breaking news
Women Power
-
లైఫ్ ఎప్పుడూ కొత్త ట్యూన్లోనే
‘కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మహిళగా నన్ను ఒక మూసలోనే ఉండమని చెప్పడానికి ఎవరికేం హక్కుంది? మీకు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి..’ అని ఘాటుగా చెబుతూనే ఈ యేడాది తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులు, హెల్తీగా, ఫిట్గా ఉండటానికి చేసిన ప్రయత్నాలు, రాబోయే కొత్త సంవత్సరంలో చేసుకోదగిన ప్లాన్స్ గురించి సింగర్ శ్రావణ భార్గవి ‘సాక్షి’తో పంచుకున్నారు.కొలంబియన్ యాసలో హిప్ హాప్ రాక్ మ్యూజిక్తో సింగర్ శ్రావణ భార్గవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కొలంబియన్ యాసలో ఉన్న ఒక పూర్తి ఆంగ్ల హిప్ హాప్ ర్యాప్ ట్రాక్ని సోషల్మీడియా ద్వారా తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా పనిచేశాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు దగ్గరగా ఉన్న ఊరిలో ఈ పాటను రెండు రోజుల పాటు షూట్ చేశాం. పాట మొత్తం ఇంగ్లిష్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ డ్రాప్లో మన సంస్కృతి ఉండాలనుకున్నాం.భయాన్ని వదిలేయాల్సిందే! ఈ సాంగ్ థీమ్లో టాక్సిక్ ఫెమినిజం గురించి ఉంటుంది. ఇదో తరహా విషపూరిత సంస్కృతి. అంటే, ఆడవాళ్లు తోటి ఆడవారి గురించి నెగిటివ్గా మాట్లాడటం. దీనిని వ్యంగ్య ధోరణిలో పాట ద్వారా చూపాను. ఉదాహరణకు.. ఒక లైంగిక దోపిడికి గురైన బాధితురాలు ఉంటే సానుభూతి చూపించకుండా ఆ అమ్మాయి గురించే తొందరపడి ఏదో ఒక మాట అనేస్తారు. ఇటీవల అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్లు డ్రెస్సింగ్ మార్చుకోవాలి సరే.. ముందు మగవాళ్లు తమ సెన్స్ మార్చుకోవాలి కదా! .. ఇలాంటి ఒక కాన్సెప్ట్లో రాసిన పాట ఇది. ఎవరైనా ఒక మహిళ ఇండిపెండెంట్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారు అధికంగా ఉంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరుగుతుంటుంది. ‘వాళ్ల మాటలు వాళ్లను మాట్లాడుకోనిద్దాం. నేను ఎందుకు వాటిని పట్టించుకోవాలి’ అనే ఆలోచనకు వచ్చాను. దీనివల్ల మరింత బాగా వర్క్ చేయగలుగుతున్నాను.నేను అనుకున్న థీమ్లో పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడటం నా మెయిన్ వర్క్ అయితే నాతో పాటు కొత్త గ్రూప్ కలిశారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశాను. మన ఎదుగుదలకు దోహదం చేసే స్నేహితులను పెంచుకోవడం చాలా అవసరం. అది నేను ఈ యేడాది నేర్చుకున్నాను. అంతేకాదు, ఈ పాట ద్వారా నాలో ఉన్న అన్ని భయాలు పోయాయి. నా మ్యూజిక్, వర్క్ ద్వారా ఈ యేడాది ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసుకున్నాను.వారి నుంచి అది నేర్చుకున్నానుసోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అదే మనకు థ్రెట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆఫ్లైన్లో ఎలా హద్దుల్లో ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. నేటి యువత ముఖ్యంగా జెన్జి గురించి మనం ఏదో అనుకొని ఆందోళన చెందుతుంటాం. కానీ, వాళ్లు చాలా క్లియర్గా ఉంటున్నారు. ‘నాకు నచ్చింది చేస్తున్నాను’ అనే క్లారిటీ వారికి ఉంది. ‘నో అంటే నో’ అనే చెబుతున్నారు. ఇది వారి నుంచి నేర్చుకున్నాను. ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనను మిస్ అయ్యానే అనిపించింది.బలంగా ఎదగాలని...నా కూతురు పెద్దయ్యాక నన్ను చూసి గర్వంగా ఫీలయ్యేలా నా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల్లో స్ట్రాంగ్ పర్సనాలిటీని పెంచడం అనేది చాలా ముఖ్యం. అది చెబితే రాదు. నన్ను చూసే నా కూతురు నేర్చుకుంటుంది కాబట్టి, నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాను. మేమిద్దరమే సినిమాలకు వెళతాం, ఇద్దరం ఒకేసారి బుక్స్ చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. ఒక నెల రోజులపాటు ఇద్దరం కలిసి యూరప్ దేశాలు తిరిగి వచ్చాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకేలా అనిపిస్తాయి. మా అమ్మ నాన్నలు కూడా ‘నచ్చిన పని చేయ్’ అని ప్రోత్సాహాన్నిస్తారు. అదే పెద్ద బలం. అలాగే, అమ్మానాన్నలు మనల్ని చూసి ధైర్యం తెచ్చుకునేలా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఎదగాలి.ఈ ఏడాది చాలా హెల్దీగా...నాకు నచ్చిన డ్రెస్సులతో రెడీ అవడం చాలా ఇష్టం. అలా ఉండటంలో నేను సంతోషంగా, కాన్ఫిడెంట్గా, మరింత క్రియేటివ్గా ఉంటాను. ఎవరో మాట్లాడుకుంటారు అని నాకు అసౌకర్యంగా ఉన్న డ్రెస్సులో ఉండలేను. ఫిట్గా ఉండటానికి వారంలో నాలుగు రోజులైనా జిమ్కు వెళతాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వర్కౌట్స్ చేస్తాను. పోషకాహారం పట్ల జాగ్రత్త తీసుకుంటాను. దీనివల్ల కిందటేడాదితో పోల్చితే ఈ యేడాది చాలా హెల్దీగా ఉన్నాను. ఆర్థిక విషయాల్లో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపు చేయడంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలాగని, డబ్బు వెంట కాకుండా నచ్చిన పని చేయడంలో ముందుండాలన్నది నా ఒపీనియన్. రాబోయే కొత్త సంవత్సరంలో మరింత క్రియేటివ్గా, మరింత ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను’’ అని నవ్వుతూ వివరించారు ఈ న్యూ హిప్ హాప్ ర్యాపర్.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: గడిగె బాలస్వామి -
ఏఐ.. 2025..ఉమెన్ రైజింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులు కీలకంగా మారాయి.మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రైజింగ్ 2025 సమ్మిట్లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్ల సంఖ్య పెరగడం శుభసూచకం.డీప్–టెక్ డొమైన్లలో...2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్ మాస్టర్ ప్రోగ్రామ్స్లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్లలో మాస్టర్స్ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్ఫామ్ రిపోర్ట్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్లాంటి డీప్–టెక్ డొమైన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్ సెక్యూరిటీ ఎన్రోల్మెంట్స్లో మహిళలు 25 శాతం, జనరేటివ్ ఏఐలో డాక్టోరల్ క్యాండిడేట్స్ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.మార్పు మంచిదే కదా!‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్ మోడల్స్ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ గుప్తా.పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్ కార్యక్రమాలు చేపట్టింది.స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్’ ఇండియా మ్యాగజైన్ సమ్మిట్ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.యశోద ఏఐ అంటే?డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్ ముందుకు వచ్చింది.యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హారిజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.ఎన్సీడబ్ల్యూ, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ (ఎఫ్ఎస్ఎల్) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్ యాప్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎందుకు కీలకం?హ్యాకింగ్, ఆన్లైన్ వేధింపులలాంటి సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్ ప్లాట్ఫామ్లను సురక్షితంగా నావిగేట్ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్లో చేరవచ్చు.‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్. ఏఐ బై హర్...గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్గ్లోబ్ ఇంపాక్ట్ ఛాలెంజెస్...‘ఏఐ బై హర్’ ‘ఏఐ ఫర్ ఆల్’ ‘యువ్ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్సెక్యూరిటీ, విద్య, డిజిటల్ వెల్బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్ క్లైమేట్ రంగాలలో, ఏఐకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ ‘ఏఐ బై హర్’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్–గుడ్ అప్లికేషన్స్’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది.ఎన్ని స్టార్టప్లో!ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్ డేటా ప్రకారం...అక్టోబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫండింగ్కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్లలో కొన్ని... డా.గీతా మంజునాథ్–నిరామయి హెల్త్ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్–మ్యాడ్ స్ట్రీట్ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్బజ్.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్స్క్రిప్ట్.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్ అగర్వాల్–బ్రెయిన్సైట్.ఏఐ. -
ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..
ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగార్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?56 ఏళ్ల అనుగార్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగార్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.మరో విశేషం ఏంటంటే అనుగార్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్మెంట్ కమిషనర్గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన అనుగార్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?) -
ఆనియన్ క్వీన్
వ్యవసాయంలో స్త్రీలు సాధిస్తున్న విజయాలు అందరూ చూస్తున్నవే. అయితే పంట నిల్వలో, వ్యవసాయ పనిముట్లలో ఆవిష్కరణలు చేస్తున్న మహిళలు తక్కువ.నాసిక్లో తండ్రి పండిస్తున్న ఉల్లిపాయ నిల్వ చేస్తే పాడవుతోందని గమనించిన కుమార్తె సొంతగా పరికరాన్ని కనిపెట్టి నిల్వలను కాపాడింది. అంతే కాదు నాసిక్, మహారాష్ట్రల్లో ఉల్లిపాయ గోదాముల నిర్వహణను పూర్తిగా మార్చేసింది. కిసాన్ దివస్ సందర్భంగా ఈనాటి రైతుబిడ్డ కల్యాణి షిండే పరిచయం.‘ఉల్లిపాయలు పాడయ్యాయన్న సంగతి చాలా నష్టపోయాకే తెలుస్తుంది’ అంటుంది కల్యాణి షిండే. 26 ఏళ్ల ఈ రైతుబిడ్డ నాసిక్, మహారాష్ట్రలలో ఉల్లిపాయల నిల్వకు విశేషమైన సహకారం అందించే పరికరాన్ని తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ‘నాసిక్ దగ్గర ఉన్న లాసన్గావ్ మా ఊరు. అది ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల కేంద్రం. మా తాత తండ్రులు, బంధువులు రైతులే. ఉల్లిపాయలు ప్రధానంగా పండిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పంట చేతికి రావడం మార్కెట్ అయ్యేలోపు పాడైతే నష్టం రావడం వింటూనే పెరిగాను. మా ఇళ్లలో నేనే మొదటిసారి బి.టెక్కు వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతూ ఇంటికి ఫోన్ చేస్తే ఉల్లిపాయలు కుళ్లిపోయి నష్టం వచ్చిందని చెప్పేవారు. దీనిని ఆపలేమా... అని రీసెర్చ్లో దిగాను’ అని తెలిపింది ఆమె.కల్యాణి షిండే రీసెర్చ్లో మహారాష్ట్రలోనే కాదు... దేశంలోనే ఉల్లిపాయలకు సరైన గిడ్డంగులు లేవని తెలిసింది. చాలా కేంద్రాల్లో ఓపెన్ గోదాముల్లోనే ఉల్లిపాయలను నిల్వ ఉంచుతారు. ఆధునిక గోదాములు ఉన్నవి తక్కువ. ‘ఉల్లిపాయలు పాడయ్యాయని ఎలా తెలుసుకుంటారని రైతులను అడిగితే దుర్వాసన ద్వారా అని చెబుతారు. కాని దుర్వాసన మొదలయ్యే సమయానికి క్వింటాల్కు 20 శాతం పాడైపోయి ఉంటాయి. ఉల్లిపాయలకు ఆరడుగుల ఎత్తు అరలో నిల్వ చేస్తే ఎత్తు తగ్గి ఐదు అడుగులకు చేరినా ఉల్లిపాయలు పాడయ్యాయని అర్థం. ఈ దశలో 40 శాతం పాడైపోయి ఉంటాయి. మనుషులు దృష్టి, వాసన ద్వారా మాత్రమే ఉల్లిపాయల నిల్వలో నష్టాన్ని తెలుసుకుంటున్నారని నాకు అర్థమైంది. అప్పుడే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్నోవేటర్లుగా తర్ఫీదు ఇచ్చే ఒక సంస్థ గురించి తెలిసింది. అందులో చేరాను. అలా గాలిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా గిడ్డంగిలో ఏ వైపున పంట నష్టం మొదలయ్యిందో తెలుసుకునే పరికరం కనిపెట్టాను. దీనివల్ల ఒక శాతం నష్టం ఉండగానే నిల్వను కాపాడుకోవచ్చు’ అని చెప్తుంది కల్యాణి షింగ్.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. ఈ పరికరాన్ని పదివేల రూపాయలకే తయారు చేసి రైతులకు చేరవేస్తోంది కల్యాణి. అంతేకాదు ఆధునిక గిడ్డంగుల ఏర్పాటులో ప్రయివేటు సంస్థలకు సూచనలు సలహాలు ఇస్తోంది. అందుకే అందురూ ఆమెను ‘ఆనియన్ క్వీన్’ అని పిలుస్తూ ఉన్నారు. రైతు కోసం రైతు బిడ్డలే కాదు ప్రతి విద్యార్థి, సాంకేతిక నిపుణుడు ఆలోచిస్తే మన దేశం మరింత సస్యశ్యామలం అవుతుంది.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. -
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే. -
ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) నుంచి పాసైన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల అమ్మాయి. ఆమె నియామకంతో 93 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు ఆమె నియామకంతో తెరపడింది. 1932లో అకాడమీ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,000కు పైగా ఆఫీసర్ క్యాడెట్లు పాసయ్యారు. వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి. ఈ ఘనతను ఎలా సాధించిందంటే..డెహ్రడూన్లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్గా 23 సంవత్సరాల సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్లు పాసవుట్ పరేడ్ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. సాయి ముత్తాత బ్రిటిష్ సైన్యంలో, తాత భారత సైన్యంలో పనిచేశారు. నాన్న సందీప్ జాదవ్ ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో తరం సైనిక అధికారిగా ప్రయాణం మొదలుపెట్టింది సాయి జాదవ్. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది.మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన సాయి కర్నాటకాలో బెల్గాంతో సహా అనేక రాష్ట్రాలలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ తరువాత సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) పరీక్ష రాసి తన ప్రతిభతో అన్ని దశల స్క్రీనింగ్లలోనూ అర్హత సాధించింది. ఇండియన్ మిలిటరీ అకాడమీలో అందరూ పురుషులే కావడంతో అందులో శిక్షణ పొందిన వారిని ‘జెంటిల్మెన్ క్యాడెట్స్’ అని పిలిచేవారు. ఇప్పుడది ‘ఆఫీసర్ క్యాడెట్స్’గా మారనుంది.‘ఐఎంఎ’లో నిర్వహించిన వేడుకలో సైనిక ఉన్నతాధికారులు సాయి జాదవ్ యూనిఫామ్పై నక్షత్రాల బ్యాడ్జీని పిన్ చేశారు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్గా ర్యాంకింగ్ను కేటాయించారు. చారిత్రక ఘనత సాధించిన సాయి గురించి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించి టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తొలి మహిళగా సాయి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. జూన్ 2026లో డెహ్రాడూన్ ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ’లో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్ను పూర్తిగా మహిళలతో కూడిన తొలి ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనుంది. ఇది చారిత్రక మలుపు అని చెప్పుకోవచ్చు.(చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..) -
ఆమె ఆత్మవిశ్వాసం ఎవరెస్ట్
‘నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను’ అనే మాట తిరుపతమ్మ నోటి నుంచి వినిపించినప్పుడు ఎంతమంది సీరియస్గా తీసుకొని ఉంటారో తెలియదు. ఆమె మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ‘నువ్వు పోటీ చేయడం ఏమిటి!’లాంటి వెక్కిరింపులకు తన విజయంతో దీటైన సమాధానం ఇచ్చారు తిరుపతమ్మ. ఆమె ఎత్తు మూడు అడుగులు. ఆమె ఆత్మవిశ్వాసం... ఎవరెస్ట్ అంత!తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామ చరిత్రలో తొలిసారి విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, సర్పంచ్గా ఘనవిజయం సాధించారు. ఆమెతో పాటు ఆమె ప్యానెల్లోని పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం మహిళలకు, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.రెక్కల కష్టం నమ్ముకొని...తిరుపతమ్మ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం తిరుపతమ్మ, సోదరుడు సుదర్శన్ భుజాలపై పడింది. ఇద్దరు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత తిరుపతమ్మ ఉపాధి హామీ పథకంలో వాచర్గా ఉద్యోగం సంపాదించారు. వాచర్గా పనిచేస్తూ ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు. గ్రామస్తుల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల తలలో నాలుక అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు# ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడిన రోజులు ఉన్నా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.నా విజయ రహస్యం... ఆత్మవిశ్వాసంఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే నా బలం. ఎన్నికలు నాకు కొత్త కావచ్చు. కాని గ్రామ ప్రజలు కొత్తవారు కాదు. వారు నా కుటుంబ సభ్యులు. ‘మంచి చేస్తే మంచే జరుగు తుంది’ అని బలంగా నమ్ముతాను. తమ్ముడు సుదర్శన్ చేసిన సేవలు, ప్రజలకు నాపై ఉన్న నమ్మకం సర్పంచ్గా నా గెలుపుకు కారణం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. – ఇల్లందుల తిరుపతమ్మ– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ -
స్టార్ పేరెంటింగ్
‘పేరెంటింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, ట్వింకిల్ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్ గురించి...మన మూలాల్లోకి...‘గ్లోబల్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కనెక్షన్ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్ ఎలా ఉంటుందో ప్రియాంక పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.తల్లే గురువుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్ చేసిన వీడియోలో సానియ ఇజాన్తో కోర్టులో తిరగడం, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్తో టెన్నిస్ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్ స్టార్గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా అంతే. కుమారుడు ఇజాన్లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్–హ్యాండెడ్. కొడుకు లెఫ్ట్–హ్యాండెడ్. ఒక పాషన్తో ఏడు సంవత్సరాల ఇజాన్ స్ట్రోక్స్ ప్రాక్టిసింగ్ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ఇజాన్ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.ఆమె అడుగు జాడల్లో..పేరెంటింగ్కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్ అలీఖాన్తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.‘కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్.ఆత్మగౌరవంపేరెంటింగ్కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్ ఉమెన్ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్.‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్ అంటే... ‘పేరెంటింగ్ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో బ్యాలెన్సింగ్ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్ మీడియాలో రాస్తూ ఉంటుంది. -
సంచలన విజయం.. ఎవరీ శ్రీలేఖ?
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 101 వార్డులకు జరగిన ఎన్నికల్లో 50 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో తిరువనంతపురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి దక్కింది. అయితే మేయర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మేయర్ రేసులో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగళం వార్డు నుంచి ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.మోదీ స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేరళలో తొలి మహిళా ఐపీఎస్గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాదస్పద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అనేక అంశాలపై బహిరంగంగా స్పందిస్తూ వస్తున్నారు. 2024, అక్టోబర్లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.లెక్చరర్ టు ఐపీఎస్శ్రీలేఖ తిరువనంతపురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత లెక్చరర్గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు సర్వీసులో చేరారు. మహిళలు పోలీసు ఉన్నత ఉద్యోగాల్లో చేరడానికి ఆమె ప్రేరణగా నిలిచారు.తల్లి ప్రోత్సాహంమహిళా ఐపీఎస్ అధికారిగా మొదటి పదేళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువతులు తనను స్ఫూర్తిగా తీసుకోవడం ఆనందం కలిగించే విషయమని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మహిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే తాను ఐపీఎస్ సాధించానని శ్రీలేఖ వెల్లడించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.'రైడ్ శ్రీలేఖ'చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు శ్రీలేఖ. తన పనితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు పనిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గానూ సేవలు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచారణలో భాగంగా దాడులు చేయడానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బట్టబయలు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వచ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.నిందితురాలికి చెంపదెబ్బకేరళ సంచలనం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్ను చెంపదెబ్బ కొట్టి వార్తల్లో నిలిచారు శ్రీలేఖ. ఇలా కొట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ తన చర్యను సమర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒకరిని అప్పట్లో శ్రీలేఖ కలిశారు. తమకు ఈ గతి పట్టించిన దుర్మార్గులను పట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్టమని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేరకు నిందితురాలిని చెంపదెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంపదెబ్బ కొట్టనందుకు బాధ పడుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బహిరంగంగానే ప్రతిఘటించారు.చదవండి: సివిల్స్ విజేతల్లో ఎక్కువ మంది వారే!చిన్ననాటి స్నేహితుడే భర్తశ్రీలేఖ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్గా పనిచేశారు. సేతునాథ్ ఆమె చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా. 'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. -
అందరి అమ్మ అల్కాశర్మ
భగవంతుడి అనుగ్రహాలూ, లీలలూ చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. చాలామందిని దీవించి, వరాలిచ్చి పంపుతుంటాడా... మరికొందరి పట్ల ఆగ్రహించడం ద్వారా చాలామందిని అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అలా ఓ చిన్నారి బిడ్డకు శిక్ష విధించి... ‘‘ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారూ... వాళ్లకు నువ్వు సేవలందించ’’మంటూ ఓ తల్లికి అనాథల బాధ్యతలు అప్పగించాడు. భగవంతుడు ఆదరించకపోతే అదెంత బాధాకరంగా ఉంటుందో అనుభవమైంది కాబట్టి... అలాంటి అభాగ్యులెందరినో ఆమె ఆదరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ తల్లే అల్కా శర్మ. ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ అమ్మ కథేమిటో చూద్దాం. దేవుడెందుకోగానీ... అల్కా శర్మ పట్ల నిర్దయగా ఉన్నాడు. ఆమె కొడుకైన అయాన్కు ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’ – (ఓఎమ్ఎస్) అనే ఓ అరుదైన వ్యాధిని అనుగ్రహించాడు. ఆ వ్యాధి కూడా చాలా చిత్రమైంది. తాను నమ్ముకున్న భగవంతుడే తనను శిక్షించినట్టుగా... తన సొంత వ్యాధి నిరోధకవ్యవస్థ తననే కబళించి దెబ్బతీసే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధి అది. అమాయకమైన చిన్నారులను దెబ్బతీసే ఆ వ్యాధి... ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత లేదా న్యూరోబ్లాస్టోమా అనే నరాల వ్యాధి వచ్చాక బయటపడుతుంది.ఈ వ్యాధి లక్షణాలేమిటంటే..?ఈ వ్యాధి ఉన్నవారి కనుగుడ్లు అత్యంత వేగంగా చకచకా అటు ఇటూ కదిలిపోతుంటాయి. ఈ కండిషన్ను ‘ఆప్సోక్లోనస్’ అంటారు. ఇలా కనుగుడ్లు చకచకా కదలడాన్ని ‘డాన్సింగ్ ఐస్’ (నాట్యం చేస్తున్న కళ్లు)గా కూడా అభివర్ణిస్తారు. దీనినే వైద్యపరిభాషలో ‘నిస్టాగ్మస్’ అంటారు. ఇక కండరాలపై అదుపు ఉండక అవి కూడా వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఫలితంగా కాళ్లూ చేతుల కండరాలపై పట్టు ఉండదు. ఒక్కోసారి నాలుక కండరంపైనా అదుపు ఉండదు కాబట్టి మాట ముద్ద ముద్దగా వస్తుంటుంది. ఇలా కళ్లూ, కాళ్లూ, కండరాలపై అదుపు ఉండని ఈ ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’తో తన బిడ్డను అనుగ్రహించగానే ఓ చిర్నవ్వు నవ్వింది ఆ తల్లి. ‘ఓహో... నాకీ శిక్ష విధించి ఇలాంటి అభాగ్యులెందరి బాధలనో గుర్తించమంటూ నన్ను అనుగ్రహించావా తండ్రీ’’ అంటూ ఆ తల్లి అల్కా శర్మ తన బిడ్డల్లాంటి ఎందరో దివ్యాంగ బిడ్డలకేసి దయగా చూసింది. వాళ్ల బాధలు బాపేందుకు పూనుకుంది. తన భర్త నీరజ్ శర్మ కూడా ఆమె సంకల్పానికి తన చేయూతనిచ్చారు. అప్పటికి తనకున్న బంగారాన్నీ, ఆభరణాలనూ అన్నింటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ తహసిల్లోని ఛత్తర్ అనే చోట దివ్యాంగులైన పిల్లల కోసం ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. ‘ఏంజెల్ డిజేబిలిటీ అండ్ ఆర్ఫనేజ్ హోమ్’ అనే ఆ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టిన నాటి నుంచీ... అంటే 2018 మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 160 మందికి పైగా దివ్యాంగ బాలిబాలికలలకు నివాస ఫిజియోథెరపీ సేవలనూ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలద్వారా సేవలందిస్తోంది అల్కా. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ వైకల్యాన్ని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకునేలా స్వావలంబన సాధించారు. ఇలా తన కొడుకుకు వైకల్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు తనపై అలక బూనినా తాను మాత్రం తన సేవా అసిధారావ్రతాన్ని అదేపనిగా కొనసాగిస్తూ పిల్లలను అనుగ్రహిస్తూనే ఉంది అమ్మ అల్క శర్మ. – యాసీన్ -
ఆ చూపు ప్రపంచంకప్పు దాకా..
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.→ ఆమె కూతురు విజేతఅంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్లో నేపాల్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.→ ప్రధానే స్పందించారుఅంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.→ తండ్రి పారిపోతే...అంజుదాస్కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.→ అమ్మ లేకపోతే...‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్. -
ఆమె కాలాన్ని బంధించింది
చేతిలో కెమెరా...దాని వెనక వేగంగా కదిలే కన్ను...ప్రతి సందర్భానికీ స్పందించే మనసు... ఇవి ఉంటే చాలు...కదిలే కాలాన్ని బంధించి... చాయాచిత్రంగా చరిత్ర పుటల్లో భద్రపరచవచ్చు. ముందు తరాలకు చెదరని తరగని జ్ఞాపకాలు అందించవచ్చు. దృశ్యాన్ని ఫొటోగా మార్చే సాంకేతిక శక్తి కెమెరాకు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న కెమెరామన్ కన్ను అంతకన్నా ముఖ్యం. సకాలంలో స్పందించే హృదయం లేని చేతిలో కెమెరా ఒక బొమ్మ మాత్రమే...అని మాటల ద్వారా కాకుండా తను తీసిన చిత్రాల ద్వారా చెప్పిన అద్భుత ఫొటోగ్రాఫర్ పద్మవిభూషణ్ హొమయ్ వ్యారవాలా. హొమయ్ వ్యారవాలా ఇండియా మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్. భారత దేశం తెల్లదొరల వలసపాలన నుంచి స్వంతంత్ర దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా చెప్పిన తొలి ఫొటోగ్రాఫర్ హొమయ్. పురుషాధిపత్యం అధికంగా ఉన్న ఈ ఫొటోగ్రఫీ రంగంలో హోమయ్ హద్దుల్ని, సరిహద్దుల్ని చెరిపేసి స్వేచ్చా విహంగం. ఆకాశమే హద్దుగా తన వృత్తిలో అనుక్షణం జీవించారు. దేశ చరిత్రలో అపురూప ఘట్టాలను చాయాచిత్రాలుగా మలచి ఆ అద్భుత దృశ్య సంపదను మనకు అందించారు. హొమయ్ ని కేవలం ఓ ఫొటోగ్రాఫర్ గా మాత్రమే కాదు.... గత చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా చూడాలి. ఈ దేశం పరపాలన నుంచి స్వపరిపాలన దాకా చేసిన ప్రయాణాన్ని ఈ దేశ గత చరిత్రను కెమెరా లో బంధించిన వ్యక్తిగా హొమయ్ కు ప్రత్యేక స్థానం దక్కుతుంది.హొమయ్ 1913 డిసెబర్ 9న గుజరాత్ రాష్ట్రం నవ్సారిలో ఓ పర్సి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఓ టూరింగ్ డ్రమా కంపెనీలో నటుడు. తర్వాతి కాలంలో కుటుంబం బోంబేలో స్థిరపడింది. తల్లి ప్రోత్సాహంతో హుమయ్ బోంబే యూనివర్సిటీ, సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. ఆసమయంలోనే ఆమెకు ఫొటోగ్రఫీపై దృష్టి మళ్ళింది. 1941 లో హొమయ్ కు మనీక్షా వ్యారవాలాతో వివాహమయ్యింది. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్, అకౌంటెంట్ గా పనిచేసేవారు. హొమయ్ 1938లో బొంబే క్రానికల్ పత్రికలో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రింట్ మీడియా ప్రధాన స్రవంతిలో , ఇల్యుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ హుమయ్ . డాల్డా 13 అనే మారుపేరుతో ఆమె చిత్రాలు ప్రచురితం అయ్యేవి. ప్రతిరోజూ నగర జీవనంలో అరుదైన దృశ్యాలను ఫొటోలుగా బంధించి పత్రికకు అందించే వారు. ఆ తర్వాత 1940 నుంచి 1970 దాకా ఢిల్లీలో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు పనిచేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం, గాంధీ అంతిమయాత్ర లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిత్రించారు. అలాగే క్వీన్ ఎలిజెబిత్ 2 లాంటి విశిష్ట విదేశీ అతిథులు వచ్చినపుడు వారి చిత్రాలను కెమెరాలో బంధించారు. బ్రిటీస్ పాలన అంతిమదశతో పాటు బారత్ స్వాంతంత్ర్య సంబరాలను చిత్రీకరించారు. స్వాంతంత్ర్య సమర ఘట్టాల చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలుగా మనకు మగిల్చిన హొమయ్ కు రోలిఫ్లెక్స్ కెమెరా అంటే ఇష్టం. ఆమె చిత్రాలు మానవీయ కోణంలో, సహజ చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ నేతల చారిత్రక సందర్భాలతో పాటు వారు నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో సహజ (క్యాండిడ్) చిత్రాలను తీయడంలో హొమయ్ ది అందెవేసిన చేయి. 1970 లో ఫొటోగ్రఫర్ వృత్తినుంచి హొమయ్ రిటైర్ అయ్యారు. 2011 లో ఆమెకు ప్రతిష్టాత్మక పద్మవిభూషన్ గౌరవం దక్కింది. ఎప్పుడూ దుమికే జలపాతంలా చురుగ్గా జీవించిన హుమయ్ తమ రిటైర్ జీవితాన్ని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చాలా ప్రశాంతంగా గడిపారు. హుమయ్ 2012 జనవరి 15న తమ 98వ ఏట ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి మహిళా ఫోటోజర్నలిస్ట్ గా.... 1940 లోనే అప్పటి సమాజంలోని పురుషాధిక్యతను నిలదీసిన ధీర మహిళగా హుమయ్ ను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!
