Delhi
-
‘ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది’
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘ఏపీలో అభివృద్ధి పనులు చేయకుండా... అప్పులు చేస్తున్నారు. ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. కేవలం 22 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 3 లక్షల 18 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా భవిష్యత్తు తరాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ అప్పులపై కేంద్ర పర్యవేక్షణ ఉండాలి.చేస్తున్న అప్పులతో ఫలితాలు వస్తున్నాయా? అని పరిశీలన జరగాలి. అప్పులతో తెచ్చిన నిధులతో ఆస్తులు నిర్మించి, జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. విద్యారంగానికి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. ఏపీలో 60 శాతం ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం అవుతుంది.దీనివల్ల బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. మత్స్య సంపద ఎగుమతులు 60% ఏపీ నుంచే జరుగుతున్నాయి. 1,60,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. వేలాదిమంది దీనిపై ఆధారపడ్డారు. కోస్తా తీరంలో మత్స్యకారులు ఉపాధికి చర్యలు తీసుకోవాలి. గోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్బర్ ఆధునికీకరణ జరగాలి.కోస్తా ప్రాంతంలో మెరైన్ ప్రాసెస్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. సెస్, సర్ చార్జీల వల్ల రాష్ట్రాలు తగిన వాటా పొందలేకపోతున్నాయి. దీనిపై పునః పరిశీలన జరగాలి. వైద్యరంగంపై తగిన దృష్టి సారించాలి. ఆరోగ్య పథకాలకు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దేశిత గడువుతో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. మేజర్ రైల్వే ప్రాజెక్టులను జవాబుదారీతనంతో పూర్తి చేయాలి’ అని అన్నారు. -
LPG సిలిండర్పై వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్?!
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 10 కిలోల గ్యాస్ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. -
ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన?
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్లో ఇరాన్పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.ఈ రోజు పార్లమెంట్లో సీసీఎస్ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. -
ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. కేంద్ర మంత్రుల అభినందనలు ప్రభుత్వాధినేతగా 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కేంద్ర మంత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని గత 24 ఏళ్లకుపైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘మోదీ యుగం’ దేశ రూపురేఖలనే మార్చివేసింది. ఈ 8,931 రోజుల ప్రస్థానం దేశం పట్ల ఆయన నిబద్ధత, ప్రతి పౌరుడి పట్ల ఆయన చూపే అసమాన సేవానిరతికి ప్రతీక’’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంత్రులు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు కూడా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంపట్ల, ప్రజల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం కలిగిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ‘‘మోదీ జీవితమంతా నిరంతర సేవా ప్రయాణం. ప్రధానిగా ఆయన సేవా దృక్పథం దేశాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మోదీ నాయకత్వంలో పేదలు, యువత, రైతులు, అన్నదాతల సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతోంది’’ అన్నారు.ఎన్నెన్ని రికార్డులో! → మోదీ తొలిసారి 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే దాకా సీఎంగా కొనసాగారు. గుజరాత్కు ఎక్కువ కాలం సీఎంగా చేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. 2001, 2002, 2007, 2012ల్లో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి, ప్రధానమంత్రిగా ఎన్ని కైన అరుదైన నాయకుడు కూడా మోదీయే. → స్వతంత్ర భారతదేశంలో జని్మంచిన తొలి ప్రధానిగా మోదీ మరో రికార్డు నెలకొల్పారు. మోదీకి ముందు ప్రధానులుగా చేసిన వారంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారే. → ప్రధానిగా రెండు పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నేత మోదీ. ప్రస్తుతం వరుసగా మూడో టర్మ్లో పదవిలో కొనసాగుతున్నారు. → వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా మోదీ మరో ఘనత సాధించారు. ఆయన సారథ్యంలో 2014, 2019, 2024ల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. → వరుసగా ఎక్కువకాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోదీ గతేడాది బద్ధలు కొట్టారు. ఇందిర 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 దాకా 4,077 రోజులపాటు వరుసగా పదవిలో ఉన్నారు. మోదీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. → అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజులపాటు పదవిలో ఉన్నారు. మోదీ నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైతే ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది. → నెహ్రూ మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారు. ఈ రికార్డును మోదీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డునూ అధిగమిస్తారు. → ఆరు వరుస ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీపక్ష నేతగా, ప్రధానిగా ఎన్నికయ్యారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ జరిపారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది.పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మధ్య పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ (LPG) కేటాయింపులను కేంద్రం పెంచింది. గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ (PNG) కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు కొనసాగుతున్నాయి.దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని.. ఎలాంటి రద్దీ లేదని అధికారులు తెలిపారు. సరఫరాలను మెరుగుపరిచే క్రమంలో, అమెరికాలోని టెక్సాస్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వస్తున్న ఒక కార్గో నౌక మంగళూరులోని 'న్యూ మంగళూరు పోర్టు'కు చేరుకుంది. మార్చి 14 నుంచి మార్చి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో సంబంధిత ఛార్జీలను మాఫీ చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.కాగా, భారత జెండాతో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ త్వరలో ఉద్రిక్తమయ హార్మూజ్ గుండా పయనించి స్వదేశానికి చేరుకోనున్నాయి. గత 24 గంటలుగా హార్మూజ్ గుండా ఎలాంటి నౌకల సంచారం లేకపోయినా అదే జలసంధి గుండా ఈ రెండు ఎల్పీజీ నౌకలు సాహసోపేత ప్రయాణం సాగించనున్నాయని రాయిటర్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణాన్ని నిలిపేసి హార్మూజ్కు దూరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా సమీప నౌకాశ్రయంలో ఈ రెండు నౌకలు లంగరువేశాయని, త్వరలోనే ప్రయాణం ఆరంభిస్తాయని నౌకలను ట్రాక్ చేసే సంస్థ ‘మెరైన్ట్రాఫిక్’ వెల్లడించింది. -
ఆసుపత్రిలో చిగురించిన ప్రేమ.. చివరికి ఏం జరిగిందంటే..!
గురుగ్రామ్: గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం చివరికి విషాదంగా మిగిలింది. నర్సు హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో భర్తే.. భార్యకు అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది, రేడియాలజిస్ట్ అరుణ్ శర్మ, నర్సుగా పని చేస్తున్న కాజల్ ఓ నర్సింగ్ హోమ్లో సహోద్యోగులుగా పరిచయమయ్యారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడాది నవంబర్లో వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, నాలుగు నెలలు తిరక్కుండానే వరకట్నం కోసం అరుణ్ ఆమెను హత్య చేయడంతో వారి బంధం విషాదాంతమైంది.వివాహం జరిగిన కొద్ది రోజులకే చిన్న చిన్న విషయాలకే అరుణ్ తన భార్యపై చేయి చేసుకునేవాడు. డబ్బు తేవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని.. వరకట్నం కోసం వేధిండని కాజల్ సోదరుడు పేర్కొన్నాడు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 4న ఈ దంపతులు గురుగ్రామ్లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చారు. దాదాపు రెండు వారాల తర్వాత మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్.. కాజల్పై దాడి చేశాడు.మరుసటి రోజు ఉదయం, మాట్లాడాలని చెప్పి అరుణ్.. కాజల్ను కిందకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఈ కొత్త దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కాజల్ స్పృహతప్పి పడిపోయింది, ఆమె ముక్కు నుంచి రక్తం కారడం గమనించారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే సరికి పరిస్థితి చేయిజారిపోయింది; ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.టాయిలెట్లో తమకు ఒక సిరంజి దొరికిందని.. అరుణ్ ఆమెకు విషం ఇచ్చి ఉంటాడని కాజల్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాజల్కు అరుణ్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పరిధిలోని బెహ్తా హాజీపూర్కు చెందిన అరుణ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో మాదకద్రవ్యాలు వాడే అలవాటు ఉన్నట్లు సమాచారం. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వైదొలిగారు. పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ఆరంభంలోనే ‘ఈ కేసులో నేను విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనా(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)లున్నాయి’అని వ్యాఖ్యానించారు. విచారణ నుంచి తప్పుకోవడం సబబని భావిస్తున్నట్లు తెలిపారు. తదుపరి సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలని సూచించారు. సీజేఐ అభిప్రాయంతో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఏకీభవించారు. దీంతో, ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీన మరో ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని సీజేఐ తెలిపారు. సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని జడ్జీలతో నూతన ధర్మాసనం ఏర్పాటవుతుందని ప్రకటించారు. తీర్పు వెలువడే వరకు ప్రస్తుత చట్టం యథాతథంగా అమల్లో ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నెలల్లోనే 2023 డిసెంబర్లో పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు కమిషనర్ల నియామకానికి ఏర్పాటయ్యే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతోపాటు హోం శాఖ సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు. సీజేఐను మినహాయిస్తూ తీసుకు వచ్చిన కొత్త చట్టంతో ఈసీ నియామక ప్రక్రియ నిష్పాక్షికతను కోల్పోయిందంటూ సుప్రీంలో కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరులు పిటిషన్లు వేశారు. అయితే, ఈసీ ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రతినిధి ఉండటం వల్ల నియామక ప్రక్రియలో నిష్పాక్షికత వచ్చినట్లు కాదని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం నిబంధనల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అవినాశ్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు.. » ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు. » ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. » ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. » దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణించి ఊరట కల్పించాలి.ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది. -
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: కార్మిక వర్గానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. పరిశ్రమ(ఇండస్ట్రీ) అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947లోని ఇండస్ట్రీ అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలని కోరుతూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై 1978 ఫిబ్రవరి 21న అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్సులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ‘ఇండస్ట్రీ’గా పరిణించాలని వెల్లడించింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్టం–1947 పరిధిలోకి వచ్చారు. తద్వారా వారికి లబ్ధి చేకూరుతోంది. 1978 నాటి తీర్పు సరైనదేనా? అని ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మూడు రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. అటవీ శాఖ ఇతర శాఖలను కూడా ఇండస్ట్రీగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తమ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్! -
పారిశ్రామికాభివృద్ధికి రూ. 33 వేల కోట్లతో ‘భవ్య’ పథకం
న్యూఢిల్లీ: తయారీరంగంలో మరింత వృద్ధి సాధనే లక్ష్యంగా తీసుకొస్తున్న భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకం కోసం రూ.33,660 కోట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 100 ప్లగ్–అండ్–ప్లే పారిశ్రామిక పార్క్ల కల్పన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. కేబినెట్ నిర్ణయాలను తర్వాత సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భవ్య పథకాన్ని ఆరంభిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని నిర్ణయాలు.. → పత్తి సేకరణ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 2023–24 కాటన్ సీజన్లో కనీస మద్దతు ధర కోసం ఖర్చుచేసిన మొత్తాలను రీయింబర్స్చేసేందుకు ఉద్దేశించిన రూ.1,718.56 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఓకే చెప్పింది. → ఉత్తరప్రదేశ్లో 927 జాతీయరహదారి వెంట బారాబంకీ నుంచి బహ్రెయిచ్ల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నాలుగు వరసల రహదారి నిర్మాణానికి అవసరమైన రూ.6,969.04 కోట్ల నిధుల మంజూరు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఆర్థిక, సామాజిక, వస్తూత్పత్తుల హబ్ల మధ్య అనుసంధానం పెంచేందుకు 101.51 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నిర్మించనున్నారు. → మరో 1,500 మెగా వాట్ల శుద్ద ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో తలపెట్టే చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.2,584.60 కోట్ల ఆర్థికసాయం చేసే ప్రతిపాదనలకు కేంద్రకేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
పార్లమెంట్ అంటే ఓపెన్ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ సభ్యత్వం ముగిసినప్పటికీ సభ్యులు ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉండాలని అన్నారు. రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ఉద్ఘాటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాజ్యసభ సభ్వత్వం ముగుస్తున్న 59 మంది సభ్యులు ఇన్నాళ్లూ అందించిన సేవలను ప్రధానమంత్రి కొనియాడారు. ఆయా సభ్యులకు బుధవారం రాజ్యసభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించిన ప్రధాని మోదీ మాట్లాడారు. ఇలాంటి వీడ్కోలు సందర్భాలు సహజంగానే రాజకీయ విభేదాలను తొలగిస్తాయని అన్నారు. సహజంగా, అప్రయత్నంగా రాజకీయ విభేదాలకు అతీతంగా వ్యవహరిస్తామని, మనందరిలో ఒక ఉమ్మడి భావన ఉద్భవిస్తుందని వ్యాఖ్యానించారు. సభకు ఇక తిరిగి వచ్చే ఆలోచన లేని సభ్యులకు భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పూర్తి విరామం అనేది ఎప్పుడూ ఉండదన్నారు. భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తోందని సూచించారు. మీ అనుభవం, సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్పష్టంచేశారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ దిగ్గజాలైన ఆ ముగ్గురు నేతలు జీవితంలో సగానికి కంటే ఎక్కువ భాగం పార్లమెంట్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు. అంకితభాతంలో పార్లమెంట్కు హాజరయ్యారని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగడం సాధారణ విషయం కాదన్నారు. మాతో ప్రేమ, మోదీతో పెళ్లి: ఖర్గే రాజ్యసభ కార్యకలాపాల నిబంధనలను సమీక్షించాలని సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. సభను మరిన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రతిపక్ష సభ్యుల భాగస్వామ్యం మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. లేకపోతే పార్లమెంట్ ప్రతిష్ట బలహీనపడుతుందని చెప్పారు. 59 మంది సభ్యుల వీడ్కోలుపై ఖర్గే మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాజీవితం నుంచి రిటైర్మెంట్ ఉండదని వ్యాఖ్యానించారు. దేశానికి సేవ చేయాలన్న తపన కలిగిన నాయకులు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎన్నడూ అలసిపోరని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యత్వం ముగు స్తున్న సభ్యులు ప్రజలకు ఎప్పటిలాగే సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని, ఆయనతో కలిసి పనిచేశానని అన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ దేవెగౌడ తమతో డేటింగ్ చేసి, ప్రేమాయణం సాగించి, చివరికి మోదీని పెళ్లి చేసుకున్నారు అంటూ చమత్కరించారు. దీంతో సభలో మోదీతో సహా సభ్యులంతా నవ్వులు చిందించారు. -
అనర్హత వేటు అధికారం హైకోర్టులకు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలు కళ్ల ముందే ఉల్లంఘనకు గురవుతున్నాయని, పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటువేసే అధికారాన్ని స్పీకర్ల నుంచి తప్పించి హైకోర్టులకు అప్పగించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సమావేశంలో బుధవారం ఆయన తెలుగులో మాట్లాడారు. స్పీకర్ల స్థానంలో హైకోర్టులే తేల్చాలి.. ప్రజాప్రాతినిధ్య చట్టం ఒక పవిత్ర లక్ష్యంతో ఏర్పడిందని.. అయితే, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న వారిపై స్పీకర్లు సకాలంలో చర్యలు తీసుకోలేకపోతున్నారని బోస్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నేతను న్యాయాధికారిగా కూర్చోబెడితే న్యాయం జరగదని చెప్పారు. పార్టీ మారిన వారిని ఆ పదవీకాలం ముగిసేవరకు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత విధించాలని ప్రధానిని కోరారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టులకు బదిలీచేసి, మూడు నుంచి ఆరు నెలల్లోగా నిర్ణయం వెలువడేలా కచ్చితమైన గడువు విధించాలని ఆయన సూచించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) అమలులోనూ రాష్ట్రాల్లో లోపాలున్నాయని, ప్రభుత్వ జీఓలను దాచిపెడుతున్నారని ఆయన ప్రస్తావించారు. చట్టాలను కాపాడుకోలేనప్పుడు రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవులు దేనికని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. ఇక్కడ చేసిన చట్టాలను మన కళ్లముందే తూట్లు పొడుస్తూ నాశనం చేస్తుంటే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. చివరగా.. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ వంటి దిగ్గజాల సరసన కూర్చునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని బోస్ సంతోషం వ్యక్తంచేశారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులంతా తిరిగి సభకు ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు.మహానేతకు, మాజీ సీఎం జగన్కు కృతజ్ఞతలు.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత రాయవరం మునసబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని బోస్ స్మరించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఓబీసీ (శెట్టిబలిజ) సామాజికవర్గం నుంచి పార్లమెంటు మెట్లు ఎక్కిన తొలి వ్యక్తిని తానేనని ఇందుకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నిబంధనల ప్రకారమే బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్తో పాటు ఇతర నిందితులకు స్టేషన్ బెయిల్ లభించడం నిబంధనల ప్రకారం జరిగిందే తప్ప అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొందరు స్టేషన్ బెయిల్ పొందారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు తాము బాధితులమని చెబుతున్నారు. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి స్టేషన్ బెయిల్ పొందే అవకాశం చట్టరీత్యా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం గానీ, మరెవరు గానీ చేసేదేమీ లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేసును పక్కదారి పట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రతేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. ముందస్తు ముచ్చటే లేదు... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే అంటే 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జాతీయ జనగణన పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది..’రేవంత్ వివరించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అది మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంకతో భేటీలు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాం«దీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్రెడ్డిని వారికి పరిచయం చేశారు. కాగా వేం నరేందర్రెడ్డిని రాహుల్, ప్రియాంక అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాహుల్, ప్రియాంకలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణ్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ మాజీ మంత్రి రోజాకు పలకరింపు పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి రోజాను ముఖ్యమంత్రి పలకరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రోజా పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఎదురుకావడంతో ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. -
‘చంద్రబాబు సర్కార్ పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది’
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.‘‘ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యేలను కొనేసి గెల్చారు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో అధికార పక్షాలు గెలుపే లక్ష్యంగా తమ చట్టసభల సభ్యులను కొనేశాయని, క్రాస్–ఓటింగ్కు పాల్పడ్డాయని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. బేరసారాలు జరిగాయన్న ప్రాథమిక సమాచారంతో ఒడిశాలో ముగ్గురు సభ్యులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటువేసింది. హరియాణాలోనూ కఠిన చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. రాజ్యసభలో 37 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గతంలోనే 26 చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. దాంతో మిగిలిన 11 స్థానాలకే బిహార్, ఒడిశా, హరియాణాల్లో ఎన్నికలు జరపగా తొమ్మిది చోట్ల ఎన్డీఏ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేడీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. మొత్తంగా చూస్తే 37 స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 22 చోట్ల విజయం సాధించింది.రహస్య ఓటింగ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోమవారం హరియాణాలో రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు సోమవారం ఆగిపోగా మంగళవారం ఆరంభించారు. బీజేపీ తరఫున సంజయ్ భాటియా, కాంగ్రెస్ తరఫున కరమ్వీర్ సింగ్ బౌధ్ విజయం సాధించారు. వాస్తవ మెజారిటీ ప్రకారం బౌధ్ గెలుపు నల్లేరుపై నడకే. కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా అత్యంత స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. మా ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీస్లు పంపబోతున్నామని హరియాణా కాంగ్రెస్ ఇన్చార్జ్ బీకే హరిప్రసాద్ తెలిపారు.‘‘ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్ను ఎలాగైనా గెలిపించాలని ఎన్డీఏ కూటమి కుట్ర పన్నింది. అయినాసరే మా అభ్యర్థి బౌధ్ గెలిచారు. అగి్నపరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది. ప్రజాస్వామ్యమే గెలిచింది. ఓటు చోరీ ఓడిపోయింది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ఓటింగ్కు పాల్పడ్డారు. వారిలో నలుగురి ఓట్లు చెల్లలేదు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు. వాళ్లెవరో ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది’’అని హరియాణా శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్ సింగ్ హూడా అన్నారు. షోకాజ్ నోటీస్లు జారీచేస్తాం.. మరోవైపు ఒడిశాలో స్వతంత్ర అభ్యరి్థ, బీజేపీ మద్దతున్న దిలీప్ రాయ్ను గెలిపించేందుకు ప్రయత్నించిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఒడిశా చీఫ్ భక్త చరణ్ దాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సనఖేముండి ఎమ్మెల్యే రమేశ్ చంద్ర జెనా, మోహన నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరథి గోమంగో, బారాబటి–కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్లను అనర్హులుగా ప్రకటించాలంటూ ఒడిశా అసెంబ్లీ మహిళా స్పీకర్ సురమా పథేకు కాంగ్రెస్ పక్షనేత రామచంద్ర కదమ్ మంగళవారం లేఖ రాశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది.‘‘తమ సభ్యులకు స్పష్టంగా విప్జారీచేయడం కూడా కాంగ్రెస్కు తెలీదు. ప్రామాణిక పద్ధతిలో మూడు లైన్లలో విప్ను జారీచేయాలి. కానీ రాహుల్గాంధీ కాంబోడియాలో, తేజస్వీ యాదవ్ యూరప్లో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర నేతలేమో అంతకన్నా బిజీగాఉన్నారు. ఇక ఎమ్మెల్యేలకు కఠిన విప్ జారీచేసేదెవరు?. అంతా అయిపోయాక వాళ్లకెందుక ఓటేశారు? అని షోకాజ్ నోటీస్లు జారీచేయడంలో ప్రయోజనం ఏముంటుంది?’’అని బిహార్లో పశి్చమచంపారన్ బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
సామాజిక భద్రతగా పితృత్వ సెలవులు
న్యూఢిల్లీ: శిశువుల సంరక్షణకు తల్లితోపాటు తండ్రి పాత్ర కూడా కీలకమేనని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డల బాధ్యత అనేది కేవలం ఒక్కరి విధి కాదని పేర్కొంది. బిడ్డ అభివృద్ధిలో తల్లి కీలక పాత్ర పోషించినప్పటికీ, అదే సమయంలో తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయం అవుతుందని స్పష్టంచేసింది. పితృత్వ సెలవులను సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తించాలని, ఈ మేరకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా పితృత్వ సెలవులు ప్రాధాన్యతను నొక్కిచెప్పింది.తండ్రులకు కూడా సెలవు ఇవ్వడం సమాజంలో లింగపరమైన అంతరాలను తొలగించడానికి దోహదపడుతుందని వెల్లడించింది. అలాగే పిల్లల పెంపకం(పేరెంటింగ్)పై సమతుల్య అవగాహనను పెంపొందిస్తుందని అభిప్రాయపడింది. పిల్లల భావోద్వేగ, శారీరక, మానసిక వికాసంలో తల్లి పాత్ర నిస్సందేహంగా కీలకమైనప్పటికీ, తండ్రికి కూడా అంతే ముఖ్యమైన పాత్ర ఉందని, దాన్ని విస్మరించడం అసంపూర్ణం, అన్యాయమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. -
హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు.. చివరకు..
