Amaravati
-
అప్పటి ‘బుల్లిరాజా’ భజన.. ఇప్పుడు వైరల్
సీతానగరం: తూర్పు గోదావరి జిల్లా మునికూడలిలోని శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘాట్కు అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనమడు దేవాన్ష్ పేరును పెట్టిన వ్యవహారం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ను ప్రసన్నం చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చూపిన అత్యుత్సాహంతో తాజాగా వెలుగుచూసిన ఈ వ్యవహారంపై హిందూ ధార్మీక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.పవిత్ర ఘాట్లకు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆధ్యాతి్మక, చారిత్రక వారసత్వానికి నిలయమైన గోదావరి తీరంలోని మునికూడలిలో దశాబ్దాలుగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ‘శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘట్టం’ 1979 పుష్కరాల సమయంలో ఏర్పాటయ్యింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాట్కు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో నామకరణం చేసి ‘దేవాన్ష్’ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు.అయితే రానున్న పుష్కరాల నేపథ్యంలో ఎమ్మెల్యే బత్తుల ఘాట్ను సందర్శించారు. దేవాన్ష్ ఘాట్ను ఆదర్శంగా, ఒక మోడల్గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారని, కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సర్వత్రా తీవ్ర చర్చ, విమర్శలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అయి.. వివాదాస్పదం కావడంతో లోకేశ్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించారు. ఘాట్కు దేవాన్ష్ పేరు ఉంటే తక్షణం తొలగించాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. -
మైనార్టీ తీరకుండానే మనువు
సాక్షి, అమరావతి: చట్టబద్ధమైన వయసు తీరకుండానే అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 15.9 శాతం మంది అబ్బాయిలు 21 ఏళ్లు నిండకుండానే ఓ ఇంటివారవుతున్నారు. ప్రతి వంద మంది అబ్బాయిల్లో 16 మంది మైనర్లుగానే పెళ్లి చేసుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–6 నివేదిక వెల్లడించింది. 2023–24 సమయానికి చేసిన సర్వేలో దేశంలోని 15.9 శాతం మంది బాలురు మైనార్టీ తీరకుండానే వివాహం చేసుకున్నట్టు గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం, పట్టణ, నగరాల్లో 9.7 శాతం అబ్బాయిల మైనర్ వివాహాలు జరుగుతున్నట్టు తేల్చింది. ఈ తరహా వివాహాలు 2019–21లో 17.7 శాతం ఉండగా, 2023–24 నాటికి కొంత తగ్గుముఖం పట్టాయి. అబ్బాయిల మైనర్ వివాహాల్లో బిహార్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని 25–29 ఏళ్ల పురుషుల్లో 29.6 శాతం మంది 21 ఏళ్లలోపు వివాహాలు చేసుకున్నారు. బిహార్లో అబ్బాయిల మైనర్ వివాహాలు ఏకంగా జాతీయ సగటుకు దాదాపు రెట్టింపు ఉన్నాయి. రాజస్థాన్లో 28.5 శాతం, మధ్యప్రదేశ్లో 25 శాతం, గుజరాత్లో 24.3 శాతం చొప్పున అబ్బాయిల్లో మైనర్ వివాహాలున్నట్టు వెల్లడైంది. రాజస్థాన్లో అమ్మాయిల్లో 24.6 శాతం మైనర్ వివాహాలు ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆ రాష్ట్రంలో కంటే అబ్బాయిల్లో మైనర్ వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 9.7 శాతం, తెలంగాణలో 5.7 శాతం చొప్పున 2023–24లో 21 ఏళ్లలోపే వివాహాలు నమోదయ్యాయి. పల్లెలను మించి పట్టణాల్లో.. బాల్య వివాహాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయనే భావన ఉంది. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనూ అబ్బాయిలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా బాలుర మైనర్ వివాహాలు 12.5 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య ఏకంగా 15.1 శాతం, గ్రామీణంలో 12.1 శాతం మాత్రమే కావడం గమనార్హం. నాగాలాండ్లో సైతం పట్టణాల్లో 13.8 శాతం, గ్రామాల్లో 8.2 శాతం మేర మైనర్ బాలుర వివాహాలు నమోదయ్యాయి. -
రాజకీయ కుట్రతోనే నాపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: కనీస ఆధారాలు లేకుండా తనపై దు్రష్పచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న టీడీపీ అనుకూల ఎల్లో మీడియాపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని వైఎస్సార్సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్రెడ్డి (కేఎన్ఆర్) ప్రకటించారు. ఎల్లో మీడియా దు్రష్పచారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు సంబంధంలేని మద్యం విధానంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆ ప్రకటనలో కేఎన్ఆర్ ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవీ.. ⇒ ఎల్లో మీడియా నాపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతోంది. నేను సీనియర్ జర్నలిస్ట్ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశా. 20 ఏళ్ల కిందటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టి అప్పటి నుంచి ఆదాయపు పన్ను రిటరŠన్స్ దాఖలు చేస్తున్నా. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా. నాకు ఏమాత్రం సంబంధంలేని అంశాలను ఆపాదిస్తూ విష ప్రచారం చేస్తున్నారు. నా బంధువులు, స్నేహితుల ఆస్తులు కూడా నావే అనడం ఎంతవరకు న్యాయం? అలా అయితే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరినీ అలాగే చూడాల్సి వస్తుంది. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బి.ఆర్.నాయుడు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయా? ⇒ విశాఖపట్నంలో ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల విషయాన్ని వక్రీకరిస్తూ నాపై దు్రష్పచారం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డుకు చెందిన 97.50 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం ఏపీ ప్రభుత్వం, సింగపూర్కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆ ఒప్పందం చేసుకున్నారు. అదంతా చట్టబద్ధ వ్యవహారమే. దాంతో నాకే మాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఆ మొత్తం ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది. ⇒ ఎల్లో మీడియా ప్రస్తావించిన రమణారెడ్డి సింగపూర్వాసి. ఆయన మత్సడో కంపెనీలో వాటాదారు కూడా కాదు. కానీ ఆయనకు, నాకు మధ్య ఏదో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఆయన 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఏపీలో వ్యాపారాలు ప్రారంభించారు. విశాఖపట్నంలోనే నాలుగు ప్రాజెక్టులు చేపట్టారు. చంద్రబాబుకు సింగపూర్లో మంత్రులు, వ్యాపారవేత్తలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చంద్రబాబుకే సన్నిహితుడు. సింగపూర్కు చెందిన జురాంగ్ కంపెనీని అమరావతికి తీసుకురావడంలో రమణారెడ్డే సహకరించారని కూటమి ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆయన నాకు బినామీ ఎలా అవుతారు...? ఆయన నా బినామీగా ఎల్లో మీడియా ఎలా దు్రష్పచారం చేస్తుంది? ⇒ విజయవాడలో ఎవరో రియల్టర్ను నేను బెదిరించినట్లు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతోంది. నేను గన్ పెట్టి మరీ బెదిరించానని విష ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. రాజకీయ కుట్రతో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటా. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్కు సంబంధమే లేదు ⇒ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఆర్బిట్రేషన్కు వక్రీకరణలు చేస్తారా? ⇒ ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా.. బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చట్టరీత్యా నేరం విశాఖపట్నం హౌసింగ్ బోర్డుకు చెందిన 97.5౦ ఎకరాల అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో అనేక కంపెనీలు, వ్యక్తులు దాదాపు రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధంగా నడిచిన ప్రక్రియ. కానీ పనులు ఎంతకూ ప్రారంభం కాకపోవడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి, అందులో పెట్టుబడులు పెట్టిన వారికి మధ్య ఉన్న వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దీనిపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ జరిగింది. మత్సడో కంపెనీ తన వద్ద పెట్టిన పెట్టుబడుల మేరకు భూములను అప్పగించింది. ఆ కంపెనీలో దాదాపు 13 పార్టీలు పెట్టుబడులు పెడితే.. ఒక్కో పార్టీలో మళ్లీ వేర్వేరు కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు. ఇందులో 13వ పార్టీలో ఒక కంపెనీతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురిలో కేఎన్నార్ బావమరిది రాంగోపాల్రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కలసి పెట్టిన పెట్టుబడికి గాను వివాద పరిష్కారంలో భాగంగా 2.5 ఎకరాలను మత్సడో వారికి దఖలు పరిచింది. ఈ వ్యవహారం అంతా చట్టపరంగా జరిగింది. ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా కూడా దీనికి బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో ప్రస్తావించిన సింగపూర్ వాసి రమణారెడ్డితో మత్సడోకు, దాంట్లో పెట్టుబడి పెట్టున వారికి ఎలాంటి సంబంధం లేదు. అతను వాటాదారు కూడా కాదు. ఎలాంటి క్రయ విక్రయాలు కూడా జరపలేదు. రమణారెడ్డి, కేఎన్నార్ మధ్య బినామీ వ్యవహారం నడిచినట్టుగా తప్పుడు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్కు సంబంధమే లేదు. విష కథనాలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసినందుకు కోర్టుకు ఈడుస్తాం. – పి.శ్రేయస్రెడ్డి, న్యాయవాది -
విష ప్రచారం దుర్మార్గం.. మేం రైతులం కాదా
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి రైతులపై సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తామంతా నిజమైన రైతులమేనని ఆదివారం వారు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చేత పట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం, దుండగులం కాదని నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించకముందే కోట్ల రూపాయల విలువ ఉందని చెప్పారు. తుళ్లూరులో రూ.5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పట్లోనే ఎకరం రూ.కోట్లు పలికిందని తెలిపారు. ‘అక్కడ 2 ఎకరాల నుండి 10 ఎకరాలున్న రైతులు ఎక్కువ మంది ఉంటే, ఈ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వారికి కౌలు సంవత్సరానికి రూ.లక్షల్లో వస్తుంది. మాకు వేలల్లో కూడా రాదు. ఆ కౌలుతో మేము ఎలా బతకాలి? రాజధాని ప్రకటించినప్పటి నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసముండే కొంత మంది టీడీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోంది. ఫలితంగా 150 పైచిలుకు యూట్యూబ్ చానల్స్లో మాలో ప్రతి ఒక్కరి గురించి వేర్వేరుగా మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా విష ప్రచారం చేస్తున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇంకా ఏమన్నారంటే.. దుష్ప్రచారం చేయడం సరికాదుఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడానికి 99 శాతం మంది రైతులు కులాలు, మతాలతో సంబంధం లేకుండా భూములను అందజేశాం. 20–25 సెంట్లు ఉన్న రైతులకు ఇదే జీవనాధారం కాబట్టి లాండ్ పూలింగ్ నుంచి, ఇతర అంశాల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దీన్ని వేరేవిధంగా స్క్రోలింగ్ చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. తుళ్లూరులో 2015కు ముందు ఎకరం రూ.5 లక్షలు ఉంటే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రూ.4 కోట్లు ఉండేది. 2014కు ముందు ఉండవల్లి, పెనుమాకలో ఎకరం భూమి అమ్మి తుళ్లూరులో 10–20 ఎకరాలు కొనొచ్చు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అన్నయ్య, సినీ హీరో చిరంజీవి 2010కి ముందు ఇక్కడ ఎంతకు పొలం కొన్నారో విచారించండి. అప్పుడు మేము అడిగేది న్యాయమా.. కాదా.. అని మీకే తెలుస్తుంది. కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి గుహల ముందు టౌన్ ప్లానింగ్ అభివృద్ధికి 400 ఎకరాల పొలం తీసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్ వెళ్లి కలసి మా సమస్య విన్నవించుకున్నాం. నాలుగు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ 20–25 సెంట్ల పొలాల్లో రెండు మూడు పంటలను ఒకేసారి పండిస్తున్నాం. తుళ్లూరు.. ఆ చుట్టు పక్కల వర్షం పడితేనే పంటలు పండుతాయి. వారికి ఆ భూములు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. మాకు మా కుటుంబాలకు ఈ భూములే జీవనాధారం. మా భూములను మాకు వదిలేయండి..మేము అభివృద్ధికి అడ్డంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కు ప్రయత్నించినా ఇవ్వలేదు. మా భూములను రక్షించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశాము. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ను కలసి మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి. మా భూములను మాకు వదిలేయండి. భూ సమీకరణ/భూ సేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించండి. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం’ అని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు ఈశ్వర్రెడ్డి, ఈశ్వరరావు, ఉండవల్లి అశ్వనికుమార్, భాస్కరరావు, మున్నంగి శ్రీధర్రెడ్డి, గుంటక నరేష్రెడ్డి, చందు చిన్న బసవయ్య, గోపాలం ప్రభాకరరావు, అశోక్రెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవరెడ్డి, ఈశ్వరయ్య, తెన్నేరు కోటేశ్వరరావు, తెన్నేరు నాగభూషణం, సందు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీళ్ల మాటలు నమ్మొద్దు
తాడేపల్లి రూరల్: ‘రాజధాని గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం బుజ్జగింపులు, వేధింపులతో లోబరుచుకుంటోంది. తొలుత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, అధికారులను మన దగ్గరకు పంపించి బుజ్జగిస్తుంది. ఓ అధికారి మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లోపే ఆయన స్థానంలో మరో అధికారి వస్తారు. నాకు తెలియదని చెబుతారు. ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. అందుకని రైతులందరం ఒకేతాటిపై నిలిచి పోరాటం చేద్దాం’ అని రైతు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కన్నారావు నాయుడు అన్నారు.ఈ నెల 9వ తేదీన మంగళవారం జరిగే గ్రామసభ సన్నాహాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఉండవల్లిలో రైతులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలో ఏం మాట్లాడాలి.. అధికారుల ప్రశ్నలకు ఏవిధమైన సమాధానాలు చెప్పాలి.. ఎలాంటి అభ్యంతరాలు తెలపాలనే విషయమై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, మున్నంగి శ్రీధర్రెడ్డిలు మాట్లాడారు.అనంతరం డాక్టర్ కన్నారావు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని తనలాంటి వ్యక్తులను కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్లు అసభ్యంగా పోస్టులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గిస్తారు.. ‘అధికారులు మన భూములు తీసుకునేందుకు మొదట బుజ్జగించారు. కొంతమంది రైతులు వారికి సహకరించారు. అయినా వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. పంట పండించే రైతుకు రాజకీయ నాయకుల, అధికారుల రాజకీయం తెలియదు. మనపై ప్రేమ ఉన్నట్లు రాజధానిలో ఎక్కడా లేని విధంగా భూముల రేట్లు పెంచి మన భూములు తీసుకుంటారు. ఇక్కడే అసలు రాజకీయం ఉంది. కొన్న భూమిని అతి తక్కువ వ్యాల్యూతో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. దీంతో గ్రామంలోని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.మనందరం మన భూమిని అమ్ముకోవడంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గిస్తే గ్రామాన్ని నాశం చేసినట్లే. 1995 నుంచే మన భూములకు ఎక్కువ విలువ ఉంది. తాడేపల్లి భూముల కన్నా మన భూముల రేట్లే ఎక్కువ. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయస్థానాల్లో మనకు న్యాయం లభిస్తుంది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం గ్రామంలో సామాజిక సర్వే జరపాల్సి ఉంది. దాన్ని సైతం క్రాస్ చేసి.. అధికారులు వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నింటిపై ఒకేసారి గ్రామసభ నిర్వహించకూడదు. కానీ, అధికారులు విడివిడిగా జరిపినట్లు రాసుకుంటారు.వీటన్నింటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మన భూమి అంగుళం కూడా పోకుండా పోరాటం నిర్వహిస్తే మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది’ అని కన్నారావు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రైతులు దంటు బాలాజీరెడ్డి, పల్లపోలు అశోక్రెడ్డి, ఉప్పు రవి, కళ్లం సాంబిరెడ్డి, శిగిరిశెట్టి రత్నబాబు, శింగంశెట్టి రాంబాబు, పెన్నేరు కోటేశ్వరరావు, గుర్రాల గోపాలరావు, పెన్నేరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేనలో కాక రేపుతోంది. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతుండగా.. జనసేనలో పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని మరోసారి తేటతెల్లమైందని, ఇలాగైతే పార్టీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అత్యధిక చోట్ల ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలకే సీట్లు దక్కాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. లాబీయిస్టు సానా సతీష్, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్కి పదవుల పందేరంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతూ ఆదివారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసినా రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీలో దళిత సామాజికవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిసారీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో వర్ల రామయ్య పేరును తెరపైకి తేవడం చివరకు సామాజిక సమీకరణాల పేరుతో పక్కనపెట్టి అవమానించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అనే విషయం మరోసారి రుజువైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకపోగా పదవుల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రామయ్య సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. యనమల గుర్రు.. కంభంపాటి కస్సు..! సీనియర్ నేత యనమల రామకృష్ణుడి బాధ వర్ణనాతీతమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పెద్దల సభకు పంపాలని పదేపదే ప్రాథేయపడినా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై యనమల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నారా లోకేష్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ధన బలం ఉన్న వారిని పార్టీ నేతలుగా చిత్రీకరించి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు సైతం తనను అవమానించారని ఆవేదనతో రగిలిపోతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని అయినప్పటికీ పదవుల విషయంలో వంచించారని ఆయన వాపోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, ఎంఏ షరీఫ్ తదితర నేతలు సైతం తమకు అన్యాయం చేశారని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఒక్క మహిళా కనపడలేదా? మూడు స్థానాల్లో టీడీపీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని మహిళా లోకం నిలదీస్తోంది. మహిళల కోసమే టీడీపీ ఉందని మహానాడులో తీర్మానాలు చేసి తీరా రాజ్యసభ సీటు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు. కార్పొరేట్ వైపే మొగ్గు.. తన కుమారుడి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న సానా సతీష్కి మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తాను లాబీయిస్టుల వైపే మొగ్గు చూపుతానని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సతీష్ వివాదాస్పద వ్యక్తి అని, అతడితో కలిసి తిరిగితే జనం ఏమనుకుంటారని ఎల్లో మీడియాకు చెందిన ఏబీఎన్ రాధాకృష్ణ తన తొలి పలుకులో ప్రశ్నించారు. టీడీపీలో సీనియర్లంతా వ్యతిరేకించినా సతీష్కు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి ఆయన రాజ్యసభకు పంపుతుండటాన్ని బట్టి తమ బంధం ఎంత బలమైందో రుజువు చేశారు. భాష్యం రామకృష్ణ కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నా ఆయనకే అవకాశం ఇవ్వడం ద్వారా కార్పొరేట్ శక్తులంటే తనకు మక్కువని చంద్రబాబు తేల్చేశారు. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ దురహంకారి కావడంతో పార్టీలో ఆయన పట్ల పూర్తి ఆమోదం లేదు. అందుకే పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల నుంచి చాలాకాలం క్రితమే ఆయన్ను తప్పించారు. అయితే లోకేష్కి సన్నిహితుడు కావడం, ధన బలం ఆధికంగా ఉండడంతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని తరచూ చెబుతూ తండ్రికి స్పీకర్ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని టీడీపీలో ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. నాలుగింటిలో రెండు సొంత వర్గానికే.. కూటమి తరఫున నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతుండగా రెండు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలోనూ వినిపిస్తోంది. జనసేన తరఫున సీటు పొందిన లింగమనేని, టీడీపీ తరఫున సీటు దక్కించుకున్న భాష్యం రామకృష్ణ.. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఆయనకు సన్నిహితులనే విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. విజయ్ సత్తా చూశాకైనా మారకుంటే ఎలా? జనసేన అంటే టీడీపీకి బీ టీమ్ అని ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా పార్టీకి దక్కిన రాజ్యసభ సీటును సైతం చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తికే కేటాయించడం పట్ల జన సైనికుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి ఓ బడా వ్యాపారవేత్తను పెద్దల సభకు పంపడం వెనుక అంతర్యమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతల్లో ఎవరికైనా ఆ పదవి ఇచ్చి ఉంటే జనసేన క్యాడర్ చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. ‘కష్టపడేవారికి గుర్తింపు లేకుండా.. పైరవీలు, ఆర్థిక అండదండలు ఉన్నవారికే పదవులు కట్టబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు? ఇలాగైతే జనసేన బలపడేదెలా?’ అంటూ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రెండేళ్లలోనే అధికారంలోకి రాగలిగిన సీఎం విజయ్ ఎక్కువగా కొత్త వ్యక్తులకే అవకాశం కల్పించారని.. దళపతి సత్తా, ఆ పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం చూసిన తర్వాత కూడా పవన్కళ్యాణ్ మారకపోతే ఎలా? అని జనసేన సైనికులు ప్రశ్నిస్తున్నారు. -
బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
సాక్షి,అమరావతి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలబడుతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బ్రహ్మనాయుడు అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఆదివారం బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబుతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన న్యాయ సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు. -
చీకట్లో మగ్గుతున్న మగ్గాలు
చేనేత.. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తరువాత అత్యధికులకు ఉపాధినిచ్చే రంగం. వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం ఇలా ఊరేదైనా ప్రతిచోటా మగ్గాలపై నేసే చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అలాంటి చేనేత రంగాన్ని సీఎం చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారు. మహర్దశ తెస్తానంటూ చివరకు మగ్గాన్నే విరిచేస్తున్నారు. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని 22 నెలలపాటు అమలు చేయలేదు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినా సగం మగ్గాలకు కూడా అమలు చేయడం లేదు. కనీసం ఉచిత విద్యుత్ కూడా దక్కకపోవడంతో చేనేత కుటుంబాలు చంద్రబాబు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశల రంగులు క్రమంగా వెలిసిపోతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత రంగానికి ఇలాంటి వారెందరో ఉచిత విద్యుత్ అందకపోవడంతో మగ్గాలు చీకట్లోనే మగ్గిపోతున్నాయి. తమను గెలిపిస్తే హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక 9 నెలలకు గానీ ఉచిత విద్యుత్కు సంబంధించిన జీఓ ఇవ్వలేదు. ఆ తరువాత జీఓ ఇచ్చినా 13 నెలలపాటు అమలు చేయలేదు. ఫలితంగా 22 నెలలపాటు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అక్కరకు రాలేదు. తీరా అమలులోకి వచ్చేసరికి లబ్దిదారుల సంఖ్యను గమనిస్తే.. పథకం అమలులో కొరవడిన చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మే నెల(ఏప్రిల్ బిల్లు)లో ఉచిత విద్యుత్ లబ్ధి కేవలం 57,247 మందికేనని ప్రభుత్వం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న సంఖ్య ఇంకా తక్కువే ఉంటుందని చేనేత సంఘాల నేతలు చెబుతున్నారు. క‘రెంట్’ షాక్ నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం దక్కకపోవడానికి వారు అద్దె ఇళ్లలో ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు. చాలామంది నేత కార్మికులకు సొంత ఇళ్లు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఇంటి యజమాని సంతకం చేసిన నోటరీ అఫిడవిట్, ఆధార్కార్డు, కరెంటు బిల్లు సమరి్పంచాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. లబ్ధిదారులు అద్దె ఇళ్లలో ఉంటున్నట్టు నోటరీ అఫిడవిట్ ఇచ్చేందుకు యజమానులు అంగీకరించడం లేదు. అఫిడవిట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు మంగళగిరిలో అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఏప్రిల్ నెలలో రూ.1,399 బిల్లు వచ్చిందని, మే నెల రూ.2,058 వచ్చిందని శ్రామిక నగర్కు చెందిన నేతన్న దంపతులు వాపోయారు. తమ ఇంటి యజమాని నుంచి నోటరీ అఫిడవిట్ తీసుకుని అధికారులకు సమర్పించినా ఉచిత విద్యుత్ పథకంలో తమ పేరు వచ్చిందో లేదో కూడా చెప్పడం లేదని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంటున్న ఓ నేతన్న కుటుంబాన్ని ఉచిత విద్యుత్ ఎందుకు రాలేదని ఆరా తీయగా.. ‘ఏమో అన్నా. నాకు తెలియదు. వచ్చే జాబితాలో వస్తుందంటున్నారు. దయచేసి నా పేరు పేపర్లో రాయొద్దు. దీనికోసం టీడీపీ నాయకుడికి రూ.3 వేలు ఇచ్చాను. ఈసారి కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా’ అని చెప్పడం గమనార్హం. మంగళగిరికి ప్రత్యేకం.. రాష్ట్రానికి మంగళం చేనేత సంఘాల ప్రతినిధులు చెబుతున్న లెక్కల ప్రకారం మంగళగిరిలో మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలు వెయ్యిలోపే ఉంటాయి. అయితే.. ఇక్కడ 2,463 మందికి ఉచిత విద్యుత్ పథకం వర్తింపచేశారు. టీడీపీ నేతలు ఎవరికి ఇవ్వమంటే వారికి అధికారులు ఇచ్చేశారు. అయితే.. పాత మంగళగిరి ప్రాంతానికి చెందిన 28 మంది అర్హులకు ఇంకా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో చీరాల, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో వివిధ రకాల సాకులు చూపి అర్హులకు మంగళం పాడేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 22 నెలలకు రూ.189 కోట్లు నష్టపోయిన నేతన్నలు ఉచిత విద్యుత్ పథకాన్ని 22 నెలల జాప్యం చేయడంతో రాష్ట్రంలోని నేతన్నలు మొత్తం రూ.189 కోట్లు నష్టపోయినట్టు అంచనా. రాష్ట్రంలో 93 వేల చేనేత మగ్గాలు, 10,534 మరమగ్గాలు కలిగిన మొత్తం 1,03,534 మందికి ఉచిత విద్యుత్ వర్తింపచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి ఉంటే రాష్ట్రంలో 1,03,534 కుటుంబాలకు 22 నెలల కాలంలో రూ.189,02,66,400 లబ్ధి చేకూరేది. చేనేత మగ్గాలు కలిగిన ఒక్కొక్క నేతన్న నెలకు రూ.720 (నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్) చొప్పున 22 నెలలకు రూ.15,840 చొప్పున నష్టపోయారు. ఈ లెక్కన మొత్తం 93 వేల కుటుంబాలకు రూ.147,31,20,000 మొత్తాన్ని కోల్పోయారు. మర మగ్గాలు కలిగిన నేతన్న నెలకు రూ.1,800 (నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్) చొప్పున 22 నెలలకు రూ.39,600 లబ్ధి దక్కకుండా పోయింది. మర మగ్గాలు కలిగిన మొత్తం 10,534 మంది రూ.41,71,46,400 నష్టపోయారు. మంత్రి నోట.. పూటకో మాట ఉచిత విద్యుత్ అమలు పథకంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పూటకో మాట చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 29న సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రకటించారు. అందులో 93,000 చేనేత కుటుంబాలు, 10,534 మరమగ్గాల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అర్హులైన ప్రతి నేతన్నకు ఈ పథకం అందుతుందని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.85 కోట్ల భారాన్ని భరిస్తోందని పేర్కొన్నారు. మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. మే 2న మంత్రి మాట్లాడుతూ.. జీరో బిల్లుతో నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 50,252 చేనేత కుటుంబాలు, 6,995 మరమగ్గాల కుటుంబాలను (మొత్తం 57,247) గుర్తించినట్టు చెప్పారు.నేతన్న నేస్తం ‘జగన్’ 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చేనేతల కోసం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గత టీడీపీ ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.3,706 కోట్లకుపైగా వెచ్చించింది. కేవలం ఒక్క వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా నగదు జమ చేశారు. నేతన్న నేస్తం పథకం ద్వారా మొత్తం రూ.982.98 కోట్ల ఆర్థిక సాయం అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. వైఎస్ జగన్ అందించిన చేయూతతో చేనేత కుటుంబాల్లో సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. చేనేత కుటుంబాల్లో 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే.. జగన్ అందించిన ప్రోత్సాహంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకుపైగా ఆదాయం ఆర్జిస్తూ నేతన్నలు నిలదొక్కుకున్నారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు ప్రత్యేకంగా కోవిడ్ సాయం అందించి జగన్ ఆదుకున్నారు. నేతన్నలను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేతన్నలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించిన నేతన్న నేస్తాన్ని కొనసాగిస్తామని, ఏడాదికి రూ.25 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. 22 నెలలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. 57 వేల మందికే ఉచిత విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం. ఎటువంటి ఆంక్షలు లేకుండా రాష్ట్రంలో ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్ అందించాలి. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమిస్తాం. – బీరక సురేంద్ర, మాజీ చైర్మన్, దేవాంగ కార్పొరేషన్చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత సమస్యలపై మంత్రి లోకేశ్ను కలిసి వినతిపత్రం సమరి్పస్తే తీసుకున్నారు. 6 నెలల తరువాత చేనేత కార్మికులకు రూ.2వేల కోట్లు కావాలా అంటూ వెటకారం చేశారు. మంత్రి సవితను కలిసి వినతిపత్రం ఇస్తే.. నేతన్న నేస్తం ఇచ్చి జగన్ చేనేత కార్మికులను తాగుబోతులను చేశారంటూ కించపరిచారు. చేనేత కమిషనర్ రేఖారాణిని కలిస్తే.. ఫొటో కోసమే వచ్చారు కదా అని అవమానపరిచారు. చేనేత సహకార సంఘాలకు రూ.203 కోట్ల బకాయిలు, చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ రూ.25 కోట్లు ఇవ్వకుండానే అన్నీ ఇచ్చేసినట్టు అసెంబ్లీ సాక్షిగా మంత్రి సవిత అబద్ధాలు చెప్పారు. ఇప్పటికైనా హామీలు అమలు చేసి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలి. – పిల్లలమర్రి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర చేనేత కార్మిక సంఘంబ్రిటిష్ కాలంలో లేని పన్నులు వేశారు బ్రిటిష్ కాలంలో సైతం చేనేతపై పన్నులు లేవు. జీఎస్టీలో చేనేత చేర్చి 18శాతం పన్ను వసూలు చేయడం దారుణం. పవర్లూమ్స్కు 6శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న ప్రభుత్వం హ్యాండ్లూమ్కు 18 శాతం వసూలు చేయడం దుర్మార్గం. జీఎస్టీని ఎత్తివేసి చేనేత రంగానికి ఊతమివ్వాలి. రాష్ట్రంలో చాలా మందికి ఉచిత విద్యుత్ అందకపోయినా చెప్పుకోలేకపోతున్నారు. ప్రతి చేనేత కార్మికుడికి ఆంక్షలు లేకుండా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయాలి. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తాం. – కూరపాటి కోటేశ్వరరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకుడుఈయన పేరు సాన రామలక్ష్మయ్య. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని శ్రామికనగర్లో ఉంటున్నారు. 58 ఏళ్ల వయసున్న రామలక్ష్మయ్య దాదాపు 35 ఏళ్లుగా చేనేత వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ వెలుగులు ఆయనకు అందటం లేదు. ఆ పథకంలో ఆయన పేరు లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక ఏప్రిల్ నెలకు సంబంధించి మేనెలలో వచ్చిన కరెంటు బిల్లు రూ.645 చెల్లించక తప్పలేదని వాపోతున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక తనకు ఏ స్కీమ్ రాలేదని, కనీసం ఉచిత విద్యుత్ అందించినా కరెంటు బిల్లు భారం తగ్గుతుందని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాడు. ఈమె పేరు యర్రా నాగలక్ష్మి. పెడన నియోజకవర్గంలోని కప్పలదొడ్డికి చెందిన ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మరణించినా ధైర్యాన్ని కూడగట్టుకుని మగ్గం నేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు ఉచిత విద్యుత్ పథకం వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. అద్దె ఇంట్లో దయనీయ స్థితిలో జీవిస్తున్న నాగలక్ష్మికి ఇంటి యజమాని నోటరీ ఇవ్వలేదనే కారణం చూపి అర్హత లేదన్నారు. యజమాని నోటరీ ఇచ్చేందుకు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడంతో నాగలక్ష్మికి ఉచిత విద్యుత్ వెలుగులు అందకుండా పోయాయి. అద్దె ఇంట్లో ఉండేవారికి యజమాని నోటరీతో నిమిత్తం లేకుండా ఉచిత వెలుగులు అందించాలని నాగలక్ష్మి వేడుకుంటోంది. -
కొనసాగుతున్న భగభగలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గడంలేదు. ఆదివారం కోస్తా ప్రాంత ప్రజలను భానుడి భగభగతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 43.2, పల్నాడుజిల్లా పిడుగురాళ్లలో 43.1, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, గుంటూరు జిల్లా పాండ్రపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 42.6, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వర్షాలు మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం, ప్రకాశం జిల్లా అద్దంకి, జరుగుమిల్లి, నెల్లూరు జిల్లా వింజమూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు కూడా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో కొనసాగనున్న ఎండ తీవ్రత మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలి
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): గడువు ముగిసి మూడేళ్లయినా పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించకపోవడం బాధాకరమని ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు అన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకపోయినప్పటికీ కమిషనర్ను నియమించకపోవడం శోచనీయమన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని ఏపీ రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ (అమరావతి) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. పీఆర్సీ కమిషనర్ను నియమించి, మధ్యంతర భృతి ప్రకటించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచాలని... తదితర 12 అంశాలపై ఏకగ్రీవంగా ఈ సమావేశంలో తీర్మానం చేశారు. పీఆర్సీ జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు జేఏసీ ప్రకటించే ఎలాంటి కార్యాచరణకైనా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. అనంతరం మీడియాతో బొప్పరాజు, పలిశెట్టి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషనర్ రాజీనామా చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం కమిషనర్ను నియమించలేదన్నారు. ఫలితంగా ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 2023 ఐఆర్ చెల్లిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు గతేడాది అక్టోబర్ 25న ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పీఆర్సీ అంశాన్ని ఆయనకు వదిలేయాలని చెప్పడంతో ఉద్యోగులంతా సహనంతో వేచి ఉన్నారన్నారు. కానీ ప్రభుత్వం నుంచి పీఆర్సీ కమిషనర్ నియామకం, మధ్యంతర భృతిపై కనీస స్పందన లేదన్నారు. మారిన పరిస్థితులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్ వెంటనే చేపట్టాలన్నారు. ఉద్యోగులు ట్యాక్స్లు చెల్లిస్తున్నప్పటికీ సరెండర్ లీవ్ కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్లో చూపాలని డిమాండ్ చేశారు. చెల్లింపులపై రోడ్డు మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉద్యమ కార్యాచరణ తప్ప వేరే ప్రత్యామ్నయం కనిపించడం లేదన్నారు. ఉద్యమ కార్యాచరణ, కలిసొచ్చే సంఘాలతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. ఉద్యోగులంతా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పారె లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
మా చావులకు కారణం కావొద్దు
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘నిర్దిష్ట సమయం ప్రకారం మా చేత పనులు చేయించుకోండి. అంతేగాని ఒకేసారి అన్ని పనులు పూర్తి చేయాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి మా చావులకు కారణం కావొద్దు. ఒత్తిడి భరించలేక ఇప్పటికే 70 మందికి పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిలో కొన్ని కూడా అమలు చేయలేదు. ఉద్యోగుల అసంతృప్తిని, ఆవేదనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నెల 15లోగా హామీలు అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. లేనిపక్షంలో 16వ తేదీ నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తాం’ అని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్లు, పెండింగ్ ఇంక్రిమెంట్లు, హేతుబద్దీకరణ, డెప్యుటేషన్లు, పెరుగుతున్న పని భారం, ఎన్నికల విధులపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. నిర్దిష్ట సమయం లేకుండా డ్యూటీలు రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం జేఏసీ చైర్మన్ జి.సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్ట సమయం ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేస్తున్నారని చెప్పారు. దీంతో పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడితో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే 70 మందికి పైగా బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. కర్నూలులో సచివాలయ ఉద్యోగి మహమ్మద్ హుస్సేన్ కేవలం ఒత్తిడి కారణంగానే మృతి చెందాడని తెలిపారు. ఒక పని తర్వాత మరో పనిచేయడానికి తాము సిద్ధమేనని, అయితే, ప్రభుత్వం అన్ని పనులు ఒకేసారి చేయాలని ఒత్తిడి చేసి ఉద్యోగుల చావులకు కారణం కావొద్దని కోరారు. ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదోన్నతుల అంశాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఉద్యోగులు ఇప్పటికే చేరుకున్న పే స్కేల్లోనే పదోన్నతులను చూపించడం వల్ల అసలు ప్రయోజనం లేకుండా పోతోందన్నారు.జేఏసీ అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ హేతుబద్దీకరణ పేరుతో ఉద్యోగులను వివిధ కార్యాలయాలకు డెప్యుటేషన్పై పంపడం వల్ల వారి బాధ్యతలను సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులే నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పడుతోందన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు తమ శాఖల విధులతోపాటు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇతర విధుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ కో–చైర్మన్లు చేవూరి వెంకట్, గంటా రామకృష్ణ, బెక్కం రవితేజ, పువ్వుల కిరణ్కుమార్, మేరిరాజు, హంపిరెడ్డి, శ్రీమన్నారాయణ, మణికంఠ, కిషోర్, హనుమంతరావు, మహబూబ్ సుభాని, కృష్ణచైతన్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్
సాక్షి,వైఎస్సార్ జిల్లా: రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. లాబీయింగ్ చేసే వారికే అవకాశాలుంటాయని ఆ పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మొండిచేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.రాజ్యసభ సీటు రాకపోవడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అలకబూనారు. సోషల్ మీడియాలో శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిని వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదు. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపించింది. కష్టపడిన నేతలకు గుర్తింపు లేదంటూ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. కాగా, ఇటీవలే ఆయనకున్న పోలిట్ బ్యూరో సభ్యుడి పోస్ట్ తీసేసి జోనల్ కో ఆర్డినేటర్ స్థాయికి తగ్గించింది. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.…— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) June 7, 2026 -
కూటమి సర్కార్పై ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 28 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. కలిసొచ్చే సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం. ఉద్యమ కార్యాచరణకు అందరూ కలిసిరావాలి అని అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి భారమెలా అవుతారు?. రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు.ఆర్టీసీ ప్రైవేటీకరణపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. -
గుంటూరు: సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతుల ఆందోళన చేపట్టారు. ఉండవల్లి రైతులను ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటివరకు అవకాశం దొరకలేదన్నారు. విజయవాడ కిలోమీటరు దూరం. ఇక్కడ 2015లోనే విల్లాలు, 2014కి ముందే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన ఊర్లో మమ్మల్ని రైతులే కాదంటే ఎలా అంటూ ప్రశ్నించారు.ఉండవల్లిని ఎల్పీఎస్, ఎల్ఏ నుంచి విరమింప చేయాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతుల భూముల్ని ప్రాజెక్టు లేకుండా అనవసరంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘మా భూముల్ని ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ నుంచి పూర్తిగా తప్పించండి. 2014లో రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్లో ఉంది. తాడేపల్లి తర్వాత టాప్ ఊరు ఉండవల్లి గ్రామం అని రైతులు అన్నారు.మా సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిస్తే తప్పేంటి? అంటూ రైతులు ప్రశ్నించారు. వైఎస్ జగన్ని కలిశామనే అక్కసుతో తమను టార్గెట్ చేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కులం పేరుతో దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. కావాలనే తమపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. ఉండవల్లిలో వెంటనే భూసేకరణ నిలిపేయాలి. ఇంకా మేము భూములు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు తేల్చిచెప్పారు. -
ప్రైవేటుకు దోచిపెట్టేద్దాం..
అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని నిర్ణయించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్ వంటి కీలక సేవలకు చేసే వ్యయాలను యూజర్ చార్జీల రూపంలో ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రభుత్వ ఆస్తులను, భవనాలను, రహదారులను, బస్టాండ్లను, ఆడిటోరియంలు, తదితర కీలక వ్యాపార కేంద్రాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ రంగానికి అప్పగించాలని వ్యూహ రచన చేసింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వినియోగంలో లేని ఆస్తులను ప్రైవేట్ సంస్థకు, వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఆదాయ వనరులను సృష్టించాలని నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంట్రాక్టర్లకు పూర్తి భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేయడం కొసమెరుపు. ఈ మేరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టేందుకు పీపీపీ విధానంలో మార్గదర్శకాలను మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ జారీ చేసింది. మార్గదర్శకాల్లో కీలకాంశాలు.. భారీ లోటు.. తప్పట్లేదు రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిధ ఉప రంగాలలో సుమారు రూ. 45,000 కోట్ల ఆర్థి క లోటు ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాల లోటును పూడ్చడానికి ప్రైవేట్ రంగ మూలధనాన్ని సమీకరించడం, సామర్థ్యాలను పెంచడం వంటి ప్రత్యామ్నాయ ఆర్థి క విధానాలను అనుసరిస్తున్నాం. ఇందులో భాగంగా నీటి సరఫరా–వనరుల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి పారుదల– నిర్వహణ, నగర రహదారుల మెరుగుదల–అభివృద్ధి, మెట్రో రైలుతో సహా సామూహిక రవాణా, నగర వృద్ధి కేంద్రాలు, కమాండ్ –కంట్రోల్ సెంటర్, విపత్తు నిర్వహణ, గృహవసతి, ఆస్తుల పునరాభివృద్ధి, పార్కులు, బహిరంగ, ప్రజా స్థలాలు–పౌర సౌకర్యాలు, వినోదం, అమ్యూజ్మెంట్ పార్కులు, ప్రజా సౌకర్యాలు–మౌలిక సదుపాయాలు, పౌర సేవలు (పురపాలక భాగస్వామ్య సేవలు), వీధి దీపాలు తదితర వాటిని పీపీపీ విధానంలో చేపట్టనున్నాం’ అని ప్రభుత్వం చెబుతోంది. ఆదాయ వనరుల సృష్టి పేరుతో అడ్డదారులు వినియోగంలో ఉన్న ఆస్తుల విలువను పెంచడానికి, అలాగే వినియోగంలో లేని ఆస్తులను గుర్తించి పీపీపీ ద్వారా వాటిని విక్రయించడం, లీజుకు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయ వనరులను సృష్టించనున్నారు. ఖాళీ భూములను పీపీపీలో విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం రాబట్టనున్నారు. ప్రాజెక్ట్ స్వభావాన్ని బట్టి భూములను లీజు, లైసెన్స్, రాయితీ, హక్కు మార్గం, లేదా మరే ఇతర పద్ధతిలోనైనా చేపట్టనున్నారు. పాత వాణిజ్య భవనాలను పీపీపీలో అభివృద్ధి చేయనున్నారు. శిధిలావస్థలో ఉన్న, నిర్మాణాలను ప్రైవేట్ రంగం ద్వారా అభివృద్ధి చేయనున్నారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని బస్ స్టాండ్లు. బస్ బేలను ప్రైవేట్ భాగస్వామి ద్వారా వాణిజ్య అభివృద్ధి కోసం ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకునే ఎంపికతో పునరాభివృద్ధి చేయనున్నారు. ఉపయోగంలో లేని కార్యాలయ భవనాలను వాణిజ్య పునరాభివృద్ధి కోసం రాయితీపై ప్రైవేట్ భాగస్వామికి అప్పగించనున్నారు.కాంట్రాక్టర్లకు ప్రభుత్వ భద్రత ఆదాయేతర సేవలతో సహా పట్టణ రంగాలన్నింటిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను సమీకరించాలని నిర్ణయించడం జరిగింది. వాస్తవ ఖర్చులను ప్రతిబింబించేలా పట్టణ వినియోగ సేవలకు వినియోగ దారుల చార్జీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. పీపీపీ కాంట్రాక్టర్లకు భరోసా కల్పించడంతో పాటు చెల్లింపుల కోసం వివిధ పౌర సేవల నుంచి వచ్చే ఆదాయాలను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలలోకి చేర్చనున్నారు.అలాగే ఆస్తుల నగదీకరణ (మోనటరైజేషన్) ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయాలను కూడా ఎస్క్రో ఖాతాలలోకి చేర్చనున్నారు. పీపీపీలో ప్రైవేట్ రంగానికి, ఈ రంగానికి సంబంధించి రుణదాతలను గౌరవించేలా.. వారికి భరోసా ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. పీపీపీ కాంట్రాక్టర్లకు రాజకీయపరమైన నష్టాలు లేకుండా చూసేందుకు ఎ్రస్కోలు, పట్టణ సంస్థల గ్రాంట్లు, రాబడులపై లీన్, అండర్రైటింగ్ లేఖ ద్వారా ప్రభుత్వ భద్రత కల్పిస్తుంది. -
ఆర్టీసీ ప్రైవేటు హా'రన్'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కు కౌంట్ డౌన్ మొదలైంది. సర్కారు ప్రైవేటు హారన్ మోగిస్తోంది. ఇ–బస్సుల ముసుగులో 2031 నాటికి ప్రజా రవాణా సంస్థను పూర్తిగా మూసివేసే దిశగా పరుగులు తీస్తోంది. దీనిలో భాగంగానే ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకూడదని కుట్ర పన్నింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు, వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్న బస్సులను దశలవారీగా తొలగించేందుకు పావులు కదుపుతోంది. వాటి స్థానంలో ప్రైవేటు సంస్థల ద్వారా ఇ–బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈమేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ ప్రైవేటుపరానికి సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇక మీదట ఆర్టీసీ కోసం కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. ఇ–బస్సులను ఆర్టీసీయే స్వయంగా నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను తిరస్కరించారు.ఆర్టీసీ ఉన్నతాధికారుల ప్రతిపాదనలివీ.. » 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆర్టీసీలో 11వేల బస్సులు ఉండేవి. గత రెండేళ్లలో కాలం చెల్లిన దాదాపు వెయ్యి బస్సులను తొలగించారు. ఆర్టీసీ అవసరాలకు నిర్దేశిత బస్సుల కంటే మొత్తం 2,689 బస్సుల కొరత ఉంది. గత ఆరు నెలల్లోనే 264 బస్సులు తొలగించారు. వాటి స్థానంలో కొత్త డీజిల్ బస్సులను ప్రవేశపెట్ట లేదు. ప్రసుతం ఆర్టీసీ బస్సుల సంఖ్య 10వేల కంటే తగ్గింది. వాటిలో దాదాపు 3వేల బస్సులు అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. అద్దె ఒప్పందం కాలపరిమితి ముగియగానే వాటిని తొలగిస్తారు. కొత్తగా అద్దె విధానంలో డీజిల్ బస్సులను ప్రవేశపెట్టరు. దీంతో నికరంగా ఆర్టీసీకి చెందిన బస్సులు దాదాపు 7వేలు మాత్రమే ఉంటాయి. » ఇక 15ఏళ్లు కాలపరిమితి దాటిన బస్సులను ఇప్పటికిప్పుడు తొలగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆ కార్యాచరణను అమలు చేస్తోంది. సగటున రెండు రోజులకు ఒక బస్సును తొలగిస్తోంది. 2031 నాటికి మరో 6,442 బస్సులను తొలగించాలని నిర్ణయించింది. అంటే 85శాతం బస్సులను తొలగించాలనేది లక్ష్యం.కొత్త ఉద్యోగాల భర్తీకీ తిలోదకాలు ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీలో దాదాపు 8వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. 2029 నాటికి ఆర్టీసీలో 50శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. 2031 నాటికి 65 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. డిపోలు, స్టేషన్లు పీపీపీకే!ఇప్పటికే రూ.6,600కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. మిగిలిన డిపోలు, ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లను కూడా 2031 నాటికి దశలవారీగా పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది.పక్కా ప్లాన్ ప్రకారమే..! ఆ విధంగా ఆర్టీసీలో 85శాతం బస్సులు ఉండవు... 65 శాతం మంది ఉద్యోగులు ఉండరూ. ఆర్టీసీకి ఆస్తులూ ఉండవు. ఈ నేపథ్యంలో ఇక ఆర్టీసీని నిర్వహించడం దంగడమారి వ్యవహారం అని ఓ కమిటీ ద్వారా తేల్చాలన్నది ప్రభుత్వ పన్నాగం. ఆ వెంటనే ఆర్టీసీని పూర్తిగా మూసివేసి రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల రోడ్డు రవాణా వ్యవస్థను పూర్తిస్థాయిలో తీసుకురావాలన్నది చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నాయి. అందుకోసం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆదివారం విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. -
హమ్మయ్యా.. రుతుపవనాలొచ్చేశాయ్
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. శనివారం ఇవి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు రెండు రోజుల్లోనే ఏపీకి విస్తరించాయి. అయితే వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో వాటి గమనం నెమ్మదిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించినా వర్షాలు మాత్రం తక్కువగానే కురుస్తాయని తెలిపింది. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడతాయని... కొన్ని రోజులపాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. అందువల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు ప్రవేశించినా శనివారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఆదివారం 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని, మరో 104 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేకే ఆత్మహత్యలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక కర్నూలు జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి శనివారం ఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్సేన్ అనే సచివాలయ ఉద్యోగి సర్జరీ అయింది... సెన్సస్ డ్యూటీ వల్ల తిరగలేక బాధ పడుతున్నా... మళ్లీ ఇంటింటికీ తిరిగి పని చేయలేను అని ఎంత వేడుకున్నా వినకుండా బీఎల్వో డ్యూటీ వేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్సుల గోలకు తోడు సర్వేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు క్షోభకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో సచివాలయ ఉద్యోగులు నలుగురు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల మరణించారు’ అని పేర్కొన్నారు. హామీలేమయ్యాయి చంద్రబాబూ..? ‘ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను ఒకటే అడగదల్చుకున్నా. అయ్యా! ఉద్యోగులంతా ఎగబడి మీకు ఓటు వేసింది మీ చేతిలో ఇలా బలి అవడానికా? మీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడా నికా..? ఆత్మహత్యలు చేసుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. అందులో మొదటిది ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవం పెంపొందిస్తామన్నారు.ఇదేనా ఉద్యోగులకు మీరు కల్పించే అనుకూలమైన పని వాతావరణం! ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పని వాతావరణం అంటే? ఆర్థికపరమైన హామీలు ఎలాగూ అమలు చేయలేదు. కనీసం ఇలాంటి హామీలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసే చర్యలు ఆపాలి’ అని డిమాండ్ చేశారు. ‘కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మనకు మంచి రోజులు వస్తాయి. సచివాలయ ఉద్యోగులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
వనితకు వంచన
సాక్షి, అమరావతి: మహిళలపై దేశంలో ఎవరికీ లేనంత చిత్తశుద్ధి తనకే ఉందని ఇటీవల మహానాడు వేదికగా చెప్పుకున్న చంద్రబాబు అంతలోనే నారీ లోకానికి తాను ఇచ్చిన మాటను విస్మరించారు. ఇంతే ఇంతింతే.. తన తీరింతే అని చాటుకున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ మహానాడు వేదికగా చేసిన తీర్మానాన్ని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తుంగలో తొక్కేశారు. తన కుమారుడు లోకేశ్ కోటరీలోని లాబీయిస్టులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లకు రాజ్యసభ స్థానాలను కేటాయించారు. మహిళలకు అంత పెద్ద అవకాశాలను ఇవ్వబోమని తేల్చేశారు. మహిళలకు ‘పెద్ద’పీట.. మహానాడులో తీర్మానం వరకే పరిమితమని ఆచరణలో తనకు కార్పొరేట్ లాబీయిస్టులే ముఖ్యమని ఈ ఎంపిక ద్వారా రుజువు చేసుకున్నారు. మహానాడు తీర్మానాలు.. పబ్లిసిటీ డ్రామాలేఇటీవల ఆన్లైన్లో ఆర్భాటంగా నిర్వహించిన మహానాడును మహిళా శక్తి పేరుతో నిర్వహించి తమ పార్టీ వారి కోసమే ఉన్నట్లు హడావుడి చేశారు. పార్టీ పదవులు, రాబోయే ఏ ఎన్నికలైనా సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానాలు కూడా చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు స్వయంగా లేఖలు రాసి జాతీయ స్థాయిలో ప్రచారం పొందాలని చూశారు. తీరా మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే అవకాశం వచ్చేసరికి ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకుండా తన అసలు నైజాన్ని చాటుకున్నారు. 33 శాతం రిజర్వేషన్ల మాట అటుంచితే కనీసం ఒక్క సీటు కూడా కేటాయించకుండా మహిళా లోకాన్ని చంద్రబాబు ఘోరంగా వంచించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన చిత్తశుద్ధి కేవలం మైకుల ముందు, తీర్మానాలకే పరిమితమని ఈ నిర్ణయంతో తేలిపోయింది.సీనియర్లకు అవమానం.. లోకేశ్ కోటరీకే పెద్దపీటపార్టీ కోసం దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేసిన సీనియర్లనూ పక్కనపెట్టారు. చంద్రబాబు సమకాలి కుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆయన హస్తగతం కావడంలో కీలకపాత్ర పోషించిన యనమల రామకృష్ణుడిని అసలు పరిగణనలోకే తీసుకోకుండా అవమానించారు. తాను గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకునేలా చివరిసారిగా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని యనమల కోరినా పట్టించుకోలేదు. అన్నివేళలా చంద్రబాబు వెన్నంటి ఉండే దళిత నేత వర్ల రామయ్యకూ మొండిచేయి చూపారు. దీంతో దళితులకు పెద్దపీట వేస్తానంటూ చంద్రబాబు చెప్పే సూక్తులన్నీ ఉత్తి మాటలేనని తేలిపోయింది. సీట్లు ఆశించిన పార్టీలోని చాలామంది సీనియర్లను అసలు పరిగణనలోకి తీసుకోకుండా అర్థ బలం ఉన్న వారి వైపే తాను ఉంటానని స్పష్టం చేశారు. టీడీపీలో మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నా సరే వివాదాస్పద నేత సానా సతీష్కి రెండవసారి రాజ్యసభ సీటు కట్టబెట్టారు. లోకేశ్ వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో సీనియర్లను కాదని ఆయనకు అవకాశం కల్పించారు. పార్టీకి కొత్త అయినా కార్పొరేట్ శక్తుల కోటాలో భాష్యం రామకృష్ణకు ఒక సీటు కేటాయించారు. జూనియర్ నేత అయినప్పటికీ లోకేశ్కు అత్యంత సన్నిహితుడు కావడంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొడుకు చింతకాయల విజయ్కి అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతలు, మహిళా నేతలకు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. మహిళలకు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, సీనియర్లకు గౌరవం వంటివన్నీ కేవలం ఎన్నికల నినాదాలే తప్ప ఆచరణలో శూన్యమని ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక ద్వారా రుజువు చేశారు. -
డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్ గోల.. యూటర్నే శరణ్యం
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థకు సంబంధించిన వరుస వివాదాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో పారదర్శకత, భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలకు దిగుతూ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో సీబీఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు విద్యా రంగాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ అంశం పలు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివాదాలకు కారణమైన కోఎంప్ట్ సంస్థ పనితీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ సంస్థకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ సమాధానపత్రాల ఆన్లైన్ మూల్యాంకన కాంట్రాక్టును అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. మూల్యాంకనంలో పొరపాట్లు, సాంకేతిక లోపాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు కావడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం రావడం లేదు. ఫ్యాక్ట్చెక్ పేరుతో ఇస్తున్న సమాచారంలో డొల్లతనాన్ని అభ్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కౌంటర్ ఇవ్వలేక తడబడుతున్నారు. బాధితులు నేరుగా రోడ్డెక్కి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగి పారేస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను సంతలో సరుకులా రేటు కట్టి అమ్ముకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పేట దాడి పెరగడంతో పాటు పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఫలితంగా పాలిటెక్నిక్ సమాధానపత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో కాకుండా సంప్రదాయ ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. తప్పుల మీద తప్పులు చేస్తున్న సర్కారు రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ తప్పుల మీద తప్పులు చేస్తుండడంతో పాలిటెక్నిక్లో వార్షిక పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గందరగోళంగా మార్చేసింది. వారానికో విధానం అమలు చేస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తూ ఫలితాల ప్రకటనపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ‘‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వాల్యూయేషన్’’ (ఓఎస్ఎం) ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. ఒక్కో ఎగ్జామినర్ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అధికారులు అవకాశం ఇచ్చారు. ఓఎస్ఎం విధానంలో తప్పులు జరుగుతున్నాయని మే 18న ‘ఇదేం టెక్నిక్ మహాశయా?’ పేరుతో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసింది. దీంతో ఓఎస్ఎం ఎంతో ఉత్తమ విధానమంటూ వివరణ ఇచ్చిన అధికారులు.. సాంకేతికంగా పరిజ్ఞానం అందించిన ‘కోఎంప్్ట’ సంస్థను వెనుకేసుకొచ్చారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఉన్నఫళంగా ఆన్లైన్ మార్కుల విధానాన్ని పక్కనబెట్టి ‘తూచ్.. ఇది పైలట్’ మాత్రమేనని మాట మార్చడం గమనార్హం. అంతేగాక మళ్లీ మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని, అదీ.. ఒకే ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఏ దరికి చేరతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కోఎంప్ట్ ఇన్ఫ్రాకు రూ.కోట్లు చెల్లింపు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎస్బీటీఈటీ) 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆన్స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వ్యాల్యూయేషన్ (ఓఎస్ఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని కోఎంప్ట్ సంస్థ నుంచి తీసుకున్నారు. ఇదే సంస్థ సీబీఎస్ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా నిర్వహించి బొక్కబోర్లా పడింది. ఈ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉన్నత విద్యాశాఖలో సాంకేతిక విద్యాశాఖ విలీన సమయంలో ‘కోఎంప్ట్’ సంస్థకు రూ.కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.05 లక్షల స్క్రిప్టుల మూల్యాంకన ప్రక్రియను ఓఎస్ఎం విధానంలో చేపట్టారు. ఒక్కో స్క్రిప్టు మూల్యాంకనం చేసేందుకు రూ.18 చొప్పున ఎగ్జామినర్లకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రోజుకు 40 నుంచి 45 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉండగా, 100కు పైగా స్క్రిప్టులు చేయించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధానంలో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో ఉత్తమ విధానంపై బురద జల్లుతున్నారని ఖండించారు.తాజాగా మాన్యువల్ మూల్యాంకనంపాలిటెక్నిక్ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, ఇప్పుడు ఆ మార్కులను పక్కనబెట్టి, మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాలని, అదీ వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై తీవ్ర విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా 7 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ను ఫణంగా పెట్టి, ఇప్పుడు ఆ మార్కులు చెల్లవని, మాన్యువల్ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ఎస్బీటీఈటీ కార్యదర్శిని వివరణ కోరగా సమాధానం దాటవేయడం గమనార్హం. -
ఈ ఉద్యోగం చేయలేను.. తనువు చాలిస్తున్నా..
