Khammam
-
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ప్రజావాణిలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో భాగంగా కలెక్టరేట్లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ వారం గ్రీవెన్స్ డేకు పెద్దసంఖ్యలో జనం బారులు దీరడంతో కలెక్టర్ వినతిపత్రాలు స్వీకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. శాఖల వారీగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలే తప్ప పెండింగ్ ఉంచొద్దని తెలిపారు. ఏమైనా దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే అందుకు కారణాలను తెలియచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ అరుణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు కొన్ని..... ● ఖమ్మం కాల్వొడ్డులోని హిందూ శ్మశాన వాటిక నిర్వహణ కమిటీ బాధ్యులు మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో తమ 14 షాపులను తొలగించారని తెలిపారు. ఈ షాపుల ద్వారా వచ్చే ఆదాయంతో మధ్యాహ్న భోజనం, ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నందున ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ● ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన పగడం దేవకర్మ కరోనా సమయం నుంచి స్వీపర్గా పని చేస్తున్న తనను ఇప్పుడు తొలగించినందున ఉపాధి కల్పించాలని విన్నవించారు. ● వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్ల సమస్యపై కలెక్టర్కు ప్రిన్సిపాల్ నవీనజ్యోతి వినతిపత్రం అందజేశారు. దీంతో పనుల పూర్తిపై ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏళ్లుగా తిరుగుతున్నాం... ఖమ్మం ఇందిరానగర్ – రోటరీనగర్ మధ్యలో నా భార్య మార్తమ్మ పేరుతో 250 గజాల ఇంటి స్థలం ఉండేది. ఈ స్థలం మీదుగా ఏళ్ల క్రితం రహదారి వేశారు. అప్పట్లో ఇంటి స్థలానికి బదులు మరోచోట స్థలం ఇస్తామని అధికారులు లేఖ అందించారు. కానీ అప్పటి నుంచి తిరుగుతున్నా స్పందించడం లేదు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలి. – మేదరమట్ల వెంకటరత్నం, ఖమ్మం -
కష్టమెదురైనా నష్టపోకుండా..
మున్నేటి వరద కష్టాలు ఇటు ఖమ్మం కార్పొరేషన్, అటు ఖమ్మం రూరల్ మండలాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు నది వర్షాకాలంలో ఉగ్రరూపం దాల్చడం సాధారణంగా మారింది. గత మూడేళ్లుగా మున్నేటికి వరుసగా వరదలు వస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 1న వచ్చిన వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇటుక ఇళ్లు, చిన్నపాటి వ్యాపారాలు, వాహనాలు, గృహోపకరణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడమో లేదా దెబ్బతినడంతో స్థానికులు కోలుకోలేని ఆస్తి నష్టాన్ని చవిచూశారు. అంతకు ముందు వచ్చిన వరదలు కూడా వేలాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈమేరకు ప్రభుత్వం ఇచ్చే తక్షణ సాయం మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారం కాదని భావించిన అధికారులు శాశ్వత ఆర్థిక భద్రత కోసం బీమానే సరైన మార్గమని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రయోజనాలపై చర్చ.. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే వారితో బీమా చేయించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అధికారులు చర్చించినట్లు తెలిసింది. వరదలతో ఎదురయ్యే ఆర్థిక నష్టానికి ఈ బీమా పథకం రక్షణ కవచంగా ఉంటుందని బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. పరిహారం త్వరగా లభించడంతో నష్టపోయిన ఆస్తులను పునరుద్ధరించుకోవడానికి అవకాశముంటుందని, ప్రజలకు సైతం ధీమా ఉంటుందని వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమీక్ష అనంతరం పథకం విధివిధానాలు, అమలుపై కార్యాచరణ సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నయ్యారు. ఏయే ప్రాంతాలను, ఏ విధంగా బీమా పరిధిలోకి తీసుకురావాలి, ప్రీమియం ఎంత ఉండాలి, నష్టాన్ని అంచనా వేసే విధానం ఎలా, పరిహారం చెల్లించే ప్రక్రియపై విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం. ముంపు ప్రాంతాల ప్రజల ఆస్తులకు బీమా వరదలతో వచ్చే నష్టాన్ని పూడ్చేలా అధికారుల నిర్ణయం ఇళ్లు, వాహనాలు, దుకాణాలు, సామగ్రి ఇన్సూరెన్స్కు ప్రణాళిక నేటి నుంచి పరీవాహక ప్రాంతాల ప్రజలకు అవగాహన సమగ్ర బీమా పథకం ముంపు పాంతాల్లో ఇళ్లు, చిన్నతరహా వ్యాపార సంస్థలు, దుకాణాలు, పలు ఉత్పత్తులు, వాహనాలకు బీమా వర్తింపజేయాలనే లక్ష్యంతో కేఎంసీ అధికారులు ఉన్నారు. తద్వారా వరదలతో కలిగే నష్టానికి పరిహారం లభిస్తుందని చెబుతున్నారు. ఈమేరకు సోమవారం అదనపు కలెక్టర్, ఇన్చార్జి కేఎంసీ కమిషనర్ శ్రీజ.. మెప్మా, ఎల్డీఎం, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులతో సమావేశమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు బీమా పథకం రూపొందించడంపై చర్చించి, అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈమేరకు తొలి సదస్సును 46, 47, 48వ డివిజన్ల ప్రజల కోసం ఖమ్మం నయాబజార్ కళాశాలలో మంగళవారం నిర్వహించాలని నిర్ణయించారు. మున్నేటికి గత ఏడాది వచ్చిన వరదతో పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. పెద్దసంఖ్యలో ప్రజలు ఇళ్లు, సామగ్రి సహా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సాయం అందించినా పూడ్చలేని నష్టం జరగడంతో స్థానికులు కోలుకోవడానికి నెలలు పట్టింది. మరోమారు వరద వచ్చినా బాధితులకు ఆస్తినష్టం నుండి దీర్ఘకాలిక రక్షణ కల్పించేలా ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలు, వ్యాపారాలకు ఆర్థిక భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు బీమా చేయించుకుంటే ప్రభుత్వ పరిహారంతో పాటు బీమా నగదు అందే వీలుంది. తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు ఉపశమనంగా ఉంటుంది. – ఖమ్మంమయూరిసెంటర్ -
టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రాగమయి
● ఉమ్మడి జిల్లా నుంచి మరికొందరికి కూడా స్థానం సత్తుపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లా నాయకులు పలువురికి స్థానం దక్కింది. ఈమేరకు 27మంది ఉపాధ్యక్షులు, 69మంది ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ నుంచి సోమవారం జాబితా విడుదలైంది. ఇందులో ప్రధాన కార్యదర్శులుగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సహా పలువురికి చోటు కల్పించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన మద్దినేని బేబీ స్వర్ణకుమారి, నాగా సీతారాములు, కట్ల రంగారావు జాబితాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అత్రనేత రాహుల్గాంధీ, కే.సీ.వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు, మంత్రులు పొంగులేటీ శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అప్రమత్తతే కీలకం ఖమ్మం రాపర్తినగర్: వరదల వంటి ప్రకృతి విపత్తుల సమయాన అప్రమత్తంగా ఉంటేనే ప్రమాద తీవ్రత తగ్గుతుందని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ కే.ఆర్.గౌతమ్ తెలిపారు. గత ఏడాది మున్నేటి వరదతో నష్టం ఎదురుకాగా ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. యువజన సంఘాలకు ఏర్పాటుచేసిన ఈ సదస్సులో గౌతమ్ మాట్లాడుతూ వరదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరద ముంచెత్తినా సురక్షితంగా బయటపడడం, వరదల్లో మునిగిన వారికి ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడగా ఏఎస్సై మద్దిలేటి, ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగులు జగదీష్, ఉదయ్కుమార్తో పాటు గౌస్, ఉమాశంకర్, సునీల్, రాము పాల్గొన్నారు. బడుల బలోపేతం, నాణ్యమైన విద్య ఖమ్మం అర్బన్: బడి ఈడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని, తద్వారా పాఠశాలలు బలోపేతం కావడమే కాక విద్యార్థులకు నాణ్య మైన ఉచిత విద్య అందుతుందని ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం 55వ డివిజన్ వేణుగోపాలనగర్లో సోమవారం నిర్వహించిన బడిబాట ర్యాలీ, సమావేశంలో కార్పొరేటర్ శ్రావణిసుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు తోడు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన భోజనం అందుతున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలికా సంరక్షణ కమిటీ చైర్పర్సన్ భారతిరాణి, ఏఏపీసీ చైర్పర్సన్ గోపికుమారి, ఎన్నెస్పీ హైస్కూల్ హెచ్ఎం గుడిపూడి శ్రీని వాసరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లుతో పాటు పి.వెంకటేశ్వర్లు, జ్యోతి, సత్యవతి, వెంకటలక్ష్మి, కుమార్, ప్రసాద్, రమేష్, పుల్లారావు, నవీన్ పాల్గొన్నారు. ప్రవేశాల సంఖ్య మరింత పెరగాలి వైరా: పదో తరగతి తర్వాత విద్యార్థులెవరూ చదువు మానేయకుండా చూస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు సూచించారు. వైరా జూనియర్ కళాశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన అధ్యాపకులతో సమావేశమయ్యారు. ప్రతీ అధ్యాపకుడు ఓ ప్రభుత్వ పాఠశాలకు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల తల్లిదండ్రులను కలవాలని తెలిపారు. తద్వారా కాలేజీల్లో ప్రవేశాలు పెంచ డమే కాక మెరుగైన బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కాగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించేలా అధికారులతో చర్చిస్తున్నామని డీఐఈఓ తెలిపారు. ప్రిన్సి పాల్ నవీనజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు. 30వరకు బియ్యం పంపిణీ నేలకొండపల్లి: రేషన్షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడం, కార్డుదా రుల నుంచి ఆరేసి సార్లు వేలిముద్రలు వేయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీనెల 15వ తేదీ వరకు బియ్యం ఇస్తుండగా, ఈసారి 30వ తేదీ వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం అందరికీ తెలిసేలా దుకాణాల వద్ధ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని డీలర్లను డీసీఎస్ఓ ఆదేశించారు. -
పేదల సంక్షేమమే మా అజెండా
ఖమ్మంవన్టౌన్/రఘునాథపాలెం: బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు ఆర్థిక విధ్వంసానికి పాల్పడినా నెమ్మదిగా సరిదిద్దుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని... తద్వారా దేశమంతా తెలంగాణను అనుసరించే స్థాయికి చేర్చామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తెలిపారు. పదేళ్లు తెలంగాణలో ఆర్థిక విధ్వంసం కొనసాగగా.. తాము అధికారంలోకి వచ్చాక నెమ్మదిగా సరిచేస్తున్నామని చెప్పారు. రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం వారు శంకుస్థాపన చేయగా, ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ చెప్పినట్లు కులగణన చేయడమే కాక స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. ఈ విషయంలో తొలుత అందరూ హేళన చేసినా ఇప్పుడిది దేశానికే దిక్సూచిగా మారిందని తెలిపారు. కాగా, పదేళ్ల పాటు దోపిడీ చేసిన ధనంతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏడాదిలోగా పూర్తయ్యేలా తన సహకారం ఉంటుందని భట్టి తెలిపారు. ఖమ్మం అంటేనే ధైర్యం.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయానికి పలుమార్లు వచ్చానని తెలిపారు. ఖమ్మం అంటేనే ధైర్యమని, ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. గౌడ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల నిధులతో కూడిన ప్రత్యేక సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దేవుళ్లని, పార్టీ కార్యాలయం ఆలయమని పేర్కొనగా.. కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుస్తామని, రాబోయే పదేళ్లు కూడా అధికారంలో ఉంటామని వెల్లడించారు. గౌడ హాల్ పేదలకు ఉపయోగపడేలా, సమాజానికి సేవ చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు పోట్ల నాగేశ్వరరావు, దొబ్బల సౌజన్య, నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్గౌడ్, ఏలూరి రవి, చింతల పుష్ప, భవాని, ప్రతిభారెడ్డి, బిచ్చాల తిరుమలరావు, డాక్టర్ రాజశేఖర్, బొల్లికొండ శ్రీనివాసరావు, కత్తి నెహ్రూగౌడ్, బోయనపల్లి లక్ష్మణ్, బండి నాగేశ్వరరావు, బండి వెంకన్న, వత్సవాయి రవి, బొర్రా రాజశేఖర్, పోతగాని వెంకటేశ్వర్లు, రాహుల్, కృష్ట, సాయన్న తదితరులు పాల్గొన్నారు. దేశం అనుసరించేలా తెలంగాణలో పాలన పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలందరికీ పదవులు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ -
తెరుచుకున్న ఖమ్మం మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: వేసవి సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తెరుచుకుంది. ఎండల కారణంగా నెల పాటు కొనుగోళ్లు నిలిపివేయగా, సోమవారం నుంచి లావాదేవీలు మొదలవుతాయనే సమాచారంతో రైతులు మిర్చి, తదితర పంటలను తీసుకొచ్చారు. వానాకాలం సీజన్లో పెట్టుబడుల కోసం ఇళ్లు, గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి, పత్తి, పెసలు, కందులను రైతులు, వ్యాపారులు అమ్మకానికి తెచ్చారు. ప్రధానంగా 38లాట్ల ఏసీ మిర్చి విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్టంగా రూ.14,100, మోడల్ ధర రూ.11,300, కనిష్ట ధర రూ.7,500గా పలికింది. ఇక నాన్ ఏసీ మిర్చి 1,500 బస్తాలు రాగా ఽగరిష్ట ధర రూ.13,600, కనిష్ట ధర రూ.4వేలుగా నమోదైంది. అలాగే, పత్తి గరిష్టంగా రూ.6,400, కనిష్టంగా రూ.6వేలు, పెసలకు రూ.6,600, కందులు రూ.4,200, మొక్కజొన్న రూ.1,975 ధర పలి కాయి. మిర్చి, అపరాల యార్డుల్లో మోడల్ మార్కెట్ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యాన కొనుగోళ్లను పత్తియార్డులో నిర్వహించారు. నిల్వ మిర్చి ధరపై ఆశలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంట సీజన్లో ఆశించిన ధర పలకక చాలామంది తేజా రకం మిర్చిని నిల్వ చేశారు. విదేశాల్లో డిమాండ్ ఉండే తేజా రకం మిర్చికి ఈ ఏడాది సరైన ఆర్డర్లు లేక ధర పలకటం లేదు. అయితే, ఇప్పుడు అన్ సీజన్ కావడంతో ధర వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం సగటున రూ.12,500 వరకు పలుకుతున్న తేజా రకం మిర్చికి మరో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు పెరిగితే చాలా మంది విక్రయించే అవకాశముంది. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో 40 లక్షల వరకు మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా.ఏసీ మిర్చి క్వింటాకు రూ. 14,100 -
కూనంనేనికి ఊరట
● కొత్తగూడెం ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ డిస్మిస్ ● తీర్పు వెలువరించిన హైకోర్టు ● 2024 జనవరిలో దాఖలైన పిటిషన్ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఏడాదిన్నర పాటు ఈ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి. గెలిచిన వెంటనే.. అసెంబ్లీ ఎన్నికలు 2023 నవంబర్లో జరగగా, నామినేషన్ దాఖలు చేసే సమయాన ఫామ్–26 అఫిడవిట్లో కూనంనేని సమగ్ర వివరాలు వెల్లడించలేదని కొత్తగూడేనికి చెందిన నందూలాల్ అగర్వాల్ 2024 జనవరి 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూనంనేని తన భార్య పేరును అఫిడవిట్లో పేర్కొనలేదని, లైసెన్స్డ్ నోటరీతో అఫిడవిట్ చేయించలేదనే అభ్యంతరాలను నందూలాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరింత సమాచారం కోసం గతేడాది డిసెంబర్లో హైకోర్టు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కూనంనేని సాంబశివరావు సుప్రీంకోర్టును ఆశ్రయించి నందూలాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరారు. అయితే హైకోర్టులో వాదనలు పూర్తి కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూనంనేని పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. దీంతో అనర్హత కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి ఆరు నెలలుగా కొనసాగింది. తుది తీర్పు వచ్చాక.. ఏడాదిన్నర వ్యవధిలో ఇటు కమిషన్, అటు హైకోర్టులో 20సార్లకు పైగా ఇరువర్గాల నడుమ వాదనలు జరిగాయి. చివరకు ఈ కేసులో తీర్పును ఈనెల 9కి రిజర్వ్ చేసినట్టు 7వ తేదీన హైకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది. దీంతో తీర్పు ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రెండురోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది. సీపీఐతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్ ఈ తీర్పుపై ఆసక్తి చూపించింది. అయితే నందూలాల్ అగర్వాల్ లేవనెత్తిన అభియోగాల్లో మెరిట్స్ లేనందున పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు సోమవారం హైకోర్టు వెల్లడించింది. దీంతో కూనంనేనికి ఊరట లభించినట్లయింది. ఖమ్మం మయూరిసెంటర్: కూనంనేని సాంబశివరావుపై దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెలువడడంపై సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే, పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు. రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బి.అయోధ్య, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్రకంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలా నా, వివిధ ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. గతంలో వనమాపై.. ఎన్నికల అఫిడివిట్లో వివరాలు, అనర్హత అంశంతో కొత్తగూడెం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే అఫిడవిట్లో పూర్తి వివరాలు పేర్కొనలేదంటూ ఆ ఎన్నికల్లో ఓడిపోయిన జలగం వెంకట్రావు 2020లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్ల విచారణ తర్వాత వనమా ఎన్నిక చెల్లదని, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 జూలైలో తీర్పు వెలువడగా.. వనమా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ విచారణ దశలో ఉండగానే 2023 నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వనమా ఓడిపోగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఫలితాలు వెలువడిన మరుసటి నెలలో కూనంనేని ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం, ఇక్కడి రాజకీయ పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. -
108 అంబులెన్స్లో ప్రసవం
నేలకొండపల్లి: పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని 108లో ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. మండలంలోని అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన మేఘనకు సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వస్తుండడంతో బోనకల్ 108 సిబ్బంది ఆమెను తీసుకుని ఖమ్మం ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో నొప్పులు పెరగడంతో ప్రకాష్నగర్ వంతెనపై ఆపిన అంబులెన్స్ సిబ్బంది మనోహర్, వెంకటరావు వాహనంలో ప్రసవం చేశారు. కాగా, మేఘనకు గతంలో నలుగురు కుమార్తెలు ఉండగా, ప్రస్తుతం ఐదో ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలింత, శిశువును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి 16నుంచి పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలోని హాకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి మూడంచెల్లో పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. తొలిదఫా ఈనెల 16నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి ఎంపికలు ఉంటాయని వెల్లడించారు. ఆపై 25, 26వ తేదీల్లో జిల్లాస్థాయి, జూలై 1నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ స్టాండింగ్ బ్రాడ్జంప్, 800 మీటర్ల పరుగుతో పాటు ఇతర అంశాల్లో పోటీలు ఉంటాయని, 01–09–2016నుంచి 30–08–2017 మధ్య జన్మించిన వారు మాత్ర మే అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తొలుత అన్లైన్లో నమోదు చేసుకోవా లని, వివరాలకు ఖమ్మం పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని డీవైఎస్ఓ సూచించారు. ఖమ్మం మార్కెట్లోకి టాటా ‘న్యూ ఆల్ట్రోజ్’ఖమ్మంఅర్బన్: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ విడుదల చేసిన నూతన న్యూ ఆల్ట్రోజ్ కారును సోమవారం ఖమ్మం మార్కెట్లోకి విడుదల చేశారు. ఖమ్మంలోని వీవీవీ మోటార్స్ షోరూంలో కారును నగర ఏసీపీ ఎస్.వీ. రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఆల్ట్రోజ్ వాహనం ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. వీవీసీ సంస్థల ఎండీ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆల్ట్రోజ్ వాహనం ప్రస్తుత మార్కెట్ అత్యంత విశ్వసనీయత కలిగిన వాహనంగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వీరేన్ చౌదరి, ఆదిత్యచౌదరి, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పేదలకు అండగా ప్రభుత్వం
● అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మంరూరల్: రాష్ట్రప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సి పాలిటీలో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మద్దులపల్లిలో రూ.94లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. అలాగే, పోలేపల్లి –రాజీవ్గృహకల్ప కాలనీ ఎన్నె స్పీ లాక్ల వరకు రూ.2.86కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, తెల్దారుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజచేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కోసం గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇదే సమయాన కొత్తగా ఉచిత విద్యుత్, సన్న ధాన్యానికి బోనస్, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయానం, ఇంది రమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాలు మొదలు పెట్టామని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ బి.హరినాధ్బాబు, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగం అభివృద్ధికి ఏమేం చేయాలి ?
మధిర: ప్రైవేట్కుఏ దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్కరణలు చేస్తే బాగుంటుందని విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరా తీశారు. మండలానికి మూడు పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా మధిర నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింఇ. ఈ నేపథ్యాన విధి విధానాలు, సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మురళి సోమవారం మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిపురం ఉన్నత పాఠశాలలో చైర్మన్, డీఈఓ ఎస్.సత్యనారాయణను పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి తదితరులు కలిశారు. కొత్త పాఠశాలల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న పాఠశాలలు బలహీనమయ్యేలా విద్యాసంస్కరణలు తీసుకురావొద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేలా విద్యావేత్తలు మేధావులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించాలని కోరారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు మొదలుపెట్టి, ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీఆర్టీయ నాయకులు జిల్లా సీహెచ్వీ.రవికుమార్, డి.వెంకటేశ్వరరావు, తూమాటి కృష్ణారెడ్డి, కొలగాని ప్రసాదరావు తదితరులు ఉన్నారు. -
రోడ్డుప్రమాదంలో జీపీ కార్యదర్శి మృతి
పెనుబల్లి/రఘునాథపాలెం: స్కూటీపై విధులకు బయలుదేరిన పంచాయతీ కార్యదర్శిని వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో అదే లారీ టైరు కింద పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పెనుబల్లి మండలం వీఎం బంజర్లో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన బానోతు సోనాలి(32) పెనుబల్లి మండలం రామచందర్రావు బంజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సంపత్ది కల్లూరు మండలం లక్ష్మాతండా కాగా వీరికి ఏడాది, నాలుగేళ్ల వయస్సు పిల్లలు ఉన్నారు. కల్లూరు నుంచి రాకపోకలు సాగించే ఆమె రోజులాగే సోమవారం తన స్కూటీపై వెళ్తుండగా అదే మార్గంలో ఖమ్మం వైపు నుండి సత్తుపల్లి వైపునకు వెళ్తున్న లారీ వీఎం బంజర్ ప్రాథమిక పాఠశాల సమీపాన వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో సోనాలి అదుపుతప్పి రోడ్డుపై పడగా, ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. సోనాలి మృతిపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సంతాపం తెలపగా, ఎంపీడీఓ అన్నపూర్ణ, ఎంపీఈఓ ఉపేంద్రయ్య, పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. బూడిదంపాడులో అంత్యక్రియలు గ్రామపంచాయతీ బానోత్ సోనాలి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆమె స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈసందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ నివాళులర్పించారు. కాగా, పలువురు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ కార్యదర్శులపై పనిభారం పెరగడంతో ఆ ఒత్తిడితో వెళ్తున్న ఆమె ప్రమాదం బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాలి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే, పంచాయతీ కార్యదర్శులకు నిర్దిష్ట పనివేళలు, స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, యర్రా రమేష్, కరణ్సింగ్, రుక్మారావు, ఫజల్, వినోద్, గాంధీ, ఉపేందర్, అనిత, సుష్మిత, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విధులకు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఘటన -
చకచకా ఆధునికీకరణ
● వైరా రిజర్వాయర్కు గైడ్ వాల్స్, ఇతర నిర్మాణాలు ● సాగు సీజన్కల్లా మేజర్పనులు పూర్తి ● జూలై నుంచి సాగునీటి విడుదలకు ప్రణాళికవైరా: జిల్లాలో పెద్దదైన వైరా రిజర్వాయర్ రెండో దశ ఆధునికీకరణ పనులను వేగంగా చేపడుతున్నారు. ఏళ్ల తర్వాత గతేడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.42.10 కోట్లు మంజూరు చేసింది. దీంతో రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించిన నీటి పారుదల శాఖ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎండాకాలంలో ఎక్కువ మేర పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించడమే కాక ఈ సీజన్లో సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. మళ్లీ అన్ సీజన్లో పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఏయే పనులు... రిజర్వాయర్ ఆధునికీకరణ రెండో దశ పనులు ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. ప్రధానంగా ఎడమ కాల్వ పరిధిలో ఆరు కి.మీ. మేర గైడ్ వాల్స్, మరో ఆరు కి.మీ. మేర లైనింగ్ పనులు చేడుతున్నారు. ఇక రెండు వైపులా సీసీ లైనింగ్ పనులు చేయిస్తున్నారు. అలాగే, కొండకొడిమ నుంచి గొల్లపూడి వరకు 2.75 కిలో.మీ. గైడ్వాల్ నిర్మాణం పూర్తయింది. ఇక కుడి కాల్వ పరిధిలో కోస్తాల నుంచి కొండకొడిమ వరకు ఈనెలాఖరు వరకు గైడ్వాల్ పూర్తిచేయనున్నారు. తాటిపూడి నుంచి జింకలగూడెం వరకు మూడు కి.మీ. పనులు పూర్తయ్యాయి. కాగా, గైడ్వాల్స్తో పాటు కాలువలో సిమెంట్ బెడ్ నిర్మాణం పూర్తిచేసినా లైనింగ్ పనులు మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. రెండేళ్ల గడువు వైరా రిజర్వాయర్ ఎడమ కాల్వ పరిధి లింగన్నపేట, విప్పలమడక గ్రామాల మధ్య సీసీ బెడ్ నిర్మాణం పూర్తయింది. మొత్తంగా పనుల్లో 70 శాతం ఈనెలాఖరు నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. కానీ లైనింగ్ పనులు మాత్రం అన్నిచోట్ల ఆలస్యమయ్యే అవకాశముంది. చాలా ప్రాంతాల్లో కాలువలు బలహీనంగా ఉండడం, నల్లరేగడి నేల కావడంతో ఇలా జరుగుతోందని చెబుతున్నారు. అయితే, 2027 జనవరి వరకు పనులు పూర్తి చేయాలనే ఒప్పందం ఉండగా, వాతావరణం సహకరిస్తే 2026 ఏప్రిల్ నాటికే పనులు పూర్తి చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీజన్లో నీరు విడదల చేస్తూనే, అన్ సీజన్లో పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. రిజర్వాయర్ ఆధునికీకరణకు మొదటిసారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.55కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కుడి, ఎడమ కాల్వలకు గైడ్ వాల్స్, లైనింగ్, అదనపు అలుగు వంటి పనులు చేపట్టారు. ఏళ్ల తర్వాత రెండో దశ పనులకు రూ.42.10కోట్లు మంజూరు చేయడంతో ఇప్పటికే 70శాతానికి పనులు చేరువయ్యాయి. ఈ పనులన్నీ పూర్తయితే రిజర్వాయర్ చివరి భూములకు కూడా విడుదల చేసిన మొదటి రోజే కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది.వాతావరణ ం సహకరిస్తే త్వరలోనే.. రిజర్వాయర్ రెండో దశ ఆధునికీకరణ పనులు ఆశించిన దాని కంటే వేగంగా సాగుతున్నాయి. మధ్యలో వర్షాలు కురవడంతో కొంత జాప్యం జరిగింది. ఆతర్వాత మళ్లీ ఊపందుకున్నాయి. 70శాతం మేర పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసి జూలైలో సాగునీరు విడుదల చేయాలని భావిస్తున్నారు. – శ్రీనివాస్, డీఈ, నీటిపారుదల శాఖ -
రాజీవ్ యువ విలాపం!
● యువ వికాసం పథకం అమలులో జాప్యం ● ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకులు ● ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు 1.60 లక్షలు ● కేటాయించిన మొత్తం యూనిట్లు 38,230చుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మే నెలలోగా లబ్ధి దారులను ఎంపిక చేసి ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని భావించింది. అనంతరం ఈ నెల 5న మంత్రివర్గ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో యువతీయవకులు నిరాశ చెందుతున్నారు. దరఖాస్తులు వెల్లువలా రావడం, దరఖాస్తుల పరిశీలన ఓ కొలిక్కి రాకపోవడంతో అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. సబ్సిడీ ఇలా.. పథకంలో రూ.50వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందించనుంది. ఈ నాలుగు కేటగిరీల్లో రూ. 50వేలు, రూ.లక్ష యూనిట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘సిబిల్’కే బ్యాంకర్ల ప్రాధాన్యం.. యువ వికాసం దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించారు. తొలుత మండల కమిటీల ఆమోదం తర్వాత జిల్లా కమిటీలకు జాబితా చేరుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఈ పథకం మంజూరు చేస్తా రు. గతంలో ఏదైనా కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారా?, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్నారా? అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు సిబిల్ స్కోర్ను పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించినా బ్యాంకర్లు మాత్రం దాటికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 38,230 యూనిట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి 1,60,207 మంది యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు 38,230 యూ నిట్లను పంపిణీ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఖమ్మంజిల్లాకు 20,181యూనిట్లు, భద్రాది జిల్లాకు 18,049 యూనిట్లు కేటాయించింది. మొదటి విడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2లో రూ. లక్ష వరకు ఎంపికై న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఈనెల 15లోపు శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. అయితే అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం జాబితాలో స్థానం కల్పిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈనెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా యువ వికాసంపై ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో పథకం అమలు మరింత జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆదేశాలు రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఈ నెల 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం. –బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ, Æ>iÐŒæ Ķæ¬Ð]l ÑM>çÜ… MøBÇz¯ólrÆŠḥ, ¿¶ {§é{¨ hÌêÏఅర్హుల ఎంపికలో పొరపొట్లు.. రాష్ట్రఆవిర్భావం దినోత్సవం రోజు పథకాన్ని ప్రా రంభించాలని భావించినా పెద్ద సంఖ్యలో దరఖా స్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సాయం అందించాలని ప్రభుత్వం భావించి కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎప్పుటికప్పుడు వాయిదా పడుతుండటంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. కాగా పథకం అమలుకు మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన తేదీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో కార్పొరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు కార్పొరేషన్ ఖమ్మం భద్రాద్రి బీసీ 39,616 20,602 ఎస్సీ 29,742 12,488 ఎస్టీ 14,416 27,792 మైనారిటీ 7,412 2,844 ఈబీసీ 4,022 1,049 క్రిస్టియన్ 117 107 -
భూభారతితో సమస్యలకు పరిష్కారం
కామేపల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందనివ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలం పొన్నేకల్లో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాసు పుస్తకాలు అందక అనేక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ అధికారంకి రాగానే భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టడంతో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అనంతరం ముచ్చర్ల శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన ఆయన, గరిడేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, నాయకులు దొడ్డ వేణు, బోడా రాజేశ్నాయక్, వల్లభనేని అశోక్, మాలోత్ ప్రేమ్కుమార్, దేవండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి కరామత్ అలీ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరావు, టీపీటీఎఫ్ జిల్లా అద్యక్షుడు నాగేశ్వరావు, పీఆర్టీయూ జిల్లా అద్యక్షుడు వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన ఖమ్మంలో సోమవరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే ఫీజులు, ఇతరత్రా పేర్లతో రూ.కోట్లలో దండుకున్నాయని ఆరోపించారు. జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండగా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా ఫీజుల నియంత్రణ, అనుమతుల విషయమై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో నాయకులు సింగు నర్సింహరావు, ఎన్.రామకృష్ణ, ప్రవీణ్, సుధాకర్, వెంకటేశ్, లక్ష్మణ్, మస్తాన్, సుఽరేష్, లతాదేవి, పోటు కళావతి, బేగం తదితరులు పాల్గొన్నారు. -
రాత పరీక్ష ఎప్పుడో..?
● సింగరేణిలో మార్చి 2024లో ఇంటర్నల్ నోటిఫికేషన్ ● పరీక్ష కోసం 15 నెలలుగా ఎదురుచూస్తున్న కార్మికులు సింగరేణి(కొత్తగూడెం): నోటిఫికేషన్ విడుదల చేసి 15 నెలలు గడిచినా సింగరేణిలో ఇంటర్నల్ క్లరికల్ రాత పరీక్ష నిర్వహించడంలేదు. 360 క్లరికల్ పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం 2024 మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో సంస్థవ్యాప్తంగా 7 వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. 15 నెలలైనా పరీక్ష నిర్వహించకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి 360 పోస్టులు ఉండగా, ప్రతి నెలా కొందరు కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతుండటంతో ఖాళీల సంఖ్య ఇంకా పెరిగిందని, ప్రస్తుతం సుమారు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల డిపెండెంట్ ఉద్యోగాలకు ఎక్కువ మంది విద్యావంతులు ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం వారిని బదిలీ వర్కర్గా నియమించిన యాజమాన్యం.. వారితో క్లరికల్ విధులు నిర్వహింపజేస్తోంది. బదిలీ వర్కర్ వేతనం పొందుతూ క్లరికల్ పనులు చేయాల్సివస్తోందని వారు వాపోతున్నారు. ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు ఏవీ..? 2024 సంస్థ 327 క్లరికల్ పోస్టుల భర్తీకి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సింగరేణి సీఎండీగా ఎన్. బలరామ్ బాధ్యతలు చేపట్టాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చినా నోటిఫికేషన్కు సంబంధించిన పరీ క్షా నిర్వహించలేదు. ఇక రిక్రూట్మెంట్ సెల్ జీఓం పోస్టులో ఇటీవల కాలంలో ముగ్గురు అధికారులు మారారు. ఈ పోస్టులో ఏ ఒక్క అధికారి పూర్తిస్థాయిలో పనిచేయని కారణంగా నోటిఫికేషన్లు జాప్యమవుతున్నాయని కార్మిక నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే 2024 మార్చి నోటిఫికేషన్ రాత పరీక్ష నిర్వహించాలని, ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. -
పెరుగుతున్న సూర్య ప్రతాపం
● వైరాలో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● కోటాకు మించి విద్యుత్ వినియోగంఖమ్మంవ్యవసాయం: మృగశిర కార్తె వచ్చినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. సాధారణంగా మృగశిర కార్తె నుంచి వర్షాలు కురవడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండాల్సిన రోహిణి కార్తె ఆరంభంలో నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురిసి కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమైంది. ఈ కార్తెలో ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఆదివారం ఎండ తీవ్రత పెరిగింది. వైరాలో గరిష్టంగా 42 డిగ్రీలు, ఇంకా అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎర్రుపాలెంలో 41.5, బచ్చోడులో 41.2, సత్తుపల్లి ఓసీ వద్ద 40.8, ఖమ్మం ప్రకాష్నగర్, ఖమ్మం ఖానాపురం, గంగారంలో 40.7, తిరుమలాయపాలెం, మధిర ఏఆర్ఎస్, కుర్నవల్లి, గౌరారం, తల్లాడలో 40.6, సత్తుపల్లి, పెద్ద గోపతిలో 40.5, పల్లెగూడెం, ఖమ్మం ఎన్ఎస్పీ, రఘునాథపాలెంలో 40.4, ముదిగొండలో 40.3, వేంసూరు, చింతకానిలో 40.2, పెనుబల్లిలో 40.1, మధిర, పమ్మిలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా బాణాపురంలో 37.3 డిగ్రీలుగా ఉంది. పెరిగిన విద్యుత్ వినియోగం.. ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. జిల్లాకు కేటాయించే కోటాకు మించి వినియోగిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ వినియోగం అంతగా లేకున్నా గృహ వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లా విద్యుత్ కోటా రోజుకు 4.73 మిలియన్ యూనిట్లు కాగా శుక్రవారం 5.581 మిలియన్ యూనిట్లు, శనివారం 5.611 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. అంటే రోజువారి కోటాతో పోలిస్తే దాదాపు 1 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా ఖర్చవుతోంది. గృహ విద్యుత్ వినియోగం పెరగడంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా లో వోల్టేజీ సమస్య ఎదురవుతోంది. దుక్కులు చేసి ఎదురుచూస్తున్న రైతులు మే నెలలో కురిసిన అకాల వర్షాలతో దుక్కులు సిద్ధం చేసిన రైతులు విత్తనాలు వేసేందుకు వానల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండో ప్రధాన పంట అయిన పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. అపరాల పంటలైన పెసర, కంది విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొందరు రైతులు వరి నారు మళ్లు దున్నుకొని విత్తనాలు సేకరించే పనిలో ఉన్నారు. 6 నుంచి 7 సెం.మీ. వర్షం కురిస్తే వెంటనే పత్తి విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 వరకు పత్తి విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది. -
ప్రొటెక్షన్ ఇచ్చేనా ?
