని అనంతసాగరానికి చెందిన తులసీధర్ నమ్మించాడు. రూ.3 లక్షల నగదు తీసుకుని కువైట్కు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వలేదు. ఇటీవల నిలదీయగా చంపుతానని బెదిరిస్తున్నాడని అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు. ● నా భర్త మరణించాడు. అత్తింటివారు ఆయన ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాకు జీవనాధారం కష్టమైంది. అవస్థలు పడుతున్నానని కొండాపురానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు. ● నా కుమార్తె ఈనెల రెండో తేదీ నుంచి కనిపించడం లేదు. మా మండలానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం ఉంది. విచారించి కుమార్తె ఆచూకీని తెలియజేయాలని లింగసముద్రంకు చెందిన ఓ మహిళ కోరారు. ● నాకు ముగ్గురు కుమారులు. నా పేరుపైనున్న ఆస్తులు పంచాలని కొడుకులు, కోడళ్లు వేధిస్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. ● నెల్లూరుకు చెందిన పృథ్వీరాజ్తో నాకు వివాహమైంది. అతను వ్యసనాలకు బానిసై అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. చైన్నెలో మరో వివాహం చేసుకున్నట్లు ఫొటోలు పంపాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రంకు చెందిన ఓ వివాహిత కోరారు. న్యాయం చేయాలని పోలీసులకు వినతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 98 ఫిర్యాదులు చట్ట పరిధిలో విచారిస్తామన్న ఏఎస్పీ సౌజన్య -
కారు బోల్తా పడి..
● వృద్ధుడి మృతి, ముగ్గురికి గాయాలు దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి సమీపంలో అటవీ ప్రాంతం వద్ద హైవేపై సోమవారం కావలి వైపు వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి తెనాలికి కారులో రత్నరాజు, అతని భార్య విజయకుమారి, కోడలు సుహాసిని, అల్లుడు వంశీ ప్రయాణిస్తున్నారు. వంశీ వాహనం నడుపుతున్నాడు. అటవీ ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. రత్నరాజు (83) అక్కడికక్కడే మృతిచెందాడు. విజయకుమారి చేతికి తీవ్ర గాయమైంది. సుహాసిని, వంశీ స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
బాలుడి అదృశ్యం.. డ్రోన్తో వెతుకులాట
నెల్లూరు సిటీ: ఒకటో తరగతి చదువుతున్న బాలుడు అదృశ్యమవగా ఏడుగంటల్లోనే పోలీసులు ఆచూకీ కనుకున్నారు. వారి కథనం మేరకు.. రూరల్ మండలంలోని పాతవెల్లంటి గ్రామంలో పాదర్తి నారాయణ, రమణమ్మ దంపతులకు మనోజ్ అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం కుమారుడు అల్లరి చేస్తున్నాడని తండ్రి మందలించాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి పనిలో వారుండగా మనోజ్ వీధిలోకి వెళ్లాడు. ఆడుకోవడానికి వెళ్లి ఉంటాడని తొలుత భార్యాభర్తలు భావించారు. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి వెతకడం మొదలుపెట్టా రు. డ్రోన్ను ఉపయోగించి ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. పక్కవీధిలోని ఇంటి మిద్దైపె ఉన్నట్లు గుర్తించారు. మనోజ్ డ్రోన్ను చూసి ఆ శబ్దానికి కిందకు దిగాడు. ఆచూకీ లభ్యం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
35 బైక్లు, రెండు ఆటోల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నగర డీఎస్పీ పి.సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి బోడిగాడితోట, అహ్మద్నగర్, బర్మాషెల్గుంట నాలుగు వైపులా దిగ్భందించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. యజమానితోపాటు కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. వాహనపత్రాలను పరిశీలించారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరనియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్లకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సెర్చ్లో నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రో కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: యువ ఆంధ్ర ప్రో కబడ్డీ సీజన్–1 రెఫరీగా కరేడు గ్రామానికి చెందిన సాదం శ్రీనివాసరావు ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరిగే సీజన్–1లో రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డు నుంచి ఎంపిక చేసినట్లు తెలిపారు. అసోసియేషన్ రెఫరీస్ బోర్డు చైర్మన్ మురళీకుమార్, కన్వీనర్ రవీంద్ర, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు, సెక్రటరీ పూర్ణచంద్రరావులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
● 40 రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య మామూళ్ల మత్తులో అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహానికి విద్యార్థుల బలిదానాలు హృదయాలను కలచివేస్తున్నాయి. మార్కులు, ర్యాంక్ల పేరుతో సరస్వతీ పుత్రులను చిదిమేస్తున్నారు. బిడ్డల భవిష్యత్తే తమ జీవితాశయమని తల్లిదండ్రులు తినీతినక కడుపులు మాడ్చుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని రూ.లక్షలు తెచ్చి కార్పొరేట్ చేతుల్లో పోస్తున్నారు. బిడ్డలను చదివించమని వదిలి పెడితే.. చావును చూపించి శవాలను తిరిగి పంపిస్తున్నారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. వేళకు పిడికెడు నాణ్యమైన మెతుకులు కూడా పెట్టకుండా మానవత్వం మరిచి మారీచుడిల్లా వ్యవహరిస్తున్నారు. అనధికారికంగా పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల నుంచి అధికారులు మామూళ్లు దండుకుంటున్న విషయం జగద్వితమే. అనుమతుల్లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు జరుగుతున్నప్పుడైనా స్పందించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏ కోశాన దయ, మానవత్వం లేకుండా తమకేమి సంబంధం లేదంటూ తప్పుకుంటున్నారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళేనికి చెందిన హేమశ్రీ పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో తమ కళాశాలలో చేర్పించమని ఆ విద్యార్థిని తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి ఇంటర్లో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో జాయిన్ చేసుకున్నారు. ఈ కళాశాల హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. బాగా చదువుకునే విద్యార్థిని ఇంకా బాగా చదవాలంటూ ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక సెక్షన్ మార్చాలని యాజమాన్యానికి విన్నవించుకుంది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె సెక్షన్ మార్చాలని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేని హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో ఆదివారం తనవు చాలిచింది. ఇలా యాజమాన్యాల నిర్వాహకం, ఒత్తిళ్లు తట్టుకోలేక జిల్లాలో కేవలం 40 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గడిచిన 40 రోజుల వ్యవధిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా జిల్లా ఇంటర్ బోర్డు, ఉన్నతాధికారుల్లో చలనం లేదు. కనీసం అటు వైపు వెళ్లి తనిఖీ చేసిన సందర్భాలు లేవు. కార్పొరేట్ కళాశాలల్లో వసతులు, విద్యార్థులపై ఒత్తిడి, నాసిరకం భోజనంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, కార్పొరేట్ యాజమాన్యాల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్న ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలలు, హాస్టల్స్ వైపు కన్నెత్తి చూడటం లేదని మండి పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం జిల్లా అధికారి నుంచి కూడా స్పందన రాకపోవడంతో విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో తూలుతుండగా మరో వైపు కార్పొరేట్ యాజమాన్యాలు ధన దాహంతో చెలరేగి పోతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ఆనంద్ స్పందించి అనుమతి లేని హాస్టల్స్, కళాశాలలను తనిఖీ చేసి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ● జిల్లాలో 30కు పైగా జూనియర్ కళాశాలల హాస్టల్స్ ● ఒక్క దానికి కూడా అనుమతి లేదు ● రూ.లక్షల్లో ఫీజులు.. దారుణ వసతులు ● ర్యాంకుల పేరుతో తీవ్రస్థాయిలో ఒత్తిడి ● తట్టుకోలేక బలవన్మరణాలు నెల్లూరు (టౌన్): జిల్లాలో ఉన్న 137 కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ జూనియర్ కళాశాలల్లో సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కళాశాలలకు సంబంధించి 30 వరకు అనధి కార హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్స్ల్లో 15 వేల మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు ఉంటున్నారు. వీటిల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు చెందిన 10 హాస్టళ్లు ఉన్నాయి. ఇంటర్లో అకడమిక్, హాస్టల్కు కలిపి కళాశాలను బట్టి రూ.60 వేల నుంచి రూ.2.70 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవికాకుండా పరీక్ష ఫీజు, హాస్టల్ డిపాజిట్, ప్రాక్టికల్స్, గేమ్స్ తదితర పేర్లుతో మరో రూ.5 వేల నుంచి రూ.7 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి నారాయణ తమకు చెందిన విద్యా సంస్థలు, హాస్టల్స్ల్లోనే నాసిరకమైన భోజనం, వసతుల లేమి, ఒత్తిడితో కూడిన చదువులు ఉండడంతో ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆశలు సమాధి చేసి.. ప్రాణాలు తీసి.. పేదింటి తల్లిదండ్రుల నుంచి శ్రీమంతుల వరకు తమ బిడ్డల భవిష్యత్పై ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. పేదింటి కుటుంబాలు అయితే తమ స్థోమతకు సరిపోకపోయినా.. కూలినాలీ చేసి, ఒక పూట తిని, మరో పూట పస్తులుండి, అప్పులు చేసి మరీ బిడ్డలను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ధనదాహంతో మునిగిపోయిన యాజమాన్యాలు విద్యార్థులపై మార్కులు, ర్యాంక్ల పేరుతో తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచుతున్నారు. కష్టమని చెప్పినా.. నిర్బంధంగా చదవాల్సిందే అంటూ పెంచుతున్న ఒత్తిడికి తట్టుకోలేక తనువులు చాలించే పరిస్థితిలోకి జారిపోతున్నారు. ఘటన జరిగిన తర్వాతైనా ఆయా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తారా అంటూ అదీ ఉండడం లేదు. బిడ్డ చనిపోతే.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించాంటూ చేతులు దులుపుకుంటున్నారు. కనీసం సమాచారం చెప్పే దిక్కుకూడా లేకుండా తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. అనుమతి లేకుండానే నిర్వహణ జిల్లాలో జూనియర్ కళాశాలల పేరిట నిర్వహిస్తున్న ఏ హాస్టల్కు ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని యాజమాన్యాలు ఒకే భవనంలో కళాశాల, హాస్టల్ నిర్వహిస్తుండగా, మరికొన్ని యాజమాన్యాలు కళాశాల ఒకచోట, హాస్టల్ మరొక చోట నిర్వహిస్తున్న పరిస్ధితి ఉంది. ఏ ఒక్క హాస్టల్కు ఫైర్ సర్టిఫికెట్ లేదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు వదలాల్సిన భయానక పరిస్థితి ఉంది. హాస్టల్స్ల్లో వసతులు అధ్వానంగా ఉంటున్నాయి. కారాగారాలను తలపించే విధంగా భవనాలు, ఇరుకు గదుల్లో ఐదుగురు నుంచి ఏడుగురు విద్యార్థులను ఉంచుతున్నారు. హాస్టల్ పేరుతో రూ.