Delhi
-
లోక్సభ స్థానాలు 850కి పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.లోక్సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్ అధినియమ్గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నుంచే అమలయ్యేలా... మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.కానీ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. మూడు బిల్లులపై 18 గంటల చర్చ మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?లోక్సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.వాడీవేడిగా సమావేశాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. డీలిమిటేషన్కు కమిషన్ ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం ⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులులోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్ 81, ఆరి్టకల్ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించనున్నారు. -
లోక్సభ స్థానాలు 850కి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా లోక్సభ స్థానాలపై కీలక నిర్ణయం తీసుకుంది.లోక్సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించింది. లోక్సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది.ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ జరగనుంది.ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది. -
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రాల్లో దొంగ, నకిలీ, డూప్లికేట్ ఓట్ల బెడదను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలుచేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల ధర్మాసనం స్వీకరించింది. ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్) తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలుచేసేలా కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, న్యాయవాది ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ, దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాల వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పాత ఓటర్ ఐడీ కార్డులు, వాటిపై సరిగా కన్పించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పిదాలు, రియల్టైమ్తో అనుసంధానంకాని పాత సమాచారం వంటి లోపాలు దొంగ, నకిలీ ఓట్ల వ్యవస్థ తిష్టవేయడానికి కారణమవుతున్నాయి. ఫింగర్, ఐరిస్తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది అత్యంత అవసరం. ‘ఒక పౌరుడికే ఒకే ఓటు’అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఆధార్ను ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. అదే తరహాలో పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ను అమలుచేయవచ్చు’’అని ఆయన కోర్టులో వాదించారు. ‘‘మార్చి 28న ఈసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా సంక్రమించిన సర్వాధికారాలతో ఈసీ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలను స్వీయనిర్ణాయాధికారాలతో అమలుచేయవచ్చు’’అని ఆయన గుర్తుచేశారు. తర్వాత కోర్టు స్పందించింది. ‘‘బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతను దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలుచేయాలంటే కేంద్రప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్, బయోమెట్రిక్ ఐరిస్ను అమలుచేయాలని ఆదేశించలేం. ఏర్పాట్లన్నీ అయిపోయిన ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత్న విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు లేదా శాసనసభల ఎన్నికల నాటికి ఈ బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాల్సి ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
నారీ శక్తికి పట్టం కట్టేందుకే!
న్యూఢిల్లీ: చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం మహిళల దశాబ్దాల ఎదురుచూపులకు అతి త్వరలో తెర పడనుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియమ్కు రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం గురువారం నుంచి పార్లమెంటు మూడు రోజుల పాటు సమావేశం కానుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన్’సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల రూపంలో ఈ శతాబ్దిలోకెల్లా అతి ముఖ్యమైన నిర్ణయాన్ని భారత్ అతి త్వరలో తీసుకోబోతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాన్ని నారీ శక్తికే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మహిళా రిజర్వేషన్ల చట్టానికి రాజ్యాంగ సవరణ ద్వారా మన పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించనుంది. మనందరి జీవితకాలంలో దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన నిర్ణయంగా ఇది మిగిలిపోనుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా, వారి శక్తియుక్తులకు నిజమైన నివాళిగా నిలవనుంది. భారత్లో స్త్రీ పురుష సమతావాదం, సామాజిక న్యాయం కేవలం నినాదాలు కావని, రోజువారీ పని సంస్కృతి మొదలుకునిఅత్యున్నత నిర్ణయ ప్రక్రియ దాకా అన్నింట్లోనూ అవి విడదీయలేని భాగమని నిరూపించనుంది. భారత మహిళలు ఇప్పటికే పాలనలో అన్ని స్థాయిల్లోనూ నిర్ణాయక పాత్ర పోషిస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు. మున్ముందు మరిన్ని పెద్ద బాధ్యతలను సమర్థంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు’’అంటూ కొనియాడారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2027 జనగణనతో ముడిపడి ఉన్నాయి. దాంతో ప్రస్తుత చట్టం ప్రకారం వాటిని 2034 నుంచి మాత్రమే అమలు చేయడం వీలు పడుతుంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ స్థానాల సంఖ్యను 816కు పెంచనున్న నేపథ్యంలో 273 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. అత్యున్నత పదవుల్లో ‘ఆమె’ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని రాజ్యాంగ పరిషత్తు దాకా మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారని మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర భారతానికి పునాదిరాయి వేయడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. ‘‘దేశ నిర్మాణంలో కీలకమైన పాత్రలు పోషించే అవకాశం దొరికిన ప్రతిసారీ అద్భుత పనితీరుతో భారత మహిళలు నిత్యం తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి దాకా అత్యున్నత బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం చురుగ్గా ఉన్నచోట మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా మహిళలు స్థానిక పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరింది. ఈ ఘనతను చూసి ప్రపంచమే విస్తుపోతోంది’’అంటూ ప్రధాని హర్షం వెలిబుచ్చారు. అన్ని పార్టీలదీ అదే ఆకాంక్ష మహిళా రిజర్వేషన్ల బిల్లును 2023లో పార్లమెంటులో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించాయని, 2029లోపే దాన్ని అమలు చేయాలని ఆకాంక్షించాయని మోదీ గుర్తు చేశారు. చర్చలు, పరస్పర సహకారం ద్వారా దీన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘దీనిపై దేశవ్యాప్తంగా మహిళల్లో పట్టరాని ఉత్సాహం కనిపిస్తోంది. లోక్సభ, అసెంబ్లీల్లో పెద్ద సంఖ్యలో కాలు పెట్టేందుకు వారు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఆ కలలకు ఇప్పుడిక రెక్కలు రానున్నాయి’’అని అభిప్రాయపడ్డారు.గృహస్తును కాకపోయినా సాదకబాధకాలు తెలుసు! మహిళల ఆర్థిక సాధికారత వల్ల కుటుంబాల్లో వారికి గౌరవాదరాలు పెరిగాయని మోదీ అభిప్రాయపడ్డారు. తాను గృహస్తును కాకపోయినా ఇంటిని నడపడంలోని సాదకబాధకాలు బాగా తెలుసని ఆయన చెప్పడంతో సమావేశంలో పాల్గొన్న మహిళలంతా పెద్దపెట్టున చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు! ‘‘ఇల్లు మొదలుకుని వాహనం దాకా కుటుంబ ఆస్తులన్నీ గతంలో ప్రధానంగా పురుషుల పేర్లతోనే ఉండేవి. పీఎం ఆవాస్ యోజన తదితరాలతో పరిస్థితి మారింది. ఆస్తులకు మహిళలు యజమానులవుతున్నారు. గత 11 ఏళ్లలో 3 కోట్ల మందికి పైగా మహిళలు ఇంటి యజమానులయ్యారు’’అని ప్రధాని అన్నారు. ‘‘గతంలో ఇళ్లలో తండ్రీ కొడుకులు వ్యాపారం గురించి చర్చించుకుంటుంటే మహిళలు వారికి చాయ్ బిస్కట్లు ఇచ్చేందుకే పరిమితమయ్యేవారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యాపార నిర్ణయాలకు సంబంధించి అమ్మతో కూడా చర్చిద్దామని కొడుకులు తండ్రులతో అంటున్నారు’’అని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ – తిరుపతి... విమానయానం సామాన్యుడికి గగనమే
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్– తిరుపతి మార్గంలో విమాన చార్జీల పెంపుపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ లక్ష్యాల్లో ఒకటైన ‘సామాన్యుడికి విమానయానం’ ఆశయానికి విరుద్ధంగా ఈ చార్జీల బాదుడు కొనసాగుతోందని మండిపడ్డారు. పెరిగిన విమాన చార్జీలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ లేఖ రాశారు. లేఖలో ముఖ్యాంశాలు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణం అత్యంత ఖరీదుగా మారింది.దీనిప్రకారం హైదరాబాద్ నుంచి గోవా (రూ.3,000–రూ.6,500), ఢిల్లీ (రూ.3,900–రూ.7,000), చెన్నై (రూ.2,500–రూ.4,000)కు ఉన్న చార్జీల కంటే తిరుపతి రూట్లోనే అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్–తిరుపతి మధ్య కనీస చార్జీ రూ.6,000 నుంచి ప్రారంభమై రూ.9,500 వరకు ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఇది రూ.14,500కు చేరుతోంది. ఇక 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 13,367 విమానాల్లో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్–తిరుపతి రూట్లో ప్రయాణించారు.కేవలం మార్చి 2026లోనే 864 విమాన సర్విసుల ద్వారా 88 వేల మందికిపైగా ప్రయాణించారు. రోజుకు ఈ రూట్లో 16 నుంచి 17విమానాలు నడుస్తున్నాయంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ విమానయాన సంస్థలు తెలివిగా పెద్ద విమానాల సంఖ్యను తగ్గించి, చిన్న విమానాలను నడుపుతూ సీట్ల కొరతను సృష్టిస్తున్నాయి. తద్వారా చార్జీలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల్లో అత్యధికులు మధ్యతరగతి వారు, వృద్ధులు ఉంటారు. వారిపై ఆరి్థక భారం మోపడం అన్యాయం. -
ఢిల్లీలోని ఆ ఇంట్లో చేసేది ఏంటి?
దేశ రాజధాని నగరంలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సెంట్రల్ ఢిల్లీలో, అజ్మేరీ గేట్ సమీపంలోని ఎస్.ఎన్. మార్గ్లో ఉన్న ఒక ఇంటిపై 12వతేదీన పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ ఎనిమిది మంది యువతులు, పలువురు పురుషులు అక్రమ అశ్లీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటాన్ని కనుగొన్నారు. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లు కూడా నిండని మైనర్ అని తేలింది. ఈ ముఠా సూత్రధారి రాహుల్, తన భార్య కుమారితో కలిసి ఈ మొత్తం కార్యకలాపాన్ని నడుపుతున్నాడు. మేనేజర్లు గోపీ రామ్ పరిహార్, లుమాకాంత్ పాండే, ఆలియా పింకీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఆ సంస్థ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత వహించారు. పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, ఎనిమిది వేర్వేరు గదులలో పలువురు పురుషులు, మహిళలు అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ మొత్తంలో నగదు (సుమారు రూ.1.97 లక్షలు), విదేశీ కరెన్సీ, గంజాయి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే క్యాప్సూల్స్, వందలాది మద్యం సీసాలు, బీర్ క్యాన్లు, కండోమ్లు, లావాదేవీల లెడ్జర్లు, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లలోపు మైనర్ అని సమాచారం.నగ్నంగా వచ్చెయ్.. నచ్చిన వారితో ఎంజాయ్ఆ ఇంటిలో నడుస్తున్న వ్యభిచారం మరింత కొత్త పుంతలు తొక్కినట్టు తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే నగ్నంగా మారాలనేది నిబంధన కాగా అక్కడ అందరూ నగ్నంగానే సంచరిస్తారట. ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల్లో నచ్చిన వారితో ఎంజాయ్ చేయవచ్చునట. ఇక అక్కడ జరిగే తంతు పోర్న్ వీడియోలకు తీసిపోని రీతిలో ఉంటుందట. వీరి క్లయింట్లు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, భిన్న రంగాల ప్రముఖులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ సోషల్ మీడియా లో ఈ వార్త వైరల్ అవుతోంది.దేశరాజధానిలో విచ్చలవిడిగా...గత కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వ్యభిచార అడ్డాలు, సెక్స్ రాకెట్లు వెలుగు చూస్తుండడం దేశ రాజధాని నగర ప్రతిష్టను మసకబారుస్తోంది. ఢిల్లీ–ఎన్ సిఆర్ ప్రాంతంలో నకిలీ డేటింగ్ యాప్ ప్రొఫైల్ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల చిత్రాల దందాలు ఆన్ లైన్ దోపిడీ (సెక్స్టార్షన్) పెరిగాయని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి, అలాగే ఢిల్లీ పోలీసులు, తరచుగా స్పా సెంటర్లు లేదా క్లబ్ల ముసుగులో నడుస్తున్న అక్రమ సెక్స్ రాకెట్లు బయటపడుతున్నాయి.గత ఏడాది మార్చి లో పహర్గంజ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఒక సెక్స్ రాకెట్ను ఛేదించారు. ఆ సమయంలో 10 మంది నేపాలీ జాతీయులు ముగ్గురు మైనర్లతో సహా 23 మంది మహిళలను రక్షించారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. అదే మార్చి నెలలో గ్రాండ్ ప్లాజాలోని బ్లిస్ వెల్నెస్ స్పాపై జరిపిన దాడిలో, విదేశీయులు మైనర్లతో కూడిన సెక్స్ రాకెట్ను నడుపుతున్నందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో రెండు స్పా సెంటర్ల పేరిట నడుస్తున్న వ్యభిచార రాకెట్పై దాడి అనంతరం ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు.ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది మహిళలను రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసులు దాడులు, అరెస్టులు కు దొరుకుతున్నవే పెద్ద జాబితా అవుతుంది. ఇక. దొరకని ముఠాలు ఎన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా ఉండాల్సిన దేశ రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అవాంఛనీయం. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది. -
క్లీన్ ఎలక్షన్స్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
ఎన్నికల్లో అవకతవకలు నివారించే ఉద్దేశంతో దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూ సోమవారం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు (Fingers), కంటి (Iris) సంబంధిత బయో మెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లు చేయాలని ఓ పిటిషన్ దాఖలైంది. తద్వారా నకిలీ ఓట్లకు చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత, జస్టిస్ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. అలాగే పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ ఈసీకి, కేంద్రానికి, పలు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో.. బయో మెట్రిక్ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సీజే బెంచ్ తోసిపుచ్చింది. అది సాధ్యమయయే పని కాదని పేర్కొంది. కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్రాల నుంచి స్పందన తర్వాత ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది.అడ్వొకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిటిషన్లో.. ఒక ఓటర్ స్థానంలో మరొకరు ఓటేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. డూప్లికేట్ ఓటింగ్, గోస్ట్ ఓటింగ్.. ఇలాంటి అక్రమాలు ఎన్నికల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడానికి పోలింగ్ బూత్ల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ అమలు చేయాలి.సీజే బెంచ్ ఏమందంటే.. ఓటర్ల గుర్తింపులో బయోమెట్రిక్ అవసరమా?. ఇలాంటి చర్యను వచ్చే పార్లమెంట్ లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. దేనికంటే ముందు అమలు చేయాలి? అనే అంశం పరిశీలించాల్సి ఉంది.ఇప్పటికే ఈవీఎంల అవకతవక అంశం, ఈసీ పాత్రపై ఆరోపణలతో దేశ ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. బ్యాలెట్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో.. క్లీన్ ఎలక్షన్స్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎలక్షన్ల ప్రక్రియలో చేర్చవచ్చనే అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలనుకోవడం విశేషం. -
29 తర్వాత అఖిలపక్షం పెట్టండి
న్యూఢిల్లీ: ఎంతో కీలకమైన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇతర అంశాలను తేల్చకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించడం వృథా ప్రయాసేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేసి వీటిపై చర్చ జరపాలని కోరారు. ఈ మేరకు ఖర్గే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని హడావుడిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా, డీలిమిటేషన్ తీరును వివరించకుండానే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సభలో అర్థవంతమైన చర్చ ఎలా సాధ్యమని భావిస్తున్నారంటూ ఖర్గే నిలదీశారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో జాప్యంతో కోట్లాది మంది మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. -
ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓట్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా ప్రక్షాళన చేసింది. పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యంగా నకిలీ, బోగస్ ఓట్లకు చెక్ పెడుతూ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ భారీ ప్రక్షాళనలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నకిలీ, బోగస్, చనిపోయిన ఓటర్ల పేర్లు ఇలా మొత్తంగా 5.18 కోట్ల పేర్లను జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఈ సవరణల అనంతరం ఆయా రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 45.81 కోట్లకు చేరుకుంది. గతంతో పోలిస్తే 10.2 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గడం గమనార్హం. మొత్తంగా 66,88,636 పేర్లు ఓటర్ల జాబితా నుంచి తీసేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 25.47 లక్షల ఓట్లకు కోత పడగా.. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్లో 24.16 లక్షల పేర్లను అధికారులు తొలగించారు. శుక్రవారం యూపీ తుది ఓటర్ల జాబితా విడుదల కావడంతో రెండో దశ ప్రక్షాళన ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండో దశ ఎస్ఐఆర్ ప్రక్రియను యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. -
బీజేపీ ఎంపీలకు ‘త్రీ-లైన్’ విప్ జారీ
ఢిల్లీ: ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపి (BJP) తన ఎంపీలకు 'త్రీ-లైన్ విప్' జారీ చేసింది. ఈ సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్కు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు.కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ ఈ మూడు రోజుల పాటు సభలోనే ఉండాలని.. ఈ సమయంలో ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.2023 నాటి 'నారీ శక్తి వందన్ అధినియం' ప్రకారం.. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) తర్వాతే అమలు కావాల్సి ఉంది. అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.మరోవైపు, ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా, ఈ చారిత్రాత్మక చట్టంపై అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. -
అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ
ఢిల్లీ: అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నారీ శక్తి వందన్ అదినియమ్ ద్వారా మహిళా శక్తిని మరింత బలోపేతం చేయాలన్న ప్రధాని.. వీలైనంత తొందరగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్న అంశంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.ఈ బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేశాం. 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. మహిళలకు రిజర్వేషన్ వల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతం. పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలి’’ అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.Congress president and Rajya Sabha LoP Mallikarjun Kharge writes to PM Narendra Modi, "I have just received your letter on the special session of Parliament for a discussion on the Nari Shakti Vandan Adhiniyam from the 16th of April...This special sitting has been called without… pic.twitter.com/SqkvavZmPs— ANI (@ANI) April 12, 2026 -
మోదీ-రాహుల్ మధ్య ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఈ ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరిగాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రేరణ్ స్థల్ వద్ద ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులర్పించి ప్రసంగించారు. అంతకు ముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాక ప్రధాని మోదీ అక్కడే వేచి ఉన్న రాహుల్ గాంధీకి, ఇతరులకు నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.మోదీ మాట్లాడుతుండగా.. రాహుల్ గాంధీ తల ఊపుతూ, వేళ్లు కదిలిస్తూ సమాధానం ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే కుతూహలం నెలకొంది. అయితే రాహుల్ను ప్రధాని మోదీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.అనంతరం మోదీ మాట్లాడుతూ.. జ్యోతిరావ్ పూలే సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుడు. ఆయన ఆలోచనలు నేటికీ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ ప్రేరణ. ఆయన చూపిన మార్గం నేటి భారతదేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. నివాళి వేదికపై ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Prerna Sthal on the Parliament premises to pay a floral tribute to Mahatma Jyotiba Phule on his 200th birth anniversary today.Lok Sabha Speaker Om Birla, Lok Sabha LoP Rahul Gandhi, Union Minister Arjun Ram Meghwal, former… pic.twitter.com/QexqUVky1Z— ANI (@ANI) April 11, 2026 -
పునర్విభజనతో ప్రజా ఉద్యమం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ నియోజకవర్గాల పెంపు (పునర్విభజన)తో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయని, ఫలితంగా ప్రజా ఉద్యమాలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. రైతు చట్టాల్లాగే డీలిమిటేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకోకతప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర ద్రోహం చేస్తోందని అన్నారు. ఈ రాష్ట్రాలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని చెప్పారు. ‘ఇప్పటికే మేము తీవ్రమైన బాధతో ఉన్నాం.. గాయపడి ఉన్నాం.. మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు’ అని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన అనంతరం.. రాత్రి తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అప్పుడు బండి, కిషన్రెడ్డిలకు చప్రాసీ పదవి కూడా దొరకదు‘నియోజకవర్గాలను ఏ ప్రాతిపదికన, ఎలా పెంచాలి అనే దానిపై కనీస చర్చ లేకుండా ఎందుకింత అర్జెంటుగా? దేశంలో 50 శాతం నియోజకవర్గాల పెంపు జరిగితే ఉత్తరాదికే పూర్తి అడ్వాంటేజ్గా మారుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి వస్తుంది. చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా ప్రాముఖ్యత కోల్పోతాయి. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన, మెరిట్ డిజబిలిటీ విధానంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు ఉండాలి.చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ అలాగే కొనసాగాలి. ప్రస్తుతం కేరళ, యూపీ మధ్య 60 సీట్ల తేడా ఉంది. పునర్విభజన జరిగితే అది ఏకంగా 99కి పెరుగుతుంది. ఇది ముమ్మాటికీ చిన్న రాష్ట్రాలకు ఉరితాడు లాంటిదే. భవిష్యత్తులో ఉత్తరాది సీట్లు పెరిగితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్, కిషన్రెడ్డి లాంటి దక్షిణాది బీజేపీ నేతలకు కనీసం చప్రాసీ పదవి కూడా దొరకదు..’ అని సీఎం అన్నారు.అందమైన ముసుగులో మోసం‘నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో చేస్తున్న మోసం. బీజేపీ పెడుతున్న ఈ మెలికల్లో వారి రాజకీయ స్వార్థం దాగుంది. గతంలో ఇలాగే హడావుడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లుపై సౌత్లో రియాక్షన్ వస్తే, బీజేపీ పాలిత చిన్న రాష్ట్రాలు సహా.. ఇతర చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం ఏం చేస్తుంది? ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు.మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు..మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను దివంగత ప్రధాని రాజీవ్గాంధీ అమలు చేశారు. సోనియాగాంధీ గతంలోనే మహిళా రిజర్వే షన్ బిల్లును పెట్టారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల కోసం సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న 543 లోక్సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? కేంద్రం లీకులు ఇస్తున్న ఇతర సవరణలపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు.కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని రేవంత్రెడ్డి విమర్శించారు. ‘గతంలో బీఆర్ఎస్లో సీనియర్లుగా ఉన్న ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్, విజయశాంతి లాంటి ఎంతోమందికి ఏం జరిగిందో, వారిని ఎలా గెంటేశారో అందరికీ తెలుసు..’ అని వ్యాఖ్యానించారు. -
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
ఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఆయన రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. పార్లమెంట్లో ఆయన అభిశంసన పెండింగ్లో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కిందటి ఏడాది మార్చిలో యశ్వంత్ వర్మ ఢిల్లీ జడ్జిగా ఉన్న టైంలో.. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అప్పుడు ఆయన హోలీ సెలవుకు సొంతూరు వెళ్లారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఒకానొక టైంలో ఆయన ఇచ్చిన తీర్పులన్నింటిపైనా రివ్యూ జరగాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో.. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో వెబ్సైట్లో కాలిన ఆ నోట్ల ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ముగ్గురు జడ్జిలతో కూడిన ఇన్హౌజ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయించింది. అటుపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలాంటి వ్యక్తి తమకు వద్దంటూ ఆ టైంలో అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనలకు దిగింది. దీంతో ఆయనకు ఎలాంటి పని అప్పగించకుండానే ఖాళీగా కూర్చోబెట్టారు. మరోవైపు.. ఆయనపై పార్లమెంట్లో అభిశంసన ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈలోపు.. ‘సుప్రీం’ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపై రాజీనామా ఒత్తిడి పెరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన వాటిని ఆరోపణలు తోసిపుచ్చుతూ వచ్చారు. కమిటీ నివేదిక.. అభిశంసన.. వీటి నుంచి బయటపడేందుకు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించగా.. అక్కడా ఆయన చుక్కెదురైంది. చివరకు స్వచ్చందంగా తన జడ్జి పోస్టుకి రాజీనామా చేశారు.గతంలోనూ.. జస్టిస్ సౌమిత్ర సేన్ ( కలకత్తా హైకోర్టు) ఇంపీచ్మెంట్ ప్రక్రియ దగ్గరి దాకా వెళ్లి రాజీనామా చేశారు. జస్టిస్ పి.డి. దినకరన్ (సిక్కిం హైకోర్టు), జస్టిస్ వి. రమణ (మద్రాస్ హైకోర్టు) మాత్రం ఆరోపణలు రాగానే రాజీనామా చేసేశారు. -
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచే కొత్త రూల్
ఢిల్లీ: టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు ఇవాళ నుంచి(ఏప్రిల్ 10, శుక్రవారం) బంద్ కానున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు 1.25 రెట్ల అధిక రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయరహదారులపై టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది. కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులను పూర్తిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ను అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది.ఫాస్టాగ్ విధానంలో మాత్రమే టోల్ప్లాజా గేట్ల వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, అందుకే ఫాస్టాగ్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వశాఖ చెబుతోంది. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్లతో వచ్చే వాహనాల టోల్చార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాస్టాగ్ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. -
PIL: ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే కాన్సెప్ట్ తొలగిస్తే..