కరుణగిరి వద్ద మున్నేరు పక్కన నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్గత రెండేళ్లుగా వర్షాకాలం వచ్చిందంటే చాలు మున్నేరు పరీవాహక ప్రాంత కాలనీల వాసులు హడలెత్తుతున్నారు. మున్నేరుకు కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలు ఖమ్మంరూరల్, ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2023లో వరదలు రాగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.690 కోట్లు మంజూరు చేసింది. ఇక గతేడాది సెప్టెంబర్లో మరింత ఉధృతంగా వచ్చిన వరదలతో ఈ ప్రాంతమంతా కకావికలమైంది. వరదల నుంచి రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమైనప్పటికీ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం రూరల్ వైపు 4.50 కిలోమీటర్ల మేరకు నిర్మాణం పూర్తయింది. ఇక ఖమ్మం నగరం వైపు భూసేకరణ సమస్య కారణంగా 250 మీటర్ల నిర్మాణం మాత్రమే జరిగింది. దీంతో ఈ వర్షాకాలం ఎలా ఉంటుందోననే ఆందోళన లోతట్టు ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అంతరాలయంలో అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. -
నేడు డిఫ్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. 3గంటలకు ఖమ్మంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభ అనంతరం 6 గంటలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం వెళ్తారు. పొంగులేటి పర్యటన.. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 6గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు కూసుమంచి మండలం పోచారం చేరుకుంటారు. 11.15 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.45 గంటలకు తెల్దారుపల్లిలో సీసీ రోడ్లకు, 12.15 గంటలకు కస్నాతండాలో సీసీ, బీటీ రోడ్లకు, 12.45 గంటలకు పోలేపల్లిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. ఖమ్మం యువతికి డాక్టరేట్ఖమ్మం సహకారనగర్ : నగరంలోని మామిళ్లగూడేనికి చెందిన సంగు వినీలకు డాక్టరేట్ లభించింది. మోయినాబాద్ మండలం హిమాయత్నగర్లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో ‘ఫార్ములేషన్ అండ్ ఎవాల్యూయేషన్ అఫ్ గ్యాస్ట్రోరేటేటివ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ఫర్ సం డ్రగ్స్’ అంశంపై సమర్పించిన పరిశోధనా పత్రానికి ఈ పురస్కారం దక్కింది. ప్రొఫెసర్ శంకరయ్య పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేయగా.. యూనివర్సిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాత్వికరెడ్డి డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీన్ క్రిష్ట్టఫర్, ఎగ్జామ్స్ కంట్రోలర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ కంట్రోలర్ జగదీష్ కుమార్, కుమారస్వామి, డానియల్, సరిత, సృజన తదితరులు అభినందించారు. ప్రశాంతంగా ఐసెట్ఖమ్మం సహకారనగర్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ జిల్లాలోని ఐదు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రెండు సెషన్లలో పరీక్షలు జరగగా.. విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి పంపించారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు అన్నప్రాసనలు, ఒడి బి య్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్ శర్మ పాల్గొన్నారు. -
పట్టాలెక్కని ‘ప్రీ స్కూల్’
● భర్తీకి నోచుకోని అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ● ఉన్న వారిపై అదనపు భారం ● టీచర్లు లేక తగ్గుతున్న ప్రవేశాలుఎర్రుపాలెం: జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ స్కూల్ విద్య(పూర్వ ప్రాథమిక విద్య) జిల్లాలో పక్కదారి పడుతోంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 6 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 34,691 మంది, 3 – 6 సంవత్సరాల వయసు చిన్నారులు 20,012 మంది ఉన్నారు. వీరితో పాటు 12,715 మంది గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నారు. కాగా అనేక అంగన్వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఇతర శాఖల్లో సిబ్బంది, ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సర్వేలకు అంగన్వాడీ టీచర్లనే వినియోగిస్తున్నారు. ఇక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో పక్క సెంటర్ కార్యకర్తకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా ఇతర విధుల్లో వారు నిమగ్నమవుతుండగా.. కేంద్రాల్లో టీచర్లు లేరంటూ చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. చాలా అంగన్వాడీ కేంద్రాల్లో 5 నుంచి 8 మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు. పలుచోట్ల కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేక చిన్నారులకు అందాల్సిన పోషకాహారం కూడా పంపిణీ కావడం లేదు. ఇలాంటి కారణాలతో పూర్వ ప్రాథమిక విద్య పక్కదారి పడుతోంది. వేధిస్తున్న కొరత.. జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 123 మంది టీచర్లు, 620 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మధిర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మధిర, వైరా, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో 31 టీచర్ పోస్టులు, 84 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్నవారిపై మరింతగా భారం పడుతోంది. ఉన్న వారితోనూ వివిధ ప్రభుత్వ శాఖల సర్వేలు, వర్షాకాలంలో వారానికి రెండు సార్లు గ్రామాల్లో శానిటేషన్ విధులు, వైద్య శాఖ నిర్వహించే డీవార్మింగ్ మందుల పంపిణీ, పల్స్ పోలియో, ఇంటింటి సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే, బడిబాట తదితర పనులు చేయిస్తున్నారు. దీంతో టీచర్లపై పనిభారం పెరగగా.. వేతనాలు మాత్రం అంతంతగానే అందుతున్నాయి. -
ఆడకుండానే సర్టిఫికెట్లు..!
● జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్న నకిలీ క్రీడాకారులు ● ప్రోత్సహిస్తున్న క్రీడా సంఘాలు ● స్కూల్ గేమ్స్లో మరింత విచ్చలవిడిగా..ఖమ్మం స్పోర్ట్స్ : క్రీడలపై అవగాహన లేకపోయినా సరే తామే జాతీయస్థాయిలో ఆడించేలా చర్యలు తీసుకుంటే ఎంత ఇస్తారంటూ బేరసారాలు సాగిస్తున్నాయి కొన్ని క్రీడా సంఘాలు. ఈ వ్యవహారం టీం క్రీడల్లో ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా క్రీడా సంఘాల ప్రతినిధులు సైతం జోక్యం చేసుకోవడంతో ఈ దందా మరింత విచ్చలవిడిగా కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నకిలీ క్రీడాకారులు కేవలం టీం క్రీడాంశాల్లోనే జిల్లా, రాష్ట్ర జట్లలో ఎంపికై జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ టీం గేమ్కు సంబంధించిన జట్టులో సగం మంది ఆడే క్రీడాకారులను తీసుకుని, మిగిలిన జట్టు సభ్యులుగా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారిని పెడుతున్నారని తెలుస్తోంది. గతంలో అప్పటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని క్రీడా సంఘాలకు మొట్టికాయలు వేసినా.. క్రీడా సంఘాల్లో మార్పు లేదు. దీనిని నియంత్రించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం క్రీడాకారుల ఎంపిక దశలోనే ఒక కమిటీ వేసి నకిలీ క్రీడాకారులకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లా స్థాయిలోనే అయా క్రీడా సంఘాలు నిర్వహించే ఎంపికల్లో సదరు క్రీడాకారుడు ఆడుతున్నడా లేదా అనేది పరిశీలించేందుకు కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం టీం గేమ్స్లోనే కాకుండా వ్యక్తిగత క్రీడాంశాల్లో కూడా నకిలీ క్రీడాకారులను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల క్రీడల్లో అధికం.. క్రీడా సంఘాలకే పరిమితం చేయకుండా రాష్ట్ర పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన జరిగే వివిధ క్రీడా పోటీల్లోనూ సగం మంది నకిలీ క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందుగా రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల సమయంలో జట్టును ప్రకటించకుండా తర్వాత ప్రకటిస్తామని చెప్పి.. తీరా జాతీయ పోటీలకు జట్టు వెళ్లే సమయంలో క్రీడాకారులకు సమాచారం అందించి ఒకరోజు ముందుగానే రావాలని చెబుతున్నారు. దీంతో వివిధ కారణాలతో ఎంపికై న క్రీడాకారులు రాలేకపోతే ముందస్తుగానే తమ వద్ద ఉన్న నకిలీ క్రీడాకారులను నేరుగా జాతీయ పోటీలకు తీసుకెళ్తున్నారనే విమర్శలున్నాయి. -
మాజీ ఎమ్మెల్యేకు ప్రముఖుల నివాళి
రఘునాథపాలెం: బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆదివారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడిలో దశదిన ఖర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మదన్లాల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఐఏఎస్ అధికారిగా ఉన్న బానోత్ మృగేంద్రలాల్ను పలువురు పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని సాంబశివరావుతోపాటు గుండాల కృష్ణ, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, అజ్మీరా వీరూనాయక్ తదితరులు ఉన్నారు. -
కలవరపెడుతున్న గ్యాంగ్వార్
● రోజురోజుకూ పెరుగుతున్న హింసాప్రవృత్తి ● హత్యలను ఫ్యాషన్గా భావిస్తున్న యువత ● కట్టడి చేయటంలో పోలీస్ శాఖ విఫలం భద్రాచలం: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రంలో హత్యలు జరుగుతున్నాయి. పర్యాటకులకు, భక్తులకు మరుపురాని అనుభూతులను అందించే భద్రగిరిలో ఇటీవలి కాలంలో యువతలో హింసాప్రవృత్తి నానాటికీ పెరిగిపోతోంది. మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలవుతున్న యువత.. హింస, గొడవలను ఫ్యా షన్గా భావిస్తూ హత్యలకు సైతం తెగబడుతున్నా రు. కట్టడి చేయాల్సిన రక్షణ శాఖ విఫలమవ్వటంతో పాటుగా అవినీతి ఆరోపణలతో కూరుకుపోతోంది. పెరుగుతున్న గొడవలు.. జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గ్యాంగ్వార్ల విష సంస్కృతి భద్రాచలానికి పాకింది. గతంలో కేవలం గొడవలకే పరిమితమైన ఈ వార్లు ప్రస్తుతం హత్యలకు సైతం దారి తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది హోలీ రోజున భద్రాచలానికి చెందిన యువకుడిని ఏపీలోని వెంకటరెడ్డిపేటలో మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. రెండు రోజుల కిందట పట్టణంలోని జగదీశ్కాలనీకి చెందిన సతీశ్ను చంపారు. ఇంట్లో ఉండగానే, కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నా అందరి ముందే హత్య చేయటం యువకుల్లో పెరుగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనం. ఫ్యాషన్గా మారుతున్న క్రైం సినిమాలు, టీవీలు, ఓటీటీ కంటెంట్లో చూపిస్తున్న మత్తు పదార్థాలు, మద్యం వాడకం యువతపై తీవ్రప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. హింస కంటెంట్గా వస్తున్న సినిమాలతో పాటుగా యువతలో నానాటికీ లోపిస్తున్న మానవతా విలువలు ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, బెల్ట్షాపుల్లో నిరంతరం లభిస్తున్న మద్యంతో యువత చెడుమార్గం పడుతుండగా.. కొందరు ప్రముఖుల, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ గ్యాంగ్లను పోషిస్తున్నారనే అపవాదు సైతం ఉంది. వీరి అండదండలు, ప్రోత్సాహంతో యువత సైతం తల్లిదండ్రుల లక్ష్యాలను, భవిష్యత్ను పక్కకు పెట్టి హింసవైపు పరుగులు తీస్తున్నారు.పోలీస్ శాఖ విఫలం.. భద్రాచలంలో పెట్రేగిపోతున్న హింస, గొడవలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందనే ఆరోపణలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలంలో వీటిపై మాత్రమే దృష్టి సారించిన రక్షణ శాఖ పెరుగుతున్న గంజాయి వాడకం, గొడవలను అరికట్టడంలో వెనుకబడ్డారని విమర్శలు వస్తున్నాయి. అవినీతి సొమ్ముకు ఆశ పడి ఏడాది కాలంలోనే భద్రాచలం పోలీస్ శాఖలో ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులు పట్టుబడటం సైతం పోలీసులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తోంది. ఇసుక, మైనింగ్ మాఫియాకు అండగా ఉంటూ ప్రధాన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులు పెట్రోలింగ్ను పెంచి, గొడవలకు దిగుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇస్తూ చెడు వ్యవసనాలకు బానిసకాకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. -
చినుకు జాడేది ?
మృగశిర మన్నించేనా..? మృగశిర కార్తె ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్తెలో అయినా వర్షాలు సమృద్ధిగా పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. కాలం అనుకూలిస్తే మృగశిర కార్తెలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలలో అకాల వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం పొందినా.. జూన్ మొదటి వారంలో మాత్రం ఎండలు, ఉక్కపోతతో విసిగిపోతున్నారు. ఎండల తీవ్రతకు జ్వరపీడితులు కూడా పెరుగుతున్నారు. మేతకు వెళ్లిన పశువులు, జీవాలు మధ్యాహ్నానికే ఇంటిదారి పడుతున్నాయి. బూర్గంపాడు: మే నెలలో కురిసిన అకాల వర్షాలు రైతులను పంటల సాగుకు సన్నద్ధం చేశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే నెలాఖరులో ఉపరితల ఆవర్తనంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. దుక్కులు చేసి పత్తి గింజలు వేశారు. కొన్ని చోట్ల పత్తి గింజలు మొలకెత్తాయి. అయితే వారం రోజులుగా చినుకు పడలేదు. దీంతో రైతులు వేసిన పత్తి గింజలు కొన్నిచోట్ల మొలకలు వచ్చి ఎండిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి వేసిన పత్తి గింజలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత నెలలో వర్షాలు.. మే నెల మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఎండలు మండిపోవాల్సిన నెలలో అకాల వర్షాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. మే నెలాఖరులో ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసి భూములు పదునయ్యాయి. ఈ తరుణంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకున్నారు. మే నెలాఖరులో వేసిన పత్తి గింజలు అకాల వర్షాలకు బాగానే మొలకెత్తాయి. ఆ తరువాత వేసిన పత్తిగింజలు మాత్రం వర్షాలు లేక మొలకెత్తలేదు. గత వారం, పది రోజులుగా ఎండలు దంచికొడుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పత్తి సాగు షురూ.. ఉమ్మడి జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి సాగు మొదలుపెట్టారు. భద్రాద్రి జిల్లాలోనే సుమారు లక్ష ఎకరాల్లో ఇప్పటికే పత్తి గింజలు వేశారు. జిల్లాలోని రైతులు పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేసుకోవడం ప్రతి ఏటా పరిపాటిగా మారింది. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ. 589 పెంచటంతో ప్రస్తుతం రూ, 8,110కి చేరింది. దీంతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైతులు లక్ష ఎకరాల్లో పత్తి సాగు చేయగా మరో లక్షన్నర ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఊరించి ఉసూరుమనిపించిన వానలు జిల్లాలో పత్తి గింజలు వేసిన రైతులు కొన్నిచోట్ల ఎండుతున్న మొక్కలు వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు -
ఘనంగా అర్ధ శతాబ్దపు వేడుకలు
మధిర: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్ధ శతాబ్దపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జూనియర్ కళాశాలను స్థాపించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళాశాల ఆవరణను మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో అలంకరించి, అతిథుల రాక కోసం రెడ్కార్పెట్ వేశారు. ప్రత్యేక సెట్టింగ్లతో బ్యాచ్లవారీగా గ్యాలరీలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. 1970 – 1972 మొట్టమొదటి బ్యాచ్ నుంచి 2025 వరకు బ్యాచ్లవారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల పేర్లను నమోదు చేయించుకున్నారు. నాటి గురువులు, పూర్వ విద్యార్థులు వృద్ధాప్యంలోకి చేరడంతో పాటు వీఐపీల రాకతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 55 ఏళ్ల పూర్వ విద్యార్థులు ఒకేవేదిక పైకి చేరుకున్నారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువులతో పాటు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వేలాదిమంది తరలిరావడంతో కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది. -
మానసిక స్థైర్యం కల్పించాలి
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధితో చిన్నారులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, వారితో పాటు తల్లిదండ్రుల్లోనూ మానసిక స్థైర్యం కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోనల్ వైద్యాధికారి గిరిసింహారావు అన్నారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియాతో ప్రమాదం లేకున్నా ఆ వ్యాధిని తలుచుకుని బాధ పడడం వల్లనే మరింత అనారోగ్యాలకు గురవుతారని చెప్పారు. చిన్నారులు సాధారణ జీవితం గడిపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. క్రమం తప్పకుండా రక్తం ఎక్కించుకుంటూ, మందులు వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు అండగా ఉండేందుకు సంకల్ప సంస్థతో కలిసి నడుస్తామని అన్నారు. చిన్నారుల కోసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో సంకల్ప సంస్థ ఫౌండర్ పి.అనిత, ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి పి.రవిచందర్, ఉదయ్భాస్కర్, వంశీకిరీటి, ఉపేందర్, మధు, ప్రముఖ మీడియా ప్రతినిధి అడప నాగేందర్, డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తలసేమియాతో చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం లేదు టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోనల్ వైద్యాధికారి గిరిసింహారావు -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
కొణిజర్ల: ట్రాక్టర్ ట్రక్కుకు వెల్డింగ్ చేస్తుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలోని తనికెళ్లలో చోటుచేసుకుంది. ఎస్ఐ సూరజ్ కథనం ప్రకారం.. మండలంలోని తనికెళ్ల శివారులో షేక్ జిలానీ వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అందులో కొణిజర్లకు చెందిన బండారు శివ (23) పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి వెల్డింగ్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురవగా.. ఖమ్మం తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. తండ్రి గతంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. పేకాట స్థావరంపై దాడిచింతకాని: మండలంలోని రామకృష్ణాపురం బస్టాండ్ సమీపంలోని మున్నేరు ఒడ్డున పేకాట ఆడుతున్న మండలంలోని పందిళ్లపల్లి, బొప్పారం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ధంసలాపురం గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులను చింతకాని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.19,640 నగదు, ఏడు సెల్ఫోన్లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. తుమ్మల చెరువులో పర్యాటకుల పాట్లుఅశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువు వద్ద బోటింగ్ వద్ద తగిన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు వద్ద రెండు చిన్న బోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో జలవిహారం చేసేందుకు పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోంది. వసతి, తాగునీటి, చిన్న పిల్లలకు స్నాక్స్ వంటి సౌకర్యాలు కూడా లేవు. తుమ్మలచెరువు వరకు రహదారి కూడా సక్రమంగా లేదు. అధికారులు స్పందించి పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, పార్క్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..
బీట్బజార్ నుంచి ఎదిగిన ఖమ్మం మార్కెట్ ● తొలుత గ్రెయిన్ మార్కెట్గా పేరు.. ● మోడల్ మార్కెట్ పేరుతో పాత నిర్మాణాల తొలగింపు ● రూ.155.30 కోట్లతో మారుతున్న రూపురేఖలు రైతుల ప్రయోజనం కోసం రైతుల ప్రయోజనం కోసం ఖమ్మం మార్కెట్ను అభివృద్ధిలో భాగంగా పాత నిర్మాణాలను తొలగించి మోడల్ మార్కెట్గా రూపురేఖలు మార్చుతోంది. 7 అధునాతన షెడ్లతో పాటు ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు శ్రీకారం చట్టారు. మార్చి నుంచి మార్కెట్లోని ఓ భాగంలో ప్రారంభించిన పనులను ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పూర్తిస్థాయిలో పనులను చేపట్టారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.10 కోట్లతో నిర్మించిన షెడ్లను కూడా తొలగించి 15.39 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టారు. అజిలిటి భూమి కంపెనీ ఈ నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. 2026 జూన్ నాటికి పనులను పూర్తయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి. మోడల్ మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత నిర్మాణాలను తొలగిస్తున్నారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి అమ్మకాలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రసిద్ధి కావడంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంగనర్, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల సైతం అమ్మకాలకు ఇక్కడకు వస్తుంటారు. దీంతో మిర్చి సీజన్లో నిత్యం లక్ష నుంచి 2 లక్షల బస్తాల వరకు పంట విక్రయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో యార్డులు సరిపోవడం లేదని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధునాతన మార్కెట్ నిర్మాణాలకు రూ. 155.30 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం మిర్చి సీజన్ ముగియడం, వేసవి సెలవులు ప్రకటించడంతో పాత నిర్మాణాలను సమూలంగా తొలగిస్తూ నూతన నిర్మాణ పనులను చకచకా చేయిస్తున్నారు. 75 ఏళ్ల నాటి గుర్తులు.. బ్రిటీష్ కాలం 1937లో నలుగురైదుగురు వ్యాపారులు కలిసి పరిసరప్రాంతాల రైతుల సౌకర్యార్థం గాంధీచౌక్లో బీట్బజార్ ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా జిల్లాలో నీటి వనరులు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో మార్కెట్ ఆవశ్యకత పెరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్గా గుట్టల బజార్లో ఏర్పాటైంది. అయితే 1969 నుంచి ప్రభుత్వం మార్కెట్ చట్టాన్ని అమలు చేయగా.. క్రమక్రమంగా దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంగా రూపుదిద్దుకుని పంటల కొనుగోళ్లలో గుర్తింపు సాధించింది. తొలుత అపరాలు, ఆపై పత్తి, మిర్చి పంటల సాగు పెరగడంతో ఖమ్మం మార్కెట్ అభివృద్ధి సాధించింది. అపరాల కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యార్డు ప్రస్తుతం మిర్చి యార్డుగా మారింది. ఈ యార్డులో 22 షెడ్లు, భూసార పరీక్షా కేంద్రం, మార్కెట్ కార్యాలయం ఉన్నాయి. దీంతో పాటు ఈ యార్డుకు పక్కనే మిర్చికి ప్రత్యేకంగా నిర్మించి.. మరో షెడ్, గోదాములు, జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయం, కార్మికుల కార్యాలయాలను కూడా తొలగించడంతో ఆనాటి గుర్తులన్నీ కనుమరుగయ్యాయి. పాత నిర్మాణాలపై భావోద్వేగం మార్కెట్ పాత నిర్మాణాలు కనుమరుగవుతుండడంతో ఇక్కడ పనిచేసే వ్యాపారులు, కార్మికులు భావోద్వేగానికి గురవుతున్నారు. కొందరు మార్కె ట్ తొలగిస్తున్న వీడియోలు తీసి పాటలు జోడించి సోషల్ మీడియాలో పెడుతుండగా.. మరికొందరు యార్డులో వ్యాపారులకు కేటాయించిన స్థానాలు, నిత్యం పనిచేసే ప్రాంతాలు, భోజనం చేసే ప్రాంతాలు, చెట్ల తొలగింపు చూసి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ మార్కెట్లో సుమారు 600 మంది వ్యాపారులు, 3 వేల మంది కార్మికులు పని చేస్తుండగా.. పరోక్షంగా నగరంలోని త్రీటౌన్ ప్రజలువివిధ రకాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.శ్రామికులకు అన్నం పెట్టే మార్కెట్ మార్కెట్ ఆవిర్భావం నుంచి మాకు అనుబంధం ఉంది. అప్పట్లో వ్యాపారులు కొనుగోలు చేశాక పంటను ఎడ్లబండ్లపై వారి గోదాములకు తరలించేవాళ్లం. అనాదిగా మార్కెట్ వేలాది మంది కార్మికులకు అన్నం పెడుతోంది. మరింత అభివృద్ధి సాధిస్తుండడం ఆనందంగా ఉంది. –నున్నా మాధవరావు, కార్మిక వర్గాల ప్రతినిధి, ఖమ్మంమిర్చి కొనుగోళ్లకు కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో పండించే తేజా రకం మిర్చి అధికంగా ఇక్కడే విక్రయిస్తారు. దీంతో మోడల్ మార్కెట్ నిర్మాణంతో మార్కెట్ స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే పాత నిర్మాణాలు తొలగిస్తుండడం కొంత బాధను కలిగిస్తోంది. – మలిశెట్టి వెంకటేశ్వర్లు, మిర్చి ఖరీదుదారు, ఖమ్మంఅంచెలంచెలుగా ఎదిగింది.. ఖమ్మం మార్కెట్ అంచెలంచెలుగా ఎదగడంలో వ్యాపారులది కీలక పాత్ర. ఇప్పుడు కొత్త నిర్మాణాలతో జ్ఞాపకాలు కనుమరుగువుతున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్ ఇప్పుడు మోడల్ మార్కెట్గా అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉంది. – పెనుగొండ రామ్మోహన్రావు, పూర్వ వ్యాపారి, ఖమ్మం -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి..
కల్లూరురూరల్: ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఏపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పసుమర్తి చందర్రావు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలో కూడా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రఅధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా చందర్రావుతోపాటు ప్రధాన కార్యదర్శులుగా గోళ్ల రాధాకృష్ణ, వనమా కిరణ్, ఉపాధ్యక్షుడుగా వీరదల్లి రాజేశ్, నూకల శ్రీనివాసరావు, కోశాధికారిగా పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా కొప్పరపు బలరాం, వర్కింగ్ ప్రెసిడెంట్గా గంగిశెట్టి జగదీశ్కుమార్, నాగుబండి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలిగా దోసపాటి సంధ్యారాణి, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా పసుమర్తి రాంబాబు, ప్రమాణ స్వీకారం చేశారు. -
తరగతి గది నుంచే భవిష్యత్కు పునాది
ఖమ్మంఅర్బన్: విద్యార్థుల భవిష్యత్ తరగతి గదుల నుంచి ప్రారంభమవుతుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కడారి రవీందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పాఠశాల నాలుగో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విశిష్ట క్యాంపస్ ప్రారంభించి మాట్లాడారు. నిర్బంధ విద్యకు తాను పూర్తిగా వ్యతిరేకమని, విలువలతో కూడిన విద్య, అభివృద్ధికి దోహదపడే టెక్నాలజీతో విద్యా పద్ధతులు తమ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ దయాకర్రెడ్డి, ప్రిన్సిపాల్ రణధీర్ తదితరులు పాల్గొన్నారు. రైతుకు ఏరువాక అగ్రి ఎక్స్లెన్స్ అవార్డుఎర్రుపాలెం: మండలంలోని మీనవోలు గ్రామానికి చెందిన ప్రకృతి సేద్యం చేస్తున్న రైతు కుడుముల వెంకట్రామిరెడ్డికి ఏరువాక అగ్రి ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. హైదరాబాద్లో ఆది వారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్, సినీ నటి కవిత, నవ నిర్మాణ ఫౌండేషన్ చైర్మన్ పొన్నాల రాంబాబు తదితరులు రైతుకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, రూ.2,116 నగదు అందజేశారు. ఆటో పల్టీ.. ఏడుగురికి గాయాలు కామేపల్లి: ఆటో పల్టీ కొట్టిన ఘటనలో పలువురికి గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన పలువురు లింగాల క్రాస్ రోడ్డు నుంచి డోర్నకల్ వైపు ఆటోలో వెళ్తుండగా బండిపాడు స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురుకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను డోర్నకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చర్ల: మండలంలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆదివారం చర్లలో జరిగే వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. వారి మాటున మావోయిస్టులు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టాయి. ప్రతీ ఒక్కరిని నిశితంగా పరిశీలించా రు. సీఐ రాజువర్మ నేతృత్వంలో ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. అడవులను రక్షించుకుందాం భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు చండ్రుగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను రక్షించుకుందామని ఎస్పీ రోహిత్రాజు పేర్కొన్నారు. మండలంలోని బెండాలపాడు శివారు కనకగిరి అటవీ ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. గుట్టలపైభాగంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. అనంతరం పర్యాటకుల కోసం గుట్టలపైభాగంలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ను పరిశీలించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్ను సందర్శించారు. వెదురు ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అడవులను, అటవీ సంపదను కొల్లగొట్టేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అందుకోసం పోలీసుశాఖ సహకారం అందిస్తుందని తెలిపారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఫారెస్టు రేంజర్ ఎల్లయ్య పాల్గొన్నారు. -
వృద్ధగిరి.. అభివృద్ధికి నిధులేవి..
ముదిగొండ : కాకతీయుల కాలం నాటి అతి పురాతన దేవాలయం, వృద్ధగిరి కొండపై స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిధులు లేక అబివృద్ధికి నోచుకోవడం లేదు. ముదిగొండ మండలం సువర్ణాపురం రెవెన్యూ పరిధిలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఆలయం ఉండడంతో సందర్శకులు, భక్తులు అఽధిక సంఖ్యలో వస్తుంటారు. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి దాదాపు 40ఎకరాల భూమి ఉండగా.. కౌలు రూపంలో వచ్చే ఆదాయం ధూప, దీప నైవేద్యాలకు, ఇతర ఉత్సవాలకు సరిపోతాయి. ఇక ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక, ఆలయంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మెట్ల మార్గం, రహదారి, ఆర్చీలతో పాటు గదులు నిర్మించాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముదిగొండ మండల పర్యటనకు వచ్చినప్పుడల్లా ఆలయ అబివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్చకులు వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ లైన్తో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. -
కిన్నెరసానిలో ఆహ్లాదం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 641 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.35,575 ఆదాయం లభించింది. 300 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,120 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహాధర్నాను విజయవంతం చేయండి.. ఇల్లెందు: సీతారామా ప్రాజెక్టు జలాలు భద్రాద్రి జిల్లా రైతాంగానికి అందించాలని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆరు గ్యారంటీలు, 13 అంశాలు అమలు డిమాండ్ చేస్తూ సోమవారం ఇల్లెందులో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు దిండిగల రాజేందర్ అన్నారు. ఆదివారం ఇల్లెందులోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ తేదీన ఉదయం 10 గంటలకు మహా ధర్నా ప్రారంభం అవుతుందని, నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అత్యధికంగా తరలి రావాలని కోరారు. లక్కినేని సురేందర్, శీలం రమేష్, అజ్మీరా భావ్సింగ్ నాయక్, జేకే శ్రీనివాస్, రంగనాథ్ పాల్గొన్నారు. -
ప్రయాణికులు కిటకిట.. బస్సులు కటకట..
ఇల్లెందు: ఇల్లెందు బస్స్టేషన్ పరిధిలో నాలుగు రూట్లలో బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తగిన సర్వీసులు లేక ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. ఆదివారం ఇల్లెందు బస్స్టేషన్లో మహబూబాబాద్, గుండాల రూట్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా అధికారులు తగిన సంఖ్యలో సర్వీసులు పెంచడంలేదు. ఇల్లెందు–మహబూబాబాద్, ఇల్లెందు–గుండాల, ఇల్లెందు–కొత్తగూడెం, ఇల్లెందు–ఖమ్మం రూట్లలో ప్రయాణికులకు బస్సులు సరిపోవటం లేదు. ఉన్న సర్వీసులూ సమయపాలన పాటించడంలేదు. స్టేషన్లోనే బస్సు నిండిపోడటంతో డ్రైవర్లు పట్టణంలోని ఇతర స్టేజీల్లో నిలుపకుండా వెళ్లిపోతున్నారు. గత నెలలో ఇల్లెందులో పర్యటించిన ఆర్టీసీ ఈడీ సోలోమెన్ పలు రూట్లలో బస్సులు నడపాలని ఆదేశించారు. అయితే చెట్టుపల్లి మినహా ఇతర ఏ ఒక్క రూట్లో కూడా బస్సులు పెంచలేదు. రాత్రి 8 గంటల తర్వాత మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం డిపోల నుంచి ఇల్లెందు వైపు సర్వీస్లు లేవు. కరీంనగర్ నుంచి భద్రాచలం వెళ్లే బస్సులు, భద్రాచలం నుంచి కరీంనగర్కు వెళ్లే బస్లు తప్ప సమీప డిపోల నుంచి ఇల్లెందుకు నడిచే షటిల్ సర్వీస్లు ఉండటం లేదు. ఖమ్మం నుంచి ఇల్లెందుకు రాత్రి సమయంలో బస్సు లేకపోవడంతో నియోజకవర్గప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి మణుగూరు, భద్రాచలం వచ్చే రెండు, మూడు సర్వీసులను రాత్రి పూట ఇల్లెందు మీదుగా మళ్లిస్తే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పే అవకాశం ఉంది. గుండాల ఎక్స్ప్రెస్ సర్వీస్, గుండాల–హైదరాబాద్ వెళ్లే సర్వీస్లు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.నాలుగు రూట్లలో సరిపడాలేని ఆర్టీసీ సర్వీసులు -
జలపుష్పాల జాతర..
నేడు మృగశిర కార్తె ● జిల్లాలో 150టన్నుల మేర చేపల విక్రయానికి ఏర్పాట్లు ● స్థానిక చెరువుల నుంచే కాక ఏపీ నుంచి దిగుమతి ఖమ్మంవ్యవసాయం: మృగశిర అనగానే గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె తొలిరోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర వచ్చిందంటే వర్షాకాలం ఆరంభమైనట్లుగా భావిస్తారు. ఇదేరోజు హైదరాబాద్లో ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి చేపమందు వేస్తుంటారు. వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని, చేపల తింటే వేడి దూరమవుతుందని నమ్ముతారు. అందుకే ఏటా మృగశిర కార్తె ఆరంభమవుతున్న ఆదివారం చేపల విక్రయాలు జోరుగా సాగనున్నాయి. ఇప్పటికే దిగుమతి జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా దాదాపు 150 టన్నులక పైగా చేపలు అమ్ముడవుతాయని అంచనా. ఈమేరకు విక్రయదారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో ఆదివారం చేపల విక్రయాలు భారీగా జరుగుతాయని భావిస్తున్నారు. కేవలం ఖమ్మం నగరంలోనే సుమారు 40 నుంచి 50 టన్నుల చేపలు విక్రయించే అవకాశముంది. చేపల లభ్యత లేక... చేపల లభ్యత జిల్లాలో తక్కువగా ఉండడంతో వ్యాపారులు ఏపీలోని పలు జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో వాహనాల్లో చేపలు తెప్పించగా ఐస్బాక్సులు, ఆక్సిజన్ ట్యాంకుల్లో నిల్వ చేశారు. ఎక్కువగా ఏలూరు, కై కలూరు, బాపట్ల, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి తెప్పించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రకం ఆధారంగా డిమాండ్ కొన్ని నెలల క్రితం కోళ్లకు వైరస్, బర్డ్ ఫ్లూ వస్తుందన్న ప్రచారంలో అమ్మకాలు పడిపోయాయి. అదే సమయాన మటన్, చేపల విక్రయాలు జోరందుకున్నాయి. కానీ మటన్ ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఆదివారం వస్తే చేపల వైపే మక్కువ చూపుతున్నారు. ఇక మృగశిర కార్తె సందర్భంగా డిమాండ్తో పాటే ధర పెరుగుతుందని భావిస్తున్నారు. సహజంగా కొర్రమేను చేపలకు అధిక ధర ఉంటుంది. ఇవి కాక బొచ్చలు, రవ్వలు, గ్యాస్కట్లు, బంగారు తీగలు వంటి రకాల ధర కిలోకు రూ.200 నుంచి రూ.220 వరకు పలికే అవకాశముంది.తిరుమలాయపాలెంలోని చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు -
క్రికెట్ ఆడేందుకు వెళ్తూ మృత్యువాత
వేంసూరు: స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడదామని బయలుదేరిన ఇద్దరు యువకులు మార్గమధ్యలోనే మృత్యువాత పడ్డారు. వేంసూరు మండలంలో శనివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం భరణిపాడు గ్రామానికి చెందిన మల్లెపూల సాత్విక్, సూరటి జగదీష్, విస్సంపల్లి జస్వంత్ స్నేహితులు. మర్లపాడులో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ముగ్గురు కలిసి బైక్పై బయలుదేరారు. అయితే, కందుకూరు దాటాక మర్లపాడు దగ్గరలో భరణిపాడు వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా సాత్విక్(22) ఘటనాస్థలిలో మృతి చెందాడు. జగదీష్(21)ను ఖమ్మం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అలాగే, జస్వంత్కు సత్తుపల్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. చేతికి వచ్చిన కుమారులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.కోళ్ల వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి -
ముగిసిన ఫుట్బాల్ శిక్షణ శిబిరం
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన రఘునాథపాలెం మండలం మల్లెమడుగులో నెల రోజులుగా నిర్వహిస్తున్న వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ఎం.డీ.అక్బర్ అలీ పాల్గొని క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్, క్యాంప్ ఇన్చార్జి బి.కృష్ణయ్య పాల్గొన్నారు. ‘విద్యావ్యాపారులతో కుమ్మకై ్కన అధికారులు’ ఖమ్మంమయూరిసెంటర్: విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ, జిల్లా కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన పీడీఎస్యూ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించకుండా సంపాదనే లక్ష్యంగా వ్యాపారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. పేద వర్గాల వద్ద అధిక మొత్తంలో డొనేషన్ల పేరుతో ఫీజులు గుంజుతున్నారని పేర్కొన్నారు. అయితే, నిబంధనలు పాటించని ఏ ప్రైవేట్ విద్యాసంస్థపైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. ఈసమావేశంలో నాయకులు తిప్పారపు లక్ష్మణ్, కిరణ్, పృధ్వీ, కార్తీక్, యశ్వంత్, సందీప్, చంద్రశేఖర్, వినయ్, సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి రూ.2.70కోట్లు తిరుమలాయపాలెం: మండలంలోని సుబ్లేడులో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి రూ.2.70 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడ హాస్టల్ ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో నిధులు మంజూరు చేశారు. దీన్ని పాత హాస్టల్ స్థలంలో నిర్మించనుండగా, స్థలాన్ని శుభ్రం చేయించే పనులను శనివారం ఐడీసీ ఈఈ విన్సెంట్రావు, బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్రెడ్డి ప్రారంభించారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సత్యనారాయణరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బత్తుల వెంకటనారాయణతో పాటు యలమంద, నవీన్, బోడ రమేష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు
రఘునాథపాలెం: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని.. అందులో భాగంగానే రూ.కోట్ల నిధులు కేటాయిస్తూ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుస్తోందని జిల్లా విద్యాశాఖ సీఎంఓ యలగందుల రాజశేఖర్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని వెంకటాయపాలెం, వేపకుంట్ల తదితర గ్రామాల్లో శనివారం నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండగా, ఉచిత విద్య, యూనిఫాం, పాఠ్యపుస్తకాలే కాక నాణ్యమైన భోజనం అందుతోందని తెలిపారు. ఇవేకాక గత ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు నమోదైన అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంపునకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కాగా, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య నిర్వహణపై వంట, పారిశుద్ధ్య కార్మికులకు ఈనెల 9, 10వ తేదీల్లో ఖమ్మంలో జిల్లా స్థాయి శిక్షణ, ఆతర్వాత 10, 11వ తేదీల్లో మండల, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ఎంలు నారాయణ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కంపు కొడుతున్న పెద్దాస్పత్రి
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో కార్మికుల సమ్మె శనివారం మూడో రోజుకు చేరింది. పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేస్తూ విధులకు దూరంగా ఉన్నారు. దీంతో జనరల్ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చెత్తాచెదారం, మెడికల్ వ్యర్థాలు పేరుకుపోయాయి. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బాత్రూమ్ల్లో దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. సెక్యూరిటీ, పేషంట్ కేర్ సేవల్లోనూ ఇబ్బందులు తలెత్తగా, సెక్యూరిటీ కార్మికులు విధులు దూరంగా ఉండడంతో రక్షణపై ఆందోళన నెలకొంది. కాగా, సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించన్నుట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్ను వివరణ కోరగా కార్మికుల వేతనాల సమస్యను డీఎంఈ దృష్టికి తీసుకెళ్లామని, రెండు, మూడు రోజుల్లో శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా మున్సిపల్ కార్మికుల సేవలు నియోగించుకుంటున్నామని వెల్లడించారు.కార్మికుల సమ్మెతో పేరుకుపోయిన వ్యర్ధాలు -
మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన
కల్లూరు: విధినిర్వహణలో ఉన్న కల్లూరు ఎస్ఐ డి.హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ రఘు వెల్లడించారు. కల్లూరు పోలీసుస్టేషన్లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కల్లూరులోని చౌదరి హోటల్ వద్ద తల్లాడకు చెంది న రాయల రామారావు తదితరులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో గొడవ చేస్తున్నారని యాజమాని మాగంటి బోసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయానికి వెళ్లిపోయిన రామారావు తిరిగి పలువురితో వచ్చి హోటల్ సిబ్బంది, యాజమానిని బెదిరించాడు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే హోటల్ను నడవనిచ్చేది లేదని హెచ్చరిస్తుండగా ఎస్ఐ హరిత, సిబ్బందితో వచ్చా రు. మద్యం మత్తులో ఉన్న రామారావు, ఆయన అనుచరులను పంపించే ప్రయత్నంలో ఎస్సై, సిబ్బంది విధులను ఆటంకపరుస్తూ దాడి చేశారు. ఈమేరకు ఎస్ఐ ఫిర్యాదుతో పది మందిపై కేసు నమోదు కాగా, ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, రామారావుపై గతంలోనూ తల్లాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం, కల్లూరు, పెనుబల్లి ఎస్ఐలు డి.హరిత, వెంకటేష్ పాల్గొన్నారు.ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు -
రేపటి నుంచి మార్కెట్లో కొనుగోళ్లు
పత్తి యార్డులో అన్ని పంటలకు ఏర్పాట్లుఖమ్మంవ్యవసాయం: ఎండల తీవ్రత నేపథ్యాన నెల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలను నిలిచిపోగా, సోమవారం తిరిగి మొదలుకానున్నాయి. ఎండలు 40–45 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో కార్మికులు, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గం వినతితో సెలవులు ప్రకటించారు. మే 9న మొదలైన సెలవులు ఆదివారంతో ముగియనుండగా, తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో కొనుగోలు మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. అన్నీ పత్తి యార్డులోనే... మిర్చి యార్డులో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో అన్ని పంటల కొనుగోళ్లు పత్తి యార్డులో చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు మిర్చి, పత్తి, అపరాలకు ప్రత్యేక షెడ్లను కేటాయించారు. ప్రస్తుతం మిర్చి, కొద్ది మేర పత్తి, యాసంగిలో పండిన పెసలు, మొక్కజొన్నలను విక్రయానికి తీసుకొచ్చే అవకాశముంది. అలాగే, మిర్చి ధర పెరిగితే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటలను రైతులు తీసుకురానున్నారు. వానాకాలం సీజన్ పెట్టుబడికి అవసరమైన నగదు కోసం రైతులు ఇళ్లు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటలను తీసుకొచ్చే అవకాశముండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. నేడు, రేపు ఐసెట్ ఖమ్మం సహకారనగర్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ ఆది, సోమవారాల్లో జరగనుంది. జిల్లాలోని ఐదు ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేయగా రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాగా, ఉదయం పరీక్షకు 8నుంచి 9–45గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 2–15గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తారు. రేపటి నుంచి డీసెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: బీఈడీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీజీడీఈఈ సీఈటీ – డీ సెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. ఖమ్మంలోని డైట్ కళాశాలలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన కోసం నాలుగు బృందాలను నియమించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ సూచించారు. -
సీహెచ్సీలో కాయకల్ప బృందం
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కాయకల్ప బృందం సభ్యులు శనివారం సందర్శించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బృందం పరిశీలన కొనసాగగా ఆస్పత్రిలో పరిశుభ్రత, ఓపీ రూమ్ల నిర్వహణపై డాక్టర్ బాలకృష్ణ, సిబ్బంది ఇందిర, విమల వివరాలు తెలుసుకున్నారు. రోజువారీ ఓపీ నమోదు, ఆపరేషన్ థియేటర్, ఓపీ గదుల నిర్వహణ, మందుల లభ్యతపైనా ఆరా తీసిన వారు చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్సీ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
విపత్తును ఎదుర్కొనేలా..