‘నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ధైర్యం ఉండాలి. జీవనోత్సాహం ఉండాలి. అవి రెండూ ఉంటే అన్నీ వస్తాయి’ అంటారు. 52 సంవత్సరాల వీణాదేవి దగ్గర అవి ఉన్నాయి. వీణ 50 శాతం శారీరక వైకల్యం ఉన్న మహిళ. ఆమె తన వైకల్యం గురించి బాధపడుతూ కూర్చోలేదు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి’ అని గట్టిగా అనుకుంది. గత కొన్ని నెలల నుంచి జెప్టో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తోంది.‘కష్టం అనిపించడం లేదా?’ అని ఎవ రైనా అడిగితే... ‘ఖాళీగా కూర్చుంటేనే నాకు చాలా కష్టం’ అని నవ్వుతూ చెబుతుంది. నటి, మోడల్ మలైకా అరోరా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీడియోలో అరోరా వీణతో మాట్లాడుతూ కనిపిస్తుంది.‘ఇలాంటి మహిళను చూడడం నాకు ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటాం. వద్దు. గయ్స్... జీవితం చాలా విలువైనది. ఆమె కస్టమర్ల ఆర్డర్ను డెలివరీ చేయడం లేదు. ఇన్స్పిరేషన్ను డెలివరీ చేస్తోంది’ అని రాసింది అరోరా.ప్రౌడ్ ఆఫ్ హర్’: ‘మహిళలు సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా అధిగమించి తాము అనుకున్నది సాధించగలరు’ ఇలాంటి మాటలతో కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం. -
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
డ్యాన్సర్గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్గా ఎలా అవతరించింది ఆ సక్సెస్ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మాయే బ్రెజిల్కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.బ్రెజిల్లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది. ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్లో ఇంటర్న్షిప్లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్గా అవతరించింది. 2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది. అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది. ఇంటర్న్షిప్ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.Kalshi raised $1B at an $11B valuation.A decade ago, only a few thousand people knew what a prediction market was.Eighteen months ago, most prediction markets were banned - until we overcame the government to set them free.Over the past seven years, our community has opened… pic.twitter.com/hGDkYxkSlh— Tarek Mansour (@mansourtarek_) December 2, 2025 (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని ఏలిన ‘షీరో’ ఇక లేరు: 5 ఆసక్తికర అంశాలు
సాక్షి, ముంబై: టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో దుబాయ్లోని కింగ్స్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత ఈ ఆగస్టు ప్రారంభంలో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.సైమన్ టాటా అస్తమయం పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా , లక్మే మాజీ చైర్పర్సన్ , భారతదేశ బ్యూటీ అండ్ రిటైల్ ల్యాండ్స్కేప్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరంటూ ఆమెకు నివాళులర్పించారు. నా షీరో ఇక లేరంటే చాలా బాధగా ఉంది, "మహిళా వ్యాపార నాయకులలో అగ్రగామి"అని తన సంతాపాన్ని ప్రకటించారు.సైమన్ టాటాకు సంబంధించి ఆసక్తికర సంగతులు.స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించారు సైమన్ నావల్ డునోయర్ 1953లో భారతదేశానికి పర్యాటకురాలిగా వచ్చారు. రెండేళ్ల తరువాత 1955లో ఆమె నావల్ హెచ్. టాటాను వివాహం చేసున్నారు.1960ల ప్రారంభంలో టాటా గ్రూప్తో తన వృత్తిపరమైన అనుబంధాన్ని ప్రారంభించారు.1961లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లక్మే బోర్డులో చేరారు. 1982లో ఆమె చైర్పర్సన్గా నియమితులయ్యారు.భారతదేశ ఆధునిక సౌందర్య సాధనాల రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను "కాస్మెటిక్ క్జారినా ఆఫ్ ఇండియా" అనే బిరుదును దక్కించుకున్నారు.వెస్ట్సైడ్ & ట్రెంట్ రిటైల్ వ్యవస్థాపకురాలుగా ఆమె ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1998లో లక్మీని హిందూస్తాన్ యూనిలీవర్కు విక్రయించిన తర్వాత, సిమోన్ టాటా రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్కు నాయకత్వం వహించారు.తరువాత వె స్ట్సైడ్ను ప్రారంభించి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫ్యాషన్ రిటైల్ చెయిన్గా తీర్చిదిద్దారు. ఇపుడు ఆ తరువాత జూడియో స్టోర్లలోకి విస్తరించింది.లక్ష కోట్ల రూపాయల రిటైల్ అండ్ బ్యూటీ సామ్రాజ్యాన్ని స్థాపించిన సైమన్ చాలా లోప్రొఫైల్మెయింటైన్ చేసేవారు. తన జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి విజయ వంతమైన వ్యాపారవేత్తగా, దార్శనికురాలిగా తన పేరును శాశ్వతం చేసుకున్న గొప్ప మహిళ సైమన్ టాటా.ఆమెకు కుమారుడు నోయెల్ టాటా, కోడలు ఆలూ మిస్త్రీ , మనవరాళ్ళు నెవిల్లే, మాయ , లియా ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
వారానికి ఆరు గంటల పని : సంవత్సరానికి రూ. 4 కోట్లు
హాస్పిటల్లో నర్సుగా పనిచేసే మహిళకు ఆ జీవితం తృప్తినివ్వలేదు. సొంత బిజినెస్ చేయాలనే కోరిక కలిగింది. ఆ ఆలోచనే పట్టుదలగా మారింది. అదే ఆమె జీవితంలో కీలక మలుపునకు దారి తీసింది. ఇపుడు ఏడాది ఏకంగా రూ.4 కోట్లు ఆర్జిస్తోంది. 13 ఏళ్ల పాటు నర్సుగా సేవలందించిన ఆమె మొదలు పెట్టిన బిజినెస్ ఏంటి? ఆమెవిజయ రహస్యం ఏంటి తెలుసుకుందామా?పట్టుదల ఉండాలే గానీ..అమెరికాలోని అరిజోనాకు చెందిన 38 ఏళ్ల కామి (మారు పేరు) ఒక హాస్పిటల్లో బోన్మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో నర్సుగా పనిచేసింది. జీవితం రొటీన్గా, మార్పు కావాలని అని అనిపించింది. ఈ పని నుంచి బైటపడాలంటే ఉద్యోగం మానేసే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చాలా తీవ్రంగా ఆలోచించింది. పెట్టుబడి కోసం ఇల్లు అమ్మాలని భావించింది. వ్యాపారానికి రెండు మూడు వెంచర్లను పరిశీలించింది. చివరికి కొంతమంది స్నేహితులు,బంధువు సలహా మేరకు లాండ్రోమాట్ వ్యాపారాన్ని ఎన్నుకుంది. విదేశాల్లో లాండ్రోమాట్ అనేది కస్టమర్లు తమకు తాముగా బట్టలు ఉతుక్కునే స్వీయ-సేవ లాండ్రీ.నర్స్గా పనిచేయడం చాలా ఇష్టం, కానీ "బెడ్సైడ్ నర్సింగ్ నిజంగా కష్టం" అని పేర్కొంది. లాండ్రోమాట్ కొనుగోలుకు నిధుల కోసం 2020లో తన ఇంటిని విక్రయించింది. మిగిలిన మొత్తం, వాషింగ్ మెషీన్ల లాంటి పరికరాల కొనుగోలు కోసం లోన్లు తీసుకుంది. అలా ఉద్యోగం చేస్తూనే వ్యాపారాన్ని మొదలు పెట్టి అది లాభదాయకంగా మారడంతో నర్సింగ్ను విడిచిపెట్టింది. వ్యాపారం కాస్త పుంజుకోగానే, ఆ ప్లేస్ను పురుద్ధరించి, లాండ్రికి సంబంధించిన బట్టల పికప్, డెలివరీతో సహా సేవలను విస్తరించింది. తద్వారా అప్పులు తీరుస్తోంది.2020 నుండి 2023 వరకు అటు ఉద్యోగం, ఇటు వ్యాపారం రెండింటినీ మేనేజ్ చేస్తూ పూర్తిగా నిబద్ధురాలై పనిచేసింది. ఆకర్షణీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాండ్రోమాట్పైనే దృష్టిపెడుతూ స్థిరమైన కస్టమర్లు,సిబ్బందితో దిన దినాభివృద్ధి చెందుతోంది. లాండ్రోమాట్ గత సంవత్సరం (2024లో) దాదాపు రూ. 4.2 కోట్లు ఆర్జించింది. పక్కనే ఉన్న సెలూన్ నుండి దాదాపు రూ. 24.96 లక్షల అద్దె కూడా సంపాదించింది. అంతేకాదు వారానికి ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే వ్యాపారం మీద దృష్టిపెడుతుంది. వ్యవస్థాపక ప్రయాణం గురించి సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడం ద్వారా అదనంగా 10 గంటలు గడుపుతుంది. సోషల్ మీడియా ద్వారా మరో రూ.18.30 లక్షలు సంపాదిస్తోంది. తన వ్యాపార వృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోతోంది. రెండో లాండ్రోమాట్ సెంటర్ పెట్టడంతోపాటు, రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా పక్కాగా ఉన్నాయంటోంది కామి. View this post on Instagram A post shared by Cami | Laundromat Girl (@laundromatgirlofficial) పరిమిత వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ, ఆమె పాడ్కాస్ట్లు, పుస్తకాలు, పరిశ్రమ ఈవెంట్ల ద్వారాతన నైపణ్యాన్ని మెరుగు పర్చుకుంది. వారాంతాలు, తనకిష్టమైన ప్రయాణాలుకోసం సమయాన్ని కేటాయించే సౌలభ్యాన్ని అందిస్తోంది లాండ్రోమాట్. -
సాహో... సాగర ధీర
సముద్రాన్ని జీవితంతో పోలుస్తారు తాత్వికులు. సముద్రంలో మౌనం ఉంటుంది. కల్లోలం ఉంటుంది. పడి లేచిన కెరటాలు ఉంటాయి. సవాళ్ల విషయంలో భారత నావికాదళం కూడా సముద్రంలాంటిదే. ఆ సవాళ్లను అధిగమించి భారత నావికా దళంలో వివిధ కీలక విభాగాల్లో తొలి మహిళలుగా చరిత్ర సృష్టించిన రోల్ మోడల్స్ గురించి...భారత నావికా యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా కమాండర్గా ప్రేరణ దియోస్థలీ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన ప్రేరణ ‘జీసస్ అండ్ మేరీ కాన్వెంట్’ స్కూలులో చదువుకుంది. నేవీలో పనిచేయాలనే లక్ష్యానికి స్కూలు రోజుల్లోనే బీజం పడింది. సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రేరణ 2009లో నావికాదళంలో చేరింది. ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని ఆమె తమ్ముడు కూడా నావికా దళంలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రారంభ సమస్యలు ఎదుర్కొంది ప్రేరణ. గోవాలో తన మొదటి ఎన్సీసీ సెయిలింగ్ క్యాంప్లో సెయిల్ బోట్ మూడుసార్లు బోల్తా పడింది. అయినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. పట్టుదలతో సెయిలింగ్లో ప్రావీణ్యం సాధించింది. ఒడిశాలోని చిల్కా సరస్సులో జరిగిన సెయిలింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరీర్ తొలిరోజుల్లో సముద్ర నిఘా విమానంలో పరిశీలకురాలిగా శిక్షణ పొందింది. 2012లో చైనా వాణిజ్యనౌకపై సోమాలియ దొంగలు దాడికి దిగినప్పుడు, ఆ దాడిని తిప్పి కొడుతూ చేసిన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ప్రేరణ భారత్ నేవీ విదేశ్ సేవాపతకాన్ని అందుకుంది.నేవీలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్భారత నావికాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యూఎఫ్ఐ)గా చరిత్ర సృషించింది కమాండర్ దివ్యశర్మ. డోర్నియర్ పైలట్లుగా పనిచేసిన మొదటి ముగ్గురు మహిళలలో న్యూ దిల్లీకి చెందిన దివ్యశర్మ ఒకరు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఫ్రంట్లైన్ కార్యకలాపాల కోసం నావికా ఏవియేటర్లకు శిక్షణ ఇవ్వడంలో ఇన్స్ట్రక్టర్లది కీలక పాత్ర.గతంలో ఫిక్స్డ్–వింగ్ విమానాలను నడిపిన దివ్య ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్లలో పైలట్లకు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్ అందుకుంది. న్యూ దిల్లీలోని మాల్వియానగర్కు చెందిన దివ్య కెరీర్ తొలి రోజుల్లో నుంచే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తోంది. డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ (డీవోఎఫ్టీ) కోర్సులో అత్యత్తమ ప్రతిభ చూపింది. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం, అంకితభావానికి గుర్తింపుగా ‘ఫస్ట్ ఇన్ ఫ్లయింగ్’ అవార్డ్ అందుకుంది.నావికా దళంలో నారీశక్తిభారత నావికాదళంలో ఒకప్పుడు మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. అయితే కాలక్రమంలో మహిళల శక్తిసామర్థాల్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి దారులు తెరిచింది ఇండియన్ నేవీ. ఒకప్పుడు మాండోవి, గోవా బ్రాంచ్లలో ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్... మొదలైన వాటిలో పరిమిత పాత్ర పోషించిన మహిళలు కీలకమైన విభాగాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నేవీలో పైలట్, ఫైటర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా... ఎన్నో కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, ప్రిగేట్... మొదలైన ఫ్రంట్లైన్ యుద్ధనౌకలలో మహిళలు విధులు నిర్వహించడం నావికాదళంలో మహిళల పాత్రకు సంబంధించి విప్లవాత్మక అభివృద్ధి. లింగసమానత్వానికి పెద్ద పీట వేయడంలో భారత నావికాదళం ముందు వరుసలో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం భారత నావికాదళం మహిళా అధికారులకు (వైద్యేతర శాఖలు) మెరిట్ ఆధారంగా పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసింది.తొలి మహిళా ఫైటర్ పైలట్భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించింది ఆస్తా పూనియా. ‘మహిళా ఫైటర్ పైలట్తో భారత నౌకాదళంలో కొత్త శకం మొదలైంది’ అన్నారు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకుంది ఆస్తా పూనియా. నాన్–ఫైటర్ ఆపరేషన్లలో మహిళా అధికారులు ఉన్నప్పటికీ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేసింది. ఎన్నో పరిమితుల కారణంగా నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించింది. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.తొలి మహిళా పైలట్ఉత్తర్ప్రదేశ్లోని తిల్హార్కు చెందిన శుభాంగి స్వరూప్ భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది. 2017లో కన్నూర్లోని ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ నుంచి పట్టభద్రురాలైన మొదటి బ్యాచ్ మహిళా అధికారులలో శుభాంగి ఒకరు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేసింది. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందింది. నావికా దళంలో పనిచేసిన తండ్రి కమాండర్ జ్ఞాన్స్వరూప్ శుభాంగికి స్ఫూర్తి.‘నేవీలో పనిచేయడం అంటే మాటలు కాదు. తట్టుకుంటావా?’ అని తండ్రి అడిగినప్పుడు ‘యస్’ అని చెప్పింది శుభాంగి. ఆమె నేషనల్ తైక్వాండో ఛాంపియన్ కూడా.ఆమె అమరత్వంవృత్తి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత వైమానిక దళంలోని తొలి మహిళా అధికారి కిరణ్ షెఖావత్. అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ 2015 మార్చి 24న గోవా తీరంలో జరిగిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ముంబైలో పుట్టిన కిరణ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిజిక్స్లో పట్టా పుచ్చుకుంది. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో చేరడానికి ముందు ఒక ప్రైవేట్బ్యాంకులో పనిచేసింది. తన ఐదు సంవత్సరాల కెరీర్లో దేశంలోని వివిధ నౌకాదళ స్టేషన్లలో విధులు నిర్వహించింది. నేవీలోకి రావాలనుకోవడానికి తండ్రి స్ఫూర్తి. ఆయన నేవీ ఆఫీసర్. రచయిత నికోలస్ స్పార్క్కు కిరణ్ పెద్ద అభిమాని. అతడి అన్నిపుస్తకాలు చదివింది. ఆ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలు చూసింది. కుమార్తె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద ‘లెఫ్టినెంట్ కిరణ్ షెఖావత్’ ఫౌండేషన్ స్థాపించాడు తండ్రి. హరియాణాలోని కుర్తాలలో కిరణ్ షెఖావత్ గౌరవార్థం రెండు ఎకరాల భూమిని షహీద్ పార్క్గా అభివృద్ధి చేశారు. ఈ పార్క్లో కిరణ్ విగ్రహం ఏర్పాటు చేశారు. -
రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం
భారతదేశంలోని అత్యంత విశిష్ట గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ కె లక్ష్మీ బాయి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు నుంచి రూ. 3.4 కోట్లను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్కు విరాళంగా ఇచ్చారు. మహిళలకు క్యాన్సర్ సంరక్షణ సేవలకు గాను ఈ విరాళాన్ని అందించారు. డిసెంబర్ 5న ఆమె 100వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె దానం చేయడం విశేషం.100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న డాక్టర్ కె లక్ష్మీ బాయి తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 3.4 కోట్లను ఒడిశా, క్యాన్సర్తో పోరాడుతున్న మహిళల కోసం గైనకాలజికల్ ఆంకాలజీ యూనిట్ను నిర్మించడానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, ఇది గైనకాలజికల్ ఆంకాలజీ కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయ పడుతుందని, భవిష్యత్ వైద్యులను రూపొందిస్తుందని, ఎంతోమంది మహిళల ఆశలను రెక్కలివ్వాలనేది తన కోరిక అని చెప్పారు. దీంతో పాటు యువతులలో క్యాన్సర్లను నివారించడంలో సహాయపడే కౌమార టీకా డ్రైవ్లకు మద్దతుగా డాక్టర్ బాయి బెర్హంపూర్ ప్రసూతి మరియు గైనకాలజీ సొసైటీకి రూ. 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. భావ్నగర్లోని డాక్టర్ బాయి నివాసంలో ఆమె పూర్వ విద్యార్థులు కొందరు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు హాజరవుతారని భావిస్తున్నారు.యాభై సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లక్ష్మీ బాయి తన క్లినికల్ ప్రావీణ్యం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవప్రదమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు కూడా విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.1926లో డిసెంబర్ 5, జన్మించిన డాక్టర్ లక్ష్మీ బాయి, కటక్లోని SCB మెడికల్ కాలేజీలో మొదటి MBBS బ్యాచ్లో ఉన్నారు. అక్కడినుంచే ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి DGO, MD (ప్రసూతి & గైనకాలజీ) పట్టాలు పుచ్చుకున్నారు. USAలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో MPHని అభ్యసించారు. 1950లో సుందర్గఢ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తిని ప్రారంభించారు. 1986లో బెర్హంపూర్లోని MKCG మెడికల్ కాలేజీలో O&G ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు. -
జేఈఈ ప్రిపరేషన్ నుంచి రాష్ట్రపతి మెడల్ వరకు..!
ఎన్డీఏ ప్రతిష్టాత్మకమైన పోర్టల్స్ 149వ కోర్సు నుంచి సుమారు 329 మంది క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. వారంతా ట్రై సర్వీసెస్ అకాడమీలోని రెండో బ్యాచ్ మహిళలు. మొత్తం 15 మంది మహిళా క్యాడెట్లకు ఈసారి చోటు కల్పించింది డిఫెన్స్ అకాడమీ. వారిలో మొత్తం మెరిట్ ఆర్డర్ పరంగా రాష్ట్రపతి మెడల్ని గెలుపొందిన తొలి మహిళా క్యాడెట్గా ఘనత సాధించిందామె. ఇంతకీ ఎవరామె..? ఆమె ఈ ఘనతను ఎలా సాధించగలిగిందంటే..ఇప్పటి వరకు ఇద్దరు మహిళా క్యాడెట్లు విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఒకరు 148వ కోర్సులో కాగా, మరొకరు 149వ కోర్సులో. ఈ ఏడాది డిపెన్స్ అకాడమీ 149వ కోర్సులో మెరిట్ క్రమంలో గెలుపొందిన తొలి మహిళ సిద్ధి జైన్. దీన్ని మొత్తం మెరిట్ జాబితా, విద్యారంగం, బహిరంగ శిక్షణ, సామూహిక శిక్షణ, అధికారిలాంటి లక్షణాలు, ప్రత్యేక సేవా అంశాలతో కూడిన పనితీరు తదితరాల ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది రాష్ట్రపతి బంగారు పతకాన్ని ఆల్ఫా స్క్వాడ్రన్కు చెందిన అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ దీపక్ కంద్పాల్కి, రాష్ట్రపతి వెండి పతకాన్ని ఆస్కార్ స్క్వాడ్రన్కు చెందిన అకాడమీ క్యాడెట్ కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్రపతి కాంస్య పతకాన్ని కిలో స్క్వాడ్రన్కు చెందిన డివిజనల్ క్యాడెట్ కెప్టెన్ సిద్ధి జైన్లు అందుకున్నారు. ఈ మేరకు పాసింగ్ అవుట్ క్యాడెట్లను ఉద్దేశించి అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ..ఈరోజు పట్టభద్రులవుతున్న రెండవ బ్యాచ్ మహిళా క్యాడెట్లను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. వారిలో సుమారు 15 మంది తమ పురుష సహచరులతో సమానంగా భుజం భుజం కలిపి నిలబడ్డారు. సేవ ఒకే ప్రమాణాన్ని గౌరవిస్తుందనేది ఈ ఘటన పునరుద్ఘాస్తోందని అన్నారు. ఇక వైమానిక దళంలో చేరనున్న సిద్ధి మాట్లాడుతూ.."మేము ఈ శిక్షణలో అనేక ఒడిదడుకులను చవిచూశాం. ప్రతి దశలోనూ మాకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల నుంచి, కుటుబం నుంచి పుష్కలంగా మద్దతు, ప్రేమ లభించింది. అందువల్లే అకాడమీలో సవాలుతో కూడిన శిక్షణ సాధ్యమైందని పేర్కొంది."అలాగే ఎన్డీఏ మహిళా క్యాడెట్లను చేర్చుకోవడాని కంటే ముందు తాను ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఆపై సాయుధ దళాలలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ లక్ష్యంతో నేఐఐటీ జేఈఈ కోసం సన్నద్ధమైనట్లు వెల్లడించింది. అయితే ఇంతలో ఎన్డీలో మహిళా క్యాడెట్ల చేరేలా మార్గం సుగమం కావడం..అందులో తాను చేరడం చకచక జరిగిపోయిందని, పైగా అందుకు తన కుటుంబం పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పుకొచ్చింది. కాగా, యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, ఇండియన్ నావల్ అకాడమీ పరీక్షలకు అర్హత ఉన్న మహిళలు హాజరు కావడానికి ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించగా, ఆగస్టు 2021లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తర్వాత NDAలోకి మహిళల ప్రవేశం సాధ్యమైంది. ఆ నేపథ్యంలోనే 148వ కోర్సులో భాగంగా 2022 జూలై-ఆగస్టులో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ NDAలో చేరింది.(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!) -
ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్
పేరెంటింగ్కు సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్... ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్ అనధికారికంగా కొత్త పేరెంటింగ్ మాన్యువల్గా మారింది. పేరెంటింగ్కు సంబంధించిన సలహాల కోసం పెద్దలు, ఇరుగు పొరుగువారు, వైద్యులు, పుస్తకాల మీద ఆధారపడడం అనేది ఒక విధానం. దీనికి భిన్నంగా ఆన్లైన్ దారిలో వెళ్లడమే ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్.శిశువుకు పాలివ్వడం నుంచి పిల్లలను స్కూలుకు పంపడం వరకు పేరెంటింగ్కు సంబంధించి ఆన్లైన్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనసులోని సందేహాన్ని టైప్ చేస్తే చాలు సెకన్ల వ్యవధిలో వందలాది వీడియోలు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ ప్రత్యేకత ఏమిటంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది.బేబీఫుడ్, రెండు సంవత్సరాల పిల్లలకు కలర్ఫుల్ ప్లేట్స్, సూటబుల్ డయపర్స్... మొదలైన ఎన్నో విభాగాల ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ‘గతంలో పేరెంటింగ్కు సంబంధించి సందేహాలు, సమస్యలు, సవాళ్లు కుటుంబ పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం పేరెంట్స్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి సలహాల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. సోషల్ మీడియా విస్తృతస్థాయిలో పేరెంటింగ్ విధానాలను పరిచయం చేయడంతో, చిన్న కుటుంబాల వారు పేరెంటింగ్కు సంబంధించిన సలహాల కోసం సోషల్మీడియాపై ఆధారపడుతున్నారు. ట్రెండ్ సంగతి ఎలా ఉన్నా, నిజంగా ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ తల్లిదండ్రులకు సహాయపడుతుందా? లేక ఒత్తిడిని పెంచుతుందా?‘కంటెంట్లో కొంత భాగం పరిశోధన ఆధారితమైనప్పటికీ, ఎక్కువ శాతం ట్రెండ్ ఆధారితమైనది. పేరెంటింగ్కు సంబంధించి సలహాలు, సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, పర్సనలైజ్డ్ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్కు ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ సమానం కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్ శిశువు చరిత్ర, స్వభావం, ఆహార అలవాట్లు, ఆరోగ్య అవసరాలు తల్లిదండ్రుల మానసిక పరిస్థితులను అంచనా వేయదు’ అంటున్నారు నిపుణులు. -
ఆకుపచ్చని ఉద్యమం
మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎడారిలాంటి చోట కూడ పచ్చని తోటై పలకరిస్తుంది. మహిళల సారథ్యంలోని ‘వనమాలి గార్డెనింగ్ గ్రూప్’ వాట్సాప్ వేదికగా విశాఖపట్టణంలో మిద్దెతోటల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వనమాలి గార్డెనింగ్ గ్రూప్లో మూడువేలమంది మహిళలు ఉన్నారు. అంతరించిపోతున్న అరుదైన సంప్రదాయ మొక్కలకు జీవం పోస్తున్నారు. గ్రీన్డ్రైవ్స్ నిర్వహిస్తూ రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు...‘పై కప్పు ఇస్తారా...పచ్చగా మార్చేస్తాం, మాకు ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మిద్దె చూపిస్తే చాలు మీకు కావాల్సిన ఆకు కూరలు, కూరగాయలు పండించే మార్గాల్ని చూపుతాం’ అంటున్నారు వనమాలి గార్డెనింగ్ గ్రూపుల నిర్వాహకులు అరుణ అరవల, సరితా మల్ల, జ్యోతి నాదెళ్ల. విశాఖపట్టణంలోని మురళీ నగర్కు చెందిన అరుణ అనే మహిళకు వచ్చిన ఆలోచన మూడువేల మంది మహిళల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆకు పచ్చని ఉద్యమానికి వేదికగా నిలిచింది.అవసరాలు తీరేలా....పర్యావరణానికి మేలు జరిగేలా...వనమాలి గార్డెనింగ్ గ్రూపులో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మన కూరగాయల తోట అనే రెండు గార్డెనింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో నగర వ్యాప్తంగా మూడువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వంట గది వ్యర్థాల నుంచి మొక్కలకు అవసరమైన కంపోస్టు ఎరువును తయారు చేసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అంతరిస్తున్న ఆకుకూరలకు జీవంఅంతరిస్తున్న సాంప్రదాయ ఆకు కూరలు, కాయగూరల పునరుద్ధరణకు ‘వనమాలి గార్డెనింగ్’ వ్యవస్థాపకురాలు ఎ.అరుణ కృషి చేస్తున్నారు. కొండపిండి ఆకు, నల్లేరు, గలిజేరు, పొన్నగంటి కూర వంటి ఆకు కూరలతోపాటు, చెమ్మ చిక్కుడు, ముళ్ల వంకాయలు, ఇతర రాష్ట్రాలకు చెందిన క్లోవ్ బీన్స్, ఫ్యాషన్ ఫ్రూట్, వింగ్డ్ బీన్స్, ఎయిర్ పొటాటో, గుడ్డు వంగ (ఎగ్ బ్రింజాల్), ఎరుపు బర్బాటీ, ఎరుపు తోటకూర, ఎరుపు చిక్కుడు, ఎరుపు బెండ, రెడ్ ముల్లంగి, ఎరుపు బచ్చలి కూరలు, సీమ చింత... మొదలైన వాటిని తన ఇంటి మిద్దెపై పండిస్తున్నారు అరుణ. వీటితో పాటు వైజయంతి మాల, వాటర్ యాపిల్, నోనీ ఫ్రూట్, బిలంబి ఉసిరి, పొట్టి పొట్ల కాయలు, పాన్ మత్తా, మింట్ తులసి, పాండవబత్తి, దాల్చిన చెక్క, అంజీర్, మల్బరీ ఫ్రూట్స్ వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి. వీటిని సంబంధించిన విత్తనాలు, నార్లు పంపిణీ చేస్తున్నారు.వనమాలి సమావేశాలువనమాలి పరిధిలో పదిహేను ఏరియా గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో వంద నుంచి రెండు వందల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఏరియాకి ఇద్దరు ఇంచార్జ్లు ఉంటారు. వీరు ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత సభ్యులకు అవసరమైన సలహాలు అందిస్తారు. విత్తనాలు, కొమ్మలు, మొక్కలు, నారు ఇచ్చి పుచ్చుకుంటారు. సీనియర్ గార్డెనర్స్ సూచనలు తీసుకుంటారు, కొత్త ఐడియాలు నేర్చుకుంటారు. నెలకోసారి గ్రీన్ డ్రైవ్స్ నిర్వహించి రహదారుల పక్కన పార్క్లో మొక్కలు నాటుతున్నారు.కమ్యూనిటీ గార్డెనింగ్‘బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్’్ట కాన్సెప్ట్లో భాగంగా పనికిరాని వస్తువుల్లో నుంచి మొక్కల పెంపకానికి ఉపయోగపడేవాటిని ఎంచుకుంటారు వనమాలి గ్రూప్ సభ్యులు. పాత వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్, బకెట్లు, టబ్స్లో మొక్కలు పెంచుతారు. కమ్యూనిటీ గార్డెనింగ్ను ప్రోత్సహించడానికి అపార్ట్మెంట్ నివాసితుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వనమాలి గార్డెనింగ్ గ్రూప్. ఈ కార్యక్రమాలలో భాగంగా కూరగాయల మొక్కలు, విత్తనాలు పంచుతారు.తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచేలా...ఇరవై ఏళ్ల క్రితం మిద్దె తోట ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మేడ మీద 500 కుండీల్లో మొక్కలు పెంచుతున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే టెక్నిక్ను తెలుసుకుని అమలు చేస్తున్నాను. మేడ పాడవకుండానే తోటను సృష్టించవచ్చు. మా గార్డెనింగ్ గ్రూప్ ద్వారా కొత్త రకాల మొక్కలు, విత్తనాలు పరిచయమయ్యాయి. కేరళ, తమిళనాడు, వాయువ్య రాష్ట్రాల నుంచి వచ్చే అరుదైన కూరగాయలు కూడా మా మేడపై పండిస్తున్నాను. గ్రీన్ క్లైమేట్ ఎం.రత్నం సహకారం అందిస్తున్నారు.– అరుణ అరవల– వి.ఆర్. కశిరెడ్డి, సాక్షి, మురళీనగర్, విశాఖపట్నం -
డిజిటల్ హింసపై యునైట్ ఫైట్
‘బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’ సరదాగా పాడుకున్న పాట. బుల్లిపెట్టెలో ఆ బూచాడు లేకపోవచ్చు. కాని ఇప్పటి బుల్లిపెట్టెలలో (స్మార్మ్ఫోన్స్, ల్యాప్టాప్, ట్యాప్)లలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. మహిళలను లక్ష్యంగా చేసుకొని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ రాక్షడుసుడి పేరు... ‘డిజిటల్ హింసాసురుడు’‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ అగేనెస్ట్ ఉమెన్’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి డిజిటల్ హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది భాగస్వాములు అవుతున్నారు... కాలంతో పాటు మహిళలపై జరిగే హింసా రూపాలు మారుతున్నాయి.‘డిజిటల్ వయోలెన్స్’ అనేది ఇప్పుడు సరికొత్త సాంకేతిక హింస.వైరల్ అయినా ప్రమాదమేనా?!కేవలం రెండు సెకన్ల వీడియోతో ఇటీవల ఇంటర్నెట్ అబ్సెషన్గా మారింది ప్రియంగన. తక్కువ టైమ్లోనే ఈ వీడియో క్లిప్ 50 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు... ఆమె ఏఐ వీడియోలు ఆల్లైన్లో వెల్లువెత్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆమె ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదం వైపు వెళుతుందని గ్రహించిన ప్రియంగన మెల్లగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లను తొలిగించడం మొదలుపెట్టింది. తన వీడియో క్లిప్ వైరల్ కావడం వల్ల ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టిన ప్రియంగన తన ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఇమేజ్ల వల్ల తాను, తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు తెలియజేసింది. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే!అవమానాలు...ఆత్మహత్యలుడిజిటల్ హింస భరించలేక మానసిక సమస్యల బారిన పడుతున్నవారూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. టెక్నాలజీ–ఫెసిలేటెడ్ జెండర్–బేస్డ్ వయోలెన్స్(టీఎఫ్జీబివి) వల్ల మన దేశంలోని ఆన్లైన్ స్పేస్లు మహిళల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని ఒక నివేదిక హెచ్చరించింది. బహిరంగంగా అవమానించడం, అవహేళన చేయడం, బెదిరింపులు... మొదలైన రూపాల్లో మహిళలపై డిజిటల్ హింస జరుగుతోంది. ఫొటోల డిజిటల్ మాన్యుపులేషన్, ఫేక్ ఎకౌంట్స్, సైబర్ బుల్లీయింగ్, కోఆర్డినేటెడ్ ఎటాక్స్.. మొదలైనవి డిజిటల్ హింస తాలూకు వివిధ రూపాలు. అశ్లీల సైట్లు, చాట్ ప్లాట్ఫామ్లలో తాము టార్గెట్ చేసిన మహిళల చిత్రాలను పోస్ట్ చేసి అసభ్య రాతలు రాస్తుంటారు. ‘ఇది నా ఫోన్ నంబర్ కాల్ చేయండి’ అని ఫోన్ నెంబర్ పెడుతుంటారు.ఫిర్యాదు చేయాలా, వద్దా?డిజిటల్ వేదికలలో కొందరు నేరస్థులు మంచి మాటలతో అమ్మాయిలను పరిచయం చేసుకొని, స్నేహం చేస్తారు. ఆ తరువాత రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంత జరుగుతున్నా చాలామంది బాధితులు పోలిస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.‘ఫిర్యాదు చేయడం అనేది మరొకరకమైన హింస. నా దురదృష్టం అని బాధపడి ఊరుకున్నాను’ అంటుంది దిల్లీకి చెందిన ఒక బాధిత మహిళ. పదిమందికి తెలిస్తే పరువు పోతుంది అనుకోవడం, కుటుంబ ఒత్తిళ్లు, న్యాయం జరగదు అనే అపోహల వల్ల చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉంటున్నారు. కొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినా, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు. భద్రతతో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి కారణం అవుతున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు కొన్ని కేసులకు సంబంధించి ఎలా స్పందించాలో పోలీసులకు తెలియడం లేదు.చట్టం ఉన్నా సరే...మన దేశంలో సైబర్ నేరాలను నిరోధించే ప్రధాన చట్టం సమాచార సాంకేతిక చట్టం–2000 (ఐటీ చట్టం) అయితే ఇది ప్రధానంగా ఆస్తి, డేటాకు సంబంధించిన నేరాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.‘మహిళలపై జరిగే డిజిటల్ హింసకు సంబంధించి ఈ చట్టం సమర్ధంగా ఉపయోగపడడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు.‘ఫిర్యాదు అందిన వెంటనే హానికరమైన కంటెంట్ను తక్షణమే తొలగించాలి. ఈ విషయంలో కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగళూరుకు చెందిన ఒక బాధితురాలు.‘డిజిటల్ స్పేస్లను సురక్షితంగా మార్చడానికి తగిన న్యాయ, విధాన సంస్కరణలు, బలమైన చట్టాలు అవసరం. వేగంగా న్యాయం జరగాలి. టెక్ కంపెనీలు తమ వేదికలపై జరిగే హానికి బాధ్యత తీసుకోవాలి’ అంటుంది విద్యావేత్త, రచయిత్రి అమంద. ‘ఆన్లైన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. అలాంటివి జరగకుండా చూడాలి’ అంటోంది ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న జీవని.డిజిటల్ హింసపై వార్జెండర్–ఆధారిత హింసకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ విమెన్ ఇండియా పదహారు రోజుల ప్రచారకార్యక్రమం నిర్వహిస్తోంది. నవంబర్ 25న మొదలైన ఈ ప్రచార కార్యక్రమాలు డిసెంబర్ 10 వరకు కొనసాగుతాయి. ఈ జెండర్బేస్డ్ వయోలెన్స్ వ్యతిరేక క్యాంపెయిన్లో యునెటైడ్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది సినీ నటి, నిర్మాత సమంత.‘మహిళలు, పిల్లలపై జరిగే హింసను అంతం చేయడాకి ఐక్యం అవ్వండి’ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. పెరుగుతున్న ఆన్లైన్ వేధింపుల గురించి సమంత అవగాహన పరుస్తుంది. అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్పై అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న స్టాకింగ్, డాక్సింగ్. డీప్ఫేక్స్, ఇమేజ్ మాన్యుపులైజేషన్పై గట్టిగా గొంతు విప్పుతోంది. ‘హింస అనేది ఇప్పుడు శారీరక హింస మాత్రమే కాదు. అది స్క్రీన్ రూపంలో కూడా వెంటాడుతుంది. మన గొంతులను నొక్కి మౌనంగా చేస్తుంది. మహిళలే లక్ష్యంగా చేసుకునే జరిగే డిజిటల్ హింస వారి భద్రత, గుర్తింపు,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది’ అంటుంది సమంత. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్న సమంత డిజిటల్ హింసకు సంబంధించి తన వ్యక్తిగత చేదు అనుభవాలను పంచుకుంటుంది. క్యాంపెయిన్లో భాగంగా ‘వీడియో మెసేజ్’ను విడుదల చేసింది ‘యూఎన్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్లకు జవాబుదారీతనం పెరగాలి. రక్షణ చట్టాలను బలోపేతం చేయాలి’ అంటుంది సమంత.ఐశ్వర్య... హైకోర్టు వరకుతన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించింది బాలీవుడ్ సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్. దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజñన్స్(ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారని, అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని తన పిటిషన్లో తెలియజేసింది ఐశ్వర్య. తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ‘ఐశ్వర్య ఫొటోలు దురిన్వియోగం చేయడం అనేది ఆమె గౌరవ, ప్రతిష్ఠలను దెబ్బతియడమే’ అని పేరొన్న న్యాయస్థానం పిటిషన్లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని గూగుల్తో సహా రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆదేశించిది. -
రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
రోజుకు రూ.20 సంపాదన నుండి రూ.300 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ను నిర్మించగలమైనా ఎవరైనా కలగంటారా? కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గొప్ప వ్యాపారవేత్తగా నిలిచింది. చిన్న చినుకులా మొదలై, ప్రభంజనం సృష్టించిన ‘చిను కలా’ స్టోరీ వింటే... ఆత్మవిశ్వాసం, పట్టుదల , కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది.ఆమె ఏ బిజినెస్ కోర్సూ చదవలేదు. ఆమె జీవితమనే విశ్వవిద్యాలయంలోనే ప్రతీదీ నేర్చుకున్నారు. నో కార్పొరేట్ సపోర్ట్. నో గాడ్ఫాదర్ నో ప్లాన్ బి . ఎలాగైనా సాధించాలనే తపన, ఆశ, కల, నమ్మకం. కేవలం 36 చదరపు అడుగులు. ఒకే నగల ట్రే. కట్ చేస్తే.. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్తో ఒక లగ్జరీ బ్రాండ్తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే అన్నట్టుగా ఎన్నో భయంకరమైన అనుభవాలనుంచి ఎదగి ఉన్నత శిఖరాలకు చేరింది. తన బ్రాండ్ చిను కళాను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్గా నిలిపింది. అక్టోబర్ 10, 1981న ముంబైలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది చిను. ఏడాది వయసున్నప్పుడే ఆమెను తల్లి విడిచిపెట్టి సౌదీకి వెళ్లిపోయింది. తండ్రి, రెండో పెళ్లి చేసుకొని సవతి తల్లిని తీసుకొచ్చాడు. కష్టాలు మొదలయ్యాయి. చినుతోవాగ్వాదం సందర్భంగా నీ యిష్టం వచ్చినట్టు నువ్వు బతకాలనుకుంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు.అంతే 15 ఏళ్ల చిను జేబులో కేవలం రూ. 300 మరియు కొన్ని బట్టలతో ఇంటి నుండి బయలుదేరింది. ఆమె టికెట్ లేకుండా నానాసుపారా నుండి సెంట్రల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ పడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె పడుకోలేకపోయింది. మరుసటి రోజు తాను ఎక్కడికి వెళ్లాలో, ఏమి తినాలో అర్థంకాక రాత్రంతా ఏడ్చింది, ఉదయం, ఒక మహిళ ఆమె కథ విని, కమిషన్ సంపాదన కోసం ఇంటింటికీ తిరిగి అమ్మే పనిని ఒకదాన్ని అప్పగించింది. ఏదో ఒకపనిచేసుకని, కడుపునింపుకుంటూ గౌరవంగా బతుకుతూ పైకి ఎదగాలని విజయం సాధించాలని అప్పుడే దృఢంగా నిశ్చయించుకుంది.డోర్-టు-డోర్ సేల్ ద్వారా సేల్స్గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. అలా రోజుకు 25 రూపాయలు వసూలు చేసే వసతి గృహంలో నివసించింది. ఆమె మొదటి అమ్మకాల ప్రయత్నంలో, ఒక మహిళ ఆమె ముఖం మీద తలుపు వేసేసింది. అలా గంటల తరబడి గుండెలు పగిలేలా ఏడ్చింది కానీ వదులుకోలేదు. వెయిట్రెస్, రిసెప్షనిస్ట్ మొదలైన వివిధ ఉద్యోగాలను చేపట్టింది. కీలక మలుపు 2002లో ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్లో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం సంపాదించడంతో చిను జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇక్కడ ఆమె తన కాబోయే భర్త అమిత్ కళను కలుసుకుంది, అతను MBA హోల్డర్, ఆమె వ్యవస్థాపక ప్రయాణంలో కీలకమైన మద్దతుదారుగా మారారు. వారు 2004లో వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లారు, అక్కడ చినుకు మోడలింగ్ పట్ల ఉన్న ప్రేమ ఆమెను 2008 గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పోటీ పడేలా చేసింది, అక్కడ ఆమె టాప్ 10లో నిలిచింది. ఈ సమయంలో చిను ఉపకరణాలు , ఆభరణాల గురించి నేర్చుకుంది.తన మోడలింగ్ అనుభవాల నుండి ప్రేరణ పొందిన చిను, కార్పొరేట్ మర్చండైజ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఫోంటే కార్పొరేట్ సొల్యూషన్స్ను స్థాపించింది. ఆ కంపెనీ త్వరగా ఆదరణ పొందింది, సోనీ, ESPN, ఎయిర్టెల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు వస్తువులను ఉత్పత్తి చేసింది. 2014లో, స్టైలిష్ మరియు బ్రాండెడ్ ఉపకరణాల కోసం భారతీయ ఆభరణాల మార్కెట్లో అంతరాన్ని గుర్తించి, ఆమె రూబన్స్ యాక్సెసరీస్న రూ. 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. రూబన్స్ యాక్సెసరీస్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్లో 36 చదరపు అడుగుల చిన్న స్థలంలో ప్రారంభమైంది. అది కాస్తా బెంగళూరులోని చాలా ప్రసిద్ధ మాల్ ఫోరం మాల్లో తన రెండవ స్టోర్ను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. అలా మొదలై చిను ప్రయాణం వినియోగదారుల ఆదరణతో కొత్త పుంతలు తొక్కింది. వినియోగదారుల అవసరాలపై విస్తృతమైన పరిశోధనల చేసిన 80 శాతం ప్రత్యేకమైన, స్పెషల్ డిజైన్లు రూపొందించింది. అలా పాశ్చాత్య , జాతి అభిరుచులకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది. ఈ వ్యూహంతో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. 2014 నాటికి, రూబన్స్ యాక్సెసరీస్ రూ. 56 లక్షల ఆదాయాన్ని సాధించింది. 2022 నాటికి రూ. 35 కోట్లకు పెరిగింది. ఈ బ్రాండ్ ఐదు ఆఫ్లైన్ స్టోర్లకు విస్తరించింది,ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో పాపులర్ అయింది. అమ్మకాలలో 75శాతం ఆన్లైన్లో నడిచాయి. ఒక దశలో మింత్రాలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది.2023లో, రూబన్స్ యాక్సెసరీస్ వార్షిక ఆదాయంలో రూ. 65 కోట్లకు చేరుకుంది. ప్రముఖ టీవీ షో "షార్క్ ట్యాంక్ ఇండియా" సీజన్ 2 నుండి ఆమె రూ. 1.5 కోట్ల నిధులను పొందింది. IIM అహ్మదాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రసంగాలు చేసింది. పాఠశాల విద్య పూర్తి చేయకపోయినా, చిను నికర విలువ ఇప్పుడు రూ. 40 కోట్లుగా ఉంది.ఆమె బ్రాండ్ 40 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందించింది నమ్మశక్యం కాని రూ.310 కోట్లను దాటింది. ఇంతటితో ఆమె ప్రయాణం ఆగిపోడం లేదు. తన బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన ఆభరణాల బ్రాండ్గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇటీవల ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అనంత క్యాపిటల్, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ మాతృ సంస్థ ఫోంటే ఫ్యాషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. -
క్లీన్ ఎనర్జీ స్టార్స్..!
