Women Power
-
నాటి నర్స్.. నేటి ఆరోగ్య మంత్రి
ఢిల్లీలోని ఎయిమ్స్లో... నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. నేడు నేపాల్ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం చూశాం. అయితే నేపాల్లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్తో అనుబంధం ఉండటం మరో విశేషం.ఎయిమ్స్లో చదువుకునినేపాల్లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్ యూనివర్సిటీలో నర్సింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లతా వెంకటేశన్ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్లోని బి.పి.కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో క్లినికల్ నర్స్గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.నర్స్గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు. -
చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!
60 దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఈ బామ్మ 103 ఏళ్ల వయసులోనూ టీ స్టాల్ నడుపుతూ స్ఫూర్తిగా నిలిచింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలన్న ఆమె దృఢసంకల్పానికి హ్యాట్సాప్ అనాల్సిందే. అంతేగాదు కష్టపడేతత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ బామ్మ ప్రూవ్ చేసింది.ఆ బామ్మే గుజరాత్లోని వడోదరకు చెందిని 108 ఏళ్ల కాశీబా. ఆమె మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం సమీపంలోని చొన్న టీ స్టాల్ నడుపుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందామె. ఆమె అల్లం టీకి ఉన్న క్రేజీ అంత ఇంత కాదు. అక్కడ విద్యార్థులకు దశాబ్దాలుగా తన టీ రుచితో ఆకర్షిస్తుంటుందామె. స్వయంగా ఆమె అల్లం తురిమి తయారు చేస్తుంటుంది ఈ బామ్మ. ఆమె వయసులో అందరూ విశ్రాంతి ఆశిస్తారు..కానీ ఆమె అచంచలమైన సంకల్పంతో తన చిరు వ్యాపారాన్ని నడుపుతూ ఆత్మనిర్భరతకు అసలైన అర్థంగా మారింది. 1993 నుంచి ఆమె ఈ టీస్టాల్ని నడుపుతుంది. అక్కడ ఎందరో విద్యార్థులకు అదొక మధుర జ్ఞాపకాల ప్రదేశం. కొందరు విద్యార్థులు అక్కడకు వచ్చి స్నేహితులతో కలిసి ఈ బామ్మ చేతి టీ తాగుతూ నాటి మధురస్ముతులను గుర్తుచేసుకుంటుంటారట. ఆమెకు కొడుకు, కోడలు, మనవళ్లు ఉన్నా..తను మాత్రం స్వతంత్రంగా బతికేందుకే ఆసక్తి కనబరుస్తుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ బామ్మ..అందంగా జీవించడం అంటే ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sakshi Singh l Journalist (@_.sakshieee) (చదవండి: కేవలం 'ఫ్లవర్ అనుకుంటివా.. పోషక విలువలున్న ఫుడ్'..!) -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
అక్షరాల... సినిమా బయోపిక్
ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్ రోల్ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత అయి, శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం. పైగా, రచయిత్రి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవితకథ ‘సావిత్రి’ లాంటివి గతంలో బెస్ట్ సెల్లర్స్ కావడమూ అందుకు నిదర్శనం. ఆ రకమైన రచనా సంవిధానంలో మెప్పించే మెరుపులు చాలానే ఉంటాయి కానీ, కొన్నిసార్లు... అసలు జరిగిన వాస్తవమేదో, కొసరు కవికల్పన ఏదో తెలియనంతగా పాలు, నీళ్ళు కలసినట్టు సాగిపోతాయి. వీలైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను పేర్కొంటూనే, సంఘటనను నాటకీయంగా చెప్పడంలో రచయిత నిజాయతీ, నైపుణ్యం రాణకెక్కుతాయి. ఉత్తమ పత్రికా రచయితగా నంది అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తన తాజా ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచనలో అక్షరాలా చేసినది అదే!ఒక మంచి ఇతివృత్తం చేయి తిరిగిన వ్యక్తి చేతిలో పడినప్పుడు అది కొత్త సొబగులు సంతరించుకోవడం సహజం. రచయితగా, పత్రికా రచయితగా ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న భగీరథ ఈ రచనలో దాన్ని సమర్థంగా వినియోగించారు. ఇటీవల ఎన్టీఆర్పై ‘తారకరామం’, ‘శకపురుషుడు’ లాంటి పుస్తకాలు, అలాగే కృష్ణదేవరాయల కాలంపై రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ ద్వారా నవతరం పాఠకులకు సైతం ఆయన సుపరిచితులే. సినీ సుప్రసిద్ధుల జీవిత కథలు రాయడం కూడా ఆయనకేమీ కొత్త కాదు. గతంలో నటి జమున అంతరంగావిష్కరణ ‘జమునా తీరం’, భాగ్యనగర్ స్టూడియోస్ వ్యవస్థాపక అధినేత బాదం రామస్వామిపై ‘మహర్జాతకుడు’, హీరో జగపతి బాబు తండ్రి – ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్పై ‘దసరా బుల్లోడు’ లాంటి సినీ జీవిత కథలు ఆయన కలం నుంచి వచ్చి, అశేష ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు అలనాటి హీరోయిన్ కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్. అనూరాధాదేవి పనుపున భగీరథ ఈ ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచన చేశారు. కృష్ణవేణి జీవితంతో పాటు ఆ సమకాలీన పరిస్థితుల్ని రచనలో ప్రతిబింబించేందుకు రచయిత కసరత్తు చేశారు. నిజానికి, నటుడు ఎన్టీఆర్ – సంగీత దర్శకుడు ఘంటసాల – సుస్వరాల రమేశ్ నాయుడు... ఇలా ఎందరో మహామహుల్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డగా సవతి తల్లితో ఇబ్బందులు పడడం, పిన్ని – బాబాయ్ వద్ద పెరగడం, రంగస్థలంపై ఆసక్తి పెరగడం, అప్పట్లో భానుమతి, రేలంగి, అంజలీదేవి సహా ఎందరినో స్టార్లుగా తీర్చిదిద్ది ‘తారాబ్రహ్మ’గా పేరొందిన సినీ దర్శక – నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహం లభించడం, ఎనిమిది – తొమ్మిదేళ్ళ వయసులోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ’లో టైటిల్ రోల్ పోషించడం, పితృసమానుడైన పుల్లయ్య గారి మీద అపార గౌరవంతో యర్రంశెట్టి కృష్ణవేణి కాస్తా చిత్తజల్లు కృష్ణవేణిగా మారడం, ఆ పైన హీరోయిన్గా రాణించడం, మీర్జాపురం రాజా వారు (మేకా వెంకట్రామయ్య అప్పారావు)తో వివాహం, భర్త జస్టిస్ పార్టీ అయితే తాను కాంగ్రెస్ సానుభూతిపరురాలిగా ‘మన దేశం’ (1949) లాంటి చిత్ర నిర్మాణం సాగించడం, ‘కీలుగుర్రం’ – ‘గొల్లభామ’, 'లక్ష్మమ్మ' లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాల రూపకల్పన లాంటి తొలినాళ్ళ సినీ చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఈ రచనలో చదవవచ్చు. నిండు నూరేళ్ళు జీవించిన ఆమె ప్రస్థానంలోని అనేక ఘట్టాలను చదువుతుంటే... అచ్చంగా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రచనా శైలి సాగుతుంది. ప్రతి సంఘటననూ దృశ్యమానమయ్యే రీతిలో రాయడంతో... ఒక రకంగా ఇది కాగితంపై అక్షరాలలో కనిపించే ఓ బయోపిక్ అనవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ మొదలు ‘సాక్షి – ఎక్సలెన్స్ అవార్డ్’ (లైఫ్ టైమ్ ఎఛివ్మెంట్) సహా ఎన్నో గుర్తింపులు పొందిన సి. కృష్ణవేణి జీవితకథ చదువుతుంటే... కేవలం ఓ వ్యక్తి జీవితంగా అనిపించదు. దాదాపు నూరేళ్ళ కాలగతిలో సమాజంలోనూ, సినిమాలోనూ వచ్చిన మార్పులు సైతం కళ్ళ ముందు రీళ్ళు తిరుగుతాయి. మహిళలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తూ, సమాజం ఇంతగా పురోగమించని రోజుల్లోనే... కృష్ణవేణి సాగించిన జీవితం, సాధించిన విజయం అబ్బురపరుస్తాయి. ఇవాళ్టికీ ఎందరికో స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయి. అరుదైన ఫోటోలతో పాటు, అవి అందుబాటులో లేని కీలక ఘట్టాలకు రేఖాచిత్రాలను సుప్రసిద్ధ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్తో ప్రత్యేకంగా గీయించడం ఈ 516 పేజీల రచనకు వన్నె తెచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనేక అడ్డంకులున్న ఆ రోజుల్లోనే ఎంత సమున్నత స్థాయికి చేరి, నూరేళ్ళ జీవితాన్ని పండించుకుందో తెలిపే ఈ రచన నేటి తరానికీ ప్రేరణనిచ్చే పాఠం. ఆపకుండా చదివించడంతో పాటు... అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న అనుభూతిని కలిగించడంతో... ఈ జీవితకథ సినీచరిత్రపై ఆసక్తి గలవారికి అందమైన బహుమానం.మీర్జాపురం రాణి... కృష్ణవేణి (నటి కృష్ణవేణి జీవితకథ), రచన – భగీరథ, ప్రతులకు – నవోదయ బుక్హౌస్, హైదరాబాద్. మొబైల్ – 92474 71361).– రెంటాల జయదేవ -
తొలి ట్రాన్స్జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!
కుటుంబం, యావత్తు సమాజం తన పుట్టుకను అంగీకరించలేదు. అడగడుగున వివక్ష, హేళనలు అవమానాలు. వాటన్నింటిని తన పని, గుర్తింపుతోనే తగిన సమాధానమివ్వగలనని భావించి నిశబ్దంగా పట్లుదలతో సాగింది. ఇవాళ ఆ నమ్మకమే గెలిచి..ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టింది. ట్రాన్స్జెండర్ విలక్షణమైన మనిషి, విభిన్నంకాదు అని అందరు అంగీకరించేలా తన గెలుపుతో చాటిచెప్పింది. ఆ మహిళే డాక్టర్ ఎన్ జెన్సీ.తమిళనాడులో పీహెచ్డీ పట్టా పొందిన తొలి ట్రాన్స్ జెండర్. ఆ తర్వాత ఆమె లయోలా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకం పొందారు. యూజీ,పీజీలలో స్వర్ణ పతక విజేత అయిన ఆమె ఇప్పుడు ట్రాన్స్జెండర్ విద్యార్థులకు ఉచిత విద్య, జీవనోపాధి సహాయం అందించడంతో తోడ్పడుతున్నారు. తమిళనాడులోని తిరుత్తని సమీపంలో ఉన్న ఆర్కే పేట అనే చిన్నగ్రామంలో జెన్సీ బాల్యం సాగింది. అంత చిన్న వయసులోనే కఠోర సత్యం తెలుసుకుంది తనను ఈ ప్రపంచం మనుగడ సాగించనివ్వదని. తల్లిదండ్రులు మద్దతు లేకుండా సాగుతున్న ఆమెకు గుర్తింపు కోసం పోరాటం ఆ క్షణం నుంచి మొదలైంది. తనకు రక్షణగా ఉండేది ఏది అని అన్వేషించడం మొదలుపెట్టింది. అనుక్షణం వెంటాడుత్ను వివక్షకు విరుగుడు విద్య మాత్రమే అని అర్థం చేసుకున్నా అని ఓ ఇంటర్వూలో జెన్సీ స్వయంగా చెప్పింది. అది మొదలు ఎప్పుడు గుర్తింపు పొందేలానే చదవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అలా వలక్కనంపూడిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యలో కూడా ప్రథమ స్థానంలో ఉండేది. ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు నుంచి తన ప్రతిభతో గుర్తింపు, గౌరవం దక్కించుకునేలా ఆహర్నిశలు కష్టపడింది. ఆ పరుగు తిరుత్తానిలోని అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చేరి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువు వరకు కొనసాగించిది. అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఆమె డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మాస్టర్స్, ఎంఫిల్ చేసింది. ఆ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ ఆమెదే కావడం విశేషం. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కళాశాల నుంచి ఆంగ్లంలో పిహెచ్డి పూర్తి చేసి, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకం పొందింది. అలా ఆమె తమిళనాడు డాక్టరేట్ పొది అసిస్టెంట్ ప్రొఫెస్ర్గా నియామకం పొందిన తొలి ట్రాన్స్ జెండ్ మహిళగా నిలిచింది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం బహిరంగంగా ఆమెను అభినందించారు. అయితే జెన్సీ ఈ క్రెడిట్ని తన ట్రాన్ కమ్యూనిటికీ చెందనదని అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నానని అన్నారామె. ప్రస్తుతం ఆమె ట్రాన్స్జెండర్ విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా చూస్తూ ప్రతి ఏడాది వారికోసం ఏడు నుంచి 12 సీట్లు రిజర్వ్ చేసేలా కాలేజీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్నారు. సమాజ పక్షపాత వైఖరికి ఓటమితో తలవంచకుండా.. విద్యతో ధీటుగా సమాధానమిచ్చి ఆమోదించేలా చేసుకోవాలని జెన్సీ తన కథ ద్వారా చక్కటి సందేశం ఇచ్చింది కదూ..!.(చదవండి: దంతాలతో కళాఖండాలు..! ఆమె టాలెట్కి ఫిదా అవ్వాల్సిందే) -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..!
కళ్లు పొడుచుకున్నా కనిపించనంత చీకటి. దుర్భేద్యమైన కొండలు. దారంతా రాళ్ళూరప్పలు...అవన్నీ దాటాలి. 150 అడుగుల లోపలకు వెళ్లాలి. అక్కడో మనిషి ఉన్నాడు. ఒళ్లంతా దెబ్బలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. అతడిని బయటకు తీయాలి. ఆ ప్రాణం కాపాడాలి. ఇదేమీ సినిమా కథ కాదు. నిజజీవిత విజయ గాథ. పర్యాటకుడి ప్రాణలు కాపాడిన సాహస బృందంలో శ్రీకాకుళం జిల్లాలోని మెట్టూరు గ్రామానికి చెందిన మేజర్ కవిత ఉన్నారు....భయపడితే భయమే మిగులుతుంది. ఆ భయం మరింత భయపెడుతుంది. ఆ భయాన్ని కాలదన్ని ముందుకు వెళితే సాహసం అవుతుంది. విజయం సొంతం అవుతుంది. ప్రాణరక్షణ చేసే ఆపద్భాందవ శక్తి అవుతుంది.ఉసిమలై లోయలో...మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక వ్యక్తి లోయలోకి పడిపోతే ఆపసోపాలు పడి బయటకు తీస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఊసిమలై లోయలో ఉన్న నీడల్రాక్ వ్యూ పాయింట్ దగ్గర జరిగింది. ఈ నెల 19న ఈ వ్యూ పాయింట్ దగ్గర ఒక పర్యాటకుడు సెల్ఫీ దిగుతూ 150 అడుగుల లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయం వెల్లింగ్టన్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ (ఎంఆర్సీ)కు తెలియజేయడంతో ఇండియన్ ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్లో 29 ఏళ్ల సిక్కోలు సివంగి మేజర్ డాక్టర్ వాసుపల్లి కవిత కీలక పాత్ర పోషించారు. ఆమెది వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు. రెస్క్యూ ఆపరేషన్పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అగ్నిమాపక అధికారులు, అటవీ అధికారులు, సహాయక బృందాలు సంయుక్తంగా సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ చీకటి పడడంతో అంతా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్మీ బృందం లెఫ్టినెంట్ కల్నల్ చందన్ మోహతా నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.రాత్రి 9.15 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో చిమ్మ చీకటి అలుముకుని ఉంది. కఠినమైన భూభాగం, ఎత్తైన ప్రదేశాలు, లోయలను దాటుకుంటూ 150 అడుగుల లోయకు చేరుకున్నారు. టార్చీల వెలుగులో బాధితుడిని గుర్తించారు. అప్పటికే ఛాతీ, చేయి, వీపు, తుంటి ఎముకలు విరిగి కదలలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించారు. ప్రాణాలు కాపాడారు...టార్చ్లైట్ వెలుగులో క్షతగాత్రునికి మేజర్ డాక్టర్ కవిత ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అక్కడే స్ట్రెచర్ను ఏర్పాటు చేశారు. లోయ పక్కన ఉన్న రెండు పర్వతాల మధ్య 70 మీటర్ల టైరోలియన్ ట్రావర్స్ లైవ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. గురువారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించిన ఈ ఆపరేషన్ వేకువజాము 3.30 గంటల వరకు సాగింది. ఈ ఆపరేషన్లో కవిత కీలక పాత్ర పోషించారు. గత సంవత్సరం బ్రహ్మపుత్ర నదిలో 1,040 కిలోమీటర్లు రాఫ్టింగ్ యాత్ర పూర్తి చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు.– కె. చలపతిరావు, వజ్రపు కొత్తూరు, రూరల్ సాక్షి, శ్రీకాకుళం (చదవండి: పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!) -
బధిరులకు ఆమె మెంటార్
కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఒకప్పుడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురైన ఒక మహిళ, నేడు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బధిర (చెవుడు, మూగ) మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఆమే నాగ్పూర్కు చెందిన కృతిక ధుండే. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన కృతిక బాల్యం అంతా సవాళ్లతోనే సాగింది. బడిలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు సైన్ లాంగ్వేజ్ తెలియక΄ోవడంతో ఆమె ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ, ఆ అడ్డంకులే ఆమెలో పట్టుదలను పెంచాయి. తన తల్లిదండ్రుల అండతో చదువు పూర్తి చేసిన కృతిక, పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయ్యాక తన కాళ్ల మీద తాను నిలబడాలని నిర్ణయించుకున్నారు. 2023లో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కమ్యూనికేషన్ సమస్య వల్ల ఇంటర్వ్యూలు మధ్యలోనే ఆపివేసేవారు. అయితే, ఆమె పట్టువదలకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. దీపికా భాటియా నేతృత్వంలోని మహిళా పారిశ్రామికవేత్తల నెట్వర్క్ గురించి తెలుసుకున్న కృతిక అందులో చేరారు. మొదట్లో లైవ్ క్యాప్ష¯Œ ్స సాయంతో విషయాలు అర్థం చేసుకునేవారు. క్రమంగా ఆ బృంద సభ్యులు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఆమెకు సహకరించడంతో కమ్యూనికేషన్ సులభంగా మారింది. అనంతరం కృతిక తనలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర బధిర మహిళలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నేడు ఆమె 1,000 మందికి పైగా బధిర మహిళలకు మెంటార్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెట్వర్క్ ద్వారా వారు నెలకు రూ. 70,000 వరకు సంపాదిస్తున్నారు. ‘ఆర్థిక స్వాతంత్య్రం నా జీవితాన్ని మాత్రమే కాదు, నన్ను చూసే సమాజపు చూపును కూడా మార్చింది. వికలాంగులలో అపారమైన ప్రతిభ ఉంటుంది, వారికి కావాల్సిందల్లా కేవలం అవకాశం మాత్రమే’ అని కృతిక సందేశమిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఇ¯Œ స్ట్రాగామ్లో సంజ్ఞా భాషలో వీడియోలు చేస్తూ లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు. సంజ్ఞా భాష అనేది కేవలం సైగలు మాత్రమే కాదు, అది ఒక గొప్ప భావ వ్యక్తీకరణ అని నిరూపిస్తూ కృతిక సాగిస్తున్న ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. -
వ్యర్థాలకూ వైద్యం
డెంటిస్ట్గా క్షణం తీరికలేనంత బిజీగా ఉండే డాక్టర్ శాంతి తుమ్మల, బెంగళూరు నగరంలోని చెత్త కుప్పలను చూసి బాధపడేవారు. అధికారులకు ఫిర్యాదు చేసి ఊరుకోవడం కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. బస్సు, ట్రైన్, బస్స్టేషన్, చౌరస్తా... ఇదీ అదీ అని తేడా లేకుండా తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఎందుకు డాక్టరమ్మా ఇది నీకు’ అన్నారు చాలామంది. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి తన వృత్తిని వదులుకొని పూర్తిస్థాయి ప్రచార కార్యకర్తగా మారారు. లక్షలాది మందిలో మార్పు తీసుకువచ్చారు...బెంగళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివసిస్తున్న శాంతి తన ఇంటిసమీపంలో ట్రక్కుల నిండా చెత్తను చూసేవారు. ఆ చెత్తగుట్టలు ఆమెను తీవ్రంగా కలవర పరిచేవి. సమస్య పరిష్కారానికి తానే నడుం బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, ΄÷డి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎలా వేరు చేయాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.అయితే... చాలామంది డాక్టర్ శాంతి మాటలకు అసహనంగా ముఖం పెట్టేవాళ్లు. కొందరికి ఆమె చెప్పింది వినడం టైమ్ వేస్ట్గా అనిపించేది. ‘పబ్లిసిటీ కోసమే ఈ ప్రచారం చేస్తుంది’ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరమ్ ద్వారా లక్షమందికి పైగా వ్యర్థాల విభజనలో సహాయపడ్డారు. ఆమె తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి ‘కంపోస్ట్ లెర్నింగ్ సెంటర్’ కూడా ్రపారంభించారు.మై వేస్ట్ మై మేనేజ్మెంట్కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆచరణాత్మక ప్రచారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు డాక్టర్ శాంతి. తన ఇంట్లోకి ΄్లాస్టిక్ను అనుమతించరు. గుడ్డ సంచులను ఉపయోగిస్తారు. పాత చీరెలు ధరిస్తారు. నిల్వ చేయడానికి స్టీల్ డబ్బాలనే వాడతారు.‘మై వేస్ట్ మై మేనేజ్మెంట్’ అనేది శాంతి నినాదం.ప్రజలు వ్యర్థాలను వేరు చేయడం ప్రారంభించినప్పటికీ, సేకరణ సమయంలో కాంట్రాక్టర్లు వాటన్నింటినీ మళ్లీ కలిపేస్తున్నారని ఆమె గమనించి, అలా జరగకుండా ఉండడానికి అధికారుల సహకారం తీసుకున్నారు.వృత్తిని త్యాగం చేసి...వృత్తిని, సామాజిక కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం డా. శాంతికి కష్టంగా మారింది. క్లినిక్లో రాత్రంతా పనిచేయడం వల్ల ఆమె అలసిపోయేవారు. ఇలా అయితే కుదరదనుకొని వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఉద్యోగం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.తన పట్టుదలతో పరిసర ప్రాంతాలను మాత్రమే కాకుండా, ఎంతోమంది బెంగళూరు వాసుల ఆలోచనా విధానాన్ని మార్చారు.ఉమ్మడి బాధ్యతతన ప్రచారానికి బస్సులను కూడా వేదికగా ఉపయోగించుకుంటారు డా.శాంతి. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో బస్సులో నిలబడి ‘దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దు’ అని ప్రయాణికులకు విన్నపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ‘నగరాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి ఉమ్మడి బాధ్యత’ అని ఒకటికి రెండు సార్లు చెబుతుంటారు. వ్యర్థాల విభజన అనేది సక్రమంగా జరగడం ప్రారంభమైన తరువాత ఆమె కంపోస్టింగ్పై దృష్టి సారించారు. -
వనదుర్గలు
కజిరంగ నేషనల్ పార్క్లో 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదు. ఇది రికార్డు. ఇందుకు కారణం ఆ పార్కులో వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన మహిళా గార్డ్స్ దళం ‘వన దుర్గ’ ఆగస్టు 2023లో మొదలైన దళం కేవలం రెండేళ్లలోనే వేటగాళ్ల భరతం పట్టి కజిరంగను విముక్తం చేయగలిగింది. వారి గస్తీ గురించి కథనం.పురుషులు సాధించలేకపోయిన ఘనత స్త్రీలు సాధించారు. కజిరంగ అరణ్యాలలో దశాబ్దాలుగా సాగుతున్న ఖడ్గమృగాల వేటకు అడ్డు కట్ట వేయగలిగారు. వేటగాళ్ల పట్ల దుర్గలుగా మారి చెండుకు తిన్నారు. అందుకే వన్యమృగాల పరిరక్షణలో, అడవుల రక్షణలో ప్రతి చోటా వనదుర్గ గార్డ్స్ లాంటి దళాలు ఉండాలని వన్య ప్రేమికులు భావిస్తున్నారు.వేటగాళ్ల ఉనికిప్రపంచంలోనే అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు మనదేశంలో ఉన్నాయి. ప్రపంచంలోని ఖడ్గమృగాల మొత్తం సంఖ్యలో ఇది దాదాపు 70 శాతం. అస్సామ్ రాష్ట్రంలోని కజిరంగ జాతీయ పార్క్లో దశాబ్దాలుగా ఖడ్గమృగాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వేట పెద్ద సవాలుగా మారింది. కొమ్ములు కోశాక చనిపోయిన ఖడ్గమృగాల కళేబరాలు, వాటి పక్కన పడి ఉన్న తూటాలు అక్కడ. ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వనదుర్గలు రక్షణ కవచాలుగా మారి ఖడ్గమృగాలను రక్షిస్తున్నాయి. వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన మహిళా గార్డ్స్ దళం ‘వనదుర్గ’. 2023లో మొదలైన ఈ దళం రెండేళ్లలోనే వేటగాళ్ల భరతం పట్టి కజిరంగను విముక్తం చేయగలిగింది.వేటగాళ్లను చంపడం న్యాయమేనా? అక్కడ ఆయుధాలతో కనిపిస్తే కాల్చమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇది ప్రాణాంతకమని, సైనిక చర్య అని పలువురు విమర్శించారు. ఇప్పటికి ఇరవైమంది వేటగాళ్లను కాల్చి చంపినట్లు బీబీసీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ‘దేశానికి తాజ్మహల్ ఎలాగో, అస్సాంకు ఖడ్గమృగం అలాగే’ అని చెబుతూ తన వైఖరిని సమర్థించుకుంది. ఈ సమష్టి ప్రయత్నాలు శాశ్వత ఫలితాలను చూపిస్తున్నాయి. 2009లో 2,048గా ఉన్న ఖడ్గమృగాల సంఖ్యను, 2022 జనాభా లెక్కల ప్రకారం పార్క్ 2,613కి పెంచింది. అనుమానిత వేటగాళ్లతో కాల్పుల ఘటనలు కూడా తగ్గాయి. 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా కజిరంగలో వేటగాళ్ల తుపాకీకి చిక్కలేదు. ఇది చాలా పెద్ద సంగతి. ఈ విజయానికి పూర్తిగా హక్కుదార్లు, ఆ వనాల దేవతలు వన దుర్గ గార్డ్సే. ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక అవుట్పోస్టుకజిరంగలో ఖడ్గమృగాల రక్షణ కోసం మహిళా గార్డ్స్ దళం ‘వనదుర్గ’ మొదలయ్యాక ఎవరైనా అక్కడ ఆయుధాలతో కనిపిస్తే కాల్చమని ప్రభుత్వం వారికి ఆదేశాలిచ్చింది. వారి కోసం పార్కులో ప్రతి ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక అవుట్పోస్టు ఏర్పాటు చేశారు. వన దుర్గ గార్డ్స్ పార్క్ క్యాంపులో 24 గంటలూ ఉంటారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుంటారు. అలాగే వేటగాళ్లపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది. పార్క్ అంతటా ఎలక్ట్రానిక్ కళ్ళు, థర్మల్ సెన్సార్లు, కెమెరా ట్రాప్లు, నైట్ విజన్ కెమెరాలను వ్యూహాత్మకంగా అమర్చారు. వీటిని వనదుర్గ గార్డ్స్ పర్యవేక్షిస్తూ వేగంగా స్పందిస్తారు. డ్రోన్ నిఘా, శాటిలైట్ ఫో¯Œ లు కూడా ఉన్నాయి. కజిరంగలో ప్రమాదం ఎల్లప్పుడూ వేటగాళ్ల నుండే రాదు. కోపంగా ఉన్న ఖడ్గమృగాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి చేసి, తమ కొమ్ములతో ప్రాణాంతకంగా గాయపరచగలవు. వన దుర్గలు ఈ ప్రమాదాల నుంచి కూడా రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ‘ఖడ్గమృగం దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, కొన్నిసార్లు మేము గాలిలో కాల్పులు జరపాల్సి వస్తుంది‘ అని వన దుర్గ గార్డ్స్ తెలిపారు. -
బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!
ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో, బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అన్న బిరుదును స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!1874లో లండన్లోని న్యూహామ్లో పేద కుటుంబంలో జన్మించింది మేరీ ఆన్ బెవాన్, నర్సింగ్ కోర్స్ చదివి 1894లో నర్సుగా మారింది. ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. అంతుచిక్కని వ్యాధి - వికృత రూపంమేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి. చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుపిల్లల కోసం తల్లి మనసు ఆరాటంరూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును." అనే ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా త్వరలోనే సర్కస్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిపోయింది. 1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్లోని డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా పనిచేసింది.మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది. వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన విద్యావంతుల్ని చేసింది.తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ". చరిత్రలో "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా నిలిచిపోతుంది. ఏమంటారు? -
స్ట్రాంగెస్ట్కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..
ఓ మహిళ ఎంత శక్తి స్వరూపిణి అని చెప్పే ఘటన ఇది. అందరు నిర్ఘాంతపోయేలా మగవాళ్లను చిటికెలో ఎత్తిపడేసింది. నిజానికి ఆమె శారీరక బలం, ఓర్పుకి సలాం అనాల్సిందే. అంతలా సులభంగా మగవాళ్లను ఎత్తిపడేసి గిన్నిస్ రికార్డు సృష్టించిందామె. ఎవరా ఆ మహిళ అంటే..సినా రుప్పెంతాల్ అనే అథ్లెట్ ఈ ఘనతను సృష్టించింది. ఒక మహిళ ఎంత బలవంతురాలు అనేది చెప్పకనే చెప్పింది తన అసాధారణమైన సాహసంతో కేవలం 37.44 సెకన్లలో సుమారు 10 మంది పురుషులను ఎత్తి విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డుని నెలకొల్పింది. ఈ క్రీడాకారిణి తన అసాధారణమైన శక్తి, వేగం, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఛాలెంజ్లో ఆ మహిళ ప్రతి ఒక్కర్ని ఎత్తి వారిని తన భుజంపై నుంచి వేగంగా ఒకరి తర్వాత ఒకరిని నిర్ధిష్ట సమయంలో విసిరి పూర్తి చేస్తింది. ఇక్కడ శారీరక బలం తోపాటు కచ్చితమైన సమన్వయం, ఓర్పు అవసరం. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కరిని చాలా సురక్షితంగా ఎత్తి నియంత్రిత కదలికలతో విసిరింది. ఆమె అలా అలవోకగా అంతమంది మగవాళ్లను ఎత్తిపడేస్తున్న విధానం చూసి ప్రేక్షకులు సైతం విస్తుపోయారు. ఈ రికార్డు వాస్తవానికి ఆగష్టు 2025లో మ్యూనిచ్లో జరిగిన 'డై గ్రోస్సే షో డెర్ వెల్ట్రికోర్డే' అనే టీవీ కార్యక్రమంలో నెలకొల్పింది సినా రుప్పెంతాల్. ఈ ఛాలెంజ్ సాంప్రదాయ స్ట్రాంగ్మ్యాన్ ఈవెంట్లను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ అథ్లెట్లు బరువైన రాళ్లను ఎత్తడం, వాహనాలను లాగడం, భారీ బరువులను మోయడం, వంటి విన్యాసాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తారు. కానీ సినా రుప్పెంతాల్ రికార్డు మాత్రం అత్యంత విలక్షణమైన రికార్డుగా వార్తల్లో నిలిచింది. ఎవరీ సినా రుప్పెంతాల్సినా రుప్పెంతాల్ ఒక జర్మన్ స్ట్రాంగ్వుమన్. ఆమె ఉన్నత స్థాయి అథ్లెట్, స్పోర్ట్స్ సైంటిస్ట్. ఆమె ప్రపంచంలో నాల్గవ అత్యంత బలవంతురాలైన సహజ మహిళగా ర్యాంక్ పొందింది. అంతేగాదు స్ట్రెంత్ స్పోర్ట్స్లో అనేక జర్మన్ రికార్డులను కలిగి ఉంది. సింపుల్గా చెప్పాలంటే రుప్పెంతాల్ STRONGESTకు బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించొచ్చు. అంతేకాదండోయ్..ఆమె మహిళా స్ట్రెంత్ అథ్లెట్లకు ఒక వేదికను అందించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ స్ట్రాంగ్వుమెన్ జర్మనీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఎల్పీజీ గ్యాస్ కొరత..ఆ స్టవ్లకు పెరుగుతున్న డిమాండ్) -
అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!
మహిళల్ని గౌరవించాలి...అనేది మన భారతీయ సంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడినా.. ఆ సమయంలో గొడవతో సంబంధంలేని మహిళలను అవమానపరిచేలా తిట్లు దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో తరచుగా ఎందరో తల్లులు, అక్కలు...బాధితులుగా మారుతున్నారు. మన రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు సైతం దీనికి అతీతంగా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో అలాంటి తిట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోని ఓ మారుమూల గ్రామం తొలి అడుగు వేసింది.ఒకరి తల్లి లేదా సోదరిని ఉద్దేశించి దుర్భాషలాడే వ్యక్తులను వెనువెంటనే శిక్షించాలని ఒక వినూత్న తీర్మానాన్ని ఆ గ్రామం ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళా సాధకులను సత్కరించడానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఈ ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేశారు. .అహల్యానగర్లోని శ్రీగొండలోని కోల్గావ్ గ్రామ పంచాయతీ దీనిని ఆమోదించింది.విభిన్న కులాలు మతాలకు చెందిన సుమారు 9,000 మంది నివాసితులున్న కోల్గావ్ గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, సీనియర్ అంగన్ వాడీ సేవిక (కార్యకర్త) శకుంతల దేశ్ముఖ్ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామసభను ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగ్తాప్ అనే మహిళ లేవనెత్తిన మాటలతో మహిళల్ని అవమానించే అంశం గ్రామ సభలో వివరణాత్మక చర్చకు దారితీసింది. సుదీర్ఘ మధనం తర్వాత, మహిళలను కించపరిచేలా అవమానకరమైన భాషను ఉపయోగించే వారికి జరిమానాగా రూ. 500 విధించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నిబంధన దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్భాషలు ఆడినట్టు డిజిటల్ ఆధారాలు అందించినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ‘అవమానకరంగా మాట్లాడిన వారిని గుర్తించడడంలో మహిళలు ( అవసరమైతే, వారి పిల్లలు) ముందుండాలని పంచాయతీ కోరింది, అలా వసూలు చేసిన జరిమానాలను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని వీరు చెబుతున్నారు.‘తల్లి లేదా సోదరిని ప్రస్తావిస్తూ తిట్టడం ద్వారా మహిళల్ని అవమానించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. అమ్మాయిలు కుటుంబ బాధ్యతలను భరించే మహిళలుగా ఎదుగుతారు. అలాంటి దుర్వినియోగాలను సాధారణం గా అంగీకరించే స్థాయికి వారి గుర్తింపులను కించపరచకూడదు’అని జగ్తాప్ అంటున్నారు. ఇలాంటివే అనూహ్యమైన మరికొన్ని తీర్మానాలతో ఈ పంచాయితీ గత కొంతకాలంగా ఆదర్శవంతంగా నిలుస్తోంది.గతేడాది తీసుకున్న ఓ నిర్ణయం కూడా అనేకమందిలో ఆలోచన రేకెత్తించేలాంటిదే. దీని ప్రకారం.. గ్రామంలో పిల్లలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో టెలివిజన్ లేదా సెల్ఫోన్ వినియోగించరు. పుస్తకాలు మాత్రమే చేతబట్టుకోవాలి. ప్రస్తుతం గ్రామంలో తల్లిదండ్రులు కూడా పాటించే నియమం ఇది. గ్రామసభ పరిశుభ్రతకు సంబంధించి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది, నివాసితులు తమ ఇళ్లలో వాణిజ్య సంస్థలలో పరిశుభ్రతను కాపాడుకోవాలని కోరింది. గ్రామ పంచాయతీకి సమర్పించిన ఫోటో/వీడియో ఆధారాల ద్వారా ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తేలిదే, వారికి రూ. 100 జరిమానా విధిస్తారు. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
సివిల్స్లో సత్తా చాటిన మహిళామణులు..!
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...24-35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళల ప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ∙డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడిపోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణిమధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్.ఒకే ఒక్కరు!సిక్కింలోని రాయ్గావ్కు చెందిన అన్నీలా షెర్పా, యూపీఎస్సీ పరీక్షలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచి ఆల్ ఇండియా ర్యాంకు 893 సాధించింది. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్లను సర్క్యూట్ రేసింగ్లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్లో మరింత స్కిల్ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
కురుగంటి కవిత... మన దేశంలో రైతుల హక్కులు, సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఓ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి. దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు, రైతు శాస్త్రవేత్తలు, దేశీ విత్తన పరిరక్షకులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, పౌర సంస్థలు, వ్యక్తులతో కూడిన ఒక విస్తృతమైన నెట్వర్క్ ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా)’. దీనికి కవిత జాతీయ కన్వీనర్గా సేవలందిస్తున్నారు. ఆషా–కిసాన్ స్వరాజ్, జాతీయ మహిళా రైతుల హక్కుల సంఘం (మకాం), ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ (ఎన్సీఎన్ఎఫ్), కోలిషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా వంటి అనేక జాతీయ వేదికల్లో ఆమె దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్వావలంబనే శ్వాసగా కదిలే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులకు, రైతు శాస్త్రవేత్తలకు, రైతుల హక్కుల కోసం కృషి చేసే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలకు బలమైన సమష్టి గొంతుకగా ఆషా–కిసాన్ స్వరాజ్ నెట్వర్క్ నిలుస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మితేనే వారికి సముచిత ఆదాయం వస్తుంది. సేంద్రియ మార్కెట్ల నిర్వహణకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో రైతులకు కాస్త చోటివ్వమని నగర/పట్టణవాసులకు ఆమె పిలుపు ఇచ్చారు. ఆరో కిసాన్ స్వరాజ్ సమ్మేళనాన్ని (kisan swaraj sammelan 2026) ఇటీవల మైసూరులో ఘనంగా నిర్వహించిన కవిత కురుగంటితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు.‘ఆషా’ ఎప్పుడు, ఎలా పుట్టింది? కురుగంటి కవిత (kavitha kuruganti): 15 ఏళ్ల క్రితం ‘ఆషా’ కిసాన్ స్వరాజ్ సంస్థ పుట్టింది. బీటీ వంగ ప్రతిఘటన ఉద్యమకాలంలో ‘కోలియేషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా’ను మేమంతా 2004లో సేవాగ్రామ్లోని గాంధీ ఆశ్రమంలో కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. బీటీ పత్తి మన దేశంలోకి వచ్చి అప్పటికి రెండేళ్లు గడిచాయి. బీటి పత్తి (BT Cotton) వల్ల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు ఆధారసహితంగా తెలిసివస్తున్న రోజులవి. కార్పొరేట్ కంపెనీల నియంత్రణ నుంచి బయటకు రావటం కోసం, స్వావలంబన సేద్యం కోసం రైతులు అనుసరించవలసిన పద్ధతులు, విష ముక్త, రుణ ముక్త, ఆత్మహత్య ముక్త జీవనోపాధుల వ్యవస్థ సాధించాలన్నది మా లక్ష్యం. అప్పుడు మేం అనుకున్నదేమిటంటే.. రైతు తన పొలంలో నడుము వంచి పనిచేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎద్దు చేనులోకి చొరబడితే చేతిలో పని ఆపేసి ముందు ఆ ఎద్దును బయటకు తరమాలి కదా. అలాగే మిగతా పనులన్నీ పక్కనపెట్టి జన్యుమార్పిడి పంటలను పారదోలాలని అనుకున్నాం. ఆ విధంగా దేశంలో ఒక ఉద్యమం నిర్మించటానికి ఆరేళ్లు విపరీతంగా కష్టపడ్డాం.కేంద్ర పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ 2009 డిసెంబర్ నుంచి జీఎం వంగపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల చేత నో అనిపించటం కోసం, సైంటిస్టులను, డాక్టర్లను ఈ ఉద్యమంలోకి తేవటం కోసం దేశమంతా తిరుగుతూ, చర్చలు పెడుతూ.. రాత్రి, పగలు అవిశ్రాంతంగా పని చేశాం. 2010 ఫిబ్రవరి 9న బీటీ వంగపై నిరవధిక మారటోరియం ప్రకటించారు. అదే మా తొలి విజయం. అదే సంవత్సరం మార్చిలో నాగపూర్లో మేం మళ్లీ కలిసి కార్యాచరణ నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ‘కిసాన్ స్వరాజ్ యాత్ర’ చేపట్టాం. 71 రోజులు 220 మందిమి 20 వేల కిలోమీటర్లు 20 రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేసి రాజ్ఘాట్లో ముగించి, సోనియా గాంధీకి మా డిమాండ్ల పత్రాన్ని ఇచ్చాం.మేము బయలుదేరిందేమో ఆత్మహత్య దారితీయని సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వ్యాప్తి కోసమని. అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఇతర సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ఆర్గానిక్ సేద్యం (Organic Farming) కన్నా ముందు గిట్టుబాటు ధర, భూసేకరణ, వ్యవసాయంపై పారిశ్రామిక కాలుష్యం ముప్పు వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో రైతులు కోరారు. సిటీల్లో ప్రజలు తమకు రసాయన అవశేషాల్లేని ఆహారం కావాలని అడిగారు. ముంబైలో మహేశ్ భట్ వంటి బాలీవుడ్ పెద్దలూ మాకు స్వాగతం పలికారు. ఈ యాత్ర నుంచే ‘ఆషా–కిసాన్ స్వరాజ్’ పుట్టింది. ‘కిసాన్ స్వరాజ్ నీతి’ పేరుతో మార్గదర్శకాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం పని చేస్తున్నాం.మీరు సాధించిందేమిటి?కవిత: దేశంలో వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్లకి మనం ముందుకెళ్లాల్సిన దారి ఏమిటో దిశా నిర్దేశం చెయ్యటంలో ఆషా–కిసాన్ స్వరాజ్ విజయం సాధించింది. గందరగోళాన్ని పారదోలింది. బీటీ వంగ పంట రాకుండా ఆపింది. రసాయనిక వ్యవసాయంతో ఎదురవుతున్న రకరకాల సంక్షోభాలు, జన్యుమార్పిడి పంటలతో (genetically modified crops) సమస్యలు వంటి వాటిపై వాస్తవ గణాంకాల ఆధారిత నివేదికలను రూపొందించటం, సంబంధిత సమగ్ర జ్ఞానాన్ని అందుబాటులోకి తేవటంలో మేం సఫలమయ్యాం. ఉదాహరణకు.. రైస్ ఫోర్టిఫికేషన్. అధ్యయన నివేదికలు రూపొందించాం. ఇది ప్రజారోగ్యానికి హానికరం కాబట్టి వద్దు అని చెప్పాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాం. 23 ఏళ్లుగా మరో జన్యుమార్పిడి పంటను వాణిజ్యపరంగా బయటకు రాకుండా ఆపగలిగాం. అంతేకాదు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ క్షేత్ర ప్రయోగాలు జరపకుండా కూడా ఆయా ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించగలిగాం.ప్రజల నుంచి మీరేమి ఆశిస్తున్నారు?కవిత: ఆరోగ్యదాయకమైన ఆహారం గురించి అందరూ చైతన్యం పెంచుకోవాలి. మీ కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఈ పని చెయ్యగలిగితే.. అనేక విధాలుగా మేలు కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగవుతుంది. వ్యవసాయంపై కార్పొరేట్ కంపెనీల నియంత్రణ కొంత తగ్గుతుంది. ఎక్కువ మంది రైతులు స్వావలంబనతో కూడిన వ్యవసాయం వైపు మొగ్గుచూపుతారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలను నేను కోరుతున్న మరో విషయమేమిటంటే.. సేంద్రియ/ ప్రకృతి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి చోటివ్వండి. మీ ఇళ్లు/ గేటెడ్ కమ్యూనిటీలు/ కాలనీల్లో తరచూ సేంద్రియ సంతల నిర్వహణకు చోటు కల్పించండి. తద్వారా మధ్యవర్తుల బెడద తీరి, రైతుల ఆదాయం పెరుగుతుంది. అర్హులైన రైతులను గుర్తించి, సమన్వయపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు కొదువ లేదు. చెన్నై, మాండ్యలలో రైతులే నిర్వహించుకునే సేంద్రియ మార్కెట్లే ఇందుకు నిదర్శనాలు.ఏమిటా ‘కిసాన్ స్వరాజ్ నీతి’ సూత్రాలు?కవిత: డా. జయతీఘోష్, డా. డి. నరసింహారెడ్డి వంటి చాలా మంది మేధావులతో లోతుగా చర్చించి 4 మార్గదర్శకాలను నిర్దేశించుకున్నాం. 1. కనీస మద్దతు ధర కావాలని రైతులు అడుగుతుంటారు. అయితే, అది దొరికినా ఆదాయ భద్రత దొరక్కపోవచ్చు. అందుకే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి. 2. ప్రభుత్వం వ్యవసాయ విధాన నిర్ణయం ఏది చేసినా అది పర్యావరణ సుస్థిరతకు లోబడి ఉండేలా చూడాలి. 3. భూమి, విత్తనం, నీరు వంటి వ్యవసాయ వనరులపై హక్కు రైతు సముదాయం చేతుల్లోనే ఉండాలి. 4. వినియోగదారులందరికీ వైవిధ్యభరితమైన, భద్రమైన, పుష్కలంగా, పోషక సంపన్నమైన ఆహారాన్ని అందించాలి. మా లక్ష్యం కేవలం సుస్థిర వ్యవసాయం కాదు. ఇవన్నీ కలిసి ఉండే హోలిస్టిక్ అగ్రికల్చర్. ఈ మార్గదర్శకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మహిళా రైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతుల హక్కులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.‘ఆషా’ నిర్మాణం ఎలా ఉంది?కవిత: మాది సభ్యత్వం, ఎన్నికల ఆధారంగా పనిచేసే సంస్థ కాదు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న సంస్థలు, వ్యక్తుల్ని కలుపుకొని వెళ్లే ఒక వేదిక మాత్రమే. ఆషా స్వచ్ఛంద సంస్థ కాదు. మాకు బ్యాంకు ఎకౌంట్ లేదు, ఆఫీసు, సిబ్బంది లేరు. ఇళ్ల నుంచే మేం పనిచేస్తున్నాం. మా సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. వేరే యూనియన్ల మాదిరిగా ఇది వద్దు, అది వద్దు అనే వైఖరికి పరిమితం కాకుండా.. సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను చూపే సంఘర్ష్, నిర్మాణ్లతో కూడిన వేదికగా ‘ఆషా’ను తీర్చిదిద్దాం. మాలో చాలా మందిమి ధర్నాల్లో పాల్గొంటాం, ప్రభుత్వ సలహా బృందాల్లోనూ సభ్యులుగా ఉంటాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యటానికని కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్ దల్వాయి వర్కింగ్ కమిటీలో నేను, కిరణ్ సభ్యులుగా ఉండి, మూడు సంపుటాలలో మా సూచనలిచ్చాం. అదే సమయంలో కిసాన్ ముక్తి యాత్ర వంటి ఆందోళనలు నిర్వహించాం.చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’తెలుగు బిడ్డ!కురుగంటి కవిత తెలుగింటి బిడ్డే! ఆమె తల్లిదండ్రులు గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్ (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే చదివిన తర్వాత జహీరాబాద్ వద్ద పస్తాపూర్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)లో దళిత మహిళా రైతుల అభ్యున్నతి కోసం ఐదేళ్లపాటు పనిచేశారు. తదనంతరం బెంగళూరులో (ఈ మధ్యనే మైసూరుకు మారారు) స్థిరనివాసం ఉంటూ జాతీయ రైతాంగ ఉద్యమం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400కుపైగా సంస్థలు, వ్యక్తులతో కూడిన ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా) ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు కోసం జరిగే పోరాటాల్లో ఆమె కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
ఉమెన్ సివిల్ పవర్
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...⇒ 24 - 35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.⇒ 41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.⇒ 18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ⇒ డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. ⇒ పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. ⇒ పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. ⇒ కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. ⇒ గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణి.⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్. -
ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!
తమిళనాడులో కాలానుగుణ నది నాగనది. గత 20 ఏళ్లుగా ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది. చక్కగా నీటితో కళకళలాడే నది కాస్తా..బీడు వారిపోయింది. ఈ నదే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఆధారం. అలాంటి నదికి నారీ శక్తి ప్రాణం పోసి 365 రోజులు నీటితో పారేలా చేస్తోంది. అదెలా ఈ మహిళామణులకు సాధ్యమైందో తెలుసుకుందామా..!.సరిగ్గా ఆ టైంలోనే గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికతతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో నీటి కొరత నిర్వహణలో భాగంగా నాగనది నది పునరుజ్జీవన పనిని అమలు చేసే నిమిత్తం 2014లో వెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్వచ్ఛంద సేవకులతో సహా సాంకేతిక నిపుణుల బృందం కదిలివచ్చింది. ఈ నదిని తిరిగి పునరుజ్జీవింప చేయాలంటే బావులు, బండరాళ్ల చెక్డ్యామ్లు నిర్మించాలన్సి అవసరం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన నదులను పునరుద్ధరించేందుకు దాదాపు 20 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త దావానలం ఆ చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద స్వచ్ఛంద సేవకులుగా ఈ పనుల్ల పాలుపంచుకునేవాళ్ల సంఖ్య అనుహ్యంగా 40 వేలకు పైగా చేరింది. వారంతా మహిళామణులే కావడం విశేషం. ఈ మహిళా స్వచ్ఛంద సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్గదర్శకత్వంలో బావులు తవ్వడం, సిమెంట్ రింగులు నిర్మించడం వంటి వాటితో అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా భూగర్భజల మట్టాలు ఒక మీటర్ నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగాయి. దెబ్బతో నదికి తిరిగి జీవం వచ్చినట్లైంది. ఇదంతా కేవలం మహిళా శ్రామిక శక్తి వల్ల సాధ్యం కావడం విశేషం. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన వందవ 'మన్ కీ బాత్' ఎపిసోడ్లో చెప్పి..ఆ నారీ శక్తి జట్టు కృషిని ప్రశంసించారు. ఒకరకంగా సమాజం కోసం అందరూ నడుబిగించాలని చెప్పడమే కాదు..ఐక్యతను సైతం చాటి చెప్పింది ఈ నారీ శక్తి. మహిళ తలుచుకుంటే భూమిని స్యశ్యామలంగా ఉంచగలరు. అలాగే ప్రకృతి సైతం పులకరించిపోయేలా అందంగా అపురూపంగా మార్చగలరు. అలాంటి మహిళామణులకు, మహిళా శక్తికి సదా జోహార్లు అని కీర్తిద్దాం, గౌరవిద్దాం. కేవలం విమెన్ డే ఒక రోజున మాత్రమే కాదు..ప్రతి సందర్భంలోనూ అవకాశంలోనూ మహిళలను పురుషులతో సమానంగా చూస్తే చాలు. అంతకుమించి ఇంకేమి ఆశించరు అని గుర్తిస్తే చాలు కదూ..!. View this post on Instagram A post shared by Art of Living (@artofliving) (చదవండి: చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..! టెక్ ఉద్యోగం వద్దనడానికి కారణం అదే..) -
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డురియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. -
ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్ని..
మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్ బిజినెస్లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అత్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. మార్కెట్కి వెళ్తున్నా అని ఫ్రెంచ్ క్లాస్లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్ఫోన్లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్ని ఒక జాబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆమెను పారిస్లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్కి మాత్రమే పంపించారు స్టాన్లీని. అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్పోర్ట్ని మాయం చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్ బోర్డియక్స్లో వైన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ MBA ప్రోగ్రామ్లో చేరింది. చెప్పాలంటే ఆ క్లాస్లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేది స్టాన్లీ. వైన్ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. ఆ తర్వాత వైన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్ 'సోలికాంటస్' పేరుతో వైన్ని విక్రయించే రేంజ్కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్ అంటే లాటిన్లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. (చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ) -
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్తో మేకప్ టీచర్గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్నగర్కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది. -
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్లను (కమాండ్స్ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు. -
పరుగే జీవితం
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది. ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్కి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్లో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.మార్చుకున్న షెడ్యూల్...చదువుకునే రోజుల్లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబుల్ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్లో నా జీవన శైలి ఉంటుంది. విదేశీ పోటీల్లోనూ...దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్ కాంపిటిషన్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఈ యేడాది జనవరిలో అజ్మీర్లో జరిగిన రన్నింగ్ రేస్లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విజయ వర్ణాలు
కాంతిపుంజంలో ఏడు రంగులు దాగి ఉంటాయి. స్త్రీ సామర్థ్యం ఒక కాంతి కిరణమే! ప్రసరించే ప్రతిచోటా వెలుతురై వెల్లివిరుస్తుంది. ప్రతి రంగూ మరో రంగుకు బలం ఇస్తుంది. స్త్రీలు ఆకాశంలో సగం మాత్రమే కాదు.. ఆకాశమంతా నిండిన ఏడు వర్ణాలు. ఇక్కడ ఏడు రంగాల్లో ఏడు గెలుపు కథలు చదవండి.మ్యాథ్స్ మాస్ట్రో నళిని అనంత రామన్ రంగం గణితంప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలలో నళిని అనంత రామన్ ఒకరు. డైనమిక్ సిస్టమ్స్, క్వాంటంపై నళిని విశేష కృషి చేశారు. ఆమె పరిశోధన హెన్రీ పాయింకేర్ ప్రైజ్, ఇన్ఫోసిస్ ప్రైజ్తో పాటు అనేక అంతర్జాతీయ గుర్తింపులను సాధించింది. గణితంపై పని చేస్తున్న ప్రముఖ పరిశోధకులలో ఒకరిగా నిలిచింది. తల్లిదండ్రులిద్దరూ గణిత శాస్త్రవేత్తలు కావడంతో నళినికి అంకెలతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. గణితానికి సంబంధించిన విశేషాలు వినడం అంటే కథలు విన్నంత సంతోషంగా ఉండేది. ‘గణితాన్ని బాగా ఇష్టపడేదాన్ని. అలా అని ఇతర సబ్జెక్లను నిర్లక్ష్యం చేయలేదు’ అని బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు నళిని. పదహారు సంవత్సరాల వయసులో ఫ్రాన్స్లో గణితానికి ప్రసిద్ధి చెందిన ‘ఎకోల్ నార్మల్ సుపీరియర్’ విద్యాసంస్థలో చేరింది. పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత అనేక పరిశోధన సంస్థలలో పనిచేశారు నళిని. ప్రస్తుతం స్ట్రాస్బోర్గ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సంక్లిష్టమైన గణిత సమస్యలను తేలికైన ఉదాహరణలతో అర్థం చేసుకునేలా చేయడం ఆమె ప్రత్యేకత. డైనమిక్ సిస్టమ్కు సంబంధించిన సారాంశాన్ని బిలియర్డ్స్ టేబుల్పై దొర్లే బంతిని ఉదాహరిస్తూ చెబుతుంటారు.చరిత్ర సృష్టించిన విజయంపూజా కృష్ణమూర్తిరంగం: క్రీడలుబ్రెజిల్ 135 ఆల్ట్రాను పూర్తి చేయడం ద్వారా పూజా కృష్ణమూర్తి చరిత్ర సృష్టించింది. 135 మైళ్ల కఠినమైన రేసుకు అర్హత పొంది విజయం సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. 48 గంటలలోనే ఈ రేసును పూర్తి చేసింది. ఈ ఘనత ఆమెను ప్రపంచ ప్రఖ్యాత రన్నర్లలో ఒకరిగా నిలిపింది. పర్వతాలతో ప్రేమ పూజాకు చిన్న వయసు నుంచే మొదలైంది. పూజ ను, ఆమె సోదరి ప్రియాను వారి తల్లి హిమాలయాలలో ట్రెక్కింగ్కు తీసుకెవెళ్లేది. ‘ట్రెక్కింగ్ వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఓర్పు, క్రమశిక్షణ’ అని చెబుతుంది పూజ. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేసిన పూజ ఆ తరువాత ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరింది. పరుగు అనేది ఆమె జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. 2011లో తల్లి, సోదరితో కలిసి హాఫ్–మారథాన్కు వెళ్లింది. ‘ఐదు కిలోమీటర్ల నా మొదటి పరుగు ప్రయాణం అలా మొదలైంది’ అంటూ జ్ఞాపకాల దారులలోకి వెళుతుంది పూజ. హాఫ్–మారథాన్ తరువాత పది కిలోమీటర్ల రేసులలో పాల్గొనడం మొదలుపెట్టింది. సరదాగా మొదలైన పూజాకృష్ణమూర్తి పరుగు ప్రయాణం చరిత్ర సృష్టించే వరకు వెళ్లింది.నవ యువ స్వర సంచలనం హన్సికా పరీఖ్రంగం: సంగీతంఇండియన్ పాప్ మ్యూజిక్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సికా పరీఖ్. అజ్మీర్లోని సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన హన్సికా పరీఖ్కు సంప్రదాయ సంగీతం మాత్రమే కాదు నవతరం సంగీతం అంటే కూడా ఇష్టం. చిన్నప్పటి నుంచి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మునిగి తేలింది హన్సిక. అలా అని అక్కడే ఉండి పోలేదు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సంగీత ధోరణుల గురించి తెలుసుకునేది. ఆమె పాట ప్రస్థానం ఎలా ప్రారంభం అవుతుంది అంటే.. మొదట ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ట్యూన్ క్రియేట్ చేస్తుంది. ఆ ట్యూన్ను మెల్లగా మనసు పొరల్లోకి తీసుకుంటూ పదాలు అల్లుతుంది. ‘కొత్త సంగీత ధోరణుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కొత్త ఆర్టిస్ట్లతో పనిచేయడం కూడా అంతే ముఖ్యం’ అంటుంది హన్సికా పరీఖ్.చిత్ర సంచలనంగీతా గంభీర్రంగం: సినిమాఈ సంవత్సరం ఆస్కార్ డాక్యుమెంటరీ రేసులో సంచలనం సృష్టించారు భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్ గీతా గంభీర్. రెండు వేర్వేరు చిత్రాలకు రెండు నామినేషన్లు సాధించారు. ‘ది పర్ఫెక్ట్ నైబర్’ అనే ఆమె చిత్రం ఫీచర్స్ విభాగంలో ‘బెస్ట్ డాక్యుమెంటరీ’కి నామినేట్ అయింది. మరో చిత్రం ‘ది డెవిల్ ఈజ్ బిజీ’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్కు నామినేట్ అయింది. నామినేషన్లకు ముందే ఈ రెండు చిత్రాలు అకాడమీ 15 షార్ట్ లిస్ట్లో ఉన్నాయి. ‘రెండు చిత్రాలను చాలా ప్రేమతో, శ్రద్ధతో నిర్మించాను. ఈ చిత్రాలకు వచ్చిన స్పందన సంతోషంగా ఉంది’ అంటున్నారు గీత. గీతా గంభీర్ బోస్టన్లో జన్మించారు. ఆమె తండ్రి శరద్ ఇంజినీరింగ్ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న గీత డాక్యుమెంటరీ ఫిల్మ్మేకింగ్తో తన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫిల్మ్ ఎడిటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత నాన్ ఫిక్షన్ ప్రోగ్రామింగ్ విభాగంలో అత్యుత్తమ పిక్చర్ ఎడిటింగ్లో రెండు ఎమ్మీ అవార్డ్లను గెలుచుకున్నారు.గేమ్ చేంజర్ఆశా శర్మరంగం: గేమింగ్తమ గేమింగ్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీయీవోగా ఆశా శర్మను నియమించింది మైక్రోసాఫ్ట్. యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటాలోని కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్న ఆశాశర్మకు టెక్నాలజీ, ప్రాడక్ట్, ఆపరేషన్ లీడర్షిప్లకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. 2011లో మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విభాగంలో తన కెరీర్ ప్రారంభించింది ఆశ. రెండు సంవత్సరాల తరువాత పోర్చ్ గ్రూప్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టింది. ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అమ్మకాలు, మార్కెటింగ్... మొదలైన వాటికి సంబంధించిన బాధ్యతలు చూసేది. ‘ఏ బాధ్యత తీసుకున్నా విజయవంతం చేస్తుంది’ అని పేరు తెచ్చుకున్న ఆశాశర్మ సరికొత్త బాధ్యతతోనూ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఏ.ఐ. ఐకాన్ అశ్వినిఅశోకన్రంగం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సిలికాన్ వ్యాలీలో పది సంవత్సరాలు పని చేసిన అశ్విని అశోకన్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చి, ఏఐ ప్లాట్ఫామ్ ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ ప్రారంభించింది. అత్యంత ఆధునిక ఏఐ ఉత్పత్తులను నిర్మించడంలో ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ‘మన దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అదే సమయంలో నిరుద్యోగం ఉంది’ అంటున్న అశ్విని తన కంపెనీ కోసం ప్రతిభావంతులను వెదకడంలో ఎప్పుడూ ముందుంటుంది. కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసింది అశ్విని. ‘ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్ను గమనించడం మంచిదేగానీ, వాటిని మనం గుడ్డిగా అనుసరించలేం. మన దేశ నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి’ అంటున్న అశ్విని ఏ.ఐ నాడి తెలిసిన నిపుణురాలు. ఏ.ఐ.ని సామాన్య ప్రజలకు ఎలా చేరువ చేయాలో తెలిసిన ఎంటర్ప్రెన్యూర్.ఆరోగ్య భాగ్యం సౌమ్య స్వామినాథన్రంగం: హెల్త్శిశు వైద్యురాలు, క్లినికల్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై విశేష కృషి చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రెటరీగా పనిచేశారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా చేరారు. అదే సంస్థలో చీఫ్ సైంటిస్ట్ అయ్యారు. కోవిడ్ కాలంలో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి కృషి చేశారు. 2009 నుండి 2011 వరకు యూనిసెఫ్, యూఎన్డీపి/ వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ల ‘రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రాపికల్ డిసీజెస్’ అనే స్పెషల్ ప్రోగ్రామ్కు కో ఆర్డినేటర్గా పనిచేశారు. ‘మన దేశంలో అందరికీ పోషకాహారం అందడం లేదు’ అంటారు. ఆమె తరచూ ‘హిడెన్ హంగర్’ అనే మాట అంటుంటారు. అంటే... తగినంత ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందక పోవడం. పిల్లలకు తగినంత పోషకాలు లభించక పోతే జరిగే దీర్ఘకాలిక నష్టాల గురించి ఎన్నో వేదికలపై నొక్కి చెప్పారు. చెన్నైలో పుట్టిన సౌమ్య ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కూతురు. -
ఎవరీ సృజన ఘల్లీ..? సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సైన్యంలోకి..
ఓ గ్రామ నేపథ్యం నుంచి కార్పొరేట్ స్థాయి ఉద్యోగం చేయడమే స్ఫూర్తిదాయకం. అందులోనూ వైట్కాలర్ ఉద్యోగం అంటే చక్కగా హాయిగా ఏ మాత్రం శారీరక శ్రమ పడకుండా ఏసీ గదుల్లో కూర్చొని చేసే జాబ్. అలాంటి జాబ్ని వద్దనుకుని దేశ సేవలోకి రావడం మాటలు కాదు. పైగా ఆర్మీలో కఠినతరమైన శిక్షణను తట్టుకుని ఏకంగా ఆఫీసర్ స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది భూటాన్కి చెందిన అమ్మాయి. యువతరం అంటే ఎంజాయ్మెంట్కి, జోష్కి కేరాఫ్ కాదు..దేశ సేవలో మనము భాగం కావాలి..మన దేశ భవిష్యత్తుకు మనమే రూపకర్తలం అని చాటి చెప్పి..జయహో సృజన అని అనిపించుకుందిఆ అమ్మాయే విదేశాంగ అధికారి క్యాడెట్ సృజన ఘల్లీ. అసలు సాయుధ దళాల కుటుంబ నేపథ్యం కాకపోయినా..ఎప్పుడో చిన్నతనంలో ఒక సైనిక అధికారిని చూసి..మనం కూడా అలాంటి యూనిఫాం ధరిస్తే..అని సరదాగా అనుకుంది. అది ఆమె మనసు అంతరాళంలో ముద్రపడినా..పెద్దయ్యాక అంతగా దాన్ని పట్టించుకోలేదు సృజన. భూటాన్లోని సామ్ట్సే అనే గ్రామంలో పుట్టి పెరిగిన సృజన తన కెరీర్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఉన్నత విద్యవైపుగా అడుగులు వేసింది. అలా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, భూటాన్లోని సెలిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడం ప్రారంభించింది. టెక్నాలజీ రంగంలో మరిన్ని ఉన్నత హోదాల్లో పనిచేసే అవకాశం ఉన్నా..దాన్నికాదనుకుని చిన్నతనంలో ఇష్టపడ్డ ఆర్మీయూనిఫాంని ధరించేందుకు ఇష్టపడింది. సౌకర్యవంతమైన కార్పొరేట్ లైఫ్లో సంతోషం లేదని, వ్యక్తిగత సక్సెస్ కన్నా..దేశ సేవలో ఉన్న ఆనందమే వేరు అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. అలా ఆమె సాఫ్ట్వేర్ కెరీర్ని వదిలేసి సైనికురాలిగా సేవలందించాలని భావించి..చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. అక్కడ ఆమె ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్గా చేరింది. అక్కడ ఆమె జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. తొమ్మిది నెలల కఠిన సైనిక శిక్షణలో ఆహోరాత్రలు శ్రమించింది. ఆ క్లిష్టతరమైన శిక్షణ శారీరకంగానూ మానసికంగానూ స్ట్రాంగ్గా ఉండేలా చేశాయి. కంఫర్ట్జోన్ దాటి వస్తేనే అసలైన మజా ఉంటుందని గ్రహించింది. ఆ సైనిక శిక్షణలో ఎదురైన కష్టాలు, సవాళ్లు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ఒకరకంగా ఆ ట్రైనింగ్లోనే సంకల్పం, పట్టుదల, ఓర్పు విలువల గురించి మరింతగా తెలుసుకుంది. అలా సైనిక నాయకత్వ బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకుని రాయల్ భూటాన్ ఆర్మీలో కమిషన్డ్ సభ్యురాలి పనిచేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం సృజన దేశానికి ఒక కవచం, సురకత్తిలా మారనుంది. సౌకర్యవంతమైన జీవితాన్ని కాదనుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అలాగే కఠినతరమైన ఆర్మీ శిక్షణలో నెగ్గుకురావాలంటే..అచంచలమైన ఓపిక, ధైర్యం తోపాటు దేశభక్తి ఉండాలి. నిజంగా సృజనే శక్తిమంతమైన మహిళ. ఆదర్శవంతమైన నారీ కూడా. (చదవండి: రణరంగంలో నారీ శక్తి..!) -
బతుకులో జీవం నింపే కళ
‘మనసుకు నచ్చిన పని ఎంతటి సంతృప్తిని ఇస్తుందో హస్తకళల ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటారు’ మరియా క్లారా. సికింద్రాబాద్లోని నాగోల్లో ఉంటున్న మరియా ఉద్యోగాన్ని వదిలేసి, కలంకారి, బాతిక్ పెయింటింగ్ నేర్చుకొని కలంబాతిక్ మరియా క్లారా గా తన కళకు గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఆమె మనసును ఎలా గాయపరుస్తాయో, తిరిగి ఆమె జీవితం కొత్తగా ఎలా మార్పు చెందుతుందో ఈ కళ కూడా వస్త్రం మీద అలాగే కళ్లకు కడుతుంది’ అంటూ కళాత్మకమైన విశేషాలను పంచుకున్నారు...‘‘కరోనా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ప్రైవేట్ ఉద్యోగంలో యాంత్రికంగా రోజులు గడిచిపోయాయి. జీవితంలో జీవం ఉండేదెలాగో అన్వేషిస్తుండగా హస్త కళలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో బాతిక్ ఆర్ట్తో గొప్ప అనుభూతిని పొందాను. మావారు ప్రైవేట్ జాబ్ చేసి, రిటైర్ అయ్యారు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఎవరి ప్రయాణం వాళ్లదే. నేను వాళ్లకు సపోర్ట్ చేస్తాను. వాళ్లు నాకు సపోర్ట్ చేస్తారు. నా ఇష్టాన్ని వాళ్లు కాదనరు.అర్థమెంతో...వ్యాక్స్తో క్లాత్ మీద ముందుగా గీతలను డిజైన్ వచ్చేలా గీస్తాం. తర్వాత దానిని ముందే సిద్ధం చేసుకున్న రంగులలో ముంచుతాం. దాంతో ఆ క్లాత్మీద ఉన్న వ్యాక్స్ లైన్ అంతా విరిగిపోతుంది. ఆ గీతల స్థానంలో రంగు లైన్లు లైన్లుగా ఇంకిపోయి, ఒక చెప్పలేని అందం కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరి వల్లనైతే మనం బాధపడతామో, ఆ తర్వాత అదే బాధ అవతలి వారు పడుతున్నప్పుడు దానిని తొలగించాలని చూస్తాం. ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించిన వాళ్లకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. అంటే, ‘నువ్వు నొప్పిని అనుభవిస్తేనే, అవతలి వారికి ఉపశమనం ఇవ్వగలవు..’. అని ఈ బాతిక్ ద్వారా జీవితపు అర్థం ఏంటో తెలిసి వచ్చింది. అంటే నొప్పిని అనుభవించిన స్త్రీయే, నొప్పికి మందుకూడా వేయగలదు. అది ఈ బాతిక్ చూపుతుంది. మనసుకు అయిన గాయాలకు రంగులు పూసి, మనకే అందంగా చూపించే కళ ఇది.ఆసరా అయ్యేలా కూడా ఉండాలిమన గురించి బయటివారికి చెప్పలేని భావాలను ఆర్ట్ రూపంలో చెప్పవచ్చు. నటించాల్సిన అవసరం లేకుండా చేసేవి హస్తకళలే. నేను చేసేది కమర్షియల్ వర్క్ కాదు. ఎవరైనా తమకు నచ్చిన అంశం డిజైన్లో వచ్చేలా చేసి ఇవ్వమని అడిగితే దానికి తగినట్టు చేసి ఇస్తాను. ఉదాహరణకు.. ‘మా ఇంట్లో పెళ్లి ఉంది, వధూవరుల డిజైన్ చేసి ఇవ్వాలి’ అని అడిగితే అలాగే చేసి ఇస్తాను. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పది మందికి ఆసరా అయ్యేలా కూడా ఉండాలని కోరుకుంటాం.ఉపాధి కల్పిస్తున్నాను..కొన్ని చీరలు, డ్రెస్సులు కలం బాతిక్ పెయింటింగ్ చేసి, బొటిక్స్కి ఇస్తాను. ఈ వర్క్ని కొంతమంది మహిళలకు నేర్పి, వారికి ఉపాధిని కల్పిస్తున్నాను. గుజరాతీ, బెంగాల్ రాష్ట్రాలలో ఈ బాతిక్ పెయింటింగ్ బాగా ్రపాచుర్యంలో ఉంది. మన దగ్గర బ్లాక్ ప్రింట్ అచ్చులతో వేస్తారు. నేను మాత్రం పూర్తిగా చేతితోనే వేస్తాను. కాలేజీలు, స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడి విద్యార్థులకు ఈ వర్క్ నేర్పిస్తున్నాను. ఈ కళ గురించి ఏమీ తెలియని వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పనిని నేర్చుకోవచ్చు. హైదరాబాద్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జరిగే కార్యక్రమంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్క్ నేర్పించే అవకాశం లభించింది. ఇష్టంతో నేర్చుకున్న పని నన్ను ఎంతో మంది కళాకారులకు చేరువ చేసింది. భావోద్వేగాల సమతుల్యతను నేర్పించింది’ అంటూ హస్తకళల గొప్పతనాన్ని అందంగా వివరించారు ఈ కళాకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి
ఎంపవర్మెంట్ కుటుంబ బాధ్యతల నుంచి స్త్రీ సాధికారత వరకు, ఆధునిక కాలంలో కుటుంబ బంధాల నుంచి స్త్రీ శక్తి వరకు... జస్టిస్ బీవీ నాగరత్న ఏది మాట్లాడినా... అది ఆణిముత్యమే. ఆత్మావలోకన దృశ్యమే. ఆమె మాటలు స్త్రీ సాధికారత, చైతన్యానికి వెలుగు బాటలు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా విముక్తి... మొదలైన విషయాలపై వివిధ సందర్భాలలో జస్టిస్ బీవీ నాగరత్న వెలువరించిన అభ్రిపాయాలు.→ వివాహం లేదా ప్రసవం తరువాత మహిళలు తమ కెరీర్ను వదులుకోకూడదు. ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది మహిళలకు సంబంధించి పఠిష్టమైన భద్రతావలయం.→ పురుషాధిక్య రంగాలలో మహిళల సంఖ్య పెరగడం ‘చొరబాటు’ కాదు. చారిత్రాత్మకంగా వారికి నిరాకరించబడిన స్థలాలను తిరిగి పొందడం.→ ప్రభుత్వ, చట్టపరమైన స్థానాల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండాలి.→ భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే మొదటి అడ్డంకి... ఆడపిల్లగా పుట్టడమే!→ ఎన్ఎఫ్హెచ్ఎస్–డేటా ప్రకారం 15–19 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లల్లో 59 శాతం మంది తగిన పోషకాహారం లేకుండా, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఆడపిల్లల అభ్యున్నతికి ఆటంకంగా మారవచ్చు.→ బాలికలపై పెరుగుతున్న డిజిటల్, లైంగిక హింసను నిరోధించడానికి న్యాయ, చట్ట విధానాలను మరింత విస్తరించాలి. 2018–2022ల మధ్య పదివేలకు పైగా కేసులు నమోదైతే వాటిలో శిక్షార్హత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. సకాలంలో బాధితులకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి.→ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేగంగా మార్పు చెందుతోంది. ఈ మార్పులు కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే కాదు న్యాయవ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం బలపడడం కూడా ఈ మార్పుల్లో ఒకటి. విద్య, ఉపాధి ద్వారా మహిళలు పొందే సామాజిక–ఆర్థిక విముక్తిని సమాజం సానుకూలంగా చూడాలి. ప్రోత్సహించాలి. అలాంటి మహిళలు కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే కాదు దేశశ్రేయస్సుకు కూడా దోహదపడతారు.→ కోర్టులలో ఉన్న కుటుంబ వివాదాల్లో ఎక్కువ కేసులు రెండు పార్టీలు రెండు అడుగులు వేస్తే పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలలో ఒకరికొకరు ఆసక్తి, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు భార్యాభర్తలు ఎవరికి వారు అవతలి వ్యక్తి దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి.→ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడానికి కారణం మహిళల ఆర్థిక, సామాజిక విముక్తి కాదు. మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన అభి్రపాయాలు, వైఖరులను మార్చుకోకపోవడమే.→ మహిళలకు స్వతంత్రం ఇవ్వండి. సలహాలు, సూచనల నెపంతో వారిని నిరంతరం పర్యవేక్షించకండి. వారు స్వతంత్రంగా ఎదగడాన్ని కోరుకోండి. ఈ దేశ మహిళలందరూ అదే కోరుకుంటున్నారు.→ వీధిలోకి వెళ్లినా, బస్సు లేదా రైల్వేస్టేషన్లో అడుగు పెట్టినా తన భద్రతకు సంబంధించిన ఆలోచనల భారాన్ని స్త్రీ మోయాల్సి ఉంటుంది. ఇల్లు, పని, సమాజంలో తన బాధ్యతలకు సంబంధించిన మానసిక భారానికి ఇది అదనపు భారం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, బేటీ బచావోలాంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంలో పురోగతి సాధించాం. చెడుకు అడ్డుకట్ట వేసే ప్రతి నివారణ చర్య, రక్షణ వ్యవస్థ హాని చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాలికలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని నిర్మిస్తాయి. -
తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..