కర్నూలు(సెంట్రల్): ‘అనారోగ్యం అని చెప్పినా వినిపించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనంటూ అధికారులు ఆదేశించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేను..’అంటూ కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్లోని 28వ వార్డు రెవెన్యూ సెక్రటరీ (వీఆర్వో) ఎస్ఎండీ షేక్ మహమ్మద్ హుసేన్ (45) శనివారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు అర్బర్ తహసీల్దార్ డి.రవికుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ధనుంజయలే తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. డిస్క్ ఆపరేషన్.. అయినా తప్పని పనిభారం సిబ్బంది కొరత కారణంగా 30, 31వ వార్డు సచివాలయ బాధ్యతలను కూడా హుస్సేన్కు అప్పగించారు. అంతేకాక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో 37వ వార్డు బీఎల్ఓ విధులను కూడా కేటాయించారు. దీనికి తోడు తన వార్డుల పరిధిలో జనగణన విధులు ఉంటాయి. అదనంగా సచివాలయ ఉద్యోగులు సాధారణంగా చేసే దాదాపు 25 రకాల సర్వేలు సరేసరి. ఇక జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో బూత్ లెవల్ ఆఫీసర్ విధుల్లో భాగంగా ఇంటింటి సర్వే చేయాలి.ఇంత పనిభారం నేపథ్యంలో మూడు నెలల క్రితం హుస్సేన్ సెలవు పెట్టి నడుము నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకుని ఇటీవలే విధుల్లో చేరాడు. ఈనేపథ్యంలో బీఎల్ఓ విధులు నిర్వర్తిస్తే క్షేత్రస్థాయిలో తిరిగే సమయంలో నొప్పి వస్తుందని భావించి విషయాన్ని తహసీల్దార్ డి.రవికుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్కు తెలియజేశాడు. ఆ విధుల నుంచి తప్పించాలని కోరాడు. అయితే వారు అవేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనని ఆదేశించడంతో ఉద్యోగంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహంతో కలెక్టరేట్ను ముట్టడించిన ఉద్యోగులు హుస్సేన్ మరణ వార్త సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. తోటి మిత్రుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10గంటలకే కలెక్టరేట్ చేరుకుని హుస్సేన్ మృతదేహాన్ని గాంధీ విగ్రహం ఎదుట ఉంచి ‘ఇది ప్రభుత్వ హత్యే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక్క హుస్సేన్ సమస్య మాత్రమే కాదని, తమ అందరికీ పని ఒత్తిడి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు సచివాలయ ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.టీసీ, వీసీల్లో అందరి ముందే పురోగతి లేదని అవమానిస్తున్నారని, తాము చెప్పేది ఏ మాత్రం వినడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడికి కారణమవుతున్న ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ మరణానికి కలెక్టరే బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే ఆమె బయటకు రాకుండా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను పంపారు.ఆమె వచ్చి హుసేన్ భార్య షేక్ ఖాజాబీ, కుమారులు షేక్ మౌలాలి, షేక్ ఖాజా, కూతూరు షేక్ సానతోపాటు కొందరు సచివాలయ ఉద్యోగులను వెంట బెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి హుస్సేన్ కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.50 వేలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కారణంగా ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2.30 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కుటుంబ సభ్యుల వేధింపులే కారణం: కలెక్టర్ హుస్సేన్ ఆత్మహత్యకు పని ఒత్తిడి కారణం కాదని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొనడం గమనార్హం. అతని మానసిక స్థితి సరిగా లేదని కలెక్టర్ పేర్కొన్నారు. భార్య, పిల్లలే హుస్సేన్ను కొట్టేవారని, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే.. ఎందరు ఉద్యోగులు మిగులుతారని ఆమె ఎదురు ప్రశి్నంచారు. సూసైడ్నోట్ నిజానిజాలపై విచారణ జరిపిస్తామని కూడా ఆమె తెలిపారు. -
పదే పదే ‘మెగా’ అబద్ధం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తప్పులను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా అక్రమాలు బయటపడినా, ఎక్కడా తప్పు జరగలేదని, తప్పంతా అభ్యర్థులదే అన్నట్టుగా బుకాయిస్తోంది. ‘ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని (1:1 నిష్పత్తి) మాత్రమే’ సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, ఇప్పుడు ఆ విధానానికే వక్రభాష్యం చెబుతోంది. ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం అంటే అర్థం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాల్ లెటర్లు పంచారంటే ఉద్యోగం వచ్చినట్లే కదా.. అని నిలదీస్తున్నారు.మెరిట్ అభ్యర్థులకు మాత్రమే కాల్లెటర్లు పంపామని చెబుతున్నప్పుడు.. ఎంపిక జాబితా లేదా తిరస్కరణ జాబితాలో ఏదో ఒకదాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారిని ఆ రెండు లిస్టుల్లోనూ ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని సరైన సమాధానం చెప్పడం లేదు. అంతా వదిలేసి హారిజాంటల్ రిజర్వేషన్ అమలును అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పడంపై నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి రెండు టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయి?, అతన్ని ఎందుకు కౌన్సెలింగ్కు రాకుండా అడ్డుకున్నారో తేల్చడం లేదు. చేసిన తప్పులను వదిలేసి బాధిత అభ్యర్థులదే తప్పు అన్నట్టు దుష్ప్రచారం చేయడం విస్తుగొల్పుతోంది. జరిగిన తప్పులపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం అభ్యర్థులపై ఎదురుదాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. వీరందరినీ ఎందుకు పిలిచారు? కూటమి ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం ఆ అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తుంది. అంటే.. ఫలితాల్లో ఉన్న అభ్యర్థులంతా దాదాపు ఎంపికైనట్లే. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన పత్రాలు అందించేందుకు నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోగా సదరు అభ్యర్థి అన్ని పత్రాలు సరైనవేనని నిరూపించుకుంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. లేదంటే అతని తర్వాత ఉన్నవారిని పిలుస్తారు. 1:1 నిష్పత్తి ఇలాగే కొనసాగుతుంది. కానీ డీఎస్సీలో మాత్రం ఈ విధానం పాటించకుండా విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అని బుకాయిస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చి అన్నీ సక్రమంగా ఉండి కూడా అటు ఎంపిక జాబితాలో ఇటు తిరస్కరణ జాబితాలోనూ లేకుండా ఉన్నవారు దాదాపు 1,500 మంది అభ్యర్థులు ఉన్నారు. మెరిట్లో లేకుంటే వీరందరినీ ఎందుకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు? పై రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన పుష్పాంజలికి ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హైమావతికి ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ ఆ ర్యాంకర్ వివరాలు తొలగించి.. డీఎస్సీ ఫలితాలు విడుదలలో భాగంగా తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా డీఎస్సీ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ నిలిచాడు. ఇతను సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు, టీజీటీ (తెలుగు) జోన్–2లో ఆరో ర్యాంకు సాధించాడు. అయితే, తొలుత అతడి వివరాలతో మెరిట్ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని ఆ లిస్టులను రద్దు చేసి, రెండో ర్యాంకు నుంచి రెండో లిస్టు విడుదల చేశారు. ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్ ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ ప్రశ్నలు అప్లోడ్ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించినట్టు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఫలితాల్లో అతడు టాపర్గా నిలిచినా పోస్టు ఇవ్వకుండా, అతడి క్యాండిడేట్ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు బయటకు వెళ్లిపోయాయన్న ఆరోపణలపైనా చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేయకపోగా తప్పుడు ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.సీబీఐ విచారణ చేయాలిమెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అధికారులు మాత్రం పారదర్శకంగా జరిగినట్టు వివరణ ఇవ్వడం హాస్యాస్పదమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబేటి రామచంద్ర విమర్శించారు. డీఎస్సీ–2025 చాలా మందికి చివరి అవకాశంగా కష్టపడి చదివి మెరిట్ సాధించారని, అలాంటి వారికి సైతం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీలో జరిగిన దారుణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.హారిజాంటల్లో ఒక్కటి.. నింపింది రెండుచిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఎం.ఏకాంబరం (బీసీ–డీ 125 ర్యాంకు) ఘటనను తీసుకుంటే.. ఈ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులు బీసీ–డీ కేటగిరిలో 7 ఉన్నాయి. ఇందులో రెండు ఓపెన్లోను, 5 పోస్టులు లోకల్ మెరిట్కు కేటాయించారు. హారిజాంటల్లో ఐదింటిలో ఒకటి ఉమెన్కు కేటాయించారు. బీసీ–డీ విభాగం మెరిట్లో చివరి ర్యాంక్ 114 అని ఒకసారి, 116 అని మరోసారి అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే్త 114 ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినప్పటికీ బీసీ–డీలో చూపించారు. 116 ర్యాంకు ఉమెన్, ఈమె మెరిట్ లిస్టులో ఎంపికైంది కాబట్టి ఇక హారిజాంటల్ రిజర్వేషన్లో కేటాయించిన ఒక పోస్టును తర్వాత మెరిట్లో ఉన్న ర్యాంకుకు కేటాయించాలి, అంటే 125 ర్యాంకు అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ, జనరల్ మెరిట్లో ఉన్న ఏకాంబరాన్ని కాదని, రెండు పోస్టులను హారిజాంటల్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఇచ్చారు. వాస్తవానికి బీసీ–డీలో ప్రకటించిన 7 పోస్టుల్లో వీరికి ఒక్క పోస్టు కూడా చూపలేదు. కానీ చట్ట ప్రకారం ఒక్క పోస్టునే ఇవ్వాల్సి ఉన్నా రెండు పోస్టులు ఇవ్వడం గమనార్హం.చట్టాన్ని కాదని ఎస్టీ అభ్యర్థికి అన్యాయంకడప జిల్లాలకు చెందిన ఎం.జగదీష్ నాయక్ విషయంలో ప్రభుత్వం చట్టానికి కొత్త అర్థం చెబుతోంది. ఎస్టీ కేటగిరీకి చెందిన జగదీష్ డీఎస్సీలో 363 ర్యాంకు సాధించారు. జిల్లాలో ఎస్జీటీ ఉర్దూ మీడియం (బ్యాక్లాగ్) 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 జనరల్, మరో 2 ఉమెన్ అభ్యర్థులకు కేటాయించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ముగ్గురిని మాత్రమే పిలిచారు. ఇందులో రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరు మేల్, ఇంకొకరు ఫీమేల్గా పేర్కొన్నారు. ‘మిగిలిన రెండు పోస్టులను అర్హులైన ఎస్టీ ఉమెన్ అభ్యర్థులు లేక భర్తీ చేయలేదని’ ప్రకటించారు. » గతేడాది కూటమి ప్రభుత్వం మైన్స్ అండ్ జియాలజీ శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టు ఒకటి భర్తీకి (క్యారీఫార్వర్డ్) నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు. 1996లో జీఏడీ ఇచ్చిన జీవో 436 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లో అర్హత గల మహిళా అభ్యర్థి లేకపోతే తర్వాత మెరిట్లో ఉన్న పురుష ఎస్టీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం డీఎస్సీలో అర్హత గల పురుష ఎస్టీ అభ్యర్థి జగదీష్ నాయక్ ఉన్నా, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఓసీ–ఈడబ్లు్యఎస్ పోస్టు బీసీకి ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ ఎస్ఏ బయలాజికల్ సైన్స్ (ఉర్దూ మీడియం)లో 11వ ర్యాంకు సాధించారు. బయోలాజికల్ సైన్స్లో 2 పోస్టులు ఉండగా, ఒకటి ఓసీ–ఈడబ్ల్యూఎస్కు రిజర్వ్ చేశారు. ఇతనికంటే ముందున్న మరో అభ్యర్థి 7వ ర్యాంకులో ఉండటంతో పోస్టుకు అతన్ని ఎంపిక చేశారు. వాస్తవానికి పోస్టుకు ఎంపికైన అభ్యర్థి (బీసీ–ఈ) ముస్లిం. ఇదే కేటగిరీలో 2008, 2012, 2014, 2018 డీఎస్సీలకు హాజరయ్యాడు. 2025లో అతడు ఓసీ–ఈడబ్ల్యూఎస్గా నమోదు చేసుకుని తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడు. ఇతనివి తప్పుడు పత్రాలని ఆధారాలతో సయ్యద్ జమీల్ నిరూపించినా అధికారులు పట్టించుకోలేదు. బాధితుడు ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయగా ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’ అని ఓ అధికారి మాట్లాడారని వాపోయాడు. -
‘చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పోరాటం చేయాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మైనారిటీ నేతలు ఖాదర్ భాషా, హసీఫ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, నిస్సార్ భాషా, నూరీ పాథిమా సహా పలువురు మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తే.. చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. వివిధ రాజకీయ శక్తులు ఏకమై అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా వంచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలిలో కలిపేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘చివరికి మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయటం దుర్మార్గం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భర్తీ చేశాం. కానీ చంద్రబాబు పదహారు వేల ఉద్యోగాలకు కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
విజయదుర్గ పీఠాధిపతి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పీఠాధిపతి మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం.. భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.‘‘సుబ్రహ్మణ్యం గారి సేవలు, బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించింది. సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
తోతాపురి మధురం.. ధరే పాషాణం
సాక్షి, అమరావతి: తోతాపురి మామిడి రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ఓ వైపు గతేడాది గుజ్జు పరిశ్రమలు బకాయిలు చెల్లించకపోగా, ఈ ఏడాది మార్కెట్లో ధర లేక, కొనేవారు లేక వరుసగా రెండో ఏడాది కూడా తోతాపురి మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తాము పండించిన మామిడి మధురమైనా ధర మాత్రం తమకు విషంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని లక్షలు పెట్టుబడి పెట్టి కంటికిరెప్పలా కాపాడుకుంటూ పండించిన మామిడి పంటను కిలో రూ.5కు మించి కొనకపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తోతాపురి ఈ ఏడాది 7.80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మామిడి కోతలు ఊపందుకున్నాయి. పక్వానికి వచ్చిన మామిడిని అమ్ముకునేందుకుæ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా పరిధిలో దాదాపు 44 గుజ్జు పరిశ్రమలుండగా, ప్రస్తుతం ఏడు యూనిట్లలో మాత్రమే తోతాపురి ప్రాసెసింగ్ ప్రారంభమైంది. అధికారులు కిలో రూ.7 నుంచి రూ.7.50 మధ్య పలుకుతుందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ ధర లభించడంలేదు. ర్యాంపుల వద్ద కిలో రూ.5కు మించి దక్కడం లేదు. చివరికి ఫ్యాక్టరీలు సైతం గతేడాది మాదిరిగానే నాణ్యతను బట్టి కిలో రూ.5 నుంచి రూ.6కు మించి కొనుగోలు చేయడంలేదని రైతులు చెబుతున్నారు. ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా తిరిగి రావడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఖర్చు, ఎరువులు, మందులు, నీటివ్యయం, కోత, రవాణా ఖర్చులు అన్నీ కలిపి చూస్తే రైతుకు చివరికి ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు. కిలో ఎంతకు కొనుగోలు చేస్తున్నారనే విషయం బిల్లుల్లో రాయడంలేదని రైతులు వాపోతున్నారు. టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే టోకెన్ రైతులు మామిడి గుజ్జు కంపెనీల గేట్ల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఈసారి గుజ్జు కంపెనీల కొనుగోలు విధానం, టోకెన్ వ్యవస్థ, అన్లోడింగ్ ఆలస్యం, తక్కువ ధరలు, తూకాల్లో కోతలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్యాక్టరీలు పెడుతున్న సవాలక్ష ఆంక్షలు వారికి ప్రతిబంధకంగా తయారయ్యాయి. ఈసారి కంపెనీలకు మామిడిని తరలించాలంటే టోకెన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ టోకెన్ సంపాదించడం రైతులకు కత్తిమీద సాములా మారింది. అధికార పార్టీ సిఫార్సు చేసిన వారికి మాత్రమే టోకెన్లు జారీచేస్తున్నారు. దీంతో సామాన్య రైతులు టోకెన్ల కోసం కంపెనీల ఎదుట రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. టోకెన్ లభించినా.. కంపెనీ వాళ్లు చెప్పిన రోజున మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో కంపెనీలు చెప్పిన తేదీలకు తరలించేందుకు వీలుగా కోతలు కోయించి ట్రాక్టర్లలో లోడ్ చేసి తీసుకెళ్తున్నా చెప్పిన సమయానికి అన్లోడింగ్ జరగకపోవడంతో ఎండలకు కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. తాము తీసుకెళ్లిన కాయల్లో 30 శాతానికి పైగా పాడైపోతున్నాయని రైతులు బాధపడుతున్నారు. మిగిలిన కాయల్లో కూడా నాసిరకమంటూ మరో 10–20 శాతం కోత పెడుతున్నారని తెలిపారు. కిలో ధర రూ.15కు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బకాయిల ఊసెత్తని ప్రభుత్వం గతేడాది కూడా కొనేవారు లేక రోడ్డెక్కిన మామిడి రైతులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేస్తామంటూ నమ్మబలికి చివరికి వారినోట్లో మట్టికొట్టింది. కిలోకు రూ.4 సబ్సిడీ ఇస్తామని, ఫ్యాక్టరీలతో రూ.8కి తక్కువకాకుండా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఫ్యాక్టరీలు కిలోరూ.5 నుంచి రూ.6కు, ర్యాంపు నిర్వాహకులు రూ.3 నుంచి రూ.4 మధ్య కొనుగోలు చేశారు. తొలుత అంచనా దిగుబడులు 5.60 లక్షల టన్నుల కొనుగోలుకు రూ.672 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టి, కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ కింద రూ.260 కోట్లు బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. వాస్తవంగా 80 వేలమంది రైతుల నుంచి 4.31 లక్షల టన్నులు సేకరించినట్టు అధికారులు లెక్కతేల్చగా, ప్రభుత్వం మాత్రం 51 వేలమంది రైతులకు రూ.173 కోట్లు విడుదల చేసింది. ఫ్యాక్టరీలు, ర్యాంపుల నుంచి రూ.380 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.160 కోట్లు.. మొత్తం రూ.540 కోట్లు జమ కావాల్సి ఉంది. ఈ బకాయిల కోసం అడిగితే అటు ఫ్యాక్టరీలు, ఇటు ప్రభుత్వం నోరుమెదపడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మధ్యవర్తులు లాభపడుతున్నారు నేను 18 ఎకరాల్లో తోతాపురి మామిడి సాగుచేస్తున్నా. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తోతాపురి మామిడికి ధర లేదు. కొనేవారు కనిపించడం లేదు. ఓ వైపు కోతలు ఊపందుకోగా పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీల వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యవర్తులు లాభపడుతున్నారే తప్ప రైతులకు ప్రయోజనం కలగడం లేదు. ఈసారి కూడా ర్యాంపుల వద్ద కిలో రూ.5కు మించి కొనడం లేదు. – శ్రీనివాసులనాయుడు, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా -
అబద్ధాలు నిజమవుతాయా?
సాక్షి, అమరావతి: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం నిండా మునిగిపోయింది. ‘సాక్షి’లో కథనాల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రం అవుతుండటంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల చేత నోటికొచ్చిన అబద్ధాలు, వక్రభాష్యాలు పలికిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణితో కూడిన అధికారుల బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా శాప్ ఎండీ భరణి మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు, అవినీతి లేకుండా స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్టు ప్రకటించారు. వాస్తవానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. భరణి చెప్పిన అంశాలు... ఇందుకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే..1 శాప్ ఎండీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ కొన్ని చోట్ల ఏ, బీ కేటగిరీలుగా క్రీడలను విభజించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడలనే ఏపీలో పెట్టాం.వాస్తవం: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు. కానీ, ఏపీలో 65 క్రీడాంశాల్లో కేవలం 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనివి ఉంచారు. కుడో, ఈక్వెస్టారియాన్(గుర్రపుస్వారీ)లను తొలగించి వాటి స్థానంలో మెట్రన్ పెంటాథ్లాన్, సెయిలింగ్ను తీసుకొచ్చి.. వాటిని ‘ఏ’ కేటగిరీలో పెట్టారు. ఈ వాస్తవాన్ని దాచేసి మొత్తం మయాస్ను అనుసరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఎక్కువ మంది ఆడే క్రీడలను ‘ఏ’ కేటగిరీలో పెట్టామన్నారు. ఏపీలో గోల్ఫ్, సైలింగ్ ఎంత మంది ఆడుతున్నారు? దానిని ‘ఏ’ కేటగిరీలో ఎందుకు పెట్టారు? అన్నది పాలకులకే అర్థం కావాలి.2 శాప్ ఎండీ: అనిగి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్కు కాకుండా నేషనల్ చాంపియన్షిప్కు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్లో బంగారు పతకం ఉన్నా ఉద్యోగం రాలేదు.వాస్తవం: దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ చాంపియన్షిప్కు ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ ను పరిశీలిస్తారు. కానీ, ఏపీలో క్రీడా పాలసీ సమయంలో అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరసలోకి వచ్చి నేషనల్ చాంపియన్ షిప్ కిందికి పోయింది. వాస్తవానికి భారత జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగానే జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పతకం రాకున్నా నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్యకు నేషనల్ చాంపియన్షిప్లో సిల్వర్, నేషనల్ గేమ్స్లో బంగారు పతకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం.3 శాప్ ఎండీ: సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ వర్సిటీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికెట్ ఉండాలి. అనంతపురంలో ఎస్ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు. ఉద్యోగం ఇచ్చాం.వాస్తవం: వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించాడు. దానికి బ్యాకప్గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికెట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ/కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు, స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికెట్ను ఎలా బ్యాకప్గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్కు పంపిస్తే వర్సిటీ తరఫున ఆడొచ్చు గానీ, ఆ బ్యాకప్ సర్టిఫికెట్తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీనిని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ ఎండీ చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం.4 శాప్ ఎండీ: స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్, వర్సిటీలు, రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే, అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చాం.వాస్తవం: ప్రభుత్వం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్లపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పైగా జెన్యూనిటీ సర్టిఫికెట్లు పరిశీలించినట్టు చెబుతున్న ఎండీ.. సాఫ్ట్బాల్ ఫెడరేషన్కు మయాస్లో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూనిటీని ఎలా వాస్తవమని నిర్ధారిస్తారో చెప్పలేదు.5 శాప్ ఎండీ: ఒలింపిక్స్ నుంచి స్టేట్ చాంపియన్షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేశాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ను చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్కు ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవం: ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం అన్నీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లే. పతకాలు గెలిచిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ, జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్స్ గేమ్స్కు, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్కు గతంలో ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కాలేజీ అడ్మిషన్లలో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఉండేది. -
దగా డీఎస్సీపై మెగా కవరింగ్..
సాక్షి, అమరావతి: మొత్తం మోసాలతో సాగిన దగా డీఎస్సీ–2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డీఎస్సీలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి (ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థి) ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే, ‘సాక్షి’ పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ‘ఫేక్’ ప్రచారానికి దిగారు. అలాగే, నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు 1:1 నిష్పత్తికి కొత్త అర్థం చెప్పింది. కాల్ లెటర్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చినట్టు భావించవద్దని ఆ లెటర్లలోనే ఉందని అధికారులు చెప్పడం విస్తుగొల్పుతోంది. రెండు జాబితాల్లోనూ వీరి పేర్లెందుకు లేవు? డీఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. మెరిట్ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు.. వర్టికల్, హారిజాంటల్ (ఉమెన్, స్పోర్ట్సు, ప్రత్యేక అవసరాలు, ఎక్స్ సర్వీస్మెన్) పరిశీలించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే.. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేనివారిని ‘తిరస్కరణ’ జాబితాలో పెట్టి, వీరి స్థానంలో తర్వాత మెరిట్ (ఓపెన్ లేదా అదే రిజర్వేషన్) అభ్యర్థికి కాల్ లెటర్ పంపుతారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్టు విద్యా శాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై, ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1,500 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన ‘రిజెక్ట్’ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడంలేదు. అలాగే, ‘కాల్ లెటర్ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే.. ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు’ అని ముందే చెప్పామని భాష్యం చెబుతున్నారు. 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న!డీఎస్సీ మెరిట్ బాధిత అభ్యర్థులను ‘ఫేక్’ అంటూ తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారంకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యి ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురు దాడికి దిగుతోంది. పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభ్యర్థులపై పెయిడ్ ఆర్డిస్టులు తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. మరోపక్క అభ్యర్థుల మెరిట్ను సైతం అధికారులు రోజుకోలా మార్చేస్తున్నారు.» చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఏకాంబరం బీసీ–డి కేటగిరీకి చెందినవారు. ఇతనిది మెరిట్ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీ–డి కేటగిరిలో 7 పోస్టులు ఉండగా, 5 మెరిట్, 2 హారిజాంటల్ రిజర్వేషన్లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్ (5 పోస్టులు)లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని గత శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధ్రువీకరించారు. కానీ శుక్రవారం ఈ మెరిట్ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైనది? వాస్తవానికి అధికారులు చెబుతున్న 114 ర్యాంకు అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీ–డిలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే, 116 ర్యాంకు మహిళది.» అంకాని నాగవేణి (బీసీ–ఎ) విషయంలోనూ ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరి 8వ అభ్యర్థిగా ఉన్న నాగవేణికి ఎందుకు కాల్లెటర్ పంపారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రకటించిన ఏడుగురు మెరిట్ అభ్యర్థుల్లో ఎవరికైనా సరైన సర్టిఫికెట్లు లేక, రిజెక్ట్ అయిన సమయంలోనే 8వ అభ్యర్థికి కాల్లెటర్ పంపాలి. అలా ఎందుకు చేయలేదు? » ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం కాల్లెటర్లు పంపితే.. అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్ లెటర్లు ఎందుకు పంపినట్టు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించినట్టు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అనే కలరింగ్ ఇస్తూ చేసిన తప్పును ఒప్పు అని భ్రమింపజేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
మైనర్ల పాస్పోర్ట్పై ఒంటరి తల్లికి ఊరట
సాక్షి, అమరావతి: మైనర్ బిడ్డల పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందులు పడుతున్న ఒంటరి తల్లులకు ఊరటనిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త సమ్మతి లేదా సంతకం లేకుండానే మైనర్ల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే పూర్తి హక్కు ఒంటరి తల్లికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా కోర్టు నుండి లేదా సమర్థ అధికారి నుంచి ఎటువంటి నిషేధాజ్ఞలు లేని సందర్భాల్లో తండ్రి సమ్మతి లేకుండా, కేవలం తల్లి సమర్పించిన దరఖాస్తు ఆధారంగా మైనర్ బిడ్డకు పాస్పోర్ట్ జారీ చేయవచ్చా.. లేదా? అన్న ప్రశ్నకు హైకోర్టు ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. పిటిషనర్ కుమార్తె పాస్పోర్ట్ దరఖాస్తును పరిశీలించి, రెండు వారాల్లో పాస్పోర్ట్ జారీ చేయాలని ఈ వ్యాజ్యంలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. సదరు ఒంటరి తల్లి ఇప్పటికే దరఖాస్తుతో పాటు చట్ట నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన ’అనెక్సర్–సి’, ’అనెక్సర్–డి’ పత్రాలను సమర్పించారని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని కూడా తెలియజేశారని, ఈ నేపథ్యంలో విడాకుల పత్రాల కోసం పాస్పోర్ట్ అధికారులు పట్టుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో తన 4 ఏళ్ల కుమార్తెకు పాస్పోర్ట్ కోసం ఒక మహిళ గత ఏడాది ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్పోర్ట్ అధికారులు ఆమె భర్త సంతకం లేదా కోర్టు నుండి విడాకులు/న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని మౌఖికంగా ఒత్తిడి చేస్తూ పాస్పోర్ట్ జారీ ప్రక్రియను నిలిపివేశారు. దీనిని సవాలు చేస్తూ షేక్ షబానా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
నాసిరకం పనులకు రూ.102 కోట్ల నజరానా
సాక్షి, అమరావతి: నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టు సంస్థపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా అంచనా వ్యయాన్ని రూ.102.72 కోట్లు పెంచేసి నజరానా అందించింది. కారణం.. ఆ కాంట్రాక్టు సంస్థ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడమే. టెండర్ నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా పనులు చేయకుండా.. అత్యంత నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి లబ్ధి చేకూర్చడంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రెండు ప్యాకేజీల కింద ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ కెనాల్ 0 కిలోమీటర్ నుంచి 26.20 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.93.14 కోట్లకు.. 26.2 కిలోమీటర్ల నుంచి 75.075 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.173.10 కోట్లకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్ దక్కించుంది. ఆ పనులను ఆర్నెల్ల్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది.ఈ ఫొటో చూడండి.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్కు సమీపంలో హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు స్టీల్ ఫైబర్ రీయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ (ఎస్ఎఫ్ఆర్సీ) విధానంలో వేసిన లైనింగ్ పనితనం నీటి ప్రవాహం ఆగిపోగానే బట్టబయలైంది. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ.. నిబంధనను ఉల్లంఘించి, పనులు వేగంగా చేయాలనే మిషతో ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో లైనింగ్ వేశారు. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్ఎఫ్ఆర్సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ గట్టు వాలు (స్లోప్)ను క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్).. ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ గట్టు వాలును క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, గట్టు వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ వేశారు. పనులు చేసిన సంస్థ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడంతో వాటిని పర్యవేక్షిస్తున్న అధికారులు నాణ్యతపై నోరు మెదపలేకపోయారు. నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నిద్రపోయింది. బిల్లులు కూడా చెల్లించేశారు. గత సీజన్లో కాలువలో ప్రవహించిన నీటి ఉద్ధృతికే కాంక్రీట్ ఎక్కడికక్కడ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది.నాసిరకానికి ఈ ఫొటోనే సాక్ష్యం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెం వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ వేశారనడానికి ఇదిగో ఆధారం. ఒక సీజన్లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది.ఈ ఫొటో మరో నిదర్శనం.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కళ్లిపల్లి సమీపంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ పనులు చేశారనడానికి ఇది మరో నిదర్శనం. కనీసం కాలువ స్లోప్ను కూడా సరి చేయకుండా ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడం వల్ల ఒక సీజన్లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ కొట్టుకుపోయింది.ఇదిగో బహుమానంపుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 26.2 కిలోమీటరు నుంచి 75.075 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు చేపట్టడానికి రూ.207.20 కోట్లతో 2024 డిసెంబర్ 3న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇవే పనులను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులు మినహాయించి రూ.173.10 కోట్లకు ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం అప్పగించింది. సకాలంలో నాణ్యంగా పనులు చేయని ఆ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరించింది. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.309.92 కోట్లకు పెంచేస్తూ మే 4న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నాసిరకంగా పనులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సంస్థకు రూ.102.72 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎఫ్ఆర్సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్ఎఫ్ఆర్సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి.. షార్ట్ క్రీటింగ్ విధానంలో పనులు చేస్తే జాప్యం జరుగుతుందని సాకులు వెతికి.. ఎస్ఎఫ్ఆర్సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. అయినా ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ గట్ల వాలును క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటరుకు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిండంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో అత్యంత నాసిరకంగా వేసిన లైనింగ్ ఒక్క సీజన్లో నీటి ప్రవాహానికే ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది.లైనింగ్ పనులు చేయాల్సింది ఇలా..» తొలుత కాలువపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా.. అడుగు భాగంలో ఇన్క్లెయిన్డ్ రోలర్ (పొక్లెయినర్కు రోలర్ను అమర్చడం)తో గట్టిపరచాలి.» ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరు వైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.» రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి.. దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి. » పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్ను తీసి.. ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే.. వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.» పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. 50 శాతం లోపు పనులను అధికారుల అనుమతితో సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. కానీ.. పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.లైనింగ్ పనులు చేసింది ఇలా..» కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలంచి, దారిని వేశారు. కానీ.. ఇన్క్లెయిన్డ్ రోలర్తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా కేవలం పొక్లెయిన్ బకెట్తో తూతూ మంత్రంగా గట్టిపరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోయింది. » గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్లపై పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచి కంకర తయారు చేశారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం), ఎ0–20 (ఒక పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు. » కాలువకు ఇరువైపులా ఇన్క్లెయిన్డ్ రోలర్తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికులతోనే సిమెంటు కాంక్రీట్తో లైనింగ్ చేశారు. మట్టి జారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేశారు. దీనివల్ల గత ఆగస్టులో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుకపైకి తేలి స్పష్టంగా కన్పిస్తోంది. -
నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే !
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి భర్తీ అవుతున్న నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. అధికారికంగా మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించుకున్నారు. కానీ, జనసేన అభ్యర్థిగా చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న లింగమనేని రమేష్ ని ఎంపిక చేయడంతో నాలుగు స్థానాలూ టీడీపీయే తీసుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి పొత్తులో భాగంగా నాలుగింటిలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీ చెరొక స్థానం పంచుకోవాల్సి ఉంది. కానీ, కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తమకు 3 సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీని ఒప్పించి టీడీపీకి చంద్రబాబు మూడు స్థానాలు కేటాయించుకున్నారు. గతంలో భర్తీ అయిన 4 స్థానాల్లో బీజేపీ రెండు తీసుకోవడంతో మిగిలిన ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున తన మనిషిని అభ్యర్థిగా పెట్టి మొత్తం నాలుగింటిని టీడీపీకే దక్కేలా చేసుకున్నారు. టీడీపీలో భారీ లాబీయింగ్ టీడీపీకి దక్కనున్న మూడు స్థానాల కోసం ఆ పార్టీలో పెద్దఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కి ఆ పదవి రెన్యువల్ చేయడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు స్థానాలకు మంత్రి నారా లోకేశ్ అనుయాయుడు కిలారు రాజేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజేష్, విజయ్ పేర్లు ఖరారైనట్లు శుక్రవారం అంతా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో భాష్యం రామకృష్ణ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తన మద్దతుదారులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.అయితే అక్కడున్న నేతలు ఆయనకు సర్దిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ చివరి నిమిషంలో సామాజిక సమీకరణలు మార్చాలని చంద్రబాబు భావిస్తే బీసీ, ఎస్సీ నేతలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అందులో మహిళా నేతలు గుండా లక్ష్మీదేవి, సజ్జా హేమలత, ఉండవల్లి శ్రీదేవి పేర్లను పరిశీలించినా వారు ఆర్థికంగా టీడీపీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన డాక్టర్ దేవయ్య, కంభంపాటి రామ్మోహనరావు పేర్లను పరిశీలించినా చివరికి వారినీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి గానీ శనివారం గానీ అధికారికంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమకు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. బాబు సొంత మనిషి.. ఇప్పుడు పవన్కి ఆప్తుడులింగమనేని రమేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటున్నా నిజానికి ఆయన చంద్రబాబు సొంత మనిషిగా, బినామీగా పేరు పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట నివాసం ఆయనదే. రమేష్ దాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారనే ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్తో సైతం రమేష్ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపాలని పవన్ నిర్ణయించారు. రమేష్ జనసేన తరఫున ఎంపీ అయినా చంద్రబాబు జేబులో మనిషేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వ్యూహం ప్రకారమే రమేష్ జనసేన తరఫున రాజ్యసభ రేసులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా నాలుగు రాజ్యసభ స్థానాలను చేజిక్కించుకోవడానికి చంద్రబాబు పన్నిన వ్యూహం ఫలించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
18న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను 17వ తేదీ ఉదయం 11 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖ(కేబినెట్ విభాగం)కు పంపించాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జి.సాయిప్రసాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. -
కొనసాగుతున్న ఎండ తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.7, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.3, కృష్ణా జిల్లా కానుమోలులో 43.1, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.1, ప్రకాశం జిల్లా కరేడులో 43, విజయనగరం జిల్లా రాజాంలో 42.7, అనకాపల్లి జిల్లా రాజాంలో 42.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లా పి.కోటకొండలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా హంద్రీకైర్వాడిలో 4.2, బాపట్ల జిల్లా గూడవల్లిలో 4.2, కర్నూలు జిల్లా గూడూరులో 2.7, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1.7, ఎర్రమంచిలో 1.3, అనంతపురం జిల్లా సలకంచెరువులో 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నేడు ఎండ తీవ్రత ఉండే ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
స్క్వేర్ ఫీటు.. ‘హై’రేటు
సాక్షి, అమరావతి: రాజధానిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) ప్రాంతంలో ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రూఫ్టాప్ ఎలివేషన్ కోసం ప్రీకాస్ట్ పిన్స్ నిర్మాణం, ఆ భవనం వెలుపల పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్, అంతర్గత రోడ్డు, సబ్స్టేషన్, వాటర్ బాడీస్ వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మరో రూ.547.07 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను డిజైన్, బిల్డ్ లంప్సమ్ విధానంలో టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అనుమతిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,978లకు చేరింది. హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు(బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ డిజైన్ను పోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థ రూపొందించింది. రూ.924.69 కోట్ల నుంచి రూ.2,027.76 కోట్లకు..హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.ఇక ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ(హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ(సీసీ టీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.547.07 కోట్ల మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. సుప్రీం కోర్టుకు కొత్తగా 86,500 చదరపు మీటర్లు(9,31,078.25 చదరపు అడుగులు)లో రూ.800 కోట్ల వ్యయంతో అదనపు భవనం నిర్మిస్తున్నారు. అంటే.. సుప్రీం కోర్టు కొత్త భవనం కంటే 11,01,152.75 (రెట్టింపు) చదరపు అడుగులు ఎక్కువ నిర్మిత ప్రాంతంతో హైకోర్టు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కేసులు సుప్రీం కోర్టులో విచారణకు వస్తాయి. అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్లతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఎంతకు చేరుతుందో? రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయంతో ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చునని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి 4,500కు మించదని గుర్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణంలో దుబారా చేస్తూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
మనోడే.. దోచిపెట్టేద్దాం!
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచేస్తూ శుక్రవారం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఆ పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.444.05 కోట్లు పెంచేసిందన్న మాట. కేవలం 20 నెలల్లోనే అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచేయడంపై ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పనులను ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ చేస్తుండటం వల్లే చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో అంచనా వ్యయాన్ని పెంచేసిందని.. డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)కి ఇది మరో నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు. పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ఈ పనుల్లో 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల పొడవున లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను ఏపీడీఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60–సీ నిబంధన కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తొలగించింది. ఆ పనులను రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే (మైదుకూరు) పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)కు 5ఏ ప్యాకేజీ కింద 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టింది. సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్, పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ చేసిన పనులు పోగా 5, 5ఏ ప్యాకేజీల్లో 2024 నాటికి రూ.81.63 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఆ పనుల వ్యయాన్ని 2023–24 ధరల ప్రకారం రూ.352.60 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబరు 3న చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. రూ.270.97 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది.అంచనాలు పెంచి అధిక ధరలకు రాయల రఘుకు అప్పగింతపోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన పనులను ఆర్నెల్లలోగా పూర్తి చేయాలని గడువు పెట్టి.. రూ.293.66 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 అక్టోబర్ 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన రాయల రఘుకు చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి, అధిక ధరలకు కట్టబెట్టినా, రాయల రఘు సంస్థ అత్యంత నాసిరకంగా పనులు చేస్తుండటాన్ని ‘వియ్యంకులకు పోలవరం’ శీర్షికన ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘నీకింత.. నాకింత’ అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోండటం వల్లే పనులు అత్యంత నాసిరకంగా చేస్తున్నారని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.తాజాగా మళ్లీ అంచనా వ్యయం పెంపుపోలవరం ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్టు దాటిన తర్వాత 2 కొండల మీదుగా కాలువ తవ్వాలి. కొండల వైపున కాలువకు ఒక గట్టు.. మరోవైపు ఇంకో గట్టు ఉంటుంది. కొండల వైపున కాలువ తవ్వడం వల్ల గట్టు వేయాల్సిన అవసరం లేదు. కొండలకు మరో వైపున 500–600 మీటర్ల పొడవున మట్టికట్టతో గట్టును వేయడంతోపాటు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించేలా డిజైన్ను మార్చారు. ఈ పనులకు రూ.100 నుంచి రూ.150 కోట్లకు మించి కాదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ ఒకేసారి అంచనా వ్యయాన్ని రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనా వ్యయాన్ని రూ.444.05 కోట్ల మేర పెంచేయడాన్ని బట్టి చూస్తే.. ఈనాడు కిరణ్ వియ్యంకుడికి మరోసారి భారీగా ప్రయోజనం చేకూర్చడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన పనులను రూ.307.41 కోట్లకు రాయల రఘు సంస్థకు అప్పగించారు. అందులో 15% అంటే రూ.46.12 కోట్ల మేర అంచనా వ్యయం పెరిగితే ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు అప్పగించే అధికారం చీఫ్ ఇంజినీర్కు ఉంటుంది. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు అప్పగించాలి. కానీ.. అంచనా వ్యయం రూ.444.05 కోట్ల మేర పెంచేసినా ఆ పని రాయల రఘు సంస్థే చేస్తోండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. -
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
సాక్షి,అమరావతి: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ను ఖరారు చేసింది. అధికారికంగా జనసేన ప్రకటించిన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లింగమనేని రమేష్కు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబుకు లింగమనేని కరకట్ట వద్ద గెస్ట్ హౌస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ భవనం అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్తో పాటు లింగమనేని రమేష్కు లావాదేవీలు ఉన్నాయి. లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే పవన్ కళ్యాణ్ నివాసం, అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో, జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా లింగమనేని రమేష్కు అవకాశం ఇచ్చినట్లు జనసేన ప్రకటించింది. -
రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదు
సాక్షి,అమరావతి: రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. చేసింది చెప్పుకోవాలన్నా ఏమీ కనిపించడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లడం, అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు పని చేస్తున్నారు.లిక్కర్ స్కాం జరగకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతీ పైసా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. చంద్రబాబు గతంలో లిక్కర్ పేరుతో లెక్కలేనన్ని స్కాములు చేశారు. లిక్కర్లో చంద్రబాబు రూ.25వేల కోట్ల స్కాం చేశారు. చంద్రబాబు 40వేల బెల్టు షాపులు నడిపించారు. రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్లుకుపైగా నష్టం చేకూర్చారు. వ్యవస్థలు మేనేజ్ చేసి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
ఉత్త ప్రచారానికే 40 కోట్లు!
ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఒకవైపు, ప్రచార వ్యూహాలు మరోవైపు ఉండే సున్నితమైన సరిహద్దు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఏపీలో సోషల్ మీడియా ప్రచారం పేరుతో భారీ నిధుల కేటాయింపు జరిగిందన్న అంశం రాజకీయ వర్గాల్లోనూ, నెటిజన్ల మధ్యనూ తీవ్ర చర్చకు కారణమవుతోంది.సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పబ్లిసిటీ కోసం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం కోసం దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వినియోగించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ప్రచారం కోసం ఇంత భారీ వ్యయం ఇప్పుడు అవసరమా? అనే చర్చ జోరందుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాకుండా ప్రధాని మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు భారీ ప్రచార వ్యయంపై విపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు.చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి తాజాగా రెండేళ్లు పూర్తైంది. ఈ కాలంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. రెండూ పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన కూడా ముందుకు వస్తోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా టీంలు చంద్రబాబు విషయంలో ఎంత హడావిడి చేస్తున్నదో తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ విభాగం ద్వారా ఆ పనిని ముమ్మరం చేయాలని చంద్రబాబుకు తనయుడు, మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు దుబారా విమర్శను అంగీకరించకుండా.. డిజిటల్ యుగంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరాలంటే సోషల్ మీడియా ప్రచారం అవసరమేనని అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించడానికి నిబద్దతతో పని చేద్దాం. సుస్థిరత అనేది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. మనందరి జీవితాల్లో అంతర్భాగం కావాల్సిన ఒక బాధ్యత’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. On the occasion of World Environment Day, let us reaffirm our commitment to protecting nature and conserving the environment for future generations. Sustainability is not just a goal but a responsibility that should be integrated into our lives.#WorldEnvironmentDay— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2026 -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా నియమించారు. డి.శ్రీరామకృష్ణమూర్తి(అమలాపురం), గొల్లపల్లి డేవిడ్ రాజు(కొత్తపేట), ఎస్.సత్యనారాయణమ్మ(కర్నూల్) పార్టీ కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమితులయ్యారు.అలాగే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జె.మారయ్య(ఆలూరు), ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి(పాణ్యం), గంధం వీర రాఘవరెడ్డి(ఆళ్లగడ్డ), నారపురెడ్డి జగదీశ్వర్ రెడ్డి(జమ్మలమడుగు), రాచంరెడ్డి భాస్కర రెడ్డి(పుట్టపర్తి), రాజులపూడి భాస్కరరావు(అమలాపురం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
మాకు ప్రాణభిక్ష పెట్టండయ్యా..