న్యూఢిల్లీ: ఓ యువకుడు హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు ఇస్తూ వీడియో తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో తుపాకీని లోడ్ చేసి, గుండెకు గురి పెట్టుకున్నాడు. అనుకోకుండా అది పేలడంతో బుల్లెట్టు అతడి శరీరంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఎలా జరిగింది? ఢిల్లీకి చెందిన పవన్ అనే ఓ యువకుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి తుపాకీతో వీడియో తీసుకుంటున్నాడు. అతడి స్నేహితుడు వీడియో చిత్రీకరిస్తున్నాడు. తుపాకీ పట్టుకున్న పవన్ ట్రిగ్గర్ను స్వల్పంగా తాకాడు. “చలానా మత్ భాయ్ (కాల్చవద్దు అన్నా)” అంటూ వీడియో తీస్తున్న వ్యక్తి హెచ్చరించాడు. అయినప్పటికీ తుపాకీని పవన్ తన చాతీపై పెట్టాడు. అకస్మాత్తుగా అది పేలింది. ఆ వెంటనే పవన్ కుప్పకూలిపోయాడు. పవన్ను ఆసుపత్రికి తరలించినా, చికిత్స సమయంలో అతడు మృతి చెందాడని అధికారులు తెలిపారు.ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని దల్లుపురాలో జరిగింది. తుపాకీకి లైసెన్స్ ఉంది. అది వీడియో చిత్రీకరించిన యువకుడిదే అని పోలీసులు తెలిపారు. వీడియో తీస్తున్న వ్యక్తి పవన్కు తుపాకీ ఎలా లోడ్ చేయాలో సూచనలు ఇస్తూ, కాల్చవద్దని హెచ్చరించాడని పోలీసులు చెప్పారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పవన్ తుపాకీతో స్టంట్లు చేస్తూ రీల్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. పవన్ తుపాకీ లాక్లో ఉందని నమ్మాడని పోలీసులు తెలిపారు. -
36 ఏళ్ల నాటి రూ. 500 లంచం కేసులో శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: దాదాపు 36 సంవత్సరాల క్రితం 500 రూపాయల లంచం తీసుకున్న నేరానికి గతంలో హైకోర్టు న్యాయస్థానం ఆనాటి కానిస్టేబుల్కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సగానికి తగ్గించింది. దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు వేసిన శిక్షను 14 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చి న తీర్పును జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.అయితే 75 ఏళ్ల వయసులో మాజీ ఉత్తరాఖండ్ ఎక్సయిజ్ కానిస్టేబుల్ రెండేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించలేడని పేర్కొంటూ ఆ శిక్షను ఏడాదికి కుదించింది. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను అనుసరిస్తూ మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ తొలి దఫా సమావేశాల వేళ లోక్సభలో సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారన్న కారణంగా ఫిబ్రవరి మూడో తేదీన సస్పెన్షన్కు గురైన ఎనిమిది మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ను మోదీ సర్కార్ రద్దుచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. సస్పెన్షన్ను మంగళవారం ఎత్తేయనున్నట్లు సమాచారం.సీపీఐ(ఎం) ఎంపీ ఎస్.వెంకటేసన్తోపాటు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, సీ కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, ప్రశాంత్ పదోలే, డియాన్ కురియన్కోసేలపై ఏప్రిల్ రెండో తేదీదాకా ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణ యించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వీళ్లపై సస్పెన్షన్ను రద్దుచేయాలంటూ విపక్షనేతలు డిమాండ్ చేయడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాజ్యసభకు నితీశ్, నితిన్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిహార్లోని ఐదు, ఒడిశాలో నాలుగు, హరియాణాలో రెండు సీట్లకు సోమవారం జరిగిన పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి బీజేడీకి, మరోటి బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడి కాలేదు. బిహార్ నుంచి ఖాళీ అవనున్న మొత్తం ఐదు స్థానాలను ఎన్డీయే క్లీన్స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్, నితిన్ నబీన్లతోపాటు జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేశ్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు.ఐదు సీట్లకుగాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర ధారి సింగ్ సహా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వరుసగా రెండో విడత గెలవాలన్న అమరేంద్రకు మహాగఠ్బంధన్ నుంచి సహకారం కరువైంది. దీంతో, ఆయన ఓడిపోయారు. కాగా, బిహార్కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు వెళ్లనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.ఒడిశాలో బీజేపీకి రెండు సీట్లుఒడిశాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పార్టీ ఎంపీ సుజీత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్త్ మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్లు పేర్కొంది. -
బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులపై వేటు
కోల్కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నత స్థాయి అధికార, పోలీసు యంత్రాంగాన్ని బాధ్యతల నుంచి తొలగించింది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ, కొద్ది గంటల్లోనే ఈ మేరకు సమూల ప్రక్షాళన చర్యలను చేపట్టడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వెలువరించిన మొదటి ఉత్తర్వులతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, హోం శాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాలపై వేటు వేసింది.అనంతరం, 16వ తేదీతో వెలువరించిన మరో ఆదేశంలో రాష్ట్ర డీజీపీ పియూశ్ పాండే, కోల్కతా సీపీ సుప్రతీమ్ సర్కార్ తదితర నలుగురు ఉన్నతస్థాయి ఐపీఎస్లను తొలగిస్తున్నట్లు తెలిపింది. నందినీ చక్రవర్తి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ దుష్యంత్ నరియాలాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. దుష్యంత్ ప్రస్తుతం ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ అదనపు చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా, జగదీశ్ ప్రసాద్ మీనా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా సంఘమిత్రా ఘోష్కు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. డీజీపీగా 1992 బ్యాచ్ అధికారి సిద్్ధనాథ్ గుప్తాను నియమించింది. అజయ్ కుమార్ నంద్ను కోల్కతా పోలీస్ కమిషనర్గా నియమిస్తున్నట్లు ఈసీ తెలిపింది. శాంతి భద్రతల ఏడీజీ వినీత్ గోయల్ స్థానంలో అజయ్ ముకుంద్ పాండేను, సిద్్ధనాథ్ గుప్తా స్థానంలో డీజీగా నటరాజన్ రమేశ్ బాబును నియమించింది.ఈసీ బెంగాల్ వ్యతిరేకి: సీఎం మమత ఎన్నికల వేళ ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ, బీజేపీలు మహిళలకు, బెంగాల్కు వ్యతిరేకులన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఎల్పీజీ సంక్షోభంపై కోల్కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ఎందరు అధికారులను మార్చినా తమ ప్రభుత్వాన్ని మాత్రం మార్చలేదని ధీమా వ్యక్తం చేశారు. -
న్యాయానికి ముసుగేసి.. వాస్తవాలు దాచేసి..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదోవ పట్టించి, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి ఆరోపించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో సునీత అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సీబీఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. ‘హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే, ఆమె మాత్రం లూథ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతడికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ, పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని... ఇలా స్టేట్మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి గారి రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి... ఇది ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం జరిగిన హత్య) కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని నిలదీశారు. షమీమ్ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలాగే వివేకాకు, షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు.. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని... మమ్మల్ని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం నిందితులు విచారణలో అనేక విషయాలు చెప్పారు. వివిధ లావాదేవీల్లో వైఎస్ వివేకానందరెడ్డికి డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దాని కోసం వివేకానందరెడ్డి గారు కొంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయిందీ, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకు ఉంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యాప్తు సునీత కోరడం లేదు?. మరోవైపు తొలిసారి 161 స్టేట్మెంట్లో దస్తగిరి... వివేకానందరెడ్డి గారిని చంపక ముందు డాక్యుమెంట్లు గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన్ను తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్య అనంతరం రెండు మూడు సార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లామని కూడా చెప్పాడు. దస్తగిరి బెయిల్ ఎందుకు అడ్డుకోలేదు? మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా.. మీరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఏకంగా లూథ్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. చంద్రబాబుకు, వివేకాను హత్య చేసిన దస్తగిరికి, మీకు న్యాయవాదిగా లూథ్రాయే ఉండడంలోని ఆంతర్యమేమిటి? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిలిచ్చినా మీరు అడ్డుకోలేదు. ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా ... అతను దర్జాగా బయట తిరుగుతున్నా కనీసం బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన్ను శిక్షించాలని మీరు ఎందుకు కోరరు? అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును, సీబీఐను అడగాల్సిన బాధ్యత మీకు లేదా? హత్య అనంతరం లేఖ గురించి ఎందుకు చెప్పలేదు? మీ తల్లి, భర్త అటెండర్కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్ల గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు.. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ.... కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఇన్నాళ్లూ చేశారన్నది పచ్చి నిజం. ఈ కేసులో పీఏ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని, లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బావమరిది, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి, చనిపోయిన విషయం కూడా చెప్పాడు. ఆ లెటర్లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?. వివేక అటెండర్ పండంటి రాజశేఖర్ను హత్యకు ముందు రోజు కుటుంబసభ్యులే కాణిపాకం ఎందుకు పంపించారు?సునీత పరస్పర విరుద్ధ ప్రకటనలు... పైగా ఎవరికీ లేని అవకాశం సీబీఐ సునీతకి ఇచ్చింది. 2020 జులై 28న ఆ లేఖ గురించి సునీతను సీబీఐ అడిగింది. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం, ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసి ఉండేది, అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని ప్రశ్నించింది. దానికి ఆమె లెటర్ ఉన్న విషయం పీఏ కృష్ణారెడ్డి తమకు వాట్సప్లో చెప్పాడని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటూ పెద్ద థియరీ చెప్పారు. మరలా నెల రోజులకు 27 ఆగస్టు 2020 నాడు సీబీఐ ముందుకు వచి్చ, నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పినదంతా తూచ్... నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటరూ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతిలో లేఖ చూడ్డం తప్ప నాకేమీ తెలియదు అని అబద్దం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచి్చన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? మరో కీలమైన అంశం నా బెయిల్ గురించి హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు... గతంలో సునీత మాట్లాడిన వీడియోను హైకోర్టు ముందు ఉంచాను. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో మాట్లాడుతూ... గడిచిన కొన్ని నెలలుగా అవినాష్ని ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి మా నాన్న శ్రమిస్తున్నారు అని మాట్లాడిన వీడియోను హైకోర్టుకు సమర్పించాను. అనంతరం నాకు బెయిల్ వచ్చిన తర్వాత మరలా సీబీఐ అధికారులను సునీత పిలిచి... మరలా మే 31, 2023 అంటే మూడేళ్ల తర్వాత గతంలో మాట్లాడిన వీడియోను కవర్ చేసే విధంగా మరో స్టేట్మెంట్ ఇప్పించారు. అందులో భాగంగా గతంలో మీరు ఎందుకు అలా మాట్లాడారు అని సీబీఐ అడిగితే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడమన్నారు అందుకే మాట్లాడానని చెప్పింది. విచారణలో లొసుగులను ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారించరు? వివేకాకు, ఆయన రెండో భార్య షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టే ధైర్యం ఉందా? వివేకా రెండో భార్య కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం మీకు ఉందా? ఈ కేసులో విచారణను పరిశీలిస్తే.. వివేకానందరెడ్డి ఆమె పేరిట ఆస్తులు ఇవ్వాలనుకున్నారని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. షమీమ్ కుమారుడిని హెచ్పీఎస్ స్కూలులో అడ్మిషన్ తీసుకుని చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్లను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. ఒకవైపు వివేకాకు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్ పూర్తిగా చెక్ పవర్ తీసేశారు. ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితికి ఆయన్ను తీసుకొచ్చారు. చివరగా గత మూడేళ్లులో ఆయనతో మాట్లాడడంలేదని కూడా విచారణలో సునీతక్క మాటల్లో ఉంది. ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదు..? షమీమ్కు వివేకా ఎన్నో హామీలిచ్చారు. అవి నెరవేరకుండానే హత్యకావించబడ్డారు. ఎవరు చేసి ఉంటారు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివేకా ఆస్తులు షమీమ్కు, ఆమె కొడుకుకు పోతే నష్టపోయేదెవరు? ఆ నష్టం వాటిల్లకుండా వారే చేసి ఉండవచ్చు కదా? మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? ఆ దొంగిలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయలేదు? నిత్యం విచారణను అడ్డుకునే ప్రయత్నంలో సునీత... ముఖ్యంగా రామ్ సింగ్ వీళ్ల చేతుల్లోకి వచి్చన తర్వాత సుధాసింగ్, దీపక్ గారిని విచారణ నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇష్టమొచి్చనట్లు స్టేట్ మెంట్లు తీసుకున్నారన్నది పచ్చి నిజం. అదే విధంగా దస్తగిరి తన స్టేట్మెంట్లో వివేకానందరెడ్డి గారికి అనేక అక్రమ సంబంధాలున్నాయని చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ అడిగే ప్రయత్నం సునీత చేయదు. అది వ్యక్తిగత అంశం కాబట్టి నేను అటువైపు వెళ్లదల్చుకోలేదు. నేను అనేకసార్లు సీబీఐ డైరెక్టర్కి వినతిపత్రం ద్వారా మొరపెట్టుకున్నా మా మొర ఆలకించలేదు. ఆ రోజుల్లో విచారణలో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు జరగలేదు. ఏకపక్షంగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లి, విచారణ అడ్డుకునేలా ప్రయత్నం చేస్తోంది. గడిచిన రెండు, మూడేళ్లుగా ఇదే పని చేస్తోంది. వచ్చే ఎన్నికల వరకు హత్య కేసును లాగడమే లక్ష్యం... ఎప్పుడు విచారణ జరిగినా.. దేవుడి ముందు, చట్టం ముందు మేం తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం మాకుంది. విచారణ జరిగేలా సహకరించమని సునీతని కోరుతున్నాం. కానీ వీరి ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. విచారణ జరగకూడదన్నట్లు, దోషులెవరూ బయటకు రాకూడదన్నట్లు ఆమె వైఖరి ఉంది. ఎవరైనా ఆధారాలుంటే విచారణ సందర్భంగా సమర్పిస్తారు.. కానీ సునీత అలా చేయకుండా ఈ కేసును ఇలాగే కొనసాగించాలని, చంద్రబాబు చేతిలో పావులా మారి ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప.. న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలను పక్కన పెట్టాలని కోరుతున్నాను.తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ...ఏపీకి సంబంధించిన పెద్ద మనిషి, ఢిల్లీలో కీలకమైన పోస్టులో ఉండడం, ఆయన ఆశీస్సులతో అప్పటి సీబీఐ డైరెక్టర్ నియామకం జరగడం, ఆయనను సునీత అనేకసార్లు కలవడం, చంద్రబాబు నాయుడు, సునీత కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా కేసును తీసుకెళ్లారు. వారికి నచి్చన వారిని తీసుకెళ్లి సీబీఐ విచారణ చేసింది. గతంలో ఎన్నికల ముందు 2024 ఏప్రిల్లో నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను. నన్ను సీబీఐ 12 సార్లు విచారణకు పిలిచింది. నేను మూడోసారి సీబీఐ విచారణకు వెళ్లినప్పుడు హత్య జరిగిన రోజు మేము గమనించిన విషయాలు చెప్పాను. నేను సీఐ గారికి సమాచారం ఇచ్చాను. స్థానికులు వివేకానందరెడ్డి గారిని చూస్తామని గట్టిగా గొడవపడితే వాళ్లను కూడా అనుమతించాం. ఆ రోజు నేను సీబీఐకి చెప్పాను. ఆ రోజు వచి్చన హిమకుంట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. 2025లో సునీత, ఆమె భర్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి... ఘటన జరిగిన తర్వాత వెళ్లిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావు, సీబీఐ వాళ్లు నిన్ను పిలిచి విషయం అడుగుతారని చెప్పారు. దానికి ఆయన నేను తప్పకుండా చెబుతానంటే... అలా చెప్పడం కాదు అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని స్టేట్మెంటు ఇమ్మన్నారు. నాకు అలా చెప్పలేదంటే... మా నాన్నకి ఆప్తుడివి నువ్వు అలా చెప్పాల్సిందేనని అంటే... అక్కడ నుంచి వెళ్లిపోయి మరలా వారం తర్వాత ఆయనపై ఒత్తిడి తెచి్చ.. తాము చెప్పమన్నట్టే స్టేట్మెంట్ ఇమ్మని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే రీతిలో తప్పుడు స్టేట్మెంట్లను ఇప్పిస్తూ వచ్చారు. వారినే సీబీఐ పిలుస్తూ వచి్చంది.విచారణ పూర్తి చేయాలి..సునీత లేఖ దాచిపెట్టిన విషయం, సౌభాగ్య పెద్దమ్మ, నర్రెడ్డి రాజశేఖర్ కలిసి అటెండర్కి సెలవు ఇచ్చి కాణిపాకం పంపించడం, డాక్యుమెంట్ దొంగతనం వంటి అంశాలపై దర్యాప్తు కోరాల్సింది పోయి.. అసలు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తోంది. దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేం పిటిషన్ వేస్తే.. వెంటనే ఆమె ఇంప్లీడ్ అయి.. దస్తగిరి తరపున లూథ్రాతో వాదనలు వినిపిస్తారు. ఈ కేసు విషయంలో గత మూడేళ్లుగా వాస్తవాలు తెలియకుండా మమ్నల్ని ఎంతో మంది దూషించారు. వీళ్లంతా తాము అనవసరంగా నిందించామని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈ కేసు ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరిగే దిశగా న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలి. సునీత భర్త రాజశేఖర్కు టీడీపీ నాయకుడు బీటెక్ రవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలి.గుండెపోటు థియరీని సృష్టించింది సునీతే..ఈ కేసులో అనేక సందర్భాల్లో సీబీఐ అప్పటి డైరెక్టర్కు తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయాలని విజ్ఞపి చేశాం. పైన నేను చెప్పిన అన్ని అంశాలను లేఖ రూపంలో రాశాను. కేవలం టార్గెటెడ్ దర్యాప్తు చేసిందే తప్ప... సీబీఐ వాస్తవాలను వెలికి తీసే దిశగా దర్యాప్తు చేయలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి, సీబీఐకి మెయిల్స్, రిజిస్టర్డ్ పోస్టు రూపంలో మేము అనుకున్న అంశాలపై ఫిర్యాదు చేశాం. సునీత ఇప్పుడు కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు రకాల పిటిషన్స్ వేసి విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ అంశాన్ని వెలుగులో ఉంచడమే వీరి లక్ష్యం. వివేకానంద రెడ్డి హత్య జరిగే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అదే విధంగా గుండెపోటు అని అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పమంటూ.. సునీత చాలా మందిని ట్రైన్ చేశారు. గుండెపోటు అని తాను అనుకున్నానని సునీత చెప్పింది. అసలు ఆ థియరీని సృష్టించింది, సిట్ ముందు చెప్పిందే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై శివప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారన్నారు. చేసినదంతా వాళ్లే చేసి అన్యాయంగా మా మీద నిందలు వేశారు. మార్చి 16న సునీత తానే స్వయంగా సిట్ ముందు గుండెపోటు అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. కీలకమైన అంశాలను పక్కనపెట్టి.. ఇతర అంశాలను కోర్టు దృష్టికి, సీబీఐ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విచారణను జాప్యం చేయడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి చెక్ పవర్ తీసివేసి చనిపోయే ముందు ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడలేదు. ఆ కోణంలో విచారణ జరగాలి. షమీమ్కి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన చాట్స్ బయటకు రావాలి. దొంగిలించబడిన రౌండ్ సీల్ డాక్యుమెంట్లలో ఏముంది? మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే మా వాదన. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వివేకం అని సినిమా తీసి రాక్షసానందం పొందారు. కానీ పైన దేవుడు కూడా క్షమించడు. వాళ్లందరినీ దేవుడు శిక్షించడం ఖాయం. ఈ ప్రశ్నలకు బదులేది?ఈ విషయాలపై మరింత విచారణకు సునీత ఎందుకు పట్టుబట్టడం లేదు?1. హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్ను సౌభాగ్యమ్మ, అల్లుడు రాజశేఖర్ కాణిపాకం ఎందుకు పంపించారు?2. వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి?3. హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం అనుమానాస్పదం కాదా?4. వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్మెంట్లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్ష పెంచుకున్నారని ఆ స్టేట్మెంట్లో ఉంది.5. వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా?6. హంతకుడు దస్తగిరి ముందస్తు బెయిల్ను సునీత అడ్డుకోదు. ఎందుకంటే సునీత ఏం కోరుకుంటుందో అదే దస్తగిరి చెబుతాడు. స్టేట్మెంట్గా ఇస్తాడు. మేం దస్తగిరి బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళితే సునీత ఇంప్లీడ్ అయ్యింది. బెయిల్ రద్దు కోసం కాదు.. దస్తగిరి బెయిల్ ఉండాలని.. దస్తగిరి రక్షణ కోసం లూద్రా వంటి సీనియర్ లాయర్ను దింపుతుంది. -
వింత ప్రవర్తన: రేబిస్తో కుక్కలా అరుస్తున్న యువకుడు
లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు. Mirzapur Boy Bitten by Dog 4 Months Ago, Took Only 2 Rabies Shots – Now Acting Like a Dog 😨#mirzapur #rabies #kiranyadav pic.twitter.com/ZuTZTCfJ5Z— Kiran yadav (@Thekiranyadavvv) March 15, 2026 -
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్తో భారత్ నిరంతరం టచ్లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్ దృక్కోణం నుండి ఇరాన్తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ తన హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నేవల్ మైన్స్ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసిందిఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్తో చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్ గ్యాస్, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.ఆరోణల్ని ఖండించిన జైశంకర్భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్-ఇరాన్ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు. భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. -
Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి
భువనేశ్వర్: ఒడిశా కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది మరణించగా, మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన ఐసీయూ వార్డులో మొత్తం 23 మంది చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది, వైద్యులు సహాయక చర్యలు ప్రారంభించారు. రోగులను ఇతర ఐసీయూ, జనరల్ వార్డులకు తరలించే సమయంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే మరో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం మోహన్ చరణ్ మాఝీఒడిశాలో ఎస్సీబీ ఆస్పత్రి ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్యశాఖ మంత్రి మహాలింగ్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. భారీ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. #WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V— ANI (@ANI) March 16, 2026 -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కేంద్రం కొత్త ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎల్పీజీ,పీఎన్జీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని సూచించింది. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు,ఎరువుల రంగాలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు సంక్షోభాన్ని తగ్గించేలా ఆయా రంగాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా భారత్ సైతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.గ్యాస్ వినియోగదారులు ఏదైనా ఒక గ్యాస్ కనెక్షన్ వినియోగించుకోవాలి. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్పీజీ నియమాలలో మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్ను తిరిగి సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఇంధన వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక గృహాలు పీఎన్జీ కనెక్షన్తో పాటు ఎల్పీజీ కనెక్షన్ను కూడా కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, సబ్సిడీ లబ్ధి విషయంలో గందరగోళం, దుర్వినియోగం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ ఉన్న గృహాలు వెంటనే ఎల్పీజీ కనెక్షన్ను సమర్పించాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. ఇకపై సబ్సిడీ లబ్ధి ఒకే కనెక్షన్కు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్పీజీ సబ్సిడీ పొందలేరు. ఎల్పీజీ కనెక్షన్ను సమర్పించిన తర్వాత పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లు తగ్గనున్నాయి.ఈ నిర్ణయంపై గ్యాస్ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఎల్పీజీ అవసరం లేదని భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎల్పీజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరమవుతుందని మరికొందరు అంటున్నారు. కాగా, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ (MoPNG), అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) ద్వారా విడుదలైన గణాంకాల ఆధారంగా దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ 33.2కోట్ల మందికి.. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్1.36కోట్ల మంది వినియోగిస్తున్నారు. -
నమాజ్ చేసే వారి సంఖ్యపై పరిమితులా?
సాక్షి, న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ చేసుకునే వారి సంఖ్యపై పరిమితులు విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతిభద్రతల నెపంతో ఇటువంటిఆంక్షలు విధించలేరని స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడలేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయడమో లేక వేరే జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సిద్ధార్థ్ నందన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.‘శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో నమాజ్ చేసుకునే వారి సంఖ్యను పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ బాధ్యతను నిర్వర్తించలేమని, చట్టాన్ని అమలు చేసే సామర్థ్యం తమకు లేదని భావిస్తే.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలి లేదా సంభాల్ జిల్లా నుంచి బయటకు బదిలీ కోరుకోవాలి’అని తీవ్ర స్థాయిలో మందలించింది. ప్రైవేట్ స్థలమైతే అనుమతి అక్కర్లేదుసంభాల్ జిల్లాలోని సర్వే నంబర్– 291లో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ మునాజిర్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ వేశారు. రంజాన్ సమయంలో ఎక్కువ మంది భక్తులు ప్రార్థనలకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని ఆయన కోర్టు దష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆంక్షలు విధించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతి వర్గానికి తమ నిర్దేశిత ప్రార్థనా మందిరాల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రైవేట్ ఆస్తిలో ప్రార్థనలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అయితే, ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లేదా పబ్లిక్ స్థలాల్లోకి ఆ కార్యక్రమాలు విస్తరించినప్పుడు మాత్రమే అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టత ఇచ్చింది.ఆ స్థలం ఎవరిది?విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనను యూపీ ప్రభుత్వం ఖండించింది. రెవెన్యూ రికా ర్డుల ప్రకారం మసీదు ఉన్న భూమి సుఖీ సింగ్ కుమారులైన మోహన్ సింగ్, భూరాజ్ సింగ్ల పేరిట ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, అక్కడ మసీదు లేదా ప్రార్థనా స్థలం ఉన్నట్లుగా పిటిషనర్ ఎలాంటి ఫొటోలను సమర్పించలేదని కోర్టు గమనించింది. ఆధారాలు, ఫొటోలు, రెవెన్యూ రికార్డులు సమర్పించేందుకు పిటిషనర్ సమయం కోరగా.. తదుపరి వివరాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం కూడా గడువు అడిగింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
తృణమూల్ ప్రభుత్వానికి కౌంట్డౌన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని అన్నారు.రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్ ఆత్మను కాపాడేందుకు, కట్ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం కాక తప్పదన్నారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్ కాంగ్రెస్కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ కోల్కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం సిల్చార్: మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. -
మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ‘యావత్ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్ పిటిషన్పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్ మాల్ మాదిరిగానే మీ పిటిషన్ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పిటిషన్లో ఇంకా ఏముంది? రోడ్లు, వంతెనలు, విద్యుత్ వైరింగ్ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి. -
అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు
న్యూఢిల్లీ: మహిళలకు రుతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవ్వరూ ఉద్యోగాల్లోకి తీసుకోరని, ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఋతుక్రమ సమయంలో విద్యారి్థనులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడింది. ‘ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది.రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న ‘చెడు’గా పరిగణిస్తారు’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్ న్యాయవాది ఎమ్.ఆర్.శంషాద్ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ‘అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. న్యాయవ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెబుతారు. వారి కెరీర్ ముగిసిపోతుంది.’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. -
ఈశాన్యంలో శాంతి వీచికలు
గువాహటి: ఒకప్పుడు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ అశాంతి అంతమై, అభివృద్ధి పరుగు ఆరంభమైందని స్పష్టంచేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వార్థ రాజకీయాల కోసమే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం అస్సాంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో రూ.19,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత కింద దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు.కోక్రాఝార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాజధాని గువాహటి నుంచి వర్చువల్గా ప్రసంగించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రధానమంత్రి కోక్రాఝార్కు చేరుకోలేకపోయారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో అస్సాంలో నూతన అధ్యాయం మొదలైందని, ఇక్కడ పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ భద్రతను పణంగా పెట్టిందని, స్థానికుల భూములను చొరబాటుదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నా అస్సాంలో తేయాకు తోటల కార్మికులకు జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దినట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భూములపై వారికి హక్కులు కల్పించామని, పట్టాలు అందజేశామని అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా మూడు కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళా కార్మికురాలికి మోదీ పాదాభివందనం చేశారు. కార్మికులకు న్యాయం చేసినందుకు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని అభినందించారు. అస్సాం కార్మికులు పండించిన తేయాకు గుజరాత్కు వస్తోందని, అక్కడ ఆ తేయాకుతో తేనీరు తయారు చేసి విక్రయించానని తెలిపారు. ఛాయ్వాలాగా పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. భూమి పట్టాలు ఇవ్వడం ద్వారా తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ది అబద్ధాల దుకాణం ప్రేమ దుకాణం(మొహబ్బత్ కీ దుకాణ్) తెరిచామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి తిప్పికొట్టారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం(ఝూటే వైదో కీ దుకాణ్) తెరిచిందని విమర్శించారు. అక్కడ ఒక అబద్ధానికి మరో నాలుగు సూపర్ అబద్ధాలు బహుమతిగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్కు ఏనాడూ లేదన్నారు. హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. -
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయొద్దన్నారు. బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్ పెరిగింది. -
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. -
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని సూచించింది. -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
సీఈసీని తొలగించాలంటూ నోటీసు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్సభ సభ్యులు కాగా, 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ నోటీసును లోక్సభకు లేదా రాజ్యసభ చైర్మన్కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు.ముందుగా ఎవరికి ఇచ్చేదీ స్పష్టం కావాల్సి ఉంది. సీఈసీ తొలగింపు కోరుతూ ఇవ్వనున్న నోటీసుపై సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు ముందుకు వచ్చారని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ, గురువారం కూడా ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీఈసీ తొలగింపును కోరాలంటే లోక్సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్య పారీ్టలతోపాటు, అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా, వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగే విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నాయి. కాగా, సీఈసీని తొలగించాలంటూ పార్లమెంట్లో నోటీసు జారీ చేయనుండటం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (50% కంటే ఎక్కువ) ఉండటంతో పాటు, ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో రెండింట మూడొంతుల మెజారిటీ తప్పనిసరి. -
ఇంధన కొరత లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో ఇంధన కొరత ఎంతమాత్రం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నట్లు తెలిపారు. ఇంధనం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంధన కొరత గురించి ప్రస్తావించారు. దీనిపై హర్దీప్సింగ్ పురి సమాధానం ఇచ్చారు. దేశంలోని 33 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా పేద కటుంబాలకు ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రకటించారు.దేశీయ సరఫరా వ్యవస్థను పరిరక్షిస్తామన్నారు. అన్ని రకాల ఇంధనం విషయంలో రిటైల్ ఔట్లెట్ల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సప్లై చైన్స్ యథాతథంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నా మని తెలిపారు. ఇంధన సరఫరాలో సంక్షోభం ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని హర్దీప్సింగ్ పురి స్పష్టంచేశారు.ఎల్పీజీ ఉత్పత్తిని 28% పెంచినట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి చూస్తే మన దేశంలో ఇంధనం ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి మనకు ముడి చమురు అందుతూ నే ఉందని గుర్తుచేశారు. 2006–07లో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమ తి చేసుకుంటున్నామని తెలియజేశారు. మోదీ దౌత్య నీతి వల్లే ముడి చమురు విషయంలో ఆటంకాలు లేకుండాపోయాయని మంత్రి ఉద్ఘాటించారు. -
రెండు నౌకలపై ఇరాన్ దాడి
న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక మీదా ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్ బోట్లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్సీ విష్ణు, జిఫిరోస్ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్ల ట్రాకింగ్ వెబ్సైట్ అయిన ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్సీ ట్రాన్స్పోర్ట్ ఐఎన్సీ సంస్థ ‘సేఫ్సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్ను గ్రీస్కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. -
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.కానీ భయాందోళనల కారణంగా బుకింగ్లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.భయంతో సిలిండర్ బుకింగ్లుఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. -
యుద్ధం వేళ.. ఇరాన్తో చర్చించిన భారత్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది. -
సుప్రీంకోర్టులో ముగిసిన తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు
న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది. అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది. -
అవినాశ్ బెయిల్ రద్దుకు సుప్రీం నో..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముసుగులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి తదితరులపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ, పలు పిటిషన్లతో పదే పదే కోర్టుల మెట్లు ఎక్కుతున్న డాక్టర్ సునీతకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్రెడ్డితో పాటు పలువురి బెయిల్ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసింది: సీబీఐ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, వివేకా కేసులో దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జ్షీట్ను సైతం కింది కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇకపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని విన్నవించారు. సీబీఐ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ రద్దు అవసరం లేదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో ‘సెక్షన్ 207’ ప్రక్రియ పూర్తికి నిర్దేశం దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందితులకు కేసు చార్జ్షీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేయడానికి సంబంధించిన ‘సీఆర్పీసీ సెక్షన్ 207’ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా కేసు ట్రయల్ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పునఃదర్యాప్తు పేరుతో వివేకా హత్య కేసు విచారణను అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ప్రత్యర్థుల కుట్రలో సునీత పావుగా మారారన్న విమర్శల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టు విచారణ ఇక్కడెందుకు.. సిద్ధార్థ లూథ్రాకు ప్రశ్న విచారణ సందర్భంగా సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను ఆయన పదే పదే ధర్మాసనం ముందు లేవనెత్తారు. ‘మా వద్ద కేసుకు సంబంధించిన కీలక మెటీరియల్ ఉంది.. దాన్ని పరిశీలించి బెయిల్ రద్దు చేయండి’ అంటూ లూథ్రా వాదించే ప్రయత్నం చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్ తీవ్రంగా స్పందించారు. ఏమిటిది.. మీరు సుప్రీంకోర్టులోనే కేసు ట్రయల్ (విచారణ) నిర్వహించాలనుకుంటున్నారా?’ అంటూ లూథ్రాను సూటిగా ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు పరిధిలో జరగాల్సిన విచారణను ఇక్కడికి ఎందుకు తెస్తున్నారంటూ లూథ్రా తీరును తప్పుబట్టారు. ఇలా పదే పదే పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. -
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్కు చాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సీవీ ఆనంద్ నియామకం కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆరు వారాల్లోగా రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు హాజరై, నలుగురు సీనియర్ ఐపీఎస్లతో కూడిన జాబితాను కమిటీకి అందజేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురు ఎవరు?... ఢిల్లీ షాజహాన్ రోడ్లోని యూపీఎస్సీ భవన్ వేదికగా దాదాపు గంటపాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్తోపాటు, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. ఈ భేటీలో ఆయా అధికారుల సర్వీస్ రికార్డులు, మెరిట్, ఇతర కీలక అంశాలపై సీఎస్తో కలిసి కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం పంపిన నలుగురి జాబితా నుంచి ఒకరిని పక్కనపెట్టి, ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ను ఎంపిక కమిటీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ పంపించే జాబితాలో నుంచి సీవీ ఆనంద్ వైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొగ్గు చూపించే అవకాశమున్నట్టు తెలిసింది. జితేందర్ ఉద్యోగ విరమణ చేసినప్పుడు కూడా సీవీ ఆనంద్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నించినా... అప్పట్లో శివధర్రెడ్డికి ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆయనకు అవకాశం కల్పించిన విషయం విదితమే. తీవ్ర పోటీ.. కొత్త డీజీపీ పోస్టు కోసం సీనియర్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జాబితాలో సీవీ ఆనంద్ పేరు ముందు వరుసలో ఉంది. డీజీపీ పదవిని దక్కించుకునేందుకు శిఖా గోయల్ సైతం గట్టిగానే ఆసక్తి చూపుతున్నట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీజీపీ జితేందర్ ఉద్యోగ విరమణ చేసిన సమయంలోనే ఆమె ఈ పోస్టు కోసం తనవంతు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే.. యూపీఎస్సీ ఎంపిక కమిటీ ఢిల్లీ నుంచి పంపే ‘ముగ్గురు’అధికారు ల తుది జాబితా రాష్ట్రానికి చేరిన తర్వా త ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుది నిర్ణ యం తీసుకుంటారు. దీంతో త్వరలోనే రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ ఎవరన్నదానిపై అధికారికంగా సస్పెన్స్ వీడనుంది. -
ఆ ముగ్గురిని పక్కన పెట్టండి
న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో అభ్యంతకర అధ్యా యాన్ని చేర్చడానికి కారకులైన ముగ్గురు నిపు ణుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వారితో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించరాదని కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ఈ పుస్తకంలో చేర్చడం సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎన్ఈసీఆర్టీ లీగల్ స్టడీస్కు సంబంధించి పాఠ్యప్రణాళికను ఖరారు చేయడానికి న్యాయ రంగానికి చెందిన నిపుణులతో ఒక కమిటీని వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ జడ్జి, ఒక ప్రముఖ విద్యావేత్త, పేరు ప్రఖ్యాతలున్న ఒక న్యాయవాది ఉంటే బాగుంటుందని సూచించింది. వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (భోపాల్)తో సంబంధం ఉన్నవారైతే ఇంకా మంచి విషయం అవుతుందని ఉద్ఘాటించింది. ఎనిమిదో తరగతి మాత్రమే కాకుండా, ఉన్నత తరగతుల పాఠ్యప్రణాళికను ఈ కమి టీ ఖరారు చేస్తుందని వెల్లడించింది. వివాదా స్పద అధ్యయాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినో నేతృత్వంలో టెక్ట్బుక్ డెవలప్మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ప్రొఫె సర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లకు భారత న్యాయవ్యవస్థ గురించి సహేతుక మైన జ్ఞానం లేదని, 8వ తరగతి విద్యార్థుల ముందు భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా, తెలిసి కూడా వాస్తవాలను తప్పుగా చూపించారని మేము సందేహించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’’ అని స్పష్టంచేసింది. తదుపరి తరం విద్యార్థులకు అవసరమైన పాఠ్యప్రణాళిక తయారీ, పాఠ్యపుస్తకాల ఖరారులో ఆ ముగ్గురిని ఎందుకు భాగస్వాములను చేయాలని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు.. ఆ ముగ్గురు నిపుణులను తక్షణమే పక్కనపెట్టాలని ఆదేశించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో లేదా పాక్షికంగా ప్రభుత్వ నిధలుతో సంబంధం ఉన్న బాధ్యతలు అప్పగించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులో సవరణ కోరుతూ ముగ్గురు నిపుణులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వివరణ ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది. దుష్ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలివ్వండి వివాదాస్పద చాప్టర్ను తిరగరాస్తున్నామంటూ ఎన్సీఈఆర్టీ డెరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్పైనా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. చాప్టర్–4ను మొత్తం తిరగరాయాలని, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించి, ఆమోదించేదాకా ఆ చాప్టర్ను ప్రచురించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నేషనల్ సిలబస్, టీచింగ్ టెర్నింగ్ మెటేరియల్ కమిటీ (ఎన్ఎస్టీసీ)ను పునర్వ్యవస్థీకరించాలని కేంద్రానికి పరోక్షంగా సూచించింది. వివాదాస్పద చాప్టర్పై ఫిబ్రవరి 26న తాము ఉత్తర్వు జారీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సోషల్ మీడియా వేదికలు, వ్యక్తుల వివరాలు తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పుడు పనులు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ.. సంబంధిత పాఠ్యప్రణాళిక తయారీలో కనీసం ఒక న్యాయ నిపుణుడికి కూడా అవకాశం కల్పించకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.విమర్శను నియంత్రించడం లేదు దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు సమీక్షకు అతీతం అని తాము చెప్పడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరోగ్యకరమైన, చట్టబద్ధమైన, నిర్మాణాత్మక విమర్శను తాము నియంత్రించడం లేదని స్పష్టంచేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగించడాకి బదులు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకే అప్పగిస్తే తాము ప్రశంసిస్తామని పేర్కొన్నారు. తటస్థ, స్వతంత్ర నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. వివాదానికి కారకులైన ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండదని ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేపే వైస్ చాన్సలర్గా నియమిస్తే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకే వెంటనే పక్కన పెట్టాలని తేల్చిచెప్పింది. -
హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించింది. హరీష్ రాణా తల్లిదండ్రుల అభ్యర్థనలతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 11, 2026) తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న రాణా పాసివ్ యూతనేషియా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసుగా నిలిచింది. ఇక ఈ కేసు తుది తీర్పు విచారణకు ముందు సుప్రీం కోర్టు హరీష్ రాణా ఆరోగ్య పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసింది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు. తాజాగా, అత్యున్నత న్యాయ స్థానం పాసివ్ యూతనేషియాకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. -
వివేకా కేసులో సునీతకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి చుక్కెదురైంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని తాజాగా సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించింది. దీంతో, సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. -
2028 వరకు జల్జీవన్ మిషన్
న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడం సహా కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జేజేఎం 2.0 కింద రూ.8.7 లక్షల కోట్లను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని 3.23 కోట్ల గృహాలకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.దేశంతో భూ సరిహద్దులు కలిగిన చైనా, ఇతర దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న నిబంధనలను సడలించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే ఆయా దేశాల వాటాదారులు, 10 శాతం వరకు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడనుందన్నారు. ఈ మేరకు 2020లో జారీ చేసిన నోటీసును సవరించనుందని చెప్పార. మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపైగల మధ్యప్రదేశ్లోని 80 కిలోమీటర్ల బద్నావర్–తిమర్వానీ సెక్షన్ను రూ.3,839 కోట్లతో నాలుగు లేన్లుగా 24 నెలల కాలంలో విస్తరించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు, బెంగాల్–జార్ఖండ్లను కలిపే రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇన్సాల్వెన్సీ లా, కంపెనీ చట్టానికి సవరణలు చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. -
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు. -
వంటగ్యాసే ఫస్టు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది. పారిశ్రామిక వినియోగదారులకు 80%ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు. మూసివేత దిశగా హోటళ్లువాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ప్రజలు ఇబ్బంది పడొద్దు⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి ⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి. -
గ్యాస్ కొరత.. మూత పడుతున్న హోటళ్లు..
