Amaravati
-
చేవ కలిగిన చేప!
సాక్షి, అమరావతి: చేపలు సాగు చేసే రైతులకు శుభవార్తే. వ్యాధులు సోకని హై గ్రోత్ చేపలు మార్కెట్లోకి రాబోతున్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అభివృద్ధి చేసిన ఈ చేప విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యాధుల నియంత్రణకే ఖర్చెక్కువ రాష్ట్రంలో 5.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దాంట్లో, 2.30 లక్షల ఎకరాల్లో చేపలు సాగవుతున్నాయి. మరోవైపు ఇన్ల్యాండ్ పబ్లిక్ వాటర్ బాడీస్లో కూడా చేపలు సాగవుతుంటాయి. ప్రధానంగా బొచ్చె (కట్ల), రాగండి (రోహు), మోసులు, రూప్ చంద్, ఫంగస్, పండుగప్ప, కొర్రమేను, తలాపియా వంటి వివిధ రకాల చేపలు సాగులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కట్ల, రోహూ రకాల చేపలే ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఏటా 45 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుండగా, 70 నుంచి 80 శాతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి. 1980వ దశకంలో అభివృద్ధి చేసిన ఈ రకాలు దాదాపు 40 ఏళ్లుగా సాగులో ఉండడం, వీటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు ఏటా పెరుగుతున్న వ్యాధులు రైతులకు పెనుసవాల్గా మారాయి. పేను, రెడ్ డిసీజ్, గిల్ ఫ్లూక్స్, ఆర్గులస్ (ఫిష్లైస్) వంటిæ వివిధ రకాల వ్యాధుల నియంత్రణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. లీజుతో కలిపి ఎకరాలో చేపలసాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంటే దాంట్లో రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఈ వ్యాధుల నియంత్రణకే ఖర్చుచేయాల్సి వస్తుంది. పదేళ్ల కృషి ఫలితం వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రకాల అభివృద్ధి కోసం దశాబ్ద కాలం పాటు సిఫా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వ్యాధులు దరిచేరని ఐదో తరానికి చెందిన అమృత బొచ్చె, జయంతి రాగండి రకాలను అభివృద్ధి చేశారు. క్షేత్ర స్థాయి పరీక్షల అనంతరం పలుచోట్ల ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతం చేశారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఆగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఈ చేపల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీడ్ పునరుత్పత్తి కోసం బాపట్లకు చెందిన హేచరీతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న బొచ్చె, రాగండి చేపలు 10–12 నెలలకు కిలో నుంచి కిలోన్నర పెరిగితే, అమృత బొచ్చె, జయంతి రాగండి చేపలు కేవలం 6–8 నెలల కాలంలోనే కిలోకి పైగా ఎదుగుతాయి. అదే ఏడాది పాటు సాగు చేస్తే 2–2.5 కేజీల పెరుగుదలతో 30–40 శాతం హై గ్రోత్ కలిగి ఉంటాయి. సంప్రదాయ చేపలకు ఎక్కువగా సోకే రెడ్ డిసీజ్, పేను వ్యాధులు వీటికి సోకవు. ఈ కారణంగా ఎకరాకు మందులకు ఉపయోగిస్తున్న వ్యయాలు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదా అవుతుంది. పైగా 6–8 నెలల్లోనే పట్టుబడికి రావడంతో సమయం కలిసొస్తుంది. అంటే సగటున రెండేళ్లకు మూడు పంటలు వేయొచ్చు. లేదంటే ఏడాది పాటు పెంచితే, వీటి గ్రోత్ కారణంగా 30–40 శాతం అదనంగా ఆదాయం వస్తుంది. ఇవి చూడడానికి గులాబీ రంగులో ఉంటాయి. పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉంటాయి. బాణం ఆకారంలో నోరు కలిగి ఉంటుంది. సాధారణ బొచ్చె, రాగండి చేపల కంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. పాలీకల్చర్కు ఎంతో అనువైనవి.నాణ్యమైన సీడ్ అందించాలి.. నేను మూడు దశాబ్దాలుగా దాదాపు 150 ఎకరాల్లో చేపల సాగులో చేస్తున్నా. ప్రస్తుతం సాగులో ఉన్న కట్ల, రోహూ రకాలు దాదాపు 40 ఏళ్లపాటు సాగులో ఉండడం, పిల్లల ఉత్పత్తిలో ఇన్బ్రీడింగ్ వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయింది. ఏటా వీటికి సోకే వ్యాధుల నియంత్రణకు వాడే మందుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పెట్టుబడి భారం పెరుగుతోంది. వీటికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహూ రకాలను సాధ్యమైనంత త్వరగా అందించగలిగితే చేప రైతులు నిలదొక్కుకోగలుగుతారు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ బ్రూడర్స్ ద్వారా నాణ్యమైన సీడ్ ఉత్పత్తికి సిఫా తోడ్పాటు అందించాలి. – పి.బోసురాజు, కార్యదర్శి ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ చేప రైతులకు నిజంగా వరం సిఫా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహు రకాలు చేపల రైతులకు నిజంగా వరం. ఇవి ఐదో తరానికి చెందిన రకాలు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ రకాలు కావడంతో వ్యాధులు దరిచేరవు. ఆ మేరకు పెట్టుబడి ఆదా అవుతుంది. ఇప్పటికే బాపట్లలోని హేచరీలకు బ్రూడర్లు అందించాం. వచ్చే సీజన్ నుంచి ఈ చేప పిల్లలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ రమేష్ రాథోడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిఫా -
నష్టపరిహారం ఇచ్చాకే...రోడ్డు విస్తరణ చేపట్టండి
సాక్షి, అనకాపల్లి: ‘గత ప్రభుత్వంలో నేను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో.. ఇప్పుడు నాకు కాపలా కాస్తున్న అధికారులే అప్పుడు నా కుర్చిని లాక్కున్నార’ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం ‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు విస్తరణ పనులు, ప్లైఓవర్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనుల శ్రీకారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ఎక్కడా వాటి గురించి మాట్లాడకుండా.. ‘గత ప్రభుత్వంలో నాపై కేసులు పెట్టి వేధించి నన్ను ఇబ్బందులకు గురిచేశారు.. చంద్రబాబును జైలుకు పంపించారు.. హోంమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారం’టూ పాత విషయాలను వల్లెవేశారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ప్రధాని మోదీ ఏపీకి ఇచ్చారని చెప్పారు. స్పీకర్కు, పల్లాకు అవమానం ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అవమానం జరిగింది. ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకూ చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ఈయనకు ప్రాధాన్యత లేకుండా మూలన కుర్చీ వేయడంపై సభకు వచ్చిన వారు విస్మయం వ్యక్తం చేశారు. కార్యక్రమం మొత్తం లోకేశ్ హైలైట్ కావడమే లక్ష్యంగా నిర్వహించినట్లు పార్టీ సీనియర్లు, కార్యకర్తలు చర్చించుకున్నారు. అలాగే, స్పీకర్ సొంత జిల్లాలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి అయ్యన్న హాజరుకాకపోవడంతో సీనియర్లకు లోకేశ్ పరోక్షంగా చెక్ పెడుతున్నారని అందరూ మాట్లాడుకున్నారు. ఇక ఈ సమావేశంలో కార్యకర్తల నుంచి వినతులు తీసుకోవడానికి లోకేశ్ నిరాకరించారు. నిర్వాసితుల నిరసన ఇక మంత్రి లోకేశ్ పర్యటనలో.. తమకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని రోడ్డు విస్తరణ నిర్వాసితులు నిరసన తెలిపారు. టీడీఆర్ బాండ్ల ప్రతిపాదన విరమించుకోవాలని, తమకు నష్టపరిహారం నగదు రూపంలోనే ఇవ్వాలంటూ అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట జంక్షన్లో ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే.. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి, మంత్రికి నిర్వాసితుల సమస్యలను చెప్పుకునేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నా పోలీసులు వారిని గృహనిర్బంధం, అరెస్టులు చేశారు. -
రేపు ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ధర్నా
సాక్షి, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలన్న డిమాండ్తో బుధవారం జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేపట్టాలని, పీఆర్సీ వేసి, ఐ ఆర్ ప్రకటించాలని, సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన 90 శాతం డీఏ బకాయిలు, సీపీఎస్ మినహాయింపు మొత్తం వారివారి ఖాతాల్లో జమచేయాలని, సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, పెండింగులో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉపాధ్యాయులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో కరువు
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఖరీఫ్ సీజన్లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ జిల్లాలో 10 తీవ్ర కరువు, కరువు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అనంతపురం జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 5, శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర కరువు, కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం, ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
పేదల ‘ఉపాధి’కి మళ్లీ ‘ఫాం పాండ్స్’ గండం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకంపై కూటమి కుట్రలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. గత టీడీపీ హయాంలో వివాదాస్పదమైన విధానాలే మళ్లీ ఊపిరిపోసుకుంటున్నాయి. ఇదే జరిగితే తమ ‘ఉపాధి’కి దెబ్బేనని కూలీలు కలవరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సొంత పొలాల్లో మళ్లీ ఫాం పాండ్స్ నిర్మాణం చేపట్టడమే వీరి ఆందోళనకు కారణం. ఇలా అయితే కోట్లాది రూపాయలు తేలిగ్గా దండుకోవచ్చని పాలకుల పన్నాగం. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపట్టే చెరువుల పూడికతీత పనులను తగ్గించి ఈ వేసవిలో రైతుల సొంత పొలాల్లో ఫాం పాండ్స్ (పంట కుంటల) పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014–19 మధ్య దాదాపు రూ.మూడున్నర వేల కోట్లతో సుమారు 9 లక్షల ఫాం పాండ్స్ నిర్మాణాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టి తీవ్ర విమర్శలపాలైంది. ఇప్పుడు వాటిలో 10–20 శాతం (అంటే రెండు లక్షలైనా) కూడా కనిపించవేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. అయినా, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అదే పంథా అనుసరిస్తోంది. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం కింద అప్పట్లాగే రెండున్నర లక్షల ఫాం పాండ్స్ నిర్మించాలని గ్రామీణాభివృద్ధి శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. ముందుగా.. రూ.900 కోట్లతో 1.40 లక్షల ఫాం పాండ్స్ను రైతు పొలాల్లో తవ్వుకునేందుకు అనుమతులిచ్చేశారు. మూడునెలల పాటు గ్రామాల్లో దీనినే మొదటి ప్రాధాన్యతగా భావించాలని ప్రభుత్వం సూచించింది. ఫాం పాండ్స్ అంటేనే అవినీతి.. పది మీటర్ల పొడువు, పది మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు చొప్పున ఒక్కో ఫాం పాండ్ నిర్మాణంలో సరాసరి 200 మంది కూలీలు పనిచేయడం ద్వారా వారికి రూ.50 వేల చొప్పున వేతనాలు చెల్లించేలా అధికారులు అంచనాలు సిద్ధంచేశారు. మరో రూ.10 వేలు చొప్పున ఒక్కో ఫాం పాండ్స్కు మెటీరియల్ కేటగిరిలో నిధులు అందజేసే అవకాశముంది. అయితే, 200 మంది కూలీలతో తవ్వే ఫాం పాండ్స్ను పొక్లెయిన్తో తవ్వితే కేవలం రూ.ఐదారు వేలతో పూర్తవుతుంది. దీంతో ఈ పనుల్లో భారీ అవినీతికి అస్కారం ఉందని.. గత చరిత్ర ఇదే చెబుతోందని పలువురు అధికారులు గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే.. అప్పట్లో కూలీల ద్వారా తవ్వించాల్సిన ఫాం పాండ్స్ను పొక్లెయిన్తో తవ్వించి.. తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కూలీల జాబితాను రూపొందించి దానిని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చి కూలీల వేతనాల పేరుతో ఉపాధి హామీ నిధులను దండుకున్నారని విమర్శలు వచ్చాయి.ఫాం పాండ్స్తో పేదలకు దెబ్బేఈ వేసవిలో ఫాం పాండ్స్ పనులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల తమ ఉపాధికి గండిపడుతుందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రాష్ట్రంలో ఏడాది పాటు ఉపాధి హామీ పథకం ద్వారా 15 కోట్ల పనిదినాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులిచ్చింది. అయితే, ఇందులో గ్రామాల్లో పనులు దొరకని ఈ వేసవి మూడునెలల కాలంలో 12 కోట్ల పనిదినాల పనుల కల్పనకు అవకాశముండగా, 3–4 కోట్ల పనిదినాలు కేవలం ఫాం పాండ్స్ పనులకే కేటాయించే అవకాశముంది.దీనివల్ల కూటమి నేతలు పొక్లెయిన్ల ద్వారా తవ్వించేసి దొంగ మస్తర్లతో పేదల ఉపాధికి గండికొట్టే ప్రమాదముంది. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి పనుల కల్పనలో తీసుకొచ్చిన మార్పులతో వ్యక్తిగతంగా కాకుండా శ్రమశక్తి సంఘాల వారీగా పనులను కేటాయిస్తున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు మరింత మేలు చేసింది. వీరికి అనుకూలంగా ఉండే శ్రమశక్తి సంఘాల పేరుతో ఫాంపాండ్, తవ్వినట్టుగా రికార్డుల్లో చూపించి, పొక్లెయిన్లతో తవ్వించేయడానికి మార్గం వేసింది. దీనివల్ల పనులు దొరక్క తాము పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. -
పోలవరంపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో తాను చేసిన చారిత్రక తప్పిదాలు, విధ్వంస కాండను కప్పిపుచ్చుకుంటూ.. గోదారమ్మ సాక్షిగా.. ప్రాజెక్టు వేదికగా సీఎం చంద్రబాబు మార్చి 27న మరోసారి అసత్యాలను వల్లించారు. ఎద్దు ఈనిందంటే.. దూడను గాటికి కట్టేయడానికి తాడు తెచ్చిన రీతిలో ‘గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు’ శీర్షికన ‘ఈనాడు’ సోమవారం పచ్చి అబద్ధాలు అచ్చేసింది. అసలు వాస్తవాలు ఇవీ..⇒ తెలుగు ప్రజల దశాబ్దాల కల పోలవరాన్ని సాకారం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. 2009 నాటికే రూ.5,298.71 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్, కుడి, ఎడమ కాలువలకు అవసరమైన లక్ష ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. కుడి కాలువలో 95 శాతం, ఎడమ కాలువలో 70 శాతం పనులను పూర్తి చేశారు.⇒ కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్ల దాహంతో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016లో సీఎం చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం అంటే.. 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయంలో మిగిలిన రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానించింది. నిజానికి పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆదిలోనే పోలవరాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా.. నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 నవంబర్లో చంద్రబాబు చేపట్టారు. 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. 2017, 2018లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో.. ఆ వరద ఉద్ధృతికి కోతకు గురై దెబ్బతిందని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నియమించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించింది చంద్రబాబేనన్నది స్పష్టమవుతోంది. ⇒ 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వెంటనే ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేసేలా అడుగులు వేశారు. ఈ క్రమంలో పీపీఏ ఆదేశాల మేరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి.. చేసిన పనులకు రక్షణ చర్యలను అధికారులు చేపట్టారు. రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టిన రూ.2,917 కోట్ల పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రద్దు చేశారు. ఆ సంస్థకే సీఎం చంద్రబాబు కట్టబెట్టిన జలవిద్యుత్కేంద్రం పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడంతో ఆ కాంట్రాక్టును రద్దు చేసి.. రెండు పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు రూ.838.5 కోట్లను ఆదా చేశారు. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే మరోవైపు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11న స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. జలవిద్యుత్కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. సీడబ్ల్యూసీ అదనంగా ప్రతిపాదించిన పనులను పూర్తి చేశారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులను కొలిక్కి తెచ్చారు. చంద్రబాబు సర్కారు చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దారు. ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని అనేక మార్లు నాడు సీఎం వైఎస్ జగన్ కోరారు. పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు అవసరమని.. అలాంటిది 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని వివరించారు. వీటిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ⇒ డయాఫ్రం వాల్ సహా వరదలకు దెబ్బతిన్న పనులను పునరుద్ధరించేందుకు రూ.2 వేల కోట్లు, తొలిదశ పనుల పూర్తికి రూ.పది వేల కోట్లు వెరసి.. రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ సిద్ధం చేశారు. ప్రాజెక్టును తొలి దశలో పూర్తి చేయడానికి మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు.. ఆ తర్వాత రెండో దశ పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని 2024, ఫిబ్రవరి 29న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు(పీఐబీ) కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయకుండా మోకాలడ్డారు. ⇒ 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లను మంజూరు చేస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ప్రాజెక్టులో నీటి నిల్వను 194.6 టీఎంసీల నుంచి 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసేలా ఎత్తును తగ్గించారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాల్లో కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడం సాధ్యమవుతుంది. దీన్ని బట్టి పోలవరానికి చంద్రబాబు మళ్లీ ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో పోలవరాన్ని గాడిలో పెట్టడం.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్.. ఇక గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వల్లే 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ లక్ష్యంగా నిర్దేశించిందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్ సెగ
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధిమిగిలిన సీనియర్లకూ అదే గతి..చంద్రబాబు సమకాలీకుడైన అశోక్గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్లూ ఇవ్వడం లేదు. ⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చిమలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్ జమానాలో తమకు అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.యనమల.. సాగనంపారిలా..టీడీపీలో అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడానికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామకృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలిగా సెట్ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామకృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు. స్వపక్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మట్టి, గ్రావెల్ దందా ద్వారా రూ.రెండు కోట్లు వెనకేసుకుంటున్నారని, తుని సమీపంలో విమానాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్ టాక్. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్లో ఐఆర్ఎస్ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. 2014–19 మధ్య డిప్యుటేషన్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. యనమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్ మీడియాలో పై అంశాలతో కూడిన వీడియోలు హల్చల్ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమార్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి. -
జగన్ హయాంలో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు మూతపడిపోయాయని, కొత్తగా ఒక్కటి కూడా రాలేదంటూ టీడీపీ కూటమి నేతల అడ్డగోలు ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 7,86,984 మంది కొత్త పారిశ్రామికవేత్తలు తయారైన విషయాన్ని రాజ్యసభకు వెల్లడించింది. ఈ కాలంలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పరిశ్రమలు, కొత్త పారిశ్రామికవేత్తల వివరాలను సంవత్సరాల వారీగా గణాంకాలతో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి వివరించారు. ఇప్పటికే అప్పుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ కూటమి అడ్డగోలుగా బురదజల్లుతూ అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిశ్రమల విషయంలోనూ కేంద్రం చేసిన తాజా ప్రకటనతో కూటమి దుష్ప్రచారానికి కళ్లెం వేసినట్లయింది.కొత్తగా 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు.. ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఉద్యమ్’ పోర్టల్లో సంవత్సరాల వారీగా కొత్తగా ఏర్పాటైన యూనిట్ల సంఖ్యనూ వివరించింది. దీని ప్రకారం.. జూన్ 1, 2020 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు రాష్ట్రంలో కొత్తగా 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా సూక్ష్మస్థాయి (మైక్రో) యూనిట్లు మహిళల పేరిట ఉండటం గమనార్హం. అలాగే, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జెనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 14,969 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఊపిరిపోసుకున్నాయి.స్టార్టప్ల జోరు..గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భారీగా స్టార్టప్లు ఏర్పాటైనట్లు కేంద్రం ప్రకటించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన 2,106 సార్టప్లు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో వచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వినూత్నమైన ఆలోచనలతో వచ్చిన విద్యార్థులను చేయిపట్టి వారి ఆలోచనను ఒక కంపెనీగా రూపుదిద్దించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ విధంగా నడిపించిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇందులో 1,159 స్టార్టప్లకూ మహిళలే నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. ఇక సంకల్ప పథకం కింద 212 యూనిట్లు, పీఎం సూర్యఘర్ పథకం అమలుకు అవసరమైన పరికరాలు అందించడానికి రెండు యూనిట్లు, అలాగే.. గడిచిన ఐదేళ్లలో 248 అగ్రి క్లినిక్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అనేకమంది ఉపాధి పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
చంద్రబాబు‘లూలూ’ గోల్ ‘మాల్’!
సాక్షి, అమరావతి: ‘లూలూ’గ్రూపుపై చంద్రబాబు సర్కారు వల్లమాలిన ప్రేమ చూపింది. లూలూ గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుపై ఆ సంస్థకు ధారాదత్తం చేసింది. విశాఖలోని హార్బర్ పార్క్లో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్.. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్ఎఫ్పీ) నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది. హార్బర్ పార్క్లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.150 కోట్లకుపైగా పలుకుతోందని విశాఖ వాసులు చెబుతున్నారు. అంటే.. ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని ‘లూలూ’కు రాసిచ్చేసినట్లు స్పష్టమవుతోంది. బీచ్ పక్కనే ఉన్న హార్బర్ పార్క్లో 13.43 ఎకరాల ఖరీదైన భూమి వీఎంఆర్డీఏ(విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) అధీనంలో ఉంది. అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలంటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి వీల్లైదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. “లూలూ’కు 99 ఏళ్లకు నామమాత్రపు అద్దెపై అప్పగిస్తూ.. ఆ సంస్థ ఛైర్మన్ విధించిన షరతులన్నింటికీ తలూపుతూ ఖరీదైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనలు తుంగలో తొక్కి “లూలూ’పై వల్లమాలిన ప్రేమ చూపించినట్లు స్పష్టమవుతోంది.18 ఏళ్ల అనుబంధం.. ఆగమేఘాలపై పచ్చజెండాటీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లూలూ ప్రాజెక్టుకు చంద్రబాబు తిరిగి పచ్చ జండా ఊపారు. గతేడాది సెప్టెంబరు 28న సీఎం చంద్రబాబుతో సమావేశమైన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలీ విశాఖలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు. దీనిపై అదే రోజు “ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా.. తనకు చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందంటూ లూలూ గ్రూప్ ఛైర్మన్ ప్రతిస్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో విశాఖ హార్బర్ పార్క్లో 13.43 ఎకరాల భూమిని అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామంటూ ఈ ఏడాది జనవరి 17న సీఎం చంద్రబాబుకు లూలూ గ్రూపు ఛైర్మన్ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 13న ఎస్ఐపీబీ(స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఆమోదముద్ర వేశారు.ఇలా కలిశారు.., అలా జీవో ఇచ్చేశారు భారీ రాయితీలు.. అత్తెసరు అద్దెతమకు భూమిని 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని.. మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే వరకూ లేదా మూడేళ్ల వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకూ అద్దె మినహాయింపు ఇవ్వాలని లాలూ గ్రూపు ఛైర్మన్ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పదేళ్లకు ఒకసారి పది శాతం అద్దె పెంచాలని, సాధ్యమైనన్ని అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాటన్నింటికీ ప్రభుత్వం తలూపడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఎకరానికి నామమాత్రంగా రూ.50 లక్షలు అద్దెగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రోత్సాహకాల కింద లూలూ గ్రూప్నకు రూ.170 కోట్లకుపైగా ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది. లాలూ గ్రూప్ కోరికల చిట్టాకు తలూపి అంత లబ్ధి చేకూరుస్తున్నా ఆ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి అద్దె రూపంలో అత్తెసరు ఆదాయం మాత్రమే రానుండటం గమనార్హం. దీన్నిబట్టి ఇందులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 2018 ఫిబ్రవరి 16న నాటి టీడీపీ సర్కార్ లూలూ సంస్థకు పీపీపీ పద్ధతిలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి భూమిని నామమాత్రపు లీజుపై కేటాయించి భారీ రాయితీలు కల్పిస్తూ ఏకపక్షంగా కట్టబెట్టింది. దీని వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.ఆదాయాన్ని ఆర్జించే వీలున్నా..వాస్తవానికి లూలూ మాల్కు అప్పగిస్తున్న భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణాలను చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, అద్దెలకు ఇవ్వడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అయితే దీన్ని కాదని.. ఓ ప్రైవేట్ సంస్థకు కారుచౌకగా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు అత్యంత ఖరీదైన స్థలాన్ని కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక గూడుపు ఠాణీ వ్యవహారాలే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడకు సమీపంలోనే రహేజా నిర్మిస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ కూడా ఉంది. నిజంగానే షాపింగ్ మాల్ కట్టాలనుకుంటే ప్రభుత్వమే నిర్మించవచ్చు. బ్యాంకు రుణం కూడా పొందే వీలుంది. అలాకాకుండా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాల మాదిరిగా ధారాదత్తం చేయడం, రూ.వందల కోట్ల రాయితీలు కల్పించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూమిని ఒకవేళ ప్రైవేట్ పరం చేయాలనుకుంటే టెండర్లు నిర్వహించి బహిరంగ ప్రకటన జారీ చేయాలి. రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఖజానాకు జమ చేసి పారదర్శకంగా వ్యవహరించాలి. దీనికి విరుద్ధంగా 99 ఏళ్ల పాటు లీజు.. పలు రాయితీలు కల్పించడం వెనుక గోల్ఙ్మాల్’ వ్యవహారాలు దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఎకరానికి చెల్లించే అద్దె: రూ.50 లక్షలు ⇒ లీజు గడువు: 99 ఏళ్లు⇒ రాయితీల రూపంలో లూలూ పొందే లబ్ధి: రూ.170 కోట్లు(స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితరాలు) -
3, 4 తేదీల్లో వర్షాలు
సాక్షి, అమరావతి: వేసవిలో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు సోమవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది.నంద్యాల గోస్పాడులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాలు, విజయనగరం జిల్లా–6, పార్వతీపురం మన్యం జిల్లా–10, అల్లూరి సీతారామరాజు జిల్లా–3, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. -
అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు.వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్సీపీ నేతల పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నేడు టెన్త్ సోషల్ పరీక్ష
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.విధి నిర్వహణలో భాగమైన అధికారులు, ఉపాధ్యాయులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం ఐచ్చిక సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పదో తరగతి పరీక్షలకు సెలవు వర్తించదని అధికారులు ప్రకటించారు. -
పేర్ని నాని కుటుంబంపై మరోసారి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
విజయవాడ,సాక్షి : పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. గతంలో పేర్ని నాని భార్యకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. bnss 316(5) సెక్షన్ని పెట్టి ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తోంది. పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ సెక్షన్ పేర్ని జయసుధకు వర్తించదని జిల్లా కోర్టు స్పష్టం చేసింది. పేర్ని జయసుధకు ఇవ్వగానే పేర్ని నానిని పోలీసులు ముద్దాయిని చేశారు. పేర్ని నానికి హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఇద్దరికీ బెయిల్ మంజూరైనా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. రేషన్ బియ్యం కేసుల్లో ఎన్నడూ లేని రీతిలో మళ్లీ పేర్ని నాని భార్యని పోలీసులు టార్గెట్ చేశారు. రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. -
‘చంద్రబాబు.. పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా ?’
తాడేపల్లి: హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పీ4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పట్ల చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...పేదల విషయంలో చంద్రబాబుది రెండు నాలుకల దోరణి. చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమం అంటూ మాట్లాడటమే తప్ప వాస్తవంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టరు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వర్గం వారి సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి పేదలన్నా, దళితులన్నా, బీసీలన్నా ఎప్పుడూ చులకన భావమే. దళిత కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించిన కుల దురహంకారి. తాజాగా నిన్నటికి నిన్న ఉగాది పండగ రోజున ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమంలోనూ మళ్లీ ఇదే తరహా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడొచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది’ అనుకుంటారు.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఉగాదినాడు ఆర్భాటంగా కార్యక్రమం మొదలుపెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే, ఆ ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి అంత దారుణంగా మాట్లాడడం అత్యంత హేయం.ఆది నుంచి ఆయనకు పేదలంటే అలుసేచంద్రబాబుకు ఆది నుంచి పేదలంటే అలుసే. ఆయన దళితులు, బడుగు, బలహీనవర్గాలపై తనకు అలవాటైన రీతిలో మళ్ళీ మళ్ళీ నోరు పారేసుకుంటునే ఉంటారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని చంద్రబాబుగారు బయటపెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో నాడు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుగారు బీసీలపై తన అక్కసు వెళ్లగక్కారు. తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. ఏం తమాషాలు చేస్తున్నారా? అసలు మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించారు.ఇంకా నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు. నాకెందుకు ఓటు వేయరు. అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్మెయిల్ తరహాలో పేదలను బెదిరించారు. నాయకుడి బాటలో నడుస్తున్న టీడీపీ నేతలు కూడా నోరు పారేసుకుంటున్నారు. దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడితే టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారు. అసలు బీసీలన్నా, దళితులన్నా ఆయనకు పడనే పడదు. వారి కోసం చిత్తశుద్ధితో చేసింది ఒక్కటీ లేదు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి, నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేయడం తప్ప. టీడీపీ నుంచి రాజ్యసభకు పంపిన వారిని చూస్తే.. దళితులు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అభిప్రాయం, ఆయన వైఖరి అందరికీ అర్ధమవుతుంది.రాష్ట్రంలో రెడ్బుక్ పాలనఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, ప్రతిపక్షంపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేశారు. ఉగాది పండగ రోజున గుడికి వెళ్లొస్తుండగా, దారి కాచిన దుండగులు దారుణంగా హతమార్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత బంధువులే హత్యకు కారణమంటూ, లింగయ్య బంధువులు ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడం లేదు. అనుమానితుల పేర్లు చెప్పినా, పోలీసులు ఖాతరు చేయడం లేదు. ఆ దిశలో కేసు దర్యాప్తు చేయడం లేదు. మరోవైపు లింగయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతోందా? లేక మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తోంది. ఇది మంచి సంప్రదాయం కాదని హెచ్చరిస్తున్నాం. చర్యకు అనుగుణంగా ప్రతి చర్య ఉంటుందని గుర్తు చేస్తున్నాం.పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా?చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో నిరుపదలను ధనవంతులు సహాయం చేయడం ద్వారా వారి పేదరికాన్ని తొలగిస్తానని చెప్పారు. ఆయన బీఆర్ అంబేద్కర్ను కోట్ చేశారు. ఆయనకు కూడా ఇలా సహయం అందడం వల్లే ఆయన ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత స్థానానికి చేరుకున్నారని గుర్తు చేశారు. ఇదే అంబేద్కర్ రాజ్యాంగంలో కొన్ని అంశాలను పేదల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనను బాధ్యతగా తీసుకుంటేనే వారు పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. ప్రజలు తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వం తమకన్నా దిగువన ఉన్న వారికి సంక్షేమం ద్వారా చేయూతను అందించాలని, సమాజంలో అసమానతలను తగ్గించాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు దీనికి భిన్నంగా పీ4 పేరుతో పేదలను ఆదుకునే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ మౌలిక సూత్రాకుల అనుగుణంగా పాలించాల్సిన వారు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ కులాలకు ఎస్సీ సబ్ప్లాన్, బీసీ కులాలకు బీసీ సబ్ప్లాన్లు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా సమాజంలోని ధనవంతులు పేదలను దత్తత తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని చంద్రబాబు సూత్రీకరించారు. మీరు ఈ రాష్ట్రంలో పేదరికం ఉందనే విషయం ఆలస్యంగా అయినా చంద్రబాబు తెలుసుకున్నారు. కరోనా వంటి ప్రపంచ విపత్తు సమయంలోనే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, నేను ఏమీ చేయలేనని చెప్పకుండా ఎంతో బాధ్యతగా పేదలకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారిని చూసి నేర్చుకోండి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఖజానాలో ఉన్నది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అలాగే వేలాది కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినా బెంబేలెత్తలేదు. పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఎగ్గొట్టాలని ఏనాడు అనుకోలేదు. పేదల ఇళ్ళలో విద్యాజ్యోతిని వెలిగిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ఫీజురీయింబర్స్మెంట్ను తీసుకువచ్చారు. చంద్రబాబు మాట్లాడితే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు దృష్టిలో కేవలం కులవృత్తులతోనే బతకాలని అనుకుంటున్నారు. అంతేకానీ బీసీలకు ఉన్నత విద్యను అందించాలని, వారి జీవితాల్లో మార్పులు తేవాలని ఏనాడు ఆలోచన చేయలేదు. -
‘పరిటాల సునీత కనుసన్నల్లోనే లింగమయ్య హత్య’
తాడేపల్లి : ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే కురబ లింగమయ్య హత్య గావించబడ్డాడని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సునీత్ డైరెక్షన్, ఎస్పై సుధాకర్ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని, రామగిరి ఎంపీపీని దక్కించుకోవటానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాస్ రెడ్డి.. ఎస్పై సుధాకర్ తన ఫోన్ నుంచే పరిటాల సునీత, శ్రీరామ్ లకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ గూండాలతో తమ ఎంపీటీలసీ కిడ్నాప్ చేయించటానికి ప్రయత్నించారని, దీన్ని అడ్డుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. మండలానికొక వైఎస్సార్ సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద రెండు రోజుల పాటు దాడులు చేశారన్నారు.‘కురుబ లింగమయ్యను దారుణంగా కొట్టి హతమార్చారు. టీడీపీ గూండాలు ఆదర్శ్, మనోజ్, నర్సింహా, నవకాంత్, రమేష్, సురేష్ లే ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఐతే పోలీసులు మాత్రం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తున్నారు. చివరికి కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించటం లేదు’ అని తోపుదుర్తి పేర్కొన్నారు. -
నిఖార్సైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల జిల్లా పరిషత్, మరికొన్ని ఎంపీపీలు, ఇంకొన్ని చోట్ల సర్పంచ్లు, ఉప సర్పంచుల ఎన్నికలు.. ఏ ఎన్నిక అయితేనేం... కూటమి నాయకులది ఒకటే లక్ష్యం. అధికారాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా వైఎస్సార్సీపీ హవాకు అడ్డు కట్టవేయడం. అయితే ప్రజల అండ, సామాన్య కార్యకర్తల తెగువ, నాయకుల చొరవతో వారి ఆటలు సాగలేదు. ఈ పరిణామాలు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి.గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు తెగువచావనైనా చస్తా... పార్టీ మారనుయలమంచిలి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆస్తిపాస్తులకు ఆమె నిరుపేద కావచ్చు కానీ.. గుణంలో మాత్రం సంపన్నురాలు. స్వపక్షాన్ని కాదని విపక్షానికి ఓటేస్తే చాలు తన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఇంటా బయట ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన వ్యక్తిత్వాన్ని వీడలేదు. చావనైనా చస్తాను కానీ, పార్టీ మారనంటే మారనని పోలీసులతోనే తెగేసి చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ. అనారోగ్య సమస్యలతో భర్త శ్రీనివాస్ చనిపోయారు.దీంతో వితంతు పింఛన్, కొబ్బరితోటపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆమె కుటుంబాన్ని నెట్టుకోస్తోంది. పెద్దకుమార్తె 9వ తరగతి, చిన్న కుమార్తె 6వ తరగతి చదువుతున్నారు. యలమంచిలి మండలంలో 17 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను వైఎస్సార్సీపీకి 13, కూటమికి నలుగురు సభ్యుల బలం ఉంది. ఎలాగైనా సరే వైఎస్సార్సీపీ సభ్యులను లాక్కుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ నేతలు బెదిరింపులు, ప్రలోభాలకు తెర లేపారు. ‘నువ్వు పార్టీ మారితే రూ.5 లక్షలు ఇస్తాం. మీ పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి బాధ్యత తీసుకుంటాం’ అని బేరం పెట్టారు. ఇందుకు ఆమె నో చెప్పి వైఎస్సార్సీపీ శిబిరానికి వెళ్లింది. ఇదే అదనుగా టీడీపీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి కుమార్తెలకు ఆశ చూపించారు. టీడీపీ నేతల కుట్రను అర్థం చేసుకోలేని ఆ పిల్లలతో ‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’ అని పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. దీంతో పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్, పట్టణ సీఐ కోలా రజనీకుమార్, యలమంచిలి ఎస్సై కర్ణీడి గుర్రయ్య ఎంపీపీ కార్యాలయం వద్దకు వెళ్లి సత్యశ్రీని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ తన పిల్లలను చూసిన సత్యశ్రీ ఏం జరిగిందో ఊహించింది. ‘మాకు వైఎస్సార్ అంటే ప్రాణం. మా కుమార్తెకు భారతి అని పేరు పెట్టుకున్నాం. నన్ను బలవంతంగా పార్టీ మారాలని బెదిరిస్తే ఉరేసుకుని చస్తాను కానీ, పార్టీ మారే ప్రసక్తి లేదు. ఇలా బలవంతం చేయడం తగదు’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ముఖంపై తెగేసి చెప్పడంతో దిమ్మెరపోయిన పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్ కార్యాలయం వద్ద దిగబెట్టారు. సత్యశ్రీ తీరు రాజకీయ ఊసర వెల్లులకు చెంపపెట్టు అని ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్నారు.మరో పార్టీకి ఎలా మద్దతిస్తాను?అంబేడ్కర్కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన ‘జగనన్నను చూసి ప్రజలు నన్ను గెలిపించారు. అలాంటప్పుడు నేను జగనన్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఎలా మద్దతు ఇస్తాను?’ అని అంబేడ్కర్కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతల బెదిరింపులతో వారి క్యాంపులో ఉన్నప్పటికీ, తీరా ఓటు వేసే సమయానికి అనుకున్న విధంగా చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం ఎంపీపీ స్థానం విషయంలో ఏ మాత్రం బలం లేకపోయినా తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి నాయకత్వం ఆశించింది. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరిగాయి.ముఖ్యంగా ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారం జరిగిన వైఎస్సార్సీపీ నేత ఆంజనేయరెడ్డిమీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక ఎంపీపీ తమదే అని భావించారు. ఎంపీటీసీగా ఉన్న సృజన కుటుంబ సభ్యునిచేతే ఆంజనేయరెడ్డిమీద తప్పుడు కేసు పెట్టించారు. అయితే ఆంజనేయరెడ్డిమీద పెట్టింది తప్పుడు కేసేనని స్వయంగా బాధితునిగా పేర్కొన్న మోహన్దాస్ పేర్కొంటుండడంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంపీటీసీ సృజన పార్టీకి తమ మద్దతు మారదని స్పష్టంచేస్తూ, ఓటింగ్లో పాల్గొని కూటమి నేతలకు చెంపపెట్టుగా నిలిచారు.జగనన్న ఫొటోతో గెలిచిన నేను ఎలా మరచిపోతాను?మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు నాగేంద్రమ్మ పుల్లలచెరువు ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఈనెల 27వ తేదీ ఎన్నిక నిర్వహించారు. వరికల్లు నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలిగా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారు. ఆమె భర్త వరికల్లు పోలయ్య ముటుకుల సబ్స్టేషన్లో నైట్ వాచ్మెన్గా పని చేస్తున్నారు. కూటమి నాయకుల బెదిరింపులతో ఇతను టీడీపీ వారికే ఓటెయ్యాలని భార్యకు సూచించారు. అయితే వైఎస్ జగన్ ఫొటోతో గెలిచిన తాను టీడీపీకి ఎలా ఓటేస్తానని తిరస్కరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికే మద్దతు ఇచ్చి.. ఇంట్లో గొడవలు రాకుండా కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లారు. -
2023-24లో శభాష్... పోలీస్
సాక్షి, అమరావతి: అమ్మో...! పోలీస్...! అని ప్రస్తుతం రాష్ట్రం హడలెత్తిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెడ్బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు సాగిస్తున్న అరాచకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, పోలీసు స్టేషన్లో చిత్రహింసలు... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వసాధారణ దృశ్యాలు అయిపోయాయి. కానీ, ఇదంతా ఈ 10 నెలల్లో రాష్ట్ర పోలీసు శాఖ ఒంటికి పూసుకున్న కళంకం.ఏడాది క్రితం వరకు ఏపీ పోలీసు శాఖ పనితీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. శభాష్... ఏపీ పోలీస్... అని జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందిందని ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’ (సీఎస్డీఎస్) సర్వే వెల్లడించింది. కామన్ కాజ్ సంస్థతో కలసి లోక్నీతి సంస్థకు చెందిన సీఎస్డీఎస్ దేశంలో పోలీసుల పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2023–24లో దేశంలో 17 ప్రధాన రాష్ట్రాల్లో పోలీసుల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’ అనే పేరుతో తాజాగా వెల్లడించింది. పోలీసు విధులు సక్రమంగా నిర్వహించడంలో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆ నివేదిక పేర్కొనడం విశేషం.అదీ పోలీసింగ్ అంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ చట్టానికి లోబడి సమర్థంగా విధులు నిర్వర్తించింది. ప్రధానంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిబంధనల మేరకు అరెస్టులు, అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు అత్యంత మెరుగైన పనితీరును కనబరిచారని సీఎస్డీఎస్ సంస్థ సర్వే వెల్లడించింది. దేశంలో అత్యంత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేరళ పోలీసు శాఖ మొదటిస్థానం సాధించగా... చివరి మూడు స్థానాల్లో బిహార్(15), కర్ణాటక(16), జార్ఖండ్(17) నిలిచాయి.అప్పుడు నిబంధనల మేరకే అరెస్టులు..⇒ బాధితుల ఫిర్యాదులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు స్పందన మెరుగ్గా ఉండేదని సీఎస్డీఎస్ సర్వే నివేదిక వెల్లడించింది.⇒ ఫిర్యాదు రాగానే సత్వరం స్పందించి తగిన చర్యలు చేపట్టేవారు. అదే సమయంలో నిందితులను అరెస్టు చేయడంలోనూ నిబంధనలను అతిక్రమించకుండా చట్టానికి లోబడే వ్యవహరించేవారని ఆ సర్వే స్పష్టం చేసింది.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టు చేయడంలో ఎల్లప్పుడూ కచ్చితంగా నిబంధనలను పాటించేవారని 57శాతం మంది చెప్పారని ఆ సర్వే వెల్లడించింది. తద్వారా రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టులు చేయడంలో పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరించేవారని తేల్చి చెప్పారు. అందుకే ఉత్తమ పోలీసింగ్లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.⇒ 2023–24లో అత్యధికంగా 32% అరెస్టులు దొంగతనాలు, దోపిడీ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. అరెస్టుల్లో 17% మహిళలపై నేరాల కేసుల్లో, 12% అల్లర్ల కేసుల్లో, 12%హత్యలు, దాడుల కేసుల్లో, 4%పబ్లిక్ న్యూసెన్స్ కేసుల్లో చేశారు. అంటే దాదాపు అన్ని అరెస్టులు కూడా సరైన కేసుల్లోనే చేశారని నివేదిక పేర్కొంది. అక్రమ కేసులతో వేదింపులకు పాల్పడేవారు కాదని స్పష్టంగా తెలిపింది.⇒ ఆందోళనలు, ధర్నాల విషయంలో 51% కేసుల్లో పోలీసులు సంయమనం పాటించారని కూడా వెల్లడించింది. చిన్నచిన్న సంఘటనలకు కేసుల్లో కౌన్సిలింగ్ ద్వారానే 49% కేసులను పరిష్కరించారు. -
మండే ఎండ.. జాగ్రత్తలే అండ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఇంకా ఎక్కువ ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. వడదెబ్బ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఎండల్లో పనిచేసే కార్మికులు గంటకు 10 నిమిషాల చొప్పున నీడపట్టున చేరి విశ్రాంతి తీసుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉ.11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది రాష్ట్రంలో 4,422.. అంతకుముందు ఏడాది 833 చొప్పున వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..– ఎక్కువ సమయం ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి రాకూడదు. అదే విధంగా 40 డిగ్రీల ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ఏసీ గదుల్లోకి వెళ్లకూడదు. – వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. – ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే గొడుగు, టోపీ, హెల్మెట్ వాడాలి. – పిల్లలను ఎండలో ఆడుకోనివ్వకుండా, ఇండోర్ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు కర్టెన్లు వాడాలి.– దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలు తాగుతుంటారు. ఇలాచేస్తే మరింత దాహం పెరుగుతుంది. వీటికి బదులు మజ్జిగా, కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఉత్తమం. – శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేట్ శీతల పానీయాలు తాగకూడదు. అలాగే, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.వడదెబ్బకు గురైతే చేయాల్సినవి..– వడదెబ్బకు గురైన బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అందించాలి.– బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.– బట్టలు వదులు చేసి, చల్లటి నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది.– గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి.రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి..శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్తపడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల పైబడినా, ఐదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం.. చర్మం పొడిబారి వదులుగా మారడం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలు వేడి, చలిని తట్టుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణులు, వృద్ధులు ఎండలేని సమయంలోనే బయటకెళ్లాలి. – డాక్టర్ పి. ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, కాకుమాను, గుంటూరు జిల్లా -
బీసీల ఆలోచన ఆ పూటకే!
సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’ ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే. నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్మెయిల్ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.చరిత్రలో ఎవరూ చేయలేదు..పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పథకం లోగో, పోర్టల్ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వల్ల అబ్దుల్ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు. పీ–4 గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్ టెన్లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పవన్ దొరకడం నా అదృష్టం..2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది. ⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్కుమార్ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మాన్యుయేల్ తన కూతుర్ని ఎంబీబీఎస్ చదివించాలని కోరగా మెయిల్ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇంత హీనంగా మాట్లాడతారా? పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి. – చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుబాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి. – నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడుగుణపాఠం తప్పదు పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిపేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది. – కైలే అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేఅసలు మనిషి బయటపడ్డాడు.. చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. – జోగి రమేష్, మాజీ మంత్రి -
‘పీ4’.. అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!
సాక్షి, అమరావతి: నాటి ఉగాది హామీ.. వలంటీర్లను కొనసాగించి వేతనం రూ.పది వేలు చేస్తాం! నేటి ఉగాది హామీ.. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా రూపుమాపుతా..!! సాధారణంగా అందరూ ఏప్రిల్ 1న ఫూల్స్ డే చేసుకుంటుంటారు..! సీఎం చంద్రబాబు మాత్రం అడ్వాన్స్గా తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఫూల్స్ చేశారు! సరిగ్గా ఏడాది క్రితం 2.66 లక్షల మంది వలంటీర్లను వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపుచ్చేందుకు సిద్ధమయ్యారు! రాజకీయాల్లో తన డైవర్షన్ పాలిటిక్స్ను సంక్షేమ కార్యక్రమాలకూ వర్తింపజేస్తున్నారు.నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలి. కానీ అవేమీ చేయకుండా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ గత ఐదేళ్లూ వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, విప్లవాత్మక విధానాలను కక్షపూరితంగా నిలిపివేశారు. మరోపక్క విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి మౌలిక రంగాలను నిర్విర్యం చేశారు. పేదలకు కూడు, గూడు, దుస్తులు సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత.దీన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకుని పీ 4 పథకం పేరుతో మరో కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఎన్నడూ మాటపై నిలబడిన దాఖలాలు లేవని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఉన్న ఆయన్ను ఎలా నమ్మాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారని.. హామీల అమలుకు మొదటి రోజు నుంచే ఆరాట పడ్డారని.. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. బాధ్యతల నుంచి పరార్... ఎన్నికల ముందు జనసేన–బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని నమ్మబలికారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు అంటూ మహిళలను, అన్నదాతా సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మోసపూరిత వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పీ–4 పేరుతో మరో నాటకానికి తెరతీశారు. అన్నీ తెలిసే మోసపూరిత వాగ్దానాలు గతంలో మూడుసార్లు సీఎంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆరి్థక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తానిచ్చిన హామీలను చూస్తుంటే భయం వేస్తోందని, సంపద సృష్టికి మార్గాలుంటే తన చెవిలో చెప్పాలంటూ నిజ స్వరూపాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం.. గెలిచాక తిలోదకాలు ఇవ్వడం చంద్రబాబుకు మొదటినుంచి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రైతు రుణ మాఫీ వ్యవహారమే దీనికి మచ్చు తునక. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త కార్యక్రమాలు తేవడం ఆయనకు ఆలవాటే. ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చిన జగన్.. చంద్రబాబు ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ సర్కారుకు మరో నాలుగేళ్ల సమయమే మిగిలి ఉంది. అలాంటప్పుడు పీ–4తో 2029 నాటికి పేదరిక నిర్మూలన చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు తాను ఇస్తానని చెప్పినవి ఇవ్వకపోగా.. గతంలో వైఎస్ జగన్ ఇచ్చినవీ ఎగ్గొడుతున్నారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నడుం బిగించారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి సొంత ఉపగ్రహం.. అమరావతిలో ఒలింపిక్స్.. రాజధానికి హైపర్ లూప్.. ఎండలు 2 డిగ్రీలు తగ్గింపు‘‘సాధ్యాసాధ్యాలతో పనిలేదు..! నమ్మశక్యం కాని విషయాలను నమ్మించేలా చెప్పడం..! వినేవాడుంటే చాలు.. చెప్పేవాడు చంద్రబాబు...!’’ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదీ!! పీ–4 అంటూ ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చిన కార్యక్రమం నేపథ్యంలో ఇలా ఎద్దేవా చేస్తున్నారు. ఏపీకి సొంతంగా ఉపగ్రహం..! అవసరమైతే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ఉపగ్రహాలు..! అని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించే హైపర్ లూప్ను అమరావతికి తెస్తానంటూ గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దాదాపు 10,500 మందికిపైగా క్రీడాకారులు, రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ఒలింపిక్స్ను అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం.. అమరావతిలో ఎండలు రెండు డిగ్రీలు తగ్గించాలి.. నోబెల్ బహుమతి సాధించేందుకు సులభమైన మార్గం చెప్పాలనడం.. ఎవరైనా దాన్ని సాధిస్తే రూ.వంద కోట్లు ఇస్తానని జపాన్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత సమక్షంలోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేయటంపై చర్చ జరుగుతోంది.హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దింది తానేనని, సత్య నాదెళ్ల తనవల్లే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని చంద్రబాబు తరచూ గొప్పలకు పోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ట్రాఫిక్ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజలతో గడిపే పోలీస్లు ఇంటి నుంచి విధులు నిర్వహించేలా (వర్క్ ఫ్రం హోం) చర్యలు తీసుకుంటానని చెప్పటాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.నిబద్ధతతో నవరత్నాలు.. సంక్షోభంలోనూ సజావుగా పథకాలు.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేసింది. తొలి కేబినెట్ (10–6–2019) సమావేశంలోనే వైఎస్ జగన్ నవరత్నాలకు ఆమోదం తెలిపి నిబద్ధత చాటుకున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించడమే కాకుండా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అని తేడా చూపకుండా ప్రతి ఇంటికీ వలంటీర్లను పంపి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్దే. క్యాలెండర్లో ప్రకటించిన తేదీల ప్రకారం నేరుగా నగదును బదిలీ చేశారు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉన్నాయని, నవరత్నాలు ఎలా అమలు చేస్తారంటూ నాడు ఎల్లో మీడియా కథనాలను అచ్చు వేసింది. అయితే కోవిడ్ సంక్షోభంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ఆపలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేప సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో రూ.6 వేల కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ హామీలను నెరవేర్చకుండా పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యం కింద పీ–4 పేరుతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేస్తానంటూ సంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకుంటున్నారు. -
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ-4 లాంఛింగ్ సభ అట్టర్ ప్లాపయ్యింది. ప్రారంభ సభకు టీడీపీ నాయకులు బస్సుల్లో జనాల్ని రప్పించారు. అయినా సరే మీటింగ్ జరుగుతుండగా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.సమావేశం మధ్యలోనే జనం వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. ఇలాంటి బడుగుల,బలహీనుల ఆలోచనలు పూట వరకే. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వాళ్ల ఆలోచన వచ్చాం. మీటింగ్ అయ్యింది. మా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మన ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది ... కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు’అని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘మీ అన్నగా చెప్తున్నా’ అన్న పవన్ మాటలు ఏమయ్యాయి?
తాడేపల్లి : గత ఏడాది ఉగాది పండుగనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఎన్నో మాయమాటలు చెప్పి వాలంటీర్లను ముంచేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన పుత్తా శివశంకర్.. గత ఉగాది నాడు చంద్రబాబు, పవన్లు ప్రజల్ని ఎలా నమ్మించి మోసం చేశారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇద్దరూ కలిసి వాలంటీర్లను నిలువునా గొంతుకోసేశారు. గత ఉగాది పండుగ నాడు వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది. ‘‘ మీ అన్నగా చెప్తున్నా’ ’నంటూ పవన్ సైతం వాలంటీర్లకు పదివేల జీతం హామీ ఇచ్చారు. వారికి లక్ష రూపాయల వరకూ సంపాదించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ హామీ సంగతిని పక్కన పెడితే.. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదంటున్నారు. వాలంటీర్లను విజయవాడ వరదలప్పుడు వాడుకున్నది ఎవరు?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలన రెండున్నర లక్షల వాలంటీర్ల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. రోడ్డున పడిన వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలి’ అని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. -
‘వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది పండుగ లేకుండా చేశారు’
విజయవాడ: ఏపీలో వాలంటీర్ల ఉద్యోగాలు తీసేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి ఉగాది పండుగ లేకుండా చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎన్నికల సమయంలో వారికి రూ. 10 వేలు జీతం పెంచుతామని చెప్పి ఉన్న ఉద్యోగం కూడా తీసేసిన ఘనత చంద్రబాబుదంటూ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చిత్తూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్త మురళీరెడ్డిపై దారుణంగా దాడి చేశారు. ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. ఏడాది కాకుండానే ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో రోడ్డెక్కుతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ఎన్ని లక్షల కోట్లు అప్పులున్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా అని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అన్ని అప్పులు లేకపోయినా ప్రజలను మోసం చేస్తున్నారు. -
కష్టాలు పవన్ ఖాతాలో.. సుఖాలు లోకేష్కు
అమరావతిలో ఎప్పట్లానే ఉగాది ఆస్థానం ఏర్పాటు చేసారు... గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే చంద్రబాబు.. లోకేష్.. మంత్రులు మాత్రమే ఉండేవాళ్ళు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఆస్థానంలో పాల్గొన్నారు. పంచాంగకర్త మాడుగుల నాగఫణి శర్మ.. గతంలో మాంచి ఫామ్లో ఉంటూ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఫేడ్ అవుట్ అయిన మాడుగుల నాగఫణి శర్మ పంచాంగం చదూతున్నారు. లోలోన పవన్ లోకేష్ ఇద్దరూ టెన్షన్ టెన్షన్ అవుతున్నారు.. మాకు ఎలా ఉంటుంది.. ఏమై ఉంటుంది.. భవిష్యత్ బంగారమే కదా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. నాగబాబు కూడా కొత్త కండువా మాటికీ సర్దుకుంటూ మేధావి నవ్వు నవ్వుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. అసలు ఉగాది పండగను కనిపెట్టి.. తెలుగుప్రజలు కొత్త సంవత్సరాన్ని పరిచయం చేసిన చంద్రబాబు కూడా చిద్విలాసంతో కూర్చున్నారు..చెప్పండి శర్మగారూ అని చంద్రబాబు ఆదేశించగా... ముందుగా ఆదాయ వ్యయాలు అని మొదలెట్టారు.. ఆ.. గమ్మున చెప్పండి అన్నారు అందరూ కోరస్ గా.. మీ అందరికీ ఆదాయం వెయ్యి.. ఖర్చు పావలా అన్నారు శర్మగారు.. దీంతో వారంతా లోలోన మురిసిపోయారు.. అవును .. అమరావతి కాంట్రాక్టులతో బాగానే వస్తోంది.. ఎక్కడా పైసా ఖర్చు చేయక్కర్లేదు.. శర్మగారు బాగానే చెప్పారు అనుకున్నారు.. లోకేష్ కూడా.. అవును పోస్టింగులు.. బదిలీలు అన్నీ నావే కాబట్టి నా ఆదాయం బాగానే ఉంటుంది.. పైగా జిల్లాలకు వెళ్ళినపుడు ఏమైనా ఖర్చు ఉన్నా అదంతా ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది.. కాబట్టి నాకు అంతా ఆదాయమే అనుకున్నారు. పవన్ కూడా నేను నియోజ కవర్గానికి వెళ్లడమే తక్కువ.. క్యాడర్ గురించి బాధ లేదు.. అటు సినిమాలు చేస్తూ ఆదాయం బాగానే వస్తోంది.. అంటే పంచాంగం కరెక్ట్ గానే ఉన్నట్లుంది అనుకున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం గురించి శర్మ గారు చెబుతూ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది.. అప్పులు పెరుగుతాయి అన్నారు.. ఇది విన్నాక బాబుగారు లోలోన రాష్ట్రం ఏమైపోతే నాకేంటి..స్టేట్ మొత్తం అప్పులైతే నాకేంది అనుకున్నారు. ఇహ లోకేష్ గారి సంగతి చూస్తే అంటూ కండువా సవరించుకున్న శర్మగారు.. ఆయనకు సీఎం పదవికి ప్రస్తుతం పవనాలు అనుకూలంగా లేవు.. కొన్నాళ్ళు మంత్రిగిరిలోనే ఉంటారు అన్నారు.. దీంతో లోకేష్ పవన్ వైపు గుర్రుగా చూడగా.. నిన్ను సీఎం ను ఎలా చేస్తాను అనుకున్నావు అంటూ పవన్ బదులిచ్చారు. ఇప్పుడు పవన్ గారి రాశి ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఫర్లేకున్నా మున్ముందు భవిష్యత్ కష్టమే అన్నారు.. దీంతో లోకేష్ చంద్రబాబులు పవన్ను కుమ్మేద్దాం కళ్ళతో అని సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. మరి నా సంగతి ఏమిటి అన్నాడు నాగబాబు.. నీకూ పదవీ యోగం ఉంది అన్నాడు శర్మ.. హమ్మయ్య అనుకుంటూ అందరూ వెళ్లిపోయారు..:::సిమ్మాదిరప్పన్న... -
సర్కారు మెప్పు కోసం.. విద్యార్థులకు ముప్పు!
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వం మెప్పు కోసం వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు రికార్డు సమయంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక లెక్చరర్తో పరిమితికి మించి బుక్లెట్లు వేల్యుయేషన్ చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మూల్యాంకనం షెడ్యూల్ను కూడా అధికారులు కుదించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. అయితే, రెండుసార్లు ఈ షెడ్యూల్ను మార్చేసి ఏప్రిల్ 3 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశించినట్టు సమాచారం. ఆ తక్కువ సమయంలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశామన్న గొప్ప కోసం... ఏదైనా పొరపాటు జరిగి మార్కులు తప్పుగా నమోదైతే విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయనే విషయాన్ని విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్లో లిమిట్ 30.. టార్గెట్ 45 జవాబు పత్రాలుఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభించారు. మొదటి పరీక్షగా నిర్వహించిన సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ఆ రోజే పూర్తి చేశారు. ఇంగ్లిష్తోపాటు ఇతర పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఈ నెల 17న ప్రారంభించి విడతల వారీగా ఏప్రిల్ 8 నాటికి పూర్తి చేయాలని తొలుత షెడ్యూల్ నిర్ణయించారు. కానీ, తర్వాత తుది గడువును ఏప్రిల్ 5కి మార్చారు. తాజాగా 3వ తేదీకి కుదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. మూల్యాంకనంలో రోజుకు ఒక ఎగ్జామినర్ (లెక్చరర్) ఉదయం 15, మధ్యాహ్నం 15... మొత్తం 30 జవాబు పత్రాలనే దిద్దాలనేది నిబంధన. ఇలా చేస్తే ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. కానీ, ఈసారి 30 జవాబు పత్రాలే దిద్దాలని చెప్పినా... ఎగ్జామినర్లపై ఒత్తిడి తెచ్చి అదనంగా మరో 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పొడిచి విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలిగేలా ఎక్కువ పేపర్లు దిద్దించడంపై లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో జవాబు పత్రాల్లో మార్కులు తప్పుగా నమోదై ఒక్క పేపర్ తప్పినా విద్యార్థికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. -
నేడు, రేపు తెరిచే ఉండనున్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున జీఎస్టీ, వ్యాట్ను వచ్చే 2 రోజుల్లో చెల్లించాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు శనివారం కోరారు. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలను మార్చి 30, 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కోసం తెరిచే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో అయితే www.apct.gov.in వెబ్సైట్లో ఈ–పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
వలంటీర్లు ‘పచ్చడి’
ఇదిగో బాబు.. ‘ఈనాడు’లో నీ ఉగాది హామీసరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వలంటీర్లను తొలగించం. గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం’ అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వలంటీర్లను నిండా ముంచేశారు. సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు ఆపై మాట మార్చేశారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు.. వలంటీర్లను సైతం మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థనూ ఒక్కసారిగా కుప్పకూల్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్న నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. వారికి కేటాయించిన ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారికి ఏయే పథకాలకు అర్హత ఉందో గుర్తించి.. వారితో దరఖాస్తు చేయించి.. ఆయా పథకాలు వర్తింప చేసి.. ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా కృషి చేశారు. ఇంతగా సేవలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వలంటీర్లకు చిక్కులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు విధులు అప్పజెప్పడం మానేసింది.ఇప్పుడు మళ్లీ ఉగాదొచ్చింది..ఇప్పుడు మళ్లీ ఉగాది వచ్చింది. గత ఏడాది జూన్లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వలంటీర్లందరి ఉద్యోగాలు పోయాయి. 2024 జూన్ ఒకటో తేదీన సైతం వలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా, ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. పది నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి నిస్సిగ్గుగా ప్రకటించారు. ‘ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించడంతో వలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వల్లె వేశారు. ‘అసలు వలంటీర్లు అఫీషియల్గా లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, జీవోలో ఎక్కడా వాళ్లు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు’ అంటూ వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. గత ఉగాది పండుగ పూట మీకు తీపి కబురు చెబుతున్నామన్న చంద్రబాబు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పది నెలలుగా ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. 2.66 లక్షల మంది వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు వినతులు ఇస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం వారి గురించి కనీస ఆలోచన చేయడం లేదు. కరోనా సమయంలో కీలక సేవలువైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి, వివక్ష, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని ఉన్నా వలంటీర్లే గ్రామ సచివాలయాల ద్వారా చేయించారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి నెలా రెండు విడతల చొప్పున కేవలం మూడు రోజుల సమయంలో అన్ని కుటుంబాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు రోగుల గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. వరదల సమయంలో బాధిత ప్రజలకు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా సహాయక చర్యలు అందించడంలో ముందు వరుసలో నిలిచారు. గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికల వరకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2.66 లక్షల కుటుంబాలను నిట్ట నిలువునా ముంచేశారని వలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఊడగొట్టిన ఉద్యోగాలే ఎక్కువ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే ఆ ఊసే లేదు. ఊడకొట్టిన ఉద్యోగాలే ఎక్కువ. 2.66 లక్షల మంది వలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. బేవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తిగా కుదించేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు..తెలుగుదేశం.. ఎన్డీయే మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ.5 వేలు కాదు, మీకు రూ.10 వేలు పారితోషకం ఇచ్చే బాధ్యత మాది.-అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబువలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. -ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్కళ్యాణ్అధికారంలోకి వచ్చాక..వలంటీర్లు అసలు అఫీషియల్గా లేరు ఇప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, ఎక్కడా.. జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. -నాలుగు నెలల క్రితం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘ ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్రూ.4.57 లక్షల కోట్ల పంపిణీలో కీలక పాత్ర2019 ఆగస్టు 15న అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక వలంటీర్ల వ్యవస్థకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మందిని నియమించింది. 2024లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధిని ప్రజల గడప వద్దకే అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ రూపంలో, మరో రూ.1.84 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో మొత్తంగా రూ.4.57 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో క్షేత్ర స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. అరచేతిలో వైకుంఠం చూపారుచంద్రబాబు వలంటీర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. అది నిజమనుకుని, ఆ హామీలు నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గతేడాది ఉగాది నాడు నూతన పట్టు వస్త్రాలు ధరించి, నుదుట బొట్టుతో చంద్రబాబు మా భవిష్యత్ గురించి ఎంతగానో తపన పడుతున్నట్లు మాట్లాడారు. మమ్మల్ని ఊరిస్తూ బూటకపు హామీలు ఇచ్చారు. ఆ హామీని నమ్మి దగా పడ్డ వలంటీర్లంతా ఈ ఉగాదిని కూటమి దగా–దినంగా పాటించాలని నిర్ణయించుకున్నాం. పండుగ పూట పస్తుండి నిరసనలు తెలుపుతాం. – హుమాయూన్ బాషా, ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలిసీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా మాకు (వలంటీర్లకు) ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు గత ఉగాది నాడు పచ్చడి తింటూ ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు. మంత్రులు ‘పుట్టని బిడ్డ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్లో విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మా సేవలు వినియోగించుకున్నారు. పుట్టని బిడ్డతో సేవలు ఎలా చేయించుకున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. –గాలి షైనీ, వలంటీర్, విజయవాడమా ఉసురుతో ఈ ప్రభుత్వం పతనం ఉగాది పండుగ రోజున వలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మరిచిపోలేం. గతేడాది ఉగాది రోజున వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన మమ్మల్ని సీఎం చంద్రబాబు మోసం చేశారు. వలంటీర్లంతా పేద కుటుంబాలకు చెందిన వారే. అలాంటి కుటుంబాల్లో వలంటీర్ ఉద్యోగం కల్పించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇద్దరూ చేసిన మోసాన్ని మేము మరిచిపోలేం.. మా ఉసురు ఈ ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయం. – చేపల రాజు, వలంటీర్, రేవుపోలవరం, అనకాపల్లి జిల్లాదుర్మార్గంగా పక్కన పెట్టేశారువలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు సైతం రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి సీఎం చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మా గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు పెంచే విషయం అటుంచి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. గత ఐదేళ్లలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించాము. కరోనా సమయంలో మేము చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి జీతాలు పెరుగుతాయని అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. – అన్నపూర్ణ, వలంటీర్, రాములవీడు గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లానమ్మించి నట్టేట ముంచేశారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచేశారు. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల్లో నెగ్గాక ఈ వ్యవస్థే లేదంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో, ఇతరత్రా మా సేవలు చూసి యావత్ దేశ ప్రజలంతా ప్రశంసించడం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే వలంటీర్లకు చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.– పెదపూడి చినబాబు, వలంటీర్, ఎన్ఆర్పీ అగ్రహారం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లాదగ్గరలోనే బుద్ధిచెప్పే రోజులు వలంటీర్లను కొనసాగించడానికి పరిపాలన అనుమతులు లేవని సాకులు చెప్పి నిలిపివేశారు. అయితే విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలను ఏ అధికారంతో వినియోగించుకున్నారో చెప్పాలి. గత ప్రభుత్వానికి సాధ్యమైంది.. ఈ ప్రభుత్వానికి ఎందుకు కావడం లేదు? వలంటీర్లను తప్పించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం సాకులు చెబుతోంది. చాలా మంది డిగ్రీ వరకు చదువుకొని ఉన్న ఊరిలో ఇంటి పనులు, ప్రజా సేవ చేస్తూ జీవనం సాగించే వారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే వలంటీర్లను పక్కనపెట్టింది. ఇది నిజం. వారికి తగినబుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – రామ్గోపాల్, చిన్నటేకూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లాఉగాది చేదు జ్ఞాపకంఉగాది పండుగ మా వలంటీర్లందరికీ చేదు జ్ఞాపకం. ఎన్నికలకు ముందు గత ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడలో చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు. ఉగాది రోజు వలంటీర్లందరికీ తీపి కబురు చెబుతున్నామన్నారు. రూ.10 వేలు జీతం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు. ఇప్పుడేమో వలంటీర్లకు జీతాలు పెంచాలని చూస్తున్నాం కానీ వారందరూ ఎక్కడా జీవోలో లేనే లేరు అని తప్పించుకోవడం బాధాకరం. చిరు జీతానికి పని చేసుకుంటున్న మమ్మల్ని మోసం చేయడం సబబు కాదు. – చలపతి, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
ఈద్ ముబారక్ ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సోమవారం జరుపుకోనున్న సందర్భంగా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈద్ ముబారక్(శుభాకాంక్షలు) తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధారి్మక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని వైఎస్ జగన్ తెలిపారు. మనిషి లోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. -
రెండేళ్ల తరువాత కేసు నమోదు చేయడమేంటి!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి విస్మయం వ్యక్తం చేసింది. 2023లో ఘటన జరిగితే.. రెండేళ్ల తరువాత ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయడమేకాక నిందితులంటూ ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ప్రశ్నించింది. రెండేళ్ల తరువాత ఫిర్యాదుదారు ఇప్పుడే మేల్కొన్నారా? అని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అదుపులోకి తీసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు చింతపల్లి అల్లా భక్షు, చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేంత వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్న పోలీస్స్టేషన్లో ఉంచాలని పల్నాడు జిల్లా మాచవరం పోలీసులను ఆదేశించింది. ఆదివారం ఉదయం వరకు వారిద్దరూ సీసీ కెమెరాలో కనిపిస్తూనే ఉండేలా చూడాలని తేల్చిచెప్పింది. ఒకవేళ మాచవరం పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోయినా, అవి పనిచేయకపోయినా అల్లా భక్షు, పెద్ద సైదాను సమీపంలో సీసీ కెమెరాలున్న మరో పోలీస్ స్టేషన్లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం శనివారం రాత్రి 10 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్బంధంపై ‘హెబియస్ కార్పస్’ తన కుమారుడు చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను, తన మేనల్లుడు చింతపల్లి అల్లా భక్షును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన షేక్ చింతపల్లి నన్నే, గుంటూరు జానీబాషా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం వీరిద్దరూ అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది.పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సార్వత్రిక ఎన్నికల తరువాత పెద్ద సైదా, అల్లా భక్షు గ్రామం విడిచి బయట ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు చాలామంది ప్రజలు సైతం గ్రామం విడిచివెళ్లారన్నారు. తెలంగాణలో ఉన్న సైదా, అల్లా భక్షును అకస్మాత్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వీరిద్దరి అరెస్ట్ గురించి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. వారి ఆచూకీ కూడా చెప్పడం లేదని వివరించారు. ఓ ప్రైవేటు ఎస్టేట్లో పెద్ద సైదాను, అల్లా భక్షును దాచేపల్లి పోలీసులు నిర్బంధించినట్టు తమకు తెలిసిందన్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ఇలా నిర్బంధించడం చట్ట విరుద్ధమన్నారు.2023లో ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేశాం: ఎస్జీపీపోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. నిందితులిద్దరూ తీవ్ర నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిపై మాచవరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో వారిని అరెస్ట్ చేశారన్నారు. ఆదివారం ఉదయం వారిని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరుస్తారని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వారిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు విష్ణుతేజ సమాధానం ఇవ్వలేదు. అసలు ఘటన ఎప్పుడు జరిగిందని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. 17.5.2023న ఘటన జరిగిందని విష్ణుతేజ చెప్పారు. దీనిపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రెండేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేశారా? అంటూ అమితాశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేమిటని, అసలు ఏం జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకుంటే తాము చేయగలిగిందేమీ లేదని విష్ణుతేజ చెప్పగా.. రెండేళ్ల తరువాత ఫిర్యాదుదారు ఆకస్మాత్తుగా మేల్కొన్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
సూపర్ సిక్స్పై పిల్లి మొగ్గలు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి ప్రజలను బుట్టలో వేసుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కొంటున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కావడంలేదని, డబ్బుల్లేవంటూ కూనిరాగాలు తీసిన చంద్రబాబు.. తాజాగా ఎన్నికలకు ముందు బయట నుంచి చూసినప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనుకున్నానని, కానీ పరిస్థితులు మరోలా ఉన్నాయని టీడీపీ ఆవిర్భావ సభలో కొత్త రాగం మొదలెట్టారు. సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే తర్వాత వాటిని కొనసాగించలేమంటూ మాయమాటలు చెబుతున్నారు. అదేపనిగా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ప్లేటు ఫిరాయింపు 2014లో మోసం చేసినట్లే, 2024లోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు, దొంగ హామీలిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల జీవితాలను మార్చేస్తానని మభ్యపెట్టారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఏటా రూ. 18 వేలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా అనేక హామీలిచ్చి అన్నీ ఎగ్గొట్టారు. ఏ కుటుంబానికీ ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదు. అప్పుల పైనా తప్పుడు లెక్కలే సూపర్ సిక్స్ అమలు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పులను బూచిగా చూపిస్తున్న చంద్రబాబుకు.. ఆ అప్పులపైనా తప్పుడు లెక్కలే చెబుతున్నారు. మొన్నటి వరకు గత ప్రభుత్వం అప్పులు రూ. 14 లక్షల కోట్లంటూ అసత్యాలు ప్రచారం చేశారు. ఆయన చెప్పిన లెక్క తప్పని ఆయన ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన గణాంకాలే స్పష్టం చేశాయి. ప్రభుత్వ అప్పులు రూ. రూ. 6.54 లక్షల కోట్లని వెల్లడించారు. మళ్లీ పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్రం అప్పు రూ. 9.74 లక్షల కోట్లంటూ మరో లెక్క చెప్పి, ప్రజలను ఏమార్చి, హామీలను ఎగ్గొడుతున్నారు. 2014లోనూ అదే మోసం నిజానికి చంద్రబాబుకు ఇచ్చిన హామీలను అమలుచేసే అలవాటు మొదటి నుంచీ లేదు. అవసరం కోసం ఏదైనా చెప్పడం, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం బాబు నైజం. 2014 ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు 600కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. బేషరతుగా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని, ఎవరూ రుణాలు చెల్లించద్దంటూ ఊరూవాడా చెప్పారు. ఈమాటల్ని నమ్మిన మహిళలు, రైతులు ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా వారిని మోసం చేశారు. వడ్డీలు పెరిగిపోయి వారంతా డిఫాల్టర్లుగా మారిపోయారు. డ్వాక్రా రుణాలూ రద్దు చేస్తానని చెప్పి మహిళలకు నయవంచన చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతనూ వంచించారు. వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు చంద్రబాబు ఎడాపెడా ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారు. గణాంకాలతో సహా వివరించారు. వైఎస్ జగన్ చెప్పిందే నిజమైంది. చంద్రబాబు ఒక్క హామీనీ అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచేశారు. -
‘సూపర్ సిక్స్’ అమలు చేయగలనని అనుకున్నా
సాక్షి, అమరావతి: ‘ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయగలనని అనిపించింది. అందుకే ప్రజలకు ఆ హామీలు ఇచ్చా.అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత వాటిని కొనసాగించలేం’ ఇవీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సభలో పలికిన మాటలు. రాష్ట్రంలో అప్పులు రూ. 9.74 లక్షల కోట్లు.. ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్ల అప్పులున్నాయని, వాటికి వడ్డీలు, అసలు కట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. రాజకీయ కక్షలకు పార్టీ దూరమని, అదే సమయంలో చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తామని హెచ్చరించారు. పార్టీకి కార్యకర్తలే ముందని, నాయకులు తర్వాతని చెప్పారు. ఏప్రిల్, మేలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం .. ఏప్రిల్, మే నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఉగాది పండుగ రోజున పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ 4 కు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. -
జేఈఈ మెయిన్స్కు అడ్మిట్ కార్డులు రెడీ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హతకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండవ సెషన్లో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో జరగనున్న పరీక్షల అడ్మిట్ కార్డులు శనివారం విడుదలయ్యాయి. ఎన్టీఏ సైట్లో ఉంచిన అడ్మిట్కార్డులను విద్యార్థులు సెషన్–2 దరఖాస్తు ఫారం నంబరు, పాస్వర్డ్తో డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షలకు ఎన్టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8వ తేదీల్లో రెండు షిఫ్ట్లలో (ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ) పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్–2ఏ బీఆర్క్,పేపర్–2బీ బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
