Prakasam
-
ఎవరికీ ‘చెప్పు’కోలేక..!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యా మిత్ర కిట్లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా.. -
చట్టాలను అతిక్రమిస్తే జైలుకే..
● జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ మార్కాపురం: మనుషులు ఆవేశంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి, నిగ్రహం నశించి చట్టాలను అతిక్రమిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మార్కాపురంలోని సబ్జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మంచి, చెడును గ్రహించే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, అవి లేని రోజున సమాజంలో శాంతి ఉండదని అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జైల్లో అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట సబ్జైలు సూపరింటెండెంట్ విజయ్కుమార్, ప్యానల్ న్యాయవాదులు ఎస్కే జహీర్, సలామ్, సిబ్బంది ఉన్నారు. -
ఎవరికీ ‘చెప్పు’కోలేక..!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. – సాక్షి, ఒంగోలు బూట్లకు బదులు చెప్పులతో వెళ్తున్న ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్ విద్యార్థినులు విద్యా మిత్ర కిట్లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా.. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
ఒంగోలు టౌన్: జిల్లాలో చెడునడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గంజాయి, పేకాటను కట్టడి చేసేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. తరచుగా గ్రామాలను సందర్శిస్తూ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు చేయాలని, సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్ బీట్స్ బలోపేతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ఇతరా శాఖలతో సమన్వయం చేసుకొని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సైబర్నేరాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, కొత చట్టాలు, శిక్షలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేసే విధంరగా ప్రోత్సహించాలని, పోలీస్ స్పందన వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలన్నారు. బహింరంగంగా మద్యం తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, డీసిఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష -
ఒంగోలులో హైటెక్ వ్యభిచారం
ఒంగోలు టౌన్: నగరంలో ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే భాగ్యనగర్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యనగర్ రెండో లైనులో నివాస గృహాల మధ్య ఉన్న రెండు అపార్టమెంట్లలో ఒక మహిళ హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బుధవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక మహిళా నిర్వహకురాలితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆర్థికంగా స్థితిమంతురాలైన నిర్వాహకురాలికి నగరంలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె ఆన్లైన్ విధానంలో కాల్ గర్ల్స్ను ఏర్పాటు చేస్తూ విటుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ● ఎస్పీ హర్షవర్థన్రాజు హెచ్చరిక ఒంగోలు టౌన్: మోడిఫైడ్ సెలెన్సర్లతో చెవులను హోరెత్తించేలా శబ్ధం చేస్తూ రోడ్లపై చక్కర్లు కొట్టే బైకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. నగరంలో గత నాలుగు నెలలుగా ప్రత్యేక డ్రైవ్లో గుర్తించి తొలగించిన మోడిఫైడ్ సైలెన్సర్లను బుధవారం రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ సెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తు చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక శబ్ధాల వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అధిక కాంతినిచ్చే లైట్లను వాహనాలకు అమర్చి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, తాలుకా సీఐ విజయ కృష్ణ, ఆర్ఐ సీతారామిరెడ్డి, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓగూరులో సచివాలయానికి తాళం కందుకూరు రూరల్: మండలంలోని ఓగూరులో స్వర్ణ గ్రామ సచివాలయానికి గ్రామస్తులు బుధవారం తాళం వేశారు. సదరం స్లాట్ బుక్ చేసుకునేందుకు స్థానికులు కొందరు సచివాలయానికి ఉదయం 10.30 గంటలకు రాగా సిబ్బంది ఎవరూ లేరు. కాసేపు ఆగి మళ్లీ రాగా తలుపులు తీసి ఉన్నాయి కానీ ఉద్యోగులు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సచివాలయానికి తాళం వేసి ఎంపీడీఓ రత్నజ్యోతికి అప్పగించారు. ఈ విషయమై ఎంపీడీఓ స్పందిస్తూ.. పంచాయతీ కార్యదర్శి డీపీఓ కార్యాలయంలో ఎలక్షన్ వర్క్లో ఉన్నారని, డిజిటల్ అసిస్టెంట్ మెడికల్ లివ్లో ఉండటంతో ఇన్చార్జిని నియమించామన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్వేలో ఉండగా, ఇన్చార్జి డిజిటల్ అసిస్టెంట్, మహిళా సంరక్షణ కార్యదర్శి సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టాలరని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
28న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు: ఈనెల 28న స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్స్లో అండర్–19 వన్ డే, మల్టీ డే క్రికెట్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా కలర్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలని పేర్కొన్నారు. 2007 సెప్టెంబర్ ఒకటో తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. వివరాలకు 9573424360, 9246222999ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు: ప్రకాశం జిల్లా క్రీడా భారతి ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల కబడ్డీ పోటీలను ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు పి.విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రాడాకారులు ముందుగా క్రీడాభారతి యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. ఒక పాఠశాల నుంచి, గ్రామం నుంచి ఎన్ని టీములైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వివరాలకు 9849429839, 96031 62699ను సంప్రదించాలని సూచించారు. గుడ్లూరు: ప్రైవేటు స్కూల్ బస్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకొనిపోయిన ఘటన మండలంలోని సాలిపేట– రావూరు గ్రామాల మధ్య బుధవారం జరిగింది. తల్లిదండ్రుల సమాచారం మేరకు..మండలంలోని చేవూరు గ్రామంలోని సాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్ ఉలవపాడు మండలం రామాయపట్నం నుంచి విద్యార్థులను తీసుకొస్తుండగా రావూరు సమీపం దగ్గర అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకొనిపోయింది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్ అజాగ్రత్త వలనే ఈప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుడ్లూరు: గూడ్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళ తన బంగారం బ్రాస్లెట్ను బస్లో మర్చిపోయి దిగింది. వెంటనే గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్ డ్రైవర్కు ఫోన్ చేయగా సీటులోనే బంగారం బ్రాస్లెట్ పడి ఉంది. కండక్టర్ తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలికి గుడ్లూరు పోలీసులు బ్రాస్లెట్ అప్పగించారు. నిజాయతీగా బంగారాన్ని అప్పగించిన ఆర్టీసీ కండక్టరు, డ్రైవర్లను పోలీసులు, బాధితురాలు అభినందించి శాలువతో సన్మానించారు. గిద్దలూరు రూరల్: మండలంలోని నరవ గ్రామ సమీపంలో గల నీటి కుంటలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిల్లెల సాలమ్మ(85) గ్రామంలో ఒంటరిగా ఉంటూ జీవితంపై విరక్తి చెంది నీటి కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సాలమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కాగా, పదేళ్ల క్రితం కుమారుడు మరణించాడు. కుమార్తెకు వివాహమై సాలమ్మకు దూరంగా ఉంటోంది. ఒంటరి జీవితాన్ని భరించలేని సాలమ్మ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23వ తేదీన నీటి కుంటలో పడి మృతి చెందింది. నీటి కుంటలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
న్యాయవాది దుర్మరణం
బైక్ను ఢీకొట్టిన కంటైనర్..ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒంగోలు నగరానికి చెందిన ఓ న్యాయవాది దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన న్యాయవాదులు గంటా శ్రీనివాసరావు, టి.విజయసారథి, కె.మారుతినందన్, పసుపులేటి వెంకట పవన్ కుమార్ బుధవారం రాత్రి రెండు మోటారు బైకులపై మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్కు వెళ్లారు. అక్కడ ఒక హోటల్లో టిఫిన్ చేసి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరాజువారిపాలెం వద్దకు రాగానే అతి వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయవాది గంటా శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మారుతి నందన్ను తొలుత ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చైన్నె తరలించారు. మరో బైక్పై ఉన్న ఇద్దరు న్యాయవాదులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన గంటా శ్రీనివాసరావు ఒంగోలు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు రాజీవ్ నగర్లో నివసిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సంతాపం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన గంటా శ్రీనివాసరావు కుటుంబానికి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, న్యాయవాదులు ఇనకొల్లు వెంకటేశ్వర్లు, దారా వశిష్ట, వై.సునీల్ కుమార్, చక్కా బాలచెన్నయ్య, పెన్నా నాగరాజు, లక్ష్మణ్ కుమార్, కేవీ శేషారెడ్డి సంతాపం తెలిపారు. బార్లో న్యాయవాదులందరితో సన్నిహితంగా మెలిగే మంచి స్నేహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన మరో న్యాయవాది పరిస్థితి విషమం.. చైన్నెకి తరలింపు న్యాయవాది ‘గంటా’ మృతికి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సంతాపం -
హాయివే కాదు సుమా!
పని చేసి అలసిన ఓ బాలుడు వేగంగా దూసుకెళ్తున్న వాహనంపై మండుటెండలో నిద్రిస్తున్న దృశ్యాన్ని చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై ఒంగోలు శివారులోని త్రోవగుంట వద్ద ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. ఓ లోడ్ ట్రక్ అంచున ప్రమాదకర స్థితిలో నిద్రిస్తున్న బాలుడు.. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రక్ గమ్యస్థానానికి చేరుకునేలోపు ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. – సాక్షి, ఒంగోలు -
ఆర్టీసీ బస్లో మహిళకు గుండెపోటు
● సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన డాక్టర్ గిద్దలూరు(బేస్తవారిపేట): ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా అదే బస్సులో ఉన్న డాక్టర్ సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గిద్దలూరు–నంద్యాల ఘాట్లో బుధవారం చోటుచోసుకుంది. గిద్దలూరు నుంచి కర్నూలు వెళ్లేందుకు హసీనాబాను అనే బహిళ ఆర్టీసీ బస్ ఎక్కింది. మార్గమధ్యలో బస్లో కుప్పకూలిపోయింది. సెల్ఫోన్ సిగ్నల్ లేదు.. అంబులెన్స్ వచ్చేందుకు అవకాశం లేదు. ఆర్టీసీ బస్ను డ్రైవర్ ఒక పక్కకు తీసి నిలిపారు. తోటి ప్రయాణికులు ఆందోళన చెందుతున్న తరుణంలో అదే బస్లో ఉన్న నంద్యాల ఎంఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కందుల ఉమామహేశ్వరరెడ్డి పరిస్థితిని గమనించారు. మహిళకు 15 నిమిషాల పాటు సీపీఆర్ చేయగా ఆమె కళ్లు తెరిచి ఊపిరి తీసుకుంది. మహిళ ప్రాణం నిలబెట్టిన వైద్యుడికి ప్రయాణికులంతా కృతజ్ఞతలు తెలిపారు. ● ఒకరిని పట్టుకుని చితకబాదిన స్థానికులు సింగరాయకొండ: మండల కేంద్రమైన సింగరాయకొండలోని ఆంజనేయనగర్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి యత్నించగా స్థానికులు అప్రమత్తమై ఒకరిని బంధించారు. దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున చోటుసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆంజనేయనగర్ సమీపంలో నివసిస్తున్న పాదర్తి సురేష్ ఇంటి ప్రహరీ దూకిన దొంగలు వెనుక వైపు తలుపును తెరిచేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సురేష్ గమనించి ఇంటి లోపలికి వచ్చిన అస్సాం రాష్ట్రానికి చెందిన రతన్బైగాను గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో సురేష్ భార్య పెద్ద పెట్టున కేకలు వేయడంతో దొంగల ముఠా సభ్యులు పరారయ్యారు. రతన్బైగా సైతం ఇంటి యజమానిపై దాడికి యత్నించి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు వచ్చి చితకబాదారు. పోలీసులకు సమాచారం అందిచగా స్టేషన్లో ఎవరూ అందుబాటులో లేరని బదులివ్వడంతో చేసేది లేక డయల్కు 100కు కాల్ చేశారు. మరో అరగంట తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను చితకబాదిన తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని స్థానికులు చెప్పారు. దొంగ కాదు.. పిచ్చోడట! రతన్బైగాను పోలీసులు తమ బైక్పై స్టేషన్కు తరలించారు. అతడికి తెలుగు రాదని, హిందీలో ప్రశ్నిస్తే నలుగురం వచ్చామని చెప్పాడని రాత్రి 7 గంటల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో కూడా ఉందని, అయితే పోలీసులు మాత్రం పిచ్చోడని చెబుతున్నారని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంభం: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి కంభంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కంభానికి చెందిన సయ్యద్ సద్దాం (32) టైల్స్ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ప్రజలు సహకరించాలి
ఒంగోలు సబర్బన్: జనాభా లెక్కల సేకరణకు ప్రజలు సహకరించాలని జన గణన అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. జనాభా లెక్కల సేకరణలో పాల్గొనే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణను బుధవారం ఒంగోలులో ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పర్యవేక్షించారు. ఫీల్డ్ ట్రైనర్లకు గృహ గణన చేసే విధానం, యాప్లో వివరాల నమోదు, సమాచార సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఒంగోలు పట్టణంలో నాలుగు బృందాలకు క్షేత్ర స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జన గణన అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించడంలో ఎదురయ్యే సమస్యలు, యాప్లో వివరాల నమోదు సమయంలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా జనాభా లెక్కల సేకరణ సిబ్బందికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలోని ఫీల్డ్ ట్రైనర్లకు రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా సిబ్బందికి క్షేత్ర స్థాయిలో అవగాహన కోసం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నివాసంలో మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు సేకరించి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. మాస్టర్ ట్రైనర్ మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జనాభా లెక్కల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఫీల్డ్ ట్రైనర్లకు క్షేత్ర స్థాయి శిక్షణ -
ప్రారంభమే ఢమాల్
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభం రోజే రైతులకు భారీషాక్ ఇచ్చారు వ్యాపారులు. కేజీకి కేవలం రూ.250ల ప్రారంభ ధరతో వేలాన్ని ప్రారంభించారు. రైతులు ఊహించిన ధరలకు దరిదాపుల్లో కూడా ప్రారంభ ధరలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధరలు ఇదే విధానంలో కొనసాగితే భారీ నష్టాలతో నిండా మునుగుతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగే అవకాశం లేదని అటు బోర్డు అధికారులు, ఇటు వ్యాపారుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా పొగాకు రైతులకు భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 ఏడాది పొగాకు సీజన్కు సంబంధించిన వేలం ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో మొదటి విడతలో భాగంగా కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో వేలాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా కందుకూరు–1 వేలం కేంద్రంలో 18 బేళ్లను వేలానికి ఉంచారు. కేజీకి రూ.250 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే క్వింటా పొగాకు రూ.25 వేలు మాత్రమే వచ్చింది. అదీ నాణ్యమైన బ్రైట్గ్రేడ్ పొగాకు రూ.250లు మాత్రమే ఇచ్చారు. దీంతో రైతులు ప్రారంభ ధరల పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు భారీ స్థాయిలో పెరిగాయని ఈ విధమైన ధరలు ఇస్తే కోలుకోలేకుండా దెబ్బతింటామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే ధరలు ఈ విధంగా ఉంటే ఇక లోగ్రేడ్ పొగాకు ధరలు ఎంత దారుణంగా ఉంటాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధమైన ధరలతో వేలం కొనసాగితే సరాసరి ధరలు భారీగా పడిపోతాయని భావిస్తున్నారు. కర్ణాటక మార్కెట్లో సరాసరి ధర రూ.230లు వచ్చిందని, ఇక్కడ ఆ ధరలు కూడా వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, వ్యాపారులు మాత్రం మార్కెట్ ఆశాజనకంగా లేనందున ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పొగాకు రైతుల భవిష్యత్ ఏంటో మొదటి రోజు వేలంలోనే స్పష్టమైంది. -
వాన వెలిసింది.. నష్టం మిగిలింది
మార్కాపురం: గతవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి మొత్తం 1182 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. 1292 మంది రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి తదితర పంటలు పూర్తిస్థాయిలో నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా మొక్కజొన్నతోపాటు అలసంద, వరి, పొద్దుతిరుగుడు పంటలు అకాల వర్షానికి నేలకొరిగాయి. మార్కాపురం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం రాళ్లపల్లి గ్రామంలోనే అత్యధికంగా 213 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు నివేదిక పంపారు. యర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి, పుల్లలచెరువు, పొదిలి, అర్ధవీడు, తదితర మండలాల్లో రైతులు కూడా నష్టపోయారు. ప్రకాశం జిల్లాలో 770 మంది, మార్కాపురం జిల్లాలో 522 మంది రైతులు నష్టపోయారు. 533.42 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, రాగి, అలసంద పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో వరిసాగు చేసిన రైతులు 102 మంది, మొక్కజొన్న రైతులు 151 మంది, పొద్దుతిరుగుడు రైతులు 225 మంది, రాగి సాగు చేసిన 43 మంది రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి, గన్నవరం, వెలిగండ్ల, పి నాగులవరం, రామగోపాలపురం, కనిగిరి మండలంలోని జమ్మలమడక, హెచ్ఎంపాడు మండలంలోని నందనవనం, సీఎస్పురం మండలంలోని అరివేముల, కంభం మండలంలోని రావిపాడు, అర్ధవీడు మండలంలోని కాకర్ల, మార్కాపురం మండలంలోని చింతగుంట్ల గ్రామాల్లో రైతులు నష్టపోగా దర్శి మండలంలోని కొర్లమడుగు, కొత్తపల్లి, లక్ష్మీ నారాయణపురం, త్రిపురసుందరపురం, పెద్ద ఉయ్యాలవాడ, రామచంద్రాపురం, బసిరెడ్డిపల్లి, లింగసముద్రం మండలంలోని పెద్దపవని గ్రామాల్లో అకాల వర్షాలకు పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలకు కూడా పంట నష్టం జరిగింది. ఆ పరిహారం కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో గత వారం కురిసిన అకాల వర్షానికి మళ్లీ పంటలు దెబ్బతినడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబు సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాధీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. గతంలో తీరానికి దగ్గరగా చేపల వేట సాగించిన పాండిచ్చేరి రాష్ట్రం కరైకల్కు చెందిన సోనాబోట్లు పెద్దల కుట్ర..! -
జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది..
ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాధీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీబీ వ్యాధిపై అపోహలు వద్దు
ఒంగోలు టౌన్: టీబీ వ్యాధిపై అపోహలు తొలగించుకొని వైద్యులు సూచించిన విధంగా మందులు వాడాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు సూచించారు. వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పల్మనాలజీ హెచ్ఓడీ డా.రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సు లో సూపరింటెండెంట్ మాణిక్యరావు మాట్లాడుతూ టీబీ నయమయ్యే వ్యాధి అని తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన వైద్య చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని చెప్పారు. సీఎస్ఆర్ఎంఓ డా.మాధవీలత మాట్లాడుతూ వృద్ధుల్లో టీబీ వ్యాధి గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యులు రంజిత్ బాషా, సాంబశివరావు, కుమార్ వర్మ, పల్మనాలజీ సిబ్బంది పాల్గొన్నారు. -
హామీల అమలులో చంద్రబాబు విఫలం
పుల్లలచెరువు: సూపర్ సిక్స్ పథకాలు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. గద్దెనెక్కిన తర్వాత ఆ సంగతే మరిచారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెంలో శ్రీ సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు.. తన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యోగం ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పింఛను ఎగ్గొట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను హామీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ది, సంక్షేమం ఊసే లేదని, రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 22 నెలల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, ఆ సొమ్మంతా టీడీపీ, జనసేన నేతలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలని సూచించారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు మరో రెండేళ్లు ఓపిక పట్టాలని సూచించారు. రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ అండ్ కో సాగిస్తున్న అరాచకాల్లో పాలుపంచుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, వారిని వదిలే ప్రసక్తి లేదని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వాగ్యానాయక్, రాష్ట్ర వలంటరీ విభాగం కార్యదర్శి బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఎల్.రాములు, సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యుడు కె.రఘు, నాయకులు ఆవుల రవణారెడ్డి, గడ్డం సుబ్బయ్య, రోసిరెడ్డి, వాసు, శ్రీనివాసరెడ్డి, చరణ్రెడ్డి, నాసర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని తుంగలో తొక్కారు సుబ్బారెడ్డిస్వామి తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి -
పేదల ఇంటి అద్దెలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు నివేశిత స్థలాలు ఇవ్వాలని, లేనిపక్షంలో వారు నివసిస్తున్న ఇళ్లకు ప్రభుత్వమే అద్దెలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పేదలకు నివేశిత స్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల ఆజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎకరా 99 పైసల చొప్పున సొంత వ్యక్తులకు కట్టబెడుతున్న చంద్రబాబుకు రాష్ట్రంలోని పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వడానికి మనసురావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడ్కో గృహాల గురించి రచ్చ చేసిన కూటమి నాయకులు ఇప్పుడు టిడ్కో గృహాల గురించి నోరు విప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ నగరంలోని సరళాదేవి నగర్, దత్తాత్రేయ కాలనీల్లో 20 ఏళ్లుగా ప్రజలు నివాసం ఉంటున్నప్పటికీ వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. నగరంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అర్హులైన వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్, ఎంఏ సాలార్, వీరారెడ్డి, హనుమారెడ్డి, ఎం.విజయ, చిరంజీవి, సీతారామయ్య, అంజయ్య పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
● రూ.9.49 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం కనిగిరి రూరల్: పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ ఏవీ రమణకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ 9,49,800 నగదు, 30 గ్రాముల బంగారు సరుడు, ఏపీ 27బీఎం 3997నెంబర్ గల మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కనిగిరిలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కనిగిరి శివారులో పొదిలి రోడ్డులోని లారీ ఆఫీసు వద్ద సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సందీప్ కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వడ్డమాను శివారెడ్డి(అంకిరెడ్డి పాలెం, గుంటూరు జిల్లా)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కనిగిరిలో ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడటంతోపాటు దర్శిలో బైక్ అపరిహించినట్లు నిందితుడు అంగీకరించాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 చోరీ కేసులు నిందితుడిపై నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడి అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
నేటి నుంచి పొగాకు వేలం
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో ఎదురైన జాప్యానికి తెరపడనుంది. ఎట్టకేలకు జిల్లాలో పొగాకు వేలాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం నుంచి జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ప్రారంభం కానుంది. ఈ ఏడాది పొగాకు ధరలపై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ధరలు లేక నష్టాలు మూటగట్టుకున్నామని, ఈ ఏడాదైనా గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకోవాలంటూ రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఆకు నాణ్యంగా ఉండటంతో ధరలు బాగుంటాయనే ఆశలు పెట్టుకున్నారు. అదే సందర్భంలో ప్రస్తుతం పొగాకు మార్కెట్ అంత ఆశాజనకంగా లేదనే భయం కూడా రైతులను వెంటాడుతోంది. కర్ణాటక పొగాకు వేలంలో వస్తున్న ధరలే దీనికి కారణం. ఇటువంటి పరిస్థితుల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం ప్రక్రియ రైతుల భవిష్యత్ను నిర్ణయించనుంది. తొలి దశలో రెండు కేంద్రాలు పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి, వెల్లంపల్లి, కందుకూరు–1, కందుకూరు–2, పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలు జిల్లా పరిధిలో ఉంటే కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిలో కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు వేలాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగిలిన 9 వేలం కేంద్రాల్లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి వేలం ప్రారంభమవుతుందని బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏడాది పొగాకు వేలం ప్రారంభ ధరలపై రైతుల్లో పలు అంచనాలు ఉన్నాయి. 90.20 మిలియన్ కేజీలకు అనుమతి 2025–26 పొగాకు సీజన్కు సంబంధించి 11 వేలం కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు విక్రయించుకునేందుకు బోర్డు అనుమతి ఉంది. ఈ ఏడాది పెరిగిన విస్తీర్ణం నేపథ్యంలో దాదాపు 130 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వేలం ప్రక్రియ ముందుగానే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో వేలం ప్రక్రియ ముగియక పోవడంతో ఇక్కడ వేలం ప్రారంభం ఆలస్యమైంది. వచ్చే నెల నాటికి కాని కర్ణాటక వేలం ముగిసే అవకాశం లేనందున తొలి విడతగా రెండు వేలం కేంద్రాల్లో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రారంభ ధరలు ఎంత ఉంటాయనే దానిపై రైతుల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాది పెరిగిన ధరలతో ఽగిట్టుబాటు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. సరాసరి ధరలు మెరుగ్గా ఉంటేనే.. ధరలు లేక గతేడాది పొగాకు రైతులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. నాణ్యత మెరుగ్గా ఉన్నందున ఆ మేరకు ధరలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కిలో పొగాకు రూ. 350 తగ్గకుండా ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరాసరి ధరలు కూడా తగ్గకుండా ధరలు ఉండాలని కోరుతున్నారు. కర్ణాటక మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో వ్యాపారులు ధరలు ఇవ్వలేదు. మొదట్లో రూ.320ల వరకు ధరలు ఇచ్చి ఆ తర్వాత కోత పెట్టి రూ.280 ఇచ్చారు. దీంతో సరాసరి ధరలు అక్కడి మార్కెట్లో రూ.230లు మించడం లేదు. ఇదే ధరలను వ్యాపారులు ఇక్కడి మార్కెట్లో అమలు చేస్తే రైతులకు కోలుకోలేని దెబ్బ తగలుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలంలో ఏ మేరకు ధరలు వస్తాయో చూడాల్సి ఉంది. తొలి విడతగా కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభం వచ్చే నెల 9వ తేదీ నుంచి మిగిలిన వేలం కేంద్రాల్లో కూడా.. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ధరలపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగా లేదంటూ ఆందోళన కర్ణాటకలో రూ.230ల వరకు పరిమితమైన సరాసరి ధరఈ ఏడాది జిల్లాలో పండిన పొగాకు నాణ్యంగా మెరుగ్గా ఉండటం రైతులకు సానుకూలాంశం. దాదాపు 60 శాతం వరకు బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో దిగుబడులు మాత్రం తగ్గాయి. గతేడాది ఎకరానికి 9, 10 క్వింటాళ్ల ఆకు దిగుబడి వస్తే ఈ ఏడాది అది 6,7 క్వింటాళ్లకు మాత్రమే పరిమితమైందని రైతులు చెప్తున్నారు. దిగుబడి తగ్గినా విస్తీర్ణం ఎక్కువ ఉండటంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తులు వస్తాయని భావిస్తున్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
● డీఈఓ రేణుక పొన్నలూరు: జిల్లాలో పదో తరగతి పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లోని పరీక్షా కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేసి పరీక్ష నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా ప్రతి రోజూ తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. మాస్ కాపీయింగ్ వంటివి లేకుండా పర్యవేక్షకులు గట్టి నిఘా ఉంచారన్నారు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి బయట వ్యక్తులు వెళ్లకుండా పరిక్ష ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట పరీక్ష కేంద్రం చీఫ్ అనురాధ ఉన్నారు. కంభం: విద్యుదాఘాతానికి వృద్ధురాలి మృతి చెందింది. ఈ ఘటన మండలంలో యర్రబాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మద్దిరాల గంగమ్మ(60) ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో పొలంలోకి వెళ్లి వెతకగా స్టాటర్ పెట్టే వద్ద విద్యుతాఘాతానికి గురై పడి ఉంది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సంతమాగులూరు (అద్దంకి రూరల్): బైకు మీద వెళుతున్న యువకుడిని బోలెరొ వాహనం ఢీకొట్టగా మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..బతుకుదెరువు నిమిత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన రోహిత్ (22) సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్లో వెళుతుండగా వినుకొండ నుంచి నరసరావుపేట వెళుతున్న అరటికాయల లోడు వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో రోహిత్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. ● జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఒంగోలు సబర్బన్: అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 278 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతతో, సత్వరం పరిష్కరించేలా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లీనిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కష్టాలు తీర్చండి
కార్మికనగర్ వాసుల ఒంగోలు సబర్బన్: కార్మిక నగర్ బాధితులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారి కష్టాలు తీర్చాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రకాశం భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని కార్మిక నగర్ బాధితులతో వచ్చి కలిశారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్కు కార్మిక నగర్ వాసులు గోడు వెల్లడించారు. చుండూరు రవిబాబు మాట్లాడుతూ సుమారు 70 నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రతినిధులు కార్మిక నగర్లో పర్యటించి భాదితులతో మాట్లాడి వారి గోడును ఆలకించామని, ఇటువంటి అన్యాయం ఒంగోలు చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. గత 15–20 సంవత్సరాలుగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 186లో సుమారు 4.40 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కార్మిక నగర్లోని పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కార్మిక నగర్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆ భూమి ‘ఇనాం’ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో (ఆర్ఎస్ ఆర్) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కొంతమందికి రెవెన్యూశాఖ వారు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అర్ధరాత్రి వేళ జేసీబీలతో వచ్చి కార్మిక నగర్లోని నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. కనీసం ఇంట్లోని వస్తువులు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఏ అధికారంతో, ఏ రికార్డులతో ఆ భూమి తమదేనని పేదల ఇళ్లను కూల్చివేశారో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా ప్రైవేటు వ్యక్తుల భూమి ఉంటే వారు ముందుగా కొలతలు వేసుకొని, చట్ట ప్రకారం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా అన్ని ప్రశ్నించారు. కానీ అందరి పేదల ఇళ్లు పడేసి వారి జీవనానికి, వారి హక్కులకు భంగం కలిగించారన్నారు. గత 45 రోజులుగా బాధితులు ఆరుబయట ఎండలో, రాత్ర చలిలో, దోమలతో గడుపుతున్నారు. ఈనాటికీ కనీసం రెవెన్యూవారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ముందుగా కార్మిక నగర్ బాధితులకు తాత్కాలిక నివాసాలు కల్పించాలని జేసీకి విన్నవించారు. ఇళ్లు కోల్పోయిన దానికి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. బాధితులకు శాశ్వత నివాస పట్టాలు మంజూరు చేయాలి ఇళ్లు కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జేసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు -
పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల్లో అన్యాయం
ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీల కార్యదర్శుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్హర్ ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న అన్యాయంపై ప్రకాశం భవన్ ముందు సోమవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలో బెన్హర్ మాట్లాడుతూ కార్యదర్శుల పదోన్నతుల్లో అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని జోన్–3 (ప్రకాశం, నెల్లూరు, గుంటూరు) పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న అన్యాయం దారుణమైందన్నారు. ఆత్మగౌరవంతో కూడిన పదోన్నతుల కోసం చేసిన న్యాయపోరాటంలో వచ్చిన తాజా తీర్పు అందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు. కోర్టులో వాస్తవాలను, ఆధారాలను ఎన్ని నిరూపించినా అన్యాయానికే బలం తోడై న్యాయం వెనకబడిందని ఆవేదన చెందారు. ముఖ్యంగా జోన్–3 లో గ్రేడ్–3 నుంచి డ్–2 ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయం వర్ణనాతీతంగా మారిందన్నారు. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 లోని రూల్ 24 ప్రకారం జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి తప్పనిసరిగా జోనల్ సీనియారిటీ లిస్టును అధికారికంగా పబ్లిష్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాతే కచ్చితమైన సీనియారిటీ లిస్ట్ను బహిర్గతం చేయాలన్నారు. కానీ ఇక్కడ ఏ సీనియారిటీ లిస్టును అధికారికంగా చూపకుండా, అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా, రహస్యంగా దొడ్డిదారిన ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతోందని కార్యదర్శులందరికీ తెలుసు, కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు రావాలంటే చాలా మంది భయపడుతున్నారన్నారు. రిలేనిరాహార దీక్షలో కార్యదర్శులు అనపర్తి నాగేశ్వర రావు, కే.వెంకట్రావుతో పాటు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్హర్ ప్రకాశం భవన్ ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం -
ప్రభకు బూచేపల్లి వెంకాయమ్మ పూజలు
చీమకుర్తి: రామతీర్థం తిరునాళ్ల సందర్భంగా వైఎస్సా ర్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ప్రభకు సోమవారం చీమకుర్తిలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పూజలు చేశారు. మరో వారం రోజుల్లో జరగనున్న తిరునాళ్ల సందర్భంగా ప్రభ తడికను నిర్మిస్తున్నందున ప్రభ వద్దకు వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించి ప్రభకు పూజలు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, వైస్ ఎంపీపీ బాపతు వెంకటరెడ్డి, పార్టీ నాయకులు గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, సోమా శేషాద్రి, బడే అయ్యపరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి కారు బోల్తా
● ఒకరు మృతి బల్లికురవ: కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మేదరమెట్ల – నార్కెట్పల్లి నామ్ రహదారిలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న టి.సుబ్రమణ్యం (53) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి, డ్రైవర్కి ఎలాంటి గాయాలు కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ప్రతి ధాన్యపు గింజ కొనాలి
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: కనపర్తి ఎత్తిపోతల పథకం కింద సాగు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో పాటు రోజుకు కనీసం ఒక్క లారీ ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో కనపర్తి ఎత్తిపోతల పథకం కింద వరి ధాన్యం పండించి రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులను సోమవారం మేరుగు నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్న తీరును రైతులు నాగార్జున దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎత్తిపోతల పథకం కింద 5 గ్రామాల్లో ఉన్న రైతాంగం సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశామని, పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా తాత్సారం చేసిందన్నారు. దీంతో చాలా మంది రైతులు దళారులకు బస్తా రూ.1000, రూ.1100 లకు అమ్ముకున్నారని తెలిపారు. చివరలో ఏదో మొక్కుబడిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా రోజుకి కనీసం ఒక్క లారీ కూడా రైతుల వద్ద నుంచి సరుకు ఎత్తడం లేదని వాపోయారు. జేసీకి వినతిపత్రం: రైతుల బాధలు విన్న మేరుగు నాగార్జున వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను విన్నవించడమే కాకుండా నేరుగా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిని కలిసి రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం చాకిరీ చేసి కష్టపడి పండించిన పంటను దళారులకు నిలువునా అమ్ముకుంటున్న రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. కనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రోజుకు 10 లారీల ధాన్యం కొనుగోలు చేస్తే కానీ రైతుల వద్ద సరుకు నాణ్యత లోపించకుండా ఉంటుందని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నేరుగా కొనుగోలు చేసినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేస్తేనే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలా కొనకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, పార్టీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, పార్టీ నాయకులు వాకా అరుణ కోటిరెడ్డి, కాకర్ల వెంకటేష్, నారపరెడ్డి, కుక్కల గోపాల్ రెడ్డి, పాకనాటి సుందర రామిరెడ్డి, నారపురెడ్డి, ఎస్.ముత్యాల్ రెడ్డి, శ్రీహరి, అంజిరెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి, పి.జోగారెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, సోమిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