సంగీతంలో పెర్కషన్ వాయిద్యాలు వాయించడం అంత సులభం కాదు. చాలామటుకు వాటిని మగవాళ్లే వాయిస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే పెర్కషన్ కళాకారులుగా మగవాళ్లే ఉంటారు ఎందుకంటే వాటిలో కొన్ని వాయిద్యాలు అత్యంత బరువుతో ఉంటాయి. పైగా వాయించాలంటే అపారమైన ఓపిక, శారీరక నొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాటిలో అత్యంత కష్టతరమైన వాయిద్యం తవిల్..అలాంటి వాయిద్యాన్ని అద్భుతంగా ఆలపిస్తూ..గుర్తింపు తెచ్చుకుంటోంది ఓ మహిళా కళాకారిణి. అంతేగాదు ఈ తవిల్ వాయిద్యాన్ని ఆలపిస్తున్న తొలి మహిళా కళాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఎవరామె అంటే..ఆ అమ్మాయే ఆరు తరాల సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చిన అమృతవర్షిణి మణిశంకర్. తమిళనాడులోని తిరువూరు, మన్నార్గుడికి చెందిన ఆమె, తండ్రి నాగస్వరం కళాకారుడు ఎపి మణిశంకర్ కాగా, తల్లి జయంతి శంకర్ వయోలిన్ విద్వాంసురాలు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తవిల్ నేర్చుకుంటూ తరతరాల నాటి సంప్రదాయాన్ని ధిక్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మహిళలు అరుదుగా అభ్యసించే వాయిద్యాన్ని ఆమె అలవోకగా వాయిస్తుంది. ఇంతవరకు మహిళా తవిల్ కళాకారులు ఎవ్వరూ లేరని చెప్పిన తల్లిదండ్రుల మాటలు ఆమెలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంచాయట. ఆ నేపథ్యంలోనే ఈ వాయిద్యాన్ని వాయించడం పట్టుదలతో నేర్చుకుంది అమృతవర్షిణి. ఆమె కోవిలూర్ కె.జి. కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఈ వాయిద్యాన్ని వాయించడంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆధునాతన శిక్షణను తీసుకుంటోంది. ఇందులో మరింత రాణించేలా తవిల్ కళాకారుడు తంజావూరు టి.ఆర్. గోవిందరాజన్ వద్ద సలహాలు సూచనలు తీసుకుంటూ తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటోంది. ఇక అమృత వర్షిణి గురువు సలహాల మేరకు ఈ వాయిద్యాన్ని నేలపై ఉంచడానికి బదులు తన ఒడిలో ఉంచి వాయించడం ప్రారంభించింది. దాదాపు 60 కిలోలు బరువు ఉండే వాయిద్యం ఎక్కువసేపు వాయించడానికి అపారమైన ఓర్పు అవసరం. ఎందుకంటే భుజం, కాళ్లలో నొప్పి అధికమవుతుంది. పైగా వేళ్లు రక్తస్రావం అవుతాయి కూడా. అవన్నీ నయం అవడానికే సుమారు పది రోజులు పడుతుంది. కచేరికి ముందు వేళ్ల చుట్టూ టేప్ చుట్టి..ధ్వనిని ఉత్పత్తి చేసే క్యాప్లను తొడిగేందుకు జిగురు రాసుకోవాల్సి ఉంటుందట. అయితే ఇప్పుడు ఆధునిక ఆడియో వ్యవస్థల కారణంగా కాస్త ప్రదర్శన సులభతరం అయ్యిందని, శారీరక ఒత్తిడి కూడా తగ్గిందని అంటోంది.బహిరంగ ప్రదర్శనలివ్వడం అప్పటి నుంచే..పదకొడేళ్ల ప్రాయం నుంచి అమృతవర్షిణి బహిరంగ ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. తొలి ప్రదర్శన హరిధ్వర్మంగళంలోని అరుల్మిగు ముత్తుమైరామ్మన్ ఆలయంలో జరిగింది. 2020లో తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీ (వాయిద్య విభాగం)లో మూడవ స్థానం దక్కించుకుంది. 2022లో మళ్ళీ పాల్గొన్నప్పుడు బ్యానర్పై తన చిత్రాన్ని చూసుకుని మురిసిపోయానంటోంది. View this post on Instagram A post shared by Indian Women Blog (@indianwomenblog) ప్రస్తుతం ఆమె సంగీత కచేరీల నిమిత్తమే టూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఈ వారాంతంలో బెంగళూరులో జరిగే మహీంద్రా పెర్కషన్ ఫెస్టివల్లో ప్రదర్శించే ‘ఉమెన్ హూ డ్రమ్’ అనే పూర్తి మహిళల పెర్కషన్ బృందంలో భాగం కానుంది. ఇది పూర్తిగా మహిళా సంగీత కళాకారులతో కూడిన బృందం. ప్రముఖ సంగీత విద్యాంసుడి నుంచి పిలుపు..అన్నింటికంటే అత్యంత విశేషమైనది “రెహమాన్ సర్ 'వండర్మెంట్ టూర్' కచేరీలో అమృతవర్షిణిని వాయించమని కోరడం. అదే తనకు తొలిసారి అని ప్రేక్షకుల ముందు సోలోగా ప్రదర్శన ఇవ్వడం అంటూ తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో గుర్తుచేసుకుంది 18 ఏళ్ల అమృతవర్షిణి. గత అక్టోబర్లో రెహమాన్ సార్ ఇన్స్టాగ్రామ్లో తనను ఫాలో అవ్వడం చూసి.. చాలా ఆశ్చర్యపోయిందట. కొంతకాలం తర్వాత, ఆయన మేనేజర్ స్వయంగా ఫోన్ చేసి ఫిబ్రవరిలో రెండు రోజులు చెన్నైలో ఉండి కచేరీలో పాల్గొనాలని చెప్పడం ఎప్పటికీ మర్చిపోను అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. మహిళలు వాయించలేని సంగీత పరికరాన్ని వాయించడం సాధన చేయడమే గాక..అందులో రాణిస్తూ..ఏకంగా ప్రముఖ సంగీత విద్వాంసుల నుంచి పిలుపు అందుకోవడం మాములు విషయం కాదు కదా..!. ఇది నిజంగా మహిళా సాధికారతకు, ఆమె అజేయమైన శక్తికి నిర్వచనం కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
అయిదు వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించారు!
‘ఆరోగ్యానికే ప్రథమ స్థానం’ అనే ఒకే ఒక మాటతో అయిదు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు బెంగళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని, అనిందిత సంపత్. ఈ బ్రాండ్ నగరంలోని అతిపెద్ద బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇది గాలివాటు విజయం కాదు. విద్య, క్రమశిక్షణ, పోషకాహారం పట్ల లోతైన అవగాహన, వ్యాపార దక్షత ఒక దగ్గర చేర్చితే కనిపించిన ఫలితం.ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు కూతుళ్లు దూరంగా ఉండేలా చూసుకునేది సుహాసిని తల్లి. ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారుచేసేది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎప్పటికప్పుడూ అవగాహన కలిగించేది. చివరికి ఆ అవగాహనే వారి వ్యాపారానికి కేంద్రబిందువు అయ్యింది. అనిందిత బిట్స్ పిలాని, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి. న్యూయార్క్లోని ఎర్న్స్ అండ్ యంగ్లో మేనేజర్గా పనిచేసింది. సుహాసిని లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ, వార్టర్ స్కూల్ నుండి సీఏ చేసింది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేసింది.ఒకరోజూ ప్రొటీన్బార్ తింటూ...‘మనం ఎప్పుడైనా వ్యాపారం ప్రారంభిస్తే ఆ కంపెనీ పేరు యోగా బార్’ అని సరదాగా చెప్పింది సుహాసిని. ఆమె సరదాగా అన్నా, ఆ మాట నిజమైంది.క్లీన్ లేబుల్ స్నాక్స్ను సృష్టించే లక్ష్యంతో సుహాసిని, అనిందిత భారతదేశానికి తిరిగివచ్చారు. ఇందిరానగర్లోని తమ ఇంట్లో మూడు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. ‘యోగా బార్’ రూపంలో వారి కంపెనీ పట్టాలకెక్కింది. రిటైల్ వ్యాపారులు, వియోగదారులలో తమ ప్రాడక్ట్ గురించి నమ్మకాన్ని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు విజయకేతనం ఎగరేశారు.ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసి దృష్టిని ఆకర్షించింది యోగా బార్. యోగాబార్ మాతృసంస్థ స్ప్రౌట్స్లైఫ్ ఫుడ్స్లో దాదాపు 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఐటీసీ. కంపెనీ సీయీవోగా అనిందిత ప్రాడక్ట్ డెవలప్మెంట్, క్రియేటివ్ విజన్కు సంబంధించిన బాధ్యతలను, సీవోవోగా సుహాసిని మేనేజింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ డిసిప్లేన్కు సంబంధించిన బాధ్యతలను చూస్తున్నారు. -
రంగుల లోకపు రాణులు
భారతీయ కళా ప్రపంచంలో ప్రత్యేకంగా కనిపించే, విస్తృతంగా గుర్తింపు పొందిన లక్షణం ఏమిటంటే అత్యంత ప్రభావవంతమైన గ్యాలరీ నిర్వాహకులు, క్యురేటర్లు, కళా పరిరక్షకులలో అనేకమంది మహిళలే కావడం! భారతదేశంలోని అనేక రంగాలు ఇప్పటికీ పురుషాధిక్యంగా ఉన్నప్పటికీ, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోని సమకాలీన కళా వేదికలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నా సమానత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ ఈ వేదికలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. కళకు నా పరిచయం అమృతా షేర్–గిల్ చిత్రాలతో చిన్నప్పుడే మొదలైంది. కాలక్రమేణా ఆమె గురించి నా అవగాహన మారింది. విద్యార్థిగా ఆమెను ఆధునిక భారతీయ చిత్రకళలో మార్గదర్శిగా చూశాను. కానీ క్యురేటర్గా చూస్తే, ఆమె మన దృక్కోణాన్ని మార్చిన వ్యక్తి. భారతీయ మహిళలకు ఒక అంతరంగాన్ని, సజీవమైన ఉనికిని ఇచ్చిన కళాకారిణి. ఆ మార్పు నేను చిత్రకళను అర్థం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఈ పరంపర విస్తరిస్తోంది.స్త్రీ వాదం... జీవన పోరాటంమాటలకందని భావాలను, సమాజంలో జరుగుతున్న విషయాలను, రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో చిత్రీకరిస్తారు అర్పితాసింగ్. నళిని మలాని పౌరాణిక కథలను, చరిత్రను, హింసను, స్త్రీవాద సమస్యలను, జీవన పోరాటాలను ‘న్యూ–మీడియా‘ ద్వారా చూపిన తొలి కళాకారిణి. మృణాలిని ముఖర్జీ సాధారణమైన అల్లిక పద్ధతికి కొత్త కోణాన్ని జోడించి వాటితో ఫైబర్ శిల్పాలను సృష్టించి, తన కళాఖండాలకు విభిన్నమైన స్థాయిని కల్పించారు. ఛాయాచిత్రాల ద్వారా గత స్మృతులు కవితాత్మకంగా ఉండవచ్చని, సేకరణ పద్ధతి కూడా స్వయంగా ఒక కళారూపమని షీబా ఛాచ్ఛి మనకు తెలియజేశారు.కళాసేవకులునేను క్యురేటోరియల్ విభాగంలోకి అడుగుపెట్టిన తరువాతే మహిళలు కేవలం కళాఖండాలను మాత్రమే కాదు, కళా వ్యవస్థలనే మలిచారని నాకు అర్థమైంది. ‘ఖోజ్’ అనే ఒక కళా–సేవా సంస్థను, వస్తువులు అమ్మే అంగడిలా కాక – సంభాషణ, ప్రయోగాల వేదికగా, వర్ధమాన కళాకారుల మేలు కోసం పూజ సూద్ మరికొంతమందితో కలిసి స్థాపించారు. వస్త్రాలు, వస్తుసంస్కృతిపై అన్నపూర్ణ గరిమెళ్ల చేసిన పరిశోధన చిత్రకళకూ హస్తకళలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, హెచ్చుతగ్గులనూ తొలగించడంలో కీలకంగా మారింది. మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళా కళాకారులు, కేవలం కళా సృష్టిలోలోనే కాదు, బోధనలో, సంస్థల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు, స్వాతంత్య్ర సమరంతో పాటు సాంస్కృతిక రంగంలో కృషి చేసిన సంగం లక్ష్మీబాయి నుంచి ఆంధ్ర ఆధునిక చిత్రకళలో తనదైన శైలి చాటుకున్న దామెర్ల సత్యవాణి వరకు తరతరాల కళాకారులను తీర్చిదిద్దిన కవితా దేవుస్కర్, అంజని రెడ్డివంటి వారి నుంచి నిశ్శబ్దంగా ‘సంస్కృతి స్కూల్ ఆఫ్ ఆర్ట్’ను లాభాపేక్షలేని వేదికగా నిలబెడుతున్న ‘ప్రింట్ మేకర్’ పద్మారెడ్డి వరకు, జేఎన్ ఏఎఫ్ఏయూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడిన నిర్మల బిలుకా నుంచి, విద్యావేత్తగా నిబద్ధతతో పనిచేస్తున్న ప్రీతి సంయుక్త వరకు, వీరందరి కృషి ఎంతోమంది చిత్రకళా విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దారు. అలాగే, గౌరి వేముల, ప్రియాంక ఏలే వంటి కళాకారిణులు హైదరాబాద్ చిత్రకళా స్వరాన్ని జాతీయ వేదికలపై వినిపించారు.మహిళగా ఎన్నో సవాళ్లుఎదుగుతున్న మహిళా గ్యాలరిస్ట్గా నాకు సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నమ్మకాన్ని కాపాడుకోవడం, నిధులు సమకూర్చడం, సారూప్య భావనలు కలవారితో చర్చలు జరపడం, అందరికీ పరస్పరం ఉపయోగపడే వ్యవస్థను అలుపెరుగక నిర్మించడం లాంటివి. భారతీయ చిత్రకళలో మహిళలు చూపిన దారులు మనకెంతో ధైర్యాన్నిస్తాయి. వసతులపై ఆధారపడకుండానే వారు సంస్థలను నిర్మించారు. అంగడి లేకుండానే వ్యవస్థను సృష్టించారు. సాంస్కృతిక వేదికలు పట్టుదలతో, సహకారంతో నిర్మితమవుతాయని తెలుసుకున్నాను. ్రపాంతీయతతో ముడిపడిన దళిత, ఆదివాసీ మహిళల స్వరాల వైవిధ్యం నన్ను ఎప్పటికీ ఉత్తేజ పరుస్తుంది. ఈ మహిళా కళాకారులు ప్రకృతి, జ్ఞాపకాలు, శ్రమ ఆధారంగా సమకాలీన భారతీయ చిత్ర–హస్తకళలను పునర్నిర్మిస్తున్నారు. వారి శైలికి తగ్గట్టు, నిదానంగానూ, సహకారాత్మకంగానూ పనిచేసే క్యురేటోరియల్ విధానాలను కోరుకుంటారు; జ్ఞానమనేది కేవలం సంస్థలకే పరిమితం కాదని, వాటి బయట కూడా ఎంతో విజ్ఞానం ఉందని గుర్తుచేస్తున్నారు.ఆ పునాది పైనే!శాంతి స్వరూపిణి (శిల్పి) వరుణికా సరాఫ్ వంటి కళాకారులెందరో జాతీయ కళా వేదికపై తమదైన ముద్ర వేశారు. వీరందరి సమష్టికృషి, ఓర్పుతో, నిర్మితమైన పునాది పైనే మనమందరం నిలబడ్డాం. వీరు ‘బోధన, సృజన, సంస్థ నిర్మాణం’ అనే మూడు రంగాలపై దృష్టి సారించారు. తాత ముత్తాతల నుండి వచ్చిన స్మృతులు, కథల ద్వారా తెలుసుకున్న విషయాలను కళా రంగంలోకి వీరు తీసుకువచ్చారు. వారు పాటించిన పద్ధతులను పరిశోధించడం వలన నా ఆలోచనా విధానం కూడా ప్రభావితమయ్యింది. ప్రదర్శనలు కేవలం యాంత్రికంగా జరిగేవి కావు! అవి పరిశోధనతోనూ, బోధనతోనూ, ప్రజలతోనూ అనుసంధానాన్ని కలిగిన ప్రక్రియలు. ఆ ప్రదేశంలోకి ఎవరు వస్తున్నారు? మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? మొదటిసారి చూసే వారికి ఇది ‘తమదే’ అన్న భావన ఎలా కలిగించాలి? ఈ ప్రశ్నలే మహిళల నేతృత్వంలోని సాంస్కృతిక కృషిలో ముఖ్యమైనవి. – అన్నపూర్ణ ఎం.ఇండిపెండెంట్ ఆర్ట్ క్యూరేటర్, ఆర్టిస్ట్, ఫౌండర్, డైరెక్టర్– ఏక్చిత్రా ఆర్ట్గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ షో, కో–ఫౌండర్ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకంగ్యాలరీలోకి అడుగుపెట్టక ముందే చిత్రకళ గురించిన కథలు వింటూ పెరిగాను. మా నాన్నగారు ఎర్రమిల్లి రోహిణీ కుమార్ గారు చిత్రకారులవటం చేత, ఆయనకు తెలిసిన చిత్రకారుల గురించి మాట్లాడినప్పుడు, దగ్గరి బంధువుల గురించి చెప్తున్నారేమో అని అనిపించేది. రావాల్సినంత గుర్తింపు రాకపోయినా, సృజనాత్మక వేదికలను నిలబెట్టిన మహిళల గురించి నేను విన్న ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకం. వారు కేవలం చిత్రాలను గీయడంతో ఆగలేదు, శిల్పాలు మాత్రమే చెక్కి ఊరుకోలేదు. కళను ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలకు కార్యరూపం ఇచ్చారు. ఇప్పుడు నేనొక క్యురేటర్గా, ఎదుగుతున్న గ్యాలరిస్ట్గా వాటి గురించి ఆలోచిస్తుంటాను. భారతీయ కళలలో మహిళల పాత్ర అనేది కొత్తగా చేర్చాల్సిన విషయం కాదు, అది ఎప్పటినుంచో అంతర్లీనంగా ఉన్నదే. -
ముళ్లున్న చోటే పూలు
కుటుంబం సవ్యంగా సాగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఎదురయ్యే కుదుపులు సమస్యలను సృష్టిస్తాయి. వాటినుంచి బయటపడడంలోనే మన జీవన పోరాటం దాగి ఉంటుంది. నల్గొండ జిల్లా దుగ్గపల్లికి చెందిన కర్ర శశికళ జీవితంలోనూ ఇదే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం భర్త ఆకస్మిక మరణంతో ఆమెను శూన్యం ఆవరించింది. కానీ, సమస్యకు ఎదురొడ్డి తను కష్టాల నుంచి బయటపడటమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. ఈ సందర్భంగా శశికళతో మాట్లాడినప్పుడు ఆమె పంచుకున్న విశేషాలు ఇవి.‘‘మనం ఒకటి అనుకుంటాం. కానీ, విధి మరొకటి తలుస్తుంది అంటారు. అందుకు నా జీవితమే ఉదాహరణ అనిపిస్తుంది. నాకు పల్లెటూరు, పొలాలు కన్నా పట్టణ జీవితం అంటేనే ఇష్టం ఉండేది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరం మిర్యాలగూడ టౌన్లో ఉండేవాళ్లం. మాకు ఒక బాబు. పెళ్లయ్యాక పీజీ, తర్వాత బీఇడీ చేశాను. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి సమయంలో మా వారు వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఊరికి వెళ్లిపోదాం అన్నారు. కానీ, పల్లెటూరుకు వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో కొంతమంది స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. అందులో పెద్ద నష్టం. అప్పుల్లో కూరుకుపోయాం. ఇది చాలదన్నట్టు ఆయన ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధి అని తేలింది. ఆసుపత్రులు, చెకప్లు అంటూ తిరుగుతుండగానే ఆయన వెళ్లిపోయారు. పూర్తిగా డిప్రెషన్ ఆవరించింది. ఆరునెలలైనా మామూలు మనిషిని కాలేకపోయాను. చనిపోదాం అనుకున్నాను. అలాంటి సమయంలో అమ్మనాన్నలు, తోడబుట్టినవాళ్లు అండగా నిలిచారు.నచ్చని వ్యవసాయాన్నే ఎంచుకున్నాను..నా భర్త కల వ్యవసాయం చేయాలని. కానీ, అప్పటికి మాకు ఆస్తి ఎంత ఉందో, అంతకుమించి అప్పు ఉంది. ఏం చేయాలా అనుకుంటున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ‘ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పు తీర్చేసి, ఉద్యోగం చేసుకుంటూ బతుకుదామా..’ అని ఆలోచించాను. కానీ, ఉద్యోగాన్నే వదులుకున్నాను. నా భర్త కల నెరవేరాలంటే వ్యవసాయమే సరైనది అనుకున్నాను. ఆ రంగంలో ఓనమాలు కూడా తెలియవు. ప్రతీది నేర్చుకుంటూ, రాణిస్తున్నాను. అగ్రికల్చర్ లోను తీసుకొని, వ్యవసాయం మొదలుపెట్టాను. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం ఎలా.. అని చాలా ఆలోచించేదాన్ని. మూడు వేల రూపాయలతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేసి, బత్తాయి తోటను కాపాడే ప్రయత్నం చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. కొద్ది కొద్దిగా అప్పులు తీరుస్తూ వచ్చాను. ఈ రంగంలో ఇంకా ఏమైనా చేయవచ్చా అనే ఆలోచనలు చేసినప్పుడు నర్సరీ నాకు సరైన ఎంపిక అనిపించింది.నర్సరీ ఆలోచన మేలు చేసింది.. నర్సరీలలో మొక్కల పెంపకానికి చేపడుతున్న చాలా మంది ఉత్తమమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఆ వైపుగా ఆలోచించాను. నర్సరీ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల ఊళ్లలో రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఉన్న పొలంలోనే నర్సరీ ఏర్పాటు చేశాను. ఈ నర్సరీలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల డెకార్కు సంబంధించిన మొక్కలను పెంచుతున్నాను. దీంతో పాటు తోటలకు సంబంధించిన మామిడి, బత్తాయి, జామ, నిమ్మ మొక్కలు సైతం ఆర్డర్లపై అందిస్తున్నాను. వీటికి తోడు గోవులను పెంచుతూ, వాటి ఉత్పత్తులను పంటలకు వాడుతున్నాను. కొన్నాళ్లకు మా వారి పేరు మీదుగా శ్రీ సాయి మాధవ గో సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఈ పని నాకు చాలా మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మొదట్లో ఊళ్లో అందరూ నా వెనక మాట్లాడుకున్నవారే ఇప్పుడు వ్యవసాయంలో సలహాలు, సూచనలు అడుగుతుంటారు. హార్టీ కల్చర్ షోలలోనూ పాల్గొంటుంటాను. నర్సరీ, వ్యవసాయానికి ఉపయోగించే ఆర్గానిక్ ఉత్పత్తులనూ సప్లై చేస్తుంటాను. ఈ రంగంలో ఉత్తమ మహిళా రైతు అవార్డులూ అందుకున్నాను. మా అబ్బాయిని పై చదువులకోసం విదేశాలకు పంపగలిగాను. మహిళ శక్తి ఆమెకు మొదట తెలియదు. కానీ, తలుచుకుందంటే చేసి చూపగలదు. ఆ ధైర్యం, తెగువ ఆమెలో స్వాభావికంగానే ఉంటాయి’ అని వివరించింది శశికళ. ఇన్నేళ్లుగా వ్యవసాయం రంగంలో ఉన్నాను. కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ ప్రకృతితో పోరాటమే. ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు. తెల్లవారకముందే నా పనులు మొదలవుతాయి. ఒకప్పుడు ఎంతమాత్రం ఇష్టం లేని పనే ఇప్పుడు నాకు ప్రాణమైంది. పచ్చని మొక్కలు, గోవులు నా ఆత్మీయ నేస్తాలు అయ్యాయి. ప్రకృతికి ఎంత ఎక్కువగా దగ్గరవ్వగలను.. అనేదే ప్రతీక్షణం ఆలోచిస్తాను. అదే ఈ రోజు నన్ను ఇలా మార్చింది అనుకుంటాను. – కర్ర శశికళ, సేంద్రియ వ్యవసాయ రైతు– నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా -
శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్గా పనికి వచ్చేయాలి..
మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అని ఠక్కున గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే..అంతగా గుర్తించని శక్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్కోక్కరిని కదిలిస్తే వాళ్ల కన్నీళ్లు ఇంకిపోయేలా పడుతున్న బాధలు, వేదనలు తెలుస్తాయి. అయినా వాటన్నింటిని పంటి బిగువున పెట్టి..పనులకు వచ్చేస్తుంటారు. ఏం కాదు, ఏం జరగలేదు అన్నట్లుగా చకచక పనులు చేసుకుపోయే ఆ మహిళామూర్తుల జీవితాలు ఎందరికో ఆదర్శం..స్త్రీ శక్తికి నిదర్శనం. అలాంటి నారీమణే ఈ శాంతి. ఎవరీమె అంటే..ఆమె నాలుగిళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ.. బతుకు బండిని లాగిస్తుంటుంది. ఆమెకు ఇంట్లో ఎంత కష్టం ఎదురైనా..తప్పక పనికి టెన్షన్గా వచ్చేయాల్సిందే. ఆమె అవసరం కష్టాలు అలాంటివి. భర్త ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగి. కొండంత ఆశలతో కుటుంబంతో సహా మహాగనగరానికి వస్తే..దేవుడి స్క్రిప్ట్ మరోలా రాసిపెట్టి ఉందామెకు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు ఆంటిజం బాధితుడు, కాగా కూతురు ఇటీవలే పదినెలల క్రితం అనుహ్యంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. కూతురు చనిపోయినా కనీసం రెండు వారాల కూడా ఇంట్లో కూర్చోకుండా పనులకు వెళ్లిపోయేది. ఎందుకంటే..కొడుకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇంట్లో కూర్చొంటే కష్టం. గుండెల్ని పిండేసే బాధ అయినా సరే మౌనంగా పనికి రాకపోతే..నెల వచ్చేటప్పడికీ తడిసిమోపిడి అవుతాయి ఖర్చులు. ఎందుకంటే కొడుకు తన పనులు తానుచేసుకోగలగాలి, తనే కాళ్లపై నడవగలగాలి అదే శాంతి ఆకాంక్ష. అందుకోసం ట్రీట్మెంట్ తప్పనిసరి. అతని చికిత్స సెషన్కు రూ. 13000 ఖర్చు అవుతుంది. భర్త సంపాదనలో ఎనిమిదివేలు నేరుగా ఇంటి అద్దెకు వెళ్లిపోతాయి. మిగతా డబ్బులు అతడి స్కూల్ఫీజ్, ఆహారానికి, ట్రీట్మెంట్ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ శాంతి హాయిగా పనులకు వెళ్లే వెసులుబాటు కూడా లేదామెకు. ఎందుకంటే కొడుకుకి అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకోవాలి. ఆమె ఉదయం స్కూల్లో కొడుకుని దించడం నుంచి మొదలవుతుంది ఆమె రోజు. ఆ తర్వాత పనికోసం ఇళ్లకు వెళ్లి..మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి..3 గంటల కల్లా కొడుకుని స్కూల్ నుంచి తీసుకువస్తుంది. ఆ తర్వాత మళ్లీ పనికోసం ఇళ్లకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ చుట్టుపక్కల వాళ్లే కాస్తచేదుడువాదోడుగా ఉంటారు. ఆమె పనికి వెళ్లినప్పుడు కొడుకు బాగోగులు వాళ్లు చూసుకుంటారు. కానీ ఇంత కష్టాన్ని, భారాన్ని మోస్తున్నా..అవేమి ఆమె కళ్లల్లో కనిపించదు, కనీసం కన్నీటి చారను బయటకు కనపడనివ్వకుండా..చకచక పనులు చేసుకుంటూ పోతున్నా ధీశాలి ఈ శాంతి. ఒక్కసారి తరచి చూస్తే ఇలాంటి శాంతి లెందరో మన సమాజంలో ఉన్నారు. వాళ్లందరికీ జోహార్లు..ఎందుకంటే పిల్లలను కోల్పోయి..మరోవైపు కుటుంబ కోసం ఆహర్నిశలు కొవ్వుత్తిలా కరిగిపోతూ..ఇంటికి వెలుగుని పంచే ఇలాంటి మహిళామణులే అసలైన హీరోలు. ఇక్కడ ఈ శాంతి ఇవేమి కోరుకోవడం లేదు, కేవలం తన కొడుకు బాగైతే చాలు.. అదొక్కటే ఆమెను అచంచలంగా నడిపిస్తోంది. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
ఉర్దూ కథా కోకిల
మత విశ్వాసాలు, కట్టుబాట్లు, పురుషుల పెత్తనం మూసిన కిటికీలు తెరవడానికీ లేని కట్టడి... వీటి మధ్య జీలాని బానూ కథా రచయిత్రిగా జన్మెత్తగలిగింది. దశాబ్దాల పాటు ఉర్దూ కథకు, దక్కనీ సాహిత్యానికి ఆమె ధ్రువతారగా నిలిచింది. జీలానీ బానూ వల్ల హైదరాబాద్ పేరు ప్రపంచ దేశాల ఉర్దూ సాహిత్య ప్రేమికులకు తెలిసింది. ఆదివారం కన్నుమూసిన జీలానీ బానూ (89) నివాళి.ఇప్పటి మాట కాదు. ఒక డెబ్బయి అయిదు... ఎనభై ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లో హైదరాబాద్ నాంపల్లి సమీపంలోని మల్లెపల్లి బస్తీ ‘ఏ’ టైప్ క్వార్టర్లో పెరట్లో పిల్లలు రాత్రయితే కథలు చెప్పుకునేవారు. వాళ్లు అప్పటికే మల్లెపల్లిలో ఆడే భాగవత, రామాయణ, భారతం కథలు నాటకాలుగా చూసుండేవారు. అవే చెప్పుకునేవారు. ఆ అమ్మాయి రామాయణం కథ చెప్తుండేది. అందులో లక్ష్మణరేఖ గీసి లక్ష్మణుడు వెళ్లి΄ోయాక సీతను ఎత్తుకెళ్లడానికి రావణుడు వస్తాడు. అంతవరకూ ఆ అమ్మాయి సరిగానే చెప్పేది. ఆ తర్వాత మార్చేసేది. దాని ప్రకారం సీత గీత దాటదు. పైగా రావణుణ్ణి చితకబాది తరిమికొడుతుంది. ఇలా మార్చి చెప్పడం ఇతర పిల్లలకు నచ్చేది కాదు. కాని సీత కష్టాలు పడటం ఆ అమ్మాయికి నచ్చేది కాదు.ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి కష్టాలు పడే స్త్రీలకు మనోధైర్యం ఇస్తూ ఎన్నో కథలు రాసింది. జీలానీ బానూగా ప్రఖ్యాతి పొందింది.జీలానీ బానూ తల్లిదండ్రులది ఉత్తర ప్రదేశ్లోని ‘బదయూ’ ప్రాంతం. అక్కడంతా స్త్రీలకు రకరకాల కట్టుబాట్లు ఉండేవి. వారు కిటికీల్లో నుంచి బయటకు చూడకూడదు. మగాళ్లు తిరిగే చోట్లకు వెళ్లకూడదు. చాయ్ తాగకూడదు. పాన్ తినకూడదు. అలాంటి చోటు నుంచి జీలానీ బానూ తల్లిదండ్రులు హైదరాబాద్కు తరలి వచ్చారు. బానూ తండ్రి హసన్ హైరత్ నిజాం సంస్థానంలో ఉర్దూ శాఖలో పని చేసేవారు. స్వయంగా పెద్ద కవి. ఆయన పేరుతో మల్లేపల్లిలో ‘హైరత్ బదయూని రోడ్డు’ ఉంది. ఆయన తన సంతానంలోని ముగ్గురు ఆడపిల్లలను పుస్తకాలు చదివించడానికి ప్రోత్సహించారు. ‘ఇళ్లల్లో తప్పనిసరిగా ఆడపిల్లలకు ఉర్దూ నేర్పించేవారు. ఉర్దూను స్త్రీలే కాపాడారు’ అంటారు జీలానీ బానూ. అలా బానూకు ఉర్దూ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది.జీలానీ బానూ బాల్యంలో ఆమె తండ్రి కోసం ఎందరో సాహితీ వేత్తలు ఇంటికి వచ్చేవారు. వారిలో సినీ కవులు షకీల్ బదయూనీ, కైఫీ ఆజ్మీతో పాటు హైదరాబాద్ కవి మగ్దూమ్ మొహియుద్దీన్ కూడా ఉండేవారు. పుస్తకాలు చదివీ చదివీ, రాయడానికి కాగితాలు దొరక్క సూపరిటెండెంట్ అయిన తన మేనమావ పారేసిన ఫైళ్లలోని కాగితాలు సేకరించి వాటి వెనుకవైపు ఖాళీపై కథలు రాయడం మొదలు పెట్టారు జీలానీ బానూ. అప్పట్లో బొంబాయి రేడియోకి పిల్లల నాటకం రాసి పంపితే దానిని ప్రసారం చేయడమే కాకుండా 10రూపాయల పారితోషికం పంపారు. ఆ రోజుల్లో 10 రూపాయలు చాలా పెద్ద మొత్తం. అది జీలానీ బానూ తొలి సంపాదన. ప్రయివేటుగా మెట్రిక్ చదివి, ప్రయివేటుగా ఉస్మానియా నుంచి బి.ఏ. చేసిన బానూ, ప్రయివేటుగానే ఎం.ఏ. ఉర్దూ కూడా చదివారు. ఆ సమయంలోనే తమ బస్తీలోని ఒక అమ్మాయిని పురుషులు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ ఘటనకు చలించి ‘మోమ్ కి మరియమ్’ (1954) అనే కథ రాశారు. దానిని లాహోర్లోని ‘అదబే లతీఫ్’ అనే పత్రికకు పంపితే ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. ఆ రోజు నుంచి జీలానీ బానూ దక్కన్ ప్రాంతంలో ఎంత ప్రసిద్ధి చెందారో లాహోర్లో కూడా అంతే ప్రసిద్ధి చెందారు.జీలానీ బానూ ఇంట్లో లక్ష్మీ అనే ఆయా పని చేసేది. ఆ ఆయా మంచి మాటకారి. కామారెడ్డిలోని భిక్నూర్ వాళ్ల ఊరు. ఆ ఊరిలో బావికి లోను ఇచ్చామని చెప్పి అధికారులు బావి తవ్వకుండా డబ్బు మింగేశారని లక్ష్మీ జీలానీ బానూకు చెప్పింది. ఆ సంఘటన ఆధారంగా బానూ రాసిన ‘నర్సయ్యా కి బావ్డీ’ (నర్సయ్య బావి) ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ కథగా నిలిచింది. దానిని శ్యామ్ బెనగళ్ ‘వెల్డన్ అబ్బా’గా సినిమా తీశాడు. జీలానీ బానూ ఇలాగే సమకాలీన ఇతివృత్తాలపై రచనలు చేశారు. దక్కనీ నవాబుల కాలంలో స్త్రీల స్థితిగతులపై ఆమె రాసిన ‘ఐవానే గజల్’ ఉత్తమ రచన. అలాగే తెలంగాణ పల్లెటూళ్లలో భూస్వాముల దురాగతాలపై ‘బారిషే సంగ్’ నవల రాశారు. మొత్తం 22 పుస్తకాలు బానూ కలం నుంచి వెలువడ్డాయి. ఆమె రచనలు రష్యన్ భాషలో అనువదితమై ఆమెకు ‘సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్’ సంపాదించి పెట్టాయి. సాహిత్య అకాడెమీ పురస్కారం, పద్మశ్రీ, ఇంకా దేశ విదేశాల నుంచి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రఖ్యాత పాకిస్తానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీలానీ బానూ ఇంటనే బస చేశారు. అంత గౌరవం జీలానీ బానూ అంటే.జీలానీ బానూ భర్త అన్వర్ మొఅజ్జం స్కాలర్, పరిశోధకుడు. వీళ్ల పెళ్లిని కవి మగ్దూం మొహియుద్దీన్ కుదర్చడం విశేషం. జీలానీ బానూ కుమారుడు ఫర్హాన్ కంప్యూటర్ నిపుణుడు. అతను ఉర్దూ ఫాంట్ను, ఉర్దూ ఫాంట్తో పేజ్ నేషన్ను తయారు చేసి పత్రికల ప్రచురణలో పెద్ద మార్పు తీసుకొచ్చాడు. జీలానీ బానూ సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేశారు. ‘యూత్ ఫర్ యాక్షన్’ అనే సంస్థ ద్వారా స్త్రీల జీవనంలో మార్పు కోసం కృషి చేశారు. ఉర్దూ కథకు చిరకీర్తి సంపాదించిపెట్టిన జీలానీ బానూ తరాలు గుర్తుంటారు.– ఖదీర్ -
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరిశోధనల్లో దారి దీపాలు
‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.సైన్స్లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తితోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనే మాటకుకాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. సైన్స్ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...శాస్త్రరంగంలో ‘షా’జీఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్ కంట్రోల్ సెంటర్ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్ మిషన్’కు అధ్యయన డైరెక్టర్గా, రిసోర్సెస్–2 ఏకి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్ ‘ఆత్య–ఎల్1’కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా సేవలందించడం ఆమె కెరీర్లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజినీరింగ్లపై రచనలు చేశారు.ఆకాశదేశాన...చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్.సైంటిఫిక్ ఫిలాసఫీకంప్యుటేషనల్ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్ లెర్నింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) తొలి మహిళా డైరెక్టర్గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్’ విభాగంలో ఇన్ఫోసిస్ ప్రైజ్, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్లు గెల్చుకున్నారు. .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.అప్పుడే మహిళల పురోగతిగౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో బయో–ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్వారి ప్రోత్సాహమే నా బలంసైన్స్ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నా కెరీర్ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.– డాక్టర్ సుధా కళ్యాణి, సీనియర్ మేనేజర్ అండ్ హెడ్, లైఫ్ సైన్స్ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్ పార్క్కాదంబిని గంగూలీకలకత్తా మెడికల్ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్గా చరిత్ర సృష్టించారు.మేరీ పూనెన్ లూకోస్భారతదేశంలో తొలి మహిళా సర్జన్ జనరల్ మేరీ పూనెన్ లూకోస్. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.ఆనందీ బాయి జోషిపాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.జానకీ అమ్మాల్ఎడవలత్ కక్కట్ జానకి అమ్మాల్ ప్రసిద్ధ బోటనిస్ట్. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్లోని సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ తొలి డైరెక్టర్ (1952)కమలా సోహోనీకమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళ.అసిమా ఛటర్జీఅసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్లో డాక్టరేట్ పొందిన తొలి మహిళ.కమల్ జయసింగ్ రణదివేకమల్ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో తొలిసారిగా టిష్యూ కల్చర్ రిసెర్చ్ ల్యాబ్ని ప్రారంభించారు.బీబా చౌదరిభారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.పూర్ణిమా సిన్హాభౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.అన్నా మణిఅన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్ ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్కు సంబంధించి విశేష కృషి చేశారు. -
తొలి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..
పితృస్వామ్య విధానం బలంగా ఉన్న రోజుల్లో..ఉద్యోగం చేయడం అంటేనే అతి కష్టమైన, అనితరసాధ్యమైన ఆశయం. అలాంటిది ఈ మహిళ ఏకంగా ఐఏఎస్ అవ్వాలనుకుంది. అస్సలు ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావొచ్చు. పోనీ కష్టపడి ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్లో ఉత్తీర్ణురాలైనా..కూడా ఎన్ని అవరోధాలంటే..ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గవర్నర్ వరకు అందరు ఒక మహిళ ప్రజావసేవలోనా..! అని కనుబిమ్మలు, పెదవులు విరిచారు. పైగా ఆమెకు మరో హోదాని ఎంచుకోమని సూచించేవారు. కానీ ఆమె అచంచలమైన ధైర్యంతో వాళ్లందర్నీ ఒప్పించి మరి..భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి అయ్యింది. పురుషులతో సమానంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తూ..అందరిచేత మన్ననలను అందుకోవడమే గాక..ఇలాంటి అత్యుతన్నపదవిలో పురుషుల కంటే మహిళలే మేటీ అని రుజువు చేసిందామె.ఆ మహిళే..అన్నా రాజమ్ మల్హోత్రా. కేరళలోని కోజికోడ్లో జన్మించిన అన్నా మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ (అప్పటి మద్రాస్)లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో మహిళలకు కొన్ని వృత్తిపరమైన అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అన్నా చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉన్నత డివిజన్ క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించింది. 1950లో తన ఇంజనీర్ బంధువు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్ను ఇంటికి తీసుకువచ్చే వరకు ఆమెకు సివిల్ సర్వీస్లో చేరాలనే ప్లాన్స్ ఏమి లేవు. చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అంత పెద్ద ఆశయాలు మొదట్లో ఏమిలేవు. పైగా ఆ బంధువు పంపించిన ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ దరఖాస్తు రుసుము రూ. 140లు. అది ఆ సమయంలో ఆమెకు పెద్ద మొత్తమే. అయితే ఆ ఫీజు కట్టేందుకు తన స్నేహితుడి తల్లి ముందుకు వచ్చింది. సరిగ్గా 1952లో ఇంటర్వ్యూ రౌండ్లో, అన్నా IAS అధికారిణి కావాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఇంటర్వ్యూ కమిటీ ఆమెకు విదేశీ సేవ కోసం ప్రయత్నించమని సూచించింది. ఎందుకంటే అది మహిళలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేగాదు ఆఖరికి ఆమె ఏ పోస్ట్ ఇవ్వాలన్నిది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది నాయకులకు, అధికారులకు. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి..ఎందుకంటే..భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (అప్పటి మద్రాస్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మహిళలు ప్రజాసేవలో కొనసాగడం ఇష్టం లేదని నిర్మోహమాటం లేకుండా ఆమె ముఖం మీదే చెప్పేశారు. ‘మీరు నాకు అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆయన్ను ఒప్పించి మరి ఐఏఎస్ అధికారి అయ్యింది అన్నా. అయితే బాధ్యతలు తీసుకునే ముందు సైనిక శిక్షణతో సహా గుర్రపు స్వారి, రివాల్సర్ ఉపయోగించటం తదితరాలన్ని పురుషులతో సమానంగా శిక్షణ తీసుకున్నారామె. ఆమె మొదటి పోస్టింగ్లో తిరుపత్తూరు (తమిళనాడు) సబ్-కలెక్టర్గా ఉంది. అన్నా రాజంకు మద్రాస్ కేడర్ కేటాయించారు. తరుచుగా అన్నా పురుష అధికారులతో నిండిన గదిలో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒక స్తీకి ఉండాల్సిన కనీస వసతులు ఏమి లేవు అన్నాకి. ఆమె ధైర్యం ఏ రేంజ్లో ఉండేదంటే..తమిళనాడులోని డెంకనికొట్టై అడవి నుంచి ఏనుగులు గుంపు దారితప్పి బహిరంగ వ్యవసాయ భూమిలోకి తిరుగుతూ..గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుండేది. దాదాపు 18 మైళ్ళు నడిచిన తర్వాత, జంతువులు హోసూర్ చేరుకున్నాయి. ఆందోళన చెందుతున్న నివాసితులు సహాయం కోసం అన్నా చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఏనుగులు శబ్దానికి భయపడతాయి కాబట్టి..పెద్ద శబ్దం వచ్చే వాటితో ఆ ఏనుగుల మందవైపు సాగి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ప్లాన్ ఫలించి..ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. అయితే ఓ మహిళ అధికారి కావడంతో ఆమె చేసిన ఘనకార్యాన్ని అభినందించకపోగా..తీవ్రమైన అల్లర్లు చెలరేగితే ఆమె అణిచివేయగలదా? కాల్చమని ఆదేశాలు ఇవ్వగలదా?, మత పిచ్చివాళ్ళ దాడిని ఎదుర్కొనగలదా..?. అయినా అస్సలు మహిళకు ఎలా అంతటి అత్యున్నత పదవి ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు. వాటిన్నంటిని అన్నా లెక్కచేయలేదు. ఇలాంటి ఎన్నో సవాళ్లను తన కెరీర్లో అధిగమించి ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారామె. విద్యుత్ సరఫరా దగ్గర నుంచి ముంబైలోని నవా శేవా ఓడరేవు నిర్మాణం వరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారామె. అందుకుగానూ 1989లో అన్నాకు పద్మభూషణ్ లభించింది. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన హోదాలను అలకరించారామె. అయినా ఎప్పుడూ కూడా ఆమె తాను ఒక మహిళగా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వమని ఏ సమయంలోనూ అగడలేదామె. అంతేగాదు నియామక సమయంలో కూడా వివాహం జరిగితే మీ సేవ రద్దు చేయబడుతుందనే నిబంధన ఉండేది. దాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఎందుకంటే ఆ టైంలో అవివాహిత మహిళలు లేదా వితంతువులు మాత్రమే సేవ రంగంలో ఉండాల్సి వచ్చేది. పెళ్లి, కుటుంబం..అన్నా తన ఐఏఎస్ బ్యాచ్మేట్ రామ్ నారాయణ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నారు. తన వివాహం సామాజిక ప్రతీకారానికి దారితీస్తుందని పూర్తిగా తెలిసినా (వారి మతాలు వేర్వేరు) వెనకడుగు వేయలేదు. వారిద్దరూ 1975లో వాషింగ్టన్, డిసిలో వివాహం చేసుకున్నారు. రామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్థాయికి ఎదిగి 1997లో మరణించారు. ఇక అన్నా 2018లో మరణించారు. ఆమె ఆనాడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు ఇవాళ ఎంతోమంది మహిళామణులు ఐఏఎస్లు అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఆమె మొదట ఈ అత్యున్నత పదవిలోకి వచ్చేటప్పుడూ..మొత్తం దారి చాలా కఠినంగా ఇరుకుగా ఉంది.. ఇప్పుడది..పువ్వులతో పరిచి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా మారింది. (చదవండి: ఆ కమెడియన్కి వెయిట్లాస్ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..) -
లక్షల వేతనం కాదనుకుని తోలుబొమ్మలాట..!
కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద స్థాయిలో వెలిగిన మహిళ... లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలి తోలుబొమ్మలాటనే కెరీర్గా ఎంచుకుంటుందా? మహానగరాలను కాదనుకొని మారుమూల పల్లెల్లోకి వెళుతుందా? ‘అవును’ అని చెప్పడానికి కచ్చితమైన సమాధానం... కలిత అసోంలోని హజో అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ద్రిషన కలిత చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలాటను చూస్తూ పెరిగింది. అసోంలో ‘పుటోల నాస్’ అని పిలవబడే తోలుబొమ్మలాట తరతరాలుగా మగవాళ్లకే పరిమితం అయింది. ‘తోలుబొమ్మలాట మగవాళ్లు మాత్రమే ఆడాలి’ అనే సంప్రదాయాన్ని కలిత బ్రేక్ చేసింది. ‘తోలుబొమ్మలాట నేర్చుకోవడం కష్టమే. అయితే నాకు ఉన్న ఆసక్తి కారణంగా కష్టమైనా సరే....ప్రతి అంశం గురించి వివరంగా నేర్చుకున్నాను’ అంటుంది కలిత. ఆరేళ్ల వయసు నుంచే అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడే కలిత దిల్లీలో కార్పొరేట్ రంగంలో ఏడు సంవత్సరాలు పనిచేసింది. అయితే ఆమెకు ఆ ఉద్యోగం అంతగా సంతృప్తి ఇవ్వలేదు.తన మాతృరాష్ట్రం కోసం ఏదైనా చేయాలనిపించి సామాజిక మార్పు కోసం తోలుబొమ్మలాటను ఉపయోగించుకోవాలి’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చిన కలిత తనలాంటి తోలుబొమ్మలాట అభిమానులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. ‘ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు తగాదా పడుతుంటారు. అయితే ఆ ప్రభావం పిల్లలపై ఎంత ప్రతికూలంగా పడుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు’ అంటున్న కవిత తోలుబొమ్మలాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం మొదలు పెట్టింది. మరోవైపు అసోం అపురూప జానపద కథలను ఈతరం పిల్లలకి తోలుబొమ్మలాట ద్వారా పరిచయం చేయడం ప్రారంభించింది. జానపదానికి సామాజిక అంశం జోడించింది.కలిత బలం... మహిళలు. ఎన్నో గ్రామాల్లోని మహిళలు కలితకు అభిమానులుగా మారారు. తమ గ్రామాలలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఒక గ్రామానికి చేరుకోగానే కలిత బృందం చేసే పని....ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. స్థానికంగా ఉన్న మూఢనమ్మకాల గురించి తెలుసుకోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా తోలుబొమ్మలాటను మార్చేది కలిత.మద్యపానం వల్ల జరిగే నష్టం నుంచి అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాల వరకు ఎన్నో అంశాలపై మారుమూల పల్లెల్లో సైతం తోలుబొమ్మలాట ద్వారా ప్రచారం చేస్తోంది కలిత. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. పనిచేస్తున్న చోట ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయి. వారి సమస్యలను తోలుబొమ్మలాట ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం తోలుబొమ్మలాట మాత్రమే కాకుండా తన థియేటర్ గ్రూప్ ద్వారా రకరకాల సామాజిక అంశాలపై స్ట్రీట్ ప్లేలు, స్కిట్స్ ప్రదర్శిస్తోంది. యువత కోసం వర్క్షాప్లు నిర్వహిస్తూ అందరి చేతా శభాష్ అని అనిపించుకుంటోంది.(చదవండి: టెర్రస్.. కామన్ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది! ) -
ఆటో డ్రైవర్ బామ్మ @ 65
‘నువ్వు నాకు ఆటోడ్రైవింగ్ నేర్పించాలిరా కన్నా’ అని కుమారుడిని అడిగింది మంగళ. ‘ఈ సరదా ఏమిటి!’ ఆశ్చర్యంగా అడిగాడు కుమారుడు. ‘సరదా కోసం కాదు, ఆటో నడిపి నాలుగు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను’ అని చెప్పింది తల్లి. మనసులో ఏమనుకున్నాడో తెలియదుగానీ, తల్లి కోరినట్లే ఆటో నడపడం నేర్పించాడు కుమారుడు. పదిహేను రోజుల్లో పర్ఫెక్ట్గా ఆటోనడపడం నేర్చుకుంది మంగళ. ఆ తరువాత ఆటోరిక్షా డ్రైవర్గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. మహారాష్ట్ర సతార జిల్లాలో కరాడ్–ఉండాలే రోడ్డులో రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆటో నడుపుతుంది. నెలకు అయిదు నుంచి ఏడు వేల వరకు సంపాదిస్తుంది. ఇది తక్కువ మొత్తమే కావచ్చు. ఆమెకు మాత్రం కోట్లతో సమానం! ఎందుకంటే ఆ డబ్బులో శ్రమ ఫలం ఉంది. ఆత్మగౌరవం ఉంది. ‘నేను చాలారోజులు ఇంట్లోనే ఉన్నాను. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అనిపించింది. ఏదో ఒక పని చేయాలనుకున్నాను. నా కొడుకు ్రపోత్సాహంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఇంటి ఖర్చులకు, నా వైద్య అవసరాలకు నేను సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి, ఎలాంటి భయం ఉండదు. ఇతర డ్రైవర్లు నన్ను గౌరవంగా చూస్తారు. ముందు అమ్మను వెళ్లన్విండి అంటారు’ అని ఆసందంగా చెబుతోంది 65 సంవత్సరాల మంగళ. -
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా! -
కథల కళల బండిలో బడిబాటకు...
‘పిల్లలందరూ ఆర్టిస్ట్లే. ఆర్టిస్ట్లందరూ పిల్లలే’ అనే మాట ఉంది. రూబుల్ నాగి ప్రసిద్ధ మ్యూరల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. పిల్లల మనసు చిత్రం తెలిసిన మనసెరిగిన మహిళ. ‘రూబుల్ నాగి ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది మంది పేదింటి పిల్లలకు విద్య అందిస్తోంది. తన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్–2026’ అందుకుంది. ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అనేది యునెస్కో సహకారంతో యూకేలోని వర్కీ ఫౌండేషన్ ఇచ్చే వన్ మిలియన్ డాలర్ల అవార్డ్...‘రూబుల్ నాగి విద్యావేత్త. అణగారిన వర్గాల పిల్లలకు అక్షరాన్ని చేరువ చేసిన మార్గదర్శి’ అని ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అవార్డు కమిటీ అభివర్ణించింది. 130 దేశాల నుండి వచ్చిన 5,000 నామినేషన్ల నుండి నాగిని అవార్డు కోసం ఎంపిక చేశారు. జమ్మూకశ్మీర్లో పుట్టిన నాగి రాజకీయ శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. తరువాత లండన్లోని స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకుంది. సోథెబీస్ లండన్లో యూరోపియన్ ఆర్ట్ను అభ్యసించింది.చదువు పూర్తయిన తరువాత ‘న్యూ డిజైన్ స్టూడియో’ ప్రారంభించి ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది. 800 మ్యూరల్స్ వేసింది. 150పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించింది. రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో నాగి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి స్వయంగా ఎంపిక చేయడం విశేషం.కళ పేదల కోసం‘కళ కళ కోసమే’ అనేది ఒక వాదం. ‘కళ ప్రజల కోసం’ అనేది మరో వాదం. నాగి రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆర్టిస్ట్గా ఏకాంత దీవిలో, ఊహల మధ్య మాత్రమే ఉండిపోలేదు ఆమె. సామాన్య ప్రజల మధ్యకు వచ్చింది. ‘సమాజం కోసం ఏం చేయగలను?’ అని ఆలోచించింది. తన దగ్గర ‘కళ’ అనే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి చదువుకు దూరం అయిన పేదపిల్లలకు చదువును దగ్గర చేయాలని నిర్ణయించుకుంది.లెర్నింగ్ సెంటర్లతో...దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో గ్రామాల్లో 800 లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘కళ’ అనే మాధ్యమంతో వందలాది మంది పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించింది. ఈ విద్యాకేంద్రాలకు ముందు పిల్లలెవరూ బడి ముఖం చూడలేదు. అక్షరం ముక్క రాదు. అలాంటి పిల్లలు కూడా లెర్నింగ్ సెంటర్లో చేరిన తరువాత చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. పెద్ద స్కూల్స్లో చదివేవారితో సమానంగా పోటీ పడుతున్నారు. లెర్నింగ్ సెంటర్లు ప్రారంభించడానికి ముందు ‘పిల్లలు బడికి ఎందుకు దూరం అవుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేసింది నాగి. పేదరికం, ఇంటిపనులు, పొలం పనులు, బాల కార్మిక వ్యవస్థ... ఇలా ఎన్నో కారణాలు కనిపించాయి. ఈ కారణాలను అడ్డంకులుగా భావించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఎంతోమంది పేదపిల్లలు బడి బాట పట్టేలా చేసింది. విద్యారంగంలో నాగి చేసిన రెండు దశాబ్దాల కృషికి గుర్తింపుగా ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ దక్కింది.పిల్లలతో కలిసిపోయి...రూబుల్ నాగి దేశమంతటా విస్తృతంగా ప్రయాణిస్తుంటుంది. విద్యాకేంద్రాలలో పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటుంది. ఆరువందల మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆమె సైన్యం. విద్యాకేంద్రాల ద్వారా ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తోంది.ఆ మాటే మంత్రంగా...కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని నాగి ఆర్ట్ స్టూడియోకు దగ్గరలోని మురికివాడ నుంచి ఒక పిల్లాడు వచ్చి ఆర్ట్వర్క్స్ను ఆసక్తిగా చూస్తున్నాడు. ‘ఏ క్లాసు చదువుతున్నావు?’ అని అడిగింది నాగి. ‘చదవడం లేదు’ అన్నాడు. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. ఆ మాట నాగిని బాగా ఆలోచించేలా చేసింది. స్టూడియో అనే నాలుగు గోడలకే పరిమితం కావద్దు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజే మురికి వాడకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. తన ఆర్ట్తో మురికివాడలలోని గోడలను అందంగా కనిపించేలా చేసింది. రెండో అడుగుగా లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘క్లాస్రూమ్లో మాత్రమే పాఠాలు’ అని కాకుండా చెట్ల కింద, ప్రకృతి మధ్య పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.‘విద్యా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి, నైపుణ్య ఆధారిత, డిజిటల్ అభ్యాస కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ఈ ప్రైజ్మనీ వినియోగిస్తాను’ అని చెప్పింది రూబుల్ నాగి. సవాళ్లు ఉన్నాసరే...మురికివాడల్లో మేము గోడలపై పెయింటింగ్ వేస్తున్నప్పుడు పిల్లలు గుమిగూడేవారు. ‘మీలో ఎవరికైనా కథ వినాలని ఉందా?’ అని అడిగితే ‘నేను వింటాను’ అంటూ అందరూ ఉత్సాహంగా స్పందించేవారు. అలా కథలు, బొమ్మల ద్వారా వారు బడిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం విజయవంతం అయింది. ఆర్ట్–బేస్డ్ లెర్నింగ్ ప్రక్రియ ద్వారా పిల్లలు పాఠాలను సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాలుగు గోడల మధ్యే పాఠాలు చెప్పాలనుకోలేదు. ఆసక్తిగా చెబితే పిల్లలు ఆరుబయట కూర్చోనైనా వింటారు. రెండు మూడు రోజులు లెర్నింగ్ సెంటర్కు వచ్చిన విద్యార్థి మరుసటి రోజు రాకపోతే మా వాలెంటీర్లు ఆ విద్యార్థి ఇంటికి వెళతారు. కారణం ఏమిటో తెలుసుకుంటారు. ఆ విద్యార్థి రోజూ స్కూల్కు వచ్చేలా చేస్తారు. లెర్నింగ్ సెంటర్ల నిర్వహణ అనేది సులువైన విషయమేమీ కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వాటిని నిర్వహిస్తున్నాం.– రూబుల్ నాగి -
ఏఐ: ఆల్ ఉమెన్ ఇంటెలిజెన్స్
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అనేది సిలికాన్ వ్యాలీ వాసుల, బడా కంపెనీల వ్యవహారం’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కాలం మారింది. మారుమూల పల్లెలోని పార్వతమ్మకు కూడా ఇప్పుడు ‘ఏ.ఐ.’పై ఆసక్తి పెరిగింది. స్వయం సహాయక బృందాల నుంచి వ్యాపారాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనుకునే చిన్న స్థాయి మహిళా వ్యాపారుల వరకు ఏ.ఐ. సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026’ అనేది సాంకేతిక దిగ్గజాల సదస్సు మాత్రమే కాదు, సామాన్య మహిళలు సైతం ఆసక్తి చూపే సదస్సు అయింది...వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మార్పులు తేనున్నది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ హైలెట్ చేసింది. అట్టడుగు స్థాయిలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంటర్ప్రెన్యూర్షిప్ విషయంలో భాష, మార్కెట్ యాక్సెస్, పరిమిత వనరులలాంటి అడ్డంకులను అధిగమించడంలో గ్రామీణ మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతోంది.బహుళ ప్రయోజన శిక్షణ‘షీ లీడ్స్ భారత్’లాంటి ఏఐ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్లు గ్రామీణ ప్రాంతాలలోని చిరు మహిళా వ్యాపారులు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించి మెరుగైన శిక్షణ ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ భాగసామ్యంతో 25,000 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇస్తోంది షీ లీడ్స్. ఎలాంటి వస్తువులకు అధిక డిమాండ్ ఉందో గుర్తించడం నుంచి వాటికి సరిౖయెన ధరలను నిర్ణయించడం, కస్టమర్ల సంఖ్యను ఎలా పెంచుకోవాలి, కీలకమైన వ్యాపార సవాళ్లను ఎలా అధిగమించాలి... మొదలైన విషయాలను తెలుసుకోవడానికి, ‘మేరీ సహేలి’ యాప్లో విలీనం చేసిన ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి తద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ‘మహిళల నేతృత్వంలోని గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడానికి, ఏఐకి సంబంధించిన బాధ్యతాయుతమైన, ఆచరణాత్మక ఉపయోగాల అవగాహనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది షీ లీడ్స్ భారత్.గల్లీ నుంచి దిల్లీ వరకుఉత్తర్ప్రదేశ్లోని వారణాసి జిల్లా నవహానిపూర్ గ్రామానికి చెందిన రుచిసింగ్ స్వయం సహాయక బృందంలో సభ్యురాలు. స్మార్ట్ఫోన్ ల నుంచి ఏఐ–ఎనేబుల్డ్ ఫ్లాట్ఫామ్ల వినియోగం వరకు ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్గా నిలిచింది. దేశవ్యాప్తంగా రుచిసింగ్లాంటి మహిళలకు దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులోని విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ‘ఏఐ సమ్మిట్’లో తమకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్–ఆమెదిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026లో వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించారు. ఈ సదస్సులో ‘ఏఐ కాలంలో మహిళలకు ఎదురవుతున్న భద్రతా సమస్యలు–డిజిటల్ ప్రపంచంలో అసమానతలు’... మొదలైన వాటి గురించి నటి, రచయిత్రి సోహ అలీఖాన్ ప్రసంగించారు. ఏఐ టూల్స్ విస్తృతస్థాయి ఉపయోగాలతో పాటు దుర్వినియోగాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.‘ఏఐ సాంకేతికత వల్ల ఫేక్ ఇమేజ్లను సృష్టించడం నుంచి డాటా దుర్వినియోగం వరకు హానికరమైన పనులు అత్యంత వేగంగా జరుతున్నాయి’ అని ఏఐలోని ప్రతికూలతల గురించి ప్రస్తావించారు సోహ అలీఖాన్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై భయాలు, అపోహలు ఉన్నాయి. అవి నిజం కాదు’ అంటూ వైద్య రంగానికి ఏఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... అనివార్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్యుల అవసరాన్ని లేకుండా చేసేది కాదు. వైద్యుల భారాన్ని తగ్గించేది. ఏఐ సాంకేతికతపై రకరకాల భయాలు, అపోహలు ఉన్నాయి. అయితే ఇది నిజం కాదు. వైద్య సమాజానికి ఏఐ సాంకేతికత అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నిపుణులు కాని వారు ఏఐ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. మన దేశంలోని విస్తారమైన జనాభా, ప్రాంతాల మధ్య వైవిధ్యాలు, వైరు«ధ్యాలు, గ్రామీణ–పట్టణ విభజన, సవాళ్లు విసురుతున్న అంటువ్యాధులు... ఈ నేపథ్యంలో సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనివార్యమైన సహాయకారిగా మారుతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. – అనుప్రియ పటేల్, కేంద్రమంత్రిపవర్ హిట్టర్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతికతను మాత్రమే కాదు వ్యూహాలు, నాయకత్వం, నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా పునర్నిర్వచిస్తోంది. ఏఐ అనేది టీ 20 క్రికెట్లో ‘పవర్ హిట్టర్’లాంటిది. టీ 20 మ్యాచ్లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్ను చూశారు. ఇలాంటి పవర్ హిట్టరే ఏఐ. సంస్థలు పనిచేసే విధానాన్ని పునర్నిర్వచించే సామర్థ్యం ఏఐకి ఉంది. ఏఐ వల్ల అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కొత్త శక్తితో, కొత్త దారులలో సంస్థలు పయనిస్తాయి. వ్యాపార నమూనాలు మారుతాయి. వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ నైపుణ్యంతో పనిచేస్తారు. ఏఐ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అనేది ముఖ్యం కాదు ఎంత బాధ్యతతో ఉందనేది ముఖ్యం. బాధ్యతాయుతమైన ఏఐ అనివార్యం.– రోహిణి నాడర్ మల్హోత్రా, చైర్పర్సన్, హెచ్సీఎల్ఏఐ... ఎన్నో ద్వారాలు!లక్షలాది మంది భారతీయ మహిళలు వినడానికి, నేర్చుకోవడానికి, పని చేయడానికి టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఆ అవకాశాలను వినియోగించుకోవాలంటే ఆన్లైన్ సురక్షితమని మహిళలు భావించాలి. ఏఐతో దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. యువతులు ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారు. బాలికలు వీరి విజయగాథల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు సృజనాత్మకతకు సంబంధించి కూడా మహిళలకు ఏఐ ప్లాట్ఫామ్లు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నాయి. మహిళా సాధికారతకు ఆన్లైన్ టూల్స్ కొత్త దారులు చూపుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే సమాజంలో ఉండే అసమానతలు డిజిటల్ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి.– సోహా అలీఖాన్, నటి, రచయిత్రి -
అరుణగ్రహమే టార్గెట్
అలిస్సా కార్సన్ .. మూడేళ్ల వయస్సులో చూసిన ఒక చిన్న కార్టూన్ ఆమె జీవిత లక్ష్యాన్నే నిర్ణయించింది. అమెరికాలోని లూసియానాలో 2001లో జన్మించిన అలిస్సా ‘ద బ్యాక్ యార్డిగాన్స్’ అనే కార్టూన్ను ఇష్టంగా చూసేది. అప్పుడే తన మనసులో ఒక ఆలోచన పుట్టింది. మార్స్ గ్రహంపైకి వెళ్లాలని. అప్పటి నుంచి ఆమె తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉంది. నాసా నేరుగా పిల్లలకు శిక్షణ ఇవ్వదు, కాబట్టి ఆమె ప్రతి అవకాశాన్ని తన ఆశయసాధనకు అనుకూలంగా మలుచుకుంది. 17 ఏళ్ల వయస్సులోనే అప్లైడ్ ఆస్ట్రోనాటిక్స్ సర్టిఫికేషన్ సాధించి, సబ్–ఆర్బిటల్ అంతరిక్షంలో పరిశోధనలు చేసే అర్హత పొందింది. 18ఏళ్లకే ప్రపంచంలోని అన్ని నాసా స్పేస్ క్యాంపులను పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందింది. 2022 లో నాటో తన కార్యకలాపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదుగురిలో అలిస్సా ఒకరు కావడం విశేషం. అలిస్సా ఇంగ్లీష్తో పాటు స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ దేశాల వ్యోమగాములతో కలిసి పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. అలిస్సా ప్రస్తుతం ఆస్ట్రోబయాలజీలో ఉన్నత చదువులు అభ్యసిస్తూ, అరుణ గ్రహంపై మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులపై పరిశోధనలు చేస్తోంది. ఆమె కేవలం తన గమ్యం వైపు పయనించడమే కాకుండా స్టెమ్ (సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో బాలికల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి కూడా కృషి చేస్తోంది. అలిస్సా ప్రస్తుతం అధికారికంగా నాసా వ్యోమగామి కాకపోయినప్పటికీ, ఆమె ఒక అంతరిక్ష శిక్షణలో ఉన్న వ్యక్తిగా, అంతరిక్ష ఔత్సాహికురాలిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే గుర్తింపు ఆమెను 2033 లో నాసా చేపట్టబోయే మార్స్ యాత్రలో నిలబెట్టనుందని నిపుణులు భావిస్తున్నారు. సో యూ వాంట్ టు బి ఆన్ ఆస్ట్రోనాట్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. సోషల్ మీడియా ద్వారా తన ట్రైనింగ్ని మిలియన్ల మందికి చూపిస్తూ, సైన్స్ ను ఒక కూల్ అంశంగా మార్చేసింది. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ లక్ష్యం వైపు సాగిస్తున్న ఈ ప్రయాణం, రాబోయే తరాలకు ఒక దిక్సూచి. ఎంతో మంది ఆడపిల్లలకు స్ఫూర్తి. -
అనన్య బిర్లాకు కథ చెప్తారా ?