సాక్షి, అమరావతి: సొంతూర్లోనే పనులు కల్పించి పల్లెల్లోని పేదల ఆకలి కష్టాలను తీర్చాలన్న లక్ష్యంతో ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. ఎప్పటికప్పుడు గరిష్టంగా 15రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలను దాదాపు రెండు నెలలవుతున్నా చెల్లించకుండా కాలయాపన చేస్తూ వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పైగా.. మొన్న శివరాత్రి, ఇప్పుడు ఉగాది పండుగ రోజు కూలీలను నిర్దాక్షిణ్యంగా పస్తులుంచుతూ తన పబ్బం గడుపుకుంటోంది. రాష్ట్రంలో 57.87 లక్షల కుటుంబాలకు చెందిన 97.35 లక్షల మంది ఉపాధి హామీ పథకం జాబ్కార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా 47 లక్షల కుటుంబాలకు సంబంధించి 75 లక్షల మందికి ఉపాధి పనులే జీవనాధారం. ఇంత పెద్ద మొత్తంలో పేదలు ఆధారపడ్డ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆ కుటుంబాల్లో ఉగాది పండుగ ఆనందం అనేది లేకుండా ఆవిరిచేస్తోంది. ఎందుకంటే.. వీరికి వారం వారం కాదు కదా.. కనీసం నెలకు కూడా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో పనులు చేసిన వారు కూలి డబ్బుల కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.శనివారం (మార్చి 29) నాటికి మొత్తం రూ.725 కోట్ల బకాయిలు వీరికి చెల్లించాల్సి ఉందంటే వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది. నిజానికి.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసిన కూలీలెవ్వరికీ ప్రభుత్వం ఇప్పటివరకూ వేతనాలు చెల్లించలేదు. అలాగే, జనవరి 9 తర్వాత పనిచేసిన కూలీలకూ అక్కడక్కడ అందలేదు. నిబంధనల ప్రకారం.. గరిష్టంగా 15 రోజులకు మించి ఉపాధి కూలీల వేతనాలు బకాయిలు ఉంచకూడదని కేంద్ర చట్టం చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తోంది. దీనివల్ల రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో సుమారు రెండు నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి. ఉపాధి హామీ పథకం చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పాటు వేతన బకాయిలు రాష్ట్రంలో ఎప్పుడులేవని వ్యవసాయ కారి్మక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా.. కేంద్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా టీడీపీ ఎంపీనే కొనసాగుతుండగా.. రాష్ట్రంలో ఉపాధి పథకానికి సంబంధించిన విభాగాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పరిధిలో ఉన్నాయి. నిత్యం నీతులు వల్లించే వీరు పండగ పూట లక్షలాది మంది పేదల కడుపులు మాడుస్తూ అవస్థలు పాల్జేస్తున్నారు.పనులకు వెళ్లే వారిలోనూ తగ్గుదల.. ఇదిలా ఉంటే.. చేసిన పనికి టీడీపీ కూటమి ప్రభుత్వం రోజుల తరబడి వేతనాలు చెల్లించకుండా రూ.వందల కోట్లు బకాయిలు పెట్టడంతో గ్రామాల్లో ఉపాధి పనులకు కూలీలు దూరమవుతున్నారు. ఫలితంగా.. పనులకు వెళ్లే కూలీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాధారణంగా.. గ్రామాల్లో వ్యవసాయ పనులు బాగా తక్కువగా ఉండే మార్చినెలాఖరు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 10 లక్షల మంది వరకు ఉపాధి పనులకు హజరవుతారని అంచనా. కానీ, శనివారం కేవలం 4.65 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. దీనికితోడు.. గత 2023–24 ఆరి్థక సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు కోటిన్నర తక్కువ పనిదినాలను ప్రభుత్వం పేదలకు కల్పించింది. 2023–24లో మొత్తం 25.59 కోట్ల పనిదినాలు పేదలకు దక్కాయి. అదే 2024–25లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అంటే.. 2024 ఏప్రిల్, మే నెలలో గత ఏడాది కన్నా కోటి పనిదినాలు ఎక్కువగా పేదలకు దక్కాయి. కానీ, ఏడాది మొత్తం చూస్తే మాత్రం గత ఏడాది కన్నా తక్కువగా కేవలం 23.96 కోట్ల పనిదినాలే పేదలు పొందారు. కూలీలకు ఈ ఏడాది కష్టకాలం.. » గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడంవల్ల ఎక్కువగా ఎస్సీలే నష్టపోయారు. ఎలాగంటే.. గత ఆర్థిక ఏడాది మొత్తం 25.59 కోట్ల పనిదినాల్లో 22.41 శాతం మేర ఎస్సీలు పనులు పొందగా.. ఈ ఆరి్థక సంవత్సరంలో మొత్తం 23.96 కోట్ల పనిదినాల్లో 21.61 శాతం మేర మాత్రమే వారు పనులు పొందారు. » అలాగే, ఉపాధి హామీ పథకంలో గరిష్టంగా వంద రోజుల పనిదినాలను ఉపయోగించుకున్న కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక ఏడాది 6,87,396 కుటుంబాలు పూర్తిస్థాయిలో వంద రోజుల పనిదినాలు ఉపయోగించుకోగా, ఈ ఆర్థిక ఏడాది కేవలం 4,69,437 లక్షల కుటుంబాలే వంద రోజుల పనిదినాలు పొందాయి. » మరోవైపు.. ఈ ఆర్థిక ఏడాదిలో కేంద్రం గరిష్ట వేతనాన్ని రూ.300కు పెంచినా, రాష్ట్రంలో కూలీలకు సరాసరిన రూ.255.56 చొప్పున మాత్రమే వేతనాలు దక్కాయి. » ఇక గత ఆర్థిక సంవత్సరం 80,589 మంది దివ్యాంగులు ‘ఉపాధి’ పొందగా.. ఈ ఏడాది 76,527 మంది మాత్రమే పనులు పొందారు. -
వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును దేశ ప్రజలంతా అడ్డుకుని తీరాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు ఖాలిద్ సైపుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును తిరిస్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ, రాష్ట్ర ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్దఎత్తున తరలిరాగా.. వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రెహ్మానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముస్లింలకు ప్రసాదించిన హక్కులను వక్ఫ్ సవరణ బిల్లుతో కాలరాసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వందల ఏళ్లనాటి మసీదులు, మదర్సాల రిజిస్ట్రేషన్ పత్రాలు దొరక్కపోతే మత సంబంధమైన బై యూజర్ నియమం ద్వారా చట్టబద్ధత లభిస్తుందన్నారు. అటువంటి నియమాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెచ్చి.. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే లక్షలాది ఎకరాలను ప్రభుత్వాలు ఆక్రమించాయని, ఇంకా అనేక హాస్యాస్పదమైన సవరణలు చేసి వక్ఫ్ను బలహీన పరచడానికి సవరణ బిల్లు తెచ్చారన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశంలోని సెక్యులర్ పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. మహాధర్నాలో జమాతే ఇస్లాం హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ఉపాధ్యక్షుడు మాలిక్ ముహతషిమ్ ఖాన్, మజ్లిస్ ఉలమా ఏపీ ప్రతినిధి మౌలానా ముఫ్తి యూసుఫ్, ఉమ్రి అధ్యక్షుడు మౌలానా నసీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ షేక్ అసిఫ్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంవక్ఫ్ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంతోపాటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించినట్టు అవుతుంది. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఈ బిల్లు ముస్లింలకు మాత్రమే నష్టం కలిగించదు. వక్ఫ్ చట్టం–1995కు 2013లో సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకుసంక్రమించిన హక్కులు, అ«ధికారాలను కూడా కోల్పోతాయి. – మౌలానాషా ఫజల్ రహీమ్ ముజద్దిద్, ప్రధాన కార్యదర్శి, ఏఐఎంపీఎల్బీ వక్ఫ్ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందిరాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ భావిస్తారు. అందుకే ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును మా పార్టీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే లోక్సభ, రాజ్యసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు. మరోసారి పార్లమెంట్లో ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. దేశంలో భిన్న మతాలు, కులాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశం. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజ్యాంగంలో రాసుకున్న రాతలకు తూట్లు పొడుస్తున్నాయి. అటువంటి పాపపు ఆలోచనల నుంచి వచ్చిందే వక్ఫ్ సవరణ బిల్లు. పాపాలు చేస్తున్న వారితోపాటు.. అలాంటి వారికి అండగా నిలవడం కూడా పాపమే అని ఖురాన్ చెబుతోంది. రంజాన్ మాసంలో వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణమైన రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా నిలదీయాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత -
22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఎండ
రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. శనివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా రుద్రవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 43.5 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా వతలూరులో 42. 7, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.4, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.2, విజయనగరం జిల్లా గుర్లలో 42.1, తిరుపతి జిల్లా గూడూరులో 41.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 96 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 27 మండలాల్లో తీవ్రవడగాలులు, 103 మండలాల్లో వడగాలులు వీచాయి. ఆదివారం అల్లూరి జిల్లా చింతూరులో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. –సాక్షి, అమరావతి -
కాటమరాజు తిరునాళ్లు.. భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: కాటమరాజు తిరునాళ్లు సందర్భంగా భక్తులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రీగంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. pic.twitter.com/iE78xxw2D5— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2025 -
విర్రవీగుతున్నావా లోకేష్ రాజా?.. రెడ్బుక్పై అంబటి సెటైర్లు
సాక్షి, గుంటూరు: నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఇంకా అంబటి రాంబాబు ఏమన్నారంటే... ఆయన మాటల్లోనే..తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.ఏనాడైన తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు.దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్టరెడ్బుక్ అంటూ విర్రవీగుతున్న లోకేష్ రాజాచంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారు. తన రెడ్బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నాడు లోకేష్ రాజా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్ళకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా లోకేష్ రాజా.జైలులో చంద్రబాబుకు వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయని, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని, శరీరంపై పొక్కులు మొలుస్తున్నాయని వాపోయారు. 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ రోజు అధికారం ఉందని తన రెడ్బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ. ఈ రోజు నీవల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎగతాళి దినోత్సవంగా మారుస్తూ మాట్లాడుతున్న దానికి ఏదో ఒకరోజు జవాబు దొరుకుతుంది రాజా. హామీలు అమలు చేయని మీ అసమర్థతపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులపై న్యాయస్థానాల స్పందన చూసిన తరువాత అయినా సిగ్గు తెచ్చుకోవాలి. రెడ్బుక్ రాజ్యాంగం, వాగ్దానాల అమలు చేయకుండా పారిపోయే మోసగాళ్ళు మీరు. పార్టీ ఆవిర్భావం మీది కాదు, నందమూరి తారక రామారావుది. ఆయన పార్టీని మీరు మోసపూరితంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ. వాపుచూసి బలం అనుకుంటోంది, శక్తిలేని పార్టీ. తెలుగుదేశం ఒక పేకమేడ లాంటివి. వారినీ వీరిని అడ్డంపెట్టుకుని బతుకుతున్న రాజకీయ జీవితాలు.దోపిడీనే చంద్రబాబు నైజంతాజాగా విజయం సాధించగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అన్నారు. సూపర్ సిక్స్ ను అమలు చేస్తానని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టారు, చందాలు ఇవ్వమని అడిగారు, ఇటుకలు అమ్ముకున్నారు. అమరావతికి రెండు గాజులు ఇచ్చి అమరావతిని దోచుకున్నారు. ఇప్పుడు 26వేల కోట్లు అమరావతి అంటున్నారు. దీనిలోనూ దోపిడీ.కాంట్రాక్టర్ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ కాఫర్ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారు. సింపుల్గా ఇన్వెస్ట్ చేయడం.. భారీగా బాగుపడటం చంద్రబాబు నైజం. రెండెకరాల నుంచి ప్రారంభించారు, నేడు వేల కోట్లు సంపాధించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటు. -
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
తాడేపల్లి: తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025 -
‘స్థానిక ‘సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై ఈసీ మౌనం ఎందుకు?’
తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉన్నా ఈసీ ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు మేరుగ. ఈరోజు(శనివారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మేరుగ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన అధికారులపై కఠిన చర్యలకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ‘ స్థానిక సంస్థల్లో జరిగిన అక్రమాల్లో ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనం వహిస్తోంది. ఈసీ మౌనం ప్రజాస్వామ్యానికి చేటు. మున్సిపల్ ఉప ఎన్నికల సమయంలో కూడా అక్రమాలు జరిగాయి. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. దాడులు, దౌర్జన్యాలు చేసినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించడం సరిదాదు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మేరుగ కోరారు. -
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
సాక్షి, అమరావతి: పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు ప్రకటించారు. పరీక్ష తేదీని విద్యార్థులు, హెచ్ఎంలు, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖతో పాటు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న అన్ని విభాగాలకు తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవోలను ఆదేశించారు. మెటీరియల్, ప్రశ్నపత్రాలు తీసుకునేందుకు ఈనెల 31న నిల్వ కేంద్రాల వైపు వెళ్లొద్దని సూచించారు. 3 నుంచి టెన్త్ మూల్యాంకనం సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఏడు రోజుల్లోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ప్రతిరోజు 40 పేపర్లను మూల్యాంకనం చేయాలి. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు పరిశీలిస్తారు. మూల్యాంకనం పూర్తయిన వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన జవాబు పత్రాల్లో కనీసం రెండు చొప్పున పరిశీలించాలి. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20 చొప్పున, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 45 చొప్పున మూల్యాంకనం చేసిన పత్రాలను పునఃపరిశీలించాలి. ఈ క్రమంలో మార్కుల్లో తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను అదేశించారు. -
పార్టీ కేసులకు ప్రజాధనం.... లూథ్రాకు రూ.2.86 కోట్లు అర్పణం
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తమ ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు పెద్ద మొత్తంలో ఫీజుల సంతర్పణ చేశారు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా.. ప్రజల సొమ్మును గురుదక్షిణగా చెల్లించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన నాలుగు వేర్వేరు కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది. ఇందులో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనే ఆయనకు ఏకంగా రూ.1.25 కోట్లు చెల్లించింది. ఇందులో ఒక్క రోజు హాజరై వాదనలు వినిపించినందుకు రూ.75 లక్షలు చెల్లించారు. ఇదే కేసులో పలు తేదీల్లో హాజరై వాదనలు వినిపించినందుకు మరో రూ.50 లక్షలను ఫీజుల రూపంలో లూథ్రాకు చెల్లించారు. అలాగే తాడేపల్లి, కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో వాదనలు వినిపించినందుకు ఆయనకు రూ.60 లక్షలు ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు కేసులో చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాదించినందుకు లూథ్రాకు రూ.65 లక్షలు చెల్లించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం 2.60 కోట్లు చెల్లించారు. దీనికి క్లర్కేజ్ (క్లర్కుకు చెల్లించాలంటూ) 10 శాతం అదనంగా అంటే రూ.26 లక్షలు కలిపి మొత్తం రూ.2.86 కోట్లు చెల్లించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నామమాత్రంగా వాదనలు వినిపించి, వాయిదాలు కోరిన కేసుల్లోనూ ఆయనకు లక్షల్లో ఫీజులు చెల్లించడం విశేషం. లూథ్రా క్లర్కు సంపాదించిన రూ.26 లక్షలను ఇంత తక్కువ సమయంలో సంపాదించడం హైకోర్టులో 90% మంది న్యాయవాదులకు దుర్లభమైన పని.కేసు చిన్నదైనా, పెద్దదైనా.. ఆయనకే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన సిద్దార్థ లూథ్రా దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు.. ఇలా ఎక్కడైనా చంద్రబాబుకు కష్టం వస్తే అక్కడ లూథ్రా ప్రత్యక్షమవుతారు. చిన్న కేసయినా, పెద్ద కేసయినా లూథ్రాకే ఇచ్చేవారు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు, టీడీపీపై లూథ్రా ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయినప్పుడు లూథ్రానే రంగంలోకి దిగారు. బాబు తరఫున రోజుల తరబడి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పక్కా ఆధారాలుండటంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన వాదన ఏసీబీ కోర్టు ముందు నిలవలేదు. తర్వాత హైకోర్టులో ఆయన వాదన చెల్లలేదు. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడా చంద్రబాబు తరఫున లూథ్రానే కీలక పాత్ర పోషించారు. అక్కడా చంద్రబాబు విజయం సాధించలేకపోయారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లూథ్రానే బయట ఉండి మొత్తం వ్యూహరచన చేశారు. ఇందుకు ఆయనకు కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లించారన్న విషయం అందరికీ తెలిసిందే. -
పౌర హక్కుల బాధ్యత కోర్టులు, పోలీసులదే
సాక్షి, అమరావతి: పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే విషయంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులు, పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ ఆలోచనలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడమనేది ఆరోగ్యకరమైన, నాగరిక సమాజంలో అంతర్భాగమని పేర్కొంది. స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదని పేర్కొంది.పోలీసులు విఫలమైతే కోర్టులు బాధ్యత తీసుకోవాలి...‘‘పోలీసులు లేదా కార్యనిర్వాహక సంస్థలు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులను గౌరవించడం, పరిరక్షించడంలో విఫలమైతే న్యాయస్థానాలు ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగే సంస్థ మరొకటి ఏదీ లేదు. మనది గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా మౌలిక సూత్రాలలో మనం ఇలా అస్థిరంగా ఉండకూడదు. కేవలం ఒక కవిత పఠనం, వినోద రూపంలో కళా ప్రదర్శన చేయడం లాంటివి సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించడం ఎంత మాత్రం సరైంది కాదు. ఇలాంటి దృక్పథాన్ని అంగీకరించడమంటే అది ప్రజాస్వామ్యంలో న్యాయసమ్మతమైన అన్ని అభిప్రాయాలను అణిచివేయడమే అవుతుంది. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాగే అందులోని ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా కేసులు బనాయిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.ఇమ్రాన్ ప్రతాప్గ్రాహిపై కేసు కొట్టివేత...ఇన్స్ట్రాగామ్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గ్రాహిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఇమ్రాన్పై మోపిన నేరం ఏదీ ఆయనకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తీర్పులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.విభేదించవచ్చు.. కానీ గౌరవించాలి!ఓ వ్యక్తి వ్యక్తం చేసే అభిప్రాయాలతో ఎంతోమంది విబేధించవచ్చునని, అయితే ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును అందరూ గౌరవించడంతో పాటు ఆ హక్కును పరిరక్షించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సాహిత్యం, కవిత్వం, నాటకాలు, సినిమాలు, వ్యంగ్య రచనలు, కళలు మానవ జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తాయని, వాటిని విద్వేషాలను రెచ్చగొట్టేవిగా పరిగణించరాదని సూచించింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు అవి అమలయ్యేలా చూడటం న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్నిసార్లు తమకు వినబడిన, రాయబడిన మాటలను న్యాయమూర్తులుగా తాము ఇష్టపడకపోవచ్చునని, అయినప్పటికీ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే న్యాయమూర్తులుగా రాజ్యాంగాన్ని, అందులోని ఆదర్శాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందంది. పౌరుల హక్కులను రక్షించే విషయంలో సదా ముందు ఉండటం న్యాయస్థానాల బాధ్యతని వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కులను కోర్టులు పరిరక్షించాలి...ప్రధానంగా రాజ్యాంగ న్యాయస్థానాలు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు అగ్రభాగంలో ఉండాలని సుప్రీం సూచించింది. రాజ్యాంగం, ఆదర్శాలను అణిచివేయకుండా చూడాల్సిన ఉత్కృష్ట బాధ్యత న్యాయస్థానాలపై ఉందని పేర్కొంది. న్యాయస్థానాలు ఎప్పుడూ పౌరుల ప్రాథమిక హక్కులను ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించి, దానిని ప్రోత్సహించే వైపే ఉండాలని తెలిపింది. ఇది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు అని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటని తెలిపింది. పోలీసులు కూడా ఈ దేశ పౌరులేనని, అందువల్ల రాజ్యాంగాన్ని అనుసరించడం, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం వారి బాధ్యతని తెలిపింది. విచారణకు స్వీకరించదగ్గ నేరం చేశారన్న సమాచారం అందినప్పుడు సదరు పోలీసు అధికారి మొదట ప్రాథమిక విచారణ చేపట్టాలంది. ప్రాథమిక విచారణ తరువాత ఆ నేరం విచారణకు స్వీకరించదగ్గదని తేలితే, అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొంది. విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలంది. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారని తెలిపింది.» స్వేచ్ఛగా ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుంది» విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియచేయాలి. తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటారు.» ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలను మరో అభిప్రాయంతో విబేధించాలేగానీ వాటిని అణచి వేయకూడదు.» స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు.. పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటి. -
సత్తెన్నకు సెవెన్ పర్సంట్!
సాక్షి, అమరావతి: వివిధ పనులకు కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అస్మదీయుడు, లేదంటే ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఓ ప్రజా ప్రతినిధికి ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ చేసుకున్న పలు సంస్థలు.. తప్పుల తడకగా బిడ్లు వేసినా ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. మూడేళ్ల కాలపరిమితికి దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కాంట్రాక్ట్లు ఇవి. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. బిడ్ల పరిశీలన పూర్తవడంతో ఎల్1 కంపెనీలను ఎంపిక చేయడం కోసం గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తప్పు చేసినా అర్హత తప్పుల తడకగా బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు అర్హత కల్పించి, కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నారని టెండర్లలో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల ఆధారంగా సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, ఇతర అవసరాల కింద ఎంత ఖర్చు చేయాలనే దానిపై టెండర్ నిబంధనల్లోనే పొందుపరిచారు. సర్వీస్ చార్జీ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండాలని సూచించారు. ఇంత స్పష్టమైన నిబంధనలున్నా రెండు సంస్థలు సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల విషయంలో నిర్దేశించిన దాని కంటే తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థల్లో ఒకటి శానిటేషన్, మరొకటి సెక్యూరిటీ టెండర్లలో పాల్గొన్నాయి. శానిటేషన్కు సంబంధించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రిది. మరోవైపు ప్రస్తుతం జోన్–2(కోస్తాంధ్ర)లో శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సంస్థ తప్పుడు ధ్రువపత్రాలతో బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ సంస్థ గతంలో బోధనాస్పత్రుల్లో 300 మందికి గానూ 250 మంది సిబ్బందితో పనులు నిర్వహించేలా ఎంవోయూ కుదుర్చుకుని టెండర్ నిబంధనలను అతిక్రమించింది. తక్కువ మంది ఉద్యోగులతోనే అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం నిర్వహించి రూ.కోట్లలో ప్రభుత్వ నిధులను దండుకుంది. ఈ సంస్థ ఏపీఎంఎస్ఐడీసీలో పనిచేసే ఇంజినీర్ల సన్నిహితులది కావడం.. వారే టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో తిమ్మిని బమ్మిని చేసి బిడ్కు అర్హత కల్పించారని వెల్లడైంది. టెండర్ నిబంధనలతో పనిలేకుండా ప్రజాప్రతినిధితో సదరు సంస్థలు డీల్ కుదుర్చుకున్న క్రమంలో ఈ మూడు సంస్థలకు కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. కూటమి పెద్దలు అస్మదీయులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 108, 104 టెండర్లను ఓ సంస్థకు కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ టెండర్లలో సైతం ఓ సంస్థను ముందే అనేసుకుని.. దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. కేవలం ఆ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినా ఆమోదించేందుకు వీలుగా నిబంధనల్లో వెసులుబాటు పెట్టుకున్నారు.బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన కంపెనీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి.. గత కొద్ది రోజులుగా ఏపీఎంఎస్ఐడీసీలో తిష్ట వేశారు. ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలూ ఉన్నాయి. అధికారుల వెంటపడి మరీ తన బిడ్కు అర్హత కల్పించుకున్నారని ఎంఎస్ఐడీసీలో చర్చించుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ ముగియకుండానే తనకు కాంట్రాక్ట్ వచ్చేసిందని డీఎంఈ అధికారులను కలిసి.. బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారని ఆరా తీసినట్టు సమాచారం. సిబ్బందికి వేతనాలు ఎగ్గొట్టి, అనుభవం లేకున్నా ఉన్నట్టు కొన్ని సంస్థలు ఆధారాలు చూపించాయని, ఈ నేపథ్యంలో ఆడిట్ చేసి సక్రమంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు. -
ఐఐటియన్లకు అందని జాబ్!
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో అసాధారణ క్షీణత కనిపిస్తోంది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సగానికి పైగా ఐఐటీల్లో సగటున 10% మేర తగ్గుదల నమోదవడం గమనార్హం. తొలి తరం ఐఐటీల్లో ఒకటైన ఐఐటీ–ఖరగ్పూర్లో మాత్రమే స్వల్పంగా 2.28% తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్నింటిలోనూ క్యాంపస్ ప్లేస్మెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 23 ఐఐటీలు ఉండగా.. చాలా ఐఐటీల్లో 2022–23లో మొదలైన తగ్గుదల... 2023–24లోనూ కొనసాగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లోనూ ప్లేస్మెంట్ల క్షీణతపై పార్లమెంట్ స్టాడింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిని అసాధారణ తగ్గుదలగా గుర్తించింది. దేశంలో విద్యపై ఖర్చు భూటాన్, మాల్దీవుల కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది. తొలి తరం ఐఐటీల్లోనూ ఎదురుగాలే..» తొలి తరం ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్ల తగ్గుదల నమోదవుతోంది. ప్లేస్మెంట్ల కోసం నమోదు చేసుకునేవారు తగ్గుతుంటే.. అందులోనూ ఉద్యోగాలు పొందేవారు మరింత తగ్గిపోతున్నారు.» తాజా గణాంకాల ప్రకారం ఐఐటీ రూర్కీలో ప్లేస్మెంట్లు గణనీయంగా పడిపోయాయి. 2021–22లో 98.54 శాతం ఉన్న ప్లేస్మెంట్లు... 2023–24కు వచ్చేసరికి 79.66 శాతానికి తగ్గాయి. అంటే ఏకంగా 18.88 శాతం తగ్గిపోయాయి. ఐఐటీ ఢిల్లీలో 15 శాతం, ఐఐటీ బొంబాయిలో 12.72 శాతం మేర క్షీణత నమోదైంది. ఐఐటీ మద్రాస్లో 12.42 శాతం, ఐఐటీ కాన్పూర్లో 11.15 శాతం ప్లేస్మెంట్లు పడిపోయాయి.» ఐఐటీ భువనేశ్వర్లో 2021–22తో పోలిస్తే 2022–23లో ప్లేస్మెంట్లు మెరుగైనప్పటికీ.. 2023–24లో మాత్రం 7.58 శాతం తగ్గుదల నమోదైంది. » రెండో తరం ఐఐటీల్లోనూ పరిస్థితి చెప్పుకోతగ్గట్టు లేదు. 2008–09 మధ్య స్థాపించిన ఐఐటీల్లో హైదరాబాద్ అత్యంత ఎక్కువ క్షీణతను (17.17 శాతం) నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ మండీ (14.1శాతం), రోపర్ (13.15శాతం), ఇండోర్ (11.03శాతం) ఉన్నాయి. » ఇక 2015–16 మధ్య స్థాపించిన మూడో తరం ఐఐటీల్లోనూ ప్లేస్మెంట్ల పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023–24లో ఐఐటీ జమ్మూలో 21.83 శాతం ప్లేస్మెంట్లు తగ్గిపోయాయి.ఆర్థిక మందగమనం ఓ కారణం..కోవిడ్ తర్వాత కూడా ఐఐటీల్లో క్యాంపస్ నియామకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగనమనం కారణంగా రెండేళ్లుగా ప్లేస్మెంట్లపై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్లడం, స్టార్టప్లపై దృష్టి సారించడం వంటి కారణాల వల్ల కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. క్యాంపస్ కొలువులు మార్కెట్ ట్రెండ్లపై ఆధారపడి ఉన్నప్పటికీ, విభాగాల వారీగా కొత్త మార్గాలను కనుగొని తదనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని సూచిస్తున్నారు. గత సంవత్సరం చాలా ఐఐటీలు తమ క్యాంపస్ ప్లేస్మెంట్లు వెల్లడించలేదు. అయితే, సెప్టెంబర్లో ఐఐటీ బొంబాయి విడుదల చేసిన నివేదిక ప్రకారం... గత పరిస్థితులతో పోలిస్తే తక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందారని, ఇందులోనూ అత్యల్ప ప్యాకేజీ ఏడాదికి రూ.4లక్షలకు పడిపోయిందని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే ఉద్యోగ మార్కెట్లో ఆందోళనకర మార్పు కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ శాతంలో తగ్గుదల ఇలా...ఐఐటీ 2021–22 2023–24ఖరగ్పూర్ 86.79 83.91బొంబాయి 96.11 83.39మద్రాస్ 85.71 73.29కాన్పూర్ 93.63 82.48ఢిల్లీ 87.69 72.81గౌహతి 89.77 79.10రూర్కీ 98.54 79.66వారణాసి 83.15 88.04ధన్బాద్ 87.89 75.38గాంధీనగర్ 91.85 82.39భువనేశ్వర్ 94.78 86.07హైదరాబాద్ 86.52 69.33జోద్పూర్ 96.59 92.98రోపర్ 88.49 75.34పాట్నా 97.65 90.03ఇండోర్ 96.74 85.71మండీ 98.13 84.03పాలక్కాడ్ 97.27 82.03తిరుపతి 94.57 86.57జమ్మూ 92.08 70.25భిలాయ్ 89.92 72.22గోవా 98.65 92.73ధార్వాడ్ 90.20 65.56––––––––––––––––––––––––––––– మొత్తం 449/410 -
AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం
విజయవాడ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలంటూ ముస్లింలు సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు(శనివారం) విజయవాడ ధర్నాచౌక్ లో మహాధర్నాకు సన్నద్ధమయ్యారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకూ ధర్నా చేయనున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని ముస్లిం సంఘాలు హెచ్చరిస్తున్నాయి.ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా నిన్న(మార్చి 27వ తేదీ గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం(మార్చి 26వ తేదీ) ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
AP Govt: లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు
విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు. -
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’
తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’ ద్వారా వైఎస్సార్సీపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.‘స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయటం హర్షించదగ్గ విషయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా..కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని..జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025 స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం -
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్కు చెంపపెట్టు
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (Kutami Prabhutvam) చెంపపెట్టులాంటిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలని.. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఏపీలో జరుగుతోంది ఏంటి?.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలను గతంలో విమర్శించారని.. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏపీలో ఈ పర్వం ఇంకా కొనసాగుతోంది. సంబంధిత వార్త: అణచివేతతో కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టుప్రెస్మీట్ పెట్టినందుకు పోసానిలాంటి వాళ్లను జైళ్లకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొందరిని పీఎస్ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తోంది కూడా. అయితే.. ఇప్పటికే కూటమి పాలనలో నమోదు అవుతున్న అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు(AP Police) హితవు పలికింది. ప్రభుత్వ పెద్దల కోసం పని చేయొద్దంటూ పోలీసులనూ తీవ్రంగా మందలించింది. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
ఆ హామీ మున్సిపాలిటీ చెత్త బుట్టలోకి
సాక్షి, అమరావతి: ‘మేం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసు కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతాం..’’ –ఎన్నికల సమయంలో కూటమి పార్టీల వాగ్దానం ఇది. కానీ, ఇప్పుడు ఈ నిబంధన రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించి ఝలక్ ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా పురపాలక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మోసం చేసింది. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే. ఇలా నియమితులైనవారు ఎన్నో ఏళ్లుగా వివిధ శాఖల్లో సేవలందిస్తున్నారు. అయితే, అత్యధికంగా మున్సిపల్ శాఖలోనే దాదాపు 98 వేల మంది ఉన్నారు. వీరిలో 70 శాతం మంది పైగా 10 ఏళ్లకు మించి సర్వీసు ఉన్నవారే. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వయసు 58, 60 ఏళ్లకు పెంచిన సందర్భంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపజేసింది. ప్రస్తుతం వీరి సర్వీసు వయసు 60 ఏళ్ల వద్ద ఉంది. దీనిని 62కు పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ మేరకు హామీ ఇచ్చారు. సర్వీసు పెంచలేమన్న ప్రభుత్వం మున్నిపాలిటీల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నారు. కానీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కానీ, , గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి కానీ లేవు. తమకు ఈ సదుపాయాలు కల్పించాలంటూ 2024 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో చేరి 10 ఏళ్ల సర్వీసు దాటినవారికి రిటైర్మెంట్ బెనిఫిట్గా రూ.75 వేలు, ఆపై ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి అమలు ప్రక్రియ ప్రారంభించింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ రావడంతో సాధ్యం కాలేదు. ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు తాము అధికారంలోకి రాగానే ఈ సదుపాయాలతోపాటు సర్వీసు కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పది నెలలుగా దీని అమలుపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు సర్వీసు కాలం పెంపు సాధ్యం కాదని ఉత్తర్వులిచ్చింది. ఇది కూటమి ప్రభుత్వ వంచనఆప్కాస్ ద్వారా వేతనాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ, కార్మీకుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాల పొడిగింపు గొంతెమ్మ కోరిక కాదు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరే సేవలందిస్తున్నారు కాబట్టి అదే నిబంధనలు వీరికీ వర్తింపచేయాలి. ఇదే అంశంపై గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే అమలుకు అంగీకరించింది. ఎన్నికల ప్రచారంలో విరమణ వయసును 62కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి పలు దఫాలుగా విన్నవిస్తే ‘పరిశీలిస్తాం’ అంటూ కాలయాపన చేసి ఇప్పుడు సాధ్యం కాదని వంచించారు. గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా సర్వీసు కాలాన్ని 60 ఏళ్లకే కుదించడాన్ని ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తిరిగి ఉద్యమిస్తాం. వైఎస్ జగన్ ప్రభుత్వం మున్సిపల్ కార్మీకులకు రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ కొంత మొత్తం ఇవ్వడానికి అగ్రిమెంట్ చేస్తే.. ఈ ప్రభుత్వం కార్మీకుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా, ఉన్న వాటికే ఉద్వాసన పలికే విధానాలు అనుసరిస్తోంది. – పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కనీస వేతనం ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి/మంగళగిరి/మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని వైద్యసేవ ట్రస్ట్ సీఈఓ రవి పటాన్శెట్టిని వైద్యమిత్రలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం వైద్యసేవ క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దఎత్తున ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆరోగ్యమిత్రలు తరలివచ్చి ఆందోళన చేశారు. బీమా విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఈఓను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వారి డిమాండ్లు..⇒ వైద్యమిత్రలకు కేడర్ కల్పించాలి.. బీమా విధానాన్ని అమలుచేయాలి.. ⇒ డిగ్రీ, పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రతలేదు..⇒ 17 సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి డీపీఓ కేడర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలి..⇒ ఉద్యోగి మృతిచెందితే రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలి..⇒ అందరికీ సర్వీసు వెయిటేజీ కల్పించాలి..⇒ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి.ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి..ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలులో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకం. మా సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు అందజేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను అమలుచేసి ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి. – ఎం ప్రత్యూష, గుంటూరుఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి..ప్రభుత్వానికి, ఆస్పత్రులకు, రోగులకు అనుసంధానంగా వుండే ఆరోగ్యమిత్రల సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస వేతనం అమలుచేయాలి. ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి. ఇటీవల మృతిచెందిన ఆరోగ్యమిత్రల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. – జీ నాగరాజు, ఆసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉంటున్నాంఆరోగ్యమిత్రల సేవలను గుర్తించి ప్రభుత్వం కనీసం వేతనాలు అమలుచేయాలి. మేం ఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉండి ఆరోగ్యశ్రీ అమలులో ఎంతో సేవచేస్తున్నాం. రోగులను ఆస్పత్రుల్లో చేర్చడమే కాక వారికి ఆరోగ్యశ్రీ అమలులో కీలకపాత్ర పోషిస్తున్నాం. – సత్యలక్ష్మి, ఆశ్రం ఆసుపత్రి, ఏలూరు -
ర్యాగింగ్ భూతం చంపేస్తోంది!