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే కాన్సెప్ట్ను తొలగించాల్సిన సమయం వచ్చిందంటూ సుప్రీం కోర్టు వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. శబరిమల కేసు సమీక్ష పిటిషన్ల సందర్భంగా ఇది చోటు చేసుకుంది. అయితే సుప్రీం కోర్టు మాత్రం తొందరపాటు నిర్ణయం మంచిది కాదన్న రీతిలో వ్యాఖ్య చేసింది. పిల్(Public Interest Litigation) తరచుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయన్నది కేంద్రం వాదన. బుధవారం శబరిమల కేసు విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. పిల్లు ఇప్పుడు తమ అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయాయి అన్నారు. నేటి పరిస్థితుల్లో న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్, కోర్టులకు సులభమైన ప్రాప్యత పెరిగినందున పిల్ అవసరం తగ్గిందని కేంద్రం అభిప్రాయపడుతోందని తెలిపారాయన. అయితే.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం ప్రజా ప్రయోజన వ్యాజ్యల విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం అని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. కోర్టులు పిల్ను స్వీకరించడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. అవి దాఖలు చేసే సమయంలో కఠినమైన ప్రమాణాలు అమలు చేస్తున్నాం. ప్రతి పిటిషన్ను పరిశీలించి మాత్రమే స్వీకరిస్తున్నాం అని సాలిసిటర్ జనరల్కు గుర్తు చేశారు. అలాగే.. శబరిమల కేసులో భక్తులు కాని వ్యక్తులు వేసిన పిటిషన్లు ఎందుకు స్వీకరించబడ్డాయి? అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు.అసలు పిల్ అంటే..పిల్ అనేది 1980లలో భారత న్యాయవ్యవస్థలో ప్రవేశపెట్టబడిన ఒక ప్రత్యేక పద్ధతి. దీని ఉద్దేశ్యం పేదలు, అక్షరాస్యులు, శారీరక వైకల్యం ఉన్నవారు, సామాజికంగా వెనుకబడినవారు న్యాయస్థానాలకు చేరుకోలేని పరిస్థితుల్లో వారి తరఫున ఇతరులు పిటిషన్ వేసే అవకాశం కల్పించడం. తద్వారా సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు వంటి అంశాలు కోర్టు దృష్టికి వస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితిగతంలో సామాజిక మార్పు సాధనంగా పిల్ ఉపయోగపడినప్పటికీ.. ఇప్పుడు అవి అధిక సంఖ్యలో దాఖలు అవుతున్నాయి. తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. అందుకే కేంద్రం తొలగింపు కోరుకుంటోంది. అయితే.. సామాజిక న్యాయం కోసం PILలు ఇంకా అవసరమే అని న్యాయవేత్తలు, పౌరసమాజం భావిస్తోంది. కాబట్టే.. కేంద్రం PILలను తొలగించాలని కోరుకుంటున్నప్పటికీ.. సుప్రీం కోర్టు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ కొనసాగిస్తోంది. -
డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు, లోక్సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని 2029 లోక్సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టనున్నారు. దానితో పాటు డీలిమిటేషన్ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 18 దాకా పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుండటం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లుఖరీఫ్ సీజన్కు ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంపు నిర్ణయానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందుకు రూ.41,533.81 కేటాయించారు. 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.4,317 కోట్లు అదనమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు భారీగా పెరిగినా రైతులకు మాత్రం 50 కిలోల బస్తాను రూ.1,350కే అందుబాటులో ఉంచుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా రాయితీని హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘రూ.13 వేల కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో కూడిన జైపూర్ మెట్రో రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 36 స్టేషన్లతో 41 కి.మీ. మేరకు ఉంటుంది’’ అని వైష్ణవ్ వివరించారు. -
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ.. భారత్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, ఢిల్లీ: అమెరికా ఇరాన్ కాల్పుల విరమణపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతి కోసం ఆశిస్తున్నామంటూ భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం పరంగా శాంతిని నెలకొల్పాలని గతంలోని చెప్పాం. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లకు అంతరాయం కలిగింది. హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా నౌకలు వెళ్తాయని ఆశిస్తున్నాము’’ అని భారత విదేశాంగ పేర్కొంది.కాగా, ‘‘ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు... ఇరాన్ కూడా శాంతినే కోరుకుంటోంది. ఇక యుద్ధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. అలాగే, అందరికీ కూడా ఇలాగే అనిపిస్తోంది’’ అంటూ అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ పెరుగుదల విషయంలో అమెరికా సాయం చేస్తుందన్న ట్రంప్.. పాజిటివ్ చర్యలు ఎక్కువగా ఉంటాయన్నారు.ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సరఫరాలతో లోడ్ అవుతాము. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండబోతున్నాం. అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అమెరికాలో మేము అనుభవిస్తున్నట్లే, ఇది పశ్చిమాసియాకు స్వర్ణ యుగం కావచ్చు” అని ట్రంప్ పేర్కొన్నారు. Statement on the recent development in West Asia ⬇️🔗 https://t.co/WwFCi4kXHg pic.twitter.com/wmsF4YUb7j— Randhir Jaiswal (@MEAIndia) April 8, 2026 -
శబరిమలలో మహిళలపై నిషేధం సబబే
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం సబబేనని కేంద్రం పేర్కొంది. ‘‘మతపరమైన విశ్వాసానికి సంబంధించిన విషయమిది. కనుక న్యాయపరమైన సమీక్షకు అతీతమైనది’’అని స్పష్టం చేసింది. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఒకరకమైన అంటరానితనమేనంటూ 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.‘‘అది తప్పుడు తీర్పు. కనుక దాన్ని పునఃపరిశీలించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25 ప్రసాదించిన మతపరమైన స్వేచ్ఛను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. మతపరమైన విశ్వాసం ముసుగులో కొనసాగే సామాజిక రుగ్మతలను పరిశీలించే అధికార పరిధి కోర్టులకు ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దానితో ఏకీభవిస్తున్నట్టు మెహతా చెప్పారు. మతపరమైన ఆచారాలు శాంతిభద్రతలకు, ఆరోగ్యానికి, నైతికతకు విఘాతం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. మహిళలను నెలలో మూడు రోజుల పాటు అంటరానివారిగా చూడటం సరికాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ విషయమై తానొక మహిళగా మాట్లాడుతున్నట్టు చెప్పారు.శబరిమల ఆలయంలోకి మహిళలపై నిషేధం వయసుకు సంబంధించిందే తప్ప రుతుస్రావానికి సంబంధించిన అంశం కాదని మెహతా బదులిచ్చారు. ‘‘దీనిపై స్పష్టత అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప ఆలయాల్లోకీ మహిళలకు ప్రవేశముంది. ఒక్క శబరిమల ఆలయంలో మాత్రమే దానిపై ఆంక్షలున్నాయి’’అని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘భారత్లో మహిళలు ఎప్పుడూ పురుషులతో సమానంగా హోదా, మన్నన అందుకున్నారు. కొన్నిసార్లు వారికే ప్రాధాన్యం దక్కింది. మహిళలను పూజించే ఏకైక సమాజం మనదే. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా అందరమూ దేవీ విగ్రహాలకు మొక్కుతాం.కనుక పురుషాధిక్యత, లింగ సమానత్వం వంటి అంశాలను ఈ కేసులో చొప్పించరాదు’’అని వాదించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని 2018లో ఐదుగరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే. అంతేగాక నిషేధాన్ని తొలగిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు కూడా వెలువరించింది. ‘‘మేమిప్పుడు ఆ తీర్పు తాలూకు మంచిచెడుల్లోకి పోదలచుకోలేదు. ఈ అంశానికి సంబంధించి రూపొందించిన ఏడు ప్రశ్నలకు మాత్రమే విచారణ పరిధిని పరిమితం చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
10వ తేదీ నుంచి టోల్ప్లాజాల వద్ద నో క్యాష్
న్యూఢిల్లీ: ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 10వ తేదీ నుంచి జాతీయరహదారులపై టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది. కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ను అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది. ఫాస్టాగ్ విధానంలో మాత్రమే టోల్ప్లాజా గేట్ల వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, అందుకే ఫాస్టాగ్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్లతో వచ్చే వాహనాల టోల్చార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాస్టాగ్ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి స్పష్టంచేశారు. -
అతిగా ఊహించుకోకండి.. కాస్త తగ్గండి!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), రాష్ట్ర డీజీలపై సుప్రీంకోర్టు తలంటింది. వారి వ్యవహార శైలిని తప్పుబట్టడంతోపాటు, మాల్డా ఘటన జరిగిన రోజున కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోన్కాల్కు సీఎస్ స్పందించక పోవడాన్ని సీరియస్గా తీసుకుంది. అతిగా ఊహించుకోకండి..కాస్తంత తగ్గండి అంటూ మందలించింది. ఘటన విచారణ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల ఒకటో తేదీన సర్ ప్రక్రియలో భాగంగా విచారణకు వెళ్లిన 9మంది న్యాయాధికారుల బృందాన్ని 9 గంటలపాటు కొందరు నిర్బంధించారు. సాయంత్రం 3.30 గంటలకు ఘెరావ్ మొదలుకాగా, అర్ధరాత్రి 11.30 గంటల వేళ సీజేఐకి సమాచారం అందింది. ఆయన జోక్యంతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆతర్వాతే అర్ధరాత్రి సమయంలో న్యాయాధికారులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఈ ఘటనపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్చువల్ హాజరైన సీఎస్ దుష్యంత్ నరియాలానుద్దేశించి ధర్మాసనం.. ‘ప్రధాన న్యాయమూర్తి ఫోన్ చేసినా స్పందించరా?’అంటూ నిలదీసింది. తాను ఆ సమయంలో ఢిల్లీ లో ఉన్నానని, ఎటువంటి ఫోన్ కాల్స్ తనకు రాలేదని సీఎస్ బదులిచ్చారు. ‘మీ నంబర్ను హైకోర్టు సీజేకి ఇచ్చి ఉంటే ఆయనకు ఆ సమయంలో ఎంతో ఉపయోగపడేది. మీరు హైకోర్టు సీజేకి కూడా అందనంత ఎత్తులో ఉన్నారు. తగ్గండి. హైకోర్టు సీజేకి అయినా అందుబాటులో ఉండండి’అంటూ గట్టిగా హెచ్చరించింది. ‘యంత్రాంగం తీరు ఇలా ఉండటం వల్లే అరాచకం రాజ్యమేలుతోంది’అని వ్యాఖ్యానించింది. మాల్డా ఘటనకు సరైన రీతిలో స్పందించడంలో విఫలమైనందుకు గాను హైకోర్టు సీజేకి క్షమాపణ లేఖ రాయాలంటూ సీఎస్కు, డీజీపీకి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాల్డా ఘటనపై కలకత్తా హైకోర్టు సీజే నివేదిక ఆధారంగానే కలెక్టర్, ఎస్పీలపై తీసుకునే చర్యలుంటాయని తెలిపింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైకోర్టు సీజేకి పూర్తి సహాయ సహకారాలను అందించాలని సీఎస్, డీజీపీ, ఇతర యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. మాల్డాలో న్యాయాధికారుల ఘెరావ్కు సంబంధించి అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ ఎన్ఐఏకి అప్పగించాలంది. ముందస్తు ప్రణాళికతో జరిగిన ఈ ఘటన వెనుక సూత్రధారులెవరో తేల్చాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. -
అసెంబ్లీలో కలకలం.. కారుతో దూసుకెళ్లిన మాస్క్ మ్యాన్!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేగింది. ఓ మాస్క్ ధరించిన అగంతకుడు తన కారుతో అసెంబ్లీ వీఐపీ ఇనుప గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకెళ్లాడు. స్పీకర్ రూమ్ ఎదురు బొకే ఉంచి.. స్పీకర్ కారుపై ఇంకు చల్లాడు. అనంతరం తన కారుతో పరారయ్యాడు. పోలీసులు సమాచారం మేరకు.. ముసుగు ధరించిన వ్యక్తి కారులో వచ్చి గేట్ నంబర్ 2 వద్ద ఇనుప గేటును బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. డ్రైవర్ అసెంబ్లీ స్పీకర్ విజయేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లాడు. ఆపై స్పీకర్ ఛాంబర్ ఎదుట బూకే ఉంచడం, ఆయన కారుపై ఇంక్ చల్లడం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడం అంతా సినిఫక్కీలో జరిగినట్లు అసెంబ్లీ అధికారులు తెలిపారు. అంగతకుండి తీరుపై అనుమానంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మాస్క్ మ్యాన్ ఉంచిన పూల బుకేలో పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని పరిశీలించింది. అందులో ఎలాంటి పేలుడు, అనుమానాస్పద వస్తువులు లేదని నిర్ధారించింది. అసెంబ్లీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. మాస్క్ మ్యాన్ కారు ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఘటన కేసులో అగంతకుడు సరబ్ జీత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ ఢిల్లీలోని రూప్ నగర్లో సరబ్ జీత్ సింగ్ కారు పార్కు చేసినట్లు గుర్తించారు. ఆపై సరబ్ జీత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు సీజ్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నేపాల్ నుంచి భారీ ఎత్తున ఆయుధాల భారత్కు స్మగ్లింగ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆయుధాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గాయపడ్డాను కాబట్టి దృఢంగా మారా: చద్ధా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా మధ్య రగడ మరింత ముదురుతోంది. తనపై పార్టీ నాయకత్వం చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ఆయన కొట్టిపారేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికే పార్లమెంట్కు వెళ్తున్నాను తప్ప గొడవలు సృష్టించడానికి కాదని తేల్చిచెప్పారు. ఆప్ అబద్ధాల అసలు రంగు కచ్చితంగా బయటపడుతుందన్నారు. ‘ధురంధర్’చిత్రంలోని డైలాన్ను ప్రస్తావిస్తూ.. గాయపడ్డాను కాబట్టి మరింత దృఢంగా మారానని స్పష్టంచేశారు. ఈ మేరకు రాఘవ్ చద్ధా శనివారం ‘మూడు ఆరోపణలు, సున్నా నిజాలు’పేరిట ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తనను టార్గెట్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం పట్ల రాఘవ్ చద్ధా సానుకూలంగా ఉంటున్నారని ఆప్ నాయకత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దీనిపై రాఘవ్ చద్ధా అభ్యంతరం వ్యక్తంచేశారు. తన గొంతు నొక్కగలరు కానీ ఓడించలేరని ఆప్ నాయకత్వానికి తేల్చిచెప్పారు. -
రాజ్యసభలో గొంతు నొక్కేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే తమకు తక్కువ సమయం కేటాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.ఆచరణ సాధ్యం కాని రీతిలో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నందున అక్కడ జరుగుతున్న అవినీతిని, లోపభూయిష్టమైన బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన పక్షపాత వైఖరిపై ఆయన పార్టీ లోక్సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్రెడ్డి, ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ చైర్మన్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను వివరించారు. సభలో జరిగిన వివక్ష, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న ప్రజాధనం లూటీని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సమయం కేటాయింపులో పక్షపాతం రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఏడుగురు సభ్యులు ఉంటే.. చర్చలో పాల్గొనేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చి మైక్ కట్ చేశారని చెప్పారు. సభలో పార్టీల బలాన్ని బట్టి కాకుండా పక్షపాత ధోరణితో సమయం కేటాయించారన్నారు. వాస్తవానికి తమ బలానికి 20 నిమిషాల సమయం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అదే సమయంలో సభలో కేవలం ఇద్దరు సభ్యులున్న టీడీపీకి ఏకంగా 15 నిమిషాలకు పైగా మాట్లాడే అవకాశం కల్పించారని తెలిపారు. తమకన్నా చిన్న పార్టీలైన టీడీపీ, బీఆర్ఎస్లకు ఎక్కువ సమయం ఇచ్చారని, బీఆర్ఎస్ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం దక్కిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం రాష్ట్ర ప్రజల గొంతు నొక్కడమేనని విమర్శించారు. సమయం కేటాయింపులో ప్రదర్శించిన పక్షపాత ధోరణి పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాజ్యసభ చైర్మన్ స్థానానికి ఇది తగదని పేర్కొన్నారు. అడుగుల లెక్కన ప్రజాధనం లూటీ చంద్రబాబు భ్రమలు కల్పించడాన్ని తప్పుపడుతూ ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ముందుగా ఆ రైతులకు ఎలా న్యాయం చేస్తారో బిల్లులో పొందుపరచాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగు నిర్మాణానికి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారని, ఇదంతా ప్రజాధనాన్ని లూటీ చేయడమేనని విమర్శించారు. కోల్కతా వంటి మహానగరమే 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఎన్నివేల ఎకరాల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. పూర్తి ప్రసంగ పాఠాన్ని రికార్డుల్లోకి తీసుకోవాలి రాజ్యసభలో చర్చ సందర్భంగా తమకు తగినంత సమయం ఇవ్వనందున, అడ్డుకోవడం వల్ల సభలో చదవలేకపోయిన తమ పూర్తి ప్రసంగ పాఠాన్ని సభ రికార్డుల్లో (టేబుల్పై) ఉంచేందుకు అనుమతించాలని కోరారు. తాము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారని, తాము ఎక్కడ నుంచి మాట్లాడటం ఆపేశామో.. అక్కడ నుంచి తమ ప్రసంగాన్ని రికార్డుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం తాము చేసిన ఫిర్యాదుపై సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. కెమెరా ప్రొసీడింగ్స్, అమరావతి అవినీతిపై త్వరలో జరిగే సమావేశాల్లో మరోసారి గట్టిగా నిలదీస్తామని చెప్పారు. ఆ కెమెరా ఫోకస్లపై విచారణ జరగాలి సభా కార్యకలాపాలు ముగుస్తున్న సమయంలో సందర్శకుల గ్యాలరీలో ఉన్న టీడీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులపైకి పదేపదే కెమెరా ఫోకస్ వెళ్లడం యాదృచ్ఛికం కాదని వైవీ సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు ఉందని, ఆ ఫొటోలను పత్రికల్లో వేసుకుని ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కెమెరా ఫోకస్ వ్యవహారంపై అధికారిక విచారణ జరపాలని చైర్మన్ను కోరినట్లు చెప్పారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన సమయం కేటాయింపు వెనుక ఉన్న పరిస్థితులపై కూడా విచారణకు ఆదేశించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన పెద్దల సభలో ఇలాంటి పరిణామాలు సభ నిర్వహణపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్యాలరీ ఫొటోల దురి్వనియోగానికి సంబంధించిన పత్రికా క్లిప్పింగ్, తన ప్రసంగపాఠం కాపీలను చైర్మన్కు ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు. కాగ్ ఆడిట్ చేయాలి.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలి: గొల్ల బాబూరావు డిమాండ్ వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ... రాజధాని ఏర్పాటు అనేది తమ పరిధిలో లేదని గతంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా తెలిపిందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని విస్మరించిన సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం అమరావతికి చట్టం చేసేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. 2014 నుంచి చట్టం చేయాలని గుర్తు రాలేదా అంటూ చంద్రబాబును నిలదీశారు. అప్పుడు అమరావతిపై లేని ప్రేమ ఇప్పుడెందుకు సడెన్గా వచ్చిందంటూ ప్రశ్నించారు. పేదల నుంచి ఐదువేల ఎకరాల అసైన్డ్ భూములను తీసుకున్నారని, వారికి తిరిగి ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పేదలకు ఐదు శాతం ల్యాండ్ పంపిణీ చేయాలని అమరావతి యాక్ట్లో ఉందని చెప్పారు. ప్రస్తుతం వారికి ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలని కోరారు. అమరావతిని బూచిగా చూపించి మిగతా ప్రాంతాలను పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ భారీ అవినీతిపై కాగ్ ఆడిట్ చేయాలని, దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. -
దేశంలో యాపిల్ నగరంగా పేరొందిన సిటీ ఎక్కడ ఉంది?