లక్షలు గుంజుతున్నా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ర్యాంకులు పేరుతో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తరగతులు, స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యార్థులు చదవలేమని చెప్పినా ఆయా యాజమాన్యాలు బలవంతంగా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. భోజనం బాగాలేదని, హాస్టల్స్ల్లో మరుగుదొడ్లు, ఇరుకు గదుల్లో మేం పడుకోలేకున్నామని తల్లిదండ్రులకు చెప్పినా ఏదో రకంగా సర్దుకుపోమ్మని సలహా ఇస్తున్నారు. ● బీసీ విద్యార్థి సంఘం నెల్లూరు (అర్బన్) : నగరంలోని ఆర్ఎన్ఆర్ కళాశాల విద్యార్థిని హేమశ్రీ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టడంతోపాటు అందుకు కారణమైన కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జేసీ కార్తీక్కకు ఆ సంఘ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్, జిల్లా అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ మురళీకృష్ణయాదవ్ మాట్లాడుతూ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉదయం 8.30 గంటలకు తల్లిదండ్రులకు హేమశ్రీ ఫోన్ చేసి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, చదువుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫోన్ చేసిందన్నారు. ఆ తర్వాత అర్ధగంటలోపే విద్యార్థిని మృతి చెందడం వెనుక ఉన్న ఒత్తిడి, ఇబ్బందులపై విచారణ జరిపించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన 3 నెలల్లోనే నెల్లూరులోని వివిధ కార్పొరేట్ కళాశాలల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇందుకు కారణమైన వారిని శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు విజయ్, బాలాజీ, సుధీర్యాదవ్, నాయబ్లు పాల్గొన్నారు. హాస్టల్స్ను పర్యవేక్షించే అఽధికారం లేదు ఇంటర్ జూనియర్ కళాశాలలకు సంబంధించి నిర్వహిస్తున్న హాస్టల్స్ను పర్యవేక్షించే అధికారాలు మాకు లేవు. విద్యార్థిని ఆత్మహత్యపై ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. ఆ కళాశాలకు తనిఖీకి వెళ్లితే తాళం వేసి ఉంది. విద్యార్థిని ఆత్మహత్యపై విచారించి కళాశాల యాజమాన్యమే కారణమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని కళాశాలలను తనిఖీ చేస్తాం. అనుమతి లేని వాటిని సీజ్ చేసి చర్యలు చేపడతాం. – వరప్రసాదరావు, ఆర్ఐఓ యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలి రాష్ట్రంలో అనుమతి లేకుండా హాస్టల్స్ను నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాటిని వెంటనే సీజ్ చేయాలి. విద్యార్థుల ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి కారణమైన కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. కళాశాల, హాస్టల్స్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలి. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, పేరెంట్స్ అసోసియేషన్ -
మద్యం కేసులో కాకాణికి బెయిల్ మంజూరు
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఇందుకూరుపేట ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 4వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దారుల పూచీ కత్తు, రూ.25 వేలు, వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎకై ్సజ్ అధికారుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి.ఉమామహేశ్వర్రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాకాణిపై ఆరోపణలకు ఎలాంటి ప్రాథ మిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో 8వ నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించారు. అనంతరం ఇందుకూరుపేట ఎకై ్సజ్ అధికారుల తరఫున ఏపీపీ లీలాకుమారి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణి గోవర్ధన్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ బదిలీ నెల్లూరు (లీగల్): నెల్లూరు రైల్వే కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పాలమంగళం వినోద్ను కర్నూలు జిల్లా డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తు తం నెల్లూరు రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ వినోద్ ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నా రు. ట్రైనింగ్ తర్వాత డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు తీసుకొంటారు. పోలీస్ కస్టడీకి బిరదవోలు నెల్లూరు (లీగల్): వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని విచారణ నిమిత్తం మూడు రోజు లు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్.సరస్వతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో అక్రమ మైనింగ్ చేసినట్లు పొదలకూ రు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన్ను విచారించడానికి నెల్లూరు రూరల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బిరదవోలు శ్రీకాంత్రెడ్డి ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్నారని విచారించ డానికి 7 రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు. బిరదవోలు శ్రీకాంత్రెడ్డి తరఫున సీనియర్ న్యా యవాది కె.రాజశేఖర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్రెడ్డిని ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తీసుకోవాలని, 14వ తేదీ విచారణాంతరం సా యంత్రం ఐదు గంటలకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచాలన్నారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని, న్యాయవాది సమక్షంలో ఆయన్ను విచారణ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. -
వాహనమిత్ర అమలు చేయాలి
నెల్లూరు రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వాహన మిత్ర పథకాన్ని లైసెన్సు కలిగిన ప్రతి డ్రైవర్కు అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు గత ప్రభుత్వం కంటే మిన్నగా ఇస్తామని కూటమి పెద్దలు హామీలిచ్చారన్నారు. ప్రతి ఆటోడ్రైవర్కు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. సోమవారం భారీగా తరలివచ్చిన ఆటోడ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జీఓ నంబరు 21 పేరుతో ట్యాక్స్లు, జరిమానాలు భారీగా పెంచడంతో ఆర్థికంగా తమపై భారం పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా ఆటోకార్మిక సంఘం ఆధ్వర్యంలో వీఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి 500 మంది ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్, ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓ సురేష్, రాజా మాట్లాడుతూ ఇప్పటికే ఆర్థిక భారాలతో సతమతమవుతున్న ఆటో కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు నిర్ణయంతో జీవితాలు మరింత దుర్భరంగా మారే పరిస్థితి అనివార్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేల వాహనమిత్ర పథకం ద్వారా సాయాన్ని అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం గడుస్తున్నా.. ఆటోకార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకుండా ఆపాలని ఆర్టీఏ అధికారుల ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. పెనాల్టీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించాలన్నారు. బ్యాంకు నుంచి వాహనాల కొనుగోలుకు రూ.4 లక్షల రుణాన్ని సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. మండలాల్లో ఆటో పార్కింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణా బాబురావు డి లవన్కుమార్, నున్న సురేష్ రాధయ్య, పెంచలయ్య, రవీంద్ర శ్యాంసన్, ఎం.సుధాకర్ విజయ్, హరి, దయాసాగర్, అశోక్, జిల్లా నలుమూలల నుంచి 500 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతాం జీఓ నంబర్ 21 పేరుతో పన్నులు, జరిమానాల భారం కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన ఆటో డ్రైవర్లు -
ఉచిత బస్సు ‘కొందరికే’
●నెల్లూరు ఒంగోలు మధ్య ఎక్స్ప్రెస్లు లేవు. అన్నీ డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సులే. ఉన్న ఎక్స్ప్రెస్లు కావలి–నెల్లూరు మధ్య తిరిగే నాన్స్టాప్ బస్సులే. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. మహిళలు ఎవరైనా ఒంగోలుకు వెళ్లాంటే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులో కావలి వరకు వెళ్లి.. అక్కడి నుంచి మరో బస్సులో ఒంగోలుకు వెళ్లాల్సి ఉంటుంది. నెల్లూరు నుంచి కందుకూరు వెళ్లాలన్నా.. ఇదే పరిస్థితి. ●నెల్లూరు నుంచి గూడూరుకై నా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేటకు వెళ్లాంటే నేరుగా ఆర్డినరీ బస్సులు కూడా లేవు. కనీసం గూడూరు నుంచి కూడా ఆర్డినరీలు లేవు. నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ‘కొందరికే’ ఉపయోగపడుతోంది. ఎక్స్ప్రెస్ల్లో ఉచితం అంటూనే నాన్స్టాప్గా నడిచే ఎక్స్ప్రెస్ల్లో ‘నో ఫ్రీ’ అంటూ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతానికి నిబంధనలు ఇవే ఉన్నప్పటికీ.. ప్రారంభించే సమయానికి ఇంకెన్నీ కండీషన్లు ఉంటాయోనని చర్చ ఆర్టీసీ అధి కారులు, ఉద్యోగుల్లోనూ ఉంది. మరో మూడు రోజుల్లో ఉచిత బస్సును ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంతవరకు అధికారులకు మార్గదర్శకాలు రాలేదు. 70 శాతం బస్సుల్లో అనుమతి ఉన్నా.. జిల్లాలో నెల్లూరు–1, నెల్లూరు–2, ఆత్మకూరు, కందుకూరు, కావలి, రాపూరు, ఉదయగిరిలో మొత్తం 7 డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో 642 బస్సులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఇందులో 341 పల్లెవెలుగు, 31 అల్ట్రా పల్లెవెలుగు, 52 ఎక్స్ప్రెస్లు కలిపి 424 (70 శాతం) బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఎక్స్ప్రెస్ కేటగిరీల్లోని నాన్స్టాప్ బస్సుల్లో అనుమతి లేకపోవడం వల్ల పెద్దగా ఒరిగేమీ ఉండదు. పట్టణాల నుంచి పల్లెలకు ఉండేవి, నడిచేవి పల్లె వెలుగులు మాత్రమే. ప్రధానంగా నెల్లూరు నుంచి కావలి, గూడూరు, ఆత్మకూరు మార్గాల్లో పల్లె వెలుగుతోపాటు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణికులు నాన్స్టాప్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ ఉచిత ప్రయాణం అందరికీ ఉపయోగపడే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. అదనంగా 30 బస్సుల కేటాయింపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 30 బస్సులను మాత్రమే అదనంగా కేటాయించారు. బడి బస్సులు 25, మరో 5 బస్సులను కేటాయించారు. గత ఆరు నెలల నుంచి ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం దశల వారీగా జిల్లాలో ఎన్ని బస్సులు అవసరం? ఎంత మంది డ్రైవర్లు, కండెక్టర్లు అవసరమో అడుగుతూ వచ్చింది. దీంతో అధికారులు సూచించిన మేరకు బస్సులు కేటాయింపు జరగకపోవడంతో ఫ్రీ బస్సు సర్వీసులను ఎలా నిర్వహించాలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. డొక్కు బస్సుల్లోనే ప్రయాణం ప్రతి రోజూ జిల్లాలో బస్సుల్లో 1.50 లక్షల నుంచి 1.70 లక్షలు మందికిపైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల కు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలు 70 వేల నుంచి 80 వేలు వరకు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఉన్న 642 బస్సుల్లో 15 లక్షల కి.