సాక్షి, అమరావతి: దేశ విద్యా వ్యవస్థను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే ఎందరో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ మాటున మితిమీరిన చేష్టలు చావు కేకలు పెట్టిస్తున్నాయి. ఇవి ఎంతగా ఉన్నాయంటే కోటాలో విద్యార్థుల బలవన్మరణాలతో దాదాపు సమానంగా ర్యాగింగ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తోంది. సొసైటీ అగైనెస్ట్ వయొలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సేవ్) సంస్థ ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022–24’ నివేదిక ప్రకారం.. వర్సిటీలు, కళాశాలల్లో 2022 – 24 మధ్య కాలంలో 51 ర్యాగింగ్ మరణాలు నమోదైనట్టు తేలింది. ఇందులో వైద్య కళాశాలలను ర్యాగింగ్ ఫిర్యాదులకు ‘హాట్స్పాట్’లుగా గుర్తించింది. దేశంలోని విద్యార్థుల సంఖ్యలో వైద్య విద్యార్థుల సంఖ్య 1.1 శాతమే. కానీ, మొత్తం ఫిర్యాదుల్లో వైద్య కళాశాలల నుంచి వచ్చినవి 38.6 శాతం.అందని ఫిర్యాదులు ఎన్నో..దేశంలోని 1,946 కళాశాలల నుంచి నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్లో నమోదైన 3,156 ఫిర్యాదుల ఆధారంగా ఈ నివేదిక కీలక ధోరణులను అంచనా వేసింది. ఇందులో అధిక ప్రమాదకర సంస్థలు, ర్యాగింగ్ సంబంధిత కేసుల తీవ్రతను గుర్తించింది. వాస్తవానికి నివేదికలో ఇచ్చిన ఫిర్యాదులు మూడేళ్లలో కేవలం జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్లో నమోదు చేసినవి మాత్రమేనని విశ్లేషకులు తెలిపారు. ఇందులో నమోదవని ఫిర్యాదులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు. కళాశాలలకు నేరుగా నమోదయ్యే ఫిర్యాదులు భారీ సంఖ్యలో ఉన్నాయని, కేసు తీవ్రతను బట్టి నేరుగా పోలీసులకు కూడా అందుతాయని వివరించారు. సాధారణంగా తక్కువ సంఖ్యలోని బాధితులు దైర్యంగా ముందుకొచ్చి సమస్యను నివేదిస్తారని, అందుకే చాలా కేసులు బయటకు రావడంలేదని అభిప్రాయపడ్డారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి పేరు లేకుండా ఫిర్యాదులను స్వీకరించాలని జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్లైన్కు ఈ నివేదిక సిఫారసు చేసింది.వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ..తాజా నివేదికలో నమోదైన 51 ర్యాగింగ్ మరణాల్లో సుమారు 45.1 శాతం వైద్య కళాశాలల్లో జరిగినవే. వైద్య కళాశాలల్లో 23 మంది ర్యాగింగ్ భూతానికి బలైపోయారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే వైద్య కళాశాలలు, వర్సిటీల్లో 30 శాతం అధికంగా ర్యాగింగ్ మరణాలు నమోదవుతున్నాయని సేవ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య కళాశాలల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించింది.ర్యాగింగ్ నియంత్రణ బృందాలు పర్యవేక్షించాలిర్యాగింగ్ నియంత్రణకు సేవ్ సంస్థ చేసిన ప్రధాన సూచనల్లో కొన్ని..» కళాశాలలు అంకితభావంతో కూడిన వ్యక్తులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలి» కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులకు సుహృద్భావ వాతావరణంలో విద్యను అందించాలి» యూజీసీ, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లలో వసతి కల్పించాలి» హాస్టళ్లలోని సీసీ కెమెరాల నిఘాను భద్రతా సిబ్బంది, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, తల్లిదండ్రులు పర్యవేక్షించాలి» తీవ్రమైన ర్యాగింగ్ కేసుల్లో సంబంధిత సంస్థలు 24 గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలిమూడేళ్లలో కోటా ఆత్మహత్యలతో పోలిస్తే..కోటాలో బలవన్మరణాలసంఖ్య 57విద్యా సంస్థల్లో ర్యాగింగ్ మరణాల సంఖ్య 51 2022 – 24 మధ్య ర్యాగింగ్ మరణాలు..2022 142023 172024 20 -
గాల్లో తేలిపోవచ్చు.. ఇట్టే వాలిపోవచ్చు
రోడ్డుపై ఆటో లేదా ట్యాక్సీ ఎక్కినట్టుగానే.. ఎయిర్ ట్యాక్సీ ఎక్కి గాలిలో ప్రయాణించే సదుపాయం మనకూ ఆందుబాటులోకి రాబోతోంది. చైనా, దుబాయ్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎయిర్ ట్యాక్సీలు భవిష్యత్లో ఏపీలోనూ సందడి చేయనున్నాయి. గుంటూరుకు చెందిన ఓ యువకుడు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. మోటార్లు మినహా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రా కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని గుంటూరుకు చెందిన ఓ యువకుడు మన దేశంలోనూ సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారు. ‘మాగ్నమ్ వింగ్స్’ కంపెనీ పేరిట కంపెనీ నెలకొల్పి ఎయిర్ ట్యాక్సీల తయారీ ప్రారంభించారు. తొలి ఎయిర్ ట్యాక్సీ సంస్థగా.. ఏపీలో ప్రప్రథమంగా మాగ్నమ్ వింగ్స్ తొలి ఎయిర్ ట్యాక్సీ సంస్థగా ఆవిర్భవించింది. గుంటూరులోని ఏటుకూరు రోడ్డు కేంద్రంగా 2018లో చావా అభిరామ్ దీనిని ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్లోని రోబోటిక్స్ యూనివర్సిటీ ఆఫ్ యూటాలో ఉన్నత విద్యను అభ్యసించిన అభిరామ్.. అక్కడే మంచి ఉద్యోగాలు వచ్చినా స్థిరపడకుండా సొంత గడ్డపై పరిశ్రమ స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మాగ్నమ్ వింగ్స్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలి ఎయిర్ ట్యాక్సీ ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయాలు, నగరాలకు వేగవంతమైన కనెక్షన్, అత్యవసర వైద్య సేవల కోసం వినియోగించేందుకు అధునాతన పరికరాలు సిద్ధం చేస్తున్నారు. రెండు, మూడు సీట్లతో.. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా ఎయిర్ ట్యాక్సీని రూపొందించి∙మాగ్నమ్ వింగ్స్ విజయవంతంగా ప్రయోగించింది. అయితే, పైలట్ లేని వాటిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించదు కాబట్టి.. పైలట్ కూడా ఉండేలా రెండు లేదా మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నారు. రెండు సీట్లతో ఒక ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ–2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతం కావడంతో రెండో వెర్షన్ తయారీలో నిమగ్నమయ్యారు. మూడు సీట్లతో కూడిన ఎక్స్–4 అనే మోడల్ను మరో నెల రోజుల్లో పరిశీలించనున్నారు. తక్కువ ఖర్చుతోనే ప్రయాణం వీ–2 రకం వెయ్యి అడుగుల ఎత్తులో గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఎక్స్–4 ఎయిర్ ట్యాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20 వేల అడుగుల ఎత్తులో 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దూర ప్రయాణాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్లోకి వచ్చేసరికి వీ–2 మోడల్ ధర రూ.2 కోట్లు, ఎక్స్–4 రకం రూ.8 కోట్లు ఉండొచ్చని అభిరామ్ చెప్పారు. క్యాబ్ ఖర్చుతోనే ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం అందుబాటులోకి తీసుకు రావాలనేది తన లక్ష్యమని ఆయన తెలిపారు. తమ వాహనాలు బ్యాటరీ సహాయంతోనే నడుస్తాయని, ఆకాశ మార్గంలో దూరం తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు సైతం పెద్దగా ఉండదని వివరించారు. అనుమతులే తరువాయి మనదేశంలో బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సైతం ఎయిర్ ట్యాక్సీలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్ ట్యాక్సీ పాలసీ ఇంకా ముసాయిదా (డ్రాఫ్టింగ్) దశలోనే ఉంది. విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. మాగ్నమ్ వింగ్స్ సంస్థ ద్వారా ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కావాలనుకున్న వారికి వాటిని విక్రయిస్తామని మాగ్నమ్ వింగ్స్ సీఈవో చావా అభిరామ్ చెప్పారు. అనుమతులు లభించిన వెంటనే విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో విమానాశ్రయ కనెక్షన్, అత్యవసర వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు. భవిష్యత్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలను విస్తరించేందుకు యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మా ఎయిర్ ట్యాక్సీలు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు. అత్యవసర వైద్య సేవలు, వైద్యులు, రోగుల రవాణా, మెడికల్ సపోర్ట్ డెలివరీ వంటి సేవల ద్వారా వేలాది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. భద్రత మా తొలి ప్రాధాన్యత. సింగిల్, డబుల్, త్రిబుల్, ఫైవ్ సీటర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. వైమానిక విప్లవానికి నాంది పలికేందుకు పాటుపడుతున్నాం. – చావా అభిరామ్, సీఈవో, మాగ్నమ్ వింగ్స్ ప్రయోజనాలివీ..» కారుతో పోలిస్తే 70% తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేయగలదు. » రోడ్డు ప్రయాణం సుమారు 100 కిలోమీటర్లు ఉంటే.. ఎయిర్ ట్యాక్సీ 50 కిలోమీటర్లలోపే గమ్యాన్ని చేరుకుంటుంది. » నగరాల మధ్య తక్కువ దూరంలోనే ప్రయాణించగలదు. 40 కి.మీ. పరిధిలోని ప్రయాణాలను కేవలం 10–15 నిమిషాల్లో పూర్తి చేయగలదు. » ప్రయాణ చార్జీలు ఓలా, ఉబర్ క్యాబ్ ధరలకు సమానంగా ఉండేలా రూపొందించబడింది. » కిలోమీటరుకు సుమారు రూ.50 చార్జీ అయ్యే అవకాశం. » పర్యావరణహితంగా పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీతో నడిచే ఇవి కార్బన్ ఎమిషన్ లేకుండా శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. » అత్యున్నత భద్రతా ప్రమాణాలు, బహుళ రిడండెన్సీ వ్యవస్థలు, అత్యాధునిక ఆటోనమస్ ఫ్లైట్ మోడ్, మల్టీ–రోటర్ టెక్నాలజీతో భద్రతను మరింత మాగ్నమ్ వింగ్స్ మెరుగుపరిచింది. » ఎమర్జెన్సీ సేఫ్టీ ఫీచర్లు, సేఫ్ బ్యాటరీ బ్యాకప్, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిస్టం, ప్రయాణికుల రక్షణ కోసం అధునాతన సెన్సార్ నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. » అత్యంత అత్యవసర వైద్యసేవల కోసం ఎయిర్ అంబులెన్స్లుగా కూడా ఎయిర్ ట్యాక్సీలు ఉపయోగపడతాయి.» యాక్సిడెంట్, గుండెపోటు, ఇతర అత్యవసర చికిత్సల కోసం వైద్యులను తక్కువ సమయంలో ఆస్పత్రులకు చేర్చేందుకు ఉపయోగపడతాయి. » మెడికల్ సపోర్ట్, అత్యవసర ఔషధాల డెలివరీ, బ్లడ్ బ్యాగ్స్, ఎంతో కీలకమైన అవయవ మార్పిడి కోసం అవసరమైన సపోర్టింగ్ సామగ్రిని ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇతర దూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వేగంగా పంపించేందుకు సాయం చేస్తాయి. -
రూ.2,704.81 కోట్లనూ మళ్లించిన సర్కారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. తక్షణమే ఆ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేసి, రసీదు పంపాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు రోజూ ఒత్తిడి చేస్తుండటంతో జల వనరుల శాఖ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించేయడంపై అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 9న తొలి విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో మళ్లించేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు జనవరి రెండో వారంలో వాటిని నోడల్ ఏజెన్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఖర్చు పెట్టిన నిధులను తిరిగిస్తే చంద్రబాబు గగ్గోలుగతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి (రీయింబర్స్ చేసేది) ఇచ్చేది. అంటే.. కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులను ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినియోగిస్తే.. పోలవరం నిధులను దారి మళ్లించేశారంటూ చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అప్పట్లో దుష్ఫ్రచారం చేశారు. రీయింబర్స్మెంట్ ప్రక్రియలో జాప్యం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని.. అడ్వాన్సుగా నిధులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రధాని మోదీ అప్పట్లో సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్ చేయడంతోపాటు రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్సు రూపంలో మొత్తం రూ.2,807.68 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజున వాటిని రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. ఈ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమచేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. అప్పట్లో రీయింబర్స్ చేసిన నిధులను మళ్లించేశారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అడ్వాన్సు నిధులను మళ్లించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్ జగన్
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«దానం’ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవిగో ఆధారాలు07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ 18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు నాటి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ వీళ్ల తీరే అంత.. వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. -
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
సాక్షి నెట్వర్క్: అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్ఎంపీపీ, 8 కో ఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్) వైఎస్సార్సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. దౌర్జన్యకాండ.. వైఎస్సార్ జిల్లా గోపవరంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ జెడ్పీ పీఠంపై ఫ్యాన్ రెపరెపలు వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్ షేక్ ఖాదర్ బాషా, 4వ వార్డు మెంబర్ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు. విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ (రెబల్) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుడిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాధిక్లు వైఎస్సార్సీపీ తరుఫున ఎన్నికయ్యారు. సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లలచెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.జగనన్న పార్టీకే జై ‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూశారు. మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చారు. – ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలుధీరనారి... నాగేంద్రమ్మప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో పోలయ్య నైట్ వాచ్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. మండల వైస్ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.రామగిరిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల అడ్డగింతశ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్కు వీడియో కాల్ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్ఐ మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్తో వీడియో కాల్స్ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.– తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనంఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. నందిగామ పీఠం వైఎస్సార్సీపీదే ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిడ్నాప్ చేసి దక్కించుకున్న టీడీపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో ఎన్నిక బాయ్కాట్ నరసరరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు. విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. విశాఖలో వైఎస్సార్సీపీకి నాలుగుఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీ, ఒక కోఆప్షన్ మెంబర్కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్కృష్ణ మండల పరిషత్ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్ గెలుపొందారు. ఆ మూడు మండల పరిషత్లు వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్సుందర్రాయల్ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్ సభ్యురాలిగా వైఎస్సార్సీపీ బలపరచిన నసీమా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. భయపెట్టినా..నిలబడ్డారు నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్గా టీడీపీ మద్దతు దారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకలు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.యలమంచిలిలో హైడ్రామాకూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్ కురేళ్ల కిషోర్ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. -
Chandrababu: ఇఫ్తార్ విందులో టీడీపీ టోపీ పంచాయితీ
విజయవాడ: ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టోపీ పెట్టే క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్ జలీల్ ఖాన్ ల మధ్య పంచాయితీ జరిగింది. చంద్రబాబుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మొదట టోపీ పెట్టగా, దాన్ని జలీల్ ఖాన్ తీసేసి ఆ స్థానంలో తాను తెచ్చిన టోపీని పెట్టారు. తాను పెట్టిన టోపీని తీయడమేంటని ఆగ్రహించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్.. జలీల్ ఖాన్ పెట్టిన టోపీని కూడా తీసేయబోయారు. దాన్ని జలీల్ ఖాన్ అడ్డగించారు. తాను పెట్టిన టోపీని తీయడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేని అడ్డుకున్న జలీల్ ఖాన్.. ఎమ్మెల్యే చేయిన పక్కకు తోసేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కనిపించింది. ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు.సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు -
పాఠశాలల్లో ‘వాటర్ బెల్’.. రోజుకు ఎన్నిసార్లు అంటే..?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యాశాఖ ‘వాటర్ బెల్’ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్నందున రోజుకు మూడుసార్లు వాటర్బెల్ (Water Bell) అమలు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10, 11, 12 గంటలకు బెల్ మోగించాలని సూచించారు. అన్ని స్కూళ్లల్లోనూ ఈ వేళలు తప్పనిసరిగా పాటించాలని, తాగునీరు (Drinking Water) కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్య కరిక్యులమ్ సంస్కరణలకు కమిటీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్ విద్య కరిక్యులమ్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) –2020కి అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉప కులపతి డాక్టర్ వెంకయ్య చైర్మన్గా 12 మంది యూనివర్సిటీ, డిగ్రీ కాలేజీల ప్రొఫెసర్లు సభ్యులుగా కమిటీ నియమించింది. ప్రత్యేక సభ్యులుగా బెంగళూరు ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సదగోపన్, అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ అశ్విని కె ఓలేటిని నియమించింది.అలాగే, ఇంజినీరింగ్ 3, 4 సంవత్సరాల కరిక్యులమ్ మార్పునకు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ చైర్మన్గా 13 మంది ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో మరో కమిటీని నియమించింది. ఈ కమిటీలు మూడు వారాల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి.‘ఆస్ట్రేలియాలో విస్తృత విద్యావకాశాలు’భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య కోణంలో ఆస్ట్రేలియాలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, రీసెర్చ్ ఆధారిత కోర్సుల ఫలితంగా వారిలో నైపుణ్యాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని.. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ (ప్రభుత్వ అధినేత) పీటర్ మలినౌస్కస్ తెలిపారు. అదే విధంగా వీసా నిబంధనలు కూడా కఠినంగా లేవని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన స్టడీ అడిలైడ్ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియాలో ఆర్అండ్డీ, టెక్, సైన్స్, హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్ విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత విద్యార్థులు కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇదే వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలు టాప్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రవేశాలు పొందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్షిప్స్ కూడా లభిస్తాయి’ అని తెలిపారు.చదవండి: 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు -
‘ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది’
తాడేపల్లి : కూటమి నేతల అరాచకాలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడ్డదోవలో పదవులను దక్కించుకునేందుకు కూటమి పార్టీలు అత్యంత నీచమైన దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బలం లేకపోయినా బెదిరింపులు, కేసులతో, వేధింపులతో ఏదో ఒక విధంగా పదవులను చేజిక్కించుకునేందుకు కుటిల రాజకీయంతో బరితెగించారని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా దానిలో ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలనే తలంపుతో రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తూ కూటమి పార్టీలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజాస్వామికవాదులు సిగ్గు పడుతున్నారు. ఏపీలో ప్రజాస్వామిక విలువలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార కూటమి పార్టీలు పదవులను దక్కరించుకునేందుకు అడ్డదోవలు తొక్కుతున్నాయి. పదవుల్లో పోటీకి సిద్దమైన వారిని భయపెట్టి, కేసులతో వేధింపులకు పాల్పడుతూ వారిని పోటీకి దూరంగా ఉంచుతున్నాయి. నాలుగుసార్లు సీఎంగా ఉండి, రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇలా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీలో చేరాలంటే ప్రస్తుతం వారు ఉన్న పార్టీకి, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే పదవులకు రాజీనామా చేసిన తరువాతే రావాలంటూ చాలాసార్లు చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. కానీ వాస్తవం చూస్తూ ఫిరాయింపు రాజకీయాలు, అడ్డదోవలో బెదిరించి, కేసులు పెట్టి మరీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా పదవులను చేజిక్కించుకుంటున్న కుటిల రాజకీయం కనిపిస్తోంది. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేవి స్థానికసంస్ధలకు చెందినవి. వాటిల్లో గెలపు ఓటముల వల్ల రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం ఉండదు. అయినా కూడా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఇటువంటి చిన్నచిన్న పదవులను కూడా అప్రజాస్వామికంగా దక్కించుకునే ప్రయత్నం చేయడం దారుణం. కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదుకూటమి పార్టీల బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా చంద్రబాబు నిలబెట్టారు? ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల బలాబలాలను చూస్తే రాజంపేట, అత్తిలి, ఏలూరు రూరల్, నరసరావుపేట, దగదర్తి, రాప్తాడు, రామకుప్పం ఇలా ప్రతిచోటా వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ చంద్రబాబు అన్నిచోట్లా అభ్యర్ధులను నిలబెట్టి, వైఎస్సార్సీపీ వారిని బెదిరించి మరీ పదవులను చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. యాబై ఒక్క చోట్ల ఎన్నికలు జరిగితే 30 చోట్లకు పైగా వైఎస్సార్సీపీ అన్ని ఒత్తిళ్ళను అధిగమించి పదవులను గెలుచుకున్నాయి. టీడీపీ 11, జనసేన ఒక చోట మాత్రమే గెలిచాయి. మరో పదిచోట్ల ఎన్నికలను వాయిదా వేయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత బలవంతం చేసినా, బెదిరించినా, భయపెట్టినా కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు మొక్కవోని పట్టుదలతో తమ బలాన్ని ప్రదర్శించి పదవులను కాపాడుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా వ్యవహరించారు. భయపెట్టి, బెదిరింపులతో అధికారంను చేజిక్కించుకోవాలనుకునే కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం నేర్పడానికి సిద్దంగా ఉన్నారు.ఎన్నిక నిలుపుదలకు టీడీపీ కుట్రలువైఎస్స్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు.వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసంకూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం -
ప్రభుత్వ ఇఫ్తార్ను బహిష్కరిస్తున్నాం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించారు. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. బుధవారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు. -
నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 47 మండలాల్లో గురువారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాలు, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, ఎన్టీటఆర్ జిల్లాలోని 1 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అలాగే మరో 199 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయన్నారు. శుక్రవారం 79 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 186 మండలాల్లో వడగాడ్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. సిద్ధవటంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఇదిలావుండగా బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.7, చిత్తూరు జిల్లా నిండ్రలో 40.1, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. -
అధికారపార్టీ అడ్డదారులు
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాట వినకపోతే కిడ్నాప్లకూ వెనుకాడటం లేదు. ‘మీరు ఎన్నిచోట్ల గెలిస్తే మాకేంటి. మాకు ఒక్క సభ్యుడు లేకపోయినా.. మీకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బలం ఎంత ఉన్నా మమ్మల్నేం చేయలేరు. ఈ ప్రభుత్వం మాది. మేం చెప్పిందే వేదం. మేం చేసేదే శాసనం. మా మాట వినకుంటే మీరెవరూ బతికి బట్టకట్టలేరు’ అంటూ రెచ్చిపోతున్నారు. – సాక్షి, అమరావతిఅచ్చంపేటలో కిడ్నాప్పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ పదవికి గురువారం ఎన్నిక జరనుండగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థిని, ఆమె భర్తను బుధవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. నాలుగు కార్లలో వచ్చి టీడీపీ మూకలు వారిద్దరినీ ఎత్తుకెళ్లి అజ్ఞాతంలోకి తరలించారు. 2021 సెప్టెంబర్లో జరిగిన ఎన్నికలలో అచ్చంపేట మండల పరిషత్ పరిధిలోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 16 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున తాడువాయి, మాదిపాడు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ అభ్యర్థులు భూక్యా రజనీబాయి, భూక్యా స్వర్ణమ్మభాయి గెలుపొందారు. రిజర్వేషన్ ప్రకారం.. భూక్యా రజనీబాయిని ఎంపీపీగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యక్తిగత కారణాల వల్ల రజనీబాయి ఆ పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతన ఎంపీపీని ఈ నెల 27వ తేదీన ఎన్నుకోవాల్సి ఉంది.అయితే, టీడీపీకి ఎస్టీ అభ్యర్థే లేరు. దీంతో ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారు. బుధవారం అర్ధరాత్రి పోలీసుల సాయంతో ఎంపీటీసీల ఇళ్లపై పడ్డారు. 15మంది ఎంపీటీసీల్లో 8 మందిని గంజాయి, అక్రమ మద్యం కేసుల్లో ఇరికించి నాన్బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించి రహస్య స్థావరానికి తరలించారు. మరోవైపు మాదిపాడు ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయిని టీడీపీ కండువా కప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. వినకపోవడంతో బుధవారం ఉదయం 12గంటల సమయంలో టీడీపీ నాయకులు నాలుగు కార్లలో వచ్చి స్వర్ణమ్మబాయిని, ఆమె భర్త రమేష్ నాయక్ను కిడ్నాప్ చేసి అజ్ఞాతంలోకి తరలించారు. టీడీపీ దాడులతో రచ్చరచ్చశ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థికి సంబంధించి బీఫామ్ అందజేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై బుధవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ లీగల్ సెల్ నాయకులు బీఫామ్ అందజేసేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన వాహనంలో రామగిరి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోగా టీడీపీ నాయకులు దాడి చేశారు.వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించారు. మరోవైపు రొద్దం, కదిరి నియోజకవర్గం గాండ్లపెంటలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆ రెండుచోట్లా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తగిన బలం లేకపోయినా ఎమ్మెల్యే పరిటాల సునీత అధికార బలాన్ని ఉపయోగించి ఎంపీపీ పదవిని అడ్డదారిలో టీడీపీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వైఎస్సార్ జెడ్పీలో ఎన్నిక అడ్డుకునేందుకు..వైఎస్సార్ జిల్లా పరిషత్ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ప్రస్తుతం అక్కడ జెడ్పీ చైర్మన్కు ఎన్నిక జరుగుతోంది. కొందరు జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా.. ఇప్పటికీ 42 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే, టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క జెడ్పీటీసీతో జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిలుపుదలకు హైకోర్టును ఆశ్రయించారు.ఒక్క సభ్యుడు లేకపోయినా..నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ పెద్దఎత్తున ప్రలోభాలు మొదలుపెట్టింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్సీపీ 12 మంది, సీపీఎంకు ఇద్దరు సభ్యుల చొప్పున బలం ఉంది. టీడీపీకి ఒక్క సభ్యుడు కూడా లేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అరాచకాలకు తెరతీసింది. 8 మంది ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు చివరి నిమిషం వరకూ ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. » పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపీకి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ » సత్యసాయి జిల్లా రామగిరిలో బీఫామ్ ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మూకల దాడి » తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర » ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగింపు » తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో అక్రమాల నివారణకు న్యాయస్థానం తలుపుతట్టిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి » ఒకే సభ్యుడు ఉండటంతో వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ ‘తూర్పు’లో ప్రలోభాలుతూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీపీ స్థానంలో గెలిచేందుకు తగిన బలం లేని కూటమి పార్టీల నేతలు వైఎఎస్సార్సీపీ ఎంపీటీసీల్లో కొందరికి రూ.3 లక్షల చొప్పున ఆశచూపారు. నలుగురు వైఎస్సార్సీపీ సభ్యులను ఎన్నిక వేళ హాజరుకాకుండా ఉండాలని అధికార పార్టీ శ్రేణలు బెదింపులకు దిగుతున్నారు. కాకినాడ రూరల్ మండల పరిషత్లో జనసేన పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తోంది. మండలంలో 18 మంది ఎంపీటీసీలు ఉండగా.. వైఎస్సార్సీపీకి 15 మంది, జనసేనకు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా ఏడుగురు ఎంపీటీసీకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చేలా ప్రలోభపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నేడు రెండు జెడ్పీ, 60 మండలపరిషత్లలోఎన్నికలుఖాళీగా ఉన్న వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. కర్నూలు జెడ్పీ కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 60 మండలాల్లో 28 ఎంపీపీ పదవులు, 23 మండల ఉపాధ్యక్ష, 12 మండల కో–ఆప్టెడ్ సభ్యుల పదవులకు సైతం గురువారం ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు 200 గ్రామ పంచాయతీల్లోనూ ఉప సర్పంచ్ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరగనున్నాయి. – సాక్షి, అమరావతిఫిర్యాదు చేస్తే చించేశారుచిత్తూరు జిల్లాలో రామకుప్పం మండల పరిషత్ అధ్యక్షురాలు శాంతకుమారి మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అన్నిచోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలని, వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు కాపీని టీడీపీ నేతలు పోలీసుల నుంచి లాక్కుని చించివేశారు.శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 6 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీ జగన్మోహన్ ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యౖమెంది. బలం లేకపోయినా ఎంపీపీ కుర్చీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై ఒత్తిడి తెస్తున్నారు.ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎంపీపీ పోటీలో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యునిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. మరో ఎంపీటీసీ సభ్యునిపైనా కేసు నమోదు చేయించారు. పుల్లలచెరువు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి సైతం ఎన్నిక జరుగుతుండగా.. ఇక్కడ మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలుకు గాను 11 స్థానాలు వైఎస్సార్సీపీ, 4 స్థానాలు టీడీపీ పక్షాన ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీ ప్రలోభాలు పెట్టేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా యత్నిస్తోంది.తిరుపతిలో వైఎస్సార్సీపీ ముందుజాగ్రత్తతిరుపతి ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్రెడ్డి రాజీనామా చేయటంతో గురువారం ఉప ఎన్నిక జరుగుతోంది. మండలంలో 40 ఎంపీటీసీ స్థానాలుండగా.. 38చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఒకస్థానం టీడీపీ టీడీపీ దక్కించుకుంది. ప్రస్తుతం 32 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ వెంటే ఉండగా.. ప్రలోభాల లొంగిన ఐదుగురు ఎంపీటీసీలు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా కూటమి నేతల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
లోకేశ్కో రూలు.. మిథున్కో రూలా!?
