Prakasam
-
పేదింటి విద్యా కుసుమం..
● 975 మార్కులతో ప్రతిభ చాటిన కత్తికిరణ్ సింగరాయకొండ: తల్లిదండ్రులు కూలి పనులు..పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. నాయనమ్మ దగ్గర ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ అత్యుత్తమ మార్కులు సాధించాడో పేదింటి విద్యార్థి. ప్రభుత్వం బుధవారం విడుదలచేసిన ఇంటర్ ఫలితాల్లో 975 మార్కులు సాధించి సత్తాచాటాడు. సింగరాయకొండ ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో కత్తి కిరణ్ సీనియర్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. తండ్రి శ్రీను, తల్లి శ్రీలక్ష్మి హైదరాబాద్లో కూలి పనిచేస్తున్నారు. నాయనమ్మ సుబ్బులమ్మ వద్ద సోదరి పల్లవితో కలిసి పాతసింగరాయకొండ పంచాయతీ నరసింహానగర్ కాలనీలో ఉంటున్నాడు. ప్రతిరోజు అన్న చెల్లెలు కలిసి వంట చేసుకుని కాలేజీకి నడిచి వెవెళ్లేవారు. కిరణ్కు నూరు శాతం హాజరు తోపాటు చదువు తప్ప ఇతర వ్యాపకాలు లేవని కాలేజి ప్రిన్సిపాల్ ఎం సౌజన్య తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 460 మార్కులు రాగా, పదో తరగతిలో 540 మార్కులు సాధించాడు. -
విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 20న జరిగే జోన్–4 విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అన్ని జోన్లలోనూ ప్రచార కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒంగోలు తర్వాత కడప, రాజమండ్రి, విశాఖపట్నంలలో ప్రచార కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలను 2029 ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు. 2019 నుంచి 2024 వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పేదలు, అట్టడుగు వర్గాలకు భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహామ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొవడమే కాకుండా ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడినా, చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామన్నారు. మరోసారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసి కూటమి అబద్ధాలను, కుట్రలను తిప్పికొడతామన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అబద్ధాలను తిప్పికొట్టేందుకు ప్రచార కమిటీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకు ఉమావల్లీ యాదవ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ తెలియజేసేలా ప్రచార కమిటీ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు తమ ముఖాన్ని చూపించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎల్లోమీడియా ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. జగనన్న వేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి పావనికుమారి, ప్రచార విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జిలానీ, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోండి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం: పట్టుసాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ విజయసునీత సూచించారు. మార్కాపురం పట్టు పరిశ్రమ కార్యాలయంలో బైఓల్టిన్ పట్టు పరిశ్రమ సాగుపై బుధవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టుసాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నాయని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. జిల్లాలో 480 మంది రైతులు 1200 ఎకరాల్లో పట్టుసాగు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సాధారణ పంటల కంటే పట్టు పంట సాగుద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం సబ్సిడీపై వచ్చిన యంత్ర పరికరాలను రైతులకు అందచేశారు. జిల్లా పట్టు పరిశ్రమ అధికారి సుజయ్కుమార్, అడిషనల్ డైరెక్టర్ అరుణకుమారి, శాస్త్రవేత్త ఇబ్రహీం బాషా తదితరులు పాల్గొన్నారు. ● రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి బేస్తవారిపేట: మోటారు సైకిల్ను కారు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలై మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం సమీపంలో హైవే రోడ్డుపై చోటుచేసుకుంది. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామానికి చెందిన కర్నాటి గురువారెడ్డి తన కుమార్తె వివాహ పెళ్లి పత్రికలు పంచేందుకు కంభంకు మోటారుసైకిల్పై వెళ్తున్నాడు. చింతపాలెం మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా బేస్తవారిపేట వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో గురువారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడికి భార్య మహాలక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బల్లికురవ: ఎమ్మెల్యేల పేరుతో నకిలీ కారు స్టిక్కర్లు తయారు చేస్తున్న వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ప్రభుత్వం జారీ చేసిన కారు స్టిక్కర్లను పోలిన నకిలీ స్కిక్కర్లు తయారు చేసి విక్రయిస్తున్న విజయవాడకు చెందిన చేబ్రోలు నాగరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి రెండు నకిలీ కార్ పాసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
జగనన్న పర్యటనతో మత్స్యకారులకు భరోసా
● మంత్రిగా ఉండి నువ్వేం చేశావ్.. ● మంత్రి స్వామిపై ఆదిమూలపు సురేష్ ధ్వజం సింగరాయకొండ: జగనన్న పర్యటనతో మత్స్యకారులకు ధైర్యం వచ్చిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించడంలో బాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. మత్స్యకారులు ప్రాణాలు తెగించి తమిళనాడు సోనాబోట్లను పట్టుకుంటే ప్రభుత్వంలో పెద్దలు కుట్రపన్ని వాటిని విడిపిపెట్టారని మండిపడ్డారు. పాకల గ్రామంలో 164 గ్రామాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు సమావేశం నిర్వహిస్తే మంత్రి స్వామి వారిని కనీసం పలకరించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జువ్వలదిన్నె జగనన్న పర్యటనకు వేలాది మంది మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివెళ్లారని, దాన్ని చూసి ఓర్వలేకే మంత్రి స్వామి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మారిటైం బోర్డు చైర్మన్ అంటూ మరో వ్యక్తి దందాలు, స్కాంలు చేసుకుంటూ ముందు ఒక కారు, వెనక ఒక కారు ఎస్కార్ట్ పెట్టుకుని అధికారం అనుభవిస్తూ కనీసం మత్స్యకారుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మీరిద్దరూ మత్స్యకారుల గురించి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి జగనన్న పర్యటనతో ఊపిరి వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నామని ఇలానే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో తిరిగేందుకు కూడా అవకాశం ఉండదన్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా లభించిందని పేర్కొన్నారు. జువ్వలదిన్నె హార్బర్తో పాటు తాను రాష్ట్రంలో తలపెట్టిన పది హార్బర్లకు మత్స్యకారులే హక్కుదారులని ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వం జువ్వలదిన్నె హార్బర్లో ప్రైవేట్ ఢిఫెన్స్ అకాడమీకి స్థలం కేటాయిస్తే తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కంపెనీని సాగనంపుతానని చెప్పారని, మత్స్యకారులకు ఇంతకంటే ఇంకేం భరోసా కావాలని సురేష్ మంత్రి స్వామిని ప్రశ్నించారు. మత్స్యకారులకు 2024–25 మధ్య పెండింగ్ బకాయిలు చెల్లించాలని, సముద్ర మత్స్యకార నియంత్రణ చట్టం 1994 సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జువ్వలదిన్నె హార్బర్లో మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తెచ్చిన తమిళ రాష్ట్రాల సోనాబోట్లను తరలించటంలో ప్రధానపాత్ర పోషించిన రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్రావు, ఐటీ మంత్రి నారాలోకేష్, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అకాల వర్షానికి కుదేలైన రైతులు
గత నెల చివర్లో కురిసిన వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఒక బేస్తవారిపేట మండలంలోనే 450 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పండించిన పంట చేతికందె దశలో మొక్కజొన్న పంట నేలపాలైంది. వారం రోజుల్లో కోత కోయాల్సిన పంట నేలపాలై రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. రెండు నెలల మొక్కజొన్న పంట బలమైన గాలులు, వడగడ్లకు విరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత రెండేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, ఇన్ఫుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం కానీ ప్రభుత్వం అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొరిగిన మొక్కజొన్న కంకులను మిషన్లతో తీసే పరిస్థితి లేకుండాపోయింది. కూలీల కొరత వేధిస్తుంది. రోజుకు ఒక్కో కూలీకి రూ.800 పెట్టి కంకులు కోయాల్సిన పరిస్థితి తలెత్తడంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నారుల మృతదేహాలతో రాస్తారోకో
యర్రగొండపాలెం: చిన్నారుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ముందు మృతదేహాలతో రాస్తారోకో చేశారు. మండలంలోని చిన్నబోయలపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము శశికుమార్, బోయలపల్లి దీపన్లు నీటి కుంటలోపడి మృతి చెందారు. ఈ సంఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు, ఆ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అక్రమంగా కాలనీకి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న నీటి కుంటను పూడ్చివేయాలని, చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని వారు కోరారు. దాదాపు 3 గంటలపాటు జరిగిన రాస్తారోకో వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, ఆందోళనను విరమించాలని సీఐ అజయ్ కుమార్ వారితో చర్చించారు. పరిస్థితి అదుపులో రాకపోవడంతో ట్రాఫిక్ను డైవర్షన్ చేసి వాహనాలను అటుగా వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతరం సీఐ ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపచేశారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
మార్కాపురం టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఏకలవ్య కాలనీలో జరిగింది. కాలనీలో నివాసముండే షేక్ మహబూబ్ సుభానీ (34) చికెన్ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యంతాగి భార్యతో గొడవ పెట్టుకోగా ఆమె పక్క బజారులో ఉండే పుట్టింటికి ముగ్గురు పిల్లలను తీసుకువెళ్లింది. మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చిచూడగా భర్త మహబూబ్ సుభానీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది. మృతుని భార్య ఇమాంబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణఎస్సై సైదుబాబు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వగ్రామం గుంటూరులోని నల్లచెరువు కాగా ఇక్కడికి వచ్చి నివాసముంటున్నాడు. మద్దిపాడు: మండలంలోని ఏడుగుండ్లపాడు సమీపంలో ఉన్న ఐచర్ షోరూం ఎదురుగా జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మద్దిపాడు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి లారీ డ్రైవర్ గానీ క్లీనర్ గానీ అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. టంగుటూరు: కారులో తరలిస్తున్న 7 కిలోల గంజాయిని ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపునకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీం బృందం టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కారులో గంజాయిని గుర్తించి వాహనాన్ని పరిశీలించగా 7 కిలోల గంజాయి లభ్యమైంది. కారులో ఉన్న ఐదుగురిని, కారుని అదుపులోకి తీసుకొని టంగుటూరు ఇన్చార్జి ఎస్సై మహేంద్రకు అప్పగించారు. అనంతరం యువకులను, గంజాయిని సింగరాయకొండ సీఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. -
వృద్ధురాలు సజీవ దహనం
ఒంగోలు టౌన్: రాత్రి తల్లి, కుమారుడికి మధ్య వాదన జరిగింది. తెల్లవారేసరికి ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు మంటల్లో కాలి సజీవ దహనమైంది. స్థానికుల కథనం ప్రకారం... ఒంగోలు నగరంలోని గద్దలగుంట రామాలయం వీధిలో అచ్చికాల వెంకట రమణమ్మ అనే వృద్ధురాలు పెద్ద కుమారుడు వెంకట కిషోర్ బాబుతో కలిసి జీవిస్తోంది. భర్త వెంకట రమణయ్య ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చాలా ఏళ్ల క్రితమే గుండెపోటుతో మరణించారు. చిన్న కుమారుడు వెంకట నారాయణ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి కాగా కొంత కాలం క్రితం సింగరాయకొండలో, అక్కడి నుంచి ఏడాదిన్నరగా ఒంగోలులోని గద్దలగుంటకు వచ్చి ఉంటున్నారు. పెద్ద కుమారుడు కిషోర్ బాబుకు వివాహమైంది. అతడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కిషోర్బాబు తల్లి వెంకట రమణమ్మ (80)తో కలిసి జీవిస్తున్నాడు. అయితే తరుచూ తల్లితో గొడవ పడడం, చేయిచేసుకోవడం చేస్తున్నాడు. సోమవారం రాత్రి కూడా తల్లితో గొడవపడ్డాడు. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజాము 5.30 గంటల సమయంలో ఇంట్లోంచి మంటలు వచ్చాయి. ఇంటి బయట కిషోర్ కేకలు వేస్తూ కనిపించాడు. నిద్రలోంచి తేరుకున్న ఇరుగు పొరుగు జనాలు కిషోర్ను ఏం జరిగిందని ప్రశ్నించారు. అమ్మ మంటల్లో కాలిపోతుందని చెప్పిన అతడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే వెంకట రమణమ్మ మంటల్లో మాడి మసైపోయింది. ఇళ్లంతా మంటలకు ఆహుతైపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఒన్టౌన్ పోలీసులు వెంకట రమణమ్మ మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. చైన్నె నుంచి వచ్చిన చిన్న కుమారుడు వెంకట నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద కుమారుడు కిషోర్బాబు తరచుగా తల్లితో గొడవ పడుతుండడం, సోమవారం రాత్రి కూడా తల్లితో ఘర్షణకు దిగడం, ఘటన జరిగిన తరువాత పారిపోవడంతో కుమారుడే నిప్పు పెట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి సీఐ నాగరాజును వివరణ అడుగగా వెంకట రమణమ్మ చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. తల్లితో కలిసి ఉంటున్న పెద్ద కుమారుడు కిషోర్ బాబు ఈ ఘటన జరిగిన తరువాత పారిపోయాడని, అతడు పోలీసులకు దొరికితే ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించింది. మంటల్లో సజీవ దహనమైన వెంకట రమణమ్మ (ఫైల్) మంటల్లో కాలిపోతున్న ఇల్లు కన్నకొడుకే నిప్పు పెట్టినట్లు స్థానికుల అనుమానాలు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
ఈ ఏడాది మత్స్య సంపద అంతంత మాత్రమే
ఈ ఏడాది మత్స్య సంపద అంతంత మాత్రంగా పడింది. పది నెలల పాటు వేట సాగితే వాతావరణం అంతగా అనుకూలించలేదు. వరుసగా తుఫాన్లు సంభవించడం, సముద్రం అలలు ఎగిసిపడి బోట్లు సముద్రంలోనికి వెళ్లడానికి వీలుకుదరకపోవడం, మోంథా తుఫాన్కు వేట సాగక అప్పుల పాలయ్యాం. ప్రభుత్వం ఈ ఏడాది మత్స్యకారులను ఆదుకోవాలి. మత్స్యకార భరోసా జాబితాను ఇంత వరకు తయారు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. విరామ సమయంలో సబ్సిడీ లోన్లు ఇస్తే వలలు కొనుగోలు చేసి తయారు చేసుకుంటాం. మత్స్యకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నా. – రాసాని మీరాసాహెబ్, కొత్తపట్నం విరామ సమయంలోనే మత్స్యకార భరోసా ఇవ్వాలి ప్రభుత్వం 61 రోజులు పాటు విరామ సమయం ప్రకటించింది. ఎండా కాలం కనుక ఎటువంటి పనులు ఉండవు. వేటకు వెళ్లే మత్స్యకారులు వేరొక పనులు చేసుకునే పరిస్థితి ఉండదు. నాకు బోటు ఉంది. బోటులో ఆరుగురు కళాసులు ఉంటారు. వారికి పది నెలలు పాటు ఉపాధి కల్పిస్తాను. వేట లేదు కనుక విరామ సమయంలో మత్స్యకార భరోసా ఇస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇంత వరకు మత్స్యకారులను గుర్తించలేదు. ఎంత మందికి ఇస్తారో తెలియదు. త్వరగా జాబితా తయారు చేసి మత్స్యకార భరోసా వెంటనే ఇవ్వాలి. – పీతా తిరుపాలు, కొత్తపట్నం -
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మొక్కజొన్న రైతు మొర ఆలకించేదెవరు? మొక్కజొన్న సాగు రైతులకు నష్టాలను మిగిల్చింది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొత్తపట్నం సముద్ర తీరంలో నిలిపి ఉంచిన బోట్లుకష్టాల కడలిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బతుకు నావ లాగుతున్న గంగపుత్రులను చంద్రబాబు ప్రభుత్వం వంచిస్తోంది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చాక వారిని అడుగడుగునా విస్మరిస్తోంది. సంద్రంలో చేపలవేట నిషేధ సమయానికిగాను మత్స్యకారులకు అందించాల్సిన జీవన భృతి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. ఇక మూడో ఏడు విరామ గంట మోగినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కాలేదు. మరో వైపు తమిళనాడు సోనా బోట్ల దాడులు, ప్రకృతి విపత్తులతో సతమతమవుతున్న మత్స్యకారుల ఘోష ప్రభుత్వానికిపట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 45 వేలమంది మత్స్యకారులు పడుతున్న అవస్థలు పాలకులకు పట్టడంలేదు. భృతి గంగపాలుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో సముద్రతీరం సుమారు 70 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉంది. తీరంలో 36 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 45 వేల మందికి పైగా జనాభా. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో సుమారు 7,500 మంది లబ్ధిదారులు మత్స్యకార భరోసాకు అర్హులుగా గుర్తించారు. వారికి రూ.15 కోట్ల భృతి చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం 2024 లో మత్స్యకార భరోసాను ఎగ్గొట్టింది. గత సంవత్సరం అందినప్పటికీ చాలామందికి భరోసా అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండో జాబితాలో ఇస్తానన్న చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫలితంగా 61 రోజులపాటు వేటకు దూరమైన మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మత్స్యకార భరోసా అందించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాక ముందు వేట విరామ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మొత్తాన్ని పెంచి ఒక్కసారిగా రూ.6 వేలు పెంచి రూ.10 వేలు ఇస్తూ వచ్చారు. భృతితో పాటు వివిధ రాయితీలు, సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కడలి పుత్రుల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. ఒడిదుడుకుల మధ్య చేపల వేట వరుస ప్రకృతి విపత్తులు ఒకవైపు... తమిళనాడు కడలూరు, పాండిచ్చేరి కరెక్కల్ సోనాబోట్ల దాడులతో చేపల వేట ఆశాజనకంగా లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తుఫాన్లు, అల్పపీడనాలు రావటంతో వేట సక్రమంగా సాగలేదని, ఒకవేళ వేటకు వెళ్లినా మత్స్య సంపద సక్రమంగా పడలేదని, చివరికి ఖర్చులు కూడా రాలేదని వాపోయారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు, పాండిచ్చేరి కరైకల్కు చెందిన సోనాబోట్లు తీరంలో విధ్వంసం సృష్టిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. భారీ బోట్లు, మారణాయుధాలతో దాడులకు పాల్పడి వలలను ధ్వంసం చేసి విలువైన సంపదను దోచుకెళ్తున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. ఈ బోట్ల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వలలు ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లినా స్పందన కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో తాము ప్రాణాలకు తెగించి పాండిచ్చేరి కరైకల్కు చెందిన నాలుగు సోనాబోట్లు పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచామని, అయితే వాటిని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు కుట్రలు చేసి వదిలేశారని ఆరోపించారు. వారితో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకుని బోట్లను వదిలేసి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారులకు తీరని ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు వదిలేసింది బీదా, అధికార పార్టీ నాయకులేనని ఇటీవల పాకలలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు హాజరైన సమావేశంలో స్పష్టమైంది. నెల్లూరు జిల్లా ఇస్కపాలెం మత్స్యకారులు ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చి బోట్లను వదిలేశారని ఈ సమావేశంలో తేలింది. ఇది జరిగి ఐదు రోజులు కావస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్లు వదిలేసిన ఘటనపై మంత్రులతో కమిటీని వేశామని, నాలుగు పెట్రోలింగ్ బోట్లను ఏర్పాటు చేసి తీరంలో పహారా కాస్తున్నామని మభ్యపెడుతున్నారని గత వారంలో కూడా సోనాబోట్లు తీరానికి దగ్గరగా వేట సాగించాయని, తమపై తమిళనాడు జాలర్లు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సోనాబోట్లను అడ్డుకునేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కొంతమేర కృషి చేశాయని, కానీ ప్రస్తుత పెద్దలు మాత్రం ఎంతసేపటికీ మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్లో అధికార పార్టీకి బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఆ బోట్లను వదిలేయడంతో తిరిగి దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. వేట విరమం సమయం ప్రారంభం కావడంతో మత్స్యకారులు పడవలు, వలలను తీరానికి చేర్చారు. తీరానికి లంగరు వేశారు. సముద్రంలో వేట నిషేధం గంట మోగింది. అయినా మత్స్యకార భరోసా లబ్ధిదారులు జాబితా సిద్ధం కాలేదని జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం లబ్ధిదారులు జాబితా అధికారులు సిద్ధం చేసేదెప్పుడో.. మాకు డబ్బులు విడుదల అయ్యేదెప్పుడో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు మాత్రం ఈనెలాఖరుకు సిద్ధం చేస్తామని చెబుతున్నారు. అయితే మత్స్యకారులు ఆన్లైన్లో నమోదు చేసుకునేదెప్పుడు ఆ జాబితాను అధికారులు పరిశీలించేందుకు ఎంత సమయం పడుతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ సిద్ధమయ్యే నాటికి వేట విరామ సమయం కూడా ముగిసిపోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వేట నిషేధకాలం రాకమునుపే సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మూడు రోజులుగా చేపల వేటకు వెళ్లలేదని మత్స్యకారులు చెప్తున్నారు. ఈ సారి కాలయాపన చేయకుండా భరోసాను వెంటనే విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
మొక్కజొన్న రైతు మొర ఆలకించేదెవరు..!
చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతపై కక్ష కట్టింది. సాగు ప్రారంభం నుంచి పంట అమ్మకం వరకు ఏ దశలోనూ అన్నదాతకు అండగా ఉండటం లేదు. ఫలితంగా రైతులు పంటను నష్టానికి దళారులకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు సాగు చేసే రైతులకు చివరకు నష్టాలే మూటగుట్టుకుంటున్నారు. బేస్తవారిపేట: చంద్రబాబు పాలనలో సాగుకు ప్రోత్సాహం అందడం లేదు. ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తామంటూ కల్లబొల్లి హామీలిచ్చిన బాబు..అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా పంటలకు గిట్టుబాటు ధరలు కరువై రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెరిగిన సాగు విస్తీర్ణం.. మొక్కజొన్న పంట తక్కువ సమయంలో పంట చేతికందుతుంది. 110 నుంచి 130 రోజుల్లో పంట అందుబాటులోకి వస్తుంది. గత ఏడాది రైతులు పండించిన ఏ పంటలకు సరైన గిట్టుబాటు ధర అందలేదు. తెగుళ్లతో పంటలు చేతికందలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులు కొంతమేర ఉపశమనం పొందారు. దీంతో ఈ ఏడాదిలో మొక్కజొన్న సాగుపై రైతులు దృష్టి పెట్టారు. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో 4752 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేయాల్సి ఉండగా 19,052 హెక్టార్లలో సాగు చేశారు. మద్దతు ధరకు మంగళం క్వింటా మొక్కజొన్నకు గతంలో రూ.2400 మద్దతు ధరగా ఉండేది. కానీ జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతుల బాధ వర్ణణాతీతం. ఎలాంటి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్, రవాణా చర్యలు చేపట్టకపోవడంతో వ్యాపారులు అడిగిందే అన్నట్లుగా పరిస్థితి మారింది. చివరకు వ్యాపారులకు క్వింటా రూ.1600–రూ.1700కు విక్రయించుకునే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వింటా రూ.2500 వరకు ధర పలికింది. అప్పటితో పోల్చుకుంటే ధర మరికొంత పెరగాల్సి ఉంది. భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి. వీటికి తోడు మొక్కజొన్న కంకులు కోసేందుకు ఎకరాకు రూ.2500 నుంచి రూ.3 వేలు ఖర్చవుతుంది. మిల్లు ఆడించేందుకు మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఇక కౌలు రైతులైతే అదనంగా ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు కౌలు చెల్లించాల్సి వస్తోంది. పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీతో పాటు కౌలు చెల్లించాల్సి రావడంతో దళారులు అడిగిన రేటుకు రైతులు తెగనమ్ముకుంటున్నారు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు: ఏడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. అకాల వర్షాలు, వడగండ్ల వానకు పొలంలోని మొక్కలన్నీ నేలకొరిగాయి. కోత కోసేందుకు మిషన్ కూడా రావడం లేదు. రైతులందరిదీ ఇలాంటి పరిస్థితే. కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. – కంకర వెంకటరెడ్డి, ఆర్ కొత్తపల్లె. నష్టాలు మిగిల్చిన మొక్కజొన్న సాగు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం నష్టానికి దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులు పెరిగిన సాగు, కోత ఖర్చులు -
కూటమి విఫలం
మత్స్యకారులకు భరోసా కల్పించటంలో సింగరాయకొండ: మత్స్యకారులకు భరోసా కల్పించటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వారికి భరోసా కల్పించడమే జగనన్న జువ్వలదిన్నె పర్యటన ముఖ్య ఉద్దేశమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న జువ్వలదిన్నెకు ఎందుకు వస్తున్నాడో తెలపాలని మంత్రి స్వామి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో వారిని ఆర్థికంగా పరిపుష్టి చేసే అంశంలోను, వారికి జీవనోపాధులు కల్పించి భరోసా ఇవ్వటంలోను పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సోనాబోట్ల నుంచి భద్రత కల్పించటంలో విఫలమైందని, తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన సోనాబోట్లు నాలుగు జిల్లాల మత్స్యకారుల పొట్టకొడుతుంటే కాపాడలేని స్థితిలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన అని అన్నారు. తీరంలో అక్రమంగా వేట సాగిస్తున్న సోనాబోట్లను మత్స్యకారులు నిర్బంధిస్తే వారికి అండగా ఉండాల్సిన అధికార పార్టీ నాయకులు ఆర్థిక స్వలాభం కోసం డబ్బుకు లొంగి వాటిని విడిపించారన్నారు. అందులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్రావు, ఇతర నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీ సముద్ర నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఆ నిబంధనల ప్రకారం మత్స్యశాఖ, రెవెన్యూ, నేవి, కోస్ట్గార్డు, కోస్టల్ ప్రొటెక్షన్ మధ్య సమన్వయం కల్పించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సోనాబోట్లు అక్రమంగా ప్రవేశించకుండా తీరప్రాంత గస్తీని పెంచాలన్నారు. వేట నిషేధకాలంలో బే షరతుగా అన్ని రోజులకు నష్టపరిహారం, పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి, సుస్థిరమైన జీవనోపాధులు కల్పించటంలో కృషి చేయాల్సింది పోయి వీటన్నింటినీ విస్మరించిన మంత్రి స్వామి, ప్రోటోకాల్ అనుభవిస్తూ కాలం గడుపుతున్న మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇద్దరూ మత్స్యకారులను గాలికొదిలేశారని ఆరోపించారు. జువ్వలదిన్నె హార్బర్ 2004 లో వైఎస్సార్ హయాంలో మంజూరైందని, దీనిపై చర్చకు సిద్ధమని సురేష్ ప్రకటించారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచి మంత్రి పదవి అనుభవిస్తున్న మంత్రి స్వామి ఈరోజు మత్స్యకారుల బాగోగులు పట్టించుకోకపోవటం దారుణమని, ఇందుకు నైతిక బాధ్యతగా తక్షణమే రాజీనామా చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. జగనన్న రాకతో మత్స్యకారులకు ఓదార్పు కలుగుతుందని, వారికి పూర్తి భరోసా కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకే జగన్ పర్యటన మత్స్యకారులకు అండగా నిలబడని మంత్రి స్వామి రాజీనామా చేయాలి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ -
గుండెలవిసేలా..మృత్యు వేదన
యర్రగొండపాలెం: ‘‘నా కుమారుడు బాగా చదువుకోవాలని ఇంటి దగ్గర వదిలి మేము మిరప కోతలకు వెళ్లాం.. చివరకు మాకు శాశ్వతంగా దూరమయ్యాడు’’ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మండలంలోని చిన్నబోయలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము శశికుమార్(12), బోయలపల్లి దీపన్(10)లతోపాటు మరో ఇద్దరు చిన్నారులు బంటు, రోహన్లు మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా తమ కాలనీకి సమీపంలో ఉన్న అరటి తోట వద్దకు వెళ్లారు. ఆ తోటలో తిరుగుతున్న సమయంలో కాళ్లకు బురద అంటుకోవడంతో దానిని శుభ్రం చేసుకునేందుకు ఆ చిన్నారులు నీటి కుంట వద్దకు వెళ్లారు. అక్కడ శశికుమార్, దీపన్లు కాళ్లు కడుక్కుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి ఆ కుంటలోపడి మునిగి మృతి చెందారు. దాదాపు రెండు నెలల క్రితం చదువుకుంటున్న శశికుమార్ను తన జేజయ్య వద్ద వదిలిపెట్టి తల్లిదండ్రులు కొమ్ము బొల్లి కొండయ్య, పెద్దమరికుమారి మిరప కోతల కోసం పల్నాడు జిల్లా గురజాల మండలంలోని దయిదకు వెళ్లారు. పెద్దకుమారుడు పెద్దారవీడు మండలంలోని వైడీపాడులో హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుకుంటున్నాడు. మరో చిన్న కుమార్తెను తమ వెంట తీసుకొని వెళ్లారు. తమ కుమారుడు నీట మునిగాడన్న సమాచారం తెలుసుకున్న వారు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి పేరుతీసుకొని వస్తాడన్న ఆశతో ఉన్న వారికి విగతజీవిగా కనిపించడంతో తల్లడిల్లిపోయారు. తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదని, వారు పెద్ద చదువులు చదవాలన్న ఉద్దేశంతో తమ పిల్లలను పనికి పిలుచుకొని వెళ్లకుండా బడిలో చేర్పించామని వారు గుండెలు బాదుకుంటూ కూలబడితే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరంకాలేదు. ఒక్కగానొక్క కుమారుడు కనిపించని లోకాలకు వెళ్లాడు.. ఒక్కగానొక్క కుమారుడు కనిపించని లోకాలకు వెళ్లాడని తెలిసిన దీపన్ తల్లిదండ్రులు బోయలపల్లి మరియదాసు, ఎస్తేరు కన్నీరు మున్నీరయ్యారు. ఆ ఇంటికి దీపన్ పెద్ద కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. దీపన్ మృతిని వారు తట్టుకోలేక ఆ దేవుడు మా ఇంటి దీపాన్నే ఆర్పేశాడని, ఇంకా తాము బతికేదెట్లా అంటూ రోదించారు. వారు ఒక సందర్భంలో స్పృహతప్పి పడిపోయారు. తాము కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా తమ కుమారుడు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని యర్రగొండపాలెంలోని ఒక ప్రైవేటు స్కూల్లో చేర్పించామని వారు ఆవేదన చెందారు. ఎమ్మెల్యే తాటిపర్తికి కంటతడి పెట్టించిన రోదనలు నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు శశికుమార్, దీపన్లు మృతి చెందారన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరారు. అక్కడ మార్చురీ వద్దకు వెళ్లి చిన్నారుల మృతదేహాలను చూసిన ఆయన తీవ్రంగా కలతచెందారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలకు ఎమ్మెల్యే కళ్లు చెమర్చటం కనిపించింది. వెనువెంటనే ఆయన అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి ఆ చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మానవత్వం చాటుకున్న పోలీసులు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. చిన్నారులు నీట మునిగిన సమాచారం అందుకున్న సీఐ అజయ్ కుమార్, ఎస్సై దేవ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారులను వెంటనే బయటికి తీస్తే బతికే అవకాశం ఉందన్న ఆశతో సీఐ క్షణం ఆలస్యం చేయకుండా నీటి కుంటలో దిగి చిన్నారులను వెతకడం మొదలు పెట్టారు. ఆ స్ఫూర్తితో గ్రామస్తులు కొంతమంది కుంటలో దిగి గాలింపు చేపట్టారు. చిన్నారులను నీటిలో నుంచి బయటికి తీసిన వెంటనే వారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వచ్చి పరీక్షలు చేయించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందారని డాక్టర్లు నిర్ధారించడంతో పోలీసులు తీవ్రంగా కలతచెందారు. -
కులం లేని సమాజం కోసం అంబేడ్కర్ పోరాటం
యర్రగొండపాలెం: కులంలేని సమాజం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన చివరిశ్వాస వరకు పోరాడారని, చదువులే దేశాభివృద్ధికి పాటుపడతాయని భావించిన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు దళిత నాయకుడు సింగా ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ నాటి పరిస్థితులను గమనంలోకి తీసుకొని అంబేడ్కర్ దళితుల కోసం అనేక పోరాటాలు చేశారని, ప్రపంచం మెచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించి సమసమాజం కోసం కృషి చేశారని అన్నారు. ఏపీలో కారంచేడు, నీరుకొండ, చుండూరులలో దళితులను ఊచకోతలు కోసిన సంఘటనలు చూశామని, ఈ సంఘటనలు అన్నీ ఏ ప్రభుత్వంలో జరిగాయో గమనించాలని ఆయన అన్నారు. అటువంటి రాష్ట్రంలో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి దళితులను గౌరవించి, ప్రభుత్వంలో భాగస్వాములు చేసి, చట్టసభలకు పంపించారని, పంటపై, చదువులపై, ఉద్యోగంపై హక్కు కల్పించారన్నారు. ఆ పంథానే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎంచుకున్నారని, రాష్ట్రం నడిబొడ్డులో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు దళితుల పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుందన్నారు. దళితులు అయిన వారు చర్చిలకు వెళ్లి క్రిస్టియానిటీని తీసుకుంటే వాళ్లను దళిత క్రైస్తవులుగా, ఎస్సీలుగా ఉంచే బాధ్యత నాది అని ప్రస్తుతం రాష్ట్రంలో పెత్తనం చెలాయిస్తున్న చంద్రబాబు మూడు ఎన్నికల్లో చెప్పాడని, తన మ్యానిఫెస్టోలో కూడా పెట్టాడని, కానీ ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడటంలేదని ఆయన విమర్శించారు. రాజ్యసభ సీట్లు కూడా తన వర్గీయులకే కేటాయిస్తున్నారని, అటువంటి పరిస్థితి జగన్మోహన్రెడ్డి కల్పించలేదని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఎస్టీలు తమ సంఘ భవనం నిర్మించుకోవటానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కేటాయించిన స్థలాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవటానికి కేటాయిస్తున్నారని తెలిసిందని, అటువంటి పరిస్థితి లేకుండా ఎస్టీ భవన్ నిర్మాణానికే కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ భవన్ నిర్మించుకోవటానికి స్థల సేకరణ కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముందుగా స్థానిక బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, తెలంగాణ ప్రజా గాయకుడు చుక్క రామనరసయ్య, దళిత నాయకులు సీహెచ్ విజయభాస్కర్, బి.వెంకటేశ్వర్లు, ఎం.బాలగురవయ్య, తోకల ఆవులయ్య, వెంకటేశ్వర్లు నాయక్, జబీవుల్లా, ఉప్పలపాటి రమేష్, ఆరుణాబాయి, రాములు నాయక్, వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దళితులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసింది వైఎస్సార్ తండ్రి పంథాలో నడిచిన జగనన్న ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం: అగ్నిప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయసునీత అన్నారు. స్థానిక అగ్నిమాపకశాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విధి నిర్వహణలో అగ్నిప్రమాదాల్లో ప్రాణాలుకోల్పోయిన ఉద్యోగులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా అపార్ట్మెంట్లు, స్కూళ్లు, కాలేజీలు, పెట్రోల్బంకులు, గ్యాస్ గోడౌన్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు వారి ప్రాణ, ఆస్తి నష్టం నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయంలో మొక్కలను నాటారు. ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం...మండలంలోని యరజర్ల గ్రామానికి చెందిన మల్లవరపు పేరయ్య (60) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఒంగోలు వస్తున్నాడు. వెంగముక్కలపాలెం సమీపంలోకి రాగానే వాహనాన్ని రోడ్డు పక్కన నిలబెట్టి ఆగాడు. అదే సమయంలో అక్కడ ఉన్న టిప్పర్ వాహనం రివర్స్ చేసుకుంటూ పేరయ్యపై నుంచి వెళ్లింది. దీంతో టిప్పర్ కింద పడి పేరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేడ్కర్కు నివాళులర్పిస్తున్న చెవిరెడ్డి, వెంకాయమ్మ, చుండూరి, బత్తుల, పార్టీ నాయకులుఒంగోలు సిటీ: సువిశాల భారతావనికి, ప్రజాస్వామ్య లౌకిక దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. ఆయన స్ఫూర్తితో మా పార్టీ పని చేస్తుందని చెప్పారు. మహనీయుడు అంబేడ్కర్ బాటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగుల సంక్షేమానికి కృషిచేశారన్నారు. నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి.దేవప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని, పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పాటు పడ్డారని అన్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి విజయవాడలో అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అలాగే పేదల సంక్షేమానికి జగన్ నిరంతరం కృషి చేశారని చెప్పారు. సమ సమాజ స్థాపనకు భారతరత్న అంబేడ్కర్ పాటు పడ్డారని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యుత్తమ స్థానంలో ఉంచిందని ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఆదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోపిచంద్, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమణయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి యరిజర్ల రమేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు యోహాను, కరుణాకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ సాయం లేకున్నా.. వ్యవసాయమే చేస్తాం..!
ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో కనపర్తి ఎత్తిపోతల పథకం కింద కనపర్తి, వినోదరాయునిపాలెం, దాసరివారిపాలెం, అమ్మనబ్రోలు, దేవరంపాడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. సుమారు లక్షా 60 వేల క్వింటాల వరిధాన్యం దిగుబడి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాగాణి రైతులకు వరి ధాన్యం రాసులపై కప్పుకునేందుకు ప్లాస్టిక్ పరదాలు, ధాన్యం నింపుకునేందుకు ఎకరాకు 80 నారగోతాలు అందజేశారు. దాంతో పాటు ఎలాంటి తరుగు, దళారుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైస్థాయిలో ప్రచారాలు, ఆర్భాటాలు మినహా క్షేత్రస్థాయిలో ఆచరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులు చేతులు దులుపుకున్నారు. గిట్టుబాటు ధర గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర క్వింటాకు రూ.2,437 కాగా, ఆ ధర ప్రకారం నామమాత్రంగా 20 నుంచి 25 లారీలు మాత్రమే కొనుగోలు చేసి వదిలేశారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు ధరలను భారీగా తగ్గించి క్వింటా వరి ధాన్యాన్ని రూ.1,500 నుంచి రూ.1,600కు కొనుగోలు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యాన్ని నిల్వ చేసుకోలేక, పెట్టుబడులకు వడ్డీలు కూడా పెరుగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో తక్కువ ధరకు తెగనమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా, ఈ సంవత్సరం వరి రైతులకు ప్లాస్టిక్ పరదాలు, నారగోతాలు (గన్నీ బ్యాగులు) కూడా కూటమి ప్రభుత్వం అందజేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో 8 నుంచి 10 కేజీల తరుగు తీసివేసి కొనుగోలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అంతేగాకుండా ధాన్యం బస్తాల తరలింపునకు లారీ ట్రాన్స్పోర్టు చార్జీలు కూడా రైతులే భరించాలని చెప్పడం వంటివి అన్నదాతలు, వ్యవసాయం పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. వ్యవసాయానికి సర్కార్ సాయం చేయకపోగా.. రైతులకు నష్టం కలిగించేలా నిబంధనలు విధించడం దారుణమని రైతుల సంఘాల నాయకులు మండిపడుతున్నారు. – సాక్షి, ఒంగోలు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వ్యవసాయం చేసేందుకు కనీస సహాయ సహకారాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతల కోసం అమలు చేసిన పథకాలన్నింటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక పాడె కట్టింది. ఎన్నికల హామీలను సైతం విస్మరించింది. రైతన్న సంక్షేమాన్ని తుంగలో తొక్కింది. వ్యవసాయంపై చంద్రబాబు చేస్తున్న కుట్రలను అధిగమించి మరీ ఆరుగాలం శ్రమించి కష్టనష్టాలకోర్చి అన్నదాతలు పంటలు పండిస్తూనే ఉన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. తమకు తెలిసింది పంటలు పండించడం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఒంగోలు, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాల్లో సాక్షి కెమెరా క్లిక్మనిపించిన ఈ దృశ్యాలే అందుకు నిదర్శనం. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గిద్దలూరు రూరల్: శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన బొల్లాని పోలయ్య(60) భార్య అల్లూరమ్మతో ఘర్షణ పడుతూ మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 80 శాతం మేర శరీరం కాలిపోయిన పోలయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూల్కు తరలిస్తుండగా నంద్యాల సమీపంలో మృతి చెందాడు. పోలయ్యకు మొదటి భార్య రమణమ్మతో ముగ్గురు కుమారులు, రెండో భార్య అల్లూరమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదటి భార్యతో 20 ఏళ్ల క్రితమే క్రితమే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తరువాత అల్లూరమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన రేపు
నెల్లూరురూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించనున్నారని జిల్లా పార్టీ నాయకులు సోమవారం తెలిపారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మత్స్యకారులందరూ హాజరు కావాలని కోరారు. ఉదయం 9.45 గంటలకు జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని, 10.30 గంటలకు ఫిషింగ్ హార్బర్కు వస్తారన్నారు. ఫిషింగ్ హార్బర్ను పరిశీలించాక.. 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారన్నారు. ఒంగోలు సిటీ: దేశవ్యాప్తంగా చేపట్టిన ఎఫ్ఎల్ఎస్–2026 సర్వే జిల్లాలోని 15 పాఠశాలల్లో నిర్వహిస్తున్నారని, సర్వే నిర్వహణపై డైట్ విద్యార్థులకు (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్)కు సోమవారం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. శాంపిల్ సర్వే ఎలా చేయాలి, డేటా సేకరణ విధానం ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్రంగా వివరించారు. ఈ సర్వేలో తెలుగు, ఇంగ్లిషు, గణితం వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ట్యాబ్లో నమోదు చేయనున్నారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు, డీసీఈబీ సెక్రటరీ శ్రీనివాసరావు, చీమకుర్తి ఎంఈఓ శివాజీ, ఏఎంఓ నాయక్, బాపట్ల ఏఎంఓ, ఒంగోలు ఎంఈఓ టి.కిషోర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. సీఎస్పురం(పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో నారాయణస్వామివారి రథోత్సవం సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి మూల విగ్రహమూర్తికి అర్చకులు మంకాల శివప్రసాద్శర్మ అభిషేకం, విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ గిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ, భక్తులు పాల్గొన్నారు. -
పోలీసు స్పందనకు 74 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు బాధితులు ఎస్పీ హర్షవర్థన్రాజును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఆయా ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వృద్ధులు, మహిళలతో గౌరవంగా ప్రవర్తించాలని, వారు చెప్పే సమస్యలను శ్రద్ధగా వినాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ప్యానల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, వేదిక ఎస్సై జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 39 అర్జీలు వచ్చినట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి అర్జీదారులు వివిధ సమస్యలపై ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందజేశారు. అత్తారింటి వేధింపులు, కుటుంబ కలహాలు, భూ వివాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు డీఎస్పీ చెప్పారు. అర్జీలపై వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్, ఎస్సైలు, సీఐలకు ఫోన్చేసి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. మార్కాపురం, పామూరు, కంభం సీఐలు సుబ్బారావు, వినోద్కుమార్, మల్లికార్జునరావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
మహిళ పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు
మార్కాపురం టౌన్: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి తిరునాళ్లలో ఓ మహిళ ఆటోలో బ్యాగు మర్చిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే కనుగొని ఆ బ్యాగును, అందులో ఉన్న బంగారం, నగదును సదరు మహిళకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. మార్కాపురం సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతునిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన బొమ్మనబోయిన జ్యోతి మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి తిరునాళ్లు చూసేందుకు ఇటీవల పట్టణంలోని తన పుట్టింటికి వచ్చింది. తిరునాళ్ల అనంతరం ఆదివారం రాత్రి అత్తగారి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరి బస్టాండుకు చేరుకుంది. హడావిడిలో తన బ్యాగును ఆటోలో మర్చిపోయింది. బస్టాండ్లోకి వెళ్లిన కొద్దిసేపటికి బ్యాగు గుర్తుకొచ్చి ఆటోలో మర్చిపోయిన విషయంపై వెంటనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ సుబ్బారావు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించి డ్రైవర్ను స్టేషన్కు పిలిపించి బ్యాగు అప్పగించారు. అందులో 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.4,200 నగదు, చీరలు ఉండటంతో పోలీసులకు జ్యోతి కృతజ్ఞతలు తెలిపింది. -
నీటి సంరక్షణపై దృష్టి సారించండి
మార్కాపురం: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని నీటిపారుదలశాఖ, ఉపాధి హామీ అధికారులు, ఎంపీడీఓలతో సోమవారం జలధార, జల హారతి కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో చేపట్టనున్న పనులపై నివేదిక ఇవ్వాలన్నారు. అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులు చేపట్టి నీటి సంరక్షణకు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూద్ అలీమ్, నీటిపారుదలశాఖ ఈఈ భాస్కర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ: కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడి పోక్సో కేసు నమోదైన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం స్థానిక కోర్టు లో హాజరుపరచినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. జడ్జి డాక్టర్ వి.లీలా శ్యాంసుందరి నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అక్షరం చిగురుటాకై !
విద్యార్థుల భవిష్యత్కు బంగరు బాటలు వేసే గురువులు కీచకులుగా మారుతున్నారు. పసిబిడ్డల దేహాలను తమ వికృత కోరికలకు బలిచేస్తూ, ఉపాధ్యాయ వృత్తికే వాళ్లు కళంకం తెస్తున్నారు. విద్యావనంలో కలుపు మొక్కలుగా మారుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని సర్కార్ పాఠశాలల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలు 16 చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి మొక్కుబడిగా సస్పెండ్ చేసి తిరిగి పోస్టింగ్లు ఇచ్చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతున్న వారికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలబడడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలు అఘాయిత్య కేంద్రాలుగా మారడంతో బాలికలు సర్కార్ స్కూళ్లకు వెళ్లాలంటే భయపడిపోయే పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలపై లైంగిక దాడులు పెచ్చుమీరిపోయాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 16 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. జిల్లాలో అత్యధికంగా కురిచేడు మండలంలో 6, సింగరాయకొండ మండలంలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్క సింగరాయకొండ మండలంలోనే నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసులు నమోదయ్యాయి. అలాగే అర్ధవీడు, కొనకనమిట్ల, కనిగిరి, మద్దిపాడు, టంగుటూరు, పొన్నలూరు తదితర మండలాల్లోని స్కూళ్లలో విద్యార్థినులపై టీచర్లు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన తమ బిడ్డ స్కూలుకు వెళ్లి చదువుకుంటుందన్న భరోసాతో తల్లిదండ్రులు ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు పాఠశాలకు వెళ్లిన తమ బిడ్డకు ఏం జరుగుతుందోనన్న దిగులుతో వణికిపోతున్నారు. బాధిత కుటుంబాలపై ఒత్తిడి... ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన ఉపాధ్యాయులు బాధిత కుటుంబాలపై ఒత్తిడి చేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత నామమాత్రంగా విచారణ జరుపుతున్న విద్యాశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. ఈలోపు బాధితులతో రాజీ చేసుకునేందుకు పచ్చ ముఠా రంగంలోకి దిగుతోంది. పాలక జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఉదంతాన్ని ఇందుకు నిదర్శనంగా చూపవచ్చు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను పోక్సో కేసులో అరెస్టు చేశారు. దాంతో విద్యాశాఖ వారిని సస్పెండ్ చేసింది. మరో టీచర్ని బదిలీ చేసింది. అయితే బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చిన కీచక ఉపాధ్యాయుడు తనను వేధించలేదని ఒక లెటర్ రాయించుకొని మరీ తీసుకొచ్చాడు. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత తప్పుడు కేసుగా కొట్టివేసేందుకు బాధిత కుటుంబాన్ని కోర్టులో హాజరుపరిచారు. ఎవరూ ఊహించని విధంగా కోర్టులో కూడా సదరు విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు తనను లైంగికంగా వేధించినట్లు చెప్పింది. దాంతో ఉపాధ్యాయుడిని అరెస్టు చేయక తప్పలేదు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. నేరం చేసిన ఉపాధ్యాయుడు కోరిన చోట పోస్టింగ్... సాధారణంగా ఒక ఉపాధ్యాయుడు నేరం చేసినప్పుడు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయడం మామూలే. సదరు ఉపాధ్యాయుడికి మళ్లీ పోస్టింగు ఇచ్చే సమయంలో పాత స్కూలులో పోస్టింగు ఇవ్వకూడదని నిబంధనలున్నాయి. కేసుపై ప్రభావం చూపకుండా సదరు ఉపాధ్యాయుడిని కేటగిరీ 4 పాఠశాలలకు బదిలీ చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ నిబంధనలను తుంగలోకి తొక్కుతోంది. పోక్సో లాంటి తీవ్రమైన నేరాలలో అభియోగాలు అనుభవిస్తున్న వారికి కోరిన చోటకు పోస్టింగులు ఇవ్వడంపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. జిల్లాలో ఒకరిద్దరు ఉపాధ్యాయులకు పాత పాఠశాలకే రీ పోస్టింగు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోక్సోతో పాటుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మద్దిపాడు మండలం వెల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సస్పెండ్ అయిన ఒక ఉపాధ్యాయుడికి తిరిగి అదే స్కూల్లో పోస్టింగు ఇచ్చినట్లు సమాచారం. కనిగిరి జిల్లా పరిషత్ హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు 2025, మార్చి 23న సస్పెండ్ కాగా సీఎస్పురం జెడ్పీ హైస్కూల్లో పోస్టింగు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెల్లపాడు జెడ్పీ హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయగా పాకల జెడ్పీ హైస్కూలులో పోస్టింగు ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో స్కూలు అసిస్టెంట్గా పనిచేస్తున్న అధికార టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడిని 38 రోజులు తిరగకుండానే కొత్తపట్నం మండలం ఈతముక్కలలో పోస్టింగు ఇచ్చారు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఫిజికల్ డైరక్టర్ను సస్పెండ్ చేసి తిరిగి ఉలవపాడు మండలం రామాయపట్నం జెడ్పీ హైస్కూలులో పోస్టింగు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారని, అధికార పార్టీ నాయకులే కీచకులకు ఎలా అండగా నిలుస్తారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీచక ఉపాధ్యాయులకు టీడీపీ నేతల అండ... ఆడపిల్లలకు ఏదైనా జరిగితే వారికి అదే చివరి రోజవుతుందని ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన కూటమి నాయకులు గెలిచి గద్దెనెక్కిన తరువాత నిందితులకు అండగా నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక దాడులకు పాల్పడిన ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయకుండా చివరి నిమిషం వరకు అడ్డుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ కేసు నమోదు దగ్గర నుంచి టీచర్ సస్పెన్షన్, రీ పోస్టింగు వరకు ప్రతి దశలోనూ టీడీపీ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు. ఏకంగా మంత్రులు సైతం కీచక ఉపాధ్యాయులకు సాయపడుతున్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం. పాలకవర్గ ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో విద్యాశాఖ అధికారులు కీచక ఉపాధ్యాయుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్నారులపై కన్నేస్తున్న టీచర్లు -
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ విజయ సునీత మార్కాపురం టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టిపెట్టామని, రాబోయే ఆరు నెలల్లో ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ యం.విజయసునీత చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 90 శాతం రెవెన్యూకు సంబంధించిన అర్జీలే వస్తున్నాయని అన్నారు. 22(ఏ)లో నమోదైన సర్వే నంబర్లను తొలగించాలని ప్రజల నుంచి ఇప్పటి వరకు 450 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. జిల్లాలోని 150 మంది రైతులకు సంబంధించిన భూములను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 22(ఏ) జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మొత్తం 165 అర్జీలు రాగా వీటిలో 92 రెవెన్యూ అర్జీలు 73 ఇతర సమస్యలపై అర్జీలు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో జేసీ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి బాలూనాయక్, వ్యవసాయశాఖ ఏడీ బాలాజీ నాయక్, ఇన్చార్జి ఆర్టీఓ రాంబాబు, కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్థాయి జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపికలను సోమవారం మండలంలోని మైనంపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఎంపికై న వారు ఈ నెల 16, 17, 18 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరగబోవు పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు వనజ రవికుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. -
సెలవులో కమీషనర్!
సాక్షి టాస్క్ఫోర్స్: ఒంగోలు నగరపాలక సంస్థ అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచరితమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా జరిగిన లూటీని వెలుగులోకి తెచ్చింది. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, తనపై వేటు తప్పదని భావించిన కమిషనర్ వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లిపోయారని తెలిసింది. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు సైతం దృష్టిసారించారని తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన కమిషనర్ ఆఘమేఘాలపై నెల రోజులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ప్రభుత్వ పెద్దల సపోర్టు ఉండడంతో కమిషనర్కు దరఖాస్తు చేసుకున్న క్షణంలోనే సెలవు మంజూరు ఉత్తర్వులు వచ్చాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ పి.సంపత్ కుమార్ నుంచి వచ్చిన లేఖ ప్రకారం ఏప్రిల్ 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆయన సెలవులో ఉంటారు. ఇన్చార్జి కమిషనర్గా ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న రాంభూపాల్రెడ్డిని నియమించారు. ఇదిలా ఉండగా కమిషనర్ వెంకటేశ్వరరావు ఇప్పటికే రెండు ఏసీబీ విచారణలను ఎదుర్కొంటున్నారు. రెండింటిలోనూ వ్యక్తిగత ఖాతాలకు ఫోన్పే ద్వారా చెల్లింపులు కీలకంగా మారాయి. ఈ విషయాలను సైతం ‘సాక్షి’ ప్రచురించింది. ఇంజినీరింగ్ వర్కుల్లోనూ... నగరంలో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం తరఫున చేస్తున్న పనులకు 5 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని మంకుపట్టు పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఈ పనుల్లో వసూలు చేసిన మామూళ్లను అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు వాటాలు పంచడంతో పాటుగా ఈ కీలక అధికారి కూడా కమీషన్లు తీసుకునేవాడని సమాచారం. కమర్షియల్ కాంప్లెక్స్ల్లో భారీ అవినీతి... నగరంలోని కమర్షియల్ కాంప్లెక్స్ల అనుమతుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంగమూరు రోడ్డులోని ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో దాదాపు కోటి రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అందులో ముఖ్య అధికారికి రూ.అర కోటికి పైగా అందినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వీఎల్టీ పన్ను, లేబరు పన్నులు కలిపి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ యాజమాన్యం దాదాపు రూ.7.40 కోట్లు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. వాళ్లకు తూ..తూ మంత్రంగా నోటీసులు ఇచ్చి రూ.కోటి నొక్కినట్లు కార్పొరేషన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. చెత్త సేకరణలోనూ పెద్ద అవనీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం లో చెత్త పన్నుల ద్వారా నెలకు రూ.45 లక్షలు సేకరించి నేరుగా పాలక సంస్థ అకౌంట్కు జమ చేసేవారు. అయితే ఇప్పుడు సేకరిస్తున్న చెత్త పన్ను డబ్బులు సైతం కీలక అధికారి ఖాతాకు మళ్లుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గత రెండేళ్లుగా ఈ డబ్బుల లెక్కలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారో దేవుడికే తెలియాలని మున్సిపల్ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు.డోర్ నంబర్ల కాంట్రాక్ట్పై బుకాయింపు.. నగరంలోని ఇళ్లడోర్ నంబర్ల ఏర్పాటు కాంట్రాక్ట్పై నగరపాలక సంస్థ కమిషనర్ విరవరణ ఇచ్చారు. టెండర్లు పిలిచామని, కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదన్నారు. దీంతో లోకల్ పెయింట్, ఆర్ట్ వర్క్స్ వారి దగ్గర నుంచి కొటేషన్లు స్వీకరించామన్నారు. ఇద్దరి దరఖాస్తు చేసుకున్నారని, అందులో తాడేపల్లిగూడెంకు చెందిన క్రాంటాక్టర్ తక్కువకు రూ.94.50కు కొటేషన్ దాఖలు చేయడంతో ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డోర్ నంబర్లు వేయటానికి చుట్టూ ఫ్రేమ్తో కలిపి రూ.70 లకు డిజైన్ చేశారు. ప్రభుత్వం మారటంతో అవి ఆగిపోయాయి. డోర్ నంబర్లు కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి ఇప్పటికే నగరంలో డివైడర్లు, బై పాస్ బ్రిడ్జి పిల్లర్లు, ప్రధాన రోడ్లపై జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఇలా రంగులు వేయడం, అవి అలా మాసిపోవటం పరిపాటిగా మారింది. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్ పి.రాజాబాబు సహకారంతో 125 కుంభాకార దర్పణాలు, 150 స్ప్రింగ్ పోల్స్ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు వివరాలు వెల్లడించారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాలో బ్లాక్ స్పాట్లు, గ్రామాల నుంచి మెయిన్ రోడ్లకు వెళ్లే ప్రదేశాలు, ప్రమాదాలకు గురయ్యే మొత్తం 115 ప్రదేశాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో నేషనల్ హైవే, ఆర్అండ్బీ అధికారులతో కలిసి కన్వెన్షన్ మిర్రర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అద్దాల ద్వారా ప్రమాదకర మలుపుల్లో దూరం నుంచి కనిపించని వాహనాలను ముందుగానే పసిగట్టి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రతలు తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. రోడ్డు ఇంజినీరింగ్లో భాగంగా ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం, నార్త్ బైపాస్, సౌత్ బై పాస్, మంగమూరు జంక్షన్లతో కలిపి నాలుగు ప్రధాన జంక్షన్ల వద్ద ప్రీ లెఫ్ట్ మార్గాల్లో వాహనదారులకు సౌకర్యార్థం స్ప్రింగ్ పోల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్త నేషనల్ హైవే రోడ్డుపై వాహనదారులు, ప్రజలు వేగంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన తరువాత బాధపడేకంటే ముందుగానే తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిదని సూచించారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా ప్రతిరోజూ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, అత్యవసర కిటీకీలు, డ్రైవింగ్ సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాలో 2500 ఎల్ఈడీ లైట్లను గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. మాడిఫైడ్ సైలెన్సర్లు, ఎల్ఈడి, హై బీమ్ లైట్లు వాడకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ వాడాలని, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడరాదని, మైనర్ రైడింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవచ్చని చెప్పారు. సమావేశంలో ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఎస్సై మాల్యాద్రి పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు -
కొత్త పుస్తకాలు కొనలేక.. జీతాలు చెల్లించలేక
మార్కాపురం: నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు అటు పాఠకులకు, ఇటు వివిధ ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు చేరువయ్యాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాలకు నిధులు ఇవ్వడంతోపాటు కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడంతో గ్రంథాలయాలకు వెళ్లేందుకు పాఠకులు క్యూ కట్టారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు కేటాయించకపోగా నూతన పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని పరిస్ధితి ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా 66 గ్రంథాలయాలు ఉండగా స్థానిక సంస్థల నుంచి సుమారు రూ.25 కోట్ల బకాయిలు గ్రంథాలయ సంస్థకు రావాల్సి ఉంది. ప్రజల నుంచి స్థానిక సంస్థలు గ్రంథాలయ సెస్ వసూలు చేస్తున్నప్పటికీ అవి గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. దీంతో రెండు నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. జిల్లాలోని 66 గ్రంథాలయాల్లో 70,659 మంది సభ్యులు ఉండగా 6,06,607 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఒంగోలుతో పాటు మార్కాపురంలో గ్రేడ్–1 గ్రంథాలయం ఉండగా కంభం, కనిగిరి, పర్చూరు, చీరాల గ్రంథాలయాలు గ్రేడ్–2గా నమోదై ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 గ్రంథాలయాలు సొంత భవనాలు, మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త పుస్తకాలు లేవు: త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్తే రెండేళ్లనాటి కరెంటు అఫైర్లు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు లభ్యమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చే పాఠకుల సంఖ్య తగ్గుతోంది. దిన, వార పత్రిక నెలవారీ బిల్లులు సకాలంలో చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నెల్లూరు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మార్కాపురం జిల్లాలోని కొమరోలు, అర్ధవీడు, రాచర్ల, ఆకవీడు, పుల్లలచెరువు గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని, గ్రంథాలయ ఉద్యోగుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఒంగోలు కార్పొరేషన్లో తవ్వేకొద్దీ రోజుకో అవినీతి వ్యవహారం బయటపడుతోంది. ఏ విభాగాన్ని కదిలించినా పైసా వసూళ్లు ఎక్కువైపోయాయి. ఓ కీలక అధికారి అన్నీ తానై అపార్ట్మెంట్ల అనుమతుల దగ్గర నుంచి చెత్తపన్ను వసూళ్ల వరకూ ఏ విభాగాన్నీ వదలకుండా టార్గెట్లు పెట్టి మరీ కమీషన్లు బొక్కుతున్నాడు. నిన్నా మొన్నటి వరకు ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గం ఉండేది. ఇప్పుడు పాలక వర్గం గడువు ముగియడంతో కార్పొరేషన్లో సదరు అధికారి రెచ్చిపోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నేనే రాజు నేనే మంత్రినంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయి ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: పాలకవర్గం లేదు..ఇక అడిగేదెవరు అన్నట్లు ఒంగోలు కార్పొరేషన్లో ఓ కీలక అధికారి అందినకాడికి దండుకుంటున్నాడు. కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న తనకు అనుకూలమైన చిరుద్యోగులను బినామీలుగా ఏర్పాటు చేసుకొని ముడుపులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పైసలు ఇస్తే సరేసరి లేకపోతే నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతూ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో పదో పరకో ఇచ్చుకొని బయటపడుతున్నట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధిలో పోటీ పడాల్సిన నగర పాలక సంస్థ అవినీతిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇందుకు ఏసీబీ దాడుల్లో పట్టుబడిన నగదే నిదర్శనమని జనం అంటున్నారు. భవన నిర్మాణాలకు రూ.20 లక్షలు జిల్లా కేంద్రమైన ఒంగోలు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయరంగం దెబ్బతినడంతో ఉన్న పొలాలు అమ్ముకొని పలువురు రైతులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒంగోలు వచ్చి స్థలాలు కొనుక్కొని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. దీంతో కొందరు భవన నిర్మాణాల వ్యాపారులు అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయాలు చేస్తున్నారు. అయితే అపార్ట్మెంట్లు నిర్మించాలంటే ముందుగా నగర పాలక సంస్థ నుంచి అనుమతులు కావాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించుకుంటే ఆ తరువాత ఇబ్బందులు పడకతప్పదు. దీన్ని అసరా చేసుకొని సదరు కీలక అధికారి భారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్కో భవన నిర్మాణానికి గాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధ్యతలు చేపట్టిన సదరు కీలక అధికారి మధ్యవర్తుల ద్వారా ఈ 20 నెలల్లోనే సుమారు రూ.2 కోట్లకు పైగా మామూళ్లు వసూలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భవన నిర్మాణాలు చేయాలంటే భయపడిపోతున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు తప్ప మిగిలిన సామాన్యులు భవన నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు. 5 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని మంకుపట్టు... నగరంలో ఇంజినీరింగ్ విభాగంలో అనేక పనులు జరుగుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఈ పనుల్లో వసూలు చేసిన మామూళ్లను అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు వాటాలు పంచడంతో పాటుగా ఈ కీలక అధికారి 2 శాతం కమీషన్లు తీసుకునేవాడని సమాచారం. అయితే మార్చి నెల 17వ తేదీ నగర పాలక వర్గం గడువు ముగిసింది. ఇప్పుడు కార్పొరేటర్లు లేరు. కనుక ఇంజినీరింగ్ పనుల్లో వసూలు చేసే డబ్బుల్లో తనకు 5 శాతం ఇవ్వాలని మంకుపట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు నగరంలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల్లో 7 శాతం కమీషన్ వసూలు చేసేవారని సమాచారం. ఇప్పుడు దాన్ని 10 శాతానికి పెంచి అందులో 5 శాతం వాటా ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులను యథాతధంగా వసూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగరంలో సుమారు 50కి పైగా బడా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. అందులోంచి వచ్చే బయో వేస్టేజీని తీసుకెళ్లేందుకుగాను ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నగరంలో ప్రధానంగా 15 కళ్యాణ మండపాలు, మరో 15కు పైగా షాపింగ్ మాల్స్, 25కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. వీటి నుంచి కూడా చెత్త సేకరించడానికి ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఇక నివాస గృహాల నుంచి చెత్త పన్నులు వసూలు చేసేందుకు కర్నూలు నుంచి ప్రత్యేకంగా కొందరిని పిలిపించినట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ పేరుతో వీధుల్లో తిరుగుతూ ఇంటికి రూ.50 నుంచి రూ.70 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైతే డబ్బులు ఇవ్వరో ఆయా వీధుల్లో చెత్త సేకరణకు వెళ్లడానికి ఆసక్తి చూపడంలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చెత్త పన్నుల ద్వారా నెలకు రూ.45 లక్షలు సేకరించి నేరుగా పాలక సంస్థ అకౌంట్కు జమ చేశారు. అయితే ఇప్పుడు సేకరిస్తున్న చెత్త పన్ను డబ్బులు కీలక అధికారి ఖాతాకు మళ్లుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గత రెండేళ్లుగా ఈ డబ్బుల లెక్కలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారో దేవుడికే తెలియాలని మున్సిపల్ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.విజయసునీత ఆదివారం తెలిపారు. ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తీసుకొచ్చి సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కార్యక్రమం నిర్వహిస్తారని, జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముండ్లమూరు: మండలంలోని ఉమా మహేశ్వరపురం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న భోగ సముద్రం భాగ్యశ్రీ, చొప్పరపు హరిప్రియలు జాతీయ స్థాయి షార్ట్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుపతి స్వామి ఆదివారం తెలిపారు. ఇరువురు బాలికలు గత ఏడాది నవంబర్లో కడప జిల్లా పులివెందులలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈనెల 16 నుంచి 22 వరకు జరిగే పోటీల్లో ఆడనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఒంగోలు సిటీ: జిల్లాలోని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 861 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆరు కేంద్రాల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు 961 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 861 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించామన్నారు. పరీక్ష ఫలితాల అనంతరం మెరిట్ కం రోస్టర్ విధానంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. -
పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు రూరల్: పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని అర్బన్ కాలనీలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొల్లాని పోలయ్య తన భార్య అల్లూరమ్మతో ఘర్షణ పడుతూ మద్యం మత్తులో తన ఒంటిపై పెట్రోల్పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అల్లూరమ్మ అక్రమ సంబంధం పెట్టుకొని తనను కొన్ని రోజులుగా దూరంగా ఉంచుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని పోలయ్య పోలీసులకు తెలియజేశాడు. ప్రమాదంలో పోలయ్య శరీరం 80శాతం మేర కాలిపోయింది. దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టంగుటూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఇన్చార్జి ఎస్సై మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..గుర్తు తెలియని వాహనం రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సింగరాయకొండలో చోరీ
● రూ.9 లక్షల విలువైన బంగారం, వెండి అపహరణ సింగరాయకొండ: మండల కేంద్రంలోని జీవీఆర్ రోడ్డులో ఉన్న సిటికేబుల్ కార్యాలయం బిల్డింగ్ మొదటి అంతస్తులో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితుడు కథనం ప్రకారం..మొదటి అంతస్తులో నివసిస్తున్న విర్రు చెంచయ్య, అతని భార్య లలితమ్మలు గుడివాలోని కుమార్తె ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఉదయం చూసేసరికి ఇంటి తాళం తీసి ఉండటంతో పాటు బీరువాలోని లాకర్ ధ్వంసం చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు 8 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించారు. క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించారు. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కార్మికుల భద్రత గాలిలో దీపమే..!
బల్లికురవ: గ్రానైట్ క్వారీల్లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం వచ్చి అమాయక కూలీల బతుకులు బండల కింద తెల్లవారుతున్నాయి. ప్రమాదం సంభంవించినప్పుడు అయ్యో పాపం అంటున్న అధికారులు మామూళ్ల మత్తుతో ఆ తదుపరి క్వారీల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలలు ఉన్నాయి. అటకెక్కిన భద్రతా చర్యలు.. జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లిలో సుమారు 140 పై చిలుకు క్వారీలున్నాయి. ఈ క్వారీలకు సంబంధించి ఇప్పటి నెల్లూరులో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ కార్యాలయాన్ని ఇటీవల హైదరాబాద్కు తరలించారు. దీంతో క్వారీల్లో నిబంధనలు, భద్రతా చర్యలు అటకెక్కాయి. క్వారీలో సెకండ్ క్లాస్ మేనేజర్ల స్థానంలో బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారు. మైన్స్ మేనేజర్లు సేఫ్టీ యంత్రాంగం పనులు జరిగే సమాయాల్లో క్వారీల్లో కనిపించరు. క్వారీల్లో వరుస ప్రమాదాలు.. గత ఏడాది ఆగస్టు 3న బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో కార్మికులు జాకీలతో రాయిని డ్రిల్లింగ్ చేస్తుండగా ఎగువ నుంచి 10 టన్నులకు పైబడిన రాయి కార్మికులపై పడటంతో అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందగా వైద్యశాలలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. క్వారీలో ప్రమాదం ఉదయం సుమారు 10 గంటలకు జరిగితే మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ప్రతినిధులను సైతం క్వారీలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన మరువక ముందే వారానికి బల్లికురవకు సమీపంలోని సనకొండ కంకర క్వారీలో మరో ఒడిస్సా కార్మికుడు సాధురామ్ కశ్యప్ (32) ఎగువ నుంచి రాళ్లు పడి చనిపోయాడు. ఇక్కడ పనిచేసే కార్మికులకు ఆదివారాలు, పండగలు సెలవు దినాలు ఉండవు. రాత్రిళ్లు పనులు చేయిస్తుంటారు. క్వారీల్లో దుమ్ము లేవకుండా ప్రతి రోజూ క్వారీతో పాటు సమీపంలో ఉన్న రోడ్డుపై నీళ్లు చల్లించాలి. ఫస్టు ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలి. కానీ ఇవేవి క్వారీ నిర్వాహకులకు పట్టవు.. కనిపించని బెంచ్ కటింగ్ నిబంధన.. బెంచ్కటింగ్ నిబంధనలు ఏ క్వారీలోనూ కనిపించవు. నిబంధన ప్రకారం పై నుంచి క్వారీని తొలిచే క్రమంలో ఒక్కో వరుసలో ఏడు మీటర్లు వెడల్పు వదిలి పనులు చేపట్టాలి. అలా చేస్తే రాయిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నిబంధన పాటించకపోవటం వల్లే సత్యకృష్ణ క్వారీలో ప్రమాదం సంభవించి 9 మంది చనిపోయారు. భద్రతా వారోత్సవాల్లోనూ ఈ మూడు మండలాల్లోని క్వారీల్లో పనిచేసే టీంలుగా నియమించుకోవటంతో అంతా బాగున్నట్లుగానే కితాబు ఇస్తున్నారు. సేప్టీ కార్యాలయం ఆంధ్రాకు అందుబాటుకు ఒంగోలులో ఏర్పాటుతో తనిఖీలు చేపడితే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. క్వారీలో ఎగువన దిగువ ఒకేసారి పనులు బల్లికుర ఈర్లకొండ క్వారీ గ్రానైట్ క్వారీల్లో తరుచూ ప్రమాదాలు వలస కూలీలకు కరువైన భద్రత క్వారీలు ఆంధ్రాలో..సేఫ్టీ కార్యాలయం తెలంగాణలో.. తూతూమంత్రంగా తనిఖీలు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు క్వారీలో నిబంధనలు పాటించరు గ్రానైట్, మెటల్ క్వారీల్లో నిబంధనలతో పాటు భద్రతా చర్యలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలకు చెక్పెట్టవచ్చు. పనులు చేసేటప్పుడు క్వారీలో మేనేజర్లు అందుబాటులో లేకుండా బినామీలతో పనులు చేయించటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుయి. పొట్ట చేతపట్టుకుని పరాయి రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్న కార్మికులను ఆదరిస్తూ మైనింగ్తో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. మైనింగ్తో పాటు రెవెన్యూ, పోలీస్ అధికార్లు ఎప్పటికప్పుడు తనిఖీలతో కార్మికుల వివరాలు నమోదు చేసుకోవాలి. అప్పుడే కొంతమేర ప్రమాదాలకు చెక్పెట్టవచ్చు. – తంగిరాల వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకుడు -
అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి
మార్కాపురం టౌన్: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అశ్వవాహనంపై రంగనాయకస్వామి అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు. చెన్నకేశవస్వామి వారు పుష్పాలంకారాలతో, విద్యుద్దీపకాంతుల మధ్య అశ్వవాహనంపై స్వామికి ఊరేగింపు చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా జటప్రోలు దక్షణామూర్తి శర్మ వ్యవహరించగా, ఆలయ ఈఓ జి.శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు. ముండ్లమూరు: నిద్రిస్తున్న మహిళ మెడలో మూడు సవర్ల బంగారు గొలుసును దుండుగలు లాక్కోని వెళ్లారు. ఈ సంఘటన మండలంలోని పోలవరంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మూతికేయపల్లి శ్రావణి తమ ఇంటి ముందు నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. శ్రావణి వెంటనే కేకలు వేసినా అప్పటికే దుండగలు పరారయ్యారు. కనిగిరిరూరల్: వెలిగొండ ప్రాజెక్టు ఒక్కటే కనిగిరి ప్రాంతానికి వరప్రసాదమని, పశ్చిమ ప్రాంత అభివృద్ధి, తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పూర్వపు ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్, హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన భైరవకోన, మాలకొండ దేవాలయాలను సందర్శించిన అనంతరం కనిగిరిలోని మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. తాను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వెనుకబడిన కనిగిరి ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ప్రతి వారం పర్యటించానని, ఈ ప్రాంతాన్ని హరిత వనంగా మార్చేందుకు ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు, ఉదయగిరి ఇరిగేషన్ ట్యాంక్ల అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారమవుతుందన్నారు. గతంలోనే తాను అప్పటి ప్రజాప్రతినిధులతో కలిసి.. ఉన్నత ఆలోచనాత్మక ప్రణాళికల నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని, తత్ఫలితంగానే నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రూపుదాల్చుతున్నట్లు వివరించారు. ధార్మికంగా అభివృద్ధిలో భాగంగా కనిగిరి భైరవకోన– మాలకొండ దేవాలయాలను ఏకీకరణ చేస్తూ ప్రత్యేక ప్రణాళిక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హిందూ ధర్మ పరిక్షణ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదరణకు నోచుకోని సుమారు 200 పైగా దేవాలయాలను కనిగిరి, కందుకూరు డివిజన్లలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ఆలయాల్లో సామూహిక వివాహాలు జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివ రామిరెడ్డి తదితరులున్నారు. మార్కాపురం: ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. మార్కాపురం జిల్లాలో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ మార్కాపురం జిల్లా కమిటీ కార్యదర్శి జీ బాలనాగయ్య ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. వెనుకబడిన మార్కాపురం జిల్లాలో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వలసలు వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నారు. ప్రజాసంఘాల కార్యాలయంలో కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం కే మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, వలసలు నివారించాలని, ఉపాధి హామీ కూలీలకు భద్రత కల్పించాలని, కరువు సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనులు లేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే సమయంలో ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని, వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైందని, వెంటనే రక్షణ చట్టాలను కల్పించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తురక ఏడుకొండలు, రాము, రత్నం, కోటమ్మ, రమేష్, బీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుకు ధరాఘాతం
అద్దంకి: పొగాకు సాగు చేయవద్దు, ప్రత్యామ్నాయంగా శనగ, మొక్కజొన్న సాగు చేయమని చెప్పిన వ్యవసాయాధికారులు ప్రభుత్వం చెప్పిన మాటలు విని మొక్కజొన్న సాగు చేసిన రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆటుపోట్లను తట్టుకుని పండించిన మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర లేక రైతు విలవిల్లాడుతున్నాడు. నిల్వ చేసుకునే పంట కాకపోవడంతో దళారి అడిగిన కాడికి విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. దాంతో పెట్టుబడులు కూడా రాక, అప్పుల పాలవుతున్నాడు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి తమపని అయిపోయిందన్నట్లు ఊరుకుంది. జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులు చెప్పిన ధర రూ.1500 నుంచి రూ.1700లకే విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన అద్దంకిలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో మొక్కజొన్నకు క్వింటాలు రూ.2400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేయూతనిచ్చింది. దళారులు సైతం అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు లాభాలు గడించారు. మద్దతు ధరతో సరి... కేంద్రాలు ఏవి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 30 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్నను సాగు చేశారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు కౌలు, విత్తనాలు వ్యవసాయం, దున్నకాలు, ఎరువులు, పురుగుమందులతో కలుపుకుని ఎకరాకు రూ.60 నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఆశించిన దిగుబడులు రాక ఎకరాకు సరాసరిన 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.20 వేల నష్టం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు వచ్చి పెట్టుబడులు దక్కేవి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు క్వింటాకు రూ.1500 నుంచి రూ.1700లకే కొనుగోలు చేస్తున్నారు. రైతుకు ఎకారకు రూ.37 వేల నుంచి రూ.42 వేలు మాత్రమే దక్కుతుంది. దాంతో ఎకరాకు పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.65 వేలు కావడంతో ఎకరాకు రూ.20 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. మంత్రి మాటలతో రైతుల్లో ఆగ్రహం.. జే పంగులూరు మండలం కొండమూరు పర్యటనకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ మొక్కజొన్న రైతుల ఆవేదన వినాల్సింది పోయి, వారిని విసుక్కోవడంతో రైతులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే మద్దతు ధర అమలైందని, కొనుగోలు కేంద్రాలతో రైతులను ఆదుకుందని, ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు. అద్దంకి: రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రిని కొండమూరులో మొక్కజొన్న రైతులు కలసిన సందర్భంగా ఆయన రైతులను విసుక్కోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారంి నియోజకవర్గంలోని పంగులూరు మండలం కొండమూరు గ్రామంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవిని కలిసి, తాము పండించిన మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు విన్నవించుకున్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి రైతులపై మంత్రి కోప్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతుకు అండగా ఉండాల్సింది పోయి, ఇలాంటి వైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని డాక్టర్ అశోక్ కుమార్ ప్రశ్నించారు. మొక్కజొన్న పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోకుండా, ప్రభుత్వం తక్షణమే కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. పండించిన పంటను అమ్ముకోలేక కుదేలవుతున్న అన్నదాతకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ ఈ ధర్నా చేపడుతోందని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ఈ పోరాటాన్ని జయప్రదం చేసి, ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. -
కన్నతండ్రులే కాలనాగులై..