ఢిల్లీ:ముంబైలో ఎల్పీజీ సిలిండర్ కొరత తీవ్రంగా పెరిగి హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడగా, త్వరలో మరో 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై (AHAR) హెచ్చరించింది.ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటకాలు తయారు చేయడం అసాధ్యమవుతోంది. ప్రతిరోజూ వేలాది మంది కస్టమర్లు హోటళ్లపై ఆధారపడుతుంటారు. సరఫరా సమస్యలు కొనసాగితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై అధ్యక్షుడు హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలను తక్షణం చర్యలు తీసుకోవాలని హోటల్ అసోసియేషన్ కోరింది.ఎల్పీజీ సరఫరా పెంచాలి. హోటళ్లకు ప్రత్యేక కోటా కేటాయించాలి. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ముంబైలో హోటల్ రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హోటల్ రంగం ముంబై ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే, ఉద్యోగాలు కోల్పోవడం, పర్యాటక రంగం దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. -
దేశంలో వేధిస్తున్న గ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.కేంద్ర పెట్రోలియం శాఖ ఆయిల్ కంపెనీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. వంటగ్యాస్ ఉత్పత్తి కోసం అవసరమైన హైడ్రోకార్బన్ను తరలించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. అదనంగా, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నియంత్రణకు పలు మార్గదర్శకాలు ప్రకటించింది.గృహ అవసరాల గ్యాస్ బుకింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు గ్యాస్ బుకింగ్ సమయాన్ని 25 రోజులకు పెంచింది. గృహ వినియోగదారులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఎల్పీజీ సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు మరియు ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కేంద్ర పెట్రోలియం శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయడమే కాకుండా, అక్రమ వినియోగాన్ని అరికట్టనుంది.ఎల్పీజీ ఉత్పత్తి పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అమలు చేసింది. ఆయిల్ కంపెనీలు ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. గృహ అవసరాలకు ఉపయోగించే పిఎన్జి, రవాణా కోసం ఉపయోగించే సిఎన్జి, అలాగే ఎల్పీజీ ఉత్పత్తి పెంపుకు ప్రాధాన్యత ఇవ్వాలని గెయిల్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి కొరత రాకుండా సమన్వయం చేయాలని స్పష్టంగా పేర్కొంది. -
Parliament Budget Session: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం చర్చ
Parliament Budget Session Updates:లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్తీర్మానంలో మూడు అంశాలను ప్రస్తావించిన కాంగ్రెస్1. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అంగీకరించకపోవడం2. 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం3. విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం అవిశ్వాస తీర్మానం పై సంతకాలు సరైన రీతిలో లేకపోయినా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారని తెలిపిన ప్యానెల్ స్పీకర్ జగదంబిక పాల్కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలుకొనసాగుతున్న రెండో దఫా పార్లమెంట్ సమావేశాలుసభలో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను తొలగించాలని తీర్మానం ప్రవేశ పెట్టనున్న ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ సెషన్ మొదటి దశలో స్పీకర్కు వ్యతిరేకంగా తీర్మానం దాఖలు చేసిన ప్రతిపక్షంతీర్మానంపై సంతకం చేసిన 118 మంది సభ్యులు పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ జరిగే సమయంలో మాట్లాడటానికి అనుమతించలేదని ఆరోపణలు గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ, దీపేందర్ సింగ్ హుడా, జోతిమణి వంటి ప్రతిపక్ష ఎంపీలు దిగువ సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా వాదనలుప్రభుత్వం తరుఫున చర్చను ప్రారంభించనున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుచర్చ సమయంలో మాట్లాడనున్న సీనియర్ బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే, రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా సభలో ప్రసంగిస్తారు. -
రైతన్నపై రుణపాశం!
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. 55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయంగతేడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.అన్నదాతల నోట్లో మట్టి..చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిచంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. -
ఏఐ, ఆటోమేషన్పై పట్టు పెంచుకోవాలి
న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్–బడ్జెట్ వెబినార్లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్లో పాల్గొన్నారు. -
మనోళ్ల భద్రతే ముఖ్యం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా తక్షణం ఉద్రిక్తతలకు తెర దించాలని సూచించింది. దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించాలని అభిప్రాయపడింది. పశ్చిమాసియా ప్రాంతంలోని దాదాపు కోటి మంది భారతీయుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వర్తక, భద్రత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు.పశ్చిమాసియాలో పరిస్థితిని కేంద్రం నిరంతరం సమీక్షిస్తోందని చెప్పారు. ఇప్పటిదాకా 67 వేల మంది విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చినట్టు వివరించారు. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత నిమిత్తం అక్కడి దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ‘‘మన ఇంధన భద్రతపై ఆందోళన అనవసరం. ఈ విషయంలో మన వినియోగదారుల ప్రయోజనాలే పరమావధి. వాటిని కాపాడే దిశగా కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’అని తెలిపారు. ‘‘మన ఇంధన భద్రతకు, వర్తకానికి గల్ఫ్ ప్రాంతం కీలకం. ఆ ప్రాంతంతో ఏటా 200 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతోంది’’అని గుర్తు చేశారు. నౌకలకు ఆశ్రయం కోరిన ఇరాన్ ఇరాన్కు చెందిన నౌక భారత్లో ఆశ్రయం పొందేందుకు మానవతా కోణంలో అనుమతించినట్టు జైశంకర్ వెల్లడించారు. ‘‘మూడు నౌకలకు ఇరాన్ ఆశ్రయం కోరింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న విజ్ఞప్తి చేసింది. కేంద్రం మార్చి 1న అనుమతులు జారీ చేసింది. ఐఆర్ఐఎస్ లావన్ నౌక మాత్రమే మార్చి 4న కోచిలో లంగరు వేసింది’’అని చెప్పారు. మిగతా రెండు నౌకల్లో ఐఆర్ఐఎస్ దేనాను మార్చి 4న శ్రీలంక తీరంలో అమెరికా ముంచేయడం తెలిసిందే. అనంతరం మూడో నౌక ఐఆర్ఐఎస్ బుషెర్ శ్రీలంకలోని ట్రింకోమలీ రేవులో లంగరు వేసింది. చర్చకు ఖర్గే డిమాండ్జైశంకర్ ప్రకటనపై ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు పెద్దపెట్టున నిరసనలకు దిగారు. ప్రకటనకు ముందే పశ్చిమాసియా సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశ ఇంధన భద్రతపై స్వల్ప అవధి చర్చకు డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంపు సామాన్యునిపై భారం మోపిందని ఆయన విమర్శించారు.‘‘పశ్చిమాసియా కల్లోలం తాలూకు ప్రభావం భారత ఇంధన భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వంపైనా పడుతోంది. దేశ ఇమేజీని, ప్రతిష్టను కూడా ఆ యుద్ధం ప్రభావితం చేస్తోంది. కనుక ఈ అంశంపై 176వ నిబంధన కింద చర్చ చేపట్టాలి’’అని కోరుతూ నోటీసిచ్చారు. దాన్ని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. అనంతరం జైశంకర్ ప్రకటన చేసేందుకు అనుమతించారు. అందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. మంత్రి ప్రకటన చేస్తుండగానే వాకౌట్ చేయడాన్ని సభా నాయకుడు జె.పి.నడ్డా తీవ్రంగా తప్పుబట్టారు. సభలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు కాంగ్రెస్, విపక్షాలు ప్రయతి్నస్తున్నాయంటూ మండిపడ్డారు. -
చర్చకు రాని అవిశ్వాసం
న్యూఢిల్లీ: పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం కూడా లోక్సభలో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. విపక్ష సభ్యులు పదేపదే కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేయబోతుండగా అడ్డుకున్నారు. ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన పలు ఇతర అంశాలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు. వాటన్నింటికీ ప్రభుత్వం అప్పుడే వివరంగా బదులిచ్చిందని సభాపతి స్థానంలో ఉన్న జగదంబికా పాల్ గుర్తు చేశారు. పశ్చిమాసియాపై చర్చకు వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.‘‘స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం ఇప్పటికే ఈ రోజు ఎజెండాలో ఉంది. ఒకే రోజు రెండు అంశాలపై చర్చ ఎలా సాధ్యం? పశ్చిమాసియాపై చర్చ కావాలంటే సభా వ్యవహారాల కమిటీని సంప్రదించండి’’అని సూచించారు. వారు పట్టువీడకపోవడంతో ఆగ్రహించారు. ‘‘విపక్ష సభ్యులు పరిణతి లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ఎజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారు’’అంటూ మందలించారు. వారు సభా మర్యాద పాటించడం లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆక్షేపించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సమావేశమయ్యాక కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడదామని విపక్ష సభ్యులకు పాల్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో ఆ అంశాన్ని చర్చకు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియాపై చర్చ ఉండబోదు: కేంద్రం పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్లకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదని సమాచారం. దీనిపై విదేశాంగ మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే ప్రకటన చేసినందున ఇక చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మోదీ బండారం బయటపడుతుందనే! ⇒ పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ: రాహుల్ ⇒ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియా కల్లోలంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ సంక్షోభానికి సంబంధించిన కీలకాంశాలపై మోదీ సర్కారు మౌనం పాటిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్గాం«దీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ , తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియా విషయంలో అమెరికా బ్లాక్మెయిలింగ్కు మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ‘‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపడితే అవన్నీ బయటపడతాయని కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు వెనకాడుతోంది’’అని ఆరోపించారు.‘అవిశ్వాసం’పై నేడు చర్చ? న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తదితరులు చర్చలో పాల్గొంటారు. అనంతరం చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని వీలైనంత త్వరగా చర్చకు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించాయి.స్పీకర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ 118 మంది విపక్ష ఎంపీలు తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడం తెలిసిందే. నాటినుంచీ లోక్సభ సమావేశాలకు బిర్లా సారథ్యం వహించడం లేదు. అవిశ్వాస తీర్మానంపై సభ నిర్ణయం వెలువడేదాకా స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆయన సాధారణ ఎంపీగా చర్చలో పాల్గొనే అవకాశముందని లోక్సభ వర్గాలు తెలిపాయి. గతంలో మూడుసార్లు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా ఒక్కటి కూడా నెగ్గలేదు. -
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి. -
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరోసారి దాడులు చేసింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. -
లిక్కర్ స్కాం కేసు.. వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో ప్రతివాదుల నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానాలు కోరింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ కోర్టు) ఇచ్చిన తీర్పును హైకోర్టులో సీబీఐ సవాల్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ట్రయల్ కోర్టు తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు, వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(మార్చి 16) తదుపరి విచారణ చేపట్టనుంది. Delhi Excise Policy Case: Delhi High Court begins hearing the CBI’s appeal challenging the trial court order that discharged former Delhi Chief Minister Arvind Kejriwal, former Deputy Chief Minister Manish Sisodia and 21 others.The matter is being heard by Justice Swarna Kanta…— ANI (@ANI) March 9, 2026 -
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్సభ వాయిదా.స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026 -
గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది తరలింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులుగా వెళ్లిన వీరంతా ఆయా దేశాల్లో చిక్కుకున్నారని తెలిపింది. మరింత మందిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామంది. పశి్చమాసియా దేశాల్లో ఉంటున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియా దేశాల్లో పాక్షికంగా గగనతలాలను తెరవడంతో దేశీయ, విదేశీ విమానయాన సంస్థలు నడిపే కమర్షియల్, నాన్ షెడ్యూల్డ్ విమానాల ద్వారా మన వాళ్లను తరలిస్తున్నామంది. మార్చి 1–7వ తేదీల మధ్య 52 వేల మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు కేంద్రం వివరించింది. వీరిలో 32,107 మంది దేశీయ విమానయాన సంస్థలు తీసుకు వచ్చాయని పేర్కొంది. కమర్షియల్ విమానాల అందుబాటుకు సంబంధించిన సూచనలు, సలహాలను దగ్గర్లోని భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లల నుంచి తెలుసుకోవచ్చంది. 24 గంటలూ పనిచేసే హెల్ప్లైన్ల ద్వారా కూడా సంప్రదించవచ్చని కేంద్రం వివరించింది. -
తృణమూల్ను ప్రజలు క్షమించరు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును ఘోరంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఒక దళితురాలిని అవమానించిన ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించబోరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో పర్యటించారు. ‘వికసిత్ ఢిల్లీ’ నిర్మాణంలో భాగంగా రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు రూ.33,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. బెంగాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న సంతాల్ గిరిజన సదస్సును తృణమూల్ బహిష్కరించిందని ఆరోపించారు.ఇది రాజ్యాంగానికి, దేశ ఆడబిడ్డలకు జరిగిన ఘోర అవమానమన్నారు. తృణమూల్ ను దేశ ప్రజలు, గిరిజన సమాజం, మహిళలు ఏనాటికీ క్షమించరన్నారు. అహంకారపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి ఒక నగరానికి పరిమితం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉందని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్వర్క్ను రికార్డు స్థాయిలో 375 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నారీ శక్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాజకీయాలు, సైన్స్, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు నూతన శక్తితో ముందుకు సాగుతున్నారని మోదీ కొనియాడారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం
న్యూఢిల్లీ/కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్ గిరిజన సదస్సు వేదికను, ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రొటోకాల్కు సంబంధించిన ‘బ్లూ బుక్’ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘‘సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలక్కపోవడం బ్లూ బుక్ రూల్స్కు విరుద్ధం.రాష్ట్రపతికి కేటాయించిన వాష్ రూమ్లో నీటి సౌకర్యం కూడా లేదు. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేశారు. వీటిపై వివరణ ఇవ్వండి. ప్రొటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్ జిల్లా మేజి్రస్టేట్, సిలిగురి పోలీసు కమిషనర్, అదనపు జిల్లా మేజి్రస్టేట్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని ఆదేశించారు.బెంగాల్ పర్యటనకు వెళ్లిన ముర్ముకు శనివారం సీఎం మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. షెడ్యూల్ ప్రకారం బదాన్నగర్లో జరగాల్సిన దళిత సదస్సును చివరి నిమిషంలో బాగ్డోగ్రా ఎయిర్పోర్టు సమీపంలోకి మార్చేశారు. సరైన సమాచారం లేక జనం ఆశించినంతగా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.ప్రొటోకాల్ను ఉల్లంఘించలేదు: మమతరాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమత తేల్చిచెప్పారు. రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలన్నారు. ‘‘రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవముంది. రాష్ట్రపతిని మా తల్లిగా భావిస్తాం. ముర్మును మేం అవమానించలేదు. ఆమెకు సిలిగురి మేయర్ స్వాగతం పలికారు’’ అని చెప్పారు. ‘‘రాష్ట్రపతిని అవమానించే అలవాటు బీజేపీదే. గతంలో ఒక సభలో రాష్ట్రపతి నుంచుని ఉంటే ప్రధాని మోదీ మాత్రం కురీ్చలో కూర్చున్నారు’’ అని మమత విమర్శించారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అడ్వానీతో పాటు మోదీ కూర్చుని ఉండగా వారి పక్కన ముర్ము నుంచున్న ఫొటోను ప్రదర్శించారు. -
టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.Champions! Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup! This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament. This victory has filled every Indian heart with…— Narendra Modi (@narendramodi) March 8, 2026ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను ప్రధాని ప్రారంభించారు. 12.3 కిలో మీటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్పూర్-బాబర్పూర్ (పింక్లైన్), 9.9 కిలోమీటర్ల దూరం విస్తరించిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ (మజెంటా లైన్) కారిడార్లను మోదీ ప్రారంభించారు.మజ్లిస్ పార్క్ - మౌజ్పూర్ - బాబర్పూర్ కారిడార్.. ఈ కారిడార్లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మజ్లిస్ పార్క్ - శివ్ విహార్ పింక్ లైన్లో భాగంగా ఉంటుంది. ఈ కొత్త మార్గంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.56 కిలోమీటర్లు. దీంతో ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి 'రింగ్ మెట్రో'గా అవతరించింది. మజ్లిస్ పార్క్, బురారీ, జరోడా మజ్రా, జగత్పూర్-వజీరాబాద్, సూర్ఘాట్, నానక్సర్-సోనియా విహార్, ఖజూరీ ఖాస్, భజన్పురా, యమునా విహార్, మౌజ్పూర్-బాబర్పూర్ స్టేషన్లు ఉన్నాయి.ఈ మార్గంలో యమునా నదిపై కొత్త వంతెన, మెట్రో లైన్, రోడ్డు ఫ్లైఓవర్ రెండూ ఉండేలా నిర్మించిన 'డబుల్ డెక్కర్ వయాడక్ట్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ కారిడార్.. ఇది బొటానికల్ గార్డెన్ - కృష్ణా పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్కు ఎలివేటెడ్ పొడిగింపు. ఇందులో ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ కారిడార్ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు.. దీపాలి చౌక్, మధుబన్ చౌక్, ఉత్తర పితాంపుర-ప్రశాంత్ విహార్, హైడర్పూర్ విలేజ్, హైడర్పూర్ బాద్లీ మోర్, భల్స్వా, మజ్లిస్ పార్క్ స్టేషన్లు ఉన్నాయి. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. -
రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు
న్యూఢిల్లీ / సిలిగురి / కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవమానించడం నిజంగా సిగ్గుచేటు అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గతంలో ఇలాంటి పరిణామం ఇప్పుడూ జరగలేదని చెప్పారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందని ధ్వజమెత్తారు. బెంగాల్లో రాష్ట్రపతి పాల్గొన్న సంథాల్ సదస్సు వేదికను రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా మార్చేసింది. ఈ విషయాన్ని ద్రౌపదీ ముర్ము తప్పుపట్టారు. తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మంత్రివర్గ సభ్యులు కూడా తన పర్యటన సందర్భంగా హాజరు కాకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. ఈ పరిణామాలపై మోదీ శనివారం ‘ఎక్స్’లో స్పందించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం అని గుర్తుచేశారు.ఆ పదవికి ఉన్న ప్రతిష్టను ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. బెంగాల్ ప్రభుత్వ చర్యతో ప్రజాస్వామ్యవాదులు, గిరిజనుల మనోభావాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన మహిళ అయిన ద్రౌపదీ ముర్ము ఆవేదన విని దేశ ప్రజల హృదయాలు బాధతో నిండిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కించపర్చారని, దీనికి బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోదీ తేలి్చచెప్పారు. బెంగాల్ ప్రభుత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇకనైనా సద్భుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. సంథాల్ సంస్కృతిపై జరిగిన గొప్ప సదస్సును బెంగాల్ సర్కార్ తేలిగ్గా తీసుకోవడం దురదృష్టకరమని ప్రధానమంత్రి వెల్లడించారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా?: మమత బీజేపీ సలహా మేరకే రాష్ట్రపతి ముర్ము నడుచుకుంటున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్, చత్తీస్గఢ్లో గిరిజనులపై దాడులు జరిగితే ముర్ము ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బెంగాల్లో గిరిజనుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్రపతి ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి పట్ల తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ముర్ము పాల్గొన్న సదస్సు వేదికను మార్చేసిన సంగతి తనకు తెలీదని మమత చెప్పారు.ఆ సదస్సును ఎవరు నిర్వహించారో, ఎవరు నిధులిచ్చారో తెలియదని అన్నారు. రాష్ట్రపతి ఏడాదికి ఒకసారి బెంగాల్కు వస్తే తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు. కానీ, తరచుగా వస్తూ ఉంటూ ప్రతిసారీ స్వాగతించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ రాష్ట్రపతి వెంట ఉండడమే మా పనా? అని వ్యాఖ్యానించారు. బెంగాల్లో గిరిజనుల ఓట్లు తొలగించిన విషయం ముర్ముకు తెలుసా? అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రాష్ట్రపతిని బీజేపీ ఉపయోగించుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. మమతా బెనర్జీకి నాపై కోపం ఉండొచ్చు: ముర్ము షెడ్యూల్ ప్రకారం బిదాన్ నగర్లో జరగాల్సిన సంథాల్ సదస్సును బెంగాల్ ప్రభుత్వం బాగ్డోగ్రా ఎయిర్పోర్టు సమీపంలోకి మార్చేసింది. దాంతో శనివారం సదస్సు అక్కడే జరిగింది. సరైన సమాచారం లేకపోవడంతో జనం పెద్దగా హాజరు కాలేదు. దీనిపై రాష్ట్రపతి ముర్ము తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ రాలేదని పేర్కొన్నారు. బిదాన్నగర్లో సదస్సు జరిగి ఉంటే గొప్పగా విజయవంతం అయ్యేదని అన్నారు.సదస్సు వేదికను ఎందుకు మార్చారో తనకు తెలియదని స్పష్టంచేశారు. గిరిజనుల సంక్షేమాన్ని బెంగాల్ ప్రభుత్వం కోరుకోవడం లేదని తప్పుపట్టారు. తాను బెంగాల్ బిడ్డనని, మమతా బెనర్జీ తన చిన్న చెల్లెలు అని వివరించారు. కానీ, తనను బిదాన్ నగర్కు ఎందుకు అనుమతించలేదో తెలియదన్నారు. మమతా బెనర్జీకి తనపై కోపం ఉండొచ్చని, అందుకే ఇదంతా జరిగినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పొరుగు అరబ్ దేశాలకు ఎటువంటి నష్టం కలగలేదన్నారు.ఇరాన్ చేపట్టిన సైనిక దాడులు చాలా జాగ్రత్తగా.. కేవలం అమెరికా లక్ష్యాలను మాత్రమే గురిచూసి చేసినవని ఆయన తెలిపారు. ఈ దాడుల వల్ల పొరుగున ఉన్న ఏ ఒక్క అరబ్ దేశానికి కూడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్లో ప్రసంగిస్తూ.. ఇరాన్ చర్యలను సమర్థించుకున్నారు.అలాగే, ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చివరి బుల్లెట్ వరకు ప్రతిఘటించడం తప్ప.. మరో మార్గం లేదన్నారు. ఇరాన్ ప్రస్తుతం పూర్తి యుద్ధ స్థితిని ఎదుర్కొంటోందని ఖతీబ్జాదే నొక్కి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడికి, దురాక్రమణకు మేము గురవుతున్నాము. వారు ఇరాన్కు భారీ నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నా తోటి పౌరులు అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న కార్పెట్ బాంబింగ్లతో నిరంతరం దాడులకు గురవుతున్నారు. టెహ్రాన్ నిరంతర దాడుల నీడలో ఉంది.ఇది ఇరాన్ పౌరుల వీరోచిత యుద్ధం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. అలాగే, ఒక దేశాధినేతను అమెరికా హత్య చేసిందని ఆరోపిస్తూ, ఇది ప్రపంచ దౌత్య సంబంధాలకు ముప్పు అంటూ ఆయన హెచ్చరించారు. -
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.సుఖోయ్ సు-30 ఎంకేఐ శిక్షణ మిషన్లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎంకేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr— Indian Air Force (@IAF_MCC) March 6, 2026 -
ఆ విమానం ఎక్కడ?.. ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
ఢిల్లీ: అసోంలో గల్లంతైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న(మార్చి 5, గురువారం) అసోంలోని జోర్హాత్ వైమానిక కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సేపటికే, 7.42 గంటల సమయానికి విమానంతో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ తెలిపింది. అన్వేషణ, సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించామని పేర్కొంది.అయితే, విమానంలోని పైలట్ల పరిస్థితిపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. సుఖోయ్–30ఎంకేఐ రెండు సీట్లుండే బహుళ ప్రయోజన లాంగ్ రేంజ్ యుద్ధ విమానం. రష్యాకు చెందిన సుఖోయ్ కంపెనీ దీనిని అభివృద్ధి పర్చింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ వీటిని ఐఏఎఫ్ కోసం ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దళంలో 260కిపైగా ఎస్యూ–30ఎంకేఐలు సేవలందిస్తున్నాయి. The Su-30MKI which was on a training mission, crashed in the area of Karbi Anglong, Assam, approx 60 km from Jorhat. Search operations are underway.@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@indiannavy https://t.co/64Ii5V2fiZ— Indian Air Force (@IAF_MCC) March 5, 2026 -
తొలిసారిగా డిజిటల్ జనగణన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మక జనాభా లెక్కల (సెన్సస్–2027) సేకరణకు కేంద్రం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్యుమరేషన్ ప్రక్రియను తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనుంది. ఇందుకోసం రూపొందించిన నాలుగు అత్యాధునిక డిజిటల్ యాప్లు, పోర్టల్స్తో పాటు ‘ప్రగతి’, ‘వికాస్’అనే మస్కట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. టెక్నాలజీతో సులభంగా ఇంటింటి సర్వే సుమారు 30 లక్షల మంది సిబ్బందితో ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టనుంది. కాగితాలతో పనిలేకుండా, సీ–డాక్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్ల ద్వారా ఆఫ్లైన్లోనూ సిబ్బంది డేటాను సేకరిస్తారు. ఈసారి ప్రజలకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’(స్వీయ నమోదు) సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎన్యుమరేటర్ ఇంటికి రాకముందే, ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా 16 ప్రాంతీయ భాషల్లో కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయగానే వచ్చే ప్రత్యేక ఐడీని సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది. ఆకర్షణీయంగా ‘ప్రగతి’, ‘వికాస్’: జనగణన ప్రక్రియలో స్త్రీ, పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా మహిళా ఎన్యుమరేటర్ను ’ప్రగతి’గా, పురుష ఎన్యుమరేటర్ను ’వికాస్’గా నామకరణం చేస్తూ మస్కట్లను విడుదల చేశారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని ప్రభుత్వం తెలిపింది. నాలుగు కీలక సాధనాలు ఇవే.. : హౌస్లిస్టింగ్ వెబ్ యాప్: శాటిలైట్ మ్యాప్ల ద్వారా భౌగోళికంగా డిజిటల్ బ్లాక్ల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుంది. హెచ్ఎల్ఓ యాప్: ఎన్యుమరేటర్లు నేరుగా డేటాను సర్వర్కు పంపేందుకు ఈ ఆఫ్లైన్ మొబైల్ యాప్ ఉపకరిస్తుంది. స్వీయ నమోదు పోర్టల్ (ఎస్ఈ పోర్టల్ ): ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే వెబ్సైట్. సెన్సస్ మేనేజ్మెంట్ సిస్టమ్: అధికారులంతా ఎప్పటికప్పుడు సర్వే పురోగతిని పర్యవేక్షించే రియల్–టైం డ్యాష్బోర్డ్. రెండు దశల్లో సెన్సస్.. కులగణన కూడా : జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. ఇళ్ల వివరాలు సేకరించే మొదటి దశ (హౌస్ లిస్టింగ్) 2026 ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30 మధ్య రాష్ట్రాల వెసులుబాటును బట్టి 30 రోజుల పాటు జరుగుతుంది. వ్యక్తుల వివరాలు సేకరించే రెండో దశ (జనాభా లెక్కింపు) 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. విశేషమేమిటంటే, ఈ రెండో దశలోనే కులగణన వివరాలు కూడా సేకరిస్తారు. ఈ జనాభా లెక్కలకు 2027 మార్చి 1వ తేదీని ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. మంచు ప్రభావం ఉండే ప్రాంతాల్లో (లద్దాఖ్, జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) మాత్రం 2026 సెపె్టంబర్కల్లా ఈ సర్వేను పూర్తి చేస్తారు. -
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. సంతాప సందేశం రాశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే.శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్లిస్ట్లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్ఖనీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు. ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. -
నామినేషన్ దాఖలు చేశారు.. నితీశ్ ఇకపై..: అమిత్ షా
న్యూఢిల్లీ: నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్ షా అభివర్ణించారు. నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని అమిత్ షా స్వాగతించారు. రాజ్యసభ స్థానానికి ఇవాళ నితీశ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో నితీశ్ వెంటే అమిత్ షా ఉన్నారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఇవాళ రాజ్యసభ స్థానానికి బిహార్ సీఎం కూడా నామినేషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటి వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం నిజంగా గొప్పది. ఈ కాలం బిహార్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వంటి పదవుల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదు. ఆయన జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల కాలంలో నితీశ్ కుమార్ బిహార్ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. మోదీ ప్రారంభించిన ప్రతి కార్యక్రమం బిహార్ ప్రజలకు చేరేలా నితీశ్ నాయకత్వం పనిచేసింది. ఇప్పుడు ఆయన మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. నేను, ఎన్డీఏ మిత్ర పక్షా నేతలు అందరమూ ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం’ అని అన్నారు.మేము ముందే చెప్పాం: తేజస్వీ బిహార్లో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్పై బీజేపీ కుయుక్తులు చేసిందని ఆరోపించారు. ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు.‘బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలు కుయుక్తులు, కుతంత్రాలను వాడి, మొత్తం వ్యవస్థను వాడుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాయో తెలుసు. అప్పుడే నితీశ్ కుమార్ను బీజేపీ హైజాక్ చేసిందని చెప్పాం. ఆయనను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోనివ్వరని తెలిపాం. ఆయన ఆ కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని మేము చెప్పాం’ అని తెలిపారు. -
లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్గా మారింది.ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు...మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది...ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది...నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్గా మాట్లాడారు. -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది.అలాగే, తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్గఢ్ నుంచి ఫులోదేవి నేతంను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం జాబితాను విడుదల చేసింది. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయకుంటే.. ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.Phulo Devi Netam from Chhattisgarh.Karamvir Singh Boudh from Haryana.Anurag Sharma from Himachal Pradesh.M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2— ANI (@ANI) March 5, 2026 -
పెద్దలు 'వేం' చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మల్లగుల్లాలు, సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి బరిలో నిలిచే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీతోపాటు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వేం నరేందర్రెడ్డికి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కిరాగానే, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు స్వయంగా వేం నరేందర్రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు అభినందనలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు. ఆ మూడు పేర్ల చుట్టే తిరిగిన చర్చ అభ్యర్థుల ఖరారుకు ముందు ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థి ఎంపికకు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఢిల్లీకి చేరుకున్నా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు అందుబాటులో లేరు. దీంతో సీఎం వారితో జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్లో ప్రధానంగా మూడు పేర్ల చుట్టే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వేం నరేందర్రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, వినయ్కుమార్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది. నెగ్గిన రేవంత్ పట్టు ! ఈ జూమ్ మీటింగ్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వినయ్కుమార్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే వైఖరితో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఆయన సీనియారిటీని ఈ సందర్భంగా సీఎం వివరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎం పట్టుదలకే అధిష్టానం గౌరవం ఇచ్చింది. వేం నరేందర్రెడ్డి వైపే మొగ్గుచూపి, జాతీయ కోటాలో అభిషేక్ మను సింఘ్వీతో కలిపి ఆయన పేరును ఖరారు చేసింది. అభ్యర్థుల బయోడేటా: వేం నరేందర్రెడ్డి జననం: 1960 తల్లిదండ్రులు: వేం వెంకటమ్మ– చెన్న కృష్ణారెడ్డి విద్యార్హతలు: బీఏ కుటుంబ నేపథ్యం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్) రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు మహబూబూబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీలో ట్రబుల్ షూటర్గా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. అభిషేక్ మను సింఘ్వీ జననం: 24 ఫిబ్రవరి 1959 స్వస్థలం: జోధ్పూర్ (రాజస్తాన్) తల్లిదండ్రులు: లక్ష్మీమాల్ సింఘ్వీ, కమల్ సింఘ్వీ కుటుంబ నేపథ్యం: ఇద్దరు పిల్లలు విద్యార్హతలు: ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు. రాజకీయ ప్రస్థానం: గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానం నుంచి 2024 ఆగస్టు 28న రాజ్యసభకు వెళ్లారు. -
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్షాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్ కోరారు. 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్కు వెళ్లి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకున్నారన్న ప్రచారం ఉత్తిదేనా?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తాబా ఖమేనీ (అలీ ఖమేనీ కుమారుడు)ని ఎన్నుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఖండించింది.“దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంపిక చేసిందని మీడియాలో ప్రచారం అవుతున్న నివేదికలకు ఏ ఆధారాలూ లేవు. వాటిని అధికారికంగా ఖండిస్తున్నాం” అని ఎక్స్లో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా, అతడిని టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇవాళ ఉదయమే హెచ్చరించిన విషయం తెలిసిందే.కాగా, మొజ్తాబాకు వారసుడిగా అలీ ఖమేనీని ఎన్నుకున్నారని, సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. కొన్ని గంటల్లోనే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తాబా ఖమేనీని వారసుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పింది.మొజ్తాబా తన దివంగత తండ్రి అలీ ఖమేనీ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నత వర్గం, ఖుద్స్ దళంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మొజ్తాబా తన తండ్రి కంటే కఠిన వైఖరితో ఉంటారని తెలిపింది. ఇరాన్లో నిరసనకారులపై జరిగిన హింస, అణచివేతల వెనుక మొజ్తాబా పాత్ర ఉందని వివరించింది. 2019 నవంబర్లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వంలో ఏ పదవీ లేకపోయినప్పటికీ సుప్రీం నాయకుడి తరఫున అధికారిక ప్రతినిధిగా వ్యవహరించినందుకు అతడిని గుర్తించింది.మరోవైపు, ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరానీయులు దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పార్థివ దేహానికి ఇవాళ రాత్రి టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ ప్రార్థనా మైదానంలో జరిగే కార్యక్రమంలో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది, అంతిమయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ప్రతీకారంతో ఇరాన్పై బాంబులతో దాడి చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.వైట్ హౌస్లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చర్యలు చేపట్టకపోతే, అణుయుద్ధం జరిగేది. వారు అనేక దేశాలను నాశనం చేసేవారు. వారి మనస్తత్వం సరిగ్గాలేదు, కోపంతో ఉన్నారు, వారు పిచ్చివాళ్లు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగించేవారు” అని చెప్పారు. Reports circulating on media regarding potential candidates for leadership selected by Iran’s Assembly of Experts have no official source and are officially denied.#Iran#AssemblyOfExperts#FactCheck pic.twitter.com/g9b9znt8j8— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 4, 2026 -
భారత్ గ్లోబల్ పవర్గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారత్తో పాటు చైనాను గ్లోబల్ పవర్స్గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.అమెరికా అగ్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు. “అమెరికా, ఇజ్రాయెల్పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు. -
పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఎస్-400లపై భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: రష్యా నుంచి మరో ఐదు ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత వాయుసేన చేసిన ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ (డీపీబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో బాలిస్టిక్ క్షిపణులు, కామికాజీ డ్రోన్లదే ఆధిపత్యం. ఈ ఘర్షణ పరిస్థితుల మధ్య ఎస్-400 కొనుగోళ్లకు డీపీబీ నుంచి నిర్ణయం రావడం గమనార్హం.కొనుగోలు ప్రతిపాదనలను డీపీబీ పరిశీలించి, తదుపరి దశకు పంపించే బాధ్యత వహిస్తుంది. భారత వాయుసేన ప్రతిపాదనకు రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని డీపీబీ తాజాగా ఆమోదముద్ర వేయడంతో ఇప్పుడు ఇది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) వద్దకు వెళ్తుంది. ఎస్-400ల కొనుగోళ్ల అవసరం ఉందని డీఏసీ అధికారికంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీఏసీ ఆమోదం తెలిపిన తర్వాతే ధర నిర్ణయ కమిటీ ఏర్పాటు అవుతుంది. కొనుగోలు ధర నిర్ణయించిన తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) తుది ఆమోదం తెలుపుతుంది.ప్రస్తుతం భారతదేశం వద్ద మూడు ఎస్-400 వ్యవస్థలు ఉన్నాయి. మరో రెండు ఈ ఏడాది భారత సాయుధ దళాల్లో చేరనున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ అద్భుతంగా పని చేసింది. భారత్ శత్రు వైమానిక స్థావరాలు, గగన రక్షణ రాడార్లు, కమాండ్ నియంత్రణ వ్యవస్థలపై దాడి చేసినప్పుడు పాకిస్థాన్ యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్ స్పై విమానాలు మన గగనతలంలోకి రాకుండా ఎస్-400 నిరోధించింది. 2025 మే 10న తెల్లవారుజామున బ్రహ్మోస్ రావల్పిండిలోని చక్లాలా వైమానిక స్థావరంలో పాకిస్థాన్ వాయుసేన ఉత్తర కమాండ్ నియంత్రణ నెట్వర్క్ను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ భయపడిపోయి చర్చలకు ముందుకు వచ్చింది.ఇది చదవండి: ఇరాన్తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు 13 రష్యా పాంట్సిర్ ఎస్-1 స్వయంచాలిత (సెల్ఫ్-ప్రొపెల్లెడ్) క్షిపణి వ్యవస్థ కొనుగోలు ప్రతిపాదన కోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రతిపాదన భారత వాయుసేన, ఆర్మీ నుంచి రావాల్సి ఉంది. ఇవి భూమి నుంచి గగనతలంలోని లక్ష్యాలను టార్గెట్ చేసే మధ్య శ్రేణి క్షిపణులు, స్వల్పశ్రేణి రాకెట్లు, కామికాజీ డ్రోన్లను ఎదుర్కొంటాయి. Defence Boost: India plans to procure 5 new S-400 ‘Sudarshan’ air defence squadrons from Russia.Indian Army orders 300 indigenous Dhanush Howitzers for 15 artillery regiments pic.twitter.com/hIcDCbBiQn— The News Drill™ (@thenewsdrill) March 4, 2026 -
కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు.. టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు: కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు తలెత్తడంతో టెక్కీగా విధులు నిర్వహిస్తున్న కోడలు ఆత్మహత్య చేసుకుంది. కోడలి ఆత్మహత్యతో అత్త పరారైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారత్ సిలికాన్ సిటీ బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టెక్ కంపెనీ డెల్ మాజీ ఉద్యోగి సుష్మ(35) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్తో సుష్మ వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు. బెంగళూరులో నివాసం ఉంటున్నారు.అయితే, పునీత్కుమార్ దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం సుష్మ, ఆమె అత్త కల్పన మధ్య వంట చేసే విషయంలో వాగ్వాదం జరిగింది. అత్త తనను వంట చేసేందుకు అనుమతించకపోవడంతో పాటు ఇతర విషయాల్లో తనని వేధిస్తుందని మనోవేధనకు గురైంది. దీంతో ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కానీ సుష్మ కుటుంబ సభ్యులు మాత్రం అత్తింటి అరళ్లకు తాళలేక తమ కుమార్తె ప్రాణం తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుష్మ కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త పునీత్కుమార్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అత్తకోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు గుడ్న్యూస్..
