Delhi
-
యోగా లైవ్ సెషన్లో గిన్నిస్ రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 వేడుకలకు ముందు ఆయుష్ మంత్రిత్వ శాఖ అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్ వేదికగా నిర్వహించిన ప్రత్యక్ష యోగా ప్రసారంలో అత్యధిక మంది వీక్షకులు పాల్గొనడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదయ్యింది. ఆదివారం ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా చేపట్టిన ఈ గ్లోబల్ ఆన్లైన్ యోగా సెషన్ను ఏకంగా 4,35,831 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దీంతో 2024లో నమోదైన 2,46,252 మంది రికార్డును అధిగమించారు.ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ, యోగా పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు ‘యోగా–365’స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కామన్ యోగా ప్రోటోకాల్పై జరిగిన ఈ సెషన్లో విద్యార్థులు, యోగా నిపుణులు, సామాన్య ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా’అనే థీమ్తో ఈ ఏడాది జూన్ 21వ తేదీన కోల్కతా వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు జరగనున్నాయి. -
నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీలో టీఎంసీ రెబల్స్ విలీనం
న్యూఢిల్లీ: మమతా బెనర్జీతో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్న తృణమూల్కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ పెద్దగా తెలియని నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ(ఎన్సీపీ)తో తమ చీలిక వర్గాన్ని విలీనం చేయబోతున్నట్లు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఢిల్లీలో ప్రకటించారు. తమ నిర్ణయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందుంచారు. ఇందుకోసం స్పీకర్ను ఆయన అధికార నివాసంలో కలిశారు. ఎన్డీఏకు మద్దతు పలుకుతున్న ఎన్సీపీలో తాము విలీనమవ్వాలని నిర్ణయించుకున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేశారు.చీలిక వర్గంగా కొనసాగితే తలెత్తే చట్టపర సమస్యల నుంచి తప్పించుకునేందుకే తిరుగుబాటు ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సూచన మేరకే రెబల్ ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీలో విలీనం అంశంపై తిరుగుబాటు ఎంపీల నాయకురాలు కకోలీ ఘోష్ దస్తీదార్ ఆదివారం మీడియాతో ఢిల్లీలో మాట్లాడారు. ‘‘టీఎంసీ ఎంపీల్లో మేం మూడింట రెండొంతుల మంది ఉన్నాం. అందరం స్పీకర్ను కలిశాం. లోక్సభలో విడిగా సీటింగ్ కేటాయించాలని కోరాం.మేం త్వరలోనే నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీలో విలీనం కాబోతున్నాం. ఎన్డీఏకు మద్దతిస్తాం’’అని ఆమె అన్నా రు. ‘‘మేం ఇప్పటికే విలీనమయ్యాం. ఎన్సీపీ అనేది ప్రాంతీయ పార్టీ. అసలైన టీఎంసీ ఏదనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. టీఎంసీ గుర్తు అయిన 2 పుష్పాలను మేమే దక్కించుకోబోతున్నాం’’అని తిరుగుబాటు ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ వ్యాఖ్యానించారు. ఎన్సీపీ అనేది త్రిపురలో గుర్తింపులేని, రిజిస్టర్డ్ చిన్న రాజకీయ పార్టీ. స్పీకర్కు అభిషేక్ బెనర్జీ లేఖ.. చీలిక వర్గం వేరుగా ఉండబోమని నిర్ణయించిన నేపథ్యంలో టీఎంసీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆదివారం లోక్సభ స్పీకర్కు ఒక లేఖ రాశారు. ‘‘టీఎంసీలో మరే ఇతర చీలిక వర్గాలు లేవు. పార్టీలో ఉన్నది ఒక్కటే ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ వర్గం. పార్లమెంట్లో అదే అసలైన టీఎంసీ పార్టీ’’అని ప్రకటించండి అంటూ స్పీకర్కు రాసిన లేఖను పార్టీ ఎంపీలు కీర్తి ఆజాద్, సాగరికా ఘోష్లు బిర్లాకు ఆదివారం అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఈ చీలికలను ఒప్పుకోదు అని ఎంపీలు స్పీకర్ ఎదుట తమ వాదన విని్పంచారు. మాదే అసలైన టీఎంసీ రెబల్ ఎంపీలు తమదే అసలైన టీఎంసీ అనే పునరుద్ఘాటించారు. ‘‘సోమవారం స్పీకర్ను కలవబోతున్నాం. సంఖ్యాపరంగా మెజార్టీతో ఉన్న కారణంగా తమ వర్గాన్నే అసలైన పార్టీగా ప్రకటించాలని బిర్లాను కోరబోతున్నాం. టీఎంసీ పార్లమెంటరీ వర్గంగా మమ్మల్నే ప్రకటించాలని బిర్లాను అభ్యరి్థస్తాం’’అని తిరుగుబాటు ఎంపీ జగదీశ్ చంద్ర బర్మ ఆదివారం వెల్లడించారు. దీనిపై మమత వర్గంలోని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ స్పందించారు.‘‘వేర్పాటు కూటమికి చట్టంలో ఎలాంటి రక్షణ లేదు. అసలైన పార్టీ పదో షెడ్యూల్ ప్రకారం మరో పార్టీలో విలీనమైతే తప్ప ఇలాంటి తిరుగుబాటుదారులకు రక్షణ ఉండదు. ఒకే పార్టీలో రెండు వర్గాలు ఒకే ఎన్నికల గుర్తుపై కొనసాగడం కుదరదు’’అని ఘోష్ స్పష్టంచేశారు. సాగరికా వ్యాఖ్యలపై దస్తీదార్ స్పందించారు. ‘‘మేం 20 మంది ఉన్నాం. సోమవారం మరో ఇద్దరు జతకూడుతున్నారు. దాంతో మా రెబల్స్ బలం 22కు పెరుగుతుంది’’అని దస్తీదార్ అన్నారు. పార్టీ పదవుల్లోకి కొత్త ముఖాలు నమ్మిన బంటు సుదీప్ బంధోపాధ్యాయ్ వంటి సీనియర్ నేతలు సైతం తిరుగుబాటు శిబిరంలో చేరడంతో పార్టీలో వ్యవస్థాగత మార్పులకు మమత శ్రీకారం చుట్టారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి సయోని ఘోష్ను తప్పించి బదులుగా అర్నాబ్ బెనర్జీని నియమించారు. నార్త్ కోల్కతా ఆర్గనైజేషన్ జిల్లాకు సుదీప్ను పక్కనబెట్టి కునాల్ ఘోష్ను నియమించారు. లోక్సభ విభాగంలో ప్రధాన సలహాదారు పదవికి ఎంపీ సౌగతా రాయ్ను ఎంపికచేశారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కాళీగంజ్ ఎమ్మెల్యే ఆలిపా అహ్మద్ను నియమించారు. -
కావాలనే నిప్పుపెట్టిన బాలిక.. 5 అంతస్తుల భవనం బూడిద
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఇటీవల ఐదు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాదని, వ్యక్తిగత కక్షతో ఉద్దేశపూర్వకంగా పెట్టిన నిప్పేనని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు.తుగ్లకాబాద్లోని టీకేడీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉన్న నివాస భవనంలో జూన్ 12న మంటలు చెలరేగాయి. తొలుత ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించారు. అయితే, తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్టు తేలింది.మంటలు చెలరేగే ముందు ఓ మహిళ భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో వాటిని పరిశీలించిన తర్వాత భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.నిప్పు ఎందుకు అంటించింది? దర్యాప్తు సమయంలో గోవింద్పురిలోని నవజీవన్ క్యాంప్కు చెందిన 17 ఏళ్ల బాలికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గోవింద్పురిలోని గిరినగర్ నివాసి సరిత (27) ప్రేరేపించడంతో తాను ఈ పని చేసినట్టు బాలిక ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.“5వ అంతస్తులో నివసించే దీపక్కు చెందిన స్కూటీకి నిప్పు పెట్టేందుకు సరిత పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వివాదం కారణంగానే ఇలా చేయాలని చెప్పిందని” ఢిల్లీ పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తులో నవజీవన్ క్యాంప్ వాసులు నిరంజన్ (33), అతని సోదరుడు రాజ్కుమార్ (27) సూచనల మేరకు సరిత వ్యవహరించినట్టు తేలింది. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఈ ముగ్గురు కలిసి అగ్నిప్రమాదానికి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం మరణానికి కారణం కావడం, నిప్పుతో నష్టం కలిగించడం, రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం వంటి తీవ్రమైన అభియోగాలను కేసులో పోలీసులు చేర్చారు. బాలిక సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.కాగా, ఈ ఘటనపై శుక్రవారం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “జూన్ 11-12 అర్ధరాత్రి దాటాక 2.24 గంటలకు గోవింద్పురి పోలీస్ స్టేషన్కు తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లోని 5 అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్టు పీసీఆర్ కాల్ వచ్చింది. దట్టమైన పొగలో చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు బయటకు తీసి సఫ్దర్జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. 22 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో కలిపి ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది” అని తెలిపారు.అగ్నిమాపక విభాగ అధికారి యశ్వంత్ మీనా మాట్లాడుతూ, “భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న 3 స్కూటీలు, 2 బైకులు, ఓ సైకిల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్తుల వరకూ వ్యాపించింది. గ్రౌండ్, ఒకటో, రెండో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.మిగతా అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది డాబాపైకి చేరుకుని, డాబా గేటు తాళం కత్తిరించి భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు బాలికలను రక్షించి క్యాట్స్, పీసీఆర్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందిని రక్షించారు” అని చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి
పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రౌషన్ ఆనంద్ (రౌషన్ సర్) సోదరుడు ప్రిన్స్ యాదవ్ నేపాల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆయనపై ఖాన్ సర్ కోచింగ్ సెంటర్పై దాడి, విధ్వంస్వం కేసు ఆరోపణలు ఉన్నాయి.రౌషన్ ఆనంద్ పాట్నాలోని జ్ఞాన్ బిందు జీఎస్ అకాడమీ డైరెక్టర్. ఆయన ప్రత్యర్థి ఫైసల్ ఖాన్ (ఖాన్ సర్), ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఈ రెండు సంస్థల మధ్య పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల సంఖ్య, క్యాంపస్ నియంత్రణ వంటి అంశాలపై కొన్నేళ్లుగా తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాల్లో ఈ రెండు ఇనిస్టిట్యూట్ల మధ్య ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. ఈఘటనకు సంబంధించి కేసులో రౌషన్ ఆనంద్ అరెస్టు కాగా ప్రిన్స్ యాదవ్ దాడి కేసులో అభియోగం ఎదుర్కొంటూ పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్యాదవ్ నేపాల్లోని బిరాట్నగర్లోని హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. అదే హోటల్లో ప్రిన్స్ యాదవ్తో పాటు తన ఆరుగురు స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ యాదవ్ స్నేహితులు, ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రిన్స్ మరణంపై స్పష్టత రాలేదు. ప్రిన్స్ యాదవ్ మృతి వార్త తెలిసిన వెంటనే రౌషన్ ఆనంద్ కుటుంబ సభ్యులు నేపాల్కు బయలుదేరారు. ఈ ఘటనతో పాట్నాలోని కోచింగ్ హబ్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికంగా పోలీస్ బలగాలను పెంచి అప్రమత్తం చేశారు. ఈ ఘర్షణ విద్యార్థుల మధ్య కూడా హింసాత్మక రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఆరోపణలు2021నుంచి రౌషన్ ఆనంద్ సోదరుడు ప్రిన్స్ యాదవ్పై పలు ఆరోణలు కొనసాగుతున్నారు. 2021 ఖాన్ సర్ కోచింగ్ సెంటర్లోకి దూసుకెళ్లి హింసాత్మక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2న విధ్వంసం ఘటనకు సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రిన్స్ పేరును చేర్చారు. ఈ కేసులో రౌషన్ ఆనంద్ ఇప్పటికే పాట్నా జైలులో ఉన్నారు. కాగా ఖాన్ సర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రౌషన్ ఆనంద్ సోదరుడు అనుమానాస్పద మృతితో పరిస్థితులు మరింత దిగజారాయి. బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలుగత మే 27న బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ సెలెక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ , బిహార్ అధికారికంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించింది. మొత్తం 19,838 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే ఈ ఫలితాలు కోచింగ్ హబ్గా పేరొందిన పాట్నాలోని ముసల్లాపూర్ కిసాన్ కోల్డ్ స్టోరేజ్ క్యాంపస్లో ఖాన్ సార్ (ఖాన్ సార్) కోచింగ్ సెంటర్, జ్ఞాన్ బిందు జీఎస్ అకాడమీ (రౌషన్ సార్) మధ్య చిచ్చు రాజేసింది. ఇద్దరూ తమ ఇన్స్టిట్యూట్ నుంచి వేలాది మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించడంతో పోస్టర్లు చించుకోవడం, హింసాత్మక దాడులు, కేసులు వరకు వివాదం పెరిగింది.ఖాన్ సార్పై ఆరోపణలుఖాన్ సార్ తన ఇనిస్టిట్యూట్ నుంచి 12,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. రౌషన్ ఆనంద్ తన జ్ఞాన్ బిందు అకాడమీ నుంచి 10,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించారు. ఇద్దరూ టాపర్ అభిషేక్ పటేల్ తమ విద్యార్థి అని ప్రకటించడం, అభిషేక్ పటేల్.. ఖాన్ సార్ని కలవడం, ఆయన బ్లెసింగ్స్ తీసుకోవడంతో రౌషన్ ఆనంద్ను ఆగ్రహానికి గురి చేసింది. అభిషేక్ పటేల్ను ఖాన్ సర్ రూ.10 లక్షలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. అభిషేక్ పటేల్ ఈ ఆరోపణలను ఖండించారు.అయితే జూన్ 2న జ్ఞాన్ బిందు అకాడమీకి చెందిన సుమారు 20 మందివారు ఖాన్ సర్ ఇనిస్టిట్యూట్పై దాడి చేశారు. ఇనిస్టిట్యూట్లో వస్తువుల్ని ధ్వంసం చేయడం,రాళ్లు రువ్వారు. దీంతో ఖాన్ సార్ బాడీగార్డులు గాల్లో కాల్పులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జ్ఞాన్ బిందు డైరెక్టర్ రౌషన్ ఆనంద్, ఆయన సోదరుడు ప్రిన్స్ యాదవ్తో పాటు ఇతరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాన్ సార్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రౌషన్ ఆనంద్పై జైలు శిక్ష పడింది. ప్రిన్స్ యాదవ్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఖాన్ సార్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ అనుమానాస్పద మృతితో బిహార్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. -
మహిళా రైతులు, రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఎస్సీ మహిళలు, రైతులపై ఇటీవల జరిగిన పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసుల నమోదు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించాయి. బాధిత మహిళలు, రైతులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, గుంటూరు ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. రెండు వారాల్లో నివేదికకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశంవైఎస్సార్సీపీ నేత, ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి, మాజీ మంత్రి జోగి రమేష్, అంబటి మురళీకృష్ణ, బాధితురాలు సుడా త్రివేణి ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసింది. ఘటనపై దాఖలైన నాలుగు వేర్వేరు ఫిర్యాదుల సారాంశం ఒకటే కావడంతో వాటన్నింటినీ కలిపి ఒకే కేసుగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ.. మహిళలపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియో రికారి్డంగ్ను పెన్ డ్రైవ్ రూపంలో సాక్ష్యంగా స్వీకరించింది. మహిళల పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరు చట్ట నియమాలకు విరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ ఆరోపణలపై ఏపీ డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ రెండు వారాల్లోగా తమ స్పందనను, సమగ్ర నివేదికను సమర్పించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. చర్యలకు మహిళా కమిషన్ ఆదేశాలుఇదే వ్యవహారంలో ఎస్సీ మహిళలపై పోలీసుల దాడి, అనుచిత ప్రవర్తనను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సైతం తీవ్రంగా పరిగణించింది. మే 27న అందిన ఫిర్యాదుల మేరకు అదే రోజు విచారణ చేపట్టింది. ఈ విషయాన్ని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఈ నెల 5న ఎంపీ తనూజ రాణికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన కమిషన్, చట్టప్రకారం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశిస్తూ లేఖ రాసినట్లు అందులో తెలియజేసింది.పోలీసుల దౌర్జన్యకాండ తీరిది..మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గత నెల 5న రైతులు శాంతియుతంగా ధర్నా చేశారు. ఈ క్రమంలో పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి.. ఎస్సీ రైతులు, మహిళలపైనే ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తప్పుడు కేసులు బనాయించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో, తహసీల్దార్ ద్వారా సుడా త్రివేణికి చెందిన గోదామును, అందులో రైతులు నిల్వ ఉంచిన 2,200 బస్తాల మొక్కజొన్నను అక్రమంగా సీజ్ చేశారు. మే 20న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, అంబటి మురళీకృష్ణలను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నారు. నాయకులను చేబ్రోలు పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమంగా నిర్బంధించారు. అక్కడున్న ఎస్సీ మహిళలను మగ పోలీసులు అసభ్యంగా నెట్టివేస్తూ, తీవ్ర దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీ నేత ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, రూరల్ సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్సై శ్రీహరి, అర్బన్ సీఐ వీరా నాయక్, తెనాలి టూ టౌన్ సీఐ రాములు నాయక్, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ తదితరులు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బాలిస్టిక్ క్షిపణి అడ్డగింతలో సక్సెస్
న్యూఢిల్లీ: శత్రుసైన్యం ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సాంకేతికతను భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీంతో బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్(బీఎండీ) సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. దీంతో బీఎండీ సాంకేతికతను సాధించిన దేశాల జాబితాలో భారత్ చేరింది. భారతీయ యుద్ధనౌకల మీదకు దూసుకొచ్చే శత్రువుల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించే సాంకేతికతను పరీక్షించామని శనివారం భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, శత్రువుల నిఘా, పర్యవేక్షణ విమానాలను అడ్డుకునే సాంకేతికతను బీఎండీగా వ్యవహరిస్తారు. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మాత్రమే ఇన్నాళ్లూ ఈ సాంకేతికతను సాధించాయి.‘‘జూన్ 10, 11వ తేదీల్లో పలు దశల్లో బీఎండీ టెక్నాలజీని పరీక్షించాం. ముందే షెడ్యూల్చేసిన లక్ష్యాలను ఛేదించేందుకు దూసుకొచి్చన బాలిస్టిక్ క్షిపణులను ఈ టెక్నాలజీతో అడ్డుకున్నాం’’అని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దీనిని పరీక్షించింది. దీంతోపాటే నౌకలను నాశనంచేసే క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునే మధ్యశ్రేణి క్షిపణి(ఎన్ఏఎస్ఎం–ఎంఆర్)ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించామని రక్షణ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలోపు ఎత్తులో ఉన్నప్పుడు, 100 కి.మీ.ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న క్షిపణులనూ తమ బీఎండీ సాంకేతికత అడ్డుకుందని రక్షణ శాఖ తెలిపింది.ప్రయోగాలు, పరీక్షలను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ బలగాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షలను విజయవంతం చేసినందుకు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ దళాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ‘‘శత్రు క్షిపణుల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టార్లను విజయవంతంగా పరీక్షించాం. అధునాతన సాంకేతికతతో వీటిని డిజైన్చేసి అభివృద్ధిచేశారు’’అని రాజ్నాథ్ వెల్లడించారు. సంక్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధిచేసి ఆచరణలో పెట్టినందుకు డీఆర్డీవోను మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్పెట్టారు. -
కృష్ణా ట్రిబ్యునల్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ కాగా.. ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నిర్దేశిత కేటాయింపులు జరిపే బాధ్యతను తొలుత కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం(ఐఎస్డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్రం మళ్లీ ట్రిబ్యునల్కు అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా కేటాయించిన జలాలను కలిపి మొత్తం 1005 టీఎంసీలను తిరిగి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో.. తమ రాష్ట్ర ప్రయోజనాలను హరించే ఈ గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, దీనిపై నిర్ణయం తీసుకునే వరకు ట్రిబ్యునల్ విచారణను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సెక్షన్ 89 కింద అప్పటివరకు జరిపిన విచారణను ట్రిబ్యునల్ పక్కనబెట్టి సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన రెఫరెన్స్ ఆధారంగా కొత్తగా విచారణను చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ వాదనలు ముగిశాయి. మరో రెండు మూడు నెలల్లో ఏపీ వాదనలూ ముగియనుండగా, ఆ తర్వాత ఆ వాదనలను ఖండిస్తూ తెలంగాణ తుది వాదన వినిపించనుంది. అనంతరం ట్రిబ్యునల్ సెక్షన్ 3 కింద తీర్పును రిజర్వ్ చేసి ఆ వెంటనే ప్రకటించడం కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూస్తూ వాయిదా వేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద మళ్లీ రెండు రాష్ట్రాల వాదనలను పునః ప్రారంభించనుంది. ఆలోగా సుప్రీంకోర్టు సెక్షన్–3 కింద నీటి పంపకాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సెక్షన్ 89 కింద విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు సెక్షన్ 3 కింద కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ను కొట్టివేస్తే మాత్రం సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్లో విచారణ మరి కొన్నేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు సెక్షన్ 3 కింద ఇప్పటివరకు ట్రిబ్యునల్ జరిపిన విచారణ వృథా ప్రయాస కానుంది. పొడిగింపులే పొడిగింపులుఅంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్ 4 కింద 2004 ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తన తొలి నివేదిక, తీర్పును 2010 డిసెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత భాగస్వామ్య రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు 2011 మార్చి 29న ట్రిబ్యునల్కు తమ సూచనలు (రెఫరెన్స్) పంపాయి. అనంతరం ట్రిబ్యునల్ తన తదుపరి నివేదికను 2013 నవంబర్ 29న కేంద్రానికి సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం–2014 లోని సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్ గడువును పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆ చట్టంలోని క్లాజ్ (ఎ), క్లాజ్ (బి) లోని అంశాల పరిష్కారం నిమిత్తం 2014 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు గడువును పొడిగిస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చారు.ఆ తర్వాత ట్రిబ్యునల్ అభ్యర్థనల మేరకు కాలానుగుణంగా ప్రతి ఏటా కేంద్రం గడువును పొడిగిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెగడం లేదు. నీటి కేటాయింపులు లేక కృష్ణా పరీవాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. -
బీజేపీ కొత్త జట్టు రెడీ..!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు ము హూర్తం దగ్గరపడింది. ఈ నెల 15తో అధిక మాసం ముగియనుండటంతో కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన ఎప్పుడైనా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల స్థాయిలో సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుల నియామకాలు దాదాపు పూర్తి కావడంతో కేంద్ర సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరిగిన వరస సంప్రదింపులు, సంఘ్ పెద్దలతో చర్చలు కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండటంతో వచ్చే వారం దీనిపై కలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. యువత.. దక్షిణాది రాష్ట్రాలు.. ఓబీసీలు..కొత్త జాతీయ జట్టు కూర్పులో ప్రధానంగా యువత, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం, ఓబీసీలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదికలైన పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ), జాతీయ మండలిలో ఈసారి గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత దశాబ్దంలో పార్టీ విస్తరణకు సేవలందించిన సీనియర్లకు గౌరవప్రద స్థానం కొనసాగిస్తూనే, ఎన్నికల రాజకీయాల్లో చురుకుగా పనిచేసే కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు జరిగినట్లు సమాచారం.ముఖ్యంగా ఇటీవలి బెంగాల్, బిహార్, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ విజయాలకు బాటలు వేసిన నేతలకు ప్రాధాన్యం ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జట్టు రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి, బండి సంజయ్, కర్ణాటకకు చెందిన విజయేంద్ర, ప్రహ్లాద్ జోషి, తమిళనాడు నుంచి ఎల్. మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్, ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలకు జాతీయ టీమ్లో ప్రాధాన్యం పెరిగే అవకాశాలపై ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే రాష్ట్ర విభాగాల నుంచి అభిప్రాయాలు సేకరించి, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యం, ఎన్నికల సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.కొత్త కార్యవర్గంలో 40–50 ఏళ్ల నాయకులకు ప్రాధాన్యం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో చురుకుగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం దాదాపు ఖాయమనే అభిప్రాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా నాయకులకు కూడా కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది కేంద్ర మంత్రులు, సంస్థాగత నేతలకు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. -
మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్పై చర్యలు తీసుకోవాలని కమిషన్కు నేతలు ఫిర్యాదు చేశారు.వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది. -
నీట్ పరీక్షా సమయం పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరిగే నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలకమైన వెసులుబాట్లు కల్పీంచింది. పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇన్విజిలేషన్ ప్రక్రియలో భాగంగా హాజరు పట్టికలో సంతకాలు తీసుకోవడం లాంటివాటితో విద్యార్థులు పరీక్ష సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకే అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు ఎన్టీఏ వివరించింది. సమయం పెంపుతో పాటే రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను సైతం ఎన్టీఏ రెట్టింపు చేసింది. గతంలో ప్రశ్నాపత్రం బుక్లెట్ చివరన కేవలం రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు వాటి సంఖ్యను నాలుగుకు పెంచారు. భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం విభాగాల్లో గణాంకాలు, రేఖాచిత్రాల కోసం అభ్యర్థులకు మరింత స్థలం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఎడమ చేతివాటం ఉన్న అభ్యర్థులకు బుక్లెట్ చివరన ఉన్న పేజీల్లో రఫ్ వర్క్ చేసుకోవడం ఇబ్బందిగా మారుతోందన్న ఫీడ్బ్యాక్ ఆధారంగా బుక్లెట్ లేఅవుట్ను మార్చారు. ఇన్స్ట్రక్షన్స్ పేజీ తర్వాత ముందు భాగంలో రెండు పేజీలు, బుక్లెట్ చివరన మరో రెండు పేజీలను రఫ్ వర్క్ కోసం కేటాయించారు. ఈ కొత్త ఫార్మాట్ ఇంగ్లిష్, ఇతర అన్ని ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రాలకు వర్తిస్తుంది. నీట్ రాసేవారిలో 10 శాతం మంది ఎడమచేతి వాటం వారు ఉన్నారని ఎన్టీఏ తెలిపింది. పరీక్షా విధానంలో తీసుకువచ్చిన ఈ చిన్న మార్పులు విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతాయని ఎన్టీఏ పేర్కొంది. పారదర్శకత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే పరీక్షను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుల్లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదువుకుని పరీక్షా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరింది. -
టీవీ చానళ్లలో అర గంట, రేడియోలో గంట
న్యూఢిల్లీ: టీవీ, రేడియో ప్రసార సేవల కోసం ఒకే నియంత్రణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా జాతీయ, సామాజిక ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన బాధ్యత టీవీ చానళ్ల నుంచి రేడియో సేవలకు కూడా విస్తరించింది. ఈ మేరకు ‘టెలికమ్యూనికేషన్స్(టీవీ, రేడియో, సంబంధిత సేవలు) రూల్స్–2026’ముసాయిదాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. టీవీ చానళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య జాతీయ, సామాజిక సంబంధిత అంశాలపై కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉండగా, రేడియో స్టేషన్లు ప్రతిరోజూ ఒక గంట సమయాన్ని దీనికి కేటాయించాల్సి ఉంటుందని ముసాయిదాలో స్పష్టంచేసింది. నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన ‘భారతదేశంలో టెలివిజన్ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్ మార్గదర్శకాలు–2022’ప్రకారం.. టీవీలో ఇటువంటి కంటెంట్ను ప్రసారం చేయడం తప్పనిసరి చేసినప్పటికీ, సమయాన్ని కచ్చితంగా పేర్కొనలేదు. దానిపై స్పష్టత ఇస్తూ ముసాయిదా రూపొందించారు. అలాగే, ఎఫ్ఎం పాలసీ మూడో దశ ప్రకారం.. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజూ ఒక గంట పాటు ప్రజాప్రయోజన ప్రకటనలను ప్రసారం చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ రేడియో స్టేషన్లపై ఉంది. ప్రజా ప్రయోజన ప్రకటనల గురించి కేంద్రం స్పష్టమైననిర్వచనాన్ని ఈ ముసాయిదాలో ఇచ్చింది. ప్రతి అధీకృత ప్రైవేట్ రేడియో సర్వీసు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే విధంగా, జాతీయ ప్రాముఖ్యత, సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలను రోజుకు కనీసం ఒక గంట పాటు ప్రసారం చేయాలి అని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. టీవీ చానళ్లు ప్రజా సేవా కార్యక్రమాలను ప్రసారం చేయొచ్చు. ఇకపై దీనిని తప్పనిసరి చేస్తూ ముసాయిదాలో నిబంధన చేర్చారు. విద్య, అక్షరాస్యత వ్యాప్తి; వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం; మహిళా సంక్షేమం; సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం; పర్యావరణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ; జాతీయ సమైక్యతలను ముసాయిదాలో కూడా కొనసాగించారు. నిబంధనలను పాటించడం సాధ్యం కాని కొన్ని వర్గాలకు మినహాయింపు ఉంటుందని ఆ ముసాయిదా పేర్కొంది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలని, అభ్యంతరాల ఉంటే తెలియజేయాలని ప్రజలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది. -
కిమ్ బాటలో కాషాయ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్మోడల్గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా, ఊహాజనిత కేసును చూపెట్టి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు.బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్లే కుట్రదారులని ఆరోపించారు. ప్రైవేటు ఫిర్యాదులపై ఇచ్చే నోటీసులన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో చూపెడుతున్నారా? అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి శుక్రవారం మీడియాతో పలు అంశాలపై చిట్చాట్ చేశారు. ఉత్తర కొరియాలో ఓట్లన్నీ కిమ్కే.. ‘ఇన్నాళ్లూ బీజేపీకి గాడ్సే ఆదర్శం అనుకున్నాం. గాంధేయవాదులకీ, గాడ్సే వారసులకీ యుద్ధం జరుగుతోందని భావించాం. కానీ బీజేపీ ఇప్పుడు కిమ్ జాంగ్ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఉత్తర కొరియాలో ఎన్నికల్లో ఒకే పార్టీ పోటీ చేస్తుంది. ఓట్లన్నీ ఆ పార్టీ నేత కిమ్ జాంగ్కే పడతాయి. ఆయనే అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. అదే మాదిరి బీజేపీ ఓట్లు, సీట్లు అన్నీ తమకే దక్కేలా కుట్రలు చేస్తోంది. మీనాక్షి విషయంలోనూ అదే చేసి చూపించింది. బలం లేకుండా మూడో అభ్యర్థిని పెట్టారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా మూడో అభ్యర్థిని పోటీలో పెట్టడం వెనుకే పెద్ద కుట్ర ఉంది. అక్కడ బీజేపీకి గెలిచేంత బలమే లేదు. అయినా అభ్యర్థిని పోటీలో పెట్టారు. మీనాక్షి నామినేషన్ వేశాక కుట్రలకు తెరలేపారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు. ఓ ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.2023లో ఇద్దరి మధ్యలో జరిగిన వివాదంతో మీనాక్షికి సంబంధం లేదు. అయినప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరించి నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరూ కుట్రదారులే. బీజేపీ టాప్ నేతలే దీనికి వ్యూహరచన చేశారు. కేసే లేనప్పుడు తెలంగాణ నుంచి ఈ వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారన్న దానిపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదు..’అని సీఎం అన్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు.. ‘తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వొద్దని కిషన్రెడ్డి ప్రతి కేంద్రమంత్రినీ కలిసి చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తానే నిలిపివేయించానని బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్ఎఫ్సీకి లోన్ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీన రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు? ఆర్ఆర్ఆర్ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్తో మాట్లాడి 1,500 ఎకరాలు తెలంగాణకు ఇప్పించలేరా? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులపై ప్రధానికి కిషన్రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి. కేబినెట్ భేటీకి రానని చెప్పాలి.. మేము అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని కేబినెట్లో ఎందుకు అడగడం లేదు? ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానని కిషన్రెడ్డి చెప్పాలి. లేదంటే కిషన్రెడ్డి సహా..రాష్ట్రానికి చెందిన మొత్తం 8మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పేరు వస్తుందని కిషన్రెడ్డి ఆపుతున్నారు..’అని రేవంత్ ఆరోపించారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష ‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం ముందుకెళుతుంది. రాష్ట్రం కోరుతున్న ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్రోడ్డు, ఐఐఎం, మెట్రోలకు ఇప్పటికైనా కేంద్రం నిధులచ్చి సహకరించాలి. జూలైలో మహారాష్ట్రతో చర్చలు.. గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై వచ్చే నెలలో మహారాష్ట్రతో చర్చలుంటాయి. నీతిఆయోగ్ సమావేశం సందర్భంగా దీనిపై ఫడ్నవీస్తో మాట్లాడా. వచ్చే నెలలో దీనిపై చర్చిద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఇప్పించలేదా? హిట్లర్ వ్యాఖ్యలకు వక్రభాష్యం.. రాష్ట్ర కేబినెట్ పునరవ్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదు. మంత్రి పదవులపై ఎవరైనా పార్టీ పెద్దలను కలవొచ్చు.. ఏదైనా అడగొచ్చు. బుద్ధి ఉన్నోడు ఎవడూ హిట్లర్ను ఆదర్శంగా తీసుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే నేతలు ఎవరైనా ఆయన రోల్మోడల్ అని చెప్పరు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది..’అని సీఎం విమర్శించారు. వైఎస్ జగన్ సభలకు అనుమతిస్తున్నారా? ‘తెలంగాణకు ఎవరైనా రావొచ్చు..మాట్లాడొచ్చు..పోటీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే పోలీసులు అనుమతులు ఇవ్వరు. పవన్ కల్యాణ్ సభ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి సమస్యలు వస్తాయనే అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలకు అనుమతులు ఇస్తున్నారా? శాంతిభద్రతల సమస్యలున్నాయని సభలను తిరస్కరించట్లేదా?. ఇప్పటికి ఎన్ని సభలను అడ్డుకున్నారో వైఎస్ జగన్ను అడిగితే ఆయనే జాబితా ఇస్తారు..’అని రేవంత్ అన్నారు. రాహుల్గాంధీతో భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శక్రవారం ఉదయం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా రాహుల్ సూచించినట్లు తెలిసింది. -
సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్ను, పెండింగ్లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.మధ్యప్రదేశ్ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?