ఏవిఎం చెట్టియార్.. జెమిని వాసన్ .. విజయా నాగిరెడ్డి ఒకప్పుడు సినిమాలంటే మగవారి నిర్మాణం. ఇప్పుడు దేశంలో స్త్రీలు సినీ నిర్మాణాన్ని లీడ్ చేస్తున్నారు. బిర్లా కుటుంబం నుంచి అనన్య బిర్లా ‘బిర్లా స్టూడియోస్’ మొదలెట్టడం తాజా ఉదాహరణ. భారీ మూలధనం కేటాయించి దేశీయ భాషల్లో సాంస్కృతిక మూలాలున్న సినిమాలు తీస్తానంటున్నారు అనన్య. దర్శకులూ... ఆమెకు కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా?సంప్రదాయ మేకింగ్ నుంచి కార్పొరేట్ మేకింగ్కు సినీ రంగం వెళ్లేకొద్దీ స్త్రీల ప్రమేయం పెరుగుతూ ఉంది. బాలాజీ సంస్థలో ఏక్తా కపూర్, తమిళనాట రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తెలుగులో అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న, అన్నపూర్ణ నుంచి సుప్రియా యార్లగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత... ఇలా ఇన్ని పేర్లు ఒకప్పుడూ ఊహకే అసాధ్యం. ఇప్పుడు ఈ మహిళా శక్తికి మరో ప్రచండ శక్తి తోడయ్యింది. బిర్లా గ్రూప్ నుంచి అనన్య బిర్లా తాజాగా సినిమా రంగంలోకి వచ్చారు. ‘బిర్లా స్టూడియోస్’ స్థాపించి ప్రాదేశిక చిత్రాలను తీయాలని నిశ్చయించుకున్నారు. ఇది దర్శకులకు మంచి కబురే.ఎలా మేలు?సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఏకకాలంలో అనేక సినిమాలు తీయరు. కాని కార్పొరేట్ సంస్థలకు ఆ సౌలభ్యం, సామర్థ్యాలు, వ్యవస్థ ఉంటాయి. సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఫార్ములాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అనన్య బిర్లా చెప్పేదాని ప్రకారం మూసకు భిన్నంగా ఉండే కథలకు అవకాశం దొరుకుతుంది. పక్షపాతాలు, సిఫార్సులతో పని లేకుండా టాలెంట్కు అవకాశం దొరికే వీలు ఎక్కువ.కుబేరుల్లో కళాహృదయంఆదిత్య బిర్లా గ్రూప్ దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి. అటువంటి సంస్థకు వారసురాలు అనన్య బిర్లా. కుమార మంగళం బిర్లా, నీర్జా బిర్లా దంపతుల పెద్ద కుమార్తె. బిర్లా కుటుంబంలో ఆరవ తరం వారసురాలు. అయితే అది మాత్రమే ఆమె ప్రత్యేకత కాదు. అనన్యది కళాహృదయం. ఆమె ప్రముఖ గాయని. పదకొండేళ్ల వయసులోనే సంతూర్ వాయించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ఆల్బమ్స్ విడుదల చేసి అభిమానులను పొందారు. మరోవైపు అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదువు పూర్తి చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. 17 ఏళ్ల వయసులోనే సొంతంగా మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలో రెండవ అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థ. 2016లో అనన్య లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ‘ఇకాయ్ అసాయ్’ను స్థాపించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఆసియాలో ప్రముఖ మహిళలలో ఒకరిగా’ నిలిచారు. గతేడాది ఆమె ‘బిర్లా కాస్మెటిక్స్’ పేరుతో కన్సూ్యమర్ బ్రాండ్లు ప్రారంభించారు.దేశీయ కథలకే ప్రాధాన్యం‘బిర్లా స్టూడియో’ పేరుతో కొత్త ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాక వాణిజ్యపరంగా లాభదాయకమైన సినిమా లు తీస్తూనే కథనంలో విలువల పరంగా ఏమాత్రం రాజీపడనని అనన్య తెలిపారు. ‘మనమందరం కథలు వింటూనే పెరిగాం. కథలు వినేందుకు మన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మాధ్యమాలలో సినిమా ఒకటి. దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ప్రేక్షకులకు అద్భుతాలు చూపించొచ్చు’ అని ఆమె వివరిస్తున్నారు. ‘వినోద విలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యతను చూపే చిత్రాలు తీయడంపైనే మా నిర్మాణ సంస్థ నుంచి దృష్టి పెడుతుంది’ అంటున్నారు. త్వరలో బిర్లా స్టూడియోస్ హిందీ, గుజరాతీ, మలయాళంతోపాటు ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో చిత్రాలు తీయాలని చూ స్తోంది. ఇంగ్లిషు సినిమాలు సైతం తీసే యోచనతో ఉంది.పెద్ద దర్శకులతో చర్చలుబి స్టూడియోస్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే చాలా మంది పెద్ద దర్శకులతో అనన్య బిర్లా చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనీజ్ బాజ్మీ, సూజిత్ సర్కార్, నీరజ్ పాండే తదితరులు ఉన్నారని సమాచారం. -
ఆమె అడుగుజాడలు
మన దేశంలోని మొట్ట మొదటి మహిళా ఆంత్రపాలజిస్ట్ ఐరావతి కార్వే. జర్మనీలో శిక్షణ పొందిన కార్వే పుణేలోని దక్కన్ కళాశాలలో మావనశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, నాగరికత, కులవ్యవస్థపై ఆమె విలువైన రచనలు చేశారు. ఆంత్రపాలజీ అంటే గుర్తుకు వచ్చే మహిళ అయినప్పటికీ కార్వే జీవితం గురించి చాలా విషయాలు తెలియవు. ఈ లోటును పూరించేలా ఆమె మనవరాలు ఉర్మిలా దేశ్పాండే, విద్యావేత్త థియాగో బార్బోసాతో కలిసి ‘ది రీమార్కబుల్ లైఫ్ ఆఫ్ ఐరావతి కార్వే’ అనే పుస్తకం రాశారు.ఆమెదే రిస్క్అండమాన్, నికోబార్ దీవులలోని ఆదిమజాతి ప్రజలపై పరిశోధన చేసిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త మధుమాల చటోపాధ్యాయ. అండమాన్ దీవులలో ఫీల్డ్వర్క్ చేయడానికి మధుమాలను అనుమతించే ముందు ఆంత్రపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించదని నిర్ధారిస్తున్న పత్రాలపై సంతకం చేయాలని కోరింది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. అండమాన్, నికోబార్ దీవులలోని వివిధ తెగలపై ఆరు సంవత్సరాలు పరిశోధన చేశారు.ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ20వ శతాబ్దంలో ‘ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ’ ఊపందుకుంది. పురుషాధిపత్య వాదనలు, వివరణలను సవాలు చేసింది. మన దేశంలో వర్గం, కులం, ప్రాంతాల వారీగా మహిళల స్థితిగతులను అధ్యయనం చేయడంలో ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ కీలక పాత్ర పోషించింది. ఉదాహరణకు దళిత మహిళలు పితృస్వామ్య భావజాలానికి మాత్రమే కాకుండా కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం గురించి విశ్లేషించింది. -
ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..
నూట నలభై ఆరు సంవత్సరాల డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (డీహెచ్ఆర్) చరిత్రలో తొలి మహిళా టికెట్ కలెక్టర్ (టీసి)గా సరితా యోల్మో చరిత్ర సృష్టించింది. ప్లస్ టు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం రావడంతో పై చదువులు చదువుకోలేకపోయింది సరిత. ఆమె భర్త దవా యోల్మో కూడా రైల్వేలో పనిచేసేవారు. ఆయన సీనియర్ సెక్షన్ ఇంజినీర్గా రిటైర్ అయ్యారు.‘సరిత అంకితభావం ఉన్న ఉద్యోగి మాత్రమే కాదు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను ఎలా సమన్వయం చేసుకోవాలో బాగా తెలిసిన మహిళ. డీహెచ్ఆర్లో ఫస్ట్ ఉమెన్ ట్రైయిన్ టికెట్ కలెక్టర్గా సరితను చూడడం గర్వంగా ఉంది’ అంటున్నాడు దవా యోల్మో.న్యూ జల్పైగురి నుండి నడిచే బ్రాడ్–గేజ్ రైళ్లలోటికెట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తోంది సరిత.‘డీహెచ్ఆర్లో టీసిగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొంత భయం కూడా ఉంది. న్యూ జల్పైగురి, డార్టిలింగ్ల మధ్య పది గంటల ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం నా ఉద్యోగ జీవితంలో కొత్త ఎపిసోడ్’ అంటుంది సరిత.టికెట్ కలెక్టర్ యూనిఫామ్లో ఉన్న సరితను ఆసక్తికరంగా చూస్తుంటారు ప్రయాణికులు. కొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు.‘కుర్సియాంగ్లోని రైల్వే ప్రెస్లో పనిచేయడం నాకు సంతోషంగా ఉండేది. అయితే ఆ ప్రెస్ మూసివేయడంతో విధి నాకు వేరే దారి చూపింది. న్యూ జల్పైగురికి బదిలీ కావడంతో కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వచ్చింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని వాణిజ్య విభాగంలో చేరకపోతే, నాకు కొత్త అవకాశాలు వచ్చేవి కావు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది సరిత. View this post on Instagram A post shared by The CSR Journal (@thecsrjournal) (చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..) -
విజయపథంలో ఆమె పాదం
వైకల్యం అనే ఓ పదం మనిషి ఆశలను, ఆశయాన్ని చలనం లేకుండా చేయలేదు అని నిరూపించింది. తనను చూసి ఎగతాళి చేసిన అయిన వాళ్లతో పాటు.. కరుడుగట్టిన బయటవాళ్లనూ గెలిచారు కృష్ణవేణి. ఇటీవల వెలువడ్డ గ్రూప్–1 ఫలితాల్లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని శ్రీరంగరాజపురం (ఎస్ఆర్)కు చెందిన ముద్దంగల కృష్ణవేణి రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. తల్లి రోజువారీ తాపీ పనులకు వెళితే.. తండ్రి వ్యవసాయ కూలి పనులు చేసి బిడ్డను చక్కగా చదివించారు. ఇపుడు ఊరంతా కృష్ణవేణి విజయం గురించి మాట్లాడుతోంది. కానీ ఆ విజయం వెనుక కష్టం గురించి మాత్రం కృష్ణవేణే మాట్లాడాలి. ఆమె ఏం చెబుతోందో తెలుసుకుందాం...మాది పేద కుటుంబం. అన్న, నేను, తమ్ముడు ముగ్గురం. నాన్న దొరస్వామి. రోజూ ΄÷లంలో కూలి పనులు చేస్తాడు, అమ్మ పేరు రత్నమ్మ. మగాళ్లకు సమానంగా ఇసుక–సిమెంటు కలపడం, ఇటుకరాళ్లు మోయడం లాంటి తాపీ పనులు చేసింది. రోజూ ఎవరో ఒకరు పనికి వెళితే తప్ప.. ఆ రోజు ఇల్లు గడవదు. తిన్నా, తినకున్నా.. నాకు మాత్రం స్కూల్లో ఉండడం ఇష్టం. నేను ఆరోతరగతి చదువుతుండగా 2010లో ఓ రోజు ఇంటి దగ్గర బట్టలుతికి, ఆరేస్తుండగా.. 11 కేవీ విద్యుత్ వైరు తగలడంతో నేను కిందపడి పోయాను. మా కుటుంబం పరిస్థితి తలకిందులై పోయింది.అప్పుల ఊబిలో చిక్కుకున్నాంట్రాన్స్కో అధికారులకు అప్పటికే చాలాసార్లు చెప్పాం. లైను మార్చమని, వాళ్లు పట్టించుకోక పోవడంతో కరెంటు తీగలు తాకిన నాకు షాక్ తగిలి శరీరమంతా నల్లగా మారి పోయింది. ఇక బతకదన్నారు. చివరి ప్రయత్నంగా తమిళనాడు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నన్ను ఎలాగో బతికించారు. మూడు నెలల తరువాత కాలు, చేయి కోల్పోయిన నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే నా వైద్యంకోసం భూములు పోయినాయి. అప్పుల్లో చిక్కుకున్నాం. (ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం) కానీ నాకేమో ఇంట్లో ఉండడం నచ్చదు. ఏది ఏమైనా బడికి వెళ్లాలి. ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడితే ఊర్లో ఉన్న ఎవరో ఒకరు నన్ను స్కూటర్పై ఎక్కించుకుని బడిలో వదిలితే అమ్మో నాన్నో వచ్చి పిలుచుకెళ్లేవాళ్లు. ఆ తర్వాత కృత్రిమ కాలు అమర్చుకున్నాను.ఆ నిర్లక్ష్యమే కసిని పెంచింది.ట్రాన్స్ కో అధికారుల నిర్లక్షా్యనికి పరిహారం కోరుతూ కలెక్టరేట్ చుట్టూ తిరిగేవాళ్లం. చేయి, కాలు పనిచేయని నన్ను అమ్మ–నాన్న చిత్తూరులో ఉండే కలెక్టరేట్కు తీసుకెళ్లేవాళ్లు. క్యూలో నిలబడి చాలాసార్లు మాకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నాం. అప్పుడే నేనొకటి గమనించాను. మాకన్నా దారుణమైన పరిస్థితి ఉన్న వాళ్లు కూడా కలెక్టర్ పిలిస్తే వెంటనే అక్కడ నిలబడటం, ఆయన ఆదేశాలు పాటించడం చూశాం. అంటే చదువుకుని చేతిలో అధికారం ఉంటే అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయొచ్చని మాత్రం అర్థమయ్యింది. ట్రాన్స్కో అధికారుల మనసు కరగక పోవడంతో అప్పులు చేసి మరీ కోర్టులో కేసు వేశాం. 54 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ తొక్కుతూ నాన్న వాయిదాలకు హాజరయ్యేవారు. అదే నాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే కసిని పెంచింది. 14 ఏళ్ల తరువాత పరిహారం వచ్చినా.. అది మా అప్పులు–వడ్డీలకు కూడా చాల్లేదు. పదో తరగతి వరకు ప్రభుత్వ బడే. మళ్లీ ఇడుపుల పాయలో సీటు, అక్కడే బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశాను.ఐఏఎస్ అవుతా..డిగ్రీ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాను. 2022లో వెలువడ్డ గ్రూప్స్ నోటిఫికేషన్ లో తొలి పరీక్షే తప్పాను. ఆ మరుసటి ఏడాది వెలువడ్డ నోటిఫికేషన్ లో ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని నిర్ణయించుకున్నాను. గ్రూప్–1, గ్రూప్–2కు సమాంతరంగా సిద్ధమయ్యాను. నా ఆర్థిక పరిస్థితి తెలిసి చాలామంది దాతలు చందాలు వేసుకుని హాస్టల్ ఫీజులు, స్టడీ సెంటర్ ఫీజులు కట్టారు. అది ఎప్పటికీ మర్చి పోలేను. ఈ మధ్యే గ్రూప్–2లో సివిల్ సప్లైస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా గ్రూప్ 1లో ఉద్యోగం వస్తుందన్న ధీమాతో అందులో చేరలేదు. నా నమ్మకం వమ్ము పోలేదు. అనుకున్నట్లే వచ్చింది. అమ్మా నాన్నలను నా కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పాలి. ఇదే సమయంలో ఎప్పటికైనా ముద్దంగల కృష్ణవేణి.. ఐఏఎస్ అని పిలిపించుకోవాలన్న నా లక్ష్యాన్ని సాధించి తీరతాననే నమ్మకం ఉంది. – ఎం.లోకనాథన్, సాక్షి, చిత్తూరు అర్బన్ -
పాఠం నుంచి పాకం దాకా
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదిగిందో చూద్దాం...రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది. కోవిడ్ మార్చేసిన జీవితంఅలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ల వరకు విస్తరించారు. తన బిజినెస్కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది. -
చిన్నారి చిత్రకారిణి.. ప్రతిభలో మేటి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బాలిక వేసిన పెయింటింగ్ విశ్వగురు వరల్డ్ రికార్డు సాధించింది. నిజాంపేట్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పెయింటింగ్లో శిక్షణ పొందిన విశ్వేశ్వరరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ప్రవ్య ఆదిత్రి నాలుగు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు మొత్తం 20 అడుగుల కాన్వాస్పై కేవలం 12.44 నిమిషాల్లో శివుడి పెయింటింగ్ (Lord Shiva Painting) వేసి ఆదివారం ఈ రికార్డును సొంతం చేసుకుంది.బంజారాహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి, రిటైర్డ్ ఎస్పీ ఎస్ఎం రత్న, డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయభాస్కర్, విశ్వగురు వరల్డ్ రికార్డు ఫౌండర్ సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు సమక్షంలో అతి తక్కువ సమయంలో శివుడి పెయింటింగ్ వేసి ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రతిభను తిలకించిన అతిథులు సన్మానించి అభినందనలు తెలిపారు. చదవండి: నో ఫోన్ చాలెంజ్.. 2 వారాల్లోనే అనూహ్య మార్పు -
వినువీథిలో సారథులు
ప్రపంచంలోనే అధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ మారుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల సరళీకరణ మన దేశాన్ని మహిళా పైలట్ల హబ్గా మార్చాయి. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వేసిన అడుగులే భారత్ను నేడు ప్రపంచానికి ఆదర్శంగానిలబెట్టాయి.ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం..→ 2021 నుంచి 2025 మధ్యకాలంలో మహిళా పైలట్ల సంఖ్య 90% మేర పెరిగింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, భారతీయ మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. → 2021లో మహిళలకు 243 లైసెన్సులు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య 461కి పెరిగింది. అంటే ఈ నాలుగేళ్లలో సుమారుగా 89.71% వృద్ధిని సూచిస్తోంది. → డిసెంబర్ 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 3,327.→ ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% నుంచి 6% మాత్రమే ఉండగా, భారతదేశంలో ఇది 15% గా ఉంది. అంటే ప్రపంచ సగటు (5%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కంటే కూడా భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది.→ ఒక్క ఏడాదిలోనే అంటే 2025 లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు 61 కొత్త శిక్షణ విమానాలను ప్రవేశపెట్టడం విమానయాన రంగంలో ఒక పెద్ద అడుగు. ప్రస్తుతం దేశంలో మొత్తం 385 శిక్షణ విమానాలు ఉన్నాయి.→ సాంకేతిక విభాగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ విభాగాల్లో మహిళల వాటా 14% వరకు ఉంది.→ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో మహిళల సంఖ్య సుమారు 2.6% మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల ఇండిగో వంటి సంస్థలు కేవలం మహిళలతో కూడిన మెయింటెనెన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.→ 2025 నాటికి విమానయాన రంగంలో మహిళల వాటాను 25 శాతానికి పెంచాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక హ్యూమన్ రిసోర్స్ పాలసీలు, ప్రసూతి సెలవులు, శిక్షణ తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించింది.అంతర్జాతీయంగానూ..చాలా మంది భారతీయ మహిళా పైలట్లు ఇప్పుడు అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడుపుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో విమానయాన రంగంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగనున్నారు. పలు ఎయిర్లైన్స్లో మహిళా పైలట్ల శాతం అలయన్స్ ఎయిర్... అత్యధికంగా 17.36% మంది మహిళా పైలట్లు ఉన్నారు.ఇండిగో... గరిష్ట సంఖ్యలో మహిళా పైలట్లను (సుమారు 791 మంది) కలిగి ఉన్న సంస్థ.స్పైస్జెట్... 16.39% మహిళాపైలట్లతో రెండోస్థానంలో ఉంది.ఎయిర్ ఇండియా... 15.62% మహిళా పైలట్లు ఉన్నారు. -
అరుణ యానంలో ఆమె ప్రతిభ
ఏఐ సాంకేతికతను అంగారక గ్రహంపై కూడా అద్భుతంగా ఉపయోగించవచ్చునని నిరూపించింది నాసా వారి పర్సెవరెన్స్ రోవర్. మరొక గ్రహంపై ఏఐ– ఆధారిత అన్వేషణకు బలాన్ని చేకూర్చిన విజయం ఇది. ఈ విజయంలో భారత సంతతికి చెందిన అంతరిక్ష రోబోటిక్ నిపుణురాలు వంది వర్మ కీలక పాత్ర పోషించారు.పుట్టినరోజు కానుకగా చిన్నప్పుడు వంది వర్మకు ఒక పుస్తకం వచ్చింది. సౌర వ్యవస్థపై రాసిన పుస్తకం అది. పుట్టినరోజు కానుకగా శాస్త్ర, సాంకేతికరంగ పుస్తకం అందుకున్న ఆ చిన్నారికి శాస్త్రరంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటానని, అంగారక గ్రహంపై రోవర్ను నడపడంలో కీలక పాత్ర పోషిస్తాన నీ అప్పుడు తెలియదు!అలా రోబోలపై ఆసక్తి మొదలైంది...వంది వర్మ జన్మస్థలం పంజాబ్లోని హల్వార. తండ్రి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) లో పైలట్. చండీగఢ్లోని ‘పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ’లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వర్మ తరువాత పెన్సిల్వేనియాలోని కార్నెగి మెల్లన్ యూనివర్శిటీ (సిఎంయు)లో రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ‘సిఎంయు’లో చదువుతున్న రోజుల్లో రోబోటిక్స్పై అమితమైన ఆసక్తి పెంచుకున్నారు.‘ట్రాక్టబుల్ పార్టికల్ ఫిల్టర్స్ ఫర్ రోబోట్ ఫాల్ట్ డయాగ్నసిస్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. చిట్టడవిలో నాసా ప్రయోగ బెలూన్లను సేకరించడానికి ఇతర రోబోట్లతో పోటీపడే సరికొత్త రోబోట్ను రూపొందించారు. దాని పనితీరు వర్మకు నచ్చింది. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆ రోబోట్ పనిచేసిన తీరు నన్ను అబ్బురపరిచింది’ అంటారు వర్మ. అప్పటినుంచి రోబోట్లపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.ప్రయాణమే మన బలం2007లో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ లో చేరిన వర్మ ప్రస్తుతం ‘మార్స్ మిషన్ రోబోటిక్స్ ఆపరేషన్స్’ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. ‘అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవడానికి రోబోటిక్ అన్వేషకుల అవసరం ఎంతో ఉంది. గ్రహాంతర వాతావరణంలో రోబోలు మాత్రమే కనుగొనగలిగే విషయాలు ఎన్నో ఉన్నాయి’ అంటారు వర్మ.‘అంగారక గ్రహంపై ఒకప్పుడు ఏదో ఒక జీవి నివసించి ఉండవచ్చు అనే సందేహం నుంచి అసలు ఆ గ్రహంలో ఏం జరుగుతుంది? అనే ఆసక్తి వరకు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో కొత్త ప్రదేశాలకు వెళ్లాను. కొత్త వ్యక్తులతో మాట్లాడాను. తరచు ప్రయాణిస్తూ ఉండడం వల్ల విభిన్న నేపథ్యాలు, విలువలు ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం వస్తుంది. దీంతో మనసు విశాలం అవుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటాం. అందుకే ప్రయాణం అనేది ముఖ్యం. ఇక అంగారక గ్రహం విషయానికి వస్తే...అక్కడ జీవం ఉనికిని మనం చూడలేదు. అయితే ప్రతి గ్రహానికి సంబంధించి భౌగోళిక శాస్త్రంలో కొన్ని గుర్తులు మిగిలే ఉన్నాయి. మనం చదవకుండా వదలేసిన కథలు అవి. ఇప్పుడు చదవాలి. రోబోల పాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది’ అంటారు వర్మ.సవాలు విసిరే పర్యావరణంలో...మానవులను పంపడం చాలా ప్రమాదకరమైన చోట రోబోలను పంపడమే సరిౖయెన పరిష్కారం అయినప్పటికీ, వాటిని నిర్మించడం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేయడం ఆషామాషీ విషయం కాదు. చిన్నపాటి తప్పు జరిగినా మిషన్ మొత్తానికీ ‘శుభం’ కార్డ్ పడుతుంది.‘మార్స్ పర్యావరణం గురించి లోతుగా తెలియనప్పుడు రోబోల నిర్మాణం అనేది సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలోనే సంక్లిష్టమైన పనులు చేసే, అదే సమయంలో సురక్షితంగా ఉండగలిగే రోబోను తయారు చేయాలి’ అంటారు వర్మ.భవిష్యత్ విజయానికి అద్దం పట్టేలా...నాసా వారి పర్సెవరెన్స్ రోవర్ మానవ జోక్యం లేకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా ΄్లాన్ చేసిన మార్గాలలో అంగారక గ్రహంపై విజయవంతంగా డ్రైవ్లను పూర్తి చేసింది. రాళ్ళు, వాలులు, ఇసుక లక్షణాలను గుర్తించడానికి జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ఆర్బిటల్ ఇమేజరీ, రోవర్ నావిగేట్ డేటాను విశ్లేషించాయి. వే పాయింట్లతో నిరంతర డ్రైవింగ్ మార్గాన్ని ఏర్పర్చాయి. మామూలుగానైతే ఈ ప్రక్రియను మానవులు నిర్వహిస్తారు.‘ఇది చెప్పుకోదగిన పురోగతి. ఏఐ సాంకేతికత ఆపరేటర్ల పనిభారాన్ని తగ్గిస్తుంది. నావిగేషన్కు సంబంధించిన ప్రధాన అంశాలను రోవర్ ఎలా క్రమబద్ధీకరించగలదో ఈ పరీక్ష నిరూపించింది. భవిష్యత్లో రోబోటిక్ మిషన్లను ఏఐ సాంకేతికతతో ఎలా నిర్వహిస్తాం అనేదానికి ఈ విజయం అద్దం పడుతుంది’ అంటారు వర్మ.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో... ఆ గ్రహంలోకి!మిషన్ లైఫ్సైకిల్లో రోబోటిక్ ఇంజినీర్లు విభిన్న పాత్రలను పోషిస్తారు. మార్స్పై రోవర్స్ శక్తిసామర్థ్యాలకు సంబంధించిన కోడ్ను రాయడంతోపాటు ఇంకా ముఖ్యమైన పనులెన్నో చేశాను. రోవర్ను ఆపరేట్ చేయడంలో పాలుపంచుకున్నాను. మార్స్పై ఆపరేషన్లను హ్యాండిల్ చేయడం అనేది నాకు ఇష్టమైన పని. ఎప్పటి నుంచో అంగారక గ్రహంపై రోబోలను డ్రైవ్ చేస్తున్నాను. అంగారక గ్రహంపై ఆపరేషన్ల ద్వారా నేను ఎప్పటికప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. మనం అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించడం అనేది సాధారణం. ఆ సాంకేతికతను మేము సంక్లిష్టమైన వాతావరణంలో ఉపయోగిస్తున్నాం. మార్స్పై ఏ రాయి ఆసక్తికరంగా ఉందో రోవర్ స్వయంచాలకంగా (ఆటోనమస్గా) గుర్తించడానికి మేము ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. వైడ్–యాంగిల్ ఇమేజ్లను తీసుకుంటున్నాం. ఆసక్తికరంగా ఉన్న వాటిని రోబోట్ తెలుసుకోవడంలో సహాయపడడానికి ఆఫ్లైన్ పద్ధతులను ఉపయోగిస్తున్నాం.– వంది వర్మ -
నీరు రుచి చూసి మార్కులేస్తుంది...
మామూలు నీళ్లు ఎవరైనా తాగుతారు. ఖరీదైన నీళ్లు తాగే వాళ్లనే ‘పెద్దవాళ్లు’ అంటారు. దేశంలో లీటరు 100 నుంచి 1500 వరకూ పలికే మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం జోరు మీద ఉంది. సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ప్రీమియం వాటర్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. దాంతో ‘వాటర్ టేస్టర్ల’ కు గిరాకీ పెరిగింది. నీటి రుచి చూసి మినరల్స్ను అంచనా కట్టడం వీరిని ‘వాటర్ సొమెలియర్’ అంటారు. ఈ నైపుణ్యంతో వాసికెక్కిన 32 ఏళ్ల అవంతి మెహతా (avanti mehta) చెప్తున్న నీటి సంగతులు...‘మన దేశంలో హిమాలయాల చెంత దొరికే నీటిదొక రుచి, ఆరావళి పర్వతాల వద్ద దొరికే నీళ్లదొక రుచి, సెలయేళ్ల నుంచి, కొండ వాగుల నుంచి, రాతి నేలల నుంచి ఇలా ఒక్కోచోట నుంచి సేకరించే నీటిది ఒక్కో రుచి. అంతేకాదు స్థలాన్ని బట్టి మినరల్స్ శాతం మారుతూ ఉంటుంది. పాకేజ్డ్ వాటర్ కూ మినరల్ వాటర్కూ వ్యత్యాసం నీళ్లలోని ఖనిజాల శాతమే తేలుస్తుంది. మన దేశంలో 6000 సంస్థలకు పాకేజ్డ్ వాటర్ లైసెన్స్ ఉంటే కేవలం 30 సంస్థలకు మాత్రమే మినరల్ వాటర్ లైసెన్స్ ఉంది. శుద్ధి చేసిన నీరు పాకేజ్డ్ వాటర్లో ఉంటే రక్షిత పరిసరాలలోని నీటి వనరుల నుంచి సేకరించిన నీరు మినరల్ వాటర్ బాటిల్స్లో ఉంటుంది’ అంటుంది అవంతి మెహతా.ఈమె మన దేశంలో ప్రస్తుతం ‘వాటర్ సొమెలియర్’గా (water sommelier) గుర్తింపు పొందుతోంది. వాటర్ సొమెలియర్ అంటే నీటి రుచి నిపుణురాలు. నీళ్లను తాగి ఆ నీటి స్వచ్ఛత, నాణ్యత తెలియచేస్తారు. వైన్ రుచి, టీ రుచికి టేస్టర్స్ ఉండటం తెలిసిందే. కాని నీళ్ల రుచి చూసే ‘వాటర్ సొమెలియర్’లు ఇప్పుడు ఉనికిలోకి వస్తున్నారు.‘నేను ఫ్యాషన్ రంగంలో ఈ–కామర్స్ విభాగంలో పని చేసే దాన్ని. అయితే ‘ఆవా’ అనే మినరల్ వాటర్ బ్రాండ్ మా కుటుంబానికి ఉంది. దేశంలో బాటిల్డ్ వాటర్కు పెరుగుతున్న గిరాకీని గమనించాక మా సొంత బిజినెస్లోకి రావాలని అనుకున్నాను. దేశంలో 70 శాతం నీళ్లు కలుషితంగా ఉన్నాయని ప్రజలు భావించే స్థితి వచ్చింది. మున్సిపల్ ట్యాప్స్ నుంచి వచ్చే నీళ్లను ఎవరూ నమ్మడం లేదు. అందుకే బాటిల్డ్ వాటర్ వ్యాపారం పెరిగింది. అయితే పాకేజ్డ్ వాటర్నే మనదేశంలో మినరల్ వాటర్ అనుకుంటూ ఉంటారు. రెండూ వేరు వేరు. అంతెందుకు ఫిల్టర్డ్ వాటర్కూ, ప్యూరిఫై చేసిన వాటర్కూ తేడా ఉంటుంది. నేచురల్ మినరల్ వాటరంటే సహజసిద్ధంగా సేకరించిందని అర్థం. ఇవన్నీ కూడా వాటర్ సొమెలియర్ కోర్సులో మాకు నేర్పుతారు. ప్రస్తుతం ప్రపంచంలో సౌత్ కొరియాలో, ఇటలీలో వాటర్ సొమెలియర్ కోర్సులు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. నేను ఇటలీలో కోర్సు చేసి సర్టిఫికెట్ పొందాను. ఈ కోర్సులో నీటి మూలాలు, నీటి సైకిల్స్, నీటి పరిరక్షణ, వాటిలోని పోషకాల గుర్తింపు ఇవన్నీ నేర్పుతారు’ అని తెలిపింది అవంతి మెహతా.‘మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. అయినా చాలామంది ఏం తింటున్నామన్న దాని మీద తప్ప ఏం తాగుతున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టరు. చైనా, అమెరికాలో పాకేజ్డ్ నీటి వ్యాపారం ఒకో దేశంలో 3000 కోట్లకు చేరిందంటే కారణం సరైన నీరు తాగాలనే చైతన్యం వల్లనే. సహజ ఖనిజాలు ఉన్న నీరు శరీరాన్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మన దేశంలో ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మంచి నీటి బ్రాండ్లు ప్రీమియమ్ బాటిల్డ్ వాటర్ను అమ్ముతున్నాయి. మా ‘ఆవా’ కూడా ప్రీమియమ్ బ్రాండే. మన దేశంలో కొన్ని కొండవాగుల, ఇసుక పాయల నుంచి సేకరించే నీటికి డిమాండ్ ఉంది. మంచు ఫలకాల నుంచి సేకరించే నీటిని ‘వింటేజ్ వాటర్’ అంటారు– ఆ ఫలకాల వయసును బట్టి. కొన్ని మినరల్ వాటర్స్ను కొన్ని రకాల ఆహారాలకు పెయిర్ చేస్తూ రెస్టరెంట్లు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. వెల్నెస్ క్రేజ్ పెరగడం వల్ల ఖరీదైనా సరే మంచిగా ఉన్న నీళ్లు తాగాలని చూస్తున్నారు’ అందామె.‘నీటి వ్యాపారం సాగుతున్న ఈ కాలంలో నా ప్రయత్నమంతా సహజ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పడమే. కలుషితాలు చేరకుండా చూస్తే స్థానిక చెరువులు, కుంటల్లోని స్వచ్ఛమైన నీరు గొప్ప శక్తిదాయినిగా మారుతుంది. నీరే భవిష్యత్తులో ఏ దేశానికైనా ఐశ్వర్యం కాగలదు’ అని ముగించింది అవంతి మెహతా. చదవండి: అవాంఛిత రోమాలు.. కారణాలు, పరిష్కారాలు -
మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!
"పెళ్లి" అంటే నూరేళ్ల పంట..ఎన్నో జన్మల బంధం అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది అబద్దమా అనిపిస్తుంది. చాలామంది ఆ అనుభవాన్ని గడించిన వివాహిత మహిళలు ఆ పేరు ఎత్తితేనే..హడలిపోతున్నారు.,విముఖత చూపిస్తున్నారు. సరదాకైనా..మళ్లీ వయసు వెనక్కి వెళ్లితే.. పెళ్లి చేసుకుంటారా అని మాటవరసకు అడిగితేనే..బాబోయ్ అన్నట్లుగా ఇస్తున్న సమాధానాల తీరు చూస్తే..పెళ్లీడుకి వచ్చిన వాళ్లు సైతం చేసుకోవాలా? వద్దా? అనేలా ఉన్నాయి వారి మాటలు. బాలీవుడ్ నటి, ట్రావెల్ వ్లాగర్ షెహనాజ్ తన పర్యాటక అనుభవాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటారామె. కంటెంట్ క్రియేటర్గా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంటారామె. అలానే ఈసారి పెళ్లై ఎన్నో వసంతాలు గడిచిపోయినా.. వృద్ద మహిళలను ఆటపట్టించే కొంటే ప్రశ్నతో పలకరించారు. అయితే వాళ్లందరి సమాధానాలు చూసి షెహనాజ్ విస్తుపోయింది. ఇంతకీ ఆ వివాహిత వృద్ధ మహిళను ఆమె ఏం అడిగారంటే..ఈ రోజు గనుక మీ ఏజ్ వెనక్కి వచ్చి..20 ఏళ్లు అయితే "మళ్లీ పెళ్లి చేసుకుంటారా"? అని ప్రశ్నించింది. అందుకు ఒకరేమో..ఒక్కసారి చాలు..ఇంకోసారి అస్సలు వద్దు అని చెప్పగా, మరొకరు పైళ్లిపై అంతగా ఆసక్తి లేదని, అది బానిసత్వానికి మరోపేరు అని తేల్చి చెప్పేశారు. ఇంకొందరు..మంచి పాఠం నేర్చుకోవాలంటే తప్పకుండా పెళ్లిచేసుకోవాలని అన్నారు. దానికి షెహనాజ్ ఏ పాఠం అని కుతుహలంగా ప్రశ్నించగా..అచ్చం కభీ ఖుషీ కభీ గమ్ మూవీలా కొన్ని సార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం అని చెప్పారు. చాలామటుకు పెళ్లిని అదొక సర్దుబాటుగా అభివర్ణించారు. ఒకరు మాత్రం ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే..జీవితంపై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారామె. అయితే ఆ సీనియర్ మహిళలంతా పెళ్లిపై అలా ఎందుకు చెప్పారంటే..వాళ్ల కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయకుండా గృహిణులుగా జీవితం గడిపామని, ఇంట్లో చాలా బాధ్యతలు ఉండేవని చెప్పడం విశేషం. ఆ సమాధానాలన్ని విని షెహనాజ్ చమత్కారంగా అందుకే తాను పెళ్లిచేసుకోలేదని అంది. వెంటనే అక్కడున్న మహిళ నవ్వుతూ..ఆ..! అది సరైన నిర్ణయం అని సమర్థించడం విశేషం.(చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా హిమాలయాల్లోని..
భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుఫియా వంద గంటల్లోపూ కఠినమైన మనాలి-లేహ్ హై-ఆల్టిట్యూడ్ రన్ను పూర్తి చేసి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇంతవరకు ఏ మహిళ సాధించిన ఘనత ఇది. హిమాలయాల్లో మొత్తం ఐదు ఎత్తైన పర్వత పాస్ల మీదుగా దాదాపు 470–480 కి.మీ. దూరం వేగవంతంగా రన్ చేసి రికార్డు సృష్టించింది. వంద గంటల లక్ష్యాన్ని తృటిలో అధిగమించి..కేవలం 98 గంటల 27 నిమిషాల్లో పరుగును పూర్తి చేసింది. ఈ మేరకు సూఫీ తాను సాధించిన ఘనతను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఇలా వివరించింది. తాను ఈ రికార్డును 2023లో అధికారికంగా ఆమోదించారని, కానీ సర్టిఫికేట్ రావడానికి ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చిది. ఐదు హై పాస్ల ద్వారా మనాలి నుంచి లేహ్ వరకు అత్యంత వేగవంతమైన పరుగు, హై-ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ రన్నింగ్ ఛాలెంజ్… లక్ష్యం: 100 గంటలు. ఇక్కడ సూఫీ దాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసింది. అయితే అధికారిక సర్టిఫికేట్ ఇండియన్ కస్టమ్స్ ద్వారా చేరుకోవడానికి చాలా సమయం తీసుకోవడం విశేషం. ఈ పోస్ట్పై నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. సూఫీ సాధించిన విజయం నిజంగా ప్రశంసనీయం. తదుపరి ఛాలెంజ్ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కూడా. కాగా సూఫీకి ప్రపంచ రికార్డులు కొత్తేమి కాదు. ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగవంతంగా పరిగెత్తిన మహిళగా, అలాగే భారతదేశం అంతటా 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రన్ను తదితరాలను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పొందామె. ఇవేగాక దేశంలో కఠినమైన భూభాగాల్లో అల్ట్రా-డిస్టెన్స్ రన్లను కూడా చేపట్టింది.(చదవండి: తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..) -
ఆమెకు ఆర్థిక శక్తి!
‘బడ్జెట్ అనేది మన స్వేచ్ఛకు పరిమితులు విధించకూడదు. మరింత స్వేచ్ఛ ఇవ్వాలి’ అనేది పాత మాట. ‘ బడ్జెట్ అనేది స్వేచ్ఛ మాత్రమే కాదు మహిళా సాధికారతకు దారి చూపాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ ద్వారా కొత్త శక్తి ఇవ్వాలి’ అనేది కొత్త మాట. ‘బడ్జెట్–2026’ నుంచి మహిళలు ఆశిస్తున్నది ఏమిటి? బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్టెన్షనాలిటీ ప్రాధాన్యత ఏమిటి? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కావాల్సింది ఏమిటి?... తెలుసుకుందాం...గత కాలాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్టెన్షనాలిటీ (జేఈ) కీలకంగా మారింది. ‘జేఈ’ అనేది మహిళల అవసరాలు, ఆకాంక్షలు, ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేసే డిజైనింగ్.‘గత బడ్జెట్ చిన్న వ్యాపారాలు, స్టార్టప్లకు కొత్త అవకాశాలను సృష్టించింది, పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను పెంచింది. క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు రెట్టింపు చేసింది. స్టార్టప్లు, ఎగుమతిదారులకు అధిక కాలపరిమితి గల రుణాలను అందించింది. రాబోయే అయిదేళ్లలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఉపశమనం లభించింది. పెద్ద సంస్థలను స్థాపించాలని, పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలని, ఉద్యోగాలు సృష్టించాలని మహిళలు కోరుకుంటున్నారు’ అంటున్నారు భారతీయ యువశక్తి ట్రస్ట్(బివైఎస్టీ) మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటేశన్.జెండర్ బడ్జెటింగ్ అంటే...జెండర్ బడ్జెటింగ్ను జెండర్ సెన్సిటివ్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. బడ్జెట్లో లింగ అసమానతలు లేకుండా చూసుకోవడమే జెండర్ బడ్జెటింగ్. ముఖ్యమైన అంశాలలో మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడం, పురుషులు, మహిళల మధ్య వనరుల పంపిణీలో సమానత్వం ఉండేలా చూడడం జెండర్ బడ్జెటింగ్ ప్రాథమిక లక్ష్యం.సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్2026 బడ్జెట్ నుండి ఆశిస్తున్న వాటిలో ముఖ్యమైనది...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మహిళలకు తగినంత సహకారం అందించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, డీప్–టెక్లాంటి రంగాలలో మహిళల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయాలని పీహెచ్డీసీసీఐ (పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) మహిళల ప్రతినిధి బృందం కోరుతోంది.ప్రోత్సాహకాలు, విధానపరమైన మద్దతు ద్వారా మహిళల నేతృత్వంలోని పరిశ్రమలు, సేవారంగాలకు ప్రోత్సాహం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించే మహిళలకు, ముఖ్యంగా ‘స్టెమ్’ విభాగాలకు సంబంధించిన మహిళలకు స్కాలర్షిప్లు అందించాలని, మార్కెట్ యాక్సెన్ను మెరుగుపరుచుకోవడానికి మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను అందించాలనీ కోరారు. ఆఫీసులలో మహిళా ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ నివారణలాంటి ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి ఆరోగ్య పథకాలను అందించాలని కోరారు.మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం..‘మహిళల నేతృత్వంలోని కంపెనీలకు అందుబాటులో ఉండే పథకాలను ప్రవేశపెట్టాలని, ముఖ్యంగా కొలేటరల్–ఫ్రీ క్రెడిట్, వడ్డీ రాయితీ...మొదలైన వాటి ద్వారా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద పట్టణాలలో ఉన్న మహిళా వ్యాపారులలో ఎంతో సృజనాత్మకత ఉంది. గొప్ప ఆశయాలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు అయ్యేలా సహాయపడవచ్చు. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం అనేది కేవలం కలిసికట్టుగా ముందుకు సాగడం మాత్రమే కాదు భవిష్యత్తు కోసం మెరుగైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కూడా’ అంటున్నారు క్రిమినల్ లాయర్ నుంచి ఎంటర్ప్రెన్యూర్గా మారిన ‘రూట్స్ కేఫ్’ ఫౌండర్ మీనాక్షి కుమార్. ‘మన దేశంలో రిటైల్ కాస్మెస్యూటికల్ పరిశ్రమ లో ఎంతో మార్పు వచ్చింది. దీనిలో మహిళా వినియోగదారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. స్వల్పకాలిక పరిష్కారాల కంటే దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్మెస్యూటికల్స్ను కేవలం అందాల విభాగంగా మాత్రమే చూడకుండా ఆరోగ్య సంరక్షణ–విశ్లేషణ వర్గంగా అధికారికంగా గుర్తించే అవకాశాన్ని కేంద్ర బడ్జెట్ 2026 ఇస్తుందని ఆశిస్తున్నాం. సమర్థవంతమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ రంగం మరింత అభివృద్ధి అయ్యేలా చేయవచ్చు. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మన దేశంలోని బ్యూటీ–ఫార్మా పరిశ్రమ బలోపేతం అవుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది’ అంటున్నారు బ్యూటీ–ఫార్మాకు చెందిన మహిళా ఎంటర్ప్రెన్యూర్లు.అసమానతలు లేకుండా...మా వాహక్, విట్ట సఖీగా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి బీమా వాహక్లకు కేంద్ర బడ్టెట్లో ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. ‘బడ్జెట్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే గత కొంతకాలంగా స్త్రీ సాధికారత దృష్ట్యా అది మరింత ఆసక్తికరంగా మారింది. జెండర్ బడ్జెటింగ్కు ప్రాధాన్యత ఇచ్చే ధోరణి పెరగడం సంతోషం కలిగిస్తోంది. బడ్జెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీదే వారి పురోగతి ఆధారపడి ఉంటుంది’ అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. -
డాక్టర్ కల చెదిరి, యూట్యూబర్గా మారి..కట్ చేస్తే!
మనం విజయం సాధించాలంటే మనమీద మనకి నమ్మకం ఉండాలి. మన పనిమీద అసరామైన నమ్మకం, కొండంత ప్రేమ ఉండాలి. ఎంతటి కష్టమైనా దూది పింజలా తేలిపోతుంది. విజయం వంగా సలాం చేస్తుంది. రాజస్థాన్లోని కురి అనే చిన్న గ్రామానికి చెందిన 30 ఏళ్ల కౌశల్య చౌదరి సక్సెస్ జర్నీ ఇలాగే మొదలైంది. తనకసలే పరిచయం లేని విషయాలపై అవగాహన పెంచుకుంది. విజయం సాధించింది. పట్టుదల, స్వయం కృషితో ఎదిగిన కౌశల్య ఏం చేసింది. తెలుసుకుందాం.ఒక మూరుమూల గ్రామం. ఆడవాళ్లు గుమ్మం దాటి కాలు బయలుపెడితేపాపం అనుకునే రోజులు. అలాంటి సమయంలో తాను సృష్టించబోయే విప్లవాన్ని స్వప్నించింది. AI టూల్స్, రింగ్ లైట్, ఖరీదైన కెమెరా , అంతరాయాలు లేని ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఒక చిన్న వీడియో రికార్డు చేయాలంటే నానా కష్టాలు పడతాం. కానీ కేవలం సాధారణ స్మార్ట్ఫోన్, అస్తవ్యస్తమైన సిగ్నల్స్ మధ్య వంటకాల వీడియోతో పాపులర్ అయ్యిందామె. ఇక్కడే ఆమె నిబద్దతను, కృషిని అర్థం చేసుకోవవచ్చు.కౌశల్యకు వంటలంటే చాలా ఇష్టం. అలా తన వంటల్ని అందరికీ పరిచయం చేయాలనుకుంది. వంటపై అపారమైన ప్రేమతో, కౌశల్య తన గ్రామంలోని వంటగదిలో ఒక తాత్కాలిక స్టూడియోను ఏర్పాటు చేసుకుంది, చేతితో రాసుకున్న నోట్స్ ద్వారా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంది. రాత్రంతా కష్టపడి, డాబాపై అష్టకష్టాలుపడి ఎ ట్టకేలకు ఒక యూట్యూబ్ వీడియోను అప్లోడ్ చేసింది.కేవలం స్వయంకృషితో ప్రియమైన డిజిటల్ క్రియేటర్ మాత్రమే కాదు. సాంప్రదాయరాజస్థానీ మసాలా దినుసులు,కోల్డ్-ప్రెస్డ్ నూనెలను అందించే 'సిద్ధి మార్వాడీ' అనే స్వచ్ఛమైన ఆహార బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా కూడా ఎదిగింది. తన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.బాల్యం: ఒక సామాన్య రైతు కుటుంబంలోపెరిగిన కౌశల్య జీవితం గ్రామీణ భారతదేశంలోని చాలామంది అమ్మాయిల జీవితంలాగే ఉండేది. ఉదయం పాఠశాల, సాయంత్రం ఇంటి పనులు. పొలానికి వెళ్ళేది, గొడ్డూ గొదా చూసుకునేది. నలుగురు తోబుట్టువులలో పెద్దది , పైగా తల్లి పొలం పనుతో బిజీగా ఉండేది.. అందుకే వంటగదికి అంకితమైపోయేది. ముఖ్యంగా తన తల్లి పొలంలో పనిలో ఉన్నప్పుడు ఆమె ప్రేమగా వండి పెట్టేది. అదితిన్నపుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందమే వంటపై ఆమెకు ప్రేమను పెంచింది. View this post on Instagram A post shared by Kaushalya Choudhary (@kaushalyaair)డాక్టర్ కావాలనే కలలు: డాక్టర్ కావాలనే కలలతోనే 12వ తరగతిలో సైన్స్ చదివింది. ఎలాగైనా కష్టపడి డాక్టర్ని కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అనీ అనుకున్నట్టే జరగవు కదా. ఇంటర్ పరీక్షలు అయ్యాయో లేదో పెళ్లి చేసేశారు పెద్దలు. తన తల్లి, ఇతర ఆడాళ్లలాగానే పొలం పనులు, ఇంటిపనులు. ఇంతోటి దానికి తాను ఇంటర్ దాకా ఎందుకు చదువుకున్నట్టు అని తనను తాను ప్రశ్నించుకుంది. ఏదో చేయాలనే ఆలోచన మొదలైంది. కానీ తన గ్రామంలో ఉద్యోగావకాలు తక్కువ. పైగా ఆడాళ్లకి సామాజిక కట్టుబాట్లు ఉండనే ఉన్నాయి. దీనికి తోడు బైటికిపోతే, ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇంటికి వచ్చే అతిథులను ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ, అత్తగారిమాటలు. బోనులో చిక్కుకున్నట్లు ఫీలింగ్ కలిగేది ఆ ఇంటికి ఏకైక కోడలైన కౌసల్యకు. చిన్నప్పటి నుంచే కౌసల్య వంటగదిలోనే గడిపింది. ఈ అనుభవంతోనే నాలుగు గోడల మధ్యలోనే అయినా సరే ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్ వరంలా దొరికిందిఐదేళ్ల చిన్నారి యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నట్టు తెలుసుకుంది. అంతేక ఆలోచన తళుక్కున మెరిసింది. ఎంతో ఆశతో భర్త వీరేంద్ర కుమార్ను యూట్యూబ్ అంటే ఏమిటని అడిగింది. కొద్దిగా వివరాలు తెలుసుకుంది. ఆ సమయంలో ఆమె దగ్గర స్మార్ట్ఫోన్ కూడా లేదు. కౌసల్య మరో అడుగు ముందుకేసి మామగారిని ఫోన్ కొనివ్వమని అడిగింది. రూ 3 వేల విలువైన బటన్ ఫోన్ ఇంటికి తెచ్చి, ఇంతకంటే ఎక్కువ కొనలేనని చెప్పారట. తాను పొదుపు చేసుకున్న మూడు వేల, అమ్మ దగ్గర మూడు తీసుకుని రూ. 7500 పెట్టి శాంసంగ్ జె2ఎస్ ఫోన్ కొనుక్కుంది. 2017లో తన వంటగది నుండి వంటకాల వీడియోలను చిత్రీకరించడం ప్రారంభించింది. ట్యూటోరియల్స్ చూసి ఎడిటింగ్ నేర్చుకుంది. నేర్చుకున్నపాయింట్లను మర్చిపోకుండా ఉండేందుకు పాయింట్లు రాసుకునేది. ఇలా అన్ని అడ్డకుంలనూ అధిగమించి కౌసల్య తన యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించింది. బేసన్ బర్ఫీ,హల్దీ కీ సబ్జీ. తొలి వీడియో సంచలనం క్రియేట్ చేసింది. అష్టకష్టాలుపడి, నాణ్యమైన వంటకాల వీడియోలను పోస్ట్ చేయగలిగింది. ప్రస్తుతం ఆమె సిద్ధి మార్వాడి కిచెన్( Sidhi Marwadi Kitchen) అనే ఛానల్కు 10 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉండటం విశేషం. తన సబ్స్క్రైబర్ల కోసం కంటెంట్ను అందిస్తూ పాపులర్ అయింది. మొదటి రోజులు చాలా కష్టంగా ఉండేవి. ట్రైపాడ్ లేదు, కేవలం అల్యూమినియం తీగలను వంచి తాత్కాలిక స్టాండ్గా ఉపయోగించేది. స్టూడియో లైట్లు లేవు, వంటగది చుట్టూ బల్బులు వేలాడ దీసేది. నెట్వర్క్ లేక వీడియోలు అప్లోడ్ చేయడానికి గంటల తరబడి వేచి ఉండేది. మొత్తానికి ఏడాదిన్నర తరువాత యూట్యూబ్ నుండి వచ్చిన తొలి సంపాదన రూ. 7,500. ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసింది లేదు. అంతేకాదు ఈమెపాపులారీటీ మాస్టర్ చెఫ్ ఇండియాదాకా చేరింది. 2023లో మాస్టర్ చెఫ్ ఇండియా పాల్గొని, రాజస్థాన్ నుండి 40,000 మంది పాల్గొనేవారిలో టాప్ 12లో చేరిన ఏకైక పోటీదారుగా నిలిచింది. తన YouTube ద్వారా వచ్చిన సంపాదన రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి "సిధి మార్వారీ" అనే క్లీన్-లేబుల్ ఫుడ్ స్టార్టప్ను ప్రారంభించింది. స్వచ్ఛమైన మసాలాలు, కోల్డ్-ప్రెస్ ఆయిల్స్తో 2024లో సిద్ధి మార్వాడి( Sidhi Marwari) బ్రాండ్ను స్థాపించింది. తన గ్రామంలో 35మందికి పైమహిళలకు ఉపాధినిస్తోంది. ఈ స్టేజికి రావడం అంత సులభంగా జరిగిపోలేదు. ఈ పని ఆపేయమనికుటుంబ సభ్యులు చాలా ఒత్తిడి చేశారు. ఇలా వీడియోలు తీయడం, నలుగురికీ కనిపించడం మంచిది కాదని వాదించారు, భయపడ్డారు. కానీ భార్య సంపాదనతో జీవిస్తోందన్న విమర్శలు ఎదుర్కొన్న భర్త వీరేంద్ర ఆమెకు సపోర్ట్గా నిలవడం విశేషం. ఇపుడు ఎంతోమంది గ్రామస్తులకు ఆమె స్ఫూర్తి. -
20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా
జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే. కన్న కూతురి కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.పెచియమ్మాళ్ అలియస్ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రారంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఇక్కడే పెచియమ్మాళ్ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం, ప్యాంట్ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్గా, కూలీగా, టీ మేకర్గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ, బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.ఆమె మహిళ అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా ముత్తు లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్గా మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది. -
అక్షర ధీర
‘పత్రికొక్కటున్న పదివేల సైన్యం... పత్రికొక్కటున్న మిత్రకోటి’... ఆనాటి నార్ల వారి మాట ఇప్పటికీ శక్తిమంతమైనదే. పత్రికల శక్తిని తెలియజేసేదే! పత్రిక అంటే ప్రజల ఆత్మీయ నేస్తం. దారి చూపే దీపం. సమాజానికి ముప్పు వాటిల్లినప్పుడు పత్రిక ప్రజల గొంతుక అవుతుంది. పాశుపతాస్త్రం అవుతుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు రిపోర్టర్, ఫొటో జర్నలిస్ట్, పొలిటికల్ కార్టూనిస్ట్... వివిధ స్థాయులలో పత్రికారంగంలో మెరిసిన మహిళలు ఎంతోమంది ఉన్నారు...జేమ్స్ ఆగస్టస్ హికీ 1780 జనవరి 29న ‘హికీస్ బెంగాల్ గెజిట్’ పత్రికను ప్రారంభించారు. ఇది మన దేశంలోని మొదటి వార్తాపత్రిక మాత్రమే కాదు ఆసియాలోని మొట్టమొదటి వార్తాపత్రిక కూడా. భారతదేశంలో నిశ్శబ్దంగా మొదలైన ప్రింట్ జర్నలిజం సామాజిక రంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారుల గొంతుక అయింది. నాయకులు, విప్లవకారుల అభి్రపాయాలను సాధారణ ప్రజలకు చేరవేయడం ద్వారా రాజకీయ పరివర్తన సాధనాలుగా పనిచేశాయి. అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కలకత్తాలో ప్రారంభమైన ‘హికీస్ బెంగాల్ గెజిట్’ లేదా ‘ది ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వరై్టజర్’ రెండు సంవత్సరాల పాటు నడిచింది. ఈ పత్రిక నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు తొలి బీజం వేసింది.అరుణ అడుగు జాడలలో...భారతీయ పత్రికరంగంలో కీలక పాత్ర పోషించిన మహిళా జర్నలిస్ట్లలో అరుణ అసఫ్ అలీ మొదటి వరుసలో నిలుస్తారు. స్వాతంత్య్రోద్యమ పోరాట యోధురాలైన అరుణ 1950 చివరిలో ‘పేట్రియాట్’ దినపత్రికను, ‘లింక్’ వారపత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలు కార్మికుల హక్కులు, సామాజిక న్యాయంపై దృష్టి సారించాయి. సైద్ధాంతిక చర్చలకు వేదికలయ్యాయి.ఛాయాచిత్ర సంచలనంఫొటో జర్నలిజం ద్వారా ప్రింట్ మీడియాలో సత్తా చాటిన జర్నలిస్ట్ హోమై వ్యరవాలా. ‘డాల్టా’ పేరుతో సుపరిచితురాలైన ఆమె భారతదేశంలోని తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబైలోని ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ పత్రికలో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో హోమై తీసిన ఫొటోలు ఆమె భర్త పేరుతో ప్రచురితమైనాయి.‘మహిళలు అన్నిచోట్లా తిరగడం ఆరోజుల్లో చాలామంది ఇష్టపడేవారు కాదు. నేను చీర కట్టుకొని, మెడలో కెమెరాతో తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను వింతగా చూసేవారు. సరదా కోసం అలా తిరుగుతున్నానని అనుకునేవారు. నన్ను సీరియస్గా తీసుకునేవారు కాదు. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫొటోలు తీయగలిగాను. నాపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల సున్నితమైన ప్రాంతాలకు వెళ్లి కూడా ఫొటోలు తీయగలిగాను. నాకు ఎవరూ అడ్డుపడలేదు. దీంతో అరుదైన ఫొటోలు తీసి ప్రచురింపజేయగలిగాను. ఆ ఫొటోలు ప్రచురితమైన తరువాతే ఆ పనిని నేను ఎంత సీరియస్గా చేస్తున్నానో ప్రజలు గుర్తించారు’ అని చెబుతుండేవారు హోమై వ్యరవాలా.మాయా జాలం!మన దేశంలోని ప్రముఖ మహిళా రాజకీయ కార్టూనిస్ట్లలో మాయా కామత్ ఒకరు. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందిన మాయ చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ ఉండేవారు. లిన్ జాన్స్టన్ పుస్తకం ‘ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్’ ప్రేరణతో కార్టూన్లు గీయడం ప్రారంభించారు కామత్. ఎన్నో ప్రధాన స్రవంతి వార్తాపత్రికలలో కార్టూనిస్ట్గా పనిచేశారు. ‘సక్సెస్ఫుల్ ఉమెన్ కార్టూనిస్ట్’ గా గుర్తింపు తెచ్చుకున్నారు.‘కర్ణిక కహెన్’ అనే కార్టూన్ క్యారెక్టర్ను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు కనికా మిశ్రా. దేశంలో జరిగే సంఘటనపై వ్యాఖ్యనించేలా ‘సామాన్య పురుషుడు’ కార్టూన్ క్యారెక్టర్లు ఎన్నో వచ్చాయి. దీనికి భిన్నంగా ‘కర్ణిక కహెన్’ను తీసుకువచ్చారు.సామాన్య మహిళలే సారథులువివిధ సామాజిక సమస్యలపై పోరాడుతూ పైకి ఎదిగిన మహిళ కవితా దేవి. బుందేల్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత ‘ఖబర్ లహరియా’ పత్రిక ఎడిటర్–ఇన్–చీఫ్గా దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించారు. తనలాంటి భావాలు ఉన్న మహిళలతో కలిసి ‘ఖబర్ లహరియా’కు రూపకల్పన చేశారు. బుందేలీ, బజ్జికా, అవధిలాంటి హిందీలోని వివిధ గ్రామీణ మాండలికాలలో ఈ పత్రిక ప్రచురితమవుతుంది. బుందేల్ఖండ్లోని సామాన్య మహిళలే ఈ పత్రికకు రిపోర్టర్లు. సారథులు.పిచాయ్– ప్రింట్ రీడర్‘నాకు ఫిజికల్ పేపర్ చదవడం అంటేనే ఇష్టం’ అని చెబుతుంటారు సుందర్ పిచాయ్. సాంకేతిక దిగ్గజం ‘గూగుల్’కు సీయివో అయిన పిచాయ్ నోట ఆన్లైన్ కాకుండా ‘ఫిజికల్ న్యూస్ పేపర్’ అనే మాట వినిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ‘నేను ఓల్డ్ స్కూల్’ అని చెప్పకనే చె΄్పారు పిచాయ్. ఈ నేపథ్యంలో ఫిజికల్ న్యూస్పేపర్లు, పుస్తకాలు చదవడం వల్ల కలగే ఉపయోగాల గురించి సామాజిక మాధ్యమాలలో చర్చ నడిచింది. సమాచారాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తించడానికి ఫిజికల్ ఫార్మట్ ఉపయోగపడుతుదనే చెబుతున్నారు విశ్లేషకులు. -
రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..!
సైన్యంలో చేరడం అంటే అంత ఆషామాషి కాదు. తీరా అందులో జాయిన్ అయ్యాక అక్కడ కఠిన శిక్షణను తట్టుకుని పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడం మాటలు కాదు . అందులోనూ ఏవియేషన్ రంగంలో ఓ సాయుధ హెలికాప్టర్కి పైలట్గా వ్యవహరించడం అంటే..ఎన్ని సవాళ్లు ఎదుర్కొనలో చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు అంతటి కష్టతరసాధ్యమైన బాధ్యతలను పురుషులే నిర్వర్తించారు. తొలిసారి అలాంటి విధుల్లో ఒక మహిళ రావడం ఇదే తొలిసారి. అలాంటి ఘనతను అందుకు "శర్మ జీ కి బేటి". గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె స్టోరీ ప్రేరణగా నిలిచింది. ఎవరామె..? ఈ రంగాన్ని ఎలా ఎంచుకుందంటే..రుద్ర హెలికాప్టర్ను నడిపిన భారత సైన్యం తొలి మహిళా పైలట్గా కెప్టెన్ హంస్జా శర్మ చరిత్ర సృష్టించారు. శర్మ కెరీర్ జర్నీలో తిరస్కరణలు, శస్త్ర చికిత్సలు ఉన్నాయి. జమ్మూలో పుట్టి పెరిగిన ఆమె నాసిక్లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ శిక్షణా పాఠశాల (CAATS)లో తన శిక్షణా కోర్సులో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ పోరాట విమాన చోదకుడికి ఇచ్చే సిల్వర్ చిరుత ట్రోఫీని అందుకున్న తొలి అధికారిణి ఆమె. ఇది భారత ఆర్మీ ఏవియేషన్కు తొలి రికార్డు కూడా. ఈ ఏడాది రాజస్థాన్ ఆర్మీ డే పరేడ్లో 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్కు నాయకత్వం వహించడమే గాక హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శించింది.జమ్మూ నుంచి ఆర్మీ ఏవియేషన్ వరకు..మార్చి 9, 1998న జమ్మూలో జన్మించిన కెప్టెన్ శర్మ బర్నాయ్లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె జమ్మూలోని పరేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత భారత సైన్యంలోకి ఎంపికయ్యే ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో చేరింది. అక్కడ నుంచి భారత సైన్యంలోకి చేరడానికి ఆమె పలు సవాళ్లు ఎదుర్కొంది. మొదటగా తాత్కలిక తిరస్కరణలను ఫేస్చేసింది. ఆ క్షణంతో తన కెరీర్ ముగిపోయిందనుకుంది. కానీ ఆమె అచంచలమైన సేవ, పట్టుదల మనస్తత్వం తిరిగి తన ఒంటిమీదకు యూనిఫాం వచ్చేలా చేశాయి. సింగిల్ మదర్ సంరక్షణలో..సీనియర్ జర్నలిస్ట్, సింగిల్ మదర్ రష్మి శర్మ తన పిల్లలను పెంచడానికి అన్నింటిని అమ్మేశానన్నారు. ప్రస్తుతం తన కూతురు హంసజ తనను ఉద్యోగం మానేయమని అంటుంది. అయితే తాను జర్నలిస్ట్ని కాబట్టి పనిచేస్తే..తనకు చేతనైనంత ఇతరులకు సాయం చేయగులుగుతానని అంటోందామె. తన కూతురు కూడా ఇతర సైనికురాలి లాంటిదేనని అన్నారు. వాళ్లు దేశం కోసం త్యాగం చేస్తే..తాను అలాంటి త్యాగాలే చేసిన తల్లినని ఆమె గర్వంగా చెప్పారు. తాను శత్రువుల ముందు ధైర్యంగా నిలబడి తగిన జవాబు ఇవ్వడానికి సాహసించే ప్రతిసైనికుడిని చూసి గర్విస్తున్నాని అన్నారామె. నిజానికి ఏఎల్హెచ్లో ప్రయాణించడం అంటే బహిరంగ ఆకాశంలో ప్రయాణించడం లాంటిదని, చాలా భయంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో హంసజకు మరిన్ని బాధ్యతలు, సవాళ్లు ఎదరవ్వుతాయని..వాటన్నింటి ఆమె విజయవంతంగా ఎదుర్కొగలదని నమ్మకంగా చెప్పారు హంసజ తల్లి రష్మి శర్మ.(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!) -
దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!