సాక్షి, న్యూఢిల్లీ: ‘మొక్కజొన్నకు ధర లేకపోవడంతో మేం గోదాములో పంట నిల్వ చేసుకున్నాము. మేమంతా అక్కడున్న సమయంలో ఆ గోదాముపై టీడీపీకి చెందిన కొందరు గూండాలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు రోప్లను మా మెడలకు వేసి మమ్మల్ని లాగి కిందకు పడేశారు. పచ్చి బూతులు తిడుతూ ఈడ్చి తంతాం.. చంపేస్తాం.. అంటూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. మాకు పోలీసుల నుంచి ప్రాణభిక్ష పెట్టండయ్యా..’ అంటూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన మహిళా రైతులు, రైతు కూలీలు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్లకు మహిళా రైతు, రైతు కూలీలు విజ్ఞప్తి చేశారు. మహిళలమని కూడా చూడకుండా అసభ్యకరంగా తాకుతూ భయభ్రాంతులకు గురిచేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసుల వ్యవహారంపై వీడియో ఫుటేజీ ఆధారాలను అందజేశారు. దీనికి స్పందించిన కమిషన్ల చైర్మన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మామిళ్లపల్లిలో ఇటీవల జరిగిన ఖాకీల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ తనూజారాణి నేతృత్వంలో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ కిశోర్ రహత్కర్, ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, సభ్యుడు వడ్డేపల్లి రామచందర్లను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. వీరి వెంట మామిళ్లపల్లికి చెందిన మహిళా రైతులు ఇక్కుర్తి సుజాత, అంబటి పార్వతి, లక్ష్మి, అంబటి సామ్రాజ్యం, మహిళా రైతు కూలీలు, బాధితులు కూచిపూడి మరియరాణి, యాతం మమత, కొమ్ము మరియమ్మ, దాసరి దానమ్మ, వైఎస్సార్సీపీ మహిళా నేత గుంటూరు శ్రీరెడ్డిలు ఉన్నారు. పోలీసులే రౌడీలుగా మారారు వైఎస్సార్సీపీ ఎంపీల విమర్శ కమిషన్ల చైర్మన్లతో భేటీ అనంతరం రైతులతో కలిసి ఎంపీలు డాక్టర్ తనూజా రాణి, గొల్ల బాబూరావు, పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వ దమనకాండను ఎండగట్టారు. పోలీసులే రౌడీలుగా మారి ఎస్సీ మహిళా రైతుల మీద దాడులు చేశారని డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలను మహారాణులుగా చూసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళలని కూడా చూడకుండా వారిపై పోలీసులు భౌతికంగా దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని గొల్ల బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో కాపు మహిళా రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వారికి అండగా నిలిచిన రైతు కూలీలైన ఎస్సీ మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారని విమర్శించారు. -
బ్రోకరిజం ఆయన మేనరిజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)లో భూసమీకరణ, భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) తీరుపై ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన తీరును చూసి స్పెషల్ డిప్యూటీ కలెక్టరా? రియల్ ఎస్టేట్ బ్రోకరా అంటూ నివ్వెరపోతున్నాయి. తమ కడుపు కొట్టి ఇప్పటికే దాదాపు రూ.15 కోట్లు ఆ అధికారి వెనకేసుకున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. నోటిఫికేషన్ల ఆసరాగా అడుగులు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 37,941.58 ఎకరాలు సమీకరించాల్సి ఉండగా ఇప్పటి వరకూ భూసమీకరణ పథకం కింద 35,017.89 ఎకరాలు సమీకరించారు. మరో 117.54 ఎకరాల భూమిని భూసేకరణ చట్టం–2013 కింద సేకరించారు. ఇంకా 2,806.15 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంది. ఆ భూమిని సీఆర్డీఏకు భూసమీకరణ కింద ఇచ్చేందుకు ఉండవల్లి, పెనుమాక, లింగాయపాలెం, నేలపాడు, మందడం, రాయపూడి తదితర గ్రామాల రైతులు అంగీకరించడం లేదు. భూసమీకరణ కింద భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టం–2013 కింద సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ భూములను సేకరించేందుకు సీఆర్డీఏ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఎస్డీసీ రియల్టీ దందా ప్రారంభించాడు. భూములు ఇవ్వని రైతుల ఇళ్ల వద్దకు సదరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వ్యక్తిగతంగా చాటుమాటుగా వెళ్తూ రూ.కోట్లు కూడబెట్టుకునే పన్నాగం పన్నాడు. ఎస్డీసీ చాటుమాటు బేరసారాల క్రమమిది మీ భూమిని భూసేకరణ చట్టం–2013 కింద బలవంతంగా సేకరించడానికి నోటిఫికేషన్ ఇస్తాం. దీని వల్ల ఎకరానికి పరిహారం రూ.50 లక్షలకు మించి రాదు.. ఆ భూమిని నాకు అమ్మండి... అంతకంటే ఎక్కువ ఇస్తాను.. అంటూ తొలుత బేరసారాలకు, బెదిరింపులకు దిగుతున్నాడు. రైతులతో భూమి ధరను ఖరారు చేసుకున్నాక.. వాటిని రియల్టర్లకు తాను ఆ రైతులతో ఖరారు చేసుకున్న ధర కంటే అధిక ధరకు విక్రయించి లాభం దండుకుంటున్నాడు. మరోవైపు ఆ రియల్టర్ నుంచి 2 శాతం కమిషన్ కూడా తీసుకుంటున్నాడు. తన ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి భూసమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించిన రియల్టర్లకు.. రాజధానిలో ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తూ వారి వద్ద నుంచి లంచాలు మింగేస్తున్నాడు. కొండవీటివాగు వరద ముప్పు నివారణకు సీఆర్డీఏ చేపట్టిన పెనుమాక, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్ కోసం తవి్వన మట్టిని టిప్పర్ల చొప్పున విక్రయిస్తూ ఇప్పటికే భారీ ఎత్తున దోచేస్తున్నారని చెబుతున్న రైతులు, ఇప్పుడిక అధికారులు రియల్టర్ల అవతారం కూడా ఎత్తడంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీకి ఝలక్.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానం కేటాయించుకున్నాయి. నాలుగింటిలో బీజేపీకి ఒక్క స్థానం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపు, రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను పల్లా, మాధవ్, నాదెండ్ల కలిసి మీడియాకు వివరించారు. మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేనకి కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్కళ్యాణ్ ప్రకటిస్తారని మనోహర్ చెప్పారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని మాధవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో రెండేళ్ల పాలనపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ‘సర్’ గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. గతంలో రెండు, రెండు గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయినప్పుడు టీడీపీ, బీజేపీ రెండు చొప్పున పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగింటిలో మూడు తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో తమకు ఒక స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్కళ్యాణ్ కోరడంతో జనసేనకు ఒక స్థానం కేటాయించారు. టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతుండడంతో సానా సతీష్, కిలారు రాజేష్ కు ఇవ్వాలని ఈ సమావేశంలో లోకేశ్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సతీష్, రాజేష్లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్ దేవయ్య, ఓ మహిళా నేతల్లో ఒకరికి చాన్స్ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. జనసేనకు దక్కనున్న ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. -
మార్కెట్లోకి ఆదిత్య బీజీ 2 పత్తి విత్తనం
సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ–2208 (ఆదిత్య బీజీ–2)’విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణతో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విత్తనాలను విడుదల చేశారు. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.జాతీయ విత్తన విడుదల కమిటీ ఆమోదంతో విడుదలైన ఈ రకం యూనివర్శిటీ అభివృద్ధి చేసిన తొలి బీటీ పత్తి రకం విత్తనం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సాగుకు అనుకూలంగా ఈ రకాన్ని సిఫారసు చేసినట్లు చెప్పారు.బీటీ సాంకేతికతపై పేటెంట్ హక్కులు ముగిసిన అనంతరం తొమ్మిదేళ్లపాటు శాస్త్రీయ పరిశోధనలు, అఖిల భారత స్థాయి పరీక్షలు నిర్వహించి ఈ రకాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ కొత్త విత్తనం ప్రత్యేకతలను శాస్త్రవేత్తలు వివరించారు. అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత లాం బీజీ టూ–2208 రకం హెక్టారుకు 32 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. మార్కెట్లో ఉన్న హైబ్రిడ్ రకాలతో సమానమైన దిగుబడిని ఇవ్వడంతో పాటు మెరుగైన దూది నాణ్యత ఉంది. ఇది సూటి రకం (వేరైటీ) కావడంతో రైతులు ప్రతి ఏటా కొత్త విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, తమ పొలాల్లో పండించిన పంట నుంచి విత్తనాన్ని భద్రపరచుకొని తిరిగి వినియోగించుకోవచ్చు.ఈ రకం శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు వంటి కాయ తొలిచే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి రసం పీల్చే పురుగుల ప్రభావాన్ని తగ్గించే లక్షణాలు ఉంది. బ్యాక్టీరియల్ బ్లైట్, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, వెర్రి తెగులు వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో రైతులు పురుగు మందులు, తెగుళ్ల నివారణ మందులపై చేసే ఖర్చును తగ్గించుకోవచ్చు. ప్రత్యేక లక్షణాలు రకం : లాం బీజీ టూ –2208 (ఆదిత్య బీటీ–2) దిగుబడి : హెక్టారుకు 32–35 క్వింటాళ్లు కాయ బరువు : 5.5 నుంచి 6 గ్రాములు దూది పొడవు : 29.5 నుంచి 30 మి.మీ. దూది సున్నితత్వం : 4.3 నుంచి 4.6 మైక్రోనైర్ దూది బలం : 33.1 గ్రాములు/టెక్స్ -
ఎండ.. వాన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఎండ, వానతో విభిన్న వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఎండ, వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని పలుచోట్ల 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలుమరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 3 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లి 2.7, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 1.8, విజయనగరం జిల్లా గుర్లలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఇదే విధంగా ముందుకు కదలితే 7, 8 తేదీల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు వచి్చనా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. -
జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్ర బ్రష్టుపట్టాయని, ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మెగా డీఎస్సీ పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. ఆఖరికి క్రీడల కోటా కింద 52 ముక్కల పేకాట (బ్రిడ్జ్) గేమ్ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల యువత భవిష్యత్తులో క్లబ్బుల బాట పట్టే ప్రమాదం ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత దానికి సమాధానం చెప్పకుండా, గత ప్రభుత్వం టీచర్లను వైన్షాప్ల వద్ద కాపలా పెట్టిందని అబద్ధాలు మాట్లాడారు. దీనికి ఆధారాలు చూపిస్తారా? ఇలా జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా? ఇలా అబద్ధాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పండి. నిజానికి మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల వద్ద ఉద్యోగులతో అడ్డదిడ్డమైన పనులు చేయించింది చంద్రబాబు సర్కారే. ఇందుకు సహకరించని ఉద్యోగులను అక్రమ కేసులు పెడతామని బెదిరించిన చరిత్ర కూడా చంద్రబాబు ప్రభుత్వానిదే’ అని విమర్శించారు. ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు చంద్రబాబు సర్కార్కు ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని కాకర్ల స్పష్టం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తడిగుడ్డతో ఉద్యోగుల గొంతు కోస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వేధింపులకు గురి చేస్తోంది. ప్రభుత్వంలో ఒత్తిడి భరించలేక 100కు పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన మేలు, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశారో బేరీజు వేసుకుంటే ఎవరు ఉద్యోగులకు మేలు చేశారో తెలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఐఆర్, పీఆర్సీ, డీఏలు లేవు. ప్రమోషన్లు లేవు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. పైగా రెగ్యులరైజేషన్ కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఎల్లో మీడియాలోనే వచ్చింది. ఇలా అడ్డగోలు పనులు చేస్తూ వాటిని ప్రశ్నిస్తే నాలాంటి వారిని డిస్మిస్ చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడైనా.. ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నించారు. ఉద్యోగులను అడ్డగోలు పనులకు వినియోగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీడియాకు కాకర్ల చూపించారు. వీటిని హోం మంత్రి అనిత చూడాలని అన్నారు. -
‘పవర్’ లాబీయింగ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, కేబినెట్లో కూడా దీనికి అంగీకారం తెలిపిందంటూ గురువారం ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఎల్లో మీడియా వార్తలు చక్కర్లు కొట్టాయి. నిజానికి కేబినెట్ అజెండాలోనే అసలు ఈ అంశం లేదు. అయినా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉందని, అయితే అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా తాము ‘లాబీయింగ్’ చేస్తామని చెబుతూ కొందరు వ్యక్తులు ఉద్యోగులను దోచుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూ.కోట్లు వసూలు కూడా చేసేసినట్టు తెలిసింది. మూడు ప్రతిపాదనలు విద్యుత్ సంస్థల్లో 1990 నుంచి 1998 వరకూ నియామకాలు ఎక్కువగా జరిగాయి. ప్రస్తుతం అన్నిటిలో కలిపి 34,582 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరిలో 80 శాతం 1990 నుంచి 1998 మధ్యకాలంలో నియమితులైన వారే ఉన్నారు. వీరంతా 2026 నుంచి 2030 మధ్య పదవీ విరమణ చేయనున్నారు. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వారు వేలల్లో ఉన్నారు. వారందరికీ బెనిఫిట్స్ ఇవ్వడానికి భయపడిన కూటమి ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఈ రెండేళ్లకు కూడా బెనిఫిట్స్ ఇవ్వకుండా మరో రెండేళ్లు పెంచాలని కూడా ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే విద్యుత్ సంస్థ(ట్రాన్స్కో, జెన్కో, నెడ్క్యాప్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్)ల్లో 60 ఏళ్లకు ఇటీవల పదవీ విరమణ చేసిన వారు, త్వరలో చేయనున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది.దీంతో పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం విద్యుత్ సంస్థల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. దానిలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. వారు సీఎం వద్ద మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి 2022 నుంచి పదవీ విరమణ వయసు పెంపును వర్తింపజేయడం. రెండోది కూటమి అధికారంలోకి వచి్చన 2024 నుంచి ఈ నిబంధనను అమలుల్లోకి తెస్తున్నట్లు చెప్పడం. మూడోది.. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఎప్పుడు ఆదేశాలిస్తే.. అప్పటి నుంచి అర్హులకు ఇవ్వడం. ఈ మూడు ప్రతిపాదనల్లో 2022 నుంచి అమలు చేయాలన్న దానిపైనే ఉద్యోగులు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. కావాలనుకునే వారి నుంచి వసూళ్లు విద్యుత్ సంస్థల్లో కారి్మకులు, ఇంజినీర్లు, అకౌంట్స్, మానవ వనరుల శాఖ అనే నాలుగు ప్రధాన విభాగాలున్నాయి. వీటిలో కార్మికులు, ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. 55 ఏళ్లు నుంచి 60 ఏళ్లు వరకూ విద్యుత్ స్తంభాలు ఎక్కడం వంటి పనులు వీరు చేయలేరు. అదీగాక ప్రస్తుతం ఉద్యోగుల కొరత వల్ల ఒక్కొక్కరూ నాలుగైదు విభాగాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపించి, ఇటీవల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. పైగా పదవీ విరమణ బెనిఫిట్స్పై వచ్చే వడ్డీ కంటే వయసు పెంచి ఇచ్చే జీతం తక్కువ. దీంతో పదవీ విరమణ వయసును పెంచడం చాలా మంది ఉద్యోగులకు ఇష్టం లేదు. కానీ మరికొంత మంది మాత్రం పదవీ విరమణ వయసు పెంచాలని కోరుకుంటున్నారు.తద్వారా తమకు పదోన్నతులు వస్తాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయని వారు ఆశపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సూపరింటెండెంట్ ఇంజనీర్లు (ఎస్ఈ), డివిజన్ ఇంజనీర్లు(డీఈ) ఉన్నారు. వీరిని టార్గెట్ చేసిన ఓ విశ్రాంత ఉద్యోగి తనకున్న పలుకుబడి, తనపైన ఉన్న మరో ముఖ్య నాయకుడితో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. అతను చెప్పిన మాటలు, అతని వెనుక ఉన్న వ్యక్తులను చూసి పని అవుతుందని భావిస్తున్న ఉద్యోగులు ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి అతను అడిగినంత ఇస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక్క విద్యుత్ శాఖ నుంచే రూ.5 కోట్ల వరకూ వసూలు చేశారని అంటున్నారు. కాగా, ఇదే వ్యక్తిపై గతంలో కాల్మనీ సెక్స్రాకెట్ వివాదంలో అనేక ఆరోపణలున్నాయి. -
ప్రభుత్వ భవనాల్లో హంగులకు రూ.641.97 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు అదే దోపిడీని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ భవనాలకు లగ్జరీ హంగులు, సోకుల పేరుతో మరోసారి భారీగా నిధులను దోచుకునేందుకు ఎత్తుగడ వేసింది. ఏప్రిల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో రాజధాని భవనాల అద్దాల అలంకరణలు, నగిషీల కోసం ఏకంగా రూ.3,338 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలపగా.. తాజాగా అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లోని హైకోర్టు భవనంలో హంగుల కోసం రూ.547.07 కోట్లు, ఐఏఎస్ భవనాల సోకుల కోసం రూ.94.90 కోట్లను వెచ్చించేందుకు పరిపాలన ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలివీ » అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలోని హైకోర్టు భవనంలో రూఫ్టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రహదారులు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ఆఫ్–ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు రూ.547.07 కోట్లకు పరిపాలన ఆమోదం. టెండర్ ప్రక్రియకు అనుమతి. » రాయపూడి గ్రామంలోని ఐఏఎస్ (ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి) భవనాలకు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అదనపు వార్డ్ రోబ్లు, స్టోర్ రూమ్, జ్యూస్ కౌంటర్, స్పైరల్ స్టెయిర్కేస్, బాల్కనీ విత్ క్యానోపీ, కార్ పార్కింగ్ షెడ్, గ్లేజ్డ్ రెయిలింగ్స్, టెన్సైల్ రూఫింగ్, హీట్ పంప్స్, బాహ్య విద్యుత్ పనులను రూ.94.90 కోట్లతో ఎల్–1 బిడ్డర్కు పనులు అప్పగించేందుకు ఆమోదం. » లండన్, దుబాయ్ తరహాలో అమరావతి అందాలను చూపించేందుకు కృష్ణా నది ఒడ్డున 6 ఎకరాల్లో అమరావతి ‘ఐ’ నిర్మాణం. 30 ఏళ్ల ఒప్పంద కాలంతో టెండర్ల ఆహ్వానానికి ఆమోదం. » అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజి్రస్టేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు, ఇతర వర్తించే చార్జీలు రూ.5.53 కోట్లు మినహాయింపు. » రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మార్పుల కోసం నెగోషియబుల్ సెటిల్మెంట్ విధానంలో సవరణలకు ఆమోదం. » చీరాల సూర్యలంక, విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా రెండేసి బీచ్ షాక్స్ ఏర్పాటు. ఫలితాల ఆధారంగా ఇతర తీర ప్రాంతాలకు విస్తరణ. బీచ్ షాక్స్లో కొన్నిరకాల మద్యం బ్రాండ్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం. » పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనుల విలువ రెట్టింపు చేసేందుకు ఆమోదం. గతంలో రూ.352.60 కోట్లకు మంజూరైన పనుల విలువను రూ.796.66 కోట్లకు పెంచుతూ సవరణ. » బాపట్ల జిల్లా కుందేరు డ్రెయిన్కు రూ.517.50 లక్షలతో కాలువ తవ్వకం పనులకు ఆమోదం. » అగ్రి గోల్డ్ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో 21 పోస్టుల భర్తీకి ఆమోదం. అగ్రి గోల్డ్ అంశంపై మంత్రుల కమిటీ. » జూలై 1 నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం –2025 అమలు కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఆమోదం. వీబీజీ రామ్జీ పథకంలో వ్యవసాయ పనుల సీజన్లో 60 రోజులు ఉపాధి పనులకు సెలవులిచ్చే అంశం కలెక్టర్లకు అప్పగింత. » అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో రెండెకరాల ప్రభుత్వ టీడీపీ జిల్లా కార్యాలయం కోసం 66 ఏళ్లపాటు ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున లీజుపై ఇచ్చేందుకు ఆమోదం. » కాకినాడ అర్బన్ మండలంలో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ జిల్లా కార్యాలయం కోసం 66 ఏళ్లపాటు ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున లీజుపై ఇచ్చేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026–2031కు ఆమోదం. » తిరుపతి జిల్లా శ్రీసిటీలో ‘శ్రీ సిటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ యూనివర్సిటీ’ ఏర్పాటు కోసం ‘ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం–2016’ షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. » గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మొత్తం ట్యాంక్ పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నందున ఆ రికార్డులను గ్రామ కంఠంగా మార్చేందుకు అనుమతి. » హడ్కో నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.300 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వ హామీ ఇస్తూ జారీ చేసిన జీవోకు ఆమోదం. » రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోలార్ ప్లాంట్లకు, రాజధానిలో కొన్ని సంస్ధలకు భూముల కేటాయింపులకు ఆమోదం.సర్కారు భవనాల సోకుల కోసం రూ.547.07 కోట్లు, ఐఏఎస్ భవనాల హంగులకు రూ.94.90 కోట్లను వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా రెండేళ్లు కాలక్షేపం చేసింది. అమరావతి పేరుతో లగ్జరీల కోసం రూ.వేల కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ భారీ దోపీడికి పాల్పడుతోంది. డబ్బుల్లేవంటూ గత ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను నిలుపుదల చేసిన ప్రభుత్వం అమరావతి పేరుతో రూ.వేల కోట్లను సంతర్పణ చేస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తి అయ్యేవి. ప్రాధాన్యత గల పనులు చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం భారీగా వ్యయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
శ్రీమతి కోసం పరపతి పణం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ రాజకీయ స్వార్థానికి అధ్యాపకుల జీవితాలు బలైపోతున్నాయి. ఒక ఎమ్మెల్సీ తన భార్య పదోన్నతి కోసం సాగించిన కుతంత్రాలు వేలాది మంది లెక్చరర్లను తీవ్ర అవస్థలపాలు చేస్తున్నాయి. కొండలు, కోనల్లో కుటుంబానికి వేల కిలో మీటర్ల దూరంలో పని చేస్తూ బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సగటు అధ్యాపకుడి ఆశలకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు (చిరంజీవి) గండికొట్టడం మేధావి వర్గాల్లో ఆగ్రహావేశాలు రేకెత్తిస్తోంది. ‘‘లెక్చరర్స్, ప్రిన్సిపాళ్ల బాధ వినే వారు కూటమి ప్రభుత్వంలో లేరా? లోకేశ్ విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి వినతులిస్తున్నాం. కానీ, లోకేశ్ ఎప్పుడూ ఎమ్మెల్సీ చిరంజీవితో సంప్రదించేవారు. ఇక్కడే, ఎమ్మెల్సీ కథ నడిపించారు. బదిలీలపై ఎప్పుడు అడిగినా ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకుల సర్వీసు రూల్స్ లేవని అధికారులతో చెప్పించి చాకచక్యంగా బదిలీలు అడ్డుకున్నారు. సర్వీసు రూల్స్ ప్రమోషన్లకు అవసరమా? బదిలీలకు అవసరమా? బదిలీలకు స్టేషన్ సీనియార్టీ ఉంటే సరిపోతుందని అధికారులకు తెలీదా?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో అధ్యాపకులు దుమ్మెత్తిపోస్తున్నారు. సీనియార్టీలో 40వ స్థానంలో ఉన్నా..! ఇటీవల ప్రిన్సిపాల్ ప్రమోషన్ కోసం రూపొందించిన సీనియార్టీ జాబితాలో 20వ స్థానానికి ముందే ఉన్న లెక్చరర్లు సబ్బవరానికి మొదటి ఆప్షన్ ఇవ్వగా ఎక్కడో 40వ స్థానంలో ఉన్న ఎమ్మెల్సీ భార్య నివేదితకు ప్రిన్సిపాల్ పోస్టు కట్టబెట్టేశారని బాధితులు తూర్పారపడుతున్నారు. అసలు తొలుత తయారు చేసిన జాబితాలో నివేదితకు 17వ స్థానం ఇవ్వగా ఆ తర్వాత దానిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 40వ స్థానంలో పెట్టారని, అయినా అనుకున్న చోట ప్రిన్సిపాల్ పోస్టుల ఇచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీ జాబితాలో టాప్లో ఉన్న ఓ జువాలజీ లెక్చరర్ సబ్బవరం తొలి ఆప్షన్ ఇస్తే.. ఆమెను మాడుగుల వేశారు.అయితే, ఫిజిక్స్, తెలుగు లెక్చరర్లు మాడుగుల అవకాశాన్ని కోల్పోయి ఎక్కడో పాలకొండ, అరకు వ్యాలీ(ఉమెన్) డిగ్రీ కళాశాలలకు పోస్టింగ్ ఇచ్చారు. జోన్–2లోనూ 24వ స్థానంలో ఉన్న గణితం లెక్చరర్ను మంత్రి సిఫారసుతో సీనియర్లను వెనక్కి నెట్టి రామచంద్రాపురం వేశారు. జోన్–1 శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఖాళీని చూపించకుండా బ్లాక్లో పెట్టారు.ఇక్కడి ఐడీ కళాశాలలో ఏడాదిగా ఒక జూనియర్ లెక్చరర్ ఇన్చార్జీగా పాలన సాగిస్తున్నారే తప్ప ప్రిన్సిపాల్ పోస్టు భర్తీ చేయట్లేదు. ‘‘అసలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పుడు ప్రమోషన్లు ఎలా చేశారు. మరో కేసులో ప్రిన్సిపాల్ పోస్టు ఖాళీగా ఉంచకుండా ఇన్చార్జీ, ఇన్టెర్మ్ అరేంజ్మెంట్ చేయాలని సూచించింది. దీనిని అడ్డుపెట్టుకుని ప్రమోషన్లు ఇచ్చేస్తారా? అంటూ దుయ్యబడుతున్నారు. ఈ అక్రమ ప్రమోషన్లపై సమగ్ర విచారణ చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. పథకం ప్రకారమే.. సర్వీసు రూల్స్ను అడ్డుపెట్టుకుని బదిలీలను నిలుపుదల చేయడంలో ఎమ్మెల్సీ చిరంజీవి పథకం పారిందని, ఆయన భార్యకు ప్రిన్సిపాల్ పోస్టును కొట్టేశారని అధ్యాపకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ చిరంజీవి ఈ మూడేళ్ల పదవీ కాలంలో సొంత వారి కోసం స్వార్థ రాజకీయాలు చేశారని ఎండగడుతున్నారు. తన భార్య, స్నేహితుల కోసం ఆగమేఘాలపై ప్రభుత్వంలో జీవోలు తెచ్చుకుని బదిలీలు చేసుకున్నారని విమర్శిస్తున్నారు.ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదిత తొలుత జోన్–3 నుంచి జోన్–1కు, ఆ తర్వాత చోడవరం నుంచి సబ్బవరం, సబ్బవరం నుంచి విశాఖపట్నం(అటానమస్–ఉమెన్) కళాశాలకు చకచకా బదిలీలు చేయించుకున్నారని, ఇక భార్య స్నేహితురాలు కోసం, శశిభూషణ్ అనే ఎమ్మెల్సీ స్నేహితుడి భార్య కోసం జీవోలు ఇచ్చి న ప్రభుత్వం వేలాది మంది అధ్యాపకులను మోసం చేస్తోందని దుయ్యబడుతున్నారు. ఇన్ని బదిలీలకు అడ్డురాని సర్వీసు రూల్స్ నిబంధన తమకు ఎలా వర్తిస్తుందని ప్రశి్నస్తున్నారు. పైగా ప్రమోషన్లను మే 30కి ఇచ్చారని.. ఒక్క రోజు ఆగితే రిటైర్ అయిన వాళ్లతో ఖాళీ అయిన పోస్టులను జూన్ 1న చూపించి భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అర్ధరాత్రి అర్జెంటుగా ప్రమోషన్లు ఎందుకు ఇచ్చారని మండిపడుతున్నారు. -
'కోఎంప్ట్'కు కోట్ల ఫలహారం!
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్ మంత్రిత్వ శాఖలో అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. ఇక లోకేశ్ పేషీ అవినీతి మకిలి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకూ పాకింది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నిర్వాకంతో యావత్ దేశం అవాక్కయింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. అదే కోఎంప్ట్ సంస్థ నిర్వాకంతో గతంలో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కోఎంప్ట్ సంస్థతో మంత్రి లోకేశ్ పేషీ సాగించిన అవినీతి జుగల్బందీ తాజాగా బట్టబయలైంది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏటా రూ.172 కోట్ల చొప్పున రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లోకేశ్ పేషీ సాగించిన అవినీతి నిర్వాకం విస్తుగొలుపుతోంది. డిజిటల్ మూల్యాంకనం ముసుగులో దోపిడీ హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ ద్వారా మంత్రి లోకేశ్ పేషీ దోపిడీకి తెగబడింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం ముసుగులో అవినీతికి తెరతీసింది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారం సాగించింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథ నడిపించి.. కోఎంప్ట్ సంస్థకు టెండరు కట్టబెట్టేయడం విస్మయ పరుస్తోంది. నిధుల దోపిడీకి కోఎంప్ట్ ఎడ్యూటెక్ మూడు కేటగిరీల ముసుగులో ప్రతిపాదనలకు లోకేశ్ పేషీ ద్వారా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక్కో విద్యార్థి పరీక్షా పత్రం మూల్యాంకనం కోసం రూ.32, ఒక్కో పరీక్షా పత్రం ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం రూ.25.75 చొప్పున కోట్ చేసింది. మొత్తం అన్ని ఫీచర్లతో డిజిటలైజేషన్ సేవల కోసం రూ.115 చొప్పున కోట్ చేయడం గమనార్హం. అంతేకాదు కోఎంప్ట్ ఎడ్యూటెక్కు కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను విశ్వవిద్యాలయాలే సమకూర్చాలి. అంటే ఎటువంటి మూల ధన వ్యయం లేకుండానే కేవలం డిజిటల్ ప్రక్రియను మాత్రమే కోఎంప్ట్ సంస్థ నిర్వహిస్తుందని నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉంది. ఆ ప్రతిపాదనలను లోకేశ్ పేషీ ఆమోదించి ఆ మేరకు కోంఎప్్టతో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తోంది. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చజెండా ఊపనున్నాయి. ఏకంగా మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఒత్తిడి వస్తుండంతో తమకు మరోమార్గం లేకుండా పోయిందని విశ్వవిద్యాలయాల అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఏటా రూ.172 కోట్ల ప్రాజెక్టుకు ఎత్తుగడ విశ్వవిద్యాలయాల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ముసుగులో కోఎంప్ట్ సంస్థకు భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సెమిస్టర్ విధానంలో మొత్తం విద్యార్థులు అన్ని పరీక్షలకు కలిపి 1.50 కోట్ల బుక్లెట్లు (పరీక్షా పత్రాలు) రాస్తారు. ఒక్కో బుక్లెట్కు రూ.115 చొప్పున ఏడాదికి మొత్తం రూ.172 కోట్ల కాంట్రాక్టును కోఎంప్ట్ కు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు లోకేశ్ పేషీ మంత్రాంగం వేగవంతం చేసింది. ఆ ప్రకారం రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ముసుగులో కమీషన్ల రూపంలో భారీ అవినీతికి పన్నాగం పన్నింది. వాస్తవానికి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును కోఎంప్ట్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలు పెట్టింది. ఇంతలో సీబీఎస్ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కోఎంప్ట్ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. దాంతో సాంకేతిక విద్యా మండలి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం నిలుపుదల చేసింది. కోఎంప్ట్ సంస్థ కొన్ని నెలల క్రితం వరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిజిటల్ మూల్యాంకనం చేట్టింది. సీబీఎస్ఈ వ్యవహారంతో ప్రస్తుతం నిలిపివేసింది. అయినా సరే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిజిటల్ మూల్యాంకనం కోసం కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని లోకేశ్ పేషీ తీవ్ర ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను పిలిపించి మరీ కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు టైమ్ లిమిట్ పెట్టి మరీ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణాలో 20 మంది ఆత్మహత్య కోఎంప్ట్ నిర్వాకం గతంలో తెలంగాణను హడలెత్తించింది. 2019లో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకుంది. అడ్డగోలుగా మూల్యాంకనం చేసింది. మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థుల్లో 3.80 లక్షల మంది అంటే 40 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఆ సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యూటెక్గా మార్చుకోవడం గమనార్హం.అప్పట్లోనే వెనకేసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం 2013లో అదే గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ జేఎన్టీయూలో రూ.230 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను దక్కించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్గా అప్పటి జేఎన్టీయూ ఉన్నతాధికారులు కాంట్రాక్టు కట్టబెట్టారు. గ్లోబెరేనా టె క్నాలజీస్ ఇ–కంటెంట్ కోసం మలేషియాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్టు కింద జేఎన్టీయూ గ్లోబెరేనా టెక్నాలజీస్కు రూ.20 కోట్లు చెల్లించింది. అడ్డగోలుగా టెండరు కట్టబెట్టడం, నిబంధనలకు విర్దుద్ధంగా నిధుల చెల్లింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం విచారణ కమిటీ పేరుతో కనికట్టు చేసింది. కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి అవినీతిని నిగ్గు తేల్చింది. బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. దీనిపై గ్లోబెరేనా టెక్నాలజీస్.. కాంట్రాక్టు మేరకు రూ.230 కోట్లు చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.పేరుమార్చుకుని ఏమార్చిన కోఎంప్ట్ సీబీఎస్ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం, డిజిటలైజేషన్ ప్రక్రియలో అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ బాగోతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థను బ్లాక్లిస్టు్టలో పెట్టారు. కానీ అదే సంస్థ కోఎంప్ట్ ఎడ్యూటెక్గా పేరుమార్చుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే మస్కా కొట్టింది. పరీక్షా పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్ఈ ఈ ఏడాది ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (ఓఎస్ఎం) విధానం చేపట్టింది. ఆ కాంట్రాక్టును హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ సంస్థ దక్కించుకుంది.సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల వెల్లడితో ఆ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరీక్షా పత్రాలను పబ్లిక్ క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్) బకెట్లలో భద్రపరచడం పట్ల సైబర్ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లీకేజీ బయట పడింది. ఇక పరీక్షా పత్రాలు కంప్యూటర్ స్క్రీన్ మీద సరిగా కనిపించక పోవడం, విద్యార్థులు రాసిన జవాబులకు.. వచ్చిన మార్కులకు పొంతన లేకపోవడం, విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వేయడం తదితర లోపాలు వెల్లడయ్యాయి. అంతేకాదు కోఎంప్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్టు దక్కించుకున్న వ్యవహారాన్ని సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పరిశోధించి మరీ వెలుగులోకి తెచ్చారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదనే నిబంధనను కోఎంప్్టకు అనుకూలంగా మార్చారు. ప్రస్తుతం బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకే అర్హత లేదని మార్చడం గమనార్హం. కోఎంప్ట్ కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఇలా అడ్డగోలుగా వ్యవహరించారు. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఈ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న విషయాన్ని మరుగున పరిచేందుకే కోఎంప్ట్ ఎడ్యూటెక్గా పేరుమార్చుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్, కోఎంప్ట్ నిర్వాకంపై యావత్ విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శిని పదవుల నుంచి తొలగించింది. -
రాక్షస పాలనపై రణభేరి
సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి కర్నూలు/సాక్షి,నెట్వర్క్: చంద్రబాబు రెండేళ్ల రాక్షసపాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తి గర్జించింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో గురువారం నుంచి 12 తేదీ వరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దగాకోరు సర్కారుకు వ్యతిరేకంగా కదంతొక్కింది. పోలీసు ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి రణన్నినాదం మోగించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరోమారు నిరూపించుకున్నారని నిప్పులు చెరిగింది. పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావు నుంచి నేడు రాష్ట్ర ప్రజల వరకు అందరూ బాబు బాధితులేనని, ఈ దుష్ట పాలన రాష్ట్రానికి హానికరమని దుయ్యబట్టింది. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడవడం మినహా చేసింది ఏమీ లేదు. సూపర్సిక్స్ హామీల్లోని ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారు. వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. దగాకోరు బాబు నుంచి ప్రజలను కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తాం. మహోద్యమానికి ఉద్యుక్తులమవుతాం. నారాసురుడిని గద్దె దించే వరకు విశ్రమించం’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ఎగిసిన ఆగ్రహజ్వాలలుగుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. గుంటూరు గుజ్జనగుండ్ల, చుట్టుగుంట సెంటర్లలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవైఎస్సార్సీపీ శిబిరం వద్దకు వచ్చి రెచ్చగొట్టే నినాదాలుచేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల అడ్డంకులను అధిగమించి నేతలు ప్రదర్శనను జయప్రదం చేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, రొంపిచర్లలో నిరసన కార్యక్రమం జరిగింది. పెదకూరపాడులో సూపర్సిక్స్ హామీల ప్రతులను దహనం చేశారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ ప్రభాకర్రావు జులుం ప్రదర్శించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాచర్ల, సత్తెనపల్లి, గురజాలల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. అనంతపురం అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నంద్యాల కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, ప్రజలకు ఇచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. గుంటూరులో ర్యాలీగా వస్తున్న మాజీ మంత్రి అంబటి, ప్రజలు పోలీసులు అడ్డుకున్నా...శ్రీకాకుళం జిల్లాలో నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేసినా వైఎస్సార్సీపీ నేతలు వెనుకడుగు వేయలేదు. పలాస నియోజకవర్గం మందసలో మానవహారం నిర్వహించారు. నరసన్నపేటలో మానవహారం చేపట్టి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మండుటెండనూ లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కారక్రమాలు చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్సిక్స్ హామీల బాండ్ ప్రతులను దహనం చేశారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై మానవహారం నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పెందుర్తి, గాజువాకలో మానవహారం నిర్వహించి ఫ్లకార్డులు ప్రదర్శించి టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేశారు. ఏలూరు, నూజివీడు, పోలవరంల్లో నిరసనలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నిరసనలు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నగరి, కార్వేటినగరం, పూతలపట్టు, బంగారుపాళ్యంలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లెల్లో చంద్రబాబు దిష్టి»ొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరసన ప్రదర్శనలు దిగ్విజయంగా సాగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేసి టీడీపీ మేనిఫెస్టోలు దహనం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. అల్లూరి జిల్లా పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ నిరసనల ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల టీడీపీ మేనిఫెస్టో ప్రతులను వైఎస్సార్సీపీ నేతలు చించివేశారు. కొన్ని చొట్ల దహనం చేశారు. ఈ దహనం కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. -
డయేరియాతో ఇద్దరి మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సింగుపురం గ్రామంలో డయేరియా విజృంభించింది. డయేరియా బారిన పడి వారం కిందట కొన్ని గోపి(55)అనే వ్యక్తి మృతి చెందగా, బుధవారం బెలమాన బైరాగి (50) అనే వ్యక్తి వాంతులు, విరేచనాలతో మృతిచెందడం గ్రామస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.మరో 30 మంది వరకు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత వ్యవహారం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గ్రామంలో కనీసం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయకపోవడంపై సింగుపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు -
ఇంటర్ విద్యలో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియట్ విద్యకు సంబంధించి 2026–27 విద్యా సంవత్సరంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సెకండియర్ విద్యార్థులకు కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన కొత్త సిలబస్ను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. అలాగే గత విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి ఏడాదిలో కొత్త సిలబస్ను ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు అప్డేటెడ్ సిలబస్ను అమల్లోకి తేనున్నారు.పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, జియోగ్రఫీ వంటి మైనర్ సబ్జెక్టుల సిలబస్ను కూడా సవరించారు. ఇప్పటికే కొత్త సిలబస్కు అనుగుణంగా క్వశ్చన్ పేపర్ డిజైన్లు, మోడల్ పేపర్లను ఇంటర్ విద్యా శాఖ ఖరారు చేసింది. కాగా, ఈనెల 12 నుంచి కాలేజీలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా గురువారం ఆర్జేడీలతో పాటు జిల్లాల అధికారులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల పెండింగ్ వివరాలను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కాలేజీల్లో 10% అడ్మిషన్ల పెంపు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీస్ పునరుద్ధరణ పూర్తిగా వారు బోధించే సబ్జెక్టుల్లో పబ్లిక్ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగానే ఉంటుందన్నారు. -
‘సిట్’ దర్యాప్తు వెర్రితలలు!
సాక్షి, అమరావతి: పిచ్చి ముదిరిందీ అంటే తలకు రోకలి కట్టండి...! అన్నట్టుగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు! టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు రోజురోజుకూ రాజకీయంగా దిగజారిపోతున్నారు. మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో ఏడాదిన్నరగా చేస్తున్న రాద్ధాంతం బెడిసికొడుతుండటంతో తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు.ఏమైనా చేయండి.. ఎవరిపై పడితే వారిపై అక్రమ కేసులు బనాయించండి..! అని సిట్ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్రలకు సిట్ అధికారులు ఎంతగా వత్తాసు పలుకుతున్నారంటే.. చివరికి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అటెండర్ మనోహర్కు కూడా నోటీసు ఇచ్చారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి నుంచి అటెండర్ వరకూ నోటీసులు ఇచ్చి అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం రాజకీయ కుతంత్రాలకు తెగబడుతున్న తీరు విస్మయపరుస్తోంది. ఐఏఎస్ నుంచి అటెండర్ వరకూ.. పిచ్చివాడి చేతిలో రాయిలా తయారైంది చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ తీరు. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ విచారణ ప్రహసనం వెగటు పుట్టిస్తోంది. కనీస ఆధారాలు లేకుండా బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ రాజ్యాంగేతర శక్తిలా చెలరేగిపోతోంది. ఎంతగా అంటే.. వైఎస్సార్సీపీ హయాంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (ప్రసుతం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం)లో విధులు నిర్వహించిన వారందరిపైనా అక్రమ కేసులు బనాయిస్తోంది.ఎవరు ఏమిటి..? ఎవరి అధికార పరిధి ఏమిటి? అనే విషయాలతో నిమిత్తం లేకుండా అక్రమ కేసులతో వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలపై అక్రమ కేసు నమోదు చేసి వేధించింది. బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించింది. సిట్ వేధిస్తోందని ఆయన హైకోర్టును ఆశ్రయించినా సరే టీడీపీ వీరవిధేయ ఐపీఎస్లు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆయన్ను ఏకంగా అపహరించుకుపోయి మూడు రోజుల పాటు వేధించి లొంగదీసుకున్నారు.అసలు నాటి ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం నిమిత్తంలేని అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి వేధించారు. ఎక్సైజ్ విధానంతో సంబంధంలేని ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి... ఆయన చెప్పని విషయాలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం న్యాయస్థానానికి సమర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టారు. ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా నెలల తరబడి జైలులో రిమాండ్లో ఉంచారు. చివరికి సిట్ తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి బెయిల్ మంజూరు చేసింది. ఏడాదిపాటు సాగించిన ఈ దర్యాప్తు ప్రహసనంతో ఏమీ సాధించలేక సిట్ చతికిలబడింది. రెండో దశలో పీఏ, అటెండర్... తరువాత తోటమాలి, ఫ్లోర్ క్లీనర్లేనా...! చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది. దాంతో తీవ్రంగా బెంబేలెత్తిన చంద్రబాబు మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. టీడీపీ వీర విధేయ సిట్ అధికారులకు మళ్లీ పని చెప్పారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ ఆరు నెలల విరామం తరువాత మరోసారి రంగంలోకి దిగింది. ఈసారి వైఎస్సార్సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడింది. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దు్రష్పచారం చేయించింది.అంతటితో సిట్ కుట్రలు ఆగలేదు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అటెండర్ మనోహర్కు కూడా సిట్ తాజాగా నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. కార్యాలయానికి వచ్చే అతిథులకు టీ, కాఫీలు మాత్రమే అందించే అటెండర్కు నోటీసులు జారీ చేయడం ఏమిటని పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు మద్యం విధానంతోగానీ ఆ విధానం అమలుతోగానీ అటెండర్కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.కేవలం దర్యాప్తు పేరుతో వేధించేందుకే సిట్ ఇంతగా దిగజారుతోందని విశ్లేషిస్తున్నారు. ఇక తరువాత వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే తోటమాలి, ఫ్లోర్ క్లీనర్లకు కూడా నోటీసులు జారీ చేస్తారేమోనని ఎద్దేవా చేస్తున్నారు. మద్యం విధానంపై అక్రమ కేసు కేవలం చంద్రబాబు రాజకీయ కక్షసాధింపు మినహా మరొకటి కాదని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కక్ష సాధింపు కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని సిట్ ఇంతగా దిగజారిపోవడం విస్మయపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. -
నేడు ఏపీ టెట్–2026 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. పూర్తి సమాచారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జాయింట్ డైరెక్టర్, ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థుల సందేహాలను తీర్చడం కోసం డైరెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ అందుబాటులో ఉండేలా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మెగా డీఎస్సీ 2025 స్కాంపై ప్రజలు, ఉపాధ్యాయ అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం నుంచి వారి దృష్టిని మళ్లించి, ఏమార్చేందుకే ప్రభుత్వం హఠాత్తుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. -
కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్’ చైర్మన్?