భారతదేశం అనేక హిల్ స్టేషన్స్కు ప్రశాంతమైన పర్వత గ్రామాలకు నిలయం, అందులోనూ విశేషం ఏమిటంటే.. ప్రతిదానికీ దాని కంటూ ఒక స్వంత కథ ఉంటుంది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లో దాగి ఉన్న అటువంటి ఒక చిన్న పట్టణం, భారతదేశపు యాపిల్ సాగులో కీలక పాత్ర పోషించింది. దట్టమైన కొండలు, స్వచ్ఛమైన పర్వత గాలి నలువైపులా యాపిల్ తోటలతో నిండి ఉండే ఈ పట్టణం ప్రశాంతంగా సహజమైన సౌందర్యంతో కనిపిస్తుంది. సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కనిపించే రద్దీకి భిన్నంగా ఈ గ్రామంలో జీవనం స్లోగా ప్రశాంతంగా సాగుతుంది. సందర్శకులు దాని సహజ సౌందర్యానికి సరళమైన, ప్రశాంతమైన జీవనశైలికి ఆకర్షితులవుతారు. అయితే, ఈ చిన్న పట్టణానికి యాపిల్ పండ్ల వల్లే గొప్ప ప్రాచుర్యం వచ్చింది.హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన కోట్గఢ్, దేశానికి యాపిల్ సాగును పరిచయం చేయడంలో చారిత్రక పాత్ర పోషించింది. తద్వారా భారతదేశపు యాపిల్ సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 20వ శతాబ్దం ప్రారంభంలో తొలి బీజం పడింది , అమెరికన్ మిషనరీ కి చెందిన శామ్యూల్ ఎవా న్స్ స్టోక్స్ వాణిజ్యపరంగా మొదటి యాపిల్ తోటలను నాటారు. కోట్గఢ్లోని సారవంతమైన నేల, చల్లని వాతావరణం అనువైన ఎత్తులో యాపిల్ సాగుకు చాలా అనుకూలంగా ఉండడంతో ఈ అభివృద్ధి చెందుతున్న ఉద్యానవన పరిశ్రమకు పునాది వేశాయి. కాలక్రమేణా, యాపిల్ సాగు కోట్గఢ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, హిమాచల్ ప్రదేశ్ను దేశంలోని ప్రముఖ యాపిల్ ఉత్పత్తిదారుగా నిలిపింది.సందర్శనీయ ప్రాంతం..ముఖ్యంగా ఆగస్టు నుంచి∙అక్టోబర్ వరకు పంట కోత కాలంలో, కోట్గఢ్లోని విస్తారమైన యాపిల్ తోటలు, ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పండ్లతో నిండిన ఆపిల్ చెట్ల వరుసల మధ్య నడవడం ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. అనేక స్థానిక కుటుంబాలు యాపిల్ సాగు తమ తోటల నడుమ జీవితం గురించిన కథలను సంతోషంగా మనతో పంచుకుంటాయి. కోట్గఢ్కు కొద్ది దూరంలో ఉన్న తాని జుబ్బర్ సరస్సు, దేవదారు అడవులు చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన ప్రదేశం. ప్రశాంతమైన జలాలు స్వచ్ఛమైన పర్వతపు గాలి ఆహ్లాదపరుస్తాయి. ఏకాగ్రతతో ఆలోచించుకోవడానికి, ఫోటోగ్రఫీకి లేదా విశ్రాంతిని అందించే పిక్నిక్కు అనువుగా అనిపిస్తాయి. కోట్గఢ్తో తరచుగా ముడిపడి ఉండే థానేదార్ గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటి యాపిల్ మొక్కలు నాటిన ప్రదేశం ఉంటుంది. సాంప్రదాయ గృహాలు, మెట్ల పొలాలు హిమాలయాల విశాల దృశ్యాలతో ఈ గ్రామం ఆకట్టుకుంటుంది. కోట్గఢ్లో స్థానిక దేవతలకు చెందిన పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాంతీయ నమ్మకాల గురించి తెలియజెబుతాయి. ఇక్కడి హోమ్స్టేలో బస చేయడం ద్వారా సందర్శకులు కోట్గఢ్లోని రోజువారీ జీవితాన్ని అనుభవించవచ్చు. సాధారణ, ఇంట్లో వండిన భోజనం నుంచి పండ్ల తోటల యజమానులతో సంభాషణల వరకు, ఇది ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకయే అవకాశాన్ని అందిస్తుంది.కోట్గఢ్ను సందర్శించడానికి మార్చి నుంచి జూన్ నెల మధ్య అనువైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కొండల అంతటా పువ్వులు వికసించడం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉండే శరదృతువు మరో విధంగా ప్రత్యేకం. ఎందుకంటే యాపిల్ పంట కోత కాలం ఈ పట్టణాన్ని చైతన్యవంతమైన కార్యకలాపాల కేంద్రంగా మారుస్తుంది. అయితే శీతాకాలాలు చల్లగా ఉంటూ మంచు కురుస్తుంది, ఇది ఈ ప్రాంతం మీదుగా ప్రయాణాన్ని సవాలుగా మారుస్తుంది,ఎలా వెళ్లొచ్చు?విమాన మార్గంలో వెళ్లాలంటే..ఈ పట్టణానికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం జుబ్బర్హట్టిలో ఉన్న సిమ్లా విమానాశ్రయం, ఇది కోట్గఢ్కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చండీగఢ్ విమానాశ్రయం కూడా మరో ఎంపిక, రైలు మార్గంలో అయితే సమీపంలోని రైల్వే స్టేషన్ సిమ్లా, ఇది వారసత్వ నారో–గేజ్ రైల్వే ద్వారా కల్కాతో అనుసంధానితమై ఉంది. సిమ్లా నుంచి కోట్గఢ్కు రోడ్డు మార్గం ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది. సాధారణ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. -
నన్నెవరూ 'ఆప్' లేరు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించడంపై ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం స్పందించారు. తాను చేసిన నేరం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడమే తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్లో శుక్రవారం వీడియో పోస్ట్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను పార్లమెంట్లో మాట్లాడుతున్నానని, తనను ఆపాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు."పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజల సమస్యలను లేవనెత్తాను. అలా చేయడం నేరమా లేక తప్పా? నన్ను పార్లమెంటులో మాట్లాడకుండా చేయమని రాజ్యసభ సెక్రటేరియట్కు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా సమాచారం ఇచ్చినందువల్లే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. నన్ను ఎవరైనా ఎందుకు మౌనంగా ఉంచాలనుకుంటారు? నా మౌనాన్ని నా ఓటమిగా పొరపాటు పడకండి" అని రాఘవ్ చద్దా అన్నారు.రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినంత మాత్రాన పార్లమెంట్లో తన గళం మూగబోదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గళం విన్పిస్తూనే ఉంటానని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, రాఘవ్ చద్దా వ్యవహారంపై ఆమ్ ఆమ్ ఆద్మీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. చదవండి: ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్ ఇచ్చిన సొంత పార్టీవిమానాశ్రయాల్లో అధిక ఆహార ఛార్జీలు, గిగ్ వర్కర్ల సమస్యలు, ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లు, డేటా ప్లాన్లతో ప్రైవేటు టెలికం కంపెనీల మాయాజాలం, మినిమమ్ చార్జీల పేరుతో బ్యాంకుల బాదుడు, నగరాల్లో ట్రాఫిక్ సమస్య, టోల్ ఫీజుల రుద్దుడు, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల్లో అసంబద్ధత, పితృత్వ సెలవుకు చట్టబద్ధత వంటి అంశాలను రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. Silenced, not defeatedMy message to the ‘aam aadmi’—खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ'आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026 -
అమరావతికి కాదు.. బిల్లుకు వ్యతిరేకం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్కి వివరించాము. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. మాకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకన్నా చిన్న పార్టీలైన బీఆర్ఎస్, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు. మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు మేము వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమే. కోల్కత్తా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్కి వివరించాము. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు. -
ఉప రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
ఢిల్లీ: ఉప రాష్ట్రపతిని వైఎస్సార్సీపీ ఎంపీలు కలిశారు. సీపీ రాధాకృష్ణన్ను వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. నిన్న( ఏప్రిల్ 2, గురువారం) అమరావతి బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు.పార్లమెంట్లో తమ గొంతు నొక్కడంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడుగురు సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీకి ఐదు నిమిషాలు కేటాయించగా.. ఇద్దరు సభ్యులు ఉన్న టీడీపీకి ఏకంగా 20 నిమిషాల సమయం కేటాయించడం పట్ల వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
అమరావతి బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026 గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, బీఆర్ఎస్, బీజేడీ, ఆప్, జేడీయూ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రెండు గంటల చర్చ అనంతరం ఈ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం దక్కినట్లయింది. లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక ప్రవేశపెట్టారు. బిల్లుపై మొత్తం 19 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదంటూ, బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటన్న విపక్షాలు... బిల్లుపై మాట్లాడిన అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం అందించే సాయం, ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునే ప్రక్రియ, పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయాలని కోరాయి. తన అవసరానికి ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. విభజన జరిగి పదేళ్లయినా ఇంతవరకు ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయలేదని ఎంపీలు పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమరావతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ‘బిహార్లో జేడీయూ నితీశ్కుమార్కు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఏమి జరుగుతుందో చూస్తున్నారు. వాడుకొని వదిలేయడం (యూజ్ అండ్ త్రో పాలసీ) బీజేపీ విధానం. కావున టీడీపీ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఆప్ ఎంపీ సంజయ్సింగ్ మాట్లాడుతూ, ‘కేంద్రంలోని బీజేపీ వైఎస్సార్సీపీకి మూడు రాజధానులు చేయమని ప్రోత్సహించింది.అమరావతిని రాజధాని చేయమని టీడీపీకి చెబుతోంది. బీజేపీతో జాగ్రత్త..చాలా పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కావున జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. బీజేడీ తరఫున మాట్లాడిన నిరంజన్ బిషీ..పోలవరంతో ఒడిశాలో ముంపుపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిరాశ్రయులకు సరైన పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. ఇక ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ‘అమరావతిని మేమెన్నడూ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికే 50వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు. అలాంటి రాజధానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమయ్యే రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపై స్పష్టత లేదు’ అని వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడిన పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి పరిశీలనకు బిల్లు..బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి ఆమోదానికి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. -
పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతి!
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. గురువారం రాజ్యసభలో ‘ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు–2026’పై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కంటితుడుపు మాత్రమే.. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’ అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.. క్షేత్రస్థాయిలో ఏమీ మారలేదు. 12 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని అని ప్రభుత్వం నిర్ణయిస్తే.. మేము వారిని మెచ్చుకోవాలా? కృతజ్ఞతలు చెప్పాలా? ఇది జాతీయ అవమానం. విభజన చట్టంలోని హామీలైన కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? 1.42 లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ ఎందుకు తేలలేదు? ఈ సభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దశాబ్దంపైగా సమయం తీసుకోవడం మీ వైఫల్యం కాదా?‘ అని రేణుక చౌదరి కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు. ‘గుజరాత్లో రాజధాని అభివృద్ధికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు.. కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కించపరుస్తున్నారు’ అని మండిపడ్డారు. ఆ ఐదు మండలాలు.. తెలంగాణలో కలపాలి..భద్రాచలం రామాలయ ఆస్తులు ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం మండలాల ప్రజలు ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అందక వారు నరకం చూస్తున్నారు. ఆ మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలి‘ అని డిమాండ్ చేశారు. విభజన హామీల అమలుపై పార్లమెంటులో ‘స్టేటస్ పేపర్’ విడుదల చేయాలని, ప్రతి హామీకి సంబంధించి కాలపరిమితితో కూడిన ‘రోడ్ మ్యాప్’ ప్రకటించాలని కోరారు. -
16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యేకంగా కొలువుదీరుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయడంతోపాటు లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంపు, రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ నెల 16, 17, 18న లోక్సభ, రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సిన ఉభయ సభలు, ప్రత్యేక సమావేశాల దృష్ట్యా 16వ తేదికి వాయిదా పడ్డాయి. కీలకమైన బిల్లుపై చర్చ కోసం ఉభయ సభలు త్వరలోనే భేటీ అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రకటించారు. కొన్ని ముఖ్యమైన బిల్లులు, అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రభుత్వం పెత్తందారులాగా వ్యవహరిస్తోందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అంశంతో రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఏ బిల్లును ఎప్పుడు తీసుకురావాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. త్వరలో సభ మళ్లీ సమావేశం కాబోతుందని, అందుకు కారణం ఏమిటో సభ్యులకు తెలుసని కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేశ్ తప్పుపట్టారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఈ సమయంలో బిల్లు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. ఇది పూర్తిగా అభ్యంతరకరమని చెప్పారు. ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో హామీని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కిరణ్ రిజిజు బదులిచ్చారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో ఈ అంశానికి సంబంధం లేదన్నారు. ముఖ్యమైన బిల్లుపై రాజకీయం చేయొద్దని విపక్షాలను కోరారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. బిల్లును ఎప్పుడు, ఎలా తీసుకురావాలన్న దానిపై డ్రామాలు ఆడొద్దని అన్నారు. -
గ్రూప్–1 నియామకాలకు సుప్రీం గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన 563 గ్రూప్–1 పోస్టుల నియామకాలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఈ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్–1 నియామకాలకు ఆమోదం తెలుపుతూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తుది తీర్పును వెలువరించింది.గ్రూప్–1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పి. ఆదిత్య తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. నియామక ప్రక్రియలో కమిషన్ అనుసరించిన విధానాలను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియామకాలను సమరి్థంచిందని.. ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టేసింది. పారదర్శకంగా ’ట్రిపుల్ ఎవాల్యుయేషన్’ విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియలో కమిషన్ అత్యంత పారదర్శకత పాటించిందని కోర్టుకు వివరించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అత్యంత శాస్త్రీయమైన ‘ట్రిపుల్ ఎవాల్యుయేషన్’(మూడంచెల మూల్యాంకనం) విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.మూల్యాంకనకర్తలు మా ర్కులు వేసేటప్పుడు ఉండే వ్యత్యాసాలను (కొందరు కఠినంగా, మరికొందరు ఉదారంగా వేయడం) తగ్గించి, అభ్యర్థులకు న్యా యం చేసేందుకే ఈ పద్ధతిని అమలు చేశామన్నారు. మొదటి రెండు విడతల్లో బార్కోడ్విధానం పాటించామని.. మూడో విడ తలో మూల్యాంకనకర్తకు అభ్యర్థి వివరాలు తెలియకుండా ఉండేందుకు, గోప్యతను కాపాడేందుకు మాత్రమే బార్కోడ్ వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వెబ్నోట్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. నిలబడని పిటిషనర్ల వాదనలు మూడో విడత మూల్యాంకనంలో బార్కోడింగ్ లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కా రం ఏర్పడిందని.. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయ ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. జవాబుల ‘కీ’లోనూ లోపాలు ఉన్నా యని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా మూల్యాంకన విధానం, బార్కోడింగ్ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై కమిషన్ను ప్రశ్నించిన ధర్మాసనం.. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం.. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకున్న అనంతరం పిటిషన్లను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. -
పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై జరిగిన చర్చలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివిధ అంశాలపై పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఆ వ్యాఖ్యలు అభ్యంతకరం: కేఆర్ సురేశ్రెడ్డి ‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ’కేంద్ర జలశక్తి మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పాలని, లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సురేశ్రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే మేడిగడ్డ బరాజ్లోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ కారి డార్, స్టీల్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీలతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ.900 కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కిషన్రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భద్రాచలం గ్రామాలను ఏపీలో కలపడం కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టంలోనే ఉంది. అప్పట్లో సోనియాగాంధీతో డిన్నర్ చేసి, ఆమె కాళ్లు పట్టుకున్న కేసీఆర్.. అప్పుడెందుకు ఆ గ్రామాల గురించి అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి పైసా తీసుకోలేదని చెబుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేసీఆర్ దుబాయ్లో నోట్లు ఏమైనా ముద్రించారా? అది కేసీఆర్ ఇంట్లో డబ్బు కాదు, ప్రజల డబ్బు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిపోయింది. ఎన్నికల ముందు కాళేశ్వరంపై విచారణ జరిపి కేసీఆర్ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఆ పనిచేయడం లేదు’అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. అది ఎలాగూ అమరావతే ఎంపీ రేణుకాచౌదరి పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.’అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టాన్ని కేవలం తన మిత్రపక్షాలకు (కూటమికి) మేలు చేసేందుకే వాడుకుంటోంది. అదే చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది’అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భద్రాచలం సరిహద్దుల్లోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి: ఎంపీ వద్దిరాజు సూపర్బజార్ (కొత్తగూడెం): ఆంధ్రప్రదేశ్ విభజన సమయాన భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను ఏపీలో విలీనం చేశారని, ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామనేది మొదటి నుంచి తమ పార్టీ విధానమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి కిషన్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. -
పీఎం మోదీ, ఆర్మీ అఫీషియల్స్ మీటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే?
దేశం మొత్తం నిద్రలో ఉన్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్తో మూడు గంటలపాటు జరిగిన గోప్య సమావేశం దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సారించింది. దోవల్ రూపొందించిన "రెడ్ ఫైల్"లో అమెరికా–పాకిస్థాన్ రహస్య ఒప్పందం, ఇరాన్పై దాడుల ప్రణాళిక, భారత్ను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలపై కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు పూరీ జగన్నాథ, అమృత్సర్ స్వర్ణ దేవాలయం, ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, సరిహద్దుల్లో NOTAM జారీ చేయడం వంటి పరిణామాలు దేశం ఒక పెద్ద "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. అమెరికా–పాకిస్థాన్ ఒప్పందం ఇరాన్తో ఘర్షణకు దారితీస్తే, పాకిస్థాన్ ఈ పరిస్థితిని భారత్పై ఒత్తిడి పెంచడానికి వాడుకోవచ్చనే ఆందోళనలతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ వీడియోను క్లిక్ చేయండి. -
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్లు కావు ఇవి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది. -
అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు : వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు. శాసన ప్రక్రియను పాటించలేదు. ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.మండలిలో చర్చించకుండా తీర్మానం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది.ఇప్పుడెలా రాజధానిపై బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు శాశ్వత నిర్మాణాలు జరగలేదు. ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?. ఇప్పటికే వడ్డీలకు రూ.20వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అమరావతి కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలోనే రూ.3.40లక్షల కోట్లు అప్పు చేశారు.అమరావతి వరదలతో మునిగిపోతుందని ఆధారాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మేం మూడు రాజధానులు చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా పెట్టాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కర్నూల్ను జ్యూడీషియల్ క్యాపిటల్గా పెట్టాం. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు.. రూ.12వేలకు పైగా ఖర్చుపెడుతున్నారు. అమరావతి పేరుతో.. కుంభకోణాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యాసభ నుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేశారు. -
‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కమ్మరావతి అని పిలవాలని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టసవరణ బిల్లుపై రేణుకా చౌదరి మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పాను పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టు పేరు’అంటూ వ్యాఖ్యానించగా.. సభలో ఇతర ఎంపీలు.. రాజధాని పేరు కమ్మరావతి పెట్టమని చెప్పడమేంటని నవ్వుకున్నారు. -
ఎంపీ రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్
న్యూఢిల్లీ: సామాన్యుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. సెల్ఫోన్ రీచార్జిలో ప్రైవేటు టెలికం కంపెనీల దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలాగే మొబైల్ డేటా వినియోగంలో టెలికం కంపెనీల వైఖరిని కూడా చట్టసభ వేదికగా ఎండగట్టారు. అంతేకాదు మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి కూడా రాజ్యసభలో ప్రస్తావించారు. మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో సామాన్యులను బ్యాంకులు ఇబ్బందులు గురిచేస్తున్నాయని సవివరంగా వివరించారు.పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడి పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను నియమించింది. దీనికి సంబంధించి రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రాఘవ్ చద్దా 2023 నుంచి రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడిగా ఉన్నారు.కారణం అదేనా?రాఘవ్ చద్దా వైఖరిపై అగ్రనాయకత్వం ఆగ్రహం కారణంగానే ఆయన పదవి పోయినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీకి అంటిముట్టన్నట్టు ఉంటున్నారని ఆయనపై ప్రధాన ఆరోపణ. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై స్పందించకుండా మౌనం వహించడంపై అధినాయకత్వం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా రాఘవ్ చద్దా నుంచి స్పందన లేదు. సోషల్ మీడియాలోనూ ఎటువంటి పోస్ట్ పెట్టకపోవడం చర్చకు దారితీసింది. అగ్రనేతలకు ఊరట లభించినా చద్దా స్పందించకపోవడంపై పార్టీలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు పలుమార్లు పార్టీ కీలక సమావేశాలకు గైర్హాజరయ్యారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు చద్దా. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేసినప్పుడు ఆలస్యంగా స్పందించారు. బ్రిటన్లో కంటి ఆపరేషన్ చేయికున్నందునే ఆలస్యంగా స్పందించానని అప్పట్లో వివరణ ఇచ్చారు.ఒకప్పుడు కేజ్రీవాల్కు సన్నిహితుడుచార్టర్డ్ అకౌంటెంట్ అయిన 37 ఏళ్ల రాఘవ్ చద్దా, 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రారంభమైనప్పటి నుండి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. గతంలో కేజ్రీవాల్కు సన్నిహితుడిగా వ్యవహరించిన ఆయన పార్టీకి జాతీయ కోశాధికారిగా పనిచేశారు. అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగానూ ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ను సమన్వయం చేయడంలో కూడా చద్దా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్గా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సలహాదారుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కో-ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చదవండి: చేతుల్లో ఏమీ లేదు.. అంతా బీజేపీ గేమ్ప్లాన్Telecom companies offer Recharge Plans with ‘𝐃𝐚𝐢𝐥𝐲 𝐃𝐚𝐭𝐚 𝐋𝐢𝐦𝐢𝐭𝐬’ like 1.5GB, 2GB or 3GB per day, resetting every 24 hours. Any Unused Data EXPIRES at midnight, despite being fully paid for. 𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐢𝐥𝐥𝐞𝐝 𝐟𝐨𝐫 𝟐𝐆𝐁. 𝐘𝐨𝐮 𝐮𝐬𝐞 𝟏.𝟓𝐆𝐁. 𝐓𝐡𝐞… pic.twitter.com/sWiJbKj2AV— Raghav Chadha (@raghav_chadha) March 23, 2026 -
రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. రాజ్యసభ జీరో అవర్లో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. 33 ఏళ్ల సర్వీస్కే కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధనపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో అభద్రత ఏర్పడిందన్నారు. దీంతో ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా ఉద్యోగులు నాలుగేళ్ల ముందుగానే సర్వీసు, ఆర్థిక ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజనాలు కోల్పోతున్నారని సుభాష్ చంద్రబోస్ వివరించారు.‘‘ఇప్పటికే పే రివిజన్ కమిషన్ బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టారు. డీఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేలకోట్ల రూపాయలు చెల్లించడం లేదు. పెన్షన్ సెటిల్మెంట్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు రెండేళ్లపాటు వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అలవికాని సర్వే టార్గెట్లు పెడుతున్నారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు’’ అని సుభాష్ చంద్రబోస్ తెలిపారు.‘‘గత వైఎస్సార్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 కు పెంచాం. పీఆర్సీని అమలు చేశాం. డీఏ పెంచి బకాయిలను క్లియర్ చేశాం. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అన్ని రకాల సహకారం అందించాం. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్స్ అమలయేలా చర్యలు తీసుకోవాలి’’ అని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. -
డీలిమిటేషన్ బిల్లు ఈ నెలలోనే!
న్యూఢిల్లీ: లోక్సభ స్థానాల పెంపు బిల్లుకు పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడేలా కనిపిస్తోంది. ఇందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏప్రిల్ మూడోవారంలో ప్రత్యేకంగా రెండు నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సి ఉంది. ‘‘అందుకు బదులుగా, ఏప్రిల్ మూడో వారంలో ఉభయ సభలు ఏ తేదీన భేటీ అయ్యేదీ సభాపతులు గురువారం ప్రకటిస్తారు. సమావేశాలను అప్పటిదాకా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటారు’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి రావడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత వారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా పంచుకు న్నారు. ఆ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల మేరకు లోక్సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరగనుంది. వాటిలో 273 స్థానాలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’చట్టాన్ని 2023లోనే పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు పూర్తయిన అనంతరమే ఆ చట్టం అమల్లోకి రానుంది. అయితే 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘‘అలాగే డీలిమిటేషన్ చట్టాన్ని సవరిస్తూ మరో సాధారణ సవరణ బిల్లు కూడా ప్రవేశపెడతారు. వాటికి పార్లమెంటు ఆమోదం లభిస్తే అవి చట్ట రూపం పొంది 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఫలితంగా 2029 లోక్సభ ఎన్నికలతో పాటు ఆ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు వీలవుతుంది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల సంఖ్యను 50 శాతం పెంచుతున్నందున వాటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య కూడా ఆ మేరకు పెరగనుంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతుంది. వాటిలో 12 నుంచి 13 సీట్లు మహిళలకు, రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనుంది. వాటిలో 86 నుంచి 87 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. వాటిలో 8 నుంచి 9 సీట్లు మహిళలకు రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. వాటిలో 59 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. నియోజకవర్గాల పెంపుకు 2027 జనాభా లెక్కలను కాకుండా 2011 గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపు విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రధాన పారీ్టలతో ఎన్డీఏ ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. -
‘సిమ్ బైండింగ్’పై కేంద్రం కీలక నిర్ణయం!