అడవి అంటే సహజసిద్ధంగా ఏర్పడేదనేది తెలుసు అందరికి. కానీ చేతితో సృష్టించిన వనం గురించి విన్నారా. ఔను ఇది నిజం. చేతితో అడవిని సృష్టించడమా? అని ఆశ్చర్యం వేసినా..నమ్మకతప్పని సత్యం ఇది. అది కూడా ఓ 92 ఏళ్ల వృద్ధురాలి చేతి నుంచి పరుచుకన్న పచ్చదనం. అది ఆమె ఆరాటం నుంచి పుట్టుకొచ్చిన ప్రకృతి తపోవనంలా అచ్చంత ఆహ్లాదభరితంగా అలారారుతుంది. వాతావరణ మార్పు కోసం గత కొన్నేళ్లుగా పచ్చదనం అనే మంత్రం జపిస్తున్నాం కానీ..అంతకుమునుపు నుంచే ఈ దేవకి అమ్మ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి..అందుకోసం కృషి చేశారామె. చెట్టు విలువ తెలసిన అమ్మ ఈమె. ఆమె పెంచిన అడవిలో ఉండే మొక్కలు గురించి విన్నా..విస్తుపోవాల్సిందే..!. అసలు ఈ దేవికి అమ్మ ఎవరు..? అడవిని సృష్టించాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే..కేరళలోని అలప్పుజలోని ఓ చిన్న గ్రామానికి చెంది దేవికి అమ్మ నలబై ఏళ్ల కృఫి ఫలితమే ఈ తపోవనం. ఇది ఆమె చేతితో సృష్టించిన అడవి. ఇక్క ఎన్నో ఔషధ మోక్కలు, చేపలు, పక్షుల సందడితో ఆహ్లాదభరితమైన పర్యావరణ సమతుల్యత కనిపిస్తుంది. మనకు కలిగిన శారీరక కష్టానికి కాసింత కలత చెంది..ఆరోగ్యంగా ఉండేందుకు యత్నిస్తాం. కానీ ఈ దేవికి అమ్మ అలా కాదు..తాను అనుభవించిన శారీరక బాధకు ఉపశమన మొక్కలుగా భావించడం విశేషం. అనుకోని ఓ ప్రమాదం కారణంగా అంగవైకల్యంతో మంచానికే పరిమితమైంది దేవకి. బాధకు ఉపశమనంగా చెట్ల పెంపకం..దాంతో ఎప్పటికీ వరిపొలం పనులు చేసే అవకాశం లేకుండాపోయింది. ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకున్న దేవకీ..ఆ పనులకు స్వస్తిచెప్పక తప్పలేదు. తనంతట తాను నడవలేని దైన్యస్థితితో చాలా పోరాడింది. చివరికి చికిత్స తీసుకుంటూనే తన పనులు తను చేసుకునేలా ఉండాలన్న సంకల్పం..కర్ర ఊతంతో నడవగలిగే శక్తిని అందించింది. ఆ కాసింత శక్తితోనే ఏదో ఒకటి చేయాలని ఆరాటపడింది. ఎలాగో ఈ శారీరక వైకల్యంతో వ్యవసాయం అంటే కష్టమే అందుకని..తన ఇంటి వెనుక ఉన్న బంజరు భూమిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. రోజుకు ఒక మొక్క చొప్పున నాటడం, దానితో కాసేపు గడపడం వంటి పనులతో తన శారీరక రుగ్మత నుంచి బయటపడే యత్నం చేసింది. ఇలా నాలుగు దశబ్దాలుగా తన రోజువారీ దినచర్యలో మొక్కలు నాటడం అనేది భాగంగా మారింది. అలా చూస్తుండగానే ఐదు ఎకరాల్లో పరుచుకున్న సహజసిద్ధమైన అడవిగా రూపాంతరం చెందింది. ఈ అడవిలో వివిధ జాతుల చెట్లు,పొదలు, ఔషధ మొక్కలకు నిలయం.ఇక్కడ ప్రత్యేక చెట్లలో ఒకటి కమండలు. దీన్ని కాలాబాస్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఋషులు తపస్సు నిమత్తమై వినియోగించే కమండలం కోసం ఈ చెట్టునే వినియోగిస్తారు. అందుకే దీన్ని కమండలు వృక్షం అనిపిలుస్తారు. అంతేగాదు ధ్యాన సమయంలో ఈ చెట్టు కొమ్మలనే ఆధారం చేసుకుంటారు. ఇదేగాక నెమలి మొక్క..అని మరో ప్రత్యేకమైన మొక్క ఉంది. దీని ఆకులు నెమలి ఈకను పోలి ఉంటాయి. ఇవేగాక అంజూర చెట్లు, ఇండియన్ బ్లాక్బెర్రీ, జాక్ఫ్రూట్, మామిడి, అడవి బెర్రీలు, వేసవిలో ఆకురాల్చు బుద్ధచెట్టు తదితరాలు ఉన్నాయి. ఈ పచ్చదనం మధ్యలో క్యాట్ఫిష్ వంటి చేపలు, స్నేక్హెడ్ ముర్రెల్తో నిండిన చిన్న చెరువు వంటివి ఉన్నాయి. ఈ చేపలు తినే పక్షులు, ఈగల్, వేటాడే పక్షులు కిలకిలరావాలతో మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. సముద్రానికి సమీపంలో బ్యాక్వాటర్స్(ఉప్పునీరు లాంటి చిన్న చెరువులు) మధ్య ఇలాంటి అడవినా..! అని అక్కడకు వచ్చే జనాలు విస్తుపోతుంటారు. తెల్లటి ఇసుక, చుట్టూ ఉప్పు నీరు మధ్య పచ్చదనం అనేది చాలా కష్టం. కానీ దేవికి అమ్మ పట్టుదల..ఈ వృక్ష సంపదకు మూలం. ఆ అమ్మ చుట్టు పక్కల వాళ్లకు ఉచితంగా ఆ అడవిలోని మొక్కలను అందిస్తుంది. అంతేగాదు అందరు వచ్చి సందర్శించొచ్చు కూడా. అందుకు ఎలాంటి రుసుము తీసుకోదామె.ఇది ప్రకృతి ప్రసాదమని అవి అందరి హక్కు అని అంటుంటారామె. ఒక చెట్టును నాటడం అనేది కార్బన్ పాదముద్రను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇక్కడ ఈ దేవికి అమ్మ అదే చేశారు. అందుకే భారత ప్రభుత్వం ఆమె నిస్వార్థ సేవను గుర్తించి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్సంగ్ హీరోస్ విభాగంలో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు అడవుల పెంపకం, పరిరక్షణకు సంబంధించి పర్యావరణ బాధ్యత ఎలా ఉంటుందో చేతల ద్వారా చూపించి ఆదర్శంగా నిలిచింది ఈ దేవకి అమ్మ..!.(చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..) -
నృత్య సేవే దైవారాధన
‘సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు శాస్త్రీయ నృత్యం ద్వారా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాను’ అని చెప్పారు తెలంగాణ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ కళాకారిణి ఐదున్నర దశాబ్దాలుగా నృత్య సేవ చేస్తున్నారు. దీపికారెడ్డి చేస్తున్న కృషికి ఈ యేడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికారెడ్డి మాట్లాడుతూ కళా సేవ గురించి తమ జీవన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు..పాశ్చాత్య హోరులో మునిగిపోతున్న మన చిన్నారులకు, యువతకు మన దేశ నృత్య కళలు తెలియాలి. కళలకు గుర్తింపు లభించి, ఇలాంటి అవార్డులు రావడం ద్వారా రాబోయే తరాలకు ప్రేరణ కలిగిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఒక క్రమ శిక్షణ అలవడుతుంది. మెదడు చురుకుగా, శక్తిమంతం అవుతుంది. నృత్యం ద్వారా వచ్చే మనశ్శాంతి, సంతోషం మనల్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. మా విద్యార్థుల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. నృత్య ప్రదర్శనల్లోనూ పాల్గొంటారు. ఇందులో ఒక టీమ్ వర్క్ ఉంటుంది. అందరి ప్రోత్సాహంతో...నాలో ఈ నాట్య తపనను వెలిగించింది మా అమ్మ రాధికారెడ్డి. తను భరతనాట్య నృత్యకారిణి. ఆమె 1961లో రవీంద్రభారతి ప్రారంభోత్సవానికి చిత్రాంగద బ్యాలె ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అమ్మ సాధనను చూసి, నేనూ స్ఫూర్తి పొందేదాన్ని. నాట్యంపై నాకున్న ఆసక్తి గమనించిన అమ్మ నాచేత గజ్జె కట్టించారు. అలా అమ్మ మొదటి గురువు, ఆ తర్వాత నాట్యంలోని మెళకువలతో ముందుకు తీసుకెళ్లింది గురువు సుమిత్ర కౌశల్. అటు నుంచి ఎంతో మందిని నృత్యకారులుగా తీర్చిదిద్దిన వెంపటి చినసత్యంగారు గురువుగా లభించడం నాకు ఓ వరం. 1976లో రవీంద్రభారతిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు వంటి ప్రముఖులు కూచిపూడి నృత్యానికి టార్చ్బేరర్ అని ప్రశంసించారు. పదకొండేళ్ల వయసులో పెద్దవారి ఆశీస్సులు లభించడం కూడా అదృష్టమే. మా తాతగారు నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. నాన్న వి.ఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. ఇంట్లో అందరికీ శాస్త్రీయ నృత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. అలా వారి ప్రోత్సాహంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. పెళ్లి తర్వాత నా భర్త శ్యామ్గోపాల్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. పిల్లలు అభినవ్, శ్లోక పుట్టిన తర్వాత కూడా నృత్యం చేస్తూనే ఉన్నాను. నేను మా అమ్మ నుంచి నృత్యంపట్ల ఆసక్తి పెంచుకుంటే నా కూతురు శ్లోక కూడా మా బాటలోనే నడిచింది. అలా మూడుతరాల శాస్త్రీయ నృత్యకారులు మా ఇంట్లో ఉన్నారు. మూడు తరాల నృత్యంమహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజునే గంగా పండాల్లోని పెద్ద స్టేజీపైన ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. శివ సతీయం, గంగావతరణం కథలను దాదాపు గంటసేపు నా కూతురు శ్లోకారెడ్డి, శిష్యబృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చాను. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్యసేవలో ఉండటం కూడా అదృష్టంగా భావిస్తున్నా. ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి నృత్య అకాడమీ’ ద్వారా ఎంతో మంది విద్యార్థులు శాస్త్రీయ నృత్యకారులుగా పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాలలో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళుతున్నారు. నృత్యసేవ అంటే భగవంతుని ఆరాధనే. దేవాలయాల వద్ద, వేదికలపైన నృత్యప్రదర్శనలు ఇస్తున్నప్పుడు దివ్యానుభూతికి లోనవుతుంటాం. ఎంతో మంది ఆ ఆనందంలో మమేకం అవుతుంటారు. ప్రదర్శన తర్వాత కలిసి తమ అనుభూతిని తెలియజేసిన వారెందరో. మొదటి అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి వరకు చూపిన ఎంతోమంది చూపిన ఆదరాభిమానాలు, ప్రోత్సాహం ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి గౌరవం అందుకునేలా చేసింది’’అని ఆనందంగా వివరించారు ఈ నృత్యకళాకారిణి. సామాజిక అంశాలపై సందేశంఅభినయం అనేది నాటి సినిమా నటీనటుల నుంచి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు నృత్యం నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. కూచిపూడి నృత్యం అనగానే చాలామంది పౌరాణిక గాథలు అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ, ప్రతి నెలా ఒక సామాజిక అంశంతో కొత్త కాన్సెప్ట్ని తీసుకుంటాం. అందులో యువతరపు ఆలోచనలనూ ముందుకు తీసుకువస్తున్నాను. దీంట్లో భాగంగా పర్యావరణం, పర్యాటకం, హ్యాండీక్రాఫ్ట్స్, మహిళల సమస్యలు, మన సంస్కృతికి వన్నెతెచ్చే అంశాలు తీసుకుంటూ సందేశాత్మకంగా ప్రేక్షకుల ముందుకు నృత్యరూపకంగా తీసుకువచ్చాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం ఎలా పొందవచ్చు అనేవి నృత్య రూపకం ద్వారా చూపించగలిగాను. – నిర్మలారెడ్డి -
అసామాన్య పద్మాలు
జీవితంలో పెను సవాళ్లు నడవాలనుకున్న మార్గంలో ఎదురుగాలులు... అయినా వాళ్లు ఆగలేదు... ముందుకు సాగారు. సవాళ్లను సోపానాలుగా చేసుకున్నారు. అందుకే వారికి నేడు జాతీయ గౌరవంగా ‘పద్మశ్రీ’ దక్కింది. అస్సాం గాయని పోఖిలా లెఖ్తెపి, యాసిడ్ ఆటాక్ను ఎదుర్కొని ప్రొఫెసర్గా స్ఫూర్తినిస్తున్న మంగళా కపూర్ల జీవన విశేషాలు.పోఖిలా లెఖ్తెపి కొండ మీద తేనె పాటకొండలకు పాటలు తెలుసు. కొండలు పాడతాయి. కాని వాటిని గొంతులో నింపుకుని జనానికి పంచేవారే కావాలి. అలాంటి కొండ మీద తేనె పాటే పోఖిలా లెఖ్తెపి. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా ‘స్వరాల రాణి’గా పేరుగాంచిన పోఖిలా లెఖ్తెపికి ‘పద్మశ్రీ’ ప్రకటించడం కొంచెం ఆలస్యమైనట్టే. ఆ మాటకొస్తే ఈ 72 ఏళ్ల జానపద గాయనికి ఈ గౌరవాలు, సత్కారాలు ఏమీ పట్టవు. పాట పాడటమే ఆమెకు తెలుసు. పాట వినిపించడమే ఆమె జీవితం.తండ్రి వద్ద పాటలు నేర్చుకొని..అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లా దుపార్ టిముంగ్ గ్రామంలో పోఖిలా జన్మించారు. తండ్రి ముఖిమ్ లేక్తే, తల్లి బాస్డే టిముపి బాగా పాడతారు. ముఖిమ్ లేక్తే ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే నాటకాలలో సంగీతం అందించేవారు. అలా పోఖిలా చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితురాలైంది. బడిలో ప్రతి శనివారం పాటల పోటీ తండ్రి వద్ద పాటలు నేర్చుకుని పాడితే ప్రెయిజులన్నీ ఆమెకే. ఆ ఉత్సాహంతో తనే సొంతంగా పాటలను స్వరపరచడం ప్రారంభించారు. 1976లో డిఫులో జరిగిన కర్బీ యువజనోత్సవంలో పాడినప్పుడు మొత్తం అస్సాంకు ఆమె పాట తెలిసింది. 1978 నాటికి ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆకాశవాణి గౌహతిలోని కర్బీ శాఖ డైరెక్టర్ ఆమెకు రేడియోలో పాడే అవకాశాన్ని కల్పించారు. కర్బీ భాషలో కొత్త శైలి...పోఖిలా పాడే సమయానికి కర్బీ భాషలో ఆధునిక పాటలు లేవు. పోఖిలా కర్బీ భాషలో మొదటి క్యాసెట్ ‘కాంగ్హోన్’ విడుదల చేశారు. అనంతరం జుబీన్ గార్గ్ సహా అస్సాంకు చెందిన పలువురు కళాకారులతో కలిసి ఆమె పాటలు పాడారు. ఇప్పటి వరకు 300కి పైగా పాటలు పాడారు. కర్బీ పాటలకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ తీసుకురావడంలో ఆమె కృషి విశేషమైనది. కర్బీ సంగీతానికి ఆమె చేసిన సేవకు గాను 2011లో హిల్స్ ఐడల్ ‘క్వీన్ ఆఫ్ మెలోడీ’ బిరుదుతో సత్కరించింది. 2023 అస్సాం ప్రభుత్వం ఆమెకు శిల్పి అవార్డుతోపాటు శిల్పి పెన్ష¯Œ ను ప్రదానం చేసింది. 2024లో అస్సాంలో మూడో అత్యున్నత ΄ûర పురస్కారమైన ‘అస్సాం గౌరవ్’ అవార్డును అందించింది. కర్బీ ఆంగ్లాంగ్ వంటి మారుమూల ప్రాంతానికి చెందిన తనలాంటి గాయనిని కేంద్ర ప్రభుత్వం సత్కరించడం సంతోషకరమైన విషయం అని ఆమె అంటున్నారు.మంగళా కపూర్ యాసిడ్ దాడిని పాటతో ఓడించారుయాసిడ్ దాడి పిరికివాళ్ల చర్య. దానిని ఎదుర్కొని ఎదగడం స్థైర్యవంతుల లక్షణం. ప్రయాణం ముగిసిపోయినట్టే అని అందరూ అనుకున్నప్పుడు గొప్ప ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టారు మంగళా కపూర్. సంగీత సాధన చేసి సంగీత విద్వాంసురాలిగా మారారు. ‘పద్మశ్రీ’ వరకూ ఎదిగారు. ఇది అసాధారణ కథ. స్ఫూర్తి గాథ.గ్వాలియర్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయని మంగళా కపూర్ 1965లో యాసిడ్ దాడి ఎదుర్కొన్నారు. అప్పటి వరకూ అద్భుతమైన తన కంఠంతో ఆమె ‘కాశీ లతా మంగేష్కర్’గా గుర్తింపు పొందారు. సంగీత రంగంలో ఎన్నో కలలు కంటూ ఉండగా యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరు సంవత్సరాలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అయినా కుంగిపోలేదు. ఆ సమయంలో కూడా చదువును కొనసాగించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత విద్య పూర్తి చేశారు. అక్కడే ప్రొఫెసర్గా నియమితులయ్యారు. మంగళా కపూర్ సంగీతం ప్రొఫెసర్ మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఆమెకు అనేక అవార్డులు వరించాయి. రాజ్యసభ ఆమెకు ‘రోల్ మోడల్’ అవార్డును ప్రదానం చేసింది. ఆమె జీవితం ఆధారంగా 2025లో మరాఠీ చిత్రం ‘మంగళ’ నిర్మించారు. సంగీతం, విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకు రాగలమని మంగళా కపూర్ అంటున్నారు. -
తొలి యాసిడ్ బాధితురాలు, చచ్చిపోదామనుకుంది.. ఇపుడు పద్మశ్రీ!
బనారస్ హిందూవిశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ మంగళ కపూర్కి పద్మశ్రీ అవార్డు లభించింది. మంగళ కపూర్ తన సంగీత కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.'కాశీ లత'గా ప్రసిద్ధి చెందిన మంగళకపూర్ భారతదేశంలో తొలి యాసిడ్ దాడి బాధితురాలు. 12 ఏళ్ల వయసులోనే యాసిడి దాడికి గురైన బాధితురాలు. ఆమె దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయక సంగీత విద్వాంసురాలిగా, ప్రొఫెసర్గా ఎలా ఎదిగిగారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశీ అవార్డు సాధన వెనుక ఆమె చేసిన కృషి ఏంటి? తెలుసుకుందాం.ఇక బతకలేమోమో ప్రయాణం ముగిసిపోయిందన్న తీవ్రమైన కష్టాలనుంచి బతికి బట్టకట్టడమే కాదు, అత్యంత ఉన్నతంగా ఎదిగిన ధీర ఆమె. బలమైన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకీ అడ్డుకోలేదు అనడానికి ప్రొఫెసర్ మంగళ జీవితం మనకు బోధిస్తుంది. ఆమె పోరాటం,విజయ గాథ స్ఫూర్తిదాయకం. అంతేనా సంగీతం , విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని కూడా గుర్తు చేసిన ఘనత ఆమె సొంతం. ఉత్తరప్రదేశ్లోకి వారణాసికి చెందిన ఆమెపై 1965లో యాసిడ్ దాడి జరిగింది. బట్టల వ్యాపారంలో ఉన్న అసూయ కారణంగా కొంతమంది ప్రత్యర్థులు రాత్రి 2 గంటల సమయంలో దాడి చేశారు. యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియని 12 ఏళ్ల వయసులో ఆమె నరకం అనుభవించింది. ఆరేళ్లపాటు ఆసత్పికే పరిమితం అయింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 37 ఆపరేషన్లు .అందమైన మొహం అందవికారమైంది. మరోవైపు సమాజం సూటిపోటీ మాటలు. దీంతోచదువు కొనసాగించ లేకపోయింది. సంగీతం ఉన్న మక్కువతో ఇంట్లోనే ఉండి సంగీతం నేర్చుకుంది. సూసైడ్ చేసుకుందామనుకుందిబయటకు వెళ్ళినప్పుడు సూటిపోటి మాటలు వ్యంగ్య వ్యాఖ్యలు వినేదానినని మంగళ కపూర్ గతంలో చెప్పారు. పాఠశాలలో పిల్లలు ఆమెను చూసి భయపడేవారట. కొన్నిసార్లు ఆమెను ఎగతాళి కూడా చేసేవారు. 'ముక్కులేనిది' అని వెక్కిరించేవారు. దీంతో ఆమె చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ముందుకు సాగాలని, వెనక్కి తిరిగితే మరింత బలహీనుమవుతామని చెప్పే తండ్రి గుర్తుకు వచ్చేవారట దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం అలవాటుగా మారిపోయింది. అలా దూరవిద్యలో పీజీ, తర్వాత మెరిట్ స్కాలర్ షిప్తో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంగీతం, కళల విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే శాస్త్రీయ సంగీత న ప్రొఫెసర్గా నియమితుల య్యారు. సంగీత కచేరీలను ప్రారంభించారు. మంగళ స్వరమాధుర్యానికి అందరూ ముగ్ధులయ్యేవారు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేవారు. దేశంలో ఆమె కార్యక్రమాలు నిర్వహించని మూల లేదు అంటే అతిశయోక్తి కాదు. సంగీత ప్రపంచంలో ఆమె గాత్రం ఎంతో ఆదరణ పొందింది. అటు టీచర్గా అనేకమంది విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని అందించారు. అందుకే ఆమెను "కాశీ లతా మంగేష్కర్" అని కూడా పిలుస్తారు. ఆమె కృషికి, అంకిత భావానికి అనేక అవార్డులు వచ్చి వరించాయి. తరంగ్ ఫౌండేషన్ ఆమెకు "కాశీ లత" బిరుదును ప్రదానం చేయగా, రాజ్యసభ ఆమెకు "రోల్ మోడల్" అవార్డును ప్రదానం చేసింది. తాజాగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవకు ,స్ఫూర్తిదాయకమైన పోరాట ప్రస్థానానికి గాను, కళారంగంలో 2026 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.మంగళ కపూర్ సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటారు. ఆమె ఉచితంగా సంగీతం నేర్పుతుంది, సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకు రావడానికి కృషి చేస్తుంది. 2018లో 'సీరత్' పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మరాఠీలో "మంగళ" మూవీగా జనవరి 17, 2025న విడుదలైంది. ఈ చిత్రం ఆమె పోరాటాలు , విజయాలను వివరిస్తుంది. -
గమ్యం చేరిన లక్ష్యం
కర్నూలు(అర్బన్): మహిళలు అన్ని రంగా ల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కష్టమైన రంగాల్లో కూడా వెనకడగు వేయడం లేదు. పురుషులకే పరిమితమైన డ్రైవింగ్లో కూడా మహిళలు తమ ప్రతిభ చాటుతున్నారు. అయితే కేవలం లైట్ వెహికల్స్కే పరిమితమైన మహిళలు నేడు హెవీ వెహికల్స్ నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వాహనాలను నడుపుతున్న మహిళల జాబితాలోకి కర్నూలు నగరానికి చెందిన యువతి విశ్వవాణి చేరనుంది. కర్నూలు పాతబస్డాండ్ సమీపంలోని సెంట్రల్ లైబ్రరీ ప్రాంతానికి చెందిన విజయేశ్వరరావు, మణి దంపతుల కూతురు విశ్వవాణి బీఎస్సీ చదివారు. ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో ఆమె ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రైవింగ్లో శిక్షణను పూర్తి చేసుకొని ఆర్టీసీ బస్సును సునాయసంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే తొలి ఎస్సీ మహిళా డ్రైవర్గా కూడా గుర్తింపు పొందనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 3 నుంచి ఈనెల 12వ తేదీ వర కు అర్హులైన వారికి ఆర్టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రై వింగ్లో శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణకు ఉమ్మడి కర్నూ లు జిల్లాలో 20 మంది ఎంపిక కాగా, ఇందులో 19 మంది పురుషులు కాగా, విశ్వవాణి ఒక్కరే మహిళ .ఇష్టంతోనే స్టీరింగ్ పట్టా .. ‘ఉద్యోగ రంగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం ఉపాధి అవకాశాల వైపు చూశాను. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తీసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి, ఆర్టీసీ కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి, ట్రైనింగ్ కళాశాల ఇన్స్ట్రక్టర్ వలితో పాటు నాతో శిక్షణ తీసుకుంటున్న వారు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ బస్సును నడిపేందుకు నన్ను ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది’. -
ఆమె సమరానికి ఆనవాలు
కాలగర్భం నుంచి వెలికి వచ్చిన వెల కట్టలేని విలువైన వజ్రంలాంటి ఆల్బమ్ ఇది. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి చా...లా సంవత్సరాల ముందు వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఆల్బమ్ ఎక్కడో అజ్ఞాతంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ అజ్ఞాతవాసాన్ని వీడి తాజాగా ప్రజల మధ్యలోకి వచ్చింది. ప్రసిద్ధ మహిళా నాయకులు కాదు సామాన్య అసామాన్య స్వాతంత్య్రోద్యమ మహిళా నాయకుల విశ్వరూపాన్ని ప్రదర్శించే ఫొటో ఆల్బమ్ ఇది...విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ముంబైలోని ఒక బ్రిటిష్ దుకాణం ముందు నిలబడి ఉన్న ఫైర్బ్రాండ్... లీలావతి మున్షీఉప్పు తయారు చేయడానికి ముంబైలోని సముద్రపు నీటిని తమ ఇళ్లకు తీసుకువెళుతున్న మహిళలు, పిల్లలు.బ్రిటిష్ పోలీసులతో ఢీ అంటే ఢీ అంటున్న మహిళా ఉద్యమకారులురెండు దశాబ్దాల క్రితం లండన్లో ఒక ఫొటో ఆల్బమ్ను వేలం వేశారు. వేలం పాటలో ఈ ఆల్బమ్ను దిల్లీకి చెందిన ఆల్కాజీ ఫౌండేషన్ సొంతం చేసుకుంది. చిన్న సైజ్లో ఉన్న ఈ ఆల్బమ్ బూడిద రంగు కవర్పై...‘ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కలెక్షన్–కె.ఎల్.నర్పీ’ అని కనిపిస్తుంది.జాతీయ జెండాతో ఉద్యమ బాటలో మహిళలుడ్యూక్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించే వరకు ఈ ఫొటో ఆల్బమ్ అల్కాజీ ఫౌండేషన్కే పరిమితం అయింది. పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఆల్బమ్ ఇది. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహిళల నాయకత్వానికి, ఉద్యమ క్రియాశీలతకు అద్దం పట్టే ఆల్బమ్ ఇది. సహాయ నిరాకరణ ఉద్యమం నాటికి మహిళల పాత్ర పరిమితంగానే ఉండేది. ఆ తరువాత మాత్రం మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎవరికీ తెలియని మహిళా స్వచ్ఛంద సేవకులు ఈ ఆల్బమ్లో కనిపిస్తారు. ‘రాట్నం వడకండి’ నివాదంతో మహిళల నేతృత్వంలో ముంబై వీధుల్లో జరిగిన ఊరేగింపుఎంతోమంది మహిళా కార్యకర్తలు తమ చంటి బిడ్డలతో పాటు బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటంలో భాగమైన అరుదైన దృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.‘ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఫొటోలలోని మహిళలను చూసి మేము ముగ్ధులమయ్యాం’ అన్నారు డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన సుమతి రామస్వామి. ఆమె తన సహోద్యోగి అవరతి భట్నాగర్తో కలిసి ఈ ఆల్బమ్ను అధ్యయనం చేశారు.‘ఈ ఆల్బమ్ జాతీయవాద ఉద్యమంలో మహిళల పాత్రను కళ్లకు కట్టడం మాత్రమే కాదు మహిళలు ఇల్లు దాటి ఉద్యమంలోకి అడుగుపెట్టడానికి సంబంధించిన అరుదైన దృశ్యాలకు వేదికగా నిలిచింది’ అంటారు భట్నాగర్.ముంబైలోని చౌపట్టీ బీచ్ దగ్గర ఉప్పు తయారుచేయడానికి సిద్ధం అవుతున్న మహిళలుఒక ఫొటోలో... గుజరాత్ స్వాతంత్య్ర సమరయోధురాలు లీలావతి మున్షీ బ్రిటిష్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఉప్పు పాన్పై దాడి చేస్తున్న పురుషుల బృందానికి సూచన ఇవ్వడం కనిపిస్తుంది.మరో ఫొటోలో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా బ్రిటిష్ డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రవేశ ద్వారం ముందు మున్షీ ధిక్కారంగా నిలబడి కనిపిస్తుంది.సుమతి రామస్వామి, అవరతి భట్నాగర్ ఈ ఆల్బమ్ను ‘ఫొటోగ్రాఫింగ్ సివిల్ డిసొబిడియన్ట్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. అరుదైన ఛాయాచిత్రాలతో పాటు విద్యావేత్తలు రాసిన విలువైన వ్యాసాలు కూడా ఉన్న ఈ పుస్తకం నేటి తరం మహిళలకు మార్గదర్శనం చేసేలా ఉంటుంది. -
సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మ
అనుకున్నది సాధించేందుకు,అద్భుతాల సృష్టించేందుకు వయసుతో పనిలేదని నిరూపిస్తున్నారు లేటు వయసు సిటిజన్లు. ఇటీవల ఉత్తర ప్రదేశ్కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ తొలి వ్లాగ్లొ అద్భుతమైన వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఏదో సరదాగా చేసిన వ్లాగ కేవలం 72 గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సంకల్ప ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్న మరో 70 ఏళ్ళ మహిళ ప్రస్తుతం నెట్టింట సందడిగా మారారు.ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం, సంగ్వాన్ 68 సంవత్సరాల వయసులో వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆమె ఆర్థరైటిస్ పేషెంట్ , ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. రోష్ని దేవి సంగ్వాన్ (70) ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె దృఢ సంకల్పం సోషల్ మీడియా వినియోగదారులను మాత్రమే కాకుండా నటుడు సునీల్ శెట్టితో సహా ప్రముఖులను కూడా ప్రేరణగా నిలిచింది.ఇదీ చదవండి: పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ అయిన రోష్ణి దేవి సంగ్వాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొత్త వీడియో 14 మిలియన్లకు పైగా వ్యూస్తో తెగ వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్లో సన్నీ డియోల్, అహాన్ శెట్టి , వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బోర్డర్ 2 మూవీలోని ఘర్ కబ్ ఆవోగే పాటకు సెట్ చేశారు. సునీల్ శెట్టి , సన్నీ డియోల్ ఈ రీల్పై వ్యాఖ్యానిస్తే, 40 ఏళ్ల తరువాత సినిమా హాల్లో బోర్డర్ 2 సినిమా చూస్తుంది అనే క్యాప్షన్తో ఈ వీడియో పోస్ట్ కావడం విశేషం. దీంతో "మీరు చాలా స్ఫూర్తి మంతులు. జై హింద్ జై భారత్," సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. చాలా బావుంది మేడమ్ అంటూ ఆయన కుమారుడు అహన్ శెట్టి కూడా స్పందించారు. View this post on Instagram A post shared by Roshni Devi Sangwan (@weightliftermummy)కాగా రోష్ణి దేవి సంగ్వాన్ ఇన్స్టాగ్రామ్లో 116 వేలకు పైగా అనుచరులను కలిగి ఉన్నారు. సంగ్వాన్ 103 కిలోల బరువును డెడ్లిఫ్టింగ్ చేయడం గమనార్హం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్తో బాధపడుతున్నఆమె, జీవనశైలిలో మార్పులు, కష్టమైనవ్యాయామం సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ, శరీరం చెప్పినట్టుగా విని కాలక్రమేణా తన బలాన్ని తిరిగి పొందగలిగినట్టు చెప్పారు. -
అమ్మాయిలంటే పవర్, బాధ్యత కాదు : హోమంత్రి అమిత్షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం జాతీయ బాలికా దినోత్సవం (NationalGirlChildDay) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు కేవలం బాధ్యత మాత్రమే కాదని,వారు దేశ నిర్మాణంలో బలమైన శక్తి అని, మహిళలు భారతదేశ ప్రగతికి ముందుండి నడిపిస్తున్నారంటూ ఎక్స్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.అందరికీ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి బాలికలు కేవలం మన బాధ్యతలు మాత్రమే కాదు, వారు అపారమైన శక్తి అన్నారు. రాణి లక్ష్మీబాయి, రాణి వేలు నాచియార్, మూలా గభారు , ప్రీతిలత వాడేదార్ వంటి వారు ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ,స్ఫూర్తితో నింపుతారు.” అని ట్వీట్ చేశారు. భారతదేశ అభివృద్ధి గాథలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ మోడీ ప్రభుత్వ మహిళా నేతృత్వ అభివృద్ధి మంత్రం నారీ శక్తిని ప్రగతిలో అగ్రస్థానంలో నిలబెట్టిందనీ, నేడు మహిళలు దేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.Greetings to everyone on 'National Girl Child Day.’#NationalGirlChildDay symbolizes that girls are not merely our responsibilities but sheer strength. The glorious examples of Rani Lakshmi Bai, Rani Velu Nachiyar, Mula Gabharu, and Pritilata Waddedar fill every Indian heart…— Amit Shah (@AmitShah) January 24, 2026 నేషనల్ గర్ల్ ఛైల్డ్ డే- లక్ష్యాలుఆధునిక సమాజంలో ఇప్పటికీ బాలికలకు సమ ప్రాధాన్యత లభించంలేదు.ఈ వివక్షను తొలగించి, ఆడపిల్లలకు కూడా అబ్బాయిలతో సమానంగా ఆహారం, విద్య, గౌరవం దక్కాలనేది ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. బాలికల డ్రాపౌట్ రేటును తగ్గించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడం ఈ కాన్సెప్ట్లో కీలక భాగం. విద్యాపరంగా వారు సాధికారత సాధించినపుడే ఆర్థికంగా కూడా వారు సాధికారత సాధించగలరు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు మరియు బాల్య వివాహాలను అరికట్టడం. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం తదితర అంశాలో స్వయం నిర్ణయం తీసుకునేలా తామే తీసుకునేలా వారిని శక్తివంతులను చేయడం. స్వతంత్రులుగా తీర్చిదిద్దడం. లింగ నిష్పత్తి (Sex Ratio): ఆడపిల్లల సంఖ్యను పెంచడం మరియు భ్రూణహత్యలను అరికట్టడం."బేటీ బచావో - బేటీ పఢావో" అనే నినాదం ఇందులోభాగంగా వచ్చిందే.అలాగే బాలికల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి.బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 వీటితోపాటు చైల్డ్ హెల్ప్లైన్ మరియు ట్రాక్ చైల్డ్ పోర్టల్ వంటి సేవలను అందిస్తుంది, ఇది తప్పిపోయిన పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించినవి. -
ఆ స్ఫూర్తి ఆకాశమంత
‘జస్ట్ రిటైర్డ్ స్టార్’ అంటున్నారు సునీతా విలియమ్స్ అభిమానులు. అరవై సంవత్సరాల సునీత జీవితంలో విలువైన అంతరిక్ష అనుభవాలు ఎన్నో... ఎన్నెన్నో! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రారంభ రోజుల నుంచి వివిధ మిషన్ల వరకు... అంతరిక్ష ప్రయాణంలో కీలకమైన ముందడుగులను, మానవులకు అంతరిక్షం ఎలా అందుబాటులోకి వచ్చిందో చూసిన అపురూప కాలానికి సునీత విలియమ్స్ కేంద్రబిందువుగా నిలిచారు. నేడు జాతీయ బాలికా దినోత్సవం. కోట్లాదిమంది బాలికలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ శక్తి సునీత విలియమ్స్ జీవితానికి ఉంది. శాస్త్రసాంకేతిక విషయాలే కాదు మధుర గాయకుడు మహ్మద్ రఫీ పాట నుంచి మలబారు అందాల వరకు మాట్లాడే సునీత విలియమ్స్ అంతరంగం ఆమె మాటల్లోనే...బాగా కష్టపడాలనే తపన ఉన్న, సృజనాత్మకత, తెలివితేటలు మూర్తీభవించిన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన అదృష్టం అని నా భర్త చెబుతుంటారు. అది నిజం. నేను పదవీ విరమణ చేసినప్పటికీ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ భావన కలగడం లేదు. నా బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చింది.→ అరరే... మిస్సవుతున్నానే!నాకూ ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) ఉంది! ఆర్టెమిజ్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్న రాబోయే మూన్ మిషన్ నాకు ‘ఫోమో’లాంటిది. చంద్రుడి మీదికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు? అసలు నేను ‘నాసా’లో చేరాలనుకోవడానికి ప్రధాన కారణం అదే. అందువల్ల నాకు ఖచ్చితంగా ‘ఫోమో’ ఉంటుంది. మూన్ మిషన్లో భాగమైన నా స్నేహితులు అదృష్టవంతులు. వారి ప్రయాణాన్ని చూడడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.→ అంతరిక్షం టు లోక సంచారంప్రతి ఒక్కరికి తమకు నచ్చిన ప్రదేశం ఒకటి ఉంటుంది. నా విషయానికి వస్తే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అంతరిక్షం. మరి ఆ తరువాత? అంతరిక్షం తరువాత భూమిపై ఉన్న అందమైన, అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. భారతదేశమంతటా పర్యటించాలనుకుంటున్నాను. ఆ ప్రదేశాలలో కేరళ ఒకటి.→ టాప్ గన్...ఇన్స్పిరేషన్ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచైనా రావచ్చు... అది హాలీవుడ్ అయినా కావచ్చు! అవును... హాలీవుడ్ సినిమా ‘టాప్ గన్’ ప్రభావం నాపై ఉండడం వల్లే తొలిసారిగా జెట్లు నడపాలనుకున్నాను. అయితే నేను హెలికాప్టర్ పైలట్గా మారాను. ఇరవై ఏళ్ల వయస్సులో టెస్ట్ పైలట్కు హాజరైన తరువాత, అక్కడ వ్యోమగాములను కలిసిన తర్వాతే వారికి ఉన్న అర్హతలలో కొన్ని నాకు ఉన్నాయనిపించింది. ‘ఇది నేను ఎంచుకోవాల్సి దారి’ అని అప్పుడే బలంగా అనిపించింది.→ వినాయకుడి ఆశీర్వాదంనా భారతీయ వారసత్వ సంపదపై నాకు చాలా గౌరవం ఉంది. దానిలో కొంత భాగాన్ని వివిధ రూపాల్లో అంతరిక్షంలోకి తీసుకువెళ్లినందుకు సంతోషంగా ఉంది. గణేష్ ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడు. నేను నివసించిన ప్రతిచోటా గణేష్ ఉన్నాడు. అందుకే నాతోపాటు అంతరిక్షంలోకి రావాల్సిందే అనుకున్నాను. ఇక భారతీయ ఆహారం విషయానికి వస్తే... ఎంత తిన్నా తనివి తీరదు. భారతీయ ఆహారం తినబోయే ముందు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతోనే అంతరిక్షంలో నా వెంట కొన్ని సమోసాలు ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది!→ నమ్మలేదు... కాని అది నిజం!నా మొదటి అంతరిక్ష యాత్ర సందర్భంగా...‘భారత్లోని ప్రజలు నువ్వు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థించారు’ అని నాన్న చెప్పినప్పుడు నేను మొదట నమ్మలేదు. ‘అలా జరిగే అవకాశం లేదు’ అని కూడా అన్నాను. అయితే దినపత్రికలలో వచ్చిన కథనాలు చదివినప్పుడు నాన్న చెప్పింది అక్షరాలా నిజమని తెలుసుకున్నాను. నా స్నేహితురాలు ఒకరు హిమాలయాల్లోని ఒక స్కూల్లో ఉండేది. ఆమె నాతో...‘నీ ఫోటో స్కూల్లో ఉంది’ అని చెప్పింది. భారతదేశం నన్ను తన కుమార్తెగా స్వీకరించడం నాకు హృద్యంగా, సంతోషంగా అనిపించింది.→ ఎలాంటి పుస్తకాలు ఇష్టమంటే...నా జీవితంలో శునకాలకు అధిక ప్రాధాన్యత ఉంది. 2017లో గోర్బి (శనకం పేరు) నాకు దూరమైనప్పుడు చాలా బాధపడ్డాను. నేను అంతరిక్షంలో ఉన్నప్పుడు, ఒక కార్గో నౌకలో నాకు ప్రియమైన శునకాల త్రీడీ–ప్రింటెడ్ మీనియేచర్లను పంపించారు. వాటిని చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది.పుస్తకాలు చదవడం ఇష్టం. అయితే చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ పుస్తకాల కంటే జంతువులు, మిస్టీరియస్ కథల పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉండేది. ఇప్పుడు మాత్రం చరిత్ర, కాల్పనిక చరిత్ర పుస్తకాలు అంటే ఇష్టం. స్లోవేనియన్ సంస్కృతిని పరిచయం చేసే నవల ఒకటి ప్రస్తుతం చదువుతున్నాను. బార్ బార్ దిన్ యే ఆయే!’ తన 59 పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘సారెగామా’ నుంచి ప్రత్యేక బహుమతిని అందుకున్నారు సునీతా విలియమ్స్. లెజెండరీ గాయకుడు మహ్మద్ రఫీ ప్రసిద్ధ పాట ‘బార్ బార్ దిన్ యే ఆయే’ (ఈరోజు మళ్లీ మళ్లీ రావాలి)తో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి సంగీతకారులు, గాయకులతో ప్రముఖ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘రండి... అతి పెద్ద ఐకాన్లతో కలిసి పాడుదాం. అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్కు మనం అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం’ అనే కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ పెట్టింది సారెగామా.’ ఆస్ట్రోనాట్గా సుపరిచితురాలైన సునీతా విలియమ్స్ అథ్లెట్ కూడా..రన్నింగ్, స్విమ్మింగ్, ట్రయాథాన్స్, విండ్సర్ఫింగ్, స్నో బోర్డింగ్, బౌ హంటింగ్, రాక్ క్లైంబింగ్ అంటే ఇష్టం. స్పేస్లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఇక సంగీతం విషయానికి వస్తే గిటార్ వాయించడంలో సునీత విలియమ్స్కు ప్రావీణ్యం ఉంది. -
ఎవరీ అక్షితా ధంకర్..? గణతంత్ర వేడుకల్లో ద్రౌపది ముర్ముతో కలిసి..
భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకలో ప్రదర్శించే కవాతు, సీఆర్పీఎఫ్, మార్చ్ ప్రదర్శనలు హైలెట్గా ఉండటమేగాక..సిందూర్ ఆపరేషన్లో తెగువ చూపిన వీరులు కవాతు ప్రదర్శనలు కూడా ప్రజలను అమితంగా ఆకట్టుకోనున్నాయి. ఈసారి మహిళా శక్తికి అర్థం వివరించేలా..సాయుధ రంగంలోని వారికి అత్యున్నత గౌరవాన్నిచ్చే సేవలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం విశేషం. ఆ నేపథ్యంలోనే పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి సారధిగా 26 ఏళ్ల సిమ్రాన్ బాలా వ్యవహరిస్తుండగా..తాజాగా ఈ వేడుక రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి జాతీయ జెండాని ఆవిష్కరించే అత్యున్నత అవకాశం మరో యువ మహిళను వరించింది. ఆమెకు కూడా ఈ అవకాశం తన ప్రతిభా సామర్థ్యం, చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి చేరిన సేవా తత్పరతల కారణంగానే దక్కింది. ఎవరా మహిళ..? సాయుధ రంగంలో ఎలాంటి సేవలందిస్తారామె..?జనవరి 26, 2026న, భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, అంకితభావాన్ని సూచించే సాయుధ దళాల కర్తవ్య పథంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంలో భారత రాష్ట్రపతికి సహాయం చేసే అత్యున్నత అవకాశాన్ని ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధంకర్ దక్కించుకున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆమె సాయుధ దళంలోకి ప్రవేశించి అత్యున్నత స్థాయికి చేరి చెరగని ముద్రవేసింది. ఈ హర్యానా వాసి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)ఎన్సీసీ వైపు ఆకర్షితురాలై అందులో చేరింది. ఎన్సీసీలో తన అపారమైన సేవతో మెప్పించి..క్యాడెట్ సార్జెంట్ మేజర్ (CSM)గా ప్రతిష్టాత్మక స్థాయికి చేరుకుని తోటి క్యాడెట్లకు స్ఫూర్తిగా నిలిచారామె. ఆ ఎన్సీసీ శిక్షణే సాయుధ దళంలోకి చేరేలా ప్రేరేపించింది. అలాగే ఆమె తండ్రి కూడా రిపబ్లిక్ పరేడ్లో పాల్గొన్నప్పుడే ఈ రంగంపై అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. అదే ఆమెను ఆ యునిఫాం ధరించేలా సాయుధ కెరీర్ని ఎంచుకునేలా చేశాయి. అలా ఆమె దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్సీఏటీ)కు హాజరయ్యారు. ఇది ఐఏఎఫ్లో ఆఫీసర్ స్టాయిలో పనిచేసే అవకాశం కల్పించే పోటీ పరీక్ష. ఆమె ఆ పరీక్షలో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణ సాధించి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో పనిచేసే అవకాశం అందుకుంది. ఆ తర్వాత జూన్ 17, 2023న షార్ట్ సర్వీస్ కమిషన్ గ్రౌండ్ డ్యూటీ కోర్సులో భాగంగా ఫ్లయింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. నిజానికి ధంకర్ చాలా తక్కువ వ్యవధిలోనే ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాకు చేరుకున్న అధికారిణి. అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో ధంకర్ కార్యచరణ అధికారుల మన్ననలను అందుకుంది. అలా ఆమె ఐఏఎఫ్ అధికారణిగా కెరీర్లో అందుకున్న సక్సెస్ ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఎంపికయ్యేలా చేసింది. పైగా ఇది అత్యున్నత ఉత్సవ గౌరవంలో ఒకటైన సేవ కారణంగా ఒక్కసారిగా ధంకర్ పేరు వార్తల్లో నిలిచింది. అంతేగాదు ఆమె స్వస్థలంలో సైతం ఈ అత్యున్నత సేవ గౌరవానికి ఎంపికైనందకు అక్కడి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. అక్కడ కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే యత్నంలో ఉండటం విశేషం. కాగా, 2026 నాటికి, IAF సిబ్బందిలో దాదాపు 13 శాతం మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా అగ్నిపథ్ పథకం వంటి చొరవల ద్వారా వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పోరాట పాత్రలను విస్తరించడంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ఇలాంటి జాతీయ కార్యక్రమాలలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధంకర్ వంటి అధికారుల భాగస్వామ్యం అనేది అర్థవంతమైన సమానత్వం వైపు పురోగతిని సూచిస్తోంది అనడంలో అతిశయోక్తి కాదు. (చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..) -
పరేడ్లో దళనాయకి
26 ఏళ్ల సిమ్రన్ బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్ అసిస్టెంట్ కమాండెంట్గా పని చేస్తున్న సిమ్రన్ బాలాఆల్ మేల్ సీఆర్పీఎఫ్ దళానికి జనవరి 26న జరిగే పరేడ్లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్ బాలా స్ఫూర్తిబాట....త్రివిధ దళాలలో నారీ శక్తి తేజం దేశానికి చాటడానికి గత కొన్నేళ్లుగా రిపబ్లిక్ డే వేడుకలు వేదిక అవుతున్నాయి. ఈసారి కూడా నారీ శక్తికి అలాంటి గౌరవమే దక్కనుంది. జనవరి 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవంలో 26 ఏళ్ల సిమ్రన్ బాలా ఈసారి చరిత్ర సృష్టించనున్నారు. జమ్ముకూ శ్రీనగర్కూ సరిగ్గా 150 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజౌరీ పట్టణంలో సి.ఆర్.పి.ఎఫ్. అసిస్టెంట్ కమాండెంట్ అయిన సిమ్రన్ బాలా కర్తవ్య పథ్లో జరిగే గ్రాండ్ పరేడ్లో ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్.) పురుష కవాతు బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈ ఘనత పొందిన మొదటి మహిళా అధికారిణి బాలా. సరిహద్దులో పుట్టి పెరిగి..రాజౌరి జిల్లాలోని నౌషెరాలో జన్మించిన బాలా బాల్యమంతా ఘర్షణలను, అలజడులనే చూశారు. సరిహద్దుల్లో కాల్పులు, నిరంతర భద్రతా సవాళ్లను చూస్తూ పెరిగారు. సైనికుల క్రమశిక్షణ, విధి నిర్వహణ, సేవ... తమ రోజువారీ జీవితంలో భాగమైన వాతావరణం చూస్తుండటంతో దేశానికి సేవ చేయాలనే లోతైన సంకల్పం చిన్ననాడే ఆమెలో నాటుకుంది. దాంతో అదే లక్ష్యంగా ప్రయత్నించి సి.ఆర్.పి.ఎఫ్.లో అధికారిగా చేరారు. సి.ఆర్.పి.ఎఫ్. మొదటి మహిళా అధికారి ఆమే కావడం విశేషం.దేశస్థాయిలో 82వ ర్యాంకు సాధించి...రాజనీతి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రన్ యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2023 మేలో మొదటి ప్రయత్నంలోనే దేశస్థాయిలో 82వ ర్యాంకును సాధించి సి.ఆర్.పి.ఎఫ్.లో చేరారు. గురుగ్రామ్లో అకాడమీలో కఠినమైన శిక్షణ పొందాక ఛత్తీస్గఢ్లోని ‘బస్తారియా బెటాలియన్’లో మొదటి ఆపరేషనల్ పోస్టింగ్లో చేరి నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలకు బాధ్యత వహించే యూనిట్లో పని చేశారు. ప్రస్తుతం రాజౌరిలో అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్నారు.గొప్ప అనుభూతిగ్రాండ్ పరేడ్లో సి.ఆర్.పి.ఎఫ్. పురుషుల కవాతు బృందానికి మహిళా అధికారిగా నాయకత్వం వహించే అవకాశం సిమ్రాన్ కు సులభంగా ఏం దక్కలేదు. పరేడ్ రిహార్సల్స్లో అత్యుత్తమ ప్రదర్శన, శిక్షణ, ఫీల్డ్ పోస్టింగ్లలో విశిష్ట రికార్డు సొంతం కావడం వల్లే ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఇంటెన్సివ్ పరేడ్ రిహార్సల్స్ సమయంలో ఆమె విశ్వాసం, డ్రిల్, కమాండ్ సామర్థ్యాలలో కచ్చితత్వం ఇతరుల కంటే మెరుగ్గా ఉండేలా చేసిందని పైఅధికారులు ప్రశంసించారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన మరుక్షణం నుంచి తాను పొందుతున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని సిమ్రాన్ బాలా అన్నారు.బాలికలకు స్ఫూర్తిగా..సిమ్రన్ బాలా పుట్టిపెరిగిన రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ప్రస్తుతం హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నేటి బాలికలకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని, రక్షణ రంగంలో కెరీర్లను ఎంచుకోవడానికి మహిళలకు ఆమె మార్గదర్శిగా నిలిచారని ఊరి పెద్దలు మెచ్చుకుంటున్నారు. ‘సిమ్రాన్ లాగే మేము కూడా యూనిఫాం ధరించి భారతమాతకు సేవ చేయాలనుకుంటున్నాము’ అని ఆమె స్వస్థలానికి చెందిన యువతులు అంటుండటం ఆమె చేసిన కృషికి అద్దం పడుతోంది. -
గర్వించే క్షణం..! గణతంత్ర దినోత్సవాల్లో హైలెట్గా నారీ శక్తి గర్జన..
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు సర్వాంగ సుందరంగా ముస్తాబవనుంది. ఈసారి న్యూఢిల్లీ వేదికగా కర్తవ్యపథంలో జరుగు కవాతు ప్రదర్శన చారిత్రాత్మక ఘట్టంగా మారనుంది. ఎందుకుంటే సాయుధ సేవలో నాయకత్వ సరిహద్దులను పునర్నర్మిస్తున్న ఈతరం మహిళలకు ఈ అరుదైన దృశ్యం ఓ ప్రేరణ కూడా. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడకల్లో నిర్వహించే కవాతులో పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి జమ్మూ కాశ్మీర్కి చెందిన సిమ్రాన్ బాలా నాయకత్వం వహించనున్నారు. ఎవరీమె..? ఆమెకు ఈ అత్యున్నత అవకాశం ఎలా అందుకున్నారంటే..సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్న సిమ్రాన్ బాలా 140 మందికి పైగా పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తునన్న తొలిమహిళ. పైగా దేశ చరిత్రలోని ఇది తొలిసారి కూడా. ఆమె జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లా నౌషెరాకు చెందినది. నియంత్రణ రేఖకు సమీపంలో నివశించిన ఆమె నిత్యం యూనిఫాంలో కనిపించే అధికారుల సమక్షంలో పెరిగింది. దాంతో క్రమశిక్షణ, సేవ, బాధ్యతలనేవి ఆమె రోజువారీ జీవితంలో ఆటోమేటిగ్గానే భాగమయ్యాయి. అలాగే రాజౌరీ జిల్లా నుంచి సీఆర్పీఎఫ్లో చేరి తొలి మహిళ కూడా సిమ్రానే కావడం విశేషం. ఆంక్షలు, సామాజిక పరిమితులు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి శివంగిలా సాయుధ దళాల్లోకి ప్రవేశించిందామె. ఆమె యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలలో తొలి ప్రయత్నంలో విజయం అందుకుని సీఆర్పీఎప్లో చేరారామె. అంతేగాదు అఖిల భారత స్థాయిలో 82వ ర్యాంకు సాధించింది. అలాగే జమ్మూకాశ్మీర్ నుంచి అర్హత సాధించిన ఏకైక మహిళా అభ్యర్థి కూడా ఆమె. ఇక సీఆర్పీఎఫ్లో పురుషుల బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఆమె మెరిట్, కమాండ్ ఆఫీసర్గా ఉన్న అనుభవం ఆధారంగా లభించింది. అయితే ఇదేం అంత ఈజీగా చేసే మార్చ్ కాదు. అంతమంది ఒకేసారి ఒకే భంగిమలో చేయడానికి, తగిన వాయిస్ కమాండ్, నాయకత్వ ఉనికి తదితరాలన్ని ఉండాలి. ఆ విషయంలో సిమ్రాన్ ప్రత్యేకంగా నిలవడంతోనే సీనియర్ అధికారులు ఆమెకు అత్యున్నత అవకాశం ఇచ్చారు. ఈసారి సీఆర్పీఎఫ్ మార్చ్ కవాతుకి మించిన ఆకర్షణగా నిలవనుంది. ఎందుకంటే ఓ 26 ఏళ్ల యువ మహిళ సారథ్యంలో పురుష బృందాన్ని నడిపించడం అనేది.. మాములు విషయంకాదు. నిజంగా ఆ రోజు కనువిందు చేయనున్న ఆ దృశ్యం.. నారీ శక్తి అజేయమైన సామర్థ్యాన్ని యావత్తు భారతదేశానికి వినిపించేలా నిశబ్దంగా గొంతెత్తి చాటుతుంది.(చదవండి: 40లలో ప్రెగ్నెన్సీ సరుక్షితమేనా..? ఉషా వాన్స్, కత్రినా కైఫ్..) -
ప్యాకేజ్డ్ ఫుడ్ ‘లేబులింగ్’ వెనక ఇంత కష్టం ఉంటుందా..?
సూపర్మార్కెట్ షెల్ఫ్ నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్ పాకెట్ తీసుకొని న్యూట్రీషన్ ఫ్యాక్ట్స్, రెగ్యులేటరీ సింబల్స్, చిన్న చిన్న డిస్కైమర్లు చూడడం అనేది సాధారణ విషయం. అయితే ఈ సాధారణ దృశ్యం వెనుక పెద్ద కష్టమే ఉంది. బ్రాండ్ల ‘లేబులింగ్’ వెనక కనిపించని కష్టం ఎంతో ఉంది. మన దేశంలో ప్యాకేజ్డ్–ఫుడ్ మార్కెట్ విస్తృతమవుతున్న రోజుల్లో ‘లేబులింగ్’ ప్రక్రియ మాత్రం నత్తకు క్లోజ్ఫ్రెండ్లా స్లోగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ‘లేబులింగ్’ ప్రక్రియను స్పీడెత్తించడానికి ‘లేబుల్బ్లైండ్’ అనే స్టార్టప్ను ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించింది న్యూట్రీషన్ ఎక్స్పర్ట్ రషీద వాపీవాలా...మన దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్ వృద్ధి చెందినప్పటికీ, లేబులింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. తప్పులు లేకుండా ‘లేబులింగ్’ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయడం సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలోనే పోషకాహార నిపుణురాలు రషీదా వాపివాలా ‘లేబుల్బ్లైండ్’ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషన్లో మాస్టర్స్, ఆ తరువాత పీహెచ్డీ చేసిన రషీద హెల్త్ టోటల్, డైట్ ఫర్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలలో పనిచేసింది.ఫుడ్ రేటింగ్తో మొదలై...స్థిరమైన కార్పొరేట్ కెరీర్ను వదులుకొని కొత్తదారి ఎంచుకోవాలనుకోవడం కొందరికి రిస్క్. అయితే రషీద మాత్రం రిస్క్ అనుకోలేదు. ‘ఆహారం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూశాను. అదే సమయంలో లేబుల్స్తో వినియోగదారులు ఎలా గందరగోళానికి గురవుతున్నారో చూశాను. సమాచారానికి సంబంధించి కంపెనీలు, వినియోగదారులు స్పష్టతతో ఉండాలని నమ్ముతాను’ అంటున్న రషీద ముంబై కేంద్రంగా ‘లేబుల్బ్లైండ్’ను ఫుడ్ రేటింగ్ వెబ్సైట్గా ప్రారంభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ‘లేబుల్ బ్లైండ్’ పనితీరును గుర్తించి ప్యాక్ లేబులింగ్ నియమాలను తెలియజేసే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ హోదా ఇచ్చింది.ఫోల్సోల్‘ప్రిన్సిపల్ ఇవ్వెస్టిగేటర్’ అవకాశంతో రషీదకు మన దేశంలోని పెద్ద ఫుడ్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం వచ్చింది. పెద్ద కంపెనీలలో కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ ఊపందుకోక΄ోవడాన్ని గమనించిన రషీద ‘ఫోల్సోల్’కు శ్రీకారం చుట్టింది. ఇది ‘లేబుల్బ్లైండ్’కు సంబంధించిన క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఫుడ్ లేబులింగ్ ప్రక్రియను సులభతరం చేసింది. ఒకప్పుడు ఈ ప్రక్రియకు వారాలు, నెలల సమయం తీసుకునేది. ‘60 నుంచి 100 సెకన్లలో మా ఏఐ సాధనాలు నివేదికను రూపొందిస్తాయి’ అంటుంది రషీద. డైరీ, బేకరి, స్నాక్స్...మొదలైన విభాగాలలో ‘లేబుల్బ్లైండ్’ పనిచేస్తోంది. 2021 నుంచి 2023 మధ్య మెనూలేబులింగ్కు సంబంధించి రెస్టారెంట్లు, హోటల్స్, క్విక్–సర్వీస్ రెస్టారెంట్(క్యూస్ఆర్)లతో కలిసి పనిచేసింది. 2023 నుంచి 2024 మధ్య కాలంలో కంపెనీ అంతర్జాతీయంగా విస్తరించింది. వేగవంతమైన, కచ్చితమైన, ప్రపంచవ్యాప్త నిబంధనలకు అనుగుణంగా ఉండే లేబులింగ్ కోసం చూస్తున్న కంపెనీలకు ‘ఫోల్సోల్’ ఒక కీలక సాధనంగా మారింది.డైనమిక్ లేబుల్స్మొదట్లో సవాళ్లు ఎదురైనా నైపుణ్యం ఉన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంలో, కంపెనీని విజయపథంలో నడిపించడంలో విజయం సాధించింది రషీద. స్టాటిక్ ప్యాకేజింగ్కు మాత్రమే కంపెనీ పరిమితమైపోలేదు. ఎన్నో కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూఆర్–బేస్డ్ డైనమిక్ లేబుల్స్ను ఆవిష్కరించింది. ఎగుమతికి సంబంధించిన వివరాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సమాచారం, మాన్యుఫ్యాక్చర్ డేటా అప్డేట్ చేయడానికి బ్రాండ్లకు ఇది ఉపయోగపడుతుంది. పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకొని...ప్రారంభదశలోనే టాటా స్టార్బక్స్, ఐటీసీ హోటల్స్, టిమ్ హోర్టన్స్ ఇండియాలాంటి పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకుంది లేబుల్బ్లైండ్. మెనూ–లేబులింగ్ సోల్యూషన్స్కి సంబంధించి ఈ కంపెనీలు ఇప్పటికీ ‘లేబుల్బ్లైండ్’ యాక్టివ్ యూజర్లుగా ఉన్నాయి. ప్యాకేజ్డ్–ఫుడ్ క్లయింట్లలో బికానో, బికనేర్వాలా, ఎవరెస్ట్ స్పైసెస్, మదర్ రెసీపీ(దేశాయ్ బ్రదర్స్), గోల్టి మసాలా, థియోబ్రొమా...మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ‘లేబుల్బ్లైండ్’ నలభైకి పైగా భారతీయ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. వీటిలో ఎక్కువ కంపెనీలు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా...మొదలైన దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి.తొలి రోజుల్లో సవాళ్లుతొలి అడుగులు వేస్తున్న కాలంలో కంపెనీకి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఫుడ్ రెగ్యులేషన్స్కు సంబంధించి సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడం, సరిౖయెన టీమ్ను తయారుచేసుకోవడం కాస్త కష్టం అయింది. మన దేశ నియమాలకు, ఇతర దేశ నియమాలకు తేడా ఉంటుంది. ‘సాంకేతికత, ఆహారనియంత్రణ అనే రెండింటిలోనూ నైపుణ్యం కలిగిన వ్యక్తులను కనుగొనడం కష్టంగా అనిపించింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది రషీద. -
11 లైసెన్సులు, 75 ఏళ్లు : ఆమెకు ప్రతీ దారి ఒక పాఠం!
కుటుంబాన్ని పోషించుకునేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మహిళలు ఎంతటి సాహసాని కైనా పూనుకుంటారు. క్లిష్టమైన డ్రైవర్ వృత్తిలో రాణిస్తూ 75 ఏళ్ల మహిళ శభాష్ అనిపించు కుంటోంది. ఒకపుడు డ్రైవింగ్ను జీవనోపాధిగా చూసేవారు, అదీ పురుషులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా డ్రైవింగ్ను ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. స్త్రీలైనా, పురుషులైనా, డ్రైవింగ్ ఒక అవసరం. కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాధామణి మరింత ప్రత్యేకం. రాధామ ఏకంగా చీరలోదుబాయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ అత్యంత నిష్ణాతులైన డ్రైవర్లలో ఒకరిగా అరుదైన ఖ్యాతిని సంపాదించింది. వాహనంఏదైనా...ఆమె చేతికి స్టీరింగ్ వచ్చిందంటే.. రయ్ రయ్మని దూసుకుపోవాల్సిందే. ఇన్స్టాగ్రామ్లో లక్ష మందికి పైగా అనుచరులున్న మణి అమ్మ లేదా డ్రైవర్ అమ్మగా ప్రసిద్ధి చెందిన రాధామణి అమ్మ, లగ్జరీ కార్లు మ్తాత్రమే కాదు లగ్జరీ కార్లను మాత్రమే కాదు,రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్కవేటర్లు, ట్రక్కులు, ఫోర్క్లిఫ్ట్లు ఇతర భారీ యంత్రాలతో సహా 11 వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్లను కలిగి ఉండటం విశేషం. విదేశాలకు డ్రైవింగ్ చేసేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ను సాధించింది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అందుకే మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. ‘‘ప్రతి దారి ఒక కొత్త పాఠం లాంటిది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ప్రేమ- ఇవే నా ప్రయాణానికి బలాలు. రోడ్లు ఎలా తిరిగినా సాగిపోతూనే ఉండే ధైర్యం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’’ మణి అమ్మకేరళలో డ్రైవింగ్ స్కూల్ బస్సు, ట్రక్ డ్రైవర్లకు శిక్షణ1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. కేరళలో మహిళలు భారీ వాహనాలను నడపడమే గగనమైన సమయంలోనే A2Z ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్కు సహ-వ్యవస్థాపకురాలిగా, డిఫరెంట్ కరియర్ను ఎంచుకోవడంలో మహిళలను బాగా ప్రోత్సహించింది. రాధామణి తన ప్రయాణాన్ని నలభయ్యేళ్లకు పైగా కొనసాగించింది. తన భర్త సూచనమేరకే డ్రైవింగ్లోకి అడుగుపెట్టి 1981లో తన ఫోర్-వీలర్ లైసెన్స్ను , 1984లో తన హెవీ వెహికల్ లైసెన్స్ను పొందింది. డ్రైవింగ్ వృత్తిలో కొనసాగేందుకు ఆమె చేసిన పోరాటం కూడా గొప్పదే. ఈ లైసెన్సులు పొందడానికి పడ్డ కష్టాలు, ఆమె పేరు మీద కేరళలో మొట్టమొదటి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ను స్థాపించడానికి చట్టపరమైన పోరాటాలు కూడా అవసరమని కూడా ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకుంది.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు 70 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్లు పొందిన మహిళగా రాధామణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందింది. 2022లో ఆమె 'ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. డెబ్బైల ప్రారంభంలో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేయడం మరో విశేషం. సోషల్ మీడియా అంతా మహిళలు వస్త్రధారణమీద తీవ్ర చర్చ నడుపుతున్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు, వృత్తికి లింగభేదం లేదని రాధామణి నిరూపించారు..నిజంగా ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే, అంకితభావం, నమ్మకంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సాధించగలరు అంటారు ఆమె. తన దృష్టిలో నేర్చుకోవడం అనేది "ఒక శాశ్వత ప్రయాణం" అని కూడా అంటారు. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) -
ఆ ఒక్క మహిళ..ఆ గ్రామం రూపు రేఖల్నే మార్చేసింది..!
అందరి లాగే తను కూడా ఆ గ్రామానికి కోడలిగా వచ్చింది. తన భర్తతో, కుటుంబంతో సంతోషంగా బతకాలనుకుంది. అంతలోనే భర్తను కోల్పోవడంతో తన బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఆ విషాదంలోనే ఉండిపోకుండా తన ఊరికి ఏౖదైనా సహాయం చేయాలనుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని గ్రామ సర్పంచ్గా గెలిచింది. పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. ఊరిని ప్రగతి మార్గంలో నడిపించింది. అదే నేడు తనను, తన ఊరిని గొప్పస్థానంలో నిలబెట్టింది. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డును అందుకోవడంతోపాటు,రూ. 1 కోటి నగదు బహుమతిని సైతం సొంతం చేసుకునేలా చేసింది. ఆమే .. యోగేశ్వరి శత్రుగన్ చౌదరి.మహారాష్ట్రలోని గోండియా జిల్లా, సడక్ అర్జుని తాలూకాకు చెందిన దవ్వా గ్రామం సరికొత్త చరిత్ర సృష్టించింది. పర్యావరణ హిత కార్యక్రమాలలో ముందుండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు పొందిన గ్రామంగా నిలిచింది దవ్వా. ఇదంతా ఆ ఊరి సర్పంచ్ యోగేశ్వరి శత్రుగన్చౌదరి వల్లే సాధ్యమైందని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు.అనుకోని విషాదంఇంటర్ పూర్తి చేసిన యోగేశ్వరి 2003లో దవ్వా గ్రామానికి కోడలిగా వచ్చింది. అనంతరం భర్త సహకారంతో బీఏ., బీఈడీ, డీఈడీ చేసి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అంతలోనే భర్త మరణించడంతో.. యోగేశ్వరి జీవితంలో అంధకారం అలుముకుంది. అయితే ఈ విషాదంలోనే ఉండిపోకుండా అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తన ఊరికోసం ఏమైనా చేయాలనుకుంది. ఆ ఆలోచనతోనే ఊరి ప్రజల సహకారంతో సర్పంచ్గా గెలిచింది.లక్షాపదహారు వేల మొక్కలు నాటింది యోగేశ్వరి పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. గ్రామంలోని నిస్సారమైన నేలలో నీటిని పారించి పంటలు పండించింది. గ్రామపరిధిలోని ఖాళీ స్థలాలలో సుమారు 1,16,000 మొక్కలను నాటి ఆ తాన్ని పచ్చదనంతో నింపేశారు. గ్రామంలోని 400 ఇళ్లకు పైగా సోలార్గ్రిడ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం ద్వారా జీరో వేస్ట్ లక్ష్యాన్ని చేరుకున్నారు. రైతుల కోసం ప్రత్యేక ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి, రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. గ్రామం కోసం చేపట్టిన పనులన్నీ పారదర్శకంగా ఉండటం కోసం భువన్ యాప్ ద్వారా జియో–ట్యాగింగ్ చేశారు. (చదవండి: ప్రభుత్వ పాఠశాల విద్యానేపథ్యం..కానీ ఇవాళ మహీంద్రా ఆటోమోటీవ్ టీమ్ హెడ్) -
నీ గాజుల చేయి కదలాడకపోతే..
శ్రీకాకుళం కల్చరల్: పండగ ముగిసిపోయింది. షాపింగ్లు అయిపోయాయి. ఎవరికి నచ్చిన దుస్తులు వారు తీసుకున్నారు. ఆ హడావుడి.. ఆ రద్దీ.. ఆ తోపులాటల మధ్య చాకచక్యంగా వ్యవహరించిన అతివలు కొందరున్నారు. ఎంతమంది వచ్చినా ఓపికతో దుస్తులు చూపించి నచ్చింది చేతికిచ్చి పంపించారు. ఓర్పుతో నేర్పుగా పండగ వ్యాపారాన్ని ఒంటి చేత్తో గట్టెక్కించారు. నిజానికి వీరిని ‘సేల్స్ గర్ల్స్’ అని పిలవడం చాలా చిన్న మాట. ఇలా ఓర్పు, నేర్పు ఉన్న మహిళలు పెద్దపెద్ద మాల్స్లో ఉద్యోగినులుగా వ్యవహరిస్తూ కొనుగోలుదారులను మెప్పించి అక్కడే దుస్తులు కొనేలా ఒప్పిస్తున్నారు. చీర సెలెక్టు చేయడానికి వచ్చే వారు కూడా మహిళలే కావడంతో ఎన్నో రకాలు ఎంచుతుంటారు. వాళ్లకి ఎంతో ఓపికగా అన్ని రకాలు చూపిస్తూ వారి మనసును గెలుచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్. కొత్తగా వచ్చిన చీరల కోసం పరిచయం చేయడం, ఏ రంగు కట్టుకుంటే బాగుంటుంది వంటి అంశాలను వారికి తెలియచేస్తూ అమ్మకాలను సాగించారు.జిల్లా కేంద్రంలో 10 షాపింగ్ మాల్స్, వందకుపైగా పెద్ద చీరల షాపులు ఉన్నాయి. వాటిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వందల్లో దుకాణాలు ఉన్నారు. వీటిలో మగవారు ఉన్నా వారు అకౌంటింగ్ సెక్షన్లకే పరిమితం అవుతున్నారు. కొనేవారు వచ్చిన దగ్గర నుంచి వారికి స్వాగతం పలుకుతూ, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని నచ్చిన వస్తువులు ఇచ్చి పంపించే బాధ్యతను ‘సేల్స్ గర్ల్స్’కు అప్పగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల ఇష్టాఇష్టాలు తెలుసుకుని వారికి నప్పే దుస్తులు తెప్పించి ఒప్పించి మెప్పించే బాధ్యతను ఈ మహిళలు అలవోకగా చేశారు.నేను టీచర్ ట్రైనింగ్ అయ్యానుగత ఏడాదిగా సేల్స్గర్ల్గా పనిచేస్తున్నాను. టీచర్ ట్రైనింగ్ (డీఈడీ) పూర్తిచేశాను. కోచింగ్ తీసుకొని డీఎస్సీ రాశాను. ఖాళీగా ఉండకుండా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఎంతో ఓపికతో కస్టమర్లకు బట్టలు చూపిస్తాం.– సంతోషలక్ష్మీ, పొందూరుఏడేళ్లుగా పనిచేస్తున్నానుఈ సేల్స్ విభాగంలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాను. కస్టమర్లకు కావాల్సిన చీరలను చూపించే స్టాల్ వద్దకు మర్యాదపూర్వకంగా తీసుకెళ్లడం నా బాధ్యత. వారు కొనుగోలు చేసే విధంగా అన్ని రకాలు చూపిస్తాం. నా ఇద్దరు పిల్లలను ఈ సంపాదనతో చదివిస్తున్నా.– హేమలత, హడ్కో కాలనీకువైట్లో పనిచేసేదాన్నినేను ముందులో కువైట్లో పనిచేసేదాన్ని. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మకి చెల్లికి తోడుగా ఉండాలని వచ్చేశాను. ఈ ఉద్యోగంతో మా చెల్లిని చదివిస్తున్నా. ఆమె ప్రస్తుతం పీజీ చదువుతోంది. నేను పదేళ్లుగా ఈ సేల్స్ రంగంలో పనిచేస్తున్నాను. అమ్మకి తోడుగా ఉంటున్నాను.– లీలారాణి, ఇలిసిపురం -
గేమ్ చేంజర్స్ : ట్రెండ్ సెట్టర్ సీతారామన్..!