న్యూఢిల్లీ: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు? ఎలా? జరిగిందనే కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ తరుణంలో తాజాగా ఉన్నతాధికార వర్గాలు స్పందించాయి. మరో రెండు నెలలు ఒపిక పెడితే అన్ని విషయాలు బయటపెడతాయని కీలక ప్రకటన చేశాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని వర్గాలు సూచించాయి. అలాగే దర్యాప్తులోని ఏ అంశాన్నీ దాచిపెట్టబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై కూడా అధికారులు స్పందించారు. వాటిలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన విమాన ఇంజిన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. విచారణలో వెలుగుచూస్తున్న అంతర్గత అంశాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. తుది నివేదిక సిద్ధం చేసే ప్రక్రియపై మాత్రమే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.తుది నివేదిక విడుదలకు ముందుగా ఒక మధ్యంతర స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) విడుదల చేసే అవకాశాన్ని కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం అలాంటి నివేదిక తప్పనిసరి కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా దర్యాప్తు వేగంపై ప్రభావం చూపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన పలు అంతర్జాతీయ భాగస్వాములు, సాంకేతిక నిపుణులు, సంస్థలపై ఆ పరిస్థితుల ప్రభావం పడిందని, అందువల్ల జాప్యానికి దర్యాప్తు బృందాన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాయి.గత ఏడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో మాత్రం కీలక విషయాన్ని వెల్లడించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే బోయింగ్ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు దాదాపు ఒకేసారి "రన్(RUN)" స్థితి నుంచి "కటాఫ్(CUTOFF)" స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు.అయితే ఆ స్విచ్లు ఎందుకు మారాయి? సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదంటే మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తుది నివేదిక వచ్చిన తర్వాతే లభించనుంది. అందుకే ఇప్పుడు విమానయాన రంగం మాత్రమే కాదు.. దేశమంతా ఆ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది
ఢిల్లీ: ఏఐ యుగంలో ఉద్యోగం కాపాడుకోవడం ఎంత కష్టమో సోషల్ మీడియాలో ప్రతిరోజూ ధీనగాధలు వినిపిస్తున్నాయి. అలాంటి ఓ యువకుడు తన నోటి దురుసు వ్యాఖ్యలతోనే ఉద్యోగాన్ని కోల్పోయాడు. రూ.370 బిర్యానీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.జూన్ 8న హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ కేంద్రంగా స్టాండప్ కామెడీ షో జరిగింది. ఈ షోకి బిగ్ బాస్ ఫేమ్ ప్రణిత్ మోరే స్టాండప్ కమెడియన్గా హాజరయ్యారు. ఈ షోలో కమెడియన్ ప్రణిత్ మోరే.. ప్రేక్షకులకు ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటే.. ఆడియన్స్ సమాధానాల ఆధారంగా వెంటనే జోకులు వేయడం దీని ఉద్దేశం.అయితే, ఈ కామెడీ షోలో హిమాన్షు జాంగ్రా తన డేట్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను ఇటీవల ఓ యువతితో డేటింగ్కు వెళ్లాను. డేటింగ్ వెళ్లే సమయంలో రూ.370 పెట్టి చికెన్ బిర్యానీ కొనుగులో చేశాను. డేటింగ్ పూర్తయి ఇంటికి వెళ్లే సమయంలో ఆ యువతి నన్ను తన ఇంటి వద్ద డ్రాప్ చేయమని అడిగింది. అందుకు నేను కాదనలేకపోయా. అయితే, డేటింగ్ వచ్చే ముందు రూ.370 బిర్యానీ కొనుగోలు చేశాను. ఆ డబ్బులు వృధా కాకూడదంటూనే అతని మాటలలో రూ.370 బిర్యానీ కొనుగులో చేసినందుకు శారీరక సంబంధం ఆశించినట్లు చెప్పాడు. అంతే హిమాన్షు మాటలకు చప్పట్లతో ఆ ప్రాంతం హోరెత్తింది. భళ్లున నవ్వుకున్నారు.హిమాన్షు చేసిన రూ.370 బిర్యానీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.హిమాన్షు నోటి దురుసుపై మహిళా సంఘాలు, ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.పలువురు పోలీసులకు ఫిర్యాదుతో మహరాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే, ఆడియన్ హిమాన్షు జాంగ్రాపై భారత న్యాయ సంహిత చట్టంలో పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. తమ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఓ టెక్ సంస్థలో వెబ్డెవలపర్గా విధులు నిర్వహిస్తున్న హిమాన్షు జాంగ్రాపై సదరు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాన్షును విధుల నుంచి తొలగించింది. తాను చేసిన వ్యాఖ్యలకు హిమాన్షు క్షమాపణలు చెప్పినా వ్యాఖ్యల వివాదం ఇంకా చల్లారలేదు. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆడ శిశువుపై తొలగని వివక్ష
న్యూఢిల్లీ: మన పితృస్వామ్య వ్యవస్థలో మగ సంతానంపై ఇప్పటికీ తగ్గని ఆసక్తిని, తెరవెనుక గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలను సుప్రీంకోర్టు తీవ్రంగా నిరసించింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రానంతవరకు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ (ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్, పీసీపీఎన్డీటీ) చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిందేనని పేర్కొంది. పితృస్వామ్య పోకడలున్న మన వ్యవస్థలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేందుకు వారి కోసం అమలవుతున్న.. బేటీ బచావో బేటీ పఢావో, జనని సురక్షా యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలే నిదర్శనమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇలాంటి పథకాలతో అభివృద్ధి జరిగినప్పటికీ, ఆశించిన ప్రయోజనాలు ఇంకా రావాల్సి ఉందని అభిప్రాయ పడింది. ‘మహిళలను చులకనగా చూడటం మానేసి, వారిని కూడా సమానులుగా భావించే పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి ప్రత్యేక ప్రయత్నాలు/ పథకాల అవసరం ఇక ఎంతమాత్రం లేదు అనే స్పృహ సమాజంలో కలిగినప్పుడే సంపూర్ణ మార్పు వచ్చినట్లు భావించాలి. అంటే ఐపిసి, బిఎన్ఎస్ వంటి చట్టాల ద్వారా మహిళలకు కల్పిస్తున్న రక్షణలు ఇకపై అవసరం లేదని కాదు. కనీసం పుట్టిన ఆడబిడ్డను స్వాగతించే పరిస్థితి రావాలి’అని ధర్మాసనం పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఆడ శిశువులు నమోదువుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో జాతీయ బాలల లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది బాలురకు 1991లో 945 కాగా, 2011 నాటికి 919కి పడిపోవడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. గర్భస్థ శిశు లింగ నిర్థారణ చట్టం పీసీపీఎన్డీటీని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుత పరిస్థితి ఫరవాలేదు. ఇంకా మెరుగుపర్చేందుకు ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చేస్తున్న ప్రయత్నాల ఫలితమే. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన ఆర్టీసీ బస్సులపై ఆడబిడ్డ విద్య, అభ్యున్నతి, ఆర్థిక భద్రతకు సంబంధించిన పోస్టర్లతో ప్రచారాలు కొనసాగించాల్సి వస్తోంది’అని వ్యాఖ్యానించింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కోర్టు దర్యాప్తును సవాల్ చేస్తూ ఓ వైద్యుడు వేసిన అప్పీల్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. -
ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రభుత్వం తీరును ఎండగడుతూ జూన్ చివర్లో దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఇందిరా భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. సమావేశంలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ జైరాం రమేశ్, భూపేశ్ బఘెల్లతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్చార్జులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నీట్, సీబీఎస్ఈ వంటి పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే చట్టం చేసిన కేంద్రం పకడ్బందీగా అమలు చేయలేకపోయింది. ఫలితంగానే లీకయ్యాయి. అదేవిధంగా, ఈ నెల 22న అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నిటినీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు’అని జైరాం రమేశ్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న డబుల్ ఇంజన్. ఇందులో ఒక ఇంజన్ ఓట్ చోరీ కాగా, మరోటి సీట్ చోరీ’అని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి తీవ్ర సమస్యలను దేశం నేడు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చిందని ఆరోపించారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాజకీయ పోరాటం సాగించడటం తమ బాధ్యతని ఖర్గే వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో మొదలయ్యే తమ దేశవ్యాప్త పోరాటం రెండు, మూడు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
14న మాక్రాన్తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లొవేకియాల్లో వారం రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్లో జరిగే జీ–7 శిఖరాగ్రంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్తో విస్తృత చర్చలు జరపునున్నారు. నీస్ నగరంలో 14న మేక్రాన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ కంపెనీలతో మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా, ఫ్రెంచి కంపెనీలు భారత్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కుదుర్చుకునే వీలుందని సమాచారం. ఫ్రాన్స్తో కనీసం 12 ఒప్పందాలు కుదిరేందుకు ఛాన్సుందని చెబుతున్నారు. అనంతరం ప్రధాని జీ 7 దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. శిఖరాగ్రానికి హాజరయ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ ప్రధాని భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. -
ఖర్గే, ఖేరా, పునియా, తరుణ్ చుగ్ సహా రాజ్యసభకు 24 మంది ఏకగ్రీవం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా, బీజేపీ నేతలు సతీశ్ పునియా, తరుణ్ చుగ్ సహా 24 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నామినేషన్ల పరిశీలన ముగియగా, ఈ స్థానాలకు బరిలో ఒక్కొక్కరు మాత్రమే బరిలో ఉండటంతో వీరు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇందులో ఎన్డీయేకి 19 దక్కగా, ఐదు సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. విజేతలకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కాగా, తీవ్రమైన పోటీ నెలకొన్న జార్ఖండ్లోని రెండు స్థానాలు, మిజోరంలోని ఒక స్థానానికి ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, పవన్ ఖేరాతోపాటు బీజేపీ నేత ఎం.నాగరాజా గెలిచారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ అక్కడ మూడు సీట్లలో బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్. రజనీశ్ అగర్వాల్, మహేశ్ కేవత్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గుజరాత్లో బీజేపీకి చెందిన రాజుభాయ్ శుక్లా, మాన్సిన్హ్ పర్మార్, ముకేశ్ భాయ్ రథ్వా, జితేంద్ర కంజారియా, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి చెందిన బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీశ్ బాబు, జనసేనకు చెందిన లింగమనేని రమేశ్ గెలిచారు. రాజస్తాన్లో బీజేపీకి చెందిన అల్కా గుర్జార్, సతీశ్ పునియా, కాంగ్రెస్ అభ్యర్థి నీరజ్ దాండి, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేత జేమ్స్ కె.సంగ్మా, మణిపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారిమయుమ్ శారదా దేవి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా, అరుణాచల్లో బీజేపీ నేత టాయ్ తగక్, మహారాష్ట్రలో ఎన్సీపీ నేత రాజేంద్ర జైన్, ఒడిశాలో బీజేపీ నుంచి దేబాశీష్ సామంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవ విజయం సాధించారు. -
నిందితుడి మృతి.. నకిలీ రిజిస్ట్రేషన్ల కేసు క్లోజ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నకిలీ భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో నిందితుడైన కూకట్పల్లి మాజీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మృతి చెందడంతో సుప్రీంకోర్టు ఆ కేసు విచారణను ముగిస్తూ కేసును మూసేసింది. అయితే ఇదే భూ వివాదానికి సంబంధించి దాఖలైన మరో క్రిమినల్ కేసును పెండింగ్లో ఉన్న సివిల్ అప్పీల్తో జత చేసి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఇదీ కేసు నేపథ్యం.. మైలార్దేవ్పల్లి పరిధిలోని సర్వే నం. 156/1/2లో ఉన్న టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ కో–ఆపరేటివ్ సొసైటీ స్థలాలను నకిలీ పత్రాలతో విక్రయించిన కేసులో మాజీ జాయింట్ సబ్–రిజి్రస్టార్ రచ్చకొండ శ్రీనివాసరావు ఏకైక నిందితుడిగా ఉన్నారు. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే శ్రీనివాసరావు ఈ ఏడాది మే 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కానీ ఇదే భూముల ఆక్రమణ, నకిలీ సేల్ డీడ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి శంకరమంచి సత్యనారాయణ తదితరులపై నమోదైన మరో ఎస్ఎల్పీపైనా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఇద్దరు మరణించారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి బండారి రామచందర్ వర్సెస్ మైత్రీ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో 2013 నుంచి భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద ఒక సివిల్ అప్పీల్ సుప్రీంలో పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. టైటిల్ వివాదానికి సంబంధించిన ఆ సివిల్ కేసుతోపాటే ఈ క్రిమినల్ కేసును కూడా విచారించాలని కోరారు. దీనిపై ప్రతివాదుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగాయనేది క్రిమినల్ ఆరోపణ అని, దానికి అసలు యాజమాన్య హక్కుల వివాదంతో ముడిపెట్టి సివిల్ కేసుతో జత చేయడం సరికాదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనకు మొగ్గుచూపుతూ క్రిమినల్ ఎస్ఎల్పీని పెండింగ్లో ఉన్న సివిల్ అప్పీల్తో జత చేసింది. ఈ రెండు కేసులపై వేసవి సెలవులు ముగిశాక తుది విచారణ జరుపుతామని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
జీ రామ్ జీ కోసం రూ.3,825.31 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ స్కీమ్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్జీ) పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు.గురువారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయి పథకం అమలు, రాష్ట్రానికి అందాల్సిన సహకారం తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గ్రామీణ ప్రజల కోసం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్ 9 నాటికి ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ.1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపినట్లు కిషన్రెడ్డి వెల్లడించారు.60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేయనున్న ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ను విడుదల చేయాల్సి ఉందని, దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా కేటాయించాల్సి ఉందని కిషన్రెడ్డి తెలియజేశారు. వ్యవసాయ పనుల విరామానికి సంబంధించిన నోటిఫికేషన్ను కూడా వ్యవసాయదారులందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. జీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో అనుకున్న సమయానికి సజావుగా, సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
అండగా నిలవండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రంలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన సీఎం రేవంత్.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎం–6’ నిధికి రూ. 6 లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ దార్శనికతను ప్రధానికి వివరించిన రేవంత్రెడ్డి.. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో తాను చేసిన ఎం–6 టాస్్కఫోర్స్ ప్రతిపాదనను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వృద్ధికి ఇంజిన్లలా పనిచేస్తున్న ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ఈ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో రెండో దశకు చేయూతనివ్వండి రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లలో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధానిని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుతోపాటు సస్టెయినబుల్ అర్బన్ హబ్గా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. రోడ్లు, రైల్వేల విస్తరణకు ఊతం హైదరాబాద్ రీజనల్ రింగ్రోడ్డు (ఉత్తర, దక్షిణ కారిడార్లు), ప్రతిపాదిత హైదరాబాద్–అమరావతి–బందరు పోర్టు ఎక్స్ప్రెస్ వే, మన్ననూర్–శ్రీశైలం (ఎన్హెచ్–765) మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలిపి అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే రీజనల్ రింగ్రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోపాటు శంషాబాద్లో సెంట్రల్ హైస్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ కనెక్టివిటీని అభివద్ధి చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని.. ఇందుకోసం హైదరాబాద్ పరిధిలో 200 ఎకరాల వివాదరహిత భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. టెక్నాలజీ, సాగునీటి ప్రాజెక్టులకు దన్నుగా నిలవండి టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు కేటాయించాలని ప్రధానిని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఎల్రక్టానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ 2.0) ఏర్పాటుకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ కింద కేంద్రం మద్దతివ్వాలని కోరారు. సాగునీటి రంగంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా ప్రధాని చొరవ తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. విద్య, వైద్యమే పునాదిగా.. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే అంశాలను సీఎం రేవంత్రెడ్డి ఈ భేటీలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశాభివృద్ధి వ్యూహంలో నాణ్యమైన విద్య, వైద్యం పునాదిగా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునీకరణ వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మోదీకి వివరించారు. మెట్రో రెండో దశకు సత్వరమే అనుమతులివ్వండి కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో భేటీలో సీఎం విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్–2 ఆవశ్యకతను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. మెట్రో ఫేజ్–2 డీపీఆర్లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ గతంలో చేసిన సూచనల మేరకు మార్పులు చేసి ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి కూడా త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి మాణిక్రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ప్రత్యేక కార్యదర్శి (సమన్వయం) అద్వైత్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్ప్రెస్వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు 200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. -
ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారుసమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు. -
మీనాక్షికి దక్కని ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్కు సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్నికల ఫలితాల ప్రకటనపై తాత్కాలిక నిలుపుదల (స్టే) ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.అయితే మిగిలిన వాదనలు, వివరణలు శుక్రవారం వింటామని తెలిపింది. అలాగే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం సాధారణంగా తగదని అభిప్రాయం బలంగానే వ్యక్తి చేసింది. దీంతో ఈ కేసు రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు, రెండు ఉప స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (4), కర్ణాటక (4) మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్ (3), జార్ఖండ్ (2), మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే.. మహారాష్ట్ర, తమిళనాడులో చెరో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. -
CBSE లోపాల ఎపిసోడ్: జాక్పాట్ కొట్టిన కుర్రాడు
ప్రభుత్వ వెబ్సైట్ల జోలికి పోవడం నేరం. అలా ఎవరైనా వెళ్తే.. కేసులు పెడతారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు మాత్రం అదే పనితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీబీఎస్ఈ మార్కుల అప్లోడ్ పోర్టల్లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారి.. అటు ప్రముఖుల నుంచి, ఇటు నెటిజన్ల నుంచి శెభాష్ అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు అతనికి మరో ‘ప్రతిష్టాత్మక’ అవకాశం దక్కింది.దేశంలోని పాఠశాలలు విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేసే సీబీఎస్ఈ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ మార్క్స్ (OSM) పోర్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయని తొలిసారిగా గుర్తించింది 19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి. అయితే చాలామంది చేసేలా ఆ లోపాలను దుర్వినియోగం చేయకుండా, బాధ్యతాయుతంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీబీఎస్ఈ డిజిటల్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇటీవల మరోసారి సీబీఎస్ఈ డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారించిన నిసర్గ.. మరో సంచలన ప్రకటన చేశాడు. "బ్యాడ్ ఆపిల్" అనే వైరల్ యానిమేషన్ను ఒక సీబీఎస్ఈ పోర్టల్లో ప్రదర్శించగలిగానని చెబుతూ భద్రతా లోపాలను ప్రస్తావించాడు. దీంతో సైబర్ భద్రత అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది.అయితే.. నిసర్గ ప్రతిభను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రం సీ3ఐహబ్ ఆ కుర్రాడిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్గా నియమించింది. ఒక సాధారణ సైబర్ రీసెర్చర్గా ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు దేశంలోని అగ్రశ్రేణి సైబర్ రక్షణ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగంగా మారడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.C3iHub అనేది IIT కాన్పూర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్. ఇది క్యాంపస్ బయట కాదు.. పూర్తిగా ఐఐటీ కాన్పూర్ లోపలే పనిచేస్తుంది. కానీ ఇది సాధారణ డిపార్ట్మెంట్ ఉద్యోగం కాదు-ప్రత్యేకంగా సైబర్ దాడులు, డేటా భద్రత, హ్యాకింగ్ విధానాలు వంటి అంశాలపై పరిశోధన చేసే ప్రాజెక్ట్ కేంద్రం. అందులో పనిచేసే నిసర్గ లాంటి వారు నేరుగా క్లాస్లు లేదా టీచింగ్ డిపార్ట్మెంట్లో కాకుండా, ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ టీమ్లో ఉంటారు. వారి పని ప్రభుత్వ, బ్యాంకింగ్, రక్షణ వ్యవస్థల డిజిటల్ భద్రతను మెరుగుపరచడం, సైబర్ ముప్పులను ముందే గుర్తించడం వంటి పనులపై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇదొక హై-లెవల్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్/సెంటర్.జీతం ఎంతంటే..ఇలాంటి నియామకాలు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రాజెక్ట్ ఆధారిత కాంట్రాక్ట్ పోస్టులుగా ఉంటాయి. ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థల రీసెర్చ్ కేంద్రాల్లో పనిచేసే వారికి నెలవారీ స్టైపెండ్ లేదా జీతం అందుతుంది. జూనియర్ స్థాయి రీసెర్చ్/ఇంజినీర్ పోస్టులకు సాధారణంగా నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.1,20,000 దాకా వేతనం ఉండొచ్చు. ఇది అభ్యర్థి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ప్రాజెక్ట్ ఫండింగ్పై ఆధారపడి మారుతుంది. నిసర్గ లాంటి ప్రత్యేక ప్రతిభ ఉన్నవారికి మార్కెట్ రేంజ్ కంటే మెరుగైన ప్యాకేజ్ కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన జీతం వివరాలు సాధారణంగా పబ్లిక్గా ప్రకటించరు.ఇన్స్పిరేషన్ కాదంటారా?నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ దాడులు, డేటా చోరీలు, ర్యాన్సమ్వేర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో థ్రెట్ ఇంటెలిజెన్స్ నిపుణుల అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. హ్యాకర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి ముప్పులు ఎదురుకావచ్చు? అనే అంశాలను ముందుగానే గుర్తించి సంస్థలకు హెచ్చరించే బాధ్యత వీరిపై ఉంటుంది. నిసర్గ నియామకం మరో విషయాన్ని స్పష్టం చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో కేవలం డిగ్రీలే కాదు.. ప్రాక్టికల్ నైపుణ్యం, పరిశోధనా దృక్పథం, నైతిక విలువలు కూడా సమానంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒక ప్రభుత్వ పోర్టల్లో లోపాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా వెల్లడించిన యువకుడు.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్లో కీలక బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యువతకు సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త దిశను చూపుతోంది. -
ప్రధాని అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ 11వ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి (Governing Council)సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు , లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యసాధన కోసం సమ్మిళిత వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధి, పీఎం ధనధాన్య కృషి యోజన పై నీతి ఆయోగ్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అలాగే ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్కూలింగ్, స్కిల్లింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ,హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ సమావేశం కోసం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్కు బయలుదేరారు. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు బెంగాల్ సువేందు అధికారి, తమిళనాడు సి. జోసెఫ్ విజయ్, కర్ణాటక డి.కె. శివకుమార్, వీడీ సతీశన్ తదితరులు కూడా రాజధాని నగరానికి చేరుకున్నారు. -
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్, కాంగ్రెస్తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్.. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్స్టాప్ పెట్టింది. కాంగ్రెస్తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది. -
మోదీ పాలన ప్రశంసనీయం
న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికై సుదీర్ఘకాలం నిరాటంకంగా ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. సరికొత్త మైలురాయికి చేరుకున్న మోదీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచాధినేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ పాలన పుష్కరకాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ ఏకగీవ్రంగా తీర్మానాన్ని ఆమోదించారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి అందించిన సేవలను ప్రశంసిస్తూ మంత్రులందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం దిశగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో దీనిని ఒక చరిత్రాత్మక మైలురాయిగా మంత్రివర్గం అభివర్ణించింది. మోదీని కొనియాడుతూ రాష్ట్రపతి ముర్ము మోదీకి లేఖ రాశారు. ప్రధానిగా మోదీ సుదీర్ఘకాలం కొనసాగడం ప్రజల ఆదరాభిమానాలకు నిదర్శమని, దేశ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని ఘట్టమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బిహార్ సీఎం సమ్రాట్ చౌదరీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఒడిశా సీఎం మోహన్చరణ్ మాఝీ, హరియాణా సీఎం నాయబ్ సైనీ తదితరులు మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని, మాల్దీవుల అధ్యక్షుడు మోహమ్మద్ మెయిజ్జూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీమ్, భూటాన్ ప్రధాని త్సారింగ్ టోబ్గే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ హయాంలో సర్వతోముఖాభివృద్ధి ఎన్డీఏ భేటీలో ప్రధానిని ప్రశంసించిన కూటమి పార్టీల అగ్రనేతలు బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కూటమి సమావేశమైంది. 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ కీలక ఎన్డీఏ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీల అగ్రనేతలు మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ఉద్ఘాటించారు. మోదీ సేవలను కొనియాడుతూ ఒక తీర్మానం ఆమోదించారు. ఎన్డీయే పక్షాల సదస్సులో బెంగాలీ ప్రముఖ అల్పాహారమైన ఝాల్మురీని ప్రధాని∙మోదీ రుచి చూశారు. -
కాంగ్రెస్ వైఫల్యాలకు హిందువులపై నిందలు
న్యూఢిల్లీ: దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సహాయతలోకి నెట్టేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశం తక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన కాలాన్ని ‘హిందూ వృద్ధి రేటు’గా తప్పుగా అభివర్ణిచారని ఆక్షేపించారు. వాస్తవానికి దానిని ‘కాంగ్రెస్ వృద్ధి రేటు’గా అని పిలవాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుందని, ఇక్కడ వేగవంతమైన ప్రగతి సాధ్యం కాదని ప్రజలు భావించేలా చేశారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాల నిందలను హిందువులపై అన్యాయంగా మోపారని, కాంగ్రెస్ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆ పార్టీ రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని చిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వారసత్వ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ అతిపెద్ద విజయాలలో ఒకటి అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన సంకల్పంతో భారీ స్థాయిలో అభివృద్ధిని సాధించవచ్చని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. 2014లో తమ ప్రభుత్వం వచి్చనప్పుడు సామాన్య పౌరుడికి ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్రోహం తర్వాత దేశ ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారని తెలిపారు. 12 ఏళ్లలో తమ కూటమి ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజలే నాకు దేవుళ్లు ‘‘అవినీతికి తావులేని పాలన అందిస్తున్నాం. ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నిజంగా నా దృష్టిలో అద్భుతమైన క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. అధికారాన్ని సేవగానే ఎల్లప్పుడూ భావించాం. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. గతంలో దశాబ్దాలపాటు జరిగే అభివృద్ధి మేము అధికారంలోకి వచ్చాక కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోంది. స్థిరమైన పాలనతో అభివృద్ధి వేగం పుంజుకుంది. 2014కి ముందు దేశంలో అస్థిరత ఉండేది. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములే. మా పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 కోట్ల నుంచి 100 కోట్లకు చేరింది. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి చెప్పడానికి ఇదొక తార్కాణం. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అన్నారు.ఉగ్ర దాడులపై దేశం మౌనంగా ఉండదు సామాన్యులపై భారం తగ్గించాలన్నదే మా సంకల్పం. పన్ను మినహాయింపులు, పాలనాపరమైన సంస్కరణలతో సహా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించాం. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చాం. నేడు దేశం సరళమైన పన్ను విధానంతో ప్రయోజనం పొందుతోంది. దేశమే ప్రథమం(నేషన్ ఫస్ట్) అనే నినాదంతో పనిచేస్తున్నాం. దేశంలో మావోయిస్టుల సమస్యను అంతం చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని నెలకొల్పాం. ఇలాంటి నిర్ణయాలను తీసుకొనే సాహసాన్ని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి. ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తున్నాం. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలతో మన సంకల్పాన్ని, బలాన్ని ప్రదర్శించాం’’ అని అన్నారు.విదేశాలపై ఆధార పడొద్దు నా దృష్టిలో పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వచ్చింది. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ‘2047 నాటికి వికసిత్ భారత్’ మన లక్ష్యం. అందుకోసం మరింత వేగంగా, క్రియాశీలకంగా పని చేయాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ సంకల్పం సాకారమవుతుండడం ఆనందంగా ఉంది. మన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు తయారు చేస్తున్నాం. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశం స్వావలంబన సాధిస్తోంది. అదే సమయంలో జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది. మన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో విదేశాలపై ఆధారపడకూడదు. 2014లో ఉదయించిన ఆశాకిరణం నేడు నూతన ఆత్మవిశ్వాసపు కాంతిరేఖగా మారింది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తనను సత్కరించినందుకు ఎన్డీయే మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతంగా తనది మాత్రమే కాదని, మొత్తం కూటమికి, బీజేపీ కార్యకర్తలందరికీ చెందుతుందని వివరించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా కాకుండా.. తమ సమిష్టి కృషికి నిదర్శనంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సుదీర్ఘ పదవీకాలాన్ని ఒక గొప్ప గౌరవంగా అభివర్ణిచారు. దేశ సేవ ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధన వంటిదని అన్నారు. -
నామినేషన్ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్లో ఆర్వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మన్వు సంఘ్వీ అన్నారు.కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ.. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ఇవాళ్టితో అధిగమిస్తూ మోదీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ ఘనత స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952లో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన నెహ్రూ.. 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించారు. ప్రధానమంత్రుల పదవీకాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4,077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3,652 రోజులు, అటల్ బిహారీ వాజ్పేయి 2,272 రోజులు, పి.వి. నరసింహారావు 1,827 రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు.ఇదిలా ఉండగా, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆయన సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు సన్మానం చేయాలని ఎన్డీయే పక్షాలు భావిస్తున్నాయి. శుభాకాంక్షల వెల్లువనరేంద్ర మోదీ రికార్డు నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఈ ఘట్టాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం తన నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించగా, పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారాపే మోదీని ఆదర్శ నాయకుడిగా కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా ప్రసాద్-బిసెస్సర్ సైతం మోదీ హయాంలో భారత్ ప్రపంచ వ్యవహారాల్లో ప్రభావవంతమైన స్వరంగా ఎదిగిందని పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత్ను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, గ్లోబల్ సౌత్కు ప్రధాన ప్రతినిధిగా ఎదగడం, అంతర్జాతీయ దౌత్య వేదికలపై కీలక శక్తిగా మారడం వంటి పరిణామాలు మోదీ నాయకత్వంలో సాధ్యమయ్యాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో మోదీ సాధించిన ఈ మైలురాయి కేవలం దేశీయ రాజకీయ ఘట్టమే కాకుండా.. ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న ప్రాధాన్యానికి ప్రతీకగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణలో ఒంటరి పోరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలపైనా తమకు ఒక స్పష్టత ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని భారత్ మండంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ అన్యాయం జరగదు..: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రత లేదని అమిత్ షా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అందుకు కావాల్సిన మద్దతు లభించగానే బిల్లును ఆమోదింజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. బిల్లుకు అవసరమైన మద్దతు అభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని.. నివేదిక రాగానే సబంధింత బిల్లుకు అవసరమైన మద్దతు లభిసుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు బలంగానే ఉన్నాయని.. తమతో కలిసి నడుస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకీ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ఆమె నామినేషన్ పత్రాలను నింపారు కాబట్టే తిరస్కరణకు గురై ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. -
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నరేంద్ర మోదీ ఖాతాలో జమ కానుంది. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. తద్వారా.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఇన్నేళ్ల తర్వాత మోదీ చెరిపేయబోతున్నారు. మోదీ ఇవాళ్టితో.. ప్రధానిగా నెహ్రూ పదవి కాలాన్ని సమం చేయబోతున్నారు. రేపటితో(జూన్ 10) 4,399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. నెహ్రూ తరహాలోనే.. వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4,077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.భారత ప్రధానమంత్రుల పదవీకాలం – టాప్ లిస్ట్జవహర్లాల్ నెహ్రూ – 4,398 రోజులు (ఎన్నికల తర్వాత నిరవధిక పదవీకాలం)నరేంద్ర మోదీ – 4,399+ రోజులు (ప్రస్తుత ప్రధానమంత్రి)ఇందిరా గాంధీ – 4,077 రోజులుమన్మోహన్ సింగ్ – 3,652 రోజులు (2004–2014)అటల్ బిహారీ వాజ్పేయి – 2,272 రోజులు (మూడు విడతలు కలిపి)పి.వి. నరసింహారావు – 1,827 రోజులురాజీవ్ గాంధీ – 1,826 రోజులుమొరార్జీ దేశాయ్ – 857 రోజులులాల్ బహదూర్ శాస్త్రి – 576 రోజులుఅయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6,131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు మాత్రమే. అంటే.. ఆ రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. మోదీ ప్రధానిగా ఇంకో 1,732 రోజులు.. అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా బద్ధలు కానుంది. మరోవైపు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ మార్పుల కేంద్రబిందువు పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమేనని పేర్కొన్నారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, స్వచ్ఛ భారత్, ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చామని మోదీ తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాలకు చేరేలా పనిచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.మొత్తానికి, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించడం భారత రాజకీయాల్లో మరో ముఖ్య ఘట్టంగా నిలవనుంది. -
ప్రతి బంధం పెళ్లి పీటలెక్కాలని లేదు
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లికి ముందే శారీరక సంబంధం కలిగి ఉండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. ఉద్యోగ నియామకాల విషయంలో అధికారులు మారుతున్న సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. ఇద్దరు మేజర్ల మధ్య శారీరక సంబంధం ఉండటం ఒక్కటే వారి వ్యక్తిత్వాలపై వ్యతిరేక అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు ప్రాతిపదిక కారాదని స్పష్టం చేసింది. అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, తక్షణమే సదరు అభ్యరి్థకి కానిస్టేబుల్గా పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. గాజుల తిరుపతి, రమాదేవి (పేరు మార్చాం) ఇరుగు పొరుగు. నాలుగేళ్లపాటు ఇద్దరూ శారీరక సంబంధమూ నెరిపారు. తర్వాత తిరుపతి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే రమాదేవి క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసు లోక్ అదాలత్లో విచారణకు రాగా ఇద్దరూ రాజీ పడ్డారు. ఈ మధ్యలో తిరుపతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దరఖాస్తు సమయంలో తిరుపతి తనపై కేసు వివరాలు వివరించారు. అయినా సరే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడి నియామకాన్ని రద్దు చేసింది. వ్యక్తిత్వాన్ని సంబంధం ఆధారంగా నిర్ణయించొద్దు ‘ఇద్దరూ మేజర్లు. పెళ్లికి ముందు సంబంధం ఉంది. వారి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను ఈ సంబంధం ఆధారంగా నిర్ణయించడం సరికాదు’అని చెప్పింది. ప్రతి సంబంధం పెళ్లిదాకా వెళ్లకపోవచ్చు కాబట్టి.. ఒకరు ఇంకొకరిని మోసం చేశారని అనుకునేందుకు ఆస్కారం ఏర్పడదని, పెళ్లి కానంత మాత్రాన మోసం చేసినట్లు కాదని వివరించింది. కాబట్టి పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి మోసం చేశాడని తిరుపతిపై లోక్ అదాలత్లో దాఖలైన కేసు అతడు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నట్లు కాదని ఆ కేసు ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వకుండా నిలపడమూ సరికాదని తెలిపింది. వక్రబుద్ధితో తీసుకున్న నిర్ణయం ఈ కేసులో వాస్తవాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ... ఇద్దరి మధ్య సంబంధం ఉన్నమాట వాస్తవం. అయితే అత్యాచారం జరిగినట్లు కానీ.. ఎవరి బలవంతంతోనో.. ఒత్తిడితోనో లోక్ అదాలత్లో రాజీ కుదిరిందనేందుకు కానీ ఎలాంటి ఆధారాలూ లేవని గుర్తించింది. అలాంటప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు కేవలం లోక్ అదాలత్తో రాజీ పడ్డాడు కాబట్టి తిరుపతి నేరానికి పాల్పడినట్లు అంచనా వేయడాన్ని తప్పు పట్టింది. ఇది నిరాధారమైందని, అతడి సెలెక్షన్ను రద్దు చేయడం వక్ర బుద్ధితో తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నైతిక దుర్మార్గానికి పాల్పడ్డాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాలని, నిర్దోషిగా విడుదలైనా, కేసు నుంచి విముక్తి పొందినా నేరంలో అభ్యర్థి ప్రమేయం ఉన్నట్లు తేలాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ఉదంతంలో కేసును మరింత ముందుకు నడిపేందుకు రమాదేవి విముఖత చూపడమే కాకుండా లోక్ అదాలత్ వద్ద రాజీ పడిన విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. -
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు. -
190 vs 170.. పాక్పై భారత్ లీడ్
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణు శక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య.. భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో.. పాకిస్థాన్పై ఆధిక్యం సాధించిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక వెల్లడించింది. సిప్రి ఇయర్బుక్ 2026 ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్హెడ్స్ ఉండగా, పాకిస్థాన్ వద్ద సుమారు 170 మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. ఇరు దేశాలు 2025లో కూడా తమ అణు ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని.. ముఖ్యంగా భారత్ తన దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఆపరేషన్ సిందూర్ టైంలో.. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను సిప్రి “అసాధారణంగా తీవ్రమైన మిలిటరీ క్రైసిస్”గా అభివర్ణించింది. అయితే అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల వద్ద కలిపి సుమారు 12,241 వార్హెడ్స్ ఉన్నాయని సిప్రి తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్దే అధిక భాగం ఉండగా, చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. చైనా వద్ద ఇప్పటికే సుమారు 620 వార్హెడ్స్ ఉన్నాయని అంచనా. భారత్ విషయానికి వస్తే.. కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, వచ్చే దశాబ్దంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.డేంజర్ జోన్ ఎందుకంటే..సిప్రి నివేదికలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మ్మెంట్ ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని స్పష్టం చేసింది. దేశాలు రక్షణ పేరుతో అణు ఆయుధాల వైపు మరింత మొగ్గు చూపుతున్నాయని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.అణు ఆయుధాలపై పారదర్శకత తగ్గడం, దేశాల మధ్య చర్చలు–ఒప్పందాలు బలహీనపడటం, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల.. భవిష్యత్తులో విపరీతాలు జరగొచ్చని సిప్రి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అవతలి దేశం దాడి చేయబోతుందనుకుని ఇవతలి దేశం పొరపడడం, చిన్న సంఘటనను పెద్ద ముప్పుగా భావించడం, అవసరం లేని సమయంలో సైనిక చర్యలకు వెళ్లడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా జరగొచ్చని అంటున్నారు. పెద్ద దేశాల మధ్య చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ గతంలో భారత్–పాక్ మధ్య గతంలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తున్నారు. -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్కు వెళ్లారు. అయితే అదే హోటల్కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
గ్యాస్ రేట్లు మళ్లీ పెరుగుతాయా?.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధన ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. అటు పెట్రో రేట్లు పెరగడం, అలాగే ఇటు సిలిండర్లపైనా పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఆ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో.. వంటగ్యాస్ (LPG) ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. సిలిండర్పై రూ.29 పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి.డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పెంపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ ధరల పెంపు తప్పించలేని నిర్ణయంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పెంపుపై విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సరఫరా పరిమితులు, రవాణా ఖర్చుల పెరుగుదల, బీమా వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో ధరలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కావడం లేదని వివరించారు.అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ సరఫరా తగ్గడం, కొన్ని పరిమిత దేశాల నుంచే దిగుమతులు జరగడం, అలాగే 40–45 రోజుల ట్రాన్స్షిప్మెంట్ కారణంగా రవాణా వ్యయాలు భారీగా పెరగడం ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యయం రూ.1,600 దాటినప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఉపశమనం కల్పిస్తోందని తెలిపింది.ఇదే సమయంలో భారత్లో వంటగ్యాస్ ధరలు ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ధరలు గణనీయంగా చౌకగా ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్కు సుమారు రూ.942 చెల్లిస్తుండగా, ప్రతి సిలిండర్పై దాదాపు రూ.700 వరకు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.58 కోట్లకుపైగా కనెక్షన్లు అందించగా, అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్కు రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ ధర సుమారు రూ.642కే లభిస్తోందని వివరించింది.మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ సంక్షోభం కొనసాగుతున్నా భారత్లో వినియోగదారులపై భారం తగ్గించేందుకు భారీ సబ్సిడీలు, ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం చెబుతోంది. అయితే పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఎల్పీజీ ధరలు ఎలా మారతాయన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు, రవాణా వ్యయాలు, దిగుమతి ఒత్తిడులు కొనసాగుతున్న నేపథ్యంలో ధరలపై ఒత్తిడి తప్పదని ఆయన పేర్కొనడం భవిష్యత్తులో మరింత పెంపులు ఉండే అవకాశాలపై సంకేతాలుగా రాజకీయ, ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
యూరియా.. ‘గ్రీన్’ ఐడియా..