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్లకు, వాటి వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించింది. భద్రతా కారణాలతో తప్పనిసరి చేసిన సిమ్ బైండింగ్ నిబంధన అమలు గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఒక యాప్ పనిచేయాలంటే అది ఇన్స్టాల్ అయిన ఫోన్లోని సిమ్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం కావడాన్నే సిమ్ బైండింగ్ అంటారు. గత ఏడాది నవంబర్లో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చి 90 రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఐతే దీన్ని అమలు చేయడంలో టెస్టింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమకు మరింత సమయం కావాలని టెక్ కంపెనీలు కేంద్రాన్ని కోరాయి.కంపెనీల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన కేంద్రం, గడువును డిసెంబర్ వరకు పొడిగించేందుకు సిద్ధమైనట్లు టెలికాం శాఖ ఉన్నతాధికారులను అడ్రెస్ చేస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ గడువు పొడిగింపుతో సిమ్ బైండింగ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడానికి టెక్ కంపెనీలకు తగినంత సమయం లభిస్తుంది. అదే సమయంలో కోట్లాది మంది యూజర్లకు తక్షణమే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుంది. -
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్,హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లు పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాలు, ఎరువుల లభ్యత, భారతీయుల భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్లో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మూడోసారి సీసీఎస్ సమావేశం నిర్వహించింది. గత సమావేశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం దేశానికి ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. ఎల్పీజీ ధరలు కూడా పెంచలేదు.ఈ ఏడాది ఖరీఫ్ కోసం తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్పుట్స్లో ఎటువంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చారు. ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్లో ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరం అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్పై అమెరికా యుద్ధ ప్రభావం దేశంపై నేరుగా పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇంధన నిల్వలు, ఎరువుల లభ్యత, విద్యార్థుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తోంది. -
లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.అమరావతి పేరుతో దోపిడీ.. అమరావతి బిల్లుపై లోక్సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.చర్చలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. -
Chandigarh : బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు
పంజాబ్: ఛండీఘడ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన ఉంచిన స్కూటీలో పేలుడు సంభవించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం చండీగఢ్ సెక్టార్ 37లోని పంజాబ్ బీజేపీ కార్యాలయం వెలుపల అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడు కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే, పేలుడుకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు.ఈ పేలుడు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక విచారణలో ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి నాటు బాంబు లేదంటే ఐఈడీ విసిరి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. -
అమరావతి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు.అమరావతి బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారుబీజేపీ మాట మార్చింది.. చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. అనంతరం, లోక్సభలో సమాజ్వాదీపార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..‘ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి, ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదు. విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేది. అమరావతి పేరుతో భారీ ఎత్తున రైతుల నుంచి భూమి తీసుకున్నారు. రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చారా?. రైతులకు న్యాయం జరగాలి’ అని అన్నారు. -
‘జుబీన్’ చుట్టూ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రధానాంశంగా మారుతోంది. దీనిపై పారీ్టల పరస్పర ఆరోపణలు, దూషణలతో వాతావరణం వేడెక్కింది. ఈ అంశానికి కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోనే చోటిచి్చంది! తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గార్గ్ మృతిపై నిజాలు వెలికితీసి న్యాయం చేస్తామని హామీ ఇచి్చంది. అస్సాంలో గార్గ్కు లక్షల్లో అభిమానులున్నారు. దాంతో వారి ఓట్ల కోసం పార్టీలన్నీ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ దుమారం 52 ఏళ్ల జుబీన్ గార్గ్ 2025 సెపె్టంబర్ 19న సింగపూర్లో ఒక ద్వీపం వద్ద ఈత కొడుతూ మరణించారు. అది కాస్తా రాజకీయంగా వివాదాంశంగా మారింది. గార్గ్ను కుట్రలో భాగంగా హత్య చేశారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అది ప్రమాద మరణమేనని సింగపూర్ కోర్టు నిర్ధారించినా, ఆయనకు బలవంతంగా మద్యం తాగించారని హిమంత వాదించారు. దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. గార్గ్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకుడు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఉదంతాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు పారీ్టలన్నీ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలలో గార్గ్ కేసుకూ స్థానం కలి్పంచింది! గార్గ్ హత్య ఎలా జరిగింది, బాధ్యులెవరన్నది తాము అధికారంలోకి వచి్చన 100 రోజుల్లో వెలికి తీసి నిజానిజాలను ప్రజల ముందుంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గార్గ్ కుటుంబానికి న్యాయం చేయలేకపోతే బీజేపీకి ఓటేయొద్దని హిమంత పలుమార్లు ప్రకటించడాన్ని పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఎన్నికల ర్యాలీల్లో పదేపదే గుర్తు చేస్తున్నారు. విచారణలో విపరీత జాప్యం జరుగుతోందంటూ గార్గ్ భార్య గరిమ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గార్గ్ మృతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవనుంది. స్మారకం చుట్టూ నేతల చక్కర్లు గువాహటి సమీపంలో నిర్మిస్తున్న గార్గ్ స్మారక కేంద్రం వద్ద నేతలు బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకులు నిత్యం పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ వాద్రా మొదలుకుని ఆ పారీ్టకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాకా ఈ జాబితాలో ఉండటం విశేషం! ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల రాక మరింత పెరిగింది. రాజకీయాలను ఆజన్మాంతం ద్వేషించిన జుబీన్ పేరు ఇప్పుడు రాజకీయంగా మారుమోగుతుండటం విచిత్రంగా ఉందంటూ ప్రజలు విస్తుపోతున్నారు! -
‘హనీమూన్ మర్డర్ కేసు’.. రాజా రఘువంశీ మళ్లీ పుట్టాడు!
షిల్లాంగ్: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే భార్య సోనమ్ రఘువంశీ చేతిలో దారుణ హత్యకు గురైన రాజా రఘువంశీ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రాజా రఘువంశీ సోదరుడు సచిన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు. ఈ సందర్భంగా తన తమ్ముడు రాజా మళ్లీ పుట్టాడంటూ అన్న సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ‘రాజా’ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. రాజా రఘువంశీ చంద్రపక్షంలోని పదకొండవ రోజు అయిన ఏకాదశి రోజే హత్యకు గురయ్యాడు. యాదృచ్ఛికంగా నా కుమారుడు కూడా అదే ఏకాదశి రోజే జన్మించాడు. ఇది దేవుడి ఆశీర్వాదమేనని, తన తమ్ముడు మళ్లీ జన్మించి కుటుంబంలోకి అడుగు పెట్టాడ’ని సంతోషం వ్యక్తం చేశాడు.రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఇండోర్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు తిరిగి వచ్చాడు’. రాజా రాక కోసం ఇంటిని బెలూన్లతో అలంకరించినట్లు చూపించారు. ఇంటి బయట ‘Raja is Back’ అంటూ డిజైన్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న అదే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని గుర్తించిన టూరిస్టులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో గతేడాది జూన్లో భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా,మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.కనిపించని పశ్చాత్తాపం.. పోలీసుల దర్యాప్తులో ప్రియుడితో కలిసి జీవించేందుకే తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు సోనమ్ రఘువంశీ నేరాన్ని అంగీకరించారు. భర్తను హత్య చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సోనమ్ మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, భర్త హత్య చేసినందుకు సోనమ్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని జైలు అధికారులు చెప్పినట్లు అప్పట్లో పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన చరిత్రాత్మక ’ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సభలో సెల్యూట్ చేశారు. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో వివరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్.. భీకర పోరు ‘తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో 50 కి.మీ. పొడవు, 37 కి.మీ. వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏళ్ల తరబడి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క డ సోలార్ విద్యుత్, ఐఈడీ (బాంబుల) తయారీ ఫ్యాక్టరీలు, ఐదేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకున్నారు. 400 నుంచి 500 మంది కేడర్ అక్కడ ఉన్నారు. ఆ స్థావరాన్ని ఛేదించేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా 21 రోజులపాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టారు. 45 డిగ్రీల భగభగమండే ఎండలో మన జవాన్లు రోజుకు కేవలం 300 మిల్లీలీటర్ల నీటిని తాగుతూ ధైర్యంగా పోరాడారు. ఈ ఆపరేషన్లో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వారు లొంగిపోయారు లేదా పారిపోతూ పోలీసులకు చిక్కారు. దీంతో బస్తర్, మహారాష్ట్ర, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో నక్సల్స్ పైకి (ఉత్తరం వైపు) రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా వారు నిరాకరించారు. కిందికి వస్తే మాత్రం ఆపుతామని చెప్పారు‘ అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయారు 2024 ప్రారంభంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో 21 మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడు వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని అమిత్షా తెలిపారు. ‘ఒకరు పట్టుబడ్డారు, ఏడుగురు లొంగిపోయారు, 12 మంది హతమయ్యారు, ఒకరు మాత్రమే పరారీలో ఉండి చర్చలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని 37 మందికిగాను ఎవరూ మిగల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో ఆరుగురు లొంగిపోయారు, ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నక్సలైట్ కూడా లేడు‘ అని చెప్పారు. బసవరాజు, హిడ్మా, వివేక్, పల్లూరి ప్రసాదరావు (చందన), వాసుదేవ్ వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగిపోయారని తెలిపారు. కాంగ్రెస్ దన్నుతోనే నక్సలిజం ‘1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ’అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చి, నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు తీసుకున్నారు. ఆ మద్దతును ఆసరాగా చేసుకుని మావోయిస్టులు దేశంలోని 17 శాతం భూభాగానికి, 10 శాతం జనాభాకు విస్తరించారు. తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు‘ అని అమిత్షా చెప్పారు. అలాగే నక్సల్స్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ ప్రారంభించిన ’సల్వాజుడుం’ ఉద్యమాన్ని 2011 జూలై 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఆ తీర్పు వల్లే నిరాయుధులైన ఎంతోమంది సల్వాజుడుం కార్యకర్తలను, ఆదివాసీలను నక్సల్స్ ఊచకోత కోశారని చెప్పారు. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని, ఇదీ కాంగ్రెస్కు నక్సల్స్తో ఉన్న లాలూచీ అని దుయ్యబట్టారు. ‘రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో అనేకసార్లు నక్సల్స్ సానుభూతిపరులతో కనిపించారు. ఆయన జరిపిన భారత్ జోడో యాత్రలో నక్సల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు చెందిన వారు పాల్గొన్నారు. 2010లో ఒడిశాలో లాడో సికాకాతో, 2018లో హైదరాబాద్లో గద్దర్తో రాహుల్ వేదిక పంచుకున్నారు‘ అని అమిత్షా పేర్కొన్నారు. 1970 నుంచి 2026 మార్చి వరకు వామపక్ష తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే ఉందని, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 20 వేల మంది పౌరులు, జవాన్ల మరణాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. -
భారత్కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
లూటీదార్లు!
పాలక్కాడ్/త్రిసూర్: సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అసలైన ఎ–టీమ్. అంతే తప్ప ఎవరికీ బి–టీమ్ కాదు’’ అని తేల్చిచెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చిచెప్పారు. కేరళ ప్రజల మద్దతు, ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందని అన్నారు.కేరళకు సేవ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ‘మోదీ గ్యారంటీ’ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి ఎన్డీయేకు ఆదరణ పెరుగుతోందన్నారు. కేరళ యువత, మహిళలు, రైతన్నలు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తున్నారని వెల్లడించారు.అన్ని కుంభకోణాలపై దర్యాప్తుకేరళను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోదీ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆ రెండు కూటముల మధ్య అవగాహన ఉంది. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చి, జేబులు నింపుకొనేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ అక్రమాలు బయటకు వస్తాయని బెదిరిపోతున్నాయి. మేం గెలిచాక ఆ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తాం’’ అని ప్రకటించారు.ఆ సొమ్మంతా కక్కిస్తాం పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో కేరళ రుణ భారం మూడు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లు దాటేసిందరి మోదీ చెప్పారు. ‘‘ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అది ఎల్డీఎఫ్ నేతల జేబుల్లోకే వెళ్లింది. మేం రాగానే ఆ సొమ్మంతా కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తాం. కేరళ ప్రగతి కోసం కేంద్రం భారీగా నిధులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే రాష్ట్రానికి మేమే ఎక్కు నిధులు విడుదల చేశాం’’ అని చెప్పారు. ‘‘మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణంపై దృష్టి పెట్టాం.చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి పార్లమెంట్లో ‘నారీశక్తి వందన్ అధినియమ్ చట్టం’ తెచ్చాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలేమో అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలుతున్నారు’’ అని మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. దానివల్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయుల ప్రాణాలకు ముప్పుందన్నారు. త్రిసూర్లో భారీ రోడ్ షో కేరళలోని త్రిసూర్లో మోదీ ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, కాషాయం రంగు తలపాగా ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. డోలు వాయించిన మోదీపాలక్కాడ్ సభలో మోదీ కేరళ సంప్రదాయ డోలు వాద్యం ‘చెండా’పై దరువేశారు. దాంతో సభికులు హర్షధ్వానాలు వెలిబుచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక దాకా జనం రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. వేదికపై చెండాను వాయించడానికి ఆయన కర్రలు చేతుల్లోకి తీసుకోగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన అర నిమిషం పాటు కొన్ని బీట్లు వాయించి అలరించారు. సభలో ఇద్దరు చిన్నారులు పెయింటింగ్లను పట్టు కొని ఉండటం గమనించిన మోదీ, వా టిపై వాళ్లు పేర్లు, చిరునామా రాయాలని వారికి సూచించారు. వారికి తాను ప్రత్యు త్తరం పంపుతానన్నారు. ఆ పెయింటింగులను తీసుకో వాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. సభలో మైక్కు సంబంధించిన పరికరం నుంచి పొగలు రావడం కాసేపు కలకలం సృష్టించింది.కష్టకాలంలోనూ సత్తా చాటుతున్నాం: మన్ కీ బాత్లో మోదీసాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభాల వంటి క్లిష్ట పరిస్థితులను 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సహకారంతో దేశం దీటుగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యుద్ధాల వేళ స్వార్థ రాజకీయాలకు తావులేదని, పుకార్లను నమ్మవద్దని ఆదివారం మన్ కీ బాత్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పీఎం సూర్య ఘర్ పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోందని, ఫిట్నెస్పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. జల సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలన్నారు. పురాతన రాతప్రతులను సంరక్షించేందుకు ఉద్దేశించిన ’జ్ఞాన్ భారతం సర్వే’లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
భారత్ నుంచి భారీగా ఇంధనం వచ్చింది: శ్రీలంక అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ‘పశ్చిమాసియా’ సంక్షోభం వేళ భారత్ నుంచి 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని అందుకుంది శ్రీలంక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన ‘పొరుగు దేశాల పాలసీ’లో భాగంగా శ్రీలంకకు ఇంధనాన్ని పంపింది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఆదివారం (మార్చి 29) భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.“పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇంధన సరఫరాల విషయంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. భారత్ త్వరితగతిన సాయం చేసింది.. కృతజ్ఞతలు. నిన్న 38,000 ఎంటీ ఇంధనం కొలంబోకు చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోఆర్డినేషన్కు కూడా ధన్యవాదాలు” అని దిస్సానాయకే ఎక్స్లో పేర్కొన్నారు.ఈ వారం ప్రారంభంలో, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై దిస్సానాయకేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. “భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంచే కీలక కార్యక్రమాల పురోగతిని సమీక్షించాం. సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ఇరుదేశాలు సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన్న స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాం” అని మోదీ ఎక్స్లో తెలిపారు. కాగా, ఈ 38,000 మెట్రిక్ టన్నుల్లో 20,000 ఎంటీ డీజిల్.. 18,000 ఎంటీ పెట్రోల్ ఉన్నాయి.మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధంపై వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం. Spoke with PM @narendramodi a few days ago about the fuel supply disruptions Sri Lanka is facing due to the Middle East conflict. Grateful for India’s swift support. 38,000 MT of fuel arrived in Colombo yesterday. My thanks also to EAM @DrSJaishankar for his close coordination.— Anura Kumara Dissanayake (@anuradisanayake) March 29, 2026 -
ఐక్యతతో సవాళ్లు ఎదుర్కోవాలి
నోయిడా/లక్నో: అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలంతా అంకితభావం, ఐక్యతతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పునరుద్ఘాటించారు. రైతన్నల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని జేవర్లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనకు 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి ప్రయత్నం, ఐక్యత అవసరమని స్పష్టంచేశారు.సమయాన్ని ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం ద్వారా పౌరుల జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నొక్కిచెప్పారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని గుర్తుచేశారు. ఈ సంక్షోభాన్ని ప్రశాంతంగా, సహనంతో, ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభ సమయంలో మనదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, అదే మన గొప్ప బలమని తేల్చిచెప్పారు. ప్రజలపై భారం పడకుండా చర్యలు ‘‘పశ్చిమాసియా పరిణామాలు, మన దేశంలో పరిస్థితులపై పార్లమెంట్లో విస్తృతంగా చర్చించాం. ముఖ్యమంత్రులతో జరిగిన భేటీలోనూ దీనిపై సానుకూలమైన సంప్రదింపులు జరిపాం. ఈ సంక్షోభ సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలకు దూరంగా ఉండాలి. కోవిడ్–19 మహమ్మారి సమయంలో తప్పుడు ప్రచారం చేసినవారిని ఎన్నికల్లో జనం తిరస్కరించారని గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లను భారత్ పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటోంది. చమురు, గ్యాస్ ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది’’అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయ్యింది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. యూపీలోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది జనం పాల్గొన్నారు. వారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం పూర్తయ్యింది. అది ఎలా అంటే.. సభలో జనవాహినితో మోదీ సంభాíÙంచారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించగా, జనం అదే రీతిలో ప్రతిస్పందించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం పూర్తయ్యిందా? అని మోదీ ప్రశ్నించగా, అవునంటూ బదులిచ్చారు.‘‘లేదు.. సగం మాత్రమే పూర్తయ్యింది. నేను ఇక్కడ శిలాఫలకం మాత్రమే ఆవిష్కరించా. మిగతా కార్యక్రమం మీరే పూర్తిచేయాలి. మీ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్ వెలిగించండి. అలా చేస్తే మీలో ప్రతి ఒక్కరూ ఎయిర్పోర్టును స్వయంగా ప్రారంభించినట్లే’’అని ప్రధానమంత్రి సూచించగానే ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్ ఆన్ చేశారు. మోదీ చిరునవ్వు చిందిస్తూ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఇప్పుడు పూర్తయ్యిందని ప్రకటించారు. -
20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఓ విద్యార్థి హత్య కేసును ఎట్టకేలకు సీబీఐ ఛేదించింది. 2005లో కేరళలో జరిగిన హత్య కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అండమాన్ వాసిని మహారాష్ట్రలోని నాగ్పూర్లో మారుపేరుతో చలామణీ అవుతున్నాడని గుర్తించి అరెస్ట్ చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన శ్యామ్ మండల్ అనే విద్యార్థి 2005 అక్టోబర్లో కిడ్నాపయ్యాడు. దుండగులు అతడి తండ్రికి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. అదే నెల 23వ తేదీన తిరువనంతపురంలోని వెల్లార్ వద్ద శ్యామ్ మృతదేహం కన్పించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అండమాన్ నికోబార్కు చెందిన దుర్గా బహదూర్ భట్ ఛత్రి, మహ్మద్ అలీలను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అలీని అరెస్ట్ చేసి, 2022లో జైలుకు పంపారు. ఛత్రి జాడ మాత్రం దొరకలేదు. 2008 డిసెంబర్లో ఈ కేసును కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఇరవయ్యేళ్లుగా ఛత్రి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సూరజ్ భట్ అనే మారుపేరుతో ఛత్రి చలామణి అవుతున్నట్లు సీబీఐ వర్గాలు కనిపెట్టాయి. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఛత్రి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై సీబీఐ స్థానిక పోలీసుల సాయం కోరింది. వారు గుర్తింపు కార్డులతోపాటు అతడి నేపథ్యం గురించి చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఛత్రినే సూరజ్ భట్ అని పోలీసులు ధ్రువీకరించడంతో శుక్రవారం సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. -
సినీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2023లో సవరించిన సినిమాటోగ్రాఫ్ చట్టం ద్వారా పైరసీ నిరోధానికి బలమైన న్యాయ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ వెల్లడించారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 6ఏఏ, 6ఏబీ ప్రకారం సినిమాలను అనుమతి లేకుండా రికార్డ్ చేయడం, ప్రసారం చేయడం నిషేధించబడిందన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాల జైలు, సినిమా మొత్తం ఖర్చులో 5 శాతం వరకు జరిమానా విధించేలా అవకాశం ఉందన్నారు. ఇక పైరసీ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. టెలిగ్రామ్ యాప్లో అనధికారికంగా కంటెంట్ ప్రసారం చేస్తున్న 3,142 చానళ్లను తొలగించాలని 2026 మార్చి 11న నోటీసులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. అలాగే సుమారు 800 పైరసీ వెబ్సైట్లను ఇంటర్నెట్ సేవా దాతల ద్వారా బ్లాక్ చేయించినట్లు చెప్పారు. పైరసీ ఫిర్యాదులను స్వీకరించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోడల్ అధికారులను నియమించిందన్నారు. ఇంటర్నెట్లో చట్టవిరుద్ధ కంటెంట్ను తొలగించేందుకు సమాచార సాంకేతిక చట్టం–2000 కింద కూడా నిబంధనలు అమల్లో ఉన్నాయన్నారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సహా అన్ని మధ్యవర్తి సంస్థలు కాపీరైట్ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈచర్యల ద్వారా సినీ, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ పైరసీని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు డా. ఎల్. మురుగన్ సమాధానమిచ్చారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్పోర్ట్ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు. -
డ్రైవింగ్ లైసెన్స్కు 30 రోజుల గ్రేస్ పీరియడ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి పలు సవరణలను ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్సును గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు అమల్లో ఉన్నట్లు పరిగణించడం వంటివి అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జన్ విశ్వాస్(అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్)బిల్లు–2026ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 23 శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు సంబంధించిన 784 నిబంధనల సవరణ ప్రతిపాదనలున్నాయి. ఇందులో మోటారు వాహనాల చట్టంలోని పలు నిబంధనల సడలింపు, చట్టపరమైన సందిగ్ధతను తొలగించేందుకు ఉద్దేశించిన 20 సవరణలున్నాయని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే, పునరుద్ధరించిన తేదీ నుంచి అమలులోకి వచ్చేలా చేయడం వంటివి ఉన్నాయన్నారు. అదేవిధంగా, డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిన 30 రోజుల వరకు అమలయ్యేందుకు వీలు కల్పించామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకునే గడువును 30 రోజులకు పెంచాలని, బీమా సర్టిఫికెట్ బదిలీపై సంబంధిత బీమా సంస్థకు సమాచారం ఇచ్చే గడువును కూడా 30 రోజులకు పెంచాలని ప్రతిపాదించామన్నారు. హిట్–అండ్–రన్ కేసుల్లో పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే, రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలుంటుందని తెలిపారు. -
‘టీమ్ ఇండియా’గా పనిచేద్దాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాలు, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆహార భద్రతను విఘాతం కలగకుండా చూడడానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమలు, సప్లై చైన్లను బలోపేతం చేయడానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆయన శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను సమీక్షించారు.రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి మనమంతా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సవాల్ను మనం కచ్చితంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న అనుభవం మనకు ఉందన్నారు. తాజా సంక్షోభం పట్ల మన ప్రతిస్పందన వేగంగా ఉండాలంటే సమాచారం పంచుకోవాలని, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలు సైతం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. సప్లై చైన్లు సజావుగా పనిచేసేలా చూడాలని, సరుకుల అక్రమ నిల్వలు, రవాణా, అక్రమార్జనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనం, సరుకుల సరఫరాలో అంతరాయాలను నివారించడానికి పరిపాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాల సరఫరా పట్ల ఆందోళన తలెత్తకుండా ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎరువులపై ముందస్తు ప్రణాళిక అవసరం పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. రైతాంగానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కు ముందు ఎరువుల నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. ప్రజల్లో భయాందోళనకు తావులేకుండా వారికి ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించాలన్నారు.తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తేల్చిచెప్పారు. అలాగే నౌక రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరా, సముద్ర కార్యకలాపాలకు సంబంధించి తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీరప్రాంత రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్బోధించారు.సహకారం, సమన్వయమే మన బలమని ఉద్ఘాటించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జమ్మూకశీ్మర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు. -
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలాదేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల చమురు కంపెనీలపై భారం తగ్గి, రిటైల్ ధరల పెరుగుదలను అరికట్టినట్లు అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించడంతో వినియోగదారులపై అదనంగా ఎలాంటి భారం పడబోదని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు రూ.13 ఉండగా.. తాజాగా రూ.10 తగ్గించడంతో అది రూ.3కు చేరుకుంది. డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు రూ.10 ఉంది. తగ్గింపు తర్వాత సున్నాకు చేరింది. ఈ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రిటైల్ ధరలు యథాతథం ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. పెట్రోల్పై లీటర్కు రూ.24, డీజిల్పై లీటర్కు రూ.30 చొప్పున నష్టం వస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గడంతో ఆయిల్ కంపెనీలు కొంతవరకు కోలుకుంటాయని, నష్టాలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు.పరోక్షంగానే ప్రయోజనం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత రిఫైనరీలకు వచ్చిన లాభాల నేపథ్యంలో 2022 జూలైలో తొలిసారిగా ప్రవేశపెట్టి, 2024 డిసెంబర్లో ఉపసంహరించుకున్న ఎక్స్పోర్టు పన్నును ప్రభుత్వం పునరుద్ధరించింది. డీజిల్పై లీటర్కు రూ 21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)పై లీటర్కు రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకాన్ని(విండ్ఫాల్ ట్యాక్స్) విధించింది. అయితే, ఈసారి ఓఎన్జీసీ వంటి సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ఎలాంటి విండ్ఫాల్ పన్ను విధించలేదు. ఎన్నికల కోసమే ఈ స్టంట్: కాంగ్రెస్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు పట్ల విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ స్టంట్కు తెరతీసిందని విమర్శించారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలాసార్లు తగ్గాయని, అప్పుడు మన దేశంలో రిటైల్ చమురు ధరలు తగ్గించలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఏప్రిల్ 30 దాకా వెయిట్ చేయండి’అంటూ జైరామ్ రమేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ తర్వాత రిటైల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా తేలి్చచెప్పారు. -
సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం
ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు చర్చలు కొనసాగాయి. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. దీనిలో భాగంగా పీఎం మోదీ మాట్లాడుతూ.. కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంలకు మోదీ ఆదేశించారు. PM Narendra Modi is chairing the meeting with CMs through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. pic.twitter.com/pqJS3iCgro— ANI (@ANI) March 27, 2026 -
దేశ ‘రక్షణ’కు బడ్జెట్లో నిధులు పెంచాలి: ఎంపీ నిరంజన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణకు బడ్జెట్లో నిధులు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో ఇవాళ ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ‘అన్ని రకాల సెస్ లు రద్దుచేసి... డిఫెన్స్ సెస్ మాత్రమే విధించాలి. ఆ నిధులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు మాత్రమే ఖర్చు చేయాలి. ప్రపంచలో అన్ని దేశాలు రక్షణ బడ్జెట్ పెంచాయి. దేశ జీడీపీలో కేవలం రెండు శాతంలోపు మాత్రమే రక్షణపై ఖర్చు పెడుతున్నారు. ఇందులో సింహభాగం జీతాలు, పెన్షన్లకే వెళుతుంది. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలి, రీసెర్చ్ కి నిధులు కేటాయించాలి.అన్ని రకాల సెస్ ఛార్జీలను రద్దు చేయాలి. న్యాయవ్యవస్థకు నిధుల కేటాయింపు పెంచాలి. జీడీపీలో 1.5% మాత్రమే న్యాయవ్యవస్థకు ఖర్చు పెడుతున్నారు. 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది సుప్రీంకోర్టులో 70 వేల కేసులు ఫైల్ అవుతున్నాయి. జడ్డీలపై పని భారం పెరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య కేవలం 36 మాత్రమే. దీన్ని కేసుల సంఖ్యకి అనుగుణంగా పెంచాలి’ అని అన్నారు. -
రూ.400 కోట్లకు పైగా నగదు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం వేళ అక్రమ నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఈసీ కఠిన చర్యలు చేపట్టింది.ఫిబ్రవరి 26న ఎల్రక్టానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) పేరిట ఎన్నికల నిఘా వ్యవస్థను క్రియాశీలకం చేసింది. నాటి నుంచి మార్చి 25 వరకు కొద్దిరోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.408.82 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మొత్తంలో మాదకద్రవ్యాల విలువ రూ.167 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ సొత్తును ఈసీ గణాంకాలతో సహా వెల్లడించింది. 100 నిమిషాల్లోనే పరిష్కారం... ఎన్నికల అక్రమాలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ‘సి–విజిల్’ (cVIGIL) యాప్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఈసీ తెలిపింది. మార్చి 15 నుంచి 25 మధ్య కేవలం పది రోజుల్లోనే 70,944 ఫిర్యాదులు అందాయి. ఇందులో 95.8 శాతం (67,899) ఫిర్యాదులను కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించారు. 1950 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ పేర్కొంది. చదవండి: ఎన్నికర ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు నిర్మించిన కేరళ నేత -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా?
భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.ప్రతి ఏటా మీకు వడ్డీ చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్" వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్" కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. -వెబ్డెస్క్ -
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ .. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
ఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో ఒకటిగా ఉన్నందున అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉందని, గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మెడిసిన్ అ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతం కీలక రవాణా కేంద్రంగా ఉండటంతో, నౌకాయాన మార్గాల అంతరాయం, మధ్యవర్తి రసాయనాల సరఫరాను దెబ్బతీస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రాకలో ఆలస్యం తయారీదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ పాలిమర్స్, గ్లాస్ వైల్స్, రబ్బర్ స్టాపర్స్ వంటి ప్యాకేజింగ్ పదార్థాల కొరత, ధరల పెరుగుదల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు రవాణా సమస్యలు, పోర్ట్ ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతిదారులు డిమాండ్ మార్పులు, చెల్లింపుల సమస్యలు, రవాణా ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుమతిదారులు అధిక ఖర్చులు, అస్థిర సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వ్యాపారులు స్టాక్ కొరత, ధరల మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వినియోగదారులకు ఔషధాల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యాంటీబయోటిక్స్, గుండె సంబంధిత ఔషధాలు, మధుమేహ ఔషధాలలో మెడిసిన్ పని చేసేందుకు వినియోగించే రసాయనాలు (APIs) కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్యాకేజింగ్ పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గుదల, ప్రాణ రక్షక ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ, కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్ట్ క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణ సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఔషధ రంగానికి చెందిన అన్ని భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు అవసరమైన ఔషధాల సరఫరాను నిరంతరంగా కొనసాగించగలమని జి. కోటేశ్వరరావు స్పష్టం చేశారు. -
భయపడాల్సిన పనిలేదు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున సమావేశానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. -
23 ‘ప్రభుత్వ’పదవులకు మమత రాజీనామా
కోల్కతా: త్వరలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడనున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో, ఇతర ప్రభుత్వరంగ బోర్డ్లు, అకాడమీలకు మొత్తంగా 23 పదవులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు హోం శాఖ, ఇతరత్రాల శాఖల నుంచి ఉత్తర్వులు జారీచేశారు.రాష్ట్ర ఆరోగ్య మిషన్, రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్, ఎకోటూరిజం అడ్వైజరీ బోర్డ్, 125వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల కమిటీ, ఉర్దూ అకాడమీ పాలకమండలి, బంగ్లా సంగీత్మండలి ఆర్గనైజింగ్ కమిటీ, ఎస్సీ, ఎస్టీల సలహా మండలి, పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, విపత్తుల నిర్వహణ సంస్థ సహా పలు సంస్థలకు చీఫ్ పదవి నుంచి మమత రాజీనామాచేశారు. లేఖలో ప్రస్తావించకపోయినా, తాను ప్రాతినిధ్యంవహించే ప్రతి ఒక్క సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు సంబంధిత ఉత్తర్వులో ప్రస్తావించారు. -
హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రధానంగా హార్మూజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్మూజ్ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, పశ్చిమాసియా పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించామని స్పష్టంచేశారు. కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై నేతలు చర్చించారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. -
సమర్థంగా ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒకబృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోందని అన్నారు. ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి కోవిడ్–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే.. సోమవారం కొత్తగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సప్లై చైన్స్, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల ఆధారంగా చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించినట్లు చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.దక్షిణాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన వ్యూహాలపై సాధికార బృందాలు కసరత్తు చేస్తాయన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఒక ప్రత్యేకమైన స్వభావం కలదని, దానికి తగినట్టుగానే విభిన్నమైన రీతిలో పరిష్కారాలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు నిరంతరం మారుతున్నాయని, అందుకే ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. పశ్చిమాసియా ప్రతికూల పరిణామాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.శాంతి యత్నాలకు భారత్ మద్దతు ఎరువుల సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రాబోయే పంటల సీజన్లో సరిపడా ఎరువులు అందజేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం మన బాధ్యత అని వివరించారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. దక్షిణాసియా లో శాంతి యత్నాలకు భారత్ మద్దతు కచి్చతంగా ఉంటుందన్నారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోయి, హర్మూజ్ జలసంధి తేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఒకవేళ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. -
50 శాతం సీట్ల పెంపు ముమ్మాటికీ కుట్రే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని విమర్శించారు. ‘ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదేస్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దక్షిణాది నుంచి చోటు ఉండదు... తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు. మోదీ త్రీడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్, డివల్యూషన్, డి్రస్కిమినేషన్ ఈ త్రీడీ విధానంలో ప్రభుత్వాన్ని మోదీ నడపాలనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాలనుకుంటున్నాం. గతంలో దక్షిణాదికి రాజకీయాల్లో ప్రాముఖ్యత ఉండేది. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు. ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదు. రాజకీయ ప్రాధాన్యంలో దక్షిణాదికి చాలా నష్టం జరుగుతోంది. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్కు పంపించేశారు. దక్షిణాదికి ఢిల్లీలో గుర్తింపేలేదు. మోదీ వచ్చిన తర్వాత రాజకీయ వివక్ష ఎక్కువైంది. కేసీఆర్ది కుటుంబ సమస్య కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత వైరం లేదు, ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. కేసీఆర్ సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడే. గృహ నిర్బంధం చేసి ఏదో రకంగా సీఎం కావాలని చూస్తున్నది అల్లుడు, మీరిద్దరు కాదు నేను సీఎం అవుతా అని కవిత చూస్తున్నది. వారసత్వ రాజకీయాలు నమ్ముకున్న కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకు కాలేదు అల్లుడు అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతా అని హరీశ్రావు అనుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కేసీఆర్ను ఫామ్హౌస్లో వాళ్లే నిర్బంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోవడం ఖాయం. వాళ్లది ఫెవికాల్ బంధం. వాళ్లిద్దరినీ వేర్వేరుగా చూడాలనుకోవడంలేదు. రెండింటినీ మడతేసి కొట్టాలన్నదే నా లెక్క. నాకు ఇప్పటికైతే జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ఇంకా 8 ఏళ్లు 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. -
మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
13 ఏళ్ల పోరాటం : తనువు చాలించిన హరీష్ రాణా
న్యూఢిల్లీ: నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి (passive euthanasia) చట్టపరమైన ఆమోదం పొందిన భారతదేశంలోని తొలి వ్యక్తి హరీష్ రాణా కన్నుమూశారు. మంగళవారం (మార్చి 24) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. దీంతో హరీష్ మరణం దేశ వైద్య-చట్టపరమైన రంగంలో ఒక కీలక ఘట్టంగా మిగిలింది. మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గౌరవప్రదమైన రీతిలో ప్రాణాలు విడిచేలా వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ ర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయనకు అందిస్తున్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు. దీంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిగా ఉన్నప్పుడు, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలైన 31 ఏళ్ల హరీష్ రాణా, 2013 నుంచి కోమాలో ఉన్నారు. గత దశాబ్దానికి పైగా కృత్రిమ పోషణ, అడపాదడపా ఆక్సిజన్ సహాయంతో రాణా జీవించారు. నిపుణుల పర్యవేక్షణలోమార్చి 14న రానాను ఘాజియాబాద్లోని తన నివాసం నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్లోని పాలియేటివ్ కేర్ యూనిట్కు తరలించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో రానాకు అందుతున్న కృత్రిమ పోషకాహార మద్దతును (Artificial Nutritional Support) క్రమంగా ఉపసంహరించారు. న్యూరో సర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ నిపుణులు సహా, డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షించింది.ప్యాసివ్ యుథనేషియా అంటే ఏమిటి?కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ జీవన మద్దతును (వెంటీలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటివి) నిలిపివేయడం ద్వారా మరణం సంభవించేలా చేయడం. దీనిని సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతించింది. -
యుద్ధం వల్ల భారత్కు ఈ సవాళ్లు ఎదురయ్యాయి: మోదీ
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ చోటుచేసుకున్న పరిస్థితులపై ఇవాళ రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఇరాన్ యుద్దానికి పరిష్కారమని, ఉద్రిక్తత తగ్గించేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందని అన్నారు. దేశం ఐక్యంగా ఉంటే ఏ సవాలునైనా ఎదుర్కోగలమని తెలిపారు.‘యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. భారత్కు ఆర్థిక, భద్రత, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు 3.75 లక్షల భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి సుమారు 1,000 మంది భారతీయులను తరలించాం. అందులో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.విదేశాల్లోని భారత మిషన్లు 24/7 సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. హెల్ప్లైన్లు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాం. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం కష్టతరం. అయినప్పటికీ ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి.ప్రస్తుతం 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుగుతున్నాయి. ఎల్పీజీలో దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాం. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల చమురు దిగుమతులు తగ్గిస్తున్నాం. రైల్వే విద్యుతీకరణతో డీజిల్ వినియోగం తగ్గిస్తున్నాం.ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ డిమాండ్కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీలో భారత్ పురోగతి సాధించింది. తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులందరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని మోదీ చెప్పారు. -
రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల ఘటన ప్రస్తావన
ఢిల్లీ: రాజమండ్రి కల్తీ పాలన ఘటనను రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కల్తీ పాలతో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల కల్తీని అరికట్టేందుకు ఎఫ్ఎస్ఏఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. కల్తీ పాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. లాలాపేటలో కల్తీ పాల వల్ల 16 మంది చనిపోయారని ఆయన తెలిపారు. నిరంతరం తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ల్యాబ్లకు పంపించాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.శ్వేత విప్లవం మన దేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఏదైనా వస్తువు కొరత ఉన్నప్పుడే కల్తీ జరుగుతుందని, అది సమృద్ధిగా ఉన్నప్పుడు కాదని మనందరికీ తెలుసు. కానీ, ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతికరంగా, భారీ ఉత్పత్తి ఉన్నప్పటికీ, మన దేశంలో పాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది.ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యం, ఎందుకంటే శారీరక పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడే 10 రకాల పోషకాలు వాటిలో ఉన్నాయి. అంతేకాకుండా, మన శరీరం ఉత్పత్తి చేయలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా వాటిలో ఉంటాయి. ప్రతి ఏడాది పలు కల్తీ కేసులు నమోదవుతున్నాయన్నారు. -
వీడియో వైరల్: భోజనంలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు?!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఐటీ–ఆర్జీపీవీ) హాస్టల్ మెస్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్లో బల్లి కళేబరం (లిజార్డ్) కనిపించింది.దీంతో ఆ విద్యార్థి మెస్ సిబ్బందిని నిలదీశాడు. ‘అన్నా, ఇది ఏమిటో చూడండి. నాకు అనుమానం వస్తోంది’ అని ప్రశ్నించాడు. సిబ్బంది మాత్రం ‘ఇది బల్లి కాదు, సిమ్లా మిర్చి (క్యాప్సికమ్)’ అని సమాధానం ఇచ్చారు. విద్యార్థి మాత్రం ‘ఇది బల్లే.. గుడ్లు తేలేసింది’ అని వాదించాడు. ఈ మాటలతో అసహనానికి గురైన ఓ సిబ్బంది, ప్లేట్లో ఉన్న ఆ ముక్కను తీసుకుని తిన్నాడు. ‘ఇది బల్లి కాదు.. క్యాప్సికమే’ అని నిరూపించడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో మెస్ పరిశుభ్రతపై విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. నెటిజన్లు సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్లేట్లో నిజంగా బల్లి కళేబరమేనా? లేక క్యాప్సికమ్ ముక్కనా? అన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. UIT RGPV Bhopal: A student allegedly claimed a lizard in his mess food.When he complained, the staff denied it and said it was capsicum, and later ate the lizard to prove their pointhttps://t.co/Wa6uBFIf5Y— Ghar Ke Kalesh (@gharkekalesh) March 22, 2026 -
Delhi : ‘అసెంబ్లీ,మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చేస్తాం’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చేస్తామంటూ స్పీకర్ విజేందర్ గుప్తకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజేందర్ గుప్తా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్తో అణువణువూ గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులు తొలిసారి మంగళవారం ఉదయం 7.28గంటల సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్స్కు వచ్చింది. 21 నిమిషాల వ్యవధిలో సరిగ్గా ఉదయం 7.49 గంటలకు అసెంబ్లీ స్పీకర్కు మరో మెయిల్ వచ్చింది. ఖలిస్తానీ వేర్పాటు వాదుల పేరిట వచ్చినట్లు అనుమానిస్తున్న ఆ ఈమెయిల్స్లో మధ్యాహ్నం 1.11గంటలకు ఢిల్లీ అసెంబ్లీ, సాయంత్రం 9.11గంటలకు ఢిల్లీ మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చివేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ,మెట్రో స్టేషన్తో పాటు అగంతకులు ప్రస్తావించిన ఇతర ప్రాంతాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు -
‘ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది’
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘ఏపీలో అభివృద్ధి పనులు చేయకుండా... అప్పులు చేస్తున్నారు. ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. కేవలం 22 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 3 లక్షల 18 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా భవిష్యత్తు తరాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ అప్పులపై కేంద్ర పర్యవేక్షణ ఉండాలి.చేస్తున్న అప్పులతో ఫలితాలు వస్తున్నాయా? అని పరిశీలన జరగాలి. అప్పులతో తెచ్చిన నిధులతో ఆస్తులు నిర్మించి, జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. విద్యారంగానికి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. ఏపీలో 60 శాతం ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం అవుతుంది.దీనివల్ల బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. మత్స్య సంపద ఎగుమతులు 60% ఏపీ నుంచే జరుగుతున్నాయి. 1,60,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. వేలాదిమంది దీనిపై ఆధారపడ్డారు. కోస్తా తీరంలో మత్స్యకారులు ఉపాధికి చర్యలు తీసుకోవాలి. గోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్బర్ ఆధునికీకరణ జరగాలి.కోస్తా ప్రాంతంలో మెరైన్ ప్రాసెస్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. సెస్, సర్ చార్జీల వల్ల రాష్ట్రాలు తగిన వాటా పొందలేకపోతున్నాయి. దీనిపై పునః పరిశీలన జరగాలి. వైద్యరంగంపై తగిన దృష్టి సారించాలి. ఆరోగ్య పథకాలకు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దేశిత గడువుతో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. మేజర్ రైల్వే ప్రాజెక్టులను జవాబుదారీతనంతో పూర్తి చేయాలి’ అని అన్నారు. -
LPG సిలిండర్పై వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్?!
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 10 కిలోల గ్యాస్ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. -
ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన?
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్లో ఇరాన్పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.ఈ రోజు పార్లమెంట్లో సీసీఎస్ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. -
ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. కేంద్ర మంత్రుల అభినందనలు ప్రభుత్వాధినేతగా 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కేంద్ర మంత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని గత 24 ఏళ్లకుపైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘మోదీ యుగం’ దేశ రూపురేఖలనే మార్చివేసింది. ఈ 8,931 రోజుల ప్రస్థానం దేశం పట్ల ఆయన నిబద్ధత, ప్రతి పౌరుడి పట్ల ఆయన చూపే అసమాన సేవానిరతికి ప్రతీక’’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంత్రులు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు కూడా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంపట్ల, ప్రజల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం కలిగిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ‘‘మోదీ జీవితమంతా నిరంతర సేవా ప్రయాణం. ప్రధానిగా ఆయన సేవా దృక్పథం దేశాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మోదీ నాయకత్వంలో పేదలు, యువత, రైతులు, అన్నదాతల సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతోంది’’ అన్నారు.ఎన్నెన్ని రికార్డులో! → మోదీ తొలిసారి 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే దాకా సీఎంగా కొనసాగారు. గుజరాత్కు ఎక్కువ కాలం సీఎంగా చేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. 2001, 2002, 2007, 2012ల్లో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి, ప్రధానమంత్రిగా ఎన్ని కైన అరుదైన నాయకుడు కూడా మోదీయే. → స్వతంత్ర భారతదేశంలో జని్మంచిన తొలి ప్రధానిగా మోదీ మరో రికార్డు నెలకొల్పారు. మోదీకి ముందు ప్రధానులుగా చేసిన వారంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారే. → ప్రధానిగా రెండు పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నేత మోదీ. ప్రస్తుతం వరుసగా మూడో టర్మ్లో పదవిలో కొనసాగుతున్నారు. → వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా మోదీ మరో ఘనత సాధించారు. ఆయన సారథ్యంలో 2014, 2019, 2024ల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. → వరుసగా ఎక్కువకాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోదీ గతేడాది బద్ధలు కొట్టారు. ఇందిర 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 దాకా 4,077 రోజులపాటు వరుసగా పదవిలో ఉన్నారు. మోదీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. → అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజులపాటు పదవిలో ఉన్నారు. మోదీ నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైతే ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది. → నెహ్రూ మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారు. ఈ రికార్డును మోదీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డునూ అధిగమిస్తారు. → ఆరు వరుస ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీపక్ష నేతగా, ప్రధానిగా ఎన్నికయ్యారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ జరిపారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది.పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మధ్య పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ (LPG) కేటాయింపులను కేంద్రం పెంచింది. గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ (PNG) కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు కొనసాగుతున్నాయి.దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని.. ఎలాంటి రద్దీ లేదని అధికారులు తెలిపారు. సరఫరాలను మెరుగుపరిచే క్రమంలో, అమెరికాలోని టెక్సాస్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వస్తున్న ఒక కార్గో నౌక మంగళూరులోని 'న్యూ మంగళూరు పోర్టు'కు చేరుకుంది. మార్చి 14 నుంచి మార్చి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో సంబంధిత ఛార్జీలను మాఫీ చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.కాగా, భారత జెండాతో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ త్వరలో ఉద్రిక్తమయ హార్మూజ్ గుండా పయనించి స్వదేశానికి చేరుకోనున్నాయి. గత 24 గంటలుగా హార్మూజ్ గుండా ఎలాంటి నౌకల సంచారం లేకపోయినా అదే జలసంధి గుండా ఈ రెండు ఎల్పీజీ నౌకలు సాహసోపేత ప్రయాణం సాగించనున్నాయని రాయిటర్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణాన్ని నిలిపేసి హార్మూజ్కు దూరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా సమీప నౌకాశ్రయంలో ఈ రెండు నౌకలు లంగరువేశాయని, త్వరలోనే ప్రయాణం ఆరంభిస్తాయని నౌకలను ట్రాక్ చేసే సంస్థ ‘మెరైన్ట్రాఫిక్’ వెల్లడించింది. -
ఆసుపత్రిలో చిగురించిన ప్రేమ.. చివరికి ఏం జరిగిందంటే..!