తాళ్లూరు/సింగరాయకొండ: ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపు కాయాల్సిన కన్నతండ్రులే కాలనాగులై వారి జీవితాలపై విషం చిమ్ముతున్నారు. వావివరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలో ఆదివారం వెలుగుచూసిన రెండు ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకడు మద్యం మత్తులో కుమార్తైపె లైంగికదాడికి యత్నించగా, మరొకడు కుమార్తైపె పలుమార్లు లైంగికదాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడి కూతురిపై తండ్రి లైంగికదాడికి యత్నం మద్యం మత్తులో కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడికి యత్నించిన ఘటనపై ఆదివారం పోక్సో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. ఈక్రమంలో తండ్రి మద్యం మత్తులో ఈనెల 4వ తేదీన కుమార్తైపె లైంగికదాడికి యత్నించాడు. ఆ విషయాన్ని కుమార్తె తల్లికి చెప్పడంతో ఆమె భర్తను నిలదీసింది. అయితే ఈవిషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో ఊరుకున్నారు. ఆదివారం మేనమామకు వారు ఫోన్ ద్వారా చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బీ మహేంద్ర తెలిపారు. -
కార్మికులే సంపద సృష్టికర్తలు
ఒంగోలు టౌన్: కార్మికులే అసలు సిసలు సంపద సృష్టికర్తలని, దేశ ప్రజల శ్రమశక్తిని దోచుకునే కార్పొరేట్ల వల్ల కలిగే ప్రయోజనం శూన్యమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య అన్నారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. సభకు ముస్తఫా, కరుణాఽనిధి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులు కట్టుబానిసలుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశంలోని అన్నీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించకుండా కేవలం మూడు గంటల వ్యవధిలోనే చట్టం ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారని తెలిపారు. చట్టాల్లో ఉన్న అభ్యంతరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవడం నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. లేబర్ కోడ్లతో కార్మికుల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని, చివరకు సంఘం పెట్టుకునేందుకు కూడా కార్మికులకు అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. ఇప్పటికై నా కార్మికులంతా ఏకమై నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగు రాధా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ...దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసిందని విమర్శించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆరు సార్లు దేశవ్యాప్త సమ్మె నిర్వహించిందని తెలిపారు. కొత్త చట్టం అమలులోకి వచ్చిన కారణంగా ఇక పర్మినెంట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. కేవలం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుందన్నారు. ఎన్నికలకు ముందు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు గెలిచి గద్దెనెక్కిన తరువాత బిజేపీ అడుగుల్లోనే నడుస్తున్నాడని విమర్శించారు. తొలుత సీనియర్ నాయకులు సర్దార్ ఏఐటీయూసీ పతాకాన్ని అవిష్కరించగా యాసిన్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నిక.... మహాసభల అనంతరం జిల్లా నూతన కమిటిని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా టంగుటూరి ప్రభాకర్, కార్యదర్శిగా కొత్తకోట వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కె.మురళి, సింగరకొండ శ్రీను, కాకుమాని రమణమ్మ, కేఎల్డీ ప్రసాద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా కోటంశెట్టి హనుమంతరావు, వై.ఆనందమోహన్, సహాయ కార్యదర్శులుగా కె.నాగేశ్వరరావు, రాజీవ్ రతన్ దేవ్, ఎస్.పోలయ్య, శ్రీరాం శ్రీనివాసులు, కోశాధికారిగా ఎంఏ సాలార్, మరో 33 మంది సభ్యులను ఎన్నుకున్నారు. -
అక్రమ కేసులకు భయపడం
త్రిపురాంతకం: వైఎస్సార్ సీపీకి ఎదురే లేదని, నియోజకవర్గంలో ప్రజలు జగనన్నకు జై కొడుతూ బ్రహ్మరథం పడుతున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని రామసముద్రం వీరాంజనేయస్వామి తిరుణాళ్ల సందర్భంగా శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. నేడు ప్రజలు ఆయన పాలనను ఛీ కొడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అబద్ధాలు, మోసపు మాటలతో కాలక్షేపం తప్ప చేసింది శూన్యమన్నారు. రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలను అటకెక్కించి ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఒక్క ఇల్లూ మంజూరు చేసింది లేదన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు తిరిగి జగన్మోహన్రెడ్డి పాలన కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారెవరిని వదిలిపెట్టమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడితే భయపడేది లేదన్నారు. అధికారులు, పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని అలా కాకుండా విరుద్ధంగా పనిచేస్తే వారికి తగిన విధంగా సమాధానం చెబుతామన్నారు. ఒకే జెండా కింద అందరం కలిసి కట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయ భేరి మోగించాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో పనిచేయాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈయన వెంట ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, పార్టీ నాయకులు ముసలారెడ్డి, గంటా రమణారెడ్డి, బాలకోటిరెడ్డి, డి.కోట సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, డి.చిన్న రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో బాబు ప్రభుత్వం విఫలం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీకి ఎదురే ఉండదు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
దళిత నేతలను అవమానించిన కూటమి
మర్రిపూడి: దళితుల ఐక్యతను చెడకొట్టి వారిని పావులుగా వాడుకునేందుకు, దళిత నేతల విగ్రహాలు దౌర్జన్యంగా ఆవిష్కరించడానికి కూటమి నేతలు పూనుకున్నారని, మహా దళిత నేతలను అవమానించారని పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు ధ్వజమెత్తారు. మండల కేంద్రమైన మర్రిపూడి ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలపై ఆదివారం రాత్రి పసుపునీళ్లు చల్లి, క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి సురేష్ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది వైఎస్సార్ సీపీ మండల గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు గురిజాల యోబు, విగ్రహాల ఆవిష్కరణ కమిటీ ఉపాధ్యక్షుడు కొమ్ము యోహోనుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో విగ్రహాలు ఏర్పాటు చేయగా ఈ నెల 5న టీడీపీ కార్యకర్తలు ఆ విగ్రహాలు ఆవిష్కరించాలని ప్రయత్నించారన్నారు. నాటకీయంగా ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ స్థానిక మంత్రి స్వామి ఆదేశాలతో పోలీసు బలగాల మధ్య తహశీల్దార్ జనార్దన్ చేత ఉద్రిక్త వాతావరణంలో విగ్రహాలను ఆవిష్కరించారన్నారు. ఇది దళితజాతికే అవమానకరమన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా విగ్రహాలను ఆవిష్కరించడం దారుణమన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందుకే ఆ మైలను కడిగేసేందుకే పసుపునీళ్లు చల్లి క్షీరాభిషేకం చేశామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరిస్తే ఎక్కడ వైఎస్సార్ సీపీకి పేరు వస్తుందోనని కడుపు మంటతో మంత్రి స్వామి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దళితుల మధ్య చిచ్చుపెట్టడం, పోలీసు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం కూటమి ప్రభుత్వం నైజంగా మారిందని ధ్వజమెత్తారు. మహానేతల విగ్రహాలు ఈ విధంగా ఆవిష్కరిస్తారా? మహా నేతలను అవమానపరుస్తారా? ఒక దళితుడివై ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా అని మంత్రి స్వామిని నిలదీశారు. మీటింగ్లకు కనీసం మైకు పెట్టుకోనివ్వరు. కుర్చీలు వేసుకోనివ్వరు, కేసులు పెట్టండి ఎంతమందిపై పెడతారో చూస్తాం జైళ్లు కూడా సరిపోవు అని అన్నారు. రాబోవు రోజుల్లో కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు, మంచి రోజులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గురిజాల యోబు, గురిజాల రమేష్ (చిన్నారి), కొమ్ము యహోను, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు, మండల పరిశీలకుడు బెజవాడ వెంకటేశ్వరరెడ్డి, చితంపల్లి హరిబాబు, కోండ్రు ఇజ్రాయిల్, కొమ్ము ప్రభుదాస్, గండి జోసెఫ్, ఒనుకూరి పవన్కుమార్, ఓ రవి, దాసరి సాల్మన్, కోండ్రు సాల్మన్, దాసరి ఇమ్మానియేలు, బోద రమణారెడ్డి, మాకినేని వెంకట్రావు, బత్తల కోటేశ్వరరావు, ఓబులేసు, లోకయ్య, గడ్డం బాలాజీ, మర్రి కిరణ్కుమార్,గురిజాల బెంజ్మన్, దుడ్డు రాములు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీ వైద్యుడి దారుణ హత్య
అద్దంకి: అర్ధరాత్రి వేళ ఆర్ఎంపీ వైద్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మవరం గ్రామానికి చెందిన మేడగం కోటిరెడ్డి (45) ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బ్రహ్మంగారి మాల వేసుకుని దీక్ష చేపట్టాడు. శనివారం రాత్రి భార్య ఆదిలక్ష్మి టిఫిన్ పెట్టగా.. తిని పడుకున్నాడు. అర్ధరాత్రి నల్లటి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డొచ్చిన అతని భార్యను నెట్టివేయడంతో స్పృహ కోల్పోయింది.అనంతరం కోటిరెడ్డిని కర్రలు, రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసినట్టు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ పరిశీలించారు. సీఐ సుబ్బరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. మంగళగిరి నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం హత్య చేయడానికి వచ్చిన వారిలో ఒకరు ‘నా భార్యతో అక్రమ సంబంధం మానుకోవా’ అన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందా.. లేక మరేదైనా కారణమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. -
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మేదరమెట్ల: రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అటుగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్స్లో వంట మాస్టర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఒంగోలు వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతుడి వివరాల కోసం అతని వద్ద ఉన్న సంచిలో వెతకగా ఎలాంటి సమాచారం అందలేదు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం అప్పుడప్పుడూ హోటల్స్లో వంట మాస్టర్గా పనిచేస్తుంటాడని, ఇతను చైన్నెకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చీమకుర్తి రూరల్: ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందిన సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం జలాశయం వద్ద శనివారం వెలుగుచూసింది. పిడుగురాళ్ల లెనిన్ నగర్కు చెందిన అబ్దుల్ రెహమాన్ (22) రామతీర్థం జలాశయానికి అనుసంధానంగా ఉన్న సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లి నీటి ప్రవాహ ఉధృతికి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అతను బోర్వెల్స్ యజమాని అని తెలిసిందని సీఐ ప్రసాద్ చెప్పారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఒంగోలు జీజీహెచ్కి తరలించామని, ఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ వెల్లడించారు. -
దొనకొండ విమానాశ్రయం పరిశీలన
దొనకొండ: స్థానిక విమానాశ్రయాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్ అధికారులు శనివారం పరిశీలించారు. బ్రిటీష్ కాలంలో సర్వే నంబర్ 14లో 135.36 ఎకరాల స్థలంలో ఎయిర్పోర్టును నిర్మించారు. ఆ విమానాశ్రయ స్థలంలోని భవనం, హెలీప్యాడ్, పరిసరాలను పరిశీలించి ఎయిర్పోర్టు సెక్యూరిటీ రామకృష్ణను ఇక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తాళ్లూరు: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వెల్లంపల్లి ప్రధాన రహదారి శివరాంపురం–కొర్రపాటివారిపాలెం రోడ్డుపై శనివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శివరాంపురం నుంచి తాళ్లూరు వస్తోంది. అదే రోడ్డు వైపు ద్విచక్ర వాహనదారుడైన కొర్రపాటి ఆంజనేయులు(55) కూడా వెళ్తున్నాడు. రోడ్డుకు అవతలి వైపు పొలాల్లో ఉన్న ఓ రైతు ద్విచక్ర వాహనదారుడిని పిలిచాడు. ఎడమ నుంచి కుడి వైపునకు ద్విచక్ర వాహనదారుడు వెళ్లగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బస్సు డ్రైవర్ పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 11డిఆర్ఎస్43: ఆంజనేయులు మృతదేహం -
సంక్షేమానికి చిరునామా.. జగన్
మార్కాపురం: అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరునామాగా మారారని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మార్కాపురం పట్టణంలోని మెయిన్ బజారులో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ముఖ్యఅతిథిగా పాల్గొని బూచేపల్లి మాట్లాడారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు తలొంచి నమస్కరిస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా హామీలు ఇచ్చి అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ కావాలో.. హామీలు అమలు చేయని చంద్రబాబు కావాలో తేల్చుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, జగనన్నకు సైనికునిగా పనిచేస్తానని అన్నారు. మార్కాపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే నిధులు ఇచ్చారని, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పుతెచ్చి అమరావతి అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు ఎందుకు నిధులివ్వలేదంటూ ప్రశ్నించారు. ఇటీవల మార్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులు 108కు ఫోన్ చేస్తే స్పందించలేదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంబులెన్స్లు ఇంటివద్దకు వచ్చి సేవలు అందించాయని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీ ఇక్కడే కట్టి ఉంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని అన్నారు. తమ వంతు బాధ్యతగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించామని చెప్పారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు నీతికి, నిజాయితీకి మారుపేరని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఆయనకు అండగా నిలవాలని బూచేపల్లి పిలుపునిచ్చారు. మార్కాపురం భూముల రేట్లు.. అమరావతి భూముల రేట్లు ఒకటే : అన్నా రాంబాబు మార్కాపురం జిల్లా ప్రకటించిన తరువాత ఇక్కడ భూముల రేట్లు అమరావతిలో భూముల ధరలతో పోటీపడుతున్నాయని, దీంతో సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకు చేర్చాడని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని, చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. దొనకొండను రాజధాని చేసి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని అన్నారు. జిల్లా ఇచ్చారని సంబరాలు చేస్తున్నారని, నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీని గెలిపిద్దాం : తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అధ్వానంగా తయారైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరికీ చెన్నకేశవస్వామి ఆశీస్సులు ఉండాలని, జగనన్నను సీఎంగా చేసుకుందామని కోరారు. నాటి వైఎస్సార్ పాలన, నేటి కూటమి పాలనను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, అన్నా కృష్ణ చైతన్య, ఎస్ఈసీ మెంబరు వెన్నా హనుమారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బాలమురళీకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ షేక్ సలీమ్, మార్కాపురం తర్లుపాడు మండలాల కన్వీనర్లు చెంచిరెడ్డి, మురారి, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ డాక్టర్ కనకదుర్గ, ఎస్ఈసీ మెంబరు ఉడుముల కోటిరెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, జె.రంగారెడ్డి, కొండయ్య, దూదేకుల మస్తాన్, సుధీర్, గాయం శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ సిరాజ్, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మను అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం చంద్రబాబు : ఎమ్మెల్యే బూచేపల్లి ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ను సీఎంను చేసుకుందాం : ఎమ్మెల్యే చంద్రశేఖర్ మార్కాపురం జిల్లా ఇచ్చినా నిధులివ్వకపోవడంతో నిరాశే : మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభపై ప్రజలనుద్దేశించి ప్రసంగం మార్కాపురంలో ఘనంగా చెన్నకేశవస్వామి తిరునాళ్లు -
ఐస్క్రీం వాహనం బోల్తా
● డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు తాళ్లూరు: ఐస్క్రీం వాహనం అదుపుతప్పి డ్రైవర్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తూర్పు గంగవరం రోడ్డు సింగనపాలెం మర్రిచెట్టు సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐస్క్రీం వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ ఎస్డీ జానీ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవ్యక్తి యర్రయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈఎంటీ డీబీ బాలజ్యోతి, పైలట్ సీహెచ్ యోగేశ్వరరావులు సేవలందించారు. -
దేవుడి సొమ్ముతో జల్సాలు
ఒంగోలు టౌన్: చిన్న చిన్న పనులు చేస్తే వచ్చే కూలి డబ్బులు జల్సాలకు సరిపోవడంలేదని దొంగలుగా మారారు. దేవుడి సొమ్ముతో జల్సాలు చేసేందుకు దేవాలయాలకు కన్నం వేయడం మొదలుపెట్టారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. ఆ వివరాలను ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్రాజు వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అనికేత్ కై లాస్ కసరోడే, సునీల్ దేవరావు సూర్యవంశీ, మనీష్ గోపాల్ వడివే, మరో ఇద్దరు మైనర్ బాలురు రోజువారీ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. అయితే, జల్సాలు చేయడానికి చేతిలో డబ్బులు ఉండేవి కావు. దాంతో అడ్డదారి తొక్కారు. దొంగలుగా మారారు. దేవుడి సొత్తు కాజేసి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హైవే సమీపంలోని కృష్డుడి ఆలయంలో వెండి, బంగారు అభరణాలు దోచుకున్నారు. ఈ నెల 1వ తేదీ ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. గుడిలో స్వామివారికి చెందిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు దొంగలించారు. చోరీ సొత్తు తీసుకుని లారీలో ఒంగోలు వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో రేణంగివరం గ్రామంలో త్రిశక్తి పీఠం కనిపించింది. వెంటనే లారీ ఆపి అక్కడ చోరీ చేశారు. గుడి తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి ముగ్గురు దేవతల వద్ద ఉన్న 2 కిలోల వెండి కిరీటాలు దొంగలించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు... దేవాలయాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ హర్షవర్థన్రాజు సీరియస్గా తీసుకున్నారు. ఆయన స్వీయ పర్యవేక్షణలో దర్శి డీఎస్పీ మార్గదర్శకత్వంలో అద్దంకి రూరల్ సీఐ డి.మల్లికార్జునరావు, సీసీఎస్ సీఐ ఎం.బీమానాయక్, ఫింగర్ ప్రింట్ సీఐ బి.వినోద్బాబు, మేదరమెట్ల ఎస్సై షేక్ రఫీ, కొరిశపాడు ఎస్సై వై.సురేష్ తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరించారు. పక్కా సమాచారంతో శనివారం అద్దంకి మండలం సింగరకొండ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో పొలాల వద్ద అమరావతి దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం... నిందితులు చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో చోరీ చేసిన వెండి చేతులు 2, వెండి చెవులు 2, వెండి కిరీటం 1, వెండి తొండం 1, మరికొన్ని ఆభరణాలతో పాటు బంగారు మంగళ సూత్రాలు 12, మారేడు బిల్వం 1, తెల్ల రాళ్లు 4, ఎర్రరాయి 1 కలిగిన ముక్కుపుడక 1, బంగారపు ముక్కుపుడక 1, బంగారు బొట్టు 1, ముత్యాల దండ పతకం 1, బంగారు పతకం 1 కలిపి మొత్తం 19 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4,70,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేణంగివరం గ్రామంలో త్రిశక్తి పీఠంలో దొంగిలించిన 2 కేజీల వెండి కిరీటాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి... ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్రాజు మాట్లాడుతూ దేవాలయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్య ప్రదేశాలలో పీపీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తరచూ సీసీ కెమెరాల పనితీరును పరిశీలించాలని, కెమెరాలకు సంబంధించి డీవీఆర్లను ఎత్తయిన ప్రదేశాలలో భద్రపరచుకోవాలని చెప్పారు. చోరీ కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి వచ్చి రాష్ట్రంలోని దేవాలయాల్లో దొంగతనాలు ఐదుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్థన్రాజు -
భూ వివాదాలే న్యాయవాది ప్రాణాలు తీశాయా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరానికి చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. నగర శివారులోని ఒక వివాదాస్పద భూమి విషయంలోనే హత్య జరిగిందా..అని నగర ప్రజలు చర్చింకుంటున్నారు. భూవివాదం గురించి న్యాయవాది హరిప్రసాద్ మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చీమకుర్తికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ (37) కొంతకాలంగా ఒంగోలులో న్యాయవాదిగా చేస్తున్నారు. నగరంలోని కర్నూలు రోడ్డులో ఒక హోటల్ వెనక నివాసం ఉంటున్న హరిప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తల్లి తిరుపతమ్మ ఒంగోలు కోర్టులో ప్రాసెస్ సర్వర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేయాల్సిన పని ఉందని తల్లి తిరుపతమ్మతో చెప్పి బయల్దేరాడు. రాత్రి 9 గంటల సమయంలో తల్లి ఫోన్ చేసినప్పుడు చిలకలూరిపేటలో ఒక హోటల్లో భోజనం చేస్తున్నట్లు చెప్పాడు. మరుసటి రోజు ఉదయానికి చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే దారి పొలాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆయన తల వెనుక బండరాళ్లతో కొట్టిన గాయాలు ఉండటం, మృతదేహంపై స్కూటీ పెట్టిన తీరు చూసిన వారికి హత్యగా అనుమానం కలిగించింది. దీంతో తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యగా కేసు నమోదు చేశారు. హత్య ఎందుకు జరిగిందనే విషయంపై పలురకాల చర్చ జరుగుతోంది. కేశవరాజుకుంట భూవివాదమే కారణమా? కేశవరాజుకుంటకు చెందిన టీడీపీ కార్యకర్త పోతురాజుకు స్థానిక మల్లేశ్వరకాలనీలో 24 గదుల స్థలం ఉంది. ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు కబ్జా చేసుకొని ప్లాట్లు వేసి విక్రయించినట్లు సమాచారం. న్యాయవాది హరిప్రసాద్ ఈ కేసును వాదిస్తున్నారు. బాధితుడు పోతురాజు, న్యాయవాది హరిప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు జిల్లాలో హల్చల్ చేస్తోంది. కబ్జాకు పాల్పడిన వ్యక్తులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పోతురాజు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో న్యాయవాది తల్లి ఇదే ఆరోపణ చేశారు. తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కుమారుడు చెప్పినట్లు పేర్కొన్నారు. భూ కబ్జాల విషయంలోనే గిట్టని వారు తన కుమారుడిని హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. హరి ప్రసాద్ హత్యకు, భూ కబ్జాలకు సంబంధం ఉందన్న ప్రచారం జోరందుకుంది. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని న్యాయవాదులు చెబుతున్నారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఎలా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు చట్టాలను లెక్కచేయడం లేదు. నిబంధనలు పట్టించుకోవడం లేదు. దీంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒంగోలులో భూములు కొనాలంటే భయపడిపోతున్నారు. న్యాయవాది హత్యపై జిల్లాలో జోరుగా చర్చ న్యాయవాది హరిప్రసాద్ వీడియో హల్చల్ -
టీడీపీ నాయకుడి వ్యాపారం కోసం సీసీ రోడ్డు
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీకి చెందిన ఓ బండల వ్యాపారి కోసం గిద్దలూరు మున్సిపాలిటీ నిధులను ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు సమీపంలో ఓ వీధిలో టీడీపీ నాయకుడు రంగనాథ్ బండల వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఒక్కడి వ్యాపారం కోసం ఏకంగా సిమెంట్ రోడ్డు వేయడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీధిలో రైల్వే ట్రాక్ వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఒక్క నివాస గృహం లేదు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో కొన్నేళ్ల నుంచి రంగనాథ్ బండల వ్యాపారం కొనసాగిన్నాడు. ఈ వీధి మీదుగా స్థానికులు ఎక్కువగా ఖాళీ స్థలాల్లోకి మలమూత్ర విసర్జన కోసం వెళుతుంటారు. పట్టణంలోని అనేక వీధులకు సరైన రోడ్డు వసతి లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా టీడీపీ నాయకులు మాత్రం వారి స్వార్థానికి ఒక్కరి కోసం ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం పై ప్రజలు మండిపడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పొన్నలూరు: ద్విచక్ర వాహనానికి పంది అడ్డం రావడంతో ఢీకొట్టి కిందపడి నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పొన్నలూరు మండల పరిధిలోని పాతశింగరబొట్లపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఓవీ రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పైరెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన నవీన్ తన కుటుంబంలోని చిన్నారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో వైద్యం కోసం కందుకూరు వెళ్లాడు. వైద్యం చేయించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో పాతశింగరబొట్లపాలెం అడ్డరోడ్డు సమీపంలోకి రాగానే తన ద్విచక్ర వాహనానికి పంది అడ్డం వచ్చింది. ప్రమాదవశాత్తూ ఢీకొట్టడంతో బైకు అదుపుతప్పి కిందపడిపోయారు. నవీన్తో పాటు రెండేళ్ల చిన్నారి, మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. సింగరాయకొండ: ట్రాక్టర్ – మోటారు సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో మోటారు సైకిల్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం పంచాయతీ కొత్తపాలేనికి చెందిన మర్రి శ్రీనివాసులు (50) హైదరాబాద్లో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చి గురువారం రాత్రి కరేడులో తన అక్కను కలిసేందుకు ఊళ్లపాలెం నుంచి కరేడు వెళ్తున్నాడు. జగనన్న కాలనీ సమీపంలోకి రాగానే ఎదురుగా వేరుశనగ గడ్డితో వస్తున్న ట్రాక్టర్ డోర్లు ప్రమాదవశాత్తూ శ్రీనివాసులు చాతికి తగిలి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని 108లో ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి గుంటూరు తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే శుక్రవారం మృతి చెందాడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ ఎస్సై మహేంద్ర తెలిపారు. ● కుమార్తె పరిస్థితి విషమం అద్దంకి: తల్లీకుమార్తెలపై ఎదురింటి వ్యక్తి రాడ్డుతో దాడి చేయడంతో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెలనాటి లక్ష్మి, ఆమె మూడేళ్ల కుమార్తె భానుప్రియలపై ఎదురింట్లో ఉంటున్న వ్యక్తి రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మి, భానుప్రియలకు తీవ్రగాయాలయ్యాయి. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని వైద్యశాలకు తరలించారు. దాడికి కారణం తెలియరాకపోవడంతో ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. -
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు.
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో 50 శాతం మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్య రాణి, వంగలపూడి అనిత లకు మెమొరాండం ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో 50 శాతం మహిళా ఉపాధ్యాయులే పనిచేస్తున్నారని వారికి పని చేసే పాఠశాలలో అనేక చోట్ల స్టాఫ్ రూమ్స్, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. లైంగిక వేధింపులు, భద్రతా సమస్యలను నిత్యం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి మహిళా ఉపాధ్యాయుల సంతకాల సేకరణ అనంతరం ఈ మెమోరాండంలను రాష్ట్ర సంఘానికి పంపిస్తారన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి మాట్లాడుతూ మహిళా టీచర్ల భద్రత కోసం ఒక ప్రొటెక్షన్ సెల్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని, మహిళలు పనిచేసే పాఠశాలలో ప్రశ్నపత్రాలు, పుస్తకాలు తీసుకురావడం, రైస్ ఇండెంట్ ఇవ్వడం తదితర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి హైస్కూల్లో ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలర్ ను ఏర్పాటు చేయాలని, పిల్లల అనారోగ్యం, చదువు నిమిత్తమే కాకుండా పెళ్లి అయిన బిడ్డలకు తీవ్ర అనారోగ్యం, ఆపరేషన్, డెలివరీ సమయాల్లో కూడా వినియోగించుకునేలా చైల్డ్ కేర్ లీవును మార్పు చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉచిత న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం సంధ్యారాణి, ఝాన్సీ లక్ష్మీబాయి, నన్నమూరి లక్ష్మీ శివపార్వతి, జే శారద, శ్రీదేవి, షేక్ హాజీరా బేగం, జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావు, జిల్లా కోశాధికారి, ఎన్ చిన్న స్వామి, జిల్లా కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, జీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ
దర్శి: దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన బాలమురళీకృష్ణ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికలతో పనిచేసి తమ డివిజన్ పరిధిలో పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొస్తానన్నారు. దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పట్టణంలో సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నేరాల నియంత్రణ, అక్రమాల కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు డీఎస్పీని కలిసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. -
పేరుకే మోడల్.. మెనూ ఢమాల్..!
● చుండి మోడల్ స్కూల్లో అధ్వానంగా మధ్యాహ్న భోజనం ● 300 మంది విద్యార్థులకు 25 కేజీల బియ్యంతోనే తయారు ● మెనూ ప్రకారం తయారు చేయాల్సింది 45 కేజీల బియ్యంతో.. ● గుడ్లు కూడా 150 మాత్రమే.. ● ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ● మెనూపై సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలేనంటూ విమర్శలు వలేటివారిపాలెం: డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం విషయంలో సీఎం చంద్రబాబు మాటలు సైతం నీటి మూటలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు మెనూ ప్రకారం చక్కగా వండిపెడుతున్నామని పదేపదే సీఎం చెబుతుండగా, ఆచరణలో అలా జరగడం లేదని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతోంది. వలేటివారిపాలెం మండలంలోని చుండి మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం మెనూపై అక్కడ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని గురువారం శ్రీసాక్షిశ్రీ పరిశీలించింది. అక్కడ మెనూ అమలు తీరు అధ్వానంగా ఉన్న విషయం వెలుగుచూసింది. సగానికి సగం దిగ్గోసి విద్యార్థులకు మెనూ అమలు చేస్తుండటం, కూరల్లో ఏమాత్రం నాణ్యత లేకపోవడం వంటివి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలిచాయి. స్కూల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు 300 మంది ఉండగా, మెనూ ప్రకారం ఒక్కొక్కరికి 150 గ్రాముల బియ్యం చొప్పున 45 కేజీల బియ్యంతో భోజనం తయారు చేయాలి. కానీ, కేవలం 25 కేజీల బియ్యంతోనే భోజనం తయారు చేశారు. పైగా, 300 మంది విద్యార్థులకు 150 గుడ్లు మాత్రమే సిద్ధం చేశారు. అరకొరగా వండిన వెజిటేబుల్ బిర్యానీ, నీళ్లనీళ్లగా కుర్మా దర్శనమిచ్చాయి. వాటిపై అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా, చాలా మంది విద్యార్థులు తినడం లేదంటూ పొంతన లేని సమాధానం చెప్పకొచ్చారు. చుండి మోడల్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ హవా నడుస్తోందని, విద్యార్థులకు సగం మెనూ మాత్రమే అమలు చేస్తూ.. మిగిలిన సగం సరుకులు అతని ఆధ్వర్యంలో బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల సిఫార్సు మేరకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కాంట్రాక్ట్ పద్ధతిపై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా నియమించారు. సదరు జూనియర్ అసిస్టెంట్ రెచ్చిపోతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతుండగా, అతనికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే కారణంతో పాటు అవినీతి సొమ్ములో వాటా అందడంతో ప్రిన్సిపాల్, ఇతర అధికారులు సైతం పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో ఆ జూనియర్ అసిస్టెంట్ రోజురోజుకూ మరింత పేట్రేగిపోతున్నాడు. 300 మంది విద్యార్థులకు సగమే మెనూ పాటిస్తూ మిగిలిన సరుకులన్నీ మింగేస్తున్నాడు. దానిపై అతన్ని ‘సాక్షి’ ప్రశ్నించగా, అధికారులు తనకు 25 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారని, 150 గుడ్లే అందించారని, అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. విద్యార్థుల అటెండెన్స్ గురించి ఆరా తీయగా, వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. గత మార్చి నెల 15వ తేదీ నుంచి ఇదే విధంగా అరకొరగా మెనూ అమలు చేస్తున్నారంటూ పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాక్షి దృష్టికి తీసుకొచ్చారు. తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పవద్దంటూ వారు భయపడుతున్నారు. ప్రిన్సిపాల్, జూనియర్ అసిస్టెంట్ కుమ్మక్కయి విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావుపై మధ్యాహ్న భోజనం విషయంలో గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. గతేడాది నవంబర్లో మధ్యాహ్న భోజనం చాలా తక్కువగా ఉండటంతో విద్యార్థులు గొడవకు దిగారు. అదే సమయంలో విద్యార్థులపై ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేసి కొంత మెనూ పెంచారు. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు భోజనం పెట్టించారు. మధ్యాహ్న భోజనం వండే సిబ్బందిని బెదిరిస్తూ తాను చెప్పిన విధంగా నడుచుకోవాలని హుకుం జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులకు విషయం చెబితే ఊరుకోనంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకుని సక్రమంగా మెనూ అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ చెప్పిందే సమాధానం : చుండి మోడల్ స్కూల్లో మెనూ అమలు చేయకపోవడంపై ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును సాక్షి వివరణ కోరగా, తాను నెల్లూరులో మీటింగ్కు వచ్చానని తెలిపారు. ఈ రోజు ఇన్చార్జిగా వేరే టీచర్ ఉన్నారని చెప్పారు. ఆమెను సంప్రదించగా, తాను మెనూ విషయం చూడటం లేదని, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. జూనియర్ అసిస్టెంట్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును సాక్షి వివరణ కోరగా, జూనియర్ అసిస్టెంట్ చెప్పిందే సమాధానమంటూ చెప్పుకొచ్చారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు గతంలోనూ అనేక ఆరోపణలు... జూనియర్ అసిస్టెంట్ హవాపై ఆరోపణలు... -
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పేరుకే మోడల్.. మెనూ ఢమాల్! చుండి మోడల్ స్కూల్లో మెనూ అధ్వానంగా ఉంటోంది. విద్యార్థులకు సరిపడినన్ని గుడ్లు, అన్నం వండటం లేదు. ‘‘మూటలు’’ అందితే చాలు.. అది ఎంతటి అక్రమమైనా...సక్రమమైపోతుంది. భవన నిర్మాణానికి ప్లాను ఉంటే ఒక రేటు...ప్లానులేకుంటే మరో రేటు... ఇదీ ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ రూటే సప‘‘రేటు’’గా మారింది. దీంతో నగరంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. తాజాగా ప్రభుత్వం అమలు చేసిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) స్కీం నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మార్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమబద్ధీకరణ మాటున కార్పొరేషన్లో ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకూ అంది జేబులు కట్టలతో నిండిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. క్రమ డబ్బీకరణ! -
బాబు.. కాలంచెల్లిన నాయకుడు