‘వీడియో గేమింగ్ ఇండస్ట్రీ అంటే చాలా టాలెంట్ ఉండాలి. మహిళల శక్తి సరిపోదు’... ఇలాంటి పురుషాధిపత్య ప్రేలాపనలు గేమింగ్ ఇండస్ట్రీలో మహిళల ప్రాతినిధ్యాన్ని తగ్గించాయి. అయితే కాలం మారుతోంది.గేమ్ డెవలపర్స్గా మహిళలు సత్తా చాటుతున్నారు. గేమింగ్ ఇండస్ట్రీలో వివిధ విభాగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది.‘మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. మా సత్తా ఇది’ అని తమ కళతో కళ్లు తెరిపిస్తున్నారు. తాజాగా... ‘గేమ్ జామ్ జైపూర్ 2026’ సదస్సులో దేశ నలుమూలల నుంచి ఎంతోమంది ఫిమేల్ గేమ్ డెవలపర్స్ పాల్గొన్నారు. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం... మహిళలే కీలకంగా మారే రేపటి గేమింగ్ ఇండస్ట్రీని ఆవిష్కరించింది. ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం, కోరల్ రిక్రూట్, ఎం–లీగ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం... మొత్తం గేమర్స్లో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ గేమింగ్ ఇండస్ట్రీలో వారి ్ర΄ాతినిధ్యం తక్కువగా ఉంది. నిజానికి ఇది మన దేశానికే పరిమితమైన విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. యూకేలో 2018–19కి సంబంధించి డేటా ప్రకారం వీడియో గేమ్ డెవలప్మెంట్ కోర్సులలోని విద్యార్థులలో 88 శాతం మగవాళ్లే ఉన్నారు!గుర్తింపు లేకపోవడం వల్లే...‘అత్యంత వివక్షాపూరిత విషయం ఏమిటంటే, పురుషులు మహిళలను గేమర్లుగా చూడకపోవడం. మీ ఎదుటి వ్యక్తి గేమర్ అని, గేమ్ల గురించి వారికి బాగా తెలుసునని మీరు నమ్మకపోతే వారిలోని ప్రతిభను గుర్తించడం మీకు కష్టమవుతుంది’ అంటుంది గేమ్ డెవలప్మెంట్ స్టూడియో ‘వాలా ఇంటరాక్టివ్’ కో–ఫౌండర్ మేఘా గుప్తా ఆమె గేమ్ జామ్ జైపూర్ 2026 జ్యూరీ సభ్యురాలు కూడా. ‘గుర్తింపు లేకపోవడం వల్ల గేమింగ్ కెరీర్ను కొనసాగించాలనే ఆలోచన, ఆసక్తిని అడ్డుకుంటుంది’ అంటోంది గుప్తాఇరవై లక్షల ఉద్యోగాలు!‘గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి కారణం అది నాకు అత్యంత సంతోషం కలిగించే పని. ఒక గేమ్ను క్రియేట్ చేయడానికి సంబంధించిన సంతోషం మాటలకు అందనిది. పెద్ద కంపెనీలో చేరిన తరువాత నా కలల గేమ్లను సృష్టిస్తాను’ అంటుంది ఔత్సాహిక గేమర్ కె.శ్రావణి కామేశ్వరి. ‘మీకు గేమింగ్ స్కిల్స్ లేవు అనేవారి మాటలకు నిరాశ చెందకుండా, ఉత్సాహంగా, పట్టుదలగా పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది మరో ఔత్సాహిక గేమర్ శ్రేయా అరోర.గతంలో గేమింగ్ పరిశ్రమను జూదంలా భావించేవారు. ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఉద్యోగాల సంఖ్య, భద్రత పెరిగింది. మన దేశంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, రియాలిటీ రంగంలో 2035 నాటికి దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. ‘సామాజిక కట్టుబాట్లతోపాటు వివిధ కారణాల వల్ల కొన్ని ఉద్యోగాల వైపు మహిళలు దృష్టి సారించడం లేదు’ అంటుంది మేఘా గుప్తాఅడ్డుగోడలు ఉన్నాయి... అయినప్పటికీ...ఇప్పుడు అడ్డుగోడలు బద్దలవుతున్నాయి. మన దేశంలో నాణ్యమైన గేమ్లను రూపొందించడానికి కొత్త కొత్త స్టూడియోలు వస్తున్నాయి. గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉండడంతో మహిళలు ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలో చేరడం సులువు అయింది. ‘గేమ్ జామ్ జైపూర్’ లాంటి కార్యక్రమాలు ఔత్సాహికులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.‘గేమ్ జామ్ జైపూర్ విలువైన ఎన్నో అనుభవాలను అందించింది’ అంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు. భారతీయ గేమింగ్ పరిశ్రమలో లింగవివక్ష ఉంది’ అని గేమ్ జామ్ జైపూర్ 2026లోపాల్గొన్న చాలామంది మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే ఆ వివక్ష వారినేమీ భయపెట్టడం లేదు. ‘చిన్నచూపు అనేది అడ్డంకి కాదు. మమ్మల్ని మేము నిరూపించుకునే ఇంధనం’ అంటున్నారు.విశేషం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా గేమ్ జామ్స్లో పాల్గొనే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఇంకా ఏమి చేయాలి?’ అనేదానిపై గేమ్ జామ్లో నిర్మాణాత్మక చర్చ జరిగింది.‘గేమింగ్ ఇండస్ట్రీలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి’ అని సూచించాడు గేమింగ్ డెవలపర్ జతిన్ వర్మ.స్థూలంగా ఈ కార్యక్రమం ఇచ్చిన సందేశం ఏమిటి?మేఘా గుప్తా మాటల్లో చెప్పాలంటే... ‘గేమింగ్ రంగంలో ఇకపై మహిళలు ఎవరి అనుమతి కోసమో వేచి చూడనక్కర్లేదు. వారు ఒక్కో కోడ్లైన్తో తమ దారిని తామే నిర్మించుకుంటున్నారు. ఒకవేళ పరిశ్రమ వారికి చోటు కల్పించక పోతే వారు తమ సొంత మార్గాన్ని సృష్టించుకుంటారు’ఆహా... ఏమి ప్రతిభ!‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ గేమింగ్ ఇండస్ట్రీకి వయసు, జెండర్ అడ్డు కాదు’ అని చెప్పకనే చెప్పింది అమి పలాన్ అనే మహిళ తాజా వైరల్ పోస్ట్. పుణే టు బెంగళూరు విమానంలో ప్రయాణిస్తున్న పన్నెండేళ్ల బాలుడితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ పిల్లాడు గేమ్ డెవలపర్, వీడియో ఎడిటర్గా డబ్బు సంపాదిస్తున్నాడు. ‘ఆ అబ్బాయి రోబ్లాక్స్ అనే గేమ్ కోసం రిసోర్స్ ప్యాక్ క్రియేట్ చేశాడు. మరో ఆశ్చర్యం... బిట్కాయిన్, డాగ్ కాయిన్ల గురించి అద్భుతంగా మాట్లాడడం’ అని రాసింది అమి పలాన్.ట్రెండ్ సెట్టర్..సీతారామన్ప్రతిష్ఠాత్మకమైన ఉమెన్ ఇన్ గేమ్స్ గ్లోబల్ అవార్డ్స్(డబ్ల్యూఐజీ) అందుకున్న తొలి భారతీయ గేమ్ డెవలపర్గా నిలిచింది పూర్ణిమ సీతారామన్. ‘జింగా’లో లీడ్ గేమ్ డిజైనర్ అయిన సీతారామన్, మొబైల్ గేమ్ డెవలప్మెంట్ సంస్థలో ప్రొగ్రామర్గా తన కెరీర్ ప్రారంభించింది. తనకంటూ సొంత కంప్యూటర్ సమకూర్చుకున్నాక గేమింగ్పై ఆమెలో ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి గేమ్ డెవలపింగ్కు సంబంధించి ప్రయోగాలు చేసేలా, గేమ్ ఇండస్ట్రీలో పైస్థాయికి చేరుకునేలా చేసింది. గేమ్ డెవలప్మెంట్, డిజైన్లో రాణించాలనుకునే యువతులకు పూర్ణిమా సీతారామన్ పోస్టర్ గర్ల్గా మారింది.‘నా కెరీర్ నల్లేరు మీద నడకేమీ కాదు. చాలామంది అమ్మాయిలలాగే నేను తొలిరోజుల్లో ఇబ్బంది పడ్డాను. వెక్కిరింపులు, వివక్షపూరిత మాటలు ఎదుర్కొన్నాను. గేమ్ డిజైనింగ్, డెవలపింగ్ రంగంలో లింగ అసమానతకు పక్షపాతంతో పాటు, సమాచార లోపం కూడా పెద్దకారణం. ఇది తమ భవిష్యత్తుకు ఉపకరించే కెరీర్ మార్గం అనేది తెలియక΄పోవడం వల్ల చాలామంది మహిళలు గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగపెట్టడం లేదు’ అంటుంది సీతారామన్.ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో లాగే గేమ్ డెవలప్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం కచ్చితంగా పెరుగుతుంది’ అనేది సీతారామన్ ఆశవాదామే కాదు భవిష్యత్ వాస్తవం కూడా. ‘అది క్యాండీ క్రష్ అయినా, డోటా 2 అయినా, కాల్ ఆఫ్ డ్యూటీ అయినా, మీరు గేమర్ కాదని ఎవరూ చెప్పడానికి వీల్లేదు. గేమింగ్ ఫోరమ్లలో చేరండి. గేమ్ జామ్స్లో పాల్గొనండి. మీలోని సృజనాత్మక శక్తిని పరిచయం చేయండి’ అని గేమింగ్పై ఆసక్తి ఉన్న మహిళలకు పిలుపునిస్తోంది సీతారామన్. చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియో -
వందల కేజీల బంగారాన్ని దేశం కోసం ఇచ్చేసి సాదాసీదా జీవితం
రెండు రోజుల వ్యవధి.. ఇద్దరు మహానీయులు.. ఇద్దరూ రాజవంశాలకు చెందినవాళ్లే.. కన్నుమూసి ఓ యుగానికి తెరదించారు. హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్, దర్భంగా(బీహార్) రాజవంశం చివరి మహారాణి కామసుందరి దేవి.. సేవలు, త్యాగం అనే విలువల్ని ప్రతిబింబిస్తుంది వీళ్లిద్దరి జీవితం. అధికారమనేది ప్రదర్శన కోసం కాదు.. బాధ్యత కోసం వినియోగించాలని ప్రేరణ ఇస్తుంది. ఇంతకీ దేశానికి వీళ్లు చేసిన సేవలు, త్యాగాలెంటో ఓసారి చూద్ధాం..1932 అక్టోబర్ 22న జన్మించిన కామసుందరి దేవి.. దర్భంగా మహారాజా కామేశ్వర్ సింగ్ మూడో భార్య. 1962లో ఇండియా–చైనా యుద్ధ సమయంలో ఆమె చేతుల మీదుగా దర్భంగా రాజవంశం 600 కిలోల బంగారంను భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. ఈ చర్య దేశవ్యాప్తంగా దేశభక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. మహారాజా మరణించిన 1962 తర్వాత ఆమె సాదాసీదా జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. విద్య, సామాజిక సేవ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో మహారాణి కామసుందరి కీలక పాత్ర పోషించారు. కల్యాణి ఫౌండేషన్ ద్వారా విద్యా, సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి.. మిథిలా ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడారు. మహారాణి కామసుందరి దేవి(93) జనవరి 12న బీహార్లోని దర్భంగా కల్యాణి నివాస్లో తుదిశ్వాస విడిచారు.దేశభక్తి చరిత్రదర్భంగా రాజశంశానికి దేశభక్తి చరిత్ర ఉంది. మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు స్వదేశీ ఉద్యమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గాంధీజీ లేఖ అందుకున్న వెంటనే ఆ సమయంలో మహారాజుగా ఉన్న లక్ష్మేశ్వర్ సింగ్ భారీ ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. మీడియా మేనేజ్మెంట్ బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఆ లేఖ నేటికీ భద్రంగా ఉంది. ఇక.. 1962 చైనా యుద్ధం సమయంలో దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు.. దేశ రక్షణ కోసం 15 మణుగుల బంగారం (సుమారు 600 కిలోలు) దానం చేశారు. అంతేకాదు తమ సొంత మూడు విమానాలను, 90 ఎకరాల విస్తీర్ణంలోని ఎయిర్పోర్టును ప్రభుత్వానికి అప్పగించారు. నేటి దర్భంగా ఎయిర్పోర్ట్ ఉంది ఆ భూమిలోనే ఉంది. అంతకు ముందు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC) వ్యవస్థాపకుడు ఏ.ఓ. హ్యూమ్కు 1880లలో ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేసేవారు. దేశంలో మొదటి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 230 ఎకరాల భూమిని దానం చేశారు.ఇందిర.. సాహిత్యం, కళల ప్రతీక1930 ఆగస్టు 17న హైదరాబాద్లోని జ్ఞాన్భాగ్ ప్యాలెస్లో జన్మించిన ఇందిరాదేవి.. రాజా ధనరాజ్గిర్జీ బహదూర్, రాణి ప్రేమిలా దేవి దంపతుల కుమార్తె. ఇంటి వద్దే ఆంగ్ల గవర్నెస్ ద్వారా విద్యాబోధన పొందిన ఆమె, ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మతో వివాహం అనంతరం సాహిత్య, కళా రంగాల్లో తనదైన ముద్ర వేసింది. ఆంగ్లంలో కవిత్వం రాసిన ఆమె రచనలు Return Eternity (1965), Partings in Mimosa (1968), Memories of the Deccan (2008) వంటి పుస్తకాల రూపంలో వెలువడ్డాయి. 1973లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతికి నామినేట్ కావడం ఆమె ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు. కవి, సంపాదకుడు కృష్ణ శ్రీనివాస్ ఆమెను నామినేట్ చేశారు. అలా భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటి భారతీయ మహిళా నోబెల్ నామినీగా ఆమెకు గుర్తింపు దక్కింది. ఆమె కవిత్వంలో హైదరాబాద్ సంస్కృతి, డెక్కన్ జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబించేవి. చిత్రకళ, రచన, ఫోటోగ్రఫీ రంగాల్లోనూ విశేష కృషి చేసిన ఆమె, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో హిందీ అకాడమీకి ఛైర్పర్సన్గా పనిచేసి సాహిత్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 13 జనవరిన హైదరాబాద్లోని జ్ఞాన్భాగ్ ప్యాలెస్లో 95 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఇందిరాదేవి తన కవిత్వం, కళల ద్వారా హైదరాబాద్ సంస్కృతిని నిలబెట్టగా, కామసుందరి దేవి తన త్యాగం, సేవల ద్వారా దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించారు. ఈ ఇద్దరు మహనీయులు మనకు ఒకే సందేశం అందించారు: దేశం, సంస్కృతి, సమాజం కోసం చేసిన సేవలు, త్యాగాలు శాశ్వతంగా నిలుస్తాయి. ‘‘దేశభక్తి ఎప్పుడూ నినాదాల్లో, అధికార ప్రదర్శనలో ఉండదు. అది నిశ్శబ్ద త్యాగంలో, సమాజానికి చేసిన సేవలో, సంస్కృతిని కాపాడటంలో ఉంటుంది’’ అని ఓ కవి చెప్పిన మాటకు ఈ ఇద్దరే రాజవంశానికి చెందిన ఆడపడుచులే ప్రత్యక్ష తార్కాణాలు. -
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
స్త్రీశక్తి అపారం.. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి.. సూర్యాస్తమయం తర్వాత కూడా పనిచేస్తూ దేశాభివృద్ధి.. కుటుంబ సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశుధ్య కార్మికురాలిగా.. ఉపాధికూలీగా.. ఉద్యోగిగా.. డాక్టర్గా.. అధికారిణిగా నిరంతరం శ్రమిస్తున్నారు. అమ్మగా.. భార్యగా.. బిడ్డగా ఇంటిని తీర్చిదిద్ది.. విధుల్లో అలుపన్నదే లేకుండా కష్టపడుతున్నారు. కాలంతో పోటీ పడుతూ అన్ని పాత్రలకు వన్నె తెస్తున్నారు. వేకువజాము మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె కష్టపడుతున్న తీరుపై ఈ వారం సండే స్పెషల్..!! పెద్దపల్లిలో కొడుకును పాఠశాలకు తీసుకెళ్తున్న తల్లి ప్రిన్సీతాముపడుతున్న కష్టం పిల్లలకు రావొద్దనుకుంటారు తల్లులు. ఉదయం 8 గంటలకు చిన్నపిల్లలైతే ఉగ్గుతినిపించి కడుపునింపుతున్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలను తీసుకుని బడి‘బాట’పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు చెప్పి వస్తున్నా రు. భర్తను ఆఫీసుకు పంపడం, అత్తమామలు, తల్లిదండ్రులకు సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.పెద్దపల్లిలో పారిశుధ్య పనులు చేస్తున్న చింతల రాజేశ్వరిఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో నాలుగువేలకు పైగా మహిళా పారిశుధ్య కార్మికులున్నారు. నిత్యం ఉదయం 4 గంటల నుంచే విధుల్లో నిమగ్నమవుతున్నారు. విడతలవారీగా రహదారులు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. చలికి, ఎండకు, వానకు తట్టుకుంటూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగాఉంచుతున్నారు.పెద్దపల్లి శాంతినగర్లో పాలు పితికిన కనకలక్ష్మిగ్రామాల్లో పాడిపరిశ్రమ, వ్యవ‘సాయం’లో మహిళలు ఎక్కువ భాగస్వాములవుతున్నారు. ఉదయం 5 గంటలకే పాడిపశువుల నుంచి పాలుపితకడం.. వ్యవసాయం చేసే మహిళలు తమ చేలలో పండిన కూరగాయలను మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. చిరువ్యాపారం చేసే వారు ఉదయాన్నే మార్కెట్కు వచ్చి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటి ఖర్చులు పోను.. ఆర్థికంగా బలపడుతున్నారు.సిరిసిల్లలో ఉదయం 6గంటలకు విధుల్లో కండక్టర్ పిల్లి రోజారాణిప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకే ఫస్ట్ బస్ డ్యూటీ కోసం మహిళా కండక్టర్లు బయలుదేరుతారు. పొద్దంతా డ్యూటీ చేసి.. వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి అప్పగించి ఇంటికి చేరుతారు. ఉద్యోగ బాధ్యత పూర్తిచేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తుంటారు.పెద్దపల్లి: గురాంపల్లిలో కొడుక్కి స్నానం చేయిస్తున్న లావణ్యవేకువజామునే పిల్లలను నిద్ర నుంచి లేపి పిల్లలకు స్నానం చేయిస్తా రు. 7 గంటల వరకే పాఠశాలకు సిద్ధం చేయిస్తారు. పిల్లలను స్నా నం మొదలు.. డ్రెస్.. జెడ ఇతర సపర్యలు చేస్తున్నంత సేపు బాగా చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఉన్నతంగా ఎదగాలని పిల్లలకు హితబోధ చేస్తా రు. అల్పాహారం సిద్ధం చేస్తారు.పెద్దపల్లిలో విధులకు వెళ్తున్న ప్రైవేటు టీచర్లు సుమలత, లతకుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పలువురు మహిళలు ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నారు. ఉద యం 9 గంటలకు ప్రైవేటు, ప్రభు త్వ టీచర్లు, ఇతర ప్రైవేటు రంగా ల్లో పనిచేసే మహిళలు లంచ్ బాక్స్ పట్టుకొని చలో..చలో అంటూ కదులుతున్నారు. సాయంత్రం వరకు విధులు నిర్వహించి తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు.సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేస్తున్న డాక్టర్ లహరిప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించేందుకు 10 గంటలకే విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో విధుల్లో ప్రజాసేవలో తరిస్తున్నారు. అధికా రులు.. అర్జీదారులకు వారధిగా ఉంటూ.. ప్రభుత్వపాలనలో మహిళా ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు.పెద్దపల్లిలో పిల్లలకు లంచ్ రెడీ చేస్తున్న గాదాసు శైలజపిల్లలను స్కూళ్లకు పంపి, భర్తలను ఉద్యోగానికి పంపిస్తూ కాసేపైనా విశ్రాంతి తీసుకోకుండా మధ్యాహ్నం భోజన తయారీకి సన్నద్ధం అవుతుంటారు. కుటుంబ ఆరోగ్యమే లక్ష్యంగా పౌష్టికాహారాన్ని వండుతుంటారు. రుచికరమైన వంటలు చేసి.. పిల్లలకు, భర్తకు భోజనం తయారు చేస్తుంటారు. లంచ్ బాక్స్ల్లో వడ్డించుకుని.. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తీసుకెళ్తుంటారు.పెద్దపల్లిలో పాఠశాలలో చిన్నారికి అన్నం తినిపిస్తున్న తల్లిఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని.. పిల్లలకు లంచ్బాక్సులు రెడీ చేసుకుని పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ చిన్నారులకు గోరుముద్దలు తినిపించుకుంటూ.. తరగతి గదుల్లో చెప్పిన పాఠాలను తెలుసుకుంటారు. గ్రామాల్లో వ్యవసాయకూలీలు పొలం పనుల్లో నిమగ్నమవుతూ.. పాటలు పాడుతూ సరదాగా సాగుతుంటారు.పెద్దపల్లి మహిళా పోలీస్స్టేషన్లో విధుల్లో ఎస్సై అక్కల రాజమణిపొద్దంతా కష్టపడి.. అలిసిపోయి.. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడుపుతుంటారు. రాత్రి తినేందుకు వంట సిద్ధం చేస్తుంటారు. ఆరోజు మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. రోజూవారి కార్యక్రమాలు, కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆచరణలపై భర్త, ఇంటి పెద్దలతో చర్చిస్తుంటారు.పెద్దపల్లిలో రాత్రివేళ చలి మంట కాగుతూ..గృహిణులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తుంటారు. హోంవర్క్ చేయిస్తూ.. అనుమానాలు నివృత్తి చేస్తూ టీచర్గా మారుతుంటూరు. పొ లం పనులకు వెళ్లినవారు చేలలో బిజీబిజీగా ఉంటారు. కొందరు అత్యవసర సేవల్లో పనిచేసే మహిళలు సమయంతో పనిలేకుండా ముందుకు సాగుతుంటారు.కొడుకు కూతురు శాన్వి, ఫర్నీత్లను నిద్రపుచ్చుతున్న తల్లి భైరి సుధచిన్నారులు.. కుటుంబసభ్యులకు భోజనాలు వడ్డించి మిగిలిపోయిన పనులు పూర్తిచేసుకుంటారు. రేపటి కోసం అవసరమైన పనులు సిద్ధం చేసుకుంటారు. చిన్నారులను లాలించి, నిద్రబుచ్చుతారు. కుటుంబ క్షేమమే తమ బాధ్యతగా ముందుకు సాగుతూ.. రోజంతా కష్టపడే మహిళలు.. ఆ ఇంట్లోని వారు అందరూ నిద్రపోయిన తరువాత విశ్రాంతి తీసుకుంటారు. ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్లు పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల -
గుత్తాజ్వాల మంచి మనసు.. 30 లీటర్ల తల్లిపాలు దానం
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు పాలు పట్టగా మిగిలిన పాలను ప్రభుత్వ ఆస్పత్రులకు దానం చేశారు. తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించిన గుత్తాజ్వాల దాదాపు 30 లీటర్ల వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. ఇలా చేయడం ద్వారా పాలుపడని తల్లుల పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు. గుత్తాజ్వాల తనలో ఉన్న మాతృహృదయాన్ని చాటడంతోపాటు తల్లిపాలకు ఎంత ప్రాధాన్యం ఉందో సమాజానికి చెప్పగలిగారు. ఇలాంటి తల్లులు మరింత మంది ముందుకొస్తే అమ్మపాలు దొరకని శిశువుల ప్రాణాలు కాపాడే అవకాశముంది. ప్రభుత్వం సైతం మిల్్కబ్యాంక్లు ఏర్పాటు చేస్తోంది.తల్లి ఒడిలో హాయిగా పడుకొని పాలు తాగాల్సిన నవజాత శిశువులు అమ్మ అమృతధార కోసం పోరాడాల్సిన పరిస్థితి. పౌష్టికాహార లేమి.. అనారోగ్య సమస్యతో తల్లికి పాలు పడక అప్పుడే పుట్టిన చిన్నారులకు అమృతధారలు అందడం లేదు. ఫలితంగా నవజాత శిశుమరణాలు పెరుగుతున్నాయి. పాలు పడని తల్లుల పిల్లల ప్రాణాలు నిలిపేందుకు పలువురు తల్లులు తమ పాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచి్చన మాతృమూర్తుల అమృతధారలను నిల్వ చేసే మిల్్కబ్యాంక్ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్్కబ్యాంకులు ఎక్కడా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నవజాత శిశువులు పాల కోసం తల్లడిల్లుతున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ మిల్్కబ్యాంక్లు ఏర్పాటు చేస్తే చాలా మంది తల్లులు తమ పాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది. పాలు ఎంతో ఉపయోగపడ్డాయినాకు పాలు పడకపోవడంతో బిడ్డ ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డా. కానీ మరో తల్లి నుంచి సేకరించిన పాలను నా బిడ్డకు పట్టించారు. ఆ పాలు నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాయి. – లావణ్య, పోతారం, హుస్నాబాద్తల్లిపాలతోనే ఆరోగ్యంతల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందిస్తాయి. శిశువు రోగనిరోధక శక్తిని పెంచి వ్యా ధుల నుంచి కాపాడుతాయి. మేధస్సు, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో సహాయపడుతాయి. తల్లి శిశువు మధ్య ప్రేమానూబంధాన్ని మరింత బలపరుస్తాయి.– డాక్టర్ నవీనా, ఆర్ఎంవో, కరీంనగర్కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో మదర్ మిల్్క బ్యాంక్ను ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో తల్లిపాలు అందని నవజాత శిశువులకు ఈ బ్యాంక్ ద్వారా పాలు అందించడమే లక్ష్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023 మార్చి 8న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మిల్క్ బ్యాంక్లో బ్రెస్ట్ పంప్ ద్వారా తల్లుల నుంచి పాలు సేకరించి, భద్రపరచి అవసరమైన శిశువులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అకాల ప్రసవాలు, తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు ఈ మిల్్కబ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది. శిశుమరణాలు తగ్గించడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా సేవలందిస్తున్నారు.శిశు మరణాలు అరికట్టడమే లక్ష్యంగా..తల్లిపాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. అతిసారం, న్యుమోనియా నివారించవచ్చు. తల్లివద్ద పాలు లేకపోతే ఆ శిశువులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం తల్లి పాల బ్యాంకులను ప్రారంభించింది. ఎక్కువగా పాలు ఉన్న తల్లుల నుంచి సేకరించి పాలు అందని పిల్లలకు అందిస్తూ కాపాడుతున్నారు. ఈ ఏడాది ఎంసీహెచ్వో 4,754 డెలివరీలు జరగగా.. 114 మంది శిశువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే ఈ సంఖ్య గతంతో పో లిస్తే తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండా పుట్టినా.. తక్కువ బరువుతో పుట్టిన శిశువుల కు ఎంసీహెచ్లో ఏర్పాటు చేసిన తల్లిపాల బ్యాంకు, ఎస్ఎన్సీయూ వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తుంది.12 గంటలపాటు నిల్వతల్లి నుంచి సేకరించిన పాలను 12 గంటల పాటు ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన ఫ్రిజ్లో నిలువ చేసే అవకాశం ఉంది. కానీ ఏ రోజు కూడా అంత సమయం నిలువ ఉంచే పరిస్థితి రాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిల్్క బ్యాంక్లో పాలను సేకరించే తల్లులకు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు, వైద్యుల పర్యవేక్షణలోనే పాలసేకరణ, పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ప్రతీ నెల 300 మంది తల్లుల నుంచి పాలు సేకరించి ప్రతీ రోజు 5 నుంచి 8 మంది పిల్లలకు అందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందని వారికి ఈ బ్యాంకు ద్వారా అందించి ప్రాణాలు కాపాడుతున్నారు.పాల బ్యాంకు వరంనా భార్య డెలివరీ తర్వాత పాపకు పాలు అందకపోవడంతో మిల్క్ బ్యాంకు నుంచి సేకరించిన పాలు అందిస్తున్నారు. పాలు అందని పిల్లలకు మాతాశిశు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తల్లి పాల బ్యాంకు ఒక వరం. – చంద్రశేఖర్, జగిత్యాలశిశువుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంతల్లిపాలతోనే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పాలను కూడా అన్ని రక్షణ చర్యలు తీసుకుని మిగతా శిశువులకు అందించేలా మిల్్కబ్యాంకులో ఏర్పాటు చేశాం. హెచ్ఐవీ, హెపటైటిస్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన తల్లుల పాలు మాత్రమే తీసుకుంటాం. – డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్, కరీంనగర్ -
తెలుగులోనే తొలి ఛార్జి‘షీ’ట్
తెలుగులో అభియోగపత్రం దాఖలుచేసిన తొలి మహిళా పోలీస్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని దుండిగల్ పోలీసుస్టేషన్లో హెడ్–కానిస్టేబుల్గా పనిచేస్తున్న మాలోత్ స్వరూప తెలుగులో అభియోగపత్రం దాఖలు చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. దీంతోపాటు పోలీసు పరిభాషలో ఫైనల్ రిపోర్టుగా పిలిచే నివేదికనూ తెలుగులో రూపొందించి, ఉన్నతాధికారికి సమర్పించిన తొలి అధికారిణిగా రికార్డుకెక్కారు. తాను పనిచేస్తున్న పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ పోలిశెట్టి సతీష్తోపాటు కమిషనర్ మస్తీపురం రమేష్లు దీనికి స్ఫూర్తి అని స్వరూప చెప్తున్నారు. ఆ ‘తొలి తెలుగు మహిళ’ దీని పూర్వాపరాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆంగ్లంలోనే ఉండటం పరిపాటి. ‘జెన్–జెడ్’ను మినహాయిస్తే... గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లోనూ ఆ భాషపై పట్టు ఉన్న వారు చాలా తక్కువ. దీంతో అనేకమంది ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి బాగా చదువుకున్న వారిమీద ఆధారపడాల్సిందే. ఇక పోలీసు విభాగం విషయానికి వస్తే తమ వద్దకు వచ్చే ఫిర్యాదు తెలుగు భాషలో ఉన్నా... అధికారులు దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసి మరీ కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు, కేసు డైరీలతో పాటు ఛార్జిషీట్ అనే అభియోగపత్రం కూడా ఇంగ్లీషులోనే రూపొందించి న్యాయస్థానానికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలూ తమ మాతృభాషలోనే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అనివార్య కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది అమలు కావట్లేదు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్న మస్తీపురం రమేష్ గతంలో హైదరాబాద్ ఈస్ట్జోన్కు డీసీపీగా పనిచేశారు. అప్పట్లో తెలుగును పోలీసు విభాగంలో అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆయన స్ఫూర్తితోనే అప్పట్లో చాదర్ఘాట్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేసిన పోలిశెట్టి సతీష్ 2021లో రెండు కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను తెలుగులో రూపొందించి కోర్టుకు సమర్పించారు. గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేసిన అవినాష్ మహంతి హెడ్–కానిస్టేబుల్ స్థాయి అధికారులను దర్యాప్తు అధికారులుగా మార్చారు. కొన్ని కేసుల్ని వీళ్లే దర్యాప్తు చేసి, అభియోగపత్రాలు దాఖలు చేసేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసు విభాగంలోకి విద్యాధికులే వచ్చి చేరుతున్నారు. అయితే వారికి ఆంగ్లంపై పట్టు తక్కువ కావడం వల్ల ఆసక్తి ఉన్నప్పటికీ అభియోగపత్రాల దాఖలులో ఉన్న ఇబ్బంది మూలాన దర్యాప్తు అధికారులుగా మారట్లేదు. ఈ విషయం గమనించిన ఇన్స్పెక్టర్ పోలిశెట్టి సతీష్ తెలుగులోనే రూపొందించి, దాఖలు చేయడానికి ప్రయత్నించమని ప్రోత్సహించారు. ఆ స్ఫూర్తితో తెలుగులో చార్జ్షీట్స్ వేయాలని నిర్ణయించుకున్నా. బౌరంపేటకు చెందిన వెంకటేష్ తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న దానిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి తెలుగులో రూపొందించిన అభియోగపత్రాన్ని మేడ్చల్లోని మొదటి తరగతి మేజిస్ట్రేట్కు సమర్పించా. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ఓ మహిళ వలస కూలీ, ఆమె కుమార్తె తప్పిపోయిన కేసు దర్యాప్తును పూర్తిచేశాను. వారి ఆచూకీ కనిపెట్టి, కుటుంబీకులకు అప్పగించిన తర్వాత కేసు మూసివేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన తుది నివేదికను తెలుగులో రూపొందించి మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డికి సమర్పించా. సాధారణంగా ఇలాంటి కేసులకు సంబంధించిన చార్జ్షీట్, ఫైనల్ రిపోర్టులను గరిష్టంగా రెండు గంటల్లో తయారు చేయవచ్చు. అయితే తెలుగులో పదాలు వెతుక్కోవాల్సి రావడంతో మూడేసి రోజులు పట్టింది. భవిష్యత్తులోనూ ఈ విధానాలను కొనసాగిస్తా!మాది మెదక్ జిల్లా. నేను దుండిగల్లోనే పుట్టిపెరిగాను. అక్కడి జిల్లా పరిషత్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివాను. గ్రాడ్యుయేషన్ మాత్రం ఇంగ్లీషు మీడియంలో పూర్తి చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి రిక్రూట్మెంట్లోనే కానిస్టేబుల్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం హెడ్–కానిస్టేబుల్ హోదాలో పని చేస్తున్నాను. ఇటీవల డీజీపీ బి. శివధర్ రెడ్డి చేతుల మీదుగా ‘సైబర్ యోధ’ అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సైబర్ క్రైమ్ కేసుల్లో పెండెన్సీ లేకుండా చూసినందుకు నాకీ అవార్డు లభించడం చాలా సంతోషం. – స్వరూప, హెడ్–కానిస్టేబుల్, దుండిగల్ పోలీసుస్టేషన్తెలుగులోనే ఉంటే న్యాయం జరుగుతుందని...ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్స్ ఇంగ్లీషులో ఉంటున్నాయి. దీనివల్ల తన ఫిర్యాదులోని అంశాలను ఎలా దర్యాప్తు చేశారో, అభియోగపత్రాల్లో ఏం ΄÷ందుపరిచారో బాధితులకు తెలియట్లేదు. తాను చేసింది ఏ చట్ట ప్రకారం నేరమనేది నిందితుడికీ అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ కోర్టు పత్రాలనూ చదవలేరు. ఇవన్నీ తెలుగులో ఉంటే దర్యాప్తులోని లోపాలను బాధితులు కూడా కనిపెట్టి నిర్లక్ష్యం చేసిన అధికారుల్నీ నిలదీస్తారు. అలా సరైన న్యాయంపొందగలుగుతారు. బీఎన్ఎస్ ప్రకారం మాతృభాషలోనూ అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. – పోలిశెట్టి సతీష్, ఇన్స్పెక్టర్, దుండిగల్ పోలీసుస్టేషన్వీలున్నంత వరకు తెలుగులోనే అందిస్తాందుండిగల్ హెడ్–కానిస్టేబుల్ స్వరూపను ఆదర్శంగా తీసుకుని, ఎందరో స్ఫూర్తి ΄÷ందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య భాష ఓ అగాథంలా మారిపోయింది. సామాన్యుల కోసం పని చేసే ప్రభుత్వాలు, యంత్రాంగాలు వారికి అర్థమయ్యేలా సాధారణ వాడుక భాషలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలి. పరిపాలనపరమైన అనేక అంశాలపై వివిధ సర్క్యులర్లు నిత్యం పంపిస్తూ ఉంటాం. వీటితో పాటు వీలున్నంత వరకు మెమోలను కూడా తెలుగులోనే జారీ చేయాలని నిర్ణయించాం. ఓ సబ్–ఇన్స్పెక్టర్ వ్యవహారానికి సంబంధించిన తొలి సర్క్యులర్ను ఇప్పటికే తెలుగులో ఇచ్చాం. – మస్తీపురం రమేష్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ – శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
అంటార్కిటికాలో 365 రోజులు...
అంటార్కిటికా చూసే అవకాశం భారతీయ స్త్రీలకు అతి తక్కువగా దొరుకుతుంది. ఎవరైనా వెళ్లినా కొన్ని గంటలు లేదా రోజులమజిలీ మాత్రమే చేయగలరు. కాని ముంబైకి చెందిన జనరల్ సర్జన్ వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికాలో సంవత్సరం పాటు ఉండి భారతీయ పరిశోధక బృందానికి వైద్యసేవలు అందించారు. ‘44వ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా’లో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చిన వైదేహీ అక్కడి అనుభవాలను పంచుకున్నారు.ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అంటార్కిటికా ఒకటి. దాని గురించి విన్న వారే తప్ప అక్కడికి వెళ్లినవారు తక్కువ. వెళ్లి నివసించినవారు అరుదు. చుట్టూ మంచుతో నిండిన ఆ ధ్రువప్రాంతంలో జీవనం దుస్సాధ్యం. అయితే భారతదేశానికి చెందిన 31 ఏళ్ల మహిళా జనరల్ సర్జన్ వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు, ఏడాది పాటు అక్కడే గడిపి ఇటీవల తిరిగి వచ్చారు. అక్కడున్న ప్రతి క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అంటున్నారామె.పదేళ్ల ముందు నుంచి ఆసక్తినేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్ .సి.పీ.ఓ.ఆర్) ఆధ్వర్యంలో 44వ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా (ఐఎస్ఈఏ)లో భాగంగా మన దేశం నుంచి వెళ్లిన బృందంలో ఏకైక మహిళ వైదేహీ వెంకటేశ్వరన్. ‘అంటార్కిటికా చూడాలనేది నా చిరకాల స్వప్నం. 2015లో విద్యార్థిగా ఉన్న సమయంలో అంటార్కిటికా ఎక్స్పెడిషన్ గురించి విన్నాను. ఎప్పటికైనా అందులో పాల్గొనాలని భావించాను. 2025లో ఎన్ సీపీఓఆర్కు దరఖాస్తు చేసుకున్నాను. మహిళలకు ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు రాగానే చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారామె.వడపోతల ఎంపికఅంటార్కిటికా మంచు ఖండం. అక్కడికి వెళ్లి ఏడాదిపాటు సేవలందించాలంటే చాలా మనోధైర్యం, గుండె నిబ్బరం కావాలి. అందుకే అక్కడికి వెళ్లే వారిని ప్రభుత్వం అనేక వడపోతల తర్వాత ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి ఇండో–టిబెటియన్ సరిహద్దు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అంటార్కిటికాలో పరిస్థితులు, వాతావరణం, అందుకు తగ్గ ఏర్పాట్లు, చేయాల్సిన పనులు, అక్కడి జీవనవిధానం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. ‘శిక్షణ తర్వాత నేను అంటార్కిటికాలో అడుగుపెట్టిన రోజు ‘పోలార్ డే’. అంటే రోజంతా సూర్యుడు ఉండే రోజది. రాత్రి ఆకాశంలో ఒకేసారి సూర్యుణ్ని, చంద్రుణ్ని చూసే ఆ వింతను జీవితంలో మర్చిపోలేను. నేను ఉన్న ప్రదేశంలో నాతో పాటు మరో వైద్యుడు, నర్స్ ఉంటారు. మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ఇంటర్నెట్ తక్కువ. బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియాలంటే రేడియో ఒక్కటే ఆధారం. శీతాకాలం మొత్తం నా చుట్టూ 24 మంది ఉన్నారు. రోజంతా అత్యంత నిశ్శబ్దంగా ఉండేది’ అని ఆమె వివరించారు.ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం‘శీతాకాలంలో మంచంతా గడ్డకట్టుకుపోతుంది. బయటికెళ్లిన వారు ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. చుట్టూ పేరుకు పోయిన మంచులో ఎటు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. దారి చూపేందుకు అక్కడ ఎటువంటి గుర్తులూ ఉండవు. అందుకే వెంట ఎప్పుడూ జీపీఎస్ ఉండేది. అంటార్కిటికా పెంగ్విన్లకు ఆవాసం. అయితే మాకున్న ఆదేశాల వల్ల వాటికి మేము దూరంగా ఉన్నాం’ అన్నారామె.ఒంటరిగా మనగలగడం కష్టం‘అంటార్కిటికా ఖండంలో ఒంటరిగా మనగలగడం కష్టం. వేలకొద్దీ కిలోమీటర్ల వరకూ మానవసంచారం ఉండదు. చుట్టూ అంతా నిశ్శబ్దంలో ఒక్కోసారి ఏమీ తోచక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ మన దేశంతోపాటు చైనా, రష్యా పరిశోధక స్టేషన్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఒకరికొకరం సాయం అందించుకునేవాళ్లం. ‘పా’ సినిమాలో అమితాబ్ ఒక తెల్లటి గ్లోబ్ తయారు చేసి ‘ఈ భూమ్మీద ఎటువంటి సరిహద్దులు లేవు’ అంటారు కదా! అంటార్క్టికాలో ఏడాదిపాటు జీవించి, తిరిగి వచ్చాక నాకు ఈ ప్రపంచం అలాగే అనిపిస్తోంది’ అంటున్నారు వైదేహి. -
భారత ఆర్మీ ఆఫీసర్గా సెక్యూరిటీ గార్డ్ కుమార్తె ..!
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతేనేం.. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కలను కనొచ్చు, నిజం చేసుకోవచ్చు. అందుకు పరిమితులు అనేవి ఎన్నటికి అడ్డంకి కావు అని నిరూపించింది ఓ సెక్యూరిటీ గార్డు కుమార్తె. పైగా చిన్న వయసులోనే భారత ఆర్మీ ఆఫీసర్ అయ్యి.. అరుదైన రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఎవరా ఆ అమ్మాయి..? ఏమా కథ..? చకచక చదివేయండి మరి...ఆ అమ్మాయే మణిపూర్లోని సేనాపతి జిల్లాలోని రాలూనామీ గ్రామానికి చెందిన ఎనోని. ఆమె మాఓ నాగా అనే గిరిజన తెగకు చెందింది. ఈ తెగకు చెందిన ప్రజలు మణిపూర్, నాగాలాండ్ అంతటా ఉంటారు. ఇక ఎనోని తండ్రి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. తన తండ్రి జీతంపైనే ఆరుగురు పిల్లలు చదువు, పోషణ చూసుకోవాల్సి ఉండేది. ఎనోని ఆ ఆరుగురిలో ఆఖరి అమ్మాయి. అయితే ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఎంతటి దారిద్యం తాండవించినా..వారి చదువుల విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా తమకు చేతనైంనతలో చదివించే యత్నమే చేశారు. ఇక ఎనోని ఆర్మీ వైపుకి ఎలా వచ్చిందంటే..ఎమనిదో తరగతి నుంచే మొదలు..నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో మహిళలు ఎక్కువగా పాల్గొనడానికి అనుమతించబడిన సమయంలోనే ఎనోనికి భారత సైన్యంలో చేరాలనే ఆకాంక్ష ఉంది. సాయుధ దళాల క్రమశిక్షణ, యూనిఫాం అంటే మహా ఇష్టం. ఆ యునిఫాంని ఎప్పుడు ధరిస్తానా అని అనుకునేది. ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఎన్సీసీలో చేరింది.తర్వాత NCC సీనియర్ వింగ్ శిక్షణను కొనసాగించడానికి ఢిల్లీకి వెళ్లింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అడుగు. ప్రతి అడుగు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది..అయినా తన సంకల్ప బలాన్ని వదులుకునేది కాదు. తండ్రి లాఠీ తనకు ఖడ్గంగా ..కఠినమైన శిక్షణ సమయంలో అలసట లేదా విసుగు వచ్చినప్పుడల్లా.. ఎనోని తన తండ్రి త్యాగాలను గుర్తు చేసుకుంటూ..ముందుకు నడిచేది. అతను చేతిలో లాఠీతో చల్లని రాత్రులలో కాపలాగా నిలబడి ఉండగా..తాను ఏదో ఒక రోజు కత్తిని చేత ధరించి భారతీయ సైనిక అధికారిగా భుజాలపై నక్షత్రాలు ధరించాలనే ఆశతో అవిశ్రాంతంగా శిక్షణ తీసుకుంది. ముందు ఇండియన్ మిలటరీ అకాడమీ(ఐఎంఏ)లో కఠినమైన శిక్షణలో విజయం సాధించింది. ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాత్రం కాస్త ఒత్తిడికి గురైంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది. శారీరకంగా, మానసికంగా భావోద్వేగపరంగా కఠినమైన శిక్షణను పూర్తి చేయడం అత్యంత కష్టతరం. అయినప్పటికీ ఎనోని అద్వితియంగా పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకుని.. చివరికి అధికారిక యూనిఫాం ధరించి డ్రిల్ స్క్వేర్పై కవాతు చేస్తూ..అనుకున్న లక్ష్యాన్ని సాధించా అంటూ ఒక విధమైన ఉద్విగ్నానికి గురయ్యేది. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ఒక చరిత్రగా మారింది. ఎందుకంటే తన మావో నాగ కమ్యూనిటీ నుంచి అధికారణిగా భారత ఆర్మీ నయూనిఫాం ధరించిన తొలి మహిళ ఆమె. అలాగే ఈశాన్య భారతదేశం నుంచి ఆర్మీకి నాయకత్వం వహించిన తొలి తొలి మహిళ కూడా ఎనోనినే కావడం విశేషం.(చదవండి: ధైర్యానికి కేరాఫ్ ఆమె..! ఏకంగా 24 దేశాలు..) -
ధైర్యానికి కేరాఫ్ ఆమె..! ఏకంగా 24 దేశాలు..
అనారోగ్యం అంటే ఎవ్వరైనా హడలిపోతాం. ఎలా బయటపడతాం అనే బెంగ వచ్చేస్తుంది. దీనికి తోడు విధి పెట్టే భయంకరమైన పరీక్షలకు అల్లాడిపోతుంటాం. అలాంటి వాటన్నింటిని జయించి..ఎందరికో మార్గదర్శకురాలిగా మారారు మినాతి బోర్ఠాకూర్. కేన్సర్కి గట్టి కౌంటిరిచ్చేలా సాగుతున్నా ఆమె ప్రయాణం ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తి కూడా.అసోంలోని గువాహటికి చెందిన మినాతి బోర్ఠాకూర్కి చిన్న వయసులోనే పెళ్లి, ముగ్గురు పిల్లలు. అయితే ఆ ముగ్గురి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ బాధ తట్టుకోవడం అంత సులభం కాలేదామెకు. దాన్నుంచి బయటపడేందుకు చదువుపై ధ్యాస పెట్టారామె. అలా చదువుకున్న కాటన్ కాలేజ్లోనే ప్రొఫెసర్గా చేసి ఫిలాసఫీ విభాగానికి హెడ్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో రిసెర్చ్ పేపర్లు రాస్తుండేవారు. అయితే ఒకరోజు ఉన్నటుండి కడుపునొప్పి రావడం మొదలైంది. మొదట్లో సాధరమైనదిగా కొట్టిపారేసింది. కానీ రాను రాను తీవ్రమై తట్టుకోలేని స్టేజ్కి వచ్చేశారు. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా..కేన్సర్ అని తేలింది. అది కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్కి పాకింది. అసలు బతకడమే కష్టమన్నారు వైద్యులు. అయితే భర్త బిహారి బోర్ఠాకూర్ ఆమె చేత కేన్సర్ జయించిన వారి జీవితాల పుస్తకాలను చదివించేవారు. వాళ్ల స్ఫూర్తితో పట్టుదలగా ట్రీట్మెంట్ తీసుకుని..కేన్సర్ని నుంచి బయటపడ్డారు. అయితే మినాతికి కేన్సర్ నుంచి బయటపడటం ఎంత కష్టమో తెలుసు, అందుకనే ఉద్యోగం కొనసాగిస్తూనే కేన్సర్ బాధితులకు ఉచితంగా కౌన్సిలింగ్ వంటి ఇతర సామాలు అందిచడం మొదలుపెట్టారామె. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్, మెడిటేషన్ సెంటర్నీ ఏర్పాటు చేశారు. అలాగే తన కేన్సర్ చికిత్స అనుభవాలను ‘మోర్ ఒషూకోర్ ఎబోసర్: ఎజోన్ క్యాన్సర్ రోగిర్ ఒబిగోటా’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. మరోసారి కేన్సర్ తిరగబెట్టడంతో..2009... అనారోగ్యానికి గురైన భర్తకి సేవలు చేస్తున్నారు మినాతి. విపరీతమైన నడుము నొప్పి. పరీక్ష చేయించుకుంటే మళ్లీ కేన్సర్ తిరగబెట్టిందన్నారు వైద్యులు. ఈసారి పెల్విక్, వెన్నెముక ప్రాంతాల్లో వచ్చింది. అయితే మినాతి అస్సలు భయపడలేదు. కానీ ఆమె భర్త తీవ్ర ఆందోళనకు లోనయ్యి గుండెపోటుతో మరణించారు. వ్యాధి కన్నా విధి పెట్టిన క్షోభకు అల్లాడిపోయారామె. దాంతో మినాతి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. అప్పుడు తనలాంటి వాళ్ల గురించి ఆలోచించడం ప్రారంబించాక..ఆమెలో తెలియని ఆరాటం, తపన మొదలయ్యాయి. అలాగ మళ్లీ కేన్సర్పై పోరాడేందుకు రెడీ అయ్యారు మినాతి. అయితే ఈసారి కూడా మినాతినే కేన్సర్పై గెలిచారు. ఇక ఈసారి కేన్సర్ జర్నీని కూడా ‘కొలిజా కైతే బిందిలే జి చోరాయే గాన్ గాయే’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అంతేగాదు కేన్సర్ బాధితులకు అండగా ఉండేలా.. డైట్, న్యూట్రిషన్, ప్రాణాయామం, ధైర్యంగా సమస్యతో పోరాడటం... ఇలా ఎన్నో అంశాల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఆమె సేవలు భారత్కే పరిమితం కాలేదు. శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 24 దేశాలకు విస్తరించారు. పైగా ఆమె శరీరాన్ని గుహవాటి మెడికల్ కాలేజ్కి కేన్సర్ పరిశోధనలకు రాసిచ్చారామె. అంతేకాదండోయ్ ఆమె పుస్తకాలు కూడా ఎన్నో భాషల్లోకి తర్జుమా అయ్యి ఎందరో కేన్సర్ భాధితుల్లో అపారమైన ధైర్యాన్ని నింపుతున్నాయి. 79 ఏళ్ల వయసుకి చేరినా.. మినాతి కేన్సర్ సహాయ సేవ కార్యక్రమాలను ఆపలేదు. ఇంకా చేతనైనంతగా ఏదో చేయాలనే ఆమె ఆరాటం ఆకాంక్ష అజరామరం, స్ఫూర్తి కూడా..! View this post on Instagram A post shared by 🧿 Snayusneham Physio🧿 (@snayusneham_physio) (చదవండి: ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..! అమెరికన్ బుడ్డోడి ఘనత) -
వెనెజువెలా నూతన సారథి..పులిబిడ్డ
‘ముళ్ల కిరీటం’ అనే మాట వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ విషయంలో అక్షరాలా సరిపోతుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ‘ఇలా చేయాలి...ఇలా మాత్రమే చేయాలి’ అంటూ శాసనాలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తన దేశ సార్వభౌమాధికారాన్ని, తమ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏటికి ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారు డెల్సీ రోడ్రిగ్స్...నార్కో–టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి... మొదలైన ఆరోపణలతో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియాను అమెరికన్ సైన్యం నిర్బంధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంతో ‘ఎవరీ డెల్సీ రోడ్రిగ్స్?’ అనే ఆసక్తి మొదలైంది.→ బాల్యం నుంచే పోరాట పాఠాలుతండ్రి ఒడిలో చిన్నప్పటి నుంచి పోరాట పాఠాలు వింటూనే పెరిగిన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా సుప్రసిద్ధ జన నాయకురాలిగా ఎదిగారు. తండ్రి జార్జ్ ఆంటోనియో వెనెజువెలాలోని ప్రసిద్ధ లెఫ్ట్–వింగ్ గెరిల్లా ఫైటర్. 1976లో ఆయన హత్యకు గురయ్యాడు.→ చరిత్ర సృష్టించి...సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా(యుసీవి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డెల్సీ స్టూడెంట్ లీడర్గా చురుగ్గా ఉండేవారు. ఆ తరువాత కాలంలో ‘సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా’లో ప్రొఫెసర్గా, ‘వెనెజువెలా అసోసియేషన్ ఆఫ్ లేబర్ లాయర్స్ ప్రెసిడెంట్’గా పనిచేశారు. 2002లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో డెల్సీని 2014లో ‘పాపులర్ పవర్ ఫర్ ఫారిన్ రిలేషన్స్’ మంత్రిగా నియమించారు. వెనెజువెలా చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డెల్సీ.→ ఉపాధ్యక్షురాలిగా...వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా 2018లో నియామకం అయ్యారు డెల్సీ. వెనెజువెలా నిఘా సంస్థ బొలివేరియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్కి హెడ్ అఫీషియల్గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020లో ‘పాపులర్ పవర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ వెనెజువెలా’ మంత్రిగా పనిచేశారు. చమురు, ఆర్థిక శాఖల మంత్రిగా దేశాన్ని ద్రవ్బోల్బణం బారిన పడకుండా చూశారు.దేశాన్ని రక్షించుకుందాం...వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం అయిన డెల్సీ రోడ్రిగ్స్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన హెచ్చరికలతో, తమ చెప్పుచేతల్లో ఉండాలని చెప్పకనే చె΄్పాడు. అయితే ట్రంప్ హెచ్చరికలను 56 ఏళ్ల డెల్సీ ఆట్టే ఖాతరు చేయలేదు. నికొలస్ మదురో, అతడి భార్యను నిర్బంధించడాన్ని ఆమె ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మదురోను కిడ్నాప్ చేశారు’ అని ఆరోపిస్తున్న డెల్సీ రోడ్రిగ్స్ ‘వెనెజువెలాని రక్షించుకోవడానికి, దేశంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశ వనరులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. గ్రేట్ ఫైటర్నికోలస్ మదురోకు డెల్సీ రోడ్రిగ్స్ ప్రతిభాపాటవాలన్నా, నాయకత్వ సామర్థ్యమన్నా ఇష్టం. ఒకానొక సందర్భంలో ఆమెను ‘టైగర్’ అని అభివర్ణించారు. డెల్సీ ఉపా«ధ్యక్షురాలిగా నియమితురాలైన సందర్భంలో నికోలస్ మదురో ఆమెను...‘ధైర్యం మూర్తీభవించిన మహిళ. రాజకీయాల్లో తలపండిన అనుభవజ్ఞురాలు. అమరవీరుడి కుమార్తె. వెయ్యి యుద్ధాలతో పరీక్షించబడిన విప్లవకారిణి’ అని ఆకాశానికి కెత్తారు. డెల్సీని ‘టైగర్’ విత్ డిజైనర్ ఫ్యాషన్ టేస్ట్స్ అంటుంటారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా పనిచేసిన డెల్సీకి ఫ్యాషన్ డిజైనింగ్పై మంచి అవగాహన ఉంది.ఏక్ లవ్స్టోరీ!గతంలో డెల్సీ రోడ్రిగ్స్, నటుడు ఫెర్నాండో కారిల్లో ప్రేమికులు. ఈ జంట 2007 వరకు కలిసే ఉంది. టీవీ సోప్ ఒపేర స్టార్గా ఫెర్నాండో సుపరిచితుడు. ‘నేను ఆమెను ఏదో ఒకరోజు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అత్యంత తెలివైన మహిళలలో ఆమె ఒకరు’ అని డెల్సీ గురించి చెబుతుండే వాడు ఫెర్నాండో కారిల్లో. వినోదం, రాజకీయం అనే భిన్న ప్రపంచాలు ఒకే ప్రపంచం కావడానికి ఏర్పడిన వైరుధ్యాలో? ఇతరత్రా కారణాలో... తెలియదుగానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేక΄ోయారు. తాజా విషయానికి వస్తే... డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా అధ్యక్షురాలిగా నియామకం అయిన నేపథ్యంలో, ఆ రోజుల్లో డెల్సీపై ఫెర్నాండో కారిల్లో తన ప్రేమను ప్రకటించిన రోజును గుర్తు చేసుకుంటున్నారు నెటిజనులు. -
యస్... ఇది నా డబ్బు!
పెళ్లికి ముందు చిన్నా చితకా ఖర్చులకు తల్లిదండ్రుల మీదే ఆధారపడేది అన్షుల్ పరేఖ్. పెళ్లి తరువాత భర్త మీదే ఆధారపడేది. ‘ఇది నేను సొంతంగా సంపాదించిన డబ్బు’ అనుకునే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. అయితే 52 ఏళ్ల వయసులో కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. ఈ ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది పరేఖ్. గృహిణులు వారి అభిరుచులు, రోజువారీ అనుభవాలను పంచుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించింది సోషల్ మీడియా. వీడియో విషయానికి వస్తే... ఫోన్ చూస్తున్న అన్షుల్ పరేఖ్ను ‘ఏమైంది మమ్మీ?’ అని అడుగుతుంది ఆమె కూతురు.‘నా జీవితంలో తొలి సంపాదనను 52 ఏళ్ల వయసులో, ఆరు నెలల్లో యూట్యూబ్ ద్వారా Üంపాదించాను’ అని తన సంతోషాన్ని కూతురితో కలిసి పంచుకుంది అన్షుల్. ‘అమ్మను చూసి గర్వపడుతున్నాను’ అని తల్లి గురించి చెప్పింది ఆమె కూతురు. ‘కలలకు వయసు అడ్డంకి కాదు. కష్టపడితే చాలు అని మా అమ్మ నిరూపించింది’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో క్యాప్షన్లో తల్లి గురించి ఎంతో మురిపెంగా రాసుకుంది కూతురు. -
మన మూలమే బలం
‘రోమ్లో రోమన్లా ఉండాలి’ అంటారు. అలా అని మన మూలాలను మరచి పోనక్కర లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలే మన బలం. తెలంగాణ బిడ్డ అనితారెడ్డి భర్తతోపాటు ఆస్ట్రేలియాలో స్థిరపడింది. తన ప్రాంతీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే రాజకీయ రంగంలో అడుగు పెట్టింది. వాక్చాతుర్యం, సామాజిక సేవ, రాజకీయాలపై ఆమెకు ఉన్నఅవగాహనను పరిగణనలోకి తీసుకున్న లిబరల్ పార్టీ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అనితారెడ్డి సౌత్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా బరిలో దిగనుంది.హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన అనితారెడ్డి అడిలైడ్లోని క్లెమ్జింగ్లో భర్తతో పాటు నివసిస్తోంది. ఎంబీఏ చేసిన అనితకు సీనియర్ మేనేజర్గా ప్రైవేట్ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఆమె భర్త ఆదిరెడ్డి యారా అక్కడ మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్. తన అత్తగారి ఊరైన హనుమకొండ జిల్లా రామకృష్ణాపూర్కు వచ్చిన అనితారెడ్డి యారాని ‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...ఏ ఇలా మొదలైంది...‘‘మేము 2006లో ఆస్ట్రేలియా వెళ్లాం. అడిలైడ్లో మా జీవితాన్ని ప్రారంభించాం. ఆ టైమ్లో అక్కడ భారతీయ జనాభా చాలా తక్కువ. 2007 ‘ఇండియన్ మేళా’ ఏర్పాటు చేశాం. తెలుగు అసోసియేషన్ (తాసా) ఏర్పాటు చేయాలనుకున్న రాజ్కిరణ్ అక్కడ మాకు పరిచయమయ్యారు. ఆయనతో పాటు మరో మూడునాలుగు కుటుంబాల వారితో పరిచయం అయింది. వారు తెలుగు అసోసియేషన్ పెడదామనే ఆలోచనలో ఉన్నారు. అసోసియేషన్ ఏర్పాటు అయ్యాక మా ఆయన కమిటీ మెంబర్గా చేరారు. తను ‘ఇండియన్ అసోసియేషన్ ’ ప్రెసిడెంట్ అయ్యాక పూర్తి సమయం కమ్యూనిటీ సర్వీస్లోనే ఉండేవారు. ఆ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి.ఏ ఆస్ట్రేలియా పార్లమెంట్లో తొలిసారిగా బతుకమ్మ!తెలుగు వాళ్లమంతా మన పండుగలు ముఖ్యంగా బతుకమ్మ, దసరా, సంక్రాంతి జరుపుకునేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ’ ఏర్పాటు చేశాం. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగలపై బాగా దృష్టి పెట్టాను. 2020లో ‘అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్’కు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఆ టైమ్లో పార్లమెంట్లో బతుకమ్మ ఆడాలన్న నా ప్రతిపాదనను మల్టీ కల్చరల్ మినిస్టర్ జోయ్ బెడిసన్ అంగీకరించారు. ఆ రకంగా ఆస్ట్రేలియా పార్లమెంట్లో మొదటిసారి బతుకమ్మ ఆడింది మేమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుపుతోంది. సాధారణంగా పార్లమెంట్లోకి ఎవరినీ అనుమతించరు. కానీ, ఇప్పుడు దాదాపు 200 మంది మహిళలకు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీపావళి పండుగ రోజుల్లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ దీపతోరణాలతో వెలిగిపోతుంది. రాజకీయాల్లోకి తొలి అడుగుఅక్కడి తెలుగువాళ్లందరికీ ఏ సమస్య ఉన్నా మా ఇంటికే రావడం అలవాటు. అసోసియేషన్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాం. 2011 నుంచి లిబరల్ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉంటున్నాం. 2021లో లిబరల్ పార్టీలో టోరెన్ ్స బ్రాంచ్ సభ్యత్వం తీసుకున్నాను. ఆ తరువాత టోరెన్ ్స ఎస్ఈసీ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ప్రస్తుతం రెండోవిడత ఆ పదవిలో కొనసాగుతున్నాను. 2022లో క్లెమ్జింగ్ వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పుడు అనిపించింది... ఇంతవరకు వచ్చాం. మళ్లీ ఎందుకు పోటీ చేయకూడదు అని. అప్పుడే ఎంపీగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాను. టికెట్ ప్రకటనకు ముందు మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. గెలిస్తే ఏమి చేస్తావు? ఓడిపోతే ఎలా ఉంటావు? – మొదలైన ప్రశ్నలకు నిక్కచ్చిగా జవాబులు ఇచ్చాను. మార్చి 18న ఎన్నికలు జరగనున్నాయి.ఏ గెలిస్తే... ఇలా..యువత, మహిళా సాధికారత, నిరుద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతాను. లిబరల్ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తాను. సమాజానికి మేలు చేసే అంశాలపై అసెంబీల్లో మంచి నిర్ణయాలు తీసుకునే విధానాలకు మద్దతు ఇస్తాను. ప్రజల గొంతుగా ఉంటాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను’’ అని చెప్పారు అనితారెడ్డి.– వర్ధెల్లి లింగయ్య, సాక్షి, వరంగల్ -
కశ్మీర్కు వెళ్లిన ప్రతిసారీ ఇంతే..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ఖాన్ ఇటీవల కశ్మీర్కు వెళ్లాడు. అరు అనే గ్రామంలో క్రికెట్ ఆడుతున్న ఓ బాలిక దగ్గరకు వెళ్లి పలకరించాడు.మాటల్లో ‘స్మృతి మంధాన అంటే నాకు ఇష్టం. ఆమెలా ఆడాలనుకుంటున్నాను’ అని చెప్పింది.ఆ బాలిక ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి...‘కశ్మీర్కు వెళ్లిన ప్రతిసారీ నా కెమెరా ఏదో ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తూనే ఉంటుంది. ఈసారి అద్భుతం... ఆరు గ్రామంలోని బాలిక. తాను భవిష్యత్తులో స్మృతి మంధాన కావాలనుకుంటుంది. స్మృతి ఈ పోస్ట్ చూస్తుందని ఆశిస్తున్నాను’ అని రాశాడు ఖాన్.అతడు ఆశించినట్లే... స్మృతి ఈ పోస్ట్ చూసి సంతోషించింది. ఒక మెసేజ్ ద్వారా ఆ కశ్మీర్ బాలికకు బిగ్ హగ్ ఇచ్చింది! ‘ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని రాసింది.చదవండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేకపోయాంమారుమూల గ్రామాల్లోని పిల్లలకు ఆడాలనే తపన తప్ప, క్రికెట్కు సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అయితే వారిలో ప్రతిభ ఉంటే, ఆ ప్రతిభ వారిని ఎక్కడికో తీసుకెళుతుందని చరిత్ర చెబుతూనే ఉంది! -
మొదటి అడుగు మార్పుకే
బాలికలు, మహిళల కోసం ‘స్టాండ్ఫర్షీ’ సంస్థను చిన్న వయసులోనే స్థాపించిన అర్చన కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి బాలికల మరుగుదొడ్లు, మంచినీటి కోసం 100 కోట్లు విడుదల చేయించింది. 2025లో గిరిజనుల విద్య, సంస్కృతి కోసం విశేషంగా పని చేసింది. ‘మార్పు రావాలి. మార్పు మొదలవ్వాలి’ అనే అర్చన... దారి చూపాలే గానీ యువత, స్త్రీలు మార్పు కోసం గొప్ప ఉద్యమాలు నిర్మించగలరని అంటోంది.‘ప్రభుత్వాలు సర్కారు బడులలో పారిశుద్ధ్యానికి నిధులు విడుదల చేస్తాయి. అవి ఎలా ఖర్చవుతున్నాయో ఎవరు చెక్ చేస్తారు? ప్రజలో, తల్లిదండ్రులో పూనుకుని చెక్ చేస్తే ఒక భయం ఉంటుంది. లేకుంటే ప్రభుత్వ బడులలో టాయిలెట్ల పరిస్థితి ఎప్పటికీ మారదు’ అంటుంది అర్చన కెఆర్.2020 నుంచి కర్నాటక ప్రభుత్వ బడుల్లో ఆడపిల్లల కోసం రావలసిన మార్పుకై పోరాడుతున్న అర్చన చాలా సాధించిందిగానీ బదులుగా సవాళ్లు ఎదుర్కొంది. ‘నేను ఎంతసేపటికీ టాయిలెట్ల కోసం పని చేస్తున్నానని పెళ్లి సంబంధాలు వెనకడుగు వేశాయి’ అంటుందీ 35 ఏళ్ల సామాజిక కార్యకర్త. అయినా ఆమె పోరాటం ఏమీ ఆపలేదు. అసలు పోరాటం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆమె మాటల వల్ల తెలుస్తూనే ఉంటుంది. ‘పిల్లలంటే ఎందుకు మనందరికీ చిన్నచూపు. ప్రభుత్వ బడులలో, హాస్టళ్లలో వాళ్లు కనీస సౌకర్యాలు లేకుండా ఉంటే మనకు ఎలా మనసొప్పుతుంది’ అడుగుతోంది అర్చన. నిజమే. ఎంతో సంపద ఉన్న రాష్ట్రాలలో కూడా చలికాలం చన్నీటి స్నానాలు చేసే పిల్లలు ఎందరో ఉన్నారు ప్రభుత్వ హాస్టళ్లలో. ‘వెచ్చని దుప్పటి... వేడినీళ్లు ఈ పిల్లల హక్కు’ అని నినదించే వారు అర్చనలా ఎంతమంది. ‘జీవితంలో ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది’ అంటుంది అర్చన.→ చెట్టే చాటుగా...అర్చనది కర్నాటక హసన్ జిల్లాలోని సకలేష్పూర్. ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లోకి వస్తుంది. ఇక్కడంతా గిరిజన జీవితం. మరుగుదొడ్లు అనేవే వారికి తెలియవు. తెలియనివ్వలేదు. ‘మరుగుదొడ్డి ఎలా ఉంటుందో నేను నా పద్నాలుగో ఏట చూశాను. మా నాన్న సకలేష్పూర్ వెటర్నరీ ఆస్పత్రిలో అసిస్టెంట్గా చేసేవాడు. ఆయనతోపాటు వెళ్లినప్పుడు అక్కడ టాయిలెట్ మొదటిసారి చూశాను’ అంటుంది అర్చన. చెప్పుల్లేని నడక, కొబ్బరి చిప్పలో టీ పోసి ఇస్తే తాగక తప్పని వివక్ష... ఇవన్నీ చూసిన అర్చన సోషల్వర్క్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేయాలని నిశ్చయించుకుంది. బెంగళూరులో ఆ చదువు ముగించాక ఒక ఎన్జీఓ స్టడీ కోసం ప్రభుత్వ బడులను చూస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు ఒక్క టాయిలెట్ కూడా లేకుండా అవస్థలు పడటం ఆమెకు తెలిసి వచ్చింది. ‘వారిలో నన్ను నేను చూసుకున్నాను. వారంతా నీళ్లు తాగడమే మానేశారు’ అని చెప్పిందామె. కొంతకాలం ఈ స్టడీ చేసి ఇక యాక్టివిస్ట్గా మారక తప్పదని రంగంలోకి దిగింది అర్చన.→ స్టాండ్ ఫర్ షీఅర్చన స్టాండ్ఫర్షీ అనే ఎన్జీఓను స్థాపించి 2000 సంవత్సరం నుంచి హసన్ జిల్లాలో ప్రభుత్వ బడులలో టాయిలెట్లు ఎలా ఉన్నాయో ప్రచారంలో పెట్టింది. ఒక్కో టాయిలెట్ పరిస్థితి సోషల్ మీడియాలో చూసి జనం కూడా ఆశ్చర్య పోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం బెంబేలెత్తింది. చివరకు 2021లో అర్చన ఒత్తిడి వల్ల ఏకంగా 100 కోట్లు కేవలం టాయిలెట్ల పునరుద్ధరణకు ప్రభుత్వం విడుదల చేసింది. ఇది అర్చన విజయం.→ శానిటరీ వేస్ట్గ్రామీణ, గిరిజన బాలికలకు శానిటరీ నాప్కిన్స్ ఎలా వాడాలి, వాడవలసిన అవసరం ఏమిటి, వాడాక వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి... ఇవన్నీ ఏమీ తెలియక పోవడం వల్ల స్వీయ శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత ఉండటం లేదు. ‘దీని గురించి ప్రచారం చేయడానికి శానిటరీ స్క్వాడ్స్ను తయారు చేశాము. వీళ్లు బడులకు తిరిగి బాలికలకు అవగాహన కలిగిస్తారు’ అని చెప్పింది అర్చన. 2025లో వేల మంది బాలికలకు తగిన చైతన్యం అర్చన స్క్వాడ్స్ వల్ల దొరికింది.→ ఉద్యమిస్తేనే మార్పు‘మన దేశంలో స్త్రీలు, యువత గొప్ప ప్రతిఘటన శక్తి కలిగినవారు. వారిని సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే ప్రజా సమస్యల మీద గొప్ప ఉద్యమాలు లేవనెత్తగలరు. కోర్టుల్లో పిటిషన్ వేసినా గొప్ప మార్పు రాగలదని చాలామందికి తెలియదు. పదిమంది సంతకాలకు కూడా విలువ ఉంటుంది. సామాజిక కార్యకర్తలుగా ప్రజలకు మనం దిశను ఇవ్వాలి. ప్రజల కోసం పని చేయాలి. మనలో మార్పు వస్తేనే వారిలో మార్పు తేగలం’ అంటుంది అర్చన. ఏ సమస్య మీదైతే పోరాడాలో ముందు దాని డేటాను తెలుసుకుని, దాని ఆధారంగా పరిశోధన జరిపి, సమస్యను ప్రజలకు వివరిస్తే ఉద్యమం అదే మొదలవుతుందని అంటుందామె. -
52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్తో మొదటి సంపాదన..!