వర్షాల వేళ డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ● ముంపు ప్రాంతాల యువతతో బృందాల ఏర్పాటు ● వరద ముప్పును ఎదుర్కొనేలా కేఎంసీ సన్నద్ధతగత ఏడాది మున్నేటికి వచ్చిన వరద ఖమ్మంలోని పలు కాలనీలను ముంచెత్తగా ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. భారీ మొత్తంలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ చేదు అనుభవం ఈ ఏడాది పునరావృతం కాకుండా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందస్తుగా అవగాహన కల్పించడమే కాక విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్సహాయక చర్యలపై శిక్షణ వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనేలా డీఆర్ఎఫ్ సిబ్బందికి కేఎంసీ అధికారులు శిక్షణ ఇప్పిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటు, ప్రథమ చికిత్స తదితర అంశాలను ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. అలాగే, గజ ఈతగాళ్లు, బోట్లు నడిపే వారు, మత్స్యకారులు, వరదల్లో చిక్కుకున్న వాహనాలను తొలగించే నైపుణ్యం కలిగిన వారిని బృందాలుగా ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం, త్వరగా స్పందించడంపై అవగాహన కల్పిస్తున్నారు. స్థానికులకు అవగాహన వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరద వస్తుందని తెలియగానే వ్యవహరించాల్సిన తీరుపై మున్నేటి పరీవాహక ప్రాంత ప్రజలకు సైతం నగరపాలక సంస్థ అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ వరద హెచ్చరికలను గుర్తించడం, ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలను భద్రపర్చుకోవడం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన తీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి శుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలపై వివరిస్తున్నారు. ఈ సదస్సుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని స్థానికులకే కాక డీఆర్ఎఫ్ సిబ్బందికి జాగ్రత్తలను వివరిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో.. వర్షాకాలం మొదలుకావడంతో అధికారులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పలు దఫాలుగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశమై వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అవసరమైన పడవలు, రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లు, ఇతర పరికరాలు సమకూర్చుకోవడంపై సూచనలు చేశారు. వరద బాధితుల కోసం తాత్కాలిక పునరావాస కేంద్రాల గుర్తింపు, అక్కడ తాగునీరు, ఆహారం సమకూర్చడంపై దృష్టి సారించాలని తెలిపారు. వైద్యబృందాల ఏర్పాటు, అత్యవసర మందుల లభ్యతపై ఆరా తీయడమే కాక వరద తగ్గాక వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలపైనా ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. పక్కా ప్రణాళికతో... ఈ ఏడాది మున్నేటి వరదతో సమస్యలు రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభావిత డివిజన్ల యువతతో బృందాలను ఏర్పాటు చేశాం. దీంతో వారికి సమాచారం ఇచ్చి స్థానికులను అప్రమత్తం చేయించొచ్చు. వరద సహాయక చర్యల కోసం ఐదు ర్యాప్ బోట్లు కొనుగోలు చేస్తున్నాం. అంతేకాక రెండు డ్రోన్లు సమకూర్చున్నాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ -
శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శని వారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు తెల్లవారుజామునే స్వామి మూల విరా ట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మ వార్లను పట్టువస్త్రాలతో అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, శ్రీవారికి పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. బొగ్గు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు సత్తుపల్లిరూరల్: రక్షణ సూత్రాలు పాటిస్తూనే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆదేశించారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్టు కార్యాలయం పైఅంతస్తులో నిర్మించిన నూతన గదులను శనివారం ఆయన కొత్తగూడెం ఏరియా జీఎం షాలేం రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతీఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ప్లాస్టిక్ సంచుల వాడకం పూర్తిగా తగ్గించాలని సూచించారు. అనంతరం క్వారీని సందర్శించిన డైరెక్టర్ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణపై సమీక్షించారు. వర్షాకాలం నేపథ్యాన ఉత్పత్తికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి పీఓ ప్రహ్లాద్, ఇంజనీర్ జీ.వీ.రావు, వివిధ విభాగాల అధికారులు రాజేశ్వరరావు, కల్యాణ్రామ్, నరేష్, అభిలాష్, గోవింద్, రవికుమార్, దేవదాస్, నాయకులు సుధాకర్, నర్సింహారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ఎస్ఐతో అనుచిత ప్రవర్తన.. అర్ధరాత్రి హోటల్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె బాడీపై చేయి వేసి పక్కకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనంతరం.. నిందితుడిని, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఖమ్మంలోని కల్లూరు ఎన్ఎస్పీలోని ఓ హోటల్ వద్ద తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్ఐ హరిత.. హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఆమె.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు.కాంగ్రెస్ నాయకుడు రాము.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో, అక్కడి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
103 శాతం బొగ్గు ఉత్పత్తి
ఐదు ఏరియాల్లో 100 శాతంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మే నెలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లోని 19 ఓ పెన్కాస్ట్ గనులకు, 21భూగర్భ గనులకు 56.50 మిలి యన్ లక్షలటన్నుల లక్ష్యానికి 58.22 లక్షల టన్ను లు 103 శాతం మాత్రమే సాధించినట్లు సింగరేణి తన గణాంకాల్లో తెలిపింది. కాగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లోని భూగర్భగనుల్లో 4.90లక్షల టన్నుల లక్ష్యానికి 3.50లక్షల టన్నులు 72శాతం ఉత్పత్తి చేయగా, ఓపెన్ కాస్ట్ గనుల్లో 51.60 లక్షల టన్నులకు గాను 54.72 లక్షల టన్నులు 106 శాతం సాధించింది. ఓవరాల్గా 56.50 లక్షల టన్నుల లక్ష్యానికి 58.22లక్షల టన్నులు 103శాతం ఉత్పత్తి జరిగింది. మే మాసంలో మెరుగైన ఉత్పత్తి... గడచిన ఏప్రిల్లో సాధించిన ఉత్పత్తి (95శాతం) కంటే మే లో 103 శాతం అంటే 8 శాతం (నెలవారీ ఉత్పత్తి) అదనంగా ఉత్పత్తి జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్లో మణుగూరు ఏరియా 10.88 లక్షల టన్నులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, ఆర్జీ–2 ఏరియా 4.99 లక్షల టన్నులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మే నెలలో 5 ఏరియాలు (కొత్తగూడెం 107 శాతం, మణుగూరు 119 శాతం, శ్రీరాంపూర్ 100 శాతం, ఆర్జీ–2 133 శాతం, ఆర్జీ–3 100 శాతం,) 100 శాతం సాధించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల్లో 49.90 లక్షల టన్నులు 95 శాతం సాధించగా, మే లో 10.81 లక్షల టన్నులు 99శాతం అంటే గతంలో కంటే మరో 4శాతం అదనంగా సాధించింది. తీరు మార్చుకోని ఆరు ఏరియాలు.. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మే మాసంలో ఐదు ఏరియాలు మాత్రమే 100 శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నాయి. అయితే సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు ఏరియాలలోని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులకు నిర్దేశించిన నెలవారి, వార్షిక లక్ష్యాలను కచ్చితంగా సాధించాలని రివ్యూ మీటింగ్లలో పలుమార్లు చెప్పినప్పటికీ అధికారుల పనీతీరులో మార్పు రాలేదు. లక్ష్యంసాధించిన కొత్తగూడెం మణుగూరు, ఆర్జీ–2... మే మాసంలో కొత్తగూడెం ఏరియా 107శాతం, వార్షిక లక్ష్యం 100శాతం సాధించగా, మణుగూరు ఏరియా మే నెలలో 119శాతం, వార్షిక లక్ష్యంలో 118శాతం సాధించినప్పటికీ ఓవరాల్గా కొత్తగూడెం ఏరియా 13.96 లక్షల టన్నులు, వార్షిక లక్ష్యం 26.04 లక్షల టన్నులు సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉండగా, మణుగూరు ఏరియా మేలో 11.74 లక్షల టన్నులు, వార్షిక లక్ష్యంలో 22.63 లక్షల టన్నులు సాధించి రెండో స్థానంలో నిలిచాయి. కంపెనీ రెండు నెలలో 108 లక్షల్లో కొత్తగూడెం రీజియన్ 53 లక్షలు సాధించటం విశేషం. అయితే మిగతా రెండు రీజియన్లు 55 లక్షల టన్నులు సాధించటం గమనార్హం. కాగా, ఆర్జీ–2 ఏరియా మే నెలలో 133 శాతం, రెండు నెలలో 159 శాతం సాధించి మూడు స్థానంలో ఉంది. -
అర్ధ సెంచరీ వేడుకకు ముస్తాబు
మధిర: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము... చదువులమ్మ చెట్టు నీడలో... అంటూ 55 బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. ఐదు దశాబ్దాలుగా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన పలువురు దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ కళాశాల ప్రారంభించి 56ఏళ్లు అవుతుండగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మధిరలో ఆదివారం(ఈనెల 8న) జరిగే ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరుకాను న్నారు. ఈనేపథ్యాన ఆనాటి గురువులు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులను ఆహ్వానిస్తూ కొద్దినెలలుగా నిర్వహణ కమిటీ కృషి చేస్తోంది. 1969లో ప్రారంభం మధిరలోని మధిర – వైరా ప్రధాన రహదారి పక్కన పదెకరాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను 1969లో స్థాపించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ ఈసీ గ్రూపులు ఉండగా.. అప్పట్లో సీటు సాధించడం గొప్పగా భావించేవారు. పదో తరగతిలో ప్రథమ శ్రేణి మార్కులు సాధించిన వారికే సీటు దక్కేదని చెబుతారు. కళాశాల స్థాపించాక 1995 వరకు ప్రైవేట్ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులతో కళకళలాడింది. కానీ ప్రైవేట్ కళాశాలలు ఏర్పడ్డాక ప్రభుత్వ కాలేజీ పరిస్థితి ఏటేటా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కాగా, 1993లో వృత్తి విద్యా కోర్సులైన ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ కోర్సులు, 2011లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) కోర్సు ప్రారంభమైంది. అవార్డులు.. దాతల చేయూత ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది ఉన్నత స్థాయికి చాటారు. 2017లో ప్రభుత్వం ప్రతిభా అవార్డులు ప్రకటించగా.. ఈ కాలేజీ విద్యార్థిఉదయ్ సిద్ధార్థ్ రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం కళాశాలలో 344 మంది ఉన్నారు. ఇటీవల కళాశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నూతన భవన సముదాయానికి రూ.5కోట్లు మంజూరు చేయడంతో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడెకరాల స్థలం వదిలేసి, మిగతా స్థలాన్ని తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్కి కేటాయించాలని నిర్ణయించారు. ఉత్సవాలతో మరింత అభివృద్ధి వేలాది మంది విద్యార్థుల తలరాతలను తీర్చిదిద్దిన కళాశాల స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 2020నాటికే కళాశాల స్థాపించి 50ఏళ్లు పూర్తయినా కోవిడ్ తదితర కారణాలతో స్వర్ణోత్సవ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈనెల 8న ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో బ్యాచ్ల వారీగా గురువులు, పూర్వవిద్యార్థులకు సమాచారం ఇచ్చారు. ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు మధిర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిన పలువురు ఉన్నత స్థానాలకు చేరారు. పల్మనాలజిస్ట్ వరికూటి సుబ్బారావు, మరద్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బండి వెంకటేశ్వర్లు, టీజీఎన్పీడీసీఎల్ సీజీఎం వంగూరి మోహన్రావు, ప్రముఖ దంత వైద్యులు పారుపల్లి కరుణాకర్, ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి, డీఆర్ డీఎల్ మాజీ సీనియర్ శాస్త్రవేత్త, బ్రహ్మోస్ మిస్సైల్ ప్రోగ్రామ్ మేనేజర్ గుడిశ రాజేశ్వరరావు, అలీ యావర్ జంగ్ జాతీయ భాషణ, శ్రవణ దివ్యాంగ జనుల సంస్థ సికింద్రాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ భీమని శ్రీనివాసరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.రేపు మధిర జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఒకే వేదికపై కలుసుకోనున్న 55బ్యాచ్ల విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన పలువురు ఏర్పాట్లలో నిమగ్నమైన ‘గోల్డెన్ జూబ్లీ’ కమిటీ అభివృద్ధికి సహకరించండి ఎందరినో తీర్చిదిద్దిన మధిర కాలేజీ అభివృద్ధికి అంతా సహకరించాలి. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నందున నాణ్యమైన విద్య అందిస్తున్నాం. పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకల నిర్వహణతో పాటు కళాశాల అభివృద్ధికి నిర్ణయించడం అభినందనీయం. – బి.జైదాస్, ప్రిన్సిపాల్ -
అర్హులకే ఇళ్లు ఇవ్వాలని ఆందోళన
కూసుమంచి: అర్హత కలిగిన పేదలకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని కోరుతూ మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పలువురు గూడు లేని పేదలు ఉన్నా వారికి కాదని అనర్హులకు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవల గ్రామానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తే అర్హులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు. -
కారు – ఆటో ఢీ, ఒకరు మృతి
కారేపల్లి: బతుకుతెరువు కోసం ఊరూరా తిరుగుతూ పాత సామాన్ల వ్యాపారం చేసే కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కారేపల్లి మండలంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు... మధిర పట్టణానికి చెందిన ఒకే కుటుంబ వాసులు మేకల సీత(30), అద్దంకి ఎల్లయ్య, మంగమ్మ, అద్దంకి సాయి ట్రాలీ ఆటోలో శుక్రవారం ఇల్లెందు సమీప గ్రామాల్లో తిరుగుతూ పాత సామగ్రి కొనుగోలు చేశారు. ఆపై కారేపల్లి – ఇల్లెందు ప్రధాన రహదారిలో వస్తుండగా ఆలియాతండా సమీపాన ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మతల్లి ఆర్చి వద్ద భాగ్యనగర్తండా గ్రామానికి చెందిన గుగులోతు రోమి, ఆయన సోదరుడు కారులో వెళ్లూ క్రమాన రెండు వాహనాలు ఢీకొన్నాయి. రెండు వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లగా మేకల సీత తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, ఆటోలో ఉన్న సాయి, ఎల్లయ్య, మంగమ్మకు సైతం గాయాలయ్యాయి. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
ఎస్సెస్సీ టాపర్ల ఢిల్లీ యాత్ర
ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి టాపర్లుగా నిలిచిన విద్యార్థలను మిత్ర ఫౌండేషన్ ద్వారా విమానంలో ఢిల్లీ యాత్రకు తీసుకెళ్లారు. ప్రతిభ కనబర్చిన తొమ్మిది మంది విద్యార్థులకు రూ.3 లక్షల నగదు, ఒక ల్యాప్టాప్ అందించిన ఫౌండేషన్ బాధ్యులు ఢిల్లీ పర్యటనకు కూడా తీసుకెళ్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురివెళ్ల ప్రవీణ్కుమార్ ఆధ్వర్యాన విద్యార్థులు పచావ వెన్నెల, మాఘం యశ్వంత్, చింతోసు సాయితో పాటు మరో ఆరుగురిని విమానంలో ఢిల్లీ తీసుకెళ్లగా పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, అక్షరధామ్, ఎర్రకోట, ఇండియా గేట్ తదితర ప్రాంతాలను సందర్శించారు. అలాగే, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి ఆయన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విమానంలో ఢిల్లీకి వెళ్లడం తమకు జ్ఞాపకంగా నిలిచిపోతుందని తెలిపారు. యాత్రకు సహకరించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, డీఈఓ సత్యనారాయణకు ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, కార్యదర్శులు రంగ శ్రీనివాస్, నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. -
తలసేమియా బాధితుల కోసం రక్తదానం
ఖమ్మంఅర్బన్: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఒకేరోజు 200మంది రక్తదానం చేశారు. ఖమ్మంకు చెందిన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే లక్ష్యంతో ‘సంకల్ప‘ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన శిబిరం ఏర్పాటుచేయగా తమ ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బంది 200 మంది రక్తదానం చేశారని తెలిపారు. అనంతరం పిల్లల మందుల కోసం శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరఫున రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఎస్టేట్స్, కన్స్ట్రక్షన్స్ ఎండీ వత్సవాయి రేణుకతో పాటు గోసు మధు, పోగుల రవికుమార్, అనిత, డాక్టర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం మధిర: మధిర మండలం మాటూరుపేట సమీపాన నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దెందుకూరు రోడ్డులోని ఓ కోళ్లఫామ్ షెడ్డులో బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో శుక్రవారం మధిర రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సత్తా చాటిన హ్యాండ్బాల్ క్రీడాకారులు ఖమ్మం స్పోర్ట్స్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మంమంగళపల్లిలో శుక్రవారం ముగిసిన రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ద్వితీయస్థానం దక్కించుకుంది. అంతేకాక జట్టు నుంచి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, డాక్టర్ పి.రఘునందన్ తెలిపారు. క్రీడాకారులను అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పాముల శ్రీని వాసరావు, సీహెచ్.కృష్ణయ్య అభినందించారు. అప్రమత్తతతోనే వ్యాధులకు చెక్ మధిర: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్గౌడ్ సూచించారు. మధిర ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కావాల్సిన మేర మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అంతేకాక వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ‘భరత్’ పూర్వవిద్యార్థికి సన్మానం మధిర: మధిరలోని భరత్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థి ఆలపాటి గోపీనాధ్ ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఓసీ కేటగిరీలో 55వ ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన ఆయనను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సన్మానించారు. కాగా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోపీనాథ్ భరత్ విద్యానికేతన్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
ఖమ్మక్రైం: బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ వెల్లడించారు. త్యాగానికి ప్రతికగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్, వెటర్నరీ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సామూహిక ప్రార్ధనల సమయాన ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశామని, మసీద్లు, ఆలయాలు, చర్చిల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని తెలిపారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక చెక్పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మతసామర్యానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు పోస్టులను నమ్మొద్దని ప్రజలకు పోలీసు కమిషనర్ సూచించారు. -
బడిబాట ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు సమీప గ్రామాలకు వెళ్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు కల్పించే సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్య, నోటుపుస్తకాలు, యూనిఫామ్ అందుతాయని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమాలకు ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడీ టీచర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్మన్లు కూడా హాజరవుతున్నారు. -
రెండోరోజూ విధుల బహిష్కరణ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కార్మికులు మరోమారు విధులు బహిష్కరించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో కొన్నాళ్ల క్రితం మూడు రోజుల పాటు విధులు బహిష్కరించగా, ఒక నెల వేతనం చెల్లించిన అధికారులు సర్దిచెప్పడంతో విధుల్లో చేరారు. మళ్లీ ఇప్పుడు మూడు నెలల వేతనం బకాయి పడడంతో గురువారం నుంచి నిరవధిక సమ్మెకు ఉపక్రమించారు. వీరి సమ్మెతో ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులు, ఇన్ పేషంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఓపీ చీటీల నమోదు, ఓపీలో వైద్యులకు సహాయకారిగా, ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీ సేవల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తుండగా సమ్మె కారణంగా ఇతరులను నియమించగా అనుభవలేమితో జాప్యం జరిగింది. దీంతో శుక్రవారం ఓపీ నమోదు వద్ద చీటీల జారీ ఆలస్యం కావడంతో క్యూ అంతకంతకు పెరిగింది. కాగా, వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి ఆస్పత్రి వెళ్లాక తరచుగా వేతనాల సమస్య ఎదురవుతోంది. వీవీపీ పరిధిలో ఉన్నప్పుడు ఆస్పత్రిలో 575 పడకలకు అనుమతి ఉండడంతో 259 మంది కార్మికులను ఏజెన్పీ ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. ఆపై డీఎంఈ పరిధిలోకి చేర్చాక 430 పడకలకే అనుమతి ఇవ్వడం, అంతకు ముందు మాదిరిగానే వేతన బడ్జెట్ విడుదల చేస్తుండడం సమస్యకు కారణమైంది. గతంలో ఒక్కోసారి ఏజెన్సీ బాధ్యులు సొంత నగదు చెల్లించినా, ఇప్పుడు వారికే రూ.2.50 కోట్లు బకాయి ఉండడంతో వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని సమాచారం. కాగా, కార్మికుల సమ్మెతో శుక్రవారం మున్సిపల్ కార్మికులతో శుభ్రం చేయించినా పెద్దగా ఫలితం కానరాలేదు.వేతనాల కోసం పెద్దాస్పత్రి కార్మికుల నిరసన -
ప్రతిపాదనలతోనే సరి..
● మరమ్మతులకు నోచుకోని వసతిగృహాలు ● పలు భవనాల్లో పైకప్పు లీకేజీలు, దెబ్బతిన్న గోడలు, మరుగుదొడ్లు ● వేసవి సెలవుల్లో దృష్టి సారించని యంత్రాంగం చిన్నచిన్న పనులైనా చేయించాలి చాలా హాస్టళ్లలో బాత్రూమ్లకు తలుపులు, గదుల్లో కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొన్నిచోట్ల పడుకునే పరిస్థితి లేదు. చిన్నచిన్న మరమ్మతులైనా చేయిస్తే విద్యార్థులకు కాస్త ఉపశమనంగా ఉంటుంది. – వంగూరి వెంకటేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శిమళ్లీ పాత సమస్యలే.. నూతన విద్యాసంవత్సరంలో వచ్చే విద్యార్థులకు హాస్టళ్లలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవుల్లో మరమ్మతులపై ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో వర్షాకాలంలో ఇబ్బంది ఎదురుకానుంది. – ఇటికాల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్, జిల్లా కార్యదర్శిఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల భవనాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కొన్ని భవనాలు మరమ్మతుకు గురి కాగా.. మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. భవనాల పైకప్పులకే లీకేజీలు, గోడలన్నీ పెచ్చులూడి, కిటికీలు దెబ్బతినడంతో పాటు విద్యుత్ వైరింగ్ సరిగా లేక విద్యార్థులు గత ఏడాదంతా అవస్థ పడ్డారు. అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల భవనాలను వేసవి సెలవుల్లో మరమ్మతు చేయించాలని ప్రతిపాదించగా ఎలాంటి స్పందన కానరాలేదు. దీంతో ఈనెల 12న వసతిగృహాలు తెరుచుకోనుండగా మళ్లీ విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి. ప్రతిపాదనలు ఇలా జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో మరమ్మతులకు అధికారులు రూ.20.20లక్షలతో అంచనాలు రూపొందించారు. అలాగే, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మధిర ఎస్టీహెచ్(షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్), ముదిగొండ మండలం వల్లభిలోని ఆశ్రమ పాఠశాల, తిమ్మారావుపేట ఎస్టీహెచ్, ఖమ్మం, ఖమ్మంరూరల్ పోస్ట్మెట్రిక్ కాలేజీల్లోనూ మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించారు. ఎస్సీ వసతి గృహాల్లోనూ వసతులు సక్రమంగా లేవు. జిల్లాలో మొత్తం 52 వసతి గృహాలకు గాను 49 ప్రభుత్వ భవనాల్లో, మిగిలిన మూడు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో మరమ్మతులకు రూ.2,42,11,000 అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించారు. సెలవులు వృథా వసతిగృహాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులే వసతి పొంది చదువుకుంటారు. ఏటా చిన్నచిన్న మరమ్మతులు చేయించాల్సి ఉన్నా కొన్నేళ్లుగా పట్టించుకోకపోవడంతో సమస్యల తీవ్రత పెరిగింది. కొన్ని వసతిగృహాల్లో స్లాబ్ కురుస్తుండగా రిపేర్ చేయించకపోవడంతో ప్రస్తుతం పెచ్చులు ఊడి పడుతున్నాయి. వేసవిలో 50 రోజుల సెలవులు వచ్చినా భవనాల మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం వహించడం గమనార్హం. కొన్ని వసతిగృహాల్లో బాత్రూమ్లకు తలుపులు కూడా లేవని, మరికొన్ని భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని చెబుతున్నారు. నిర్మాణానికి ఆదేశాలు జిల్లాలో శిథిలావస్థకు చేరిన మూడు బీసీ సంక్షేమ వసతిగృహాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి బీసీ సంక్షేమశాఖ నిధులను మంజూరు చేసింది. ఒక్కో హాస్టల్కు రూ.3 కోట్ల చొప్పున మూడింటికి రూ.9 కోట్లు మంజూరయ్యాయి. ఖమ్మం ముస్తఫానగర్లోని బీసీ బాయ్స్ హాస్టల్, జహీర్పురలో బీసీ గర్ల్స్ హాస్టల్, రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని బీసీ హాస్టళ్లకు భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ మూడు భవనాలు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.జిల్లాలోని వసతిగృహాల వివరాలు సంక్షేమశాఖ వసతిగృహాలు బీసీ 33ఎస్సీ 52ఎస్టీ 30 -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఖమ్మం లీగల్: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖరరావు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం న్యాయ సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో చంద్రశేఖరరావు, మొబైల్ కోర్టు న్యాయమూర్తి నాగలక్ష్మి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతా ఆరోగ్యం ఉండడం, పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మువ్వా నాగేశ్వరరావు, న్యాయ సేవా సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. డ్రోన్లు, ఈవీల మరమ్మతుల్లో మహిళలకు శిక్షణ ఖమ్మంఅర్బన్: ఐటీఐ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణం ఆధ్వర్యాన తొలిసారి డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఐటీఐ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు జత చేసిన దరఖాస్తులను టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో ఈనెల 9నుంచి 12వరకు అందజేయాలని సూచించారు. నెల పాటు శిక్షణ కోసం ప్రతీ ట్రేడ్లో ముప్ఫై మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. కాగా, డ్రోన్ మరమ్మతుల శిక్షణకు ఏదైనా ట్రేడ్లో ఐటీఐ, ఈవీ మెకానిక్ శిక్షణకు డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్హులైన వారు అర్హులని మేనేజర్ వెల్లడించారు. నిరంతర సరఫరా కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లు బోనకల్: మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్ ఎన్.వీ.వేణుగోపాలాచారి తెలిపారు. బోనకల్ రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. రావినూతల, చొప్పట్లుపాలెం గ్రామాల రైతులు తమ సుబాబుల్ తోటల మీదుగా 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండడంతో గాలిదుమ్ము వచ్చినప్పుడు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. అలాగే, మరికొందరు అదనపు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వేణుగోపాలాచారి మాట్లాడుతూ వినియోగదారులు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో ఫోరం సభ్యులు కె.రమేష్, చరణ్దాస్, ఎం.రామారావు, వైరా డీఈ బి.శ్రీనివాసరావు, ఏడిఈ పి.కిరణ్కుమార్, ఏఈలు సుందర్కుమార్, సాయికుమార్, టి.మనోహర్, ఎస్ఏఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ కవచధారణలో రామయ్యభద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు. -
మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి
సత్తుపల్లి: మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు స్థానిక తామరచెరువు వద్ద అటవీ ప్రాంతంలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని విద్యానగర్ రోడ్డుకు చెందిన ఎస్కె.ఖాదర్బీ(70) మతిస్థిమితం లేకపోవడంతో తామరచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. దీంతో అటవీశాఖ ఉద్యోగులు ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోడీ పాలనలో దేశం అభివృద్ధి
ఖమ్మం మామిళ్లగూడెం : ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి, జాగృతి ఇండస్ట్రీస్ చైర్మన్ ఓ.శ్రీనివాసరెడ్డి అన్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలోని ఓ హోటల్లో గురువారం జిల్లా కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు అమలు చేసిందని, ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ విజయదుందిబి మోగిస్తుందని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఇటీవల ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో దేశ ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరిగిందని అన్నారు. ఈ కార్యశాలలో పార్టీ రాష్ట్ర నాయకులు గెంటేలా విద్యాసాగర్, కూసంపూడి రవీందర్, శీలం పాపారావు, ఈవీ.రమేష్, నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, అల్లిక అంజయ్యయాదవ్, శ్యాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. విపత్తు నివారణ చర్యలపై అవగాహన ఖమ్మంసహకారనగర్: విపత్తు సమయాన చేపట్టాల్సిన నివారణ చర్యలపై గురువారం స్థానిక ఎస్బీఐటీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశాలతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), హైదరాబాద్ విద్యార్థులకు స్కూల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి జాతీయ విపత్తు నివారణ సంస్థ ఇన్స్పెక్టర్ గౌతమ్, వారి బృందం, జిల్లా విద్యాధికారి సామినేని సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విపత్తు సమయం చెప్పిరాదని, అది జరిగిన వెంటనే స్పందించేందుకు యువత ముందుండాలన్నారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ సేవాలను కొనియాడుతూ.. గతేడాది ముంపు సమయాన యువత అందించిన సేవలను గుర్తుచేశారు. అనంతరం కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జి.ధాత్రి మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం, వరదలు, భూకంపం వంటి విపత్కర పరిస్థితుల్లో అవలంబించాల్సిన కనీస ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కలిగించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ జి.రాజ్కుమార్, కళాశాల అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏవీవీ శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీఈటీ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం బోనకల్/ఖమ్మంమామిళ్లగూడెం: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న వత్సవాయి నరేశ్ ఇటీవల చింతకాని మండలం నాగులవంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఖమ్మం జిల్లా బీసీ గురుకుల ఉద్యోగులు తలాకొంత వేసుకుని రూ.2 లక్షలు సమకూర్చారు. ఈమేరకు గురువారం జిల్లా ఆర్సీఓ సీహెచ్.రాంబాబు, డీసీఓ సుష్మ, బోనకల్ పాఠశాల హెచ్ఎం జ్యోతిర్మయిలు మండలంలోని మోటమర్రి గ్రామంలోని మృతుడి అమ్మమ్మ, తాతయ్య వంగాల పద్మ, బ్రహ్మంలకు అందజేశారు. మేడేపల్లి పంచాయతీకి పురస్కారం ముదిగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండలపరిధిలోని మేడేపల్లి గ్రామపంచాయతీ రాణించడంతో రాష్ట్రస్థాయి అవార్డు ఎంపికై ంది. పర్యావరణం పరిరక్షణకు అమలు చేసిన విధానాలు, సేంద్రియ ఎరువు తయారి, తడి,పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలను అమలు చేసినందుకు గాను ఎంపికై ంది. ఈమేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని టీజీపీసీబీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ చేతులమీదుగా పంచాయతీ కార్యదర్శి రమ్య గురువారం పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో మండల అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ఆయిల్ ‘ఫామ్’లోకి వచ్చేలా..