ఒక సంక్షోభం మరో సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో..నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన గ్రీన్ యూరియా ఉత్పత్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వీడన్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ కనిపెట్టిన గ్రీన్ యూరియా టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రముఖ స్వీడిష్ క్లీ¯న్ టెక్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ గుళికల రూపంలో ఉండే హరిత నత్రజని ఎరువుల తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేసి పేటెంట్ పొందింది. మన దేశంలోని అధిక సబ్సిడీలతో నడిచే, అధిక ఉద్గారాలు వెలువరించే హేబర్–బోష్ యూరియా ప్లాంట్లకు.. పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ అత్యంత ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.10 దేశాలు.. 34 ఒప్పందాలుగత ఏడాది 20 లక్షల డాలర్ల ఫుడ్ ప్లానెట్ అవార్డును గెల్చుకున్న ఈ సాంకేతికతపై ఇప్పటికే పది దేశాల కంపెనీలు 34 ఒప్పందాలు చేసుకున్నాయని నైట్రోక్యాప్ట్ చెబుతోంది. తూర్పు ప్రాంతానికి చెందిన ఒక భారతీయ కంపెనీ ఈ సాంకేతికతో గ్రీన్ యూరియా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఈ గ్రీన్ యూరియా టెక్నాలజీ వినియోగం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. సాధారణ యూరియా వర్సెస్ నైట్రోక్యాప్ట్ గ్రీన్ యూరియాహేబర్–బోష్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను పారిశ్రామికంగా సంశ్లేషణ చేస్తారు. గ్రీన్ యూరియా ప్రక్రియలో ఇనుము ఉత్ప్రేరకాల సహాయంతో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజని, హైడ్రోజన్లను కలిపి యూరియాను తయారు చేస్తారు. -
రూరల్ టీనేజర్లకు టెన్షన్
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆరుగురు టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హరియాణాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ దిగ్భ్రాతికరమైన విషయాలు వెలుగుచూశాయి.ఒత్తిడికి ప్రధాన కారణాలు చదువు, పరీక్షల భయంతోపాటు తక్కువ మార్కులు వస్తాయనే ఆందోళన, మరోవైపు ఫెయిల్ అవుతామనే భయం, భవిష్యత్పై అభద్రతా భావం. వీటితోపాటు కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, శారీరక లేదా మానసిక వేధింపులు. కుటుంబ పెద్దల వ్యసనాల కారణంగా ఒత్తిడికి గురైనట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది టీనేజర్లు తమ ఇంట్లో పెద్దవారు మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలైనట్టు తెలిపారు. ఇవేకాకుండా పేదరికం వల్ల అబ్బాయిలు చదువు మానేసి కూలి పనులకు వెళ్తుంటే.. భద్రతా కారణాలు, సామాజిక ఆంక్షల వల్ల అమ్మాయిల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. స్కూళ్లలో లేదా బయట జరిగే అవమానాలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.నిశ్శబ్దంగా నరకం.. అవగాహనా రాహిత్యం!ఈ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. చాలామంది టీనేజర్లు తమ బాధను, ఆత్మహత్యా ఆలోచనలను ‘జీవితంలో ఒక భాగం’గా భావిస్తూ భరిస్తున్నారు. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ ఉంటుందనే కనీస అవగాహన కూడా వారికి లేదు. సమాజంలో ఎక్కడ అవమానం జరుగుతుందోననే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.గణాంకాలు ఇలా: ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం దేశంలో జరిగే మొత్తం ఆత్మహత్యల్లో 6 శాతం 18 ఏళ్ల లోపు పిల్లలవే. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో 7.6 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.అందుబాటులో లేని చికిత్స: భారతదేశంలో మానసిక ఆరోగ్య చికిత్సకు సంబంధించిన లోటు 83 శాతంగా ఉంది. అంటే సమస్య ఉన్న మెజారిటీ ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. నిపుణుల సూచనలు: చిన్న వయసులోనే వచ్చే మానసిక సమస్యలను పట్టించుకోకపోతే, అవి వారు పెద్దయ్యాక కూడా వెంటాడుతాయని, కాబట్టి తక్షణమే జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. స్కూల్ కౌన్సెలింగ్: ప్రతి పాఠశాలలోనూ పిల్లల సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి.ఉపాధ్యాయులకు శిక్షణ: పిల్లల్లో మారుతున్న ప్రవర్తనను, ఒత్తిడిని గుర్తించేలా టీచర్లకు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలి.టెలి–మానస్ వినియోగం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ సేవలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. -
నీట్ రీటెస్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ జారీ
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్–యూజీ 2026 రీ టెస్ట్కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. రీ టెస్ట్ రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని ఈ స్లిప్ ద్వారా చూసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ను ఉపయోగించుకుని ఈ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ ఎక్స్లో కోరింది. ఈ స్లిప్ అడ్మిట్ కార్డు కాదు, కేవలం అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉన్నదీ తెలుసుకునేందుకు మాత్రమేనని తెలిపింది. దాదాపు అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యంగా పేర్కొన్న నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించామని తెలిపింది. త్వరలోనే రీ టెస్ట్ అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నట్లు ఎన్టీఏ వివరించింది. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల అప్డేట్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలను చూడాలని సూచించింది. నీట్ రీ టెస్ట్ 21వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు జరగనుండటం తెల్సిందే. -
మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతికత
న్యూఢిల్లీ: స్వదేశీ న్యాయశాస్త్రం అభివృద్ధికి మనం గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయపరమైన అంశాల్లో స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనియన్, ఆక్స్ఫర్డ్ లా సొసైటీలో ‘డిజిటల్ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం: ఏఐ, సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం’ అనే అంశంపై జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక కార్యక్రమాలకు అదనంగా న్యాయవ్యవస్థ కోసం స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం దిగుమతి చేసుకున్న సాంకేతిక నమూనాలు లేదా అంచనాలపై ఆధారపడకుండా, మన సొంత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం, సామాజిక పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. న్యాయ వ్యవస్థలో నేడు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థలను ఒకదానితో ఒకటి మరింత సన్నిహితంగా సంభాషించుకునేలా చేసిందన్నారు. ప్రపంచ న్యాయ సమాజం టెక్నాలజీతో పరస్పరం అనుసంధానం అవుతోందని వెల్లడించారు. న్యాయవ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులు దోహదపడుతున్నారని పేర్కొన్నారు. సాంకేతికత అనేది మానవ విచక్షణను ఎన్నటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు. -
మీనాక్షికి క్రాస్ఓటింగ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్లో ఆందోళనను మరింత పెంచింది. -
భారత్లోనే చౌకగా వంటగ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లోనే వంటగ్యాస్(ఎల్పీజీ) ధరలు ∙తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు పొరుగు దేశాల కంటే మన దగ్గరే గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు ఫిబ్రవరి నుండి జూన్ నాటికి సుమారు 46 శాతం పెరిగాయి. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సరఫరా వ్యయం రూ.1,600 దాటింది. అయినప్పటికీ అంతర్జాతీయ ధరల భారాన్ని సామాన్య వినియోగదారులపై మోపకుండా తామే భరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ కోసం సాధారణ వినియోగదారుడు రూ.942 చెల్లిస్తుండగా, ప్రభుత్వం ప్రతి సిలిండర్పై దాదాపు రూ.700 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు గతేడాది రూ.60,000 కోట్లకు చేరగా, రూ.30,000 కోట్ల పరిహారం చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద దేశంలో 10.58 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి మొదటి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్కు రూ.300 చొప్పున (ఏడాదికి రూ.1,200) చెల్లిస్తోంది. దీనివల్ల ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ కేవలం రూ.642కే లభిస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే దాదాపు 60 శాతం తక్కువ అని కేంద్రం పేర్కొంది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని 32 టీఎంటీల నుండి 52 టీఎంటీలకు 60 శాతం పైగా) పెంచింది. అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి ఎల్పీజీని దిగుమతి చేసుకుని దేశంలో ఎక్కడా వంటగ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం గుర్తుచేసింది. -
నేడే ఇండియా జనబంధన్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా జనబంధన్’ పేరిట కూటమి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేమని తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జనబంధన్’ భేటీ ప్రారంభమవుతుందని, 23 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టంచేశారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగనుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశి్చమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, సీపీఎం పార్టీ తదితరులు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు సైతం భేటీకి వస్తున్నట్లు వార్తలొచ్చాయి . కూటమిలో రచ్చరచ్చ 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీకి తాము హాజరు కావడంలోని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కళగంతో చేతులు కలిపిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ హాజరు కానున్నట్లు సమాచారం. ఐక్యతపై అనుమానాలు: బీజేపీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఆ కూటమిలో విభేదాలు నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. బేబీ రాసిన లేఖ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టిందని ఆయన చెప్పారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కూటమిలోని పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్నాయని, ఇక ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు.ప్రతిపక్షాల మధ్యసమన్వయం కోసమే..ఇండియా కూటమిలో కీలక పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా ‘ఇండియా జనబంధన్’ సమావేశాన్ని పరిగణిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. గతంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం గురించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.కేజ్రీవాల్తో మమత భేటీ భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆప్ చీఫ్తో టీఎంసీ చీఫ్ మమత భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆతీ్మయంగా జరిగిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలతోపాటు తదుపరి కార్యాచరణపై వారిద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారని వెల్లడించాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ వచ్చారు. -
భారత్లో జననాల రేటుపై ఎలన్ మస్క్ సంచలన పోస్ట్
ఇటీవల కాలంలో భారతదేశంలో పడిపోతున్న జననాల రేటును ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ ఎత్తిచూపారు. సంతానోత్పత్తి రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక పెద్ద హెచ్చరిక అంటూ ట్వీట్ చేసిన ఆయన.. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. వివరాలతో డేటాను కూడా షేర్ చేశారు. జనాభా పరిమాణాన్ని స్థిరంగా ఉంచడానికి అవసరమైన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతుల్లో భారతదేశ జననాల రేటు చాలా ఏళ్ల క్రితమే భర్తీ స్థాయి కంటే తగ్గిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ స్థాయి కంటే కిందకు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశ ప్రస్తుత టి.ఎఫ్.ఆర్ 1.9 శాతానికి క్షీణించింది. దీర్ఘకాలికంగా దేశంలో జననాల రేటు తగ్గుముఖం పడుతోందనే వాస్తవానికి ఈ నివేదిక అద్దం పడుతోంది.India’s birth rate has fallen below replacement. Among those most educated, India’s birth rate fell below replacement many years ago. https://t.co/RsWf0PK6wx— Elon Musk (@elonmusk) June 6, 2026వలసలతో సంబంధం లేకుండా, ఒక తరం నుండి తదుపరి తరానికి జనాభా స్థిరంగా (తగ్గకుండా లేదా పెరగకుండా) కొనసాగడానికి అవసరమైన సగటు సంతానోత్పత్తి రేటును 'రీప్లేస్మెంట్ స్థాయి' అంటారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీనిని 2.1 గా పరిగణిస్తారు. భారతదేశ టీఎఫ్ఆర్ ఇప్పుడు 1.9 కి పడిపోవడం అంటే దేశం క్రమంగా స్థిరమైన జనాభా నిర్మాణం వైపు దూసుకుపోతోందని అర్థం. జాతీయ సగటు 1.9 గా ఉన్నప్పటికీ.. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య జనాభా పరంగా పెద్ద వ్యత్యాసమే కనిపిస్తోంది. అత్యధిక టీఎఫ్ఆర్ కలిగిన రాష్ట్రంగా బిహార్ (2.9) ఉండగా.. అత్యల్ప టీఎఫ్ఆర్ కలిగిన ప్రాంతంగా ఢిల్లీ (1.2) ఉంది. గత దశాబ్దంలో ఢిల్లీ అత్యంత వేగంగా పతనాన్ని నమోదు చేయగా.. బిహార్లో చాలా నెమ్మదిగా తగ్గుదలను చూపిస్తోంది.దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సంతానోత్పత్తి రేటు అత్యంత ఆందోళనకరంగా 1.4 నుండి 1.6 మధ్యకు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇది ఏకంగా 1.2 కి తగ్గిపోయింది. అయితే, దీనికి భిన్నంగా ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే అధికంగానే నమోదు అవుతుండగా.. దేశవ్యాప్తంగా సగటు రేటు పడిపోతుండటం వల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గి పోవడం... వృద్ధుల జనాభా భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగం లేదని కుటుంబ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడు
న్యూఢిల్లీ: కేవలం ఉద్యోగం లేదనే సాకుతో భార్య, కుమారుడి పోషణ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. బాలుడైన కుమారుడి పోషణ కోసం నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఓ గృహ హింస కేసులో అదనపు సెషన్స్ జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ ఈ మేరకు 2వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గృహ హింసనివారణ చట్టం కిందభర్త నుంచి తనకు సాయం మందించేలా ఆదేశాలించాలంటూ వేసిన పిటిషన్కు దిగువ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన అర్జీపై న్యాయమూర్తి.. ‘తనకు వేరే బాధ్యతలున్నాయని, ఉద్యోగం లేదని కారణాలు చూపుతూ భర్త చట్టబద్ధంగా వివాహమాడిన భార్య, మైనర్ సంతానం పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేడు’అని పేర్కొన్నారు. ఉద్యోగం చేయగలిగి ఉండీ కూడా ఇలాంటి కారణాలను చూపరాదన్నారు. కుమారుడు మేజర్ అయ్యే వరకు ఈ భరణం చెల్లించాల్సిందేనన్నారు. 2013లో తమకు వివాహమైనప్పటి నుంచి కట్నం కోసం వేధిస్తూ, శారీరకంగా, మానసికంగా భర్త, అతడి కుటుంబం తన పట్ల క్రూరంగా వ్యహరించారని పిటిషన్ ఆరోపించారు. గర్భవతిగా ఉండగానే 2015లో తనను ఇంట్లోంచి గెంటి వేశారని, అప్పటి నుంచి కుమారుడితో కలిసి వేరుగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు. కుటుంబ న్యాయస్థానం రాజీ కుదర్చడంతో 2015లో ఈ దంపతులు వేరు కాపురం పెట్టినా, కొద్ది నెలలపాటే కలిసి ఉన్నారు. అయితే, భర్త గృహ హింసకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు ఆమె చూపించ లేకపోయారంటూ ట్రయల్ కోర్టు ఆమె పిటిషన్ను కొట్టివేసింది.ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఆ చిన్నారి తండ్రి నుంచి ఎటువంటి సాయం అందకుండానే తల్లి కస్టడీలో ఉంటున్నందున భరణం అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ విద్యావంతురాలైనందున ఆమెకు సాయం అవసరం లేదని కూడా పేర్కొంది. అయితే, తాజాగా విచారించిన సెషన్ జడ్జి.. పిటిషనర్ తన కుమారుడిని పోషించుకునేందుకు అవసరమైన మేర సంపాదిస్తున్నట్లు చూపించడంలో భర్త విఫలమయ్యారని తెలిపారు. విద్యావంతురాలైనందున భరణం అవసరం లేదన్న వాదనను కూడా ఆమె తోసిపుచ్చారు. దిగువ కోర్టు పలుమార్లు అవకాశమిచ్చినప్పటికీ పిటిషనర్ భర్త తన ఆదాయ ధ్రువీకరణ అఫిడవిట్ను సమర్పించలేకపోయిన విషయాన్ని జడ్జి ఎత్తి చూపారు. -
కదం తొక్కిన కాక్రోచ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. నీట్(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్మంతర్ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చా.. ‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక మార్పు రావాలి పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్మంతర్ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’పేరిట ఆన్లైన్ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్మంతర్ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాక్రోచ్–ఇన్–చీఫ్ అభిజిత్ దీప్కే జంతర్మంతర్ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్ పవార్ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్చుక్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్ దీప్కేను కాక్రోచ్–ఇన్–చీఫ్గా వాంగ్చుక్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్ మంతర్ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలుత డెడ్లైన్ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్లైన్ను వారం రోజులకు పొడిగించారు. -
మరోసారి గ్యాస్ మంట
న్యూఢిల్లీ: గృహ వినియోగ గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. 14.2 కిలోల సిలిండర్పై ప్రభుత్వం రూ.29 పెంచేసింది. పెరిగిన ధర ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కి చేరుకోనుంది. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఇంధనం ధరలు పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత్లో మార్చి 7వ తేదీన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 చొప్పున పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలకు నష్టాలు తప్పడం లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో సిలిండర్పై రూ.703 చొప్పున నష్టపోతున్నట్లు చెబుతున్నారు. -
ఆర్థిక వృద్ధి పెంపునకు ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆర్థిక సలహా మండలి(ఈఏసీ) సభ్యులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పశ్చిమాసియా సంఘర్షణ భారతదేశం, ప్రపంచంపై చూపే ప్రభావం పట్ల తమ అంచనాను ఈఏసీ సభ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఈరోజు ఆర్థిక సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించా. దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం. సంస్కరణల ప్రయాణానికి మరింత ఊపునివ్వడంతోపాటు సులభతర జీవనం, సులభతర వాణిజ్యంపై మా అభిప్రాయాలు పంచుకున్నాం’’అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ ఆర్థికాభిృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా వివిధ ఆలోచనలు, చర్యలపై ఈఏసీ భేటీలో చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. సులభతర జీవనం, సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపర్చడమే ధ్యేయంగా పలు సంస్కరణలపైనా చర్చించినట్లు వెల్లడించాయి. ఈఏసీ అనేది కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఆర్థిక, సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. ప్రస్తుతం ఈఏసీలో ఛైర్మన్, ముగ్గురు పూర్తికాల సభ్యులు, 11 మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. ఎస్.మహేంద్ర దేవ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి సూచించిన ఆర్థిక లేదా ఇతర ఏ అంశాన్నైనా విశ్లేషించి, దానిపై ఆయనకు సలహా ఇవ్వడం, ఆర్థిక ప్రాముఖ్యత గల సమస్యలను పరిష్కరించి, వాటిపై ప్రధానమంత్రికి అభిప్రాయాలను సమర్పించడం ఈఏసీ బాధ్యత. -
7 రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే...
న్యూఢిల్లీ: ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడు రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తొలగించాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, దీనిపై గళం వినిపించడమే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభమై, జనరేషన్-జీ వల్ల వేగంగా ఎదిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలు లేవు" అని చెప్పారు. నేటి నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. "నా తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి వెళ్తున్నాను. వారిని చివరిసారి కలిసి ఏడాదికి పైగా అయింది. గత 15 రోజులుగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెదిరింపుల కారణంగా ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్తాను" అని ఎక్స్లో పేర్కొన్నారు."ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏమి సాధిస్తారని ప్రజలు అంటారు. కానీ వాటి ద్వారా మేము ఇంకా జీవించి ఉన్నామని నిరూపిస్తాం! ప్రభుత్వానికి మేము కేవలం కీటకాల్లా కనిపించవచ్చు. కానీ మేము జీవించి ఉన్నాం. మా హక్కుల కోసం పోరాడే సామర్థ్యం మాకు ఉంది" అని కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్లో పేర్కొంది.కాగా, విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉన్న దిప్కే శనివారం తెల్లవారుజామున భారత్కు చేరుకుని, నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్కు వెళ్లారు. నీట్-యూజీ, సీయూఈటీ, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ జీడీ వంటి ప్రధాన జాతీయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల చుట్టూ ఈ నిరసన సాగింది.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై పరీక్షలకు సంబంధించిన వివాదాలు ప్రభావం చూపాయని పేర్కొంటూ, భారత విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరే యువత చేస్తున్న ఉద్యమంగా సీజేపీ తన ప్రచారాన్ని మలిచింది. ఈ ఉద్యమం ఆన్లైన్లో విపరీతంగా ఆదరణ పొందింది. తమకు లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని, సామాజిక మాధ్యమ వేదికల్లో బలమైన జనరేషన్-జీ అనుచర వర్గం ఉందని సంస్థ చెబుతోంది.నిరసనకు ముందు సంస్థ తన నిర్మాణాన్ని అధికారిక రూపంలో ఏర్పాటు చేసే చర్యలు కూడా చేపట్టింది. సౌరవ్ దాస్, విజేత దహియా, ఆశుతోష్ రాంకాను అధికారిక ప్రతినిధులుగా ప్రకటించింది. వీరు మాధ్యమాలతో మాట్లాడనున్నారు.ప్రతినిధులు నిరసన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పాల్గొనేవారు క్రమశిక్షణ పాటించాలని, జాతీయ జెండాలు, పుస్తకాలు తీసుకురావాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భద్రతా కారణాలు, ప్రజలకు అసౌకర్యం కలగొచ్చనే ఆందోళనల దృష్ట్యా, తాను వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి రావద్దని మద్దతుదారులను కోరారు. అరెస్టు సహా చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఉద్యమం రాజ్యాంగ పరిమితులలోనే కొనసాగుతుందని, శాంతియుత భిన్నాభిప్రాయ వ్యక్తీకరణపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ ఉద్యమంలో లడఖ్ ఉద్యమనేత సోనం వాంగ్చుక్ కూడా పాల్గొంటున్నారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ కీలక భేటీ
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. -
సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఆవిర్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.ఈ నిరసనలో వినిపించిన డిమాండ్ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. Sonam Wangchuk arrives at Jantar Mantar to join the protest.There are more press reporters then cockroachs 🪳#cjp_पार्टी pic.twitter.com/nbYShqORbD— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) June 6, 2026కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది. -
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నిరసనను అడ్డుకోవాలని శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) తోసిపుచ్చింది.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించిన సీజేపీ విదేశీ సర్వర్ల ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. యువతను రెచ్చగొట్టేలా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించాలని లేదా వేరే ప్రాంతానికి మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.వాదనలు విన్న జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మల వెకేషన్ బెంచ్ ఈ పిల్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆందోళనకు సంబంధించిన ప్రస్తుత దశలో ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్ను విచారణ జాబితాలో చేర్చేందుకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు తరలి రావాల్సిందిగా దేశంలోని యువతకు దిప్కే సోషల్ మీడియా వేదికగా ఇటీవల పిలుపునివ్వడం తెల్సిందే. అంతేకాదు, 6న ఢిల్లీకి వస్తున్న తనను విమానాశ్రయం వద్దే కలుసుకోవాలని కూడా అతడు కోరాడు. -
కొందరిపై వేటు కొత్తవాళ్లకు చోటు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జూన్ 20న ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆశించిన స్థాయి లో పనితనం కనబరచని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు చోటు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్షాళన కొనసాగనుంది.ఈ రేసులో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఒకరికి నేరుగా కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కట్టబెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు హస్తినలో హాట్ టాపిక్గా మారింది. దేశాన్ని కుదిపేసిన ‘నీట్’ప్రశ్నపత్రం పేపర్ లీక్ వ్యవ హారం మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నార్థకంగా చేసింది. విపక్షాల నిరసనలు, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు కోడై కూస్తున్నాయి. రామ్మోహన్పై అసంతృప్తి! ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడి పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, మహారాష్ట్రలో విమాన ప్రమాదాలు, విమాన చార్జీలు చుక్కలనంటడం వంటివి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల్లో ఒకరికి కేబినెట్ ర్యాంక్ ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది.తెలంగాణ పరిస్థితి.. దక్షిణాదికి తెలంగాణను సింహద్వారంగా భావిస్తున్న బీజేపీ 2029 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి మరో ఒకరిద్దరికి కేబినెట్లో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శాఖ మారే అవకాశం ఉందని.. కుమారుడి కేసు నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవికి గండం ఉందనే ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. ఎవరి మంత్రి పీఠం భద్రం? ప్రస్తుతానికి మోదీ కేబినెట్లో కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి అగ్రశ్రేణి మంత్రుల స్థానాలు చాలా వరకు సురక్షితంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో చోటు ఎవరికి? ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి, విద్యా రంగానికి సంబంధించిన లోతైన అవగాహన ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న కీలక నాయకులకు చోటు దక్కే ఆస్కారముంది. ఉత్తర భారతం లేదా ఒడిశా సమీకరణాలను బట్టి ఈ ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి మాజీ ముఖ్యమంత్రులను కేంద్రంలోకి తీసుకున్నట్లే ఈసారి సైతం సుదీర్ఘ అనుభవం ఉండి, రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్రంలో సేవలు అవసరమని భావిస్తున్న ఒక ప్రముఖ హిందీ ప్రాంతం లేదా పశి్చమ భారతానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి మంత్రి పదవి ఎవరికి? బండి సంజయ్ను ఒకవేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పిస్తే తెలంగాణ నుంచి గెలిచిన మిగతా ఎంపీలలోని సీనియర్ లేదా సామాజిక సమీకరణాలకు సరిపోయే మరో నేతకు ఈసారి మోదీ కేబినెట్లో ఛాన్స్ దక్కవచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నారు. రామ్మోహన్ను తప్పిస్తే? ఏపీలో ఎన్డీయే కూటమి పొత్తు ధర్మం పాటించనుంది.ఒకవేళ రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తప్పించాల్సి వస్తే ఆయన స్థానంలో టీడీపీ తరఫున గెలిచిన కీలక లోక్సభ సభ్యులలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నాయని పార్టీ సీనియర్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ నుంచి ప్రమోషన్? ఈ ప్రమోషన్ రేసులో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఒకవేళ టీడీపీ కోటాలోనే మార్పులు చేయాలని భావిస్తే ఈయనకు కేబినెట్ ర్యాంకుకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం పరిశీలించవచ్చు. ఒకవేళ బీజేపీ ఏపీలో తన సొంత బలాన్ని, సామాజిక సమీకరణాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తే ప్రస్తుతం భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగావున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ కేబినెట్ హోదా కల్పంచే దిశగా కూడా అధిష్ఠానం ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా మరో వారం, పది రోజుల్లోపు కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే ఆస్కారముంది. -
మమ్మల్ని కిందపడేసి పోలీసులు కొట్టారు: మహిళా రైతులు
ఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ను పొన్నూరు మహిళ రైతులు కలిశారు. మామిళ్లపల్లిలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాలను కలిసి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని కిందపడేసి పోలీసులు కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలబడుతున్న వైఎస్సార్సీపీ నేతలను లోపలికి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ‘‘మా పంట మేము నిల్వ చేసుకోవడమే నేరమా?. మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పొలాల్లో పని చేసే మహిళలను దారుణంగా కొట్టారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం’’ అని మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు.పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘మామిళ్లపల్లిలో మహిళలు, రైతులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. బాధిత మహిళలపైనే తిరిగి కేసులు పెట్టారు. వెంటనే మహిళలపై పెట్టిన కేసులను ఉపసంహరించాలి. దాడి చేసిన పోలీసులపైన 307 కేసులు పెట్టాలి. న్యాయం చేయమని కోరితే రాష్ట్రంలో చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అందుకే మేమందరం ఢిల్లీకి వచ్చి కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసులు దౌర్జన్యాన్ని తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని మానవ హక్కుల సంఘం హామీ ఇచ్చింది. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు వివిధ కమిషన్లను కలిసి మహిళలు ఫిర్యాదు చేశారు.మొక్కజొన్నలు రైతుల వద్ద తక్కువ ధరకు కొని టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. బాధిత మహిళ రైతులు చాలామంది కాపులే ఉన్నారు. కాపు ఫ్యాక్టరీ పేరుతో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ ఒక పావుగా మారారు. మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు కనీసం ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు’’ అంటూ అంబటి మురళీకృష్ణ మండిపడ్డారు. -
ఒంటిపై గాయాలు, గీతలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసులో ట్విస్ట్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ తన అపార్ట్మెంట్లో హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఫ్లాట్ లోపల నుంచి తాళం వేసి ఉండటం, శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని డెవోస్మితా పాల్గా గుర్తించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె వసుంధర ఎన్క్లేవ్లోని ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పలువురు ఫోన్ కాల్స్కు ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో, ఆమె సోదరి ప్రత్యక్షంగా అపార్ట్మెంట్కు వెళ్లారు. అక్కడ ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అపార్ట్మెంట్ సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, మహిళా ప్రొఫెసర్ శవమై కనిపించారు.అయితే, ప్రాథమిక విచారణలో శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తలపై బలమైన దెబ్బలు, మణికట్టు వద్ద గాయాలు కనిపించినట్లు ఫోరెన్సిక్ టీమ్ తెలిపింది. దీంతో ఇది సహజ మరణం కాకుండా హత్యగా నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు యథాతథంగా ఉండటంతో దోపిడీ కోణాన్ని పోలీసులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీని ఆధారంగా ఈ హత్య వ్యక్తిగత శత్రుత్వమా? లేదా తెలిసిన వ్యక్తి ద్వారా జరిగిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం. ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటమే. ఘటన అనంతరం నిందితుడు తలుపు వేసి వెళ్లి ఉండవచ్చని లేదా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అలాగే, అపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తుల వివరాలు పరిశీలించినట్టు తెలిపారు. బాధతురాలు మొబైల్ కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టారిఫ్ల టెన్షన్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో భారత్పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ఆయన.. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒకవైపు భారత్పై అదనపు సుంకాల (టారిఫ్లు) కత్తి వేలాడదీస్తూ.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తన "మంచి స్నేహితుడు"గా అభివర్ణిస్తున్నారు ట్రంప్. భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. గతంలో భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్తో వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీతో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. "మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం బాగా కలిసిపోతాం. అందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం కచ్చితంగా కుదురుతుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో భారత్పై విమర్శలు కూడా గుప్పించారు. చాలా ఏళ్ల పాటు భారత్ అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. ప్రస్తుతం తన విధానాల వల్ల పరిస్థితి తారుమారైందని, ఇప్పుడు అమెరికానే భారత్తో వాణిజ్యం ద్వారా లాభపడుతోందని చెప్పారు.ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (BTA) చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా ప్రతినిధి బృందం భారత్లో పర్యటించి కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి.అయితే చర్చలు జరుగుతున్న వేళే అమెరికా మరోసారి టారిఫ్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బలవంతపు శ్రమ (Forced Labour) ద్వారా తయారైన వస్తువులు దిగుమతి అవుతున్నాయనే ఆరోపణలతో భారత్తో పాటు మరో 53 దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.ట్రంప్ మరోసారి హార్లే-డేవిడ్సన్ మోటార్సైకిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో భారత్ హార్లే-డేవిడ్సన్పై 200 శాతం వరకు సుంకం విధించిందని, అందువల్ల ఆ సంస్థ భారత్లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు భారత ద్విచక్ర వాహనాలకు అమెరికాలో అలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు.గతంలో మోదీ-ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత్పై విధించిన కొన్ని సుంకాలను తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై కీలక తీర్పు ఇవ్వడంతో చర్చల దిశలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాలు కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాయి.అదనపు టారిఫ్ల హెచ్చరికల మధ్య కూడా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా వ్యక్తం చేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. భారత్–అమెరికా సంబంధాల్లో స్నేహపూర్వక సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. టారిఫ్ల వివాదం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కీలకాంశాలుభారత్తో డీల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలుభారత్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ట్రంప్ ధీమా.మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్య.గతంలో భారత్ భారీ సుంకాలు విధించిందని విమర్శ.భారత్తో పాటు 53 దేశాలపై 12.5% అదనపు టారిఫ్ల ప్రతిపాదన.టారిఫ్ల వివాదం మధ్యే కొనసాగుతున్న వాణిజ్య చర్చలుత్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం -
మాకు ప్రాణభిక్ష పెట్టండయ్యా..