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్టుచెయ్యొద్దని హైకోర్టు బుధవారం సీఐడీని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరిపారు. మిథున్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి. అప్పుడు లోకేశ్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు..ముందుగా నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడు కానప్పటికీ, ఆ కేసువల్ల ప్రభావితమయ్యే వ్యక్తి ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్టుచేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా వెయ్యొచ్చని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేశ్ను నిందితుడిగా చేర్చలేదు కాబట్టి, ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు మిథున్రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా, ఇప్పుడు మరో రకంగా సీఐడీ వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా.. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను నిరంజన్రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు.గతంలో లోకేశ్ తరఫున సిద్దార్థ లూథ్రా, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజున నిందితుడు కానప్పటికీ లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను సమర్థించిన లూథ్రా.. ఇప్పుడు మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ను మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.లోకేశ్కు ఇచ్చినట్లే ఉత్తర్వులివ్వాలని మిథున్ కోరలేరు..లూథ్రా వాదనలు వినిపిస్తూ, లోకేశ్ కేసులో వాస్తవాలకు, ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. లోకేశ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అలాంటి ఉత్తర్వులే తమకూ ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణార్హతే లేదని లూథ్రా తెలిపారు. పైగా.. విచారణకు హాజరుకావాలని ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దర్యాప్తు అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పీఎల్ఆర్ కంపెనీ వివరాలు అడిగామని, అందువల్ల తనను అరెస్టు చేస్తారని పిటిషనర్ చెబుతున్నారని, వాస్తవానికి ఆ కంపెనీలో మిథున్రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారం రూ.వేల కోట్లకు సంబంధించిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయ్యొద్దని లూథ్రా కోర్టును కోరారు.దర్యాప్తు అధికారి తీరును తీవ్రంగా పరిగణించండి..ఇక ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చారని నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ వాంగ్మూలంలో మిథున్రెడ్డి ప్రస్తావన ఉందన్నారు. ఇదే సమయంలో.. ఓ అధికారి సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారని అది తమ వద్ద లేదని సీఐడీ దర్యాప్తు అధికారి చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు అధికారిపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు కనిపించడంలేదని నిరంజన్రెడ్డి అన్నారు. ఒకవైపు నేరారోపణలకు ఆధారాలు లేవంటారని, మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ పరస్పర విరుద్ధంగా వాదనలు వినిపిస్తోందన్నారు. ఆధారాల్లేకుంటే ముందస్తు బెయిల్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు. మిథున్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నందునే తాము ముందస్తు బెయిల్ కోసం కోర్టుకొచ్చామన్నారు. మిథున్రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను దగ్గరకు వస్తే అరెస్టుచేయాలన్న ఉద్దేశంతో సీఐడీ ఉందన్నారు. -
నాలా చట్టం రద్దు
సాక్షి, అమరావతి: అభివృద్ధికి అడ్డంకిగా మారిన నాలా చట్టాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాలా అనేది చాలా మందికి మనీ కలెక్షన్ సెంటర్గా మారిందని, దీనివల్ల అనుమతులు ఆలస్యం అవుతుండటంతో ఆభివృద్ధి నెమ్మదిస్తోందని, అందుకనే ఆదాయం నష్టపోతున్నా కూడా దీన్ని రద్దు చేస్తున్నానని స్పష్టం చేశారు. మంగళ, బుధవారం సచివాలయంలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ‘రియల్ ఎస్టేట్ రంగం, పరిశ్రమలకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి రద్దు చేస్తాం. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు కడితే సరిపోతుంది. ఎటువంటి పెనాల్టీ, వడ్డీలు చెల్లించక్కర్లేదు. సంపద అనేది కొందరికే పరిమితం కాకూడదు. అందుకే ఉగాది నుంచి పీ4 పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కలెక్టర్లు అడిగినప్పుడు సమస్యలను చెప్పడం కాదు. ఆ సమస్యలను వారే పరిష్కరించాలి. గతంలో నేను మాత్రమే పరుగులు పెట్టే వాడిని. ఇప్పుడు నాతో పాటు మిమ్మల్నీ పరుగులు పెట్టిస్తా. 2047 వృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రతి కలెక్టర్ కృషి చేయాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ, ఆర్అండ్బీ అతిథి గృహాలు ప్రైవేట్ వారికి ఇచ్చి, హోటల్స్గా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలి‘ అని చెప్పారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో ప్రైవేట్ రంగంలో పెట్టడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు» శ్రీకాకుళంతో పాటు వెనుకబడిన జిల్లాలో వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలి. » అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉద్యాన పంటలు నిలువ చేసుకునేందుకు కోల్డ్ చైన్ లింకేజీ సౌకర్యాలను పెంచాలి. » రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా పనిచేసేలా ప్రతి గృహానికి బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ సౌకర్యం కల్పించాలి. » గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలి. ఇందు కోసం ఐఏఎస్ అధికారులు వీరపాండియన్ను ప్రత్యేకాధికారిగా, విజయరామరాజును అదనపు అధికారిగా నియమిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హామీలపై కార్యాచరణ ఏదీ?ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంపై కార్యాచరణ లేకుండానే ముగిసింది. ఈ సదస్సుతో పాటు తొలి, రెండవ సదస్సులోనూ సూపర్ సిక్స్ సహా ఇతర హామీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత సదస్సులో మే నెల నుంచి తల్లికి వందనం అమలు చేస్తామంటూ ముక్తాయింపు ఇచ్చారు తప్ప, కలెక్టర్లతో కూలంకషంగా చర్చించలేదు. ఆదాయం పెంచితేనే హామీలు అమలు చేయగలనని, భారం అంతా కలెక్టర్లపై మోపారు. ఏం చేస్తే వృద్ధి రేటు 15 శాతానికి పైగా సాధించవచ్చో చెప్పకుండా.. ఆ మేరకు లక్ష్యం విధించడం సీఎం చిత్తశుద్ధి లోపమేనని అధికార వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం ఎలా పెరుగుతుందో కలెక్టర్లు చెప్పక పోవడంతో రంగు రంగుల పీపీటీలతో తనను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులెవ్వరినీ మాట్లాడనివ్వలేదు. మొత్తంగా ఈ తొమ్మిది నెలలో ఏ పనులూ పూర్తి కాలేదని బహిర్గతమైంది. -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. -
'పరీక్షల్లో' ప్రభుత్వం ఫెయిల్
సాక్షి, అమరావతి: ఇప్పటికే విద్యారంగ సంస్కరణలను నీరుగార్చి, చదువులను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు.. పరీక్షల వ్యవస్థను సైతం మూడు లీకులు.. ఆరు మాస్ కాపీయింగ్ల స్థాయికి దిగజార్చేసింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన నిర్వాకాలే దీనికి నిదర్శనం. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కనీసం ప్రశ్న పత్రాల ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల సిలబస్కు అనుగుణంగా ప్రశ్నా పత్రాన్ని మార్చేసిన ఘనత కూటమి సర్కారులోనే కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది 10,58,893 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,49,884 మంది టెన్త్ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసున్నారు. ప్రభుత్వ నిర్వాకాలు వారి భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష అయినా పకడ్బందీగా నిర్వహించారని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2022లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్ లీక్కు జరిగిన యత్నాలను సమర్థంగా అడ్డుకుని కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు వేగంతో నిర్వహించి భర్తీ చేసిందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.⇒ మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసేలా మాస్ కాపీయింగ్ వ్యవహారాలు పలు చోట్ల వెలుగు చూశాయి. ఈనెల 21న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ, బీ కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్కు తెర తీశారు.లీకేజీలకు కేరాఫ్ బాబు పాలనటీడీపీ అధికారంలో ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకై విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో పదో తరగతి పేపర్ లీకైంది.పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల అరెస్ట్, వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు టెన్త్ పేపర్ లీక్... 9 మంది అరెస్టుపదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు సంబంధించి వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని ఖాజీపేట మండలం ఏటూరు గ్రామం అల్లాడుపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వల్లూరు జడ్పీ హైసూ్కల్ కేంద్రంలో ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్ బాయ్ సాయి మహేష్ షేర్ చేసేందుకు ఉపయోగించిన సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్ స్కూల్ టీచర్ విఘ్నేష్రెడ్డి అలియాస్ విఘ్నేష్, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, మాథమేటిక్స్ టీచర్ శ్రీకాంత్రెడ్డి, బీసీ వెల్ఫేర్ గెస్ట్ టీచర్ శ్రావణి, టీచర్ మధుయాదవ్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెంటెండ్ ఎం.రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్ ఎం.రమణ వీరిలో ఉన్నారు. ప్రశ్నాపత్రం లీక్పై డీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక్కడ విద్యార్థులకు స్లిప్పులు అందించడం.. పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ ఉపాధ్యాయులు పట్టుబడ్డ వ్యవహారం బట్టబయలైంది. దీంతో 11 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు హెచ్ఎంలు, రికార్డు అసిస్టెంట్ సహా మొత్తం 15 మందిని సస్పెండ్ చేశారు. ⇒ వైఎస్సార్ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రం లీక్ చేసి వాట్సాప్లో తిప్పారు. ఈనెల 24న ఇక్కడ పదో తరగతి లెక్కల పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. స్కూల్లో ఓ వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తికి పంపినట్లు తేలింది. నిషిద్ధ ప్రాంతంలో వాటర్ బాయ్ వద్ద స్మార్ట్ ఫోన్ లభించడం విస్మయం కలిగిస్తోంది. ఉత్తీర్ణత పెరగాలంటూ ఒత్తిళ్లు..విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో చదువులను నీరుగార్చిన ప్రభుత్వం పరీక్షల్లో మాత్రం అత్యధికంగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ ఉపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఒకపక్క ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జూన్లో ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ వరకు సాగదీసింది. అయినా నూరు శాతం పూర్తి చేయలేదు. మరోపక్క ‘అర్జెంట్ రిపోర్టు’ పేరుతో రోజూ మెస్సేజులు పంపుతూ బోధనను గాలికొదిలేసింది. తీరా పరీక్షల నాటికి ఫలితాల కోసం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ టీచర్ల మెడపై కత్తి వేలాడదీసింది! మీరు ఏం చేసినా సరే.. గతంలో కంటే ఎక్కువగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ హెచ్చరించింది. తన గొప్పల కోసం పాస్ శాతం పెరగాలని విద్యాశాఖ మంత్రి ఆదేశిస్తుండగా.. ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ఆయా సబ్జెక్టుల్లో పర్సంటేజ్ పెరగకుంటే నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని స్లిప్పులు రాసే స్థితికి దిగజార్చారు. ఇంటర్ పేపర్లో తప్పులు.. ⇒ మార్చి 5న జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో ముద్రణ తప్పులు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. 8వ ప్రశ్న కింద ‘అడ్వర్టైజ్మెంట్ చదివి సమాధానాలు రాయాలని ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే ప్రశ్నలో ఏముందో గుర్తించలేని రీతిలో ముద్రించారు. ఈ విషయాన్ని నెల్లూరులో గుర్తించి ఉన్నతాధికారులకు చేరవేసి సరిదిద్దేసరికి గంట సమయం గడిచిపోయింది. దీంతో కొన్ని చోట్ల బోర్డుపై రాయగా మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రంలోని అంశాలను ఇని్వజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. 13వ ప్రశ్న కూడా గందరగోళంగా ముద్రించడంతో విద్యార్థులు మొత్తం పది మార్కులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ⇒ 15వ తేదీన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో 14వ ప్రశ్న అకడమిక్ సిలబస్ నుంచి ఇవ్వగా విద్యార్థులు జవాబులు రాశారు. తీరా గంట గడిచిన తర్వాత ప్రశ్నలో తప్పుందంటూ మార్పు చేశారు. ఓ కార్పొరేట్ కాలేజీ ముద్రించుకున్న సిలబస్కు అనుగుణంగా దీన్ని మార్చినట్లు తెలిసింది. ⇒ మార్చి 11న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని పెనుమాక జూనియర్ కాలేజీలో ఓ ప్రైవేట్ కాలేజీకి మేలు చేసేలా మాస్ కాపీయింగ్ జరిగింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ సెంటర్ కేటాయించారు. ఇంటర్ రెండో ఏడాది గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇక్కడ మాస్ కాపీయింగ్ ప్రారంభమైంది. ఈ ఘటన తాడేపల్లిలోని మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో చోటు చేసుకోవడంతో రహస్యంగా ఉంచారు. సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇని్వజిలేటర్లను మార్చి చేతులు దులుపుకొన్నారు. ⇒ ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అరగంట ఆలస్యంగా పేపర్ ఇవ్వగా ఎలాంటి అదనపు సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయానికే తిరిగి తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని ఇంటర్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. సెల్ఫ్ సెంటర్లు...నిబంధనల ప్రకారం విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్ష సెంటర్ కేటాయించకూడదు. కానీ ఈ దఫా ఇంటర్ పరీక్షల్లో 1,535 సెంటర్లలో దాదాపు 300 సెల్ఫ్ సెంటర్లే ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు సైతం 800కిపైగా సెల్ఫ్ సెంటర్లే ఉండటం, వీటిలో అత్యధికం కార్పొరేట్ స్కూళ్లే కావడం గమనార్హం. -
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. -
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
అమెజాన్ ప్రైమ్లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్లో టాప్-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్ డిస్క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. -
వాట్సప్లో టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్.. నిందితుల అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో లీకైన గణితం ప్రశ్నాపత్రం లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రమోయమున్న తొమ్మదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవల నిర్వహించిన గణితం పరీక్షలో పేపర్ లీకేజీ జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల బి కేంద్రంలో గణితం ప్రశ్నా పత్రం వాట్సప్లో షేర్ చేసినట్లు తెలిసింది.పేపర్ లీకేజీపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల విచారణలో సాయి అనే వాటర్ బాయ్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటో తీయించి లీక్ చేసినట్లు నిర్ధారించారు.ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాటర్ బాయ్ వాట్సప్ ద్వారా కమలాపురం వివేకానంద ఇంగ్లీష్ మీడియం యాజమాన్యానికి పంపినట్లు తేలింది. నిందితుల్లో వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డితో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోయం ఉన్నట్లు తేలింది. మాస్ కాపీయింగ్ కోసమే పేపర్ లీక్ చేశారంటూ పోలీసుల సైతం ప్రకటించారు. -
గీత దాటిన పోలీసులకు కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చట్టాలను గౌరవించకుండా కూటమి ప్రభుత్వం మెప్పుకోసమే పనిచేస్తున్న పోలీసులకు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే నష్టపోతారని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ యంత్రాంగం మీద న్యాయవ్యవస్థ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో కీలకమైన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం బాధాకరం. ఒకే కంటెంట్ ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావొచ్చేమోకానీ, పలుచోట్ల ఎఫ్ఐఆర్లు కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన సూచనలు పోలీస్ యత్రాంగం పట్టించుకోవడం లేదు.అరెస్ట్ చేయొద్దని చెప్పినా, పీటీ వారెంట్ పేరుతో అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఒక ప్రణాళిక బద్ధంగా పైనుంచి వచ్చిన నాయకుల సూచనలను పోలీసులు పాటిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఒకానొక సందర్భంలో డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చే దాకా తెచ్చుకోవడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. కోర్టు సీసీ టీవీ ఫుటేజీలు అడిగితే కోతులు కొరికేశాయని చెప్పుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.వ్యవస్థీకృత నేరాల పేరుతో వేధింపులుగుంటూరులో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక రీల్ చేస్తే, అతడిని కర్నూలులో అరెస్ట్ చూపించారు. ఆయన్ను వ్యవస్థీకృత నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టు ఆక్షేపించింది. మేం కళ్లు మూసుకుని ఉండలేమని గౌరవ హైకోర్టు చెప్పడం పోలీసుల వ్యవహారశైలికి నిదర్శనం. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షలు పడే నేరాలకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని పలుమార్లు సూచించింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పింది. 41ఏ నోటీసు ఇచ్చాక స్పందించకుండ పారిపోయే ప్రయత్నం చేసినప్పుడే అరెస్ట్ చేయాలని కోర్టులు చెబుతున్నాయి. నరసరావుపేటలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెళ్ళిలో ఉంటే పోలీసులు మంగళగిరిలో ఉన్నట్టు చూపించారు. ఆ కేసులో ఆధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎన్ఎస్ 111 యాక్ట్ ని సోషల్ మీడియా యాక్టీవీస్ట్ల కేసుల్లో ఎలా వర్తింపచేస్తారంటూ కోర్టు పలుమార్లు ఆక్షేపించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు.రాష్ట్రంలో అడుగడుగునా అధికార దుర్వినియోగంరాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అడుగుడుగునా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. గార్లపెంటలో ఇన్చార్జిగా ఉన్న గంగోజమ్మ తానే స్వయంగా వీడియో పంపినా కూడా అక్కడున్న లీడర్లపై కేసులు పెట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలో బలం లేకపోయినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది.ఒక పక్క పోటీ చేయడం లేదని చెబుతూనే మరోపక్క ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అత్తిలి, యలమంచలిలో ఎంపీపీ ఎన్నికలున్నాయి. రెండుచోట్లా వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా అడ్డదారులు తొక్కి మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలా అనైతిక కార్యకలాపాల ద్వారా గెలవాలని చూస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.పథకాల అమలుపై దృష్టిసారించండిరాష్ట్రంలో రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క మద్ధతు ధర లభించిక అప్పులపాలవుతున్నారు. మిర్చి రైతులు నెలరోజులకుపైగా ఆందోళనలు కొనసాగిస్తుంటే వారి కష్టాలు పట్టించుకునే వారే లేరు. పీ4 పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేసే పనులు పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీలకు, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పథకాలకు నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి పేదరికంపై యుద్ధం చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో నాయకులు బెదిరింపులకు దిగుతుంటే వారి ఆదేశాలకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వత్తాసు పలకడం సబబేనా? -
అప్పులు చేయడంలో రికార్డు సృష్టించిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. కూటమి ప్రభుత్వానికి అప్పు వారమైన మంగళవారం(నిన్న) రోజున 7.09 శాతం వడ్డీతో మరో రూ.4,548 కోట్లు అప్పు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో, చంద్రబాబు చేసిన అప్పులు రికార్డు స్థాయిలో రూ.1.52లక్షల కోట్లకు చేరుకున్నాయి.అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ దూసుకెళ్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రూ.4,548 కోట్లు తీసుకుంది. ఇందుకు గాను 7.09 శాతం వడ్డీతో అప్పు తీసుకోవడం గమనార్హం. దీంతో, రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. బడ్జెట్లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్ అప్పులు చేసింది. బడ్జెట్ అప్పులు రూ.98,088 కోట్లకు చేరగా.. బడ్జెట్ బయట అప్పు రూ.54,700 కోట్లకు చేరుకుంది. దీంతో, బడ్జెట్ బయట, లోపల.. చంద్రబాబు చేసిన అప్పులు రూ.1.52లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, ఇన్ని అప్పులు చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు.ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గత గురువారం వెల్లడించింది.భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. -
ఆదాయం పెంచాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు. వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు). మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు – రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి. – బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు. – రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి. – కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి. – వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు. – మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. -
రోడ్డెక్కిన మిర్చి రైతులు
సాక్షి, ప్రతినిధి గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరీ ఇంత దారుణమా?గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్ గేట్ ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లాధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. – గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా -
అన్నదాతకు సర్కారే శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు దెబ్బతీస్తున్నా, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయమే అస్తవ్యస్తమైపోయింది. రైతులు తీవ్ర ఒడిదొడుకుల మధ్య పంటలు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలశ్యం కాగా, ఆ ప్రభావం రబీ పైనా పడింది. రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఈ తిప్పలన్నీ పడలేక చాలా మంది రైతులు వారి పొలాల్లో సాగే చేయకుండా వదిలేశారు. రెండు సీజన్లలో కలిపి 1.51 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 1.24 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఖరీఫ్లో 16 లక్షల ఎకరాలు.. రబీలో 11 లక్షల ఎకరాల్లో.. మొత్తంగా 27 లక్షల ఎకరాల్లో సాగే లేకుండా సీజన్ ముగిసింది. ఖరీఫ్లో వరుస వైపరీత్యాల బారిన పడి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు కనీస మద్దతు కూడా దక్కలేదు. దీంతో రైతులు కుదేలైపోయారు. దాని ప్రభావం రబీ పైనా పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. లక్షలాది ఎకరాల్లో విత్తనం నాటడానికి కూడా రైతులు సాహసించలేకపోయారు. రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు కాగా.. సాగైన విస్తీర్ణం 46.40 లక్షల ఎకరాలే. అంటే 11.25 లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. దాళ్వాలో వరి సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు కాగా సాగైంది 16.52 లక్షల ఎకరాల్లోనే. అంటే 3.50 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండిపోయాయి. సాధారణంగా రెండో పంటలో వరి కంటే ఎక్కువగా అపరాలు సాగవుతాయి. ఈసారి అపరాల సాగు లక్ష్యం 23.50 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 16.72 లక్షల ఎకరాలే. అంటే దాదాపు 6.78 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండి పోయాయి. వీటిలో ప్రధానంగా శనగలు 11.17 లక్షల ఎకరాలకు గాను, 7.5 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మినుము సాగు లక్ష్యం 8.50 లక్షల ఎకరాలు కాగా, 6.95 లక్షల ఎకరాల్లో పంట వేశారు. గతేడాది రికార్డు స్థాయిలో సాగైన మొక్కజొన్న కూడా ఈసారి తగ్గిపోయింది. ఈ ఏడాది మొక్కజొన్న సాగు లక్ష్యం 5.27 లక్షల ఎకరాలకుగాను 4.55 లక్షల ఎకరాలే సాగైంది. ఇలా పంటలన్నీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఇప్పటికీ రబీ పంటల సాగు చివరి దశకు చేరుకున్నా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరందక పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఫెంగల్ తుపాన్ దెబ్బతీయగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. దీనికి తోడు సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెను శాపంగా మారింది. -
మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: విదేశాలకు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు క్షీణించాయి. గడచిన సీజన్లో ఒక్క ఏపీ నుంనే 3 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతులు జరుగుతాయని అంచనా వేయగా.. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో 2.75 లక్షల టన్నుల మేర నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయింది. వివిధ దేశాల్లో యుద్ధాలు. ఆర్థిక మాంద్యం, పౌర అశాంతి ప్రభావంతో దేశం నుంచి ఎగుమతులు పడిపోయాయి. ఈ ఏడాది కూడా పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో ఎగుమతులు మరింత క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితి మామిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, వరుస వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, నాణ్యత లోపించడం వంటి కారణాలతో ధర లేక మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అదే సమయంలో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం రైతులతో పాటు ఎగుమతి దారులకు ఆశనిపాతంగా మారింది. ఆ ప్రభావం ఈసారి మార్కెట్పై మరింతగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా ఎగుమతి రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా.. ఈ ఏడాది 45 లక్షల టన్నులకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగయ్యే పంటలో 65–70 శాతం పంట తోతాపురి రకమే. తోతాపురి మామిడిని గుజ్జు రూపంలో యూరప్, గల్ఫ్, ఉక్రెయిన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రం నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు ఎగుమతి అవుతుంటుంది. 2019–24 మధ్య 8.5 లక్షల టన్నుల పల్ప్ విదేశాలకు ఎగుమతి చేశారు. అదేవిధంగా 550 టన్నులకుపైగా మామిడి పండ్లు సైతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి. రైతులు, ఎగుమతిదారులకు ఇది కష్టకాలమే 2024–25లో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల దేశం నుంచి మామిడి గుజ్జుతో పాటు పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విదేశాల నుంచి ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తోతాపురి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ధర పలకగా, ఈ ఏడాది టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు మించి పలకకపోవచ్చని చెబుతున్నారు. వాతావరణ మార్పులు, చీడపీడలు, కొత్తరకం పురుగులు మామిడిపై దాడి చేయడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గుజ్జు ఎగుమతులు కాకపోతే ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రైతులను మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.పేరుకున్న రూ.1,750 కోట్ల విలువైన గుజ్జు నిల్వలు మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా 47 ఫ్యాక్టరీలు ఉండగా.. వాటి సామర్థ్యం 8 లక్షల టన్నులు. గతేడాది 3.50 లక్షల టన్నులకు పైగా గుజ్జు ఉత్పత్తి అయ్యింది. ఇందులో స్థానిక వినియోగం పోగా.. ఇంకా 2.75 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ రూ.1,750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సాధారణంగా ఏటా 10–20 శాతం వరకు గుజ్జు నిల్వలు మిగులు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గుజ్జు ఎగుమతులు ప్రారంభం కాగా.. గతేడాది పేరుకుపోయిన నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎగుమతి అయింది. మే నాటికి పాత నిల్వలు అమ్ముడవకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని వ్యాపారులు చెబుతున్నారు. తమకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రోసెసర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది.ఈసారి కూడా మామిడి కష్టమే మాకు 10 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈసారి పూత ఆలస్యమైంది. వాతావరణ ప్రభావంతో పిందె సక్రమంగా రాలేదు. తెగుళ్లు, కొత్త రకం పురుగులు పంటను పట్టి పీడిస్తున్నాయి. ఎండ తీవ్రత అధికం కావడంతో పిందె ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు 3 సార్లు మందుల పిచికారీ చేశా. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మరోవైపు మామిడి గుజ్జు నిల్వలు ఫ్యాక్టరీల్లో పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కుతాయో లేదో అనుమానంగా ఉంది. – పద్మనాభరెడ్డి, ఎర్రచేను, చిత్తూరు జిల్లా అయోమయంలో ఉన్నాం మహరాష్ట్ర వెళ్లి ఎగుమతిదారులతో మాట్లాడాం. వాళ్లు ఏమాత్రం స్పందించడం లేదు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధాలు, ట్రాన్్పపోర్ట్ చార్జీలు పరిశ్రమదారులను నిండా ముంచుతున్నాయి. అప్పులు నిలిచిపోయాయి. ఈసారి ఎలా ఉంటుందో అర్థంగాక అయోమయంలో ఉన్నాం. జ్యూస్ తయారీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి. గతంలో జ్యూస్లో 80 శాతం గుజ్జు కలిపేవారు. ఇప్పుడు 5 శాతమే గుజ్జు కలుస్తోంది. ఇది కూడా పరిశ్రమదారులను దెబ్బతీస్తోంది. వీటిపై ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలి. – తలపులపల్లి బాబురెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమాని మామిడి గుజ్జు పరిశ్రమను ఆదుకోవాలి: ఏఐఎఫ్పీఏ తీవ్ర సంక్షోభంలో ఉన్న మామిడి పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని, చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ (ఏఐఎఫ్పీఏ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబీ చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫెడరేషన్తో కలిసి సీఎం చంద్రబాబుకు, కేంద్రానికి లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్ప్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు రుణాల వసూళ్లను ఆరునెలలు వాయిదా వేసేలా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడయ్యేందుకు వీలుగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మామిడి గుజ్జు పరిశ్రమల సమాఖ్యకు స్టాల్స్ కేటాయించాలని, మధ్యాహ్న భోజనం మెనూలో మామిడి ఉత్పత్తులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. పల్ప్ పరిశ్రమలకు పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. -
సీఐడీ నమోదుచేసిన కేసు కొట్టేయండి
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో నిందితులైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులతో ప్రభుత్వం కుమ్మక్కైందని, అందువల్లే ఈ కేసులో మరో నిందితుడైన యర్రం విక్రాంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విక్రాంత్రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వారితో ప్రభుత్వం కుమ్మక్కయినందునే వారు ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయలేదని తెలిపారు. విక్రాంత్రెడ్డిపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టును కోరారు. తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొన్నదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో యర్రం విక్రాంత్ రెడ్డికి హైకోర్టు గతంలో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కాగా, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ విక్రాంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. విక్రాంత్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వాస్తవానికి వాటాల బదిలీ విషయంలో ఫిర్యాదుదారు కేవీ రావు, అరబిందో గ్రూపునకు మధ్య రాజీ కుదిరిందని, దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని తెలిపారు. ఈ వాటాల బదిలీతో విక్రాంత్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా దర్యాప్తు పేరుతో పిటిషనర్ను సీఐడీ అధికారులు వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని చెప్పారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను బహిర్గతం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా రాయిస్తున్నారని వివరించారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుకు రూ.25 లక్షలు ఖర్చులు విధించాలని ఆయన కోర్టును కోరారు. -
నాటి స్టార్టప్ వెలుగులకు కితాబు
సాక్షి, అమరావతి : గత ఐదేళ్లలో స్టార్టప్ రంగంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోయిన విధానాన్ని నారా లోకేశ్ మంత్రిగా నిర్వహిస్తున్న ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన స్టార్టప్ పాలసీలో ప్రముఖంగా ప్రస్తావించింది. వచ్చే ఐదేళ్లలోనూ స్టార్టప్లను ప్రోత్సహించేలా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ఐదేళ్లలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన స్టార్టప్లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటయ్యాయని.. రాష్ట్రంలో మొత్తం 6,600 స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 2,400 స్టార్టప్లకు డీపీఐఐటీ గుర్తింపు లభించిందని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాలసీలో పేర్కొంది. అంతే కాకుండా డీపీఐఐటీ గుర్తించిన స్టార్టప్లలో 1,159 స్టార్టప్లు మహిళల నేతృత్వంలో ఉన్నాయని చెప్పింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అన్ని వర్గాల్లో ఎంత బలంగా విస్తరించిందన్న విషయాన్ని ధృవీకరిస్తోందని పేర్కొంది. డీపీఐఐటీ విడుదల చేసిన 2022 స్టార్టప్ ర్యాంకుల్లో రాష్ట్రం “లీడర్’షిప్ హోదా దక్కించుకుందని, వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకును పొందుతూ వ్యాపారానికి ఏపీ అత్యంత అనువైన రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. రాష్ట్రంలో 46 ఇంక్యుబేటర్స్ ఉండటమే కాకుండా కీలకమైన ఐవోటీ–ఏఐ, ఇండస్ట్రీ 4.0, బయోటెక్, మెడికల్ డివైసెస్, మారిటైమ్ అండ్ షిప్పింగ్, రూరల్ ఇన్నోవేషన్ సెంటర్ పేరుతో ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ స్టార్టప్ పాలసీ 4.0 లక్ష్యం » వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 20 వేల స్టార్టప్ల ఏర్పాటు లక్ష్యంగా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0 విడుదల. »హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటు ద్వారా లక్షల మందికి ఉపాధి. »కొత్తగా 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, 20 సూని కార్నర్స్, 10 యూనీ కార్నర్స్ ఏర్పాటు. »కీలకమైన 15 డిపార్ట్మెంట్లలో స్టార్టప్లకు ప్రోత్సాహం. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపు. »అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ఏర్పాటు.. దీనితో అనుసంధానం చేస్తూ ఐదు ప్రాంతాల్లో స్పోక్ సెంటర్లు. ఐదేళ్లల్లో స్టార్టప్లకు నిధులు సమకూర్చేలా ఆర్టీఐహెచ్కు రూ.250 కోట్లు, ప్రతి స్పోక్ సెంటర్కు రూ.100 కోట్ల గ్రాంట్ బడ్జెట్. »ఎంపికైన ప్రతి కాన్సెప్్టకు రూ.2 లక్షల ప్రారంభ గ్రాంట్.. దశల వారీగా రూ.15 లక్షల వరకు.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకైతే రూ.20 లక్షల వరకు గ్రాంట్.. 8 శాతం వడ్డీ రాయితీ, రూ.50 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్, మార్కెటింగ్ సపోర్ట్.. »ఈవెంట్స్కు వెళ్లినప్పుడు అయ్యే ఖర్చులో 75 శాతం.. గరిష్టంగా రూ.3 లక్షలు అందజేత. ఐదేళ్లు ఎస్జీఎస్టీపై 100 శాతం రీయింబర్స్మెంట్. »వేగంగా అనుమతులు మంజూరు చేసేలా ఏపీ స్టార్టప్ వన్ పోర్టల్ ఏర్పాటు. సార్టప్ పాలసీ సేŠట్ట్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించనున్న ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ.. త్వరలోనే ఆపరేషనల్ గైడ్లైన్స్ విడుదల. -
నామినేటెడ్ పదవులపై మీనమేషాలు
సాక్షి, అమరావతి: కార్యకర్తలతో ఎన్నికల్లో పని చేయించుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులిచ్చే విషయంలో నానా తిప్పలు పెట్టడం సీఎం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా సాగుతూనే ఉంది. ఇక జిల్లా, నియోజకవర్గస్థాయి పోస్టులు, దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకంలో ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా మార్కెట్ యార్డు చైర్మన్లు, వెయ్యికి పైగా దేవస్థానం ట్రస్టు బోర్డులు, పలు పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకంపై చంద్రబాబు సాగతీత వైఖరే అవలంబిస్తున్నారు. ఈ పదవుల కోసం కార్యకర్తలు ఎంతగా ఎదురు చూస్తున్నా త్వరితగతిన భర్తీ చేయకపోగా.. వాటి భర్తీలో జాప్యాన్ని ఎమ్మెల్యేలపై నెట్టేయడం అందరిలో అసహనం కలిగిస్తోంది. పదవుల కోసం విజ్ఞాపనలు ఇస్తున్న క్యాడర్ పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన తమకు ఈ పదవుల్లో అవకాశం ఇవ్వాలని మధ్యస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలు పట్టించుకోకపోవడంతో చాలామంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు, లోకేశ్ను కలిసి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ కార్యాలయంలో వారంలో నాలుగైదు రోజులు నిర్వహించే విజ్ఞప్తుల స్వీకరణలో సగం మంది పదవుల కోసం వచ్చిన వారే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పదవులు అందరికీ ఇవ్వలేమని పరోక్షంగా చెబుతున్నారు. పైపెచ్చు ఏ పదవైనా రెండేళ్లేనని, ఆ తర్వాత వేరే వారికి ఇస్తామని చెబుతున్నారు.వీటితోపాటు పదవుల భర్తీకి ఎమ్మెల్యేలు సహకరించడంలేదని, పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లను సిఫారసు చేయమని అడిగితే వారు పట్టించుకోవడంలేదని ఇటీవల ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తమను పేర్లు అడుగుతూనే, మరోపక్క వారికి ఇష్టం వచ్చిన వారి పేర్లను వారే రాసేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈమాత్రం దానికి తమను పేర్లు అడగడం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యేల బేరసారాలతో మరింత ఆలస్యం అనేక చోట్ల ఎమ్మెల్యేలు పదవులను బేరం పెట్టినట్టు టీడీపీ శ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు సైతం ముడుపులు అడుగుతుండడం, వారు ఇవ్వలేమని చెబుతుండడంతో ఎవరి పేర్లనూ అధిష్టానానికి సిఫారసు చేయడంలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీ చేయడంలో తన తప్పు లేదంటూ ఎమ్మెల్యేలపై నెపం నెట్టివేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బేరాలు పెట్టిన ఎమ్మెల్యేలను నియంత్రించి, కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సిన సీఎం.. ఎమ్మెల్యేలు సహకరించడం లేదంటూ తప్పించుకోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం, ముడుపుల లెక్కలు తేలకపోవడం వల్లే ఈ పదవుల భర్తీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పదవుల పంపకంపైనా ఏకాభిప్రాయం కుదరడంలేదని చెబుతున్నారు. టీడీపీకి 80 శాతం పోస్టులు, జనసేన, బీజేపీకి కలిపి 20 శాతం కేటాయించాలని మొదట్లో ఒప్పందం జరిగింది. అయితే ఇది సరిగ్గా అమలు కావడంలేదని క్షేత్ర స్థాయిలో జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ కేడర్లోనూ పదవుల పంపకంపై ఆందోళన నెలకొంది. -
అడుగుకు కమీషన్.. 'రూపాయి పావలా'
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఓ వైపు సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెబుతూ.. మరోవైపు మద్యం దందా, ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి మరీ చిల్లరగా ఉంది. కిలో చికెన్కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇటీవల హుకుం జారీ చేసిన విషయంపై కలకలం సద్దుమణగక ముందే ఈ దంపతుల కన్ను గోడౌన్లపై పడింది. చదరపు అడుగుకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని స్వయంగా ఎమ్మెల్యేనే గోడౌన్ల యజమానులకు అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ నేతలైనా సరే కమీషన్ ఇచ్చిన తర్వాతే గోడౌన్ లీజుకు పర్మిషన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో టీడీపీ నాయకులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. రైతుల వద్ద నుంచి కొన్న పొగాకును నిల్వ చేసుకునేందుకు పొగాకు కంపెనీలకు ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్.జమ్ములదిన్నెలోని గోడౌన్లు అవసరమవుతాయి. సుమారు 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.5.25 చొప్పున ఇస్తామని పొగాకు కంపెనీలు యజమానులకు ఆఫర్ ఇచ్చాయి. మూడేళ్ల పాటు అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పడంతో యజమానులంతా సంతోషపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రతి అడుగుకు తనకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఖరాకండిగా చెప్పేశారు. కమీషన్ ఇవ్వకుంటే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారో చూస్తానని హెచ్చరించినట్లు యజమానులు వాపోతున్నారు. తమకు పెద్దగా మిగిలేది ఉండదని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని సమాచారం. దీంతో చేసేది లేక ఆమె గారు అడిగిన మేరకు అడుగుకు “రూపాయి పావలా’ కమీషన్కు ఓకే చెప్పారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర ఎమ్మెల్యేకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం స్థానికంగా రైతులందరికీ తెలియడంతో ఇంత చిల్లర వ్యవహారాలు ఎక్కడా ఉండవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -హైకోర్టు ధర్మాసనం తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి.. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్భంధంపై హెబియస్ కార్పస్..పోలీసులు తన తండ్రి ప్రేమ్కుమార్ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గతేడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.తప్పుల మీద తప్పులు...డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్ నటించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.అరెస్ట్ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?“ప్రేమ్కుమార్ను అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్కుమార్ రీల్ను సోషల్ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం! అంతేకాదు.. అరెస్ట్ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి...!“గుంటూరులో ప్రేమ్ కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్కుమార్ అరెస్ట్ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది. ప్రేమ్ కుమార్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు త్రీటౌన్ ఎస్హెచ్వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది. ఈ కేసులో ప్రేమ్కుమార్ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాస్తే మేజిస్ట్రేట్ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్ ఎస్హెచ్వో, మేజిస్ట్రేట్ను ఆదేశించింది.పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే...“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో “సుప్రీం కోర్టు’’ కీలక వ్యాఖ్యలు -
ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు 2024–25 సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్బుక్లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
ఆ విషయంపై టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు?: గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రాష్టవ్యాప్తంగా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిలదీశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘21 మంది కూటమి ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయటం లేదు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులనూ తీసుకురాలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు వెళ్తున్నా కూటమి ఎంపీలు మాట్లాడటం లేదు. కేవలం వైఎస్సార్సీపీ ఎంపీలపై ఆరోపణలు చేయటానికే వారు పరిమితం అయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. లేని లిక్కర్ స్కాం గురించి మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ స్కాం గురించి ఐటీ, ఈడీ సమన్లు కూడా ఇచ్చింది. వీటిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని గురుమూర్తి ప్రశ్నించారు.‘‘యోగేష్ గుప్త, మనోజ్ పాత్ర ఉన్నట్టు కేంద్ర సంస్థలు గుర్తించాయి. టిడ్కోలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. వీటిపై శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకు ప్రశ్నించటం లేదు?. కేంద్రం చంద్రబాబుని పట్టించుకోవడం లేదు. ఏదో కేసుల్లో ఇరికించటానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్సైజ్ శాఖతో సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్కసిరెడ్డి, మిథున్రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు’’ అని గురుమూర్తి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ వచ్చాక 43 వేల బెల్టు షాపులు తొలగించారు. మద్యం అమ్మే సమయాన్ని కుదిరించారు. అలాంటప్పుడు లంచాలు ఎవరైనా ఎలా ఇస్తారు?. అయినప్పటికీ కొంతమంది పత్రికాధిపతులను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్క డిస్టలరీలకూ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం బ్రాండులకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మార్కెట్లో ఉన్న బ్రాండులన్నిటికీ చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. కానీ టీడీపీ నేతలు మాపై విష ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు’’ అని గురుమూర్తి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ అంటేనే లీకేజీలు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నపత్రం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో సోమవారం అధికారులు తనిఖీ చేస్తుండగా, 10వ తరగతి గణితం పేపర్ వాట్సాప్లో షేర్ అయినట్లు తెలిసింది. ఆరా తీయగా స్కూల్లోని వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వరరెడ్డి అనే వ్యక్తికి పంపినట్టు గుర్తించారు. వాటర్ బాయ్పై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సస్పెన్షన్..ఈనెల 21న జరిగిన ఇంగ్లీష్ పరీక్షలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ,బీ కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు సహకరించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కళేష్ సర్కిల్, బస్ స్టాండ్ రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏ,బీ కేంద్రాల వద్ద భారీగా గణితం స్లిప్పులు దొరకడంతో ఇరువురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు. -
ఇంటర్మిడియట్లో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మిడియట్ విద్యలో మార్పులు చేశారు. రానున్న విద్యా సంవత్సరం (2025–26) నుంచి ఇంటర్లో కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిలబస్లో విద్యా బోధన పూర్తి చేసినందున ఇంటర్మిడియట్లోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్ను, సీబీఎస్ఈ విధానాలను అమలు చేయనున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, 2026–27లో సెకండియర్ విద్యార్థులకు కొత్త సిలబస్లో బోధన మొదలవుతుంది. అలాగే, పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు సీబీఎస్ఈ విధానంలోకి మారాయి. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ గ్రూప్ను ప్రవేశపెట్టారు. జేఈఈ, నీట్ పరీక్షలకు అనుగుణంగా ఎంపీపీ, బైపీసీ సిలబస్లోనూ మార్పులు చేశారు. వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభిస్తారు. తాజా మార్పులను ఇంటర్మిడియట్ విద్యా మండలి ప్రకటించింది.ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కాలేజీలు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే తేదీన ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరంలో కళాశాలలకు 235 రోజులు పనిదినాలు, 79 సెలవులు ప్రకటించారు. ఎలక్టివ్ సబ్జెక్టు విధానంవిద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచుతూ ఎలక్టివ్ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అన్ని గ్రూపులకు పార్ట్–1లో ఇంగ్లిష్, పార్ట్–2 లో రెండో భాష (లాంగ్వేజెస్), పార్ట్–3 లో కోర్ సబ్జెక్టులు ఉండగా, పార్ట్–2లో ఎలక్టివ్ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టారు. ఇందులో లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో 20 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ గ్రూప్ వారికైనా ఇంగ్లిష్ తప్పనిసరి. రెండో భాష స్థానంలో ‘ఎలక్టివ్’ సబ్జెక్టుగా తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/అరబిక్/ తమిళం/కన్నడ/ఒరియా/ ఫ్రెంచ్/పర్షియన్ (10 భాషలు) ఉంటాయి. మోడ్రన్ లాంగ్వేజెస్ (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ)/ భూగోళశాస్త్రం/లాజిక్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/చరిత్ర/సివిక్స్/కామర్స్/ఎకనామిక్స్ (10 సబ్జెక్టులు) ఉంటాయి. వీటిలో ఒకటి విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి.ఐదు సబ్జెక్టులు.. 1000 మార్కులుఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో 2 భాషా సబ్జెక్టులు, 4 కోర్ సబ్జెక్టులు (మొత్తం 6 సబ్జెక్టులు), ఆర్ట్స్ గ్రూప్లో 2 భాషా సబ్జెక్టులు, 3 కోర్ సబ్జెక్టులు ఉన్నాయి. ఇకపై ఏ గ్రూపులో అయినా ఐదు సబ్జెక్టులే ఉంటాయి. మేథమెటిక్స్–ఏ, బీ పేపర్లను ఒక సబ్జెక్టుగా, బాటనీ–జువాలజీ రెండు సబ్జెక్టులను కలిపి ఒక సబ్జెక్టుగా మార్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు సబ్జెక్టులతో ‘ఎంబైపీసీ’ గ్రూప్ను ప్రవేశపెడుతున్నారు. ఎంపీసీ విద్యార్థులు బోటనీ, బైసీపీ విద్యార్థులు మేథమెటిక్స్ తీసుకుని పూర్తి చేస్తే ‘ఎంబైపీసీ’ సర్టీఫికెట్ ఇస్తారు.అన్ని గ్రూపులకు రెండేళ్లకు కలిపి 1000 మార్కుల విధానం అమల్లోకి తెచ్చారు. సైన్స్ సబ్జెక్టులకు థియరీకి 85 మార్కులు, ప్రాక్టికల్స్కు 30 మార్కులు కేటాయిస్తారు. అన్ని గ్రూపుల పరీక్షల్లోను మార్పులు చేశారు. ప్రశ్నా పత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల స్థానంలో సీబీఎస్ఈ విధానాలకు అనుగుణంగా 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. -
సాయం అందించే చేతులకు వేదిక పీ–4
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు. ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
రెడ్బుక్కు సహకరించకపోతే ఇక అంతే...