సాక్షి, అమరావతి: పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్గా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు. వారు చెబుతున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాకా ఊదే ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్గా మారింది. 2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా జరిగిన మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు) హాజరయ్యారు.ఆ సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాల ప్రకారం.. పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా హాల్లోకి వెళ్లి ఇన్విజిలేటర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్కు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి వెనుక ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడేమంటారో!! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అవన్నీ నిరాధార ఆరోపణలని, బాధితులు కూడా లేరని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని శాప్ చైర్మన్ ప్రగల్బాలు పలికారు. ఆయన సవాల్కు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గట్టి సమాధానం ఇస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ సమయంలో బంగారు పతకం సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా కాంస్య పతకం, పార్టిసిపేషన్ సరి్టఫికెట్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటూ ఆధారాలతో సహా చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలను రవికుమార్ సవాల్కు చెంపపెట్టుగా నెటిజన్లు చూపిస్తున్నారు. -
బీచ్లలో బీరు.. బారు
ఇన్నాళ్లూ.. బీచ్ అంటే షికార్లు.. సరదాలు.. పిల్లలు, కుటుంబంతో సేదతీరే ప్రాంతం! ఇకపై.. బీచ్లంటే బీరు, బారు.. మందూ, చిందూ.. ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం!! రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది! గురువారం మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చజెండా ఊపింది! కూటమి సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీచ్ షాక్స్ అంటే.. మినీ బార్లే బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏమిటంటే... బీచ్లలో చిన్న సైజు బార్లే. వెదురు గానీ చెక్కతోగానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్ధాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దశలవారీ మద్యం నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరి్మట్ రూమ్లను రద్దు చేసింది. 48 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది.కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిచి్చ.. మొత్తం 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్ రాష్ట్రంలో ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలతో విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. తీరప్రాంతం ధారాదత్తం.. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బీచ్ షాక్స్ పేరుతో బీచ్లలో బార్లకు అనుమతినిచ్చింది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో పైలట్ ప్రాజెక్టుగా మినీ బార్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. అనంతరం రాష్ట్రంలోని ఇతర బీచ్లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీచ్లలో కూడా మినీ బార్లు ఏర్పాటుకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వాటికి కూడా అనుమతి ఇవ్వనుందని ఎక్సైజ్శాఖ వర్గాలు తెలిపాయి. మినీ బార్లను కూడా టీడీపీ సిండికేట్కే ఏకపక్షంగా కట్టబెట్టనుందన్నది సుస్పష్టం.ఇక బీచ్కు వెళ్లాలంటే భయం భయం..!చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్లకు ఉదయం, సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి.ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి బ్యాచ్లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. ఇక బీచ్లలో కూడా మందు బాబులు, గంజాయి బ్యాచ్లు మహిళలపై విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో బీచ్లలో పోలీసు భద్రత కూడా లేదు. మరోవైపు విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో ఎందరో యువకులు ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు బీచ్లలో మినీ బార్లు ఏర్పాటుతో మద్యం మత్తులో సముద్ర స్నానాలు, ఈతకు దిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.బికినీ ఫెస్టివల్ నుంచి బీచ్ షాక్స్ దాకా.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో బీచ్లలో బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 2016లో జీవో నంబర్ 470 కూడా జారీ చేశారు. దాంతోపాటు బీచ్లలో బికినీ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా సన్నాహాలు చేశారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీచ్లలో బార్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మినీ బార్ల ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి తలుపులు తెరచింది. – సాక్షి, అమరావతి -
‘డీఎస్సీ అక్రమాలను డైవర్టు చేయడానికే పవన్ పాట్లు’
సాక్షి, తాడేపల్లి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వర్గాలను వంచించిందే కాకుండా వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాలన పూర్తయినా సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపానపోలేదని.. బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ బాండ్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ వెనుక జరిగిన కుంభకోణంతో ప్రభుత్వం ఇరుకున పడిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.పవన్ కళ్యాణ్కి పాలన చేతకాకనే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడని, చేతనైతే విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని వంగవీటి నరేంద్ర హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...ఆరోపణలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనతో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి చివరికి ఏదీ కాకుండా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బాండ్ పేపర్ల మీద సంతకాలు చేసి మరీ సూపర్ సిక్స్ హామీల విషయంలో మాటతప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల తరఫున వైయస్సార్సీపీ ప్రశ్నిస్తుంటే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.అక్రమ కేసులతో వేధింపులు, దాడులతో బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో అడ్డంగా దొరికిన ప్రతిసారీ ప్రజల దృష్టిని మరల్చడానికి తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జరగని కుంభకోణాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లడంతోపాటు అక్రమ కేసులతో వైఎస్ జగన్కి దగ్గరగా ఉన్న నాయకులను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క దానికీ ఆధారాలు లేకపోయినా పోలీసులను అడ్డం పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు బదులు తీర్చుకోవగానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.కూటమి పాలనలో గాడితప్పిన శాంతిభద్రతలువైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నోటికొచ్చినట్టు తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రం అప్పులపాలై శ్రీలంకగా మారిపోయిందని ఊదరగొట్టారు. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైపోయారని పవన్ కళ్యాణ్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వారు చేసిన ఆరోపణల్లో దేనినీ నిరూపించలేకపోయింది.మహిళలకు రక్షణ కల్పస్తామని చెప్పిన కూటమి నాయకులు, రెండేళ్లుగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోయారు. కేంద్ర సంస్థల నివేదిక ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం అట్టడుగున ఉందని, మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని, నేరాలు గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు పెరిగాయని రుజువైంది. వైయస్సార్సీపీ హయాంలో మహిళలకు రక్షణ కల్పించిన దిశ యాప్కి శక్తి యాప్ అని పేరు మార్చి నిర్వీర్యం చేసేశారు. కూటమి ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి వేధిస్తున్నారని ఆధారాలతో సహా మహిళలు ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకోకపోగా, బాధితులనే వేధిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఏం చేశాడో పవన్ కళ్యాణ్ చెప్పాలిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణకి వెళ్లి తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన అధ్యక్షుడిగా విభజన హామీలు పరిష్కరించడానికి ప్రయత్నించకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి చూడటం సిగ్గుచేటు.కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ పేరుతో సంతకాలు పెట్టి రిలీజ్ చేసిన బాండ్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమాధానం చెప్పాలి. ఏపీలో పాలన గాలికొదిలేసి తెలంగాణలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక పక్క రాష్ట్రం వెళ్లి విద్వేష ప్రకటనలు చేస్తున్నాడు.దీంతో పాటు అమరావతిలో అవినీతి నిరంతర ప్రక్రియగా మారిపోయింది. శాండ్, ల్యాండ్, మైన్, వైన్ దోపిడీని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అక్రమాలను వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు బయటకు తీసుకొస్తుంటే ఏ ఒక్కదానికి ప్రభుత్వం జవాబు చెప్పడం లేదు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం నడుచుకుంటూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్కి కూడా ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. -
ఏపీలో కాస్ట్ కటింగ్పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: ఏపీలో కాస్ట్ కటింగ్పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విమాన ప్రయాణాలను నియంత్రించని ప్రభుత్వం.. కేవలం అధికారులు, ఉద్యోగులకే పొదుపు పాఠాలు చెబుతోంది. అనవసర ఖర్చులు, ఇంథన పొదుపు, వర్చువల్ గవర్నెన్స్, వర్క్ ఫ్రం హోమ్ పై ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.50 శాతం అధికారిక సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్లలో చేయాలన్న ప్రభుత్వం.. మీటింగ్లు, సమీక్షల కోసం అనవసర ప్రయాణాలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లోని అధికారులు ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అనవసరంగా మంత్రులు, అధికారులు విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్ల వినియోగం తగ్గించాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.. డెకరేటివ్ లైటింగ్స్, జనరేటర్ల వినియోగం తగ్గించాలని పేర్కొంది. -
‘కూటమి రెండేళ్ల పాలన ఓ పెద్ద వెన్నుపోటు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి.. గత రెండేళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలును గాలికొదిలేసి.. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం వైఎస్ జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3.50 లక్షల కోట్ల అడ్డగోలు అప్పులతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడమే కాకుండా.. ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ, మెగా డీఎస్సీ అక్రమాలు, ప్రభుత్వ భూముల దోపిడీ, ఉద్యోగుల వేధింపులు, మహిళలపై అఘాయిత్యాలతో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా గాడి తప్పించారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వ ఈ మోసపూరిత వైఖరిని, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు రాజీలేని నిరసన పోరాటాలు చేపడుతుందని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..ప్రజాస్వామ్యం కాదు.. ఇది 'పొలిటికల్ గవర్నెన్స్'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినట్లుగా రాష్ట్రంలో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన కాదని, కేవలం తమ కార్యకర్తల ప్రయోజనాల కోసమే నడిచే ‘పొలిటికల్ గవర్నెన్స్’ మాత్రమే. "ప్రజాస్వామ్యం అంటే మేం ముగ్గురమే.. మేం చెప్పిందే నడవాలి" అన్నట్లుగా కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్త వస్తే ప్రభుత్వ అధికారి కుర్చీ వేసి, కాఫీ ఇచ్చి పనులు చేసి పెట్టాలని మంత్రి అచ్చన్నాయుడు బహిరంగంగా ఆదేశించడం చూస్తుంటే రాష్ట్రంలో వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థమవుతోంది.కూటమి హామీల అమలు శూన్యం..ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. వాటికి అదనంగా మరిన్ని పథకాలు ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు, నేడు అసలు పథకాలకే ఎసరు పెట్టారు. ఈ నేపథ్యంలో కూటమి మోసాలపై వైఎస్ జగన్ పిలుపునిచ్చిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు, నాలుగు కూడళ్లలో బ్యాండు పేపర్ల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో విఫల నాయకుడుప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక్కడ సమాధానం చెప్పలేక రాష్ట్ర సరిహద్దులు దాటి మరో సమస్యలో చిక్కుకుని అందరితో తిట్లు తింటున్నారు. "పవన్ కళ్యాణ్.. మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ ప్రజా జీవితంలో మీరు పూర్తిగా విఫల నాయకుడు. నాడు ప్రశ్నిస్తానన్న నాయకుడు నేడెక్కడ దాక్కున్నాడు?". కనీసం సీఎం కూడా కాలేని వ్యక్తికి ఒక రాజకీయ పార్టీ ఎందుకు?.డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి..వైఎస్సార్సీపీ ప్రజల తరపున నిలదీస్తుంటే.. కూటమి నేతలు సమాధానం చెప్పలేక వైఎస్సార్సీపీపై ‘గొడ్డలి పార్టీ’, ‘క్రిమినల్స్ పార్టీ’ అంటూ బురదజల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఉదయం లేచింది మొదలు వైఎస్ జగన్ పేరు తలచుకోకుండా కూటమి నేతలకు రోజు గడవడం లేదు. పేదలపై ప్రేమ ఒలకబోసే చంద్రబాబు.. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ కేటాయించిన 50 వేల ఇళ్ల స్థలాలను ‘డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్’ (జనాభా సమతుల్యత దెబ్బతింటుంది) అనే సాకుతో రద్దు చేయడం సిగ్గుచేటు. ఈ అన్యాయాలపై భాగస్వామ్య పార్టీ బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలి.అస్తవ్యస్త పాలన.. అక్రమాలమయం..రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పింది, చివరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలే సొంత ప్రభుత్వంపై అడ్డం తిరిగే పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీలో అపాయింట్మెంట్ ఆర్డర్లు రావాల్సిన అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, స్పోర్ట్స్ కోటా పేరిట పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని, బాధితులంతా వైఎస్ జగన్ను కలిసి మద్దతు కోరగా.. వైఎస్సార్సీపీ వారికి అండగా నిలిచింది. నాడు వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను రక్షిస్తే.. నేడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 12 కీలక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి భక్షించే కార్యక్రమానికి తెరలేపింది.99 పైసలకే భూములు:ఏ ప్రభుత్వమైనా 99 పైసలకే ఎకరా భూమిని అమ్ముతుందా? పెట్టుబడిదారుల పేరుతో ప్రభుత్వ భూములను, పేదల అసైన్డ్ భూములను తమ అనుయాయులకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. అమరావతి నిర్మాణం అనేది అంతులేని కథగా మారిందని, గాలిలో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో చారిత్రాత్మక భూసర్వే చేపడితే విషప్రచారం చేసిన కూటమి నేతలు, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ వైయస్సార్సీపీ చేసిన అభివృద్ధి పనులకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు.మహిళలపై అఘాయిత్యాలు..కూటమి ఎమ్మెల్యేలు కీచకుల్లా మారి వరుసగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. అలాగే, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసింది, ఆ డబ్బు అంతా ఎటు పోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి చేసిన అక్రమ అప్పులపై ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం.విద్యా, వైద్య రంగాలు ధ్వంసం.. ఉద్యోగులపై వేధింపులు..రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సూది, దూది, మందులు కూడా దొరకని దౌర్భాగ్య స్థితి నెలకొంది. వైయస్.జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూశారు, అయితే వైయస్సార్సీపీ పోరాటానికి భయపడి ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధులు నిలిపివేయడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ హక్కులైన డీఏ, ప్రమోషన్స్, ఐఆర్ అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, ఉద్యోగాల నుంచి తొలగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.రైతుల అరెస్టులు దుర్మార్గం..రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదు. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లపైకి వస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హతను కూటమి ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది, కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమ అరెస్టులపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేస్తుంది. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి.ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం:"ఎన్నికల నాడు రంగురంగుల బ్యాండు పేపర్లు (మేనిఫెస్టో) చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజల వీపున పొడిచిన ఈ పొలిటికల్ వెన్నుపోటును జనాల్లోకి బలంగా తీసుకెళ్తాం. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగే మా ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు రైతులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తాం" అని జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కూటమి పాలకుల ప్రతి అక్రమంపై వైఎస్సార్సీపీ భవిష్యత్తులో ఖచ్చితంగా విచారణ జరిపించి తీరుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అరెస్టులు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా కూటమి మెడలు వంచే వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని జూపూడి ప్రభాకరరావు అన్నారు. -
చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి : ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భభ్రాంతిని వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదకరం.అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రకాశంలో విషాదంప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అమరావతి భవనాల హంగులకు భారీ వ్యయం
సాక్షి,విజయవాడ: అమరావతిలో ఇప్పటికే భారీ వ్యయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు భవనాల హంగుల కోసం మరోసారి వందల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు సంబంధిత పనులకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.సూపర్ బ్లాక్ ఎఫ్లో ఉన్న హైకోర్ట్ భవనం వద్ద అదనపు వసతుల కోసం రూ.540 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్ స్టేషన్, బ్యూటిఫికేషన్ పనులు ఉన్నాయి.అదే విధంగా, రాయపూడి ప్రాంతంలోని ఐఏఎస్ అధికారుల నివాస భవనాలకు కూడా హంగులు జోడించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్లలో హంగుల కోసం రూ.94 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పనుల్లో స్టోర్ రూమ్స్, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టెయిర్కేస్, బాల్కనీ విత్ కెనేపీ, పార్కింగ్ వసతులు వంటి అంశాలు ఉన్నాయి.ఇప్పటికే అమరావతిలో భవనాల నిర్మాణానికి భారీ నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటికి అదనంగా హంగుల కోసం మళ్లీ నిధులు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. -
బీచ్లలో మద్యం అమ్మకాలు.. ఆమోదం తెలిపిన చంద్రబాబు సర్కార్
సాక్షి,అమరావతి: గత ఎన్నికల్లో ‘సంపద సృష్టిస్తా..పేదలకు పంచుతా..’ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల పెంపుపై దృష్టి పెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం విక్రయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కేబినెట్ సమావేశంలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్లో అన్ని బీచ్లలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం బీచ్లలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తోందని, శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పవన్ కల్యాణ్కు అస్వస్థత
సాక్షి,అమరావతి: పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. అయితే కేబినెట్ సమావేశం మధ్యలో పవన్ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కు వెళ్లిపోయారు. -
సీబీఐతో విచారించాలి
పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచి అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్సీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం. పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు.. 1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మోసం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్ కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం.. మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్ను కలవడానికి ఛాంబర్కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్బెల్ట్ ఛాంపియన్ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, స్పోర్ట్స్కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ షాక్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన తర్వాత సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన దేవుడెరుగు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని రుణ ఊబిలోకి నెట్టేస్తున్నారు. అది చాలదన్నట్టు ప్రభుత్వ శాఖలను సైతం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పీఎం సూర్యఘర్లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ శాఖల నిధులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు తదితర భవనాలపై రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ–నెడ్క్యాప్) టెండర్లు ఆహ్వానించింది. ప్రతిబంధకంగా నిబంధనలు ఈ ప్రాజెక్టు కోసం రూపొందించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో నిబంధనలు ప్రభుత్వ సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రభుత్వ సంస్థలపై దీర్ఘకాలిక ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజాధనం ప్రైవేటు పరం 25 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో ప్రభుత్వ సంస్థలపై అధిక బాధ్యతలు, ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసిన డెవలపర్కు ప్రతి యూనిట్పై అదనంగా రూ.0.10 సర్వీస్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంస్థలు విద్యుత్ బిల్లులను 45 రోజుల్లోపు చెల్లించాలి. గడువు దాటితే నెలకు 1 శాతం చక్రవడ్డీ (కాంపౌండ్ ఇంట్రెస్ట్) విధించే నిబంధనను చేర్చారు. ఇదేం విడ్డూరం ఇంకా ఆందోళన కలిగించే అంశం ‘డీమ్డ్ జనరేషన్‘ విధానం. ప్రభుత్వ సంస్థలు విద్యుత్ను పూర్తిగా వినియోగించకపోయినా, లోడ్ అందుబాటులో లేకపోయినా, మీటర్ లోపాల కారణంగా విద్యుత్ నమోదు కాకపోయినా ఆ విద్యుత్ ఉత్పత్తి అయినట్టుగా పరిగణించి డెవలపర్కు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 25 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే వరకు ప్రభుత్వ సంస్థలు 100 శాతం విద్యుత్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒప్పందం ఉల్లంఘన జరిగితే రెండేళ్ల సామర్థ్య చార్జీలకు సమానమైన పరిహారం చెల్లించాల్సిందే. దీంతో ప్రభుత్వ సంస్థలు ఒకసారి ఒప్పందం చేసుకుంటే బయటపడటం కష్టం. నిర్వహణ బాధ్యత ప్రభుత్వ సంస్థలదే.. అదే విధంగా ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత కూడా ప్రభుత్వ సంస్థలపైనే ఉంచారు. భవనాలపై కొత్త నిర్మాణాలు చేపట్టి ప్యానెళ్లకు నీడ పడినా, భవనం మరమ్మతుల కోసం ప్యానెళ్లను తొలగించాల్సి వ చ్చినా దానికయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వ సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సంస్థలకు ఇది అదనపు భారంగా మారే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీటర్ రీడింగ్ సమయంలో ప్రభుత్వ ప్రతినిధి హాజరు కాకపోతే కేవలం డెవలపర్ నమోదు చేసిన రీడింగ్నే సంయుక్త మీటర్ రీడింగ్గా పరిగణిస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే నష్టాలను పెంచే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద కంపెనీలకే టెండర్నెడ్క్యాప్ విడుదల చేసిన టెండర్ ప్రకారం ఎంపికైన సంస్థలు 2028 మే వరకు ఎంపానెల్లో కొనసాగుతాయి. అనంతరం ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది.అయితే ఈ టెండర్లో పాల్గొనే సంస్థలు కనీసం రూ. కోటి వార్షిక టర్నోవర్ లేదా అంతే స్థాయి లైన్ ఆఫ్ క్రెడిట్ కలిగి ఉండాలి. దీంతో రాష్ట్రంలోని అనేక చిన్న సోలార్ వ్యాపార సంస్థలు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.గత మూడేళ్లలో కనీసం 500 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులు పూర్తి చేసిన అనుభవం ఉండాలని నిబంధన విధించారు. ఈ అర్హత కూడా కొత్తగా రంగంలోకి వ చ్చిన సంస్థలకు పెద్ద అడ్డంకిగా మారనుంది. మరోవైపు ఎంపానెల్ అయిన సంస్థలకు సుమారు 5 మెగావాట్ల చొప్పున కేటాయించనున్నారు. ఒకే సంస్థకు గరిష్టంగా 40 మెగావాట్ల వరకు పనులు దక్కే అవకాశం కల్పించారు. దీంతో పెద్ద కంపెనీలకే అధిక ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రూల్స్.. రిజర్వేషన్లకు పాతర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూల్స్, రిజర్వేషన్లను తుంగలో తొక్కుతూ కూటమి నేతల కుటుంబ సభ్యులకు పోస్టులు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు (చిరంజీవి) భార్య టీఎంఏ నివేదితకు నిబంధనలను కాలరాస్తూ ఏకంగా ప్రిన్సిపాల్ పోస్టింగ్ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. ఇటీవల ఉన్నత విద్య కమిషనర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జోన్ల వారీగా 32 ప్రిన్సిపాల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సీనియార్టీ ప్రకారం అధ్యాపకుల జాబితాను సిద్ధం చేశారు. అయితే, తొలుత 2008 బ్యాచ్కు చెందిన ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదితకు 50 మంది సీనియార్టీ జాబితాలో 17వ స్థానం ఇచ్చారు. దీనిపై సీనియర్ లెక్చరర్లు లిఖిత పూర్వకంగా కమిషనరేట్కు ఫిర్యాదు చేయడంతో జాబితాను సవరించారు. రెండో జాబితాలో సీనియార్టీ ప్రకారం 40వ స్థానం వ చ్చింది. అయితే, 32 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉంటే.. సీనియర్లను కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అధ్యాపకులను వెనక్కి నెట్టి ఏకంగా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా నివేదితను నియమించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి అడుగూ అక్రమమే.. ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదిత జోన్–3కి చెందిన లెక్చరర్. 2009లోనే జోన్–1కు బదిలీ చేయించుకున్నారు. ఫలితంగా జోన్–1లో సున్నా నుంచి సర్వీసు ప్రారంభించారు. అంటే, 2008లో జోన్–1లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా నియామకం పొందిన వారి సర్వీసు కంటే నివేదిత సర్వీసు జూనియర్. ఏడాదిన్నర కిందట వరకు సబ్బవరం డిగ్రీ కళాశాలలో బోటనీ లెక్చరర్గా పని చేసేవారు. అప్పుడే ఎమ్మెల్సీ చిరంజీవి తన రాజకీయ, అధికార బలంతో పథకం ప్రకారమే సబ్బవరం నుంచి విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు (అటానమస్) దొడ్డిదారి జీవోతో బదిలీ చేయించుకున్నారు. ఒకవైపు రెండు వేల మంది డిగ్రీ అధ్యాపకులు బదిలీల కోసం నిరీక్షిస్తుంటే ఎమ్మెల్సీ చిరంజీవి మాత్రం అధికారాన్ని అడ్డంపెట్టుకుని భార్యకు న చ్చిన చోట పోస్టింగు వేయించుకున్నారు. తాజాగా ప్రిన్సిపాల్ ఖాళీల భర్తీల సమయంలో రూల్స్, రిజర్వేషన్లను కాలరాస్తూ సీనియార్టీ, దళిత సామాజిక వర్గాలకు చెందిన మహిళా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఏకంగా సొంత నియోజకవర్గం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే ప్రిన్సిపాల్ను చేసేశారు. వీరి బాధలు వర్ణనాతీతంచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రెండేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తూ విసిగిపోయారు. పదేపదే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఎయిడెడ్ కళాశాలల నుంచి ప్రభుత్వంలో విలీనమైన సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించలేదనే సాకుతో బదిలీలను ఆపేస్తున్నారు. ఇప్పటికీ సర్వీసు రూల్స్ ఫైల్ను ఉన్నత విద్య కార్యదర్శి క్లియర్ చేయకుండా వేధింపులకు గురి చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రెండు వేల మంది డిగ్రీ అధ్యాపకులు బదిలీల కోసం నిరీక్షిస్తుంటే ఎమ్మెల్సీ చిరంజీవి మాత్రం అధికారాన్ని అడ్డంపెట్టుకుని భార్యకు నచ్చిన చోట (సబ్బవరం నుంచి విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు) పోస్టింగు వేయించుకోవడమూ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఖాళీలు చూపించని పోస్టుకు.. పోస్టింగా?పీలేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మే 31న పదవీ విరమణ పొందారు. అంతకు ముందు ఉన్నత విద్య కమిషన్ ఇ చ్చిన ప్రిన్సిపాల్స్ పోస్టుల ఖాళీల్లో పీలేరు ప్రిన్సిపాల్ పోస్టు ఖాళీ చూపించలేదు. ఫలితంగా ఆ కళాశాలను ఎవరూ ఎంపిక చేసుకోలేదు. కానీ, హఠాత్తుగా చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కామర్స్ లెక్చరర్ టి.వినీలకు పీలేరు ప్రిన్సిపాల్గా పోస్టింగ్ ఇచ్చేశారు. ఇదంతా ఎవరి కోసం... ఎవరు చేశారో ఉన్నత విద్యా కమిషనరేట్ స్పష్టం చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. -
జై ఆంధ్రా అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వరు
సాక్షి, అమరావతి : ‘తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన ఉంది. తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉంటుంది. కానీ, ఆంధ్రా వాళ్లకు ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు’ అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జై ఆంధ్రా అంటే ఇక్కడి వాళ్లు కనెక్ట్ అవ్వరని చెప్పారు. బుధవారం ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి రాజధాని ప్రాంతం శాఖమూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తానెప్పుడూ తెలంగాణ–ఏపీ విభజనను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో తాను అంత గట్టిగా మాట్లాడడం వెనుక ఎలాంటి ముందస్తు ప్లాన్ లేదని చెప్పారు. తాము సభ పెట్టుకుంటామంటే అడ్డుకోకూడదు కదా.. అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అదంతా ఎవరో ఒకరు కూర్చొని చేసింది కాదు కానీ, చిలికి చిలికి గాలివానగా మారిందన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకొని చేసిందని, రేవంత్రెడ్డి చేశారని నేను అనుకోను. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలి. కేటీఆర్తో నాకు మంచి సంబంధాలున్నాయి’ అని చెప్పారు.రాష్ట్రంలో ఎన్నెన్నో కులాల సంఘాలు ఏర్పాటు అవుతున్నాయని, అయితే వాటి వల్ల ఆ సంఘ నాయకులు బాగుపడుతున్నారేమో తెలియదు గానీ, ఆ కుల ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ‘గత ముఖ్యమంత్రి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటూ రాజధాని ప్రాంతాన్ని ఇంకా పెంచారు. మూడు జిల్లాలు కలిపి రాజధాని అంటున్నారు. అంతా చేయాలంటే ఎప్పటికి సాగుద్ది.. రాజధాని రాత్రికి రాత్రే పూర్తవదు. హైదరాబాద్లో ఇంకా జరుగుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదు. అయినా అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానిని ముందుకు తీసుకెళ్లాలి’ అని చెప్పుకొచ్చారు. -
సోషల్ మీడియా పోస్టును అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా?
ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే.. కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే కచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్ప నిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకు పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. – హైకోర్టుసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా.. ఆ పోస్టు దేనికి సంబంధించిందన్న దాంతో నిమిత్తం లేకుండా దానిని అల్లర్లను ప్రేరేపించే తీవ్రమైన నేరంగా పోలీసులు చిత్రీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే, కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకూ పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. ఒక సమూహంలో ఉన్నంత మాత్రాన లేదా ఒక నిర్దిష్ట గ్రూపుతో సంబంధం ఉన్నంత మాత్రాన, ఆ గ్రూపు చేసే ప్రతి తప్పును వ్యక్తిగతంగా ఒకరికి ఆపాదించలేం. నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేనప్పుడు, కేవలం సదరు వ్యక్తులతో పరిచయం ఉందనే నెపంతో ఎవరినీ దోషిగా నిలబెట్టలేం’, అని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు, మాగల్లు గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై ఐపీసీ సెక్షన్ 153 కింద నమోదు చేసిన కేసును కొట్టేసింది. అయితే ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 120బీ, 505 (2), ఐటీ చట్టం సెక్షన్ 66 కింద జరిగే విచారణలో (ప్రొసీడింగ్స్) జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. -
సెలక్షన్.. అంతా కలెక్షన్!
డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో సాఫ్ట్బాల్ విభాగంలో 38 పోస్టులు భర్తీ చేశారు. వీటిల్లో అత్యధికంగా 18 పోస్టుల వరకు కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు ఇచ్చేశారు. ఆ తర్వాత నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్తో ఆరు మందికి పోస్టులు దక్కాయి. మిగిలినవి సౌత్ జోన్ చాంపియన్ షిప్, సీనియర్ నేషనల్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్కు కట్టబెట్టేశారు. ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ 38 మంది క్రీడా సర్టిఫికెట్లలో ఆరింటికి ఏపీలోని వర్సిటీలు జెన్యూనిటీ ఇచ్చాయి. మిగిలిన వాటికి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ జెన్యూనిటీ నిర్ధారించాయి. జెన్యూనిటీని నిర్ధారించాలంటే ఆయా ఫెడరేషన్లకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో కచ్చితంగా గుర్తింపు ఉండాలి. కానీ, కొన్నేళ్లుగా ఎస్ఏఐకు మయాస్లో గానీ, ఐఓఏలో గానీ గుర్తింపు లేదు. ఎస్ఏఐపై దేశ వ్యాప్తంగా క్రీడాకారులు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐఓఏలో గుర్తింపు లేనప్పటికీ, ఎస్ఏఐ తమకు తాము ఐఓఏ గుర్తించినట్టు ప్రకటించుకోడంపై ఐఓఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకే గుర్తింపు లేనప్పుడు రాష్ట్రంలోని సాఫ్ట్బాల్ అసోసియేషన్కు ఎలా గుర్తింపు వచ్చింది? సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్లు ఇచ్చిన జెన్యూనిటీని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఎలా అంగీకరిస్తుంది? ఇందులో దొంగ సర్టిఫికెట్లు లేవని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అనంతపురంలో 2021-22లో సాఫ్ట్బాల్ నేషనల్స్ స్పోర్ట్స్ మీట్లో ఆడకుండానే సర్టిఫికెట్టు తెచ్చుకుని, న్యాయస్థానంలో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఇప్పటికీ కేసులు నడవట్లేదా? ఇందులో శాప్ అధికారులు 2024 సెప్టెంబర్లో ముందుగా సర్టిఫికెట్ను ధ్రువీకరించి.. ఆ తర్వాత కాదని కోర్టుకు చెప్పలేదా? అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఇందులో పారదర్శకత ఎక్కడుంది? టీడీపీ ఎమ్మెల్యే ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటమే అన్నింటికంటే పెద్ద అర్హతా?జూడో విభాగంలో 39 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో 23 మందికి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ మీట్ సర్టిఫికెట్లకు పోస్టులు వచ్చేశాయి. వారు రాష్ట్రం దాటి వెళ్లలేదు. మరో 16 మందికి ఆలిండియా ఇంటర్ వర్సిటీ, స్టేట్ మీట్లో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్కు సైతం పోస్టులు ఇచ్చేశారు. ఇందులో పీఈటీ, పీడీ పోస్టులు కాదు ఏకంగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కింద బోధన పోస్టులు ఇచ్చేశారు. ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు లేరా? అత్యంత దారుణంగా జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహించిన వారికి పతకం రాకపోయినా పాల్గొంటే చాలని ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జిల్లా స్థాయిలో ఆడటమేనా క్రీడా మెరిట్? పైగా 2018 నవంబర్లో నిర్వహించిన సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో చాంపియన్ షిప్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు.. తాజాగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులకు పొంతనే లేదు. ఒరిజినల్ రిజల్ట్ లిస్టులోని వ్యక్తుల స్థానంలో కొత్తవారు వచ్చి ఉద్యోగాలు పొందారు.సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీ అక్రమాలను సెలక్షన్ లిస్టు మరింత బలపరుస్తోంది. డీఎస్సీ నియామకాలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును రెండు రోజుల కిందట ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్టింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం కట్టబెట్టేసింది. పతకంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి ‘మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా’(ఎంఎస్క్యూ)కు సరికొత్త అర్థం చెప్పింది. దాదాపు 24 ఏళ్ల కిందట సర్టిఫికెట్లు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా నియమించడం సర్వత్రా విస్తుగొలుపుతోంది.విచిత్రంగా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కడం క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 382 పోస్టులను భర్తీ చేసింది. ఫైనల్ లిస్టులో 36 క్రీడాంశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. పదికిపైగా పోస్టులతో నింపిన 14 క్రీడాంశాల్లో మొత్తం 308 పోస్టులను భర్తీ చేస్తే.. ఇందులో కేవలం నాలుగు క్రీడాంశాల్లో 174 పోస్టులు నింపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, మిగిలిన 22 క్రీడాంశాల్లో భర్తీ చేసినవి కేవలం 74 పోస్టులు మాత్రమే. ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన 382 మంది జాబితాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఎంత దారుణంగా నియామకాలు చేశారో అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో గుర్తింపు లేని సంఘాలు, కోర్టు కేసుల్లో ఉన్న సంఘాల నుంచి క్రీడా సర్టిఫికెట్ల జెన్యూనిటీ తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గపు విధానాలను అవలంభిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మెరిట్కు అర్థం మార్చేసిన ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎస్సీ నియామకాలు చేసినట్టు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది. దేశ చరిత్రలో పతకాలు సాధించిన వారిని కాదని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోయినా, ఏపీ క్రీడా కోటా డీఎస్సీలో మాత్రం 90 శాతం పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఇందుకు తగ్గట్టుగా క్రీడా పాలసీ రూపకల్పనలోనే దీనికి బీజం పడింది. ఒలింపిక్ మొదలకొని ఏషియన్ గేమ్స్, వరల్డ్కప్ (4ఏళ్లు), కామన్ వెల్త్, నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్షిప్, ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్/యూత్ గేమ్స్/ఆలిండియా ఇంటర్ వర్సిటీ చాంపియన్ షిప్, సౌత్ జోన్ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ వర్సిటీ చాంపియన్షిప్, స్టేట్ చాంపియన్ షిప్ల ద్వారా వరుస క్రమంలో పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. వీటిల్లో పతకాలతో పాటు పార్టిసిపేషన్ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఇలా 12 స్థాయిల్లో క్రీడా అర్హతల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ చాంపియన్ షిప్లో అత్యధికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో పతకం గెలిచిన క్రీడాకారులందరూ ఏమైపోయారు? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నేషనల్ చాంపియన్ షిప్లకు ప్రాధాన్యం ఇస్తే.. ఇక్కడ నేషనల్ గేమ్స్ను ముందు వరుసలో ఎందుకు పెట్టారు? అనేదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 65 క్రీడాంశాలను ఎందుకు విభజించారు?కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాల ప్రకారం 65 క్రీడాంశాలను పెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే, కేంద్రంలో 65 క్రీడాంశాలను రెండుగా విభజించలేదు. ఏపీలో మాత్రం విభజించారు. 65లో రెండు, మూడు క్రీడలను మార్చి.. ‘మాస్టర్ మైండ్’ (శాప్లో పెద్ద తలకాయ తనకు తానుగా పెట్టుకున్న పేరు) సొంతంగా క్రీడలను చేర్చారు. ఇలా ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 పోస్టులను ఎందుకు విభజించారో చెప్పలేదు. ఏ–కేటగిరీలో స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇవ్వగా.. బీ–కేటగిరీలో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారికి ఉద్యోగాలు దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది. రాత పరీక్షకు కూడా హాజరు కాని వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు కొట్టేశారు. ఆ తర్వాత తీరిగ్గా జీవోను సవరించారు. క్రీడా కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లో పోస్టు పొందాలంటే కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్ష రాయాలని పేర్కొనడం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. చిత్తురు జిల్లా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లతో భారీ అవకతవకలు జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.క్రీడా ట్రయల్స్ ఎందుకు పెట్టలేదు?కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు క్రీడా కోటాలో ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో కచ్చితంగా క్రీడా ట్రయల్స్ నిర్వహిస్తాయి. అందులో ప్రతిభను చూసి పోస్టులకు ఎంపిక చేస్తాయి. కానీ, డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఎక్కడా రాత పరీక్ష లేకపోగా, కనీసం క్రీడా ట్రయల్స్ను నిర్వహించక పోవడం గమనార్హం. తాజాగా హైకోర్టు సైతం డీఎస్సీకి సంబంధించిన కేసులో సర్టిఫికెట్ నిర్ధారణకు సాఫ్ట్బాల్లో ట్రయల్స్ పెట్టమని ఆదేశించింది. 20– 24 ఏళ్ల కిందటి క్రీడా సర్టిఫికెట్లతో..అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఆలిండియా ఇంటర్ వర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బాల్ బ్యాడ్మింటన్లో 48 పోస్టులు భర్తీ చేస్తే 34 పైగా, ఖోఖో 49కి గాను 24కుపైగా, హ్యాండ్బాల్ 18 పోస్టులు ఉంటే 14 పోస్టులకుపైగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఇచ్చేశారు. ఫొటోలు, మెడల్స్ను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు.సారూ.. వీటినేమంటారు?» అనంతపురంలో వాలీబాల్/బీచ్ వాలీబాల్లో ఓ క్రీడాకారుడికి ఎస్ఏ హిందీ పోస్టు వచ్చింది. సదరు వ్యక్తి 2011-12లో హైదరాబాద్ వర్సిటీలో వార్షిక క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది కోయంబత్తూరులో సౌత్ జోన్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో డీఎస్సీ ఉద్యోగం దక్కింది.» చిత్తూరు జిల్లాలో హ్యాండ్ బాల్ కోటాలో ఓ మహిళకు ఎస్ఏృజీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. ఆమె 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ (2021 మార్చి 5-7)లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ (2021 మార్చి17-21)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందింది. ఇక్కడ 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్కి.. అదే ఏడాది 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ మీట్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఆశ్చర్యం కలిగిస్తోంది.» పశ్చిమగోదావరి జిల్లా ఖోఖో కోటాలో ఓ మహిళకు ఎస్ఏృఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చింది. ఆమె 2022 డిసెంబర్ 13-22 మధ్య హైదరాబాద్లో జరిగిన 32వ నేషనల్ గేమ్స్లో మొదటి స్థానం దక్కినట్టు సర్టిఫికెట్ చూపించారు. దీనికి తోడు 2001లో డిసెంబర్ 19-23 మధ్య పుణెలో 37వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్ షిప్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందుపరిచారు. వాస్తవానికి 2022 సెప్టెంబర్లోనే గుజరాత్లో 36వ నేషనల్ గేమ్స్ జరిగాయి. ఈ లెక్కన ఏది నిజం? సదరు క్రీడాకారిణి జెన్యూనిటీ పరిశీలించారా? » చిత్తూరు జిల్లాలో బ్యాడ్మింటన్ విభాగంలో ఓ మహిళకు ఎస్ఏృఇంగ్లిష్ పోస్టు వచ్చింది. సదరు క్రీడాకారిణికి ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ (2008-09)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చారు. 2008-09లో తిరుచ్చిలో ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ టోర్నీలో బాల్ బాడ్మింటన్లో పాల్గొన్నట్టు బ్యాకప్ సర్టిఫికెట్ చూపించారు. అసలు బ్యాడ్మింటన్లో బ్యాకప్ సర్టిఫికెట్ చూపించాలి కదా?» చిత్తూరు జిల్లాలో ఖోఖోలోనే ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమె 2019-20లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వార్షిక స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో సౌత్జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారు. ఇక్కడ అండర్ ఏజ్, సీనియర్ చాంపియన్ షిప్లలో పాల్గొనకుండానే ఉద్యోగం వచ్చేసింది.» తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ విభాగంలో ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమెకు 2006 అక్టోబర్లో 7వ సీనియర్ స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్(విశాఖ)లో 2వ స్థానం దక్కింది. అంతకు ముందు ఆమె గెలిచిన ఒక్క పతకానికి సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపరచలేదు. జూనియర్ స్థాయిలో ఆడకుండానే సీనియర్ చాంపియన్ షిప్కు వెళ్లిపోయారా? -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు ఎండ ప్రభావం మరోవైపు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 19, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 1 మండలం మొత్తంగా 46 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 79 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని చెప్పారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించారు. -
రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, న్యాయపోరాటం చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి.ఏ కమిటీల్లో ఎవరు?సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ: పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాబు సీఆర్డీఏ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శనరెడ్డి, కె.శ్రీనివాస్డీఎస్సీ పోరాట కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రడీఎస్సీ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిశోర్ -
మెగా డీఎస్సీ ఒక ‘మెగా స్కామ్’: సాకే శైలజానాథ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన డీఎస్సీ బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. పారదర్శకత లేని వన్ ఈస్ట్ వన్ (1:1) విధానంలో.. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్లో కానీ, రిజెక్షన్ లిస్ట్లో కానీ లేకుండా మాయం చేశారు.స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు:పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేస్తామని మొదట చెప్పి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలంటూ జీవోలు మార్పు చేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక నేషనల్ గోల్డ్ మెడలిస్ట్కు ఉద్యోగం రాలేదు.. అసలు పరీక్షే రాయనటువంటి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. బ్రిడ్జ్ గేమ్స్ ఆడిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలిచ్చి.. వారు స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్ ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.రూల్ ఆఫ్ రిజర్వేషన్కు పాతర: ఓపెన్ కాంపిటేషన్ మార్కులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కోటాలో భర్తీ చేయకుండా, రిజర్వేషన్ కేటగిరీ కింద చూపడం దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చేస్తున్న ద్రోహమే. డీఎస్సీ నియామకాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వార్తలు వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వ సిట్ (SIT)ల మీద నమ్మకం లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత నిష్పాక్షపాత విచారణ జరిపించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు లేకుండా 1.30 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం.సూపర్ సిక్స్ మోసం:ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్'లో ఒక్కటీ అమలు చేయకుండానే, హఠాత్తుగా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. దీనిపై ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్నారు.విద్యార్థులపై నిర్లక్ష్యం:జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ.. విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్లు, బెల్టులు, బ్యాగులు, షూస్ అందించని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 'బాబు వస్తే జాబు వస్తుంది' అని గోడల మీద రాసుకున్నారని, మరి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్న కేఎన్నార్ లాంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల ఐటీ నోటీసుల వ్యవహారంలో అమెరికా పారిపోయి, మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే తిరిగి వచ్చాడు. మరోవైపు ఉచిత ఇసుక లేదు.. లిక్కర్ దోపిడీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ ఇ లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వంగా మారింది.రాష్ట్రంలో 'ఉచిత ఇసుక' అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది. ఎక్కడా ఉచితంగా దొరకడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి దశలోనూ భారీగా కలెక్షన్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 750 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు అటు ప్రభుత్వానికి రాబడి లేకుండా, ఇటు ప్రజలకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు.బెల్ట్ షాపుల విజృంభణ:బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3.49లకే విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. నేడు తన హయాంలో ఏకంగా రూ. 4.65 ల అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేస్తూ పెద్ద స్కామ్కు తెరలేపారు.రూ. 5 వేల కోట్ల భూముల బంధుప్రీతి – అమరావతిపై ప్రశ్నలుచంద్రబాబు నాయుడు తన కుమారుడి తోడల్లుడు, ఎంపీ భరత్కు చెందిన విద్యాసంస్థలకు ఏకంగా రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 'సత్వా' వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూములను ధారాదత్తం చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు, అది కేవలం దేవతల రాజధానిగా మిగిలింది. అత్యంత క్లిష్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు రూ. 18 వేలు, రూ. 19 వేలకు కడుతున్నారు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు."కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూముల పందేరం మరియు అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కూటమి నాయకులు సిద్ధమా?" అని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం బంధుప్రీతి, అవినీతి, దోపిడీలకే పరిమితమైందని సాకే శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డియస్సీ పేరుతో నిరుద్యోగ పేద కుటుంబాల ఆశలను అడియాసలు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకుని విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు. -
నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన
సాక్షి, విశాఖపట్నం: రేపు(గురువారం) కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకుతాయని.. 5 తేదీన రాయలసీమలో ప్రవేశిస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. పదో తేదీకి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయని తావరణ శాఖ అధికారి జగన్నాథ్కుమార్ తెలిపారు. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం రుతుపవనాలు విస్తరించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.వారం రోజులపాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే ఉంటాయని మరో ఐదు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడాది ఎండలు బాగా కాశాయి కాబట్టి వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పలేమని.. కాసిన ఎండలు, వర్షాలకు సంబంధం ఉండదని జగన్నాథ్కుమార్ వివరించారు.ఇప్పటికే కేరళంలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. కేరళం, తమిళనాడు మీదగా ఏపీలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. కావలిలో 42.6 డిగ్రీలు అత్యధిక ఉష్ట్రోగ్రతలు నమోదైంది. తీరం వెంబడి బలమైన గాలులు, భీమిలిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పిడుగుపాటు హెచ్చరికరాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. -
ప్రముఖ తెలుగు యూట్యూబర్ నందు కుటుంబంపై కేసు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్ఐ బీ. రాజు తెలిపారు.నందూస్ వరల్డ్ యూట్యూబ్ ప్రయాణం నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం.ఆరోపణల్ని ఖండించిన నందన తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు. -
డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వ డీఎస్సీ స్కాంకు బలైన డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ తమను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించారు. తెర వెనుక ‘డార్క్ ఆపరేషన్’ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని డీఎస్సీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై వైఎస్ జగన్ స్పందించారు. అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తాం. అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు తోడుగా నిలుస్తాం. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తోడుగా ఉంటాం. పార్టీకి చెందిన లీగల్ విభాగం ఈ పోరాటంలో మీకు సహాయపడుతుంది. ఆ లీగల్ ఖర్చులను మేమే భరిస్తాం.డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తున్న కేసులన్నింటి మీద రీ ఎంక్వైరీ చేయిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ ఎంక్వైరీ చేయిస్తాం. ఈ ప్రత్యేక కేసులమీదే కమిషన్కూడా వేయిస్తాం. స్పోర్ట్స్ కోటా పేరిట ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తామని జీవో ఇచ్చారు.ఉద్యోగాలు పూర్తిచేశాక, మళ్లీ ఆ జీవోను మార్పు చేసి మళ్లీ కొత్త జీవో తీసుకొచ్చారు. ఎవరికోసం మొదట జీవో తీసుకొచ్చారు. ఎవరికి మేలు చేయడానికి తీసుకొచ్చారు. చంద్రబాబు తన వాళ్లకోసం గేట్లు తెరిచారు. వాళ్ల పని అయిపోయిన తర్వాత మళ్లీ జీవోను ఉప సంహరించుకున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అందుకే తెలంగాణలో పవన్ కొత్త డ్రామా’
సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు...తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?...ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్...నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డీఎస్సీలో కప్పిపుచ్చుకునే ‘గేమ్స్’
సాక్షి, అమరావతి: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకోవడంతో అర్ధరాత్రి వేళ శాప్లో హైడ్రామా నడిచింది. సోమవారం ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు (సెక్షన్ ఆఫీసర్లు) మురుసటి రోజు మంగళవారం ఉదయం 7 గంటల తర్వాతే ఇళ్లకు వెళ్లారు. శాప్ ఉన్నతాధికారి సైతం సోమవారం అర్ధరాత్రి 3 గంటల తర్వాత కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లగా.. తిరిగి ఉదయం 7 గంటలకే కార్యాలయానికి తిరిగి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగులకు షిప్టులు వేసి మరీ కార్యాలయం పని వేళల కంటే ముందుగా రప్పించి.. అర్ధరాత్రి వరకు పని చేయించడం గమనార్హం. తాము చెప్పిన సమయానికి రాకపోతే.. చెప్పిన పని చేయకపోతే సస్పెషన్ వేటు వేయడంతోపాటు బదిలీ చేస్తామని సాక్షాత్తూ శాప్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. మంగళవారం రాత్రి వరకూ ఇదే తంతు నడిచింది. డీఎస్సీ ముగిసి 8 నెలల దాటిన తర్వాత ఇప్పుడు శాప్లో కూర్చుని డేటాను తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.జాబితా ఎందుకు మారింది?రాత్రంతా క్రీడా కోటా డీఎస్సీలో అభ్యర్థుల డేటాపై మల్లగుల్లాలు పడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫోన్లు సైతం సదరు అధికారి వద్దనే పెట్టుకుని పని చేయించడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో రాత పరీక్ష లేకుండా పోస్టులు పొందిన 382 మంది జాబితాను మంగళవారం ఉదయానికి ఓ ప్రత్యేక లింక్ ద్వారా విడుదల చేశారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ లింక్లోని డేటాలో మార్పులు కనిపించాయి. 382 మంది సెలక్షన్ లిస్టులో తొలుత ట్రయథ్లాన్లో ముగ్గురు క్రీడాకారులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు చూపించారు. ఇందులో జరుబుల రాము అనే వ్యక్తి పేరును సవరించిన జాబితా నుంచి తొలగించారు. అతనికి ఉద్యోగం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు తొలగించారు? ఉద్యోగం రాకపోతే ఎందుకు జాబితాలోకి పేరు చేరింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విచిత్రం ఏమంటే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో స్కూల్ అసిస్టెంట్ పీఈటీగా పని చేస్తున్న వ్యక్తి పేరు ముందుగా అప్లోడ్ చేసిన జాబితాలో లేకపోవడం గమనార్హం. సదరు క్రీడాకారిణి ఏషియన్ ఉమెన్ చాంపియన్ షిప్లో పతకం సాధించారు. నియామక సమయంలో తొలుత ఆమెకు పోస్టు ఇవ్వడానికి నిరాకరిస్తే ఏకంగా హైకోర్టులో కేసు వేసి ఆధారాలతో సహా సమర్పించగా కోర్టు ఆదేశాలతో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం దక్కని అర్హులైన ఎందరో క్రీడాకారులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ, 382 మంది జాబితా చూస్తే క్రీడల్లో పతకాలు సాధించిన వారి కంటే పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్, స్టేట్ చాంపియన్ షిప్లో పాల్గొన్న వ్యక్తులకు మాత్రమే పోస్టులు రావడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా పాదర్శకంగా చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంలో అర్ధరాత్రి హడావుడి పడుతూ డేటాను మార్చాల్సిన అవసరం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పబ్లిక్ డొమైన్లో జాబితాలు పెట్టకుండా ఇప్పుడు ఉరుకుల పరుగులపై విడుదల చేయడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఎంపిక జాబితా ఇచ్చారే తప్ప 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన 2వేల మంది క్రీడాకారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని ఉద్యోగాలు దక్కని అర్హులైన క్రీడాకారులు నిలదీస్తున్నారు. -
'తొలి సంతకం' మోసం గురూ!
సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీపైనే సీఎం తొలి సంతకం... మెగా డీఎస్సీ–2025.. అంటూ ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు నయ వంచనకు పాల్పడిందని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు పాతరేసి నచ్చినట్లు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడుతున్నారు. కటాఫ్ మార్కులు ప్రకటించకుండా.. వారిచ్చిందే ర్యాంకు, చెప్పిన వారికే ఉద్యోగం అన్న చందంగా డీఎస్సీని మార్చేశారని అర్హులు ఆవేదన చెందుతున్నారు. జీవో నం.77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అమలును సరిగా అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతుండటాన్ని తప్పుబడుతున్నారు. నిజానికి పాలకులే ఈ జీవో అమలును తుంగలో తొక్కేశారని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఓపెన్ మెరిట్లో కటాఫ్ మార్కులు లేకుండా, రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ ప్రకటించకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని పేర్కొంటున్నారు. నిరుద్యోగులను దగా చేసి డీఎస్సీపై న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టించడంపై విస్తుపోతున్నారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తప్పుడు ప్రచారాలకు వంత పాడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ ప్రకారం జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వ పెద్దలకు నచ్చినట్లు మార్చేశారని, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.కటాఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలేదు? మెగా డీఎస్సీ–2025 నిర్వహణను అడుగడుగునా దారి తప్పించారు. జిల్లా ఎంపిక కమిటీలను నీరుగార్చి ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. పరీక్ష ముగిశాక రాసిన అభ్యర్థులందరితో కామన్ మెరిట్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్నా పలు దఫాలు ‘టెట్’ మార్కులు ‘ఎడిట్’ చేశారు. డీఎస్సీలో వచ్చిన మార్కులతో కలిపి మార్పులు చేర్పులు చేశారు. దీంతో మొదట మెరిట్లో ఉన్న ర్యాంకులు తలకిందులైపోయాయి. చివరిగా ఇచ్చిన మెరిట్ లిస్టుల్లోనూ ఓపెన్ ‘కటాఫ్’, సామాజిక వర్గాల ఆధారంగా మెరిట్ కటాఫ్ మార్కులు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్, ఓసీ అభ్యర్థుల మెరిట్ను సైతం విడుదల చేయాలి. తర్వాత ‘లోకల్ మెరిట్’ ఎంపిక చేపట్టాలి. ఓపెన్ కటాఫ్ కంటే పైన ఉన్న ప్రతిభావంతులను ఓపెన్లోనే భర్తీ చేయాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని జీవో నం.77లోనూ పేర్కొన్నారు. కానీ ఏ విధానం అనుసరించారో, ఎలా చేశారో పరీక్ష రాసిన ఒక్క అభ్యర్థికి కూడా అర్థం కాకుండా చేశారు. రిజర్వేషన్ వర్తింపులోనూ అన్యాయమే..!డీఎస్సీలో పోస్టుల ఆధారంగా అమలు చేయాల్సిన వివిధ సామాజిక రిజర్వేషన్లనూ దారి తప్పించారు. మెరిట్లో ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వడంతో ఆ మేరకు రిజర్వుడు కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వంద శాతం పోస్టుల్లో కచ్చితంగా 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలి. 33 శాతం కంటే మహిళలు తగ్గితే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ను పరిశీలించి తగ్గిన మహిళల సంఖ్య ఆధారంగా అంతే సంఖ్యలో అత్యంత కిందనున్న పురుష అభ్యర్థులను తొలగించి వారిస్థానంలో మెరిట్లో ఉన్న మహిళలను ఎంపిక చేయాలి. ఒకవేళ మహిళా అభ్యర్థులు 33 శాతానికి మించి ఉంటే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ వర్తించదు. హారిజాంటల్ రిజర్వేషన్లో ఒకటి ఉమెన్, రెండోది స్పెషల్ రిజర్వేషన్. స్పెషల్ రిజర్వేషన్లో డిసేబుల్ (4 శాతం), మెరిట్ స్పోర్ట్స్ (3), ఎక్స్ సర్వీస్మెన్ (2) శాతం ఎంపిక చేయాలి. వీరిని సామాజిక రిజర్వేషన్లో లోకల్ పోస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా సామాజిక కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటాయించారో చివరిలో ఉన్న అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో స్పెషల్ రిజర్వేషన్ అభ్యర్థులను చేర్చాలి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ అభ్యర్థి మెరిట్లో ఉంటే.. మరో స్పెషల్ కేటగిరీ (హారిజాంటల్) అభ్యర్థికి అవకాశం ఉండదు. ఇవన్నీ పూర్తి చేశాక మాత్రమే అభ్యర్థులకు 1 : 1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపాలి. ఓపెన్ మెరిట్, రిజర్వేషన్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ల వర్తింపు పూర్తి చేశాక మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న వారికి అన్ని సర్టిఫికెట్లు పరిశీలన పూర్తిచేసి ఉద్యోగం ఇవ్వాలి. అత్యంత అరుదుగా మాత్రమే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. సర్టిఫికెట్లలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు గడువునివ్వాలి. కానీ ఈ డీఎస్సీలో మాత్రం చేసిన తప్పులు, నిబంధనల ఉల్లంఘనను కప్పిపుచ్చేందుకు అత్యంత వేగంగా 148 రోజుల్లో ప్రక్రియను ముగించారు. 1,500 మంది రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం!సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల మేరకు, నిబంధనల ప్రకారం.. ‘కటాఫ్’కు పైన ఉన్న అభ్యర్థులను తప్పనిసరిగా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయాలి. వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చేందుకు ఆస్కారం లేదు. కానీ డీఎస్సీ – 2025లో ప్రభుత్వం ప్రకటించిన మెరిట్ లిస్టునే తీసుకుంటే.. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన వారిని వివిధ సామాజిక రిజర్వేషన్లోని లోకల్ పోస్టుల్లో (80 శాతం) నింపారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్లో ఉన్నా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉన్నట్టు అంచనా! విజయనగరం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల భర్తీలో ఈ అక్రమాలు కొట్టొచ్చినట్టు బయటపడ్డాయి. 88వ ర్యాంకు నుంచి 101వ ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులను ‘ఓపెన్ కేటగిరీ’ లోకల్లో ఎంపిక చేస్తే.. 87వ ర్యాంకు అభ్యర్థిని ‘బీసీ–ఏ’ లోకల్ పోస్టులో భర్తీ చేశారు. దీంతో బీసీ–ఏ రిజర్వు కేటగిరీ అభ్యర్థి పోస్టు కోల్పోయారు. ఈ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు బీసీ–ఏ లోకల్లో 15 ప్రకటించారు. ఈ పోస్టుల్లో హారిజాంటల్ స్పెషల్ రిజర్వేషన్కు ఒక్క పోస్టు కేటాయించారు. మిగిలిన 14 బీసీ– ఏలోని మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలి. ఇదే తరహాలో అన్ని సామాజిక కేటగిరీలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం ఎక్కడా పాటించలేదని అభ్యర్థులు, గతంలో డీఎస్సీ నిర్వహణలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఎస్జీటీ కేటగిరీలో నలుగురు రిజర్వుడు అభ్యర్థులు నష్టపోయారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను రిజర్వుడు పోస్టులో భర్తీ చేయరాదని 2007లో సుప్రీంకోర్టు రాజేశ్కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో తీర్పు ఇచ్చింది. అలాగే 2025 డిసెంబర్లో రజత్యాదవ్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన తీర్పు వెల్లడించింది. కానీ వీటిని తుంగలో తొక్కి డీఎస్సీ–2025లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ తమను వేధిస్తోందని, మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇచ్చేదే లేదని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే లే అవుట్లు, ప్లాట్లు వేస్తోందని.. రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తోందని మండిపడ్డారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ కష్టాన్ని వివరించామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైఎస్ జగన్ను కలిసి తమ కష్టాలను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. రెండో విడత భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని, ఉన్న అరెకరం పొలం ఇచ్చి తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. పెనుమాకలో మినీ రిజర్వాయర్ పేరుతో పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేసిందని చెప్పారు. పక్కనే భూ సేకరణకు భూములివ్వని రైతుల పొలాలను 20 అడుగుల లోతు వరకు చెరువుల్లా తవ్వేసి.. వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయని చెప్పారు. తామంతా (రైతులు) ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం పొలాల్లో తవ్వేసిన మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రాజధాని కోసం ఇళ్లు, పొలాలను ఇచ్చేసిన రైతులకు ప్రభుత్వం వాగుల్లో ప్లాట్లు కేటాయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.ఎంత మంది రైతులను చంపేద్దామనుకున్నారు?రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్న అరెకరం పొలం ఇచ్చి కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాదా? భూసేకరణకు భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పక్కనే కుప్పలుగా పోశారు. రైతులు ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం రైతుల పొలాల్లో మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. మంచి ప్లాట్లు నేతలు తీసుకుని, రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే ఓ రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి, ఇంకెంత మంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల జీవితాలను మట్టిపాలు చేయాలనుకోవడం చాలా తప్పు. బలవంతపు భూసేకరణ పేరుతో రైతులను వేధించడం ఇకనైనా ఆపాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తవైఎస్ జగన్ హామీతో ధైర్యం వచ్చిందిచంద్రబాబు ప్రభుత్వ తీరుతో తామంతా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, ఈ ప్రభుత్వం తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను సీఆర్డీఏ కమిషనర్, మంత్రి లోకేశ్.. ఉండవల్లిలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. ఉన్న అరకొర భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తమ బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. అండగా ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. ఈ అన్యాయంపై రైతుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో పోరాడతామని హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీతో తమకు ధైర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి రైతుల పొలాలను తవ్వేయడం, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో వారి అనుమతి లేకుండా లే అవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని వైఎస్ జగన్ మండిపడ్డారని తెలిపారు.చంద్రబాబు, లోకేశ్ మా గోడు వినలేదునాకు ఉన్నదే కొంచెం భూమి. అందులో కొంత కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. మిగిలింది సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దాని పక్కనే బఫర్ జోన్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్ వేశారు. నాకు భూమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సీఆర్డీఏ కమిషనర్ మా మొర ఆలకించడం లేదు. మా ఎమ్మెల్యే లోకేశ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోనే ఉంటారు. మా రైతులను పిలిచి మా గోడు వినాలి. పచ్చని పంటలు పండే భూములు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేము. ప్రభుత్వం స్పందించక పోవడంతో న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశాం. వైఎస్సార్సీపీ లీగల్గా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. – శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి రైతుభూములివ్వడం ఇష్టం లేదుతరతరాలుగా మేము అనుభవిస్తున్న భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. 12 ఏళ్లుగా ఇదే మాట మీదే ఉన్నా. ఈ భూమిని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. అన్నం పెట్టే పొలాన్ని ఇవ్వడం మాకిష్టం లేదు. – శంకర్రావు, ఎర్రపాలెం రైతుప్రభుత్వం తీరుతో నిద్ర కరువు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కారణంగా మేం రోజూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడం ఇష్టం లేదని మొత్తుకుంటున్నా నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో మాకు ధైర్యమొచ్చింది. – అశోక్ రెడ్డి, ఉండవల్లి రైతుమా పొలాన్ని పనికి రాకుండా చేశారుమా గ్రామ రైతులు ఏడాదంతా పూల తోటలు సాగు చేస్తారు. ఎకరం పొలంలో ఏడాదికి రూ.3–4 లక్షలు సంపాదిస్తాం. రెండెకరాలున్న రైతులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరతరాలుగా బతుకుతున్నారు. మొదటి విడత భూసేకరణకు పోను మా గ్రామంలో 450 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మా సమ్మతి లేకుండానే ఆ భూముల్లో కూడా ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మా పొలాల చుట్టూ మెరక తోలేస్తున్నారు. వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇలాగైతే మేం ఏం తిని బతకాలి? – శివరామ్, రైతు, నిడమర్రు -
అమరావతి రైతులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: ‘రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలన్నదే మా అభిమతం.. ముందు నుంచి మా వైఖరి అదే.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’ అని రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణమని, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. వారికి బాసటగా నిలిచారు. రైతుల భూములను లాక్కోవడానికి దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను వైఎస్ జగన్కు వివరించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న వైఎస్ జగన్, రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం అన్నారంటే..అందుకే మావిగన్ ప్రతిపాదన‘‘ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 50 వేల ఎకరాలు అవసరం ఏముంది? అందుకే ‘మావిగన్’ ప్రతిపాదించాం. ఇప్పటికే గన్నవరంలో విమానాశ్రయం ఉంది. దానికి దగ్గర్లోనే మరో ఎయిర్పోర్టుకు అనుమతి ఇవ్వరు. మావిగన్లో పోర్టు కూడా ఉంది. అది మచిలీపట్నంలో ఉంది. చంద్రబాబు తీరుతో మరో 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని కనిపించదు. ఎందుకంటే పనులు జరగవు. కారణం అక్కడ కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి రూ.2 కోట్లు కావాలని 12 ఏళ్ల క్రితమే బ్యాంకులకు నివేదిక ఇచ్చారు. నిజానికి ఇప్పటికి ఆ రేటు పెరిగింది. ఈ లెక్కన రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వీటిన్నింటికే ఎన్నేళ్లు ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి?చంద్రబాబు ఉద్దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలనేదే మా అభిమతం. ముందు నుంచి మాది అదే వైఖరి. కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ రైతులకు నష్టం కలగకూడదనే మావిగన్ను ప్రతిపాదించాం. ఆ ప్రాంతంలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం జీరో నుంచి కడతామని అమరావతిపై వెనక్కు తగ్గడం లేదు. అక్కడ నిరంతరం పనులు.. నిరంతరం కమీషన్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అదే చంద్రబాబు ఉద్దేశం. రాజధాని పనుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. అవసరం అయితే భూములు వెనక్కుఅమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం. బలవంతంగా భూ సేకరణ అనేది ఉండదు. అవసరం అయితే భూములు వెనక్కు ఇస్తాం. ఇప్పుడు మీ పోరాటంలో మా పార్టీ న్యాయ విభాగం కూడా పాలు పంచుకుంటుంది. మా లీగల్ టీమ్ మీకు అన్ని విధాలుగా సహాయ, సహకారిగా ఉంటుంది. పార్టీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తాం. మీ తరఫున గట్టిగా పోరాడతాం. మనం ఇప్పుడు చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమే. మూడేళ్ల తర్వాత దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడితే, మీకు పూర్తి న్యాయం చేస్తాం. అవకాశం ఉంటే భూములు కూడా తిరిగి ఇస్తాం.దౌర్జన్యం చేసే వారికి శిక్ష తప్పదుముఖ్యమంత్రిగా చేయకూడని పని చంద్రబాబు చేస్తున్నారు. రైతులు భూమి ఇవ్వకపోతే కక్షగట్టడం దారుణం. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయడం, కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, తోడిన నీరు పంపింగ్ చేయడం, దగ్గర్లో రిజర్వాయర్లు ఉంటే గండి కొట్టి, నీరు పారేలా చేయడం దారుణం. ఇప్పుడు పలు రకాలుగా దౌర్జన్యం చేస్తున్న వారందరికీ శిక్ష పడేలా చేస్తాం. మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించేలా చేస్తాం. మీ తరఫున పోరాడేందుకు లీగల్ కమిటీ వేయడం ద్వారా అమరావతి రైతులకు న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం’’ అని వైఎస్ జగన్ అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. -
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అత్యంత బాధాకరం
సాక్షి, అమరావతి: పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో గత ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులతో అమలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపుగా నిలిచిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నరసరావుపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు వైద్యులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగ పరిస్థితులు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారని తెలిపారు. ఆస్పత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు పారదర్శకంగా ఇవ్వకుండా, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందించాల్సిన వ్యాధులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా నిధులు కేటాయిస్తూ.. అందులో అవినీతి, కమీషన్లకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం (ఆరోగ్య ఆసరా), రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, నాడు – నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వైద్యులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శేషిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హనిమిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రకిరణ్, వసంత, చెన్నారెడ్డి, కొండారెడ్డి, జయభారత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, క్రాంతికుమార్, వెంకట లక్ష్మి తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
వైద్య పరికరాల కొను‘గోల్మాల్’!
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో పరికరాల కొనుగోళ్లు భారీ స్కామ్లా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేసి నాణ్యమైన అధునాతన పరికరాలను సమకూర్చాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లే లక్ష్యంగా భారీ అవినీతికి తెర తీసినట్లు విమర్శలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్ఐడీసీ) వైద్య శాఖ ఉన్నతాధికారి.. కీలక నేతలు.. ఇలా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ గొలుసు కట్టుగా ఈ కమీషన్ల దందా సాగుతోంది. దీంతో ముడుపుల భారాన్ని కూడా పరికరాల ధరలో కలిపేసి కాంట్రాక్టర్లు రెట్టింపు రేట్లు కోట్ చేస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. కమీషన్లు ఇవ్వండి.. ధర మీ ఇష్టం..! చంద్రబాబు సర్కారు వచ్చాక ప్రభుత్వాస్పత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఎంఎస్ఐడీసీ అవినీతికి అడ్డాగా మారిపోయింది. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్ట్ ఖరారు మొదలు పర్చేజ్ ఆర్డర్ (పీవో), బిల్లులు మంజూరు దాకా ప్రతి స్థాయిలో ముడుపుల తంతు సాగుతోంది. ముఖ్యంగా పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్ఐడీసీ ఎక్యుప్మెంట్ విభాగానికి చెందిన కీలక అధికారి కమీషన్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు. కొత్త కాంట్రాక్ట్లు, పీవోల జారీకి ఆయన స్థాయిలో మూడు శాతం కమీషన్ గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇక బిడ్ల పరిశీలన, డెమోలలో లబ్ధి చేకూర్చే ఒప్పందం, బిల్లులు ప్రాసెసింగ్.. ఇలా వివిధ స్థాయిల్లో రెండు శాతం మేర దండుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇలా ఎంఎస్ఐడీసీ స్థాయిలో ఐదు శాతం మేర కమీషన్లు వసూలు చేస్తున్నట్లు కాంట్రాక్టర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంట్రాక్ట్ దక్కాలన్నా, పీవో రావాలన్నా సర్కార్లో కీలక నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని కమీషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న అధికారి తేల్చి చెబుతున్నారు. అలా కీలక నేతలు కనిష్టంగా 5 శాతం నుంచి 10 శాతానికిపైగా దోచుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. కమీషన్లు దండుకోవడంలో ఆరోగ్య శాఖలోని ఓ అత్యున్నత అధికారి రాజకీయ నేతలతో పోటీపడుతున్నారు. ఆయన కూడా 5 శాతం నుంచి 10 శాతం మేర రాబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాదికి చెందిన సదరు అత్యున్నత అధికారి అక్కడి డిస్ట్రిబ్యూటర్ సంస్థలతో పెద్ద మొత్తంలో వాటాలు మాట్లాడుకుని పారదర్శకంగా జరగాల్సిన టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎంఎస్ఐడీసీ మొదలుకుని ప్రభుత్వంలోని నేతల వరకూ 15 నుంచి 25 శాతం మేర కమీషన్లు డిమాండ్ చేస్తుండటంతో కంపెనీలు వాటిలాభాలు కూడా వేసుకుని వైద్య పరికరాల ధరలను చుక్కలను తాకిస్తున్నాయి. అయినా సరే.. తాము అడిగినంత కమీషన్ చెల్లిస్తే ఎంత ధర కోట్ చేసినా ఫర్వాలేదనే రీతిలో లోపాయికారీ ఒప్పందాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అటు అధికారులు ఇటు ప్రభుత్వ పెద్దల అండదండలతో కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రంలో విక్రయిస్తున్న వైద్య పరికరాల ధరల కంటే రెండు మూడు రెట్లు అధికంగా కోట్ చేస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవిగో..! ధరలో ‘ఎక్స్ట్రా’క్టర్ తెలంగాణాలో రూ.1.04 లక్షలతో ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ పరికరాన్ని మన దగ్గర రూ.3.13 లక్షల చొప్పున సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏకంగా రూ.2 లక్షలకు పైగా అధికంగా చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో ‘సాక్షి’లో కథనం రావడంతో సెకండరీ హెల్త్లో దాదాపు 230 పరికరాల కొనుగోలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే పెద్ద మొత్తంలో కమీషన్ల డీల్ కుదరడంతో ఎలాగైనా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రూ.3.13 లక్షల ధరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంఎస్ఐడీసీ జస్టిఫికేషన్ తీసుకుంది. అదే ధర ఆధారంగా పరికరాల కొనుగోలుకు ఇండెంట్లు పంపాలని డీఎంఈ, డీఎస్హెచ్, డీహెచ్లకు లేఖ రాసింది. ఈఎన్టీ సిమ్యులేటర్.. దబిడి ది‘బిడ్’! బోధనాస్పత్రుల్లో పెద్దగా అవసరం లేని ఈఎన్టీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలు పేరిట స్కామ్కు తెర తీశారు. ఒకే రకం కంపెనీ పరికరాలను సరఫరా చేస్తామని రెండు సంస్థలు బిడ్లు వేస్తే సింగిల్ బిడ్గా పరిగణించి తిరస్కరించకుండా ఆమోదించారు. బహిరంగ మార్కెట్లో రూ.కోటి నుంచి రూ.3 కోట్లు పలికే ఒక్కో పరికరాన్ని ఏకంగా రూ.4.44 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ అత్యున్నత అధికారి నేరుగా ఓ ఉత్తరాది కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. హిస్టోస్కోపి.. మా‘యేఐ’నా..! గైనిక్ విభాగాలకు సంబంధించి హిస్టోస్కోపి పరికరాల కొనుగోలుకు గత నెలలో ఆర్సీ ఖరారు చేశారు. ఈ పరికరాన్ని గత ప్రభుత్వంలో రూ.46 లక్షలతో సరఫరా చేసేలా బిడ్లు రాగా ఇప్పుడదే కంపెనీకి చెందిన పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట ఏకంగా రూ.69.45 లక్షలకు ఆర్సీ ఖరారు చేశారు. ఎక్స్రే.. బాప్రే 800 ఎంఏ డిజిటల్ ఎక్స్రే పరికరాన్ని రూ.1.23 కోట్లతో కొనుగోలుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఖరారు చేశారు. తమిళనాడులో రూ.69 లక్షలతో కొనుగోలు చేసిన ఇదే పరికరాన్ని ఇక్కడ ఏకంగా రూ.50 లక్షలకుపైగా అధిక ధరతో కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఎంత మెరుగైన పరికరం కొన్నప్పటికి రూ.70 లక్షల నుంచి రూ. కోటి దాటదని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇండెంటే లేకుండా ఆస్పత్రులకు పరికరాలు! సాధారణంగా వైద్య పరికరాల కొనుగోలుకు ఆస్పత్రుల నుంచి ఆయా విభాగాధిపతుల కార్యాలయాలకు ఇండెంట్ రావాలి. ఆస్పత్రి సూపరింటెండెంట్లు/సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, చికిత్సల అవసరాల నివేదికను సేకరించాలి. అయితే ఈ ప్రక్రియను పక్కనపెట్టి నేరుగా డీఎంఈ కార్యాలయం నుంచి ఇండెంట్ పంపి గతేడాది ‘పాయింట్ ఆఫ్ కేర్ అ్రల్టాసౌండ్ 3 ఇన్ 1 ప్రోబ్’ పరికరాల కొనుగోళ్లను చేపట్టారు. ఏకంగా 78 పాయింట్ ఆఫ్ కేర్ అ్రల్టాసౌండ్ పరికరాలను బోధనాస్పత్రులకు డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పరికరానికి రూ.11.33 లక్షల చొప్పున దాదాపు రూ.9 కోట్లు ఇందుకు వెచ్చించారు. కీలక నేతతో కాంట్రాక్ట్ సంస్థ డీల్ కుదుర్చుకోవడంతో అవసరం లేని పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. 17 బోధనాస్పత్రులకు 78 పరికరాలు సమకూర్చాలని గతేడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నుంచి ఎంఎస్ఐడీసీకి ప్రతిపాదన వెళ్లింది. ఒక్కో ఆస్పత్రికి రెండు నుంచి ఆరు పరికరాల చొప్పున అవసరముందని అందులో పేర్కొన్నారు. కాంట్రాక్టు సంస్థ ఈ ఏడాది ప్రారంభం నుంచి పరికరాల సరఫరా చేపట్టింది. అసలు ఇండెంటే పెట్టకుండా ఈ పరికరాలు ఆస్పత్రులకు చేరుతుండడంతో ఖంగుతిన్న వైద్యులు అవి తమకెందుకని, వాటి అవసరమేలేదంటూ ఏకంగా డీఎంఈకి రాసిన లేఖల్లో కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. కేవలం ప్రాథమిక నిర్ధారణ కోసం వాడే ఈ పాయింట్ ఆఫ్ కేర్ పరికరాలు తమకెందుకని వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, విజయనగరం తదితర ఆస్పత్రుల్లో ఈ పరికరాల అవసరమేలేదని.. వెనక్కు తీసుకెళ్లిపోవాలని కాంట్రాక్టర్కు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో కొన్నిచోట్ల వీటిని తీసుకుని స్టోర్స్, వార్డుల్లో మూలనపడేశారు. నిజానికి బోధనాస్పత్రులలో ఇప్పటికే అధునాతన అ్రల్టాసౌండ్, రేడియాలజీ స్కానింగ్ యంత్రాలున్నాయని వైద్య వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కమీషన్ల కోసం ఆస్పత్రులకు అవసరం లేని పరికరాలను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ చేస్తున్నారని చర్చించుకుంటున్నాయి.ట్రెడ్మిల్ రూ.11లక్షలు!మార్కెట్లో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు పలికే ట్రెడ్మిల్ను ఏకంగా రూ.11 లక్షల చొప్పున బోధనాస్పత్రుల కోసం కొనుగోలు చేసేలా రేట్ కాంట్రాక్ట్ (ఆర్సీ) ఖరారు చేశారు. ఈ ధర చూసి అవాక్కైన డీఎంఈ అధికారులు కొనుగోలును వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం.అక్రమాల అ‘క్షయ’పాత్రటీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్రే పరికరాల కొనుగోలుకు ఇటీవల టెండర్ ఖరారు చేశారు. ఒక్కో పరికరాన్ని రూ.21.84 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పోర్టబుల్ ఎక్స్రే పరికరాలను కేంద్ర ఆరోగ్య శాఖ టీబీ కార్యక్రమంలో భాగంగానే రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలకే పలు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి కూడా 40 వరకూ పరికరాలు ఇప్పటికే అందాయి. బ్లూటూత్ కనెక్షన్తో కూడిన పోర్టబుల్ ఎక్స్రే, ల్యాప్ట్యాప్, ఇతర పరికరాలు కేంద్రం సరఫరా చేసిన ఎక్యుప్మెంట్లో ఉన్నాయి. ఎక్స్రే తీస్తే రిపోర్ట్ ల్యాప్ట్యాప్లో జనరేట్ అయ్యే సౌకర్యం ఉంది. ఐతే ఇదే తరహా పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట దాదాపు రూ.22 లక్షలతో ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. ఇది కేంద్రం సరఫరా చేసిన పరికరాల ధరలతో పోలిస్తే రూ.7 లక్షల మేర అధికం. రాష్ట్ర ప్రభుత్వం 100 పరికరాలను ప్రస్తుతం కొనుగోలు చేయబోతోంది. ఈ లెక్కన ఒక్కో పరికరానికి రూ.7 లక్షల చొప్పున రూ.7 కోట్ల మేర అదనంగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో టెండర్ పిలవగా కేవలం రెండు సంస్థల బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి. నామమాత్రపు పోటీ ఉన్నప్పటికీ తొలి పిలుపులోనే కాంట్రాక్ట్ ఖరారు చేశారు. మరోవైపు వెంటిలేటర్లు, అనస్తీషియా వర్క్స్టేషన్స్, ఇతర వైద్య పరికరాల కొరత ఆస్పత్రులను తీవ్రంగా వేధిస్తోంది. రోగులకు ఊపిరి పోయాల్సిన ఈ పరికరాల కొనుగోళ్లను మాత్రం ఏడాదిగా సాగదీస్తున్నారు. వివిధ టెండర్లలో రెండు మూడు బిడ్లు అర్హత సాధించినా పోటీ లేదని తిరస్కరిస్తున్నారు. దీన్నిబట్టి రేటు కుదిరితే ఒకలా లేదంటే మరోలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమ్మో.. మామోగ్రఫీ.. డీఎంఈ పరిధిలోని ఆరు బోధనాస్పత్రులకు ఒక్కొక్కటి చొప్పున మామోగ్రఫీ పరికరాల కొనుగోలుకు గత మార్చిలో కాంట్రాక్టు ఖరారు చేశారు. అల్లెంజర్స్ కంపెనీకి చెందిన ‘మామ్ వీనస్+’ మామోగ్రామ్ కొనుగోలు, ఇన్స్టలేషన్కు రూ.1.71 కోట్ల చొప్పున ధర ఖరారు చేశారు. ఇదే మోడల్ పరికరాన్ని నేరుగా తయారీ సంస్థ నుంచి తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ రూ.83.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇన్స్టలేషన్కు రూ.12.82 లక్షలు ఇచ్చింది. అంటే ఒక్కో పరికరానికి సుమారు రూ.96 లక్షలు వెచ్చించారు. ఇదే పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.1.71 కోట్లకు అంటే ఒక్కో పరికరంపై ఏకంగా రూ.75 లక్షలు అధిక ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే ఆరు పరికరాలకు రూ.4.50 కోట్ల మేర అధికంగా ప్రజాధనాన్ని వెచ్చించారు. ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అత్యధిక ధరకు మామోగ్రఫీ పరికరాల కొనుగోలులో భారీ అవినీతికి తెర తీశారనే విమర్శలున్నాయి. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సదరు సంస్థకు ఎంఎస్ఐడీసీ దాసోహం అవుతోందన్న ఆరోపణలున్నాయి. -
రెండేళ్ల పాలన కానుక.. మరో రూ.4,400 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు మరోసారి అప్పుల మోత మోగించింది. తాజాగా మంగళవారం బడ్జెట్లో మరో రూ.4,400 కోట్ల మేర అప్పులు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రెండేళ్లలోనే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు ఏకంగా రూ.3,47,095 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్ అప్పులే రూ.1,86,904 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,12,804 కోట్ల వరకు ఉన్నాయి. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో మరో రూ.47,387 కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రాన్ని రాసిచ్చేసి...! ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లలోనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాష్ట్రాన్ని భారీ రుణాల ఊబిలోకి నెట్టేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అందినకాడికి అప్పులు చేసి ఏమాత్రం ఫలితాలు ఇవ్వని రంగాలకు మళ్లించేశారు. రాష్ట్రాన్ని బ్యాంకులకు రాసిచ్చేశారు. మరోపక్క ప్రభుత్వ ఆస్తులతో పాటు ఏకంగా ఖజానానే తాకట్టు పెట్టేశారు. సంపద సృష్టించకపోగా అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం దిశగా నెడుతున్నారు.గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, అమరావతి పేరుతో భారీగా అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్లు అమలు చేయలేదు. సంక్షేమం మాటే లేదు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర రాబడులను పెంచే దిశగా చర్యలు శూన్యం. ఇవేమీ చేయకపోగా దారుణమైన అప్పులతో ముంచేశారు. సంపద సృష్టించి అన్ని హామీలు అమలు చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక అంతులేని అప్పుల భారాన్ని మోపారు. విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం.. అంతులేని అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా గత ప్రభుత్వం చేపట్టిన కొత్త వైద్య కళాశాలల పనులను సైతం నిలిపేసింది. పీపీపీ పేరుతో వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తూ వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన మన బడి నాడు–నేడు పనులను సైతం చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. విద్యా రంగంలో కొత్తగా ఒక్క స్కూలు గానీ, కాలేజీ గానీ నిర్మాణం చేపట్టలేదు. రెండేళ్లలో చంద్రబాబు సర్కారు చేసిందల్లా వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన ఆస్తుల కల్పన పనులను నిలుపుదల చేయడంతో పాటు వాటిని ప్రైవేట్ పరం చేయడమే! వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేయగా అందులో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబి్ధదారులకు బదిలీ చేయడం గమనార్హం. -
నా కొడుకు బతికున్నాడా.. చంపేశారా?
విజయవాడ లీగల్: ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విలపిస్తూ చెప్పారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె మంగళవారం న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల 9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు. తన సెల్ఫోన్ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చినట్లు నిజనిర్ధారణ అయింది బీబీఏ మానవహక్కుల కమిటీ చైర్మన్, సీనియర్ న్యాయవాది ఏ.ఎస్.ఎస్.రాంప్రసాద్ మాట్లాడుతూ మార్కాపురం నుంచి 20 రోజుల కిందట అక్రమంగా తీసుకొచ్చిన గాదె సాయికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో పలు కేసులతో సంబంధం ఉన్న గాదె సాయికృష్ణ కొంతకాలంగా మార్కాపురంలో ఉంటున్నాడని తెలిపారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక పోలీసులు అతడిని చిత్రహింసలకు గురిచేశారని అనుమానం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో బీబీఏ మానవహక్కుల కమిటీ తరఫున కృష్ణలంక సీఐ నాగరాజును అడగగా తాము సాయికృష్ణను తీసుకురాలేదని చెప్పారన్నారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజి ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. బార్ అసోసియేషన్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మార్కాపురం వెళ్లి విచారించారని, సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని అక్కడివారు చెప్పారని తెలిపారు. సాయికృష్ణ బయటకు రాలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడా? లేక చంపేశారా అన్న అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంటే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచాలేగానీ పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను కోర్టులో హాజరుపర్చకపోతే బాధితురాలి పక్షాన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇలాగే బెజవాడ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు, లాకప్డెత్లు చేసినప్పుడు బీబీఏ న్యాయవాదులు పోరాటాలు చేసి అటువంటి ఘటనలు తిరిగి జరగకుండా అడ్డుకట్టవేశారని ఆయన గుర్తుచేశారు. -
దుబారాలో దూసుకుపోతున్న బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబారాలో ప్రభుత్వం దూసుకుపోతూ జాతీయ మీడియాలో ప్రచారానికి నిధులు విడుదల చేసింది. జాతీయ మీడియా పొగడ్తల కోసం రూ. 45 లక్షలు ఖర్చు పెట్టింది.ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారానికి 45 లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇండియా టుడే, ది వీక్, ఔట్లుక్, బిజినెస్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో ప్రచార ప్రకటనలతో పాటు ఫీచర్ ఆర్టికల్స్ ప్రచురించినందుకు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. -
వైఎస్ జగన్కు వైద్యుల ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
మరో భారీ అప్పు చేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. జూన్ నెల మొదటి మంగళవారమే ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు తెచ్చింది. తాజా అప్పుతో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3లక్షల 44వేల 494 కోట్లకు చేరాయి. ఫలితంగా చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక బాబు సర్కార్ గడిచిన 24 నెలల్లో రూ.3,44,494 కోట్లు అప్పు చేసింది. వాటిల్లో బడ్జెటరీ అప్పులు రూ.లక్షా 85వేల కోట్లు, బడ్జెట్ బయట రూ.1,15,504కోట్లు అప్పులు చేసింది. అమరావతి పేరుతో రూ.47,387కోట్ల అప్పులు ఉన్నాయి. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులుఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. Warm wishes to all the brothers and sisters of Telangana on the auspicious occasion of Telangana Formation Day!— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2026 -
చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమరభేరి మోగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కారుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్ లీక్, అడుగడుగునా చోటుచేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయమని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజర్వేషన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చిన వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్ జగన్ ఉద్యోగాలిచ్చారని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. చిత్తూరు కలెక్టరేట్ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడుగునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
గోప్యత హక్కు పేరుతో నేరస్తులు తప్పించుకోలేరు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ ద్వారా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఒకరి భూమిని మరొకరికి విక్రయించిన వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సదరు నకిలీ ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్, ఇతర అనుమతించదగిన వివరాలను పోలీసులకు అందచేయాలని ఆధార్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత గోప్యత పేరుతో నేరగాళ్లు చట్టం నుండి తప్పించుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ చట్టం–2016 సెక్షన్ 33(1) ప్రకారం సమాచారాన్ని బహిర్గతం చేయడంపై సంపూర్ణ నిషేధం లేదని హైకోర్టు గుర్తు చేసింది. ‘సాధారణంగా ఒకరి ఆధార్ వివరాలను మరొకరికి ఇవ్వడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుంది. కానీ ఈ కేసులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది.వివాదంలో ఉన్న ‘ఆధార్ కార్డు’ స్వయంగా అప్పీలుదారు పేరుతోనే జారీ అయింది. ఎవరో ఒక అపరిచిత మూడో వ్యక్తి తన పేరుతో నకిలీ కార్డు సృష్టించి మోసానికి పాల్పడ్డారని అప్పీలుదారు వాదిస్తున్నారు. అప్పీలుదారు తన స్వంత పేరు, గుర్తింపుతో ముడిపడి ఉన్న సమాచారాన్ని మాత్రమే కోరుతున్నారు కాబట్టి.. ఇక్కడ వేరొకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశమే లేదు.’ అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి భూమి అమ్మేసిన ఆగంతకుడు... విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 156/1 , 157/11లో 1.99.5 ఎకరాల భూమికి ఏలప్రోలు సీతారామాంజనేయులు యజమాని. అయితే ఒక గుర్తుతెలియని వ్యక్తి సీతారామాంజనేయులు పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించి, తానే సీతారామాంజనేయులనంటూ 2021లో రెండు వేర్వేరు సేల్ డీడ్ల ద్వారా ఈ భూమిని ఇతరులకు అక్రమంగా అమ్మేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు నమోదయ్యింది. దీనిపై విశాఖపట్నం జిల్లా కోర్టులో దావా కూడా దాఖలయ్యింది. విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్, తనిఖీలు చేపట్టి నకిలీ సేల్ డీడ్లను రద్దు చేస్తూ 2021న ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, పోలీసుల దర్యాప్తులో భాగంగా సదరు నకిలీ ఆధార్ కార్డును సృష్టించిన వ్యక్తి అసలు వివరాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడానికి బాధితుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, చట్టంలోని సెక్షన్ 8 (1)(జే) ప్రకారం మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమంటూ ఆధార్ యంత్రాంగం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అటు పోలీసులు కూడా ఈ వివరాలు సేకరించడంలో చొరవ చూపకపోవడంతో, బాధితుడు సీతారామాంజనేయులు 2025లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో, సీతారామాంజనేయులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. -
రాష్ట్రంలో భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వానలతో భిన్నవాతావరణం నెలకొందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలన్నారు. గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వీలైనంత దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఎండ తీవ్రత ఉంటుందని వివరించారు. -
జీఎస్టీ నేల చూపులు
గణనీయంగా తగ్గిన రాష్ట్ర జీఎస్టీ ఆదాయం– 2024తో పోలిస్తే 2026 మే నెలలో రూ.173 కోట్లు తగ్గిన ఆదాయం– గతేడాదితో పోలిస్తే రూ.86 కోట్లు తగ్గుదల– దీంతో ఏకంగా గత రెండేళ్ల గణాంకాలనే మార్చేసిన ప్రభుత్వం – ఈ ఏడాది పెరుగుదల చూపించేందుకు తంటాలు సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు తిరోగమన దిశలోనే పయనిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన 2026 మే నెల స్థూల జీఎస్టీ ఆదాయం రూ.3,717 కోట్లకు పరిమితమయ్యింది. 2024 మే నెలలో రూ.3,890 కోట్లు, 2025 మేలో రూ.3,803 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. ఇప్పుడు రూ.3,717 కోట్లకు పడిపోయింది.2024తో పోలిస్తే రెండేళ్లలో మే నెల జీఎస్టీ ఆదాయం రూ.173 కోట్లు పడిపోయింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల ఆదాయంలో కూడా 5.2 శాతం క్షీణించింది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.8,490 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. ఇప్పుడు రూ.449 కోట్లు తగ్గి రూ.8,041 కోట్లకు పరిమితమయ్యింది. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో తామిచ్చిన గణాంకాలనే ఇప్పుడు మార్చేసి ఏకంగా రికార్డు స్థాయిలో వృద్ధి నమోదయ్యిందంటూ రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ప్రకటన జారీ చేయడం గమనార్హం దొంగ లెక్కల్లో బాబుకే ‘బాబు’ దొంగ లెక్కలు చెప్పడంలో రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. ఈ ఏడాది జీఎస్టీ పెరిగిందని చూపించుకోవడానికి ఏకంగా అంతకుముందు వారిచ్చిన జీఎస్టీ గణాంకాలనే మార్చేసి అడ్డంగా దొరికిపోయారు. కిందటి సంవత్సరం మే నెలలో జీఎస్టీ గణాంకాలు విడుదల చేసినప్పుడు రాష్ట్ర స్థూల జీఎస్టీ ఆదాయం 2024 మేలో రూ.3,890 కోట్ల నుంచి 2025 మేలో 2.4 శాతం క్షీణించి రూ.3,803 కోట్లకు పడిపోయిందని ఎ.బాబు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.ఇప్పుడు ఈ విలువ మరింత తగ్గి రూ.3,717 కోట్లకు పడిపోవడంతో ఏకంగా గత రెండేళ్ల గణాంకాలను తగ్గించేసి.. ఈ ఏడాది పెరిగినట్లు చూపిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జీఎస్టీ ఆదాయం పెరిగిందని చూపించడం కోసం 2024 మే నెల ఆదాయాన్ని రూ.3,631 కోట్లకు, 2025 మే నెల ఆదాయాన్ని రూ.3,596 కోట్లకు తగ్గించేసి.. ఈ ఏడాది మే నెల జీఎస్టీ ఆదాయం రూ.3,717 కోట్లకు పెరిగిందంటూ ప్రకటన జారీ చేయడంతో వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులే అవాక్కయ్యారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కీలక అధికారే ఇలా తప్పుడు సమాచారం విడుదల చేయడాన్ని తప్పు పడుతున్నారు. -
‘యువగళం’ బ్యాచ్కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.లోకేశ్ యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్ ట్విట్టర్లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మెరిట్ లిస్టు మాయం ‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్ లిస్టు డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్లైన్ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి. -
జేఈఈ అడ్వాన్స్డ్లో తెలుగోళ్ల సత్తా
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10లో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండగా.. విశాఖకు చెందిన కూచి సందీప్ 318 మార్కులతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బి.జయకృష్ణ శ్రీనివాస్ 314 మార్కులతో 6వ, మేడిశెట్టి నాగసహర్ష 312 మార్కులతో 9వ స్థానం దక్కించుకున్నారు.ఆలిండియా టాపర్గా ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ (360కి గాను 330) ఘనత సాధించారు. మహిళల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన అరోహి దేశ్పాండే 280 మార్కులతో అగ్రస్థానం దక్కించుకున్నారు. తొలి 10 స్థానాల్లో అత్యధికంగా ఐదుగురు ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థులు ఉండటం విశేషం. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్కు చెందిన వారు ముగ్గురు, ఐఐటీ బాంబేకు చెందిన విద్యార్థులు ఇద్దరున్నారు. ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1,87,389 మంది నమోదు చేసుకోగా 1,79,694 మంది పరీక్ష రాశారు. ఇందులో 56,880 మంది అర్హత సాధించారు. వీరిలో పురుష అభ్యర్థులు 46,773 మంది, మహిళలు 10,107 మంది ఉన్నారు.టాప్–100లో ఐఐటీ మద్రాస్ విద్యార్థులే అధికంతెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ఓబీసీ–ఎన్సీఎల్–పీడబ్ల్యూడీ విభాగంలో ఐఐటీ మద్రాస్ జోన్కు చెందిన నానాల నాగచైతన్య, జనరల్ ఈడబ్ల్యూఎస్లో బి.జయకృష్ణ శ్రీనివాస్ టాపర్లుగా నిలిచారు. మద్రాస్ జోన్ నుంచి వెల్దుర్తి హర్షిత్ 15వ ర్యాంక్, భువనేశ్వర్ జోన్ నుంచి రెడ్డి సాయిసాహితి 230 ర్యాంక్ పొందారు. జోన్ల వారీగా చూస్తే ఐఐటీ మద్రాస్ నుంచి అత్యధికంగా 14,294 మంది అర్హత సాధించారు.ఆ తర్వాత ఐఐటీ బాంబే 12,389, ఐఐటీ ఢిల్లీ 10,697, ఐఐటీ రూర్కీ 5,637, ఐఐటీ కాన్పూర్ 5,552, ఐఐటీ భువనేశ్వర్ 5,428, ఐఐటీ గౌహతి 2,883 మంది ఉన్నారు. టాప్–100లో ఐఐటీ మద్రాస్ నుంచి 35 మంది, ఢిల్లీ 29, బాంబే 23, రూర్కీ నుంచి 9 మంది, కాన్పూర్ నుంచి ముగ్గురు, భువనేశ్వర్ నుంచి ఒకరు ఉన్నారు. టాప్–100లో 30 మంది వరకు తెలుగు విద్యార్థులు వివిధ జోన్లలో మంచి ర్యాంకులు సాధించారు. జోన్–2 నుంచి జోసా కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.చాలా కష్టపడ్డా..జేఈఈ పరీక్ష కోసం చాలా కష్టపడ్డాను. నా తల్లిదండ్రులు మేడిశెట్టి అప్పారావు, రాజేశ్వరి, హైదరాబాద్ మాదాపూర్ చైతన్య క్యాంపస్ యాజమాన్యం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. జాతీయస్థాయిలో టాప్ టెన్లో ఉంటానని ఊహించాను. నా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈలో సీటు సాధించడమే ప్రస్తుతం నా లక్ష్యం. నాకు వచ్చిన ర్యాంక్తో సాధిస్తానని నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో మరింత ఉన్నతంగా రాణించి దేశానికి ఉపయోగపడే రీతిలో నా వంతు సేవలు అందించాలన్నదే నా కోరిక.– మేడిశెట్టి నాగ సహర్ష, జేఈఈ 9వ ర్యాంకర్, పెందుర్తి -
అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, శాప్ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్’ యాప్లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సీఎస్ అజయ్జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్గా ఉండదట!మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. శాప్లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.శాప్.. పూటకో మాట!డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్ సర్వర్ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్బాల్ నేషనల్ మీట్లో పాల్గొని తన టీమ్ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్మైండ్’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్బాల్ నేషనల్ మీట్లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.దీనిపై సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్ బెంచ్ను ఆశ్రయించగా శాప్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ చెబుతున్నట్లుగా శాప్ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొలుత సదరు సాఫ్ట్బాల్ క్రీడాకారుడి సర్టిఫికెట్ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ సర్వీసు రూల్స్కు ముందు జీవో సవరణ?కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ను మళ్లీ సవరిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్ సీఎస్ అజయ్జైన్ ఉత్తర్వులు ఇవ్వడం!నేషనల్ గేమ్స్కు ప్రాధాన్యమా?క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్మైండ్’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్ నేషనల్స్కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్ గేమ్స్ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్మైండ్ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.పోస్టల్ శాఖలో రిజెక్ట్.. డీఎస్సీలో పోస్టింగ్మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్ గేమ్స్లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్ ఆఫ్ బర్త్తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్వీఆర్ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్ ఆఫ్ బర్త్లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.తొలుత 10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్ ఏజ్లో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్ గేమ్స్లో పాల్గొని పతకం సాధించింది.డీఎస్సీ నోటిఫికేషన్కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ‘పోస్టల్ అసిస్టెంట్’ (రిజిస్టర్ నం, ఎస్పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ గేమ్స్లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘డీఎస్సీ డీల్స్’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది. 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక -
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా, వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో పోస్టర్, బుక్ లెట్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తన ప్రసంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లురెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేశారు. ఓవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. మా పాలనలో ఐదేళ్లలో చేసిన అప్పును ఇప్పుడు రెండేళ్లలోనే చేసేశారు. అప్పట్లో రెండేళ్ల పాటు కోవిడ్లో ఆదాయం రాలేదు, ఖర్చు పెరిగింది. తానిచ్చిన మోసపూరిత హామీల్ని పక్కన పెట్టేయడమే కాకుండా, అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న తరుణంలో దీనిపై ప్రజల్లో చర్చ జరగాలంటే, ఈ రెండేళ్లలో జరిగే ఘోరం తెలియాలంటే ఓ ఉపన్యాసం, ప్రెస్ మీట్ తో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.ఈ మోసపూరిత పాలనలో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసిన నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా, మేథావులు, ఆలోచనాపరులు, వివేచనా పరులు తమ చుట్టూ ఉండే వారికి చెప్పే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పోస్టర్ కార్యక్రమం విడుదల కార్యక్రమం ఇక్కడ చేశాం, రేపు జిల్లా కేంద్రాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది.ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నిరసన కార్యక్రమాలుప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్తో ఫోన్లలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజల వైపు నుంచి సూచనలు, సలహాలు ఉన్నా స్వీకరిస్తాం. ఈ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకుని, మీ చుట్టు పక్కల ఉండే వారితో చర్చించాలని కోరుతున్నాం.రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ 2019-24 మధ్య ఇచ్చిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనను సైతం గుర్తుచేసుకునే విధంగా, ప్రస్తుత పాలనతో పోల్చుకునే విధంగా 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో మీటింగ్స్ నిర్వహించబోతున్నాం. అలాగే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ పేపర్లను కూడళ్లలో తగులబెట్టే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది. ఈ నిరసనలకు సంక్షేమ పథకాలు రాని బాధితులు కూడా తరలిరావాలి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఏదో విధంగా కొంత మొత్తం ప్రజల ఖాతాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశారు.ఇప్పుడు అదంతా సున్నా అయిపోయింది. డ్వాక్రా మహిళలు పూర్తిగా రోడ్డున పడ్డారు. 18 శాతం పైగా ఉన్న వీరి నిరర్ధక ఆస్తుల్ని వైఎస్ జగన్ హయాంలో 4 శాతానికి తగ్గించాం. డ్వాక్రా మహిళలు మా హయాంలో కోటికి పెరిగారు. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి సాయం చేశాయి. వైఎస్ జగన్ పాలన చివరి ఏడాదిలో 49 వేల కోట్లుగా ఉన్న డ్వాక్రా మహిళల రుణం కాస్తా ఇప్పుడు 30 వేల కోట్లకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వ సాయం తగ్గిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం మా మాటలు కాదు, క్షేత్రస్దాయిలో అనుభవిస్తున్న వారి మాటలే.నిరసనల్లో ప్రజలు, మేథావులు భారీగా పాల్గొనాలిచంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. మాయల మరాఠీ రోజూ అదే చెప్తుంటే ప్రజలు కూడా నమ్మక ఏం చేస్తారు ? ఈ లోగా వైఎస్సార్సీపీ మీద, పార్టీ అధినేత గురించి మాట్లాడకుండా వారిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఏది కాదో అదే అని చూపించే ప్రయత్నం పచ్చమీడియాలో చేస్తున్నారు.మెగా డీఎస్సీ పేరు మీద నెల రోజులుగా సాక్ష్యాలతో సహా బయటపెడున్నా వారి మీడియాలో ఎక్కడా కనబడదు. మహా ఉంటే అధికారుల సాయంతో దబాయింపు చేస్తున్నారు. తాడు లాగే పోటీతో, బ్రిడ్జి గేమ్స్ తో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చని వీళ్లు నిరూపించారు. సెలెక్షన్ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చేశామని అధికారులతోనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు సుపుత్రుడు విద్యామంత్రి మాత్రం దీనిపై ఉలకడు, పలకడు. మేం ప్రశ్నిస్తుంటే ఇసుక, బైజూస్ అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోటీ 47 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాక వారు రేపైనా తీర్పు ఇచ్చారు. కానీ వారిని గందరగోళ పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. వైఎస్ జగన్ లక్ష్యం తాను ఉన్నా, మరొకరు వచ్చినా సంక్షేమం కొనసాగాల్సిందే. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు అప్పుల భారంలో ముంచి వెళ్లిపోతే, వైఎస్ జగన్ అలా వదిలేకుండా అప్పుల బాధ తీర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెస్తే దాన్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అందుకే వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే వైఎస్సార్సీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలని ప్రజలు, సంక్షేమ పథకాల బాధితులతో పాటు మేథావులు, ఆలోచనాపరులకు పిలుపునిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. -
కోస్తాలో ఎండ.. సీమలో వర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది విభిన్న వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం కోస్తా ప్రాంతంలో ఎండలు దంచికొట్టగా.. సీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మద్దిపాలెంలో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ సెగ మరోవైపు పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
రాజేషా.. సతీషా?
సాక్షి, అమరావతి: రాజ్యసభ సీట్ల భర్తీ టీడీపీలో రసకందాయంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సానా సతీష్ బాబుకు మళ్లీ అవకాశం దక్కుతుందా లేదా అనే విషయం కూటమిలో హాట్టాపిక్గా మారింది. ఆయనకు ఏడాది క్రితమే ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగుస్తుండడంతో రెన్యువల్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సానాను పక్కనపెట్టి లోకేశ్ వ్యవహారాలను చక్కబెట్టే కిలారు రాజేష్ కి అవకాశం ఇస్తారనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఎలాగైనా సరే ఈసారి రాజేష్కి ఎంపీ పదవి ఇప్పించుకోవాలని లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తేవడంతో చేసేది లేక అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజేష్ కి అవకాశం ఇచ్చి సానా సతీష్ ని పక్కనపెట్టాలనే యోచనలో చంద్రబాబు, లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సానా సతీష్ , రాజేష్ ఇద్దరూ లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తులు. అయితే పార్టీతో సంబంధం లేని లాబీయిస్ట్ సానా సతీష్ ఎంపీ కావటాన్ని టీడీపీ సీనియర్లు, ఎల్లో మీడియాకి చెందిన ముఖ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు కొన్ని ఆర్టీక, రాజకీయ వ్యవహారాల్లో కూడా తేడా రావడంతో సానా కంటే తన సొంత మనిషి రాజేషే బెటర్ అని లోకేశ్ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి రాజేష్ ని రాజ్యసభకు పంపాల్సిందేనని నిర్ణయించినట్లు సమాచారం. కుదిరితే సానాను కూడా కొనసాగించాలని భావిస్తున్నా ఆయన కోసం అంతగా పట్టుబట్టడంలేదు. వారిద్దరిలో ఒకరికే అవకాశం ఇద్దామని చంద్రబాబు చెబుతుండడంతో రాజేష్ వైపే లోకేశ్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు సానా సతీష్ ఎలాగైనా సరే ఎంపీ స్థానాన్ని రెన్యువల్ చేయించుకోవడం కోసం భారీ లాబీయింగ్ చేస్తున్నారు. తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి లోకేశ్, చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాజేషా.. సతీషా? అనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. మూడు సీట్లకు టీడీపీ వ్యూహం..! ఈదఫా ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి మూడు స్థానాలు కావాల్సిందేనని బీజేపీకి సంకేతాలు పంపుతున్నారు. అవసరమైతే జనసేనను పక్కన పెట్టయినా మూడో స్థానాన్ని చేజిక్కించుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా టీడీపీ నేతలు చెబుతున్నారు. రేసులో మరి కొందరు..పెద్దల సభకు వెళ్లేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని భాష్యం విద్యా సంస్థలకు చెందిన రామకృష్ణ, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య తదితరులు అధినేతను కోరుతున్నారు. భాష్యం రామకృష్ణ గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించడంతోపాటు చురుగ్గా పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆయన రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తూ ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీకంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చంద్రబాబు కూడా ఆయన పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.ఇక గత ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ తప్పిదం చేశానని భావిస్తున్న గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభ స్థానం కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సైతం తన రాజ్యసభ కల నెరవేర్చాలని చంద్రబాబును కోరుతున్నారు. వర్ల రామయ్య కూడా తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక మహిళకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నట్లు తెలిసింది. ఆ స్థాయి అర్థబలం ఉన్న మహిళా నేతలు ఎవరున్నారా? అనే అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. -
బైజూస్ పేరుతో పచ్చ పైత్యం!