ఒంగోలు టౌన్: జగనన్న 5 జి అయితే చంద్రబాబు 2జి లాంటి వాడని, కాలం చెల్లిన ఆలోచనలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం అప్పుల పాలు కాకూడదనే సదుద్దేశంతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుకొని రాజధాని కారిడార్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటే బుర్రలేని ఎల్లో మీడియా, పచ్చపార్టీ కార్యకర్తలతో కలిసి ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పారు. మూడు పంటలు పండే అమరావతి నేలపై రాజధాని నిర్మిస్తానని చెప్పి రైతులను నమ్మించి భూములు తీసుకున్నాడని, ప్రస్తుతం నిర్మించిన సచివాలయానికి 100 అడుగుల లోతు పునాదులు తవ్వారని, మెత్తటి నేలలో , నీటి ముంపు ప్రాంతంలో ఎవరైనా రాజధాని నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నేటికీ 50 వేల ఎకరాలలో ఉందని, రాయపూర్లో 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించినా నేటికీ అక్కడ జనం నివసించడంలేదని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్లతో పార్లమెంటు భవనం నిర్మించారని, అమరావతిలో తాత్కాలిక సచివాలయం కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేయడం ఎంత వరకు సమర్ధనీయమని నిలదీశారు. స్కీంల కోసం, స్కాంల కోసం రాజధాని కట్టి ప్రజలను అప్పుల పాలు చేయడం మంచిదికాదని హితవుపలికారు. రాజధాని పేరుతో రూ.లక్షల కోట్లు అప్పులు చేయడం పొరపాటు నిర్ణయమని, రేపు భావితరాలు ఆ అప్పులు తీర్చలేక అల్లాడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడాన్ని చూడలేక జగనన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రతిపాదనలు చేశారని తెలిపారు. ఒక ప్రతిపక్ష నాయకుడు చేసిన సూచనపై చర్చించాల్సిందిపోయి పార్టీ కార్యకర్తలు, అనుకూల పత్రికల చేత తప్పుడు రాతలు రాయించడం చరిత్ర క్షమించదని హెచ్చరించారు. తక్కువ ఖర్చుతో పెద్ద రాజధాని అందుబాటులోకి రావడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించడం సహించలేక రోతరాతల రాధాకృష్ణ చేత బూతులు రాయించి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. జగనన్న చేసిన ప్రతిపాదనతో కేవలం రూ.20 వేల కోట్లతోనే రాజధాని అందుబాటులోకి వస్తుందని, ఒక్క రూపాయి అప్పులు చేయాల్సిన అవసరముండదని వివరించారు. అమరావతి పేరుతో చేస్తున్న అప్పులను ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చంద్రబాబు పాత ఆలోచనలు చేస్తున్నారని, జగనన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మచిలీపట్నంలో జగనన్న హయాంలో నిర్మించిన పోర్టు ఉందని, విజయవాడ, గుంటూరుల్లో రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు ఉన్నాయని, మౌలిక సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో రాజధాని కట్టడం మంచిదా, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో, ప్రతి ఏడాది వరదలొచ్చి ముంపునకు గురయ్యే ప్రాంతంలో అమరావతి నిర్మించడం మంచిదో ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబును నమ్మి భూములు కొంటే రియల్టర్లు తీవ్రంగా నష్టపోతారని, గతంలో కూడా అనేక మంది నష్టపోయారని, ఇప్పుడు చేతులు కాల్చుకోవద్దని చెప్పారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్కు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని ఒట్టిచేతులు చూపుతున్న చంద్రబాబు రూ.లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతామని చెబితే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇప్పటికై నా భేషజాలు వీడి జగనన్న చేసిన సూచనను అమలు చేయాలని, మావిగన్ పేరు నచ్చకపోతే మీకు ఇష్టమొచ్చిన పేరు పెట్టుకోవాలని కోరారు. 21 గ్రామాల అమరావతి రాజధాని వద్దన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలాధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, నగర పాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ ఎండీ ఇమ్రాన్ ఖాన్, సీనియర్ నాయకులు దామరాజు క్రాంతికుమార్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న, గోనెల మేరి , మాధవి, కామేపల్లి విజయ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్, కరుణాకర్, గుడ్డల వెంకటేశ్వర్లు, గున్నా అమర్, చిన్నా, సాయి, శివ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించాలి
సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించాల్సిందేనని వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దళితులు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన వారి హోదా పెరగదని, వివక్ష తగ్గదని అన్నారు. సామాజిక వెనుకబాటు తనం అసలు పోదని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు దళితులకు అన్యాయం చేస్తుందని దళితులు బాధపడుతున్నారని అన్నారు. సామాజిక న్యాయం రాజ్యాంగ స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక మతంలోకి మారినంత మాత్రాన వివక్ష చూపి రిజర్వేషన్లు తీసేయడం సరికాదని వైఎస్సార్ సీపీ భావిస్తుందన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ చాలా స్పష్టంగా ఉందన్నారు. అందుకే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామన్నారు. చంద్రబాబు కూడా ఈ విషయాలను మేనిఫెస్టోలో పెట్టారని, చంద్రబాబు బీజేపీలో ఉంటే ఒక రకంగా.. లేనప్పుడు మరో రకంగా మాట్లాడతారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి దళితుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సుప్రీం తీర్పు తరువాత వైఎస్సార్ సీపీ స్టాండ్ ఏంటని అందరూ అడుగుతున్నారని, అంబేడ్కర్ ఆలోచనా విధానం అమలు చేయటడమే జగన్ లక్ష్యమని సురేష్ అన్నారు. ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా అదే కోణంలో ఆలోచన చేస్తున్నామని, రాజీ అనే పదం లేకుండా దళితుల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు. దళిత క్రిస్టియన్లు ఎస్సీలు కాదని చెప్పడం సరైంది కాదన్నారు. మతం మారినంత మాత్రాన కులం పోదని చెప్పారు. ఎస్సీలపై అంటరానితనం, వివక్ష అలాగే కొనసాగుతోందని వివరించారు. దళిత క్రిస్టియన్లను బీసీలుగా గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండటం సరికాదన్నారు. మతతత్వానికి అనుకూలంగా టీడీపీ వ్యవహరిస్తే అది వారినే దహించి వేస్తుందని ఆయన చెప్పారు. వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
పోతవరంలో కలెక్టర్ పల్లెనిద్ర
దర్శి: మండలంలోని పోతవరంలో శుక్రవారం కలెక్టర్ పీ రాజాబాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కలెక్టర్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోకి వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు తెలిపేందుకు పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు హాజరయ్యారు. వారి సమస్యలు కలెక్టర్కు విన్నవించారు. పోతవరంలో సీసీరోడ్లు వేయాలని, దెబ్బతిన్న తిమ్మాయిపాలెం–పోతవరం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. తానంచింతలలో సైడ్ కాలువలు నిర్మించాలని, రోడ్డు ఆక్రమణలు తొలగించాలని కోరారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు సాగర్ కెనాల్ నుంచి పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసి నీటి ఎద్దడి లేకుండా చూడాలని విన్నవించారు. పలువురు భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. తాత్కాలికంగా మంజూరైన సదరన్ క్యాంప్ సర్టిఫికెట్లను పరిమినెంట్ సర్టిఫికెట్లుగా మంజూరు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. దేవవరంలో పూర్వం నుంచి 90 మంది సన్న, చిన్న కారు రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారని వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో అధికంగా డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని, వీరు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారని దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. అనంతరం గ్రామంలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో మొదటగా పోతవరం గ్రామంలో పల్లనిద్ర నిర్వహించామన్నారు. అధికారులు చేసే పని వలన ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారిన తరువాత కూడా కొన్ని గ్రామాలు తిరిగి ఉదయం అందరితో కలసి మాట్లాడతానన్నారు. ఆయా శాఖల అధికారులు మండలంలోని ఇతర గ్రామాల్లో పల్లె నిద్ర చేపట్టారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఆర్డీఓ జాన్సన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భార్యను కిరాతకంగా చంపిన భర్త
గిద్దలూరు రూరల్: భార్యపై అనుమానంతో భర్త కిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన గురువారం పట్టణంలోని ఏబీఎం పాలెంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. దాసరి ప్రేమకుమారి (30), భర్త గంగరాజుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ తలెత్తడంతో భర్త రోకలి బండతో తలపై కొట్టి చంపాడు. కొంతకాలంగా వారి మధ్య తరుచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఘర్షణ జరిగి గంగరాజు మిద్దైపె నుంచి దూకడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లకు గాయాలపాలైన గంగరాజు ఇంట్లో ఉంటూ ప్రేమకుమారితో ఘర్షణపడ్డాడు. ఆమైపె అనుమానం పెంచుకున్న గంగరాజు ఆవేశంలో రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో ప్రేమకుమారి తీవ్ర రక్తస్రావమై వంటగదిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సీఐ కె.సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హతురాలి బంధువులు గంగరాజుపై దాడికి పాల్పడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. హతురాలి స్వగ్రామం చిన్నకంభం కాగా సెంట్రింగ్ పనిచేసుకుని జీవించే గంగరాజుకు ఆమెతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను దొంగ.. కాదు కాదు పిచ్చోడు! సింగరాయకొండ: ఇళ్లలోకి చొరబడిన దుండగులను స్థానికులు కష్టపడి పట్టుకోవడం.. తీరా పోలీసులకు అప్పగించాక వారు దొంగలు కాదు పిచ్చోళ్లని చెబుతుండటం సింగరాయకొండ మండలంలో చర్చనీయాంశంగా మారింది. గురువారం తెల్లవారుజామున కనుమళ్ల పంచాయతీ పరిధిలోని చినకనుమళ్ల వడ్డెర కాలనీలోని తన్నీరు జయమ్మ అనే మహిళ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. స్థానికులు అతడిని పట్టుకునే క్రమంలో వరుసగా నాలుగు ఇళ్ల గోడలు దూకి పారిపోయేందుకు యత్నించాడు. చివరకు ఆ వ్యక్తిని దొరకబుచ్చుకుని చితకబాదిన స్థానికులు.. బైక్పై ఎక్కించుకుని పోలీస్స్టేషన్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మెడ నొక్కి దాడి చేసేందుకు దొంగ యత్నించగా స్థానికులు ఆగ్రహించి చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. సదరు వ్యక్తిని స్టేషన్కు తరలించిన పోలీసులు కాసేపటికే అతను పిచ్చోడని తేల్చేయడం చర్చనీయాంశమైంది. అనుమానిత వ్యక్తి వేలిముద్రలు పరిశీలించామని, అతను దొంగ కాదని, పిచ్చోడని చెప్పిన పోలీసులు మరో కథనాన్ని సైతం వెల్లడించారు. అనుమానితుడి వద్ద స్మార్ట్ ఫోన్లో ఉన్న ఓ నంబర్కు కాల్ చేయగా తమది తెలంగాణ రాష్ట్రమని, పట్టుబడిన వ్యక్తి లారీ క్లీనర్ అని, గొడవ కారణంగా లారీ వదిలి వెళ్లాడని, పామూరులో సరుకు అన్లోడ్ చేసి వస్తున్నామని, తాము తీసుకెళ్తామని చెప్పినట్లు పోలీసులు వివరించారు. ఇదిలా ఉండగా పట్టుబడిన వ్యక్తి తనకు 3 ఎకరాల పొలం ఉంది, పాలు పితకడానికి టైమైంది, తనను పంపాలని అడుగుతున్నాడని పోలీసులు చెప్పడంతో విన్నవారంతా అవాక్కవుతున్నారు. అనుమానిత వ్యక్తి పిచ్చోడైతే వైద్యులు నిర్ధారించాలి కానీ పోలీసులు ఎలా ప్రకటిస్తారని, అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటన ఇది రెండోది కావడంతో పట్టుబడిన దొంగలంతా పిచ్చోళ్లలా నటించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం టౌన్: ప్రేమ పేరుతో బాలిక వెంటపడి వేధిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి వివరాలను పట్టణ ఎస్సై సైదుబాబు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణానికి చెందిన మస్తాన్ వలి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. రోజూ వెంటపడి ఇబ్బంది పెడుతుండటంతో ఎవరికీ చెప్పుకోలేక, మనస్థాపం చెంది బాలిక ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని ఎస్సై తెలిపారు. సింగరాయకొండలో దొంగను పట్టుకున్న స్థానికులు పిచ్చోడు.. కేసు నమోదు కుదరదన్న పోలీసులు ఇటీవల కాలంలో ఈ తరహాలో ఇది రెండో కేసు పిచ్చోళ్లని నిర్ధారించాల్సింది వైద్యులే కానీ పోలీసులు కాదంటున్న స్థానికులు -
మృతుల కుటుంబానికి వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం
కొనకనమిట్ల: బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన తండ్రి, కుమారుడు అంబటి అనిల్, లియో కుటుంబానికి గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సూచనల మేరకు అన్నా, ఉడుముల పార్టీ నాయకులతో కలిసి పెదారికట్ల ఎస్సీ కాలనీకి వెళ్లి అనిల్ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌజన్యకు, ఇతర కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదం చోటు చేసుకున్న రోజున మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ ప్రకటించిందని, ఆ మేరకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు అన్నా, ఉడుముల తెలిపారు. అనుకున్నమేర ఆర్థిక సాయం అందజేసినందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ యాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి, పార్టీ నాయకులు ఉడుముల గురవారెడ్డి, మారావత్ వెంకటేశ్వర్లు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. రూ.2 లక్షల నగదు అందజేసిన మాజీ మ్మెల్యేలు అన్నా, ఉడుముల -
చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించండి
మార్కాపురం: పోషణ్ పక్వాడా కార్యక్రమంతో చిన్నారుల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని కలెక్టర్ విజయసునీత ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పోషణ్ పక్వాడా కార్యక్రమాల ఉత్సవాన్ని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు స్వయం సహాయక సంఘాలతో, అంగన్వాడీ లబ్ధిదారులతో పోషణ్ ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. 6 సంవత్సరాల్లోపు చిన్నారులకు జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు వంటల పోటీలు నిర్వహించాలన్నారు. పోషణ్ ప్రాముఖ్యతపై అమ్మమ్మలు, తాతయ్యలతో కథలు చెప్పడం ద్వారా సమాజ స్థాయిలో అనుభవాలు పంచుకోవచ్చని తెలిపారు. గర్భిణులు బాలింతలు, పిల్లల కోసం స్థానికంగా లభ్యమయ్యే పోషకాహార వంటకాల ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులను కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో పోషణ్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించాలన్నారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా మలేరియా యూనిట్ అధికారి కె.రాహుల్, మెప్మా సిటీ మేనేజర్ ఎలిషా, ఐసీడీఎస్ సూపర్వైజరు నీలోఫర్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ విజయ సునీత ఆదేశం -
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన
మార్కాపురం టౌన్: శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎస్వీకేపీ కళాశాల మైదానంలో కేటగిరి–2 పశుప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలను రైతులు, పశుపోషకులు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ ఎడ్లను ఉత్సాహపరుస్తున్నారు. మొత్తం 9 జతల ఎడ్లు పాల్గొనగా ఉదయం 3 జతలకు పోటీ నిర్వహించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మిగిలిన 6 జతలకు సాయంత్రం తర్వాత ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు ఏర్పాట్లు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు పోటీలు కొనసాగాయి. టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన స్థానిక టోల్ ప్లాజా వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టోల్ప్లాజా హోటల్ వద్ద మెట్లు దిగి రోడ్డు దాటుతున్న జయవరానికి చెందిన బ్రహ్మారెడ్డిని ఒంగోలు వైపు నుంచి వచ్చిన బైకు అదుపుతప్పి ఢీకొట్టింది. బ్రహ్మారెడ్డితో పాటు బైక్పై ఉన్న గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన ఆదాం, యోగిలు కింద పడ్డారు. ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స కోసం హైవే అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. నాగులుప్పలపాడు/చీమకుర్తి రూరల్: జనాభా లెక్కల సేకరణలో సిబ్బంది అలసత్వం వహించకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. గురువారం ప్రారంభమైన ఎన్యుమరేటర్ల ఫేజ్–1 శిక్షణ కార్యక్రమాన్ని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన 2026ను డిజిటల్ విధానంలో చేపడుతున్నామని, నిర్దేశిత వివరాలన్నీ సక్రమంగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, ఏఎస్వో కళ్యాణి, ఫీల్డు ట్రైనర్లు చంద్ర, అలేఖ్య పాల్గొన్నారు. చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్ల శిక్షణ సమావేశంలో డీఆర్ఓ ఓబులేసు మాట్లాడారు. మూడు రోజుల శిక్షణలో మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. జనాభా లెక్కల ప్రక్రియ రెండు విడతల్లో చేపడుతున్నట్లు తెలిపారు. మొదటగా గృహాల గణన, రెండోసారి జనాభా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే నెలలో గృహాల గణన ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య ఎంపీడీఓ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హనుమంత వాహనంపై రామచంద్రునిగా చెన్నకేశవస్వామి
మార్కాపురం టౌన్: శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం చెన్నకేశవస్వామి వారు శ్రీరామచంద్రుని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం చెన్నకేశవస్వామి మూలవిరాట్ను, ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అర్చన, నివేదన, మంగళహారతి ఇచ్చారు. అనంతరం నాలుగు మాడవీధుల్లో స్వామివారి నగరోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మార్కాపురం పురవీధులు కిక్కిరిశాయి. కాగా, చెన్నకేశవ స్వామివారి మూలవిరాట్ను అర్చకులు ప్రత్యేకంగా చందనంతో అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి పల్లకి సేవలో వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా కోలాట ప్రదర్శన, నృత్యం, వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేడు గరుడ వాహన సేవ శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గరుడ వాహనంపై స్వామివారు శ్రీమహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులు నగరోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని ఈఓ కోరారు. -
గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి
● పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ మద్దిపాడు: పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ అన్నారు. మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం వేలాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పొగాకు బోర్డు శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. వేలం నిర్వహణ అధికారులు సూచించిన గ్రేడ్లను వేలం కేంద్రాలకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని రైతులకు సూచించారు. మొదటిరోజు ఆనవాయితీగా చండ్రపాడు గ్రామ రైతులకు చెందిన 18 బేళ్లను వేలంలో ఉంచగా, అన్నింటికీ 250 రూపాయల చొప్పున ధర వచ్చినట్లు ఆమె తెలిపారు. రైతులు మేలిమి రకం పొగాకును వేలం కేంద్రాల్లో ఉంచి మంచి ధర పొందాలని సూచించారు. ఆమె వెంట వేలం కేంద్రం నిర్వహణ అధికారి రామాంజనేయులు, వేలం కార్యనిర్వహణాధికారి గిరిరాజ్కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ హర్ష, రైతు నాయకులు నారిపెద్ది వరహాలు చౌదరి, పల్లకి సత్యనారాయణరెడ్డి, అబ్బూరి శేషగిరి, రావి మహేష్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
సంబరాలు కాదు.. రాజధాని కట్టి చూపండి
మార్కాపురం: రాజధాని అమరావతి పేరుతో ప్రజలను మఽభ్యపెట్టే చర్యలు, సంబరాలు మానుకుని, ముందు రాజధానిని నిర్మించి చూపాలని చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాజధాని కట్టేస్తున్నాం, ప్రపంచం అదిరేలా చేస్తున్నాంశ్రీ అని 2014 నుంచి గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు సర్కారు ఇప్పటికీ ఏపీ కేపిటల్ అమరావతి పేరుతో సంబరాలు చేస్తున్నారని, అయితే రాజదానికి ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించేలా కేంద్రం నుంచి నాడే ఎందుకు అనుమతి తీసుకురాలేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదించడం సంగతి అటుంచితే, ఇన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిన అన్యాయాన్ని విస్మరించి మోడీ సర్కార్కు ఎలా జైకొట్టారని నిలదీశారు. మళ్లీ ఇప్పుడేదో గొప్పగా సాధించినట్లు చంద్రబాబు ప్రభుత్వం జబ్బలు చరుచుకోవడం అవివేకమని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో బాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచన కలిగిన వారని, అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాన్ని నిలదీసే రోజు దగ్గరలోనే ఉందని జంకె హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి -
11న జ్యోతిబా పూలే జయంత్యుత్సవాలు
మార్కాపురం టౌన్: మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంత్యుత్సవాలను ఈ నెల 11వ తేదీ మార్కాపురంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయసునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులో విద్యుత్ కార్యాలయం వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేయనున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టరేట్లో కూడా జ్యోతిబా పూలే జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు వన్టౌన్: సీ్త్ర నిధి రుణాలను 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రూ.450 కోట్లు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ నారాయణ సిబ్బందికి సూచించారు. ఒంగోలులోని భాగ్యనగర్లో వెలుగు టీటీడీసీ భవనంలో సీ్త్ర నిధి బ్యాంక్ మేనేజర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 57,792 మంది సభ్యులకు రూ.450 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో 22,961 మంది సభ్యులకు రూ.195.40 కోట్లను రుణాలుగా అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీలన్నీ డిజిటల్ పద్ధతిలో సీ్త్ర నిధి యాప్ ద్వారా చెల్లించాలని ఆదేశించారు. సీ్త్ర నిధి యాప్పై సభ్యులకు అవగాహన కల్పించారు. సీ్త్ర నిధి జోనల్ డీజీఎం ఉమామహేశ్వరరావు, ఏజీఎంలు ఉదయ్ కుమార్, చిన బుల్లయ్య సమావేశంలో పాల్గొని సభ్యులకు, డీఆర్డీఏ సిబ్బందికి సీ్త్ర నిధి యాప్పై అవగాహన కల్పించారు. సీ్త్ర నిధి కార్యకలాపాలు, విధివిధానాలు, లక్ష్యాల సాధన గురించి గ్రూపు సభ్యులకు అధికారులు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠం, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రజనీకాంత్, సహాయ ప్రాజెక్టు మేనేజర్ జె.నారాయణ, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రాజెక్టు మేనేజర్, జీవనోపాధుల విభాగం, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, ఫార్మర్ మిత్రలు పాల్గొన్నారు. -
చిన్నకండ్లేరు.. రైతులు ఉసూరు
పుల్లలచెరువు: మండలంలోని పలు గ్రామాల ప్రజల ప్రధాన నీటి వనరు చిన్నకండ్లేరు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. తాగు, సాగు నీరు అందిస్తున్న ప్రాజెక్టులోని నీరు అధికారులు, నాయకుల అలసత్వంతో వృథాగా పోతోంది. మండల కేంద్రం పుల్లలచెరువులోని చిన్నకండ్లేరు ప్రాజెక్టు ప్రస్తుతం అలంకారప్రారంగా కనిపిస్తోంది. 26 అడుగుల నీటి సామర్థ్యంతో వందల ఎకరాల వైశాల్యం కలిగిన చిన్నకండ్లేరు ప్రాజెక్టు ఆయకట్టు పశ్చిమ ప్రాంతంలో కంభం చెరువు తర్వాత అతి పెద్ద చెరువుగా పేరు గాంచింది. అధికారికంగా 3 వేలు, అనధికారంగా మరో రెండు వేలు.. దాదాపు ఐదు వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే పుల్లలచెరువు, తెల్లగట్ల, ఉమ్మడివరం, గంగవరం, ముటుకుల, సింగుపల్లి, రెంటపల్లి తదితర గ్రామాల్లో తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా రెండు కార్లు పంటలు పండుతాయి. సుమారు మూడేళ్ల క్రితం చెరువు లోపల గండి పడి దాదాపు సగానికిపైగా నీరు వృథాగా పోయింది. అప్పటి అధికారులు ప్రత్యక్షంగా చెరువును పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరకట్టారు. చెరువులో నీరు తగ్గగానే సిమెంట్ కాంక్రీట్తో చెరువు కట్టకు లోపల, బయట మరమ్మతులు చేస్తామని, ఇక ఇటువంటి సమస్య రాకుండా ఉంటుందని అధికారులు హామీ ఇచ్చారు. గతేడాది కురిసిన భారీ వర్షానికి చెరువులో సగానికి పైగా నీరు చేరింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతన్నల ఆశలను ఆవిరి చేస్తూ గత వారం నుంచి చెరువు కట్టకు లోపల రంధ్రం పడటంతో మళ్లీ నీరు వృథాగా పోతోంది. ఇరిగేషన్ అధికారులు బుధవారం చెరువు కట్టను పరిశీలించి గండి పడిన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని, నీరు వృథా కాకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మూడేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయిన నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికిప్పడు రైతులకు కంటి తుడుపు చర్యగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తూతూమంత్రపు హామీలు ఇస్తున్నారు. పది గ్రామాల ప్రజలకు పుష్కలంగా తాగు, సాగు నీరందించే అతి పెద్ద చెరువు చిన్నకండ్లేరు ప్రాజెక్టు పట్ల ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్నతాధికారులు పరిశీలించినా ఫలితం శూన్యం కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారులు చెరువును ప్రత్యక్షంగా పరిశీలించినా ఉపయోగం లేకుండాపోయింది. అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సారియా, జిల్లా, రాష్ట్ర స్థాయి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు చెరువును పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుంటామని, పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చి వెళ్లారేగానీ నేటి వరకు చెరువుపై కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. వేలాది ఎకరాలకు సాగు నీరు, దాదాపు పది గ్రామాల ప్రజలకు తాగు నీరు అందించే చిన్నకండ్లేరు ప్రాజెక్టు పట్ల అధికారులు, నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. వాస్తవానికి తమది రైతు ప్రభుత్వమని, నీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కూటమి నాయకులు వల్లెవేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా చిన్నకండ్లేరు ప్రాజెక్టు సమస్యలపై మీడియాలో కథనాలు వస్తున్నా, రైతుల నుంచి సదరు శాఖ అధికారులకు, నాయకులకు విన్నపాలు అందుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతుచిక్కడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని నీటి వృథాను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
చేతగాని ప్రభుత్వంతో ఆర్థిక ఇబ్బందులు
రాధాకృష్ణను అరెస్టు చేయాలి ఖైదీలను సంస్కరించే శిక్షణాలయాలు.. జైళ్లు కనిగిరిలో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్, పార్టీ నేతలు మార్కాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నాయకులు మహిళలను కించపరుస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుల భార్యలు, మహిళలను దూషించిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. – సాక్షి, ఒంగోలు ● ఏకేయూ వీసీ మూర్తి ఒంగోలు సిటీ: సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆంధ్రకేసరి యూనివర్శిటీ వైస్ చాన్సిలర్ డీవీఆర్ మూర్తి అన్నారు. స్థానిక యూనివర్శిటీలో ఫైనలియర్ ఎంబీఏ ఆక్వా కల్చర్, మ్యాథమేటిక్స్, సోషల్ వర్క్ ఎడ్యుకేషన్, కెమిస్ట్రీ డిపార్టుమెంట్ల విద్యార్థులకు గురువారం ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలంటే సామాజిక సేవ చేయాలని తెలిపారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారానే నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. సమాజమే ఒక పెద్ద ప్రయోగశాల అని, సమాజంలో ఉన్న రకరకాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ఎవరి సమస్యలు వాళ్లు తెలుసుకునే విధంగా సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. తద్వారా సమాజంలోని అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి, ప్రొఫెసర్ జి.రాజమోహన్, ప్రొఫెసర్ జి.సోమశేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్షప్రీతందేవ్, తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ఒంగోలు టౌన్: కారాగారాలు ఖైదీలను సంస్కరించే శిక్షణాలయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. గురువారం ఒంగోలులోని జిల్లా జైలును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలు తమ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఖైదీలకు అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో ముఖాముఖి మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కొంత మంది ఖైదీలు నేరాలకు అలవాటుపడుతున్నారని, మానుకోకపోతే జీవితాంతం కారాగారవాసమేనని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలుగుతూ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని పంచాలని హితవు పలికారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి, జైలర్ ఎంఏ నాయుడు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.రాఘవులు, జైలు విజిటింగ్ న్యాయవాదులు మొబీనా, శైలజ పాల్గొన్నారు. -
ఖాళీ బాసూ!
భద్రతసాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పోలీసు కార్యాలయంలో ఏడాదిన్నర కాలంగా అడిషనల్ ఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అడిషనల్ ఎస్పీ క్రైంగా విధులు నిర్వహించిన శ్రీధర్ బాబు నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందడంతో బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ కుర్చీ ఖాళీగా ఉంది. జిల్లా కేంద్రంలో నేర పరిశోధనలో కీలకమైన పోస్టు భర్తీ చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా గత డిసెంబర్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు కూడా బదిలీపై వెళ్లారు. దాంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. జిల్లాలో అడిషనల్ ఎస్పీలు లేకపోవడంతో ఏదైనా అవసరమైనప్పుడు పొరుగు జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల సింగరాయకొండ చైతన్య నవోదయ కోచింగ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మరణించడం తేలిసిందే. ఈ విషయంలో న్యాయం కోసం విద్యార్థి తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లడంతో అడిషనల్ ఎస్పీతో పునర్విచారణ చేయించాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ జిల్లాలో ఆ పోస్టుకు అధికారులు లేకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్యకు ఆ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. అయినా సరే, కూటమి పాలకులకు పోస్టుల భర్తీ పట్టడం లేదు. జిల్లాకు అవసరమైన పోలీసు అధికారుల పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత వదిలిపెట్టారని ప్రజలు విమర్శిస్తున్నారు. స్పెషల్ బ్రాంచికి డీఎస్పీ ఎప్పుడోస్తారో... జిల్లా కేంద్రమైన ఒంగోలులో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో డీఎస్పీగా పనిచేస్తున్న సురేష్ కుమార్ను ఎస్బీ డీఎస్పీగా నియమించారు. అయితే, కొంతకాలానికే ఆయన రిటైరయ్యారు. మూడు నెలల నుంచి ఎస్బీ డీఎస్పీ పోస్టు ఖాళీగానే ఉంది. గుంటూరు నుంచి చిరంజీవిని డీఎస్పీగా నియమించారు. ఆయనకు పోలీసు కానిస్టేబుల్ శిక్షణ జరుగుతున్న డీటీసీ కేటాయించారు. అక్కడ పనిచేయడం ఇష్టం లేని ఆయన.. బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దాంతో ఎంతో కీలకమైన ఎస్బీ డీఎస్పీ బాధ్యతలను సీఐ శ్రీనివాసరావు చూస్తున్నారు. సీఐ చేతుల్లోనే ట్రాఫిక్ సిగ్నల్స్... జిల్లా కేంద్రమైన ఒంగోలును నిత్యం ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. దానికితోడు జిల్లా కేంద్రం కావడంతో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇంత కీలకమైన ఒంగోలు నగరంలో ట్రాఫిక్ డీఎస్పీ పోస్టు 20 నెలలుగా ఖాళీగా ఉంది. కారణమేమిటో ఎవరికీ తెలియదు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సీఐగా పాండురంగారావును నియమించింది. ఆయన మీద పలు ఆరోపణలు రావడం తెలిసిందే. జిల్లా ఎస్పీగా హర్షవర్థన్రాజు బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ల తరువాత పాండురంగారావును వీఆర్కు పంపించారు. ఆయన స్థానంలో సీసీఎస్లో పనిచేస్తున్న జగదీష్ సీఐగా వచ్చారు. 20 నెలలుగా డీఎస్పీని నియమించకపోవడం వెనుక మతలబేమిటో పోలీసు అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. గ్రూప్–1 వివాదాల నేపథ్యంలో... గ్రూప్–1 వివాదాల నేపథ్యంలో కనిగిరి డీఎస్పీ యశ్వంత్సాయి ఈశ్వర్ను బదిలీ చేయడంతో అక్కడ కూడా ఇదే సమస్య నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి సబ్ డివిజన్ ప్రాంతంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే కనిగిరికి డీఎస్పీ పోస్టు చాలా అవసరం. యశ్వంత్ సాయి ఈశ్వర్ స్థానంలో ఒంగోలు దిశ డీఎస్పీ వీవీ రమణ కుమార్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లా కేంద్రం నుంచి ఆయన అక్కడకు వెళ్లాల్సి రావడం సమస్యేనని పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా కనిగిరికి పూర్తి స్థాయి డీఎస్పీని నియమిస్తారో.. లేకపోతే కాలయాపన చేస్తారో వేచి చూడాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జిల్లాలో ఈ సమస్య లేదు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు విధులు నిర్వహించారు. ట్రాఫిక్ విభాగాన్ని డీఎస్పీ పర్యవేక్షించారు. ఎస్బీ డీఎస్పీగా మరియదాసు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఇపుడు దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో కీలక పోలీసు ఉద్యోగాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నెలల తరబడి ఖాళీగా ఉన్నాగానీ పాలకులకు కానరావడంలేదు. పైస్థాయి ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. జిల్లాలో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు లేకపోవడంతో శాంతి భద్రతల బాధ్యత, కేసుల విచారణలు సీఐల మీద పడ్డాయి. దీనికి తోడు బందోబస్తులు, ప్రొటోకాల్ సమస్యలతో సీఐలు సతమతమవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోలీసు పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతో అట్టహాసంగా మార్కాపురం జిల్లాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కీలకమైన అధికారులను నియమించే విషయంలోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కాపురం జిల్లా ప్రకటించి నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ నేటికీ ఎస్పీని నియమించలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థన్రాజు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో మార్కాపురం జిల్లా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఒంగోలు రావాల్సి వస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు చేసి ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా మార్కాపురం జిల్లాకు వెంటనే కొత్త ఎస్పీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేయండి
మార్కాపురం టౌన్: అభివృద్ధిలో వెనుకబడిన మార్కాపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయసునీతకు వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విజయ సునీతను బుధవారం మాజీ ఎమ్మెల్యే అన్నాతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషేర్ ఆలీబేగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ షేక్ సలీమ్, కార్యదర్శి సత్యంరెడ్డి, మార్కాపురం, కొనకనమిట్ల మండలాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజ్ఞప్తి -
కూలీల ఆటో బోల్తా
సంఘటన స్థలంలో బోల్తా పడిన ఆటో, కూలీలు క్షతగాత్రులకు 108 వాహనంలో చికిత్స కొనకనమిట్ల: మిర్చి కోతలకు వెళ్తుండగా ఆటో బోల్తా పడిన ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన 565 జాతయ రహదారిపై కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల సబ్స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పెదారికట్లకు చెందిన 10 మంది కూలీలు ఆటోలో మిర్చి కోత కోయడానికి కొత్తపల్లి గ్రామానికి వెళ్తున్నారు. ఆటో చినారికట్ల జంక్షన్ దాటి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోకి రాగానే రోడ్డుకు అడ్డంగా అడవి పందులు వచ్చాయి. వేగంగా వెళ్తున్న ఆటో పందులను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మిగిలిన వారిని మోస్తరు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వెద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరసమ్మ, చెన్నమ్మ, గురవమ్మను మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మిర్చి కోతలకు వెళ్లే క్రమంలో అదుపు తప్పిన ఆటో 8 మందికి గాయాలు -
భారీ ఎత్తున మొహరించిన పోలీసులు
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి హంగామా సృష్టించారు. బ్యారికేడ్లను అడ్డం పెట్టారు. మహిళా నాయకురాళ్లను బ్యారికేడ్లు దాటి వెళ్లకుండా అడ్డుకున్నారు. పాత చీరాల రోడ్డులో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి హడావుడి చేశారు. తొలుత ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు నేతృత్వంలో పలువురు నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి బలవంతంగా పంపేశారు. -
‘సఖి’ సేవలు సద్వినియోగం చేసుకోండి
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇబ్రహీం షరీఫ్ ఒంగోలు టౌన్: సఖీ వన్ స్టాప్ సెంటర్లో అందిస్తున్న వైద్య, పోలీస్, కౌన్సిలింగ్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ సూచించారు. బుధవారం నగరంలోని జీజీహెచ్ పరిధిలో గల సఖి వన్స్టాప్ సెంటర్ను ఆయన సందర్శించారు. అక్కడున్న బాధితులను పరామర్శించి ఉచిత న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా న్యాయవాదిని నియమించి న్యాయసహాయం అందించనున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి మహిళ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం వలన కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. అనంతరం రాంనగర్లోని బాలసదన్, శిశుగృహను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. వసతి, భోజన సౌకర్యాల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో సఖీ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ, ఏఎస్ఐ వేమా గౌతమి, ఐసీడీఎస్ సిబ్బంది అనిత, లక్ష్మీ ప్రసన్న, జోనల్ లీగల్ అడ్వైజర్ బి.రత్నప్రసాద్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పొన్న వాహనంపై మురళీకృష్ణుడిగా చెన్నకేశవుడు
మార్కాపురం టౌన్: శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం చెన్నకేశవ స్వామివారు మురళీకృష్ణ అలంకారంలో పొన్న వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యులు బృందం స్వామివారికి పుష్పాలంకరణ, అర్చన, నివేదన, మంగళహారతి ఇచ్చిన అనంతరం స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్వామివారి పల్లకి సేవలో మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు సతీమణి దుర్గకుమారి, ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారిని పలువురు ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా కోలాటం, డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
మోక్షమెప్పుడో?