వ్యాపారం ద్వారా లాభం పొందాలి...అలాగే పర్యావరణానికి, సమాజానికి మేలు చేకూర్చాలి. ఈ రెండు విధానాలను వ్యాపారంలో చేర్చడం పెద్ద సవాల్. పర్యావరణహిత వ్యాపారాలు చేస్తూ ఎకో ఎంట్రప్రెన్యూర్లుగా రాణిస్తున్నారు నేటి మహిళలు. క్లీన్ ఎనర్జీ స్టార్టప్స్తో దేశంలోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు: ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రియా మజుందార్ సింఘాల్భారతదేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద స్థిరమైన ప్యాకేజింగ్ కంపెనీ అయిన ‘ఎకోవేర్ సొల్యూషన్స్’ వ్యవస్థాపకురాలు రియా మంజుదార్ సింఘాల్. ముంబయ్వాసి అయిన రియా బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారుచేస్తుంది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత నారీ శక్తి పురస్కారం అందుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో యంగ్ గ్లోబల్ లీడర్, ఉమెన్ ఎంపవర్మెంట్– క్లీన్ ఎయిర్ జాతీయ కమిటీ సభ్యురాలు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదువుకున్న రియా భారతదేశంలో ప్లాస్టిక్ ముప్పును పరిహరించే ఏకైక లక్ష్యంతో ‘ఎకోవేర్ సొల్యూషన్స్’ను స్థాపించింది. ప్లాస్టిక్ను పూర్తిగా కంపోస్ట్ చేయగల ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఫుడ్ ప్యాకేజింగ్ పరిశ్రమను బ్రేక్ చేసింది. వ్యవసాయ పంటల వ్యర్థాల నుండి ఎకోవేర్ తయారవుతుంది. వాయు కాలుష్యాన్ని నివారిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ సర్వీస్ ఆపరేటర్ అయిన ఇండియన్ రైల్వేలను ఎకోవేర్ బయోడిగ్రేడబుల్స్ ట్రేలకు మారేలా ఒప్పించడం రియా సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. అజైతా షాగ్రామీణ భారతావనిలోని ఇళ్లకు అధిక నాణ్యత, స్వచ్ఛమైన శక్తితో నడిచే సౌర దీపాలు, కుకింగ్ స్టౌలు.. వంటి ఉపకరణాలను అందించడానికి ‘ఫ్రాంటియర్ మార్కెట్స్(క్లీన్ ఎనర్జీ)’ను స్థాపించింది. మహిళా వ్యవస్థాపకుల నెట్వర్క్ ద్వారా అమ్మకాలు, సేవలను కొనసాగిస్తుంది. అజైతా క్లీన్ ఎనర్జీ యాక్సెస్ ప్రపంచానికి కొత్తేమీ కాదు, ఫ్రంటియర్ మార్కెట్స్కు ముందు భారతదేశం అంతటా 10,000కు పైగా గ్రామాల్లో 13 లక్షలకు పైగా మహిళలకు సేవలందిస్తూ, ఏడేళ్లుగా మైక్రోఫైనాన్స్ రంగంలో పనిచేశారు.గ్రామాల్లో సరైన విద్యుత్తు అందుబాటులో లేదన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని ఫ్రాంటియర్ మార్కెట్లను ప్రారంభించింది. గ్రామీణ కుటుంబాలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ క్లీన్ ఎనర్జీ వినియోగదారులలో 70 శాతం మహిళలే ఉన్నారు. నీలిమా మిశ్రాఒడిశాలోని భువనేశ్వర్లో వ్యర్థాల నిర్వహణ రంగంలో ఒక విప్లవాత్మక స్టార్టప్ ద్వారా సంచలనం సృష్టిస్తోంది. పర్యావరణ స్పృహ కలిగిన నీలిమా రబీ నారాయణ్ మిశ్రా స్థాపించిన ‘సీబా గ్రీన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సస్టెయినబిలిటీలో ఒక ఉద్యమం. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఈ స్టార్టప్ ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా చేర్చింది. 2019లో నెలకొల్పిన ఈ స్టార్టప్ తన అనుభవాలనుండి పుట్టుకువచ్చిందని చెబుతుంది నీలిమా మిశ్రా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టాలు పొందిన నీలిమ‘సీబా గ్రీన్’ ద్వారా వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వ్యర్థాలను సేకరించడం, సేంద్రీయ వ్యర్థాలను విలువైన కం΄ోస్ట్గా మార్చడం, రీ సైక్లింగ్ను సులభతరం చేస్తూ పరిశుభ్రమైన నగరాలకు ఊపిరి ఊదుతుంది.ఆర్తి రాణా తరు ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన ఆర్తి రాణా తరు 350 స్వయం సహాయక సంఘాలలోని పదివేల మంది మహిళల ద్వారా చేత చేనేత ఉత్పత్తులను తయారు చేయిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థల మద్దతుతో ఆరేడేళ్లలో వేల మందికి చేరువయ్యింది ఆర్తి. మొదట ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో సాధారణంగా కనిపించే పొడవైన, దృఢమైన గడ్డితో బుట్టలు, పెన్ స్టాండ్లను తయారు చేశారు. ఇవి వారి చేనేత వస్త్రాలతో పాటు ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్లో ప్రజాదరణ పొందాయి. సస్టెయినబిలిటీ సాధించడం, మహిళల్లో స్వావలంబనను ప్రోత్సహించడంలో ఆర్తి రాణా 2020లో నారీ శక్తి పురస్కార్తో పాటు మరెన్నో సత్కారాలూ అందుకుంది.(చదవండి: కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!) -
నవంబర్ నవ శక్తి
ఇంకో మూడు రోజుల్లో... ‘ఇక సెలవా మరి’ అని నవంబర్ నెల చరిత్రలో కలిసిపోనుంది. అయితేనేం. మహిళల క్రీడా ప్రపంచానికి సంబంధించి ఈ మాసం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోనుంది. మహిళ వన్డే వరల్డ్కప్ను టీమ్ ఇండియా గెల్చుకోవడం, తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ను మన అమ్మాయిలు సాధించడం, భారత మహిళల కబడ్డీ జట్టు వరల్డ్ కప్ను చేజిక్కించుకోవడం... ఒకే నెలలో మూడు చారిత్రక విజయాలు. ఇవి గాలివాటు విజయాలు కాదు. ఎన్నో సంవత్సరాల కష్టానికి దక్కిన అపూర్వ ఫలితాలు. ఈ విజయాల్లో నుంచి సిము దాస్లాంటి పేదింటి బిడ్డలు ప్రపంచానికి ఘనంగా పరిచయం అయ్యారు...నవంబర్ 2న నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్కప్ను గెలుచుకున్న క్షణం దేశాన్ని ఉత్తేజపరిచింది. ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తినిస్తుంది అన్నట్లుగా ఆ విజయం బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్కు బలమైన స్ఫూర్తిని ఇచ్చింది.తొలిసారే...చారిత్రక విజయం!అంధ మహిళా క్రికెటర్ల కోసం క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా(సీఏబీఐ) మొదటిసారిగా టీ 20 వరల్డ్కప్కు శ్రీకారం చుట్టింది. ఇండియా బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ తొలి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీపిక సారథ్యంలోని జట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా విజయం దిశగా దూసుకుపోయింది.ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయంభారత జట్టులో చోటు సంపాదించడానికి అనేక సవాళ్లను అధిగమించిన అమ్మాయిలు బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్లో ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఏళ్లకు ఏళ్లు ప్రాక్టిస్ చేసిన వారు కాదు వారు. గత కొన్ని సంవత్సరాలలో మాత్రమే క్రికెట్ నేర్చుకొని అందులో ప్రావీణ్యం సాధించారు.మన టీమ్ వరల్డ్ కప్ను గెల్చుకోవడం దేశవ్యాప్తంగా ఎంతోమంది దివ్యాంగ మహిళలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా, ‘మేము సైతం’ అంటూ ఆటల్లో దూసుకుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.‘దివ్యాంగులు క్రికెట్ లేదా ఇతర క్రీడల్లోకి అడుగు పెట్టడానికి ఈ విజయం స్ఫూర్తిని ఇచ్చింది’ అంటున్నారు మన దేశంలోని అంధుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మహంతేష్.ధైర్యమే వజ్రాయుధమై...కర్నాటకలోని తుమకూర్కు చెందిన దీపిక టీసి చిరునవ్వు లేకుండా మాట్లాడడం అరుదైన దృశ్యం. చిరునవ్వు ఆమె సహజ ఆభరణం. ఆత్మవిశ్వాస సంతకం. ‘నేను బడికి వెళ్లింది క్రికెట్ ఆడడానికి కాదు. అంధత్వంతో కూడా హాయిగా ఎలా జీవించవచ్చో తెలుసుకోవడానికి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది కెప్టెన్ దీపిక. రైతు అయిన ఆమె తండ్రి చిక్కతిమప్ప... ‘ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’ అని చెబుతుండేవాడు. ఆటలో అది తనకు ఒక మంత్రంలా, వజ్రాయుధంలా పనిచేసింది. జయాపజయాలను అధిగమించేలా చేసింది. ‘బ్లైండ్ క్రికెట్ అనేది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంటుందనే విషయం నాకు చాలా కాలం వరకు తెలియదు’ అని ఒకప్పుడు చెప్పిన దీపిక టీమ్ను విజయపథంలోకి తీసుకువెళ్లి వరల్డ్కప్ గెల్చుకోవడంలో కెప్టెన్గా కీలక పాత్ర పోషించింది.సంజు...స్టార్ రైడర్రైడర్ స్థానంలో ఉండడమంటే ఆత్మవిశ్వాసంతో ఉండడం, చాలా చురుగ్గా ఉండడం. మెరుపు నిర్ణయాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడం. ఈ లక్షణాలన్నీ సంజు దేవిలో ఉన్నాయి. అందుకే ఆమె మహిళల కబడ్డీ జట్టులో స్టార్ రైడర్గా దూసుకుపోతోంది.మన టీమ్ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ను గెల్చుకోవడంలో సంజుదేవి కీలక పాత్ర పోషించింది. ‘కబడ్డీ అమ్మాయిల ఆట కాదు’ అనుకునే ఛత్తీస్గఢ్లోని కోర్బ ప్రాంతానికి చెందిన సంజు దేవి స్వరాష్ట్రంలోనే కాదు ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. మహిళల కబడ్డీ వరల్డ్కప్ కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇండియన్ నేషనల్ టీమ్కు ఎంపికైన తొలి మహిళగా తన ప్రత్యేకత నిలుపుకుంది సంజుదేవి.చిన్నప్పటి నుంచే కబడ్డీలో అద్భుత ప్రతిభ చూపేది సంజు. 6వ ఏసియన్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. బిలాస్పూర్లోని ఉమెన్స్ రెసిడెన్షియల్ కబడ్డీ అకాడమీలో చేరడం సంజుకు టర్నింగ్ పాయింట్గా మారింది. దిల్ కుమార్ రాథోడ్లాంటి కోచ్ల దగ్గర కబడ్డీలో పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలే ఆమె విజయానికి మెట్లు అయ్యాయి. పేదింటి బిడ్డకు పెద్ద పేరు వచ్చింది‘మా విజయం ఎంతోమంది అంధ అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తుంది’ అంటుంది అస్సాంకు చెందిన బ్లైండ్ క్రికెటర్ సిము దాస్. ఈ విజేత ఎన్నో కష్టాల రహదారుల్లో నుంచి నడిచి వచ్చింది. ‘బిడ్డ అంధురాలు’ అని తెలుసుకున్న సిము దాస్ తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిముకు తల్లే అన్నీ అయింది. కొంతకాలానికి తల్లి మంచం పట్టింది. రోజుకు రెండు పూటలా భోజనం కష్టం అయింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడికి నిరంతర సహాయం అవసరం. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినప్పటికీ సిము ఒక కలను నిలబెట్టుకుంది. తాను ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది అసాధ్యం అనిపించే కల. కాని సిము ఎక్కడా వెనకడుగు వేయలేదు. క్రికెట్ తన పాషన్ మాత్రమే కాదు జీవితం అయిపోయింది. క్రికెట్పై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ఆమెకు సలహాలు ఇచ్చేవారు లేరు. ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు లేరు. ఎలా ప్రారంభించాలో, ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. ‘బ్యాటిల్ ఫర్ బ్లైండ్నెస్’ సంస్థతో సిముకు అండ దొరికింది. ఉచిత వసతి, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం ఆమెకు ఎంతగానో నచ్చింది. ‘నేను క్రికెటర్ కావాలనుకుంటున్నాను’ తన మనసులోని మాటను బలంగా చెప్పింది. ‘మేమున్నాం’ అంటూ సంస్థ ఆమె భుజం తట్టింది. క్రికెట్లో శిక్షణ ఇప్పించింది. అంకితభావం, కష్టంతో భారత జట్టులో స్థానం సాధించింది సిము. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబిఐ) భారతదేశం, నేపాల్ల మధ్య నిర్వహించిన మహిళా క్రికెట్ సిరీస్లో సిము ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది. -
Fatma Bosch: అవమానాల నుంచి అందాల కిరీటం వరకు...
ప్రపంచానికి మాత్రం ధగధగలాడుతూ వెలిగిపోతున్న ఆమె కిరీటం కనిపించవచ్చు. అయితే ఆ వెలుగుల వెనుక కనిపించని చీకట్లు ఎన్నో ఉన్నాయి. ‘డిస్లెక్సియా’ వల్ల ఆమె బాల్యం అవమానాలు, అవహేళనలతో నిండిపోయింది. అయితే ఆ అవమానాలను గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోలేదు ఈ మెక్సికో సుందరి. ‘ఆ అవమానాలే లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’ అంటుంది 74వ మిస్ యూనివర్స్ పోటీలో విశ్వసుందరి కిరీటాన్ని గెల్చుకున్న ఫాతిమా బాష్. ఆమె ఇంటి పేరు ‘బాష్’కు అడవి అని అర్థం. అడవిలో ‘పచ్చదనం’ అనే సానుకూల శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే ప్రతికూలతలను అధిగమించి అందాల కిరీటాన్ని గెలుచుకుంది.ఫాతిమా బాష్ బాల్యం అందరిలా ఉండేది కాదు. ‘మాట్లాడినా వెటకారాలే... మాట్లాడకపోయినా వెటకారాలే’ అన్నట్లుగా ఉండేది. డిస్లెక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ)తో బాధ పడుతున్నట్లు ఆరేళ్ల వయసులో నిర్ధారణ అయింది. తోటి పిల్లలు ఎప్పుడూ ఫాతిమాను అవమానిస్తుండే వారు. ఉపాధ్యాయులు కూడా ఏదో రకంగా తిడుతూనే ఉండేవారు.అమ్మో... అల్లరి పిల్ల!ఫాతిమా ఇంటికి వస్తుందంటే చుట్టాలు, పక్కాలు భయపడి పోయేవాళ్లు, ఎందుకంటే ‘ఏడీహెచ్డీ’ వల్ల ఆమె తెగ ఆల్లరి చేస్తుండేది. అది భరించడం ఇతరులకు కష్టంగా ఉండేది. ఆమె అతి చురుకుదనం అందరికీ సమస్యగానే ఉండేది. స్కూలుకు వెళుతున్న మాటేగానే...‘డిస్లెక్సియా’ అనే అభ్యాస వైకల్యం వల్ల చదవడం, రాయడం, పాఠాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడేది.కాలమే దారి చూపింది‘ఎందుకు ఇలా?’ అని సీరియస్గా విశ్లేషించుకునే వయసు కాదు. వయసు పెరుగుతున్న క్రమంలో తన గురించి తనకు అర్థం అవుతూ వచ్చింది. అయితే ఫాతిమా ఎప్పుడూ నిరాశకు గురి కాలేదు. సానుకూల ఆలోచనలు ఆమెకు బలాన్ని ఇచ్చాయి. ‘ఏదో ఒకటి సాధించాలి. అప్పుడు నాతో అందరూ చక్కగా మాట్లాడతారు’ అని తెలిసీ తెలియని వయసులోనే అనుకుంది. ఏం సాధించాలో తెలియదు. ఎలా సాధించాలో తెలియదు. అయితే కాలమే ఆమె ముందు దారులు పరుస్తూ వెళ్లింది.సామాజిక సేవలో...ఎంత ఇబ్బందిగా ఉన్నా చదువుకు మాత్రం దూరం కాలేదు. మెక్సికోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. క్యాన్సర్ బాధితులైన పిల్లలకు అండగా నిలవడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది.ఆ రోజు రానే వచ్చింది!మెక్సికన్ రాష్ట్రం టటాస్కోలోని టీపా అనే చిన్న పట్టణంలో జన్మించింది ఫాతిమా. టటాస్కో రాష్ట్రంలో జరిగే అందాల పోటి ‘ఫ్లోర్ టటాస్కో’ (2018) టైటిల్ గెలుచుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది. పరిచితులు, అపరిచితులు, ఆత్మీయుల అభినందనలతో ఫాతిమా మనసు నిండిపోయింది.‘ఈరోజు కోసమే కదా నేను వేచి చూసింది’ అనుకుంది. అయితే ఇంకో రోజు కూడా ఆమె కోసమే ఓపికగా ఎదురు చూస్తూనే ఉంది. అది ఆమె మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న రోజు. అది ఆమెకే పరిమితమైన విజయం కాదు. అవమానాలు ఎదురైతే ‘నా జీవితం ఇంతేనా’ అని కుంగుబాటు చీకట్లోకి వెళ్లిపోయే వారికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. ‘పట్టుదలగా ప్రయత్నించు. నువ్వు సాధించడానికి ఎంతో ఉంది’ అని గుర్తు తెచ్చే విజయం.క్షమాపణ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు!ఫాతిమా బాష్కు అవమానాలు, ఈసడింపులు కొత్తేమీ కానప్పటికీ తాజా అవమానం ఆమెను తీవ్రంగా బాధ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది షాక్ అయ్యేలా చేసింది. ‘సోషల్ మీడియాలో తన ప్రమోషన్ కంటెంట్ను పోస్ట్ చేయడంలో ఫాతిమా విఫలమవుతుంది’ అని ఆరోపిస్తూ మిస్ యూనివర్స్ థాయ్లాండ్ నేషనల్ డైరెక్టర్ నవత్ ఇట్సారగ్రిసిల్ బహిరంగంగా ఆమెను ‘తెలివి తక్కువ’ అని అర్థం వచ్చేలా అవమానించారు.నవత్ మాటలను నిరసిస్తూ ఫాతిమా వాకౌట్ చేసింది. గత సంవత్సరం మిస్ యూనివర్స్తో సహా అనేకమంది పోటీదారులు ఫాతిమాకు సంఘీభావంగా వాకౌట్ చేశారు. ‘సాధికారత ఉన్న మహిళలం మనం. మన గళాన్ని వినిపించే వేదిక ఇది’ అని తన గళాన్ని వినిపించింది ఫాతిమా. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నవత్ నోటిదురుసుతనాన్ని ఖండించింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఫాతిమాకు మద్దతుగా మాట్లాడింది. వాకౌట్ తరువాత తిరిగి పోటీలో పాల్గొన్న ఫాతిమా బాష్ అందాల కిరీటాన్ని గెలుచుకుంది.‘నవత్లాంటి వ్యక్తుల అహంకారానికి చెంపపెట్టులాంటి అద్భుత విజయం ఇది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న నవత్ ఫాతిమాకు బహిరంగ క్షమాపణ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్తో కూడిన ఏఐ మోడల్స్ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్ఫామ్ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
ఆ పెయింటింగ్ ధర ఏకంగా రూ.487 కోట్లు!..అందులో ఇంత కథ ఉందా!
ఓ మహిళా కళాకారిణి చిత్రించిన పెయింటింగ్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. అది కూడా ఒక మహిళ ప్రాణంపోసిన కళాకృతికే ఈ ఘనత దక్కడం అందర్నీ ఆశ్చర్యానందంలో ముంచెత్తింది. పురుష కళాకారులను అందర్ని వెనక్కినెట్టి మరీ ఇంత పెద్దమొత్తంలో ధర పలకడంతో ఆ చిత్రంలో దాగున్న విశేషం ఏంటని సర్వత్రా ఆసక్తి రెక్తిత్తించింది. అది ఆ కళాకారిణి స్వీయ చిత్రమట. అందులో పొందుపర్చిన భావం, దాని వెనుకున్న కథ వింటే..ఈ చిత్రంలో ఇంత అర్థావంతమైనదా అని ఆశ్చర్యం కలుగక మానదు. మరి ఆ పెయింటింగ్ కథ కమామీషు ఏంటో చకచక చదివేద్దామా.!.ఆ అపురూపమైన కళాఖండాన్ని చిత్రించింది మెక్సికన్ కళాకారిణి ఫ్రిదా కహ్లో. దీన్ని ఎల్ సుయెనో (లా కామా)" అనే పేరుతో 1940లో చిత్రించింది. "ది డ్రీమ్ (ది బెడ్)" అనే ఆర్ట్వర్క్ విభాగంలో భాగంగా ఇది వేలంలో ఏకంగా రూ. 487 కోట్లకు అమ్ముడుపోయింది. అది కూడా జస్ట్ నాలుగు నిమిషాల్లోనే ఈ రేంజ్లో పలకడం విశేషం. మునుపటి రికార్డుని బ్రేక్ చేసింది ఈ ఆర్ట్. గతంలో అమెరికాకు చెందిన మరో మహిళా కళాకారిణి జార్జియా ఓ'కీఫ్ పేరు మీదున్న రికార్డును ఈ పెయింటింగ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబైస్ (Sotheby's) పేర్కొంది.ఏం చెబుతుందంటే..ఈ చిత్రం కళాకారిణి కహ్లో కెరీర్లో కీలకమైన దశాబ్దంలో చిత్రించిన పెయింటింగ్ అట ఇది. కహ్లో మాజీ ప్రేమికుడు హత్యకు గురైన ఏడాది, ఆ తర్వాత ఆమె విడాకులు పునర్వివాహం పరిణమాల మధ్య ఆమె మనసులో చెలరేగిన భావోద్వేగాన్ని వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే..పూర్తిగా ఇది ఆమె వ్యక్తిగత చిత్రం.దీనిలో ఇంత అంతరార్థం ఉందా..?ఆకాశంలో మేఘాల మధ్య తేలియాడుతున్నట్లు కనిపించే మంచంలో, డైనమైట్ కర్రలతో చుట్టబడిన కాళ్ళతో కూడిన అస్థిపంజరం పడుకుని ఉంటుంది. అలాగే దానికింద ఉన్న మరో బెడ్పై పూల పందిరిలో హాయిగా నిద్రిస్తున్నట్లు కళాకారిని కనిపిస్తుంది. పై బెడ్లో డైనమైట్తోకప్పబడిన అస్థిపంజరం శారీరకంగా, మానసికంగా కష్ట సమయాల్లో ఆమె స్థితిస్థాపకతను సూచిస్తుంది. అలాగే కింద బెడ్పై సర్వాంగ సుందరంగా ఆకుల పందిరిలో పడుకున్నట్లు కనిపిస్తున్న చిత్రం..ఆమె సంబంధాలు, అనారోగ్యంతో చేస్తున్న పోరాటాన్ని తెలుపుతుంది. అంతేగాదు మెక్సికన్ సంస్కృతి, జానపద మూలాంశాలు, యూరోపియన్ సర్రియలిజం(మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఉద్భవించిన ఒక కళాత్మక ఉద్యమం) వంటివి ప్రస్ఫుటంగా కనపిస్తాయి. ఈ పెయింటింగ్ కంటే 1932 నాటి పెయింటింగ్ "జిమ్సన్ వీడ్/వైట్ ఫ్లవర్ నంబర్ 1" 2014లో $44.4 మిలియన్లు (రూ. 391 కోట్లు) పలకడం విశేషం. దీన్ని ఆమె భర్త, కుడ్యచిత్రకారుడు డియెగో రివెరాతో కలిసి చిత్రించింది. కాగా, 1954లో మరణించిన ఫ్రిదా కహ్లో, గొప్ప చిత్రకారులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందిన కళాకారిణి. ముఖ్యంగా సెల్ఫ్(వ్యక్తిగత చిత్రాలకు) పెయింటింగ్లకు పేరుగాంచిన కళాకారిణి. ఆ పెయింటింగ్స్ అన్ని తరచుగా ఆమెకున్న శారీరక మానసిక బాధల్ని వ్యక్తపరుస్తాయి. ఆమె బాల్యంలో పోలియోతో బాధపడింది. ఆ తర్వాత బస్సు ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలపాలైంది. ఆయా కష్ట సమయాల్లో తన మానసిక స్థితిని ప్రతిబింబించేలా చిత్రిస్తుందామె. నిజంగా ఒక చిత్రం ఇన్ని విషయాలను వెల్లడిస్తుందా..అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది.(చదవండి: పశ్చిమ్ కా పరంపర..! రేపటి నుంచి 'భారతీయ కళా మహోత్సవ్') -
పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్క్యూ'
వయస్సు, అనుభవం ఆవిష్కరణకు అడ్డు కాదని నిరూపించింది ఇరవై రెండు సంవత్సరాల అలెశాండ్రా గలీ. పా΄ర్కిన్సన్ వ్యాధిగ్రస్తులపై ఆమె సానుభూతి కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఉపకరించే ఆవిష్కరణ ఇది. నెదర్లాండ్స్లోని డెలప్స్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల్లో అలెశాండ్రా గలీ, పార్కిన్సన్ రోగులు ఎదుర్కొంటున్న రోజువారి ఇబ్బందులను చూసి చలించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పార్కిన్సన్ రోగులు ఉన్నారు, వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి అధ్యయనం చేసింది. కీబోర్డ్ను ఉపయోగించడంలో వారు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకుంది. ఆధునిక గేమింగ్ బోర్డ్ల నుంచి ప్రేరణ పొంది ‘ఆన్క్యూ’ అనే కీబోర్డ్ను రూదిపొందించింది. పార్కిన్సన్ రోగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టైప్ చేయడానికి ‘ఆన్క్యూ’ కీబోర్డ్ ఉపయోగపడుతుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా వైబ్రేషన్, లైట్ సిగ్నల్స్ తీవ్రతను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణకు జేమ్స్ డైసన్ అవార్డు అందుకుంది అలెశాండ్రా. ‘ఆన్క్యూ అనేది ఆవిష్కరణ మాత్రమే కాదు. ఇందులో తత్వం కూడా ఉంది. సాంకేతికతను సామాజిక సేవకు ఉపయోగించాలనేది ఆ తత్వం’ అంటుంది అలెశాండ్రా. (చదవండి: దటీజ్ ఫాతిమా బాష్..! వివాదాలు, హేళనలే ఆమె బలం..) -
దటీజ్ ఫాతిమా బాష్..! వివాదాలు, హేళనలే ఆమె బలం..