నిరుద్యోగులను నిలువునా మోసం
కొండపి: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారంరెడ్డి గంగాధర్రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసినట్లు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్ల తర్వాత ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ పేరిట పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అక్కడ ప్రకటించిన 10060 ఉద్యోగాలు కూడా ఒక్క నోటిఫికేషన్తో ఇవ్వడం లేదని నాలుగు విడతల్లో 41 నోటిఫికేషన్లతో వచ్చే అక్టోబర్ వరకు సాగదీస్తున్నారని విమర్శించారు. వలంటీర్లను తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, ప్రజలను వంచించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఖాళీ పోస్టులు 1,72,000 ఉండగా కేవలం 10 వేల పోస్టులు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. 66 లక్షల మంది వలంటీర్లకు ఉపాధి కల్పించారన్నారు. కార్యక్రమంలో కొండపి మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, టంగుటూరు మండల కన్వీనర్ చింతపల్లి హరిబాబు, మర్రిపూడి మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, హరీష్ వరుణ్, రవీందర్రెడ్డి, వెంకారెడ్డి, మండల సీనియర్ నాయకులు బొక్కిసం సుబ్బారావు, గొట్టిపాటి మురళి, మండవ మాలకొండయ్య, మేదరమెట్ల భరత్, మల్లికార్జున, బ్రహ్మారెడ్డి ఈశ్వర్, యామవరపు వీర వసంతరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, షేక్ వన్నూరు, వంశీ, శ్రీకాంత్రెడ్డి, శ్రీహరిబాబు, నజీర్, నాగేశ్వరరావు, పెట్లూరు కృష్ణమూర్తి, గర్నిపూడి రమేష్, పర్చూరి సుబ్బయ్య, సుల్తాన్, కొర్నేలు, సాంబశివరావు, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఎక్కడా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతలేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని తన చాంబర్లో జేసీ అన్నీ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ వినియోగం, సరఫరాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పౌర సరఫరా అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వినియోగదారులకు అవసరమైన వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు నిల్వలు అందుబాటులో ఉంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ పద్మశ్రీ,, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వర రావు, జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు, డీటీసీ సుశీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డీఈఓ రేణుక, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, శ్రియా వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావుతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● ఎస్పీ హర్షవర్ధన్రాజు మార్కాపురం: పోలీసుశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన సమర్ధవంతమైన పోలీసు సేవలు అందించే అవకాశం ఉందన్నారు. అనంతరం మార్కాపురం జిల్లాలో జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక నిమిత్తం మార్కాపురం, పొదిలి ప్రధాన రహదారిపై రాయవరం గ్రామ సమీపంలో ఉన్న సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. కార్యాలయ ఏర్పాటుకు భూమి స్థితి, రవాణా సౌకర్యాల అందుబాటు, భధ్రతా పరమైన అంశాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి అవకాశాలను పోలీసులతో సమీక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వు వంటి కీలక విభాగాలను ఏర్పాటుచేసేందుకు అనువైన పరిస్థితులపై చర్చించారు. ఈయన వెంట డీఎస్పీ నాగరాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై వేమన అధికారులు పాల్గొన్నారు. పొదిలి: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వారి సమస్యలు పోలీస్ పరిధిలో తక్షణమే పరిష్కారం అయ్యేలా పోలీసులు శ్రద్ధ చూపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు రకాల కేసులపై సమీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలో నమోదైన కేసులపై సమీక్ష చేశారు. పురోగతి, దర్యాప్తు తీరు గురించి ఆరా తీశారు. తరుచూ జరుగుతున్న నేరాల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు, మాదక ద్రవ్యాల దుష్పరిమాణాలు, సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో వృత్తి నైపుణ్యతతో శాసీ్త్రయ పద్ధతులతో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు, బాదితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూను వేగవంతం చేయాలని నిందితులను పట్టుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, ఇతర అనుమానిత వస్తువుల వాడకం, రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల, రాంగ్ రూట్లో ప్రయాణాలు, మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు శక్తి యాప్ను ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల్లో జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలన్నారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు, సీఐ రాజేష్ ఉన్నారు. -
జాబ్క్యాలెండర్ అంటూ చంద్రబాబు మోసం
పుల్లలచెరువు: జాబ్ క్యాలెండర్ అంటూ మరోసారి నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని ఐటీ వరం గ్రామంలో శనివారం రాత్రి వేణుగోపాల స్వామి తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కేవలం వారి కార్యకర్తలు లాభపడడానికి మాత్రమే పనిచేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ను విడుదల చేస్తాం రాసి పెట్టుకోండి అని చెప్పిన మంత్రి లోకేష్ సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో అనేక వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం కంటి తుడుపుగా నాలుగు ఉపాధ్యాయ పోస్టులు వేసి చేతులు దులుపుకుంటునారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని రూ.3 వేలు ఇస్తానని సంతకాలు చేసి బాండ్లు ఇచ్చారని ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా ఇంత వరకు ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఈ 22 నెలల్లో రూ.13 వేల కోట్లు నిరుద్యోగులకు ఎగ్గొట్టారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, బియ్యం మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రఘు. సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల రవణారెడ్డి, మాజీ ఎంపీపీ లాజర్, నాయకులు చరణ్రెడ్డి, నాసర్రెడ్డి, గడ్డం సుబ్బయ్య, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టోల్ ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ రాస్తారోకో
పెద్దదోర్నాల: నేషనల్ హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ హసానాబాద వాసులు సోమవారం టోల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు అధికారులు ముందస్తుగానే జమ్మిదోర్నాల టోల్ ప్లాజాగా పేరు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్ మాట్లాడుతూ ఎకరా రూ.2 కోట్ల విలువైన భూములను టోల్ ప్లాజా నిర్మాణం కోసం తమ గ్రామస్తులు కేవలం రూ.4 లక్షలకే ఇచ్చారన్నారు. టోల్ ప్లాజా నిర్మాణానికి భూములు ఇచ్చిన గ్రామస్తుల వాసుల కోరిక మేరకు టోల్ ప్లాజాకు హసానాబాద టోల్ ప్లాజా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట రమణయ్య సంఘటనా స్థలికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. -
వంట తంటా
గ్యాస్ మంట..ఒంగోలు నగరం బాలాజీనగర్లో ఇంటి బయట కట్టెలపొయ్యితో వంటలు చేసుకుంటున్న మహిళలుపశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్రీపాయింట్లు, హోటళ్లలో ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ధరలు పెంచినట్లు బోర్డులు పెట్టారు. చాలా వరకు హోటళ్ల వారు గ్యాస్ పొయ్యిల బదులు కట్టెల పొయ్యికి మారిపోయారు. కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కర్రీపాయింట్లు, హోటళ్లను మూసేశారు. కొన్ని ఇళ్లలోనూ గ్యాస్స్టవ్లకు బదులు ఆరుబయట కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. – సాక్షి, ఒంగోలు -
కార్యకర్తల కష్ట, నష్టాలకు తగిన ప్రతిఫలం
పొదిలి: కూటమి ప్రభుత్వంలో కష్టపడుతూ, నష్టపోతూ ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన ప్రతిఫలం వచ్చేలా చేసేందుకు వైఎస్.జగన్మోహనరెడ్డి నిర్ణయించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి ఏలూరు ముసి ఆంజనేయస్వామి వార్షిక తిరునాళ్ల సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ జగన్మోహనరెడ్డి నిలిచారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు, పేదలు సంకల్పం తీసుకున్నారన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ వారినే వెన్నుపోటు పొడిచేందుకు కాచుకు కూర్చున్న వారిపై చర్యలు తప్పవన్నారు. మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడమే అజండాగా కూటమి నేతలు పని చేస్తున్నారన్నారు. ఎదురవుతున్న కష్టాలను అనుభవిస్తూనే, జగనన్న కోసం పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారన్నారు. కార్యకర్తలకు వచ్చే ఇబ్బందులను, సమస్యలను పరిష్కారం చేసేందుకు తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అన్నా కృష్ణ చైతన్య, రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, గొలమారి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ సలహామండలి మాజీ అధ్యక్షుడు కొండ్రగుంట సుబ్బారావు, అన్నవరం బ్రహ్మారెడ్డి, ఉప్పలపాడు మాజీ ఎంపీటీసీ కొణతం రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బూచి నాగిరెడ్డి, ఏలూరు, ఓబులక్కపల్లి, పాములపాడు, అక్కచెరువు, ఆముదాలపల్లి, మల్లవరం, రామాపురం సర్పంచ్లు తాల్లూరి సింగయ్య, ఆవుల వెంకట సుబ్బారెడ్డి, కోదండరామిరెడ్డి, గొంటు సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, రెడ్డెబోయిన వెంకటేశ్వర్లు, కసిరెడ్డి కోటిరెడ్డి, మాజీ సర్పంచ్లు కొండ్రగుంట శ్రీనివాసరావు, పూనె చిన వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కొండాయపాలెం నారాయణరెడ్డి, మూగ చింతల రామాంజనేయరెడ్డి, గురుగుపాడు నారాయణరెడ్డి, ఈగలపాడు యోగిరెడ్డి, రామిరెడ్డి, మండలంలోని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ కొరడా
ఒంగోలు టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నేటి వరకు 41 రోజుల పాటు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 189 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,82,394 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కోడి పందేలు నిర్వహిస్తున్న 84 మందిని అదుపులోకి తీసుకొని రూ.2,10,180 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్పై కేసు నమోదు చేసి 3 ల్యాప్టాప్లు, 21 సెల్ ఫోన్లతో పాటుగా రూ.24 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కమ్యునికేటర్, బోర్డు, 3 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే మాట్కా నిర్వహిస్తున్న 5 స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేయడమే కాకుండా వారి నుంచి రూ.15,760 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 98 మంది కోడి పందేలు ఆడే పాత ముద్దాయిలు, నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు చెప్పారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు 1500 మందికి పైగా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆఫ్లైన్, ఆన్లైన్ బెట్టింగుల గురించి అప్రమత్తం చేశామన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను పర్యవేక్షించాలని, అనుమానాస్పద కార్యక్రమాలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
మార్కాపురం టౌన్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నాయబ్ రసూల్, కే మల్లిఖార్జునరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం సబ్కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ప్రతి ఆరు నెలలకు మంజూరు చేయాల్సిన కరువు భత్యాన్ని, రిటైర్డు అనంతరం రావాల్సిన బెనిఫిట్స్, సరెండర్ లీవులు సకాలంలో చెల్లించడం లేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇంత వరకూ చెల్లించలేదని, 12వ పీఆర్సీ సమయం రెండేళ్లు దాటినా ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు పీ రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో 117 జీవోను రద్దుచేసినట్లుగా చెబుతున్న ప్రభుత్వం అదే విధమైన జీవో 19, 20 తీసుకువచ్చి ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఒకే పాఠశాలలో విద్య కొనసాగిస్తున్నారని, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నా నెల నెలా పదోన్నతులు నిలిపివేయడం వలన ఆ ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని, కేజీబీవీల్లో పనిచేస్తున్న వారికి ఎంటీఎస్ వర్తింపచేయాలని, కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించాలని, 50 ఏళ్లు నిండిన వారికి డిపార్టుమెంట్ పరీక్షలకు సంబంధం లేకుండా 24 ఏళ్ల స్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, ఎంఈఓల బదిలీలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సబ్కమిటీ సభ్యులు టీ సుబ్బరాయుడు, కే తిరుమల, టీ రామారావు పీసీ వెంకటేశ్వర్లు, జే ఆనందరావు, జీ రామకృష్ణ, రంగస్వామి, జే రాఘవేంద్రరావు, సీహెచ్ శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ నారాయణరెడ్డి, టీ శ్రీనివాసులు, యం కోటేశ్వరరావు, శోభన్బాబు, శ్రీనివాస నాయక్, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
నేలకొరిగిన అరటి పంట
పెద్దారవీడు: మండల కేంద్రమైన పెద్దారవీడులో శుక్రవారం అకాల వర్షం, ఈదురు గాలులు కారణంగా అరటి చెట్లు నెలకొరిగాయి. గ్రామానికి చెందిన రైతు అల్లు వెంకటరెడ్డి సాగు చేసిన 2 ఎకరాల అరటి పొలంలో సాగు చేశానని, పంట చేతికి అందే సమయంలో వడగండ్ల వర్షంతో పాటు ఈదురు గాలులు ఎక్కువగా రావడంతో పంట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 చెట్లు నేలకు కూలడంతో దాదాపు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రస్తుతం అరటి పంట పూత, కాయ దశలో ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి అదుకోవాలని రైతు కోరారు. -
కరుణించు ఖుదా..
ఒంగోలు ఈద్గా మైదానంలో ప్రార్థన చేస్తున్న ముస్లింలుపొదిలిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలుఒంగోలు టౌన్: దేశ ప్రజలందరినీ కరుణించు ప్రభు... ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఖుద్బా ప్రసంగం చేసిన మౌలానా రంజాన్ మాసం విశిష్టతను వివరించి చెప్పారు. రంజాన్ మాసంలో 30 రోజుల పాటు నిష్టగా పాటించిన ఉపవాస దీక్షల స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సమాజంలోని పేదలను ప్రేమగా దగ్గరకు తీయాలని, అభాగ్యులను, అనాథలను ఆదరించి అక్కున చేర్చుకోవాలని చెప్పారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ చదివించాలని ఉన్నత స్థానాలనధిరోహించేలా ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం జరిగిన దువాలో దేశ ప్రజల మధ్య సహోదర భావాన్ని పెంపొదించాలని, కులమతాలకతీతంగా ప్రజలందరిపై వరాల వసంతాన్ని కురిపించాలని అల్లాహ్ను వేడుకున్నారు. యుద్ధంలో పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు నలిగిపోకుండా రక్షించాలని, ప్రపంచ శాంతిని ప్రసాదించాలని కన్నీటితో దువా చేశారు. ఆలింగనంతో ఈద్ ముబారక్ చెప్పుకుంటున్న చిన్నారులు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు ఒంగోలులోని 22 మసీదులతో పాటుగా ఈద్గా మైదానంలో ప్రత్యేక నమాజు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపిన వైఎస్సార్ సీపీ ఇన్చార్జిలు, నాయకులు అలాయ్ బలాయ్ చేసుకొని సోదర భావం చాటుకున్న హిందూ, ముస్లింలు -
న్యాయం కోసం పోరాటం..
తౌషిక్ మృతిపై న్యాయం కోసం తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీ ఎక్కని గడప లేదు. మొక్కని అధికారి లేడు. కలెక్టర్ పి.రాజాబాబును కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్పీ హర్షవర్థన్రాజును కలిసి న్యాయం చేయమని వేడుకున్నారు. చివరకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లి నిరసన చేపట్టారు. అయినా కనుచూపు మేరలో న్యాయం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవల తౌషిక్ తల్లి మౌలాబి అర్ధరాత్రి శ్మశాన వాటికకు వెళ్లి కుమారుడి సమాధిపై పడి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. బుధవారం కనిగిరిలోని ఒక మూడంతస్తుల బిల్డింగు ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేగింది. నెల రోజులుగా ఆ ఇంట్లో సంతోషం లేదు. రంజాన్ పండుగ సందడి లేదు. ఆ తల్లిదండ్రులు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఫలిస్తుందో లేదో చూడాల్సి ఉంది. -
యుద్ధంపై పాలకుల మౌనం క్షమార్హం కాదు
ఒంగోలు టౌన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం పట్ల మన దేశ పాలకులు వ్యూహాత్మకంగా మౌనం పాటించడం క్షమార్హం కాదని జనసాహితి జిల్లా అధ్యక్షుడు జీవీ కృష్ణయ్య స్పష్టం చేశారు. అంతర్జాతీయ కవితా దినాన్ని పురస్కరించుకొని ఎన్జీవో హోంలో శనివారం సామ్రాజ్యవాద యుద్ధంపై కవితాస్త్రాలు పేరుతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ కృష్ణయ్య మాట్లాడుతూ అంతులేని పెట్రో దాహంతో , ఆయుధ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టేందుకు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ప్రపంచ ప్రజలపై యుద్ధాన్ని రుద్దుతున్నాయని మండిపడ్డారు. యుద్ధ ప్రభావం మన దేశంపై తీవ్రంగా ఉంటుందని, ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని తెలిపారు. ఇప్పటికే మనదేశంలో వంటగ్యాస్ ధరలు పెంచారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పెట్రోలు ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పారు. గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్లు మూతపడుతున్నాయని, దీంతో వందలాది మంది హోటల్ కార్మికులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు పెట్రోలు ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటడం ఖాయమన్నారు. యుద్ధం పేదరికాన్ని మరింతగా పెంచుతుందని, ఆకలి చావులకు కారణమవుతుందన్నారు. యుద్దాన్ని ఖండించాల్సిన కేంద్రంలోని మోదీ సర్కార్ మౌనం పాటించడం బాధాకరమన్నారు. అనంతరం అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవిబాబు అనువదించిన ఆంగ్ల కవితల సంపుటి ‘కలమే నా ఆయుధం’ పుస్తకాన్ని కవి, రచయిత ఎస్ఎస్ హుస్సేన్ పరిచయం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన కవిత్వాన్ని అనువదించిన కొత్తపల్లి రవిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎజ్రాశాస్త్రి, రవికుమార్, కోటేశ్వరమ్మ, ఎంఏ సాలార్, ఎస్.లలిత కుమారి, ప్రసన్న, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏసుదాసు, డీవీ ఖాదర్ బాషా, యోహాన్రెడ్డి పాల్గొన్నారు. -
వ్యాఘ్ర వాహనంపై బాలాత్రిపురసుందరీదేవి
త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రుల్లో భాగంగా వ్యాఘ్ర వాహన సేవ శనివారం వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, ఉభయదాతల పూజలు, హోమాలు వైభవంగా వేదపండితులచే నిర్వహించారు. వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం శనివారం ఆదాయం రూ.9,03,211 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆదాయంలో భాగంగా కుంకుమార్చన ద్వారా రూ.20,880, తలనీలాలు రూ.32,925, ప్రత్యేక దర్శనం రూ.4,12,600, రూం అద్దెలు రూ.31,360, లడ్డు ప్రసాదాలు రూ.2,15,560, అన్నదానం రూ.1,60,035 ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.9,03,211 వచ్చినట్లు తెలిపారు. ఒంగోలు సబర్బన్: విద్యుత్ వినియోగదారుల కోసం ఆదివారం సెలవు రోజు అయినా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ బిల్లులు ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చన్నారు. కొనకనమిట్ల: మండలంలోని పాతపాడులో అగ్ని ప్రమాదంలో పొగాకు బ్యారన్ పూర్తిగా కాలిపోయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన కొండపురెడ్డి పెదవెంకటరెడ్డి, చినవెంకటరెడ్డ్లికు చెందిన పొగాకు బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ జరుగుతోంది. బ్యారన్లో సుమారు 1100 పొగాకు అల్లుడు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మొద్దు గొట్టంపై అల్లుడు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్లలోని పొగాకు అల్లుడు కర్ర మొత్తం పూర్తిగా కాలిపోయింది. బ్యారన్లోని టైర్లు, రేకులు, అల్లుడు కర్ర అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయాయి. మంటల ధాటికి బ్యారన్ గోడలు నెర్రలిచ్చాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మార్కాపురం అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే బ్యారన్ పూర్తిగా దగ్ధమైంది. అల్లుడు కర్ర, బ్యారన్ మొత్తం రూ.3 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో శనివారం అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి ఆలయ అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ప్రత్యేక పూలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, చైర్మన్ సిద్ధం నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కాశీనాయన రెడ్ల, యోగివేయన రెడ్ల, కృష్ణదేవరాయుల కాపుబలిజ, ఆర్యవైశ్య, గోపాలకృష్ణ యాదవ అన్నదాన సత్రాల్లో అన్నసంతర్పణ చేశారు. -
కల్లూరివారిపాలెంలో పొగాకు బ్యారన్ దగ్ధం
● రూ.6 లక్షల ఆస్తి నష్టం పొన్నలూరు: మండలంలోని కల్లూరివారిపాలెం గ్రామంలో కల్లూరి దిబ్బయ్య, మువ్వా శ్రీనివాస్రెడ్డి, జొన్నకూటి పెదచెన్నయ్య, అంబారపు వెంకటస్వామికి చెందిన ఉమ్మడి పొగాకు బ్యారన్ శనివారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు అల్లిక కర్ర జారి మొద్దుగొట్టంపై పడటంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం వలన సుమారు 1200 పొగాకు కర్రలు, బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో దాదాపుగా రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. -
పసి ప్రాణం.. కోరుతోంది న్యాయం
ఒంగోలు టౌన్: సింగరాయకొండ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లో చదువుతున్న సయ్యద్ తౌషిక్ చనిపోయి నెల రోజులు దాటింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లాడు..అమ్మకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకొని రమ్మంటూ అడిగిన పసివాడు ...కళ్లు మూసి తెరచేలోపే నిముషాల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం ఏ తల్లిదండ్రులకైనా ఎలా నమ్మబుద్ధవుతుంది. పాపం పుణ్యం తెలియని బాలుడు, కల్లా కపడం ఎరగని చిన్నారి, మాయా మర్మంలేని పిల్లాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఎవరైనా ఎలా నమ్మగలరు. తౌషిక్ను చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తౌషిక్ను హత్య చేశారని లోకం కోడై కూస్తోంది. కానీ పోలీసులు మాత్రం తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నందు వల్లనే చనిపోయాడని ప్రకటించారు. నెల రోజులుగా ఆ తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. తన బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కనిపించిన అధికారికి దండం పెట్టి వేడుకుంటున్నారు. అయితేనేం పట్టించుకునే నాథుడే లేడు. పరామర్శించే నాయకుడే లేడు. తౌషిక్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదు... చిన్నారి తౌషిక్ అనుమానాస్పదంగా మరణించింది సింగరాయకొండలోని పాఠశాలలో. ఇది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు నియోజకవర్గం పరిధిలో ఉంది. కన్నీరు మున్నీరవుతున్న బాలుడి తల్లిదండ్రులను ఆయన పరామర్శించలేదు. నెల రోజులుగా ఆ పసిబాలుడి తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కి పోరాడుతుంటే పట్టించుకోకపోవడం సరికాదని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పలకరించని ఉగ్ర... మృతుడు తౌషిక్ స్వగ్రామం కనిగిరి. తండ్రి సయ్యద్ అలీ కారు డ్రైవర్. తల్లి మౌలాబీ సాధారణ గృహిణి. తౌషిక్ అనుమానాస్పద మృతిపై కనిగిరిలో మతాలకతీతంగా ప్రజలు భారీ ర్యాలీ చేశారు. అయినప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాత్రం కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని వెళితే కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖుల ఆదేశాలతోనే కేసు పక్కదారి... శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడికి అధికార పార్టీకి చెందిన ఒక నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సదరు నేత పోలీసులకు ఫోన్ చేసినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. అలాగే తౌషిక్ మృతి చెందిన రోజే పోలీసులకు జిల్లాకు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధి నుంచి కూడా ఫోన్ వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది. తౌషిక్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ అదే రోజు బాలుడి తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట రోడ్డు మీద పడుకొని నిరసనకు దిగారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. అధికార పార్టీకి చెందిన వారు ఫోన్ చేయడంతో సింగరాయకొండ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడని, తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎలా చెబుతాడని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తౌషిక్ మృతిపై విచారణాధికారిగా కందుకూరు సీఐ అన్వర్ బాషాను నియమించారు. అధికారి మారినప్పటికీ పోలీసులు మాత్రం ఆత్మహత్య కోణం నుంచే విచారణ చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తుండడం గమనార్హం. చివరికి వారి అనుమానాలు నిజమయ్యాయి. విచారణ పూర్తి కాకుండానే తౌషిక్ ఆత్మహత్య చేసుకొని మరణించాడని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రకటించారు. చిన్నారి తౌషిక్ మరణించి నెలరోజులు దాటినా పరామర్శించడానికి మనసురాని మంత్రి, ఎమ్మెల్యే న్యాయం కోసం పోరాడుతున్నా నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయడానికి వెనకాడుతున్న పోలీసులు విచారణ కొనసాగుతుందంటూనే తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించిన డీఎస్పీ 11 ఏళ్ల చిన్నారి మృతిపై న్యాయం చేయలేని ప్రభుత్వం ప్రజలకేం న్యాయం చేస్తుందని బాధితుల ప్రశ్న -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
ఒంగోలు సిటీ: ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు, కొండపి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్లు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్లు బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, కనిగిరి, ఒంగోలు, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్లు దద్దాల నారాయణ యాదవ్, చుండూరి రవిబాబు, డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్లు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టంగుటూరు: సింహపురి ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ ఫీజులు వసూలు చేసే క్రమంలో ప్రతి రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహదారులు, అత్యవసర పనుల నిమిత్తం పోయే వారు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. టంగుటూరు వైపు నుంచి ఒంగోలుకు అత్యవసర స్థితిలో ఉన్న రోగిని తరలించే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత వలన ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటానికి సుమారు 30 నిమిషాలు పట్టింది. నిత్యం ఇదే తీరు కొనసాగుతోంది. అధికారులు స్పందించి టోల్ ప్లాజా యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
రామతీర్థంలో ప్రభ ఏర్పాటుకు బూచేపల్లి, మేరుగు పూజలు
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తిరునాళ్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ ప్రభ పనులు ప్రారంభించడానికి శ్రీమోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చి 31వ తేదీ చీమకుర్తిలో మందిరాలు, ఏప్రిల్ 1వ తేదీ రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల నిర్వహిస్తారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గంగమ్మతల్లి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రభ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో చీమకుర్తి పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్రెడ్డి, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, యన్నం శేషురెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పొన్నపల్లి నాగేశ్వరరావు పిన్నిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల వలంటరీ వింగ్ అధ్యక్షుడు చౌడారెడ్డి, కౌన్సిలర్ శేషాద్రి, నల్లూరి చంద్ర, ప్రతాప్రెడ్డి, జనార్ధన్రెడ్డి, ఉప్పలపాటి వెంకటరావు, ప్రసాదరెడ్డి, చంద్ర, చిన్నికృష్ణ, లక్ష్మిరెడ్డి, అన్ను రాంబాబు, మక్కెన రాజేంద్ర, రావి లక్ష్మయ్య, ఖజా తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డి హాస్టల్లో అభివృద్ధి పనులు అభినందనీయం
ఒంగోలు వన్టౌన్: ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు రెడ్డి హాస్టల్లో గురువారం రాత్రి నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ సమాజానికి మంచి చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్దలు, దాతలను కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రొఫెసర్ డి.వెంకటేశ్వరరెడ్డి, హాస్టల్ కార్యదర్శి ఆదిరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కనిగిరిలో శ్మశాన రణం
కనిగిరిరూరల్: కనిగిరి పట్టణంలో వాల్మీకి బోయకులస్తుల శ్మశాన వివాదం శుక్రవారం పోలీసులు, అధికారులు తీరుతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ కులానికి చెందిన సీ అంజమ్మ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఆ సామాజికవర్గం వారు గురువారం రాత్రంతా జాగారం చేశారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి శ్మశానవాటికగా ఉపయోగిస్తున్న స్థలంలోనే తాము ఖననం చేస్తామని భీష్మించారు. రాత్రంతా హైవే పక్కనే శవాన్ని పెట్టుకుని జాగారం చేస్తూ నిరసన తెలిపారు. అయితే ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదని.. రిజిస్టర్ భూమి అని, సర్వే నం 554లోని భూమిలో ఖననం చేయడానికి కుదరదంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న సంగతి విదితమే. తోపులాట..ఆర్తనాదాల మధ్య మృతదేహం తరలింపు.. వాస్తవం ఏమిటీ..తెరవెనుక ఎవరున్నారనేది పక్కన పెడితే.. పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందన్న చర్చ నడుస్తోంది. భారీగా పోలీసులను మోహరించారు. కనిగిరి డివిజన్తో పాటు, ఇతర మండలాలకు చెందిన ఎస్సైలు, పోలీసులు, ప్రత్యేక బలగాలు వచ్చాయి. పది నిమిషాలు బాధిత వ్యక్తులతో మాట్లాడిన పోలీసులు హఠాత్తుగా వారిని నెట్టేసి మృతదేహాన్ని మున్సిపల్ ట్రాక్టర్లో ఎక్కించారు. ఈ క్రమంలో వాల్మీకి బోయకులస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్సై, పోలీసులు, వాల్మీకి బోయకులస్తులను నిర్ధాక్షణ్యంగా పక్కకు నెట్టి మృతదేహం ఉన్న ట్రాక్టర్ను పట్టణంలోని గార్లపేట రోడ్డులోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. ఈక్రమంలో మృతురాలు అంజమ్మ కోడలికి, బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులను పెట్టి తోసేశారు. పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. శ్మశాన వాటిక వద్ద నిరసన.. మృతురాలు అంజమ్మ బంధువులు కొందరు హిందూ శ్మశాన వాటిక వద్దకు చేరారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. తమకు చేసిన అన్యాయం, పాపం ఊరికే పోదని మృతురాలి బంధువులు దుమ్మెత్తి పోశారు. కనీసం మట్టి కూడా ఇవ్వకుండా ఖననం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము బీసీ సామాజిక వర్గానికి చెందిన వారం అని తీవ్ర అన్యాయం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సొంత బంధువులు వచ్చి.. అంత్యక్రియలు చేసుకోవాలని అధికారులు చెప్పారు. పోలీస్ పహారా.. అంజమ్మ భౌతిక కాయాన్ని తీసుకెళ్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు బోయపాలెం నుంచి ఎవరూ రోడ్డు మీదకు రాకుండా పోలీస్ పహారా పెట్టారు. సుమారు 30 మంది పోలీసులు, మహిళా పోలీసులు 9వ వార్డు బోయపాలెం కాలనీ ప్రధాన రహదారికి అడ్డంగా నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలీసులు అక్కడే ఉన్నారు. కాగా.. రెండ్రోజుల నుంచి ఘటన ఏరియాలో కనిపించని రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్మశాన వాటిక స్థలం వద్ద ప్రత్యక్షమైనట్లు తెలిసింది. సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.. వాస్తవానికి వాల్మీకి బోయ కులస్థుల శ్మశాన వాటిక స్థలం సమస్య కొంత కాలం నుంచి ఉన్నా.. ఈ రెండేళ్లలో తీవ్ర జటిలంగా మారి రచ్చకెక్కుతోంది. అలాంటి సమయంలో క్షేత్ర స్థాయి పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య మరింత తీవ్రం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భూ రిజిస్టర్ పట్టాదారుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం సర్వే నంబర్ 554లో తమకు రిజిస్టర్ అయిన భూమిలో కొందరు వ్యక్తులు అంత్యక్రియలు, ఖనన కార్యక్రమాలు చేసేందుకు వస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రిజిస్ట్రేషన్దారుడు గురువారం ఫిర్యాదు చేశాడు. శాంతిభద్రతల సమస్య రాకుండా ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం. – ఉప్పు శ్రీనివాసులు, సీఐ -
అకాల వర్షం..అపార నష్టం
మర్రిపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మర్రిపూడి మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కాకర్ల, చిలంకూరు, శివరాయునిపేట తదితర గ్రామాల్లో 200 ఎకరాల్లో సాగుచేసిన లేత పొగాకు పూర్తిగా దెబ్బతిని పంట నేలకు ఒరిగింది. వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో ఇళ్ల రేకులు పైకప్పులు లేచిపోయాయి. చెట్లు వేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు పడి సరఫరా నిలిచిపోయింది. చిమట, కాకర్ల గ్రామాల్లోని బ్యారన్ రేకులు ఎగిరి దూరంగా పడిపోయాయి. దీంతో క్యూరింగ్ జరుగుతున్న బ్యారన్లో పొగాకు పూర్తిగా తడిసిపోయింది. ఆయా గ్రామాల్లో దాదాపు రూ.2.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకర్ల గ్రామానికి చెందిన మొల్లల సుబ్బారెడ్డి, మనోహర్రెడ్డిలకు చెందిన ఒక్కో బ్యారన్లో 1200 పొగాకు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా రేకులు ఎగిరిపోయి, ఆకు తడిసిపోయింది. అలాగే చిమట గ్రామానికి చెందిన గంగిరెడ్డి మూడవ బ్రహ్మారెడ్డి, వెలుతుర్ల మాలకొండయ్య, భూంపల్లి రమణయ్య, రాగిపిండి శ్రీను, పులిచర్ల వెంకటసుబ్బయ్యలకు చెందిన బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా విపరీతంగా వీచిన గాలులకు బ్యారన్ పై కప్పులు లేచి దూరంగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు సుమారు రూ.1.5 లక్షల చొప్పున సుమారు రూ.11 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. -
ఘనంగా జాళ్లపాలెం తిరునాళ్ల
కొండపి: మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్న మఠంగా ప్రసిద్ధిగాంచిన జాళ్లపాలెం గ్రామంలో ఏటా ఉగాది రోజున తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. హోమగుండంలో కొబ్బరి చిప్పలు వేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చూండూరి రవిబాబు, సీఈసీ సభ్యుడు, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు నడిపింది. పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ, మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేశారు. డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొండపి సీఐ సోమశేఖర్ సహ ముగ్గురు సీఐలు, ఎస్సై ప్రేమ్కుమార్ సహా 11 మంది ఎస్సై లు, 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా క్రీస్తు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని హవేలీ ఫంక్షన్ హాల్లో మార్కాపురం జిల్లా క్రీస్తు సంఘ ఐక్యవేదిక చారటబుల్ ట్రస్టు సమావేశం గురువారం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘ సువార్తీకులు 150 మంది హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడిగా నియమితులైన చాట్ల గంగయ్య తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా సింగ రాజేష్, ఉపాధ్యక్షులుగా గొంగటి ఏలియా, దర్శనం సుధీర్ బాబు, గుర్రంబాబు, కార్యదర్శులుగా ముటుకూరి దేవదానం, వేశపోగు భరత్, ఎనిబెర అచ్చయ్య, గుర్రం శరత్బాబు, కోశాధికారి బూదాల అశోక్కుమార్, ఈసీ మెంబర్లుగా పల్లె బాబు, దర్శి షాలెం రాజు, ఇంటూరి జయరాజు, పుప్పాల డేవిడ్, గౌరవ అధ్యక్షులుగా వంకాయలపాటి జర్మియ, చిలకా ఇజ్రాయేలు, రావినూతల సుధాకర్రావు, వేశపోగు బాలు దర్శనం పెద్ద యేసయ్య, గౌరవ సలహాదారులుగా కొంగలేటి సోలోమన్ రాజు, నన్నేపోగు సుందర్రాజు, వంకాయలపాడి డేవిడ్రాజు, గంగవరపు డేవిడ్ ఎన్నికై నట్లు పేర్కొన్నారు. ఒంగోలు సబర్బన్: విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో ఒంగోలు నగరంలో వార్డు సెక్రటరీలుగా పనిచేస్తున్న ఇద్దరికి చోటు దక్కింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పిట్టు రవికుమార్ రెడ్డి, వేల్సూరి హరిబాబు గురువారం ఓ ప్రకనటలో పేర్కొన్నారు. తమ నియామకానికి సహకరించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు, సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీలో స్థానం దక్కించుకున్న ఇద్దరిని ఒంగోలు నగర పాలక సంస్థ వార్డు సెక్రటరీల అసోసియేషన్ నాయకులు అభినందించారు. -
వైభవంగా ప్రారంభమైన వసంత నవరాత్రులు
త్రిపురాంతకం: ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన వేదపండితుడు నాగఫణిశాస్త్రి, అర్చకుడు ప్రసాదశర్మ పూజలు, కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం పల్లకి సేవ, రాత్రి పద్మవాహనంపై అమ్మవారి ఉత్సవం నిర్వహించారు. అలాగే పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి గ్రామోత్సవం వైభవంగా సాగింది. అర్చకుడు విశ్వనారాయణశాస్త్రి పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. భక్తులు గ్రామ కూడళ్లలో పందిళ్లు వేసి స్వామివారిని సాదరంగా ఆహ్వానించారు. భక్త బృందాల కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయాల ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
పర్యవేక్షణ భారం!