కంభం కోర్టుకు కంభం: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 96 న్యాయస్థానాలను అదనంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కేడర్లో 7 న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా, కంభంలో కోర్టు ఏర్పాటు కానుందని ఆశించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర నిరాశే మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. కంభంలో కోర్టు లేకపోవడంతో బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాల ప్రజలు వ్యయ ప్రయాసలలోర్చి మార్కాపురం, గిద్దలూరులోని న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తోంది. నవాబుల కాలంలోనే కంభంలో ఏర్పాటైన కోర్టు, ఆ తర్వాత బ్రిటిష్ హయాం, అలాగే స్వాతంత్య్రం అనంతరం కొంతకాలం వరకు కొనసాగింది. ఆనాటి పాలకులు స్థానిక పరిస్థితుల కారణంగా కంభంలో ఉన్న కోర్టును గిద్దలూరుకు తరలించినట్లు పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం గిద్దలూరులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అడిషనల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టు, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టు ఉండగా ఇటీవల కాలంలో సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) కోర్టు మంజూరైంది. 2008వ సంవత్సరంలో కంభంలో కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉండగా అప్పట్లో అది కూడా గిద్దలూరుకు తరలిపోయింది. దీంతో కంభంలో కోర్టు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మూడు మండలాల ప్రజలు మరింతగా నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం మార్కాపురం, గిద్దలూరులో మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రజల, పోలీస్ అధికారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలను కలిపి కంభం పోలీస్ సర్కిల్గా ఏర్పాటు చేశారు. ఈ పరిణామం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇదే మాదిరి కోర్టు సైతం ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. న్యాయవాదులు ఎక్కువే.. కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో వంద మందికి పైగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారు. సుమారు 30 మంది న్యాయవాదులు గిద్దలూరు, మార్కాపురం కోర్టులకు వెళ్తుండగా మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. మార్కాపురంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో న్యాయ విద్యనభ్యసించే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. కంభంలో కోర్టు ఏర్పాటు చేస్తే నూతన న్యాయవాదులకు సైతం అవకాశాలు పెరుగుతాయి. గిద్దలూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలో అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలున్నాయి. కోర్టు పరిధిలో సుమారు మూడు వేల కేసుల వరకు పెండింగ్లో ఉండగా వీటిలో ఈ మూడు మండలాలకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. కక్షిదారులకు ప్రయోజనం అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, వెలగలపాయ గ్రామాలు, బేస్తవారిపేట మండలంలోని కోనపల్లి లోయ గ్రామాల ప్రజలు గిద్దలూరు కోర్టుకు వెళ్లాలంటే సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. లోయ ప్రాంతాల నుంచి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక రోజు మొత్తం సరిపోతోంది. కొన్ని సందర్భాల్లో కోర్టు సమయానికి చేరుకోలేక కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంభంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కేసుల విచారణ వేగంగా జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో గిద్దలూరులో సైతం పెండింగ్ కేసుల సంఖ్య తగ్గి, అక్కడి కేసుల విచారణ వేగంగా పూర్తయ్యే అవకాశముందన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. కక్షిదారుల ఇబ్బందుల దృష్ట్యా కంభంలో కోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవచూపాలని ప్రజలు కోరుతున్నారు. మూడు మండలాల ప్రజలకు దూరాభారంగా న్యాయస్థానాలు లోయ ప్రాంతాల నుంచి కోర్టుకు వెళ్లాలంటే సుమారు 70 కి.మీ ప్రయాణం గిద్దలూరు న్యాయస్థానంలో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు కంభంలో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులకు ఉపయోగకరం నవాబుల కాలం నుంచి స్వాతంత్య్రానంతరం వరకు కంభంలో ఉన్న కోర్టు ఆ తర్వాత గిద్దలూరుకు తరలించిన వైనం నూతన మార్కాపురం జిల్లాలోనైనా కంభంలో కోర్టు ఏర్పాటు చేయాలని ప్రజాకాంక్ష -
కదం తొక్కిన కార్మిక లోకం
కనిగిరిరూరల్: మార్కాపురంలో జిల్లా ఏర్పడిన తర్వాత ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభ బుధవారం కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. సంఘటిత, అసంఘటి కార్మికులు, వివిధ కార్మిక సంఘాలు సమైక్యతను చాటుతూ కష్టజీవుల జెండాలను చేతబూని పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. స్థానిక పీవీఆర్ పార్క్ వద్ద నుంచి శ్రమజీవులు, కార్మికులు, కర్షకులు, ఎర్ర జెండాలను చేతబూని స్థానిక షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏఐటీయూసీ జెండాను సీపీఐ సీనియర్ నాయకుడు అందే నాసరయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసీన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధక్షుడు ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ శ్రమ జీవుల పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ నిరంతర పోరాటాలు సాగిస్తోందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకళించేందుకు కార్మిక లోకం సంసిద్ధం కావాలన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ, కార్మిక వర్గాలు ఇప్పటి వరకు కార్మిక సంక్షేమ పోరాటాలు సాగించాయని.. ఇక ఇప్పటి నుంచి కార్మిక వర్గాలు రాజకీయ పోరాటాలకు సంసిద్ధులు కానున్నట్లు వెల్లడించారు. అందుకు రానున్న రాష్ట్ర, ఆల్ ఇండియా కార్మిక సభల్లో అన్ని కార్మిక సంఘాలతో సమష్టి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ పోరాటాలతో కార్మికుల హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. కార్మిక చట్టాలను, హక్కులను కూటమి సర్కార్ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కూటమి నేతలకు కార్మిక సత్తా చూపించేందుకు సమాయత్తం కావాలన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కార్లో అన్ని వర్గాలకు అన్యాయం కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల పేరుతో రూ.కోట్ల విలువ చేసే భూములను కార్పొరేట్ వ్యాపారులకు, బడాబాబులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, యువత ఉద్యోగం, ప్రజా సంక్షేమం ఇలా అన్నింటినీ గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు. పీపీపీ విధానం పేరుతో పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రకు చంద్రబాబు తెర లేపారని విమర్శించారు. వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి కనీస చర్యలు లేవని, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతూ..కాకమ్మ కబుర్లతో కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. సీపీఐ, ఏఐటీయూసీ రాష్ట్ర, జిల్లా నాయకులు వై రవీంద్రబాబు, రమేష్ బాబు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్డీ మౌలాలి, కృష్ణ గౌడ్, మస్తాన్రావు, ఎస్కే ఖాశింపీరా మాట్లాడారు. కార్యక్రమంలో కార్మిక, వివిధ సంఘాల నాయకులు పందిటి మోహన్, జీపీ రామారావు, ఎస్కే గులాం హుస్సేన్, పీ ప్రభాకర్రావు, దాసరి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. – ఎంఎల్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి -
పాలకులు స్పందించాలి
కంభం నియోజకవర్గంగా ఉన్న సమయంలో కూడా నాటి పాలకులు ఈ ప్రాంత కక్షిదారుల అవసరాలను గుర్తించక పోవడం, సమస్యలను ఉన్నతస్థాయి కోర్టులు, జడ్జిల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో కోర్టు ఏర్పాటుకు నోచుకోలేదు. కోర్టు ఏర్పాటుకు అవసరమైన వసతులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతో మూడు మండలాల ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు. – ఉదయగిరి మల్లికార్జున,అడ్వకేట్, కంభం కంభంలో కోర్టు ఏర్పాటు చేయాలి గతంలో కంభంలో ఉన్న కోర్టును కొన్ని అనివార్య కారణాల వల్ల నాడు గిద్దలూరుకు తరలించారు. కోర్టు ఏర్పాటు కోసం పలుమార్లు ధర్నాలు చేశాం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించాం. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించి కోర్టు ఏర్పాటు ఆవశ్యకతపై గళం వినిపించాం. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో సివిల్ కేసులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి కంభంలో కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – మహమ్మద్ ఇబ్రహీం, ఎస్జీపీఏ ఏపీ అధ్యక్షుడు, కంభం -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
సంతమాగులూరు (అద్దంకి): ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు మనస్తాపం చెంది బుధవారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన గుంజి నాగేంద్రం కుమారుడు నవీన్ (27) కొంతకాలంగా మండలంలోని కుందుర్రులో నివాసం ఉంటూ చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం దక్కక పోవడంపై తీవ్ర నిరాశకు గురై ఎలుకల మందు తిన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని అద్దంకిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దొనకొండ: వెళ్తున్న రైలు నుండి ప్రయాణికుడు జారిపడి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే ఏఎస్ఐ వీరాంజనేయులు కథనం ప్రకారం.. మండలంలోని తెల్లబాడు పంచాయతీ నల్లబోతులవారిపాలెం గ్రామానికి చెందిన పోకూరి శ్రీనివాసరావు రైలు నుంచి జారి కింద పడ్డాడు. రైల్వే సిబ్బంది గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. దర్శి 108 సిబ్బంది ఈఎంటీ ఎన్.ప్రసాద్, పైలట్ కె.నరేష్బాబు హుటాహుటిన రైల్వేట్రాక్ గుట్టమీదపల్లె వద్దకు చేరుకుని క్షతగాత్రుడిని ప్రథమ చికిత్స కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారని ఏఎస్ఐ తెలిపారు. తాళ్లూరు: మండలంలో అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐలు రవిబాబు, రాఘవరావులు తమ సిబ్బందితో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూర్పుగంగవరంలో పాదర్తి కుమార్రాజా వద్ద 16 డొమెస్టిక్ సిలిండర్లు, ఐదు కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి తాళ్లూరు మంగ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి అప్పజెప్పారు. నిందితుడిని ఒంగోలు జాయింట్ కలెక్టర్ కోర్టుకు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై నాగేశ్వరరావు, డిటి రాధాకృష్ణ పాల్గొన్నారు. సంతమాగులూరు (అద్దంకి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కర్నూలు–గుంటూరు రహదారిపై పాతమగులూరు వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన విమరాల ప్రకారం.. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ముత్తునపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మం (53) టీవీఎస్ వాహనంపై వినుకొండ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య హనుమాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
ఎమ్మార్పీఎస్ ఆశయాలు మనుధర్మానికి తాకట్టు
● తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం నాగులుప్పలపాడు: ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించుకుందుకు ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఆశయాలను మనుధర్మానికి తాకట్టు పెట్టడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. ఎమ్మార్పీఎస్ పురిటిగడ్డ ఈదుమూడి గ్రామాన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నేత గరటయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రీతం మాట్లాడుతూ ఈదుమూడిలో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిందని గుర్తు చేశారు. చివరకు ఎస్సీ వర్గీకరణ సాధించుకొని ఈదుమూడి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అటువంటి ఉద్యమం ద్వారా ఏదిగిన స్వార్థ నాయకుడు బీజేపీ మాయలో పడి ఉద్యమాన్ని, ఆశయాలను మనుధర్మానికి తాకట్టు పెట్టడంతో పాటు ఈదుమూడి గ్రామం ఏమైనా ఉద్యమానికి రక్షణ కవచమా.. అని మాట్లాడటం దుర్మార్గమైన చర్యన్నారు. రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన తరుణంలో స్వార్థపరుడైన నాయకుడు ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఏ ఉద్యమ ఆశయాలను మనుధర్మానికి తాకట్టు పెట్టారో దానికి వ్యతిరేకంగా ఈదుమూడి నుంచే మరో ఉద్యమం ప్రారంభించి దేశ నలులమూలలా చాటి చెపుతామన్నారు. ఆ ఉద్యమానికి తాను అండగా నిలబడి ముందుకు తీసుకెళ్తానన్నారు. క్రైస్తవ మతం పుచ్చుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఉండదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామన్నారు. హిందువులకు తిరుపతి పుణ్యక్షేత్రంలా ఎలాగో మాదిగలకు పుణ్యక్షేత్రం ఈదుమూడిలో నిర్మించి తీరుతామన్నారు. అందుకు ఎమ్మార్పీఎస్ పుట్టిన రోజైన జూలై 7వ తేదీన దేశ నాయకులతో వచ్చి శంకుస్థాపన చేస్తామన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రిజర్వేషన్ను మన పిల్లలు పొందే విల్లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తోందని, దీంతో కష్టపడి చదువుకున్నా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, మానుకొండ శ్రీధర్, ఏటుకూరి విజయ్కుమార్, కొమ్మూరి సుధాకర్, సైమన్ పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: సన్నిహితంగా ఉంటున్న మహిళ దూరం పెట్టిందన్న కారణంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మార్కాపురం పట్టణంలోని ఇండో ఫ్యాక్టరీ వెనుక వైపు చక్రపాణి వీధిలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. బొమ్మిరెడ్డి చెన్నారెడ్డి కుమారుడు మల్లికార్జునరెడ్డి(36) ప్రైవేట్ డిష్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొద్ది రోజులుగా సదరు మహిళ దూరం పెట్టడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పట్టణ ఎస్సై సైదుబాబు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సాగర్ కాలువలో మృతదేహం లభ్యం
దర్శి: పట్టణంలోని పొదిలిరోడ్డు ఎస్కేజే పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సాగర్కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఉల్లగల్లు గ్రామానికి చెందిన చీమకుర్తి పీరుసాహెబ్(65)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పీరుసాహెబ్కు ఇటీవల ప్రమాదంలో గాయపడి మతిస్థిమితం లేనట్లు సమాచారం. మతిస్థిమితం లేక కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. పీసీపల్లి: మండల పరిధిలోని తురకపల్లి గ్రామంలో అక్రమంగా అటవీ పోరంబోకు, అటవీ భూముల్లో, బంజారా భూముల్లో అక్రమంగా తెల్లరాయి తవ్వుతున్నారన్న సమాచారంతో మైనింగ్ శాఖ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు చేశారు. దాడుల్లో అక్రమంగా తెల్లరాయి తవ్వుతున్న జేసీబీనీ, 100 టన్నుల తెల్లరాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. మురుగమ్మి, అయినకోట, పెదయిర్లపాడు, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో కొంత మంది అక్రమంగా తెల్లరాయి తరలిస్తున్నారని తెలిసింది, వారిని కూడా కట్టడి చేస్తామన్నారు. అనుమతులు లేకుండా తెల్లరాయి తవ్వితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో ఏజీ పోల్రెడ్డి, ఆర్ఐ బాలరాజు, మాధవరెడ్డి, వీఆర్ఓ సుకుమార్ పాల్గొన్నారు ఒంగోలు టౌన్ : పామూరు సీఐ మాకినేని శ్రీనివాస రావుపై వేటు పడింది. ఆయన్ను గుంటూరు రేంజ్ వీఆర్కు పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావుకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 5 నెలల క్రితం సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఇంటివద్ద దుకాణం తెరిచి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి కూడా సీఐ పట్ల అసంతృప్తిగా వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సీఐని వీఆర్కు పంపించినట్లు తెలుస్తుం . ఒంగోలు టౌన్: జీవన శైలిలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవడం వలన సగం వ్యాధులు దూరమవుతాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఆరోగ్య పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్టీ వెంకటేశన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జయప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం 30 శాతం ప్రజలు బీపీ, షుగర్, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులతో బాధపడుతున్నారని తెలిపారు. కంటినిండా నిద్ర, సరిపడా వ్యాయామం, మానసిక ఒత్తిడి వలన ఈ జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. ఎవరికి వారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించాలని కోరారు. జేవీవీ జిల్లా కోశాధికారి బి.తిరుపతయ్య మాట్లాడుతూ చిన్నారులు అధిక చక్కెర కలిగిన పదార్థాలు, జంక్ఫుడ్ తినడం వలన ఊబకాయానికి గురవుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా జీవన శైలి ఆరోగ్య సమస్యలు–శాసీ్త్రయ అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కూలు డైరక్టర్ బి.విజయలక్ష్మి, ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, శివప్రసాద్, కళ్యాణ్, స్వామిదాసు, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
జె.పంగులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై అలవలపాడు డొంక వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు..గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెంపాడు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరి (65) తన అమ్మ స్వగ్రామం కృష్ణాజిల్లా నూజివీడు నుంచి బాపట్ల జిల్లా మార్టూరు మండల కోలలపూడి గ్రామంలో ఉన్న తన కుమార్తె రత్నకుమారిని చూసేందుకు మరో వ్యక్తి సాయంతో సోమవారం రాత్రి బయలుదేరారు. మంగళవారం ఉదయం కొలలపూడి వద్ద దిగాల్సి ఉండగా నిద్రమత్తులో ఆదమరిచి అద్దంకి మండలం వెంకటాపురం వద్ద దిగారు. కొలలపూడి వేళ్లేందుకు ఆటో తీసుకొని వస్తానని సహాయంగా వచ్చిన వ్యక్తి కందుకూరి సుంఖాలు వెంకటాపురం వెళ్లగా మతి స్థిమితం లేని నాగమల్లేశ్వరి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా అలవలపాడు డొండ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దదోర్నాలలో పిచ్చికుక్క స్వైర విహారం
● ముగ్గురు చిన్నారులతో పాటు మరొకరికి గాయాలు పెద్దదోర్నాల: పిచ్చికుక్క స్వైర విహారం చేయటంతో ముగ్గురు చిన్నారులతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పెద్దదోర్నాలకు చెందిన చిన్నారులు కళ్యాణి, ధరణి, ఐనముక్కలకు చెందిన శ్రీలక్ష్మిలతో పాటు ఓ రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి మౌళాలి తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు గుంటూరు రోడ్డులోని ఐడియా షోరూం ఎదురుగా తల్లిదండ్రులు కాశీరాములతో కలిసి షాపింగ్కు వచ్చిన కళ్యాణి, దిబ్బయ్య కుమార్తె ధరణిలు, ఐనముక్కలకు చెందిన వెంకట రమణ కుమార్తె శ్రీలక్ష్మిలను పిచ్చికుక్క దాడి చేయటంతో వారిద్దరి చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో ప్రాంతానికి వెళ్లిన పిచ్చికుక్క రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి మౌళాలిపై దాడి చేసి కాలిపై కొరకటంతో పంటిగాట్లు బలంగా పడ్డాయి, గాయపడిన వీరిని స్థానికులు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా క్షతగాత్రులకు యాంటి రేబిస్ వాక్సిన్లు వేయటంతో పాటు ప్రథమ చికిత్స చేశారు. అధికారులు స్పందించి గ్రామంలో సంచరిస్తున్న పిచ్చికుక్కను బంధించాలని కోరుకుంటున్నారు. -
వర్షానికి తీవ్రంగా నష్టపోయాం
అకాల కురిసిన వర్షానికి మొక్కజొన్న పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంటకు మంచి ధర పలుకుతుందన్న ఉద్ధేశంతో ఎకరాకు రూ.10వేలు కౌలు చెల్లించి 5 ఎకరాల్లో సాగు చేశాను. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో కంకులు కోతకు వస్తాయి. గింజ కూడా గట్టిపడి బరువు పెరుగుతుందనుకుంటున్న తరుణంలో వర్షం కురిసి పంట నేలవాలింది. దీంతో కంకులు తడవడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ముందస్తుగా పంటను కోయాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే తాము అప్పుల పాలవుతాం. – వనిపెంట వీరమ్మ, యర్రగొండపాలెం పంట నష్టాలను అంచనా వేస్తున్నాం అకాల వర్షాలకు మొక్కజొన్న పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం. పుల్లలచెరువు మండలంలోని కొమరోలు, యడ్రపల్లి గ్రామాల ప్రాంతాల్లో మొక్కజొన్న రైతులకు దాదాపు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన మండలాల్లో జరిగిన నష్టం గురించి ఆయా మండలాల ఏఓలు అంచనా వేస్తున్నారు. – వెంకటరమణ, ఏడీఏ, యర్రగొండపాలెం -
పోతురాజు కాలువను అభివృద్ధి చేయాలి
ఒంగోలు టౌన్: నగరంలో దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిన పోతురాజు కాలువను యుద్ధప్రతిపాదికన అభివృద్ధి చేయాలని, కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుయాత్రను మంగళవారం స్థానిక భగత్సింగ్ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాబు మాట్లాడుతూ...స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ పేర్లతో నగరం అభివృద్ధిలో వెలిగిపోతున్నట్లు పాలకులు చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో కాగడా వేసి వెతికినా కనిపించడంలేదని విమర్శించారు. నగరంలో పోతురాజు కాలువకు ఆనుకొని జీవిస్తున్న ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారని, కాలువలో చెత్తా చెదారం పేరుకొని పోవడంతో మురుగునీరు నిలిచిపోయిందన్నారు. దీంతో దుర్గంధం వెలువడుతుందని, దోమలు విపరీతంగా పెరిగిపోయి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పారు. పోతురాజు కాలువ చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మించాలని, కాలువను శుభ్రం చేసి మురుగునీరు పారేందుకు అనువైన చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...భగత్సింగ్ కాలనీ, గోపాల్ నగరం, మహేద్ర నగర్, నీలంపాలెం, కరుణా కాలనీ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీరు తొలగించి దోమల మందు పిచికారి చేసేవారు కూడా లేకుండా పోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి సెంటు స్థలం చొప్పున కేటాయిస్తూ భరోసా పత్రాలు జారీ చేసిందని, ఆ స్థలాలకు పొజిషన్ చూపించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 13న నిర్వహించే ధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, విజయమ్మ, భావనారాయణ, శ్యాము, హుసేన్, వీరాస్వామి, వెంకటరావు, రామకృష్ణ పాల్గొన్నారు. -
బెట్టింగ్లతో జీవితాలు నాశనం
దర్శి: బెట్టింగ్లకు దిగి జీవితాలు నాశనం చేసుకోద్దని డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. ఇటీవల గుర్తించిన 18 మంది బెట్టింగ్రాయుళ్లకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కుటుంబసభ్యులను పిలిచి వారితో మాట్లాడి బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. దర్శి ఏరియాలో ఒక రూంను అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన ముఖ్యమైన ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకి పంపామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 26 మందిని నిందితులుగా చేర్చామన్నారు. అందులో పేద కుటుంబాలకు చెందిన తెలియక అవగాహన లేని బెట్టింగ్లకు పాల్పడిన కొందరిని ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు వారిని మొదటి తప్పు కింద వదిలి పెడుతున్నామని చెప్పారు. మళ్లీ బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాలో ముఖ్యమైన ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఐపీఎల్లో ఎవ్వరూ బెట్టింగ్ల జోలికి వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో సీఐ రామారావు పాల్గొన్నారు. 18 మంది బెట్టింగ్రాయుళ్లకు డీఎస్పీ కౌన్సెలింగ్ ముఖ్యమైన ముగ్గురు కోసం గాలిస్తున్నాం ఐపీఎల్లో బెట్టింగ్లు పెట్టవద్దని హెచ్చరిక మొదటి తప్పుగా కొందరిని వదిలేశాం రెండోసారి బెట్టింగ్లు పెడితే జైలుకు పంపుతాం -
వేర్వేరు ప్రమాదాల్లో రెండు కార్లు దగ్ధం
పొదిలి: మంటలు ఎగిసి కారు దగ్ధమైన సంఘటన మంగళవారం ఒంగోలు–నంద్యాల రోడ్డులో కంభాలపాడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..కృష్ణాజిల్లా కలిదిండి నుంచి ప్రయాణికులతో కారు కనిగిరి వైపు వెళుతుంది. ఈక్రమంలో కంభాలపాడు బస్టాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత కారు ముందుగా వెళులున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు రేడియేటర్ నుంచి మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే కారు దిగారు. నిముషాల వ్యవధిలో కారు ముందు భాగం మొత్తం దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిద్రమత్తులో డివైడర్ను ఢీకొని.. సింగరాయకొండ: నిద్రమత్తులో కారు డివైడర్ను ఢీకొని తిరగబడటంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగి కారు తగలబడింది. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో మండల పరిధిలోని జాతీయరహదారి పై ఉన్న విమానాల రన్వే పై జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడగా అందులో శ్రీనివాసరెడ్డికి స్వల్ప గాయాలు కాగా సుమతికి గాయాలయ్యాయి. పోలీసుల కథంనం ప్రకారం..తిరుపతిలో దర్శనం చేసుకుని తిరుగుప్రయాణంలో హైదరాబాద్లోని బీన్రెడ్డి హిల్స్కు వెళుతుండగా కారు రన్వే పైకి రాగానే నిద్రమత్తు కారణంగా రోడ్డు మధ్యలో డివైడర్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తిరగబడటంతో పాటు డీజిల్ ట్యాంకు లీకై మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో కారులోని వారు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. తరువాత టంగుటూరు నుంచి ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పింది. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులోని వారిని 108లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. -
ప్రకృతి పగ
పంట చేతికందే వేళ..యర్రగొండపాలెం: ప్రకృతి వైపరీత్యానికి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమవారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి పుల్లలచెరువు మండలంలోని కొమరోలు, యండ్రపల్లి గ్రామాల్లో వేసిన మొక్కజొన్న పంట నేలవాలి సుమారు రూ.10లక్షల మేర రైతులు రైతులు నష్టపోయారు. యర్రగొండపాలెం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లో దాదాపు 15,773 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అయితే ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. దీంతో కోతకు వచ్చిన మొక్కజొన్న పంట పొలంలోనే నేలవాలింది. కొన్ని ప్రాంతాల్లో ఆరబెట్టుకున్న కంకులు పూర్తిగా తడిచిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. దాదాపు 10 రోజుల తరువాత కోయాల్సిన మొక్కజొన్న కంకులు నేలవాలిన పంటనుంచి కోసుకోవాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయే పరిస్థితి ఉందని రైతులంటున్నారు. వ్యవసాయాధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అకాల వర్షానికి కుదేలైన మొక్కజొన్న రైతులు నేలవాలిన మొక్కజొన్న కంకులు తడిసిపోయిన ఆరబెట్టుకున్న కంకులు పుల్లలచెరువు మండలంలోని రెండు గ్రామాల్లోనే రూ.10లక్షల నష్టం స్పందించని వ్యవసాయాధికారులు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు -
తెల్లరాయి తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ
రాచర్ల: మండలంలోని అనుములపల్లె గ్రామ సమీపంలోని 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సమీసపంలోని కొండ ప్రాంతంలో మెస్సర్స్ ఇండోసోల్ సోలార్ కంపెనీ సర్వే నంబర్ 732లోని 12.50 హెక్టర్లల్లో తెల్లరాయి తవ్వేందుకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ పెంచల ప్రభాకర్, నెల్లూరు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్కుమార్ అధ్వర్యంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనుములపల్లె గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మాట్లాడుతూ మైనింగ్ చేసే ప్రాంతంలో పంటపొలాలు, పశువులకు ఎలాంటి హానీ జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గొర్రెలు, మేకలు మేతకు వెళ్లేందుకు కాపరులు ఇబ్బందులు పడతారని, అనుములపల్లె గ్రామం మీదుగా వెళ్లే రోడ్డును విస్తరణ చేయాలని కోరారు. మైనింగ్ చేసే సమయంలో చుట్టపక్కల ఉండే రైతులకు, గొర్రెల కాపరులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామాల్లో వైద్య సేవలందించాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని కోరారు. ఈ సందర్భంగా పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్కుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. కార్యక్రమంలో అనుములపల్లె మాజీ సర్పంచ్ సిరిగిరి రమేష్, జియోలాజిస్ట్ గోవిందరావు, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, వీఆర్ఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలందించండి
మార్కాపురం రూరల్: మార్కాపురం రోడ్ రైల్వేస్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చినా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందటం లేదని ప్యాసింజర్స్ అసోసియేషన్ నాయకులు ఓరుగంటి మల్లిక్, ఆర్కేజే నరసింహలు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ సుధీష్ణ సేన్కు విన్నవించారు. మంగళవారం మార్కాపురం రోడ్ రైల్వేస్టేషన్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్యాసింజర్స్ అసోసియేషన్ నాయకులు ఆమెను కలిసి పలు సమస్యలను జీఎం దృష్టికి తెచ్చారు. రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రమైనప్పటికీ అందుకు తగినట్లుగా రైళ్లు, స్టేషన్లో వసతి సౌకర్యాలు లేవని, వాటిని మెరుగు పరచాల్సి ఉందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు కర్నాటక, హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని, వారికి తగినట్లుగా రాత్రి సమయంలో బస చేసేందుకు ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. మార్కాపురం నుంచి గుంటూరుకు మధ్యాహ్నం సమయంలో ఒక రైలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చర్లపల్లి–మార్కాపురం రైలును ప్రతిరోజు నడపాలని, కాచిగూడ–నడికుడి ప్యాసింజర్ను న్యూపిడుగురాళ్ల, శావల్యాపురం మీదుగా మార్కాపురం వరకు పొడిగించాలని కోరారు. కొండవీడు ఎక్స్ప్రెస్ను డైలీ సర్వీసుగా మార్చాలని కోరారు. గుంటూరు–ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ను షిర్డీ వరకు పొడిగించాలని, గుంటూరు–తిరుపతి ఎక్స్ప్రెస్ను తిరువణ్ణామలై మీదుగా తిరుచిరాపల్లి వరకు పొడిగించాలని విన్నవించారు. వారితో పాటు నరసింహా చార్యులు, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. -
పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడండి
● ఎస్పీ హర్షవర్ధన్రాజు ఒంగోలు టౌన్: వేసవి సెలవుల్లో పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ వీ హర్షవర్ధన్రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్ధులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. సరదాల కోసం పిల్లలు, యువకులు, గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు ఈతలకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. గతంలో ఇలాంటి ప్రమాదకర జలాశయాల్లో పలువురు మృత్యువాత పడి కుటుంబాలకు తీరని విషాదం మిగిల్చిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ఈతకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సరదాగా వెళ్లిన పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెరువుల్లో, కొలనుల్లో, కాలువల్లో ఈత కొట్టే ముందు ఈత తెలిసిన వారు కూడా నీటి లోతును కర్రసాయంతో ముందుగా పరిశీలించుకోవాలన్నారు. లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే ఈత, స్నానం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలో చెరువులు, కొలనులు, జలపాతాలు, నీటి కుంటలు, ఏరుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈత ప్రదేశాల్లో నీటి లోతును తెలుపుతూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవించిన వెంటనే 112 నంబరుకు డయల్ చేయాలని లేదా సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. పెద్దదోర్నాల: మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద ఉన్న కొల్లంవాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండవ సొరంగం ద్వారా ప్రత్యేక వాహనంలో కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. అనంతరం గంటవానిపల్లె వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సొరంగ నిర్మాణ పనులు, ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ విజయ సునీత, సీఈ, రమేష్, ఎస్ఈ అబూతాలిం, డీఈ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. కనిగిరిరూరల్: జనగణన విధులకు పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై పంచాయతీ కార్యదర్శుల సంఘం తీవ్రంగా మండిపడుతోంది. ఈమేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేయనున్నట్లు కనిగిరి పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులు మాట్లాడుతూ పట్టణాల్లో వీఆర్వోలు, వీఆర్ఏలు, సచివాలయ సిబ్బంది ఉన్నా.. వారిని పక్కన పెట్టి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు జనగణన బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఐవీఆర్ఎస్ కాల్స్, డోర్టు డోర్ చెత్త సేకరణ, స్వామిత్వ సర్వే, యూనిఫైడ్ మిస్సింగ్ డేటా, జల సంరక్షణ మాసం, నీటి ఎద్దడి నివారణ చర్యలు, గ్రామ పరిపాలన బాధ్యతల నిర్వహణ తదితర అనేక రకాల విధులతో ఒత్తిడిల్లో ఉన్న తమను కావాలని జనగణన విధులకు కేటాయించడం సమంజసం కాదన్నారు. జనగణన విధులు రెవెన్యూ సిబ్బందికి కేటాయించకుండా తమనే ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నిస్తే..‘పంచాయతీ కార్యదర్శులకు పనిలేదని...వీఆర్వోలకు, వీఆర్ఏలకు పని ఉందని’ రెవెన్యూ శాఖ అధికారులు వ్యాఖ్యానించడం తీవ్ర బాధాకరమన్నారు. జిల్లా అధికారులు తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని జనగణన విధుల్లో నుంచి పంచాయతీ కార్యదర్శులను తప్పించాలని, తాము చేస్తున్న గ్రామాల్లోనే విధులు కేటాయించాలని సంఘ నాయకులు కోరారు. -
భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా చర్యలు
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీవో, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జలాధార–నీటి భద్రత కార్యక్రమంలో భాగంగా రాబోయే 100 రోజుల్లో మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వీబీజీ రామ్ జీ పథకంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ముందుగా పది రోజుల యాక్షన్ప్లాన్ను తయారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 80 రోజుల ప్రణాళికలో జిల్లాలోని చెరువుల పూడిక తీయటంతోపాటు భూగర్భ జలాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వివరించారు. జలాల మట్టాన్ని కనీసం 1.5 మీటర్లు పెంచాలన్నారు. వేసవికి ముందు 6 మీటర్ల లోపు వర్షాకాలం తర్వాత 3 మీటర్ల నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, అధికారులు పాల్గొన్నారు. -
స్పాట్ సాంకేతికమక
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పదో తరగతి మూల్యాంకనంలో విద్యాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు టీచర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. స్పాట్ ప్రారంభమైన తొలి రోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ట్యాబ్ ఆధారిత అప్లికేషన్లో సాంకేతిక సమస్యలు, అదనపు పనిభారంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ ప్రక్రియలో మార్కుల నమోదు నెమ్మదిగా సాగుతుండటంతో ఆలస్యమవుతోంది. దీనికి తోడు జిల్లా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇష్టారాజ్యంగా మినహాయింపులపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. Ýë…MóS-†-MýS…V> ¡çÜ$-Mö-_a¯]l Ñ«§é-¯]l…™ø E´ë-«§éÅ-Ķæ¬ÌSOò³ A§ýl-¯]lç³# ¿êÆý‡… ç³yýl$-™ø…§ýl° E´ë-«§éÅĶæ$ çÜ…çœ*Ë$ BÆø-í³-çÜ$¢-¯é²Æ‡$$. çÜÇV>Y ç³°-^ólĶæ$° sêÅ»ŒæË$, ¯ðlsŒæ çÜÐ]l$-çÜÅ-ÌS™ø AÐ]lçܦË$ ç³yýl$-™èl$¯é²Æý‡° õ³ÆöP…-r$-¯é²Æ‡$$. „óS{™èl Ýë¦Æ‡$$ÌZ ÐéçÜ¢Ð]l ç³Ç-íܦ™èl$Ë$ ç³Ç-Ö-Í…-^èl-MýS$…yé Mö™èl¢ Ñ«§é¯]l… AÐ]l$Ë$ ^ólĶæ$yýl… çÜÇ-M>§ýl° A…r$-¯é²Æ‡$$. ✔️çÜ-Ð]l$-Æý‡¦-Ð]l…™èl-OÐðl$¯]l sêÅ»ŒæË$ A…¨…-^éÍ, íܦÆý‡-OÐðl$¯]l, ÐólVýS-Ð]l…-™èl-OÐðl$¯]l ¯ðlsŒæ-Ð]lÆŠ‡P MýS͵…^é-Í. ÐéçÜ¢Ð]l ç³Ç-íܦ-™èl$ÌSMýS$ A¯]l$-VýS$-׿…V> ç³°-¿êÆý‡… Ñ¿ýæ-h…-^é-ÌS-°, E´ë«§éÅ-Ķæ¬ÌS MýSÚët°² VýS$Ç¢…-_, çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ ™èl„ýS-׿Ðól$ ç³Ç-çÙP-Ç…-^éÌS° yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æ‡$$. Ð]lÊÌêÅ…MýS¯]l MóS…{§ýl…ÌZ ç³NÇ-¦-Ýë¦-Ƈ$$ÌZ Ð]lçÜ™èl$Ë$ MýSÍ-µ…-^éÌS° MøÆý‡$-™èl$-¯é²Æ‡$$. ఒంగోలు సిటీ: పదో తరగతి మూల్యాంకనం 6వ తేదీ నగరంలోని డీఆర్ఆర్ స్కూలులో ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకూ జరుగుతుంది. ఇందుకు 23 గదులను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు అమర్చారు. ఈ కేంద్రంలో సుమారు 1.92 లక్షల పేపర్లను స్పాట్ వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి 775 మంది ఉపాధ్యాయులను నియమించారు. అందులో స్పెషల్ అసిస్టెంట్లు 236 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 459 మంది, చీఫ్ ఎగ్జామినర్లు 80 మంది ఉన్నారు. మూల్యాంకనం ఇలా.. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు సరాసరి 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఉదయం 20, మధ్యాహ్నం 20 పేపర్లు చేయాల్సి ఉంది. గతంలో టీచర్లు దిద్దిన పేపర్లను ముగ్గురు స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మార్కులు టోటల్స్ చేసి సంతకాలు చేసేవారు. తాజాగా విద్యాశాఖ చేసిన మార్పుల ప్రకారం దిద్దిన సమాధాన పత్రాలను ట్యాబ్ల ద్వారా స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మూల్యాంకనం చేసిన వెంటనే స్పెషల్ అసిస్టెంట్లుగా ఉన్న టీచర్లు స్కాన్ చేస్తారు. తరువాత స్థాయి అధికారి పరిశీలన అనంతరం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రెండింటికీ తేడా ఉంటే ఆన్లైన్ తీసుకోదు. ఇంత కష్టపడుతున్నా స్పెషల్ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం తక్కువగా ఉందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యతో సతమతం.. విద్యాశాఖ నూతనంగా తీసుకొచ్చిన నిబంధనలు మూల్యాంకనం చేస్తున్న టీచర్ల పాలిట శాపంగా మారాయి. సాంకేతికంగా మార్పులు తీసుకువచ్చింది కానీ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో తొలిరోజే ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. ఫలితంగా సాయంత్రం ఐదు గంటలకు ముగించాల్సిన స్పాట్ వాల్యుయేషన్ అర్ధరాత్రి వరకూ కొనసాగిందని టీచర్లు వాపోతున్నారు. రెండో రోజు పరిస్థితి కొంత మెరుగుపడినా కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయని తెలిసింది. స్పాట్ కోసం మొత్తం 300 ట్యాబ్లను వినియోగిస్తున్నారు. పదో తరగతి మూల్యాంకనంలో టీచర్లకు విధులు కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి చాలా మందికి మూల్యాంకనం నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మందికి ఎలాంటి వినతులు చేసుకోకపోయినా మినహాయింపులు ఇస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్పాట్ ఆర్డర్లలో నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఐటీ సిబ్బంది కొందరు అధికారులకు తెలియకుండా మినహాయింపులు ఇచ్చినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని తెలిసింది. ఫిజిక్స్ నుంచి మ్యాథ్స్ కన్వర్ట్ అయిన ఒక సంవత్సరం అర్హత గల వారిని సైతం ఎగ్జామినర్గా నియమించరని తెలుస్తోంది. అలాగే రెండు మూడు సంవత్సరాల నుంచి హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియెట్ బోధిస్తున్న వారికి కూడా ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అధికారులు నిబంధనలకు నీళ్లు ఒదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
11న చెన్నకేశవస్వామి రథోత్సవం
మార్కాపురం టౌన్: చారిత్రక ప్రసిద్ధి చెందిన మార్కాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వివిధ రంగులతో విద్యుత్ దీపాలను అలంకరించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈనెల 1 నుంచి నిర్వహిస్తున్నారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చెన్నకేశవస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మార్కాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో, కర్నూలు, నంద్యాల, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రతిరోజూ ఒక వాహనంపై ప్రత్యేక అలంకారంలో నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ గొలమారి శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వాహనాల్లో భాగంగా పొన్న వాహనం, హనుమంత వాహనం, గజ వాహనాలకు పగలు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వాహనం ముందు భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ వేషధారణల మధ్య స్వామివారికి నగరోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడంతోపాటు భక్తులు రథాన్ని లాగి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నదానం చేస్తారు. -
ముదిరిన టోల్ప్లాజా వివాదం
పెద్దదోర్నాల: మండల పరిధిలోని హసానాభాద, జమ్మిదోర్నాల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ఆయా గ్రామాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం రెండు గ్రామాల ప్రజలు ఎదురు పడటంతో తోపులాటకు దారి తీసింది. రెండు గ్రామాల నడుమ నిర్మించిన టోల్ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటే, కాదు తమ ఊరి పేరే పెట్టాలంటూ హసానాబాద, జమ్మిదోర్నాలకు చెందిన గ్రామస్తులు ఏకంగా సోమవారం రోడ్లపైకి చేరి ఆందోళన చేయటంతో ఏకంగా రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో టోల్ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మండుతున్న ఎండలకు పలు వాహనాల్లోని ప్రయాణికులతో పాటు చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..ఆయా రెండు గ్రామాల నడుమ ఏర్పాటు చేసిన టోల్ప్లాజాకు జమ్మిదోర్నాల పేరు పెట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టోల్ ప్లాజా ఏర్పాటుకు తమ గ్రామంలోని రైతులకు చెందిన స్థలాలనే వినియోగించారని, కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను టోల్ ప్లాజా నిర్మాణాలకు తాము కారు చౌకగా ప్రభుత్వానికి ఇచ్చామని కాబట్టి టోల్ప్లాజాకు తమ ఊరి పేరే పెట్టాలని హసానాబాదకు చెందిన పలువురు రైతులు వాదిస్తున్నారు. అయితే టోల్ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసిందని, అందువల్ల తమ ఊరి పేరే పెట్టాలని జమ్మిదోర్నాలకు చెందిన పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం టోల్ ప్లాజాకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంలో రెండు గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కొందరు ఆకతాయిలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లను విసురుకోవడంతో గందరగోళం వాతావరణం నెలకొంది. దీంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, పురుగు మందు డబ్బాలతో హల్చల్ చేశారు. సంఘటనా స్థలిలో కొద్ది మంది మాత్రమే పోలీసులు ఉన్నా, అక్కడ భారీగా గుమిగూడిన గ్రామస్తులను అదుపులోకి తీసుకురావడం అసాధ్యమైంది. దీంతో సమాచారమందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్ సంఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను నచ్చజెప్పటంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సీఐ అజయ్కుమార్, నేషనల్ హైవే కాంట్రాక్టర్ రవీంద్రారెడ్డితో ప్రత్యేకంగా చర్చించారు. టోల్ప్లాజాకు సంబంధించిన వివాదాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. రెండు గ్రామాలకు చెందిన వారి మధ్య తోపులాట టోల్ప్లాజాకు తమ ఊరి పేరే పెట్టాలని ఇరు గ్రామాలు పట్టు గ్రామస్తులు రోడ్లపై భైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం రెండు గంటల పాటు ఎండ తీవ్రతకు అల్లాడిన చిన్నారులు, వృద్ధులు -
తౌషిక్ మృతిపై విచారణ
ఒంగోలు టౌన్: జిల్లాలో సంచలనం సృష్టించిన సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూలు విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతిపై నెల్లూరు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య విచారణ నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో నెల్లూరు ఏఎస్పీ సౌజన్యకు విచారణ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కనిగిరి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమె తౌషిక్ తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీలతో సుదీర్ఘంగా మాట్లాడారు. తల్లిదండ్రుల అనుమానాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. స్కూలు యజమాని కుమారుడు ఒక ఉపాధ్యాయునితో సన్నిహితంగా ఉండటం చూసినందుకు వల్లే తౌషిక్ను హత్య చేసినట్లు తలిదండ్రులు ఏఎస్పీ దృష్టికి తీసుకొని వచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన తౌషిక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. -
మేమింతే..మారమంతే..!