మిస్ యూనివర్స్ 2025 విజేతగా మిస్ మెక్సికో ఫాతిమా బాష్(25) కిరీటం దక్కించుకుని, టబాస్కో నుంచి గెలుపొందిన తొలి మహిళగా బాష్ చరిత్ర సృష్టించింది. నిజానికి ఈ కీరిటం అంత సులభంగా రాలేదు. పైగా ఆమె ఈ పోటీలో పాల్గొనే స్థాయికి చేరుకోవడానికి ఎన్నో హేళనలు, అవమానాలు, ధిక్కారాలను దాటుకుని వచ్చింది. తగ్గేదే లే అంటూ తాను ఎంత వరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతా పెట్టి.. గెలుపుని పాదాక్రాంతం చేసుకుని శెభాష్ అనిపించుకుంది ఫాతిమా బాష్. నిజానికి ఫాతిమాని చిన్నప్పటి నుంచి స్కూల్లో తోటి విద్యార్థులు చులకనగా చూసేవారు. టబాస్కోలోని శాంటియాగో డి టీపాలో జన్మించిన ఆమెకు పుట్టుకతోనే స్లెక్సియా, ADHD అనే నాడి సంబంధిత సమస్యల ఉన్నాయి. దీని కారణంగా బాష్ చదువులో వెనకుండేది. సింపుల్గా చెప్పాలంటే మాట్లాడటంలో తడబాటు, ఒకచోట కుదురుగా కూర్చొని చదవలేని మానసిక సమస్య. ఆ సమస్యను చేధించి తానేంటో ప్రూవ్ చేసుకుని అందాల పోటీకి వస్తే..మళ్లీ ఇక్కడ కూడా వివాదం వెంటాడింది. ఆమె స్థానంలో మరొకరెవరైనా..తప్పుకునేవారేమో. ఇక్కడుంది ఫాతిమా కాదన్న వాళ్ల నోళ్లే మూయించేలా.. తడకా చూపించాలనుకుంది. అందుకే ఆ అవమానాలు, ధిక్కారాలను బలంగా మార్చుకుని విజయం తన ముంగిట్లోకి వచ్చేలా చేసుకుని యావత్తు ప్రపంచం తనవైపు చూసేలా చేసుకుంది. ఇంతకీ ఫాతిమా బాష్కు అందాల పోటీలో ఎదురైన వివాదం ఏంటంటే..ఈ అందాల రాణి అంత సులభంగా కిరీటాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. ఎందుకంటే మిస్ యూనివర్స్2025 సాష్ వేడుకల్లోనే ఆమెకు అవమానం, బెదిరింపులు ఎదురయ్యాయి. మొత్తం ప్రపంచ దేశ సుందరీమణుల అందరి ముందు ఘోరంగా అవమానపాలైంది. సాక్షాత్తు మిస్ యూనివర్స్పోటీల అధికారి నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆమెను నిందించడం బాధకరం. అంతేగాదు ఒక మహిళగా తన వ్యక్తిత్వాన్నే కించపరిచేలా సోషల్ మీడియా లైవ్స్ట్రీమింగ్లో ఆయన ఇలా వ్యాఖ్యానించడం అందర్ని విస్తుపోయేలా చేసింది. దాంతో ఒక్కసారిగా ఫాతిమాకు సోషల్మీడియా నెటిజన్లతో సహా తోటి సుందరీమణులు మద్దతు వెల్లువెత్తింది. ఆ అధికారి దృష్టిలో ఇక్కడ బాష్ చేసిన తప్పిదం ఏంటంటే..అందాల పోటీలు జరుగుతున్న ధాయిలాండ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయకపోవడం, అలాగే తన జాతీయ అధికారి మాటలనే ఆదేశిస్తుందనేది నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆరోపణలు. ఆనేపథ్యంలోనే ఆమెను దారుణంగా అవమానిస్తూ దుర్భాషలాడాడు. ఆఖరికి ఆమె పోటీ నుంచి నిష్క్రమించేలా పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. ఇదేం పద్దతి అంటూ మిస్ యూనివర్స్ పోటీలపై సర్వత్రా విమర్శలు రావడంతో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టింది. అంతేగాదు ఈ ఘటనకు క్షమాపణు చెప్పడమే గాక సదరు అధికారికి చీవాట్లు సైతం పెట్టింది. ఈ పోటీల్లో అతడు జోక్యం ఉండదని నామామాత్రంగానే న్యాయనిర్థేధికారిగా ఉంటాడని వివరణ కూడా ఇచ్చింది. ఇంతటి పరిస్థితుల్లో కూడా ఆమె మీడియా ముందు..ఒక మహిళగా తనకు గౌరవం ఇవ్వలేదని, తన దేశ జాతీయుడితో ఉన్న సమస్యను..నాతో ముడివేసి ఆ అధికారి ఇబ్బందులకు గురిచేశాడని ధైర్యంగా చెప్పింది. అంతేగాదు తనెనెవరు ఈ పోటీల్లో పాల్గొనకుండా చేయలేరు, కిరీటం దక్కించుకోకుండా చేయలేరు అని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిన ప్రతి పోటీలోనూ తన దైన శైలిగా న్యాయనిర్థేతలను, ప్రేక్షకులను మెప్పించింది. ఆఖరికి క్వశ్చన్ రౌండ్లో కూడా ప్రపంచ వేదికపై మహిళలు తమ గొంతున వినిపించి..మార్పు తీసుకురావాలని శక్తిమంతంగా సమాధానమిచ్చి జడ్జీల మన్ననలను అందుకుంది. ఊహించని ఝలక్..!థాయ్లాండ్లోని నోంతబురి నగరంలో అంగరంగవైభవంగా ఈ గ్రాండ్ ఫినాలే జాలిస్కో, లోపెజ్, ఫెర్నాండా ప్యూమా, ఎమిరే అరెల్లానో, ఎలెనా రోల్డాన్ వంటి అందాల భామలతో తలపడింది బాష్. వివాదంలో నిలిచింది కాబట్టి బాష్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అంతా మిస్ జాలిస్కోదే కిరీటం అనుకున్నారు. అయితే అక్కడ న్యాయనిర్థేతలు అనూహ్యంగా ఫాతిమా బాష్ను మిస్ యూనివర్స్గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మీడియా ముందు చెప్పినట్లుగానే కిరీటం దక్కించుకుంది కదా అంటూ..అందరూ సాహో రాణి అని కీర్తించారు. చిన్నప్పుడూ మాటల్లో స్పష్టత లేక తడబడి అల్లాడిన ఆ చిన్నారే..ఆ మానసిక సమస్యను బలంగా మార్చుకుని తన గొంతు విప్పి..తనను కాదన్న వాళ్లని ఒక్క గెలుపుతో నోరూమూయించింది. అంతేగాదు అవమానాలు, చీత్కారాలు గెలుపుకి ఆటంకాలు కాదు బలం అని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: మిస్ యూనివర్స్గా ఫాతిమా బాష్) -
అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్ రైడ్..!
వయసు శరీరానికే గానీ మనసుకు కాదని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. అయితే ఈ బామ్మలు వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి..ఏకంగా చలాకీగా బైక్ రైడ్ చేస్తూ..సాహస యాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరు వృద్ధ మహిళలు చూస్తే..ఓల్డ్ ఏజ్ అని అనిపించదు..బంగారంలా బతకడం అంటే ఏంటో తెలుస్తుంది.!.ఆ బామ్మలే అహ్మదాబాద్కు చెందిన ఇద్దరు వృద్ధ అక్కాచెల్లెళ్లు. 87 ఏళ్ల మందాకిని షా తన చెల్లెలు ఉషతో కలిస స్కూటర్పై సాహసయాత్రలు చేస్తోంది. అంతేగాదు తన చెల్లెలుతో ఉన్న సాన్నిహిత్యం, సాహసయాత్రల పట్ల ఉన్న అభిరుచి కలగలసి ఇలా తనతో కలిసి చుట్టిరావడానికి పురిగొల్పిందని అంటోంది. ఇంత ఏజ్లోనూ ఆ బామ్మ మందాకిని చాలా చలాకీగా స్కూటర్ నడిపేస్తుంటుంది. అయితే ఈ బామ్మ 62 ఏళ్ల వయసులో ఉన్నప్పుడూ స్కూటర్ నడపడం నేర్చుకుందట. ఆరుగురు తోబుట్టువులో పెద్దది కావడంతో చిన్న వయసులోనే బాధ్యతలను నిర్వహించడం అలవాటైపోయిందట ఆమెకు. స్వాతంత్ర సమరయోధుడైన ఆమె తండ్రి వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేవాడట. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాపారం చేసే సాహసం చేయలేకపోయాడట. తన కుటుంబంలో తరుచు డబ్బు కొరత బాగా ఉండేదని, అందుకోసం తన తల్లి ప్రతి రోజు ఎంతలా కష్టపడేదో దగ్గరగా చూశానని అంటోంది. బహుశా అదే తనలో ఆత్మవిశ్వాసం పెంచి తన కాళ్లపై తాను నిలబడేందుకు దారితీసిందని చెబుతోంది. 16 ఏళ్ల వయసులో తనకు ఇంగ్లీష్ సరిగా రాకపోయినా..బాల్ మందిర్లో మాంటిస్సోరి స్కూల్లో టీచర్ పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపింది. తర్వాత సామాజికి సంక్షేమ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ప్రారంభించానని, దాంతో ఆమెకు మహిళా సంఘాలు, పంచాయతీ సమావేశాలు తదితర వాటిల్లో పాల్గొనే అవకాశం లభించిందని చెప్పుకొచ్చింది. ఆనేపథ్యంలోనే తానుమోపెడ్, జీపు నడపడం వంటివి నేర్చుకున్నట్లు వివరించింది. అలా 62 ఏళ్ల వయసులో సెకండ్హ్యాండ్ స్కూటర్ నడపడం నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికీ తాను, తన సోదరి ఇద్దరం కలిసి నగరం చుట్టేసి వచ్చేస్తుంటామని నవ్వుతూ చెబుతోంది. అయితే స్థానికులు ఆ బామ్మను ఎందుకు వివాహం చేసుకోలేదని తరుచుగా అడుగుతుంటారట. అయితే బామ్మ ఒకప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అయితే జీవితం మరో మార్గాన్ని చూపించడంతో ఆ దిశగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక బామ్మ మందాకిని చివరగా.. పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తిని ఏది ఆపలేదని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. ఈ బామ్మ ఈ తరానికి ఎంతో స్ఫూర్తి కదూ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: ఉద్యోగం ఐటీ..నాట్యంలో మేటి) -
ఆట, పాట గెలిచాయి
చాంపియన్ స్పోర్ట్ షూటర్ శ్రేయసి సింగ్, స్టార్ సింగర్ మైథిలీ ఠాకూర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో.... ‘ఆడినంత సులువు కాదు’ ‘పాడినంత సులువు కాదు’ అన్నారు విమర్శకులు. అయితే ఈ ఇద్దరూ ఆడినంత తేలిగ్గానే, పాడినంత సులువుగానే బిహార్ తాజా ఎన్నికలలో విజయం సాధించారు. భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువ మహిళా నాయకుల గురించి...ఈసారి కూడా గురి తప్పలేదు!బిహార్ లోని జముయి నియోజక వర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచిన శ్రేయసి సింగ్ ఒకప్పుడు చాంపియన్ స్పోర్ట్ షూటర్. శాసనసభ్యురాలిగా ఇది ఆమె రెండో విజయం. బిహార్ జముయి జిల్లాలోని గిదౌర్కు చెందిన శ్రేయసి సింగ్కు ఘనమైన క్రీడా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తాత సెరేందర్సింగ్, తండ్రి దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షులుగా పనిచేశారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి మాజీ ఎంపీ.దిల్లీలోని హన్స్రాజ్ కాలేజీలో చదువుకున్న శ్రేయసి ఫరిదాబాద్లోని మానవ్ రచనా ఇంటర్నేషల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి షూటింగ్ చూస్తూ పెరగడం వల్ల సహజంగానే ఆ క్రీడపై ఆమెకు ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి నైపుణ్యం తోడు కావడంతో షూటింగ్లో గురి తప్పకుండా దూసుకుపోయింది. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో బిహార్కు ప్రాతినిధ్యం వహిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శ్రేయసి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరి 2020 బిహార్ శాసన సభ ఎన్నికల్లో జముయి నియోజక వర్గం నుంచి గెలిచింది. యువత, మహిళ ఓటర్లను ఆకర్షించగల చరిష్మా, కుటుంబ రాజకీయ నేపథ్యం వల్ల బీజేపీ శ్రేయసీకి సీటు ఇచ్చింది. పురుషాధిపత్యం కనిపించే బిహార్ రాజకీయ రణక్షేత్రంలో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే క్షేత్రస్థాయి నుంచి బిహార్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న శ్రేయసి ఎప్పుడూ తడబడలేదు. వెనకబడిన రాష్ట్రమైన బిహార్లో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి శ్రేయసి సింగ్ రోల్మోడల్గా మారింది. స్త్రీ విద్య, ఉపాధి కోసం రాజకీయ వేదికగా క్రియాశీలంగా పనిచేస్తోంది.చారిత్రక విజయ గీతం‘సంగీతంలో పుట్టింది. సంగీతంతో పెరి గింది’ అనే మాట మైథిలి ఠాకూర్కు సరిపోతుంది. బాల్యం నుంచి ఆమెకు శాస్త్రీయ, జానపద సంగీతంతో అనుబంధం ఉంది. ‘లిటిల్ చాంప్స్’ ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోల ద్వారా చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారింది. ‘జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. తొలి ఆల్బమ్ ‘యా రబ్బా’తో సంగీత అభిమానుల ప్రశంసలు అందుకుంది. మరుసటి సంవత్సరం ‘రైజింగ్ స్టార్’లో రన్నరప్గా నిలిచింది.ఆలీనగర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా ఆర్జేడీ అభ్యర్థిపై విజయం సాధించిన మైథిలీ ఠాకూర్ బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీటును గెల్చుకోవడం బీజేపికి ఇది మొదటిసారి. దీనిని చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. బిహార్ అసెంబ్లీకి ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలిగా సంచలనం సృష్టించి దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తోంది 25 సంవత్సరాల మైథిలీ ఠాకూర్. ఎన్నికల ప్రచార యాత్రలలో జానపద, భక్తిగీతాలు ఆలపిస్తూ జనాలను ఆకట్టుకుంది. ఇతరుల కంటే భిన్నంగా సామాజిక సంస్కరణకు, సాంస్కృతిక పునర్జీవనాన్ని మిళితం చేసి తనదైన ఎజెండాను రూపొందించింది ఠాకూర్. మిథిల చిత్రకళను పాఠశాలల్లో పాఠ్యేతర అంశం (ఎక్స్ట్రా–కరికులర్ కంపోనెంట్)గా ప్రవేశపెడతామని, బాలికల కోసం బలమైన విద్యాకార్యక్రమాలు, స్థానిక యువత కోసం ఉపాధి–కేంద్రీకృత కార్యక్రమాలు, మిథిల చిత్రకళ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది మైథిలీ ఠాకూర్. -
చెట్ల అవ్వ వెళ్ళిపోయింది
చెట్టు అంటే ఏమిటి? అది ప్రాణవాయువు. అది ఆకు కొమ్మ ఫలం. అది పువ్వు. అది నీడ. అది గూడు. అది గుర్తు. చెట్టు బతికితే మనిషి బతుకుతాడు. జీవితాంతం చెట్లు నాటుతూ బతికిన సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో కన్ను మూశారు. పచ్చటి సందేశమై ఆమె మనకు కర్తవ్యాన్ని బోధపరుస్తూనే ఉంటారు.వృక్షో రక్షతి రక్షితః... ఇది కొందరికి ఒట్టి వేదవాక్కు. కాని ‘సాలుమరద’ తిమ్మక్కకు అది జీవనవేదం. చెట్లను తన బిడ్డలుగా భావించి, వాటిని పెంచి పోషించిన ఆ చెట్ల అవ్వ ఇక లేరు. సాలుమరద అంటే చెట్ల వరుస అని కన్నడంలో అర్థం. ప్రజలు ఇచ్చిన ఇంటి పేరును తన పేరులో కలుపుకున్న కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. అల్లారుముద్దుగా తమను పెంచిన ఆ తల్లి తరలిపోగా వృక్షాలన్నీ మౌనంగా దుఃఖిస్తున్నాయి.ఆ వనంలాంటి రోడ్డుకర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని కూడూర్–హలికల్ మధ్యనున్న స్టేట్ హైవే నం.94లో ఉన్న మర్రిచెట్లను ఓమారు పలకరించండి. 4.5 కిలోమీటర్ల దూరం వరకూ ఆ రోడ్డుకు అటూ ఇటూ భారీగా ఎదిగిన ప్రతిచెట్టు తమ బతుకు వెనుక తిమ్మక్క ఉందని చెప్తుంది. ఎన్నో విషయాలు వివరిస్తుంది. నీరు దొరకడమే గగనమైన ఆనాటి రోజుల్లో ఒక్కో మొక్కకు నీరు పోసి, పెంచి, బాగోగులు చూసి వాటిని కంటికి రెప్పలా కాపాడిన తిమ్మక్క, చిక్కయ్య దంపతుల గొప్పతనం అక్కడున్న ప్రతి చెట్టు తెలియజేస్తుంది. మొత్తం 385 మర్రిచెట్లను నాటి, వాటిని పెంచి, ఆ ప్రాంతంలో పచ్చదనం నెలకొల్పిన ఘనత తిమ్మక్కదే. బిడ్డలులేని ఆమె చెట్టునే బిడ్డ అనుకుంది. అయితే ఒకరిద్దరితో ఆ సంతానాన్ని నియంత్రించలేదు. మొక్కలు నాటడాన్ని ఆపలేదు. తాను జీవించి ఉన్నంత కాలం మొక్కలు నాటుతూ పంచుతూ పెంచుతూ ఉండిపోయింది. అందుకే 2019లో అప్పటి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లను కొట్టేయాలని యోచించినప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి తిమ్మక్క లేఖ రాశారు. 70 ఏళ్ల వయసున్న ఆ వృక్షాలను రక్షించాలని కోరారు. ఆమె మాటతో ముఖ్యమంత్రి ఆ చెట్ల కొట్టివేతను ఆపి, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా తిమ్మక్క వల్లే సాధ్యమైంది.ప్రపంచమంతా మెచ్చుకోలుతిమ్మక్క దశాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నా దేశవిదేశాల్లో అనేకమంది ఆమె కృషిని గుర్తించినా 2016లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంత మహిళల జాబితాలో బీబీసీ ఆమె పేరును పేర్కొన్నా మన దేశం మాత్రం తిమ్మక్కను గుర్తించడంలో చాలా ఆలస్యం చేసిందని ఆమె గురించి తెలిసినవారు అంటారు. 108 ఏళ్ల వయసులో ఆమెకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. అది చాలా ఆలస్యమని, అయినా ఆమెకు తన పని మీద తప్ప ఇటువంటి వాటి మీద ఆసక్తి లేదని ఆమె అభిమానుల మాట. ఆ తర్వాతే దేశంలోని అనేకమందికి తిమ్మక్క గురించి తెలిసింది. ఆమె వివరాలు, ఆమె చేస్తున్న పని ప్రాచుర్యం పొందాయి. కాలిఫోర్నియాలో పర్యావరణం మీద పని చేసే ఒక ఎన్.జి.ఓ తన సెంటర్కు సాలుమరద తిమ్మక్క పేరు పెట్టింది.చెట్లే ఆరోగ్యంతిమ్మక్క జీవితం చూస్తే చెట్లే ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చాయా అనిపిస్తుంది. సగటు మనుషులు 50 దాటక ముందే అనారోగ్యం బారిన పడుతున్న వేళ తిమ్మక్క వందేళ్లు దాటాక కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. తన పనులు తానే చేసుకునేవారు. ఖాళీగా కూర్చోవడం, దిగులుతో బాధపడటం ఆమెకు తెలియదు. 1991లో భర్త మరణించిన తర్వాత అన్ని పనులూ భుజాన వేసుకున్నారు. చెట్లు నాటడమే కాకుండా, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. 2020లో నడుముకు సంబంధించి ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతంగా జరిగిందని, తాను బాగానే ఉన్నానని ఆమె తెలిపారు. కొద్దికాలంగా అనారోగ్యం బారిన పడ్డ ఆమె మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోయారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో నవంబర్ 14న కన్నుమూశారు. ఆమెకు ఒక పెంపుడు కొడుకు ఉన్నాడు. తిమ్మక్క శివైక్యం చెందారు. ఆమె నాటిన చెట్లు కలకాలం పచ్చగా ఆమెను గుర్తు చేస్తుంటాయి. -
అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..
అఫ్గానిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. తాలిబన్ల ప్రభుత్వం అక్కడ మహిళల హక్కులను, స్వేచ్ఛను హరించేలా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే వాళ్లు ఎలాంటి కల కనాలనే ఆశ కూడా మనసులోకి రానంత దారుణమైన పరిస్థితులు మధ్య అక్కడ మహిళలు జీవిస్తున్నారు. అలాంటి చోట నుంచి వచ్చిన ఓ చిన్నారి పెళ్లి కూతురు..తన దుస్థితిని మార్చుకోవాలని కంకణం కట్టుకుని మరి దేశం నుంచి పారిపోయింది. దేశం కానీ దేశంలో.. చంకలో బిడ్డను పెట్టుకుని భాష రాక ఎన్నో అవస్థలు పడింది. అన్నింటిని ఓర్చుకుని తాను కోరుకున్న కలల జీవితాన్ని నిర్మించుకుని యావత్తు ప్రపంచ తనవైపు చూసేలా ఛాంపియన్గా అవతరించి..శెభాష్ అనిపించుకుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఆశే లేకుండా చేసినా..అందంగా జీవితాన్ని మలుచుకునే సత్తా ఉంటే..ఎదురే లేదని ప్రూవ్ చేసింది. యూరప్ అంతటా పేరుగాంచిన బాడీబిల్డంగ్ ఛాంపియన్(bodybuilding champion)గా అవతరించిన అఫ్గానిస్తాన్కి చెందిన రోయా కరోమి(Roya Karimi) బాల్యం కడు దయనీయం. ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతికిందంటే..చదువు ఊసే లేకుండా పెరిగింది. ఒక నిశబ్ద వాతావరణం..తానెందుకు బతుకుతున్నా.. అనిపించే పరిస్థితుల మధ్య అమాయకంగా జీవనం సాగించింది. కనీస స్వేచ్ఛ కూడా లేని కఠిన పరిస్థితులను చూసి విసుగుపుట్టునా ఏం చేయలేని పసితనంతో అల్లాడింది. టీనేజ్ వయసుకే పెళ్లి, పిల్లలు..జస్ట్ 14 ఏళ్లకే పెళ్లి, 15 ఏళ్ల వయసుకు తల్లిగా మారిపోయింది. అలా 2011 నాటికి కనీస స్వేచ్ఛ, కలలు కనలేని ఈ సామాజిక ఆంక్షల మధ్య బతకడం తన వల్ల కాదంటూ..పరుగు లంకించింది. తన దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోయేదాక ఆపలేదు. ఒక చేతిలో ఏవో గుర్తింపు కాగితాలు మరో చేతిలో బిడ్డతో ఆమె పెట్టిన పరుగు..మాటలకందని వేదనకు మించినది. ఎలా బతుకుతాననేది తెలియదు. ఒంటరిగా బయటకు అడుగుపెట్టలేని ఆ దేశంలో కంటే.. తన కంటూ ఓ గుర్తింపు, స్వేచ్ఛతో బతకాలనే ఆరాటంతో దేశ సరిహద్దులు దాటి నార్వేకు చేరుకుంది. అక్కడ అధికారుల నుంచి ఎదురైనా ఎన్నో ప్రశ్నల నడుమ..శరణార్థుల శిబిరంలోకి చేరింది. చివరికి అక్కడే ఉండేలా అర్హత సంపాదించుకుని..తిరిగి తన జీవితాన్ని నిర్మించుకోవడాన్ని అహర్నిశలు కష్టపడింది. చేతికందిన ప్రతి పని చేసుకుంటూ జీవనం సాగించింది. అలాగే నార్వే భాషపై పట్టుసాధించి..తనకంటూ ఒక కుటుంబాన్ని నిర్మించుకుంది. సరిగ్గా మహమ్మారి సమయంలో ఫిట్నెస్పై దృష్టిపెట్టింది. ఆ సమయంలోనే బాడీబిల్డింగ్ క్రీడ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ క్రమంలో కండరాలను బలోపేతం చేసుకుంటూ తన శరీరంపై పట్టు సాధించడం నేర్చుకుంది. చిన్న వయసులోనే వివాహం చేసుకుని ఏ స్వేచ్ఛనైతే కోల్పోయిందో..అది ఈ బాడీబిల్డింగ్ శిక్షణ కోసం జిమ్లో గడుపుతున్నప్పుడూ.. ఆ స్వేచ్ఛని తిరిగి పొందిన అనుభూతి కలిగింది. దాన్ని ఆపకూడదనుకుంది. అలా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేలా పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందింది. అందుకు భర్త మద్దుతు కూడా లభించడంతో నర్సుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మరి పూర్తి జీవితాన్ని ఆ క్రీడకు కేటాయించి వరుస పతకాలను కొల్లగొట్టింది. ప్రతి పోటీలోనూ టైటిల్ ఆమెనే వరించేది. అలా 2025లో యూరోపియన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగి చేసేలా చేసుకుంది. అంతేగాదు బార్సిలోనాలో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్లలో ఆమెకు మరింత గౌరవం దక్కింది. ఒక అఫ్గాన్ బాలిక ఎన్నో సాంస్కృతిక, సామాజిక అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి చేరుకోవడం మాములు విషయం కాదంటూ అక్కడ స్థానిక మీడియాలన్నీ ఆమెను కీర్తించాయి. దాంతో ఆమె పేరు వార్తల్లో నిలవడమే కాదు కరిమి ఎందరో అమ్మాయిలకు నువ్వు ఆదర్శం, ప్రేరణ అంటూ ప్రశంసించాయి కూడా. అఫ్గాన్ నిబంధనలకు విరుద్ధంగా పోటీలో అలాంటి దుస్తులు ధరించినందుకు కరోమికి ఎన్నో బెదిరిపులు వచ్చాయి..అయినా తగ్గేదేలా అంటూ ముందుకు సాగింది. అంతేగాదు సంవత్సరాలుగా ప్రజలు నా గొంతును, శరీరాన్ని, భవిష్యత్తును నియంత్రించారు. ఇక చాలు..అలాంటి పరిస్థితి రానివ్వను అంటూ..తనకొచ్చే బెదిరింపులకు ఘాటుగా సమాధానమిచ్చింది. అంతేగాదు తీవ్రమైన ఆంక్షల మధ్య బతుకుతున్న అఫ్గాన్ మహిళల పాలిట సింహ స్వప్నంగా మారింది కరిమి. తనకు ఈ బాడీబిల్డింగ్ ఒక క్రీడ కాదని..తను బాల్యంలో కోల్పోయిన స్వేచ్ఛ అని భావోద్వేగంగా చెబుతోంది కరిమి.(చదవండి: ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమకి.. ఆస్ట్రేలియన్ డ్రైవర్ ఫిదా..!) -
చచ్చిపోదామనుకుంది...ఇపుడు వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతి
ముంబై నడిబొడ్డున ఎన్నో కలలు కంటున్న ఒక చిన్నారి కలలు ఒక్కసారిగా ఊహించని మలుపు తీసు కున్నాయి. పుస్తకాలతో దోస్తీ చేయాల్సిన 12 ఏళ్ల వయసులోనే పెళ్లి. కట్ చేస్తే.. గృహ హింస, తీరని అణిచివేత అంతకుమించిన పేదరికం. జీవితం పీడకలగా మారిపోయింది. కానీ అక్కడినుంచే తననుంచి దూరంగా వెళ్లి పోయిన జీవితాన్ని వెదుక్కుంది. వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారింది.దళిత కుటుంబంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ.1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కల్పనా సరోజ్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్కు పెళ్లి జరిగిపోయింది. భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో నివసించేది. కానీ పెళ్లి తరువాత అత్తింటి వేధింపులు భరించలేక, బయటపడటానికి మార్గం లేదని భావించి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె తండ్రి ఆమెను రక్షించి,ఇంటికి తిరిగి తీసుకు వచ్చాడు. అలా16 సంవత్సరాల వయసులో, మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. ముంబైలోని ఒక ప్రభుత్వ వస్త్ర మిల్లులో ఉద్యోగం మొదలు పెట్టింది జీతం నెలకు రూ. 2 మాత్రమే. కానీ అదే కల్పన భవిష్యత్తుకు తొలి అడుగు. సాధికారతకు స్వావలంబంనకు బీజం.ఇదీ చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీఈ కష్టాలమధ్యే బట్టలు కుట్టడం నేర్చుకుంది. అలా కల్పన ఆదాయాన్ని రూ. నెలకు 50 రూపాయలు. ఆ అనుభవంతో ఆమె పెద్ద రిస్కే చేసింది. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో రూ. 50 వేల రుణం తీసుకొని సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క్లాత్ బొటిక్ ప్రారంభించింది. అనుకోకుండా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది . అక్కడితో ఆగిపోలేదు. బలమైన నెట్వర్క్తో రియల్ ఎస్టేట్లోకి విస్తరించింది. ఎలా అంటే..1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొని మోసపోయింది. కానీ అప్పటి కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చిన కల్పనా సరోజ్,ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగింది. KS ఫిల్మ్ ప్రొడక్షన్ఆ తర్వాత తన సొంత సంస్థ KS ఫిల్మ్ ప్రొడక్షన్ను స్థాపించింది. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం ఎదుర్కొన్న దారుణాల గురించి 'ఖైర్లాంజిచ్య మాత్యవర్' అనే వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది. ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా చూస్తారనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ కథనాన్ని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకురావాలనది ఆమె అభిమతం. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో డబ్ చేశారు. నేరస్థులను ఆపకపోతే, అవగాహన పెంచకపోతే, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన నమ్ముతారు.కమానీ ట్యూబ్స్కు ప్రాణం పోసిందిదృఢసంకల్పం, తెలివైన వ్యాపారవేత్తగా ఆమె ఖ్యాతి పెరిగింది. కమానీ ట్యూబ్స్ కంపెనీప్పుల్లో మునిగి, పతనం అంచున ఉంది. దాదాపు మూడేళ్లుగా దాని 3,500 మంది ఉద్యోగులకు చెల్లించలేకపోయింది. అలా వారు 2001లో, కల్పనను సలహా కోసం సంప్రదించారు. ఇదే ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన చాలెంజ్ విసిరింది. దాన్ని బాధ్యతగా తీసుకుంది కల్పన. ఏకంగా కంపెనీని కొనుగోలు చేసి, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. అచంచలమైన సంకల్పంతో ముందుకు నడిపించింది. అప్పులను తీర్చేసి,కార్మికులకు జీతాలు చెల్లించడమే కాదు, కంపెనీ లాభాల బాట పట్టింది. ఇపుడు కమానీ ట్యూబ్స్ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.చదవండి: చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్ఏడో తరగతిలోనే పెళ్లి, కష్టాలు అనుభవించి, రూ. 2 సంపాదించిన బాల్య వధువు కల్పన సరోజ్, రూ. 1000 కోట్ల నికర విలువను కలిగి ఉంది. కమానీ ట్యూబ్స్ చైర్పర్సన్గా 2013లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. IIM బెంగళూరులో గవర్నర్ల బోర్డు సభ్యురాలు కూడా. దీంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందామె.కల్పన సరోజ్ జీవితం అద్భుతమైన విజయగాథ మాత్రమే కాదు. కృషి, పట్టుదల ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి ఇదొక బ్లూప్రింట్. కష్టాల కొలిమినుంచే అందమైన జీవితానికి బాటలు వేసుకున్న ధీర కల్పన సరోజ్ ఎంతోమందికి ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!
పాలన, రక్షణ రంగాలను వారధిగా చేసుకుని దేశ సేవ చేయాలనే ఆమె ద్వంద్వ వైఖరి అందరికి స్ఫూర్తిదాయకం. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశానికే గర్వకారణం కూడా. సింపుల్గా చెప్పాలంటే బహువిధ మార్గాల్లో దేశానికి సేవ చేయడం అంటే ఏంటో యువతకు ప్రేరణని ఇచ్చారామె. మరి ఇలా రెండు రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందామా.కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన భవ్య నరసింహమూర్తి(Bhavya Narasimhamurty) గతేడాది టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఇటీవట గత మూడు నెలలుగా డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట కాలానికి లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యంలో సేవలందిస్తూనే ఉంటారామె. అంతేగాదు భవ్య దక్షిణ భారతదేశం నుంచి మొదటి మహిళా టెరిటోరియల్ ఆర్మీ (TA) అధికారిగా ఘనత సృష్టించింది. ఇది నిజంగా భారత సైనిక చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి. రాజకీయ ప్రస్థానం..భవ్య నరసింహమూర్తి 2020లో అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్ (INC)లో చేరారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రతినిధిగా , టెలివిజన్ చర్చలలో సుపరిచితమైన వ్యక్తిగా మారింది. పార్టీ విధానాలను ఉద్రేకంతో సమర్థిస్తూ, ప్రతిపక్షాలను విమర్శించేది. ఆమె స్పష్టమైన వాదనలు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన తదితరాలు భవ్యను కర్ణాటక రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. అలా ఆమెను 2023లో AICC సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ల జాతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ పదవి ఆమెకు డిజిటల్ కమ్యూనికేషన్లో తనకున్న నైపుణ్యంతో పార్టీ ఆన్లైన్ ఉనికిని రూపొందించి ఓటర్లతో సన్నిహితంగా ఉండటానికి, అలాగే ప్రగతిశీల భారతదేశం కోసం కాంగ్రెస్ దార్శనికతను ప్రోత్సహించడానికి వీలు కల్పించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో, భవ్య రాజాజీనగర్ నియోజకవర్గం టికెట్ కోసం బలమైన పోటీదారుగా నిలిచింది.అలా ఆర్మీవైపు అడుగులు..ఆమె 2022లో కఠినమైన టెరిటోరియల్ ఆర్మీ (TA) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆ ఏడాది ఎంపికైన ఏకైక మహిళా అభ్యర్థిగా భవ్య నిలిచింది. మే 2024లో, ఆమెను ఇండో-పాక్ నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ఆర్మీ యూనిట్కు నియమించారు. అక్కడ ఆమె ఇంటెన్సివ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, లెఫ్టినెంట్గా నియమితురాలైంది. రాజకీయాల నుంచి సైన్యంలోకి ఆమె తీసుకున్న యూటర్న్.. జాతీయ సేవపట్ల తనకున్న బహుముఖ నిబద్దతను తెలియజేస్తోంది. ఇలా పౌరులు తమ వృత్తిపరమైన కెరీర్ల తోపాటు ఆర్మీలో సేవ చేయడానికి వీలు కల్పించే టెరిటోరియల్ ఆర్మీ,భారతదేశ రక్షణకు తోడ్పడటానికి భవ్యకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. ఇలా టెరిటోరియల్ ఆర్మీ ఆపీసర్గా క్రికెటర్ ఎంఎస్ ధోని, రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ వంటి ప్రముఖ వ్యక్తులు ఎందరో భాగమయ్యారు. కానీ దక్షిణ భారతదేశం నుంచి తొలి మహిళగా భవ్య సాధించిన విజయం సైన్యంలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహిక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇక భవ్య నరసింహమూర్తి కూడా సోషల్ మీడియా ఎక్స్లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ.."ఈ ఆర్మీ శిక్షణ చాలా సవాలుతో కూడుకున్నది, పైగా గొప్ప అసాధారణ అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా నా శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది." అని భవ్య పోస్ట్లో రాసుకొచ్చారామె. అంతేగాదు తాను భారత సైన్యంలో అధికారిగా, అలాగే రాజకీయ నాయకురాలిగా నా మాతృభూమికి సేవ చేయగలిగే అద్భుతమైన అవకాశాన్ని అందించిన ఆ భగవంతుడుకి సదా కృతజ్ఞతలు అని పోస్ట్ని ముగించిందామె. Late post After my selection as a Lieutenant in Territorial Army of Indian Army, every year I serve in Indian army for a short period. This year with your love and blessings I successfully completed 3 months training at the prestigious Indian Military Academy Dehradun, now I am… pic.twitter.com/Qs0fB2zlLG— Bhavya Narasimhamurthy (@Bhavyanmurthy) November 4, 2025 (చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ) -
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
చిన్నప్పటినుంచీ తండ్రి వ్యాపారాన్ని చూస్తూ పెరిగింది. ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు అనుకోకుండా కుల్ఫీ మేకింగ్లో ప్రయోగం చేసింది. అంతే అక్కడినుంచి ఆమె జీవితం, ఆలోచన మారి పోయింది. కట్ చేస్తే కోటి రూపాయలు ఆర్జించే బిజినెస్కు యజమానిగా మారిపోయింది. ఎవరామె? ఏమా సక్సెస్ జర్నీ. తెలుసుకుందామా ఢిల్లీకి చెందిన సమత బోత్రా(Samta Bothra) సగటు అమ్మాయి మాదిరిగా పెళ్లి చేసుకుని భర్త, పిల్లా పాపాలతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. అలాదాదాపు మూడు దశాబ్దాలు గడచిపోయాయి. 2018లో హోలీ పండుగ సందర్బంగా సరదాగా కుల్ఫీ తయారు చేసింది. అందరికి తెగ నచ్చేసింది. ఇంటికొచ్చిన బంధువులకు కూడా రుచి చూపించింది. అంతే అలాంటి కుల్పీ కావాలని బంధువులు మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టారు. దీంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదనే ఆలోచన 51 ఏళ్ల సమత మదిలోవచ్చింది. View this post on Instagram A post shared by Foodler (@realfoodler)తన కొడుకు సహాయంతో, సమతా కేవలం మూడు రుచులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది సమత. ఇంట్లో నుండే రబ్రీ, గులాబీ , కేసర్ కుల్ఫీ ఆర్డర్స్ మీద తయారు చేసింది. కేవలం రూ.5 వేలతో మమ్మీస్ కుల్ఫీ మొదలైంది. అలా ప్రారంభ రోజుల్లో ఆర్డర్ల సంఖ్య చాలా తక్కువగా అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ వచ్చేవి. స్నేహితులు ,బంధువుల తదితరుల ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. అలా ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆరేడు నెలల తర్వాత రెగ్యులర్గా కుల్ఫీల కోసం ఆర్డర్ట్ మొదలైనాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీంతో డిమాండ్ మరింత పుంజుకుంది. ప్రతి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డర్లు వచ్చేవి.కార్పొరేట్ కంపెనీలు సైతం మమ్మీస్ కుల్ఫీలకు ఆర్డర్లు ఇచ్చేవారు. జొమాటోతో భాగస్వామ్యం కార్పొరేట్ల కోసం ఒకేసారి 2000 - 3000 కుల్ఫీ బల్క్ ఆర్డర్లు వచ్చేవి. మెట్ లైఫ్ , భారతి ఎయిర్టెల్తో సహా అనేక ఇతర కంపెనీలలో కుల్ఫీ స్టాల్లను కూడా ఏర్పాటు చేసింది. రూ. 5వేల నుంచి కోటి టర్నోవర్ దాకాడిమాండ్ బాగా పెరగడంతో రిటైల్ బిజినెస్లోకి కూడా ప్రవేశించింది సమత. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా నగర్లో మమ్మీ కుల్ఫీ షాప్ను తెరించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. మమ్మీ కుల్ఫీ రుచికి, నాణ్యతకు వినియోగదార్లు ఫిదా అయిపోయారు. దీంతో తరువాత ఏడాదికే మరో షాపును ఓపెన్ చేసే స్థాయికి చేరింది. ఇపుడు ఏడాదికి కోట రూపాయల టర్నోవర్ను సాధించింది. అన్నీ సహజ, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తామని చెబుతున్నారు సమత. ఒక్క ఐడియాతో తన జీవితాన్ని మార్చేసుకుని తన లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సమత. సక్సెస్కు వయసుతో సంబంధం లేదని ఓర్పు, సహనం, మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలని చాటి చెప్పింది. -
స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!
మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెళ్లు. అందరికీ 1990లలోనే పెళ్ళిళ్లు కూడా అయిపోయాయి. మా నాన్నగారి తల్లిగారి పేరిట ఉన్న ఆస్తిని, తను చనిపోయాక మా నాన్నగారు తన పేరుతో పట్టా పాస్ పుస్తకం తీసుకున్నారు. కొంత భూమిని అమ్మే క్రమంలో కొనేవారు మా అత్తయ్యల అంగీకారం కూడా కావాలి అని అడిగారు. అయితే అందుకు అత్తయ్యలు అంగీకరించలేదు. మా నాన్నగారు వాళ్లకి కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు మా నలుగురు అత్తయ్యలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలా? ఇవ్వకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి.– ఫణీంద్ర, చిత్తూరు జిల్లాఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాను కాబట్టి ఇక వారికి ఆస్తిలో ఎటువంటి భాగమూ ఉండదు అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. పూర్వికులు ఆస్తి మగవారి హక్కు అని ఆడవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. మీ అత్తయ్య గార్లకి పెళ్ళిళ్లు చేయకముందు – చేసిన తర్వాత కూడా ఆస్తిని మీ నాన్నగారు – మీరే కదా అనుభవిస్తున్నారు? మీరు అనుభవించిన దానితో పోలిస్తే వాళ్లకి చేసిన పెళ్ళిళ్లు సరితూగుతాయా? చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ సమాజంలో ఇంకా రాలేదు. ఆడపిల్లలకు/స్త్రీలకు సమానమైన ఆస్తి హక్కులను చట్టం కల్పించినప్పటికీ తమ హక్కు కోసం ఎంతోమంది మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏది ఏమైనా, హిందూ వారసత్వ (సవరించబడిన) చట్టం, 2005 లోని సెక్షన్ 6 ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయి. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మరోసారి తేల్చి చెప్పింది. మీరు వివరించిన దాని ప్రకారం మీకు సెక్షన్ 15 వర్తిస్తుంది. వీలునామా రాయకుండా మరణించిన మహిళ ఆస్తి సెక్షన్ 15 ప్రకారం తన వారసులకు అనగా: 1. ప్రథమంగా కొడుకులకు (లేని పక్షంలో అతని వారసులకు), కూతుళ్ళకు (లేని పక్షంలో ఆమె వారసులకు) – భర్తకు సమానంగా సంక్రమిస్తుంది.2. ద్వితీయంగా భర్త వారసులకు3. తృతీయంగా తల్లి – తండ్రులకు4. లేదా నాలుగవ పక్షంలో తండ్రి గారి వారసులకు5. ఆఖరున తల్లిగారి వారసులకు;ఇలా క్రమపద్ధతిలో మొదటివారు, లేదా రెండవ వారు, ఎవరూ లేకుంటే ఆఖరున సూచించినవారికి ఆస్తి సంక్రమిస్తుంది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు ఆస్తి పంపకాలు (పార్టిషన్) జరిగి ఉంటే తప్ప, స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే! పెళ్ళి చేశాము, కట్నం ఇచ్చాము, పురుడు పోశాము, సంక్రాంతికి కొత్త బట్టలు కొన్నాము అంటే కుదరదు. వారి హక్కును వారికి ఇవ్వండి. వారి ఆస్తిని వారికి ఇవ్వండి. మీ అత్తయ్యలకి తెలియకుండా ఆస్తిని అమ్మేస్తే అది మోసం చేసినట్టే. అలాంటి అమ్మకం చెల్లదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: మ్యాడ్ హనీ గురించి విన్నారా..? కానీ ఒక్క చుక్క తాగినా అంతే సంగతులు..) -
20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
కరియర్ పీక్లో ఉండగా, దాన్ని వదిలేసి, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని కోట్లకు పడగలెత్తిన ఒక నటి సక్సెస్ స్టోరీ గురించి తెలుసా? ఒకటీ రెండూ కాదు, ఏకంగా 1200 కోట్ల విలువైన కంపెనీకి సారధిగా సత్తా చాటుకుంటున్న ప్రముఖ టీవీ నటి ఆష్కా గొరాడియా విజయ గాథను తెలుసుకుందాం పదండినటులు కేవలం నటనలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలోనూ రాణించగలరు అని నిరూపించిన నటి ఆష్కా. టీవీ నటిగా మరపురాని పాత్రలు పోషించడమే కాదు స్టార్ట్ప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రోజువారీ సబ్బుల నుండి గ్లోబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ దాకా నైపుణ్యం విస్తరించింది.2002లో 'అచానక్ 37 సాల్ బాద్' షోతో టీవీలో అడుగుపెట్టింది. తర్వాత 'భాభి', 'తుమ్ బిన్ జౌన్ కహాన్' వంటి షోలలో పనిచేసింది. అయితే 2003లో, ఏక్తా కపూర్ షో 'కుసుమ్'తో ఆమె కరీయర్ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థి', 'సిందూర్ తేరే నామ్ కా', 'నాగిన్' పాపులర్ టీవీ సీరియల్స్తో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అష్కా కేవలం కల్పనలో మాత్రమే కాకుండా రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. 2019 లో 'దాయన్' ,రియాలిటీ షో 'కిచెన్ ఛాంపియన్ 5' లో కనిపించింది. 2021 లో, ఆమె తన వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించడానికి నటనను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.రెండు దశాబ్దాల స్టార్డమ్కు బైబై చెప్పేసింది. కళాశాల స్నేహితులు ప్రియాంక్ షా , అశుతోష్ వలాని తో కలిసి, ఈ ముగ్గురూ 2020 లో ‘రెనీ కాస్మెటిక్స్’ ను ప్రారంభించారు. మిత్రుల వ్యాపార అనుభవానికి ఆష్కార్ తెగువ, ధైర్యం మరింత కలిసి వచ్చాయి. వలం రూ.50 లక్షలతో ప్రారంభమైన డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ రూ. 1,200–1,400 కోట్లకు చేరింది. తరువాతి క్రమంలో ఈ బ్రాండ్ ఆఫ్లైన్లో కూడా విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాలలో, రెనీ కాస్మెటిక్స్ బ్రాండ్ నుండి పూర్తి స్థాయి సామ్రాజ్యంగా మారింది. లిప్స్టిక్లు, ఐలైనర్లు, హైలైటర్లు ఇలా 200 కంటే ఎక్కువ బ్యూటీ ఉత్పత్తులతో, బ్రాండ్ ఇప్పుడు భారతదేశం అంతటా 650 స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, మింత్రాలో అమ్మకాలు సాగుతున్నాయి. రెనీ సునామీమెరుపు వేగంతో వచ్చిన పెట్టుబడులు కంపెనీనీ రూ. 100 కోట్లను సేకరించింది. 2024 సంవత్సరంలో, రెనీ కాస్మెటిక్స్ కంపెనీ ఎవాల్వెన్స్ ఇండియా మరియు ఎడెల్వీస్ గ్రూప్ నేతృత్వంలో వచ్చిన నిధులతో కంపెనీ రూ. 820 కోట్ల నుండి కూల్ రూ. 1,200 కోట్లకు ఎగిసింది. కాగా భారతదేశంలో అందం మరియు సౌందర్య సాధనాల పరిశ్రమ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్లను మించుతుందని అంచనా.రెనీ అంటే అర్థం ఇదీ! “రెనీ” అనే పేరుకు ఫ్రెంచ్లో “పునర్జన్మ” అని అర్థం. అలా రెనీ ద్వారా ఆష్క తన కరియర్ పునర్ని ర్మించుకుంది. తాను 16 ఏళ్ల వయసులో గుజరాత్ నుండి ముంబైకి వచ్చిన అష్కా ప్రారంభంలో, పేయింగ్ గెస్ట్గా అద్దె ఇంట్లో నివసించింది. కానీ 23 ఏళ్ల వయసులో ముంబైలో నా సొంత ఇల్లు కొనుక్కోవడం తన జీవితంలో పెద్ద సక్సెస్ అయి ఒక సందర్బంలో స్వయంగా చెప్పుకుంది ఆష్కా. ఇంతటి అద్భుతమైన విజయంతో నటననుంచి వ్యాపారవేత్తలుగా మారిన అతి కొద్ది మంది వారిలో ఆష్క ముందు వరుసలో ఉంటారు. ప్రేమ, పెళ్లి ప్రతి సూపర్ ఉమెన్ వెనుక, ఒక సూపర్ సపోర్టివ్ పార్టనర్ తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో ఆషా భర్త కూడా ఒకరు. 2016లోపరిచయమైన అమెరికన్ వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్తో ప్రేమలో పడింది. 2017లో వీరిద్దరూ క్రైస్తవ , హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. -
సరిగమల్లో నవ మాసాలు
స్త్రీ గర్భం దాల్చాక శిశు జననం వరకూ ఎన్నో ఆనంద ఘడియలు, అన్నే ఆందోళనలు. తల్లి ఆరోగ్యమూ, బిడ్డ ఆరోగ్యమూ కాపాడుకోవాలి. తల్లితో లోపలి బిడ్డ బంధం బలపడాలి. ఇవన్నీ సంగీతం వల్ల సాధ్యమవుతాయంటోంది చెన్నైకి చెందిన మ్యూజిక్ టీచర్ దివ్యలక్ష్మి. గర్భం దాల్చిన తల్లులకు శాస్త్రీయ సంగీతం నేర్పేందుకు దివ్య తయారు చేసిన ఆరు నెలల కోర్సుకు కాబోయే తల్లులు సరిగమలతో బదులిస్తున్నారు. వివరాలు...దివ్యలక్ష్మి కమలాకన్నన్కు ఈ ఐడియా తన కూతురిని చూశాక వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చదివి ఆ తర్వాత బాల్యం నుంచి నేర్చుకుంటున్న కర్నాటక సంగీతంలోనే తన జీవితాన్ని నిమగ్నం చేయాలని నిశ్చయించుకున్న దివ్య లక్ష్మి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా తీసుకుంది. ఆ తర్వాత సౌత్ చెన్నైలో ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇవ్వడమే కాక అక్కడి కిల్పార్క్ గార్డెన్లో ‘ఆరోహణ’ పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కర్నాటక, హిందూస్తాని, ఇన్స్ట్రుమెంటల్ సంగీతాలలో ఇక్కడ శిక్షణ ఇస్తూ గుర్తింపు పొందిన దివ్యలక్ష్మి లాక్డౌన్ రావడంతో డీలా పడింది. ఇన్స్టిట్యూట్ మూసేసింది. ఆ సమయానికి ఆమె గర్భంతో ఉంది. ఇంట్లో తనే సంగీత సాధన చేస్తూ వెళ్లింది.కుమార్తె ఆరోహి పుట్టాక ఆ పాప ఒకటిన్నర సంవత్సరాల వయసుకే విపరీతంగా జ్ఞాపకశక్తి ప్రదర్శించడం దివ్యలక్ష్మికి ఆశ్చర్యం కలిగించింది. మూడున్నరేళ్లు వచ్చేసరికి ఆరోహి వయొలిన్ చేత పట్టుకుని సరిగమలు పలికించడం ఇంకా సంతోషపెట్టింది. ఆరోహి తన కడుపులో ఉన్నప్పుడు తాను సాధన చేసిన శాస్త్రీయ సంగీతం పాప తెలివితేటల ఎదుగుదలకు ఉపయోగపడిందని దివ్యలక్ష్మికి అనిపించింది. గర్భవతులకు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే, వారు డెలివరీ అయ్యేంత వరకు శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే పుట్టబోయే బిడ్డకు అన్ని విధాలా ఉపయోగమని అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని మరింతగా నిర్థారించుకోవాలని నిశ్చయించుకుంది.మ్యూజిక్ థెరపీకొన్ని అధ్యయనాల ప్రకారం మ్యూజిక్ థెరపీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి, గుండె స్పందనలకు బాగా పని చేస్తుందని నిర్థారితమైంది. సంగీతం గర్భిణుల్లో ఉండే యాంగ్జయిటీ, లో–బీపీ వంటి సమస్యలను దూరం చేయగలదని స్వీయ పరిశీలన ద్వారా అర్థం చేసుకున్న దివ్యలక్ష్మి తమ కాలనీలో ఉన్న నలుగురైదుగురు గర్భవతులకు ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సంగీతం నేర్పించసాగింది. వారికి ఆ పాఠాలు ఆహ్లాదం కలిగించడమే కాదు ప్రసవాలు కూడా కాంప్లికేషన్స్ ఎదురవకుండా జరిగాయి. దాంతో ఆరునెలల కోర్సు తయారు చేసిన దివ్యలక్ష్మి మళ్లీ సంగీత పాఠశాల తెరిచి ఇప్పుడు గర్భిణులకు సంగీత పాఠాలు చెబుతోంది.ఆమె దగ్గర నేర్చుకోలేకపోయినా, ఉన్నచోట నేర్చుకోలేకపోయినా, గర్భిణులు తరచూ ఆహ్లాదపరిచే సంగీతం వినడం, మంచి పాటలు హమ్ చేసుకుంటూ ప్రశాంతంగా గడపడం వల్ల మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుంది.నాదమే వైద్యం‘సంగీతంలో నాదం ఉంటుంది. ఆ నాదం గర్భిణీ స్త్రీ శరీరంలోని నీటిలో అనునాదం పుట్టిస్తుంది. ఆమె ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే కాకుండా పిండస్థ శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు... ఇలా సంగీత పాఠాల కోసం వచ్చే గర్భిణుల మధ్య ఒక స్నేహం ఏర్పడి ఒకరికొకరు అన్నట్టుగా ఉండటంతో ఆందోళనలు పూర్తిగా పోతాయి’ అంటోంది దివ్యలక్ష్మి. -
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్కుమార్రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్ను ఎలా చిక్గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్తో కంఫర్ట్ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్సెట్టర్గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్ను సాధించిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్జస్ట్గా గుర్తించారు. చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకిహర్మన్ ప్రీత్కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్గా రాయల్ లుక్లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)కాగా పంజాబ్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ది. అయితే ఆ బ్యాట్ను స్మృతి సోదరుడు శ్రవణ్కు (జూనియర్ క్రికెటర్గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్ప్రీత్కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్స్టార్ అయింది. క్రికెట్తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్చైర్లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్చైర్లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్చైర్పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్తో జరిగిన మ్యాచ్లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్బాల్ ప్లేయర్స్ను పరిచయం చేశారు. -
మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్ విషెస్ : సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లో
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 (ICC Womens World Cup 2025) భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. దక్షిణాఫ్రికా-ఇండియా జట్ల మధ్య నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి ప్రపంచ కప్ ట్రోఫీని భారత మహిళా క్రికెట్ జట్టు గెలుచుకున్న సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ క్రికెట్ ప్రేమికురాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీఅభినందనలు తెలిపారు.దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు జట్టుకు కృతజ్ఞతలు తెలిపారు నీతా. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీమిండియా మహిళల ప్రపంచ కప్ సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జట్టుకు ప్రత్యేక అభినంనదనలు తెలిపారు. అర్ధరాత్రి వేళ, మన అమ్మాయిలు మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ధైర్యం, దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసంతో ఆడిన తీరుతో, మొత్తం దేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశారని భావిస్తున్నాఅన్నారు. మీ విజయం పట్ల చాలా గర్వపడుతున్నాం. ధన్యవాదాలు, జై హింద్ అని ఉత్సాహంగా చెప్పారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు , చైర్పర్సన్ నీతా అంబానీ మ్యాచ్ జరుగుతున్నంత సేపు భారత జెండాను ఊపుతూ, జట్టుకు ఉత్సాహపరుస్తూ, అమ్మాయిలు ప్రపంచ కప్ గెలుచుకోగానే పట్టరాని సంతోషంగా కనిపించారు. మ్యాచ్ ఆద్యంత ఆమె ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి మారాయి. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్సింపుల్ అండ్ స్టైలిష్ దుస్తులలో నీతా అంబానీ అదరగొట్టారు. సమయానికి తగ్గట్టు అన్నట్టగా క్లాసిక్ వైట్ షర్ట్ , నీలిరంగు డెనిమ్ జీన్స్లో మెరిసారు. అలాగే విలాసవంతమైన బంగారు బ్రాస్లెట్ వాచ్, భారీ డైమండ్ సెంటర్ స్టోన్ పొదిగిన స్టేట్మెంట్ గోల్డ్ రింగ్, డైమండ్ ఇయర్ స్టడ్లను ఆమె ఎంచుకున్నారు.ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు ఆకాష్ అంబానీ కూడా హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, భార్యతో కలిసి రోహిత్ శర్మ, ఇతర టీమిండియా మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇండియా మహిళల సేన దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. #WATCH | Founder-Chairperson of Reliance Foundation, Nita M. Ambani congratulates Indian captain Harmanpreet Kaur after she guided India to the first-ever women's World Cup title.(Source: Special Arrangement) pic.twitter.com/vdgVy7eere— ANI (@ANI) November 3, 2025“The way you have played with courage, confidence and conviction. We are all so proud of you.”Mrs. Nita Ambani shared her feeling of pride towards the Women in Blue 💙✨ #AaliRe #CWC25 #INDvSA pic.twitter.com/ItCsYn93M3— Mumbai Indians (@mipaltan) November 2, 2025 -
టీచర్ కాబోయి యాంకర్.. ఈమె ఎవరో తెలుసా?
ఎమ్మెస్సీ బీఈడీ చదివిన ఆమె.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు. తన మధుర స్వరం, సంభాషణ చాతుర్యం ఆమెను ముందుకు నడిపించాయి. వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. యాంకరింగ్ చేస్తూనే ఈవెంట్స్ నిర్వహణతో మరో యాభై మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డికి చెందిన ప్రసన్నలక్ష్మి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్లో జన్మనిచ్చిన ప్రసన్నలక్ష్మి కులకర్ణి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు విజయవర్ధన్తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్త, కుమారుడితో కలిసి పట్టణంలోని దేవి విహార్లో నివసిస్తున్నారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన ఆమె ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రెండుసార్లు డీఎస్సీ రాసినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లి ష్, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రావీణం ఉన్న ప్రసన్నలక్ష్మికి చదువుకునే సమయంనుంచి ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం, రాయడం అలవాట్లున్నాయి. అదే ఆమెకు బతుకుబాట చూపింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో ఏడేళ్ల క్రితం వ్యాఖ్యాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంచి గాత్రంతోపాటు సంభాషణ చాతుర్యం ఉన్న ఆమె ఈ రంగంలో సక్సెస్ అయ్యారు. వందలాది కార్యక్రమాల్లో ఆమె తన మాట, పాటలతో వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అధికారిక కార్యక్రమాల్లోనూ తనదైన యాంకరింగ్తో మెప్పిస్తున్నారు.పెళ్లిళ్లు, ఫంక్షన్లలో...ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఆట, పాటలతో అలరింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైనవన్నీ ఈవెంట్ ఆర్గనైజర్లే చూసుకుంటున్నారు. ప్రసన్నలక్ష్మి అన్నపూర్ణ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఈ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్... ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బుకింగ్స్ ఉంటున్నాయి. తమ సంస్థలో యాభై నుంచి అరవై మందికి ఉపాధి కలి్పస్తున్నామని ప్రసన్నలక్ష్మి తెలిపారు.మాట, పాటలతో...ప్రసన్నలక్ష్మి ఐదు భాషలలో మాట్లాడడంతో పాటు శ్రావ్యంగా పాటలూ పాడతారు. వీడియోలకు అవసరమైన వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. ఉద్యోగుల సన్మాన కార్యక్రమాలు, ఉద్యోగ విరమణ కార్యక్రమాలు, బదిలీ కార్యక్రమాలలో వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలను ప్రిపేర్ చేసి తన మాట, పాటలతో ఆహూతులను ఆకట్టుకుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో దాండియా, కోలాటం, బతుకమ్మ ఆటలు కూడా ఆడించడం ద్వారా అందరినీ ఉత్తేజపరుస్తుంటారు. తన వెంట ఉండే బృందంతో నృత్యాలు చేయిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. -
నీతా అంబానీ : దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ 62 పుట్టిన రోజు (Happy Birthday to Nita Ambani ) జరుపుకుంటున్నారు. దాతగా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా నీతా అంబానీ పేరు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమేకాదు, వ్యాపారవేత్తగా, దాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మహిళ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక విభాగం, విపత్తు నిర్వహణ లాంటి అనేక అంశాల్లో నీతా అంబానీ తనదైన శైలిలో సేవలందించి లక్షలాదిమందికి దగ్గరయ్యారు. Warmest birthday wishes to our Founder and Chairperson, Mrs. Nita Mukesh Ambani. pic.twitter.com/mK2hdQQ8eU— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2025 అంతేకాదు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమానిగా జట్టు విజయవంతంగా నడిపించిన ఘనత ఆమె సొంతం. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ ద్వారా, కళలకు, దేశీయ వస్త్రాలకు ఎంతో ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికైన తొలి భారతీయురాలు. ఇటీవల పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ‘ఇండియా హాల్’ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ పేరుతో ప్రోత్సహించారు. నీతా అంబానీ 62వ పుట్టిన రోజు (నవంబరు 1)అనేక మంది ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్, ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీ ప్రత్యేకంగా బర్త్డే విషెస్ అందించాయి. -
ఆమె ఇల్లే ఓ ల్యాండ్ మార్క్!
ఎవరికైనా ఇంటి అడ్రస్ చెప్పడానికి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మార్క్ చెబుతాం తేలిగ్గా కనుక్కోవడానికి! కానీ ఇల్లే అలా ల్యాండ్మార్క్ అయిన అబ్బురం గురించి విన్నారా? ఆ ఘనత క్రికెటర్ దీప్తి శర్మకు దక్కుతుంది. ఆమె ఇంటి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తి శర్మ మార్గ్: సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ కనపడుతుంది. ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలే! ఆల్రౌండర్గా అందులో ఆమె చూపిస్తున్న ప్రతిభనే సందర్భంగా దీప్తి పరిచయం.. ఆగ్రాలోని షాగంజ్, అవద్పురి కాలనీలో పుట్టి పెరిగారు దీప్తి. చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ బ్యాట్తో ఆగ్రా వీధులను చుట్టారు. తన స్పిన్ బౌలింగ్తో ఆ ఊరి దారులను సుపరిచితం చేసుకున్నారు. క్రికెటర్ కావాలన్న ఆ దీక్షే ఆమెను ఈ రోజు స్టేడియంలో నిలబెట్టింది. వరల్డ్ కప్ టీమ్లో భాగస్వామిని చేసింది.అన్నయ్యే తొలి గురువుగా.. దీప్తికి క్రికెట్ మీద ఆసక్తి ఏర్పడింది అన్నయ్య సుమిత్ శర్మ క్రికెట్ ఆడటాన్ని చూసే. అన్నయ్యను అనుకరిస్తూ ఆమె క్రికెట్ ఆడేవారు. అది అన్నయ్య దృష్టిలో పడింది. క్రికెట్ అంటే దీప్తికున్న మక్కువనూ, ఆ ఆటలో ఆమె ప్రతిభనూ గమనించాడు. అంతే! చెల్లికి తొలి కోచ్గా మారాడు. ‘ఆడపిల్లకు క్రికెట్ ఏంటీ?’ అన్న బంధువుల మాటలకు తలొగ్గిన తల్లి .. చెల్లిని క్రికెట్ ఆడనీయకుండా ప్రయత్నించేది. కానీ అమ్మకు తెలియకుండా చెల్లిని గ్రౌండ్కి తీసుకెళ్లి క్రికెట్లోని మెలకువలను నేర్పించాడు అన్నయ్య. ఆట పట్ల ఆ పిల్లలకున్న నిబద్ధతను చూసి తల్లిదండ్రులూ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. బంధువుల మాటను బేఖాతరు చేసి. చదువునూ సీరియస్గా తీసుకోవాలనే షరతు పెట్టారు. అలా ఆ ఇంటి పెద్దలు రెండిటి మధ్య సమన్వయం పాటించినట్లే దీప్తి కూడా చదువు, క్రికెట్ రెండిటినీ సమన్వయం చేసుకుంది. ప్రొఫెషనల్ క్రికెటర్గా..గ్రౌండ్లో అన్నాచెల్లెళ్ల క్రికెట్ కమిట్మెంట్ చూసిన స్థానిక కోచ్లు దీప్తికి తదుపరి శిక్షణనివ్వడానికి ముందుకు వచ్చారు. ఆ శిక్షణ ఆమె బ్యాటింగ్ను, బౌలింగ్ స్కిల్స్ను మెరుగుపరచాయి. దానికి తోడు గ్రౌండ్లో గంటల కొద్దీ ప్రాక్టీస్.. ఆమెను ఆల్రౌండర్గా మలిచింది. ఆ ప్రత్యేకతే నేషనల్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. పదిహేడేళ్ల వయసులోనే ఆమెకు ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టులో స్థానం కల్పించేలా చేసింది. ఆమె ప్రతిభ యూపీ వారియర్స్ (ఐపీఎల్)కి కెప్టెన్ను చేసింది. తర్వాత అంతర్జాతీయ క్రికెట్కూ చేర్చింది. సవాళ్లు.. విజయాలుగెలుపు దారి అంత సులువుగా ఉండదు. ఇందుకు దీప్తి క్రికెట్ ప్రయాణం మినహాయింపు కాదు. ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటీ అని పెదవి విరవడాల దగ్గర్నుంచి క్రికెట్లో లింగవివక్ష లాంటి నుదురు చిట్లింపుల వరకు ప్రతి చిన్నా పెద్దా సవాళ్లకు ఎదురొడ్డింది దీప్తి. అన్నిటినీ బౌల్డ్ చేసింది.. మూస ఆలోచనలను బౌండరీకి ఆవల నెట్టేసింది. ఒక్కమాటలో క్రికెట్లో ఆమె ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. వన్ డే ఇంటర్నేషనల్స్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు క్రికెట్లో ఉన్న పురుషాధిపత్యాన్నీ బ్రేక్ చేసింది. ఇలా ఆటలోని ఆమె శైలి, వ్యూహం, స్థిరత్వం అన్నీ మన దేశ మహిళా క్రికెట్ను ఉన్నత స్థితికి చేర్చాయి. అందుకే మన మహిళా క్రికెట్లో ఆమెను ఒక అద్భుతంగా అభివర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. చిన్న పట్టణం నుంచి పెద్ద కలతో విశాలమైన మైదానంలోకి అడుగుపెట్టి ఆ కలను ఆమె సాకారం చేసుకున్న తీరు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ స్ఫూర్తే! అందుకే దీప్తి శర్మ అర్జున అవార్డ్ అందుకున్న వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆమె ఇంటిముందున్న రోడ్లను సువిశాలం చేసి.. ఆమె ఉంటున్న వీథికి మౌలిక సదుపాయాలను కల్పించారట. ఆ గౌరవంతోనే అవద్పురి వాసులు తమ వీథి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తిశర్మ మార్గ్ : సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ను ఏర్పాటు చేశారు. ‘జీవితంలో.. ఆటలో ఎక్కడైనా ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే విజయం. ఆ చాలెంజెసే మనల్ని అద్భుతమైన ప్లేయర్గా తీర్చిదిద్దుతాయి ఆటలో అయినా.. జీవితంలో అయినా!– దీప్తి శర్మ -
ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..
తొలి మహిళ ఇంజనీర్గా కంప్యూటర్ రంగంలో కృషి చేసిన కర్ణాటకకు చెందని రాజేశ్వరి ఛటర్జీ లేదా మెరైన్ ఇంజనీర్ సోనాలి బెనర్జీ పేర్లనే చెప్పుకుంటాం. కానీ వారందరికంటే ఒక వితంతవు..నాటి సామాజిక పరిస్థితులను చేధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో చేరి, రాణించి దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. చరిత్ర ఆమె విజయాలను అంతగా గుర్తించకపోయినా..ఎలక్రికల్ ఇంజనీర్లో తొలి మహిళా గ్రాడ్యుయేట్ అనేది కాదనలేని సత్యం. అంతేగాదు ఎందరో అమ్మాయిలు ఆ రంగంలో చేరేలా పురికొల్పేందుకు కారణమైంది. నాడు ఆ ఒక్క మినహాయింపుతో..ఎవ్వరూ చేయలేని సాహసం చేసిన తొలి మహిళ ఆమె. ఔను ఏరంగంలోనైనా ఫస్ట్ పొజిషన్లో ఉండటం అంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే మార్గదర్శకులు ఉండరు, పైగా ఎన్నో కళ్లు మన గెలుపుని అనుమానిస్తాయి, తక్కువ అంచనా వేస్తాయి. వాటన్నింటిని అధిగమించి అసాధారణ గెలుపుని ఒడిసి పట్టి యావత్తు ప్రపంచం గుర్తించుకునేలా చేసిన తొలి మహిళా ఇంజనీర్ ఆమె. ఈ తరానికి అంతగా తెలియని, గుర్తింపుకు నొచుకుని ఆ మహిళ ఇంజనీర్ ఎవరంటే..ఆ మహిళే..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయూజుల లలిత. మన తెలుగమ్మాయే. చెన్నైలోని గిండిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పుడూ తొలి రోజు కాలేజీలో ఎదురైన ఘటనకు మరెవ్వరైనా..మళ్లీ అడుగు పెట్టడానికే భయపడిపోతారు. కానీ లలిత ఉక్కు ధైర్యంతో ముందుకుసాగారామె. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో అంతా అబ్బాయిలే ఉండేవారు. ఒకే ఒక్క అమ్మాయి తన సహచర విద్యార్థిగా అడుగుపెడుతుందని తెలిసి అంతా వింతగా, ఎగతాళిగా నవ్వులు వినిపిస్తున్నా..ఓపికతో భరించింది. కూర్చొనేందుకు చోటు లేని పరిస్థితి. ఆమె కోసం ప్రత్యేకంగా సెపరేట్గా వేసిన కూర్చీలో కూర్చొని పాఠాలు వినింది. కాటన్ చీరలో తలొంచుకుని నిశబ్దంగా వస్తున్న అమ్మాయిని చూసి అందరికీ చిన్న చూపు, ద్వేషం. అయినా తన పని, లక్ష్యంమీద దృష్టిపెట్టి..కొద్దికాలంలోనే ప్రొఫైసర్లకు, తన తోటి పురుష విద్యార్థులకు అభిమాన సహచర విద్యార్థినిగా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఆ కాలేజీలో మహిళ హాస్ట్ల్ లేకపోయినా..తన కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో ఉండి, చదువుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి.ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు దారితీసిన పరిస్థితి..ఆగస్టు 27, 1919 చెన్నైలో ఒక తెలుగుకుటుంబంలో జన్మించిన లలిత నాటి కాలంలోని సామాజిక పరిస్థితులన్నింటిని ధిక్కరించి చదువుకున్న తొలి మహిళ. 15 ఏళ్ల ప్రాయానికే వివాహం చేసుకుని 18 ఏళ్లకే వితంతువుగా మారింది. శ్యామల అనే కూతురుకి తల్లిగా మారింది. ఒక్కసారిగా నిశబ్దంలోకి తొంగి చూస్తున్న ఆమె జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆమె తండ్రి ఇంజనీర్, లెక్చరర్ అయిన ప్రొఫెసర్ అయ్యల సోమయాజుల సుబ్బారావు. ఆమె జీవితంలోకి వచ్చిన నష్టాన్ని పూరించలేకపోవచ్చు..ఏదో వ్యాపకంతో ఆమె జీవితం చిగురించేలా చేయాలని ఆశించారు. కేవలం విద్యతోనే ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొంది ధైర్యంగా మనగలదని ప్రగాఢంగా నమ్మారాయన. ఆ ఉద్దేశ్యంతోనే ఇంట్లోనే లలితకు గణితం, భౌతిక శాస్త్రాన్ని బోధించారాయన. ఆ తర్వాత గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు. అయితే ఆ సమయంలో మహిళా హాస్టళ్లు లేవు, ప్రత్యేక సౌకర్యాలు లేవు. స్త్రీని చేర్చుకునే విద్యావిధానం కూడా లేదు. కానీ సుబ్బారావుగారు స్వయంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డికి విజ్ఞప్తి చేసి లలితను 'స్పెషల్ కేసు'గా చేర్చుకునేలా ఒప్పించారు. ఆ ఒక్క మినహాయింపు చరిత్ర గతిని మార్చేసింది. అయితే లలిత తండ్రి నమ్మకాన్ని నిజం చేసేలా తన కోర్సులో రాణించింది, మంచి స్కిల్ సంపాదించుకుంది. అలా 1944 నాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలై..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యిందామె. గ్రాడ్యుయేషన్ అనంతరం లలిత సిమ్లాలోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(సీఎస్ఓ)లో చేరారు. అక్కడ ఆమె దేశానికి కీలకమైన విద్యుత్ పరికరాలు సాంకేతికత భద్రతా ప్రమాణాలను నిర్ణయించే విధులను నిర్వర్తించేది. ఆ తర్వాత కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్(ఏఈఐ)లో విద్యుత్ కేంద్రాల కోసం విద్యుత్ జనరేటర్లు, రక్షణ రిలేను రూపొందించారు. అంతేగాదు దేశ పురోగతికి శక్తినిచ్చే.. విద్యుత్గ్రిడ్కి సంబంధించిన సమర్థవంతమైన వ్యవస్థలో స్పెషలిస్ట్గా ఉన్నారు. నిశబ్దంగా ఉండే ఆమె ధోరణి వల్లే ప్రపంచానికి లలితా అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురించి తెలియకుండాపోయింది. ఒక పక్క కూతురు శ్యామలను పెంచుతూనే ఇంజనీరింగ్ వృత్తిలో అంచలంచెలుగా రాణిస్తోందామె. ఆమెకు దక్కిన అసాధారణ గుర్తింపు..1964లో, న్యూయార్క్లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సదస్సు(ICWES)లో లలిత భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ సదస్సులో ఆమె 35 దేశాల మార్గదర్శకులతో వేదికను పంచుకుంది. అంతలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విశేష ప్రతిభను కనబర్చిన ఆమె 1979లో మరణించారు. కానీ చరిత్ర ఆమె సాధించిన విజయాలను అంతగా గుర్తించలేదు. తొలి మహిళా ఇంజనీరింగ్గా ఎవరెవరో పేర్లను వినిపించేదే తప్ప వారందరికంటే..లలిత ఒక వితంతువుగా నాటి సామాజిక పరిస్థితులను చేధించుకుంటూ సాగిన వైనాన్ని గుర్తించకపోవడం బాధకరం.(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..
గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్షిప్ నవంబర్లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..) -
ఈ కెమెరాకు భయం లేదు
‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్లో బిందూయే చాలామందికి ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.అనుకోకుండా ఒకరోజువి.వి.బిందుది కొడంగల్లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్లో కొట్టినపిండి అయ్యింది. దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.విరామం తీసుకున్నాపెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.కేసుకు 2000 రూపాయలుబిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది. గుండె దడదడనేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ. -
ఎవరీ టెంజిన్ యాంగ్కి..? ఆనంద్ మహీంద్రా సైతం..
ఏ రంగంలోనైనా మొదటి వ్యక్తి కావడం అంత ఈజీ కాదు. తనకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకుని, అందులో తొలి వ్యక్తిగా నిలిచేందుకు ఎలాంటి మార్గదర్శకులు ఉండరు. అయినా సరే గెలవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగి సక్సెస్ని అందుకుని సరికొత్త మైలురాయిని సృష్టిస్తారు అంటూ పారిశ్రామిక దిగ్గజం టెక్ మహీంద్రా తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచిని టెన్జిన్ యాంగ్కిని ప్రశంసిస్తూ మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. ఈసారి మనకు ప్రేరణ ఈ ఐపీఎస్ అధికారిణి అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో టెంజిన్ యాంగ్కి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..!.తవాంగ్కు చెందిన టెంజిన్ యాంగ్కి(Tenzin Yangki ) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్గా(Arunachal's First Woman IPS Officer) చరిత్ర సృష్టించారు. ఇక్కడ ఆమె, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, వారసత్వంగా సక్రమించిన ప్రజాసేవ తదితరాలతో సాగిన ఆమె సక్సెస్ జర్నీ ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదిలించింది.టెంజిన్ ఎవరంటే..ఆమె దివంగత తండ్రి తుప్టెన్ టెంపా, IAS అధికారి, మాజీ మంత్రి, తల్లి జిగ్మి చోడెన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక టెంజిన్ విద్య నేపథ్యం వచ్చేసి..జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఆమె 2017లో ఏపీపీఎస్సీలో ఉత్తీర్ణురాలై, సియాంగ్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 545వ ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించి ఐపీఎస్ క్యాడర్కి ఎంపికైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని.. ఇటీవల అక్టోబర్ 17న, జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్వహించిన ఈ శిక్షణలో 36 శాతం మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..టెంజిన్ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారామె. సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది..ఈ ఐపీఎస్ అధికారిణి టెంజిన్ యాంగ్కి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకువెళ్తోంది. తనకంటూ ఒక వినూత్న మార్గాన్ని ఏర్పరచుకుని అందులో తానే తొలి వ్యక్తిగా నిలవడం అంత సులభం కానిదే అయినా..ఆమె సాధించి చూపించింది. పైగా ఎందరో తన మార్గంలో నడిచేలా స్ఫూర్తిని రగిలించింది. ఈ రోజు ఒంటిరిగా నడుస్తున్నా అని భయపడ్డా..ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు, త్వరలో వారికి మీరు మార్గదర్శకులుగా మారేరోజు వస్తుంది. అందుక ఉదహరణ టెంజిన్ యాంగ్కి అంటూ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్లో రాసుకొచ్చారు. కాగా, టెన్జిన్ సాధించిన ఈ విజయం ఈశాన్య ప్రాంతానికి చెందిన మహిళలకు ఒక గొప్ప ఒక మైలురాయి క్షణం. ఎందుకంటే అక్కడ జాతీయ నాయకత్వ పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.Tenzin Yangki from Tawang has become the first woman from Arunachal Pradesh to join the Indian Police Service.An academician, a civil servant, and now an IPS officer, she carries forward the legacy of service from her parents while carving her own path of excellence.Being… pic.twitter.com/YWt8TCLadF— anand mahindra (@anandmahindra) October 27, 2025 (చదవండి: Success Story: కాలేజ్కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..) -
వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!
సరికొత్త క్రీడా స్ఫూర్తిని నింపింది ఈ తల్లి. తన గెలుపుతో సరికొత్త అధ్యయానికి తెరతీసిందామె. గర్భంతో ఉన్నవాళ్లు చిన్న చిన్న బరువులు ఎత్తేందుకే భయపడతారు. అలాంటిది వెయిల్లిఫ్టింగ్లో పాల్గొనడమే కాదు విజయం సాధించింది ఈ మహిళ. స్థిరత్వం, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించొచ్చని నిరూపించింది ఈ తల్లి. ఏడు నెలల నిండు గర్భిణి అయిన సోనికా యాదవ్(Sonika Yadav) ఈ ఘనత సృష్టించింది. ఆమె ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్(Delhi Police constable)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26(Weightlifting Cluster 2025-26 )లో పాల్గొని 145 కిలోల బరువుని ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె గత మే నెలలో గర్భం దాల్చినట్లు నిర్థారణ అయ్యాక..శిక్షణ నిలిపేస్తుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే ఆమెకు క్రీడలు, ఫిట్నెస్ పట్ల ఉన్న మక్కువతో కొనసాగించాలనే నిర్ణయించుకుంది. చాలా దృఢసంకల్పంతో నిపుణుల పర్యవేక్షణలో తన వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ని తీసుకున్నట్లు పేర్కొంది. నిజానికి ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఎవ్వరికీ ఆమె గర్భిణి అని తెలియదు. ఎందుకంటే సోనియా వదులుగా ఉన్న దుస్తులే ధరించి సహ పోటీదారులతో పాల్గొంది. చివరి డెడ్లిఫ్ట్ ప్రయత్నంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఆమె క్రీడాస్ఫూర్తిని చూసి ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులతో చప్పట్లుతో అభినందనలు వెల్లువెత్తాయి. ఆ అసాధారణ గెలుపుని చూసిన వివిధ పోలీసు విభాగాల మహిళా అధికారులంతా సోనికాని అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తారు. ఇక సోనికా గర్భవతిగా ఉండగా ఇలాంటి పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ లిఫ్టర్ లూసీ మార్టిన్స్ నుంచి ప్రేరణ పొందినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, 2014 బ్యాచ్ అధికారిణి అయిన సోనికా ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్లో పనిచేస్తున్నారు. గతంలో, మజ్ను కా తిలా ప్రాంతంలో బీట్ ఆఫీసర్గా, అలాగే మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారాల్లోనూ కీలక పాత్ర పోషించారామె.ప్రెగ్నెంట్ టైంలో మంచిదేనా..!గర్భవతిగా ఉన్నప్పుడూ వెయిట్లిఫ్టింగ్ సురక్షితమేనని చెబుతున్నారు నిపుణులు. ప్రెగ్నెంట్ టైంలో వచ్చే వెన్నునొప్పి, వంటి సమస్యలు ఉండవని తేలికగా ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల మీ కోర్ కండరాలు బలోపేతమై..నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్లు ఎక్కువుగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. కానీ వైద్యుడు సమక్షంలో లేదా పర్యవేక్షణలో చేయాలని సూచిస్తున్నారు. వారి సలహాలు సూచనలతో తగిన జాగ్రత్తలతో బరువులు ఎత్తితే బిడ్డకు తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇక్కడ బరువు ఎత్తేటప్పుడూ.. ఫిట్నెనస్ ట్రైనర్ల సూచనలమేరకు తేలికపాటి టెక్నిక్లతో ఎత్తాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 🏋️♀️Defying limits, redefining strength💪W/Ct. Sonika of @DcpNorthDelhi clinched Bronze medal at the All India Police Weightlifting Cluster 2025-26, Amravati (A.P.), lifting a total of 350 kg in 84+ kg category — while 7 months pregnant!True embodiment of strength, courage &… pic.twitter.com/F9jqYdXAFB— Delhi Police (@DelhiPolice) October 24, 2025 (చదవండి: Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?) -
స్టార్ హార్టిస్ట్
international Animation day 2025 యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ఆ రోజుల్లో...ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.సందేహాలను వదిలి సత్తా చాటుతూ...కోల్కత్తాలోని ‘డ్రీమ్వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.బాధ నుంచి బయట పడేలా...అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది. ఇదీ చదవండి: Yoga: ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. చక్కటి ఆసనాలు‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో చేరాను. మెరుగైన సాఫ్ట్స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.మూడు ఖండాలలో...రెండు దశాబ్దాల తన కెరీర్లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్లు. మహిళల సంఖ్య పెరుగుతోంది...లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్గా రాణించడానికి జెండర్, బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.యానిమేషన్లో ఆమె బహుముఖ ప్రజ్ఞయానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’– ప్రమిత ముఖర్జీ -
సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..!
యువరానర్.. అనాలనేది చాలా మంది కల. కానీ యువరానర్ అనిపించుకునే స్థాయిలో ఉండేవారు కొందరే. ఆ కొందరిలోనూ మహిళలు తక్కువగా కనిపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మహిళా జడ్జీలు.. లాయర్ల సంఖ్య పెరుగుతుంది. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆత్మస్థైర్యంతో విజయం సాధిస్తే.. మనోధైర్యంతో వృత్తిలో రాణిస్తున్నామంటున్నారు మహిళా జడ్జిలు. వీరిపై ప్రత్యేక కథనం.ఆత్మస్థైర్యంతో ముందుకు.. సునీత కుంచాల, పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిలక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్లి విజ యం సాధించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సునీత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి గురువులు ఉపాధ్యాయుడిగా, తల్లి జయకుమారి ప్రభుత్వాస్పత్రిలో నర్సు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిన్న వయసులోనే సునీతకు వివాహమైంది. భర్త, తల్లిదండ్రుల సహకారంతో డిగ్రీ, పీజీ ప్రైవేట్గానే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. ఎల్ఎల్బీ ఉత్తీర్ణురాలు అ య్యారు. సునీత ఆడపడుచు జడ్జీ కావడంతో తాను కూడా జడ్జీ కావాలనే లక్ష్యం పెట్టుకొని.. శ్రమించా రు. 2003లో జడ్జీ పోస్టుకు పరీక్ష రాసి.. ఇంటర్వ్యూ దాకా వెళ్లి త్రుటిలో ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నారు. ఓటమితో నిరాశచెందకుండా మళ్లీ ప్రయత్నించారు. 2013లో జూనియర్ సివిల్జడ్జిగా ఎంపికయ్యారు. జిల్లా జడ్జీ కావాలనే కాంక్ష వెంటాడడంతో అదే ఏడాది పడ్డ నోటిఫికేషన్లో ఒకే పోస్టు ఉండడంతో కష్టపడి చదివి విజయం సాధించారు. పోక్సో నేరాలకు కఠిన శిక్షలుజిల్లా జడ్జిగా హైదరాబాద్లోని స్పెషల్ కోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన కాలంలో 84 పోక్సో కేసుల్లో తీర్పునిచ్చారు. 10 కేసుల్లో జీవితఖైదు విధించారు. పెద్దపల్లి జిల్లా జడ్జిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు కేసుల్లోనూ తీర్పులిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసే సమయంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు ఆఫీసు సబార్డినేటర్లుగా ఉద్యోగావకాశాన్ని కల్పించడం సంతోషాన్ని ఇచ్చిందంటారు సునీత కుంచాల. నిజామాబాద్లో పనిచేసిన కాలంలో 14 వేల మందికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. నిజామాబాద్లోని బాలసదనంలోని విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేలా ట్రస్టు ఏర్పాటు చేయించడం సంతృప్తినిచ్చిందంటారు.కష్టాలు ఎదురైనా కుంగిపోలేదు: తడిగొప్పుల ప్రవిళిక, జూనియర్ సివిల్ జడ్జి, పిడుగురాళ్లతన ప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు అనేకం ఉన్నాయని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడీ్జగా విధులు నిర్వర్తిస్తున్న తడిగొప్పుల ప్రవళిక తెలిపారు. వేములవాడ ప్రాంతంలోని కొదురుపాకకు చెందిన ప్రవళిక జడ్జీగా ఎంపికయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటర్ వరకు కరీంనగర్లో చదువుకున్నారు. 2020లో పీజీ లాసెట్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రవళిక క్లాట్ ద్వారా నల్సార్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం. వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, అత్తారింటి వారి సహకారంతో చదువు పూర్తి చేయడంతోపాటు జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులపై పూర్తి అవగాహన ఉండాలి. లాయర్గా వృత్తిలో రాణించాలంటనే నిత్య విద్యార్థి మాదిరిగా కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాల్సిందేనని ప్రవళిక తెలిపారు.ఆత్మవిశ్వాసంతోనే విజయం: గడ్డం వందన, జూనియర్ సివిల్ జడ్జి,వేములవాడ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. కష్టపడితే ఏదైనా సాధిస్తారని వేములవాడకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన నిరూపించారు. జడ్జీ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. జీవన విలువలు.. సమాజాన్ని అర్థం చేసుకోవడమని ఆమె అంటున్నారు. వేములవాడకు చెందిన వందన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సవాళ్లను స్వాగతించాలివందన తల్లిదండ్రులు గడ్డం శైలజ, సత్యనారాయణరెడ్డి. వేములవాడలో 10వ తరగతి వరకు చదువుకున్న వందన ఇంటర్ హైదరాబాద్లో, లా కోర్సు మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో పూర్తి చేశాను. న్యాయవిద్యలో పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎల్ఎల్ఎం పూర్తయ్యాక జ్యుడీషి యల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 2022లో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జడ్జిగా ఎంపికయ్యారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధిస్తామని వందన అంటున్నారు.(చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!
చరిత్ర పొరపాట్లు చేయదు. కానీ, మానవ స్వార్థం చరిత్రలో పొరపాట్లు నమోదు అయ్యేలా చేస్తుంది. అటువంటి చారిత్రకమైన స్వార్థపూరిత పొరపాట్లే ఇక్కడ ఉన్న ఈ ఆవిష్కరణలన్నీ. వీటిని కనిపెట్టింది, లేదా సృష్టించింది మహిళలే అయినప్పటికీ, ఆ గొప్పదనం పురుషులకు దక్కింది! నిజానికి ఇది ‘దక్కటం’ కాదు. ‘కొట్టేయటం’! స్త్రీల నుంచి పురుషులు.. చోరీ చేసి, ప్రపంచాన్ని మభ్యపెట్టి, గురువు స్థానంలో ఉండీ, పేటెంట్ను మూలన పడేసి, సహోద్యోగిని టాలెంట్ను తొక్కిపెట్టి, పైకి మాట్లాడనీయకుండా చేసి, పక్కకు తోసేసి...క్రెడిట్ తీసుకున్న ఇన్నోవేషన్లు.. డిస్కవరీలలో ఇవి కొన్ని మాత్రమే!మోనోపలీ గేమ్ఈ బోర్డ్ గేమ్ని కనిపెట్టింది కాలిఫోర్నియాకు చెందిన చార్ల్స్ డారో అనే ఆయన అని; కనిపెట్టి ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్ పబ్లిషర్స్కి 1935లో విక్రయించారని; అలా ఈ ‘మోనోపలీ’ బోర్డ్ గేమ్ ప్రఖ్యాతి చెందిందని ప్రపంచానికి ఒక పొరపాటు భావన ఉంది.నిజానికి మోనోపలీ బోర్డ్ గేమ్ను కనిపెట్టింది అమెరికన్ గేమ్ డిజైనర్, రచయిత్రి ఎలిజబెత్ మ్యాగీ (1866–1948). చార్ల్స్ డారో కంటే 3 దశాబ్దాల ముందే.. ‘ది ల్యాండ్లార్డ్స్ గేమ్: యాంటీ–మోనోపలిస్ట్, మోనోపలిస్ట్’ అనే పేరుతో రెండు సెట్ల మోనోపలీ గేమ్ని ఎలిజబెత్ మ్యాగీ సృష్టించారు. మోనోపలీ బోర్డ్ గేమ్లో ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను వ్యాపారంలో దివాలా తీయించటానికి, వ్యాపార ప్రపంచ జగదేక వీరుడిగా నిలవటానికి ఆస్తులను కొనుగోలు చేస్తూ, అమ్ముతూ, లాభాల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ గేమ్ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆడుతుంటారు. ఆటకు కనీసం ఇద్దరు ఉండాలి. 6 లేదా 8 మంది ప్లేయర్ల వరకు ఆడవచ్చు.పేపర్ బ్యాగులు అడుగు భాగం బల్లపరుపుగా ఉండి, పక్కకు వాలిపోకుండా స్థిరంగా నిలబడి ఉండేలా పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రానికి సృష్టికర్త నిజానికి మార్గరెట్ ఎలోయిస్ నైట్ (1838–1914) అనే అమెరికన్ మహిళ. అయితే, చార్ల్స్ అన్నన్ అనే అతడు ఆమె కనిపెట్టిన పేపర్ బ్యాగ్ డిజైన్ను తస్కరించి తన పేరుతో పేటెంట్స్ సంపాదించాడు. మార్గరెట్ ఎలోయిస్ నైట్.. పేపర్ బ్యాగ్ యంత్రానికి మొదట చెక్కతో నమూనాను తయారు చేసి, దానికి ఒరిజినల్ వెర్షన్ కోసం (ఇనుప యంత్రం నమూనా) ఒక షాపుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అన్నన్ ఆమె దగ్గరున్న పేపర్ బ్యాగ్ డిజైన్ను దొంగిలించాడు. అన్నన్పై న్యాయ పోరాటం చేసి మరీ మార్గరెట్ తన పేటెంట్ను దక్కించుకోవలసి వచ్చింది. ఆమె తన 12వ యేటే ‘ఆటో–స్టాపర్’ మెషిన్ను కూడా కనిపెట్టారు. నేటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో; పారిశ్రామిక, వాణిజ్య పరికరాలలో ఆ ఆటో స్టాపర్ (దానంతటే ఆగిపోయే ఏర్పాటు) కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది.సెక్స్ క్రోమోజోమ్లుఅమెరికన్ మహిళా జన్యుశాస్త్రవేత్త నెట్టీ స్టీవెన్స్ (1861–1912) 1905లో సెక్స్ క్రోమోజోములను కనిపెట్టారు. అయితే ఆ ఘనతను మొదట ఆమె గురువు ఇ.బి.విల్సన్ దక్కించుకున్నారు. పురుషుల్లోని లింగ నిర్ధారణ క్రోమోజోమ్ల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి నెట్టీ స్టీవెన్స్ పేడ పురుగులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు... పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ణయించేది పురుషుల క్రోమోజోమ్లేనని ఆమె కనుగొన్నారు. తల్లి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. తండ్రి శుక్రకణాల్లో ‘వై’, ‘ఎక్స్’ క్రోమోజోములు రెండూ ఉంటాయి. తండ్రిలో ‘వై’ క్రోమోజోమ్ తల్లిలోని ‘ఎక్స్’తో కలిస్తే మగబిడ్డ; లేదా తండ్రిలోని ‘ఎక్స్’– తల్లిలో ఉండే ‘ఎక్స్’తో కలిస్తే ఆడబిడ్డ పుడతారని నెట్టీ స్టీవెన్స్ కనిపెట్టారు. నెట్టీ పరిశోధనను, మరికాస్త ముందు తీసుకువెళ్లటం వరకు మాత్రమే ఇ.బి.విల్సన్ పాత్ర పరిమితమై ఉన్నప్పటికీ అసలైన సృష్టికర్తగా ఆయనకే పేరు వచ్చింది.విండ్షీల్డ్ వైపర్లు1902లో, మేరీ ఆండర్సన్ (1866–1953) అలబామా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణిస్తున్నారు. బాగా మంచు కురుస్తోంది. విండ్షీల్డుపై పడుతున్న ఆ మంచును మెత్తటి వస్త్రంతో తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును రోడ్డు పక్కన ఆపవలసి వస్తోంది. అది చూసిన మేరీ ఆండర్సన్కు ఈ విండ్షీల్డ్ వైపర్ల ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనకు పేటెంట్ను దాఖలు చేశారు.దురదృష్టవశాత్తూ ఆమె ఆవిష్కరణకు పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఇదీ ఒక ఇన్వెషనేనా అన్నారు. కొంతకాలం ఆమె పేటెంట్ గడువు ముగిసింది. తరువాత కొన్ని నెలల్లోనే అమెరికాలో ఎక్కడ చూసినా విండ్షీల్డ్ వైపర్లే! అంతేకాదు, విండ్షీల్డ్ వైపర్స్ను కనిపెట్టిన క్రెడిట్ రాబర్ట్ కియర్న్స్ అనే వ్యక్తికి దక్కింది! మేరీ ఎలిజబెత్ ఆండర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు విస్తారంగా పాడి పంటల క్షేత్రాలు ఉన్నాయి. ద్రాక్ష తోటల్ని పెంచేవారు. నిరంతరం కారు ప్రయాణాలు చేస్తుంటారు. ఏమైనా.. విండ్షీల్డ్ వైపర్ సృష్టికర్త రాబర్ట్ కియర్న్స్ కాదని, మేరీ ఎలిజబెత్ అని త్వరలోనే ప్రపంచానికి నిజం తెలిసిపోయింది.కేంద్రక విచ్ఛిత్తి ‘కేంద్రక విచ్ఛిత్తి’ని కనుగొన్నందుకు ఒట్టో హాన్ అనే జర్మనీ శాస్త్రవేత్తకు 1944లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నిజానికి ఆ బహుమతి దక్కవలసింది ఆయన సహోద్యోగి లిజ్ మీట్నర్కు! కేంద్రక విచ్ఛిత్తికి (న్యూక్లియర్ ఫిషన్) సైద్ధాంతిక వివరణను అందించింది అసలు లిజ్ మీట్నరే. యురేనియంలో మహా శక్తి ఉన్నట్లు కూడా ఆమే కనిపెట్టారు.ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియే కేంద్రక విచ్ఛిత్తి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో కేంద్రక విచ్ఛిత్తిలో శక్తి విడుదల అవుతుందని లిజ్ మీట్నర్ కనుగొన్నారు. ఆమె అందించిన సహకారం వల్లనే ఒట్టో హాన్ నోబెల్ సాధించగలిగారు.లిజ్ మీట్నర్ (1878–1968) ఆస్ట్రియన్–స్వీడిష్ అణు భౌతిక శాస్త్రవేత్త. వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1924–1948 మధ్య రసాయన శాస్త్రంలో 19 సార్లు, 1937–1967 మధ్య భౌతిక శాస్త్రంలో 30 సార్లు నోబెల్కు ఆమె నామినేట్ అయ్యారు.గ్రీన్హౌస్ ప్రభావంగ్రీన్హౌస్ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ టిండాల్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. అయితే, గ్రీన్హౌస్ ప్రభావాన్ని మొదట సిద్ధాంతీకరించి, దానిని రుజువు చేసింది నిజానికి అమెరికన్ మహిళా శాస్త్రవేత్త యునిస్ ఫూటే (1819–1888). విచారకరం ఏంటంటే – ఆమె కనిపెట్టిన ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ గురించి వివరించటానికి ఆమెకు అనుమతి లభించలేదు. దాంతో ఆమె తన పరిశోధనల గురించి మాట్లాడాలని ఒక పురుష సహోద్యోగిని అడగాల్సి వచ్చింది. 1856లోనే యూనిస్ ఫూటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను కనిపెట్టారు. కానీ 1861లో దానిని కనిపెట్టిన జాన్ టిండాల్కు ప్రాధాన్యం లభించింది. భూవాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు సూర్యుని వేడిని సంగ్రహించి భూమికి హితంగా ఉండేంత మోతాదులో మాత్రమే ఉష్ణోగ్రతను స్వీకరించి, మిగతా కిరణాలను వెనక్కు పంపే సహజ ప్రక్రియే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. (చదవండి: తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..) -
సత్తా చాటిన సిస్టర్ సబీనా
కేరళకు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో హర్డిల్స్లో అద్భుతంగా రాణించారు. 55 ఏళ్ల సబినా 55–ప్లస్ విభాగంలో మొదటిస్థానంలో నిలిచారు. కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబినా ఒకప్పుడు జాతీయ స్థాయి హర్డిలర్. తొమ్మిదో క్లాస్లో ఉన్నప్పటి నుంచి జాతీయస్థాయి హర్డిల్స్ ఈవెంట్స్లో పాల్గొనేవారు. యూనివర్శిటీ స్థాయి పోటీలలో కూడా సత్తా చాటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఆమె ఎంతోమంది విద్యార్థులను క్రీడలలో తీర్చిదిద్దారు.‘రాబోయే మార్చిలో ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నాను. ఈలోపు ఒకసారి పోటీలో పాల్గొనాలనుకున్నాను’ అన్నారు సబీన. ‘ఆమె విజయం సంకల్ప బలానికి ప్రతీక. లక్ష్యం చేరుకోవడానికి వయసు ఎప్పుడూ అడ్డు కాదని నిరూపించారు’ అని సబీనాపై ప్రశంసలు కురిపించారు కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి. మతపరమైన దుస్తులు ధరించి సబీనాపోటీలో పాల్గొనడం విశేషంగా మారింది.చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్ -
ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ... నానమ్మల బడి
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే చదువుకు చదువు, స్నేహానికి స్నేహం దక్కుతాయి. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఇలాంటి బడి నేటికీ కొనసాగుతూ ప్రతి ఊరికి ఇలాంటిది అవసరమని చాటుతోంది. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అమ్మమ్మల బడి’ గురించి...ఇది అద్భుతం. మొన్నటి మార్చి 8న మహారాష్ట్రలోని ఆ చిన్న పల్లెలో, ముంబైకి 120 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అదేమిటో తెలుసా? ‘ఆజిబైచి శాల’ దశాబ్ది ఉత్సవం. అంటే ఆ స్కూల్ పెట్టి సరిగ్గా పదేళ్లయిన సందర్భంగా ఆ స్కూలు స్టూడెంట్లు, పెద్దమనుషులు, గ్రామస్తులు... ఆ స్కూల్ని స్థాపించిన యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడు ... అందరూ వేడుక చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటయ్యి ఇలా పదేళ్లపాటు కొనసాగి, ఇంకా కొనసాగుతూ ఉండటం ఎంత గొప్ప. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అవ్వల బడి’. అందులో స్టూడెంట్స్ అందరూ అవ్వలే.మలుపు తిప్పిన ఆలోచనఒక ఆలోచన వెలిగితే అది చరిత్ర సృష్టిస్తుంది. పదేళ్ల క్రితం ఫంగణె అనే ఆ పల్లెలో ఛత్రపతి శివాజీ గాథను ఊరి వారికి ఏర్పాటు చేశారు. వచ్చిన గాయకులు శివాజీ గాథను పాడుతూ ఉంటే ఊళ్లోని వారందరూ ఒకవైపు; ఊళ్లోని అవ్వలందరూ ఒకవైపూ కూచున్నారు. వారి సంఖ్య 36. శివాజీ గాథను ఊరి వారందరూ ఉత్సాహంగా వింటుంటే అవ్వలకు ఆ కథ సరిగ్గా అర్థమయ్యీ అర్థం కాక ఇబ్బందిగా అనిపించింది. కథ ముగిశాక ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ దగ్గరకు వెళ్లిన వారందరూ ‘సారూ... మీరంతా కథ మస్తు ఎంజాయ్ చేశారు. మేం కూడా చదువుకుని ఉంటే మీలాగే ఎంజాయ్ చేద్దుము’ అన్నారు. యోగేంద్ర బంగార్కు మనసు కలుక్కుమంది. ఇంట్లో ఉండే అవ్వలు చదువు లేక పోవడం వల్ల, వయసు రీత్యా, మారిన కాలం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్నారని, వీరికి ఒక ఉపయోగపడే కాలక్షేపం కల్పిస్తే మేలవుతుందని ఆయన అనుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఊళ్లోని చిన్న స్థలంలో షెడ్డు వేసి ‘అవ్వల బడి’ని ప్రారంభించాడు. అవ్వలు ముందు కంగారు పడ్డా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఊరి వాళ్లు మెచ్చుకుని మద్దతు ఇచ్చారు. అలా మొదలైన ఆ స్కూలు ఆ నాటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.పెద్ద సమూహం, ఎంతో మేలుగ్రామంలో అంతవరకూ ఎవరికీ పట్టని ఈ అవ్వలు ఇప్పుడు కొత్త ఉనికిలోకి వచ్చారు. గౌరవం పొందారు. అంతేకాదు ఇంట్లో వీరు తమ మనవలతో, మనవరాళ్లతో పాటుగా చదవడం మొదలుపెట్టారు. అవ్వల హోమ్వర్కులో మనవలు సాయం పట్టారు. దాంతో వాతావరణమే మారి పోయింది. ఈ అవ్వలందరూ కలిసి యాత్రలకు వెళుతున్నారు. అలాగే వీరికోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటారు. ఇవన్నీ వారికి ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి.‘ఈ బంధుగణం కావాలి’‘మన దేశంలో చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల అరవై ఏళ్లు వచ్చేసరికి స్త్రీలు ఒంటరితనాన్ని, నిరాసక్తతను అనుభవిస్తున్నారు. వీరికి చదువు లేక పోతే చాలా విషయాలకు మరింత దూరమవుతున్నారు. కనీసం ఫోను వాడకం కూడా రావడం లేదు. వీరి కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం కంటే ఇలాంటి బడులు ప్రతి ఊళ్లో ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వీరికి మనం కూడా ఎంచదగ్గ మనుషులమే అనే భావన కలుగుతుంది. అవ్వల అనుభవం, వారి చిరునవ్వు ప్రతి ఇంటా ఉండాలంటే వారిని గౌరవించి పట్టించుకోవడం అవసరం‘ అంటాడు ఈ స్కూలు స్థాపకుడు యోగేంద్ర బంగార్.నిజమే... ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసం వారికి కొత్త జవసత్వాలను ఇస్తుంది. వారి ఉదాసీనత పోగొడుతుంది. పింక్ రంగు చీరల్లో ‘స్టూడెంట్స్’ఊరిలోని వాళ్ల ఫండ్స్తో మొదలైన ఈ స్కూలుకు అవ్వలందరికీ పింక్ రంగు చీరలు యూనిఫామ్గా ఇచ్చారు. స్కూల్ బ్యాగులు, పలకలు, బలపాలు అన్నీ ఇచ్చారు. స్కూలు మొదలైన రోజున ‘చేతికర్రతో తిరిగే ఆ స్త్రీలు బలపం పట్టుకోవడానికి విద్యార్థుల్లా’ బడికి వచ్చారు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. స్కూలు గంటలు వారికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు. రోజువారీ పనులన్నీ అయ్యి, గొడ్లకు మేత వేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బడికి రావాలి. రోజూ బడి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండు గంటలు మాత్రమే జరుగుతుంది. మరాఠీ లిపి, కొద్దిపాటి లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్... అన్నీ నేర్పిస్తారు. సిలబస్ ఉంటుంది. అన్నింటికీ మించి తమదంటూ ఒక చోటు.. తమకంటూ కొందరు మనుషులు వారికి దొరుకుతారు. -
గోల్డెన్ క్రియేటర్
ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్స్టా సంస్థ బంగారు రింగ్ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్స్టా ప్రొఫైల్లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్ని ఇన్స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి. -
ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..!
నేర్చుకోవాలనే అంతులేని తపనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు కొందరు. పైగా మంచి ఉన్నత పొజిషన్లో పనిచేసి పదవీ విరమణ పొందాక కూడా విద్యను అభ్యసించడం అంటే మాటలు కాదకదా..!. చదవాలన్న కోరిక ఉన్నా..వయసు సహకరించదు. పోనీ కొత్తగా ఆ స్పీడ్ టెక్నాలజీని అందుకుంటూ చదవాలంటే వామ్మో అనేస్తారు ఎవ్వరైనా..కానీ ఈ 80 ఏళ్ల మహిళ వాటన్నింటిని ఖతారు చేస్తూ..దిగ్విజయంగా ఎంబిఏ పూర్తి చేసింది. రెండుసార్లు కేన్సర్తో పోరాడి గెలిచి కూడా..ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగి..నేటి యువతకు ఆదర్శంగా నిలిచారామె.ఆ మహిళే 80 ఏళ్ల ఉషా రే(Usha Ray). పూణేలోని పాటిల్ విద్యాపీఠ్ సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్లో హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్లో MBA కోసం చేరినప్పుడు ఆమె వయసు 77 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టుకి 80 ఏళ్లు వచ్చిన రెండు వారాలకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారామె. నిజానికి ఈ సబ్జెక్టు ఆమెకు కొత్త. ఎందుకంటే ఆమె జంతుశాస్త్రంలో ఎంబిఏ చేశారు. దశాబ్దాలుగా పాఠశాల ఉపాధ్యాయురాలిగా కొనసాగిన అనుభవం ఉందామెకు. ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాస్త్రం అర్థం చేసుకోవడం, కంప్యూటర్తో కుస్తీ పట్టడం అన్ని సవాళ్లే ఆమెకు. అయినా..తగ్గేదే లే అంటూ ఎంబీఏ చేసేందుకు ఉత్సాహం చూపించిందామె. ఆమె ఇంగ్లాండ్, యోమెన్ వంటి అంతర్జాతీయ పాఠశాలల్లో భోధించారు కూడా. ప్రస్తుతం ఆమె లక్నోలో గోమతినగర్లోని లవ్ శుభ్ హాస్పిటల్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ కోరిక ఎలా పుట్టిందంటే..2009లో టీచింగ్ వృత్తి నుంచి పదవీ విరమణ చేశాక..ఆస్పత్రిలో సీఈవోగా పనిచేస్తున్నప్పుడు ఈ కోరిక కలిగిందామెకు. అక్కడ చాలామంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడూ..ప్రతిచోట ఎంబీఏ అని కనిపించేదట ఆమెకు. అందరూ చేసే ఈ ఎంబీఏ ఏంటి?..ఎలాగైనా తెలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు ఉషా రే. అలా 2023లో ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్లో చేరింది. అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కు సంబధించిన విభాగంలో చేయడం ఆమె ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు ఆమెకు 2003లో స్టేజ్-4 ఛాతీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెలల కీమోథెరపీ, రేడియో థెరపీతో కోలుకుంది. మళ్లీ మహమ్మారి సమయంలో కేన్సర్ తిరగబెట్టింది. మళ్లీ ధైర్యంగా ఎదుర్కొంది. ఇన్ని ఆటోపోట్లు చూసినా ఆమె వెనక్కి తగ్గకుండా ఎంబిఏ చేయాలనుకోవడం విశేషః. ఇక్కడ ఉషా రే ఎదురుదెబ్బ తగిలినప్పుడే జాగ్రత్తగా ఉండాలే తప్ప భయంతో అస్సలు ఆగిపోకూడదు అంటారామె. చివరగా దిగ్విజయంగా ఎనిమిది పదుల వయసులో ఎంబీఏ చేయగలిగానంటే అదంతా తన కుటుంబం, సహోద్యోగుల అందించిన ప్రోత్సాహమే అంటూ క్రెడిట్ అంతా వాళ్లకే ఇచ్చేశారు ఉషారే. (చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్) -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్బ్రాండ్ పాలిటిక్స్తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..