మీ. తిరిగిన బస్సులు 100 ఉండగా, 10 లక్షలు కి.మీ. తిరిగిన బస్సులు 200 వరకు ఉన్నాయి. కొత్త బస్సులు 100 ఉండగా, 200 బస్సులు కండీషన్లో ఉన్నాయి. కండీషన్లో లేని బస్సుల్లో ఎక్కువ శాతం పల్లెవెలుగు బస్సులు కావడం గమనార్హం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తరువాత ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ బస్సుల్లో లోడ్ పెరగడం ద్వా రా బస్సుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణం సజావుగా సాగేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూలన పడేందుకు సిద్ధంగా ఉన్న బస్సులకు రంగులు అద్ది రోడ్ల పైకి తీసుకు వస్తున్నారు. 100 మంది ఆన్కాల్ డ్రైవర్ల నియామకం జిల్లాలో డ్రైవర్లు 1,119, కండక్టర్లు 923 మంది ఉన్నారు. వీరు కాకుండా 110 మంది ఆన్కాల్ డ్రైవర్స్ ఉన్నారు. అయితే కొత్తగా మరో 100 మంది ఆన్కాల్ డ్రైవర్స్ను అధికారులు నియామకం చేసుకుంటున్నారు. అయితే ఆన్కాల్ డ్రైవర్స్ నియమించుకునే క్రమంలో వారి పూర్తిస్థాయి డ్రైవింగ్పై అనుభవాన్ని పరీక్షిస్తున్నారు. గతంలో లారీలు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉంది. అయితే ఆయా డ్రైవర్లు వందల మంది ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు నడుపుతారా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పాత, తుప్పు పట్టిన బస్సులకు పసుపు రంగులు వేసి కలరింగ్ చేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు తిప్పలు తప్పవా? ప్రతి రోజూ ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆశ్రయిస్తుంటారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా ఎక్కితే ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో అధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల్లోనే అవకాశం నాన్స్టాప్ల్లో ఉచిత ప్రయాణం లేదంట మరో మూడు రోజులే ఉన్నా.. ఇంకా అందని మార్గదర్శకాలు మల్లగుల్లాలు పడుతున్న ఆర్టీసీ అధికారులు బస్సులను కండీషన్లో ఉంచుతాం ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బస్సులను కండీషన్లోఉండేలా చూసుకుంటున్నాం. ఇంకా ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు అందలేదు. వచ్చిన వెంటనే కార్యాచరణ చేపడుతాం. – షేక్ షమీమ్, జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి -
అక్రమ కేసుల్లో అరెస్ట్లకు అత్యుత్సాహం
సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల ఆదేశాలతో వైఎస్సార్సీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన దర్గామిట్ట పోలీసులు ఇరకాటంలో పడ్డారు. పోలీసులుగా తమ విధులు వదిలేసి పచ్చ పార్టీకి విదేయులుగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. లాఠీచార్జి ఘటనలో పోలీసుల దుందుడుకుగా వ్యవహరించడంతో స్పెషల్ బ్రాంచ్ హెడ్కానిస్టేబుల్ పక్కకు తప్పుకునే క్రమంలో ఆయనకై ఆయనే తట్టుకుని కింద పడిపోయాడు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ శ్రేణుల పాత్ర ఏమాత్రం లేదు. పోలీసులు నమోదు చేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడేమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫొటోలను న్యాయమూర్తి ముందు పెడితే పోలీసులపైనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయకోవిదులు చెబుతున్నారు. అడ్డుగోలుగా కేసులు ఘటనకు దారితీసిన పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పటికీ ఇవేమి తమకు పట్టవంటూ కూటమి నేతలు సూచించిన పేర్లను కేసుల్లో ఇరికించి పోలీసులు జైలుకు పంపుతున్నారు. ఇటీవల కావలి ఎస్బీ హెడ్కానిస్టేబుల్ చేయి విరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. హెడ్కానిస్టేబుల్ ఫొటోలు తీస్తూ తనకు తాను తట్టుకుని కింద పడితే వైఎస్సార్సీపీ నేతలు నెట్టివేయడంతో కింద పడ్డానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాస్తవాలు పరిశీలించకుండానే ఎస్బీహెడ్కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆయన్ను నెట్టివేయడంతో కిందపడి చేయి విరిగిందంటూ నాన్బెయిల్బుల్ సెక్షన్లతో తొలుత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు కౌన్సిలర్ బొబ్బల శ్రీనివాసయాదవ్, పాతపాటి ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత కూటమి నేతలు ఇచ్చిన జాబితా ప్రకారం వైఎస్సార్సీపీ కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనురూప్రెడ్డితోపాటు 17 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని ప్రసన్నకుమార్రెడ్డితోపాటు మరికొందరుపై మరో కేసు నమోదు చేశారు. బైక్ ర్యాలీ చేశారని యువకులపై ఇంకో కేసు నమోదు చేశారు. ముందు ప్రసన్నకుమార్రెడ్డి ఉంటే.. వెనుక పక్కన కిందపడిన హెడ్కానిస్టేబుల్ (వృత్తాల్లో చూడొచ్చు)పోలీసుల తోపులాటలో పడిన హెచ్సీ, మరో వ్యక్తిఇద్దరు కూటమి ఎమ్మెల్యేల ఆదేశాలతో ఈ కేసులో మాజీమంత్రి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు 20 మందిని నిందితులుగా చేర్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తోపాటు చైన్నె, బెంగళూరు, వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కోవూరు మండల అధ్యక్షుడు ఎ. అనూప్రెడ్డిని అరెస్ట్ చేసిన తీరును చూస్తే దర్గామిట్ట పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోంది. ఆయనేమి ఉగ్రవాది కాదు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తి ఇంటిని అర్ధరాత్రి పూట భారీగా పోలీసులు చుట్టుముట్టి భయానక వాతావరణం సృష్టించడం చూస్తే పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరికొందరి కోసం వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. వాస్తవానికి తమకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నప్పటికి పోలీసులు అవేమిపట్టించుకోకుండా కూటమి పెద్దలను మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్తో జీర్ణించుకోలేని కూటమి నేతలు తోపులాటలో హెడ్కానిస్టేబుల్ గాయపడ్డాడని 20 మందిపై అక్రమ కేసులు ఇప్పటికే కోవూరు మండల కన్వీనర్ అనూప్రెడ్డి అరెస్ట్ మరికొందరి కోసం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల గాలింపు వెలుగులోకి వచ్చిన ఆయనకై ఆయనే తట్టుకుని పడిన చిత్రాలు -
అందుబాటులో 1100 కాల్ సెంటర్
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నంబరు ప్రభుత్వ ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఒక భాగమని, ఇది పౌరులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి సకాలంలో పరిష్కరించేలా చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవలు, స్థాని క సమస్యలు ఇతర ప్రజాసమస్యలకు సంబంధించిన సమస్యలను నివేదించడానికి పౌరులు ఏ ఫోన్ నుంచి అయినా 1100కు ఉచితతంగా కాల్ చేయొచ్చు అన్నారు. ఫిర్యాదులను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సౌలభ్యం కోసం నమోదు చేసుకోవచ్చునని, దీన్ని వినియోగించుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ● డీఈఓ బాలాజీరావు నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మొదటి నిర్మాణాత్మక మదింపు (ఎస్ఏఎంపీ–1) పరీక్షలు సోమవారం నుంచి జరుగుతాయని డీఈఓ బాలాజీ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మూడు రోజుల పాటు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నాలుగు రోజుల పాటు టైం టేబుల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయన్నారు. 11వ తేదీ ప్రథమ భాష తెలుగు, గణితం 12న ద్వితీయ భాష హిందీ, సామాన్యశాస్త్రం/భౌతికశాస్త్రం, 13న తృతీయ భాష ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, 14న ప్రధాన భాష సంస్కృతం, జీవశాస్త్రం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతి సబ్జెక్ట్కు 35 మార్కులతో పాటు ప్రతి సబ్జెక్ట్లో తరగతి గది ప్రతిస్పందనలు, రాత పనులు, ప్రాజెక్ట్ పనులుకు ఒక్కొక్కటికి 5 మార్కులు చొప్పున ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించి మొత్తం 50 మార్కులకు మదింపు చేస్తారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఉపాధ్యాయులు జవాబులను మూల్యాంకనం చేసి ఆ మార్కులను మదింపు పుస్తకంలోని ఓఎంఆర్లో నమోదు చేసి, స్కాన్ చేసి లీప్ యాప్ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. పరీక్ష ఫలితాలను రాష్ట్ర స్థాయిలో మదింపు చేసి ప్రస్తుత విద్యాప్రమాణాల మీద, తదుపరి చర్యలపైన ఉపాధ్యాయులకు సూచనలు చేస్తారన్నారు. శిలాఫలకం ధ్వంసం కేసులో ఇద్దరి అరెస్ట్ ● కావలి డీఎస్పీ శ్రీధర్ కావలి (జలదంకి): తమ్మలపెంట పట్టపుపాళెంలో జల్జీవన్ మిషన్ శిలాఫలకం ధ్వంసం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ కే శ్రీధర్ తెలిపారు. ఆదివారం కావలి డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివవరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తమ్మలపెంట పట్టపుపాళెంలో 2021లో ప్రభుత్వ పథకం జల్జీవన్ మిషన్, రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇటీవల ధ్వంసం చేశారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పామంజి యానాదయ్య, కోడూరు జకరయ్య ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి జేసీబీతో శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా శిథిలాలను బయటకు తరలించారని తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై తిరుమలరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
చేపల వేటకెళ్లి ఇద్దరు యువకుల మృతి