టంగుటూరు: సింహపురి ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ ఆధ్వర్యంలో టంగుటూరు టోల్ప్లాజాలో ఓవర్ లోడ్ ఫీజు వసూలు పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. టోల్ప్లాజా యాజమాన్యం తీరుతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, పరీక్షలకు వెళ్లే విద్యార్థుల ఇక్కట్లు చెప్పేవీ కావు. సోమవారం సాయంత్రం ట్రాఫిక్లో అంబులెన్సు చిక్కుకుపోయింది. ఓవర్ లోడ్ ఫీజు వసూలు కోసం వాహనాలు చాలా సేపు ఆగిపోతున్నాయి. దీంతో అంబులెన్సులతో పాటు పోలీసులు, ప్రజాప్రతినిధుల వాహనాలు సైతం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ తంతు చాలా రోజులుగా జరుగుతున్నా టోల్ప్లాజా యాజమాన్యం వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టోల్ప్లాజా యాజమాన్యంపైచర్యలు తీసుకొని ఇక్కట్లు తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు. మారని టంగుటూరు టోల్ప్లాజా తీరు ఓవర్ లోడ్ ఫీజు వసూలుతో వాహనదారులకు ఇక్కట్లు గంటల పాటు స్తంభిస్తున్న ట్రాఫిక్ ట్రాఫిక్లో అంబులెన్సులు చిక్కుకుంటున్నా చలించని వైనం -
పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పిడుగులు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపించగా..సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తరువాత ఉరుములు మెరుపులతో పిడుగులు పెద్ద సంఖ్యలో పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. ముఖ్యంగా పొలం పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో పిడుగులు పడటంతో రైతులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. త్రిపురాంతకం: పిడుగులు, ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు పూర్తిస్థాయిలో దెబ్బతినగా, పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లింగాల కోటేశ్వరరావుకు చెందిన 1.50 లక్షల విలువ చేసే ఎద్దు మృతి చెందగా, అదే సమీపంలో మరో ఎద్దు తప్పించుకుని పరిగెడుతూ ఓ మహిళలను ఢీకొట్టడంతో ఆమె గాయపడింది. గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్తారు. ఒక్క సారిగా వాతావరణంలో మార్పులు చేసుకుని భారీ వర్షం కురవటంతో కళ్లాల్లోని మిరిప కాయలు పూర్తిగా తడిచిపోయాయని రైతులు వాపోయారు. వాటికి పట్టాలు కప్పే పరిస్థితి కూడా లేకపోవటంతో భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. దీంతో పాటు అరటి, బొప్పాయి, మెక్కజొన్న పంటలకు సైతం నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. పొన్నలూరు: పొన్నలూరులో పిడుగు పడి వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని బాప్టిస్ట్ నగర్కు చెందిన చుండి సామ్యేలు గ్రామానికి సమీపంలో ఉన్న పొలం దగ్గరకు వెళ్లాడు. ఇంటికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడటంతో మార్గ మధ్యలో చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములతో చెట్టుకు సమీపంలో పిడుగు పడటంతో వీపు భాగం, కాళ్లకు స్వల్ప గాయాలతో సృహతప్పి పడిపోయాడు. దీంతో అటుగా వస్తున్న వారు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స నిమిత్తం స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు. పొదిలి రూరల్: మండలంలోని ఓబులక్కపల్లిలో సోమవారం పిడుగుపడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన తిరుమలశెట్టి భాగ్యలక్ష్మి పొలంలో పనులు చేస్తుండగా సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో పిడుగుపడిన సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి శరీరంలోని వెనుక వైపు, చేయి తీవ్రగాయాలతో ఆపస్మారక స్థితిలో జారుకుంది. స్థానికులు గ్రామస్తులు తెలపడంతో వెంటనే పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పొదిలి: పొదిలి పట్టణంలో ఉరుములు మెరుపులతో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో స్థానిక శ్రావణి ఎస్టేట్లోని చెరుకూరి నాగవర్థనమ్మ భవనంపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు భవనం ఎలివేషన్ పాక్షికంగా దెబ్బతినటంతో పాటు, అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నందిపాలెం గ్రామంలోని పొలాల్లో విపరీతంగా వీచిన గాలికి కరెంటు స్తంభం దెబ్బతింది. విరిగిపోయిన పోల్ కొంత భాగం తీగలకు వేలాడుతుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మర్రిపూడి: మండలంలోని వేమవరం, కూచిపూడి, మర్రిపూడి, గుండ్లసముద్రం, అంకేపల్లి గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షానికి వేమవరంలో పొగాకు, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. గుండ్లసముద్రం దళితవాడలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. వల్లాయపాలెం, మర్రిపూడి, గంగపాలెం గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో రేకులు ఇళ్లు దెబ్బతిన్నాయి. వడగండ్ల వర్షానికి పంట నష్టం సంభవించింది. పంట పొలాల్లో వర్షం నీరు నిలిచాయి. పొదిలి మండలం ఓబులక్కపల్లిలో పిడుగుపాటుకు గాయపడిన భాగ్యలక్ష్మి త్రిపురాంతకం కల్లాల్లో తడిసిన మిరపకాయలు -
యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్టు
● నిందితునికి 15 రోజుల రిమాండ్ పామూరు: కోరిక తీర్చమని బలవంతం చేయడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుందని సీఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బోడ మాధవి పామూరులోని సెయింట్మార్స్క్ ప్రైౖవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. మండలంలోని మోపాడు కొండారెడ్డిపల్లె గ్రామానికి చెదిన షేక్.నాగూర్బాషా తన పిల్లలను అదేపాఠశాలలో చదివిస్తుండగా వారికోసం వెళ్లి వస్తూండేవాడు. ఈ క్రమంలో నాగూర్బాషా టీచర్ బోడా మాధవి ఫోన్నంబర్ తీసుకుని ఆమెతో క్రమంగా స్నేహం ఏర్పరచుకుని ఆమెతో ఫోన్ ఛాటింగ్, వీడియో కాల్స్ చేసేవాడు. అయితే మాధవికి తెలియకుండా నూడ్ వీడియోస్ స్క్రీన్ రికార్డు చేసి వాటితో ఆమెతో బెదిరించేవాడు. తన కోరిక తీర్చకుంటే వీడియోలు సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పరువు పోతుందని భయపడిన మాధవి ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణలో మాధవి బలవాన్మరణానికి కారకుడైన నాగూర్బాషాను పామూరులోని కందుకూరు రోడ్డులో అరెస్ట్చేసినట్లు వెల్లడించారు. నిందితున్ని కనిగిరి ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలు
మార్కాపురం రూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని వేములకోట జగనన్న కాలనీ వద్ద ఎదురెదురుగా వస్తున్న బైక్లు ఢీకొని ఇద్దరు వాహనదారులకు గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి నికరంపల్లి, చింతగుంట్ల నుంచి మార్కాపురం వస్తున్న బైక్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆనెకాళ్ల పిచ్చిరామిరెడ్డి తలకు, చేతులకు గాయాలు కాగా మద్దుపల్లి సాయి కల్యాణ్ ప్రసాద్కు మోకాలికి తీవ్ర గాయమైంది. మేడం ఆంజనేయులకు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు తరలించారు. రూరల్ ఎస్సై వేమన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు స్పందనకు 80 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు నేరుగా ఎస్పీ హర్షవర్థన్ రాజును కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వృద్ధులు, నడవలేని వారి సమస్యలను విని వారికి సత్వర న్యాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ రమణకుమార్, చీమకుర్తి సీఐ ప్రసాద్, అద్దంకి సీఐ సుబ్బరాజు, ప్యానెల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు.ముండ్లమూరు: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ దుండగులు చింపేశారు. ఈ ఘటన మండలంలోని నూజెల్లపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన హనుమంతరావు అనే కార్యకర్త తన ఇంటి వద్ద ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా బూచేపల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది ఓర్చుకోలేని టీడీపీ వర్గీయులు ఫ్లెక్సీని చించివేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త అయిన హనుమంతరావుపై వారం రోజుల క్రితం దాడి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం ఇస్తే కేసు తీసుకోకుండా కాళ్లరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింత శ్రీనివాస్రెడ్డి అక్కడకి చేరుకొని టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిచేసి, ఫ్లెక్సీలు చింపి వేయడంపై మండిపడ్డారు. ఫ్లెక్సీ చించివేతపై గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, మండల నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కురిచేడు: మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జీబీబీ రఘువీరను జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సస్పెండ్ చేశారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఎంఈఓ సీహెచ్ కోటయ్య విచారించారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించినట్లు ధ్రువీకరించడంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
లబ్ధిదారుల సంఖ్య కుదిస్తే ఉద్యమం
ఒంగోలు టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను యథాతథంగా ఇవ్వాలని, లబ్ధిదారుల సంఖ్య కుదిస్తే ఉద్యమం తప్పదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక సుందరయ్య భవనంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికలకు ముందు అగ్రహారం, వెంగముక్కలపాలెం ప్రాంతాల్లో 280 ఎకరాలను కొనుగోలు చేసి ఒక్కో లబ్ధిదారునికి సెంటు స్థలం చొప్పున రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ ఎంక్వయిరీ పేరుతో 13 వేల మందిని తొలగించడం అన్యాయమన్నారు. ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నా కరెంటు మీటర్ల ఆధారంగా అనర్హులుగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తే ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూముల్లో 20 నుంచి 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న దారావారికుంట, దత్తాత్రేయకాలనీ, మదర్థెరిసా కాలనీ, న్యూ అంబేద్కర్ నగర్, మున్సిపల్ వర్కర్స్ కాలనీ, మోటూరు ఉదయం కాలనీల పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. అమృత్ పథకం కింద ప్రతిరోజూ నీరందిస్తామని చెబుతున్నా మూడు రోజులకోసారి నీరివ్వడం గగనమవుతుందన్నారు. పోతురాజు కాలువ అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ప్రజా పోరుబాట నిర్వహించి 13వ తేదిన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. తొలుత పోరుబాట వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసులు, వీరాస్వామి, ఎస్డీ హుసేన్, దామా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కూలి బతుకులపై పిడుగు
యర్రగొండపాలెం/పుల్లలచెరువు/కనిగిరి రూరల్/ముండ్లమూరు/దర్శి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం మండుటెండలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వడగండ్ల వానకు తోడు భీకర శబ్దాలతో పిడుగులు పడ్డాయి. బతుకు దెరువు కోసం పంట పొలాల్లో పనులు చేసుకునే కూలీలు, పశువులు మేపుకునే కాపరుల పాలిట ఆ పిడుగులు మృత్యుపాశాలయ్యాయి. పిడుగుల ధాటికి ఆరుగురు మృత్యువాత పడగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ● పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లా అచర గ్రామానికి చెందిన కన్నయ్య(18) మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న అచర గ్రామానికి చెందిన అజాద్ కుమార్, రజనీష్ కుమార్, నితీష్ కుమార్, రాజు కుమార్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మండలంలోని యండ్రపల్లి గ్రామానికి సమీపంలో మొక్కజొన్న తోటలో కంకులు కోస్తున్న సమయంలో పిడుగు పడటంతో రైతు కూలి బొందలపాటి నాగయ్య (60) మృతి చెందాడు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో పంట అన్లోడ్కు వచ్చిన లారీలో ఉన్న కంకులు తడుస్తాయని బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలు ఆ లారీపై పట్టలు కప్పుతున్నారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో అక్కడికి సమీపంలో పిడుగుపడింది. పిడుగు ధాటికి కూలీలు కింద పడిపోయారు. వారిలో కన్నయ్య మృతి చెందాడు. మిగిలిన కూలీలకు గాయాలయ్యాయి. గాయాలైన వారు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సంఘటన తెలిసిన వెంటనే సీఐ అజయ్కుమార్, ఎస్సై సాంబశివరావు హుటాహుటిన వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. ఈ కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● అదే విధంగా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(37) పశువుల వ్యాపారం చేసుకుంటూ పుల్లలచెరువు మండలంలోకి రాగా వర్షంతో పాటు మెరుపులు, ఉరుములు రావడంతో సమీపంలోని చెట్టు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడడంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టు తోర్రలో పిడుగు పడడంతో చెట్టు కూడా కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ● ముండ్లమూరు మండలంలోని వేములబండ పొలాల్లో సోమవారం సాయంత్రం పిడుగుపడి పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ (19) మృతిచెందాడు. శివకృష్ణ తన బంధువులైన రావులపల్లి శ్రీను, మల్లయ్య, మరికొందరితో కలిసి వేములబండ రైతుల పొలాలకు గొర్రెలను కౌలుకు తీసుకుని మేత మేపుకుంటున్నారు. సోమవారం సాయంత్రం శివకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతుండగా అతడు ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి కాపరులు శివకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతని తల్లిదండ్రులు కుమార్, భవానీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని తహశీల్ధార్ ఆర్ శ్రీకాంత్, ఆర్ఐ మూర్తి, ఏఎస్ఐ బి పవన్ కుమార్ పరిశీలించారు. ● దర్శి మండలం శామంతపూడిలో ఆవుల మల్లికార్జునరావు (26) సోమవారం మేత కోసం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు విలపించారు. ● కనిగిరిలో పిడుగుపాటుకు రైల్వే పనుల కోసం వచ్చిన కార్మికుడు దుర్గేష్ కుమార్ (24) మృతి చెందాడు. బీహార్కు చెందిన దుర్గేష్ కుమార్ వారం రోజుల క్రితం కనిగిరి సమీపంలోని పోలవరం, కలగట్ల వద్ద జరుగుతున్న రైల్వే లైన్ పనుల కోసం వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. రైల్వే లైన్ సమీపంలో పిడుగు పడటంతో అక్కడే పనులు చేస్తున్న కార్మికుడు దుర్గేష్ మృతి చెందాడు. -
సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి
మార్కాపురం: ప్రజల నుంచి అందిన సమస్యలతో కూడిన అర్జీలకు పరిష్కారం దిశగా పోలీసులు పనిచేయాలని డీఎస్పీ యూ నాగరాజు ఆదేశించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెస్సల్ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అందిన ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి సత్వర పరిష్కారం కల్పిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్లకు తెలియచేసి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మీకోసంలో ఉద్యోగ, ఆర్ధిక, కుటుంబ కలహాలు, భూ వివాదాలు, చీటింగు కేసులు తదితర సమస్యలపై 35 అర్జీలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు రాజేష్కుమార్, కే అజయ్కుమార్, రామకోటయ్య, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు: జిల్లా న్యాయసేవాధికార సంస్థలో రెగ్యులర్ ప్రాతిపదికన ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టు భర్తీ చేసేందుకు 2026 ఫిబ్రవరి 15న నిర్వహించిన పరీక్షను రద్దు చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రద్దు చేశారన్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించే తేదీలను, వాటి వివరాలను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం త్వరలో తెలియజేస్తామన్నారు. -
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. ధరలు మాత్రం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ధాన్యం అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రకటనకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేకుండా ఉంది. మొక్కుబడిగా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే అవి ఏరకంగానూ అన్నదాతకు మేలు చేయడంలేదు. దిక్కుతోచని స్థితిలో వచ్చిన రేటుకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా దళారులు ధరలో కోత పెడుతున్నారు. రైతులను నిలువునా ముంచుతున్న కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోంది. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంపిణీలో విఫలమైన ప్రభుత్వం చివరకు రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వం ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు బయట మార్కెట్లల్లో ధాన్యం అమ్ముకుంటున్నారు. మాజీ సీఎం జగనన్న ప్రభుత్వంలో అన్ని రకాల రైతులకు మద్దతు ధర కల్పించారు. – రాయిండ్ల వెంకట నారాయణ, టంగుటూరు మండలం. కందుకూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41,467 మంది వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్లో 16,704 హెక్టార్లలో, రబీలో 24,647 హెక్టార్లలో వరిసాగు చేశారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గం పరిధిలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, తాళ్లూరు, కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ, టంగుటూరు, అలాగే త్రిపురాంతకం, పామూరు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, ఒంగోలు తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు. మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు సాధారణంగా పంట చేతికొచ్చే సమయంలో మద్దతు ధరలు కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం విధి. జిల్లాలో మొక్కుబడిగా అరకొరగా, ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వివిధ సాకులు చూపుతూ పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తక్కువ రేట్లకు దళారులకు తెగనమ్ముకున్నారు. రెచ్చిపోతున్న దళారులు.. ధాన్యం సేకరణలో దళారుల ఇష్టారాజ్యంగా మారింది. ఒకపక్క మద్దతు ధరలకు కొనుగోలు చేయకపోగా తేమ శాతం పేరుతో మరో దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2389ల మద్దతు ధర ప్రకటించింది. దీని ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1800ల వరకు ధర చెల్లించాల్సి ఉంది. కానీ దళారులు ప్రస్తుతం రూ.1500 కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగిలిన కామన్ గ్రేడ్ రకాల ధాన్యానికి క్వింటాకు రూ.2369 మద్దతు ధర ఉండగా 75 కేజీల బస్తాకు రూ.1780ల వరకు ధర ఇవ్వాలి. కానీ దళారులు మాత్రం రూ.1200 నుంచి రూ.1400లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పైగా తేమ శాతం పేరుతో బస్తాకు 4 కేజీల వరకు తరుగు తీసేస్తున్నారు. దీంతో రైతులు అటు ధరలు లేక, ఇటు తేమ శాతం పేరుతో రెండు విధాలా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా నేటికీ ఒక్క ధాన్యం సేకరణ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం దారుణం. తీరా రైతులు ధాన్యం మొత్తం అమ్ముకున్న తరువాత ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రకటనలు ఇస్తుండడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు వరి సాగులో పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు, సేద్యపు ఖర్చులు, ఎరువులు, కూలీలు, కోతలు ఇలా అన్ని రకాల ఖర్చు పెరగడంతో ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. పెట్టుబడి పెరిగినా దిగుబడి బాగా వచ్చిందని సంబరపడుతున్న తరుణంలో ధరలు లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు ముందుతో పోల్చితే ప్రస్తుతం బస్తాకు రూ.500ల వరకు ధర తగ్గిందని రైతులు అంటున్నారు. ఈ విధమైన ధరలతో చేసిన శ్రమకు, పెట్టిన పెట్టుబడులకు ఏమాత్రం ఫలితం లేకుండా పోతుందంటున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులకు విక్రయిస్తున్నామని చెప్తున్నారు. ధర వర్రీ!కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో రబీ సీజన్లో ప్రధానంగా వరి పంట సాగు చేస్తుంటారు. కందుకూరు మండలంలో అత్తాకోడళ్ల చెరువుల కింద మాచవరం, మోపాడు, కొండముడుసుపాలెం, పాలూరు–దొండపాడు వంటి ప్రాంతాల్లో, రాళ్లపాడు ప్రాజెక్టు కింద లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లోని గ్రామాల్లో పంటను సాగు చేస్తారు. అయితే వరిసాగు ఆశాజనకంగా ఉండడం లేదనే కారణంతో ఈ ఏడాది కొంత మేర మాత్రమే రైతులు వరిని సాగు చేశారు. ప్రధానంగా రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఆయకట్టులో కొన్ని గ్రామాల్లో వరి సాగైంది. సాగైన ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు ఊహించిన దానికంటే దిగుబడులు అధికంగా వచ్చాయి. సాధారణంగా సన్నం రకాల ధాన్యం ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తే రైతులు సంతోషంగా ఉంటారు. అలాంటి ఈ ఏడాది ఎకరాకి 50 బస్తాల నుంచి 60 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. అన్ని ప్రాంతాల్లోను ఒకటీ రెండు బస్తాలు అటూఇటుగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం గత 20 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా వరికోతలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దిగుబడులు చూసి ఆశ్చర్యంతో పాటు, సంతోషంతో సంబరపడుతున్న రైతులకు ధరలు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడు. మిల్లర్లు దళారులను అడ్డుపెట్టుకుని ధరలు తగ్గించి నిలువు దోపిడీ చేస్తున్నారు. -
ఘనంగా బూచేపల్లి జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కట్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు తదితరులు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలపూడి అశోక్కుమార్, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, పార్టీ కార్యాదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.ఆదెన్న, బి.రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ వెన్నపూస కుమారి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ శివకృష్ణారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పోసం మధుసూదన్రెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, దర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి, కిస్టిపాటి శేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకు హైడ్రామా
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు కరైకల్కు చెందిన బోట్లను వదిలేసిన వ్యవహారంలో తెరవెనుక సూత్రధారులు ఎవరో తేల్చేందుకు 164 గ్రామాల మత్స్యకారులు పాకలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్ధరాత్రి వరకు హైడ్రామా నెలకొంది. గత నెల నాలుగో తేదీన జువ్వలదిన్నె హార్బర్లో మైరెన్ పోలీసుల రక్షణలో ప్రకాశం జిల్లా మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లు మాయమయ్యాయి. ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ పోతయ్యగారిపట్టపుపాలెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన సమావేశమయ్యారు. నాలుగు జిల్లాల నుంచి బస్సులు, వ్యాన్లు, మోటారు సైకిళ్లపై వేలాదిగా తరలివచ్చారు. ఈ సంఘటన జరిగిన రోజు ఘటనకు ప్రధాన కారకులైన నెల్లూరు జిల్లా ఇస్కపల్లి మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డి, పాతపాలెంకు చెందిన శెట్టిలను సమావేశంలో నిందితులుగా నిలబెట్టారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించాలని మత్స్యకార పెద్దలు ఆదేశించారు. దీనికి ఆ ముగ్గురు ‘‘తాము తప్పు చేశామని బహిరంగంగా ప్రకటించారు’’. అయితే ఎవరు చెబితే వదిలేశారో చెప్పడం లేదు. ఈ ఘటనకు వెనకాల ఎవరు ప్రధానపాత్ర పోషించారు, ఏం జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొంతమంది మత్స్యకార కాపులు జరిమానాతో సరిపెడదామని అంటుండగా ఈ ఘటనకు వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరో చెప్పాలని, ఎంత మొత్తం చేతులు మారిందో తెలపాలని సమావేశానికి హాజరైన సింహభాగం మత్స్యకార కాపులు పట్టుబట్టారు. ఒక్కొక్కరిది ఒక్కో మాట: సోనాబోట్ల అపహరణలో ప్రధాన నిందితులైన ఇస్కపల్లికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాలేనికి చెందిన జాలిరెడ్డి, పాతపాలేనికి చెందిన శెట్టి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. ఒక ముద్దాయి ఇటీవల లోకేష్ పర్యటన సందర్భంగా హార్బర్లో బోట్లు అడ్డంగా ఉన్నాయని, వాటిని పక్కకు జరపాలని కావలి సీఐ వాటిని తీసుకుని వెళ్లటానికి అనువుగా ఏర్పాటు చేశాడని చెప్పగా.. మరొకరు ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. మూడవ వ్యక్తి తోటయ్య మాత్రం తనకు తెలుగు వచ్చినప్పటికీ ఇతర భాషలో మాట్లాడే ప్రయత్నం చేయటంతో సీఐతో మాట్లాడటానికి తెలుగు వచ్చుకానీ ఇప్పుడు మాత్రం తెలుగు రాదా అని మత్స్యకారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సూత్రధారులు ఎవరో చెప్పాల్సిందేనంటూ సమావేవానికి హాజరైన మత్స్యకార పెద్దలు పట్టుబట్టారు. రాత్రి గం.11.30 సమయంలో ఇస్కపల్లికి చెందిన తోటయ్య చివరకు నోరువిప్పాడు. బోట్లు వదిలేసేందుకు తెరవెనుక ఉన్న వ్యక్తి బీద మస్తానరావేనని చెప్పడం సంచలనంగా మారింది. ప్రాణాలకు తెగించి పోరాడాం.. మత్స్యకార పెద్దలు 8 నెలల నుంచి తాము ఏవిధంగా ప్రాణాలకు తెగించి సోనాబోట్లను అదుపులోకి తీసుకుందీ వివరించారు. వాటిని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచి వాటి కాపలా బాధ్యతను ఇస్కపల్లి, కొత్త బంగారుపాలెం, తాటిచెట్లపాలెం, పాతపాలెం మత్స్యకార పాలెంలకు అప్పగించి ముగ్గురిని కాపలాగా ఉంచామన్నారు. అంతేకాక ఈ బోట్లను విడిపించటానికి సోనాబోట్ల యజమానులు ఒక్కో బోటుకు రూ.15 లక్షలు ఇస్తామన్నా తాము వదల్లేదన్నారు. ఈ ఘటనకు ఆ నాలుగు మత్స్యకార గ్రామాల పెద్దలు కూడా బాధ్యత వహించాలని ప్రకటించగా వారు కూడా అందుకు సమ్మతించారు. ఎన్నో సంవత్సరాలుగా సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయామని తాము తెగించి సమైక్యంగా బోట్లను అదుపులోకి తీసుకుంటే ఈ విధంగా చేశారని మత్స్యకార పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తెరవెనుక కారకులు తేలే వరకు అర్ధరాత్రైనా సమావేశం కొనసాగుతుందని మత్స్యకార పెద్దలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 100 మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సమావేశం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మొదట పోలీసులు, విలేకరులకు అనుమతి ఉండదని ప్రకటించినప్పటికీ తరువాత విలేకరులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. -
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం
ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకి వివిధ చోట్ల ఐదుగురు మృత్యవాత పడ్డారు. ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ఉమ్మడి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ పిడుగుపాటు కారణంగా జిల్లాలోని పుల్లల చెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ పిడుగుపడి కన్నయ్య(28) మృతి చెందగా, పుల్లల చెరువు మండలం యంద్రపల్లిలో పొలంలో పని చేస్తున్న బొండపాటి నాగయ్య మృతి చెందారు. కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన దుర్గేష్ పిడుగు పాటుకి మృతి చెందాడు. సాయంత్రం ఒక్కసారి ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం పడింది. పలుచోట్ల పిడుగు పాట్లతో జిల్లాలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. కాగా, ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ విధించింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.మరోవైపు.. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. -
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
కనిగిరిరూరల్: మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థికసాయం అందజేశారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున, క్షతగాత్రులకు రూ.20 వేల చొప్పున వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ పార్టీ నేతలతో వెళ్లి అందజేశారు. కనిగిరి మండలంలోని లింగారెడ్డిపల్లి మండాదివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి కుటుంబానికి రూ.లక్ష, చల్లగిరిగిల్ల పంచాయతీ తమ్మిశెట్టి పిచ్చమ్మ, మనుమరాలు తమ్మిశెట్టి రుక్మిణిల కుటుంబాలకు చెరొక రూ.లక్ష, పునుగోడు కు చెందిన దేవండ్ల రామయ్య కుటుంబానికి రూ.లక్ష అందజేశారు. క్షతగాత్రులైన మండాదివారిపల్లికి చెందిన డబ్బుకొట్టు శ్రీహరిని, కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్య ఖర్చులకు రూ.20 వేలు అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, ఎస్ మోహన్రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, మండాది కృష్ణారెడ్డి, వాకుమళ్ల రాజశేఖర్రెడ్డి, పోలక సిద్దారెడ్డి, లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, కుమ్మరికుంట రవి, సంగటి మహేంద్రారెడ్డి, శీలం శివారెడ్డి,చిలంకూరి బ్రహ్మరెడ్డి, కొండా మాలకొండారెడ్డి, మండాది వెంకట సుబ్బయ్య, సంగటి మాధవరెడ్డి, వేమన గురవారెడ్డి, మాలపాటి మాల్యాద్రి, కుమ్మరి వెంకటేశ్వర్లు, గాలిబోయిన నాగార్జున, రామచంద్రుని ఐజాక్, అల్లాటిపల్లి మహేష్, కాసుల బాలయ్య, బత్తుల మాలీ, మల్లెల వెలుగొండయ్య, అల్లాటిపల్లి కొండారెడ్డి, బాలయ్య, మాధవ్, నరేంద్ర, రాజాల ప్రసాద్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో రంగనాయకస్వామి చక్రస్నానం
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనామకస్వామి బ్రహ్మోత్సవాల ముంగిపు సందర్భంగా ఆదివారం స్వామికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, వెంకటరంగచార్యులు అధ్వర్యంలో నెమలిగుండ్లరంగనాయకస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. నీటి గుండం వద్ద ఏర్పాటు చేసిన స్వామి చక్రస్నానానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. చైర్మన్ సిద్ధం నరసింహులు, దేవస్థానం ఈఓ మల్లవరపు నాగయ్య, ఎంపీడీఓ ఎస్.వెంకటరామిరెడ్డి, కంభం, గిద్దలూరు అర్బన్, రూరల్ సీఐలు మల్లికార్జున్రావు, సురేష్, జె.రామకోటయ్య, రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నసత్రాల్లో అన్నదానం చేశారు. -
సర్పంచ్ల సేవలు మరువలేం
మార్కాపురం రూరల్: గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు కృషి మరువలేమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు అభినందించారు. పదవీ కాలం ముగిసిన సర్పంచ్ల అధినందన కార్యక్రమం ఆదివారం పట్టణంలోని జవహర్నగర్ కాలనీలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం సరిగా లేకపోయినా పోరాడి సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. గత ఐదేళ్లుగా సర్పంచ్లు తమ సమయం, శ్రమ వెచ్చించి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేశారన్నారు. మౌలిక వసతుల కల్పనలో కొన్ని ప్రాంతాల్లో అధికారుల నుంచి, ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు, వివక్ష ఎదురైనా తమ గ్రామాల అభివృద్ధికి వెనుకడుగు వేయలేదన్నారు. పార్టీని నమ్మించి పని చేసిన ప్రతి కార్యకర్తకు తాను కష్టకాలంలో అండగా ఉంటానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశ్వాసంతో నిలబడిన వారదంరినీ ఆయన అభినందించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అధికారులు అందించే నూతన ఓటర్ల జాబితాలో ఓట్లు అన్ని ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు ముందుకు సాగే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లను సన్మానించారు. కార్యక్రమంలో కుందురు చిన్న వెంకటరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు పోరెడ్డి చెంచిరెడ్డి, ఎంపీపీ బండి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు దేవండ్ల పెద్ద మల్లయ్య, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, బట్టగిరి తిరుపతిరెడ్డి, భవనం వెంకట రామిరెడ్డి, మాలపాటి శ్రీనివాసరెడ్డి, కుందురు శ్రీనివాసరెడ్డి, ఎల్ శేఖర్, జాజ వెంకటేశ్వర్లు, ఏర్వ వెంకటేశ్వరరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు శ్రీరాములు, నాద గురుబ్రహ్మం, ఎంవీ రమణారెడ్డి, తుమ్మా రవణమ్మ, సింగపోగు తిరుమలమ్మ, బట్టగిరి గౌతమి, కుకట్లపల్లి పెద్ద శ్రీను, వేల్పుల వెంకట లక్ష్మి, దండా వెంకటేశ్వరెడ్డి, గోమసాని వెంకటేశ్వర్లు, గుంజా రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో అండగా ఉంటా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
సోనా సంగతి తేల్చేద్దాం!
తమిళ జాలర్ల ఆగడాలతో విసిగిపోయిన స్థానిక మత్స్యకారులు ఎనిమిది నెలల క్రితం ప్రాణాలకు తెగించి పట్టుకున్న నాలుగు సోనాబోట్లను జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందంతో కూటమి ప్రభుత్వ పెద్దలు దొంగచాటుగా సోనాబోట్లను తరలించడంపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ నాలుగు జిల్లాల పరిధిలోని 160 మత్స్యకార గ్రామాలకు చెందిన వారు భవిష్యత్ కార్యాచరణకు నేడు పాకలలో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ● కరైకల్ బోట్ల మాయంపై మత్స్యకారుల సమావేశం ● 8 నెలల కిందట ప్రాణాలు లెక్కచేయకుండా సోనాబోట్ల స్వాధీనం ● జువ్వలదిన్నె హార్బర్లో మైరెన్ పోలీసుల రక్షణలో బోట్లు ● అధికార టీడీపీ పెద్దల చీకటి ఒప్పందంతో గుట్టు చప్పుడు కాకుండా బోట్ల తరలింపు ● రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఆగ్రహం ● బోట్ల మాయంపై పాకలలో సమావేశం నేడు ● తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని 160 మత్స్యకార గ్రామాల నుంచి హాజరు ● సమావేశానికి అనుమతి నిరాకరించిన పోలీసులు ● మా సమావేశానికి మీ అనుమతి ఎందుకంటున్న మత్స్యకారులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రతో జువ్వలదిన్నె హార్బర్ నుంచి కొద్దిరోజుల క్రితం తప్పించుకుపోయిన పాండిచ్చేరి (కరైకల్)కు చెందిన సోనాబోట్లు సముద్ర తీరప్రాంత నిబంధనలకు విరుద్ధంగా తీరానికి అతి సమీపంలో చేపల వేట సాగిస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల వలలు తెంచుతూ, మత్స్య సంపదను దోచుకుంటూ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి రావటంతో కొద్దిరోజులుగా మత్స్యకారులు ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నారు. జువ్వలదిన్నె హార్బర్లో సోనాబోట్ల నిర్బంధం కొద్ది సంవత్సరాలుగా పాండిచ్చేరి (కరైకల్) ప్రాంతానికి చెందిన సోనాబోట్లు తీరానికి అతి సమీపంలో చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన ఈ ప్రాంత మత్స్యకారుల వలలు ధ్వంసం చేయటమే కాక లక్షలాది రూపాయల మత్స్యసంపదను కొల్లగొడుతూ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయి. దీనిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొంతవరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సోనాబోట్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేక మత్స్యకారులు సుమారు 8 నెలల క్రితం కలిసికట్టుగా ఒక సైన్యంలా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట సాగిస్తున్న సోనాబోట్లపై దాడులు చేసి నాలుగు బోట్లను నెల్లూరు జిల్లా పరిధిలోని జువ్వలదిన్నె హార్బర్లో మైరెన్ పోలీసుల పర్యవేక్షణలో భద్రపరిచి పాండిచ్చేరికి చెందిన మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రశాంతంగా చేపల వేట సోనాబోట్ల నిర్బంధంతో మత్స్యకారులు నిరాటంకంగా చేపల వేట సాగించారు. కానీ గత వారం కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రతో హార్బర్లో నిర్బంధంలో ఉన్న సోనాబోట్లను పాండిచ్చేరి మత్స్యకారులు ఈ ప్రాంత మత్స్యకారులకు తెలియకుండా విడిపించుకుని వెళ్లిపోయారు. సోనాబోట్లను తీసుకెళ్తున్నారన్న సమాచారం తెలియటంతో అప్రమత్తమైన మత్స్యకారులు వాటిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసినా అవి తప్పించుకునిపోయాయి. ఆగ్రహించిన మత్స్యకారులు జువ్వలదిన్నె హార్బర్లో మైరెన్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్ మత్స్యకారులు తరలించుకుపోవటంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగస్వాములైన మూడు గ్రామాలకు చెందిన ముగ్గురు కాపులను నిర్బంధించి ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో తెలపాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమావేశం కూటమి ప్రభుత్వం తమకు చేసిన మోసంపై ఆగ్రహించిన మత్స్యకారులు ఈనెల 6వ తేదీ సోమవారం పాకల పంచాయతీలోని పోతయ్యగారి పట్టపుపాలెంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయటానికి తీర్మానం చేశారు. ఇటీవల సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బీ మహేంద్ర పోతయ్యగారి పట్టపుపాలెంకు వెళ్లి సమావేశం ఎప్పుడు పెట్టుకున్నారో చెప్పాలని మత్స్యకారులపై ఒత్తిడి చేశారు. దీనిపై మత్స్యకారులు తాము ఇంకా సమావేశం తేదీ నిర్ణయించలేదని తరువాత చెబుతామని చెప్పారు. తరువాత మత్స్యకారులు సమావేశం తేదీ నిర్ణయమైందని ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. పోలీసులు మాత్రం ఈ సమావేశానికి ఎటువంటి అనుమతులు ఇవ్వమని తేల్చిచెప్పారు. మత్స్యకారులు కూడా అదే పంతంతో తాము ఏర్పాటు చేసేది రాజకీయ సమావేశం కాదని, ఇది కేవలం కుల సమావేశం అని, ఈ సమావేశానికి పోలీసులకు, మీడియాకు అనుమతి ఉండదని తెగేసి చెప్పారు. ఈ సమావేశానికి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన సుమారు 6 వేలకుపైగా మత్స్యకారులు హాజరవుతారని తెలిపారు. దీనిపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న మత్స్యకారుల గ్రామాల్లో కూటమి ప్రభుత్వ పెద్దల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, సానుకూలంగా సమస్య పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
దుస్తుల దుకాణంలో చోరీ
అద్దంకి రూరల్: అద్దంకిలోని దుస్తుల దుకాణంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..అద్దంకి మెయిన్ బజారులో ఫ్యాషన్ షోరూం నిర్వాహకులు శనివారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాపు వెనుకవైపు భాగం నుంచి పైకి ఎక్కి పైకప్పు రేకులను వంచి దుండగులు లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లోని నగదు అపహరించారు. ఆదివారం ఉదయం షాపు నిర్వాహకులు వచ్చి చూడగా క్యాష్ కౌంటర్లో నగదు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సుబ్బరాజు సంఘటన స్థలాని వెళ్లి పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్టీం సీఐ భీమానాయక్, సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో షోరూమ్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి వేలుముద్రలు సేకరించారు. పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణంలోనే దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుమారు రూ.2లక్షల నగదు చోరీకి గురైందని నిర్వాహకులు తెలిపారు. -
సొమ్ము ఒకరిది.. సోకొకరిది
మర్రిపూడి: మంత్రి స్వామి ఆదేశాలతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను అధికారులు హడావుడిగా ప్రారంభించడంపై దళితులు భగ్గుమన్నారు. మేం ఏర్పాటు చేసిన విగ్రహాలను మాకు చెప్పకుండా మీరెలా ప్రారంభిస్తారంటూ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే. గత వైఎస్సార్ సీపీ హయాంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రాంవిగ్రహాలను రూ.15 లక్షలు వెచ్చించి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ విగ్రహాలను దానం చేశారు. దీంతో దాతల సహకారంతో తహసీల్దార్ కార్యాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో విగ్రహాల ఆవిష్కరణ ఆగిపోయింది. ఆ తరువాత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించాలని గ్రామస్తులు భావించారు. అయితే వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీయాలన్న కుట్రతో మంత్రి స్వామి పన్నాగం పన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన రెండు వర్గాల దళితులను స్థానిక పోలీస్స్టేషన్కు పిలిపిచించిన కొండపి సీఐ సోమశేఖర్ చర్చలు జరిపారు. విగ్రహాలను రెండు వర్గాల నాయకులు ఇప్పుడు ఆవిష్కరించేది లేదని ఒప్పందం చేసుకున్నారు. రెండు వర్గాలతో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేయించి పంపించారు. ఈ లోగా ఎస్సై రమేష్బాబు, సీఐ సోమశేఖర్ ఎక్కడ వారిని అక్కడ చెదరగొట్టారు. వెంటనే తహహీల్దార్ జనార్దన్ తన సిబ్బందితో కలిసి వారి చేతుల మీదుగా విగ్రహాలను పూలమాలలు వేసి ఆవిష్కరించారు. అంతకుముందే పోలీసులు ఇరువర్గాల పై బైండవర్ కేసు నమోదుచేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం రెండేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు చందాల రూపంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను మంత్రి స్వామి ఆదేశాలకు అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఆవిష్కరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. దాతల సహకారంతో మేం ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను మీరెలా ప్రారంభిస్తారని, మీరు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అధికారులను ప్రశ్నించారు. ఇరువర్గాలను పిలిచి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మీరెలా ప్రారంభిస్తారని తహసీల్దార్ జనార్దన్ను దళితులు నిలదీశారు. దీంతో తహసీల్దార్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. రెండేళ్ల క్రితం విగ్రహాలు పెట్టి ప్రారంభించకుండా గొడవలు జరుగుతాయనే తానే ప్రారంభించానని పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన దళితులు మా డబ్బులతో మీరు, టీడీపీ నేతలు దండలు వేసి ఆవిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని పొదిలి– టంగుటూరు ఆర్అండ్బీ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సర్దిచెప్పారు. ఆందోళనకు దిగిన వారిలో దళిత నాయకులు గురిజాల యోబు, గురిజాల రమేష్,, గురిజాల బుజ్జి, గురిజాల యేబేలు, దాసరి సాల్మన్, దాసరి ఇజ్రాయిల్, గండి బుజ్జి, గురిజాల పేతురు, దాసరి చిన్నా, ఓండ్రు ఓబద్య, ఒనుకూరి రవి, ఒనుకూరి ప్రసాదు, ఓ సూర్యం, నేలపాటి బెనర్జి తదితరులు ఉన్నారు. రూ.15 లక్షలతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రాం విగ్రహాలు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎన్నికల కోడ్తో నిలిచిన విగ్రహ ఆవిష్కరణలు రెండేళ్లుగా పట్టించుకోని కూటమి నాయకులు మంత్రి ఆదేశాలతో హడావుడిగా ప్రారంభించిన అధికారులు అధికారుల ఆవిష్కరణలపై భగ్గుమన్న దళితులు రహదారిపై బైఠాయింపు, నిలిచిన రాకపోకలు మంత్రి, అధికారుల తీరుపై దళితుల ఆగ్రహం -
విద్యుదాఘాతానికి మహిళ మృతి
తాళ్లూరు: విద్యుదాఘాతానికి మహిళ మృతి చెందింది. ఈ ఘటన తాళ్లూరులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..తాళ్లూరుకు చెందిన ఇడమకంటి బలరామిరెడ్డి భార్య రమాదేవి(50) ఇనుమ కత్తితో కొబ్బరి కాయలు కొడుతుండగా పక్కనే ఉన్న ఇనుప రాడ్ను తగిలింది. ఆ రాడ్డు వెళ్లి విద్యుత్ తీగలను తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. సంతమాగులూరు (అద్దంకి రూరల్): రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టడం గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు మండలంలో ఆదివారం జరిగింది. గొర్రెల యజమాని కోనంకి శ్రీను తెలిపిన వివరాల మేరకు..మండలలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గొర్రెలకాపరి కోనంకి శ్రీను ఆదివారం గొర్రెల మందను తీసుకొని పొలానికి వెళ్లి మేపుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో అద్దంకి–నార్కెట్పల్లి నామ్ రహదారిపై ఉన్న ఏల్చూరు– కొమ్మాలపాడు గ్రామాల మధ్య నున్న రహదారిపై గొర్రెల మందును అద్దంకి నుంచి పిడుగురాళ్ల వెళుతున్న లారీ ఢీకొట్టింది. మందలోని 4 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. 7 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెల కాపరి శ్రీను సంతమాగులూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. -
ఆర్థికసాయం
బస్సు ప్రమాద మృతునికి వెలిగండ్ల,(కనిగిరిరూరల్): మార్కాపురంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెలిగండ్ల మండలం చౌడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర కుటుంబానికి వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందజేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సూచనల మేరకు పార్టీ నాయకులతో కలిసి శనివారం మహేంద్ర భార్య నాగమణి, కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన చౌడవరంకు చెందిన క్షతగాత్రులు కుమ్మరికుంట అబ్రహ్మం, రామచంద్రపు ప్రవీణ్లను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, ఎలికా నారాయణ, కటికల వెంకటరత్నం, మేడం ఆదినారాయణ, బోబ్బారెడ్డి వెంకటరెడ్డి, పొల్లా సుబ్రహ్మణ్యం, కుప్పనబోయిన వెంకట రామయ్య, నారపరెడ్డి కోటిరెడ్డి, సానా భాస్కర్రెడ్డి, డి. రంగారెడ్డి, బాల నారాయణ, జి.రాజు, నారాయణరెడ్డి, జి.బాలిరెడ్డి, డి.గురుబ్రహ్మయ్య, జి.బెంజీమన్, కె.పుల్లయ్య, ఎలికా రమణయ్య, కె.ఆదాం, గాలిమోటు రోశయ్య, రాజీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఏజెన్సీ ఎదుట హైడ్రామా
ఒంగోలు టౌన్: గ్యాస్ సరఫరా విషయంలో నగరంలోని అన్నవరప్పాడు వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీ వద్ద హైడ్రామా నెలకొంది. నగరంలోని సంతపేట, అన్నవరప్పాడు మొదటిలైనులో పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ వుంది. ఇక్కడ మార్చి 14న కొందరు వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు కంపెనీ నుంచి వెంటనే మెసెజ్ కూడా వచ్చింది. అయితే అప్పటి నుంచి నేటి వరకు గ్యాస్ డెలివరీ చేయలేదు. కొందరు వినియోగదారులు ఏజెన్సీ నిర్వాహకుడి వద్దకు వెళ్లి వాకబు చేస్తే రేపు రండి ఎల్లుండి రండంటూ తిప్పుకుంటున్నారు. దీంతో విసుగు చెందిన వినియోగదారులు కొందరు శనివారం ఏజెన్సీ వద్దకు చేరుకొని నిర్వాహకులను నిలదీశారు. గ్యాస్ స్టాక్ రాలేదని, వెంటనే ఇస్తామని బుకాయించే ప్రయత్నాలు చేయడంతో వినియోగదారులు వాదనకు దిగారు. దీంతో ఏజెన్సీ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం తెలిసిన పోలీసులు ఏజెన్సీ వద్దకు చేరుకొన్నారు. వినియోగదారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా నిర్వాహకులు గ్యాస్ డెలివరీ ఎప్పుడు చేస్తారో నిర్దిష్టంగా చెప్పకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఏజెన్సీని రద్దు చేయాలని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లబజారుకు తరలిన గ్యాస్... గత నెల 14న బుక్ చేసుకున్న వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లను దొడ్డి దారిన నల్లబజారుకు తరలించినట్లు కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నగరంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్కు సదరు గ్యాస్ సిలిండర్లను అమ్ముకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఏజెన్సీ అక్రమాలపై ఇప్పటికే పలువురు వినియోగదారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఏజెన్సీకి సంబంధించిన వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే బాధ్యతను నగరంలోని మరో రెండు గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే గత నెల 14వ తేదీకి ముందు బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రం పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేయాల్సి వుంది. ఇప్పుడు ఈ విషయంలోనే పూర్ణిమా ఏజెన్సీ నిర్వాహకులకు వినియోగదారులకు మధ్య వాదన జరిగినట్లు సమాచారం. మీడియాకు బెదిరింపులు.. గ్యాస్ వినియోగదారులకు, నిర్వాహకులకు మధ్య వాదన జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న కొందరు మీడియా ప్రతినిధులు ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులు మీడియా ప్రతినిధులతో వాదనకు దిగారు. మీ సంగతి తేలుస్తామంటూ బెదిరింపులకు దిగడంతో అక్కడకు వచ్చిన వినియోగదారులు విస్మయానికి గురయ్యారు. ఎవరి అండ చూసుకొని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఇంతగా బరితెగిస్తున్నారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంక్షోభ సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జూనియర్ సివిల్ జడ్జిగా గౌతమి