దుష్ట ప్రవృత్తి గల నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేసే ఎందరో నరకాసురులకు సత్యభామలుగా మారిన పోలీసు ఆ‘షీ’సర్లు చెక్ చెప్తున్నారు. నేడు నరక చతుర్దశి సందర్భంగా మహిళా పోలీస్ అధికారుల ప్రాధాన్యం గురించి... హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో 36 శాతం మహిళలే. ఎన్పీఏ చరిత్రలో ఇదో రికార్డు. దీనికిముందే ఇలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. సెప్టెంబర్లో చోటు చేసుకున్న ఐపీఎస్ అధికారుల బదిలీతో రాష్ట్ర పోలీసు విభాగంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మకుటాలను 33.3 శాతం మహిళలే ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1979 వరకు మహిళా ఐపీఎస్లే లేరు. ఆ ఏడాది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న హైదరాబాదీ యువతి అరుణ బహుగుణ చిత్తూరు జిల్లా మదనపల్లె అదనపు ఎస్పీగా పోస్టింగ్ పొందారు. ఇది అప్పట్లో సంచలనం. ఆపై కాలక్రమంలో మహిళ ఐపీఎస్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ 2014 వరకు వీరికి సముచిత పోస్టింగ్స్ ఉండేవి కాదు. అత్యవసర సందర్భాల్లో అక్కరకు రావడానికి కమిషనరేట్కు ఒక మహిళ ఐపీఎస్కు పోస్టింగ్ ఇచ్చేవాళ్లు. మిగిలిన అధికారుల్ని అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించే వారు. రానురాను ఆ సీన్ పూర్తిగా మారిపోతూ వచ్చింది. పోలీసు విభాగంలో మహిళ ఐపీఎస్ అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోస్టింగ్స్ ఇవ్వడం అనివార్యంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళ భద్రత విభాగం, షీ–టీమ్స్ ఏర్పాటైన తర్వాత వీటిలో అనివార్యంగా మహిళ ఐపీఎస్లకే పోస్టింగ్ ఇస్తూ వచ్చారు. కమిషనరేట్లలో డీసీపీ పోస్టులతో పాటు కొన్ని జిల్లాలకు మహిళల్ని ఎస్పీలుగా నియమించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న మూడో వంతు హెచ్ఓడీ పోస్టులతో పాటు హైదరాబాద్, రాచకొండల్లోని డీసీపీ పోస్టుల్లో అత్యధికంగా మహిళా ఐపీఎస్లే ఉన్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడెమీకి అభిలాష్ బిస్త్, నేరగాళ్లలో మార్పునకు కృషి చేసే జైళ్లశాఖకు సౌమ్య మిశ్ర, రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చారు సిన్హా, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన బి.సుమతి, హోంగార్డ్స్ వింగ్కు స్వాతి లక్రా నేతృత్వం వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 15 హెచ్ఓడీ పోస్టుల్లో ఏడింటికి ఐదుగురు మహిళ ఐపీఎస్లు నేతృత్వం వహిస్తున్నట్లు లెక్క. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు శిఖా గోయల్ చీఫ్గా, అవినీతి నిరోధక శాఖకు చారు సిన్హా ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు ఉన్నత స్థాయిలో కూడా ఉండేవారు కారు. అయితే కాలక్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో హఠాత్తుగా తలెత్తే పరిణామాలతోపాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది. కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళ ఉన్నతాధికారి ఉండాలని ప్రభుత్వమూ భావించినప్పటికీ చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్జోన్కు మాత్రమే మహిళ అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసువింగ్లో మహిళ ఉన్నతాధికారి ΄ోస్టు ఇదొక్కటే అనే భావన కొనసాగింది.ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ కమిషనరేట్లో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్కు ఒక్కో డీసీపీ నేతృత్వం వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడు జోన్లలో మూడింటికి మహిళ ఐపీఎస్లే డీసీపీలుగా ఉన్నారు. మధ్య మండలానికి శిల్పవల్లి, ఉత్తర మండలానికి సాధన రష్మీ పెరుమాళ్, దక్షిణ మండలానికి స్నేహ మెహ్రా డీసీపీలుగా ఉన్నారు. వీరికి తోడు పరిమళ నూతన్, పరిపాలన విభాగం సంయుక్త సీపీగా, రక్షితమూర్తి, సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా, అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా, ఎన్ .శ్వేత డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ గా, డి.కవిత,సైబర్ క్రైమ్ విభాగం డీసీపీగా, లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్లోని అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్కు డీసీపీగా రితిరాజ్ వ్యవహరిస్తున్నారు. ఇక రాచకొండలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిలో మల్కాజ్గిరి, ఎల్బీనగర్, మహేశ్వరానికి పద్మజ రెడ్డి, అనురాధ, సునీత రెడ్డి డీసీపీలుగా ఉన్నారు. వీరిలో సునీత రెడ్డి మాత్రమే నాన్ ఐపీఎస్ అధికారి. ఈ జోనల్ డీసీపీలతోపాటు మహిళ భద్రత విభాగం, సైబర్ క్రైమ్ వింగ్స్లను ఆ‘షీ’సర్స్ నేతృత్వం వహిస్తున్నారు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
కృష్ణుడిగా సత్యభామ
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు. మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.బాల్యం నుంచీ... మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.సత్యభామ.. మీరజాలగలరా..!కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది. కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యువ హవా
ఘనమైన కుటుంబ వ్యాపార నేపథ్యం ఉన్నంత మాత్రాన... ‘విజయం అనివార్యం’ అని చెప్పడానికి లేదు. అంకితభావం, కష్టం ఉంటేనే విజయం సొంతం అవుతుంది.ఘనమైన కుటుంబ వ్యాపారనేపథ్యం లేనంత మాత్రాన...‘విజయం దూరం’ అని చెప్పడానికి లేదు. ఆసక్తికి అంకితభావం, కష్టం తోడైతే విజయం సొంతం అవుతుంది. దీనికి తాజా ఉదాహరణ... అవెండస్ వెల్త్–హురున్ ఇండియా–2025 జాబితా. 35 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన 155 మంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్లు వెల్త్–హురున్ ఇండియా జాబితాలో చోటు సాధించారు. వీరిలో... వారసత్వ బాధ్యతకు తమ శక్తియుక్తులను జోడించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. కొన్ని ఉత్పత్తులలో లోపాలు కనిపెట్టి లోపాలు లేని, సౌకర్యవంతమైన ప్రాడక్ట్స్ కోసం ఎంటర్ప్రెన్యూర్లుగా మారి విజయం సాధించిన వారూ ఉన్నారు... వారిలో కొందరు యంగ్ ఫిమేల్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి..సక్సెస్ఫుల్ యూఎస్పీతో...ప్రారంభ కష్టాల మాట ఎలా ఉన్నా... ఉమెన్ యాక్టివేర్ ‘బ్లిస్క్లబ్’ మార్కెట్లో నిలుదొక్కుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఈ ఆన్లైన్ బ్రాండ్ ఆ తరువాత రెండు ఆఫ్లైన్ స్టోర్లను కూడా లాంచ్ చేసి విజయం సాధించింది. ‘మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి కదా. మీ ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ‘బ్లిస్క్లబ్’ ఫౌండర్, సీయీవో మినూ మార్గరెట్ ముందు వచ్చి నిల్చుంది. సిగ్నేచర్ ఫ్యాబ్రిక్స్, వినూత్నమైన ప్రాడక్ట్ డిజైన్ను తమ కంపెనీ యూఎస్పీగా చేసుకొని విజయం సాధించింది మార్గరెట్.నేషనల్ లెవెల్ ఫ్రిస్బీ ప్లేయర్ అయిన మినూ మార్గరెట్ యాక్టివేర్కు సంబంధించిన డీసెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘బ్లిస్క్లబ్’ స్టార్టప్ ఆలోచనవచ్చింది.‘యాక్టివేర్ రంగంలోని కంపెనీలు డిజైన్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తాయి. మేము మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నాం. బ్లిస్క్లబ్కు డిజైన్ క్లబ్ లేదు. ప్రాడక్ట్ ఇంజినీరింగ్ టీమ్ మాత్రమే ఉంది. ఈ టీమ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యాక్టివేర్ సౌలభ్యానికి సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడం. ఉదాహరణకు చెన్నైలోని ఒక మహిళ గురించి. వేడి వాతావరణంలో ఆమెకు లెగ్గింగ్స్ ధరించడం కష్టమయ్యేది. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని వేడివాతావరణంలో కూడా సౌకర్యంగా ఉండే లెగ్గింగ్స్ను డిజైన్ చేశాం’ అంటుంది మార్గరెట్.దేశంలో తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్చెరకు, బయోప్లాస్టిక్కు సంబంధించిన ఆపరేషన్లలో యువ మార్గదర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అవంతిక సరౌగి. కాలిఫోర్నియాలో చదువుకున్న అవంతిక తమ బల్రామ్పూర్ చినీ మిల్స్ లిమిటెడ్ (బీసిఎంఎల్)ను పీఎల్ఏ (పాలీలాక్టిక్ యాసిడ్) తయారీ సౌకర్యాన్ని అందించే కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉంది. ఇది మన దేశంలోని మొట్ట మొదటి బయోప్లాస్టిక్ ప్లాంట్ కానుంది. పీఎల్ఏ అనేది చెరకు పునరుత్పాదక వనరుల నుండి తయారైన బయో ఆధారిత, కంపోస్టబుల్, తక్కువ ఉద్గారాల ప్లాస్టిక్. దీనిని సాధారణంగా ΄్యాకేజింగ్, త్రీడి ప్రింటింగ్లో ఉపయోగిస్తారు. మన దేశంలోని ఈ తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్ వల్ల బీసిఎంఎల్ లాభాల బాటలో పయనించనుంది. టర్నోవర్ పెరగనుంది. పర్యావరణ అనుకూలంగా కూడా మారనుంది.తరగతి గదినిమార్చేలావినూత్నమైన ఆలోచన విధానంతో విద్యా, సాంకేతిక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ పరిత పరేఖ్. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకుంది. బ్రౌన్ తరువాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ‘ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్’పై మాస్టర్స్ చేసింది. స్టాన్ఫోర్డ్లో చదువుకునే రోజుల్లో పిల్లల విద్యావిధానం మీద దృష్టి పెట్టేది. స్టాన్ఫోర్డ్లో చేసిన పరిశోధనలు, నేర్చుకున్న ఆధునిక సాంకేతిక విషయాలు ఆమెను ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు నడిపించాయి.కట్టింగ్–ఎడ్జ్ ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్ఫామ్ ‘టొడెల్’తో ఎంటర్ప్రెన్యూర్గా ప్రస్థానాన్ని ప్రారంభించింది పరిత. మూస బోధన పద్ధతులకు అతీతంగా ఆధునిక బోధన పద్ధతులు, ఆలోచనలతో ‘టొడెల్’ ప్లాట్ఫామ్కు రూపకల్పన చేసింది. ‘టొడెల్’ ప్రభావంతో చాలా బడులలో ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే సంప్రదాయ, ఆధునిక విద్యాబోధనలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ‘టొడెల్’ కృషి చేస్తోంది. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెం పొందించే ప్రణాళికలతో ‘టొడెల్’ విద్యాప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది.చిన్న గదిలో మొదలై...కోట్ల టర్నోవర్ వరకుబెంగళూరులోని చిన్న గదిలో మొదలైన ‘యానిమల్’ రూ.550 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ స్థాయికి చేరింది. ఐఐటీ–దిల్లీలో చదువుకున్న కీర్తి జాంగ్ర, నీతూ యాదవ్ల బ్రెయిన్ చైల్డ్ ‘యానిమల్’. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అవ్యవస్థీకృతంగా ఉన్న మన దేశంలోని పశువుల మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.పశువుల క్రయవిక్రయాలలో ‘యానిమల్’ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. తమ స్టార్టప్ను ప్రారంభించడానికి ముందు సర్వే నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు కీర్తి, నీతూ యాదవ్. డైరీ ఇండస్ట్రీలో కీలకమైన మార్పు తేవాలనుకున్న కీర్తి, నీతూ యాదవ్లు ‘యానిమల్’ యాప్తో తమ కలను నిజం చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మనం ఉన్న చోటు నుంచే వందల కిలోమీటర్ల దూరంలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్న ప్రదేశం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది. అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్ఎస్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. కుటుంబ నేపథ్యం..ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి. (చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..) -
అమ్మ... నాన్న... నాలుగో సింహం
అణువంత ప్రోత్సాహంతో అంతులేనన్ని విజయాలు సాధిస్తామని నిరూపించారు. అపజయాలెన్ని ఎదురైనా వెరవకుండా లక్ష్యాన్ని సాధించి చూ పారు. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం.. భరోసాతో దేశంలోనే అత్యున్నత సర్వీస్లలో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపికై శభాష్ అనిపించుకున్నారు. ఓ కూతురు కండక్టర్ అయిన తన తండ్రి కల నెరవేర్చితే... మరో కూతురు తన తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో సమాజ సేవకు సిద్ధమైంది.అమ్మ అండతో సాటి మహిళలకు భరోసాగా నిలిచే పోలీస్ అధికారి అవుతానని మరొకరు నిరూపించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 174 మందిలో 77 ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్) బ్యాచ్ ఐపీఎస్ అధికారులు నేడు నిర్వహించనున్న పాసింగ్ ఔట్పరేడ్తో (passing out parade) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్లోని ముగ్గురు మహిళా ఐపీఎస్ల మనోగతం.. వారి మాటల్లోనే...అమ్మ ఇచ్చిన భరోసాతోనే ముందుకు వెళ్లా!నేను ఐపీఎస్ అధికారి అయ్యానంటే అందుకు వందశాతం మా అమ్మే కారణం. నేను ఓటమి పాలైన ప్రతిసారి నాలో ధైర్యాన్ని నింపింది అమ్మ. ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రతిసారీ నాకు భరోసా ఇచ్చి నన్ను ఇక్కడివరకు నడిపింది మా అమ్మ నీతూశర్మే. నా పేరు జయశర్మ. నా స్వస్థలం హర్యానాలోని హిస్సార్. మా నాన్న ప్రమోద్ కుమార్ శర్మ. నాన్న డిస్ట్రిక్ట్ ఫుడ్ సప్లై కంట్రోలర్గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాను. నాకు ఐపీఎస్ కావాలని చిన్ననాటి నుంచే కల. అమ్మ ప్రోత్సాహం, నాన్న అండతో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టా. ఇది ఎంతో కష్టమైన పని. కొన్నిసార్లు మనపై మనం నమ్మకాన్ని కోల్పోతాం. ఇది మన వల్ల కాదనిపిస్తుంది. అలాంటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్లు, భరోసా ఇచ్చేవాళ్లు ఎంతో అవసరం. నేను కూడా మూడుసార్లు సివిల్స్కి ఎంపిక కాకపోయినా నిరుత్సాహ పడలేదు. తప్పులు సరిచేసుకుంటూ ముందు వెళ్లా. ఐపీఎస్ ఎలాగైనా సాధించాలన్న నా పట్టుదలకు తోడు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. నాల్గో ప్రయత్నంలో నేను అనుకున్నట్టుగానే ఐపీఎస్కి ఎంపికయ్యాను. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పూర్తిగా భిన్నమైంది. నేను ఎన్ పీఏలోకి రాకముందు కనీసం వంద మీటర్లు కూడా పరిగెత్తినట్టు గుర్తు లేదు. కానీ ఇక్కడ శిక్షణతో ఇప్పుడు ఒంటిపై బరువు, చేతిలో రైపిల్తో 40 కిలోమీటర్లు కూడా రన్నింగ్ చేసేంత స్థై్థర్యం వచ్చింది. మహిళా ఐపీఎస్ అధికారిగా మహిళా భద్రత, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతాను. – జయశర్మనాలుగుసార్లు ఓడినా.. నాన్న ప్రోత్సాహం తగ్గలేదుమా స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. నాన్న బస్ కండక్టర్గా పనిచేసి ఈ ఏడాది రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి. మా అక్క ప్రైవేటు ఉద్యోగిని. మేం ఇద్దరమూ అమ్మాయిలమే అయినా.. నాన్న మమ్మల్ని అన్నింటిలో ప్రోత్సహించేవారు. నేను అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేశాను. ప్రభుత్వ అధికారిగా ఉంటేనే సమాజానికి దగ్గరగా పనిచేయవచ్చని నాకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఇంజినీరింగ్ తర్వాత ప్రైవేటు ఉద్యోగాలవైపు వెళ్లలేదు. తమిళనాడులో స్టేట్ జీఎస్టీ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాను. కానీ.. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ను చేయాలన్నది నాన్న కల. అయితే సివిల్స్ కు ఎంపిక కావడం అంత సులువేం కాదు. ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఎప్పటికప్పుడు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వ్యక్తిగతంగా నోట్స్ తయారు చేసుకుంటూ నా ప్రయత్నాన్ని కొనసాగించాను. చివరికి విజయం దక్కింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశంతో పాటు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్. ఈ శిక్షణ తర్వాత నేను ఎంతో భరోసాగా చెప్పగలను – పోలీస్ ఉద్యోగం మహిళలు కూడా ఎంతో బాగా చేయగలరని! మా బ్యాచ్లో కూడా 65 మంది మహిళా ఐపీఎస్లు ఉండడమే అందుకు ఉదాహరణ. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి నా సలహా ఒక్కటే..సివిల్స్ సాధించడం అనేది మీ లక్ష్యం అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మధ్యలో వదలొద్దని ముందే నిర్ణయించుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడు విజయం మనదే.– అశ్విని.ఎస్నాకు స్ఫూర్తి మా నాన్నేనాన్న ఎయిర్మెన్ గా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేసి రిటైర్ అయ్యారు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండేది. నా చిన్నప్పటి నుంచి నాన్నను అలా యూనిఫాంలో చూస్తూ పెరగడంతో నాకు కూడా యూనిఫాం సర్వీసెస్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఆయనే నాకు ఎప్పటికీ స్ఫూర్తి. స్కూలింగ్ పూర్తయి, కాలేజీకి వచ్చాక నాకు స్పష్టత వచ్చింది ఐపీఎస్ అధికారి అయితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని. అందుకే ఎప్పటికైనా ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లా. గ్జేవియర్స్ కాలేజ్ కోల్కతా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయి తర్వాత నేను మొదటి ప్రయత్నంలో సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఎంపికయ్యాను. 2020 లో ట్రైనింగ్ చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాను. చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు ఎంపికయ్యాను. అయినా, ఐపీఎస్ కలను వదల్లేదు. నాల్గో ప్రయత్నంలో నాకు ఐపీఎస్ (IPS) వచ్చింది. నాన్న ఎయిర్ఫోర్స్లో పనిచేయడం.. మొదటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరగడంతో ఇక్కడి ట్రైనింగ్ కష్టంగా అనిపించలేదు. సులువుగానే శిక్షణ పూర్తి చేశా. ఇక్కడ నేర్చుకున్న విషయాలు వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగా నన్ను ఎంతో మార్చాయి. నాకు తెలంగాణ పోలీసులో మహేశ్ భగవత్ ఇన్స్పిరేషన్. ఐపీఎస్ అధికారిగా నేను మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను హర్యానాలో పుట్టిపెరిగాను. అక్కడి పరిస్థితులు చూశాక.. మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.– కీర్తియాదవ్ -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
జెండర్ ‘బౌండరీ’ దాటిన ఫస్ట్ కామెంటేటర్
దారులు ఏర్పరచేవారెప్పుడూ ఒంటరిగానే బయలుదేరుతారు! చెప్పకనే ఆ బాటను పదిమందికీ గమ్యంగా మారుస్తారు. అలా పురుషుల రంగమైన క్రికెట్లో మహిళలను కామెంటరీ బాక్స్ వరకు నడిపించిన వ్యక్తి చంద్ర నాయుడు. ఆమెను పరిచయం చేస్తోంది ఈ వారం పాత్ మేకర్..ఇప్పుడిప్పుడే క్రికెట్లో మహిళల ఉనికి, ఉన్నతి కనిపిస్తోంది. కామెంటరీ రంగంలోనూ మహిళా గళాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ నేపథ్యం కాకపోయినా మందిరా బేడీ క్రికెట్ యాంకర్గా, కామెంటేటర్గా కనిపించి, వినిపించి కలకలం రేపింది. అంజుమ్ చో్రపా, ఇసా గుహా, లీసా స్థాలేకర్, స్నేహల్ ప్రధాన్ లాంటి క్రికెటర్స్ కూడా ఆట నుంచి రిటైరైపోయి కామెంటేటర్స్గా మారినవారే! వీళ్లందరికీ ఆ ధైర్యం, స్ఫూర్తిని పంచింది మాత్రం 1970ల్లోని క్రికెట్ ప్లేయర్.. చంద్ర నాయుడు. మగాళ్లే వినిపించే క్రికెట్ వ్యాఖ్యానంలోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ రంగంలో మహిళలు రావడానికి దారిని ఏర్పరచారు.ఘనకీర్తి వారసత్వంచంద్రనాయుడు.. దేశపు తొలి టెస్ట్మ్యాచ్ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు కూతురు. 1932లో లార్డ్స్ స్టేడియంలో మన దేశం ఇంగ్లండ్తో ఆడిన తొలి టెస్ట్మ్యాచ్లో మన జట్టుకు ఆయనే సారథ్యం వహించారు. అతని సోదరులైన సీఎల్ నాయుడు, సీఆర్ నాయుడు, సీఎస్ నాయుడు కూడా క్రికెటర్లే. అలా క్రికెట్ కుటుంబంలో పుట్టిన చంద్ర నాయుడు రక్తంలో కూడా క్రికేట్ ఉండటంతో ఊహ తెలియని వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారావిడ. ఊహ తెలిసేప్పటికి ఆమె ఆసక్తి, ఇష్టం అన్నీ క్రికెటే అయ్యాయి. ప్రాక్టీస్తో ఆటలో ప్రావీణ్యం సంప్రాదించి దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.సల్వార్, కమీజ్తో రోల్ మోడల్గా.. ఇటు చదువు.. అటు ఆటలు.. రెండిట్లోనూ చంద్ర చురుకే! 1950ల్లో తన కాలేజీ రోజుల్లో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సల్వార్, కమీజ్తోనే క్రికెట్ ఆడేవారు ఆమె. ఈ ఆట కోసం ΄్యాంట్, షర్ట్ ధరించాల్సిన అవసరం ఉండదని, సంప్రదాయ దుస్తుల్లోనే చక్కగా ఆడొచ్చని తోటి అమ్మాయిలు గ్రహిస్తారని! క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్లోకి వీలైనంత ఎక్కువ మంది అమ్మాయిలు రావాలని చంద్ర ఆశించారు. అందుకే స్పోర్ట్స్వేర్తో వాళ్లు వెనుకడుగు వేయకుండా తనను ఓ రోల్మోడల్గా చూపేందుకు ప్రయత్నించారు ఆమె.ట్రయల్ బ్లేజర్ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ ఆట నుంచి ఆమె దృష్టి క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం మీదకు మళ్లింది. రంజీ ట్రోఫీ మ్యాచ్ల కోసం రేడియోలో వ్యాఖ్యానం చెప్పడం మొదలుపెట్టారు. ఆల్ ఇండియా రేడియో కోసం కాకుండా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల కోసం నేరుగా వ్యాఖ్యానం చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ అవకాశం 1977లో వచ్చింది బాంబే (అప్పటి) – మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్తో! ఆ ఆటను వ్యాఖ్యానించడానికి స్టేడియంలో తొలిసారిగా మైక్ పట్టుకున్నారు చంద్ర నాయుడు. ఆ సందర్భమే ఆమెను తొలి మహిళా కామెంటేటర్ అనే ఖ్యాతిని తెచ్చి పెట్టింది. చరిత్రలో నిలిపింది. భారతీయ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్లోనే ఓ సంచలనంగా మారింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్కి ఆల్ ఇండియా రేడియోలో ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి బీబీసీ మేల్ కామెంటేటర్స్ అబ్బురపడ్డారట.టీచర్గా ...క్రికెట్ కామెంటరీ నుంచి రిటైరయ్యాక చంద్ర నాయుడు ఇండోర్ వెళ్లిపోయి.. అక్కడి ప్రభుత్వ మహిళా పీజీ కాలేజ్లో లెక్చరర్గా చేరారు. చివరి వరకు అక్కడే పనిచేసి ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. ఆమె తండ్రి తొలి టెస్ట్ మ్యాచ్కి ఎక్కడైతే కెప్టెన్గా వ్యవహరించారో అక్కడే ఆ లార్డ్స్ స్టేడియంలోనే 1982లో ఇండియా, ఇంగ్లండ్కు మధ్య జరిగిన గోల్డెన్ జుబ్లీ టెస్ట్ మ్యాచ్కు చంద్ర నాయుడు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఆమె ఇండోర్లో.. 2021, ఏప్రిల్లో తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. -
పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి డబ్బుల్లేక అలా చేశా!
కష్టపడి చదువుకోవడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్ను అందుకోవడం మరో ఎత్తు. గ్రాడ్యుయేషన్ విద్యార్థుల జీవితాల్లో, కరియర్లో అదొక అద్భుతమైన అనుభూతి. గ్రాడ్యుయేషన్ డ్రెస్లో తోటివారితో పాటు వేదికపై నిలబడటం, హితులు, సన్నిహితుల సమక్షంలో గర్వంగా పట్టా పుచ్చుకోవడం అనేది చాలా అరుదుగా సాధించగల అనుభూతి. కానీ అలాంటి ఆనందాన్ని మిస్ అవడం నిజంగా చెప్పలేనంత దురదృష్టమే. అలాంటి అనుభవాన్ని డిజిటల్ క్రియేటర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నెట్టింట పలువురి హృదయాలను దోచుకుంది.డిజిటల్ క్రియేటర్, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆరోజు కేవలం జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్ చేశారు."నేను నా స్వంత గ్రాడ్యుయేషన్కు అతిథిగా ఉన్నాను" అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్లోచేసిన పోస్ట్ వైరల్గా మారింది. అప్పట్లో ఆ వేడుకకు డబ్బు చెల్లించడం కంటే నెల గడవడమే తనకు ముఖ్యమని ఫజాలి పేర్కొన్నారు. నిజంగా ఆ క్లోక్ ధరించాలని చాలా కోరిక ఉండేదని, కానీ మిస్ అవ్వడం తీపి చేదు కలయిక క్షణాలని, వేడుకకు అతిథిగా హాజరు కావాలనే తన నిర్ణయం అత్యంత దారుణమైందని గుర్తు చేసుకున్నారు. అయితే తనను ప్రోత్సహించిన తన తోటివారిని అభినందించే అవకాశం వచ్చినందుకు సంతోషించాననీ, కనీసం ఆ ఆనంద జ్ఞాపకాలు తనలో మిగిలాయని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rashika Fazali (@rashikariri)బిడ్డకు తల్లిగాఒక బిడ్డకు తల్లిగా క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రషికా మెరిట్తో పట్టభ్రదురాలైంది. రిసెర్చ్లో డిస్టింక్షన్ తెచ్చుకుంది. అదీ చిన్ని పాపాయిని ఎత్తుకుని ఎవరి సాయం లేకుండానే, మాస్టర్స్ సాధించానంటూ గర్వంగా చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. అయ్యో... అప్పుడు తమకీ విషయం తెలిసి ఉంటే, సాయం చేసేవారమని చాలామంది కమెంట్ చేశారు. "ఎంత గొప్ప విజయం! భవిష్యత్తులో ఇంకా సాధిస్తారు! అలా కూర్చోవడానికి చాలా ధైర్యం అవసరం! అని ఒకరు, ‘‘గ్రాడ్యుయేషన్కు అభినందనలు మీరు నిజంగా క్వీన్," మరొకరు కామెంట్ చేశారు. నాకు తెలిసి ఉంటే కచ్చితంగా సాయం చేసే దాన్ని.. సాయంగానో, ఉపకారంగానో కాదు ఒకబిడ్డకు తల్లిగా ఇది సాధించడంఎంత కష్టమో తెలుసు అన్నారు మరొకరు. -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
పాలిటిక్స్లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్కి మోస్ట్వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది..దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!
చదువు అయిన తరువాత ఉద్యోగం రావడం అంత సులువుకాదు. అదీ మన మనసుకు నచ్చిన జాబ్ రావడమంటే జాక్ పాట్ కొట్టినంత ఆనందమే. దీనికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు , తెగువ, స్మార్ట్నెస్ కూడా ఉండాలని నిరూపించిందో యువతి. కేవలం అయిదే అయిదు నిమిషాల్లో ఉద్యోగాన్ని సాధించిన యువతి స్టోరీని టెక్ కంపెనీ సీఈవో సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట హల్చల్ చేస్తోంది.కోడ్ ఆఫ్ అజ్ CEO సాండి స్లోంజ్సాక్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఐదు నిమిషాలు మాట్లాడిన తరువాత ఒక కళాశాల విద్యార్థినిని తాను నియమించు కున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మనోధైర్యం, తెలివి, నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. "తమ కంపెనీలో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు లేకపోయినా ... ఓపెన్ లెటర్ దరఖాస్తు పంపే ధైర్యం ఉంది, తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడమేకాదు, కష్టపడి పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది" అని చెప్పుకొచ్చారు. ఆమె సూపర్ కమ్యూనికేటివ్, స్ట్రెయిట్ షూటర్. చాలా స్మార్ట్, చాలా వినయంతో ఉంది. జీతం గురించి పట్టించుకోనని తెలిపిందంటూ ట్వీట్ చేశారు. ఖాళీ సమయంలో తన సొంత ప్రాజెక్టులలో పనిచేసిందని చెప్తూ, కృషి అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఆమె నిజాయితీ, అభిరుచి, పట్టుదల తనను చాలా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మూడు నెలల కనీస వేతనంతో జాబ్ ఆఫర్ చేసి, రేపటినుంచే ఉద్యోగంలో చేరిపోవచ్చని ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. (హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!)today i hired a college student after just 5 minutes of talking to her1. had the guts to send an open letter application although we had no job openings 2. straight up admitted she knows nothing3. told she’s willing to work as an animal to learn as much as she can4. open…— Sandi Slonjšak (@sandislonjsak) October 8, 2025సోషల్ మీడియా రియాక్షన్సోషల్ మీడియాలో సీఈవో, విద్యార్థిని ఇద్దరిపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.‘నిజమైన రత్నాన్ని గుర్తించారు.. మీ కంపెనీలో నేర్చుకోవాలనే ఆమె ఆసక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందా? అనే అసక్తిని ప్రదర్శించారు. రిక్రూటర్లు అందరూ మీలా వుండరు సార్ , ఆమెకు ఎంచుకున్నందుకు సంతోషం, ఆమెను మీ ఆధ్వర్యంలో బాగ నైపుణ్యాన్ని సాధిస్తుందని మరొకరు కమెంట్ చేశారు.చదవండి: జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి! -
సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేసేలా ప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం అంటూ గగ్గోలు పెడుతున్నారు పర్యావరణ వేత్తలు. అన్నింటిలో ప్లాస్టిక్ ఆవరించేసిందంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడమే తప్ప, నిర్మూలించే దిశగా అడుగులు పడవు. కానీ ఈ మహిళలు..ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్లాస్టిక్ని నాటి సంప్రదాయం తిరిగి పురుడుపోసుకునేలా చెక్పెట్టేందుకు నాంది పలికారు. సాదికారతకు బీజం వేసేలా సంప్రదాయం, పర్యావరణ హిత సమ్మిళితంగా సాగిపోతున్న వారి దృఢ సంకల్పానికి హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే. ఇదంతా చెన్నైలో చోటుచేసుకున్న అద్భుత చైతన్యంగా పేర్కొనవచ్చు. చెన్నై అనగానే మెరీనా బీచ్, ఆవిరి ఫిల్టర్ కాఫీ, పురాతన దేవాలయాలే కాదు..వినూత్న పద్ధతిలో ప్లాస్టిక్కి చెక్పెడుతున్న ఈ మహిళలు కూడా ఇప్పుడు ఠక్కున గుర్తొస్తారు. ఎందుకంటే వీళ్లు చేస్తున్న సాధికారతతో కూడిన పర్యావణ హిత ఉద్యమం యావత్తు దేశాన్ని ఆకర్షించేలా హైలెట్గా నిలిచింది. చేస్తున్న ప్రయత్నం చిన్నదైనా..ప్రభావం మాములుగా లేదు అనిపించుకున్నారు ఈ వనితలు. తమిళనాడు ప్రభుత్వం పర్యావరణ అనుకూల ప్రాజెక్టులో భాగంగా మహిళా సంఘాలకు ఆకుపచ్చని ఎలక్ట్రిక్ ఆటోలు అందించి సాధికారత, సంప్రదాయాన్ని మిళితం చేసేలా పర్యావరణ హితంగా నడిపిస్తోంది. వీరంతా ఆకుపచ్చ మొబైల్ ఆటోల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధినే కాదు, పర్యావరణ సంరక్షణ కోసం తమ వంతు తోడ్పాటును అందిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్లు ఈ మొబైల్ ఆటోల సాయంతో తాజా కూరగాయలను కస్టమర్లకు చేరవేయడమే కాదు, వాటిని పసుపు పచ్చ బ్యాగుల్లోనే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. పాతకాలం నాటి పసుపురంగు కాటన్ సంచులకు ప్రాణం పోసి నాటి సంప్రదాయన్ని గుర్తుచేయడమే కాదు..పర్యావరణ సంరక్షణకు బాటలు వేస్తున్నారు. అంతేగాదు కేవలం కూరగాయలు అమ్మడమే కాదు, ఈ ప్లాస్టిక్ భూతం మన జీవితాన్ని ఎలా కబిళిస్తుంది, ఎలా మన జీవితాల్లో స్థిరపడిపోయిందో వివరిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ చెన్నై మహిళలు. ఆకుపచ్చని ఆటోలతో పచ్చదన సంరక్షణ నినాదం తోపాటు తిరిగి ఉపయోగించే ఈ పర్యావరణ హిత పసుపు సంచులనే వాడుదాం అని విషయాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేస్తున్నారు. అందుకే ఈ సంచులను తమిళంలో మంజపైస్(మళ్లీ వినియోగించే పసుపు సంచులు) అని పిలుస్తారు. ఇక ఈ ఆటోలు కూడా కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహనాలే కావడం విశేషం. మొత్తం ఈ ప్రాజెక్టు కార్యచరణ మొత్త పర్యావరణ సంరక్షణకే పెద్దపీట వేసేలా జాగ్రత్త తీసుకుని స్త్రీ సాధికారతను ప్రోత్సహించి..అందిరిచే ప్రశంలందుకుంది అక్కడి ప్రభుత్వం. ఇది ఒకపక్క జీవనోపాధి, మరోవైపు సాధికారణ, సంప్రదాయ మిళిత పర్యావరణ హితానికి అంకురార్పణ చేయడమే గాక పెనుమార్పుకి నాంది పలికింది కదూ..!. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!