సోషల్ మీడియా గృహిణులకు వారి అభిరుచులు, రోజువారీ అనుభవాలను డాక్యుమెంట్ చేసి, ఆదాయ వనరులుగా మార్చుకుని, జీవనోపాధి పొందే అవకాశాలను కల్పిస్తోంది. ఇది యువతకే కాదు..50 ఏళ్ల పైబడ్డవారికి గొప్ప ఫ్లాట్ఫామ్. వాళ్లు కూడా వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేస్తున్నారు. అందుకు ఈ 52 ఏళ్ల మణీష పరీక్ ఉదాహరణ. యూట్యూబ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ ఆరు నెలల్లో తొలి ఆదాయం అందుకున్నా అంటూ కూతురు అన్షుల్ పరీక్షతో సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఆమె తన అమ్మ హ్యాపీ మూమెంట్స్ని కెమారాలో రికార్డు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్గా మారడంతో మనిషా వార్తల్లో నిలిచింది. అంతేగాదు ఆ వీడియోకి అంతా ‘కంగ్రాట్స్ ఆంటీ జీ’ అని ప్రేమగా కామెంట్లు పెట్టగా, యూట్యూబ్ సైతం ఆమెను అభినందించడం విశేషం.52 ఏళ్ల వయసులో మనీషా పరీక్ యూట్యూబ్లో కార్టూన్ ఆధారిత రీల్స్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ‘Life Unscripted’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. మన చుట్టూ ఉండే కుటుంబాలలో జరిగే కొన్ని సంఘటనలకే తనదైన హాస్యాన్ని జోడిస్తూ.. కార్టూన్ వీడియోలను రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. వాటికి అనతికాలంలోనే ఆదరణ లభించడంతో వ్యూస్ కూడా పెరిగాయి. ఇలా ఆరు నెలలు తిరక్కముందే సుమారు 42 వేల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుని..యూట్యూబ్ సంస్థ నుంచి తొలిసారి వేతనాన్ని అందుకుంది. అది మనీషాకు జీవితంలోనే మొదటి సంపాదన కావడంతో పట్టరాని సంతోషం కలిగిందామె. ఈ క్రమంలోనే తన సంతోషాన్ని కూతురు అన్షుల్ పరీక్తో పంచుకుంది. ఈనేపథ్యంలోనే తన తల్లి మెమరబుల్ మొమెంట్స్ని వీడియో రూపంలో కెమెరాలో బంధించి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.అంతేగాదు ఆ వీడియోలో అన్షుల్ తన తల్లితో ‘నీ హ్యాపీనెస్కి కారణమేంటమ్మా?’ అని అడగ్గా.. ‘52 ఏళ్ల వయసులో.. జీవితంలో తొలి సంపాదనను యూట్యూబ్ ద్వారా అందుకున్నా. అదీ ఆరు నెలల్లోనే.. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది’ అంటూ సంబరపడిపోయింది మనీషా. ఈ వీడియోకి సుమారు 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Anshul Pareek | Content Creator (@anshul_pareek___) (చదవండి: సోలో బైక్ రైడ్తో..12 జ్యోతిర్లింగాలు చుట్టొచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ అంబిలి సతీష్..!) -
ఆమె... శక్తి
‘నాలోనే శిల ఉంది. నాలోనే శిల్పి ఉన్నాడు’ అనుకుంటారు కొందరు. వారు తమను తాము తీర్చిదిద్దుకుంటారు. లోక ప్రసిద్ధులవుతారు. ట్రబుల్ షూటర్ షెఫాలి గొరాడియ నుంచి టాటా టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సవితా బాలచంద్రన్ వరకు... ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2025 జాబితాలో చోటు సాధించిన మహిళల గురించి...గ్లోబల్ ఫైనాన్స్, మైక్రో ఎకనామిక్స్లో తనదైన ముద్ర వేశారు గీతా గోíపీనాథ్. వాణిజ్యం, పెట్టుబడి, రుణం. వడ్డీరేట్లకు సంబంధించిన కీలకమైన విధాన నిర్ణయాలలో ఆమె పాత్ర ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో తన కెరీర్ప్రారంభించారు. చికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అసిస్టెంట్ప్రోఫెసర్గా పనిచేసిన గీత, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని సమస్యలు, ఆర్థిక సంక్షోభాలపై ఎన్నో పరిశోధన వ్యాసాలు రాశారు. ‘ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్’గా చరిత్ర సృష్టించారు. కోవిడ్ కల్లోల కాలంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి పరిష్కార మార్గాలు ఆలోచించడంలో ఆమె అపార అనుభవం, నైపుణ్యం ఉపయోగపడ్డాయి.విస్తృత అనుభవం... ఆమె విజయ రహస్యంఆర్థికసేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కాకు నఖతే భారత కార్పొరేట్ రంగానికి సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలలో కీలక పాత్రపోషించారు. గతంలో జేపీ మోర్గాన్లో ఇండియా ఆపరేషన్స్ వైస్చైర్మన్గా పనిచేశారు. పద్దెనిమిది సంవత్సరాలకు పైగా డీఎస్పీ మెర్రిల్ లించ్లో వరల్డ్ మార్కెట్స్, ఈక్విటీలలో పెద్ద పదవులు నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా భారతీయ సీఈఓగా పనిచేస్తున్నారు.ట్రబుల్ షూటర్సీఏలో గోల్డ్మెడలిస్ట్ అయిన షెఫాలి గొరాడియా చిన్న, పెద్ద పరిశ్రమలలో పనిచేసి చైర్పర్సన్ స్థాయికి ఎదిగారు. డెలాయిట్ ఇండియా తొలి మహిళగా చైర్పర్సన్గా గుర్తింపు పొందారు. ‘ట్రబుల్ షూటర్’గా షెఫాలికి పేరు. ‘సమస్య ఎంత క్లిష్టంగా ఉంటే, నాకు ఆసక్తి అంత ఎక్కువగా ఉంటుంది. ఒక సమస్యను పరిష్కరించినప్పుడు సరికొత్త ఉత్సాహం వస్తుంది. మరిన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ ఉత్సాహం ఉపకరిస్తుంది’ అంటారు షెఫాలి.ఆ పదవిలో తొలి మహిళప్రసిద్ధ టాటా గ్రూప్తో సవితా బాలచంద్రన్ ప్రయాణం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. బిజినెస్, ఫైనాన్స్, స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి కీలకమైన పదవుల్లో ఉన్నారు. 2000 సంవత్సరంలో టాటా మోటర్స్లో ‘ఇన్వెస్టర్ రిలేషన్స్’ యంగెస్ట్ హెడ్గా పలువురి దృష్టిని ఆకర్షించారు. 2020లో టాటా టెక్నాలజీస్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియామకం అయ్యారు. ఈ పదవిలో నియామకం అయిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 2023లోప్రారంభమైన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కు హెడ్గా పనిచేశారు.వేల పాటల కోకిలమ్మకోకిల గొంతు సునిధి చౌహాన్ 1999 నుండి పదికి పైగా భాషలలో రెండు వేల అయిదు వందలకు పైగా పాటలు పాడారు. ‘మెహబూబ్ మేరే’ ‘ఛాలియా’ ‘ఆజా నాచ్లే’ ‘దేసి గర్ల్’ ‘షీలా కి జవానీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో సింగర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏఆర్ రెహమాన్, విశాల్–శేఖర్, సలీం సులేమాన్లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా... తొలి రోజులనాటి ఉత్సాహం ఇప్పటికీ ఆమెలో ఉంది. అదే ఆమె విజయ రహస్యం.అద్భుత ప్రతిభభారతదేశంలోని అది పెద్ద మానసిక ఆరోగ్య సంస్థ (మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్)లో అత్యున్నత పదవిని చేపట్టిన రెండవ మహిళగా, తొలి మహిళా సైకియాట్రిస్ట్గా ప్రత్యేకత నిలుపుకున్నారు డాక్టర్ ప్రతిమ మూర్తి. కేంద్ర నిధులతో నడిచే ఈ సంస్థకు ప్రపంచం కోవిడ్ బారిన పడిన కాలంలో డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే రెండవ ఎడిషన్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నెల్సన్ మండేలా అవార్డ్ అందుకున్నారు.తానే ఒక బ్రాండ్మీడియా, ఫిల్మ్ కంపెనీలలో పెద్ద పదవులలో పనిచేశారు ప్రేరణ సింగ్. బిజినెస్ మేనేజింగ్, ఫైనాన్స్, బ్రాండింగ్, మార్కెటింగ్లలో పేరు తెచ్చుకున్నారు. పా(2009)తో ఆమె చలన చిత్ర యాత్రప్రారంభమైంది. ఆ సమయంలో రిలయన్స్ బిగ్ పిక్చర్స్ మార్కెటింగ్ అండ్ మీడియాలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ప్రేరణ. ‘హీరామండీ’ అనే షోకి ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్గా వ్యవహరించారు విడుదలైన మొదటి వారంలోనే అత్యధికులు వీక్షించిన భారతీయ సిరీస్గా నిలిచింది హీరామండీ.ఆ రంగంలో మొదటి మహిళఐఏఎస్ ఆఫీసర్ అయిన మోనా ఖండర్ సంక్లిష్టమైన అసైన్మెంట్లపై పనిచేయడంలో ప్రసిద్ధి పొందారు. గుజరాత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మొదటి మహిళగా ప్రత్యేకత సాధించారు. ఆ రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసిసి) పాలసీ 2025–30, సెమీకండక్టర్ పాలసీ 2022–2027 అమలుపై కృషి చేస్తున్నారు.రేణుక... పెట్టు‘బడి’ టీచర్మూడు దశాబ్దాల అనుభవంతో వివిధ రంగాలలో వ్యాపార సంస్థల వృద్ధిలో కీలక పాత్రపోషించారు రేణుకా రామనాథ్. ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మల్టీపుల్ పీఇ’ని స్థాపించి ఆరు కీలక రంగాలలో 30కి పైగా కంపెనీలలో పెట్టుబడి పెట్టారు. రేణుక ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. తన ఇన్వెస్టింగ్ జర్నీలో అనూహ్యమైన మార్కెట్ పరిస్థితులు, సవాళ్లను అ«ధిగమించి అద్భుత పనితీరు కనబరిచే టీమ్లను వెలుగులోకి తీసుకువచ్చారు. ‘మల్టిపుల్స్’కు ముందు ఐసీఐసీఐ వెంచర్(ప్రైవేట్ ఈక్వాటీ ఫండ్స్)కు ఎండీ, సీఈఓగా పనిచేశారు. -
ఛేంజ్ మేకర్స్ 2025
→ డయానా పుండోల్32 ఏళ్ల ఈ ఇద్దరు పిల్లల తల్లి మోటార్ రేసింగ్లో మొదటి మహిళా జాతీయ ఛాంపియన్. ఆమె 2024లో ఎంఆర్ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ను గెలుచుకున్నారు. పురుషులు–ఆధిపత్యం వహించే ఈ క్రీడలో స్త్రీల నుంచి ఇదో పెద్ద ముందడుగు. ఇప్పుడు 2025–2026 ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ సిరీస్లో ΄ోటీ పడుతున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు, ఫెరారీ 296 ఛాలెంజ్ కారును నడుపుతున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేసి, ఇప్పుడు రేసింగ్లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.→ అంజ్లీ అగర్వాల్డాక్టర్ అంజ్లీ అగర్వాల్కు జీవితంలో ఎదురైన లోతైన బాధలెన్నో తెలుసు. కండరాల బలహీనతతో చక్రాల కుర్చీలో జీవిస్తున్నారామె. బహిరంగ స్థలాల్లో ర్యాంప్ లేక΄ోవడం వల్ల అవస్థ పడుతున్న తనలాంటి వేలమంది దివ్యాంగుల కోసం ఆమె ΄ోరాటం సాగిస్తున్నారు. ఆమె, ఆమె బృందం కలిసి వందలాది ప్రజా స్థలాలకు పునః రూపకల్పన చేశారు. ర్యాంప్ ఉండటం వల్ల దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులకు అవగాహన కల్పించారు.→ బీబీ జాన్ కర్నాటకకు చెందిన బీబీ జాన్ చిన్నపాటి లోన్ కోసం బ్యాంక్ వెళితే తనలాంటి వాళ్లకు లోన్ రావడం ఎంత కష్టమో తెలియడమే కాకుండా తనలాంటి వాళ్లు చాలామంది లోన్ల కోసం బాధలు పడుతున్నారని అర్థమైంది. దాంతో ఆమె స్థానిక స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చి 14 మంది సభ్యుల బృందంతో మొదలుపెట్టి నేడు 1,000 మందికి పైగా మహిళల సమష్టి ఎదుగుదలకు కారణమయ్యారు. వారంతా స్వంత మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను నడుపుతూ సేంద్రీయ, వాతావరణ–స్థిరమైన పద్ధతులను ఉపయోగించి 30 గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నారు. -
యాపద్బాంధవులు
ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ యాప్స్కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి...మై సేఫ్టీపిన్క్రౌడ్ సోర్స్ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్ యాప్. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్ ట్రాకింగ్’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్ రూట్, క్విక్ అడిట్, సపోర్ట్ నెట్వర్క్, లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లాంటి కీలకమైన ఫీచర్లు ‘మై సేఫ్టీపిన్’ యాప్లో ఉన్నాయి.నూన్లైట్నూన్లైట్ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్ సేఫ్టీ యాప్. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్ను ప్రెస్ చేయడం ద్వారా మనం ఉన్న స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్ ఆపరేటర్లను మనకు కనెక్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే... ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్స్క్రీన్ బటన్ను నొక్కాలి. సర్టిఫైడ్ ఆపరేటర్లు మనకు టెక్ట్స్ లేదా ఫోన్ కాల్ చేస్తారు. మనం ఉన్న లొకేషన్కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్ షేరింగ్, పీస్ ఆఫ్ మైండ్లాంటి కీలక ఫీచర్లు ‘నూన్లైట్’లో ఉన్నాయి.112 ఇండియా యాప్మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్...112 ఇండియా. ఇది కస్టమర్లను ఒకే నంబర్ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్ రూమ్ లేదా సమీపంలోని వాలంటీర్లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్’ ఫీచర్ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్’ సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లను అప్రమత్తం చేస్తుంది.యూ ఆర్ సేఫ్హ్యాండ్స్–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్కు ఉపయోగపడే పర్సనల్ సేఫ్టీ యాప్... యూఆర్సేఫ్. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్–ఫ్రీ ఎస్వోఎస్: సింగిల్ ట్యాప్ లేదా వాయిస్ కమాండ్తో అలర్ట్స్ను యాక్టివేట్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ అండ్ స్ట్రీమింగ్: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్తో సేఫ్టీ స్కాడ్ (మన సన్నిహిత బృందం)కి షేర్ చేస్తుంది.ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్ చేస్తుంది. సేఫ్టీచెక్స్: లొకేషన్ బేస్డ్ సేఫ్టీ ట్రిగ్గర్స్తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్ అండ్ ఫాల్ డిటెక్షన్: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్ పంపుతుంది.విత్ యూ‘ఐయామ్ ఇన్ డేంజర్’లాంటి మెసేజ్ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్... ‘విత్యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్ పదేపదే రిపీట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్స్ మూమెంట్ను ట్రాక్ చేస్తుంది. ఫోన్ పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ‘విత్యూ’ యాక్టివేట్ అవుతుంది. ‘ఐయామ్ ఇన్ డేంజర్’ ‘ఐ నీడ్ హెల్ప్’ ‘ప్లీజ్ ఫాలో మై లొకేషన్’లాంటి మెసేజ్లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కు పంపుతుంది.షేక్ 2 సేఫ్టీమహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్... ‘షేక్ 2 సేఫ్టీ’. ఫోన్ను షేక్ చేయడం ద్వారా లేదా పవర్బటన్ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్ఎంఎస్/కాల్) పంపుతుంది. ఆఫ్లైన్, లాక్డ్ స్క్రీన్లోనూ పనిచేస్తుంది. యాప్ సెట్టింగ్స్లో ఎమర్జెన్సీ కాంటాక్స్ను యాడ్ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్వోఎస్ మెసేజ్లకు సంబంధించి సైరన్ బట్ యాడ్ చేయవచ్చు. సర్కిల్ ఆఫ్ 6మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్వర్క్ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్ ఆఫ్ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్ వివరాల ప్రీ-ప్రోగ్రామ్డ్ ఎస్ఎంఎస్ను మన సర్కిల్కు పంపిస్తుంది. హాట్లైన్కు వేగంగా యాక్సెస్ అయ్యేలా చేస్తుంది. సింపుల్ ఐకాన్స్, జీపీఎస్ని ఉపయోగించి ‘సర్కిల్’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్ అండ్ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్డ్గా రూపొందించిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వరల్డ్ ఎమర్జెన్సీ అసోషియేషన్... టాప్ 10 ఉమెన్ సేఫ్టీ యాప్స్దిల్లీ పోలీసులు ‘హిమ్మత్ ప్లస్’ అనే ఉమెన్ సేఫ్టీ యాప్ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్ లొకేషన్–షేరింగ్ యాప్...లైఫ్360. లైవ్ లొకేషన్ షేరింగ్, ఎస్వోఎస్ అలర్ట్స్. ప్లేస్ అలార్ట్స్, రైడ్–షేర్ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్ ఎమర్జెన్సీ అసోసియేషన్’ ప్రకటించిన టాప్ 10 సేఫ్టీ యాప్లలో...మై సేఫ్పిన్, నూన్లైట్, లైఫ్ 360, యూఆర్సేఫ్ యాప్లతో పాటు మై ఎస్వోఎస్ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్ అయిన సిటిజన్, ఐయామ్ సేఫ్. గూగుల్ పర్సనల్ సేఫ్టీ, సేఫ్టీ యాప్లు ఉన్నాయి.అక్కలాంటి... అమ్మలాంటి యాప్ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్ లిటిల్సిస్టర్’ వారి యాప్ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్ లిటిల్ సిస్టర్ యాప్’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్’ అనే యాప్ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి. -
లైఫ్ ఎప్పుడూ కొత్త ట్యూన్లోనే
‘కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మహిళగా నన్ను ఒక మూసలోనే ఉండమని చెప్పడానికి ఎవరికేం హక్కుంది? మీకు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి..’ అని ఘాటుగా చెబుతూనే ఈ యేడాది తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులు, హెల్తీగా, ఫిట్గా ఉండటానికి చేసిన ప్రయత్నాలు, రాబోయే కొత్త సంవత్సరంలో చేసుకోదగిన ప్లాన్స్ గురించి సింగర్ శ్రావణ భార్గవి ‘సాక్షి’తో పంచుకున్నారు.కొలంబియన్ యాసలో హిప్ హాప్ రాక్ మ్యూజిక్తో సింగర్ శ్రావణ భార్గవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కొలంబియన్ యాసలో ఉన్న ఒక పూర్తి ఆంగ్ల హిప్ హాప్ ర్యాప్ ట్రాక్ని సోషల్మీడియా ద్వారా తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా పనిచేశాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు దగ్గరగా ఉన్న ఊరిలో ఈ పాటను రెండు రోజుల పాటు షూట్ చేశాం. పాట మొత్తం ఇంగ్లిష్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ డ్రాప్లో మన సంస్కృతి ఉండాలనుకున్నాం.భయాన్ని వదిలేయాల్సిందే! ఈ సాంగ్ థీమ్లో టాక్సిక్ ఫెమినిజం గురించి ఉంటుంది. ఇదో తరహా విషపూరిత సంస్కృతి. అంటే, ఆడవాళ్లు తోటి ఆడవారి గురించి నెగిటివ్గా మాట్లాడటం. దీనిని వ్యంగ్య ధోరణిలో పాట ద్వారా చూపాను. ఉదాహరణకు.. ఒక లైంగిక దోపిడికి గురైన బాధితురాలు ఉంటే సానుభూతి చూపించకుండా ఆ అమ్మాయి గురించే తొందరపడి ఏదో ఒక మాట అనేస్తారు. ఇటీవల అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్లు డ్రెస్సింగ్ మార్చుకోవాలి సరే.. ముందు మగవాళ్లు తమ సెన్స్ మార్చుకోవాలి కదా! .. ఇలాంటి ఒక కాన్సెప్ట్లో రాసిన పాట ఇది. ఎవరైనా ఒక మహిళ ఇండిపెండెంట్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారు అధికంగా ఉంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరుగుతుంటుంది. ‘వాళ్ల మాటలు వాళ్లను మాట్లాడుకోనిద్దాం. నేను ఎందుకు వాటిని పట్టించుకోవాలి’ అనే ఆలోచనకు వచ్చాను. దీనివల్ల మరింత బాగా వర్క్ చేయగలుగుతున్నాను.నేను అనుకున్న థీమ్లో పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడటం నా మెయిన్ వర్క్ అయితే నాతో పాటు కొత్త గ్రూప్ కలిశారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశాను. మన ఎదుగుదలకు దోహదం చేసే స్నేహితులను పెంచుకోవడం చాలా అవసరం. అది నేను ఈ యేడాది నేర్చుకున్నాను. అంతేకాదు, ఈ పాట ద్వారా నాలో ఉన్న అన్ని భయాలు పోయాయి. నా మ్యూజిక్, వర్క్ ద్వారా ఈ యేడాది ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసుకున్నాను.వారి నుంచి అది నేర్చుకున్నానుసోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అదే మనకు థ్రెట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆఫ్లైన్లో ఎలా హద్దుల్లో ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. నేటి యువత ముఖ్యంగా జెన్జి గురించి మనం ఏదో అనుకొని ఆందోళన చెందుతుంటాం. కానీ, వాళ్లు చాలా క్లియర్గా ఉంటున్నారు. ‘నాకు నచ్చింది చేస్తున్నాను’ అనే క్లారిటీ వారికి ఉంది. ‘నో అంటే నో’ అనే చెబుతున్నారు. ఇది వారి నుంచి నేర్చుకున్నాను. ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనను మిస్ అయ్యానే అనిపించింది.బలంగా ఎదగాలని...నా కూతురు పెద్దయ్యాక నన్ను చూసి గర్వంగా ఫీలయ్యేలా నా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల్లో స్ట్రాంగ్ పర్సనాలిటీని పెంచడం అనేది చాలా ముఖ్యం. అది చెబితే రాదు. నన్ను చూసే నా కూతురు నేర్చుకుంటుంది కాబట్టి, నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాను. మేమిద్దరమే సినిమాలకు వెళతాం, ఇద్దరం ఒకేసారి బుక్స్ చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. ఒక నెల రోజులపాటు ఇద్దరం కలిసి యూరప్ దేశాలు తిరిగి వచ్చాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకేలా అనిపిస్తాయి. మా అమ్మ నాన్నలు కూడా ‘నచ్చిన పని చేయ్’ అని ప్రోత్సాహాన్నిస్తారు. అదే పెద్ద బలం. అలాగే, అమ్మానాన్నలు మనల్ని చూసి ధైర్యం తెచ్చుకునేలా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఎదగాలి.ఈ ఏడాది చాలా హెల్దీగా...నాకు నచ్చిన డ్రెస్సులతో రెడీ అవడం చాలా ఇష్టం. అలా ఉండటంలో నేను సంతోషంగా, కాన్ఫిడెంట్గా, మరింత క్రియేటివ్గా ఉంటాను. ఎవరో మాట్లాడుకుంటారు అని నాకు అసౌకర్యంగా ఉన్న డ్రెస్సులో ఉండలేను. ఫిట్గా ఉండటానికి వారంలో నాలుగు రోజులైనా జిమ్కు వెళతాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వర్కౌట్స్ చేస్తాను. పోషకాహారం పట్ల జాగ్రత్త తీసుకుంటాను. దీనివల్ల కిందటేడాదితో పోల్చితే ఈ యేడాది చాలా హెల్దీగా ఉన్నాను. ఆర్థిక విషయాల్లో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపు చేయడంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలాగని, డబ్బు వెంట కాకుండా నచ్చిన పని చేయడంలో ముందుండాలన్నది నా ఒపీనియన్. రాబోయే కొత్త సంవత్సరంలో మరింత క్రియేటివ్గా, మరింత ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను’’ అని నవ్వుతూ వివరించారు ఈ న్యూ హిప్ హాప్ ర్యాపర్.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: గడిగె బాలస్వామి -
ఏఐ.. 2025..ఉమెన్ రైజింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులు కీలకంగా మారాయి.మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రైజింగ్ 2025 సమ్మిట్లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్ల సంఖ్య పెరగడం శుభసూచకం.డీప్–టెక్ డొమైన్లలో...2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్ మాస్టర్ ప్రోగ్రామ్స్లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్లలో మాస్టర్స్ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్ఫామ్ రిపోర్ట్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్లాంటి డీప్–టెక్ డొమైన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్ సెక్యూరిటీ ఎన్రోల్మెంట్స్లో మహిళలు 25 శాతం, జనరేటివ్ ఏఐలో డాక్టోరల్ క్యాండిడేట్స్ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.మార్పు మంచిదే కదా!‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్ మోడల్స్ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ గుప్తా.పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్ కార్యక్రమాలు చేపట్టింది.స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్’ ఇండియా మ్యాగజైన్ సమ్మిట్ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.యశోద ఏఐ అంటే?డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్ ముందుకు వచ్చింది.యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హారిజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.ఎన్సీడబ్ల్యూ, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ (ఎఫ్ఎస్ఎల్) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్ యాప్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎందుకు కీలకం?హ్యాకింగ్, ఆన్లైన్ వేధింపులలాంటి సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్ ప్లాట్ఫామ్లను సురక్షితంగా నావిగేట్ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్లో చేరవచ్చు.‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్. ఏఐ బై హర్...గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్గ్లోబ్ ఇంపాక్ట్ ఛాలెంజెస్...‘ఏఐ బై హర్’ ‘ఏఐ ఫర్ ఆల్’ ‘యువ్ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్సెక్యూరిటీ, విద్య, డిజిటల్ వెల్బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్ క్లైమేట్ రంగాలలో, ఏఐకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ ‘ఏఐ బై హర్’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్–గుడ్ అప్లికేషన్స్’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది.ఎన్ని స్టార్టప్లో!ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్ డేటా ప్రకారం...అక్టోబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫండింగ్కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్లలో కొన్ని... డా.గీతా మంజునాథ్–నిరామయి హెల్త్ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్–మ్యాడ్ స్ట్రీట్ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్బజ్.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్స్క్రిప్ట్.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్ అగర్వాల్–బ్రెయిన్సైట్.ఏఐ. -
ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..
ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగార్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?56 ఏళ్ల అనుగార్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగార్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.మరో విశేషం ఏంటంటే అనుగార్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్మెంట్ కమిషనర్గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన అనుగార్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?) -
ఆనియన్ క్వీన్
వ్యవసాయంలో స్త్రీలు సాధిస్తున్న విజయాలు అందరూ చూస్తున్నవే. అయితే పంట నిల్వలో, వ్యవసాయ పనిముట్లలో ఆవిష్కరణలు చేస్తున్న మహిళలు తక్కువ.నాసిక్లో తండ్రి పండిస్తున్న ఉల్లిపాయ నిల్వ చేస్తే పాడవుతోందని గమనించిన కుమార్తె సొంతగా పరికరాన్ని కనిపెట్టి నిల్వలను కాపాడింది. అంతే కాదు నాసిక్, మహారాష్ట్రల్లో ఉల్లిపాయ గోదాముల నిర్వహణను పూర్తిగా మార్చేసింది. కిసాన్ దివస్ సందర్భంగా ఈనాటి రైతుబిడ్డ కల్యాణి షిండే పరిచయం.‘ఉల్లిపాయలు పాడయ్యాయన్న సంగతి చాలా నష్టపోయాకే తెలుస్తుంది’ అంటుంది కల్యాణి షిండే. 26 ఏళ్ల ఈ రైతుబిడ్డ నాసిక్, మహారాష్ట్రలలో ఉల్లిపాయల నిల్వకు విశేషమైన సహకారం అందించే పరికరాన్ని తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ‘నాసిక్ దగ్గర ఉన్న లాసన్గావ్ మా ఊరు. అది ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల కేంద్రం. మా తాత తండ్రులు, బంధువులు రైతులే. ఉల్లిపాయలు ప్రధానంగా పండిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పంట చేతికి రావడం మార్కెట్ అయ్యేలోపు పాడైతే నష్టం రావడం వింటూనే పెరిగాను. మా ఇళ్లలో నేనే మొదటిసారి బి.టెక్కు వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతూ ఇంటికి ఫోన్ చేస్తే ఉల్లిపాయలు కుళ్లిపోయి నష్టం వచ్చిందని చెప్పేవారు. దీనిని ఆపలేమా... అని రీసెర్చ్లో దిగాను’ అని తెలిపింది ఆమె.కల్యాణి షిండే రీసెర్చ్లో మహారాష్ట్రలోనే కాదు... దేశంలోనే ఉల్లిపాయలకు సరైన గిడ్డంగులు లేవని తెలిసింది. చాలా కేంద్రాల్లో ఓపెన్ గోదాముల్లోనే ఉల్లిపాయలను నిల్వ ఉంచుతారు. ఆధునిక గోదాములు ఉన్నవి తక్కువ. ‘ఉల్లిపాయలు పాడయ్యాయని ఎలా తెలుసుకుంటారని రైతులను అడిగితే దుర్వాసన ద్వారా అని చెబుతారు. కాని దుర్వాసన మొదలయ్యే సమయానికి క్వింటాల్కు 20 శాతం పాడైపోయి ఉంటాయి. ఉల్లిపాయలకు ఆరడుగుల ఎత్తు అరలో నిల్వ చేస్తే ఎత్తు తగ్గి ఐదు అడుగులకు చేరినా ఉల్లిపాయలు పాడయ్యాయని అర్థం. ఈ దశలో 40 శాతం పాడైపోయి ఉంటాయి. మనుషులు దృష్టి, వాసన ద్వారా మాత్రమే ఉల్లిపాయల నిల్వలో నష్టాన్ని తెలుసుకుంటున్నారని నాకు అర్థమైంది. అప్పుడే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్నోవేటర్లుగా తర్ఫీదు ఇచ్చే ఒక సంస్థ గురించి తెలిసింది. అందులో చేరాను. అలా గాలిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా గిడ్డంగిలో ఏ వైపున పంట నష్టం మొదలయ్యిందో తెలుసుకునే పరికరం కనిపెట్టాను. దీనివల్ల ఒక శాతం నష్టం ఉండగానే నిల్వను కాపాడుకోవచ్చు’ అని చెప్తుంది కల్యాణి షింగ్.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. ఈ పరికరాన్ని పదివేల రూపాయలకే తయారు చేసి రైతులకు చేరవేస్తోంది కల్యాణి. అంతేకాదు ఆధునిక గిడ్డంగుల ఏర్పాటులో ప్రయివేటు సంస్థలకు సూచనలు సలహాలు ఇస్తోంది. అందుకే అందురూ ఆమెను ‘ఆనియన్ క్వీన్’ అని పిలుస్తూ ఉన్నారు. రైతు కోసం రైతు బిడ్డలే కాదు ప్రతి విద్యార్థి, సాంకేతిక నిపుణుడు ఆలోచిస్తే మన దేశం మరింత సస్యశ్యామలం అవుతుంది.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. -
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే. -
ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) నుంచి పాసైన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల అమ్మాయి. ఆమె నియామకంతో 93 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు ఆమె నియామకంతో తెరపడింది. 1932లో అకాడమీ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,000కు పైగా ఆఫీసర్ క్యాడెట్లు పాసయ్యారు. వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి. ఈ ఘనతను ఎలా సాధించిందంటే..డెహ్రడూన్లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్గా 23 సంవత్సరాల సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్లు పాసవుట్ పరేడ్ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. సాయి ముత్తాత బ్రిటిష్ సైన్యంలో, తాత భారత సైన్యంలో పనిచేశారు. నాన్న సందీప్ జాదవ్ ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో తరం సైనిక అధికారిగా ప్రయాణం మొదలుపెట్టింది సాయి జాదవ్. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది.మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన సాయి కర్నాటకాలో బెల్గాంతో సహా అనేక రాష్ట్రాలలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ తరువాత సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) పరీక్ష రాసి తన ప్రతిభతో అన్ని దశల స్క్రీనింగ్లలోనూ అర్హత సాధించింది. ఇండియన్ మిలిటరీ అకాడమీలో అందరూ పురుషులే కావడంతో అందులో శిక్షణ పొందిన వారిని ‘జెంటిల్మెన్ క్యాడెట్స్’ అని పిలిచేవారు. ఇప్పుడది ‘ఆఫీసర్ క్యాడెట్స్’గా మారనుంది.‘ఐఎంఎ’లో నిర్వహించిన వేడుకలో సైనిక ఉన్నతాధికారులు సాయి జాదవ్ యూనిఫామ్పై నక్షత్రాల బ్యాడ్జీని పిన్ చేశారు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్గా ర్యాంకింగ్ను కేటాయించారు. చారిత్రక ఘనత సాధించిన సాయి గురించి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించి టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తొలి మహిళగా సాయి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. జూన్ 2026లో డెహ్రాడూన్ ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ’లో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్ను పూర్తిగా మహిళలతో కూడిన తొలి ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనుంది. ఇది చారిత్రక మలుపు అని చెప్పుకోవచ్చు.(చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..) -
ఆమె ఆత్మవిశ్వాసం ఎవరెస్ట్
‘నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను’ అనే మాట తిరుపతమ్మ నోటి నుంచి వినిపించినప్పుడు ఎంతమంది సీరియస్గా తీసుకొని ఉంటారో తెలియదు. ఆమె మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ‘నువ్వు పోటీ చేయడం ఏమిటి!’లాంటి వెక్కిరింపులకు తన విజయంతో దీటైన సమాధానం ఇచ్చారు తిరుపతమ్మ. ఆమె ఎత్తు మూడు అడుగులు. ఆమె ఆత్మవిశ్వాసం... ఎవరెస్ట్ అంత!తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామ చరిత్రలో తొలిసారి విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, సర్పంచ్గా ఘనవిజయం సాధించారు. ఆమెతో పాటు ఆమె ప్యానెల్లోని పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం మహిళలకు, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.రెక్కల కష్టం నమ్ముకొని...తిరుపతమ్మ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం తిరుపతమ్మ, సోదరుడు సుదర్శన్ భుజాలపై పడింది. ఇద్దరు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత తిరుపతమ్మ ఉపాధి హామీ పథకంలో వాచర్గా ఉద్యోగం సంపాదించారు. వాచర్గా పనిచేస్తూ ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు. గ్రామస్తుల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల తలలో నాలుక అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు# ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడిన రోజులు ఉన్నా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.నా విజయ రహస్యం... ఆత్మవిశ్వాసంఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే నా బలం. ఎన్నికలు నాకు కొత్త కావచ్చు. కాని గ్రామ ప్రజలు కొత్తవారు కాదు. వారు నా కుటుంబ సభ్యులు. ‘మంచి చేస్తే మంచే జరుగు తుంది’ అని బలంగా నమ్ముతాను. తమ్ముడు సుదర్శన్ చేసిన సేవలు, ప్రజలకు నాపై ఉన్న నమ్మకం సర్పంచ్గా నా గెలుపుకు కారణం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. – ఇల్లందుల తిరుపతమ్మ– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ -
స్టార్ పేరెంటింగ్
‘పేరెంటింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, ట్వింకిల్ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్ గురించి...మన మూలాల్లోకి...‘గ్లోబల్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కనెక్షన్ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్ ఎలా ఉంటుందో ప్రియాంక పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.తల్లే గురువుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్ చేసిన వీడియోలో సానియ ఇజాన్తో కోర్టులో తిరగడం, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్తో టెన్నిస్ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్ స్టార్గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా అంతే. కుమారుడు ఇజాన్లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్–హ్యాండెడ్. కొడుకు లెఫ్ట్–హ్యాండెడ్. ఒక పాషన్తో ఏడు సంవత్సరాల ఇజాన్ స్ట్రోక్స్ ప్రాక్టిసింగ్ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ఇజాన్ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.ఆమె అడుగు జాడల్లో..పేరెంటింగ్కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్ అలీఖాన్తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.‘కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్.ఆత్మగౌరవంపేరెంటింగ్కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్ ఉమెన్ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్.‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్ అంటే... ‘పేరెంటింగ్ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో బ్యాలెన్సింగ్ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్ మీడియాలో రాస్తూ ఉంటుంది. -
సంచలన విజయం.. ఎవరీ శ్రీలేఖ?
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 101 వార్డులకు జరగిన ఎన్నికల్లో 50 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో తిరువనంతపురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి దక్కింది. అయితే మేయర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మేయర్ రేసులో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగళం వార్డు నుంచి ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.మోదీ స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేరళలో తొలి మహిళా ఐపీఎస్గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాదస్పద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అనేక అంశాలపై బహిరంగంగా స్పందిస్తూ వస్తున్నారు. 2024, అక్టోబర్లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.లెక్చరర్ టు ఐపీఎస్శ్రీలేఖ తిరువనంతపురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత లెక్చరర్గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు సర్వీసులో చేరారు. మహిళలు పోలీసు ఉన్నత ఉద్యోగాల్లో చేరడానికి ఆమె ప్రేరణగా నిలిచారు.తల్లి ప్రోత్సాహంమహిళా ఐపీఎస్ అధికారిగా మొదటి పదేళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువతులు తనను స్ఫూర్తిగా తీసుకోవడం ఆనందం కలిగించే విషయమని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మహిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే తాను ఐపీఎస్ సాధించానని శ్రీలేఖ వెల్లడించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.'రైడ్ శ్రీలేఖ'చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు శ్రీలేఖ. తన పనితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు పనిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గానూ సేవలు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచారణలో భాగంగా దాడులు చేయడానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బట్టబయలు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వచ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.నిందితురాలికి చెంపదెబ్బకేరళ సంచలనం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్ను చెంపదెబ్బ కొట్టి వార్తల్లో నిలిచారు శ్రీలేఖ. ఇలా కొట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ తన చర్యను సమర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒకరిని అప్పట్లో శ్రీలేఖ కలిశారు. తమకు ఈ గతి పట్టించిన దుర్మార్గులను పట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్టమని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేరకు నిందితురాలిని చెంపదెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంపదెబ్బ కొట్టనందుకు బాధ పడుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బహిరంగంగానే ప్రతిఘటించారు.చదవండి: సివిల్స్ విజేతల్లో ఎక్కువ మంది వారే!చిన్ననాటి స్నేహితుడే భర్తశ్రీలేఖ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్గా పనిచేశారు. సేతునాథ్ ఆమె చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా. 'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. -
అందరి అమ్మ అల్కాశర్మ
భగవంతుడి అనుగ్రహాలూ, లీలలూ చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. చాలామందిని దీవించి, వరాలిచ్చి పంపుతుంటాడా... మరికొందరి పట్ల ఆగ్రహించడం ద్వారా చాలామందిని అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అలా ఓ చిన్నారి బిడ్డకు శిక్ష విధించి... ‘‘ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారూ... వాళ్లకు నువ్వు సేవలందించ’’మంటూ ఓ తల్లికి అనాథల బాధ్యతలు అప్పగించాడు. భగవంతుడు ఆదరించకపోతే అదెంత బాధాకరంగా ఉంటుందో అనుభవమైంది కాబట్టి... అలాంటి అభాగ్యులెందరినో ఆమె ఆదరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ తల్లే అల్కా శర్మ. ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ అమ్మ కథేమిటో చూద్దాం. దేవుడెందుకోగానీ... అల్కా శర్మ పట్ల నిర్దయగా ఉన్నాడు. ఆమె కొడుకైన అయాన్కు ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’ – (ఓఎమ్ఎస్) అనే ఓ అరుదైన వ్యాధిని అనుగ్రహించాడు. ఆ వ్యాధి కూడా చాలా చిత్రమైంది. తాను నమ్ముకున్న భగవంతుడే తనను శిక్షించినట్టుగా... తన సొంత వ్యాధి నిరోధకవ్యవస్థ తననే కబళించి దెబ్బతీసే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధి అది. అమాయకమైన చిన్నారులను దెబ్బతీసే ఆ వ్యాధి... ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత లేదా న్యూరోబ్లాస్టోమా అనే నరాల వ్యాధి వచ్చాక బయటపడుతుంది.ఈ వ్యాధి లక్షణాలేమిటంటే..?ఈ వ్యాధి ఉన్నవారి కనుగుడ్లు అత్యంత వేగంగా చకచకా అటు ఇటూ కదిలిపోతుంటాయి. ఈ కండిషన్ను ‘ఆప్సోక్లోనస్’ అంటారు. ఇలా కనుగుడ్లు చకచకా కదలడాన్ని ‘డాన్సింగ్ ఐస్’ (నాట్యం చేస్తున్న కళ్లు)గా కూడా అభివర్ణిస్తారు. దీనినే వైద్యపరిభాషలో ‘నిస్టాగ్మస్’ అంటారు. ఇక కండరాలపై అదుపు ఉండక అవి కూడా వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఫలితంగా కాళ్లూ చేతుల కండరాలపై పట్టు ఉండదు. ఒక్కోసారి నాలుక కండరంపైనా అదుపు ఉండదు కాబట్టి మాట ముద్ద ముద్దగా వస్తుంటుంది. ఇలా కళ్లూ, కాళ్లూ, కండరాలపై అదుపు ఉండని ఈ ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’తో తన బిడ్డను అనుగ్రహించగానే ఓ చిర్నవ్వు నవ్వింది ఆ తల్లి. ‘ఓహో... నాకీ శిక్ష విధించి ఇలాంటి అభాగ్యులెందరి బాధలనో గుర్తించమంటూ నన్ను అనుగ్రహించావా తండ్రీ’’ అంటూ ఆ తల్లి అల్కా శర్మ తన బిడ్డల్లాంటి ఎందరో దివ్యాంగ బిడ్డలకేసి దయగా చూసింది. వాళ్ల బాధలు బాపేందుకు పూనుకుంది. తన భర్త నీరజ్ శర్మ కూడా ఆమె సంకల్పానికి తన చేయూతనిచ్చారు. అప్పటికి తనకున్న బంగారాన్నీ, ఆభరణాలనూ అన్నింటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ తహసిల్లోని ఛత్తర్ అనే చోట దివ్యాంగులైన పిల్లల కోసం ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. ‘ఏంజెల్ డిజేబిలిటీ అండ్ ఆర్ఫనేజ్ హోమ్’ అనే ఆ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టిన నాటి నుంచీ... అంటే 2018 మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 160 మందికి పైగా దివ్యాంగ బాలిబాలికలలకు నివాస ఫిజియోథెరపీ సేవలనూ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలద్వారా సేవలందిస్తోంది అల్కా. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ వైకల్యాన్ని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకునేలా స్వావలంబన సాధించారు. ఇలా తన కొడుకుకు వైకల్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు తనపై అలక బూనినా తాను మాత్రం తన సేవా అసిధారావ్రతాన్ని అదేపనిగా కొనసాగిస్తూ పిల్లలను అనుగ్రహిస్తూనే ఉంది అమ్మ అల్క శర్మ. – యాసీన్ -
ఆ చూపు ప్రపంచంకప్పు దాకా..
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.→ ఆమె కూతురు విజేతఅంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్లో నేపాల్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.→ ప్రధానే స్పందించారుఅంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.→ తండ్రి పారిపోతే...అంజుదాస్కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.→ అమ్మ లేకపోతే...‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్. -
ఆమె కాలాన్ని బంధించింది
చేతిలో కెమెరా...దాని వెనక వేగంగా కదిలే కన్ను...ప్రతి సందర్భానికీ స్పందించే మనసు... ఇవి ఉంటే చాలు...కదిలే కాలాన్ని బంధించి... చాయాచిత్రంగా చరిత్ర పుటల్లో భద్రపరచవచ్చు. ముందు తరాలకు చెదరని తరగని జ్ఞాపకాలు అందించవచ్చు. దృశ్యాన్ని ఫొటోగా మార్చే సాంకేతిక శక్తి కెమెరాకు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న కెమెరామన్ కన్ను అంతకన్నా ముఖ్యం. సకాలంలో స్పందించే హృదయం లేని చేతిలో కెమెరా ఒక బొమ్మ మాత్రమే...అని మాటల ద్వారా కాకుండా తను తీసిన చిత్రాల ద్వారా చెప్పిన అద్భుత ఫొటోగ్రాఫర్ పద్మవిభూషణ్ హొమయ్ వ్యారవాలా. హొమయ్ వ్యారవాలా ఇండియా మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్. భారత దేశం తెల్లదొరల వలసపాలన నుంచి స్వంతంత్ర దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా చెప్పిన తొలి ఫొటోగ్రాఫర్ హొమయ్. పురుషాధిపత్యం అధికంగా ఉన్న ఈ ఫొటోగ్రఫీ రంగంలో హోమయ్ హద్దుల్ని, సరిహద్దుల్ని చెరిపేసి స్వేచ్చా విహంగం. ఆకాశమే హద్దుగా తన వృత్తిలో అనుక్షణం జీవించారు. దేశ చరిత్రలో అపురూప ఘట్టాలను చాయాచిత్రాలుగా మలచి ఆ అద్భుత దృశ్య సంపదను మనకు అందించారు. హొమయ్ ని కేవలం ఓ ఫొటోగ్రాఫర్ గా మాత్రమే కాదు.... గత చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా చూడాలి. ఈ దేశం పరపాలన నుంచి స్వపరిపాలన దాకా చేసిన ప్రయాణాన్ని ఈ దేశ గత చరిత్రను కెమెరా లో బంధించిన వ్యక్తిగా హొమయ్ కు ప్రత్యేక స్థానం దక్కుతుంది.హొమయ్ 1913 డిసెబర్ 9న గుజరాత్ రాష్ట్రం నవ్సారిలో ఓ పర్సి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఓ టూరింగ్ డ్రమా కంపెనీలో నటుడు. తర్వాతి కాలంలో కుటుంబం బోంబేలో స్థిరపడింది. తల్లి ప్రోత్సాహంతో హుమయ్ బోంబే యూనివర్సిటీ, సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. ఆసమయంలోనే ఆమెకు ఫొటోగ్రఫీపై దృష్టి మళ్ళింది. 1941 లో హొమయ్ కు మనీక్షా వ్యారవాలాతో వివాహమయ్యింది. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్, అకౌంటెంట్ గా పనిచేసేవారు. హొమయ్ 1938లో బొంబే క్రానికల్ పత్రికలో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రింట్ మీడియా ప్రధాన స్రవంతిలో , ఇల్యుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ హుమయ్ . డాల్డా 13 అనే మారుపేరుతో ఆమె చిత్రాలు ప్రచురితం అయ్యేవి. ప్రతిరోజూ నగర జీవనంలో అరుదైన దృశ్యాలను ఫొటోలుగా బంధించి పత్రికకు అందించే వారు. ఆ తర్వాత 1940 నుంచి 1970 దాకా ఢిల్లీలో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు పనిచేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం, గాంధీ అంతిమయాత్ర లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిత్రించారు. అలాగే క్వీన్ ఎలిజెబిత్ 2 లాంటి విశిష్ట విదేశీ అతిథులు వచ్చినపుడు వారి చిత్రాలను కెమెరాలో బంధించారు. బ్రిటీస్ పాలన అంతిమదశతో పాటు బారత్ స్వాంతంత్ర్య సంబరాలను చిత్రీకరించారు. స్వాంతంత్ర్య సమర ఘట్టాల చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలుగా మనకు మగిల్చిన హొమయ్ కు రోలిఫ్లెక్స్ కెమెరా అంటే ఇష్టం. ఆమె చిత్రాలు మానవీయ కోణంలో, సహజ చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ నేతల చారిత్రక సందర్భాలతో పాటు వారు నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో సహజ (క్యాండిడ్) చిత్రాలను తీయడంలో హొమయ్ ది అందెవేసిన చేయి. 1970 లో ఫొటోగ్రఫర్ వృత్తినుంచి హొమయ్ రిటైర్ అయ్యారు. 2011 లో ఆమెకు ప్రతిష్టాత్మక పద్మవిభూషన్ గౌరవం దక్కింది. ఎప్పుడూ దుమికే జలపాతంలా చురుగ్గా జీవించిన హుమయ్ తమ రిటైర్ జీవితాన్ని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చాలా ప్రశాంతంగా గడిపారు. హుమయ్ 2012 జనవరి 15న తమ 98వ ఏట ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి మహిళా ఫోటోజర్నలిస్ట్ గా.... 1940 లోనే అప్పటి సమాజంలోని పురుషాధిక్యతను నిలదీసిన ధీర మహిళగా హుమయ్ ను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!
‘నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ధైర్యం ఉండాలి. జీవనోత్సాహం ఉండాలి. అవి రెండూ ఉంటే అన్నీ వస్తాయి’ అంటారు. 52 సంవత్సరాల వీణాదేవి దగ్గర అవి ఉన్నాయి. వీణ 50 శాతం శారీరక వైకల్యం ఉన్న మహిళ. ఆమె తన వైకల్యం గురించి బాధపడుతూ కూర్చోలేదు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి’ అని గట్టిగా అనుకుంది. గత కొన్ని నెలల నుంచి జెప్టో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తోంది.‘కష్టం అనిపించడం లేదా?’ అని ఎవ రైనా అడిగితే... ‘ఖాళీగా కూర్చుంటేనే నాకు చాలా కష్టం’ అని నవ్వుతూ చెబుతుంది. నటి, మోడల్ మలైకా అరోరా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీడియోలో అరోరా వీణతో మాట్లాడుతూ కనిపిస్తుంది.‘ఇలాంటి మహిళను చూడడం నాకు ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటాం. వద్దు. గయ్స్... జీవితం చాలా విలువైనది. ఆమె కస్టమర్ల ఆర్డర్ను డెలివరీ చేయడం లేదు. ఇన్స్పిరేషన్ను డెలివరీ చేస్తోంది’ అని రాసింది అరోరా.ప్రౌడ్ ఆఫ్ హర్’: ‘మహిళలు సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా అధిగమించి తాము అనుకున్నది సాధించగలరు’ ఇలాంటి మాటలతో కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం. -
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
డ్యాన్సర్గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్గా ఎలా అవతరించింది ఆ సక్సెస్ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మాయే బ్రెజిల్కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.బ్రెజిల్లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది. ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్లో ఇంటర్న్షిప్లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్గా అవతరించింది. 2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది. అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది. ఇంటర్న్షిప్ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.Kalshi raised $1B at an $11B valuation.A decade ago, only a few thousand people knew what a prediction market was.Eighteen months ago, most prediction markets were banned - until we overcame the government to set them free.Over the past seven years, our community has opened… pic.twitter.com/hGDkYxkSlh— Tarek Mansour (@mansourtarek_) December 2, 2025 (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని ఏలిన ‘షీరో’ ఇక లేరు: 5 ఆసక్తికర అంశాలు
సాక్షి, ముంబై: టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో దుబాయ్లోని కింగ్స్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత ఈ ఆగస్టు ప్రారంభంలో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.సైమన్ టాటా అస్తమయం పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా , లక్మే మాజీ చైర్పర్సన్ , భారతదేశ బ్యూటీ అండ్ రిటైల్ ల్యాండ్స్కేప్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరంటూ ఆమెకు నివాళులర్పించారు. నా షీరో ఇక లేరంటే చాలా బాధగా ఉంది, "మహిళా వ్యాపార నాయకులలో అగ్రగామి"అని తన సంతాపాన్ని ప్రకటించారు.సైమన్ టాటాకు సంబంధించి ఆసక్తికర సంగతులు.స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించారు సైమన్ నావల్ డునోయర్ 1953లో భారతదేశానికి పర్యాటకురాలిగా వచ్చారు. రెండేళ్ల తరువాత 1955లో ఆమె నావల్ హెచ్. టాటాను వివాహం చేసున్నారు.1960ల ప్రారంభంలో టాటా గ్రూప్తో తన వృత్తిపరమైన అనుబంధాన్ని ప్రారంభించారు.1961లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లక్మే బోర్డులో చేరారు. 1982లో ఆమె చైర్పర్సన్గా నియమితులయ్యారు.భారతదేశ ఆధునిక సౌందర్య సాధనాల రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను "కాస్మెటిక్ క్జారినా ఆఫ్ ఇండియా" అనే బిరుదును దక్కించుకున్నారు.వెస్ట్సైడ్ & ట్రెంట్ రిటైల్ వ్యవస్థాపకురాలుగా ఆమె ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1998లో లక్మీని హిందూస్తాన్ యూనిలీవర్కు విక్రయించిన తర్వాత, సిమోన్ టాటా రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్కు నాయకత్వం వహించారు.తరువాత వె స్ట్సైడ్ను ప్రారంభించి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫ్యాషన్ రిటైల్ చెయిన్గా తీర్చిదిద్దారు. ఇపుడు ఆ తరువాత జూడియో స్టోర్లలోకి విస్తరించింది.లక్ష కోట్ల రూపాయల రిటైల్ అండ్ బ్యూటీ సామ్రాజ్యాన్ని స్థాపించిన సైమన్ చాలా లోప్రొఫైల్మెయింటైన్ చేసేవారు. తన జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి విజయ వంతమైన వ్యాపారవేత్తగా, దార్శనికురాలిగా తన పేరును శాశ్వతం చేసుకున్న గొప్ప మహిళ సైమన్ టాటా.ఆమెకు కుమారుడు నోయెల్ టాటా, కోడలు ఆలూ మిస్త్రీ , మనవరాళ్ళు నెవిల్లే, మాయ , లియా ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
వారానికి ఆరు గంటల పని : సంవత్సరానికి రూ. 4 కోట్లు
హాస్పిటల్లో నర్సుగా పనిచేసే మహిళకు ఆ జీవితం తృప్తినివ్వలేదు. సొంత బిజినెస్ చేయాలనే కోరిక కలిగింది. ఆ ఆలోచనే పట్టుదలగా మారింది. అదే ఆమె జీవితంలో కీలక మలుపునకు దారి తీసింది. ఇపుడు ఏడాది ఏకంగా రూ.4 కోట్లు ఆర్జిస్తోంది. 13 ఏళ్ల పాటు నర్సుగా సేవలందించిన ఆమె మొదలు పెట్టిన బిజినెస్ ఏంటి? ఆమెవిజయ రహస్యం ఏంటి తెలుసుకుందామా?పట్టుదల ఉండాలే గానీ..అమెరికాలోని అరిజోనాకు చెందిన 38 ఏళ్ల కామి (మారు పేరు) ఒక హాస్పిటల్లో బోన్మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో నర్సుగా పనిచేసింది. జీవితం రొటీన్గా, మార్పు కావాలని అని అనిపించింది. ఈ పని నుంచి బైటపడాలంటే ఉద్యోగం మానేసే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చాలా తీవ్రంగా ఆలోచించింది. పెట్టుబడి కోసం ఇల్లు అమ్మాలని భావించింది. వ్యాపారానికి రెండు మూడు వెంచర్లను పరిశీలించింది. చివరికి కొంతమంది స్నేహితులు,బంధువు సలహా మేరకు లాండ్రోమాట్ వ్యాపారాన్ని ఎన్నుకుంది. విదేశాల్లో లాండ్రోమాట్ అనేది కస్టమర్లు తమకు తాముగా బట్టలు ఉతుక్కునే స్వీయ-సేవ లాండ్రీ.నర్స్గా పనిచేయడం చాలా ఇష్టం, కానీ "బెడ్సైడ్ నర్సింగ్ నిజంగా కష్టం" అని పేర్కొంది. లాండ్రోమాట్ కొనుగోలుకు నిధుల కోసం 2020లో తన ఇంటిని విక్రయించింది. మిగిలిన మొత్తం, వాషింగ్ మెషీన్ల లాంటి పరికరాల కొనుగోలు కోసం లోన్లు తీసుకుంది. అలా ఉద్యోగం చేస్తూనే వ్యాపారాన్ని మొదలు పెట్టి అది లాభదాయకంగా మారడంతో నర్సింగ్ను విడిచిపెట్టింది. వ్యాపారం కాస్త పుంజుకోగానే, ఆ ప్లేస్ను పురుద్ధరించి, లాండ్రికి సంబంధించిన బట్టల పికప్, డెలివరీతో సహా సేవలను విస్తరించింది. తద్వారా అప్పులు తీరుస్తోంది.2020 నుండి 2023 వరకు అటు ఉద్యోగం, ఇటు వ్యాపారం రెండింటినీ మేనేజ్ చేస్తూ పూర్తిగా నిబద్ధురాలై పనిచేసింది. ఆకర్షణీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాండ్రోమాట్పైనే దృష్టిపెడుతూ స్థిరమైన కస్టమర్లు,సిబ్బందితో దిన దినాభివృద్ధి చెందుతోంది. లాండ్రోమాట్ గత సంవత్సరం (2024లో) దాదాపు రూ. 4.2 కోట్లు ఆర్జించింది. పక్కనే ఉన్న సెలూన్ నుండి దాదాపు రూ. 24.96 లక్షల అద్దె కూడా సంపాదించింది. అంతేకాదు వారానికి ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే వ్యాపారం మీద దృష్టిపెడుతుంది. వ్యవస్థాపక ప్రయాణం గురించి సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడం ద్వారా అదనంగా 10 గంటలు గడుపుతుంది. సోషల్ మీడియా ద్వారా మరో రూ.18.30 లక్షలు సంపాదిస్తోంది. తన వ్యాపార వృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోతోంది. రెండో లాండ్రోమాట్ సెంటర్ పెట్టడంతోపాటు, రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా పక్కాగా ఉన్నాయంటోంది కామి. View this post on Instagram A post shared by Cami | Laundromat Girl (@laundromatgirlofficial) పరిమిత వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ, ఆమె పాడ్కాస్ట్లు, పుస్తకాలు, పరిశ్రమ ఈవెంట్ల ద్వారాతన నైపణ్యాన్ని మెరుగు పర్చుకుంది. వారాంతాలు, తనకిష్టమైన ప్రయాణాలుకోసం సమయాన్ని కేటాయించే సౌలభ్యాన్ని అందిస్తోంది లాండ్రోమాట్. -
సాహో... సాగర ధీర
సముద్రాన్ని జీవితంతో పోలుస్తారు తాత్వికులు. సముద్రంలో మౌనం ఉంటుంది. కల్లోలం ఉంటుంది. పడి లేచిన కెరటాలు ఉంటాయి. సవాళ్ల విషయంలో భారత నావికాదళం కూడా సముద్రంలాంటిదే. ఆ సవాళ్లను అధిగమించి భారత నావికా దళంలో వివిధ కీలక విభాగాల్లో తొలి మహిళలుగా చరిత్ర సృష్టించిన రోల్ మోడల్స్ గురించి...భారత నావికా యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా కమాండర్గా ప్రేరణ దియోస్థలీ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన ప్రేరణ ‘జీసస్ అండ్ మేరీ కాన్వెంట్’ స్కూలులో చదువుకుంది. నేవీలో పనిచేయాలనే లక్ష్యానికి స్కూలు రోజుల్లోనే బీజం పడింది. సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రేరణ 2009లో నావికాదళంలో చేరింది. ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని ఆమె తమ్ముడు కూడా నావికా దళంలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రారంభ సమస్యలు ఎదుర్కొంది ప్రేరణ. గోవాలో తన మొదటి ఎన్సీసీ సెయిలింగ్ క్యాంప్లో సెయిల్ బోట్ మూడుసార్లు బోల్తా పడింది. అయినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. పట్టుదలతో సెయిలింగ్లో ప్రావీణ్యం సాధించింది. ఒడిశాలోని చిల్కా సరస్సులో జరిగిన సెయిలింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరీర్ తొలిరోజుల్లో సముద్ర నిఘా విమానంలో పరిశీలకురాలిగా శిక్షణ పొందింది. 2012లో చైనా వాణిజ్యనౌకపై సోమాలియ దొంగలు దాడికి దిగినప్పుడు, ఆ దాడిని తిప్పి కొడుతూ చేసిన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ప్రేరణ భారత్ నేవీ విదేశ్ సేవాపతకాన్ని అందుకుంది.నేవీలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్భారత నావికాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యూఎఫ్ఐ)గా చరిత్ర సృషించింది కమాండర్ దివ్యశర్మ. డోర్నియర్ పైలట్లుగా పనిచేసిన మొదటి ముగ్గురు మహిళలలో న్యూ దిల్లీకి చెందిన దివ్యశర్మ ఒకరు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఫ్రంట్లైన్ కార్యకలాపాల కోసం నావికా ఏవియేటర్లకు శిక్షణ ఇవ్వడంలో ఇన్స్ట్రక్టర్లది కీలక పాత్ర.గతంలో ఫిక్స్డ్–వింగ్ విమానాలను నడిపిన దివ్య ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్లలో పైలట్లకు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్ అందుకుంది. న్యూ దిల్లీలోని మాల్వియానగర్కు చెందిన దివ్య కెరీర్ తొలి రోజుల్లో నుంచే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తోంది. డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ (డీవోఎఫ్టీ) కోర్సులో అత్యత్తమ ప్రతిభ చూపింది. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం, అంకితభావానికి గుర్తింపుగా ‘ఫస్ట్ ఇన్ ఫ్లయింగ్’ అవార్డ్ అందుకుంది.నావికా దళంలో నారీశక్తిభారత నావికాదళంలో ఒకప్పుడు మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. అయితే కాలక్రమంలో మహిళల శక్తిసామర్థాల్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి దారులు తెరిచింది ఇండియన్ నేవీ. ఒకప్పుడు మాండోవి, గోవా బ్రాంచ్లలో ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్... మొదలైన వాటిలో పరిమిత పాత్ర పోషించిన మహిళలు కీలకమైన విభాగాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నేవీలో పైలట్, ఫైటర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా... ఎన్నో కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, ప్రిగేట్... మొదలైన ఫ్రంట్లైన్ యుద్ధనౌకలలో మహిళలు విధులు నిర్వహించడం నావికాదళంలో మహిళల పాత్రకు సంబంధించి విప్లవాత్మక అభివృద్ధి. లింగసమానత్వానికి పెద్ద పీట వేయడంలో భారత నావికాదళం ముందు వరుసలో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం భారత నావికాదళం మహిళా అధికారులకు (వైద్యేతర శాఖలు) మెరిట్ ఆధారంగా పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసింది.తొలి మహిళా ఫైటర్ పైలట్భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించింది ఆస్తా పూనియా. ‘మహిళా ఫైటర్ పైలట్తో భారత నౌకాదళంలో కొత్త శకం మొదలైంది’ అన్నారు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకుంది ఆస్తా పూనియా. నాన్–ఫైటర్ ఆపరేషన్లలో మహిళా అధికారులు ఉన్నప్పటికీ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేసింది. ఎన్నో పరిమితుల కారణంగా నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించింది. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.తొలి మహిళా పైలట్ఉత్తర్ప్రదేశ్లోని తిల్హార్కు చెందిన శుభాంగి స్వరూప్ భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది. 2017లో కన్నూర్లోని ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ నుంచి పట్టభద్రురాలైన మొదటి బ్యాచ్ మహిళా అధికారులలో శుభాంగి ఒకరు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేసింది. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందింది. నావికా దళంలో పనిచేసిన తండ్రి కమాండర్ జ్ఞాన్స్వరూప్ శుభాంగికి స్ఫూర్తి.‘నేవీలో పనిచేయడం అంటే మాటలు కాదు. తట్టుకుంటావా?’ అని తండ్రి అడిగినప్పుడు ‘యస్’ అని చెప్పింది శుభాంగి. ఆమె నేషనల్ తైక్వాండో ఛాంపియన్ కూడా.ఆమె అమరత్వంవృత్తి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత వైమానిక దళంలోని తొలి మహిళా అధికారి కిరణ్ షెఖావత్. అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ 2015 మార్చి 24న గోవా తీరంలో జరిగిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ముంబైలో పుట్టిన కిరణ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిజిక్స్లో పట్టా పుచ్చుకుంది. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో చేరడానికి ముందు ఒక ప్రైవేట్బ్యాంకులో పనిచేసింది. తన ఐదు సంవత్సరాల కెరీర్లో దేశంలోని వివిధ నౌకాదళ స్టేషన్లలో విధులు నిర్వహించింది. నేవీలోకి రావాలనుకోవడానికి తండ్రి స్ఫూర్తి. ఆయన నేవీ ఆఫీసర్. రచయిత నికోలస్ స్పార్క్కు కిరణ్ పెద్ద అభిమాని. అతడి అన్నిపుస్తకాలు చదివింది. ఆ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలు చూసింది. కుమార్తె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద ‘లెఫ్టినెంట్ కిరణ్ షెఖావత్’ ఫౌండేషన్ స్థాపించాడు తండ్రి. హరియాణాలోని కుర్తాలలో కిరణ్ షెఖావత్ గౌరవార్థం రెండు ఎకరాల భూమిని షహీద్ పార్క్గా అభివృద్ధి చేశారు. ఈ పార్క్లో కిరణ్ విగ్రహం ఏర్పాటు చేశారు. -
రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం
భారతదేశంలోని అత్యంత విశిష్ట గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ కె లక్ష్మీ బాయి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు నుంచి రూ. 3.4 కోట్లను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్కు విరాళంగా ఇచ్చారు. మహిళలకు క్యాన్సర్ సంరక్షణ సేవలకు గాను ఈ విరాళాన్ని అందించారు. డిసెంబర్ 5న ఆమె 100వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె దానం చేయడం విశేషం.100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న డాక్టర్ కె లక్ష్మీ బాయి తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 3.4 కోట్లను ఒడిశా, క్యాన్సర్తో పోరాడుతున్న మహిళల కోసం గైనకాలజికల్ ఆంకాలజీ యూనిట్ను నిర్మించడానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, ఇది గైనకాలజికల్ ఆంకాలజీ కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయ పడుతుందని, భవిష్యత్ వైద్యులను రూపొందిస్తుందని, ఎంతోమంది మహిళల ఆశలను రెక్కలివ్వాలనేది తన కోరిక అని చెప్పారు. దీంతో పాటు యువతులలో క్యాన్సర్లను నివారించడంలో సహాయపడే కౌమార టీకా డ్రైవ్లకు మద్దతుగా డాక్టర్ బాయి బెర్హంపూర్ ప్రసూతి మరియు గైనకాలజీ సొసైటీకి రూ. 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. భావ్నగర్లోని డాక్టర్ బాయి నివాసంలో ఆమె పూర్వ విద్యార్థులు కొందరు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు హాజరవుతారని భావిస్తున్నారు.యాభై సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లక్ష్మీ బాయి తన క్లినికల్ ప్రావీణ్యం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవప్రదమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు కూడా విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.1926లో డిసెంబర్ 5, జన్మించిన డాక్టర్ లక్ష్మీ బాయి, కటక్లోని SCB మెడికల్ కాలేజీలో మొదటి MBBS బ్యాచ్లో ఉన్నారు. అక్కడినుంచే ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి DGO, MD (ప్రసూతి & గైనకాలజీ) పట్టాలు పుచ్చుకున్నారు. USAలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో MPHని అభ్యసించారు. 1950లో సుందర్గఢ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తిని ప్రారంభించారు. 1986లో బెర్హంపూర్లోని MKCG మెడికల్ కాలేజీలో O&G ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు. -
జేఈఈ ప్రిపరేషన్ నుంచి రాష్ట్రపతి మెడల్ వరకు..!