ఒంగోలు టౌన్: అకుంఠిత దీక్ష, నిరంతరం కృషి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి ఉంటే అసాధ్యమైనదేదీ లేదని నల్లూరి గౌతమి చాటి చెప్పారు. పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకొని పుట్టిన ఊరికి, తలిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఒంగోలుకు చెందిన నల్లూరి గౌతమి తాజాగా విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. గతేడాది అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తి చేసుకున్న ఆమె ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో నిర్వహించిన ఇంటర్వ్యూలో అద్భుత ప్రతిభచాటి సివిల్ జడ్జిగా నియాకపత్రాన్ని అందుకున్నారు. ఒంగోలు నగరం మంగమూరులో నివాసం ఉండే గౌతమి తలిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఇద్దరూ ఉపాధ్యాయులు. శ్రీనివాసరావు 2017 గుండెపోటుతో మరణించారు. తల్లి ఉదయలక్ష్మి ప్రస్తుతం పేర్నమిట్ట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. తలిదండ్రులు ఆశయాలను అర్థం చేసుకున్న ఆమె తొలి నుంచి చదువుల్లో రాణించారు. ఒంగోలులోని మాంటిస్సోరి పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్ ఎన్టీఆర్ మోడల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. విశాఖపట్టణంలోని ప్రతిష్టాత్మక దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఒకవైపు చదువుకుంటూనే ఏ మాత్రం తీరక దొరికినా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒంగోలులోని భూమి స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యురాలిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం గౌతమికి స్వచ్ఛత అవార్డు ఇచ్చి గౌరవించింది. సామాన్యులకు, నిరుపేదలకు సత్వర న్యాయం అందించడమే తన లక్ష్యమని గౌతమి చెప్పారు. నల్లూరి గౌతమి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో స్వగ్రామం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంతో పాటు ఒంగోలులోని మంగమూరు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కురిచేడు: మండలంలోని పెద్దవరం సమీపంలో శుక్రవారం వేకువ జామున కారు బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శివ కథనం ప్రకారం..పెద్దవరంలో వివాహానికి కారులో హాజరైన నలుగురు తిరుగు ప్రయాణంలో కురిచేడు వైపు వెళ్తున్నారు. కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు.. వాగులో బోల్తా కొట్టింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి కారులో ప్రయాణిస్తున్న నలుగురిని బయటకు తీసి చూడగా హైదరాబాద్కు చెందిన శింగనమల నాగేశ్వరరావు (55)కు తీవ్ర గాయాలై కొన ఊపిరితో ఉన్నట్లు గమనించారు. 108 వాహనానికి సమాచారం అందించగా సిబ్బంది నాగేశ్వరరావు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నాగేశ్వరరావు మరణించాడు. మృతుడు నాగేశ్వరరావు హైదరాబాద్లో కన్జుమర్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మార్కాపురం టౌన్: ఎస్ఐఆర్ (సర్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిస్పక్షపాతంగా నిర్వహించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఏఎం అబ్దుల్ సుభాన్, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఎంపీజే ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ) పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ అనేది ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని, అయితే ప్రస్తుతం కులం, మతం, పార్టీల పరంగా విభజించబడిందా అనేలా విమర్శలు వస్తున్నాయన్నారు. -
జగనన్నను సీఎం చేసుకోవాలి
తాళ్లూరు: 2029 ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్యెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గుంటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా గురువారం రాత్రి తూర్పుగంగవరం పడమటి బజార్ బూచేపల్లి యూత్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బూచేపల్లి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా కరోనాలో రెండేళ్లు ఇబ్బందులు ఉన్నా నవరత్నాలను 100 శాతం అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలు, రైతులు జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సి బాధ్యత మనదేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్రెడ్డి, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాసరెడ్డి, జిల్లా లీగల్సెల్ కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వర్రెడ్డి, నియోజకవర్గ కల్చరల్ విభాగం అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, నియోజకవర్గ ప్రచారం విభాగం అధ్యక్షుడు యత్తపు మధుసూదన్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, రైతు అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుజ్జుల వెంకటేశ్వర్లురెడ్డి (గోల్డ్), గొల్లపూడి యర్రయ్య, గువ్వల సత్యనారాయణరెడ్డి, సోషల్ మీడియా నాయకులు కొనికి గోవిందరాజు యాదవ్, బొజ్జా సంజీవ్కుమార్, సర్పంచ్ షేక్ వలి, పార్టీ నాయకులు గూడా శ్రీధర్రెడ్డి, గూడా ప్రసాద్రెడ్డి, ఎడమకంటి రాజాగోపాల్రెడ్డి (గోపి), కై పు వెంకట కృష్ణారెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, ఐ.విజయభాస్కర్రెడ్డి (పాదయాత్ర), గుద్దేటి శ్రీనివాసరెడ్డి (జగన్), గువ్వల తిరుపతి (రాయుడు), పడమట బజార్ యాత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి -
తౌషిక్ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
సింగరాయకొండ: సింగరాయకొండ మండలంలోని శ్రీచైతన్య నవోదయ స్కూలులో ఫిబ్రవరిలో జరిగిన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ మౌలాబి, ఆలీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమ కుమారుడు తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారని, ఇది ముమ్మాటికీ అవాస్తవమని తల్లిదండ్రులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ స్కూలు యాజమాన్యం రమణారెడ్డి, ఆయన కుమారుడు చైతన్యకు కొమ్ముకాస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తౌషిక్ది ముమ్మాటికీ హత్యేనని ఆత్మహత్య కాదని చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ జరపకుండా దోషులకు కొమ్ముకాస్తూ వారిని కేసు నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. పంచనామా సమయంలో కూడా సంఘటన జరిగిన ప్రదేశం వద్ద కాకుండా ఒంగోలు జీజీహెచ్ వద్ద పంచనామా చేశారని ఆరోపించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని, మృతదేహంపై ఉన్న గాయాలకు ఎలాంటి సమాధానం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్రంగా విచారించిన హైకోర్టు ఈకేసులో విచారణాధికారులుగా ఉన్న పోలీసులు, ఇతర అధికారుల సెల్ఫోన్లు, సీసీ టీవీ ఫుటేజ్లతో పాటు అన్ని ఆధారాలను భధ్రపరచాలని, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ జరిపించాలని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదికతో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఎస్పీ వీ హర్షవర్దన్రాజును ఆదేశించింది. తౌషిక్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించటంతో ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, ఈ కేసులో మొదటి నుంచి అనుమానాస్పదంగా వ్యవహరించిన ఎస్సై బీ మహేంద్ర, ఇతర అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ప్రకాశం ఎస్పీకి ఆదేశాలు కేసుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకోవాలని సూచన కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిన సీఐ, ఎస్సైపై సమగ్ర విచారణ జరపాలి పూర్తి నివేదికతో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశం -
ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్బాబు అన్నారు. స్థానిక ఎన్జీఓ భవన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిల విడుదల వేగవంతం చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ను వెంటనే నియమించి ఇంటేరియం రిలీఫ్ మంజూరు చేయాలని, అదే విధంగా పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నిరంతర కృషి ఫలితమని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలన్నీ సాధించుకుంటామన్న నమ్మకం ఉందన్నారు. సంక్షేమం కోసం అసోసియేషన్ ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తుందని, పీఆర్సీ కమిటీ నియామకం, సరెండర్ లీవ్కు సంబంధించిన బిల్లులు సహా ఇతర పెండింగ్ బిల్లుల త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కే శివ కుమార్, సహాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పి.మాధవి, ఉపాధ్యక్షులు బి.ఏడుకొండలు, తోట శ్రీనివాసులు, పీ రామాంజనేయులు, ఆర్ దీపక్ కుమార్, బీ విజయ్ కుమార్, కే కోటేశ్వరమ్మ, జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి బీ కృష్ణ కిషోర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు యం శ్రీనివాసరావు, డీ వెంకటేశ్వర్లు, డీ మధుసూదన రెడ్డి, కే రాజేష్ బాబు, వీ హరి బాబు, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్, కార్యదర్శి షేక్ మగ్దుం షరీఫ్, జిల్లా కన్వీనర్ సీహెచ్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ● దేహశుద్ధి చేసిన బంధువులు కురిచేడు: పదో తరగతి పరీక్షల చివరి రోజు ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం పదో తరగతి పరీక్షలు ముగియడంతో స్థానిక వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువులకు ఒకసారి కనిపించి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ విద్యార్థిని పీఎస్ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లగా అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసి ఆ విద్యార్థిని బంధువులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యార్థినుల భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే కాలనాగులై కాటేస్తుంటే ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు రక్షణ కరువైంది. కంచె చేను మేసిన చందంగా ఉపాధ్యాయులు తయారవుతున్నారు. మండలంలో ఏడాదిన్నరలో నాలుగు పాఠశాలల్లో విద్యార్థినులతో ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిద్రావస్థను వీడి కీచక గురువులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
విద్యుదాఘాతానికి పెయింటర్ బలి
పొదిలి: పట్టణంలోని తాలూకా కార్యాలయం సమీపంలో నివాసం ఉండే బూచిరాజు నాగరాజు (45) పెయింట్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వీధిలో ఓ ఇంటికి పెయింట్ వేస్తున్నాడు. పెయింట్ వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనున్న విద్యుత్ వైర్లు తగలడంతో నాగరాజు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. తీవ్రంగా గాయపడిన నాగరాజు కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
అద్దంకి రూరల్: పొలంలో పనులు చేసుకుంటూ జగనన్న పాటలు పెట్టుకున్నారన్న అక్కసుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన అద్దంకి మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన రైతు, వైఎస్సార్ సీపీ కార్యకర్త లక్కిరెడ్డి వెంకటరెడ్డి, అతని భార్య మల్లేశ్వరిలు పొలంలో కూలీలతో పాటు పసుపు కొమ్ములు కోసుకునే పని చేస్తున్నారు. సమీపంలో నిలిపి ఉన్న ట్రాక్టర్లో కూర్చొన చిన్న పిల్లాడిని కూలీలంతా జగనన్న పాటలు పెట్టమని చెప్పడంతో పాటలు పెట్టాడు. కూలీలంతా పాటలు వింటూ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బైకుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పాటలు ఆపమని ఆ కుర్రాడిని కొట్టేందుకు ప్రయత్నించారు. అది చూసిన వెంకటరెడ్డి పాటలు పెట్టుకుంటే మీకేంటి బాధ అనడంతో చేతిలో ఉన్న బటన్ నైఫ్తో వెంకటరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ముఖానికి గాయమవడంతో అతని భార్య, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షురాలైన మల్లేశ్వరి అక్కడకు వచ్చి ప్రశ్నించింది. టీడీపీ కార్యకర్తల్లో ఒకరు ప్యాంట్ విప్పి అసభ్యంగా మాట్లాడుతూ ఏం పీక్కుంటారో పీక్కోండి.. ప్రభుత్వం మాది..మీకు దిక్కున్నచోట చెప్పుకొండి..అని బైకుపై పరారయ్యారు. గాయాలపాలైన వెంకటరెడ్డిని స్థానికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. -
తెప్పోత్సవానికి ఏర్పాట్ల పరిశీలన
రాచర్ల: నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నీటి గుండంలో జరిగే తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మార్కాపురం కలెక్టర్ ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. తొలుత నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు జరిగే తెప్పోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని అధికారులకు సూచించారు. నీటి గుండం వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని ఆదేశించారు. భక్తులు నీటి గుండంలో స్నానాలకు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, గిద్దలూరు, రాచర్ల తహసీల్దార్లు అంజనేయరెడ్డి, ఎల్.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య పాల్గొన్నారు. -
దళితుడి ఇల్లు కూల్చివేత
చీమకుర్తి: మండలంలోని మర్రిచెట్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో చిన్న స్థలంలో రేకులతో నిర్మించుకున్న ఇంటిని కూల్చేశారని దాసరి రాజేశ్వరి, ఆమె భర్త దాసరి రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిర్మించుకున్న ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం వేకువ జామున కూల్చేశారని, వారు గతంలో తమ ఇంటిపైకి దాడికి కూడా దిగారని ఈ సందర్భంగా పోలీసులకు బాధితులు గుర్తు చేశారు. సర్వే నెంబర్ 195లో 2 సెంట్ల భూమిని గతంలో రవి నాన్న దాసరి నాగేశ్వరరావు పేరు మీద ఉంది. దానిలో ఇంటిని నిర్మించుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారని భయాందోళనతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో ఒకసారి ఇదే విషయంపై రవి ఇంటిపైకి వచ్చిన వారిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టినా లేక బైండోవర్ చేసినా ఇప్పుడు తన ఇంటిని ఎవరూ కాల్చే వారు కాదని గుర్తు చేశారు. అంతే కాకుండా ఈ విషయం అడిగినందుకు తనపై దాడి చేసిన వారు ఫిర్యాదు చేయటంతో తనపైనే కేసు నమోదు చేస్తున్నారని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పోలీస్స్టేషన్లో సీఐని అడిగినందుకు తనను తన భార్య, ఎస్సై, ఇతర వ్యక్తుల ముందే చొక్కా పట్టుకొని సీఐ లోపలకు లాక్కెళ్లాడని, ఆయనపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఎస్సైకి దాసరి రవి ఫిర్యాదు చేశారు. దానిపై సీఐని వివరణ కోరగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రవి న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడి చొక్కా పట్టుకున్న సీఐ సీఐపై ఎస్సైకి ఫిర్యాదు -
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కల్యాణం శుక్రవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కమనీయంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. స్వామి వారి కల్యాణాన్ని కన్నులారా తిలకించిన భక్తులు భక్తితో పరవశించిపోయారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రంగనాయకా..పాహిమాం అంటూ భక్తజనం పులకించిపోయారు. రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలోని కల్యాణ మండలంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. – మార్కాపురం టౌన్ – రాచర్ల -
రైతులను నట్టేట ముంచిన బాబు
తమకు చెందిన 1.17 ఎకరాల భూమిని సర్వేయర్ ద్వారా కొలతలు వేయాలని సుబ్బాయమ్మ దరఖాస్తు చేసుకుంది. స్థానిక సర్వేయర్తో జనవరి 9వ తేదీ 2025న కొలతలకు వస్తామని నోటీసులు పంపారు. పండుగ సెలవులు కావడంతో జనవరి 19వ తేదీన కొలతలు వేశారు. అయితే జనవరి 7వ తేదీ కొలతలు వేయకుండానే ఈ భూమి మీది కాదని డిక్లరేషన్ ఇచ్చారని ఆరోపించింది. ఈ విషయంపై కలెక్టర్ను కలిసినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. తన మాటలు కలెక్టర్ వినకుండానే ఆఫైల్ను పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం కోర్టును ఆశ్రయించానని చెబుతోంది. ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఎంతసేపూ తన మనుషులకు ఎలా లబ్ధి చేకూర్చాలన్న ధ్యాసలోనే ఉన్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం రైతు విభాగ నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, అన్ని రకాలుగా అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పార్టీకి సంబంధించి అన్ని రకాల అనుబంధ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేద్దాం.. రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బూచేపల్లి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డెయిరీని మూతేయించి పాడి రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రుణమాఫీ చేసి అండగా నిలిచారని, వైఎస్ జగన్ మోహన్రెడ్డి పెట్టుబడి సాయం దగ్గర నుంచి గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం సకాలంలో అందజేయడమే కాకుండా ఆర్బీకేల ద్వారా అన్ని సేవలను రైతు ముంగిటకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసి ఉచిత పంటల బీమా అమలు చేసి సకాలంలో సాయం అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క దర్శి నియోజకవర్గంలో మిర్చి, మొక్కజొన్న ఇలా రకరకాల పంటలకు పంట నష్టపరిహారం కింద సుమారు రూ.7 లక్షల వరకూ అందుకున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉంటేనే సమాజంలోని అన్ని వర్గాలు బాగుంటాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా అందజేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, పొగాకు, మొక్కజొన్న, శనగ పంటలను కొనేవారు లేక అన్నదాతలు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట వేయాలని అధికారుల ద్వారా ప్రోత్సహించారని, తీరా పంట చేతికొచ్చిన తర్వాత మొండి చేయి చూపారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెస్పీ ధరలకే మొక్కజొన్న పంటను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పొగాకు కొనుగోలుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన బాధ్యతను మరిచిన చంద్రబాబు రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారులు రైతుల కష్టానికి ధరలు నిర్ణయిస్తున్నారని, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం.ప్రసాదరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళ్ల రవీంద్రరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, రైతు విభాగం నాయకులు శంకరరావు, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. భూ మాయ..!సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు గాడి తప్పుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి కోట్లాది రూపాయల విలువైన భూమిని అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరు మీదకు ఆన్లైన్లో మార్పులు చేసి లబ్ధిదారుల పొట్టకొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓ రెవెన్యూ అధికారి అక్రమాలకు అంతేలేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. సదరు అధికారి రియల్ వెంచర్లలో భాగస్వాములుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల తీరుతో నష్టపోతున్నట్లు దర్శికి చెందిన ఓ వృద్ధురాలు వేదన చెందుతోంది. సదరు అధికారి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పనిచేసి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో మరింత చెలరేగిపోయి భారీ ఎత్తున భూములు బదలాయించి కోట్లు గడించారని రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల నోటీసుకు వెళ్లడంతో వారిని సైతం మేనేజ్ చేసే పనిలో పడ్డారని ఆశాఖ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనాయకులతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ వివాదాల నుంచి బయటపడాలన్న ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శిలోని ఓ వెంచర్లో భాగస్వామిగా మారిన సదరు అధికారి ఫ్రీహోల్డ్లో రూ.కోట్ల విలువైన భూమిని అనువంశీకం కిందకు మార్పు చేశారు. ఈ భూముల్లో రియల్ఎస్టేట్ వెంచర్ వేశారు. అలాగే ఎర్రబాలెంలో బ్రిటీష్ కాలం నుంచి ఉన్న భూముల రికార్డులు కూడా తారుమారు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఐదు ఎకరాల భూమికి సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు భూమి విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. దొనకొండ రాజధాని అని పుకార్లు రావడంతో అధికార టీడీపీ నేతలు భూములపై వాలిపోయి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై క్రైస్తవ భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా యథేచ్ఛగా దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శి పట్టణానికి చెందిన మాడపాకుల వెంకట సుబ్బయ్య భార్య సుబ్బాయమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బాయమ్మ మామ వెంకట సుబ్బయ్యకు సర్వే నంబర్ 178లో 2.35 ఎకరాల భూమి ఉంది. తమకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని తన భర్త వెంకట సుబ్బయ్యకు 1.17 ఎకరాల భూమి, ఆయన సోదరుడు వెంకటేశ్వర్లుకు 1.17 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. ఇవి ఇనామ్ భూమి కావడంతో అమ్మడానికి లేదని ఫ్రీహోల్డ్లో పెట్టి ఉంది. 2025 జనవరి నెల వరకు ఈ భూమి ఫ్రీ హోల్డ్లోనే ఉంది. 2025 ఫిబ్రవరి నెలలో వెంకటేశ్వర్లుకు సంబంధించిన 1.17 ఎకరాల భూమి, వెంకట సుబ్బయ్యకు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన 44 సెంట్లు భూమి కలిపి వెంకటేశ్వర్లు కొడుకుల పేరుపై ఎక్కించారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ నుంచి తీసివేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు వెసులుబాటు కల్పించారు. -
రక్తకన్నీరు..
ప్రతి ఏడాది వేసవిలో రక్తం కొరత ఉంటుందని బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బ్యాంకర్లు, కార్పొరేట్ కంపెనీలు, జీవిత బీమా కంపెనీలు తమ ఉద్యోగుల చేత రక్త సేకరణ చేస్తుంటారని, వీరిలో కాలేజీ విద్యార్థుల నుంచి రక్తం సేకరించడం అధికంగా ఉంటుందని సమాచారం. సహజంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు జిల్లాలో రక్త సేకరణ క్యాంపులు నిర్వహిస్తుంటారని, కాలేజీలకు సెలవుల కారణంగా వేసవిలో రక్త సేకరణ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు సేకరించిన రక్తం నుంచి జీజీహెచ్కు 30 శాతం ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. చాలా వరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోవడంలేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనీసం ఒక్క యూనిట్ బ్లడ్ కూడా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి జీజీహెచ్కు అందలేదని సమాచారం. ప్రజలలో రక్తదానంపై అవగాహన కల్పించేందుకు మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 540 నర్సింగ్ హోంలు, వివిధ రకాల ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 90 ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులున్నారు. ఇక్కడ ప్రతినిత్యం వందల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. సుమారు 150 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా జిల్లా కేంద్రమైన ఒంగోలులో రెండు కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు చేస్తున్నారు. లెక్కకు మిక్కిలిగా స్టంట్లు వేస్తున్నారు. ఇంకా మోకాలి ఆపరేషన్లు, మహిళల గర్భసంచి సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఒక్క జీజీహెచ్లో జరిగే ఆపరేషన్లకే రోజుకు 15 యూనిట్లకు పైగా రక్తం అవసరమవుతుంది. ఒంగోలులోని మిగిలిన ప్రైవేటు ఆస్పత్రులకు 50 నుంచి 75 యూనిట్ల రక్తం అవసరం. అత్యవసర ఆపరేషన్లు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం కోసం బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. జీజీహెచ్కు వెళితే అక్కడ అవసరమైన రక్తం దొరకదు, ప్రైవేటుకు వెళితే రెడ్క్రాస్కు వెళ్లమంటారు. అక్కడకు వెళితే ఒట్టిచేతులు చూపుతున్నారని బాధితులు వాపోతున్నారు. నగరంలో రక్త నిల్వలు ఇలా.. జిల్లాలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఒంగోలు నగరంలోని జీజీహెచ్తో పాటుగా కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. నగరంలో జీజీహెచ్, రెడ్క్రాస్లతోపాటు మొత్తం కలుపుకొని 6 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో జీజీహెచ్లో ఏ పాజిటివ్ 27, బీ పాజిటివ్ 42, ఓ పాజిటివ్ 47, ఏబీ పాజిటివ్ 5 యూనిట్ల రక్తం అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏ నెగిటివ్ 1, బీ నెగిటివ్ 2, ఓ నెగిటివ్ 2, ఏబీ నెగిటివ్ జీరో యూనిట్లు ఉన్నాయి. రెడ్ క్రాస్లో ఓ పాజిటివ్ హోల్ బ్లడ్ 2, పాకెట్ సెల్ 19, ఏ పాజిటివ్ హోల్ బ్లడ్ 3, పాకెట్ సెల్ 5, బీ పాజిటివ్ హోల్ బ్లడ్ జీరో, పాకెట్సెల్ 17, ఏబీ పాజిటివ్ రెండు రకాలు నిల్వలు లేవు. ఓ నెగిటివ్ పాకెట్ సెల్ 1, హోల్ బ్లడ్ జీరో, ఏ నెగిటివ్ హోల్ బ్లడ్ జీరో, పాకెట్ సెల్ 1, బీ నెగిటివ్ రెండు రకాలు అందుబాటులో లేవు, ఏబీ నెగిటివ్ కూడా నిల్వలు లేవు. న్యూ విజన్ ప్రైవేటు బ్లడ్ బ్యాంకులో ఏ పాజిటివ్ 4, బీ పాజిటివ్ 45, ఓ పాజిటివ్ 21, ఏబీ పాజిటివ్ 06 నిల్వలు ఉన్నట్లు నిర్వాహకుడు జి.నాగేశ్వరరావు తెలిపారు. నెగిటివ్ బ్లడ్ గ్రూపులు ఏవీ అందుబాటులో లేవని తెలిపారు. మార్కాపురం జీజీహెచ్లోని బ్లడ్ బ్యాంకులో ఓ పాజిటివ్ 2, బీ పాజిటివ్ 3 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా గ్రూపులు, నెగిటివ్ బ్లడ్ పూర్తిగా నిల్వలు లేవని సమాచారం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఒంగోలు, గుంటూరుకు పరిగెత్తాల్సి వస్తోందని మార్కాపురం జిల్లా ప్రజలు చెబుతున్నారు. దీంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయి ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు. నెగిటివ్ బ్లడ్ కోసం తిప్పలు... కాస్త ప్రయత్నిస్తే పాజిటివ్ రక్తం దొరుకుతుంది కానీ ఎంత ప్రయత్నించినా నెగిటివ్ రక్తం దొరకడం కష్టమవుతోంది. ప్రస్తుతం జీజీహెచ్లో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు మొత్తం కలుపుకొని కేవలం 5 యూనిట్ల నెగిటివ్ రక్తం మాత్రమే నిల్వలున్నాయి. రెడ్ క్రాస్లో ఏ నెగిటివ్ 1, ఓ నెగిటివ్ 1 యూనిట్ మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు బ్లడ్ బ్యాంకు న్యూ విజన్లో అయితే ఓ నెగిటివ్ 1 యూనిట్ ఉండగా మిగతా ఏ, బీ, ఏబీ నెగిటివ్ గ్రూపు రక్తం నిల్వలు లేవు. దాంతో నెగిటివ్ రక్తం అవసరమైతే దాతలను వెదుక్కోవాల్సి వస్తోంది. అరుదైన ఏబీ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కోసం ఒక్కోసారి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఎంత డబ్బు వెచ్చించినా ఏబీ నెగిటివ్ రక్తం దొరికే వరకు గ్యారంటీ ఉండడంలేదని తెలుస్తోంది. -
వాడ్ని బయటకు నెట్టు !
● అసిస్టెంట్ లైన్మెన్పై విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు చౌదరి రంకెలు సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు కొందరు అధికారులు కూడా రెచ్చిపోతున్నారు. ఒంగోలు విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు చౌదరి ఒక చిరుద్యోగిపై చిందులేయడం సంచలనం సృష్టిస్తోంది. లింగంగుంట్ల మద్దిపాడు సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఒంగోలు డివిజన్ డీ త్రీకి బదిలీ చేశారు. ఈ మేరకు సీఎండీ చైర్మన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కట్టా వెంకటేశ్వర్లుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈ వెంకటేశ్వర్లు మార్చి 10వ తేదీ డీ త్రీ అసిస్టెంట్ లైన్మెన్గా పోస్టింగు ఇవ్వాల్సిందిగా ఈఈ హరిబాబును ఆదేశించారు. అప్పటి నుంచి నేటి వరకు ఏఎల్ఎం వెంకటేశ్వర్లురెడ్డి పోస్టింగు కోసం ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇది జరుగుతుండగానే మద్దిపాడు సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న సునిల్ కు డిస్టిక్ స్టోర్స్కు పోస్టింగు ఆర్డర్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు తనకు కూడా పోస్టింగు ఇవ్వమని అడిగేందుకు గురువారం ఈఈ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే బయట ఉన్న అటెండర్ నిన్ను ఈఈ గారు లోపలకు రానీయవద్దని చెప్పారని అడ్డుకున్నారు. ఈ లోపు సీసీ కెమెరాలోంచి వెంకటేశ్వర్లు రాకను గమనించిన ఈఈ హరిబాబు చౌదరి తన చాంబర్ నుంచి ఆగ్రహంగా బయటకు వచ్చారు. వచ్చీ రాగానే వెంకటేశ్వర్లును ఉద్దేశించి ‘‘బయటకు పో..బయటకు పో..’’ అంటూ రంకెలేశారు. వాడ్ని బయటకు నెట్టమని అటెండర్ను ఆదేశించారు. అంతటితో ఊరుకోకుండా ‘‘వీడ్ని సస్పెండ్ చేయండి’’ అంటూ హూంకరించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో చిత్రీకరిస్తుండగా అతడినుద్దేశించి ‘‘వీడియో తీస్తే ఏమవుద్ది...తీసుకో’’ అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఈఈ హరిబాబు ఎంత రెచ్చిపోతున్నప్పటికీ ఏఎల్ఎం వెంకటేశ్వర్లు రెడ్డి మాత్రం మౌనంగా తలవంచుకొని నిలబడ్డారు. ముడుపులు ఇవ్వలేదన్న కోపంతోనే... ఈఈ హరిబాబు చౌదరికి ముడుపులు ఇవ్వకుండా ఏఎల్ఎం వెంకటేశ్వర్లు రెడ్డి బదిలీ ఆర్డర్ తెచ్చుకున్నాడన్న కోపంతోనే విచక్షణ కోల్పోయి దూషణలకు పాల్పడినట్లు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. విద్యుత్ శాఖలో బదిలీల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఉద్యోగిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈఈ హరిబాబును సస్పెండ్ చేయాలి... ఆఫీసులో అందరిముందు తనను అకారణంగా దూషించిన ఈఈ హరిబాబును ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఎల్ఎం వి.వెంకటేశ్వర్లు రెడ్డి విజ్ఞప్తి చేశారు. తోటి ఉద్యోగినన్న కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించారని, మనస్తాపంతో తానేదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇలా మరో ఉద్యోగికి జరగకుండా ఈఈపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. -
అబద్ధపు హామీలతో మోసగించిన బాబు
వైఎస్సార్సీపీ విద్యుత్ ప్రభపై మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పక్కన మేరుగు నాగార్జున, కారుమూరి, వెంకాయమ్మ వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభ దగ్గర జనసందోహం చీమకుర్తి రూరల్: చంద్రబాబు అలవికాని అబద్ధపు హామీలు ఇచ్చి..అరకొరగా అమలు చేసి ప్రజలను మోసగించాడని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. చీమకుర్తి మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలో బుధవారం రాత్రి గంగా బాలత్రిపుర సుందరీ సమేత మోక్షరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గంగమ్మ తల్లి తిరునాళ్లలో ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాయ మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని, 2029లో చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కూటమి పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేరని, రైతన్నలు పండించిన ఏ పంటకు మద్దతు ధర ప్రకటించిన పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల పక్షాన గిట్టుబాటు ధరల కోసం పోరాడితే అక్రమ కేసులు, అరెస్టులు, బెదిరింపులు సర్వసాధారణమైపోయాయన్నారు. మీ అక్రమ కేసులకు ఏ ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్త భయపడడని 2029లో చంద్రబాబుకి తగిన మూల్యం తప్పదన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకు పార్టీ, బూచేపల్లి కుటుంబం కూడా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న అంటేనే జనం అని, జగనన్న వెంటే జనం ఉన్నారని, 2029లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను పార్టీ చూడకుండా, మతం చూడకుండా కులం చూడకుండా చెప్పినవి, చెప్పనవి కూడా నెరవేర్చారన్నారు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ఏపంటకూ మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వంలో విఫలమైందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్రెడ్డి, దుంపా చెంచురెడ్డి, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శారద శిల్పకళా మందిరంలో ఉచిత అడ్మిషన్
అద్దంకి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీ శారద శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు 4 సంవత్సరాల కోర్సును ఉచితంగా నేర్పించనున్నట్లు పట్టణానికి చెందిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరిన వారికి రాతి శిల్పకళను నేర్పుతారని తెలిపారు. ఈ శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించి, రెండో సంవత్సరం నుంచి స్టైఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కోర్సులో చేరదలుచుకున్న వారు శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ డీ రవీంద్ర చారి, శిల్పి, శ్రీ శారద శిల్పకళామందిరం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, 8142711990, 9849211807 వారికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలోని ఉత్సాహవంతమైన యువతీ యువకులు ఈ సదవకాశం వినియోగించుకోవాలన్నారు. మార్కాపురం టౌన్: రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు మార్కాపురం ఆర్టీసీ డిపో ద్వారా భక్తుల, ప్రయాణీకుల సౌకర్యార్థం 4 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తుల కోసం ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. గురువారం సాయంత్రంతో సర్పంచ్ల పదవీకాలం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. 2021 మార్చిలో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. వారి పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల్లో పాలన చేయనున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, ఈఓఆర్డీలు, ఎంఈఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, మండల వ్యవసాయాధికారులు, మండల హార్టీకల్చర్ అధికారులు, మత్స్యశాఖ అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు 2, 3 పంచాయతీలను కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 924 గ్రామ పంచాయతీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ సర్పంచ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. వీరందరూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల పరిధిలో 21 మండలాల్లో 406 పంచాయతీలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలకు ఈఓపీఆర్డీలు ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ఆయా గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, వీధిలైట్లు తదితర అంశాలను పర్యవేక్షిస్తారు. -
పదింతల ఆనందం
● ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఒంగోలు సిటీ: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2వ తేదీ గురువారం ఇంగ్లిష్ పరీక్షతో ముగిశాయి. దీంతో విద్యార్థులు సంతోషంగా కేరింతలు కొట్టారు. స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటూ సెండాఫ్ చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 165 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 28,316 మంది విద్యార్థులకు గాను, 28,150 మంది హాజరుకాగా, 166 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఫ్లయింగ్స్క్వాడ్, స్టేట్ ఫ్లయింగ్ స్క్వాడ్, అధికారులు మొత్తం 88 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. బై బై.. ఇంటర్లో కలుద్దాం.. -
కరుణాంతరంగ.. దీవించు గంగ
గంగమ్మ తల్లి దేవాలయంలో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ రామతీర్థంలో మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మచీమకుర్తి రూరల్: గ్రానైట్ ఖిల్లా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. ప్రసిద్ధిగాంచిన రామతీర్థం గంగమ్మ తిరునాళ్ల బుధవారం రాత్రి రంగరంగ వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు హాజరై గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి శరణు వేడారు. చీమకుర్తి మండలం రామతీర్థం నిధిలో వెలసిన గంగా, బాలత్రిపురసుందరీ సమేత మోక్షరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు మొక్కులు చెల్లించారు. తిరునాళ్ల సందర్భంగా మోక్షరామలింగేశ్వరస్వామి దేవస్థానం, గంగమ్మ తల్లి ఆలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఐదు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభలపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, తిరునాళ్లకు హాజరైన భక్తులకు వివిధ సామాజిక సత్రాల్లో అన్న సంతర్పణ చేశారు. చీమకుర్తి సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రామతీర్థంలో బూచేపల్లి ప్రత్యేక పూజలు మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయం, గంగమ్మ తల్లి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేయించారు. రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల బాగా జరగాలని, ముందుగా మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో తరువాత గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ చీమకుర్తిలో యువకుని హత్య? ఉలవపాడులో చోరీ ● 8 సవర్ల బంగారం అపహరణ ఉలవపాడు: మండల కేంద్రమైన ఉలవపాడు రిజర్వు కాలనీలోని రెండో లైనులో ఓ ఇంట్లో చోరీ ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. షేక్ షాహిద్కు రిజర్వు కాలనీ రెండో లైన్ లో సొంత గృహం ఉంది. కొంత కాలంగా సికింద్రాబాద్ లో ఉద్యోగ నిమిత్తం నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కింద పోర్షన్ అద్దెకి ఇచ్చి పైన ఇక్కడకు వచ్చినప్పుడు నివాసం ఉంటారు. 45 రోజుల క్రితం ఉలవపాడుకు వచ్చి తిరిగి సికింద్రాబాద్కు వెళ్లాడు. మంగళవారం రాత్రి కింద పోర్షన్ లో అద్దెకు ఉండేవారు గమనించి పైన దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. బుధవారం వచ్చి పరిశీలించగా బీరువా పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్బాషా, ఎస్సై సుబ్బారావు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బీరువాలో ఉన్న 8 సవర్ల బంగారు నగలు చోరీకి గురయ్యాయని బాధితుడు తెలిపారు. క్లూస్ టీమ్వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీమకుర్తి: చీమకుర్తిలో మంగళవారం రాత్రి మందిరాల వేడుకలో పాల్గొని ఇంటికి చేరుకున్న యువకుడు తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. చెవి నుంచి రక్తం కారిన మరకలు, కనుబొమ్మలు, మెడపై రక్తపు గాట్లు, గుండెలపై కమిలిన మచ్చలు ఉండటంతో యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం మృతుడి భార్య కార్తికేయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం, అందిన సమాచారం మేరకు.. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన రామయోగి పెయింట్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గత రెండేళ్లుగా చీమకుర్తిలోని గాంధీనగర్లో ఇంటిని అద్దెకు తీసుకొని భార్య కార్తికేయి, రెండేళ్ల కుమారుడు యోగేష్తో కలిసి జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి చీమకుర్తిలో మందిరాల సంబరాలకు భార్య, కుమారుడితో కలిసి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. మరో గంట తర్వాత రామయోగిని తనతోపాటు పనిచేసే ముగ్గురు స్నేహితులు వచ్చి మందిరాల సంబరాల పేరుతో వెంట తీసుకెళ్లారు. రాత్రి 12 నుంచి ఒంటి గంట మధ్య ముగ్గురు స్నేహితులు రామయోగిని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మృతుడి భార్య కథనం ప్రకారం.. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న రామయోగి తన భార్యతో రెండు మూడు మాటలు మాట్లాడి తొలుత మంచంపై, కాసేపటి తర్వాత నేలపై పడుకున్నాడు. బుధవారం ఉదయం ఇంటి పనులు చేసుకుంటూ భర్తను నిద్ర లేపే ప్రయత్నం చేయగా ఎలాంటి కదలిక లేదు. భర్త మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ దాసరి ప్రసాదరావు, ఎస్సై పీవీ కృష్ణయ్య పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానంతో కార్తికేయితోపాటు మృతుడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి సోదరుడు యోగేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీవీ కృష్ణయ్య తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. రామయోగి చెవి వద్ద రక్తపు మరకలు, మెడపై గాయంమృతదేహం వద్ద విలపిస్తున్న సోదరుడు యోగేశ్వరరావు 12వ పీఆర్సీ కమిషన్ వేయాల్సిందే.. రామతీర్థం నిధిలో వైభవంగా గంగమ్మ తల్లి తిరునాళ్ల మోక్షరామలింగేశ్వరస్వామి ఆలయంలో వేలాది భక్తుల పూజలు ఐదు విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు మృతుడు పెయింటింగ్ వర్కర్ రాత్రి ఇంటికి వచ్చి పడుకుని, తెల్లవారేసరికి శవమైన వైనం శరీరంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు మృతుడి భార్యతోపాటు ముగ్గురు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు -
కొండకు నిప్పు పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు
రాచర్ల: రాచర్ల ఫారెస్ట్ బీట్ పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్లో నివాసం ఉంటున్న కటారి కృష్ణయ్య, కుంచపు సురేష్ అనే వ్యక్తులు నల్లమలలోని గూనికొండ నుంచి గుర్రాలకొండ వరకు బుధవారం నిప్పు పెట్టారు. అటవీ ప్రాంతంలోని నెమళ్లు, జింకలతోపాటు వన్యప్రాణుల ఆవాసాలకు నష్టం కలిగిస్తున్నారన్న అభియోగంపై ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజులపాటు రిమాండ్ విధించారని ఫారెస్టు డీఆర్ఓ బి.వంశీకృష్ణకుమారి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మానాయక్ తెలిపారు. ● తన కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమన్న మౌలాబీ సింగరాయకొండ: మండల కేంద్రంలోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి తౌషిక్ మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ విద్యార్థి తల్లి మౌలాబీ తన కుమారునిది ముమ్మాటికీ హత్యేనని ఇప్పటికే పలు విధాల నిరసనలు తెలిపి చివరికి బుధవారం ఆ పాఠశాల వద్ద కూర్చొని తన నిరసన తెలిపింది. దీంతో పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు గంటన్నరకు పైగా ఆమె తన నిరసన తెలపగా చివరికి ఆమె బంధువులు కారులో వచ్చి ఆమెను బతిమిలాడి అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. తన కుమారుడి మరణానికి ముమ్మాటికీ శ్రీ చైతన్య నవోదయ స్కూలు యాజమాన్యమే కారణమని తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని ఆమె రోదించటంతో పాటు స్కూలు యాజమాన్యాన్ని దుర్భాషలాడింది. సింగరాయకొండ: మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డులో ఉన్న రాఘవయ్య కాలనీలో గత నెల 14వ తేదీ డాక్టర్ దువ్వూరి అనిల్కుమార్ ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న చీమకుర్తి గ్రామానికి చెందిన తన్నీరు శ్రీహరిబాబును బుధవారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 30.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 548 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వేలిముద్రలు పడకుండా హ్యాండ్ గ్లౌజ్లు వాడుతూ స్క్రూడ్రైవర్, రాడ్డు ఉపయోగించి చోరీలు చేశాడన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్సై మహేంద్ర వివరించారు. అద్దంకి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎల్ఐసీ ఏజెంట్ మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కొమ్మాలపాటి గోపీ నాఽథ్ (27) గేదెల మేత కోసం ఉదయాన్నే తన మోటారు సైకిల్పై పొలానికి వెళ్లారు. గడ్డి మోపు తీసుకుని ఇంటికి వస్తున్న సమయంలో పొలంలో వేసిన విద్యుత్ వైరు మడ్గర్కు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్కు రాజగోపాల్ నగర్కు చెందిన యమునతో ఆరు నెలల క్రితం వివాహమైంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివాహమైన ఆరు నెలలకే భర్త అర్ధంతరంగా తనువు చాలించడంతో యమున కన్నీరు మున్నీరుగా విలపించింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ప్రాణాలు తీసిన ప్రేమ
తాడేపల్లిరూరల్: ఇద్దరి మధ్య ప్రేమ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ కుటుంబాలు పలుమార్లు ఘర్షణ పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రేమికుడు దేవిరెడ్డి శివరామిరెడ్డి (21) పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు బుధవారం మృతిచెందాడు. శివరామిరెడ్డితో ఆ యువతి బంధువులు పురుగుమందు తాగించారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన మేరకు.. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామానికి చెందిన దేవిరెడ్డి శివరామిరెడ్డి (21) కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతూ మానేసి ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. విజయవాడలో నివాసముండే అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని, అతడు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతనెల 18వ తేదీ శివారెడ్డితో ఆ విద్యార్థిని ఫోన్లో మాట్లాడుతుండగా ఆమె తల్లి గమనించింది. అనంతరం ఆ యువతి తల్లిదండ్రులు మీర్జాపేట వెళ్లి శివరామిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, చెంచులక్ష్మితో గొడవ పడ్డారు. శివరామిరెడ్డి ఇకమీదట ఆ అమ్మాయి జోలికి రాకుండా చూసుకుంటామంటూ నాగిరెడ్డి, గ్రామపెద్దలు వారికి చెప్పారు. 19వ తేదీ ఆ విద్యార్థిని, మరో యువకుడు ఫోన్చేసి శివరామిరెడ్డిని మార్కాపురం పిలిచారు. అక్కడ అతడిపై దాడిచేసి ఫోన్ లాక్కున్నారు. మీర్జాపేటలో కూడా రెండువర్గాల వారు తరచూ ఘర్షణ పడ్డారు. గత 25న ఆ విద్యార్థిని బంధువులు శివరామిరెడ్డిని దోర్నాల పిలిపించి దుర్భాషలాడి కొట్టారు. ఈ నేపథ్యంలో 30వ తేదీ ఇంట్లో నుంచి హడావిడిగా వెళ్లిన శివరామిరెడ్డి కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చి పడిపోయాడు. అతడిని మార్కాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు పురుగుమందు తాగాడని చెప్పారు. దీంతో అతడిని తాడేపల్లి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శివరామిరెడ్డితో ఆ విద్యార్థిని కుటుంబసభ్యులు బలవంతంగా పురుగుమందు తాగించారని అతడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దోషుల్ని శిక్షించాలని కోరారు. తాడేపల్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. తాడేపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి యువతి బంధువులు పురుగుమందు తాగించారన్న మృతుడి తల్లిదండ్రులు అంతకుముందు మార్కాపురం మీర్జాపేటలో రెండువర్గాల ఘర్షణ -
వరుడు వధువాయె..!