దేవుడిపైనే మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ఏర్పడి మూడు నెలలు అవుతున్నా దేవదాయ ధర్మాదాయ శాఖలో నేటికీ జిల్లా స్థాయి అఽధికారులను నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లాలో పలు శాఖలకు ఉన్నతాధికారులుగా ఇన్చార్జిలను నియమించి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే దేవదాయ శాఖకు మాత్రం కేవలం కార్యాలయ బోర్డు ఏర్పాటు చేసి అధికారిని నియమించకపోవడంతో ప్రజలు, పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం జిల్లాను ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు దేవదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్గా ఎవరిని నియమించకపోవడంతో పనుల నిమిత్తం ఇక్కడి ప్రజలు ఒంగోలు ఏసీ కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు. దేవదాయ శాఖ సిబ్బంది సైతం తమ సర్వీసు రికార్డులు, ఎన్ఓసీలు, సమస్యల పరిష్కార నిమిత్తం పొలోమంటూ ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో ఈఓల పరిధిలోని ఆలయాలతోపాటు దేవదాయశాఖలో కలిసిన ఆలయాలను కలుపుకొని సుమారుగా 470 వరకు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మార్కాపురంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, మార్కండేశ్వరస్వామి ఆలయం, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపురసుందరీదేవి ఆలయాలు, రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం, కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, పొదిలిలోని నిర్మమహేశ్వర ఆలయం, సీఎస్ పురంలోని భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాలతోపాటు దేవదాయశాఖలో కలిసిన ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటి పర్యవేక్షణకు ఇప్పటి వరకు దేవదాయశాఖ జిల్లా అధికారిని నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దేవదాయశాఖ జిల్లా అధికారిని నియమించాలని ప్రజలతో పాటు ఆ శాఖ సిబ్బంది కోరుతున్నారు. -
తౌషిక్ అనుమానాస్పద మృతి కేసు.. శ్రీచైతన్య స్కూల్ గుర్తింపు రద్దు
ఒంగోలు సిటీ: సింగరాయకొండలోని మూలగుంటపాడులో శ్రీచైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ.. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 22వ తేదీన త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలలో త్రీమెన్ కమిటీ చేపట్టిన విచారణలో పలు అవకతవకలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆ పాఠశాల గుర్తింపును 2026–2027 విద్యా సంవత్సరం నుంచి ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా శ్రీచైతన్య ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్యం వివరణ ఇవ్వని కారణంగా గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. ● చిరుత దాడి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక పెద్దదోర్నాల: చిరుతపులి దాడిలో గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న చిన్నారుట్ల గిరిజన తండాకు చెందిన బాలికకు అటవీశాఖ అధికారులు రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేశారు. గురువారం నెక్కంటి ఫారెస్ట్ రేంజి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారుట్లకు చెందిన కుడుముల అంజలి తల్లి లింగేశ్వరికి నష్టనరిహారం చెక్కు అందజేశారు. గత ఏడాది ఆగస్టు నెల 13వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులు కుడుముల అంజయ్య, లింగేశ్వరితో కలిసి నిద్రిస్తున్న మూడేళ్ల బాలిక అంజమ్మ తలను నోట కరుచుకుని చిరుత అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేసి అడ్డుకున్నారు. నాటి నుంచి చిన్నారి అంజమ్మకు వైద్య చికిత్స చేయించిన అధికారులు గురువారం నష్టపరిహారం అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అఫీసర్ వెంకటయ్య, బీట్ ఆఫీసర్ మదన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: దారి తప్పిన ఓ చుక్కల దుప్పి జనావాసాల మధ్యకు ప్రవేశించింది. ఈ సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి జింకలు, దుప్పులు తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ క్రమంలో దారి తప్పిన ఓ చుక్కల దుప్పి మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు దాటి అర్ధరాత్రి వేళ పట్టణంలోకి ప్రవేశించింది. ఇందిరానగర్, ఫారంబజార్, శ్రీశైలం బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన చుక్కల దుప్పి ఎట్టకేలకు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్ అధికారి హరి మాట్లాడుతూ.. అడవిలో అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులు జనావాసాల మధ్యకు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో అడవుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. ఒంగోలు: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలో అంపైర్ల కొరతను అధిగమించేందుకు ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు విజయనగరం జిల్లా నార్త్ జోన్ అకాడమీలో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 ఏళ్లలోపు వయసు కలిగి స్థానిక క్రికెట్ టోర్న మెంట్లలో అంపైరింగ్ చేసిన అనుభవం ఉన్న వారు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా తమ వివరాలను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మెయిల్ ఐడీ pdcaongole@gmail. comకు పంపాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు ఏసీఏ ఆధ్వర్యంలో ఉచిత వసతి కల్పించడంతోపాటు ప్రయాణ ఖర్చులు అందిస్తారని తెలిపారు. వివరాలకు 9246222999ను సంప్రదించాలని సూచించారు. -
ఐపీఎల్ నాటికి బెట్టింగ్ను కట్టడి చేస్తాం
దర్శి: క్రికెట్ బెట్టింగ్ వలలో చిక్కుకుని అప్పులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. రానున్న ఐపీఎల్ సీజన్ నాటికి బెట్టింగ్ను పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పారు. బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలైన కొందరు యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న వైనంపై ‘బెట్టింగ్ వల ప్రాణాలు విలవిల’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ప్రకాశం జిల్లా పోలీసులు స్పందించారు. బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు అనుమానం ఉన్న యువత కుటుంబ సభ్యులకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. చెడు స్నేహం, పిల్లలకు బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే మందలించాలని సూచించారు. తప్పని తెలియక, బెట్టింగ్రాయుళ్ల మాయమాటలు నమ్మి ఒకటీరెండు సార్లు పందెం కాసిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నామన్నారు. వారు మళ్లీ బెట్టంగ్లో పాల్గొన్నట్లు గుర్తిస్తే కటకటాల వెనక్కు నెడతామని చెప్పారు. బెట్టింగ్ను ఆదాయ మార్గంగా ఎంచుకుని యువతను ఆ ఊబిలోకి దించి, వారి జీవితాలు నాశనం చేస్తున్న వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెట్టింగ్ రాకెట్ను ఛేదించేందుకు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న నలుగురు నిందితులను విచారించేందుకు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు పరిశీలించి, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. రెండు లేదా మూడు రోజుల్లో బెట్టింగ్ రాకెట్ నిందితుల వివరాలు రాబడతామన్నారు. కార్యక్రమంలో సీఐ రామారావు, ఎస్సైలు శివ, మల్లికార్జున్ పాల్గొన్నారు. బాధితులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు బెట్టింగ్ రాకెట్ సూత్రధారులను వదిలే ప్రసక్తే లేదు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ -
జగనన్న పాలనలో యాదవులకు సముచిత స్థానం
పెద్దారవీడు: రాష్ట్రంలో అన్ని విధాలా యాదవులకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలో నల్లమల అడవిలో వెలసిన వేనూతల కాటమరాజుస్వామి తిరునాళ్ల సందర్భంగా బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యాదవులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ మాదిరిగానే యాదవుల సంక్షేమానికి వైఎస్ జగన్ కృషి చేశారన్నారు. యాదవులకు నామినేటెడ్ పదవులివ్వడంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందని కొనియాడారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి కృషి చేసింది జగనన్న మాత్రమేనన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీసీలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఇంగ్లిష్ మీడియం చదువులు, ట్యాబ్లు అందడం లేదని, మధ్యాహ్నం భోజన పథకాన్ని సైతం నీరుగార్చారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఐక్యరాజ్య సమితి వేదికపై బీసీ బిడ్డలు అనార్గళంగా ఇంగ్లిష్లో ప్రసంగించింది జగనన్న పాలనలోనే అని గుర్తు చేశారు. జగన్నన్నను మరోమారు సీఎంగా చేసుకుంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నా పట్టించుకున్న నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో యాదవుల కల్యాణ మండపం కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తే, ఆ ఫైల్ను నేడు తొక్కిపెట్టారన్నారు. వైఎస్ జగన్ కాగానే కాటమరాజు ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, జగనన్నతోనే ఆ పనులకు శంకుస్థాపన చేయిస్తామని పేర్కొన్నారు. యాదవులంతా వైఎస్ జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అధికారం వెలగబెట్టిన టీడీపీ ప్రభుత్వం.. చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. చంద్రబాబు దృష్టిలో సూపర్సిక్స్ అంటే మైన్స్, మగువ, మద్యం, ల్యాండ్స్, గంజాయి, డ్రగ్స్, డ్యాన్స్లు చేయడమేనని ఎద్దేవా చేశారు. కాటమరాజుస్వామి ఆలయ భూములను టీడీపీ నాయకులు తమ పేరుపై ఎక్కించుకుని ప్రభుత్వం నుంచి డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. వైపాలెం నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమార్జనే లక్ష్యంగా ఇసుక, మట్టి మాఫియా చెలరేగుతోందని, ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మరీ లూటీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే కాటమరాజుస్వామి దేవాలయం అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి అన్నివిధాలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. యాదవులపై ఎంతో ప్రేమతో కాటమరాజుస్వామిపై ట్వీట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగలు, దోపిడీదారుల ప్రభుత్వాన్ని గంగలో కలిపేంత వరకు కార్యకర్తలు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. యర్రగొండపాలెం గడ్డపై మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జురెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విధానాలను తూర్పారబట్టారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కఠారి శంకర్, వైఎస్సార్ సీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణయాదవ్, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి ఏరువ శేషశయనారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు తోకల ఆవులయ్య, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా ఎల్లేష్యాదవ్, దివ్యాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం ముత్యాలయ్య, మాజీ ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్యాదవ్, మాజీ సర్పంచ్లు గుమ్మా రాజయ్యయాదవ్, ఈర్ల రాజశేఖర్యాదవ్, పార్టీ నాయకులు ఒంటేరు నాగేశ్వరరావుయాదవ్, సుబ్బయ్య యాదవ్, గుమ్మా రామాంజనేయయాదవ్, నాలి కొండయ్యయాదవ్, మురారి గాలెయ్యయాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాటమరాజు ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి పూజలు హాజరైన ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యేలు అన్నా, కేపీ -
అకాల వర్షాలు
ఉమ్మడి జిల్లాలో ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. త్రిపురాంతకం, మర్రిపూడి, కొనకనమిట్ల, బల్లికురవ, చీమకుర్తి, సంతనూతలపాడు, గిద్దలూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మార్చిలో 38 డిగ్రీలకు సెల్సియస్కు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగుపాటు, ఈదురుగాలులు... వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులతో బుధవారం రాత్రి నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. కనిగిరి ప్రాంతంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందాయి. దర్శి ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. త్రిపురాంతకం: అకాల వర్షాలకు మండలంలోని సోమేపల్లి గ్రామానికి చెందిన దూళ్ల గాలెయ్య, ఎం కోటేశ్వరరావు. డి.ఆంజనేయులకు చెందిన 8 ఎకరాల్లో అరటి చెట్లు పూర్తిగా విరిగిపడ్డాయి. దీంతో సుమారు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు సమీపంలోని పొలాల్లో తాటి చెట్టు గుబురుపై బుధవారం రాత్రి పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. అయితే అప్పటి వరకు ఆ పక్కనే ఉన్న మిరప తోటల్లో కూలీలు ఇంటికి రావడంతో ప్రమాదం తప్పింది. పొదిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఓ మోస్త్తరు వర్షం కురిసింది. ఈగలపాడు, పాములపాడు, జువ్వలేరు, కుంచేపల్లి గ్రామాల్లో 20 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రైతులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో గాలులతో వడగండ్లు పడ్డాయి. జువ్వలేరులో బొప్పాయి తోటలకు కొంత మేర నష్టం వాటిల్లింది. -
ప్రొటోకాల్ మరిచిన అధికారులు
మార్కాపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ విస్మరించారు. పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అధికారులు టీడీపీ ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీల్లో ప్రచురించి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫొటోను పెట్టలేదు. ఈ సంఘటన పలు విమర్శలకు తావిస్తోంది. మార్కాపురం జిల్లాలో మార్కాపురం పక్క నియోజకవర్గమైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో పెట్టకుండా గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రం ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. పొరపాటున చేశారా.. కావాలనే చేశారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కావడంతో యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు సబర్బన్: దైవానుగ్రహంతో జిల్లా సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు ఉద్బోధించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి స్వామిలతో పాటు కలెక్టర్ పి.రాజాబాబు దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో తొలుత మంగళ వాయిద్యాలతో అధికారులు, నాయకులకు స్వాగతం పలికారు. ప్రముఖ వేద పండితుడు దక్షిణామూర్తి సంవత్సర పంచాంగ శ్రవణం చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, ప్రజలను దక్షిణామూర్తి ఆశీర్వదించారు. వట్యం నాగేశ్వర విశ్వనాథ శర్మ, నాదెండ్ల నాగేశ్వరరావు, నడింపల్లి లక్ష్మీనారాయణ, పరాంకుశం శ్రీనివాసచార్యులకు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ తరఫున ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వేదపండితులు షడ్రుచుల ఉగాది పచ్చడి అందజేశారు. వేడుకల్లో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఇంటర్ మూల్యాంకనణం ఈ నెల 21వ తేదీ నుంచి నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ శనివారం నుంచి ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ, హిందీ, ఒకేషనల్కు చెందిన ఇంగ్లిష్, జీఎఫ్సీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సీఎస్ఈ, లే, ఎల్ఎండీ కోర్సుల మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్జెక్టులకు సంబంధించిన చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు తప్పక హాజరుకావాలన్నారు. 22వ తేదీన ఈ సబ్జెక్టులకు సంబంధించిన స్క్రుటినైజర్లు హాజరుకావాలన్నారు. అన్ని రకాల యాజమాన్యాల ప్రిన్సిపాళ్లు ఇంటర్ బోర్డు నుంచి ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఒక్కరినీ రిలీవ్ చేయాలని కోరారు. ఉత్తర్వులు అందుకొని మూల్యాంకనానికి గైర్హాజరైన సంబంధిత కళాశాల యాజమాన్యంపై ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
స్పెషలాఫీసర్గా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పి. రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఈ నెల 17వ తేదీతో ముగియడంతో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ ప్రతిష్టతను పెంచడంతో పాటు నగర పౌరులకు మెరుగైన సేవలందేలా కృషి చేస్తామన్నారు. అమృత్ పథకం కింద ఒంగోలు నగరంలో రూ.450 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ పనులు ఏడాది కాలంలో పూర్తి చేస్తే నగర ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. నగర అభివృద్ధితో పాటు రెవెన్యూ రాబడిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ వైష్ణవి, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
పశ్చిమాసియా యుద్ధం సెగ మన వంటింటిని తాకింది. గ్యాస్ కంపెనీ ఏజెన్సీలు, అధికారులతో కుమ్మకై ్క చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గ్యాస్ కొరతను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లను నల్లబజారుకు తరలించి డొమెస్టిక్ సిలిండర్ రూ. 3600, కమర్షియల్ సిలిండర్ రూ. 5000 వరకూ విక్రయిస్తున్నారని సమాచారం. బ్లాక్లో సిలిండర్లను కొనలేక ఇటు ప్రజలు, అటు వ్యాపారస్తులు అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో పలు చోట్ల హోటళ్లు, కర్రీ పాయింట్స్ మూతపడ్డాయి. ఇడ్లీ, దోశలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న మధ్య తరగతి, చిరువ్యాపారుల ఉపాధికి గండి పడుతోంది. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు చేయడం గమనార్హం. యుద్ధం మొదలైన రోజు నుంచే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీలు నిలిపివేసినట్లు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఏజెన్సీలు కమర్షియల్ గ్యాస్ లేదని చేతులెత్తేశారు. అదే సమయంలో నల్లబజారు తలుపులు తెరుచుకున్నాయి. బ్లాక్ మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సిలిండర్లు లభ్యమవుతున్నాయి. యుద్ధానికి ముందు వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1982 ఉండగా యుద్ధం మొదలయ్యాక కేంద్రం రూ.115 పెంచడంతో ప్రస్తుతం రూ. 2.097లకు చేరుకుంది. అయితే ఏజెన్సీలు కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయకపోవడంతో నల్లబజారులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.4500 నుంచి రూ. 5000కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.గ్యాస్ మాటలుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో మూడు స్టార్ హోటళ్లతో పాటుగా 16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 150 నుంచి 200 బడా హోటళ్లున్నాయి. ఇవి కాకుండా వీధి వీధికొకటి చొప్పున వెలిసిన చిన్న చిన్న హోటళ్లు మరో 1000కి పైగానే వున్నాయి. ఇళ్ల దగ్గర ఇడ్లీ, దోశలు వేసి అమ్ముకునే వాళ్లు మరో 500 మంది వరకు ఉన్నారు. 1200 నుంచి 1500 టీ స్టాల్స్ ఉన్నాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద న్యూడిల్స్ పాయింట్లు, చికెన్ పకోడి బండ్లు సుమారు 200 పైమాటే. ఇక కేటరింగ్లకు లెక్కలేదు. ఒక్కో స్టార్ హోటల్లో రోజుకు 10కి పైగానే వాణిజ్య గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుంటారు. రెస్టారెంట్లలో నిత్యం 6 నుంచి 8 గ్యాస్ సిలిండర్లు పనిచేస్తూనే ఉంటాయి. రోజుకు సుమారు 10,200కు పైగానే గ్యాస్ సిలిండర్లు అవసరం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 10 వేలకు పైగానే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. అయితే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాలుగు రోజల తర్వాత గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు కావలసినప్పుడల్లా లభించే గ్యాస్ సిలిండర్లను రాత్రికి రాత్రే నల్లబజారుకు తరలించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించి అడ్డగోలు సంపాదనకు తెరదీశారని మండిపడుతున్నారు. వంటింకి మంట.. ప్రకాశం జిల్లాలో 5,51,759, మార్కాపురం జిల్లాలో 3,22,279 గృహ వినియోగదారులు ఉన్నాయి. ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు 9,875 సిలిండర్లు అవసరం ఉండగా డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు సిద్ధం ఉన్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు ప్రకటించారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు, మార్కాపురంతో పాటుగా అనేక మండల కేంద్రాల్లో డొమోస్టిక్ గ్యాస్ సక్రమంగా లభించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటల్ నిర్వాహకులు అనివార్యంగా డొమెస్టిక్ గ్యాస్ను వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నల్లబజారు వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్ ధరలను ఆమాంతం పెంచేసి నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ ఽసిలిండర్ రూ. 958కి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రూ. 1500లకు విక్రయించారు. ఆ తరువాత క్రమంగా పెంచుకుంటూ పోయిన అక్రమార్కులు గురువారం నాటికి ఒక్కో సిలిండర్ను రూ. 3000 నుంచి రూ.3600 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే సిలిండర్ ధర రూ.5000 వరకు పెరిగినా అశ్చర్యం లేదని చెబుతున్నారు. నగరంలోని సంతపేట సాయిబాబా ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఏటా అన్నదానం నిర్వహిస్తారు. గ్యాస్ కొరత తో ఈ ఏడాది అన్నదానం చేయడం లేదని ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా బోర్డు పెట్టడం గమనార్హం. మూతపడుతున్న హోటళ్లు... జిల్లా కేంద్రంలోని హోటళ్లపై యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక రెస్టారెంట్లు, హోటళ్లలో న్యూడిల్స్, పుల్కా, పూరి, ఇడ్లీ, స్టాటర్స్, చికెన్ స్నాక్స్లను పూర్తిగా ఆపివేశారు. వెజిటేరియన్ హోటళ్లలో కూడా వేపుళ్లను నిలిపివేశారు. పప్పు, సాంబరు, చారుతో సరిపెడుతున్నారు. ఊక పొయ్యి మీద వండే వాటిని మాత్రమే వడ్డిస్తున్నట్లు హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పలు హోటళ్లు ఊక పొయ్యిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. గ్యాస్ కొరతతో నగరంలో రోజుకో హోటల్ మూతపడుతోంది. నెల్లూరు బస్టాండు సెంటర్లో ఇటీవలే ప్రారంభించిన కొత్త హోటల్కు తాళం వేశారు. ముంగమూరు డొంకకు వెళ్లే దారిలో ఒక హోటల్ మూడు రోజులుగా తెరవడం లేదు. ఇక పూర్తిగా గ్యాస్ సిలిండర్ల మీదనే ఆధారపడిన టీ స్టాళ్లు చాలా వరకు మూతపడుతున్నాయి. కొన్ని టీ స్టాల్స్లో రూ. 5వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు రూ.10 విక్రయించిన టీ ఇప్పుడు రూ.15 పెంచారు. కాఫీ ధరలను సైతం రూ.30 లకు పెంచినట్లు చెబుతున్నారు. నగరంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద ప్రముఖ టీ స్టాల్ నాలుగు రోజులుగా తలుపులు తెరవడం లేదు. కేటరింగ్లు, ఇళ్ల వద్ద నిర్వహించే టిఫిన్ పాయింట్లలో ఇడ్లీ, దోశ ధరలను పెంచేశారు.నగరంలో నల్ల బజారు వ్యాపారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోని అధికారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసులు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు నల్లబజారు వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు నల్ల బజారు వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.యుద్ధం హోటల్ వర్కర్ల పొట్టకొడుతోంది. నగరంలోని పలు హోటళ్లు మూతపడుతుండడంతో అనేక మంది హోటల్ వర్కర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. రెస్టారెంట్లు, బడా హోటళ్లలో కనీసం 100 వరకు పని చేస్తుంటారు. రోజువారి కూలీతో వంట మాస్టర్లు, సప్లయర్లు, క్లీనింగ్ స్టాఫ్ పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇప్పుడు వీరంతా ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు ప్రభుత్వ సాయం లేదు. ఇటు హోటల్ యాజమాన్యాలు అందించే చేయూతలేక అర్ధాకలితో జీవిస్తున్నామని వాపోతున్నారు. మాయదారి యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది. తిరిగి మాములు పరిస్థితులు ఎప్పుడు వస్థాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అంత్యక్రియలు చేయొద్దు..
అది ప్రైవేట్ స్థలం..కనిగిరిరూరల్: ప్రైవేట్ స్థలంలో అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుకోవడంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన మార్కాపురం జిల్లా కనిగిరిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన చొప్పరపు అంజమ్మ(70) గురువారం మృతి చెందింది. అంజమ్మకు ఖనన, అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్మీకి బోయకులస్తులంతా పురాతన కాలం నాటి శ్మశాన వాటిక వద్దకు తీసువెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అది ప్రైవేట్ స్థలమని, అక్కడ అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే తాతల కాలం నుంచి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుకోవడానికి మీరెవరంటూ వాల్మీకి బోయకులస్తులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 4 గంటల పాటు వాల్మీకి బోయ కులస్తులు మృతదేహంతో నిరసనకు దిగారు. ప్రభుత్వ, అధికారుల తీరుపై వాల్మీకి బోయకులస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు అంజమ్మ అంత్యక్రియలు జరిగాయి. వాల్మీకి బోయ కులస్తులేమంటున్నారంటే.. ‘మా తాత ముత్తాల కాలం నాటి నుంచి సర్వే నెంబర్ 554లోని భూమిలో వాల్మీకి బోయ కులస్తుల శ్మశాన వాటిక ఉంది. ఆ సర్వే నెంబర్లోని సుమారు 5 ఎకరాల భూమిలో దాదాపు 50 సెంట్ల స్థలంలో ఎప్పటినుంచో అంత్యక్రియల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ధరలు పెరగడంతో కొందరు రియల్ వ్యాపారులు అధికార పార్టీ నేతల అండతో ఆ భూమిలో అడుగు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని’ వాపోయారు. ఇప్పటికే మాపై కేసులు పెట్టారని, శ్మశానాన్ని రాత్రికి రాత్రి పెకలించారని, ఇటీవల శ్మశాన వాటికను చదును చేసేందుకు ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. అందుకు వ్యతిరేకంగా గతంలో నిరసన ర్యాలీలు కూడా చేశామని వివరించారు. శ్మశాన వాటిక ఉన్న స్థలం సుమారు రూ.2 కోట్లపైనే పలుకుతుండటంతో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకే రియల్ వ్యాపారులు అధికార పార్టీ అండతో తమ పై దౌర్జన్యం చేస్తున్నారని వాల్మీకి బోయ కులస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా వారికి మద్దతుగా ఉన్నారని వాపోయారు. శ్మశాన వాటిక భూమి మట్టిని ల్యాబ్ పరీక్షలు నిర్వహస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని, వందల ఏళ్ల నుంచి అక్కడ శ్మశాన వాటిక ఉందని వాల్మీకి బోయకులస్తులు వాపోతున్నారు. అధికారులు ఇలా.. అయితే అధికారులు మాత్రం శ్మశాన వాటిక స్థలం ప్రైవేటు వ్యక్తుల భూమిగా, రిజిస్టర్ ల్యాండ్గా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక స్థలం కాకుండా.. మరో రెండు మూడు చోట్ల ప్రదేశాలు చూపిస్తున్నారు. కానీ వాల్మీకి బోయకులస్తులు దానికి అంగీకరించడం లేదు. పూర్వీకుల కాలం నాటి శ్మశాన వాటికలో తాము అంత్యక్రియలు చేస్తామని తెగేసి చెప్తున్నారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం.. బాధిత వాల్మీకి బోయకులస్తులతో మాట్లాడుతున్నామని.. సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. -
ఇక ఆటవిడుపు
● ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 67 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్ విద్యార్థులు మొత్తం 15,476 మందికి గాను, 15,035 మంది హాజరుకాగా, 439 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 6 పరీక్ష కేంద్రాలను, డీఈసీ 7 పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ 33 కేంద్రాల చొప్పున మొత్తం 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. స్నేహితులకు వీడ్కోలు చెబుతూ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సొంత ఊళ్లకు వెళ్లే విద్యార్థులతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. సరిపడినన్ని బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. -
24న సీపీఐ ధర్నాలు
మార్కాపురం: రాష్ట్రంలో అర్హులైన పేదలకు నివాస స్థలాలు, పక్కా గృహాలు, వ్యవసాయ కూలీలకు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీ ఈశ్వరయ్య తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నివాస స్థలాల కోసం రాష్ట్రంలో నిరుపేదలు అనేక దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన చంద్రబాబు అధికారంలోనికి రాగానే వాగ్దానాలను గాలికొదిలేశారని చెప్పారు. పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల క్రితం టిడ్కో ఇళ్లు పూర్తయినా నేటికీ లబ్ధిదారులకు స్వాధీనం చేయకపోవడంతో అవన్నీ శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై నా వాటిని లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీలన్నీ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో భూ మాఫియా పేట్రేగిపోతోందని, ప్రజలు తమ ఆస్తులను రక్షించుకునేందుకు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు, పెన్షన్లు ఇస్తామని చెప్పిన కూటమి నాయకులు కొత్తవి ఇవ్వకపోగా అనర్హుల పేరుతో అర్హులను తొలగించారన్నారు. దళిత వాడల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్కే యాసీన్, అందె నాసరయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్కె ఖాశీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు విలవిల
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026యువకుల క్రికెట్ మోజు..డబ్బు ఆశను అడ్డంపెట్టుకుని బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. బెట్టింగ్ వలలో చిక్కుకున్న యువకులు అప్పులపాలై అవి తీర్చే దారి తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల దర్శి కేంద్రంగా ఉన్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టవడంతో బెట్టింగ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులకు ఎస్పీ చార్జ్మెమో ఇచ్చారు. దీంతో అసలు సూత్రధారులు అప్రమత్తమై దేశం దాటేశారన్న ప్రచారం సాగుతోంది. కాలం పూచిన తొలిపువ్వుబెట్టింగ్ వల..దర్శి: దర్శి నియోజకవర్గంలో దర్శి కేంద్రంగా నిర్వహించిన బెట్టింగ్ తీగలాగితే బెట్టింగ్ రాయుళ్ల డొంక కదిలింది. ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసి కూపీలాగడంతో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్ రాజు మంగళవారం 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలకు చార్జ్మెమోలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎస్పీ తీసుకుంటున్న చర్యలకు అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తీగ లాగడంతో బుకీలు పరార్: దర్శి కేంద్రంగా చేస్తున్న బెట్టింగ్ రాయుళ్ల ద్వారా నరసరావుపేటలో బెట్టింగ్కు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం, వారి వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరకడం, వారి ద్వారా హైదరాబాద్లో మరో బెట్టింగ్ రాయున్ని కూడా అదుపులోకి తీసుకోవడంతో బెట్టింగ్ డొంక కదిలింది. దీంతో ప్రధానంగా బెట్టింగ్లు వేయించే బుకీలు గుట్టు చప్పుడు కాకుండా అడ్రస్ లేకుండా ఊళ్లు వదిలేసి వెళ్లిపోయారు. ఈ బెట్టింగ్ వ్యవహారంలో తెరవెనుక అసలు పెద్దలు ఉన్నవారిని పట్టుకునేందుకు ఎస్పీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. పది మంది అదుపులోకి.. మంగళవారం రాత్రి దర్శి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 10 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు వచ్చి వారిని ఒంగోలు తీసుకెళ్లారు. దీంతో పట్టణంలో ఒక్క సారిగా కలకలం రేగింది. ప్రధాన బెట్టింగ్ రాయుళ్ల ముఠాకు సంబంధించి జిల్లాలోని 14 మంది వరకు శ్రీలంక, ఇతర దేశాలకు వెళ్లినట్లు సమాచారం. అసలు దోషులను పట్టుకుంటారా లేక వారిని వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది. – సాక్షి, ఒంగోలు ఇప్పటి వరకు 25 మందికి పైగా బలవన్మరణాలుదర్శి పట్టణంలో బెట్టింగ్కు అలవాటుపడిన యువకులు డబ్బు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి బెట్టింగ్లు పెట్టి రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో అప్పుల వాళ్ల ఒత్తిళ్లకు తట్టుకోలేక, అందరికీ తెలిస్తే ఆ డబ్బు ఏం చేశారో చెప్తే కుటుంబం పరువు పోతుందని, ఆ అప్పులు తీర్చేందుకు మళ్లీ మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్లు వేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు గత పదేళ్లలో దాదాపు 25 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కేబుల్ వర్క్ చేసుకునే కుటుంబానికి చెందిన ఒక యువకుడు బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఇంట్లో నుంచి పారిపోయాడు. అతను వెళ్లిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. సరుకుల కంపెనీలో పని చేసే ఓ యువకుడు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్టర్ తోలుకుని జీవనం సాగించే వ్యక్తి కుమారుడు బెట్టింగ్ లకు పాల్పడి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి పెళ్లి అయి చిన్న పిల్లలు ఉన్నారు. మరో సరుకుల రవాణాకు సంబంధించిన పని చేసే యువకుడు కూడా బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి కూడా ఇదే బెట్టింగ్లకు బలయ్యారని చర్చించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 20 నుంచి 30 సంవత్సరాల లోపు యువకులు పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
వంటింట్లో నూనె మంట!