● జిల్లాలో 14,500 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక ● ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ కంపెనీల ద్వారా పంట సాగు ● ఇదే సమయాన పండ్లు, కూరగాయల తోటల సాగుకు ప్రోత్సాహంఖమ్మంవ్యవసాయం: ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత కొంత కాలంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు తోడు, ఇక్కడి భూములు, వాతావరణం, నీటి లభ్యత అనుకూలిస్తుండడం, పంట కొనుగోలుకు పరిశ్రమలు ఉండడం సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతున్నాయి. పోషకాలున్న పామ్ ఆయిల్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొ ని రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుకు ప్రాధాన్యం ఇస్తుంది. పామ్ ఆయిల్ ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్ తదితర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న తరుణాన.. ఇక్కడ పంట సాగుకు వనరులుండడంతో పాటు డిమాండ్ కూడా ఉండడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యాన రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పంట సాగుకు నేలలు అనుకూలంగా ఉండగా 2022 నుంచి 2027 వరకు 30 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయాలని నిర్దేశించింది. దీనిలో భాగంగా ప్రతి ఏటా పంట సాగు లక్ష్యాలను విధిస్తున్నారు. జిల్లాలో పంట సాగు విస్తీర్ణం 28,184 ఎకరాలు కాగా 2022 నుంచి 2025 వరకు మూడేళ్ల కాలంలో 21,390 ఎకరాల్లో సాగవుతోంది. రూ. 56 కోట్ల నిధులతో.. జిల్లాలో 2025–26 సంవత్సరంలో రూ.56 కోట్లతో 14,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక రూపొందించారు. నాలుగేళ్ల కాలపరిమితితో ఆయిల్ ఫెడ్ ద్వారా 9,250, గోద్రెజ్ ద్వారా 5,250 ఎకరాల్లో పంట సాగుకు నిర్ణయించారు. ఒక్కో ఎకరానికి డ్రిప్, మొక్కలు, అంతర పంటల సాగుకు రూ.38,600 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. డ్రిప్ పరికరాలకు మొదటి విడతలో 1,710 ఎకరాలకు గాను రూ.16.17 కోట్లను కేటాయించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి 100 శాతం, వెనకబడిన తరుగుతులు, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీలు కల్పిస్తున్నారు. మొక్కలకు ఎకరాకు రూ.11,600 రాయితీతో పాటు అంతరపంటలకు ఎకరాకు రూ.4,200 రాయితీ అందించేలా నిర్ణయించారు. డిసెంబర్ నాటికి లక్ష్యాలను చేరే విధంగా ప్రణాళికలు రూపొందించారు. పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు సమీకృత ఉద్యా మిషన్ పథకం ద్వారా పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహకాలను అందించేలా ప్రణాళిక రూపొందించారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, అంజీర, అవకాడో, బొప్పాయి, ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, హైబ్రిడ్ కూరగాయలు, పూల తోటలను మొత్తం 227 హెక్టార్లలో పెంపకానికి రాయితీలు కల్పించారు. అంతేకాక 13 హెక్టార్లలో ముదరు మామిడి తోటల పునరుద్ధరణకు, 540 హెక్టార్లలో మల్చింగ్ షీట్లకు, రెండు ప్యాక్ హస్ యూనిట్లకు, ఉద్యాన యాంత్రీకరణ 63 యూనిట్లకు, ఫ్రూట్ కవర్లకు, వీడ్ మ్యాట్లకు నిధులు కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద తీగజాతి కూరగాయల శాశ్వత పందిర్లు 50 యూనిట్లకు రూ. 25 లక్షలు కేటాయించారు. జాతీయ వెదురు మిషన్ పథకం కింద 50 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రాయతీలను కల్పించారు. ఇందుకోసం రూ.7.20 లక్షలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.ప్రోత్సాహకాలను వినియోగించుకోండి.. రైతుల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. పంట సాగుతో అనేక ప్రయోజనాలుండగా.. మార్కెటింగ్కు జిల్లాలో పరిశ్రమలు కూడా నెలకొల్పబడి ఉన్నాయి. పండ్ల తోటలకూ ప్రోత్సాహకాలను అందిస్తున్న నేపథ్యాన ఆసక్తి కలిగిన రైతులు సమీప ఉద్యాన అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. – ఎం.వీ.మధుసూదన్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారిఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన నంబర్లు అధికారి సెల్ నంబర్ మండలాలు పి.అపర్ణ 89777 14104 కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఎ.విష్ణు 89777 14113 ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం ఎ.వేణు 89777 14105 వైరా, కొణిజర్ల, కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు జి.నగేష్ 89777 14103 ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి జి.శ్రావణి 89777 14114 సత్తుపల్లి, వేంసూరు -
పెరిగిన ఎండ తీవ్రత
ఖమ్మంవ్యవసాయం: ఎండ తీవ్రత పెరిగింది. గురువారం అత్యధికంగా తల్లాడ మండలం కుర్నవల్లిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 40.1 డిగ్రీలుగా నమోదు కాగా, తల్లాడలో 39.9, వైరాలో 39.8, పల్లెగూడెం, గౌరారంలో 39.6, కాకరవాయిలో 39.5, వైరా ఏఆర్ఎస్ వద్ద 39, ఖమ్మం ప్రకాశ్నగర్, పెద్దగోపతిలో 38.9, ముదిగొండ, ఎర్రుపాలెంలో 38.8, పమ్మి, కల్లూరు, పెనుబల్లిలో 38.7, వేంసూరు, చింతకానిలో 38.6, కొణిజర్ల, బాణాపురం, ఏన్కూర్లో 38.4, నేలకొండపల్లి, మధిరలో 38.3, మధిర ఏఆర్ఎస్, ఖమ్మం ఖానాపురం, సత్తుపల్లి ఓసీల వద్ద 38.2, సత్తుపల్లి, రావినూతల, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ వద్ద 38.1, సదాశివునిపాలెంలో 38, గేటుకారేపల్లి, రఘునాథపాలెం, లింగాల, సిరిపురంలలో 37.9, కూసుమంచి, నాగులవంచ, గంగారం, పంగిడి, తిరుమలాయపాలెంలో 37.8, తిమ్మారావుపేట 37.7, గుబ్బగురి, మంచుకొండలలో 37.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా.. రైతులు మాత్రం పంటల సాగుకు దుక్కలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
అర్బన్ మలేరియా సిబ్బంది విధుల పరిశీలన
ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని మున్సిపాటిలీ కార్యాలయంలో గల అర్బన్ మలేరియా పథకంలో పనిచేస్తున్న సిబ్బంది విధులను గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఇన్స్పెక్టర్ మహ్మద్ మన్నన్, హెల్త్ అసిస్టెంట్ హరీష్, ఫీల్డ్వర్కర్ రామకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో సిబ్బంది అటెండెన్స్తో పాటు విధులను పరిశీలించారు. అనంతరం రోటరీనగర్, లెనిన్నగర్, సారథినగర్ ప్రాంతాల్లోని మురికి కాల్వల్లో ఆంటీ లార్వ స్ప్రే పనులను పరిశీలించి దోమల నివారణపై పలు సూచనలు చేశారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని, జ్వరం వచ్చిన వెంటనే మలేరియ, డెంగీ పరీక్షలు చేయించాలన్నారు. పాజిటివ్గా నమోదైతే ఆ ఇంటి పరిసరాలలో ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే చేయించి ఇతరులకు సంక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో అందరూ క్షేత్రస్థాయిల్లో ఉండి విధుల్ని నిర్వర్తించాలని, కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
ఖమ్మంసహకారనగర్: నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, రూ.100 వెరిఫికేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెన్నిస్ విజేతలకు బహుమతులుఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నెల రోజులుగా జరుగుతున్న లాన్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ బాధ్యులు సత్యనారాయణ, కై లాస్ తదితరులు పాల్గొన్నారు. ‘శాయ్’ తనిఖీ తర్వాతే సింథటిక్ ట్రాక్ పనులు.. ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆధునిక సింథటిక్ ట్రాక్ పనులను ఇప్పటికే జిల్లా యువజన క్రీడల శాఖ లాంఛనంగా ప్రారంభించింది. అయితే, భవిష్యత్లో ఇబ్బందులు ఎదురుకాకుండా నిర్దేశిత నమూనాలతో నాణ్యతగా పనులు జరిగేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) అధికారులు పరిశీలించాకే పనులు మొదలు కానున్నాయని తెలిపారు. దీంతో శాయ్ అధికారులు ఎప్పుడు వస్తారని కాంట్రాక్టర్ ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. ఇప్పటికే ట్రాక్ చుట్టు మట్టి తవ్వకం పూర్తిచేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ముదిగొండ: పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. కోదాడ – ఖమ్మం జాతీయ రహదారిపై గేదెను ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలో కార్పెంటర్ పనులు ముగించుకుని బైక్పై ఇద్దరు వ్యక్తులు నేలకొండపల్లి వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో ముదిగొండ సమీపానికి రాగానే రహదారిపై గేదెలను గమనించక బైక్ ఢీకొట్టడంతో వెనక కూర్చున్న గోవిందాచారి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలయ్యాయి. విద్యుదాఘాతంతో యువకుడు.. ఖమ్మం అర్బన్: కరెంట్ షాక్తో చేపలు పట్టే ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని 8వ డివిజన్ ఎల్బీనగర్కు చెందిన తురాయి రాజు(28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం అతడు తన స్నేహితులు సైదులు, తురాయి వీరభద్రం, తురాయి శివలతో కలిసి ఇంటికి సమీపంలో ఉన్న ఎన్నెస్పీ కాలువ వద్ద కరెంట్ షాక్తో చేపలు పట్టేందుకు వెళ్లారు. కాలువ పక్కన ఉన్న కరెంట్ లైన్పై విద్యుత్ తీగను వేసి చేపలు పడుతుండగా రాజు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. వెంటనే విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోవడంతో స్నేహితులు అతడిని బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించగా.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం అర్బన్ ఖానాపురం హవేలీ సీఐ ఆర్.భానుప్రకాష్ తెలిపారు. కారు పల్టీకొట్టి డ్రైవర్.. కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం ఓ కారు పల్టీ కొట్టగా.. ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం (25) గురువారం హైదరాబాద్ నుంచి ఖమ్మానికి కారులో వస్తుండగా.. జీళ్లచెరువు ఫ్లైఓవర్ పైకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈఘటనలో ఇబ్రహీం అక్కడికక్కడే మృతిచెందగా.. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహకారంతో పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
తిరుమలాయపాలెం: వైద్య సేవల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్గౌడ్ అన్నారు. గురువారం తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వైద్యులు సమయపాలన పాటించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇక్కడ పని చేయడం ఇష్టం లేని వైద్యులు తమ వివరాలను తెలపాలని సూచించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు తిరుమలాయపాలెంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, మెరుగైన వైద్యసేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అమర్సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు, ప్రతాపరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. టెన్నిస్ విజేతలకు బహుమతులుఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నెల రోజులుగా జరుగుతున్న లాన్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ బాధ్యులు సత్యనారాయణ, కై లాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఊడిన టాటా ఏస్ స్టీరింగ్..
ఇల్లెందురూరల్/కారేపల్లి: గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుంచి కారేపల్లి మండలం పోలెంపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనంలో ఒక కుటుంబం గురువారం ఉదయం బయలుదేరింది. మార్గమధ్యలో ఇల్లెందు మండలంలోని రాజీవ్నగర్తండా శివారులో అకస్మాత్తుగా స్టీరింగ్ ఊడిపోవడంతో టాటాఏస్ వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పోలెబోయిన సుభద్ర, దొడ్ల నర్సమ్మ, రమేష్, పోలెబోయిన వెంకటనర్సు, పోలెబోయిన లక్ష్మి, డ్రైవర్ పూనెం కృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన సుభద్ర, నర్సమ్మ, వెంకటనర్సులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫారసు చేశారు. మిగిలిన నలుగురికి ఆస్పత్రిలో వైద్యసాయం అందించారు.ఆరుగురికి తీవ్ర గాయాలు -
డీఎంహెచ్ఓ కార్యాలయంలో సంబరాలు
ఖమ్మంవైద్యవిభాగం: ఫార్మాసిస్టులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గేజిట్ ద్వారా ‘ఫార్మసీ ఆఫీసర్’గా ప్రమోషన్ ఇచ్చిన సందర్భంగా గురువారం ఐడీఓసీ ప్రాంగణంలోని స్ఫూర్తి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల లాగే పేషంట్లను ఆరోగ్యవంతులుగా చేయడంలో ఫార్మసీ ఆఫీసర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఆదేశాలు అందిన నేపథ్యాన ఇకనుంచి ఫార్మాసిస్ట్ గ్రేడ్–1ను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్గా, గ్రేడ్–2ను ఫార్మసీ ఆఫీసర్గా, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ను జిల్లా ఫార్మసీ ఆఫీసర్గా మారుస్తూ జీఓ నంబర్ 71 ద్వారా తెలియజేయడం అభినందనీయమన్నారు. ఫార్మాసీ ఆఫీసర్లు ఈ ఔషది పోర్టల్లో కూడా మందుల వివరాలు అన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్ఓను ఫార్మసిస్టులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ చందునాయక్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రామారావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్ (ఇన్చార్జ్) మోహన్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్ మంగీలాల్, పద్మ, లింగమూర్తి, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం
● ఆయిల్పామ్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలి ● రైతులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచనవైరారూరల్: రెవెన్యూ సదస్సులతో భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. మండలంలోని పూసలపాడులో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించే క్రమంలో క్షేత్రస్థాయికి వెళ్లి భూమి ఎవరి కబ్జాలో ఉందో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆయా దరఖాస్తులను హైకోర్టు తీర్పు ప్రకారం పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 600 మంది ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో గ్రామకంఠ సర్వేలు నిర్వహించి అసైన్మెంట్ భూములు పేదల వద్ద ఉంటే వారికి పట్టాలు ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉందని తెలిపారు. భూ హక్కుల రికార్డులపై ప్రజలకు ఏమైనా అభ్యంతరాల పరిష్కారానికి తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు రెవెన్యూ కోర్టు వ్యవస్థ ఏర్పాటైందని, పైసా ఖర్చు లేకుండా భూ వివాదాలు పరిష్కారం అవుతాయని వివరించారు. రైతులు సంప్రదాయ పంటలే కాకుండా ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు.. ప్రైవేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు వస్తున్నాయని, ప్రభుత్వ విద్యపై నమ్మకం ఉంచి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ కోరారు. మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులను పాఠశాలకు తరలించేందుకు 7 సీటర్ ఆటోలను ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నామని, 6 నెలల్లో స్పష్టమైన మార్పు వస్తుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ సామినేని సత్యనారాయణ, తహసీల్దార్ కె.వి. శ్రీనివాసరావు, ఎంపీడీఓ పి.సరస్వతి, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అడ్మిషన్ల పెంపునకు బడిబాట ఖమ్మంగాంధీచౌక్: ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట ద్వారా అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఇందిరా డెయిరీ ఏర్పాటుకు రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ రెండు అంశాలపై సంబంధిత అధికారులతో గురువారం ఐడీఓసీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, నూతనంగా చేపట్టిన ఉపాధ్యాయుల నియామకం తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. పక్కా ప్రణాళికతో ఇందిరా డెయిరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లక్ష్యం మేరకు గేదెల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమాధికారులు కె.సత్యనారాయణ, జ్యోతి, విజయలక్ష్మి, పురంధర్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. -
విపత్తు సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి
కూసుమంచి : విపత్తులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత అధికారులను కోరారు. కూసుమంచి రైతువేదికలో గురువారం విపత్తుల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు, సిబ్బంది సమన్వయంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తే నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. జిల్లా స్థాయి నుంచి ప్రమాద హెచ్చరికలు రాగానే ప్రతిస్పందిచాలని, వరదల సమయాల్లో ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, వైద్యాధికారి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించగా మిల్లర్లు అధికంగా కోత పెడుతున్నారని పలువురు రైతులు శ్రీలతకు ఫిర్యాదు చేశారు. దీంతో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఏపీఎం తిరుమలరావుకు ఆమె సూచించారు. -
పొంచి ఉన్న ముప్పు
● వానాకాలంలో అప్రమత్తత తప్పనిసరి ● సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక ● ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని అవగాహన జిల్లాలో కొన్నేళ్లుగా నమోదైన వ్యాధుల వివరాలు ఏడాది డెంగీ మలేరియా చికున్గున్యా 2022 711 02 98 2023 530 – – 2024 529 – – 2025 03 – – (ఇప్పటివరకు) ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. త్వరలోనే వర్షాకాలం సీజన్ పూర్తిస్థాయిలో మొదలుకానుంది. అయితే, వర్షాల కారణంగా రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు పెరిగితే వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యాన జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలోని సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాల పరిధిలో వ్యాధుల కట్టడికి వివిధ శాఖలతో కలిసి సంయుక్త కార్యాచరణకు సమాయత్తమైంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో డెంగీ, మలేరియా, చికున్గున్యా, విషజ్వరాలు వంటివి ప్రబలే ప్రమాదముంది. అయితే, వ్యాధుల వ్యాప్తి మొదలుకాక ముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాప్తి చెందిన తర్వాత కట్టడి చేయడం కంటే ముందుగా మేల్కొంటే మంచిదని అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లతో పాటు పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని చెబుతూ.. జిల్లాలో గతంలో కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకై తే తక్కువే.. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకై తే వ్యాధుల వ్యాప్తి తక్కువే. వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, విషజ్వరాలు నమోదైనా అంతగా ప్రభావం కనిపించలేదు. అలాగే డెంగీ కూడా ఇప్పటి వరకు మూడు కేసులే నమోదయ్యాయి. ఇక మలేరియా, చికున్గున్యా కేసులు ఒక్కటీ రాలేదు. కానీ గతంలో జిల్లాలో డెంగీ వైరస్ ప్రభావం తీవ్రంగా చూపించింది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 529 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారు ఆస్పత్రుల్లో సంప్రదిస్తున్నా ఇబ్బందికర పరిస్థితులైతే లేవు. కానీ మున్ముందు డెంగీ కేసులు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా చర్యలు చేపడుతూనే ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ఇదీ ముందస్తు ప్రణాళిక ఖాళీ స్థలాలు, సైడ్ డ్రెయిన్లు, కుండలు, పూలకుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ ప్రతీ గ్రామం, డివిజన్లలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అలాగే, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో టిమోపాస్, ఆయిల్ బాల్స్ వేస్తారు. టైర్లు, పాత సామగ్రి, కొబ్బరి బొండాల షాపుల యజమానులను అప్రమత్తం చేసి ఎక్కడ పడితే అక్కడ వాటిని పడేస్తే ఎదురయ్యే అనర్థాలను వివరిస్తారు. జ్వరం వచ్చిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇళ్లు, సమీప నివాసాల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్ఆర్టీ బృందాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పాజిటివ్ కేసుల సిరమ్ షాంపిళ్లు సేకరించడమే కాక అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. -
వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డితో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి వారికి అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, నాయకులు వేమిరెడ్డి త్రివేణి, బాణావత్ శ్రీనివాసరావు, వేమిరెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పచ్చదనాన్ని కాపాడాలిఖమ్మం లీగల్ : భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని కాపాడడం అందరి బాధ్యత అని న్యాయమూర్తులు ఏపూరి బిందుప్రియ, నాగలక్ష్మి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్లో మొక్కలు నాటి.. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వాచ్ టవర్, నర్సరీ, బోటింగ్ ట్యాంక్, యోగా షెడ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. పార్క్లో చేపట్టిన పరిశుభ్రత, మొక్కల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాహుల్ తదితరులు పాల్గొన్నారు. సర్వే వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ శ్రీజఎర్రుపాలెం: భూ భారతిలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సర్వే సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ములుగుమాడులో నిర్వహిస్తున్న భూముల రీసర్వే తీరును గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత బనిగండ్లపాడు ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి, వైద్య సేవలు, పరీక్షలపై ఆరా తీశారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అనుమతి లేకుండా గైర్హాజరు కావొద్దని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెరుగైన వైద్య సేవలందించాలి.. వైరా: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆమె రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. -
మన్మోహన్ సింగ్ ‘ఎర్త్ సైన్సెస్’..
● కొత్తగూడెం వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు ● తెలంగాణ కేబినెట్ సమావేశంలో లభించిన ఆమోదం ● జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇటీవల మంజూరైన ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే రెండోది సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో మొదలై యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (కాకతీయ)గా అప్గ్రేడ్ చెందిన కేఎస్ఎం ప్రస్థానంలో మరో ఎత్తుకు చేరుకుంది. ఇటీవల ఈ కాలేజీని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఇప్పుడీ కాలేజీకి ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరును పెట్టింది. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి విశ్వవిద్యాలయం కేవలం అమెరి కాలోనే ఉంది. రెండోది కొత్తగూడేనికి మంజూరైంది. అందించే కోర్సులు ప్రపంచంలో రెండో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కావడంతో దేశ విదేశాల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు ఇక్కడకు వచ్చే అవకాశముంది. కాలేజీ రాకతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతోపాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. కళకళలాడనున్న క్యాంపస్ గ్రాడ్యుయేషన్లో జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సులు ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో కెమిస్ట్రీ అందుబాటులోకి తేనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు పీహెచ్డీ చేయొచ్చు. ఇప్పటికే క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో మైనింగ్, కంప్యూటర్సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతీ కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉండగా ఎర్త్ సైన్సెస్ సబ్జెక్టులు రావడంతో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. అన్ని అనుకూలతలే.. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఉన్నాయి. నేషనల్ హైవేకు సమీపంలో వర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం సమీపంలో మినీ స్టీల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్, ఫెర్రో అల్లాయిస్, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. జిల్లాలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉండగా, ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు, రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. దీనివల్ల భవిష్యత్లో నీటి ఇబ్బందులు ఉండవు. ఇలా కొత్తగూడేనికి ఉన్న అనుకూలతలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంజూరు చేయించేందుకు మంత్రి తుమ్మల నిర్విరామంగా కృషి చేశారు. ఇప్పుడు మన్మోహన్సింగ్ పేరు పెట్టడంతో వర్సిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరగనుంది. -
బెస్ట్ చదువు కోసం..
●ఎవరెవరు అర్హులు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి ప్రభుత్వం పలు అర్హతలను నిర్ణయించింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించొద్దు. జిల్లాకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఒకటో తరగతిలో చేరేందుకు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించిన వారు (5 – 6 ఏళ్ల వయస్సు) అర్హులు. కాగా, విద్యార్థుల ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా జరుగుతుంది. సీట్ల కేటాయింపులో ఎస్సీ కేటగిరీ –1 ఉపకులాల వారికి 1 శాతం, ఎస్సీ కేటగిరీ – 2 ఉపకులాల వారికి 9 శాతం, ఎస్సీ కేటగిరి – 3 ఉపకులాల వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఒకవేళ నిర్ణీత సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2025 – 26 విద్యాసంవత్సరంలో ఈ పథకం ద్వారా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఐదో తరగతిలో రెసిడెన్షియల్ విధానం, ఒకటో తరగతిలో డే స్కాలర్లకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 5వ తరగతికి 131, 1వ తరగతికి 128 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ముందుకొచ్చే ప్రైవేట్ స్కూళ్లను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా ఎంపిక చేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. రిజర్వేషన్లు ఇవే.. ఈ పథకం ద్వారా ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రులు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉండొద్దు. సీట్ల కేటాయింపులో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. 50 శాతం సీట్లు వ్యవసాయ కూలీల పిల్లలకు, మొదటి తరం విద్యార్థులకు(కుటుంబంలో మొదటిసారి చదువుకుంటున్న వారికి) కేటాయిస్తారు. మిగిలిన 50 శాతంలో అనాథలకు 20 శాతం, జోగినుల పిల్లలకు 15 శాతం, బాండెడ్ లేబర్ పిల్లలకు 15 శాతం సీట్లు ఉంటాయి. అందజేయాల్సిన పత్రాలు దరఖాస్తుతో పాటు అధికారులు సూచించిన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు జత చేయాలి. ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి మార్కుల జాబితా, ఒకటో తరగతికి పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్ లేదా ఆధార్ కార్డు జిరాక్సు, మీ–సేవ ద్వారా జారీ చేసిన నూతన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. ఈనెల 16న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ఫారాలను కలెక్టరేట్లోని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.ఎస్సీ విద్యార్థులకు మంచి అవకాశం భవిష్యత్లో ఉన్నత విద్యను అభ్యసించేలా ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం సీట్లు కేటాయించింది. బీఏఎస్ పాఠశాలల్లో వీరికి నాణ్యమైన విద్య అందుతుంది. – కస్తాల సత్యనారాయణ, ఎస్సీ డీడీచిన్నారుల ఉజ్వల భవిష్యత్కు పునాది బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు 1, 5వ తరగతుల్లో 259 మంది విద్యార్థులకు అవకాశం ఎంపిక చేసిన ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు -
ముగిసిన వేసవి క్రీడా శిబిరాలు
ఖమ్మం స్పోర్ట్స్ : క్రీడా శిక్షణలు నిరంతరం కొనసాగేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని ఖమ్మం డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, తహసీల్దార్ పుల్లయ్య అన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నెల రోజులుగా సాగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలోనే క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టేడియంలో ప్రాక్టిస్ చేసిన క్రీడాకారులే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారంటే ఎలాంటి క్రీడా సౌకర్యాలు, శిక్షకులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ శిక్షకులు ఎండీ.గౌస్, ఎండీ అక్బర్ అలీ, ఉదయ్కుమార్, క్రీడా సంఘాల ప్రతిధులు వీవీఎస్ మూర్తి, సురేష్, గోపికృష్ణ, శ్రీనివాసరావు, కొండల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలాలు కావలెను..
● వైరాలో కార్యాలయాలకు కొరత ● భవనాలు మంజూరైనా స్థలాలు లేక ఏర్పాటులో జాప్యం ● ఎంవీఐ కార్యాలయం తరలింపునకు నిర్ణయంవైరా: రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాఖల వారీగా వైరా నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కానీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న స్థలాల రక్షణపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. ఒకవేళ ప్రభుత్వ భూములను అక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాలనుకున్నా రాజకీయ ఒత్తిడి ఎదురవుతోంది. స్థలాల కోసం వెదుకులాట వైరా మండలంలో 22 పంచాయతీలు, మూడు శివారు గ్రామాలు న్నాయి. నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఉన్నా.. పట్టణ పరిధిలో ఎక్కువగా ఎన్నెస్పీ స్థలాలే ఉన్నాయి. రెవెన్యూ శాఖ పరిధిలో మండలంలోని ముసలిమడుగు, రెబ్బవరం, గరికపాడు, విప్పలమడక, బ్రాహ్మణపల్లి, సోమవరం, స్టేజీపినపాక ప్రాంతాల్లో ఎకరం మించి ప్రభుత్వ భూములు లేవు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సరిపడా భూమి లేక ఉన్న వాటిలోనే సర్దుకుంటున్నారు. ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం 15 ఏళ్లుగా అద్దె భవనంలోనే నిర్వహించారు. చివరకు నిర్వహణ భారంగా మారడంతో ఇటీవలే పాత పంచాయతీ కార్యాలయంలోకి తరలించారు. అలాగే, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తుండగా.. ఫైర్స్టేషన్ను వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలోని ఒక భవనంలో ఏర్పాటుచేశారు. ఫలితంగా ఫైరింజన్కు షెడ్డు లేక వానకు తడుస్తూ, ఎండకు ఎండుతోంది. ఇదే ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం కూడా నిర్వహిస్తుండగా ఇరుకు భవనం కావడం, టాయిలెట్ సదుపాయం కూడా లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు ఏఓ కార్యాలయాన్ని రేకుల షెడ్డులోనే నిర్వహిస్తుండగా, మత్స్య విత్తనాభివృద్ధి భవనం శిథిలావస్థలోకి చేరింది. ఇలా చాలా కార్యాలయాలకు సరైన భవనాలు లేకపోగా.. ప్రభుత్వ స్థలాల కొరతతో నిధులు మంజూరైనా నిర్మాణానికి ముందుకు సాగడం లేదు. రెబ్బవరానికి ఎంవీఐ ఆఫీస్ 30 ఏళ్ల క్రితం ఎన్నెస్పీ పాత భవనంలో రవాణాశాఖ యూనిట్ కార్యాలయం ఏర్పాటు చేయగా అది శిథిలావస్థకు చేరింది. అలాగే, ఈ భవనాన్ని ఆనుకుని వంద పడకల ఆస్పత్రి భవనం నిర్మాణం చేపట్టడం, భవనానికి ప్రధాన రహదారి రవాణా శాఖ కార్యాలయం నుంచే ఇవ్వడంతో సమస్య ఎదురైంది. దీంతో కార్యాలయాన్ని రెబ్బవరంలోని మూడెకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రెబ్బవరానికి ఎంవీఐ కార్యాలయం తరలిస్తే అటు మధిర నియోజకవర్గం, ఇటు ఇటు వైరా, మరోపక్క సత్తుపల్లి మండలంలోని తల్లాడ వాసుల ఇక్కట్లు తీరతాయని.. అక్కడ డ్రైవింగ్ టెస్టు ట్రాక్ కూడా ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చారు. సబ్స్టేషన్లకు కూడా.. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని వైరాకు రెండు విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేశారు. కానీ వీటి నిర్మాణాలకు స్థలాలు లేక అధికారులు అన్వేషణలో పడ్డారు. మండలంలోని విప్పలమడకలో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం మూడెకరాలు స్థలాన్ని మాత్రం గుర్తించగలిగారు.సర్వే చేస్తున్నాం.. వైరా మండలంలో ప్రభుత్వ భూముల గుర్తింపునకు సర్వే చేస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, విద్యుత్ సబ్స్టేషన్లకు తొలుత స్థలాలు గుర్తించనున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి భూములు ఆయా శాఖలకు అప్పగిస్తాం. – కే.వీ.శ్రీనివాసరావు, తహసీల్దార్, వైరా -
మళ్లీ ఆదర్శ రైతులు!
● అధికారులు – రైతులకు అనుసంధానంగా వ్యవస్థ ● రైతు వేదికల నిర్వహణ సైతం అప్పగించే యోచన ● ఎంపికకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంబూర్గంపాడు: ఆదర్శ రైతు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెస్తోంది. గతంలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ రైతుల వ్యవస్థ తీసుకువచ్చారు. వ్యవసాయ అధికారులకు, రైతులకు మధ్య అనుసంధాన కర్తలుగా ఆదర్శ రైతులు వ్యవహరించారు. నాడు ఆదర్శరైతులకు ప్రభుత్వం గౌరవ వేతనం కూడా అందించింది. రాష్ట్ర విభజన అనంతరం ఆదర్శ రైతు వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఓ ఏఈఓను నియమించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వేదికల నుంచే రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో, వ్యవసాయ నిపుణులతో పంటల సాగు, యజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆదర్శ రైతులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘వేదిక’కు పది మంది.. గ్రామాలను విత్తనోత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వం ఉచితంగా మేలురకం ఫౌండేషన్ సీడ్స్ను రైతులకు అందించి విత్తనోత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. రైతులే విత్తనాలు పండించి తోటి రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసార పరీక్షలు, పంటల నమోదు, సస్యరక్షణ చర్యలు, పంటల అమ్మకాలలో ఆన్లైన్ ప్రక్రియ తదితర పనులు వ్యవసాయ అధికారులకు భారంగా మారాయి. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులకు రైతులకు మధ్య వారధిగా ఉండేందుకు తిరిగి ఆదర్శ రైతులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైతు వేదిక పరిధిలో పది మంది వరకు ఆదర్శ రైతులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో నిర్వహణ భారం వ్యవసాయశాఖ అధికారులపై పడుతోంది. దీంతో నిధులు మంజూరు చేసి నిర్వహణ బాధ్యతలు ఆదర్శ రైతులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదర్శంగా.. పారదర్శకంగా... ఆదర్శ రైతుల ఎంపిక ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్న రైతులను, సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్న రైతులను, బాగా చదువుకుని వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగు చేస్తున్న రైతులను ఆదర్శ రైతులుగా నియమించే అవకాశాలున్నాయి. పంటల సాగుతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో రాణిస్తున్న రైతులను కూడా ఆదర్శరైతులుగా తీసుకోనున్నారు. గ్రామాల్లో డెయిరీ ఫామ్స్, ఫౌల్ట్రీ ఫామ్స్, గొర్రెలు, మేకల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన రైతులను కూడా ఆదర్శ రైతులుగా తీసుకోనున్నారు. గతంలో ఆదర్శ రైతులకు ప్రభుత్వం నెలకు రూ 1000 గౌరవ వేతనం అందించింది. ప్రస్తుతం మాత్రం గౌరవ వేతనంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టుగా సమాచారం. కాగా ప్రభుత్వం ఆదర్శ రైతులను నియమించేందుకు నిర్ణయించటంతో ఆశావహులు అప్పుడే ఉత్సాహం చూపిస్తున్నారు. అధికార కాంగ్రెస్లో ఉన్నవారు తమను ఆదర్శ రైతులుగా తీసుకోవాలని స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులను కలిసి విన్నవించుకుంటున్నారు. -
సేంద్రియ రైతుబజార్ రెడీ...
● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మంలో ఏర్పాటు ● ధ్రువీకరించిన 26మంది రైతులకు అవకాశం ● త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లుఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో సేంద్రియ రైతు బజార్(ఆరోగ్య మార్కెట్) ఏర్పాటవుతోంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండించిన ఆహార పంటలు ఆరోగ్యానికి హానీ కలిగిస్తున్నాయనే భావన పెరుగుతుండగా.. ప్రజలు ప్రకృతి సిద్దంగా పండించిన పంటల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వీటిని ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చేలా ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత మార్కెట్ ఆవరణలో సేంద్రియ రైతుబజార్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ షెడ్ను చికెన్, మటన్, చేపల అమ్మకానికి ఏర్పాటుచేసినా సత్ఫలితాలు రాకపోవడంతో సేంద్రియ రైతు బజార్కు కేటాయించారు. జిల్లాలో సేంద్రియ విధానాలతో ఆహార పంటలు, ఉత్పత్తులు చేస్తున్న రైతుల వినతితో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమ్మకాలకు రైతుల గుర్తింపు సేంద్రియ విధానంలో పంటలు పండించే రైతులతో పాటు ఇతర ఉత్పత్తులు తయారుచేసే వారిని ఇప్పటికే ఉద్యోగులు గుర్తించారు. వ్యవసాయ, ఉద్యాన తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ధ్రువీకరించాక వీరిని అమ్మకాలను అనుమతిస్తారు. సేంద్రియ విధానంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యం, చిరుధాన్యాలు, పండ్లతో పాటు గానుగ నూనెలు, మిరప, పసుపు పొడి, కంది, పెసర, మినుములు, పాలను ఇక్కడ అమ్మనున్నారు. ఈ మేరకు మార్కెట్లో 26 స్టాళ్లు ఏర్పాటుచేసుప్తండగా... కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం పండించే రైతులే కాక గానుగ నూనె, పప్పులు, పాలు, మసాలా పొడులు, జ్యూట్ బ్యాగులు తయారుచేసే 13 మందిని ఎంపిక చేశారు. మరో 13 మంది గుర్తింపునకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మొదటిసారి ఖమ్మంలో... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో తొలిసారిగా సేంద్రియ రైతు బజార్ ఏర్పాటవుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరల విక్రయానికి రైతు బజార్లు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో కూడా రైతు బజార్ల నిర్వహణ ఉంది. అయితే ప్రత్యేకంగా సేంద్రియ విధానంలో పండించే పంటలు, ఉత్పత్తుల కోసం ప్లాస్టిక్ రహితంగా ఈ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేటాయించిన షెడ్కు రంగులు వేసి బోర్డు ఏర్పాటుచేశారు. త్వరలోనే ఈ మార్కెట్ను ప్రారంభించేందుకు జిల్లా అధికారులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. సేంద్రియ ఉత్పత్తిదారులకే అవకాశం ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న రైతు బజార్లో సేంద్రియ విధానంలో సాగు చేసిన పంటలు, ఇతర ఉత్పత్తుల అమ్మకానికి అనుమతిస్తాం. అలాగే, మసాలా పొడులు, నూనెలు, జూట్ బ్యాగ్లు కూడా అమ్మేలా చూస్తాం. తొలుత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యాన విక్రయదారులను ధ్రువీకరిస్తాం. – మధుసూదన్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి -
ముంచుకొస్తున్న ముప్పు..
● నానాటికీ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● వివిధ కారణాలతో తరుగుతున్న అడవులు ● వాతావరణ సమతుల్యతకు మరింత విఘాతం ● పర్యావరణ పరిరక్షణే మార్గమంటున్న నిపుణులు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి చాలా ప్రమా దం పొంచి ఉందనేది ఇప్పటికే తెలుస్తోంది. అటవీశాఖ అన్ని చోట్ల మొక్కలు నాటే ప్రక్రియ కు శ్రీకారం చుడుతోంది. ఏటా వనమహోత్సవం పేరుతో లక్షలాది మొక్కలను నాటి సంరక్షిస్తోంది. అటు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ముందుకు వచ్చి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. యువతీ, యువకులు ఒక మొక్కను పెంచే బాధ్యత తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. –కిష్టాగౌడ్, డీఎఫ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి: మానవ మనుగడలో పర్యావరణం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నేళ్లుగా మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. విలువైన సహజ సంపదను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తేనే భావితరాలు సాఫీగా సాగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు, వ్యర్థాలతో భూతాపం పెరగడం, భూ, వాయు, జల కాలుష్యాలు పెరుగుతుండడం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. అడవుల తగ్గుదలతో ఆందోళన అడవుల అభివృద్ధితోనే పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పలు రకాలైన జంతు, వృక్ష జాతులకు ఆశ్రయం కల్పించి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పడతాయి. అడవులు భూసారాన్ని కాపాడమే కాకుండా నేల క్షీణతను నిరోధిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మానవ మనుగడకు అడవులే ఆధారం. 2021 నుంచి 2023 వరకు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గటం ఒకింత ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల వ్యవధిలో 121.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023ను గతేడాది డిసెంబర్లో వెల్లడించింది. 2021–23 మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55 చ.కి.మీ. ఖమ్మం జిల్లాలో 25.76 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గిందని నివేదికలో పేర్కొంది. 2021 కాలంలో 2,957.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2023 చివరి నాటికి 2,861.66 చ.కి.మీ.కి తగ్గినట్లు తెలిపింది. ఇక ఖమ్మం జిల్లాలో 2021 కాలంలో 633.23 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా, 2023 ముగిసే నాటికి 607.47 చ.కి.మీ.గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ (–115.50) తర్వాత భద్రాద్రి జిల్లా (–95,55) రెండో స్థానంలో నిలవగా, ఖమ్మం మూడో స్థానంలో ఉందని వివరించింది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కిన్నెరసాని, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు.. తదితర ఎనిమిది అటవీ డివిజన్లలో ఒక్క కిన్నెరసాని వైల్డ్లైఫ్లో తప్ప మిగతా వాటిలో అటవీ విస్తీర్ణం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అక్రమణలు, అగ్ని ప్రమాదా అందుకు కారణమని, అగ్ని ప్రమాదాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటిస్థానంలో ఉన్నట్లు తేలింది. ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం (చ.కి.మీ.ల్లో) భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా అటవీ డివిజన్లు 06 02 దట్టమైన అడవులు 637.34 42.68 మధ్యస్థాయి అడవులు 1,502.70 261.44 ఓపెన్ అడవులు 721.60 303.30 -
కొత్త కార్డులొస్తున్నాయ్..
● ఇప్పటికే 5,298 రేషన్కార్డులు మంజూరు ● చేర్పులతో 61,667మందికి లబ్ధి ● మూడు నెలల బియ్యంతో రెట్టింపు ఆనందం ఖమ్మం సహకారనగర్: పదేళ్లుగా కొత్త రేషన్కార్డుల మంజూరు లేకపోవడంతో పెద్దసంఖ్యలో పేదలు ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యాన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడమే కాక దరఖాస్తులు సైతం స్వీకరించింది. ఈమేరకు విచారణ చేపడుతూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాక పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లు సైతం చేరుస్తున్నారు. విచారణ చేపడుతూ... జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ షాప్లు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు ఇచ్చేలా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసింది. జనవరి నుంచి మే నెల వరకు 5,298 కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. అయితే, ఇంకా 48,971 మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యాన వీటి పరిశీలనలో అధికారులు వేగం పెంచారు. ఇదే సమయాన అనర్హుల కార్డులను తొలగిస్తున్నారు. అంతేకాక కార్డుదారుల పిల్లల పేర్లు, వివాహాలెన వారి భార్య పేరు నమోదుకు 42,787దరఖాస్తులు అందాయి. వీటిని సైతం పరిశీలించి 61,667మంది పేర్లను కార్డుల్లో చేర్చారు. కాగా, కొత్త కార్డుల జారీతో జిల్లాలో రేషన్కార్డుల సంఖ్య 4,15,905కు చేరగా వీటి పరిధిలో 12,03,943మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం కొత్తగా రేషన్కార్డు రావడమే కాక ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వర్షాకాలం సీజన్ కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాత, కొత్త కార్డుదారులందరికీ మూడేసి నెలల బియ్యాన్ని డీలర్లు సరఫరా చేస్తున్నారు.అర్హులందరికీ రేషన్కార్డులు రేషన్కార్డుల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాక అర్హులకు కార్డులు జారీ చేస్తున్నాం. ఇప్పటికే 5,298 కొత్త రేషన్కార్డులు ఇవ్వగా, మిగతా దరఖాస్తుల పరిశీలన వేగంగా జరుగుతోంది. అర్హులెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. – చందన్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిజనవరి నుంచి మే వరకు కార్డుల జారీ ఇలా.. కేటగిరీ కార్డులు లబ్ధిదారులు కొత్తవి 5,298 16,127 పేర్ల చేర్పులు 42,787 61,667 మొత్తం 48,085 77,794 -
ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు
● సీహెచ్సీలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ ● హాజరు పట్టికలో ఉద్యోగుల తప్పుడు సంతకాలపై సీరియస్తిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేలా వైద్యులు, సిబ్బంది వైద్యసేవలందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ చేసిన ఆమె చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆతర్వాత ఫార్మసీ, పరీక్ష గది, ఆస్పత్రిలో మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, పరీక్షలపై ఆరా తీశారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. డ్యూటీలో లేకున్నా సంతకాలా? ఆస్పత్రిలో ఉద్యోగుల హాజరు రికార్డు పరిశీలించగా విధుల్లో లేని డాక్టర్ల సంతకాలు ఉండడంతో అదనపు కలెక్టర్ శ్రీజ మండిపడ్డారు. డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి వైద్యులు గైర్హాజరవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే, రాత్రి సమయాన పీహెచ్సీకి సిబ్బంది, దంత వైద్యుడికి డ్యూటీ వేయడంపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు. తల్లీపిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె తెలిపారు. డాక్టర్లు అమర్సింగ్, సురేష్, ప్రదీప్రెడ్డి, హారిక తదితరులు పాల్గొన్నారు. -
పథకాల్లో రాజకీయాలు ఉండవు...