సాక్షి, అమరావతి: ‘రెడ్బుక్’ అరాచకాలు, కుట్రలకు అంగీకరించకుండా.. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పొగబెట్టి, రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తోంది. ఇదే కోవలో చంద్రబాబు ప్రభుత్వ ‘రెడ్బుక్’ అరాచకాలకు ఎదురుతిరిగి సంచలనం సృష్టించిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్కూ పొగ పెట్టేసింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం రవాణా వ్యవహారంలో చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలని ఆయనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఇక్కడ పనిచేయలేక రాష్ట్ర సర్విసులను వీడుతున్నారు. డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. ఆయన డెప్యుటేషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. వినీత్ ఐదేళ్లపాటు కేంద్ర సర్విసుల్లో కొనసాగుతారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన వినీత్ బ్రిజ్లాల్ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్బుక్ కుట్రలకు సహకరించేందుకు ససేమిరా అనడం పోలీసు శాఖలో పెద్ద సంచలనమే సృష్టించింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారనే అభియోగాలతో నమోదైన కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ చీఫ్గా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. కానీ, దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్టుగా వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అందుకు బ్రిజ్లాల్ అంగీకరించలేదు. అయినా తాము చెప్పినట్లుగానే నివేదిక ఇవ్వాలని వారంతా పట్టుబట్టడంతో బ్రిజ్లాల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. దాంతో బెంబేలెత్తిన డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయన్ని బుజ్జగించి, అతి కష్టం మీద ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపజేశారు. కానీ, సిట్ చీఫ్గా కొనసాగేందుకు సమ్మతించకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన సిట్ వ్యవహారాలను పర్యవేక్షించలేదు. ఆయన్ని సిట్ చీఫ్ పోస్టు నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశాన్ని గుర్తించిన బ్రిజ్లాల్ డెప్యుటేషన్పై కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని సీఆర్పీఎఫ్ ఐజీగా నియమించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. బ్రిజ్లాల్తో ఇక రెడ్బుక్ అరాచకాలకు ఇబ్బంది ఉండదని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయన డెప్యుటేషన్కు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆపరేషన్ పరివర్తన్లో కీలక పాత్ర ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ను విజయవంతం చేయడంలో వినీత్ బ్రిజ్లాల్ కీలక పాత్ర పోషించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్గా ఆయన ఆధునిక సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటూ రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ను విజయవంతం చేశారు. 11 వేలకు పైగా ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. 2.50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా గిరిజనులను ప్రోత్సహించారు.అంతటి సమర్థ అధికారిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రకు సహకరించలేదనే అక్కసుతో పొగబెట్టి మరీ పంపించేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన అక్రమ మార్గాల్లో పనిచేయలేక ఇప్పటికే పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో పలువురు దరఖాస్తు కూడా చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈఓను, వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున.. వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.వివిధ రూపాల్లో నిరసనలుఏప్రిల్ 7 వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విజయ్కుమార్ వివరించారు. అందులో భాగంగా.. మార్చి 25న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డీఎంహెచ్ఓలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాక.. తమ ఇబ్బందులను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మార్చి 27న ఎంఎల్ఏలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జిలను కలిసి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 29న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు.. ఏప్రిల్ 3న కార్పొరేట్ హాస్పిటల్స్ హెడ్స్, ఆషా ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నంలలో ప్రెస్మీట్ల నిర్వహణకు కార్యాచరణను రూపొందించినట్లు ఆషా ప్రతినిధులు తెలిపారు.నగదు రహిత వైద్యం అందించలేంనిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, సీఈఓ ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్లోడ్ చేయాల్సిన బిల్స్ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి. -
1 నుంచి మాల్స్లో పార్కింగ్ ఫీజు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొస్తుందని పేర్కొన్నారు.మొదటి అర గంటకు ఎవరి నుంచీ పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని, అనంతరం గంట వరకు వాహనం ఉంచితే సదరు మాల్లో వస్తువుల కొనుగోలు బిల్లు చూపిన వారి నుంచి ఫీజు వసూలు చేయరాదని, గంటకు పైగా ఉన్న వాహనదారులకు సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు చూపినా ఉచిత పార్కింగ్ అవకాశం వినియోగించుకోవచ్చునన్నారు. -
3న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ(కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. -
ఏపీ అప్పు రూ.5.62 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 34.70 శాతం ఉంటాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్డీపీలో అప్పులు 34.58 శాతమని వెల్లడించారు.సోమవారం లోక్సభలో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలకు సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఆ తర్వాత సంవత్సరాల రుణాల పరిమితుల్లో చేరుతాయని వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా అప్పులు ఉన్నాయా..? లేదా..? అనేది రాష్ట్రాల శాసనసభలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. -
న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్.ద్వారకానాథరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులు మరణించినప్పుడు వారి నామినీలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం హైకోర్టులోని బార్ కౌన్సిల్లో జరిగింది. కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయవాదులు, వారి కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.బార్ కౌన్సిల్ రోల్స్లో నమోదు చేసుకున్న న్యాయవాదులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల మేర పరిహారం అందించాలని తీర్మానించారు. ఈ కొత్త పథకాన్ని ఈ ఏడాది మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటికీ అవసరమైన సొమ్మును బార్ కౌన్సిల్ నిధుల నుంచి చెల్లిస్తారు. అనంతరం గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.తెలుగు భాషకు, సాహిత్యానికి చేసిన అసాధారణమైన సేవలకు గానూ ఆయన ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్.కృష్ణమోహన్, సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎస్బ్రహ్మనందరెడ్డి, గంటా రామారావు, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, రావిగువేరా, కార్యదర్శి పద్మలత పాల్గొన్నారు. -
‘డ్రగ్స్’పై ‘డర్టీ’ ప్రచారం
సాక్షి, అమరావతి: స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కూటమి డ్రగ్స్ దందా అంటూ యావత్ రాష్ట్రంపై అభాండాలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్కు అడ్డాగా మారిపోయిందంటూ నిత్యం విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనన్న వాస్తవాన్ని కేంద్ర హోం శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు దేశంలో అత్యధికంగా డ్రగ్స్ కేసులు నమోదైన 12 రాష్ట్రాల జాబితాను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు సమర్పించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం పేరే లేదు.అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావమే లేదని, ఎల్లో మీడియా, చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతమంతా రాజకీయ కుట్రే అన్న విషయాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంతేకాదు.. గుజరాత్ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు తేలగానే చంద్రబాబు ముఠా దాన్ని రాష్ట్రంతో లింకు పెట్టి రచ్చ చేసింది. విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ విషయంలోనూ ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఈ కంటైనర్ల విషయంలో బాబు ముఠా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని సీబీఐ దర్యాప్తుల్లో వెల్లడైంది.కేంద్ర హోం శాఖ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నాడు డ్రగ్స్ కేసుల జాబితాలోనే లేని ఏపీ దేశంలో 2022, 2023, 2024 సంవత్సరాల్లో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా (ఎన్డీపీఎస్) కేసులు, ఈ కేసులు అత్యధికంగా నమోదైన 12 రాష్ట్రాల వివరాలను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు నివేదించింది. ఈ మూడేళ్లలో దేశంలో ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 3,02,228 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎన్డీపీఎస్ కేసుల్లో.. కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నట్లు తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలనూ ఇచ్చింది. హోం శాఖ ఇచ్చిన ఈ టాప్ 12 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేనే లేదన్న వాస్తవం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం డ్రగ్స్ దందాను సమర్ధంగా కట్టడి చేసిందన్న విషయాన్ని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.కంటైనర్ల విషయంలోనూ విష ప్రచారమేఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారంటూ చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అదంతా దుష్ప్రచారమేనని సీబీఐ దర్యాప్తుతో నిగ్గు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు గుజరాత్లోని కాండ్లా పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్లో భారీగా డ్రగ్స్ను గుర్తించారు. వెంటనే దీనిపై చంద్రబాబు కూటమి, ఎల్లో మీడియా విష ప్రచారం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకే ఆ డ్రగ్స్ను దిగుమతి చేశారంటూ యాగీ చేశాయి. డీఆర్ఐ, సీబీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంటైనర్లోని మాదక ద్రవ్యాలను గుజరాత్ పోర్టులో దిగుమతి చేసి చెన్నైకు తరలించాలన్నది ఆ డ్రగ్స్ ముఠా మాస్టర్ ప్లాన్ అని ఆ రెండు కేంద్ర సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. సీబీఐ చెన్నైకు చెందిన కొందరిని అరెస్ట్ కూడా చేసింది. ఇక ఎన్నికలకు ముందు ఓ ఆక్వా సంస్థ విదేశాల నుంచి డ్రై ఈస్ట్ను దిగుమతి చేసుకుంది. ఈ కంటైనర్పై అనుమానంతో సీబీఐ అధికారులు తనిఖీ చేయగానే చంద్రబాబు కూటమి మళ్లీ రాద్ధాంతం మొదలెట్టింది. డ్రై ఈస్టు పేరుతో డ్రగ్స్ను దిగుమతి చేశారంటూ కూటమి నేతలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ కంటైనర్ ద్వారా దిగుమతి చేసింది డ్రై ఈస్టు మాత్రమేనని సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ రెండు కంటైనర్ల విషయంలో టీడీపీ కూటమి చేసిందంతా దుష్ప్రచారమేనన్నది నిర్ధారణ అయ్యింది. కేవలం ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకే చంద్రబాబు ముఠా వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోపాటు యావత్ రాష్ట్రంపై విష ప్రచారానికి తెగించిందన్న విషయం నిగ్గు తేలింది. -
తాడేపల్లిలో మహిళపై అత్యాచారం.. హత్య
తాడేపల్లి రూరల్: విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి మధ్య డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మహిళ అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. స్థానికుల కథనం మేరకు.. కొలనుకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారిలో జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహానికి ఎడమ చేతి వైపున గొంతుపై బలంగా పొడిచినట్లు గాయం కనిపిస్తోంది. మహిళ మొహంపై పూర్తిగా రక్తం ఉండడంతో ఆమె ముఖఛాయలు సరిగా కనిపించడం లేదు. మర్మాంగం వద్ద రక్తం కారుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ రెండు కాళ్లూ మోకాలు నుంచి కిందకు వంచి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికి హత్య జరిగి సుమారు 40 నిమిషాలు అయ్యుండొచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు. సంఘటన స్థలం వద్ద సెల్ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లభించాయని.. వాటిని పరిశీలించి ఆ మహిళ ఎవరో గుర్తిస్తామని తెలిపారు. కాగా, డీజీపీ కార్యాలయం సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఓ హోటల్లో నిత్యం పోలీసులు ఉంటున్నప్పటికీ ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. జనవరి 31వ తేదీన కూడా గుంటూరు ఛానల్ నుండి నులకపేటకు వచ్చే రహదారిలో ఇదే గ్రామంలో డీజీపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇదే తరహాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ ఎవరో ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఈ రెండు హత్యలు ఒకేలా జరగడంతో ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలిగే ఉన్న సెల్ ఫోన్ టార్చిలైట్సంఘటనా స్థలం వద్ద మహిళ మృతదేహం కనిపించేలా సెల్ఫోన్లో టార్చిలైట్ వెలిగే ఉంది. హత్య చేసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మహిళ సెల్ఫోన్కు ఎటువంటి రక్తపు మరకలు కనిపించ లేదు. లేదా హత్య జరగక ముందే ఆ మహిళ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ను ఆన్ చేసి ఉంచిందా.. అనే దిశలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ సెల్ఫోన్ కీలకంగా మారడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరో కోణంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన నేరస్తుల ద్వారా కూడా వివరాలు సేకరించి ఆ మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తామని సీఐ తెలిపారు. -
నేటి నుంచి పార్లమెంట్లో ‘అరకు’ కాఫీ ఘుమఘుమలు
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ అవకాశం కల్పించారు.సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద సోమవారం నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణి, గిరిజన కో–ఆపరేటివ్ సొసైటీ(జీసీసీ) అధికారులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. -
ఓ వైపు ఎండలు.. మరోపక్క వానలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాల్లో పలుచోట్ల శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసలపల్లెలో ఆదివారం 2.9 సెం.మీ. వర్షం పడింది.శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. విజయవాడలోని గుణదల, ప్రసాదంపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం కురిసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతోనే..ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కలిసినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. -
‘రెడ్బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
సిండికేటు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) నిర్వహించిన టెండర్లలో సిండికేట్ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్ కెపాసిటీని 2 ఎన్ఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఎన్సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం, ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్ ఇన్ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా (నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్కు రూ.779.82 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్డీఏ, ఏడీసీఎల్ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్డీఏ, ఏడీసీఎల్ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
ధర్నాచౌక్ సాక్షిగా ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: ప్రజాగళం వినిపించే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసి ఆత్మస్తుతి–పరనింద ధ్యేయంగా మారిన అసెంబ్లీ సమావేశాలు ఒకపక్క జరుగుతుండగా, మరోపక్క కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు చేసిన ఆందోళనకు విజయవాడ ధర్నాచౌక్ కేంద్రంగా నిలిచింది. ఉద్యోగ, అంగన్వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీలు సహా 20కిపైగా విభాగాలకు చెందిన సామాన్య ప్రజానీకం తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేలా పది రోజులకుపైగా మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగించిన ఉద్యమ హోరు కూటమి ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే పెల్లుబికిన అసంతృప్తికి అద్దం పట్టింది. డిమాండ్లు నాలుగు నెలల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రజానీకం అల్టిమేటం ఇచ్చింది. వెల్లువెత్తిన ఆందోళనలు.. » అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని మహాధర్నాను నిర్వహించారు. » పెద్ద ఎత్తున ఫీజు పోరు, బకాయిల విడుదలకు ఆందోళన జరిగింది. » ఆశా వర్కర్లు కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పలు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. » వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, నెలకు రూ.10వేలు వేతనం హామీని నిలబెట్టుకోవాలని మహాధర్నా జరిగింది. » రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ) ధర్నా నిర్వహించారు. » కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమించారు. » గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూధర్నా జరిగింది. » కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పొట్టగొట్టేలా.. ఆప్కాస్ విధానం రద్దును విరమించుకోవాలని ఉద్యమించారు. » ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. » డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపై ధర్నా నిర్వహించారు. » ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు నెలవారి పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ధర్నా చేశారు. » నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. » మిలియపుట్టి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేశారు. » మెప్మా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు తదితర అనేక విభాగాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని ధర్నాచౌక్లో నినదించారు. -
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్నా..ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్–ఈ కేడర్లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్ఈ లెక్చరర్గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా -
దొంగ ఓట్లకు ఇకనైనా చెల్లుచీటీ!
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాపై పెద్దఎత్తున వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఓటరు కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్లతో పాటు ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు కావడానికి అడ్డుకట్ట వేయనుంది. ఆంధ్రప్రదేశ్లో దొంగ, మల్టిపుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అనుమానాలు లేవనెత్తడంతో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ దొంగ ఓట్ల నివారణే లక్ష్యంగా ఓటర్ల జాబితాకు ఆధార్ను అనుసంధానం చేయడానికి న్యాయ, సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోలతో కీలక సమావేశం నిర్వహించారు. » ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానించడం అనేది ఆరి్టకల్ 326లోని నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ ఒక వ్యక్తికి గుర్తింపు ఇస్తుందని, ఓటరు కార్డు ద్వారా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తామంది. ఇంతకాలం ఆధార్ అనుసంధానం అనేది ఆప్షనల్గా ఉండగా ఇకమీదట తప్పనిసరి చేయనున్నారు. 2015లో శ్రీకారం ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం 2015లో మొదలుపెట్టినా సుప్రీంకోర్డు ఉత్తర్వులతో ఆగిపోయింది. ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటు కలిగి ఉండడంతో వీటి ఏరివేతే లక్ష్యంగా 2015 ఫిబ్రవరిలో ఆధార్ అనుసంధానం చేపట్టింది. మూడు నెలల్లోనే 30 కోట్ల కార్డులను లింక్ చేసింది. కానీ, దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆధార్ అనుసంధానానికి అడ్డుకట్ట పడింది. తర్వాత ఎవరి ఇష్టాన్ని బట్టి వారు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే 66 శాతంపైగా ఓటరు కార్డులు అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. » ప్రస్తుతం రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లుండగా, 70 శాతంపైనే ఆధార్తో అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. » రాష్ట్ర విభజన తర్వాత చాలామంది అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఓటు కలిగి ఉంటూ రెండుచోట్లా హక్కును వినియోగించుకుంటుండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. » గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి మరీ ఓటర్లుగా చేర్పించడంపై వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనేక పార్టీల నుంచి ఇదే విధమైన విమర్శ వస్తుండటంతో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఓటరు ఐడీ–ఆధార్ అనుసంధానంతో ప్రయోజనాలు » ఓటరు జాబితాకు సంబంధించిన లోపాల పరిష్కారం » ధ్రువీకృత ఓటర్ల జాబితాను దేశానికి సమర్పించడం » ఓటరు జాబితాలో మోసపూరిత పేర్లను చేర్చడాన్ని నివారించడం » రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదుల పరిష్కారం. » వ్యక్తులు వేర్వేరుచోట్ల నమోదు చేసుకునే అవకాశాన్ని తొలగించడం » ఎవరూ రెండు వేర్వేరు ప్రదేశాలలో నమోదు చేసుకోలేరని నిర్ధారించడం -
అమ్మో... కాటు!.. 600 మంది మృతి
దేశంలో మూడేళ్లుగా పాముకాట్లు పెరుగుతున్నాయి. పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు గత మూడేళ్లలో దేశంలో 2.69 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాము కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 600కు చేరింది. పాము కాటు కేసులు అత్యధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పాము కాటుకు గురై చనిపోయిన వారు కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. – సాక్షి, అమరావతివైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలుపాము కాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపింది. పాముకాటు నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొంది. పాము కాటుకు చికిత్స అందించేందుకు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర మందులు, పరికరాలు, రవాణా యంత్రాంగం, ఇతర సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందిస్తోందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన ఔషధాల జాబితాలో పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనంను చేర్చినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉచిత ఔషధాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలో పాటుకాటు నివారణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాము కాటు నిర్వహణ, అత్యవసర సంరక్షణ తదితర అంశాలపై వైద్య నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వైద్య శాలల్లోని వైద్యులను పాము కాటు కేసుల అత్యవసర నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. -
మద్యం షాపులపై... బార్ ఓనర్స్ వార్
నరసరావుపేటటౌన్: మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంపై బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. అధికార కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసి యజమానులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తాము బార్లు నిర్వహించలేమని తాళాలను అధికారులకు అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో 11 వైన్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఆ వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి బార్ అండ్ రెస్టారెంట్లకు దీటుగా నిర్వహిస్తున్నారు.మాంసం, బిర్యానీ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉండటం, మద్యం కూడా బార్ అండ్ రెస్టారెంట్ల కన్నా తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువ మంది వైన్ షాపుల వద్దకే వెళుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఎక్సైజ్ శాఖ ఆడుతున్న ఆటలో తాము బలైపోతున్నామంటూ నరసరావుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బార్ల తాళాలను ఎక్సైజ్ శాఖ సీఐ సోమయ్యకు అందజేసి తాము వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. వైన్ షాపుల్లో అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకునేవరకు తాము బార్లు తెరవబోమని స్పష్టం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బార్లు ఏర్పాటు చేసుకుంటే తమకు నెలకు రూ.5లక్షల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఉందని, ఇలాగైతే వ్యాపారం చేయలేం మహాప్ర¿ో... అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనను విరమించి వెనుదిరిగారు. -
సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్
గన్నవరం : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏఎస్పీ వీవీ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక(14) సన్నిహితులతో కలిసి ఇటీవల కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెం జాతరకు వచ్చి.. సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను స్వగ్రామం తీసుకెళతామని నమ్మబలికిన వీరపనేనిగూడేనికి చెందిన ఇద్దరు మైనర్లు ముందుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మైనర్లు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామానికి చెందిన బాణావత్ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ అక్కడికి వెళ్లి బాలికపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆ బాలికను కేసరపల్లిలోని కొండేటి అనిల్ సహకారంతో అతని ఇంట్లో నిర్బంధించారు. అక్కడ జితేంద్ర, హర్షవర్ధన్లతో పాటు వారి స్నేహితులైన పరసా సంజయ్, ఉయ్యూరు నవీన్కుమార్, పరసా రాజేష్ ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే జితేంద్ర, హర్షవర్ధన్తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ చేసిన అనిల్, సంజయ్, నవీన్కుమార్, రాజేష్ లను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!
భారత్లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్ డెస్క్ఎలా పని చేస్తుంది?వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)’, ‘గ్లూకగాన్ లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1)’ హార్మోన్ రెసెప్టార్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.మరికొన్ని మందులున్నా..బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్’ ఔషధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందల కోట్ల మార్కెట్..ఫార్మాట్రాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం.. భారత్లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టైప్–1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదుమవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్–2 డయాబెటిస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్, సివియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.టైప్–1 డయాబెటిస్కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్ పాపులేషన్కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు..భారత్లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్ పిల్’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్ గురవారెడ్డి, సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బేరియాట్రిక్ సర్జన్మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్, సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.ప్రాణాంతకమైన మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.లైఫ్స్టైల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం. -
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్వర్క్ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్గా.. చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.కోడ్ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం. -
చెప్పింది చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన కూటమి ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలనే కాకుండా, ఉన్నతాధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నారు. తాము చెప్పిన ఎలాంటి పని అయినా నిబంధనలతో నిమిత్తం లేకుండా చేసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోయినా, ఆ పని ఆలస్యమైనా వారిపై విరుచుకు పడుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా సరే బెదిరించడానికి, ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి వెనుకాడడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెవెన్యూ ఉన్నతాధికారులపై వీరంగం వేసిన వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్న అడిగిన ఆయన.. మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారులు ఉండే రూమ్లోకి వెళ్లి రెచ్చిపోయారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్మిని తన పని ఎందుకు చేయలేదంటూ ఇష్టానుసారం తిట్టిపోశారు. అరుపులు, కేకలతో వారిపైకి దూసుకెళ్లారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని సర్ది చెప్పినా వినిపించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ తిట్టడం చూసిన మిగిలిన అధికారులు బిత్తరపోయారు.పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళుతుండగా.. మీ సంగతి తేలుస్తానంటూ అధికారులను బెదిరించడం గమనార్హం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014–19) కూడా బొండా ఉమ... విజయవాడలో అప్పటి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను అందరి ముందు తిట్టి రభస సృష్టించడం సంచలనం రేకెత్తించింది. ఎక్సైజ్ కమిషనరేట్లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు ఎక్సైజ్ శాఖ కమిషనరేట్కు వెళ్లి నానా బీభత్సం సృష్టించడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. నరసరావుపేటలోని మద్యం డిపోలో తాను సిఫారసు చేసిన 10 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించలేదంటూ డైరెక్టర్ నిషాంత్కుమార్ ఛాంబర్లోకి వెళ్లి ఆయన్ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తాను రాసిన లేఖను ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. ఇప్పటికిప్పుడు తాను చెప్పిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లనని బీభత్సం సృష్టించారు.ఛాంబర్లోనే ఉన్న సోఫాలో పడుకుని హడావుడి చేయడంతో డైరెక్టర్.. సంబంధిత మంత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మంత్రి వెంటనే.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వెనక్కు వచ్చేయాలని, తాను ఆ పని అయ్యేలా మాట్లాడతానని చెప్పినా ఆయన వినలేదు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవింద్బాబు పట్టించుకోలేదు. రెండున్నర గంటలపాటు ఛాంబర్లోనే ఉండడంతో గత్యంతరం లేక డైరెక్టర్ ఆయన చెప్పిన వారికి పోస్టింగ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాతే అరవింద్బాబు అక్కడి నుంచి బయటకు వచ్చారు. మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్పై జనసేన ఎమ్మెల్యే దాడి కొద్ది రోజుల క్రితం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం సృష్టించింది. విద్యార్థులు ఆడుకోవాల్సిన కాలేజీలో బయట వ్యక్తులకు అనుమతి లేదని చెప్పడంతో రెచ్చిపోయిన నానాజీ అనుచరులు వెంటనే ఆయన్ను పిలుచుకుని వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. ఎమ్మెల్యే నానాజీ సైతం బూతులు తిడుతూ డాక్టర్ మాస్క్ని లాగిపడేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక అధికారులను బెదిరించడం, తిట్టడం సర్వసాధారణం కావడం అందరికీ తెలిసిందే. తన వద్దకు వచ్చే అధికారులను ఎలా పడితే అలా మాట్లాడుతుండడంతో వారు బెంబేలెత్తుతున్నారు. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆయన పేరుగాంచారు. ⇒ శ్రీకాళహస్తి, తాడిపత్రి, ఆమదాలవలస, దెందులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్రెడ్డి, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి (ఈయన కుమారుడు ఎమ్మెల్యే), తదితరులు అధికారులను బూతులు తిట్టడం పరిపాటిగా మారింది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తనకు ఇష్టం లేని అధికారిని మున్సిపల్ కమిషనర్గా నియమించారని అక్కడి టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ దుర్భాషలాడుతూ ఆయన్ను కార్యాలయంలోనికి రానీయకుండా అడ్డుకుని రభస చేశారు. చంద్రబాబు అండతో రుబాబు విధి నిర్వహణలో ఉన్న తమను బెదిరించడం, అసభ్యంగా తిడుతుండడాన్ని ఐఏఎస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బొండా ఉమ, ఎక్సైజ్ కమిషనరేట్లో అరవింద్బాబు సృష్టించిన రభస ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాగైతే పని చేయడం కష్టమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో ఇదంతా సీఎం ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశాల్లో తనది పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం చెప్పడం, ఆ క్రమంలోనే అధికారులపై ఎమ్మెల్యేలు విరుచుకు పడడం జరుగుతుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారులు.. ఎమ్మెల్యేల దగ్గర కుక్కిన పేనుల్లా పడి ఉండి, వారు చెప్పిన తప్పుడు పనులు చేయడమేనా.. అనే చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి చేయడం, చేయకపోతే దాడులు, దౌర్జన్యాలు చేసే సంస్కృతి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.ఇప్పుడు కూటమి పాలనలోనే ఆ సంస్కృతి కొత్తగా మొదలైందని, ఉన్నతాధికారులపై దాడులు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సీరియస్ అంశాలపై కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం, ఊరికే వారిపై సీరియస్ అయినట్లు, విచారణ జరుపుతున్నట్లు మీడియాకు లీకులిచ్చి, తర్వాత వదిలేయడం పొలిటికల్ గవర్నెన్స్లో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఎరువుల్లేవ్.. అంతా సమస్యల దరువే!