కావలి (జలదంకి): చేపల వేటకు వెళ్లి మత్స్యకార యువకులు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతై ఇద్దరు మృతి చెందిన ఘటన కావలి మండలం తుమ్మలపెంట సముద్రతీరంలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో మరొక యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. తుమ్మలపెంట పల్లెపాళెంకు చెందిన శ్రీహరి–వెంకటేశ్వరమ్మ కుమారుడు వెయ్యాల విష్ణు (20), శ్రీను–సావిత్రమ్మ కుమారుడు అయ్యాల శివకృష్ణ (19), మరో యువకుడు గొల్లపోతు నాగాచార్యులు కలిసి మొయ్యవల తీసుకుని సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. విష్ణు, శివకృష్ణ సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యారు. కొంత దూరంలో ఉన్న నాగాచార్య నీటిలో కొట్టుకుంటూ కేకలు వేశాడు. దీంతో మైరెన్ పోలీసులు స్పందించి స్థానిక మత్స్యకారులతో కలిసి బోటులో వెళ్లి నాగాచార్యను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీట మునిగి అపస్మారక స్థితిలో ఉన్న విష్ణు, శివకృష్ణలను బోటులో ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. అనంతరం ఇద్దరి యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. దీనిపై రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరొకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మైరెన్ పోలీసులు తుమ్మలపెంట సముద్రతీరంలో ఘటన పల్లెపాళెంలో విషాదఛాయలు -
తుక్కు ఫోన్లు.. చెత్త యాప్లు
ఉదయగిరి: జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 1,24,680 మంది పిల్లలు, బాలింతలు 13,098, గర్భిణులు 11,663 మంది ఉన్నారు. వీరికి అన్నీ సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న పనిభారంతో సతమవుతున్న కార్యకర్తలకు అదనపు యూప్లు పేరుతో మరింత భారం పెంచారు. దీంతో కార్యకర్తలు మరింత మానసిక ఆవేదన చెందుతున్నారు. కొత్త యాప్లకు సపోర్టు చేయని సెల్ఫోన్లు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం పంపిణీలో పారదర్శకత కోసం గత ప్రభుత్వం అందజేసిన 2జీ ఫోన్ల ద్వారా నమోదు చేయించింది. అప్పటి విధులకు ఆ ఫోన్లు పని చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇవ్వకుండా 5జీ సపోర్టు యూప్లతో అప్లోడ్ చేయాలని చెబుతున్నారు. అసలే అరకొర సిగ్నల్స్, పనిచేయని యూప్లతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో విసుగు చెందిన కార్యకర్తలు కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా కొత్త యూప్లు రద్దు అయినా చేసి పాత యూప్లు కొనసాగించండంటూ పలువురు కార్యకర్తలు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. జిల్లాలో ఒక్క ఉదయగిరి తప్ప అన్ని ప్రాజెక్ట్ల్లోని పనిచేసే కార్యకర్తలు తమకిచ్చిన సెల్ ఫోన్లను ప్రాజెక్ట్ కేంద్రాల్లో ఇచ్చారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి విధానంలో లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలంటే యూప్లో ముఖ ఆధారిత గుర్తింపు తప్పని సరి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఉన్న పాత ఫోన్లు సపోర్టు చేయకపోవడంతో ఫేస్ క్యాప్చర్ కావడం లేదు. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు రేషన్ ఇవ్వడంలో ఇబ్బంది తలెత్తుతోంది. గతంలో కుటుంబంలో ఎవరూ వచ్చిన ఆహారం ఇచ్చే అవకాశం ఉండేది. కానీ కొత్త యూప్లో ఆ అవకాశం లేదు. దీంతో కార్యకర్తలు లబ్ధిదారులకు, అధికారులకు సమాధానం చెప్పలేక మానసిక ఆందోళనకు గురువుతున్నారు. పైగా యూప్లతోనే కుస్తీ పట్టాల్సిన రావడంతో పిల్లలపై దృష్టి పెట్టేందుకు సమయం సరిపోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యానికి, పోషకాహారానికి భరోసాగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం కుంపటిగా మారింది. పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు క్రమశిక్షణ, ఆట పాటలతో కూడిన విద్యను అందించడంతోపాటు కిశోర బాలికల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం పెరగడంపై అష్టకష్టాలు పడుతున్నారు. పని భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి కొత్త యాప్లు తీసుకొచ్చి ఒత్తిడి మరింత పెంచింది. తుక్కు ఫోన్లు, చెత్త యాప్లతో విసిగిపోయిన వర్కర్లు ప్రభుత్వం తమికిచ్చిన సెల్ఫోన్లను ఆయా ప్రాజెక్ట్ కేంద్రాల్లో జమ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ ఆధారిత గుర్తింపుతో రేషన్ పంపిణీ సపోర్టు చేయకపోవడంతో నమోదు కాని పరిస్థితి పని భారం.. అధికారుల ఒత్తిళ్లు విసిగిపోయిన అంగన్వాడీలు ఐసీడీఎస్ కార్యాలయల్లో ఫోన్ల అప్పుగింత మానసిక వేదనతో సతమవుతున్న కార్యకర్తలు ఫేస్ క్యాప్చర్ తీసివేయాలి ముఖ ఆధారిత గుర్తింపు విధానం (ఫేస్ క్యాప్చర్) తీసి వేయాలి. ఈ విధానంలో లబ్ధిదారులు కచ్చితంగా కేంద్రం వద్దకే రావాలి. వారి ఫోన్లకు వచ్చే ఓటీపీ చెప్పాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లు కొత్త యాప్లకు సపోర్టు చేయడం లేదు. సిగ్నల్స్ లేకపోవడంతో ఒక్కరికే గంటల తరబడి సమయం కేటాయించాలి వస్తుంది. మాన్యువల్ విధానమే కొనసాగించాలి. – శ్రీదేవి, అంగన్వాడీ యూనియన్ లీడర్ అధికారుల వేధింపులు ఆపాలి పని చేయని ఫోన్లు ఇచ్చి కార్యకర్తలపై అధికారులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు గురి చేయడం మానుకోవాలి. కొత్త యాప్లు ప్రవేశపెట్టి అంతే స్పీడ్తో పాత ఫోన్లు ఎలా పని చేస్తాయనేది అధికారులకు తెలియదా?. అంగన్వాడీ కార్యకర్తలు చేసే పనులకు, వారికి ఇచ్చే వేతనం చూస్తే ప్రభుత్వం వారితో వెట్టి చాకిరి చేయిస్తోంది. ప్రభుత్వం పని తగ్గ వేతనం అమలు చేసి వారితో పనులు చేయించాలి. – కాకు వెంకటయ్య -
కొంటే.. కూర‘గాయాలు’
నెల్లూరు (పొగతోట): జిల్లాకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన ఏసీ కూరగాయల మార్కెట్ అవినీతిమయమైంది. ఈ మార్కెట్లో అధికారులు అనేక పర్యాయాలు తనిఖీలు చేసినా, కేసులు పెట్టినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. అధికారులు తనిఖీ సమయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వెళ్లిన తర్వాత వ్యాపారుల తీరు షరా మామూలుగానే మారుతోంది. తూకాల్లో మోసాలు, కుళ్లిపోయిన, పుచ్చిపోయిన కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. వ్యాపారులు నిత్యం వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ తంతు నిత్యం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కేజీకి 850 గ్రాములే.. కేజీ కూరగాయలు తీసుకుని బయటకు వచ్చి తూకం వేస్తే 850 గ్రాములు మాత్రమే ఉంటున్నాయి. వినియోగదారులు తూకం వేసి పరిశీలించుకునేందుకు ధర్మకాటా ఏర్పాటు చేశారు. ధర్మకాటా బోర్డు మాత్రం కనిపిస్తోంది. కానీ కాటా కనిపించదు. నిత్యం వేలాది మంది వినియోగదారులు ఇక్కడ కూరగాయలు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. ఈ విషయంపై అదికారులకు ఫిర్యాదులందినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఈ మార్కెట్పై నిఘా పెట్టి, తరచూ తనిఖీ చేయడంతో ఆయన ఉన్నంత కాలం వ్యాపారులు నిజాయితీగా వ్యవహరించారు. ఆయన వెళ్లిపోయాక కొత్తగా వచ్చిన ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడంతో తిరిగి యథారాజా తథ ప్రజాగా మారారు. ఒక పక్క మండిపోతున్న ధరలు మరో వైపు తుకాల్లో మోసాలు వ్యాపారులు సిండికేట్గా దోపిడీ వినియోగదారుల జేబులకు చిల్లు కుళ్లినవి, పుచ్చినవి అంటగడుతున్నారు నెల్లూరుకు వచ్చిన సమయంలో ఇంటికి వెళ్లేటప్పుడు మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తాం. వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కుళ్లినవి, పుచ్చినవి అంటగడుతున్నారు. ఇవేమని ప్రశ్నిస్తే భలే కొన్నావ్లే పోవయ్యా అంటూ ఛీదరించుకుంటున్నారు. అధికారులు చొరవ తీసుకొని వినియోగదారులు నష్టపోకుండా చూడాలి. – విజయేంద్రబాబు, పొదలకూరు వ్యాపారులకు నోటీసులిస్తాం వినియోగదారులు నష్టపోకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం. వినియోగదారులను నష్టపరుస్తున్న వ్యాపారులపై దృష్టి పెట్టి నోటీసులు అందించి కేసులు నమోదు చేస్తాం. నిత్యం ధర్మకాటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – అనితకుమారి, మార్కెటింగ్ ఏడీ -
చిత్రం సాక్షిగా దొరికిన ఖాకీలు
అక్రమ కేసుల్లో జిల్లా కేంద్ర కారాగార రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్, టీడీపీ కిరాయి ముష్కరుల దాడి ఘటన నేపథ్యంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు గత నెల 31వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వచ్చారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధ ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలను లెక్క చేయని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసులను ఉసిగొల్పడంతో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ సమీపంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులపై అకారణంగా ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. దీంతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు పలువురికి గాయాలయ్యాయి. తనతోపాటు పార్టీ శ్రేణులపై లాఠీచార్జి చేయడాన్ని గర్హిస్తూ ప్రసన్నకుమార్రెడ్డి పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. లాఠీచార్జి జరుగుతున్న సమయంలో అక్కడున్న ఎస్బీ హెడ్కానిస్టేబుల్ మాలకొండయ్య ఫొటోలు తీసేందుకు వెనక్కి వెనక్కి వెళుతూ తనను తానే తట్టుకుని పడిపోతున్నట్లు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సదరు హెడ్కానిస్టేబుల్ కింద పడిపోవడానికి లాఠీచార్జి చేస్తున్న పోలీసుల దూకుడుతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనకు కొంచెం దూరంలో పార్టీ శ్రేణులతో ప్రసన్నకుమార్రెడ్డి రోడ్డుపై బైఠాయించిన దృశ్యం అదే చిత్రంలో కనిపిస్తోంది. హెడ్కానిస్టేబుల్ కింద పడుతున్నప్పుడు, పడిన తర్వాత ఆయనకు దగ్గరల్లో కేసులో పేర్కొన్న ఏ వ్యక్తి లేరని ఫొటోలు, వీడియోలతో తేలిపోయింది. దీనిని బట్టి చూస్తే కూటమి నేతలు ఓ పథకం ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు హెడ్కానిస్టేబుల్ను ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిసినప్పటికీ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. పోలీసులు తమపై పెట్టిన అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వాస్తవాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. తాజా పరిణామాలతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ఎలాగైనా తామే కరెక్ట్ అని నిరూపించుకునే పనిలో పడ్డారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ‘కూటమి ప్రభుత్వంలో మహిళల పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. వారికి రక్షణ కరువైంది. రాష్ట్రంలో మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత జగనన్న ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచిందన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వారికి పదవులు ఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు మరోలా ఉన్నట్లు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. 5జీ ఫోన్లు ఇవ్వలేక సొంత ఖర్చులతో పనిచేయమని చెప్పడం దారుణమన్నారు. మహిళల సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. జగనన్నకు కృతజ్ఞతలు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే తనను మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూజిత కృతజ్ఞతలు తెలిపారు. పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. తన తండ్రి కాకాణి గోవర్ధన్రెడ్డి జైలుకు వెళ్లి 75 రోజులైందన్నారు. ఆయన బయటకు వస్తారని ప్రతిరోజూ అనుకుంటున్నామన్నారు. కేసులపై కేసులు వేసి తమను మానసికంగా వేధిస్తున్నప్పుడు జగనన్న ఫోన్లో మాట్లాడి ఓదార్చడమే కాకుండా నెల్లూరుకు వచ్చి నాన్నను కలిసి ధైర్యం చెప్పారని, ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు కాకాణికి అండగా ఉన్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎంబేటి శేషమ్మ, ఆత్మకూరు మహిళా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ ప్రసన్న, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షురాలు సంధ్యారాణి, నెల్లూరు రూరల్ అధ్యక్షురాలు రమాదేవి, నెల్లూరు సిటీ అధ్యక్షురాలు ధనుజారెడ్డి, ఇంకా శారద, బషీరా, ముంతాజ్, హైమ, వసంత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత -
కేసు నమోదు చేయాలంటూ..
● ఆర్ఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా ● నేతలను తరిమికొట్టిన పోలీసులు నెల్లూరు(అర్బన్): విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై పోలీసులు ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఆ కళాశాల వద్ద ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశ్రిత్రెడ్డి, నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్య ఉదయం జరిగినప్పుడు సాయంత్రం వరకు తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం చెప్పకపోవడం దారుణమన్నారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. విద్యాశాఖాధికారులు కళాశాలకు వచ్చి పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం చేసేవిధంగా కలెక్టర్ స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేసి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. న్యాయం అడిగితే.. విద్యార్థి నేతలు కళాశాల వద్ద ధర్నా నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా కదలకపోవడంతో తరిమికొట్టారు. ఈ ఘటనలో ఎస్ఎఫ్ఐ నాయకులను ఈడ్చి వేయడంతో చొక్కాలు చినిగిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతుంటే పోలీసులు కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా తమపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు తౌఫిక్, అబిద్, ఉస్మాన్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నాగేంద్ర, చైతన్య, జగదీష్, సుకుమార్, యశ్వంత్, సురేంద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
13న ప్రత్యేక విద్యుత్ అదాలత్
● ఈఈ సోమశేఖర్రెడ్డి వెల్లడి నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఈనెల 13వ తేదీ బుధవారం పొదలకూరులో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ నెల్లూరు రూరల్ డివిజన్ ఈఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఉన్న కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రూరల్ డివిజన్ పరిధిలోని రాపూరు, నెల్లూరు రూరల్, పొదలకూరు, ముత్తుకూరు సబ్ డివిజన్ పరిధిలోని రాపూరు, సైదాపురం, పొదలకూరు, మనుబోలు, కలువాయి, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలతోపాటు విరుపూరు, కోడూరు, వెంకటాచలం, కావేరినగర్, బుజబుజనెల్లూరు, నారాయణరెడ్డిపేట సెక్షన్ల విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈ అదాలత్ జరుగుతుందన్నారు. పొదలకూరు విద్యుత్ సబ్స్టేషన్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీజీఆర్ఎఫ్ చైర్మన్ వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, సభ్యురాలు విజయలక్ష్మి, ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ విజయన్, డిస్కం అధికారులు విచ్చేస్తారన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగదారలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కరాటే పోటీల్లో బంగారు పతకం
కలిగిరి: మండలంలోని బసిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన బోరెడ్డి సరిత తంజావూరులో నిర్వహించిన మూడో ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షి ప్ – 2025లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచింది. పెరియార్ మణియమ్మై ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆండ్ కళాశాల ఆవరణలో ‘కింగ్ షిటో – ర్యూ స్పోర్ట్స్ కరాటే డో ఇండియా’ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఇంటర్నేషనల్ పోటీలు జరిగాయి. మొదటి స్థానంలో నిలిచిన సరితకు నేషనల్ కరాటే ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సినీ నటుడు సుమన్, జాతీయ కార్యదర్శి డాక్టర్ పియూ ష్జైన్ బంగారు పతకం, ట్రోఫీ అందజేశారు. తనకు శిక్షణ ఇచ్చిన లక్ష్మీసామ్రాజ్యం, రవికి సరిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
కన్నపేగు విలవిల
● కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు నెల్లూరు(క్రైమ్): చదువుల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనుకున్న కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నపేగు విలవిల్లాడింది. కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలిపోయారు. వారి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకు హేమశ్రీ (16), మరో కుమార్తె, కుమారుడు సంతానం. తిరుమలయ్య శ్రీసిటీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నతంలోనే పిల్లలను చదివిస్తున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా హేమశ్రీ చిన్నతనం నుంచే చదువుల్లో చురుకుగా ఉండేది. పదో తరగతిలో 550 మార్కులు సాధించింది మండల టాపర్గా నిలిచింది. కుమార్తె మంచి మార్కులు సాధించడంతో భవిష్యత్లో మరింతగా చదువుల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉంటుందని తల్లిదండ్రులు కలలుగన్నారు. ఆమెను నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. కొంతకాలంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి బాధపడుతూ ఉండేది. తల్లిదండ్రులు ఆదివారం కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడతామని చెప్పారు. ఈక్రమంలోనే హేమశ్రీ మృతిచెందింది. నెల్లూరుకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతిని తట్టుకోలేక రోదిస్తూ కుప్పకూలిపోవడం చూపరులను సైతం కంట తడిపెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుమార్తెను కళాశాల వారే పొట్టన పెట్టుకున్నారని వారు ఆరోపించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మృతి వెనుక అనుమానాలున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిమ్మ ధరలు ౖపైపెకి..
నిమ్మ ధరలు పెరిగాయని సంతోష పడాలా?, దిగుబడి లేనందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో రైతులున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో ఇటీవల స్వల్పంగా ధరలు పెరిగాయి. తాజాగా అమాంతం ఒక కిలో రూ.30 నుంచి రూ.50కి చేరింది. బస్తా కాయలు ప్రస్తుతం మార్కెట్లో రూ.4 వేలకు అమ్ముతున్నారు. నెలాఖరుకు ధరలు మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది.బస్తా కాయలు రూ.4 వేలు ● ధరలు మరింత పెరిగే అవకాశం ● బయట మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ ● దిగుబడి తగ్గి రైతుల దిగాలుపొదలకూరు: ఈ ఏడాది నిమ్మ మార్కెట్ సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. ధరలు పతనమై కిలో కాయలు రూ.15కు కూడా అమ్ముడుపోలేదు. చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలిలేయాల్సి వచ్చింది. అయితే పండగల సీజన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా ధరలు తాత్కాలికంగా ఉంటాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ నుంచి వర్షాలు మొదలైతే కాయల ఎగుమతి పూర్తిగా తగ్గిపోతుంది. కాగా దసరా వరకు రైతులకు నష్టం వాటిల్లకుండా ధరలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. సంక్షోభం నుంచి కోలుకుంటూ.. ఈ ఏడాది సీజన్లో సైతం ధరలున్నా కాయల్లేక, ఒకవేళ కాయలుంటే ధరల్లేక రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరేళ్ల నాడు ఇలాంటి పరిస్థితే వచ్చింది. వ్యాపారులు కొనుగోలు చేసిన కాయలను పారబోసేవారు. గతేడాది ఇదే సీజన్లో బస్తా రూ.9 వేల వరకు అమ్ముడుపోయింది. కాయలు ఉన్నన్ని రోజులు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. తీరా తోటల్లో కాయలు లేకపోవడంతో ఇప్పుడు డిమాండ్ మెల్లగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఉండదని రైతులు చెబుతున్న మాట. చాలామంది తోటల్లో కాయలు పలచబారి లేకుండాపోతున్నాయి. కాయలున్న ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఈ ప్రాంతంలో 4 వేల ఎకరాల్లో తోటలన్నాయి. నిమ్మను మెట్టరైతులను వేరుచేసి చూడలేని పరిస్థితి ఉంది. ఎన్ని కష్టా లు, నష్టాలొచ్చినా ఈ సాగును వీడటం లేదు. మార్కెట్కు వచ్చిన నిమ్మకాయలు ధరలు పెరగడం మంచిదే.. ధరలు పెరగడం మంచి పరిణామమే. అయితే నెలరోజులు ముందుగా పెరిగుంటే చాలామంది రైతులు బాగుపడేవారు. తోటల్లో కాయలు లేని తర్వాత పెరగడం వల్ల తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కాయలున్న రైతులకు ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. – పి.పెంచలనారాయణరెడ్డి, నిమ్మ రైతు, మొగళ్లూరు ఆటుపోట్లు మామూలే.. ఈ ప్రాంత నిమ్మ రైతులకు ధరల్లో ఆటుపోట్లు మామూలైపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా నిమ్మను వీడలేం. ఒక ఏడాది ఆదాయం వస్తే మరో ఏడాది నష్టం వస్తుంటుంది. అంతమాత్రాన సాగును వదిలిపెట్టేది ఉండదు. నిమ్మలోనే జీవించడం వల్ల మాకు నష్టం వచ్చినా పట్టించుకోం. – కేపీ నారాయణరెడ్డి, నిమ్మ రైతు, అంకుపల్లి ఢిల్లీ మార్కెట్కు పంపుతున్నాం మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారంలో వేగం పెరిగింది. అయితే తోటల్లో కాయలు తగ్గుముఖం పడుతున్నందునే ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్కు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇటీవల వరకు ఆ మార్కెట్ వ్యాపారులు కాయలను వద్దనేవారు. ఇప్పుడు కావాలంటున్నా కాయలు తగినన్ని లేకపోవడంతో ఉన్నవాటినే పంపుతున్నాం. – ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మ మార్కెట్, పొదలకూరు ● -
సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి..