ఖమ్మం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడంలో రాజకీయాలకు తావుండదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా మొదటి దశలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, దశల వారీగా అందరికీ మంజూరు చేస్తామన్నారు. కాగా, రూరల్ మండలంతో పాటు కేఎంసీ పరిధి 60వ డివిజన్ రామన్నపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూనే సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీపీ సునీల్దత్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రాంప్రసాద్, డీఎల్పీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి కూసుమంచి: అనారోగ్యంతో బాధపడే పేదలు చికిత్స చేయించుకునేలా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో 348 మందికిరూ.1.58 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన బుధవారం అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల విలువైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తూనే, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.వందలాది కోట్ల సాయం మంజూరు చేస్తున్నామని తెలిపారు. కూసుమంచి మండలంలోని గట్టుసింగారం, గైగోళ్లపల్లి, పాలేరు, చేగొమ్మ, నాయకన్గూడెం గ్రామాల్లో బీటీ, సీసీ రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందని పలువురు పేర్కొనగా విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, సీడీసీ చైర్మన్ ఎరబోలు సూర్యనారాయణరెడ్డితో పాటు మల్లె గురవయ్య, జూకూరి గోపాలరావు, రామసహాయం వెంకటరెడ్డి, ఎడవెల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే...
బోనకల్/కొణిజర్ల: చెక్పోస్టు మీదుగా వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి అన్ని పత్రాలను పరిశీలించాలని అడిషినల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు బోనకల్ మండలంలోని జానకీపురం క్రాస్, కొణిజర్ల మండలం బస్వాపురం క్రాస్లో ఏర్పాటుచేసిన చెక్పోస్టులను బుధవా రం ఆయన పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తూ పశువుల రవాణాకు అనుమతిపత్రాలు లేని వాటిని అడ్డుకోవాలని తెలిపారు. ఇవి కాక ఇతర సంస్థల వాహనాలను ఆపొద్దని పేర్కొన్నారు. బోనకల్ ఎస్ఐ పొదిలి వెంకన్న, పోలీసు ఉద్యోగులు పాల్గొన్నారు. ‘నో డ్రగ్స్.. సేవ్ లైఫ్’ అంటూ ప్రచారంకామేపల్లి: మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత జీవితాలు కోల్పోకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవగాహన కల్పిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ రద్దీ ఉండే జాతరలు, ఉత్సవాలు, వారాంతపు సంతల వద్దకు వెళ్లి మత్తు పదార్థాల వినియోగంతో నష్టంపై వివరిస్తున్నారు. కామేపల్లి మండలం పండితాపు రం వారాంతపు సంతకు బుధవారం ఆకట్టుకునేలా వేషధారణతో వచ్చిన ఆయన కరపత్రాలు, ఫ్లెక్సీ ద్వారా స్థానికులకు అవగాహన కల్పించారు.రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో సత్తాఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–10, 12 అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రాక్లీస్ చేస్తున్న డి.లోహిత, సీహెచ్.లాస్య అండర్–10 విభాగంలో, అండర్–12 బాలికల విభాగంలో ఎం.భవిత, బి.రుత్విక, బాలుర అండర్–12లో డి.ఉపేక్షిత్ ఈ.వరుణ్ బహుమతులు సాధించారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసిఇయేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ బుధవారం అభినందించారు. యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం ఖమ్మంక్రైం: ప్రియురాలు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆమె బంధువులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందిన వట్టికూడి సందీప్ జూబ్లీక్లబ్ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి ఆమె తల్లి నిరాకరించడంతో యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సందీపే కారణమని యువతిబంధువులు వేధిస్తున్నారంటూ సందీప్ బుధవారం యాసిడ్ తాగాడు. ఘటనపై ఆయన కుటుంబీకులు ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరంగా ర్యాలీ మధిర: ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాలకు వందనం చెబుతూ మధిరలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా దేశ సైనికుల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ కార్యక్రంమలో డాక్టర్ ఏ.కొండలరావు, గల్లా సత్యనారాయణ, నెల్లూరు కోటేశ్వరరావు, ఎస్.కే.మహమ్మద్ ముజాయిదీన్ మాట్లాడగా ఏలూరి నాగేశ్వరావు, చావా వేణు, చేకూరి కృష్ణారావు, రషీద్, గాలిమ్, కురువెళ్ల కృష్ణ, చెరుగుడ్ల నర్సింహారావు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్లో అంతర పంటలతో లాభాలు
ఖమ్మంఅర్బన్: రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తూనే నాలుగు రకాల అంతర పంటలు వేసుకోవచ్చని, తద్వారా అదనపు లాభాలు పొందొ చ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రఘునాథపాలెం, ఖమ్మం బాలపేటల్లోని ఆయిల్పామ్ తోటల్లో బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఆయిల్పామ్లో వక్క, కోకో, మునగ, సుగంధ ద్రవ్యాల పంటలే కాక కూరగాయలు పంటలు కూడా సాగు చేసుకోవచ్చన్నారు. తద్వారా ఆయిల్పామ్ చేతికొచ్చేలోగా ఈ పంటలతో పెట్టుబడి ఖర్చులు తీరతాయని తెలిపారు. ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారి నగేష్తో పాటు రామకృష్ణ, చంద్రశేఖర్, మానుకొండ రాధాకిషోర్, రామచంద్రు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఏన్కూరు: రైతులకు నకిలీలు, అనుమతి లేని విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య హెచ్చరించారు. వైరా ఏడీఏ టి.కరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన ఏన్కూరులోని పలు షాపుల్లో తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు నిల్వల రికార్డులను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. రైతులు కూడా ప్రతీ కొనుగోలుపై బిల్లు తీసుకుని పంట కాలం పూర్తయ్యే భద్రపర్చాలని సూచించారు. అనంతరం ఏన్కూరులో సబ్సిడీపై అందించే జీలుగ విత్తన ప్యాకెట్ల నిల్వలను పరిశీలించారు. పచ్చిరొట్ట సాగుతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఆతర్వాత రైతు వేదికలో ఏఈఓలతో సమీక్షించి ఫార్మర్ రిజిస్ట్రీపై సూచనలు చేశాక ఫౌండేషన్ విత్తనాలు పంపిణీ చేశారు. ఏఓ ఏ.నరసింహారావు, ఏఈఓలు బాలకృష్ణ, శ్రీకాంత్, కమలాకర్, నవ్య, భవ్య, భాగ్యలహరి పాల్గొన్నారు. రేషన్ దుకాణాలు, మార్కెట్ల తనిఖీ ఖమ్మం సహకారనగర్/ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీపై ఆరా తీశారు. డీఎం శ్రీలత, డీలర్ జానీమియా తదిరులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన, వీడీవోస్ కాలనీల్లో ఉన్న సమీకృత మార్కెట్లను అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. మార్కెట్ల నిర్వహణ, స్టాళ్లు ఖాళ్లీగా ఉండడంపై ఆరా తీశారు. అలాగే, వీడీవోస్ కాలనీ సమీకృత మార్కెట్లో సేంద్రియ రైతు బజార్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి వేదికగా ‘భూభారతి’ ముదిగొండ: భూసమస్యల పరిష్కార వేదికగా భూభారతి చట్టం నిలవనుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముదిగొండ మండలం గోకినేపల్లిలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఆయన భూసమస్యలపై రైతుల నుండి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరమవుతాయని తెలిపారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుంటూ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఆర్ఐ వహీదా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలి
బోనకల్: రైతులు సాగు చేసే అన్ని పంటలకు కనీస మద్దతు ధర దక్కేలా చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం రావినూతలలో బుధవారం నిర్వహించిన సంఘం మధిర డివిజన్ సదస్సులో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. విత్తనాల తయారీ బహుళజాతి సంస్థల చేతుల్లో ఉండడంతో రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేలా కార్పొరేట్లకు వేలాది ఎకరాలు కట్టబెడుతోందని ఆరోపించారు. ఇకనైనా స్వామినాధన్ కమిషన్ సిఫారసులు అమలుచేయాలని కోరారు. కాగా, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తికావడం లేదని, ఈ విషయమై పోరాటానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతుసంఘం మధిర డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పాపినేని రామనర్సయ్య, దొండపాటి నాగేశ్వరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఆహారం, ఔషధాలు, ఇంధనం కొరతతో క్యూబా దేశ ప్రజల జీవనం దుర్భరంగా మారినందున సాయానికి అందరూ ముందుకు రావాలని పోతినేని కోరారు. ఈక్రమంలో సమావేశానికి హాజరైన రైతులు సమకూర్చిన రూ.28,115 నగదును సుదర్శన్రావుకు నాయకులు అందజేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబుతో పాటు పొన్నం వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు, మడిపల్లి గోపాల్రావు, కిలారు సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్రావు -
మొదలుకు నిప్పు.. వాహనంపై పడిన చెట్టు
ముగ్గురికి తీవ్రగాయాలుతిరుమలాయపాలెం: రోడ్డుపై వెళ్తున్న వాహనంపై భారీ వృక్షం పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజీ సమీపాన బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పంటలపై నీడ పడుతోందని కొందరు రైతులు రహదారి పక్కన చెట్ల మొదళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇలాగే చేయడంతో చెట్టు ఒక్కసారిగా కూలగా అదే రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో వాహనంపై వెళ్తున్న బీసురాజుపల్లితండాకు చెందిన బోడ సేవ్యా, పద్మ, సుధాకర్కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరకుని జేసీబీతో చెట్టును తొలగించారు.విధులకు ఆటంకపర్చిన ఇద్దరిపై కేసు కారేపల్లి: అటవీ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధి గేటు రేలకాయలపల్లిలో ధర్మసోత్ సూర్యం, ఆయన కుమారుడు జేసీబీతో అటవీ భూమిలో దున్నుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఇమ్మడి వీరభద్రం, బీట్ ఆఫీసర్ రమాదేవి వెళ్లి అనుమతి పత్రాలు అడగగా సూర్యం, ఆయన కుమారుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉద్యోగులను గెంటేశారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. ఎన్సీసీ కేడెట్లకు సర్టిఫికెట్లుకొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థినులు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్సీసీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రజిత తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారికి ఖమ్మం 11(టీ) బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ భద్ర బీ, సీ సర్టిఫికెట్లు అందజేశారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై ప్రిన్సిపాల్ రజిత, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, కోఆర్డినేటర్లు ఐశ్వర్య, రజిని, రాజేశ్వరి, సీటీఓ శోభాదేవిని అభినందించారు. -
వన మహోత్సవానికి సిద్ధం
● కేఎంసీ పరిధిలో 2.50లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక ● పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొదటి దఫా.. ● తొలిరోజు డంపింగ్యార్డులో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వనమహోత్సవం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డంపింగ్యార్డులో మొక్కలు నాటాలని నిర్ణయించారు. కాగా, వన మహోత్సవం సందర్భంగా 2.50 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా, ఇందులో లక్ష మొక్కలను ఇంటింటా పంపిణీ చేస్తారు. మిగతా మొక్కలు వివిధ ప్రాంతాల్లో నాటేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో కొన్నిమొక్కలు స్థానిక నర్సరీల్లో సిద్ధంగా ఉండగా, మిగతావి హైదరాబాద్ నుంచి తెప్పిస్తారు. నేడు డంపింగ్యార్డులో.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేఎంసీ పరిధిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించగా, తొలుత నగరంలో ప్రదర్శన నిర్వహించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత డంపింగ్యార్డులో ఒకేరోజు దాదాపు వెయ్యికి పైగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. నర్సరీల్లో లక్ష మొక్కలు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగానే వన మహోత్సవం నిర్వహించేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేఎంసీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి లక్ష మొక్కలను పెంచారు. ఇందులో ఎక్కువగా మందార, గన్నేరు, గులాబీ పూలతో పాటు నిమ్మ, ఉసిరి, టెకోమ, సీతాఫలం, అలంకరణ మొక్కలు ఉన్నాయి. వీటన్నింటినీ ఇంటింటా పంపిణీ చేస్తారు. గతంలో ప్రజలు ఏమేం మొక్కలు ఎక్కువగా అడిగారో పరిగణనలోకి తీసుకుని వీటిని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇక వన మహోత్సవానికి కావాల్సిన మరో 1.50 లక్షల మొక్కలను హెచ్ఎండీఏ నుంచి తెప్పించేలా కేఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రవాణా ఖర్చు భరిస్తే ఉచితంగా మొక్కలు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు ముందుకొచ్చారు. దీంతో మహాగని, బాదం, పొగడ, స్టాతోడియా తదితరాలే కాక కావాల్సిన రకాలు తెప్పించి ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రభుత్వ షెడ్యూల్ విడుదల చేయగానే నాటనున్నారు.రెడీగా మొక్కలు ఈ ఏడాది వన మహోత్సవంలో నాటేందుకు 2.50 లక్షల మొక్కలను సిద్ధం చేశాం. ఇంటింటా పంపిణీ చేసేలా కేఎంసీ నర్సరీల్లో లక్ష మొక్కలు పెంచాం. మొక్కలను నాటడమే కాక సంరక్షించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. – బెల్లం రాధిక, ఉద్యానాధికారి, కేఎంసీ -
విద్యార్థులకు పోషకాహారమే కీలకం
రఘునాథపాలెం: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేసే బాధ్యత వంట సిబ్బందిపై ఉందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం కోయచలక క్రాస్ వద్ద గురుకులంలో సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల వంట సిబ్బందికి బుధవారం ఇచ్చిన నైపుణ్య శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించాక ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది కీలకంగా వ్యవహరించాలన్నారు. తల్లిప్రేమతో కూడిన భోజనం అందిస్తే విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారని తెలిపారు. అనంతరం ఆహార తనిఖీలకు ఫుడ్ ఇన్స్పెక్టర్కు కేటాయించిన వాహనాన్ని పరిశీలించిన కలెక్టర్, అందులోని యంత్రాల పనితీరుపై ఆరాతీశారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల డీడీలు కస్తాల సత్యనారాయణ, ఎన్.విజయలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్ట్ ఉద్యోగులకు సన్మానం ఖమ్మం సహకారనగర్: వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సన్మానించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి వివిధ శాఖల అధికారులు జి.గురువయ్య, ఎం.మోహన్, జి.ఉమాదేవి, ఎన్.వసంత, వై.సరస్వతి, సీహెచ్.రాజకొమురమ్మ, టి.నాగేశ్వరరావు, వై.వీ.రమణ, జి.అప్పమ్మ, ఎం.డీ.రఫీ అహ్మద్ను సన్మానించి విధినిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. అలాగే, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీగా పనిచేస్తూ 2012 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన బి.రమాదేవితో ‘ప్రస్థానం’ పేరిట మాట్లాడారు. అప్పట్లో జిల్లా పరిస్థితులు, ఉద్యోగ నిర్వహణలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎలా అధిగమించారు, ఉద్యోగంలో సాధించిన ఘనతలు, ప్రభుత్వ పథకాలనుఅర్హులందరికీ చేర్చడంలో తీసుకున్న జాగ్రత్తలను ఆరా తీయడమే కాక విధినిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రస్తుత ఉద్యోగులకు సూచనలు ఇప్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ దీక్షారైనా, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖాధికారి జి.జ్యోతి, ఉద్యోగులు అరుణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
విశ్వకర్మ పథకాన్ని సంపూర్ణంగా అమలుచేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో వృత్తి నైపుణ్యాలను పెంచేలా కేంద్రప్రభుత్వం రూపొందించిన విశ్వకర్మ పథకాన్నిపూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా 18వర్గాలకు చెందిన చేతివృత్తిదారులకు జీవనోపాధి కల్పించాలని బుధవారం డీఆర్ఓ పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. అనంతరంకోటేశ్వరరావు మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు శిక్షణ ఇవ్వడమే కాక ఆతర్వాత రూ.లక్ష రుణం మంజూరు చేయాలని, ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ నాయకులు మందడపు సుబ్బారావు, నర్సింహారావు, రవి రాథోడ్, చంద్రశేఖర్, నరేష్, ఆర్వీఎస్.యాదవ్, ఈదుల భద్రం, అంకతి పాపారావు, నాగేశ్వరరావు, రామారావు, వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు. -
చేపల కోసం చెరువు నీళ్లు వదిలారు...
వైరా: అన్నదాతలకు ఆదెరువుగా, మత్స్యకారులకు అండగా నిలుస్తున్న నిండా నీరు ఉండగా.. చేపలు పట్టడం సాధ్యం కావడం లేదని కాంట్రాక్టర్ నీరు విడుదల చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలోని నల్ల చెరువు నీటిని అనుమతి కాంట్రాక్టర్ చేపల వేట కోసం వదిలినట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులో 3.5 అడుగుల మేర నీరు ఉంది. అయితే, నీరు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారుల అనుమతి అవసరం కాగా, అదేమీ లేకుండా మూడు రోజులుగా నీటిని వృథాగా విడుదల చేయడంతో చెరువు ఖాళీ అయ్యే స్థితికి చేరింది. మత్స్య సొసైటీ అధ్యక్షుడు, కాంట్రాక్టర్తో కుమ్మకై ్క ఈ ఘటనకు పాల్పడినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అలాగే, సుమారు 250 ఎకరాల మేర వరి నాట్లకు ఇబ్బంది ఏర్పడనుందని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఈ విషయమై ఐబీ డీఈ శ్రీనివాస్ను వివరణ కోరగా చెరువులో చేపల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు నీరు వదిలినట్లు ఆలస్యంగా తెలి సిందని, బాధ్యులను గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చెరువు వద్ద లష్కర్లతో పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు -
‘బడిబాట’కు వేళాయె...
● ఈనెల 6నుంచి నిర్వహణకు సన్నాహాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలుఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల తగ్గుముఖం పడుతోందని గణాంకాలతో సహా వివరించారు. అంతేకాక ఈ సారి ప్రవేశాలు పెరిగేలా కృషి చేయాలని సూచించడంతో అధికారులు ఈనెల 6వ తేదీ నుంచి ‘బడి బాట’ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది తగ్గారు... జిల్లాలోని 1,214 పాఠశాలల్లో 69వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, అంతకు ముందు సంవత్సరం కంటే గత ఏడాది సుమారు 6వేల మేర తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో పలు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు వేసవి సెలవులు మొదలైనప్పటి నుంచే ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వస్తున్న ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి పకడ్బందీగా.. గతంలో ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పది రోజుల పాటు బడిబాట నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. గత ఏడాది ఆగస్ట్ 31 వరకు బడిబాట నిర్వహించగా, 12వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు చెబుతున్నారు. అయితే, ఇంత తక్కువ సంఖ్యలో ప్రవేశాలు జరగడంపై సమీక్షించిన విద్యాశాఖ అధికారులు ఈసారి మరింత పకడ్బందీగా బడిబాట నిర్వహించేలా సన్నద్ధమయ్యారు. కొన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, డిజిటల్ బోధన, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుండ డం.. ఈసారి బడిబాట ముందుగా నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. షెడ్యూల్ ఇలా.. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 6వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తారు. ఇక 7వ తేదీన ఇంటింటికీ వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం, 8 నుంచి 10వ తేదీ వరకు కరపత్రాలతో ప్రచారం చేస్తారు. డ్రాపౌట్ పిల్లలను బడిలో, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత కేంద్రంలో చేర్పిస్తారు. ఆయా కార్యక్రమాలపై 11వ తేదీ సమీక్షించుకుని, 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యాన పాఠశాలలను ప్రారంభిస్తారు. తొలిరోజునే రాత, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించడమే కాక 13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ నిర్వహిస్తారు. ఇక 16వ తేదీన ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ (ఎల్ఐపీ) దినోత్సవం, 17న విలీన విద్య, బాలికా విద్య దినోత్సవం, 18న తరగతి పాఠశాలల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యత విద్యార్థులకు తెలియజేస్తారు. చివరగా 19వ తేదీన బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలను నిర్వహిస్తారు.విస్తృతంగా అవగాహన ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 6నుంచి బడిబాట నిర్వహించేలా సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఇతర సౌకర్యాలు, పదో తరగతి ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. గతంలో కంటే ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరగడమే లక్ష్యంగా కృషి చేస్తాం. – సామినేని సత్యనారాయణ, డీఈఈ -
భూముల రీసర్వేతో రైతులకు మేలు
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● ములుగుమాడులో సదస్సు, సర్వేను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ● పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మలఎర్రుపాలెం: రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూముల రీసర్వే చేపట్టనుండగా రైతులకు మేలు జరగడమే కాక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూముల రీ సర్వే, భూభారతి సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు మాట్లాడారు. ఎవరిపై భారం పడకుండా సర్వే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడమే కాక ఎవరికీ రూపాయి కూడా ఖర్చు లేకుండా భూముల రీసర్వే చేసి రికార్డులకు భద్రత కల్పిస్తామని భట్టి, మంత్రులు వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ధరణి చట్టం స్థానంలో భూభారతి తీసుకొచ్చామని తెలిపారు. తద్వారా ప్రతీ భూకమతానికి ఆధార్కార్డు మాదిరి భూధార్ ఇస్తామని చెప్పారు. అంతేకాక ఏటా సదస్సులు నిర్వహించి అమ్మకాల, కొనుగోలు వివరాలను అప్డేట్ చేస్తామని తెలిపారు. భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేస్తే, గత పదేళ్లలో ఎక్కడా కమిటీలు కానరాలేదని పేర్కొన్నారు. ఈనేపథ్యాన కొత్త చట్టంతో కమిటీలు ఏర్పాటు చేసి మిగులు భూములను ఇంటి పట్టాలుగా, సాగుకు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న భూమి కంటే ఎక్కువగా రికార్డుల్లో నమోదు చేయించి రైతుబంధు నిధులు కాజేశారని, ఇలాంటివన్ని ఇక సాగవని స్పష్టం చేశారు. అంతేకాక గ్రామ పాలనాధికారులు, లైసెన్సు సర్వేయర్ల నియామకంతో రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా ఈసంవత్సరం వరి నాట్ల కంటే ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా, నక్షాలు లేకుండా రాష్ట్రంలోని 413 గ్రామాల్లో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతుండగా తాజాగా చేపడుతున్న రీ సర్వేతో ఈ సమస్య పరిష్కారమవుతాయని వెల్లడించారు. కాగా, ధరణి చట్టంలోని లోపాలతో ఎదురైన ఇబ్బందులు పలువురు రైతులు వివరించారు. అనంతరం భూముల రీసర్వేతో లాభాలను సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో లాండ్ అండ్ సర్వే జేడీ ప్రసన్నలక్ష్మి, పోలీసు కమిషనర్ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ ఎం.ఉషాశారద, మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డితో పాటు చావా రామకృష్ణ, గంటా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పరిష్కరిస్తాం..
సమస్య చెప్పండి..పైలట్గా రెండు మండలాలు... భూభారతి చట్టాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జిల్లాలోని నేలకొండపల్లికి స్థానం దక్కింది. ఈ మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 3,224 మంది రైతులు సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,791 దరఖాస్తులు సాదాబైనామాపై ఉండగా, ఇతర సమస్యలపై 1,433 దరఖాస్తులు ఉన్నాయి. ఇందులో 322 దరఖాస్తులు పరిష్కరించి, 953 తిరస్కరించారు. ఇక అసైన్డ్ భూములకు సంబంధించి 70 దరఖాస్తులకు ఆమో దం లభించింది. మిగిలిన దరఖాస్తుల పరిశీలన కూడా కొనసాగుతోంది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాలను ఎంపిక చేయగా.. జిల్లాలోని బోనకల్ మండలాన్ని చేర్చారు. ఈ మండలంలో 2,861 దరఖాస్తులు అందగా, 43 పరిష్కరించి మిగతా వాటి పరిశీలనపై దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా సదస్సులు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికై న నేలకొండపల్లి, బోనకల్ మండలాలు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల్లోనూ మంగళవారం భూభారతి చట్టం అమలుపై సదస్సులు మొదలయ్యాయి. రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించే ఈ సదస్సుల్లో తహసీల్దార్ సహా ఉద్యోగులు పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. త్వరలోనే సర్వేయర్ల నియామకం జరగనుండడంతో దరఖాస్తుల ఆధారంగా సర్వే చేసి సమస్యలు పరిష్కరించనున్నారు. తద్వారా గ్రామాల్లో భూసంబంధిత సమస్యలు ఉండవని చెబుతున్నారు. తొలిరోజు 3,153 దరఖాస్తులు జిల్లాలో 19 మండలాల పరిధి 37 రెవెన్యూ గ్రామాల్లో తొలిరోజైన మంగళవారం భూభారతి సదస్సులు నిర్వహించినట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఈమేరకు ఆయా గ్రామాల్లో కలిపి భూసమస్యలపై 3,153 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. తహసీల్దార్ ఆధ్వర్యాన రెవెన్యూ ఉద్యోగులు సదస్సుల్లో పాల్గొని చట్టంపై అవగాహన కల్పించడమే కాక సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. అయితే, రైతులు దరఖాస్తులతో పాటు వారి వద్ద ఉన్న ఆధారిత డాక్యుమెంట్లు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.‘భూభారతి’లో భాగంగా సదస్సులకు శ్రీకారం ఇప్పటికే నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో నిర్వహణ కొనసాగుతున్న అక్కడి దరఖాస్తుల పరిష్కారం మిగతా మండలాల్లో తొలిరోజు 3,153 దరఖాస్తుల స్వీకరణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం పూర్తిస్థాయి అమల్లో భాగంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు మంగళవారం మొదలయ్యాయి. ఈ చట్టాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించగా.. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఇందులో జిల్లాలోని నేలకొండపల్లి ఉండగా, రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. రెండో విడతగా బోనకల్ మండలంలోనూ సదస్సుల నిర్వహణ పూర్తయింది. మిగిలిన మండలాల్లోని రెవెన్యూ గ్రామాల వారీగా మంగళవారం మొదలైన సదస్సులు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మంపొరపాట్లకు తావులేకుండా.. రైతులు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సమస్యకు కారణాలను ఆరా తీస్తూనే సర్వేనంబర్ల వారీగా, రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి పరిష్కారంపై దృష్టి సారించారు. మరోమారు అదే సమస్యపై దరఖాస్తు అందకుండా, పొరపాట్లకు తావులేకుండా పరిష్కరించేలా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే పైలట్ మండలాల్లో ఎక్కువగా సాదాబైనామా దరఖాస్తులే వచ్చాయి. కానీ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో వీటిని పక్కన పెట్టిన అధికారులు మిగతా దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా పరిశీలనలో నిమగ్నమయ్యారు. -
108, 102 వాహనాల్లో అధునాతన పరికరాలు
మధిర: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించే 108, 102 అంబులెన్స్ వాహనాల్లో అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. ఈమేరకు పరికరాల పనితీరు, వినియోగంపై మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఆయన ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అంబులెన్స్ల్లో మానిటర్, వెంటిలేటర్, సిరంజ్ పంపు, ఇంక్యుబేటర్ వినియోగం, ప్రసవానంతరం నవజాత శిశువుల్లో ఏర్పడే అనారోగ్య సమస్యల నివారణకు నవజాత శిశు సంరక్షణ అంబులెన్స్ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ అనిల్కుమార్, ఆస్పత్రి ఉద్యోగులు శ్రీనివాస్, మధు, శ్రీను, సీ.వీదేవి, విజయశ్రీ, శారద పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు తేదీలు ఖరారు ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలోని హాకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తేదీలు ప్రకటించింది. మూడంచెల్లో ఎంపిక పోటీలు నిర్వహించనుండగా, తొలుత మండల స్థాయి పోటీలు ఈనెల 6నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో ఈనెల 27నుంచి 30వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయిలో జూలై 7నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని వెల్ల డించారు. నాలుగో తరగతిలో ప్రవేశాలు కల్పించనుండగా, ఒక్కో స్పోర్ట్స్ స్కూల్లో బాలురకు 20, బాలికలకు 20 సీట్లు ఉంటాయని, 8 – 9 ఏళ్ల పిల్లలు అర్హులని తెలిపారు. ఈమేరకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్ట్ అనంతరం ప్రవేశాలు కల్పిస్తారని డీవైఎస్ఓ వివరించారు. మత సామరస్యాన్ని చాటుదాం.. ఖమ్మంక్రైం: బక్రీద్ పండుగ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే కాక మత సామరస్యాన్ని చాటేలా అన్ని మతాల వారు సహకరించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాన్ని గౌరవిస్తూ, సంప్రదాయాలను పాటించడంలో ముందు నిలిచే జిల్లా ప్రజలు ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని కోరారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, పాడి ఆవులు, లేగ దూడల క్రయవిక్రయాలు జరపొద్దని సూచించారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా ఎవరైనా ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ తెలిపారు. అనంతరం వివిధ మతాల పెద్దలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐలు కరుణకర్, బాలకృష్ణ, మోహన్ బాబు, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చేరిన యూనిఫామ్ క్లాత్ ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్ క్లాత్ జిల్లాకు చేరింది. మొదటి దశలో వచ్చిన క్లాత్తో యూనిఫామ్ సిద్ధం చేస్తున్నారు. రెండో విడతగా వచ్చిన క్లాత్ను బాధ్యులకు మంగళవారం అందజేసినట్లు ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. -
నష్ట నివారణే కీలకం
ఖమ్మం సహకారనగర్: విపత్తు సమయంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్(డీడీఎంపీ) సమావేశం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించగా పోలీస్ కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది వరదలతో నష్టం జరిగిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేయాలన్నారు. ఈనెల 15 నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసే వర్షం ఆధారంగా నదీ ప్రవాహాల వివరాలను వాట్సప్ గ్రూపుల ద్వారా సేకరిస్తూ హెచ్చరికలను ప్రభావిత ప్రాంతాలకు చేరవేయాలని సూచించారు. అంతేకాక ముంపు ప్రాంతాల ప్రజల కోసం ముందస్తుగా పునరావాస కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. అలాగే, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులను గుర్తించి అప్రమత్తం చేయాలన్నారు. సీపీ సునీల్దత్ మాట్లాడుతూ వరదల సమయాన ప్రజలకు రక్షణ కల్పించడంలో తమ శాఖ పూర్తిగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. విపత్తు సమయాన హెచ్చరికలు క్షేత్రస్థాయికి చేరాలి డీడీఎంపీ సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
భర్త అన్యాయం చేశాడని మహిళ నిరసన
తల్లాడ: మరో పెళ్లి చేసుకున్న భర్త తనకు అన్యా యం చేశాడంటూ ఓ మహిళ ఆయన ఇంటి ఎదుట నిరసనకు దిగింది. మండలంలోని మల్సూర్తండా గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... మల్సూర్తండాకు చెందిన భూక్యా నాగేశ్వర్రావు ఏడేళ్ల క్రితం కొణిజర్ల మండలం రాజ్యతండాకు చెందిన గుగులోత్ వాణిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు జన్మించాక వరకట్నం కోసం వేధిస్తుండడంతో కొణిజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆపై వాణికి విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వాణి తమ బంధువులతో కలిసి ఆయన ఇంటికి చేరుకుని నాగేశ్వరరావు, ఆయన రెండో భార్యను గదిలో నిర్బంధించి నిరసనకు దిగింది. ఈమేరకు పోలీసులు చేరుకుని స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. -
సర్వేకే పరిమితమైన డబ్లింగ్ లైన్
ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోనున్న పలువురు ● ఐదు నెలల క్రితమే సర్వే, ఆపై మార్కింగ్ ● ఇప్పటికీ పరిహారం ఊసెత్తని అధికారులు కారేపల్లి: డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా కొత్తగూడెం స్టేషన్ వరకు ఉన్న సింగిల్ ట్రాక్ను డబుల్ ట్రాక్గా నిర్మించేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కారేపల్లి మండలంలో కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో భూసేకరణ కోసం సర్వే చేశారు. మండల వ్యాప్తంగా 54 ఎకరాలు అవసరమని గుర్తించగా, కారేపల్లి పరిధి సింగరేణి రెవెన్యూలో సుమారు 60 – 70 మంది నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాలని ఉంటుందని నిర్ధారించారు. అలాగే, కారేపల్లిలో స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్ ఫామ్, అదనంగా రెండు ట్రాక్ల నిర్మాణానికి 20 కుటుంబాల నుంచి ఇళ్లు సేకరించాల్సి ఉంటుంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, స్టేషన్ పరిధిలో 65మీటర్ల భూమితో పాటు ఇళ్లు సేకరించేలా మార్కింగ్ సైతం వేశారు. ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు భూనిర్వాసితులకు సమాచారం ఇచ్చారు. ఆపై గ్రామసభలు నిర్వహించినా, ఇప్పటివరకు పరిహారంపై ప్రకటన చేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు చేయాలా.. వద్దా ? డబ్లింగ్ లైన్ నిర్మాణ భూసేకరణ కోసం సర్వే చేపట్టి ఐదు నెలలు కావొస్తుండగా, పరిహారంపై స్పష్టత కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదలుకావడంతో రైల్వే అధికారులు మార్కింగ్ చేసిన భూముల్లో పంట సాగు చేయాలా, వద్ద మీమాంస నెలకొంది. సింగరేణి రెవెన్యూ పరిధి మైదాన ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి భూములకు మంచి ధర పలుకుతోంది. అయితే, వ్యవసాయి భూములు, ఇంటి స్థలాలకు మార్కెట్ ధర కంటే మూడు రెట్లు అదనంగా పరిహారంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇళ్లకు స్వభావం ఆధారంగా ధర నిర్ణయించి గ్రామసభలో తీర్మానం చేస్తారని సమాచారం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలియకున్నా పరిహారం స్పష్టత లేక, పంటల సాగుపై అవగాహన లేక నిర్వాసితులు ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. -
ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం, బైరవునిపల్లి, బోదులబండ, నేలకొండపల్లి, చెన్నారంల్లో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేయగా, అర్హులందరికీ కేటాయిస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ఎవరు కూడా అభద్రతా భావానికి లోనుకావొద్దని సూచించారు. కాగా, బౌద్ధక్షేత్రం సమీపంలో గుడిసెల్లో ఉంటున్న పలువురు మంత్రి శ్రీనివాసరెడ్డిని కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, భద్రయ్య, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, కె.హన్మంతరావు, వంగవీటి నాగేశ్వరరావు, వెంకన్న, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్, వేగినాటి లక్ష్మినర్సయ్య, ఉండమోదుగుల శ్రీనివాస్, తన్నీరు నారాయణ, కొమ్మూరి నరేష్, యడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లాలో మంత్రి పర్యటన ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో నిర్వహించే సమావేశంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు. ఆతర్వాత ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట, దారేడు, పోలిశెట్టిగూడెం, తీర్థాలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాప చేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, సాయంత్రం కూసుమంచి మండలం గట్టు సింగారం, చేగొమ్మ, బచ్చోడు, పాలేరు, నాయకునిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
‘గుట్ట’కాయ స్వాహా...