● గుడిపాడు కొత్తపాలెంలో వింత ఆచారం కనిగిరిరూరల్: మండలంలోని గుడిపాడు కొత్తపాలెంలో వింత ఆచారంతో వివాహం జరిగింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆ గ్రామంలోని 7 గోత్రాలు, సుమారు 5 ఇంటి పేర్ల కుటుంబాలకు చెందిన వారి వివాహ వేడుకల్లో వరుడు వధువుగా అలంకరించుకోవడం ఆచారం. ఈక్రమంలో గుడిపాడు కొత్తపాలెంలో దాదిరెడ్డి కృష్ణారెడ్డి, లక్ష్మీదేవిల వివాహం బుధవారం జరిగింది. వివాహంలో వారి ఆచారం ప్రకారం ముందుగా పెళ్లి కుమారుడు కృష్ణారెడ్డి పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. ఊరేగింపుగా ఎదురు నడిచే కార్యక్రమం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది -
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పశ్చిమాసియా యుద్ధం వంటింట్లో మంటలు రేపుతోంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలు సగటు జీవిని గాయపరుస్తున్నాయి. తొలుత గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ధరల పెరుగుదలకు శ్రీకారం చుట్టినట్లయింది. గ్యాస్ ధరలు పెరగడంతో పాలు, పెరుగు, సిమెంట్, వంటనూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాస్ కోసం ఏజెన్సీల దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. పాల కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నాడు. వంటనూనె కోసం చేతులు కాల్చుకుంటున్నాడు. అయినా సరే పాలకులకు పట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తుంటే ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదని జనం ఆందోళన చెందుతున్నారు. -
నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి
మార్కాపురం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ అమలును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటిస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలతో మార్కాపురం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాసి, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేయడం తీవ్ర అన్యాయమని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం కార్మిక వర్గానికి బ్లాక్ డే అని అన్నారు. ఇప్పటి వరకూ ఉన్న కార్మిక చట్టాల రక్షణ కవచాన్ని నాలుగు లేబర్ కోడ్ల అమలు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛిద్రం చేస్తున్నాయని, కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేయాలని, పాత కార్మిక చట్టాలను అమలుచేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం హేయమైన చర్య అన్నారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీ బాలనాగయ్య, పట్టణ కో కన్వీనరు సుబ్బరాయుడు, నాయకులు నాగరాజు బాషా, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, నాయక్, హరి, సలామ్ ఖాన్, శ్రీను, శేఖర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి విషయంలో నిర్లక్ష్యం సహించం
అద్దంకి: ఈ వేసవిలో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై, కొరిశపాడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొరిశపాడు రిజర్వాయర్కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా తాగు నీరు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో వర్షం నీరు వృథాగా పోకుండా జల సంరక్షణ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టేలా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వేసవిలో చెరువులు, కాలువల పూడికతీత పనులు, జంగిల్ క్లియరెన్స్, లింక్ కెనాల్స్ శుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అద్దంకి పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్సన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఎస్డీసీ విజయ జ్యోతి, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని గాలికొదిలేసిన బాబు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వదిలేసి జగన్మోహన్రెడ్డిని తిట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలతో కలసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదని విమర్శించారు. పీ4 ద్వారా ఏం కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని, 18 ఏళ్లు నిండిన వారికి రూ.1500, ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టేశారని అన్నారు. పీ4 విజయవంతం అయిందని డబ్బాలు కొట్టుకుంటున్నారని, అసలు ఈ కార్యక్రమం ద్వారా ఏం చేశారో చెప్పాలన్నారు. మా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.3.33 లక్షల కోట్లు అప్పులు చేశారని, మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మీరు అంతకుమించి అప్పులు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, దాచుకో, దోచుకో, పంచుకో అన్న రీతిన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడైనా అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి.. అమరావతి విషయంలో జగన్మోహన్రెడ్డి వ్యతిరేకం కాదని, విశాఖ అభివృద్ధికి కూడా జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ కాదనరని, గతంలో తాత్కాలిక భవనాలు కట్టి కాలక్షేపం చేశారన్నారు. ప్రస్తుతమైనా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. మా ప్రభుత్వ హయాంలో దేవాలయాలు అభివృద్ధి జరిగాయని, అలాగే కోనసీమలో రథం కాలిపోతే వెంటనే చేయించి ఇచ్చారన్నారు. సెక్యులర్ దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టొదన్నారు. జగన్ వెంటే మేము.. ‘‘మా ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎలా ఉన్నారు... ఇప్పుడు ఎలా ఉన్నారు? గిట్టుబాటు ధర అప్పటి, ఇప్పటి పరిస్థితులపై అందరూ బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, ప్రజలు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నార’’ని కారుమూరి అన్నారు. జగన్తో మేమున్నామంటూ పార్టీ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రైతులు, కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారన్నారు. 17 మెడికల్ కళాశాలల నిర్మాణం, పోర్టులు, హార్బర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ పరిధిలో సభ్యత్వం నమోదు విషయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు పెద్ద ఎత్తున చేపట్టారని, ఇందుకు అందర్నీ అభినందించారు. మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు ముందంజలో ఉన్నారన్నారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్చార్జ్లు, నియోజకవర్గ పరిశీలకులతో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పార్టీ నిర్మాణం, కమిటీలు, పార్టీ స్థితిగతులు, రోజు వారీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై దిశనిర్దేశం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి, మాజీ మంత్రులు కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్లు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నారాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్చార్జ్లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, యర్రగొండపాలెం, దర్శి, కొండపి, ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిశీలకులు పిడతల ప్రవీణ్కుమార్రెడ్డి, మాదాసి వెంకయ్య, మీర్జా షంషీర్ అలిభేగ్, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న కారుమూరి నాగేశ్వరరావు, పక్కన శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, సురేష్, మేరుగు నాగార్జున, బత్తుల, అన్నా రాంబాబు, చుండూరి రవిబాబు, దద్దాల తదితరులుసమీక్ష సమావేశంలో పాల్గొన్న బూచేపల్లి, కారుమూరి, వెంకాయమ్మ, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, పరిశీలకులు -
వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ విజయ సునీత పెద్దదోర్నాల: జిల్లాకు తలమానికంగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు, ఫీడర్ కెనాల్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జూన్ 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజుకు 4 మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాలన్నారు. ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన డీజిల్, గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ప్రాజెక్టు ఈఈ అబూతాలిం, స్పెషల్ కలెక్టర్ శ్రీధరరెడ్డి, శివరామిరెడ్డి, తతదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో ప్రధానంగా నెలకొన్న రెవెన్యూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే 6 నెలలు రెవెన్యూ సమస్యలపై దృష్టిపెట్టాలని తెలిపారు. రీసర్వే జరిగే గ్రామాలకు ప్రతిరోజూ తహశీల్దార్లు వెళ్లాలన్నారు. మ్యుటేషన్లు, 22ఏ భూములు, ఇతరుల భూముల వంటి వాటిలో అధికారులకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలన్నారు. రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. జిల్లాలో వీఆర్ఓలు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవన్నారు. పదే పదే వచ్చే అర్జీలపై నేరుగా ఫీల్డు సర్వే చేయాలన్నారు. పీజీఆర్ఎస్పై ప్రతిరోజూ రిపోర్టు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్, కనిగిరి ఇన్చార్జ్ ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎస్ఓ అంకయ్య, జిల్లాలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో విద్యుత్ సర్కిల్లోని వినియోగదారులకు వారి సర్వీసు నంబరుల మొదటి నంబరు 4కు బదులు 7 గా మార్చినట్లు ఏడీఈ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో సర్వీసు నంబరు ఉదాహరణకు 4222101012345 స్థానంలో 7222101012345 మార్చినట్లు తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించేటప్పుడు సర్వీసు నంబరులో మొదట 4కు బదులు 7 మొదలయ్యేలా చూసుకోవాల్సిందిగా సూచించారు. మార్కాపురం రూరల్: జిల్లా ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించే జలజీవన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా బుధవారం మండలంలోని గొట్టిపడియ గ్రామం వద్ద రూ.1290 కోట్లతో జరుగుతున్న జలజీవన్ మిషన్ పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో శాశ్విత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన, సుజల నీటిని ఇంటింటికీ సరఫరా చేయనున్నారన్నారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
● విషాదంలో చిన జమ్ములమడక కాలనీ బల్లికురవ: ఆడుతూ, అల్లరి చేస్తూ, ముద్దులొలికే మాటలతో సందడి చేస్తున్న చిన్నారిని మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం పంచాయతీ చిన జమ్ములమడక కాలనీ వద్ద చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. చిన జమ్ములమడక కాలనీకి చెందిన పరిమి ఏసు, శిరీషా దంపతుల రెండో కుమారుడు పెరిడిపాల్(3) ఇంట్లో నుంచి ఆడుకుంటూ రోడ్డు పైకి వచ్చాడు. వెలమవారిపాలెం నుంచి గుండ్లకమ్మ నది వైపు అతివేగంగా వెళ్తున్న టిప్పర్ చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటన తర్వాత ఆగకుండా వేగంగా వెళ్తున్న టిప్పర్ను స్థానికులు వెంబడించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. కాగా, స్నేహ సంస్థకు చెందిన టిప్పర్లు రోజూ కొప్పరపాడు వైపు నుంచి, కూకట్లపల్లి రోడ్డు నుంచి గుండ్లకమ్మ నది వైపు ఇసుక, గ్రావెల్ తెచ్చేందుకు అతివేగంగా వెళ్తూ ప్రజల ప్రాణాలలను బలితీసుకుంటున్నాయని వెలమవారిపాలెం, కొత్తూరు, అరుణగిరి, జమ్ములమడక కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. -
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
అద్దంకి: ప్రజల్లో నమ్మకం కలిగేలా అధికారులు సేవలందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కొత్తగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై మరింత దృష్టి సారించి సమన్వయంతో పనిచేయాలన్నారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, రెవెన్యూ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. మండల స్థాయి అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ, ప్రతిరోజూ ఉదయం పారిశుధ్యం, ఉపాధి హామీ పనులను పరిశీలించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహిస్తున్న తీరును రోజుకు ఒక గ్రామం చొప్పున పరిశీలించాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, చేతిపంపులకు, కుళాయిలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, భూగర్భ నీటిమట్టం పెంచడం వంటి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించనని హెచ్చరించారు. ఆయా విషయాల్లో నిర్వహిస్తున్న సర్వేలో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారుల పనితీరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వచ్చే మూడు నెలల కాలాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. ప్రత్యేక ప్రణాళిక అవసరం .. ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడులు పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. దీనికోసం వచ్చే మూడు నెలల కాలానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడం, పంటల మార్పిడి దిశగా వారిని ప్రోత్సహించడం వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. వెబ్ల్యాండ్, మ్యుటేషన్, 22(ఏ), ఇతరములు వంటి రెవెన్యూ సమస్యలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. రెవిన్యూ క్లినిక్ , మీకోసం కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలను పునరావృతం కాకుండా సహేతుంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఎండార్స్మెంట్ స్పష్టంగా ఉండాలన్నారు. డివిజన్లోని 22(ఏ) భూముల సమస్యను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో తాను విస్తృతంగా పర్యటిస్తానని తెలిపారు. సమావేశాల్లో సీపీఓ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఆర్టీఓ జాన్సన్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్తమ్మ, ఏడీఏలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఏపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అక్షరాలా రూ.12 కోట్లు విలువజేసే ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో సర్కారు పెద్దలు స్కామ్కు తెరతీశారు. టీడీపీ కార్యాలయానికి కారు చౌకగా కట్టబెట్టేందుకు పార్టీ పెద్దలు చకచకా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన కార్యాలయం కావడంతో అధికారులు సైతం స్వామిభక్తిని చాటుకుంటూ శరవేగంగా ఫైల్ సిద్ధం చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అరెకరా స్థలానికి ఏడాదికి రూ.1000 లీజుతో 66 ఏళ్ల కాలపరిమితితో ఇచ్చేందుకుసంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని తెలుస్తోంది. స్థలం ఇంకా కేటాయించకపోయినా టీడీపీ నాయకులు మాత్రం కార్యాలయ నిర్మాణానికి సిద్ధమవుతుండడం కొసమెరుపు. ప్రభుత్వ స్థలం..పార్టీ చేసుకుందాం! -
అంతంతమాత్రమే!
ఆస్తి పన్ను చెల్లింపులు మార్కాపురం టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆస్తి పన్ను చెల్లించేందుకు భవన యజమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పోరేషన్తోపాటు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, చీమకుర్తి, పొదిలి, అద్దంకి, కందుకూరు, పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు గడిచిన రెండు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. వార్డు సచివాలయ సిబ్బందిని టీమ్లుగా విభజించి పన్ను చెల్లించేలా భవనాల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలను మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయినప్పటికీ పురపాలక సంఘాల్లో పన్ను బకాయిలు చెల్లించేందుకు యజమానులు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం ఆశించిన మేర మున్సిపల్ ఖజానాకు నగదు జమ కానట్టు తెలుస్తోంది. వసూళ్లు సగమే..! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది విధించిన పన్ను, పాత బకాయిలతో కలిపి రూ.139.85 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.76.25 కోట్లు మాత్రమే చెల్లించారు. ఒంగోలు కార్పొరేషన్లో రూ.83.14 కోట్ల డిమాండ్ ఉండగా మార్చి 31 నాటికి రూ.40.48 కోట్లు, మార్కాపురం మున్సిపాలిటీలో రూ.13.49 కోట్లకుగాను రూ.8.29 కోట్లు, గిద్దలూరులో 5.50 కోట్లకుగాను రూ.3.81 కోట్లు, కనిగిరిలో రూ.5.82 కోట్లకుగాను రూ.3.77 కోట్లు, దర్శిలో రూ.5.92 కోట్లకుగాను రూ.3.55 కోట్లు, చీమకుర్తిలో రూ.5.36 కోట్లకుగాను రూ.3.24 కోట్లు, పొదిలిలో రూ.4. 57 కోట్లకుగాను రూ.2.18 కోట్లు, అద్దంకిలో రూ.5.71 కోట్లకుగాను రూ.4.59 కోట్లు, కందుకూరులో రూ.10.34 కోట్లకుగాను రూ.6.34 కోట్లు వసూలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన డిమాండ్ ఉన్న మొత్తంలో సుమారు 60 శాతం మేర పన్ను ప్రజలు చెల్లించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆస్తి పన్ను వడ్డీపై నూరు శాతం రాయితీ ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గడిచిన రెండేళ్ల కాలంలో కేవలం 50 శాతం మాత్రమే రాయితీ ఇవ్వడంతో పన్ను చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేస్తే వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని భవనాల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో పన్ను బకాయిలు రూ.139.85 కోట్లు ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి చెల్లించినది రూ.76.25 కోట్లు వడ్డీపై 50 శాతం రాయితీ ఇచ్చినా ఫలితం నామమాత్రం -
బెట్టింగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ హర్షవర్ధన్రాజు బేస్తవారిపేట/కంభం/రాచర్ల: ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ను కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. మంగళవారం బేస్తవారిపేట, కంభం, గిద్దలూరు, కొమరోలు పోలీస్స్టేషన్లను తనిఖీ చేయడంతోపాటు రాచర్ల మండలంలోని నెమలిగుండం రంగనాయకస్వామి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భగా ఎస్పీ మాట్లాడుతూ.. బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ఆరుగురిని ఇటీవల అరెస్టు చేశామని, బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్న యువకుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామన్నారు. బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జునరావు, గిద్దలూరు రూరల్ సీఐ జె.రామకోటయ్య, కంభం, బేస్తవారిపేట ఎస్సైలు శివకృష్ణరెడ్డి, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు రాచర్ల: నల్లమల అభయారణ్యంలోని నెమలిగుండం రంగనాయకస్వామి క్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్థన్రాజు తెలిపారు. మంగళవారం రంగనాయకస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. నీటి గుండం, వాహనాల పార్కింగ్, కల్యాణ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, దేవస్థానం చైర్మన్ నరసింహులు, ఈవో మల్లవరపు నాగయ్య, గిద్దలూరు రూరల్ సీఐ జే.రామకోటయ్య, రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే..
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గడిచిన రెండేళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్నారని, పాలనలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విమర్శించారు. జగనన్న వెంటే జనం ఉన్నారని, 2029లో మళ్లీ సీఎంగా చేసుకుందామన్నారు. సోమవారం రాత్రి సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడు సమీపంలోని నిధిలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ తరఫున ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ప్రభలపై మాజీ మంత్రి, సంతనూతపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జునతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలోని కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధిష్టానంతోపాటు బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, రాజకీయాలు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పఽథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని కొనియాడారు. కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించకుండా నిలువునా ముంచారని మండిపడ్డారు. ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచురెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఎంపీపీ విజయ నాగేశ్వరావు, స్థానిక నాయకులు ములకలపల్లి సుబ్బారావు దొడ్డపాటి శ్రీనివాసరావు ఆంజనేయులు, పెద బ్రహ్మయ్య, మంగపాటి శ్రీను, ఇనగంటి పిచ్చిరెడ్డి, పాలడుగు రాజీవ్, వాకా కోటిరెడ్డి, కందుల డానియేల్, వేమా శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు. 2029లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించారు గుమ్మళంపాడు తిరునాళ్లలో ఎమ్మెల్యే బూచేపల్లి, మాజీ మంత్రి మేరుగు -
గ్రూప్–డి శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
మార్కాపురం రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రూప్–డి శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు తేదీని పొడిగించిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎస్.నిర్మలా జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని, స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 99892 85530, 89850 90926ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పు వెల్లడించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం మేరకు.. వెలిగండ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బద్దిపూడి అనోక్ 2022 జూలై 24న తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో వెలిగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై పి.విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేయగా ఒంగోలు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఎ.పల్లపురాజు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసులు సాక్షులను సకాలంలో హాజరుపరచడంతో కేసు విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొంటూ పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.75 వేలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ కేసు రుజువు చేస్తోందని ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. ప్రత్యేక పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజన్లు ఈవీ స్వామి, యల్లమంద, కె.సాయి హరికృష్ణారెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు: ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి గంజాయి స్వాధీనం కేసులో మొదటి నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి మంగళవారం తీర్పు వెల్లడించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.పద్మజ కథనం ప్రకారం.. 2017 నవంబర్ 30న చీమకుర్తి ఏకలవ్యనగర్లోని పాలపర్తి వెంకట్రావు నివాసంలో చీమకుర్తి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ వి.శ్రీనివాసులు పలువురు అధికారులు, మధ్యవర్తుల సమక్షంలో ఆకస్మిక తనిఖీ చేశారు. 3.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, పాలపర్తి వెంకట్రావు, బొర్రా సింహాచలం(విశాఖ)పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సమయంలో రెండో నిందితుడు మరణించగా, మొదటి నిందితునిపై విచారణ పూర్తి చేశారు. నిందితునిపై నేరం రుజువైనట్లుగా పేర్కొంటూ ఐదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ● రూ.9.25 లక్షల సొత్తు రికవరీ కొండపి: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుకందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కొండపి మండలం జాళ్లపాలెం గ్రామానికి చెందిన ముదిరెడ్డి రామలక్ష్మమ్మ మార్చి 7వ తేదీన ఇంటికి తాళం వేసి పనిపై బయటకు వెళ్లింది. ఉదయం 11:30 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉన్నాయి. రెండు బంగారు గొలుసులు, ఒక నల్లపూసల దండ, రెండు జతల చెవిపోగులు, రెండు పాపట బిల్లలు చోరీ అయ్యాయని బాధితురాలు ఫిర్యాదు చేయగా కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్కుమార్ దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత సాయంతో పొదిలి మండలం ఏలూరు గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి వినయ్కుమార్రెడ్డి(21)ని నిందితుడిగా గుర్తించారు. మంగళవారం ఉదయం కొడపి–జాళ్లపాలెం మార్గంలో ఒకటో కిలోమీటర్ రాయి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిండితుడి నుంచి రూ.9.25 లక్షల విలువైన 78 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కొండపి సీఐ, ఎస్సైతోపాటు సిబ్బంది సుధాకర్, రవి, అనిల్, అంజయ్యను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారని డీఎస్పీ తెలిపారు. కనిగిరి రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పెరుగు మురళీకృష్ణ(మాజీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్), పెరుగు తిరుపతమ్మ(వెదుళ్లచెరువు సర్పంచ్, వెలిగండ్ల మండలం), సంగు సుబ్బారెడ్డి(కనిగిరి రూరల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. -
మోటారు బైకుల దొంగ అరెస్టు
● 27 మోటారు బైకుల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు ఒంగోలు టౌన్: కళ్లు మూసి తెరిచేలోపే మోటారు బైకులను చోరీ చేసి ఉడాయించే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన అద్దేటి ఏడుకొండలు చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో మోటారు బైకులు చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఒంగోలు ఒన్టౌన్, టూ టౌన్, తాలుకా పోలీసు స్టేషన్ల పరిధిలోనే కాకుండా మద్దిపాడు, అద్దంకి, పల్నాడు జిల్లా వినుకొండ, నరసరావుపేట, గుంటూరు జిల్లా నగరంపాలెం, కొండూరు పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 27 మోటారు బైకులను దొంగిలించాడు. మంగళవారం నగరంలోని మామిడిపాలెం సెంటర్ నుంచి భాగ్యనగర్ వెళ్లే దారిలో వేణుగోపాల స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయితో సహా పట్టుబడ్డాడు. తహసీల్దార్ మధుసూదనరావు సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని, బైకులను సీజ్ చేశామని డీఎస్పీ వివరించారు. కాగా, బైకుల చోరీ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీతోపాటుగా సీఐ నాగరాజు, ఏఎస్సై కె.సురేష్, హెచ్సీలు ఎం.సాయి, జి.విజయ్, కానిస్టేబుల్ అనిల్ తదితరులను ఎస్పీ హర్షవర్థన్ రాజు అభినందించారు. -
ఉసురు తీసిన అతివేగం
పామూరు: లారీ డ్రైవర్ అతి వేగం ఒకరిని బలి తీసుకోగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి నాగరాజు, తన భార్య నారాయణమ్మ, కుమార్తె అనన్యకృష్ణ, కుమారుడు రిత్విక్రాముతో కలిసి గత కొంత కాలంగా బెంగళూరులో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి సామగ్రితో సహా స్వగ్రామం గొల్లపల్లికి మినీ లారీలో వస్తున్నారు. సోమవారం రాత్రి తిరగలదిన్నె వద్ద ఓ లారీ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. దానిని మినీ లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో క్యాబిల్లో కూర్చుని ఉన్న నారాయణమ్మకు తీవ్ర, ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు మోస్తరు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను పామూరు సీహెచ్సీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నారాయణమ్మ(28) చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ మహేంద్ర అతివేగమే ప్రమాదానికి కారమని స్థానికులు చెబుతున్నారు. మరో గంటలో ఇంటికి వెళ్తామనగా.. భార్య మృత్యువాతపడటం, కుమార్తె, కుమారుడు గాయాలపాలవడంతో నాగరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నారాయణమ్మ భౌతికకాయాన్ని కనిగిరి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి రిత్విక్ రాము చికిత్సపొందుతున్న చిన్నారి అనన్యకృష్ణ మృతురాలు దాసరి నారాయణమ్మ ఆగిఉన్న లారీని ఢీకొన్న మినీ లారీ ప్రమాదంలో మహిళ మృతి భర్త, ఇద్దరు పిల్లలకు గాయాలు -
జనసేన నాయకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సింగరాయకొండ: మండలంలోని పాకల గ్రామానికి చెందిన జనసేన మండల అధికార ప్రతినిధి సంకె నాగరాజుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు దాడి చేసి గాయపరిచారు. స్థానికుల కథనం ప్రకారం సంకె నాగరాజు, సైకం ఫణీంద్ర కలిసి చేపల వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం కోసం సంకె నాగరాజుతో రూ. 4.50 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. కానీ ఆదాయంలో ఒక్క రూపాయి ఇవ్వకపోగా పెట్టుబడిని కూడా సైకం ఫణీంద్ర తన ఆధీనంలో ఉంచుకున్నాడు. నగదు విషయమై పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా రూ.2.50 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుని రూ. లక్ష ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం బస్టాండ్ సెంటర్లోని సంకె నాగరాజు స్టూడియో వద్దకు వచ్చిన ఫణీంద్రను డబ్బులు ఇవ్వాలని అడగగా నన్నే డబ్బులు అడుగుతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతావు అంటూ గొడవ చేసి వెళ్లి తరువాత తన తండ్రి సైకం సుబ్బారావు, తమ్ముడు సైకం ఆనంద్, అతని బాబాయి మొత్తం నలుగురు కర్రలు తీసుకుని వచ్చి సంకె నాగరాజుపై దాడి చేశారు. అతని సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి జనసేన మండల ప్రదాన కార్యదర్శి కాసుల శ్రీనివాసులు గాయపడ్డ నాగరాజును కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. నాగరాజును జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కనపర్తి మనోజ్కుమార్, మండల అధ్యక్షుడు అయినాబత్తిన రాజేష్ పరామర్శించి దోషులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
మందలించాడని హత్య చేశాడు
బేస్తవారిపేట: భార్య పట్ల ప్రవర్తన మార్చుకోవాలని మందలించినందుకు చిన్న మామను హత్య చేశాడని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం సాయంత్రం బేస్తవారిపేటలోని గాంధీబజార్ సమీపంలో ఈనెల 22వ తేదీన జరిగిన హత్య కేసుపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కొమరోలు మండలం పొట్టిరెడ్డిపల్లెకు చెందిన పొద్దుటూరి పీరావలికి బేస్తవారిపేటకు చెందిన దూదేకుల రాజాహుస్సేన్ కుమార్తె కరిష్మాతో జనవరి 24న వివాహమైంది. అయితే పీరావలి భార్యను సక్రమంగా పట్టించుకోకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. విషయం కరిష్మా తల్లిదండ్రులకు, బాబాయ్ కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ విషయంపై పీరావలిని చిన్నమామ ఖాజావలి మందలించారు. దీంతో కక్ష పెంచుకున్న పీరావలి ఎలాగైన చిన్నమామను హత్య చేయాలని యూట్యూబ్లో మర్డర్ చేసే వీడియోలు చూశాడు. దూదేకుల ఖాజావలి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో రోకలిబండతో తలపై కొట్టి కత్తితో గొంతులో పొడిచాడు. దీంతో ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సొంతమామ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నిద్రపోతున్న రాజాహుస్సేన్ను చంపేందుకు ఫోర్క్ స్పూన్తో దాడిచేశాడు. మామ, అత్త అప్రమత్తమై దాడిని అడ్డుకుని అల్లుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. హంతకుడు బయటకు పరుగెత్తి పరారయ్యాడు. నిందితున్ని సోమవారం బేస్తవారిపేట ఆర్కే జంక్షన్లో కంభం సీఐ మల్లికార్జున అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తాకట్టు పెట్టిన సొమ్ము ఇవ్వాలని ఎస్టీల ధర్నా
అద్దంకి రూరల్: తాకట్టు పెట్టిన సొమ్ము తిరిగి ఇవ్వనంటున్న వ్యాపారిపై ఎస్టీలు ధర్నాకు దిగారు. ఈ సంఘటన సోమవారం రాత్రి అద్దంకిలో జరిగింది. ఎస్టీలు తెలిపిన వివరాల మేరకు..తాము 7 ఏళ్ల క్రితం కాలనీలోని 20 మంది బంగారు చైన్లు, ఉంగరాలను పట్టణంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి వద్ద 20 సవర్ల వరకు తాకట్టు పెట్టి కొంత నగదు తీసుకున్నారు. పనులు చేసుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లి 5 నెలల క్రితం తిరిగి వచ్చి డబ్బు చెల్లిస్తాం బంగారం ఇవ్వమని వ్యాపారిని అడిగారు. అయితే ఆ వ్యాపారి బంగారం లాకర్లో ఉందని తీసుకువచ్చి ఇస్తానని ఇన్నిరోజులు కాలయాపన చేశాడు. ఇప్పుడు తన వద్ద బంగారం లేదని, మీ ఇష్టం వచ్చిన వారి చెప్పుకోండని దుర్భాషకు దిగాడు. దీంతో చేసేది లేక వారంతా పోలీస్స్టేషన్ను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సోమవారం షాపు వద్ద ధర్నాకు దిగారు. వ్యాపారికి అధికార పార్టీ అండ ఉండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. -
షంషీర్ను పరామర్శించిన నేతలు
మార్కాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ షంషీర్ అలీబేగ్ తండ్రి ఉస్మాన్బేగ్ మృతి చెందడంతో ఆయన మృతదేహానికి సోమవారం పలువురు నేతలు నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నివాళులర్పించి షంషీర్ను ఓదార్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు షంషీర్ను ఒదార్చారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణా, మాజీ ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం, డాక్టర్ చప్పళ్ళి కనకదుర్గ, ఉడుముల కోటిరెడ్డి, గౌతంనాగిరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, ఎన్. చంద్రమౌళి, శ్రీనివాసరావు, చాతరాజుపల్లి శ్రీనివాసులు, సిరాజ్, మురారి వెంకటేశ్వర్లు, ఉత్తమ్, గొలమారి సత్యనారాయణరెడ్డి, బూదాల గురవయ్య, మందటి మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, రంగారెడ్డి, గపూర్, నజీర్, నల్లబోతుల కొండయ్య, రమణారెడ్డి, గుంటక చెన్నారెడ్డి, గౌస్మోహిద్దిన్, ధర్మానాయక్, తదితరులు నివాళులర్పించారు. -
అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
మార్కాపురం టౌన్: అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. అయితే కొంత మంది అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యంగా తీసుకోవడం, అనుమతి లేకుండా వేదిక నుంచి వెళ్లిపోవడం వంటి విషయాలను కలెక్టర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా వేదిక నుంచి ఎలా వెళ్లిపోతారని అసహనం వ్యక్తం చేశారు. అర్జీలను పరిష్కరించకుండా మాయమాటలతో క్లోజ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సమస్యలను లాజికల్గా పరిశీలించి పరిష్కారం చూపేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు తిరస్కరించే విధంగా తహసీల్దార్లు ప్రవర్తించవద్దని హితవు పలికారు. ప్రజా సేవకోసమే ఉన్నామని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని క్షణంగా పరిశీలించి వ్యక్తిగతంగా విచారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న మండలాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, నిర్లక్ష్యం చేసిన తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అన్ని అర్జీలను కేటగిరి వారీగా విభజించి సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ పి.ప్రభాకర్, కనిగిరి ఇన్చార్జి ఆర్డీఓ శివరామిరెడ్డి, గనులశాఖ ఏడీ రవివర్మ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాలాజీ నాయక్, ఉద్యానవనశాఖ అధికారి రమేష్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్డు డైరెక్టర్ జెన్నమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం ప్రజలు తిరస్కరించే విధంగా ప్రవర్తించవద్దని హితవు