గురుగ్రామ్: గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం చివరికి విషాదంగా మిగిలింది. నర్సు హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో భర్తే.. భార్యకు అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది, రేడియాలజిస్ట్ అరుణ్ శర్మ, నర్సుగా పని చేస్తున్న కాజల్ ఓ నర్సింగ్ హోమ్లో సహోద్యోగులుగా పరిచయమయ్యారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడాది నవంబర్లో వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, నాలుగు నెలలు తిరక్కుండానే వరకట్నం కోసం అరుణ్ ఆమెను హత్య చేయడంతో వారి బంధం విషాదాంతమైంది.వివాహం జరిగిన కొద్ది రోజులకే చిన్న చిన్న విషయాలకే అరుణ్ తన భార్యపై చేయి చేసుకునేవాడు. డబ్బు తేవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని.. వరకట్నం కోసం వేధిండని కాజల్ సోదరుడు పేర్కొన్నాడు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 4న ఈ దంపతులు గురుగ్రామ్లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చారు. దాదాపు రెండు వారాల తర్వాత మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్.. కాజల్పై దాడి చేశాడు.మరుసటి రోజు ఉదయం, మాట్లాడాలని చెప్పి అరుణ్.. కాజల్ను కిందకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఈ కొత్త దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కాజల్ స్పృహతప్పి పడిపోయింది, ఆమె ముక్కు నుంచి రక్తం కారడం గమనించారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే సరికి పరిస్థితి చేయిజారిపోయింది; ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.టాయిలెట్లో తమకు ఒక సిరంజి దొరికిందని.. అరుణ్ ఆమెకు విషం ఇచ్చి ఉంటాడని కాజల్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాజల్కు అరుణ్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పరిధిలోని బెహ్తా హాజీపూర్కు చెందిన అరుణ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో మాదకద్రవ్యాలు వాడే అలవాటు ఉన్నట్లు సమాచారం. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వైదొలిగారు. పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ఆరంభంలోనే ‘ఈ కేసులో నేను విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనా(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)లున్నాయి’అని వ్యాఖ్యానించారు. విచారణ నుంచి తప్పుకోవడం సబబని భావిస్తున్నట్లు తెలిపారు. తదుపరి సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలని సూచించారు. సీజేఐ అభిప్రాయంతో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఏకీభవించారు. దీంతో, ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీన మరో ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని సీజేఐ తెలిపారు. సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని జడ్జీలతో నూతన ధర్మాసనం ఏర్పాటవుతుందని ప్రకటించారు. తీర్పు వెలువడే వరకు ప్రస్తుత చట్టం యథాతథంగా అమల్లో ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నెలల్లోనే 2023 డిసెంబర్లో పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు కమిషనర్ల నియామకానికి ఏర్పాటయ్యే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతోపాటు హోం శాఖ సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు. సీజేఐను మినహాయిస్తూ తీసుకు వచ్చిన కొత్త చట్టంతో ఈసీ నియామక ప్రక్రియ నిష్పాక్షికతను కోల్పోయిందంటూ సుప్రీంలో కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరులు పిటిషన్లు వేశారు. అయితే, ఈసీ ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రతినిధి ఉండటం వల్ల నియామక ప్రక్రియలో నిష్పాక్షికత వచ్చినట్లు కాదని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం నిబంధనల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అవినాశ్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు.. » ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు. » ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. » ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. » దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణించి ఊరట కల్పించాలి.ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది. -
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: కార్మిక వర్గానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. పరిశ్రమ(ఇండస్ట్రీ) అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947లోని ఇండస్ట్రీ అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలని కోరుతూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై 1978 ఫిబ్రవరి 21న అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్సులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ‘ఇండస్ట్రీ’గా పరిణించాలని వెల్లడించింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్టం–1947 పరిధిలోకి వచ్చారు. తద్వారా వారికి లబ్ధి చేకూరుతోంది. 1978 నాటి తీర్పు సరైనదేనా? అని ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మూడు రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. అటవీ శాఖ ఇతర శాఖలను కూడా ఇండస్ట్రీగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తమ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్! -
పారిశ్రామికాభివృద్ధికి రూ. 33 వేల కోట్లతో ‘భవ్య’ పథకం
న్యూఢిల్లీ: తయారీరంగంలో మరింత వృద్ధి సాధనే లక్ష్యంగా తీసుకొస్తున్న భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకం కోసం రూ.33,660 కోట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 100 ప్లగ్–అండ్–ప్లే పారిశ్రామిక పార్క్ల కల్పన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. కేబినెట్ నిర్ణయాలను తర్వాత సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భవ్య పథకాన్ని ఆరంభిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని నిర్ణయాలు.. → పత్తి సేకరణ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 2023–24 కాటన్ సీజన్లో కనీస మద్దతు ధర కోసం ఖర్చుచేసిన మొత్తాలను రీయింబర్స్చేసేందుకు ఉద్దేశించిన రూ.1,718.56 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఓకే చెప్పింది. → ఉత్తరప్రదేశ్లో 927 జాతీయరహదారి వెంట బారాబంకీ నుంచి బహ్రెయిచ్ల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నాలుగు వరసల రహదారి నిర్మాణానికి అవసరమైన రూ.6,969.04 కోట్ల నిధుల మంజూరు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఆర్థిక, సామాజిక, వస్తూత్పత్తుల హబ్ల మధ్య అనుసంధానం పెంచేందుకు 101.51 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నిర్మించనున్నారు. → మరో 1,500 మెగా వాట్ల శుద్ద ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో తలపెట్టే చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.2,584.60 కోట్ల ఆర్థికసాయం చేసే ప్రతిపాదనలకు కేంద్రకేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
పార్లమెంట్ అంటే ఓపెన్ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ సభ్యత్వం ముగిసినప్పటికీ సభ్యులు ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉండాలని అన్నారు. రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ఉద్ఘాటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాజ్యసభ సభ్వత్వం ముగుస్తున్న 59 మంది సభ్యులు ఇన్నాళ్లూ అందించిన సేవలను ప్రధానమంత్రి కొనియాడారు. ఆయా సభ్యులకు బుధవారం రాజ్యసభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించిన ప్రధాని మోదీ మాట్లాడారు. ఇలాంటి వీడ్కోలు సందర్భాలు సహజంగానే రాజకీయ విభేదాలను తొలగిస్తాయని అన్నారు. సహజంగా, అప్రయత్నంగా రాజకీయ విభేదాలకు అతీతంగా వ్యవహరిస్తామని, మనందరిలో ఒక ఉమ్మడి భావన ఉద్భవిస్తుందని వ్యాఖ్యానించారు. సభకు ఇక తిరిగి వచ్చే ఆలోచన లేని సభ్యులకు భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పూర్తి విరామం అనేది ఎప్పుడూ ఉండదన్నారు. భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తోందని సూచించారు. మీ అనుభవం, సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్పష్టంచేశారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ దిగ్గజాలైన ఆ ముగ్గురు నేతలు జీవితంలో సగానికి కంటే ఎక్కువ భాగం పార్లమెంట్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు. అంకితభాతంలో పార్లమెంట్కు హాజరయ్యారని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగడం సాధారణ విషయం కాదన్నారు. మాతో ప్రేమ, మోదీతో పెళ్లి: ఖర్గే రాజ్యసభ కార్యకలాపాల నిబంధనలను సమీక్షించాలని సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. సభను మరిన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రతిపక్ష సభ్యుల భాగస్వామ్యం మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. లేకపోతే పార్లమెంట్ ప్రతిష్ట బలహీనపడుతుందని చెప్పారు. 59 మంది సభ్యుల వీడ్కోలుపై ఖర్గే మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాజీవితం నుంచి రిటైర్మెంట్ ఉండదని వ్యాఖ్యానించారు. దేశానికి సేవ చేయాలన్న తపన కలిగిన నాయకులు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎన్నడూ అలసిపోరని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యత్వం ముగు స్తున్న సభ్యులు ప్రజలకు ఎప్పటిలాగే సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని, ఆయనతో కలిసి పనిచేశానని అన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ దేవెగౌడ తమతో డేటింగ్ చేసి, ప్రేమాయణం సాగించి, చివరికి మోదీని పెళ్లి చేసుకున్నారు అంటూ చమత్కరించారు. దీంతో సభలో మోదీతో సహా సభ్యులంతా నవ్వులు చిందించారు. -
అనర్హత వేటు అధికారం హైకోర్టులకు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలు కళ్ల ముందే ఉల్లంఘనకు గురవుతున్నాయని, పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటువేసే అధికారాన్ని స్పీకర్ల నుంచి తప్పించి హైకోర్టులకు అప్పగించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సమావేశంలో బుధవారం ఆయన తెలుగులో మాట్లాడారు. స్పీకర్ల స్థానంలో హైకోర్టులే తేల్చాలి.. ప్రజాప్రాతినిధ్య చట్టం ఒక పవిత్ర లక్ష్యంతో ఏర్పడిందని.. అయితే, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న వారిపై స్పీకర్లు సకాలంలో చర్యలు తీసుకోలేకపోతున్నారని బోస్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నేతను న్యాయాధికారిగా కూర్చోబెడితే న్యాయం జరగదని చెప్పారు. పార్టీ మారిన వారిని ఆ పదవీకాలం ముగిసేవరకు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత విధించాలని ప్రధానిని కోరారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టులకు బదిలీచేసి, మూడు నుంచి ఆరు నెలల్లోగా నిర్ణయం వెలువడేలా కచ్చితమైన గడువు విధించాలని ఆయన సూచించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) అమలులోనూ రాష్ట్రాల్లో లోపాలున్నాయని, ప్రభుత్వ జీఓలను దాచిపెడుతున్నారని ఆయన ప్రస్తావించారు. చట్టాలను కాపాడుకోలేనప్పుడు రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవులు దేనికని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. ఇక్కడ చేసిన చట్టాలను మన కళ్లముందే తూట్లు పొడుస్తూ నాశనం చేస్తుంటే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. చివరగా.. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ వంటి దిగ్గజాల సరసన కూర్చునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని బోస్ సంతోషం వ్యక్తంచేశారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులంతా తిరిగి సభకు ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు.మహానేతకు, మాజీ సీఎం జగన్కు కృతజ్ఞతలు.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత రాయవరం మునసబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని బోస్ స్మరించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఓబీసీ (శెట్టిబలిజ) సామాజికవర్గం నుంచి పార్లమెంటు మెట్లు ఎక్కిన తొలి వ్యక్తిని తానేనని ఇందుకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నిబంధనల ప్రకారమే బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్తో పాటు ఇతర నిందితులకు స్టేషన్ బెయిల్ లభించడం నిబంధనల ప్రకారం జరిగిందే తప్ప అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొందరు స్టేషన్ బెయిల్ పొందారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు తాము బాధితులమని చెబుతున్నారు. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి స్టేషన్ బెయిల్ పొందే అవకాశం చట్టరీత్యా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం గానీ, మరెవరు గానీ చేసేదేమీ లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేసును పక్కదారి పట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రతేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. ముందస్తు ముచ్చటే లేదు... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే అంటే 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జాతీయ జనగణన పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది..’రేవంత్ వివరించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అది మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంకతో భేటీలు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాం«దీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్రెడ్డిని వారికి పరిచయం చేశారు. కాగా వేం నరేందర్రెడ్డిని రాహుల్, ప్రియాంక అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాహుల్, ప్రియాంకలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణ్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ మాజీ మంత్రి రోజాకు పలకరింపు పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి రోజాను ముఖ్యమంత్రి పలకరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రోజా పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఎదురుకావడంతో ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. -
‘చంద్రబాబు సర్కార్ పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది’
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.‘‘ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యేలను కొనేసి గెల్చారు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో అధికార పక్షాలు గెలుపే లక్ష్యంగా తమ చట్టసభల సభ్యులను కొనేశాయని, క్రాస్–ఓటింగ్కు పాల్పడ్డాయని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. బేరసారాలు జరిగాయన్న ప్రాథమిక సమాచారంతో ఒడిశాలో ముగ్గురు సభ్యులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటువేసింది. హరియాణాలోనూ కఠిన చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. రాజ్యసభలో 37 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గతంలోనే 26 చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. దాంతో మిగిలిన 11 స్థానాలకే బిహార్, ఒడిశా, హరియాణాల్లో ఎన్నికలు జరపగా తొమ్మిది చోట్ల ఎన్డీఏ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేడీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. మొత్తంగా చూస్తే 37 స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 22 చోట్ల విజయం సాధించింది.రహస్య ఓటింగ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోమవారం హరియాణాలో రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు సోమవారం ఆగిపోగా మంగళవారం ఆరంభించారు. బీజేపీ తరఫున సంజయ్ భాటియా, కాంగ్రెస్ తరఫున కరమ్వీర్ సింగ్ బౌధ్ విజయం సాధించారు. వాస్తవ మెజారిటీ ప్రకారం బౌధ్ గెలుపు నల్లేరుపై నడకే. కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా అత్యంత స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. మా ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీస్లు పంపబోతున్నామని హరియాణా కాంగ్రెస్ ఇన్చార్జ్ బీకే హరిప్రసాద్ తెలిపారు.‘‘ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్ను ఎలాగైనా గెలిపించాలని ఎన్డీఏ కూటమి కుట్ర పన్నింది. అయినాసరే మా అభ్యర్థి బౌధ్ గెలిచారు. అగి్నపరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది. ప్రజాస్వామ్యమే గెలిచింది. ఓటు చోరీ ఓడిపోయింది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ఓటింగ్కు పాల్పడ్డారు. వారిలో నలుగురి ఓట్లు చెల్లలేదు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు. వాళ్లెవరో ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది’’అని హరియాణా శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్ సింగ్ హూడా అన్నారు. షోకాజ్ నోటీస్లు జారీచేస్తాం.. మరోవైపు ఒడిశాలో స్వతంత్ర అభ్యరి్థ, బీజేపీ మద్దతున్న దిలీప్ రాయ్ను గెలిపించేందుకు ప్రయత్నించిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఒడిశా చీఫ్ భక్త చరణ్ దాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సనఖేముండి ఎమ్మెల్యే రమేశ్ చంద్ర జెనా, మోహన నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరథి గోమంగో, బారాబటి–కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్లను అనర్హులుగా ప్రకటించాలంటూ ఒడిశా అసెంబ్లీ మహిళా స్పీకర్ సురమా పథేకు కాంగ్రెస్ పక్షనేత రామచంద్ర కదమ్ మంగళవారం లేఖ రాశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది.‘‘తమ సభ్యులకు స్పష్టంగా విప్జారీచేయడం కూడా కాంగ్రెస్కు తెలీదు. ప్రామాణిక పద్ధతిలో మూడు లైన్లలో విప్ను జారీచేయాలి. కానీ రాహుల్గాంధీ కాంబోడియాలో, తేజస్వీ యాదవ్ యూరప్లో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర నేతలేమో అంతకన్నా బిజీగాఉన్నారు. ఇక ఎమ్మెల్యేలకు కఠిన విప్ జారీచేసేదెవరు?. అంతా అయిపోయాక వాళ్లకెందుక ఓటేశారు? అని షోకాజ్ నోటీస్లు జారీచేయడంలో ప్రయోజనం ఏముంటుంది?’’అని బిహార్లో పశి్చమచంపారన్ బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
సామాజిక భద్రతగా పితృత్వ సెలవులు
న్యూఢిల్లీ: శిశువుల సంరక్షణకు తల్లితోపాటు తండ్రి పాత్ర కూడా కీలకమేనని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డల బాధ్యత అనేది కేవలం ఒక్కరి విధి కాదని పేర్కొంది. బిడ్డ అభివృద్ధిలో తల్లి కీలక పాత్ర పోషించినప్పటికీ, అదే సమయంలో తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయం అవుతుందని స్పష్టంచేసింది. పితృత్వ సెలవులను సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తించాలని, ఈ మేరకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా పితృత్వ సెలవులు ప్రాధాన్యతను నొక్కిచెప్పింది.తండ్రులకు కూడా సెలవు ఇవ్వడం సమాజంలో లింగపరమైన అంతరాలను తొలగించడానికి దోహదపడుతుందని వెల్లడించింది. అలాగే పిల్లల పెంపకం(పేరెంటింగ్)పై సమతుల్య అవగాహనను పెంపొందిస్తుందని అభిప్రాయపడింది. పిల్లల భావోద్వేగ, శారీరక, మానసిక వికాసంలో తల్లి పాత్ర నిస్సందేహంగా కీలకమైనప్పటికీ, తండ్రికి కూడా అంతే ముఖ్యమైన పాత్ర ఉందని, దాన్ని విస్మరించడం అసంపూర్ణం, అన్యాయమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. -
హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు.. చివరకు..
న్యూఢిల్లీ: ఓ యువకుడు హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు ఇస్తూ వీడియో తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో తుపాకీని లోడ్ చేసి, గుండెకు గురి పెట్టుకున్నాడు. అనుకోకుండా అది పేలడంతో బుల్లెట్టు అతడి శరీరంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఎలా జరిగింది? ఢిల్లీకి చెందిన పవన్ అనే ఓ యువకుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి తుపాకీతో వీడియో తీసుకుంటున్నాడు. అతడి స్నేహితుడు వీడియో చిత్రీకరిస్తున్నాడు. తుపాకీ పట్టుకున్న పవన్ ట్రిగ్గర్ను స్వల్పంగా తాకాడు. “చలానా మత్ భాయ్ (కాల్చవద్దు అన్నా)” అంటూ వీడియో తీస్తున్న వ్యక్తి హెచ్చరించాడు. అయినప్పటికీ తుపాకీని పవన్ తన చాతీపై పెట్టాడు. అకస్మాత్తుగా అది పేలింది. ఆ వెంటనే పవన్ కుప్పకూలిపోయాడు. పవన్ను ఆసుపత్రికి తరలించినా, చికిత్స సమయంలో అతడు మృతి చెందాడని అధికారులు తెలిపారు.ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని దల్లుపురాలో జరిగింది. తుపాకీకి లైసెన్స్ ఉంది. అది వీడియో చిత్రీకరించిన యువకుడిదే అని పోలీసులు తెలిపారు. వీడియో తీస్తున్న వ్యక్తి పవన్కు తుపాకీ ఎలా లోడ్ చేయాలో సూచనలు ఇస్తూ, కాల్చవద్దని హెచ్చరించాడని పోలీసులు చెప్పారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పవన్ తుపాకీతో స్టంట్లు చేస్తూ రీల్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. పవన్ తుపాకీ లాక్లో ఉందని నమ్మాడని పోలీసులు తెలిపారు. -
36 ఏళ్ల నాటి రూ. 500 లంచం కేసులో శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: దాదాపు 36 సంవత్సరాల క్రితం 500 రూపాయల లంచం తీసుకున్న నేరానికి గతంలో హైకోర్టు న్యాయస్థానం ఆనాటి కానిస్టేబుల్కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సగానికి తగ్గించింది. దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు వేసిన శిక్షను 14 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చి న తీర్పును జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.అయితే 75 ఏళ్ల వయసులో మాజీ ఉత్తరాఖండ్ ఎక్సయిజ్ కానిస్టేబుల్ రెండేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించలేడని పేర్కొంటూ ఆ శిక్షను ఏడాదికి కుదించింది. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను అనుసరిస్తూ మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ తొలి దఫా సమావేశాల వేళ లోక్సభలో సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారన్న కారణంగా ఫిబ్రవరి మూడో తేదీన సస్పెన్షన్కు గురైన ఎనిమిది మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ను మోదీ సర్కార్ రద్దుచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. సస్పెన్షన్ను మంగళవారం ఎత్తేయనున్నట్లు సమాచారం.సీపీఐ(ఎం) ఎంపీ ఎస్.వెంకటేసన్తోపాటు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, సీ కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, ప్రశాంత్ పదోలే, డియాన్ కురియన్కోసేలపై ఏప్రిల్ రెండో తేదీదాకా ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణ యించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వీళ్లపై సస్పెన్షన్ను రద్దుచేయాలంటూ విపక్షనేతలు డిమాండ్ చేయడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాజ్యసభకు నితీశ్, నితిన్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిహార్లోని ఐదు, ఒడిశాలో నాలుగు, హరియాణాలో రెండు సీట్లకు సోమవారం జరిగిన పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి బీజేడీకి, మరోటి బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడి కాలేదు. బిహార్ నుంచి ఖాళీ అవనున్న మొత్తం ఐదు స్థానాలను ఎన్డీయే క్లీన్స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్, నితిన్ నబీన్లతోపాటు జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేశ్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు.ఐదు సీట్లకుగాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర ధారి సింగ్ సహా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వరుసగా రెండో విడత గెలవాలన్న అమరేంద్రకు మహాగఠ్బంధన్ నుంచి సహకారం కరువైంది. దీంతో, ఆయన ఓడిపోయారు. కాగా, బిహార్కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు వెళ్లనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.ఒడిశాలో బీజేపీకి రెండు సీట్లుఒడిశాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పార్టీ ఎంపీ సుజీత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్త్ మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్లు పేర్కొంది. -
బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులపై వేటు
కోల్కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నత స్థాయి అధికార, పోలీసు యంత్రాంగాన్ని బాధ్యతల నుంచి తొలగించింది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ, కొద్ది గంటల్లోనే ఈ మేరకు సమూల ప్రక్షాళన చర్యలను చేపట్టడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వెలువరించిన మొదటి ఉత్తర్వులతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, హోం శాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాలపై వేటు వేసింది.అనంతరం, 16వ తేదీతో వెలువరించిన మరో ఆదేశంలో రాష్ట్ర డీజీపీ పియూశ్ పాండే, కోల్కతా సీపీ సుప్రతీమ్ సర్కార్ తదితర నలుగురు ఉన్నతస్థాయి ఐపీఎస్లను తొలగిస్తున్నట్లు తెలిపింది. నందినీ చక్రవర్తి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ దుష్యంత్ నరియాలాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. దుష్యంత్ ప్రస్తుతం ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ అదనపు చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా, జగదీశ్ ప్రసాద్ మీనా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా సంఘమిత్రా ఘోష్కు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. డీజీపీగా 1992 బ్యాచ్ అధికారి సిద్్ధనాథ్ గుప్తాను నియమించింది. అజయ్ కుమార్ నంద్ను కోల్కతా పోలీస్ కమిషనర్గా నియమిస్తున్నట్లు ఈసీ తెలిపింది. శాంతి భద్రతల ఏడీజీ వినీత్ గోయల్ స్థానంలో అజయ్ ముకుంద్ పాండేను, సిద్్ధనాథ్ గుప్తా స్థానంలో డీజీగా నటరాజన్ రమేశ్ బాబును నియమించింది.ఈసీ బెంగాల్ వ్యతిరేకి: సీఎం మమత ఎన్నికల వేళ ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ, బీజేపీలు మహిళలకు, బెంగాల్కు వ్యతిరేకులన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఎల్పీజీ సంక్షోభంపై కోల్కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ఎందరు అధికారులను మార్చినా తమ ప్రభుత్వాన్ని మాత్రం మార్చలేదని ధీమా వ్యక్తం చేశారు. -
న్యాయానికి ముసుగేసి.. వాస్తవాలు దాచేసి..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదోవ పట్టించి, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి ఆరోపించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో సునీత అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సీబీఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. ‘హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే, ఆమె మాత్రం లూథ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతడికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ, పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని... ఇలా స్టేట్మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి గారి రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి... ఇది ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం జరిగిన హత్య) కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని నిలదీశారు. షమీమ్ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలాగే వివేకాకు, షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు.. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని... మమ్మల్ని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం నిందితులు విచారణలో అనేక విషయాలు చెప్పారు. వివిధ లావాదేవీల్లో వైఎస్ వివేకానందరెడ్డికి డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దాని కోసం వివేకానందరెడ్డి గారు కొంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయిందీ, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకు ఉంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యాప్తు సునీత కోరడం లేదు?. మరోవైపు తొలిసారి 161 స్టేట్మెంట్లో దస్తగిరి... వివేకానందరెడ్డి గారిని చంపక ముందు డాక్యుమెంట్లు గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన్ను తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్య అనంతరం రెండు మూడు సార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లామని కూడా చెప్పాడు. దస్తగిరి బెయిల్ ఎందుకు అడ్డుకోలేదు? మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా.. మీరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఏకంగా లూథ్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. చంద్రబాబుకు, వివేకాను హత్య చేసిన దస్తగిరికి, మీకు న్యాయవాదిగా లూథ్రాయే ఉండడంలోని ఆంతర్యమేమిటి? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిలిచ్చినా మీరు అడ్డుకోలేదు. ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా ... అతను దర్జాగా బయట తిరుగుతున్నా కనీసం బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన్ను శిక్షించాలని మీరు ఎందుకు కోరరు? అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును, సీబీఐను అడగాల్సిన బాధ్యత మీకు లేదా? హత్య అనంతరం లేఖ గురించి ఎందుకు చెప్పలేదు? మీ తల్లి, భర్త అటెండర్కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్ల గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు.. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ.... కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఇన్నాళ్లూ చేశారన్నది పచ్చి నిజం. ఈ కేసులో పీఏ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని, లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బావమరిది, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి, చనిపోయిన విషయం కూడా చెప్పాడు. ఆ లెటర్లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?. వివేక అటెండర్ పండంటి రాజశేఖర్ను హత్యకు ముందు రోజు కుటుంబసభ్యులే కాణిపాకం ఎందుకు పంపించారు?సునీత పరస్పర విరుద్ధ ప్రకటనలు... పైగా ఎవరికీ లేని అవకాశం సీబీఐ సునీతకి ఇచ్చింది. 2020 జులై 28న ఆ లేఖ గురించి సునీతను సీబీఐ అడిగింది. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం, ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసి ఉండేది, అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని ప్రశ్నించింది. దానికి ఆమె లెటర్ ఉన్న విషయం పీఏ కృష్ణారెడ్డి తమకు వాట్సప్లో చెప్పాడని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటూ పెద్ద థియరీ చెప్పారు. మరలా నెల రోజులకు 27 ఆగస్టు 2020 నాడు సీబీఐ ముందుకు వచి్చ, నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పినదంతా తూచ్... నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటరూ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతిలో లేఖ చూడ్డం తప్ప నాకేమీ తెలియదు అని అబద్దం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచి్చన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? మరో కీలమైన అంశం నా బెయిల్ గురించి హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు... గతంలో సునీత మాట్లాడిన వీడియోను హైకోర్టు ముందు ఉంచాను. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో మాట్లాడుతూ... గడిచిన కొన్ని నెలలుగా అవినాష్ని ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి మా నాన్న శ్రమిస్తున్నారు అని మాట్లాడిన వీడియోను హైకోర్టుకు సమర్పించాను. అనంతరం నాకు బెయిల్ వచ్చిన తర్వాత మరలా సీబీఐ అధికారులను సునీత పిలిచి... మరలా మే 31, 2023 అంటే మూడేళ్ల తర్వాత గతంలో మాట్లాడిన వీడియోను కవర్ చేసే విధంగా మరో స్టేట్మెంట్ ఇప్పించారు. అందులో భాగంగా గతంలో మీరు ఎందుకు అలా మాట్లాడారు అని సీబీఐ అడిగితే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడమన్నారు అందుకే మాట్లాడానని చెప్పింది. విచారణలో లొసుగులను ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారించరు? వివేకాకు, ఆయన రెండో భార్య షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టే ధైర్యం ఉందా? వివేకా రెండో భార్య కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం మీకు ఉందా? ఈ కేసులో విచారణను పరిశీలిస్తే.. వివేకానందరెడ్డి ఆమె పేరిట ఆస్తులు ఇవ్వాలనుకున్నారని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. షమీమ్ కుమారుడిని హెచ్పీఎస్ స్కూలులో అడ్మిషన్ తీసుకుని చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్లను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. ఒకవైపు వివేకాకు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్ పూర్తిగా చెక్ పవర్ తీసేశారు. ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితికి ఆయన్ను తీసుకొచ్చారు. చివరగా గత మూడేళ్లులో ఆయనతో మాట్లాడడంలేదని కూడా విచారణలో సునీతక్క మాటల్లో ఉంది. ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదు..? షమీమ్కు వివేకా ఎన్నో హామీలిచ్చారు. అవి నెరవేరకుండానే హత్యకావించబడ్డారు. ఎవరు చేసి ఉంటారు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివేకా ఆస్తులు షమీమ్కు, ఆమె కొడుకుకు పోతే నష్టపోయేదెవరు? ఆ నష్టం వాటిల్లకుండా వారే చేసి ఉండవచ్చు కదా? మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? ఆ దొంగిలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయలేదు? నిత్యం విచారణను అడ్డుకునే ప్రయత్నంలో సునీత... ముఖ్యంగా రామ్ సింగ్ వీళ్ల చేతుల్లోకి వచి్చన తర్వాత సుధాసింగ్, దీపక్ గారిని విచారణ నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇష్టమొచి్చనట్లు స్టేట్ మెంట్లు తీసుకున్నారన్నది పచ్చి నిజం. అదే విధంగా దస్తగిరి తన స్టేట్మెంట్లో వివేకానందరెడ్డి గారికి అనేక అక్రమ సంబంధాలున్నాయని చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ అడిగే ప్రయత్నం సునీత చేయదు. అది వ్యక్తిగత అంశం కాబట్టి నేను అటువైపు వెళ్లదల్చుకోలేదు. నేను అనేకసార్లు సీబీఐ డైరెక్టర్కి వినతిపత్రం ద్వారా మొరపెట్టుకున్నా మా మొర ఆలకించలేదు. ఆ రోజుల్లో విచారణలో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు జరగలేదు. ఏకపక్షంగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లి, విచారణ అడ్డుకునేలా ప్రయత్నం చేస్తోంది. గడిచిన రెండు, మూడేళ్లుగా ఇదే పని చేస్తోంది. వచ్చే ఎన్నికల వరకు హత్య కేసును లాగడమే లక్ష్యం... ఎప్పుడు విచారణ జరిగినా.. దేవుడి ముందు, చట్టం ముందు మేం తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం మాకుంది. విచారణ జరిగేలా సహకరించమని సునీతని కోరుతున్నాం. కానీ వీరి ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. విచారణ జరగకూడదన్నట్లు, దోషులెవరూ బయటకు రాకూడదన్నట్లు ఆమె వైఖరి ఉంది. ఎవరైనా ఆధారాలుంటే విచారణ సందర్భంగా సమర్పిస్తారు.. కానీ సునీత అలా చేయకుండా ఈ కేసును ఇలాగే కొనసాగించాలని, చంద్రబాబు చేతిలో పావులా మారి ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప.. న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలను పక్కన పెట్టాలని కోరుతున్నాను.తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ...ఏపీకి సంబంధించిన పెద్ద మనిషి, ఢిల్లీలో కీలకమైన పోస్టులో ఉండడం, ఆయన ఆశీస్సులతో అప్పటి సీబీఐ డైరెక్టర్ నియామకం జరగడం, ఆయనను సునీత అనేకసార్లు కలవడం, చంద్రబాబు నాయుడు, సునీత కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా కేసును తీసుకెళ్లారు. వారికి నచి్చన వారిని తీసుకెళ్లి సీబీఐ విచారణ చేసింది. గతంలో ఎన్నికల ముందు 2024 ఏప్రిల్లో నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను. నన్ను సీబీఐ 12 సార్లు విచారణకు పిలిచింది. నేను మూడోసారి సీబీఐ విచారణకు వెళ్లినప్పుడు హత్య జరిగిన రోజు మేము గమనించిన విషయాలు చెప్పాను. నేను సీఐ గారికి సమాచారం ఇచ్చాను. స్థానికులు వివేకానందరెడ్డి గారిని చూస్తామని గట్టిగా గొడవపడితే వాళ్లను కూడా అనుమతించాం. ఆ రోజు నేను సీబీఐకి చెప్పాను. ఆ రోజు వచి్చన హిమకుంట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. 2025లో సునీత, ఆమె భర్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి... ఘటన జరిగిన తర్వాత వెళ్లిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావు, సీబీఐ వాళ్లు నిన్ను పిలిచి విషయం అడుగుతారని చెప్పారు. దానికి ఆయన నేను తప్పకుండా చెబుతానంటే... అలా చెప్పడం కాదు అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని స్టేట్మెంటు ఇమ్మన్నారు. నాకు అలా చెప్పలేదంటే... మా నాన్నకి ఆప్తుడివి నువ్వు అలా చెప్పాల్సిందేనని అంటే... అక్కడ నుంచి వెళ్లిపోయి మరలా వారం తర్వాత ఆయనపై ఒత్తిడి తెచి్చ.. తాము చెప్పమన్నట్టే స్టేట్మెంట్ ఇమ్మని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే రీతిలో తప్పుడు స్టేట్మెంట్లను ఇప్పిస్తూ వచ్చారు. వారినే సీబీఐ పిలుస్తూ వచి్చంది.విచారణ పూర్తి చేయాలి..సునీత లేఖ దాచిపెట్టిన విషయం, సౌభాగ్య పెద్దమ్మ, నర్రెడ్డి రాజశేఖర్ కలిసి అటెండర్కి సెలవు ఇచ్చి కాణిపాకం పంపించడం, డాక్యుమెంట్ దొంగతనం వంటి అంశాలపై దర్యాప్తు కోరాల్సింది పోయి.. అసలు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తోంది. దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేం పిటిషన్ వేస్తే.. వెంటనే ఆమె ఇంప్లీడ్ అయి.. దస్తగిరి తరపున లూథ్రాతో వాదనలు వినిపిస్తారు. ఈ కేసు విషయంలో గత మూడేళ్లుగా వాస్తవాలు తెలియకుండా మమ్నల్ని ఎంతో మంది దూషించారు. వీళ్లంతా తాము అనవసరంగా నిందించామని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈ కేసు ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరిగే దిశగా న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలి. సునీత భర్త రాజశేఖర్కు టీడీపీ నాయకుడు బీటెక్ రవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలి.గుండెపోటు థియరీని సృష్టించింది సునీతే..ఈ కేసులో అనేక సందర్భాల్లో సీబీఐ అప్పటి డైరెక్టర్కు తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయాలని విజ్ఞపి చేశాం. పైన నేను చెప్పిన అన్ని అంశాలను లేఖ రూపంలో రాశాను. కేవలం టార్గెటెడ్ దర్యాప్తు చేసిందే తప్ప... సీబీఐ వాస్తవాలను వెలికి తీసే దిశగా దర్యాప్తు చేయలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి, సీబీఐకి మెయిల్స్, రిజిస్టర్డ్ పోస్టు రూపంలో మేము అనుకున్న అంశాలపై ఫిర్యాదు చేశాం. సునీత ఇప్పుడు కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు రకాల పిటిషన్స్ వేసి విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ అంశాన్ని వెలుగులో ఉంచడమే వీరి లక్ష్యం. వివేకానంద రెడ్డి హత్య జరిగే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అదే విధంగా గుండెపోటు అని అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పమంటూ.. సునీత చాలా మందిని ట్రైన్ చేశారు. గుండెపోటు అని తాను అనుకున్నానని సునీత చెప్పింది. అసలు ఆ థియరీని సృష్టించింది, సిట్ ముందు చెప్పిందే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై శివప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారన్నారు. చేసినదంతా వాళ్లే చేసి అన్యాయంగా మా మీద నిందలు వేశారు. మార్చి 16న సునీత తానే స్వయంగా సిట్ ముందు గుండెపోటు అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. కీలకమైన అంశాలను పక్కనపెట్టి.. ఇతర అంశాలను కోర్టు దృష్టికి, సీబీఐ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విచారణను జాప్యం చేయడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి చెక్ పవర్ తీసివేసి చనిపోయే ముందు ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడలేదు. ఆ కోణంలో విచారణ జరగాలి. షమీమ్కి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన చాట్స్ బయటకు రావాలి. దొంగిలించబడిన రౌండ్ సీల్ డాక్యుమెంట్లలో ఏముంది? మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే మా వాదన. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వివేకం అని సినిమా తీసి రాక్షసానందం పొందారు. కానీ పైన దేవుడు కూడా క్షమించడు. వాళ్లందరినీ దేవుడు శిక్షించడం ఖాయం. ఈ ప్రశ్నలకు బదులేది?ఈ విషయాలపై మరింత విచారణకు సునీత ఎందుకు పట్టుబట్టడం లేదు?1. హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్ను సౌభాగ్యమ్మ, అల్లుడు రాజశేఖర్ కాణిపాకం ఎందుకు పంపించారు?2. వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి?3. హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం అనుమానాస్పదం కాదా?4. వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్మెంట్లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్ష పెంచుకున్నారని ఆ స్టేట్మెంట్లో ఉంది.5. వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా?6. హంతకుడు దస్తగిరి ముందస్తు బెయిల్ను సునీత అడ్డుకోదు. ఎందుకంటే సునీత ఏం కోరుకుంటుందో అదే దస్తగిరి చెబుతాడు. స్టేట్మెంట్గా ఇస్తాడు. మేం దస్తగిరి బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళితే సునీత ఇంప్లీడ్ అయ్యింది. బెయిల్ రద్దు కోసం కాదు.. దస్తగిరి బెయిల్ ఉండాలని.. దస్తగిరి రక్షణ కోసం లూద్రా వంటి సీనియర్ లాయర్ను దింపుతుంది. -
వింత ప్రవర్తన: రేబిస్తో కుక్కలా అరుస్తున్న యువకుడు
లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు. Mirzapur Boy Bitten by Dog 4 Months Ago, Took Only 2 Rabies Shots – Now Acting Like a Dog 😨#mirzapur #rabies #kiranyadav pic.twitter.com/ZuTZTCfJ5Z— Kiran yadav (@Thekiranyadavvv) March 15, 2026 -
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్తో భారత్ నిరంతరం టచ్లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్ దృక్కోణం నుండి ఇరాన్తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ తన హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నేవల్ మైన్స్ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసిందిఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్తో చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్ గ్యాస్, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.ఆరోణల్ని ఖండించిన జైశంకర్భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్-ఇరాన్ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు. భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. -
Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి
భువనేశ్వర్: ఒడిశా కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది మరణించగా, మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన ఐసీయూ వార్డులో మొత్తం 23 మంది చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది, వైద్యులు సహాయక చర్యలు ప్రారంభించారు. రోగులను ఇతర ఐసీయూ, జనరల్ వార్డులకు తరలించే సమయంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే మరో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం మోహన్ చరణ్ మాఝీఒడిశాలో ఎస్సీబీ ఆస్పత్రి ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్యశాఖ మంత్రి మహాలింగ్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. భారీ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. #WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V— ANI (@ANI) March 16, 2026 -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కేంద్రం కొత్త ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎల్పీజీ,పీఎన్జీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని సూచించింది. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు,ఎరువుల రంగాలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు సంక్షోభాన్ని తగ్గించేలా ఆయా రంగాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా భారత్ సైతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.గ్యాస్ వినియోగదారులు ఏదైనా ఒక గ్యాస్ కనెక్షన్ వినియోగించుకోవాలి. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్పీజీ నియమాలలో మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్ను తిరిగి సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఇంధన వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక గృహాలు పీఎన్జీ కనెక్షన్తో పాటు ఎల్పీజీ కనెక్షన్ను కూడా కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, సబ్సిడీ లబ్ధి విషయంలో గందరగోళం, దుర్వినియోగం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ ఉన్న గృహాలు వెంటనే ఎల్పీజీ కనెక్షన్ను సమర్పించాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. ఇకపై సబ్సిడీ లబ్ధి ఒకే కనెక్షన్కు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్పీజీ సబ్సిడీ పొందలేరు. ఎల్పీజీ కనెక్షన్ను సమర్పించిన తర్వాత పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లు తగ్గనున్నాయి.ఈ నిర్ణయంపై గ్యాస్ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఎల్పీజీ అవసరం లేదని భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎల్పీజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరమవుతుందని మరికొందరు అంటున్నారు. కాగా, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ (MoPNG), అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) ద్వారా విడుదలైన గణాంకాల ఆధారంగా దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ 33.2కోట్ల మందికి.. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్1.36కోట్ల మంది వినియోగిస్తున్నారు. -
నమాజ్ చేసే వారి సంఖ్యపై పరిమితులా?
సాక్షి, న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ చేసుకునే వారి సంఖ్యపై పరిమితులు విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతిభద్రతల నెపంతో ఇటువంటిఆంక్షలు విధించలేరని స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడలేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయడమో లేక వేరే జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సిద్ధార్థ్ నందన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.‘శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో నమాజ్ చేసుకునే వారి సంఖ్యను పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ బాధ్యతను నిర్వర్తించలేమని, చట్టాన్ని అమలు చేసే సామర్థ్యం తమకు లేదని భావిస్తే.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలి లేదా సంభాల్ జిల్లా నుంచి బయటకు బదిలీ కోరుకోవాలి’అని తీవ్ర స్థాయిలో మందలించింది. ప్రైవేట్ స్థలమైతే అనుమతి అక్కర్లేదుసంభాల్ జిల్లాలోని సర్వే నంబర్– 291లో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ మునాజిర్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ వేశారు. రంజాన్ సమయంలో ఎక్కువ మంది భక్తులు ప్రార్థనలకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని ఆయన కోర్టు దష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆంక్షలు విధించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతి వర్గానికి తమ నిర్దేశిత ప్రార్థనా మందిరాల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రైవేట్ ఆస్తిలో ప్రార్థనలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అయితే, ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లేదా పబ్లిక్ స్థలాల్లోకి ఆ కార్యక్రమాలు విస్తరించినప్పుడు మాత్రమే అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టత ఇచ్చింది.ఆ స్థలం ఎవరిది?విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనను యూపీ ప్రభుత్వం ఖండించింది. రెవెన్యూ రికా ర్డుల ప్రకారం మసీదు ఉన్న భూమి సుఖీ సింగ్ కుమారులైన మోహన్ సింగ్, భూరాజ్ సింగ్ల పేరిట ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, అక్కడ మసీదు లేదా ప్రార్థనా స్థలం ఉన్నట్లుగా పిటిషనర్ ఎలాంటి ఫొటోలను సమర్పించలేదని కోర్టు గమనించింది. ఆధారాలు, ఫొటోలు, రెవెన్యూ రికార్డులు సమర్పించేందుకు పిటిషనర్ సమయం కోరగా.. తదుపరి వివరాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం కూడా గడువు అడిగింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
తృణమూల్ ప్రభుత్వానికి కౌంట్డౌన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని అన్నారు.రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్ ఆత్మను కాపాడేందుకు, కట్ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం కాక తప్పదన్నారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్ కాంగ్రెస్కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ కోల్కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం సిల్చార్: మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. -
మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ‘యావత్ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్ పిటిషన్పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్ మాల్ మాదిరిగానే మీ పిటిషన్ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పిటిషన్లో ఇంకా ఏముంది? రోడ్లు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి. -
అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు
న్యూఢిల్లీ: మహిళలకు రుతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవ్వరూ ఉద్యోగాల్లోకి తీసుకోరని, ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఋతుక్రమ సమయంలో విద్యారి్థనులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడింది. ‘ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది.రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న ‘చెడు’గా పరిగణిస్తారు’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్ న్యాయవాది ఎమ్.ఆర్.శంషాద్ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ‘అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. న్యాయవ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెబుతారు. వారి కెరీర్ ముగిసిపోతుంది.’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. -
ఈశాన్యంలో శాంతి వీచికలు
గువాహటి: ఒకప్పుడు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ అశాంతి అంతమై, అభివృద్ధి పరుగు ఆరంభమైందని స్పష్టంచేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వార్థ రాజకీయాల కోసమే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం అస్సాంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో రూ.19,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత కింద దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు.కోక్రాఝార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాజధాని గువాహటి నుంచి వర్చువల్గా ప్రసంగించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రధానమంత్రి కోక్రాఝార్కు చేరుకోలేకపోయారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో అస్సాంలో నూతన అధ్యాయం మొదలైందని, ఇక్కడ పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ భద్రతను పణంగా పెట్టిందని, స్థానికుల భూములను చొరబాటుదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నా అస్సాంలో తేయాకు తోటల కార్మికులకు జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దినట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భూములపై వారికి హక్కులు కల్పించామని, పట్టాలు అందజేశామని అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా మూడు కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళా కార్మికురాలికి మోదీ పాదాభివందనం చేశారు. కార్మికులకు న్యాయం చేసినందుకు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని అభినందించారు. అస్సాం కార్మికులు పండించిన తేయాకు గుజరాత్కు వస్తోందని, అక్కడ ఆ తేయాకుతో తేనీరు తయారు చేసి విక్రయించానని తెలిపారు. ఛాయ్వాలాగా పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. భూమి పట్టాలు ఇవ్వడం ద్వారా తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ది అబద్ధాల దుకాణం ప్రేమ దుకాణం(మొహబ్బత్ కీ దుకాణ్) తెరిచామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి తిప్పికొట్టారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం(ఝూటే వైదో కీ దుకాణ్) తెరిచిందని విమర్శించారు. అక్కడ ఒక అబద్ధానికి మరో నాలుగు సూపర్ అబద్ధాలు బహుమతిగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్కు ఏనాడూ లేదన్నారు. హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. -
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయొద్దన్నారు. బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్ పెరిగింది. -
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. -
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని సూచించింది. -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
సీఈసీని తొలగించాలంటూ నోటీసు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్సభ సభ్యులు కాగా, 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ నోటీసును లోక్సభకు లేదా రాజ్యసభ చైర్మన్కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు.ముందుగా ఎవరికి ఇచ్చేదీ స్పష్టం కావాల్సి ఉంది. సీఈసీ తొలగింపు కోరుతూ ఇవ్వనున్న నోటీసుపై సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు ముందుకు వచ్చారని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ, గురువారం కూడా ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీఈసీ తొలగింపును కోరాలంటే లోక్సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్య పారీ్టలతోపాటు, అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా, వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగే విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నాయి. కాగా, సీఈసీని తొలగించాలంటూ పార్లమెంట్లో నోటీసు జారీ చేయనుండటం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (50% కంటే ఎక్కువ) ఉండటంతో పాటు, ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో రెండింట మూడొంతుల మెజారిటీ తప్పనిసరి. -
ఇంధన కొరత లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో ఇంధన కొరత ఎంతమాత్రం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నట్లు తెలిపారు. ఇంధనం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంధన కొరత గురించి ప్రస్తావించారు. దీనిపై హర్దీప్సింగ్ పురి సమాధానం ఇచ్చారు. దేశంలోని 33 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా పేద కటుంబాలకు ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రకటించారు.దేశీయ సరఫరా వ్యవస్థను పరిరక్షిస్తామన్నారు. అన్ని రకాల ఇంధనం విషయంలో రిటైల్ ఔట్లెట్ల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సప్లై చైన్స్ యథాతథంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నా మని తెలిపారు. ఇంధన సరఫరాలో సంక్షోభం ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని హర్దీప్సింగ్ పురి స్పష్టంచేశారు.ఎల్పీజీ ఉత్పత్తిని 28% పెంచినట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి చూస్తే మన దేశంలో ఇంధనం ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి మనకు ముడి చమురు అందుతూ నే ఉందని గుర్తుచేశారు. 2006–07లో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమ తి చేసుకుంటున్నామని తెలియజేశారు. మోదీ దౌత్య నీతి వల్లే ముడి చమురు విషయంలో ఆటంకాలు లేకుండాపోయాయని మంత్రి ఉద్ఘాటించారు. -
రెండు నౌకలపై ఇరాన్ దాడి
న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక మీదా ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్ బోట్లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్సీ విష్ణు, జిఫిరోస్ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్ల ట్రాకింగ్ వెబ్సైట్ అయిన ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్సీ ట్రాన్స్పోర్ట్ ఐఎన్సీ సంస్థ ‘సేఫ్సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్ను గ్రీస్కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. -
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.కానీ భయాందోళనల కారణంగా బుకింగ్లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.భయంతో సిలిండర్ బుకింగ్లుఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. -
యుద్ధం వేళ.. ఇరాన్తో చర్చించిన భారత్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది. -
సుప్రీంకోర్టులో ముగిసిన తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు
న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది. అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది. -
అవినాశ్ బెయిల్ రద్దుకు సుప్రీం నో..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముసుగులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి తదితరులపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ, పలు పిటిషన్లతో పదే పదే కోర్టుల మెట్లు ఎక్కుతున్న డాక్టర్ సునీతకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్రెడ్డితో పాటు పలువురి బెయిల్ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసింది: సీబీఐ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, వివేకా కేసులో దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జ్షీట్ను సైతం కింది కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇకపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని విన్నవించారు. సీబీఐ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ రద్దు అవసరం లేదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో ‘సెక్షన్ 207’ ప్రక్రియ పూర్తికి నిర్దేశం దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందితులకు కేసు చార్జ్షీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేయడానికి సంబంధించిన ‘సీఆర్పీసీ సెక్షన్ 207’ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా కేసు ట్రయల్ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పునఃదర్యాప్తు పేరుతో వివేకా హత్య కేసు విచారణను అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ప్రత్యర్థుల కుట్రలో సునీత పావుగా మారారన్న విమర్శల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టు విచారణ ఇక్కడెందుకు.. సిద్ధార్థ లూథ్రాకు ప్రశ్న విచారణ సందర్భంగా సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను ఆయన పదే పదే ధర్మాసనం ముందు లేవనెత్తారు. ‘మా వద్ద కేసుకు సంబంధించిన కీలక మెటీరియల్ ఉంది.. దాన్ని పరిశీలించి బెయిల్ రద్దు చేయండి’ అంటూ లూథ్రా వాదించే ప్రయత్నం చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్ తీవ్రంగా స్పందించారు. ఏమిటిది.. మీరు సుప్రీంకోర్టులోనే కేసు ట్రయల్ (విచారణ) నిర్వహించాలనుకుంటున్నారా?’ అంటూ లూథ్రాను సూటిగా ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు పరిధిలో జరగాల్సిన విచారణను ఇక్కడికి ఎందుకు తెస్తున్నారంటూ లూథ్రా తీరును తప్పుబట్టారు. ఇలా పదే పదే పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. -
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్కు చాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సీవీ ఆనంద్ నియామకం కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆరు వారాల్లోగా రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు హాజరై, నలుగురు సీనియర్ ఐపీఎస్లతో కూడిన జాబితాను కమిటీకి అందజేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురు ఎవరు?... ఢిల్లీ షాజహాన్ రోడ్లోని యూపీఎస్సీ భవన్ వేదికగా దాదాపు గంటపాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్తోపాటు, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. ఈ భేటీలో ఆయా అధికారుల సర్వీస్ రికార్డులు, మెరిట్, ఇతర కీలక అంశాలపై సీఎస్తో కలిసి కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం పంపిన నలుగురి జాబితా నుంచి ఒకరిని పక్కనపెట్టి, ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ను ఎంపిక కమిటీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ పంపించే జాబితాలో నుంచి సీవీ ఆనంద్ వైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొగ్గు చూపించే అవకాశమున్నట్టు తెలిసింది. జితేందర్ ఉద్యోగ విరమణ చేసినప్పుడు కూడా సీవీ ఆనంద్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నించినా... అప్పట్లో శివధర్రెడ్డికి ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆయనకు అవకాశం కల్పించిన విషయం విదితమే. తీవ్ర పోటీ.. కొత్త డీజీపీ పోస్టు కోసం సీనియర్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జాబితాలో సీవీ ఆనంద్ పేరు ముందు వరుసలో ఉంది. డీజీపీ పదవిని దక్కించుకునేందుకు శిఖా గోయల్ సైతం గట్టిగానే ఆసక్తి చూపుతున్నట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీజీపీ జితేందర్ ఉద్యోగ విరమణ చేసిన సమయంలోనే ఆమె ఈ పోస్టు కోసం తనవంతు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే.. యూపీఎస్సీ ఎంపిక కమిటీ ఢిల్లీ నుంచి పంపే ‘ముగ్గురు’అధికారు ల తుది జాబితా రాష్ట్రానికి చేరిన తర్వా త ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుది నిర్ణ యం తీసుకుంటారు. దీంతో త్వరలోనే రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ ఎవరన్నదానిపై అధికారికంగా సస్పెన్స్ వీడనుంది. -
ఆ ముగ్గురిని పక్కన పెట్టండి
న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో అభ్యంతకర అధ్యా యాన్ని చేర్చడానికి కారకులైన ముగ్గురు నిపు ణుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వారితో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించరాదని కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ఈ పుస్తకంలో చేర్చడం సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎన్ఈసీఆర్టీ లీగల్ స్టడీస్కు సంబంధించి పాఠ్యప్రణాళికను ఖరారు చేయడానికి న్యాయ రంగానికి చెందిన నిపుణులతో ఒక కమిటీని వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ జడ్జి, ఒక ప్రముఖ విద్యావేత్త, పేరు ప్రఖ్యాతలున్న ఒక న్యాయవాది ఉంటే బాగుంటుందని సూచించింది. వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (భోపాల్)తో సంబంధం ఉన్నవారైతే ఇంకా మంచి విషయం అవుతుందని ఉద్ఘాటించింది. ఎనిమిదో తరగతి మాత్రమే కాకుండా, ఉన్నత తరగతుల పాఠ్యప్రణాళికను ఈ కమి టీ ఖరారు చేస్తుందని వెల్లడించింది. వివాదా స్పద అధ్యయాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినో నేతృత్వంలో టెక్ట్బుక్ డెవలప్మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ప్రొఫె సర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లకు భారత న్యాయవ్యవస్థ గురించి సహేతుక మైన జ్ఞానం లేదని, 8వ తరగతి విద్యార్థుల ముందు భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా, తెలిసి కూడా వాస్తవాలను తప్పుగా చూపించారని మేము సందేహించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’’ అని స్పష్టంచేసింది. తదుపరి తరం విద్యార్థులకు అవసరమైన పాఠ్యప్రణాళిక తయారీ, పాఠ్యపుస్తకాల ఖరారులో ఆ ముగ్గురిని ఎందుకు భాగస్వాములను చేయాలని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు.. ఆ ముగ్గురు నిపుణులను తక్షణమే పక్కనపెట్టాలని ఆదేశించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో లేదా పాక్షికంగా ప్రభుత్వ నిధలుతో సంబంధం ఉన్న బాధ్యతలు అప్పగించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులో సవరణ కోరుతూ ముగ్గురు నిపుణులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వివరణ ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది. దుష్ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలివ్వండి వివాదాస్పద చాప్టర్ను తిరగరాస్తున్నామంటూ ఎన్సీఈఆర్టీ డెరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్పైనా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. చాప్టర్–4ను మొత్తం తిరగరాయాలని, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించి, ఆమోదించేదాకా ఆ చాప్టర్ను ప్రచురించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నేషనల్ సిలబస్, టీచింగ్ టెర్నింగ్ మెటేరియల్ కమిటీ (ఎన్ఎస్టీసీ)ను పునర్వ్యవస్థీకరించాలని కేంద్రానికి పరోక్షంగా సూచించింది. వివాదాస్పద చాప్టర్పై ఫిబ్రవరి 26న తాము ఉత్తర్వు జారీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సోషల్ మీడియా వేదికలు, వ్యక్తుల వివరాలు తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పుడు పనులు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ.. సంబంధిత పాఠ్యప్రణాళిక తయారీలో కనీసం ఒక న్యాయ నిపుణుడికి కూడా అవకాశం కల్పించకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.విమర్శను నియంత్రించడం లేదు దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు సమీక్షకు అతీతం అని తాము చెప్పడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరోగ్యకరమైన, చట్టబద్ధమైన, నిర్మాణాత్మక విమర్శను తాము నియంత్రించడం లేదని స్పష్టంచేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగించడాకి బదులు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకే అప్పగిస్తే తాము ప్రశంసిస్తామని పేర్కొన్నారు. తటస్థ, స్వతంత్ర నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. వివాదానికి కారకులైన ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండదని ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేపే వైస్ చాన్సలర్గా నియమిస్తే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకే వెంటనే పక్కన పెట్టాలని తేల్చిచెప్పింది. -
హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించింది. హరీష్ రాణా తల్లిదండ్రుల అభ్యర్థనలతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 11, 2026) తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న రాణా పాసివ్ యూతనేషియా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసుగా నిలిచింది. ఇక ఈ కేసు తుది తీర్పు విచారణకు ముందు సుప్రీం కోర్టు హరీష్ రాణా ఆరోగ్య పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసింది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు. తాజాగా, అత్యున్నత న్యాయ స్థానం పాసివ్ యూతనేషియాకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. -
వివేకా కేసులో సునీతకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి చుక్కెదురైంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని తాజాగా సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించింది. దీంతో, సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. -
2028 వరకు జల్జీవన్ మిషన్
న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడం సహా కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జేజేఎం 2.0 కింద రూ.8.7 లక్షల కోట్లను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని 3.23 కోట్ల గృహాలకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.దేశంతో భూ సరిహద్దులు కలిగిన చైనా, ఇతర దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న నిబంధనలను సడలించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే ఆయా దేశాల వాటాదారులు, 10 శాతం వరకు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడనుందన్నారు. ఈ మేరకు 2020లో జారీ చేసిన నోటీసును సవరించనుందని చెప్పార. మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపైగల మధ్యప్రదేశ్లోని 80 కిలోమీటర్ల బద్నావర్–తిమర్వానీ సెక్షన్ను రూ.3,839 కోట్లతో నాలుగు లేన్లుగా 24 నెలల కాలంలో విస్తరించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు, బెంగాల్–జార్ఖండ్లను కలిపే రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇన్సాల్వెన్సీ లా, కంపెనీ చట్టానికి సవరణలు చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. -
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు. -
వంటగ్యాసే ఫస్టు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది. పారిశ్రామిక వినియోగదారులకు 80%ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు. మూసివేత దిశగా హోటళ్లువాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ప్రజలు ఇబ్బంది పడొద్దు⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి ⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి. -
గ్యాస్ కొరత.. మూత పడుతున్న హోటళ్లు..