సాక్షి, న్యూఢిల్లీ: ‘మొక్కజొన్నకు ధర లేకపోవడంతో మేం గోదాములో పంట నిల్వ చేసుకున్నాము. మేమంతా అక్కడున్న సమయంలో ఆ గోదాముపై టీడీపీకి చెందిన కొందరు గూండాలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు రోప్లను మా మెడలకు వేసి మమ్మల్ని లాగి కిందకు పడేశారు. పచ్చి బూతులు తిడుతూ ఈడ్చి తంతాం.. చంపేస్తాం.. అంటూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. మాకు పోలీసుల నుంచి ప్రాణభిక్ష పెట్టండయ్యా..’ అంటూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన మహిళా రైతులు, రైతు కూలీలు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్లకు మహిళా రైతు, రైతు కూలీలు విజ్ఞప్తి చేశారు. మహిళలమని కూడా చూడకుండా అసభ్యకరంగా తాకుతూ భయభ్రాంతులకు గురిచేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసుల వ్యవహారంపై వీడియో ఫుటేజీ ఆధారాలను అందజేశారు. దీనికి స్పందించిన కమిషన్ల చైర్మన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మామిళ్లపల్లిలో ఇటీవల జరిగిన ఖాకీల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ తనూజారాణి నేతృత్వంలో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ కిశోర్ రహత్కర్, ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, సభ్యుడు వడ్డేపల్లి రామచందర్లను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. వీరి వెంట మామిళ్లపల్లికి చెందిన మహిళా రైతులు ఇక్కుర్తి సుజాత, అంబటి పార్వతి, లక్ష్మి, అంబటి సామ్రాజ్యం, మహిళా రైతు కూలీలు, బాధితులు కూచిపూడి మరియరాణి, యాతం మమత, కొమ్ము మరియమ్మ, దాసరి దానమ్మ, వైఎస్సార్సీపీ మహిళా నేత గుంటూరు శ్రీరెడ్డిలు ఉన్నారు. పోలీసులే రౌడీలుగా మారారు వైఎస్సార్సీపీ ఎంపీల విమర్శ కమిషన్ల చైర్మన్లతో భేటీ అనంతరం రైతులతో కలిసి ఎంపీలు డాక్టర్ తనూజా రాణి, గొల్ల బాబూరావు, పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వ దమనకాండను ఎండగట్టారు. పోలీసులే రౌడీలుగా మారి ఎస్సీ మహిళా రైతుల మీద దాడులు చేశారని డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలను మహారాణులుగా చూసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళలని కూడా చూడకుండా వారిపై పోలీసులు భౌతికంగా దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని గొల్ల బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో కాపు మహిళా రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వారికి అండగా నిలిచిన రైతు కూలీలైన ఎస్సీ మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారని విమర్శించారు. -
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లు రాష్టాల వారీగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ నుంచి అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగీ, తమిళనాడు నుంచి ప్రవీన్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రవీన్ ఝా కు అవకాశం కల్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేనుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. -
‘‘నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు’’
ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టేస్లో బస చేసిన గినియా పౌరుడు హోటల్ అగ్నిప్రమాదం తర్వాత హృదయ విదారక అనుభవాన్ని తెలిపాడు. తన స్నేహితుల్లో పలువురిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. వారిలో చికిత్స నిమిత్తం భారత్కు వచ్చిన ఓ నైజీరియా రోగి, అతని తల్లి కూడా ఉన్నారని తెలిపాడు.ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘నేను 2 నెలల క్రితం ఫ్లోరిష్ స్టేస్కు వచ్చాను. నేను, నా తండ్రి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాం. శనివారం మాక్స్ హాస్పిటల్లో చేరాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మేము ఈ హోటల్లో లేము. నేను, నా తండ్రి ఆస్పత్రిలో ఉన్నాం. నిన్న ఈ హోటల్లో ఏమి జరిగిందో నాకు తెలుసు. నా స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. ఈ హోటల్లో చాలా మంది చనిపోయినట్లు చూశాను. నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు. నైజీరియాకు చెందిన నా ఓ స్నేహితుడు తన తల్లితో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాడు. అతను చనిపోయాడు. అతని తల్లి కూడా చనిపోయింది. కాంగోకు చెందిన ఇద్దరు కూడా చికిత్స కోసం వచ్చారు. ఓ వ్యక్తి, అతని భార్య మాక్స్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చారు. వారు కేవలం ఒక వారం మాత్రమే ఈ హోటల్లో ఉన్నారు. అతను కూడా చనిపోయాడు. నాలుగో అంతస్తులో చాలా మంది చనిపోయారు. కాంగోకు చెందిన ఆ ఇద్దరూ అక్కడే ఉన్నారు. మిగిలిన వారు కూడా నాలుగో అంతస్తులోనే, నా గది పక్కనే ఉన్నారు. నా గది చిన్నది కాదు.. పెద్దదే. వాష్రూమ్ కూడా ఉంది. అన్నీ బాగున్నాయి. కిటికీ కూడా ఉంది. గాజు కిటికీ ఉంది. దానికి తాళం కూడా ఉంది’’ అని చెప్పారు. -
ఢిల్లీ ఘటనలో మరో హృదయ విదారక దృశ్యం
ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘ఆమె వీల్ఛైర్లో కూర్చుని ఉంది. ఆమె పక్కనే కుర్చీలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకోగా.. ఆమె తన తలను అతని భుజంపై ఆనించింది. రక్షణ కోసం ఎదురుచూస్తూనే.. వారు ఒకరి చేతుల్లో ఒకరు ప్రాణాలు విడిచారు. వీల్ఛైర్లో ఒకరు.. చేతులు గట్టిగా పట్టుకుని మరో జంట.’’ సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి కన్పించిన దృశ్యాలు వారిని కంటతడి పెట్టించింది.బుధవారం ఉదయం ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టే బిఎన్బి' హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉండగా.. ఆ పురుషుడు ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవచ్చనే ఆశతో వారు లోపల తాళం వేసుకున్నట్లు తెలుస్తోందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మరో గదిలో బెడ్ అంచున కూర్చుని ఉన్న ఒక జంట కనిపించింది. వారిద్దరూ పూర్తిగా కాలి బూడిదయ్యారని లోపల దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయన్నారు. బేస్మెంట్ (భూగర్భ గది) ద్వారా భవనంలోకి ప్రవేశించాం. హోటల్లోకి ప్రవేశించడానికి తాము షట్టర్ను కట్ చేశాం. బేస్మెంట్లోకి ప్రవేశించినప్పుడు, రిసెప్షన్ సమీపంలో పూర్తిగా కాలిపోయిన మొదటి మృతదేహాన్ని చూశాం. అది 20 ఏళ్ల వయసున్న అమ్మాయిది. ఆమె చేతులు, కాళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమె అక్కడికక్కడే మరణించింది. అక్కడి నుండి కొన్ని అడుగుల దూరంలో, వీల్చైర్పై ఉన్న ఒక వ్యక్తి కూడా కాలి చనిపోయి కనిపించాడు. మేం ముందుకు వెళ్లినప్పుడు.. ముగ్గురు విదేశీయులు స్పృహ తప్పి పడి ఉండటం చూసి వారికి సీపీఆర్ చేశామని రెస్క్యూ సిబ్బంది గుర్తు చేసుకున్నారు. -
ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే అధికారుల అవినీతి, వ్యవస్థ విఫలమై ఇలాంటి ఘోర విషాదాలు సంభవించినప్పుడు, సామాన్య పౌరులే హీరోలుగా నిలుస్తారు. అసాధారణమైన ధైర్య సాహసాలతో బాధితులను మృత్యు ముఖం నుంచి బయటపడేస్తారు. ఢిల్లీ ఘటనలో కూడా స్థానిక యువకులే ఎంతోమంది ప్రాణాలును కాపాడారు.బుధవారం ఉదయం, దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో స్థానిక నివాసితులు ఎలాంటి రక్షణాలు కవచాలు లేకుండానే రంగంలోకి దూకి ప్రాణాలకు తెగించి మరీ ఎంతోమంది బాధితులను కాపాడారు.భవనాన్ని చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, నలుదిశలా కమ్మేస్తున్న పొగ, బాధితుల హాహాకరాలు, భయాందోళనలు ఇలాంటి నిస్సహాయ వాతావరణంలో, మంటల నుండి తప్పించుకోవడానికి కిటికీల నుండి దూకుతున్న అనేకమందితో సహా, లోపల చిక్కుకుపోయి వారిని రక్షించాలనే తపనతో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో ఒకరు మహమ్మద్ అఫ్జల్, మౌ.షాహరూఖ్, మౌ.అనీష్, మౌ.అమీర్, మౌ.వసీం, రియాజవుద్దీన్ గద్దె వాలా, ఇంకా స్థానికులు ఉన్నారు. VIDEO | Delhi Malviya Nagar Hospital fire: Wasim Raja, one of the first rescuers, says, "As soon as we reached the scene at around 8:50 am, the entire building was already engulfed in flames. Right across from the building, there is a mattress and quilt shop owned by Riyazuddin,… pic.twitter.com/3XGJc3n4uJ— Press Trust of India (@PTI_News) June 4, 2026మహమ్మద్ అఫ్జల్సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే స్థానికులు ఎలా తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టారో వివరించారు. తాము అక్కడి చేరుకునేటప్పటికే భారీ అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనీ, వెంటనే ఎదురుగా ఉన్న అర్మాన్స్' దుకాణం నుండి తెచ్చిన పరుపులను కింద పరిచి, హోటల్ నుంచి వారిని కిందకు దూకమని కోరామని తెలిపారు. కొందరు విజయవంతంగా దూకగా, మరికొందరు దూకలేకపోయారని అఫ్జల్ చెప్పారు. వీరి మాటల ప్రకారం ఆ తర్వాత, పరిస్థితి విషమించడంతో మంటలు తీవ్రమవడంతో హాజీ సాహిబ్ పోలీస్ స్టేషన్కు, అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. చివరికి, అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాంతో వీరు భవనంలోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.రూ. 2 లక్షల విలువైన పరుపులుఅగ్నిప్రమాదం నుండి బాధితులను కాపాడటానికి లక్షల విలువైన పరుపులను వినియోగించారు స్థానిక దుకాణ యజమాని. అతను అతని కుమారుడు లేకపోయి ఉంటే ఈ విషాదం మరింత ఘోరంగా ఉండేది. ఆ ఇద్దరూ దాదాపు రూ. 2 లక్షల విలువైన కొత్త పరుపులను త్యాగం చేసి, అనేక ప్రాణాలను కాపాడటానికి సహాయపడిన ఒక తాత్కాలిక రక్షణ వలయాన్ని ఏర్పరిచారు.తన సరుకుకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా, పరుపుల యజమాని తమకు సహాయం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రత్యేకమైన రెస్క్యూ పరికరాలేవి అందుబాటులోలేకపోవడంతో అతని షాపులోని దుప్పట్లతోనే బాధితులను పైఅంతస్తుల నుండి జాగ్రత్తగా కిందకు దించి, ఆసుపత్రిలకు తరలించామని అఫ్జల్ చెప్పారు.వసీం రాజామరో హీరో వసీం రాజా. అత్యవసర పరిస్థితిలో తన వృత్తిపరమైన శిక్షణ కీలకమని నిరూపించారు. మాక్స్ హాస్పిటల్లో పనిచేసే రాజా, పొగ పీల్చడం వల్ల బాధపడుతున్న బాధితులకు సహాయం చేయడానికి వెంటనే తన వైద్య శిక్షణను ఉపయోగించాడు. సామూహిక ప్రాణనష్టం జరగకుండా, సీపీఆర్ (CPR) చేసి కొంతమందికి ప్రాణభిక్ష పెట్టారు. నోటి ద్వారా శ్వాస అందించి కొంతమందిని కాపాడగిలిగాం కానీ, దురదృష్టవశాత్తు మరికొందరిని రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్మెనిస్థాన్కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్మెంట్తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా పెరిగి, అనేక జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత పెరగడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ప్రవేశాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.కేరళలోని సుమారు 15 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొని, రాబోయే గంటల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఆలస్యంగా, దాదాపు పది రోజుల ఆలస్యంతో కేరళ తీరాన్ని తాకినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తీవ్రత ఆశించినంత బలంగా లేదని భారత వాతావరణ శాఖ ప్రాథమిక విశ్లేషణలో పేర్కొంది. రుతుపవనాల ప్రస్తుత దశ బలహీనంగానే కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది.ఇక రాబోయే వారం రోజుల్లో ఈ రుతుపవనాలు క్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. మరో వారం తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే చాన్స్ కనిపిస్తోంది. దక్షిణ భారతంలో వర్షపాతం పెరుగుతుందా లేదా అన్నది రుతుపవనాల బలం, దిశపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కేరళలో వర్షాలు మొదలైన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం ఎలా మారుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
ఢిల్లీలో ఘోరం
న్యూఢిల్లీ: నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఢిల్లీలోని ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మసిబొగ్గులా మారింది. తమ బంధువుల శస్త్రచికిత్సలు, వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చి ఆస్పత్రి సమీప ఈ హోటల్లో బసచేస్తున్న పలువురు విదేశీయులు ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదయ్యారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది విదేశీయులు సహా మొత్తంగా 21 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో 9 మంది ఆఫ్రికా దేశస్తులుకాగా ఇద్దరు తుర్క్మెనిస్తాన్ దేశస్తులు. పది మంది భారతీయులూ ఈ ఘటనలో చనిపోయారు. ఉదయంకావడంతో కొందరు నిద్రలోనే శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. అగ్ని ప్రమాదం విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 35 మందిని కాపాడారు. వీరిలో 16 మందికి స్వల్ప గాయాలుకాగా 19 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. హోటల్లోని అతిథులు, పోలీసులు, స్థానికులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కలిపి మొత్తంగా 58 మంది ఈ ఘటనలో ప్రభావితమయ్యారు. ఘోర అగ్నిప్రమాదం వార్త తెలిసి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సెన్సర్తో పనిచేసే తలుపులు మూసుకుపోయి బయటకురాలేక, అగ్నికీలల వేడిమికి తాళలేక హోటల్లోని అతిథులు కాపాడండి అంటూ చేసిన ఆక్రందనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. హోటల్ జయమాని అరెస్టునిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్వహిస్తూ ఈ ఘటనలో పలువురి మృతికి కారణమయ్యాడంటూ హోటల్ యజమాని లోకేశ్ బజాజ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. పరారీలో ఉన్న అతన్ని పోలీసులు రాత్రి పొద్దుపోయాక అరెస్టు చేశారు. ప్రమాదం వార్త తెలిసి రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు తలో రూ.50,000 మంజూరుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ సైతం మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అసలేం జరిగింది? దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోని హౌజ్రాణి ప్రాంతంలో ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ ఒక ఐదంతస్తుల భవంతిలో నడుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పథకంలో భాగంగా ఈ నివాస భవంతిని పేయింగ్ గెస్ట్ మాదిరిగా నడుపుతున్నారు. ఈ హోటల్లో కేవలం ఆరు గదులకు అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా 25 గదుల్లో విదేశీయులకు వసతి కల్పించారు. లైబీరియా, మొజాంబిక్, నైజీరియా, బంగ్లాదేశ్లకు చెందిన వ్యక్తులు ఈ హోటల్ గదుల్లో దిగారు. కిక్కిరిసిన హోటల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు ఉదయం హోటల్ కిచెన్లో చెఫ్ ఒక ఎలక్ట్రిక్ వస్తువును స్విచ్ఛాఫ్ చేశాక ఎలక్ట్రిక్ ప్లగ్ నుంచి మంటలొచ్చాయి. ఆర్పేలోపే గది అంతా మంటలు వ్యాపించి చివరకు భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయని స్థానికుడు ఆసిఫ్ వెల్లడించాడు. క్షణాల్లో భవనం మొత్తాన్నీ అగ్నికీలలు చుట్టుముట్టాయి. సీల్ వేసిన కిటికీలు, ప్రతి అంతస్తులో సెన్సార్తో పనిచేసే తలుపులు అగ్నికీలల ధాటికి తెరుచుకోకపోవడంతో హోటల్లోని వాళ్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. చెలరేగుతున్న మంటల్ని చూసిన స్థానికులు, పరుపులు అమ్మే దుకాణదారు అర్మాన్ వెంటనే హోటల్ ముందు పరుపులు, దుప్పట్లను పరిచారు. కొందరు సాహసించి పైనుంచి వాటిపై దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తు నుంచి ఒక చిన్నారితో మహిళ కిందకు దూకిన వీడియో వైరల్గా మారింది. నాలుగో అంతస్తు నుంచి ఒక విదేశీ జంట కిటికీ అద్దాలు బద్దలుకొట్టి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలపాలైన వీళ్లను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రిలో చేరి్పంచారు. పై నుంచి దూకిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దూకిన మొహమ్మద్ సాహిదుల్ ఇస్లాం, ఆరామిన్ జమాన్, రియానాలను ఆస్పత్రుల్లో చేరి్పంచారు. ప్రమాదం విషయం తెల్సి ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పలువురిని కాపాడి క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేరి్పంచారు. మృతులు, క్షతగాత్రుల్లో చాలా మంది మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల రోగులు శస్త్ర చికిత్సలు, వైద్యం కోసం గతంలో సమీప ఆస్పత్రుల్లో చేరగా వాళ్ల బంధువులు ఈ ఫ్లోరిష్ బీ అండ్ బీ హోటల్లో దిగగా అనూహ్యంగా ఈ అగ్నిప్రమాదం బారిన పడ్డారు.ఆస్పత్రుల్లో విషాద దృశ్యాలు వైద్యం చేయించుకునేందుకు తాము వస్తే తమకు సాయపడేందుకు వెంట వచ్చిన బంధువులు విగతజీవులుగా మారారని తెల్సి సమీప మ్యాక్స్, సఫ్డర్జంగ్, ఎయిమ్స్, పండిత్ మదన్మోహన్ మాళవీయ ఆస్పత్రుల్లోని రోగులు కన్నీటిపర్యంతయ్యారు. తమ వాళ్లు అగ్నికీలలకు బలయ్యారని తెల్సి బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘నా అల్లుడు, కూతురు తరిణి అగర్వాల్(42), 17, 20 ఏళ్ల మనవరాళ్లు ఇదే హోటల్లో దిగారు. మంటల్లో అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు కుమార్తె, మనవరాళ్ల జాడ తెలీడం లేదు’’అని ఒకతను కన్నీటిపర్యంతయ్యాడు. అగ్నికీలలు అంటుకున్న గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదే హోటల్లో దిగిన మా బంధువులు ఆరుగురూ చనిపోయారు. నలుగురి మృతదేహాలను గుర్తుపట్టా. మిగతా ఇద్దరి మృతదేహాలు ఎక్కడున్నాయో ఎవరూ చెప్పడం లేదు’’అని నమిత్ గోయల్ అని వ్యక్తి ఏడుస్తూ చెప్పారు.అడుగడుగునా నిబంధనలు బేఖాతరు హోటల్ను తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కని్పంచింది. ఇరుకైన దారిలో నిర్మించిన ఈ ఐదంతస్తుల భవనం లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి కేవలం ఒక్కటే ద్వారం ఉంది. ఏడేళ్ల క్రితం ఒక్కటే పై అంతస్తు ఉండగా ఇటీవలే అనుమతుల్లేకుండా మిగతావి కట్టేశారు. ధారాళంగా గాలి వెలుతురు రాకుండా గదుల కిటికీలను సీల్వేసి ఉన్నాయి. పై అంతస్తుల్లో సెన్సర్తో పనిచేసే తలుపులు బిగించారు. అగ్నికీలలకు విద్యుత్ వైర్లన్నీ కాలిపోవడంతో సెన్సార్లు పనిచేయక తలుపులు తెరచుకోలేదు. దీంతో లోపల ఉన్న వాళ్లు మంటలకు, దట్టమైన పొగకు చనిపోయారు. ఆరు గదులకు అనుమతి ఇస్తే పాతిక గదులను నిర్మించి హోటల్ను అతిథులతో నింపేశారు. భవంతికి ఎలాంటి అగ్నిమాపకశాఖ నిరభ్యంతర సరి్టఫికేట్(ఎన్ఓసీ) లేదు అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అఖిలాష్ మాలిక్ వెల్లడించారు. గ్రౌండ్ఫ్లోర్లో రెస్టారెంట్ నడుపుతున్నారు. బేస్మెంట్ మొదలు పై అంతస్తు, టెర్రస్దాకా మొత్తం గదులతో నింపేశారని స్థానికుడు షేక్ అలీ వెల్లడించారు. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రధాన ద్వారం, కిటికీలను రాళ్లు, సుత్తితో పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. 17 అగ్నిమాపక బృందాలు ఘటనస్థలికి చేరుకుని ఎట్టకేలకు మంటల్ని ఆర్పేశాయి. అతిథులను కాపాడే క్రమంలో 10 మంది పోలీసులు గాయపడ్డారు. వీళ్లను ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేరి్పంచారు. -
సుదీర్ఘ ఎడబాటూ మానసిక హింసే
సాక్షి, న్యూఢిల్లీ: భార్యాభర్తలు సుదీర్ఘకాలం పాటు ఎవరికి వారు విడిగా జీవిస్తూ వివాహ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని మానసి క క్రూరత్వంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంపత్య హక్కుల నిరాకరణ విడాకులకు స్పష్టమైన కారణమని తేల్చిచెప్పింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ దంపతుల విడాకుల కేసులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్ ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పెళ్లైన కొద్దిరోజులకే భార్య శారీరక సాన్నిహిత్యానికి దూరంగా ఉంటోందని, ఇది మానసిక హింసేనంటూ భర్త 2009లో విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేయగా, వివాహ బంధాన్ని కొనసాగించేందుకు సిద్ధమంటూ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి పిల్లలు లేకపోగా, 15 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారని, గతేడాది సుప్రీంకోర్టు సూచనతో జరిగిన మధ్యవర్తిత్వం విఫలమైందని వాదనల సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దంపతులు సుదీర్ఘకాలం పాటు విడిగా జీవించడం, రాజీకి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం హిందూ వివాహ చట్టం ప్రకారం మానసిక హింస కిందకే వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సహేతుక కారణం లేకుండా దాంపత్య హక్కులను తిరస్కరించడం విడాకులకు బలమైన కారణమని పేర్కొంది. ఏళ్ల తరబడి విడిగా ఉంటున్న దంపతులను కలిసి ఉండాలని బలవంతం చేయడం వారి పట్ల క్రూరత్వమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం కాగితాలకే పరిమితమైన వివాహ బంధాలను నిర్జీవంగా సాగదీయడం కంటే చట్టబద్ధంగా తెంచేయడమే ఇరువురికి, సమాజానికి శ్రేయస్కరమ ని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో తేల్చిచె ప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన విశేషాధికారాలను ఉపయోగించి ఈ వివాహ బంధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, భార్య అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. -
నిధుల 'బాట'.. ఖర్చుపై కొట్లాట
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల (ఎన్ హెచ్–63), జగిత్యాల–కరీంనగర్ (ఎన్హెచ్–563) జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించే భారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 190.76 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ రహదారుల విస్తరణ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.7,597.16 కోట్లను కేటాయించింది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారుల విస్తరణతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రద్దీని నివారించేందుకు ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల, పోతారం, గంగాధర తదితర ప్రాంతాల్లో బైపాస్లు ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ టోలింగ్ విధానం(టోల్బూత్ల వద్ద వాహనాలు ఆగకుండా, నేరుగా హైవే వేగంతో ప్రయాణించడానికి అనుమతించే ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ)తో వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ నాలుగు లేన్ల మార్గాన్ని డిజైన్ చేశారు. రహదారుల విస్తరణ పూర్తయితే ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య సుమారు గంటన్నర ప్రయాణ సమయం ఆదా కానుంది. జగిత్యాల నుంచి కరీంనగర్ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం కలసిరానుంది. ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలకు సురక్షితమైన, వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది.సాక్షి, హైదరాబాద్: భూసేకరణ ఖర్చు అంటేనే రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తాల్సి వస్తోంది. భూసేకరణ ప్రక్రియే చాలా క్లిష్టమైంది కావటంతో దాన్ని కొలిక్కి తేవటం పెద్ద సవాలుగా ఉంటే, దాని వ్యయాన్ని భరించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు వివాదం నెలకొంటోంది. రీజినల్ రింగురోడ్డుకు అనుసంధానంగా రింగు రైలు ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించటంతో ఆ ప్రాజెక్టు ముందడుగేసింది. ఇక్కడే ఇప్పుడు పేచీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి ఇప్పుడు కసరత్తు ప్రారంభించాల్సి ఉంది. దీంతో భూసేకరణ బాధ్యత మీదంటే మీదే అన్నది తెరమీదకు వస్తోంది. రీజినల్ రింగురోడ్డును ఆనుకొని రైల్వే లైన్ నిర్మించాలన్నది ఆలోచన. ఇప్పటికే రీజినల్ రింగురోడ్డుకు 100 మీటర్ల వెడల్పుతో ఉత్తర భాగానికి అలైన్మెంట్ ఖరారైంది. దక్షిణ భాగానికి ఇంకా కొలిక్కి రాలేదు. ఉత్తర భాగానికి అనుమతి ఇచ్చే సమయంలో, ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా రోడ్డును 90 మీటర్ల వెడల్పునకే పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మిగిలిన 10 మీటర్ల వెడల్పు భాగానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. అప్పుడు ఆ పది మీటర్ల వెడల్పు భాగానికి పూర్తి భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దీంతో దీన్ని తీసుకోవాలా వద్దా అని తటపటాయిస్తున్న తరుణంలో, రింగు రైలు భూసేకరణ అంశం తెరమీదకు వచ్చింది. రింగురైలుకు అవసరమైన 35 మీటర్లు/ 40 మీటర్ల వెడల్పుతో ఉండే అలైన్మెంట్ భూసేకరణ వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రైల్వే శాఖ పేర్కొంటోంది. అలా కాదు, మొత్తం భూసేకరణ వ్యయాన్ని రైల్వేనే భరించాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నెలాఖరుకు డీపీఆర్ సిద్ధమవుతున్నందున, దీనిపై ఓ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య పేచీకి కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ‘రింగు’కు ఆనుకునా.. దూరంగానా..రీజినల్ రింగురోడ్డును ఆనుకునే రింగు రైలు ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ–రైల్వే సంయుక్త సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దానిమీద మళ్లీ పునరాలోచించాలని భావిస్తున్నారు. రింగురోడ్డు మలుపులు–రైల్వే లైను మలుపులు–గ్రేడియంట్లో చాలా తేడా ఉంటుంది. రైల్వేలైన్ క్రాసింగ్ రెండు కి.మీ. ముందునుంచే మొదలవుతుంది. దీంతో రోడ్డు–రైలు లైను మధ్య సమన్వయం సాధ్యం కాదు. సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో దూరదూరంగానే నిర్మించాల్సి ఉంటుందన్న నిపుణుల సూచన మేరకు అలైన్మెంట్లో మార్పుచేర్పుల అంశాన్ని పరిశీలిస్తున్నారు. పక్కపక్కనే నిర్మించినా, దూరంగా నిర్మించినా, భూసేకరణ అనేది పెద్ద సవాల్గా మారనుంది. ఇప్పటికే రింగురోడ్డుకు భూములు ఇచ్చిన రైతులు మళ్లీ రింగురైలుకు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనే అవకాశమే ఎక్కువగా ఉంది. యాదాద్రి తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారి విస్తరణకు, ఇతర సాగునీటి ప్రాజెక్టు కాలువలకు ఇప్పటికే రెండుమూడు పర్యాయాలు భూములు ఇచ్చిన రైతులు, రీజినల్ రింగురోడ్డుకు ఇచ్చేందుకు ససేమిరా అని కోర్టుల్లో కేసులు వేశారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ రింగురైలుకు భూములు ఇచ్చేందుకు వారు సహకరించే వీలు లేదు. ఇటు రోడ్డు–అటు రైల్వే లైను మధ్యలో ఉండే భూములకు విలువ తగ్గిపోతుంది. దీన్ని కూడా ఆయా రైతులు వ్యతిరేకించే అవకాశముంది. వెరసి ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర అయోమయం నెలకొంది. -
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో..
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) రాయాలి. కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని స్పష్టంగా చెప్పింది. అంటే, ఏడాదికి కనీసం రెండు సార్లు టెట్ తప్పనిసరిగా జరుగుతుంది. అదనంగా, ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా మరో రెండు అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఈ గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఆ లోపు టెట్ పాస్ కావడం తప్పనిసరి.టెట్లో ఫెయిల్ అయితే ఉపాధ్యాయులకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగం కొనసాగించలేరు, అలాగే ప్రమోషన్లు పొందలేరు. కోర్టు స్పష్టంగా తెలిపినట్లుగా, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలి. ఫెయిల్ అయినా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహించబడుతుండటంతో, మరోసారి రాసే అవకాశం ఉంటుంది. కానీ గడువు ముగిసేలోపు పాస్ కాకపోతే, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం తప్పదు.ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా వేలాది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాయాల్సి ఉంటుంది. విద్యా ప్రమాణాలను పెంచడం, నాణ్యమైన బోధన అందించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై మరిన్ని పొడిగింపులు ఇవ్వబోమని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణలో పారదర్శకత పాటించి, ఉపాధ్యాయులకు సమయానికి పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. -
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఢిల్లీలోని రెస్టారెంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. -
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?
తమిళనాడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026 -
వైరల్ వీడియో.. సుప్రీం కోర్టులో బిగ్ హైడ్రామా
ఒక వైరల్ వీడియో దేశం మొత్తాన్ని ‘‘అయ్యో పాపం పెద్దాయన..’’ అనుకునేలా చేసింది. అటు ఇటు తిరిగి.. అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అయితే.. ఈ హైడ్రామాలో చివరి క్షణంలో ‘ట్విస్ట్’ చోటు చేసుకోవడంతో విచారణను విరమించుకోవాల్సి వచ్చింది.బిహార్లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు వచ్చిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడవడానికే కష్టపడుతున్న ఆ వృద్ధుడు కర్ర సాయంతో కోర్టు ఆవరణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు.. ఇద్దరు వ్యక్తుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతుండగా.. సుప్రీంకోర్టు కూడా అప్రమత్తమైంది.बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026మంగళవారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలతో కోర్టు నం.1 (ప్రధాన న్యాయమూర్తి కోర్టు)ను తక్షణం తెరవాలని సూచించారు. సుమోటో విచారణ చేపట్టే అవకాశముందని భావించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి పరిస్థితి మారింది.బిహార్ హైకోర్టు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. వృద్ధుడికి అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ వివరాలు తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు సుమోటో చర్యను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై తక్షణ చర్యకు ఆసక్తి చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కొలీజియం సమావేశాల్లో ఉన్నప్పటికీ.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రీకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వివాదానికి కారణమైన కేసు 1992 నాటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై కాల్పుల ఆరోపణలు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం వారిలో నలుగురు మరణించగా, మిగిలిన ఐదుగురిపై తీర్పు వెలువడింది. ఇందులో 85 ఏళ్ల దీప్ రాయ్కు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడింది. వైరల్ వీడియో ప్రభావంతో సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ ఘటన చివరి క్షణంలో భిన్న మలుపు తిరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్ ఏటీఎంగా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు..అమరవీరుల స్వప్నాలను సాకారం చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన సొంత ఏటీఎంగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వికసిత్ తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: నితిన్ నబీన్ ‘జై తెలంగాణ‘నినాదంతో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కాంగ్రెస్ అవినీతి పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఒక అవినీతి ప్రభుత్వం పోయిందనుకుంటే, ఇప్పుడు అంతకంటే ఘోరమైన మరో అవినీతి సర్కార్ కొలువు దీరిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు కప్పంగా కడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా నిలబడ్డారని, వాజ్పేయి హయాం నుంచే బీజేపీ చిన్న రాష్ట్రాలకు మద్దతుగా ఉందన్నారు. తెలంగాణ వికాసం, సమృద్ధి కేవలం మోదీ నేతృత్వంలోని ‘వికసిత్ తెలంగాణ’తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యే వరకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది ఊసరవెల్లి రాజకీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి, వెనుక నుంచి మిర్చి పౌడర్లు, పెప్పర్ స్ప్రేలు కొట్టించిన ఊసరవెళ్లి రాజకీయాల చరిత్ర కాంగ్రెస్దని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది అమాయకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. నాడు బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ‘బంగారు తెలంగాణ’పేరుతో కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకొని, తీవ్ర అవినీతితో దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు వచి్చన రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మినహాయింపు ఏమీ కాదన్నారు. సహకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రగతి: రాంచందర్రావు తెలంగాణ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు..అది అసంఖ్యాక త్యాగాల ఆత్మగౌరవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పేర్కొన్నారు. ‘వికసిత్ తెలంగాణ’–‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’లు పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారంతో కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్ భారత్’స్వప్నం సాకారమవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎమర్జెన్సీ మైండ్ సెట్ను బయటపెట్టుకుందని రాంచందర్రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులకు, అర్బన్ నక్సలైట్ల సభలకు అనుమతులిచ్చే ఈ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. సెంటిమెంట్ రాజకీయం సాగదు: ఎంపీ రఘునందన్రావు ఏపీకి వెళ్లి మాజీమంత్రి రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్రెడ్డిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయొచ్చు కానీ, పవన్ కల్యాణ్ వస్తే తప్పా? అని నిలదీశారు. ఉడత ఊపులకు బీజేపీ భయపడదని, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. -
పెళ్లయిన కుమార్తె కూడా కుటుంబంలో భాగమే
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లియిందనే కారణంతో కుమార్తెకు కారుణ్య నియామకం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం నిర్వచనంలో పెళ్లి అయిన కుమార్తె కూడా భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి అనేది ఒక మహిళ అర్హతకు అడ్డంకి కాదని, అర్హత కలిగిన కుమార్తెకు కేవలం వైవాహిక హోదా కారణంగా సంక్షేమ పథకాన్ని నిరాకరించలేమని తెలిపింది. ఈ విషయంలో బాంబే, కర్ణాటక హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది. కేసు వివరాలివీ..ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్సుమ్ నిషా తల్లి చౌక ధరల దుకాణం డీలర్గా ఉండేవారు. కుల్సుమ్ నిషా పెళ్లయినప్పటికీ, భర్తతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండేవారు. దివ్యాంగురాలైన తన సోదరి బాగోగులు చూసుకుంటూ, తల్లికి దుకాణం నిర్వహణలో సాయం చేసేవారు. తల్లి మరణించిన తర్వాత, కారుణ్య ప్రాతిపదికన ఆ దుకాణం లైసెన్స్ తనకు ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి పెళ్లయిన కూతుళ్లను తొలగించింది. ఈ జీవోను సాకుగా చూపి ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. భిన్న తీర్పుల నేపథ్యంలో సుప్రీంకు బదిలీ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి, గత తీర్పులను పరిశీలించారు. వాటిలో ప్రధానంగా..⇒ విమల్ శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. (2015) కేసులో.. ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలకు సంబంధించిన ‘ఉత్తరప్ర దేశ్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిపెండెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ డైయింగ్–ఇన్– హార్నెస్ రూల్స్, 1974’ లోని ‘‘కుటుంబం’’నిర్వచనాన్ని విశ్లేషించింది. వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టి కల్ 14, 15లకు విరుద్ధమని, అది వివక్ష తో కూడుకున్నదని తేల్చింది. కుటుంబం నిర్వచనంలో ఉన్న ‘అవివాహిత’అనే పదాన్ని కొట్టివేసింది. ⇒ కుసుమ్లత వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు (2021)లో అయితే.. 2019 జీవోను సవాల్ చేస్తూ దాఖలైన మరో కేసులో సింగిల్ జడ్జి, విమల్ తీర్పులో వచ్చినది ఇక్కడ వర్తించదని పేర్కొన్నారు. 2019 జీవోలో ‘అవివాహిత కుమార్తె’అని ఉండటం వివక్ష కాదని తేల్చారు. ‘హార్నెస్ రూల్స్’ను అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా 2019 జీవోను వ్యాఖ్యానించలేమని చెప్పారు.⇒ సైదా బేగం వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు (2023)లో.. డివిజన్ బెంచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఒకే హైకోర్టులో భిన్న తీర్పులు రావడంతో పాటు, ఇతర హైకోర్టుల అభిప్రాయాలు కూడా వేరుగా ఉన్నాయి. బాంబే హైకోర్టు ‘రంజనా మురళీధర్ అనే రావ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2014)’కేసులో, లైసెన్సింగ్ ఆర్డర్, 1979 కింద మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తీర్మానంలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19(1)(జీ)లకు విరుద్ధమని తీర్పు ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ భిన్నమైన తీర్పుల నేపథ్యంలో, స్పష్టత కోసం అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు.4 వారాల్లో లైసెన్స్ ఇవ్వాలని ఆదేశంతీర్పు సందర్భంగా.. బాంబే హైకోర్టు రంజనా కేసులో ఇచ్చిన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అలహాబాద్ హైకోర్టు సైదా బేగం కేసులో ఇచ్చిన తీర్పు సరైంది కాదని తేల్చి చెప్పింది. ‘ఈ కేసులో రికార్డుల ప్రకారం, అప్పీలుదారు పెళ్లి తర్వాత కూడా అదే గ్రామంలో నివాసం ఉంటూ, తన తల్లికి చౌక ధరల దుకాణం నడపడంలో సాయం చేసేవారు. తల్లి మరణం తర్వాత, ఆమె తన సోదరి, శారీరక వైకల్యం ఉన్న మరో సోదరి బాధ్యతలను తీసుకుంది. ఆమె వివాహిత అనే కారణంతో దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగపరంగా చెల్లదు’అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్కు లైసెన్స్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ధర్మాసనం, నాలుగు వారాల్లోగా కుల్సుమ్ నిషాకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఆదేశించింది. -
రేపు కేరళను తాకనున్న నైరుతి
న్యూఢిల్లీ: భారత్లో పంటసాగుకు ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ నాలుగోతేదీన కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. సాధారణంగా జూన్–సెపె్టంబర్ సీజన్కు సంబంధించిన నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటోతేదీకల్లా కేరళలో చిరుజల్లులను కురిపిస్తూ రైతన్నల ముఖాల్లో ఆనందం తీసుకొస్తాయి. కానీ ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా భారత్లోకి అడుగుపెడుతున్నాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.‘‘నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్ర, లక్షద్వీప్ దీవులు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోలలో ఒకేసారి జూన్ నాలుగోతేదీన నైరుతి రుతుపవనాలు తాకే ఆస్కారముంది. నైరుతి, దక్షిణ మధ్య ప్రాంతం, తూర్పు మధ్యప్రాంతం, బంగళాఖాతం ఈశాన్య ప్రాంతాలు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాల్లోనూ అదే తేదీన వర్షాకాల సీజన్ ఆరంభంకానుంది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90 శాతంగా ఉండొచ్చు’’అని వాతావరణ శాఖ అంచనావేసింది.గత 30 లేదా 50 సంవత్సరాల కాలంలో నిర్ణిత ప్రాంతంలో ఒక నెలలో లేదా ఒక సీజన్లో పడే వర్షపాతం సగటును ఎల్పీఏగా పేర్కొంటారు. 1971 నుంచి 2020 ఏడాది మధ్య నమోదైన ఎల్పీఏ 87 సెంటీమీటర్లనే ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈసారి ఎల్పీఏ 90 శాతంగా ఉండొచ్చు అంటే ఈసీజన్లో లోటు వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందని వాతావరణ శాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. ఎల్ నినో పరిస్థితుల కారణంగానే లోటు వర్షపాతం ముప్పు పొంచి ఉందని నిపుణులు వివరించారు. భూమధ్యరేఖ సమీప పసిఫిక్ మహాసముద్ర ప్రాంత ఉపరితల జలాలు క్రమంగా వేడెక్కుతూ ఎల్నినో పరిస్థితులను సృష్టిస్తున్నాయి. జూన్లో ఎల్–నినో ప్రభావం తక్కువగా ఉండి, సెప్టెంబర్లో బలపడే అవకాశముంది. -
ఐదుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. శీల్ నాగ్, శ్రీచంద్రశేఖర్, సంజీవ్ సచ్దేవా, అరుణ్ పల్లి, వి.మోహనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరుకుంది. మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 38 కాగా, ప్రస్తుతం కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది వి.మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని మే 27న సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం మే 31న ఆమోదం తెలిపింది. సిట్టింగ్ జడ్జీలు జస్టిస్ పంకజ్ మిథాల్ ఈ ఏడాది జూన్ 16న, జస్టిస్ జె.కె.మహేశ్వరి జూన్ 28న పదవీ విరమణ చేయబోతున్నారు. జస్టిస్ శీల్ నాగ్: 1965 జనవరి 1న జన్మించారు. 1987 అక్టోబర్లో అడ్వొకేట్గా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మే 23న అదే కోర్టులో పర్మినెంట్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2024 మే 25న మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2024 జూలై 9న పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ శ్రీచంద్రశేఖర్: 1965 మే 25న జన్మించారు. 1993లో ఢిల్లీ యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 2013 జనవరి 17న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 జూన్ 27న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 డిసెంబర్ 29 నుంచి 2023 జూలై 4 వరకు జార్ఖండ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2024 జూలై 5న రాజస్తాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2025సెప్టెంబర్ 5న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సంజీవ్ సచ్దేవా: 1964 డిసెంబర్ 26న జన్మించిన జస్టిస్ సంజీవ్ సచ్దేవా 1988లో ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పొందారు. 1988 ఆగస్టు 1న ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2011 జూలైలో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2013 ఏప్రిల్ 17న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2015 మార్చి 18న అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 మే 30న మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ సచ్దేవా 2025 జూలై 17న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అరుణ్ పల్లి: 1964 సెప్టెంబర్ 18న జన్మించారు. 1988లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తిచేశారు. 2004 నుంచి 2007 దాకా పంజాబ్ అదనపు అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. 2007 ఏప్రిల్ 16న సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 28న పంజాబ్, హరియాణా హైకోర్టు బెంచ్కు పదోన్నతి పొందారు. 2025 ఏప్రిల్ 16న జమ్మూ కశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అరుణ్ పల్లి తండ్రి, తాత పటియాలాలో న్యాయవాదులుగా పనిచేశారు. జస్టిస్ వి.మోహన: 1966 జూన్ 27న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. అప్పటి నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో గతంలో న్యాయవాద వృత్తిలో ఎవరూ లేరు. 1992 తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ ఇందూ మల్హోత్రా ఛాంబర్లో చేరారు. సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్ ఛాంబర్లో కూడా ఆమె పనిచేశారు. 1996లో అడ్వకేట్–ఆన్–రికార్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. జస్టిస్ వి.మోహనను 2015లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్గా నియమించింది. ఐదేళ్ల తర్వాత మహిళా జడ్జి సుప్రీంకోర్టులో ఐదేళ్ల విరామం తర్వాత మహిళా న్యాయమూర్తి నియామకం కావడం విశేషం. దీంతో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరుకుంది. సుప్రీంకోర్టుకు మహిళా జడ్జి నేరుగా ఎంపిక కావడం ఇది రెండోసారి. 2018లో జస్టిస్ ఇందూ మల్హోత్రా తర్వాత బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన రెండో మహిళా న్యాయవాదిగా జస్టిస్ వి.మోహన రికార్డులకెక్కారు. హైకోర్టు జడ్జిగా పని చేయకుండా న్యాయవాద వృత్తి నుంచే నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక కావడం గమనార్హం. -
సీబీఎస్ఈ ప్రక్షాళన!
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల ప్రక్రియకు సంబంధించిన డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రెటరీ హిమాన్షు గుప్తాపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారిద్దరినీ మంగళవారం జాతీయ విద్యా బోర్డు నుంచి బదిలీ చేసింది. ఆన్- స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వ్యవస్థలో లోపాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోర్టల్లో అప్లోడ్ చేసిన తమ జవాబు పత్రాల కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని పునర్మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది 12వ తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీబీఎస్ఈ పనితీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పరీక్షల ప్రక్రియలో సాంకేతిక లోపాలు, చెల్లింపుల వ్యవస్థ వైఫల్యాలు, ధ్రువీకరణ, పునర్ మూల్యాంకన ప్రక్రియలో జాప్యం వంటి అంశాలపై బోర్డు విమర్శలను ఎదుర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిమాండ్లు వెల్లువెత్తాయి. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ పరీక్షలు, విద్యావిషయాలు, విధానాల అమలు, ప్రధాన సంస్కరణలతో సహా బోర్డు మొత్తం పనితీరును పర్యవేక్షించారు. కార్యదర్శి హిమాన్షు గుప్తా పరిపాలన, ఆర్థికం, అనుబంధ విధులకు నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ పాఠశాలలు, పరీక్షల వ్యవస్థ రోజువారీ కార్యకలాపాలు, విధానాల అమలులో కీలకపాత్ర పోషించారు. వివాదం మొదలైనప్పటి నుంచి ప్రభుత్వ తీసుకున్న పరిపాలనా చర్యలలో ఒకటిగా సీబీఎస్ఈ చైర్మన్, కార్యదర్శి బదిలీని పరిగణిస్తున్నారు. ఎస్.రాధా చౌహాన్ నేతృత్వంలో కమిటీ సీబీఎస్ఈ ఆన్- స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ సేవల సేకరణకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్.రాధా చౌహాన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఈ కమిటీ నెల రోజుల్లోగా తమ నివేదికను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు అందజేయనున్నట్లు పేర్కొంది. అవసరమైనప్పుడు ఇతర శాఖల సహాయం పొందేందుకు రాధా చౌహాన్కు అధికారం కట్టబెట్టారు. సీబీఎస్ఈ ఆన్- స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ సేవల కాంట్రాక్ట్ను కోఎంప్ట్ ఎడ్యూ టెక్కు అప్పగించిన సంగతి తెలిసిందే. కేంద్ర బిందువు కోఎంప్ట్ ఎడ్యూ టెక్ సీబీఎస్ఈ ఆన్- స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్పై నెలకొన్న వివాదానికి హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూ టెక్ అనే సంస్థ కేంద్ర బిందువుగా మారింది. సీబీఎస్ఈ పరీక్షల డిజిటల్ మూల్యాంకన సేవల ఈ కాంట్రాక్టును ఈ సంస్థ దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.384 కోట్లు. గతంలో తెలంగాణలోనూ కోఎంప్ట్ ఎడ్యూ టెక్పై పలు ఆరోపణలు వచ్చాయి. సీబీఎస్ఈ సాంకేతిక మదింపులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను స్వల్ప తేడాతో అధిగమించి, తక్కువ ఆర్థిక బిడ్ను సమరి్పంచి డిజిటల్ మూల్యాంకన కాంట్రాక్టును కోఎంప్ట్ దక్కించుకుంది.టెక్నికల్ ఎవాల్యూయేషన్లో 100 పాయింట్లకు గాను కోఎంప్ట్ 91 పాయింట్లు, టీసీఎస్ 89 పాయింట్లు సాధించాయి. ఫైనాన్షియల్ బిడ్ను కోఎంప్ట్ తక్కువగా సమరి్పంచింది. ఒకోఆన్సర్ బుక్లెట్ను మూల్యాంకనం చేయడానికి టీసీఎస్ రూ.53 నుంచి రూ.65 వరకు కోట్ చేసింది. కోఎంప్ట్ మాత్రం కేవలం రూ.24.75 నుంచి రూ.25.74 వరకు తీసుకోవడానికి ముందుకొచ్చింది. దాంతో ఆ సంస్థకే కాంట్రాక్టు దక్కింది. టెక్నాలజీ దిగ్గజమైన టీసీఎస్ను చిన్నపాటి సంస్థ అయిన కోఎంప్ట్ వెనక్కి నెట్టడం గమనార్హం. -
ఏఐ ఖర్చు తడిసిమోపెడు!