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 120 టన్నులకు పైగా నూనె విక్రయాలు ● అడ్డూ అదుపు లేని ప్లాస్టిక్ వస్తువుల ధరలు ● ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలంమార్కాపురం: పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వంటిళ్లలో మంట పుట్టిస్తున్నాయి.! ఇరాన్తో అగ్ర రాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వస్తు సేవల రంగాలపై ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో వివిధ వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూనె ధరలు ఒక్కసారిగా పెరిగి జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో లీటరు నూనె ధర రూ.5 నుంచి 10 రూపాయల మేర పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజూ 120 టన్నులకు పైగా ఆయిల్ విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. ఐదు రోజుల క్రితం ఒక రకం కంపెనీ ఆయిల్ ధర రూ.162 ఉండగా ప్రస్తుతం రూ.170కి పెరిగింది. మరోరకం ఆయిల్ ధర రూ.115 నుంచి రూ.125కి చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూనె ధరలు దిగి రాకుంటే ఆహార పదార్థాల ధరలు పెంచక తప్పదని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, టిఫిన్ బండ్లు మూత వేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గడిచిన వారం రోజుల వ్యవధిలో కూలింగ్ క్యాన్ల ధర రూ.450 నుంచి రూ.600కు బబుల్స్ రూ.130 నుంచి రూ.170కు, కవర్ల ప్యాకెట్ ధర రూ.175 నుంచి రూ.215కు ఎగబాకింది. గల్ఫ్ దేశాల నుంచి ముడిపదార్థాల దిగుమతికి అంతరాయం ఏర్పడటంతో ధరలపై ప్రభావం పడుతోందని వ్యాపారులు చెబుతున్నారు. నూనె ధరలు తగ్గించాలి గత వారం రోజుల నుంచి నూనె ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలి. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టం. ప్లాస్టిక్ వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నారయి. అధికారులు స్పందించి కృత్రిమ కృత్రిమ గ్యాస్ కొరతను, ధరలను నియంత్రించాలి. – కరీముల్లా, మార్కాపురం 17వ బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
బొల్లావులతో చిందులు.. కాటమరాజుకు మొక్కులు
పెద్దారవీడు: నల్లమల అభయారణ్యంలో పెద్దారవీడు మండల పరిధిలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవాని అమ్మవార్ల తిరునాళ్ల బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలు, పూలమాలతో శోభాయమానంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అన్న సంతర్పణ చేశారు. తిరునాళ్ల సందర్భంగా రాత్రి వేళ భక్తుల కాలక్షేపానికి విద్యుత్ ప్రభలు, కోలాటం, నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. భక్తిపారవశ్యం.. బొల్లావుల ఉత్సవం కాటమరాజు స్వామి తిరునాళ్ల సందర్భంగా బొల్లావుల ఉత్సవం భక్తులను ఆనందపరవశులను చేసింది. కనక తప్పెట్ల మోత, కొమ్ము బూర వాయిద్యం నడుమ యాదవులు వీరతాళ్లతో బొల్లావులను ఆడిస్తుండగా స్వామి వారి ఆలయం చుట్టూ మహిళలు పొంగళ్లతో ప్రదక్షిణలు చేశారు. మొక్కుబడి ఉన్న మహిళలు గంగాభవానీ అమ్మవారికి పట్టుచీరలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఊరేగింపుగా వచ్చిన బొల్లావులు కాటమరాజు సన్నిధిలో కొలువుదీరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం
అద్దంకి రూరల్: అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అద్దంకి ఆరోగ్య రథాన్ని ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అద్దంకి ఆరోగ్య రథం లోగోను బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అశోక్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రథం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక పరీక్షలు చేసి చికిత్స అందిస్తారని చెప్పారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే అద్దంకి అభివృద్ధి చెందుతుందని డాక్టర్ అశోక్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాళ్లూరు: బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి తాళ్లూరు మండలంలో చేపడుతున్న పనులను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి బుధవారం పరిశీలించారు. హైవేకు అదనంగా భూమి అవసరమని గుర్తించారు. తాళ్లూరు గ్రామంలో 2.28 ఎకరాలు, మల్కాపురం గ్రామంలో 14 సెంట్ల భూమి అవసరమని అధికారులు జేసీ దృష్టికి తీసుకురాగా, భూ రికార్డులు పరిశీలించారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించారు. రైతుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అద్దంకి ఆర్డీఓ జాన్సన్, తహసీల్దార్ బీవీ రమణారావు, ఎక్స్ప్రైస్ హైవే ఎస్డీసీ, వీఆర్ఓ చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాతం
దర్శి: దర్శిలో ఫ్లెక్సీల తొలగింపులో నగర పంచాయతీ కమిషనర్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా పక్షపాతం చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలో ముస్లింలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలలో రాజకీయ పార్టీ నాయకులు ఫొటోలు ఉన్నాయని, రోడ్డుకు అడ్డం లేకున్నా ఫ్లెక్సీలను తొలగించారని ముస్లింలు పడ్డారు. ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీల తొలగిస్తుండటంతో అక్కడకు చేరుకున్న ముస్లింలు కమిషనర్ శ్రీరామ్మూర్తితో మాట్లాడారు. గడియార స్తంభానికి అడ్డంగా నడిరోడ్డులో ఉన్న టీడీపీ నాయకులు, రాజకీయ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు కడితే వాటిని ఎందుకు తీసివేయలేదని ప్రశ్నించారు. దీంతో కమిషనర్ మాట్లాడుతో రోడ్డుకు అడ్డంగా ఉందని, ఇక్కడ ఎవరు కట్టినా తీసేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రోడ్డుకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు ఎందుకు తీయలేదని, వారికి ఉన్న పర్మిషన్లు చూపించాలని కోరారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ నాకు ఎటువంటి పార్టీలు లేవని చెబుతూనే వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగించి టీడీపీ ఫ్లెక్సీలను అక్కడే ఉంచారు. దీనిపై స్థానికులు కమిషనర్ను నిలదీయంగా..వారికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. అనుమతులు చూపించాలని ప్రశ్నించగా కమిషనర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై కమిషనర్ను వివరణ కోరగా నగదు చెల్లించి అనుమతులు తీసుకుంటే ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు మాత్రమేతొలగింపు కమిషనర్ తీరుపై స్థానికుల ఆగ్రహం -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
సీఎస్పురం(పామూరు): చెట్టుపై చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వి.బైలులో బుధవారం జరిగింది. ఎస్సై అనూక్ తెలిపిన వివరాలు... మండలంలోని వి.బైలు గ్రామానికి చెందిన జమకాల నడిపి ఓబయ్య(67) మంగళవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలోని చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఓబయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కురిచేడు: పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పడమర వీరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చౌడేశ్వర కాలనీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నమ్మ ప్రతిరోజు లాగా బుధవారం కూడా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో మిర్చి కోతకు వెళ్లింది. పొలంలో మిరపకాయలు కోస్తుండగా సాయంత్రం ఉరిమిన ఉరుములకు పిడుగులు పడటంతో షాక్కు గురై మృతి చెందింది. పేద మహిళను మృత్యువు పిడుగు రూపంలో కబళించిందని తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దదోర్నాల: వాతావరణంలో మార్పుల ప్రభావంతో అకాల వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఓ ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని బలిజపల్లె గిరిజన గూడెం సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. ఐనముక్కలకు చెందిన రైతు లింగాల అచ్చయ్యకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. లక్ష రూపాయల విలువ చేసే ఎద్దు మృతి చెందడంతో జీవనాధారాన్ని కోల్పోయానంటూ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు. కురిచేడు: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని బోదనంపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..బోధనంపాడు గ్రామానికి చెందిన వెలుతుర్ల బ్రహ్మారెడ్డి(79)కి సుమారు రూ.60 లక్షల వరకు అప్పులుఉన్నాయి. వాటిని తీర్చలేక కోర్టు నుంచి ఐపీ నోటీసులు అప్పులు ఇచ్చిన వారికి పంపాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పొలం అమ్మి అప్పులు తీర్చాలంటే కుటుంబ సభ్యులు అంగీకరించకలేదు. దీంతో గ్రామంలో ముఖం చూపించలేక మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బుదవారం ఉదయం గ్రామంలోని నిర్మానుష ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్సై తెలిపారు. ఒంగోలు సిటీ: పదో తరగతి హిందీ పరీక్షకు బుధవారం 28,572 మంది విద్యార్థులకు గాను 28,422 మంది హాజరు కాగా 150 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. డీఈఓ ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలు, మార్కాపురం జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలను, ఏసీజీ అండ్ డీఎంసీ అధికారులు 5 కేంద్రాలను తనిఖీ చేశారు. అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మొత్తం 80 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు రెండవ రోజు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు డీఈఓ పేర్కొన్నారు. -
రైతాంగ వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి
● సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఒంగోలు టౌన్: దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై విద్యార్థి, యువజనులు పోరాటాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ఈనెల 23వ తేదిన భగత్సింగ్ వర్థంతిని పురస్కరించుకొని చేపట్టే నిరసన కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై 7 రెట్లు అధికంగా భారం పడిందన్నారు. విదేశీ కంపెనీలకు చెందిన జన్యుమార్పిడి విత్తనాలు, నకిలీ విత్తనాలను ఇష్టం వచ్చిన ధరలకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చిందని తెలిపారు. దేశీయ రైతాంగానికి లేని హక్కులు విదేశీ కంపెనీలకు మాత్రం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విదేశీ కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టేందుకే విత్తన చట్టం తీసుకొచ్చినట్లు విమర్శించారు. ఇరాన్పై యుద్ధంతో ప్రపంచంలో వస్తు రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారని, రైతు పేదా తేడా లేకుండా విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.వీరారెడ్డి మాట్లాడుతూ...మన ఎగుమతులపై 17 శాతం అమెరికా సుంకాలు విధిస్తుంటే, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు ఎటువంటి సుంకాలు విధించకపోవడం ఎంతగొప్ప దేశభక్తో చెప్పాలన్నారు. అమెరికాతో చేసుకున్న అడ్డగోలు, దోపిడీ ఒప్పందాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు పొగడడం హాస్యస్పదమన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల హనుమంతరావు మాట్లాడుతూ సీబీఐ, ఈడీ వంటి నేరపరిశోధక సంస్థలను ఉసిగొల్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చారని, 10 శాతం వాటా చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపై 40 శాతం భరించాలని షరతులు విధించడం దారుణమన్నారు. సమావేశంలో రైతు నాయకులు ఎంఎస్ సాయి, ఎస్.లలితకుమారి, భీమవరపు సుబ్బారావు, ఎల్ రాజశేఖర్, చొప్పర జాలన్న పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో సాగదీత ధోరణి సరికాదు
● రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో సాగదీత ధోరణి సరికాదని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా దిశగా చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 22ఏ కేసులపై మరింత దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి అవసరమైన ఈ–కేవైసీ ప్రక్రియను లోపాలు లేకుండా చేయాలన్నారు. కేవలం కిందిస్థాయి సిబ్బందికే అప్పగించకుండా తహసీల్దార్లు కూడా రెగ్యులరుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి ముందుగా సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువైన నాలుగు వారాల్లోగా 22(ఏ) కేసులను పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ బి.ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్లపై కక్ష సాధింపు
బిల్లుల పెండింగ్తో గిద్దలూరు(బేస్తవారిపేట): రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న సర్పంచ్లపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక భూమా గెస్ట్హౌస్లో నియోజకవర్గంలోని సర్పంచ్లతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేపీ మాట్లాడారు. సర్పంచ్ల హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాస్తోందని, ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు, అంతర్గరోడ్లు, ప్రభుత్వ భవనాల కాంపౌండ్లు, పారిశుధ్య పనుల కోసం సర్పంచ్లు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. చేసిన పనులకు బిల్లులు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారి సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్లు 15 రోజుల్లోపు తమ తీర్మానాలను అధికారులకు సమర్పించి, ఎంబుక్ల రశీదులను తీసుకుని వస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుందామని చెప్పారు. బకాయిలు వచ్చే వరకు పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బిల్లుల మంజూరుపై సర్పంచ్ల ఆవేదన పిటికాయగుళ్ల సర్పంచ్ నర్రా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ సర్పంచ్లు భయపడాల్సిన పనిలేదని చట్టపరంగా ముందుకెళ్లి బిల్లులు సాధించుకుందామన్నారు. కందులాపురం సర్పంచ్ బత్తుల సూర్యప్రకాష్ దాదాపు రూ.కోటి విలువైన పనులు చేస్తే రూ.60 లక్షల వరకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కందులాపురం సెంటర్లో అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారని, వైఎస్సార్ సీపీ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే దుర్మార్గంగా అడ్డు తగులుతున్నారన్నారు. అర్ధవీడు సర్పంచ్ మునగాల వసంత మాట్లాడుతూ.. సుమారు రూ.80 లక్షల వరకు ఖర్చు చేసి రోడ్ల పనులు చేశామని, రూ.40 లక్షల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధవీడు మండలంలో సర్పంచ్లకు తెలియకుండానే, ఎటువంటి తీర్మానాలు తీసుకోకుండానే పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సర్పంచ్లు సమావేశంలో తాము ఎదుక్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే కేపీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే కేపీ ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, ఎం వెంకట్రావ్, కడప లక్ష్మీదేవి, జెడ్పీటీసీలు సారె వెంకటనాయుడు, పగడాల శ్రీరంగం, బీవీ రాజయ్య, మాజీ ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, రవికుమార్యాదవ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు బి.ఓబులరావు, ఆవుల శ్రీధర్రెడ్డి, సీఆర్ఐ మురళి, గొంగటి చెన్నారెడ్డి, నాయకులు దొడ్డంపల్లి కృష్ణారెడ్డి, మానం బాలిరెడ్డి, డాక్టర్ బ్రహ్మారెడ్డి, నెమిలిదిన్నె చెన్నారెడ్డి, దప్పిలి వెంకట్రామిరెడ్డి, పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులకు బాబు సర్కారు తూట్లు గ్రామాల్లో చేసిన పనుల బిల్లులు రెండేళ్లుగా నిలిపేయడం దుర్మార్గం రూ.కోట్లలో బకాయిలు పెట్టి అధికారుల చుట్టూ తిప్పుతారా? తీర్మానాలు లేకుండా టీడీపీ నేతలు పనులు చేస్తే బిల్లులెలా ఇచ్చారు? వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి ధ్వజం -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
యర్రగొండపాలెం: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ.10 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన మండల కేంద్రమైన పుల్లలచెరువులోని కమ్మవారిపల్లెలో నివాసం ఉంటున్న మేడికొండ వెంకటేశ్వర్లు పొలం పనులకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన సంగతి తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యర్రగొండపాలెం సీఐ కె.అజయ్కుమార్, ఎస్సై బి.సాంబశివరావు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించగా నిందితులు ఎవరనేది తెలుసుకోగలిగామని డీఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని నామనాయక్ తండాకు చెందిన కోడావత్ రాజు అలియాస్ కుమార్, దేవరకొండ మండలంలోని మైనంపల్లి తండాకు చెందిన వడితే సాయికిరణ్తోపాటు మరో ఇద్దరు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు గతంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని, వీరిలో రాజు అనే వ్యక్తికి దాదాపు 100 చోరీ కేసుల్లో సంబంధం ఉందని చెప్పారు. స్థానిక మాచర్ల రోడ్డులోని మల్లాపాలెం గ్రామ క్రాస్ రోడ్డులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి బంగారు చైన్, గొట్టాల గొలుసు, నల్లపూసల దండ, రెండు జతల మాటీలు, రెండు జతల జుంకాలు, రెండు జతల బుట్టకమ్మలు, ఒక జత రాళ్ల కమ్మలు, ఒక జత కమ్మలు, రెండు చిన్న ఉంగరాలు, వెండితో చేసిన 5 జతల కాళ్ల పట్టీలు, మొలతాడు, రెండు గ్లాసులు, ఒక స్పూన్, 3 కుంకుమ భరణెలు, 6 గిన్నెలు వెరసి మొత్తం రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు ఉపయోగించిన హోండా సిటీ పాతకారును సీజ్ చేశామని, బీరువా తాళాలు పగలకొట్టేందుకు ఉపయోగించిన రెండు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చోరీ కేసును సకాలంలో ఛేదించిన సీఐ, ఎస్సైని డీఎస్పీ అభినందించారు. రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం నిందితుల వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు పుల్లలచెరువులో చోరీ కేసును వేగంగా ఛేదించిన పోలీసులకు అభినందనలు -
మట్టి మాఫియాకు యువకుడు బలి
కందుకూరు రూరల్: మట్టి మాఫియా యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వేయడంతో ఏర్పడిన పెద్ద పెద్ద గొయ్యిల్లో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బి.ప్రసాద్ (19) గేదెలు మేపుకునేందుకు పొలం వెళ్లాడు. పక్కనే ఉన్న చెరువులోకి గేదెలు తోలి శుభ్రం చేసేందుకు చెరువులోకి దిగాడు. లోతును గమనించకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. మట్టి మాఫియా చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి అధిక లోతుగా మట్టిని తీయడంతో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. అవే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేతికందివచ్చిన కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ● ఇద్దరిపై 6ఏ కేసు నమోదు పామూరు: గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై అధికారులు దాడులు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రమైన పామూరుతోపాటు మండలంలోని గ్రామాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఎన్ఫోర్సుమెంట్ డీటీ కే.రాఘవేంద్ర భూపతి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీహెచ్.రవిబాబు, విజిలెన్స్ డీసీటీఓ బి.రామారావు ఆధ్వర్యంలో రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరి దుకాణాల నుంచి 35 డొమెస్టిక్ సిలిండర్లు, 4 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని వారిపై 6ఏ కేసు నమోదుచేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. పామూరులోని పేట వీధి సమీపంలో షేక్.చిన్న ఖాజా రహమతుల్లా చెందిన రేకుల ఇంటిలో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్ల నిల్వ ఉంచి అధికధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఇండేన్ డొమెస్టిక్ ఫుల్ గ్యాస్ సిలిండర్లు 21, ఖాళీ సిలిండర్లు 02, భారత్ డొమెస్టిక్ ఖాళీ గ్యాస్ సిలిండర్లు 12, ఇండేన్ కమర్షియల్ ఖాళీ గ్యాస్ సిలెండర్ 1 మొత్తం 36 స్వాధీనం చేసుకుని చిన్న ఖాజా రహమతుల్లాపై 6ఏ కేసు నమోదుచేశామన్నారు. అదేవిధంగా మండలంలోని నుచ్చుపొద గ్రామంలోని చాకలివీధిలో నివాసంలో కౌలూరి ఖాజా రసూల్ అక్రమంగా నిల్వ ఉంచిన 3 కమర్షియల్ ఖాళీ సిలెండర్లను స్వాధీనం చేసుకుని అతనిపై 6ఏ కేసు నమోదు చేసి సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు స్వాధీనం -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
మార్కాపురం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ అదాలత్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. మంగళవారం మార్కాపురంలో నిర్వహించిన విద్యుత్ అదాలత్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 విద్యుత్ అదాలత్లు నిర్వహించి, వినియోగదారుల సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. ఒంగోలు సర్కిల్ పరిధిలో 26 అదాలత్లు, మార్కాపురంలో 6 అదాలత్లు నిర్వహించినట్లు వెల్లడించారు. తమ పరిధిలో 7 విద్యుత్ సర్కిల్స్ ఉండగా, ప్రతి నెలా 5 సర్కిళ్లలో అదాలత్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లుల చెల్లింపులో సమస్యలు, స్తంభాల ఏర్పాటులో జాప్యం లాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని వినియోగదారులకు సూచించారు. న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలను తమ వద్దకు తీసుకురావద్దని, అవి తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. అనంతరం 26 మంది విద్యుత్ వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డి.కృష్ణనాయక్, కె.కృష్ణ, కె.వెంకటేశ్వర్లు, ఎ.సునీత, ఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ సియానాయక్, జిల్లా పరిధిలోని ఏఈలు పాల్గొన్నారు. -
ఐనవోలు మేజర్లో మృతదేహం లభ్యం
కురిచేడు: మండలంలోని ఆవులమంద రోడ్డులోని ఐనవోలు మేజర్లోకి మహిళ మృతదేహం మంగళవారం కొట్టుకు వచ్చింది. ఏఎస్సై మోహనరావు కథనం ప్రకారం మార్కాపురం గ్రామానికి చెందిన గోగు గురవమ్మ(60) ఈనెల 9 వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మృతదేహం కాలువలో రబ్బరు చెట్లు తగిలి నిలిచిపోయింది. మృతదేహం బోర్లాపడి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. కాలువలో మృతదేహన్ని వెలికితీసి విచారించగా మార్కాపురం మహిళళగా గుర్తించామన్నారు. మృతురాలి బంధువుల ద్వారా నిర్ధారణ చేసుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేసినట్లు తెలిపారు. ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం ప్రకారం..చీరాల రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 7 ఏళ్ల బాలికపై బిట్ల అలియాస్ పిట్ల సూరిబాబు(45) నిర్మాణంలో ఉన్న ఒక డాబా ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లికి తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేశారు. చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ నిందితుడ్ని అరెస్టుచేసి కోర్టులో ఛార్జీషీటు దాఖలుచేశారు. సాక్షులను విచారణ అనంతరం నిందితునిపై అభియోగం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి పదేళ్ల కఠిన కారాగార ఽశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వంచే బాధిత బాలికకు రూ.75వేలు పరిహారం కింద చెల్లించాలని తీర్పులో వెలువరించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితునికి శిక్ష పడడంలో కృషిచేసిన ప్రత్యేక పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ మొయిన్, ఇతర అధికారులు, కోర్టు లయజన్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. ● ఏప్రిల్ 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి ఒంగోలు వన్టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు 45 వరకూ ఉన్నాయని కలెక్టర్ పి.రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–4 పోస్టులు 12 , క్లాస్–4, 30 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్–2, టైపిస్టు–8, ఎంపిహెచ్ఏ సీ్త్ర,–1, ఏఎన్ఎం గ్రేడ్ 3, సీ్త్ర–1, ఫిషర్ మెన్–1, ఆఫీస్ సబార్డినేట్–13, మెసెంజర్–1, శానిటరీ మేసీ్త్ర–1, హెల్పర్–1, వాచ్మెన్–10, స్వీపర్–1, పీహెచ్ వర్కర్–2, పోస్టులు ఉన్నట్లు తెలిపారు. అంధులకు–21, బధిరులకు–10, శారీరక వైకల్యం–4, ఆటిజం, మేధో వైకల్యం, నిర్ధిష్ట అభ్యాస వైకల్యం, మానసిక ఆరోగ్య, బహుళ వైకల్యాలు–7 పోస్టులుకు వేరు, వేరుగా దరఖాస్తులు చేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేది సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను, నిర్ణీత గడువు లోగా ప్రకాశం భవన్లోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. -
పోలీస్శాఖను కుదిపేస్తున్న బెట్టింగ్..
ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. టీ 20 ప్రపంచ కప్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు జరగడం, దర్శిలో పలువురు అరెస్టవడం తెలిసిందే. అయితే దర్శిలో అసలు బుకీలను ఒదిలిపెట్టి సబ్ బుకీలను అరెస్టు చేయడంపై మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ‘కేసును తిప్పేశారు’ అనే శీర్షికతో వచ్చిన కథనంతో ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్ అయ్యారు. ఊరూరా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నా పట్టించుకోకపోవడమే కాకుండా భారీ మొత్తంలో ముడుపులు తీసుకొన్న కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది బుకీలకు సహకరిస్తున్నట్లు ఎస్పీకి సమాచారం రావడంతో తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులకు నోటీసు ఇచ్చినట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తమ పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో విఫలం చెందినట్లు భావించిన ఎస్పీ జిల్లాలోని 15 మంది సీఐలకు, 25 మంది ఎస్సైలకు చార్జి మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో చార్జి మెమోలు ఇవ్వడం జిల్లాలో ఇదే ప్రథమం. ఇది జిల్లా పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది. -
టీటీడీ చైర్మన్ను తక్షణమే తొలగించాలి
ఒంగోలు సిటీ: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వికృత లీలలను ప్రజలందరూ చూశారని, తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకుల ప్రవర్తనను, అకృత్యాలను, వికృత చేష్టలను, అఘాయిత్యాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. గంజాయి తాగే ఎంపీలు, బీఆర్ నాయుడు లీలలను చూశారన్నారు. ఇంత బరితెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తుంటే జనసేన ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీ్త్రల పట్ల మాకు గౌరవం ఉందని చెప్పుకునే పవన్కళ్యాణ్, చంద్రబాబు సీ్త్రలను అవమాన పరుస్తున్న, సీ్త్రలను బ్లాక్మెయిల్ చేసేవారిని, మానభంగాలు చేసేవారిని, కించపరిచేవారిని పెట్టి పాలనను కొనసాగిస్తుంటే ప్రజలు వింతగా చూస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని మహిళలు నిరసన తెలుపుతుంటే మహిళలను నెత్తురు వచ్చేలా పిడిగుద్దులు గుద్దారన్నారు. అటువంటి వ్యక్తి దేవస్థానానికి అర్హుడు కాదని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కన్నీళ్లు ఉప్పుంగి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్లుగా ఉప్పు రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ధర ఉంటే ఉప్పు తయారీ ఉండదు. తయారీ ఉంటే ధర ఉండదు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండి ఉప్పు ఉత్పత్తి బాగా తయారవుతోంది. ఈ సారి మంచి ధర వస్తుందని ఆశించిన ఉప్పు రైతుకు పశ్చిమాసియా యుద్ధం శరాఘాతంగా మారింది. యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, వాణిజ్య సిలిండర్లను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ప్రభావం పలు రాష్ట్రాల్లోని హోటల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, చిన్నా పెద్దా హోటళ్లు మూత పడ్డాయి. అలాగే కేటరింగ్ సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా ఉప్పునకు డిమాండ్ తగ్గిపోయింది. తగ్గిన ధరలు.. యుద్ధం కారణంగా హోటళ్లు, కేటరింగ్ సర్వీసులు మూతపడడంతో ఉప్పునకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ధరలు బాగా పతనమైపోయాయి. యుద్ధానికి ముందు 76 కేజీల బస్తా ధర గత నెలలో రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.200లకు పడిపోయింది. వాస్తవానికి ఉప్పు కనీస మద్దతు ధర రూ.250 ఉంటేనే రైతుకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాణ్యమైన ఉప్పు ధర రూ.200 పలుకుతుండగా, తక్కువ నాణ్యత గల ఉప్పు ధర రూ.170 నుంచి రూ.190 ధర ఉంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా ఉండి ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించిన ఉప్పు రైతును యుద్ధం కోలుకోలేని దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన ఎగుమతులు.. యుద్ధం ప్రభావం ప్రధానంగా హోటల్ రంగంపై పడడంతో ఉప్పు ఎగుమతులు తగ్గిపోయాయి. సింగరాయకొండ, చిన్నగంజాం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా అవుతుంది. మార్చి నెలకు ముందు ప్రతిరోజు మండలంలోని ఊళ్లపాలెం, బింగినపల్లి ప్రాంతాల నుంచి 5 నుంచి 7 లారీల వరకు ఉప్పు రవాణా చేసేవారు. ప్రస్తుతం కొనుగోలుదారుల కానీ, బ్రోకర్లు కానీ రాకపోవటంతో రోజుకు ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉంది. దీంతో ఉప్పుపై ఆధారపడే కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఉప్పుకు డిమాండ్ ఎప్పుడు వస్తుందోనని ఉప్పు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉప్పు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉప్పు కొనుగోలు చేయాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉప్పుసాగు ఇలా.. ఉమ్మడి జిల్లాలో కనపర్తి, చిన్నగంజాం, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతోంది. 7 వేలకు పైగా రైతులు 10 వేలకు పైగా కూలీలు ఉప్పు సాగు పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం తప్ప సుమారు 9 నెలల పాటు ఉప్పు సాగవుతుంది. ఎకరాకు 76 కేజీలు ఉప్పు బస్తాలు 1,000 వరకు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రకారం ప్రతినెలా 25 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి వస్తుంది. గత సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి లక్ష్యానికన్నా తక్కువగా అయింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి కావడంతో పాటు దిగుబడి బాగా వచ్చింది. అంతా ఆశాజనకంగా ఉందని రైతులు భావించారు. ఇంతలో వీరి ఆశపై యుద్ధం నీళ్లు జల్లింది. మంచి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు యుద్ధం నడ్డివిరిచేసింది. -
ధరలు పడిపోతున్నాయి
యుద్ధం ప్రభావంతో ఉప్పు ధరలు తక్కువగా ఉన్నాయి. గత 15 రోజుల్లో 76 కేజీ ల బస్తాకు సుమారు రూ.80ల వరకు ధరలు పడిపోయాయి. యుద్ధం త్వరగా ముగిసి ధరలు పెరిగితే తప్ప ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఉంది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం ఉప్పు రైతుకు కష్టకాలం ప్రస్తుతం 76కేజీల నాణ్యమైన ఉప్పు ధర రూ. 200ఉండగా తక్కువ రకం ఉప్పు ధర రూ.170 ఉంది. యుద్ధం కారణంగా హోటళ్లు మూతపడటంతో ఉప్పుకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. గతంలో రోజుకు 5 పైగా లారీల్లో ఉప్పు రవాణా జరుగుతుండగా ప్రస్తుతం ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉండటంతో ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. – నాటారు వెంకటేష్, ఉప్పు రైతు, ఊళ్లపాలెం -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల వివరాలు పంపాలి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో మూడేళ్ల నుంచి అసలు విద్యార్థులు లేకుండా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, జిల్లాలో కారుణ్య నియమకానికి అర్హులైన వారి వివరాలను ప్రభుత్వానికి 23వ తేదీ లోపు పంపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 41 మంది ఉపాధ్యాయులను రోజుకు వారానికి ఒక పాఠశాల చొప్పున డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారన్నారు. అలా పనిచేసే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఒక పాఠశాలకు శాశ్వతంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని డీఈఓ సీవీ రేణుకను కోరారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారులకు కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించడం, ఎక్కువ రేట్లకు అమ్మడం, అక్రమంగా నిల్వచేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నప్పుడు అధిక ధరలు వసూలు చేయవద్దని చెప్పారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వ్యవధితో గ్యాస్ బుక్చేయించుకోవాలని చెప్పారు. ఒక్క సిలిండర్ ఉన్నవారు 5 రోజుల ముందు బుక్ చేసుకోవాలన్నారు. గ్యాస్ వినియోగదారులు కూడా స్పాట్ బుకింగ్ డిమాండ్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య, సివిల్ సప్లయ్ డీటీలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో నిర్వహించిన జాతీయ అకడమిక్ సదస్సుల్లో ఒంగోలు విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అస్వన్ మార్గదర్శకత్వంలో రెండో సంవత్సరం పీజీ విద్యార్థిని డాక్టర్ సాయి ప్రత్యూష ఈ నెల 13,15 తేదీల్లో గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీలో జరిగిన జాతీయ సదస్సులో జెనరేషన్ జెడ్ 1997–2012 మెడికల్ విద్యార్థుల్లో డిజిటల్ డిటాక్స్ ప్రభావాన్ని అంచనా వేసే ఒక ఇంటర్వెన్షనల్ అధ్యయనం అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. దీనికిగాను ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే ఇటీవల పుదుచ్చేరి జిప్మెర్ వైద్య కళాశాలలో జరిగిన సదస్సులో డాక్టర్ భాస్కరి మార్గదర్శకత్వంలో మూడో సంవత్సరం విద్యార్థిని షేక్ అలీనా పరిశోధన పత్రం సమర్పించారు. దీనికిగాను ద్వితీయ బహుమతితో పాటు రూ.6 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. జాతీయ సదస్సులో పాల్గొని ద్వితీయ బహుమతులు సాధించిన పీజీలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏసుపాదం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులు సాధించిన జాతీయ స్థాయి బహుమతులు ఒంగోలు జీఎంసీలో బలమైన పరిశోధనా వాతావరణం, అకడమిక్ ప్రతిభను చాటిచెబుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.అశ్విన్, పి.దివ్య పాల్గొన్నారు. -
ప్రజా ధనం లూటీ
● కార్పొరేషన్ చేసుకోవాల్సిన పనులను కూడా టెండర్ల ద్వారా అప్పగింత ● పచ్చదనం టెండర్లలో కూడా పోటీ లేకుండా సింగిల్ టెండర్ ఆమోదం ● కౌన్సిల్, అధికారుల తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ ● సాదాసీదాగా చివరి కౌన్సిల్ సమావేశంఒంగోలు సబర్బన్: అడ్డగోలుగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు...స్వయంగా కార్పొరేషన్ చేసుకోవాల్సిన పనులను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించి దోచిపెడుతున్నారు. అదీ పోటీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారా పనులు అప్పగించి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను నిలువునా పంచి పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్లో ధ్వజమెత్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో మేయర్ జి.సుజాత అధ్యక్షతన నిర్వహించారు. 20 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. 9, 10 అంశాలను నిధుల దుర్వినియోగం కోసమే పెట్టారని 14వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అధికారులను నిలదీశారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను ఒంగోలు నగర పాలక సంస్థ స్వయంగా చేపట్టవచ్చన్నారు. అలాంటిది తడి, పొడి చెత్తలను వేరుచేసి బయోవేస్ట్గా మార్చటానికి రూ.92 కోట్లు వెచ్చించాలని చూడటం అత్యంత దారుణమన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నాయని, అయినా ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ప్రజా ధనాన్ని అప్పనంగా కాజేసే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. అదీ కూడా పోటీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారా ఏ విధంగా టెండర్ను ఆమోదిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా 10వ అంశంలో కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచేందుకుగాను రూ.40 లక్షలు కేటాయించటం కూడా నిధులు దుర్వినియోగానికి పాల్పడటమేనన్నారు. అదీ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారానే కేటాయించటం అత్యంత దారుణమన్నారు. ఎస్ఎస్ ట్యాంకు–1కు ఉత్తరం వైపున 32వ డివిజన్ పరిధిలో పాత బైపాస్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారని జనసేన సభ్యుడు, 18వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు(చిన్నారి) అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. కౌన్సిల్లో ఆమోదం లేకుండా, టెండర్ పిలవకుండా ఈ విధంగా పనులు చేస్తున్నారని నిలదీశారు. బీటీ రోడ్డు దాదాపు పూర్తయిందని, చివరగా ఒక లేయర్ బీటీ వేస్తే రోడ్డు పూర్తవుతుందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. మరి టెండర్ పిలవకుండానే సొంత డబ్బులు పెట్టి రోడ్డు వేయాల్సిన అవసరం కాంట్రాక్టర్కు ఎందుకు ఉంటుందన్నారు. అంటే అధికారులు ఆ కాంట్రాక్టర్కు ముసుగులో ఏమైనా డబ్బులు ముట్ట చెప్పారా అని పలువురు కార్కొరేటర్లు చెవులు కొరుక్కున్నారు. చివరకు 20 అంశాలతో కూడిన కౌన్సిల్ సమావేశం పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ పద్దతిపై హెల్త్ విభాగంలో కన్సల్టెంట్ను బీసీఎస్ డాక్టర్ పత్తిపాటి పల్లవిని నియమించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టారు. అయితే కౌన్సిల్ ఆ నియామక ఆమోదాన్ని రద్దు చేసింది. గత కౌన్సిల్లో వాయిదా వేసిన 38వ డివిజన్లో పార్కుకు శ్రీ కృష్ణ దేవరాయ పార్కుగా నామకరణం చేయాలని స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన విన్నపాన్ని తిరిగి వాయిదా వేశారు. చివరకు కౌన్సిల్ చివరి సమావేశం సాదాసీదాగా సాగింది. కౌన్సిల్ సమావేశం అనంతరం కార్పొరేటర్లు అందరూ, అధికారులు కుటుంబ సభ్యులతో సహా వీడ్కోలు విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కే.వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవ రావు, వేమూరి సూర్య నారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్ -
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
ఉప్పు కొఠారులలో ఉప్పు తయారీపశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఉమ్మడి జిల్లా ఉప్పురైతుల బతుకుల్లో మంటలు రేపుతున్నాయి. ఎగుమతులు ఆగిపోవడంతో ఉప్పు ధరలు కుప్పకూలి రైతు ఆందోళనలో మునిగిపోయాడు. యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లు నిలిపివేయడంతో చాలా రాష్ట్రాల్లో చిన్నా పెద్దా హోటల్స్ మూతపడుతున్నాయి. ఫలితంగా ఉప్పు కొనేవారులేక డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు రైతుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతుకు యుద్ధం శాపంలా పరిణమించింది. యుద్ధానికి ముందు ఉప్పు బస్తా (75 కేజీ) ధర రూ.280 ఉండగా నేడు అమాంతం రూ.200లకు పడిపోయింది. -
పోర్టుకు సర్కారు పోటు
రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2024 చివరి నాటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సాగిన పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పడకేశాయి. ఈ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. కీలకమైన బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్, బ్రేక్వాటర్ ఫీడర్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. దీంతో పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పోర్టు ప్రారంభంపై నెలకో తేదీ చెప్తూ కాలయాపన చేస్తున్నారు.కందుకూరు: ప్రకాశం జిల్లాలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతానికి మణిహారంగా.. జిల్లా అభివృద్ధికి ఊతంగా ఉపయోగపడే రామాయపట్నం పోర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఈ పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థను తొలగించడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తరువాత మరో బడా కాంట్రాక్టు సంస్థకు నిర్మాణ పనులు అప్పగించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులను కూడా నూతన కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయలేకపోయింది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బెర్తుల నిర్మాణం ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం చేయాల్సి ఉండగా వాటిలో గత ప్రభుత్వంలోనే ఒక బెర్తు నిర్మాణం పూర్తయింది. మిగిలిన మూడు బెర్తుల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. అలాగే భారీ ఓడలు నిలిచే విధంగా సముద్రలోతు పెంచే డ్రెజ్జింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. సౌత్, నార్త్ బ్రేక్వాటర్ ఫీడర్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇక సిబ్బంది కోసం నిర్మించాల్సిన క్వార్టర్లు, కస్టమ్స్ రూమ్స్ వంటి పనులు పూర్తి కాలేదు. అలాగే చెన్నై–కోల్కత్తా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పోర్టు నుంచి చేపట్టిన కీలక రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అలాగే సమీపంలోని తెట్టు రైల్వే స్టేషన్ నుంచి పోర్టు వరకు రైల్వేలైన్ నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇలా పోర్టు నిర్మాణంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. దీంతో అసలు పోర్టు పనులు పూర్తి చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ నిర్మాణ ప్రణాళిక... కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్) సామర్ధ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్రేక్ ఫీడర్ల నిర్మాణంతో పాటు, డ్రెజ్జింగ్, ఒక బల్్కబెర్తు నిర్మాణం, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాలకు చెందిన బిల్డింగ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. బల్్కబెర్త్ నిర్మాణం పూర్తికావడంతో రామాయపట్నం పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి మొదటి ఓడను నిలపాలని భావించారు. తరువాత ప్రభుత్వం మారడంతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పోర్టు పనుల పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఒక బెర్తు పూర్తయినా మిగిలిన మూడు బెర్తుల నిర్మాణాన్ని రెండేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయింది. ఇలా అన్ని విభాగాల పనులు దాదాపు ఏడాది కాలం పాటు నిలిచిపోయాయి. ఆ తరువాత పనులు ప్రారంభించినా అనుకున్న స్థాయి లో పనులు జరగడం లేదు. ఇదే ప్రస్తుతం రామాయపట్నం పోర్టు పాలిట పెద్ద శాపంగా మారింది.నెలకో ప్రారంభ తేదీ... రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే తేదీలపై అటు మారిటైంబోర్డు అధికారులు, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన మారిటైంబోర్డు అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటిస్తే, ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో పోర్టు పనుల పూర్తిపై ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే మరో రెండు, మూడేళ్లకు కూడా పోర్టు నిర్మాణ పనులు పూర్తికావనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
తౌషిక్ది ముమ్మాటికీ హత్యే..
ఒంగోలు టౌన్: సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సయ్యద్ తౌషిక్ది ముమ్మాటికీ హత్యేనని, బాలుడి మృతిపై జ్యుడీషియల్ విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తౌషిక్ తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీలతో కలిసి ప్రజా సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు, ఒన్టౌన్ సీఐ నాగరాజు, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు కలెక్టరేట్ ప్రధాన గేటు మూసివేసి ప్రజా సంఘాల నాయకులు, బాధిత కుటుంబాన్ని అడ్డుకున్నారు. దీంతో గేటు బయట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ... విచారణ పూర్తి కాకముందే తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రకటించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. తౌషిక్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు ఆత్మహత్యగానే చెబుతున్నారని, అదే కోణంలో విచారణ కూడా జరుగుతుందని బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఆత్మహత్యకు ముందు తల్లితో మాట్లాడిన తౌషిక్ విచారంగా కనిపించినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ చెబుతున్నాడని, అదే నిజమైతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై లేదా అని ప్రశ్నించారు. నిరుపేద మైనారిటీ కుటుంబానికి చెందిన బాలుడు కనుకే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు కె.వీరారెడ్డి మాట్లాడుతూ.. త్రిసభ్య కమిటీ విచారణ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేసిన త్రిసభ్య కమిటీ సభ్యుల చర్యలను తప్పుపట్టారు. పాఠశాల యాజమాన్యం తన రాజకీయ, ఆర్థిక పలుకుబడితో అధికారులను లోబరుచుకున్నారని ఆరోపించారు. బాలుడు మృతి చెంది నెల రోజులు కావస్తున్నా స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయులు, అధికార పార్టీకి చెందిన ఇతరా ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రిగా ఆయనకు ఆ బాధ్యత లేదా అని నిలదీశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, 5 ఎకరాల పొలం, రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్డీపీఐ రాష్ట్ర నాయకులు షేక్ సత్తార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్ధి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చూపడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో పలు విద్యాలయాల్లో జరుగుతున్న హత్యాచారాలను ఆత్మహత్యలుగా చిత్రీకరించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. తౌషిక్ తలిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీ మాట్లాడుతూ..పోలీసులు, అధికారులు అమ్ముడుపోయారని ఆరోపించారు. తమ బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ, నల్లూరి క్రాంతి, సీపీఎం నాయకులు సయ్యద్ హుసేన్, సీపీఎం ఎల్ నాయకులు నాంచార్లు, ఆర్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకటించడం దారుణం పాఠశాల యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రజా ప్రతినిధులకు మనసెందుకు రావట్లేదు పోలీసు విచారణపై నమ్మకం లేదు, జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ -
కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలి
● కలెక్టరేట్ ఎదుట ధర్నా ఒంగోలు వన్టౌన్: మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ కాటమరాజు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టారని తెలిపారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ప్రస్తుత మార్కాపురం ప్రాంతానికి, కనిగిరిని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన యాదవుల ఆరాధ్యదైవం కాటమరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది ఆ మహనీయుడికి ఇచ్చే గౌరవమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, అఖిల భారత యాదవ మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి చల్లా హరినారాయణ మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలో ప్రజల ఆరాధనతో నిలిచిన కాటమరాజు గుడి ఆయన త్యాగాలు, పోరాటాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఆ ప్రాంత చరిత్ర, విశ్వాసం కాటమరాజుతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నందున మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కాటమరాజు ప్రాముఖ్యత ఎంతో ఉందని, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను కొనియాడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవుల హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మార్కాపురానికి కాటమరాజు జిల్లా నామకరణం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది చల్లారాజాధనవర్మ, బీసీ సంక్షేమ సంఘం బంకా చిరంజీవి, యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు చిరుమామిళ్ల గోపికృష్ణ యాదవ్, బొడ్డు వెంకటేశ్వర్లు, దూళ్ల అప్పారావు, జడ బాలనాగేంద్ర, మిరియం అంజిబాబు, నాగం శేషయ్య, పెద్దన్న, కుట్టుబోయిన కోటేశ్వరరావు, మందపల్లి శ్రీనివాసరావు, శివాజీ, కోళ్లిబోయిన నాగేశ్వరరావు, దాసరి సుందరం, బత్తుల ప్రసాద్, ఠాగూర్, బాలకోటయ్య, ఆవుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రీవెన్స్లో డీఆర్ఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. -
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ సోమవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం ప్రకారం..బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామవాసి మోతుకూరి అలియాస్ కోలా పిచ్చయ్య 2024 ఏప్రిల్ 14న ఉదయం 7.30గంటల సమయంలో 10 ఏళ్ల బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తుండగా నిందితుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు బేస్తవారిపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు. అప్పటి ఎస్సై బి.నరసింహారావు కేసు నమోదుచేయగా అప్పటి మార్కాపురం డీఎస్పీ యం.బాలసుందరరావు దర్యాప్తు చేసి నిందితుడ్ని అరెస్టుచేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసులో సాక్షులను విచారించిన అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లుగా పేర్కొంటూ 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా బాధితురాలికి రూ.3లక్షలు పరిహారం అందేలా జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలని, బాలికలు ధైర్యంగా ఉండి ఏదైనా సమస్య వస్తే తక్షణమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ హర్షవర్థన్ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన స్పెషల్ పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన పోలీసు అధికారులు, లైజన్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ● రూ.10 లక్షల ఆస్తినష్టం మార్కాపురం: ప్రమాదవశాత్తు పొగాకు దగ్ధమై రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన సోమవారం తర్లుపాడు మండలంలోని నాయుడుపల్లి గ్రామంలో జరిగింది. మార్కాపురం ఫైర్స్టేషన్ ఆఫీసరు రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చేతుల చిన్న వెంకటేశ్వర్లు, మాలకొండయ్య బ్యార్నీలో క్యూరింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పురవ్వ తగులుకుని బ్యారన్ మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పొగాకు, బ్యారన్ దగ్ధమవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒంగోలు సబర్బన్: ఈ ఏడాది వేసవి కాలంలో వడగాల్పులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో, ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి. రాజాబాబు సూచించారు. ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వేసవి కాలంలో వడగాల్పులు అధికంగా వీచే ప్రమాదం ఉందని, అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయట తిరగరాదని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున సమ్మర్ యాక్షన్ ప్లాన్ను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రతి మండల కార్యాలయాల్లో, సచివాలయాల్లో, ముఖ్య కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వడగాల్పులు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన మందులు అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, ఎస్డీసీ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. గుడ్లూరు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై మోచర్ల–వీరేపల్లి వద్ద ఆటోని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే ప్రమాదానికి కారణమైన కారులో గంజాయి తరలిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గుడ్లూరు సీఐ, ఎస్సైలు సాంకేతిక పరిజ్ఞానంతో కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఒరిస్సా నుంచి చైన్నెకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి గంజాయి స్వాధీనం చేసుకొని నింది తులను అదుపులోనికి తీసుకున్నారు. -
రెవెన్యూ సమస్యలే అధికం
● జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మార్కాపురం టౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించి న్యాయంచేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 181 అర్జీలు రాగా అందులో 124 రెవెన్యూ సమస్యలపై ఉన్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యలపై ఆలస్యం చేయకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా స్ధాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: పోలీసుల వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జిల్లా వ్యాప్తంగా 32 అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారునితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపుతున్నామని సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదు దారులకు దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్ ఎస్సై, సీఐలతో మాట్లాడారు. చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు గురికావద్దని, ఎవరూ ఉద్యోగాలు ఇప్పించలేరని, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ ద్వారానే పరీక్షలు రాసి పాసై ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. పొదిలి, గిద్దలూరు, కంభం సీఐలు రాజేష్కుమార్, రామకోటయ్య, మల్లికార్జున పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
వెట్టిచాకిరి నుంచి విముక్తి
ఒంగోలు వన్టౌన్: పదేళ్లుగా బాండెడ్ లెబర్ కింద వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించింది. వివరాల్లోకి వెళితే..కురిచేడు మండలం వీవై కాలనీకి చెందిన చెంచు గిరిజన కుటుంబాలకు చెందిన 29 మంది బాండెడ్ లెబర్ కార్మికులుగా నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కల్వకుర్తి రోడ్డుకు సమీపంలోని బొగ్గు బట్టీలో పదేళ్లుగా బానిస కార్మికులుగా పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న దళిత బహుజన రిసోర్స్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఇండియా లేబర్ లైన్ సంస్థతో కలిసి నాగర్కర్నూల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు తెలకపల్లి తహసీల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, ఎస్సై నరేష్ పోలీస్ బృందం, కార్మిక శాఖ అధికారి రాజ్కుమార్, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి శ్రీశైలం కలిసి బాధితులు వెట్టి చాకిరి చేస్తున్న పనిప్రదేశానికి వెళ్లి కార్మికులను విచారించారు. విచారణలో తాము పదేళ్లుగా బొగ్గు బట్టీల్లో బలవంతపు పని చేస్తున్నామని అధికారుల ఎదుట వాపోయారు. మొత్తం ఆరు కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు కలిపి 29 మందిని బాండెడ్ లేబర్ పరిస్థితుల నుంచి రక్షించి తదుపరి పునరావాస చర్యల కోసం జిల్లా కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు. అనంతరం వారిని సురక్షితంగా వారి స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వీవై కాలనీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బొగ్గు బట్టీ యజమాని లాలుపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వెట్టి చాకిరి నుంచి రక్షించిన కార్మికులను సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ పి.రాజాబాబు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కార్మికులు తామ పడుతున్న బాధలను కలెక్టర్కు వివరించారు. కార్మికులకు తక్షణంగా అవసరమైన సహాయం, పునరావాస చర్యలు చేపట్టాలని..ఆ బాధ్యతలను జేసీకి అప్పగించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల్లో శివ పార్వతి, శివ దంపతులకు జన్మించిన రెండు నెలల పాపకు ‘ప్రేరణ’ అనే పేరు నామకరణం చేశారు. జాయింట్ కలెక్టర్ కల్పనా మాట్లాడుతూ కార్మికులను తక్షణమే వారి గ్రామానికి పంపించేలా చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి గాయత్రి దేవి, జి.నాగేశ్వరరావు, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్టేట్ కో ఆర్డినేటర్ హేమలత, ఇండియా లేబర్ లైన్ గుంటూరు జిల్లా ఇన్చార్జి అయాన్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులుగా నటిస్తూ చోరీ
● 5 నెలల క్రితం జరిగిన చోరీ కేసులో దొంగల అరెస్టు ఒంగోలు టౌన్: అందరూ ప్రయాణికుల్లాగే బస్సు ఎక్కారు. అదును చూసి లగేజీ బ్యాగును కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం...బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు, బాబురావు దంపతులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో స్వగ్రామానికి వచ్చిన ఆ దంపతులు 2వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు ఒంగోలు సౌత్ బైపాస్ వద్దకు రాగానే భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్ వద్ద ఆపారు. హిమబిందు, బాబురావు ఇద్దరూ బస్సు దిగి భోజనం చేసి మళ్లీ బస్సు ఎక్కారు. మరుసటి రోజు బెంగళూరు చేరుకున్న ఆ దంపతులు బ్యాగు తెరిచి చూడగా అందులో నగలు కనిపించలేదు. ప్రయాణ సమయంలో బస్సులో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన తాలుకా పోలీస్స్టేషన్ సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలోని బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పసిగట్టింది. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన ఫిరోజ్, హైదర్లు బ్యాగు చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని 120 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో నగల బ్యాగులను బాధిత కుటుంబానికి అందజేశారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయకృష్ణ, ఎస్సై రామకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు అన్వర్బాషా, రామకృష్ణ, ఆర్.రాంబాబులను ఎస్పీ అభినందించారు. -
త్యాగధనుడు పొట్టిశ్రీరాములు
ఒంగోలు సబర్బన్: తెలుగుజాతికి గుర్తింపు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషిచేసిన పొట్టి శ్రీరాములు త్యాగ ధనుడని వక్తలు కీర్తించారు. ఆయన పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూమ్ సమీపంలోని ఆయన విగ్రహానికి మంత్రి స్వామి, కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా లక్ష్యసాధనకు పూనుకున్న పొట్టి శ్రీరాములు నేటి తరానికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం అసాధారణ నిర్ణయం తీసుకుని దాన్ని సాధించేలా చిత్తశుద్ధితో ముందుకు సాగిన పొట్టి శ్రీరాములు మన అందరికీ గర్వకారణమన్నారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్పూర్తి ఎందరికో ఆదర్శం ఒంగోలులో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు... -
గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు
ఒంగోలు సబర్బన్: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్లో వీసీ హాల్లో జేసీ కల్పనాకుమారితో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంట గ్యాస్ నిల్వల పరిస్థితి, సరఫరా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యల గురించి కలెక్టర్ వివరించారు. ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి ఆందోళనకు గురికావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో 5,51,759 డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, మార్కాపురం జిల్లాలో 3,22,279 డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 39 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 25 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నట్లు తెలిపారు. డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు సగటున 9,875 సిలిండర్లు అవసరం కాగా, డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు ఫస్ట్ ఇన్ – ఫస్ట్ అవుట్ విధానంలో వాటిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో స్టాక్ కొరత అనేది ఎక్కడా లేదన్నారు. ప్రతిరోజూ సంబంధిత డీలర్లతో జేసీ సమావేశమవుతూ రోజువారీ నిల్వలు, బుకింగ్, పంపిణీ విధానాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆస్పత్రులకు కూడా ప్రాధాన్యతగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో వంటగ్యాస్ సరఫరా సజావుగా జరుగుతోందన్నారు. ఎల్పీజీ నిల్వలు, పంపిణీ గురించి ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా విడుదల చేస్తున్న సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. పుకార్లను నమ్మి అనవసరమైన అపోహలు, ఆందోళనలతో అవసరానికి మించి అదనంగా సిలిండర్లు బుక్ చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. అవసరం ఉన్నప్పుడే సిలిండర్లు బుక్ చేసుకోవాలని వినియోగదారులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని రూమర్స్ క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఏజెన్సీల వారు ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలు ఎవరైనా చేపడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్ సిలిండర్ అందేలా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. -
పది పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంగోలు సిటీ: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేసినట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, నగరంలోని పీవీఆర్ బాలికలు, బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం, గౌతమ్ స్కూల్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడా చిన్న లోటుపాట్లు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 165 పరీక్ష కేంద్రాల్లో 28,632 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు, ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పది మంది బాలికలు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందిని కూడా అవసరమైన మందులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఈఓ సి.వి.రేణుక, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, అధికారులు ఉన్నారు. -
జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల సత్తా
గిద్దలూరు రూరల్: జాతీయస్థాయి కరాటే పోటీల్లో గిద్దలూరు విద్యార్థులు సత్తాల చాటారు. పట్టణంలోని సంజీవిని గురుకుల అనాథ ఆశ్రమంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న 8 మంది విద్యార్థులు ఈ నెల 15వ తేదీ హైదరాబాద్లో నిర్వహించిన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. చరణ్ అకాడమీ ఆర్గనైజేషన్ కిన్నెర రవి ఆధ్వర్యంలో కటాస్, స్పారింగ్ ఫైట్ విభాగంలో పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని కీర్తన, 8వ తరగతి విద్యార్థి బ్లెస్సీ, ఎంపీపీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న పద్మశ్రీ, పూజ, నాగమ్మ, రుత్విక్, 5వ తరగతి చదువుతున్న రంగపూజిత, ప్రకాష్లు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్గనైజర్ ఓబులపురం రాజశేఖర్తో పాటు కరాటే మాస్టర్ బూతరాజు శ్రీను, తదితరులు విద్యార్థులను అభినందించారు. -
అటెన్డెన్స్
28,302పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 165 పరీక్ష కేంద్రాల్లో 28,302 మంది విద్యార్థులు హాజరయ్యారు. 28,465 మందికిగానూ 163 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సి.వి.రేణుక తెలిపారు. కలెక్టర్ పి.రాజాబాబు మూడు పరీక్ష కేంద్రాలను, జిల్లా పరిశీలకులు ఆరు పరీక్ష కేంద్రాలను, డీఈఓ రేణుక ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. 13 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 86 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. మార్కాపురం జిల్లా పరిశీలకులు ఐదు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. డైరెక్టరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి కార్యాలయం నుంచి స్పెషల్ స్క్వాడ్ అధికారి 7 కేంద్రాలను పరిశీలించారు. మొదటి రోజు మొత్తం 113 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. -
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
ఒంగోలు సిటీ: రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని వైఎస్సార్ సీపీ నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించారని కొనియాడారు. మన రాష్ట్రం ఏర్పడక ముందు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవారిమని, పొట్టి శ్రీరాములు త్యాగం వలనే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలిశాయని వివరించారు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, నాయకులు రొండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, రాయని వెంకటరావు, దాసరి కరుణాకర్, పేరం ప్రసన్న, మీరవళి, ప్రసాద్, మేళం మధు, జిలానీ బాషా, తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఒంగోలు నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు జరిగే ఈ భేటీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ మాట్లాడతారు. -
యాదవుల ఇలవేల్పు.. కాటమరాజుస్వామి
వేనూతల కాటమరాజుస్వామి మూలవిరాట్ తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు ● తిరునాళ్లకు ముస్తాబైన దేవాలయం పెద్దారవీడు: మండలంలోని గుండంచర్ల పంచాయతీ సమీపంలో నల్లమల అడవిలో వెలసిన పురాతనమైన పుణ్యక్షేత్రం వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవానీ ఆలయ తిరునాళ్లను ఈ నెల 18వ తేదీ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు భారీగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉగాది పండుగకు ముందు రోజు యాదవులు గ్రామాల్లో బొల్లావులను ఊరేగించుకుంటూ కాటమరాజుస్వామి దేవాలయం వద్దకు చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. బొల్లావు నిర్మాణం... బొల్లావును యాదవుల ఇలవేల్పుగా ఆరాధించి పూజిస్తారు. రెండున్నర అడుగుల ఎత్తులో తేలికై న కలపతో దీనిని తయారు చేస్తారు. ఎరుపు రంగుతో అందంగా తీర్చిదిద్దుతారు. రెండు తొడలపై ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, డొక్కకు సింహ తలాటం, వీపున నాగబంధం, మూపురం (చెండు)కు ఇరువైపుల శంకు, చక్రాలు, నొసటన గాంభీర్యాన్ని, అందాన్ని చేకూరుస్తాయి. కొమ్ముకు వెండి గొడుగులు, చెవులు, మెడకు ఆభరణాలు వీరతాళ్లు అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు... 18వ తేదీ జరిగే కాటమరాజుస్వామి తిరునాళ్లకు మార్కాపురం డిపో వారు మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి, గిద్దలూరు డిపో నుంచి వయా మాగుటూరు మీదుగా దేవాలయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
బాబుకు లోకేషే వెన్నుపోటుదారుడు
యర్రగొండపాలెం: మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వెన్నులో వణకుపుడుతుందని, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెన్నుపోటు పొడిచే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన గ్రామ పంచాయతీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి నాయకులు మోడీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఒక వర్గం అయితే, లోకేష్ మరో వర్గంగా యువ నాయకత్వం నడుపుతున్నాడని, ఆయన కళ్లు సీఎం కుర్చీపై పడిందన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చంద్రబాబును గద్దె దించి లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాట మొదలైందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అరాచక కూటమి ప్రభుత్వం కాలకూటమి లాంటిదని, ఇది పతనం కావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి 11 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు పోలైనా ఓకే అజెండాతో ముందుకు వెళుతుందని, ఒంటరిగానే పోటీ చేసే సత్తా ఉన్న పార్టీ పేర్కొన్నారు. అటువంటి ధమ్ము, ధైర్యం కూటమి నాయకులకు లేదని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజల అభిష్టం మేరకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రజల హర్షధ్వనుల మధ్య తాటిపర్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంటే కూటమి నాయకుల దృష్టిలో మనుషులు కాదని, వారు అధికారంలో ఉన్న సమయంలోనే వారిపై దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కారంచేడు, చుండూరు, నీరుకొండ, పిన్నెల్లి ఘటనలే అందుకు ఉదాహరణలన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే దళితులు ఊచకోతలకు గురవుతారన్న సత్యాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలే రుజువు చేస్తున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ జగనన్న పరితపిస్తుంటారని, ఆ మాటలు చంద్రబాబు నోటితో ఎప్పుడూ వినలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ మూడమంచు బాలగురవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, వివిధ విభాగాల నాయకులు యండ్రపల్లి సుబ్బారావు, ఆర్.అరుణాబాయి, పి.రాములు నాయక్, ఆవుల వీరకోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాట ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం లేని కూటమి నాయకులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
అక్రమంగా నిల్వ ఉంచిన 96 సిలిండర్ల స్వాధీనం
● విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపుదాడి, కేసు నమోదు పొదిలి రూరల్: మండలంలోని ఏలూరు పంచాయతీలో ఏలూరు, నల్లారెడ్డివారిపాలెంలో శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక ప్రైవేటు గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన పలు గ్యాస్ కంపెనీలకు సంబంధించిన కమర్షియల్ సిలిండర్లు, గృహావసర సిలిండర్లను రెండు మోటార్లతో రీఫిల్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 55 డొమెస్టిక్ సిలిండర్లు, 41 కమర్షియల్ సిలిండర్లు కలిపి మొత్తం 96 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాఘవరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ప్రజల నుంచి సేకరించి కమర్షియల్కు షిఫ్టు చేిసే రెండు మోటార్లు, మిషన్, అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకోగా, అధికారులు జరిగిన విషయాన్ని వారికి వివరించారు. దీంతో సమస్య సులభంగా పరిష్కారమైంది. దాడుల్లో డీటీ డేవిడ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
తౌషిక్ను హత్య చేసినట్లు ఆధారాలు లేవు
ఒంగోలు టౌన్: సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఒంగోలు సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తౌషిక్ మృతిపై విచారణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఉరివేసుకోవడం వలనే తౌషిక్ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని తెలిపారు. పోస్టుమార్టం చేసి శరీరంలోని ప్రధాన అవయవాలను రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఆర్ఎఫ్ఎస్ఎల్)కి పంపించినట్లు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన సందేహాల మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే స్థానిక అధికారుల పట్ల తౌషిక్ తల్లిదండ్రులు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎస్పీ హర్షవర్థన్రాజు కందుకూరు సీఐ షేక్ అన్వర్బాషాను విచారణాఽధికారిగా నియమించినట్లు తెలిపారు. స్థానిక అధికారుల ప్రమేయం లేకుండా కందుకూరు సీఐ అన్వర్ బాషా విచారణ చేశారని, 70 మంది సాక్షులను, 47 మంది విద్యార్థులను విచారించినట్లు తెలిపారు. అయితే మృతి చెందిన తౌషిక్ ఒకరోజు ముందు తల్లితో మాట్లాడినప్పుడు, చనిపోవడానికి కొద్దిసేపు ముందు తల్లితో మాట్లాడినప్పుడు విచారంగా ఉన్నట్లు సాటి విద్యార్థులు గమనించినట్లు విచారణలో తెలిసిందన్నారు. తల్లిదండ్రులు అనుమానించిన కోణంలోనే మొదట్నుంచి విచారణ జరిపామని, ఇప్పటి వరకు హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తల్లిదండ్రులు తౌషిక్ మరణాన్ని హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నందున విచారణ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. విలేకరుల సమావేశంలో కేసు విచారణాధికారిగా వ్యవహరించిన కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య పాల్గొన్నారు. -
రెండు బ్యారెన్లు దగ్ధం
● రూ.14 లక్షల ఆస్తి నష్టం వలేటివారిపాలెం: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు బ్యారెన్ను దగ్ధమయ్యాయి. ఈ సంఘటన వలేటివారిపాలెంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..వలేటివారిపాలెం గ్రామానికి చెందిన వలేటివారిపాలెం శ్రీధర్నాయుడు, వలేటి మధుసుదన్రావుకు సంబంధించిన రెండు బ్యారన్లో పొగాకు క్యూరింగ్ చేస్తుండగా శ్రీధర్నాయుడుకు బ్యారన్లో అల్లుడు కర్ర జారీ మొద్దు గొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. పంటలు పక్కనున్న బ్యారన్కు కూడా వ్యాపించడంతో రెండు బ్యారెన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు కందుకూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటాన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు బ్యారెన్లలోని టైర్లు, క్రరలు, మొద్దు గొట్టాలు, పొగాకు మొత్తం కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.14 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యజమానులు వాపోయారు. ఒంగోలు టౌన్: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను తీసుకొస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ సర్పంచ్లనే ఇన్చార్జిలుగా నియమించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లకోసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించడం కుదరనప్పుడు ప్రజల తరఫున సర్పంచ్లను కొనసాగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. 2000లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు ఆదేశాల మేరకు సర్పంచ్లను ఇన్చార్జిలుగా కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేక పాలన కొనసాగించారని, తద్వారా గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారులున్నా ప్రజల తరఫున సర్పంచ్లను ఇన్ చార్జిలుగా కొనసాగించాలని కోరారు. -
చిరుతపులి కలకలం
గిద్దలూరు రూరల్: మండలంలోని తిమ్మాపురం గ్రామశివారులోని పంట పొలాల్లో ఆదివారం చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందారు. గుండ్లకమ్మరేంజి రాచర్ల బీటు పరిధిలోని తిమ్మాపురం సమీపంలోని అటవీప్రాంతంలో నుంచి ఓ చిరుతపులి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లోకి రావడంతో రైతులు భయాందోళన చెందారు. రైతుల సమాచారం మేరకు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి, రేంజ్ ఆఫీసర్ పీవీ నరసింహారావు, డీఆర్ఓ వంశీక్రిష్ణ వారి సిబ్బందితో సహా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అప్రమత్తం చేశారు. చిరుత పులికి సుమారు రెండు నుంచి మూడేళ్ల వయసు ఉంటుందని రైతులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అటు వైపు ఎవ్వరిని వెళ్లనివ్వకుండా డ్రోన్ కెమెరాల సహాయంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. -
అల్లాహ్ స్మరణ.. అన్నివేళలా రక్షణ
కనిగిరి రూరల్: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది. రంజాన్ నెలలో 26 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూర్తయిన తర్వాత ఆఖరి మూడు రోజులకు ముందు వచ్చే షబ్–ఏ ఖదర్ (లైలతుల్ ఖదర్)ను సోమవారం ముస్లింలు అత్యంత నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. రాత్రి మసీదుల్లో ప్రత్యేక నమాజులు, ఆరాధనలు, ప్రార్థనలు చేసి అల్లాహ్ అనుగ్రహం కోసం వేడుకుంటారు. షబ్ –ఏ–ఖదర్ తర్వాత ఆఖరి మూడు రోజుల ఉపవాస దీక్షలు (సతామీ) ప్రారంభమవుతాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ఉపవాస దీక్షలు ఉండలేని వారు ఆఖరి మూడు రోజులు మాత్రం తప్పకుండా ఆచరిస్తారు. ఎతికాఫ్ ఇలా... ఎతికాఫ్ (తపోనిష్ట)తో అల్లాహ్ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఇతరులకు సమస్యగా ఉండకూడదని మసీదులోని ఓ మూలలో డేరా (పర్దా) ఏర్పరుచుకుంటారు. మల, మూత్ర విసర్జన (శుద్ధి, స్నానం) వజూ సమయాల్లోనే ‘పర్దా’లో నుంచి బయటకువస్తారు. మిగతా సమయం అంతా దైవస్మరణలో ఖురాన్ చదువుతూ, సున్నత్ నమాజులు చదువుతూ గడపుతారు. సీ్త్రలు ఇంట్లోనే ఓ ప్రత్యేక గది ఏర్పరుచుకుని ఎతికాఫ్ చేస్తారు. ఇఫ్తార్ సమయం కంటే ముందు 12 రకాతులు తహజూద్ నమాజ్ చదవాలి. ఆ సమయంలో ‘సజ్దా’ పద్ధతిలో దువా చేస్తే అల్లాహ్ అత్యంత సమీపం నుంచి వారి మొర వింటారు. కుటుంబం యోగక్షేమాలతో పాటు బంధుమిత్రులు, సర్వమానవాళి సంక్షేమం కోరుతూ దువా చేయడం ఉత్తమం. అలా చేస్తే అల్లాహ్ అనుగ్రహం లభిస్తోందని మౌలీలు, ముఫ్తిలు తెలిపారు. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో కనీసం ఒకరోజైనా సున్నతే మౌఖిదా ఎతికాఫ్ పాటించాలి. ఎతీకాఫ్ నియ్యత్ ఇలా... నవాయితు అన్ బిస్మిల్లాహి, తవక్కల్తు వలైహీ దఖల్తూ వనవాయితూ బిసున్నతిల్ ఎతికాఫ్ (ఎతికాఫ్కి నియ్యత్) చదివి ముస్లింలు ఎతికాఫ్ ఆచరిస్తారు. అల్లాహ్ కోసం అన్నింటిని త్యజించి, దైవ సన్నిధికి వెళ్లి ఆధ్యాత్మికతలో విలీనమై కష్టాలు, బాధలు, సమస్యలు చెప్పుకుంటే అల్లాహ్ వారిపై అత్యంత కరుణ చూపి వారి మొరను దగ్గర నుంచి అల్లాహ్ ఆలకిస్తారని ముస్లింల విశ్వాసం. నేడు షబ్–ఏ–ఖదర్ రంజాన్ నెల చివరి మూడు రోజుల దీక్షలు (సతామీ) షురూ నియమ నిష్టలతో తాఖ్రాత్లు మసీదుల్లో కొనసాగుతున్న ఎతీకాఫ్ దీక్షలుఇస్లాంకు ఉన్న ఐదు మూల స్తంభాలలో జకాత్ ఒకటి, ఇది ఆరాధనలో రెండో విధి. ఇస్లాం పవిత్ర గ్రంథంలో జకాత్ గురించి ప్రస్తావన కనీసం 32 సార్లు ఉంది. దీని బట్టి జకాత్కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. ఇది పేదల హక్కు. అవసరార్థులకు జకాత్ చెల్లించే సదాచారుల కోసం దేవుని వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంటుంది. ప్రతి ముస్లిం తన సంపాదనలో రెండున్నర శాతం పేదలకివ్వాలన్నది జకాత్ ఉద్దేశం. నమాజ్ వలే ఇది కూడా తప్పనిసరి నియమం. ఇస్లాంను ఆచరించే వారు దీనిని విస్మరించరాదు. -
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
పేద రోగుల ప్రాణాలకు అండగా ఉండాల్సిన జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో నాడిపట్టే నాథుడు లేక రోగులు అల్లాడుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో సీనియర్ వైద్యులు, హెచ్ఓడీలు హాజరుకే పరిమితమై..రోగులను జూనియర్లకు అప్పగిస్తుండగా.. మార్కాపురం జిల్లా వైద్యశాలలో అసలు వైద్యులే లేకుండా పోయారు. మౌలిక వసతుల కొరతా వేధిస్తోంది. మందులు కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. జిల్లా వైద్యశాలలపై సాక్షి విజిట్...రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ వైద్యశాలకు ఎంతో నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యసేవలు కోసం దూరప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే గతంలో ఉన్న స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతోపాటు ఉన్న వైద్యులను, వైద్య సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వైద్యశాలకు రోగులు అంతంతమాత్రంగా వస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకం కలిగించి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. సరైన వైద్యం అందక నగదు చెల్లించి ప్రైవేటు వైద్యశాలను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. – గొలమారి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీపట్టణ ప్రధాన కార్యదర్శి -
మహిళలకు బూచేపల్లి పెద్దపీట
● దర్శి నియోజకవర్గంలో మహిళల కోసం రూ.1.25 కోట్లు మంజూరు ● ఈ నిధులతో ప్రతి మండలంలో మహిళా భవన్ల నిర్మాణం దర్శి: జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మహిళలకు పెద్ద పీట వేశారు. దర్శి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న వెంకాయమ్మ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి మహిళలపై ఉన్న తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఉమెన్ అండ్ వెల్ఫేర్ పథకం ద్వారా జిల్లా పరిషత్ నిధులతో ఒక్కో మండలానికి రూ.25 లక్షల చొప్పున దర్శి నియోజకవర్గానికి రూ.1.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రతి మండల కేంద్రంలో మహిళా భవన్లు నిర్మించనున్నారు. ఈ భవనాల ద్వారా మహిళలకు శిక్షణ తరగతులు, చేతి వృత్తులు, వంటి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగించనున్నాయి. మండల కేంద్రాల్లో నిర్మించే ఈ భవనాల వలన మహిళలకు ఎంతో మేలు చేకూరనుంది. ఒంగోలు టౌన్: దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ భావజాలంలో పరిపాలిస్తున్న మోదీ పాలనలో హిట్లర్ను గుర్తుకు తెస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కృష్ణకాంత్ విమర్శించారు. నగరంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ మనోహర్ అధ్యక్షత వహించిన ఈ సభలో కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ సామ్రాజ్యవాద దేశాల ముందు జీ హుజూర్ అంటూ తలొగ్గుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక ఉద్యమాలను అణచివేసేందుకే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారని చెప్పారు. లేబర్ కోడ్స్ అమలుకు ముందే కార్మిక ఉద్యమాలను బలహీనపరిచే చర్యలు చేపట్టారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ పద్ధతి అమలు చేయడం వలన అవినీతి పెచ్చుమీరిపోతుందని, నిరుపేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టాన్ని పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో డా.ఏ.శ్రీనివాసరావు, రవికుమార్, ఐ.కృష్ణ మోహన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
దైవాధీనం
పేదల ప్రాణం..మార్కాపురం జీజీహెచ్లో రోగులు లేక ఖాళీగా ఉన్న బెడ్లు ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఉండగా, మార్కాపురంలో జిల్లా ఆస్పత్రి ఉంది. జిల్లా వైద్యశాలను సాక్షి బృందం పరిశీలించింది. రెండు చోట్లా రోగులకు అరకొర వైద్యమే అందుతోంది. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు, హెచ్ఓడీలు కనిపించడం గగనమైపోయింది. ఈ ఆస్పత్రికి ప్రతి రోజూ వివిధ రకాల వైద్య సేవల కోసం సుమారు 1000 నుంచి 1500 మంది వరకు వస్తుంటారు. పెద్దాస్పత్రికి వెళితే అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని, వైద్యం బాగుంటుందన్న ఆశతో వచ్చే రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సీనియర్లు ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహించుకుంటూ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులతో పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంగోలు జీజీహెచ్లో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని వినుకొండ, శావల్యాపురం, నూజండ్ల, బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. చిన్న చిన్న వ్యాధులకు స్థానికంగా ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించుకునే గ్రామీణ నిరుపేదలు దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు జీజీహెచ్కు వస్తుంటారు. అయితే క్యాజువాలిటీలో ఎప్పుడు చూసినా జూనియర్ వైద్యులే కనిపిస్తున్నారని, సీనియర్ వైద్యులు ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఓపీలో ఒకరిద్దరు సీనియర్లు డ్యూటీలు చేస్తే గొప్ప అన్నట్లు తయారైంది. ఇక్కడ పేరుకు ఎంఐసీయూ, ఎన్ఐసీయూ, ఆర్ఐసీయూ, పీఐసీయూ, ఎస్ఐసీయులు ఉన్నాయి. ఇక్కడ స్పెషలిస్ట్ వైద్యులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని, పీజీ విద్యార్థులే దిక్కయ్యారని రోగులు చెబుతున్నారు. ఖాళీగా ట్రామా కేర్... ఒంగోలు చుట్టు పక్కల ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా క్షతగాత్రులను జీజీహెచ్కు తీసుకొస్తుంటారు. క్యాజువాలిటీలో ఒక చిన్నగదిలో రెండు పడకలు వేసి ట్రామా కేసుల కోసం కేటాయించారు. ట్రామా కేర్లో ఒక న్యూరాలజిస్ట్, ఒక మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లతో కలిపి మొత్తం 30 మంది వరకు ఉండాలి. కానీ వారిని ఇతర విభాగాల్లో డ్యూటీలు వేస్తున్నట్లు సమాచారం. ట్రామా కేసుల కోసం ప్రత్యేక సిబ్బంది ఉన్నారోలేదో, అసలు ట్రామా విభాగం ఉందో లేదో తెలియని పరిస్థితి. ట్రామా కేర్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ సేవలు అంతంత మాత్రమే... జీజీహెచ్లో కనీసం 300 మంది వరకు ఇన్ పేషంట్లు ఉంటారు. జనరల్ వార్డులు, అత్యవసర వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని రోగులు, వారి సహాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. వార్డుల్లో విధులు నిర్వహించాల్సిన స్టాఫ్ నర్సులు సెల్ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, నర్సింగ్ విద్యార్థినులకు పనులు అప్పచెప్పి టైం పాస్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా కొందరు నర్సింగ్ స్టాఫ్ తరచుగా రోగులతో ఘర్షణ పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నర్సింగ్ స్టాఫ్ కు డ్యూటీలు వేసేందుకు లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నడవలేని స్థితిలో రోగులు జీజీహెచ్కు వస్తే వారికి వీల్చైర్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. ఒక వేళ వీల్చైర్ దక్కించుకున్నా రోగుల కుటుంబ సభ్యులే తోసుకెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో డాక్టర్ల కొరత మార్కాపురం టౌన్: మార్కాపురం జీజీహెచ్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందేది. కరోనా సమయంలో కూడా ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించి ఎప్పటికప్పుడు వైద్యశాల సిబ్బంది రోగులను పర్యవేక్షిస్తూ వారికి వైద్యం అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వైద్యానికి పెద్దపీట వేసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ వైద్యశాలలో సరైన మందులు, స్పెషలిస్టు వైద్యులు, వైద్య సిబ్బంది నియమించకపోగా ఉన్న సిబ్బందిని, వైద్యశాలలో ఉన్న పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లినా తమకు వచ్చిన రోగాలు నయమవుతాయో లేదో అన్న అనుమానంలో ప్రజలు వైద్యశాలకు వెళ్లడం తగ్గించారు. గత ప్రభుత్వంలో 100 పడకలు ఉన్న వైద్యశాలను 330 పడకల వైద్యశాలగా మార్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు, నాన్ క్లినికల్ వైద్యులతో కలిపి సుమారు 70 మంది వైద్యసేవలను అందించారు. రోజుకు 600 నుంచి 700 ఓపీ సేవలతో కిటకిటలాడేది. అయితే అప్పుడున్న వైద్యుల సంఖ్యను తగ్గించడంతోపాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వైద్యుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వైద్యశాలలో అందుతున్న సేవలు తగ్గిపోవడంతో రోగుల సంఖ్య ప్రస్తుతం 100 నుంచి 150కి ఓపీలకు పడిపోయింది. గతంలో 330 బెడ్లకు గానూ ఇన్ పేషంట్లు 200 మంది ఉండగా ప్రస్తుతం 20 నుంచి 30 మంది రోగులు మాత్రమే ఇన్పేషంట్లుగా కనిపిస్తున్నారు. వైద్యశాల నుంచి బ్లడ్బ్యాంకు వైపు వెళ్లే ప్రాంతాల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం సుమారు 15 మంది వైద్యులు ఉండగా 55 మందిపైగా రోగులకు సేవలు అందిస్తున్నారు. వైద్యశాలకు వెళ్లే కొద్దిమందికి కూడా కనీస అవసరమైన జలుబు, దగ్గు మందులు కూడా లేవని ఫార్మాసిస్టు తెలపడంతో బయటకు వెళ్లి కొనుగోలు చేసి వాడుకోవాల్సి వస్తోంది. ఇన్పేషంటు వార్డుల్లో రోగులు లేక అన్నీ బ్లాకుల్లో ఏర్పాటు చేసిన బెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పరికరాలను కూడా గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించారు. రోగులు లేక వైద్యశాలలో నూతన బెడ్లు మూలనపడి పాడైపోతున్నాయి. బాలింతలకు స్కానింగ్ చేసే రేడియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గైనకాలజిస్టుతోనే బిడ్డ ఆరోగ్య పరిస్థితి చెబుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే బయటి స్కానింగ్ సెంటర్లను బాలింతలు ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో పేషంట్లతో కిటకిటలాడిన జీజీహెచ్ ప్రస్తుతం పేషంట్లు లేక వెలవెలబోతోంది. జీజీహెచ్లో స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ ప్రజలకు వైద్యం అందడం లేదు. సోమ, గురువారం న్యూరాలజీ రోగులకు ఓపీ ఉంటుంది. గుండె జబ్బుల ఓపీ మంగళ, గురువారం ఉంటుంది. యూరాలజీ ఓపీ బుధ, శనివారం చూస్తారు. ఒకసారి చూపించుకోవడానికి ఒకపూట పడుతుంది. ఆ తరువాత అవసరమైనా ఆ వైద్యులు కనిపించరు. డాక్టర్ కోసం ఆరా తీస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని చెబుతుంటారు. అక్కడకు వెళ్లి అడిగితే ఓపీలో ఉన్నట్లు సమాధానం వస్తుంది. తీరా చూస్తే సొంత ఆస్పత్రిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో విసుగెత్తిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు మాత్రం జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. -
అటెన్ షన్ !
మార్కాపురం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 165 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచే ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటైన తరువాత మొదటిసారి జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 28,632 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో ఈ దఫా 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా 14,596 మంది హాజరు కానున్నారు. ఇందులో ఏ గ్రేడ్ సెంటర్లు 42, బీ గ్రేడ్ సెంటర్లు 26, సీ గ్రేడ్ సెంటర్లు 49గా అధికారులు గుర్తించారు. ఉదయం 9.30 నుంచి గం.12.40 వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఏ గ్రేడ్ సెంటరు అంటే పోలీసు స్టేషన్కు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాలు, బీ గ్రేడ్ సెంటరు అంటే పోలీసు స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రాలు, సీ గ్రేడ్ సెంటరు అంటే అంతకంటే దూరంలో ఉన్న కేంద్రాలుగా విభజించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలు ఇవే... మార్కాపురం జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్ల జెడ్పీహెచ్ఎస్, పెద్దారవీడు మండలంలోని వైడిపాడు జెడ్పీహెచ్ఎస్, సీఎస్పురం మండలంలోని సీఎస్పురం జెడ్పీహెచ్ఎస్, మండల కేంద్రమైన కొమరోలు జెడ్పీహెచ్ఎస్, అర్ధవీడు మండలంలోని యాచవరం జెడ్పీహెచ్ఎస్, మండల కేంద్రమైన రాచర్ల జెడ్పీహెచ్ఎస్, యర్రగొండపాలెం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్, హెచ్ఎంపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకూ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు కూడా జరగనున్నాయి. మొత్తం 1144 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు హాజరుకానున్నారు. ఇందుకోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది. -
అన్నీ ఏర్పాట్లు పూర్తి
సోమవారం నుంచి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 87 పరీక్ష కేంద్రాల్లో 14,596 మంది పరీక్షలు రాస్తున్నారు. గదుల్లో వారికి అన్నీ ఏర్పాట్లు చేశాం. తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయిస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలి. కాపీయింగ్కు పాల్పడితే చర్యలు చేపడతాం. – మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ డీఈఓ మార్కాపురం జిల్లా 144 సెక్షన్ అమలు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. అన్నీ జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప బయట వ్యక్తులెవరూ ఉండకూడదు. సమస్యాత్మక కేంద్రాలపై కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కల్పిస్తున్నాం. ఎటువంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలి. మొబైల్, పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశాం. ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా కేంద్రాలను తనిఖీ చేస్తారు. – హర్షవర్ధనరాజు, ఇన్చార్జి ఎస్పీ మార్కాపురం జిల్లా -
ఔను..వాళ్లిద్దరూ రాజీ పడ్డారు !
ఒంగోలు టౌన్: మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నట్లు అన్నదమ్ముల మధ్య 40 ఏళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ కేసును శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గంలో పరిష్కరించారు. ఒంగోలు రూరల్ మండలం కొప్పోలు గ్రామానికి చెందిన అన్నాదమ్ములు, వారి వారసుల మధ్య 1986వ సంవత్సరం నుంచి ఆస్తులకు సంబంధించి బాడుగ పంపిణీ వివాదం కొనసాగుతోంది. ఇరు వర్గాలు పట్టుదలకుపోవడంతో ఏ ఒక్కరూ ఒక మెట్టు దిగడానికి ససేమిరా అనడంతో కేసు పీఠముడి పడింది. 40 ఏళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్న అన్నాదమ్ములు, వారి వారసులను పిలిపించి మాట్లాడిన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.హేమలత సమస్యకు ఒక పరిష్కారమార్గం కనుగొన్నారు. ఇరు వర్గాలు దాన్ని ఆమోదించడమే కాకుండా జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడేందుకు అంగీకరించారు. ఎట్టకేలకు 40 ఏళ్ల కేసును రాజీ మార్గంలో పరిష్కరించడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇరువర్గాలు రాజీపడినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ప్రకటించారు. లోక్అదాలత్లో 16,860 కేసుల పరిష్కారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 16,615 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి లోక్ అదాలత్ కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ న్యాయస్థానాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 231 సివిల్ కేసులు, 16,615 క్రిమినల్ కేసులు, 14 పీఎల్సీ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు సుమారుగా రూ.5 కోట్ల పరిహారం ఇప్పించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 27 బెంచీల్లో వ్యాజ్యాల పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించినట్లు తెలిపారు. -
పునరావాస కాలనీలో పనులు వేగవంతం చేయండి
మార్కాపురం టౌన్: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, మార్కాపురం, అర్ధవీడు, పెద్దారవీడు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇంత వరకూ ఎంత నగదు చెల్లించారు. ఇంకా చెల్లించాల్సిన నగదు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది జూలై నాటికి ప్రాజెక్టు ద్వారా నీరొస్తే గ్రామాల పరిస్థితి, రోడ్ల అనుసంధానం, ఇతర మార్గాలపై చర్చించారు. పునరావాస కాలనీల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాలని, రెండు రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని, నివేదికను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. పెద్దారవీడు మండలంలోని వీఆర్ఓలు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూత్ అలీం, మార్కాపురం ఎస్డీసీ సత్యనారాయణ, కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధే ముఖ్యమా ?