ఢిల్లీ:ముంబైలో ఎల్పీజీ సిలిండర్ కొరత తీవ్రంగా పెరిగి హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడగా, త్వరలో మరో 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై (AHAR) హెచ్చరించింది.ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటకాలు తయారు చేయడం అసాధ్యమవుతోంది. ప్రతిరోజూ వేలాది మంది కస్టమర్లు హోటళ్లపై ఆధారపడుతుంటారు. సరఫరా సమస్యలు కొనసాగితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై అధ్యక్షుడు హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలను తక్షణం చర్యలు తీసుకోవాలని హోటల్ అసోసియేషన్ కోరింది.ఎల్పీజీ సరఫరా పెంచాలి. హోటళ్లకు ప్రత్యేక కోటా కేటాయించాలి. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ముంబైలో హోటల్ రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హోటల్ రంగం ముంబై ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే, ఉద్యోగాలు కోల్పోవడం, పర్యాటక రంగం దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. -
దేశంలో వేధిస్తున్న గ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.కేంద్ర పెట్రోలియం శాఖ ఆయిల్ కంపెనీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. వంటగ్యాస్ ఉత్పత్తి కోసం అవసరమైన హైడ్రోకార్బన్ను తరలించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. అదనంగా, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నియంత్రణకు పలు మార్గదర్శకాలు ప్రకటించింది.గృహ అవసరాల గ్యాస్ బుకింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు గ్యాస్ బుకింగ్ సమయాన్ని 25 రోజులకు పెంచింది. గృహ వినియోగదారులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఎల్పీజీ సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు మరియు ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కేంద్ర పెట్రోలియం శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయడమే కాకుండా, అక్రమ వినియోగాన్ని అరికట్టనుంది.ఎల్పీజీ ఉత్పత్తి పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అమలు చేసింది. ఆయిల్ కంపెనీలు ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. గృహ అవసరాలకు ఉపయోగించే పిఎన్జి, రవాణా కోసం ఉపయోగించే సిఎన్జి, అలాగే ఎల్పీజీ ఉత్పత్తి పెంపుకు ప్రాధాన్యత ఇవ్వాలని గెయిల్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి కొరత రాకుండా సమన్వయం చేయాలని స్పష్టంగా పేర్కొంది. -
Parliament Budget Session: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ
Parliament Budget Session Updates:లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్తీర్మానంలో మూడు అంశాలను ప్రస్తావించిన కాంగ్రెస్1. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అంగీకరించకపోవడం2. 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం3. విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం అవిశ్వాస తీర్మానం పై సంతకాలు సరైన రీతిలో లేకపోయినా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారని తెలిపిన ప్యానెల్ స్పీకర్ జగదంబిక పాల్కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలుకొనసాగుతున్న రెండో దఫా పార్లమెంట్ సమావేశాలుసభలో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను తొలగించాలని తీర్మానం ప్రవేశ పెట్టనున్న ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ సెషన్ మొదటి దశలో స్పీకర్కు వ్యతిరేకంగా తీర్మానం దాఖలు చేసిన ప్రతిపక్షంతీర్మానంపై సంతకం చేసిన 118 మంది సభ్యులు పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ జరిగే సమయంలో మాట్లాడటానికి అనుమతించలేదని ఆరోపణలు గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ, దీపేందర్ సింగ్ హుడా, జోతిమణి వంటి ప్రతిపక్ష ఎంపీలు దిగువ సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా వాదనలుప్రభుత్వం తరుఫున చర్చను ప్రారంభించనున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుచర్చ సమయంలో మాట్లాడనున్న సీనియర్ బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే, రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా సభలో ప్రసంగిస్తారు. -
రైతన్నపై రుణపాశం!
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. 55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయంగతేడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.అన్నదాతల నోట్లో మట్టి..చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిచంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. -
ఏఐ, ఆటోమేషన్పై పట్టు పెంచుకోవాలి
న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్–బడ్జెట్ వెబినార్లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్లో పాల్గొన్నారు. -
మనోళ్ల భద్రతే ముఖ్యం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా తక్షణం ఉద్రిక్తతలకు తెర దించాలని సూచించింది. దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించాలని అభిప్రాయపడింది. పశ్చిమాసియా ప్రాంతంలోని దాదాపు కోటి మంది భారతీయుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వర్తక, భద్రత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు.పశ్చిమాసియాలో పరిస్థితిని కేంద్రం నిరంతరం సమీక్షిస్తోందని చెప్పారు. ఇప్పటిదాకా 67 వేల మంది విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చినట్టు వివరించారు. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత నిమిత్తం అక్కడి దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ‘‘మన ఇంధన భద్రతపై ఆందోళన అనవసరం. ఈ విషయంలో మన వినియోగదారుల ప్రయోజనాలే పరమావధి. వాటిని కాపాడే దిశగా కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’అని తెలిపారు. ‘‘మన ఇంధన భద్రతకు, వర్తకానికి గల్ఫ్ ప్రాంతం కీలకం. ఆ ప్రాంతంతో ఏటా 200 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతోంది’’అని గుర్తు చేశారు. నౌకలకు ఆశ్రయం కోరిన ఇరాన్ ఇరాన్కు చెందిన నౌక భారత్లో ఆశ్రయం పొందేందుకు మానవతా కోణంలో అనుమతించినట్టు జైశంకర్ వెల్లడించారు. ‘‘మూడు నౌకలకు ఇరాన్ ఆశ్రయం కోరింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న విజ్ఞప్తి చేసింది. కేంద్రం మార్చి 1న అనుమతులు జారీ చేసింది. ఐఆర్ఐఎస్ లావన్ నౌక మాత్రమే మార్చి 4న కోచిలో లంగరు వేసింది’’అని చెప్పారు. మిగతా రెండు నౌకల్లో ఐఆర్ఐఎస్ దేనాను మార్చి 4న శ్రీలంక తీరంలో అమెరికా ముంచేయడం తెలిసిందే. అనంతరం మూడో నౌక ఐఆర్ఐఎస్ బుషెర్ శ్రీలంకలోని ట్రింకోమలీ రేవులో లంగరు వేసింది. చర్చకు ఖర్గే డిమాండ్జైశంకర్ ప్రకటనపై ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు పెద్దపెట్టున నిరసనలకు దిగారు. ప్రకటనకు ముందే పశ్చిమాసియా సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశ ఇంధన భద్రతపై స్వల్ప అవధి చర్చకు డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంపు సామాన్యునిపై భారం మోపిందని ఆయన విమర్శించారు.‘‘పశ్చిమాసియా కల్లోలం తాలూకు ప్రభావం భారత ఇంధన భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వంపైనా పడుతోంది. దేశ ఇమేజీని, ప్రతిష్టను కూడా ఆ యుద్ధం ప్రభావితం చేస్తోంది. కనుక ఈ అంశంపై 176వ నిబంధన కింద చర్చ చేపట్టాలి’’అని కోరుతూ నోటీసిచ్చారు. దాన్ని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. అనంతరం జైశంకర్ ప్రకటన చేసేందుకు అనుమతించారు. అందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. మంత్రి ప్రకటన చేస్తుండగానే వాకౌట్ చేయడాన్ని సభా నాయకుడు జె.పి.నడ్డా తీవ్రంగా తప్పుబట్టారు. సభలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు కాంగ్రెస్, విపక్షాలు ప్రయతి్నస్తున్నాయంటూ మండిపడ్డారు. -
చర్చకు రాని అవిశ్వాసం
న్యూఢిల్లీ: పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం కూడా లోక్సభలో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. విపక్ష సభ్యులు పదేపదే కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేయబోతుండగా అడ్డుకున్నారు. ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన పలు ఇతర అంశాలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు. వాటన్నింటికీ ప్రభుత్వం అప్పుడే వివరంగా బదులిచ్చిందని సభాపతి స్థానంలో ఉన్న జగదంబికా పాల్ గుర్తు చేశారు. పశ్చిమాసియాపై చర్చకు వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.‘‘స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం ఇప్పటికే ఈ రోజు ఎజెండాలో ఉంది. ఒకే రోజు రెండు అంశాలపై చర్చ ఎలా సాధ్యం? పశ్చిమాసియాపై చర్చ కావాలంటే సభా వ్యవహారాల కమిటీని సంప్రదించండి’’అని సూచించారు. వారు పట్టువీడకపోవడంతో ఆగ్రహించారు. ‘‘విపక్ష సభ్యులు పరిణతి లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ఎజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారు’’అంటూ మందలించారు. వారు సభా మర్యాద పాటించడం లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆక్షేపించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సమావేశమయ్యాక కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడదామని విపక్ష సభ్యులకు పాల్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో ఆ అంశాన్ని చర్చకు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియాపై చర్చ ఉండబోదు: కేంద్రం పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్లకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదని సమాచారం. దీనిపై విదేశాంగ మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే ప్రకటన చేసినందున ఇక చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మోదీ బండారం బయటపడుతుందనే! ⇒ పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ: రాహుల్ ⇒ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియా కల్లోలంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ సంక్షోభానికి సంబంధించిన కీలకాంశాలపై మోదీ సర్కారు మౌనం పాటిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్గాం«దీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ , తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియా విషయంలో అమెరికా బ్లాక్మెయిలింగ్కు మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ‘‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపడితే అవన్నీ బయటపడతాయని కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు వెనకాడుతోంది’’అని ఆరోపించారు.‘అవిశ్వాసం’పై నేడు చర్చ? న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తదితరులు చర్చలో పాల్గొంటారు. అనంతరం చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని వీలైనంత త్వరగా చర్చకు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించాయి.స్పీకర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ 118 మంది విపక్ష ఎంపీలు తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడం తెలిసిందే. నాటినుంచీ లోక్సభ సమావేశాలకు బిర్లా సారథ్యం వహించడం లేదు. అవిశ్వాస తీర్మానంపై సభ నిర్ణయం వెలువడేదాకా స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆయన సాధారణ ఎంపీగా చర్చలో పాల్గొనే అవకాశముందని లోక్సభ వర్గాలు తెలిపాయి. గతంలో మూడుసార్లు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా ఒక్కటి కూడా నెగ్గలేదు. -
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి. -
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరోసారి దాడులు చేసింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. -
లిక్కర్ స్కాం కేసు.. వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానాలు కోరింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ కోర్టు) ఇచ్చిన తీర్పును హైకోర్టులో సీబీఐ సవాల్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ట్రయల్ కోర్టు తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు, వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(మార్చి 16) తదుపరి విచారణ చేపట్టనుంది. Delhi Excise Policy Case: Delhi High Court begins hearing the CBI’s appeal challenging the trial court order that discharged former Delhi Chief Minister Arvind Kejriwal, former Deputy Chief Minister Manish Sisodia and 21 others.The matter is being heard by Justice Swarna Kanta…— ANI (@ANI) March 9, 2026 -
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్సభ వాయిదా.స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026 -
గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది తరలింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులుగా వెళ్లిన వీరంతా ఆయా దేశాల్లో చిక్కుకున్నారని తెలిపింది. మరింత మందిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామంది. పశి్చమాసియా దేశాల్లో ఉంటున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియా దేశాల్లో పాక్షికంగా గగనతలాలను తెరవడంతో దేశీయ, విదేశీ విమానయాన సంస్థలు నడిపే కమర్షియల్, నాన్ షెడ్యూల్డ్ విమానాల ద్వారా మన వాళ్లను తరలిస్తున్నామంది. మార్చి 1–7వ తేదీల మధ్య 52 వేల మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు కేంద్రం వివరించింది. వీరిలో 32,107 మంది దేశీయ విమానయాన సంస్థలు తీసుకు వచ్చాయని పేర్కొంది. కమర్షియల్ విమానాల అందుబాటుకు సంబంధించిన సూచనలు, సలహాలను దగ్గర్లోని భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లల నుంచి తెలుసుకోవచ్చంది. 24 గంటలూ పనిచేసే హెల్ప్లైన్ల ద్వారా కూడా సంప్రదించవచ్చని కేంద్రం వివరించింది. -
తృణమూల్ను ప్రజలు క్షమించరు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును ఘోరంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఒక దళితురాలిని అవమానించిన ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించబోరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో పర్యటించారు. ‘వికసిత్ ఢిల్లీ’ నిర్మాణంలో భాగంగా రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు రూ.33,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. బెంగాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న సంతాల్ గిరిజన సదస్సును తృణమూల్ బహిష్కరించిందని ఆరోపించారు.ఇది రాజ్యాంగానికి, దేశ ఆడబిడ్డలకు జరిగిన ఘోర అవమానమన్నారు. తృణమూల్ ను దేశ ప్రజలు, గిరిజన సమాజం, మహిళలు ఏనాటికీ క్షమించరన్నారు. అహంకారపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి ఒక నగరానికి పరిమితం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉందని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్వర్క్ను రికార్డు స్థాయిలో 375 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నారీ శక్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాజకీయాలు, సైన్స్, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు నూతన శక్తితో ముందుకు సాగుతున్నారని మోదీ కొనియాడారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం
న్యూఢిల్లీ/కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్ గిరిజన సదస్సు వేదికను, ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రొటోకాల్కు సంబంధించిన ‘బ్లూ బుక్’ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘‘సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలక్కపోవడం బ్లూ బుక్ రూల్స్కు విరుద్ధం.రాష్ట్రపతికి కేటాయించిన వాష్ రూమ్లో నీటి సౌకర్యం కూడా లేదు. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేశారు. వీటిపై వివరణ ఇవ్వండి. ప్రొటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్ జిల్లా మేజి్రస్టేట్, సిలిగురి పోలీసు కమిషనర్, అదనపు జిల్లా మేజి్రస్టేట్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని ఆదేశించారు.బెంగాల్ పర్యటనకు వెళ్లిన ముర్ముకు శనివారం సీఎం మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. షెడ్యూల్ ప్రకారం బదాన్నగర్లో జరగాల్సిన దళిత సదస్సును చివరి నిమిషంలో బాగ్డోగ్రా ఎయిర్పోర్టు సమీపంలోకి మార్చేశారు. సరైన సమాచారం లేక జనం ఆశించినంతగా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.ప్రొటోకాల్ను ఉల్లంఘించలేదు: మమతరాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమత తేల్చిచెప్పారు. రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలన్నారు. ‘‘రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవముంది. రాష్ట్రపతిని మా తల్లిగా భావిస్తాం. ముర్మును మేం అవమానించలేదు. ఆమెకు సిలిగురి మేయర్ స్వాగతం పలికారు’’ అని చెప్పారు. ‘‘రాష్ట్రపతిని అవమానించే అలవాటు బీజేపీదే. గతంలో ఒక సభలో రాష్ట్రపతి నుంచుని ఉంటే ప్రధాని మోదీ మాత్రం కురీ్చలో కూర్చున్నారు’’ అని మమత విమర్శించారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అడ్వానీతో పాటు మోదీ కూర్చుని ఉండగా వారి పక్కన ముర్ము నుంచున్న ఫొటోను ప్రదర్శించారు. -
టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.Champions! Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup! This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament. This victory has filled every Indian heart with…— Narendra Modi (@narendramodi) March 8, 2026ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను ప్రధాని ప్రారంభించారు. 12.3 కిలో మీటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్పూర్-బాబర్పూర్ (పింక్లైన్), 9.9 కిలోమీటర్ల దూరం విస్తరించిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ (మజెంటా లైన్) కారిడార్లను మోదీ ప్రారంభించారు.మజ్లిస్ పార్క్ - మౌజ్పూర్ - బాబర్పూర్ కారిడార్.. ఈ కారిడార్లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మజ్లిస్ పార్క్ - శివ్ విహార్ పింక్ లైన్లో భాగంగా ఉంటుంది. ఈ కొత్త మార్గంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.56 కిలోమీటర్లు. దీంతో ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి 'రింగ్ మెట్రో'గా అవతరించింది. మజ్లిస్ పార్క్, బురారీ, జరోడా మజ్రా, జగత్పూర్-వజీరాబాద్, సూర్ఘాట్, నానక్సర్-సోనియా విహార్, ఖజూరీ ఖాస్, భజన్పురా, యమునా విహార్, మౌజ్పూర్-బాబర్పూర్ స్టేషన్లు ఉన్నాయి.ఈ మార్గంలో యమునా నదిపై కొత్త వంతెన, మెట్రో లైన్, రోడ్డు ఫ్లైఓవర్ రెండూ ఉండేలా నిర్మించిన 'డబుల్ డెక్కర్ వయాడక్ట్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ కారిడార్.. ఇది బొటానికల్ గార్డెన్ - కృష్ణా పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్కు ఎలివేటెడ్ పొడిగింపు. ఇందులో ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ కారిడార్ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు.. దీపాలి చౌక్, మధుబన్ చౌక్, ఉత్తర పితాంపుర-ప్రశాంత్ విహార్, హైడర్పూర్ విలేజ్, హైడర్పూర్ బాద్లీ మోర్, భల్స్వా, మజ్లిస్ పార్క్ స్టేషన్లు ఉన్నాయి. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.