‘‘ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు..’’ ‘‘ప్రతి రంగంలోనూ ఏఐ, రోబోలదే రాజ్యం’’ ఇంకో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండనే ఉండరు’’ కృత్రిమ మేధ.. అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకోవర్గం సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్లను వదిలేసుకున్నారు. కానీ...ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు ఆరు నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లక్ష వరకూ ఇంజనీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్లు నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది.కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే.... ఏఐ వాడితే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి... వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు రావడమే! ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి.ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్లలో లెక్కిస్తూంటారు. ఉదాహరణకు మీరు ‘ Hello, How are you? ‘ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏక మొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు. టోకెన్లుగా విభజిస్తుంది. ‘ " Hel", " lo", " How", " are", " you" ‘ లు ఒకొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే... అందులోని ఒక్కో టోకెన్కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. 70 శాతం ఏఐదే.. కానీ... కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేసింది. ‘‘ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు’’అని ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటన్జరో వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘సాఫ్ట్వేర్ కోడ్లో 70 శాతం వరకూ ఏఐ ఆధారంగానే జరుగుతోంది. అయితే దీని వల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతోందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు’’అని ఊబర్ సీఓఓ ప్రశాంత్ మహేంద్ర రాజ చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఏఐపై పెడుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం లేదన్నమాట. ఉద్యోగాల కోత మాటేమిటి? ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది.వీటిని కలిగిఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి!!–సాక్షి, నేషనల్ డెస్క్ -
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి,న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులేనని తెలిపింది. వివాహిత కుమార్తెను ‘కుటుంబం’ నిర్వచనం నుంచి మినహాయించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలకు పెళ్లయిన కూతుర్లను మినహాయించకూడదని వెల్లడించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం, బాంబే హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. వివాహం కారణంగా అర్హత ఉన్న కూతురికి సామాజిక సంక్షేమ ప్రయోజనాలు లేకుండా చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్కు చెందిన వివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ కేసు మొదలైంది. తన తల్లి మరణం తర్వాత రేషన్ షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఆమెకు ‘వివాహిత కూతురు’ అనే కారణంతో లైసెన్స్ నిరాకరించారు.ఆమె తన వికలాంగ సోదరిని చూసుకుంటూ, కుటుంబంతోనే నివసిస్తూ తల్లికి సహాయం చేస్తూ షాప్ నడిపేది. అయినప్పటికీ 2019 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఆమె దరఖాస్తు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషనరైన వివాహిత కూతురుకు నాలుగు వారాల్లో రేషన్ షాప్ లైసెన్స్ ఇవ్వాలని సుప్రీం కోర్టు యూపీ అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో సుప్రీం కోర్టు మహిళల హక్కులను మరింత బలోపేతం చేసింది. వివాహం తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకు ఇది పెద్ద ఊరట కలిగినట్లైంది. -
అసలు కారణం చెప్పేసిన అన్నామలై!
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీజేపీకి గుడ్బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది. -
సెలవుల్లో సీనియర్లకు నో ఎంట్రీ యువ న్యాయవాదులకే ఛాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం (వెకేషన్ బెంచ్) ముందు వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను అనుమతించేది లేదని న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. సెలవుల్లో కేవలం యువ న్యాయవాదులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్)లకు మాత్రమే తన కోర్టులో అవకాశం కల్పిస్తానని తేల్చి చెప్పారు. తమ కేసులను ప్రస్తావించేందుకు ప్రయతి్నంచిన పలువురు సీనియర్లను న్యాయమూర్తి వారించారు. తనకు అధికారికంగా సీనియర్ హోదా లేనందున వాదించేందుకు అనుమతివ్వాలని న్యాయవాది మాథ్యూస్ నెడుంపర కోరగా నిరాకరించారు. ఈ నిర్ణయం తమకు ముందుగా తెలియదని, కనీసం రేపటి నుంచైనా అమలు చేయాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కోరారు. గత వారం నోటీసులు జారీ చేసిన కేసుల్లో తాము ఇదివరకే హాజరైనందున, ఈ రోజైనా వాదించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ధర్మాసనాలు సీనియర్లను అనుమతిస్తున్నాయని గుర్తుచేశారు. మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సైతం అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్ల విజ్ఞప్తులను జస్టిస్ విక్రమ్నాథ్ తోసిపుచ్చారు. యువ న్యాయవాదులు, ఏవోఆర్లను ప్రోత్సహించి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ ఒకటి నుంచి జూలై 12వ తేదీ వరకు సెలవుల కాలంలో పని దినాల్లో తన కోర్టులో సీనియర్లకు అనుమతి లేదన్నారు. ఈ నిబంధన ఎవరికీ తెలియదన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. గత నాలుగేళ్లుగా ప్రతి వెకేషన్లోనూ తన బెంచ్ ఇదే విధానాన్ని పాటిస్తోందని, ఈ విషయం అందరికీ తెలుసునని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. నెడుంపర అభ్యర్థనపై స్పందిస్తూ.. తన దృష్టిలో ఆయన సీనియర్ న్యాయవాదేనని పేర్కొన్నారు. గత వారం హాజరైన కేసుల్లో వాదించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనలను సైతం ధర్మాసనం అంగీకరించలేదు. తన వైఖరిని మార్చుకునేది లేదని జస్టిస్ విక్రమ్నాథ్ తేల్చిచెప్పారు. కోర్టు హాలు నుంచి సీనియర్ న్యాయవాదులను పంపించి వేయాలని కోర్టు మాస్టర్ను ఆదేశించారు. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేను సైతం అనుమతించని న్యాయమూర్తి.. ఆయన స్థానంలో సహాయక న్యాయవాది వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
రాజీ కుదిరాక కేసులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ వివాదంపై దిగువ కోర్టు సూచనల మేరకు ఇరుపక్షాలు మధ్యవర్తిత్వ కేంద్రంలో రాజీకి వచ్చాయి. లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాజీ షరతుల ప్రకారం నడుచుకున్నప్పటికీ.. తనపై పెట్టిన చీటింగ్ కేసును వెనక్కి తీసుకునేందుకు ఎదుటి పక్షం నిరాకరిస్తోందంటూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన క్లయింట్ను వేదించాలనే ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్ను కొనసాగిస్తున్నారంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఒప్పందంలోని కొన్ని షరతులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, అందుకే కేసును వెనక్కి తీసుకోలేదని ప్రతివాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు, మధ్యవర్తిత్వ కేంద్రం సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ..కోర్టుల సమయాన్ని ఆదా చేయడానికి, కేసుల సత్వర పరిష్కారం కోసమే మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని తెలిపింది. ఇరుపక్షాలు స్వచ్ఛందంగా రాజీ ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత, అందులోని షరతులకు తప్పక కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కేసులను వెనక్కి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొనసాగించడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు కేవలం కక్ష సాధింపు చర్యల కిందకే వస్తాయని, న్యాయపరమైన ప్రయోజనం ఏమీ ఉండదని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. పిటిషనర్పై నమోదైన చీటింగ్ ఎఫ్ఐఆర్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజీ ఒప్పందంలోని షరతులను ఇరుపక్షాలు నిరీ్ణత వ్యవధిలోగా తూచా తప్పక పాటించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి కొత్త ఫిర్యాదులు, క్రిమినల్ కేసులు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
అన్నామలై సంచలన నిర్ణయం?
సాక్షి,చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన అనుచరులు కూడా తమ నేతకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కొత్త పార్టీ గురించి అన్నామలైని ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తానని ఆయన తెలిపారు.ఇటీవల తమిళనాడులో పార్టీ అధ్యక్ష పదవి మార్పు, అనంతరం జరిగిన పరిణామాలపై అన్నామలై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి.అన్నామలై కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నప్పటికీ.. ఆయన ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. అయితే, ఆయన అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కేవలం పుకార్లేనని, అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై స్థాపించబోయే పార్టీ పేరు ‘తమిళగ మక్కల్ శక్తి ఖచ్చి (టీఎంఎస్కే)’గా వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బీజేపీ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను మార్చింది. తమిళనాడులో కూడా నాయకత్వ మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో, ఈ నెల చివర్లో కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వదంతులు అన్నామలై కేంద్ర నాయకత్వం ముందు తన బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహమని ఆయన ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు.2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం, నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్ వంటి సీనియర్ బీజేపీ నాయకుల ప్రభావం తగ్గిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అన్నామలై కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ స్థానంలో వనతి శ్రీనివాసన్కు అవకాశం ఇ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన అన్నామలై చివరికి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గానీ లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని గానీ ఆశించే అవకాశంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.రాజీనామా నిజమేనా?అన్నామలై పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్కు తన నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న అన్నామలై, తన నిర్ణయాన్ని ఖరారు చేస్తూ నబిన్ను కలవనున్నారు.ఇప్పటికే తన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ సమావేశం కోసమే కాకుండా తన ఆరేళ్ల రాజకీయ జీవితం పట్ల కృతజ్ఞత తెలిపేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నన్నారని, ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తనకు కల్పించిన అవకాశాలు, అనుభవాలు, రాజకీయ ప్రయాణానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఈటలపై పోస్టర్లు: రామచందర్రావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. అలాగే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై పోస్టర్ల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇలా జరిగింది. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. బీజేపీ రాజేందర్పై పోస్టర్లు వేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ పోస్టర్లకు పార్టీ నేతలకు సంబంధం లేదు. బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఇలా పోస్టర్లు వేస్తున్నారు. దీనిపై డీజీపీ, కమిషనర్లకు ఫిర్యాదు చేశాం. ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.కాగా, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్ద ఫ్లెక్సీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం.. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బీజేపీకి నువ్ చేసిన ఒక్క మేలైనా చెప్పగలవా?’ అంటూ వెలిసిన ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో ‘రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు’ అని విమర్శించారు.అలాగే బీజేపీ ఈటలకు చేసిన మేలును తెలుపుతూ ‘ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది.. మోదీ నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తో గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత’ అని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ‘బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? అని నిలదీశారు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. దీంతో, బీజేపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఉన్నట్టు మరోసారి బహిర్గతమైంది. -
దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్లతో.. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్ను సమర్థంగా నిర్వహించడం, అక్రమ నిల్వలు (హోర్డింగ్).. మళ్లింపులను అరికట్టడం వంటి చర్యల నేపథ్యంలో ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక.. కోట్లాది మంది గృహ వినియోగదారుకు ఊరట ఇస్తూ.. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో.. రూ.821.50కు చేర్చారు. ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్ ధరలు ఒక్కోలా ఉన్నాయి.ఢిల్లీలో ఒక్క సిలిండర్పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది. కోల్కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో రూ.3,255.50గా మారింది. పెరిగిన రేట్లతో.. తెలంగాణ హైదరాబాద్లో(రూ.52 పెంపు) రూ.3,315, ఇటు ఏపీ విజయవాడలో రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 వేల మెట్రిక్ టన్నుల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్పీజీ నిల్వలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ డిమాండ్ ఉండగా, రిఫైనరీలు 50–52 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాయి. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్లాగ్ 4.5 రోజులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు, భారీ మొత్తంలో కొనుగోళ్లు పెరగడంతో ఇంధన విక్రయాల్లో అసాధారణ వృద్ధి నమోదైందని ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగగా, 14 జిల్లాల్లో పెట్రోల్ విక్రయాలు 100 శాతానికి మించి పెరిగాయి. దీంతో అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.గత నాలుగు రోజుల్లో ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన 6,500 దాడులు నిర్వహించగా, ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే పెట్రోల్ బంకుల్లో 900 తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ధరల మార్పులు ఎలా ఉన్నాయి?వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, డిమాండ్ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కానీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే వాణిజ్య ఎల్పీజీపై ఈ పెంపు ప్రభావం చూపిస్తూ వస్తోంది. ఎందుకు పెంచారు?పశ్చిమాసియాలో యుద్ధం.. హర్ముజ్లో నిలిచిన చమురు రవాణాదేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ డిమాండ్వ్యూహాత్మక ఇంధన నిల్వలను బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలుఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 30 రోజుల కనీస నిల్వల నిర్వహణ ఆదేశాలుఅక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు కఠిన చర్యలుసరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన నిర్వహణ వ్యయాలుమొత్తంగా చూస్తే, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు జూన్ నెల ప్రారంభంలోనే ధరల షాక్ తగిలింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. -
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఐదు అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా రక్షించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.సాయిదుల్లాజాబ్ ప్రాంతంలోని వెస్ట్రన్ మార్గ్లో ఉన్న ఈ ఐదు అంతస్తుల భవనంలో కోచింగ్ సెంటర్, కేఫ్లు, కార్పొరేట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. మూడో అంతస్తులో కొంత నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. శనివారం రాత్రి 7:45 నిమిషాల సమయంలో ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పక్కనే విద్యార్థులు రాత్రి భోజనం చేస్తున్న ఒక తాత్కాలిక రేకుల షెడ్డు (క్యాంటీన్)పై ఈ భవనం పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.డీఎఫ్ఎస్, ఎన్డీఆర్ఎఫ్, డీడీఎంఏ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించడానికి జేసీబీ ఎక్స్కవేటర్లు, హైడ్రాలిక్ కట్టర్లతో పాటు.. లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి ప్రత్యేక విక్టిమ్-లొకేషన్ కెమెరాలు, ఎర్త్-అగర్ డ్రిల్లింగ్ మిషన్లు మరియు శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు) రంగంలోకి దించారు.#WATCH | Delhi: Rescue operation underway after a five-storey building collapsed in the Mehrauli police station area. Nine people have been evacuated.Morning visuals from the spot. pic.twitter.com/N8OCw44nKi— ANI (@ANI) May 31, 2026స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో క్యాంటీన్, భవనంలో కలిపి దాదాపు 100 నుండి 150 మంది వరకు ఉండవచ్చని... శిథిలాల కింద నుంచి రక్షించాలంటూ ఆర్తనాదాలు విన్నామంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి 12 మందిని రక్షించాం. శిథిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తయ్యే వరకు కచ్చితంగా చెప్పలేం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
జాక్వెలిన్, సుకేశ్లపై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు లో మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మరో 15మందిపై అభి యోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శనివా రం ఆదేశించింది. నిందితులందరిపైనా ప్రాథ మికంగా బలమైన సాక్ష్యాధారాలున్నా యని అదనపు సెషన్స్ జడ్జి (ఏఎస్జే) ప్రశాంత్ శర్మ పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3, 4కింద వీరిపై అభియోగాలు నమోదు చేయా లన్నారు. దీంతో, ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కేసులో పలుమార్లు జాక్వెలిన్ను ప్రశ్నించిన ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్లో మొదటిసారిగా ఆమె పేరును చేర్చింది. పింకీ ఇరానీ ద్వారా సుకేశ్ నుంచి ఆమె ఖరీదైన బహు మతులను పొందినట్లు రెండో సప్లిమెంటరీ చార్జి షీట్లో పేర్కొంది. సుకేశ్ నేర కార్యకలాపాలు తెలిసిన తర్వాత కూడా అతడితో జాక్వెలిన్ సంబంధాలు కొనసాగించిందని, మనీలాండరింగ్తో ఆమెకూ సంబంధాలున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఆమె బాధితురాలు కాదని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు సుకేశ్ను 2017లో అరెస్ట్ చేయగా, 2021లో ఈడీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సుకేశ్ భార్య లీనా, దీపక్ రమ్నానీ, ప్రదీప్ రమ్దానీ, బి. మోహన్రాజ్, అరుణ్ ముత్తు, డి.కమ్లేశ్ కొఠారి, పింకీ ఇరానీలతోపాటు మరికొందరు కూడా నిందితులుగా ఉన్నారు. -
సైనిక దళాల ఏకీకరణ అత్యవసరం!
న్యూఢిల్లీ: త్రివిధ దళాలు, కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మిళితం చేసి ఒక ప్రత్యేక నావల్ థియేటర్ కమాండ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత నావికాదళం అధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి చెప్పారు. సముద్ర భద్రత (మారి టైమ్ సెక్యూరిటీ) అనేది ఇంధన భద్రత, జాతీయ భద్రతతో నేరుగా ముడిపడి ఉందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంఘర్షణను ఉదహరించారు. భారతదేశ సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నావల్ థియేటర్ కమాండ్ను ఏర్పాటు చేయా లని ప్రతిపాదించారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నావల్ కమాండ్ థియేటరైజేషన్ అనేది కేవలం సంస్థాగత పునర్నిర్మాణంపై మాత్రమే కాకుండా, కార్యాచరణ సామర్థ్యం, జాతీయ సైనిక సామర్థ్యం పెంపుదల ద్వారా జరగాలని తెలిపారు. వేర్వేరు సైనిక దళాల ఏకీకరణను ఒక భావనగా కాకుండా పోరాట అవసరంగా పరిగణించాలని సూచించారు. ఏదైనా కొత్త ఉమ్మడి నిర్మాణం అనేది విస్తృత జాతీయ లక్ష్యాలు సాధిస్తూనే సముద్ర భద్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అస్థిరత, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను ప్రస్తావించారు. సంఘర్షణకు దూరంగా ఉండటం అంటే దాని పరిణామాలకు దూరంగా ఉన్నట్లు కాదని పేర్కొన్నారు. మన సముద్ర తీరాలు, సరిహద్దులు భద్రంగా ఉంటేనే ఆర్థిక భద్రత, జాతీయ భద్రత సాధ్యమవుతుందని, ఇది చాలా ముఖ్యమైన పాఠమని స్పష్టంచేశారు. నౌకా మార్గాలు, ఇంధన సరఫరాలు, సముద్ర సరుకు రవాణా చైన్లకు కలిగే అంతరాయాలు తక్షణ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని అన్నారు. బీమా ఖర్చులు పెరిగిపోతాయని, నౌకా రవాణాకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. యుద్ధాల్లో విభజన తొలగిపోయిందినేడు మొత్తం యుద్ధ స్వరూపమే ఒక తీవ్రమైన పరివర్తనకు లోనవుతోందని అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి తెలిపారు. నేటి సముద్ర యుద్ధ క్షేత్రం సముద్రగర్భం నుండి అంతరిక్షం వరకు నిరాటంకంగా విస్తరించిందని అన్నారు. అదే సమయంలో సైబర్, విద్యుదయస్కాంత, సమాచార రంగాలు కూడా అంతే కీలకమైనవిగా మారాయని స్పష్టంచేశారు. ఆధునిక యుద్ధాన్ని దాని వేగం, స్థాయి ద్వారా ఎక్కువగా నిర్వచించే పరిస్థితి వచ్చిందన్నారు. వేగం అంటే ఇకపై ఒక ప్రత్యేక సామర్థ్యమని వ్యాఖ్యానించారు. స్వల్పకాలిక, వేగవంతమైన యుద్ధాలు అనే విభజన తొలగిపోయిందన్నారు. సుదూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఆయుధాలు, నిరంతర నిఘా అమల్లోకి వచ్చిన నేటి కాలంలో సంప్రదాయ యుద్ధరీతి ఇకపై రక్షణకు హామీ ఇవ్వదని అన్నారు. అంతేకాకుండా సుంకాలను ఆయుధంగా వాడటం, పరస్పర ఆధారిత సప్లై చైన్లకు అంతరాయాలు కలగడం వల్ల, దేశాలు తమ లాజిస్టిక్స్ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. అపూర్వమైన కార్యాచరణ వేగం భారత నావికాదళం ఆధునిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటోందని దినేశ్ కె.త్రిపాఠి తెలియజేశారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే’ బలగాన్ని నిర్మించేందుకు మానవరహిత వ్యవస్థల రోడ్మ్యాప్కు అనుగుణంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీలు, స్వయంప్రతిపత్తి పరిష్కా రాలను అనుసంధానిస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్ నౌకాదళం అత్యాధునిక సిబ్బందితో కూడిన ప్లాట్ఫామ్లతో పాటు తక్కువ ఖర్చుతో అధిక ప్రభావం చూపే మానవరహిత పరిష్కారాలపై దృష్టి పెట్టిందని గుర్తుచేశారు. పరస్పరం అనుసంధానమై, రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న సముద్ర భౌగోళిక పరిస్థితుల్లో భారత నౌకాదళం అపూర్వమైన కార్యాచరణ వేగాన్ని కొనసాగించిందని పేర్కొన్నారు. 2025లో దాదాపు 11,000 నౌకా దినాలు, 50,000 గంటలకు పైగా విమానయాన సమయాన్ని నమోదు చేసిందని చెప్పారు. గత ఏడాది నావికాదళం సాధించిన విజయాల్లో ఆపరేషన్ సింధూర్ చాలా ప్రధానమైనదని వివరించారు. ఇది మన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించిందని స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్ సందర్భంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సమన్వయం కూడా అంతే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. ఇది ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పిందని అన్నారు. -
స్వార్థం కోసం తప్పుడు కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.మూకుమ్మడి కేసులు సరికాదుఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలను వాడుకుంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.పావులుగా పిల్లలువైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేతభర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. -
సీబీఎస్ఈ టెండర్లో సంచలన ట్విస్టులు?
న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్.. డిజిటల్ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.12వ తరగతి విద్యార్థి సార్థక్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్గా మారినట్లు సమాచారం.అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.సీబీఎస్ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్పై వివాదం🔹 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్ (ప్రస్తుత కోయెంప్ట్ ఎడుటెక్)కు కాంట్రాక్ట్🔹 టెండర్ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్ఈ🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్కు టెండర్ దక్కినట్లు ఆరోపణలుసార్థక్ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్ నుంచి మూడో టెండర్కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్ విఫలమైతే సంస్థను భవిష్యత్లో బ్లాక్లిస్ట్ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు. జవాబు పత్రాల స్కానింగ్లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టెండర్ రూల్స్లో మార్పులు➡️ గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు➡️ సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు➡️ థర్డ్పార్టీ క్లౌడ్ హోస్టింగ్కు అనుమతి➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానంఇటీవల సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్లో వెలుగుచూసిన సైబర్ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్ నిర్వహించాలని, పార్లమెంట్లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.లేవనెత్తుతున్న ప్రశ్నలు❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది? This is an unbelievable piece of work by Sarthak and something that requires amplification. Let me explain what he found, in simple terms.Sarthak is a Class 12 student from the 2025-26 batch, one of the 17 lakh students whose answer sheets went through CBSE's new On-Screen… https://t.co/1wB5ZRx5qO— Malay Krishna (@Malay4Product) May 29, 2026అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్ఈ లేదా కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్ఈ టెండర్ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది. -
సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి!
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్పై సైబర్ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పేమెంట్ సిస్టమ్ హ్యాక్ కావడంతో.. కొంతసేపు అనధికారిక యాక్సెస్ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది సైబర్ దాడేంకాదని.. సాంకేతిక సమస్య మాత్రమేనని ఇటు అధికారులు అంటున్నారు.పోర్టల్ లైవ్ అయిన సమయంలో ఈ సమస్య తలెత్తగా.. సుమారు 50 మంది విద్యార్థులు సిస్టమ్లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు సమాచారం. దీంతో కొన్ని సందర్భాల్లో చెల్లించాల్సిన ఫీజు రూ.1 నుంచి ఏకంగా రూ.67,000–రూ.68,000 వరకు మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటన సంబంధిత బ్యాంక్ పేమెంట్ గేట్వేతో అనుసంధానమైన వ్యవస్థలో గ్లిచ్ కారణంగా(సిస్టమ్లో బగ్ వల్ల వచ్చిన ఇష్యూ) జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సిస్టమ్ను నిలిపివేసి సమస్యను సమీక్షించారు.ఈ వ్యవహారంపై ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బృందం కూడా దర్యాప్తు ప్రారంభించింది. పోర్టల్ కోడ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ను సమీక్షిస్తూ భద్రతను మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇకపై హెచ్డీఎఫ్సీతో పాటు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కూడా అదనపు పేమెంట్ గేట్వేలుగా అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. సిస్టమ్ను మరింత సురక్షితంగా, గ్లిచ్లేని విధంగా మార్చేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో జూన్లోనూ వడగాడ్పులు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో జూన్లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.‘మధ్య, వాయవ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం చాలా వరకు సాధారణంకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది’అని ఐఎండీ డీజీఎం మృత్యుంజయ్ మొహాపాత్ర శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం అధిక ఉష్ణోగ్రతల వల్ల మౌలిక సదుపాయాలు, వనరుల నిర్వహణ వ్యవస్థలపై అదనపు భారం పడే అవకాశాలున్నాయని, ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు అవసరమైన సన్నద్ధతా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రజారోగ్యం, నీటి లభ్యత, విద్యుత్ వినియోగం, నిత్యావసర సేవలపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో ఈసారి వర్షాలు తక్కువే.. దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.\అదే సమయంలో ఈశాన్య భారత్లో మాత్రం సాధారణ స్థాయిలో, వాయవ్య భారత్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ద్వీపకల్ప ప్రాంతాలు, తూర్పు–మధ్యభారత్ను ఆనుకొని ఉన్న ప్రాంతాలు, తూర్పు భారత్లోని కొన్నిచోట్ల సాధారణం నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం!: దేశంలోని ప్రధాన వర్షాధార వ్యవసాయ ప్రాంతాలను కలిగిన ‘మాన్సూన్ కోర్ జోన్’లోనూ ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. దీంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని అంచనా వేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయం, తాగునీటి లభ్యత, జలవిద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించింది. కరువు పరిస్థితులు, తాగునీటి కొరత వంటి సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. వడదెబ్బతో 10 మంది మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎర్రగుంటపల్లిలో మేస్త్రీ ఇంజపురి కనకయ్య (48), గంగిపల్లిలో రాచర్ల సంపత్ (55), మానాలలో ఉపాధి కూలీ ఎడిపెల్లి గంగారెడ్డి (60). పాపక్కపల్లిలో సామన్ వీరన్న (68), మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాలో బోడ భిక్రి (63), పెనుగొండలో సందా ఉపేందర్ (46), మర్రిమిట్టలో గుండమల్ల లచ్చమ్మ (68), జయశంకర్ భూపాలపల్లి జిల్లా అశిరెడ్డిపల్లిలో జెట్టి వీరమ్మ (104), హనుమకొండలోని లక్ష్మీపురంలో జనగాని అమృత (76), సంగారెడ్డి జిల్లా దెగుల్వాడిలో గ్రామ పంచాయతీ కారి్మకురాలు సంగీత (40) వడదెబ్బతో మృతి చెందారు. -
యూపీఎస్సీని చూసి నేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: మన యువతను ఎప్పుడూ నిరాశపర్చకూడదని సుప్రీంకోర్టు సూచించింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–యూజీలో అక్రమాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. నిజమైన జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించిన అసలు సమస్య పరిష్కారం కాదని వెల్లడించింది. నీట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు పదేపదే పునరావృతం కావడం వ్యవస్థాగత వైఫల్యమేనని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల విధానం గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్ వంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని గుర్తుచేసింది. యూపీఎస్సీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఎన్టీఏకు హితవు పలికింది. నీట్(యూజీ)లో అవకతవకల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని రద్దు చేసేలా లేదా ఆ సంస్థను పునర్వ్యవస్థీకరించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ అభ్యర్థుల ఆందోళనల పరిష్కారం పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. ప్రవేశ పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 21న జరగనున్న నీట్–యూజీ రీటెస్ట్ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షలో అక్రమాలు జరిగితే విద్యార్థులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా అది చాలా బాధాకరమైన విషయం అవుతుందని పేర్కొంది. వారు చాలా భావోద్వేగానికి గురవుతారని తెలిపింది. బాధ్యత ఎవరి భుజస్కంధాలపై ఉందో తెలిసినప్పుడే జవాబుదారీతనం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టంచేసింది. వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం: తుషార్ మెహతా పరీక్షల్లో అక్రమాలు జరగకుండా ఎక్కడో ఒకచోట ముగింపు పలకాల్సిందేనని తుషార్ మెహతా అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని గుర్తుచేశారు. ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని, పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు భవిష్యత్తులో ఎన్టీఏ పరీక్షల్లో పెన్ అండ్ పేపర్ విధానానికి బదులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానాన్ని అమలు చేయడంతో పాటు, సైబర్ భద్రతను పెంచుతున్నామని తెలిపారు. ఐఐటీ తదితర సంస్థల నుంచి నిపుణులను భాగస్వాములను చేసి వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు తుషార్ మెహతా వివరించారు. చాలా సంస్థలు తాత్కాలికమైనవి కావడమే అసలు సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక సంస్థలో అత్యుత్తమంగా పనిచేసే అధికారిపైనే అందరూ ఆధారపడతారని పేర్కొంది. దేశమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సామర్థ్యం అనేది సంస్థకు ఉండాలని సూచించింది. అందుకే సంస్థను గొప్పగా పనిచేసేలా తీర్చిదిద్దాలని ఉద్ఘాటించింది. సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయండి తాము మే 25వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుకు అనుగుణంగా ఎన్టీఏ డైరెక్టర్ (లీగల్) ఒక అఫిడవిట్ దాఖలు చేశారని ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ను క్షుణ్నంగా పరిశీలిస్తామని తెలియజేసింది. ఎన్టీఏలో సంస్కరణల కోసం ‘ఇస్రో’మాజీ చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసిన సిఫార్సుల అమలు, భవిష్యత్ కార్యాచరణను సూచిస్తూ కె.రాధాకృష్ణన్ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేశారని ధర్మాసనం వెల్లడించింది. ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహణ, ముగింపు ప్రక్రియను ఏవిధంగా పూర్తిచేస్తారో తెలియజేస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024 లేదా 2026 పరీక్షల వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు, ఎన్టీఏకే భౌతికంగా, మేధోపరంగా అవసరమైన వనరులు అందుబాటులో ఉండాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఆరు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. అలాగైతే సిఫార్సుల్లోనే లోపంసుప్రీంకోర్టులో విచారణకు డాక్టర్ కె.రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. స్టీరింగ్ కమిటీ సిఫార్సుల అమలును ఎంతవరకు పర్యవేక్షించారని ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. నీట్(యూజీ)లో వైఫల్యం ఎలా జరిగిందో చెప్పాలని సూచించింది. ఒకవేళ కమిటీ సిఫార్సు ఆధారంగా పర్యవేక్షణ జరిగినప్పటికీ, ఈ వైఫల్యం జరిగి ఉంటే.. అసలు సిఫార్సుల్లో లోపం ఉన్నట్లేనని అభిప్రాయపడింది. భవిష్యత్తులో తలెత్తబోయే పరిస్థితులను కమిటీ ఊహించలేకపోయినట్లే అవుతుందని తెలిపింది. రాధాకృష్ణన్ బదులిస్తూ.. ఇప్పటికే చాలా సిఫార్సులను అమలు చేయడం ప్రారంభమైందని అన్నారు. 2025లో నీట్(యూజీ)ని సంతృప్తికరంగా నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకటి రెండుసార్లు విద్యుత్ అంతరాయం మినహా ఎలాంటి తప్పిదాలు జరగలేదన్నారు.2027 నుంచి సీబీటీ విధానం నీట్(యూజీ) పరీక్షలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామని ఎన్టీఏ తెలియజేసింది. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్–యూజీని సీబీటీ విధానానికి మార్చాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిపింది. కేవలం ఈ ఏడాది మాత్రమే నీట్(యూజీ) ప్రధాన పరీక్షను పెన్, పేపర్(పీపీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మిగతా అన్ని ప్రధాన ఎన్టీఏ పరీక్షలను ఇప్పటికే సీబీటీ విధానంలో నిర్వహిస్తున్నట్లు గుర్తుచేసింది. -
సెక్స్ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం కోర్టు
మానవ అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం కేసుల విషయంలో దేశవ్యాప్తంగా సంచలన ప్రభావం చూపే కీలక మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేస్తున్న 18 ఏళ్లు నిండిన వారిని నేరస్తుల్లా చూడొద్దని, వారిపై పోలీసులు దాడులు చేయడం.. కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో మహిళలు, మైనర్ల అక్రమ రవాణా మాఫియాపై మాత్రం కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించింది.సెక్స్ వర్కర్ల హక్కులు, పునరావాసం, పోలీసుల వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు కల్పిస్తోందని, సెక్స్ వర్కర్లు కూడా అదే హక్కులకు అర్హులని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తి చేస్తున్న వయోజన మహిళలు, మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే అక్రమ రవాణా ముఠాలను ఒకేలా చూడకూడదని కోర్టు పేర్కొంది. సెక్స్ వర్క్ స్వచ్ఛందంగా చేస్తున్నారనే విషయం స్పష్టంగా ఉంటే వారిని వేధించడం, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని తెలిపింది. ఇకపై రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్ల ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు ఇవ్వొద్దని కూడా కోర్టు ఆదేశించింది. వారి గుర్తింపును బహిర్గతం చేయడం వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. మీడియా సంస్థలు కూడా బాధితుల వివరాలు, చిత్రాలు ప్రసారం చేయరాదని సూచించింది. ఈ మార్గదర్శకాలను శుక్రవారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ ధర్మాసనం చేసింది. మరో కీలక ఆదేశంగా.. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్ వర్కర్లకు వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల నుంచి వారు దూరమవుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.అదే సమయంలో మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే మాఫియా నెట్వర్క్లను అణచివేయాలని.. బాధితుల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. -
రిజర్వ్ తీర్పులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: “జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్”.. అంటే ఆలస్యమైన న్యాయం అనేది న్యాయం కాదనే సూత్రాన్ని మరోసారి గుర్తు చేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేసుల విచారణ పూర్తై తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత నెలలు, సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇకపై రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్టంగా మూడు నెలల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది.తీర్పుల ఆలస్యం కారణంగా ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయినా తీర్పు రాకపోవడంతో బాధితులు, పిటిషనర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ మార్గదర్శకాలను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.హైకోర్టుల్లో రిజర్వ్ చేసిన తీర్పులు చాలా కాలం వెలువడకపోవడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ముఖ్యంగా కొన్ని కేసుల్లో సంవత్సరాల పాటు తీర్పులు రాకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారం:రిజర్వ్ చేసిన తీర్పులను సాధ్యమైనంత త్వరగా, గరిష్టంగా మూడు నెలల్లో ప్రకటించాలిమూడు నెలలు దాటితే ఆ కేసు వివరాలను సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) దృష్టికి తీసుకెళ్లాలిపెండింగ్లో ఉన్న రిజర్వ్ తీర్పుల జాబితాను క్రమం తప్పకుండా పరిశీలించాలిఆలస్యమైన తీర్పులపై పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలిపూర్తి కారణాలతో కూడిన తీర్పు ఏడు రోజుల్లో అప్లోడ్ చేయాలి.ప్రత్యేక పరిస్థితుల్లో 15 రోజుల్లో తీర్పు అప్లోడ్ చేయాలి.బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే అధికారులకు తెలపాలి.బెయిల్ ఉత్తర్వులు రద్దు చేస్తే మరుసటి రోజే ప్రకటించాలి.ఖైదీల విడుదల సాధ్యమైనంత వరకు అదే రోజు లేకపోతే మరుసటి రోజు జరగాలి. కొన్ని హైకోర్టుల్లో తీర్పులు సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండటం “వ్యవస్థలోని తీవ్రమైన సమస్య”గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేసులో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి రెండేళ్ల పాటు తీర్పును రిజర్వ్లో ఉంచడాన్ని సుప్రీంకోర్టు “షాకింగ్”గా అభివర్ణించిన విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.న్యాయపరమైన జాప్యాలు2025 నాటికి, భారతదేశంలోని హైకోర్టులన్నింటిలో 60 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అలహాబాద్, పంజాబ్, హర్యానా, మద్రాస్ హైకోర్టులలో అత్యధికంగా కేసులు పేరుకుపోయాయి. తీర్పుల జాప్యం: జార్ఖండ్ హైకోర్టులో (ఈ తీర్పుకు దారితీసిన కేసు), అనేక తీర్పులు రిజర్వ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలకు పైగా ఆలస్యం కావడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది.బెయిల్ ఉత్తర్వులుభారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 70 శాతానికి పైగా విచారణలో ఉన్న ఖైదీలేనని ఎన్సీఆర్బీ గణాంకాలు చూపిస్తున్నాయి. బెయిల్ ప్రకటనలు, సమాచార మార్పిడిలో జాప్యం కారణంగా, వేలాది మంది అవసరమైన దానికంటే ఎక్కువ కాలం జైలులోనే ఉండిపోతున్నారు.అప్లోడ్ ఆలస్యంకొన్ని హైకోర్టులలో తీర్పులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి వారాల నుండి నెలల సమయం పడుతోందని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. ఇది పారదర్శకతను అందుబాటును పరిమితం చేస్తుంది. వేగవంతమైన బెయిల్సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానంగా అదే రోజు బెయిల్ ప్రకటనలు, సమాచార మార్పిడి జైళ్లలో రద్దీని తగ్గిస్తాయి విచారణలో ఉన్న ఖైదీల హక్కులను కాపాడతాయి.పారదర్శకత24 గంటలలోపు తీర్పులను అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలకు అందుబాటును కల్పించి, అనిశ్చితిని తగ్గిస్తుంది. జవాబుదారీతనం: 3 నెలలలోపు తీర్పులు వెలువడకపోతే రిజిస్ట్రార్ జనరల్స్ కేసులను ఉన్నతాధికారులకు నివేదించాలి, తద్వారా అంతర్గత తనిఖీలు ఏర్పడతాయి.జవాబుదారీతనం3 నెలల్లోగా తీర్పులు వెలువడకపోతే రిజిస్ట్రార్ జనరల్స్ కేసులను ఉన్నతాధికారులకు నివేదించాలి, తద్వారా అంతర్గత తనిఖీలు ఏర్పడతాయి. ఫలితంగా పౌరులకు త్వరితగతిన న్యాయం లభిస్తుంది, తద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.సవాళ్లు, పనిభారం, ఒత్తిడిన్యాయమూర్తులు వేగాన్ని, వాదనల నాణ్యతను సమతుల్యం చేసుకోవాలి. మౌలిక సదుపాయాల అవసరాలు24 గంటలూ అప్లోడ్లు జరిగేలా చూసేందుకు హైకోర్టులకు మరింత పటిష్టమైన ఐటీ వ్యవస్థలు అవసరం. అన్ని హైకోర్టులలో గడువుల పాటింపును పర్యవేక్షించడానికి యంత్రాంగాలు ఉండాలి.రాష్ట్రాల వారీగా వ్యత్యాసంఎక్కువ కేసుల భారం ఉన్న పెద్ద హైకోర్టులు (ఉదాహరణకు, అలహాబాద్) చిన్న వాటి కంటే ఎక్కువగా ఇబ్బంది పడవచ్చు. -
వామ్మో.. అలాంటి గాలి పీలుస్తున్నామా?