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేక ఎల్లో మీడియా ద్వారా గత ప్రభుత్వ పాలనపై విషం కక్కుతోంది. ఈ క్రమంలో పేదింటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన ట్యాబ్ల పంపిణీని తీవ్రంగా తప్పుపట్టింది. పేదింటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బైజూస్ కంటెంట్పై ఏడుపుగొట్టు రాతలు రాస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సాంకేతిక పరికరాలను రూపొందించే శాంసంగ్ సంస్థ ట్యాబ్లలో ఉచితంగా బైజూస్ కంటెంట్ను అందిచడాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోంది.వాస్తవానికి శాంసంగ్ సంస్థ 8.7 అంగుళాల స్క్రీన్తో ట్యాబ్లను రూపొందిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో తయారు చేస్తోంది. అలాంటి పేరెన్నిక కలిగిన ట్యాబ్లను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. పైగా అందులో అత్యంత ఖరీదైన గ్లోబల్ కంటెంట్ను (బైజూస్) నిక్షిప్తం చేసి మరీ అందించింది. ఇంతటి విప్లవాత్మక చర్య విద్యా వ్యవస్థలో ఎన్నడూ జరగలేదు. దీన్ని ఓర్వలేని చంద్రబాబు అండ్ కో గతంలోనూ పిల్లలు ట్యాబ్ వాడి చెడిపోతున్నారంటూ తప్పులు రాతలు రాయించి పేదింటి విద్యార్థులను తీవ్రంగా అవమానించింది. ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు మరోసారి అక్కసు వెళ్లగక్కింది. 9 అంగుళాల స్కీన్ర్ పెడితే?చంద్రబాబు ఎల్లో మీడియా 8.7 అంగుళాక స్క్రీన్ నిబంధన కేవలం ఒక కంపెనీకే లబ్ధి చేకూర్చేందుకు పెట్టారని వింత వాదన తెరపైకి తెచ్చింది. అదే, 9 అంగుళాలు స్క్రీన్ పెట్టినా ఇలాంటి తప్పుడు వాదనే వినిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు అండ్కోకు పేదింటి బిడ్డలు ఉన్నత ప్రమాణాలతో విద్యను నేర్చుకోవడం నచ్చదు. పేదలు అక్షర జ్ఞానానికి చేరువ అవుతున్న ప్రతిసారీ ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అంటూ పుక్కిట ఉపన్యాసాలు గుప్పించి వ్యవస్థలను కలుషితం చేసింది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమంపైనా బురదజల్లింది.అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్ల పంపిణీని ఎత్తేసింది. రెండో ఏడాదికే విద్యార్థి కిట్లు (సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర) పంపిణీ చేయలేమంటూ ఎక్కడో జరుగుతున్న యుద్ధంపైకి నెపాన్ని నెట్టేసి తప్పించుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై నిరుద్యోగ యువత రగలిపోతుంటే కనీసం స్పందించని చంద్రబాబు, ఎల్లో మీడియా.. ఉన్నట్లుండి బైజూస్కు దోచిపెట్టారంటూ అడ్డగోలు కథనం అచ్చేయడం విస్తుగొలుపుతోంది. -
చంద్రబాబు.. ఓ గోబెల్స్ బాస్
సాక్షి,అమరావతి: ‘చంద్రబాబే ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు. ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు’ అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ పేరిట తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే. దగా, మోసం, వెన్నుపోటుకు పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుంది’ అని స్పష్టం చేశారు. ‘ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసి.. మహిళలకు పెద్దపీట వేశానని, 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నారు. చీకటి సామ్రాజ్యాధినేత ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారు. లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. అలాంటి వ్యక్తిని రాజకీయంగా నాశనం చేయగలిగే శక్తి వైఎస్ జగన్కే ఉంది. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ జగనే’ అని స్పష్టం చేశారు. చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం మహిళలకే ఉంది ‘రెండేళ్లపాటు సాగిన వ్యవస్థీకృత అరాచక పాలనను ఎత్తిచూపుతూ, రెండేళ్లకు ముందు సాగిన దేశంలోనే ఆదర్శమైన పాలనను గుర్తుచేసుకుంటూ.. ప్రజలకు గుర్తుచేస్తూ పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది, దోపిడీకి గురైంది మహిళలే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం వారికే ఉంది. ఏ పాలనకైనా మహిళలకు పెద్దపీట వేయడమే గీటురాయి. జగన్ ఐదేళ్ల పాలన అలాగే సాగింది. చెప్పినవన్నీ చేసేశానని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం దోపిడీ, దగా, మోసానికి పరాకాష్ట. సౌత్, నార్త్లో జనాభా తేడాలకూ, పిల్లల్ని కనడానికి సంబంధం ఏంటి? ఉచిత విద్య, వైద్యం పీకేసి, ఇప్పుడు పిల్లల్ని కంటే వారికి అవన్నీ ఎవరు అందిస్తారు? నెలకు రూ.15 వేలు ఏమైందో తెలియదు, ఆడబిడ్డ నిధి ఏమైందో కూడా తెలియదు.వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు మహిళలు రూ.1.70 లక్షల కోట్లకు పైగా డ్వాక్రా రుణాలు తీసుకున్నారు. ఇది దేశంలోనే రికార్డు. గతేడాది అది రూ.40 వేల కోట్లకు, ఈ ఏడాది రూ.30 వేల కోట్లకు తగ్గిపోయింది. ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను మహిళలకు గుర్తుచేయాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించి వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి.తద్వారా హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. ఎంపీ తనూజరాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు సత్యవతి, అనూరాధ, పార్టీ అధికార ప్రతినిధులు నందమూరి లక్ష్మీపార్వతి, ఆరె శ్యామల, మాజీ మంత్రి విడదల రజని, మహిళా నాయకులు సుభద్ర, ఉప్పాల హారిక, రాయన భాగ్యలక్షి్మ, కాకాణి పూజిత, నూరి ఫాతిమా ప్రసంగించారు. -
జీవో ఒకలా.. అమలు ఇంకోలా!
సాక్షి, అమరావతి: హారిజాంటల్ రిజర్వేషన్ అమలు ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకుంటూ మెగా డీఎస్సీ–2025పై ఆరోపణలు చేస్తున్నారని పాఠశాల విద్యా శాఖ బుకాయిస్తోంది. డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు అవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదోలా ఈ స్కామ్ నుంచి బయట పడాలని విద్యా శాఖ ద్వారా పొంతనలేని రీతిలో సమాధానాలిప్పిస్తోంది. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తప్పు జరగలేదంటూనే పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షి దినపత్రికలో ‘తప్పుపై తప్పు.. స్పోర్ట్సు డీఎస్సీపై మాకు తెలియదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వివరణ ఇస్తూ విద్యా శాఖ డైరెక్టర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు జారీ చేసినప్పటికీ, వెరిఫికేషన్కు హాజరైన పలువురు అభ్యర్థులకు తుది ఎంపిక జాబితాలో చోటు దక్కలేదన్న ఆరోపణ సరికాదు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చింది.అర్హత, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించే ఉద్దేశంతో, నోటిఫై చేసిన ఖాళీల సంఖ్యకు అనుగుణంగా ఆయా వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ వర్గాల పరిధిలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్లు జారీ చేశాం. ఆ తర్వాత తుది ఎంపిక జాబితాలను సిద్ధం చేసే సమయంలో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు వర్తించే హారిజాంటల్ రిజర్వేషన్ సర్దుబాట్లను జీవో ఎంఎస్ నం.77 ప్రకారం వర్తింపజేశాం. ఇది అర్థం చేసుకోలేక సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరైన వారిలో కొందరు తమకు ఉద్యోగాలు రాలేదంటున్నారు’ అని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తి అంటే అర్థమేంటి మరి?జీవో77 ప్రకారం 1:1 జాబితా ఎప్పుడు తయారవుతుందంటే హారిజాంటల్ రిజర్వేషన్లను (మహిళలు, వికలాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులు) మొదట మార్కుల మెరిట్ ఆధారంగా ఓసీ, తర్వాత సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్) వారీగా జాబితాలను సిద్ధం చేయాలి. ఆ తర్వాతే మహిళలు, ఇతర హారిజాంటల్ కోటాలో లోటును తనిఖీ చేసి, అవసరమైతే జాబితా చివరన ఉన్న అభ్యర్థులను తొలగించి, నిర్దేశిత ప్రత్యేక వర్గాల అభ్యర్థులను చేర్చి ‘తాత్కాలిక ఎంపిక జాబితా’ ఖరారు చేయాలి.ఇలా హారిజాంటల్ రిజర్వేషన్లు అప్లై చేసి పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసిన తర్వాతే, కచ్చితంగా ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం ఉన్న వారితోనే 1:1 (ఒక పోస్టుకు ఒకరు) జాబితాను ప్రకటించాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక జాబితా (1:1) సిద్ధం చేయాలి. అందులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేయడానికి కాల్ లెటర్లు పంపాలి.సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యాక, ఎటువంటి లోపాలు లేని వారితో తుది జాబితాను ప్రకటించాలి. మెగా డీఎస్సీ–2025లో ఇలా చేయకుండా కొందరు అభ్యర్థులకు అన్యాయం చేయడం వాస్తవమని బాధిత మెరిట్ అభ్యర్థులు వాపోతున్నారు. దీన్ని ఒప్పుకోకుండా అధికారులు వింత వాదనను వినిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్నంత మాత్రాన పోస్టు ఎంపికకు గ్యారంటీ లేదని ముందే పేర్కొన్నామంటూ ‘కండీషన్స్ అప్లై’ అన్న రీతిలో చెప్పడం కొసమెరుపు. -
దొంగ ఎత్తులు.. నక్కజిత్తులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరు దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. నక్కజిత్తులతో ప్రజలను మాయ చేయాలని చూస్తోంది. ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటిలాగే తప్పుడు ప్రచారానికి దిగింది. తానే ఇసుక దందా నడుపుతూ గతంలో అక్రమాలు జరిగాయని విష ప్రచారం చేస్తోంది. ఇందుకు ‘ఈనాడు’ తందానా అంటోంది. ఈ క్రమంలో జగన్ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానికి భారీగా జరిమానాలు విధిస్తున్నారంటూ అడ్డగోలు కథనం అచ్చేసింది. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం సాగాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటి వెనుక కూత వేటు దూరంలోనే ఇసుక మాఫియా కృష్ణా నదిని కొల్లగొట్టడంపై 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పారదర్శక ఇసుక విధానం అమలైంది. 2019 వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి, ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా, ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. బాబు రాగానే అక్రమాలు మొదలు2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే.. జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై టీడీపీ నేతల కన్ను పడింది. నేతలు ఎక్కడికక్కడ ఆ ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. సగానికి పైగా ఇసుక అమ్మేసుకున్నాక.. యార్డుల్లో పెద్దగా నిల్వలు లేవంటూ మిగిలిన కొద్దిపాటి ఇసుకను ప్రజలకు విక్రయించారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లు, డీ సిల్టింగ్ పాయింట్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం యథేచ్ఛగా⇒ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉచితం ముసుగులో ఇసుక అక్రమాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి, అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.⇒ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా.. అనుమతి లేని రీచ్లలో ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సివుండగా, ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుకను రూ.30-60 వేల వరకు అమ్ముతున్నారు.⇒ ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. చినబాబుకు ఆ మేరకు కమీషన్లు ఠంచనుగా చేరిపోతున్నాయి.⇒ చినబాబుకు కప్పం చెల్లిస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు.. నదులు, వాగులను కొల్లగొడుతూ వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను దాచి పెట్టేందుకు గతంలో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలకు జరిమా నాలు విధిస్తున్నారని ఎల్లోమీడియా అండతో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. -
అంతర్ జిల్లా క్రీడా సర్టిఫికెట్తో టీచర్ పోస్టా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్రీడా కోటాలో రాత పరీక్ష అవసరం లేకుండా భర్తీ చేసిన టీచర్ పోస్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అత్యంత దారుణంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా) క్రీడా పోటీల సర్టీ ఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేయడం విస్తుగొల్పుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి చూపించి కేవలం ఒక జిల్లాకు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన వారి సర్టీ ఫికెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరగా నిలుస్తోంది. ‘ముఖ్య’నేత బంధువు, మాస్టర్ మైండ్ అవినీతి వ్యూహంలో భాగంగానే పోస్టుల భర్తీలో ప్రాధాన్యతలు మారిపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. మెరిట్ జాబితా ఎక్కడ? క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టుల్లో 97 శాతం భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్ జాబితాను ప్రదర్శించలేదు. తొలుత టెంటేటివ్ (తాత్కాలిక) జాబితాను పెట్టిన శాప్ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వెంటనే తొలగించింది. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేసింది. విచిత్రం ఏమిటంటే.. తాత్కాలిక జాబితాలో ఉన్న చాలా మంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం.అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్ డొమైన్లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. అయితే శాప్ వెబ్సైట్ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదు. శాప్కు వచి్చన దరఖాస్తులను తొలుత స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపగా సమీక్షించి తుది జాబితాను ఆమోదించింది. ఇదంతా లోపాయికారిగా చేయడంలో మాస్టర్మైండ్ కీలక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది! బ్యాక్గ్రౌండ్ జల్లెడ పడుతున్న అభ్యర్థులు.. క్రీడా కోటా డీఎస్సీలో అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ‘మాస్టర్మైండ్’ ఉద్యోగాలు పొందిన కొందరు ఉపాధ్యాయులను రంగంలోకి దించి వీడియోలతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు చేసిన యత్నం బెడిసికొడుతోంది. వారి బ్యాక్ గ్రౌండ్ను నిరుద్యోగ అభ్యర్థులు జల్లెడ పడుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం దక్కని క్రీడాకారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో వీడియోలు చేస్తే తమ గుట్టు రట్టవుతుందని ఫేక్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ గురించి చిన్న పేపర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ తమపై మాస్టర్మైండ్ విరుచుకుపడటాన్ని శాప్ వర్గాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. మూటలు దోచుకుని తమపై చిందులేయడం ఏమిటని చర్చించుకుంటున్నాయి. సర్టీ ఫికెట్ల పరిశీలన ఏది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ క్రీడాకారిణి ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించారు. ఆమెకు డిగ్రీ సర్టీ ఫికెట్ లేకున్నా స్పోర్ట్స్ కోటా డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. తొలుత జిల్లా జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఆమె తర్వాత టాప్లోకి వచ్చేసింది. పొరుగు రాష్ట్రంలో డిగ్రీ చదివినట్లు ఓ ఫేక్ సర్టీ ఫికెట్ను సృష్టించి పోస్టు అమ్మేశారు. అదే శాప్.. క్రీడా సర్టీ ఫికెట్తోపాటు అభ్యర్థి డిగ్రీ సర్టీ ఫికెట్ నిజమైనదేనా? అని పరిశీలించి ఉంటే అక్రమాలు జరిగేవి కావని అవకాశం కోల్పోయిన అర్హులైన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీపీఈడీ, బీఈడీలు చేసినట్లు బోగస్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగాలిచ్చారని, ఒక్క అభ్యర్థి విషయంలో కూడా శాప్ ఆయా వర్సిటీలకు వివరాలను పంపించి వాస్తవాన్ని ధ్రువీకరించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సర్టీ ఫికెట్లే కాదు.. దొంగ డిగ్రీలతోనూ టీచర్ ఉద్యోగాలు అమ్మేయడం ‘మాస్టర్మైండ్’ స్కెచ్కు నిదర్శనమని పేర్కొంటున్నారు.సర్టిఫికెట్కు రూ.5 లక్షలు.. పోస్టుకు రూ.15–20 లక్షలు!క్రీడా కోటా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి టీచర్ ఉద్యోగాలను అంగట్లో సరుకుల మాదిరిగా అమ్మేశారని తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.5 లక్షలకు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లను విక్రయించడంతో పాటు పోస్టుకు రూ.15–20 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇలా మూడొంతులు పోస్టులు అమ్ముకుని రూ.40–50 కోట్లు వసూలు చేసినట్లు క్రీడాకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే ఎక్కడా తుది మెరిట్ లిస్టును ప్రదర్శించ లేదని.. దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టు, మాస్టర్మైండ్ బండారం బయటపడుతుందనే భయంతోనే దాన్ని దాచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం!
సాక్షి, అమరావతి: పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డీఎస్సీ–2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు. మెరిట్.. వెర్టికల్.. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధివిధానాలను అత్యంత జాగరూకతతో రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డీఎస్సీ 2025లో ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం.. తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడుపుఠాణి బోధపడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘నేను 25 ఏళ్లుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నా. ఎన్నో డీఎస్సీలు నిర్వహించినా ఈ తరహా ప్రక్రియ ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి..’ అని విద్యాశాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం మెగా డీఎస్సీ నిర్వహణలో లొసుగులకు అద్దం పడుతోంది. అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడి రిజెక్ట్..! ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాల్లో హాల్టికెట్ నంబర్ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు..? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు..? ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్ అభ్యర్థి ఎవరు..? అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు. లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డీఎస్సీ–2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినా మెరిట్ కమ్ రిజర్వేషన్ (వర్టికల్/హారిజాంటాల్) ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్ లెటర్లు వెళతాయి. అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డీఎస్సీ 2025 కాల్ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డీఎస్సీ అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదేం రిజర్వేషన్ లెక్కో? 1:1 నిష్పత్తి ప్రకారం జోన్ ఆఫ్ కన్సిరడేషన్, పోస్ట్ పరిధిలోకి వచ్చిన వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు మెరిట్ ద్వారా, 3 పోస్టులు హారిజాంటాల్ ద్వారా (ఉమెన్/ స్పోర్ట్సు/ఎక్స్ సర్వీస్మెన్/ పీడబ్లు్యడీ (ప్రత్యేక అవసరాలు) భర్తీ చేయాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఏకాంబరం (బీసీ–డీ) వివరాలను ఉదహరించారు. చిత్తూరు జిల్లాలో బీసీ–డీ కేటగిరిలో 7 పోస్టులు ఉండగా ఒకటి హారిజాంటాల్లో ఉమెన్కు కేటాయిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియలో 5 పోస్టులను మెరిట్ ప్రకారం, 2 పోస్టులను హారిజాంటల్లో భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. మెరిట్లో చివరి ర్యాంకర్ 114కి ఇచ్చామని (వాస్తవానికి 114వ ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినా బీసీ–డీలో చూపించారు), కానీ ఏకాంబరం ర్యాంకు 125 కాబట్టి అతడికి పోస్టు వచ్చే అవకాశం లేదని చెప్పారు. మెరిట్లో ఉమెన్ లేకపోతే హారిజాంటాల్ ప్రకారం కింద ర్యాంకు ఎంత ఉన్నా పైకి తెచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు. అర్హత ఉన్నా ఏకాంబరానికి అన్యాయం! వాస్తవానికి మెరిట్లో భర్తీ చేసిన ఐదు పోస్టుల్లో చివరి అభ్యర్థి ఉమెన్. ఆమె ఓవరాల్ ర్యాంకు 116. దీంతో హారిజాంటల్ పోస్టు భర్తీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు పోస్టులను మెరిట్లో భర్తీ చేయాలి. 116వ ర్యాంకు అభ్యర్థి తర్వాత... ఆరో స్థానంతో 125వ ర్యాంకు సాధించిన ఎం.ఏకాంబరం ఉన్నారు. అతడికి ఒక పోస్టు ఇస్తే, మరో పోస్టును 133వ ర్యాంకులో ఉన్న మరో అభ్యర్థికి (బీసీ–డీలో 7వ ర్యాంకు) ఇవ్వాలి. కానీ చివరి రెండు పోస్టులను పీహెచ్ అభ్యర్థులతో నింపారు. వాస్తవానికి జిల్లాలో ఎస్ఏ సోషల్కు 113 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్ని కేటగిరీల (బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓసీ) అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లో చూపించారు. అయితే స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్లు్యడీ వారికి వర్టికల్ రిజర్వేషన్లో కాకుండా హారిజాంటల్లో చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎవరిని భర్తీ చేస్తారో నోటిఫికేషన్లో చెప్పకుండా బీసీ–డీ కేటగిరీలోని రెండు పోస్టులను పీడబ్లు్యడీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం అన్ని పోస్టులోనూ హారిజాంటల్లో పీడబ్లు్యడీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు కేటాయిస్తే.. వాటిలో రెండు బీసీ–డీలోనే భర్తీ చేయడంతో ఆ వర్గంలో మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో అర్హుడైనప్పటికీ ఏకాంబరం పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. డిలీట్.. అప్లోడ్.. డిలీట్! వెబ్సైట్లో డీఎస్సీ జాబితాపై దాగుడుమూతలు మెగా డీఎస్సీ 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డీఎస్సీ ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచి పెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు.. తాజాగా డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించడం కొసమెరుపు. డీఎస్సీలో అక్రమాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. డీఎస్సీ డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు. -
బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్-చిరాగ్లకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి : బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేఎఫ్ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో వారు టైటిల్ గెలుచుకోవటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘వీరి గెలుపు ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే గర్వకారణం. భవిష్యత్తులో వీరిద్దరూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఆకాంక్షించారు Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on winning the KFF Singapore Badminton Open 2026 Men’s Doubles title. Proud moment for India and Andhra Pradesh. Wishing them both many more achievements and continued success ahead.@BAI_Media@satwiksairaj… pic.twitter.com/xG3LlcCxM0— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2026 -
కేసులకు, బెదిరింపులకు భయపడం : విడదల రజని
సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్ సిక్స్ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు. -
చంద్రబాబు, జగన్ మధ్య తేడా ఇదే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. మహానాడు సాక్షిగా చెప్పిన అబద్ధాలపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. సమావేశానికి వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్ జగన్ ఐదేళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు జగన్కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు. నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే రూ.30 వేలు నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్ జగన్.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు,లోకేష్,పవన్ను ఎక్కడ కనబడినా అడగాలి’’ అని సజ్జల పిలుపునిచ్చారు.అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం: వరుదు కల్యాణివరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలన అంతా మోసం దగా. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు చీటింగా మాస్టర్. మొన్న జరిగింది హైబ్రీడ్ మహానాడు కాదు లోగ్రేడ్ మహానాడు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మహానాడులో వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా?...టీడీపీకి, వైఎస్సార్సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీడీపీ, వైఎస్సార్సీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగువారి పౌరుషాన్ని జగన్ ఢిల్లీకి చూపించారు. తెలుగువారి ప్రయోజనాలను ఢిల్లీకి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్. హామీలను ఎగ్గొట్టిన మోసగాడు చంద్రబాబు. మా బ్రాండ్ సంక్షేమం.. మీ బ్రాండ్ సంక్షోభం. హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా మీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. జైల్లో ఖైదీలతో కుమ్మక్కైన మీకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయికి కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు. హోంమంత్రి అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి మీకు వివరిస్తాం -
తుక్కునీ తినేశారు!
తిరుపతి డిస్కంలో బయటపడిన ‘తుక్కు స్కాం’ ఇప్పుడు విద్యుత్ శాఖనే కుదిపేస్తోంది. కోట్ల రూపాయల విలువైన స్క్రాప్ మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లు మాయమైనా బాధ్యులపై చర్యలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విజిలెన్స్ విచారణలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలకు సహకారం స్పష్టంగా బయటపడినప్పటికీ, ఆ నివేదికను ఏడాది పాటు సంస్థలోని ఓ డైరెక్టర్ స్థాయి అధికారి మూలన పడేయడం దుమారం రేపుతోంది. తనిఖీలు చేయాల్సిన అధికారులు కళ్లుమూసుకోగా, అదే స్కాంలో పాత్రదారులైన వారికి వరుస పదోన్నతులు రావడం మరింత వివాదాస్పదమైంది. మరోవైపు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఈ స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు ఎదుర్కోకుండానే రిటైర్మెంట్తో సేఫ్ జోన్లోకి వెళ్లిపోవడం హాట్ టాఫిక్గా మారుతోంది. ఉమ్మడి చిత్తూరు జల్లా పరిధిలో పెద్ద ఎత్తున ‘తుక్కు దందా’ జరిగినట్టు స్పష్టమవుతోంది. ట్రాన్స్కోలో తుక్కు అవినీతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, టాస్్కఫోర్స్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో తుక్కు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. డిస్కం పరిధిలోని పలు ఎస్పీఎం (స్టోర్–ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ యూనిట్లు)ల్లో కోట్ల విలువైన స్క్రాప్ మెటీరియల్ మాయమైనట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. వినియోగంలో లేని పాత ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ సామగ్రి, కాపర్ కేబుల్స్, అల్యూమినియం, ఇనుప సామగ్రి తదితర వస్తువులు అధికారిక రికార్డుల్లో ఉన్నప్పటికీ, భౌతికంగా కనిపించకపోవడం స్కాంను బట్టయలు చేస్తోంది. ముఖ్యంగా పీలేరు, పలమనేరు, మదనపల్లి ఎస్పీఎంలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఎస్ఈల నిర్లక్ష్యమే కారణం ఎస్పీఎంలపై పర్యవేక్షణ బాధ్యత వహించే సూపరింటెండింగ్ ఇంజినీర్లు (ఎస్ఈలు) ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలి. అయితే ఆ తనిఖీలు సక్రమంగా జరగక పోవడం, ఒకరిద్దరు ఎస్ఈలు అక్కడ స్కాం జరుగుతున్నట్టు తెలిసినా తనిఖీలకు వెళ్లకపోవడం వల్లే కోట్ల రూపాయల స్కాంకు అవకాశం దొరికిందని విజిలెన్స్ తమ నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేగాక ఎస్పీఎంలలో తప్పు జరుగుతోందని డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు స్థాయి అధికారి తన పైఅధికారి అయిన ఎస్ఈకి రాత పూర్వకంగా సమాచారం పంపినా సదరు ఎస్ఈ సకాలంలో స్పందించలేదన్న విషయాన్ని కూడా విజిలెన్స్ అధికారులు తమ రిపోర్టులో తెలియజేసినట్టు సమాచారం. ఏడాదిగా మూలన పడ్డ విజిలెన్స్ రిపోర్ట్ తుక్కు స్కాంను బయటపెట్టిన విజిలెన్స్ రిపోర్టును ఎస్పీడీసీఎల్ అధికారులకు ఇచ్చినప్పటికీ సంస్థలోని ఓ కీలక డైరెక్టర్ ఏడాదిగా బయటకు రానివ్వలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది బయటకు వస్తే ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తప్పవన్న ఉద్దేశంతోనే తొక్కిపెట్టారన్న అనుమానాలు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. విజిలెన్స్ నివేదిక బయటకు రానందున తప్పునకు సహకరించిన ఆ ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకునే ప్రక్రియ నిలిచిపోయిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది.రిటైర్మెంట్తో సేఫ్ గేమ్ తుక్కు స్కాంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులు వరుస పదోన్నతులతో పాటు పదవీ విరమణ చేసి సేఫ్ జోన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదికను దాచిపెట్టి విచారణ ఆలస్యం చేయడం వల్లే వారు ఎలాంటి చర్యలు ఎదుర్కోకుండానే రిటైర్డ్‡ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్కాంలో సుమారుగా రూ.25 కోట్లు మేరకు సంస్థకు నష్టం వాటిల్లినా, బాధ్యులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం తుక్కు స్కాంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్క్రాప్ మెటీరియల్ మాయం ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది..? ఇందులో ఎవరి పాత్ర ఎంత..? విజిలెన్స్ నివేదికను ఎందుకు దాచిపెట్టారు..? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధ్యులైన వారి నుంచి సంస్థ ఆదాయానికి నష్టం కలిగిన రూ.25 కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.తప్పు చేసిన వారికే పదోన్నతులా?విజిలెన్స్ నివేదికలో పేర్లు వచ్చిన కొందరు అధికారులకు వరుసగా పదోన్నతులు లభించడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. స్క్రాప్ స్కాంకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొనే ఎస్ఈలకు ప్రమోషన్లు కల్పించి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవడం వెనుక సంస్థలోని ఓ డైరెక్టర్ అండదండలు ఉన్నాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కనబెట్టి, అక్రమాలకు సహకరించిన వారినే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విద్యుత్ ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది. -
సర్వే చేయడానికి మీరు ఎవర్రా..?
శెట్టూరు: మేము అధికార పార్టీ నాయకులం... పోలీసులు, అధికారులు ఎవరైనా లెక్కలేదు అన్నట్లు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరికి అద్దం పడుతున్న వ్యవహారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో తాజాగా చోటుచేసుకుంది. బచ్చేహళ్లిలో సర్వే నంబర్ 97–1లో వైఎస్సార్సీపీ నాయకురాలి కుటుంబానికి 97 సెంట్ల పొలం ఉంది. ఈ 97 సెంట్లలో కొంత భూమిని.. పక్కనే సర్వే నంబర్ 97–2లో కొంత భూమి ఉన్న టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు.ఆక్రమణ నుంచి వైదొలగవలసిందిగా ఎన్నిసార్లు చెప్పినా మల్లన్న వినకపోవడంతో తమ పొలానికి సర్వే చేయాలని వైఎస్సార్సీపీకి చెందిన మహిళా రైతు, బాధితురాలు భార్గవి తహసీల్దార్ కార్యాలయంతో పాటు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శనివారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల రక్షణతో పొలం సర్వే చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ నేత మల్లన్న, అతని కుటుంబ సభ్యులు అశ్వర్థమ్మ, తిప్పేస్వామి, కవిత, శివ.. పచ్చ కండువాలు కప్పుకుని మరీ అక్కడకు వచ్చారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు.సర్వే చేయడానికి మీరు ఎవర్రా..? అంటూ దాడికి దిగారు. దాడిలో సర్వేయర్ శ్రీ లక్ష్మి కింద పడిపోగా, మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి చేతికి బలమైన గాయమైంది. అటు శెట్టూరు ఎస్ఐ సుమన్, కంబదూరు ఎస్ఐ లోకేశ్పైనా దురుసుగా ప్రవర్తిస్తూ చొక్కాలు చిరిగిపోయేలా దాడి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ రెడ్డిపైనా దాడికి యత్నించగా.. వీఆర్ఏలు, సిబ్బంది అడ్డుకున్నారు. అయితే స్థానికులు, పాత్రికేయులు జరిగిన సంఘటనను తమ సెల్ఫోన్లలో రికార్డు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని వీడియోలు, ఆడియోలను తొలగించడం గమనార్హం. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులపై దాడి హేయం ఇలా దాడి చేయడం హేయం. మాకు పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీ మేరకు శనివారం పొలం సర్వే చేయడానికి వెళ్లగా..మమ్మల్ని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలా ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడంతో భయాందోళనకు గురయ్యాం. – అనిల్ కుమార్ రెడ్డి, శెట్టూరు డిప్యూటీ తహసీల్దార్ -
మోత మోగిపోద్ది.. ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా రూ.300 కోట్ల అదనపు భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) ఈ మేరకు ప్రతిపాదనల్ని సమర్పించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో చార్జీల పెంపుపై రెండు ప్రతిపాదనలను సమర్పించింది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు అదనపు నిధులు కేటాయించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. చార్జీలు పెంచుకోవాలని సూచించడంతో ప్రయాణికులపై ఆర్థికభారం అనివార్యం కానుంది. నిధులివ్వలేం.. చార్జీలు బాదేయండిఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు ఏటా రూ.220 కోట్లు మంజూరు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ ప్రతినెలా కోల్పోతున్న రాబడికి ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. కానీ.. ఇతర నిర్వహణ వ్యయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించే పన్నాగంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా రూ.220 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. కానీ.. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆర్టీసీకి ఏమాత్రం నిధులు కేటాయించలేమని తేల్చి చెప్పింది. చార్జీలు పెంచుకుని నష్టాలను పూడ్చుకోవాలని సూచించింది. దాంతో చార్జీల పెంపుదలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.ఏటా రూ.300 కోట్ల బాదుడేప్రయాణికుల నుంచి చార్జీల ద్వారా ఏటా రూ.300 కోట్లు అదనపు రాబడి సాధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీల రూపంలో ఏటా రూ.6,551.69 కోట్ల రాబడి వస్తోంది. కాగా నిర్వహణ వ్యయం పెరుగుదలను సాకుగా చూపిస్తూ చార్జీల పెంపునకు రెండు ప్రతిపాదనలను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.ప్రతిపాదన 1: – కిలోమీటరుకు 4.15 పైసలు చొప్పున పెంచుతారు. ఆ ప్రకారం కిలోమీటరుకు ప్రస్తుతం సగటు ప్రాథమిక చార్జీ 124.85 పైసలుగా ఉంది. ఆ చార్జీని 129 పైసలకు పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.217.64కోట్ల అదనపు భారం పడుతుంది.ప్రతిపాదన 2: ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల అదనపు రాబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రెండో ప్రతిపాదనను సమర్పించింది. ఆ ప్రకారం చార్జీలు కిలోమీటరుకు 5.72 పైసల చొప్పున పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే చార్జీల మోత మోగనుంది. -
నేడు పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వివరించారు. దీని ప్రభావంతో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యధికంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో 51 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కడప జిల్లా పెద్దపసుపల్లెలో 45, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లెలో 31.5, కడప జిల్లా ఉప్పలూరులో 29, తొర్రివేముల 26, పొత్తిపాడులో 26, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆదివారం 17 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. -
తప్పుపై తప్పు.. స్పోర్ట్స్ డీఎస్సీ మాకు తెలీదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కథలు చెబుతూ తప్పుపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చేసిన స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం ఎనిమిది రోజుల తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. శనివారం విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి, తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి.. అందులోనూ అడ్డంగా బుక్కయింది. శనివారం సాయంత్రం విద్యాభవన్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతన లేని జవాబులిస్తూ.. కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డీఎస్సీ గురించి తనకు తెలియదని చెప్పడం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ–2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ, రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ర్యాంకుపై పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే, స్పోర్ట్సు కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన తప్పులపై తనకు తెలియదని, అది తన పరిధికాదన్నట్టు జవాబు దాటవేశారు. నవీన్ విషయంలో 3 సమాధానాలుమీడియా: మెగా డీఎస్సీలో ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరక్కుంటే ఇలా ఎందుకు చేశారు. అసలు ఆయనకు టాప్ ర్యాంకు ఎలా వచ్చింది?కార్యదర్శి: శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా పరీక్ష రాయాలన్నా, కోర్సులు చదవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. నవీన్ ముందస్తు అనుమతి తీసుకోలేదు. అందుకే అతడి పోస్టును నిలిపివేశాం. నవీన్ రెండు పరీక్షలు రాశారు. పరీక్ష రాసేంత వరకు ఇక్కడ పనిచేశాడు. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతన్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. నవీన్ కోర్టుకు వెళ్లాడు. కోర్టుల్లో మా వాదనలు వినిపించాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాకపోవడంతో అతని పోస్టు పక్కన పెట్టాం. వాస్తవం: నవీన్ రెండు పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డీఎస్సీ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యదర్శి: గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1ః1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్కు పిలిచాం. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్కు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం పేపర్లలో వస్తున్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. వాస్తవం: 1:1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే.. కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగం రావాలి. సర్టిఫికెట్లు సరిగా లేకపోతే వారిని రిజెక్ట్ చేసి, రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటాల్ రిజర్వేషన్లో ఉన్నవారే. అలాంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. స్పోర్ట్సు కోటా వారిచ్చిందే చేశాం కార్యదర్శి: డీఎస్సీ స్పోర్ట్సు కోటా అంశంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణనలోకి తీసుకున్నాం. అక్కడేం జరిగిందో మాకు తెలియదు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డీఎస్సీ భర్తీ నాటి పాలసీ. ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ మారితే మాకు సంబంధం లేదు. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం. స్పోర్ట్స్ సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు. వాస్తవం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రెండు విధానాలు అనుసరించారు. ఒకటి రెగ్యులర్ డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం కొత్తగా రెండో విధానం ఈ డీఎస్సీ వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ–2024–29ను డీఎస్సీకి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష (టెట్/డీఎస్సీ) లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి, రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదుకార్యదర్శి: డీఎస్సీలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. తప్పు పట్టలేదు.వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాత పూర్వంగా ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు.. రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని, మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడంలో అర్థం లేదు. కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదుకార్యదర్శి: డీఎస్సీలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు. అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వాస్తవం: తూర్పు గోదావరి జిల్లాలో ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డీఎస్సీ అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దాంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (కాపీయింగ్పై మరోసారి ప్రశ్నించగా అలా అనలేదని సమాధానం చెప్పారు)వాస్తవాలు దాచి సమాధానం దాటవేతడీఎస్సీ అక్రమాలలో కీలకమైన ఆరోపణలపై విద్యా శాఖ సమాధానం దాటవేసింది. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్కు టాప్ ర్యాంక్ రావడంపై కార్యదర్శి కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామని ఒకసారి.. కౌన్సిలింగ్కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. వాస్తవానికి నవీన్కు కాల్ లెటర్ వెళ్లకుండా అభ్యర్థి డీఎస్సీ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారు. ఆ విషయం బాధిత నవీన్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నాడు. పైగా కాంట్రాక్టు ఉద్యోగి పరీక్ష రాసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశంపై సమాధానం దాటవేశారు. అలాగే, అతను ఎస్సీఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైనా సరైన సమాధానం ఇవ్వలేదు.గ్రీవెన్స్లోనూ తప్పులేకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పిన అధికారులు ఎంపిక లిస్టులో అభ్యర్థుల పేర్లను గల్లంతు చేశారు. ఈ విషయమై బాధిత అభ్యర్థులు విద్యా శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ రిడ్రెసెల్ సెల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. మరికొందరికి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది.దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం!డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలు జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు కట్టబెట్టారు. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది గానీ లేకుండా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటిషనర్లను బెదిరించడం గమనార్హం.ఇదో అవినీతి క్రీడ⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. అనూహ్యంగా ఆమెకు ఏపీ డీఎస్సీ క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పోస్టు ఇచ్చారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో పోస్టల్ శాఖను మోసగించే ప్రయత్నం చేయడంతో ఆమెపై గతంలో అనర్హత వేటు వేశారు. అలాంటి ఈమెకు ఏపీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఆమె రెండు వేర్వేరు ఏజ్ గ్రూప్స్లో ఆడినట్టు విజయనగరం జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో గతేడాది ఆగస్టులోనే శాప్కు ఫిర్యాదులు చేశారు. అప్పుడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. నెల క్రితం ‘సాక్షి’లో కథనం వచ్చాక విచారణ చేస్తామని శాప్ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపించి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఇదే క్రీడా కోటాలోనే ఉద్యోగం పొందారు. ఇక్కడ పోస్టల్ శాఖ అనర్హులుగా తేల్చిన వ్యక్తికి ఏపీలో ఉద్యోగం ఇస్తే.. ఏపీలో తిరస్కరించిన వ్యక్తికి పోస్టల్ శాఖలోనే ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఘటనలే డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.⇒ కర్నూలు జిల్లాలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్–లోకల్ కోటాలో వేరే జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నాన్–లోకల్లోకి వచ్చేవారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలకు దిగువన ఉన్నా నాన్లోకల్ కోటాలో అక్కడ పోస్టును భర్తీ చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఇది తప్పు అని తెలిసినా పట్టించుకోలేదు. అసలు ఓపెన్ కేటగిరీలో ఓ పోస్టు భర్తీ చేశాక, నాన్ లోకల్లో మరో పోస్టును ఎలా భర్తీ చేస్తారు? -
రైల్వేజోన్కు సర్వం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ప్రారంబోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని రైల్వే బోర్డు భావిస్తోంది. విశాఖ నుంచి ఏదైనా కొత్త రైలు ప్రారంభించినప్పుడు భారీగా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఒక్క రోజే గడువు ఉండటంతో అనుబంధ జోన్లు, డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవుని రద్దు చేసి విధులకు హాజరవ్వాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీన జరిగే ప్రారంబోత్సవంలో పాల్గొనేందుకు దక్షిణ కోస్తా జోన్ పరిదిలోని డీఆర్ఎంలు విశాఖకు వస్తున్నారు.దీనిపై నేడు డెక్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎంల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయి పనుల్లో రైల్వే ఉద్యోగులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లలో జాప్యం జరగకుండా ఉండేందుకు రైల్వేబోర్డు ఆయా డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగీ విధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. పరిపాలన, క్షేత్ర స్థాయి పనులపై పూర్తి దృష్టి సారించింది. ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, కొత్త జోన్ పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) శనివారం విశాఖ జోన్ జీఎం సందీప్ మాథుర్తో సమావేశమయ్యారు. మరోవైపు రైల్వే బోర్డు అధికారులకు దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జీఎంలు, డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆస్తులు విభజనపై ఈ భేటీలో చర్చించారు.కొత్త బోర్డులతో హద్దుల మార్పు జోన్ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకున్నాయి. కొత్త జోన్ సరిహద్దులను ఖరారు చేస్తూ, పాత బోర్డుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న రైల్వే కార్యాలయాలు, కల్యాణమండపాలు, ఇతర భవనాల వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ స్థానంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని మారుస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల హడావుడితో జోన్ కార్యాలయంతోపాటు పరిసరాల్లో సందడి నెలకొంది. సీపీఆర్వోగా బాలాజీ కిరణ్మరోవైపు పాలనాపరమైన కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వోగా బాలాజీ కిరణ్ను నియమించింది. ఒక పక్క క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, మరోపక్క పరిపాలనా విభాగాల కూర్పుతో జోన్ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. రద్దీకి అనుగుణంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు నుంచి అదనపు రైళ్లు, వందేభారత్ కనెక్టివిటీ పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి జోన్ అమల్లోకి రాగానే వైజాగ్ – సికింద్రాబాద్ వందేభారత్తోపాటు పలు రైళ్ల నిర్వహణ, అడ్మిని్రస్టేషన్ కంట్రోల్ మొత్తం విశాఖ కేంద్రంగా జరగనుండటంతో ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందనున్నాయి.కొత్త రైల్వే జోన్లోకి స్వాగతం!మధిర: ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను నూతనంగా ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగిన విజయవాడ డివిజన్ను కొత్తజోన్లోకి మార్చారు. అలాగే, ఇన్నాళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మధిర, తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లను విశాఖ జోన్, విజయవాడ డివిజన్ పరిధిలోకి బదలాయించారు.ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుండగా.. మధిర మండలం బయ్యారం సమీపాన కొత్త జోన్ పరిధిని సూచిస్తూ సిబ్బంది శనివారం బోర్డు ఏర్పాటు చేశారు. కాగా, ఇన్నాళ్లు రైల్వే ఉద్యోగులు, ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం సికింద్రాబాద్ వెళ్తుండగా.. ఇకపై జీఎంను కలవాలంటే విశాఖకు, ఇతర అధికారులను కలిసేందుకు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని మూడు రైల్వేస్టేషన్ల పరిధి ఉద్యోగులు, ప్రజలు పాలనపరమైన అంశాల్లో ఇబ్బంది ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు. -
ఖరీఫ్లోనూ కర్షకుడికి కష్టాలే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో ఖరీఫ్లో సాగుపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జూన్ 1వ తేదీ వస్తున్నా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. అదునుకు వేరుశనగ విత్తనమే కాదు.. కనీసం పచ్చిరొట్ట విత్తనం కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తోంది. ఎరువులను యాప్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధపడడంతో ఈసారి కూడా యూరియా, డీఏపీ కోసం యూరియా, డీఏపీ కోసం రైతులకు అగచాట్లు తప్పేటట్టు కన్పించడం లేదు. సీజన్కు ముందుగా పెట్టుబడి సాయం లేదు. ఇన్పుట్సబ్సిడీ ఎలాగూ లేదు. ఉచిత పంటల బీమా అసలే లేదు. కనీసం స్వచ్ఛంద పంటల బీమాను కూడా రైతులకు దూరం చేశారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాధార ప్రాంతాల్లోనే కాదు, సాగునీటి వనరులున్న ప్రాంతాల్లోనూ రైతులు ఖరీఫ్ సాగుకు ముందుకెళ్లలేకపోతున్నారు.అదునుకు విత్తనమేది?ఖరీఫ్లో రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్–2026లో 81.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 37.85 లక్షల ఎకరాల్లో వరి, 9.89 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 12.87 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 8 లక్షల ఎకరాల్లో అపరాలు, తదితర పంటల సాగును లక్ష్యంగా పెట్టారు. ఈసారి ముందస్తుగా సాగునీటి విడుదలకు షెడ్యూల్ ప్రకటించామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.కోతల వేళ వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకోవచ్చంటూ మే 4 నుంచి పెన్నా డెల్టాకు, జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు జూలై 1 నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు, అలాగే, మిగిలిన ఆయకట్టులకు సాగునీటి షెడ్యూల్ను విడుదల చేసింది. కానీ అందుకు తగినట్టుగా విత్తన సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రెండు సీజన్లు కలిపి కనీసం 400 కోట్లతో సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేసేవారు. గడిచిన రెండేళ్లుగా సబ్సిడీ విత్తన పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతుండడంతో రైతులు అదునుకు సబ్సిడీ విత్తనం దొరక్క దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.బకాయిలతో ముందుకురాని కంపెనీలు2026–27 వ్యవసాయ సీజన్లో ఖరీఫ్లో రూ.179 కోట్లతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదించారు. 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.62 లక్షల క్వింటాళ్ల వరి, 92 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి.అయితే గడిచిన రెండేళ్లకు చెందిన రూ.187 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వ ఎగవేత ధోరణికి నిరసనగా విత్తన సరఫరాకు కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏపీ సీడ్స్ వద్ద అందుబాటులో ఉన్న పచ్చిరొట్ట విత్తనాలను అరకొరగా పొజిషన్ చేయగా, వేరుశనగ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పలేని దుస్థితి. దీంతో రాయలసీమ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎల్నినో పరిస్థితులున్నప్పటికీ సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అదునుకు విత్తనం సరఫరా చేసి ఉంటే రైతులకు ఎంతగానో మేలు జరిగేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయలేదు.అందని పెట్టుబడి సాయం.. అటకెక్కిన పంటల బీమాఅధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,716 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోత పెట్టి రూ.14వేలతో సరిపెట్టారు. ఈ ఏడాది అయినా సీజన్కు ముందుగా పెట్టుబడి సాయం అందిస్తారేమో అని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. కానీ మరో రెండ్రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు.రెండేళ్లుగా పైసా పెట్టుబడి సాయం అందించకపోవడంతో కౌలు రైతులుగగ్గోలు పెడుతున్నారు. 2024 జూన్లో కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్కు సంబంధించి దాదాపు రూ.1385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందలేదు. 2024–25, 2025–26 వ్యవసాయ సీజన్లలో ప్రభుత్వం బీమా ప్రీమియం బకాయిలు రూ.1095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టేశాయి. మరోవైపు కరువు బకాయిలు రూ.327 కోట్లతో పాటు 2024–25 సీజన్లో రూ.650 కోట్లకుపైగా పంట నష్టపరిహారం నేటికీ జమ చేయలేదు. రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. దీంతో ఖరీఫ్ సాగు వేళ రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.యాప్ ద్వారా ఎరువులు.. ఆందోళనలో రైతులుఎరువుల కొరతేమీ లేదంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈసారి యాప్ ద్వారా పంపిణీ అంటూ మెలిక పెట్టి, ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు 2025–26 వ్యవసాయ సీజన్కు సంబంధించి జాతీయ స్థాయిలో 39.054 మిలియన్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 20.012 మిలియన్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ సారి రాష్ట్రానికి జరిపిన కేటాయింపుల మేరకు ఎరువులు సరఫరా జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది.రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు 18.09 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 8.20 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో యూరియా ఏ స్థాయిలో దారిమళ్లుతోందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పంటలు సాగులేని ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 75 వేల టన్నుల యూరియా, 30 వేల టన్నుల డీఏపీ అమ్మకాలు జరిగాయంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతుందే తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించలేకపోతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం: 77.12 లక్షల ఎకరాలు⇒ ఖరీఫ్ 2026 సాగు లక్ష్యం: 81.50 లక్షల ఎకరాలు⇒ వరి: 37.85 లక్షల ఎకరాలు⇒ వేరుశనగ: 9.89 లక్షల ఎకరాలు⇒ పత్తి: 12.87 లక్షల ఎకరాలు⇒ అపరాలు తదితర పంటలు: 8 లక్షల ఎకరాలు -
సర్కారు ఉక్కిరిబిక్కిరి!
తిరుపతి టాస్క్ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్రెడ్డి వంత పాడారు. రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతిటీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతిడీఈఓను సస్పెండ్ చేయాలిడీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతిఎవరు చెబితే ఇలా చేశారు?డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఅబ్బే.. మేం పిలవలేదు..డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
‘దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి’
న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు శనివారం వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం సమర్పించిన అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు, ఎంపీలు డాక్టర్ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. దళిత క్రైస్తవుల విషయంలో వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సిక్కులు, బౌద్ధులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూడా అదే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు.ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులు ఏమన్నారంటే..వారి మాటల్లోనేదళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి వైఎస్సార్సీపీఅధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం. ప్రస్తుతం సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. గతంలో నియమించిన పలు కమిషన్లు మతం మారినంత మాత్రాన సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కమిషన్ను కోరాం. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిజమైన అర్హుల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా విషయంలో వైఎస్సార్సీపీచిత్తశుద్ధితో వ్యవహరించింది. 2023 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానానికి, దళితుల హక్కుల పరిరక్షణకు మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది.దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే: గొల్ల బాబూరావుదళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక వాస్తవికత మారదు. మతం ఆధారంగా దళితుల హక్కులను నిరాకరించడం సరికాదు. అందువల్ల దళితులు ఏ మతంలో ఉన్నా వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు: జూపూడి ప్రభాకర్రావుదళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తూ వారిని బీసీసీ వర్గంలోకి నెట్టివేసే ప్రయత్నాలను వైఎస్సార్సీపీతీవ్రంగా ఖండిస్తోంది. దళిత క్రైస్తవులు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక వాస్తవికత మారదు. అందువల్ల వారిని ఎస్సీలుగానే పరిగణించాలన్నదే మా పార్టీ స్పష్టమైన వైఖరి. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించింది. ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. మతం మారినా కుల వివక్ష పోవడం లేదని కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రెండు గ్లాసుల విధానం, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అలాంటప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అదే వైఖరికి వైఎస్సార్సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం వైఎస్సార్సీపీనిరంతరం పోరాడుతుంది. బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేయాలి. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా మేము ప్రతిఘటిస్తాం. అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం:మేరుగు నాగార్జున దళిత క్రైస్తవులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీఈ రోజు పోరాటం చేస్తోంది. దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని స్పష్టంగా సూచించాయి. సిక్కులు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజల్లో ఆందోళన ఉంది. చర్చిలపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దళిత సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 24న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి వైఎస్సార్సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయానికి అనుగుణమైన చర్య అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దళితులు, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. దళిత క్రైస్తవుల పక్షాన వైయస్ జగన్ గారు దృఢంగా నిలబడతారని స్పష్టం చేస్తున్నాం.దళితుల పక్షాన నిలిచిన నాయకుడు జగన్: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కులపై కుట్ర జరుగుతోందనే ఆందోళన కలుగుతోంది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టుకతో వచ్చిన కులాన్ని మత మార్పిడితో మార్చలేమనే వాస్తవాన్ని గుర్తించాలి. మతం మారినా సామాజిక వివక్ష, వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. సిక్కు, బౌద్ధ మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతుంటే, దళిత క్రైస్తవుల విషయంలో మాత్రమే భిన్నమైన వైఖరి అవలంబించడం సమంజసం కాదు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని గతంలో నియమించిన కమిషన్లు సిఫార్సు చేశాయి. అయినప్పటికీ మరోసారి ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు మారిపోలేదు. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష, వెలివేత, అనేక రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను కాలరాయడం సరికాదు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీనిరంతరం పోరాడుతోంది. 2023లో వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీపెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉంటుంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం సాధిస్తాం. దళితుల పక్షాన వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ గారు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఎస్సీ హోదా లేదనడం వివక్షతకు నిదర్శనం: అరుణ్ కుమార్ దళితులు ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతంలోనే ఉండాలని, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదని చెబుతున్నారు. అయితే బౌద్ధం, సిక్కు మతాలను స్వీకరించిన దళితులకు మాత్రం ఎస్సీ హోదా కొనసాగిస్తున్నారు. ఈ భిన్నమైన వైఖరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవుల విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన కమిషన్ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైస్తవ మతంలో కులం లేదని, అంటరానితనం లేదని చెప్పడం ద్వారా భారతీయ సామాజిక వాస్తవాలను విస్మరిస్తున్నారు. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష, వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోవడం లేదనేది వాస్తవం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకుంది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని వైఎస్సార్సీపీప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ హోదా కోసం ఐక్య పోరాటం: నందిగామ సురేష్ మతం మారిన కారణంతో దళితులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక పరిస్థితులు, వివక్షకు గురయ్యే వాస్తవాలు మారవు. అందువల్ల దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాల్సిందే. దళితుల హక్కుల అంశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పదవుల కోసం మౌనం పాటించకుండా దళిత సమాజం తరఫున గొంతెత్తాలి. దళితుల సమస్యలు, హక్కుల అంశాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవడం సరైంది కాదు. దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు ప్రశ్నించాలి. సమాజంలో సంపద, అవకాశాలు, హక్కులు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు పనిచేయాలి. దళితులకు న్యాయం జరిగే వరకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించే వరకు అందరం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు. -
వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు, కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింతగా తీసుకెళ్లాలి. దీనిపై పార్టీ కమిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తీర్మానాలు చేసి వాటిని డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. సర్వే ప్రారంభమయ్యేలోగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అంశంపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని చెప్పారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్ఈఆర్టీలో పనిచేసే నవీవ్కి టాప్ ర్యాంక్పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.నవీన్ లాగిన్ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో జూన్లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. -
‘జూన్ 10లోపు విద్యుత్ సబ్సిడీ హామీ అమలు చేయాలి’
సాక్షి, తాడేపల్లి: ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీ లోపు యూనిట్ రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ హామీని అమలు చేయాలని, నాన్ ఆక్వా జోన్ రైతులు గత రెండేళ్లుగా చెల్లించిన బిల్లులు రీయింబర్స్ చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో సీడ్, ఫీడ్ ధరలు, ఎగుమతులు, అన్నీ అప్సడా నిర్ణయం మేరకు రైతులతో చర్చించి తీసుకునేవాళ్లమని.. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా)ని నిర్వీర్యం చేసేసి దళారుల చేతికి చంద్రబాబు పెత్తనం ఇచ్చాడని మండిపడ్డారు.ఫీడ్ ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోమని, రైతులతో చర్చించి ఏడాదికి ఒక్కసారే పెంచాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, త్వరలోనే ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారని వడ్డి రఘురాం వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్సడా నిర్వీర్యం.. తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ అన్ని విభాగాలను ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి ఆక్వా రైతులకు మేలు చేశారు. సీడ్, ఫీడు ధరలు పెంచాలన్నా, వాటి నాణ్యత పరిశీలించాలన్న ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీలో ప్రభుత్వం, రైతులు, సీడు, ఫీడు యజమానులు, ఎక్స్పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడికల్ కంపెనీలు ఉండేవి.వీరంతా ఉమ్మడిగా చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా అప్సడాలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి, పెత్తనాన్ని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టాడు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆక్వారైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇటీవల విచ్చలవిడిగా ఫీడు రేట్లు పెంచడానికి పూనుకున్నారు. వైయస్ జగన్ గారి హెచ్చరికలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదుఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆక్వా రైతులను మోసం చేశాడు. రెండేళ్లలో చంద్రబాబు కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మొత్తం 64 వేల కనెక్షన్లు ఉంటే వైఎస్సార్సీపీ హయాంలోనే 50,800 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏటా రూ.800 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2104-19 మధ్య కూడా యూనిట్ విద్యుత్ రూ.2 లకే ఇస్తామని చెప్పి ఆరు నెలలకే ఆపేశాడు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డిస్కంలకు గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.340 కోట్లు వైఎస్ జగనే చెల్లించి ఆక్వా రంగాన్ని ఆదుకోవడం జరిగింది.ఐదేళ్లలో రూ. 3640 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించిన ఘనత వైయస జగన్కే దక్కుతుంది. నాన్ ఎలిజిబిలిటీ రైతులకు ఇబ్బందులు రావడంతో 24 గంటల్లో రూ. 24 కోట్లు రోల్ బ్యాక్ చేయడం జరిగింది. మెరైన్ ఎక్స్పోర్టులో రెండుసార్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే మొదటిస్థానం సాధించి అవార్డులు తీసుకుంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా సీపీఎఫ్ అనే కంపెనీ ఫీడ్ ధరలు పెంచినప్పుడు రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను థాయ్లాండ్ నుంచి 48 గంటల్లో పిలిపించి వారితో ప్రభుత్వం చర్చించి మూడేళ్లపాటు పైసా కూడా పెంచకుండా చూశాం. రెండుసార్లు పెంచితే రెండుసార్లూ రోల్ బ్యాక్ చేయడం జరిగింది.ఆక్వా రైతుల తరఫున వైఎస్సార్సీపీ డిమాండ్లుసంక్షోభంలో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఆక్వా రైతుల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆక్వా నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. నాన్ ఆక్వా జోన్ పరిధిలో సుమారుగా 12,800 కనెక్షన్లు ఉంటాయని అంచనా. వారందరూ గడిచిన రెండేళ్లుగా విద్యుత్ సబ్సిడీకి నోచుకోకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ బిల్లులన్నీ రోల్ బ్యాక్ చేస్తారో లేదో చెప్పాలి. సంక్షోభంలో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకునేలా ఇతర పంటల మాదిరిగానే ఆక్వా లోనూ పంటల సాగు వివరాలు నమోదు చేయాలి.ప్రాసెసింగ్ ప్లాంట్లకు వచ్చిన ఆర్డర్లు, పంట సాగు లెక్కలను బేరీజు వేసుకుని ధరలు నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సోయా, ఫిష్ ఆయిల్ ధరలు ఏడాదికి ఒక్కసారే పెరుగుతాయి. ఆక్వా సీడు, ఫీడ్ ధరలు ఇష్టమొచ్చినట్టు పెంచకుండా ఏడాదిపాటు ఒకే ధరతోనే విక్రయాలు జరిగేలా చూడాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ధరలు పెంచాల్సి వస్తే రైతుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి.జూన్ 10వ తేదీ లోపు జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రంగంలో రూపాయిన్నర సబ్సిడీకి విద్యుత్ పంపిణీ చేయాలి. రెండేళ్లుగా నాన్ ఆక్వా జోన్ రైతులు చెల్లించిన బిల్లును రీయింబర్స్ చేయాలి. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం. త్వరలోనే ఆక్వా రైతులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడి పోరాడతుందని వడ్డి రఘురాం స్పష్టం చేశారు -
డబ్బులిస్తే కోరుకున్న చోట కొలువు!
సాక్షి, అమరావతి: డిప్యూటీ తహశీల్దార్లకు (డీటీ) తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం) సర్విసెస్ విభాగ అధికారులకు కాసుల పంట పండిస్తోంది. సర్విస్ సబార్డినేట్ రూల్స్, సీనియారిటీతో సంబంధం లేకుండా ముడుపులు ఇచ్చిన వారికి కోరుకున్న జిల్లాలను కేటాయించేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. సర్విసెస్ విభాగం అధికారి, సంబంధిత సెక్షన్ అధికారి, ఆయన వద్ద పని చేసే ఆన్ డ్యూటీ ఆర్ఐ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు రెవెన్యూ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. వారు ఎన్ని తప్పులు చేసినా, పైరవీలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తినా సీసీఎల్ఏ ముఖ్య ఉన్నతాధికారి పట్టించుకోకుండా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతుల అంశం రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్గా మారింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ డీటీలు, కింద నుంచి పదోన్నతిపై వచ్చిన డీటీలందరితో ఒక జాబితా తయారు చేసి.. వారికి తహశీల్దార్గా పదోన్నతులు ఇవ్వడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇటీవల హైకోర్టు సూచించింది. దీంతోరాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించే అవకాశం ఏర్పడింది. వీరందరికీ పదోన్నతులు రావడం ఖాయమైనా, జిల్లాల కేటాయింపు కీలకంగా మారింది.ముడుపులిస్తే కావాల్సిన జిల్లాలకు కేటాయింపు1996 సర్విస్ సబార్డినేట్ రూల్సు ప్రకారం సీనియారిటీ, పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల కేటాయింపు జరగాలి. వీటి ఆధారంగా డీపీసీ (డి్రస్టిక్ట్ ప్రమోషన్ కమిటీ)లో పదోన్నతులు ఖరారు చేసి జిల్లాలు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ఆ జిల్లాల్లో పని చేస్తున్న వారు, పలు జిల్లాల్లో ఫోకల్ మండలాలపై కన్నేసిన డీటీలు నేరుగా సీసీఎల్ఏ కార్యాలయానికి వచి్చ.. సర్వీసెస్ విభాగంలోని ముఖ్యులతో బేరమాడి సెట్ చేసుకుంటున్నారు.కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తీసుకు వెళ్లినా, తమకు ముడుపులు ఇవ్వాల్సిందేనని చెబుతుండడంతో వారితో బేరం కుదుర్చుకుని ఆ మేరకు డబ్బు ఇస్తున్నారు. సీసీఎల్ఏ కార్యాలయంలో ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా, సర్వీసెస్ విభాగం అధికారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా.. ముఖ్య ఉన్నతాధికారి మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.‘ఆయన’పై ఆది నుంచి ఆరోపణలేసర్విసెస్ విభాగం అధికారి ఆ సీటులోకి వచ్చినప్పటికీ నుంచి చేయి తడపకపోతే ఫైలు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం అదే సెక్షన్లో ఆన్ డ్యూటీ ఆర్ఐని ఉపయోగించుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. ఈ ఆరోపణలపై ఏడాది క్రితం అతన్ని వేరే సెక్షన్కి మార్చితే, ఆ అధికారి పట్టుబట్టి మళ్లీ తన వద్ద వేయించుకున్నారు. సీసీఎల్ఏ కార్యాలయం నుంచి తహశీల్దార్గా వెళ్లే అధికారిని కాకుండా, డబ్బు తీసుకుని సచివాలయం నుంచి తహశీల్దార్గా వెళ్లే అధికారిని నెల్లూరు జిల్లాకు పంపించడంపై గతంలో వివాదం ఏర్పడి ఉన్నతాధికారుల వద్ద పంచాయితీ కూడా జరిగింది. డిప్యూటీ కలెక్టర్ల పే ఫిక్సేషన్, బకాయిల సెటిల్మెంట్, ఇతర సర్విస్ వ్యవహారాలన్నింటికీ ఆయన డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అనేకం వచ్చాయి. అయినా ప్రస్తుతం ఆ అధికారికే డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతుల జాబితా ప్రక్రియను అప్పగించారు. దీంతో ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయం పైరవీకారులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఫలితంగా సీనియారిటీ ఉండి, నిబద్ధతతో పనిచేసే డీటీల పరిస్థితి అయోమయంగా మారడంతో వారు లబోదిబోమంటున్నారు. -
సీబీఐతో విచారించాలి
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్ పోస్టుల అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025లో అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి పోరుకు భారీ స్పందన వచి్చంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సరి్టఫికెట్లతో ఎంపికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. శుక్రవారం గుంటూరులో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి వినతి పత్రం సమర్పించారు. పూర్తిగా పారదర్శకత లోపించిన మెగా డీఎస్సీ తంతులో పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం లాంటి అనేక అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ..⇒ పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.⇒ బాపట్లలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.⇒ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలసి పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని నినదించారు.⇒ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.⇒ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజవర్గ అధ్యక్షులు సద్ధాం ఆరోపించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వ్యతిరేకంగా నినదించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నారా లోకే‹శ్మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.⇒ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్దవైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్ నేతృత్వంలో దగాడీఎస్సీపై నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్,సమన్వయకర్తలు తిప్పల దేవాన్రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు.⇒ మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహం నుంచి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించింది. సకల శాఖా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.⇒ కాకినాడలో వైఎస్సార్సీపీ విద్యారి్థ, యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.⇒ ఒంగోలులో నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహా్మనందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు.⇒ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో ‘విద్యార్థి పోరు’ పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.⇒ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించడంతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అక్కడకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును⇒ చంద్రబాబు సర్కారుకు డీఎస్సీపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా అని వైఎస్సార్సీపీ నేతలు నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినా‹Ù, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినదించారు.⇒ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మలసత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేడ్కర్ సెంటర్, ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
పొగాకు రైతులకు నష్టాల సెగ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోగా.. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో పొగాకు బోర్డు అధికారుల తీరు కారణంగా వర్జీనియా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. బోర్డు అనుమతి ఇచ్చిన పరిధిలోనే సాగుచేసి మంచి దిగుబడి సాధించి.. నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసినా గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రెండేళ్లుగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.2024–25 సీజన్లో నల్లబర్లీ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాండ్లు ఇచ్చిన కంపెనీలు కొనుగోలు సమయంలో చేతులెత్తేయడంతో రైతుల వద్ద 53 వేల టన్నులు పేరుకుపోయాయి. అతికష్టంమ్మీద 20 వేల టన్నులు సేకరించగా.. నేటికీ రైతుల వద్ద 33 వేల టన్నులు పాత పొగాకు నిల్వలు ఉండిపోయాయి. ఇళ్లవద్దే ఉండిపోయిన బేళ్లు అమ్ముడుపోక, నిల్వ ఖర్చులు, వడ్డీలు, కూలీ ఖర్చులు తడిసి మోపెడవటంతో నల్లబర్లీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది అదే పరిస్థితి వర్జీనియా పొగాకు (వైట్ బర్లీ) రైతులు ఎదుర్కొంటున్నారు.తిరస్కరణకు గురవుతున్న బేళ్లే ఎక్కువ2025–26 సీజన్లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్కు 2,276 కిలోల దిగుబడి చొప్పున ఈ ఏడాది కనీసం 2.61 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దక్షిణాది నల్ల నేలల్లో పొగాకుకు సగటున కిలోకి రూ.212.07, ఉత్తరాది తేలిక నేలల్లో పొగాకుకు సగటున కిలోకు రూ.237.21 చొప్పున మాత్రమే ధర లభిస్తోంది. ఒంగోలు, టంగుటూరు, కొండెపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో 45–47 శాతం, పొదిలి, కనిగిరి, కందుకూరు, కలిగిరి, డీసీ పల్లి కేంద్రాల్లో 36–40 శాతం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాల్లో 35–43 శాతం మేర బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరించిన పొగాకును వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేల వరకు అదనంగా ఖర్చవుతోందని రైతులువాపోతున్నారు.45 రోజులైనా 5 శాతమే వేలంపొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించి 45 రోజులైంది. ఇప్పటివరకు కేవలం 9,500 టన్నుల పొగాకు మాత్రమే వేలం జరిగింది. అంటే ఉత్పత్తిలో 5 శాతానికి మించి రైతులు ఇప్పటివరకు అమ్ముకోలేకపోయారు. గతేడాది ఇదే సమయానికి 33,860 టన్నులు వేలంలో అమ్ముడయ్యింది. 2023–24లో సగటున కిలోకు రూ.288.65 చొప్పున దక్కితే.. ఈ ఏడాది కిలోకు రూ.237.21కి మించి దక్కడం లేదు. అదీ కూడా మార్కెట్కు తీసుకొచ్చిన బేళ్లలో 5 శాతం బేళ్లకే ఈ ధర లభిస్తోంది. ఏటా సగటు ధర పెరగాల్సింది పోయి.. 2023–24తో పోలిస్తే ఈ ఏడాది రైతు కిలోకు దాదాపు రూ.51 తక్కువ ధరకు అమ్ముకోవాల్సి దుస్థితి దాపురించింది. ఫలితంగా రెండేళ్లలో రూ.3,100 కోట్లకు పైగా రైతులకు నష్టపోతున్నారని అంచనా.నిత్యం నిరసనల్ని పట్టించుకోని ప్రభుత్వంఏ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లినా రైతుల నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కడుపు మండిన రైతులు పొగాకును తగలబెట్టే స్థాయికి వచ్చారు. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టుగా మిన్నకుండిపోతోంది.ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలిపొగాకు సాగు చేసే వారిలో అత్యధికులు కౌలు, సన్నకారు రైతులే. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఆరి్థక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుని తక్షణమే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి సారించాలి. -
ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ పాలనలో పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ జగన్ పాలనలో 2023–24లో ఆంధ్రప్రదేశ్ పలు కీలక సామాజిక, ఆరోగ్య సూచీలలో జాతీయ సగటును దాటి ముందంజలో నిలిచింది. 2019–21 సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే, మరింతగా ప్రజారోగ్యానికి అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు స్పష్టమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–6) 2023–24 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023–24లో రాష్ట్రంలో ప్రజారోగ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారత రంగాలలో విప్లవాత్మక మార్పులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను జాతీయ సర్వే చాటి చెప్పింది. రాష్ట్రంలో మహిళల విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఊహించని రీతిలో పురోగతి కనిపించినట్లు నివేదిక పేర్కొంది. పదవ తరగతి, అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 2019–21లో 39.6 శాతం ఉండగా, 2023–24 నాటికి అది 48.4 శాతానికి పెరిగి, జాతీయ సగటు 46.4 శాతాన్ని అధిగవిుంచడం గమనార్హం. అదే సమయంలో మహిళలు ఇంటర్నెట్ వినియోగంలోనూ ముందంజలో ఉన్నారు. సాంకేతిక వినియోగంలో మహిళలు దేశ సగటుకు సమానంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2019–21లో కేవలం 21 శాతంగా ఉన్న ఇంటర్నెట్ వాడుక, 2023–24 నాటికి ఏకంగా 63.6 శాతానికి చేరడం విశేషం.తల్లీ పిల్లల ఆరోగ్యం దేశానికే ఆదర్శంగర్భిణిలు, బాలింతల సంరక్షణ, శిశు ఆరోగ్య రక్షణలో ఏపీ జాతీయ సగటును మించి అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు సర్వే వెల్లడించింది. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7 శాతం నుండి 88.6 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు 76.2 శాతం కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలో ప్రసవాలు ఆసుపత్రుల్లోనే (ఇన్స్టిట్యూషనల్ బర్త్స్) జరిగేలా చూడటంలో రికార్డు నమోదైనట్లు సర్వే పేర్కొంది. 2019–21లో 96.5 శాతం ఉన్న ఆసుపత్రి ప్రసవాలు.. 2023–24 నాటికి 98.4 శాతానికి చేరి, జాతీయ సగటు 90.6 శాతాన్ని మించాయి. 12–23 నెలల వయసున్నపిల్లల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో 2019–21లో 73.2 శాతం ఉండగా, 2023–24లో అది 87.7 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (82.6శాతం)తో పోలిస్తే చిన్నారుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది.వివాహ వయసు పరిమితిలో సానుకూల మార్పుసామాజిక చైతన్యం పెరగడం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణ, వివాహ వయసు పరిమితుల్లో సానుకూల మార్పులు వచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.8 శాతంగా స్థిరపడినట్లు తెలిపింది. ఇది జాతీయ సగటు (2.0 శాతం) కంటే తక్కువగా ఉంటూ జనాభా స్థిరీకరణను సూచిస్తోందని తెలిపింది. బాల్య వివాహాల నియంత్రణలో గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు సర్వే వెల్లడించింది.మహిళల ఆర్థిక భద్రతలో టాప్మహిళల ఆర్థిక భద్రత, కుటుంబ నిర్ణయాధికారాల్లో ఆంధ్రప్రదేశ్.. దేశ సగటును దాటి దూసుకుపోయినట్లు సర్వే వెల్లడించింది. తమ పేరిట సొంతంగా బ్యాంక్ లేదా పొదుపు ఖాతా కలిగి ఉండి, దానిని స్వయంగా వినియోగిస్తున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 81.8 శాతం నుండి 92.3 శాతానికి పెరిగినట్లు సర్వే తెలిపింది. ఇది జాతీయ సగటు (89.0 శాతం) కంటే చాలా ఎక్కువ అని పేర్కొంది.గృహ హింస 29.9 శాతం నుంచి 22.7 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహాలకు మౌలిక వసతులు కల్పించడంలో ఏపీ మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో 99.7 శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉండగా, జాతీయ సగటు 98.3 శాతంగా ఉంది. 97.6 శాతం కుటుంబాలు సురక్షిత తాగునీటి వనరులను పొందుతుండగా, దేశ సగటు 96.5 శాతంగా ఉంది. -
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని... ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు.‘‘ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి డాక్టర్ వైఎస్సార్కు గాదె వెంకటరెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు. వైఎస్సార్తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘టీడీపీ మహానాడు ఓ మహానాటకం’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు.ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, వైఎస్ జగన్ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో ఆమె ఇంకేమన్నారంటే..మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీమహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు.రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్ జగన్ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి.మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనేఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్ జగన్.మహిళలకు రిజర్వేషన్పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్ జగన్ మాత్రమే. ఎలాగో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు.హత్యా రాజకీయాలు టీడీపీవేగొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్ జగన్ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు.మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ ? రాష్ట్రంలో శాంతి భద్రతలపై మీరే మాట్లాడాలి. మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లే పరిస్ధితి ఉందా, వెళ్లినా ఫిర్యాదు తీసుకునే పరిస్ధితి ఉందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అమాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాపై దాడులే.రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైలో మోసం, అత్యాచారం ఆరోపణలపై మహిళా ఉద్యోగి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యల్లేవు. మహిళా స్కూలు ప్రిన్సిపాల్ ను టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తే ఎలాంటి చర్యల్లేవు, మంత్రి సంధ్యారాణి పీఏపై లైంగిక వేధింపులపై చర్యల్లేవు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య కాల్స్ లో మాట్లాడినా చర్యల్లేవు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యేపైనా చర్యలుండవు. కాబట్టి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?మహిళల్లో దైర్యం నింపిన జగన్ పథకాలుస్త్రీ శక్తి అంటే సభలో చప్పట్టు కొట్టుకోవడం కాదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అసలు స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ప్రతీ ఇంట్లోనూ ఓ నమ్మకం కలిగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళళకు సాధికారత లభించింది. మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మున్సిపల్, జడ్పీ పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు గత ప్రభుత్వంలో మహిళల స్వయం శక్తిని పెంచాయి. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్ వర్క్ లతో మహిళా సంఘాల్ని అనుసంధానం చేసిన ఘనత వైఎస్ జగన్దే. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలకు చేసిందేమీ లేదు. కానీ నిత్యం వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారు.రాష్ట్రంలో మీరు కోల్పోయిన విశ్వసనీయత మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు, లోకేష్ గురించి అర్దమైపోయింది. మహానాడులో పెద్ద పెద్ద మాటలతో పబ్లిసిటీ కింగ్ లు, పరిపాలనలో పిల్లులని నిరూపించారు. హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పథకం మహిళల జీవితాల్లో మార్పు తెస్తే.. మీ పాలనలో మాత్రం ప్రతీకార రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మామా, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరుతో చేసిన మహానాటకం అద్భుతం.ఎందుకంటే మామ గారైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మరదలి బలవన్మరణానికి కారణమయ్యారు, తమ్ముడి గారిని గొలుసులు వేసి కట్టేశారు. ఇవన్నీ నిజాలే. ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ. మీరు హద్దులు దాటి మాట్లాడితే మేమూ ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ మాట్లాడలేదంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయనే. మీరు దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారకపోయినా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లే అర్హత లేని వాళ్తంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టారాజ్యంగా నిందలేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా కబ్జాదారులు, బ్యాంక్ దోపిడీ దాడులు, మహిళల్ని లైంగికంగా వేధించిన వాళ్లు, డీఎస్సీ స్కాం దారులే. అదే వేదికపై మహిళా బిల్లును ఓడిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లంతా వైఎస్ జగన్ గురించి, వైఎస్సార్సీపీ గురించి మాట్లాడుతున్నారు.లోకేష్కు వైఎస్సార్సీపీ ఓపెన్ ఛాలెంజ్లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. చర్చకు సిద్దమని మీరు సవాల్ విసిరారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాం. ఏ టీవీ ఛానలో చెప్పండి, అందులో మా పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వచ్చి చర్చలో పాల్గొంటారు. కానీ దాని కంటే ముందు పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తారా చెప్పండి, అలాగే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారా చెప్పాలి. డీఎస్సీలో పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ మాయం, డేటా లీక్ జరిగాయి. మీరు ఈ డార్క్ ఆపరేషన్ గురించి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.రాష్ట్ర యువత లోకేష్ కు పేపర్ లీకేజ్ అని పేరు పెట్టారు. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ లు అయ్యాయి?, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు ? అడిగితే కేసులు పెడుతున్నారు. మీ పరీక్షల నిర్వహణలో తప్పులు పెట్టుకుని అడిగిన వాళ్ల మీద కేసులు పెడతామంటే ఎలాగో పేపర్ లీకేజ్ మంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. మీ వీధి భాష చూసి మీరు చదివిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా సిగ్గుపడుతుంది.ఓ పారిశ్రామిక వేత్త నుంచి లాబీయింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ఫీజులు కట్టారన్నది వాస్తవమా కాదా లోకేష్ చెప్పాలి. స్టాన్ ఫర్డ్ డిగ్రీ కంటే వీధి భాష, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ పాలనపైనే ఎక్కువగా పీహెచ్డీ చేసినట్లున్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆరె శ్యామల అన్నారు. -
లోకేశ్.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే!
సాక్షి, అమరావతి: డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైఎస్సార్సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. ‘మిమ్మల్ని (లోకేశ్ను) ఇంటర్మీడియెట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. -
బాబు సర్కారు కుట్ర.. ఆర్టీసీని ప్రైవేట్కు ఇచ్చేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట రోడ్డు రవాణా సంస్థను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ప్రైవేట్కు ధారాదత్తం చేయడానికి పూనుకుంది. రూ.500 కోట్లు కేటాయిస్తే.. 750 ఇ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించవచ్చు. నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది కూడా. ఫలితంగా ఆర్టీసీ దర్జాగా మనుగడ సాగిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో ఈ మేరకు రాజ ముద్ర వేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో 750 బస్సులతో మొదలుపెట్టి.. దశల వారీగా మొత్తం 8 వేల బస్సులను ప్రైవేటుపరం చేసే కుతంత్రానికి పదును పెడుతోంది. 52 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని మొత్తంగా అమ్మేయడానికి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీకి తిలోదకాలు ఇచ్చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించేసింది. అందుకు తొలి దశలో 750 ఇ–బస్సులతో ప్రై‘వేటు’ కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. ప్రధాన మంత్రి ఇ–బస్ సేవా పథకం కింద దేశంలో 10 వేల ఇ–బస్సులను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఏపీకి 1,050 బస్సులు కేటాయించారు. 750 సాధారణ బస్సులు కాగా, మరో 300 బస్సులు తిరుపతి – తిరుమల మధ్య ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం నిర్వహిస్తారు. ఈ ఘాట్ రోడ్డు బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించిన 750 బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిర్వహణ సాధ్యం కాదంటూ .. 750 ఇ– బస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. ఆ బస్సుల చార్జింగ్ సదుపాయాల కోసం ఆర్టీసీ డిపోల్లో హైటెన్షన్ కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.89 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.80 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తుంది. కాబట్టి ఆర్టీసీ కేవలం రూ.9 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది. దాంతో 750 ఇ–బస్సులను ఆర్టీసీనే సొంతంగా నిర్వహించొచ్చు. ఫలితంగా ఆర్టీసీ మనుగడకు ఎటువంటి ఇబ్బందీ రాదు. ఈ విషయాన్ని పూర్తి గణాంకాలతో సహా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రవాణా శాఖ ఉన్నతాధికారులకు వివరించాయి. నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ 750 ఇ–బస్సులను సొంతంగా నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. అందుకోసం రూ.500 కోట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే ఆ 750 బస్సులు ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహణకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేయనున్నారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. దశల వారీగా ఆర్టీసీపై ప్రై‘వేటే’ ఆర్టీసీ ప్రైవేటీకరణ కేవలం 750 ఇ–బస్సులకే పరిమితం కాదు. మొత్తం బస్సులను దశల వారీగా ప్రైవేటుపరం చేసేందుకే ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో 8 వేలు ఆర్టీసీ సొంత బస్సులు కాగా, 3 వేల బస్సులను అద్దె విధానంలో నిర్వహిస్తున్నారు. అద్దె ఒప్పంద కాల పరిమితి ముగియగానే ఆ 3 వేల బస్సులను తొలగిస్తారు. ఇక ఆర్టీసీకి చెందిన 8 వేల బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థల ద్వారా దశల వారీగా ఇ–బస్సులను ప్రవేశ పెడతారు. ఆర్టీసీ కొత్తగా ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయదు. సగటున రోజుకో బస్సును తొలగిస్తోంది. అంటే కొద్ది కాలంలోనే రాష్ట్ర రోడ్లపై ఆర్టీసీ బస్సు అన్నది కనిపించదు. అన్ని బస్సులను ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. బస్సులు ఉండకపోతే ఇక ఉద్యోగ నియామకాలు అవసరం లేదు. అందుకే ఆర్టీసీలో 8 వేల ఖాళీ పోస్టులు ఉన్నా సరే జాబ్ క్యాలండర్లో వాటి గురించి ప్రభుత్వం ప్రస్తావించనే లేదు. ఇకపై రిటైరయ్యే ఉద్యోగుల పోస్టులను కూడా భర్తీ చేయరు. బస్సులు లేకపోతే ఇక ఆర్టీసీకి ఆస్తులతో పనేముందని ప్రభుత్వ పెద్దలు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతుండటం గమనార్హం. ఇప్పటికే రూ.6 వేల కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. అదే రీతిలో రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్లను కూడా ప్రైవేటు సంస్థల పరం చేసేందుకు ఎంతో కాలం పట్టదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బాబ్బాబు.. కోతలు కాదు.. అంతరాయాలనండి!
గాలివానలు, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల లోడ్ తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. కాబట్టే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అంతేగాని విద్యుత్ కోతలు లేవు. - ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్లో లోపం ఏర్పడటంతో గ్రిడ్పై అధిక లోడ్ పడి, దాని ప్రభావం కారణంగా ఏలూరు పట్టణం, పరిసరప్రాంతాల్లో రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి విద్యుత్ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. -ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సాల్మన్రాజు ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ ఒకేసారి వినియోగిస్తే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పెరిగి, అది కాలిపోయి రాత్రి అంతా కరెంటు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కావున విద్యుత్ వినియోగం తగ్గించుకుని మాకు సహకరించండి. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా కొంచెం ఓర్పు, సహనంతో ఉండాలని కోరుతున్నాం. - వినియోగదారులకు విద్యుత్ శాఖ చేసిన విజ్ఞప్తి సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ కోతలకు ఆ శాఖ మంత్రి, అధికారులు చెబుతున్న కారణాలివి. విద్యుత్ కోతలు లేకుండా సరఫరా అందించలేక ప్రకృతి మీద నెపం నెట్టి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రకటనలివి. ఇలాంటి ప్రకటనలు విద్యుత్ శాఖ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ట్రాన్స్ఫార్మర్లు తట్టుకోలేవంటూ కథలు.. విద్యుత్ శాఖ మంత్రి, ఇంధన శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. నిజంగానే ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుత ఉష్ణోగ్రతలను తట్టుకోలేవా అని విద్యుత్ రంగ నిపుణులను అడిగితే 315 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు ఉన్నా నిస్సందేహంగా తట్టుకుంటుందని తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో కూలింగ్ సిస్టం ఉంటుంది. అంటే రేడియేటర్లు, ఫ్యాన్లు, ఆయిల్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ను చల్లబరిచే వ్యవస్థ అందులో ఉంటుంది. అంతేకాదు ఈ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉష్ణోగ్రత 95 డిగ్రీల వరకు, వైండింగ్ 120 డిగ్రీల వరకు వేడిని తట్టుకుంటాయి. మరి ఇంతటి సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువై కాలిపోవడం ఏమిటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ లోడ్కు తగ్గట్టుగానే దాని పరిధిలో విద్యుత్ సర్వీసులు ఉంటాయి. మొత్తం సర్వీసులు వినియోగించే విద్యుత్ లోడ్కు తగ్గట్టే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఓవర్లోడ్ అయ్యే పరిస్థితి ఎందుకొస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే కేవలం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రభుత్వం చెబుతున్న సాకులని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అంచనాల్లోనే విఫలమై..అనధికార కోతలు రాష్ట్రంలో వేసవి గరిష్ట విద్యుత్ డిమాండ్ 280 మిలియన్ యూనిట్లు ఉండవచ్చని ఇంధన శాఖ వేసవి ప్రారంభానికి ముందే అంచనా వేసింది. కానీ ఇటీవల రోజువారీ విద్యుత్ డిమాండ్ 288 మిలియన్ యూనిట్ల వరకు వెళ్లింది. అంచనాల్లోనే విద్యుత్ శాఖ విఫలమైందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ డిమాండ్కు సరిపడా విద్యుత్ను సరఫరా చేసే పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం లేదు. దీంతో ప్రజలకు నిరంతరం విద్యుత్ అందించలేకపోతున్నామనే విషయాన్ని కప్పిపుచ్చడానికి కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ డిమాండ్తో లోడ్ పెరిగిపోయిందని చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి 280 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేసినప్పుడే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. పెరిగింది కూడా కేవలం 8 మిలియన్ యూనిట్లే. అది కూడా ఒకటి, రెండు రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో ఆ స్థాయిలో డిమాండ్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ (బుధవారం) 240 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే అంచనాకంటే చాలా తక్కువగానే వినియోగం ఉంది. అయినా కూడా విద్యుత్ సరఫరా చేయలేక కోతలు విధిస్తున్నారు. పట్టణాల్లోనే రోజుకు రెండు గంటలు కరెంటు తీసేస్తుండగా, గ్రామాల్లో వేళాపాళా లేకుండా అనధికా రికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లోను విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. అయినా మంత్రి మాత్రం అవి కోతలు కాదు.. అంతరాయాలు అంటూ పర్యాయపదాలు చెబుతూ కాలం గడపాలని చూస్తున్నారు. -
మరో డైవర్షన్ డ్రామా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన శకుని మార్కు కుతంత్రాలకు మరోసారి బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న ఆయన డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ప్రభుత్వ రెండేళ్ల వైఫల్య, అవినీతి పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడంతో హడలిపోతున్నారు. అందుకే ఇప్పటికే సరైన ఆధారాలులేక మూలనపడేసిన అక్రమ కేసు బూజు దులిపారు. సిట్ దర్యాప్తు పేరిట కక్ష సాధింపు రాజకీయాలకు పదునుపెట్టారు. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతానికి తెగబడుతున్నారు. తద్వారా.. ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ ఆ కుట్రలకు వత్తాసు పలుకుతూ ఖాకీ ధర్మాన్ని విస్మరిస్తూ పచ్చదండు అవతారమెత్తింది. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ దర్యాప్తు పేరిట రెడ్బుక్ కుట్ర రెండో అంకానికి తెరతీసిన తీరే ఇందుకు నిదర్శనం. ఏ1 సహా అందరికీ బెయిల్.. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ తాజా హడావుడి కేవలం రాజకీయ కక్ష సాధింపునకేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. ఈ కేసులో సిట్ ఆరోపణలన్నీ కూడా నిరాధారమని ఇప్పటికే స్పష్టమైంది. పైగా.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డితోపాటు సిట్ అరెస్టుచేసిన అందరికీ న్యాయస్థానం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలపై నమోదుచేసిన అభియోగాలకు సిట్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. రాజకీయ కక్షతోనే వారిని అరెస్టుచేసినట్లు స్పష్టమైంది. దర్యాప్తు పేరిట సిట్ ఏడాదిపాటు చేసినదంతా కేవలం రెడ్బుక్ వేధింపులేనన్నది తేటతెల్లమైంది. ఇక ఈ అక్రమ కేసులో సిట్ ఇప్పటికే చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. దాంతో సాంకేతికంగా దర్యాప్తు ముగిసినట్లేనని.. న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగించాలని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ చట్ట నిబంధనలు, న్యాయ ప్రక్రియను బేఖాతరు చేస్తూ రాజకీయ కక్ష సాధింపే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే మద్యం విధానంపై అక్రమ కేసులో హఠాత్తుగా మరోసారి దర్యాప్తు పేరిట తమ కుట్రలో రెండో అంకానికి తెరతీసింది. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కేఎన్ఆర్ కేఎన్ఆర్పై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం.. ఇక వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం కోసమే ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్–పీఏ కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్)ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీ ఆస్తులున్నట్లు, అవన్నీ గత ఐదేళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన సీనియర్ జర్నలిస్ట్. 2003 లోనే ‘వార్త’ దినపత్రికలో ఎడిషన్ ఇన్చార్జ్గా పని చేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పని చేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్లు చూస్తున్నారు. పార్టీకి నలుగురైదుగురు పీఏలు ఉన్నారు. అయితే కేఎన్ఆర్ ఒక్కరే పీఏ అన్నట్లు, మద్యం విధానంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు.. డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు ఎల్లో మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ క్రమంలో పాత విషయాలను పట్టుకుని నెలకు కేవలం రూ.10వేలు–రూ.15 వేలతో ఉద్యోగం చేసిన కేఎన్ఆర్ ఆస్తులు ఎలా కొనుగోలు చేశారని ఈనాడు పత్రిక రాయడం హాస్యాస్పదంగా ఉంది. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ వాస్తవాలను వక్రీకరిస్తూ సిట్ అధికారులు ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం.. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారంతో రాద్ధాంతం చేయడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు మద్యం దోపిడీ బాగోతం టీడీపీదే..సిట్ పేరుతో చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంది. ఎందుకంటే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. 2014–19లో ఏకంగా రూ.25వేల కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గుతేల్చింది. కేబినెట్ ఆమోదంలేకుండా రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది చంద్రబాబే. టీడీపీ సిండికేట్కు 7,884 మద్యం దుకాణాలు ఏకపక్షంగా కేటాయించడంతోపాటు మరో 7,884 పరి్మట్ రూమ్లు, 48వేల బెల్ట్ దుకాణాలతో దోపిడీకి పాల్పడ్డారు. ఎంఆర్పీ కంటే 20శాతం అధిక ధరలకు మద్యం విక్రయించి మొత్తంగా రూ.25వేల కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డిస్టిలరీకి లైసెన్స్ జారీచేయనేలేదు. మద్యం దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబుతోపాటు ఇతరులను నిందితులుగా చేరుస్తూ సీఐడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం అడ్డగోలుగా మూసివేసింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి మద్యం దోపిడీకి చంద్రబాబు బరితెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దుచేసేశారు. ఆ స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కేటాయించారు. ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలు తెరచి ఊరూవాడా మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్పీ కంటే 20శాతం అధిక ధరలతో దోపిడీకి పాల్పడుతున్నారు. అంతేకాక.. నకిలీ మద్యం దందా ద్వారా కూడా భారీ దోపిడీకి తెగబడుతున్నారు. ఇలా మద్యం దోపిడీదారైన చంద్రబాబు కక్షపూరితంగా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉంది. సోదాల పేరిట వేధింపులు..ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు సోదాల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ వైపు కేఎన్ఆర్ను వరుసగా రెండోరోజు సిట్ కార్యాలయంలో విచారిస్తూనే మరోవైపు ఆయన నివాసంలో సోదాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా హంగామా చేశారు. ఆయన ల్యాప్టాప్, ఇతర వ్యక్తిగత సామగ్రితోపాటు కొన్ని కాగితాలను స్వా«దీనం చేసుకున్నారు. విదేశాల్లో చదువుతున్న కేఎన్ఆర్ పెద్ద కుమార్తె ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ఆమె పాస్పోర్ట్, మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఎంతగా అభ్యంతరం పెట్టినా పోలీసులు కనికరించలేదు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్, న్యాయవాదులు గవాస్కర్, బసవారెడ్డి పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేఎన్ఆర్ కుమార్తె పాస్పోర్ట్, ఫోన్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని నిలదీయడంతో సిట్ అధికారులు వాటిని వెనక్కి ఇచ్చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి నివాసంలో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన్ని శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. కేఎన్ఆర్ను రాత్రి 9.30 వరకు విచారించిన అనంతరం విడిచిపెట్టారు. -
డీమెరిట్ డీఎస్సీ
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మొదటి నోటిఫికేషన్ మెగా డీఎస్సీ–2025 డీమెరిట్ డీఎస్సీగా మారిపోయిందా? ఈ డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సర్కారు తప్పులు, అధికారుల విచ్చలవిడితనం వెరసి ప్రతిభగల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నా సరే వివిధ సాకులతో వారిని అనర్హులుగా చేశారు. మెరిట్లో తర్వాత ఉన్నవారికి ఆ పోస్టును ఇచ్చేశారు. కనీసం అభ్యర్థులు చెప్పింది వినకపోగా, కనీస గడువూ ఇవ్వకుండా నచ్చినట్టు చేసుకుంటూ పోయారు. తీరా డీఎస్సీ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు అన్నీ సక్రమమే అని ఆయా శాఖల నుంచి పత్రాలు తెచ్చుకున్నా.. ‘అంతా అయిపోయింద’ంటూ చేతులెత్తేవారు. దీంతో దాదాపు ఐదారేళ్ల కాలంపాటు డీఎస్సీ కోసమే కష్టపడి చదివి, పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి తీవ్ర అన్యాయమే జరిగింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయంగా పోస్టులు సృష్టించి ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం మరో డీఎస్సీలో ప్రయత్నించండి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. గ్రీవెన్స్లోనూ న్యాయం జరగని వైనం మెగా డీఎస్సీలో అన్ని అర్హతలూ ఉండి పోస్టులు రాని అభ్యర్థుల కోసం జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రెస్ సెల్స్ ఏర్పాటు చేశారు. మొదటి స్థాయిలో న్యాయం జరగకపోతే, రెండో దశలో ఆర్జేడీ స్థాయిలో పరిష్కరించాలి. అక్కడా పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలి. మొదటి రెండు స్థాయిల్లో 15 రోజుల చొప్పున, మూడో స్థాయిలో నెల రోజుల్లోనూ పరిష్కారం చేయాలి. కానీ, కింది స్థాయిలో ఒక్కటీ పరిష్కరించిన దాఖలా లేదు. మెరిట్ లిస్టు, అభ్యర్థుల ఎంపిక అంతా రాష్ట్ర స్థాయిలో పూర్తిచేసి, కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జిల్లా అధికారులు చేశారు. దాంతో తమ పరిధి కాదని తమకు వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర కార్యాలయానికి పంపినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పరిష్కార వేదికలో అభ్యర్థులకు అవమానాలే గాని న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. – అన్నమయ్య జిల్లాకు చెదిన ఓ అభ్యర్థి ఓసీ–ఈడబ్లు్యఎస్ కోటాలో ఎస్ఏ బయాలజీ పోస్టు రావాలి. తన కంటే మందున్న అభ్యర్థి గతంలో ‘బీసీ’ కోటాలో డీఎస్సీ పరీక్షలు రాశాడు. ఈసారి అతడు ఓసీ–ఈడబ్లు్యఎస్గా నమోదు చేసుకుని తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాడు. బాధిత అభ్యర్థి ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్సెస్లో ఫిర్యాదు చేయగా ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’’ అని ఓ అధికారి అవమానకరంగా మాట్లాడారని ఆవేదన చెందాడు. సూపర్ ‘నో’మరి..! సాధారణంగా ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన ఉద్యోగార్థులకు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది. ఇందులో 15,941 పోస్టులను తప్పుల తడకగా భర్తీ చేసి, మిగిలిన 406 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద మరో నోటిఫికేషన్కు బదిలీ చేశారు. ఇక్కడ అధికారులు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేయడంతో పాటు వేగంగా పని పూర్తిచేశామన్న రికార్డు కోసం తాపత్రయపడ్డారేగాని, వారి చర్యల ద్వారా అభ్యర్థులకు ఎంత తీవ్రమైన అన్యాయం జరిగిందో పట్టించుకోలేదు. నష్టపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమ నిజాయతీని నిరూపించుకున్నారు. వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కానీ అప్పటికే పోస్టుల భర్తీ పూర్తయిపోయిందని, ఆయా స్థానాల్లో మరొకరికి పోస్టింగ్ ఇచ్చేశామని చెప్పడం గమనార్హం. కోర్టు తీర్పు ప్రకారం వారికి పోస్టులు ఇవ్వాలి, అదుకోసం సూపర్న్యూమరీ పోస్టులు సృష్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు అంగీకరించడం లేదు. దీనివల్ల ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
హామీలు మరిచి ‘మహా’ నాటకం!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్లు.. సెవెన్లు ఇస్తామంటూ అందరినీ నమ్మించి రెండేళ్లైనా వాటి ఊసే లేకుండా పాలన సాగించిన చంద్రబాబు కనీసం ఈ మహానాడులోనైనా వాటి గురించి ప్రస్తావిస్తారని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశను మిగిలిస్తూ ‘డిజిటల్’ పేరుతో గొప్ప హైడ్రామాను రక్తి కట్టించారు! సూపర్ సిక్స్లు, సెవెన్లు సహా ప్రజలకు ఇచ్చిన 143 హామీలను ఎందుకు అమలు చేయలేదో.. పోనీ ఎప్పటి నుంచి చేస్తారో.. మహానాడులో కనీసం చర్చించిన పాపాన పోలేదు. చంద్రబాబు కొత్త పథకాలు ఇవ్వకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో.. అందుకు కారణాలేమిటో చెప్పలేదు. దాదాపు రూ.పది వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? వాటిని ఎప్పుడిస్తారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చి అంపశయ్యపైకి చేర్చారు. రోగులకు ‘ఆసరా’ ఊసే లేదు. అక్కచెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం మాటే లేదు. వైఎస్ జగన్ హయాంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా ప్రతి ఊరిలో కళకళలాడిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు భ్రష్టు పట్టించారంటే సమాధానం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకివ్వడం లేదో చెప్పలేదు. కనీవిని ఎరుగని రీతిలో అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లపైకి చేరుకుని అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురిస్తే దాని గురించి మహానాడులో కనీసం చర్చ లేదు. మళ్లీ సమస్య తలెత్తకుండా ఏం చేస్తారో చెప్పలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏకంగా 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయో సమాధానం లేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఎటుపోయిందో చెప్పలేదు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా స్కామ్లు చేస్తూ... ఆచరణ సాధ్యమైన రాజధాని కారిడార్ ‘మావిగన్’ ఎందుకు వద్దో చెప్పడం లేదు. మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్..! లక్షలాది మంది యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ లేదు. ఇక మహిళలకు రిజర్వేషన్లు.. చినబాబు చొరవ అంటూ మరో హైడ్రామా! వైఎస్ జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో 33 శాతం పదవులు మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో మహానాడులో చర్చ లేదు. వైఎస్ జగన్ హయాంలో మహిళలే కేంద్రంగా పాలన సాగించి సింహభాగం పథకాలతో వారికి లబ్ధి చేకూర్చితే.. మహిళా సాధికారతకు కూటమి సర్కారు తూట్లు పొడిచింది. హామీల అమలు, పాలనను గాలికి వదిలేసి ‘రెడ్బుక్’ బెదిరింపులతో అరాచకంగా వ్యవహరిస్తోంది. మొత్తంగా మహానాడులో బోరు కొట్టించే ప్రసంగాలు.. జగన్పై వ్యక్తిగత విమర్శలు మినహా ఏ ఒక్క అంశంపైనా నిర్మాణాత్మకంగా చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. పాలన పడకేసిన చంద్రబాబు సర్కారులో మట్టి నుంచి ఇసుక, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్, మద్యం దాకా దేంట్లో చూసినా దోపిడీనే..! ప్రాంగణాలు వెలవెల.. మహానాడు పేరుతో చంద్రబాబు నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ డ్రామా అట్టర్ఫ్లాప్ అయింది. టీడీపీ కార్యర్తలు కూడా ఈ డ్రామాను పట్టించుకోకపోవడంతో అన్నిచోట్లా మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయినా సరే రికార్డులు సృష్టించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. మహానాడుకు వర్చువల్గా 11 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. టీడీపీ యాప్ ద్వారా ఈ హాజరును తీసుకున్నట్లు సంబరపడ్డారు. నిజానికి మహానాడుకు స్పందన లేకపోవడంతో నాయకులు జనాన్ని తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. అనేక చోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక వచ్చిన కొద్ది మంది కూడా వెనుతిరిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని కదిపినా ఇదేం మీటింగ్? అని విసుక్కోవడం మహానాడు ప్రత్యేకతగా నిలిచింది. పోటాపోటీగా పొగడ్తలు.. మహానాడు ఆద్యంతం అదే పనిగా వైఎస్ జగన్ను తిట్టడం, చంద్రబాబును పొగిడేందుకు నేతలు పోటీలు పడ్డారు. ఎన్టీఆర్ జయంతిని నిర్వహిస్తున్నట్టుగా చంద్రబాబు జయంతిని చిరకాలం నిర్వహించేలా ‘బాబునాడు’ చేద్దామని ఆయన వేదికపైన ఉండగానే నేతలు చెప్పడాన్ని బట్టి వారి అతి ఏ స్థాయికి వెళ్లిందో చూడవచ్చు. లోకేశ్ రాష్ట్రానికి కాదు.. దేశానికి దిక్సూచి అని, పులి కడుపున పులే పుడుతుందంటూ.. ఆయన పెద్ద పులి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి అందం ఆ కుటుంబాల్లో నారా దేవాన్‡్షకే వచ్చిందంటూ మోకా ఆనంద్సాగర్ అనే నేత పొగడ్తలు కురిపించారు. వైఎస్సార్సీపీని చంపేయాలని టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ అనుచిత వ్యాఖ్యలు చేసి లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయతి్నంచారు. వీటిని వింటూ చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు. ఎన్టీఆర్ కోసం ఉత్తుత్తి తీర్మానం ఎప్పటిలానే ఈ మహానాడులో పలు ఉత్తుత్తి తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని మరోసారి ఆమోదించారు. ఈసారి ఆ తీర్మానాన్ని చంద్రబాబు పెట్టడం గమనార్హం. భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబే తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో చేయని వాటిని చేసినట్లు, జరగని వాటిని జరిగినట్లు చూపించడానికి చంద్రబాబు తాపత్రయపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా చేశామంటూ పచ్చి అబద్ధాలు చెప్పుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే అమలు చేసేసినట్లు చెప్పారు. లోకేశ్ జెన్జీ కామెడీ! మహానాడులో నారా లోకేశ్ పబ్లిసిటీకి పరాకాష్టగా ఆయన జెన్జీ యువతతో సమావేశమై సంభాíÙంచినట్లు ఓ యూట్యూబ్ లింకు ఇచ్చారు. అందులో నలుగురంటే నలుగురే పార్టీ కార్యకర్తలు కూర్చోగా వారితో లోకేశ్ పిచ్చాపాటీగా మాట్లాడారు. దాన్నే జెన్జీ సమావేశంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా షేర్ చేసుకోవడం గమనార్హం. -
‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఫైర్ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డీఎస్సీ కాదని ఒక దగా డీఎస్సీ అని అభివర్ణించారు.చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్పైనా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు. కాబట్టి నాడు ఎన్టీఆర్ హయాంలో నిర్వహించిన మహానాడుకు, ఇప్పటి ఈ మహానాడుకు మధ్య నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. వర్చువల్ మహానాడు సమావేశాలకు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని, అందుకే రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు, డ్వాక్రా మహిళలను బెదిరించి, సమావేశాలకు తీసుకొచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి తెలిపారు.ప్రెస్మీట్లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:అందుకోసమేనా మీ ‘మహానాడు’?:టీడీపీ మహానాడు సమావేశాలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి. తనకు తానే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ కామెడీ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో, అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పకుండా.. రాబోయే రోజుల్లో ఏం చేస్తారన్న దానిపైనా మాట్లాడకుండా కేవలం జగన్గారిని తిట్టడానికే మహానాడు వేదికగా మార్చుకున్నారు. వైఎస్ జగన్ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులతో విమర్శలు చేయించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైజానికి అద్దం పడుతోంది.స్త్రీ శక్తి పేరు పెట్టుకోవడం విడ్డూరం:రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మహానాడులో 1160 సార్లు జగన్ పేరు జపించారు. మహిళల కోసం పోరాడుతున్నట్లు ‘స్త్రీ శక్తి’ అంటూ మహానాడుకు పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మహానాడుకు మహిళలు రావడం లేదనే పరిస్థితిలో స్త్రీశక్తి అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెట్టారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ‘కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ అన్న డైలాగులు చెప్పింది మీ మామ బాలకృష్ణ కాదా?. చంద్రబాబు క్రెడిబులిటీని తగ్గించి లోకేష్ను హైలైట్ చేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. నటనలో భాస్కర్ అవార్డు చంద్రబాబు, లోకేష్కే ఇవ్వాలి. అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు.అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: మహానాడు తొలి రోజు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పార్లమెంట్లో మహిళా బిల్లు ద్వారా 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా లోకేష్ మహిళలకు అవకాశాలు ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అనిత.. నీకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్ గారికే తప్ప చంద్రబాబు, లోకేష్కు కాదు. దళిత మహిళలకు హోం మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర జగన్గారిది. మహిళలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019–2024 మధ్య చట్టబద్ధంగా అవకాశాలు కల్పించకపోయి ఉంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? చంద్రబాబుకు నిజంగా నీపై అంత ప్రేమ ఉంటే గతంలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇవాళ పరిస్థితులు మారడంతో మంత్రి పదవి ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడి జగన్ను తిడితే సరిపోతుంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.బూతులు. నిందలు. విమర్శలు.. ఇదే మహానాడు:మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు, నాలుగు నిందలు అన్నట్టుగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి.. 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి జగన్ గారు మీటింగ్ పెడితే మీ మహానాడు మొత్తం కొట్టుకుపోతుంది. అదే జగన్ స్టామినా. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని లోకేష్ అంటున్నారు. దేనిమీదైనా చర్చకు మేం సిద్ధం. మా ఎమ్మెల్యేలు మీతో చర్చకు వస్తారు రెడీనా? కానీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు.. మేం రాసిన రెడ్బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయని మర్చిపోతున్నారు.ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు:ఎన్నికల సమయంలో ఆడబిడ్డకు నెలకు రూ.1500, మూడు ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం అంటూ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప 22 నెలల పాలనలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్ పథకాలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు మొదటి మద్దతు తెలిపింది జగన్ గారే. ఇప్పుడు అదే విషయంపై క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు:పాలనా వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్ బయట పడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే మహానాడును వాడుకుంటున్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం అప్లోడ్ చేసిన వ్యక్తికే టాప్ ర్యాంక్ ఎలా వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలి. ఇది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాట్లాడేవాళ్లు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలి. మీది వెన్నుపోటు పార్టీ కాదా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించింది. దాన్ని తీసేసి శక్తి యాప్ తెచ్చారని, మరి దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించిన నాగ మల్లీశ్వరి, చంద్రబాబు కూటమి పాలనలో మహిళలే ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు. -
మహానాడులో చంద్రబాబుకి ‘సన్’స్ట్రోక్!
తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫీలయ్యే ‘‘మహానాడు’’ గతకొన్నేళ్లుగా రాజకీయ సెటైర్లకు కేంద్రబిందువుగా మారుతోంది. టెక్నాలజీ వినియోగంలో తాము దేశానికి మార్గదర్శకులమని చెప్పుకునే ఆ పార్టీ పెద్దకు.. ఈసారి హైబ్రిడ్ మహానాడు చేదు అనుభవమే మిగులుస్తోంది. ఈ వర్చువల్ ప్రయోగం ఆయనో షాక్లా మారడమే కాదు.. సీనియర్ల నుంచి పెదవి విరుపులకు కారణమైందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.ఒకవైపు టీడీపీ వర్గాలు, వాటి అనుకూల మీడియాలు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షల మంది వర్చువల్గా పాల్గొన్నారని భారీ లెక్కలు చెబుతుండగా.. మరోవైపు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వీడియోలు అదే మీడియా చానెళ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని మోపిదేవి సెంటర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమం అయితే ఈ విమర్శలకు ప్రధాన ఉదాహరణగా మారింది. భారీ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కుర్చీలు మాత్రం ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. “రండి బాబు రండి” అంటూ నేతలు కార్యకర్తలను బ్రతిమాలుకున్నా స్పందన ఆశించిన స్థాయిలో రాలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.నేతల తంటాలుమహానాడులో జనం ఉన్నట్లు కవరింగ్ చేసుకునేందుకు టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు లేకపోవడంతో పాత రికార్డింగ్ వీడియోలు ప్లే చేశారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు, భోజనాలు ఏర్పాటు చేసి జనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తప్పనిసరిగా హాజరు కావాలంటూ స్థానిక నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చారన్న ప్రచారం కూడా వినిపించింది.అయితే టీడీపీ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. “యాప్ రిజిస్ట్రేషన్, టైం టు టైం అటెండెన్స్, డిసిప్లిన్, వర్చువల్ కనెక్టివిటీ”తో మహానాడు ఘనవిజయమైందని చెబుతోంది. తెలంగాణ, అండమాన్ నుంచి కూడా కార్యకర్తలు పాల్గొన్నారని.. ఒక్కో క్లస్టర్లో 300 మందికిపైగా హాజరయ్యారని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది.అంతా లోకేష్ వల్లే.. ఈ హైబ్రిడ్ మోడల్ వెనుక నారా లోకేష్ సలహా కీలకంగా ఉందన్న ప్రచారం పార్టీలోనే వినిపిస్తోంది. డిజిటల్ ఫార్మాట్తో భారీ ఇంపాక్ట్ వస్తుందని భావించినా.. చివరికి అది రివర్స్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. “లోకేష్బాబు మాట వినొద్దు సర్” అంటూ కొందరు టీడీపీ సీనియర్లు ముందుగానే చంద్రబాబును హెచ్చరించారట. కార్యకర్తల ఉత్సాహం, ప్రత్యక్ష హాజరు, రాజకీయ వేడి లేకుండా మహానాడు ప్రభావం తగ్గిపోతుందని చెప్పినా.. చివరకు అదే నిజమైందన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే నడుస్తోందట. ఈ ప్రయోగం విఫలమైందనే ఫీలింగ్లో చంద్రబాబు కూడా ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.ఇదిలా ఉంటే.. గతేడాది కడపలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్ వారసత్వం, పార్టీ భవిష్యత్తు, లోకేష్ నాయకత్వంపై భారీ ఎమోషనల్ హైప్ క్రియేట్ చేసిన టీడీపీ.. ఈసారి మాత్రం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత ప్రయోగానికి వెళ్లి బొక్కబొర్లా పడింది. అప్పట్లో “ఎన్టీఆర్ దిగొచ్చి చంద్రబాబు, లోకేష్లను చూసి గర్వపడ్డారు” అన్నట్టుగా ఏఐతో వైరల్ చేసిన వీడియోలు, విజువల్స్తో నవ్వులపాలయ్యారు. ఇప్పుడు అదే లోకేష్ సూచించిన హైబ్రిడ్ మోడల్తో సొంత నేతల నుంచే విమర్శల పాలవుతోంది.“డిజిటల్ కనెక్టివిటీతో కొత్త రాజకీయ సంస్కృతి” తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈసారి వర్చువల్ మహానాడును భారీగా ప్లాన్ చేసినప్పటికీ.. గ్రౌండ్లో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం పార్టీ అంచనాలను తారుమారు చేశాయన్న చర్చ సాగుతోంది. “గతేడాది ఎమోషన్తో హైప్.. ఈసారి యాప్లతో టైప్” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ టీమ్ టెక్నాలజీ ప్రెజెంటేషన్, యాప్ అటెండెన్స్, డిజిటల్ మానిటరింగ్పైనే ఎక్కువ దృష్టి పెట్టి.. కార్యకర్తల భావోద్వేగ కనెక్ట్ను మిస్ అయ్యిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మహానాడు ముగింపునకు ఒకరోజు ముందే టీడీపీకి గ్రౌండ్ రియాలిటీని చూపెట్టింది. వచ్చే ఏడాది ఇలాంటి “వర్చువల్ ప్రయోగాలు” వద్దని పార్టీ సీనియర్లు చంద్రబాబుకి స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి టెక్నాలజీతో రాజకీయాలను మార్చేస్తామని చెప్పిన టీడీపీకి.. ఈసారి “డిజిటల్ మహానాడు” మాత్రం సోషల్ మీడియాలో సెటైర్ల సునామీగా మారిపోయింది. -
మళ్లీ అదే డైవర్షన్ కుట్ర
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన మార్కు డైవర్షన్ రాజకీయాలకు మరోసారి తెరతీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నాగం పన్నారు. అందుకు టీడీపీ వీరవిధేయ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ను మరోసారి అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు విచారణకు సంబంధించి సిట్ ఒక్కసారిగా హడావుడి చేయడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయం, సిట్ అధికారులు చకచకా కుట్ర కార్యాచరణ చేపట్టారు. కె.నాగేశ్వర్ రెడ్డి(కేఎన్ఆర్)ని సిట్ అధికారులు బుధవారం విచారించడం ఆ కుతంత్రంలో భాగమే. ఆయన్ను విజయవాడలోని సిట్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు. పోరుబాటకు జడిసి డైవర్షన్ రాజకీయం టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధపడుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో బెంబేలెత్తిన ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ కుట్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేఎన్ఆర్ను బుధవారమే విచారించాలని నిర్ణయించారు. తదనంతరం కూడా ఈ విచారణ పేరుతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. ఈ విచారణ ప్రక్రియను వక్రీకరిస్తూ.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దు్రష్పచారానికి పాల్పడాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొడుతూ ఉద్యమ పథంలో సాగుతామని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. ఇదీ సిట్ పన్నాగం మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పోలీసు జులుం ప్రదర్శిస్తోంది. ఈ కేసులో విచారణ పేరుతో పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులను వేధించి వెంటాడింది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వేధించింది. వారు చెప్పని విషయాలు చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డి తదితరులను అక్రమంగా అరెస్టు చేసింది. అయినా సరే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయింది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు అయిన అందరికీ బెయిల్ మంజూరైంది. దాంతో ప్రభుత్వం కుట్ర పూరితంగానే అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఈ అక్రమ కేసు విచారణను తెరపైకి తేవడం గమనార్హం. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కేసు విచారణ పేరుతో హడావుడి చేయాలని పన్నాగం పన్నిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బరితెగించిన టీడీపీ నేతలు.. గుడి, బడి, ప్రభుత్వాఫీసుల్లో మహానాడు
బుచ్చెయ్యపేట/పెద్దపంజాణి/శ్రీరంగరాజపురం/కంచరపాలెం(విశాఖ)/సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే బరితెగింపుతో పవిత్రమైన ఆలయాలు.. ప్రభుత్వ భవనా లని చూడకుండా ఎక్కడపడితే అక్కడ మహానాడు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఏకాదశి రోజున భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టేశారు. భక్తులు మండపం నుంచి గుడిలోకి వెళ్లకుండా అడ్డంగా కుర్చీలు వేసి, ఏకంగా ఆలయం తలుపులు మూసివేశారు. స్వామి విగ్రహానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉంచి, భారీ స్క్రీన్ ఏర్పాటుచేసి సమావేశాన్ని నిర్వహించారు. కొందరు టీడీపీ నేతలు మద్యం సేవించి హాజరైనట్లు సమాచారం. అలాగే, ఇదే జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ యోగా భవనంలోనూ మహానాడు నిర్వహించారు. ఇక ప్రైవేట్ హాల్స్లో అయితే డబ్బులు కట్టాలన్న కక్కుర్తితో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ ఎంపీడీఓ కార్యాలయంలో కానిచ్చేశారు. ఎంపీడీఓ బాలాజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయకట్టు ఆరుమాకులపల్లి గ్రామంలోని శ్రీ ఆరుమానిగంగమ్మ ఆలయ ప్రాంగణంలోనూ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నిండా జెండాలు, భారీ బ్యానర్లు, కటౌట్లు, ఏర్పాటుచేశారు. ఇది దేవాలయమా? లేక టీడీపీ కార్యాలయమా?’’ అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇదే జిల్లా గుడిపాలలో టీటీడీ కల్యాణమండపంలో, తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు ప్రభుత్వ పాఠశాలలోనూ నిర్వహించారు.సచివాలయంలో మహానాడు.. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతల అరెస్టువిశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు కస్తూరినగర్లోని సచివాలయంలో కూడా మహానాడు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కటుమూరి సతీష్, కో–ఆప్షన్ సభ్యుడు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి కంచరపాలెం పోలీస్స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.బద్వేలు మహానాడులో రికార్డు డ్యాన్స్ బద్వేలులో రికార్డింగ్ డ్యాన్సులు..మరోవైపు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు బోర్కొట్టి జారిపోతుండటంతో డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటుచేశారు. ఇది చూసి పార్టీ సీనియర్ నాయకులు ముక్కున వేలేసుకున్నారు. పొదుపు పేరుతో మరింత దుబారామహానాడుకు తడిసిమోపెడు ఖర్చు చేయించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడుకు చంద్రబాబు అనుసరించిన తీరు మాటల్లో పొదుపు.. చేతల్లో తీవ్ర దుబారా కనిపించింది. ఇంత ఖర్చుచేసినా ఈ కార్యక్రమం పూర్తిగా అట్టర్ఫ్లాప్ అయినట్లు పార్టీ నేతలు వాపోతున్నారు. వర్చువల్ సమావేశమే అయినా దీనికి సాధారణంగా అయ్యే ఖర్చుకంటే నాలుగు రెట్లు ఎక్కువ అవడంతో పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కార్యకర్తలు అక్కడకు రావడానికి ఉత్సాహం చూపించలేదు. ఈ మహానాడులో పొదుపు కంటే దుబారా ఎక్కువైంది. ఖర్చు తగ్గించడానికే ఆన్లైన్లో పెట్టామని చెబుతున్న చంద్రబాబు మాటలకు.. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్లు, ఇతర హంగులకు ఎక్కడా పొంతన కనిపించలేదు. వాస్తవానికి.. ఒకే వేదికపై మహానాడు నిర్వహిస్తే ఒక భారీ వేదిక, జర్మన్ హ్యాంగర్ టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, భారీ భోజనాలు ఉండేవి. అక్కడ ఖర్చంతా ఇద్దరు, ముగ్గురు బడా నేతలపైనే పడేది. ప్రస్తుత వర్చువల్ మహానాడులో మంగళగిరి పార్టీ కార్యాలయంలో వేసిన ఒక స్టూడియో ఖర్చు మాత్రమే అధిష్టానానిది. మిగిలిన అసలు ఖర్చంతా జిల్లాల్లోని 1,875 క్లస్టర్లలోని నేతల మీదకు నెట్టేశారు. అసలు కంటే కొసరు ఖర్చు ఎక్కువైంది.. క్లస్టర్లు అంటే నియోజకవర్గానికి కనీసం 7–10 వరకూ ఉంటాయి. ఉదా.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 8 క్లస్టర్లలోనూ విడివిడిగా టెంట్లు, కురీ్చలు, సౌండ్ బాక్సులు, ప్రతీచోటా ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్, దానికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్థానికంగా తరలివచ్చే జనం కోసం విడివిడిగా భోజనాలన్నీ కలిపి తడిసిమోపెడైంది. ఒక్కో క్లస్టర్లో కనీసం రూ.10 లక్షల ఖర్చు.. మామూలుగా అయితే మహానాడు ఖర్చు మొత్తాన్ని పార్టీ నిధుల నుండి లేకపోతే పార్టీలోని బడా నేతలు భరించేవారు. కానీ, చంద్రబాబు డిజిటల్ డ్రామావల్ల యాప్ లింక్, ఆఫీస్ లైటింగ్, వేదిక ఖర్చు తప్ప ఆయనకు పెద్దగా ఖర్చు కాలేదు. 1,875 క్లస్టర్లలో మాత్రం విపరీతంగా ఖర్చయింది. సాధారణ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుండి జనాలను బస్సులు, వాహనాలు, రైళ్లలో తరలించడంవల్ల రవాణా ఖర్చు పెరిగేదని.. దీన్ని తగ్గించేశామని చంద్రబాబు సెలవిచ్చారు. అయితే, ఈ క్లస్టర్ కేంద్రాలకు జనాలను తరలించడానికి స్థానిక నేతలు వందలాది ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేట్ వాహనాలు వినియోగించారు. కనీసంగా ఒక్కో క్లస్టర్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే, నేతలపైనే పడింది. వారు తమ నియోజకవర్గంలోని పలు కార్యాలయాలు, వ్యాపారులపై పడి వసూలుచేసినట్లు తెలుస్తోంది. రవాణా, టెంట్లు, జనాల తరలింపు మామూలే.. ఇక రవాణా, టెంట్లు, జనాల తరలింపు వంటివన్నీ తగ్గించి ఖర్చును నివారించడం వర్చువల్ సమావేశాల ఉద్దేశం. కార్యకర్తలు, నేతలు ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని మొబైల్స్లోనో, లాప్టాప్లలోనో చూసుకోవాలి. అలా కాకుండా మళ్లీ గ్రామాల్లో, మండలాల్లో టెంట్లు వేసి, మైకులు పెట్టి, వందల మందిని సమీకరించి, పెద్ద స్క్రీన్ల ముందు కూర్చోబెట్టడాన్ని ఏమనాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటే తప్ప పొదుపు ఏమాత్రం కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. బాబు సెల్ఫ్ డబ్బా కోసమే డిజిటల్ డ్రామా.. చంద్రబాబు తాను ఐటీ విజినరీనని చెప్పుకోవడానికి వర్చువల్ అనే పదం వాడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేదంతా పాత విధానమే. జనాన్ని తరలించడం, అదే టెంట్లు, అదే బిర్యానీ ప్యాకెట్లు అదే హడావుడి. కార్యకర్తలను తీసుకెళ్లి థియేటర్లో సినిమా చూపించినట్లు ఎల్ఈడీ స్క్రీన్ల ముందు కూర్చోబెట్టారు. అయినా వారు వెళ్లిపోవడంతో ఆపడానికి నానాపాట్లు పడ్డారు. చివరికి బద్వేలు నియోజకవర్గంలో అయితే ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి పరువు తీసుకున్నారు. -
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
సాక్షి, అమరావతి: రేయింబవళ్లు కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికి ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం! మళ్లీ నోటిఫికేషన్ నాటికి వయసు ఉంటుందో మీరిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సీ–2025లో కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగాలను పలువురికి ఇచ్చేదిలేదు పొమ్మంది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పటికే నియామకాలు జరిగి పోయాయని చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపోయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించగా, సర్కారు వాటినీ పెడచెవిన పెట్టింది. దాంతో అధికారులను ఇంప్లీడ్ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా దాదాపు 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీని ఎంత పారదర్శకంగా, ఘనంగా ఎలా చేపట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించామని సర్కారు పెద్దలు గొప్పలు చెబుతున్నా, తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపికప్రక్రియ పూర్తయిపోయిందని చెబుతున్న ప్రభుత్వం.. నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఆదిలోనే మెరిట్కు పాతర గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు వారి వారి అర్హతలను బట్టి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభగల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల్లో రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. వీటిల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ప్రాధాన్యక్రమంలో ఉంటాయి. ఒక ఎస్జీటీ 20 ఏళ్లకు పైగా పని చేసి, అర్హత సంపాదిస్తే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. ఈ క్రమంలో రెండు లేదా మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత ఉద్యోగం పొందాలనే కోరుకుంటారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మంది డీఎస్సీ అభ్యర్థులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025), కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని తిరస్కరించిన ఘటనలో ఏఎస్సార్ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ 3470/25 వివరాలు సర్కారు తీరుపై న్యాయస్థానం ఆగ్రహండీఎస్సీలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా, ఆప్షన్ ఇవ్వలేదన్న కారణంతో 54 మందిని ఎస్జీటీలుగా పరిగణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం విద్యా శాఖ తీరును తప్పుబట్టింది. విద్య, వైద్యంలో మెరిట్ను కాదని, కింది వారికి అవకాశం ఇస్తే ఆ దేశం నాశనం అవుతుందని తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ, కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15 నాటికి డీఎస్సీ ఎంపిక, పోస్టింగ్స్ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలిపింది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది వారి స్థానాల్లో వేరే వారిని నియమించామని చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తమ మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మీకు తోచిన సమాధానం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. రెండు నెలల్లోగా వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని జనవరిలోనే తీర్పునిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధితులు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిపోయిందని, కొత్తగా ఎవరికీ ఉద్యోగాలు ఇచ్చేది లేదని అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ బెదరింపు ధోరణి ప్రదర్శించినట్టు బాధితులు వాపోయారు.తప్పుపై తప్పులకు నిదర్శనాలెన్నెన్నో..⇒ 200 మందికి పైగా అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.⇒ డీఎస్సీలో మెరిట్ సాధించినా పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేక పోవడంతో వారికి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025) వేశారు. ఇందులో డీఎస్సీ నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజును ప్రధాన ప్రతివాదిగా చేర్చారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ (4261/25), బి.సరస్వతి (3585/25), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రాయల్ (3130/ 25) స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు (స్పోర్ట్స్ కోటా) ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించి తమ తప్పులేదని నిరూపించుకున్నారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్ (1347/26) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినా మెరిట్ కం రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. తమకు అన్యాయం జరిగిందని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, వారికి పోస్టు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (3470/25) ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా, కుల ధ్రువీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దాంతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల కమిటీని వేసి దుర్గాప్రసాద్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ సరైనదేనని నిర్ధారించారు. కానీ, అతనికి పోస్టు ఇవ్వలేదు. ఇదే కోవలో తిరుపతి జిల్లాకు చెందిన ఎ.శిరీష (3060/25) ఉద్యోగాన్ని కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ అని తిరస్కరించారు. ఆమె కూడా తన సర్టిఫికెట్ సరైనదేనని నిరూపించుకున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.⇒ గుంటూరుకు చెందిన జి.రాజేశ్ దినకర్ (1335/26) ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ ‘ఫేక్’ అని ఎస్ఏ పోస్టు తిరస్కరించారు. దాంతో మరోసారి గుంటూరు వైద్యుల కమిటీ ముందు హాజరై సచ్చీలతను నిరూపించుకున్నారు. సదరం సర్టిఫికెట్ సరైనదేనని ధ్రువీకరించినా పోస్టు ఇవ్వలేదు. -
బాబు రాక్షస పాలనపై పోరు
‘‘స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది’’‘‘స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనసులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి ప్రయత్నం చేయాలి. ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరువొద్దు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను సీరియస్గా తీసుకుంటా’’‘‘కుప్పంలో టీడీపీకి 20 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తోంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతి సారీ తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇది కుప్పంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల వరకు మన ఓట్లు పోయినట్టే!’’ -పార్టీ నేతలతో భేటీలో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం, దగా, వంచనను వివరిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు..’ పేరుతో రూపొందించిన బుక్లెట్ను వైఎస్ జగన్ విడుదల చేశారు. అది గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ప్రతి కార్యకర్త వద్ద ఆ బుక్లెట్ ఉండాలని.. డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై వైఎస్ జగన్ ప్రధానంగా చర్చించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసినా దీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వారిని ఇప్పటి నుంచే గుర్తించాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి ప్రతి అడుగులో తోడుగా నిలవాలని నిర్దేశించారు. స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి తమకు అండగా నిల్చారన్న భావన స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరిలో కలిగేలా చొరవ చూపాలని సూచించారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా పని చేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని.. ఒకవేళ అలా జరిగితే అది అక్కడి ఇన్ఛార్జ్ వైఫల్యంగా భావిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్ జగన్ గట్టిగా సూచించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశి్చమ బెంగాల్, తమిళనాడులో ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ‘సర్’ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఓట్లు తగ్గినా.. పెరిగినా డేంజరేనని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు బాబు రాక్షస పాలన.. ‘ముసలి పులి.. బంగారు కడియం’ రెండేళ్ల చంద్రబాబు పాలన గురించి నాకన్నా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా చక్కగా చెబుతాడు. చంద్రబాబు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూసిన తర్వాత.. ‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’ అని రుజువైంది. వెన్నుపోటు.. విధ్వంసం.. అరాచకం.. అబద్ధాలు.. డైవర్షన్ పాలిటిక్స్.. దోపిడీ.. అవినీతి.. ఇదే ఈ రెండేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలన! ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్పా.. ‘ఒక ముసలి పులి. బంగారు కడియం’ కథ! చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని! ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు మన కళ్ల ఎదుటే చూశాం. ఆ రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబునాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు. సూపర్ సెవెన్ అన్నాడు. మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది. మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్క చెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానన్నావు కదా! రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అని అడిగితే మాట రాదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా నిరుద్యోగ భృతి అని చదువుకున్న ప్రతి పిల్లాడికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు.. రెండేళ్లకు రూ.72 వేలు ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి కేటాయింపులు లేవు కదా? అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా కనిపించదు. దీనిపై అడిగితే మాత్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్కడన్నా పొరపాటున చంద్రబాబునాయుడును నిద్రలేపి మావిగన్ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడులో ఇవన్నీ చూస్తున్నాం. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు పెట్రో ధరల తగ్గింపుపైనా మోసమే.. చంద్రబాబు 143 హామీల్లో మనందరికీ ప్రధానంగా పెట్రోలు, డీజిల్ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఈరోజు లీటరు పెట్రోలు రూ.117 దాటింది. లీటరు డీజిల్ చూస్తే రూ.105 దాటింది. పెట్రోలు, డీజిల్ ధరలు అధికారంలోకి రాగానే తగ్గిస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్పై విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. అందుకే బాబు డైవర్షన్ పాలిటిక్స్.. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు తాను ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మినహా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో నేను ఈ మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి. ప్రజలను ఈ టాపిక్ నుంచి.. ఆ టాపిక్ లోకి మభ్య పెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్యవంతులు. గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పగలం.. రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగు పడిందన్నా.. నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా.. పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా.. ఒక రైతు బాగుపడ్డాడు అన్నా.. ఒక అక్కచెల్లెమ్మ బాగు పడిందన్నా.. ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడ్డాడన్నా.. ఇవన్నీ ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్సార్సీపీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతా. మంచి చేశాం అని చెప్పి కాలర్ ఎగరేసుకుని.. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పర్చేందుకు ఒక బుక్లెట్ను రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కార్యకర్త వద్ద ఉండాలి.. ప్రతి ఇంటికీ చేర్చాలి బుక్లెట్లో అన్ని అంశాలను క్షుణ్నంగా మనం చదువుకోవడమే కాకుండా మన పారీ్టలో ప్రతి కార్యకర్తకు ఈ రెండేళ్ల పాలనలో ప్రతి అంశం మీద అవగాహన ఉండేలా రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది మనం నిర్వహించిన ర్యాలీలు కార్యక్రమం అప్పట్లో బాగా జరిగింది. రెండో ఏడాది కూడా చంద్రబాబునాయుడు పాలన మీద నిరసన తెలుపుతూ అంతకన్నా ఇంకా గొప్పగా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటినీ జూన్ 4 నుంచి 12 వరకు పార్టీ తరఫున చేపడుతున్నాం. ‘సూపర్హిట్’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం..ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి.. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో.. ఒక్క చంద్రబాబునాయుడు తప్ప. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ ఇందుకే..‘చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు..’ బుక్ లెట్లో సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లతో ఏరకంగా ఆయన మోసం చేశాడనే దగ్గర నుంచి.. ఏ రకంగా విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టి పిల్లలను రోడ్ల మీదకు తెచ్చాడనే పరిస్థితి నుంచి.. ఆరోగ్యశ్రీ దుస్థితి, విద్య, వైద్యం, వ్యవసాయం ఏరకంగా కుప్పకూలిపోయింది? అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి? లాంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అవినీతి అన్నీ కూడా క్లుప్తంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఈ బుక్లెట్ రూపొందించడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకూ చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ బుక్లెట్ వివరాలు అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం.చంద్రబాబుకి సెగ తగిలేలా నిరసన కార్యక్రమాలు ఇలా.. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలను ఒకవైపు ఎస్ఐఆర్, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుకు సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ‘ఈనాడు’లో ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కాపీ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫొటోలతో సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్ల కాపీలు.. (ఇవి నెట్లో, బుక్లెట్లో అందుబాటులోనే ఉన్నాయి) ప్రతి మండల కేంద్రంలో 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్చార్జి పాలు పంచుకోవాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకుని కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించాం. తరువాత జూన్ 8, 9వ తేదీల్లో వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు ఉంటుంది. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్లోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది. చివరగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేను పర్యవేక్షిస్తా. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘త్యాగాల పండుగ బక్రీద్. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ పండగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్సార్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్ మండిపడ్డారు.వైఎస్ జగన్ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే, ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని, బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నేతలు ఇంకేమన్నారంటే..బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా?: చెల్లుబోయిన వేణు2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ బీసీ ఉపముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీల్లో కాపు సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే యోగ్యత లేదా ? బీసీలు ఏమీ అడగరనే ధైర్యమా ? బీసీల ఆత్మగౌరవ, ఆత్మక్షోభకు కారకులు మీరు కాదా ? ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసినా రాజ్యాధికారం పొందలేని స్ధితిలో ఉన్న అనేక కులాలు నాడు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు. కానీ మీరు ఎన్నో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ? వెనుకబడ్డ కులాల్ని ఇంకా వెనక్కు నెట్టేశారనడానికి ఇదే నిదర్శనం కాదా ?ఆనాడు వైఎస్ జగన్ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పోరేషన్లు ఇస్తే .. మీరు ప్రతీ రోజూ ఏ కార్పోరేషన్ కూ భవనాలు లేవు, రూములు లేవని రోజూ విమర్శలు చేసారు. ఇప్పుడు మీరు 40 కార్పోరేషన్లను మాత్రమే వేసి మిగతా 16 కార్పోరేషన్లను వదిలేశారు. బీసీలు చైత్యనం కావాల్సిన అవసరం ఉంది. అబద్దాలకు వేదికగా మహానాడు పెట్టి తన మోసాల్ని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసిన పార్టీ టీడీపీ. అందుకే రాష్ట్రంలో బీసీ సమాజం చంద్రబాబు మోసంపై ఆగ్రహంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు బీసీల ద్రోహి. చంద్రబాబు అబద్దాల్ని నమ్మి బీసీలు రెండు, మూడు తరాలు వెనక్కిపోయారు.బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధం: జోగి రమేష్రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహానాడు వేదికగా చంద్రబాబు మాటమాటలు, లోకేష్ అబద్దాలు వింటుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. 2019-2024 వరకూ వైఎస్ జగన్ పాలనలో వెనుకబడిన వర్గాలంతా ఎంతో ధైర్యంగా ఉన్నారు. స్పీకర్, కేబినెట్ మంత్రి పదవుల నుంచీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల నుంచీ, రాజ్యసభ సీట్ల వరకూ ఇచ్చి ఢిల్లీకి కూడా పంపారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో చోటిచ్చిన ఆ మహనీయుడి పరిపాలన ఎక్కడా ? అని వెనుకబడిన వర్గాలు ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బలహీన వర్గాలు చెప్పిన 50 ఏళ్లు దాటితే ఇస్తానన్న పెన్షన్ ఏమైంది ? 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మోసం చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చేయూత మోసాలు కనిపిస్తున్నాయి. జగనన్న పాలనలో బలహీన వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ల ఆరోగ్యాల్ని కాపాడారు. అభివృద్ది, సంక్షేమంపై చర్చకు సిధ్దమంటున్న లోకేష్.. దానికి టైమ్, ప్లేస్ కూడా చెప్పాలని బీసీ మాజీ మంత్రులుగా అడుగుతున్నాం. బీసీ వర్గాలకు మా జగనన్న చేసిందేంటో, మీరు చేస్తోంది ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాం.బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు: విడదల రజనిబీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా జగనన్న.. ఐదేళ్ల పాలనలో బీసీల పట్ల తనకున్న ప్రేమను, బీసీల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఎలా అడుగులు వేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. దీని వల్ల బీసీలు ఎలా లబ్దిపొందారో కూడా చూసారు. కానీ అదే బీసీల్ని చంద్రబాబు ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నారు. బీసీలకు ఏ విధమైన అభివృద్ది కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మహానాడులో బీసీలకు ఏదేదే చేసేశామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బీసీల సంక్షేమం కోసం పాటుపడింది, వారికి న్యాయం చేసింది వైఎస్ జగనే.మ్యానిఫెస్టోలో సైతం రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అంతకు మించి ఖర్చుపెట్టిన చరిత్ర జగన్ ది. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. తన రెండో కేబినెట్ లో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారు. మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి నిదర్శనం. కానీ చంద్రబాబు ఎన్నికల్లో బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారికి సరైన న్యాయం ఎప్పుడూ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా బీసీ మాజీ మంత్రులు .. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.బీసీలపై తప్పుడు కేసులకు భయపడబోం: కారుమూరి నాగేశ్వరరావురెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని గాలికొదిలేసి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ అన్యాయం చేసింది. ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని తప్పుడు విమర్శలు చేశారు. కానీ ఆయన చేసిన 3.30 లక్షల కోట్ల అప్పుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ నోటితోనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు రెండేళ్లలోనే 3.50 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటిని ఏం చేశారో చెప్పుకోలేని దుస్దితిలో ఉన్నారు. ఆనాడు వైఎస్ జగన్ నాకు మంత్రి, నా కొడుక్కి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 38 ఎమ్మెల్సీల్లో 18 ఎమ్మెల్సీల్ని, 9 మంది మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లలోనూ సింహభాగం బీసీలకు ఇచ్చారు.రాష్ట్రంలో బీసీ బిడ్డలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చలవే. ఇప్పుడు ఎక్కడో యుద్దం జరుగుతుంటే పిల్లలకు డ్రెస్సు లేదు, బుక్స్ లేవంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పత్రాల్లోనే మిగిలిపోయాయి. మీరు నా మీద, నా కొడుకు, కోడలి మీద కేసులు పెట్టినా భయపడేది లేదు. మేం తప్పుచేయలేదు కాబట్టి భయపడబోం, ప్రాణత్యాగానికైనా సిద్దం. బీసీ వర్గాల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.బీసీల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారు: బుట్టా రేణుకబీసీలకు ఆర్దికంగా, సామాజికంగా అండగా నిలబడి, వారిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. బీసీ మహిళలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి,జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ పథకం కూడా ఇవ్వకుండా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.ఈ రెండేళ్లలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. మా ప్రభుత్వంలో చేసిన దానికీ, మీరు చేసిన దానికీ తేడా ఏంటో చూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ప్రతీ దాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో చంద్రబాబుకు తెలుసు. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముందుకెళ్తాం. మేం ఎప్పుడూ సాధ్యమయ్యేదే చెప్తాం, దాన్నే అమలు చేసి చూపిస్తాం.బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కారుమూరి సునీల్బీసీలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. మహిళలకు ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తామని, అన్నీ గాలికొదిలేశారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అమలు చేసిన ఏ ఒక్క పథకం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డీఎస్సీలో చేసిన మోసంతో ఎంతో మంది బీసీ అభ్యర్ధులు ఇబ్బందిపడుతున్నారు. బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. త్వరలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టబోతున్నాం. -
బీటెక్ రవిపై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆగ్రహం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి పులివెందుల ప్రజలకు కన్నం వేశారు. బైరెటీస్ డంపులను అక్రమంగా అమ్ముకున్నారు. రాత్రికి రాత్రే ముగ్గురాయిని తవ్వుకుని దోచుకున్నారు. మూడు టన్నుల బైరెటీస్ దోచుకుంటే కనీసం కేసు పెట్టలేదు. బీటెక్ రవిని చట్టం ముందు నిలబెడతాం. ఉల్లిమెల్ల తోటకు ఎందుకొచ్చాడో బీటెక్ రవి చెప్పాలి. ఎంపీటీసీ పదవి కోసం ఒక ప్రతిపాదనతో బీటెక్ రవి వచ్చాడు. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీలో చేరాలనుకున్నాడు’అని వ్యాఖ్యానించారు. -
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
సాక్షి, అమరావతి: మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పని అధికారులు.. అంతా సక్రమంగా ఉన్నట్టు బుకాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంకు వచ్చింది నిజామా? కాదా?. మెరిట్ లిస్ట్లు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటూ నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. -
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్తో చంద్రబాబు చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నానిమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సర్’కు సహకరించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. సచివాలయంలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమం అమలుపై చర్చించారు. అర్హత కలిగిన పౌరుడి వివరాలు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావడం.. చనిపోయినవారు, బహుళ ఓట్లు కలిగినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులను జాబితాలో లేకుండా చూడడమే ‘సర్’ ప్రధాన ఉద్దేశమని వివేక్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రతినిధులు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఏఎన్ఎన్ మూర్తి, ఎన్.చంద్రశేఖర్రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎ.వెంకటేశ్వరరావు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 5 నుంచి సిబ్బందికి శిక్షణ.. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు అర్హత తేదీని ఈ ఏడాది జూలై 1గా నిర్ణయించినట్లు వివేక్ యాదవ్ వెల్లడించారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. జూన్ 5 నుంచి 14 వరకు సన్నాహక కార్యక్రమాలు, శిక్షణ, గణన ఫారాల ముద్రణ చేపడతామన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి గణన ఫారాల పంపిణీ, సేకరణ చేస్తారని చెప్పారు. జూలై 14 వరకు పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణ కొనసాగుతుందన్నారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం కలి్పస్తామని తెలిపారు. నోటీసులు, విచారణలు, దావాలు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెపె్టంబర్ 18 వరకు కొనసాగుతుందన్నారు. తుది ఓటరు జాబితాను సెపె్టంబర్ 22న ప్రచురించనున్నట్లు తెలిపారు. కారణాలు, విచారణ లేకుండా తొలగించంఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పాక్షికంగా నింపిన గణన ఫారాలను అందజేస్తారని వివేక్ యాదవ్ చెప్పారు. ఓటర్లు వాటిని ధ్రువీకరించి తిరిగి సమర్పించాలని సూచించారు. గణన ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబోమన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే.. బీఎల్వోలు కనీసం మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు. కొత్తగా ఓటరు అర్హత పొందిన వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సవరణలు లేదా బదిలీల కోసం ఫారం–8, అభ్యంతరాలు, తొలగింపుల కోసం ఫారం–7 వినియోగించాలని కోరారు. ఏ వ్యక్తి పేరును కూడా విచారణ లేకుండా, కారణాలతో కూడిన ఉత్తర్వు జారీ చేయకుండా ఓటరు జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. ఆధార్ కేవలం గుర్తింపు మాత్రమేనని, అది పౌరసత్వం లేదా నివాసానికి చట్టబద్ధమైన రుజువు కాదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల చట్టాల ప్రకారం గర్తింపు నిర్ధారణ కోసం ఆధార్ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.ఎస్ఐఆర్ అర్హత తేదీ: 2026 జూలై 1 ఇంటింటి సర్వే: జూన్ 15 నుంచి జూలై 14 వరకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: జూలై 21 అభ్యంతరాల స్వీకరణ: జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాల పరిష్కారానికి గడువు: సెప్టెంబర్ 18 తుది ఓటర్ల జాబితా విడుదల: సెప్టెంబర్ 22 -
అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో అర్హులైన ఓటర్లను ఒక్కరిని తగ్గించినా ఒప్పుకునేది లేదని వైఎస్సార్ సీపీ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని.. రాజకీయ పార్టీలు ఇప్పటికే సమర్పించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాను అధికారికంగా ఆథరైజ్ చేయాలని స్పష్టం చేసింది.వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి మంగళవారం వెలగపూడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో సమావేశం అనంతరం వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం చేపట్టటానికి వీల్లేదన్నారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటును కూడా తొలగించవద్దని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ను కోరినట్లు పేర్ని నాని తెలిపారు. పార్టీల సమక్షంలోనే ‘సర్’ ప్రక్రియ జరపాలిఉత్తర భారత దేశం పలు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్) పేరు మీద చాలా విచిత్రాలు జరిగాయి. దీనివల్ల అనేకమంది అర్హులైన ఓటర్లకి ఓటు లేకుండా పోయిందని వార్తల్లోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అలా కాకుండా ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలి. రాజకీయ పార్టీలు ఇప్పటికే సమర్పించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాను అధికారికంగా ఆథరైజ్ చేయాలి. బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేసేటప్పుడు, ఖచ్చితంగా రాజకీయ పార్టీల ప్రతినిధులైన బీఎల్ఏలను కూడా తమ వెంట పెట్టుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.18 ఏళ్లు నిండిన, అర్హులైన ఏ ఒక్క ఓటరుకు కూడా రాష్ట్రంలో ఓటు లేకుండా పోకూడదు. 2002లో చివరిసారిగా ఇటువంటి ‘సర్’ జరిగింది కాబట్టి దానిని ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. అందువల్ల 2002 నాటి ఓటర్ల ముసాయిదాను కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరాం. అలాగే 2025 జనవరి 25 తర్వాత పబ్లిష్ అయిన సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్లు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. కాబట్టి 2025 జనవరి నుంచి ఈ నెల 25 వరకు నమోదైన ప్రతి ఓటరు లిస్టును రాజకీయ పార్టీలకు అందించాలి.2002లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉంది కాబట్టి ఇక్కడి పౌరులలో చాలామందికి అప్పట్లో తెలంగాణలో ఓటు ఉండే అవకాశం ఉంది. అందువల్ల బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లినప్పుడు వారి ఫోన్లలో ఉండే యాప్లో 2002 ఓటర్ లిస్ట్కు సంబంధించిన డేటా (తెలంగాణ లేదా భారతదేశంలో ఎక్కడ ఓటు ఉన్నా సరే) చూసుకునే వీలుండాలి. యాప్లో ఆ సదుపాయం ఖచ్చితంగా కల్పించాలని మేం కోరగా అందిస్తామని సీఈఓ చెప్పారు. ఓటర్లు ఇంట్లో అందుబాటులో లేకపోతే, విదేశాల్లో ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా ఫారమ్ను పూర్తి చేసి సమర్పించే అవకాశాన్ని కల్పించాలి.డూప్లికేట్ ఓట్లు లేదా డబుల్ ఓట్లు (ఒకే మనిíÙకి రెండు లేదా మూడు ఊర్లలో, ఒకే నగరంలో రెండు డివిజన్లలో, లేదా రెండు రాష్ట్రాలలో ఓట్లు) లేకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘానిదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. డబుల్ ఓటు అనేది లేకుండా ఉండేలా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ‘సర్’ ప్రక్రియపై అనేక రాష్ట్రాల్లో అల్లర్లు, రచ్చ జరిగిందని, అనేక సందేహాలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ అలాంటిదేమీ జరగకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలన్నింటి సమక్షంలోనే ప్రక్రియ జరపాలని కోరాం. అత్యంత పారదర్శకంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. –పేర్ని నాని, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిరాష్ట్రంలో అలా జరగకూడదు.. ఇటీవల దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మన దేశ పౌరులై ఉండి గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న లక్షలాది మంది ఓట్లను బెంగాల్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో తొలగించారు. మన రాష్ట్రంలో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా నిజాయితీగా జరగాలని కోరాం. పేదలు, దళితులు రోజువారీ కూలీ పనుల కోసం ఉదయమే వెళ్తారు.కాబట్టి ఉదయం 7 నుంచి 10 గంటల లోపు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సూచించాం. గతంలో హైదరాబాద్ లేదా తెలంగాణలో ఓటు ఉండి, ఇప్పుడు ఇక్కడి ఓటర్ లిస్ట్లో పేరు లేని వారు ఓటు హక్కును కోల్పోకూడదు. అందుకోసం నాటి ఓటర్ల లిస్ట్లను కూడా ఇక్కడి అధికారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. ఇంటికి వచ్చినప్పుడు వెబ్సై ట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో 2002 తెలంగాణ ఓటర్ లిస్ట్ కూడా చూసే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు. –వై.వెంకటేశ్వరరావు, సీపీఎం కార్యవర్గ సభ్యుడురాజకీయ ఉద్దేశాలతోనే విమర్శలు దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ‘సర్’ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇదేదో ఇప్పుడు కొత్తగా జరుగుతున్న విషయం కాదు. దేశంలో చొరబాటుదారులను గుర్తించడంలో, చనిపోయిన వారి వివరాలను తొలగించడంలో, అలాగే అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడంలో ఎన్నికల కమిషన్ అత్యంత పారదర్శక విధానంతో వ్యవహరిస్తోంది. ఇటీవల మిగతా రాష్ట్రాలలో ఎన్నికలను గమనిస్తే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం భారీగా పెరగడానికి ఈ శుద్ధి ప్రక్రియే ప్రధాన కారణం. కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో, బురదజల్లేందుకే ఈ ప్రక్రియపై విమర్శలు చేస్తున్నాయి. –నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి -
జూనియర్కు అందలం.. సీనియర్లకు అగాధం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)గా కాకినాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎంఈ కార్యాలయంలోనే ఏడీఎంఈగా పనిచేస్తున్న డాక్టర్ రఘునందన్కు తొమ్మిది నెలల కిందట డీఎంఈగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) ఇచ్చారు.ఉన్నట్టుండి ఆయన్ను విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్గా నియమించి, ఆ స్థానంలో డాక్టర్ విష్ణువర్ధన్ను నియమించడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ నియామకం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన సీనియర్లకు అన్యాయం చేస్తూ ఎడీఎంఈ సీనియార్టీ 19వ స్థానంలో ఉన్న విష్ణువర్ధన్కు డైరెక్టర్ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈయన సీఎం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అత్యంత జూనియర్ అయినప్పటికీ అందలం ఎక్కిస్తున్నారని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీలకు అన్యాయం చేస్తూ.. డీఎంఈ స్థానం నుంచి వైదొలగుతానని డాక్టర్ రఘునందన్ చెప్పారని ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత సీనియారీ్టలో ఉన్న వారిని ప్రభుత్వం కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండా నేరుగా 19వ స్థానంలో నున్న వ్యక్తిని నియమిస్తుండటం గమనార్హం. విష్ణువర్ధన్ కంటే ముందు 10 మంది వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజక వర్గాలకు చెందిన వైద్యులు ఉన్నారు. ఎఫ్ఏసీ ఇవ్వడానికి అన్ని అర్హతలున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరినీ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.దీంతో చంద్రబాబు, ఆయా వర్గాల వారికి అత్యున్నత స్థానాల్లో కూర్చునే అవకాశం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాబు గద్దెనెక్కిన వెంటనే ఆయన సామాజికవర్గానికి చెందిన వారు పొరుగు శాఖల నుంచి డిప్యుటేషన్పై వైద్య శాఖలోని కీలక పోస్టుల్లో తిష్ట వేయడం మొదలు పెట్టారు. రూ.వేల కోట్ల వైద్య పరికరాల కొనుగోళ్లు చేపట్టే ఏపీఎంఎస్ఐడీసీలోని కీలక స్థానంతో పాటు, మరో పోస్టులోనూ వారే ఉన్నారు.ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో కీలక హోదాలో పొరుగు శాఖలోని సీఎం సామాజికవర్గానికి చెందిన అధికారి నియామకం కోసం వైద్య శాఖలో ఫైల్ ముందుకు కదులుతోంది. గతంలోనూ సదరు ఆ అధికారి ట్రస్ట్లో డిప్యుటేషన్పై పనిచేశారు. అప్పట్లో ఆరోపణలు రావడంతో డిప్యుటేషన్ రద్దు చేసి వెనక్కు పంపారు. ఈయన తిరిగి ట్రస్ట్లోకి రావడానికి ప్రయతి్నస్తున్న క్రమంలో కొందరు ఉద్యోగులు సైతం ఉన్నతాధికారులను కలిసి గతంలో జరిగిన విషయాలను మొరపెట్టుకున్నట్టు సమాచారం. ప్రమోషన్ పొందిన 15 మందికి పోస్టింగ్స్ ఇటీవల ప్రొఫెసర్ నుంచి ఏడీఎంఈలుగా ప్రమోషన్ పొందిన 15 మందికి ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాజమండ్రి ప్రిన్సిపల్గా డాక్టర్ ఎం.ఎస్ రాజును, డీఎంఈ కార్యాలయంలో ఏడీఎంఈగా డాక్టర్ కేవీవీ సత్యనారాయణమూర్తి, కాకినాడ ప్రిన్సిపల్గా డాక్టర్ పి.ఉషాకిరణ్, పాడేరు ప్రిన్సిపల్గా డాక్టర్ బసుమిత్రదాస్, పిడుగురాళ్ల ప్రిన్సిపల్గా డాక్టర్ గోవింద్ నియామకం కానున్నారు. ఒంగోలు ప్రిన్సిపల్గా డాక్టర్ శివాని, విమ్స్ డైరెక్టర్గా డాక్టర్ మన్మథరావును ఖరారు చేశారు.