సాక్షి, అమరావతి : ఇది పక్కన చెప్పుకొన్న ఉదాహరణలోని గిరిజన రైతు సమస్యనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న వెత.. ప్రభుత్వ సేవలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఎరువుల సరఫరాపై ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత రాష్ట్రంలో ఎరువుల సరఫరా అధ్వాన్నంగా ఉందంటూ వారంతా తేల్చి చెప్పారు. సకాలంలో, సరైన సమయానికి అవసరానికి తగ్గట్టు లభ్యం కావడం లేదని స్పష్టం చేశారు. పైగా గతంలో ఎన్నడూలేని విధంగా పంపిణీలో కూడా అవినీతి చోటుచేసుకుంటోందని కుండబద్దలు కొట్టారు. కూటమి పాలనలో కష్టాలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి ఎరువుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా కూడా అరకొరగానే ఇస్తున్నారు. దీంతో సకాలంలో దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదివరకు తరహాలో మండల కేంద్రాలకు పరుగులు తీస్తూ సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంప్లెక్స్ మోత ఓపక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు రూ.100 నుంచి రూ.255 మేర పెంచడంతో అన్నదాతలు భారం మోయలేక తల్లడిల్లుతున్నారు. మరోపక్క కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు అందినంత దోచుకుంటున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల బస్తాపై రూ.100–500 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ దోపిడీ కొనసాగుతూనే ఉంది.రైతు భరోసా లేదు.. అంతా బాదుడే పది ఎకరాల్లో కాఫీ, పసుపు, మిరియాలు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు వరి సాగు చేస్తుంటా. వరి మినహా మిగిలిన పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే పండిస్తా. వరికి కావాల్సిన ఎరువులు గతంలో గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లోనే దొరికేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక సరఫరా నిలిపివేశారు. దీంతో 25 కి.మీ. దూరంలో ఉన్న చింతపల్లి, అక్కడ లేకపోతే 40 కి.మీ. దూరంలోని నర్సీపట్నం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎరువుల కట్ట కోసం రోజంతా వృథా అవడమే కాదు. చార్జీలకు రూ.500 పైగా ఖర్చవుతోంది. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేని పురుగు మందులు అంటగడుతున్నారు. ఎరువుల్లో నాణ్యత కూడా ఉండడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏంటిది? అని అధికారులను అడిగితే మేమేం చేయగలం? అని అంటున్నారు. – బౌడు కుశలవుడు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ గిరిజన రైతు. ఎరువుల సరఫరాపై ఐవీఆర్ఎస్ సర్వేలో ‘ఎరువులు లేవు’ అని చెప్పిన రైతులు 41.2% జనవరిలో44% మార్చిలో74% అత్యధికంగాఏజెన్సీ జిల్లాల్లో56% శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో‘నాసిరకం’ అని చెప్పిన రైతులు 22.4% జనవరిలో34% మార్చిలో67% అత్యధికంగా ఏజెన్సీ జిల్లాల్లో 49% అనంతపురం జిల్లాలో48% కర్నూలు జిల్లాలోఎరువుల సరఫరా సందర్భంగా సహకార సంఘాలు,రైతు సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని చెప్పిన రైతులు 39% జనవరిలో37% మార్చిలో45% అత్యధికంగా పల్నాడు,కర్నూలు జిల్లాల్లోసరిపడాఎరువులు అందుబాటులోఉన్నాయా..?అన్ని జిల్లాల్లోనూ లేవు అని చెబుతున్న వారు 40- 44%అవసరమైనప్పుడు, కోరుకున్న ఎరువులు దొరకడం లేదు..41%ఎమ్మార్పికి మించి యూరియాకు వసూలు చేస్తున్నారు. 60%ఎరువులతో పాటు అవసరం లేని మందులను అంటగడుతున్నారు 60% -
విద్యుత్తు ఉద్యోగులకు బదిలీల ‘షాక్’
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మతితో పని లేదు.. సాధారణ బదిలీల్లో ఇచ్చే వెసులుబాట్లూ లేవు.. ఎప్పుడూ ఉండే.. వైకల్యం, భార్యాభర్తలు, అనారోగ్యం, స్థానికం ‘ఆప్షన్లు’ లేవు.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ..! విద్యుత్తు శాఖలో ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ప్రభుత్వ విభాగంలోనూ ఇలాంటి నిర్భంధ బదిలీలు జరగలేదని, ఎందుకింత కఠినం అని ఉన్నతాధికారులను అడిగితే.. ‘మేం చెప్పిన చోటకు వెళ్లండి.. లేదంటే మానేయండి’ అనే సమాధానం వస్తోందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. విమర్శలు రావడంతో అనుమతి పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26గా చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో దాదాపు 1.92 కోట్లమంది విద్యుత్తు వినియోగదారులకు సేవలందించేందుకు కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించారు.కూటమి ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు అధికారులు, సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో కొంతకాలం క్రితం కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. చెరో జిల్లాకు భార్యాభర్తలు..!రాష్ట్రంలోని 3 డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటు చేసుకోమని, కొత్త పోస్టులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సర్కిళ్లు ఏర్పాటు చేయాలంది. డిస్కంలు దీనికితగ్గట్లు.. కమిటీలు వేసి ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే, సాధారణ బదిలీల్లో అనుసరించే నిబంధనలను పక్కనపెట్టాయి. ఈ కారణంగా ఒక డిస్కం పరిధిలో భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉంటే వారు చెరో జిల్లాకు బదిలీ కావాల్సి వస్తోంది. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి ఇప్పటికే సగం సర్వీసులు తగ్గించేశారు. కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్ఏవో) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) పోస్టులను ఎత్తేశారు. టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పనిచేసే విధంగా భారం మోపుతున్నారు. వీటితోనే సతమతం అవుతున్న ఉద్యోగులు శాశ్వత కేటాయింపులపై ఆందోళనకు గురవుతున్నారు. -
1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్ జగన్ శుక్రవారం లేఖ రాశారు. శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్ జగన్ వివరించారు. లోక్సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే.. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది. అపోహలు, భయాలు తొలగించండి రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.డీఎంకే నాయకులకు లేఖ ప్రతి డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు. -
వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి -
జేఈఈ మెయిన్స్-2 నిబంధనలివీ..
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్లలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలు జరుగుతాయి. 9 వ తేదీ ఉదయం పేపర్–2 ఎ బీఆర్క్ పరీక్ష, పేపర్ – 2బి ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల పరీక్ష కేంద్రం వివరాలను (సిటీ ఇంటిమేషన్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే వెబ్సైట్లో ఉంచింది. పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని అడ్మిట్ కార్డుల్లో ఎన్టీఏ పొందుపరిచింది. వాటిని విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకొని, ఆ మేరకు ముందుగానే సిద్ధమవ్వాలి.మెయిన్స్–2 పరీక్ష రాసే విద్యార్థులకు ఇవీ సూచనలు» పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జరుగుతుంది. ఉదయం షిఫ్ట్లో పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. » పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. » పరీక్ష సమయానికి అర గంట ముందు వరకే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తరువాత ప్రధాన గేట్లను మూసివేస్తారు.» పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను మాత్రమే ధరించాలి.» బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి. » ఆభరణాలు, వాచీలు ధరించ కూడదు. కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులనే ధరించాలి. » ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను మాత్రమే అనుమతిస్తారు. » దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులను విధిగా తీసుకెళ్లాలి. » ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే ఇక్కడ అతికించాలి. పక్కన ఉండే మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.» విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరొక పాస్పోర్ట్ సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలి. » ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు. -
38 శాఖలు 1.32 లక్షల పెండింగ్ ఫైళ్లు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 1,32,395 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని ఈ–ఆఫీస్లో ఫైళ్ల క్లియరెన్స్ను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ తేల్చింది. ఇటీవల సీఎం వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో జరిపిన సమీక్షలో ఈ విషయం వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ తరువాత సీఎం నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అత్యల్పంగా 42 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒక రోజు సమయం తీసుకుంటుండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి సగటున రెండు రోజులు సమయం తీసుకుంటున్నాయి. న్యాయ శాఖ సగటున మూడు రోజుల్లో ఒక ఫైలు క్లియర్ చేస్తుండగా, రెవెన్యూ శాఖలో సగటున ఒక ఫైలు క్లియర్కు ఐదు రోజులు సమయం పడుతోంది. సగటున ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి అత్యధికంగా జలవనరుల శాఖ 50 రోజులు సమయం తీసుకుంటుండగా, విపత్తుల శాఖ 47 రోజులు సమయం తీసుకుంటోంది. ఈ–ఆఫీస్ వచ్చిన తరువాత సాధారణంగా రొటీన్ ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయవచ్చు. ఏమైనా ఆర్థిక, విధానపరమైన ఫైళ్లను క్లియర్ చేయడానికి మాత్రం సమయం పడుతుంది. అయితే మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా, అటువంటి ఫైళ్లను ఆ శాఖలు క్లియర్ చేయడం లేదు. సీఎం అభీష్టం మేరకు ఆయన కార్యాలయ అధికారులు సంబంధిత అంశాలకు చెందిన ఫైలును సర్క్యులేట్ చేయల్సిందిగా ఆయా శాఖలకు ఆదేశిస్తారు. అలాంటి ఫైళ్లు సంబంధిత అన్ని విభాగాల్లోను వెంటనే క్లియర్ అవుతూ ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించిన లేదా ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు అంత వేగంతో క్లియర్ కాకపోవడం గమనార్హం. -
ఆ ఐపీఎస్ అధికారిని ఏపీకి పంపాల్సిందే!
సాక్షి, అమరావతి : ఓ ఐపీఎస్ అధికారిని డిప్యుటేషన్పై యూపీ నుంచి ఏపీకి పంపాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుపడుతోంది. నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తున్నా, తమకు ఆయన కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా పట్టుపడుతోందంటే..అనకాపల్లి జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ 1998 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో రహదారి భద్రత విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఆయన టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి సమీప బంధువు కూడా. అందుకే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన సీఐడీ విభాగంలో ఐజీగా విధులు నిర్వహించారు. డిప్యుటేషన్ కాలం ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయారు. చెప్పింది చెప్పినట్లు చేస్తారని.. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ పెద్దలు సత్యనారాయణపై దృష్టి సారించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలతో విరుచుకు పడేందుకు అస్మదీయుడైన అధికారి కావాలని భావించారు. దాంతో ప్రభుత్వ ముఖ్య నేత దృష్టి సత్యనారాయణపై పడింది. అందుకే ఆయన్ను రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపాలని కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే.. ..ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను డిప్యుటేషన్పై ఇతర రాష్ట్రాలకు పంపేందుకు నిబంధనలు సమ్మతించవు. అదే విషయాన్ని ఆ మధ్య కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సత్యనారాయణను డిప్యుటేషన్పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. దీనిపై కొన్ని నెలలు మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇటీవల మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. ఈ ప్రయత్నాలన్నీ రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల బాధ్యతలను సత్యనారాయణకు అప్పగించేందుకేనని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
పెద్దపులికి పెనుముప్పు
నడకలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపు వేగం.. పెద్దపులికే సొంతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవి అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇముడ్చుకున్న పెద్దపులి మనుగడ ప్రమాదపు అంచులకు చేరడం జంతు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనూ ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది. సాక్షి, అమరావతి: దేశంలో పెద్దపులికి పెనుముప్పు వచ్చి పడింది. ఐదేళ్లలో పులుల వేట అమాంతం పెరిగింది. పులులను వేటాడి వాటి ఎముకలు, చర్మాలను విదేశాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు వ్యవస్థీకృతమై మరీ స్మగ్లింగ్ దందాను సాగిస్తున్నాయి.పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్లలో పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రధానంగా 2024లో దేశంలో పులుల వేట, స్మగ్లింగ్ జోరందుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వ విభాగం ‘వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో బలైన 100 పులులు కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సంతోషించేలోగానే.. పులుల వేట కూడా అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 70 శాతం భారత్లోనే ఉన్నాయి. దేశంలో 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో 2022 నాటికి 3,682 పెద్ద పులులు ఉన్నాయి. 2006లో కేవలం 1,411 పెద్ద పులులు మాత్రమే ఉండగా.. 2023 నాటికి వాటి సంఖ్య 3,682కు పెరగడం విశేషం.కాగా 17 ఏళ్లలో క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరగ్గా.. గత ఐదేళ్లలో పులుల వేట కూడా పెరగడం ప్రతికూలంగా పరిణమిస్తోంది. గత ఐదేళ్లలో స్మగ్లింగ్ ముఠాలు దేశంలో 100 పులులను వేటాడాయి. వాటి ఎముకలు, చర్మం, ఇతర భాగాలను అక్రమంగా రవాణా చేశాయి. 2021–23లోనే 33 పులులను హతమార్చగా... 2024లోనే 42 పులులను వేటాడారు. ఐదేళ్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 41 పులులను హతమార్చారు. ఆ రాష్ట్రంలో 2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 22 నాటికి.. అంటే కేవలం 24 రోజుల్లోనే 12 పులులను వేటాడటం దేశంలో స్మగ్లింగ్ ముఠాల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. స్మగ్లింగ్లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్లో ఐదేళ్లలో 10 పులులు వేటగాళ్ల దెబ్బకు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి, తమిళనాడులో రెండు పులులు హతమవగా... కేరళ, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మిగిలిన పులులను వేటాడారు. మందుల తయారీ ముడిసరుకుగా పులి ఎముకలు చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉండటంతో వాటి వేట పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పులి శరీర భాగాలను వాణిజ్యపరమైన డిమాండ్ ఏమీ లేదు. పులి చర్మాలను స్టేటస్ సింబల్గా కొందరు బడా బాబులు తమ బంగ్లాలలో ప్రదర్శిస్తుంటారు. కానీ.. చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో పులి శరీర భాగాలకు వాణిజ్యపరమైన డిమాండ్ భారీగా ఉంది. ప్రధానంగా పులి ఎముకలకు ఆ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉంది. చైనా, తైవాన్లలో ఔషధాల తయారీకి పులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముకలను పొడి చేసి వాటిని ప్రత్యేకమైన కొన్ని ఔషధాల తయారీకి వాడుతున్నారు. ఇక జపాన్లో పులి ఎముకలను బాగా ఉడికించి ఆ రసాన్ని ఖరీదైన మద్యం తయారీకి వాడుతున్నారు. ఆ దేశాల్లో పులులు లేవు. దాంతో ఆ దేశాల్లోని ఔషధ కంపెనీలు భారత్ నుంచి అక్రమంగా పులి ఎముకలను కొనుగోలు చేస్తున్నాయి. అందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు పులులను వేటాడి వాటి శరీర భాగాలను ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఏజెంట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్– సిల్చార్–ఐజ్వాల్–చంఫాయి గుండా దేశ సరిహద్దులు దాటించి మయన్మార్ మీదుగా చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అడ్డుకట్టకు సిట్ ఏర్పాటు దేశంలో పులుల వేట, స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసింది. పులులను వేటాడే ముఠాల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. -
ఆధారం ఉంటే ఒట్టు.. అంతా కనికట్టు!
ఫిర్యాదే ఓ కుట్ర.. నివేదికే బూటకం.. కేసే అక్రమం.. ఎఫ్ఐఆర్ కుయుక్తి.. వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం.. ఇదీ రాష్ట్రంలో సీఐడీ, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి, సాగిస్తున్న వేధింపులు వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. దాంతో తిమ్మిని బమ్మి చేసైనా సరే వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని మద్యం విధానంపై అక్రమ కేసుతో రంగంలోకి దిగింది. ఫిర్యాదు మొదలు దర్యాప్తు వరకు సాగుతున్న కుతంత్రం విస్తుగొలుపుతోంది. - సాక్షి, అమరావతికుట్రపూరితంగా ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. అందుకోసం కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ.. విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సీఐడీ తదితర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగానీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఈ ఇద్దరూ అటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు. ఇటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించ లేదు. ఎందుకంటే వీరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఆ ఫిర్యాదు కాపీని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.రూ.4 వేల కోట్ల కట్టు కథమద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏయే తేదీల్లో ఏయే డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్దే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించ లేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతూ మంత్రపు విచారణతో రూ.4 వేల కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వర్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ సాక్షిగా అక్రమ కేసు ఇక ప్రభుత్వ పెద్దల కుట్రకు పదును పెట్టడం తమ వంతు అని సీఐడీ రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేసేసింది. నిందితులు ఎవరో కూడా పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులోని ఏడో కాలమ్లో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలీదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవర్ని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన లేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర ఏమిటన్నది పేర్కొనకుండా, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120 బి కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బెవరేజస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైనా అక్రమ కేసు నమోదు చేసేందుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని తొమ్మిదో కాలమ్లో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించ లేదు. అవసరమైతే ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే.. అన్నది ఏమిటో సీఐడీ ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా.. అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సీఐడీ వద్ద కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నది సుస్పష్టం. దీన్నిబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించ లేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్లోని పదో కాలమ్లో ఈ వ్యవహారంలో ఏకంగా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ అవినీతి జరిగినట్టుగా పేర్కొనడం విడ్డూరం. నిందితులు తెలీదు.. ఆ కేసుకు సంబంధించిన ఆస్తుల వివరాలు లేవు.. కానీ రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. ఈ లెక్కన ఎంతటి నిరాధార ఆరోపణలో.. ఎంతటి అక్రమ కేసో అన్నది తేటతెల్లమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కట్టు కథకు తగ్గట్టు వాంగ్మూలాలు ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, అరాచకాల కుట్రకు బరితెగించేందుకు సీఐడీ సరిపోదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరుతో అరచకానికి తెగించింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ రెండు నెలలుగా పాల్పడుతున్న వేధింపులే ఇందుకు నిదర్శనం. దర్యాప్తు పేరిట బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. ఆ కేసులో సాక్షుల పేరిట వారిని విచారిస్తూ కనికట్టు చేస్తోంది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తోంది. సిట్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాలను తమ అక్రమ కేసుకు ఆధారంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తాము సాక్షులుగా భావిస్తూ సిట్ నుంచి తప్పించుకునేందుకు అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓసారి వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాతే వారినే ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్నది సిట్ పన్నాగం. ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి.. కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి.. జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టు మేరకు జరుగుతోంది. అవే డిస్టిలరీలు.. పెరిగిన ఆదాయం.. ఇంకెక్కడ అవినీతి?వాస్తవానికి డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి, నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. (వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు) 2014 నవంబర్లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి దోపిడీకి తెర తీసింది. 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. పైగా మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈ లెక్కన అవినీతికి తావెక్కడ? అంతా చంద్రబాబు అండ్ కో కట్టుకథే. -
వి వాంట్.. డిస్కౌంట్
సాక్షి, అమరావతి: డిస్కౌంట్.. కొద్దికాలంగా భారతీయులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే పదం ఇది. గతంలో కంటే ఎక్కువగా వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పండుగ సీజన్లలో ఇచ్చే డిస్కౌంట్ల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా అమ్మకాలు డిస్కౌంట్ల వల్లే జరుగుతున్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులను 50 శాతానికిపైగా డిస్కౌంట్ ఉన్నప్పుడే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలా 2024 పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగుల సీజన్లలో కొనుగోళ్లు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఆ సమయంలో వివిధ బ్రాండ్లు ఇచ్చే డిస్కౌంట్లు, చేసే ప్రమోషన్లు కొనుగోళ్లను బాగా ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది. మొబైల్ షాపింగ్కి పెరుగుతున్న ఆదరణఆన్లైన్ షాపింగ్లోనూ మొబైల్ షాపింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ–కామర్స్ అమ్మకాలు పెరగడంలో మొబైల్ షాపింగ్ ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకాల్లో 50 శాతం మొబైల్ షాపింగ్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ అమ్మకాల్లో ముందున్నాయి. ఇలాంటి సంస్థలు సోషల్ మీడియా ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ అన్ని రకాల వస్తువుల అమ్మకాలను పెంచుకుంటున్నాయి.ఆన్లైన్ షాపింగ్కే ఓటు..గతంలో మాదిరిగా షాపులకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆఫర్లు ఉన్నప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. డిస్కౌంట్తోపాటు డోర్ డెలివరీ అనేది కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోందని తెలిపింది. ప్రజల అభిరుచి మేరకు వివిధ రకాల వస్తువులను అందించే ఆన్లైన్ స్టోర్లు, పోర్టల్స్ పెరిగిపోయాయి. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లు పెరగడం వెనుక పండుగ షాపింగ్ అత్యంత కీలకంగా ఉంటోంది. సెలవుల సీజన్లలో వివిధ కంపెనీలు తరచూ కొత్త వాటితోపాటు పాత స్టాకుపై గణనీయమైన తగ్గింపులను ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్ డీల్స్, బై వన్– గెట్ వన్, బై టు–గెట్ త్రీ వంటి ఆఫర్లతో అదనపు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్లో ‘బిగ్ బిలియన్ డేస్’, మింత్రాలో ‘ఫ్లాష్ సేల్స్‘, అమెజాన్లో ‘గ్రేట్ ఫెస్టివ్ సేల్‘ వంటి పేర్లతో విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నాయి. ఇలాంటి సంస్థల మార్కెటింగ్ వ్యూహాలు అమ్మకాల పెరుగుదలకు బాగా దోహదం చేస్తున్నాయి. దేశంలోని సంస్కృతి, సంప్రదాదాలు, సెలవు రోజులు, ప్రజల మూడ్కు అనుగుణంగా భారతీయులకు దగ్గరవుతూ అమ్మకాలను ఈ సంస్థలు రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. -
కొత్త కొలువులు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలూ హుష్!
అయ్యా.. బాబూ.. నిరుద్యోగ భృతి ఇవ్వండని యువత అడుగుతుంటే.. ఉద్యోగాలొస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కనీవినీ ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30 వేల మందికి వందల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని తేలింది. కూటమి సర్కారు వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చయ్యే రూ.1500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే.. పలుకుబడిగల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక విధాన పత్రంలోనే స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం రూ.177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో వృత్తిపరమైన సర్వీసు పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.747 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది.మేనిఫెస్టోకు మంగళం!సూపర్ సిక్స్లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పలుకుబడి గల వారికి నెలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ కన్సల్టెంట్లుగా నియమించుకుంటోంది. సామాన్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయం గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా, వారికి వేతనాల కింద ఏటా రూ.1,500 కోట్లు చెల్లించిందని గత నవంబర్లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో వలంటీర్లను తొలగించేసింది. తమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉంటే వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.2,604 కోట్లు చెల్లించిందని గత నవంబర్లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 94,420కి తగ్గిపోయినట్లు తెలిపింది. వారికి వేతనాల కింద ఏటా రూ.2,329 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొంది.ఉద్యోగాల కుదింపే లక్ష్యంగత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా కూటమి సర్కారు భర్తీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గిపోయింది. అలాగే గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది ఉండగా, కూటమి సర్కారులో 53,122కు తగ్గిపోయింది.నాడు మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో 72,747కు తగ్గిపోయింది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గిపోయింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 46,646కు పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఏలు 19,406 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 18,435కు తగ్గిపోయింది. దీన్నిబట్టి ఉద్యోగాలను తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టమవుతోంది. -
నీళ్లో రామ చంద్రా..
సాక్షి నెటవర్క్ : రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు. మరికొన్ని పట్టణాల్లో కొన్ని కాలనీలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్లతో సరఫరా ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు తాగు నీటి కోసం ప్రజలు శివారు ప్రాంతాల్లోని బావులు, వంకల వద్దకు కష్టాలకోర్చి వెళుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.వేసవి ముంగిట తాగునీటి ఎద్దడికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయక పోవడం వల్ల సమస్య మరింత జఠిలం కానుంది. తీవ్ర నీటి ఎద్దడి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, నీటి సరఫరాకు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఎక్కడికక్కడ ప్రజలు మండిపడుతున్నారు.సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే మంచి నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ పలుచోట్ల నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతుండటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వంశధార చెంత.. గొంతు తడవక చింత శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ తీరాన ఉండే హిరమండలం మేజర్ పంచాయతీలో తాగునీటికి కటకట ఏర్పడింది. ఇటు కుళాయిల ద్వారా నీటి సరఫరా జరగక.. అటు ట్యాంకర్ల ద్వారా నీరు అందక మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఇక్కడ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్, మంచి నీటి పథకం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. ఏలూరులో రోడ్డెక్కిన మహిళలువేసవి ప్రారంభంలోనే ఏలూరు నగరంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. స్థానిక 29వ డివిజన్ కుమ్మరి రేవు ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ స్థానిక మహిళలు ఏలూరు కార్పొరేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ ఎ.భాను ప్రతాప్కు వినతి పత్రం అందజేశారు. కుమ్మరి రేవు ప్రాంతంలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కాస్తా ముందు ఉన్న వారికి అందుతున్నాయని, కాలనీ లోపల ఉండే వారికి దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. డబ్బు పెట్టి నీళ్ల క్యాన్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకు, స్నానానికి, దుస్తులు ఉతికేందుకు సైతం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తమకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలని కోరుతున్నారు.పుట్టపర్తిలో దాహం దాహంప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం అయిన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. రూ.వేల కోట్లు వెచ్చించి అనేక రాష్ట్రాలకు తాగునీరు అందించి జల దాతగా పేరు గాంచిన సత్యసాయి బాబా నడయాడిన పుట్టపర్తి ప్రాంతంలోనే తాగునీటి కష్టాలు నెలకొనడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో నెల రోజుల నుంచి తాగునీటి సమస్య నెలకొంది. రెండో వార్డు పెద్ద బజారు వద్ద గురువారం అర్ధరాత్రి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు తారకరామనగర్, 9వ వార్డు కర్ణాటక నాగేపల్లి, 2వ వార్డు పెద్ద బజార్, 6వ వార్డు చిత్రావతి గుట్ట, 12వ వార్డు ఎనుములపల్లి కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. రంజాన్, ఉగాది పండుగలను ఎలా జరుపుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాగా, వేసవి వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పట్టపర్తి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సీఎం ఇలాకాలోనూ తాగునీటికి కటకటసీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ, గుడుపల్లె మండలంలో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. గుడుపల్లి మండలం మిట్టూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుడుపల్లె మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గుడుపల్లి మండలం కోటపల్లి గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెస్కో కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్యాలెస్ ఎక్స్టెన్షన్లో తాగునీటి సమస్య తీర్చాలంటూ మున్సిపల్ కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇది సర్కారు నిర్లక్ష్యమేఅమలాపురం మున్సిపాలిటీ 30వ వార్డు పరిధిలోని రావులచెరువు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. అయినా ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ ముందుచూపుతో రూ.20 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని తెచ్చారు. నిధులు కూడా మంజూరై పనులు మొదలయ్యాయి. గాంధీనగర్లో ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. హౌసింగ్ బోర్డు కాలనీ, ఏవీఆర్ నగర్లో త్వరితగతిన ట్యాంకు నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో రావులచెరువు, రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం తూర్పుపాలెం, గొల్లపాలెం, శంకరగుప్తం, ఆడవిపాలెం, మట్టపర్రు, రామరాజులంక, సఖినేటిపల్లి మండలం మోరి, కేశవదాసుపాలెం, ఉయ్యూరివారి మెరక, అప్పన రాముని లంక, రాజోలు మండలం పొన్నమండలోని శివారు ప్రాంతాలకు తాగు నీరు అందడం లేదు. బిందెడు నీటి కోసం పాట్లుబిందెడు నీటి కోసం చాలా పాట్లు పడుతున్నాం. రక్షిత మంచి నీటి పథకం ద్వారా తాగు నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అనేది ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతోంది. దీంతో మాలాంటి వీధులకు నీరు అందడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. – బూర రాధ, హిరమండలం, శ్రీకాకుళంఇలాగైతే ఎలా?తాగు నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్ రిపేరీ ఉందని బయటకు తీశారు. అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వస్తే కానీ అధికారులు స్పందించడం లేదు. ఇలాగైతే ఎలా? ప్రభుత్వం వెంటనే పట్టించుకుని సమస్య పరిష్కరించాలి. – కేశమ్మ, పెద్ద బజార్, పుట్టపర్తిఎమ్మెల్యే స్పందించాలిపుట్టపర్తి మున్సిపాలిటీలో పలుచోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి. అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల వేళ కాని వేళ నీళ్లు వదులుతున్నారు. కూలి పనులకు వెళ్లకుండా నీటి కోసం పడిగాపులు కాస్తున్నాం. ఉగాది, రంజాన్ పండుగలు దగ్గర పడుతున్నాయి. అధికారులు, ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలి.– సత్యనారాయణ, పెద్ద బజార్ 2వ వార్డు, పుట్టపర్తి -
బాబు పెట్రో బాదుడు రూ.5,256 కోట్లు
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.పెట్రోలుపై లీటర్కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందేప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెలఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. » ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కర్ణాటక వెళ్లొస్తున్నాం..పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలంరూ.6 తక్కువకే..ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలంరాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..పెట్రోలు: 35,66,066.66 లీటర్లుడీజిల్: 86,01,966 లీటర్లురోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు -
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
‘ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలి’
ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రకటనలలో నటించి ఒక తీవ్రమైన తప్పు చేసారని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తన అభ్యంతరం తెలిపారు. బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించారని పలువురిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మందిపై కేసు నమోదు అయ్యిందన్నారు. పలువురు యాంకర్లతో పాటు సోషల్ మీడియా Influencerలపై రెడ్విత్, బీఎన్ఎస్ 3, 3(A), 4..ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేతిరెడ్డి గుర్తు చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంశానికి సంబంధించి భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, కర్ణాటకలలో ఒక చట్టం చేయడం జరిగిందన్నారు. పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని గత ఏపీ ప్రభుత్వం కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రిని కోరారన్నారు. ఈ మేరకు 2020లో అప్పటి సీఎం జగన్.. లేఖ రాశారన్నారు. దీనిపై సమగ్ర చట్టం పార్లమెంట్ లో చేయాలని, మిగతా అన్నీ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దుకు కేంద్రాన్ని కోరాలని, అప్పుడే భారత్లో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను లేకుండా చేయగలమన్నారు . ఇప్పుడు తెలంగాణలో ఫైల్ చేసిన కేసులో సెలెబ్రిటీలు Influencerలపై ప్రస్తుతం పెట్టిన కేసులో బలం లేదన్నారు. వారి పాత్ర వలన డబ్బు ఎంత చలామణి అయ్యిందో తెలుస్తోందని , భారత దేశంలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం 30 శాతం పెరిగిందని, మహిళలు సైతం ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసలు అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివిధ రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడంతో పాటు కేంద్రం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను బ్లాక్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. "సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలే కానీ ప్రజలకు నష్టం కలిగే వ్యవహారాలు చేయడం సిగ్గు చేటని, 'మా' అసోసియేషన్ వెంటనే స్పందించి తగిన చర్యలకు తీసుకోవాలని, యూట్యూబ్లో స్టార్స్ అయినంత మాత్రాన.. రియల్ లైఫ్లో స్టార్స్ కాదన్నది వారు గుర్తెరిగి నడుచుకోవాలని కేతిరెడ్డి హెచ్చరించారు. -
పోసానికి బెయిల్ మంజూరు
గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. -
‘సామాజిక’ సాహిత్యం
సాక్షి, అమరావతి: ‘వడగాడ్పు నా జీవితం.. వెన్నెల నా కవిత్వం’ అన్నారు గుర్రం జాషువా. ఆకలి కవిత్వం.. ఆలోచనే కవిత్వం.. కదిలించే ఘటనలు.. కవ్వించే ప్రతినలు.. కవితకు ప్రాతిపదికలు అంటూ కవిత్వం స్వరూపాన్ని వివరించారు శ్రీశ్రీ. రచనలతో సంస్కృతి, సంప్రదాయాల సంపదను, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కవుల పాత్ర గొప్పది. వారు సాహిత్యానికి, తద్వారా సమాజ ఉన్నతికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారి కవిత్వానికి గుర్తింపునిస్తూ ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. పడిలేచిన కెరటం: కాలంతో పాటు సాహిత్యకారులకు ఆదరణ కరువైంది. కరోనా మహమ్మారి ఈ పరిస్థితిలో కాస్త మార్పు తెచి్చంది. సామాజిక మాధ్యమాల ద్వారా రచయితలకు తిరిగి పూర్వ వైభవం వస్తోంది. అక్షర జ్ఞాన ప్రదర్శనకు అనువైన వేదికలు కల్పించే సాహిత్య సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనుభవజు్ఞల నుంచి అప్పుడే అడుగులు వేస్తున్న వారికీ ఇక్కడ గుర్తింపు దక్కుతోంది. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలనే ఇతివృత్తంగా కవితలు, కథల పోటీలు నిర్వహిస్తుంటే, గెలుపొందిన వారితో పాటు పాల్గొన్న వారికీ ప్రోత్సాహక బహుమతులు, పురస్కారాలు లభిస్తున్నాయి. దీంతో యువతరంలోనూ క్రమంగా సాహిత్య రచనా కాంక్ష పెరుగుతోంది. ఎన్నో మార్గాలు : అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం అంటూ ఎవరు ఏం రాసినా పూర్వం పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురిస్తేగానీ ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. ప్రతిలిపి, పాకెట్ ఎఫ్ఎం, పాకెట్ నవల్ వంటి ఆన్లైన్ యాప్లో కథలు, కవితలు వినడం, చదడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.కవులు పెరిగారు సోషల్ మీడియా వేదికగా సాహిత్యానికి పెద్ద ప్లాట్ఫాం ఏర్పడింది. కరోనా తర్వాత ఆన్లైన్ వేదికలు రావడంతో ఎంతోమంది కవులు మారారు. కవులకు సరైన సాహిత్య మార్గ నిర్దేశకం అవసరం. అందుకే ప్రత్యేక వేదికలు కల్పిస్తున్నాం. – కత్తిమండ ప్రతాప్, రచయిత, శ్రీశ్రీ కళా వేదిక నిర్వాహకుడు సామాన్యులకు అర్థం అవుతోంది ఒకప్పుడు కవిత్వం రాసేవారిని వెతకాల్సి వచ్చేది. కరోనా తరువాత ప్రతి వంద మందిలో 10 మంది కవులు ఉంటున్నారు. ఏ కాలంలోనూ ఇంతమంది కవులు లేరు. – నిమ్మగడ్డ కార్తీక్, రచయిత, తపస్వి మనోహరం సాహిత్య వేదిక నిర్వాహకుడు -
మా అధికారాల్లోనే జోక్యం చేసుకుంటారా?