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భీకర యుద్ధం నేపథ్యంలో గల్ప్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు.. స్వదేశం చేరుకుంటున్నారు. అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకున్న వంద మందిని ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానం కొచ్చి విమానాశ్రయానికి చేర్చింది. మరోవైపు.. నేడు గల్ఫ్ దేశాలకు 58 విమానాలు నడపనున్న విమానయాన సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.వివరాల మేరకు.. నేడు గల్ప్ దేశాలకు ఇండిగో 30, ఎయిరిండియా 23 విమానాలు నడపనున్నట్లు విమానయానశాఖ వెల్లడించింది. అలాగే, గల్ఫ్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం అదనపు విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్ ధరలు పెరగకుండా నిరంతరం కేంద్రం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల కొచ్చి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన 31 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి.#WATCH | Kochi, Kerala: Malayalam Actress Swasika, who arrived at Cochin International Airport from Abu Dhabi, says, "Heavy panic situation is not there, but still, as we are from another country, so definitely we will get a little panic... I was supposed to come on 28th… pic.twitter.com/AS5XloeHTT— ANI (@ANI) March 4, 2026ఇక, యుద్ధం కారణంగా ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 1,221 విమానాలు, విదేశీ విమానయాన సంస్థల నుంచి 388 విమానాలు రద్దు అయినట్టు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.a అలాగే, ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. గల్ప్ దేశాల నుంచి భారత్ చేరుకున్న ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణంలో తాము భయానక పరిస్థితులను వెల్లడిస్తున్నారు.#WATCH | Delhi: A passenger, who arrived at IGI Airport from Dubai, says, "I was in Dubai for three days, so there were problems at some places, but the administration there managed everything well. Sounds of explosives were coming from some places, but there was not much… pic.twitter.com/5RNZdJjtvS— ANI (@ANI) March 3, 2026 -
రాజ్యసభకు నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సన్నాహాలను వేగవంతం చేసింది. మంగళవారం 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను బిహార్ నుంచి బరిలోకి దించనుంది.తొలివిడతగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఖాళీ అయ్యే స్థానాలకు బీజేపీ ప్రకటించిన పేర్లు ఇవే..బిహార్ నుంచి నితిన్ నబీన్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శివేష్ కుమార్, అసోంనుంచిఎమ్మెల్యే తెరాష్ గోవాలా, రాష్ట్ర మంత్రి జోగెన్ మోహన్, ఛత్తీస్గఢ్ నుంచి పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి లోక్సభ మాజీ ఎంపీ సంజయ్ భాటియా, ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాజ్యసభ ఎంపీగా ఉన్న సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ రాహుల్ సిన్హా ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఈనెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మోదీ యూట్యూబ్ చానల్కు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ చానల్ 3 కోట్ల సబ్స్క్రైబర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక రెండోస్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కొనసాగుతున్నారు. ఆయనకు మోదీకున్న ఫాలోవర్లలో నాలుగోవంతు సబ్స్క్రైబర్లున్నారు. ఇక, దేశంలోనూ ఇతర నాయకులతో పోలిస్తే మోదీకి ఎక్కువ సబ్స్క్రైబర్లున్నారు. గత నెలలోనే ఇన్స్టాగ్రామ్లో 10కోట్ల ఫాలోవర్ల చరిత్రాత్మక మైలురాయిని ప్రధాని అధిగమించిన సంగతి తెలిసిందే. -
ఒమన్, కువైట్, ఖతార్ పాలకులకు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు షేక్ సబా అల్–ఖలీద్ అల్–హమద్ అల్–ముబారక్ అల్–సబా, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిపై వారితో చర్చించారు. మూడు దేశాలపై దాడులతోపాటు సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల ఉల్లంఘన జరుగుతుండడాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై చర్చించారు. భారతీయులకు తగిన రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ గత రెండు దేశాల్లో పశ్చిమాసియాలో ఎనిమిది దేశాల అధినేతలతో మాట్లాడారు. ప్రధానంగా భారతీయుల భద్రతని వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఒమన్, కువైట్, ఖతార్ దేశాల పెద్దలతో మాట్లాడినట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వివాదాలను దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టంచేశారు. భారతీయుల రక్షణ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు మూడు దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. -
సముద్రంలో బిక్కుబిక్కు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయి. భారతదేశ జెండాలతో కూడిన మొత్తం 37 నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆయా నౌకల్లో 1,109 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత గల్ఫ్ సముద్ర తీరంలో విదేశీ జెండాలు ఉన్న నౌకలపై పలు దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ పరిణామాలు భారత షిప్పింగ్ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. భారత నౌకలకు, సిబ్బందిని తగిన రక్షణ కల్పించడానికి భారత నావికాదళం, విదేశాంగ శాఖ, మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ) సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. -
ప్రపంచంలో భారత్ స్థాయి తగ్గేలా చేయొద్దు: రాహుల్
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఈ తీరు ప్రపంచంలో భారత స్థాయిని తగ్గిస్తుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అశాంతి నెలకొన్న ఆయా ప్రాంతాలను అతిపెద్ద ఘర్షణ వైపు నడిపిస్తున్నాయి. దాదాపు కోటి మంది భారతీయులు సహా కోట్లాది మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతా పరమైన ఆందోళనలు వాస్తవమే అయినా, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత పెంచేస్తాయి.ఇరాన్పై జరుగుతున్న ఏకపక్ష దాడులను, అలాగే ఇతర పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. హింస హింసనే పుట్టిస్తుంది. చర్చలు, సంయమనం పాటించడమే శాంతికి ఏకైక మార్గం. ఈ పరిస్థితుల్లో భారత్ నైతికంగా స్పష్టమైన రీతితో ఉండాలి. అంతర్జాతీయ చట్టాలు, మనుషుల ప్రాణాలను కాపాడడంలో భారత్కు స్పష్టంగా మాట్లాడే ధైర్యం ఉండాలి.వివాదాలకు శాంతియుత పరిష్కారం చూపడానికి కృషి చేయడం మన విదేశాంగ విధానం, సార్వభౌమత్వంలో ఉంది. అది స్థిరంగా ఉండాలి. ప్రధాని మోదీ మాట్లాడాలి. ప్రపంచ క్రమాన్ని నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేతను హత్య చేస్తే ఆయన మద్దతు ఇస్తున్నారా? నిశ్శబ్దం ఇప్పుడు ప్రపంచంలో భారత్ స్థాయిని తగ్గిస్తుంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ ప్రతీకారదాడులకు దిగడంతో అమెరికా మళ్లీ భీకరదాడులు చేస్తామని హెచ్చరించింది. -
సోషల్ మీడియాలో మోదీ దూకుడు.. సాటెవ్వరు..
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూట్యూబ్లో మోదీ మరో ఘనత సాధించారు. 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నేతగా మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ నేతకూ ఇంతమంది సబ్స్క్రైబర్లు లేరు. ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (6.58 మిలియన్ల సబ్స్క్రైబర్లు ) ఉన్నారు. అయితే, బొల్సొనారోకు ఉన్న ఫాలోవర్లు మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగింట ఒకవంతు మాత్రమే.అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు ఏడు రెట్లు. ఇక భారత్లోని నేతల విషయానికి వస్తే కూడా ఫాలోవర్ల విషయంలో మోదీదే ఆధిపత్యం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య మూడురెట్లు ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు నాలుగేసి రెట్ల చొప్పున అధికం.మోదీకి యూట్యూబ్లో 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మోదీకి 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.మోదీ ఇన్స్టాగ్రామ్లో 2014లో జాయిన్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్నకు ఉన్న ఫాలోవర్ల కంటే మోదీకి రెట్టింపు మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్నకు ఇన్స్టాలో 43.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండొనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 15 మిలియన్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లులాకు 14.4 మిలియన్లు, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్కు 11.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత్లో మోదీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. యోగికి ఇన్స్టాలో 16.1 మిలియన్ల మంది, రాహుల్ గాంధీకి 12.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే.. 45 రోజుల్లో..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్షా బంపరాఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోరి మథురాపుర్లో బీజేపీ పరివర్తన్ యాత్రను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును వ్యతిరేకించకపోతే.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి హిందూ శరణార్థి ఇప్పటికే పౌరసత్వాన్ని పొందేవాడు. అయినప్పటికీ హిందూ శరణార్థులెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క హిందూ శరణార్థి కూడా పౌరసత్వాన్ని కోల్పోకుండా చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్రమ చొరబాటుదారులను లేకుండా చేస్తాం. చొరబాటుదారుల పేర్లను ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి మాత్రమే తొలగిస్తున్నాం. దీనిపై మమతా దీదీ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే చొరబాటుదారులను పూర్తిగా ఇక్కడి నుంచి పంపించేస్తాంప్రజల కోసం దీదీ చేసిందేమీ లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను మాత్రం ఆమె బుజ్జగిస్తున్నారు. మేమే రామ మందిరాన్ని, కాశి విశ్వనాథ్, మహాకాల్ కారిడార్ను కట్టించాం. మమతా బెనర్జీ ప్రజల్ని విస్మరించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే వారి పద్ధతి. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు అందుకుంటున్నారు. బెంగాల్ ఉద్యోగులు మాత్రమే ఇప్పటికీ ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం’ అని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
‘భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది’.. పాక్ అధ్యక్షుడు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు చేస్తుంటే తనని బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం ‘హైడ్రో టెరరిజా’నికి పాల్పడింది. రాజకీయానికి నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమజసం కాదు. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మేము శాంతి, సంభాషణ ద్వారానే సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలే భారత్తో చర్చలు జరిపేందుకు పాక్ సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేశారు.జర్దారీ వ్యాఖ్యలు,ఇటీవల భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత జఠిలమయ్యాయి. ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు శాంతి మార్గంలో ముందుకు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అని కాలమే నిర్ణయించాల్సి ఉంది. Pakistani President Asif Ali Zardari says they are ready for negotiations with India.Zardari says:My message to them (India) is to move away from the war theater to meaningful negotiation tables, because that is the only path for regional security. pic.twitter.com/Kfh0aDSCy7— OsintTV 📺 (@OsintTV) March 2, 2026 -
వారసత్వంగానే రొమ్ము కేన్సర్!
సాక్షి,చెన్నై: రొమ్ము కేన్సర్ రోగులపై ఐఐటీ మద్రాస్, కార్కినోస్ హెల్త్కేర్ చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని రొమ్ము కేన్సర్ రోగులలో ప్రతి నలుగురిలో ఒకరికి వారసత్వంగా వచ్చే జన్యు లోపాల వల్లే సంభవిస్తోందని పరిశోధకులు తేల్చారు. ఈ వివరాలను ఐఐటీ మద్రాస్ సోమవారం ప్రకటించింది. రొమ్ము కేన్సర్కు కారణమయ్యే బీఆర్సీఏ 1,2 జన్యువుల కంటే ఎక్కువగా, ఇతర జన్యువులలో లోపాలు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించిందని పేర్కొంది. 67% వారసత్వ కేసులు ఈ ప్రామాణిక బీఆర్సీఏ జన్యువుల వెలుపలే ఉన్నాయని వెల్లడించింది.అంతర్జాతీయ డేటా బేస్లలో లేని, కేవలం భారతీయ జనాభాలోనే కనిపించే ప్రత్యేక జన్యు వైవిధ్యాలను పరిశోధకులు కనుగొన్నారు. చికిత్సలో వాడే మందులు అందరికీ సురక్షితం కాదని, 3.13% నుంచి 5% మంది రోగులలో ‘డీపీవైడీ’అనే జన్యు వైవిధ్యం వల్ల కీమోథెరపీ తీవ్రమైన విషప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులలో కేవలం కేన్సర్ మాత్రమే కాకుండా ఇతర తీవ్రమైన వంశపారంపర్య సమస్యలు కూడా బయటపడ్డాయన్నారు. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎస్.మహాలింగం పర్యవేక్షణలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్టాత్మక బీఎంసీ కేన్సర్ జర్నల్లో పొందుపరిచినట్లు ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఇది భవిష్యత్తులో భారతీయ రోగులకు వారి జన్యువుల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి ఒక బలమైన పునాది కానుందని పేర్కొంది. -
భారత్కు 2.6 బిలియన్ డాలర్ల యురేనియం
న్యూఢిల్లీ: యురేనియం, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో భారత్, కెనడా మధ్య కీలకమైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా నూతన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశారు.రక్షణ, క్రిటికల్ టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, మార్క్ కార్నీ తీర్మానించారు. కెనడా ప్రధానితో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, కెనడా సంబంధాలు ఇప్పుడు నూతన శక్తి, పరస్పర విశ్వాసం, సానుకూలతను సంతరించుకున్నాయని ఉద్ఘాటించారు. యురేనియం ఒప్పందంలో భాగంగా భారత అణు ఇంధన రంగానికి కెనడా సహకారం అందించబోతోంది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా చేయనుంది. సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసాత్మక భావజాలం కేవలం భారత్, కెనడాలకే కాకుండా భూగోళంపై మొత్తం మానవాళికి ముప్పుగా మారాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండు దేశాలదీ ఒక్కటే మాట అని వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంతోపాటు రాడికలైజేషన్పై పోరాటంలో భారత్, కెనడా మధ్య సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి అత్యంత కీలకమని అన్నారు. కెనడాపై దాడులు, పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, అక్కడి ప్రజల భద్రతకు సవాళ్లు ఎదురవుతుండడంపై మోదీ, మార్క్ కార్నీ చర్చించారు. అభిప్రాయాలు పంచుకున్నారు.వివాదాలు, ఘర్షణలను సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అలాంటి ప్రయత్నాలకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి భద్రత కోసం ఆయా దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు బలహీన పడుతున్న నేపథ్యంలో భారత్తో వాణిజ్యానికి కెనడా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తమ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలను మరింత విస్తృతపర్చుకోవాలని ప్రధాని మోదీ, మార్క్ కార్నీ నిర్ణయించుకున్నారు. భారత్లో కెనడా వర్సిటీ క్యాంపస్లు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని మరో నాలుగేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ధ్యేయమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. భారత్, కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని, దీనివల్ల రెండు దేశాల్లో నూతన పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కెనడా పెన్షన్ నిధి నుంచి భారత్లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారని, మనదేశ ప్రగతి చరిత్ర పట్ల కెనడాకు ఉన్న బలమైన విశ్వాసానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 13 బిలియన్ డాలర్లుగా ఉంది. కెనడా నుంచి అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.తద్వారా సప్లై చైన్స్ బలోపేతం అవుతాయన్నారు. ఇంధన రంగంలో ‘తదుపరి తరం భాగస్వామ్యం’ నిరి్మంచుకుంటున్నామని చెప్పారు. హైడ్రోకార్బన్లు సహా పునరుత్పాధక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ స్టోరేజీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. దీర్ఘకాలంలో యురేనియం కోసం కెనడాలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ హర్షం వ్యక్తం చేశారు.రక్షణ రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం నానాటికీ పెరుగుతుండడం రెండు దేశాల లోతైన మైత్రికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక అని వివరించారు. కెనడా యూనివర్సిటీల క్యాంపస్లు మన దేశంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. విద్యా రంగంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయని స్పష్టం చేశారు. కీలక రంగాల్లో భారత్తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నదే తమలక్ష్యమని మార్క్ కార్నీ తేలి్చచెప్పారు. ఇరుదేశాలు లబ్ధి పొందేలా కలిసి పని చేస్తామన్నారు. యురేనియం ఒప్పందాన్ని భారత్, కెనడాల స్నేహానికి ప్రతీకగా అభివరి్ణంచారు. సంస్కరణలు, సులభతర వాణిజ్యానికి పెద్దపీట: మోదీ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశీయంగా వినియోగం పెరుగుతుండడం, భారీగా పెట్టుబడులు వస్తుండడం, డిజిటల్ ఎకానమీ వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సోమవారం ఇండియా–కెనడా సీఈఓ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. సంస్కరణలతోపాటు సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు తీయడం తథ్యమని స్పష్టం చేశారు. కెనడాతో కలిసి త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఏపీఏ) కుదుర్చుకుంటామని వెల్లడించారు. ఈ సదస్సులో భారత్, కెనడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. -
యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఢిల్లీ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. హింస జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచనలు చేసింది.వివరాల మేరకు ఇరాన్పై దాడుల నేపథ్యంలో నిన్న(ఆదివారం) జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్, యూపీలోని లక్నోలో షియా ముస్లింలు నిరసనలకు దిగారు. దీంతో, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్లో నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఇరాన్ రాడికల్ మతబోధకుల రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి పెట్టాలని హోంశాఖ.. రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లేఖలు రాసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆదివారం భారత్లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ట్రాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. 15 లక్షల షియా ముస్లింలు ఉన్న కశ్మీర్లోని శ్రీనగర్, బుద్గాం, బందిపొరా, అనంత్నాగ్, పుల్వామాలో షియాలు గుండెల మీద బాదుకొంటూ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇరాన్లోని తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరారు. యూపీలోని లక్నో, అజ్మీర్లోనూ నిరసనలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో 1986లో ఖమేనీ సందర్శించిన ఓ గ్రామంలో స్వచ్చందంగా దుకాణదారులు షాపులను మూసివేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని గ్రామస్థులు నిర్ణయించారు. దీంతో, పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. -
‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్!
ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి. లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది. భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. -
ప్రయాణికులకు అలర్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్ను ఎయిర్ ఇండియా సోమవారం(మార్చి 2) రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణీకులకు సూచనలు చేసింది.ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై, తిరుచిరాపల్లి సహా పలు విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి సంస్థలు కూడా తాత్కాలికంగా వాటి సర్వీసులను నిలిపివేశాయి. దీంతో, యూరప్ వెళ్లే విమానాలు సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.దాడులు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో’ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు 184 అంతర్జాతీయ విమానాలను పాకిస్థాన్ రద్దు చేసింది. అటు పశ్చిమాసియా దేశాల్లోనూ 1,800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) వెల్లడించింది.మరోవైపు.. ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా విమానాశ్రయాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. -
సీసీఎస్ అత్యవసర సమావేశం.. నెతన్యాహుకు మోదీ ఫోన్
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ.. నెతన్యాహుకు సూచించినట్టు చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా మోదీ.. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే, యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని.. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu— Narendra Modi (@narendramodi) March 1, 2026సీసీఎస్ అత్యవసర సమావేశం.. అయితే.. భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం వచ్చింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు రోజుల పర్యటన నుండి ఆయన న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత చమురు దిగుమతులకు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా CCS అంచనా వేసినట్టు తెలుస్తోంది.మధ్యప్రాచ్యంలోని భారతీయ పౌరుల భద్రత, వివాదం మరింత తీవ్రమైతే అత్యవసర ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్లో, 40,000 మందికి పైగా ఇజ్రాయెల్లో, పశ్చిమాసియా మరియు గల్ఫ్లో సుమారు తొమ్మిది మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు సమాచారం. తాజా దాడుల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. -
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల మూడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకే ప్రారంభమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణం 2028, జూలై 6న ఏర్పడుతుందని వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో గ్రహణ సమయంవివరాలు ఇలా..⇒ విజయవాడ నగరంలో సాయంత్రం 6.14 గంటలకు చంద్రోదయం కానుంది. గ్రహణం సాయంత్రం 6.48 గంటలకు విడుస్తుంది. సుమారు 34నివిుషాలు గ్రహణ ఛాయలు కనిపించనున్నాయి.⇒ రాజమహేంద్రవరంలో 6.07గంటలకు చంద్రోదయం అవుతుంది. 6.48గంటలకు గ్రహణం ముగుస్తుంది. సుమారు 41 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుంది. ⇒ నెల్లూరులో సాయంత్రం 6.18 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. గ్రహణం ముగిసే సమయం 6.48 గంటలు. నెల్లూరు వాసులు సరిగ్గా 30 నిమిషాల పాటు ఈ ఖగోళ వింతను చూడవచ్చు. -
బీజేపీ పాలనకు కౌంట్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు తీర్పుతో మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలైనా గడవకమునుపే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందికి దించేందుకు కౌంట్డౌన్ మొదలైందంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం జంతర్మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. మద్యం విధానం కేసులో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కుట్రపన్నారని ఆరోపించారు. అయితే, కోర్టు ఇచి్చన చారిత్రక తీర్పు తాను కరుడుగట్టిన నిజాయతీపరడన్నది రుజవైందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీలో భయమొదలైందంటూ ఆయన..నిరంకుశుడు ఇలా భయపడుతున్నాడంటే దానర్థం..అతడి పాలనకు ముగింపు దగ్గరపడున్నట్లేనని పేర్కొన్నారు. చిన్నారుల విద్య కోసం పోరాడిన, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్చుక్ను మోదీయే జైలులో పెట్టించారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన ఒక రోజు పార్లమెంట్కు వెళ్లలేదు. ట్రంప్ అన్నా మోదీకి భయమే’అని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయన్నారు. రహదారులు, ఆరోగ్య రంగం, విద్య, పారిశుధ్యం..ఇలా అన్నీ దారుణంగా మారాయని విమర్శించారు. జీవించగలిగే భారత్ను ప్రజలు కోరుకుంటుండగా వికసిత్ భారత్ అంటూ ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పరీక్షా పే చర్చ పేరుతో డ్రామాలు ఆపి, పరీక్ష పత్రాల లీకేజీని అరికట్టాలన్నారు. ఏడాది పాలనలోనే ఢిల్లీని బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. దేశానికి మోదీ చేసిందేమీ లేదంటూ కేజ్రీవాల్..కుట్రలు, ఓటర్ల జాబితా అవకతకల ద్వారానే ఆయన అధికారంలో కొనసాగుతున్నారంటూ ఆరోపించారు. -
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
న్యూఢిల్లీ: ఓ యువతి తనతో రెండేళ్లుగా సంబంధం నెరపుతున్న యువకుడికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకుని కక్షతో రగిలిపోయింది. నమ్మకంగా పిలిపించుకుని, మత్తు మందిచ్చి, అతడి మర్మావయవాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు(22) హిందూరావ్ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చేరాడు. ఆస్పత్రి అధికారుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడిని యూపీలోని రాంపూర్కు చెందిన ఆర్ఎంపీగా పనిచేసే విసర్జీత్గా గుర్తించారు. ఇతడికి రెండేళ్ల క్రితం ఢిల్లీలోని వజీరాబాద్కు చెందిన అమీనా ఖాతూన్తో పరిచయమేర్పడింది. ఫిబ్ర వరి 24వ తేదీన అమీనా వద్దకు విసర్జీత్ వచ్చాడు. ఆ రోజు రాత్రి అతడికి అమీనా మత్తు పదార్థం కలిపిన పాలను తాగించింది. మత్తులోకి జారుకున్నాక అతడి మర్మాయవాలను పదునైన ఆయుధంతో కోసేసింది. అప్పటికే పెళ్లయినా కాలేదని విసర్జీత్ చెప్పడంతో ఆగ్రహంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లారాక విసర్జీత్ గాయాలతో దగ్గర్లోని హిందూరావ్ ఆస్పత్రిలో చేరాడు. వివిధ సెక్షన్ల కింద అమీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. అమీనా స్వస్థలం బిహార్లోని కటిహార్ ప్రాంతం. -
నితీశ్కు ప్రధాని మోదీ... పుట్టినరోజు శుభాకాంక్షలు
పట్నా/చెన్నై/న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం 76 ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ గవర్నర్, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనామెయిన్ తదితరులు నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దార్శనికత, అభివృద్థి పథకాలతో లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్న నితీశ్కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రారి్థంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, గవర్నర్ ఆర్.ఎన్.రవి, సినీనటుడు రజనీకాంత్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే ప్రముఖులు అన్నాదురై, ఎం.కరుణానిధి స్మారక చిహ్నాల వద్ద స్టాలిన్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. తమిళ భాష, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తన జీవిత ధ్యేయమని ఎక్స్ వేదికగా ప్రకటించారు. మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్కు కూడా ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్ ప్రజల సేవలో ఆయన దీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. పంజాబ్, హరియాణ హైకోర్టులో మూడోస్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24 పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళితే ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులవుతారు. 2028లో జస్టిస్ లీసా గిల్ పదవీ విరమణ.. ఆలోపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2028 నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. ఆ లోపు పంజాబ్, హరియాణ రాష్ట్ర కోటాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పంజాబ్, హరియాణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో సహా మొత్తం ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వీరిలో జస్టిస్ సూర్యకాంత్ 2027లో, జస్టిస్ రాజేష్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్లో, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ 2028 మార్చిలో పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా పదవీ విరమణకు ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉంది. కొత్త విధాన నిర్ణయం తీసుకున్న కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ లతో కూడిన కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో కొత్త విధాననిర్ణయం తీసుకుంది. న్యాయపాలన సామర్థ్యాన్ని, నాణ్యతను బలోపేతం చేయడానికి కొత్త విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో ఆ ఖాళీ ఏర్పడటానికి కనీసం రెండునెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనివల్ల సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు వ్యవహారాలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అక్కడ ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీ అయిన వెంటనే సీజేగా బాధ్యతలు స్వీకరించడానికి వీలుంటుందని కొలీజియం పేర్కొంది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే, అదే హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు. కొద్దినెలల తరువాత వేరే హైకోర్టు నుంచి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు. చాలా సందర్భాల్లో హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని మాతృ హైకోర్టు కోటా నుంచి వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమిస్తుండేవారు. ఆ న్యాయమూర్తి తాత్కాలిక సీజేగా కొంత అనుభవం గడిస్తారన్న ఉద్దేశంతో గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీజే అదే హోదాలో పదవీ విరమణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజే నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్ నేపథ్యం.. 1966 నవంబర్ 15న జన్మించిన ఆమె చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆమె పంజాబ్, హరియాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హరియాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
కార్నీ పర్యటన ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి శుక్రవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో దిగారు. అనంతరం పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఆదివారం కార్నీ ఢిల్లీ చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో కూడా భేటీ అవుతారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యానంతరం ఇరుదేశాల సంబంధాలు బాగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. వాటిని తిరిగి బలోపేతం చేసుకోవడంతో పాటు పలు రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. భారత్, కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ సహా పలు రంగాలపై ప్రధానులు లోతుగా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ పేర్కొంది. -
మా సచ్ఛీలత రుజువైంది
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు తీర్పును ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (57) స్వాగతించారు. తాను, ఆప్ నేత మనీశ్ సిసోడియాతో పాటు తమ పార్టీ కరడుగట్టిన నిజాయితీకి మారుపేరని ఈ తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే ఢిల్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరపాలి. బీజేపీకి 10 సీట్లకు మించి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా’’అంటూ సవాలు విసిరారు! తీర్పు సమయంలో కేజ్రీవాల్ కోర్టులోనే ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. సిసోడియా ఆయన్ను ఓదార్చారు. అనంతరం కేజ్రీవాల్ గద్గద స్వరంతో మాట్లాడారు. ‘‘కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో అన్ని వ్యవస్థలూ నిరంతర దాడికి గురవుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి తీర్పు ఇవ్వడం ద్వారా జడ్జి గొప్ప సాహసం ప్రదర్శించారు’’అంటూ అభినందించారు. తనపై నమోదైన కేసును స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్రగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆప్ను రాజకీయంగా అంతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘నా నిజాయితీపై, పరువు ప్రతిష్టలపై తప్పుడు కేసుతో దాడి చేశారు. దేశంలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిని ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జైలుపాలు చేశారు. ఆప్ అగ్ర నేతలు ఐదుగురిని జైల్లో పెట్టారు. మాపై ఇష్టానికి బురదజల్లారు. టీవీల్లో నిరంతరం చర్చలు జరిపారు. కానీ ఇదంతా పూర్తిగా తప్పుడు కేసని ఇప్పుడు రుజువైంది. దేవుడు మాతో ఉన్నాడని నేనెప్పుడూ చెబుతూ వచ్చాను. ఇన్నేళ్లలో నేను సంపాదించుకున్నది నిజాయితీ ఒక్కటే’’అన్నారు. అధికారం కోసం దేశంతో, రాజ్యాంగంతో ఆటలాడొద్దని మోదీకి హితవు పలికారు. ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కాలుష్యం, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలెన్నో ఉన్నాయి. వాటిని పరిష్కరించి అధికారంలోకి రండి’’అని సూచించారు. మద్యం కుంభకోణం అభియోగాలకు సంబంధించి తమపై ఈడీ కేసులను కూడా కొట్టేయాలని కోర్టును కోరతామని అనంతరం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు. మోదీకి ఏకైక అవకాశం... నన్ను చంపించడమే! జైలు నుంచి వచ్చాక తాను మౌనం వహించానని మాయమైపోయానని చాలామంది అన్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ‘‘నేను రాజకీయ నాయకున్ని కాదు. నేతలకు తోలు మందంగా ఉంటుంది. తిట్టినా పట్టించుకోరు. కానీ నన్ను అవినీతిపరుడంటే, జైల్లో పెడితే, నా కుటుంబాన్ని ఎద్దేవా చేస్తే కచ్చితంగా బాధపడతాను. అందుకే నా నిర్దోషిత్వం దేశానికి రుజువయ్యేదాకా మౌనం వహించాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నా హృదయం మీదినుంచి పెద్ద భారం తొలగిపోయింది’’అన్నారు. ‘‘మోదీ నాపై పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించారు. జైల్లో పెట్టించారు. అయినా నన్నేమీ చేయలేకపోయారు. ఇక మోదీకి మిగిలిన ఆప్షనల్లా ఒక్కటే. నన్ను చంపించడం! లేదంటే నన్ను తట్టుకోవడం ఆయన వల్ల కాదు’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆనందోత్సాహాలు తీర్పు అనంతరం కేజ్రీవాల్కు ఆయన నివాసంలో ఘనస్వాగతం లభించింది. భార్య సునీతను, పిల్లలను హత్తుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీలో 5, ఫిరోజ్షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీగా గుమిగూడారు. హోలీ ముందే వచ్చిందంటూ డప్పులు మోగిస్తూ, మిఠాయిలు పంచుతూ, చిందులేస్తూ సందడి చేశారు. కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తన భర్త నిజాయితీకి మారుపేరని సునీత అన్నారు. కొనసాగనున్న ఈడీ దర్యాప్తు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ‘‘ఇది స్వతంత్ర దర్యాప్తు. ఈ కేసులో ఇప్పటికే విశ్వసనీయమైన ఆధారాలు లభించాయి. కుంభకోణం తాలూకు మొత్తాలను ఎక్కడెక్కడికి ఎలా తరలించిందీ, వాటితో ఏమేం చేసిందీ ఇప్పటికే వివరంగా పొందుపరిచాం’’అని వారు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం ఈడీ తనంత తానుగా క్రిమినల్ కేసు పెట్టలేదు. పోలీస్, సీబీఐ ఇతర చట్టపరమైన సంస్థల ఫిర్యాదు ఆధారంగానే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా 2022 ఆగస్టు 22న ఈడీ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు ప్రకారం ప్రాథమిక కేసులో నిందితునికి విముక్తి లభిస్తే దాని ఆధారంగా నమోదైన మనీలాండరింగ్ కేసు కొట్టివేతకు గురైనట్టే. దీనిపై ఈడీ అభ్యంతరం లేవనెత్తుతోంది. మనీ లాండరింగ్ కేసులను స్వతంత్ర కేసులుగా పరిగణించాలని, ప్రాథమిక కేసు తీర్పుతో వాటిని ముడిపెట్టొద్దని వాదిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటిదాకా 8 చార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో 40 సంస్థల పేర్లను పేర్కొంది. కుంభకోణానికి కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్ నేతలు తదితరులతో కలిసి ఈ కుట్రకు తెర తీశారని ఆరోపించింది. కేజ్రీవాల్, సిసోడియా సహా 18 మందిని అరెస్టు చేసింది.స్వాగతించిన విపక్షాలు న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తదితరులు నిర్దోషులంటూ కోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలు స్వాగతించాయి. మోదీ సర్కారు తప్పుడు ప్రచారానికి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి తీర్పును చెంపపెట్టుగా అభివరి్ణంచాయి. బీజేపీ మాత్రం ఈ అంశంపై ప్రజలు ఎప్పుడో రాజకీయ తీర్పు వెలువరించారంటూ స్పందించింది. ఊహించిన స్క్రిప్టే: కాంగ్రెస్ ‘‘బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు. అవసరార్థం ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే పాము వంటిది. కాంగ్రెస్ను ఓడించేందుకు ఎంతకైనా దిగజారుతుంది. గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్ వంటి అవసరార్థ భాగస్వామ్య పార్టీ నేతలపై కేసులన్నీ క్రమంగా తెరచాటుకు వెళ్లిపోతాయి. ఇదంతా ఊహించిన స్క్రిప్టే’’ – కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి: బీజేపీ ‘‘మద్యం కుంభకోణానికి సంబంధించి పలు సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. మద్యం విధానం సరైనదే అయితే విచారణ మొదలవగానే ఎందుకు రద్దు చేసినట్టు? దీనిపై న్యాయప్రక్రియ ఇంకా ముగియలేదు. రుజువుల్లేవని మాత్రమే కోర్టు చెప్పింది. వాటిని కేజ్రీవాల్, సిసోడియా నాశనం చేశారని సీబీఐ ఇప్పటికే పలుమార్లు పేర్కొంది. ఈ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు ఇప్పటికే రాజకీయ తీర్పు ఇచ్చేశారు. మీడియా ముందు కల్లబొల్లి ఏడ్పుల డ్రామాతో సానుభూతి పొందాలన్న కేజ్రీవాల్ ప్రయత్నాలు ఫలించబోవు. ఆయన బాలీవుడ్కు వెళ్తే మంచిది!’’ – ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవన్యాయవ్యవస్థే సుప్రీం ‘‘న్యాయవ్యవస్థే సుప్రీం. కనుక కోర్టు తీర్పును అంతా అంగీకరించాలి. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ పాత్రపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పుకు ముందు చేసినవి. ఆయన ఇకపై తన గురించి, సొంత పార్టీ గురించి కాకుండా సమాజం గురించి, దేశం గురించి పని చేయాలి’’ – సామాజిక కార్యకర్త అన్నాహజారే ‘‘ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు సరైన తీర్పు ఇచ్చింది. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఎంతలా దురి్వనియోగం చేస్తోందో ఈ తీర్పు మరోసారి చాటుతోంది. విపక్ష నేతలను తప్పుడు కేసులతో వేటాడుతున్నందుకు నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు దేశానికి క్షమాపణలు చెప్పాలి. – సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ రాజకీయ ప్రతీకార క్రీడలో ఎలా పావులుగా మారుతున్నాయో చెప్పేందుకు ఇది మరో నిదర్శనం. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిని అందుకు పూర్తిస్థాయిలో బాధ్యులను చేయాలి. ఆ మేరకు నిబంధనలు రూపొందాల్సిన అవసరముంది.’’ – సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా‘‘తప్పుడు మద్యం కేసు వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎంతో నష్టపోయింది. కనుక అక్కడ తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఈడీ, సీబీఐతో పాటు రాజ్యాంగ వ్యవస్థలను కూడా బీజేపీ చెరబడుతోంది. అవి ప్రధాని కార్యాలయం చెప్పినట్టల్లా ఆడుతున్నాయి.’’ – ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ‘‘అంతిమంగా సత్యమే గెలుస్తుందనేందుకు ఈ తీర్పు మరో నిదర్శనం. – పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ‘‘రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని కోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది. మేం అవినీతిపరులమని రుజువు చేసేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా సత్యమే గెలిచింది.’’ – ఆప్ నేత మనీశ్ సిసోడియా ‘‘చివరికి సత్యమే గెలిచింది. మద్యం కేసు విచారణ సందర్భంగా మా పారీ్టపై విపరీతమైన ఒత్తిళ్లు కొనసాగాయి. ఆప్ నిప్పులాంటి పార్టీ అని అంతిమంగా తేలింది.’’ – ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి ఎప్పుడేం జరిగిందంటే... 2021 నవంబర్: నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం. 2022 జూలై: అందులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఆదేశాలు. ఆగస్టు: మద్యం కుంభకోణంపై కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ. సెపె్టంబర్: మద్యం విధానాన్ని రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం. 2023 మార్చి 8: కవితకు ఈడీ సమన్లు. 2023 అక్టోబర్: మనీ లాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్కు ఈడీ సమన్లు 2024 మార్చి 15: హెదరాబాద్లో కవితను అరెస్టు చేసిన ఈడీ. మార్చి 21: కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ. మే 10: లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. జూన్ 20: కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు. జూన్ 21: ఈడీ అభ్యర్థన మేరకు బెయిల్ను సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు. జూన్ 25: కేజ్రీవాల్ బెయిల్పై స్టే విధించిన హైకోర్టు. జూన్ 26: జైల్లో ఉన్న కేజ్రీవాల్ను లాంఛనంగా అరెస్టు చూపించిన సీబీఐ. జూలై 12: ఈడీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్. సీబీఐ కేసు నేపథ్యంలో జైల్లోనే కేజ్రీవాల్. జూలై 17: సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్. ఆగస్టు 5: సీబీఐ అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు. ఆగస్టు 12: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్. ఆగస్టు 27: కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు. సెప్టెంబర్ 11: కేజ్రీవాల్ కస్టడీని సెపె్టంబర్ 25 దాకా పొడిగించిన ఢిల్లీ కోర్టు. సెప్టెంబర్ 13: కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్. 2026 ఫిబ్రవరి 12: మద్యం కుంభకోణం కేసులో విచారణ ముగించి తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ కోర్టు. ఫిబ్రవరి 27: కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మొత్తం 23 మంది నిందితులూ నిర్దోషులని కోర్టు తీర్పు. -
హైకోర్టు సీజేలుగా బాధ్యతలు చేపట్టే జడ్జీలను ముందుగానే బదిలీ చేయాలి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలకమైన విధానపర నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు అప్పగించే జడ్జీలను ఆ పోస్ట్ ఖాళీ అయ్యేందుకు కనీసం రెండు నెలలు ముందుగానే ఆయా కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ హైకోర్టు కార్యకలాపాలపై ఆ జడ్జికి మంచి అవగాహన వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో గురువారం సమావేశమైన కొలీజియం అభిప్రాయపడింది. కోర్టు నిర్వహణలో సమర్థంగా, మెరుగ్గా వ్యవహరించగలుగుతారని కొలీజియం సమావేశం పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేయాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైరైన వెంటనే ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియామకం అమల్లోకి వస్తుందని వివరించింది. అదేవిధంగా, కేరళ హైకోరు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 5న రిటైరవనున్నారు. -
పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కవితలతో సహా మొత్తం 23 మందికి ఢిల్లీ సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. వారందరినీ ఈ కేసు నుంచి తప్పిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ తదితరులపై మోపిన ఆరోపణలను నిరూపించేందుకు సీబీఐ తగిన ఆధారాలు చూపలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని స్పష్టం చేసింది. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొంది. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మద్యం వ్యాపారులు కలిపి తాము కోరుకున్న వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కుట్ర పన్నారన్న సీబీఐ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.నిందితుల మధ్య ముందస్తు ఒప్పందం, నేరపూరిత కుట్ర జరిగినట్లు రుజువు చేసే బలమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రధానంగా దినేష్ అరోరా వంటి అప్రూవర్ల సాక్ష్యాలపై ఆధారపడి ఉందని, అయితే వారికి ఇతర స్వతంత్ర సాక్షుల మద్దతు లేదని, అందువల్ల వారి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఢిల్లీ సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. అదే రకంగా హోల్సేల్ లాభాల మార్జిన్ను 5% నుండి 12% కి పెంచడం అనేది విధానపరమైన నిర్ణయమే తప్ప, అది కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడానికే చేశారన్న ఆరోపణలకు సైతం తగిన ఆధారాలను చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవంది.ప్రభుత్వ విధానం తప్పుగా ఉండటం నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదంది. పాలసీలో మార్పుల కోసం కేజ్రీవాల్ నేరుగా నగదు డిమాండ్ చేసినట్లు లేదా కుట్రలో పాల్గొన్నట్లు సీబీఐ చూపిన ఆధారాలు ‘అనుమానాల‘ స్థాయిలోనే ఉన్నాయని, అవి అభియోగాలు నమోదు చేయడానికి సరిపోవని కోర్టు పేర్కొంది. మద్యం పాలసీని మనీష్ సిసోడియా మార్చారని చెప్పలేమని, ఫైళ్ల కదలికలు, నోటింగ్స్ అన్నీ అధికారిక నిబంధనల ప్రకారమే ఉన్నాయని కోర్టు పేర్కొంది.కల్వకుంట కవితను కీలక కుట్రదారుగా పేర్కొన్నప్పటికీ, ఆమె ద్వారా రూ.100 కోట్ల ముందస్తు నగదు బదిలీ జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి సమర్పించిన ఆధారాలు ఎంత మాత్రం సరిపోవని, బలహీనంగా ఉన్నాయని కోర్టు భావించింది. విజయ్ నాయర్కు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేదని, పాలసీ రూపకల్పనలో ఇతను కీలక పాత్ర పోషించాడనడానికి తగిన ఆధారాలు లేవని ఢిల్లీ సీబీఐ కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన ఒక పద్ధతి ప్రకారం, వివిధ విభాగాల మధ్య చర్చల తర్వాత జరిగిందని తేల్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలోనే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోలేవు...ఎన్నికల రాజకీయ పార్టీలు ఖర్చు చేసే నిధుల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను పరిశీలించే ప్రాథమిక అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ’ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951’ కింద ’ఎన్నికల పిటిషన్’ దాఖలు చేసుకోవడమే చట్టబద్ధమైన మార్గమని కోర్టు పేర్కొంది.అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ చట్టం వంటి కఠినమైన చట్టాలను, ఎన్నికల చట్టాల పరిధిలోకి వచ్చే అంశాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యామ్నాయంగా వాడకూడదని కోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ ఆరోపణలను నేరాలుగా మార్చకూడదంది. ఒకవేళ దర్యాప్తు చేయాల్సి వస్తే.. అది ఎన్నికల చట్ట ఉల్లంఘనలకు సంబంధం లేకుండా, స్వతంత్రంగా రుజువయ్యే స్పష్టమైన నేరమై ఉండాలని తెలిపింది. ఎన్నికల వేళ వచ్చే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, చట్ట పాలనను, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని సీబీఐ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాపార అవకాశవాదం నేరం కిందకు రాదు...ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ప్రైవేటు సంస్థలు అందులోని సడలింపులను వాడుకుని లాభపడాలని చూడటం సహజమని కోర్టు పేర్కొంది. ఇలాంటి ‘వ్యాపార అవకాశవాదం’ ఎప్పుడూ నేరం కిందకు రాదని తెలిపింది. ఒకవేళ నేరంగా పరిగణించాలంటే, అందులో మోసం, ఫోర్జరీ, లంచం, క్విడ్ ప్రో కో, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఖచ్చితంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.2002 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించిన సీబీఐ కోర్టు, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాల వల్ల ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరినా, అందులో దురుద్దేశం, చట్ట ఉల్లంఘన లేకుంటే వాటిని నేరంగా పరిగణించలేమని కోర్టు వివరించింది. ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లినంత మాత్రాన లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి లాభపడినంత మాత్రాన దానిని నేరంగా పరిగణించలేమంది. అక్కడ అవినీతి, అక్రమ సంపాదన జరిగినట్లు ఆధారాలు ఉంటేనే అది నేరపూరిత చర్య అవుతుందని తెలిపింది.విధానాల రూపకల్పన, అమలు బాధ్యత పాలకులదే...ప్రజా విధానాలను రూపొందించడం, మార్చడం లేదా పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం అనేది పూర్తిగా శాసన కార్యనిర్వాహక వ్యవస్థల రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు కాబట్టి, సామాజిక అవసరాలను గుర్తించే అధికారం శాసనకర్తలకు ఉంటుందని తెలిపింది. న్యాయస్థానాలు సాధారణంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవని గుర్తు చేసింది. ఒక కొత్త చట్టం లేదా విధానం వచ్చేటప్పుడు ప్రభుత్వం ఈ క్రింది అంశాలను పరిశీలిస్తుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను విశ్లేషించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించడం, పాత విధానం వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేయడం, ఆ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని చర్చించడం వంటి ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగం.నిర్ణయాలను నేరపూరిత చర్యలుగా చూడకూడదు...ప్రభుత్వం పాత విధానంలోని లోపాలను సవరించి కొత్త విధానాన్ని తెచ్చినప్పుడు, దాన్ని కేవలం ‘కుట్ర‘ లేదా ‘నేరపూరిత దురుద్దేశం‘తో చూడకూడదని సీబీఐ కోర్టు తెలిపింది. పాత విధానంలోని లోపాల వల్ల లాభపడిన వ్యక్తులు, కొత్త విధానంలోని మార్పులను అడ్డుకోవడానికి ఫిర్యాదులు, ఆరోపణలు చేయవచ్చునంది. కేవలం ఫిర్యాదుల్లో రాసిన భాషను బట్టి లేదా ఊహించిన కుట్రలను బట్టి విధాన నిర్ణయాలను నేరాలుగా పరిగణించడానికి వీల్లేదంది. నిజాయితీగా తీసుకున్న విధాన నిర్ణయాలను నేరపూరిత చర్యలు చూడరాదంది. ఇలాంటి చర్యల వల్ల పాలకులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ కొత్త సంస్కరణలు తీసుకురావడానికి వెనకాడతారని తెలిపింది. పరిపాలనలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రారని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ఇలాంటి చర్యలు అడ్డుకుంటాయంది.ప్రభుత్వ నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు విశ్లేషించజాలవు... సీబీఐ గానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించే అధికారం లేదని తెలిపింది. ఒక నిర్ణయం వల్ల ఆర్థికంగా లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా అని లెక్కలు వేయడం వారి పని కాదంది. ఆ నిర్ణయం పరిపాలనాపరంగా సరైనదా కాదా అని వారు తీర్పు చెప్పలేరంది. ప్రభుత్వం ఒక పాలసీని ఎందుకు తెచ్చింది? అసలు ఆ పాలసీ అవసరమా? అని ప్రశ్నించే హక్కు కూడా వారికి లేదని తెలిపింది. దర్యాప్తు సంస్థల పని కేవలం చట్టం ప్రకారం నేరం జరిగిందా లేదా?‘ అని చూడటం మాత్రమేనంది. ప్రభుత్వ నిర్ణయాల్లో మంచి చెడులు చూడటం దర్యాప్తు సంస్థల పని కాదని తేల్చి చెప్పింది.ప్రైవేటు సంస్థకు లాభం కలిగినంత మాత్రాన అది నేరం అయిపోదు...ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త విధానం వల్ల ఏదైనా ప్రైవేట్ సంస్థకు అనుకోకుండా లాభం చేకూరవచ్చునని, అంత మాత్రన అది నేరం అయిపోదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ప్రతి నిర్ణయాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం మొదలుపెడితే, నిజాయితీగా పనిచేసే అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ కేసులో ఇరుక్కుంటామో అన్న భయంతో పాలన ఆగిపోతుందని తెలిపింది. రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకు, నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులను వేధించడం వల్ల వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వ విధానాలపై క్రిమినల్ కేసులు పెట్టలేవు...ఒక అధికారి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి చెడు ఉద్దేశం లేనపపుడు అలాంటి వారిని శిక్షించడం తగదని తెలిపింది. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే, దర్యాప్తు సంస్థల అనవసరపు వేధింపుల నుండి వారికి రక్షణ ఉండాలని తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం సరైందా కాదా అనేది అసెంబ్లీ లేదా పార్లమెంటులో చర్చించాలే తప్ప, దానికి బదులుగా క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించి ఆ విధానాన్ని ప్రశ్నించడం రాజ్యాంగ విరుద్ధమంది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనే అంశంపై దర్యాప్తు సంస్థలు క్రిమినల్ కేసులు పెట్టలేవంది. అభివృద్ది చెందుతున్న ఓ దేశానికి అధికారుల నిర్ణయాలలో స్థిరత్వం, నిశ్చయత చాలా ముఖ్యమంది. ఏళ్ళ క్రితం నిజాయితీతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు నేరాలుగా పరిగణించి విచారిస్తే, భవిష్యత్తులో ఏ అధికారి కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించడని తేల్చి చెప్పింది. ఆర్థిక విధానాల విషయంలో కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోకూడదని, అవి ప్రభుత్వ ప్రత్యేక పరిధిలోకి వస్తాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీబీఐ కోర్టు తన తీర్పులో ఉదహరించింది.ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చుననే కోణంలో సీబీఐ దర్యాప్తు సాగింది...ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరును మొదటి నుండి చివరి వరకు పరిశీలించిన తర్వాత, సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పింది. దర్యాప్తు అనేది నిష్పక్షపాతంగా జరగాలని, కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థ ఒక నిర్ణీత లక్ష్యంతో ముందే ఊహించుకున్న నేరారోపణలతో ముందుకు వెళ్లినట్లుగా కనిపిస్తోందని తెలిపింది. దర్యాప్తు సంస్థ తన దృష్టిని మధ్యలో మార్చుకుంటూ, ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చు అనే కోణంలో దర్యాప్తు సాగించిందని కోర్టు తెలిపింది. ప్రచార సంస్థలు , చిన్న వ్యాపారులు, అంగడియాలు (నగదు బదిలీ చేసేవారు), ఇంటి యజమానులు, హోటల్ నిర్వాహకులు, రాజకీయ కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలు చివరకు జాతీయ నాయకత్వాన్ని ఈ కేసులో ఇరికించారంది.ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరిగి ఉంటుందన్న ముందస్తు ఊహతో దర్యాప్తు సాగించిందని తెలిపింది. ఏ ఒక్క విభాగాన్ని వదలకుండా అందరినీ లాగాలన్న ఉద్దేశంతో ఈ దర్యాప్తు జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా దానిని అమలు చేసినప్పుడు అందులో నేరం ఉందని నిరూపించడానికి బలమైన సాక్ష్యం ఉండాలంది. కేవలం రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎవరికైనా లాభం చేకూరిందని భావించి, అందరినీ నేరస్తులుగా చిత్రించడం తగదని కోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యవస్థీకృత నేరం జరుగుతున్నప్పుడు, ఆ నేరాన్ని నడుపుతున్న అసలు వ్యక్తులను వదిలేసి, వారిని రాజకీయ లేదా ఉన్నత స్థాయి అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఉపయోగించుకోవడం సరైన దర్యాప్తు అనిపించుకోదని పేర్కొంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు.. హైకోర్టులో సీబీఐ అప్పీల్