ఒంగోలు టౌన్: పాలకులు ప్రజల ఆరోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి ఽవిమర్శించారు. నూతన ఆర్ధిక విధానాల అమలు తరువాత విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమైందని, నిరుపేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారిపోయాయని చెప్పారు. నగరంలోని అంబేడ్కర్ భవనంలో శనివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నానా హంగామా చేసిందని, అంతటి బూటకం మరొకటి లేదని చెప్పారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మందులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి ఔషధాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని, ప్రజారోగ్యానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రజారోగ్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ జపం చేస్తోందని, మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నేరుగా నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రమణయ్య మాట్లాడుతూ.. పేదలకు మందులు ఉచితంగా అందజేయాలని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఎఫ్ఎంఆర్ఏఐ జాతీయ అధ్యక్షుడు కృష్ణానంద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్లు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా వివరించారు. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై యూనియన్ పోరాటాలు చేస్తుందని తెలిపారు. సభలో కె.సీతారామయ్య, సీహెచ్ వెంకటరావు, సీహెచ్ కుమార్, జి.శ్రీనివాస్, ఎం.అయ్యపురెడ్డి, ఈదర అన్నపూర్ణ, ఎం.రమేష్, కాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా కొండారెడ్డి
పామూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన అంబటి కొండారెడ్డిని నియమించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, మండలపార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంబటికి పలువురు అభినందనలు తెలిపారు. మార్కాపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలానికి వెళ్లే భక్తుల కోసం మార్కాపురం డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డిపో మేనేజరు లావణ్య తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నుంచే శ్రీశైలానికి మార్కాపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించామని, ప్రతి రోజూ 5 నుంచి 6 బస్సులను ప్రయాణికుల కోసం నడుపుతున్నామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు నుంచి ఈ బస్సులు వెళ్తాయన్నారు. ఈనెల 19 నుంచి 25 బస్సులు శ్రీశైలానికి మాత్రమే వెళ్తాయని, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని ఆమె చెప్పారు. ఈనెల 18వ తేదీ పెద్దారవీడు మండలంలో జరిగే కాటంరాజు తిరునాళ్లకు మార్కాపురం డిపో నుంచి 13 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు వెళ్లాలని చెప్పారు. అవసరమైతే కాటంరాజు గుడి వద్దకు ఇంకా బస్సుల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం, శనివారాల్లో శ్రీశైలానికి వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నల్లమల ఘాట్ రోడ్డు మొత్తం కర్నాటక నుంచి వచ్చే భక్తులతో, శివన్నామస్మరణతో మార్మోగుతోంది. ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని గ్యాస్ వినయోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూంను ఒంగోలు ప్రకాశం భవన్లోని కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో నం:1077ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్ పద్మ శ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం గ్యాస్ సరఫరా పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గృహ అవసరాలకు, అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరా నిరంతరం జరుగుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల కారణంగా రీఫిల్ బుకింగ్లు పెరిగినా మొదట బుక్ చేసిన వారికి మొదట అందిస్తారన్నారు. వినియోగదారులు ఒకే సారి ఎక్కువగా గ్యాస్ బుకింగ్లను చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. గ్యాస్ను వాట్సాప్, మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
చిల్లకర్ర కొట్టడానికి కూలీలు వెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.జిల్లా అభివృద్ధికే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2024 చివరి నాటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సాగిన పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పడకేశాయి. ఈ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. కీలకమైన బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్, బ్రేక్వాటర్ ఫీడర్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. దీంతో పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పోర్టు ప్రారంభంపై నెలకో తేదీ చెప్తూ కాలయాపన చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే తేదీలపై అటు మారిటైంబోర్డు అధికారులు, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన మారిటైంబోర్డు అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటిస్తే, ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో పోర్టు పనుల పూర్తిపై ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే మరో రెండు, మూడేళ్లకు కూడా పోర్టు నిర్మాణ పనులు పూర్తికావనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా కీలకమైన బెర్తుల నిర్మాణం (ఫైల్) పోర్టుకు సర్కారు పోటు -
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. శనివారం విద్యాశాఖ అదనపు సంచాలకుడు, జిల్లా పరిశీలకుడు ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల నిర్వహణ విభాగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావులతో కలిసి ఆమె ఒంగోలు సంతపేటలోని డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఇవి విద్యాపరమైన పరీక్షలు కాబట్టి 30 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఉందన్నారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని గుర్తించవచ్చని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్ లను మూసివేయిస్తామని, పోలీసుల ద్వారా అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షల నిర్వహణ ఇలా... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈఓ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, 10 బాలికలు ఉన్నారన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. పబ్లిక్ పరీక్షలు ముగిశాక ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందన్నారు. -
ఏకేయూలో కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్ ల్యాబ్లు
ఒంగోలు సిటీ: ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజీలో కొత్త రసాయన శాస్త్రం, ఆక్వాకల్చర్ విభాగాల కోసం ఏర్పాటు చేసిన వైస్ చాన్సలర్ డీవీఆర్.మూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఈ ఆధునిక ప్రయోగశాల విద్యార్థులకు పరిశోధన కార్యకలాపాలు, నాణ్యమైన శాసీ్త్రయ శిక్షణ అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త ప్రయోగశాలల ఏర్పాటుకు సహకరించిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, హెడ్ అఫ్ ది డిపార్టుమెంట్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగిక శిక్షణను మెరుగుపరచడం, శాసీ్త్రయ పరిశోధనలను ప్రోత్సహించడం, నైపుణ్యాధారిత విద్యను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజీలో నూతన ప్రయోగ శాల ఏర్పాటు చేయడం సంతోషకరమని, అలాగే మరికొన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొననున్నారు. -
అన్నదాతకు వంచన
అన్నదాత సుఖీభవ రావడం లేదు మాకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద డబ్బులు వచ్చాయి. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. పొలం నాపేరున ఉన్నా ఈ ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవ రెండో విడతలో రాలేదు. ఇప్పుడు కూడా రాలేదని చెబుతున్నారు. నా వయసు 65 సంవత్సరాలు. పిల్లలు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ పథకం నాకు వర్తిస్తే బాగుండేది. కానీ నాకు ఈ పథకంలో పేరు లేకుండా పోయింది. దీనిపై సచివాలయంలో అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – నలమలపు ఈశ్వరమ్మ, గురవారెడ్డిపాలెం, మద్దిపాడు మండలం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. 2024 ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ప్రతి రైతుకు రూ.20 వేలు అక్షరాలా ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఎగనామం పెట్టాడు. చివరకు రెండో ఏడాదిలో అయినా సకాలంలో ఇచ్చాడా అంటే అదికూడా లేదు. మే నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఆగస్టులో రెండో విడత ఇవ్వాల్సిన సాయం రూ.5 వేలు రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ చేశాడు. అంటే మొదటి విడతతో కలిపి రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంటే ఒక విడత మాత్రమే ఇచ్చి మ..మ..అనిపించాడు. 2026 ఆగస్టు రెండో తేదీన మొదటి విడత పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఎర్రటి ఎండలో రైతులను మంచాల మీద కూర్చోబెట్టి నానా అవస్థల పాలు చేశాడు. అయితే ఆ రోజు చంద్రబాబు మనస్సులోని మాటను బయట పెట్టకనే పెట్టాడు. ‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు...ఉండబోదు...ఇది నా ప్రామిస్’’ అని స్వయానా చంద్రబాబు పలికాడు. ఒక్కోసారి ఎంత దాచుకుందామన్నా మనస్సులోని మాటలు అస్సలు దాగవు కదా.. మూడో విడతలో 72,081 మంది రైతులు పెరిగారట... అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులైన రైతులు మూడో విడతలో 72,081 మంది రైతులు పెరిగారని అధికారులు లెక్కలు కట్టారు. ఒక పక్క రైతులు పథకం డబ్బులు పడలేదని, అనేకరకాల కొర్రీలు పెట్టి అర్హులైన రైతులను కూడా జాబితాల నుంచి తొలగించారని మొత్తుకుంటుంటే అధికారులు మాత్రం కాకి లెక్కలు చూపించి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పీఎం కిసాన్ పథకంలో మొత్తం 2,31,383 మంది రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. కానీ అన్నదాత సుఖీభవ పథకం కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులను వెరిఫై చేసి 4,38,251 రైతుల జాబితాను సిద్ధం చేశారు వ్యవసాయ అధికారులు. ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. అందులో ఆర్ఐజీఎస్ పరిధిలో ఆ జాబితాను పరిశీలించి 2,72,824 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి ఈకేవైసీ పూర్తి చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు. చివరకు అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 2,68,168గా తేల్చారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చే సరికి ప్రకాశం జిల్లాలో 1,88,056 మంది, మార్కాపురం జిల్లాలో 1,52,190 మంది మొత్తం కలిపి 3,40,246 మంది రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. చివరకు ఇవన్నీ కాకిలెక్కలేనని తేలిపోయింది. కౌలు రైతుల ఊసే ఎత్తకుండా, లబ్ధిదారుడైన భర్త చనిపోయినా భార్య పేరు జాబితాలో చేర్చకుండా, కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించకుండా లబ్ధిదారుల జాబితాను పెంచి చూపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా అంత మందికి అకౌంట్లలో నగదు జమకావడం లేదని తెలుస్తోంది. రెండు విడతల్లో 90 వేల మందికి పైగా ఎగనామం... అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో గతంలో ఇచ్చిన రెండు విడతల్లో దాదాపు 90 వేల మందికి పైగా బ్యాంకుల్లో జమ కాలేదు. రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సాంకేతికపరమైన సమస్యల వల్ల పడలేదు. తరువాత జమవుతాయని నమ్మబలికారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఆ రెండు విడతల్లో రావాల్సిన పెట్టుబడి సాయం రానేలేదు. మూడో విడతలో కూడా అనేక రకాలుగా కోతలు విధించారు. కానీ లబ్ధిదారులు పెరిగారని అధికారులు అంకెల గారడీ చేసి చూపిస్తున్నారు. మోంథా తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. గతంలో ఎన్నడూ పడనంతగా ఒక్కరోజులోనే 26 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పొలాలు, రోడ్లు చెరువులను తలపించాయి. దాదాపు 60 వేల ఎకరాలకు పైగా నష్టం సంభవిస్తే కేవలం 30 వేల ఎకరాల లోపే నష్టం జరిగిందని అంచనాలు పంపించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మోంథా తుపాను నష్టం ఒక్క రూపాయి కూడా జిల్లా రైతాంగానికి రానేలేదు. ఆ తుపానుతో పంటలు పూర్తిగా పాడైపోయి రైతులు మళ్లీ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇంత వరకు అప్పటి పంట నష్టం రాకపోవటంతో రైతన్నలు అప్పుల పాలై అల్లాడిపోతున్నారు. -
ఫార్మా రంగంలో కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి
● మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డిమాండ్ ఒంగోలు టౌన్: ఫార్మా రంగంలో కార్పొరేట్ దోపిడీని అరికట్టాలని, మెడికల్ రెప్రజెంటేటివ్స్కు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కుమార్ డిమాండ్ చేశారు. శని, ఆదివారాలలో ఒంగోలులో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో శుక్రవారం అంబేడ్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని ఐడీపీఎల్ వంటి ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపి వేయాలని, నిత్యావసర, అత్యవసర మందుల ధరలను తగ్గించాలని కోరారు. నకిలీ, నాసిరకం మందుల తయారీ, విక్రయాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకటరావు మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీలకు, కార్మికులకు నష్టం కలగజేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పోరాడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్–1976ను పునరుద్ధరించాలని కోరారు. కచ్చితమైన పని విధానాలకు రూపొందించాలన్నారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీని వెంటనే సమావేశ పరిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమస్యల సాధన కోసం రిప్రజెంటేటివ్లు ఐక్యతగా పోరాడాలన్నారు. సమావేశంలో యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకులు జి.మనోహర్, యుఎస్ రవికుమార్, ఐకే కృష్ణ మోహన్, సీహెచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
సిలిండర్
మార్కాపురం: ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం వంటింట్లో గ్యాస్ కష్టాలు తెచ్చింది. గ్యాస్ కొరత ఏర్పడనుందన్న సమాచారంతో ఒక్కసారిగా అందరూ ఆన్లైన్లో గ్యాస్ను బుక్ చేయడంతో సర్వర్లు పనిచేయక తిప్పలు పడుతున్నారు. ఓటీపీ వస్తేనే గ్యాస్ సిలిండర్ డెలవరీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరఫరా తగ్గిపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల డెలివరీ టెన్షన్ భరించలేక తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కొరత ప్రారంభమైంది. బుకింగ్ సమయాన్ని 21 రోజుల నుంచి 40 రోజులకు పెంచారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ బుకింగ్కు కాల్ సెంటరుకు ఫోన్ చేయడంతో సర్వర్ మొరాయిస్తోంది. దీంతో గ్యాస్ బుక్ అవ్వక, సిలిండర్ రాదేమోనన్న ఆందోళన మహిళల్లో ఏర్పడింది. తాత్కాలికంగా విద్యుత్ పొయ్యిలను, ఇండెక్షన్ స్టవ్లను బయటకు తీస్తున్నారు. హోటల్ నిర్వాహకులు కూడా అతి పొదుపుగా వాడుతున్నారు. మార్కాపురంలో ఒక్కొక్క గ్యాస్ ఏజెన్సీకి రోజుకు 2 లారీల లోడ్ వస్తోంది. అయితే మూడు రోజుల నుంచి రెండు రోజులకు ఒక లోడ్మాత్రమే రావడంతో డెలివరీ ఆలస్యమవుతోంది. ప్రధానంగా హోటల్స్, చిరువ్యాపారులకు, టిఫిన్ బండ్ల నిర్వాహకులకు కమర్షియల్ సిలిండర్ అవసరం ఎక్కువగా ఉంది. గ్యాస్ ధర పెంచినప్పటికీ సిలిండర్ సకాలంలో అందితే చాలనే భావన ఏర్పడింది. ప్రతి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ బుక్ చేసుకునేవారి సంఖ్య రోజుకు 400 నుంచి 500 మధ్య ఉంటోందని ఒక ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. సిలండర్ల డెలివరీ తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువ కావడంతో సకాలంలో డెలివరీ చేయలేక నిర్వాహకులు ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకుంటున్నారు. మార్కాపురం పట్టణంలో గత రెండు రోజుల నుంచి బండ్లపై టిఫిన్ తయారు చేసే వాటిని మూసేశారు. కేవలం సిలిండర్ల కొరత కారణంగానే వీటిని మూసివేస్తున్నారు. గత వారం వరకూ బుక్చేసుకున్న 2 నుంచి 3 రోజులకే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది. ఇప్పుడు నెల వరకూ పట్టవచ్చనే వార్తలు అటు వ్యాపారుల్లో ఇటు గృహ యజమానుల్లో టెన్షన్కు దారితీస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ సంతమాగులూరు(అద్దంకి): యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడిందన్న ప్రచారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూకట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో శుక్రవారం గ్యాస్ వాహనం రాగానే బుక్ చేసుకున్న వినియోగదారులు క్యూ కట్టారు. గతంలో రెండు రోజులకు ఒక సారి వచ్చే గ్యాస్ వాహనం ఇప్పుడు 15 రోజులకు ఒక సారి వస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మండలంలో మొత్తం 15 వేల కనెక్షన్లు ఉండగా, 10 వేల మంది సిలిడర్లు కావాలని బుక్ చేసుకున్నారని, వారికి వెంటనే సిలిండర్లు ఇచ్చేందుకు వీలు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.ఇలా అయితే వ్యాపారాలు చేయలేము మార్కాపురం పట్టణంలో గత ఎనిమిదేళ్లుగా టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. ఇప్పటి వరకూ గ్యాస్ కొరత లేకపోవడంతో ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ వేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వారం రోజుల నుంచి గ్యాస్ కొరత వేధిస్తోంది. దీంతో సాయంత్రం పూట స్నాక్స్ బండిని ఆపేశాను. పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ఉగాది పండుగ, రంజాన్ వస్తోంది. వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయని ఆశతో ఉంటే గ్యాస్ కొరత భయపెడుతోంది. – సుబ్బారావు, టిఫిన్ బండి నిర్వాహకుడు ఒంగోలులో గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారుల పడిగాపులుఒంగోలులోని ఓ హోటల్లో కట్టెల పొయ్యిపై వంట -
ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ఫలితం లేదు
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026ఇతని పేరు జూటూరి సిద్ధయ్య. అర్థవీడు మండలం చెర్లో దొనకొండ గ్రామం. ఇతనికి ఒకటిన్నర ఎకరా పొలం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం పలుమార్లు వ్యవసాయశాఖ అధికారులకు అర్జీ ఇచ్చాడు. కొత్తవి పెట్టుకునేందుకు అవకాశం లేదంటున్నారు. గతంలో హైదరాబాద్లో ప్త్రెవేట్ కంపెనీల్లో పనిచేసుకుంటూ జీవించాడు. ఆరోగ్య సమస్యలతో కొన్నేళ్ల క్రితం స్వగ్రామం వచ్చాడు. ఉన్న పొలంలో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్నాడు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని సిద్ధయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: విద్యుత్ రంగంలో కేంద్ర, రాష్ట్ర పథకాలు సక్రమంగా అమలు చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. శుక్రవారం ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పురోగతి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వేసవిలో విద్యుత్ కోతల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని, ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వీడాలని సూచించారు. పీఎం కుసుమ్ పథకం అమలు కోసం భూ సేకరణ పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం ఏపీ ట్రాన్స్ కో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొత్త ఈహెచ్టీ సబ్ స్టేషన్ ప్రతిపాదనలు, నిర్మాణ పనుల పురోగతి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్ఈ రాజగోపాల్, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ సుబ్బారావు, ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: మద్దిపాడులో హత్య కేసు చేధించినందుకు అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ అవార్డు)కు జిల్లా పోలీసులు ఎంపికయ్యారు. ఈ అవార్డును ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి జిల్లా పోలీసులకు ఈ అవార్డు లభించింది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ హర్షవర్థన్రాజు అవార్డు అందుకున్నారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, రాష్ట్ర సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ స్థానంలో జీఆర్పీ పోలీసులు... ఏబీసీడీ అవార్డుల్లో ఒంగోలు జీఆర్పీ పోలీసులు ద్వితీయ స్థానంలో నిలిచారు. గతేడాది నవంబర్ 25వ తేదీ హైదరాబాద్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిన కేకే రామిరెడ్డికి చెందిన 341 గ్రాముల బంగారు నగల బ్యాగ్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన ఒంగోలు జీఆర్పీ పోలీసులు.. కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నెల్లూరు డీఎస్ఆర్పీ జి.మురళీధర్, ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సినిమా ఫక్కీలో కేసు ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేసింది. ఈ కేసులో జీఆర్పీ పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. డీజీపీ చేతుల మీదుగా మంగళగిరిలో అవార్డు అందుకున్నారు. విద్యుత్ అధికారులతో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి -
పోలీస్, డాక్టర్ ఇంట్లో చోరీ
సింగరాయకొండ: మండల కేంద్రంలోని బాలయోగినగర్లో నివసిస్తూ కనిగిరిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పోట్లూరి హరిబాబు నివాసంలో, కందుకూరు రోడ్డులోని దేవరపల్లి రాఘవయ్య కాలనీ 3వ లైనులో నివసిస్తూ ఒంగోలు జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సివిల్ సర్జన్ దువ్వూరి అనిల్కుమార్ నివాసంలో దొంగలు పడ్డారు. సుమారు రూ.14 లక్షల విలువైన 91 గ్రాముల బంగారు నగలు, రూ.2.50 లక్షల విలువైన కేజీ వెండి వస్తువులు, రూ.1.40 లక్షల నగదు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దేవరపల్లి రాఘవయ్య కాలనీలో నివసిస్తున్న డాక్టర్ అనిల్కుమార్ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బెంగళూరులోని చెల్లెలు వద్దకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపునకు ఉన్న తాళం కోసి ఉంది. దొంగలు లోపలికి ప్రవేశించి ప్రొఫెషనల్ దొంగల్లా బీరువాను ఇనుప రాడ్డుతో తెరిచి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.18 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీ జరిగిందని బాధితుడి బంధువులు తెలిపారు. అంతేగాకుండా అతను ఎప్పటి నుంచో దాచుకున్న సుమారు రూ.50 వేల విలువైన 7 విదేశీ మద్యం బాటిళ్లను కూడా చోరీ చేసినట్లు తెలిపారు. మరో చోరీ ఘటనలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హరిబాబు ఉద్యోగరీత్యా కనిగిరిలో నివాసం ఉంటున్నాడు. సింగరాయకొండలోని బాలయోగినగర్లోని ఇంటిలో సామగ్రి మినహా విలువైన వస్తువులేమీ లేవు. దీంతో విలువైన వస్తువులు పోనప్పటికీ.. దొంగ ఇంటి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోని బీరువా తలుపులు ధ్వంసం చేయడంతో పాటు బీరువాలోని సీక్రెట్ లాకర్లు కూడా ధ్వంసం చేశాడు. వారం క్రితం ఈ ప్రాంతంలో ఒక కుర్రాడు రెక్కీ నిర్వహించాడని, అతడిని అనుమానించి ప్రశ్నించగా.. నేను దొంగను అని చెప్పడంతో పట్టుకునే ప్రయత్నం చేశామని, కానీ, పారిపోయాడని స్థానికులు తెలిపారు. అతని వద్ద పదునైన ఇనుప వస్తువు ఉందని తెలిపారు. ఒకే రోజు రెండు దొంగతనాలు జరగడంతో పాటు భారీగా బంగారం, వెండి, నగదు చోరీ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంఘటన స్థలాలను సీఐ హజరత్తయ్య పరిశీలించారు. రూ.18 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరణ డాక్టర్ ఇంట్లో బంగారం, వెండి, నగదు చోరీ పోలీసు ఇంట్లో డోర్లు, బీరువా, లాకర్లు ధ్వంసం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
సంతమాగులూరు(అద్దంకి): బైక్పై వెళ్తున్న యువకుడు లారీని దాటవేసే క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పడటంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద నార్కెట్పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏల్చూరుకు చెందిన కొండి వెంకట ఆంజనేయులు(19) బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. హిందూ శ్మశానవాటిక వద్ద ముందు వెళ్తున్న లారీని దాటవేసే క్రమంలో అదుపుతప్పి లారీ ముందు టైరు కింద పడిపోయాడు. చేయి నుజ్జునుజ్జు కాగా తల, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని నిలిపివేశాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుని తండ్రి వెంకట్రావు ఏడు నెలల క్రితం కన్నుమూశారు. ఇంతలోనే కొడుకు చనిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒంగోలు సిటీ: జాతీయ స్థాయిలో నిర్వహించిన పారఖ్ సర్వేక్షణ ఫలితాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు మెరుగుపరచాలని డీఈఓ రేణుక సూచించారు. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పారఖ్ జాతీయ సర్వేక్షణ–2024 ఫలితాలపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని క్విస్ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. డీసీఈబీ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, ఏఎంఓ నాగేంద్ర నాయక్, మార్కాపురం డీవైఈఓ మావిళ్లపల్లి శ్రీను పాల్గొని ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లుగా డైట్ సీనియర్ లెక్చరర్లు విజయకృష్ణ, సర్దార్ పాపారాయుడు శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు రిసోర్స్ పర్సన్లుగా సోమశేఖర్, యామిని, పద్మశ్రీ పాల్గొని వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి మాండలిక విద్యాధికారులు, క్లస్టర్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పాల్గొన్నారు. పారఖ్ జాతీయ సర్వేక్షణలో గుర్తించిన విద్యార్థుల అభ్యాస స్థాయిలు, లోపాల ఆధారంగా పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణలో చర్చించారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులంతా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను విశ్లేషించి బోధన విధానాలను మెరుగుపరచడానికి అవసరమైన అవగాహన పొందుతారని నిర్వాహకులు తెలిపారు. -
పుల్లలచెరువులో ఇల్లు లూటీ
పుల్లలచెరువు: మండల కేంద్రమైన పుల్లలచెరువులో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో నగలు, నగదు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లలచెరువు జెడ్పీ పాఠశాల సమీపంలో మేడికొండ వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటోంది. వెంకటేశ్వర్లు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా, ఆయన భార్య అడిగొప్పలలో అమ్మవారి ఆలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు మధ్యాహ్న సమయంలో చోరీకి తెగబడ్డారు. ఇంటి యజమాని భోజనానికి రాగా తాళం పగలగొట్టి ఉండటంతో కంగుతిన్నాడు. ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు రూ.1.50 లక్షల నగదు చోరీ అయ్యాయని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ అజయికుమార్, ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. వెంకటేశ్వర్లు భార్య ఆలయం నుంచి తిరిగి వస్తే చోరీ అయిన సొత్తు పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. -
హోరాహోరీగా ఎడ్ల పందేలు
కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు శుక్రవారం జాతీయ స్థాయి సీనియర్ విభాగం ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. మేకలవారిపల్లి రెడ్ల సంఘం, బొమ్మన బ్రదర్స్ పర్యవేక్షణలో నిర్వహించిన ఎడ్ల పోటీలను ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడి్డ్ ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన 14 జతల ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. సేద్యపు ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన పశుపోషకులు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. రిఫరీగా వల్లెల వెంకటరామిరెడ్డి, నారాయణస్వామి వ్యవహరించారు. న్యూ కేటగిరీ విజేతలు ఇవే.. గురువారం రాత్రి వరకు కొనసాగిన న్యూ కేటగిరీ విభాగంలో ఆర్కే బుల్స్ అత్తోటి శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి సంయుక్త ఎడ్ల జత నిర్ణీత సమయంలో 6,420 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.75 వేలు, గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఎడ్ల జత 6,252 లడుగులు లాగి రెందో బహుమతి రూ.60 వేలు, నాగార్ కర్నూలుకు చెందిన అక్షరరెడ్డి ఎడ్ల జత 6,236 అడుగులు లాగి మూడో బహుమతి రూ.40 వేలు, గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 6 వేల అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.30 వేలు, గుంంటూరు జిల్లాకు చెందిన గుదిడండ మాధవరెడ్డి, పెద్దపరిమి శ్రీనివాస్ సంయుక్త ఎడ్ల జత 5,464 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.20 వేలు, యర్రగొండపాలేనికి చెందిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 5,400 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.15 వేలు, పుల్లలచెరువుకు చెందిన ఎడ్ల జత 4,724 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.8 వేలు గెలుపొందాయి. దాతల సహకారంతో విజేతలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, ఆలయ ఈఓ ఈఓ చెన్నకేశవరెడ్డి చేతులమీదుగా నగదు అందజేశారు. సీనియర్ విభాగంలో కృష్ణా జిల్లా ఎడ్ల సత్తా సీనియర్ విభాగం ఎడ్ల పోటీల్లో కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన రాజా చౌదరి, మోహన్రావు సంయుక్త ఎడ్ల జత 4,200 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.90 వేలు. నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి కేశవరెడ్డి, సాంబశివారెడ్డి, వీరనరసింహరెడ్డి ఎడ్ల జత 4,022 అడుగులు లాగి రెండో బహుమతి రూ.70 వేలు, వైఎస్సార్ కడప జిల్లా చౌటపల్లికి చెందిన మార్తాల చంద్ర ఓబులరెడ్డి ఎడ్ల జత 3,874 అడుగులు లాగి మూడో బహుమతి రూ.50 వేలు, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణచౌదరి ఎడ్ల జత 3,694 అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.40 వేలు, వీరికే చెందిన మరో జత ఎడ్లు 3634 లాగి ఐదో బహుమతి రూ.30 వేలు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఎడ్ల జత 3,602 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.20 వేలు, బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి చౌదరి ఎడ్ల జత 3,451 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.10 వేలు అందుకున్నాయి. మూడు రోజులపాటు ఎడ్ల పందేల్లో పాల్గొని బహుమతి దక్కని ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేశారు. -
సాహిత్య రంగంలో మొల్లమాంబది ప్రత్యేక స్థానం
ఒంగోలు సబర్బన్: సాహిత్యరంగంపై మొల్లమాంబ తనదైన ముద్ర వేశారని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు కొనియాడారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం ప్రకాశం భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నిర్మలజ్యోతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముప్పూరి వెంకటేశ్వరరావు, పలువురు కవయిత్రులు, శాలివాహన సంఘ ప్రతినిధులు పాల్గొని మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ మొల్లమాంబ విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో ప్రత్యేక చలివేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘ గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, జిల్లా అధ్యక్షురాలు పరాంకుశం కృష్ణవేణి, గాయని చల్లా నాగేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు. శాలివాహన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులైన ఐలాపురం వెంకయ్య, శ్రీవిక్కీశ్రీ నాగేశ్వరరావు మృతికి సంతాపంగా ఈ కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వర్ణ దురంహకారంపై సంధించిన బాణం మొల్ల ఒంగోలు టౌన్: వర్ణ దురంహాకారాన్ని ఎదుర్కొన్న కవయిత్రి మొల్ల నేటి తరానికి ఆదర్శనీయమని ఆర్ఐ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ తీవ్రమైన వివక్షను తిప్పికొడుతూ రామాయణ మహాగ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి మొల్లను తెలుగుజాతి ఎన్నటికీ మరచిపోదన్నారు. సీ్త్రలు వంటింటికే పరిమితం కావాలని ఆంక్షలు విధించిన రోజుల్లో సీ్త్రలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై పోరాటం చేసి చరిత్రలో వీరవనితగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఏఆర్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. మొల్లమాంబ జీవితం ఆదర్శం మార్కాపురం: రామాయనాన్ని సరళమైన శైలిలో రాసి ప్రజలకు అందించిన తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శమని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా స్ధానిక తర్లుపాడు రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ.. కడప జిల్లా గోపవరంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల తన సహజ పాండిత్యంతో రామాయణాన్ని తెలుగులో రచించి తొలి తెలుగు మహిళా కవిగా నిలిచారని కొనియాడారు. తాను రాసిన రామాయణాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని, తెలుగు సాహిత్యంలో ఆమె స్థానం అమూల్యమైనదన్నారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురలీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం శాలివాహన సత్రం అధ్యక్షుడు సీహెచ్ మోహన్, పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బొగ్గరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు జేసీ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి
మార్కాపురం: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో నీటి సమస్యపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ముందుగానే గుర్తించాలని, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలని చెప్పారు. అవసరమైన చోట, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, డీపీహెచ్ఈఓ శ్రీనివాసరావు, గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణ, పలువురు ఏఈలు పాల్గొన్నారు. -
నోట్లోకి దూరిన చేప
ఒంగోలు టౌన్: ఊహించని రీతిలో వలలోని చేప జాలరీ నోట్లోకి దూరింది. ఊపిరాడక గిలగిలలాడుతున్న సదరు జాలరీని ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన జీజీహెచ్ వైద్యులు జాలరీ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలుకు చెందిన సుబ్రమణ్యం గురువారం చేపలవేటకు వెళ్లారు. చేపలు పట్టుకొని ఇంటికి వచ్చిన ఆయన నోట్లో వలను పట్టుకొని చేపలను బయటకు తీస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఒక చేప సుబ్రమణ్యం నోట్లోకి వెళ్లింది. గొంతుకు అడ్డంపడి గిలగిలా కొట్టుకోసాగింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్ గొంతులో చేప ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి చెప్పారు. ట్రాకియాక్టమి పద్ధతిలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు. సుమారు గంటకు పైగా ఆపరేషన్ చేసి సకాలంలో చేపను బయటకు తీయడంతో సుబ్రహ్మణ్యం ప్రాణాలతో బయట పడ్డారు. ఆపరేషన్ బృందంలో డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్, డాక్టర లాలస పాల్గొన్నారు. క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు ప్రశంసించారు. -
పేదల మది నిండా.. వైఎస్సార్ సీపీ జెండా
వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చేసిన మేలును గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ జెండాలు ఆవిష్కరించడంతోపాటు దివంగత వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సందడి చేశారు. – సాక్షి నెట్వర్క్దర్శిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తున్న నాయకులుకంభంలో వైఎస్సార్ విగ్రహానికి కే పీ నాగార్జునరెడ్డి నివాళికందుకూరులో కే క్ కట్ చేసి సంబరాలు..వైపాలెంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు -
ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నయం చేయొచ్చు
ఒంగోలు టౌన్: క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం అంత సాధ్యమవుతుందని జీజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా స్క్రీనింగ్ క్యాంపును నగర మేయర్ సుజాత, కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జీజీహెచ్లో పారిశుధ్య కార్మికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ...ముందుగా లక్షణాలు గుర్తించడం అవసరమన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చన్నారు. జీజీహెచ్లో ప్రివెంటివ్ అంకాలజీలో నిరంతరం ఓపీ సేవలు అందిస్తుందన్నారు. సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ అంకాలజీ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. పరీక్షల కోసమే కాకుండా కౌన్సెలింగ్ కోసం కూడా జీజీహెచ్కు రావచ్చన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డా.శ్రీదేవి, గైనకాలజీ అధిపతి డాక్టర్ సంధ్యా రాణి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఆర్టీఓగా చండ్రా రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎంవీఐగా పనిచేస్తున్న ఆయనను మార్కాపురం ఇన్చార్జి ఆర్టీఓగా నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన శ్రీచందన సెలవుపై వెళ్లారు. మార్కాపురం ఎంవీఐగా కేఎల్రావును నియమించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాల డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. -
ఆక్రమించేద్దాం.. అక్రమ కట్టడాలు కట్టేద్దాం!
పొన్నలూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు భూ ఆక్రమణలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఏ భూమైనా పర్వాలేదు ఆక్రమించేద్దాం.. అక్రమ కట్టడాలు నిర్మిద్దాం, అవసరమైతే అమ్ముకుందాం అనే పద్ధతిని పాటిస్తూ యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు కబ్జాదారులుగా మారి జెండా పాతేస్తున్నారు. స్థానికులు అడ్డు తగులుతూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా అవేవి మాకు వర్తించవంటూ నియోజకవర్గ ముఖ్య నేతల అండదండలతో అధికారులను, స్థానికులను బెదిరిస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన వారంతా ప్రేక్షకపాత్ర వహించడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. మండలంలోని చెరుకూరు రెవెన్యూ పరిధి తిమ్మపాలెం గ్రామంలో సర్వే నంబర్ 737/1 లో 1.14 ఎకరాల ప్రభుత్వ బండి బాట స్థలం ఉంది. ఈ స్థలం గ్రామానికి సమీపంలో ఉండి కట్టడాలకు అనువుగా ఉండటంతో స్థానిక టీడీపీ సానుభూతిపరుల కన్ను బండిబాట స్థలంపై పడింది. వాస్తవంగా 2018 గత టీడీపీ ప్రభుత్వ నుంచే తమ్ముళ్లు విడతల వారీగా స్థలాన్ని ఆక్రమిస్తూ బ్యారన్ల నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు 2022లో హైకోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆక్రమితదారులకు నోటీసులు ఇచ్చారు. అయితే పంచాయతీ అధికారులు బండి బాట స్థలాన్ని పొరపాటున వాగుపోరంబోకు భూమి అని కోర్టుకు తెల్పడంతో కొంత సందిగ్ధత ఏర్పండి. దీంతో మరోసారి రికార్డులు పరిశీలించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేసి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అయితే పంచాయతీ అధికారులకు నేటి వరకు ఆక్రమితదారులకు నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. స్థలం విలువ రూ.కోట్లలోనే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు బండిబాట స్థలంలో అక్రమంగా బ్యారన్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. ప్రభుత్వ బండిబాట స్థలం గ్రామానికి సమీపంలో ఉండటంతో సెంటు స్థలం రూ.2 లక్షల ధర పలుకుతోంది. ఈ చొప్పున 1.14 ఎకరాల స్థలం ధర సుమారుగా రూ.2.28 కోట్లు వరకు ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. విడతల వారీ గా తెలుగు తమ్ముళ్లు బండిబాట స్థలాన్ని ఆక్రమించి సుమారుగా 10 బ్యారన్లు వరకు నిర్మించారు. దొంగ పత్రంతో బ్యారన్ లెక్క... ప్రభుత్వ బండి బాట స్థలం ఆక్రమించి తమ్ముళ్లు పొగాకు బ్యారన్లు నిర్మించడమే కాకుండా అక్రమ నిర్మాణాలకు దొంగ పత్రాలు సృష్టించారు. అక్రమ పొగాకు బ్యారన్ నిర్మాణానికి స్థానిక వీఆర్వో అధికారకంగా అనుమతి పత్రం ఇచ్చినట్లు దొంగ పత్రం సృష్టించి పొగాకు బోర్డు అధికారులకు అందజేశారు. దీంతో దొంగ పత్రం ఆధారంగా పొగాకు బోర్డు వారు సంబంధిత ఆక్రమితదారులకు పొగాకును విక్రయించడానికి బ్యారన్ లెక్క కూడా కల్పించారు. అయితే దీనిపై సంబంధిత వీఆర్వోని గ్రామస్తులు ప్రశ్నించగా తనకు తెలియదని, అనుమతి పత్రం నేను మంజూరు చేయలేదని తెలియజేయడం గమనార్హం. అలాగే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన బ్యారన్లకు ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడం కొసమెరుపు. బ్యారన్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని కూడా గ్రామస్తులు రాకపోకలు సాగించే రోడ్డులో నిర్మించడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయి. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం... వాస్తవంగా తిమ్మపాలెం గ్రామంలో విలువ కలిగి ప్రభుత్వ బండిబాట స్థలం ఆక్రమణపై రెవెన్యూ, పంచాయతీ అధికారులకు గ్రామస్తులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. తమకు ఇవేమి పట్టవంటూ పట్టీపట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఆక్రమితదారుల దగ్గర ముడుపులు తీసుకోవడం వలనే రెవెన్యూ, పంచాయతీ అధికారులు అటువైపు కూడా చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అయితే మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు కందుకూరు సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ బండిబాట స్థలంలోని ఆక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిమ్మపాలెంలో తెలుగు తమ్ముళ్ల ఆక్రమణల పర్వం 1.14 ఎకరాల ప్రభుత్వ బండిబాట స్థలం ఆక్రమణ మార్కెట్లో బండిబాట స్థలం విలువ సుమారుగా రూ.2.28 కోట్లు ఆక్రమించిన స్థలంలో 10 పొగాకు బ్యారన్ల నిర్మాణం దొంగ పత్రాలతో పొగాకు బ్యారన్ లెక్క సైతం తెచ్చుకున్న వైనం బ్యారన్లకు అక్రమ విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన ఆ శాఖ సిబ్బంది పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ, పంచాయతీ అధికారులు -
విచిత్రం… జాలరి నోట్లోకి దూకిన చేప!
ఒంగోలు టౌన్: ఊహించని రీతిలో వలలోని చేప జాలరీ నోట్లోకి దూరింది. ఊపిరాడక గిలగిలలాడుతున్న సదరు జాలరీని ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన జీజీహెచ్ వైద్యులు జాలరీ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలుకు చెందిన సుబ్రమణ్యం గురువారం చేపలవేటకు వెళ్లారు. చేపలు పట్టుకొని ఇంటికి వచ్చిన ఆయన నోట్లో వలను పట్టుకొని చేపలను బయటకు తీస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఒక చేప సుబ్రమణ్యం నోట్లోకి వెళ్లింది. గొంతుకు అడ్డంపడి గిలగిలా కొట్టుకోసాగింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్ గొంతులో చేప ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి చెప్పారు. ట్రాకియాక్టమి పద్ధతిలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.సుమారు గంటకు పైగా ఆపరేషన్ చేసి సకాలంలో చేపను బయటకు తీయడంతో సుబ్రహ్మణ్యం ప్రాణాలతో బయట పడ్డారు. ఆపరేషన్ బృందంలో డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్, డాక్టర లాలస పాల్గొన్నారు. క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు ప్రశంసించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్ ముఠాకు భారీ దెబ్బ తగిలింది. దర్శిలో తీగలాగితే నరసరావుపేట, హైదరాబాద్లో డొంక కదిలింది. ఫిబ్రవరి 26వ తేదీన ‘బెట్టింగ్ మామూళ్లే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఎస్పీ హర్షవర్థన రాజు సీరియస్గా తీసుకున్నారు. అప్పుడే జిల్లా పోలీసు అధికారులకు క్లాస్ పీకారు. బెట్టింగ్ ముఠా అంతు చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లా వ్యాప్తంగా హడావుడి చేసిన పోలీసు యంత్రాంగం నామ మాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. అయినా ఎస్పీ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో టీ 20 ఫైనల్ జరుగుతున్న రోజు దర్శిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక పోస్టల్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని మూడు రోజుల పాటు విచారణ చేసి కూపీ లాగారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు దర్శి పోలీసులు నామ మాత్రంగా కేసు పెట్టి పోస్టల్ ఉద్యోగిని వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ కేసును టాస్క్ఫోర్స్కు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్పోర్స్ పోలీసులు నరసరావుపేటకు చెందిన ప్రధాన బుకీని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. అతడి వద్ద బెట్టింగుకు సంబంధించిన బోర్డు, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు లభించినట్లు సమాచారం. అతడి వద్ద నుంచి బెట్టింగుకు సంబంధించిన రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట బుకీని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా హైదరాబాద్లో మరో ప్రధాన బుకీ ఉన్నట్లు సమాచారం వచ్చింది. దాంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ బుకీ నుంచి రాబట్టిన సమాచారం మేరకు కడప, గుంటూరులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ బుకీలను ఏర్పాటు చేసుకొని కోట్లాది రూపాయల బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు బిత్తరపోయారు. సినిమా తరహాలో ఏర్పాటు చేసుకున్న సెట్టింగులు చూసి విస్మయానికి గురయ్యారు. లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నేడో రేపో హైదరాబాద్ బుకీని అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బుకీ అరెస్టుతో రాష్ట్రంలో ఒక పెద్ద బెట్టింగ్ ముఠా ఆటకట్టయినట్లేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
వచ్చేది జగనన్న పాలనే..