ఎన్డీఏ ప్రతిష్టాత్మకమైన పోర్టల్స్ 149వ కోర్సు నుంచి సుమారు 329 మంది క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. వారంతా ట్రై సర్వీసెస్ అకాడమీలోని రెండో బ్యాచ్ మహిళలు. మొత్తం 15 మంది మహిళా క్యాడెట్లకు ఈసారి చోటు కల్పించింది డిఫెన్స్ అకాడమీ. వారిలో మొత్తం మెరిట్ ఆర్డర్ పరంగా రాష్ట్రపతి మెడల్ని గెలుపొందిన తొలి మహిళా క్యాడెట్గా ఘనత సాధించిందామె. ఇంతకీ ఎవరామె..? ఆమె ఈ ఘనతను ఎలా సాధించగలిగిందంటే..ఇప్పటి వరకు ఇద్దరు మహిళా క్యాడెట్లు విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఒకరు 148వ కోర్సులో కాగా, మరొకరు 149వ కోర్సులో. ఈ ఏడాది డిపెన్స్ అకాడమీ 149వ కోర్సులో మెరిట్ క్రమంలో గెలుపొందిన తొలి మహిళ సిద్ధి జైన్. దీన్ని మొత్తం మెరిట్ జాబితా, విద్యారంగం, బహిరంగ శిక్షణ, సామూహిక శిక్షణ, అధికారిలాంటి లక్షణాలు, ప్రత్యేక సేవా అంశాలతో కూడిన పనితీరు తదితరాల ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది రాష్ట్రపతి బంగారు పతకాన్ని ఆల్ఫా స్క్వాడ్రన్కు చెందిన అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ దీపక్ కంద్పాల్కి, రాష్ట్రపతి వెండి పతకాన్ని ఆస్కార్ స్క్వాడ్రన్కు చెందిన అకాడమీ క్యాడెట్ కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్రపతి కాంస్య పతకాన్ని కిలో స్క్వాడ్రన్కు చెందిన డివిజనల్ క్యాడెట్ కెప్టెన్ సిద్ధి జైన్లు అందుకున్నారు. ఈ మేరకు పాసింగ్ అవుట్ క్యాడెట్లను ఉద్దేశించి అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ..ఈరోజు పట్టభద్రులవుతున్న రెండవ బ్యాచ్ మహిళా క్యాడెట్లను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. వారిలో సుమారు 15 మంది తమ పురుష సహచరులతో సమానంగా భుజం భుజం కలిపి నిలబడ్డారు. సేవ ఒకే ప్రమాణాన్ని గౌరవిస్తుందనేది ఈ ఘటన పునరుద్ఘాస్తోందని అన్నారు. ఇక వైమానిక దళంలో చేరనున్న సిద్ధి మాట్లాడుతూ.."మేము ఈ శిక్షణలో అనేక ఒడిదడుకులను చవిచూశాం. ప్రతి దశలోనూ మాకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల నుంచి, కుటుబం నుంచి పుష్కలంగా మద్దతు, ప్రేమ లభించింది. అందువల్లే అకాడమీలో సవాలుతో కూడిన శిక్షణ సాధ్యమైందని పేర్కొంది."అలాగే ఎన్డీఏ మహిళా క్యాడెట్లను చేర్చుకోవడాని కంటే ముందు తాను ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఆపై సాయుధ దళాలలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ లక్ష్యంతో నేఐఐటీ జేఈఈ కోసం సన్నద్ధమైనట్లు వెల్లడించింది. అయితే ఇంతలో ఎన్డీలో మహిళా క్యాడెట్ల చేరేలా మార్గం సుగమం కావడం..అందులో తాను చేరడం చకచక జరిగిపోయిందని, పైగా అందుకు తన కుటుంబం పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పుకొచ్చింది. కాగా, యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, ఇండియన్ నావల్ అకాడమీ పరీక్షలకు అర్హత ఉన్న మహిళలు హాజరు కావడానికి ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించగా, ఆగస్టు 2021లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తర్వాత NDAలోకి మహిళల ప్రవేశం సాధ్యమైంది. ఆ నేపథ్యంలోనే 148వ కోర్సులో భాగంగా 2022 జూలై-ఆగస్టులో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ NDAలో చేరింది.(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!) -
ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్
పేరెంటింగ్కు సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్... ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్ అనధికారికంగా కొత్త పేరెంటింగ్ మాన్యువల్గా మారింది. పేరెంటింగ్కు సంబంధించిన సలహాల కోసం పెద్దలు, ఇరుగు పొరుగువారు, వైద్యులు, పుస్తకాల మీద ఆధారపడడం అనేది ఒక విధానం. దీనికి భిన్నంగా ఆన్లైన్ దారిలో వెళ్లడమే ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్.శిశువుకు పాలివ్వడం నుంచి పిల్లలను స్కూలుకు పంపడం వరకు పేరెంటింగ్కు సంబంధించి ఆన్లైన్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనసులోని సందేహాన్ని టైప్ చేస్తే చాలు సెకన్ల వ్యవధిలో వందలాది వీడియోలు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ ప్రత్యేకత ఏమిటంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది.బేబీఫుడ్, రెండు సంవత్సరాల పిల్లలకు కలర్ఫుల్ ప్లేట్స్, సూటబుల్ డయపర్స్... మొదలైన ఎన్నో విభాగాల ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ‘గతంలో పేరెంటింగ్కు సంబంధించి సందేహాలు, సమస్యలు, సవాళ్లు కుటుంబ పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం పేరెంట్స్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి సలహాల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. సోషల్ మీడియా విస్తృతస్థాయిలో పేరెంటింగ్ విధానాలను పరిచయం చేయడంతో, చిన్న కుటుంబాల వారు పేరెంటింగ్కు సంబంధించిన సలహాల కోసం సోషల్మీడియాపై ఆధారపడుతున్నారు. ట్రెండ్ సంగతి ఎలా ఉన్నా, నిజంగా ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ తల్లిదండ్రులకు సహాయపడుతుందా? లేక ఒత్తిడిని పెంచుతుందా?‘కంటెంట్లో కొంత భాగం పరిశోధన ఆధారితమైనప్పటికీ, ఎక్కువ శాతం ట్రెండ్ ఆధారితమైనది. పేరెంటింగ్కు సంబంధించి సలహాలు, సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, పర్సనలైజ్డ్ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్కు ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ సమానం కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్ శిశువు చరిత్ర, స్వభావం, ఆహార అలవాట్లు, ఆరోగ్య అవసరాలు తల్లిదండ్రుల మానసిక పరిస్థితులను అంచనా వేయదు’ అంటున్నారు నిపుణులు. -
ఆకుపచ్చని ఉద్యమం
మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎడారిలాంటి చోట కూడ పచ్చని తోటై పలకరిస్తుంది. మహిళల సారథ్యంలోని ‘వనమాలి గార్డెనింగ్ గ్రూప్’ వాట్సాప్ వేదికగా విశాఖపట్టణంలో మిద్దెతోటల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వనమాలి గార్డెనింగ్ గ్రూప్లో మూడువేలమంది మహిళలు ఉన్నారు. అంతరించిపోతున్న అరుదైన సంప్రదాయ మొక్కలకు జీవం పోస్తున్నారు. గ్రీన్డ్రైవ్స్ నిర్వహిస్తూ రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు...‘పై కప్పు ఇస్తారా...పచ్చగా మార్చేస్తాం, మాకు ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మిద్దె చూపిస్తే చాలు మీకు కావాల్సిన ఆకు కూరలు, కూరగాయలు పండించే మార్గాల్ని చూపుతాం’ అంటున్నారు వనమాలి గార్డెనింగ్ గ్రూపుల నిర్వాహకులు అరుణ అరవల, సరితా మల్ల, జ్యోతి నాదెళ్ల. విశాఖపట్టణంలోని మురళీ నగర్కు చెందిన అరుణ అనే మహిళకు వచ్చిన ఆలోచన మూడువేల మంది మహిళల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆకు పచ్చని ఉద్యమానికి వేదికగా నిలిచింది.అవసరాలు తీరేలా....పర్యావరణానికి మేలు జరిగేలా...వనమాలి గార్డెనింగ్ గ్రూపులో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మన కూరగాయల తోట అనే రెండు గార్డెనింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో నగర వ్యాప్తంగా మూడువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వంట గది వ్యర్థాల నుంచి మొక్కలకు అవసరమైన కంపోస్టు ఎరువును తయారు చేసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అంతరిస్తున్న ఆకుకూరలకు జీవంఅంతరిస్తున్న సాంప్రదాయ ఆకు కూరలు, కాయగూరల పునరుద్ధరణకు ‘వనమాలి గార్డెనింగ్’ వ్యవస్థాపకురాలు ఎ.అరుణ కృషి చేస్తున్నారు. కొండపిండి ఆకు, నల్లేరు, గలిజేరు, పొన్నగంటి కూర వంటి ఆకు కూరలతోపాటు, చెమ్మ చిక్కుడు, ముళ్ల వంకాయలు, ఇతర రాష్ట్రాలకు చెందిన క్లోవ్ బీన్స్, ఫ్యాషన్ ఫ్రూట్, వింగ్డ్ బీన్స్, ఎయిర్ పొటాటో, గుడ్డు వంగ (ఎగ్ బ్రింజాల్), ఎరుపు బర్బాటీ, ఎరుపు తోటకూర, ఎరుపు చిక్కుడు, ఎరుపు బెండ, రెడ్ ముల్లంగి, ఎరుపు బచ్చలి కూరలు, సీమ చింత... మొదలైన వాటిని తన ఇంటి మిద్దెపై పండిస్తున్నారు అరుణ. వీటితో పాటు వైజయంతి మాల, వాటర్ యాపిల్, నోనీ ఫ్రూట్, బిలంబి ఉసిరి, పొట్టి పొట్ల కాయలు, పాన్ మత్తా, మింట్ తులసి, పాండవబత్తి, దాల్చిన చెక్క, అంజీర్, మల్బరీ ఫ్రూట్స్ వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి. వీటిని సంబంధించిన విత్తనాలు, నార్లు పంపిణీ చేస్తున్నారు.వనమాలి సమావేశాలువనమాలి పరిధిలో పదిహేను ఏరియా గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో వంద నుంచి రెండు వందల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఏరియాకి ఇద్దరు ఇంచార్జ్లు ఉంటారు. వీరు ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత సభ్యులకు అవసరమైన సలహాలు అందిస్తారు. విత్తనాలు, కొమ్మలు, మొక్కలు, నారు ఇచ్చి పుచ్చుకుంటారు. సీనియర్ గార్డెనర్స్ సూచనలు తీసుకుంటారు, కొత్త ఐడియాలు నేర్చుకుంటారు. నెలకోసారి గ్రీన్ డ్రైవ్స్ నిర్వహించి రహదారుల పక్కన పార్క్లో మొక్కలు నాటుతున్నారు.కమ్యూనిటీ గార్డెనింగ్‘బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్’్ట కాన్సెప్ట్లో భాగంగా పనికిరాని వస్తువుల్లో నుంచి మొక్కల పెంపకానికి ఉపయోగపడేవాటిని ఎంచుకుంటారు వనమాలి గ్రూప్ సభ్యులు. పాత వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్, బకెట్లు, టబ్స్లో మొక్కలు పెంచుతారు. కమ్యూనిటీ గార్డెనింగ్ను ప్రోత్సహించడానికి అపార్ట్మెంట్ నివాసితుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వనమాలి గార్డెనింగ్ గ్రూప్. ఈ కార్యక్రమాలలో భాగంగా కూరగాయల మొక్కలు, విత్తనాలు పంచుతారు.తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచేలా...ఇరవై ఏళ్ల క్రితం మిద్దె తోట ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మేడ మీద 500 కుండీల్లో మొక్కలు పెంచుతున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే టెక్నిక్ను తెలుసుకుని అమలు చేస్తున్నాను. మేడ పాడవకుండానే తోటను సృష్టించవచ్చు. మా గార్డెనింగ్ గ్రూప్ ద్వారా కొత్త రకాల మొక్కలు, విత్తనాలు పరిచయమయ్యాయి. కేరళ, తమిళనాడు, వాయువ్య రాష్ట్రాల నుంచి వచ్చే అరుదైన కూరగాయలు కూడా మా మేడపై పండిస్తున్నాను. గ్రీన్ క్లైమేట్ ఎం.రత్నం సహకారం అందిస్తున్నారు.– అరుణ అరవల– వి.ఆర్. కశిరెడ్డి, సాక్షి, మురళీనగర్, విశాఖపట్నం -
డిజిటల్ హింసపై యునైట్ ఫైట్
‘బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’ సరదాగా పాడుకున్న పాట. బుల్లిపెట్టెలో ఆ బూచాడు లేకపోవచ్చు. కాని ఇప్పటి బుల్లిపెట్టెలలో (స్మార్మ్ఫోన్స్, ల్యాప్టాప్, ట్యాప్)లలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. మహిళలను లక్ష్యంగా చేసుకొని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ రాక్షడుసుడి పేరు... ‘డిజిటల్ హింసాసురుడు’‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ అగేనెస్ట్ ఉమెన్’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి డిజిటల్ హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది భాగస్వాములు అవుతున్నారు... కాలంతో పాటు మహిళలపై జరిగే హింసా రూపాలు మారుతున్నాయి.‘డిజిటల్ వయోలెన్స్’ అనేది ఇప్పుడు సరికొత్త సాంకేతిక హింస.వైరల్ అయినా ప్రమాదమేనా?!కేవలం రెండు సెకన్ల వీడియోతో ఇటీవల ఇంటర్నెట్ అబ్సెషన్గా మారింది ప్రియంగన. తక్కువ టైమ్లోనే ఈ వీడియో క్లిప్ 50 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు... ఆమె ఏఐ వీడియోలు ఆల్లైన్లో వెల్లువెత్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆమె ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదం వైపు వెళుతుందని గ్రహించిన ప్రియంగన మెల్లగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లను తొలిగించడం మొదలుపెట్టింది. తన వీడియో క్లిప్ వైరల్ కావడం వల్ల ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టిన ప్రియంగన తన ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఇమేజ్ల వల్ల తాను, తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు తెలియజేసింది. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే!అవమానాలు...ఆత్మహత్యలుడిజిటల్ హింస భరించలేక మానసిక సమస్యల బారిన పడుతున్నవారూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. టెక్నాలజీ–ఫెసిలేటెడ్ జెండర్–బేస్డ్ వయోలెన్స్(టీఎఫ్జీబివి) వల్ల మన దేశంలోని ఆన్లైన్ స్పేస్లు మహిళల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని ఒక నివేదిక హెచ్చరించింది. బహిరంగంగా అవమానించడం, అవహేళన చేయడం, బెదిరింపులు... మొదలైన రూపాల్లో మహిళలపై డిజిటల్ హింస జరుగుతోంది. ఫొటోల డిజిటల్ మాన్యుపులేషన్, ఫేక్ ఎకౌంట్స్, సైబర్ బుల్లీయింగ్, కోఆర్డినేటెడ్ ఎటాక్స్.. మొదలైనవి డిజిటల్ హింస తాలూకు వివిధ రూపాలు. అశ్లీల సైట్లు, చాట్ ప్లాట్ఫామ్లలో తాము టార్గెట్ చేసిన మహిళల చిత్రాలను పోస్ట్ చేసి అసభ్య రాతలు రాస్తుంటారు. ‘ఇది నా ఫోన్ నంబర్ కాల్ చేయండి’ అని ఫోన్ నెంబర్ పెడుతుంటారు.ఫిర్యాదు చేయాలా, వద్దా?డిజిటల్ వేదికలలో కొందరు నేరస్థులు మంచి మాటలతో అమ్మాయిలను పరిచయం చేసుకొని, స్నేహం చేస్తారు. ఆ తరువాత రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంత జరుగుతున్నా చాలామంది బాధితులు పోలిస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.‘ఫిర్యాదు చేయడం అనేది మరొకరకమైన హింస. నా దురదృష్టం అని బాధపడి ఊరుకున్నాను’ అంటుంది దిల్లీకి చెందిన ఒక బాధిత మహిళ. పదిమందికి తెలిస్తే పరువు పోతుంది అనుకోవడం, కుటుంబ ఒత్తిళ్లు, న్యాయం జరగదు అనే అపోహల వల్ల చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉంటున్నారు. కొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినా, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు. భద్రతతో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి కారణం అవుతున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు కొన్ని కేసులకు సంబంధించి ఎలా స్పందించాలో పోలీసులకు తెలియడం లేదు.చట్టం ఉన్నా సరే...మన దేశంలో సైబర్ నేరాలను నిరోధించే ప్రధాన చట్టం సమాచార సాంకేతిక చట్టం–2000 (ఐటీ చట్టం) అయితే ఇది ప్రధానంగా ఆస్తి, డేటాకు సంబంధించిన నేరాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.‘మహిళలపై జరిగే డిజిటల్ హింసకు సంబంధించి ఈ చట్టం సమర్ధంగా ఉపయోగపడడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు.‘ఫిర్యాదు అందిన వెంటనే హానికరమైన కంటెంట్ను తక్షణమే తొలగించాలి. ఈ విషయంలో కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగళూరుకు చెందిన ఒక బాధితురాలు.‘డిజిటల్ స్పేస్లను సురక్షితంగా మార్చడానికి తగిన న్యాయ, విధాన సంస్కరణలు, బలమైన చట్టాలు అవసరం. వేగంగా న్యాయం జరగాలి. టెక్ కంపెనీలు తమ వేదికలపై జరిగే హానికి బాధ్యత తీసుకోవాలి’ అంటుంది విద్యావేత్త, రచయిత్రి అమంద. ‘ఆన్లైన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. అలాంటివి జరగకుండా చూడాలి’ అంటోంది ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న జీవని.డిజిటల్ హింసపై వార్జెండర్–ఆధారిత హింసకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ విమెన్ ఇండియా పదహారు రోజుల ప్రచారకార్యక్రమం నిర్వహిస్తోంది. నవంబర్ 25న మొదలైన ఈ ప్రచార కార్యక్రమాలు డిసెంబర్ 10 వరకు కొనసాగుతాయి. ఈ జెండర్బేస్డ్ వయోలెన్స్ వ్యతిరేక క్యాంపెయిన్లో యునెటైడ్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది సినీ నటి, నిర్మాత సమంత.‘మహిళలు, పిల్లలపై జరిగే హింసను అంతం చేయడాకి ఐక్యం అవ్వండి’ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. పెరుగుతున్న ఆన్లైన్ వేధింపుల గురించి సమంత అవగాహన పరుస్తుంది. అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్పై అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న స్టాకింగ్, డాక్సింగ్. డీప్ఫేక్స్, ఇమేజ్ మాన్యుపులైజేషన్పై గట్టిగా గొంతు విప్పుతోంది. ‘హింస అనేది ఇప్పుడు శారీరక హింస మాత్రమే కాదు. అది స్క్రీన్ రూపంలో కూడా వెంటాడుతుంది. మన గొంతులను నొక్కి మౌనంగా చేస్తుంది. మహిళలే లక్ష్యంగా చేసుకునే జరిగే డిజిటల్ హింస వారి భద్రత, గుర్తింపు,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది’ అంటుంది సమంత. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్న సమంత డిజిటల్ హింసకు సంబంధించి తన వ్యక్తిగత చేదు అనుభవాలను పంచుకుంటుంది. క్యాంపెయిన్లో భాగంగా ‘వీడియో మెసేజ్’ను విడుదల చేసింది ‘యూఎన్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్లకు జవాబుదారీతనం పెరగాలి. రక్షణ చట్టాలను బలోపేతం చేయాలి’ అంటుంది సమంత.ఐశ్వర్య... హైకోర్టు వరకుతన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించింది బాలీవుడ్ సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్. దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజñన్స్(ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారని, అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని తన పిటిషన్లో తెలియజేసింది ఐశ్వర్య. తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ‘ఐశ్వర్య ఫొటోలు దురిన్వియోగం చేయడం అనేది ఆమె గౌరవ, ప్రతిష్ఠలను దెబ్బతియడమే’ అని పేరొన్న న్యాయస్థానం పిటిషన్లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని గూగుల్తో సహా రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆదేశించిది. -
రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
రోజుకు రూ.20 సంపాదన నుండి రూ.300 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ను నిర్మించగలమైనా ఎవరైనా కలగంటారా? కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గొప్ప వ్యాపారవేత్తగా నిలిచింది. చిన్న చినుకులా మొదలై, ప్రభంజనం సృష్టించిన ‘చిను కలా’ స్టోరీ వింటే... ఆత్మవిశ్వాసం, పట్టుదల , కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది.ఆమె ఏ బిజినెస్ కోర్సూ చదవలేదు. ఆమె జీవితమనే విశ్వవిద్యాలయంలోనే ప్రతీదీ నేర్చుకున్నారు. నో కార్పొరేట్ సపోర్ట్. నో గాడ్ఫాదర్ నో ప్లాన్ బి . ఎలాగైనా సాధించాలనే తపన, ఆశ, కల, నమ్మకం. కేవలం 36 చదరపు అడుగులు. ఒకే నగల ట్రే. కట్ చేస్తే.. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్తో ఒక లగ్జరీ బ్రాండ్తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే అన్నట్టుగా ఎన్నో భయంకరమైన అనుభవాలనుంచి ఎదగి ఉన్నత శిఖరాలకు చేరింది. తన బ్రాండ్ చిను కళాను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్గా నిలిపింది. అక్టోబర్ 10, 1981న ముంబైలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది చిను. ఏడాది వయసున్నప్పుడే ఆమెను తల్లి విడిచిపెట్టి సౌదీకి వెళ్లిపోయింది. తండ్రి, రెండో పెళ్లి చేసుకొని సవతి తల్లిని తీసుకొచ్చాడు. కష్టాలు మొదలయ్యాయి. చినుతోవాగ్వాదం సందర్భంగా నీ యిష్టం వచ్చినట్టు నువ్వు బతకాలనుకుంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు.అంతే 15 ఏళ్ల చిను జేబులో కేవలం రూ. 300 మరియు కొన్ని బట్టలతో ఇంటి నుండి బయలుదేరింది. ఆమె టికెట్ లేకుండా నానాసుపారా నుండి సెంట్రల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ పడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె పడుకోలేకపోయింది. మరుసటి రోజు తాను ఎక్కడికి వెళ్లాలో, ఏమి తినాలో అర్థంకాక రాత్రంతా ఏడ్చింది, ఉదయం, ఒక మహిళ ఆమె కథ విని, కమిషన్ సంపాదన కోసం ఇంటింటికీ తిరిగి అమ్మే పనిని ఒకదాన్ని అప్పగించింది. ఏదో ఒకపనిచేసుకని, కడుపునింపుకుంటూ గౌరవంగా బతుకుతూ పైకి ఎదగాలని విజయం సాధించాలని అప్పుడే దృఢంగా నిశ్చయించుకుంది.డోర్-టు-డోర్ సేల్ ద్వారా సేల్స్గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. అలా రోజుకు 25 రూపాయలు వసూలు చేసే వసతి గృహంలో నివసించింది. ఆమె మొదటి అమ్మకాల ప్రయత్నంలో, ఒక మహిళ ఆమె ముఖం మీద తలుపు వేసేసింది. అలా గంటల తరబడి గుండెలు పగిలేలా ఏడ్చింది కానీ వదులుకోలేదు. వెయిట్రెస్, రిసెప్షనిస్ట్ మొదలైన వివిధ ఉద్యోగాలను చేపట్టింది. కీలక మలుపు 2002లో ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్లో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం సంపాదించడంతో చిను జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇక్కడ ఆమె తన కాబోయే భర్త అమిత్ కళను కలుసుకుంది, అతను MBA హోల్డర్, ఆమె వ్యవస్థాపక ప్రయాణంలో కీలకమైన మద్దతుదారుగా మారారు. వారు 2004లో వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లారు, అక్కడ చినుకు మోడలింగ్ పట్ల ఉన్న ప్రేమ ఆమెను 2008 గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పోటీ పడేలా చేసింది, అక్కడ ఆమె టాప్ 10లో నిలిచింది. ఈ సమయంలో చిను ఉపకరణాలు , ఆభరణాల గురించి నేర్చుకుంది.తన మోడలింగ్ అనుభవాల నుండి ప్రేరణ పొందిన చిను, కార్పొరేట్ మర్చండైజ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఫోంటే కార్పొరేట్ సొల్యూషన్స్ను స్థాపించింది. ఆ కంపెనీ త్వరగా ఆదరణ పొందింది, సోనీ, ESPN, ఎయిర్టెల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు వస్తువులను ఉత్పత్తి చేసింది. 2014లో, స్టైలిష్ మరియు బ్రాండెడ్ ఉపకరణాల కోసం భారతీయ ఆభరణాల మార్కెట్లో అంతరాన్ని గుర్తించి, ఆమె రూబన్స్ యాక్సెసరీస్న రూ. 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. రూబన్స్ యాక్సెసరీస్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్లో 36 చదరపు అడుగుల చిన్న స్థలంలో ప్రారంభమైంది. అది కాస్తా బెంగళూరులోని చాలా ప్రసిద్ధ మాల్ ఫోరం మాల్లో తన రెండవ స్టోర్ను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. అలా మొదలై చిను ప్రయాణం వినియోగదారుల ఆదరణతో కొత్త పుంతలు తొక్కింది. వినియోగదారుల అవసరాలపై విస్తృతమైన పరిశోధనల చేసిన 80 శాతం ప్రత్యేకమైన, స్పెషల్ డిజైన్లు రూపొందించింది. అలా పాశ్చాత్య , జాతి అభిరుచులకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది. ఈ వ్యూహంతో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. 2014 నాటికి, రూబన్స్ యాక్సెసరీస్ రూ. 56 లక్షల ఆదాయాన్ని సాధించింది. 2022 నాటికి రూ. 35 కోట్లకు పెరిగింది. ఈ బ్రాండ్ ఐదు ఆఫ్లైన్ స్టోర్లకు విస్తరించింది,ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పాపులర్ అయింది. అమ్మకాలలో 75శాతం ఆన్లైన్లో నడిచాయి. ఒక దశలో మింత్రాలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది.2023లో, రూబన్స్ యాక్సెసరీస్ వార్షిక ఆదాయంలో రూ. 65 కోట్లకు చేరుకుంది. ప్రముఖ టీవీ షో "షార్క్ ట్యాంక్ ఇండియా" సీజన్ 2 నుండి ఆమె రూ. 1.5 కోట్ల నిధులను పొందింది. IIM అహ్మదాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రసంగాలు చేసింది. పాఠశాల విద్య పూర్తి చేయకపోయినా, చిను నికర విలువ ఇప్పుడు రూ. 40 కోట్లుగా ఉంది.ఆమె బ్రాండ్ 40 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందించింది నమ్మశక్యం కాని రూ.310 కోట్లను దాటింది. ఇంతటితో ఆమె ప్రయాణం ఆగిపోడం లేదు. తన బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన ఆభరణాల బ్రాండ్గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇటీవల ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అనంత క్యాపిటల్, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ మాతృ సంస్థ ఫోంటే ఫ్యాషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. -
క్లీన్ ఎనర్జీ స్టార్స్..!
వ్యాపారం ద్వారా లాభం పొందాలి...అలాగే పర్యావరణానికి, సమాజానికి మేలు చేకూర్చాలి. ఈ రెండు విధానాలను వ్యాపారంలో చేర్చడం పెద్ద సవాల్. పర్యావరణహిత వ్యాపారాలు చేస్తూ ఎకో ఎంట్రప్రెన్యూర్లుగా రాణిస్తున్నారు నేటి మహిళలు. క్లీన్ ఎనర్జీ స్టార్టప్స్తో దేశంలోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు: ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రియా మజుందార్ సింఘాల్భారతదేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద స్థిరమైన ప్యాకేజింగ్ కంపెనీ అయిన ‘ఎకోవేర్ సొల్యూషన్స్’ వ్యవస్థాపకురాలు రియా మంజుదార్ సింఘాల్. ముంబయ్వాసి అయిన రియా బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారుచేస్తుంది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత నారీ శక్తి పురస్కారం అందుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో యంగ్ గ్లోబల్ లీడర్, ఉమెన్ ఎంపవర్మెంట్– క్లీన్ ఎయిర్ జాతీయ కమిటీ సభ్యురాలు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదువుకున్న రియా భారతదేశంలో ప్లాస్టిక్ ముప్పును పరిహరించే ఏకైక లక్ష్యంతో ‘ఎకోవేర్ సొల్యూషన్స్’ను స్థాపించింది. ప్లాస్టిక్ను పూర్తిగా కంపోస్ట్ చేయగల ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఫుడ్ ప్యాకేజింగ్ పరిశ్రమను బ్రేక్ చేసింది. వ్యవసాయ పంటల వ్యర్థాల నుండి ఎకోవేర్ తయారవుతుంది. వాయు కాలుష్యాన్ని నివారిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ సర్వీస్ ఆపరేటర్ అయిన ఇండియన్ రైల్వేలను ఎకోవేర్ బయోడిగ్రేడబుల్స్ ట్రేలకు మారేలా ఒప్పించడం రియా సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. అజైతా షాగ్రామీణ భారతావనిలోని ఇళ్లకు అధిక నాణ్యత, స్వచ్ఛమైన శక్తితో నడిచే సౌర దీపాలు, కుకింగ్ స్టౌలు.. వంటి ఉపకరణాలను అందించడానికి ‘ఫ్రాంటియర్ మార్కెట్స్(క్లీన్ ఎనర్జీ)’ను స్థాపించింది. మహిళా వ్యవస్థాపకుల నెట్వర్క్ ద్వారా అమ్మకాలు, సేవలను కొనసాగిస్తుంది. అజైతా క్లీన్ ఎనర్జీ యాక్సెస్ ప్రపంచానికి కొత్తేమీ కాదు, ఫ్రంటియర్ మార్కెట్స్కు ముందు భారతదేశం అంతటా 10,000కు పైగా గ్రామాల్లో 13 లక్షలకు పైగా మహిళలకు సేవలందిస్తూ, ఏడేళ్లుగా మైక్రోఫైనాన్స్ రంగంలో పనిచేశారు.గ్రామాల్లో సరైన విద్యుత్తు అందుబాటులో లేదన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని ఫ్రాంటియర్ మార్కెట్లను ప్రారంభించింది. గ్రామీణ కుటుంబాలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ క్లీన్ ఎనర్జీ వినియోగదారులలో 70 శాతం మహిళలే ఉన్నారు. నీలిమా మిశ్రాఒడిశాలోని భువనేశ్వర్లో వ్యర్థాల నిర్వహణ రంగంలో ఒక విప్లవాత్మక స్టార్టప్ ద్వారా సంచలనం సృష్టిస్తోంది. పర్యావరణ స్పృహ కలిగిన నీలిమా రబీ నారాయణ్ మిశ్రా స్థాపించిన ‘సీబా గ్రీన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సస్టెయినబిలిటీలో ఒక ఉద్యమం. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఈ స్టార్టప్ ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా చేర్చింది. 2019లో నెలకొల్పిన ఈ స్టార్టప్ తన అనుభవాలనుండి పుట్టుకువచ్చిందని చెబుతుంది నీలిమా మిశ్రా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టాలు పొందిన నీలిమ‘సీబా గ్రీన్’ ద్వారా వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వ్యర్థాలను సేకరించడం, సేంద్రీయ వ్యర్థాలను విలువైన కం΄ోస్ట్గా మార్చడం, రీ సైక్లింగ్ను సులభతరం చేస్తూ పరిశుభ్రమైన నగరాలకు ఊపిరి ఊదుతుంది.ఆర్తి రాణా తరు ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన ఆర్తి రాణా తరు 350 స్వయం సహాయక సంఘాలలోని పదివేల మంది మహిళల ద్వారా చేత చేనేత ఉత్పత్తులను తయారు చేయిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థల మద్దతుతో ఆరేడేళ్లలో వేల మందికి చేరువయ్యింది ఆర్తి. మొదట ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో సాధారణంగా కనిపించే పొడవైన, దృఢమైన గడ్డితో బుట్టలు, పెన్ స్టాండ్లను తయారు చేశారు. ఇవి వారి చేనేత వస్త్రాలతో పాటు ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్లో ప్రజాదరణ పొందాయి. సస్టెయినబిలిటీ సాధించడం, మహిళల్లో స్వావలంబనను ప్రోత్సహించడంలో ఆర్తి రాణా 2020లో నారీ శక్తి పురస్కార్తో పాటు మరెన్నో సత్కారాలూ అందుకుంది.(చదవండి: కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!) -
నవంబర్ నవ శక్తి
ఇంకో మూడు రోజుల్లో... ‘ఇక సెలవా మరి’ అని నవంబర్ నెల చరిత్రలో కలిసిపోనుంది. అయితేనేం. మహిళల క్రీడా ప్రపంచానికి సంబంధించి ఈ మాసం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోనుంది. మహిళ వన్డే వరల్డ్కప్ను టీమ్ ఇండియా గెల్చుకోవడం, తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ను మన అమ్మాయిలు సాధించడం, భారత మహిళల కబడ్డీ జట్టు వరల్డ్ కప్ను చేజిక్కించుకోవడం... ఒకే నెలలో మూడు చారిత్రక విజయాలు. ఇవి గాలివాటు విజయాలు కాదు. ఎన్నో సంవత్సరాల కష్టానికి దక్కిన అపూర్వ ఫలితాలు. ఈ విజయాల్లో నుంచి సిము దాస్లాంటి పేదింటి బిడ్డలు ప్రపంచానికి ఘనంగా పరిచయం అయ్యారు...నవంబర్ 2న నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్కప్ను గెలుచుకున్న క్షణం దేశాన్ని ఉత్తేజపరిచింది. ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తినిస్తుంది అన్నట్లుగా ఆ విజయం బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్కు బలమైన స్ఫూర్తిని ఇచ్చింది.తొలిసారే...చారిత్రక విజయం!అంధ మహిళా క్రికెటర్ల కోసం క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా(సీఏబీఐ) మొదటిసారిగా టీ 20 వరల్డ్కప్కు శ్రీకారం చుట్టింది. ఇండియా బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ తొలి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీపిక సారథ్యంలోని జట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా విజయం దిశగా దూసుకుపోయింది.ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయంభారత జట్టులో చోటు సంపాదించడానికి అనేక సవాళ్లను అధిగమించిన అమ్మాయిలు బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్లో ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఏళ్లకు ఏళ్లు ప్రాక్టిస్ చేసిన వారు కాదు వారు. గత కొన్ని సంవత్సరాలలో మాత్రమే క్రికెట్ నేర్చుకొని అందులో ప్రావీణ్యం సాధించారు.మన టీమ్ వరల్డ్ కప్ను గెల్చుకోవడం దేశవ్యాప్తంగా ఎంతోమంది దివ్యాంగ మహిళలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా, ‘మేము సైతం’ అంటూ ఆటల్లో దూసుకుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.‘దివ్యాంగులు క్రికెట్ లేదా ఇతర క్రీడల్లోకి అడుగు పెట్టడానికి ఈ విజయం స్ఫూర్తిని ఇచ్చింది’ అంటున్నారు మన దేశంలోని అంధుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మహంతేష్.ధైర్యమే వజ్రాయుధమై...కర్నాటకలోని తుమకూర్కు చెందిన దీపిక టీసి చిరునవ్వు లేకుండా మాట్లాడడం అరుదైన దృశ్యం. చిరునవ్వు ఆమె సహజ ఆభరణం. ఆత్మవిశ్వాస సంతకం. ‘నేను బడికి వెళ్లింది క్రికెట్ ఆడడానికి కాదు. అంధత్వంతో కూడా హాయిగా ఎలా జీవించవచ్చో తెలుసుకోవడానికి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది కెప్టెన్ దీపిక. రైతు అయిన ఆమె తండ్రి చిక్కతిమప్ప... ‘ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’ అని చెబుతుండేవాడు. ఆటలో అది తనకు ఒక మంత్రంలా, వజ్రాయుధంలా పనిచేసింది. జయాపజయాలను అధిగమించేలా చేసింది. ‘బ్లైండ్ క్రికెట్ అనేది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంటుందనే విషయం నాకు చాలా కాలం వరకు తెలియదు’ అని ఒకప్పుడు చెప్పిన దీపిక టీమ్ను విజయపథంలోకి తీసుకువెళ్లి వరల్డ్కప్ గెల్చుకోవడంలో కెప్టెన్గా కీలక పాత్ర పోషించింది.సంజు...స్టార్ రైడర్రైడర్ స్థానంలో ఉండడమంటే ఆత్మవిశ్వాసంతో ఉండడం, చాలా చురుగ్గా ఉండడం. మెరుపు నిర్ణయాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడం. ఈ లక్షణాలన్నీ సంజు దేవిలో ఉన్నాయి. అందుకే ఆమె మహిళల కబడ్డీ జట్టులో స్టార్ రైడర్గా దూసుకుపోతోంది.మన టీమ్ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ను గెల్చుకోవడంలో సంజుదేవి కీలక పాత్ర పోషించింది. ‘కబడ్డీ అమ్మాయిల ఆట కాదు’ అనుకునే ఛత్తీస్గఢ్లోని కోర్బ ప్రాంతానికి చెందిన సంజు దేవి స్వరాష్ట్రంలోనే కాదు ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. మహిళల కబడ్డీ వరల్డ్కప్ కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇండియన్ నేషనల్ టీమ్కు ఎంపికైన తొలి మహిళగా తన ప్రత్యేకత నిలుపుకుంది సంజుదేవి.చిన్నప్పటి నుంచే కబడ్డీలో అద్భుత ప్రతిభ చూపేది సంజు. 6వ ఏసియన్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. బిలాస్పూర్లోని ఉమెన్స్ రెసిడెన్షియల్ కబడ్డీ అకాడమీలో చేరడం సంజుకు టర్నింగ్ పాయింట్గా మారింది. దిల్ కుమార్ రాథోడ్లాంటి కోచ్ల దగ్గర కబడ్డీలో పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలే ఆమె విజయానికి మెట్లు అయ్యాయి. పేదింటి బిడ్డకు పెద్ద పేరు వచ్చింది‘మా విజయం ఎంతోమంది అంధ అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తుంది’ అంటుంది అస్సాంకు చెందిన బ్లైండ్ క్రికెటర్ సిము దాస్. ఈ విజేత ఎన్నో కష్టాల రహదారుల్లో నుంచి నడిచి వచ్చింది. ‘బిడ్డ అంధురాలు’ అని తెలుసుకున్న సిము దాస్ తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిముకు తల్లే అన్నీ అయింది. కొంతకాలానికి తల్లి మంచం పట్టింది. రోజుకు రెండు పూటలా భోజనం కష్టం అయింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడికి నిరంతర సహాయం అవసరం. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినప్పటికీ సిము ఒక కలను నిలబెట్టుకుంది. తాను ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది అసాధ్యం అనిపించే కల. కాని సిము ఎక్కడా వెనకడుగు వేయలేదు. క్రికెట్ తన పాషన్ మాత్రమే కాదు జీవితం అయిపోయింది. క్రికెట్పై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ఆమెకు సలహాలు ఇచ్చేవారు లేరు. ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు లేరు. ఎలా ప్రారంభించాలో, ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. ‘బ్యాటిల్ ఫర్ బ్లైండ్నెస్’ సంస్థతో సిముకు అండ దొరికింది. ఉచిత వసతి, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం ఆమెకు ఎంతగానో నచ్చింది. ‘నేను క్రికెటర్ కావాలనుకుంటున్నాను’ తన మనసులోని మాటను బలంగా చెప్పింది. ‘మేమున్నాం’ అంటూ సంస్థ ఆమె భుజం తట్టింది. క్రికెట్లో శిక్షణ ఇప్పించింది. అంకితభావం, కష్టంతో భారత జట్టులో స్థానం సాధించింది సిము. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబిఐ) భారతదేశం, నేపాల్ల మధ్య నిర్వహించిన మహిళా క్రికెట్ సిరీస్లో సిము ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది. -
Fatma Bosch: అవమానాల నుంచి అందాల కిరీటం వరకు...
ప్రపంచానికి మాత్రం ధగధగలాడుతూ వెలిగిపోతున్న ఆమె కిరీటం కనిపించవచ్చు. అయితే ఆ వెలుగుల వెనుక కనిపించని చీకట్లు ఎన్నో ఉన్నాయి. ‘డిస్లెక్సియా’ వల్ల ఆమె బాల్యం అవమానాలు, అవహేళనలతో నిండిపోయింది. అయితే ఆ అవమానాలను గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోలేదు ఈ మెక్సికో సుందరి. ‘ఆ అవమానాలే లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’ అంటుంది 74వ మిస్ యూనివర్స్ పోటీలో విశ్వసుందరి కిరీటాన్ని గెల్చుకున్న ఫాతిమా బాష్. ఆమె ఇంటి పేరు ‘బాష్’కు అడవి అని అర్థం. అడవిలో ‘పచ్చదనం’ అనే సానుకూల శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే ప్రతికూలతలను అధిగమించి అందాల కిరీటాన్ని గెలుచుకుంది.ఫాతిమా బాష్ బాల్యం అందరిలా ఉండేది కాదు. ‘మాట్లాడినా వెటకారాలే... మాట్లాడకపోయినా వెటకారాలే’ అన్నట్లుగా ఉండేది. డిస్లెక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ)తో బాధ పడుతున్నట్లు ఆరేళ్ల వయసులో నిర్ధారణ అయింది. తోటి పిల్లలు ఎప్పుడూ ఫాతిమాను అవమానిస్తుండే వారు. ఉపాధ్యాయులు కూడా ఏదో రకంగా తిడుతూనే ఉండేవారు.అమ్మో... అల్లరి పిల్ల!ఫాతిమా ఇంటికి వస్తుందంటే చుట్టాలు, పక్కాలు భయపడి పోయేవాళ్లు, ఎందుకంటే ‘ఏడీహెచ్డీ’ వల్ల ఆమె తెగ ఆల్లరి చేస్తుండేది. అది భరించడం ఇతరులకు కష్టంగా ఉండేది. ఆమె అతి చురుకుదనం అందరికీ సమస్యగానే ఉండేది. స్కూలుకు వెళుతున్న మాటేగానే...‘డిస్లెక్సియా’ అనే అభ్యాస వైకల్యం వల్ల చదవడం, రాయడం, పాఠాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడేది.కాలమే దారి చూపింది‘ఎందుకు ఇలా?’ అని సీరియస్గా విశ్లేషించుకునే వయసు కాదు. వయసు పెరుగుతున్న క్రమంలో తన గురించి తనకు అర్థం అవుతూ వచ్చింది. అయితే ఫాతిమా ఎప్పుడూ నిరాశకు గురి కాలేదు. సానుకూల ఆలోచనలు ఆమెకు బలాన్ని ఇచ్చాయి. ‘ఏదో ఒకటి సాధించాలి. అప్పుడు నాతో అందరూ చక్కగా మాట్లాడతారు’ అని తెలిసీ తెలియని వయసులోనే అనుకుంది. ఏం సాధించాలో తెలియదు. ఎలా సాధించాలో తెలియదు. అయితే కాలమే ఆమె ముందు దారులు పరుస్తూ వెళ్లింది.సామాజిక సేవలో...ఎంత ఇబ్బందిగా ఉన్నా చదువుకు మాత్రం దూరం కాలేదు. మెక్సికోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. క్యాన్సర్ బాధితులైన పిల్లలకు అండగా నిలవడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది.ఆ రోజు రానే వచ్చింది!మెక్సికన్ రాష్ట్రం టటాస్కోలోని టీపా అనే చిన్న పట్టణంలో జన్మించింది ఫాతిమా. టటాస్కో రాష్ట్రంలో జరిగే అందాల పోటి ‘ఫ్లోర్ టటాస్కో’ (2018) టైటిల్ గెలుచుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది. పరిచితులు, అపరిచితులు, ఆత్మీయుల అభినందనలతో ఫాతిమా మనసు నిండిపోయింది.‘ఈరోజు కోసమే కదా నేను వేచి చూసింది’ అనుకుంది. అయితే ఇంకో రోజు కూడా ఆమె కోసమే ఓపికగా ఎదురు చూస్తూనే ఉంది. అది ఆమె మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న రోజు. అది ఆమెకే పరిమితమైన విజయం కాదు. అవమానాలు ఎదురైతే ‘నా జీవితం ఇంతేనా’ అని కుంగుబాటు చీకట్లోకి వెళ్లిపోయే వారికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. ‘పట్టుదలగా ప్రయత్నించు. నువ్వు సాధించడానికి ఎంతో ఉంది’ అని గుర్తు తెచ్చే విజయం.క్షమాపణ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు!ఫాతిమా బాష్కు అవమానాలు, ఈసడింపులు కొత్తేమీ కానప్పటికీ తాజా అవమానం ఆమెను తీవ్రంగా బాధ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది షాక్ అయ్యేలా చేసింది. ‘సోషల్ మీడియాలో తన ప్రమోషన్ కంటెంట్ను పోస్ట్ చేయడంలో ఫాతిమా విఫలమవుతుంది’ అని ఆరోపిస్తూ మిస్ యూనివర్స్ థాయ్లాండ్ నేషనల్ డైరెక్టర్ నవత్ ఇట్సారగ్రిసిల్ బహిరంగంగా ఆమెను ‘తెలివి తక్కువ’ అని అర్థం వచ్చేలా అవమానించారు.నవత్ మాటలను నిరసిస్తూ ఫాతిమా వాకౌట్ చేసింది. గత సంవత్సరం మిస్ యూనివర్స్తో సహా అనేకమంది పోటీదారులు ఫాతిమాకు సంఘీభావంగా వాకౌట్ చేశారు. ‘సాధికారత ఉన్న మహిళలం మనం. మన గళాన్ని వినిపించే వేదిక ఇది’ అని తన గళాన్ని వినిపించింది ఫాతిమా. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నవత్ నోటిదురుసుతనాన్ని ఖండించింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఫాతిమాకు మద్దతుగా మాట్లాడింది. వాకౌట్ తరువాత తిరిగి పోటీలో పాల్గొన్న ఫాతిమా బాష్ అందాల కిరీటాన్ని గెలుచుకుంది.‘నవత్లాంటి వ్యక్తుల అహంకారానికి చెంపపెట్టులాంటి అద్భుత విజయం ఇది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న నవత్ ఫాతిమాకు బహిరంగ క్షమాపణ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్తో కూడిన ఏఐ మోడల్స్ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్ఫామ్ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
ఆ పెయింటింగ్ ధర ఏకంగా రూ.487 కోట్లు!..అందులో ఇంత కథ ఉందా!
ఓ మహిళా కళాకారిణి చిత్రించిన పెయింటింగ్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. అది కూడా ఒక మహిళ ప్రాణంపోసిన కళాకృతికే ఈ ఘనత దక్కడం అందర్నీ ఆశ్చర్యానందంలో ముంచెత్తింది. పురుష కళాకారులను అందర్ని వెనక్కినెట్టి మరీ ఇంత పెద్దమొత్తంలో ధర పలకడంతో ఆ చిత్రంలో దాగున్న విశేషం ఏంటని సర్వత్రా ఆసక్తి రెక్తిత్తించింది. అది ఆ కళాకారిణి స్వీయ చిత్రమట. అందులో పొందుపర్చిన భావం, దాని వెనుకున్న కథ వింటే..ఈ చిత్రంలో ఇంత అర్థావంతమైనదా అని ఆశ్చర్యం కలుగక మానదు. మరి ఆ పెయింటింగ్ కథ కమామీషు ఏంటో చకచక చదివేద్దామా.!.ఆ అపురూపమైన కళాఖండాన్ని చిత్రించింది మెక్సికన్ కళాకారిణి ఫ్రిదా కహ్లో. దీన్ని ఎల్ సుయెనో (లా కామా)" అనే పేరుతో 1940లో చిత్రించింది. "ది డ్రీమ్ (ది బెడ్)" అనే ఆర్ట్వర్క్ విభాగంలో భాగంగా ఇది వేలంలో ఏకంగా రూ. 487 కోట్లకు అమ్ముడుపోయింది. అది కూడా జస్ట్ నాలుగు నిమిషాల్లోనే ఈ రేంజ్లో పలకడం విశేషం. మునుపటి రికార్డుని బ్రేక్ చేసింది ఈ ఆర్ట్. గతంలో అమెరికాకు చెందిన మరో మహిళా కళాకారిణి జార్జియా ఓ'కీఫ్ పేరు మీదున్న రికార్డును ఈ పెయింటింగ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబైస్ (Sotheby's) పేర్కొంది.ఏం చెబుతుందంటే..ఈ చిత్రం కళాకారిణి కహ్లో కెరీర్లో కీలకమైన దశాబ్దంలో చిత్రించిన పెయింటింగ్ అట ఇది. కహ్లో మాజీ ప్రేమికుడు హత్యకు గురైన ఏడాది, ఆ తర్వాత ఆమె విడాకులు పునర్వివాహం పరిణమాల మధ్య ఆమె మనసులో చెలరేగిన భావోద్వేగాన్ని వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే..పూర్తిగా ఇది ఆమె వ్యక్తిగత చిత్రం.దీనిలో ఇంత అంతరార్థం ఉందా..?ఆకాశంలో మేఘాల మధ్య తేలియాడుతున్నట్లు కనిపించే మంచంలో, డైనమైట్ కర్రలతో చుట్టబడిన కాళ్ళతో కూడిన అస్థిపంజరం పడుకుని ఉంటుంది. అలాగే దానికింద ఉన్న మరో బెడ్పై పూల పందిరిలో హాయిగా నిద్రిస్తున్నట్లు కళాకారిని కనిపిస్తుంది. పై బెడ్లో డైనమైట్తోకప్పబడిన అస్థిపంజరం శారీరకంగా, మానసికంగా కష్ట సమయాల్లో ఆమె స్థితిస్థాపకతను సూచిస్తుంది. అలాగే కింద బెడ్పై సర్వాంగ సుందరంగా ఆకుల పందిరిలో పడుకున్నట్లు కనిపిస్తున్న చిత్రం..ఆమె సంబంధాలు, అనారోగ్యంతో చేస్తున్న పోరాటాన్ని తెలుపుతుంది. అంతేగాదు మెక్సికన్ సంస్కృతి, జానపద మూలాంశాలు, యూరోపియన్ సర్రియలిజం(మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఉద్భవించిన ఒక కళాత్మక ఉద్యమం) వంటివి ప్రస్ఫుటంగా కనపిస్తాయి. ఈ పెయింటింగ్ కంటే 1932 నాటి పెయింటింగ్ "జిమ్సన్ వీడ్/వైట్ ఫ్లవర్ నంబర్ 1" 2014లో $44.4 మిలియన్లు (రూ. 391 కోట్లు) పలకడం విశేషం. దీన్ని ఆమె భర్త, కుడ్యచిత్రకారుడు డియెగో రివెరాతో కలిసి చిత్రించింది. కాగా, 1954లో మరణించిన ఫ్రిదా కహ్లో, గొప్ప చిత్రకారులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందిన కళాకారిణి. ముఖ్యంగా సెల్ఫ్(వ్యక్తిగత చిత్రాలకు) పెయింటింగ్లకు పేరుగాంచిన కళాకారిణి. ఆ పెయింటింగ్స్ అన్ని తరచుగా ఆమెకున్న శారీరక మానసిక బాధల్ని వ్యక్తపరుస్తాయి. ఆమె బాల్యంలో పోలియోతో బాధపడింది. ఆ తర్వాత బస్సు ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలపాలైంది. ఆయా కష్ట సమయాల్లో తన మానసిక స్థితిని ప్రతిబింబించేలా చిత్రిస్తుందామె. నిజంగా ఒక చిత్రం ఇన్ని విషయాలను వెల్లడిస్తుందా..అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది.(చదవండి: పశ్చిమ్ కా పరంపర..! రేపటి నుంచి 'భారతీయ కళా మహోత్సవ్') -
పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్క్యూ'
వయస్సు, అనుభవం ఆవిష్కరణకు అడ్డు కాదని నిరూపించింది ఇరవై రెండు సంవత్సరాల అలెశాండ్రా గలీ. పా΄ర్కిన్సన్ వ్యాధిగ్రస్తులపై ఆమె సానుభూతి కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఉపకరించే ఆవిష్కరణ ఇది. నెదర్లాండ్స్లోని డెలప్స్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల్లో అలెశాండ్రా గలీ, పార్కిన్సన్ రోగులు ఎదుర్కొంటున్న రోజువారి ఇబ్బందులను చూసి చలించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పార్కిన్సన్ రోగులు ఉన్నారు, వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి అధ్యయనం చేసింది. కీబోర్డ్ను ఉపయోగించడంలో వారు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకుంది. ఆధునిక గేమింగ్ బోర్డ్ల నుంచి ప్రేరణ పొంది ‘ఆన్క్యూ’ అనే కీబోర్డ్ను రూదిపొందించింది. పార్కిన్సన్ రోగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టైప్ చేయడానికి ‘ఆన్క్యూ’ కీబోర్డ్ ఉపయోగపడుతుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా వైబ్రేషన్, లైట్ సిగ్నల్స్ తీవ్రతను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణకు జేమ్స్ డైసన్ అవార్డు అందుకుంది అలెశాండ్రా. ‘ఆన్క్యూ అనేది ఆవిష్కరణ మాత్రమే కాదు. ఇందులో తత్వం కూడా ఉంది. సాంకేతికతను సామాజిక సేవకు ఉపయోగించాలనేది ఆ తత్వం’ అంటుంది అలెశాండ్రా. (చదవండి: దటీజ్ ఫాతిమా బాష్..! వివాదాలు, హేళనలే ఆమె బలం..) -
దటీజ్ ఫాతిమా బాష్..! వివాదాలు, హేళనలే ఆమె బలం..
మిస్ యూనివర్స్ 2025 విజేతగా మిస్ మెక్సికో ఫాతిమా బాష్(25) కిరీటం దక్కించుకుని, టబాస్కో నుంచి గెలుపొందిన తొలి మహిళగా బాష్ చరిత్ర సృష్టించింది. నిజానికి ఈ కీరిటం అంత సులభంగా రాలేదు. పైగా ఆమె ఈ పోటీలో పాల్గొనే స్థాయికి చేరుకోవడానికి ఎన్నో హేళనలు, అవమానాలు, ధిక్కారాలను దాటుకుని వచ్చింది. తగ్గేదే లే అంటూ తాను ఎంత వరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతా పెట్టి.. గెలుపుని పాదాక్రాంతం చేసుకుని శెభాష్ అనిపించుకుంది ఫాతిమా బాష్. నిజానికి ఫాతిమాని చిన్నప్పటి నుంచి స్కూల్లో తోటి విద్యార్థులు చులకనగా చూసేవారు. టబాస్కోలోని శాంటియాగో డి టీపాలో జన్మించిన ఆమెకు పుట్టుకతోనే స్లెక్సియా, ADHD అనే నాడి సంబంధిత సమస్యల ఉన్నాయి. దీని కారణంగా బాష్ చదువులో వెనకుండేది. సింపుల్గా చెప్పాలంటే మాట్లాడటంలో తడబాటు, ఒకచోట కుదురుగా కూర్చొని చదవలేని మానసిక సమస్య. ఆ సమస్యను చేధించి తానేంటో ప్రూవ్ చేసుకుని అందాల పోటీకి వస్తే..మళ్లీ ఇక్కడ కూడా వివాదం వెంటాడింది. ఆమె స్థానంలో మరొకరెవరైనా..తప్పుకునేవారేమో. ఇక్కడుంది ఫాతిమా కాదన్న వాళ్ల నోళ్లే మూయించేలా.. తడకా చూపించాలనుకుంది. అందుకే ఆ అవమానాలు, ధిక్కారాలను బలంగా మార్చుకుని విజయం తన ముంగిట్లోకి వచ్చేలా చేసుకుని యావత్తు ప్రపంచం తనవైపు చూసేలా చేసుకుంది. ఇంతకీ ఫాతిమా బాష్కు అందాల పోటీలో ఎదురైన వివాదం ఏంటంటే..ఈ అందాల రాణి అంత సులభంగా కిరీటాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. ఎందుకంటే మిస్ యూనివర్స్2025 సాష్ వేడుకల్లోనే ఆమెకు అవమానం, బెదిరింపులు ఎదురయ్యాయి. మొత్తం ప్రపంచ దేశ సుందరీమణుల అందరి ముందు ఘోరంగా అవమానపాలైంది. సాక్షాత్తు మిస్ యూనివర్స్పోటీల అధికారి నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆమెను నిందించడం బాధకరం. అంతేగాదు ఒక మహిళగా తన వ్యక్తిత్వాన్నే కించపరిచేలా సోషల్ మీడియా లైవ్స్ట్రీమింగ్లో ఆయన ఇలా వ్యాఖ్యానించడం అందర్ని విస్తుపోయేలా చేసింది. దాంతో ఒక్కసారిగా ఫాతిమాకు సోషల్మీడియా నెటిజన్లతో సహా తోటి సుందరీమణులు మద్దతు వెల్లువెత్తింది. ఆ అధికారి దృష్టిలో ఇక్కడ బాష్ చేసిన తప్పిదం ఏంటంటే..అందాల పోటీలు జరుగుతున్న ధాయిలాండ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయకపోవడం, అలాగే తన జాతీయ అధికారి మాటలనే ఆదేశిస్తుందనేది నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆరోపణలు. ఆనేపథ్యంలోనే ఆమెను దారుణంగా అవమానిస్తూ దుర్భాషలాడాడు. ఆఖరికి ఆమె పోటీ నుంచి నిష్క్రమించేలా పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. ఇదేం పద్దతి అంటూ మిస్ యూనివర్స్ పోటీలపై సర్వత్రా విమర్శలు రావడంతో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టింది. అంతేగాదు ఈ ఘటనకు క్షమాపణు చెప్పడమే గాక సదరు అధికారికి చీవాట్లు సైతం పెట్టింది. ఈ పోటీల్లో అతడు జోక్యం ఉండదని నామామాత్రంగానే న్యాయనిర్థేధికారిగా ఉంటాడని వివరణ కూడా ఇచ్చింది. ఇంతటి పరిస్థితుల్లో కూడా ఆమె మీడియా ముందు..ఒక మహిళగా తనకు గౌరవం ఇవ్వలేదని, తన దేశ జాతీయుడితో ఉన్న సమస్యను..నాతో ముడివేసి ఆ అధికారి ఇబ్బందులకు గురిచేశాడని ధైర్యంగా చెప్పింది. అంతేగాదు తనెనెవరు ఈ పోటీల్లో పాల్గొనకుండా చేయలేరు, కిరీటం దక్కించుకోకుండా చేయలేరు అని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిన ప్రతి పోటీలోనూ తన దైన శైలిగా న్యాయనిర్థేతలను, ప్రేక్షకులను మెప్పించింది. ఆఖరికి క్వశ్చన్ రౌండ్లో కూడా ప్రపంచ వేదికపై మహిళలు తమ గొంతున వినిపించి..మార్పు తీసుకురావాలని శక్తిమంతంగా సమాధానమిచ్చి జడ్జీల మన్ననలను అందుకుంది. ఊహించని ఝలక్..!థాయ్లాండ్లోని నోంతబురి నగరంలో అంగరంగవైభవంగా ఈ గ్రాండ్ ఫినాలే జాలిస్కో, లోపెజ్, ఫెర్నాండా ప్యూమా, ఎమిరే అరెల్లానో, ఎలెనా రోల్డాన్ వంటి అందాల భామలతో తలపడింది బాష్. వివాదంలో నిలిచింది కాబట్టి బాష్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అంతా మిస్ జాలిస్కోదే కిరీటం అనుకున్నారు. అయితే అక్కడ న్యాయనిర్థేతలు అనూహ్యంగా ఫాతిమా బాష్ను మిస్ యూనివర్స్గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మీడియా ముందు చెప్పినట్లుగానే కిరీటం దక్కించుకుంది కదా అంటూ..అందరూ సాహో రాణి అని కీర్తించారు. చిన్నప్పుడూ మాటల్లో స్పష్టత లేక తడబడి అల్లాడిన ఆ చిన్నారే..ఆ మానసిక సమస్యను బలంగా మార్చుకుని తన గొంతు విప్పి..తనను కాదన్న వాళ్లని ఒక్క గెలుపుతో నోరూమూయించింది. అంతేగాదు అవమానాలు, చీత్కారాలు గెలుపుకి ఆటంకాలు కాదు బలం అని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: మిస్ యూనివర్స్గా ఫాతిమా బాష్) -
అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్ రైడ్..!
వయసు శరీరానికే గానీ మనసుకు కాదని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. అయితే ఈ బామ్మలు వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి..ఏకంగా చలాకీగా బైక్ రైడ్ చేస్తూ..సాహస యాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరు వృద్ధ మహిళలు చూస్తే..ఓల్డ్ ఏజ్ అని అనిపించదు..బంగారంలా బతకడం అంటే ఏంటో తెలుస్తుంది.!.ఆ బామ్మలే అహ్మదాబాద్కు చెందిన ఇద్దరు వృద్ధ అక్కాచెల్లెళ్లు. 87 ఏళ్ల మందాకిని షా తన చెల్లెలు ఉషతో కలిస స్కూటర్పై సాహసయాత్రలు చేస్తోంది. అంతేగాదు తన చెల్లెలుతో ఉన్న సాన్నిహిత్యం, సాహసయాత్రల పట్ల ఉన్న అభిరుచి కలగలసి ఇలా తనతో కలిసి చుట్టిరావడానికి పురిగొల్పిందని అంటోంది. ఇంత ఏజ్లోనూ ఆ బామ్మ మందాకిని చాలా చలాకీగా స్కూటర్ నడిపేస్తుంటుంది. అయితే ఈ బామ్మ 62 ఏళ్ల వయసులో ఉన్నప్పుడూ స్కూటర్ నడపడం నేర్చుకుందట. ఆరుగురు తోబుట్టువులో పెద్దది కావడంతో చిన్న వయసులోనే బాధ్యతలను నిర్వహించడం అలవాటైపోయిందట ఆమెకు. స్వాతంత్ర సమరయోధుడైన ఆమె తండ్రి వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేవాడట. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాపారం చేసే సాహసం చేయలేకపోయాడట. తన కుటుంబంలో తరుచు డబ్బు కొరత బాగా ఉండేదని, అందుకోసం తన తల్లి ప్రతి రోజు ఎంతలా కష్టపడేదో దగ్గరగా చూశానని అంటోంది. బహుశా అదే తనలో ఆత్మవిశ్వాసం పెంచి తన కాళ్లపై తాను నిలబడేందుకు దారితీసిందని చెబుతోంది. 16 ఏళ్ల వయసులో తనకు ఇంగ్లీష్ సరిగా రాకపోయినా..బాల్ మందిర్లో మాంటిస్సోరి స్కూల్లో టీచర్ పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపింది. తర్వాత సామాజికి సంక్షేమ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ప్రారంభించానని, దాంతో ఆమెకు మహిళా సంఘాలు, పంచాయతీ సమావేశాలు తదితర వాటిల్లో పాల్గొనే అవకాశం లభించిందని చెప్పుకొచ్చింది. ఆనేపథ్యంలోనే తానుమోపెడ్, జీపు నడపడం వంటివి నేర్చుకున్నట్లు వివరించింది. అలా 62 ఏళ్ల వయసులో సెకండ్హ్యాండ్ స్కూటర్ నడపడం నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికీ తాను, తన సోదరి ఇద్దరం కలిసి నగరం చుట్టేసి వచ్చేస్తుంటామని నవ్వుతూ చెబుతోంది. అయితే స్థానికులు ఆ బామ్మను ఎందుకు వివాహం చేసుకోలేదని తరుచుగా అడుగుతుంటారట. అయితే బామ్మ ఒకప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అయితే జీవితం మరో మార్గాన్ని చూపించడంతో ఆ దిశగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక బామ్మ మందాకిని చివరగా.. పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తిని ఏది ఆపలేదని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. ఈ బామ్మ ఈ తరానికి ఎంతో స్ఫూర్తి కదూ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: ఉద్యోగం ఐటీ..నాట్యంలో మేటి) -
ఆట, పాట గెలిచాయి
చాంపియన్ స్పోర్ట్ షూటర్ శ్రేయసి సింగ్, స్టార్ సింగర్ మైథిలీ ఠాకూర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో.... ‘ఆడినంత సులువు కాదు’ ‘పాడినంత సులువు కాదు’ అన్నారు విమర్శకులు. అయితే ఈ ఇద్దరూ ఆడినంత తేలిగ్గానే, పాడినంత సులువుగానే బిహార్ తాజా ఎన్నికలలో విజయం సాధించారు. భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువ మహిళా నాయకుల గురించి...ఈసారి కూడా గురి తప్పలేదు!బిహార్ లోని జముయి నియోజక వర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచిన శ్రేయసి సింగ్ ఒకప్పుడు చాంపియన్ స్పోర్ట్ షూటర్. శాసనసభ్యురాలిగా ఇది ఆమె రెండో విజయం. బిహార్ జముయి జిల్లాలోని గిదౌర్కు చెందిన శ్రేయసి సింగ్కు ఘనమైన క్రీడా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తాత సెరేందర్సింగ్, తండ్రి దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షులుగా పనిచేశారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి మాజీ ఎంపీ.దిల్లీలోని హన్స్రాజ్ కాలేజీలో చదువుకున్న శ్రేయసి ఫరిదాబాద్లోని మానవ్ రచనా ఇంటర్నేషల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి షూటింగ్ చూస్తూ పెరగడం వల్ల సహజంగానే ఆ క్రీడపై ఆమెకు ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి నైపుణ్యం తోడు కావడంతో షూటింగ్లో గురి తప్పకుండా దూసుకుపోయింది. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో బిహార్కు ప్రాతినిధ్యం వహిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శ్రేయసి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరి 2020 బిహార్ శాసన సభ ఎన్నికల్లో జముయి నియోజక వర్గం నుంచి గెలిచింది. యువత, మహిళ ఓటర్లను ఆకర్షించగల చరిష్మా, కుటుంబ రాజకీయ నేపథ్యం వల్ల బీజేపీ శ్రేయసీకి సీటు ఇచ్చింది. పురుషాధిపత్యం కనిపించే బిహార్ రాజకీయ రణక్షేత్రంలో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే క్షేత్రస్థాయి నుంచి బిహార్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న శ్రేయసి ఎప్పుడూ తడబడలేదు. వెనకబడిన రాష్ట్రమైన బిహార్లో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి శ్రేయసి సింగ్ రోల్మోడల్గా మారింది. స్త్రీ విద్య, ఉపాధి కోసం రాజకీయ వేదికగా క్రియాశీలంగా పనిచేస్తోంది.చారిత్రక విజయ గీతం‘సంగీతంలో పుట్టింది. సంగీతంతో పెరి గింది’ అనే మాట మైథిలి ఠాకూర్కు సరిపోతుంది. బాల్యం నుంచి ఆమెకు శాస్త్రీయ, జానపద సంగీతంతో అనుబంధం ఉంది. ‘లిటిల్ చాంప్స్’ ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోల ద్వారా చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారింది. ‘జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. తొలి ఆల్బమ్ ‘యా రబ్బా’తో సంగీత అభిమానుల ప్రశంసలు అందుకుంది. మరుసటి సంవత్సరం ‘రైజింగ్ స్టార్’లో రన్నరప్గా నిలిచింది.ఆలీనగర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా ఆర్జేడీ అభ్యర్థిపై విజయం సాధించిన మైథిలీ ఠాకూర్ బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీటును గెల్చుకోవడం బీజేపికి ఇది మొదటిసారి. దీనిని చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. బిహార్ అసెంబ్లీకి ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలిగా సంచలనం సృష్టించి దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తోంది 25 సంవత్సరాల మైథిలీ ఠాకూర్. ఎన్నికల ప్రచార యాత్రలలో జానపద, భక్తిగీతాలు ఆలపిస్తూ జనాలను ఆకట్టుకుంది. ఇతరుల కంటే భిన్నంగా సామాజిక సంస్కరణకు, సాంస్కృతిక పునర్జీవనాన్ని మిళితం చేసి తనదైన ఎజెండాను రూపొందించింది ఠాకూర్. మిథిల చిత్రకళను పాఠశాలల్లో పాఠ్యేతర అంశం (ఎక్స్ట్రా–కరికులర్ కంపోనెంట్)గా ప్రవేశపెడతామని, బాలికల కోసం బలమైన విద్యాకార్యక్రమాలు, స్థానిక యువత కోసం ఉపాధి–కేంద్రీకృత కార్యక్రమాలు, మిథిల చిత్రకళ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది మైథిలీ ఠాకూర్. -
చెట్ల అవ్వ వెళ్ళిపోయింది
చెట్టు అంటే ఏమిటి? అది ప్రాణవాయువు. అది ఆకు కొమ్మ ఫలం. అది పువ్వు. అది నీడ. అది గూడు. అది గుర్తు. చెట్టు బతికితే మనిషి బతుకుతాడు. జీవితాంతం చెట్లు నాటుతూ బతికిన సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో కన్ను మూశారు. పచ్చటి సందేశమై ఆమె మనకు కర్తవ్యాన్ని బోధపరుస్తూనే ఉంటారు.వృక్షో రక్షతి రక్షితః... ఇది కొందరికి ఒట్టి వేదవాక్కు. కాని ‘సాలుమరద’ తిమ్మక్కకు అది జీవనవేదం. చెట్లను తన బిడ్డలుగా భావించి, వాటిని పెంచి పోషించిన ఆ చెట్ల అవ్వ ఇక లేరు. సాలుమరద అంటే చెట్ల వరుస అని కన్నడంలో అర్థం. ప్రజలు ఇచ్చిన ఇంటి పేరును తన పేరులో కలుపుకున్న కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. అల్లారుముద్దుగా తమను పెంచిన ఆ తల్లి తరలిపోగా వృక్షాలన్నీ మౌనంగా దుఃఖిస్తున్నాయి.ఆ వనంలాంటి రోడ్డుకర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని కూడూర్–హలికల్ మధ్యనున్న స్టేట్ హైవే నం.94లో ఉన్న మర్రిచెట్లను ఓమారు పలకరించండి. 4.5 కిలోమీటర్ల దూరం వరకూ ఆ రోడ్డుకు అటూ ఇటూ భారీగా ఎదిగిన ప్రతిచెట్టు తమ బతుకు వెనుక తిమ్మక్క ఉందని చెప్తుంది. ఎన్నో విషయాలు వివరిస్తుంది. నీరు దొరకడమే గగనమైన ఆనాటి రోజుల్లో ఒక్కో మొక్కకు నీరు పోసి, పెంచి, బాగోగులు చూసి వాటిని కంటికి రెప్పలా కాపాడిన తిమ్మక్క, చిక్కయ్య దంపతుల గొప్పతనం అక్కడున్న ప్రతి చెట్టు తెలియజేస్తుంది. మొత్తం 385 మర్రిచెట్లను నాటి, వాటిని పెంచి, ఆ ప్రాంతంలో పచ్చదనం నెలకొల్పిన ఘనత తిమ్మక్కదే. బిడ్డలులేని ఆమె చెట్టునే బిడ్డ అనుకుంది. అయితే ఒకరిద్దరితో ఆ సంతానాన్ని నియంత్రించలేదు. మొక్కలు నాటడాన్ని ఆపలేదు. తాను జీవించి ఉన్నంత కాలం మొక్కలు నాటుతూ పంచుతూ పెంచుతూ ఉండిపోయింది. అందుకే 2019లో అప్పటి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లను కొట్టేయాలని యోచించినప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి తిమ్మక్క లేఖ రాశారు. 70 ఏళ్ల వయసున్న ఆ వృక్షాలను రక్షించాలని కోరారు. ఆమె మాటతో ముఖ్యమంత్రి ఆ చెట్ల కొట్టివేతను ఆపి, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా తిమ్మక్క వల్లే సాధ్యమైంది.ప్రపంచమంతా మెచ్చుకోలుతిమ్మక్క దశాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నా దేశవిదేశాల్లో అనేకమంది ఆమె కృషిని గుర్తించినా 2016లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంత మహిళల జాబితాలో బీబీసీ ఆమె పేరును పేర్కొన్నా మన దేశం మాత్రం తిమ్మక్కను గుర్తించడంలో చాలా ఆలస్యం చేసిందని ఆమె గురించి తెలిసినవారు అంటారు. 108 ఏళ్ల వయసులో ఆమెకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. అది చాలా ఆలస్యమని, అయినా ఆమెకు తన పని మీద తప్ప ఇటువంటి వాటి మీద ఆసక్తి లేదని ఆమె అభిమానుల మాట. ఆ తర్వాతే దేశంలోని అనేకమందికి తిమ్మక్క గురించి తెలిసింది. ఆమె వివరాలు, ఆమె చేస్తున్న పని ప్రాచుర్యం పొందాయి. కాలిఫోర్నియాలో పర్యావరణం మీద పని చేసే ఒక ఎన్.జి.ఓ తన సెంటర్కు సాలుమరద తిమ్మక్క పేరు పెట్టింది.చెట్లే ఆరోగ్యంతిమ్మక్క జీవితం చూస్తే చెట్లే ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చాయా అనిపిస్తుంది. సగటు మనుషులు 50 దాటక ముందే అనారోగ్యం బారిన పడుతున్న వేళ తిమ్మక్క వందేళ్లు దాటాక కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. తన పనులు తానే చేసుకునేవారు. ఖాళీగా కూర్చోవడం, దిగులుతో బాధపడటం ఆమెకు తెలియదు. 1991లో భర్త మరణించిన తర్వాత అన్ని పనులూ భుజాన వేసుకున్నారు. చెట్లు నాటడమే కాకుండా, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. 2020లో నడుముకు సంబంధించి ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతంగా జరిగిందని, తాను బాగానే ఉన్నానని ఆమె తెలిపారు. కొద్దికాలంగా అనారోగ్యం బారిన పడ్డ ఆమె మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోయారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో నవంబర్ 14న కన్నుమూశారు. ఆమెకు ఒక పెంపుడు కొడుకు ఉన్నాడు. తిమ్మక్క శివైక్యం చెందారు. ఆమె నాటిన చెట్లు కలకాలం పచ్చగా ఆమెను గుర్తు చేస్తుంటాయి. -
అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..
అఫ్గానిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. తాలిబన్ల ప్రభుత్వం అక్కడ మహిళల హక్కులను, స్వేచ్ఛను హరించేలా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే వాళ్లు ఎలాంటి కల కనాలనే ఆశ కూడా మనసులోకి రానంత దారుణమైన పరిస్థితులు మధ్య అక్కడ మహిళలు జీవిస్తున్నారు. అలాంటి చోట నుంచి వచ్చిన ఓ చిన్నారి పెళ్లి కూతురు..తన దుస్థితిని మార్చుకోవాలని కంకణం కట్టుకుని మరి దేశం నుంచి పారిపోయింది. దేశం కానీ దేశంలో.. చంకలో బిడ్డను పెట్టుకుని భాష రాక ఎన్నో అవస్థలు పడింది. అన్నింటిని ఓర్చుకుని తాను కోరుకున్న కలల జీవితాన్ని నిర్మించుకుని యావత్తు ప్రపంచ తనవైపు చూసేలా ఛాంపియన్గా అవతరించి..శెభాష్ అనిపించుకుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఆశే లేకుండా చేసినా..అందంగా జీవితాన్ని మలుచుకునే సత్తా ఉంటే..ఎదురే లేదని ప్రూవ్ చేసింది. యూరప్ అంతటా పేరుగాంచిన బాడీబిల్డంగ్ ఛాంపియన్(bodybuilding champion)గా అవతరించిన అఫ్గానిస్తాన్కి చెందిన రోయా కరోమి(Roya Karimi) బాల్యం కడు దయనీయం. ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతికిందంటే..చదువు ఊసే లేకుండా పెరిగింది. ఒక నిశబ్ద వాతావరణం..తానెందుకు బతుకుతున్నా.. అనిపించే పరిస్థితుల మధ్య అమాయకంగా జీవనం సాగించింది. కనీస స్వేచ్ఛ కూడా లేని కఠిన పరిస్థితులను చూసి విసుగుపుట్టునా ఏం చేయలేని పసితనంతో అల్లాడింది. టీనేజ్ వయసుకే పెళ్లి, పిల్లలు..జస్ట్ 14 ఏళ్లకే పెళ్లి, 15 ఏళ్ల వయసుకు తల్లిగా మారిపోయింది. అలా 2011 నాటికి కనీస స్వేచ్ఛ, కలలు కనలేని ఈ సామాజిక ఆంక్షల మధ్య బతకడం తన వల్ల కాదంటూ..పరుగు లంకించింది. తన దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోయేదాక ఆపలేదు. ఒక చేతిలో ఏవో గుర్తింపు కాగితాలు మరో చేతిలో బిడ్డతో ఆమె పెట్టిన పరుగు..మాటలకందని వేదనకు మించినది. ఎలా బతుకుతాననేది తెలియదు. ఒంటరిగా బయటకు అడుగుపెట్టలేని ఆ దేశంలో కంటే.. తన కంటూ ఓ గుర్తింపు, స్వేచ్ఛతో బతకాలనే ఆరాటంతో దేశ సరిహద్దులు దాటి నార్వేకు చేరుకుంది. అక్కడ అధికారుల నుంచి ఎదురైనా ఎన్నో ప్రశ్నల నడుమ..శరణార్థుల శిబిరంలోకి చేరింది. చివరికి అక్కడే ఉండేలా అర్హత సంపాదించుకుని..తిరిగి తన జీవితాన్ని నిర్మించుకోవడాన్ని అహర్నిశలు కష్టపడింది. చేతికందిన ప్రతి పని చేసుకుంటూ జీవనం సాగించింది. అలాగే నార్వే భాషపై పట్టుసాధించి..తనకంటూ ఒక కుటుంబాన్ని నిర్మించుకుంది. సరిగ్గా మహమ్మారి సమయంలో ఫిట్నెస్పై దృష్టిపెట్టింది. ఆ సమయంలోనే బాడీబిల్డింగ్ క్రీడ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ క్రమంలో కండరాలను బలోపేతం చేసుకుంటూ తన శరీరంపై పట్టు సాధించడం నేర్చుకుంది. చిన్న వయసులోనే వివాహం చేసుకుని ఏ స్వేచ్ఛనైతే కోల్పోయిందో..అది ఈ బాడీబిల్డింగ్ శిక్షణ కోసం జిమ్లో గడుపుతున్నప్పుడూ.. ఆ స్వేచ్ఛని తిరిగి పొందిన అనుభూతి కలిగింది. దాన్ని ఆపకూడదనుకుంది. అలా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేలా పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందింది. అందుకు భర్త మద్దుతు కూడా లభించడంతో నర్సుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మరి పూర్తి జీవితాన్ని ఆ క్రీడకు కేటాయించి వరుస పతకాలను కొల్లగొట్టింది. ప్రతి పోటీలోనూ టైటిల్ ఆమెనే వరించేది. అలా 2025లో యూరోపియన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగి చేసేలా చేసుకుంది. అంతేగాదు బార్సిలోనాలో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్లలో ఆమెకు మరింత గౌరవం దక్కింది. ఒక అఫ్గాన్ బాలిక ఎన్నో సాంస్కృతిక, సామాజిక అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి చేరుకోవడం మాములు విషయం కాదంటూ అక్కడ స్థానిక మీడియాలన్నీ ఆమెను కీర్తించాయి. దాంతో ఆమె పేరు వార్తల్లో నిలవడమే కాదు కరిమి ఎందరో అమ్మాయిలకు నువ్వు ఆదర్శం, ప్రేరణ అంటూ ప్రశంసించాయి కూడా. అఫ్గాన్ నిబంధనలకు విరుద్ధంగా పోటీలో అలాంటి దుస్తులు ధరించినందుకు కరోమికి ఎన్నో బెదిరిపులు వచ్చాయి..అయినా తగ్గేదేలా అంటూ ముందుకు సాగింది. అంతేగాదు సంవత్సరాలుగా ప్రజలు నా గొంతును, శరీరాన్ని, భవిష్యత్తును నియంత్రించారు. ఇక చాలు..అలాంటి పరిస్థితి రానివ్వను అంటూ..తనకొచ్చే బెదిరింపులకు ఘాటుగా సమాధానమిచ్చింది. అంతేగాదు తీవ్రమైన ఆంక్షల మధ్య బతుకుతున్న అఫ్గాన్ మహిళల పాలిట సింహ స్వప్నంగా మారింది కరిమి. తనకు ఈ బాడీబిల్డింగ్ ఒక క్రీడ కాదని..తను బాల్యంలో కోల్పోయిన స్వేచ్ఛ అని భావోద్వేగంగా చెబుతోంది కరిమి.(చదవండి: ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమకి.. ఆస్ట్రేలియన్ డ్రైవర్ ఫిదా..!) -
చచ్చిపోదామనుకుంది...ఇపుడు వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతి
ముంబై నడిబొడ్డున ఎన్నో కలలు కంటున్న ఒక చిన్నారి కలలు ఒక్కసారిగా ఊహించని మలుపు తీసు కున్నాయి. పుస్తకాలతో దోస్తీ చేయాల్సిన 12 ఏళ్ల వయసులోనే పెళ్లి. కట్ చేస్తే.. గృహ హింస, తీరని అణిచివేత అంతకుమించిన పేదరికం. జీవితం పీడకలగా మారిపోయింది. కానీ అక్కడినుంచే తననుంచి దూరంగా వెళ్లి పోయిన జీవితాన్ని వెదుక్కుంది. వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారింది.దళిత కుటుంబంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ.1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కల్పనా సరోజ్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్కు పెళ్లి జరిగిపోయింది. భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో నివసించేది. కానీ పెళ్లి తరువాత అత్తింటి వేధింపులు భరించలేక, బయటపడటానికి మార్గం లేదని భావించి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె తండ్రి ఆమెను రక్షించి,ఇంటికి తిరిగి తీసుకు వచ్చాడు. అలా16 సంవత్సరాల వయసులో, మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. ముంబైలోని ఒక ప్రభుత్వ వస్త్ర మిల్లులో ఉద్యోగం మొదలు పెట్టింది జీతం నెలకు రూ. 2 మాత్రమే. కానీ అదే కల్పన భవిష్యత్తుకు తొలి అడుగు. సాధికారతకు స్వావలంబంనకు బీజం.ఇదీ చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీఈ కష్టాలమధ్యే బట్టలు కుట్టడం నేర్చుకుంది. అలా కల్పన ఆదాయాన్ని రూ. నెలకు 50 రూపాయలు. ఆ అనుభవంతో ఆమె పెద్ద రిస్కే చేసింది. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో రూ. 50 వేల రుణం తీసుకొని సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క్లాత్ బొటిక్ ప్రారంభించింది. అనుకోకుండా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది . అక్కడితో ఆగిపోలేదు. బలమైన నెట్వర్క్తో రియల్ ఎస్టేట్లోకి విస్తరించింది. ఎలా అంటే..1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొని మోసపోయింది. కానీ అప్పటి కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చిన కల్పనా సరోజ్,ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగింది. KS ఫిల్మ్ ప్రొడక్షన్ఆ తర్వాత తన సొంత సంస్థ KS ఫిల్మ్ ప్రొడక్షన్ను స్థాపించింది. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం ఎదుర్కొన్న దారుణాల గురించి 'ఖైర్లాంజిచ్య మాత్యవర్' అనే వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది. ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా చూస్తారనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ కథనాన్ని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకురావాలనది ఆమె అభిమతం. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో డబ్ చేశారు. నేరస్థులను ఆపకపోతే, అవగాహన పెంచకపోతే, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన నమ్ముతారు.కమానీ ట్యూబ్స్కు ప్రాణం పోసిందిదృఢసంకల్పం, తెలివైన వ్యాపారవేత్తగా ఆమె ఖ్యాతి పెరిగింది. కమానీ ట్యూబ్స్ కంపెనీప్పుల్లో మునిగి, పతనం అంచున ఉంది. దాదాపు మూడేళ్లుగా దాని 3,500 మంది ఉద్యోగులకు చెల్లించలేకపోయింది. అలా వారు 2001లో, కల్పనను సలహా కోసం సంప్రదించారు. ఇదే ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన చాలెంజ్ విసిరింది. దాన్ని బాధ్యతగా తీసుకుంది కల్పన. ఏకంగా కంపెనీని కొనుగోలు చేసి, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. అచంచలమైన సంకల్పంతో ముందుకు నడిపించింది. అప్పులను తీర్చేసి,కార్మికులకు జీతాలు చెల్లించడమే కాదు, కంపెనీ లాభాల బాట పట్టింది. ఇపుడు కమానీ ట్యూబ్స్ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.చదవండి: చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్ఏడో తరగతిలోనే పెళ్లి, కష్టాలు అనుభవించి, రూ. 2 సంపాదించిన బాల్య వధువు కల్పన సరోజ్, రూ. 1000 కోట్ల నికర విలువను కలిగి ఉంది. కమానీ ట్యూబ్స్ చైర్పర్సన్గా 2013లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. IIM బెంగళూరులో గవర్నర్ల బోర్డు సభ్యురాలు కూడా. దీంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందామె.కల్పన సరోజ్ జీవితం అద్భుతమైన విజయగాథ మాత్రమే కాదు. కృషి, పట్టుదల ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి ఇదొక బ్లూప్రింట్. కష్టాల కొలిమినుంచే అందమైన జీవితానికి బాటలు వేసుకున్న ధీర కల్పన సరోజ్ ఎంతోమందికి ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!