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్ను ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే.. రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిట్ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. మా అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందిఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏవైనా పొరపాట్లు గానీ, లోటుపాట్లు గానీ ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఆరోపణలను నమోదు చేసి, ఆయనకు ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్లు కూడా రికార్డ్ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ.. సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు. సిట్ ఏర్పాటుపై పిటిషన్ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు (ఫాం 7) దాఖలయ్యాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఫాం 7 దాఖలుపై విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాపట్లకు చెందిన గుండపనేని కోటేశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు. -
వర్గీకరణపై ఐదు సిఫారసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఐదు కీలక సూచనలు చేసింది. గతేడాది నవంబర్ 15న నియమితులైన ఆయన అదే నెల 27న బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి ఈ నెల 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పింపంచారు. నాలుగు నెలలపాటు అధ్యయనం చేసి 3,820 విజ్ఞాపనలు స్వీకరించిన కమిషన్ మొత్తం 360 పేజీల నివేదికలో ఐదు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. వాటిలో గ్రూపు–ఏలో 2.25 శాతం జనాభా కలిగిన అత్యంత వెనుకబడిన 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ అందించాలని సిఫారసు చేసింది. గ్రూప్–బీలో 41.56 శాతం జనాభా కలిగిన వెనుకబడిన 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంది. గ్రూప్ సీలో 53.98 శాతం జనాభా కలిగి మిశ్రమ వెనుకబాటుతనంతో ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది. రోస్టర్ విధానం ప్రకారం మొదట వంద పోస్టులు వస్తే 8 శాతం పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. ఈ మూడు కలిపితే 15 శాతమవుతుంది. అదే రోస్టర్ విధానంలో 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15, మాదిగ సామాజిక వర్గానికి 13, రెల్లి వర్గానికి రెండు వర్తిస్తాయి. తద్వారా రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవీ ఐదు కీలక సూచనలు..» ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలి. » 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యాక ప్రభుత్వం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చు. » ఎస్సీ 59 ఉపకులాలను ఏ, బీ, సీగా మూడు కేటగిరీల్లో వర్గీకరణ. » 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు. » రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి.జనగణన తర్వాతే వర్గీకరణఅసెంబ్లీలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రం యూనిట్గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జనగణన తర్వాతే జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప కులాల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికపై గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. 1995లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సుదీర్ఘకాలం సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే పరిష్కారం కావడం సంతృప్తినిచి్చందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో చెప్పినట్లే ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. 30 ఏళ్ల నిరీక్షణను నిజం చేస్తూ నా చేతుల మీదుగా వర్గీకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అంటరానితనంపై అప్పట్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ చేసిన 42 సిఫారసులు ఆమోదించి 25 జీవోలు, మెమోలు తీసుకొచ్చాం. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీ, ఎస్టీ చట్టం తెచ్చా. మాదిగ పేరు చెప్పుకొనేందుకు కూడా వెనుకాడిన రోజుల్లో మాదిగ దండోరాను స్థాపించి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు. వారి డిమాండ్లు సమంజసమని భావించి 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్వులు ఇచ్చాం. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచి్చంది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. పేదరికంలేని సమాజమే నా లక్ష్యం. ఉగాది నుంచి పీ 4 విధానం తెస్తాం’ అని చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మంద కృష్ణ, చంద్రబాబు ఇద్దరే కారణమని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే రెల్లి కులస్తుతులకు కూడా న్యాయం చేయాలన్నారు. బుడగ జంగాలనూ ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. -
హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం
రాష్ట్రం నుంచి హజ్కు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టుదలతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్ను కూటమి ప్రభుత్వం రద్దు చేయించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు వీలుగా ఏకంగా ఏపీ హజ్ కమిటీతో లేఖ రాయించింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్ బర్మన్ ఈ నెల 18న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్సింగ్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. – సాక్షి, అమరావతి వైఎస్ జగన్ కృషితో సాకారం..భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్కు కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనార్టీ తదితర శాఖలు సమీక్షించి అనుమతి ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హాజీలు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ కోసం అనుమతి సాధించింది. అలాగే ఇక్కడి నుంచి ప్రయాణించే వారిపై పడిన అదనపు చార్జీలను సైతం వైఎస్ జగన్ సర్కార్ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్ కమిటీలతో వైఎస్సార్సీపీ ఎంపీలు అనేక పర్యాయాలు సంప్రదించారు. కేంద్రానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మాట్లాడించారు. అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై రూ.80 వేల చొప్పున పడుతున్న అదనపు చార్జీల భారాన్ని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్సీపీ హయాంలో గత రెండేళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్కు వెళ్లారు. 1,813 మందికి చార్జీల భారం లేకుండా రూ.14.50 కోట్లకు పైగా అందించింది.ముస్లిం సమాజాన్ని మోసం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు వంటి వాటిలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. తాజాగా ఎంబార్కేషన్ పాయింట్ పోయేలా లేఖ ఇప్పించి.. ముస్లిం సమాజాన్ని మోసం చేసింది. ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపర్చడమే. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి ఎంబార్కేషన్ పాయింట్ను తిరిగి సాధించాలి. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్ ఇది చంద్రబాబు మార్క్ కుట్ర.. హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దు కచ్చితంగా చంద్రబాబు మార్క్ కుట్ర. ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేస్తుంటే ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? రూ.లక్ష హామీని ఎగవేసేందుకే ఇలా కుట్ర చేశారా? – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తీసుకువస్తే.. బాబు నాశనం చేశారు పొరుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందిన హాజీలు అవస్థలు పడకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్.. పట్టుదలతో ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే ఆ భారాన్ని కూడా భరించారు. అలాంటి సౌలభ్యాన్ని చంద్రబాబు నాశనం చేశారు. – దస్తగిరి, ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్ -
బాబు విజనరీ.. ఆదాయం ఆవిరి!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది.సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు... గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్బుక్ పాలనపైనే దృష్టి సారించి, సుపరిపాలనను గాలికొదిలేయడమేనని స్పష్టం అవుతోంది. భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ⇒ ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు ⇒ 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. ⇒ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. జగన్ పాలనలో కన్నా రూ.10వేల కోట్లు తక్కువగా మూలధన వ్యయం ⇒ అప్పు చేసిన నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే, ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. ⇒ జగన్ సీఎంగా ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద రూ.23,251 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం రూ.13,303 కోట్లే మూలధన వ్యయం చేశారు. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా.. అది ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.76,292 కోట్లకు చేరింది. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు రూ.90,047 కోట్లకు చేరింది. ⇒ రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా.. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందంటూ సీఎం చెప్పడం.. కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
బతుకే ‘పరీక్ష’
మంత్రాలయం: బతుకుదెరువులో భాగంగా ఎంతో మంది పదవ తరగతి విద్యార్థులు పేదరికంతో పరీక్షలకు దూరమై చదువులకు వీడ్కోలు పలుకుతున్నారు. పనికోసం వలస (సుగ్గి) బాటలోనే విలువైన జీవితాలను పణంగా పెడుతున్నారు. తల్లిదండ్రులకు చదివించుకోవాలన్న ఆశ ఉన్నా, పేదరికం శాపంగా మారింది. పూట గడవని జీవులకు బతుకే ఓ పోరాటమైంది.జీవితమే ఓ పరీక్షగా మారింది. ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడం గమనార్హం. విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వకుండా వేడుక చూస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ ఏడాది 32,130 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.అందులో మొదటి రోజు తెలుగు, ఉర్దూ, కన్నడ సబ్జెక్టు పరీక్షలకు 700 మంది గైర్హాజరయ్యారు. వీరిలో మంత్రాలయం నియోజకవర్గం వారు 79 మంది, ఆదోనివారు 37 మంది ఉన్నారు. కోసిగి మండలం చింతకుంటకు చెందిన చిన్నారి పరీక్షకు హాజరు కాలేదన్న విషయం ఓ పత్రికలో చదివి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్.. సదరు చిన్నారిని గురువారం స్వగ్రామానికి పంపారు.రెండు సబ్జెక్టుల పరీక్షలు ముగిసిన తర్వాత ఆమెను ఇంటికి రప్పించారు. ఈ బాలిక మిగతా పరీక్షలకు హాజరైనా, మొదటి రెండు పరీక్షల్లో ఫెయిల్ కాకతప్పదు. ఇలాంటి విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. మరి వారందరి పరిస్థితి ఏమిటన్నది మంత్రి లోకేశ్ సెలవివ్వాలి. పేపర్లో వస్తేనే స్పందించే బదులు తొలుతే అందరూ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుని ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రెండు సబ్జెక్టులకు దూరమైన చిన్నారి ⇒ ఈ విద్యార్థిని పేరు సన్నక్కి చిన్నారి. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె. కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదవుతోంది. గుంటూరు జిల్లా కేంద్రం సమీపంలో మిరప కోతలకు తల్లిదండ్రులతోపాటు జనవరిలో వెళ్లింది.చిన్నారి కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. కూలికి వెళితేనే నాలుగు మెతుకులు. ఈసారి కూలి పనులు లేకపోవడంతో మారయ్య ఇంటిల్లిపాది పని కోసం వలస పట్టారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనా చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు. తోటి వారు వారించడంతో రెండు సబ్జెక్టుల పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరు చేరుకుంది.వీరేంద్ర పరీక్షకు తండ్రి జబ్బు శాపం ⇒ ఈ ఫొటోలోని విద్యార్థి పేరు వీరేంద్ర. మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన భీమయ్య, ఉసేనమ్మ కుమారుడు. ప్రస్తుతం ఈ విద్యార్థి తండ్రికి జబ్బు చేసి స్వగ్రామంలోనే ఉండిపోగా.. తల్లితోపాటు వీరేంద్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గడితండా గ్రామంలో మిరప కోతలకు వెళాడు.పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తానని వీరేంద్ర మొర పెట్టుకున్నా, అమ్మ ఒప్పుకోలేదు. నాన్న అనారోగ్యంగా ఉండటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పైగా పోయిన సంవత్సరాల్లాగా అమ్మ ఒడి కూడా రాలేదని వీరేంద్రను వారించడంతో మనసు చంపుకొని పనికి వెళ్లాడు. రెండు నెలలుగా అక్కడే పనులు చేసుకుంటున్నారు.పూట గడవని మాకు పరీక్షలెందుకని?⇒ ఈ ఫొటోలోని భార్యాభర్తల పేర్లు సులువాయి నరసింహులు, నీలమ్మ. వీరిది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని పల్లెపాడు గ్రామం. పచ్చ రంగు చొక్కా ధరించిన బాలుడు ఉరకుందు పదవ తరగతి, క్రీం కలర్ షర్టు ధరించిన బాలుడు వీరేంద్ర ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తయ్యాయి.బతుకుదెరువు కోసం తల్లిదండ్రులతోపాటు ఉరుకుందు సుగ్గి (పని కోసం వలస)కి వెళ్లడంతో పరీక్షలకు హాజరు కాలేదు. పూట గడవని తమకు పరీక్షలు ఎందుకనుకున్నారేమో తల్లిదండ్రులు పిల్లలను సైతం తమ వెంట తీసుకొని ప్రకాశం జిల్లా పురిమెట్లలో మిరప కోతలకు వెళ్లారు. తల్లిదండ్రుల పేదరికం ఈ విద్యార్థికి శాపంగా మారడం విచారకరం. వీరికి ఎకరా భూమి ఉంది. వానొస్తేనే పొలంలో కాసింత పచ్చదనం కనిపిస్తుది. లేదంటే బీడుగా వదిలేసి సుగ్గి బాట పట్టాల్సిందే.తల్లికి వందనం లేనందునే..ఇలా ఒక్క పదవ తరగతి విద్యార్థులే కాదు.. ఇతర తరగతులు చదివే విద్యార్థుల్లో చాలా మంది వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16 వేల మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం అమలుతో విద్యార్థులు వలస వెళ్లిన దాఖలాలు చాలా తక్కువ.ఈసారి మాత్రం తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం గమనార్హం. తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. అంతేగాక సీజనల్ హాస్టళ్ల ఏర్పాటులోనూ కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం కూడా వలసలకు ఓ కారణం.నాగలక్ష్మికి పేదరికమే అడ్డు⇒ ఈ అమ్మాయి పేరు నాగలక్ష్మి. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన లింగమ్మ, భీమేష్ దంపతుల కుమార్తె. నాగలక్ష్మి తల్లితోపాటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రం సమీపంలో మిరప కోతల్లో ఉండిపోయింది. మూడు నెలలుగా అక్కడ పొలం పనులకు వెళ్తోంది. ఈ బాలిక పెద్దకడబూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పబ్లిక్ పరీక్ష రాసేందుకు సైతం హాజరు కాలేదు. సెంటు భూమి లేని నాగలక్ష్మి కుటుంబానికి కూలి పనులే శరణ్యం. గ్రామంలో పనులు ముగియడంతో తల్లితో కలిసి వలస వెళ్లడం గమనార్హం. -
రెడ్బుక్ తంత్రం.. సిట్ కుతంత్రం!
సాక్షి, అమరావతి : పోలీస్ స్టేషన్కు ఉండాల్సిన అర్హతలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇది రెడ్బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. చట్ట విరుద్ధంగా సిట్ ఏర్పాటు సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్ను ఓ పోలీస్ స్టేషన్గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్ను ఓ పోలీస్ స్టేషన్గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. కానీ అసలు పోలీస్ స్టేషన్కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్ స్టేషన్గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్ స్టేషన్కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి. కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్ స్టేషన్గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కు కచి్చతంగా స్టేషన్ హౌస్ అధికారిగానీ లేదా ఆఫీసర్ ఇన్చార్జ్ ఆ పోలీస్ స్టేషన్కు బాధ్యుడిగా ఉండాలి. మరి సిట్ను పోలీస్ స్టేషన్గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్చార్జ్ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్కు లేవని తేల్చి చెబుతున్నారు. అబద్ధపు వాంగ్మూలాలుసిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది. అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూడని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయాలని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్యత ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు కోసమే బరితెగింపు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్స్టేషన్గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్ను పోలీస్ స్టేషన్గా గుర్తించింది. తద్వారా సిట్ను ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్గా తీర్చిదిద్దింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించారు. వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు. -
సాగుకు ‘నీటి’ గండం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది..! దీనిప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరందాలి..! కానీ, వంతుల వారీ నీరందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో విసుగుచెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరివ్వడంలోనే కాదు.. విడుదల, నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరి దుబ్బులను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్లపై పంట చేలల్లో తిరుగుతూ గోడు వినండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండడం అన్నదాతలను కుంగదీస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 46 లక్షల ఎకరాల్లోనే సాగు ప్రభుత్వం రబీలో 57.66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. మార్చి 19 నాటికి 55 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 46 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 19.87 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, 16.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తమ్మీద నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ. మరోపక్క రెండో పంటకు సరిపడా నీరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. పరిస్థితి చూస్తే శివారు ప్రాంతాలకు చేరలేనేలేదు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాక హంద్రీనీవా, వంశధార నదుల కింద కూడా రైతులు పాట్లు పడుతున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. –నవంబరు, డిసెంబరులో మైనస్ 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం, జనవరి, ఫిబ్రవరిలో 79.2 మిల్లీమీటర్లు, మార్చిలో ఇప్పటివరకు 98.3 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలనే కన్నీరు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 95 శాతం పంట గోదావరి కాలువల కిందనే. 5వేలకు పైగా ఎకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. రబీకి నీటి సరఫరా విషయంలో తొలి నుంచి అధికారులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖరీఫ్ వర్షాలతో చేలల్లో ముంపు దిగక రబీ నారుమడులు ఆలస్యమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ శివారుకు చేరడం లేదు. –అమలాపురం మండలం వన్నెచింతలపూడి, ఎ.వేమవరం, ఎ.వేమరప్పాడు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పర్రభూమి ప్రాంతం, కూనవరం, ముక్తేశ్వరం పంట కాలువ కింద లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం, అంబాజీపేట మండలం కె.పెదపూడి, మామిడికుదురు మండలం నిడిమిలంక గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ద్వారా కుండలేశ్వరం వైరులాకు దిగువ, ఎగువ ప్రాంతాలకు వంతుల వారీగా ఇస్తున్నా శివారు ఆయకట్టు బీటలు వారింది. కె.గంగవరంలో యండగండి, కూళ్ల, కోటిపల్లి, యర్రపోతవరం పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాళు తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. అదనపు భారం అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుతూ పొట్ట దశలోని వరి పంటను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సాగునీటి కోసం గురువారం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు చేలల్లోనే వినూత్న నిరసనలు అయినాపురం–కూనవరం పంట కాలువ శివారు కూనవరం పరిధి గరువుపేట రైతులు పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. ఈనే దశలో ఉన్న సుమారు 350 ఎకరాల్లోని పంట దెబ్బతింటోందని వాపోయారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు దాసరివారిపేటలో ఎండిన చేలలో ఓ రైతు మోటారు సైకిల్ నడిపాడు. ఆత్మహత్యలే శరణ్యం.. తాళ్లరేవు మండల పరిధి పి.మల్లవరం శివారు రాంజీనగర్, మూలపొలం, గ్రాంటు తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు సాగు నీరు పూర్తిగా అందడం లేదు. దీంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ వరిదుబ్బులు, పురుగు మందు డబ్బాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోన మండలం రామాలయంపేట, గొల్లగరువు, లైనుపేట 150 ఎకరాలు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, చాకిరేవు చెరువు, తిల్లకుప్ప, మొల్లి చెరువు, జి.మూలపొలం తదితర ప్రాంతాల్లో 300 ఎకరాలు బీడువారుతున్నాయి. పి.మల్లవరం పంచాయతీ మూలపొలం, రాంజీనగర్, గ్రాంటు గ్రామాల్లో వరిచేలకు సాగునీరు అందక బీటలు వారాయి. జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. –కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో చేలు బీటలు వారాయి. తాళ్లరేవు కరప, గొల్లప్రోలు, శంకవరం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది. వట్టిపోయిన కేసీ కెనాల్.. శ్రీశైలం నిండింది..రెండో పంటకు దండిగా నీరు అందుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కేసీ కాల్వ ఒట్టిపోయింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి చేలకు నీరు చేరడం లేదు. కేసీ కెనాల్ రైతుల అగచాట్లు మామూలుగా లేవు. గొప్పాడు మండలం యాళ్లూరు వద్ద ముచ్చుమర్రి పంపుల ద్వారా 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నా చివరి ఆయకట్టుకు చేరడమే లేదు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో 18 వేల ఎకరాల్లో వరి, కంది, మొక్కజొన్న సాగవుతున్నాయి. కోత దశలో ఉన్న మొక్కజొన్నకు కనీసం రెండు తడులు అందించాలి. నీరివ్వకుంటే రూ.లక్షల్లో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద నీరు బంద్ కావడంతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్వ కింద 42 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కోత దశకు రాగా.. తడులందక రైతులు పాట్లు పడుతున్నారు. సాగర్ కిందా ఇదే దుస్థితి.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9 రోజులు, ఉమ్మడి ప్రకాశంకు 6 రోజులు నీటిని విడుదల చేస్తున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు బ్రాంచి కెనాల్, మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాల్వ ద్వారా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లోని శివారు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రబీలో 36 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, మినప, శనగ, మొక్కజొన్న వేయగా, ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్నకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయకపోవడం, చేసినా చివరి భూములకు నీరు చేరక పంటలు బెట్టకు వస్తున్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి చెరువులు, కుంటల్లోని నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలను తడుపుతున్నారు. మురుగు కాలువల్లో నీటిని తోడి పంటలను కాపాడుకోవల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. –శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని తడులు అందిస్తున్నారు. వంశధార జలాశయం కింద నీరందని కొందరు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. –కృష్ణా డెల్టాలోని ఏలూరు జిల్లా పెడపాడు, దెందులూరు మండలాల్లో 48 వేల ఎకరాలను ఖాళీగా వదిలేశారు. దెందులూరుతో పాటు బీమడోలు మండల పరిధి పలు గ్రామాల్లో ప్రస్తుతం పొట్ట, ఈనిక దశలో ఉన్న వరి పంటకు నీరందని పరిస్థితి ఉంది. సుమారు 7 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆత్మహత్యలే శరణ్యం ఈ ఏడాది సూపర్–10 రకానికి సంబంధించి పది ఎకరాల మిరప సాగు చేశా. రూ.లక్ష దాక పెట్టుబడి అయింది. మరో రెండు విడతల కోతలు రావాల్సి ఉంది. మార్చి మొదటి వారం నుంచే పొన్నాపురం సబ్ చానల్కు నీటి విడుదల ఆపేశారు. భూములు తడులు లేక పగుళ్లిచ్చాయి. కేసీ కెనాల్ అధికారులను వేడుకుంటున్నా సాగు నీటి విడుదలకు ప్రయోజనం లేకపోయింది. దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. –చిన్న తిరుపతిరెడ్డి, మిటా్నల, నంద్యాల జిల్లా అధికారులు కన్నెత్తి చూడడం లేదు మాది ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం. మూడెకరాలు కౌలుకు చేస్తున్న. దాళ్వాలో వరి వేశా. నీటికి ఢోకా లేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నా. మా గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది? –వల్లూరి నాగేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలుషిత నీటిని తోడుకుంటున్నాంవరి చేలు బీటలు వారాయి. టేకి డ్రైన్లో నీటిని మోటార్లతో తోడుతున్నారు. అది ఉప్పగా ఉండడంతో పాటు కలుషితం కావడంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. గతంలో మాదిరిగా తాతపూడి పంపింగ్ స్కీం ద్వారా నీరు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. –దడాల బుజ్జిబాబు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా ఏం చేయాలో పాలుపోవడం లేదు4.5 ఎకరాల్లో మెనుగు పెసర వేశారు. నీరు లేక ఎండల తీవ్రతతో పంట ఎండిపోతోంది. 12 ఎకరాల్లోని జీడి పంటకూ నీరు పెట్టే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు పువ్వు మాడిపోయింది. కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోవడంలేదు. –కనపల శేఖర రావు, పాతయ్యవలస, శ్రీకాకుళం జిల్లా ఎండిపోతున్న మిర్చి పంట పల్నాడు జిల్లాలో వారబందీ అమలులో ఉన్నప్పటికీ నీరందక మిర్చి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచర్ల మండలం వీరవట్నం పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం గురువారం ఆందోళన బాట పట్టారు. నాగార్జున సాగర్ సంతగుడిపాడు ఇరిగేషన్ సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి కన్పించడం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపించారు. రైతులు ఏయే పంటలు సాగు చేశారు, ఎన్ని రోజులు పాటు ఎంతమేర నీటి అవసరాలు ఉన్నాయనే వివరాలు అధికారుల దగ్గర లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బతినకుండా ఏప్రిల్ 20 వరకు సాగు నీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున సాగర్ కింద ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. సాగు నీరు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టారు రాస్తారోకో చేస్తున్న వీరంతా పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు. నీళ్లున్నాయన్న ఆశతో రెండో పంటగా చింతపల్లి నాగార్జున సాగర్ కాల్వ కింద 400 ఎకరాల్లో వరి వేశారు. ప్రస్తుతం పొట్ట దశకు రాగా.. మార్చి తొలి వారం నుంచి నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సాగు నీటి విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాస్తారోకో చేశారు. దీంతో రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ‘‘నీళ్లు అడిగిన పాపానికి స్టేషన్కు తరలిస్తారా?’’ అంటూ రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. -
లిక్కర్ స్కాం పేరుతో 'కూటమి' భారీ కుట్ర: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైఎస్సార్సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందికూటమి పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు.వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు.తెలుగుదేశం వీర విధేయులతో సిట్ ఏర్పాటుసాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్లో నియమించారు.సిట్ను నియమించే సందర్బంలో సుప్రీంకోర్టు సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్కు సంబంధించిన పోలీస్స్టేషన్ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, స్టేట్మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్కు సంబంధించిన ఫైళ్ల రూటింగ్ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడంలిక్కర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది.లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్ జగన్ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. -
దావోస్ జస్ట్ ఒక వేదిక అంతే!: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ‘‘ఏపీకి పెట్టుబడులను వెల్లువలా తీసుకురాబోతున్నాం’’ ఈ ఏడాది జనవరిలో దావోస్కు వెళ్లడానికి ముందు కూటమి ప్రభుత్వం (Kutami Prabhutvam)చెప్పిన మాట. ‘‘పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం.. సుమారు 15 కంపెనీల అధిపతులతో సమావేశమయ్యాం..’’ ఇది దావోస్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరుగుతున్న టైంలో చెప్పిన మాట. ఇప్పుడేమో.. దావోస్ వెళ్లింది ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కాదంటూ అసెంబ్లీ సాక్షిగా ఇంకో మాట చెప్పేసింది. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారనేది తెలిసిందే. అయితే ఆ పర్యటనపై మండలి సాక్షి గా ఏపీ ప్రభుత్వం వింత భాష్యం చెప్పింది. దావోస్ పర్యటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్లు ప్రశ్న సంధించారు. అయితే తమ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది ఎంవోయూలు చేసుకోవడానికి కాదని సమాధానం కూటమి ఇచ్చింది. అది కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే.. మేం అక్కడికి వెళ్లింది ఎలాంటి పెట్టుబడులు చేసుకోవడానికి కాదు’’ అని సమాధానం విడుదల చేసింది. -
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 214 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వార్డు సభ్యుల ద్వారా జరిగే ఈ ఉప సర్పంచ్ల ఎన్నిక కోసం 27న ఉదయం 11 గంటలకు ఆయా పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. -
‘యువిక’.. భావి శాస్త్రవేత్తలకు వేదిక
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): అంతరిక్ష పరిశోధనలపై మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారిని ప్రత్యేకంగా తమ ప్రాంగణాలకు ఆహ్వానించి నూతన ఆవిష్కరణలపై ఉత్సాహాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధమైన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఇస్రో పిలుపునిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పలు పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. యువిక లక్ష్యాలు ఇవీ.. » భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం» విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం» అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడంఎవరు అర్హులంటే...ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు, ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇస్రో ప్రాధాన్యతనిస్తోంది. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2–10%, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10% వెయిటేజీ ఇవ్వనుంది. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5%, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 15% ప్రాధాన్యం ఇవ్వనుంది. పరీక్ష ఎక్కడంటే...ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ). దరఖాస్తు ఇలా చేసుకోవాలి..నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తరువాత ‘యువికా’ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23 వరకు అవకాశముంది. ఎంపిక జాబితాను 2 విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటుగా అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది.కార్యక్రమం షెడ్యూల్ ఇలా..వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7నాటికి వడపోసి ఎంపికైన విద్యార్థుల జాబితాలను ఇస్రో విడుదల చేస్తుంది. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడుతోంది. మే 31న ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తుంది. ఎంపికైన విద్యార్థులను మే లో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తుంది. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తుంది. వారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వారికి విజ్ఞానాన్ని అందిస్తారు.విద్యార్థులకు మంచి అవకాశం విద్యార్థులకు ఇస్రో వంటి సంస్థను సందర్శించటం, ఆయా పరిశోధనలపై అవగాహన పెంచుకోవటానికి ఇది మంచి అవకాశం. భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతోన్న యువికా కార్యక్రమాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈవోలు, ఎంఈవోలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లాఅవగాహన కల్పిస్తున్నాం యువికాలో పాల్గొనేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబిషన్లు, పోటీ పరీక్షల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదేస్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ మైనం హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి -
42 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో మొదలు పెట్టాలని తేల్చి చెప్పింది. ఏపీపీ పోస్టులను పెంచినట్లే, మిగిలిన కేడర్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో పీపీలు, ఏపీపీలు, అసిస్టెంట్ సీనియర్ పీపీల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, అందువల్ల పీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజయానంద్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యల గురించి విజయానంద్ను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం ఏపీపీల కేడర్ స్ట్రెంత్ 204గా ఉందని, దీనిని 209కి పెంచనున్నామని విజయానంద్ చెప్పారు. 42 ఖాళీలను డైరెక్టుగా భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. -
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు
సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులను మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్సెప్షనల్ బెనిఫిట్ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు. -
ఆశలు ఎండ‘మామిడి’
సాక్షి, అమరావతి: చెట్టంతా పూత.. దీంతో ఈ ఏడాది ఇక చింత లేదనుకున్నారు..! పిందె పడడమే ఆలస్యం.. తమ పంట పండినట్లేనని భావించారు..! కానీ, పగబట్టినట్లుగా వాతావరణ మార్పులు.. కొత్త రకం పురుగులు కలిపి దాడి చేశాయి..! ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలూ నేలరాలుతున్నాయి. నాలుగు డబ్బులు మిగులుతాయని భావిస్తే.. ఎర్రటి ఎండల్లో నీటి జాడను భ్రమింపజేసే ఎండమావుల్లా మారింది వారి పరిస్థితి. ‘ఆంధ్రప్రదేశ్ మామిడి’ అంటే దేశ విదేశాల్లో గొప్ప పేరు..! అయితే, ప్రస్తుతం చిత్తూరు నుంచి నూజివీడు దాకా ఎటుచూసినా మామిడి రైతులో నిర్వేదమే కనిపిస్తోంది. బంగినపల్లి మొదలు రసాల వరకు పంటను చూస్తే బెంగ పట్టుకుంటోంది. వాస్తవానికి ఏటా డిసెంబరు, జనవరిలో మామిడి పూత వస్తుంది. ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో మొదలైంది. అయితే, శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు ఏ చెట్టు చూసినా పూత బ్రహ్మాడంగా కాసింది. దీంతో దిగుబడికి దిగులు ఉండదని రైతులు ఆశపడ్డారు. కానీ, పూత పిందె కట్టేలోగా వారి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులకు తోడు ‘మాంగో లూఫర్’ అనే కొత్త రకం పురుగు, తెగుళ్లు విజృంభణతో కళ్లెదుటే పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయి. ఇదంతా చూసి రైతులు దిగాలు పడుతున్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో.. రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సువర్ణ రేఖ, నీలం, తోతాపూరి, బంగినపల్లి ప్రధానంగా పండిస్తున్నారు. గత రెండేళ్లలో వరుసగా 49.85 లక్షల టన్నులు, 35.78 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కనీసం 45 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేశారు. అయితే, పూత పట్టింది మొదలు తెగుళ్లు, వైరస్లు విజృంభించాయి. మరోపక్క ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. అసలే పూత ఆలస్యంతో ఇబ్బంది పడుతుండగా, ఉష్ణోగ్రతల ప్రభావం ప్రూట్ సెట్టింగ్ను దెబ్బతీసింది. జనవరి, ఫిబ్రవరిలో 28–29 డిగ్రీల మేర ఉన్న ఉష్ణోగ్రత, ప్రస్తుతం 36–38 డిగ్రీలకు చేరడం మామిడి పంటపై ప్రభావం చూపుతోంది. ⇒ మరోవైపు రాత్రిపూట మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. అనూహ్య వాతావరణ పరిస్థితులతో మగ, ద్విలింగ పుష్పాల నిష్పత్తి (రేషియో) మారిపోయి ఆశించిన స్థాయిలో పిందెలు ఏర్పడడం లేదు. ⇒ మిరపను ఆశిస్తున్న నల్ల తామర పురుగు.. రెండేళ్లుగా మామిడిపైనా దాడి చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని దెబ్బకు మామిడి పూత చాలావరకు మాడిపోయింది. 40 శాతం పైగా పంట మీద నల్ల తామర పురుగు ఉ«ధృతి కనిపిస్తోంది.రాయలసీమలో లిచీ లూఫర్ పురుగు దాడి లిచీ పంటలో కనిపించే అరుదైన మ్యాంగో లూఫర్ (కొత్త రకం గొంగలి పురుగు) ఏపీలో తొలిసారి మామిడిపై వ్యాపిస్తోంది. రాయలసీమతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లార్వా దశలోనే పువ్వులు, ఆకులను తినేసే, పిందెల్లోకి చొరబడే ఈ పురుగులు 20–30 శాతం తోటలను దెబ్బతీస్తున్నాయి. వీటికితోడు వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, పెంకు, తేనె మంచు పురుగు, కాండంతొలుచు, కొమ్మ తొలిచే, గూడు పురుగు వంటి ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా పూత మాడిపోతూ పిందెలు రాలిపోతున్నాయి. ⇒ సాధారణంగా హెక్టార్కు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ ఏడాది మూడు నుంచి నాలుగు టన్నులకు మించి వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. పురుగుమందుల ఖర్చు రెట్టింపు ⇒ విస్తృతంగా పురుగుమందుల వినియోగంతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడు అవుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.20 వేలు వ్యయం కాగా.. ప్రస్తుతం సగటున రూ.40–50 వేల మధ్య ఖర్చు చేస్తున్నారు.సస్యరక్షణ చర్యలు ఇలా...⇒ అజాడిరక్టివ్ 2 మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత బీటీ ఫార్ములేషన్ బాసిల్లస్ తురింజియోస్పిస్ వెరైటీ కుర్స్టాకి(డిపెల్) 1.5–2 మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ క్లోరోఫైరిఫాస్ 50శాతం ఈసీ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో లేదా ఇమామోక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో లేదా నోవాల్యురాన్ 5.25 శాతం ప్లస్ ఇండోక్సా కార్బ్ 4.5 శాతం ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ పురుగుల ఉధృతిని నియంత్రించేందుకు ఎకరాకు 8 పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి. ⇒ 10 ఏళ్లు పైబడిన మామిడి తోటలకు రోజుకు ఒక చెట్టుకు కనీసం 100 లీటర్ల నీటిని అందించాలి. ⇒ పిందెలు ఎక్కువగా రాలిపోతుంటే నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్ (ప్లానోఫిక్స్) 100 ఎంఎల్ 500 లీటర్ల నీటిలో (50 చెట్లు) పిచికారీ చేయాలి. ⇒ నీటి వసతి లేని రైతులైతే పొటాíÙయం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటోప్యూరాన్ 0.25 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టుకొక బ్లూ కలర్ జిగురు అట్ట అమర్చుకోవాలి.ఏం చేయాలో పాలుపోవడం లేదునాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చినప్పటికీ ఎండల తీవ్రతతో పాటు నల్లతామర, కొత్త రకం పురుగుల ప్రభావంతో మాడిపోయింది. పిందెలను కాపాడడానికి పురుగుమందులు విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తోంది. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అవుతోంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెట్టుబడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోలా అధికారులు తోటలను పరిశీలించి సలహాలు ఇవ్వడం లేదు. నిరుడు ధర లేక మామిడిని తోటల్లోనే వదిలేశాం. ఈ ఏడాదైనా గట్టెక్కుదాం అనుకుంటే అసలు ఏంచేయాలో పాలుపోవడంలేదు. – ఆకేపాటి రంగారెడ్డి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం తూర్పుపల్లిపెట్టుబడి కూడా వచ్చేలా లేదు 2.5 ఎకరాల్లో 12 ఏళ్ల వయస్సున్న 200 చెట్లు ఉన్నాయి. ఎండల ప్రభావం, బంక తెగులుతో పూత మొత్తం నేలవాలింది. ఒకటీ అరా పిందెలు వచ్చినా కొత్తరకం పురుగులతో రాలిపోతోంది. ఇప్పటికే పురుగు మందుల కోసం రూ.40–50 వేలు ఖర్చు చేశా. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చా. తీరా కాపు కొచ్చేసరికి తెగుళ్లు, ఎండలు మా కడుపు కొడుతున్నాయి. ఈసారి దిగుబడికి అవకాశం లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. –కె.వెంకటసుబ్బయ్య, అనంతపల్లె, పుల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లా70 శాతం పూత దెబ్బ.. నాకు సొంతంగా ఐదెకరాలుండగా, 15 ఎకరాల్లో తోటలు లీజుకు తీసుకున్నా. ప్రారంభంలో మంచి పూతే వచ్చింది. ఇటీవల కురుస్తున్న మంచుకు తోడు పగటి ఉష్ణోగ్రతల ప్రభావానికి పూర్తిగా మాడిపోయింది. తేనె మంచు, రసం పీల్చే పురుగుల ప్రభావంతో రాలిపోయింది. 60–70 శాతం పూత దెబ్బతిన్నది. మిగిలిన పూతలో అక్కడక్కడా పిందెలు కట్టినా నిలుస్తాయో లేదోనని అనుమానంగా ఉంది. ఈ ఏడాది లీజుతో పాటు పురుగుమందులకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. అది కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. –దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లాఫ్రూట్ కవర్స్తో కొంత మేర రక్షణ కొత్త రకం గొంగలి పురుగు మ్యాంగో లూఫర్తో పాటు నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంది. పూత ఆలస్యమవడంతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో ఫ్రూట్ సెట్టింగ్ జరగక పిందెకట్టడం తగ్గిపోయింది. ఈసారి దిగుబడులు తగ్గే అవకాశాలు కన్పింస్తున్నాయి. పురుగుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. పురుగు మందులను సిఫార్సుల మేరకే వాడాలి. పిందెలను కాపాడుకునేందుకు రైతులు ఫ్రూట్ కవర్స్ కట్టాలి. పిందె నిమ్మకాయ పరిమాణంలోకి వచ్చిన తర్వాత కవర్లు కడితే కాయల సైజుతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది. –డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి,గుంటూరు: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి (Posni Krishna Murali) బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసింది.గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. ఈరోజు పోసాని బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. -
కూటమి ప్రభుత్వంపై నిరసన గళం.. అప్కాస్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం
విజయవాడ: అప్కాస్ విధానం రద్దుకు వ్యతిరేకంగా ఉద్యోగులు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకటో తేదీన జీతాలు తీసుకునే స్థితి నుంచి జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందంటూ ఆందోళన దిగారు. అప్కాస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మంచి చేశారని, దాన్ని రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు హోచ్చరించారు. అప్కాస్ ను యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నామున్సిపల్ కార్మికులు సమస్యలు మాత్రం తీరడం లేదు. అప్కాస్ రద్దు చేయడం దుర్మార్గం. గత ప్రభుత్వం కాలంలో చేసుకున్న ఒప్పందాలను నేటి ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరం చేయడం లేదు. సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదనే ఆలోచనకు ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. అప్కాస్ రద్దు చేస్తే మునిసిపల్ వర్కర్స్ ను ఎక్కడ తీసుకుని పెడతారు.ప్రవేట్ కాంట్రాక్టర్ల బందిఖానాలో వర్కర్స్ ను పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అప్కాస్ రద్దు కూటమి ప్రభుత్వంకి సరైనది కాదు. అప్కాస్ లో మొదటి తేదీనే జీతాలు పడుతున్నాయి.. కాంట్రాక్ట్ వ్యవస్ధ జీతాలు సమయంకి పడవు. అప్కాస్ రద్దు చేస్తే రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తాం. పిబ్రవరి చివరి వరకు జీతాల పెంపుకోసం చూస్తాం. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతాం.మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తే స్వచ్చ సర్వేక్షణ్ ఏవిధంగా సాధ్యం అవుతుంది.. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగితే దానికి బాధ్యత కూటమి ప్రభుత్వందే’ అని సిఐటియు నాయకులు కాశీనాధ్ స్పష్టం చేశారు. -
‘వైఎస్సార్’ను జనం గుండెల్లో నుంచి తొలగించలేరు
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే , పార్టీ అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు. స్వయంగా చంద్రబాబు కుమారుడే లోకేష్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుమట్లు.. కోడుమూరులో నిన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, నాగార్జున యూనివర్శిటీ సహా అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. చివరికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. జనం రావటంతో ఆ ముష్కరులు పారిపోయారన్నారు.‘రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కారులు వైఎస్ఆర్ విగ్రహాలపై పడ్డారు. విగ్రహాలను తొలగించ గలరేమోగానీ జనం గుండెల్లో నుండి వైఎస్సార్ ని తొలగించలేరు. తన తెచ్చిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్ దేవుడయ్యాడు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు అన్నీ తెలుసు. రాయలసీమకు వైఎస్సార్ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారు. వైఎస్ జగన్ నేరుగా ఎన్టీఆర్ పేరుతో జిల్లానే ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం వైఎస్సార్ పేరును తొలగిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే 4 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ కట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. కూటమి నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదువిశాఖపట్నంలో స్టేడియం పేరు తొలగించటం దారుణం. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? , కూటమి నేతలు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లుంచుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు.