Mahabubnagar
-
కేంద్ర పథకాలు పక్కాగా అమలుచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎంపీ, దిశ చైర్మన్ డీకే అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ నిధులు, రాష్ట్ర వాటా నిధులతో అమలుచేస్తున్న కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలులో లోపాలు ఉంటే సవరించుకొని ఎవరికి చేరాలో వారికి లబ్ధి జరిగినప్పుడు లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై చర్చించారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు రూ.2.40 కోట్లు కేటాయించగా.. రూ.1.89 కోట్లు విడుదలయ్యాయని, ఇందులో రూ.1.35 కోట్లు ఖర్చు చేసి గ్రూప్లు, వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు రెంట్, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా అందచేశామని డీఏఓ వెంకటేష్ తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, పెద్ద రైతులకు కాకుండా.. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యూరియా, ఎరువులు తగ్గించి సహజ వ్యవసాయం ప్రోత్సహించేందుకు నేషనల్ మిషన్ మిషన్ ఫర్ నేషనల్ ఫార్మింగ్ కింద 20 క్లస్టర్లలో 2,500 ఎకరాలు, క్లస్టర్కు 125 ఎకరాల్లో 2,500 మంది రైతులు ఈ సంవత్సరం సహజ వ్యవసాయం ద్వారా వరి, మొక్కజొన్న, కూరగాయలు రైతులు పండిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కమ్యూనిటీ సోక్ పిట్స్ వెంటనే పూర్తిచేయాలన్నారు. భారత్మాల రోడ్డు మహబూబ్నగర్ నగర పరిధిలో అలైన్మెంట్ మార్చడంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, అలైన్మెంట్ రెవెన్యూ, ఎన్హెచ్ అధికారులు సర్వే చేసి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్కు సూచించారు. మున్సిపాలిటీలలో అమృత్ కింద చేపట్టిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించి, వీటి పురోగతిపై స్థానిక ఎంపీగా తనకు సమాచారం అందించాలని, 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన మిగిలిన నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పిస్తాహౌస్ నుంచి పాలకొండకు వెళ్లే దారిలో ఫ్రెష్మీట్ వద్ద డివైడర్ తొలగించారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ● చేవెళ్ల ఎంపీ, దిశ కోచైర్మన్ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గండేడ్, ముహమ్మదాబాద్ మండలాల్లో నీటి సమస్య లేదని, ఆయిల్పాం సాగుపై ఆదర్శ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారికి సూచించారు. గండేడ్ మండలం సల్కర్పేట పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, వెంటనే క్షేత్రస్థాయిలో మైనింగ్ అధికారులు పర్యటించి అరికట్టేలా చూడాలన్నారు. ● కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రారంభించినప్పుడు ప్రోటోకాల్ తప్పక పాటించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, మేయర్ మమత, తదితరులు పాల్గొన్నారు. లైనింగ్ పనులు చేపట్టాలి.. భూ సేకరణ వేగవంతం చేసి లైనింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఖుష్బూగుప్తాతో కలిసి రైల్వే అధికారులతో ఎంపీ సమీక్షించారు. మహబూబ్నగర్– డోన్ రైల్వేమార్గం డబ్లింగ్ పనులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ త్వరగా చేయాలన్నారు. మహబూబ్నగర్ నగరంలోని టీడీగుట్ట వద్ద నూతనంగా మంజూరు చేసిన పనులు త్వరగా మొదలుపెట్టాలన్నారు. రైల్వే ద్వారా చేపట్టిన అండర్ పాస్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సంజయ్ కుమార్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీచుపల్లికి బ్రహ్మోత్సవ శోభ
● నేటి నుంచి ఉత్సవాలు ● హాజరుకానున్న వేలాది మంది భక్తులు ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఐదురోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పంచామృతాభిషేకం, వాస్తు పూజహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం, 30న ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, మే 1న ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, 2న ఉదయం పంచామృతాభిషేకం, చౌకీసేవ, ప్రభోత్సవం, 3న అమృతస్నానం, పంచామృభిషేకం, పల్లకిసేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం 7: 30లకు ఆకుపూజ, అభిషేకం జరుగుతుంది. ప్రతిఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా (నెలరోజుల పాటు) భక్తులు స్వామివారికి దాసంగాలను సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానది ఉంది. భక్తులు నదిలో పుణ్యనాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు అధికంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ప్రతి అమావాస్య నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేస్తారు. అదే విధంగా దేవస్థానం వద్ద దాసంగాలు, వివాహాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, పుట్టు వెంట్రుకలు తీయుట, నామకరణం వంటి కార్యక్రమాలను అధికంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో సీతారామ కల్యాణానికి ఆలయ వ్యవస్థాపక వంశీయులు, ఎంపీ డీకే అరుణ, భరతసింహారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైంది. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆంజనేయస్వామి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు ఆలయ ఈఓ పురందర్కుమార్ తెలిపారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. -
ఆరోగ్య శాఖ విస్తృత కార్యక్రమాలు
పాలమూరు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని మోతీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 119 మందికి ఎక్స్రే, 21 మందికి తెమడ పరీక్షలు చేయగా.. నలుగురికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా జిల్లాలోని పలు పీహెచ్సీల పరిధిలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు. మిడ్జిల్ పీహెచ్సీ పరిధిలో 595 ఇళ్లు సందర్శించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. నీటి నిల్వలలో లార్వాలను గుర్తించి నిర్మూలన చర్యలు చేపట్టారు. 19 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. -
అకాల వర్షంతో అవస్థలు
● స్వల్పంగా తడిసిన మొక్కజొన్న బస్తాలు ● ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు ● ధాన్యం తడవకుండా రైతుల అవస్థలు జడ్చర్ల/వెల్దండ/అమ్రాబాద్/లింగాల: జడ్చర్లలో మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. వర్షం కురువడంతో బాదేపల్లి మార్కెట్లో ఆరుబయట ఉన్న మొక్కజొన్న బస్తాలు స్వల్పంగా తడిశాయి. గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి భారీగా రైతులు మొక్కజొన్నను తీసుకొచ్చారు. అయితే అక్కడ కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పగా.. వర్షం కొద్దిసేపు కురువడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా వస్తే తడిసిపోయే ప్రమాదముండేదని, చిరుజల్లులు కురువడంతో ఎలాంటి నష్టం కలుగలే దని రైతులు తెలిపారు. త్వరితగతిన మొక్కజొన్న ను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ● వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని మొక్కజొన్న బస్తాలు మంగళవారం సాయంత్రం కురుసిన వర్షానికి తడిసిపోయాయి. ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి సింగిల్ విండో అధికారులు మొక్కజొన్న కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మూడురోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం బస్తాలను నిల్వ చేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 6వేల బస్తాలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం బస్తాలు వర్షంలో తడిసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు ట్రాక్టర్లలో మొక్కజొన్న పంటను తీసుకురాగా.. బస్తాలు అందుబాటులో లేకపోవడంతో అకాల వర్షానికి మరో వేయి బస్తాల ధాన్యం తడిసినట్లు తెలిపారు. ● లింగాల మండలంలో మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, లైన్లకు ప్రమాదం పొంచి ఉండడంతో విద్యుత్తు శాఖవారు ముందస్తుగా సరఫరాను నిలిపి వేశారు. దీంతో మండల వ్యాప్తంగా కొన్ని గంటలపాటు సరఫరాకు అంతరాయం కలిగింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడ్డారు. ధాన్యంపై కవర్లను కప్పి ఉంచారు. ● అమ్రాబాద్, పదర మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం గంటపాటు అకాల వర్షం కురిషింది. వర్షం రాకతో అక్కడక్కడ వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. వేసవి దుక్కులు దున్నుకునేందుకు వర్షం సకాలంలో పడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించాలి
అలంపూర్: షాఅలీ పహిల్వాన్ ఉర్సును అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు నిర్వాహణపై మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎస్ఐ రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాముడు, ఆయా శాఖల అధికారులు, దర్గా డెవలప్మెంట్ కమిటీ సభ్యులు హాజరై మాట్లాడారు. మే 9 నుంచి 12వ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 9న రాత్రి గంథోత్సవం, 10న సర్ ముబారక్ దర్గాలో చిన్నకిస్తీ, 11న ధడ్ ముబారక్ దర్గాలో పెద్దకిస్తీ పోటీలు, 12న చివరి రోజు మహిళలకు ప్రత్యేక ఉర్సు ఉంటుందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగు సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ ఆయా శాఖల అధికారులను సూచించారు. మున్సిపాలిటీ అధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు, రవాణ సౌకర్యం, తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవులు, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు, దర్గా నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిలలో హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలు పై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టు ను ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణంపై హైకో ర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయి తే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలో సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలీకాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరోరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరి జం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైల ం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీపంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్చువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మహబూబ్నగర్ క్రైం: చించోళి బైపాస్ రోడ్డులో మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. వీరన్నపేట ఎర్రమన్నుగుట్ట సమీపంలోని చించోళి బైపాస్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం నగరంలోని మోనప్పగుట్టకు చెందిన వేణుగోపాల్తోపాటు నిరంజన్, శషాంక్ ముగ్గురు కలిసి అయిల్ డబ్బాలు తీసుకుని బొలేరోలో వస్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న తాహేర్(40) దుర్మరణం చెందగా కారులో ఉన్న ఇమ్రాన్, రెహాన్కు తీవ్ర గాయాలు కాగా, హైదరాబాద్కు తరలించారు. బొలేరోలో ఉన్న వేణుగోపాల్, నిరంజన్, శషాంక్ను జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● చించోళి బైపాస్ రోడ్డుపై ఎర్రమన్నుగుట్ట సమీపంలో కొంత మేర మలుపు ఉండడంతో ముందు వచ్చే వాహనం దగ్గరకు వెళ్లే వరకు కన్పించదు. దీంతో కారు చాలా వేగంగా ఉండడంతో అదుపు కాకపోవడంతో ఎదురుగా వచ్చిన వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు స్టీరింగ్ ఊడిపోయి బయటపడింది. అయితే వీరన్నపేట సమీపంలో బైపాస్ రోడ్డుపై అధికంగా దాబాలు ఉండటంతో మద్యం మత్తులో తరచూ ప్రమాదాలకు చోటుచేసుకుంటున్న తెలుస్తోంది. -
ఇక ప్రత్యేక పాలనేనా..?
అచ్చంపేట: జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం మరో 9 రోజుల్లో ముగియనుంది. మే 7 నుంచి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహిస్తారా.. సమయం తీసుకుంటారా.. అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగలేదని పాలక వర్గాల సభ్యులు నిరాశలో ఉన్నారు. మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే వార్డుల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చొరువ తీసుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా.. మొత్తం 20 వార్డు స్థానాలకు గాను 2 ఎస్టీ, 3 ఎస్సీ, 5 స్థానాలు బీసీ, 10 జనరల్కు రిజర్వ్ అయ్యాయి. 6 వార్డులు మహిళలకు కేటాయించారు. జడ్చర్ల మున్సిపల్ పీఠాన్ని జనరల్కు రిజర్వు చేశారు. వేధిస్తున్న నిధుల కొరత 2023 జూన్ నుంచి ఆయా మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ప్రతినెలా జనాభా ప్రకారం రూ. 30 నుంచి 60లక్షలు వరకు నిధులు వచ్చేవి. అవి ఇప్పుడు నిలిచిపోవడంతో సమస్యలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు తప్ప జనరల్ ఫండ్ కార్మికుల జీతాలకే సరిపోని కారణంగా ఇతర అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి మున్సిపాలిటీల్లో నెలకొంది. ఎన్నికలపై కానరాని కసరత్తు పాలకవర్గానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగే అవకాశాలున్నాయి. మే 4న జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలో మిగిలిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పాలకవర్గానికి సన్మానం అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశాన్ని మే 4 లేదా 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కుమారుడి వివాహా వేడుకల్లో బిజీగా ఉండటంతో వచ్చే నెల మొదటి వారంలో పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. మారిన రాజకీయ ముఖచిత్రంతో.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పాలన ప్రారంభం కావడంతో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్పై 2024 జూన్12న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీతో కలిపి 15 మంది కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో.. కాంగ్రెస్ కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు జూలై 6న చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. జడ్చర్ల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ డి.లక్ష్మిపై అదే ఏడాది సెప్టెంబరులో అవిశ్వాసం ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్కే చెందిన పుష్పలత చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అచ్చంపేట, జడ్చర్ల ‘పుర’ పాలనకు కౌంట్డౌన్ 9 రోజుల్లో ముగియనున్న పదవీకాలం వచ్చే నెల మొదటి వారంలో చివరి కౌన్సిల్ సమావేశం ఎన్నికలపై సర్వత్రా చర్చ నిరాశలో మున్సిపల్ పాలక వర్గాలు -
2 నుంచి బాలోత్సవ్ వేసవి శిబిరం
స్టేషన్ మహబూబ్నగర్: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సృజనను పెంపొందించుకునేందుకు పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మే 2వ తేదీ నుంచి 22 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ తెలిపారు. జిల్లాకేంద్రంలోని రెయిన్బో హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 రోజులపాటు జరగనున్న శిబిరాలను రెయిన్బో హైస్కూల్లో నిర్వహిస్తామని, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాల, బాలికలకు జానపద నృత్యం, వెస్ట్రన్ డాన్స్, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. పిల్లలు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి సృజనాత్మకత కార్యక్రమాల వైపు మళ్లేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. శిక్షణలో పాల్గొనాలనుకునే వారు సెల్ నం.93983 05993ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం వేసవి శిబిరం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. -
12 రోజులుగా పడిగాపులు
జడ్చర్ల పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి 140 బస్తాల మొక్కజొన్న తీసుకువచ్చాను. కొనుగోలు చేయకపోవడంతో కుప్ప వద్దే 12 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా. పొలం దగ్గర వరిచేను కోసి కుప్ప వేశాను. ఇంటి వద్ద గొర్లను కాసే దిక్కులేదు. ఇక్కడేమో కొనుగోలు చేయడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – నారాయణ, రైతు, మద్దిగట్ల కలెక్టరే న్యాయం చేయాలి.. మొక్కజొన్న అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. 25 రోజులుగా ఆరబెట్టడం, కుప్పగట్టడం, తూర్పార బట్టడమే సరిపోయింది. ప్రతిరోజు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై కాలుకు తీవ్ర గాయమైంది. అయినా కొనుగోలు చేయడం లేదు. వర్షం వచ్చే పరిస్థితి ఉన్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ మాకు న్యాయం చేయాలి. – హిర్మన్, రైతు, మొరంబాయితండా గోస పడుతున్నాం.. అనేక కష్టనష్టాలకు గురై పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకుపోయేందుకు పడుతున్న గోస అంతా ఇంతా కాదు. తిండి.. తిప్పలు మాని నెలరోజులుగా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా.. పట్టించుకునే దిక్కులేదు. రేపు.. మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంత అన్యాయం ఎప్పుడూ చూడలే. అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. – టోక్య, రైతు, గోప్లాపూర్ ● -
‘సింగిల్ విండో’ల్లో సిబ్బంది అక్రమాలు
● రికవరీ పేరుతో డబ్బులు స్వాహా ● రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి.. గండేడ్: కంచె చేను మేసిందనే చందంగా రికవరీ పేరుతో డీసీసీబీ, పీఏసీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రికవరీ చేసిన డబ్బును రెతుల ఖాతాల్లో జమచేయకుండా స్వాహా చేశారు. పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా బాధిత రైతుల డబ్బులు సర్డుబాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి గండేడ్ (గండేడ్, మహమ్మదాబాద్ మండలాలు) మండలంలో పీఏసీఎస్తో పాటు డీసీసీ బ్యాంకుల పరిధిలో 24 పంచాయతీలతో పాటు 33 అనుబంధ గ్రామాలు ఉండగా.. రైతులకు పంట, దీర్ఘకాలిక, పీటీ ట్రేడర్స్ రుణాలు ఇచ్చారు. అక్రమాలకు నెలవు.. ఆయా గ్రామాల్లో రుణాల రికవరీకి గాను బ్యాంకు సిబ్బందితో పాటు పీఏసీఎస్ సిబ్బంది కూడా వెళ్లేవారు. ప్రతి మార్చి నెలలో రుణాలు రికవరీ చేసి లక్ష్యం పూర్తి చేయాలనే ప్రభుత్వం సూచిస్తుండడంతో సిబ్బంది నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి రుణా లు కట్టాలంటూ ఒత్తిడి చేసేవారు. అలా వసూలు చేసిన డబ్బును బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయకుండా సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గండేడ్ మండలంలోని కొంరెడ్డిపల్లి, గోవింద్పల్లి పగిడ్యాల్, బల్సుర్గొండ, రెడ్డిపల్లి, మహమ్మదా బాద్ తదితర గ్రామాల్లో బాధిత రైతులు ఉన్నారు. రశీదుల్లో మాయాజాలం... రైతుల నుంచి రుణాలు రికవరీ చేసినప్పుడు పీఏసీఎస్ ముద్ర, సీఈఓల సంతకాలు లేకుండా చేతితో రాసిన రశీదులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది వాటిని దారి మళ్లించి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంతో అప్పు అలాగే ఉండిపోయింది. గతంలో మహమ్మదాబాద్ డీసీసీబీ మేనేజర్గా పనిచేసిన వ్యక్తి బదిలీపై పక్క మండలానికి వెళ్లాడు. ఇటీవల ఈ అక్రమాలు వెలుగు చూడడంతో సదరు మేనేజర్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. దాదాపు ఈ తతంగం జరిగి పది రోజులు గడుస్తున్నా.. విషయం బయటపడకుండా గోప్యంగా ఉంచారు. ఆయన సస్పెండ్ కావడంతో దాని నుంచి బయట పడేందుకు వాడుకున్న డబ్బులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. పగిడ్యాల్లో ఓ రైతు, జక్లపల్లిలో ఓ రైతు, కొంరెడ్డిపల్లిలో కొంతమంది రైతులు కట్టిన డబ్బులు స్వాహా చేశారు. వ్యవహరం బయటపడడంతో అధికారులు వాటిని కట్టినట్లు తెలియవచ్చింది. మిగతా వాటిని కూడ సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే డీసీసీబీ, పీఏసీఎస్ సిబ్బంది బాగోతం మరింత బయటపడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
‘రైతులపై ప్రభుత్వ కపట ప్రేమ’
● ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతల నిరసన ● పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణశెట్టి అన్నారు. మంగళవారం స్థానిక గాంధీచౌక్లో జూరాల గ్రామానికి చెందిన రైతులు బీఆర్ఎస్ నాయకుడు శివ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. లారీలు రావడం లేదని, బ్యాగులు లేవని ధాన్యం కాంటా చేయకుండా చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి తగ్గిందని, వచ్చిన కాస్త పంటను కాపాడుకుని తీసుకొస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమని బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ జేకే మోహన్, ఎస్ఐ జయన్న ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతల మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గంట పాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు కిష్టన్న, గోవిందు, రవి, మాసన్న తదితరులు ఉన్నారు. -
కందనూలులో భారీ వర్షం
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ప్రధాన రోడ్డుపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చెట్లు నేలకొరిగిగాయి. విద్యుత్ పూర్తిగా గంటపాటు నిలిచిపోయింది. నెల్లికొండ మార్కెట్ యార్డులో కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు తడిసిపోయాయి. వారంరోజుల నుంచి రైతులు మార్కెట్కి అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం ఒక్కసారి వర్షం రావడంతో తడవకుండా ఉండడానికి ప్రయత్నం చేసినా భారీ వర్షానికి చేసేదిలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. ఆకాల వర్షం రైతన్నలను నిండా ముంచిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వేగవంతంగా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు. -
ఖాజీపూర్లో వ్యక్తి హత్య
● బండరాయితో మోది దారుణంగా.. ● ఆనవాళ్లు లేకుండా నీటితో శుభ్రం కొత్తపల్లి(మద్దూరు): బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మద్దూరు మండల పరిధిలోని ఖాజీపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఎండీ అహ్మద్(37) వృత్తిరీత్యా మద్దూరు పట్టణంలో మెకానిక్ పని చేస్తున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలోని పొలంలో ఫౌల్ట్రీఫాం నిర్మాణ చేపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫాంలో పడుకొని ఉండగా గుర్తు తెలియని దుండగులు దాడిచేసి బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం దాడి జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లు కనిపించకుండా బోరు మోటార్ నీటితో శుభ్రం చేసి అహ్మద్ శవంపై ఉన్న రక్తపు మరకలు లేకుండా చేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లున్న రైతులు నీరు వృథాగా పోతుందని దగ్గరకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ బాల్రాజ్ ఘటనా స్థలికి చేరుకొని డాగ్ స్క్వాడ్, బయోమెట్రిక్ ఆనవాళ్లు తీసుకున్నారు. మృతుడి భార్య సాహిబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు మద్దూరు ఇన్చార్జి ఎస్ఐ రేవతి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. మార్లబీడులో వ్యక్తి మృతి ధరూరు: మండల పరిధిలోని మార్లబీడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన నర్సింహులు (37) గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కాళ్లకు రక్తగాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నందికర్ డాగ్స్క్వాడ్తో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
వ్యసనాలకు బానిసై చోరీలు
జడ్చర్ల: ఆన్లైన్లో బెట్టింగ్లు తదితర వ్యసనాలకు బానిసులగా మారిన ఇద్దరు యువకులు చోరీలకు అలవాటు పడి జైలుపాలయ్యారు. ఇందుకు సంబంధించి సోమవారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెళ్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన యువకుడు అబ్దుల్మతిన్ ఐఐటీ సంగారెడ్డిలో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తించేవాడు. అలాగే ఏపీలోని నంద్యాల జిల్లా ఎరగుడూరుకు చెందిన దేవరశెట్టి శివకృష్ణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరు ఆన్లైన్ తదితర వ్యసనాలకు బానిసలుగా మారి డబ్బు కోసం ఇద్దరు చేతులు కలిపి చోరీలకు పాల్పడ్డారు. వీరు పగటి వేళల్లో పట్టణాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రెక్కి నిర్వహిస్తారు. చీకటి పడగానే ఆయా ఇళ్లలోకి వెళ్లి చోరీలకు పాల్పడుతారు. ఈ కోవలోనే ఈనెల 11న జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి వెనుకవైపు తాళం వేసి ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు లాకెట్, కమ్మలు, చైన్ చోరీ చేశారు. అదేవిధంగా ఈనెల 21న హౌజింగ్బోర్డు కాలనీలో తాళం వేసిన ఇంటిలోకి వెళ్లి బంగారు కమ్మలు, చైన్ నగదును అపహరించారు. మహబూబ్నగర్ బైపాస్ సమీపంలోని ఇంటిలో 15తులాల వెండి గొలుసులు అపహరించారు. ఆయా దొంగతనాలకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం జడ్చర్ల కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వాహణాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకొన్నారు. వారినుంచి 5తులాల బంగారు నగలతోపాటు 15 తులాల వెండి గొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. సమావేశంలో జడ్చర్ల సీఐ కమలాకర్, సీసీఎస్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిప్పంటుకొని మొక్కజొన్న పంట దగ్ధం
మిడ్జిల్: మండల కేంద్రం సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంటకు నిప్పు తగులడంతో దాదాపు 6ఎకరాలలో సాగు చేసిన పంట కాలీ బూడిదైందని కౌలు రైతులు రాములు, రవి తెలిపారు. వారు మిడ్జిల్ సమీపంలో దాదాపు 8ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు సకాలంలో జరుగకపోవడంతో మరోవారం రోజుల తర్వాత పంటను కోద్దామనుకునేలోగా సోమవారం సాయంత్రం పంటకు నిప్పంటుకుంది. మంటలు వ్యాప్తించడంతో చుట్టుపక్కలవారు గమి నించి సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే 80 శాతం పంట కాలిపోవడంతో మంటలను అదుపు చేయగా.. రెండు ఎకరాల్లో మాత్రమే మి గిలిందని దాదాపు రూ.4నుంచి 5లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఉప్పొంగిన శివభక్తి
నవాబుపేట: ఓం నమఃశివాయ.. ఓం వీరభద్రాయ అంటూ నిప్పు కణికలపై నడిచి భక్తి పారవశ్యంతో పొంగిపొర్లారు భక్తులు. మండల పరిధిలోని లోకిరేవు వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవాలయంలో అగ్నిగుండంలో భక్తులు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. నాడు దక్షయజ్ఞం వీరభద్రుడు భగ్నం సందర్భంగా అగ్నిలో దూకి వీరంగం సృష్టించిన నేపథ్యంలో స్వామి దేవాలయాల్లో అగ్ని గుండాలు నిర్వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి శివ భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గ్రామంలో పురవీధుల గుండా ఏర్పాటు చేసిన రథోత్సవం అందరిని ఆకట్టుకుంది. అనంతరం గురుస్వాములకు సత్కారం చేసి రథయాత్రలో ఊరేగించారు. కార్యక్రమంలో పూజారి లింగయ్య, వీరభద్రయ్యస్వామి, అర్చక సంఘం రాష్ట్ర నాయకుడు వీరన్న, యాదయ్య, మాజీ సర్పంచ్లు వెంకటేష్, సత్యం, కృష్ణయ్య, నర్సింహచారి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అగ్నిగుండంలో నడిచిన భక్తులు -
తెలంగాణకు రెండో విజయం
తెలంగాణ జట్టు ఆడిన రెండో మ్యాచ్లోనూ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో చండీఘడ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన చండీఘడ్ మొదట బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. జట్టులో ఆహన్ 47 పరుగులు, సూరజ్ 42 పరుగులు చేశారు. సాయి తనిష్క్ 2 వికెట్లు తీశారు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలంగాణ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. షాన్ విన్సెంట్ 41 బంతుల్లో 76 పరుగులు చేయగా హర్షిత్ 33 పరుగులు చేసి విజయంలో కీలకం అయ్యారు. బౌలింగ్లో అర్వదీప్ 2 వికెట్లు తీశాడు. ● ఉత్తరప్రదేశ్– డీఎన్హెచ్డీడీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. జట్టులో ఆయుష్మాన్ 43 బంతుల్లో 98 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి.. త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీఎన్హెచ్డీడీ జట్టు 76పరుగులకే ఆలౌట్ అయి 134 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ● ఢిల్లీ– ఎన్వీఎస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగా జట్టులో రాహుల్ 21 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్వీఎస్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. హర్షిల్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ● హర్యానా– మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. 109 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ చేపట్టిన మహారాష్ట్ర 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్యానా జట్టులో నకుల్, ప్రియాంషు చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు. -
లీగ్ మ్యాచుల్లో హోరాహోరీ
జడ్చర్ల టౌన్: జడ్చర్ల, మహబూబ్నగర్ మైదానాల్లో జరుగుతున్న ఎస్జీఎఫ్ 69వ జాతీయ అండర్ 17 బాలుర క్రికెట్ చాంపియన్షిప్ టోర్నీలో రెండో రోజు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. మొత్తం 5 మైదానాల్లో జరిగిన మ్యాచుల్లో ఆయా రాష్ట్రాల జట్లు ప్రతిభ కనబర్చి విజయాలు నమోదు చేశాయి. జడ్చర్ల మినీ స్టేడియంలో.. జడ్చర్ల మినీ స్టేడియంలో పంజాబ్– గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చిన పంజాబ్ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ జట్టులో అరవింద్ 3 వికెట్లు తీయగా, గుజరాత్ జట్టులో పృథ్వీ పటేల్ 28 పరుగులు చేసి టాపర్గా నిలిచాడు. 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కేవలం 4 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. జట్టులో రన్వీర్ 14 బంతుల్లో 45 పరుగులు చేశాడు. జమ్మూకశ్మీర్ విజయం మినీ స్టేడియంలోనే జమ్మూకశ్మీర్– సీబీఎస్ఈ డబ్ల్యూఎస్ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో జమ్మూకశ్మీర్ విజయం సాధించింది. టాస్ గెలిచిన సీబీఎస్ఈ డబ్ల్యూఎస్ఓ జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన జమ్మూకశ్మీర్ 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. మూసేబ్ 20 బంతుల్లో 58 పరుగులు, హర్ష్ 26 బంతుల్లో 44 పరుగులు చేయటంతో అధిక స్కోరు చేయగలిగారు. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీబీఎస్ఈ డబ్ల్యూఎస్ఓ జట్టు లక్ష్య చేధనలో డీలా పడింది. 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్లో పైస్, సుబబ్, ప్రదీప్లు చెరో రెండు వికెట్లు తీశారు. టోర్నీలోనే అఽత్యధిక స్కోరు జమ్మూకశ్మీర్ జట్టు నమోదు చేయటం గమనార్హం. 49 పరుగుల తేడాతో బిహార్ విజయం స్వామినారాయణ గురుకుల మైదానంలో పాండిచ్చేరి– బిహార్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో బిహార్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బిహార్ నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. బౌలింగ్లో పృథ్వీరాజ్ 2 వికెట్లు తీయగా రిషివర్మ, దివాకర్, టోనిలు ఒక్కో వికెట్ తీశారు. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేయగలిగింది. బిహార్ బౌలర్ ఓంకార్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో.. మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానంలో జార్ఖండ్– చత్తీస్ఘడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన జార్ఖండ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన చత్తీస్ఘడ్ 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆకాష్ 45 పరుగులు చేయగా హర్షిత్ 3 వికెట్లు తీశాడు. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం సాదించింది. మహబూబ్నగర్ బీఎస్ఆర్ మైదానంలో ఢిల్లీ– సీబీఎస్ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. సీబీఎస్ఈ జట్టు టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ ఇచ్చింది. ఢిల్లీ జట్లు 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో ఆరుష్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీబీఎస్ఈ జట్టు 7 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో కుశాల్ 41 పరులుగు చేశాడు. దీంతో 65 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఐపీఎస్సీఈ విజయం స్వామినారాయణ్ గురుకుల మైదానంలోనే కర్ణాటక– ఐపీఎస్సీఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఐపీఎస్సీఈ జట్టు విజయం పొందింది. టాస్ గెలిచిన కర్ణాటక జట్టు 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జట్టులో శ్రీజేష్ 24 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐపీఎస్సీఈ జట్టు చివరి బంతి మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో ధృవ్సోకిన్ 19 బంతుల్లో 42 పరుగులు, శ్లోక్వర 25 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయానికి కారణమయ్యారు. బీఎస్ఆర్ మైదానంలో.. కొనసాగుతున్న ఎస్జీఎఫ్ జాతీయ క్రికెట్ టోర్నీ -
ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