ఒంగోలు టౌన్: రెండేళ్ల చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు మళ్లీ జగనన్న పాలన రావాలని కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్లు, నాయకులు వేడుకల్లో పాల్గొని కేక్లు కట్ చేసి, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సభకు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది కార్యకర్తల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎత్తిన జెండా దించకుండా జగనన్నకు వెన్నుదన్నుగా నిలబడి కలబడిన కార్యకర్తల రుణం తీర్చుకోలేమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించిందని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా అదరక, బెదరక పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. కూటమి పదవులకు, ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవంతో ముందుకు సాగిన కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి అకాల మరణం తరువాత ప్రజలను పట్టించుకునేవారే లేకుండా పోయిన పరిస్థితుల్లో జననేత జగనన్న వైఎస్సార్ సీపీ పెట్టారని గుర్తు చేశారు. గత 16 ఏళ్లుగా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగనన్నదన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా వెన్ను చూపకుండా ముందుకు సాగిన దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగనన్న అని కొనియాడారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం, రైతు భరోసా, సచివాలయాలు వంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేసిందని తెలిపారు. నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్య శ్రీ అమలు చేసిందని నేడు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వాటిని అటకెక్కించారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పాలకులు ఎన్ని కేసులు పెట్టినా, 16 నెలలు జైలుకు పంపించినా భయపడకుండా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడిన దమ్మున్న నాయకుడు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని, ఎల్లకాలం ఇదే పరిపాలన కొనసాగదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని, అప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. -
రూర్బన్ పంచాయతీల పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు
మార్కాపురం టౌన్: రూర్బన్ పంచాయతీల పేరుతో పేదల పొట్ట కొట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి సుస్థిరత సమావేశం కే మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూర్బన్ పంచాయతీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానం చేయడంతో ఉపాధి పథకం ఆ గ్రామాల్లో రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 10 వేల జనాభా ఉన్న గ్రామాలను రూర్బన్ (రూరల్ అర్బన్) పేరుతో పంచాయతీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గ్రామాలకు పట్టణ సౌకర్యాలు కల్పించడం మంచిదే అయినా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టం ఆ గ్రామాల్లో అమలు చేస్తారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేసిన సందర్భాల్లో నగర పంచాయతీలుగా మార్చిన సందర్భంలోనూ పేదలు ఉపాధి హామీ చట్టాన్ని కోల్పోయారని అన్నారు. రూర్బన్ పద్ధతిలో అటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కారణాలు చూపి గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండరుకు రూ.60, వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ రూ.11 పెంచడం అన్యాయమని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల సరఫరా సంస్థలు సిలిండర్లను బ్లాక్చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ప్రకటించిన పథకాలు అమలులోకి రాలేదని, ప్రభుత్వం పథకాలపై స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మార్కాపురం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కే మాల్యాద్రి, కార్యదర్శిగా గుమ్మా బాలనాగయ్య, ఉపాధ్యక్షులుగా కే వెంకటమ్మ, సహాయ కార్యదర్శులుగా ఏడుకొండలు, బీ రత్నంతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డీకేఎం రఫీ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, కార్మికులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి రానివ్వాలని చిరు వ్యాపారుల ఆందోళన
పెద్దదోర్నాల: తమను శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ కర్నాటక, రాజస్థాన్కు చెందిన చిరు వ్యాపారులు శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్పోస్టు వద్ద రోడ్లపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గణపతి చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్కు గంట పాటు అంతరాయం ఏర్పడింది. శ్రీశైల దేవస్థానం అధికారుల ఆదేశాల మేరకు కొద్ది రోజులుగా చిరు వ్యాపారులను గణపతి చెక్పోస్టు వద్ద నిలిపేస్తున్నారు. దీంతో వారు మండల కేంద్రంలోని రహదారుల వెంట వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వారికి అనుకున్నంతగా వ్యాపారాలు జరగకపోవటంతో వారు తొలుత అటవీశాఖ కార్యాలయం వద్ద చేరుకుని, అనంతరం గణపతి చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు రాస్తారోకో నిర్వహించి తమను శ్రీశైలానికి అనుమతించాలని ఆందోళన నిర్వహించారు. దీంతో పాటు శ్రీశైలానికి ప్రయాణాలు సాగిస్తున్న కన్నడ భక్తులు కూడా వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో అటవీశాఖ అధికారులు దేవస్థానం అధికారులతో మాట్లాడి ఆందోళన చేస్తున్న వారిని శ్రీశైలానికి అనుమతించటంతో గొడవ సద్దుమణిగింది. ఈ ధర్నాతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవటంతో 2 గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.గణపతి చెక్పోస్టు వద్ద ఆందోళన చేస్తున్న చిరు వ్యాపారులు ఆందోళనతో నిలిచిన వాహనాల రాకపోకలు -
కూటమిలో కుంపటి
ఒంగోలు సబర్బన్: అధికార కూటమి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికార టీడీపీ, జనసేన సభ్యుల మధ్య మాటల తూటాలు రచ్చకు దారితీశాయి. చివరకు జనసేన సభ్యులు మైకులు విరగ్గొట్టే స్థాయికి చేరుకున్నారు. కొంతసేపు కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ సుజాత లేకపోవటంతో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన బుధవారం కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కౌన్సిల్కు ఈ నెల 16వ తేదీతో పాలక మండలి గడువు ముగుస్తుండటంతో చివరగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 41 అంశాలతో కూడిన అజెండాతో కౌన్సిల్ను ప్రారంభించిన వేమూరి 38వ అంశం వచ్చేసరికి కౌన్సిల్ ఒక్కసారిగా వేడెక్కింది. 38వ డివిజన్కు చెందిన జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ తన డివిజన్లో ఉన్న పార్కుకు శ్రీకృష్ణ దేవరాయ పార్కుగా నామకరణం చేయాలనే అంశాన్ని కౌన్సిల్లో ఆమోదం కోసం పెట్టారు. అయితే ఆ అంశం ప్రస్తావనకు రాగానే టీడీపీ సభ్యుడు తేజ లేచి ఆ అంశాన్ని వాయిదా వేయాలని చెప్పాడు. దాంతో రచ్చ ప్రారంభమైంది. స్థానికంగా ప్రజల అభిప్రాయాలతో సంతకాల సేకరణ చేపట్టామని, మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పటానికి నువ్వెవరంటూ టీడీపీ సభ్యుడు తేజను జనసేన సభ్యుడు మలగా రమేష్ నిలదీశాడు. దాంతో అటు టీడీపీ సభ్యులు, ఇటు జనసేన సభ్యులు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. కౌన్సిల్లో జనసేనకు 21 మంది సభ్యుల బలం ఉంది. దాంతో కౌన్సిల్ ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు జనసేన సభ్యుడు మలగా రమేష్ మైక్ ఎత్తి నేలకేసి కొట్టాడు. దాంతో కౌన్సిల్లో ఇంకా రెండు గ్రూపుల మధ్య వాడి వేడి మాటల యుద్దం జరిగింది. చివరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలుగజేసుకొని ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నామే కానీ రద్దు చేయటం లేదని చెప్పటంతో కొంత శాంతించారు. చివరకు జనసేన సభ్యులు టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా బాయ్ కాట్ చేస్తున్నామంటూ కౌన్సిల్ హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. రెండేళ్లలో జీరో అవర్ ప్రవేశపెట్టలేదు...వైఎస్సార్ సీపీ ధ్వజం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందని, అయితే ఈ రెండేళ్లలో ఒంగోలు నగర ప్రజల సమస్యలను చర్చించటానికి అవకాశం కల్పించే ‘‘జీరో’’ అవర్ను ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు పాలక పార్టీలపై ధ్వజమెత్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్ తీరును తూర్పారబట్టారు. పాలక మండలి కాలపరిమితి పూర్తి కావస్తున్నా కనీసం చివరి సమావేశంలోనైనా జీరో అవర్ను ప్రవేశ పెట్టక పోవటాన్ని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా పరిగణించారు. అజెండాలోని అంశాలను ఆమోదింపజేసుకునే ఆలోచనలోనే పాలక పార్టీ సభ్యులు ఉన్నారే తప్ప ప్రజల సమస్యలను ప్రస్తావిద్దామన్న ఆలోచనే లేదన్నారు. ఒంగోలు నగరంలో విపరీతమైన దోమలతో ప్రజలు అల్లాడుతుంటే అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. నాలుగైదు దఫాలుగా మంచినీరు సక్రమంగా రావటంలేదన్నారు. వేసవి రాకముందే మంచినీటి కొరత ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహకు అందటం లేదని ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ దివాలా తీసిందన్నారు. ‘‘ట్రేడ్స్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టం’’ (ట్రెడ్స్) ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటమేంటని ప్రశ్నించారు. అసలు నగర పాలక సంస్థలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు ఉన్నాయో చెప్పాలన్నారు. దాంతో టీడీపీ సభ్యులు వైఎస్సార్ సీపీ సభ్యులను అడ్డుకున్నారు. మాట్లాడనీయకుండా గొడవకు దిగారు. ఒంగోలు నగరంలోని ఎస్ఎస్ ట్యాంకుకు పడమర వైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని స్ట్రీట్ వెండార్స్ కోసం తలపెట్టిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు సక్రమ పద్ధతిలో చేపట్టటం లేదని జనసేన నాయకుడు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నిలదీశారు. రూ.50 లక్షలకు పైగా ఖర్చుచేయాలని చూడటం అనాలోచిత చర్య అని అధికారులపై మండిపడ్డారు. -
వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఒంగోలు టౌన్: వైద్య విద్యలో పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలని డాక్టర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం సందర్శించిన ఆయన అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. కీలకమైన అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యత ఉందని, దీని కోసం ప్రతి సంవత్సరం రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ప్రజారోగ్యం, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజారంగంలో పరిశోధనలను విస్తరించేందుకు సింగపూర్ యూనివర్శిటీ, గేట్స్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కళాశాల విద్యతోపాటుగా క్రీడలు, ఇతర సామాజిక అంశాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి, నిరాశ లేకుండా సైకాలజీ విభాగం సరైన కౌన్సిలింగ్ అందించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏసుపాదం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.మాణిక్యరావు, డా.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు పథకాన్ని అందించాలి
అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండానే రూ.20 వేలు ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాటమార్చారు. అకాల వర్షాలు, తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నేటికీ నష్ట పరిహారం విడుదల చేయలేదు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. – యూ జోసఫ్, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, అన్నదాత సుఖీభవ పథకం ఒక ఏడాది ఇవ్వలేదు. ప్రస్తుతం ఇచ్చే పథకంలో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను భారీగా తగ్గిస్తున్నారు. ప్రతి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం పథకానికి దూరం చేయడం సమంజసం కాదు. – ఆవుల శ్రీధర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఇవ్వాలి
హామీలన్నీ అమలు చేసిన ఏకై క సీఎం జగన్దర్శి: దేశ చరిత్రలో వంద శాతం హామీలు అమలు చేసి చరిత్ర తిరగరాసిన ఒకే ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. దర్శి పట్టణంలో సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా కోలాట ప్రదర్శన వద్ద అందరితో కలసి కోలాటంలో సందడి చేశారు. అనంతరం కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్దకు వచ్చిన బూచేపల్లిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయని చరిత్రహీనుడుగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని అడిగితే చంద్రబాబు కల్తీ లడ్డు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే మీ పొట్టలు నింపుకోవడం కాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కపింఛన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడటం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన పట్టిన జెండా విడవకుండా మా నాయకుడు జగనన్నే అని సగర్వంగా చెప్పుకుంటున్నారని స్పష్ట చేశారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడేళ్ల నుంచి విద్యార్థులు లేక వివిధ పాఠశాలల్లో వారానికి, నెలకు రకరకాలుగా ఎయిడెడ్ ఉపాధ్యాయులను రోజువారి కూలీలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కోర్టుకు వెళ్లిన యాజమాన్యాల పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపుతున్నారు కానీ ఆ పాఠశాల యాజమాన్యాలు వారిని విధుల్లో చేర్చుకోవడం లేదన్నారు. జిల్లాలో మండలాల వారీగా జీవో నంబర్ వన్ ప్రకారం 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సబ్జెక్టు వారీగా సెకండ్ గ్రేడ్ టీచర్లు 108 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం 8, సోషల్ 6, సైన్స్ 4, తెలుగు పండిట్ 6, హిందీ పండిట్ 5, క్రాఫ్ట్ డ్రాయింగ్ 3, పీఈటీ 5, నాన్ టీచింగ్ స్టాఫ్ 20 మంది చొప్పున ఉన్నారని తెలిపారు. జిల్లాలో 42 ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే టీచర్ తో బోధన జరుగుతోందన్నారు. కొన్ని పాఠశాలల్లో 40 మంది పైన విద్యార్థులు ఉన్నారని, వారికి రెండవ టీచర్ను కేటాయించి యాజమాన్యం విల్లింగ్ ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను ఇచ్చి మిగిలిన ఎయిడెడ్ ఉపాధ్యాయులను శాశ్వతంగా కౌన్సిలింగ్ నిర్వహించి జీవో నంబర్ 24 ప్రకారం ప్రభుత్వ పాఠశాలలోకి సర్దుబాటు చేయాలని కోరారు. -
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించాలి
● డీఈఓ సీవీ రేణుక ఒంగోలు సిటీ: విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ సీవీ రేణుక అన్నారు. ప్రకాశం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం హైస్కూల్ టీచర్లకు బుధవారం ప్రకాశం భవన్లోని పీజీ ఆర్ఎస్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుంచి 150 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి పాఠశాల ఉపాధ్యాయుడు కీలకమన్నారు. వివిధ రకాల పోస్టర్స్ను, శిక్షణ దీపికను విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి చంద్రమౌలేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్, మాస్టర్ ట్రైనీలుగా పిచ్చిరెడ్డి, నివేదిత, అల్లూరయ్య, సంజీవరాజు, భాస్కర్ రెడ్డి, రాజగోపాల్ వ్యవహరించారు. -
గాలికుంటు వ్యాక్సినేషన్ పక్కాగా చేపట్టాలి
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సూచించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆరు లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి
దర్శి: పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సూచించారు. స్థానిక నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, గ్రామాల నాయకులతో మంగళవారం విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ డిజిటలైజేషన్ దాదాపుగా పూర్తి కావచ్చిందని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అందరూ నాయకులు తమ ఫొటోలను తీసుకుని డిజిటల్ చేసేందుకు త్వరితగతిన ముందుకు రావాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన
మార్కాపురం: ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల్లో ఈనెల 16తో ముగియనున్న పాలక మండళ్ల పదవీ కాలం నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్కు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మంగళవారం జీఓ ఆర్టీ నం 284ను విడుదల చేశారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని, కొత్తగా ఎన్నికయ్యే పాలకమండళ్లు బాధ్యతలు స్వీకరించే వరకూ లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు మున్సిపాలిటీల్లో పరిపాలన నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం జిల్లాలో జిల్లా కేంద్రమైన మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, అద్దంకి మున్సిపాలిటీకి అద్దంకి ఆర్డీఓ జాన్సన్, చీమకుర్తి మున్సిపాలిటీకి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్నను, మార్కాపురం మున్సిపాలిటీకి మార్కాపురం ఆర్డీఓ పీ ప్రభాకర్ను, గిద్దలూరు మున్సిపాలిటీకి వెలుగొండ ప్రాజెక్టు భూ సేకరణ, ఆర్అండ్ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరును, కనిగిరి మున్సిపాలిటీకి కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2021 మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2021 మార్చి 14న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఎన్నికై న సభ్యులు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 16తో మున్సిపల్ పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో పట్టణాల్లో, నగరాల్లో పాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐదేళ్లుగా మున్సిపల్ కౌన్సిల్లు ఉండటంతో ఆయా పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదం పొందిన తరువాత పనులు చేపట్టేవారు. పట్టణాల్లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్య, వీధిలైట్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులన్నీ మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిల్ పర్యవేక్షించేవారు. ఇకపై ఈ బాధ్యతలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జరగనున్నాయి. -
తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలేవీ?
ఒంగోలు టౌన్: వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో నగరంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా నగర పాలక సంస్థ ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నా పాలకులు మొద్దునిద్ర వీడడంలేదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలోని నీటి ఎద్దడి ఇబ్బంది పెడుతుండడంతో సీపీఎం నాయకుల బృందం మంగళవారం సమ్మర్ స్టోరేజీ ట్యాంకునుల పరిశీలించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వాస్తవానికి ట్యాంకుల్లో 5800 మిలియన్ లీటర్ల నీరు నిల్వలు ఉండాలని, ప్రస్తుతం 3700 మిలియన్ లీటర్లు మాత్రమే ఉందని వివరించారు. వేసవి తీవ్రత వలన నీటి నిలువలు వేగంగా తగ్గిపోతున్నాయని, అయినా నగర పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే సాగర్ నుంచి నీరు తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. నగర శివారు ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారని, నగరంలోని 25 శాతం జనాభాకు ట్యాంకర్ల ద్వారా వారానికి ఒక్కసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ 2 ను పరిశీలించినప్పుడు భవనంపైన హై టెన్షన్ విద్యుత్ లైన్లు కేవలం 10 అడుగుల ఎత్తులోనే ఉన్నాయని, దీనివలన సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలకు నీటిని సరఫరా చేసే మోటార్లు ఉన్న ప్రాంతానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కార్మికులు చెత్త, గడ్డి మధ్య వెళ్లాల్సి వస్తోందన్నారు. చెరువులోని నీరు పచ్చగా మారిందని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశీలించిన బృందంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేన్ తదితరులు ఉన్నారు. -
కూటమి పగ
శనగ రైతుపైవిదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు సుంకం పెంచాలి. సుంకంతో పాటు సెస్ తగ్గించడం వల్ల దిగుమతులు 2023–24లో 1.64 లక్షల టన్నుల నుంచి 2024–25లో 15.06 లక్షల టన్నులకు తీవ్రంగా పెరిగాయి. దిగుమతి సుంకం తగ్గించడంతో తక్కువ ధరకు విదేశీ శనగలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తద్వారా దేశీయంగా మన రైతులు పండించిన శనగ ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పడిపోయాయి. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో శనగ రైతు కుదేలవుతున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలపై సుంకాలను తగ్గించి కేంద్ర ప్రభుత్వం దేశీయ రైతుల నడ్డి విరిచింది. సరైన ధరలు లేక ఇప్పటికే లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మగ్గిపోతుండగా, ఈ ఏడాది రబీ సీజన్లో శనగ పంట మరికొద్ది రోజుల్లో చేతికి రానుంది. దాంతో వైఎస్సార్ సీపీ శనగ రైతులను ఆదుకోవాలంటూ పోరుబాట పట్టింది. ఒంగోలు సబర్బన్: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు దాటినా రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నిరకాల రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నా ప్రయోజనం శూన్యం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఏటా 1.50 లక్షల ఎకరాలకు పైగా శనగ సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అయితే దాదాపు 2 లక్షల ఎకరాల వరకూ శనగ సాగు చేశారు. అలాంటిది చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత శనగ సాగు ఏడాదికేడాదికి తగ్గిపోతోంది. గత సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరం కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు సాగు చేశారు. ఈ ఏడాది రబీ సీజన్లో శనగ పంట మరో నెల రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముందుగా వేసిన పంటను వారం, పది రోజుల్లో కోత కోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దాంతో వైఎస్సార్ సీపీ శనగ రైతులను ఆదుకోవాలంటూ పోరుబాట పట్టింది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి బాబులు ఈనెల 7వ తేదీన కలెక్టర్ పి.రాజాబాబును కలిసి శనగ రైతులను ఆదుకోవాలంటూ కోరారు. 10 లక్షల క్వింటాళ్లు కోల్డ్ స్టోరేజీల్లో... రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రెండేళ్ల నుంచి శనగ నిల్వలు 10 లక్షల క్వింటాళ్లు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతున్నాయి. 50 వేల మందికి పైగా రైతులు తమ శనగ నిల్వలను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కనీసం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవటంతో నష్టాలకు అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక శనగ రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఒంగోలుతో పాటు సంతనూతలపాడు, కొండపి, అద్దంకి, దర్శి, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలలో పాత శనగలు మగ్గుతున్నాయి. మద్దతు ధర కూడా లేక అవస్థలు... శనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5650 కూడా లేకపోవటంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల లోపే కొనుగోలు చేయటంతో కనీసం ఖర్చులు కూడా రావని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చివరకు కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలకు అద్దెలు కూడా కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూలీలకు, పెట్టిన పెట్టుబడులు చెల్లించేందుకు కొందరు రైతులు ఇచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి వచ్చే శనగకు దిగుమతి సుంకం తగ్గించి మోసం... విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దిగుమతి సుంకం 60 శాతం ఉండగా దాన్ని పది శాతానికి తగ్గించింది. దాంతో విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా శనగలు దేశంలోని మార్కెట్లకు చేరనున్నాయి. ఫలితంగా దేశీయంగా పండించిన శనగలకు ధర ఇంకా దారుణంగా పడిపోయే పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కల్పిస్తున్నాయి. ఇక్కడి శనగలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు దిగుమతి సుంకాన్ని తగ్గించకుండా చూడటంలో ఎలాంటి శ్రద్ధ చూపలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దిగుమతి సుంకం పెంచేందుకు పోరాటం... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలపై సుంకాన్ని పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రుల చుట్టూ తిరిగి, లేఖల మీద లేఖలు రాసి దిగుమతి సుంకం 30 శాతం ఉన్నదానికి 60 శాతానికి తీసుకెళ్లారు. దాంతో మన రాష్ట్రంలోని శనగ రైతులతో పాటు దేశంలో శనగ పండించిన రైతులందరికీ ప్రయోజనం చేకూరింది. శనగ రైతుకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత శనగ రైతుల కష్టాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. 2014 నుంచి 2019 మే నెల వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు శనగ రైతులను పట్టించుకోకపోవటంతో రైతులు పండించిన శనగలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసుకొన్నారు. దాంతో నష్టాలతో ఉన్న శనగ రైతులకు ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్నారు. ఆ విధంగా జిల్లాలోని దాదాపు 35 వేల మంది శనగ రైతులకు ప్రయోజనం చేకూరింది. దానికితోడు 2020 నుంచి బహిరంగ మార్కెట్లో జేజే రకం శనగలకు దాదాపు క్వింటా రూ.8 వేలకు పైగా ధర పలికింది. కాగ్–2 రకానికి రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర రావటంతో రైతులు ఎంతో సంతోషంగా పంట సాగు చేశారు.రాష్ట్రంలోని శనగ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు తగ్గించిన సుంకాన్ని పెంచాలని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా 50 నుంచి 60 శాతం వరకు సుంకాన్ని పెంచాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తిలు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్కు, పీయూష్ గోయల్కు లేఖలు రాశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏవిధంగానైనా శనగ రైతులను ఆదుకోవాలన్నదే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పోరాడుతోంది. జిల్లాలో ప్రధాన పంట శనగ..రెండేళ్ల నుంచి పండించిన శనగలకు మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయి. ఈ సంవత్సరం కూడా శనగ పంట చేతికి వచ్చే స్థితిలో విదేశాల నుంచి సుంకాలు లేకుండా దిగుమతి అవుతున్న శనగల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శనగ రైతులు నష్టపోతుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్వింటాకు రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 35 క్వింటాళ్లకు ఇచ్చి ఆదుకున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.1000 బోనస్ ప్రకటించాలి. – చుండూరు రవిబాబు, వైఎస్సార్సీపీ ఒంగోలు ఇన్చార్జ్ -
నగర కార్పొరేషన్లో ఏసీబీ తనిఖీలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఒంగోలు కార్యాలయ ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ రికార్డులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవటానికి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఆ స్కీంలో ఏమైనా అక్రమాలు చోటుచేసుకున్నాయా అన్న అంశంపై రికార్డులు పరిశీలించేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఒంగోలు ఏసీబీ సీఐలు బి.రమేష్ బాబు, సీహెచ్.శేషుల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్లోకి ప్రత్యేక ఏసీబీ బృందం ప్రవేశించింది. అప్పటి వరకు లోపల ఉన్న అధికారులను, సిబ్బందిని ఎవరినీ బయటకు పోనీయకుండా వాళ్ల వద్ద ఉన్న సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) పోస్టు ఖాళీగా ఉంది. ఏసీపీగా ఉన్న జెడ్.సుధాకర్ ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఏసీపీ అదనపు బాధ్యతలు టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) బాబూరావు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలోకి ప్రవేశించిన సమయంలో బాబూరావు తన చాంబర్లోనే ఉన్నారు. అధికారులు చేసిన సోదాల్లో ఇరువురు సిబ్బంది వద్ద ఒకరి వద్ద రూ.3 వేలు, మరొకరి వద్ద రూ.2 వేలు నగదు ఉంది. అవి సొంత ఖర్చుల కోసం దగ్గర పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టే సమయానికి నగర కమిషనర్ కే.వెంకటేశ్వరరావు ఎస్ఎస్ ట్యాంకులను పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలోనే ప్రత్యేక చాంబర్ ఉండే మున్సిపల్ సర్వేయర్ ఆవుల శ్రీనివాసరావు కూడా కార్యాలయంలో లేరు. బీపీఎస్ రికార్డుల పరిశీలన లోతుగా... ఏసీబీ అధికారులు బీపీఎస్ స్కీమ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రెగ్యులరైజ్ చేశారు.. ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి.. నగరంలో మొత్తం ఎన్ని అక్రమ భవనాలు ఉన్నాయి.. వాటిలో బీపీఎస్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఎన్ని.. కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా అన్న అన్ని కోణాల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. బుధవారం ఆయా రికార్డుల ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశీలించనున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్సైలు షరీఫ్, ప్రసాదుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎందరు పిల్లల్ని కనాలో బాబే చెబుతారా
● హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య ఒంగోలు టౌన్: ఎంత మంది పిల్లలను కనాలో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం మహిళల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే అత్యధిక జనాభాతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న మనదేశంలో ప్రజలకు సరైన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో పాలకులు వెనకబడ్డారని తెలిపారు. ఒకరిద్దరినే పోషించలేక ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. చేయడానికి పనులు లేవని, చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో అధికంగా పిల్లలను కనాల్సిందిగా చంద్రబాబు చెప్పడం తగదన్నారు. ఆర్ధిక వనరులను బట్టి భార్యాభర్తలు ఎంతమందిని కనాలో నిర్ణయించుకుంటారని, ముఖ్యమంత్రి ఇచ్చే రూ.25 వేల కోసం పిల్లలను కనమని చెప్పడం దారుణమన్నారు. దళిత పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం మాట్లాడుతూ ఉత్తర భారతంలో ఎక్కువ జనాభా ఉండడం వలన ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉన్నాయని, దక్షిణ భారతంలో తక్కువగా జనాభా ఉండడం వలన తక్కువ పార్లమెంటు సీట్లు ఉన్నాయని, ఈ కారణంతోనే చంద్రబాబు అధికంగా పిల్లలను కనమని చెబుతున్నారని వివరించారు. కేవలం పార్లమెంటు సీట్ల కోసమే పిల్లలను కనమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో హేతువాద నాయకులు ఎంకే బేగ్, షేక్ నజీర్ బాషా, గోరంట్ల పిచ్చయ్య, సుబానీ, ఎస్వీ రంగారెడ్డి, గుమ్మళ్ల నరసింహారావు పాల్గొన్నారు. -
ఎస్టీలను బహిష్కరించిన గ్రామస్తులు
● ఆలయం వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడంతో బహిష్కరించామంటున్న గ్రామస్తులు మార్కాపురం రూరల్: మండలంలోని మిట్టమీదపల్లె గ్రామంలో నివసిస్తున్న ఎస్టీ కులానికి చెందిన కుటుంబాలను గ్రామస్తులు బహిష్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లె గ్రామంలో కొందరు ఎస్టీలు గ్రామంలోని ఆలయాల వద్ద మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అయితే గ్రామస్తుల మాటలు వారు వినకపోవడంతో గ్రామంలోని మిగతా కులాలకు చెందిన వారు వారిని గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ శివారులో ఎస్టీలు నివసిస్తున్నారు. గ్రామ బహిష్కరణతో ఎస్టీలు గ్రామంలోకి నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలుకు వచ్చినప్పుడు వారికి ఎటువంటి వస్తువులు అమ్మరాదని మైకుల ద్వారా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వారికి అవసరమైన వస్తువులను అమ్మితే షాపు యజమానులకు ఫైన్ వేస్తామని హెచ్చరించారు. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన ఎస్టీలు తహశీల్దార్కు వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో తహశీల్దారుతో పాటు రూరల్ ఎస్సై మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని ఇరువురి మధ్య సమస్యను పరిష్కరించి రాజీ చేశారు. -
వడగాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: వడగాలులకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధిక ఉష్ణోగ్రతలతో చిన్నారులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలన్నారు. రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మిట్ట మధ్యాహ్నం వేళల్లో ఎండలో పనిచేయకుండా చూడాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాగునీటికి, పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీ ప్రదేశాల్లో వాహనదారులు నిలిచి ఉండే చోట నీడ కోసం షెడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి బోర్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోం మంత్రి వి.అనిత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్సు నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్తో పాటు డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ డీపీఎం మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఈఓ రేణుక, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ. నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్, భూగర్భ జల వనరులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
అదృశ్యమైన విద్యార్థి శవమై తేలాడు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రెండు వారాల కిందట కాలేజీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి కృష్ణానదిలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గొలమారి శివారెడ్డి, లక్ష్మీ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సాయికృష్ణారెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసి చైన్నెలో ఉంటుండగా చిన్న కుమారుడు సాయి నిహార్రెడ్డి(16) నిడమానూరులోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 19వ తేదీన నిహార్రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తాను పీఎన్బీఎస్ బస్టాండ్కు వెళ్లి వస్తాను, మీరు కాలేజీకి వెళ్లండి అని నిహార్రెడ్డి తన స్నేహితులకు చెప్పగా వారు కాలేజీకి వెళ్లారు. 20వ తేదీకి కూడా కాలేజీకి చేరుకోకపోవడంతో కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. వెంటనే కాలేజీ వద్దకు చేరుకుని సిబ్బందితో కలిసి పటమట పోలీస్స్టేషన్కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కృష్ణానదిలో భవానీద్వీపంలో ఒక బాలుడు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిహార్రెడ్డి తల్లిదండ్రులకు చూపించారు. గుర్తులు ఆధారంగా తన కుమారుడు నిహార్రెడ్డిగా నిర్ధారించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో వారం రోజుల కిత్రం చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. -
హత్య కేసులో పోలీసుల అదుపులో భర్త
బల్లికురవ: పథకం ప్రకారం భార్యను పొలంలోకి తీసుకెళ్లి సాగర్ కాలువలోని నెట్టేసిన భర్తను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సంతమాగులూరు సీఐ కె. వెంకటరావు, బల్లికురవ ఎస్సై వై. నాగరాజు తెలిపారు. మండలంలోని వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి వీరాంజనేయులు భార్య గంగాభవాని (28) గత మంగళవారం సాయంత్రం సాగర్ అద్దంకి బ్రాంచ్ కాల్వ 33/0 కి ఎగువన హత్యతో కాల్వలోకి నెట్టిన విషయం విదితమే. భవాని సోదరుడు కొనిదెన శ్రీను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ,ఎస్సైలు వివరించారు.