● అక్రమంగా తవ్వకాలు, మొరం తరలింపు ● కన్నెత్తి చూడని అటవీ, రెవెన్యూ అధికారులు ఇకనైనా చెక్ పెట్టాలి.. మద్దులపల్లి, కెప్టెన్బంజర సమీపాన గుట్టలపై మొరం, మట్టిని జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఇకనైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.– జాలె శ్రీనుయాదవ్, మద్దులపల్లి తవ్వకాలు చేపడితే చర్యలు గుట్టలపై మొరం తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవు. ప్రభుత్వ భూములు, గుట్టలపై ప్రత్యేక దృషి్ట్ సారిస్తాం. సెలవు దినాల్లోనూ నిఘా ఏర్పాటుచేస్తాం. ఎవరు నిబంధనలను అతిక్రమించినా చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం. – సుధాకర్, తహసీల్దార్, కామేపల్లి కామేపల్లి: ప్రభుత్వ స్థలమని తెలియగానే వారికి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చినట్లుంది.. ఎవరూ పట్టించుకోరనే నమ్మకంతో ధనార్జనే ధ్యేయంగా రాత్రింబవళ్లు యంత్రాలతో గుట్టను తవ్వి మొరాన్ని తరలిస్తున్నారు. పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో మొరం తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటుండగా.. దీన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కామేపల్లి మండలంలోని మద్దులపల్లి, కెప్టెన్బంజర గ్రామ సమీపాన గుట్టల్లో ప్రొక్లెయినర్ల సాయంతో మొరం తవ్వి వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే, ప్రభుత్వ భూములు, గుట్టల సంరక్షణపై దృష్టి సారించాల్సిన అధికారులు అధికారులు ఉదాసీనంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిగా తవ్వకాలు అక్రమంగానే కాక ఇష్టారాజ్యంగా గుట్టలపై, చుట్టూ తవ్విస్తున్న కొందరు మొరం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటుకు మొరం అవసరమవుతోంది. దీంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ మొరం తరలించి జేబులు నింపుకుంటున్నారు. అయినా అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గుట్టల వద్ద మొరం తవ్వకాలతో ఆ ప్రాంతం స్వరూపాన్ని కోల్పోతుండగా చెట్లు కనుమరుగవుతున్నాయి. సెలవు రోజుల్లో మరింతగా.. మాములు రోజుల్లోనే ఇక్కడ తవ్వకాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక సెలవు రోజుల్లోనైతే ఇటు వైపు ఎవరూ రారన్న నమ్మకంతో అక్రమార్కులు ఆయా రోజుల్లో మరిన్ని వాహనాలను రంగంలోకి దింపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, రాత్రివేళ కూడా తవ్వకాలు చేపట్టి మొరం తరలిస్తుండడంతో వాహనాల రాకపోకలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతుతున్నారు. ఒకవేళ స్థానికులెవరైనా ఫిర్యాదు చేసినా అధికారులు వచ్చేలోగా వాహనాలతో సహా మాయమవుతున్నారని సమాచారం. ఇప్పటికై నా అధికారులు నిఘా వేయకపోగా గుట్టలు పూర్తిగా కనుమరుగవుతాయని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉన్నత ఆశయంతో ఇందిరా డెయిరీ
మధిర: మహిళలను ఆర్థికంగా తీర్చిదిద్దాలన్న ఉన్నతాశయంతో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుచేస్తున్నామని, అధికారులు సమన్వయంతో దీన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిరలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఆర్డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఇందిరా డెయిరీ ద్వారా లబ్ధిదారులకు రెండేసి గేదెలు అందజేయాలని, ఇందుకోసం సభ్యులు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదనే విషయమై అవగాహన కల్పించాలన్నారు. అలాగే, భూమి లేకున్నా అర్హులేనని.. అసలే గేదెలు లేనివారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రానున్న ఐదు నెలల్లో లబ్ధిదారులకు గేదెలు అందించేలా కొనుగోలుపై దృష్టి సారించాలని భట్టి సూచించారు. ● ఈనెల 8న నిర్వహిస్తున్న మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈకార్యక్రమంలో మిరియాల రమణగుప్తా, మొండితోక సుధాకర్, అద్దంకి విప్లవకుమార్, బెజవాడ రవి, శీలం వెంకటరెడ్డి, మక్కెన నాగేశ్వరరావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● తొలి తరం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, రమావత్ బాబురావు తదితరులు మాట్లాడారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న తాము అనేక సమస్యలతో బాధపడుతున్నందున ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని విన్నవించారు. ● ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని 31 జీపీల్లో తెనుగోళ్లు, మున్నూరు కాపు కులస్తులకు రాజీవ్ యువ వికాసం యూనిట్లు కేటాయించలేదని సంఘం మండల బాధ్యులు నాయకులు సూరంశెట్టి భాస్కరరావు, కడియం శ్రీనివాసరావు, మల్లెల లక్ష్మణరావు తెలిపారు. ఈమేరకు బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజ్మమిల్ఖాన్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. నాయకులు పసుపులేటి వెంకటనారాయణ, గంధం శ్రీనివాసరావు, తోట సాంబశివరావు, పసుపులేటి మహేష్, శ్రీపాలశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
జేఎన్టీయూ నుంచి డాక్టరేట్
కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీ పరిధి కిష్టయ్యబంజర్కు కావేటి రామకృష్ణకు హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఇటీవల యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఈమేరకు రామకృష్ణ, ఆయన తల్లిదండ్రులు గోపాలరావు – జయమ్మను కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, బైరెడ్డి మనోహర్రెడ్డి, మాదిరాజు లక్ష్మణరావు, జొన్నలగడ్డ గోపాలస్వామి, గునుకుల ఈశ్వరరావు, జిల్లెళ్ల కృష్ణారెడ్డి, చుక్కా, శ్రీనివాసరెడ్డి, తోట జనార్దన్, మేకల ప్రసాద్, ఎస్.కే.ఆఫ్రోజ్, షేక్ సమీర్, సయ్యద్ జావీద్ అభినందించారు. ఖమ్మం వాసి కోటేశ్వరరావుకు.. ఖమ్మం సహకారనగర్: హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఖమ్మం చెరువుబజార్కు చెందిన బోనగిరి కోటేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ కె.గిరిబాబు, ప్రొఫెసర్లు పి.చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ఇటీవల యూనివర్సిటీ వీసీ కిషన్కుమార్రెడ్డి చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ స్వీకరించారు. యూపీహెచ్సీలో డీఎంహెచ్ఓ తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం శ్రీనివాస్నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఉద్యోగుల హాజరు పట్టికను తనిఖీ చేశాక వారితో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, దోమల లార్వా నివారణ, ఫాగింగ్కు చర్యలు తీసుకోవాలని, జ్వరం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాలని తెలిపారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ రామారావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రేష్ఠ, యూపీహెచ్సీ కోఆర్డినేటర్ బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశువులు అక్రమ రవాణా చేస్తే చర్యలు ముదిగొండ: అక్రమంగా పశువుల రవాణా చేపట్టే వారిపై చర్యలు తప్పవని ముదిగొండ సీఐ ఓ.మురళి హెచ్చరించారు. మండలంలోని వల్లభి సమీపాన ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ఆయన వాహనాల తనిఖీలను పరిశీలించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడడే కాక పశువుల రవాణాలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల్లో ఎస్ఐ అనంతరాములు, ఏఎస్ఐ సాంబశివరావు, ట్రెయినీ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. న్యూవిజన్ విద్యార్థిని అభినందించిన చైర్మన్ ఖమ్మం సహకారనగర్: తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్లో ఫలితాల్లో ఆలిండియా స్థాయి 497వ ర్యాంక్ సాధించిన న్యూవిజన్ విద్యాసంస్థల విద్యార్థి పేరాల ప్రణవ్ను చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ఆలిండియా స్థాయి ఓపెన్ కేటగిరీలో 497వ ర్యాంక్ సాధించటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన తండ్రి సురేష్ ప్రోత్సాహకానికి తోడు కళాశాల యజమాన్యం ఇచ్చిన శిక్షణతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇంజనీర్గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో గోదావరి పరవళ్లు
ఏన్కూరు: గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీతారామ ఎత్తిపోతల పథకం సిద్ధమవుతోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో కీలకమైన రాజీవ్ కెనాల్ పనులు 8.86 కి.మీ.ల్లో 7.86 కి.మీ. మేర పూర్తయినందున, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందనుందని వెల్లడించారు. ఏన్కూరు సమీపాన రాజీవ్ కెనాల్(ఏన్కూరు లింక్ కెనాల్) పనులను మంగళవారం మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఈనెల 10వ తేదీకల్లా కెనాల్ పనులు పూర్తి కానుండగా, పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. కాగా, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించేలా యాతాలకుంట టన్నెల్ నిర్మిస్తున్నామన్నారు. సాగర్ ద్వారా కృష్ణా జలాలు రావడానికి రెండు నెలల ముందుగానే ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి జలాలు అందించాలన్నది తమ సంకల్పమని మంత్రి తెలిపారు. లింక్ కెనాల్ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల -
బంగారు భవిష్యత్కు బాటలు వేద్దాం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని సీఎండీ ఎన్.బలరామ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన అన్ని ఏరియాల జీఎంలు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ విస్తరణ, సమస్యల పరిష్కారంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఓవర్బర్డెన్ తొలగింపులో ఉన్న ఇబ్బందులు అధిగమించాలని, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన గనులు లేకపోతే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి తదితర ఏరియాలకు భవిష్యత్ ఉండదని, కొత్త గనుల కోసం ముమ్మరంగా ప్రయత్నించాలని అన్నారు. అటవీ అనుమతులు సాధనలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. శాంతిఖని, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ల్లో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సత్తుపల్లిలో కోల్వాషరీ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పాటు అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు. ప్రజాకవి జయరాజుకు సన్మానం సింగరేణి మాజీ ఉద్యోగి, ప్రజాకవి గొడిశెల జయరాజును కొత్తగూడెంలో సీఎండీ ఎన్.బలరామ్ ఘనంగా సన్మానించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రూ.కోటి నగదు బహుమతి ఇస్తూ గుర్తింపునివ్వడం హర్షణీయమని సీఎండీ తెలిపారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ సింగరేణి అందించిన సహకారం, ప్రోత్సాహంతోనే తాను కవిగా, ఉద్యమకారుడిగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కోల్ మూమెంట్ డైరెక్టర్ ఎస్డీఎం సుభాని, డైరెక్టర్లు ఎల్.వీ.సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై దృష్టి పెట్టాలి సింగరేణి సీఎండీ బలరామ్ దిశా నిర్దేశం -
● హార్వెస్ట్కు ఉత్తమ ర్యాంకులు
హార్వెస్ట్ విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో బి.సాయిచరణ్ 83వ ర్యాంకు, బి.సంజయ్ 207, ఎం.నాగయశ్వంత్ 393, బి.సిద్దార్థ్ 395, డి.శ్రీనివాస గౌతమ్రెడ్డి 686, వి.చరణ్ గోపాల్స్వామి 1,092, బి.మోక్షజ్ఞ 1,159, పి.క్రిష్ సాత్విక్ 1,163, ఎ.గణేష్ 1,195, ఎన్.సీ.హెచ్.జస్వంత్ సాయి 1,268, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 2,108, పి.ప్రేమ్వర్ధన్ 5,078, వి.సాయిదీపక్ 6,001 ర్యాంకు సాధించారని వెల్లడించారు. -
● రెజొనెన్స్ జయభేరి
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లతో జయభేరి మోగించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్వీ. నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. టి.స్నేహ మృదుల 89వ ర్యాంక్, బి.రాకేష్ 230, బి.అభినాయక్ 342, జె.మదన్ 371, జి.సురేష్ 557, బి.హర్షవర్థన్ 906, బి.శ్యామ్ 1,860, ఆర్.గురుప్రసాద్ 2,097, గోపిచంద్ 2,275, జి.దివ్యతేజ 2,847వ ర్యాంక్ సాధించగా, మరికొందరు సైతం ఉత్తమ ర్యాంక్లు సాధించారన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్, భాస్కర్రెడ్డి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న శకటాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సంబంధించి రూపొందించిన శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో రవాణాశాఖ (మహాలక్ష్మి) బస్సు శకటం, పౌర సరఫరాల శాఖ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు, గృహ నిర్మాణ శాఖ శకటం ఇందిరమ్మ ఇంటి నమూనాతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. వీటితో పాటు సంక్షేమ శాఖలు, రవాణా శాఖ, పర్యాటక శాఖల శకటాలు సైతం ఆకట్టుకున్నాయి. అంతేకాక వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్డీఏ, విద్యుత్ తదితర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. కాగా, వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి. – ఖమ్మం సహకారనగర్ -
కార్యకర్తల కోసం ప్రాణమైనా ఇస్తా..
నేలకొండపల్లి/కూసుమంచి: బీఆర్ఎస్ కార్యకర్తలను తన ప్రాణం అడ్డు వేసైనా కాపాడుకుంటానని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో సోమవారం జరిగిన సమావేవంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఎవరు వేధించినా సహించేది లేదని చెప్పారు. ఎదుటి వారు ఒక దెబ్బ కొడితే... తాము రెండు దెబ్బలు కొడతామని తెలిపారు. తన వద్ద డబ్బు లేకపోయినా చేతనైన మేర సాయం చేస్తానని, కనీసం రెండు శాతం మంది ప్రజలైనా తాను మంచి చేయలేదని చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్ల డించారు. కాగా, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా విజయం బీఆర్ఎస్నే వరిస్తుందని కందాళ ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్ మాజీ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్యతో పాటు నాగుబండి శ్రీనివాసరావు, కోటి సైదారెడ్డి, షేక్ హుస్సేన్, కమదన ప్రవీణ్, యాతాకుల భాస్కర్, గోలుసు రవి, మాదాసు ఆదాం, దాసరి ఉదయ్, దేవరశెట్టి మురళి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచి మండలం గంగబండ తండాలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి -
రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీనే...
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీయేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన సాధ్యమని పేర్కొంటూ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను బీజేపీ ఎంపీలు వినిపించారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు గెంట్యాల విద్యాసాగర్, సన్నే ఉదయ్ ప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, మందడపు సుబ్బారావు, జ్వాలా నర్సింహారావు, అల్లిక అంజయ్య యాదవ్, రుద్ర ప్రదీప్, శ్యాంరాథోడ్, మందడపు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజలకు బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో... ఖమ్మంమయూరిసెంటర్: తెలంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు గుండాల కృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. ఆతర్వాత పెవిలియన్ మైదానం సమీపాన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. -
విందుల్లో విష సంస్కృతి
● విచ్చలవిడిగా ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం ● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు, విక్రయం ● ఆహారపదార్థాల కలుషితం.. పరిశ్రమల పరిసరాల్లో ఇక్కట్లుఅధికారులు స్పందించాలి ప్లాస్టిక్ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతేనే పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం రావడం లేదు. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై మరింత చిత్తశుద్ధి పనిచేయాలి. – మహేష్రెడ్డి, భద్రాచలంప్లాస్టిక్ నిర్మూలనపై దృష్టి భద్రాచలంలో ప్లాస్టిక్ నిషేధం అమలుకు కృషి చేస్తున్నాం. తొలుత షాపుల్లో కవర్ల వినియోగాన్ని నిర్మూలించే కార్యక్రమం చేపట్టాం. త్వరలో ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపైనా దృష్టి సారిస్తాం. వాటర్ ప్లాంట్ల వద్ద కూడా పరిశీలిస్తాం. – శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ ఈఓ, భద్రాచలంభద్రాచలంఅర్బన్: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఏ విందు అయినా భోజనం వడ్డించడం ఆనవాయితీ. గతంలో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించగా.. ఇప్పుడు ప్లాస్టిక్ బఫే పేట్లు తెరపైకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం భద్రాచలంలోనే వీటి తయారీకి 6 – 7 కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్లేట్లలో భోజనాలు చేసే వ్యక్తులు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆయా కార్యక్రమాల వద్ద తాగునీరు సమకూర్చేందుకు వినియోగిస్తున్న వాటర్ ప్యాకెట్లు కూడా అంతే ప్రమాదంగా మారుతున్నాయి. అంతా కలుషితమే... ఇప్పుడు ప్రతీ గల్లీలో పేపర్ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, వీటి తయారీకి ఉపయోగించే ముడిసరుకు ప్రమాదకరమని.. తయారీ అనంతరం మిగిలిన వ్యర్థాలను పొలాలు, చెరువుల పక్కన వేయడంతో ఆ ప్రాంతాలు కలుషితమవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాక ఉపయోగం అనంతరం రహదారుల వెంట వేస్తుండడంతో అందులోని ఆహార పదార్థాలనే కాక ప్లేట్లను తింటున్న పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. ప్రమాదకర రసాయనాలు.. పేపర్ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని చెబుతున్నారు. హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరను వినియోగిస్తుండగా.. మోట్రో సోమిన్,బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డాక్సిన్ వంటి కెమికల్స్ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటాయని తెలుస్తోంది. ఇందులో వేడి వేడి ఆహార పదార్థాలు వేశాక కరిగి ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయని.. తద్వారా చర్మసంబంధిత వ్యాధులే ఇతర ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. -
విలువలు కలిగిన నేత పోటు ప్రసాద్
ఖమ్మంఅర్బన్: సమకాలీన రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నేతగా పోటు ప్రసాద్ నిలిచిపోతారని, ఆయన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ స్మారక స్థూపాన్ని ఖమ్మం ఇందిరానగర్ వద్ద ఖానాపురం హవేలీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేయగా సోమవారం పువ్వాడ ఆవిష్కరించి మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ, సీపీఐలో కీలకపాత్ర పోసించిన ప్రసాద్ అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, దండి సురేష్, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్.కే.జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, పోటు కలావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, వరదా నర్సింహారావు, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు పాల్గొన్నారు.స్తూపాన్ని ఆవిష్కరించిన సీపీఐ నేత పువ్వాడ -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా..
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులతో ప్రతిభ చాటారు. ఈమేరకు ఆయా విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అభినందించి వివరాలు వెల్లడించారు. – ఖమ్మం సహకారనగర్ ● న్యూవిజన్ ప్రభంజనం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో పేరాల ప్రణవ్ 497వ ర్యాంక్, మరో కేటగిరీల్లో అజ్మీరా రోషిక్ మణిదీప్ 5వ ర్యాంక్ సాధించారని తెలిపారు. ఇక భూక్యా పీయుష్ వర్థన్ 102, అజ్మీరా జిగీష 204, ఆంగోతు శ్యామ్ 205, భూక్యా యశ్వంత్ 394, పేరాల ప్రణవ్ 497, గూడె కార్తీక్సాయి 537, చంద్రసాయికృష్ణ 556, గుగులోతు షణ్ముఖ 562, తేజావత్ స్రవంతి 605, బానోతు వివేక్రామ్ 618, భూక్యా ప్రతీక్ 678, స్వర్ణ మనస్విక్ 770, గంగావత్ చరణ్తేజ్ నాయక్ 888, రామ కౌశిక్ 953, పగిడిపల్లి చేతన్చంద్ర 977, కంసాని మధుర హాసిని చౌదరి 1,026, భుక్యా శివనాగచైతన్య 1,093, బానోతు కౌశిక్ 1,377, ధర్మసోత్ రాహుల్ నాయక్ 1,427, వడ్లముడి ఆశిష్ 1,433, ఆళ్ల హేమంత్ 1,683, పండేటి యశస్విన్ 1,797, వాంకుడోతు బిందుబాయ్ 1,800, బానోతు దీపిక 1941, బానోతు మోహన్ సాయిలక్ష్మి 1,962వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. ● శ్రీచైతన్య.. ఆల్టైం రికార్డు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంక్లతో ఆల్టైం రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఆలిండియా స్థాయిలో హెచ్.జశ్వంత్ 9వ ర్యాంక్, ఎస్వీ.వీరబ్రహ్మం 92, బి.లిగ్నేష్ 144, వి.కుషాల్ 165, బి.విక్టోరియా 199, బి.జయంత్ 221, ఐ.అను 258, ఎం.జ్ఞాతిక్ లక్కి 270, డి.అంకిత 272, జి.కార్తీక్ 330, డి.రూపేష్ 370, ఎన్.జస్మిత 375, బి.వరుణ్ సాయి 383, హెచ్.జీవన్ 456, బి.మృదున 478, జి.ఉదయ్ కృష్ణ 502, జి.అమృత హాసిని 527, బి.సిద్ధు 538, బి.సిద్ధార్థ 560, బి.వంశీ 598, జె.లహరి 602, జి.రాహుల్ 664, బి.మహేష్ 673, టి.రోహిత్ 677, బి.పండు చరణ్ 761, ఎల్.మనోజ్కుమార్ 768, ఎం.లోకేష్ 847, బి.సుజిత్ 850, జె.మాయావతి 870, హెచ్ఎస్ చరణ్తేజ 882, వి.ప్రణతి 897, ఈ.శ్రీకర్ 921, బి.మురళి 928, టి.జశ్వంత్కుమార్ 947, బి.లావణ్య 1,007వ ర్యాంక్ సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాశ్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
మధిర: మధిర నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర మండలం మాటూరులో రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సబ్ ఏర్పాటుతో మాటూరు, మాటూరుపేట, నాగవరప్పాడు, సిద్ధినేనిగూడెం, అంబారుపేట గ్రామాలకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఇదే కాక అవసరమైన చోట సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈలు బండి శ్రీనివాసరావు, కె.హీరాలాల్, ఏడీఈలు ఏ.కిరణ్ చక్రవర్తి, శ్రీనివాస్, ఎం.అనురాధ, ఈఈ జి.వెంకటేశ్వర్లు, ఏడీఈ మధిర రూరల్ ఏఈ ఎస్.మైథిలి పాల్గొన్నారు. ఈ చెత్తాచెదారం ఏమిటి? ఐబీ డీఈ నాగబ్రహ్మయ్యపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా జాలిముడి ప్రాజెక్టును తనిఖీ చేశారు. అక్కడ మద్యం సీసాలు, చెత్తాచెదారం ఉండడాన్ని గమనించిన ఆయన నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసినా నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. రూ.25కోట్లతో రహదారి, సెంట్రల్ లైటింగ్ చింతకాని: చింతకానిలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. రూ.25 కోట్ల నిధులతో చింతకాని నుంచి కొణిజర్ల వరకు డబుల్ లేన్ బీటీ రహదారి నిర్మాణంతో పాటు చింతకానిలో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ నిర్మానం పనులకు శంకుస్థాపన చేయగా.. కాంగ్రెస్ నాయకులు, స్థానికులకు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, చింతకానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని స్థానికులు చెప్పగా ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీచేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ డీఈ రాంప్రసాద్, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు మడుపల్లి భాస్కర్, కూరపాటి కిషోర్, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున్, కొప్పుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
నీటి సంప్లో పడి చిన్నారి మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని రేగులచలకలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంప్లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రేగులచలకకు చెందిన ఆటో డ్రైవర్ సత్తి నరేష్–వినోద్ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీరాజ్యవి (5) ఇంటి ముందు అడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడి నీటి సంప్లో పడింది. తల్లి ఇంటి పనుల్లో ఉండగా ఈ విషయాన్ని గుర్తించలేదు. కాసేపటి తర్వాత చిన్నారి ఎటు వెళ్లిందోనని ఆరా తీస్తుండగా సంప్లో కనిపించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అంతసేపు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు. ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నిరుపేదనైన తన పేరు లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. మండలంలోని మంగాపురంతండాకు చెందిన ధరావత్ కేశ్యా పేరు జాబితాలో పేరు సోమవారం ఆయన పంచాయతీ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవటంతో వెనక్కి తగ్గినప్పటికీ ఆ కాసేపటికి ఒంటిపై పోసుకోగా స్థానికులు అడ్డుకుని ఇంటికి తీసుకెళ్లారు. మోకాళ్ల పై కూర్చుని నిరసన కారేపల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదంటూ కారేపల్లి మండలం పేరుపల్లిలో పలువురు అంబేడ్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. రేకుల ఇళ్లలోఉంటున్న తాము కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నా ఇళ్లు మంజూరు ఏయలేదని వాపోయారు. కొందరి స్వార్ధంతో ఈ పరిస్థితి ఎదురైనందున అధికారులు స్పందించాలని కోరారు. ఈకార్యక్రమంలో స్థానికులు పప్పుల నిర్మల, పప్పుల వెంకటేశ్వర్లు, అజ్మీరా సరిత, శంకర్, ధరా బక్కయ్య, అజ్మీరా నగేష్, ధారా రాంబాబు, పాయం బిక్షపతి, రవి, గుగులోతు సుభద్ర, కోటం నాగమణి, అజ్మీరా లక్ష్మి, విక్రమ్, గడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ల లక్ష్యం ఖరారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా వసూలు చేయాల్సిన పన్నులకు సంబంధించి లక్ష్యాన్ని ఖరారు చేశారు. గత ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి ఆదాయం నమోదైంది. దీంతో 2025–26 సంవతసరానికి గాను జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల ద్వారా రూ.69.37 కోట్ల వసూలుకు మార్కెటింగ్ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. గత ఏడాది లక్ష్యానికి మించి ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్ధులపల్లిలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.63.15 కోట్ల లక్ష్యాన్ని విధించగా రూ.65.56 కోట్ల ఆదాయం నమోదైంది. దీంతో ఈసారి రూ.69.37 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. తద్వారా దాదాపు రూ.6 కోట్లు పెంచినట్లయింది. అయినప్పటికీ లక్ష్య సాధన కోసం మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారు. మార్కెట్లలో వ్యాపారులు చేసే కొనుగోళ్లలో కొంత శాతం పన్ను రూపంలో వసూలు కానుంది. అలాగే, వివిధ ప్రాంతాల్లోని చెక్పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయనున్నారు. ఈ ఏడాది రూ.69.37 కోట్ల వసూళ్లకు ప్రణాళిక గతేడాది కంటే రూ.6 కోట్ల పెంపుమార్కెట్ల వారీగా గత ఏడాది, ఈ ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం (రూ.కోట్లలో) మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది ఖమ్మం 30 35 మధిర 4.75 4.99 నేలకొండపల్లి 3.78 4 కల్లూరు 5.67 5.44 వైరా 6.73 6.29 ఏన్కూరు 4.87 4.95 సత్తుపల్లి 4.94 5.12 మద్దులపల్లి 3.15 3.21 -
‘న్యూలిటిల్ ఫ్లవర్స్’ విద్యార్థులకు అభినందన
వైరా: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వైరాలోని న్యూలిటిల్ ఫ్లవర్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన వి.కుశాల్ 165, ఎం.నాగ యశ్వంత్ 393, రాహుల్దేవ్ 4,068 ర్యాంకులు సాధించగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సోమవారం అభినందించారు. కళాశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేష్, డైరెక్టర్ సుమన్, ప్రిన్సిపాల్ భువనప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ మధిర: జేఈఈ అడ్వా న్స్డ్ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ జాతీయస్థాయిలో 3,354 ర్యాంక్ సాధించాడు. 1 – 10వ తరగతి వరకు మధిర శ్రీ చైతన్య పాఠశాలలో చదివిన ఆయన ఇంటర్లో వెయ్యికి 986 మార్కులతో ప్రతిభ చాటారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్లో మెరుగైన ర్యాంకు సాధించిన శశాంక్ను పలువురు అభినందించారు. రహదారి మరమ్మతు చేయించాలని ఆందోళన కామేపల్లి: మండలంలోని ముచ్చర్ల నుంచి ఏన్కూర్ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైనా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన సోమవారం రాస్తారోకో చేశారు. నిమ్మవాగు సమీపాన చేపట్టిన ఆందోళనలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్ మాట్లాడుతూ.. కొత్త రహదారి నిర్మాణం మాటేమో కానీ కనీసం మరమ్మతు చేయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అనంతరం డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన సైకిల్యాత్ర చేపట్టారు. నాయకులు భూక్యా వీరభద్రం, ప్రభాకర్, రమేశ్, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, బాదావత్ శ్రీనివాస్, నవీన్, గిరిధర్, నర్సిరెడ్డి పాల్గొన్నారు. కరాటే పోటీల్లో ప్రతిభ ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఖమ్మం మహబూబ్ కరాటే స్కూల్కు చెందిన పది మంది విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన ఎన్.నియాన్ష్, పి.కుశల్, ఉద్యాంష్దత్తా, పి.అక్షిత, సయ్యద్ అమీర్పాషా, ఆర్.శశి, ఎన్.శ్రీసాహిత్య, రూప, కె.గణేశ్, సయ్యద్ అదిల్పాషా పతకాలు గెలుచుకున్నారు. వీరిని కరాటే స్కూల్ మాస్టర్ ఎండీ మహబూబ్ తదితరులు అభినందించారు. ఇక మరింత వేగం ! ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ, తరలింపునకు ఇప్పటివరకు పలు వాహనాలు ఉన్నాయి. అయితే, పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగుపడేలా కొత్తగా 19 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు వంద రోజుల ప్రణాళిక అమలు మొదలుపెట్టిన సోమవారం ఈ ట్రాక్టర్లను మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. అనంతరం ఓ ట్రాక్టర్ను కమిషనర్ అభిషేక్ ఇలా స్టార్ట్ చేసి కార్పొరేటర్లు, ఉద్యోగులతో కలిసి విజయ సంకేతం చూపించారు. జయరాజుకు గుర్తింపుపై హర్షంకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించిన కవి, గాయకుడు, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు జయరాజును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి, రూ. కోటి నగదు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. జయరాజు సింగరేణి కార్మిక ఉద్యమ నిర్మాతగా ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితులని కొనియాడారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, ఆశ్రమం కో ఆర్డినేటర్ సుగుణారావు ఉన్నారు. -
బెల్ట్షాపులు తొలగించాలని నిరసన
సత్తుపల్లిరూరల్: మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నందున బెల్ట్షాప్లు తొలగించాలనే డిమాండ్తో వేంసూరు మండలం శంభునిగూడెంకు చెందిన మహిళలు పలువురు సోమవారం నిరసన తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి ఎకై ్సజ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడారు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్షాపులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్సై శేఖర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పద్మ, రాధ, మారేశ్వరమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, సావిత్రి, రమణ, కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీసీఎంఎస్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్, సంస్థ పర్సన్ ఇన్చార్జి పి.శ్రీనివాసరెడ్డి ప్రశంసా పత్రాలు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆఫీస్ సబార్డినేట్ వెలిశాల వెంకటి, కల్లూరు సూపర్వైజర్ పెరుగు నాగరాజు, నేలకొండపల్లి ఉద్యోగి బొడ్డు సంతోష్కు ప్రశంసాపత్రాలు అందించారు. సంస్థ మేనేజర్ కె.సందీప్, ఉద్యోగులు పి.వినోద్, గోపి, శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. వర్షానికి కూలిన ఇంటి పైకప్పు కారేపల్లి: ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిగా నానిన పెంకుటింటి కప్పు కుప్పకూలింది. మండలంలోని గేటుకారేపల్లికి చెందిన భూక్యా శాంతి బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె సోమవారం పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లగా, ఇప్పటికే వరుస వర్షాలతో నానిన ఇంటి కప్పు, గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ సమయంలో శాంతి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరింది. చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి కారేపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోతు మంగ్లీ(70) భర్త ఏడాది క్రితం మృతి చెందగా, అప్పుడప్పుడూ మద్యం తాగుతుండేది. ఈ క్రమంలోనే గత నెల 29న మద్యం తాగాక మంగ్లీ పురుగుల మందు తాగింది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందిందని ఎస్ఐ బి.గోపి తెలిపారు. స్పృహ తప్పిన ఏఆర్ కానిస్టేబుల్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హుస్సేన్ పాషా స్పృహ తప్పి కిందపడ్డాడు. దీంతో సహచర సిబ్బంది 108 వాహనంలోకి ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఆయన స్పృహ కోల్పోగా, చికిత్స అనంతరం కోలుకున్నాడని అధికారులు తెలిపారు. రుణ బాకీ పేరిట వితంతువుల పింఛన్ నిలిపివేత మధిర: వితంతు, ఒంటరి మహిళ పింఛన్లు అందుకుంటున్న మహిళలు సభ్యులుగా ఉన్న మహిళా సంఘం పేర బకాయి ఉందంటూ పది నెలలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ పింఛన్లు నిలిపివేయడంపై ఆవేదన చెందుతున్నారు. మధిర మండలం దెందుకూరుకు చెందిన కొత్తపల్లి సుధ, పగిడిపల్లి కాంతమ్మ వితంతువుల పింఛన్, గద్దల పున్నమ్మ ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నారు. అయితే, పది నెలలుగా దెందుకూరులోని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ పింఛన్ ఆపేయడంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము సభ్యులుగా ఉన్న డ్వాక్రా గ్రూపులో కొందరు రుణబకాయి చెల్లించకపోవడమే ఇందుకు కారణమంటూ మేనేజర్ చెప్పారని తెలిపారు. ఈవిషయమై బ్యాంక్ మేనేజర్ వెంకన్నను వివరణ కోరగా అంజలి డ్వాక్రా గ్రూపు తరఫున రుణం తీసుకోగా కొందరు సభ్యులు తిరిగి చెల్లించడం లేదన్నారు. గ్రూపు నిబంధనల ప్రకారం సభ్యులెవరు చెల్లించకున్నా అందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే వారి అకౌంట్ హోల్డ్లో పెట్టామని వెల్లడించారు. -
‘సహకారం’ సరికొత్తగా..
● పీఏసీఎస్ల్లో ఎఫ్పీఓ సంఘాలు ● భద్రాద్రి జిల్లాలో 11 పీఏసీఎస్ల ఎంపిక ● రైతుల ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంబూర్గంపాడు: రైతుల ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు, పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీఓ (ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్) సంఘాలను ఏర్పాటు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 10 వేల ఎఫ్పీఓలు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో 2020లో కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది. కంపెనీల చట్టం, సహకార చట్టం కింద నమోదైన సంఘాల్లోని సభ్యులతో ఎఫ్పీఓలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలోని 21 పీఏసీఎస్లకు గాను తొలివిడతగా 11 సొసైటీల్లో ఎఫ్పీఓ సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. జిల్లాలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, దుమ్ముగూడెం, చర్ల, గానుగపాడు, గుంపెన, కొత్తగూడెం, జూలూరుపాడు పీఏసీఎస్లకు ఇందులో స్థానం దక్కింది. సభ్యులుగా 750 మంది రైతులు.. ఎఫ్పీఓ సంఘంలో 750 మంది రైతులు సభ్యులుగా ఉంటారు. ఒక్కొక్కరు రూ. 2000 చొప్పున వాటాధనం చెల్లించి సభ్యులుగా చేరాలి. రైతుల ఈక్విటీగా మొత్తం రూ.15 లక్షలు జమచేస్తే, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా రూ.15 లక్షలు అందిస్తుంది. ఎఫ్పీఓలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను, పాలకమండలిని కూడా ఎన్నుకోవాలి. ఎఫ్పీఓలలో సగం మంది సన్న, చిన్నకారు రైతులతో పాటు మహిళా రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. ఎఫ్పీఓల నుంచి 18 నెలల వ్యాపార ప్రణాళిక, బడ్జెట్తో వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేపట్టాలి. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్ర పరికరాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడం, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వంటి వ్యాపారాలను ఎఫ్పీఓలు చేపట్టాల్సి ఉంటుంది. విత్తనోత్పత్తి, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటి అధిక ఆదాయం వచ్చే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. ఆదాయం పెంపే లక్ష్యంగా.. ఎఫ్పీఓలతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యాపారాలను విస్తృతపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, సాగుకు అవసరమైన యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్ల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. ఉద్యానవన పంటల మార్కెటింగ్, పశుపోషణ, జీవాల పెంపకాలకు అవరమైన వసతులు కల్పించడం వంటి పనులు నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా ఎఫ్పీఓలు పనిచేయాల్సి ఉంది. ఎఫ్పీఓల ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయనున్నారు.విత్తనాలు, ఎరువుల విక్రయం.. ఇప్పటికే పీఏసీఎస్లు రైతులకు వ్యవసాయ రుణాలు అందించడంతో పాటు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను కూడా పీఏసీఎస్లకే అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కుదేలయ్యాయి. రైతులు తీసుకున్న అప్పులు చెల్లించక ఆర్థికంగా దెబ్బతిన్నాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల వ్యవసాయ రుణాలు, బంగారం తాకట్టు రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయడంతో సహకార రంగం ఊపిరి పీల్చుకుంది. ఆయన హయాంలోనే పీఏసీఎస్లను బలోపేతం చేసేందుకు ఎరువులు, విత్తనాల విక్రయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పీఏసీఎస్లు బలోపేతం కాసాగాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీఓ సంఘాలు ఏర్పాటు చేస్తుండడంతో మరింత ఆర్థిక పరిపుష్టి సంతరించుకోనున్నాయి. -
లారీని ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: టైర్ పంక్షర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో 10మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు సోమవారం సాయంత్రం ఖమ్మం వస్తోంది. పిండిప్రోలు సమీపాన కాశీపట్నం వద్ద టైర్ పంక్షర్ అయి ఆగిన లారీని తప్పించే క్రమంలో ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయాలైన 10 మంది ప్రయాణికులను 108లో ఖమ్మం తరలించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
ఫంక్షన్ హాళ్ల మధ్య దుర్గంధం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఫంక్షన్హాళ్ల సమీపంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లుతోంది. ఫంక్షన్ హాళ్ల యజమానులు డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగునీరు హాళ్ల మధ్య గల ఖాళీ ప్రదేశంలోకి చేరుతోంది. దీంతో ఫంక్షన్లు చేసుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శికి, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ లేక అవస్థలు -
మా బతుకులు రోడ్డున పడ్డాయి..