మహమ్మదాబాద్: విద్యుత్ ట్రాన్స్పార్మర్ను పట్టుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మదాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి(40) అన్నారెడ్డిపల్లి రోడ్డు సమీపంలో గేటుకు 100మీటర్ల దూరంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లాడు. అక్కడే తాను వేసుకున్న చెప్పులను వదిలి నేరుగా ట్రాన్స్పార్మర్ను పట్టుకున్నాడు. వెంటనే ఫీజులు ఎగిరి పెద్దగా శబ్ధం వచ్చి అక్కడే పడిపోయాడు. దీంతో నిప్పులు వచ్చి మంటలు చెలరేగి అక్కడే మృతిచెందాడు. అక్కడే పొలాల్లో పనిచేస్తున్న మహిళలు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది మంటల్లో చిక్కుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి స్థానికుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు గుర్తుతెలియని వ్యక్తి కావునా గులాబిరంగు చొక్కా జీన్స్ ప్యాంటు ధరించినట్టు గుర్తులు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు మహమ్మదాబాద్ పోలీసులను సందర్శించాలని ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేయకపోవడంతో వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని కోరారు. వ్యక్తి బలవన్మరణం నవాబుపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కామారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడిగే చంద్రయ్య(61) కుటుంబ పోషణ భారంగా మారండంతో తరుచూ ఇంట్లో గొడవ పడేవాడు. ఈనెల 26న ఆదివారం తన భార్యతో తగాదా పెట్టుకున్నాడు. అనంతరం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రించగా.. చంద్రయ్య ఒక్కడే ఇంటిపై ఉన్న మరో గదిలో నిద్రించాడు. రాత్రి సమయంతో ఆయన నిద్రించిన గదిలో నుంచి శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు లేచిచూసే సరికి ఇంటి పైకప్పునకు పంచెతో ఉరేసుకొని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తలిరించారు. చికిత్స ిపొందుతూ సోమవారం మృతిచెందాడు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. రెండు బైకులు ఢీ..రైతు మృతి ● కుమార్తెకు తీవ్ర గాయాలు దామరగిద్ద: పొలం దగ్గరకు తన కుమార్తెతో కలిసి బైకుపై వెళ్లిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. మద్దూర్ మండలానికి చెందిన రైతు తిరులమలప్ప (56) అయ్యవారిపల్లి శివారులోని తన పొలానికి బైకుపై కుమార్తె జ్యోతి కలిసి వెళ్తుండగా మార్గమధ్యలో అయ్యవారిపల్లి మలుపు సమీపంలో వెనుక నుంచి అతివేగంగా బైకుపై వస్తున్న మోమినాపూర్కు చెందిన వెంకటేష్ ఢీకొట్టాడు. ప్రమాదంలో తిరుమలప్ప, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు మద్దూర్ ఆస్పత్రికి తరలించారు. తిరుమలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. జ్యోతికి చికిత్స పొందుతుంది. మృతుడి భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి కృష్ణా: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని టైరోడ్డులో ఆదివారం జరిగింది. ఎస్ఐ నవీద్ వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి టై రోడ్డుపై వడదెబ్బ కారణంగా సొమ్మసిల్లి కిందపడ్డాడు. అటువైపుగుండా వెళ్తున్న పోలీసులు గమనించి చికిత్స నిమిత్తం రాయచూర్లోన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు. బావిలో పడి వ్యక్తి మృతి గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శ్రీను (45) మున్సిపల్ కార్యాలయంలోని బావి వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణానికి చెందిన పావని(43) జాతీయ రహదారిపై జమ్జమ్ హోటల్ సమీపంలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందింది. ఈ విషయంలో మృతురాలి కుమారుడు జస్వంత్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. -
భోజన ఏర్పాట్లపై అసంతృప్తి
జడ్చర్ల టౌన్: జాతీయ క్రికెట్ చాంపియన్షిప్లో భోజన ఏర్పాట్లపై ఆయా రాష్ట్రాల కోచ్లు, మేనేజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో క్రీడాకారుడికి రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తున్నా సరైన భోజనం అందించడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా సమయపాలన లేదంటూ వాపోతున్నారు. స్వామినారాయణ గురుకులంలో బస ఏర్పాటు చేయగా జడ్చర్లలో రెండు, మహబూబ్నగర్లో మూడు మైదానాల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. భోజనాలు మాత్రం బాదేపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. బస చేసిన ప్రాంతం, మైదానం నుంచి రావడానికి బస్సులు ఏర్పాటు చేసినా సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు. అలాగే భోజనం చేసేందుకు ముందుగా క్రికెట్ మ్యాచ్లు ఉన్న జట్లను పిలవడంతో మిగిలిన జట్లు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ కారణంగా మధ్యాహ్న భోజనం ఏకంగా 3 గంటలకు చేస్తుండటంతో క్రీడాకారులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి అన్ని జట్లకు భోజనం వడ్డించేందుకు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కొందరు క్రీడాకారులు బయటి హోటళ్లలో అల్పాహారాలు, భోజనం చేస్తున్నారు. నార్త్– సౌత్ల మధ్య.. భోజనాలు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఉండటంతో ఉత్తర భారతదేశానికి చెందిన జట్లు రుచిలేక ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని జట్లు సైతం తమ ప్రాంత భోజనం లేదంటూ వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ రాష్ట్రానికి చెందిన కోచ్, మేనేజర్లు వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు క్యాటరింగ్ వారితో చర్చించి రెండు ప్రాంతాలకు సరిపోయేలా భోజనం చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
స్కూల్ తరలించాలనడం సరైందికాదు
దేవరకద్ర: నియోజకవర్గానికి ఎంతో కృషి చేసి తెచ్చిన ఇంటిగ్రేటేడ్ స్కూల్ను తరలించాలనడం సరైంది కాదని, దీని కోసం సంతకాల సేకరణ చేసే ముందు తనను కలిస్తే వివరించేవాడినని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. 25 ఎకరాల భూమి ఎక్కడా లభించకపోవడం వల్లనే అక్కడి వాతవరణం బాగుండడంతో ఎంపిక చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఖండిస్తూ సోమవారం ఎమ్మెల్య క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ కంపెనీ వచ్చిందని దీంతో 26 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీదే ఇథనాల్ కంపెనీ అని దీన్ని ఆనాడే వ్యతిరేకించామన్నారు. కొల్లూరు వద్ద రూ. వంద కోట్లు పెట్టి భూమి కొన్నానని ఆరోపించడంలో నిజం లేదని, అక్కడ భూమి కొన్నట్లు నిరూపిస్తే అక్కడే వదిలేస్తానని సవాల్ చేశారు. తనకు కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. ఎవరిని అక్రమ కేసులు పెట్టి బెదిరించి తీసుకోలేదని బీఆర్ఎస్కు చెందిన వారే స్వచ్ఛందంగా వచ్చి చేరితేనే తీసుకున్నామన్నారు. 2014 నుంచి 2024 వరకు ఎన్ని కేసులు పెట్టారో లెక్కతీద్దామన్నారు. సంతోష్రెడ్డిపై మీరే 9 కేసులు పెట్లారనే విషయం గుర్తించాలన్నారు. మా తమ్ముడిని అనవసరంగా ఇందులోకి లాగవద్దన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 50 వేల మెజార్టీతో గెలుస్తానన్నారు.ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్లు కథలయ్య, ప్రశాంత్, మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి, టీపీసీసీ నాయకులు అరివింద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి మహబూబ్ నగర్ న్యూటౌన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లకు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఆస్పత్రి ఎస్ఆర్(సీనియర్ రెసిడెన్స్) డాక్టర్లకు ఆరునెలల పెండింగ్ ఉపకారవేతనం తక్షణమే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్రెడ్డితో కలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగాఅజ్మీరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్లతో సమానంగా తమ ఆరోగ్యాలు, ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం మూడునెలల వేతనాలు పెండింగ్లో ఉంచడం సబబు కాదని పేర్కొన్నారు. సీనియర్ రెసిడెన్స్ సిబ్బందికి ఆరునెలలుగా స్టైఫండ్ పెండింగ్లో ఉందని, విధులకు వచ్చేందుకు కనీసం రవాణా ఖర్చులకు కూడా అప్పులు చేసే దుస్థితి నెలకొన్నదన్నారు. ఆస్పత్రిలోని ఎన్హెచ్ఎం సిబ్బందికి ఆరునెలల వేతనాలు బకాయి ఉందన్నారు. ప్రభుత్వం పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ వైద్యులు, డాక్టర్ రోహిత్ పాల్గొన్నారు. -
వేరుశనగ @ రూ.6,899
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.5,688 ధర పలికింది. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.6,239, జొన్నలు రూ.2,177, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,256, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,786, పొద్దుతిరుగుడు రూ.5,690, కందులు రూ.6,276 చొప్పున లభించాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,959, హంస గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,719, ఆముదాలు గరిష్టంగా రూ.6,080, కనిష్టంగా రూ.6,050 చొప్పున నమోదయ్యాయి. -
అక్రమ నిర్మాణాలకు షోకాజ్ నోటీసులు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఇంటి, బహుళ అంతస్తు భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ విషయమై ఈ నెల 16న ‘అతిక్రమణలు కోకొల్లలు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పది రోజుల వ్యవధిలోనే 34 మంది ఇంటి యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సరైన వివరాలు అందించాలని, లేనిపక్షంలో రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, వందలాది మంది నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడితే అధికారులు కొందరికి మాత్రమే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలు సకాలంలో పరిష్కరించాలి మహబూబ్నగర్ క్రైం: ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో అధికంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతపైనే ఉంటున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె పోలీస్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం లేకుండా చూడాలన్నారు. జిల్లావాసులు తమ సమస్య లు చెప్పుకోవడానికి ప్రజావాణి ఉత్తమ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సమస్యలు సకాలంలో పరిష్కరించడం వల్ల ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతుందన్నారు. 3,052 మందికి టీబీ పరీక్షలు పాలమూరు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆరోగ్య శాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 28 టీబీ క్యాంపులు నిర్వహించగా.. సోమవారం భూత్పూర్ మండలంలోని తాడిపత్రి, ఎల్కిచర్ల గ్రామాల్లో క్షయ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో 105 మందికి ఎక్స్రే, 12 మందికి తెమడ పరీక్షలు, ఎల్కిచర్లలో 118 మందికి ఎక్స్రే, 8 మందికి తెమడ పరీక్షలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,052 మందికి ఎక్స్రే, 222 మందికి తెమడ పరీక్షలు చేయగా 9 మందికి క్షయ పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో టీబీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా క్షయ నియంత్రణ అధికారి మల్లిఖార్జున్ తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల్లో క్షయ లక్షణాలు ఉన్నవారు తప్పక పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం -
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజావాణి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియతో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమం, భూసర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 102 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అలాగే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 2 వరకు బాలల భద్రత, డ్రగ్స్ నిరోధం, మే 4 నుంచి 9 వరకు వ్యవసాయ శాఖ ద్వారా రైతు వారోత్సవాలు, మే 2న నియోజకవర్గ స్థాయిలో చేపట్టే కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆమె చాంబర్లో ఆవిష్కరించారు. ● కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు ఉదయం 10 గంటలకు హాజరై, జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంరెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ, ఇన్చార్జి డీపీఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు -
మామిడీలా..!
మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు ● టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు ● కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ● ఆందోళనలో మామిడి రైతులు కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29 వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20వేల ధర.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. -
వేసవి క్రీడా శిబిరాల సందడి
మహబూబ్నగర్ క్రీడలు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈ శిబిరాల ఏర్పాటు కోసం జిల్లా యువజన, క్రీడలశాఖ దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు అందజేశారు. జిల్లాలో ఈ ఏడాది 24 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 10, అర్బన్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరం నిర్వాహకులకు (కోచ్లు) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపున రూ.4 వేల గౌరవ వేతనం అందించనున్నారు. ఎక్కడెక్కడంటే.. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎం.మల్లేష్– కబడ్డీ, జి.నరేష్– బ్యాడ్మింటన్ (అల్లీపురం), శ్రీకాంత్– అథ్లెటిక్స్ (మహమ్మదాబాద్), జి.రాఘవేంద్ర– సాఫ్ట్బాల్ (కొత్లాబాద్), ఎం.జంగయ్య– వాలీబాల్ (రాజాపూర్), డి.చరణ్– హ్యాండ్బాల్ (వస్పుల), ఎం.విజయ్– హ్యాండ్బాల్ (నల్లకుంటతండా), కనకప్ప– వాలీబాల్ (కోయిల్సాగర్), ఎస్.లింగం– అథ్లెటిక్స్ (పోతులమడుగు), నరేష్ కాట్రావత్– ఫెన్సింగ్ (దేవునిగుట్టతండా)లో ఏర్పాటు చేయనున్నారు. ● అర్బన్ పరిధిలో జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలో సునీల్కుమార్– అథ్లెటిక్స్, ఎం.రాజగోపాల్– బ్యాడ్మింటన్, ఎండీ ఖలీల్– బాస్కెట్బాల్, డి.నికేష్– ఫుట్బాల్, వి.శంకర్– బాక్సింగ్, ప్రదీప్కుమార్– హ్యాండ్బాల్, ఎం.బాలమణి– యోగా, నాగరాజు– సాఫ్ట్బాల్, పర్వేజ్పాష– వాలీబాల్, అబ్దుల్ రహెమాన్ఖాన్– వాలీబాల్ (క్రిస్టియన్పల్లి), ప్రణయ్కుమార్– హ్యాండ్బాల్ (మహబూబ్నగర్ హైస్కూల్, భగీరథకాలనీ), అబ్దుల్ ఫయూం– అథ్లెటిక్స్ (క్రిస్టియన్కాలనీ), వడెన్న– ఫుట్బాల్ (జడ్చర్ల), ఎం.శంకర్నాయక్– కబడ్డీ (బాలానగర్)లో కొనసాగనున్నాయి. కోచ్లకు దిశానిర్దేశం మెయిన్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సోమవారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై కోచ్లతో డీవైఎస్ఓ సన్నాహక సమావేశం నిర్వహించి కోచ్లకు దిశానిర్దేశం చేశారు. శిబిరాల్లో సమయపాలన పాటించాలని, వేసవి తాపం దృష్ట్యా శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆయా క్రీడల కోచ్లు సునీల్కుమార్, ఎండీ ఖలీల్, రహెమాన్, అంజద్, నికేష్, శంకర్, రాజ్గోపాల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో 24 శిక్షణ శిబిరాలు అర్బన్లో 14, గ్రామీణ ప్రాంతాల్లో 10 చొప్పున ఏర్పాటు మే 1 నుంచి జూన్ 7 వరకు నిర్వహణ -
డీజిల్.. నో స్టాక్
● తీవ్రమైన కొరతతో జిల్లాలో పలుచోట్ల బంకుల మూసివేత ● అక్కడక్కడ తెరిచి ఉన్న వాటి వద్ద వాహనాల బారులు నగరంలోని జిల్లా జైలు పెట్రోల్ బంకు వద్ద ఇలా..పెట్రోల్ బంక్ వద్ద వాహనాల బారులు డీజిల్ కోసం ఆగిన ప్రైవేట్ అంబులెన్స్ మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో ఇంధన కొరత ఒక్కసారి గా తీవ్రమవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగి క్యూలు ఏర్పడగా.. గంటల తరబడి వాహనదారులు బారులుదీరారు. జిల్లావ్యాప్తంగా హెచ్పీ, భార త్, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు చెందిన 112 బంకులు ఉండగా.. సోమవారం ఉదయం నుంచే మూతబడ్డాయి. ఇంధన కొరత మరింత తీవ్రంగా ఉంటుందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరుతున్నారు. సాధారణంగా ఒకటి, రెండు లీటర్లు పోయించుకునే వాహనదారులు ట్యాంకు ఫుల్ చేయించుకుంటుండటంతో బంకుల్లో ఇంధన నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మహబూబ్నగర్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం ఉదయం నుంచి నోస్టాక్ బోర్డులే దర్శనమివ్వడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడకక్కడ తెరిచి ఉన్న బంకుల వద్ద బారులుదీరినా చివరికి దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లాలో కొరత లేదు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో జిల్లాస్థాయి ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్షించారు. జిల్లాలో రెండు వారాల నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ స్టాక్, సరఫరా, నిల్వలపై ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రెండు వారాల్లో కొంత సరఫరా పెరిగిందని, జిల్లాలో డిమాండ్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు వివరించారు. జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి ● చదువు, క్రీడల్లో యువత రాణించాలి : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పిలుపు ● అట్టహాసంగా 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం ● తొలిరోజు శుభారంభం చేసిన తెలంగాణ జట్టు ● ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు జడ్చర్ల టౌన్: యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని క్రికెట్లో రాణించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జడ్చర్ల మినీ స్టేడియంలో నిర్వహించిన 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత మూడేళ్లుగా జాతీయ టోర్నీ నిర్వహించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, అలాంటిది జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించడం గర్వంగా ఉందని, ఇందుకు ముందుకు వచ్చిన విద్యాశాఖను అభినందించారు. టోర్నీ నిర్వహణకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. క్రికెట్, ఇతర ఏ క్రీడ అయినా ఫ్యాషన్గా తీసుకుని ముందుకు సాగాలని, తద్వారా అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఇదే సమయంలో క్రీడలతోపాటు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం విస్మరించరాదన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. ప్రారంభ కార్యక్రమానికి క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కావాల్సి ఉండగా.. ఖేలో ఇండియాలో పాల్గొనడానికి వెళ్లినందున రాలేకపోయారని చెప్పారు. అంతకు ముందు డీఈఓ ప్రవీణ్కుమార్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారద, ఎంఈఓ మంజులాదేవి ప్రసంగించారు. టోర్నీ ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. 77 పరుగుల తేడాతో తమిళనాడు విజయం రెండో మ్యాచ్లో తమిళనాడు ఎన్వీఎస్ జట్లు పోటీ పడగా తమిళనాడు 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. జట్టులో ధీరజ్ 14 బంతుల్లోనే 51 పరుగులు చేయగా ధరినేష్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్వీఎస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 82 పరుగులు చేసింది. జట్టులో ఆర్యన్ 32 బంతుల్లో 28 పరుగుల అత్యధికంగా చేయగా బౌలింగ్లో రిసిమ్ 3 వికెట్లు తీశాడు. ఏపీపై కేరళం బోణి ఆంధ్రప్రదేశ్– కేరళం జట్ట మధ్య జరిగిన మ్యాచ్లో కేరళం జట్టు గెలుపు బోణి కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళం జట్టు 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు సాధించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే రెండు జట్లలోనూ బౌలర్లు రాణించడం విశేషం. ఆంధ్ర జట్టులో అభిమన్యు 4 వికెట్లు తీయగా కేరళం జట్టులోనూ సంకేత్ 4 వికెట్లు తీశాడు. ఉత్తరాఖండ్ గెలుపు ఉత్తరాఖండ్– ఐబీఎస్ఎస్ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో ఉత్తరాఖండ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 10 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. శ్లోక్ 20 బంతుల్లో 40 పరుగులు చేయగా బౌలింగ్లో అరవ్, ఉదయ్విర్ చెరో 3 వికెట్లు తీశారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐబీఎస్ఎస్ఓ జట్టు 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్లో వన్ష్ఉంగ్లే 24 పరుగులు చేయగా బౌలింగ్లో ఆరుష్ 3 వికెట్లు తీశాడు. మధ్యప్రదేశ్ విజయం గుజరాత్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టును విజయం వరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జట్టులో ఆదిత్యగుప్తా 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ జట్టులో ప్రియావరాత్ 2 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి కేవలం 10 ఓవర్లలోనే 130 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జట్టులో ప్రియావరాత్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 30 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్.. మహబూబ్నగర్ బీఎస్ఆర్ గ్రౌండ్లో జరిగిన ఉత్తరప్రదేశ్– ఛత్తీస్గడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. జట్టులో ఓంప్రియ 36 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బౌలింగ్లో విష్ణు 2 వికెట్లు తీశాడు. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చత్తీస్ఘడ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో అన్మోల్ 39 పరుగులు చేయగా బౌలింగ్లో అలోక్జన్ 2 వికెట్లు తీశాడు. తమిళనాడు– ఎన్వీఎస్ జట్ల మధ్య మ్యాచ్ జాతీయ క్రికెట్ టోర్నీలో మొదటిరోజు నలుగురు బ్యాట్స్మెన్లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరంతా అటు బౌలింగ్లోనూ రాణించడం విశేషం. తెలంగాణ– పాండిచ్చేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాండిచ్చేరికి చెందిన జీవిత్ బౌలింగ్లో 2 వికెట్లు పడగొట్టగా బ్యాటింగ్లో 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక ఏపీ– కేరళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేరళంకు చెందిన అభిమన్యు బౌలింగ్లో 4 వికెట్లు తీశాడు. గుజరాత్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లలో అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. గుజరాత్ జట్టులో ఆదిత్యగుప్తా 42 బంతుల్లో 52 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ జట్టులో ప్రియావరాత్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. తమిళనాడు జట్టుకు చెందిన ధీరజ్ 14 బంతుల్లోనే 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కర్ణాటక జట్టులోనూ శ్రీజేష్ 38 బంతుల్లో 65 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఉత్తరప్రదేశ్జట్టులో ఓంప్రియ 36 బంతుల్లోనే 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసింది సైతం ఇతడే. కర్ణాటక– మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కర్ణాటక 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా శ్రీజేష్ 38 బంతుల్లో 65 పరుగులు చేశాడు. బౌలింగ్లో ధృవీ 2 వికెట్లు పడగొట్టాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 106 పరుగులకే కుప్పకూలింది. క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. పాండిచ్చేరి జట్టుతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 18 పరుగుల తేడాతో రాష్ట్ర జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కేతన్ 29 బంతుల్లో 42 పరుగులు చేయగా, సిద్ధార్థ్ 22 పరుగులు చేశా రు. జీవిత్ 2 వికెట్లు పడగొట్టాడు. 123 పరు గుల లక్ష్యంతో దిగిన పాండిచ్చేరి జట్టు 14.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో జీవిత్ 29 బంతుల్లో 50 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. బౌలింగ్లో దేవా, రాంచరణ్ చెరో రెండు వికె ట్లు పడగొట్టారు. దీంతో 18 పరుగుల తేడాతో తెలంగాణ జట్టు విజయం సాధించింది. జడ్చర్ల మినీ స్టేడియం గుజరాత్– పంజాబ్ జమ్మూకశ్మీర్– సీబీఎస్ఈ (డబ్ల్యూఎస్ఓ) యూపీ– డీహెచ్ఎన్డీడీ జడ్చర్ల స్వామినారాయణ గురుకులం మైదానం పాండిచ్చేరి– బిహార్ ఐపీఎస్సీఈ– కర్ణాటక ఎన్వీఎస్– ఢిల్లీ మహబూబ్నగర్ సమర్థ గ్రౌండ్ ఒడిశా– సీఐఎస్సీఈ ఆంధ్రప్రదేశ్– రాజస్థాన్ మహారాష్ట్ర– హర్యానా మహబూబ్నగర్ బీఎస్ఆర్ గ్రౌండ్ తెలంగాణ– సీబీఎస్ఈ మధ్యప్రదేశ్– కేవీఎస్ డీఏ– గోవా మహబూబ్నగర్ ఎండీసీఏ గ్రౌండ్ సీజీ– ఝార్ఖండ్ తమిళనాడు– సీబీఎస్ఈ తెలంగాణ– చండీఘడ్ జాతీయ టోర్నమెంట్ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. మ్యాచ్లు ఆడుతున్న మైదానాల్లో మైక్ లేకపోవడం పట్ల క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కామెంటరీ సైతం లేకపోవడంతో మ్యాచ్లో ఎన్ని పరుగులు, ఎన్ని ఓవర్లు, ఎవరు గెలిచారు అన్న వివరాలు తెలుసుకునేందుకు ఇబ్బందిగా మారింది. మ్యాచ్లు ముందుగా 20 ఓవర్లుగా ప్రకటించినప్పటికీ 15 ఓవర్లకు కుదించారు. ఇక భోజనాలు సైతం అంతగా బాగోలేవని క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
● ఇద్దరికి తీవ్రగాయాలు ● తప్పిన పెను ప్రమాదం ఎర్రవల్లి: జాతీయ రహదారి పై లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి రాథోడ్ కథనం మేరకు.. సీఎంఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు శనివారం రాత్రి పీలేరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున మునుగాల శివారులో వెళ్తుండగా బస్సు డ్రైవర్ సుబ్రమణ్యం అతివేగంగా నడుపుతూ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టెక్ చేయబోయి బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో బస్సు క్యాబిన్తో పాటుగా కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు అంజలి, శిరీషకు తీవ్రగాయాలు కాగా మిగిలిన ప్రయాణికులు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలు అంజలి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. హైవేపై అదుపుతప్పి కారు బోల్తా ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబ తమ కారులో తిరుపతికి వెళ్తుంది. ఈ క్రమంలో పదవ బెటాలియన్ సమీపంలో జాతీయ రహదారి–44పై కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుభద్రకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్ తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేత అయిజ: తుంగభద్ర నది నుంచి ఆదివారం తెల్లవారుజామున టిప్పర్తో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మేడికొండ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. టిప్పర్ యజమాని సంగాల రాజశేఖర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేశ్ పేర్కొన్నారు. -
పోషకాల గని కొర్రలు
మదనాపురం: ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మన పూర్వీకులు తిన్న చిరుధాన్యాల (ముతక ధాన్యాలు) ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిత తెలిపారు. ముఖ్యంగా కొర్రలు వాడటం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆమె వివరించారు. అద్భుతమైన పోషక విలువలు కొర్రల్లో కేవలం పిండి పదార్థాలే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నా యి. ప్రతి 100 గ్రాములకు సుమారుగా 357.44 కిలో కేలరీలు శక్తి, మాంసకృత్తులు (ప్రోటీన్లు) 14.00% పీచు పదార్థం 10.53% కాల్షియం 737.50 మి.గ్రా. ఇనుము 99.30 మి.గ్రా. జింక్ 53.60 మి.గ్రా. ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు మధుమేహ నియంత్రణ వ్యాధిగ్రస్తులకు కొర్రలు ఒక వర ప్రసాదం. దీని గ్లైసిమిక్ సూచిక తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. వరి బియ్యానికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. మెరుగైన గుండె ఆరోగ్యం కొర్రలు రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. రక్తంలోని చక్కెరలను, కొవ్వును నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు చురుకుదనం వీటిలో ఉండే అధిక ఇనుము మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ బీ కాంప్లెక్స్ నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు సౌందర్యం కొర్రల్లో ఉండే కొల్లాజెన్ ప్రోటీన్ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతూ యవ్వనంగా ఉంచుతుంది. ఇందులోని అధిక ప్రోటీన్ కంటెంట్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. జీర్ణక్రియకు మేలు అధిక పీచు ఉండటం వల్ల మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఇందులోని ఫినోలిక్ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. శరీర దారుఢ్యానికి, కండరాల బలహీనతను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ దైనందిన ఆహారంలో కొర్రలను భాగం చేసుకోవాలి. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. గుండె వ్యాధులకు చెక్ పాడి–పంట -
రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం
ఉప్పునుంతల: మండలంలోని శ్రైలం–హైదరాబాద్ ప్రధాన రోడ్డులో అయ్యవారిపల్లి స్టేజీ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్కు చెందిన జటగోని రాజేష్(15) ఏళ్ల బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకే తిర్మలాపూర్ చెందిన మృతుడు రాజేష్తోపాటు అదే గ్రామానికి చెందిన మరో బాలుడు జటగోని శివాజీ ఇద్దరు కలిసి బైక్పై డిండివైపు వెళ్తున్నారు. వీరి ముందు మరో బైక్పై నల్గొండ జిల్లా డిండి మండలం తవకలాపూర్ సమీపంలోని తండాకు చెందిన ధర్మనాయక్ వెళ్తూ అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ స్లో చేశాడు. అది గమనించకుండా వేగంగా వెనకనుంచి బైక్పై వస్తున్న బాలుడు ముందు వెళ్తున్న బైక్ను ఢీకొని పక్కనే ఉన్న హోటల్కు సంబంధించిన బోర్డుకు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి జటగోని అంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. పాముకాటుతో మహిళా రైతు మృతి కృష్ణా: పాము కాటుతో మహిళా రైతు మృతి చెందిన ఘటన మండలంలోని గుడెబల్లూర్ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్ల మహాదేవి (56) శనివారం ఉదయం రోజు మాదిరిగానే పొలానికి వెళ్లింది. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు బాధిత మహిళను వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త భీంషప్పతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిది ఇరుపేద రైతు కుటుంబమని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞిప్తి చేశారు. తప్పిన ప్రమాదం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కారు ఇంజిన్లో మంటలు వ్యాప్తించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు, ఫైర్ సిబ్బంది కథనం మేరకు.. మల్దకల్ మండలం మేకలసోంపల్లికి చెందిన హరినాథ్గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి ఎర్రవల్లి నుంచి గద్వాల వైపునకు కారులో వస్తున్నారు. అయితే పూటాన్పల్లి స్టేజీ సమీపంలో కారు ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన యజమాని కారును సైడ్కు తీసుకెళ్లి నిలిపివేశాడు. మంటలు వ్యాప్తి చెందడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీంతో ఊపిరీ పీల్చుకున్నారు. ట్రాక్టర్, బైక్ ఢీకొని యువకుడి మృతి ఊట్కూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ట్రాక్టర్, బైక్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుమ్మరి బాలప్ప (27) సొంత పనులపై బైక్పై మల్లేపల్లికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని కుమ్మరి బస్వరాజ్ పొలం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టడంతో బాలప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమార్తె ఉన్నాది. -
రిక్కితేజ్లో అసాధారణ ప్రతిభ
వంగూరు: చిన్న వయసులోనే చిత్రకారుడు రిక్కి తేజ 100కుపైగా చార్కోల్ చిత్రాలు గీసి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. అతను గీసిన అనేక చిత్రాలు ఎంతోమందిని ఆకర్శిస్తున్నాయని సినీ దర్శకుడు, చిత్రకారుడు నర్సింగరావు అన్నారు. వంగూరు మండలం తుమ్మలపల్లి ప్రాథమిక పాఠ శాలలో 8వ తరగతి చదువుతున్న రిక్కితేజ గీసిన చిత్రాలకు సంబంధించి ఎగ్జిబిషన్ను హైదరాబాద్లోని లమాకాన్ వేదికగా ఆదివారం ప్రదర్శించగా.. రిక్కితేజ్ గీసిన చిత్రాల్లో ముసలి రైతు చిత్రం తనకెంతో నచ్చిందని నర్సింగరావు పేర్కొన్నారు. అలాగే అతను గీసిన చిత్రంలో కళ్లలో జీవం, చర్మంలోని ముడతలు, ముఖంపై చెమట చుక్కలను గీసిన విధానం పట్ల ఆయన రిక్కితేజను ప్రశంసించారు. పౌరాణిక చిత్రాలు, పోట్రేట్లు ఎలాంటి గీతల ఆధారం లేకుండా గీయడం రిక్కితేజ ప్రత్యేకత అన్నారు. ఈ ప్రతిభ వల్ల రిక్కితేజకు వచ్చే ఆదాయంతో తాను చదువుతున్న పాఠశాలలో ప్రతిరోజు అల్పాహారం, స్నాక్స్ అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి చిత్రకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన కోరారు. రిక్కితేజ గీసిన వృద్ధ రైతు, యువతి చిత్రాలు సినీ దర్శకుడు నర్సింగరావు -
సమాజాన్ని సంస్కరించడమే కవి పని
స్టేషన్ మహబూబ్నగర్: సమాజాన్ని సంస్కరించడమే కవి పని అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లోని కాళోజీ హాల్లో ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్గౌడ్ రచించిన ‘నిశ్శబ్దం మాట్లాడితే’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా హాజరై మాట్లాడారు. లక్ష్మణ్గౌడ్ స్థానిక సమస్యలనే కాకుండా అంతర్జాతీయ సమస్యలను సైతం అద్భుతంగా కవిత్వం రాశారన్నారు. ధిక్కారంతో రాసిన కవిత్వం ఇందులో కనిపిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ లక్ష్మణ్గౌడ్ కవిత్వం సమకాలిన సమస్యలను బలంగా ఆవిష్కరించిందన్నారు. నిరంతరం కవిత్వం రాస్తూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. పుస్తక సమీక్షకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ప్రపంచ కవులైన ఇలియట్, జాన్కిట్స్, ప్లాబో నెరుడా వంటి వారు రాసిన కవిత్వం లక్ష్మణ్గౌడ్ కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఆయన కవిత్వంలో శ్రీశ్రీ ధిక్కారం, కాళోజీ ప్రజాస్వరం కనిపిస్తుందన్నారు. ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్గౌడ్ కవిత్వం రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ విద్యావేత్త, అనువాదకులు జలజం సత్యనారాయణకు అంకితం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రారెడ్డి, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, లిటిల్ స్కాలర్స్ పాఠశాల కరస్పాండెంట్ అరుంధతీరాయ్, సంయుక్తరాయ్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బాదేపల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి ● చదువు, క్రీడల్లో యువత రాణించాలి : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పిలుపు ● అట్టహాసంగా 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం ● తొలిరోజు శుభారంభం చేసిన తెలంగాణ జట్టు ● ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు –8లో u– జడ్చర్ల టౌన్ -
ఎదురుచూపులు..