విశాఖ నగరవాసులు తమకు తెలియకుండానే ప్రమాదకర వాతావరణంలో జీవిస్తున్నారా? రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత నగరాన్ని నెమ్మదిగా “పాల్యూషన్ హాట్స్పాట్”గా మారుస్తోందా? అసలు ప్రజలు పీలుస్తున్న గాలి నిజంగానే సురక్షితమేనా? తాజాగా వెలువడిన ఒక నివేదిక ఈ ప్రశ్నలకు ఆందోళనకర సమాధానాలు ఇచ్చింది. విశాఖ ప్రజలు దాదాపు ప్రతి 10 రోజుల్లో 7 రోజులు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.“రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సంస్థ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో గత మూడు సంవత్సరాలుగా వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మానిటరింగ్ స్టేషన్ ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం.. 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 70.68 శాతం రోజుల్లో PM10 స్థాయులు భారత జాతీయ భద్రతా పరిమితిని మించిపోయాయి.PM10.. పీఎంఅంటే గాలిలో తేలే సూక్ష్మ ధూళి కణాలు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో గత రెండేళ్లలో నైట్రోజన్ డైఆక్సైడ్ (NO2) స్థాయిలు 34 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాల వల్లే ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.నివేదికలో మరింత షాకింగ్ అంశం ఏమిటంటే.. 2026లో PM10 వార్షిక సగటు 139.59 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్గా నమోదైంది. ఇది జాతీయ ప్రమాణాల కంటే రెండింతలకు పైగా అధికం. అంతేకాదు, జీవీఎం కార్పొరేషన్ మానిటరింగ్ స్టేషన్ పరిధి వరుసగా మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా నమోదవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా కూడా పరిస్థితి మెరుగ్గా లేదని నివేదిక పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్లో PM10 సగటు 67 µg/m³ ఉండగా, 2026 నాటికి అది 84 µg/m³కు పెరిగింది. PM2.5 స్థాయిలు కూడా 33 శాతం పెరిగి జాతీయ పరిమితులను దాటాయి. ముఖ్యంగా చలికాలంలో కాలుష్యం మరింత తీవ్రంగా నమోదైంది. 2025 డిసెంబర్, 2026 జనవరిలో PM10 స్థాయులు 100 µg/m³ దాటినట్లు అధ్యయనం వెల్లడించింది.ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా పరిశ్రమల ఉద్గారాలు, పోర్ట్ కార్యకలాపాలు, రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లు, పెరుగుతున్న వాహన రద్దీని నివేదిక స్పష్టంగా గుర్తించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీతో పాటు పరిశ్రమల దహన ప్రక్రియల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు విశ్లేషణ చెబుతోంది.ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారిపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం పరిశ్రమలపై కఠిన నియంత్రణలు, హైపర్లోకల్ ఎమిషన్ మ్యాపింగ్, మరిన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, రియల్టైమ్ హాట్స్పాట్ రిపోర్టింగ్ వ్యవస్థలను వెంటనే అమలు చేయాలని “రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సూచించింది. -
కేసు క్లోజర్ రిపోర్టు ఇచ్చాక.. తదుపరి దర్యాప్తునకు కోర్టు అనుమతి తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ఒక కేసులో ఆధా రాలు లేవంటూ పోలీసులు క్లోజర్ రిపోర్టు ఇచ్చిన తర్వాత, అదే కేసుపై తదుపరి దర్యా ప్తు చేపట్టాలంటే మేజిస్ట్రేట్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మూసేసిన కేసులో మేజి స్ట్రేట్ నుంచి ఎక్స్ప్రెస్ పర్మిషన్ తీసుకో కుండా తదుపరి దర్యాప్తు కొనసాగించడం చెల్లదని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో పోలీసులకు గల దర్యాప్తు అధికా రాల విషయంలో ఈ తీర్పును అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. గురువారం ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. పిటిషనర్ పళనిస్వామి వీరరాజాకు ఊరట కల్పించింది. సీఆర్పీసీ సెక్షన్ 173(8) ప్రకారం తదుపరి దర్యా ప్తునకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరంలేదని కర్ణాటక హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వి.మోహన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చట్టంలో నేరుగా పేర్కొనకపోయినా, కోర్టు అనుమతితోనే తదుపరి దర్యాప్తు జరగాలనే నిబంధన ఉన్న విషయం తెలుసుకోవాలన విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం ఏకీభవించింది. ‘చట్టంలో ఎక్స్ప్రెస్ పర్మిషన్ అవసరమని లేకపోయినా, న్యాయ పరిణామ క్రమంలో సంబంధిత మేజిస్ట్రేట్ నుంచి అనుమతి కోరడం ఒక అవసరంగా రూపుదిద్దు కుంది’అంటూ స్పష్టం చేసింది. ‘రామ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్, (2013) 5 ఎస్సీసీ 762, వినయ్ త్యాగి వర్సెస్ ఇర్షాద్ (2013) 5 ఎస్సీసీ 762, పీతాంబరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(2023), ఎస్సీసీ 402, రాబర్ట్ లాల్చుంగ్నుంగా చోంగ్తూ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ (2025) కేసులను ధర్మాసనం గుర్తుచేసింది. ‘కోర్టు అనుమతి కోరడం, సప్లిమెంటరీ రిపోర్టు దాఖలు చేయడం అనే అవసరాన్ని సెక్షన్ 173(8) నిబంధనల్లో చదువు కోవాలి. ఇది తప్పనిసరి’అంటూ వినయ్ త్యాగి కేసులోని తీర్పును ధర్మాసనం ఉటంకించింది. ‘ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని మళ్లీ దర్యాప్తు పేరుతో వేధించకుండా ఈ తీర్పు అడ్డుకుంటుంది. కేసుపై కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇది పౌరులకు రక్షణ వంటిది’అని ధర్మాసనం వివరించింది. ఒకసారి కేసు మూసేశాక, మేజిస్ట్రేట్కు తెలియకుండా పోలీసులు మళ్లీ దర్యాప్తు చేయలేరని స్పష్టంగా ప్రకటించింది. -
భారత్ సహా ఆ 3 దేశాల పిలుపుపై ఉ.కొరియా ఘాటు వ్యాఖ్యలు
ప్యాంగ్యాంగ్: క్వాడ్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఉత్తర కొరియా గురువారం ఖండించింది. సంపూర్ణ అణు నిరాయుధీకరణ చేపట్టాలని క్వాడ్ దేశాలు ఆ ప్రకటనలో కోరగా తమ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎప్పటికీ విడిచిపెట్టబోమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ ఈ విషయాన్ని వెల్లడించింది.భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ‘క్వాడ్’ కూటమి ఇటీవల సమావేశం జరిపిన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై తమ వైఖరిని మరోసారి ప్రకటించారు.దీనికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా విదేశాంగ శాఖ.. క్వాడ్ ప్యాంగ్యాంగ్ సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అలాగే, ఈ తీరు “అమెరికా ఏకపక్ష ఆధిపత్య లక్ష్యాల సాధనకు ఉపయోగపడే రాజకీయ, దౌత్య సాధనం మాత్రమే” అని విమర్శించింది.“డీపీఆర్కే(డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) అణు నిరాయుధీకరణ ఎప్పటికీ చేయదని మేము మరోసారి చెబుతున్నాం” అని ఆ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా నేతృత్వంలోని క్వాడ్ తమ దేశంపై తీసుకున్న వైఖరిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఉత్తరకొరియా తెలిపింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఘర్షణాత్మక చర్యలను నిలిపివేయాలని క్వాడ్ కూటమిని గట్టిగా కోరింది.విధ్వంసకర ఆయుధాలు వద్దు మంగళవారం విడుదలైన క్వాడ్ విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటనలో... “సంబంధిత యూఎన్ఎస్సీఆర్లకు అనుగుణంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై మా వైఖరిని మళ్లీ తెలియజేస్తున్నాం. సంబంధిత యూఎన్ఎస్సీఆర్ల కింద ఉన్న అన్ని బాధ్యతలను ఉత్తర కొరియా పాటించాలని కోరుతున్నాం” అని పేర్కొన్నారు. యూఎన్ఎస్సీఆర్ అంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు.“ఉత్తర కొరియా అక్రమ బాలిస్టిక్ క్షిపణులు, విధ్వంసకర ఆయుధాల అభివృద్ధిని మేము ఖండిస్తున్నాం. ఉత్తర కొరియా సైబర్ కార్యకలాపాలు, ఐటీ కార్మిక చర్యలపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇవి ఉత్తర కొరియా అక్రమ సామూహిక విధ్వంస ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నాయి. ఉత్తర కొరియాకు సంబంధించిన యూఎన్ఎస్సీఆర్ల ఉల్లంఘనలను ఎదుర్కొనే చర్యలకు మద్దతు కొనసాగిస్తాం. ఉత్తర కొరియాకు ఆయుధాలు, సంబంధిత సామగ్రి బదిలీ చేయడం లేదా అక్కడి నుంచి కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధం సహా, యూఎన్ఎస్సీఆర్ల కింద ఉన్న అంతర్జాతీయ బాధ్యతలను అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు అమలు చేయాలి” అని క్వాడ్ దేశాల విదేశాంగ మంతత్రులు కోరారు. -
సర్ చట్టబద్ధమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఓటరు జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఇది జీవ నాడి వంటిదని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా బిహార్, బెంగాల్లలో చేపట్టిన సర్పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును ఎన్నికల కమిషన్ సాధించిన ఘన విజయంగా భావిస్తున్నారు. సర్ ప్రజాప్రాతినిధ్య చట్టం–1960లోని నిబంధనలకు ఏమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత ఓటరు జాబితా కచ్చితత్వంపైనే ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియను కేవలం పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం చేపట్టినట్లుగా తాము నిర్థారించలేకపోతున్నామని తెలిపింది. ఎన్నికల కమిషన్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించిందనే వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం..ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలన్న రాజ్యాంగం నిబంధనలకు సర్ ప్రాణం పోస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, ఓటరు జాబితా సవరణ ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరుల పిటిషన్లపై జనవరిలో విచారణ ముగించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం 124 పేజీల సవివర తీర్పు వెలువరించింది. జాబితా ప్రక్షాళన ఈసీ అధికారమే ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత, దానిపై మళ్లీ కొత్తగా విచారణ జరిపి పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జాబితా సవరణ పేరుతో ఈసీ చేపట్టిన తొలగింపులు నిబంధన 21ఏకు విరుద్ధమని వారన్నారు. అలాగే, ఓటరు నమోదు, ధ్రువీకరణలకు సంబంధించి పత్రాల పరిశీలన కోసం ఈసీ విధించిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, వీటి కారణంగా ఎందరో ఓటు హక్కును కోల్పోతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది. ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక గుర్తింపే అయినప్పటికీ, దాన్ని మళ్లీ పరిశీలించకూడదన్న నియమం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను, ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచేందుకు ఇలాంటి సవరణలు (ఎస్ఐఆర్) చేపట్టే పూర్తి అధికారం ఈసీకి ఉంటుందని వ్యాఖ్యానించింది. పత్రాల పరిశీలనకు ఈసీ విధించిన నిబంధనలు పరీక్షకు నిలబడతాయని, అవి పూర్తిగా సహేతుకమైనవేనని తెలిపింది. అయితే, ఒక వ్యక్తి పౌరసత్వంపై ఈసీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేయగలదని, పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఆ సంస్థకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ తీసుకునే నిర్ణయం కేవలం ఎన్నికల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, పౌరసత్వ చట్టం కింద సదరు వ్యక్తులు తమ హక్కులు కోల్పోయినట్లు భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనుమానిత కేసులన్నీ అథారిటీకేసర్లో ముందుగా ఈసీ నోటీసులిచ్చి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకునే విధానాన్ని పాటించినందున ఈ ప్రక్రియ చట్టబద్ధంగా అమలైందని ధర్మాసనం తుది తీర్పులో పేర్కొంది. అయితే, 2003 జాబితా నుంచి భారత పౌరులు కారు అనే కారణంతో తొలగింపునకు గురైన వారి కేసులన్నిటినీ నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం–1955 కింద ఏర్పాటు చేసిన ‘కాంపిటెంట్ అథారిటీ’కి తప్పనిసరిగా పంపాలని ఆదేశించింది. ఆ అథారిటీ చట్టబద్ధంగా విచారణ జరిపి వారు భారత పౌరులే అని తేల్చితే, ఆ పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. మరణించినవారు, వలస వెళ్లిన వారు లేదా నకిలీలు అనే కారణాలతో పొరపాటున జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయ సమీక్ష ద్వారా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా ఉందని ధర్మాసనం వివరించింది. పౌరసత్వానికి ఆధార్ ధ్రువీకరణ కాదుసర్ కోసం ఎన్నికల కమిషన్ అమలు చేసిన ధ్రువీకరణ పత్రాల విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల సంఘం అనుమతిస్తున్న డాక్యుమెంటేషన్ ప్రమాణాలపై అభ్యంతరాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓటర్ల జాబితాల తయారీ ఒక యాంత్రిక ప్రక్రియ కాదు, అదొక ప్రాథమిక రాజ్యాంగబద్ధమైన విధి అని తీర్పు నొక్కి చెప్పింది. నివాసం, అర్హత వంటి చట్టబద్ధమైన నిబంధనల నిర్ధారించే హక్కు ఈసీకి ఉందని పేర్కొంది. అదేవిధంగా, ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని కూడా తెలిపింది. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) చట్టం ప్రకారం ఆ కార్డును పౌరసత్వానికి, స్థానికతకు నిరూపణగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటు హక్కుకు అవసరమైన చట్టబద్ధ అర్హతగా దీనిని పరిగణించకపోవడంలో ఈసీ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ఒక వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఆధార్ను ఉపయోగించాలని తెలిపింది. ఓటర్ల ముమ్మర సర్వే కోసం నిర్దేశించిన పత్రాల జాబితా నుంచి రేషన్ కార్డులను మినహాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. సర్ ప్రక్రియకు అనుగుణంగా రేషన్ కార్డుల స్థానంలో మరింత విశ్వసనీయమైన పత్రాలను కోరడం, కొన్ని రకాల పత్రాలను మార్చడం వంటి విచక్షణాధికారాలు ఈసీకి ఉన్నాయని తీర్పులో పేర్కొంది.తీర్పు ముఖ్యాంశాలు→ బిహార్లో చేపట్టిన సర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం–1960 నిబంధనలకు విరుద్ధంగా లేదు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిబంధనలకు భంగం కలిగించడం లేదు. → ప్రస్తుతం నిర్వహించిన సర్ ప్రక్రియ, చట్ట పరమైన అవసరాలకు అనుగుణంగానే ఉంది. సాధించాల్సిన లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు ఉన్నాయి. ఇవి హేతుబద్ధమైనవి. ఏకపక్షంగా ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా నిరోధించడానికి తగు రక్షణ విధానాలు ఇందులో ఉన్నాయి. → ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకే కొన్ని రకాల పత్రాల వర్గీకరణ, కొన్ని వర్గాల పత్రాల మినహాయింపు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయించారు. → ఓటర్ల జాబితాలో చేర్చడానికి కావలసిన అర్హతను నిర్ధారించే క్రమంలో పౌరసత్వంపై పరిమితమైన విచారణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది. అయితే, ఇటువంటి విచారణ పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ధారించే ప్రక్రియ మాత్రం కాదు. → ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన వారు తమ ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం పరిధిలోని సంబంధిత అథారిటీకి ఎన్నికల సంఘం రిఫర్ చేయాలి. → ఆయా కేసులపై సంబంధిత అథారిటీ చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి. వీలైతే తదుపరి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ముందుగా జరిగితే దానికి ముందే నిర్ణయం ప్రకటించాలి. అలాగే, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినడానికి తగిన అవకాశం కల్పించాలి. → ఒకవేళ సదరు అథారిటీ విచారణ తర్వాత తొలగింపునకు గురైన వారు భారత పౌరులేనని తేలితే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎవరు ఓటేయాలో నిర్ణయించేది బీజేపీయే: యోగేందర్ యాదవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లలో ఒకరైన యోగేందర్ యాదవ్ స్పందించారు. తీర్పు తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇలాంటి తీర్పు వస్తుందని తాను ముందే ఊహించానన్నారు. అందుకే, తీర్పు సమయానికి తాను కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. సర్ రాజ్యాంగబద్ధతను పరిశీలించడం వదిలేసి, ఫిర్యాదుల పరిష్కారం, మధ్యవర్తిత్వంపైనే న్యాయస్థానం దృష్టి సారించినప్పుడే తనకీ విషయం అర్థమైందని చెప్పారు. ఇకపై ఎవరు ఓటేయాలో, ఎవరు ఓటేయ కూడదో నిర్ణయించేది బీజేపీనంటూ ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. అసలు వాస్తవమేమంటే.. ఈ తీర్పు లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును రద్దు చేయడానికి అనుమతి ఇవ్వడం. ఇప్పటివరకు కనీసం 5.9 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయారు. ఇది మున్ముందు 10 కోట్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.సుప్రీం తీర్పుతో సమాధానాలకు మించి ప్రశ్నలు: కాంగ్రెస్ సర్కు రాజ్యాంగబద్ధతను కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పుతో తాము గౌరవప్రదంగా ఏకీభవించడం లేదని తెలిపింది. ‘సర్కు అనుమతి ప్రాథమికంగా ఒక చట్టబద్ధతను చేకూర్చవచ్చు. కానీ, దాని అమలులోని దురుద్దేశాన్ని ఎంతమాత్రం సరిదిద్దలేదు’అని పేర్కొంది. సర్ ప్రక్రియను ఈసీ అమలు చేసిన తీరుపై తాము లేవనెత్తిన అనేక ప్రశ్నలను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపింది. పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు ఈసీకి లేదని ఈ తీర్పు స్పష్టం చేసినప్పటికీ ఈసీ ఇప్పటికే పౌరసత్వం ప్రాతిపదికన ప్రజలను ఓటర్ల జాబితా నుంచి మినహాయించడం పరస్పర విరుద్ధం కాదా? అని ప్రశ్నించింది. -
సీబీఎస్ఈ అక్రమాలపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్–స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) వ్వవస్థలో అక్రమాలపై స్వతంత్ర జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణంలో నిజాలను బహిర్గతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) సైతం నియమించాలని అన్నారు. తెలంగాణలో వివాదాస్పద నేపథ్యం ఉన్న ఒక సంస్థకు సీబీఎస్ఈ ఈ ఓఎస్ఎం కాంట్రాక్టును అప్పగించిందని ఆరోపించారు. సీబీఎస్ఈ తీరు వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని చెప్పారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరుమెదపడం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఎక్స్లో పోస్టు చేశారు. 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షకు సంబంధించి నమ్మశక్యంకాని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. ఈ పరీక్షకు ఓఎస్ఎం చేసిన కోంపెంట్ ఎడ్యుటెక్ అనే కంపెనీ అసలు పేరు గ్లోబరెనా అని తెలిపారు. ఈ గ్లోబరెనా ఇంతకుముందు తెలంగాణలో 2019, 2023లో స్కామ్కు పాల్పడిందిన్నారు. తెలంగాణలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఓఎస్ఎం ఆధారిత లోపాలే కారణమని తేల్చిచెప్పారు. మళ్లీ అదే కోంపెంట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఖండించిన సీబీఎస్ఈ కోంపెంట్ ఎడ్యుటెక్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సీబీఎస్ఈ బుధవారం ఖండించింది. అందులో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొంది. ఓఎస్ఎం కాంట్రాక్టును కోంపెంట్కు ఇచ్చిన మాట నిజమేనని వెల్లడించింది. అయితే, రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టును కట్టబెట్టామని తేల్చిచెప్పింది. రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది. -
‘సరిహద్దు’లో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల సమీపంలో అక్రమ నిర్మాణాలపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో వెలసిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని సూచించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించిన భద్రతా సమస్యలను ఆయన సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని సంస్థలు బ్యాంకుల బ్యాంకింగ్ లావాదేవీల్లో చట్టబద్ధ, ఆర్థిక నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. పెద్ద వ్యాపార సంస్థలను ధృవీకరించడం, వాటి నిధుల మూలాలను పరిశీలించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులను గుర్తించడం, సరిహద్దు స్మగ్లింగ్ను నియంత్రించడం వంటి బాధ్యతలను జిల్లా మేజి స్ట్రేట్లకు అప్పగించారు. నేరాలు, మాదకద్రవ్యాల బెడద వెనుక ఉన్న మూలాలు, తీరు, నెట్వర్క్లపై లోతైన అధ్యయనం చేయాలని, భవిష్యత్తులో ఈ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని సరిహద్దు జిల్లాలను ఆదేశించారు. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. చొరబాటు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి, సరిహద్దు నిర్వహణ కోసం బీఎస్ఎఫ్, సీబీడీటీ, ఎన్సీబీ, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమన్వయ విధానం రూపొందించాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలు అయ్యేలా చూడాలని షా ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ‘1930’ కాల్ సెంటర్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
సీబీఎస్ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో 9,10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. కేంద్రం, ఎన్సీఈఆర్టీ( NCERT)కి నోటీసులు ఇచ్చింది.ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మల్య బాగ్చీ, విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.అయితే, 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్ పరీక్ష కూడా నిర్వహించారు.ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకం 2031 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. రూ.80 కోట్ల మంది ప్రజలకు రేషన్ సరఫరా అవుతుంది. ఈ పథకాన్ని అంబ్రెలా స్కీమ్గా కొనసాగించనున్నారు. ఆహార భద్రతా చట్టం కింద రేషన్ సరఫరా జరుగుతుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా, నిర్వహణ ఖర్చులు, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర సహాయ నిధుల విధానాన్ని కొనసాగించనున్నారు.ఈ పథకం కింద ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు పథకాలను ఏకీకృతం చేశారు. వాటిలో ఒకటి జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర సంస్థలకు ఆహార ధాన్యాల రవాణా, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ సహాయం. రెండోది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లో సాంకేతిక ఆధునికీకరణ, సంస్కరణల పథకం.సార్థక్-పీడీఎస్ పథకం లక్ష్యాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్కు స్థిర ఆర్థిక సహాయం అందించడం ఒకటి. ప్రజలకు చివరి దశ వరకు సేవలు సమర్థంగా చేరేలా, లీకేజీలు తగ్గేలా, ఆహార భద్రత బలోపేతం అయ్యేలా సమగ్ర, ప్రజాకేంద్రీకృత, సమన్వయ పీడీఎస్ వ్యవస్థను నిర్మించడం రెండోది.సార్థక్-పీడీఎస్ పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బ్లాక్చైన్ వంటి ఆధునిక సాంకేతికతలతో పీడీఎస్ కార్యకలాపాలను ఆధునికీకరించనున్నారు.రియల్టైమ్ పర్యవేక్షణ, కృత్రిమ మేధస్సు ఆధారిత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు, విశ్లేషణ వ్యవస్థలు, డేటా ఆధారిత పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రక్రియలతో పీడీఎస్లో పారదర్శకత, భద్రత, స్థిరత్వం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.దేశ ప్రజలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించి ఆహార, పోషక భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ సామాజిక, చట్టబద్ధ బాధ్యత అని కేంద్రం తెలిపింది. గత దశాబ్దంలో టీపీడీఎస్ పూర్తి కంప్యూటరీకరణ, ఐఎం-పీడీఎస్, స్మార్ట్ పీడీఎస్ వంటి డిజిటల్ కార్యక్రమాలను కేంద్రం అమలు చేసింది. “మేరా రేషన్”, “అన్న మిత్ర”, “రైట్ఫుల్ టార్గెటింగ్ డ్యాష్బోర్డ్”, “అన్న సహాయత” వంటి ప్రజా సేవా యాప్లను కూడా ప్రవేశపెట్టింది. 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్న స్మార్ట్ పీడీఎస్ పథకం ద్వారా రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈ-పీఓఎస్ ద్వారా ఫెయిర్ ప్రైస్ షాప్ల ఆటోమేషన్, ఆన్లైన్ కేటాయింపులు, కంప్యూటరీకృత సరఫరా వ్యవస్థలు 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లోకి వచ్చాయి.కాగా, దేశంలో కొనసాగుతున్న తీవ్ర వడగాలులపై క్యాబినెట్లో చర్చించారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
హైడ్రోజన్ రైలుకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర రైల్వే జోన్ పరిధిలోని జింద్–సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించనుంది. డీజిల్, విద్యుత్ ద్వారా కాకుండా హైడ్రోజన్ బ్యాటరీల నుంచి అందే శక్తితో ఇది నడుస్తుంది.భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి మూడు నెలల పాటు నిపుణులైన సిబ్బంది రైలులోనే అందుబాటులో ఉంటారని రైల్వే శాఖ తెలిపింది. అయితే, రైల్వే శాఖ అనుమతితో ఈ రైలు వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. పలు నిబంధనల అమలు ప్రక్రియలు, ధ్రువీకరణ దశలను దాటాల్సి ఉందని వివరించారు.హైడ్రోజన్ రైలు నడిచేదిలా..సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్తో కలిసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.చదవండి: కేంద్రం నిర్ణయంపై అన్నామలై అభ్యంతరందేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్ను గతేడాది జూలైలో చెన్నైలోని ఐసీఎఫ్ వద్ద రైల్వే శాఖ విజయవంతంగా పరీక్షించింది. భారత్ 1,200 HP పేరుతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు పనితీరును కూడా పరీక్షించేందుకు తాజాగా సిద్ధమైంది రైల్వే శాఖ. హైడ్రోజన్ రైలు అందుబాటులో వస్తే కాలుష్యం తగ్గడంతో పాటు భారతీయ రైల్వే టెక్నాలజీ పరంగా మరో మైలురాయిని అందుకుంటుంది. -
విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కేరళం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత పినరయి విజయన్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆకస్మిక తనీఖీలకు దిగింది. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నట్లు ఏఎన్ఐ సంస్థ ఓ కథనం ఇచ్చింది. ఈ సోదాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం కూడా ఉందని ఆ కథనం పేర్కొంది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో.. పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. విజయన్ కుమార్తె వీణ అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఏంటీ సీఎంఆర్ఎల్ కేసు?కేరళ రాజకీయాల్లో ఇటీవల తరచూ చర్చకు వచ్చిన అంశాల్లో సీఎంఆర్ఎల్ కేసు ఒకటి. కొచిన్ మినలర్స్ అండ్ రూటిలె లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత, సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఈ చెల్లింపులు ప్రధానంగా కన్సల్టెన్సీ/సర్వీస్ ఫీజుల పేరుతో జరిగినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ సేవలు నిజంగా అందించబడ్డాయా? లేదా? అనేది ప్రధాన వివాదాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ, మీడియా వర్గాలు ఈ లావాదేవీలపై ప్రశ్నలు లేవనెత్తాయి.విజయన్ కూతురి పేరుతో..ఈ వివాదంలో ముఖ్యంగా వీణా విజయన్కు సంబంధించిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ (Exalogic Solutions) అనే సంస్థ పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి ప్రతిపక్ష పార్టీలు విజయన్ సర్కార్పై విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలను వీణా విజయన్ ఇప్పటికే ఖండించారు. తమపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరితమని, అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నాడు అధికార పక్షంగా ఉన్న విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈ ఆరోపణలను రాజకీయ దాడిగా అభివర్ణించింది. ప్రతిపక్షాలు మాత్రం అవినీతి అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్ని తమ ఆయుధంగా యూడీఎఫ్ మల్చుకుంది. అలా విజయన్ ఓటమిలో ఈ ఆరోపణలు కూడా ఓ భాగం కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ కేసులో కోర్టు స్థాయిలో(హైకోర్టులో విచారణ దశలో ఉంది) నేరం నిర్ధారణ కాలేదు. అయితే ఈడీ సోదాల నేపథ్యంలో ఈ కేసు మరోసారి ప్రాముఖ్యతను సంతరించుకుంది. -
ప్రధానిగా మోదీకి 12 ఏళ్లు పూర్తి
న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఆయన సరిగ్గా 12 సంవత్సరాల క్రితం.. 2014 మే 26వ తేదీన తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారంతో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ నేతలు అభినందనలు తెలియజేశారు. మోదీ పదవీకాలాన్ని భారతదేశం తిరిగి ఆత్మవిశ్వాసం వైపు పయనించడంగా, సాంస్కృతిక పునరుజ్జీవనంగా అభివర్ణించారు. మోదీ వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ 140 కోట్ల మంది తోటి పౌరులకు సేవ చేయడానికే ప్రతి క్షణాన్ని అంకితం చేశారని, ఈ సంకల్పాన్నే జీవితానికి మార్గదర్శక సూత్రంగా చేసుకున్నారని బీజేపీ పేర్కొంది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. -
ఖనిజ సహకారంతో చైనాకు చెక్!
న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి నాలుగు దేశాల క్వాడ్ కూటమి ‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ప్రారంభించింది. అరుదైన ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 20 బిలియన్ డాలర్ల (1.91 లక్షల కోట్లు) వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రాంతంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని క్వాడ్ విదేశాంగ మంత్రులు తీర్మానించారు.అలాగే ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మొతేగి పాల్గొన్నారు. నాలుగు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ఖరారు చేశారు. సమావేశం అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దేశాలు తమ సొంత మార్గాలను నిర్ణయించుకోవడానికి, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్కు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, నిర్దిష్టమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అక్కడ ఏకపక్ష చర్యలు వద్దు హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ వాణిజ్యం నిరాటంకంగా సాగాలని విదేశాంగ మంత్రులు స్పష్టంచేశారు. అక్కడ వాణిజ్య నౌకలపై ఇరాన్ సుంకాలు విధించడాన్ని తప్పుపట్టారు. అలాగే తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే, బలప్రయోగంతో అస్థిరపరిచే లేదా ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.చైనా తీరుపై మండిపడ్డారు. సముద్ర వనరుల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు పదేపదే ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మానుకోవాలని చైనాకు తేల్చిచెప్పారు. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని భగ్నం చేసే చర్యలు మానుకోవాలని చైనాను పరోక్షంగా హెచ్చరించారు. చట్టాలను పాటించాల్సిందే: జైశంకర్ క్వాడ్ ఎజెండాలో భాగంగా కీలక, అరుదైన ఖనిజాల ఒప్పందం, ఇండో–పసిఫిక్ ఇంధన భద్రతా కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చర్చలు, ద్వైపాక్షిక సంప్రదింపుల్లో ఎక్కువ భాగం ప్రపంచ ప్రస్తుత పరిస్థితిపైనే జరిగాయని చెప్పారు. సహజంగానే, చర్చల ప్రధాన ఉద్దేశం ఇండో–పసిఫిక్కు సంబంధించిన అంశాలేనని అన్నారు.సురక్షితమైన, నిరాటంకమైన సముద్ర వాణిజ్యంపై చర్చించామని, ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్కు అనేక కోణాలు, పార్శా్వలు ఉన్నాయని, వాటిలో సాధించిన పురోగతిని క్వాడ్ సమావేశం సమీక్షించిందని జైశంకర్ ఉద్ఘాటించారు. నాలుగు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని, సప్లై చైన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. సముద్ర భద్రతకు చర్యలు: రూబియో ఇండో–పసిఫిక్ సముద్ర నిఘా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్వాడ్ సమావేశం నిర్ణయించిందని మార్కో రూబియో తెలిపారు. ఇది ఇండో–పసిఫిక్లో మన నాలుగు దేశాల సముద్ర నిఘా సామర్థ్యాలను వినియోగించుకుంటుందని అన్నారు. క్వాడ్ దేశాల మధ్య ఇండో–పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి క్వాడ్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60 శాతం ఇండో–పసిఫిక్ గుండానే సాగుతోందని గుర్తుచేశారు. అందుకే సముద్ర భద్రతకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు: చైనా బీజింగ్: క్వాడ్పై తన అక్కసును చైనా మరోసారి వెళ్లగక్కింది. కొన్నిదేశాలు కలిసి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం, ఇతర దేశాలతో ఘర్షణలకు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంగళవారం పేర్కొంది. క్వాడ్ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడాలని అన్నారు. అంతేతప్ప మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. కూటముల పేరిట మరో దేశంతో ఘర్షణ పడొద్దని చెప్పారు. -
ముస్లిం సంఘాలకు సీఎం హిమంత కృతజ్ఞతలు
డిస్పూర్: ఇస్లాం మత ఆచారం ప్రకారం బక్రీద్ రోజున ప్రత్యేక నమాజ్ అనంతరం జంతువులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వారం జరగనున్న బక్రీద్లో గోమాతను బలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు తీర్మానం చేశాయి. ఈ తీర్మానంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.అస్సాం అసెంబ్లీలో హిమంత మాట్లాడుతూ.. ‘ఈసారి అస్సాంలోని అనేక ముస్లిం సంఘాలు హిందువుల భావాలను గౌరవిస్తూ గోవు బలి చేయకూడదని నిర్ణయించాయి’ అని అన్నారు. హోజాయ్, ధుబ్రి, బోంగాయిగావ్, ఉదర్బోండ్ ప్రాంతాల్లోని ఇద్గాహ్, కబ్రిస్తాన్ కమిటీలు అధికారిక ప్రకటనలు జారీ చేసి, బక్రీద్ సందర్భంగా గోవు బలి చేయకూడదని విజ్ఞప్తి చేశాయి. ధుబ్రి టౌన్ ఇద్గాహ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో, బక్రీద్ రోజున గోవు బలి చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది.కమిటీలు పేర్కొన్నది ఏమిటంటే, ఇస్లాంలో గోవు బలి తప్పనిసరి కాదు. హలాల్ జంతువులలో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా బలిదానం చేయవచ్చని ఇస్లామిక్ న్యాయశాస్త్రం చెబుతోంది. అందువల్ల గోవు బలి చేయకపోవడం మతపరమైన ఆచారానికి విరుద్ధం కాదని వారు వివరించారు. హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ‘సామాజిక-మతపరమైన ఐక్యతను బలపరిచే గొప్ప అడుగు’గా అభివర్ణించారు. ఇంకా నిర్ణయం తీసుకోని సంఘాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. VIDEO | Guwahati: In state assembly session, Assam CM Himanta Biswa Sarma (@himantabiswa) says, “This time, many Muslims and several Muslim groups in Assam have decided that they will not use cows for sacrifice during Bakrid. Respecting the sentiments of Hindus, they have decided… pic.twitter.com/6eekzhroAR— Press Trust of India (@PTI_News) May 26, 2026 -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు.. అదీ భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ సంస్థలు కిలో రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ రేటు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న సీఎన్జీ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీ-NCR రీజియన్లో కిలోకు రూ.83 కు చేరింది. మే 15 నుంచి ఇలా పెంచుకుంటూ రావడం ఇది నాలుగోసారి. అంతకు ముందు.. మే 15న రూ2, మే 18న రూ1, మే 23న మరో రూ.1 పెంచాయి. ఇప్పుడు తాజాగా రూ.2 పెంపుతో కేవలం 11 రోజుల్లోనే దాదాపు రూ.6 వరకు ధరలు పెరిగాయి.సీఎన్జీ ధరలు – నగరాల వారీ లిస్ట్ (కేజీకి)ఢిల్లీ – రూ.83ముంబై – రూ.81పుణే – రూ.92.50నాగ్పూర్ – రూ.88.90అహ్మదాబాద్ – రూ.82.30వడోదరా – రూ.81.35గాంధీనగర్ – రూ.76.98నోయిడా – రూ.85.07ఫరీదాబాద్ – రూ.88.72హైదరాబాద్ – రూ.99విజయవాడ – రూ.93గుంటూరు – రూ.92బెంగళూరు – రూ.90చెన్నై – రూ.91.5కోల్కతా – రూ.93.5గమనిక: నగరాల వారీ ధరలు గ్యాస్ కంపెనీ + రాష్ట్ర ట్యాక్స్లపై ఆధారపడి మారుతాయికాలుష్య నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వాలు సీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నది తెలిసిందే. భారత్లో ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పాటు టైర్ టూ సిటీల్లో, పట్టణాల్లోనూ సీఎన్జీ వాహనాల వినియోగం అధికంగా ఉంది. ఆటోలు, క్యాబ్లు, నగర బస్సులు వంటి రవాణా రంగం పెద్ద మొత్తంలో ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. అయితే ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా భావించిన సీఎన్జీ కూడా పెరుగుతున్న రేట్ల వాహనదారుల్ని బెంబేలెత్తిస్తోంది. సీఎన్జీ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితే. పశ్చిమాసియా సంక్షోభం, గ్యాస్ సరఫరా మార్గం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, గ్లోబల్ గ్యాస్ ధరల్లో మార్పులు.. ఫలితంగా భారత్ వంటి దేశాల్లో ఎల్ఎన్జీ (Liquefied Natural Gas) కొనుగోలు( దిగుమతి) ఖర్చు పెరుగుతోంది. తద్వారా ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసి వాహన ఇంధనంగా మార్చే సీఎన్జీ సరఫరా వ్యయం కూడా పెరుగుతోందన్నమాట. రవాణా, నిల్వ, పంపిణీ వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టే గ్యాస్ పంపిణీ సంస్థలు రేట్లను సవరించాల్సి వస్తోంది. అయితే అంతిమంగా మాత్రం భారం వాహనదారులపైనే పడుతోంది. -
ఆన్సర్ షీట్లు తారుమారు!