ఢిల్లీ: లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మంది నిందితులను ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అభియోగాలకు తగిన ఆధారాలను సీబీఐ చూపకపోవడంతో నిందితులను స్పెషల్ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే.. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలనుకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా 20 మంది నిందితులందరికీ కోర్టు శుక్రవారం విముక్తి కల్పించింది.అలాగే సీబీఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్షీట్లో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేదని పేర్కొంది. చార్జ్షీట్లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని కూడా న్యాయ మూర్తి గమనించారు. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందని కోర్టు తెలిపింది. -
Liquor Scam Case మోదీ, అమిత్షా కుట్ర : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన స్కాంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్నేత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం కుట్ర పన్నిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగంకేజ్రీవాల్కు క్లీన్ చిట్ రావడంతో అటు ఆప్ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. -
కేంద్రానికి తలనొప్పి.. కోర్టుకు పెనుభారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ట్రిబ్యునళ్ల వ్యవస్థ పనితీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండటం లేదని, అవి ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’(ఎవరికీ సంబంధం లేని ప్రాంతం)గా తయారయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం–2021ను కొట్టివేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీకాలాన్ని పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్పై గురువారం సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది. మీరు తెచ్చిందే.. మీకే తలనొప్పి కోర్టు విచారణలో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. ‘ట్రిబ్యునళ్లను సృష్టించింది కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి అవి ఇప్పుడు మీకు తలనొప్పిగా, మాకు పెద్ద భారం (లయబిలిటీ)గా పరిణమించాయి. రెండు మూడు ట్రిబ్యునళ్లు మినహా మిగతావి వెలువరిస్తున్న ఉత్తర్వులను చూస్తుంటే.. అవి ఏమాత్రం జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోందని’వ్యాఖ్యానించారు. ఎంతటి చెత్త వ్యవస్థను సృష్టించాం..? ఓ కీలక ట్రిబ్యునల్లో పనిచేస్తున్న సభ్యుడి తీరుపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ‘టెక్నికల్ మెంబర్’ఏకంగా తాను ఇవ్వాల్సిన తీర్పు లను జ్యుడీషియల్ సభ్యులతో రాయించడం లేదా బ యటి వ్యక్తులకు ‘ఔట్సోర్సింగ్’ఇవ్వడం చేస్తున్నారని సీజేఐ తప్పుబట్టారు.‘అతడికి ఎంతటి ధైర్యం? సరైన సమయం చూసి అతడిని కచ్చితంగా సాగనంపుతాం. కోర్టులపై భారాన్ని తగ్గించుకోవాలన్న ఆత్రుతలో మనం ఎంతటి అస్తవ్యస్తమైన వ్యవస్థను సృష్టించుకున్నామో కదా’అని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే, టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టీడీశాట్)లో చైర్పర్సన్ లేనప్పుడు టెక్నికల్ మెంబర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంస్థాగత సంక్షోభం తలెత్తకుండా చూడాలని, టెక్నికల్ మెంబర్ ఒక్కరే ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని జస్టిస్ బాగ్చి కేంద్రానికి తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్ సభ్యులకు ఉండాల్సిన కనీస అర్హతలపైనా ధర్మాసనం పెదవి విరిచింది. పర్యావరణ చట్టాలు, వాణిజ్య చట్టాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు.. నాలుగేళ్లలో ఆయా అంశాల్లో నిపుణులు ఎలా అయిపోతారని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం జాతీయ ప్రయోజనాలకే విరుద్ధమని, చక్కదిద్దేందుకు కొత్త యంత్రాంగం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. -
వివాదాస్పద పాఠ్య పుస్తకంపై నిషేధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యానాలతో రూపొందించిన ఒక చాప్టర్తో ముద్రితమైన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం నిషేధం విధించింది. భవిష్యత్తులో దేశవిదేశాల్లో ఈ పుస్తకాన్ని పునర్ముద్రించడంగానీ ఆన్లైన్లో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడం లాంటివి చేయకూడదని జాతీయ విద్యా పరిశోధన శిక్షణమండలి(ఎన్సీఈఆర్టీ), కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘కరప్షన్ ఇన్ ది జ్యుడీషియరీ’, ‘ది రోల్ ఆఫ్ ది జ్యుడీషియరీ ఇన్ అవర్ సొసైటీ’అంశాలతో ముద్రితమైన ‘ఎక్స్ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్(వాల్యూమ్2)’8వ తరగతి సాంఘికశాస్త్ర పాఠ్య పుస్తకాన్ని ఏ పాఠశాలకు పంపిణీచేయొద్దని, ఇప్పటికే పంపిణీ అయిన పుస్తక ప్రతులన్నింటినీ వెంటనే సీజ్ చేసి, వెనక్కి తెప్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంఛోలీల ధర్మాసనం ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. పుస్తకం తుది ఆమోదం, ముద్రణకు బాధ్యులుగా పేర్కొంటూ ఎన్సీఈఆర్టీకి కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అత్యంత వివాదాస్పద, అభ్యంతరకర చాప్టర్ను పుస్తకంలోకి జొప్పించి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, అందులోని పాఠశాల విద్యావిభాగ కార్యదర్శికి కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. బుల్లెట్ దించి రక్తం చిందించారు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించాక విచారిస్తూ సీజేఐ సూర్యకాంత్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘న్యాయవ్యవస్థకు అవినీతి మరకలు అంటిస్తూ న్యాయవ్యవస్థ మీదకు వాళ్లు బుల్లెట్ ప్రయోగించారు. బుల్లెట్ గాయంతో ఈరోజు న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థకు అత్యున్నత సారథిగా ఇందుకు కారకులెవరో కనిపెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. కారకులను న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టాల్సిందే. కఠిన శిక్ష పడాల్సిందే. ఈ అంశంలో లోతైన దర్యాప్తు జరగాలి. అసలు ఇలాంటి పాఠ్యపుస్తకం ఒకటి ప్రచురితమైందని వార్తపత్రికల్లో ఆరి్టకల్ చదవగానే షాక్కు గురయ్యా. ఇలాంటి ప్రచురణ నిజంగానే వచ్చిందా అని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ద్వారా వాకబు చేయించా. ఇది నిజమని తెలిసి హుతాశులమయ్యాం. తప్పుపై పశ్చాత్తాపం చెందాల్సిందిపోయి ఎన్సీఈఆర్టీ తన చర్యను సమరి్థంచుకునే ప్రయత్నంచేశారు. ఇది నిజంగా అత్యంత నిర్లక్ష్యపూరిత, బాధ్యతారహిత, ఉల్లంఘనీయ చర్య. పుస్తకంలోని అంశాలను మేం పరిశీలించాక పక్కా ప్రణాళికతో న్యాయవ్యవస్థ పరువును మంటగలపాలని కంకణం కట్టుకున్నట్లు కని్పస్తోంది. ఈ చాప్టర్ను పొరపాటున ప్రచురించినట్లుగా ఏ కోశాన కని్పంచట్లేదు. న్యాయవ్యవస్థను కుంభకోణాలమయంగా చిత్రించే దుస్సాహసం చేశారు’’అని సీజేఐ అన్నారు. అందరి పేర్లూ ఇవ్వండి.. ‘‘ఈ చాప్టర్ను ఎవరు లిఖించారు? ఆమోదించింది ఎవరు? చాప్టర్పై విస్తృత చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? ఆ సమావేశం తాలూకు మినిట్స్ను, సంబంధిత ఒరిజినల్ రికార్డులను మాకు సమరి్పంచండి. ఈ పాఠ్యపుస్తకాన్ని రచించిన రచయితల పేర్లు, ముసాయిదా అధ్యాయం రూపకల్పనకు బాధ్యులైన అధికారుల వివరాలు ఇవ్వండి’’అని ధర్మాసనం ఎన్సీఈఆర్టీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ దినేశ్ ప్రకాశ్ సక్లానీని ఆదేశించింది. దీంతో పాఠశాల విద్యా శాఖ తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలి్పంచుకుని విద్యాశాఖ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పారు.ప్రధాని మోదీ అసంతృప్తి.. పాఠ్యపుస్తంలోని అంశాలు వివాదాస్పదమవడంతో ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఢిల్లీలో కేంద్రప్రభుత్వ నిర్ణయాలపై తుది ఆమోదం కోసం జరిగిన కేబినెట్ భేటీలో పాఠ్యపుస్తకం అంశం ప్రస్తావనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పిల్లలకు పాఠాలు బోధించాల్సిన అవసరం ఏమొచి్చంది?. మాధ్యమిక స్థాయి విద్యార్థులకు ఇలాంటి విషయాలు ఏ రకంగా ఉపయోగపడతాయి? అసలు ఇలాంటి చాప్టర్ను పెట్టాలని ఎవరు నిర్ణయించారు? ఇలాంటి అంశాలు పాఠశాల స్థాయి దాకా చేరాలని నిర్ణయించిందెవరు? పాఠ్యాంశాలను రూపొందించి ఆమోదించిందెవరు?’’అని మోదీ ఆరాతీసినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎన్సీఈఆర్టీ ‘‘పాఠ్యాంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో తప్పు ఎక్కడ దొర్లింది? విషయంపై అంతర్గత సమీక్ష జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి అనుచితాలు పునరావృతంకాకుండా అడ్డుకుంటాం’’అని ఎన్సీఈఆర్టీ తెలిపింది.కించపరిచే ఉద్దేశం మాకు లేదు: ధర్మేంద్ర ప్రధాన్ ‘‘జరిగినదానికి నేనెంతో బాధపడుతున్నా. న్యాయవ్యవస్థను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఈ అంశంలో దర్యాప్తు జరిపించి చాప్టర్ రూపకల్పన, ఆమోదానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విషయం తెలియగానే పాఠ్యపుస్తకాన్ని ఎవరికీ అందుబాటులోలేకుండా నిలువరించాం’’అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జంషెడ్పూర్లో మీడియాతో అన్నారు. -
తప్పుడు ఫిర్యాదులపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు నమోదు అవుతున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారిని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. కొన్ని సందర్భాల్లో కేసు నమోదు అయిన విషయం ఫిర్యాదు దారుడికి కూడా తెలియడం లేదన్నారు. తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు, దురుద్దేశపూర్వకంగా నమోదు చేసే క్రిమినల్ కేసులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిల్పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం విచారణ చేపట్టింది. తప్పుడు కేసుల వివరాలను తెలపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిరపరాధుల జీవితాన్ని రక్షించాలి ఆరి్టకల్ 32 కింద దాఖలైన ఈ పిల్లో అంశాలు ఇలా ఉన్నాయి. ‘తప్పుడు కేసులను అరికట్టేందుకు పరిపాలనా భద్రత చర్యలు తీసుకోవాలి. నిరపరాధుల జీవితం, స్వేచ్ఛ, గౌరవాలను రక్షించాలి. నిజమైన కేసుల కంటే తప్పుడు కేసుల వల్లనే న్యాయవ్యవస్థపై భారం పడుతోంది. భూ వివాదాలు వంటి సివిల్ కేసులు కొన్ని సందర్భాల్లో.. ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద క్రిమినల్ కేసులవుతున్నా యి. ఫలితంగా గ్రామీణ వాతావరణం ఇబ్బ ందికరంగా ఉంటోంది’అంటూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. రోజూ దేశంలో తప్పుడు కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థలపై ఉందని ఆమె పేర్కొన్నారు. విమర్శలకు భయపడం నిరపరాధులను రక్షించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘కోర్టు ఈ అంశంపై ఆదేశాలు ఇస్తే.. ప్రజల హక్కులను అణచివేస్తున్నారనే ఆరోపణలు రావొచ్చనే విషయాన్ని కూడా మేం గమనించాం’అని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తాము ఎవరో చేసే విమర్శలకు భయపడమని స్పష్టం చేశారు. ‘మమ్మల్ని గ్యాగ్ చేస్తున్నారని అంటున్నారు, అలా చేస్తున్నారని మేం భయంతో ఉండాలా?’అంటూ ప్రశ్నించారు. కొందరు దురి్వనియోగం చేసి మాయవుతామంటే ఎలా అని పేర్కొన్నారు. ‘ఇటువంటి కేసుల విషయంలో సమాజం అవగాహనతో ఉండాలి, పక్కవారి మౌలిక హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి, సోదరభావం పెంపొందించాలి’అంటూ సీజేఐ చెప్పారు. విమర్శల కారణంగా న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని పట్టించుకోకుండా ఉండబోమని ఈసందర్భంగా స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు సూచనలు విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ‘పోలీసు స్టేషన్లు, కోర్టు ప్రాంగణాలు, పంచాయతీ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద తప్పుడు కేసులపై శిక్షలకు సంబంధించిన వివరాలతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు సమయంలో ఆరోపణలు నిజమని అఫడవిట్ లేదా లిఖితపూర్వక హామీ తీసుకోవాలి. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు సమాచారంపై ఉన్న చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. బీఎన్ఎస్–2023లోని సంబంధిత నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. పిటిషన్ ప్రకారం చట్టాల్లో శిక్షల నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి దురి్వనియోగాన్ని నిరోధించే పరిపాలనా వ్యవస్థ లోపించడం వల్ల సమస్య కొనసాగుతోంది, దీనిని పరిష్కరించేందుకు సిద్దపడాలి’అంటూ నోటీసుల్లో పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఈ పిటిషన్పై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఫిర్యాదుదారుడికే తెలియకుండా కేసు? కొన్నిసార్లు అసలు ఫిర్యాదు దారుడికి కూడా తెలియకుండా నకిలీ సంతకాలతో కేసులు నమోదవ్వడం అత్యంత దుర్మార్గమని సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పేద వ్యక్తికి తన పేరుతో కేసు నమోదైందన్న విషయం కూడా తెలియదు. డబ్బు, అధికార ప్రభావంతో దుర్వినియోగం జరుగుతోంది’అంటూ మండిపడ్డారు. ‘ఇటీవల ఓ మహిళ స్వయాన కోర్టుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడు తమ కేసులో భాగస్వామి కాదు’’అంటూ చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు డబ్బు లేదా శక్తి ప్రభావం లేకుండా జరుగుతాయా?’అంటూ సీజేఐ ప్రశ్నలు సంధించారు. -
1917 నాటి అప్పు తిరిగి ఇవ్వాల్సిందే
సీహోర్(ఎంపీ): వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తులు, భవనాలు, వజ్రాభరణాలపై వారసులు న్యాయస్థానాల మెట్లెక్కడం మనం చూస్తూనే ఉంటాం. సబార్డినేట్ కోర్టుల మొదలు సుప్రీంకోర్టు దాకా ఇలాంటి కేసులు కోకొల్లలు. అవన్నీ వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ తగాదాలు. వీటికి పూర్తి భిన్నంగా ఏకంగా ఆనాటి బ్రిటిష్ పాలకులపై మధ్యప్రదేశ్ వ్యాపారి ఒకరు 35,000 రూపాయల పాత బాకీ కట్టాలని ఇప్పుడు న్యాయపోరాటానికి సంసిద్ధమవుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారత్లోని సంపన్నుల నుంచి నాటి బ్రిటన్ ప్రభుత్వం కొంత మేర నగదు మొత్తాలను రుణాలరూపంలో సమీకరించింది. వాటిని తిరిగి చెల్లించేలోపే మనకు స్వాతంత్య్రంఇచ్చేసి వెళ్లిపోయింది. దీంతో తన తాతకు రావాల్సిన రూ.35వేలు అలాగే ఉండిపోయాయని, బ్రిటన్ ఇప్పటికైనా బాకీ తీర్చాల్సిందేనని సేఠ్ జుమ్మా లాల్ రూథియా మనవడు వివేక్ డిమాండ్చేస్తున్నారు. అసలేం జరిగింది? 1914లో మొదలైన మొదటి ప్రపంచయుద్ధకాలంలో నిధుల కటకట నుంచి గట్టెక్కేందుకు బ్రిటన్ ప్రభుత్వం నాటి మధ్యప్రదేశ్ ప్రాంతంలోని సంపన్నుల నుంచీ రుణాలను తీసుకుంది. అప్పట్లో సీహోర్, భోపాల్ సంస్థానాల్లో సంపన్నులుగా ఖ్యాతి పొందిన రూథియాలు సైతం బ్రిటన్ పాలకులకు రుణాలు ఇచ్చారు. సేఠ్ జుమాలాల్ నుంచి భోపాల్ రాజకీయ ప్రతినిధిగా డబ్ల్యూ ఎస్ డేవిస్ రూ.35 వేలు పుచ్చుకున్నారు. ఆ మేరకు రసీదు రాసి సంతకంచేసి ఇచ్చారు. 1917 జూన్ నాలుగోతేదీన ఈ అప్పు ఇచ్చినట్లు రసీదులో ఉంది. అప్పు ఇచ్చాక రెండు దశాబ్దాల తర్వాత 109 ఏళ్ల వయసులో 1937లో సేఠ్ చనిపోయారు. అప్పు పత్రం మాత్రం భద్రంగా ఉంది. ఇటీవలికాలంలో తమ ఇంట్లో పాత వస్తువులను దులుపుతుండగా ఈ అరుదైన పత్రం ఆయన మనవడు, ప్రస్తుతం భోపాల్లో పెద్ద వ్యాపారి వివేక్(65) కంటబడింది. దీంతో ఎలాగైనా తన తాత ఇచ్చిన రుణాన్ని యూకే సర్కార్ నుంచి ముక్కుపిండి వసూలుచేస్తానని ఆయన శపథంచేశారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని అనుబంధ డాక్యుమెంట్లనూ ఆయన మీడియా ముందుపెట్టారు. ‘‘ఇండియా వార్ లోన్ కోసం సేఠ్ నుంచి రూ.35వేలు ముట్టాయి. రుణమిచ్చి ఆయన ప్రభుత్వం, రాజ్యం పట్ల తన విధేయతను ప్రకటించుకున్నారు’’అని అప్పుపత్రంలో రాసి ఉంది. ‘‘వలసరాజ్యపాలనాకాలంలో నాటి పాలకులు తీసుకున్న రుణాలను ఏ విధంగా రాబట్టాలో మా లాయర్లతో చర్చిస్తున్నా. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వానికి నోటీస్లు పంపిస్తా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా సార్వ¿ౌమదేశానికి పాత రుణాలను తీర్చే బాధ్యత ఉంటుంది. ఆ లెక్కన మా తాత డబ్బు మాకు తిరిగి ఇవ్వాల్సిందే. అప్పు ఇచ్చి వందేళ్లు దాటింది. అసలుకు చక్రవడ్డీ లేదా కనీసం సాధారణ వడ్డీగా ఐదు శాతం లెక్కేసుకున్నా ఇప్పడా రుణం కోట్ల రూపాయల్లో ఉంటుంది. నాటి బంగారం రేట్లతో పోల్చుకున్నా సరే ఇప్పుడా మొత్తం 3,000 రెట్లు పెరిగి రూ.10 కోట్లుదాకా రావాల్సిందే’’అని వివేక్ అన్నారు. అయితే వివేక్ వాదన అంతర్జాతీయ చట్టాల్లో ఏ మేరకు చెల్లుబాటు అవుతుందనే సందేహాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చారు. ‘‘నాటి రాజరికం ఇప్పుడు లేదు. పాలకులూ మారిపోయారు. వలసరాజ్యంగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం బ్రిటన్ సర్కార్ చెల్లిస్తుంది? స్వాతంత్య్రం ఇచ్చాక పోతూపోతూ పాత ఒడంబడికలు, ఒప్పందాలు, హామీలతో మాకు సంబంధం లేదు అని బ్రిటిషర్లు చేతులు దులుపుకునే ఉండి ఉంటారు. ఈ లెక్కన నాటి అప్పు నేడు రాబట్టడం కష్టం’’అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అప్పు రాకపోయినా శతాబ్దకాలంనాటి పురాతన పత్రంగాఅయినాఇది ఘన చరిత్రను చాటుతూ శాశ్వతంగా నిలిచి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పత్రం చరిత్రగా ఉండిపోతుందా లేదంటే అప్పు రాబట్టి కొత్త చరిత్ర లిఖిస్తుందా అనేది వివేక్ కొనసాగించే తదుపరి పోరుపై ఆధారపడి ఉంటుంది. -
న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం సహించం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అవినీతి అత్యధికమవుతోందంటూ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’అనే అంశాన్ని జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) చేర్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో అవినీతి, పెండింగ్ కేసులు, న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలతో కొత్త పుస్తకం రూపొందించారని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానంలో ప్రస్తావించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు తక్కువచేసేలా పాఠ్యపుస్తకంలో వ్యాఖ్యానాలు ఉన్నాయని, ఈ అంశాన్ని తక్షణం విచారణకు స్వీకరించాలని లాయర్లు చేసిన అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంఛోలీల ధర్మాసనం పరిశీలించింది. పాఠ్యపుస్తకంలోని ఆ చాప్టర్లో ‘న్యాయమూర్తులు కోర్టులోనేకాదు వాటి వెలుపల సైతం నైతిక నియమావళికి కట్టుబడి ఉండాలి’అని హితబోధ చేస్తూ వ్యాఖ్యానాలు పొందుపరచడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయవ్యవస్థను, న్యాయవ్యవస్థ సమగ్రతను మసకబార్చే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా మేం అనుమతించబోం. ఈ విషయాన్ని సుమోటో స్వీకరిస్తాం. న్యాయవ్యవస్థను అపకీర్తిపాలుజేసే చర్యలను అడ్డుకుంటా’’అని వ్యాఖ్యానించారు. చాలా కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి.. ‘‘ఈ పాఠం విషయం తెల్సి నాకు బార్ నుంచి బెంచ్దాకా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి నాకు అనేక ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. అవినీతి అనేది ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉందా? ఇంకా ఏ వ్యవస్థలోనూ లేదా?. ఇటువంటి బోధనల వలన చిన్నారుల్లో న్యాయవ్యవస్థపై గౌరవం పోతుంది’’ అని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూమోటోగా వెంటనే స్వీకరించాలని సిబల్ కోరగా సీజేఐ ‘‘ఈ ఒక్కరోజు ఆగండి. ఈ విషయంలో యావత్ న్యాయవ్యవస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. న్యాయవ్యవస్థలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈసమస్యను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని, ఈవ్యవహారంపై ఇప్పటికే సూమోటాగా కేసును నమోదుచేయాలని ఆదేశించా’’అని సీజేఐ తెలిపారు. ‘‘ఉద్దేశపూర్వకంగా పా ఠ్యాంశాన్ని చేర్చినట్లుగా ఉంది. పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇంతకుమించి మేం వ్యాఖ్యానించబోం. ఏదేమైనా ఇలాంటి కీలక అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా’’అని లాయర్లతో సీజేఐ అన్నారు. మేము చాలా బాధపడ్డాం ‘‘న్యాయవ్యవస్థను అవమానక రీతిలో చిత్రించిన కొత్త పాఠ్యాంశాన్ని చూసి మేం చాలా కలత చెందాం’’అని న్యాయవాదులు సింఘ్వీ, సిబల్ ధర్మాసనం ఎదుట చెప్పారు. ‘‘న్యాయవ్యవస్థలో అవి నీతి ఉందంటూ విద్యార్థులకు బోధించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం’’అని సిబల్ అన్నారు. ‘‘పాఠ్యపుస్తకంలోని అంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూ త్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’అని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ స్వాగతించారు. యూటర్న్ తీసుకున్న ఎన్సీఈఆర్టీ సర్వోన్నత న్యాయస్థానం సహా పలు హైకోర్టుల జడ్జీలు, న్యాయవాదులు, పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్సీఈఆర్టీ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. తమ వెబ్సైట్ నుంచి వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని తొలగించింది. వివాదాస్పద అంశాలను తొలగించాలని భావిస్తోంది. ఇప్పటికే పుస్తకాల ముద్రణ పూర్తయినప్పటికీ వాటిని తొలగించి మళ్లీ కొత్తగా ముద్రించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని బోధించాలా వద్దా అనే విషయంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఢిల్లీలోని పలు పాఠశాలల యాజమాన్యాలు బుధవారం వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన విషయ నిపుణులను రప్పించి అసలు వీటికి తుది అనుమతులు ఇచ్చిందెవరు అనేది తేల్చేందుకు ఎన్సీఈఆర్టీ అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ ప్రసాద్ సాక్లానీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పాఠ్యాంశంపై మోదీ సర్కార్ సైతం అసంతృప్తిగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టులో సుమారు 81 వేలు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లా, సబార్డినేట్ కోర్టులో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో అవినీతి మేటవేసిందని, జడ్జి పోస్టుల భర్తీ సవ్యంగా జరగకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటోందని ఆ పాఠ్యాంశంలో పొందుపరిచిన విషయం విదితమే. -
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం సీరియస్
ఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సిలబస్ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇలాంటి సిలబస్తో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది.కాగా, సుప్రీం వార్నింగ్తో ఎన్సీఈఆర్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. "న్యాయవ్యవస్థలో అవినీతి" అనే సెక్షన్ను ఎనిమిదో తరగతి పాఠ్యాంశం నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించనుంది. న్యాయవ్యవస్థపై ప్రతికూల అంశాల కంటే, స్ఫూర్తిదాయక అంశాలు రాయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థను కించపరిచే ప్రయత్నాలను సహించమంటూ ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై తగ్గిన చర్యలు తీసుకుంటామని సీజేఐ వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న అతిపెద్ద సవాళ్లు అవినీతి, న్యాయమూర్తుల ఖాళీలంటూ ఎన్సీఈఆర్టీ ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం పేర్కొంది.న్యాయ వ్యవస్థను అవినీతి మయమని పేర్కొనడం ఆందోళనకరమంటూ సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని సుమోటో కేసుగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా చేశారని, తీవ్రంగా పరిగణిస్తున్నానని.. తగిన చర్యలు తీసుకుంటామని సీజేఐ తెలిపారు. -
యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్టు
న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు వేదిక వద్ద అర్ధ నగ్న నిరసన ప్రదర్శన కేసులో భారత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. చిబ్ను ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ఉదయం 10 గంటలకు పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నేరపూరిత కుట్ర, ప్రభుత్వోద్యోగికి హాని కలిగించడం, విధి నిర్వహణను అడ్డుకోవడం, ఉద్దేశపూర్వక అవిధేయత వంటి పలు అభియోగాలు నమోదు చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిరసన ప్రదర్శనకు ప్రధాన సూత్రధారి, కుట్రదారు ఆయనేనని పోలీసులు పేర్కొన్నారు. ‘‘ఇది నేపాల్లో జెన్–జీ నిరసనల నుంచి ప్రేరణ పొందిన పెద్ద కుట్ర. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అందులో పాల్గొన్నారు. ఈ దర్యాప్తు చాలా ముఖ్యమైనది’’అని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే చిబ్ నిరసన స్థలంలో లేరని, నిరసనకు సంబంధించి ఎలాంటి సూచనలూ చేయలేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అంతర్జాతీయ కార్యక్రమాల సందర్భంగా నిరసనలు పరిపాటేనని వాదించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని అంతా అభినందిస్తుంటే నిరసనలకు నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. వాదనల అనంతరం చిబ్కు జడ్జి నాలుగు రోజుల పోలీసు రిమాండ్ విధించారు.గత శుక్రవారం ఢిల్లీలో ఏఐ సదస్సు వేదికైన భారత మండపం ముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు టీ షర్టులు విప్పి అర్ధనగ్న నిరసనలకు దిగడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన నరసింహ యాదవ్ కూడా ఉన్నారు. వేదిక వద్దకు ప్రవేశం కోసం వారంతా ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని వెల్లడించారు. ఏఐ సదస్సు నిరసన కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. తదుపరి దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ తాలూకు ఇంటర్ స్టేట్ సెల్ (ఐఎస్సీ) నిర్వహిస్తుంది. నియంతృత్వం: రాహుల్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. చిబ్, ఇతర యువజన కాంగ్రెస్ నేతల అరెస్టులను ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది మోదీ సర్కారు నియంతృత్వ ధోరణులకు, పిరికితనానికి నిదర్శనమంటూ దుయ్యబట్టారు. దేశ ప్రయో జనాల కోసం నిర్భయంగా గొంతెత్తిన యువజన కాంగ్రెస్ సభ్యులను చూస్తే గర్వంగా ఉందన్నారు.భయపడేది లేదు: ఖర్గే అరెస్టులకు కాంగ్రెస్ భయపడబోదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టాలని మోదీ ప్రయతి్నస్తున్నారు. అదెన్నటికీ జరగదు. ఆయన సర్కారు ట్రంప్కు లొంగిపోయింది. ఆయన షరతులన్నింటికీ తలూపింది. ఉపాధి లేక దేశ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది. మోదీ సర్కారుపై వారిలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి’’అని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి మోదీ ఇజ్రాయెల్ పర్యటన
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు దృష్టిసారించనున్నారు. ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలుదువ్వుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హోర్జోగ్, ప్రధాని నెతన్యాహూతో విడివిడిగా భేటీకానున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ మంగళవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తంగా రక్షణ, భద్రత సహకారంలో అంశాలే గురువారం నాటి చర్చల్లో కీలకం కానున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. యుద్ధమయ గాజా అంశం సైతం చర్చకు రానుంది.బుధవారం రాత్రి మోదీ కోసం నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2017 జూలైలో పర్యటించినప్పుడే ఇరుదేశాల మధ్య బంధాన్ని ‘వ్యూహాత్మక’ స్థాయికి చేర్చారు. ఆ తర్వాతి ఏడాది జనవరిలో నెతన్యాహూ భారత్లో పర్యటించారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. సైనిక, ఆయుధ వ్యవస్థలను భారత్కు సరఫరా చేస్తూ ఇజ్రాయెల్ కీలక మిత్రదేశంగా మారిన విషయం విదితమే. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసుల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఐదు మంది ప్రయాణిస్తున్న ఒక కారుపై గుర్తు తెలియని వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) మధుర్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనను ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదు మంది సియాజ్ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి దాడి జరిగింది. సీటు వెనుక కూర్చున్న సందీప్ అనే వ్యక్తి భుజం దగ్గర బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. కారులో ఉన్న మరో వ్యక్తి దీపక్ ఖత్రి, తాను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు అడ్వకేట్ అని పోలీసులకు తెలిపాడు. అయితే విచారణలో ఆయన భార్య రాజ్ని ఖత్రి బిష్ణోయ్కు న్యాయవాది అని, సందీప్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులు స్కూటర్పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కారులో ఉన్నవారి వాంగ్మూలాలు, స్థానికుల స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ టీమ్ను సంఘటనా స్థలానికి తరలించారు. స్థానికి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: భారత్లో 14 ఏళ్ల వయసు పైబడిన బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఉచితంగా హ్యూమన్ పపిలోమావైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా 14 ఏళ్లు పైబడిన బాలికలకు అందజేయనున్నట్లు మంగళవారం అధికార వర్గాలు ప్రకటించాయి. క్వాడ్రీవాలెంట్ హెచ్పీవీ వ్యాక్సిన్ ఉన్న గార్డాసిల్ టీకాను ఒక డోసులో అందించనున్నారు. ఇది సర్వైకల్ క్యాన్సర్కు దారితీసే హెచ్పీవీ టైప్ 16, టైప్ 18 రకాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. దీంతోపాటు టైప్ 6, టైప్ 11ల నుంచీ రక్షణ కల్పిస్తుంది. యూనివర్సిటీ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కిందకాకుండా విడిగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఈ గార్డాసిల్ టీకాలను వేయనున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)సహా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను వేస్తారు. సరై్వకల్ క్యాన్సర్ను రూపుమాపే అంతర్జాతీయ వ్యూహంలో హెచ్పీవీ వ్యాక్సిన్ది కీలకపాత్ర అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనల మేరకు మోదీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతోందని తెలుస్తోంది. అయితే సొంతంగా కొనుగోలుచేయాలనుకునే వాళ్లకు ఇప్పటికే భారతీయ మార్కెట్లో గార్డాసిల్–4 టీకా అందుబాటులో ఉంది. కానీ దాని ఒక్క డోస్ ధర ఏకంగా రూ.3,927. దీనిని 15 ఏళ్లలోపు బాలికలకు ఇవ్వవచ్చు.వీళ్లు రెండు డోస్లు తీసుకోవాల్సి ఉంటుంది. అదే 15 ఏళ్ల పైబడిన వాళ్లకయితే మూడు డోస్లు ఇవ్వాల్సి ఉంటుంది. గార్డాసిల్–4ను ఎంఎస్డీ ఇండియా సంస్థ తయారుచేస్తోంది. ‘‘దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో బాలికలు టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందమే. బలవంతం ఏమీ లేదు. దీనిని ఉచితంగా ఇస్తారు. సరైన వయసులో టీకా తీసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడే ప్రమాదం నుంచి బయటపడొచ్చు’’అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ టీకా 2006 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.గత పదేళ్లలో 160 ప్రపంచదేశాల్లో 50 కోట్ల డోస్ల టీకాలను వేశారు. సింగిల్ డోస్ విధానంలో టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది. వ్యాక్సిన్ వేసుకుంటే టైప్ 6, 11, 16, 18 వైరస్ల నుంచి దాదాపు 93–100 శాతం రక్షణ ఉంటుందని అంతర్జాతీయంగా పలు పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. భారతీయ మహిళలకు సోకుతున్న రెండో అతిపెద్ద క్యాన్సర్గా సర్వైకల్ క్యాన్సర్ పరిణమించింది. ఏటా భారత్లో 80,000 కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఏటా 42,000 మంది చనిపోతున్నారు. -
గాలి నుంచి నీరు!