‘చంద్రగఢ్’ మరమ్మతుకు రూ.6.58 కోట్లు మంజూరు ● టెండర్ పూర్తయినా అగ్రిమెంట్లో జాప్యం ● 9 ఏళ్లుగా నిరుపయోగంగా నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల ● చంద్రగఢ్ లిఫ్ట్లో తాజాగా కాలిన ప్యానల్ బోర్డు ● వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా? ●చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటి వరకు అగ్రిమెంట్ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇదీ పరిస్థితి.. జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్లైన్ నిర్మించారు. కాని కాంట్రాక్టర్ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం సంప్హౌజ్ నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్పు, చిన్న సంపుహౌజ్ల నిర్మాణం, కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డుతో పాటు పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. బెక్కర్పల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్నవించడంతో నిధులు మంజూరయ్యాయి. -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెటీరియల్ ఫీజులు సంఖ్యతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు. హాస్టల్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నా పట్టింపు లేదు. – మారుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
ఇదేం శిక్షణ..!
● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు న్యూటౌన్లో నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ రాజేంద్రనగర్లోని నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. గతంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ ఇచ్చిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని, సిలబస్ పూర్తి చేయలేదని, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదని అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పలు కోచింగ్ సెంటర్ల యజమానులు వాటి స్థానంలో కొత్త పేర్లతో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. ఇందుకోసం పెద్దఎత్తున ఫీజులు వసూలు చేయడంతోపాటు హాస్టల్స్ సైతం నిర్వహిస్తున్నారు. వీటికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తిలోనూ చాలా కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడం విశేషం. టెట్, డీఎస్సీ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులు పెట్టుకుని శిక్షణ ఇస్తుండగా.. మరికొంత మంది ఉదయం, సాయంత్రం వేళల్లో కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేసేందుకు వీల్లేదు. -
జనగణనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతిఒక్కరూ జనాభా గణనలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆదివారం ఉదయం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియం కమాన్ వద్ద ‘హ్యాపీ సండే’ నిర్వహించారు. అలాగే యాప్ ద్వారా స్వీయ జనగణనకు సంబంధించిన నమోదును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో జనగణన ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా పారదర్శకత, వేగం పెరిగిందన్నారు. దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని, కచ్చితమైన డేటా ఆధారంగా ప్రభుత్వాలు సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అధికారులు ఇంటికి వస్తే సరైన సమాచారం ఇవ్వాలన్నారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా వెనకబాటుతనం, విద్యాస్థాయి, జీవన ప్రమాణాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. ఇక ‘హ్యాపీ సండే’లో భాగంగా చిన్నారుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, అదనపు కలెక్టర్ హరిప్రియ, నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
1న లక్ష్మీనరసింహాస్వామి కల్యాణోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీనరసింహా (ఓబులేశు) స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిపారవశ్యంతో జరగనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొననున్న దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. మొదటిరోజు ఈ నెల 30న పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. మే 1న ప్రధాన ఆకర్షణగా స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో దేవతా మూర్తులను అలంకరించి, సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రోజు 2న వసంతోత్సవం, అభిషేకోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు ముందుగా టికెట్లు పొందవచ్చని, విరాళాలు కూడా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలు భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని, ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైభవంగా వాసవీమాత జయంతి ఉత్సవాలు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వాసవీమాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వాసవీమాత చిత్రపటానికి కలెక్టర్ ఖుష్బూ గుప్తా పూలమాల సమర్పించారు. త్యాగ నిరతి, ధర్మ నిష్ట, సమాజ హిత భావనకు ప్రతిరూపం, ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సువర్జరాజ్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. నేడు ఎరువుల దుకాణాల బంద్ జడ్చర్ల: జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తెరవకుండా సోమవారం బంద్ పాటిస్తున్నట్లు ఎరువుల దుకాణాల డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంచని పాండయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఎరువుల దుకాణాలను బంద్ చేసి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల ఉత్పత్తిదారులు సరఫరాలపై ఎఫ్ఓఎల్ విధానం రవాణా చార్జీలు అమలు చేయాలన్నారు. అదేవిధంగా లింక్ ప్రొడక్ట్లు లేకుండా ఎరువులను సరఫరా చేయాలని, డీలర్లకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించే విధంగా అటు ప్రభుత్వం.. ఇటు ఉత్పత్తిదారులు చర్యలు చేపట్టాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫారూఖ్, ఉపాధ్యక్షుడు భరత్, కోశాధికారి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
భూత్పూర్: రైతులకు అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, ఇందుకు సంబంధించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్ పట్టణంతోపాటు మండలంలోని కొత్తమొల్గర, పాత మొల్గర, ఎల్కిచర్ల గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. కాబట్టి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించి నష్టపోరాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలకోటి, నాయకులు విజయ్గౌడ్, వెంకట్ నర్సింహారెడ్డి, ఏఓ మురళీధర్, సర్పంచులు ఆనంద్రెడ్డి, రమేష్, వెంకటేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెలకాపరులకు అటవీ భూములు కేటాయించాలి
పెద్దకొత్తపల్లి: జీవాల మేతకోసం గొర్రెల కాపారులకు అటవీ భూములను కేటాయించాలని యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా.అజయ్కుమార్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని చెన్నపురావుపల్లిలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో కురుమ, యాదవుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదన్నారు. బీసీ సర్పంచులు ఉన్న గ్రామాల్లో బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేసి బీసీలనంతా ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా యాదవులను అవమానపర్చి మోసం చేసిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో యాదవులు అత్యధిక శాతం ఉన్నారని వచ్చే ఎన్నికలల్లో సంఘటితంగా ఉండి అన్నిపార్టీల వారికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్యాదవ్, మల్లేష్యాదవ్ పాల్గొన్నారు. -
అక్రమ నిల్వ బియ్యం సీజ్
బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లిలో పట్టుబడిన 101 క్వింటాళ్ల బియ్యంలో 73 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హేమ్లానాయక్ తెలిపారు. బిజినేపల్లి స్టాక్ పాయింట్ నుంచి వచ్చిన నిల్వల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కాగా కొందరు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదని, వాటిని అక్రమ నిల్వ చేశారని అధికారులు చెబుతున్నారు. 73 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాటిని బిజినేపల్లి స్టాక్ పాయింట్కు తరలిస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ దుకాణం–355 ద్వారా పంపిణీ చేయాల్సిన మిగిలిన బియ్యాన్ని అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్యామలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
ఆరోగ్య పరుగు
● మే 3న జడ్చర్లలో పాలమూరు రన్ ● ఆరోగ్యకరమైన జీవనశైలికే అంటున్న నిర్వాహకులు తెలంగాణ రన్నర్స్ సహకారంతో పాలమూరు రన్ పేరుతో 10కే రన్ నిర్వహిస్తున్నాం. మే 3న బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లో తెల్లవారుజామున జుంబా డాన్స్, యోగ, ధ్యానంతో సభ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి గూర్చి ప్రముఖులు అవగాహన కల్పిస్తారు. రన్లో 2.5కె, 5 కే, 10కే ఉంటాయి. డిగ్రీ కళాశాల మైదానంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదులు చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. – గోపాల్, పాలమూరు రన్ నిర్వహకుడు, జడ్చర్ల రన్నర్స్ సభ్యుడు నిత్యం రన్నింగ్ చేయటంతో 64 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ఇప్పటివరకు మారథాన్, 10కే, 5కే రన్లో పాల్గొన్నా. అందరు నాలా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే పాలమూరు రన్ నిర్వహించేందుకు ముందుకొచ్చాం. నాలాంటి ఎంతోమంది తమ అనుభవాలను ఆరోజు పంచుకుంటారు. రన్నింగ్ చేయటంతో కలిగే ప్రయోజనాలు అందరు తెలుసుకోవడానికి పాలమూరు రన్ విజయవంత చేయాలి. – రామకృష్ణ, జడ్చర్ల రన్నర్స్ సభ్యుడు జడ్చర్ల టౌన్: తెలంగాణ రన్నర్స్ సహకారంతో జడ్చర్ల రన్నర్స్ మే 3న జడ్చర్లలో పాలమూరు రన్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాధారణంగా మెట్రో నగరాల్లో మారథాన్, ఆఫ్మారథాన్, 10కే, 5కే రన్ పేరిట జాతీయ, అంతర్జాతీయ స్థాయి రన్లు నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ రన్నర్స్ పేరిట హైదరాబాద్లో 40కిపైగా స్థానిక రన్నర్స్ ఏర్పాటు చేసుకు ని ప్రతివారం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి తరహాలోనే తెలంగాణ రన్నర్స్ పేరిట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకేంద్రాల్లో రన్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జడ్చర్లలో మే 3న పాలమూరురన్ నిర్వహించనున్నారు. రన్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా, నేరుగా జడ్చర్ల మినీ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదులు చేసుకునేందుకు జడ్చర్ల రన్నర్స్ సదుపాయం కల్పించారు. ఇప్పటికే 400మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో 200మంది వరకు నమోదుకు అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు, హైదరాబాద్ నుంచి సైతం రన్నర్స్ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్యులతో సలహాలు, యోగాతో కలిగే ప్రయోజనాలు వివరించనున్నారు. రన్నింగ్లో పాల్గొన్న వారికి టీషర్ట్, అల్పాహారం, రన్నింగ్ మధ్యలో స్నాక్స్ అందించనున్నారు. రన్నింగ్తో గుండె ఆరోగ్యం మెరుగుపడటం, ఊపిరితిత్తులను బలపర్చటం, గుండె జబ్బు ల నివారణను 45శాతం తగ్గిస్తుంది. వేగంగా క్యాలరీలను కరిగించటంతో బరువు తగ్గటం, ఎముకల బలం పెరగటం, ఒత్తిడి తగ్గటం, ఒత్తిడిని తగ్గించి మానసికస్థితిని మెరుగుపర్చటం, రన్నింగ్తో ఆందోళనను తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు 5–10నిమిషాలు పరుగెత్తటంతో గుండె జబ్బుల వల్ల కలిగే మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పై అంశాలపై రన్లో అవగాహన కల్పించనున్నారు. -
డబుల్ బెడ్రూం కోసం మహిళ హత్య?
● కన్న కూతురు, అల్లుడే హత్య చేశారని బంధువుల ఫిర్యాదు జడ్చర్ల: డబుల్ బెడ్రూంలో కూతురు, అల్లుడితో కలిసి ఉంటున్న ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. పట్టణంలోని కావేరమ్మపేటకు చెందిన సాహిదాబేగం(80) తన కూతురు ఫహిమ్ ఉన్నీసాబేగం, అల్లుడు మహ్మద్ ఫాజిల్తో కలిసి నివాసం ఉంటుంది. అయితే కొన్నిరోజుల నుంచి డబుల్ బెడ్రూం ఇంటిని తమకు ఇవ్వాలంటూ భార్యాభర్తలు గొడవ పడి ఆమైపె దాడి చేసి గాయపరిచినట్లు మృతురాలి మేనల్లుడు వాహిద్పాష తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న కూతురు, అల్లుడు కలిసి ఆమైపె దాడి చేసి గాయపరిచారని, మరుసటి రోజు 24న ఆమె మృతి చెందిందని సమాచారం వచ్చిందని ఆయన వివరించారు. దీంతో ఇంటి కోసమే కన్న తల్లిని హత్య చేసిన కూతురు, అలుడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి మేనల్లుడు వాహిద్పాష శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కొత్తకోట రూరల్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలం అమ్మపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ జలేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మోల్గరి హన్మంత్రెడ్డి(65) ఇంటి దగ్గర నీళ్ల మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కొత్తకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు భాస్కర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి జడ్చర్ల: జడ్చర్ల కొత్త బస్టాండ్ ఆవరణలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి(60) మృతి చెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. బస్టాండ్ స్టేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి వనపర్తి రూరల్: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శనివారం పెబ్బేరు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ–2 దివ్యారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెబ్బేరు మండల కేంద్రంలోని కొత్తకోట బైపాస్ దగ్గర కర్నూల్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై జై గురుదత్తా దాబా సమీపంలో ఓ వాహనం శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తిని(42) ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పెబ్బేరు పట్టణ వార్డు ఆఫీసర్ గొల్ల అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి మక్తల్: ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్లో సిమెంట్ తీసుకొస్తుండగా ట్రాలీ అదుపు తప్పి ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచలింగాల్ భగవాన్పల్లి మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి భగవాన్పల్లికి వెంకటేష్ (57), తిమ్మప్ప తీవ్రగాయాల పాలయ్యారు. వెంకటేష్ను మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తిమ్మప్ప కర్నాటక రాయచూర్లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పిడుగుపడి యువకుడు మృతి బల్మూర్: మండలంలోని మైలారం సమీపంలో శనివారం సాయంత్రం ఆకాల వర్షంతో పిడుగుపాటుకు గురై ఓ యువకుడితోపాటు గేదె మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టు సలేశ్వరం(19) శనివారం తన గేదెను మేపడానికి సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్లగా సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావండతో సమీపంలో ఉన్న తాటి చెట్టుకిందికి గేదెతోపాటు వెళ్లి తలదాచుకోగా.. పిడుగు పడి గేదెతోపాటు సలేశ్వరం అక్కడికక్కడే మృతిచెందాడు. వర్షం వెలిసిన తర్వాత గమనించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి వచ్చి పరిశీలించగా మృతిచెంది ఉండటంతో బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతుడి తల్లి చెన్నకిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడి తండ్రి ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందగా తల్లి, సోదరి ఉన్నారు. -
ఉచ్చులో చిక్కుకొని చుక్కల దుప్పి మృతి
లింగాల: మండల రేంజ్ పరిధిలోని దారారం బీట్లోని ఓ వ్యవసాయ పొలం చుట్టూ ఏర్పాటు చేసిన ఉచ్చులో చుక్కల దుప్పి చిక్కుకొని చనిపోయిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఈ వ్యవసాయ పొలం చుట్టూ అటవీ జంతువుల వేటకోసం ఉచ్చును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా చుక్కల దుప్పి మృతిచెందిన విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటన బయట పడకుండా దుప్పిని కాల్చివేసినట్లు తెలిసింది. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలో జరుగుతున్నప్పటికీ వెలుగులోకి రాకుండా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చుక్కల దుప్పి మృతి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వివరణ కోరేందుకు ప్రయత్నించగా అటవీశాఖ వారు అందుబాటులో లేరు. బల్మూర్లో పిచ్చికుక్కల సైర్యవిహారం ● ఒకే రోజు ఎనిమిదికి కాటు బల్మూర్: మండల కేంద్రంతో పాటు కొండనాగులలో శనివారం పిచ్చి కుక్కల సైర్యవిహారం చేశారు. ఒక్కరోజులోనే ఎనిమిది మందిపై దాడి చేశాయి. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ, 1వ వార్డులలో బాలయ్య, రత్నమ్మ, నాగమణి, శివకుమార్, పవన్కుమార్, సాయి, ధర్మతేజతో పాటు కొండనాగుల మణికంఠలపై కుక్కకాటు గురై గాయపడ్డారు. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పటికై నా పంచాయతీ సిబ్బంది స్పందించి కుక్కలను అటవి ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు, బాధితులు కోరుతున్నారు. కోనేరులో ఇద్దరు చిన్నారులపై దాడి... అలంపూర్ రూరల్: గద్వాల జిల్లా కోనేరులో శనివారం ఇద్దరు చిన్నారులపై ఓ వీధి కుక్క దాడి చేసింది. అలంపూర్ మండలంలోని ముక్కాపూర్ గ్రామానికి చెందిన తిమ్ములమ్మ, స్వాముల తన కుమారుడు జీవన్బాబు (6) కుమార్తె మధుకుమారి (4) కలిసి కోనేరు గ్రామానికి వచ్చారు. చిన్నారులపై కుక్క దాడి చేయగా.. జీవన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అంబులెన్స్లో బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అక్కడ చికిత్స చేయిస్తున్నారు. -
పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం
కొల్లాపూర్ రూరల్: పోడు భూములకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పట్టాలిచ్చే వరకు గిరిజనులతో కలిసి పోరాటాలు చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. శనివారం కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో ఆయన పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులతో కలిసి భూములను పరిశీలించారు. అనంతరం అక్కడ ఫారెస్టు అధికారులు పెడుతున్న ఇబ్బందుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న ఎకరం నుంచి 10ఎకరాల వరకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ముక్కిడిగుండంలో 70మంది రైతులు 300 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని అట్టివారికి వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ భూములకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచి సాగునీరు సరఫరా చేయాలని కోరారు. షెడ్యూల్డు ట్రై ప్రకృతి ఆరాధికులకు జనగణనలో ఒక కాలాన్ని పెట్టాలన్నారు. అనంతరం గిరిజన సంఘం కొల్లాపూర్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు బాల్యనాయక్, సర్పంచ్ లాలి, మండలాధ్యక్షుడు శ్రీనునాయక్, తిరుపతినాయక్, గోపాల్నాయక్, బాల్నాయక్, హనుమంతు నాయక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ షూటింగ్బాల్లో ముగ్గురు పాలమూరు క్రీడాకారులు
మహబూబ్నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్లో ఆదివారం నుంచి ఈనెల 28 వరకు జరిగే సౌత్జొన్ జాతీయస్థాయి సబ్ జూనియర్ షూటింగ్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు వరుణ్, మేఘన, సంగీత పాల్గొంటున్నారు. వీరిని శనివారం జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించి శాలువాలతో సత్కరించారు. వారు మాట్లాడుతూ క్రీడాకారులు ఈ ఏడాది జనవరిలో తాండూర్లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్జోన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, మహబూబ్నగర్ షూటింగ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆడమ్స్, పుష్ప, కోశాధికారి రవి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రెడ్డి, డాక్టర్ విజయ్ మోహన్గౌడ్, బస్వరాజ్, వెంకటేశ్, రమేష్, జానకిరాములు పాల్గొన్నారు. -
న్యాయ విచారణలో ఆధారాలే కీలకం
మహబూబ్నర్ ఎడ్యుకేషన్: న్యాయ విచారణలో ఆధారాలే కీలకం అని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. పీయూ లా కళాశాల ఆధ్వర్యంలో క్లూ ఫర్ ఎవిడెన్స్ సంస్థ సహకారంతో ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాయపరమైన విచారణలో భౌతికపరమైన, సాంకేతికపరమైన సాక్ష్యాల ద్వారా త్వరితగతిన కేసు విచారణ చేసేందుకు అవకాశం ఉంటుందని, వీటిపై విద్యార్థులు పూర్తిస్థాయిలో పట్టు సాధించాల్సిన అవసరం ఉందని, అప్పుడే న్యాయవాది వృత్తిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకోసం పుస్తకపఠనం, ప్రాక్టీస్తోపాటు ఇలాంటి వర్క్షాప్లలో విద్యార్థులు పాల్గొని మంచి నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. క్లూ ఫర్ ఎవిడెన్స్ సంస్థ డైరెక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ న్యాయ విచారణలో ఎవిడెన్స్ అనేది అత్యంత కీలకమైన అంశమని, విద్యార్థులకు మాక్ డెమానిస్ట్రేషన్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, లీగల్ అప్లికేషన్ వంటి అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ప్రిన్సిపాల్ మాళవి, వైస్ ప్రిన్సిపాల్ భూమయ్య, వెంకటసాయి ప్రసాద్, రాధాకృష్ణ, అనిల్సింగ్, అశోక్, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు
ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్.. గ్రీన్ జ్యూస్లకు ఆదరణ వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్ టిఫిన్స్, దవాచాయ్, గ్రీన్ జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్ సెంటర్లు వెలిశాయి. 24 మూలికల చూర్ణంతో దవాచాయ్ తయారీ కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపైపెరిగిన శ్రద్ధ నిత్యం వాకింగ్ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు ధాతు ఆయుర్వేదం సహకారంతోసెంటర్ల ఏర్పాటు -
ఎస్జీఎఫ్ క్రికెట్ సంబురం
నేటినుంచి 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ● పాల్గొననున్న 31 రాష్ట్రాల జట్లు ● ఇప్పటికే జడ్చర్ల చేరుకున్న 28 జట్లు ● ఆరు రోజుల పాటు ఐదు మైదానాల్లో మ్యాచ్ల నిర్వహణ వాతావరణం వాతావరణం ఉదయం కాస్త చల్లబడుతుంది. మధ్యాహ్నం వేడిగా ఉండి ఉక్కపోత పెడుతుంది. సాయంత్రం కొంత ఆహ్లాదంగా ఉంటుంది. జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హాజరుకాన్నారు. డీఈఓ పరిశీలన.. మెగా టోర్నీ ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. స్వామి నారాయణ గురుకులానికి చేరుకుని ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో మాట్లాడారు. వారికి కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, వసతిపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న జడ్చర్ల మినీ స్టేడియాన్ని పరిశీలించారు. ఆయన వెంట టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి ఉన్నారు. ఆరోగ్య పరుగు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలో వచ్చే నెల 3న రన్ నిర్వహించనున్నారు. –8లో uతెలంగాణ జట్టు జి.కేతన్కుమార్, పి.రామ్కుమార్ చారి, కె.మాన్విత్, వెంకటాభిరామ్ శ్రీచరణ్, ఎం.సిద్దార్థ, అహ్మద్ ఆజముద్దీన్, సి.సిద్దార్థ, లిఖిత్రెడ్డి బైరెడ్డి, మునగాలశెట్టి శాన్ విన్సెంట్ రాజ్, అకరామ్ హర్షిత్, అజ్మీరా ద్విపద్నాయక్, డి.అభినవ్, కె.సాయితనిక్ష్, మహ్మద్ అనస్, ఎ.దేవశివ్త్ యాదవ్, బి.మణివర్ధన్. నేటి మ్యాచ్లు.. జడ్చర్ల మినీ స్టేడియంలో తెలంగాణ వర్సెస్ పుదుచ్చేరి, తమిళనాడు వర్సెస్ ఎన్వీఎస్, స్వామినారాయణ గురుకుల మైదానంలో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కేరళ, యూపీ వర్సెస్ ఐబీఎస్ఓ, సమర్థ స్కూల్ మైదానంలో మధ్యప్రదేశ్ వర్సెస్ గుజరాత్, కర్ణాటక వర్సెస్ మహారాష్ట్ర, బీఎస్ఆర్ మైదానంలో ఉత్తరప్రదేశ్ వర్సెస్ చత్తీస్ఘడ్ జట్లు తలపడనున్నాయి. -
వేరుశనగ క్వింటా రూ.6,761
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ. 6,761, కనిష్టంగా రూ.5,129 ధర లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,290, కని ష్టంగా రూ. 6,267, జొన్నలు గరిష్టంగా రూ. 5,127, కనిష్టంగా రూ.5,124, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,471, కని ష్టంగా రూ.1,847, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,831, కని ష్టంగా రూ.1,661, హంస రూ.1,601, పొద్దుతిరుగుడు గరి ష్టంగా రూ.5,629, కనిష్టంగా రూ. 5,310, మినుములు గరిష్టంగా రూ. 7,600, కనిష్టంగా రూ.7,560, చింతగింజలు రూ.2,860, కందులు రూ. 6,27 5, రాగులు రూ. 2,777, పెబ్బర్లు రూ.4,700 ధరలు లభించాయి. దేవరకద్రలో ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,909, హంస గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,701గా ధరలు నమోదయ్యాయి. -
జీపీఓలకు రక్షణ కల్పించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లావ్యాప్తంగా ఇసుక విధుల్లో ఉన్న జీపీఓలకు రక్షణ కల్పించాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల తహసీల్దార్ ఆదేశం మేరకు ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయడంలో భాగంగా విధుల్లో ఉన్న రంగాపూర్, కోడ్గల్ గ్రామాలకు చెందిన జీపీఓలపై కొంతమంది ఇసుక మాఫియా దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని పారిపోయారని ఆరోపించారు. దాడి చేసిన దుండగులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జీపీఓలకు రక్షణ కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు చంద్రనాయక్, దేవేందర్, శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాలొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జడ్చర్ల టౌన్: అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ హెచ్చరించారు. శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, నర్సరీల నిర్వహణ, ఉపాధి హామీ లేబర్ సమీకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఉపాధి పనులకు కనీసం వందమంది కూలీలను సమీకరించాలని, నర్సరీ బెడ్స్లో మొక్కలు మొలకెత్తే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు మొదలు పెట్టని వాటిని త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఉద్యోగులు అందరూ సకాలంలో విధులకు హజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ్కుమార్, ఏపీఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దోమకాటుతో అప్రమత్తంగా ఉండాలి పాలమూరు: దేశవ్యాప్తంగా మలేరియాను 2030 వరకు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ అన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కుమ్మరివాడీ అర్బన్ హెల్త్సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అనాథిలిస్ అనే దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుందని, జ్వరం, చలి, చెమటలు పట్టడం, ఒళ్లు నొప్పులు ఉండటం ఈ వ్యాధి లక్షణాలు అన్నారు. మలేరియా రక్త పరీక్షల ద్వారా వ్యాధి పాజిటివ్ అనేది నిర్ధారణ చేయవచ్చని వెల్లడించారు. దోమల సంతతి పెరగకుండా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వేసవిలో బయట నిద్రించే వారు తప్పక దోమ తెరలు వాడాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జ్వర లక్షణాలు కనిపిస్తే స్థానిక పీహెచ్సీల్లో చికిత్స తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి విద్య, మెడికల్ ఆఫీసర్ తస్లీమా ఫర్హాత్, హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నాగరాజుశెట్టి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్లు గుర్తుండేలా కోర్టు భవన నిర్మాణం
జడ్చర్ల టౌన్: వందేళ్లపాటు గుర్తుండేలా జడ్చర్ల కోర్టు భవనాల సముదాయం నిర్మించుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. శనివారం ఆమె జడ్చర్ల జూనియర్ సివిల్కోర్టును సందర్శించి.. కోర్టు కోసం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థలం ప్రస్తుత కోర్టు సముదాయాల ప్రహరీకి ఆనుకుని ఉండటాన్ని న్యాయవాదులు వివరించారు. జాతీయరహదారి–167కి ఆనుకుని స్థలం రావడంతో ప్రధాన ద్వారం అక్కడ నిర్మించాలని కోరారు. అనంతరం కోర్టుకు చేరుకుని భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. అన్ని గదుల్లోనూ వర్షపు నీరు వస్తుందని, దీంతో బార్ అసోసియేషన్ కోసం నిర్మించిన భవనాన్ని అదనపు కోర్టు కోసం కేటాయించి.. తాము చిన్నపాటి గదిలో నిర్వహణ సాగిస్తున్నామని న్యాయవాదులు వివరించారు. ఆ తర్వాత కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదిరెడ్డి, న్యాయవాది మహేశ్వర్రెడ్డి కోర్టులో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ స్థల పరిశీలన కోసం వచ్చానని, అయితే భవనం మంజూరు విషయంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోర్టు భవనాల నిర్మాణాలకు ఒకే రకమైన డిజైన్ ఉంటుందని, జడ్చర్ల కోర్టు అదే తరహాలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్లో మరిన్ని కోర్టులు వచ్చినా ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకుందామన్నారు. కోర్టుకు వచ్చిన న్యాయమూర్తికి న్యాయమూర్తి నీహారిక, అదనపు కోర్టు న్యాయమూర్తి ముదసిర్ స్వాగతం పలికారు. ఆమె పర్యటన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. -
నగరంలో తాగునీటి సమస్య రావొద్దు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి ఆదేశించారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కావడంతో మిషన్ భగీరథ పథకం ద్వారా రెండు రోజులకోసారి సరఫరా అయ్యే తాగునీటిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా, అలాగే వృథా కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పైపులైన్లకు ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే బాగు చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా పవర్ మోటార్ల ద్వారా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా గణనపై అవగాహన నగర ప్రజలకు జనాభా గణనకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్పై అవగాహన కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం వార్డు ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెప్మాకు చెందిన ఆర్పీల సహాయంతో మొబైల్ యాప్లో ఏ విధంగా వివరాలు నమోదు చేయాలో వివరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా నోడల్ ఆఫీసర్ శివరామకృష్ణ, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఎంఈ మురళీమోహన్రెడ్డి, ఏసీపీ జ్యోత్స్నాదేవి, డీఈఈ హేమలత, ఏఈ రాగవినతి, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, టీపీబీఓ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసు ఛేదన.. ఇద్దరు దొంగల అరెస్ట్
మహబూబ్నగర్ క్రైం: పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ గాంధీనాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి చోరీ ఘటన వివరాలు వెల్లడించారు. నగరంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్యామ్సుందర చారి జోషి ఈ నెల 4న కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లి ఈనెల 5న తిరిగి వచ్చారు. తిరిగొచ్చేసరికి దొంగలు ఇంటి తాళంతో పాటు బీరువా తాళం పగలకొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా జడ్చర్ల బస్టాండ్లో ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుంటే అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు కర్ణాటకకు చెందిన కిరణ్ పాటిల్ అలియాస్ బాక్సర్ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుంటాడని అలాగే హైదరాబాద్కు చెందిన మహ్మద్ షేక్ బైకులు దొంగతనం చేసి ఇద్దరు వేరు వేరు కేసుల్లో చర్లపల్లి జైలుకు వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారి చోరీలకు పాల్పడేవారు. మహ్మద్ షేక్ తల్లికి గుండె ఆపరేషన్ ఉందని దీనికి డబ్బులు కావాలని కిరణ్ పాటిల్కు చెప్పగా దొంగతనాలు చేయడానికి అవసరం అయిన కిట్ (టూల్స్), రెండు కత్తులు, తిరగడానికి కాటేదాన్లో ఒక బైక్ దొంగతనం చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బైక్పై మహబూబ్నగర్కు వచ్చి ఈనెల 4న శ్యామ్సుందర్ చారి జోషి ఇంట్లో నాలుగు తులాల బంగారం, డబ్బు, వెండి వస్తువులు అపహరించారు. దొంగతనం చేసిన బంగారాన్ని మరో వ్యక్తి మహ్మద్ సొహెల్ ఖాన్ పేరు మీద ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రూ.2 లక్షలు తీసుకొని ఖర్చులకు వాడుకున్నారు. మరి కొంత బంగారం, వెండి వస్తువులను హైదరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించారు. మళ్లీ దొంగతనం చేయడానికి జడ్చర్ల బస్టాండ్లో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏ1 కిరణ్ పాటిల్, ఏ2 మహ్మద్ షేక్లను అరెస్టు చేయగా ఏ3 మహ్మద్ సొహెల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐలు నాగర్జున్గౌడ్, కృష్ణ ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
నాగర్కర్నూల్ క్రైం: {ç³gê BÆøVýSÅ…Oò³ {ç³™ólÅMýS {Ôèæ§ýl® ¡çÜ$-MýS$…-r$-¯]lr$Ï A^èla…õ³r GÐðl$ÃÌôæÅ Ð]l…Ö-MýS–çÙ~ A¯é²Æý‡$. Ô¶æ${MýS-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° yîlG…òßæ^ŒlK M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ OÐðl§ýlÅ íܺ¾…-¨™ø çÜÐ]l*-ÐólÔèæ… °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$™èl* hÌêÏÌZ° A°² {糿¶æ$™èlÓ Bçܵ{™èl$ÌZÏ AÐ]l-çÜ-Æý‡OÐðl$¯]l LçÙ-«§éË$ A…§ýl$-»ê-r$ÌZ E…^èl$Mø-Ðé-ÌS-¯é²Æý‡$. ïßæsŒæÝ‰ùMŠS, yîlOòßæ-{yólçÙ¯ŒS Ð]l…sìæ çÜÐ]l$-çÜÅÌS °Ðé-Æý‡-׿MýS$ Ð]l¬…§ýlçÜ$¢ HÆ>µr$Ï ^ólĶæ*ÌS° çÜ*_…^éÆý‡$. ️{V>Ò$׿ {´ë…™éÌZÏ OÐðl§ýlÅ õÜÐ]l-ÌS¯]l$ Ð]l$Ç…™èl ºÌZõ³™èl… ^ólíÜ, GÐ]l$-Æð‡j±Þ ç³Ç-íܦ-™èl$ÌZÏ ™èl„ýS׿ çܵ…¨…_ _MìS™èlÞ ^ólĶæ*ÌS° MøÆ>Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ yîlG…òßæ^ŒlK yé.Æý‡-Ñ-MýS$-Ð]l*ÆŠæ, Eç³ OÐðl§éÅ-«¨M>Ç yé ™éÆ>-íÜ…VŠæ, Ððl$yìlMýSÌŒæ BïœçÜÆý‡$Ï, OÐðl§ýl$ÅË$, ´ëÌŸY-¯é²-Æý‡$. -
తడిసిన మొక్కజొన్న ధాన్యం
పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న మొక్కజొన్న ధాన్యం తడిసింది. కుప్పల చుట్టూ వర్షపు నీరు చేరింది. 12 వేల బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఈ బస్తాలను తరలించకపోవడంతో రైతులు ధాన్యం కుప్పల వద్ద లారీల కోసం పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యం బస్తాలను మళ్ళీ ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లింగాల: మండలంలో శుక్రవారం సాయంత్రం గంట పాటు గాలి వాన భీభత్సం సృష్టించింది. పలు గ్రామా లలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. మండలంలోని శాయిన్పేటలో జర్పటి సాయిలుకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పడి పోగా ఇంటిలో ఉన్న దుస్తులు, తిండి గింజలు వర్షానికి తడిసి పోయాయి. విద్యుత్తు స్తంభం విరిగిపడింది. భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలు మార్గాలలో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసి పోయింది. -
రోడ్డు ప్రమాదంలోరైతు దుర్మరణం
ధరూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు.. కేటీదొడ్డి మండలం కొండాపురానికి చెందిన హరిజన గోవిందు(50) శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బైకుపై ధరూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని జాంపల్లి– కోతుతగిద్ద గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా మృతి చెందిన వ్యక్తి గోవిందుగా గుర్తించారు. మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైకు ఢీ.. యువకుడి మృతి మహమ్మదాబాద్: వెనుక నుంచి ఆర్టీసీ బస్సును బైకుతో ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చింతలకుంట తండాకు చెందిన శ్రీనివాస్నాయక్ శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని మొకర్లాబాద్ స్టేజీ వద్ద వెళ్తుండగా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా రోడ్డుపై ఆపడంతో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆస్పత్రిలో అవసరాల కోసం రూ.50 వేలు కోస్గి తీసుకెళ్తున్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారిపై నిలపడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన టీఎస్06యూడీ9432 నంబర్ గల ఆర్టీసీ బస్సు సిబ్బందిని మాత్రం ఎలాంటి విచారణ చేపట్టకుండా వదిలేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధురాలు మృతి ● అడవి పందులు అడ్డురావడంతో ప్రమాదం బిజినేపల్లి/పానగల్: మండలంలోని మహదేవునిపేట సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పానగల్కు చెందిన ధర్మకారి దేశ్బాయి(79) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్కు చెందిన దేశ్బాయి, ఆమె కుమారుడు ఈశ్వర్లాల్, రేణుకబాయి బిజినేపల్లి నుంచి పాన్గల్కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మహాదేవునిపేట గ్రామ సమీపంలో అడవి పందుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాటిని తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో దేశీబాయి మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు 108లో గాయపడిన వారిని నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. శుక్రవారం స్వగ్రామంలో దేశ్బాయి అంత్యక్రియలు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదుపుతప్పినబైక్.. వ్యక్తి మృతి అలంపూర్: అలంపూర్ ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు.. పట్టణంలోని న్యూప్లాట్స్కు చెందిన మహ్మద్ రఫి(34) ఓ బ్యాంక్లో క్లర్క్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 23న రాత్రి కర్నూలు నుంచి అలంపూర్కు బైక్పై వస్తుండగా ఇమాంపురం సమీపంలోని ఐదు మోరీల మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఆసిఫ్జా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కారు బోల్తా మహిళ మృతి కల్వకుర్తి రూరల్: మండలంలోని తురకలపల్లి సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో తుమ్మోజు పార్వతమ్మ (54) మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్ఐ వివరాల ప్రకారం హైదరాబాద్లోని కాటేదాన్ ప్రాంతంలో నివాసం ఉండే పార్వతమ్మ కుమారుడు హరీష్ వివాహ పత్రికలను నాగర్కర్నూల్లో ఉండే బంధువులకు ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తురకలపల్లి గేట్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సునీల్ రెడ్డి తో పాటు హరీష్కు గాయాలు కాగా పార్వతమ్మకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. సునీల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
బీసీల రాజ్యాధికారానికి పెరిగిన మద్దతు
● ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగేసి డీలిమిటేషన్తోపాటు ప్రవేశపెట్టారని, ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందన్నారు. దాన్ని అమలు చేయకుండా కుట్రలు చేయడం తగదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు తీరని నష్టం చేసి దీర్ఘకాలంగా అధికారాన్ని చెలాయించే కుట్రను పార్లమెంటులో ఓడించడం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ● సీనియర్ జర్నలిస్టు యాదగిరి మాట్లాడుతూ.. 2056వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేష్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికంగా సీట్లు పెరిగే అవకాశముందని, దక్షణాది రాష్ట్రాల్లో జనాభాను కంట్రోల్ చేసి, ఉత్తరాది రాష్ట్రాలకు రివార్డులు ఇవ్వడం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ బానిసలుగా ఉంటారా ప్రజల పక్షాన కోట్లాడుతారో తేల్చుకోవాలన్నారు. మహబూబ్నగర్ న్యూటౌన్: కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉందని, బీసీల రాజ్యాధికారానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ‘13వ రాజ్యాంగ సవరణ బిల్లు–పూర్వాపరాలు’ అంశంపై జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్లోనే ఓబీసీ రిజర్వేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. 2023లోనే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన మహిళా బిల్లును తిరిగి డీలిమిటేషన్ బిల్లుతోపాటు పెట్టి తన కుటీల ప్రయత్నాన్ని చాటుకుందని బీజేపీపై మండిపడ్డారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్రలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్కు చిత్తశుద్దితో ఉందని, డీలిమిటేషన్లో పార్లమెంటు సీట్ల పెంపు అనంతరం మళ్లీ 25ఏళ్ల వరకు దీనిపై ఆలోచించే పరిస్థితి ఉండదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు దేశంలో పరిణామాలపై ఆలోచించి అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. రౌండ్టేబుల్ సమావేశంలోప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, వక్తలు -
కానరాని దేవుళ్లు.. పశువైద్యులు
నేడు ప్రపంచ వెటర్నరీ దినోత్సవం ● సమాజ ఆరోగ్యంలోనూ కీలక పాత్ర మహబూబ్నగర్ (వ్యవసాయం): గ్రామీణ జీవనానికి అండగా నిలిచే పశుసంపదను కాపాడేవారు.. రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి బలంగా నిలిచేవారు.. మనం నిత్యం వినియోగించే పాలు, గుడ్లు, మాంసం వంటి ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించే వారే వెటర్నరీ వైద్యులు. కనిపించకుండా సేవలు అందిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్న ఈ అజ్ఞాత సైనికుల సేవలు అపారమైనవి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం నిర్వహించే ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రైతు–జీవాలు–ప్రజారోగ్యం జంతు సంరక్షణ అంటే కేవలం పశువుల వైద్యం మాత్రమే కాదు.. ప్రజారోగ్యానికి కూడా సంబంధించిన అంశం. పశువుల్లో వ్యాధులు వ్యాపించకుండా అరికట్టడం ద్వారా మానవులకు వచ్చే అంటువ్యాధులను నివారించడం కూడా వీరి బాధ్యతలో భాగమే. ఒక ఆరోగ్య సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు చేస్తూ పశు, మానవ ఆరోగ్యాన్ని సమాంతరంగా కాపాడుతున్నారు పశు వైద్యులు. జిల్లాలో విస్తృత సేవలు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాలీక్లీనిక్లు, పశువైద్యశాలలు నిర్వహిస్తూ రైతులకు చేరువవుతున్నారు. గ్రామ స్థాయిలోనే చికిత్సలు అందిస్తూ అత్యవసర సమయాల్లో పశువులను రక్షిస్తున్నారు. జిల్లా జాయింట్ డైరెక్టర్తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, 27 మంది పశువైద్యులు, 52 మంది పాలీ సిబ్బంది, 60 మంది అటెండర్లు కలిసి సమన్వయంతో పని చేస్తున్నారు. వీరంతా గ్రామీణ స్థాయిలోనే పశువులకు టీకాలు, క్రిమినాశన చర్యలు, గర్భధారణ సేవలు, పోషణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీరేబీస్ టీకాలు వేస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తమ పరిధిలో టీకాల నమోదు, పర్యవేక్షణ, నివేదికల సమర్పణ వంటి చర్యలను క్రమబద్ధంగా కొనసాగిస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువులను సంరక్షణపై చర్యలు తీసుకుంఉటన్నారు. ఫర్మ్ నుంచి ఫుడ్ వరకు.. పశువుల ఆరోగ్యం బాగుంటేనే మనకు సురక్షిత ఆహారం అందుతుంది. పాలు, మాంసం, గుడ్ల నాణ్యతను కాపాడడంలో వెటర్నరీ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫర్మ్ టు ఫోర్క్ విధానంలో ఆహార భద్రతను కాపాడడంలో వెటర్నరీ వైద్యుల పాత్ర కీలకం. జిల్లా గోజాతి గేదె జాతి గొర్రెలు మేకలు కుక్కలు పిల్లులు మహబూబ్నగర్ 89,500 79,102 8,01,847 1,13,798 10,200 1,000 జో,గద్వాల 56,298 52,124 5,77,444 66,817 9,300 390 నాగర్కర్నూల్ 2,39,523 1,06,373 6,62,717 1,95,745 14,917 1,200 జిల్లాల వారీగా పశుసంపద ఇలా.. ఫర్మ్ నుంచి ఫుడ్ వరకు వెటర్నరీల సేవలు పశువుల ఆరోగ్యం అంటే రైతు ఆర్థిక భద్రత మాత్రమే కాదు, సమాజ ప్రజారోగ్యానికి కూడా ఎంతో కీలకం. జిల్లాలో పశువైద్య సేవలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. టీకాల పంపిణీ, వ్యాధి నిరోధక చర్యలు, మొబైల్ వెటర్నరీ సేవల ద్వారా రైతులకు సమయానుకూలంగా సేవలు అందిస్తున్నాం. వన్ హెల్త్ దృక్పథంతో పశు–మానవ ఆరోగ్యాన్ని సమాంతరంగా చూసే విధానాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కూడా పశువుల సంరక్షణలో జాగ్రత్తలు పాటిస్తూ, టీకాలు తప్పనిసరిగా వేయించాలి. – డాక్టర్ మధుసూదన్గౌడ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఆర్థిక వ్యవస్థకు అండ పశుసంపద రైతు కుటుంబాల ఆదాయానికి ప్రధాన వనరు. ఒక పశువు అనారోగ్యం పాలైతే కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో వెటర్నరీ వైద్యులు వేగంగా స్పందించి పశువులను రక్షించడం ద్వారా రైతు నష్టాలను తగ్గిస్తున్నారు. -
హెల్ప్డెస్క్ బ్యానర్ ఆవిష్కరించిన డీఈఓ
జడ్చర్ల టౌన్: పట్టణంలో ఆదివారం నుంచి జరగబోయే 69వ జాతీయ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీకి సంబంధించిన హెల్ప్డెస్క్ బ్యానర్ను డీఈఓ ప్రవీణ్కుమార్ శుక్రవారం జడ్చర్లలో ఆవిష్కరించారు. ముందుగా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాలని కమిటీలకు సూచించారు. అనంతరం బాలుర పాఠశాలలో భోజన ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. క్యాటరింగ్కు సంబంధించి సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా వంటకాలను వడ్డించాలని అలాగే స్వచ్చమైన మంచినీరు అందించాలన్నారు. తర్వాత మినీ స్టేడియంలో క్రీడల ప్రారంభోత్సవానికి సంబంధించిన వేదిక ఏర్పాట్లను పరిశీలించి ఎండల దృష్ట్యా టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. పాల్గొనే జట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రిజిస్ట్రేషన్, రవాణాకు సంబంధించి ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి సమస్యలను నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదా, మోయిన్ పాల్గొన్నారు. -
ముండ్లదిన్నె ఘటనలో విచారణ షురూ
● అనుమానితుడిగా ఒకరిపై కేసు నమోదు ● ‘సాక్షి’ కథనానికి స్పందించిన పోలీసులు రాజోళి: తీగలాగితే డొంక కదలాలి.. కాని ఇన్నిరోజులుగా వాస్తవాలను దాచినవారు ప్రస్తుతం విషయాలు బయటకు చెబుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ముండ్లదిన్నెలో అమాయక యువతిపై జరిగిన అఘాయిత్యంపై ‘సాక్షిశ్రీలో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. గురువారం నుంచే విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో బాధిత యువతి మతిస్థిమితం లేని కారణంగా ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామంలో కూడా చేసిన విచారణలో తెలిసిన వివరాల మేరకు ఒకరిపై అనుమానితుడిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోకారి తెలిపారు. బాధిత యువతి సోదరుడు మల్లి ఫిర్యాదు మేరకు ఒకరిపై అనుమానితుడిగా కేసు నమోదు చేశామని, ఇంకా విచారణ సాగుతుందని తెలిపారు. డొంక కదులుతుందా? ఘటనకు సంబంధించి ‘సాక్షిశ్రీలో కథనం వచ్చాక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్లు తెలస్తుంది. ఈ కారణంగానే ఒక్కరిపై అనుమానితుడిగా గుర్తించి తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుమానితుడిగా ఉన్న వ్యక్తే మిగతావారి పేర్లు చెబుతారనే అనుమానాలు వారిలో వెంటాడుతున్నాయి. ఘటనపై గ్రామపెద్దలు నిజంగానే పంచాయితీ పెట్టారా? ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళను శుక్రవారం సఖి కేంద్రానికి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం పోలీసులు అనుమానితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ‘సాక్షి’ కథనం అనంతరం జరుగుతున్న పరిణామాలను చూస్తే అమాయక యువతిని లొంగదీసుకున్న వారిలో మరికొందరు ఉన్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. -
కురుమూర్తిస్వామి దగ్గరకు రా.. తేల్చుకుందాం
● ఎమ్మెల్యే జీఎంఆర్కు మాజీ ఎమ్మెల్యే ఆల సవాల్ దేవరకద్ర: ‘ప్రజల తీర్పును గౌరవించి మొదట్లో ఏమి అనలేదు. మా మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అడ్డగోలుగా గౌరవం లేకుండా మాట్లాడితే ప్రజలు మెచ్చుకోరు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. స్థాయికి మించి మాట్లాడొద్దు, నల్లమట్టి అమ్ముకోలేదని కురుమూర్తిస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా. నువ్వు అక్కడి రా 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని సంతకం చేసి రాసిన బాండును బయటపెడతాం. కురుమూర్తి స్వామి ఎవరిని శిక్షిస్తారో చూద్దాం.’ అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం దేవరకద్రలో ఆయన మాట్లాడుతూ.. ‘మళ్లీ పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలుస్తా అంటున్నావు. అయితే రాజీనామా చేసి రా పోటీ చేయడానికి నేనూ సిద్ధమే. ఒకవేళ నేను ఓడిపోతే రాజకీయ సన్యాయం తీసుకుంటా’ అని తెలిపారు. సివిల్ ఇంజనీరుగా సొంతంగా ఆలోచించి కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించానని, పెద్దవాగు ఊకచెట్టు వాగులపై 36 చెక్ డ్యామ్లను నిర్మాణం చేసి రెండు వాగులను సజీవంగా నిలిపినట్లు పేర్కొన్నారు. కరివెన రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్లో లేకున్నా.. తాను సొంతంగా అక్కడ తిరిగి రిజర్వాయర్ నిర్మాణం చేయవచ్చని కేసీఆర్ను ఒప్పించామని తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఇంటిగ్రేటేడ్ స్కూల్ స్థలం మార్చాలని అడిగిన వారిపై కేసు పెట్టి జైలులో వేశాడని ఆరోపించారు. పదేళ్ల క్రితం ఉన్న కేసులు బయటకు తీసి జైలుకు పంపిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన వెంట ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా భవిష్యత్లో ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కరివెన ప్రాజెక్టు పెండింగ్ పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎర్రమట్టి, నల్లమట్టి లేకుండా రిజర్వాయర్ నిర్మాణం సాధ్యం కాదు.. నీ తెలివి తేటలతో చేయగలిగితే చేయండి ఎట్లా చేస్తావో చూస్తామన్నారు. చేస్తే అభినందిస్తామన్నారు. నీ తమ్ముడు చెక్ డ్యామ్లు కడితే అప్పుడే కొట్టుకుపోయాయని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక దందా జోరుగా సాగుతుందని, ప్రతి బండికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.వంద కోట్లతో కొల్లూరులో ఎలా కొన్నావు, కూకట్పల్లిలో ఏం చేస్తున్నావో తెలుసన్నారు. భాష మార్చుకోకపోతే వీడియోలు బయటికి వస్తాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు జట్టి నర్సింమారెడ్డి, శ్రీకాంత్యాదవ్, మోహన్గౌడ్, బసిరెడ్డి, నరేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ‘నేషన ల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్స్రక్షన్’ ద్వారా నిర్వహించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పేద బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీ, వెనుకబడిన తరగతుల యువతకు ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తోందన్నారు. నిరుద్యోగ యువతి యువకులు గృహ నిర్మాణం, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్లంబింగ్, వెల్డింగ్, టైలరింగ్, భూమి సర్వే, లాంటి వివిధ ట్రేడ్లలో ఉచిత నైపుణ్య శిక్షణను పొంది స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీలలో మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చని చెప్పారు. 2025–26లో జిల్లాలో 800 మంది నిరుద్యోగ యువతి యువకులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించామని, వారిలో 200 మంది ప్లేస్మెంట్ ద్వారా వివిధ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించామమని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ సహాయ సంచాలకులు శివశంకర్ తెలిపారు. జిల్లాలో బోయేపల్లి గేటు వద్ద ఉన్న యూత్ శిక్షణ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, అత్యాధునిక ల్యాబ్లు, పరికరాలున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లలను అందించారు. కార్యక్రమంలో ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి ఛత్రునాయక్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఖయ్యూం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై స్పందించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమం అమలుపై కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఆ పథకాల లబ్ధి ప్రజలకు సమర్థంగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అధికారులు బాధ్యతతో పని చేస్తూ, తమ శాఖల పరిధిలోని సమస్యలను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రతిరోజు సేకరించే సుమారు 100 మెట్రిక్ టన్నుల చెత్త వల్ల మీథేన్, రసాయనాల ప్రభావంతో ప్రజల కు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి పరిష్కారంగా బయో మైనింగ్ చేపట్టేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సూచించారు. మురుగు నీటి పారుదల కోసం మంజూరైన మూడు ఎస్టీపీల పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అవసరమైన స్థల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నగరంలోని పార్కులపై ఆక్రమణలను గుర్తించి, వాటిని రక్షించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, పీహెచ్సీలు మరియు అర్బన్ పీహెచ్సీలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సమావేశం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు -
ఇంటర్ ఉంటేనే అంగన్వాడీ పోస్టు
అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లుగా ఉద్యోగాలకు నియమితులయ్యే వారికి కనీసం ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇకపై కనీసం ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించింది. వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు పంపించాం.. జిల్లాలో అంగన్వాడీ టీ చర్లు, ఆయాల పోస్టు ల ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే జిల్లా లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల స్థానంలో ఇన్చార్జిలను ని యమించాం. పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మంజూ రు అయిన వెంటనే భర్తీ చేస్తాం. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి ● -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలోభాగస్వామ్యం చేసుకోవాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శరీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడలతో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాధాన్యత ఇస్తూ ఒలింపిక్స్లో మనదేశం అత్యధిక పతకాలు సాధించే లక్ష్యంతో పలు ప్రణాళికలు అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడు అయినందున రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. క్రీడాకారులను అంతర్జాతీస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన గవర్నర్ ముందు మార్చ్ఫాస్ట్ నిర్వహిస్తున్న పాలమూరు క్రీడాకారులు క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రా ధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండి యా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 9 నుంచి 15 వరకు మండలస్థాయిలో, 15 నుంచి 20 వరకు అసెంబ్లీస్థాయిలో, 21, 22 తేదీల్లో పార్లమెంటరీస్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలకు యువత నుంచి విశే షమైన స్పందన లభించినట్లు వివరించారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
రాజోళి: వడ్డేపల్లి మండలం జూలకల్ గ్రామంలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గ్యాంగ్ తిమ్మప్ప మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. అయితే గురువారం షార్ట్ సర్య్యూట్ అయి పంటకు నిప్పంటుకొని పంట మొత్తం కాలి బూడిదైంది. ప్రమాదంలో రూ.2.50లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ట్రాలీ, పశుగ్రాసం దగ్ధం తిమ్మాజిపేట: మండల పరిధిలోని బావాజిపల్లిలో గురువారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ, పశుగ్రాసం దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన అబ్దుల్నబీ తన పొలంలోని షెడ్డు సమీపంలో ట్రాక్టర్, పశుగ్రాసం(జొన్నసొప్ప)భద్రపరిచాడు. హఠాత్తుగా మంటలు వ్యాపించడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం గద్వాల క్రైం: కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదంలో తండ్రి మృతిచెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. హట్కార్పేటకు చెందిన చంద్రశేఖర్(70) కుమారుడు లోకేష్ మధ్య బుధవారం రాత్రి వివాదం జరిగింది. ప్రమాదవశాత్తు తండ్రిని తోసివేయడంతో సృహ తప్పి కిందపడిపోయాడు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరిచారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు మద్యానికి బానిసై, ఆర్థిక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తండ్రిపై దాడి చేయడంతోనే మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తండ్రి మృతి -
సర్వే పనులు అడ్డుకున్న రైతులు
భూత్పూర్: మండలంలోని అన్నాసాగర్ వద్ద భారతమాల రహదారి పనుల సర్వేను రైతులు గురువారం అడ్డుకున్నారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్ శివారు నుంచి అన్నాసాగర్, తాటికొండ గ్రామ శివారు గుండా రాయచూర్ జాతీయ రహదారిని కలిపేందుకు భారతమాల చేపడుతున్నారు. దాదాపు వంద ఎకరాలకు పైగా భూములు కోల్పోతుండటంతో రహదారి పనుల సర్వేను అడ్డుకున్నట్లు తెలిపారు. ఏ ఏ గ్రామాల రైతుల భూములు కోల్పోతున్నారు, ఎంత కోల్పోతున్నారని, వారికి వచ్చే పరిహారం కోసం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశంతో సర్వే పనులు చేస్తుండగా పలు పర్యాయాలు రైతులు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ కిషన్ తెలిపారు. వారం రోజుల వ్యవధి కావాలని రైతులు తెలిపినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్నాసాగర్ సర్పంచ్ ఆల శ్రీకాంత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బిజినేపల్లి: మండలంలోని లట్టుపల్లిలో ఒక ఇంటిలో అనుమానస్పదంగా నిల్వ చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్పోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హేమ్లానాయక్కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక ఆర్ఐ బాలరాజ్, పోలీసులతో కలిసి లట్టుపల్లిలోని ఓ ఇంటిలో గురువారం సాయంత్రం అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక డీలర్ రేషన్ దుకాణానికి సమీపంలో ఒక ఇంటిలో అనుమానస్పదంగా నిల్వ చేసిన 100 క్వింటాళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అనుమానం ఉన్న ఇతర డీలర్ల దుకాణాల్లోనే అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిజినేపల్లి గోదాం నుంచి వచ్చిన బియ్యం, పంపిణీ, రేషన్ షాపులో ఉన్న నిల్వలతో పాటు, అనుమానస్పదంగా నిల్వ ఉంచిన వాటిని సరిపోల్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మూడు నెలల బియ్యం రావడంతో.. మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి రేషన్ షాపు రావడంతో అక్కడ నిల్వ సామర్థ్యం లేక గన్నీ సంచులతో సహ మరో ఇంటి వద్ద నిల్వ చేసినట్లు డీలర్ తెలిపారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే గ్రామానికి చెందిన లబ్ధిదారుల నుంచి డీలర్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట అధిక ధరలకు అమ్ముకుంటున్నారని బీజేపీ నాయకుడు భూషయ్య ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఒక్కసారిగా గన్నీ సంచులతో 100 క్వింటాళ్ల బియ్యం పట్టుబడటంతో అవి అక్రమ నిల్వలా.. లేదా గోదాంలో నిల్వ సామర్థ్యం లేక మరో చోట ఉంచారా అనే విషయంలో అధికారులు విచారణ చేస్తున్నారు. -
లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి
బిజినేపల్లి: వ్యవసాయంలో మానవ శ్రమను తగ్గించడంతో పాటు ప్రజల ఆరోగ్యం పెంచే పంటల్లో అధిక దిగుబడులు వచ్చేలా నూతన వంగడాలను సృష్టించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వాతావరుణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని తట్టుకునే పంటఽలు, సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. గురువారం పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానంలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు లాభదాయక పంటల వైపునకు తరలించే విధంగా శాస్త్రవేత్తలు వ్యవసాయ వంగడాలను రూపొందించాలని కోరారు. రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచే విధంగా శాసీ్త్రయ బద్ధ పంటల సాగుకు అనువైన పరిస్థితులను కల్పించుకోవాలన్నారు. పాలెం ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డా.ఎల్.కృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరంలో వరిలో అభివృద్ధి చేసిన ఆర్ఎన్ఆర్ 25105, 31479 రకాల్లో అధిక దిడుబడి, తక్కువ నూకశాతం కలిగిన వంగడాల గురించి వివరించారు. అలాగే వేరుశనగలో నాణ్యమైన విత్తనాల ప్రాధాన్యతను వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా. బలరాం మాట్లాడుతూ యూరియా సమగ్ర వినియోగం, చిరుదాన్యాల ప్రోత్సాహం, అడవి పందులు, కోతుల వంటి జంతువుల వలన కలిగే నష్టాన్ని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆదాయానికి గండికొడుతున్నాడని హత్య
● గద్వాలలో వ్యక్తి హత్యకేసును ఛేదించిన పోలీసులు ● ఇద్దరు నిందితుల అరెస్టు.. రిమాండ్ ● గద్వాల డీఎస్పీ మొగిలయ్య గద్వాల క్రైం: ^ðl™èl¢ M>W-™éË$, ™éW ç³yól-íܯ]l ïÜÝëÌS õÜMýSÆý‡×æÌZ ™èlÌñæ-†¢¯]l ÑÐé§ýl… JMýSÇ {´ë׿… ¡íÜ…¨. D çœ$r-¯]lMýS$ çÜ…º…«¨…-_¯]l ÑÐ]l-Æ>-ÌS¯]l$ VýS$Æý‡$-ÐéÆý‡… ç³rt׿ ´ùÎ-‹Ü-õÜt-çÙ-¯ŒSÌZ HÆ>µ-r$-^ól-íܯ]l ÑÌôæMýSÆý‡Ï çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ VýS§éÓÌS yîlGïܵ Ððl¬W-ÌSĶæ$Å ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. MýSÆý‡*²Ë$ hÌêÏ GÑ$ÃVýS-¯]l*ÆŠ‡ Ð]l$…yýlÌS… MýSyìl-Ððl$rÏMýS$ ^ðl…¨¯]l VöÌSÏ ÒÆó‡…{§ýl (34), Ð]l$çßæ-º*-»Œæ-¯]l-VýSÆŠ‡ hÌêÏ çßæ¯éÓyýl Ð]l$…yýlÌS… A…ºsZ°ç³ÍÏMìS ^ðl…¨¯]l MýS$ç³µ-WÇ }°Ðé-çÜ$Ë$, MýSyýlç³ hÌêÏ G{Æý‡-VýS$…-rÏMýS$ ^ðl…¨¯]l íܧýl®Ä¶æ$Å Ð]lÊyýl$ ¯ðlÌSË$V> VýS§éÓÌS hÌêÏ MóS…{§ýl…ÌZ° ÑÑ«§ýl {´ë…™éÌZÏ ^ðl™èl¢ M>W-™éË$, ™éW ç³yól-íܯ]l Ð]l$§ýlÅ… ïÜÝëË$, ´ëÏíÜtMŠS Ð]lçÜ$¢-Ð]l#ÌS¯]l$ õÜMýSÇ-çÜ$¢¯é²Æý‡$. Ðésìæ° Ñ{MýS-Ƈ$$…-^èlV> Ð]l_a¯]l Ý÷Ð]l¬Ã çÜÐ]l*-¯]l…V> ¡çÜ$-MýS$-¯ól-ÐéÆý‡$. B ™èlÆ>Ó™èl GÐ]l-Ç-MìS-ÐéÆý‡$ Ð]l$§ýlÅ… ™éVýSyýl… ÐéÇ ¨¯]l^èlÆý‡ÅV> Ð]l*Ç…-¨. D {MýSÐ]l$…ÌZ }°-Ðé-çÜ$Ë$, íܧýl®Ä¶æ$Å Ð]l$çßæ-º*-»Œæ-¯]l-VýSÆŠ‡ ¯]l$…_ VýS§éÓ-ÌSMýS$ Ð]l_a ^ðl™èl¢ õÜMýS-ÇçÜ*¢.. ™èl¯]l B§é-Ķæ*-°MìS VýS…yìl Mört-yýl…Oò³ ÒÆó‡…{§ýl ÑÐ]l¬-Q™èl ^ðlõ³µÐéyýl$. Ð]l$§ýlÅ… ™éW-¯]l糚yýl$ C§ýlª-Ç-™ø¯]l* VöyýlÐ]l ç³yól-Ðéyýl$. ©…™ø C§ýlªÆý‡$ °…¨-™èl$Ë$ GÌê-OVðS¯é ÒÆó‡…{§ýl¯]l$ çßæ™èlÅ ^ólĶæ*ÌS° Ð]lNÅçßæ… Æý‡_…-^éÆý‡$. D ¯ðlÌS 11¯]l ÒÆó‡…{§ýl Mö™èl¢ ºÝët…yŠæ çÜÒ$-ç³…ÌZ° OÐðl¯ŒS-Úëç³# Ð]l§ýlª Ð]l$§ýlÅ… ™éVýS$-™èl$-¯]l²r$Ï VýS$Ç¢…_ çœ$Æý‡Û׿ ç³yézÆý‡$. B ™èlÆ>Ó™èl Æ>{† 10VýS…rÌS çÜÐ]l$-Ķæ$…ÌZ òœ•ÏKÐ]lÆŠæḥ Ð]l…™ðl¯]l çÜÒ$-´ë-°MìS ÐðlâýæÏyýl… VýS$Ç¢…-_.. Ð]l$ÆøÝëÇ çœ$Æý‡Û׿ ç³yézÆý‡$. D {MýSÐ]l$…ÌZ ÒÆó‡…{§ýl B çÜÐ]l$Ķæ$…ÌZ MìS…§ýl ç³yýl-r…™ø çܵ–çß MøÌZµÄ¶æ*yýl$. C§ýlªÆý‡$ °…¨-™èl$Ë$ º…yýl-Æ>Ƈ$$™ø Ððl*¨ çßæ™èlÅ-^ól-Ô>Æý‡$. °…¨™èl$ÌZÏ JMýSÇ ´ëÅ…sŒæMýS$ Æý‡MýS¢ç³# Ð]l$Æý‡-MýSË$ A…r$-Mø-Ð]l-yýl…™ø OÆð‡ÌôæÓõÜt-çÙ¯ŒS Ð]l*Æý‡Y…ÌZ° Ð]l¬âýæÏ-´÷-§ýlÌZÏ ´ëÅ…sŒæ ç³yólíÜ ç³Æ>Æý‡-Ķæ*ÅÆý‡$. -
జాతీయస్థాయిలో ‘తెలంగాణ’ సత్తా
మన్ననూర్: అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని 5 గ్రామాలకు పునరావాసం కల్పించడంలో భాగంగా నమూనా ప్రజెంటేషన్లో తెలంగాణ ప్రతినిధులు సత్తా చాటారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష, కార్యదర్శులలో తెలంగాణకు పవర్ ప్రజెంటేషన్లో ప్రశంసల వెల్లువ లభించింది. కేంద్ర పర్యాటక శాఖ, రాష్ట్ర అటవీ(అరణ్య) శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఈకో టూరిజం సంయుక్త్త పునరావాసం పథకంలో భాగంగా అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లం, వటువర్లపల్లికి సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శులు సీఎం సాయిబాబు, సంబు సంతోష్ను ఎంపిక చేసి మధ్యప్రదేశ్లోని పన్న టైగర్, ఈకో టూరిజం ప్రాజెక్టుకు అటవీశాఖ తరఫున తీసుకెళ్లారు. ఈ క్రమంలో 25రోజులుగా కొనసాగిన అవగాహన కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధి సభ్యులతోపాటు తెలంగాణ తరఫున అమ్రాబాద్ టైగర్ రిజర్వు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వైల్డ్లైఫ్ కన్జర్వేషన్, ఈకో టూరిజం, డిప్లొమా కోర్సుల అంశాలపై ఎన్టీసీపీ బృందం సభ్యుల సమక్షంలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరుణ మార్పుల మంత్రిత్వ శాఖ, డెహ్రడూన్లోని వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) నిర్వహించిన ఈ శిక్షణలో అమ్రాబాద్ ఈకో టూరిజం అభివృద్ధికి సంబంధిచి పలు అంశాలను తెలియజేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రతినిధులు ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ను (డబ్ల్యూఐఐ) హెడ్ డాక్టర్ రమేష్, కృష్ణమూర్తి, కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ చిన్నస్వామి, కేంద్ర మత్రిత్వ శాఖ సభ్యులు అభినందించారు. ప్రత్యేకించి చెంచు గిరిజనులకు ఉపాధి అవకాశాలు, స్థిరమైన ఆదాయ వనరులు, స్థానిక కళలు, సాంస్కృతిక ప్రోత్సాహం, ప్రకృతి సంరక్షణతో కూడిన అభివృద్ధి ఈ ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయని ఎన్టీసీఎ సభ్యులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా చివరి ప్రజెంటేషన్లుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని 5గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పునరావాసం కింద అందజేస్తున్న రెండు ప్యాకేజీలలో భాగంగా మొదటిది రూ.15 లక్షలు నగదు చెల్లింపు, రెండో 5ఎకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇండ్లు, కనీస అవసరాల ఏర్పాట్ల కల్పన తదితర అంశాల గురించి చేసిన విశ్లేషణ జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకట్టుకున్నట్లు తెలిపారు. నల్లమల ప్రాంతంలో అటవీశాఖ కల్పిస్తున్న ఈ ప్రత్యేకతలను పరిశీలించేందుకు త్వరలోనే ఉన్నతస్థాయి బృందం అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అటవీశాఖ తరఫున ఇలాంటి అవకాశం కల్పించిన డీఎఫ్ఓ రేవంత్చంద్ర, ఎఫ్డీఓలు, ఎఫ్ఆర్ఓలు, సంబంధిత అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏటీఆర్లోని ఐదు గ్రామాల పునరావాసంపై పవర్ ప్రజెంటేషన్ ఆకట్టుకున్న తెలంగాణ ప్రతినిధుల విశ్లేషణ అభినందించిన వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా -
ఓవర్ స్పీడ్కు ఇద్దరు బలి
మహబూబ్నగర్ క్రైం: తెల్లవారుజాము.. రోడ్డు నిర్మానుషంగా ఉండటంతో బైక్పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టడంతో ఓ యువకుడు స్పాట్ డెడ్కాగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. భగీరథ కాలనీకి చెందిన బహద్దూర్ శ్రీకర్(26), వీరన్నపేటకు చెందిన కుమార్(24) ఇద్దరూ ఆన్లైన్ డెలివరీ బాయ్స్గా పని చేస్తుంటారు. గురువారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో భగీరథ కాలనీ నుంచి బోయపల్లిగేట్లోని కంపెనీ గోదాం వద్దకు బైక్పై వెళ్తూ వన్టౌన్ చౌరస్తాలో వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో శ్రీకర్ అక్కడిక్కడే దుర్మరణంపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన కుమార్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదం మధ్యరాత్రి కావడంతో ఎలాంటి ట్రాఫిక్ లేకపోవడంతోపాటు బైక్ ఓవర్ స్పీడ్ ఉండుట, హెల్మెట్లు లేకపోవడంతో తలకు గాయాలు కావడంతో ఇద్దరూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ● రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇద్దరూ యువకులే.. కుటుంబాలకు ఆసరాగా ఉంటూ డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈబైక్ ప్రమాదంలో ఇద్దరికీ తలలకు తప్పా ఇతర శరీర భాగాల్లో ఎక్కడా పెద్ద గాయాలు లేకపోవడం విశేషం. ప్రమాదం సమయంలో ఇద్దరికి హెల్మెట్ ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశం కన్పిస్తోంది. ఇద్దరూ యువకులు మృతితో ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ● అర్ధరాత్రి బైక్తో డివైడర్ను ఢీకొట్టి ఇద్దరు యువకులు ● స్పాట్లో ఒకరు.. ఆస్పత్రిలో మరొకరు ● హెల్మెట్ లేకపోవడం వల్లే మృత్యువాత -
25న ఎరువు తయారీపై వర్క్షాప్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో సమస్యగా మారిన చెత్తను వినియోగించుకునే క్రమంలో ఈనెల 25న జడ్చర్ల మున్సిపాలిటీలో సీడీఎంఏ నుంచి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. వర్క్షాప్లో జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు మహబూబ్నగర్, షాద్నగర్, కొత్తూరు, భూత్పూర్, దేవరకద్ర, మక్తల్ మున్సిపాలిటీల నుంచి కమిషనర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంట్ ఏఈలు పాల్గొననున్నారు. వర్క్షాప్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సీడీఓ హేమలత హాజరై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ పరిధిలోని బోయిలకుంట సమీపంలోని మున్సిపల్ 10 శాతం భూమిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం వర్క్షాప్ నిర్వహించే ప్రాంతానికి తడిచెత్తను తరలించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, శానిటరి ఇన్స్పెక్టర్ నరేష్ ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో సేకరించిన తడిచెత్తను ఎరువుగా ఎలా మార్చాలనే దానిపై పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇవ్వనున్నారు. తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి తడి, పొడిచెత్తను వేరు వేరుగా స్వీకరించి తడి చెత్త ద్వారా ఎరువుగా మార్చాలని కృషి చేస్తున్నారు. అలా తయారైన ఎరువును మున్సిపాలిటీలోని చెట్లకు వినియోగించటంతో పాటు ఉత్పత్తి ఎక్కువైతే రైతులకు విక్రయించటం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
విద్యుదాఘాతానికిలైన్మన్ బలి
అయిజ: గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాను మెరుగుపరిచేందుకు విధులు నిర్వహిస్తున్న లైన్మన్ విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లేష్ కథనం ప్రకారం.. మండలంలోని మేడికొండకు చెందిన శ్రావణ్కుమార్ (35) 2017నుంచి గ్రేడ్–2 ఆర్టిజన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ పునరుద్ధరణకు చిన్నతాండ్రపాడు శివారులోని చిన్నమ్మ చెరువువద్ద వైర్లను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనతోపాటు హెల్పర్లు రాజు, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వారు కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక విద్యుత్శాఖ అధికారులతోపాటు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య ఉంది. ఈ ఘటనతో విద్యుత్ శాఖ అధికారులను కలిచివేసింది. చిన్నతాండ్రపాడులో ఘటనతో విషాదం అలుముకుంది. నిచ్చెన నుంచి జారి పడి వ్యక్తి మృతి చిన్నంబావి: నిచ్చెన దిగుతూ అదుపు తప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దగడపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. దగడపల్లికి చెందిన వెంకటయ్యచారి (45) తన ఇంటి వద్ద రేకులు బిగించడానికి మిద్దె పైకి ఎక్కాడు. అనంతరం కిందకి దిగుతున్న క్రమంలో అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నీటి బకెట్లోపడి చిన్నారి మృతి లింగాల: సరదాగా ఆడుకుంటూ నీటి బకెట్ వద్దకు వెళ్లిన ఓ చిన్నారి అందులో పడి మృతిచెందిన విషాధకర ఘటన గురువారం మండలంలోని అప్పాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకుంట మల్లేష్, విజయ దంపతులకు మీనాక్షి(18నెలలు) కూతురు మధ్యాహ్న సమయంలో తల్లి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లగా.. ఇంట్లో కుటుంబ సభ్యులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో అన్నం తిన్న చిన్నారి చేతులు కడుక్కోవడానికి బాత్రూంలో ఉన్న బకేటు వద్దకు వెళ్లి బకెట్టులో ప్రమాదవశాత్తు బోర్ల పడింది. బయటకు వెళ్లిన చిన్నారి ఇంకా రాలేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై బయటకు వెళ్లి చూడగా చిన్నారి అప్పటికే మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉన్న ఒక్క కూతురు నీటిలో పడి చనిపోవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. వివాహిత అనుమానాస్పద మృతి కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మున్సిపాలిటీలోని 5వ వార్డు ఎర్రగుట్టతండాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగట్టుతండాకు చెందిన సబావట్ కవిత (30)పై అనుమానంతో భర్త వస్యానాయక్ నిత్యం వేధించేవాడు. బుధవారం రాత్రి సైతం కవితను వస్యానాయక్ కొట్టాడని, ఈ క్రమంలో ఆమె మృతి చెందినట్లు తెలిసిందన్నారు. మృతురాలి తల్లిదండ్రులు గురువారం ఉదయం వచ్చి కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
కల్వర్టును ఢీకొట్టిన కారు: ఐదుగురికి గాయాలు
వెల్దండ: మండల కేంద్ర సమీపంలో యెన్నమ్స్ ఆస్పత్రి సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని హయత్నగర్కు చెందిన చరణ్తేజ్, సాయిసుజన్ రెడ్డి, కిరణ్, హర్షిక్, సల్మాన్లు గురువారం రాత్రి కారులో శ్రీశైలం బయలుదేరారు. వెల్దండకు చేరుకోగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు రోడ్డు కిందభాగంలో పడడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. డ్రైవర్ సాయిసుజన్రెడ్డి, కిరణ్, చరన్తేజల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
కారు బోల్తా పడి వ్యక్తి దుర్మరణం
మహబూబ్నగర్ క్రైం: కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగాం కు చెందిన దినకర్రెడ్డి (55) కుటుంబ సభ్యులు ఐదుగురితో కలిసి దేవరకద్ర నుంచి మహబూబ్నగర్కు వస్తుండగా.. మార్గమధ్యలో ఆల్మదీనా కళాశాల వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కారు డోర్ తెరుచుకోవడంతో దినకర్రెడ్డి తల రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బంధువులకు సంబంధించిన ఫంక్షన్ కోసం జనగాం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ రెండో ఎస్ఐ భూపాల్రెడ్డి వెల్లడించారు. -
మక్కలు.. తిప్పలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. అరకొర కేంద్రాలతో అవస్థలు.. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయస్థాయిలో సత్తా అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని గ్రామాలకు పునరావాసం కల్పించడంపై నమూనా ప్రజెంటేషన్లో ప్రతినిధులు సత్తాచాటారు. –8లో u -
ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ దౌర్జన్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఆర్టీసీ కార్మికుల సమ్మైపె కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని, దీనిని తట్టుకోలేక వరంగల్లో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం తన నివాసంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాండూరులో ఆర్టీసీ కార్మికులకు టెంట్లు ఇస్తే టెంట్హౌస్ ఓనర్లకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆర్టీసీ కార్మికులు కొత్తగా డిమాండ్లు అడగడం లేదని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుతున్నారన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీకి బకాయి పడిన రూ.1,400 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా దొరకడం లేదని, కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదని, రైతుబంధు ఇవ్వడం లేదు.. పండించిన పంట కొనడంలేదని ఆరోపించారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోలేదని పేల్చారనే అనుమానం ఇంజనీర్లు వ్యక్తం చేశారన్నారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పీసీ ఘోష్ కమిషన్ విచారణ పేరుతో అనవసరంగా ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. రెండు పిల్లర్లు కుంగితే ఎల్అండ్టీ సంస్థ మరమ్మతులు చేస్తామని చెప్పినా రాజకీయం చేయాలని మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. ఆర్ఎస్పీ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులు రేవంత్రెడ్డి మీద ఉన్నాయన్నారు. చిత్తనూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం వస్తుందని, దాని పక్కన గురుకుల పాఠశాల ఏర్పాటు చేయవద్దని కోరితే సంతోష్రెడ్డి మీద తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. అదే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.నాయకులు రాజేశ్వర్గౌడ్, యాదయ్య, నర్సింహులు, వెంకన్న, కుర్వసత్యం పాల్గొన్నారు. -
25 క్వింటాళ్లే కొంటారంట
నాకున్న 9 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తే.. ఎకరాకు 30– 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 20 రోజుల క్రితమే పంట కల్లాల్లో నిల్వ చేశాను. దళారులను ఆశ్రయిస్తే క్వింటా రూ.1,600లకు కొంటారంట. దేవరకద్రలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో అమ్ముదామంటే పారంభించారు. అక్కడ అమ్ముకుందామనుకుంటే ఎకరాకు 25 క్వింటాళ్లే కొంటామని అధికారులు చెబుతున్నారు. – రమేష్, రైతు, పర్దీపురం గ్రామం, చిన్నచింతకుంట మండలం త్వరగా తూకం వేయాలి.. కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు ఆలస్యం కావడంతో నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. వాన కురిస్తే మొక్కజొన్నలు తడిచి ఇబ్బంది అవుతుంది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సకాలంలో తూకాలు వేయాలి. – రాఘవేందర్, రైతు, వాడ్యాల్, మిడ్జిల్ మండలం తడిసిన ధాన్యం కొనాలి.. కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు ఆల స్యం కావడంతో రోడ్ల పై పోసిన మొక్కజొన్న కుప్పలు వానకు తడుస్తుంది. కాబట్టి ప్రభు త్వం తడిసిన మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలి. – ఆంజనేయులు, రైతు, మిడ్జిల్ ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం.. మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్ ● -
భగీరథుడి దీక్ష, సంకల్పం స్ఫూర్తిదాయకం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భగీరథ మహర్షి ఒక గొప్ప తపస్వి అని, ఆయన దీక్ష సంకల్పం, నిస్వార్థ సేవా భావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో గ్రీన్బెల్ట్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వేశారు. సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించేందుకు భగీరథుడి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మేయర్ మమత, బీజీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, సగరసంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్ పాల్గొన్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతోనే పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందని ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లోనే మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ బీజేపీ దురుద్దేశంతో 2027 జనగణన తర్వాత అమలు చేస్తామని మోసానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక బృందావన్ ఫంక్షన్ హాలులో రౌండ్టేబుల్ సమావేశం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, జాన్వెస్లీ తదితరులు చర్చాగోష్టిలో పాల్గొంటారన్నారు. దీనికి జిల్లాలోని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ @ రూ.6,461 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్లో గురు వారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,461, కనిష్టంగా రూ.4,889 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ. 6,310, జొన్నలు గరిష్టంగా రూ.5,887, హంస గరిష్టంగా రూ.1,869, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,461, కనిష్టంగా రూ.1,651, కందులు రూ.గరిష్టంగా రూ.6,266, పెబ్బర్లు రూ.6,277 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,113, కనిష్టంగా రూ.1,980, హంస గరిష్టంగా రూ.1,741, కనిష్టంగా రూ.1,719 ధరలు నమోదయ్యాయి. -
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు
● హాజరవుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ఖేల్ మహోత్సవ ముగింపు వేడుకలను జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే అతిథులుగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, గొంగిడి త్రిషారెడ్డి, డబ్ల్యూపీఏల్ మహిళా క్రికెటర్ త్రిషా పూజితలు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా.. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్, నవీన్కుమార్రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్తో పీయూ వీసీ సమావేశం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జాతీయ విద్యావిధానంలో భాగంగా విజయ్ అండ్ మిషన్ అమలులో పాలమూరు యూనివర్సిటీ పాత్ర, 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పీయూలో జరిగిన కార్యక్రమాలపై గవర్నర్ శివప్రతాప్శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూ అధ్యాపకులు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్ పొందారని, రీసెర్చ్కు మరింత ప్రోత్సాహం ఇస్తున్నట్లు వీసీ వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
బస్సులు నిరంతరం నడిచేలా చర్యలు: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ఆర్టీసీ బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో గురువారం బస్టాండ్ ఆవరణలో బందోబస్తు విధానాన్ని ఎస్పీ పరిశీలించారు. సమ్మె పరిస్థితుల్లో కూడా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైవర్లు తమ విధులు నిర్వహించాలని, ప్రజల రవాణా సౌకర్యాన్ని నిరవధికంగా కొనసాగించేందుకు పోలీస్శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, మార్గమధ్యలో బస్సులను నిలిపిన, డ్రైవర్లపై దాడులకు పాల్పడిన అలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణించి సంబంధిత వ్యక్తులపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ ఉన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం
● దేవరకద్ర మార్కెట్లో పేరుకుపోతున్న కుప్పలు ● ఒకపక్క తూకం వేసిన బస్తాలు ● మరోపక్క అమ్మకానికి వస్తున్న వడ్లు దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్కు నిత్యం పెద్ద ఎత్తున అమ్మకానికి వస్తున్న ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేసి తరలించడంలో జాప్యం అవుతుండదంతో ఒకపక్క తూకం వేసిన బస్తాలు, మరోపక్క అమ్మకానికి వచ్చిన ధాన్యంతో మార్కెట్ యార్డు అంతా ధాన్యంతో పేరుకుపోతున్నది. రెండు వారాలుగా మార్కెట్లో ధాన్యం సీజన్ ప్రారంభమైంది. కోయిల్సాగర్ ఆయకట్టు కింద వేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతోపాటు బోరుబావులు, చెరువులు, కుంటల కింద వేసిన వరి పంటలు ఒకేసారి కోతలు కోస్తుండడంతో నిత్యం వేలాది బస్తాల ధాన్యం అమ్మకానికి వస్తున్నది. దీంతో రోజువారీగా 5వేల నుంచి 6వేల బస్తాల ధాన్యం మార్కెట్కు వస్తున్నది. మధ్యాహ్నం 1గంటకు టెండర్ల ద్వారా ధరలు ఖారారైన తర్వాత మధ్యాహ్నం 2 తర్వాత తూకాలు ప్రారంభమవుతాయి. అయితే సాయంత్రం వరకు తూకాలు కొనసాగడం ఆ తరువాత తూకం వేసిన బస్తాలను లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించే పనులు చేపడుతున్నారు. మార్కెట్ నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు తిరిగి వస్తేనే మళ్లీ ధాన్యం తరలించే అవకాశం ఉంటుంది. అయితే మిల్లుల వద్ద అన్లోడ్ చేయడానికి జాప్యం అవుతుండడంతో లారీలు లేక మార్కెట్లో తూకం వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల ఒకపక్క తూకం వేసిన ధాన్యం బస్తాలు ఉండగానే మళ్లీ అమ్మకానికి వచ్చిన ధాన్యంను బస్తాల మధ్యనే కుప్పలుగా పోసి అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కూడా వచ్చిన ధాన్యంను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసినా తరలింపులో జాప్యం కావడంతో మార్కెట్లో ధాన్యం పెద్ద మొత్తంలో మిగులుతున్నది. ఉల్లివేలం రద్దు దేవరకద్ర మార్కెట్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు ఒకవైపు ఉండగానే అమ్మకానికి వచ్చిన ధాన్యం రాసులతో మార్కెట్లో ఖాళీ స్థలం లేకుండా పోయింది. దీంతో బుధవారం జరగాల్సిన ఉల్లి వేలాన్ని రద్దు చేశారు. గతవారం కూడ పరిస్థితి ఇలాగే ఉంటే చాలామంది రైతులు మార్కెట్ బయట నేరుగా వినియోగదారులకు అమ్ముకున్నారు. ఈవారం కూడ పరిస్థితి అలాగే ఉండడంతో చాలామంది రైతులు మార్కెట్కు ఉల్లిని అమ్మాకానికి తీసకురాలేదు. కొనుగోలు చేయడం లేదు మార్కెట్లో రెండురోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదు. చాలామంది రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక గ్రామస్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్ల రైతులు మార్కెట్కు ధాన్యంను అమ్మకానికి తెస్తున్నారు. కొందరు రైతులు వెంటనే డబ్బులు వస్తాయని మార్కెట్లో అమ్ముకుంటున్నారు. తరలించడానికి ఇబ్బందులు ధాన్యంను కొనగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లారీల్లో ధాన్యం లోడ్ చేసి మిల్లులకు తరలిస్తే అక్కడ అన్లోడ్ కావడానికి ఆలస్యమవుతున్నదని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల కొనుగోలు చేసిన ధాన్యంను మార్కెట్లోనే నిల్వ చేసుకునే పరిస్థితి వస్తున్నదని తెలిపారు. -
ఆగిన ప్రగతి రథాలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం స్టేషన్ మహబూబ్నగర్: సమ్మెతో ప్రగతి రథ చక్రాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ప్రారంభమైంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగారు. సమ్మెలో మహబూబ్నగర్ రీజియన్లోని పది డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. వివిధ రూట్లలో వెళ్లిన నైట్హాల్ట్ బస్సులు ఉదయం తిరిగి ఆయా డిపోలకు చేరాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచి ఉన్నారు. ఉదయం వేళల్లో ఉద్యోగులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పడిగాపులు కాశారు. సమ్మెతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డిపోలు, బస్టాండ్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు బలగాలను మోహరించారు. మహబూబ్నగర్ డిపోలో డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షించారు. సమస్యలు పరిష్కరించాలి పలువురు ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి పునరుద్ధరించడంతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పీఆర్సీలను ప్రకటించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్ప జెప్పి ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జి.లక్ష్మణ్గౌడ్, విజయ్బాబు, సాయిరెడ్డి, జిల్లా నాయకులు బసప్ప, నాగేందర్, జానకిరాములు, బి.శ్రీనివాసులు, భానుప్రకాశ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. డిపోలకే పరిమితమైన బస్సులు ఉమ్మడి జిల్లాలో పది డిపోల్లో ఆర్టీసీ కార్మికుల నిరసనలు సమ్మెకు సహకరించాలని ప్రైవేట్ డ్రైవర్లకు వేడుకోలు పోలీసు బందోబస్తు మధ్య 134 బస్సులు నడిపించిన అధికారులు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన విత్తనాల విక్రయదారులు, మండల వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విత్తన వ్యాపారులు తమ స్టాక్లకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన విత్తనాలను దుకాణాలు, గోదాముల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప్రతి విత్తన సంచిపై ప్యాకింగ్ తేదీ, గడువు, సరఫరా సంస్థ పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలని తెలిపారు. ఈ వివరాలు లేని విత్తనాలను నకిలీగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండలంలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాలను తనిఖీ చేసే బాధ్యత అప్పగించామని తెలిపారు. వ్యాపారులు తక్షణ లాభాల కోసం రైతులను మోసం చేయకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ గతేడాది భూత్పూర్లో 1,343 గడువు ముగిసిన విత్తన సంచులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జడ్చర్లలో కూడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ, డీఏఓ వెంకటేష్, ఆర్టీఓ రఘు, తదితరులు పాల్గొన్నారు. నీట్ను పకడ్బందీగా నిర్వహించాలి మే 3న నీట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరీక్ష కేంద్రాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్షల నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను సురక్షితంగా తరలించడం, భద్రపరచడం వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ముందుగానే నియమించుకోవాలని సూచించారు. ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఆర్ఓ రామ్రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీస్తాం మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులను వెలికితీస్తామని నూతన జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా డీవైఎస్ఓ క్రికెట్ కోచ్గా బదిలీపై ఆయన మహబూబ్నగర్ డీవైఎస్ఓగా వచ్చారు. బుధవారం యువజన, క్రీడల కార్యాలయంలో రాజశేఖర్రెడ్డి డీవైఎస్ఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ తాను ఎల్బీ స్టేడియంలో, జింఖానా మైదానం, రంగారెడ్డి డీఎస్ఓ క్రికెట్ కోచ్గా పని చేసినట్లు చెప్పారు. జిల్లాలో అన్ని క్రీడా సంఘాల సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన డీవైఎస్ఓను పలువురు ఘనంగా సన్మానం చేశారు. అకాడమీ వాలీబాల్ క్రీడాకారులకు డీవైఎస్ఓ పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో యువజన, క్రీడల శాఖ సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, పీడీ బాల్రాజు, కోచ్లు సునీల్కుమార్, పర్వేజ్పాష, అంజద్ పాల్గొన్నారు. -
పీయూలో పీసీఐ బృందం తనిఖీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీయూలోని ఫార్మసీ కళాశాలను బుధవారం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ రికార్డులతో పాటు ల్యాబ్స్, గ్రంథాలయం, హెర్బల్ గార్డెన్ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బృందం సభ్యులు డా.గౌరవ్, డా.మహాలక్ష్మి మాట్లాడుతూ ఇక్కడి ఫార్మసీ కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులందరూ డాక్టరేట్ కలిగి ఉండటం సంతోషకరమన్నారు. అనంతరం వారిని పీయూ వీసీ శ్రీనివాస్ సన్మానించారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ పూస రమేష్బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.ఎన్.చంద్రకిరణ్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రవికాంత్, హెచ్ఓడీ వి.ప్రభాకర్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎ.ఈశ్వర్కుమార్, చిన్నాదేవిర, సోమేశ్వర్, బి.సురేష్, శారద, సుజాత, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. 24న సంసద్ ఖేల్ మహోత్సవం ముగింపు వేడుకలు ●హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ఖేల్ మహోత్సవానికి యువత నుంచి విశేష స్పందన లభించినట్లు ఇన్చార్జీలు ముచ్చర్ల జనార్దన్రెడ్డి, కిరణ్కుమార్, నవీన్కుమార్ తెలిపారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియం వేదికగా ఈనెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ పరిధిలోని ప్రజలు, క్రీడాభిమానులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు గద్వాల క్రైం: గుప్త నిధుల కోసం గుర్తు తెలియ ని దుండగులు దేవాలయంలో గుట్టుగా తవ్వకాలు చేపట్టిన సంఘటన గద్వాల మండలంలోని పరుమాలలో వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామ శివారులోని రంగస్వామి ఆలయంలో శివలింగం, వినాయక విగ్రహాలు ఉన్నాయి. గుర్తు తెలియని దుండగులు బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించి దేవుడి విగ్రహాలను తొలగించి తవ్వకాలు చేపట్టారు. ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి, భక్తులకు గుడిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి సీఐ శ్రీను, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్లు చేరుకొని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
శ్రీశైలం వెళ్లాలి..