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్నెట్లో బోర్డు అప్లోడ్ చేసిన తమ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) వ్యవస్థలో జవాబు పత్రాల మధ్య పొంతన కుదరడంలో లోపం ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల అసలైన జవాబు పత్రాలు, ఇంటర్నెట్లోని స్కాన్డ్ కాపీల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి రెండూ ఒక్కటి కాదని అంటున్నారు. అంటే మిస్మ్యాచ్ జరుగుతోందని విమర్శిస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలామంది మార్కులు తక్కువగా రావడంతో పునర్మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి జవాబు పత్రాలను సీబీఎస్ఈ సిబ్బంది నెట్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిశీలించిన విద్యార్థులు కంగు తింటున్నారు. అవి తాము సమాధానాలు రాసిన పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరొకరి జవాబు పత్రాలను తమ పేరిట అప్లోడ్ చేశారని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే విద్యార్థి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. తనది కాని ఫిజిక్స్ ఆన్సర్ షీట్ను తన పేరిట అప్లోడ్ చేశారని తెలిపాడు. అందులో ఉన్న చేతిరాత తనది కాదని పేర్కొన్నాడు. రీవాల్యుయేషన్లో తనకు అన్యాయం జరిగిందని వెల్లడించాడు. సాంకేతిక సమస్యలపై దృష్టి పెట్టాం: ప్రధాన్ వేదాంత్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు అతడికి మద్దతిచ్చారు. కానీ, కొందరు వ్యతిరేకించారు. జాతి వ్యతిరేకిగా, పాకిస్తానీగా వేదాంత్పై ముద్రవేశారు. సంజన అనే మరో విద్యార్థినిది కూడా ఇదే వ్య«థ. ఆమె కెమిస్ట్రీ ఆన్సర్ షీట్ తారుమారయ్యింది. 70 మార్కులకు గాను 11 మార్కులే వచ్చాయి. ఆన్సర్ షీట్ మొదటి పేజీలో విద్యారి్థని పేరు, వివరాలు సరిగ్గానే ఉన్నాయి. రెండో పేజీ నుంచి మొత్తం మారిపోయాయి. సీబీఎస్ఈ అధికారులను సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని సంజన కన్నీరు పెట్టుకుంది. చాలామంది విద్యార్థులు ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ ఆవేదనను సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం: సీబీఎస్ఈ ఈ ఏడాది పరీక్షల్లో పునర్మూల్యాంకన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి వెలుగులోకి వచ్చిన అన్నిరకాల సాంకేతిక సమస్యలపై ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–కాన్పూర్ నిపుణులు దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా సీబీఎస్ఈకి సహకరిస్తారని తెలిపారు. రీవాల్యూయేషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మిస్మ్యాచ్ ఆన్సర్ షీట్ల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీబీఎస్ఈ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్లో గానీ, ఆఫ్లైన్లో గానీ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా స్వీకరిస్తున్నామని, విద్యార్థులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశాయి. విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో ఉన్నతాధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారని తెలియజేశాయి. ప్రతి ఫిర్యాదునూ చురుగ్గా పరిష్కరిస్తున్నట్లు సీబీఎస్ఈ అధికారులు చెబుతున్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహిగా ముద్ర వేస్తారా? ప్రధాని మోదీ అహంకారాన్నిజెన్ జెడ్ దించేయడం తథ్యం సీబీఎస్ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వయం మరో కీలక సంస్థను అక్రమాలకు ప్రతీకగా మార్చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అహంకారాన్ని జెన్ జెడ్ దించేయడం తథ్యమని తేల్చిచెప్పారు. సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం)లో లోపాలపై రాహుల్ సోమవారం స్పందించారు. ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పునర్ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్సర్ షీట్లు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి జవాబు పత్రాన్ని మరొకరి పేరిట అప్లోడ్ చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పట్ల రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షల నిర్వహణలో ఎన్ని అవినీతి, అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఇంకా కురీ్చని పట్టుకొని వేలాడుతున్నాడని మండిపడ్డారు. సీబీఎస్ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారని ఆరోపించారు. -
ఘనంగా ‘పద్మ’ల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. 2026 సంవత్సరానికిగాను వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్ పురస్కారాలతోపాటు 58 మంది పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పురస్కారాలు స్వీకరించారు. తెలుగు పద్మాలు వీరే.. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు గూడూరు వెంకట్రావు, పాల్కొండ విజయ్ ఆనంద్రెడ్డి మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. కళల విభాగంలో దీపికారెడ్డి పద్మ అవార్డు అందుకోగా సాహిత్యం–విద్య విభాగంలో ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి పద్మ పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మ అవార్డు ప్రకటించగా ఆయన కుమారుడు గరిమెళ్ల అనిల్ కుమార్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ సాహిత్యం–విద్య విభాగంలో ఢిల్లీ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. ధర్మేంద్ర తరఫునఅందుకున్న హేమమాలిని దివంగత బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించగా ఆయన భార్య, బీజేపీ ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో ఎన్. రాజమ్ పద్మ విభూషణ్ అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ, కళల విభాగంలో ఆర్. గణేశ్, వాణిజ్యం–పరిశ్రమల విభాగంలో ఉదయ్ కోటక్ పద్మ భూషణ్ అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మరణాంతరం వీకే మల్హోత్రాకు పద్మ భూషణ్ ప్రకటించగా ఆయన కుమారుడు పురస్కారాన్ని స్వీకరించారు. క్రీడల విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పద్మశ్రీ అందుకున్నారు. తొలి విడతలో 66 మందికి.. పద్మ అవార్డులను తొలివిడతలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం 66 మందికి ప్రదానం చేశారు. మిగిలిన అవార్డులను త్వరలో నిర్వహించే రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. 2026కుగాను కేంద్రం మొత్తం 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం తెలిసిందే. -
ఆల్కా లాంబాను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: 2024నాటి కేసులో మహిళా కాంగ్రెస్ చీఫ్ ఆల్కా లాంబాను ఢిల్లీ కోర్టు దోషిగా ప్రకటించింది. అప్పట్లో ఆమె జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన సమయంలో రహదారిపై బైటాయింపు, పోలీసుల విధులకు ఆటంకం కల్గించడం వంటి ఆరోపణలపై కేసు నమోదైంది. సోమవారం అదనపు చీఫ్ జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ అశ్వనీ పవార్ ఈ కేసు విచారణ చేపట్టారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా నిరసన తెలిపే సమయంలో బాధ్యత గల పౌరురాలిగా ఆల్కా లాంబా వ్యవహరించలేదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నాయంటూ పోలీసులు చేసిన హెచ్చరికలను సైతం ఆమె పట్టించుకోలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. మోపి నాలుగు నేరారోపణల్లోనూ ఆమెను దోషిగా నిర్ధారించవచ్చని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో ఆల్కా లాంబాకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. తీర్పును జూన్ 4వ తేదీన ప్రకటిస్తామని మేజిస్ట్రేట్ తెలిపారు. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’పై విచారణకు నో!
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవల పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’కి సంబంధించిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని మరీ సెంటిమెంట్గా తీసుకోవద్దని, ఇందులో అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సీజేపీ వెనుక ఉన్న వ్యక్తులపై, అలాగే నకిలీ న్యాయవాద డిగ్రీల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది రాజా చౌదరి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున ఎన్.కె.గోస్వామి వాదనలు వినిపించారు. సీజేపీ సోషల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తోందని పేర్కొన్నారు. కోర్టులో జరిగే సంభాషణలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు వ్యాఖ్యలను కత్తిరించి, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తాము వాక్ స్వాతం్రత్యానికి, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకం కాదని, కేవలం కోర్టు వ్యాఖ్యలను స్వార్థానికి వాడుకోవడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిల ధర్మాసనం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మరీ అంత సెంటిమెంట్గా తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వెంటనే విచారించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
టాయిలెట్లు, నాప్కిన్ల కొరత సాకుతో బాలికలను బడికి దూరం చేయరాదు
న్యూఢిల్లీ: స్కూళ్లలో శానిటరీ నాప్కిన్లు, వేరుగా టాయిలెట్లు లేవనే ఒకే ఒక్క కారణంతో బాలికలు చదవుకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 30వ తేదీన తాము వెలువరించిన ఆదేశాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో తుచ తప్పక అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని మరోసారి కోరింది. విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు అందించడం, పాఠశాలల్లో బాలికలకు వేరుగా నీటి వసతి కలిగిన పనిచేసే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించేలా చర్యలు వేగవంతం చేశామని సోమవారం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనానికి కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అర్చనా పాఠక్ దవే విన్నవించారు. స్పందించిన ధర్మాసనం..‘ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. అవి మన దేశంలోని మహిళలు, బాలికల మేలు కోసమే. కేవలం టాయిలెట్లు, నాప్కిన్లు లేవని బాలికలు చదువు మానేసి ఇంటి పనులకు పరిమితం కారాదు’అని పేర్కొంది. అదేవిధంగా, తమ ఆదేశాల అమలు తీరుపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివరాలను సేకరించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష కొనసాగిస్తూనే ఉండాలని తెలిపింది. ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకోసారి తమకు నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది. తాము వాటిపై సమీక్ష చేపడతామంది. ఈ అంశంపై సెప్టెంబర్ ఒకటో తేదీన తదుపరి విచారణ జరుపుతామని, ఇందుకుగాను ఆగస్ట్ 15కల్లా నివేదిక అందజేయాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని పేర్కొంది. ఈ సందర్భంగా ఒక మధ్యంతర పిటిషనర్ తరఫు న్యాయవాది జనవరి 30వ తేదీ నాటి ఆదేశాల్లో ఉన్న ఆక్సో–బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ల గురించి ప్రస్తావించారు. అవి పర్యావరణ హితమైనవి కావని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది.ఆ కీలక తీర్పులో ఏముంది? జనవరి 30వ తేదీన అత్యున్నత న్యాయస్థానం..‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా భాగమే. రుతుక్రమ పరిశుభ్రతకు తగు సదుపాయాలు లేకుంటే బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. అంతిమంగా వారు వెనుకబాటుకు గురవుతారు. వీటిని నివారించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్లను బాలికలకు పూర్తిగా ఉచితంగా అందించాలి. అదేవిధంగా, సక్రమంగా పనిచేసే, నీటి వసతి కలిగిన టాయిలెట్లను బాలికల కోసం వేరుగా నిర్మించాలి’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. -
ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? భవిష్యత్తుపై బెంగలో 500 మంది
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్ను జూన్ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు రోడ్డెక్కారు. ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన ఈ అకస్మాత్తు నోటీసుతో, క్లబ్లో పనిచేస్తున్న దాదాపు 500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆందోళనలో 500 మందికేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తమ పరిస్థితి ఏంటీ, ఎక్కడి పోవాలి, తమ భవిష్యత్తు ఏంటి? అని వాపోతున్నారు. ‘మమ్మల్ని జూన్ 5కల్లా క్లబ్ ఖాళీ చేయాలని చెప్పారు. మాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు. ఇక్కడ ముప్పై, నలభై ఏళ్లుగా పనిచేస్తున్నాం.. ఇప్పుడు మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు" అంటూ క్లబ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విన్నప్పటి నుండి సిబ్బంది అంతా షాక్లో ఉన్నారని, తమ భవిష్యత్తు ఏంటో తెలియక నిరంతరం ఫోన్లు చేస్తున్నారని యూనియన్ చీఫ్ నందన్ నేగి తెలిపారు.క్లబ్ యాజమాన్యం స్పందనమరోవైపు నాలుగు ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మే 25న ఢిల్లీ జింఖానా క్లబ్ యాజమాన్యం ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్కు లేఖ రాసింది. క్లబ్ నిర్వహణకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా తగిన స్థలాన్ని కేటాయిస్తారా?, క్లబ్ నమ్ముకుని ఉన్న 500 మంది ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్తుకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? అని కోరింది. దీనితో పాటు, క్లబ్ గవర్నింగ్ బాడీ ఈ ఖాళీ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను చర్చించడానికి ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్తో సమావేశం కావాలని అభ్యర్థించింది.కాగా ప్రధానమంత్రి అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న చారిత్రాత్మక 'ఢిల్లీ జింఖానా క్లబ్' భూమిని తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలం అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ప్రాంతం పరిధిలోకి వస్తుందని ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని, ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్' మే 22న ఈ నోటీసు జారీ చేసింది.ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారంఢిల్లీ జింఖానా.. దేశంలోని పురాతన, ప్రముఖ క్లబ్లలో ఒకటి. 1913 జులైలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పట్లో దీన్ని ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ గా పిలిచేవారు. స్పెన్సర్ హార్కోర్ట్ బట్లర్ దీనికి మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1947లో స్వాతంత్య్రానంతరం ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఢిల్లీ జింఖానా క్లబ్గా మారింది. క్లబ్ ప్రారంభ రోజుల్లో పోలో క్లబ్ జింఖానాలో భాగంగా కొనసాగింది. ప్రస్తుతం 5,600 మందికి పైగా సభ్యులు, సుమారు 500 మంది సిబ్బంది ఉన్నారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ22 ఏళ్లకే ఆరో సారి : ఇంకో కొడుకు కావాలి! నెటిజన్లు ఫైర్! -
కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్ క్యాంపెయిన్ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు."Don’t take it so sentimentally’, says Chief Justice of India Surya Kant, as a lawyer mentions PIL, saying a distorted and malicious narrative is being continued to malign the judiciary despite clarification by the CJI on the 'cockroach' remark.CJI says there is no such grave… pic.twitter.com/gi0yp91N9h— ANI (@ANI) May 25, 2026మరో పిటిషన్లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అలా మొదలై..మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్ను నడిపిస్తున్నారు.చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోనికి దిగుతుందా?ఈ గ్రూప్ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.ట్రోలింగ్ మాత్రమే కాదు..అయితే ఇది కేవలం ట్రోలింగ్కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. -
భారత్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు మూడేసి రూపాయాల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. సీఎన్జీపైనా పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6గం. నుంచే అమల్లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంధన భారం అధికంగా కొనసాగుతుండడం గమనార్హం.అమెరికా-ఇరాన్ యుద్ధంతో భారత్కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయింది. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరల పెంపునకు కేంద్రం అనుమతి ఇస్తోంది. తాజాగా పెట్రోల్పై లీటర్కు రూ.2.61 పైసలు, డీజిల్పై రూ.2.71పైసలు చొప్పున పెంచారు. మొత్తంగా పదిరోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు ఇంధన ధరలు పెంచేశారు.మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు మే 25.. రూ.2.61 పైసలు.. డీజిల్పై రూ.2.71 పైసలు పెంపుఅంటే ఇప్పటివరకు.. అదీ పదిరోజుల వ్యవధిలో పెట్రోల్పై లీటర్కు రూ.7.34, డీజిల్పై లీటర్కు రూ.7.45 పెరిగిందన్నమాట. తాజా రేట్లు (పెట్రోల్ రూ.2.61, డీజిల్ రూ.2.71 పెంపు కలిపి):ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76కోల్కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75 గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చుపశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. నౌకా రవాణా అంతరాయం వల్ల అధిక ధరలకు క్రూడాయిల్ను కొనుగోలు చేయాల్సి వస్తోందని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు చెబుతూ వచ్చాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని, వాటిని ఎక్కువకాలం భరించడం సాధ్యం కావట్లేదని ఆయిల్ సంస్థలు కేంద్రానికి వివరించాయి. ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసి ధరల పెంపును నియంత్రించే ప్రయత్నం చేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు ధరల సవరణలు తప్పవని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారకపోవడం, హర్ముజ్ ప్రాంతంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో కూడా ఇంధన ధరలు దశలవారీగా మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చేసిన పెంపు మాత్రమే సరిపోదని, ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చుకోవడానికి ఇంకొన్నిరోజులపాటు ధరల పెంపులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఇకపై అమెరికా వీసా ఈజీ.. భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.మార్కో రూబియో నాలుగు రోజుల భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సపోర్ట్ యానెక్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్-అమెరికా సంబంధాలు కేవలం మీడియాకే పరిమితం కాదని..అంతకు మించిన బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరగా లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు,భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమని ఆయన వివరించారు.ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్ హౌస్ ఆహ్వానం అందించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన సరఫరాలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలపై చర్చించారు.ఈ పర్యటనలో రూబియో చేసిన ప్రకటనలు భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య వ్యాపార, వ్యూహాత్మక బంధాలను మరింతగా బలపరచే ప్రయత్నం. అమెరికా ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: At the US Embassy Support Annex Building dedication ceremony, US Secretary of State Marco Rubio says, "We're introducing a new America First visa schedule that prioritises business professionals that strengthen these ties. But the facility, as I said, is not just… pic.twitter.com/pkY5nlb6r5— ANI (@ANI) May 23, 2026 -
5 కల్లా ‘జింఖానా’ను అప్పగించండి
న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్ను జూన్ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం నిర్వాహకులను ఆదేశించింది. అత్యంత కీలకమైన ల్యుటెన్స్ ప్రాంతం లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ఆనుకుని 27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అధీనంలోని భూ అభివృద్ధి కార్యాలయం(ఎల్ అండ్డీవో) ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉత్తర్వు జారీ చేసింది. సఫ్దర్జంగ్ రోడ్ నంబర్–2లోని అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన చోట ఉన్న ఈ క్లబ్ స్థలం ప్రజా భద్రత అవసరాల కోసం ఎంతో కీలకమైందని అందులో పేర్కొంది. నేడు ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్గా అందరికీ పరిచయమైన ఒకప్పటి ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్కు ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం ‘సోషల్ అండ్ స్పోర్టీంగ్ క్లబ్’నిర్వహణ కోసం లీజుకిచ్చిందని అందులో వివరించింది. పరిపాలనాపరమైన, సంస్థాగతమైన తక్షణావసరాల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల కోసం ఈ భూమి ఎంతో అవసరమని, పక్కనే ఉన్న ప్రభుత్వ భూములతో దీనిని అనుసంధానించాల్సిన అవసరముందని ఎల్ అండ్ డీవో తెలిపింది. లీజ్ డీడ్లోని క్లాజ్–4 ద్వారా సంక్రమించిన అధికారం కింద భూ అభివృద్ధి కార్యాలయం ద్వారా భారత రాష్ట్రపతి ఈ భూమిని తిరిగి తక్షణమే స్వా«దీనం చేసుకునేందుకు నిర్ణయించారని తెలిపింది. మొత్తం 27.3 ఎకరాల్లో ప్రస్తుతమున్న అన్ని భవనాలు, శాశ్వత నిర్మాణాలు, లాన్లు, ఇతర అమరికలు అన్నీ లీజు దాత, ఎల్ అండ్ డీవో ద్వారా భారత రాష్ట్రపతికి పూర్తిగా చెందుతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వు ప్రకారం జూన్ 5వ తేదీన భూ అభివృద్ధి కార్యాలయం క్లబ్ ఆవరణను స్వా«దీనం చేసుకోనుందని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించని పక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని కూడా తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలపై ఢిల్లీ జింఖానా క్లబ్ సభ్యుడు సిద్థార్థ విస్మయం వ్యక్తం చేశారు. క్లబ్ కారణంగా భద్రతకు ముప్పు ఉందనడాన్ని ఆయన తప్పుబట్టారు. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ కార్యాలయాలు ఉన్నాయన్నారు. పెద్ద సంఖ్యలో సభ్యులు, ఎంతో చరిత్ర కలిగిన క్లబ్ను కాపాడుకునేందుకు తాము కోర్టుకు వెళతామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. క్లబ్ స్వాధీనం విషయమై మరోసారి ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సభ్యత్వం కోసం దశాబ్దాల వెయిటింగ్ బ్రిటిష్ జమానాలో 1913లో ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ పేరుతో దీనిని స్థాపించారు. స్వాతంత్య్రం వచ్చాక పేరును ఢిల్లీ జింఖానా క్లబ్గా మార్చారు. ఇప్పుడున్న కట్టడాలన్నీ 1930ల్లో నిర్మించినవే. ఇందులో సభ్యత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ఈ క్లబ్ సభ్యుల సంఖ్య 11 వేలు కాగా ఇందులో కొత్తగా చేరాలనుకునే వారు 30–40 ఏళ్లు వేచి ఉండక తప్పదని జింఖానా సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం 3 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏటా ఖాళీ అయ్యే స్థానాల్లో 70 మంది వరకు కొత్తగా తీసుకుంటుంటారు. ఇందులో వెయిటింగ్ ఫీజే రూ.7.5 లక్షలు. ప్రభుత్వ అధికారి కేటగిరీ కింద సాధారణ రుసుము రూ.4.5 లక్షలు, ప్రభుత్వేతర కేటగిరీ అయితే రూ.18.91 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుంది. సభ్యత్వానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్కు 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెంపు.. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో.. అధిక ధరలకు క్రూడాయిల్ను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు కొన్నివారాలుగా గగ్గోలు పెట్టాయి. ఒక అంచనా ప్రకారం ఆ లెక్క రూ.1,600 కోట్లు ఉందని.. వినియోగదారులపై ఆ భారం వేయకుండా వచ్చామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి. మరోవైపు కేంద్రం కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు ఇంధన ధరలు పెంచలేదు. అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ తరుణంలో.. చమురు రేట్లు దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు పెంపు తప్పడం లేదని ఆయిల్ కంపెనీలు, కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పటికీ చేసిన పెంపు సరిపోదని అంటున్నారు. మరో రెండు వారాలపాటు దశలవారీగా గానీ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి (పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరిగిన తర్వాత):ఢిల్లీ: పెట్రోల్ ₹99.50, డీజిల్ ₹92.41ముంబై: పెట్రోల్ ₹108.27, డీజిల్ ₹94.77హైదరాబాద్: పెట్రోల్ ₹112.23, డీజిల్ ₹100.44కోల్కతా: పెట్రోల్ ₹110.18, డీజిల్ ₹96.76చెన్నై: పెట్రోల్ ₹105.53, డీజిల్ ₹97.13బెంగళూరు: పెట్రోల్ ₹107.69, డీజిల్ ₹95.73పాట్నా: పెట్రోల్ ₹110.27, డీజిల్ ₹96.52జైపూర్: పెట్రోల్ ₹109.76, డీజిల్ ₹95.23తిరువనంతపురం: పెట్రోల్ ₹112.11, డీజిల్ ₹101.00చండీగఢ్: పెట్రోల్ ₹99.03, డీజిల్ ₹87.19విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹115.35, డీజిల్ ₹103.08విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ ₹113.83, డీజిల్ ₹101.23గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు -
సైప్రస్తో సుదృఢ బంధం
న్యూఢిల్లీ: భారత్, సైప్రస్ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఇరుదేశాలు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాయి, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. రక్షణ సహకారం విషయంలో ఐదేళ్ల రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి తదితర రంగాల్లో సహకారం కోసం ఇరుదేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఒప్పందం కూడా ఇందులో ఉంది. వలసలపై ఒక సమగ్ర భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, సైప్రస్ నిర్ణయించుకున్నాయి. కాలపరీక్షకు నిలిచిన స్నేహబంధం వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, విద్య వంటి రంగాల్లో సంబంధాలతోపాటు ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అమలుపై నరేంద్ర మోదీ, నికోస్ క్రిస్టోడౌలైడ్స్ చర్చించుకున్నారు. ఈ భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సైప్రస్లోని మౌలిక సదుపాయాలు, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో భారతీయ కంపెనీలకు వాణిజ్య మూలధనాన్ని అందుబాటులోకి తెచ్చి, కొత్త మార్గాలను తెరుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న షిప్పింగ్, సముద్ర పరిశ్రమల్లో పెట్టుబడులను పెంచుతుందని వెల్లడించారు. ‘భారత్, సైప్రస్ స్నేహబంధం ఎన్నోసార్లు కాలపరీక్షలకు నిలిచిందని గుర్తుచేశారు. ఈ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలన్న నిర్ణయంతో ఇరుదేశాల బంధానికి కొత్త ఆశయాలను, కొత్త ఊపును ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు రెండు దేశాలు ప్రకటించాయి. భారత్–యూరప్ సంబంధాలు మెరుగుపడటాన్ని మోదీ ప్రస్తావించారు. అవి ఒక కొత్త స్వర్ణయుగంలోకి ప్రవేశించాయని అన్నారు. మౌలిక సదుపాయాలు, నౌకా రవాణా వంటి కీలక రంగాల్లో సహకారం కోసం భారత్, సైప్రస్లు ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని నికోస్ క్రిస్టోడౌలైడ్స్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. -
కంటెంట్పైనే అభ్యంతరం రచయితలపై కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్య పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ్యపుస్తకాల్లోని విషయాలకు (కంటెంట్) సంబంధించి మాత్రమే తమకు అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని రూపకల్పన చేసిన విద్యావేత్తలను తప్పుబట్టడం తమ ఉద్దేశం కాదని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో తామిచ్చిన ఉత్తర్వుల్లో రచయితలను ఉద్దేశించి చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేవలం 8వ తరగతి పుస్తకాల్లోనే కాకుండా 11వ తరగతి పాఠ్యపుస్తకాల్లోనూ అభ్యంతరకర కార్టూన్లు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వయసు విద్యార్థులపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని, విద్యా సంబంధిత పుస్తకాల్లో ఇలాంటి వాటికి తావుండరాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. వివాదాస్పద కంటెంట్ రూపొందించిన వారితో భవిష్యత్తులో ప్రభుత్వం కలిసి పనిచేయదన్న నిర్ణయాన్ని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఈ సందర్భంగా రచయితలు, విద్యావేత్తల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో రచయితల ఉద్దేశాలను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వారి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల రూపకల్పన సమష్టి బాధ్యత అని, ఇందులో ఏ ఒక్కరినీ బాధ్యులను చేయ డం సరికాదన్నారు. వాటిని ఉత్తర్వుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ‘గత ఉత్తర్వుల్లోని వ్యాఖ్యలతో రచయితలకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. వారి వివరణ విన్న తర్వాత ఆ ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తున్నాం. మా అభ్యంతరాలు కంటెంట్ పైనే తప్ప, రూపొందించిన వ్యక్తులపై కాదు’అని స్పష్టం చేసింది. -
10న జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూన్ 10వ తేదీన జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈవోఎస్–05 (జీఐశాట్–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహా న్ని నింగిలోకి పంపనున్నారు.అయితే ఈ ప్రయోగం మార్చి నెల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. వరుసగా రెండు పీఎస్ ఎల్వీ ప్రయోగాలు విఫలమైన తర్వాత చేపట్టనున్న జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాలని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పలకరింపు కరువై.. స్మార్ట్ఫోన్లకు బందీలై!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం ఎన్నడూ లేనంతగా సాంకేతికతతో అనుసంధానమైంది. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్ల మోత మోగుతోంది. కానీ విచిత్రంగా పొరుగువారితో, సమాజంతో దూరం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఎంతలా అంటే.. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలి యని పరిస్థితి నెలకొంటోంది. సోషల్ మీడియాలో వేలాది మంది ‘ఫ్రెండ్స్’ఉంటున్నా అర్ధరాత్రి ఏదైనా ఆపద వస్తే కాపాడేందుకు పక్క ఇంట్లో ఉండే నిజమైన మనిషి దూరమవుతుండటం నేడు ప్రపంచాన్ని సంక్షోభంలా చుట్టుముడుతోంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్లో ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడానికి ఏకంగా జాతీయ సంభాషణ ప్రాజెక్ట్ ప్రారంభించాల్సి వచ్చింది.పాశ్చాత్య దేశాల్లో బంధాలకు బీటలు...బ్రిటన్లో సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మాజీ కన్జర్వేటివ్ చాన్స్లర్ సాజిద్ జావిద్, లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ నేత జాన్ క్రుడాస్ నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. ‘భవిష్యత్తు బ్రిటన్ ఎలా ఉండాలి? ఏ బంధాలు ప్రజల్ని కలుపుతున్నాయి? పొరుగువారితో అనుబంధం ఎలా పెరగాలి?’అని ప్రజలనే అడుగుతూ ఒక దరఖాస్తు లేదా నిమిషం నిడివిగల వాయిస్ నోట్ ద్వారా ఆగస్టుకల్లా అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు.ఆందోళన పరుస్తున్న అధ్యయనాలుబ్రిటిష్ రెడ్ క్రాస్ జరిపిన తాజా అధ్యయనంలో 75% మంది బ్రిటన్ విభజిత దేశంగా మారిందని.. గత ఐదేళ్లలో ఈ దూరం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఏఈఐ అనే అమెరికన్ థింక్ ట్యాంక్ అధ్యయనం ప్రకారం 2012లో 59% మంది అమెరికన్లు వారంలో పలుమార్లు పొరుగువారితో మాట్లాడేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల మధ్యలోని యువతలో పొరుగు వారితో క్రమం తప్పకుండా మాట్లాడే వారి శాతం 51% నుంచి ఏకంగా 25 శాతానికి తగ్గింది.ఆరోగ్యానికి ముప్పుగా ‘ఒంటరితనం’...ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని ఒక ప్రజారోగ్య సంక్షోభంగా గుర్తించింది. నిపుణుల అభిప్రా యం ప్రకారం సామాజిక దూరం మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా గుండె జబ్బులు, డిప్రెషన్, అకాల మరణాల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. ప్రపంచంలో ప్రతి ఐదో వ్యక్తి తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నాడని.. దీన్ని ఒక నిశ్శబ్ద సామాజిక సంక్షోభంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం, పొరుగిల్లు, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కలిపేవి. కానీ ఇప్పుడు అల్గారిథమ్స్ మనుషుల పరిచయాలను, సంభాషణలను శాసిస్తున్నాయి.హైదరాబాద్ టు వైజాగ్ అంతా కాంక్రీట్ అరణ్యం.. దేశంలో కుటుంబ వ్యవస్థ పశ్చిమ దేశాల కంటే బలంగా ఉందనేది నిజమే అయినా నగరాల వేగం ఈ బంధాలను తుడిచేస్తోంది. హెల్ప్ ఏజ్ ఇండి యా నివేదిక ప్రకారం భారత్లో 69% మంది యువకులు, 68% మంది వృద్ధులు వృద్ధాప్యంలో ఒంటరివాళ్లమైపోతామనే భయంతో బతుకుతున్నా రు.ౖహైదరాబాద్, వైజాగ్ వంటినగరాల్లో ఈ సామా జిక దూరం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కారణాలు, ప్రస్తుత పరిస్థితుల అంచనా... అపార్ట్మెంట్ సంస్కృతి: గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లలో పక్క ఫ్లాట్లో ఎవరుంటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని ఉదాసీనత పెరిగిపోయింది. లిఫ్ట్లో ఎదురైనా బాగున్నారా అనే పలకరింపు కూడా కరువైంది. ఉద్యోగ ఒత్తిళ్లు: ఐటీ, కార్పొరేట్ ఉద్యోగ వేళలు, వర్క్ ఫ్రం హోం సంస్కృతి కారణంగా యువత గదులకే పరిమితమవుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం, సలహాలన్నీ మొబైల్ స్క్రీన్పైనే లభి స్తుండటంతో పొరుగువారే కాదు.. ఎవరి ఇంటి తలుపులూ తట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. మనస్తత్వంతోనే! సాంకేతికత మనిషిని స్వయంసమృద్ధుడిగా మార్చింది. కానీ సామాజికంగా ఒంటరిని చేసింది. ఆధునిక సమాజంలో సాంకేతికతను వాడుకుంటూనే మనుషులను మళ్లీ ఎలా అనుసంధానించాలనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్. పొరుగువారితో మాట్లాడటం సమయం వృథా కాదు.. అదొక సామాజిక భద్రత అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. – డేనియల్ కాక్స్, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సర్వే సెంటర్ డైరెక్టర్ -
మిస్సింగ్ కేసుల్లో తక్షణమే ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నారులు, మహిళల అక్రమ రవాణా కేసులు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా తప్పిపోయినట్లు సమాచారం అందిన వెంటనే ప్రాథమిక విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు యంత్రాంగానికి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. చిన్నారుల అక్రమ రవాణాపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.డి.సంజయ్ వాదనలు వినిపించారు. సమస్య ఇంత తీవ్రమైందన్న విషయం తనకు తెలియదంటూ జస్టిస్ అమానుల్లా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై తనకు ఇంతవరకూ అవగాహన లేదనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటి వరకు 47 వేల మంది చిన్నారులు జాడ తెలియకుండా పోవడాన్ని ప్రస్తావిస్తూ..ఈ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బాలలు వ్యవస్థీకృత అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాల బారినపడుతున్నారని పేర్కొంది. ఏహెచ్టీయూలకు కేసుల బదిలీదర్యాప్తులో అక్రమ రవాణా జరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణమే ఆ కేసును మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలకు (ఏహెచ్టీయూ) బదిలీ చేయాలి. కాగితాలకే పరిమితమైన ఏహెచ్టీయూలను వెంటనే క్రియాశీలకంగా మార్చాలి. చట్టపరమైన చర్యలు తీసుకునేలా వాటికి తగిన అధికారాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. రక్షించిన చిన్నారులను విచారణ అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా కుటుంబ సభ్యులకు అప్పగించాలి. అక్రమ రవాణాలో కుటుంబ సభ్యుల పాత్రే ఉన్నట్లు తేలితే బాధితులను వారికి అప్పగించకూడదు. ఆధార్ నమోదు తప్పనిసరి బాధితులను రక్షించిన వెంటనే వారిని ఆధార్ వెరిఫికేషన్ లేదా కొత్త ఆధార్ కార్డు నమోదు కోసం తీసుకెళ్లాలి. బయోమెట్రిక్ ఆధారాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అదే వ్యక్తి మరో ఆధార్ కార్డు పొందే ప్రయత్నం చేస్తే సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది. బాధితులను రక్షించిన ప్రాంతాల్లోని జిల్లా బాలల పరిరక్షణ విభాగాలు (డీసీపీయూ) బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఈ ప్రక్రియను హైకోర్టు బాలల న్యాయ కమిటీలు పర్యవేక్షించాలి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలు పూర్తి సహకారం అందించాలి. ప్రత్యేక పోర్టల్ను ‘మిషన్ వాత్సల్య’, ‘సీసీటీఎన్ఎస్’తో అనుసంధానం చేయాలన్న సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నామంది.ధర్మాసనం ఏం చెప్పిందంటే.. → అదృశ్యమైన మహిళలు, చిన్నారుల కేసుల కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను తీసుకురావాలి. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లను ఒకే వేదికపైకి తెస్తూ జాతీయ స్థాయి గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. → ఎవరైనా తప్పిపోయినట్లు సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ జరిపే వరకు లేదా కుటుంబ సభ్యులు వచ్చే వరకు వేచి చూడొద్దు. → ఎఫ్ఐఆర్లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని కిడ్నాప్, అక్రమ రవాణా సెక్షన్లను తప్పనిసరిగా చేర్చాలి. → తప్పిపోయిన వ్యక్తి 24 గంటల్లోపు తిరిగి వస్తే కేసును అక్కడే మూసివేయవచ్చు. కానీ, 24 గంటల వరకు వేచిచూడకుండా ఆచూకీ కోసం తక్షణమే అత్యున్నత స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేయాలి.నోడల్ అధికారుల తీరుపై అసంతృప్తి నోడల్ అధికారుల నియామకం, వారి పనితీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులను తరచూ మార్చడం, సమావేశాలకు హాజరుకాకుండా తమ తరఫున ఇతరులను పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులపై అవగాహన, నిజాయతీ, సామర్థ్యం ఉన్న అధికారులనే నియమించాలని అన్ని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. ఏహెచ్టీయూలకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర నోడల్ అధికారులకు ఉంటుందని, ఆ బాధ్యతలను వేరొకరికి బదిలీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
పదొస్తే పైచేయి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా పెద్దల సభలో పూర్తిస్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలక సంస్కరణల బిల్లులు, రాజ్యాంగ సవరణలను ఆటంకాలు లేకుండా ఆమోదించుకోవాలంటే ఎగువ సభలో సంఖ్యాబలం కమలనాథులకు అత్యంత కీలకంగా మారింది. అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పూర్తి మెజారిటీపై కన్ను.. ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న 113 స్థానాలతో ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను సొంతంగా గెలుచుకుంటే సొంతంగానే మెజారిటీ మార్కు 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన 163 సీట్ల మార్కును దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి. బీజేపీ భవిష్యత్తులో తీసుకురావొచ్చని భావిస్తున్న కీలక బిల్లుల్లో ఒకే దేశం–ఒకే ఎన్నిక (వన్ నేషన్–వన్ ఎలక్షన్) కీలకమైనది.దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లు కూడా బీజేపీ ఎజెండాలో ప్రధానంగా ఉంది. అలాగే జనాభా ఆధారిత నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్), జడ్జీల నియామక విధానం, ట్రిబ్యునళ్ల వ్యవస్థ, కోర్టు పరిపాలన వంటి అంశాల్లో మార్పులు, ఎన్నికల సంస్కరణలు, కేంద్ర–రాష్ట్ర అధికారాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలపై బిల్లులకు మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. దీంతో బీజేపీ ఆ దిశగా ఆధిపత్యం సాధించేందుకు సిద్ధమవుతోంది. 12 మంది బీజేపీకి చెందిన వారే ప్రస్తుతం నోటిఫికేషన్ వెలువడిన 24 స్థానాల్లో ఏపీ, కర్ణాటక, గుజరాత్లలో నాలుగు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో మూడు చొప్పున ఖాళీ కానున్నాయి. జార్ఖండ్లో రెండు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ 24 మంది సభ్యుల్లో 12 మంది బీజేపీకి చెందినవారే. వారిలో కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్సింగ్ బిట్టూ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఈసారి కేవలం సంస్థాగత విధేయతకే కాకుండా ప్రజాదరణ, ఎన్నికల ప్రభావం, సామాజిక సమీకరణాల వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభించే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూకు మళ్లీ రాజస్తాన్ నుంచే అవకాశం లభించొచ్చు.మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంగా కొందరు కీలక నాయకులను రాజ్యసభ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి సదానందగౌడను రాజ్యసభకు పంపి ఆయనకు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బీజేపీ నేతను ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే అంశం పరిశీలనలో ఉందని చెబుతున్నారు.మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుతం గవర్నర్లుగా ఉన్న సీనియర్ నాయకుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర యూనిట్లు ఇప్పటికే ఆశావహుల జాబితాలను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. -