నీరు. సకల జీవరాశులకు ప్రాణాధారం. అలాంటి నీటి లభ్యత ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. ముఖ్యంగా స్వచ్ఛమైన తాగునీటికి దేశాలన్నీ కటకటలాడే రోజు ఎంతో దూరంలో లేదని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత స్వచ్ఛమైన నీటిని నేరుగా గాలి నుంచే సులువుగా తయారు చేసుకునే టెక్నాలజీని నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఒమర్ యాగీ అభివృద్ధి చేశారు.భారీ ప్లాంట్లు, పరికరాల అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. ఇందుకోసం కేవలం ఒక షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే యంత్రాన్ని యాగీ రూపొందించారు. ఒక్కో యంత్రం సాయంతో రోజుకు కనీసం 1,000 లీటర్ల నీటిని నేరుగా గాలి నుంచే ఒడిసిపట్టవచ్చు! అంతేకాదు, అత్యంత పొడి వాతావరణంతో కూడిన ఎడారి ప్రాంతాల్లో కూడా ఈ పరిజ్ఞానం భేషుగ్గా పని చేస్తున్నట్టు తేలింది! దీన్ని ప్రపంచపు దాహార్తిని తీర్చగల కీలక పరిణామంగా భావిస్తున్నారు. రెటిక్యులర్ కెమిస్ట్రీతో... గాలి నుంచి నీటిని సేకరించడంపై చేసిన పరిశోధనలకు ప్రొఫెసర్ యాగీకి 2025లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. కాలిఫోరి్నయాకు చెందిన ఆయన సొంత డీప్టెక్ కంపెనీ అటోకో గాలి నుంచి నీటిని సేకరించే టెక్నాలజీపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తోంది. ఎడారుల వంటి అత్యంత పొడి వాతావరణంలో కూడా గాలి నుంచి అతి సులువుగా నీటిని తయారు చేయగల పారిశ్రామిక యంత్రాన్ని అటోకో తాజాగా రూపొందించింది. రెటిక్యులర్ కెమిస్ట్రీగా పిలిచే సాంకేతికత సాయంతో ఈ అద్భుతాన్ని సాధించింది. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ (ఎంఓఎఫ్)లను రూపొందించింది. నానో టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ ఎంఓఎఫ్లను ఒకరకంగా నీటిని పీల్చుకునే స్పాంజీలతో పోల్చవచ్చు.కాకపోతే ఇవి అత్యాధునిక అణు స్పాంజీలన్నమాట. గాలిలోని తేమను, కనిపించని వాయువులను ఇవి శోషించుకుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయిక అటా్మస్పియరిక్ వాటర్ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ) ద్వారా గాలి నుంచి నీటిని సేకరించే ప్రక్రియ అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. అందులో గాలిలోని తేమను నీటి బిందువులుగా మార్చే శీతలీకరణ స్థాయిని రాబట్టేందుకు సమీప వాతావరణం మొత్తాన్నీ కూలింగ్ ప్రక్రియ సాయంతో చల్లబరచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ యంత్రాలు భారీగా విద్యుత్ను వాడుకుంటాయి. కానీ ఎంఓఎఫ్లకు ఇలాంటివేమీ అవసరముండవు. అధిశోషణంగా పిలిచే సహజ ప్రక్రియ ద్వారా గాలిలోని నీటి అణువులను అవి నేరుగా ఆకర్షిస్తాయి.గాలిని బలవంతంగా చల్లబరిచే అవసరం లేకుండా గాలిలోని నీటి అణువులను ఎంఓఎఫ్లు నేరుగా తమకేసి ఆకర్షించుకుంటాయి. మరోలా చెప్పాలంటే అవి రసాయనిక అయస్కాంతాల్లా పని చేస్తాయి. దాంతో నీటి అణువులు వాటి ఉపరితలాలపైకి వచ్చి అతుక్కుపోతాయి. యాగీ సరికొత్త రెటిక్యులర్ కెమిస్ట్రీ టెక్నాలజీకి మొత్తానికీ ఇదే అత్యంత కీలకం. అలా అతుక్కున్న నీటి అణువులను కొద్దిపాటి వేడి సాయంతో వాటిని ఎప్పుడు కావలిస్తే అప్పుడు కంటైనర్లోకి ఒడిసిపట్టుకోవచ్చు. అలా ఎలాంటి కాలుష్యమూ లేని అత్యంత స్వచ్ఛమైన నీరు సమకూరుతుంది.అంతేకాదు, ఈ ప్రక్రియంతా భారీ యంత్రాల బాదరబందీ లేకుండా అత్యంత సులువుగా, సహజంగా జరిగిపోతుంది. పైగా సూర్యుని నుంచి వచ్చే వేడి సాయంతోనే పని పూర్తవుతుంది. కనుక విద్యుత్కేంద్రాలు, భారీ పైపుల వంటివాటి అవసరమే ఉండదు! నీటికొరత ఉన్న ప్రాంతాల్లో షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే ఎంఓఎఫ్ యంత్రం బిగించుకుంటే చాలన్నమాట. ఎడారి నేలల్లోనూ... సాంప్రదాయిక పద్ధతుల్లో గాలి నుంచి నీటిని తయారు చేయాలంటే తేమ శాతం కనీసం 45కు మించి ఉండాల్సిందే. లేదంటే అవి చేతులెత్తేస్తాయి. కనుక ఎడారుల వంటి అత్యంత పొడి ప్రదేశాలకు అవి పనికిరావు. కానీ గాల్లో తేమ 20 శాతం కంటే తక్కువగా ఉన్నా యాగీ టెక్నాలజీ భేషుగ్గా పని చేస్తుందని తేలింది. అంటే ఎన్నడూ వర్షమే కురవని, అత్యంత వేడి గాలులతో కూడిన ప్రాంతాల్లో కూడా దాని సాయంతో నీటిని తయారు చేసుకోవచ్చన్నమాట. ఎడారుల్లో గాలిలో నీటి అణువులు చాలా తక్కువగా ఉంటాయి. అటోకో రూపొందించిన ఎంవోఎఫ్లు రసాయన అయస్కాంతాలు తేమ 10 శాతం మాత్రమే ఉండే అత్యంత పొడి వాతావరణంలో కూడా నీటి అణువులను తమకేసి ఇట్టే ఆకర్షిస్తాయి. భారత్లోనూ... భారత్లో కూడా గాలి నుంచి నీటి తయారీకి అక్వో అనే దేశీయ కంపెనీ అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ)ను తయారు చేసింది. ఇవి అధునాతన సంక్షేపణ పరిజ్ఞానం సాయంతో పని చేస్తాయి. అవి గాలిని లోనికి పీల్చుకుంటాయి. అందులోని దుమ్ము, ధూళి వంటివాటిని తొలగించి శీతలీకరణ స్థాయికి చల్లబరిచి నీటిని సేకరిస్తాయి. దాన్ని కార్బన్ ఫిల్టరేషన్, యూవీ స్టెరిలైజేషన్ వంటి పలు దశల్లో శుభ్రపరిచి వినియోగానికి అనువుగా మారుస్తారు. అక్వో ఇప్పటికే మధ్యప్రదేశ్లోని హర్దువా మంగ్రా ప్రాంతంలో 1,500 మంది దాహార్తిని తీరుస్తోంది. హల్దియా రిఫైనరీకి ఈ పద్ధతిలో నీటిని సరఫరా కూడా చేస్తోంది. కాకపోతే ఈ విధానంలో నీటి ఉత్పత్తి ఉష్ణోగ్రత, గాల్లో తేమపై ఆధారపడి ఉంటుందని అక్వో వ్యవస్థాపకుడు, సీఈఓ నవ్కరణ్ సింగ్ బగ్గా వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ..ఆ నేపథ్యమే ప్రేరణప్రొఫెసర్ యాగీది అత్యంత దయనీయమైన నేపథ్యం. ఆయన జోర్డాన్లోని శరణార్థి శిబిరాల్లో పెరిగారు. నీటికి తీవ్ర కటకట అక్కడ అత్యంత సాధారణ దృశ్యం. దాంతో పెరిగి పెద్దవాడయ్యే క్రమంలో యాగీ నిత్యం దాహార్తినే చవిచూస్తూ వచ్చారు. తర్వాతి తరాలు తనలా గొంతెండి అల్లాడకుండా ఏదో చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెబుతారాయన. ఆ తపనతోనే రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేస్తూ వచ్చారు. తన కెరీర్ను దానికే అంకితం చేశారు.ఎన్నెన్ని ఉపయోగాలో...!యాగీ రూపొందించిన వినూత్న ఎంఓఎఫ్ యంత్రాన్ని ప్రపంచానికి నీటి కొరతను సమూలంగా తీర్చగల వరదాయినిగా చెప్పవచ్చు...⇒ నీటికొరత ఇప్పటికే అతి పెద్ద ప్రపంచ సమస్యల్లో ప్రధానమైనదిగా మారుతోంది.⇒ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది సురక్షిత తాగునీటి సౌకర్యానికి దూరమైనట్టు ఐరాస చెబుతోంది.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఎంఓఎఫ్ యంత్రాలు గేమ్చేంజర్లు కాగలవు. ఎందుకంటే గాలిలోని నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదుల్లోని నీటి కంటే ఏకంగా ఆరు రెట్ల అధికమని పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక గాలి నుంచే నేరుగా నీటిని ఒడిసిపట్టుకోగలిగితే దాహార్తి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.⇒ పైగా ఈ పద్ధతి ద్వారా అత్యంత స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.⇒ పాతాళాన్ని తాకిన భూగర్భ జలాలపై, వాటర్ ట్యాంకులపై ఆధారపడటం తగ్గిపోతుంది. -
తప్పుకోండి.. తప్పుకోండి.. వివేక్ సార్ వస్తున్నారంట
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ అంటే సంగమం, కుంభమేళా, ఆధ్యాత్మికత, చరిత్ర అన్నీ కలిసిన ఒక పవిత్ర నగరం. ఇప్పుడా పవిత్ర నగరంలో బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ పర్యటన వివాదాస్పదంగా మారింది. వివేక్ బంజాల్ను ప్రసన్నం చేసుకునేందుకు ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్ రూపొందించిన ఆఫీస్ ఆర్డర్పై రగడ మొదలైంది.ఫిబ్రవరి 19న జారీ చేసిన అధికారిక కమ్యూనికేషన్ ప్రకారం, డైరెక్టర్ పర్యటనకు నిమిషానికో ప్రోటోకాల్ రూపొందించారు. రైల్వే స్టేషన్లో స్వాగతం నుంచి పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలు, భోజనాలు, వ్యక్తిగత సౌకర్యాల వరకు అన్ని అంశాలను విపులంగా వివరించారు. ఇక ఆ ఆర్డర్ని పరిశీలిస్తే.. వివేక్ బంజాల్ ప్రయాగ్ రాజ్ పర్యటనలో భాగంగా ఆయనకు రాచమర్యాదలు చేసేందుకు 50మంది ఉద్యోగులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల విధుల్లో భాగంగా వివేక్ బంజాల్ కోసం 21 పనులు చేయాల్సి ఉండగా.. వాటిల్లో వివేక్ బంజాల్ ఎక్కడికి వెళితే అక్కడి బోటు ప్రయాణాలు, ఆలయ దర్శనాలు, ‘స్నాన కిట్స్’ తయారీ, ప్యాకేజింగ్, వాహనాల్లో నీటి బాటిల్స్, చాక్లెట్లు, చిప్స్ వంటి రిఫ్రెష్మెంట్స్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆఫీస్ ఆర్డర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే గత త్రైమాసికంలో రూ.1,300 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసిన బీఎస్ఎన్ఎల్ ఇలాంటి విలాసవంతమైన ఏర్పాట్లు ఎందుకు చేసిందని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో వీఐపీ కల్చర్పై చర్చ మొదలైంది.తీవ్ర విమర్శల నేపథ్యంలో, ఈ పర్యటనను ఒక్క రోజులోనే రద్దు చేశారు. బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆశిష్ గుప్తా, డైరెక్టర్ ప్రయాగ్రాజ్ ప్రోగ్రామ్ రద్దయిందని, జారీ చేసిన ప్రోటోకాల్ ఇకపై చెల్లుబాటు కాదని తెలిపారు. అయితే, ఏర్పాట్లపై వచ్చిన వివాదంపై ఆయన వ్యాఖ్యానించలేదు. -
ఎన్సీఎల్ఏటా విధివిధానాలకు కట్టుబడతాం
న్యూఢిల్లీ: ప్రకటనల సంబంధిత డేటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోప్యత, అంగీకార నిర్దేశకాలను వర్తింపజేస్తామని సోషల్ నెట్వర్కింగ్ వేదిక వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ విషయంలో ఎన్సీఎల్ఏటా విధివిధానాలకు కట్టుబడతామని పేర్కొన్నాయి.ఎన్సీఎల్ఏటా నిర్దేశాలను సవాలు చేస్తూ ఆ సంస్థలు పెట్టుకున్న పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం విచారణ జరిపింది. ట్రిబ్యునల్ నిర్దేశాలను మార్చి 16 కల్లా అమలు చేయాలని మెటా, వాట్సాప్ నిర్ణయించినట్టు వాటి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంది. దాంతో వాట్సాప్, మెటా పిటిషన్లను పరిష్కరించినట్టు భావించాలని ధర్మాసనం పేర్కొంది.ప్రైవసీ పాలసీ ఉల్లంఘనకు సంబంధించి వాట్సాప్కు సీసీఏ గతంలో రూ.213.14 కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. డేటా షేరింగ్ పేరిట పౌరుల భద్రతతో ఆటలాడటాన్ని అనుమతించబోమని ఫిబ్రవరి 3న మెటా, వాట్సాప్లను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. చదవండి: ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్ -
2018కి ముందు కేసుల పునర్వీచారణ కుదరదు
న్యూఢిల్లీ: ఎన్హెచ్ఏఐ చట్టం కింద భూ సేకరణ, నష్టపరిహారాలకు సంబంధించి 2018కి ముందు కేసుల పునఃపరిశీలన సాధ్యపడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్హెచ్ఏఐ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది. ఎన్హెచ్ఏఐ చట్టం కింద సేకరించిన రైతుల భూమికి పరిహారం, వడ్డీ చెల్లించాలన్న నిర్ణయం గత ఉదంతాలకు కూడా వర్తిస్తుందంటూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ‘‘అలాగైతే మాపై ఏకంగా రూ.32 వేల కోట్ల మేరకు ఆర్థిక భారం పడుతుంది. కనుక ఈ నిర్ణయాన్ని ఇకపై తలెత్తే వివాదాలకు మాత్రమే వర్తింపజేయాలి’’అని కోరింది. అలా చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14లో పేర్కొన్న సమానత్వపు హక్కుకు విఘాతమే అవుతుందంటూ ఈ విజ్ఞప్తిని అప్పట్లో న్యాయస్థానం తిరస్కరించింది. దానిపై ఎన్హెచ్ఏఐ పెట్టుకున్న రివ్యూ పిటిషన్పై సీజేఐ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 2019 నాటి తీర్పును ఫిబ్రవరి 4 నాటి విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం సమర్థించింది. దీనిపై వాదనలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ ఉదంతానికి సంబంధించి అభ్యంతరాలేమైనా ఉంటే లిఖితపూర్వకంగా సమరి్పంచాలని ఇరు వర్గాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
రామ్మోహన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ‘అజిత్ దాదా ఫ్లయిట్ క్రాష్ వెనుక తమకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయండి. మనుషుల మధ్య లేని దాదా మృతికి న్యాయం చేయండి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాలను దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ కోరారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖలు రాసిన రోహిత్ పవార్ సోమవారం ఆ లేఖలను తమ సిబ్బంది ద్వారా ఢిల్లీలో పీఎంఓ, హోంశాఖ కార్యాలయాలకు పంపారు. లేఖల్లో ఆయన ప్రస్తావించిన వివరాలివీ.. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది ‘‘అజిత్ పవార్ ప్రయాణించిన ఫ్లయిట్ క్రాష్ అవ్వడం వెనుక భారీ కుట్రకోణం ఉన్నట్లు మాకు అనుమానాలున్నాయి. ఘటన స్థలంలో అనేక పేలుళ్లు జరిగినట్లు గుర్తించాం. ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి మరణిస్తే.. విచారణ అనేది పూర్తి కాకుండా, పూర్తి రిపోర్టు బయటకు రాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్నాయుడు ‘‘వీఎస్ఆర్ వెంచర్స్ కంపెనీ’’ తప్పేమీ లేదని ఎలా ప్రకటిస్తారని ప్రశి్నంచారు. ఆయన ప్రకటన తర్వాత తమకు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత తాము లోతుగా పరిశీలిస్తే.. నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వీఎస్ఆర్ కంపెనీకి మధ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను మీకు అందజేస్తున్నాం. ఈ సంబంధాలపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యే వరకూ రామ్మోహన్ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలి. రామ్మోహన్ నాయుడు ఆ పదవిలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తారు. ఈ కారణంగా అజిత్ దాదా మృతికి న్యాయం దక్కదు. ఆ ఉద్దేశంతోనే తాము రామ్మోహన్ నాయుడు రాజీనామాను డిమాండ్ చేస్తున్నాం. డీజీసీఏ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అన్నదీ స్వతంత్రంగా పరిశీలించాలి’ అని ఆ లేఖల్లో రోహిత్ పవార్ కోరారు. అజిత్ పవార్ మృతికి న్యాయం జరిగే వరకూ తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కుట్ర కోణం తెరపైకి?
ముంబై: మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కుట్ర కోణం తెరపైకి వచ్చింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎమ్మెల్సీ అమోల్ మిట్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం దాగుందన్నారు. విమానం పైలెట్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి మాట్లాడుతూ.. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనకు భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోందంతో పోల్చారు. ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రమాదంపై అనుమానాలను మాత్రమే కాకుండా, దాని వెనుక కుట్ర ఉందా అనే ప్రశ్నలను కూడా లేవనెత్తాయి.ఈ వివాదం నేపథ్యంలో, రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వర్గాలు పారదర్శకత కోసం డిమాండ్ చేస్తున్నారు. డీజీసీఏ, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, మిట్కరి చేసిన వ్యాఖ్యలు ఈ దర్యాప్తుపై మరింత ఒత్తిడి పెంచాయి.మహారాష్ట్రలో ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అజిత్ పవార్ మరణం దిగ్భ్రాంతిని గురి చేయగా.. ఇప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన మరణం చుట్టూ ఉన్న అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. అజిత్ పవార్ మరణంపై స్పష్టత రావాల్సి ఉంది. -
జార్ఘాండ్లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్
రాంచీ: జార్ఘాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రాంచి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ జార్ఘాండ్ ఛత్రా జిల్లాలో కూలింది. విమానంలో సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. ప్రమాదాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. ఎయిర్ అంబులెన్స్లో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు అటెండెంట్లు, ఒక డాక్టర్, ఒక పారామెడిక్ ఉన్నట్లు తెలిపింది. ఈ విమానం బీచ్క్రాఫ్ట్ C90 మోడల్ది. రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన ఎయిర్ అంబులెన్స్ రాంచీ విమానాశ్రయం నుండి సాయంత్రం 7:11 గంటలకు టేకాఫ్ అయింది. 7:34 గంటలకు కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో చివరిసారి సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సుమారు వారణాసి దక్షిణ-తూర్పు దిశలో 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ కమ్యూనికేషన్ సంబంధాలు కోల్పోయింది.దీంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఛత్రా జిల్లా ప్రభుత్వయంత్రాంగానికి సమాచారం అందించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో 24న ఈసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో మరింత సమన్వయం పెంచే దిశగా అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)లతో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. చివరగా 1999 ఏడాదిలో ఇలాంటి భేటీ జరగ్గా 27 ఏళ్ల విరామం అనంతరం ఈ రౌండ్టేబుల్ సమావేశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24న ఢిల్లీలోని భారతమండపంలో నిర్వహించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషి పాల్గొననున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు, వారి న్యాయ–సాంకేతిక నిపుణులు, అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం ప్ర ధానంగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం. ఎన్నికల ప్రక్రియలు, సాంకేతిక వనరుల వినియోగంలో చర్చించనున్నారు. సహకార సమాఖ్య స్పూర్తిని మరింత బలపరచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశంలో ఈవీఎంల భద్రత, ఓటర్ల జాబితా తయారీలో చట్టపరమైన మార్గ దర్శకాలు, రాష్ట్రాల వారీగా ఓటరు అర్హతలపై తులనాత్మక సమీక్ష, ఈసీఐనెట్ డిజిటల్ ఫ్లాట్ఫారమ్లపై చర్చించనున్నారు. దేశవ్యా ప్తంగా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. -
‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం... దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించటాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.సీఎం అబద్ధాలు ప్రచారం చేశారురాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాలను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.స్వయంగా ‘సుప్రీం’ పర్యవేక్షిస్తున్నా ఏకసభ్య కమిటీనా..? లడ్డూ ప్రసాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ విచారణ కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్లో నివేదించారు.కుట్ర బెడిసికొట్టడంతో కమిటీ పన్నాగం!శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ లాబ్లు స్పష్టం చేయగా సీబీఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ ఒక్క వైఎస్సార్సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసికొట్టడంతో మరో కొత్త కుత్రంత్రానికి తెర తీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలనే రాజకీయ కుట్రతో దినేష్ కుమార్ కమిటీని నియమించారు.బాబు సర్కారుపై ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు..చంద్రబాబు సర్కారు దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అంటూ చంద్రబాబునుద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రానుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.స్వామి పిటిషన్లో ఆరుగురు ప్రతివాదులు వీరే..⇒ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం⇒ కేంద్ర ప్రభుత్వం ⇒ చంద్రబాబు (ఏపీ సీఎం)⇒ సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బందం)⇒ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)⇒ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) -
కాంగ్రెస్ ‘నగ్న’ రాజకీయాలు చేయాల్సిన పనేంటి? ప్రధాని మోదీ
లక్నో: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ నగ్న రాజకీయాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉందనే విషయం దేశ ప్రజలకు తెలుసు. మరీ దుస్తులు తీసివేయాల్సిన అవసరం ఏముంది?అని ప్రశ్నించారు.ఆదివారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మేట్రో సేవల్ని ప్రారంభించారు. అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో భారత్-ఆమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ భారత యువజన కాంగ్రెస్ కార్యకర్తలు (ఐవైసీ) చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనపై మీరట్ సభలో మోదీ ప్రస్తావించారు. ‘ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ మురికి, నగ్న రాజకీయాలు చేసింది. సైద్ధాంతికంగా దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్. దేశంలోని పురాతన పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాలా తీసిందో ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన పనే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ తన సొంత దేశాన్ని కించపరచడంలో బిజీగా ఉంది. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు దేశం విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ దేశంలో జరగడం మనం ఇప్పుడే చూశాము. కానీ కాంగ్రెస్ ఏం చేసింది. దేశం కోసం నిర్వహించిన ప్రపంచ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన మురికి, నగ్న రాజకీయాలకు వేదికగా మార్చింది. కాంగ్రెస్ నాయకులు నన్ను ద్వేషిస్తారు. నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాడరు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదు. ఆ కార్యక్రమం జరిగే సమయంలో బీజేపీ నాయకులు ఎవరూ అక్కడ లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశం నిర్వహిస్తున్న కార్యక్రమం. కానీ ఆ రోజు కాంగ్రెస్ మర్యాదను ఉల్లంఘించింది. కాంగ్రెస్ అవినీతి విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది’అని వ్యాఖ్యానించారు. #WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, "... The Congress turned a global event for India into a platform for its dirty and naked politics. Congress leaders reached the venue naked in front of the foreign guests. I ask the Congress people, the country… https://t.co/fa5yKag8oq pic.twitter.com/81zAr1Qsar— ANI (@ANI) February 22, 2026 -
డేటింగ్ యాప్.. సహజీవనం.. చివరికి..
డేటింగ్ యాప్లో పరిచయం.. సహజీవనం.. అనుమానం.. చివరకు పైశాచిక చేష్టలు.. గురుగ్రామ్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవడానికి త్రిపుర నుండి గురుగ్రామ్ వచ్చిన 19 ఏళ్ల యువతి.. ఓ యువకుడితో సహజీవనం సాగిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న శివం.. యువతిపై అమానుషంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ నిలదీసినందుకు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. చిత్రహింసలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన శివమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.యువతికి గత ఏడాది సెప్టెంబర్లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివం పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ కలిసి సెక్టార్-69లో ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన శివం ఆమెను గదిలో బంధించాడు. స్టీల్ బాటిల్తో తలపై కొట్టి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కత్తితో కూడా దాడి చేశాడు.మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతి.. తన తల్లికి ఫోన్ చేసిన జరిగిన ఘోరాన్ని వివరించింది.. తల్లి ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. అంనతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు శివంను అరెస్ట్ చేసిన పోలసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఫిబ్రవరి 16న జరిగిన గొడవ తర్వాత శివం తనపై అత్యంత క్రూరంగా దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె తలపై స్టీల్ బాటిల్తో, మట్టి కుండతో కొట్టాడు. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు వివరించింది. దారుణమైన దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. ఫిబ్రవరి 18 రాత్రి ఆమె నిందితుడి ఫోన్ నుండే తన తల్లికి ఫోన్ చేసింది. శివంకు అర్థం కాకుండా ఆమె బెంగాలీ భాషలో తన బాధను వివరించింది. తనను ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే వచ్చి కాపాడండంటూ ఆమె తన తల్లితో చెప్పింది. బాధితురాలి తల్లి వెంటనే 112 హెల్ప్లైన్కు సమాచారం అందించారు. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు(సోమవారం) విచారణ చేపట్టనుంది.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు.అయితే, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో చంద్రబాబు.. తన సొంత కమిటీ వేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ ఏర్పాటు చేసి.. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. -
ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్లోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు. -
ప్లేన్ క్రాష్పై దర్యాప్తుకు టీడీపీ బ్రేకులు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రమాదంలో మృతి పట్ల తమకు అనేక అనుమానాలున్నాయని, ఆయన ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ కంపెనీతో టీడీపీ ముఖ్యులకు లోపాయికారీ ఒప్పందాలు, సంబంధాలు ఉన్నందునే దర్యాప్తు సవ్యంగా సాగడం లేదని ఎన్సీపీ (శరద్ పవార్) నేత, అజిత్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ రాజేంద్ర పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, వీఎస్ఆర్ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ రెండు కంపెనీల మధ్య వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరగబట్టే.. ప్రమాద ఘటన వ్యవహారంలో విచారణ పారదర్శకంగా సాగకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే విచారణ పూర్తి కాకుండానే వీఎస్ఆర్ కంపెనీ తప్పేమీ లేదని రామ్మోహన్ నాయుడు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఎస్ఆర్ కంపెనీతో టీడీపీ పెద్దలకున్న ఆర్థిక లావాదేవీల కారణంగా విచారణ ప్రక్రియను రామ్మోహన్ నాయుడు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని, లేదా రామ్మోహన్ స్వయంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును, వీఎస్ఆర్ కంపెనీతో టీడీపీ ముఖ్యులకు ఉన్న బంధాన్ని వివరిస్తూ, రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. హెరిటేజ్తో ఆర్థిక లావాదేవీలుచంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, వీఎస్ఆర్ కంపెనీల మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయని రోహిత్ చెబుతూ.. ఈ రెండు కంపెనీల మధ్య 2023 మార్చి 30న జరిగిన ‘హైపోథిటికేషన్’ ఒప్పంద పత్రాన్ని చూపించారు. పక్కనే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, డాక్టర్ ఎం.సాంబశివరావుల ఫొటోలను చూపిస్తూ మీడియాకు వివరించారు. వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం.. ముఖ్యంగా విమానాల కొనుగోలు అవసరాల కోసం అంటూ హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థ నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని చెప్పారు. వీఎస్ఆర్ కంపెనీ వెనుక రాజకీయ, వ్యాపార వేత్తలు ఉన్నారని.. ఆ కంపెనీతో టీడీపీ అధినేతలకు, రామ్మోహన్నాయుడికి కూడా సంబంధాలు ఉన్నాయన్నారు. ‘ఓ పక్క ప్రమాదం జరిగి అందరూ శోక సంద్రంలో ఉంటే.. మరో పక్క వీఎస్ఆర్ కంపెనీ తప్పేమీ లేదని కేంద్ర మంత్రి పదవిలో ఉన్న రామ్మోహన్ ప్రకటించడం ఏమిటి? అంత త్వరగా ఆ కంపెనీకి వకాలత్ పుచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు ప్రాథమిక రిపోర్టు రాకుండానే బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వొచ్చా? ఏడాది క్రితం రాజస్తాన్లో జరిగిన కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఫంక్షన్కు టీడీపీలోని ప్రముఖ నేతలు హాజరు కావడంతో మాకు అనుమానాలొచ్చాయి. టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు, రామ్మోహన్ వీఎస్ఆర్ కంపెనీతో సన్నిహితంగా ఉండబట్టే.. అజిత్ పవార్ ప్రమాద ఘటనకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కావడం లేదు. ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ ఆ పదవిలో ఉంటే విచారణను పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి. తక్షణం కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ను ఆ పదవి నుంచి తప్పించాలి. అజిత్ పవార్ మృతిపై మోదీ, అమిత్షాలు న్యాయం చేయాలి’ అని కోరారు. హెరిటేజ్ నుంచి రూ.వందల కోట్లు‘హెరిటేజ్ నుంచి వీఎస్ఆర్ కంపెనీకి రూ.200–300 కోట్ల ఫండింగ్ వచ్చింది. అందుకే వీఎస్ఆర్ కంపెనీని టీడీపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ కాపాడుతున్నారు. విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని లోతుగా పరిశీలిస్తే పలు విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో హెరిటేజ్కు, వీఎస్ఆర్కు మధ్య ఉన్న ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్)లో ఉన్నారు. మెజార్టీ షేర్ హోల్డర్లు వీళ్లవే ఉన్నాయి. వీళ్ల నుంచే వీఎస్ఆర్కు ఫండ్స్ వెళ్లాయి. వీళ్ల మధ్య ఇంతగా ఆర్థిక లావాదేవీలు ఉండబట్టే అజిత్ పవార్ ప్రమాద ఘటనపై విచారణ పారదర్శకంగా జరగట్లేదు. అందుకే రామ్మోహన్నాయుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 1,100 డిగ్రీల వేడిలో ఉన్నా బ్లాక్ బాక్స్ కాలిపోవడం జరగదు. కానీ ఈ ఘటనలో బ్లాక్ బాక్స్ కాలిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. టీడీపీకి చెందిన కీలక వ్యక్తి రూ.650 కోట్లతో దుబాయిలో వీఎస్ఆర్ కంపెనీ ద్వారా విమానం కొనుగోలు చేశాడు. ఇలా ఒకటి, రెండు విషయాలు కాదు.. చాలా ఆర్థికపరమైన వ్యవహారాలు టీడీపీ నేతలు, వీఎస్ఆర్ కంపెనీకి మధ్య ఉన్నాయి’ అని రోహిత్ పవార్ చెప్పారు.కుట్ర కోణంలో దర్యాప్తు జరగాలిప్రమాదం జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయని రోహిత్ పవార్ తెలిపారు. వీఎస్ఆర్ కంపెనీ వెనుక రాజకీయ పార్టీల నేతలు, వ్యాపార వేత్తలు ఉండటం వల్లే ఆ కంపెనీకి కొమ్ముకాస్తున్నట్లు చెప్పారు. ‘డీజీసీఏలో కొంత మంది అధికారులు వీఎస్ఆర్ కంపెనీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం చెందినా.. కంపెనీ యజమాని వీకే సింగ్ను అరెస్టు చేయలేదు. దీని వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. వీఎస్ఆర్ పైలెట్ కపూర్ లైసెన్స్పై కూడా అనుమానాలు ఉన్నాయి. పైలెట్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. పైలెట్లకు 12 గంటల విశ్రాంతి ఇవ్వాలన్న నిబంధనలకు వీఎస్ఆర్ తూట్లు పొడిచింది. రూ.35 కోట్లు విలువ గల విమానానికి రూ.265 కోట్లు (ఈ విమానం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10–15 కోట్లే. అయితే ఏకంగా రూ.55 కోట్ల ఇన్సూ్యరెన్స్, రూ.210 కోట్ల లయబిలిటీ ఇన్సూ్యరెన్స్) ఇన్సూ్యరెన్స్ చేశారు. దీనిపై అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. అనుమతి లేని కంపెనీకి చెందిన బ్లాక్ బాక్స్ను ఈ విమానంలో వినియోగించారు. బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం చూస్తుంటే మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోసినట్లు అవుతోంది. టాయిలెట్ వెనుక లగేజ్ పెట్టే ప్రాంతంలో కొన్ని పెట్రోల్ క్యాన్లను ఉంచారు. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ నింపారు. అందుకే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. ఒక క్రికెటర్ వీఎస్ఆర్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్లో తీవ్రమైన సమస్య వచ్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. వీఎస్ఆర్ విమాన జీవిత కాలం 5 వేల గంటలు మాత్రమే. ప్రమాదం జరిగిన సమయానికి 85 గంటలు మాత్రమే మిగిలి ఉంది. డీజీసీఏ అధికారులను ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వీఎస్ఆర్ కంపెనీకి ఉన్నాయి. అందుకే క్యాబిన్ క్రూ సిబ్బందిని ప్యాసింజర్లా చూపించారు. ఈ ప్రమాదంపై కుట్ర కోణంలోనూ విచారణ జరగాలి’ అని అన్నారు. తక్షణం రామ్మోహన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రూ.10 కోట్ల నుంచి రూ.500 కోట్లకు.. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్ కుట్ర ఉంది. వీఎస్ఆర్ కంపెనీతో డీజీసీఏ అధికారి, కేంద్ర మంత్రి రామ్మోహన్కు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. ప్లేన్ క్రాష్ ఘటన కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజాలను సమాధి చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అసలు రోహిత్ సింగ్కు డీజీసీఏ ఎందుకు మద్దతిస్తోంది? రామ్మోహన్ నాయుడు మంత్రి పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ 2025లో రూ.500 కోట్లకు చేరింది. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించండి బారామతి విమాన ప్రమాదంపై ప్రధానికి రోహిత్ పవార్ లేఖ ముంబై: బారామతి విమాన ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ పవార్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.విమాన ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వీటిని స్వతంత్ర సంస్థతో దర్యాప్లు జరిపించి నివృత్తి చేయాలని కోరారు. -
‘అందరికీ కృత్రిమ మేధ సాంకేతికత’