శ్రీౖశెలం మల్లన్న దర్శనం కోసం కర్ణాటకలోని యాద్గిర్ నుంచి వచ్చాను. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్నగర్ బస్టాండ్లో వేచి ఉన్నాను. బస్సులు నడుపుతారని కొంతమంది, నడవవు అని మరికొందరు అంటున్నారు. రాత్రి వరకై నా సరే.. బస్సులు నడిస్తే శ్రీశైలం వెళుతాను. – హనుమంతు, యాద్గిర్ (కర్ణాటక) సమ్మె విషయం తెలియదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం తెలియదు. నారాయణపేట జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లాలి. ఉదయం 6 గంటల నుంచి మా తండా నుంచి కల్వకుర్తి వరకు ఆటో, అక్కడి నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ వరకు ఆటోల్లో వచ్చాను. తీరా ఇక్కడ వచ్చేసరికి 12 గంటల సమయం అయింది. ఇక్కడ బస్సు కోసం గంటల తరబడి వేచి ఉన్నాను. సాయంత్రం వరకై నా బస్సులు నడుస్తే బాగుంటుంది. – ముడావత్ కిషన్, దేవతపల్లితండా (డిండి మండలం), నల్లగొండ ● -
భౌ..బోయ్ కుక్కలు
● మార్చి 22న రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓ పిచ్చి కుక్క చేసిన స్వైర విహారంతో ఆస్పత్రికి వచ్చిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. క్యాజువాలిటీ, ఎంసీహెచ్ భవన్ ఎదుట ఉన్న ఎండీ ఇమ్రాన్, ఆరేళ్ల చిన్నారి ఫైజా, ఫర్హా జబీర్, వెంకటయ్య, రాయప్ప, మరో గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. ● మార్చి 23న నగరంలోని గోల్ మజీద్ ఏరియాలోని సోఫియా మజీద్ ఎదురుగా ఇంటి ఎదుట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై కుక్క దాడి చేసింది. వీరిని జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించడంతో పాటు డాగ్ బైట్ టీకాలు ఇప్పించారు. అదే ఏరియాలో ఆరు నెలల క్రితం ఒకే కుక్క దాదాపు 40 మందిపై దాడి చేసి గాయపరిచింది. ఇలా నగరంలో చాలా కాలనీల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో పిల్లలను బయటికి ఒంటరిగా పంపించడానికి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. పాలమూరు: వీధి కుక్కలు బెడదతో ప్రజలు బెంబేలేత్తుతున్నారు.గుంపులు, గుంపులుగా తిరుగుతూ వీధుల్లో జనాలను వెంబడిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా..విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుడుతోంది. ప్రజలు ఇంట్లోంచి కిరాణాషాపులకు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ఇక రాత్రి పూట రోడ్లపై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 22 వరకు 980 వాయిల్స్ చొప్పున 6వేల మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారంటే జిల్లాలో కుక్కకాటు బాధితులు ఏవిధంగా పెరుగుతున్నారో అర్థం అవుతుంది. జిల్లాలో ప్రతి రోజు గ్రామ సింహాల బారినపడి రోజుకు సగటున 30 నుంచి 50 మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 14 వేల వరకు వీధి కుక్కలున్నాయి. కార్పొరేషన్ సిబ్బంది నిత్యం పది నుంచి 12 కుక్కలను పట్టుకుని స్థానిక మౌలాలి గుట్టలోని యానిమల్ బెర్ట్ కంట్రోల్(ఎంబీసీ)సెంటర్కు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. అక్కడ ఇనుప జాలీలలో 150 నుంచి 180 వరకు వీధి కుక్కలను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2,678 కుక్కలను పట్టుకున్నారు. ఎప్పటికప్పుడు శస్త్రచికిత్సలు చేసి తిరిగి నిబంధనల ప్రకారం వారం రోజుల తర్వాత వదిలేస్తున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను స్వతంత్ర యానిమల్ వెల్ఫేర్ సోసైటీకి మున్సిపల్ అధికారులు అప్పగించారు. ఒక్కో వీధి కుక్కకు శస్త్రచికిత్స చేసినందుకు రూ.1,400 చొప్పున ఈ సంస్థకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని వాటిని నియంత్రించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ కార్పొరేటర్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 31న బండ్లగేరిలో మున్సిపల్ కమిషనర్ పర్యటించిన నేపథ్యంలో వీధి కుక్కలు అధికంగా కన్పించడంతో వాటిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ● జిల్లాలో కుక్కకాట్లు పెరుగుతుండటంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో గ్రామంలో సగటున 10 నుంచి 30 మందిని ఒకటే కుక్క కరిచిన ఉదంతాలు ఉంటున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. శునకాలకు కు.ని. శస్త్రచికిత్సలు మొక్కుబడిగా జరుగుతుండటం వల్ల వాటి సంతతి పెరుగుతోంది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడం వల్ల కరిచిన వారికి ప్రాణాంతకమవుతోంది. ● జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్స్లలో యాంటీ రేబిస్వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహనను కల్పిస్తున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లి నిర్ణీత డోసులను తీసుకుంటుండటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు. జిల్లాలో రెచ్చిపోతున్న గ్రామసింహాలు శునకాలకు అడ్డాగా పాలమూరు వీధులు ఏటా పెరుగుతున్న కుక్క కాటు కేసులు ఇటీవల నగరంలో వరుసగా చిన్నారులపై దాడులు రెండేళ్లలో 13,216 మందికి యాంటీ–రేబిస్ వ్యాక్సిన్ -
వెంటనే బయటపడదు..
పిచ్చి కుక్క కరవడం వల్ల వెంటనే రోగం బయటపడదు. మెడపై, ముఖంపై కరిస్తే 15 రోజుల్లో, కాళ్లకు కరిస్తే ఆరు నెలల్లో రేబిస్ లక్షణాలు కన్పిస్తాయి. నరాల ద్వారా వైరస్ బ్రెయిన్కు చేరుకుని ఆ తర్వాత శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి వైద్యుడి సూచనల మేరకే ఏఆర్వీ టీకాలు తీసుకోవాలి. కరిచిన రోజు మొదటి డోస్ మూడో రోజు రెండో డోస్, 7వ రోజు మూడో డోస్, 14వ రోజు నాలుగో డోస్, 28వ రోజు ఐదవ డోస్ కచ్చితంగా తీసుకోవాలి. ఈ డోస్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరిగి వైరస్ను నశింపచేస్తోంది. – డాక్టర్ శివానందస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్, పశు సంవర్ధకశాఖ శనివారం ఉచిత వ్యాక్సినేషన్ పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ప్రతి ఏడాది యాంటీ రేబిస్ టీకాలు అందిస్తున్నాం. కుక్కల ఆరోగ్యం పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇంజక్షన్స్ ఇస్తున్నాం. వీధి కుక్కలను మున్సిపల్ అధికారులు అధిక మొత్తంలో ఒక దగ్గర పట్టుకుని ఉంటే మా బృందం వెళ్లి టీకాలు ఇస్తుంది. వచ్చే శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీగా చేపడుతున్నాం. – డాక్టర్ బి.మధుసూదన్గౌడ్, జిల్లా పశువైద్యాధికారి ● -
‘బ్యాట్’ జాయింట్ సెక్రెటరీగా రవికుమార్
మహబూబ్నగర్ క్రీడలు: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(బ్యాట్) జాయింట్ సెక్రెటరీగా మహబూబ్నగర్కు చెందిన ఎల్.రవికుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లో మంగళవారం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో రవికుమార్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన రాష్ట్ర అసోసియేషన్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. -
ఆర్డీఓ ఆస్తులపై ఏసీబీ ఆరా..
నారాయణపేట/మహబూబ్నగర్ క్రైం: ఏసీబీ వలలో చిక్కుకున్న నారాయణపేట ఆర్డీఓ రాంచందర్నాయక్కు సంబంధించి స్థిర, చర ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను సైతం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఆర్డీఓ కార్యాలయంతో పాటు ఆర్డీఓ నివాసం ఉంటున్న క్వార్టర్స్లో సోదాలు చేపట్టి రూ.10.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లోని బుధవారం సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బయట పడినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహబూబ్నగర్, జడ్చర్లలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, భూత్పూర్లో 3.18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీలో తేలింది. ఆర్డీఓ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలతో పాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులు, బినామీలు ఎవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తూ వారి బ్యాంకు ఖాతాలను సైతం జల్లెడ పట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నగదు దొరికింది రూ.10.20 లక్షలు అయితే దాచుకున్న సొమ్ము ఎంత అనేది తేటతెల్లం చేసేందుకు అధికారులు బయటికి తెలియకుండా రహస్యంగా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్డీఓ స్వగ్రామమైన భూత్పూర్ మండలం పోత్లగడ్డతండాలో ఆయన కుటుంబసభ్యులపై ఏమైనా వ్యవసాయ భూములు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు ఏసీబీలో వలలో చిక్కుకున్న ఆర్డీఓ రాంచందర్నాయక్ పై లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారుల బృందం బుధవారం హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 14 రోజుల పాటు రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ.10.20లక్షల నగదు స్వాధీనం జడ్చర్ల, మహబూబ్నగర్లో నాలుగు ఓపెన్ ప్లాట్లు భూత్పూర్లో 3.18 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు నారాయణపేటలో అర్ధరాత్రి వరకు ఆర్డీఓ ఇంట్లో సోదాలు ఆర్డీఓ కుటుంబసభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాల తనిఖీ -
దేశం, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేద్దాం
దామరగిద్ద: దేశ రక్షణ, హింధూ ధర్మ సంరక్షణ కోసం ప్రతి హిందువు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్ అప్పాల ప్రసాద్ జీ, ఇస్కాన్ ప్రతినిధులు గీత సంస్కృతి భోదకులు వదరరాజ్ దాస్ ప్రభుజీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని భవానిమాత ఆలయ ఆవరణలో ఏర్పా టు చేసిన హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ సమ్మేళనాకి వారు ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి సమైక్య భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలన్నదే హిందూ ధర్మం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వీఎచ్పీ వంటి సంస్థలు చేపడుతున్న కార్యక్రమాల్లో మనమంత పాలుపంచుకోవాలని సూచించారు. ఏడాది క్రితం ఇదే రోజున జమ్ముకాశ్మీర్లోని పహేల్గాం ఉగ్ర దాడిలో మతాన్ని చూసి పర్యాటకులను హతమార్చిన ఘటన మనందరిని కలిచివేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రమూకలను మట్టుబెడ్డిన ఘనత మన జవాన్లకు దక్కిందన్నారు. కుటుంబం కోసం సంతానం ఎంత ముఖ్యమో దేశాన్ని రక్షించడం కోసం ప్రతి ఇంటి నుంచి సైనికులను పంపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్నాథ్, హిందే సమ్మేళన సమితి అద్యక్షుడు అశోక్, ఆర్ఎస్ఎస్ బాధ్యులు సత్యనారాయణరెడ్డి, రాఘవేందర్గౌడ్, నాగేందర్లు, వెంకట్రాములు, రవికుమార్, మాణిక్ పాల్గొన్నారు. -
అవమానాన్ని భరించలేక అంతమొందించాడు
● గొంతునులిమి సంపులో పడేసిన వైనం ● అనుమానాస్పద మృతి కేసు చేధించిన పోలీసులు కల్వకుర్తి టౌన్: తోటకు వచ్చిన వ్యక్తి స్నేహితుల ఎదుట జరిగిన వివాదంలో అవమానాన్ని భరించలేక వ్యక్తిని హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తును ప్రారంభించి హత్యగా తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్కు చెందిన శ్రీనివాస్(56) వృత్తిరీత్యా మామిడితోటలతో పాటుగా ఇతర తోటలను లీజుకు తీసుకొని పండ్ల వ్యాపారాన్ని చేసేవాడు. ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్లో ఓ తోటను లీజుకు తీసుకొని అక్కడే తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ నెల 13న పెద్దాపూర్ గ్రామానికి చెందిన చక్రవర్తిగౌడ్ అనే వ్యక్తి ఈ తోటను శ్రీనుకు లీజుకి ఇప్పించటంతో అతనితో ఉన్న చనువుతో అక్కడికి వారి స్నేహితుడు రాంరెడ్డి, వాళ్ల పిల్లలను తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ వేరే తోటలో భార్యను దించి, తిరిగి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న మామిడి తోటకు వచ్చాడు. ఆ సమయంలో తోటలోకి వచ్చిన శ్రీనివాస్ చక్రవర్తి స్నేహితులతో గొడవకు దిగగా, అక్కడే ఉన్న రాంరెడ్డి సోదరుడు వినోద్రెడ్డి అక్కడకు రావటంతో శ్రీనివాస్ వారిని మా తోటలోకి ఎందుకు వచ్చారని మందలించాడు. వెంటనే అక్కడే ఉన్న చక్రవర్తి ఇరువురికి సర్దిచెప్పి గొడవను ఆపాడు. అవమానాన్ని భరించలేక... స్నేహితుల ఎదుట తనను అవమానించాడన్న నెపంతో చక్రవర్తితో శ్రీనివాస్కు మధ్య మాటమాట పెరిగి అది గొడవకు దారితీసింది. ఈ క్రమంలో చక్రవర్తి శ్రీనివాస్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. తోటలో ఉన్న సంపు వద్ద ఉండగా వెనుక నుంచి వెళ్లి గొంతునులిమి సంపులో పడేశాడు. అనుమానం రాకుండా అతని బట్టలు, సెల్ఫోన్ను అదే సంపులో వేసి, ఈత రాక సంపులో పడినట్లుగా చిత్రీకరించాలని చూసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో వెలుగులోకి... శ్రీనివాస్ మృతిపై అతని భార్య వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ క్రమంలో సంపులో నీటిని బయటకు తోడుతుండగా శ్రీనివాస్ మృతదేహాం కనిపించింది. సంఘటనా స్థలంలో నిందితుడు చక్రవర్తి ఫోన్ పోలీసులకు లభ్యం కాగా వారి శైలిలో విచారణ చేయగా పొంతన లేని సమానాధాలు చెపుతుండటంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని కల్వకుర్తి సీనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ తెలిపారు. హత్య కేసును త్వరితగతిన విచారించిన వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి, సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి అభినందించారు. -
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
వనపర్తి రూరల్: రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని సోమవారం పెబ్బేరు పట్టణంలోని సుబాష్ చౌరస్తాలో ఇళ్లు కోల్పోయిన బాధితులు శ్రీధర్రెడ్డి , వెంకట్రావ్జీ, వెంకటేష్, హన్మంతు రెడ్డి, శ్యామ్లాల్, చాకలి రాముడు, సీతమ్మ, నరేందర్జీ, మోహన్లాల్, నర్సిం హ్మ గౌడ్, శ్రీనాథ్, రఫీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎంఐఎం మండల అధ్యక్షుడు అప్రోజ్, బీఎస్పీ నేత ఏబీజే సత్యం సాగర్, సీపీఐ నేత పెద్ద ఖాజ, బీసీ పోలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్ దీక్షలో పాల్గొని మద్దతు తెలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది నుంచి ఆగిన వనపర్తి రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి, విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా ప్లాట్ కేటాయించి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారి విస్తరణ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. అదే విధంగా చౌరస్తా నుంచి ఇరువైపులా 40 అడుగుల రహదారి నిర్మాణం చేపట్టాలని, రహదారి విస్తరణ ఎక్కువ, తక్కువ లేకుండా బాధితులు అందరూ ఒకటే కాబట్టి ఇష్టం వచ్చినట్లు కాకుండా అంతటా 40 ఫీట్లు ఉండేలా చూడాలని కోరారు. అంబేద్కర్ చౌక్లో మహిళలకు, పురుషులకు టాయిలెట్లు నిర్మించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు దీక్షలు కొనసాగుతాయని వారు చెప్పారు. కార్యక్రమంలో రోడ్డు విస్తరణ భాదితులు పాల్గో న్నారు. -
అగ్నిమాపక వారోత్సవాల నిర్వహణ భేష్
అచ్చంపేట: అగ్నిమాపక వారోత్సవాల నిర్వహణ భేష్ అని భూగర్భ కేంద్రం సీఈ సత్యనారాయణ అన్నారు. టీజీ జెన్కో పరిధిలోని శ్రీశైలం భూగర్భ విద్యుత్ కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను వారం రోజుల పాటు కేంద్రం వద్ద, ఈగలపెంట, దోమలపెంటలో సంతృప్తికరంగా నిర్వహించారని స్టేషన్ ఫైర్ సిబ్బంది, స్టేఫ్టీ ఇంజినీర్లను అభినందించారు. వారోత్సవాలు ముగింపు సందర్భంగా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఈ మాట్లాడారు. భూగర్భ కేంద్రం భద్రతకు సేఫ్టీ ఇంజినీర్లు, ఫైర్ సిబ్బంది ఎల్లవేళల అప్రమత్తతతో విధులు నిర్వహిస్తూ కేంద్రాన్ని కంటికి రెప్పలా కాపాడాలన్నారు. సేఫ్టీ డీఈ శ్రీకుమార్గౌడ్, ఏడీఈ రాము, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జునను ప్రశంసించారు. భూగర్భ కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలను అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం సంతృప్తి కల్గించిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ(ఓఅండ్ఎం)ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో నేలకు రక్ష
ఏ పంటకు ఎంత లోతులో నమూనా తీయాలి? ● వ్యవసాయ పంటలకు 6 అంగుళాలు ● పండల్ల తోటలకు 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమునా ● చౌడు, ఆమ్ల నేలల్లో అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమునా తీయాలి. మట్టి నమునాలు ఎలా సేకరించాలంటే? ● నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొక్కలు తీసివేయాలి. ● అగర్ లేదా పార ద్వారా నమునాలు సేకరించాలి. ● పొలంలో ‘వీ’ ఆకారంలో గోతులు తీయాలి. ● గొయ్యి అంచుల నుంచి పారతో గాని లేదా తాపీతోగాని మట్టిని సేకరించాలి. ● పొలంలో 8 నుంచి 10 స్థలాల నుంచి మట్టిని సేకరించాలి. ● సేకరించిన మట్టిని అంతటిని కలిపి నేలమీద పరచి దానిని నాలుగు భాగాలు చేయాలి. ● మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకోని మిగిలిన మట్టిని పారవేయాలి. ఈ విధంగా అరకిలో మట్టి నమునాలు సేకరించాలి. ● అరకిలో మట్టిని గుడ్డ నుంచి లేదా పాలిథీన్ సంచిలో నింపి అందులో రైతు పేరు, చిరునామా, సర్వే నంబర్, పొలం విస్తీర్ణం, మెట్ట/పల్లం/ఆరుతడి పంటలు, గత మూడు సంవత్సరాల్లో వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ లాంటి వివరాలు జతయాల్సి ఉంటుంది. సమాచార పత్రంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత భూసార పరీక్ష కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోని పారదర్శకంగా మట్టి నమునాలు పంపితే ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత భూసార పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలంపూర్ : మనం బతకడానికి ఆధారమైన నేలకు భూసార పరీక్షలు ఎంతో అవసరం. భూమిలో ఉన్న పోషకాలు వాటి లోపాలు తెలుసుకోవడానికి అందుకు అనుగుణంగా పంటలు వేయడానికి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు సూచించారు. భూసార పరీక్షల ద్వారా నేల భౌతిక, రసాయన లక్షణాలు తెలుసుకోనే వీలుంటుందని, రైతులు మట్టి నమునాలు సేకరించే సమయాల్లో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని ఏడీఏ వివరించారు. భూసార పరీక్ష అంటే? పొలం నుంచి సేకరించిన మట్టిని ప్రయోగశాలల్లో వివిధ భౌతిక, రసాయనిక పద్ధతుల ద్వారా విశ్లేంషించి వాటి లక్షణాలు తెలుసుకోవడం. అలాగే అందులోని పోషకాలు ఏంటీ, తక్కువగా, మధ్యస్థంగా ఉన్నవి ఏంటీ? వాటి ఫలితాల ఆధారంగా ఏ పంట వేసుకోలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్షలుగా పేర్కొన్నారు. భూసార పరీక్షలతో లాభాలు: ● పొలంలో వివిధ పోషకాల స్థాయి ఎంత వరకు ఉందో తెలస్తోంది. ● ఏ పంట వేయాలో తెలుసుకోనే అవకాశం ఉంటుంది. ● ఎరువులను ఎంత మోతాదులో.. ఎంత వరకు వేసుకోవాలో తెలుస్తుంది. ● నేల సమస్యలు, కారు చౌడు, పాలచౌడు తెలుసుకోని స్థాయి సవరించుకోవచ్చు ● ఎరువుల అనవర ఖర్చు తగ్గించవచ్చు ● పంటసాగులో అధిక దిగుబడి సాధించుకోనే అవకాశం. మట్టి నమునాలు ఎప్పుడు సేకరించాలి ? పంట కోత తర్వాత వేసవిలోనూ, పంటలు లేని సమయాల్లో మట్టి నమునాలు జాగ్రత్తగా తీసి పంపాలి. మట్టి నమునాలు ఎక్కడ తీయకూడదు? ● ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు మట్టి నమునాలు సేకరించకూడదు. ● నీరుపెట్టిన తర్వాత మట్టి నమునాలు సేకరించరాదు. ● నీడ పడే ప్రదేశాల్లో సేకరించరాదు. ● నీటి ముందు ఉన్న ప్రాంతాల్లో సేకరించ కూడదు. ● ఎరువుల కుప్పల వద్ద, గట్లవద్ద, చెట్ల దగ్గర ప్రాంతాల్లో మట్టిని తీయరాదు. ఎంత విస్తీర్ణానికి మట్టి నమూనా తీయాలి? ● ఒక పొలానికి ఒక నమూనా తీయాలి. ● పొలం విస్తీర్ణం ఎక్కువగా ఉంటే ప్రతి రెండు నుంచి ఐదు ఎకరాలకు ఒక నమూనా తీయాలి. ● నేల నిర్మాణం, రంగు, మురుగు పారుదల సౌకర్యం, నేలవాలు, చౌడు, క్షార, ఆమ్ల గుణాలు, పంటల సరళి తదితర విషయాల్లో తేడాలు కనిపిస్తే అన్ని రకాల నమూనాలు ఆ పొలం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. పాడి–పంట -
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
మహబూబ్నగర్ క్రైం: మెడిసిన్ విద్యార్థులు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి తప్పా.. ర్యాగింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టరాదని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. రూరల్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో యాంటీ–ర్యాగింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చట్టరీత్యా నేరం కావడంతోపాటు సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి విద్యార్థుల ఉత్తమ విద్య, భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందని తెలిపారు. అనైతిక చర్యలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీస్తాయని వెల్లడించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి కళాశాలలో ఆరోగ్యకరమైన విద్య వాతావరణం నెలకొల్పడానికి ప్రతివిద్యార్థి బాధ్యతగా ఉండాలన్నారు. కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ గాంధీనాయక్, ఎస్ఐ భూపాల్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జోషి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు -
ఉత్సాహంగా ‘సంసద్ ఖేలో మహోత్సవ్’
మహబూబ్నగర్ క్రీడలు: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడాపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. మండల, నియోజకవర్గస్థాయిల్లో పూర్తయిన క్రీడాపోటీలు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం నుంచి పార్లమెంట్ స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు బాలురకు క్రికెట్, బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. క్రికెట్లో మహబూబ్నగర్, నారాయణపేట, జడ్చర్ల, కొడంగల్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో పార్లమెంట్ స్థాయిలో మక్తల్ జట్టు విజేతగా, దేవరకద్ర జట్టు రన్నరప్గా నిలిచాయి. మంగళవారం కబడ్డీ, ఖోఖో పోటీలతో పాటు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ పార్లమెంట్ ఇన్చార్జి ముచ్చర్ల జనార్దన్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, ఇన్చార్జి నవీన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.18 లక్షల పరిహారం ఇవ్వాలి
ఖిల్లాఘనపురం: కొడంగల్లోని లగచర్ల రైతులకు చెల్లించిన ప్రకారం గణప సముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పయిన రైతులకు పరిహారం చెల్లించాలని గణప సముద్రం రిజర్వాయర్ భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు నల్లమద్ది రవీందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కల్యాణ మండపంలో సోమవారం గణపసముద్రం రిజర్వామర్లో భూములు కోల్పోయిన రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఒక్కోక్కరు వారి అభిప్రాయాలను చెప్పారు. అనంతరం సంఘం అధ్యక్షుడు, పెద్దలు రాళ్ల కృష్ణయ్య, రాఘవేందర్రెడ్డి, కుర్వ మాసయ్య తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన విధంగా ఎకరాలకు రూ.18 లక్షల పరిహారం, 150 గజాల ఇంటి స్థలంతో పాటుగా ఇళ్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చును ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కొలతలు చేసిన సమయంలో 7 రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పిన నాయకులు 10 నెలలు కావస్తున్న ఇప్పటికీ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎప్పుడు అడిగినా 10 రోజుల్లో ఇస్తామని చెబుతున్నారని ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని రైతులకు ఇచ్చిన విధంగా వెంటనే పరిహారం ఇవ్వకుంటే నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. బుధవారం రాస్తారోకో కార్యక్రమం చేపట్టి అదే రోజు రైతులందరం చర్చించి నిరసన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
మిడ్జిల్: మండలంలోని వేముల పంచాయతీ పరిదిలోని తమ్మడికుంట తండాలో రైతు రవినాయక్ సాగుచేసిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండాకు చెందిన రైతు రవినాయక్ ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. పంటమొత్తం కోత దశకు రాగా.. సోమవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంని కాలిబూదదైంది. దాదాపు రూ.4లక్షలు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరారు. విద్యుదాఘాతంతో దుకాణం దగ్ధం కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు షార్ట్ సర్కూట్తో దుకాణం దగ్ధమైన ఘటన పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు పట్టణంలోని శివాజీ చౌరస్తాలో నివాసం ఉంటున్న గంగ్జి హరికిషన్ మొబైల్, గడియారాల రిపేర్షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే ఆదివారం రాత్రి షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో షాపులోంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు యజమానికి సమాచారం అందించారు. తెరిచే చూసే సరికి షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. -
12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన బి.వెంకటేష్ చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు పల్లెర్ల గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టి సుమారు 12 క్వింటాళ్లు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పంచనామ పూర్తి చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి మండలాల పరిధిలో ఎవరైనా అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినా, రవాణా చేసినా లేదా ఇతరులకు అమ్మినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మన్యంకొండ నరసింహస్వామికి విశేష పూజలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని కోనేరు వద్ద గల వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయం వేళల్లోనే విశేష అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పాలతో అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో క్రీ‘డల్’
● 63 జూనియర్ కళాశాలల్లో ఒక్క పీడీ కూడా లేని వైనం ● అండర్–19 ఎస్జీఎఫ్ క్రీడలకు ఇబ్బందులు మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల (పీడీ) కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 63 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 25వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాని 63 కళాశాలలకు ఒక్క ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) లేకపోవడం గమనార్హం. మహబూబ్నగర్ జిల్లాతో పాటు మిగతా జిల్లాలైన నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పీడీలు లేకపోవడం గమనార్హం. అండర్–19 ఎస్జీఎఫ్కు నిర్వహణ భారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో ముఖ్యంగా ప్రతి ఏడాది నిర్వహించే అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల నిర్వహణపై ప్రభావం ఏర్పడుతుంది. కళాశాలల్లో పీడీ లేకపోవడంలో గత విద్యాసంవత్సరం నుంచి జిల్లా పాఠశాల ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్–19 స్కూల్గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ఎంపికలు నిర్వహించారు. కళాశాలల్లో పీడీలను నియమించాలి... ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పీడీలు లేరు. పాఠశాలస్థాయిలో అండర్–14, అండర్–17 ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. అయితే పీడీలు లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అండర్–19 ఎస్జీఎఫ్లో విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటలేకపోతున్నారు. హైస్కూళ్లలోని సీనియర్ పీడీలకు పదోన్నతులు కల్పించి జూనియర్ కళాశాలల్లో పీడీలుగా నియమించాలని విజ్ఞప్తి. పీడీలు వస్తే కళాశాలల్లో క్రీడలు నిరంతరంగా జరుగుతాయి, తద్వారా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభచాటి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. – దూమర్ల నిరంజన్, తెలంగాణ రాష్ట్ర పీడీ, పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు -
సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు
రాజాపూర్: ఓ కారు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టిన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుల్కచర్ల మండలానికి చెందిన అరుణ్కుమార్ నేవీ ఉద్యోగి కాగా మహబూబ్నగర్లో నివసిస్తున్నాడు. సోమవారం హైదరాబాద్ నుంచి కారులో మహబూబ్నగర్కు వస్తుండగా రాజాపూర్ మండల కేంద్రంలో ముందు వెళ్తున్న కారును తప్పించపోయి సడన్గా పక్కకు తిప్పడంతో కారు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న అరుణ్కుమార్తో పాటు మరో వ్యక్తి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి కారును పక్కకు జరిపారు. ఒక వేళ వెనక నుంచి మరో వాహనం వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు తెలిపారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్డుపై ఉన్న కారును పక్కకు తీశారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య నాగర్కర్నూల్ క్రైం: వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మున్సిపాలిటీలోని ఎండబెట్లలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. ఎండబెట్లకు చెందిన బొడ్డుపల్లి వీరేష్ (26) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్య వెళ్లిపోయిందనిమనస్తాపం..గోపాల్పేట: భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆవేదనకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా.. మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన గగనం శ్రీనివాసులు(33) తన భార్య తనను విడిచిపెట్టి వారి అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిందని బాధతో శ్రీనివాసులు కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఇదేక్రమంలో ఆదివారం 3గంటల ప్రాంతంలో కోదండ రామస్వామి ఆలయం ముందున్న కోనేరుకు వెళ్లి నీటిలో మునిగాడు. ఆదివారం ఫైర్ సిబ్బంది కోనేరులో వెతికి బాడీని బయటకు తీశారు. బాధితుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గోపాల్పేట ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. -
‘గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భారతీయులు ఆరాధించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆల్ మే వా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షేక్ ఫారుక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించి న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా బక్రీద్ పండుగ వస్తుందంటేనే మహబూబ్నగర్ జిల్లాలో గోవులను సంతలో అమ్ముతారని ఆ సంతలో కొనుగోలు చేసిన ఖురేషి తెగవారిపై గోరక్షక దళాల పేరుతో దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు బనాయించి వారికి నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం గోవులు సంతలో అమ్మకుండా పటిష్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు ఖురేషి తెగవారికి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మొహమ్మద్ తక్హుద్దీన్, మొహమ్మద్ సలీం మహమ్మద్ సోహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
దేవరకద్ర: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. మక్కలకు మద్దతు ధర రూ.2400 ప్రకటించి కొనుగోలు చేయాలని నిర్ణయించిందని.. ఇందుకు మొదటిసారిగా దేవరకద్ర మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సోమవారం దేవరకద్ర మార్కెట్ యార్డులో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో వరితో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ లభిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఇథనాల్ ఫ్యాక్టరీని దూరంగా తరలించాలని బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతంపై స్పందిస్తూ.. ఇంటిగ్రేటెడ్ స్కూలును అక్కడి నుంచి తరలించే ప్రసక్తి లేదని.. నిజంగా కాలుష్యం ఏర్పడితే ఫ్యాక్టరీనే ఈ ప్రాంతం నుంచి తరలిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీని తెచ్చింది.. ఫ్యాక్టరీ ఓనర్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి అని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూలు వస్తే ఇథనాల్ కంపెనీ తరలించే అవకాశం ఉందని భావించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆ కంపెనీతో కుమ్మకై ్క అభిప్రాయ సేకరణ పేర నాటాకాలకు తెరలేపారని విమర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కతలప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక, వ్యవసాయ అధికారి రాజేందర్ అగర్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి, వైస్ చైర్మన్ యుగంధర్రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ అరవింద్రెడ్డి, మండలాధ్యక్షుడు అంజిల్రెడ్డి, నరేందర్రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు తక్షణం పరిష్కరించాలి
● కలెక్టర్ ఖుష్బూగుప్తా ● గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో అర్జిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సీఎం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచకూడదని వాటి పరిష్కారానికి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఖుష్బూగుప్తా అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియతో కలిసి ప్రజల నుంచి అర్జిలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీ, భూసర్వే–ల్యాండ్ రికార్డ్స్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల వద్ద ఉన్న ిపెండింగ్ ఫైళ్ల గురించి సీఎం రేవంత్రెడ్డి ప్రస్తావించారని తెలిపారు. ఫైళ్లను పెండింగ్లో ఉంచడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా వాటికి పరిష్కరించేందుగు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనాభా గణనకు సంబంధించిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. అధికారులపై ఆగ్రహం... ప్రజావాణికి హాజరుకాని అధికారులపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసు ఆదేశా లు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వ హిస్తుందని, దీనిని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో మున్సిపల్, జిల్లా సంక్షేమం, భూ–సర్వే రికార్డులు, గృహనిర్మాణం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, గనులు, కాలుష్య నియంత్రణ తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 126 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామ్రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నర్సింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వేసవికాలం కావడంతో నగరంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం క్లాక్టవర్ వద్ద ‘జలధార’ పేరిట వ్యాపారులకు ఉచితంగా కూల్వాటర్ క్యాన్స్ పంపిణీ చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభించారు. అంతకుముందు అప్పన్నపల్లి, ఎదిరలో నిర్మించిన కొన్ని ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయా కార్యక్రమాలలో నగర మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,329 మంది విద్యార్థులకు 1,250 మంది హాజరయ్యారు. ఇక ఎస్సెస్సీలో 19 పరీక్ష కేంద్రాలు ఉంటే 836 మందికి 725 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెండు ఫ్లయింగ్స్క్వాడ్స్, 15 మంది సిట్టింగ్స్క్వాడ్స్ను నియమించారు. ఎస్సీ గురుకులాల్లో దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మినీ గురుకులాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్లాక్ సీట్ల భర్తీకి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని, వచ్చే నెల 5వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని పేర్కొన్నారు. 11వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, 12వ తేదీన అడ్మిషన్ల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ‘22 వరకు దరఖాస్తు చేసుకోవాలి’ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఉన్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రిల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మోహన్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 22వ తేదీ వరకు అవకాశం ఉందని, వచ్చేనెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలు నివారణపై అవగాహన అవసరం మహబూబ్నగర్ క్రైం: అగ్నిప్రమాదాలు ఏర్పడినప్పుడు అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి అనే అంశంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కిషోర్ అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల(మహిళలు)లో అగ్ని ప్రమాదాలపై సదస్సు నిర్వహించారు. వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయని అలాంటి సమయంలో భయాందోళనకు గురికాకుండా చాకచక్యంగా స్పందించాలన్నారు. అగ్నిప్రమాదాలు జరిగితే 101తో పాటు 87126 99351, 87126 99350లకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ మల్లిఖార్జున్ అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ సెప్టీ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. -
ఉమ్మడి జిల్లాలో రోగులు ఇలా..
కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు ● నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట ● మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు ● పాలమూరువ్యాప్తంగా 908 మంది బాధితులు మహబూబ్నగర్ 361నాగర్కర్నూల్ 184జోగుళాంబ గద్వాల 162వనపర్తి 110పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్– ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నారాయణపేట 91 -
ప్రభుత్వానికి నివేదిక..
వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొ త్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి వైద్యుడిని సంప్రదించాలి.. కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రా వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అ యితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్వోఎంఎల్, హెచ్ డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు -
ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం
స్టేషన్ మహబూబ్నగర్: ఈనెల 22 ఉదయం మొదటి బస్సు నుంచి మొదలయ్యే ఆర్టీసీ నిరవధిక సమ్మెకు కార్మికులందరం సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జి.లక్ష్మణ్గౌడ్, విజయబాబు, సాయిరెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులతో కలిసి వారు సమ్మె సన్నాహక పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా లెక్క చేయలేదన్నారు. విధిలేని పక్షంలో తాము సమ్మెబాట పట్టామని, ప్రజలు, వివిధ సంఘాలు, మేధావులు తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బసప్ప, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మక్తల్ ఆరో వారు్డలో బీజేపీ విజయం
మక్తల్: నారాయటపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఆరోవార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎర్కలి సత్యమ్మ విజయం సాధించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగాల్సి ఉండగా.. బీజేపీ అభ్యర్థి ఎర్కలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో పోలింగ్ వాయిదా పడింది. శనివారం పోలింగ్ నిర్వహించి.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఎర్కలి మహదేవప్ప బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె తన సమీప ప్రత్యర్థి ఎర్కలి మార్పైపె 37 ఓట్ల మెజారీతో విజయం సాధించారు. మొత్తం 1,453 ఓట్లకు 1,294 పోల్ అయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి సత్యమ్మకు 628 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మారెప్పకు 591 ఓట్లు, బీఆర్ఎస్కు 46, నోటాకు 4, ఓటర్లు వచ్చాయి. 25ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.గెలుపొందిన అభ్యర్థి సత్యమ్మకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
మహిళా బిల్లుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు
పాలమూరు: వచ్చే 2029ఎ న్నికల్లో మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ అందించాలనే ఉద్దేశంతో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్, మిత్ర పక్షాలు వ్యతిరేకించాయని, మహిళల సంక్షేమాన్ని వీరు అడ్డుకున్నారని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్లతో ఆమె మాట్లాడారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళ రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటూనే ఉందని, ఎన్నికల వేళ మహిళల రిజర్వేషన్పై మట్లాడటం, తర్వాత తూట్లు పొడవడం అనాధిగా కొనసాగుతుందన్నారు. మహిళ రిజర్వేషన్కు కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు కుంటిసాకులు చెబుతూ వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపించారు. డీలిమిటేషన్ జనాభా ప్రకారం జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే భావాన్ని వ్యక్తం చేసినప్పుడు పరిగణలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా 50 శాతం సీట్లు పెంపు ప్రతిపాదన చేశారన్నారు. 17 స్థానాలు ఉన్న తెలంగాణలో మరో 9 స్థానాలు పెంచితే 26 స్థానాలకు పెరిగే అవకాశం ఉండేదని తెలిపారు. కేంద్రం సమతుల్యమైన ఫార్ములా తీసుకొస్తే దేశాన్ని విభజించే తీరుగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే భావన కూటమి పార్టీలు తీసుకువచ్చారని విమర్శించారు. ఈనెల 24న మహబూబ్నగర్లో జరగనున్న ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరవుతారని తెలిపారు. ఆత్మకూర్, కొత్తపల్లి బ్రిడ్జి వ్యతిరేకించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు అంజయ్య, సత్యం, కృష్ణవర్ధన్రెడ్డి, బాల్రెడ్డి, మర్రి జ్యోతి, పద్మావేణి, హరికృష్ణ పాల్గొన్నారు. ● మహబూబ్నగర్ నగరంలోని మదీనా మజీద్, కొత్త గంజి ఏరియాలో రైల్వే అధికారులతో కలిసి రైల్వే డబ్లింగ్ పనులను ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి స్థానికుల ఇబ్బందులు పరిష్కరించాలని రైల్వే అధికారులకు సూచించారు. -
ఆర్టీసీ పరిరక్షణకోసమే సమ్మె
ఆర్టీసీ పరిరక్షణ కోసమే తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటినే పరిష్కరించమని కోరుతున్నాం. 2021 పేస్కేల్ అమలు చేస్తామని చెప్పి ఇంత వరకు నెరవేర్చలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామన్న హామీని మరిచారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. – జి.లక్ష్మణ్గౌడ్, ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కార్మికుల సమస్యల పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సంస్థ ను కాపాడు కునే లక్ష్యంతోనే సమ్మె చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. – విజయ్బాబు, ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు -
సమ్మెకు సై..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి నుంచి ఆర్టీసీ బంద్ డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట రీజియన్లోని 10 డిపోల పరిధిలోనిలిచిపోనున్న బస్సు సర్వీసులు అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..అద్దె బస్సులు నడిపేలా చర్యలు -
లారీని ఢీకొట్టిన కారు.. తల్లి, బిడ్డ దుర్మరణం!
మహబూబ్ నగర్: అతివేగం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వెనక నుంచి ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లి, ఐదు నెలల కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అడ్డాకుల శివారులోజాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్రెడ్డి భార్య నందిని (21), ఐదు నెలల కుమారుడు కన్నయ్యతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి తెల్లవారుజామున కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో అడ్డాకుల శివారులోని స్నేహ పరిశ్రమ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టుకుంది. ప్రమాదంలో కారు ఎడమ సీట్లో కూర్చున్న నందిని తల భాగం పూర్తిగా ఛిద్రమై రోడ్డుపై పడింది. నందిని ఒళ్లో కూర్చున్న బాలుడు కారు ముందు భాగంలో ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. ఇక కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రకా‹Ùరెడ్డి సీటు బెల్టు ధరించడంతో ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని తల్లీకొడుకుల మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రకాష్ రెడ్డిని అంబులెన్స్లో వనపర్తి జిల్లా కేంద్రానికి పంపించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఏదైనా వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఎడమ వైపు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీ వెనుక ఢీకొట్టాడా.. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రకాష్రెడ్డిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించినట్లు తెలిసింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెప్పులే ప్రమాదానికి కారణమా! కారు నడిపేటప్పుడు ప్రకాష్రెడ్డి తాను ధరించిన శాండిల్స్ను డ్రైవింగ్ సీటు వద్దే వదిలాడు. వేగంగా వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో బ్రేక్ వేయడానికి ప్రయతి్నంచిన సమయంలో శాండిల్స్ బ్రేక్ పెడాల్ కిందకి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనివల్లే బ్రేక్ వేయడానికి వీలు కాకపోవడంతో కారు వెళ్తున్న వేగంతోనే లారీని ఢీకొట్టి ఉంటుందని, అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీని కారు తగిలే సమయంలో బ్రేక్ వేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో కాళ్ల వద్ద చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు పెట్టొద్దని, గతంలో కూడా ఇలాగే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని నిపుణులు అంటున్నారు. -
భయం పోయింది..
ముందు ఒక లెక్క చేయడానికి నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు అదే లెక్కను సెకండ్లలో చేస్తాం. గణితం అంటే భయం పోయింది. – గౌతమి, విద్యార్థిని, పెదిరిపాడు విస్తరణ అవసరం.. ప్రస్తుత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించి మరింత మంది విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. లెక్కలంటే భయం అనే భావనను తొలగించి ఆసక్తిగా మార్చగల సామర్థ్యం ఈ కార్యక్రమంలో ఉందని స్పష్టం అవుతోంది. – బాలకిష్టప్ప, ప్రధానోపాధ్యాయుడు స్పష్టమైన మార్పు.. విద్యార్థులు గణితాన్ని సులభంగా అర్థం చేసు కొని వేగంగా చేయగలిగే స్థాయికి చేరుకోవడం ఈ కార్య క్రమం విజయాన్ని సూచిస్తోంది. తక్కువ సమయంలోనే స్పష్టమైన మార్పు కనిపించడం ప్రత్యేకం. – విద్యాసాగర్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి మంచి ఫలితాలొచ్చాయి.. గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తగ్గిస్తూ ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేసే దిశగా వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో ఆత్మవిశ్వాసం పెరగడం ప్రశంసనీయమైన అంశం. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ● -
వేసవి దుక్కులతో లాభాలు
అలంపూర్: పంటల సాగులో జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. యాసంగి పంట ముగిసిన తర్వాత వానాకాలం పంట సాగు చేసే ముందు వేసవిలో భూములను దున్నడం పంటకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వేసవి దుక్కిలు పంటకు లాభం చేకూర్చుతాయని వివరిస్తున్నారు. రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ కోరుతున్నారు. వేసవి దుక్కి అంటే.. వానాకాలం సాగుకు ముందుగా వేసవిలో పొలాన్ని లోతుగా దున్నే విధానాన్ని వేసవి దుక్కి అంటారు. కలుపు నివారణ లోతు దుక్కుల వలన పొలంలో ఉండే మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ వంటి మొదలగు దుంపలతో సహా తొలగించవచ్చు. దీంతో ఎండిపోయిన కలుపు సమస్య తగ్గుతుంది. పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. తెగుళ్ల నివారణ భూమిలో ఉండి సాగుకాలంలో పైరును ఆశించే వివిధ రకాల శీలింధ్రాలు వేసవిలో చేపట్టే లోతు దుక్కుల వలన ఎండ తాకిడికి చనిపోతాయి. తర్వాత పంట కాలంలో ఈ తెగుళ్ల తీవ్రత తగ్గుతుంది. వివిధ పంటల్లో ఎండు తెగుళ్లును వేసవి దుక్కుల వలన తగ్గుముఖం పట్టించవచ్చు. దుక్కులతో ప్రయోజనాలు ప్రాథమికంగా వేసవి దుక్కుల వలన తొలకరిలో పడే వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. దీంతోపాటు నేలలో తేమ నిల్వ శాతం వృద్ధి చెందుతుంది. నీరు బాగ ఇంకడం వలన నేల గుల్లబారి విత్తనం నాటేందుకు అనుకూలంగా మారుతుంది. తద్వారా మొలక శాతం పెరుగుతుంది. ముందు పంట మొదళ్లు, చెత్త ఆకులు, నేలలో కలిసి సేంద్రియ పదార్థంగా మారి నేల సారం పెరుగుతుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని లోతుగా దున్ని క్రింది నేలను పైకి వచ్చేట్లు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న వివిధ పురుగుల గుడ్లు, ప్యూపాలు సూర్యరశ్మితాకిడికి చనిపోతాయి. వేసవి దుక్కులతో వరి పైరును ఆశించే కాండం తొలుచు పురుగు మొక్కజొన్నలో వచ్చే పురుగుల ఉధృతిని తగ్గింవచ్చు. నేలలోపల గట్టి పొరలను పగులగొట్టడంతో మొక్కల వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని వస్తాయి. వేరు వ్యవస్థ నేలలోకి బాగా విస్తరించడం వలన మొక్కల ఎదుగుదలకు కావాలసినంత తేమ పోషకాలు సమకూరుతాయి. దీంతో నాణ్యమైన దిగుబడి వస్తుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల చర్యలను అభివృద్ధి చేసేందుకు వేసవి దుక్కిలు దోహదం చేస్తాయి. -
వ్యక్తిగత జీవితంలో విలువలే ప్రాణం
అలంపూర్: వ్యక్తిగత జీవితంలో విలువలే ప్రాణమని బహుజన ఉద్యమ కవి, తెలంగాణ రాష్ట్ర అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఒక ఫంక్షన్ హాల్లో మేదక్ జిల్లా సీఐడీ ఎస్పీ సంధ్యపోగు మహేందర్ పదవీ విరమణ మహోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుజన ఉద్యమ కవి, తెలంగాణ రాష్ట్ర అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ రామానంద తీర్థ, గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిషోర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డు ఎస్పీ మహేందర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సామాజిక, కుటుంబ విలువలు చిద్రమవుతున్న కాలంలో విలువలతో జీవితాన్ని కొనసాగిస్తూ నిలిచిన వ్యక్తులను సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖలో 35ఏళ్లు పనిచేసి ఆ శాఖ గౌరవాన్ని పెంచిన అరుదైన వ్యక్తుల్లో సంధ్యపోగు మహేందర్ ఒకరని కొనియాడారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మహేందర్ పోలీస్ అధికారిగా సమన్యాయం పాటిస్తూ వ్యక్తిగత జీవితంలో విలువలే ఆదర్శంగా సేవలు అందించారన్నారు. వృత్తిరీత్యా పోలీస్ శాఖలో అనేక ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. కుటుంబ విలువలే మంచి సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తాయన్నారు. కార్యక్రమంలో నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ శ్రీనివాసులు, మెదక్ జిల్లాకు చెందిన పలువురు పోలీస్ అధికారులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభ ఏర్పాటు పనుల్లో ఒకరి మృతి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో సీఎం రేవంత్రెడ్డి సభ ఏర్పాటు పనులు చేస్తున్న నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన కూలీ గోపాల బాలయ్య(60) శనివారం రాత్రి మృతిచెందాడు. తోటి కూలీల కథనం ప్రకారం.. అస్వస్థతకు గురైన బాలయ్యను వెంటనే పోలీసులు తమ వాహనంలో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరగంల్లోని ఎంజీఎంకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతికి గుండెపోటా.. మరేదైనా కారణమో తెలియాల్సి ఉంది. సీఎం సభకు ముందే కూలీ చనిపోయి విషాదం నెలకొనడంతో అధికారులు అంతా గోప్యంగా ఉంచుతున్నారని తెలిసింది. బాలయ్య స్టేజీ, బారీకేడు పనులు చేశాడని తోటి కూలీలు పేర్కొన్నారు. జక్లేర్లో భారీ చోరీ ● 20 తులాల బంగారం, రూ. 4 లక్షల నగదు అపహరణ మక్తల్: మండలంలోని జక్లేర్ గ్రామంలో భారీగా దొంగతనం జరిగిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజ్రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు చోరీ చేశారు. శనివారం రాత్రికి భార్యతో కలిసి తన సెల్ఫోన్ షాపుకు వెళ్లి తిరిగి ఇంటి ఇంటికి రాగా తలుపులు తెరచి ఉండటంతో పాటు బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం మక్తల్ పోలీసులకు సమాచారం అందించగా మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి క్లూటీంతో ఇంట్లో వేలిముద్రలు స్వీకరించారు. ఆదివారం బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి కందనూలు: విద్యుత్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హౌసింగ్ బోర్డ్ సబ్స్టేషన్ వద్ద మరమ్మతు పనులు చేస్తున్న కార్మికుడిని జంపర్ మార్చడానికి ట్రాన్స్కో ఉద్యోగులు వెంకటేష్ (35)ను వారి వెంట తీసుకువెళ్లినట్లు తోటి కార్మికులు తెలిపారు. సబ్స్టేషన్ మరమ్మతు పనులు జరుగుతున్న మరో లైన్లో విద్యుత్ సరఫరా ఉండటాన్ని గమనించని అధికారులు కార్మికుడిని జంపర్ మార్చమని సూచించడంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం వెంకటేష్ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు కొల్లాపూర్ నియోజకవర్గంలోని కుడికిల్ల గ్రామానికి చెందినవాడు కాగా.. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వరికోత మిషన్కు వైర్లు తగిలి యువకుడు హన్వాడ: కోయిల్కొండ మండలంలోని అభంగపట్నం గ్రామంలో వరికోత మిషన్ వైర్లకు తగలడంతో ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హన్వాడ మండలంలోని యారోనిపల్లి గ్రామానికి చెందిన బీసు సతీష్కుమార్రెడ్డి (21) తన వరికోత మిషన్తో అభంగపట్నం గ్రామానికి వరి పైరును కోసేందుకు వెళ్లాడు. రాత్రి సమయంలో వరికోత పనులు జరుగుతుండగా.. పొలాల మధ్య ఉన్న విద్యుత్ వైర్లు వరికోత మిషన్కు తగలడంతో ఆపరేట్ చేస్తున్న సతీష్కుమార్రెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని నవోదయ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి అదృశ్యం ● కోనేరులో మునిగాడని అనుమానం గోపాల్పేట: మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు మధ్యాహ్నం ఇంటి నుంచి మళ్లీ తిరిగి రాలేదు. పూర్తి వివరాలు.. మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సాయమ్మ కొడుకు శ్రీనివాసులు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన తల్లి వెతకగా కోదండరామస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు వద్ద శ్రీనివాసులుకు చెందిన ద్విచక్రవాహనం, చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో తన కోనేరులోనే దిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. ఫైర్ అధికారులు ఫైర్ ఇంజిన్తోపాటు కోనేరు దగ్గరికి రాగా చీకటి పడటంతో గాలింపు చర్యలు ఆపేసినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి శ్రీనివాసులు తెలిపారు. -
ఉన్నత విద్యకు ‘ఆస్థానం’
స్వయం ప్రతిపత్తిగల డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల టౌన్: పట్టణంలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి కావటంతోపాటు తెలంగాణ రాష్ట్ర బొటానికల్ గార్డెన్తో ప్రత్యేక గుర్తింపు పొందింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుండటంతో తమ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వా లని కళాశాల అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్ విన్నవిస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా పేద ప్రజలకు నా ణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. 1963లో ప్రారంభం.. 1963లో శ్రీరాంనగర్లోని ప్రస్తుత కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల ప్రారంభం అయ్యింది. ఆర్ట్స్, సైన్స్తో పాటు జూనియర్ కళాశాల నిర్వహించేవారు. ఆ తరువాత సిగ్నల్గడ్డపై మాజీ ఎమ్మెల్యే కొత్తకేశవులు కృషితో ప్రస్తుతం ఉన్న స్థలం సేకరించి నూతన భవనం నిర్మించారు. 1991లో నూతన భవనంలోకి ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ఆర్ట్స్ కామర్స్ను బదిలీ చేశారు. సైన్స్ మాత్రం పాత భవనంలోనే కొనసాగించారు. ఆ తరువాత కొన్నాళ్లకే సైన్స్ కోర్సులు సైతం ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఇంటర్మీడియేట్ పాత కళాశాల భవనంలోకి, డిగ్రీ కోర్సులన్ని సిగ్నల్గడ్డ భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి 1990 దశకం నుంచి పూర్తిస్థాయిలో డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. న్యాక్లో ఏ గ్రేడ్ 2025 ఆరంభంలో న్యాక్ బృందం కళాశాలను సందర్శించి ఏ గ్రేడ్ను కేటాయించింది. దీంతో కళాశాలకు స్వయం ప్రతిపత్తి లభించింది. దీని ద్వారా పరీక్షల నిర్వహణ, కోర్సుల ఏర్పాటు వంటివి స్వయంగా నిర్ణయించే వెసులుబాటు కలిగింది. ఆరు దశాబ్దాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన బొటానికల్ గార్డెన్ దోస్త్లో ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవిస్తున్న కళాశాల అధ్యాపక బృందం దోస్త్ అడ్మిషన్లు ప్రారంభం అయినందున ఆన్లైన్లో డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలి. నాణ్యమైన విద్యను అందించటంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నాయ కత్వ లక్షణాలు పెంపొందిస్తాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఏవైనా సందేహాలుంటే కళాశాలలోని సాంకేతిక విభాగం అన్ని విధాలుగా సహకరిస్తుంది. –డా.సుకన్య, ప్రిన్సిపాల్, డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
పోరాటమే పేరూరును ప్రత్యేకంగా నిలబెట్టింది
దేవరకద్ర: పేరూరు గ్రామ స్ఫూర్తి రాష్ట్రానికి మార్గదర్శకం అని, విద్య అవసరాన్ని 75 ఏళ్ల క్రితమే గుర్తించి ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి జెడ్పీ చైర్పర్సన్ కేకే రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం కౌకుంట్ల మండలంలోని పేరూర్ గ్రామంలో నిర్వహించిన జెడ్పీ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లో కరెంట్, రోడ్లు, ఆస్పత్రులు లేని కాలంలో పేరూరు గ్రామం విద్య కోసం పోరాడిందని, ఆ పోరాటమే ఈ రోజు పేరూరును ప్రత్యేకంగా నిలబెట్టిందన్నారు. పేరూరులో మీనీ స్టేడీయం ఏర్పాటు చేస్తామని యువతకు క్రీడా వసతులు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో విద్య, సంక్షేమం, అభివృద్ధి మూడు రంగాల్లో తెలంగాణను ముందంజలో నెలబెట్టే దిశగా ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తామని, పాఠశాలలో మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి మాట్లాడుతూ పేరూర్ పాఠశాలకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో కృషిచేశానన్నారు. అంతకు ముందు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. కార్యక్రమరంలో సర్పంచ్ శృతి, అరవింద్రెడ్డి, డీజీక్వెస్ట్ చైర్మన్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టించుకోవడం లేదు..
పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను లెదర్ పార్కుకు కేటాయించిన స్థలంలో డంప్ చేస్తున్నారు. దీంతో వ్యర్థాలతో ఈ ప్రాంతం నిండిపోయింది. వ్యర్థాలను తగులబెట్టడంతో వస్తున్న పొగ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వ్యర్థాల పారబోతపై విచారించి చర్యలు చేపట్టాలి. – కృష్ణయ్య, మాచారం పరిశ్రమల వ్యర్థాల సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసకెళ్తాం. ఇప్పటికే వ్యర్థాల పారబోతపై సంబంధిత పరిశ్రమలకు హెచ్చరికలు జారీచేశాం. సమస్యను సంబంధిత మంత్రి కొండా సురేఖ దృష్టికి కూడా తీసుకెళ్లాం. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతం రెడ్ కేటగిరీలోకి వెళ్లే ప్రమాదం ఉంది. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల ● -
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
● ఈ నెల 23 వరకు మ్యాంపింగ్ ప్రక్రియ ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలు ● జిల్లావ్యాప్తంగా 4,99,582 మంది ఓటర్లు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. మిగిలిన పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా అనుసరించి అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు సైతం ప్రారంభించారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో ఇటీవల మహమ్మదాబాద్, కౌకుంట మండలాలు కొత్తగా ఏర్పడగా.. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనుండటంతో 16కు సంఖ్య చేరింది. అసెంబ్లీ జాబితా ఆధారంగా.. కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దీంతో కొత్త ఓటర్లు స్పల్పంగా పెరిగారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,99,582 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,48,222, మహిళలు 2,51,349 మంది ఉండగా.. ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ నెల 23 వరకు ఓటరు జాబితాను మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చిగురించిన ఆశలు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాజకీయ పార్టీలతోపాటు ఆశావాహులంతా భావించారు. అయితే బీసీ రిజర్వేషన్ల్ అంశం కోర్టులో తేలాకే వాటిపై ముందుకుపోవాలని ప్రభుత్వం భావించడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎస్ఈసీ ఓటర్ల జాబితాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చనట్లు అయింది. అయితే వెంటనే చేపడుతుందా.. లేదా రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తుందా అనే దానిపై మాత్రం అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అధికారులు మాత్రం ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయనున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం. – వెంకట్రెడ్డి, జెడ్పీసీఈఓ -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
● పాలమూరులో తీవ్రమైన ఎండలు పాలమూరు: ఉదయం 7 గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలో ఒకవైపు ఉదయం తీవ్రమైన ఎండలు.. రాత్రి వేళ వేడి, ఉక్కపోతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పల్లెల్లో సైతం తీవ్రమైన వేడి వల్ల నీరు, చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇక ఇంట్లో కూడా ఉక్కపోత భరించలేని విధంగా అనిపిస్తోంది. ఫ్యాన్ల నుంచి కొద్దిసేపటికే వేడి గాలి వస్తుండటంతో జనాలు ఎలా సేద తీరాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికంగా ఎండ ఉన్నా.. సాయంత్రం వాతావరణం కొంత చల్లబడినట్లు అనిపించింది. కానీ వేడి, ఉక్కపోత వల్ల చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార సముదాయాలు, రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. మహిళా బిల్లు పేరుతో బీజేపీ రాజకీయం స్టేషన్ మహబూబ్నగర్: మహిళా బిల్లు పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్ పార్టీ కృషిచేసిందని, మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్లు గుర్తుచేశారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇప్పుడున్న 543 పార్లమెంట్ స్థానాలకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ మాట్లాడుతూ మహిళా బిల్లు పేరుతో తమిళనాడు, బెంగాల్లో ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ మహిళలను మోసం చేసేవిధంగా బీజేపీ ప్రభుత్వం బిల్లుపై రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తుందని, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని, వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చలకు రావడం లేదని ప్రశ్నించారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విధానపరమైన సమస్యలు అనడం సమంజసం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకురావాలని, ఆర్టీసీ కార్మి సంఘాలతో చర్చించి.. ఈ నెల 22 నుంచి జరిగే ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
విచ్చలవిడిగా పారబోత..
ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాలను శుద్ధి చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా బయటకు విచ్చలవిడిగా పారబోస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు చెరువులు, నేలలోకి చేరితే వాటి ప్రభావం ఏళ్లతరబడి ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నేరుగా నేలలోకి దిగితే అది క్రమంగా ఇసుక, రాళ్ల పొరల మధ్యకు చేరి బోర్ల నీరు కాలుష్యంగా మారి వ్యవసాయ నీటి వనరులు కలుషితమవుతాయి. అలాగే నీటికి ఉప్పుదనం పెరిగి తాగడానికి పనికిరాకుండా పోతాయి. పంటలకు ఇలాంటి కలుషిత నీటిని అందిస్తే మట్టిసారం దెబ్బతినడం, పంటల ఎదుగుదల కోల్పోతాయి. అలాగే మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు చర్మ సంబంధ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక చెరువులు, కాల్వలు, వాగులు, బావులలోకి చేరిన వ్యర్థజలాలు నీటిని కలుషితం చేయడమే గాక మొత్తం జీవ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఫలితంగా నీటిలో బతికే చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతాయి. వాసనతోపాటు చెరువులలో నీటి రంగు మారి ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మూగజీవాలకు సైతం తాగడానికి పనికిరాకుండా పోతుంది. ఫార్మ పరిశ్రమల నుంచి వెలువడే పొగ, దుర్వాసన ప్రభావంతో గాలి కాలుష్యం పెను భూతంగా మారుతుంది. రాత్రివేళల్లో ఎక్కువగా వీటి ప్రభావం ఉంటుందని దుర్వాసన, కళ్లు, గొంతు మంటతోపాటు తలనొప్పి తదితర శ్వాస ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. -
తాగునీటికి ఢోకా లేనట్టే!
● ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం ● 800 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ● వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు కొల్లాపూర్: శ్రీశైలం జలాశయం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. సరఫరా ఇలా.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూ ర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి.. నీటిని సరఫరా చేస్తున్నారు. రోజూ 0.02 టీఎంసీలు.. మిషన్ భగీరథ పథకానికి ప్రతిరోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది. కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ -
చేపల వేటకు వెళ్లి శవమై తేలాడు
రాజాపూర్: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో శవమై తేలిన సంఘటన శనివారం మండల పరిధిలోని కుచ్చర్కల్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మంగళి కృష్ణయ్య(55) తన పొలం పక్కన ఉన్న మామిడికుంటలో రాత్రి సమయంలో చేపల వల వేసి ఉదయం చేపలు తీసుకొని వచ్చేవాడు.. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రోజు మాదిరిగా పొలం వద్దకు వెళ్లాడు. శనివారం ఎంతకు రాకపోవడంతో మృతుడి కుమారుడు శ్రీనివాసులు పొలం వద్దకు వెళ్లగా.. చెరువు కట్టపై తండ్రి బట్టలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చెరువులో వల కాళ్లకు చుట్టుకొని కృష్ణయ్య శవమై తేలాడు. అనంతరం గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. అప్పులబాధతో యువకుడు బలవన్మరణం చారకొండ: అప్పులబాధతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలం చంద్రాయన్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వీరబాబు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కందుకూరు మధు (34) కొంతకాలంగా కల్వకుర్తిలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం అప్పుచేసి ఎకరా పొలం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక తీవ్ర మనస్తాపంతో శుక్రవారం స్వగ్రామానికి వచ్చాడు. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తన భార్యకు వాట్సప్లో తాను ఉరేసుకుంటున్నట్లు స్వీయ చిత్రాన్ని తీసి పంపించాడు. ఆమె సమీప కుటుంబీకులను ఇంటికి పంపించే సరికి విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య మాధవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాధవి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మట్టి దిబ్బ కూలి.. మహిళ మృతి కొత్తకోట రూరల్: చెరువులో ఉపాధి పనులు చేస్తున్న క్రమంలో మట్టి దిబ్బ కూలి మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా పాలెంలో చోటు చేసుకుంది. స్థానికులుతెలిపిన వివరాలు.. పాలెం గ్రామ శివారులోని కర్ణమోని కుంట చెరువులో శనివారం ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలడంతో కూలీలు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చివర్లో ఉన్న శాంతమ్మ, కొండన్నపై మట్టి దిబ్బ పడింది. దీంతో శాంతమ్మ(59)కు తీవ్ర గాయాలు కాగా కొండన్నకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతమ్మను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పని ప్రదేశంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటలను జరుగుతున్నాయని కూలీలు వాపోతున్నారు. -
నడిగడ్డలో అనుమానిత ముఠా
● వ్యాపారులతో బంగారం బిల్లలు విక్రయించేందుకు యత్నం ● మీడియా అన్వేషించగా.. అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం గద్వాల క్రైం: గద్వాల జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని అనుమానిత వ్యక్తులు వ్యాపారులను ఏమరచి చోరీలకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరల్లోకి వేళ్తే.. జిల్లా కేంద్రంలోని గుర్తుతెలియని వ్యక్తులు తమ వద్ద బంగారం బిల్లలు ఉన్నాయంటూ వ్యాపారుల వద్దకెళ్లి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా బంగారు బిల్లలు విక్రయిస్తున్నట్లు తెలుపుతున్నారు. మేలిమి బంగారం వీటిని పరిశీలించిన తర్వాతే డబ్బులు ఇవ్వాల్సిందిగా వ్యాపారులకు సూచిస్తున్నారు. కొందరు వ్యాపారులు మాత్రం వాటికి సంబంధించిన బిల్లులు, రసీదులు ఉంటే కొనుగోలు చేస్తామని సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. అయితే గతంలో కొందరు వ్యాపారులు అపరిచితుల మాటలు నమ్మి బంగారు బిల్లలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వ్యాపారులు పూర్తిస్థాయిలో పరిశీలించిన క్రమంలో నకిలీ బంగారు బిల్లలుగా తేలింది. ఈ విషయం బయటకు తెలిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించి మోసపోయిన వ్యాపారులు ఉన్నారు. జరిగిన ఘటనలధాటికి అపరిచితుల నుంచి కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేశారు. విషయం తెలుసుకున్న మీడియా బృదం అపరిచితుల కోసం అన్వేషణ చేపట్టారు. అప్పటికే అపరిచితులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇలాంటి ముఠా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉంటారని వ్యాపారులు చెబుతున్నారు. -
500 బస్తాల రేషన్ పట్టివేత
● గత్ప శివారు పొలాల్లో రాష్ట్ర విజెలెన్స్ అధికారుల దాడి ● స్టాక్ పాయింట్కు బియ్యం తరలింపు దామరగిద్ద: అక్రమంగా నిల్వ ఉంచిన 500 బస్తాలకు పైగా పీడీఎస్ బియ్యం శనివారం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డాయి. స్టేట్ విజిలెన్స్ సీఐ గణేశ్, డీసీఓపీ సురేష్ బృందం నిర్వహించిన దాడిలో మండలంలోని గత్ప శివారులోని పొలాల్లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని అంతారం గ్రామానికి చెందిన వెంకటేశ్ అద్దెకు తీసుకొని బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అదే విధంగా అక్కడే ఉన్న డీసీఎం వాహనంలో నాలుగు బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. సదరు వ్యక్తి బియ్యాన్ని ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఆధారాలు సేకరించారు. సీజ్ చేసిన బియ్యం బస్తాలను అదే డీసీఎంలో స్టాక్ పాయింట్కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిని పీడీఎస్ రైస్, డీసీఎంను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. -
తుది సమావేశానికి సమాయత్తం
జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గానికి మేనెల 6వతేదీతో గడువు ముగియనుండటంతో చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే సమావేశానికి ఆటంకాలు ఎదురవుతుండగా వాటిని అధిగమించి సాఫీగా నిర్వహించే ఆస్కారం ఉందా అన్న సందేహాలు నెలన్నాయి. 2021 మే 7న ప్రమాణస్వీకారం చేసిన పాలకవర్గం ఐదేళ్లు ముగియనున్నప్పటికీ కోఆప్షన్ సభ్యులు లేకుండానే పాలన కొనసాగించటం గమనార్హం. అనేక ఆశయాలు, లక్ష్యాలతో పగ్గాలు చేపట్టిన పాలకవర్గం మూడు అవినీతి ఆరోపణలు.. ఆరు వివాదాలు అన్నట్లుగా పాలన సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. ● 1960లో మున్సిపాలిటీగా ఉన్న బాదేపల్లి ఆ తర్వాత మారిన సమీకరణలో గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామపంచాయతీ తిరిగి మున్సిపాలిటీగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాదేపల్లి, జడ్చర్ల, నాగసాల, బూరెడ్డిపల్లి, కావేరమ్మపేటతో జడ్చర్ల మున్సిపాలిటీగా ఆవిర్భవించి 2021ఏప్రిల్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 27 కౌన్సిల్ స్థానాలకుగానూ బీఆర్ఎస్ 23, 2 బీజేపీ, 2 కాంగ్రెస్లు గెలిచాయి. చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వు కావడంతో అప్పటి ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి దోరేపల్లి లక్ష్మి చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా అదే పార్టీకి చెందిన పాలాది సారికను నియమించారు. ఇద్దరి మహిళలతో పాలన ఎలా అన్న సందేహాలకు తావులేకుండా రెండేళ్లపాటు సవ్యంగానే కొనసాగించారు. అంతా తానే అయి లక్ష్మారెడ్డి పాలన చేయించారు. కాలక్రమేణా వార్డుకౌన్సిలర్లలో వివాదాలు తలెత్తటం, అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి ఓడిపోవటం, కాంగ్రెస్ అనిరుధ్రెడ్డి గెలవటం జరిగాయి. ఈ క్రమంలో చైర్పర్సన్–కొందరు కౌన్సిలర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మున్సిపాలిటీలో పందుల తరలింపు సైతం దుమారం లేపింది. చివరకు లక్ష్మారెడ్డి సమ్మతితో 2024 ఆరంభంలో దోరేపల్లి లక్ష్మిపై అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపారు. ఆ తరువాత 7నెలలపాటు చైర్పర్సన్ నియామకం లేకుండానే పాలన సాగింది. చివరకు 2024 నవంబర్ నెలలో చైర్పర్సన్గా బీఆర్ఎస్కు చెందిన కోనేటి పుష్పలతను ఎన్నుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకే ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆశీస్సులతో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్లపాటు పాలన సవ్యంగానే సాగినప్పటికి కొంతకాలంగా వివాదాస్పద, స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కుంటున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అనుకూలమంటూ సొంత పార్టీలో ఆరోపణలు ఎదుర్కోవా ల్సి వస్తుంది. దీనికితోడు నిధుల కేటాయింపులో జ రిగిన పరిణామాలు అందుకు ఊతమిచ్చినట్లయ్యింది. ఇంకేముంది. ఇదే అదనుగా చివరి కౌన్సిల్ సమావేశ నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం కోఆప్షన్ సభ్యులు లేకుండానే.. పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్లలోనే కో ఆప్షన్ సభ్యులను నియమించటం పరిపాటి. అయితే అనేక రాజకీయ కారణాలతో లక్ష్మారెడ్డి కోఆప్షన్ సభ్యుల నియామకానికి ఆసక్తి చూపలేదు. ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులు కో ఆప్షన్ పదవిపై ఆశపెట్టుకుని ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం గడవటంతో నిట్టూరుస్తున్నారు. వచ్చేవారంలో.. మున్సిపల్ చివరి కౌన్సిల్ సమావేశం వచ్చేవారం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాము. ఇందుకోసం అంతా సన్నద్దం చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సహకారంతో నిర్వహించే సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోనున్నాం. మే 6తో మా గడువు ముగియనున్నందున ఇదే చివరి సమావేశం అవుతుంది. మధ్యలో కొన్ని చిన్నచిన్న ఆటంకాలతో ఆలస్యం జరుగుతుంది. – కోనేటి పుష్పలత, చైర్పర్సన్, జడ్చర్ల మున్సిపాలిటీ మే 6తో ముగియనున్న జడ్చర్ల పురపాలకవర్గం గడువు ఇన్నాళ్లు కోఆప్షన్ సభ్యుల నియామకం లేకుండానే పాలన ఆటంకాలు కలుగుతున్నాయన్న వాదనలు -
ఆదాయం ఫుల్.. వసతులు నిల్
మెట్టుగడ్డ: ఎండాకాలంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నరకం.. డబ్బులు తీసుకుంటారు కానీ.. వసతులు మాత్రం కల్పించరు. ఇది మహబూబ్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దుస్థితి. క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో దస్తావేజు రిజిస్ట్రేషన్కు వినియోగదారుడి నుంచి ప్రభుత్వం రూ.500 యూజర్ ఛార్జీ వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. కానీ పాలమూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గొంతు తడిపే దిక్కులేదు. ఎండలు మండుతున్నా కనీసం ప్రజలకు ఫ్యాన్లు కూడా పెట్టించలేని స్థితిలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో కార్యాలయం నడుస్తోంది. క్రయవిక్రయాల ద్వారా ఆదాయాన్ని అర్జించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వసతుల కల్పన మాత్రం తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు కూడా కేవలం ఒక్కటే ఉంది. మహిళలతై నరకం అనుభవిస్తున్నారు. కార్యాలయం బాగా ఇరుకుగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మేల్కొని తగిన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తాగేనీరు లేదు.. ఫ్యాన్లు లేవు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రయవిక్రయదారులు ఇరుకై న కార్యాలయంతో ప్రజలకు ఇక్కట్లు -
రైతులకు సాగునీరందించడమే లక్ష్యం
మక్తల్: రైతులకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సాయంత్రం మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి వద్ద కొనసాగుతున్న మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. డీపీఆర్లో ఉన్న వివరాలను ఎస్ఈ శ్రీధర్ను అడిగి తెలుసుకున్నారు. పైప్లైన్ పనులు ఎలా జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. ఇప్పటికే ఎకరాకు రూ.20లక్షలు నష్టపరిహారం అందించిందని పేర్కొన్నారు. ఇంకా నష్టపరిహారం అందని రైతులకు సత్వరమే అందిస్తామని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్గౌడ్, ఈడబ్ల్యూఈ నాగశివ, చెన్నయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
మానవపాడు: నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలోని శ్రీనగర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ స్వాతి, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని చంద్రశేఖర్నగర్ పంచాయతీలోని శ్రీనగర్ గ్రామంలో రాధ, చలపతిరావు దంపతులు నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాధ మెడలో ఉన్న బంగారు గొలుసు 5 తులాల బంగారాన్ని చోరీ చేసి వెళ్లారు. వారికి మత్తు మందు ఇచ్చి చోరీ చేశారని బాధితులు వాపోతున్నారు. 5 తులాల బంగారు గొలుసు బంగారు, 4.42 గ్రాములు, 1 పుస్తె గొలుసు బంగారు మొత్తం 5 తులాల బంగారును చోరీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పి.వెంకటయ్య(55) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల మేరకు.. వెంకటయ్య శనివారం ఉదయం తన కూతురుని చూసేందుకు నారాయణపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ధన్వాడలో బస్సు దిగి అక్కడి నుంచి స్వగ్రామానికి తెలిసిన వారి బైకుపై వెళ్తుండగా మనిపూర్ తండా దాటిన తర్వాత మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటయ్యను ధన్వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి తిప్పుతూ సరైన వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. -
గాలీవాన బీభత్సం.. అపార నష్టం
● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు ● రాకపోకలకు తీవ్ర అంతరాయం బల్మూర్: గాలీవాన బీభత్సంలో రోడ్లపై భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలి పడగా, మామిడి కాయలు నేలరాలి అపార నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని బల్మూర్, వీరంరాజ్పల్లి, కొండనాగుల, రామాజిపల్లి, సితారాంపూర్, గోదల్ తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన దూమారం రేగడంతో బల్మూర్లోని బస్టాండ్ వద్ద మూడు విద్యుత్ స్తంభాలు, కొండనాగుల వద్ద భారీ వృక్షాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు వంద ఎకరాల మామిడితోటల్లో కోత దశకు వచ్చిన మామిడి కాయలు రాలిపోగా, మొక్కజొన్న పంట నేలకొరిగి తీవ్రనష్ట్రం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్లు నేలరాలాయి రెండు రోజుల్లో మామిడి కాయలు కోసి విక్రయించాలని కూలీలను మాట్లాడుకున్నా. కానీ ప్రకృతి విలయంతో గాలివానకు తోటలోని మామిడి కాయలన్నీ నేలరాలి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – అంబటిపల్లి రాములు, మామిడి తోటరైతు, వీరంరాజుపల్లి -
కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం
చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్తో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి. -
గుప్తుల కాలం నాటి కోట
అమరచింత: క్రీ.శ. 17వ శతాబ్దంలో గుప్తుల కాలంలో నిర్మించిన చంద్రగఢ్ కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అమరచింత మండలంలోని చంద్రగఢ్ గ్రామంలోని కొండపై భాగాన నిర్మించిన ఈ కోట చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. కనుచూపు మేరలో కృష్ణానది కనిపిస్తుండటంతో పర్యాటకులు ప్రాజెక్టుకు వెళ్తూ.. ప్రాచీన కట్టడమైన చంద్రగఢ్ను సందర్శిస్తుంటారు. ఇక్కడి చిన్నచిన్న రాజ్యాల నుంచి కప్పం రూపంలో వసూలు చేసిన ధాన్యం, డబ్బులు, బంగారం, వెండి నిల్వలను తరలించే క్రమంలో బసతోపాటు శత్రువుల బారి నుంచి వీటిని కాపాడుకునేందుకు కోటను చంద్రగుప్తుడు నిర్మించాడు. వేసవిలో సైతం తాగేందుకు నీరు లభ్యమయ్యేలా రాతి శిలలలో నీటి గుండాలు ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఫిరంగులు పెట్టి కాపాడేవారు. కోట మధ్యలో శివాలయం నిర్మించి పూజలు ఆచరించేవారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. -
సమర్థవంతంగా రైళ్ల రాకపోకలు
● డబ్లింగ్లైన్ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే స్టేఫీ కమిషనర్ మాధవి స్టేషన్ మహబూబ్నగర్: రైలు అనుసంధానాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక అడుగుపడింది. మహబూబ్నగర్–మన్యంకొండ మధ్య కొత్తగా నిర్మించిన డబుల్లైన్ను (రెండో లైన్) శనివారం రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి సమగ్రంగా తనిఖీ చేసి స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. మహబూబ్నగర్ స్టేషన్ నుంచి మన్యంకొండ వరకు ఇతర అధికారులతో కలిసి ఆమె ప్రత్యేక మోటార్ ట్రాలీపై ప్రయాణించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవితో పాటు సీఏఓ నిర్మాణం విభాగం అధికారి రణధీర్రెడ్డి, హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్కుమార్వర్మ, చీఫ్ ఇంజనీర్ (నిర్మాణ విభాగం) నాగభూషణం, ఇతర ఉన్నతాధికారులు ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనల నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చే ముందు అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్ధారించారు. కొత్త ట్రాక్పై రైళ్ల స్థిరత్వం, సాఫీగా కదలడాన్ని పరీక్షించడానికి హైస్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో సీఆర్ఎస్ ఈ లైన్ను కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ సెక్షన్లో రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతి లభించింది. ఈ రద్దీ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడానికి, సమయ పాలనను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈ డబుల్లైన్ అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్–డోన్ మార్గంలో రద్దీ గణనీయంగా తగ్గి రైళ్ల రాకపోలకు మరింత సమర్థవంతంగా సాగుతాయని, అలాగే ప్రయాణికులకు ప్రయాణ సమయం కూడా తగ్గు తుందన్నారు. ప్రాంతీయ రవాణా అవసరాలను తీ ర్చేందుకు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు, దక్షిణమధ్య రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు. -
చోరీలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి
మహబూబ్నగర్ క్రైం: వేసవి సెలవుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దొంగతనాల నివారణకు ప్రజల నుంచి సహకారం అవసరం అని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. సెలవులు, శుభకార్యాల వల్ల కుటుంబసభ్యులతో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఇంటి బయట లేదా ఇళ్లపై నిద్రించే వారు మెడలో ఉండే బంగారం ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు ఉండకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఇంటికి నాణ్యమైన తాళాలు వేయడం, బస్సుల్లో ప్రయాణం చేసే సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉంటూ అపరచితులు ఇచ్చే ఎలాంటి ఆహారం తీసుకోరాదని సూచించారు. ● జిల్లా విశ్రాంతి పోలీసుల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఎస్పీ డి.జానకి ప్రారంభించారు.కోయిలకొండ పోలీస్స్టేషన్ ఎస్ఐ తిరుపాజీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి బహుమతులు అందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వెళ్తున్న 26 మంది హోంగార్డులకు మెడికల్ కిట్లు, వాటర్ బాటిల్స్ను ఎస్పీ అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సమ్మెతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు సమ్మెతోనే పరిష్కారం జరుగుతుందని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు జి.లక్ష్మణ్గౌడ్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన సమ్మె సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇచ్చి కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి పునరుద్దరించాలని, కార్మికులకు రావాల్సిన పీఆర్సీలను ప్రకటించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి ఉద్యోగుల నియామకాలు చేపట్టాలనే మొత్తం 32 సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ నాయకులు బసప్ప, కృష్ణయ్య, బీఎన్రెడ్డి, రాజలింగం, మల్లికార్జున్, బుచ్చన్న, సంజీవరెడ్డి, చిన్నమ్మ, మంజుల, నిర్మల, హేమంత్కుమార్, రవికుమార్, సుకుమార్రెడ్డి, జేజేరావు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ @ రూ. 2,117 దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర గరిష్టంగా రూ.2,117, కనిష్టంగా రూ.1,961గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,729, కనిష్టంగా రూ.1,609, ఆముదాల ధర గరిష్టంగా రూ.6,089, కనిష్టంగా రూ.6,062గా ధరలు నమోదయ్యాయి. -
పోషకాహార లోపాలను అరికట్టాలి
మహబూబ్నగర్ రూరల్: పోషకాహార లోపాలను అరికట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డి సూచించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం ధర్మాపూర్ అంగన్వాడీకేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమానికి కమిషన్ మెంబర్లు వందనాగౌడ్, అపర్ణలతో కలిసి ఆమె హాజరై వివిధ పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు, కిషోర బాలలకు పోషణ లోపం లేకుండా చూడాలని అన్నారు. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి రెండేళ్ల వరకు (వెయ్యి రోజులు) మంచి పౌష్టికాహారం అందించేలా అంగన్వాడీ టీచర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. చిన్నారులకు అనుకూల సమయంలో టీకాలు వేయించడం, పోషకాహారాన్ని అందించడం, మానసికశక్తి అభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, సీడీపీఓ శైలాశ్రీ, డీసీపీఓ నర్మద, సూపర్వైజర్ జగదీశ్వరి, సర్పంచ్ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సురభి వంశీయుల అడ్డా కొల్లాపూర్
కొల్లాపూర్: జటప్రోల్ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది. -
సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం ఈ కార్యక్రమంపై హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సీఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్లో వీసీ ద్వారా మండల స్థాయి అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ వారోత్సవాలకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల బ్యానర్లను తప్పకుండా ప్రదర్శించాలన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ మీటింగ్ల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, సీపీఓ రవీందర్ పాల్గొన్నారు. -
ప్రమాదరహిత రాష్ట్రమే లక్ష్యం
పాలమూరు: రోడ్డు ప్రమాదాల రూపంలో ఏటా రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు క్షతగాత్రులుగా మారి ఆర్థికంగా చితికిపోతున్నారని, తెలంగాణను రోడ్డు ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నట్లు వెల్లడించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పంచవటి పాఠశాలలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఎంవీఎస్ కళాశాల నుంచి బైక్లపై ర్యాలీగా పంచవటి పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు మెడికల్ స్టాల్ ప్రారంభించారు. పాఠశాలలో ఎంవీఐ వాసుదేవ్రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన చిల్డ్రన్ ట్రాఫిక్ అవగాహన పార్క్ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగాపలువురు విద్యార్థులు ట్రాఫిక్ పార్క్లో ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉంటాయి? సిగ్నల్స్ అమలు విధానం, జీబ్రా క్రాసింగ్ పనితీరు, స్కూల్, ఆస్పత్రి జోన్, యూటర్స్, ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలా పని చేయాలనే అంశంపై ప్రదర్శన చేసి చూపించారు. ఆనంతరం ఆరోగ్య శిబిరం, కంటి పరీక్షల కేంద్రం, సీపీఆర్పై అవగహన కల్పించే కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనలను దినపత్రికల ద్వారా చూపించారు. సంగారెడ్డిలో దావత్ చేసుకుని తిరిగి హైదరాబాద్కు వస్తుంటే ప్రమాదం జరిగిందని ఇలా మద్యం మత్తులో ప్రమాదాలు కావడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను మొదటి గంట గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చి వారి ప్రాణాలను కాపాడితే అలాంటి వారిని గుర్తించి రహవీర్ పథకం కింద ప్రభుత్వం రూ.25వేల పారితోషికం ఇస్తుందన్నారు. ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్స్పాట్స్ను సందర్శించి అక్కడ సైన్బోర్డులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలపై, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పెంచాలన్నారు. పోలీస్ శాఖ తరచూ వాహనాలు తనిఖీలు చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించి నిబంధనలు పాటించని వారికి అవగాహన పెంచాలన్నారు. ప్రతి ఏడాది ఐదుసార్లు రహవీర్ అవార్డు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
భార్యాభర్తల గొడవమనస్తాపంతో భార్య ఆత్మహత్య
కోడేరు: హైదరాబాద్లో మహిళ ఉరేసుకొని మృతి చెందిన ఘటన మండలంలోని నాగులపల్లితండాలో విషాదం నింపింది. గ్రామస్థుల కథనం మేరకు.. పాన్గల్ మండలంలోని కిష్టాపూర్తండాకు చెందిన రాత్లావత్ సంగీత (23), కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన రాత్లావత్ రమేష్ 2024లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో బతుకుదెరువు కోసం రమేష్ హైదరాబాద్లోని అల్వాల్లో ఆటో నడుపుతూ అక్కడే దంపతులు జీవనం గడిపేవారు. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సంగీత అల్వాల నివాసముంటున్న ఇంట్లో ఊరేసుకొని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఇటిక్యాల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవిరాథోడ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్దదిన్నే గ్రామానికి చెందిన కురువ లక్ష్మన్న (48) కొంత కాలంగా ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన పెద్ద కుమారై గీత అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపనికి గురై గురువారం పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పుష్పమ్మ ఫిర్యాధు మేరకు కేసు నమాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత: కేసు నమోదు తెలకపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున బ్లూకోర్టు సిబ్బంది మండలంలోని గౌరెడ్డిపల్లి గ్రామ శివారులో విధుల నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు మర్రిగూడ(చింతపల్లి): అతివేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన సూర్య గిరిధర్గౌడ్(28) వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన స్నేహితుడు అవినాష్తో కలిసి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గిరిధర్గౌడ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి స్నేహితుడు అవినాష్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అవినాష్ను మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడు సూర్య అరవింద్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నేడు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారి జానీ పాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో 250 వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న జాబ్మేళాను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 8919380410 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక, రాజకీయకుల గణనలో మాదిగ మెజార్టీ జనాభాగా ఉన్నాదని ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయమని, మెజార్టీగా ఉన్నవారికి ఏబీసీడీ వర్గీకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో 11శాతం రిజర్వేషన్లు అమలు కావాలని ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోకుండా వర్గీకరణను అమలు చేయకుండా అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. పేరుకే అత్యధిక జనాభా కలిగిన మాదిగలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇతర పదవుల్లో కనీసం ప్రాతినిద్యం లేదన్నారు. ప్రభుత్వాలు ఇకనైనా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. -
ఫిర్యాదు చేస్తేనే అధికారుల స్పందన
అడ్డాకుల: మండలంలోని కందూర్ గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ను శుక్రవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొన్ని ట్రాక్టర్లను ఉదయం స్థానిక పెద్దవాగులోకి తీసుకెళ్లి ఇసుకను నింపుతున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారని కొందరు నాయకులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. గిర్దావర్ శశికిరణ్, జీపీఓ నర్సిములు కలిసి వాగు వద్దకు వెళ్లి అక్కడే ఉన్న ఓ ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాలీలో ఇసుక లేదని కాని ఇసుక కోసమే అక్కడికి వెళ్లడంతో కార్యాలయం వద్దకు తీసుకొచ్చి జరిమానా విధించి వదిలేశామని తహసీల్దార్ శేఖర్ తెలిపారు. మరో చోట ఇసుక డంప్ కందూర్ గ్రామానికి సమీపంలో క్రషర్కు ఎదురుగా ఒక చోట అక్రమంగా ఇసుకను డంప్ చేశారు. కొందరు నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రాత్రి జీపీఓ నర్సిములు అక్కడికి వెళ్లి విచారించారు. షెడ్డు నిర్మాణం కోసం ఇసుకను డంప్ చేసుకున్నట్లు రైతు చెప్పాడని ఆయన తెలిపారు. కాగా కందూర్ గ్రామంలో ఇటీవల అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలింపు వివాదాలకు కారణమవుతోంది. పట్టపగలే ఇసుక, మట్టి రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకరంటే ఒకరికి గిట్టని రాజకీయ నాయకులు ఫిర్యాదు చేస్తే తప్ప కందూర్లో జరిగే ఇసుక, మట్టి అక్రమ తరలింపుపై అధికారులు దృష్టి సారించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శుక్రవారం అధికారులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్, ఇసుక డంపు వ్యవహారం రాజకీయ ‘రంగు’ను బట్టబయలు చేస్తోంది. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల నుంచి రాత్రిపూట ఇసుకను అక్రమంగా నిల్వ చేసి టిప్పర్లలో నింపి పంపిస్తున్నారని కొందరు నాయకులు ఆరోపణలు చేయడం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఇప్పటికై నా అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరముంది. ఇసుక డంప్, తరలింపుపై ఫిర్యాదులు -
జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అందించాలి
పాలమూరు: హైదరాబాద్లోని హైకోర్టు ఆవరణలో జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్కుమార్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మే నెలలో దేవరకద్ర జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం అవుతుందని, జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారిని ప్రోత్సాహించాలని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఆ తర్వాత నూతన కమిటీ హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మణ్, మాధవి దేవి, నర్సింగ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు వార్షికోత్సవానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కోశాధికారి రాజుగౌడ్, సభ్యులు సబిత, ధనలక్ష్మి, శశిబాబు పాల్గొన్నారు. పోగొట్టుకున్న బంగారు పుస్తెలు తిరిగి అందజేత యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు పోగొట్టుకున్న బంగారు నల్లపూసల పుస్తెలను ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు. ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గొర్లనోనిబావికి చెందిన కావలి మంగమ్మ తన కుటుంబసభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు శుక్రవారం వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో ఆమె బంగారు నల్లపూసల పుస్తెలు పోగొట్టుకుంది. వెంటనే మంగమ్మ సమీపంలోని ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల సాయంతో పుస్తెలు దొరికిన వ్యక్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఓ నవీన్కుమార్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె. శేషగిరిరావు, ఎస్ఐ సీహెచ్. రవి సమక్షంలో మంగమ్మకు బంగారు పుస్తెలు అందజేశారు. -
నేడు మక్తల్ 6వ వార్డుకు పోలింగ్
మక్తల్: పట్టణంలోని 6వ వార్డు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. గతంలో బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి మహదేవప్ప మృతి చెందడంతో 6 వార్డు ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. 6వ వార్డులో మొత్తం 1452 మంది ఓటర్లు ఉన్నారని , వీరిలో పురుషులు 728 మంది, మహిళలు 725 మంది, పోలింగ్ సిబ్బంది 25 మంది ఉన్నారు. ఇక బీజేపీ మద్దతుతో సత్యమ్మ, కాంగ్రెస్ మద్దతుతో మారెప్ప, బీఆర్ఎస్ తరఫున మొగులప్ప బరిలో నిలిచారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫణింద్రర్రెడ్డి పోలింగ్ బూత్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుందని ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. చందపూర్లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ ఫణిందర్రెడ్డి -
కురుమూర్తి గుట్టకు భక్తుల రద్దీ
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయం అమావాస్య సందర్భంగా శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.