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్లు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం అవసరమా అన్న సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల ద్వారా సామాజిక స్థితిలో మార్పు సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలి’అని స్పష్టం చేసిందిరిజర్వేషన్లలో కొనసాగితే ఈడబ్ల్యూఎస్కు, క్రిమిలేయర్కు తేడా ఏముంటుంది?. ఆ రెండింటి మధ్య తేడా ఉండాల్సిందేనని తెలిపింది. ఓబీసీ క్రిమిలేయర్, రిజర్వేషన్లపై నమోదైన దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్లపై వ్యాఖ్యానించింది. ఓబీసీ క్రిమిలేయర్కు సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలపై పిటిషన్ను విచారిస్తున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయన్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘ఇద్దరూ ఐఏఎస్ అధికారులు.ప్రభుత్వ సేవలో ఉన్నారు. బాగా స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ అవసరమా?’అని ప్రశ్నించింది. జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ..‘విద్యా, ఆర్థిక శక్తివంతతతో సామాజిక స్థితి మార్పు వస్తుంది. కానీ మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే, ఈ వ్యవస్థ నుండి ఎప్పటికీ బయటకు రాలేము’అని అన్నారు. ఈడబ్ల్యూఎస్లో సామాజిక వెనుకబాటు ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటు మాత్రమే ఉంటుందని తెలిపారు.ఈ కేసులో వాదించిన అడ్వకేట్ శశాంక్ రత్నూ మాట్లాడుతూ..‘క్రిమీ లేయర్లో వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా, వారి స్థాయి ఆధారంగా తప్పించారు. కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించాలి’అని వాదించారు. ఆయన,ఈడబ్ల్యూఎస్, క్రిమీ లేయర్ను ఒకే విధంగా చూడకూడదని, క్రిమీ లేయర్ ప్రమాణాలు మరింత సడలింపుగా ఉండాలని సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, సుప్రీం కోర్టు పిటిషనర్లు, ప్రతివాదులు వంటి సంబంధిత పక్షాల నుంచి సమాధానాలు కోరుతూ నోటీసులు జారీ చేసింది. -
ఉమర్ ఖాలిద్కు తాత్కాలిక ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై జైలులో ఉన్న మాజీ జేఎన్యూ విద్యార్థి నేత కార్యకర్త ఉమర్ ఖాలిద్కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆరు సంవత్సరాల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.శుక్రవారం హైకోర్టు ఖాలిద్కు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆయన విడుదల కానున్నారు. అయితే ఈ తాత్కాలిక బెయిల్ ఆయన తల్లి శస్త్రచికిత్స కారణంగా మంజూరైంది. రూ.1 లక్షల ష్యూరిటీ చెల్లించాలని.. అలాగే ఈ మూడు రోజుల సమయంలో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అంటే.. ఆయన ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు అన్న విషయాలు నియంత్రణలో ఉండేలా ఆంక్షలు విధించిందన్నమాట.ఉమర్ ఖాలిద్ 2020లో ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన నిర్దోషి అని వాదిస్తూ పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు ఆయనకు దీర్ఘకాలిక బెయిల్ లభించలేదు. అయితే ఇటీవలె బెయిల్ నిరాకరణపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కుటుంబ కారణాల వల్ల హైకోర్టు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ ఇవ్వడం గమనార్హం.ఢిల్లీ అల్లర్లు.. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్లలో దాదాపు 53 మంది మృతి చెందగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద ఛార్జిషీట్ నమోదు చేశారు. వీళ్లలో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ సహా ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై జనవరిలో విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఖాలిద్, ఇమామ్కు మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.సుప్రీం ధర్మాసనం అసంతృప్తిఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ.. ఈ ఏడాది జనవరిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఇటీవల ఈ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపా కేసులో ఆరేళ్లకు పైగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం వంటి సమయాల్లో బెయిల్ మంజూరు చేయవచ్చని, 2021లో ఓ కేసులో ముగ్గురు న్యాయమార్తులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ జడ్జిమెంట్ను జనవరిలో తీర్పు ఇచ్చిన సమయంలో ధర్మాసనం సరిగా అనుసరించలేదని వ్యాఖ్యానించింది. గతంలో ధర్మాసనం అనుసరించిన విధానాన్ని అంగీకరించడం కష్టమని చెబుతూ.. ఉపా కేసులలో సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం, విచారణలో జాప్యం వంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఖాలిద్కు తాత్కాలిక బెయిల్ దక్కడం గమనార్హం.ఫేక్ ఎవిడెన్స్పై విమర్శలు..2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి. 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించాయి. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్ ఎవిడెన్స్ను కోర్టులు హైలైట్ చేశాయి. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
ఇలాంటిదేదో జరుగుద్దని ముందే ఊహించాం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో గతవారం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. అయితే గంటల వ్యవధిలో ఆ పార్టీ ‘కాక్రోచెస్ డోంట్ డై’ట్యాగ్లైన్తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట మరోఖాతాను సృష్టించుకుంది. తమ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, నిలిపివేస్తారని కూడా ముందే ఊహించామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్పారు. ఇది ప్రభుత్వం తనకు తాను చేసుకున్న తప్పిదం అని పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరుతో ‘ఎక్స్’లో కొత్త ఖాతా ప్రారంభించామని తెలిపారు. తమ ఖాతా, ఉద్యమం వేగంగా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయని స్పష్టంచేశారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఖాతా ప్రారంభం కాగా.. మళ్లీ ఫాలోవర్స్ విషయంలో దూసుకుపోతోంది. అందుకే తప్పుడు ప్రచారంతమ ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఖాతాను నిలిపివేసిందని అభిజిత్ దీప్కే విమర్శించారు. అంతేకాదు.. సీజేపీ విషయంలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయనో క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి ఇస్లాం ప్రభావిత దేశాల నుంచే దానికి ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని, ఫేక్.. బోట్(కంప్యూటర్ ఆపరేటెడ్) అకౌంట్లు ఉన్నాయని(కొందరు వీడియోలు పెట్టారు.. అవి ఫేక్ అని అభిజిత్ అంటున్నారు).. జనతా కాక్రోచ్ పార్టీ ప్రొపగాండ క్యాంపెయిన్ అని, తాను ఆప్ ఏజెంట్నని(అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పని చేశారు), దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే విదేశీ కుట్ర వ్యవహారమంటూ జరుగుతున్న ప్రచారాలన్నింటినీ ఆయన ఖండించారు. ఒకవైపు నిరుద్యోగ యువత ఈ ఉద్యమంలో చేతులు కలుపుతుంటే.. పనికిమాలిన వాళ్లే అలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. I know you are desperately trying to hack the account but since you have failed to do so. Let me share the real data.Why would you call 94% of Indian youth as Pakistanis? https://t.co/547NtEP934 pic.twitter.com/9DRTx6l96e— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇన్స్టాగ్రామ్లో 18 మిలియన్లు క్రాస్ఉపాధి, ఉద్యోగాలు లేని యువత పరాన్నజీవులు, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఆక్షేపించారు. దీనిపై నిరసన వ్యక్తంచేస్తూ అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. నిజానికి ఇదొక వ్యంగ్య డిజిటల్ పార్టీ. సోషల్ మీడియాలో యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక కార్యకర్తలు, కళాకారులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. పలు రాజకీయ పార్టీ నేతలు, మేధావులు కూడా అండగా నిలిచారు. పార్టీ ‘ఎక్స్’ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో చేరింది. ఇన్స్టా్రగామ్లో అనుసరించేవారి సంఖ్య 18 మిలియన్లు దాటేసింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న కాంగ్రెస్, రెండో స్థానంలో ఉన్న బీజేపీలను సీజేపీ అధిగమించినట్లైంది. కాక్రోచ్ జనతా పార్టీ పదునైన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానం ద్వారా ఆదరణ పొందుతోంది. సమకాలీన అంశాలపై చర్చ.. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీక్లు, విద్యా వ్యవస్థ తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తోంది. అందుకే దీనికి దేశద్రోహి, ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి తిట్టి పోస్తున్నారు. అయితే వాళ్లకు స్వయంగా అభిజిత్ కౌంటర్ ఇస్తుండడం గమనార్హం. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పారీ్టకి సంబంధించిన తొలి ‘ఎక్స్’ఖాతా గురువారం నుంచి నిలిచిపోవడం.. కాసేపటికే కొత్త అకౌంట్ ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ‘ఎక్స్’లో ద కాక్రోచ్ యూత్, కాక్రోచ్ న్యూస్, ఐయామ్ కాక్రోచ్, కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా, కాక్రోచ్ జనతా పారీ్ట(జెన్ జెడ్) పేరిట ఖాతాలు చురుగ్గా పని చేస్తున్నాయి. -
వారసుల ప్రస్తావన లేదని వీలునామాను కొట్టిపారేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: సహజ వారసత్వ క్రమాన్ని మార్చడమే వీలునామా వెనకున్న అసలు ఉద్దేశమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేవలం సహజ వారసుల ప్రస్తావన లేదనే ఏకైక కారణంతో వీలునామాను రద్దు చేయడం లేదా అనుమానాస్పదమైందిగా పరిగణించలేమని పేర్కొంది. చార్టెర్డ్ అక్కౌంటెంట్గా పనిచేసిన దివంగత షీనా నాయిరి 1983లో కర్ణాటకలోని తన ఆస్తుల్లో కొన్నిటిని సోదరి అయిన లక్ష్మీ నాయిర్తి పేరిట రాశారు. ఆ వీలునామా చెల్లదంటూ ఆయన భార్య, పిల్లలు వేసిన పిటిషన్పై జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలునామా వాస్తవమైందేనని ట్రయల్ కోర్టు, అప్పిలేట్ కోర్టు, కర్ణాటక హైకోర్టు ప్రకటించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. ముంబైలో ఉంటున్న భార్య, పిల్లలకు చాలినంత ఆస్తిని ఇచ్చానంటూ ఆ వీలునామాలో షీనా నాయిరి పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. వీలునామా కర్త తన ఆస్తిని ఇష్ట ప్రకారం ఎవరికైనా ఇచ్చే చట్టపరమైన హక్కును కలిగి ఉంటారు. అయితే, సహజ వారసులను పక్కన పెట్టడం వెనుక ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేనంత వరకు.. కేవలం వారసులను మినహాయించిన కారణంగానే వీలునామా చెల్లకుండా పోదని ధర్మాసనం పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ ఎంట్రీల్లో వారసుల పేర్లు ఉన్నప్పటికీ వారికి ఆస్తిపై ఎలాంటి యాజమాన్య హక్కులను కల్పించవని, అవి కేవలం పన్నుల వసూలు వంటి ఆర్థిక అవసరాల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. -
విద్యే శక్తివంతమైన ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో ప్రతీ విజేత ఎన్నో కష్టాలు, అపజయాలు ఎదుర్కొంటాడని, అవే మనిíÙని మరింత బలంగా తీర్చిదిద్దుతాయని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విద్యే జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం గురువారం ఢిల్లీలో ఆయన్ను కలిశారు. టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 41 మంది విద్యార్థులు ఉపరాష్ట్రపతి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, అధికారులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారని గుర్తుచేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిపెట్టాలని సూచించారు. మహిళ శక్తి పెరుగుదలకు నిదర్శనం.. 41 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల్లో 27 మంది బాలికలు ఉండటం దేశంలో మహిళా శక్తి పెరుగుదలకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి తెలిపారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను అతి తక్కువగా వినియోగించాలని చెప్పారు. క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మకతపై దృష్టిపెట్టాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ‘నిబద్ధతతో కష్టపడండి.. విజయంతో వినయంగా ఉండండి.. సమాజ శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని వినియోగించండి’ అనే మూడు సూత్రాలను జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు!
న్యూఢిల్లీ: నీట్ (యూజీ)–2026 ప్రశ్నపత్రం మొత్తం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టంచేశారు. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయి కాబట్టి ఈ వ్యవహారాన్ని పేపర్ లీక్గా భావించవద్దని పేర్కొ న్నారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని తేల్చిచెప్పారు. ఆయనతోపాటు ఎన్టీఏ అధికారులు గురువారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో జరిగిన పేపర్ లీక్ ఉదంతాలను ప్రస్తావించారు. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు. అక్రమాలను అరికట్టడానికి భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నామని ఎన్టీఏ అధికారులు బదులిచ్చారు. అభిషేక్ సింగ్కు ఎన్డీయే ఎంపీల మద్దతు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణకు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషీ, ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎన్టీఏలో సంస్కరణలపై రాధాకృష్ణన్ నివేదికలోని సిఫార్సులపై ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని సిఫార్సులను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్కు అధికార ఎన్డీయే ఎంపీలు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత నివేదికను స్టాండింగ్ కమిటీకి సమరి్పంచాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, బీజేపీ ఎంపీలు అందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని పేర్కొన్నారు. ఆ సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఎన్టీఏలో ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు సూచించారు. పేపర్ లీకేజీలు జరగకుండా, ఏజెన్సీ పూర్తి సామర్థ్యంతో పని చేయాలంటే సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. బయటకు వెల్లడించలేం: దిగ్విజయ్ మే 3న నీట్(యూజీ) నిర్వహించగా, పేపర్ లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నీట్(యూజీ) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తు సాగుతోంది. ఒకరి చేతి నుంచి మరొకరికి నీట్ ప్రశ్నలు అందినట్లు గుర్తించారు. అయితే, నీట్(యూజీ) పేపర్ లీకైనట్లు ఎన్టీఏ అధికారులు అంగీకరించడం లేదు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, పేపర్ లీకేజీ జరిగినట్లు సీబీఐ అధికారికంగా ధ్రువీకరిస్తేనే తాము అంగీకరిస్తామని అంటున్నారు. విచారణ అనంతరం పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎలాంటి చర్చలు జరిగినా వాటిని బయట చర్చించలేమని అన్నారు. గురువారం సమావేశం చాలా బాగా జరిగిందని, సభ్యులందరి నుంచి అభిప్రాయాలు అందాయని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ పై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. -
రైల్వే నెట్వర్క్ను మరింతగా విస్తరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను మరింతగా విస్తరిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. గురువారం ఢిల్లీలోని రైల్వే భవన్లో అశ్వినీ వైష్ణవ్తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్ పనుల పురోగతిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. ఈ స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను రైల్వే మంత్రి వివరించారు. ఎంఎంటీఎస్పై త్వరలో ప్రత్యేక సమావేశం.. హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ఉద్యోగులకు అత్యంత కీలకమైన రవాణా సాధనంగా ఉన్న ఎంఎంటీఎస్ సేవలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంఎంటీఎస్ రైళ్ల వేళలను క్రమబద్ధీకరించాలని, ప్రయాణికులకు సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకోవాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. కిషన్రెడ్డి విజ్ఞప్తిపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.ఈ అంశంపై త్వరలోనే అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. -
కొత్త సంస్కరణలను తెద్దాం
న్యూఢిల్లీ: దేశం శత వసంత స్వాతంత్య్ర దినోత్సవాలు చేపట్టే 2047 ఏడాదికల్లా సర్వతోముఖాభివృద్ధి సాధనే లక్ష్యంగా కీలక మంత్రిత్వ శాఖలు సమిష్టిగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశంచేశారు. ఇందుకు నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం వేదికగా నిలిచింది. ఢిల్లీలోని ప్రధానమంత్రి నూతన కార్యాలయం( సేవా తీర్థ్థ)లో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం మొదలై గంటల తరబడి కొనసాగింది. భవిష్యత్ సంస్కరణల మీదనే మంత్రులంతా దృష్టిసారించాలని, అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలను ప్రజలు అందుకోగలరని మంత్రులకు మోదీ కర్తవ్యబోధ చేశారు. 2047 ఏడాదికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అవలంభించాల్సిన విధానాలు, అమలుచేయాల్సిన సంస్కరణల చిట్టాను మోదీ మంత్రుల ముందు పెట్టారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడిగా ముందుకు కదలండి ‘‘కొత్త సంస్కరణలు తెద్దాం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతోపాటు సులభతర జీవనాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా మంత్రులంతా ఉమ్మడిగా పనిచేయండి. ప్రజల జీవితాలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడడమే మన ప్రథమ కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు గరిష్టస్థాయిలో ప్రయోజనం పొందేలా చర్యలు చేపట్టండి. గతంలో చేసిన పనుల గురించి వెనక్కి తిరిగి చూసుకునే సమయం లేదు. చేయాల్సిన కార్యాల మీద దృష్టిపెట్టండి. ఈ ఏడాదే అధికారంలోకి వచ్చామనే నూతనోత్సాహంతో పనిచేయండి. ఈ ఏడాది పూర్తిగా భవిష్యత్ లక్ష్యాలు, సాధించాల్సిన విజయాలపైనే దృష్టిసారించండి. సుపరిపాలనే శ్వాసగా పనిచేయండి. ప్రభుత్వ పనుల్లో పెండింగ్ అనే మాటే వినపడొద్దు’’అని మంత్రులకు మోదీ సూచించారు.ఈ భేటీలో కేబినెట్ మంత్రులతోపాటు సహాయక మంత్రులు, స్వతంత్రహోదా ఉన్న సహాయక మంత్రులు సైతం పాల్గొన్నారు. ఈ ఏడాది అందరు మంత్రులతో జరిగిన తొలి భేటీ ఇదేనని తెలుస్తోంది. ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు చేపడుతున్న చర్యలు, పథకాల అమలుతీరును, మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రధానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తంగా 9 మంది కార్యదర్శులు ఇందులో భాగస్వాములయ్యారు. అన్ని శాఖల సమగ్ర పనితీరుపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ మరో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతీ ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సైతం ఇందులో పాల్గొన్నారు. కీలక పశ్చిమబెంగాల్తోపాటు అస్సాం శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగడంతో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల పనితీరు, లోటుపాట్లు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై ఈ భేటీలో సమీక్షించినట్లు తెలుస్తోంది. వీటితోపాటే ఇటీవల ఐదు దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని పర్యటన విశేషాలు, మిత్రదేశాలతో దౌత్య బంధం బలోపేతం, కీలక ఒప్పందాలు, పశ్చిమాసియా సంక్షోభం అంశాలపై మంత్రులకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విడిగా బ్రీఫింగ్ ఇచ్చారని తెలుస్తోంది. -
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది సమాచారం.కాగా, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పని తీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చద్దాకు కేబినెట్ పదవి దక్కే అవకాశముంది. అలాగే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓం బిర్లా స్థానంలో ఓ మహిళకు లోక్సభ స్పీకర్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇక, తెలంగాణ నుంచి ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్కు మంత్రివర్గంలో ఛాన్స్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, కిషన్ రెడ్డికి శాఖ మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మంత్రి మండలిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరిని తప్పిస్తారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశం ఆర్థిక, రాజకీయ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం, చమురు ధరల పెరుగుదలపై చర్చలు జరగనున్నాయి. -
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!
మే 2026.. భారత్లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ పెట్టి వారం తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఏకంగా బీజేపీ లాంటి దిగ్గజ పార్టీని మించిపోయి.. కురువృద్ధ పార్టీ కాంగ్రెస్ను సైతం పక్కకు నెట్టేసే దిశగా దూసుకుపోతోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. అతిపెద్ద పార్టీగా ఎదగడానికి సిద్ధమైంది.సీజేపీ.. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రస్తుతానికి రాజకీయ పార్టీ కాదు. కేవలం వ్యంగ్య ఉద్యమం(సెటైర్) అని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లకు చెప్పనక్కర్లేదు. కానీ, డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో గత నాలుగైదు రోజులుగా మామూలు సత్తా చాటడడం లేదు. ముఖ్యంగా జెన్ జీ యువత ఆదరణ, మద్దతుతో దూసుకుపోతోంది. సో.మీ. ఫాలోవర్స్ విషయంలో బీజేపీని ఇప్పటికే దాటేసింది సీజేపీ. ఆ విషయాన్ని కూడా అంతే వెటకారంగా ప్రకటించుకుంది. ప్రస్తుతానికి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఉంది. సీజేపీ దూకుడు చూస్తుంటే.. రేపో, మాపో ఆ ఫిగర్ను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఆన్లైన్లో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీ(నాన్ పొలిటికల్)గా సీజేపీ నిలవనుంది.World’s largest party they said🤭 pic.twitter.com/dT9TOFKZoZ— Cockroach Janta Party (@CJP_2029) May 20, 2026అలా పుట్టింది..మే 15, 2026న సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. కొంతమంది యువకులు బొద్దింకల్లాంటివాళ్లు.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని రగిల్చాయి. పెద్ద సంఖ్యలో యువత దీన్ని అవమానకరంగా భావించి వ్యంగ్యరూపంలో ప్రతిస్పందించారు. అలాంటి వాళ్లలో అభిజీత్ దిప్కే ఒకడు. ఈ ఒక్కడే ఈ పెను సంచలనానికి కేంద్ర బిందువయ్యాడు.మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదివిన అభిజిత్.. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆప్ వలంటీర్గా పనిచేసిన అనుభవం ఆయనకు డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్లో ప్రత్యేక నైపుణ్యం ఇచ్చింది. ఆ నైపుణ్యంతో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సెటైరిక్ పేజీని ప్రారంభించాడు.సీజేఐ వివరణ.. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో యువతపై తాను చేసిన వ్యాఖ్యలను పొరపాటుగా మీడియా చూపించిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ఫేక్ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చినవాళ్లను మాత్రమే ఉద్దేశించి తాను అలా అన్నానని ఆయన చెప్పారు. భారత యువతపై తాను ఎలాంటి విమర్శ చేయలేదని.. పైగా వాళ్లను చూసి గర్వపడుతున్నానని.. వాళ్లే దేశాభివృద్ధికి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. అయితే.. అప్పటికే సీజేపీ జోరు మొదలైంది.మేము సైతం.. మే 16న గూగుల్ ఫారమ్ ద్వారా అభిజిత్ సీజేపీ సభ్యత్వం ప్రారంభించాడు. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే నినాదం ఇచ్చాడు. “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ” అనే వ్యంగ్య సిద్ధాంతాలతో పార్టీ ముందుకు సాగుతోందని ప్రకటించాడు. అప్పటికే సీజేఐ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా.. పెద్ద సంఖ్యలో యువత మాత్రం వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపేలా ‘‘మేము కూడా కాక్రోచులమే’ అంటూ ఫాలో బటన్ను క్లిక్ చేస్తూ, సభ్యత్వం తీసుకుంటూ తమ అసంతృప్తిని డిజిటల్ వేదికలపై భారీగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.అలా.. మే 17–20 మధ్య జస్ట్ నాలుగురోజుల్లోనే వెబ్ పేజీకి నాలుగు లక్షలకు పైగా సభ్యులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో 9 మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. తద్వారా ఆప్, బీజేపీ పార్టీలను చాలా దూరం నెట్టేశారు. సీజేపీ జోరు చూస్తుంటే కాంగ్రెస్ను కూడా దాటేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. అలాగని ఇది పూర్తి సెటైరిక్ మూమెంట్గా ఉండిపోలేదు. అర్థవంతమైన చర్చలు, సమకాలీన అంశాలపై మేధావులతో డిబేట్లు, అభిప్రాయ సేకరణ.. ఇలా ఈ ఉద్యమం ప్రత్యేకంగా నిలిచింది. మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, ఉద్యోగ సమస్యలు, పరీక్షల మోసాలు, యువత నిరాశ వంటి అంశాలను వ్యంగ్యరూపంలో వెలుగులోకి తేవడమే. ఇది యువతను అవమానపరిచిన వ్యాఖ్యకు ప్రతిస్పందన. మేము కాక్రోచులం అనే గుర్తింపుని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే దేశ వ్యవస్థ అంతగా కుళ్లిపోయింది కాబట్టి. ఆ కుళ్లులోనే కాక్రోచులు బయటకు రావాల్సి వస్తోంది. ఇది సెటైరిక్ ఉద్యమం కావొచ్చు. అలాగని ఇదేం జోక్ కాదు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగుల గొంతుకంగా మారింది అని చెబుతున్నాడు. అయితే నేపాల్, బంగ్లాదేశ్లా జెన్జీ ఉద్యమానికి ఇది దారి తీస్తుందా? అనే ప్రశ్నకు ఆయన నుంచి నో అనే సమాధానమే వచ్చింది. FYI pic.twitter.com/XCkclwy50K— Cockroach Janta Party (@CJP_2029) May 19, 2026👉సీజేఐ ఏమన్నారంటే.. కొంత మంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లేని యువత.. సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి, వ్యవస్థపై దాడి చేస్తున్నారు. 👉సీజేఐ వ్యాఖ్యల్ని సమర్థించిన వర్గాలు: బొద్దింకలతో పోల్చడం అంటే.. యువతలోని సహనశక్తి, ఎక్కడైనా బతికే సామర్థ్యం ఉంది.👉విమర్శించిన వర్గాలు: మేం కాక్రోచ్లమే అంటూ వెటకారంగా స్పందించినా.. నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది ఆ పేజీ ఫాలోయింగ్. పైగా ఆ ప్లాట్ఫారమ్లలో జరుగుతున్న డిబేట్లలో కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు👉రాజకీయ విశ్లేషకులు: ఇది ఒక “సోషల్ మీడియా విప్లవం”. నిరుద్యోగ యువత అసంతృప్తిని వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తున్నారు.👉ప్రతిపక్ష నేతలు: భారతీయ యువతలోని నిరాశను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది👉ప్రభుత్వ అనుకూల వర్గాలు: ఇది కేవలం వ్యంగ్య ఉద్యమం మాత్రమే, నిజమైన రాజకీయ శక్తిగా మారడం కష్టంఅభిజిత్ ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ.. వ్యంగ్య ఉద్యమం నుంచి డిజిటల్ విప్లవంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ మద్దతుతో ఏదైనా పెను ఉద్యమానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -
కొత్త కబురు ఏమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మే 13న కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పొదుపు సూత్రాల నేపథ్యంలో జరిగిన ఆ భేటీలో కీలక ప్రకటనలు వెలువడొచ్చని అంతా భావించారు. కానీ, అలా జరగేలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటన తదనంతరం జరుగుతున్న భేటీ కావడంతో ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ ఆసియా ఘర్షణ, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. చమురు ధరలు, ఇంధన సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే నిశితంగా పర్యవేక్షణ చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్న ఉన్నత స్థాయి అనధికారిక మంత్రుల బృందం ఈ సంక్షోభాన్ని పరిశీలిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గించే చర్యలను సూచిస్తోంది. ఈ బృందంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. “చమురు, ఇంధనం, LPG నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు” అని ఇప్పటికే స్పష్టం చేసింది.మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలుఈ సమావేశానికి మరో రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. మోదీ 3.0 ప్రభుత్వం జూన్ 10న తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు జరిగే అవకాశాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత వారం అధికార వర్గాలు కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని సంకేతాలు ఇచ్చాయి. మంత్రిత్వ శాఖల పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష జరుగుతోందని సమాచారం. రెండో వారంలోనే మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశం ఆర్థిక, రాజకీయ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం, చమురు ధరల పెరుగుదలపై చర్చలు జరగనున్నాయి. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సమావేశం తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రభుత్వ న్యాయ విభాగాల్లో 30% మహిళా కోటాపై తేల్చండి
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, విభాగాలు, ట్రిబ్యూనళ్లు, రెగ్యులేటరీల వంటి ప్రభుత్వ ప్యానెళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయ సలహాదారు, గవర్నమెంట్ ప్లీడర్, న్యాయాధికారి వంటి పోస్టుల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్ వేసిన ఈ పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులోని ప్యానెళ్లు మొదలు స్థానిక న్యాయసహాయక అథారిటీల్లో మహిళా న్యాయవాదులకు తగు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయమై తాము ఇప్పటికే దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని తేల్చేందుకు సర్వే పూర్తిచేశామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్సింగ్ తెలిపారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇటీవల తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నన్ను కలిశారు. అక్కడ మహిళా లాయర్ను సెక్రటరీగా నియమించారని తెలిసి ఆశ్చర్యపోయా. అక్కడ మొత్తం 19,000 మంది బార్ సభ్యులున్నారని, వారిలో 8,000 మంది లాయర్లు తరచూ కోర్టులకు హాజరవుతారని తెలిసింది. వారిలో 2,000 మంది మహిళా లాయర్లే. వీరిలో ఒకరికి మాత్రమే సెక్రటరీ పదవి దక్కింది’’ అని సీజేఐ గుర్తుచేశారు. మహిళా లాయర్లు న్యాయవాద వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలపై విడిగా పిల్ వేస్తామని సింగ్ తెలిపారు. ‘‘ లా కాలేజీల్లో చాలా మంది అమ్మాయిలు చేరి లా పట్టా పుచ్చుకుంటున్నా న్యాయస్థానాల దాకా రావట్లేదు. న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఎన్నో ప్రతిబంధకాలు వాళ్లకు అడ్డుగా నిలుస్తున్నాయి. అందుకే 30 శాతం రిజర్వేషన్ ద్వారా మహిళల ప్రాతినిధ్యం ఈ వృత్తిలో పెంచాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్యానెళ్లు, ప్రభుత్వ లా ఆఫీసర్ పదవులు, న్యాయ సహాయకులు, అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో లీగల్ నిపు ణులు,సలహాదారుల పదవుల్లోకి మహి ళా లాయర్లకు తగు అవకాశం ఇవ్వాలి’’ అని ఆయన వాదించారు. -
రాష్ట్రానికి అదనంగా రూ.5 వేల కోట్లు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విద్యారంగ రూపాంతరమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కీలక భేటీ జరిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల విస్తరణ, మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం నుంచి అదనపు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఆయన వినతిపత్రాలు సమర్పించారు. ‘సాస్కీ’పథకం కింద.... రాష్ట్రంలో కొనసాగుతున్న మూలధన వ్యయాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా ‘సాస్కీ’(ఎస్ఏఎస్సీఐ) పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి విక్రమార్క కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఇప్పటికే కేంద్రం రూ.4,208 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.30,000 కోట్లతో భారీ ప్రణాళికను రూపొందించిందని భట్టి పేర్కొన్నారు. ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వండి ఏడీబీ సహకారంతో రూ.4,049.11 కోట్లు, ఏఐఐబీ సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో చేపట్టే విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రెటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. కొయ్యగూడెం బ్లాక్–3ని సింగరేణికి అప్పగించండికేంద్రమంత్రి కిషన్రెడ్డికి భట్టి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్ర విద్యుత్ అవసరాలే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డితో సమావేశమయ్యారు. కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలోనూ ఆధునిక సాంకేతికతతో ‘బొగ్గు గ్యాసిఫికేషన్’ప్రాజెక్టులను చేపట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ అవసరాలకు కీలకమైన కొయ్యగూడెం బ్లాక్–3 గత వేలంలో కేటాయించినా నాలుగేళ్లుగా పనులు ప్రారంభం కాలేదని, కాబట్టి దాన్ని సింగరేణికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ–మైనింగ్ పనులు పూర్తయిన తాడిచెర్ల కోల్ బ్లాక్–2 మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేసేలా ముందస్తు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుల గణన జరగాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జన గణనతోపాటు కుల గణన చేపట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పింది. సంక్షేమ పథకాలను రూపొందించి, అమలు చేయాలంటే వెనుకబడిన కులాల జనాభా లెక్కలు ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియాలని పేర్కొంది. కుల గణనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుల గణన అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తుచేసింది. సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుధాకర్ గుమ్ముల స్వయంగా హాజరై తన తరఫున తానే వాదనలు వినిపించారు. కులాల లెక్కలపై ప్రభుత్వం వద్ద ఇప్పటికే పుష్కలమైన సమాచారం ఉందని, గణాంకాలు అందుబాటులో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి కుల గణన అవసరం లేదని చెప్పారు. పిటిషనర్ వాదనను ధర్మాసనం తిరస్కరించింది.‘‘జనాభా లెక్కల సేకరణతోపాటు కుల గణన కూడా జరగాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇందులో తప్పేముంది? వెనుకబడిన తరగతి ప్రజలు ఎంతమంది ఉన్నారో, వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి తప్పక తెలిసి ఉండాలి’’అని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. న్యాయస్థానాల పరిధికి మించిన అంశం కావడంతో ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలియజేసింది. -
టెట్రా ప్యాక్ల్లో మద్యం.. మోసపూరితం
సాక్షి, న్యూఢిల్లీ: టెట్రా ప్యాక్లు, సాచెట్ల వంటి ‘గుర్తించలేని ప్యాకేజింగ్’లో మద్యం విక్రయాలు సాగిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర ఇతర భాగస్వామ్య పక్షాలను ఆదేశించింది. కేంద్రంసహా అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ‘డ్రంకెన్ డ్రైవింగ్ వ్యతిరేక కమ్యూనిటీ’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని, టెట్రా ప్యాక్లు, సాచెట్ల మద్యం అమ్మకాలను నిషేధించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున అడ్వొకేట్ విపిన్ నాయర్ వాదనలు వినిపించారు. ఎక్సైజ్ విధానం కింద ‘సీసా’ అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, దీనిపై కొంత ప్రామాణీకరణ జరగాలని చెప్పారు. ఆకుపచ్చ ఆపిల్ ఫోటోలు ఉన్న టెట్రా ప్యాక్ల్లో మద్యం ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం నిజంగా మోసపూరితమేనని ధర్మాసనం పేర్కొంది. టెట్రా ప్యాక్ చూసి వినియోగదారులు పొరబడుతున్నారని, పైన ఆపిల్ ఫోటో, లోపల వోడ్కా ఉంటోందని విపిన్ నాయర్ వెల్లడించారు. పౌరుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చిచెప్పారు. ‘‘పొగాకు ప్యాకెట్లపై ఉన్నట్లుగా టెట్రా ప్యాక్లపై ఎలాంటి హెచ్చరిక గుర్తులు లేవు. ఇవి పండ్ల రసాల ప్యాకెట్ల మాదిరిగానే ఉంటాయి. లోపల మద్యం నింపుతున్నారు. మిరపకాయ, మామిడి వోడ్కాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పబ్లిక్ ప్రదేశాల్లో, వాహనాలు నడుపుతూ సులభంగా మద్యం తాగే అవకాశం కలుగుతోంది. మైనర్లు వీటికి త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటించి స్మగ్లింగ్ చేయడం కూడా సులభంగా మారుతోంది. ఈ తరహా విక్రయాలను నిషేధించేలా ఒక విధానాన్ని తీసుకురావాలి. ‘బాట్లింగ్’ అంటే కేవలం గాజు సీసాలు లేదా పారదర్శక కంటైనర్లు మాత్రమే అన్నట్లుగా ఏకీకృత నిర్వచనం ఇవ్వాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ సాచెట్లు, పెట్ బాటిళ్లు, టెట్రా ప్యాక్ల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. వీటిని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం. ఆదాయం పెంచుకోవడానికే వాటిని ప్రోత్సహిస్తున్నారు. ప్రమాదకరమైన ప్యాకేజింగ్లో మద్యం అమ్మకాలను నిషేధించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం’’ అని అని విపిన్ నాయర్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే: ధర్మాసనం పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పండ్ల రసాల ప్యాకెట్లను పోలి ఉండే టెట్రా ప్యాక్ల్లో విరివిగా మద్యం విక్రయించడం అత్యంత మోసపూరితమైన చర్య అని వ్యాఖ్యానించింది. ఇలాంటి విక్రయాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడింది. గతంలో ఓ ట్రేడ్ మార్క్ వివాదానికి సంబంధించిన విచారణలోనూ టెట్రా ప్యాక్ల్లో మద్యం అమ్మకాలపై తాము అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇది ప్రభుత్వ విధానపరమై నిర్ణయయమని చెబుతూ.. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం కొట్టేసింది. అదే సమయంలో ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.వెనుకబాటుతనం గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది విధానపరమైన నిర్ణయం (పాలసీ డెసిషన్). కాబట్టి ఇందులో మా జోక్యం ఉండబోదు. వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంఖ్య తెలుసుకోవడం అవసరం. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిందే అని చీఫ్ జస్టిస్ బెంచ్ స్పష్టం చేసింది.జనగణనలో కులగణన వద్దని కోరుతూ సుధాకర్ గుమ్ములా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ వాదనలు ఇలా.. ‘‘కులగణన డేటాను రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉంది. కులాల వారీగా లెక్కలు తీస్తే సమాజంలో విభజన పెరుగుతుంది. కుల ఆధారిత రాజకీయాలు మరింత బలపడతాయి. జనగణన ఉద్దేశం.. ప్రధానంగా జనాభా, ఆర్థిక, సామాజిక వివరాల కోసం మాత్రమే. అలాంటప్పుడు కులగణన చేర్చడం అవసరం లేదు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది. కులాల వారీగా లెక్కలు తీస్తే సమానత్వ భావన దెబ్బతింటుంది’’ అని వాదించారు.ఈ పిటిషన్పై కేంద్రం వాదిస్తూ.. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే కులాల వారీగా డేటా అవసరం. 1931 తర్వాత పూర్తి స్థాయి కులగణన జరగలేదు. కాబట్టి కొత్త డేటా కావాల్సిందే. సమగ్ర అభివృద్ధి కోసం వెనుకబడిన వర్గాల సంఖ్య, స్థితి తెలుసుకోవాలి. అసలు కులగణన చేయాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇది న్యాయస్థానం జోక్యం చేసుకునే విషయం కాదు.సుప్రీం కోర్టు తీర్పు.. జనగణనలో కులగణన ఉండాలా లేదా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. మేము జోక్యం చేసుకోలేంకులగణన అంటే.. జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కించడం. చివరిసారి పూర్తి స్థాయి కులగణన 1931లో జరిగింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే అధికారికంగా లెక్కించబడుతున్నాయి. అయితే కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల సంఖ్య, స్థితి తెలుసుకోవచ్చు. ఇది సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడానికి కీలకమని ప్రభుత్వం చెబుతోంది.