పాలన, రక్షణ రంగాలను వారధిగా చేసుకుని దేశ సేవ చేయాలనే ఆమె ద్వంద్వ వైఖరి అందరికి స్ఫూర్తిదాయకం. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశానికే గర్వకారణం కూడా. సింపుల్గా చెప్పాలంటే బహువిధ మార్గాల్లో దేశానికి సేవ చేయడం అంటే ఏంటో యువతకు ప్రేరణని ఇచ్చారామె. మరి ఇలా రెండు రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందామా.కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన భవ్య నరసింహమూర్తి(Bhavya Narasimhamurty) గతేడాది టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఇటీవట గత మూడు నెలలుగా డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట కాలానికి లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యంలో సేవలందిస్తూనే ఉంటారామె. అంతేగాదు భవ్య దక్షిణ భారతదేశం నుంచి మొదటి మహిళా టెరిటోరియల్ ఆర్మీ (TA) అధికారిగా ఘనత సృష్టించింది. ఇది నిజంగా భారత సైనిక చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి. రాజకీయ ప్రస్థానం..భవ్య నరసింహమూర్తి 2020లో అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్ (INC)లో చేరారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రతినిధిగా , టెలివిజన్ చర్చలలో సుపరిచితమైన వ్యక్తిగా మారింది. పార్టీ విధానాలను ఉద్రేకంతో సమర్థిస్తూ, ప్రతిపక్షాలను విమర్శించేది. ఆమె స్పష్టమైన వాదనలు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన తదితరాలు భవ్యను కర్ణాటక రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. అలా ఆమెను 2023లో AICC సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ల జాతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ పదవి ఆమెకు డిజిటల్ కమ్యూనికేషన్లో తనకున్న నైపుణ్యంతో పార్టీ ఆన్లైన్ ఉనికిని రూపొందించి ఓటర్లతో సన్నిహితంగా ఉండటానికి, అలాగే ప్రగతిశీల భారతదేశం కోసం కాంగ్రెస్ దార్శనికతను ప్రోత్సహించడానికి వీలు కల్పించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో, భవ్య రాజాజీనగర్ నియోజకవర్గం టికెట్ కోసం బలమైన పోటీదారుగా నిలిచింది.అలా ఆర్మీవైపు అడుగులు..ఆమె 2022లో కఠినమైన టెరిటోరియల్ ఆర్మీ (TA) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆ ఏడాది ఎంపికైన ఏకైక మహిళా అభ్యర్థిగా భవ్య నిలిచింది. మే 2024లో, ఆమెను ఇండో-పాక్ నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ఆర్మీ యూనిట్కు నియమించారు. అక్కడ ఆమె ఇంటెన్సివ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, లెఫ్టినెంట్గా నియమితురాలైంది. రాజకీయాల నుంచి సైన్యంలోకి ఆమె తీసుకున్న యూటర్న్.. జాతీయ సేవపట్ల తనకున్న బహుముఖ నిబద్దతను తెలియజేస్తోంది. ఇలా పౌరులు తమ వృత్తిపరమైన కెరీర్ల తోపాటు ఆర్మీలో సేవ చేయడానికి వీలు కల్పించే టెరిటోరియల్ ఆర్మీ,భారతదేశ రక్షణకు తోడ్పడటానికి భవ్యకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. ఇలా టెరిటోరియల్ ఆర్మీ ఆపీసర్గా క్రికెటర్ ఎంఎస్ ధోని, రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ వంటి ప్రముఖ వ్యక్తులు ఎందరో భాగమయ్యారు. కానీ దక్షిణ భారతదేశం నుంచి తొలి మహిళగా భవ్య సాధించిన విజయం సైన్యంలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహిక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇక భవ్య నరసింహమూర్తి కూడా సోషల్ మీడియా ఎక్స్లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ.."ఈ ఆర్మీ శిక్షణ చాలా సవాలుతో కూడుకున్నది, పైగా గొప్ప అసాధారణ అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా నా శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది." అని భవ్య పోస్ట్లో రాసుకొచ్చారామె. అంతేగాదు తాను భారత సైన్యంలో అధికారిగా, అలాగే రాజకీయ నాయకురాలిగా నా మాతృభూమికి సేవ చేయగలిగే అద్భుతమైన అవకాశాన్ని అందించిన ఆ భగవంతుడుకి సదా కృతజ్ఞతలు అని పోస్ట్ని ముగించిందామె. Late post After my selection as a Lieutenant in Territorial Army of Indian Army, every year I serve in Indian army for a short period. This year with your love and blessings I successfully completed 3 months training at the prestigious Indian Military Academy Dehradun, now I am… pic.twitter.com/Qs0fB2zlLG— Bhavya Narasimhamurthy (@Bhavyanmurthy) November 4, 2025 (చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ) -
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
చిన్నప్పటినుంచీ తండ్రి వ్యాపారాన్ని చూస్తూ పెరిగింది. ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు అనుకోకుండా కుల్ఫీ మేకింగ్లో ప్రయోగం చేసింది. అంతే అక్కడినుంచి ఆమె జీవితం, ఆలోచన మారి పోయింది. కట్ చేస్తే కోటి రూపాయలు ఆర్జించే బిజినెస్కు యజమానిగా మారిపోయింది. ఎవరామె? ఏమా సక్సెస్ జర్నీ. తెలుసుకుందామా ఢిల్లీకి చెందిన సమత బోత్రా(Samta Bothra) సగటు అమ్మాయి మాదిరిగా పెళ్లి చేసుకుని భర్త, పిల్లా పాపాలతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. అలాదాదాపు మూడు దశాబ్దాలు గడచిపోయాయి. 2018లో హోలీ పండుగ సందర్బంగా సరదాగా కుల్ఫీ తయారు చేసింది. అందరికి తెగ నచ్చేసింది. ఇంటికొచ్చిన బంధువులకు కూడా రుచి చూపించింది. అంతే అలాంటి కుల్పీ కావాలని బంధువులు మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టారు. దీంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదనే ఆలోచన 51 ఏళ్ల సమత మదిలోవచ్చింది. View this post on Instagram A post shared by Foodler (@realfoodler)తన కొడుకు సహాయంతో, సమతా కేవలం మూడు రుచులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది సమత. ఇంట్లో నుండే రబ్రీ, గులాబీ , కేసర్ కుల్ఫీ ఆర్డర్స్ మీద తయారు చేసింది. కేవలం రూ.5 వేలతో మమ్మీస్ కుల్ఫీ మొదలైంది. అలా ప్రారంభ రోజుల్లో ఆర్డర్ల సంఖ్య చాలా తక్కువగా అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ వచ్చేవి. స్నేహితులు ,బంధువుల తదితరుల ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. అలా ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆరేడు నెలల తర్వాత రెగ్యులర్గా కుల్ఫీల కోసం ఆర్డర్ట్ మొదలైనాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీంతో డిమాండ్ మరింత పుంజుకుంది. ప్రతి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డర్లు వచ్చేవి.కార్పొరేట్ కంపెనీలు సైతం మమ్మీస్ కుల్ఫీలకు ఆర్డర్లు ఇచ్చేవారు. జొమాటోతో భాగస్వామ్యం కార్పొరేట్ల కోసం ఒకేసారి 2000 - 3000 కుల్ఫీ బల్క్ ఆర్డర్లు వచ్చేవి. మెట్ లైఫ్ , భారతి ఎయిర్టెల్తో సహా అనేక ఇతర కంపెనీలలో కుల్ఫీ స్టాల్లను కూడా ఏర్పాటు చేసింది. రూ. 5వేల నుంచి కోటి టర్నోవర్ దాకాడిమాండ్ బాగా పెరగడంతో రిటైల్ బిజినెస్లోకి కూడా ప్రవేశించింది సమత. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా నగర్లో మమ్మీ కుల్ఫీ షాప్ను తెరించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. మమ్మీ కుల్ఫీ రుచికి, నాణ్యతకు వినియోగదార్లు ఫిదా అయిపోయారు. దీంతో తరువాత ఏడాదికే మరో షాపును ఓపెన్ చేసే స్థాయికి చేరింది. ఇపుడు ఏడాదికి కోట రూపాయల టర్నోవర్ను సాధించింది. అన్నీ సహజ, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తామని చెబుతున్నారు సమత. ఒక్క ఐడియాతో తన జీవితాన్ని మార్చేసుకుని తన లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సమత. సక్సెస్కు వయసుతో సంబంధం లేదని ఓర్పు, సహనం, మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలని చాటి చెప్పింది. -
స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!
మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెళ్లు. అందరికీ 1990లలోనే పెళ్ళిళ్లు కూడా అయిపోయాయి. మా నాన్నగారి తల్లిగారి పేరిట ఉన్న ఆస్తిని, తను చనిపోయాక మా నాన్నగారు తన పేరుతో పట్టా పాస్ పుస్తకం తీసుకున్నారు. కొంత భూమిని అమ్మే క్రమంలో కొనేవారు మా అత్తయ్యల అంగీకారం కూడా కావాలి అని అడిగారు. అయితే అందుకు అత్తయ్యలు అంగీకరించలేదు. మా నాన్నగారు వాళ్లకి కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు మా నలుగురు అత్తయ్యలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలా? ఇవ్వకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి.– ఫణీంద్ర, చిత్తూరు జిల్లాఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాను కాబట్టి ఇక వారికి ఆస్తిలో ఎటువంటి భాగమూ ఉండదు అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. పూర్వికులు ఆస్తి మగవారి హక్కు అని ఆడవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. మీ అత్తయ్య గార్లకి పెళ్ళిళ్లు చేయకముందు – చేసిన తర్వాత కూడా ఆస్తిని మీ నాన్నగారు – మీరే కదా అనుభవిస్తున్నారు? మీరు అనుభవించిన దానితో పోలిస్తే వాళ్లకి చేసిన పెళ్ళిళ్లు సరితూగుతాయా? చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ సమాజంలో ఇంకా రాలేదు. ఆడపిల్లలకు/స్త్రీలకు సమానమైన ఆస్తి హక్కులను చట్టం కల్పించినప్పటికీ తమ హక్కు కోసం ఎంతోమంది మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏది ఏమైనా, హిందూ వారసత్వ (సవరించబడిన) చట్టం, 2005 లోని సెక్షన్ 6 ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయి. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మరోసారి తేల్చి చెప్పింది. మీరు వివరించిన దాని ప్రకారం మీకు సెక్షన్ 15 వర్తిస్తుంది. వీలునామా రాయకుండా మరణించిన మహిళ ఆస్తి సెక్షన్ 15 ప్రకారం తన వారసులకు అనగా: 1. ప్రథమంగా కొడుకులకు (లేని పక్షంలో అతని వారసులకు), కూతుళ్ళకు (లేని పక్షంలో ఆమె వారసులకు) – భర్తకు సమానంగా సంక్రమిస్తుంది.2. ద్వితీయంగా భర్త వారసులకు3. తృతీయంగా తల్లి – తండ్రులకు4. లేదా నాలుగవ పక్షంలో తండ్రి గారి వారసులకు5. ఆఖరున తల్లిగారి వారసులకు;ఇలా క్రమపద్ధతిలో మొదటివారు, లేదా రెండవ వారు, ఎవరూ లేకుంటే ఆఖరున సూచించినవారికి ఆస్తి సంక్రమిస్తుంది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు ఆస్తి పంపకాలు (పార్టిషన్) జరిగి ఉంటే తప్ప, స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే! పెళ్ళి చేశాము, కట్నం ఇచ్చాము, పురుడు పోశాము, సంక్రాంతికి కొత్త బట్టలు కొన్నాము అంటే కుదరదు. వారి హక్కును వారికి ఇవ్వండి. వారి ఆస్తిని వారికి ఇవ్వండి. మీ అత్తయ్యలకి తెలియకుండా ఆస్తిని అమ్మేస్తే అది మోసం చేసినట్టే. అలాంటి అమ్మకం చెల్లదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: మ్యాడ్ హనీ గురించి విన్నారా..? కానీ ఒక్క చుక్క తాగినా అంతే సంగతులు..) -
20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
కరియర్ పీక్లో ఉండగా, దాన్ని వదిలేసి, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని కోట్లకు పడగలెత్తిన ఒక నటి సక్సెస్ స్టోరీ గురించి తెలుసా? ఒకటీ రెండూ కాదు, ఏకంగా 1200 కోట్ల విలువైన కంపెనీకి సారధిగా సత్తా చాటుకుంటున్న ప్రముఖ టీవీ నటి ఆష్కా గొరాడియా విజయ గాథను తెలుసుకుందాం పదండినటులు కేవలం నటనలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలోనూ రాణించగలరు అని నిరూపించిన నటి ఆష్కా. టీవీ నటిగా మరపురాని పాత్రలు పోషించడమే కాదు స్టార్ట్ప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రోజువారీ సబ్బుల నుండి గ్లోబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ దాకా నైపుణ్యం విస్తరించింది.2002లో 'అచానక్ 37 సాల్ బాద్' షోతో టీవీలో అడుగుపెట్టింది. తర్వాత 'భాభి', 'తుమ్ బిన్ జౌన్ కహాన్' వంటి షోలలో పనిచేసింది. అయితే 2003లో, ఏక్తా కపూర్ షో 'కుసుమ్'తో ఆమె కరీయర్ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థి', 'సిందూర్ తేరే నామ్ కా', 'నాగిన్' పాపులర్ టీవీ సీరియల్స్తో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అష్కా కేవలం కల్పనలో మాత్రమే కాకుండా రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. 2019 లో 'దాయన్' ,రియాలిటీ షో 'కిచెన్ ఛాంపియన్ 5' లో కనిపించింది. 2021 లో, ఆమె తన వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించడానికి నటనను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.రెండు దశాబ్దాల స్టార్డమ్కు బైబై చెప్పేసింది. కళాశాల స్నేహితులు ప్రియాంక్ షా , అశుతోష్ వలాని తో కలిసి, ఈ ముగ్గురూ 2020 లో ‘రెనీ కాస్మెటిక్స్’ ను ప్రారంభించారు. మిత్రుల వ్యాపార అనుభవానికి ఆష్కార్ తెగువ, ధైర్యం మరింత కలిసి వచ్చాయి. వలం రూ.50 లక్షలతో ప్రారంభమైన డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ రూ. 1,200–1,400 కోట్లకు చేరింది. తరువాతి క్రమంలో ఈ బ్రాండ్ ఆఫ్లైన్లో కూడా విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాలలో, రెనీ కాస్మెటిక్స్ బ్రాండ్ నుండి పూర్తి స్థాయి సామ్రాజ్యంగా మారింది. లిప్స్టిక్లు, ఐలైనర్లు, హైలైటర్లు ఇలా 200 కంటే ఎక్కువ బ్యూటీ ఉత్పత్తులతో, బ్రాండ్ ఇప్పుడు భారతదేశం అంతటా 650 స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, మింత్రాలో అమ్మకాలు సాగుతున్నాయి. రెనీ సునామీమెరుపు వేగంతో వచ్చిన పెట్టుబడులు కంపెనీనీ రూ. 100 కోట్లను సేకరించింది. 2024 సంవత్సరంలో, రెనీ కాస్మెటిక్స్ కంపెనీ ఎవాల్వెన్స్ ఇండియా మరియు ఎడెల్వీస్ గ్రూప్ నేతృత్వంలో వచ్చిన నిధులతో కంపెనీ రూ. 820 కోట్ల నుండి కూల్ రూ. 1,200 కోట్లకు ఎగిసింది. కాగా భారతదేశంలో అందం మరియు సౌందర్య సాధనాల పరిశ్రమ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్లను మించుతుందని అంచనా.రెనీ అంటే అర్థం ఇదీ! “రెనీ” అనే పేరుకు ఫ్రెంచ్లో “పునర్జన్మ” అని అర్థం. అలా రెనీ ద్వారా ఆష్క తన కరియర్ పునర్ని ర్మించుకుంది. తాను 16 ఏళ్ల వయసులో గుజరాత్ నుండి ముంబైకి వచ్చిన అష్కా ప్రారంభంలో, పేయింగ్ గెస్ట్గా అద్దె ఇంట్లో నివసించింది. కానీ 23 ఏళ్ల వయసులో ముంబైలో నా సొంత ఇల్లు కొనుక్కోవడం తన జీవితంలో పెద్ద సక్సెస్ అయి ఒక సందర్బంలో స్వయంగా చెప్పుకుంది ఆష్కా. ఇంతటి అద్భుతమైన విజయంతో నటననుంచి వ్యాపారవేత్తలుగా మారిన అతి కొద్ది మంది వారిలో ఆష్క ముందు వరుసలో ఉంటారు. ప్రేమ, పెళ్లి ప్రతి సూపర్ ఉమెన్ వెనుక, ఒక సూపర్ సపోర్టివ్ పార్టనర్ తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో ఆషా భర్త కూడా ఒకరు. 2016లోపరిచయమైన అమెరికన్ వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్తో ప్రేమలో పడింది. 2017లో వీరిద్దరూ క్రైస్తవ , హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. -
సరిగమల్లో నవ మాసాలు
స్త్రీ గర్భం దాల్చాక శిశు జననం వరకూ ఎన్నో ఆనంద ఘడియలు, అన్నే ఆందోళనలు. తల్లి ఆరోగ్యమూ, బిడ్డ ఆరోగ్యమూ కాపాడుకోవాలి. తల్లితో లోపలి బిడ్డ బంధం బలపడాలి. ఇవన్నీ సంగీతం వల్ల సాధ్యమవుతాయంటోంది చెన్నైకి చెందిన మ్యూజిక్ టీచర్ దివ్యలక్ష్మి. గర్భం దాల్చిన తల్లులకు శాస్త్రీయ సంగీతం నేర్పేందుకు దివ్య తయారు చేసిన ఆరు నెలల కోర్సుకు కాబోయే తల్లులు సరిగమలతో బదులిస్తున్నారు. వివరాలు...దివ్యలక్ష్మి కమలాకన్నన్కు ఈ ఐడియా తన కూతురిని చూశాక వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చదివి ఆ తర్వాత బాల్యం నుంచి నేర్చుకుంటున్న కర్నాటక సంగీతంలోనే తన జీవితాన్ని నిమగ్నం చేయాలని నిశ్చయించుకున్న దివ్య లక్ష్మి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా తీసుకుంది. ఆ తర్వాత సౌత్ చెన్నైలో ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇవ్వడమే కాక అక్కడి కిల్పార్క్ గార్డెన్లో ‘ఆరోహణ’ పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కర్నాటక, హిందూస్తాని, ఇన్స్ట్రుమెంటల్ సంగీతాలలో ఇక్కడ శిక్షణ ఇస్తూ గుర్తింపు పొందిన దివ్యలక్ష్మి లాక్డౌన్ రావడంతో డీలా పడింది. ఇన్స్టిట్యూట్ మూసేసింది. ఆ సమయానికి ఆమె గర్భంతో ఉంది. ఇంట్లో తనే సంగీత సాధన చేస్తూ వెళ్లింది.కుమార్తె ఆరోహి పుట్టాక ఆ పాప ఒకటిన్నర సంవత్సరాల వయసుకే విపరీతంగా జ్ఞాపకశక్తి ప్రదర్శించడం దివ్యలక్ష్మికి ఆశ్చర్యం కలిగించింది. మూడున్నరేళ్లు వచ్చేసరికి ఆరోహి వయొలిన్ చేత పట్టుకుని సరిగమలు పలికించడం ఇంకా సంతోషపెట్టింది. ఆరోహి తన కడుపులో ఉన్నప్పుడు తాను సాధన చేసిన శాస్త్రీయ సంగీతం పాప తెలివితేటల ఎదుగుదలకు ఉపయోగపడిందని దివ్యలక్ష్మికి అనిపించింది. గర్భవతులకు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే, వారు డెలివరీ అయ్యేంత వరకు శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే పుట్టబోయే బిడ్డకు అన్ని విధాలా ఉపయోగమని అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని మరింతగా నిర్థారించుకోవాలని నిశ్చయించుకుంది.మ్యూజిక్ థెరపీకొన్ని అధ్యయనాల ప్రకారం మ్యూజిక్ థెరపీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి, గుండె స్పందనలకు బాగా పని చేస్తుందని నిర్థారితమైంది. సంగీతం గర్భిణుల్లో ఉండే యాంగ్జయిటీ, లో–బీపీ వంటి సమస్యలను దూరం చేయగలదని స్వీయ పరిశీలన ద్వారా అర్థం చేసుకున్న దివ్యలక్ష్మి తమ కాలనీలో ఉన్న నలుగురైదుగురు గర్భవతులకు ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సంగీతం నేర్పించసాగింది. వారికి ఆ పాఠాలు ఆహ్లాదం కలిగించడమే కాదు ప్రసవాలు కూడా కాంప్లికేషన్స్ ఎదురవకుండా జరిగాయి. దాంతో ఆరునెలల కోర్సు తయారు చేసిన దివ్యలక్ష్మి మళ్లీ సంగీత పాఠశాల తెరిచి ఇప్పుడు గర్భిణులకు సంగీత పాఠాలు చెబుతోంది.ఆమె దగ్గర నేర్చుకోలేకపోయినా, ఉన్నచోట నేర్చుకోలేకపోయినా, గర్భిణులు తరచూ ఆహ్లాదపరిచే సంగీతం వినడం, మంచి పాటలు హమ్ చేసుకుంటూ ప్రశాంతంగా గడపడం వల్ల మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుంది.నాదమే వైద్యం‘సంగీతంలో నాదం ఉంటుంది. ఆ నాదం గర్భిణీ స్త్రీ శరీరంలోని నీటిలో అనునాదం పుట్టిస్తుంది. ఆమె ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే కాకుండా పిండస్థ శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు... ఇలా సంగీత పాఠాల కోసం వచ్చే గర్భిణుల మధ్య ఒక స్నేహం ఏర్పడి ఒకరికొకరు అన్నట్టుగా ఉండటంతో ఆందోళనలు పూర్తిగా పోతాయి’ అంటోంది దివ్యలక్ష్మి. -
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్కుమార్రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్ను ఎలా చిక్గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్తో కంఫర్ట్ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్సెట్టర్గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్ను సాధించిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్జస్ట్గా గుర్తించారు. చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకిహర్మన్ ప్రీత్కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్గా రాయల్ లుక్లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)కాగా పంజాబ్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ది. అయితే ఆ బ్యాట్ను స్మృతి సోదరుడు శ్రవణ్కు (జూనియర్ క్రికెటర్గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్ప్రీత్కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్స్టార్ అయింది. క్రికెట్తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్చైర్లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్చైర్లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్చైర్పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్తో జరిగిన మ్యాచ్లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్బాల్ ప్లేయర్స్ను పరిచయం చేశారు. -
మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్ విషెస్ : సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లో
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 (ICC Womens World Cup 2025) భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. దక్షిణాఫ్రికా-ఇండియా జట్ల మధ్య నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి ప్రపంచ కప్ ట్రోఫీని భారత మహిళా క్రికెట్ జట్టు గెలుచుకున్న సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ క్రికెట్ ప్రేమికురాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీఅభినందనలు తెలిపారు.దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు జట్టుకు కృతజ్ఞతలు తెలిపారు నీతా. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీమిండియా మహిళల ప్రపంచ కప్ సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జట్టుకు ప్రత్యేక అభినంనదనలు తెలిపారు. అర్ధరాత్రి వేళ, మన అమ్మాయిలు మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ధైర్యం, దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసంతో ఆడిన తీరుతో, మొత్తం దేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశారని భావిస్తున్నాఅన్నారు. మీ విజయం పట్ల చాలా గర్వపడుతున్నాం. ధన్యవాదాలు, జై హింద్ అని ఉత్సాహంగా చెప్పారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు , చైర్పర్సన్ నీతా అంబానీ మ్యాచ్ జరుగుతున్నంత సేపు భారత జెండాను ఊపుతూ, జట్టుకు ఉత్సాహపరుస్తూ, అమ్మాయిలు ప్రపంచ కప్ గెలుచుకోగానే పట్టరాని సంతోషంగా కనిపించారు. మ్యాచ్ ఆద్యంత ఆమె ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి మారాయి. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్సింపుల్ అండ్ స్టైలిష్ దుస్తులలో నీతా అంబానీ అదరగొట్టారు. సమయానికి తగ్గట్టు అన్నట్టగా క్లాసిక్ వైట్ షర్ట్ , నీలిరంగు డెనిమ్ జీన్స్లో మెరిసారు. అలాగే విలాసవంతమైన బంగారు బ్రాస్లెట్ వాచ్, భారీ డైమండ్ సెంటర్ స్టోన్ పొదిగిన స్టేట్మెంట్ గోల్డ్ రింగ్, డైమండ్ ఇయర్ స్టడ్లను ఆమె ఎంచుకున్నారు.ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు ఆకాష్ అంబానీ కూడా హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, భార్యతో కలిసి రోహిత్ శర్మ, ఇతర టీమిండియా మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇండియా మహిళల సేన దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. #WATCH | Founder-Chairperson of Reliance Foundation, Nita M. Ambani congratulates Indian captain Harmanpreet Kaur after she guided India to the first-ever women's World Cup title.(Source: Special Arrangement) pic.twitter.com/vdgVy7eere— ANI (@ANI) November 3, 2025“The way you have played with courage, confidence and conviction. We are all so proud of you.”Mrs. Nita Ambani shared her feeling of pride towards the Women in Blue 💙✨ #AaliRe #CWC25 #INDvSA pic.twitter.com/ItCsYn93M3— Mumbai Indians (@mipaltan) November 2, 2025 -
టీచర్ కాబోయి యాంకర్.. ఈమె ఎవరో తెలుసా?
ఎమ్మెస్సీ బీఈడీ చదివిన ఆమె.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు. తన మధుర స్వరం, సంభాషణ చాతుర్యం ఆమెను ముందుకు నడిపించాయి. వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. యాంకరింగ్ చేస్తూనే ఈవెంట్స్ నిర్వహణతో మరో యాభై మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డికి చెందిన ప్రసన్నలక్ష్మి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్లో జన్మనిచ్చిన ప్రసన్నలక్ష్మి కులకర్ణి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు విజయవర్ధన్తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్త, కుమారుడితో కలిసి పట్టణంలోని దేవి విహార్లో నివసిస్తున్నారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన ఆమె ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రెండుసార్లు డీఎస్సీ రాసినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లి ష్, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రావీణం ఉన్న ప్రసన్నలక్ష్మికి చదువుకునే సమయంనుంచి ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం, రాయడం అలవాట్లున్నాయి. అదే ఆమెకు బతుకుబాట చూపింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో ఏడేళ్ల క్రితం వ్యాఖ్యాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంచి గాత్రంతోపాటు సంభాషణ చాతుర్యం ఉన్న ఆమె ఈ రంగంలో సక్సెస్ అయ్యారు. వందలాది కార్యక్రమాల్లో ఆమె తన మాట, పాటలతో వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అధికారిక కార్యక్రమాల్లోనూ తనదైన యాంకరింగ్తో మెప్పిస్తున్నారు.పెళ్లిళ్లు, ఫంక్షన్లలో...ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఆట, పాటలతో అలరింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైనవన్నీ ఈవెంట్ ఆర్గనైజర్లే చూసుకుంటున్నారు. ప్రసన్నలక్ష్మి అన్నపూర్ణ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఈ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్... ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బుకింగ్స్ ఉంటున్నాయి. తమ సంస్థలో యాభై నుంచి అరవై మందికి ఉపాధి కలి్పస్తున్నామని ప్రసన్నలక్ష్మి తెలిపారు.మాట, పాటలతో...ప్రసన్నలక్ష్మి ఐదు భాషలలో మాట్లాడడంతో పాటు శ్రావ్యంగా పాటలూ పాడతారు. వీడియోలకు అవసరమైన వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. ఉద్యోగుల సన్మాన కార్యక్రమాలు, ఉద్యోగ విరమణ కార్యక్రమాలు, బదిలీ కార్యక్రమాలలో వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలను ప్రిపేర్ చేసి తన మాట, పాటలతో ఆహూతులను ఆకట్టుకుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో దాండియా, కోలాటం, బతుకమ్మ ఆటలు కూడా ఆడించడం ద్వారా అందరినీ ఉత్తేజపరుస్తుంటారు. తన వెంట ఉండే బృందంతో నృత్యాలు చేయిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. -
నీతా అంబానీ : దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ 62 పుట్టిన రోజు (Happy Birthday to Nita Ambani ) జరుపుకుంటున్నారు. దాతగా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా నీతా అంబానీ పేరు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమేకాదు, వ్యాపారవేత్తగా, దాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మహిళ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక విభాగం, విపత్తు నిర్వహణ లాంటి అనేక అంశాల్లో నీతా అంబానీ తనదైన శైలిలో సేవలందించి లక్షలాదిమందికి దగ్గరయ్యారు. Warmest birthday wishes to our Founder and Chairperson, Mrs. Nita Mukesh Ambani. pic.twitter.com/mK2hdQQ8eU— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2025 అంతేకాదు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమానిగా జట్టు విజయవంతంగా నడిపించిన ఘనత ఆమె సొంతం. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ ద్వారా, కళలకు, దేశీయ వస్త్రాలకు ఎంతో ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికైన తొలి భారతీయురాలు. ఇటీవల పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ‘ఇండియా హాల్’ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ పేరుతో ప్రోత్సహించారు. నీతా అంబానీ 62వ పుట్టిన రోజు (నవంబరు 1)అనేక మంది ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్, ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీ ప్రత్యేకంగా బర్త్డే విషెస్ అందించాయి. -
ఆమె ఇల్లే ఓ ల్యాండ్ మార్క్!
ఎవరికైనా ఇంటి అడ్రస్ చెప్పడానికి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మార్క్ చెబుతాం తేలిగ్గా కనుక్కోవడానికి! కానీ ఇల్లే అలా ల్యాండ్మార్క్ అయిన అబ్బురం గురించి విన్నారా? ఆ ఘనత క్రికెటర్ దీప్తి శర్మకు దక్కుతుంది. ఆమె ఇంటి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తి శర్మ మార్గ్: సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ కనపడుతుంది. ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలే! ఆల్రౌండర్గా అందులో ఆమె చూపిస్తున్న ప్రతిభనే సందర్భంగా దీప్తి పరిచయం.. ఆగ్రాలోని షాగంజ్, అవద్పురి కాలనీలో పుట్టి పెరిగారు దీప్తి. చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ బ్యాట్తో ఆగ్రా వీధులను చుట్టారు. తన స్పిన్ బౌలింగ్తో ఆ ఊరి దారులను సుపరిచితం చేసుకున్నారు. క్రికెటర్ కావాలన్న ఆ దీక్షే ఆమెను ఈ రోజు స్టేడియంలో నిలబెట్టింది. వరల్డ్ కప్ టీమ్లో భాగస్వామిని చేసింది.అన్నయ్యే తొలి గురువుగా.. దీప్తికి క్రికెట్ మీద ఆసక్తి ఏర్పడింది అన్నయ్య సుమిత్ శర్మ క్రికెట్ ఆడటాన్ని చూసే. అన్నయ్యను అనుకరిస్తూ ఆమె క్రికెట్ ఆడేవారు. అది అన్నయ్య దృష్టిలో పడింది. క్రికెట్ అంటే దీప్తికున్న మక్కువనూ, ఆ ఆటలో ఆమె ప్రతిభనూ గమనించాడు. అంతే! చెల్లికి తొలి కోచ్గా మారాడు. ‘ఆడపిల్లకు క్రికెట్ ఏంటీ?’ అన్న బంధువుల మాటలకు తలొగ్గిన తల్లి .. చెల్లిని క్రికెట్ ఆడనీయకుండా ప్రయత్నించేది. కానీ అమ్మకు తెలియకుండా చెల్లిని గ్రౌండ్కి తీసుకెళ్లి క్రికెట్లోని మెలకువలను నేర్పించాడు అన్నయ్య. ఆట పట్ల ఆ పిల్లలకున్న నిబద్ధతను చూసి తల్లిదండ్రులూ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. బంధువుల మాటను బేఖాతరు చేసి. చదువునూ సీరియస్గా తీసుకోవాలనే షరతు పెట్టారు. అలా ఆ ఇంటి పెద్దలు రెండిటి మధ్య సమన్వయం పాటించినట్లే దీప్తి కూడా చదువు, క్రికెట్ రెండిటినీ సమన్వయం చేసుకుంది. ప్రొఫెషనల్ క్రికెటర్గా..గ్రౌండ్లో అన్నాచెల్లెళ్ల క్రికెట్ కమిట్మెంట్ చూసిన స్థానిక కోచ్లు దీప్తికి తదుపరి శిక్షణనివ్వడానికి ముందుకు వచ్చారు. ఆ శిక్షణ ఆమె బ్యాటింగ్ను, బౌలింగ్ స్కిల్స్ను మెరుగుపరచాయి. దానికి తోడు గ్రౌండ్లో గంటల కొద్దీ ప్రాక్టీస్.. ఆమెను ఆల్రౌండర్గా మలిచింది. ఆ ప్రత్యేకతే నేషనల్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. పదిహేడేళ్ల వయసులోనే ఆమెకు ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టులో స్థానం కల్పించేలా చేసింది. ఆమె ప్రతిభ యూపీ వారియర్స్ (ఐపీఎల్)కి కెప్టెన్ను చేసింది. తర్వాత అంతర్జాతీయ క్రికెట్కూ చేర్చింది. సవాళ్లు.. విజయాలుగెలుపు దారి అంత సులువుగా ఉండదు. ఇందుకు దీప్తి క్రికెట్ ప్రయాణం మినహాయింపు కాదు. ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటీ అని పెదవి విరవడాల దగ్గర్నుంచి క్రికెట్లో లింగవివక్ష లాంటి నుదురు చిట్లింపుల వరకు ప్రతి చిన్నా పెద్దా సవాళ్లకు ఎదురొడ్డింది దీప్తి. అన్నిటినీ బౌల్డ్ చేసింది.. మూస ఆలోచనలను బౌండరీకి ఆవల నెట్టేసింది. ఒక్కమాటలో క్రికెట్లో ఆమె ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. వన్ డే ఇంటర్నేషనల్స్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు క్రికెట్లో ఉన్న పురుషాధిపత్యాన్నీ బ్రేక్ చేసింది. ఇలా ఆటలోని ఆమె శైలి, వ్యూహం, స్థిరత్వం అన్నీ మన దేశ మహిళా క్రికెట్ను ఉన్నత స్థితికి చేర్చాయి. అందుకే మన మహిళా క్రికెట్లో ఆమెను ఒక అద్భుతంగా అభివర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. చిన్న పట్టణం నుంచి పెద్ద కలతో విశాలమైన మైదానంలోకి అడుగుపెట్టి ఆ కలను ఆమె సాకారం చేసుకున్న తీరు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ స్ఫూర్తే! అందుకే దీప్తి శర్మ అర్జున అవార్డ్ అందుకున్న వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆమె ఇంటిముందున్న రోడ్లను సువిశాలం చేసి.. ఆమె ఉంటున్న వీథికి మౌలిక సదుపాయాలను కల్పించారట. ఆ గౌరవంతోనే అవద్పురి వాసులు తమ వీథి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తిశర్మ మార్గ్ : సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ను ఏర్పాటు చేశారు. ‘జీవితంలో.. ఆటలో ఎక్కడైనా ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే విజయం. ఆ చాలెంజెసే మనల్ని అద్భుతమైన ప్లేయర్గా తీర్చిదిద్దుతాయి ఆటలో అయినా.. జీవితంలో అయినా!– దీప్తి శర్మ -
ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..
తొలి మహిళ ఇంజనీర్గా కంప్యూటర్ రంగంలో కృషి చేసిన కర్ణాటకకు చెందని రాజేశ్వరి ఛటర్జీ లేదా మెరైన్ ఇంజనీర్ సోనాలి బెనర్జీ పేర్లనే చెప్పుకుంటాం. కానీ వారందరికంటే ఒక వితంతవు..నాటి సామాజిక పరిస్థితులను చేధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో చేరి, రాణించి దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. చరిత్ర ఆమె విజయాలను అంతగా గుర్తించకపోయినా..ఎలక్రికల్ ఇంజనీర్లో తొలి మహిళా గ్రాడ్యుయేట్ అనేది కాదనలేని సత్యం. అంతేగాదు ఎందరో అమ్మాయిలు ఆ రంగంలో చేరేలా పురికొల్పేందుకు కారణమైంది. నాడు ఆ ఒక్క మినహాయింపుతో..ఎవ్వరూ చేయలేని సాహసం చేసిన తొలి మహిళ ఆమె. ఔను ఏరంగంలోనైనా ఫస్ట్ పొజిషన్లో ఉండటం అంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే మార్గదర్శకులు ఉండరు, పైగా ఎన్నో కళ్లు మన గెలుపుని అనుమానిస్తాయి, తక్కువ అంచనా వేస్తాయి. వాటన్నింటిని అధిగమించి అసాధారణ గెలుపుని ఒడిసి పట్టి యావత్తు ప్రపంచం గుర్తించుకునేలా చేసిన తొలి మహిళా ఇంజనీర్ ఆమె. ఈ తరానికి అంతగా తెలియని, గుర్తింపుకు నొచుకుని ఆ మహిళ ఇంజనీర్ ఎవరంటే..ఆ మహిళే..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయూజుల లలిత. మన తెలుగమ్మాయే. చెన్నైలోని గిండిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పుడూ తొలి రోజు కాలేజీలో ఎదురైన ఘటనకు మరెవ్వరైనా..మళ్లీ అడుగు పెట్టడానికే భయపడిపోతారు. కానీ లలిత ఉక్కు ధైర్యంతో ముందుకుసాగారామె. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో అంతా అబ్బాయిలే ఉండేవారు. ఒకే ఒక్క అమ్మాయి తన సహచర విద్యార్థిగా అడుగుపెడుతుందని తెలిసి అంతా వింతగా, ఎగతాళిగా నవ్వులు వినిపిస్తున్నా..ఓపికతో భరించింది. కూర్చొనేందుకు చోటు లేని పరిస్థితి. ఆమె కోసం ప్రత్యేకంగా సెపరేట్గా వేసిన కూర్చీలో కూర్చొని పాఠాలు వినింది. కాటన్ చీరలో తలొంచుకుని నిశబ్దంగా వస్తున్న అమ్మాయిని చూసి అందరికీ చిన్న చూపు, ద్వేషం. అయినా తన పని, లక్ష్యంమీద దృష్టిపెట్టి..కొద్దికాలంలోనే ప్రొఫైసర్లకు, తన తోటి పురుష విద్యార్థులకు అభిమాన సహచర విద్యార్థినిగా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఆ కాలేజీలో మహిళ హాస్ట్ల్ లేకపోయినా..తన కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో ఉండి, చదువుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి.ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు దారితీసిన పరిస్థితి..ఆగస్టు 27, 1919 చెన్నైలో ఒక తెలుగుకుటుంబంలో జన్మించిన లలిత నాటి కాలంలోని సామాజిక పరిస్థితులన్నింటిని ధిక్కరించి చదువుకున్న తొలి మహిళ. 15 ఏళ్ల ప్రాయానికే వివాహం చేసుకుని 18 ఏళ్లకే వితంతువుగా మారింది. శ్యామల అనే కూతురుకి తల్లిగా మారింది. ఒక్కసారిగా నిశబ్దంలోకి తొంగి చూస్తున్న ఆమె జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆమె తండ్రి ఇంజనీర్, లెక్చరర్ అయిన ప్రొఫెసర్ అయ్యల సోమయాజుల సుబ్బారావు. ఆమె జీవితంలోకి వచ్చిన నష్టాన్ని పూరించలేకపోవచ్చు..ఏదో వ్యాపకంతో ఆమె జీవితం చిగురించేలా చేయాలని ఆశించారు. కేవలం విద్యతోనే ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొంది ధైర్యంగా మనగలదని ప్రగాఢంగా నమ్మారాయన. ఆ ఉద్దేశ్యంతోనే ఇంట్లోనే లలితకు గణితం, భౌతిక శాస్త్రాన్ని బోధించారాయన. ఆ తర్వాత గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు. అయితే ఆ సమయంలో మహిళా హాస్టళ్లు లేవు, ప్రత్యేక సౌకర్యాలు లేవు. స్త్రీని చేర్చుకునే విద్యావిధానం కూడా లేదు. కానీ సుబ్బారావుగారు స్వయంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డికి విజ్ఞప్తి చేసి లలితను 'స్పెషల్ కేసు'గా చేర్చుకునేలా ఒప్పించారు. ఆ ఒక్క మినహాయింపు చరిత్ర గతిని మార్చేసింది. అయితే లలిత తండ్రి నమ్మకాన్ని నిజం చేసేలా తన కోర్సులో రాణించింది, మంచి స్కిల్ సంపాదించుకుంది. అలా 1944 నాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలై..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యిందామె. గ్రాడ్యుయేషన్ అనంతరం లలిత సిమ్లాలోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(సీఎస్ఓ)లో చేరారు. అక్కడ ఆమె దేశానికి కీలకమైన విద్యుత్ పరికరాలు సాంకేతికత భద్రతా ప్రమాణాలను నిర్ణయించే విధులను నిర్వర్తించేది. ఆ తర్వాత కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్(ఏఈఐ)లో విద్యుత్ కేంద్రాల కోసం విద్యుత్ జనరేటర్లు, రక్షణ రిలేను రూపొందించారు. అంతేగాదు దేశ పురోగతికి శక్తినిచ్చే.. విద్యుత్గ్రిడ్కి సంబంధించిన సమర్థవంతమైన వ్యవస్థలో స్పెషలిస్ట్గా ఉన్నారు. నిశబ్దంగా ఉండే ఆమె ధోరణి వల్లే ప్రపంచానికి లలితా అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురించి తెలియకుండాపోయింది. ఒక పక్క కూతురు శ్యామలను పెంచుతూనే ఇంజనీరింగ్ వృత్తిలో అంచలంచెలుగా రాణిస్తోందామె. ఆమెకు దక్కిన అసాధారణ గుర్తింపు..1964లో, న్యూయార్క్లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సదస్సు(ICWES)లో లలిత భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ సదస్సులో ఆమె 35 దేశాల మార్గదర్శకులతో వేదికను పంచుకుంది. అంతలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విశేష ప్రతిభను కనబర్చిన ఆమె 1979లో మరణించారు. కానీ చరిత్ర ఆమె సాధించిన విజయాలను అంతగా గుర్తించలేదు. తొలి మహిళా ఇంజనీరింగ్గా ఎవరెవరో పేర్లను వినిపించేదే తప్ప వారందరికంటే..లలిత ఒక వితంతువుగా నాటి సామాజిక పరిస్థితులను చేధించుకుంటూ సాగిన వైనాన్ని గుర్తించకపోవడం బాధకరం.(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..
గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్షిప్ నవంబర్లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..) -
ఈ కెమెరాకు భయం లేదు
‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్లో బిందూయే చాలామందికి ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.అనుకోకుండా ఒకరోజువి.వి.బిందుది కొడంగల్లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్లో కొట్టినపిండి అయ్యింది. దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.విరామం తీసుకున్నాపెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.కేసుకు 2000 రూపాయలుబిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది. గుండె దడదడనేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ. -
ఎవరీ టెంజిన్ యాంగ్కి..? ఆనంద్ మహీంద్రా సైతం..
ఏ రంగంలోనైనా మొదటి వ్యక్తి కావడం అంత ఈజీ కాదు. తనకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకుని, అందులో తొలి వ్యక్తిగా నిలిచేందుకు ఎలాంటి మార్గదర్శకులు ఉండరు. అయినా సరే గెలవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగి సక్సెస్ని అందుకుని సరికొత్త మైలురాయిని సృష్టిస్తారు అంటూ పారిశ్రామిక దిగ్గజం టెక్ మహీంద్రా తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచిని టెన్జిన్ యాంగ్కిని ప్రశంసిస్తూ మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. ఈసారి మనకు ప్రేరణ ఈ ఐపీఎస్ అధికారిణి అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో టెంజిన్ యాంగ్కి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..!.తవాంగ్కు చెందిన టెంజిన్ యాంగ్కి(Tenzin Yangki ) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్గా(Arunachal's First Woman IPS Officer) చరిత్ర సృష్టించారు. ఇక్కడ ఆమె, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, వారసత్వంగా సక్రమించిన ప్రజాసేవ తదితరాలతో సాగిన ఆమె సక్సెస్ జర్నీ ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదిలించింది.టెంజిన్ ఎవరంటే..ఆమె దివంగత తండ్రి తుప్టెన్ టెంపా, IAS అధికారి, మాజీ మంత్రి, తల్లి జిగ్మి చోడెన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక టెంజిన్ విద్య నేపథ్యం వచ్చేసి..జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఆమె 2017లో ఏపీపీఎస్సీలో ఉత్తీర్ణురాలై, సియాంగ్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 545వ ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించి ఐపీఎస్ క్యాడర్కి ఎంపికైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని.. ఇటీవల అక్టోబర్ 17న, జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్వహించిన ఈ శిక్షణలో 36 శాతం మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..టెంజిన్ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారామె. సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది..ఈ ఐపీఎస్ అధికారిణి టెంజిన్ యాంగ్కి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకువెళ్తోంది. తనకంటూ ఒక వినూత్న మార్గాన్ని ఏర్పరచుకుని అందులో తానే తొలి వ్యక్తిగా నిలవడం అంత సులభం కానిదే అయినా..ఆమె సాధించి చూపించింది. పైగా ఎందరో తన మార్గంలో నడిచేలా స్ఫూర్తిని రగిలించింది. ఈ రోజు ఒంటిరిగా నడుస్తున్నా అని భయపడ్డా..ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు, త్వరలో వారికి మీరు మార్గదర్శకులుగా మారేరోజు వస్తుంది. అందుక ఉదహరణ టెంజిన్ యాంగ్కి అంటూ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్లో రాసుకొచ్చారు. కాగా, టెన్జిన్ సాధించిన ఈ విజయం ఈశాన్య ప్రాంతానికి చెందిన మహిళలకు ఒక గొప్ప ఒక మైలురాయి క్షణం. ఎందుకంటే అక్కడ జాతీయ నాయకత్వ పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.Tenzin Yangki from Tawang has become the first woman from Arunachal Pradesh to join the Indian Police Service.An academician, a civil servant, and now an IPS officer, she carries forward the legacy of service from her parents while carving her own path of excellence.Being… pic.twitter.com/YWt8TCLadF— anand mahindra (@anandmahindra) October 27, 2025 (చదవండి: Success Story: కాలేజ్కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..) -
వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!
సరికొత్త క్రీడా స్ఫూర్తిని నింపింది ఈ తల్లి. తన గెలుపుతో సరికొత్త అధ్యయానికి తెరతీసిందామె. గర్భంతో ఉన్నవాళ్లు చిన్న చిన్న బరువులు ఎత్తేందుకే భయపడతారు. అలాంటిది వెయిల్లిఫ్టింగ్లో పాల్గొనడమే కాదు విజయం సాధించింది ఈ మహిళ. స్థిరత్వం, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించొచ్చని నిరూపించింది ఈ తల్లి. ఏడు నెలల నిండు గర్భిణి అయిన సోనికా యాదవ్(Sonika Yadav) ఈ ఘనత సృష్టించింది. ఆమె ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్(Delhi Police constable)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26(Weightlifting Cluster 2025-26 )లో పాల్గొని 145 కిలోల బరువుని ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె గత మే నెలలో గర్భం దాల్చినట్లు నిర్థారణ అయ్యాక..శిక్షణ నిలిపేస్తుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే ఆమెకు క్రీడలు, ఫిట్నెస్ పట్ల ఉన్న మక్కువతో కొనసాగించాలనే నిర్ణయించుకుంది. చాలా దృఢసంకల్పంతో నిపుణుల పర్యవేక్షణలో తన వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ని తీసుకున్నట్లు పేర్కొంది. నిజానికి ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఎవ్వరికీ ఆమె గర్భిణి అని తెలియదు. ఎందుకంటే సోనియా వదులుగా ఉన్న దుస్తులే ధరించి సహ పోటీదారులతో పాల్గొంది. చివరి డెడ్లిఫ్ట్ ప్రయత్నంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఆమె క్రీడాస్ఫూర్తిని చూసి ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులతో చప్పట్లుతో అభినందనలు వెల్లువెత్తాయి. ఆ అసాధారణ గెలుపుని చూసిన వివిధ పోలీసు విభాగాల మహిళా అధికారులంతా సోనికాని అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తారు. ఇక సోనికా గర్భవతిగా ఉండగా ఇలాంటి పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ లిఫ్టర్ లూసీ మార్టిన్స్ నుంచి ప్రేరణ పొందినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, 2014 బ్యాచ్ అధికారిణి అయిన సోనికా ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్లో పనిచేస్తున్నారు. గతంలో, మజ్ను కా తిలా ప్రాంతంలో బీట్ ఆఫీసర్గా, అలాగే మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారాల్లోనూ కీలక పాత్ర పోషించారామె.ప్రెగ్నెంట్ టైంలో మంచిదేనా..!గర్భవతిగా ఉన్నప్పుడూ వెయిట్లిఫ్టింగ్ సురక్షితమేనని చెబుతున్నారు నిపుణులు. ప్రెగ్నెంట్ టైంలో వచ్చే వెన్నునొప్పి, వంటి సమస్యలు ఉండవని తేలికగా ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల మీ కోర్ కండరాలు బలోపేతమై..నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్లు ఎక్కువుగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. కానీ వైద్యుడు సమక్షంలో లేదా పర్యవేక్షణలో చేయాలని సూచిస్తున్నారు. వారి సలహాలు సూచనలతో తగిన జాగ్రత్తలతో బరువులు ఎత్తితే బిడ్డకు తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇక్కడ బరువు ఎత్తేటప్పుడూ.. ఫిట్నెనస్ ట్రైనర్ల సూచనలమేరకు తేలికపాటి టెక్నిక్లతో ఎత్తాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 🏋️♀️Defying limits, redefining strength💪W/Ct. Sonika of @DcpNorthDelhi clinched Bronze medal at the All India Police Weightlifting Cluster 2025-26, Amravati (A.P.), lifting a total of 350 kg in 84+ kg category — while 7 months pregnant!True embodiment of strength, courage &… pic.twitter.com/F9jqYdXAFB— Delhi Police (@DelhiPolice) October 24, 2025 (చదవండి: Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?) -
స్టార్ హార్టిస్ట్
international Animation day 2025 యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ఆ రోజుల్లో...ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.సందేహాలను వదిలి సత్తా చాటుతూ...కోల్కత్తాలోని ‘డ్రీమ్వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.బాధ నుంచి బయట పడేలా...అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది. ఇదీ చదవండి: Yoga: ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. చక్కటి ఆసనాలు‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో చేరాను. మెరుగైన సాఫ్ట్స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.మూడు ఖండాలలో...రెండు దశాబ్దాల తన కెరీర్లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్లు. మహిళల సంఖ్య పెరుగుతోంది...లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్గా రాణించడానికి జెండర్, బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.యానిమేషన్లో ఆమె బహుముఖ ప్రజ్ఞయానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’– ప్రమిత ముఖర్జీ -
సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..!
యువరానర్.. అనాలనేది చాలా మంది కల. కానీ యువరానర్ అనిపించుకునే స్థాయిలో ఉండేవారు కొందరే. ఆ కొందరిలోనూ మహిళలు తక్కువగా కనిపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మహిళా జడ్జీలు.. లాయర్ల సంఖ్య పెరుగుతుంది. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆత్మస్థైర్యంతో విజయం సాధిస్తే.. మనోధైర్యంతో వృత్తిలో రాణిస్తున్నామంటున్నారు మహిళా జడ్జిలు. వీరిపై ప్రత్యేక కథనం.ఆత్మస్థైర్యంతో ముందుకు.. సునీత కుంచాల, పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిలక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్లి విజ యం సాధించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సునీత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి గురువులు ఉపాధ్యాయుడిగా, తల్లి జయకుమారి ప్రభుత్వాస్పత్రిలో నర్సు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిన్న వయసులోనే సునీతకు వివాహమైంది. భర్త, తల్లిదండ్రుల సహకారంతో డిగ్రీ, పీజీ ప్రైవేట్గానే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. ఎల్ఎల్బీ ఉత్తీర్ణురాలు అ య్యారు. సునీత ఆడపడుచు జడ్జీ కావడంతో తాను కూడా జడ్జీ కావాలనే లక్ష్యం పెట్టుకొని.. శ్రమించా రు. 2003లో జడ్జీ పోస్టుకు పరీక్ష రాసి.. ఇంటర్వ్యూ దాకా వెళ్లి త్రుటిలో ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నారు. ఓటమితో నిరాశచెందకుండా మళ్లీ ప్రయత్నించారు. 2013లో జూనియర్ సివిల్జడ్జిగా ఎంపికయ్యారు. జిల్లా జడ్జీ కావాలనే కాంక్ష వెంటాడడంతో అదే ఏడాది పడ్డ నోటిఫికేషన్లో ఒకే పోస్టు ఉండడంతో కష్టపడి చదివి విజయం సాధించారు. పోక్సో నేరాలకు కఠిన శిక్షలుజిల్లా జడ్జిగా హైదరాబాద్లోని స్పెషల్ కోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన కాలంలో 84 పోక్సో కేసుల్లో తీర్పునిచ్చారు. 10 కేసుల్లో జీవితఖైదు విధించారు. పెద్దపల్లి జిల్లా జడ్జిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు కేసుల్లోనూ తీర్పులిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసే సమయంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు ఆఫీసు సబార్డినేటర్లుగా ఉద్యోగావకాశాన్ని కల్పించడం సంతోషాన్ని ఇచ్చిందంటారు సునీత కుంచాల. నిజామాబాద్లో పనిచేసిన కాలంలో 14 వేల మందికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. నిజామాబాద్లోని బాలసదనంలోని విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేలా ట్రస్టు ఏర్పాటు చేయించడం సంతృప్తినిచ్చిందంటారు.కష్టాలు ఎదురైనా కుంగిపోలేదు: తడిగొప్పుల ప్రవిళిక, జూనియర్ సివిల్ జడ్జి, పిడుగురాళ్లతన ప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు అనేకం ఉన్నాయని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడీ్జగా విధులు నిర్వర్తిస్తున్న తడిగొప్పుల ప్రవళిక తెలిపారు. వేములవాడ ప్రాంతంలోని కొదురుపాకకు చెందిన ప్రవళిక జడ్జీగా ఎంపికయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటర్ వరకు కరీంనగర్లో చదువుకున్నారు. 2020లో పీజీ లాసెట్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రవళిక క్లాట్ ద్వారా నల్సార్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం. వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, అత్తారింటి వారి సహకారంతో చదువు పూర్తి చేయడంతోపాటు జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులపై పూర్తి అవగాహన ఉండాలి. లాయర్గా వృత్తిలో రాణించాలంటనే నిత్య విద్యార్థి మాదిరిగా కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాల్సిందేనని ప్రవళిక తెలిపారు.ఆత్మవిశ్వాసంతోనే విజయం: గడ్డం వందన, జూనియర్ సివిల్ జడ్జి,వేములవాడ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. కష్టపడితే ఏదైనా సాధిస్తారని వేములవాడకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన నిరూపించారు. జడ్జీ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. జీవన విలువలు.. సమాజాన్ని అర్థం చేసుకోవడమని ఆమె అంటున్నారు. వేములవాడకు చెందిన వందన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సవాళ్లను స్వాగతించాలివందన తల్లిదండ్రులు గడ్డం శైలజ, సత్యనారాయణరెడ్డి. వేములవాడలో 10వ తరగతి వరకు చదువుకున్న వందన ఇంటర్ హైదరాబాద్లో, లా కోర్సు మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో పూర్తి చేశాను. న్యాయవిద్యలో పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎల్ఎల్ఎం పూర్తయ్యాక జ్యుడీషి యల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 2022లో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జడ్జిగా ఎంపికయ్యారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధిస్తామని వందన అంటున్నారు.(చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!
చరిత్ర పొరపాట్లు చేయదు. కానీ, మానవ స్వార్థం చరిత్రలో పొరపాట్లు నమోదు అయ్యేలా చేస్తుంది. అటువంటి చారిత్రకమైన స్వార్థపూరిత పొరపాట్లే ఇక్కడ ఉన్న ఈ ఆవిష్కరణలన్నీ. వీటిని కనిపెట్టింది, లేదా సృష్టించింది మహిళలే అయినప్పటికీ, ఆ గొప్పదనం పురుషులకు దక్కింది! నిజానికి ఇది ‘దక్కటం’ కాదు. ‘కొట్టేయటం’! స్త్రీల నుంచి పురుషులు.. చోరీ చేసి, ప్రపంచాన్ని మభ్యపెట్టి, గురువు స్థానంలో ఉండీ, పేటెంట్ను మూలన పడేసి, సహోద్యోగిని టాలెంట్ను తొక్కిపెట్టి, పైకి మాట్లాడనీయకుండా చేసి, పక్కకు తోసేసి...క్రెడిట్ తీసుకున్న ఇన్నోవేషన్లు.. డిస్కవరీలలో ఇవి కొన్ని మాత్రమే!మోనోపలీ గేమ్ఈ బోర్డ్ గేమ్ని కనిపెట్టింది కాలిఫోర్నియాకు చెందిన చార్ల్స్ డారో అనే ఆయన అని; కనిపెట్టి ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్ పబ్లిషర్స్కి 1935లో విక్రయించారని; అలా ఈ ‘మోనోపలీ’ బోర్డ్ గేమ్ ప్రఖ్యాతి చెందిందని ప్రపంచానికి ఒక పొరపాటు భావన ఉంది.నిజానికి మోనోపలీ బోర్డ్ గేమ్ను కనిపెట్టింది అమెరికన్ గేమ్ డిజైనర్, రచయిత్రి ఎలిజబెత్ మ్యాగీ (1866–1948). చార్ల్స్ డారో కంటే 3 దశాబ్దాల ముందే.. ‘ది ల్యాండ్లార్డ్స్ గేమ్: యాంటీ–మోనోపలిస్ట్, మోనోపలిస్ట్’ అనే పేరుతో రెండు సెట్ల మోనోపలీ గేమ్ని ఎలిజబెత్ మ్యాగీ సృష్టించారు. మోనోపలీ బోర్డ్ గేమ్లో ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను వ్యాపారంలో దివాలా తీయించటానికి, వ్యాపార ప్రపంచ జగదేక వీరుడిగా నిలవటానికి ఆస్తులను కొనుగోలు చేస్తూ, అమ్ముతూ, లాభాల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ గేమ్ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆడుతుంటారు. ఆటకు కనీసం ఇద్దరు ఉండాలి. 6 లేదా 8 మంది ప్లేయర్ల వరకు ఆడవచ్చు.పేపర్ బ్యాగులు అడుగు భాగం బల్లపరుపుగా ఉండి, పక్కకు వాలిపోకుండా స్థిరంగా నిలబడి ఉండేలా పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రానికి సృష్టికర్త నిజానికి మార్గరెట్ ఎలోయిస్ నైట్ (1838–1914) అనే అమెరికన్ మహిళ. అయితే, చార్ల్స్ అన్నన్ అనే అతడు ఆమె కనిపెట్టిన పేపర్ బ్యాగ్ డిజైన్ను తస్కరించి తన పేరుతో పేటెంట్స్ సంపాదించాడు. మార్గరెట్ ఎలోయిస్ నైట్.. పేపర్ బ్యాగ్ యంత్రానికి మొదట చెక్కతో నమూనాను తయారు చేసి, దానికి ఒరిజినల్ వెర్షన్ కోసం (ఇనుప యంత్రం నమూనా) ఒక షాపుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అన్నన్ ఆమె దగ్గరున్న పేపర్ బ్యాగ్ డిజైన్ను దొంగిలించాడు. అన్నన్పై న్యాయ పోరాటం చేసి మరీ మార్గరెట్ తన పేటెంట్ను దక్కించుకోవలసి వచ్చింది. ఆమె తన 12వ యేటే ‘ఆటో–స్టాపర్’ మెషిన్ను కూడా కనిపెట్టారు. నేటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో; పారిశ్రామిక, వాణిజ్య పరికరాలలో ఆ ఆటో స్టాపర్ (దానంతటే ఆగిపోయే ఏర్పాటు) కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది.సెక్స్ క్రోమోజోమ్లుఅమెరికన్ మహిళా జన్యుశాస్త్రవేత్త నెట్టీ స్టీవెన్స్ (1861–1912) 1905లో సెక్స్ క్రోమోజోములను కనిపెట్టారు. అయితే ఆ ఘనతను మొదట ఆమె గురువు ఇ.బి.విల్సన్ దక్కించుకున్నారు. పురుషుల్లోని లింగ నిర్ధారణ క్రోమోజోమ్ల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి నెట్టీ స్టీవెన్స్ పేడ పురుగులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు... పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ణయించేది పురుషుల క్రోమోజోమ్లేనని ఆమె కనుగొన్నారు. తల్లి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. తండ్రి శుక్రకణాల్లో ‘వై’, ‘ఎక్స్’ క్రోమోజోములు రెండూ ఉంటాయి. తండ్రిలో ‘వై’ క్రోమోజోమ్ తల్లిలోని ‘ఎక్స్’తో కలిస్తే మగబిడ్డ; లేదా తండ్రిలోని ‘ఎక్స్’– తల్లిలో ఉండే ‘ఎక్స్’తో కలిస్తే ఆడబిడ్డ పుడతారని నెట్టీ స్టీవెన్స్ కనిపెట్టారు. నెట్టీ పరిశోధనను, మరికాస్త ముందు తీసుకువెళ్లటం వరకు మాత్రమే ఇ.బి.విల్సన్ పాత్ర పరిమితమై ఉన్నప్పటికీ అసలైన సృష్టికర్తగా ఆయనకే పేరు వచ్చింది.విండ్షీల్డ్ వైపర్లు1902లో, మేరీ ఆండర్సన్ (1866–1953) అలబామా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణిస్తున్నారు. బాగా మంచు కురుస్తోంది. విండ్షీల్డుపై పడుతున్న ఆ మంచును మెత్తటి వస్త్రంతో తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును రోడ్డు పక్కన ఆపవలసి వస్తోంది. అది చూసిన మేరీ ఆండర్సన్కు ఈ విండ్షీల్డ్ వైపర్ల ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనకు పేటెంట్ను దాఖలు చేశారు.దురదృష్టవశాత్తూ ఆమె ఆవిష్కరణకు పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఇదీ ఒక ఇన్వెషనేనా అన్నారు. కొంతకాలం ఆమె పేటెంట్ గడువు ముగిసింది. తరువాత కొన్ని నెలల్లోనే అమెరికాలో ఎక్కడ చూసినా విండ్షీల్డ్ వైపర్లే! అంతేకాదు, విండ్షీల్డ్ వైపర్స్ను కనిపెట్టిన క్రెడిట్ రాబర్ట్ కియర్న్స్ అనే వ్యక్తికి దక్కింది! మేరీ ఎలిజబెత్ ఆండర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు విస్తారంగా పాడి పంటల క్షేత్రాలు ఉన్నాయి. ద్రాక్ష తోటల్ని పెంచేవారు. నిరంతరం కారు ప్రయాణాలు చేస్తుంటారు. ఏమైనా.. విండ్షీల్డ్ వైపర్ సృష్టికర్త రాబర్ట్ కియర్న్స్ కాదని, మేరీ ఎలిజబెత్ అని త్వరలోనే ప్రపంచానికి నిజం తెలిసిపోయింది.కేంద్రక విచ్ఛిత్తి ‘కేంద్రక విచ్ఛిత్తి’ని కనుగొన్నందుకు ఒట్టో హాన్ అనే జర్మనీ శాస్త్రవేత్తకు 1944లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నిజానికి ఆ బహుమతి దక్కవలసింది ఆయన సహోద్యోగి లిజ్ మీట్నర్కు! కేంద్రక విచ్ఛిత్తికి (న్యూక్లియర్ ఫిషన్) సైద్ధాంతిక వివరణను అందించింది అసలు లిజ్ మీట్నరే. యురేనియంలో మహా శక్తి ఉన్నట్లు కూడా ఆమే కనిపెట్టారు.ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియే కేంద్రక విచ్ఛిత్తి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో కేంద్రక విచ్ఛిత్తిలో శక్తి విడుదల అవుతుందని లిజ్ మీట్నర్ కనుగొన్నారు. ఆమె అందించిన సహకారం వల్లనే ఒట్టో హాన్ నోబెల్ సాధించగలిగారు.లిజ్ మీట్నర్ (1878–1968) ఆస్ట్రియన్–స్వీడిష్ అణు భౌతిక శాస్త్రవేత్త. వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1924–1948 మధ్య రసాయన శాస్త్రంలో 19 సార్లు, 1937–1967 మధ్య భౌతిక శాస్త్రంలో 30 సార్లు నోబెల్కు ఆమె నామినేట్ అయ్యారు.గ్రీన్హౌస్ ప్రభావంగ్రీన్హౌస్ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ టిండాల్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. అయితే, గ్రీన్హౌస్ ప్రభావాన్ని మొదట సిద్ధాంతీకరించి, దానిని రుజువు చేసింది నిజానికి అమెరికన్ మహిళా శాస్త్రవేత్త యునిస్ ఫూటే (1819–1888). విచారకరం ఏంటంటే – ఆమె కనిపెట్టిన ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ గురించి వివరించటానికి ఆమెకు అనుమతి లభించలేదు. దాంతో ఆమె తన పరిశోధనల గురించి మాట్లాడాలని ఒక పురుష సహోద్యోగిని అడగాల్సి వచ్చింది. 1856లోనే యూనిస్ ఫూటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను కనిపెట్టారు. కానీ 1861లో దానిని కనిపెట్టిన జాన్ టిండాల్కు ప్రాధాన్యం లభించింది. భూవాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు సూర్యుని వేడిని సంగ్రహించి భూమికి హితంగా ఉండేంత మోతాదులో మాత్రమే ఉష్ణోగ్రతను స్వీకరించి, మిగతా కిరణాలను వెనక్కు పంపే సహజ ప్రక్రియే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. (చదవండి: తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..) -
సత్తా చాటిన సిస్టర్ సబీనా
కేరళకు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో హర్డిల్స్లో అద్భుతంగా రాణించారు. 55 ఏళ్ల సబినా 55–ప్లస్ విభాగంలో మొదటిస్థానంలో నిలిచారు. కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబినా ఒకప్పుడు జాతీయ స్థాయి హర్డిలర్. తొమ్మిదో క్లాస్లో ఉన్నప్పటి నుంచి జాతీయస్థాయి హర్డిల్స్ ఈవెంట్స్లో పాల్గొనేవారు. యూనివర్శిటీ స్థాయి పోటీలలో కూడా సత్తా చాటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఆమె ఎంతోమంది విద్యార్థులను క్రీడలలో తీర్చిదిద్దారు.‘రాబోయే మార్చిలో ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నాను. ఈలోపు ఒకసారి పోటీలో పాల్గొనాలనుకున్నాను’ అన్నారు సబీన. ‘ఆమె విజయం సంకల్ప బలానికి ప్రతీక. లక్ష్యం చేరుకోవడానికి వయసు ఎప్పుడూ అడ్డు కాదని నిరూపించారు’ అని సబీనాపై ప్రశంసలు కురిపించారు కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి. మతపరమైన దుస్తులు ధరించి సబీనాపోటీలో పాల్గొనడం విశేషంగా మారింది.చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్