● పాముకాటుకు గురై మహిళ మృతి సంగం: ఓ మహిళ తమ్ముడికి రాఖీ కట్టి తన ఇంట్లోకి వెళ్లింది. అక్కడున్న నాగుపాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెం పల్లిపాళెం గ్రామంలో జరిగింది. సంగం మండలం అన్నారెడ్డిపాళెం పల్లిపాళేనికి చెందిన పాకం రావమ్మ (50) కొన్ని సంవత్సరాలుగా బుచ్చిరెడ్డిపాళెంలో పనులు చేసుకుంటోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం అన్నారెడ్డిపాళెం పల్లిపాళెంలో ఉంటున్న తన తమ్ముడు కనిసిరి హజరత్తయ్య వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. పక్కనే ఉన్న తన ఇంటిని చూసేందుకు రావమ్మ వెళ్లింది. అప్పటికే అక్కడున్న నాగుపాము ఆమెను కాటు వేసింది. కేకలు వేయడంతో హజరత్తయ్య, గ్రామస్తులు బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రావమ్మ రాత్రి మృతిచెందింది. ఆదివారం ఉదయం పల్లిపాళెంలో అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కాటువేసిన నాగుపాము కనిపించడంతో కొట్టి చంపేశారు. -
ఆర్ఐఎంసీకి విద్యార్థి ఎంపిక
సంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామానికి చెందిన డేగా చంద్రిల్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కళాశాల (ఆర్ఐఎంసీ)లో సీటు సాధించాడు. 8వ తరగతి ప్రవేశం కోసం గత సంవత్సరం డిసెంబర్లో ప్రవేశపరీక్ష జరిగింది. చంద్రిల్రెడ్డి ప్రతిభ చూపాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉంది. అతను 6, 7 తరగతుల బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ ప్రభుత్వ పాఠశాలు చదవడం విశేషం. తండ్రి డేగా మనోహర్రెడ్డి, తల్లి పవిత్ర తమ బిడ్డ సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్స్ఫోర్స్ అధికారి కావడమే తన లక్ష్యమని చంద్రిల్రెడ్డి చెబుతున్నాడు.48 మద్యం బాటిళ్ల స్వాధీనందుత్తలూరు: దుత్తలూరు పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాళెం మలుపు వద్ద అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుపై ఆదివారం దుత్తలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఉదయగిరి సీఐ వెంకట్రావు, దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి తన సిబ్బందితో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్● యువకుడికి గాయాలుదగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల హైవే సర్వీస్ రోడ్డుపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి మోటార్బైక్ ఢీకొనడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఆదివారం కావలి నుంచి నెల్లూరు వైపు పల్లెవెలుగు బస్సు వెళ్తోంది. ఉలవపాళ్ల సర్వీసు రోడ్డు స్టాప్లో ప్రయాణికులు దిగారు. లోపల ఉండిపోయిన ఓ ప్రయాణికురాలు బస్సు ఆపాలని అడగడంతో డ్రైవర్ నిలిపాడు. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ బైక్పై వెళుతూ ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్నాడు. అతడి కుడి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే బంధువులు కావలి హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.పోలీసుల అదుపులో జూదరులువిడవలూరు: పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన మండలంలోని ముదివర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ముదివర్తి గ్రా మం పాత ఇసుక ర్యాంపు సమీపంలో వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఎస్సై పి.నరేష్ తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. అదే గ్రామానికి చెందిన ఎస్కే బాబు, షేక్ హనీఫ్, మారుబోయిన విష్ణుకుమార్, తంగం శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలియజేశారు.● మనుబోలు: మండలంలోని మనుబోలు దళితవాడలో పేకాట స్థావరంపై ఆదివారం ఎస్సై శివరాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.15 నుంచి రాపూరమ్మ జాతరరాపూరు: మండల కేంద్రంలోని గ్రామదేవత రాపూరమ్మ జాతర ఈనెల 15వ తేదీ నుంచి జరుగుతుందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రాచీన కాలంనాటి ఈ ఆలయంలో 15న ఉదయం అభిషేకం, అంకురార్పణ, అమ్మవారి ఆహ్వానం, 16న పూలంగిసేవ, అన్నదానం, గంగపెట్టె ఊరేగింపు, 17న గ్రామ పొంగళ్లు, రాత్రి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కండలేరులో 25.917 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 25.917 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,280 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,700, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు. -
నృసింహునికి తులసీ దళార్చన
రాపూరు: శ్రావణ పౌర్ణమి సందర్భంగా పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శనివారం తులసీ దళార్చన అత్యంత వైభవంగా జరిగింది. నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాల నడుమ శ్రీవారి నందనంలోని ప్రత్యేక మండపంలో తులసీ దఽళాలతో ప్రత్యేక పూజలు, ఆదిలక్ష్మీదేవికి కుంకుమార్చన సేవ జరిగింది. రాత్రి బంగారు గరుడ వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహం కొలువుదీర్చి అలంకరించారు. కోనలోని మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు● ఒకరి మృతి, నలుగురికి గాయాలు ● రాజుపాళెం వద్ద ఘటన ఉలవపాడు: రెండు ద్విచక్ర వాహనాలను కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై రాజుపాళెం జంక్షన్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల ప్రశాంత్ (28), కల్యాణ్, ఏడేళ్ల వయసున్న సాయికృష్ణ బైక్పై ఉలవపాడు నుంచి భీమవరం వెళ్లడానికి రాజుపాళెం జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్నారు. ఈ సమయంలో గూడూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ప్రశాంత్ బైక్ను వేగంగా ఢీకొట్టింది. తర్వాత రోడ్డుమార్జిన్ వైపునకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రాజుపాళెం నుంచి ఉలవపాడుకు మరో బైక్పై వెళ్తున్న జొన్నాబత్తిన గిరి, మురళీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ మృతిచెందాడు. కల్యాణ్, సాయికృష్ణ తీవ్రంగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడులోని సీహెచ్సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పథకాలు అందాలంటే జగనన్న రావాలి
గుడ్లూరు: ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందాలంటే ముఖ్యమంత్రిగా జగనన్న రావాలని మాజీ ఎమ్మెల్యే, కందుకూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని చేవూరులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి బాబు మోసాలను తెలియజేస్తూ ప్రజలతో మాట్లాడారు. అంబేడ్కర్ను చూస్తే రాజ్యాంగం, అబ్దుల్ కలాంను చూస్తే రాకెట్లు, ఉపగ్రహాలు గుర్తుకు వచ్చినట్లు చంద్రబాబును చూస్తే దగా, నయవంచన గుర్తుకు వస్తాయన్నారు. బాబు ఎన్నో పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. వృద్ధులకు నూతన పెన్షన్ రాలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి బడుగు, బలహీనవర్గాలను మోసం చేశారన్నారు. జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ పథకాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారన్నారు. సుపరిపాలన కాదు మోసపూరిత పరిపాలన తల్లికి వందనం తప్ప ఇంకా ఏ పథకం ఇవ్వలేదన్నారు. అది కూడా అరకొరగా ఇచ్చి కోతలు పెట్టారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పెట్టామన్నారు. కానీ ఆ డబ్బులు అందరికీ వేయడం లేదన్నారు. చంద్రబాబు ఇటీవల సుపరిపాలన అనే కార్యక్రమం పెట్టారని, అది మోసపూరిత పరిపాలన అన్నారు. ఎన్నికలప్పుడు ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీలిచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలియజేశారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అందడం లేదని, జగనన్న ఉన్నప్పుడే పథకాలు సక్రమంగా పడ్డాయని తెలియజేశారు. గడిచిన కాలంలో ప్రజలను ఎలా మోసం చేశారనేది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంత నష్టపోయారని ప్రజలకు వివరించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పులి రమేష్, మండల అధ్యక్షుడు కాపులూరి కృష్ణయాదవ్, ఉపాధ్యక్షుడు బిళ్లా రమణయ్య, జిల్లా నాయకులు తోకల కొండయ్య, చీమలరాజా, రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి, నియోజకవర్గ నాయకులు నల్లమోతు చంద్రమౌళి, పాలవల్లి అమర్నాథ్రెడ్డి, షేక్ రహీమ్, చల్లా విఘ్నేష్, నక్కల శరత్, నక్కల రామకృష్ణ, ఎందేటి శేషయ్య, ఇమ్మని నరసింహారావు, ఎల్లంటి శ్రీను, ఏలియా, సుబ్బరాయుడు, నరసింహ, శ్రీను, మల్లికార్జున, రవికాంత్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కందుకూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి బుర్రా చేవూరులో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ -
పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ..
● తమిళనాడు వాసి సైకిల్ యాత్ర ఉదయగిరి: పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ముత్తు సెల్వన్ సైకిల్ యాత్ర చేపట్టారు. శనివారం ఉదయగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు, పర్యావరణంపై అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామన్నారు. అన్ని రాష్ట్రాలతోపాటు ప్రపంచంలోని ఏడు దేశాల్లో యాత్ర చేస్తానన్నారు. -
విషాద ప్రయాణం
ఉలవపాడు: బాలుడికి తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించి.. దైవ దర్శనం చేసుకుని సంతోషంగా సొంతూరికి చేరుకోవాలని ఆ కుటుంబం అనుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని తుఫాన్ వాహనంలో బయలుదేరింది. అయితే విధి మరోలా తలచింది. మృత్యు ప్రయాణంగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలోకి వచ్చే సమయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, శనివారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు చిన వెంకటేశ్వర్లు సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సాధించారు. వెంకటేశ్వర్లు పిడుగురాళ్లలో వెల్ఫేర్ అసిస్టెంట్గా, సుభాషిణి డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కుమారుడితో జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. వెంకటేశ్వర్లు తన భార్యను, తల్లి వెంకటనరసమ్మ, కుమారుడు తేజస్విని అభినయకృష్ణను పోగొట్టుకున్నాడు. దైవదర్శనం కోసం వారితోపాటు వెళ్తూ సుభాషిణి తండ్రి యర్రం శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేశ్వర్లు అన్న శ్రీనివాసరావు భార్య రుక్మిణమ్మ మరణించడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. రైల్లో వెళ్లాలని అనుకుని.. ఆ కుటుంబం తొలుత తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకుంది. అందులో ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని శ్రీనివాసరావు అన్నాడు. చిన్నపిల్లలు రైలులో ఇబ్బందులు పడతారు, కారులో అయితే ప్రశాంతంగా పడుకుని నిద్రపోతారు కదా అని వెంకటేశ్వర్లు అనడంతో పిడుగురాళ్లకు చెందిన గంగరాజు అనే వ్యక్తికి సంబంధించిన తుఫాన్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి మధ్యలో టీ తాగేందుకు ఆగారు. తిరిగి బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాల అప్పగింత ఉలవపాడు సీహెచ్సీలో వెంకటనరసమ్మ, సుభాషిణితోపాటు బాలుడు అభినయ్కృష్ణకు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పెరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తొలుత తిరుపతికి రైల్లో వెళ్లాలని అనుకుని.. తుఫాన్ వాహనంలో బయలుదేరి అనంతలోకాలకు.. -
నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి
పేదలకు చేరాల్సిన బియ్యం పచ్చ మాఫియాలకు వ్యాపారంగా మారింది. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో పచ్చనేతల రేషన్ బియ్యం దందా ఆకాశమే హద్దుగా సాగుతోంది. అధికారుల అండదండలతో గోదాముల నుంచే దోపిడీకి తెరతీస్తున్నారు. రాత్రివేళల్లో టన్నుల కొద్దీ బియ్యం మిల్లులకు తరలిపోతున్నా.. ప్రతి నెలా రూ.కోట్లు చేతులు మారుతున్నా సివిల్ సప్లయీస్, పోలీస్, విజిలెన్స్ శాఖలు పచ్చ మాఫియా బియ్యం బండ్లకు పచ్చజెండా ఊపుతున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్ పట్టి.. బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించడం కోసమే నెల్లూరు, కోవూరు, కావలి, కందుకూరుల్లో ప్రత్యేకంగా రైస్ మిల్లులు ఉన్నాయి. ● ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో వ్యాపారం ● ఇందు కోసమే ప్రత్యేకంగా కొన్ని మిల్లులు ● ఆ విషయం తెలిసినా సివిల్ సప్లయీస్, విజిలెన్స్ పట్టించుకోని వైనం ● ప్రతి నెలా 70 శాతం బియ్యం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అక్రమ రవాణా ● పాలిష్ పట్టి అధిక ధరలకు విక్రయం ● స్థానికులు సమాచారంతో పట్టుకున్నా నిబంధనలకు విరుద్ధంగా సీఎస్ డీటీలే రిలీజ్ ● జేసీ అధికారాలను లాగేసుకుంటున్న సీఎస్ డీటీలు సాక్షి, టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలోని 205 రేషన్ షాపుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. 91,371 మంది కార్డు హోల్డర్లలో కొందరు నేరుగా రేషన్ షాపుల డీలర్లకే అమ్ముకుని నగదు తీసుకుంటున్నారని సమాచారం. మరికొందరు ఆటోల్లో ఇళ్లకు వచ్చి బియ్యం కొనుగోలు చేసే వారికి అమ్ముకుంటున్నారు. డీలర్లు కిలోకు రూ.12 ఇస్తుండగా, ఇళ్లకు వచ్చి సేకరించే వారు రూ.15 కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు ఓ ఏజెంట్ ఉన్నాడు. ఆయనకే డీలర్లు తాము సేకరించిన బియ్యాన్ని అందజేయాల్సి ఉంటుంది. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో మరికొందరు ఏజెంట్లు ఉన్నారు. మనుబోలు, వెంకటాచలం మండలాల నుంచి రేషన్ బియ్యం సేకరించేందుకు నెల్లూరు చెందిన ఏజెంట్లు వస్తున్నట్లు తెలిసింది. ప్రతినెలా సగటున 913 టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు ప్రచారం ఉంది. రూ.లక్షల్లో రేషన్ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పొదలకూరు మీదుగా వెంకటగిరి, కలువాయి మండలాల నుంచి కూడా నెల్లూరు మిల్లులకు అక్రమంగా రాత్రి వేళల్లో తోలుతున్నారు. గతంలో పొదలకూరు పోలీసులకు అక్రమం రేషన్ బియ్యం తోలుతున్న పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. నెల్లూరు(పొగతోట): పచ్చ నేతల అండదండలతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేద ప్రజల బియ్యం భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అండగా నిలుస్తోంది. గతంలో చాటుమాటుగా సాగే ఈ వ్యాపారం ప్రస్తుతం బహిరంగంగానే జరుగుతోంది. ఈ రేషన్ మాఫియా నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల గోడౌన్ల నుంచే బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలించే స్థాయికి ఏ స్థాయికి బరితెగించింది. ముఖ్యంగా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సమీప బంధువు సివిల్ సప్లయీస్ శాఖ డైరెక్టర్గా ఉండడంతోపాటు ఈ మాఫియాకు కీలక నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాతో రూ.కోట్లల్లో దందా ఈ మాఫియా అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలించి రూ.కోట్లు గడిస్తోంది. గతంలో బియ్యం అక్రమ రవాణాకు మాఫియా డాన్గా వ్యవహరించిన కీలక వ్యక్తికి షిప్ (ఓడ)లో 20 శాతం వాటా ఉంది. అధికార పార్టీకి చెందిన ఒక సామాన్యమైన వ్యక్తి ఓడలో పార్టనర్ స్థాయికి ఎదిగాడంటే, దీన్ని బట్టి బియ్యం అక్రమ రవాణా ఏస్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లా నలుమూలల నుంచి, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాల నుంచి అక్రమంగా తరలించిన రేషన్ బియ్యాన్ని నెల్లూరు నగరంలోని రైస్ మిల్లుల్లో పాలిష్ పడుతున్నారు. నగరంలో ఉన్న 100కు పైగా రైస్ మిల్లుల్లో సుమారు 15 పెద్ద రైస్ మిల్లులు పేదల బియ్యం పాలిష్ మాత్రమే పట్టుతాయి. ఆయా రైస్ మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయరు.. మిల్లింగ్ చేయరు. ప్రతి నెలా మామూళ్లు జిల్లా వ్యాప్తంగా 1,513 చౌకదుకాణాలు ఉన్నాయి. 7.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. చౌకదుకాణాల ద్వారా ప్రతి నెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ ప్రతి నెలా మామూళ్లు అందుతున్నాయి. ప్రతి డీలర్ నెల్లూరు ఎన్టీఆర్నగర్కు చెందిన ఈ మాఫియా డానుకు మాత్రమే బియ్యం ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకు ప్రతి నెలా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ముడుపులు అందుతున్నాయి. అధికారులకు, పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బియ్యం సేకరణ ప్రతి నెలా కార్డుల సంఖ్య అధారంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు రేషన్ సరఫరా చేస్తారు. చౌకదుకాణాల డీలర్లు ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల వయస్సు దాటిన కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి లబ్ధిదారులు 92 వేల మంది ఉన్నారు. డీలర్లు దివ్యాంగులు, వృద్ధుల పేరు చెప్పి చుట్టుపక్కల ఉండే కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్రలు వేయించుకుని నగదు ఇస్తున్నారు. కార్డుదారుల నుంచి కేజీ బియ్యం రూ.12 నుచి రూ.13లకు డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. డీలర్లు సేకరించిన బియ్యాన్ని మాఫియా డాన్కు కేజీ రూ.17 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని పాలిష్ పట్టి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.50 నుంచి రూ.60లకు విక్రయిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ విధులు సీఎస్డీటీలు వాహనాలు, లారీలను తనిఖిలు చేసే అధికారం సీఎస్డీటీలకు ఉన్నాయి. అనుమానం వచ్చిన వాహనాలను పట్టుకున్న సమయంలో బయట వ్యక్తులు ఆరుగురి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించాలి. వారి సమక్షంలో శాంపిల్స్ సేకరించాలి. అవి పీడీఎస్, నాన్ పీడీఎస్ అని నిర్ధారణ కోసం డీఎం కార్యాలయానికి పంపించాల్సి ఉంది. అప్పటి వరకు వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించాల్సి ఉంది. పీడీఎస్ అయితే కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించాలి. నాన్ పీడీఎస్ బియ్యం అయితే వాహనానికి జాయింట్ కలెక్టర్ రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఫైల్ నిర్వహించాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో రెండు వాహనాలకు పట్టుకున్న అఽధికారులు జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండా సీఎస్డీటీలే రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేశారు. జాయింట్ కలెక్టర్ విధులను సైతం సీఎస్డీటీలు లాగేసుకోవడం వెనుక అధికార పార్టీ నేతలు, రేషన్ మాఫియా అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతసాగరం నుంచి తరలిస్తుండగా పట్టుకొన్న రేషన్ బియ్యం మినీ లారీ (ఫైల్) కోవూరు: నియోజకవర్గంలో కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంల్లో మొత్తం 208 రేషన్ షాపులు, 98,600 కార్డులు ఉన్నాయి. సివిల్ సప్లయీస్ శాఖ డైరెక్టర్ కోవూరు నియోజకవర్గ నేత కావడంతో చంద్రశేఖరపురంలోని ఓ రైస్ మిల్లును అడ్డాగా చేసుకుని ఇక్కడ రేషన్ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు సగటున 980 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటివద్దకే రేషన్ బియ్యం సరఫరా జరిగేది. దీంతో ఎక్కడా బియ్యం పక్కదారి పట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులనే కబ్జా చేసిన మాఫియా నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి, రేషన్ షాపుల నుంచి బహిరంగంగా తరలిస్తున్నారు. చాలా మంది షాపుల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోకపోవడంతో ఇది అక్రమార్కులకు అనుకూలంగా మారింది. కొంతమంది డీలర్లు మీరు రేషన్ బియ్యం తినరు కదా మీకెందుకు బియ్యం వాటి బదులు కేజీకి రూ.10 డబ్బులిస్తామంటూ బేరం మాట్లాడుకొంటున్నారు. గతంలో బుచ్చిరెడ్డిపాళెంలోని కొట్టాల దగ్గర ఉన్న రైస్మిల్లు ఉంది. కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఓ రైస్ మిల్లు, కోవూరు మండలంలోని జమ్మిపాళెం రోడ్డులో ఉన్న రైసుమిల్లులకు తరలించి పాలిష్పట్టించి, బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి పోర్టుల ద్వారా విదేశాలకు, తమిళనాడుకు తరలిపోతున్నాయి. రేషన్ గోడౌన్ల నుంచే దోపిడీ దందా చంద్రశేఖరపురం మిల్లులో పాలిష్ కఠిన చర్యలు తీసుకుంటాం బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బియ్యం అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. టోల్ప్లాజాల వద్ద రాత్రి సమయాల్లో తనిఖిలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి తనిఖిలు నిర్వహించి వాహనాలను సీజ్ చేస్తున్నాం. – విజయకుమార్, డీఎస్ఓ రెండు రోజుల కిందట అనంతసాగరం మండలం నుంచి కోవూరు సమీపంలోని రైస్ మిల్లుకు తరలిస్తున్న 190 బస్తాల (9.5 టన్నులు) రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. చౌకదుకాణాల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమై మొదటి వారంలోనే ఒక రేషన్ షాపు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా చేశారంటే పరిస్థితి అర్థమవుతోంది. బియ్యం మాఫియా డాన్కు గుడిపల్లిపాడులో సొంత రైస్ మిల్లుతోపాటు మరో మూడు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని బియ్యం పాలిష్ పట్టేందుకు మాత్రమే నిర్వహిస్తున్నాడు. ఉదయగిరి, కావలి, కందుకూరు, ఆత్మకూరు, కలువాయి, రాపూరు, వింజమూరు, పొదలకూరు తదితర ప్రాంతాల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని గోదాము లు, నిమ్మ, మామిడి, బత్తాయి తోట్ల నిల్వ ఉంచు తున్నారు. రాత్రి సమయాల్లో సమయం చూసుకుని నెల్లూరులోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. -
ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ నెల్లూరు (అర్బన్): ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు నిర్వహిస్తున్న డాక్టర్లు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. నమోదు చేసుకుని గడువు ఐదేళ్లు పూర్తవుతున్న వారు ఒక నెల రోజులు మందుగానే ఆన్లైన్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం డీఎంహెచ్ఓ సుజాత నగరంలోని నారాయణ, అపోలో, ఎనెల్ తదితర పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, వివరాల రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా.. లేదా తెలుసుకునేందుకు 13 మంది అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఈ నెల 13వ తేదీ వరకు తనిఖీలు జరిపిస్తున్నామన్నారు. ఆస్పత్రులను ఆంధ్రప్రదేశ్ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ 2002 ప్రకారం నమోదు చేసుకోకుండా ఉంటే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తప్పనిసరిగా పొల్యూషన్, ఫైర్, బయోమెడికల్ వేస్టేజి లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రులు అందిస్తున్న సేవలు, అందుకు వసూలు చేస్తున్న ధరలు బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు, కేస్షీట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 21 నుంచి విద్యుత్ క్రీడాకారుల ఎంపిక నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీఈపీడీసీఎల్ నేతృత్వంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ సర్కిల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామివేలు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి, అర్హత ఉన్న జిల్లా సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 ఉద్యోగులు అర్హులని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని స్టౌన్హౌస్పేటలోని మైడ్రీమ్ క్లబ్లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 90308 02038, 98851 84450 నంబర్లను సంప్రదించాలని కోరారు. రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్కు చాకిచర్ల విద్యార్థి ఉలవపాడు: రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్కు చాకిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చైతన్యకృష్ణ ఎంపికై నట్లు వ్యాయామ అధ్యాపకుడు ఓగుబోయిన శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ నెల 10వ తేదీలో విశాఖపట్నం పోలీస్పరేడ్ గ్రౌండ్లో జరిగే సబ్ జూనియర్ షాట్ఫుట్ విభాగంలో నెల్లూరు జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన పారా స్పోర్ట్స్ క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థి ఎంపిక కావడంతో హెచ్ఎం జనార్దన్ అభినందనలు తెలిపారు. -
పేదల కడుపు కొడుతున్న పచ్చ నేతలు
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో 246 చౌక దుకాణాల పరిధిలో సుమారు 89 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు దళారులను ఏర్పాటు చేసుకుని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి కావలి, కొడవలూరు, నెల్లూరుల్లో రైస్మిల్లులకు తరలిస్తున్నారు. వీరికి స్థానికంగా పోలీసులు, సివిల్ సప్లయీస్ శాఖలు అండగా ఉంటున్నాయి. అక్కడి నుంచి ముత్తుకూరు పోర్టుకు చేర్చి శ్రీలంకతోపాటు ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని సమాచారం. ఉదయగిరి నియోజకవర్గం నుంచి పీడీయస్ బియ్యాన్ని కావలి, జలదంకి మండలాలకు చెందిన ఇద్దరు వ్యాపారులు సేకరించి అక్రమంగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక వ్యాపారులు డీలర్లు, లబ్ధిదారుల నుంచి రూ.15 వరకు కేజీ బియ్యం కొనుగోలు చేస్తారు. వారు రేషన్ వ్యాపారం చేసే అక్రమార్కులకు రూ.21లకు అమ్ముతారు. వారు రేషన్ మాఫియాకు రూ.29లకు విక్రయిస్తారు. మూడు నెలల క్రితం జలదంకి మండలానికి చెందిన ఓ పచ్చ నేత అక్రమంగా బియ్యం తరలిస్తుండగా చామదలలో స్థానికులు పట్టించారు. కానీ పోలీసులు లారీలో ఉన్న సరుకులో కొంత భాగం అటోకు ఎక్కించి లారీలో సరుకు బిట్రగుంటలోని ఓ రైస్మిల్లుకు తరలించి నేర తీవ్రతను తగ్గించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం కొండాపురం మండలం మర్రిగుంటలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యంను పోలీసులు పట్టుకుని, బొలేరో వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
80 శాతం బియ్యం బ్లాక్ మార్కెట్కే..
సాక్షి, టాస్క్ఫోర్స్: ఆత్మకూరు నియోజకవర్గం డెల్టా, మెట్ట ప్రాంతంగా ఉంది. ఇక్కడి పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో 80 శాతానిపైగా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నట్లు సమాచారం. ఆత్మకూరు పట్టణంలోని పలు రేషన్ దుకాణాదారుల నుంచి కేజీ రూ.10 కొనుగోలు చేసి ఏజెంట్లకు రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని టెంకాయతోపు రహస్య ప్రాంతంలో స్టాక్ చేసి రాత్రి వేళల్లో మినీ వ్యాన్ల ద్వారా కావలి, నెల్లూరు, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతసాగరం మండలంలో వెంగంపల్లి, చిలకలమర్రి గ్రామాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని స్టాక్ ఉంచి వారం రోజులకొకసారి నెల్లూరు శివార్లలోని రైస్మిల్లులకు తరలిస్తుంటారు. రెండు రోజుల క్రితం అనంతసాగరం మండలం నుంచి తరలించిన 9.5 టన్నుల రేషన్ బియ్యాన్ని కోవూరు సమీపంలో పట్టుకున్న విషయం తెలిసిందే. రేషన్ బియ్యం పంపిణీ మొదలు పెట్టిన వారం రోజులకే (7వ తేదీ నాటికే) ఒక అనంతసాగరం మండలం నుంచే తొమ్మిదిన్నర టన్నుల రేషన్ సేకరించారంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. మంత్రి ఆనం ప్రాతినిథ్యం వహించే అనంతసాగరం మండలంలో బుట్టి మహేష్రెడ్డి అనే వ్యక్తి ప్రధాన సూత్రదారుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, సుబ్బారెడ్డి, వేముల రెడ్డి ఈ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో బ్యాచ్కు చెందిన నలుగురు వ్యక్తులు కొత్తగా రేషన్ బియ్యాన్ని సేకరించే పని మొదలు పెట్టారని సమాచారం. గతంలోనూ వెంగంపల్లి కేంద్రంగా టీడీపీ నాయకులు రేషన్ బియ్యం దందా కొనసాగిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.