● ఆర్సీహెచ్పీకి బొగ్గు లోడింగ్ నిలిపివేయాల్సిందే.. ● ఆందోళనకు దిగిన లారీల యజమానులు ● నాణ్యమైన బొగ్గు ఇవ్వడం లేదని ఆవేదన సత్తుపల్లి: నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతో... కొనుగోలుదారులు మహారాష్ట్ర, ఒడిశా గనులకు వెళ్తున్నారని తద్వారా తమకు లోడింగ్ లేక జీవనాధారం కోల్పోతున్నామని సత్తుపల్లికి చెందిన లారీల యయజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి మండలంలోని ఓసీల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతున్నా రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ) ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ తమ బతుకులను రోడ్డున వేశారని మండిపడ్డారు. ఈమేరకు కిష్టారం ఓసీ వద్ద సోమవారం ఆందోళనకు దిగడమే కాక ఆర్సీహెచ్పీ కి వెళ్లే టిప్పర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి భూమిలో బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, ఆంధ్రా కాంట్రాక్టర్లకు లబ్ధి జరిగేలా యాజమాన్యం, అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సమస్య ఏమిటంటే... ఓసీల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులు, స్థానికులు జీవనాధారం కోసం లారీలు కొనుగోలు చేశారు. వీరికి రోజు 6వేల టన్నుల బొగ్గు లోడింగ్ ఇస్తామని పలుమార్లు అధికారులు తెలిపారు. అయితే, ఆచరణలో మాత్రం రోజుకు కేవలం 2వేల నుంచి 2,500 టన్నులు మాత్రమే ఇస్తుండడంతో 30 లారీలకే లోడింగ్ వస్తోంది. సత్తుపల్లిలో మొదటగా 650 లారీలు ఉండగా.. సరైన లోడింగ్ అందక సకాలంలో ఫైనాన్స్ కిస్తీలు చెలిం్లచక ఒక్కొక్కరు అమ్ముకుంటూ రావడంతో ఆ సంఖ్య ప్రస్తుతం 450కి పడిపోయింది. నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతోనే.. సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో జీ–8, 9, 11, 13, 15, 16 రకం బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీ–8, 13 నాణ్యమైనది కావడంతో మంచి డిమాండ్ ఉంది. కానీ నాణ్యమైన బొగ్గును కావాల్సిన కంపెనీలకు కాక రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ) ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈక్రమాన సింగరేణి క్వాలిటీ మేనేజర్ తీరుతో వివిధ కంపెనీల బాధ్యులు ఆర్డర్లు రద్దు చేసుకుని మహారాష్ట్ర, ఒడిశా గనులకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ ప్రాజెక్టు నుంచి 5వేల టన్నులు ఆర్డర్ చేస్తే.. బొగ్గు లోడింగ్ ఇవ్వలేదని సమాచారం. తాత్కాలిక అనుమతితో రవాణా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ)కు రోడ్డు మార్గాన టిప్పర్ల బొగ్గు రవాణా చేసేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా ఓసీ ల్లో బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉందని, నిల్వ చేస్తే మంటలు వస్తున్నాయని సాకు చూపి తాత్కాలిక అనుమతితో రవాణా చేస్తున్నారు. ఏడాది దాటినా ఆర్సీహెచ్పీకి నిరంతరాయంగా బొగ్గు రవాణా చేస్తుండడంతో స్థానిక లారీ లకు లోడింగ్ అందడంలేదు. ఇకపై ఆర్సీహెచ్పీకి లోడింగ్ అడ్డుకుంటామని లారీల యజమానులు చెబుతున్నారు.జూలై నుంచి ఇస్తాం.. బొగ్గు కాంట్రాక్టు ఆర్డర్లు లేకపోవడంతోనే లోడింగ్ ఇవ్వలేకపోతున్నామని.. వచ్చే జూలై నుంచి లోడింగ్ పెంచుతామని కిష్టారం, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ పీఓలు నర్సింహారావు, ప్రహ్లాద్ లారీల యజమానులకు హామీ ఇచ్చారు. యజమానుల ఆందోళనతో వారు యూనియన్ కార్యాలయంలో చర్చించినా వారి సమాధానంతో సంతృప్తి చెందలేదు. మరో దఫా చర్చలు జరిపి లోడింగ్లు పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళలో లారీ యూనియన్ బాధ్యులు కొండపల్లి రమేష్రెడ్డి, ఎస్.కే.మౌలాలీ, కోట మోహన్రావు, చిన్నంశెట్టి సూరిబాబు, ఎస్.కే.మస్తాన్, ఎస్.కే.ఖలీల్, దురిశేటి శ్రీనివాసరావు, కొండపల్లి క్రాంతిరెడ్డి, చిలుకూరి మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిరుమలాయపాలెం: అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలంలోని రఘునాథపాలెం, గోల్తండా, రాజారం, దమ్మాయిగూడెం, కొక్కిరేణి గోపాలపురం తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ నిరుపేదలకు తొలుత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. ఆతర్వాత అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. మొదటి దఫా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మరో విడత కేటాయిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన మాట ప్రకారం రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. నేటి నుంచి సదస్సులు వానాకాలం సీజన్కు సంబంధించి త్వరలోనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదలవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. అలాగే, ధరణి స్థానంలో ప్రవేశపెట్టిన భూభారతి ద్వారా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలపై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం నుంచి ఈ సదస్సులు మొదలవుతాయని వెల్లడించారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపినా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, కొప్పుల అశోక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
సిద్ధమైన నమూనా గృహం
రఘునాథపాలెం: రఘునాథపాలెం తహసీల్ ఆవరణలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం పూర్తయింది. మండలంలో మల్లేపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 19మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అయితే, వడపోత తర్వాత 13 మందినే ఎంపిక చేయగా ముగ్గురు ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. మిగతా 10మంది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే, దశల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయనుండడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో నిర్మించుకునేలా అవగాహన కోసం తహసీల్ ఆవరణలో నమూనా గృహాన్ని నిర్మించారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా విధులు ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీజ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగుల ఉద్యమంతో తెలంగాణ సిద్దించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ ఎన్.అరుణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఖమ్మంరూరల్: అక్రమంగా పశువుల రవాణాను అడ్డుకునేలా విస్తృత తనిఖీలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రూరల్ మండలం వెంకటగిరి క్రాస్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును డీసీపీ సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడమే కాక పశువులను తరలిస్తున్నట్లే తేలితే అనుమతి పత్రాలు పరిశీలించాలన్నారు. సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేయాలని ఆదేశించారు. కాగా, నిబంధనలకు విరుధ్ధంగా పశువుల రవాణా జరుగుతున్న తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాకతీయుల కాలం నాటి శిలాశాసనం నేలకొండపల్లి: మండలంలోని అనాసాగారంలో కాకతీయుల నాటి శిలాశాసనాన్ని గుర్తించారు. గ్రామ పాత బొడ్రాయి సెంటర్లో రావిచెట్టు వద్ద ఈ శాసనం వెలుగుచూసింది. నాలుగు అడుగుల పొడవు, అడుగు మందంతో ఉన్న నల్లరాతి బండపై ఓ వైపున 19 పంక్తులతో తెలుగు లిపిలో రాసి ఉన్న శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్ నేతృత్వాన సోమవారం గుర్తించారు. శాసనంపై శివలింగం, దానికి రెండువైపులా సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయి. మహామండలీశుడు కాటేయ(రుద్రసేనాని కొడుకు) రాజ్యం ఏలుతున్నప్పుడు గోవిందమాంబ, దేవశెట్టి కొమ్మోజు తవ్వించిన రుద్రసముద్రానికి ఎకరంన్నర భూదానం చేసినట్లు ఈ శాసనం తెలుపుతోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం కన్వీనర్ హరగోపాల్, గ్రామ పెద్దలు వున్నం వెంకయ్య, పసుమర్తి శ్రీనివాస్, తిరుమల్, షేక్ రహీముతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అదే మా లక్ష్యం, పాలనావిధానం
● రాజీవ్ కెనాల్తో 1.25లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ● మధిరలో ఇందిరా మహిళా డెయిరీతో మహిళల ఆర్థికాభివృద్ధి ● తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కజాతీయజెండా ఆవిష్కరించి వందనం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పక్కన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీసీ సునీల్దత్ (ఇన్సెట్) ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతుండగా, అభివృద్ధి, సంక్షేమాలను ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేకమంది అసువులు బాయగా.. వీరి త్యాగాలతోనే ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈక్రమంలోనే జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే... – సాక్షి ప్రతినిధి, ఖమ్మంపెరగనున్న ఆయకట్టు సేద్యం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.100 కోట్లతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి రూ.1.25 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి– యాతాలకుంట ట్రంక్కెనాల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగు నీరు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశాం. మున్నేరు నుంచి పాలేరు కెనాల్ వరకు రూ.102.92 కోట్ల అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. మున్నేటి వరద ముంపునకు అడ్డుకట్ట వేసేలా ఇరువైపులా రూ.525.36 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నాం. మహిళల ఆర్థిక సాధికారత ● మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుచేస్తున్నాం. 21వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండేసి పాడి గేదెలు ఇచ్చి పాలు సేకరిస్తాం. అలాగే, ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళా మార్ట్, 64 సీ్త్ర టీ షాపుపెద్దమొత్తంలో నిధులతో 613 క్యాంటీన్ షెడ్లు, 28 పౌల్ట్రీ షెడ్లు ఏర్పాటు చేశాం. ● భూభారతితో రైతుల సమస్యలు తీరనున్నాయి. జిల్లాలోని నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సదస్సుల ద్వారా 3,224 దరఖాస్తులు స్వీకరించాం. ఆపై బోనకల్ మండలాన్ని రెండో పైలట్ మండలంగా ఎంపిక చేసి సదస్సులు నిర్వహించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. ● 2024–25 యాసంగి సీజన్లో జిల్లాలో ఇప్పటి వరకు 32,102 మంది రైతుల నుంచి 21,66,180 క్వింటాళ్ల ధాన్యం సేకరించాం. ఇందులో సన్న ధాన్యానికి బోనస్గా 47,494 మంది రైతులకు రూ.136.33 కోట్లు చెల్లించాం. ● తాగునీటి సమస్య పరిష్కారానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ.229 కోట్లతో చేపట్టిన పనులు తుదిదశలో ఉన్నాయి. వైరాలో రూ.28 కోట్లు, మధిరలో రూ.17 కోట్ల నిధులతో పనులు పూర్తిచేశాం. ● జిల్లాలోని 60 పాఠశాలల్లో న్యూట్రిగార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. మధిరలో రూ.4కోట్లు, సిరిపురంలో రూ.5 కోట్లు, కూసుమంచి మండలంలో రూ.5.50 కోట్లతో జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలు చేపట్టాం. ఖమ్మం మెడికల్ కాలేజీకి నూతన భవనాల నిర్మాణం రూ.130 కోట్లతో చేపడుతున్నాం. అలాగే, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 – 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాం. ● పర్యాటక అభివృద్ధికి నూతన పాలసీ తీసుకొచ్చాం. వెలుగుమట్ల అర్బన్పార్క్ వద్ద 40 అడుగుల రోడ్డు, ప్లే ఏరియా, బోటింగ్ ఏరియా అభివృద్ధి చేశాం. ఖమ్మం ఖిలాపైకి రోప్వే నిర్మాణానికి రూ.29 కోట్లతో ప్రతిపాదించాం. పాలేరు రిజర్వాయర్ అభివృద్ధి, పర్యాటకులకు సౌకర్యాల కల్పన కోసం రూ.16.75 కోట్లతో ప్రతిపాదించి రూ.5కోట్లు మంజూరు చేశాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్ఓ పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పెనుబల్లి మండలం పులిగుండాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఏర్పాటుచేసిన సఫారీ వాహనాన్ని పరేడ్ గ్రౌండ్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. -
తెలంగాణ ‘పానకాల స్వామి’!
చింతకాని: చుట్టూ కొండలు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చని పొలాలు.. ఎత్తయిన గుట్టపై రాతి కొండలో స్వయంభువుగా వెలిసిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి కొలిచిన వారికి కొంగు బంగారంలా వర్థిల్లుతున్నాడు. భక్తులు పోసిన బెల్లం పానకాన్ని సగం స్వీకరించి.. మిగతాది ప్రసాదంగా మిగులుస్తూ పానకాల స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. త్రేతాయుగంలో హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించే క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట సమీపాన ఉన్న కొండపై ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై నర్సింహస్వామి స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పానకాల స్వామి ఆలయం.. దేశంలో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి తర్వాత తెలంగాణలోని సీతంపేటలో మాత్రమే ఉంది. ఘనమైన ఆలయ చరిత్ర త్రేతాయుగంలో నర్సింహస్వామి.. హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించి తిరిగి వైకుంఠానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వెళ్తున్నాడట. మార్గమధ్యలో సీతంపేట వద్ద ప్రకృతి రమణీయతతో అలరారుతుండటంతో దేవేరుల కోరిక మేరకు స్వామి ఇక్కడ కొండపై స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మిక. 500 ఏళ్ల క్రితం.. సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంత జమీందారు, నాగులవంచ పరగణా«దీశుడు గడ్డం సీతారామిరెడ్డి తాత భూపతిరెడ్డికి సంతానం లేకపోవటంతో.. ఆ దంపతులు ఇష్ట దైవం నర్సింహస్వామిని నిత్యం పూజించేవారు. ఒకరోజు భూపతిరెడ్డి కలలో కనిపించి దేవుడు ‘నీకు సంతానం కలగాలంటే నాకు గుడి కట్టించాలి. జ్యోతి రూపంలో ఆకాశమార్గంలో వెళ్తుంటాను. ఆ జ్యోతి ఎక్కడయితే అదృశ్యమవుతుందో అక్కడే ఆలయం నిర్మించాలి’.. అని చెప్పి అదృశ్యమయ్యాడట. దీంతో జమీందార్ సూచనల మేరకు పండితులు అన్వేషిస్తుండగా సీతంపేట వద్ద అడవిలోని కొండల మధ్యలో.. రాతి కొండపై స్వామి వారు దేదీప్యమానంగా దర్శమిచ్చారట. భూపతిరెడ్డి రాతి కొండపై స్వామి గుడి కట్టించాడు. తదనంతరం జమీందారుకు సంతానం కలిగింది. కాగా, స్వామి ఇక్కడ ఏనుగు పడుకున్న ఆకారాన్ని పోలి ఉండడంతో.. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిగా కొలుస్తున్నారు. పానకాల స్వామిగా.. నర్సింహస్వామికి పాంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆరాధన, పూజలు నిర్వహించేవారు. కొంతకాలానికి ఒక భక్తుడిని స్వామి వారు ఆవహించి.. ‘నాకు దప్పికగా ఉంది. బెల్లం పానకం పోయండి’.. అని సూచించారట. దీంతో అర్చకులు బిందెలతో పానకం పోయగా.. సగం మాత్రమే స్వీకరించారని ప్రతీతి. ఇదేమిటని ప్రార్థించడంతో ‘సగం పానకాన్నే స్వీకరిస్తా.. మిగతాది భక్తుల కోసం’.. అని చెప్పినట్లు ప్రతీతి. దీంతో అప్పటి నుంచి శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిని పానకాల స్వామిగా కొలుస్తున్నారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. కొండపై కోనేరు.. కొండపై ఆలయం, కోనేరు ఉంటాయి. ఈ కోనేరు స్వామి వారి పాదముద్రల ఆకారంలో ఉండడంతో పాటు ఎండాకాలంలో ఎక్కడా నీరు లేకున్నా కోనేరు మాత్రం ఎండిపోయిన దాఖలాలు లేవు. దీన్ని స్వామి మహిమగా భక్తులు చెప్పుకుంటారు. కాగా, త్రిదండి చినజీయర్ స్వామి 2004లో ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ఆయన హాజరయ్యారు. ధూపదీప నైవేద్యానికి 150 ఎకరాలు నైజాం నవాబు భూమి శిస్తు వసూళ్ల కోసం ఈ ప్రాంతానికి రాగా జమీందారు భూపతిరెడ్డి ఆయనను ఆలయానికి తీసుకెళ్లాడట. అక్కడ పానకం మహిమను వివరిస్తే నవాబు స్వామి విగ్రహం నోట్లో చేయి పెట్టి అబద్ధమని పరిహాసమాడాడట. దీంతో ఆగ్రహించిన స్వామి.. తన దంతాలతో నవాబు చేయి బయటకు రాకుండా పట్టుకోవడంతో.. ఆయన క్షమించమని కోరడమే కాక ధూపదీప నైవేద్యాల నిమిత్తం కనుచూపు మేర ఉన్న భూమిని ఆలయానికి రాసిచ్చాడని చెబుతారు. కాగా, భూపతిరెడ్డి వంశీయులైన నాగులవంచ గ్రామానికి చెందిన గడ్డం ఉపేందర్రెడ్డి కుటుంబీకులు గత మూడేళ్ల వరకు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులుగా కొనసాగారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతోంది. అయితే, ఆలయం పేరిట ఉన్న 150 ఎకరాల భూమిని అమ్మి నగదు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ నగదు ఎటూ సరిపోనందున.. ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారుఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలి తెలంగాణలో స్వామి పానకం తాగే ఏకైక ఆలయం సీతంపేటలోనే ఉంది. పచ్చని పంట పొలాల మధ్య ఎత్తయిన కొండపై స్వామి స్వయంభువుగా వెలిశారు. ఘనచరిత్ర కలిగిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. – చుండూరు రామకోటేశ్వరరావు, ఆలయ ఈవో నిర్వహణ కష్టంగా ఉంది శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలి. దేశంలో ఉన్న రెండు ఆలయాల్లో సీతంంపేటలో ఒకటి ఉంది. ఆలయానికి ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఆలయ నిర్వహణ కష్టంగా ఉంది. ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలి. – పీవీ రమణాచార్యులు, ఆలయ అర్చకుడు -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఒడి బియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. రాయితీపై ఫైబర్ గడలు దమ్మపేట : పామాయిల్ గెలల కోతకు వినియోగించే ఫైబర్ గడలను ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై అందజేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని గండుగులపల్లిలోని తన నివాసంలో పలువురు రైతులు కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎత్తయిన పామాయిల్ చెట్ల గెలలు కోసే క్రమంలో విద్యుత్ షాక్ తగలకుండా ఫైబర్ గడలను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, వసంతరావు, అప్పారావు, రైతులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్టీఎఫ్ నాయకులు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో విద్యార్థులకు మేలు జరగడమే కాక విద్యారంగానికి దిక్సూచిలా నిలుస్తాయని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్లో ఆదివారం ఆయన పలువురు ఎస్టీఎఫ్ బాధ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఈమేరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ చిత్రపటాన్ని అందజేసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కాక అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు ఉత్తమ విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. -
ఏదీ కారుణ్యం?
● జెన్కోలో కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు ● కేటీపీఎస్లో సుమారు 76 మంది బాధితులు పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. కర్మాగారాల్లో నిత్యం కాలుష్యం అధికంగా ఉండే రెడ్జోన్ పరిధిలో కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో అనేక ప్రాణాంతక వ్యాధులకు గురై అనారోగ్యంతో బాధపడుతుంటారు. వ్యాధులు, ప్రమాదాలతోపాటు అకాల మరణాలు చెందిన అనేక మంది ఉద్యోగుల కుటుంబాలకు దక్కాల్సిన కారుణ్య నియామకాలపై జెన్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఉద్యమాలు చేస్తున్నా తాత్సారం చేస్తోంది. జెన్కో వ్యాప్తంగా సుమారు 110 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తుండగా, కేవలం కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలోనే సుమారు 76 మంది వరకు ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బాధితుల ఎదురుచూపులు ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. జెన్కోలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సీఎండీలు మారడం, డైరెక్టర్ స్థాయి పోస్టులు ఖాళీగా ఉండటం, ప్రభుత్వం మారడం వంటి పరిణామాలతో మూడేళ్లుగా ఈ ప్రక్రియ మందగించింది. దీంతో విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న బాధిత కుటుంబీకులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఫైరవీల పేరుతో బాధితుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాలు వెంటనే ఇస్తే ఎక్కువ కాలం విధులు నిర్వర్తించే చేసే అవకాశం, సీనియారిటీ పెరిగి అధిక వేతనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నట్లు పలువురు వాపోతున్నారు. వర్తించని జీపీఎఫ్ 1999 నుంచి 2004 మధ్యలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తించడం లేదు. ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చి పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగాలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యపై కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. అయినా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి, కారుణ్య నియామకాల కోసం, జీపీఎఫ్ కోసం తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాడ్ చేస్తున్నాయి. -
ఐఎఫ్ఎస్గా భరత్ స్కూల్ పూర్వ విద్యార్థి ఎంపిక
మధిర: మధిరలోని భరత్ టెక్నో స్కూల్ పూర్వ విద్యార్థి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం రామిరెడ్డిపల్లికి చెందిన ఆలపాటి గోపీనాథ్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఓసీ కేటగిరీ నుంచి 55వ ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. ఈసందర్భంగా ఆదివారం ఆయనను స్కూల్ చైర్మన్ శీలం వెంకటరెడ్డి సన్మానించారు. భరత్ విద్యానికేతన్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివిన గోపీనాథ్ ఐఎఫ్ఎస్కు ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ నెట్బాల్ టోర్నీలో కాంస్య పతకం ఖమ్మం స్పోర్ట్స్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ పోటీల్లో ఖమ్మం రూరల్ పెద్ద వెంకటగిరికి చెందిన వి.హర్షిణి కాంస్య పతకం దక్కించుకుంది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమె ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా హర్షిణిని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, నెట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సీహెచ్.దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్, కోచ్లు పీ.పీ.రమణ, అఖిల్కుమార్ అభినందించారు. అధ్యాపకుల నిరసన ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని నూతన అధ్యాపకులకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో కొందరు కుట్ర పన్నారని పేర్కొంటూ అధ్యాపకులు నిరసన తెలిపారు. ఈమేరకు ఖమ్మంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్–475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడగా బాధ్యులు బేగం, మల్లయ్య, కిషోర్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు ఖమ్మం సహకారనగర్: పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరే క్రమాన కళాశాలల అనుమతులు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. అకాడమీలు, ట్యూషన్ సెంటర్లకు ఎలాంటి అనుమతులు ఉండవని వెల్లడించారు. ఈనేపథ్యాన ప్రభుత్వ అనుమతులు పరిశీలించాకే చేరాలని.. తద్వారా నష్టం జరగదని పేర్కొన్నారు. ఈమేరకు కళాశాలల గుర్తింపు వివరాలను tsbie.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని డీఐఈఓ తెలిపారు. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున విద్యార్థులు హాజరుకావాలని ఆయన సూచించారు. భారజల కర్మాగారం జీఎంగా శ్రీనివాసరావు అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని మణుగూరు భారజల కర్మాగారం జీఎంగా ఘంటసాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుత జీఎం హెచ్కే.శర్మ ఉద్యోగ విరమణ చేయడంతో డీజీఎంగా పని చేస్తున్న శ్రీనివాసరావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
‘ఈ దేశ మూలవాసులం మనమే..’
ఖమ్మం మామిళ్లగూడెం: ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాక మతం మార్చుకున్న ముస్లిం మైనార్టీలు కూడా ఈ దేశ మూలవాసులేనన్న అంశం శాసీ్త్రయంగా నిరూపితమైందని బామ్సెఫ్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా శ్రీధర్ తెలిపారు. సంఖ్యాపరంగా అధిక సంఖ్యలోనే ఉన్నా బానిసలుగా, బాధితులుగా మిగిలిపోవడంతో విద్య నుండి దూరమయ్యామని చెప్పారు. ఖమ్మం టీటీడీసీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇతర దేశాల నుండి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి జీవన విధానం, నాగరికతను ధ్వంసం చేసి ఎవరూ తిరగబడకుండా కుల వ్యవస్థ, మనుధర్మాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈమేరకు అందరూ చరిత్రను చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమారి మాట్లాడుతూ మాతస్వామిక తత్వంతో జీవించగా, సీ్త్రలకు విలువలు లేని మనుధర్మ శాస్త్రం, కులాన్ని రుద్దడం ద్వారా రాజ్యాధికారానికి దూరం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో తొలుత సామాజిక ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈకార్యక్రమంలో బామ్సెఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా పెద్దన్నతో పాటు వివిధ సంఘాల నాయకులు భూక్యా ఉపేంద్రబాయి, షేక్ నజీమా, ప్రమీల, త్రివేణి, భవాని, సరోజని, బానోతు భద్రునాయక్, మీగడ రామారావు, రవి, సోమ్లా, సంజీవరావు, పగిడిపల్లి నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తుల కన్నా.. పర్యావరణం మిన్న
సింగరేణి(కొత్తగూడెం): ప్రపంచంలో అన్నింటికీ హద్దులు ఉన్నా.. గాలి, వెలుతురు, ఆక్సిజన్కు లేవని, అందుకే ఆస్తుల కంటే పర్యావరణమే ముఖ్య మని గుర్తించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేఓసీ డంప్యార్డ్ వద్ద ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 121 మొక్కలు నాటారు. దీంతో తాను ఇప్పటివరకు 19,121 మొక్కలు నాటానని, వచ్చే జూలై చివరి నాటికి మరో 1,879 మొక్కలు నాటి.. 21వేల లక్ష్యాన్ని చేరాల్సి ఉందని వివరించారు. ఒక మొక్క ద్వారా రూ. కోటి విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వీ.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం శాలేంరాజు, అటవీ, పర్యావరణ శాఖ సలహాదారు మోహన్ చంద్ర పరిగెన్, పర్యావరణ జీఎం సైదులు, జీకేఓసీ పీఓ రమేష్, సూర్యనారాయణతో పాటు ఎండీ రజాక్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో మొక్కలు నాటిన సీఎండీ -
భారంగా పచ్చిరొట్ట సాగు
● గత ఏడాదితో పోలిస్తే విత్తనాల ధర రెట్టింపు ● సరఫరా సైతం నామమాత్రంగానే... ● ఉత్పత్తి సరిపడా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఖమ్మంవ్యవసాయం: భూసారాన్ని పెంచేలా రైతులు సాగుచేసే పచ్చిరొట్ట విత్తన ధరలు అమాంతం పెరిగాయి. గత ఏడాదితో రెట్టింపు కావడం గమనార్హం. ఏకంగా ఒక్కో విత్తన బ్యాగ్పై రూ.వేయికి పైగా ధర పెరిగినా.. సరిపడా అందుబాటులో లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పంటల సాగుకు ముందు తొలకరి వర్షాలు కురవగానే భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేస్తారు. ఈ పైరు పెరిగాక భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి సాగు చేసే మాగాణి భూముల్లోనే కాక మిర్చి, పండ్ల తోటల్లో భూముల్లో పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జనుము, పిల్లి పెసర సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతకు మించి... పచ్చిరొట్ట విత్తనాల ధరలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. గత ఏడాది కిలో జీలుగుల ధర రూ.37.20 కాగా, ఈ ఏడాది రూ.71.25కు చేరింది. జనుము గత ఏడాది రూ.36.20 ఉంటే రూ.62.75, పిల్లి పెసర గత ఏడాది రూ.54.20 కాగా ఈ ఏడాది రూ.102.50గా నిర్ణయించారు. ఈ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ఽ50 శాతం సబ్సిడీతో అందిస్తున్నా రైతులు భారం మోయలేకపోతున్నారు. అంతంతే సరఫరా ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు డిమాండ్ మేరకు విత్తనాభివృద్ది సంస్థకు ఇండెంట్ ఇస్తాయి. ఆపై విత్తనాభివృద్ధి సంస్థ పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో తీసుకొస్తుంది. ఈ ఏడాది ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల అధికారులు జీలుగులు 19వేల క్వింటాళ్లు, జనుము 1,900 క్వింటాళ్లు, పిల్లి పెసర 200 క్వింటాళ్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఇందులో జీలుగు 3,252 క్వింటళ్లు, జనుము 1,170 క్వింటాళ్లే అందుబాటులోకి వచ్చాయి. ఇక పిల్లి పెసర విత్తనాల జాడే లేదు. గత ఏడాది జీలుగులు 15,229 క్వింటాళ్లు, జనుము 1,172 క్వింటాళ్లు, పిల్లి పెసర 171 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కానీ ఈసారి తక్కువగా అందుబాటులో రావడంతో రైతులందరికీ అందకపోగా.. , ధర పెరిగిన నేపథ్యాన కొందరు సాగుపై నిర్లిప్తత కనబరుస్తున్నారు. ఉత్తరాది నుంచి దిగుమతి పచ్చిరొట్ట పంటలను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేస్తారు. ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లోనే కాక బిహార్లో ఈ పంటలే సాగవుతున్నాయి. కానీ ఈ ఏడాది పచ్చిరొట్ల పంటల దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తద్వారా ధరలపైనే కాక లభ్యతపై ప్రభావం పడిందని విశ్లేషిస్తున్నారు. ఏదిఏమైనా విత్తన ధరలు పెరగడం, సరఫరా తగ్గడంతో ఈ ఏడాది పచ్చిరొట్ట సాగు సైతం తగ్గుతుందని చెబుతున్నారు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం పెరిగే అవకాశముంది.పచ్చిరొట్ట విత్తనాల ధరలు (రూ.ల్లో) విత్తనం కిలోలు గత ఏడాది ఈ ఏడాది పెంపు జీలుగు 30 1,116 2,137 1,021 జనుము 40 1,448 2,510 1,062 పిల్లిపెసర 30 1,084 2,055 971 -
సాగుకు మరింత నీరు
● బుగ్గవాగు చెక్డ్యాం నుంచి పైపులైన్ల ఏర్పాటుకు ప్రణాళిక ● రూ.82కోట్ల బడ్జెట్తో ప్రభుత్వానికి ప్రతిపాదన ● అమలైతే 5,500 ఎకరాలకు సజావుగా సాగునీరు ఖమ్మంఅర్బన్: జిల్లాలోని కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో సాగునీటి కష్టాలు తీర్చేలా కొత్త పథకం తెరపైకి వచ్చింది. కారేపల్లి – కామేపల్లి మండలాల సరిహద్దుల్లో బుగ్గవాగుపై ఏళ్ల క్రితమే చెక్డ్యాం నిర్మించగా.. గ్రావిటీ కాల్వల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందిగా మారడంతో ఫలితం దక్కలేదు. ఇటీవల రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ల ద్వారా 33 చెరువులకు సాగునీరు మళ్లించగా విజయవంతమైంది. ఇదే తరహాలో చెక్డ్యాం నుంచి పైపులైన్లు వేసి చెరువులకు నీరు మళ్లించాలని ప్రతిపాదించిన జల వనరుల శాఖ అధికారులు రూ.82 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించినట్లు తెలిసింది. పదేళ్ల క్రితమే నిర్మాణం బుగ్గవాగుపై పదేళ్ల క్రితమే చెక్డ్యామ్ నిర్మించారు. ఆతర్వాత గ్రావిటీ కాల్వల ద్వారా చెరువులకు నీరు తరలించాలని భావించారు. ఇందుకోసం సుమారు రూ.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా... భూసేకరణలో విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు వ్యతిరేకించారు. దీనికితోడు మరి కొన్ని సమస్యలతో పథకం ముందుకు సాగలేదు. ‘మంచుకొండ’ సక్సెస్ బుగ్గవాగు చెక్డ్యాం నుంచి నీరు తరలించేందుకు ఎక్కువ భూసేకరణ అవసరం లేకుండా ప్రత్యామ్నాయంపై అధికారులు ఆలోచన చేశారు. ఇటీవల రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ల ద్వారా 33 చెరువులకు సాగునీరు విడుదల చేశారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో అధికారులు బుగ్గవాగు చెక్డ్యాంపై దృష్టి సారించారు. మంచుకొండ మాదిరిగానే పైపులైన్లు నిర్మిస్తే తక్కువ భూసేకరణ, వ్యయంతో పని పూర్తవుతుందనే నిర్ణయానికి వచ్చారు. 26 కి.మీ.. 200 క్యూసెక్కులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో సుమారు 26 కి.మీ. మేర పైపులైన్ నిర్మాణం, భూసేకరణ, ఇతర పనులకు రూ.82కోట్లు అవసరమని జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇది అమలైతే కామేపల్లి మండలంలోని 21, రఘునాథపాలెం మండలంలోని 10 చెరువులకు కలిపి 31 చెరువులకు పైపులైన్ ద్వారా నీరు అందుతుంది. సుమారు 200 క్యూసెక్కుల నీటిని తరలించడం ద్వారా దాదాపు 5,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు మెరుగుపడతాయని.. తాగునీటి సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. వర్షాకాలంలో వాగుల ద్వారా వచ్చే నీటిని చెక్డ్యామ్లో నిలిపి.. ఆపై చెరువులకు తరలిస్తే పంట సాగు చివరి దశలో ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నారు. కాగా, మంచుకొండ లిఫ్ట్ ద్వారా రఘునాథపాలెం మండలంలోని పలు చెరువులకు సాగర్ జలాలు విడుదల చేయగా, మిగతా చెరువులకు బుగ్గవాగు చెక్డ్యాం నుంచి నీరు అందనుండడంతో మండలంలో సాగునీటి కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. -
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఎండ ప్రభావం పెరుగుతుంది. మధ్యాహ్నం వేళ వడగాలుల శ్రీప్రభావం సైతం ఉంటుంది. త్వరలోనే హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకానుంది. ఇన్నాళ్లు కాల్వొడ్డు తదితర ప్రాంతాల్లో పండ్లు అమ్ముతుండగా అమ్మకందారులే కాక ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన నగరంలోని 4వ డివిజన్ పారిశ్రామిక ప్రాంతంలో మూడేళ్ల నుంచి అసంపూర్తి నిర్మాణాలతో ఖాళీగా ఉన్న వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ షెడ్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. కొద్దిమేర మిగిలి ఉన్న పనులు పూర్తిచేసి హోల్సెల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది అమల్లోకి వస్తే నగరవాసులకు అన్ని రకాల పండ్లు ఒకే చోట లభించనున్నాయి. ఈకార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు. ప్రణాళికాయుతంగా పనులు ఖమ్మంవన్టౌన్: జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రణాళికాయుతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధి కారులతో ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రహదా రులపై ర్యాంప్ల నిర్మాణం, ఆక్రమణతో వెడల్పు తగ్గి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయితే, అధికారులు తొలిదశలో అడ్డుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, వర్షాలు పడేనాటికి ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలని, విద్యుత్ లైన్ల ఏర్పాటులో ఉద్యోగులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తికి శ్రీకారం
● రైతులకు ‘ఫౌండేషన్ సీడ్’ పంపిణీ ● జిల్లాలోని 379 గ్రామాల్లో ముగ్గురేసి రైతుకు వరి, పెసర విత్తనాలు ● నేడు పంపిణీకి సిద్ధం చేసిన యంత్రాంగంఖమ్మంవ్యవసాయం: మెరుగైన విత్తనోత్పత్తే లక్ష్యంగా రైతులకు ఫౌండేషన్ సీడ్(పునాది విత్తనం) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన రైతులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వీటిని అందించనున్నారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు చొప్పున రైతులకు వరి, పెసర విత్తనాలను పంపిణీ చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ, వైరా కేవీకే ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. వరి డబ్ల్యూజీఎల్–44 సన్న రకం, పెసర ఎంజీజీ– 385 రకాలను అందిస్తారు. వరి విత్తనాలను ఒక్కో రెవెన్యూ గ్రామంలో ఇద్దరికి చొప్పున 758 మందికి, పెసలు ఒక్కొక్కరు చొప్పున 379 మంది రైతులకు అందించాలని నిర్ణయించారు. నాణ్యమైన విత్తనాల కోసం.. రైతులు ఏటా విత్తనాలు కొనుగోలు చేయకుండా సొంతంగా విత్తనోత్పత్తి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రైతులు సొంత అవసరాలకు వాడుకోవడమే కాక గ్రామాల్లో ఇతరులకు అమ్ముకోవడం ద్వారా ఆదాయం లభిస్తుందని భావనకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా రైతుల ద్వారా విత్తనోత్పత్తి చేసేలా ప్రభుత్వం ఫౌండేషన్ సీడ్ పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ద్వారా విత్తనాలు విక్రయించడం కంటే రైతులే విత్తనోత్పత్తి చేసేలా ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా నకిలీ విత్తనాల బారిన పడకుండా అడ్డుకట్ట వేసే అవకాశముంది. అలాగే, రైతులు సాగు చేసే పంటను అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి అవగాహన కల్పిస్తేఅందరికీ మేలు జరగనుంది. ఈ రకంగా మూడేళ్ల పాటు విత్తనోత్పత్తి చేయించేలా ఫౌండేషన్ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. -
మరిన్ని బడుల్లో ఏఐ
విద్యార్థుల్లో సామర్ధ్యం పెంపు కంప్యూటర్ ఆధారిత బోధనతో విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగయ్యాయి. పాఠశాలకు క్రమం తప్పకుండా రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలు కంప్యూటర్ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. – కె.రవికుమార్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి 176 పాఠశాలల్లో ఏర్పాట్లు జిల్లాలోని 176 పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత బోధన మొదలుపెడుతున్నాం. ఇప్పటికే అమలుచేసిన స్కూళ్లలో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తున్నాం. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారిరాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత విద్యాసంవత్సరం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత బోధన సాగించారు. జిలాల్లోని ఏడు పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయగా సత్ఫలితాలు వచ్చాయని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇంకా 176 పాఠశాలల్లో అమలుకు నిర్ణయించారు. – ఖమ్మం సహకారనగర్అమలు ఇలా.. పేరున్న కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రమే ఏఐ ఆధారిత బోధన కొనసాగుతోంది. దీన్ని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో తెలుగు, ఇంగ్లిష్, గణిత సామర్థ్యాలు పెంచేలా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఏడు పాఠశాలలకు కంప్యూటర్లు సమకూర్చి 3 నుంచి 5 తరగతుల్లో పదేసి మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆపై ‘ఏక్ స్టెప్‘ ఫౌండేషన్ రూపొందించిన ప్రోగ్రాం ఆధారంగా రోజుకు 40 నిమిషాలు, వారానికి నాలుగు రోజులు కంప్యూటర్లతో బోధించారు. తద్వారా ప్రతీ విద్యార్థి కంప్యూటర్ను వినియోగిస్తూ ఉచ్ఛారణను రికార్డు చేయడమే కాక ఆపై మళ్లీ వింటూ తప్పొప్పులు సరిచేసుకున్నారు. ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలు, మల్లెమడుగు, పాండురంగాపురం, సింగారెడ్డిపాలెం, సత్తుపల్లి, సిద్ధారంలోని మండల పరిషత్ పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయగా విద్యార్థుల సామర్థ్యాలు పెరిగినట్లు గుర్తించారు. తల్లిదండ్రులకు నివేదికలు గత ఏడాది ఏఐ ఆధారిత బోధన సాగిన పాఠశాలల్లోని విద్యార్థుల ప్రగతిని రెండు సార్లు తల్లిదండ్రులకు అందించారు. ఈ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. అంతేకాక ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో నిలవగా ఉన్నతాధికారులు డీఈఓ సామినేని సత్యనారాయణకు ప్రశంసాపత్రం అందించారు. దీంతో ఈ ఏడాది 50కి మించి విద్యార్థులు ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఐదు చొప్పున కంప్యూటర్లు కేటాయించి విస్తరించాలని నిర్ణయించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధనపై ప్రత్యేకదృష్టి సారించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో కొత్త విధానం అమలును తరచుగా పర్యవేక్షించిన ఆయన అధికారులకు సూచనలు చేశారు. దీంతో కార్యక్రమం సమర్థవంతంగా అమలైంది. గత ఏడాది ఏడు పాఠశాలల్లో అమలు విద్యార్థుల ఉత్సాహం.. మెరుగైన ఫలితాలు ఈసారి కొత్తగా 176స్కూళ్లలో ఏర్పాటుకు నిర్ణయం ఇవీ లాభాలు ఏఐ ఆధారిత బోధన ద్వారా తెరపై చూస్తూ పాఠాలు వింటుండడంతో విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా దోహదపడుతుందని భావిస్తున్నారు. అలాగే, కంప్యూటర్ విద్యపై భయం తగ్గుతుందని.. వెనకబడిన విద్యార్థులు సైతం చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు సులభంగా నేర్చుకున్నారని తేలింది. తెలివితేటలు, ఏకాగ్రత పెరిగి విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారని గుర్తించారు.ఈ ఏడాది అమలు చేయనున్న స్కూళ్ల వివరాలు నియోజకవర్గం పీఎస్లు యూపీఎస్లు మొత్తం పాఠశాలలు పాలేరు 40 08 48మధిర 35 03 38ఖమ్మం 35 02 37వైరా 23 05 28సత్తుపల్లి 21 04 25మొత్తం 154 22 176 -
విత్తన దందాపై నజర్