న్యూఢిల్లీ: ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకొనే దిశగా కీలకమైన ముందడుగు పడింది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ(అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషం) అనే స్ఫూర్తితో భారత్ రూపొందించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్’ను ప్రపంచ దేశాలు ఆమోదించాయి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా శనివారం ఈ డిక్లరేషన్పై 86 దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. మానవాళి బాగు కోసం ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధ ప్రయోజనాలను అందరూ సమానంగా పంచుకోవాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ నిర్దేశిస్తోంది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, బహుళ భాగస్వాముల మధ్య అనుసంధానం, దేశాల జాతీయ సార్వ¿ౌమత్వాన్ని గౌరవించడం, ఏఐని మరింత ముందుకు తీసుకెళ్లడం, ఏఐ టెక్నాలజీ వినియోగంలో భద్రమైన, విశ్వసనీయమైన ఫ్రేమ్వర్క్ నిర్మించడం డిక్లరేషన్ ప్రధాన లక్ష్యం. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఏఐ సాంకేతికతను అందించడమే ధ్యేయం. అంతర్జాతీయ సహకారమే పునాది ఏడు కీలకమైన మూలస్తంభాల ఆధారంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ రూపొందించారు. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక వృద్ధి–సామాజిక సంక్షేమం, భద్రమైన–విశ్వసనీయమైన ఏఐ, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఏఐ, సామాజిక సాధికారత సాధన, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, సుస్థిరమైన, ప్రభావవంతమైన, నూతన ఏఐ వ్యవస్థల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. డిక్లరేషన్కు అంతర్జాతీయ ఏఐ సహకారమే పునాదిగా నిలుస్తోంది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’శనివారం ఈ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సదస్సులో పాల్గొన్న దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక పరివర్తనలో ఏఐ పోషించబోయే పాత్రను డిక్లరేషన్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ ఎకోసిస్టమ్స్ను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. తక్కువ ఇంధనంతో పనిచేసే ఏఐ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైన్స్, పరిపాలన, ప్రజాసేవల పంపిణీలో ఏఐ వినియోగం పెంచుకోవాలని స్పష్టంచేశారు. ఈయూ, ఐఎఫ్ఏడీ ఆమోదం న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించిన వాటిలో రష్యా, ఆ్రస్టేలియా, బెల్జియం, భూటాన్, బ్రెజిల్, కెనడా, డెన్మార్క్, ఇస్తోనియా, ఇథియోపియా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్, ఐర్లాండ్, ఇండోనేసియా, ఇరాన్, హంగేరీ, గ్రీస్, జర్మనీ, ఫిన్లాండ్, మెక్సికో, యూఏఈ, ఉక్రెయిన్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, టాంజానియా, స్విట్జర్లాండ్, నార్వే, ఒమన్, ఫిలిప్పైన్స్, పెరూ, రొమేనియా, నేపాల్, మయన్మార్, న్యూజిలాండ్ తదితర దేశాలున్నాయి. అంతర్జాతీయ సంస్థలైన యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్(ఐఎఫ్ఏడీ) సైతం డిక్లరేషన్ను ఆమోదించాయి. సమతుల్యం అత్యంత కీలకం: అశ్వినీ వైష్ణవ్ ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘మానవ కేంద్రీకృత ఏఐ దార్శనికత’ను ప్రపంచదేశాలు ఆమోదించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కృత్రిమ మేధ వనరులను ప్రజాస్వామీకరించడం వల్ల ఏఐ సేవలు, సదుపాయాలు, సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమాన్ని సమతుల్యం చేసుకోవడం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆర్థిక ప్రగతిని మాత్రమే కాకుండా సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంలో భద్రత, విశ్వాసం ముఖ్యమైన అంశాలేనని చెప్పారు. భద్రమైన, విశ్వసనీయ, బలమైన ఐఏ ప్రేమ్వర్క్ను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ పరస్పరం కలిసి పని చేయడానికి ముందుకొచ్చాయని వైష్ణవ్ స్పష్టంచేశారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ సూక్తిని ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఆమోదించాయని స్పష్టంచేశారు. -
ఎస్ఐఆర్ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను(జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు) నియమించాలని కలకత్తా హైకోర్టుకు స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఆయా జ్యుడీషియల్ అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది. ఎస్ఐఆర్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న రగడ పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది. ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ దురదృష్టకరమైన బ్లేమ్ గేమ్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సాఫీగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ సక్రమంగా పూర్తికావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. వేర్వేరు కారణాలు, నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే జాబితాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలనకు, ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించాలని పేర్కొంది. అంతకు మించి మరో మార్గం లేదు ఎస్ఐఆర్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడ్ ‘ఎ’అధికారులను నియమించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగాలంటే కొందరు జ్యుడీషియల్ అధికారులను, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ను ఆదేశించింది. అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి ర్యాంకు ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. పేరు, వయసు వంటి వ్యత్యాసాల వల్ల ఓట్లు కోల్పోయే జాబితా ఉన్న వ్యక్తుల పెండింగ్ క్లెయిమ్లను వీరంతా క్షుణ్నంగా పరిశీలిస్తారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేని పక్షంలో జ్యుడీషియల్ అధికారులను నియమించడం.. లేదా ఎన్నికల సంఘమే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను నియమించుకోవడం మినహా మరో మార్గం లేదని తేలి్చచెప్పింది. జ్యుడీషియల్ అధికారులకు తగిన భద్రత కలి్పంచాలని పోలీసులను ఆదేశించింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతి ఎస్ఐఆర్పై పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన డెడ్లైన్ ప్రకారమే ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. అవసరమైతే తర్వాత అనుబంధ జాబితాలు విడుదల చేయవచ్చని సూచించింది. ఫిబ్రవరి 28 తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చవచ్చని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే తేదీ వరకూ కొత్త పేర్లను చేర్చి, అనుబంధ జాబితాలు విడుదల చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ శనివారం ఒక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల సంఘం అధికారి, అడ్వొకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. -
ఏఐ సదస్సు ద్వారా 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ద్వారా వివిధ దేశాల నుంచి 250 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలు రాబట్టినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే మరో 20 బిలియన్ డాలర్ల మేర డీప్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ సదస్సు పూర్తి స్థాయిలో విజయవంతమైందని శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయల రంగంలో ఈ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రతిపాదిత ఢిల్లీ డిక్లరేషన్కు 70 దేశాలు ఇప్పటికే మద్దతు పలికాయని అన్నారు. శనివారం కల్లా ఈ సంఖ్య 80కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డిక్లరేషన్పై శనివారం సంతకాలు జరుతాయని వివరించారు. సదస్సును 5 లక్షల మందికిపైగా ప్రజలు సందర్శించారని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయని స్పష్టంచేశారు. ఢిల్లీ డిక్లరేషన్పై పూర్తి వివరాలను సదస్సు ముగిసిన తర్వాత బహిర్గతం చేస్తామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇండియా ఏఐ మిషన్ 2.0లో భాగంగా 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు స్పష్టంచేశారు. -
సీఈఓలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు టెక్నాలజీ, ఏఐ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 16 ఏఐ, డీప్టెక్ స్టార్టప్ల వ్యవస్థాపకులతో రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉన్నత విద్య తదితర రంగాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపై వారితో చర్చించారు. వీటితో పాటు పలు అంశాలపై తమ వ్యూహాలు తదితరాలను సీఈఓలు ప్రధానితో పంచుకున్నారు. వారంతా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, స్లొఒవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం, లీచెన్స్టైన్ రాకుమారుడు అలోయిస్తో మోదీ విడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై వారితో లోతుగా చర్చించారు. దిస్సనాయకెతో భేటీ అద్భుతంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, కీలక నైపుణ్యాలు, సంస్కృతి, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. ఇతర దేశాధినేతలతో భేటీలో కూడా పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచి్చనట్టు వెల్లడించారు. గుటెరస్తో సమావేశం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా మోదీ సమావేశమయ్యారు. ఏఐ ప్రస్థానం, దాని ఫలాలు అన్ని దేశాలకు సముచితంగా అందడంలో ఐరాస పాత్ర తదితరాలపై ఆయనతో లోతుగా చర్చించారు. ఏఐ సాంకేతికతను ప్రపంచ ప్రగతి కోసం మరింత సమర్థంగా వినియోగించే విషయంలో భారత్ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని గుటెరస్కు హామీ ఇచ్చారు. -
పాక్స్ సిలికాలోకి భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పాక్స్సిలికా కూటమిలో భారత్ శుక్రవారం సభ్యదేశంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఈ కూటమి ముఖ్యోద్దేశం. భారత్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. మోదీ సర్కారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హెల్బర్గ్ అభినందించారు. ‘‘అరుదైన ఖనిజ సరఫరా వ్యవస్థలపై ప్రస్తుతం కొందరి గుత్తాధిపత్యమే సాగుతోంది. ఇది ఆర్థిక ఒత్తిళ్లతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దారి తీస్తోంది’’అంటూ చైనా తీరును ఉద్దేశించి ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మా సన్నిహిత మిత్ర దేశాలు నిత్యం ఇలాంటి బ్లాక్మెయిలింగ్ల బారిన పడుతుంటే మేం చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. అవి ప్రగతి కోసం తమ సార్వ¿ౌమత్వాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని నివారించడంలో సిలికా కూటమిది కీలక పాత్ర కానుంది. ఎందుకంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత’’అని అభిప్రాయపడ్డారు. కూటమి మరింత బలోపేతం: గోర్ 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతిక ప్రపంచ క్రమాన్ని పాక్స్సిలికా కూటమి పునర్ నిర్వచిస్తుందని గోర్ జోస్యం చెప్పారు. భారత్ చేరికతో ఈ కీలక కూటమి మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘కూటమిలో భారత్ చేరిక కేవలం లాంఛనప్రాయం కాదు. అది అత్యంత ఆవశ్యకమైన చర్య. అరుదైన ఖనిజాలు, ఏఐ రంగాల్లో ప్రత్యర్థులను సవాలు చేయగల అపారమైన నైపుణ్యం భారత్ సొంతం. కనుక టెక్నాలజీ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారం అత్యంత కీలకం. రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్నొవేషన్ తదితరాల్లో ఇది కీలక పాత్ర పోషించగలదు’’అని ఆయన చెప్పారు. ‘‘ప్రత్యర్థులు నియమాలకు కట్టుబడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. శాంతి సాధన బలం, శక్తి సామర్థ్యాలతోనే సాధ్యం. ఈ విషయం భారత్కూ బాగా తెలుసు’’అని గోర్ పేర్కొన్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలుకుని పాక్స్సిలికా దాకా భారత్, అమెరికా పరస్పర సహకారానికి ఆకాశమే హద్దు. నేను రాయబారిగా ఉండే మూడేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తా’’అని తెలిపారు. పలు అడ్డంకులను అధిగమించి, అపోహలను తొలగించుకుని మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. కీలక నిర్ణయం: వైష్ణవ్ పాక్స్సిలికా కూటమిలో చేరికను భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్ర మంత్రి వైష్ణవ్ అభివరి్ణంచారు. ఏఐ, అరుదైన ఖనిజాల రంగంలో సురక్షిత భవితకు ఇది బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలను నానాటికీ మరింతగా పెంచుకుంటోందని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన నానోమీటర్ చిప్స్ను భారత యువ ఇంజనీర్లే రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రస్తుతం కనీసం 10 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరం. భారత్కు అతి పెద్ద అవకాశమిది’’అని పేర్కొన్నారు. ఏమిటీ పాక్స్సిలికా? ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్ చిప్స్ మొదలుకుని స్వచ్ఛ ఇంధనం, ఏరో స్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమన్నది తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. దాంతో ఆ ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతులపై కొన్నేళ్లుగా ఆ దేశ గుత్తాధిపత్యమే సాగుతోంది. అరుదైన ఖనిజాల వెలికితీతలో చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటాయే ఏకంగా 97 శాతం! ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయిగా నిలవనుంది. దాంతో ఈ విషయంలో చైనా పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గత డిసెంబర్లో పాక్స్సిలికా కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికాన్కు సిలికా ముడి ఖనిజమన్నది తెలిసిందే. అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్యదేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని లక్ష్యం. ఆ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో వాటి వినియోగం... ఇలా అన్ని దశల్లోనూ కూటమి దేశాలు సమన్వయంతో పని చేయాలన్నది ఉద్దేశం. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్, ఖతార్ ఇందులో సభ్యులుగా చేరాయి. భారత్లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పాక్స్సిలికా కూటమిలో చేరేలా భారత్ను ఒప్పించేందుకు అమెరికా ముమ్మరంగా ప్రయతి్నస్తూ వచ్చింది. గోర్ భారత రాయబారిగా వచ్చిన క్షణం నుంచే ఈ ప్రయత్నాలకు పదును పెట్టారు. తొలి రోజు బాధ్యతలు స్వీకరించినప్పుడే భారత్ను ఆయన కూటమిలోకి ఆహ్వానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ మంత్రిత్వ శాఖ!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కృత్రిమ మేధ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు.మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో వార్ రూమ్ నిర్వహిస్తాం.. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్మ్యాప్ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏఐ యూనివర్సిటీ స్థాపించాలి ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్ల కోసం జాతీయ ఏఐ నిధి స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం
ఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) వాహనదారులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలలో నగదు లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఈ కొత్త విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా 1,150కి పైగా టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్లు,నగదు చెల్లింపులు ద్వారా జరుగుతున్నాయి. తద్వారా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీతో పాటు పారదర్శకత లోపిస్తుండడంపై ఎన్హెచ్ఏఐ దృష్టిసారించింది. ఇందులో భాగంగా టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని భావిస్తోంది. యూపీఐ,ఫాస్టాగ్ ద్వారా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించే వెసలు బాటు కల్పించనుంది. గతంలో, ఫాస్ట్ట్యాగ్ల స్వీకరణ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ ప్లాజాలలో సగటు వేచి ఉండే సమయం 734 సెకన్ల నుండి 47 సెకన్లకు తగ్గిందని ఎన్హెచ్ఏ తెలిపింది. -
సోలార్ పడవలొచ్చాయ్
తిరునంతపురం: కేరళ ప్రభుత్వం మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలో తొలిసారిగా వైకోమ్ పట్టణంలో సోలార్తో నడిచే పడవల్ని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా కేరళ ప్రభుత్వం పర్యావరణహిత రవాణా రంగంలో కీలక అడుగు వేసినట్లైంది. కేరళ.. ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగా కేరళలో సరస్సులు, కాల్వలు, సముద్రతీరపు నీటి మార్గాలు ఎక్కువ. అందుకే అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పని సరి. అదే సమయంలో కొబ్బరిపీచు, జీడిపప్పు, ఇటుక తయారీ, చేపల వేట వంటి సంప్రదాయ వృత్తులు సైతం నీటి మార్గాల పక్కన ఎక్కువగా ఉండంటం వల్ల రవాణా అవసరాలు పడవల ద్వారా జరుగుతుంటాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పర్యావరణహిత రవాణా మార్గంగా పడవ ప్రయాణాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా వైకోమ్ పట్టణంలో ఇంధనంతో నడిచే పడవల స్థానంలో సోలార్తో నడిచే పడవల్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సి.బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. వైకోమ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హబ్గా అవతరించింది. ఇది కేరళ పర్యావరణహిత రవాణా రంగానికి మరో కలికితురాయి’అని పేర్కొన్నారు.ఇక ఈ జల రవాణా కేంద్రంలోని ఒక్కో పడవలో 75 మంది ప్రయాణించొచ్చు. 3.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పడవలు 80 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో నడుస్తాయి. మొత్తం 10.8 కిలోమీటర్ల మార్గంలో ఈ పడవలు సేవలు అందించనున్నాయి. రోజుకు 15 ప్రయాణాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి, పర్యాటక రంగానికి కూడా ఊతం లభించనుంది. 2017లో వైకోమ్లో మొదటి సౌర పడవను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిగా సౌరశక్తి ఆధారితంగా మారడం కేరళలో స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారు?.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ఢిల్లీ: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం , పోలీసులు కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారన్న సుప్రీంకోర్టు.. కేసును సాగదీస్తున్న పోలీసులను సస్పెండ్ చేశారా ? మీ డీజీపీ ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీకు చేతకాకుంటే చెప్పండి కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ కోర్టు మండిపడిందినవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ అనంత బాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది?. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించాన్న ధర్మాసనం.. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ పొడిగించింది. -
పగలు సెలూన్ యజమాని.. రాత్రి లేడీ డాన్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున డ్రగ్స్ సిండికేట్ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలియాస్ నేహాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన కీలక షూటర్, ఆయుధ సరఫరాదారుడు బాబీ కబూతర్కు చిరకాల భాగస్వామి. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నేహా ఉత్తర-తూర్పు ఢిల్లీలో బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తూ సాధారణ మహిళగా చలామణి అయ్యేది. అయితే, బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, పోలీసుల విచారణలో నేహ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో వీరిని అరెస్ట్ చేసినప్పుడు భారీ మొత్తంలో డ్రగ్స్ లభించాయి. నేహా, బాబీ గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.బాబీ కబూతర్.. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు ప్రధాన లాజిస్టిక్స్ లింక్గా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. దాదాపు ఏడేళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బాబీ కబూతర్ చివరికి పోలీసులకు చిక్కాడు. నేపాల్-భారత సరిహద్దు సమీపంలో ఇటీవల అరెస్ట్ అయిన దేశంలోనే అతిపెద్ద అక్రమ ఆయుధ వ్యాపారిగా పేరున్న సలీం పిస్టల్ నుంచి ఆయుధాలను సేకరించి ముఠా సభ్యులకు అందించేవాడు. సలీం పిస్టల్ వద్ద నుంచి బాబీ కబూతర్ ఆయుధాలను సేకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. సలీం పిస్టల్ను పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అధికారులు వెల్లడించారు.బాబీ కబూతర్.. మొదట నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నాసిర్ గ్యాంగ్లో ఉండేవాడు. ఆ తర్వాత హషీమ్ బాబాతో కలిసి లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్లో చేరాడు. పలు సంచలన కేసులలో నిందితుడిగా ఉన్నాడు. బరేలీలోని నటి దిశా పటాని ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఢిల్లీలోని జాఫ్రాబాద్లో ఇద్దరు సోదరులపై జరిగిన కాల్పుల్లో బాబీ కబూతర్ స్వయంగా పాల్గొన్నట్లు సమాచారం. ఆ ఘటనలో సుమారు 48 రౌండ్ల కాల్పులు జరిగాయి. 2024లో గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన ఈ హత్యలో షూటర్లకు లాజిస్టిక్ సాయం అందించాడని పోలీసుల విచారణలో తేలింది. -
ఏఐ ‘విండోస్’!
ఒకట్రెండేళ్లలో ‘ఏఎస్ఐ’: ఆల్ట్మన్ ‘‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా’’అని దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఏఐ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్వత్రా చర్చనీయంగా మారిన ఆరి్టఫిíÙయల్ సూపర్ ఇంటలిజెన్స్ (ఏఎస్ఐ) తాలూకు తొలి వెర్షన్లు అందుబాటులోకి రావడానికి మరో ఒకట్రెండేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాల్లోనూ మానవ మేధను మించిపోయే ఏఎస్ఐని కృత్రిమ మేధ ప్రస్థానంలో కీలకమైన తదుపరి అడుగుగా భావిస్తున్నారు. ‘‘ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం’’అని స్పష్టం చేశారు. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు.మా పెట్టుబడుల గమ్యస్థానం భారతే: మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్కు అతి పెద్ద ఏఐ పెట్టుబడుల గమ్యస్థానాల్లో భారత్ది అగ్ర స్థానమని సంస్థ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వెల్లడించారు. ఏఐ వినియోగంలో గ్లోబల్ సౌత్ దేశాలు భారత్ను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఈ విషయంలో గ్లోబల్ సౌత్ చేయాల్సింది ఎంతో ఉంది. డేటా సెంటర్లతో పాటు కనెక్టివిటీ, విద్యుత్... ఇలా మొత్తంగా మౌలిక సదుపాయాలన్నీ ఎంతగానో మెరుగవ్వాలి. ఇందుకు భారీ పెట్టుబడులు కావాలి. ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగమూ ముందుకొస్తేనే ఇది సాధ్యం. గ్లోబల్ సౌత్లో ఏఐ విస్తరణకు వచ్చే పదేళ్లలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించడానికి కారణం కూడా అదే’’అని వెల్లడించారు. తమ పెట్టుబడి ప్రణాళికల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టెక్నాలజీ అంతరాలను పూడ్చేందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ముఖ్యమే అయినా మానవ నైపుణ్యాలే అత్యంత కీలకమని స్మిత్ చెప్పారు.ఏఐ దుర్వినియోగ కట్టడిలో భారత్దే కీలకపాత్ర: దరియో ఏఐ వాడకం ఎన్నో సవాళ్లను తెరపైకి తెస్తోందని ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్ అభిప్రాయపడ్డారు. ఏఐ మోడళ్ల స్వతంత్ర ప్రవర్తన మరిన్ని సమస్యలకు దారితీస్తోందన్నారు. ‘‘వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఏఐ దుర్వినియోగం పెరిగిపోతోంది. మున్ముందు ఇది పెద్ద సమస్యగా మారనుంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. దాన్ని కట్టడి చేయడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. చారిత్రకంగా గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అన్ని విషయాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ ఫలాలు ఆయా దేశాలకు అందడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ వచి్చందన్నారు. ‘‘తొలి ఏఐ సదస్సు 2023లో జరిగింది. ఈ మూడు నాలుగేళ్లలోనే ఏఐ రంగం అనూహ్య ప్రగతి సాధించింది. వాణిజ్యపరంగానే గాక సామాజికంగా కూడా ఏఐ వాడకాన్ని దేశాలన్నీ పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు నైతిక సమస్యలు, సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వాటికి తక్షణం సమాధానాలు కనిపెట్టాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ సాంకేతికత పలు విషయాల్లో మానవ మేధను అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏఐ మోడళ్లు సూపర్ హ్యూమన్ సామర్థ్యాలతో పనులు చక్కబెట్టనున్నాయి. దేశాల మేధో సామర్థ్యమంతా ఇకపై డేటా సెంటర్లలో నిక్షిప్తం కానుంది. కనీవినీ ఎరగని ఈ పరిణామాలు మానవాళికి అవకాశాలతో పాటు మరెన్నో సవాళ్లను కూడా తేనున్నాయి. ఏఐతో అందివచ్చే అవకాశాల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా చికిత్స లేని రోగాలకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఏఐ వ్యవస్థల స్వతంత్ర పనితీరు విపరిణామాలకు దారి తీయవచ్చు. వ్యక్తులు, వ్యవస్థలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా వాటిని దుర్వినియోగం చేయవచ్చు’’అని అమొదెయ్ హెచ్చరించారు.గ్లోబల్ లీడర్గా భారత్: రషీద్ ప్రేమ్జీ ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగే సువర్ణావకాశం భారత్ ముందు ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రషీద్ ప్రేమ్జీ అన్నారు. ఈ విషయమై వచ్చే కొన్నేళ్లలో భారత్ తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలు కీలకమని అభిప్రాయపడ్డారు. దానిపైనే దేశ ఆర్థిక ప్రగతి, 140 కోట్ల ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారాలు ఆధారపడతాయన్నారు. ‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఏఐ టాలెంట్ పూల్ భారత్ సొంతం. ఇది తిరుగులేని సానుకూలత. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐకి, టాలెంట్కు మన దేశం గమ్యస్థానంగా మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా ఏకంగా 6.5 లక్షల మంది నిపుణులు ఏఐ, సంబంధిత రంగాల్లో నిత్యం కృషి చేస్తున్నారు. మరో ఏడాదిలో వారి సంఖ్య రెట్టింపు కానుంది. యూపీఏ పేమెంట్ల విధానం భారత్లో ఎంతగా సక్సెస్ అయిందో ప్రపంచమంతా చూస్తోంది. డీప్టెక్, ఏఐ స్పేస్లో 4,000 పై చిలుకు స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఏఐ పటిమను పెంచుకోగలిగితే అద్భుతాలు సాధ్యపడతాయి’’అని ప్రేమ్జీ చెప్పారు.ఏఐ ఎడ్యుకేషన్లో భారత్ భేష్: యాక్సెంచర్ విద్యా వ్యవస్థలో ఏఐని అంతర్భాగంగా తీర్చిదిద్దడంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ అన్నారు. ‘‘ప్రాథమిక విద్యలోనే ఏఐని భాగంగా చేయడం నిజంగా అభినందనీయం. దీన్ని అన్ని దేశాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది’’అని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఐ వర్క్ఫోర్స్ విషయంలో కూడా భారత్ అగ్ర స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘అభ్యసన నిరంతర ప్రక్రియ అన్నది ఏఐ రాకతో మరింత వాస్తవంగా మారింది. సంస్థలైనా, దేశాలైనా కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటేనే ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయి’’అని స్పష్టం చేశారు.భారత ఏఐ మోడల్స్ ప్రపంచానికి ఆదర్శం: ఫిలిప్స్ వైద్య రంగంలో భారత్ తయారు చేస్తున్న ఏఐ మోడళ్లు ప్రపంచానికి ఆదర్శమని రాయల్ ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్ అన్నారు. ఈ రంగంలో గ్లోబల్ మోడల్స్లో సంస్కరణలకు దారి చూపగల సత్తా వాటి సొంతమని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ సాంకేతికత అత్యంత ప్రభావం చూపగల రంగాల్లో ఆరోగ్యం కీలకమైనది. ఈ రంగంలో ఏఐ వాడకంలో భారత్ చాలా ముందుంది. దీనికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్ వంటివి నిదర్శనం. ఆరోగ్య రంగంలో భారత్ను గ్లోబల్ ఇన్నొవేషన్ ఇంజన్గా ఫిలిప్స్ పరిగణిస్తోంది’’అని చెప్పారు.దూకుడైన వ్యూహాలే మార్గం: మెటా ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టాలంటే సరైన విధానాలు, భారీ పెట్టుబడులతో పాటు దూకుడైన వ్యూహాలు కూడా చాలా కీలకమని టెక్నాలజీ దిగ్గజం మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ అన్నారు. దేశాలన్నీ దీనిపై తక్షణం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ టూల్స్ అన్ని అవసరాలనూ తీర్చేందుకు అనువుగా రూపొందాలి. అంతే తప్ప అన్నింటికీ ఒకే టెక్నాలజీ వాడుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాంతం, భాష, సంస్కృతి వంటివాటితో నిమిత్తం లేకుండా ప్రజలంతా ఏఐ టెక్నాలజీని సులువుగా వాడుకోగలగాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఒక్కతాటిపైకి వస్తేనే అది సాధ్యం’’అన్నారు. ఇందుకోసం ‘పర్సనల్ సూపర్ ఇంటలిజెన్స్’దిశగా మెటా కృషి చేస్తోందని గుర్తు చేశారు. మనుషుల బిజీ జీవితాలను చక్కగా ప్లాన్ చేయడం తదితరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు.ఇన్నొవేషన్కు భారత్ సారథ్యం: ష్నీడర్ ‘‘దేశాల ప్రగతి ప్రస్థానంలో కృత్రిమ మేధతో పాటు ఇంధన మేధ (ఎనర్జీ ఇంటలిజెన్స్–ఇంధన మేధ) పాత్ర కూడా నానాటికీ కీలకంగా మారుతోంది. ఆ రెండు రంగాలూ పరస్పరం అవిభాజ్యంగా రూపొందుతున్నాయ. అలాంటి ఈ కీలక రంగాల్లో గ్లోబల్ ఇన్నొవేషన్కు సారథ్యం వహించే సువర్ణావకాశం భారత్ ముందుంది’’అని ష్నీడర్ ఎలక్ట్రిక్ సీఈఓ ఒలివియర్ బ్లుమ్ అభిప్రాయపడ్డారు. ఆ రంగాలకు ప్రభుత్వ, పరిశ్రమపరంగా లభిస్తున్న బలమైన మద్దతే ఇందుకు కారణమని చెప్పారు. ఏ రంగంలోనైనా భారత్లో నిలదొక్కుకోగలిగిన సంస్థ ప్రపంచంలో మరెక్కడైనా రాణించవచ్చని చెప్పారు. ‘‘వ్యయ నియంత్రణ, ఇన్నొవేషన్, తిరుగులేని నైపుణ్యం, అపార మానవ వనరులతో ఏఐ విప్లవానికి భారత్ సారథిగా మారుతోంది. ఇంధనం, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ తదితరాల్లో తిరుగులేని సామర్థ్యాలు ఆ దేశానికి ఎంతగానో కలిసొస్తున్నాయి’’అని చెప్పారు.వికటించే రిస్కుతో జాగ్రత్త: నీలేకని ‘‘ఏఐ రంగంలో శరవేగంగా సాధిస్తున్న ప్రగతి అన్ని రంగాలకూ విస్తరించేలా చూడటం చాలా ముఖ్యం. తద్వారా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు అది ఉపయోగపడాలి’’అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. లేదంటే ఏదో ఒక దశలో ఏఐ టెక్నాలజీ వికటించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ తదితర వృత్తి నిపుణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ ఇండియా సదస్సులో భాగంగా ఏఐ ప్రభావం తదితరాలపై ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్తో నీలేకని ముచ్చటించారు. డీప్ఫేక్ సమస్య వంటి ఏఐ తాలూకు ప్రతికూల పార్శా్వలను కూడా ఆయన ఉదాహరించారు. -
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజీనామా చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర విమాన ప్రమాద ఘటనకు కారణమైన చార్టర్డ్ విమానయాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ను కాపాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, తెలుగుదేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నందున సదరు మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ గురువారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రమాదం వెనుక ‘ఇన్సూరెన్స్’ కోణం కూడా ఉన్నట్లు రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణ చేశారు. విమానం కొనుగోలు ధర రూ.35 కోట్లు అయితే.. దాని ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం రూ.10 నుంచి రూ.15 కోట్లు మాత్రమేనని.. అయితే, ఆశ్చర్యకరంగా ఆ విమానానికి ఏకంగా రూ.55 కోట్ల ఇన్సూరెన్స్, అలాగే రూ.210 కోట్ల మేర లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. లియర్ జెట్ విమాన ప్రమాదంలో ఆ చార్టర్డ్ విమానాన్ని నిర్వహించిన వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థను తెలుగుదేశం పార్టీ పెద్దలు వెనకేసుకొస్తున్నారని రోహిత్ పవార్ ఆరోపించారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకు వీఎస్ఆర్ కంపెనీ యజమానులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్ కుమారుడు రోహిత్ సింగ్ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు, మంత్రులు, మహారాష్ట్ర మాజీమంత్రులు కూడా హాజరయ్యారని రోహిత్ పవార్ ఆధారాలతో సహా బయటపెట్టారు.వీరి మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉండడంవల్లే విమానయాన సంస్థను వారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రామ్మోహన్ నాయుడు మంత్రిగా కొనసాగితే విచారణ పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ప్రయాణికుల ప్రాణాలతో వీఎస్ఆర్ చెలగాటంప్రమాదానికి గురైన విమానంలో పరిమితికి మించి అదనపు ఇంధన ట్యాంకులను నింపారని, అవే విమానంలో బాంబుల్లా పేలాయని రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేవలం బారామతి వరకు వెళ్లే విమానానికి అంత ఇంధనం ఎందుకు? అవసరమైతే హైదరాబాద్లో ఇంధనం నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా ఎందుకు చేయలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ దుర్ఘటన కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాలకు ఈ చిన్నచిన్న పరిణామాలే బలాన్పిస్తున్నాయని తేల్చిచెప్పారు. వీఎస్ఆర్ సంస్థ తమ విమానాలను కనీస స్థాయిలో కూడా మెయింటెనెన్స్ చేయకుండా వీవీఐపీలు, ఇతర ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోందని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు, ఎక్కడా ఎలాంటి లోపాలు లేనట్లుగా ఆ సంస్థ యజమాన్యం డాక్యుమెంట్లను తారుమారు చేస్తోందని ఆరోపించారు. మియామికి పారిపోయిన యజమానులుఈ మొత్తం వ్యవహారంలో వీఎస్ఆర్ వెంచర్ యజమాని వీకే సింగ్, ఆయన కుమారుడు రోహిత్ సింగ్ ఆచూకీపై రోహిత్ పవార్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రోహిత్ సింగ్ దేశం విడిచి పరారయ్యాడని, ప్రస్తుతం అతను మియామిలో ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు అలా చేయకపోవడం దారుణమన్నారు.రాజకీయ కుట్ర ఉందా?ఇదిలా ఉంటే.. బలమైన నాయకులను అజిత్ పవార్ ఎదిరించినందున, ఆయన భద్రతపై గతంలోనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని రోహిత్ పవార్ తెలిపారు. ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం ఎన్డీయేలో చేరడం.. లేదా అజిత్ పవార్ ఎన్డీయే నుంచి తప్పుకోవడం వంటి ఊహాగానాల నేపథ్యంలో కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ సహా పలువురు ఎన్సీపీ నేతలు ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరడాన్ని రోహిత్ పవార్స్వాగతించారు. మరోవైపు, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై ఫిబ్రవరి 27 నాటికి ప్రాథమిక నివేదికను విడుదలచేసే అవకాశముంది. ఈ తరుణంలో విమానయాన సంస్థకు, టీడీపీ నేతలకు మధ్య ఉన్న బంధంపై వస్తున్న తీవ్ర ఆరోపణలు జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. సమగ్ర విచారణ జరపాల్సిందే: సుప్రియా సూలే ఇక ఈ వ్యవహారంపై బారామతి ఎంపీ, అజిత్ పవార్ సోదరి సుప్రియా సూలే సైతం స్పందించారు. ప్రమాదానికి సంబంధించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, ఈ ఘటనపై పారదర్శకమైన, సమగ్ర విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. రోహిత్ పవార్ చేస్తున్న పోరాటం శాస్త్రీయమైనదంటూ మద్దతు పలికారు. విమాన ప్రమాదం వెనుక అసలు నిజాలు బయటికి రావాలని రోహిత్ పవార్ కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే సమగ్ర విచారణను కోరుతున్నామని సుప్రియా స్పష్టంచేశారు.