● ఏపీ కేంద్రంగా తయారీ.. జిల్లాకు రవాణా ● అడ్డుకట్ట వేసేలా 14 చెక్పోస్టుల ఏర్పాటు ● పాత నేరస్తులపైనా నిఘాఖమ్మంవ్యవసాయం: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న వేళ అక్రమార్కులు విత్తన దందాకు తెరలేపారు. రైతుల అవసరాలు, ఆతృతను సొమ్ము చేసుకునేలా రంగంలోకి దిగారు. విత్తన తయారీ, విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డాగా నిలుస్తుండగా.. అక్కడ కుటీర పరిశ్రమల మాదిరి నకిలీ విత్తనాలు తయారుచేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీకి సరిహద్దుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండడంతో అక్కడి నుంచి విత్తనాలు తీసుకొస్తున్న మధ్యవర్తులు మాయమాటలతో రైతులకు అంటగడుతున్నారు. ఈ నేపథ్యాన రైతులెవరూ మోసపోకుండా వ్యవసాయ, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఏపీ అడ్డాగా నకిలీ విత్తన దందా అధికోత్పత్తుల పేరుతో అక్రమార్కులు నకిలీ విత్తన దందాకు తెగబడుతున్నారు. ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ విత్తనాలనే ఆకర్షణీయమైన ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారు. మైలవరం, మండలం చంద్రుగొండ, తెనాలి, బాపట్ల తదితర ప్రాంతాల్లో అరుణోదయ లేబుల్తో రైబోజోల్ మిశ్రమంతో తయారు చేసిన విత్తనాలను మినీ పరిశ్రమల స్థాయిలో తయారుచేస్తున్నారు. ఆపై ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నారని తెలుస్తోంది.. గుట్టురట్టు చేసిన పోలీసులు ఏపీ అడ్డాగా సాగుస్తున్న విత్తన దందాను ఖమ్మం పోలీసు యంత్రాంగం గుర్తించింది. జిల్లాలోని ఏన్కూరు, మధిర మండలాలకు ఏపీ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న పత్తి విత్తన ప్యాకెట్లను గుర్తించి.. క్వింటాళ్ల మేర స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పత్తి విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్కు రూ.901 ధర నిర్ణయించగా... అక్రమార్కులు ఎక్కువ దిగుబడి వస్తుందంటూ రూ.1,200 చొప్పున వరకు విక్రయిస్తున్నారు. ఇక నిషేధిత బీటీ–3 విత్తనాల ప్యాకెట్లు రూ.2,600 వరకు కూడా విక్రయిస్తున్నట్లు తేలింది. రవాణా విభాగాలు, పాత నేరస్తులపై దృష్టి జిల్లాలో ఏర్పాటుచేసిన 21 టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. రవాణా సంస్థల గోదాములు, ప్యాకేజీ ఇండస్ట్రీలతో పాటు డీలర్ల గోదాముల్లోనూ తనిఖీలు చేపట్టారు. అంతేకాక గతంలో నకిలీ విత్తన దందాకు పాల్పడిన వారిపై పోలీస్ యంత్రాంగం నిఘా వేసింది. గతంలో కారేపల్లి, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో కొందరు అనుమతి లేని పత్తి, మిర్చి విత్తనాలు అమ్మారనే సమాచారంతో వారి కదలికలను పరిశీలిస్తున్నారు.చెక్పోస్టుల్లో తనిఖీలు నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా సరిహద్దులు, టోల్ ప్లాజాల వద్ద వ్యవసాయ, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా 14 చెక్ పోస్టులను ఏర్పాటుచేసింది. ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులతో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నేలకొండల్లి మండలం అప్పలనర్సింహాపురం, ముదిగొండ మండలం వల్లభి, వైరా మండలం గన్నవరం(నెమలి క్రాస్ రోడ్), బోనకల్ మండలం వత్సవాయి రోడ్డు, ఎర్రుపాలెం మండలం పెద్దాపురం క్రాస్ రోడ్డు, మధిర మండలం మధిర క్రాస్ రోడ్డు, వేంసూరు మండలం వెంకటాపురం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్, కూసుమంచి మండలం పాలేరు(సింగరేణిపల్లి టోల్ప్లాజా), వైరా మండలం పాలడుగు, కొణిజర్ల మండలం బస్వాపురం క్రాస్, కల్లూరు మండలం హనుమా తండా, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఈ చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి. చెక్ పోస్టుల వద్దే కాక ఇతర చోట్ల కూడా తనిఖీలు ముమ్మరంగా చేపడుతూ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రణా ళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా వాన
ఖమ్మంవ్యవసాయం: రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం ఉదయం 8–30 నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కారేపల్లి మండలంలో 76.8 మి.మీ.లు, కామేపల్లి మండలంలో 73.4, తల్లాడలో 52.4, ఏన్కూరులో 49.2, పెనుబల్లిలో 38.2, వేంసూరులో 32.2, వైరాలో 20, కల్లూరులో 15.4, సత్తుపల్లిలో 10.6, కొణిజర్లలో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైందని నివేదికలో పేర్కొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులు ప్రవేశపెట్టడంతో పాటు ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం ద్వారా పాఠశాలలను బలోపేతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు నూతన ఆవాసాల్లో పాఠశాలలు ప్రారంభించాలన్నారు. వందలాదిగా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యాన అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని, కాలయాపన చేయకుండా పెండింగ్ టీఏలు, పీఆర్సీ విడుదల చేయాలని రవి డిమాండ్ చేశారు. అంతేకాక పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, కేజీబీవీ, సర్వశిక్ష ఉద్యోగ ఉపాధ్యాయులకు సరైన వేతనం చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, ఉద్దండ్ షరీఫ్, ప్రసాద్రావు, వీరస్వామి, వీరబాబు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి -
కాంగ్రెస్ ఇన్చార్జ్, పీసీసీ చీఫ్తో మంత్రి భేటీ
ఖమ్మంవన్టౌన్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ శనివారం ఖమ్మం వచ్చారు. భద్రాద్రి జిల్లా కిన్నెరసానిలో జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో పాల్గొన్న వారిని తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని మంత్రి సన్మానించగా.. జిల్లాలో పార్టీ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించారు. మదన్లాల్ కుటుంబానికి పరామర్శ రఘునాథపాలెం: మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుటుంబాన్ని శనివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మదన్లాల్ మృతి చెందగా, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు తుల్లూరి బ్రహ్మయ్య, వాంకుడోత్ దీపక్, బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
పారదర్శకత.. వేగం
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు ● కొత్తగా ఆధార్ ఈ–సంతకం సేవలు ● పైలట్గా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ● రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పౌర సేవలను మరింత వేగవంతం చేయడమే కాక పారదర్శకత పెంపునకు సంస్కరణలు తీసుకొస్తోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన సంక్లిష్ట ప్రక్రియలను సరళీకృతం చేస్తూ, నూతన విధానాలు అమల్లోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన అధికారులను బదిలీ చేశారు. ఆపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునికీకరించడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇకపై ఆధార్ ఈ–సంతకం పౌర సేవలను సులభతరం చేసేలా ఆధార్ అనుసంధానంతో కూడిన ఈ–సంతకం సేవల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇది భౌతికంగా కార్యాలయంలో దస్త్రాలపై సంతకాలు తగ్గించడం, డాక్యుమెంట్లు తయారు చేశాక కార్యాలయానికి వచ్చినప్పుడు మళ్లీ సంతకాలు పెట్టే పని లేకుండా ఉపకరిస్తుందని చెబుతున్నారు. డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకాల ద్వారా లావాదేవీలను పూర్తి చేయడంలో సమయం తగ్గి, మానవ జోక్యాన్ని తగ్గించినట్లవుతుందని.. తద్వారా అవినీతికి ఆస్కారముండదని భావిస్తున్నారు. అంతేకాక డిజిటల్ సంతకాలు అత్యంత సురక్షితంగా, ట్యాంపరింగ్కు వీల్లేకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్కు వచ్చిన వారు భౌతికంగా వేలిముద్రలు వేసే పని లేకుండా... ఒక వేలి ముద్రను స్కానింగ్ చేస్తే ఆధార్ వెబ్సైట్ ద్వారా వారి సదరు వ్యక్తి అన్ని వేళ్ల ముద్రలు ఆన్లైన్లోకి వచ్చేస్తాయని.. తద్వారా పని సులువవుతుందని భావిస్తున్నారు. అన్ని ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించడం.. పనులు త్వరగా పూర్తయ్యేలా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుచేయనున్నారు. ఈ విధానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాక రాష్ట్రంలోని ఇంకొన్ని కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఇది విజయవంతమైన నేపథ్యాన స్లాట్ బుకింగ్ విధానాన్ని అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నారు. కాగా, ఈ విధానంతో ఆయా కార్యాలయాల్లో సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తిచేయడంతో పాటు గంటల వ్యవధిలోనే దస్త్రాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందిస్తున్నారు. ఉత్తమమైన సేవలు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు ఆన్లైన్ ద్వారా ముందే తమ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్దేశిత సమయానికి వస్తే త్వరగా పని పూర్తవుతుంది. ఫలితంగా గంటల తరబడి వేచి ఉండే ఇక్కట్లు తీరినట్లేనని చెబుతున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెరుగుతోంది. ఇలాంటి సంస్కరణలతో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ మరింత చేరువ కావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.పైలట్ ప్రాజెక్ట్గా కూసుమంచి నూతన విధానం అమలుకు పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో జిల్లాలోని కూసుమంచి కార్యాలయం కూడా ఉంది. రెండు కార్యాలయాల్లో ఆధార్ ఈ–సంతకం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, మార్పులు అవసరమైతే చేశాక రాష్ట్రంలోని అన్ని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరించనున్నారు. కాగా, కూసుమంచిలో ఒకటి, రెండు రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
షరా మామూలే
తప్పుల తడక.. సత్తుపల్లి: సత్తుపల్లిలోని పలు స్కానింగ్ సెంటర్లలో తప్పులతడకగా రిపోర్టులు ఇవ్వడం, రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. పలుమార్లు ఆందోళనలు జరుగుతుండడం షరామామూలుగా మారింది. పట్టణంలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు మే 1వ తేదీన వచ్చిన మహిళను ఎదురుగా ఉన్న ఆస్పత్రికి రిఫర్ చేయటం.. అక్కడ ఆపరేషన్ వికటించి ఆమె మృతి చెందింది. ఈ ఘటన మరువక ముందే ఆరు నెలల గర్భిణి అనూషకు తొమ్మిది నెలలు నిండిన జ్యోతి స్కానింగ్ రిపోర్టు ఇవ్వడంతో చికిత్స వికటించింది. కేసులు నమోదు అవుతున్నా.. గతేడాది ఆల్ఫాస్కానింగ్ సెంటర్లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో నష్టపోయానని సత్తుపల్లి పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. నెల కిందట విద్యుత్శాఖ ఉద్యోగి బంధువు కడుపులో ఓవరిస్ సమస్య లేకపోయినా ఉందని నివేదిక ఇవ్వగా, ఖమ్మంలో స్కానింగ్ చేయిస్తే ఇబ్బంది ఏమీ లేదని తేలింది. దీనిపై బాధితుడు స్కానింగ్ సెంటర్ బాధ్యులను నిలదీస్తే తప్పు జరిగిందని అంగీకరించారు. వైద్యురాలు ఏం చేస్తున్నట్టు.. ఆరు నెలల గర్భిణి రిపోర్టు స్థానంలో తొమ్మిది నెలల గర్భిణి నివేదిక ఇవ్వగా.. పేరు చూడకుండానే డాక్టర్ ఉడతనేని లలితకుమారి మందులు రాయడం గమనార్హం. ఆరు నెలల గర్భిణికి తొమ్మిది నెలల గర్భిణికి సంబంధించిన మందులు రాయడంతో ఆమె అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైంది. గతంలో ఇదే ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందగా సర్దుబాటు చేసుకున్న విషయం విదితమే. పర్సంటేజీలతోనే స్కానింగ్ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్కానింగ్కు పంపించటం కొందరికి అనవాయితీగా మారింది. ప్రతీ స్కానింగ్లోనూ వైద్యులకు, స్కానింగ్ సెంటర్ నడుమ పర్సంటేజీల వ్యవహారం ఉండడంతోనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్తుపల్లిలోని కొందరు వైద్యులకు ఇది నిత్యకృత్యంగా మారిందని చెబుతున్నా సత్తుపల్లిలో రెండు స్కానింగ్ సెంటర్లు ఉన్నా ఒకే సెంటర్కు రిఫర్ చేస్తుండడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. రెన్యూవల్ కాకున్నా.. ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు 2023 వరకు మాత్రమే అనుమతి ఉండగా.. రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్నటికీ అనుమతి రాలేదని డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారాం శనివారం చేపట్టిన తనిఖీల్లో తేలింది. అంతేకాక ఏ పరీక్షకు ఎంత రుసుమో తెలిపే బోర్డు కూడా ఏర్పాటుచేయకుండా ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. స్కానింగ్ సెంటర్లో రిపోర్టులు తారుమారైన ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు చింతా కిరణ్కుమార్ తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రిపోర్టులు మారిన తర్వాత వైద్యం చేయడంపై డాక్టర్ లలితకుమారిని కూడా ప్రశ్నించామని తెలిపారు. పేర్లు చూడకుండా వైద్యం చేసిన నేపథ్యాన వివరణ తీసుకున్నామని చెప్పారు. అలాగే, స్కానింగ్ సెంటర్లో సక్రమంగా వ్యవహరించడమే కాక పరీక్షల ధరలతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదులొస్తున్నా చర్యలు శూన్యం వైద్యులతో పర్సంటేజీ ఒప్పందాలపై విమర్శలు నిర్వాహకుల ఇష్టారాజ్యంతో ప్రజల ఇక్కట్లు -
మహిళ వస్త్రాలు ఎత్తుకెళ్లిన దుండగుడు!
నేలకొండపల్లి: ఓ దొంగ రెక్కీ నిర్వహించాడంటే ఆ ఇంట్లో నగలు, డబ్బు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేస్తాడు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి కేవలం మహిళల వస్త్రాలే ఎత్తుకెళ్లడం గమనార్హం. నేలకొండపల్లిలో ఓ మహిళ శనివారం దుస్తులు ఉతికి ఆరుబయట దండెంపై ఆరేసింది. ఆ ఇంటి వద్ద అటూఇటు ఓ యువకుడు తిరుగుతుండగా స్థానికులు ప్రశ్నిస్తే సేల్స్మేన్గా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి దండెంపై ఆరేసిన మహిళ వస్త్రాలను బ్యాగ్లో పెట్టుకుని పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ఎదురుగా ఉన్న షాప్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మైనర్, డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో జరిమానా ఖమ్మంక్రైం: వాహనాలు నడుపుతూ పట్టుబడిన 34 మంది మైనర్లకు రూ.వెయ్యి చొప్పున, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 75 మందికి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన మైనర్లు, మద్యం తాగిన వారిని కోర్టులో హాజరుపర్చగా నాలుగో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్) న్యాయమూర్తి బి.నాగమణి జరిమానా విధించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలువైరారూరల్: మండంలోని స్టేజీ పినపాక సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని విప్పలమడకకు చెందిన అక్కిశెట్టి కృష్ణారావు వైరాలో హమాలీగాపనిచేస్తున్నాడు. పని ముగిశాక ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తల్లాడ వైపు నుంచి ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావును పోలీసులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మిషన్ భగీరథ సర్వీసుల తనిఖీ ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ల విద్యుత్ సర్వీసులను ఎన్పీడీసీఎల్ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఆయా ప్లాంట్ల కనెక్షన్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అంశాలను పరిశీలించారు. ఖమ్మంలోని పలు సర్వీసుల తనిఖీ డీఈ(ఆపరేషన్స్) నంబూరి రామారావు ఆధ్వర్యాన కొనసాగింది. -
‘బడిబాట’ పూర్తయ్యాక సర్దుబాటు చేయాలి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో బడిబాట కార్యక్రమం పూర్తయ్యాకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలలు బలోపేతం చేసే లా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలన్నారు. అంతే తప్ప అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయ, అమృత్కుమార్, రాయల నరసింహారావు, గిలకత్తుల వెంకటరమ ణ, జిల్లా ఉపాధ్యక్షులు లింగం సతీశ్ పాల్గొన్నారు సర్దుబాటు జీఓను సవరించాలి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 25లో లోపాలు ఉన్నందున సవరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు – విద్యార్థుల నిష్పత్తి సరిగా లేదని, ఇకనైనా ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, నాయకులు వెంకటేశ్వరరావు, ఉమాదేవి, కోటేశ్వరరావు, గరికే శ్రీను, నాగిరెడ్డి, యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు. -
డెయిరీ ఫలాలతో ఆర్థికాభివృద్ధి
మధిర: ఇందిరా మహిళా డెయిరీ ద్వారా అందే యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ మహిళా లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. త్వరలో డెయిరీ ఏర్పా టు కానున్న నేపథ్యాన మధిరలోని కార్యాలయంలో శనివారం మహాజనసభ నిర్వహించగా డీఆర్డీఓ మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో డెయిరీ ఏర్పాటవుతోందని తెలిపారు. సభ్యత్వం కలిగిన వారికి సబ్సిడీపై రెండు చొప్పున పాడి గేదెలు ఇవ్వనుండగా, ఇప్పటి నుంచే దాణా సేకరణ, గడ్డి పెంపకంపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డెయిరీలో నిబంధనల సవరణ, నూతనంగా పలువురికి సభ్యత్వం కల్పించడం, ఎర్రుపాలెం మినహా మిగిలిన నాలుగు మండలాల్లో పాలశీతలీకరణ కేంద్రాల ఏర్పాటు, నూతన పాలకవర్గం ఎన్నిక ప్రతిపాదనలపై చర్చించారు. సమావేశంలో ఏపీఎం జంగం లక్ష్మణ్రావుతో పాటు మామిళ్ల శ్రీనివాసరావు, కోటేశ్వర్రెడ్డి, మురళీకృష్ణ, అన్నపూర్ణ, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. -
కేన్సర్తో పోరాడి ఓడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
రఘునాథపాలెం: కేన్సర్ను తుది దశలో గుర్తించినా, ధైర్యంగా చికిత్స చేయించుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన పోరాటంలో ఓడిపోయారు. మండలంలోని కోయచలకు చెందిన మాదంశెట్టి సత్యగోపాల్ (34) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. ఆయనకు కేన్సర్ సోకిన ట్లు తెలియడంతో మూడేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయినా ఫలితం లేక శనివా రం ఉద యం మృతి చెందాడు. కాగా, సత్యగోపాల్ సోదరుడు రాంబాబు అన్న కోసం ఉద్యోగం వదిలిపెట్టి చికిత్సకు చేయూతగా నిలవగా, చివరకు సోదరుడు కన్నుమూయడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు సత్యగోపాల్ అంత్యక్రియలకు కుటుంబీకులు, స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ మృతి వైరారూరల్: వైరా సమీపాన బ్రిడ్జిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీడ్రైవర్ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఇనుప చువ్వల లోడుతో వైరా వైపు నుంచి తల్లాడ వైపు లారీ వెళ్తుండగా డీసీఎం వ్యాన్ను, ఆ తర్వాత కారును ఢీకొన్న విషయం విదితమే. ఈ ఘటనలో లారీడ్రైవర్ షేక్మహబూబ్ సుభానీ అలియాస్ మున్నా(32)కు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందాడు. ఆయన స్వగ్రామం విజయవాడ కాగా భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం వేంసూరు: అప్పుల పెరగడం, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన షేక్ నాగుల్మీరా (37) భార్యతో కలిసి చికెన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిస కావడంతో అప్పులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా డు. శనివారం నాగుల్మీరా భార్య షాకీనా ఆస్పత్రికి వెళ్లగా ఆయన ఉరి వేసు కున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులు గుర్తించి సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆయనకు భార్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతితిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని సుద్దవాగుతండాకు చెందిన బానోతు శ్రీనివాస్(42) మోటార్సైకిల్పై శనివారం రాత్రి సోలీపురం నుంచి కాకరవాయి వస్తుండగా కింద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, శ్రీనివాస్ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిందా లేదా గేదెను తగిలి పడ్డాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య బుజ్జితో పాటు ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాటరాయుళ్లపై కేసుబోనకల్: మండలంలోని రావినూతలలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిపై కేసు నమోదుచేసి రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సత్కారం
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో విధులు నిర్వర్తిస్తూ శనివారం ఉద్యోగ విరమణ చేసిన అధికారులను రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం ఖమ్మంలో సన్మానించారు. భద్రాచలం డీఎంగా పనిచేసి, ప్రస్తుతం కార్గో ఏటీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రామారావు, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) వీరన్న ఉద్యోగ విరమణ చేశారు. కార్యక్రమంలో ఖమ్మం డిపో మేనేజర్ దినేశ్కుమార్, పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, ఏఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. రైతుల పేరిట రుణం తీసుకున్న చైర్మన్ ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం సహకార సంఘం చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్ తమ పేరుపై సొసైటీలో రుణం తీసుకుని చెల్లించలేదని తనగంపాడుకు చెందిన తేజావత్ బాలు, వీరన్న ఆరోపించారు. పట్టాదారు పాస్ బుక్లు పెట్టి రుణం తీసుకోగా, తిరిగి చెల్లించాలని కోరితే రుణమాఫీ అవుతుందని నమ్మబలికాడని పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ కాకపోగా ప్రస్తుతం అప్పు చెల్లించాలని తమకు నోటీసులు వచ్చాయని వాపోయారు. ఈ మేరకు చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వారు జిల్లా సహకార శాఖ అధికారి, ఖమ్మం రూరల్ సీఐకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ వేసవి ప్రణాళిక విజయవంతంఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఖమ్మంవ్యవసాయం: వేసవి కాలానికి రూపొందించిన విద్యుత్ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. నవంబర్లోనే కార్యాచరణ సిద్ధం చేసి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగామని వెల్లడించారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న కొత్తలింగాల, మమతా రోడ్డు, తనికెళ్ల, బత్తులపల్లి, మిట్టపల్లి, జన్నారం, ములుగుమాడు, సత్తుపల్లి సబ్స్టేషన్లలో మొత్తం 13 పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, ఇల్లెందు క్రాస్, టేకులపల్లి, దానవాయిగూడెం, ప్రకాశ్నగర్, ధంసలాపురం, ఖానాపురం, బుర్హాన్పురం, వైరా, ఎర్రుపాలెం, లక్ష్మీపురం, జిల్లా ఆస్పత్రి, మర్లకుంట ప్రాంతాల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే కాక అవసరమైన చోట 295 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తద్వారా ఓవర్ లోడ్ తగ్గిందని తెలిపారు. కాగా, 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ఏర్పాటుతో సమస్య ఎదురైన సబ్స్టేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ సరఫరా చేయగలిగామని ఎస్ఈ వెల్లడించారు. ఇప్పటివరకు 213.14 కి.మీ. మేర 36 సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. మత్స్యకార మహిళలకు ముగిసిన శిక్షణకూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు చేపలు, రొయ్యలతో ఆహార ఉత్పత్తుల తయారీపై ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశాక నర్సాపురం మత్స్య కళాశాల అసిసియేట్ డీన్ నీరజ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో మత్స్య రంగ అభివృద్ధికి అనువైన అవకాశాలు ఉన్నందున మహిళలు చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని సూచించారు. నైపుణ్యాలు పెంచుకుని యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చని తెలిపారు. చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, ఇతర ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా కొనసాగించాలని పేర్కొన్నారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఇప్పటి వరకు 4 వేల మంది మత్స్యకారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రవీందర్, నాగరాజు, భార్గవి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
జీవనంలో సగపాలు
జీవన ప్రమాణాలు మెరుగుపర్చేది పాడిపరిశ్ర మ●● పౌష్టికాహారంలో పాలకే ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో మెరుగ్గా పాల ఉత్పత్తి ● త్వరలోనే ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు ● నేడు ప్రపంచ పాల దినోత్సవంపాల ఉత్పత్తికి పెరుగుతున్న ప్రాధాన్యం మనిషి ఆరోగ్యం పాల ఉత్పత్తులపై ఆధారపడటంతో ఆయా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యాన ప్రభుత్వాలు పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాడి పరిశ్రమపైనా రైతులు మక్కువ కనబరుస్తునానరు. ఉమ్మడి జిల్లాలో గేదె పాలు ఉత్పత్తి ఎఉ్కవగా ఉండగా.. ప్రభుత్వం 25 వేల లీటర్ల సామర్థ్యంతో పాడి పరిశ్రమ (విజయ డెయిరీ)ను నిర్వహిస్తోంది. ఖమ్మంలోని ఈ పరిశ్రమకు అనుబంధంగా కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలలో 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాల శీతలీకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 227 గ్రామాల్లో పాల సేకరణ పాల శీతలీకరణ కేంద్రాల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 30 మండలాల్లోని 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ పాల సేకరణ కేంద్రాల్లో 3,025 మంది ఉత్పత్తి చేసే పాలను విక్రయిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రస్తుతం రోజుకు 7,750 లీటర్ల పాలను సేకరిస్తుండగా, కొత్తగూడెం జిల్లా నుంచి 2,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఈ మొత్తం నుంచి ఖమ్మం జిల్లాలో 1,000 లీటర్లు, కొత్తగూడెం జిల్లాలో 2,600 లీటర్లు విక్రయిస్తున్నారు. విజయ పాల ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రాధాన్యం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 6 డెయిరీ పార్లర్లు నడుస్తున్నాయి. వెన్నశాతం ఆధారంగా పాడి పరిశ్రమ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ప్రభుత్వం ఇటీవల పాల ధరను పెంచింది. 10 వెన్నశాతం ఉన్న గేదె పాల ధరను రూ.80 నుంచి 84.60కు, వెన్నశాతం 7 ఉన్న గేదె పాల ధర రూ.56 నుంచి రూ.59.50లకు పెంచింది. ఇందిరా డెయిరీతో పెరగనున్న ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సభ్యులైన మహిళలకు రెండు గేదెల చొప్పున సబ్సిడీపై అందించనున్నారు. మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఇప్పటికే ఎర్రుపాలెంలో బల్క్మిల్క్ కేంద్రం ఉండగా, బోన కల్, చింతకాని, మధిర, ముదిగొండల్లో ఒక్కో మండలంలో 2,500ల నుంచి 5 వేల సామర్థ్యం కలిగిన బల్క్మిల్క్ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. ఆరోగ్యం.. శక్తి పాలలో మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, పాస్ఫరస్, అయోడిన్, ఐరన్, పొటాషియం, ఫోలేట్స్, విటమిన్–ఏ, బిటమిన్–డీ, రైబోఫ్లేవిన్, విటమిన్ బీ–12, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ (ఆరోగ్య కొవ్వు పదార్థాలు) వంటివి ఉంటాయి. అనాదిగా అనేక దేశాలు పాల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. నిత్యం సగటున ఒక మనిషికి 274 గ్రాముల పాలు, పాల పదార్థాలు అవసరం. అయితే మన దేశంలో ఒక్కో మనిషికి సగటున 186 గ్రాములు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 గ్రాములకు మించి పాల ఉత్పత్తులు అందటం లేదని నివేదికలు చెబుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాలు ఆరోగ్యకరమన ఆహారం. జీవనోపాధి, సమాజ ప్రయోజనాలకు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుంది. జీవన ప్రమాణాలను మెరుగుపర్చటంలో పాడి పరిశ్రమ ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహం లేదు. మానవాళి జీవనంలో పాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యాన నేడు (ఆదివారం) అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కథనం. –ఖమ్మంవ్యవసాయం రైతుల్లో పెరుగుతున్న అవగాహన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెరుగుతోంది. పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో పాడి పరిశ్రమపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు గేదెలను పెంచుకొని, వాటి ద్వారా పాడిని ఉత్పత్తి చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. స్థానికంగా పాలు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా డెయిరీలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. –మోహనమురళి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం -
ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు
● లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో సింగరేణి ● జీఎం కార్యాలయం, ఏరియా వర్క్షాప్ ప్రారంభోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థకు మంచి రోజులు వచ్చాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సంస్థ పదేళ్లు వెనక్కు వెళ్లిందని, కొత్త గనులు రాకపోవడం, విస్తరణ చేపట్టకపోవడమే దీనికి కారణమని చెప్పారు. కొత్తగూడెంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన వర్క్షాప్ను, ఆ తర్వాత జీఎం కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలో వీకే – 7 ఓసీకి పర్యావరణ అనుమతులు వచ్చాయని, త్వరలో రెండో దశకు అనుమతులు రానున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. 136 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ సంస్థ కేవలం బొగ్గుపైనే ఆధారపడకుండా లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నామని, రాబోయే 30 ఏళ్లలో మరో 22 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా వెలికితీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి ప్రమాద బీమా వర్తింపజేస్తున్నామని, దీంతోపాటు వారసులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం.. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ప్రారంబోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యేగా తన అధ్యక్షతన జరగాల్సి ఉందని, అంతేకాక ప్లెక్సీలో తన ఫొటో ముద్రించకుండా ప్రొటోకాల్ విస్మరించారని కూనంనేని సాంబశివరావు సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని ఏ పనీ చేయొద్దని, భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కావొద్దని సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపెల్లి కవిత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నేషనల్ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, కొప్పల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, మిరియాల రంగయ్య, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ కె.విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగినుల వసతిగృహంలో ప్రవేశాలు ఖమ్మంవన్టౌన్: మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహిస్తున్న ఉద్యోగినుల వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తూ 18 – 40 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఆర్థికంగా వెనుకబడిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈమేరకు పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఉద్యోగ ధ్రువీకరణ లేదా ఉద్యోగ శిక్షణకు సంబంధించిన పత్రం, వేతన సర్టిఫికెట్తో తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 7901017341 నంబర్కు ఫోన్ చేయొచ్చని డీడబ్ల్యూఓ తెలిపారు. 12న అథ్లెటిక్స్ అకాడమీ ఎంపికలు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఈనెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. బాలురకు మాత్రమే అవకాశం ఉండగా, 30 జూన్ 2009 నుంచి 1 జూలై 2011 లోపు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 8గంటలకు అకాడమీకి చేరుకోవాలని సూచించారు. మూడు నెలల బియ్యం పంపిణీకి సిద్ధం బోనకల్: ఈనెలలో రేషన్షాప్ల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. బోనకల్ మండలంలో పలు రేషన్షాపులను తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ నవీన్కుమార్, సివిల్ ప్లయీస్ తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో బియ్యం నిల్వ సామర్ధ్యం, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీఎస్ఓ మూడు నెలల బియ్యం పంపిణీ సజావుగా సాగేలా రేషన్ డీలర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, బియ్యం తీసుకున్న వారు అమ్మితే కార్డు రద్దు చేస్మాతని స్పష్టం చేశారు. డీలర్లు సుంకర రామారావు, బందం అచ్చయ్య, తోట లింగయ్య, వరలక్ష్మి, సత్తార్, నిర్మల, పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. 3న హెచ్ఎంలు, ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం ఖమ్మం సహకారనగర్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100శాతం నమోదైన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలను సన్మానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో 3వ తేదీన కలెక్టరేట్లో జరిగే సమావేశంలో వంద శాతం ఫలితాలు సాధించిన 66పాఠశాలల హెచ్ఎంలతో పాటు జిల్లా, మండల స్థాయి టాపర్లను సైతం సన్మానించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
పారదర్శకంగా భూసమస్యల పరిష్కారం
● రెవెన్యూ సదస్సులకు సిద్ధం కావాలి ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: భూ భారతి చట్టం ద్వారా రైతులు, ప్రజలకు సంబంధించి భూసమస్యల దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వీటిని పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇక ఈనెల 3నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు జరగనుండగా, ప్రతీ మండలానికి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యాన రెండేసి బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీరోజు సదస్సుల నిర్వహణపై నివేదిక ఇస్తూ, దరఖాస్తుదారులకు రశీదు అందించాలని తెలి పారు. కాగా, సదస్సు వేదికల వద్ద హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, సరిపడా దరఖాస్తులు సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ ఎవరి దరఖాస్తులైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు స్పష్టంగా తెలియచేయాలని చెప్పారు. కాగా, ఆర్ఎస్ఆర్పీఓటీ, భూ సేకరణ కేసులు, సరిహద్దు వివాదాలు, పార్ట్ బీ కేసులు, అసైన్డ్ భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈసమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.రేపటి నుంచి విధుల్లోకి జీపీఏలు గ్రామ పాలన అధికారులు(జీపీఓ) సోమవారం నుంచి విధుల్లోకి రానున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 382 రెవెన్యూ గ్రామాలు ఉండగా, జీపీఓగా విధులు నిర్వర్తించేందుకు 255మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పరీక్షకు 225మంది హాజరుకాగా, అందులో 192మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నియామక పత్రాలు, పోస్టింగ్లు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆపై 3వ తేదీ నుంచి గ్రామాల్లో జరిగే భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వీరు విధులు నిర్వహించే అవకాశం ఉంది. -
ఏసీబీ డీఎస్పీకి క్యాష్ రివార్డు
ఖమ్మంక్రైం: ఏసీబీ డీఎస్పీ రమేష్కు విధినిర్వహణలో అభినందనలు దక్కాయి. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యాన హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీఎస్పీకి ఏసీబీ డీజీపీ విజయకుమార్ క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు.బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులుఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఐదో తరగతి(రెసిడెన్షియల్), ఒకటో తరగతి(డే స్కాలర్)లో ప్రవేశానికి వచ్చేనెల 2నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఐదో తరగతిలో 131 మంది, ఒకటో తరగతిలో 128 మందికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి మార్కుల జాబితా, ఒకటి తరగతిలోనైతే పుట్టినతేదీ ధ్రువపత్రం, రేషన్కార్డు లేదా ఆధార్కార్డు జిరాక్స్, మీ సేవ ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలను దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలిపారు.ముగిసిన ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియఖమ్మంమయూరిసెంటర్: భద్రాద్రి జోన్ పరిధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తిచేశామని జోనల్ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఖమ్మంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ కళాశాల(బాలికలు)లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్న 1,165 మంది అభ్యర్థుల్లో 700 మంది హాజరయ్యారని వెల్లడించారు. విద్యార్హతలు, ప్రతిభ, డెమో ఆధారంగా తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీ చేపట్టామని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.కొనసాగుతున్న ‘దోస్త్’ ప్రవేశాలుఖమ్మం సహకారనగర్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. లేనిపక్షంలో వారు సీటు కోల్పోతారని పేర్కొన్నారు. ఇక రెండో విడత ప్రవేశాల కోసం జూన్ 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్త్ కోఆర్డినేటర్ ఎం.డీ.సలీంపాషా ఓ ప్రకటనలో వెల్లడించారు.లబ్ధిదారులకు అండగా నిలుస్తాం..మధిర: ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు యంత్రాగగం అన్నివిధాలుగా సహకరిస్తుందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.శ్రీనివాసరావు తెలిపారు. మధిర మండలం సిరిపురం, వంగవీడు గ్రామాల లబ్ధిదారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశుగ్రాసం ఆవశ్యకత, గేదెల ఎంపిక, అధిక పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. త్వరలో యూనిట్లు అందనున్నందున ఇప్పటి నుంచే పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, అధిక పాల దిగుబడి వచ్చేలా మేలైన గేదెలను ఎంపిక చేసుకుని, పాలను ప్రభుత్వ కేంద్రాలకు సరఫరా చేయాలని తెలిపారు. ఆపై లబ్ధిదారుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఉమాకుమారి, గ్రామ దీపికలు పాల్గొన్నారు. -
కల్లూరు.. ఇకపై మున్సిపాలిటీ!
కల్లూరు: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ కొన్నాళ్ల క్రితం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఇకపై కల్లూరు మున్సిపాలిటీగా మనుగడలోకి రానుంది. అంతేకాక ఇన్చార్జ్ కమిషనర్గా మధిర మున్సిపల్ కమిషనర్ అరెగెల సంపత్కుమార్ నియమించగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అలాగే, స్పెషల్ ఆఫీసర్గా ఇల్లెందు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ను కేటాయించారు. కల్లూరును మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేయాలని స్థానికులతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి వినతితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదింపజేశారు. కప్పలబంధం, పుల్లయ్యబంజర, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర, హనుమాతండా, వాచ్చానాయక్ తండాల విలీనంతో కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈమేరకు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సంపత్కుమార్ను పంచాయతీ ఈఓ నందిశెట్టి నాగేశ్వరరావు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్చార్జ్ కమిషనర్గా సంపత్కుమార్ -
రైల్వేట్రాక్ పక్కన మృతదేహం గుర్తింపు
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) రైల్వేట్రాక్ సమీపాన ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. పదిహేను రోజుల క్రితం సదరు యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తెలుస్తుండగా దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు శుక్రవారం పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా, ఆ పక్కనే లభించిన సెల్ఫోన్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేయడంతో మృతుడు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం సీతారాంపురం వాసి నేతుల అనిల్బాబు(20)గా తేలింది. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇచ్చి నట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం మార్చురీకి తరలించారు. గుండెపోటుతో రైతు మృతికారేపల్లి: పంటల సాగు పనుల్లో నిమగ్నమైన రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామేపల్లి మండలం మంగళితండా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పిల్లలమర్రి వెంకటేష్(30) రెండున్నర ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, వరి సాగుకు ఏర్పాట్లుచేసుకుంటున్నాడు. ఈక్రమాన శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పగా గుండెపోటుగా గుర్తించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి...చింతకాని: అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిమ్మినేనిపాలెంకు చెందిన తుడం రవి(55) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యాన ఆయన భార్య పొలం పనులకు వెళ్లిన సమయాన గురువారం పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
కొణిజర్ల: కారు. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ వెల్ల డించిన వివరాల మేరకు... ఏపీలోని చింతలపూడి నుంచి శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్న కారును తనికెళ్ల సమీపాన ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అంతేకాక కొణిజర్ల నుంచి ఖమ్మం వెళ్తున్న ఆటోనూ ఢీకొట్టడంతో బోల్తా పడింది. కారు డ్రైవర్ కోడూరి సునీల్, అందులో ఉన్న చింతలపూడికి చెందిన వెంకటేశ్వరరావు, పార్వతికి గాయలయ్యాయి. అలాగే, ఆటోడ్రెవర్ చింతకాని మండలం నేరడకు చెందిన తాటి లోకేష్, కొణిజర్లకు చెందిన పందిళ్ల వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి గాయపడ్డారు. అయితే, ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ రోడ్డుపైనే వాహనం వదిలేసి పరారయ్యాడు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఉరి వేసుకుని ఆత్మహత్యచింతకాని: మండలంలోని పొద్దుటూరుకు చెందిన తుడుం ఎల్లేష్(33) ఉరి వేసుకుని బలవన్మరణానికి బలపడ్డాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆయన కరెంట్ వైరుతో దూలానికి ఉరి వేసుకున్నాడు. ఎల్లేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖమ్మంలో యువతి... ఖమ్మంక్రైం: ఖమ్మం జూబ్లీ క్లబ్ సమీపంలో నివసిస్తున్న బంక కస్తూరి(25) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. ఆమె తల్లి ఇచ్చిన సమాచారంతో ఖమ్మం త్రీటౌన్ పోలీసులు పరిశీలించారు. కస్తూరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.