సొంతింటి కల అనేది చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. అంతేకాదు తమలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్దిదాయకమైన స్టోరీ ఒకటి ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.పదండి ఆ వివరాలు తెలసుకుందాం.భారతదేశంలో ఇల్లు కొనడం దశాబ్దాల కష్టం దాగి ఉంటుంది. అదీ ఒక మామూలు శ్రామికమహిళకు ఇంకా కష్టం. సూరత్కు చెందిన ఒక ఇంటి పని మనిషి కొత్త చరితను లిఖించింది ఎన్నో అవమానాల్ని, అవహేళల్ని తోసి రాజని సొంతింటి కలను నెరవేర్చుకుంది.సూరత్లో కేవలం రూ. 10 లక్షల రుణంతో రూ. 60 లక్షల 3BHK ఫ్లాట్ను కొనుగోలు చేసింది.ఈ విషయాన్ని ఆమె యజమాని నళిని ఉనగర్ ఈ స్టోరీని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని, చాలా సాధారణంగా తనతో మాట్లాడుతూ సూరత్లో తాను రూ.60 లక్షల అపార్ట్మెంట్ కొన్నానని చెప్పిందని తెలిపింది. అంతే కాదు, ఆమె ఇప్పటికే రూ.4 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు చేసిందట ఇందుకోసం ఆమె తీసుకున్న కేవలం రూ.10 లక్షల రుణంతో ఇవన్నీ చేసుకుంది.. దీనికి నిజంగా షాకయ్యాను అంటూ నళిని ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!దీనికి ఒక యూజర్ స్పందిస్తూ'మీరు ఎందుకు షాక్ అవుతున్నారు? ఆమె విజయానికి సంతోషించండి!' అన్నదానికి రిప్లై ఇస్తూ 'సంతోషంగా ఉన్నాను. కానీ సమాజంలొ తరచుగా ఇంటి పనిలో ఉన్నవారు పేదోళ్లనే చులకన భావం ఉంటుందనీ, కానీ చాలామంది డబ్బును తెలివిగా మేనేజ్ చేసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాదు మరికొందరు కేఫ్లు, గాడ్జెట్లు , ట్రిప్లపై డబ్బు ఖర్చు చేస్తారని ఆమె కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మ్యేజికో,మంత్రమో కాదు, ఆమె ఆర్థిక నిర్వహణకు, తెలివిగా పొదుపు చేసిన వైనానికి నిదర్శనమంటూ ప్రశంసించారు. -
ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..
అత్యంత ప్రతిష్టాత్మకమైన కఠినమైన ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్. అలాంటి సివిల్స్ ఎగ్జామ్స్లో సత్తా చాటి ఐఏఎస్ కావాలనేది ఎందరో యువత కల. అందరు ఒక్కోలా తపించి కలను సాకారం చేసుకుంటుంటారు. కానీ ఈమె అత్యంత విభిన్న పద్ధతిలో తన డ్రీమ్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సాధించాలనుకునేవాడికి సవాలక్ష మార్గాలు తన కళ్లమందు ఉంటాయనేందుకు ఉదాహరణగా నిలిచింది.ఆ అమ్మాయే అంకిత కాంతి(Ankita Kanti,). ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని చమోలి జిల్లాలోని చిర్ఖున్ అనే చిన్న గ్రామానికి చెందిన అంకిత కాంతి కుటుంబం మధ్యతరగతి నేపథ్యానికి చెందిన అతి సామాన్య కుటుంబం. ఆమె తండ్రి దేవేశ్వర్ కాంతి బ్యాంకులకు నగదు తీసుకెళ్లే పనిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఉషా కాంతి గృహిణి. బాల్యం నుంచి అంకిత కాంతి చదువులో మంచి ప్రతిభను చాటుకుంది. ఆమె తుంటోవాలాలోని డూన్ మోడరన్ స్కూల్, కర్బరిలోని సంజయ్ పబ్లిక్ స్కూల్లలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. పదోతరగతి పరీక్షలో 92.40% మార్కులు సాధించింది. తర్వాత 2018లో 12వ తరగతి పరీక్షలలో 96.4% మార్కులు సాధించి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికే నాల్గవ టాపర్గా నిలిచింది. ఇక డీబీఎస్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, ఎంఎస్సీ పూర్తి చేసింది. అయితే అప్పటి నుంచే ఆమె యూపీఎస్సీ సివిల్స్(UPSC Civil Services Examination (CSE))కి సన్నద్ధమైంది. కానీ సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థుల్లా కాకుండా..స్వీయంగా సన్నద్ధమైంది. అయితే ఆమె హిందీ మాధ్యమంలో ఈ సివిల్స్ 2024 ఎగ్జామ్ని రాసి ఆల్ ఇండియా ర్యాంకు 137 సాధించి, ఐఏఎస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకుందామె. దీంతో అంకిత తొలిసారగా హిందీ మాధ్యమంలో పరీక్ష రాసి.. టాపర్గా నిలిచిన అమ్మాయిగా వార్తల్లో నిలిచింది. ఆమె చెల్లెలు కూడా బ్యాంకు ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం ఆమె కూడా తన అక్క అంకిత అడుగుజాడల్లో వెళ్తోంది. అంజలి కూడా ప్రస్తుతం యూపీఎస్సీకి ప్రిపేరవ్వుతోంది. ఎక్కడ నియమించారంటే..ప్రస్తుతం ఆమె ట్రైనింగ్లో ఉంది. అధికారికంగా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదామెకు.చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..! -
నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోమహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.గూగుల్లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025ఎవరీ రాగిణి దాస్?గురుగ్రామ్లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో 2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్లైన్ క్లబ్ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్గా ఎంపికకావడం విశేషం. -
రిపోర్టింగ్... ఓ వార్!
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్. అంతేకాదు ఎయిమ్స్లోని మెడికల్ స్కామ్నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్తో యుద్ధ ట్యాంక్ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం! జర్నలిజం.. వార్ రిపోర్టింగ్ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్ను తిరస్కరించి.. కీలకమైన అసైన్మెంట్స్కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లో ఉన్న తన పేరెంట్స్ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్ను పత్రికా ఆఫీస్కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు. సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే. -
తొలి మహిళా సైన్స్ లెక్చరర్
అది 1930. దేశ రాజధాని ఢిల్లీలో రాధ (Dr. Radha Pant ) బీఎస్సీ చదవాలని కలలు కంటోంది. అప్పటికి డిగ్రీ స్థాయిలో సైన్స్ చదివే అవకాశం మహిళ లకు ఏ కళాశాలలోనూ లేదు. తండ్రి కాలేజీల చుట్టూ తిరగడం, వెనక్కి రావడం... రెండేళ్లయ్యింది. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గడం లేదు; ‘అవసరమైతే గాంధీ మహాత్ముడిలా సత్యా గ్రహం చేస్తాను హిందూ కాలేజీ ఎదుట’ అనేదాకా వెళ్ళింది. అలా బీఎస్సీ సైన్స్ డిగ్రీలో హిందూ కళాశాలలో ప్రవేశం దొరికింది. కేరళలోని పాల్ఘాట్ ప్రాంతం కల్పతి గ్రామంలో 1916 సెప్టెంబర్ 5న రాధ జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి 1940లో పీహెచ్డీ సాధించారు. పీహెచ్డీ కొరకు 2, 4 డై మీతోక్సి ఐసోఫ్తలి కామ్లం; 2, 6 డై హైడ్రాక్సి ఐసోథాలికామ్లాలను తొలిసారి తయారు చేసిన శాస్త్రవేత్త రాధ. బొంబాయి హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్ వారి న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ విభాగంలో సీనియర్ రిసెర్చ్ ఫెలోగా పని చేస్తూ... ఎంతోకాలంగా ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ... ‘సోయా కన్నా శనగలే మేలైన పోషక విలువలు కలిగి ఉన్నాయని’ రుజువు చేశారు. 1945లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో తొలి మహిళా అధ్యాపకురాలిగా బయోకెమిస్ట్రీ నేపథ్యంతో చేరారు. అనతి కాలంలోనే అదే విశ్వవిద్యాలయంలో బోటనీ ప్రొఫెసర్గా పని చేస్తున్న దివ్య దర్శన్ పంత్ను వివాహం చేసుకున్నారు. 1954–56 మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ యూని వర్సిటీ ఆఫ్ లండన్ వెళ్లి పోస్ట్ డాక్టోరల్ పట్టాలు పొందారు. ‘ఎవర్ ఎ ఫైటర్ ’ పేరుతో రాధా పంత్ తన జ్ఞాపకాలను రాసుకున్నారు. 1956లో అలహాబాద్ యూనివర్సిటీలో తను పరిశోధనను కొనసాగించాలను కున్నప్పుడు ఆ విభాగంలో కేవలం 6 గదులు మాత్రమే ఉన్నాయనీ; ఇక పరిశో ధనకు కావలసిన గ్రంథాలు, వసతులు ఏమాత్రం లేవనీ చెప్పారు. అటువంటి అలహాబాద్ యూనివర్సిటీలోనే 1968లో జీవరసాయన శాస్త్ర విభాగంలో ఎంఎస్సీ కోర్సును ప్రారంభించ గలిగారు. రాధా పంత్ బృందం హృదయ రోగాలు, పట్టుపురుగులు ఇలా అనేక విభిన్న అంశాల మీద విలువైన ఫలితాలు సాధించారని ‘ద బయో కెమిస్ట్’ జర్నల్లో కుసుమ్ పంత్ జోషి పేర్కొన్నారు. పట్టుపురుగులకు సంబంధించి రాధా పంత్ కృషి గురించి ఫ్రెంచ్ జర్నల్ ‘సెరికొలో జియా’ ఒక ప్రత్యేకమైన ప్రచురణని వెలవరించిందంటే ఆమె స్థాయి ఏమిటో గమనించవచ్చు. 2003 డిసెంబర్ 19న కన్నుమూసిన రాధ చిరస్మరణీయురాలు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
అంబర్ పేట బిడ్డకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ డాక్టరేట్
అంబర్ పటేల్ నగర్కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి కూన ప్రియదర్శిని కి ఆగ్రా లోని రాడిసన్ హోటలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ ద్వార భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించారు. సినీ నటి మరియు విఖ్యాత భరతనాట్య కళాకారిణి సుధా చంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఈ పురస్కారాలు తీసుకున్నందుకు కారకులైన తన గురువులకు మరియు తల్లిదండ్రులకు డాక్టర్ కూన ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సిరాజ్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్సీఎల్ అధినేత్రి రోష్నీ నాడార్ మల్హోత్రా సరికొత్త రికార్డులు సృష్టించారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్లిస్ట్-2025 దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. రూ.2.84 లక్షల కోట్లతో సంపదతో మూడో స్థానం కైవసం చేకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ రూ.8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండో స్థానంలో నిలిచారు. ఎం3ఎం ఇండియా, హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్ను విడుదల చేశాయి. ఆ జాబితాలో దేశంలోని ధనవంతుల జాబితాలో మూడో స్థానం దక్కించుకుని సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. హురున్ ధనవంతుల జాబితాలో టాప్ -10లో నిలిచిన పిన్న వయస్కురాలు ఆమే కావడం గమనార్హం. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రోష్నీ నాడార్ మల్హోత్రా రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నా.. ఆమె సంపద వారసత్వంగా వచ్చింది. కాబట్టి ఆమె సెల్ఫ్మేడ్ విమెన్ జాబితాలో ఆమె లేరు. అయినప్పటికీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్నీ నాడార్. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని, తనదైన శైలిలో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. సామాజిక సేవా రంగంలోనూ విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్లిస్ట్-2025లో చోటు దక్కించుకున్న సెల్ఫ్ మేడ్ విమెన్ ఆంత్రపప్రెన్యూర్ల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. 1.జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)భారతదేశంలో స్వయం- నిర్మిత మహిళా మిలియనీర్ల జాబితాలో అరిస్టా నెట్వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. సంపద రూ. 50,170 కోట్లు. అరిస్టా నెట్వర్క్స్ అధ్యక్షురాలు సీఈవో జయశ్రీ ఉల్లాల్ 2008 నుండి దేశంలోనే ప్రముఖ కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థలలో ఒకటైన అరిస్టా నెట్వర్క్స్ను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ గత సంవత్సరం 7 బిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం పెరిగింది.2. రాధా వెంబు (Radha Vembu)జోహో కార్ప్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న రాధా వెంబు రెండవ స్థానంలో ఉన్నారు. రూ. ఆమె సంపద రూ. 46,580 కోట్లు. జోహోను ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి స్థాపించారు. ఆయన 1996లో అడ్వెంట్నెట్గా వ్యాపారాన్ని ప్రారంభించారు.3. ఫల్గుణి నాయర్ (Falguni Nayar)సౌందర్య ఉత్పత్తుల దిగ్గజ రిటైలర్ అయిన నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ. 39,810 కోట్లు.4. కిరణ్ మజుందార్-షా ( Kiran Mazumdar-Shaw)బయోకాన్కు చెందిన కిరణ్ మజుందార్-షా రూ. 29,330 కోట్లతో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు. భారతదేశ బయోటెక్, హెల్త్కేర్ రంగాలలో మార్గదర్శకురాలిగా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బయోటెక్నాలజీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తొలి తరం వ్యవస్థాపకురాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్గా సత్తా చాటిన మహిళ. 1978లో భారతదేశంలోని తన గ్యారేజ్ నుండి బయోటెక్ ప్రయాణాన్ని ప్రారంభించారు.5. రుచి కల్రా (Ruchi Kalra)B2B కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఆఫ్బిజినెస్ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో రుచి కల్రా అయిదో స్థానంలో ఉన్నారు. ఆఫ్బిజినెస్ను సహ-స్థాపించడానికి మెకిన్సేలో కన్సల్టెంట్గా పనిచేశారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. తరువాత హైదరాబాద్లోని ఐఎస్బి నుండి ఎంబీఏ సంపాదించారు. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 9,130 కోట్లు.6. జూహి చావ్లా (Juhi Chawla)90లలో బాలీవుడ్ నేలిన స్టార్ హీరోయిన్ జూహి చావ్లా నేడు వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యూహాత్మక పెట్టుబడులతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చావ్లా నికర ఆస్తుల విలువ రూ. 7,790 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఆమె సంపదలో 69 శాతం పెరుగుదలను చూసింది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ నుండి వస్తుంది. 7. నేహా బన్సాల్ (Neha Bansal)లెన్స్కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ ప్రస్తుతం కంపెనీలో వర్తకం, చట్టపరమైన విధులకు నాయకత్వం వహిస్తున్నారు. రూ. 5,640 కోట్ల నికర విలువతో ఏడో స్థానంలో ఉన్నారు. లెన్స్కార్ట్ను ప్రారంభించడానికి ముందు, బన్సాల్ 2010 నుండి 2014 వరకు DNS అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా పనిచేశారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన నేహా, BCom ఆనర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.8. ఇంద్రా నూయి (Indra Nooyi) పెప్సికోలో 24 సంవత్సరాలు సేవలందించిన తర్వాత, కంపెనీ మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి రూ. 5,130 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. 2019లో పదవీ విరమణ చేశారు. CEOగా, తన పదవీకాలంలో అమ్మకాలను దాదాపు రెట్టింపు చేశారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టారు. పెప్సికో నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, నూయి 2019లో అమెజాన్ బోర్డు, డ్యూయిష్ బ్యాంక్ యొక్క గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో చేరారు. 2023లో AI-ఆధారిత డేటా భద్రత, నిర్వహణ స్టార్టప్ కోహెసిటీ CEO అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. నూయి భారతదేశంలో పెరిగారు. యేల్ నుండి MBA పట్టా పొందారు. 9. నేహా నార్ఖేడే ( Neha Narkhede)స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ సంస్థ కాన్ఫ్లూయెంట్ కోఫౌండర్,మాజీ సీటీవో నేహా నికర ఆస్తుల విలువ రూ. 4,160 కోట్లు. మహారాష్ట్రలోని పూణేకు చోందిన నేహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అపాచీ కాఫ్కాను సహ-సృష్టించారు. ప్రస్తుతం ఆమె కాన్ఫ్లూయెంట్ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు 2021లో రిస్క్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ డెవలపర్ ఓస్సిలార్ను సహ-స్థాపించారు. అంతేకాదు గత ఏడాది ఆమె ఫోర్బ్స్ అమెరికా యొక్క స్వీయ-నిర్మిత మహిళలలో ఒకరిగా జాబితాలో చోటు సంపాదించారు.10. కవిత సుబ్రమణియన్ (Kavitha Subramanian)భారతీయ ఆన్లైన్ పెట్టుబడి వేదిక, అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకురాలు కవిత భారతదేశంలోని టాప్ 10 ధనిక మహిళా వ్యవస్థాపకుల జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. ఆమె నికర విలువ రూ. 3,840 కోట్లు. అప్స్టాక్స్ను ప్రారంభించడానికి ముందు ఆమె 2015-2016 వరకు లీప్ఫ్రాగ్ ఇన్వెస్ట్మెంట్స్కు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. SKS మైక్రోఫైనాన్స్ లిమిటెడ్లోని యాక్టిస్లో పనిచేశారు. IIT బాంబే పూర్వ విద్యార్థిని, ది వార్టన్ స్కూల్ MBA గ్రాడ్యుయేట్. -
పరిశోధనా రంగంలో స్ఫూర్తి పతాకం
సంధ్యా షెనాయ్ (Dr Sandhya Shenoy ) సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు ఒక స్ఫూర్తిపతాకం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డచ్ అకడెమిక్ పబ్లిషర్ ఎల్స్వియర్తో కలిసిప్రతి ఏటా వెలువరించే అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్లజాబితాలో ఆమె వరుసగా మూడుసార్లు నిలిచింది. తాజాగా వెలువడిన 2025 జాబితాలో ఆమెకు మూడోసారి స్థానం దక్కడంతో భారత పరిశోధనా రంగంలో హర్షాతిరేకాలు వెలువెత్తుతున్నాయి. సంధ్యా షెనాయ్ పరిచయం.సంధ్యా షెనాయ్కు విద్యా రంగంలో, పరిశోధన రంగంలో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. 2010లో మొదటిసారి ఆమె ఘనత వార్తపత్రికల ద్వారా లోకానికి తెలిసింది. దానికి కారణం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో ఆమె సెంట్ పర్సెంట్ సాధించడం. ఇలా ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో నూరు శాతం మార్కులు సాధించడం అసాధ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతవరకూ ఆ ఘనత సాధించిన వారు ఒక్కరూ లేరు. మొదటిసారి సంధ్యా షెనాయ్ ఆ మార్కులు సాధించింది. ‘స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి’ అని అందరి చేతా అనిపించుకుందామె.హాజరు.. చదువు...కొంకిణి మాతృభాష కలిగిన సంధ్యా షెనాయ్ సొంత ప్రాంతం ఉడిపి. అక్కడే బి.ఎస్సీ. వరకూ చదివి కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత కుటుంబం బెంగళూరులో స్థిరపడటంతో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నూరు శాతం మార్కులు సాధించి నానో కెమిస్ట్రీలో పీహెచ్డీ కొనసాగించింది. ‘నా చదువులో ఎప్పుడూ కాలేజీ ఎగ్గొట్టలేదు. నూరు శాతం అటెండెన్స్తో ఉంటాను. అలాగే క్లాసుల్లో రన్నింగ్ నోట్స్ మిస్ కాను. పరీక్షలకు అదే చదువుకుంటాను. అలాగే మార్కులు తెచ్చుకున్నాను’ అంటుందామె. కెమిస్ట్రీలో విశేషమైన అభిరుచి ఉన్న షెనాయ్ మొదట అధ్యాపక వృత్తిలో ఉంటూనే తన పరిశోధనను కొనసాగించి ఉత్తమ సైంటిస్ట్ అవ్వాలని నిశ్చయించుకుంది.చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్వేస్ట్ హీట్ను విద్యుత్గా...మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీలో ప్రొఫెసర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా పని చేస్తున్న సంధ్యా షెనాయ్ థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్లో విశేషమైన పరిశోధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు ప్రచురించడం ద్వారా గుర్తింపు పొందింది. లండన్లోని ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ (ఆర్.ఎస్.సి.) ఆమెను లీడింగ్ ఫిమేల్ రీసెర్చర్గా గుర్తించింది. ఈ గుర్తింపు పొందడం అంత సులువు కాదు. పర్యావరణ రంగానికి చేటు చేస్తున్న వేస్ట్ హీట్ (కర్మాగారాలు, ఇతర యంత్ర పరికరాల వల్ల వెలువడే ఉష్ణం) వృథా అవడమే కాకుండా పర్యావరణానికి చేటు చేస్తుండటం వల్ల ఆ వేస్ట్ హీట్ను విద్యుత్తుగా ఎలా మార్చవచ్చో పరిశోధనలు చేస్తూ, వాటి ఫలితాలను ప్రతిపాదిస్తూ సంధ్యా షెనాయ్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్ల దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమెకు 2021లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2024లో ‘కెమిస్ట్రీ మెడల్’ లభించాయి.చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదికప్రపంచ సైంటిస్టుల జాబితాలో...ప్రపంచంలో అత్యుత్తమ సైంటిస్టుల 2 శాతం పట్టికను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ప్రకటిస్తూ ఉంటుంది. ఆగస్టు 30 నాటికి ఆ సంవత్సరంలో వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించిన పరిశోధన పత్రాల ఆధారంగా, వాటికి అందిన ఆదరణను బేరీజు వేసుకుని సెప్టెంబర్లో ఈ జాబితాను విడుదల చేస్తారు. 2023 నుంచి సంధ్యా షెనాయ్ ఈ పట్టికలో నిలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 19న విడుదల చేసిన 2025 జాబితాలో మూడవసారి కూడా సంధ్యా షెనాయ్కు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్త సైంటిస్టులకు సమఉజ్జీగా మన దేశం నుంచి ఒక మహిళా పరిశోధకురాలు ఈ స్థాయి గుర్తింపు ΄పొందుతుండటం మన సైన్సు రంగానికి గర్వకారణం. అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువతరం. -
మెలోని గారి మన్ కీ బాత్
బాగా ఇష్టమైన ఇల్లు కాలి బూడిదైతే... ఆ బూడిదను చూస్తూ ఏడుస్తూ కూర్చోలేము. ఒక్కో ఇటుక పేరుస్తూ కొత్త ఇంటికి సిద్ధం అవుతాము. జార్జియా మెలోని అలాగే చేసింది. కుటుంబ కల్లోలాన్ని మనసుపైకి రానివ్వకుండా తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని అయింది. ఆమె ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్ (ఇండియన్ ఎడిషన్)కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు.కొన్ని నెలల క్రితం అల్బేనియాలో జరిగిన ఒక సదస్సులో వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు వైరల్ అయింది. కారు దిగి వస్తున్న మెలోనికి వర్షంలో మోకాళ్లపై కూర్చొని నమస్కారం చెబుతూ ఆయన స్వాగతం పలికిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.న్యూయార్క్లో జరిగిన ఒక అవార్డ్ల కార్యక్రమంలో... ‘మెలోని నిజాయితీపరురాలు. ఆమె మనసు అందమైనది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటలీలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీని ‘నమస్తే’ అంటూ మెలోని స్వాగతం పలకడం వైరల్గా మారింది.ఒక్క మాటలో చె ప్పాలంటే... జార్జియా మెలోని అనేది ‘ప్రధాన ఆకర్షణ’కు మరో పేరు.అయితే ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక కాదు. ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లింది.‘ఐయామ్ జార్జియా–మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ను ఒక అధ్యక్షురాలి ఆత్మకథగా మాత్రమే చూడనక్కర్లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయమేమీ కాదు. ధైర్యంలో, ఆత్మవిశ్వాసంలో, సానుకూల శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది మెలోని.రోమ్లో పుట్టి గార్బటెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మెలోని తండ్రి, కుటుంబాన్ని విడిచి కానరీ దీవులకు వెళ్లాడు. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. మెలోనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.తండ్రి దూరం అయ్యాడు. తమకు ఇష్టమైన ఇల్లు అగ్నిప్రమాదంలో నాశనం అయింది. బాల్యం, కుటుంబ విచ్ఛిన్నం తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయని తన ఆత్మకథలో రాసుకుంది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎంఎస్ఐ) యువ విభాగం ‘యూత్ ఫ్రంట్’లో చేరడంతో మెలోని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ‘స్టూడెంట్ మూవ్మెంట్’ నేషనల్ లీడర్గా ఎదిగింది. ప్రావిన్స్ ఆఫ్ రోమ్’ కౌన్సిలర్గా పనిచేసింది. ‘యూత్ యాక్షన్’ అధ్యక్షురాలిగా ఎంపికైంది... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించింది.మోదీ ముందుమాట‘దేశభక్తి ఉట్టిపడే అత్యత్తమ నాయకురాలు’ అని ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మన ప్రధాని నరేంద్ర మోదీ మెలోనిని కొనియాడారు. ఆమె వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం గురించి వివరించారు. మెలోని ఆత్మకథను ‘మన్కీ బాత్’లో చె ప్పారు. ‘‘ఇటలీ ప్రధాన మంత్రి మెలోనిపై అభిమానం, స్నేహంతో ఈ ముందుమాట రాశాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆమె స్ఫూర్తిదాయకమైన, చారిత్రక ప్రయాణం భారత్లో ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది’’ అని తన ముందు మాటలో రాశారు మోదీ. గతంలో రెండు పుస్తకాలకు మాత్రమే మోదీ ముందు మాట రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్కు అంకితం ఇచ్చిన పుస్తకానికీ, ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథకు గతంలో ముందుమాట రాశారు. -
కాంచన, ప్రియ.. ఎవరీ యువ నేతలు!
టీవీ చర్చల్లో అర్నాబ్ గోస్వామి ఎలా మాట్లాడతారో చాలా మందికి తెలుసు. ఓ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వ్యంగ్యంగా "రాహుల్ బాబా" అని పదేపదే సంబోధించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి అర్నాబ్ బాబా అంటూ కౌంటర్ ఇవ్వడంతో అర్నాబ్ వెనక్కి తగ్గారు. ఆ యువతిపేరు కాంచనా యాదవ్. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె 2018లో విద్యార్థి రాజకీయాల్లో చేరి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) భావజాలం ప్రభావంతో ఆ పార్టీలో కొనసాగుతున్నారు.మరొక టీవీ చర్చా కార్యక్రమంలో అర్నాబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'నేను ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడి'ని అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ప్రియాంక భారతి (Priyanka Bharti) ఈ వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు. మీది ఉన్నత కులం కాదు. పుట్టకతోనే ఎవరూ ఉన్నతులు, తక్కువ వారు కాదు. మీ మాటలు వివక్షపూరితంగా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. దీంతో గోస్వామి కామ్ అయిపోయారు.కాంచన, ప్రియాంక ఇద్దరూ ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులు. ఈ ఇద్దరు యువతులు తమ పోరాట శైలితో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా టీవీ చర్చల్లో తమ పార్టీ గళాన్ని బలంగా పనిచేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇద్దరూ 2018లో JNUలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం ఛత్ర రాష్ట్రీయ జనతాదళ్ (CRJD)లో చేరారు. విశ్వవిద్యాలయ విద్యార్థి రాజకీయాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని భావించిన ఆర్జేడీ.. 2019 విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసింది.''జేఎన్యూలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి, పార్టీలో ప్రోత్సహించాలనేది ఎంపీలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆలోచన. సీఆర్జేడీ ఏర్పడినప్పటి నుంచి ప్రొఫెసర్ నవల్ కిషోర్ దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు" అని పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు. కాంచన, ప్రియాంక.. సీఆర్జేడీ ద్వారానే వెలుగులోకి వచ్చారు. కంప్యూటేషనల్, ఇంటిగ్రేటివ్ సైన్సెస్లో కాంచన పీహెచ్డీ చేశారు. జర్మన్ స్టడీస్లో ప్రియాంక పీహెచ్డీ చేస్తున్నారు. 2023, అక్టోబర్లో ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులుగా వీరిద్దరూ నియమితులయ్యారు.లాలూ స్ఫూర్తితోనే.. లాలూ ప్రసాద్ యాదవ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు కాంచన వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశంపై 'ది ప్రింట్'తో ఆమె మాట్లాడుతూ.. ''2018లో నేను విద్యార్థి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. కానీ నేను RJD భావజాలంతో బాగా ప్రభావితమయ్యాను. (పార్టీ చీఫ్) లాలూ ప్రసాద్ జీ సిద్ధాంతాలపై ఎప్పుడూ రాజీపడలేదు. JNUలోని చాలా మంది విద్యార్థులు సాధారణంగా వామపక్ష విద్యార్థి సంఘాల వైపు ఆకర్షితులవుతారు. కానీ లాలూజీ భావజాలం నన్ను ఆకట్టుకుంద''ని తెలిపారు. విద్యార్థి నేతగా ఫీజు పెంపుదల, హాస్టల్ సంబంధిత సమస్యలతో పాటు అంశాలపై పోరాటం చేసినట్టు వెల్లడించారు.పోలీసులు దారుణంగా కొట్టారుతన రాజకీయ ప్రయాణం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. ''నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆర్జేడీ విద్యార్థి విభాగంలో చేరాను. ఆ సమయంలో జేఎన్యూలో అనేక నిరసనలు జరుగుతున్నాయి. వామపక్ష గ్రూపులలో చేరడం వంటి ఇతర ఎంపికలు కూడా నాకు ఉన్నాయి, కానీ అవి కుల సమస్యలపై తగినంతగా గళం విప్పడం లేదని నేను భావించాను. నేనేమీ అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాను. పోలీసులు నన్ను దారుణంగా కొట్టారు. నా చర్మంపై పిన్నులు గుచ్చారు. దాని వల్ల నా మోకాలిలో కణితి వచ్చింది. మా విద్యార్థి విభాగం కోసం కరపత్రాలు పంపిణీ చేస్తున్నప్పుడు సీఆర్జేడీ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నావని సీనియర్ ఒకరు అడిగారు. సామాజిక న్యాయం, లాలూజీ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పాను. అలా నాకు సీఆర్జేడీలో సభ్యత్వం వచ్చింద''ని తెలిపారు.ఎవరీ కాంచన?ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో కాంచన జన్మించింది. ఆమె పూర్వీకులు బిహార్లోని ససారాంకు చెందినవారు. కాంచనతాత ప్రభుత్వ ఉద్యోగి కాగా, తండ్రి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2017లో లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీ చేయడానికి జేఎన్యూలో చేరారు. సీఎస్ఐఆర్ ఫెలోషిప్ సాధించడంతో బెంగళూరులో సైంటిస్ట్ ఉద్యోగ అవకాశం వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనే ఉండిపోయారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తమకెంతో కీలకమని, ఈ ఎన్నికల తర్వాతే ఉద్యోగం గురించి ఆలోచిస్తానని కాంచన 'ది ప్రింట్'తో చెప్పారు.ప్రియాంక ప్రస్థానంపట్నా జిల్లా తూర్పు శివార్లలోని ఫతుహా పట్టణానికి చెందిన ప్రియాంక 2019లో జరిగిన జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో సీఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె తండ్రి రైతుగా పనిచేస్తున్నారు. తమ కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని ప్రియాంక చెప్పారు. జేఎన్యూలో పీహెచ్డీ కొనసాగుతోందన్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆర్జేడీ (RJD) పార్టీ వైఖరిని బలంగా వినిపించడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్టు వెల్లడించారు.చదవండి: 'మా ఆయన అస్సలు మంచోడు కాదు'మీడియాలో వివక్షమీడియాలో ప్రతిపక్ష నాయకుల పట్ల వివక్ష కొనసాగుతోందని కాంచన, ప్రియాంక ఆరోపించారు. కొంత మంది న్యూస్ యాంకర్లు అధికార పార్టీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార బీజేపీ, గోడి మీడియా యాంకర్లకు సరైన సమాధానం ఎలా ఇవ్వాలో తమకు తెలుసునని.. భయపడేది లేదని వారిద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. చర్చల్లో పాల్గొనకుండా తమను గోడి మీడియా బాన్ చేసినప్పుడు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ (Tejashwi yadav) తమకు అండగా నిలబడ్డారని తెలిపారు. -
డీఎస్పీగా గృహిణి..! ఆమె కలను వివాహం ఆపలేదు..
వివాహం ఏ అమ్మాయికైనా తన కలలను కనడమే మరిచిపోయేలా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సపోర్టు ఉంటే తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఎదుగుతుంది. లేదంటే వంటిటికే పరిమితమవ్వాల్సిందే. కానీ అలాంటి మూసపద్ధతులన్నింటిని బద్దలుకొట్టుకుంటూ దూసుకొచ్చింది ఈ మహిళ. ఓ పక్క పేదరికం, మరోవైపు ఇంటి బాధ్యతలు అయినా.. తన కలలు కల్లలుగా మారనివ్వ లేదు. తాను అనుకున్నది సాధించడం కోసం గుక్కపెట్టి ఏడిపించేలా చేస్తున్న కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని..గృహిణులు కూడా ఉన్నతాధికారుల కాగలరని చాటి చెప్పిందిఆ ధీర వనితే అంజు యాదవ్(Anju Yadav). 1988లో హర్యానాలోని నార్నాల్ జిల్లాలోని చోటే అనే గ్రామంలో జన్మించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తండ్రి లాల్రామ్ వ్యవసాయం, పార్చున్ దుకాణం సాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి సుశీలా దేవి గృహిణి. ఆమెకు ముగ్గురు సోదరీమణులు. బీఏ వరకు తన గ్రామంలోనే చదువుకున్న అంజు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 22 ఏళ్లకే తల్లి అయ్యి ముకుల్దీప్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా సరే తన డ్రీమ్ ఆగిపోకూడదనుకుంది. తల్లిగా, భార్యగా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ సతమతమైంది. తన లక్ష్యానికి నెరవేర్చుకునేందుకు అత్తమామలు ముందుకు రాకపోవడంతో తల్లి సాయం తీసుకుంది. ఆమెకు తన కొడుకు బాధ్యతను అప్పగించి తన కెరీర్పై దృష్టిసారించింది. అలా ఎలాంటి కోచింగ్ లేకుండా బీఈడీ సీటు సంపాదించి ఏకంగా మూడుసార్లు పలు చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక ఆ సమయంలో తల్లి ఆమెకు మద్దతిచ్చి..కొడుకు ముకుల్దేవ్ బాధ్యతను తీసుకుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆరాటంతో సాగిపోతున్న అంజుకి భర్త అనారోగ్యం ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) రిక్రూట్మెంట్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకుని మరీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఆ డీఎస్పీ ఎగ్జామ్కి సన్నద్ధమవుతుండగా భర్త నిత్యానంద్రావు అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి తల్లిగా నానా ఇబ్బందులు పడింది. ఆ కష్ట సమయంలో తల్లిదండ్రులు మద్దతివ్వడంతో..ఆహర్నిశలు కష్టపడి ప్రిపేరయ్యింది. అలా 2023లో 1725 ర్యాంకు సాధించి డీఎస్సీ అయ్యింది. చివరికి సెప్టెంబర్ 2025కి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాజస్తాన్ పోలీస్ సర్వీస్లో డీఎస్పీ(Deputy Superintendent of Police )గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ మారుమూల గ్రామంలో వివాహితురాలిగా మారిన తర్వాత కూడా అంజు కలలు కనడం ఆపలేదు. ఎన్ని రకాలుగా తనను అణిచివేసేలా ఇబ్బందులు వచ్చి పడినా అధైర్యపడలేదు. ఏదో ఒక నాటికి తను అనుకున్న గుర్తింపు సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందుకు సాగింది. చివరకు సుదీర్ఘ పోరాటం అనతరం తన కలను నెరవేర్చుకుంది .కష్టపడేతత్వం ఉంటే కల ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచి.. 'దటీజ్ అంజు యాదవ్' అని అనిపంచుకుంది . View this post on Instagram A post shared by Anju Yadav (@anjuyadav_dsp) (చదవండి: అందాలపోటీలకు అంతరాయం కలిగించిన భూకంపం..! వీడియో వైరల్) -
అంబానీ, అదానీ తరువాత.. మరోసారి టాప్లో రోష్నీ నాడార్
ప్రముఖ టెక్ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL) చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ధనవంతులైన వ్యాపారవేత్తగా మరోసారి తన ఘనతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతు రాలైన మహిళగా చరిత్ర సృష్టించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తద్వారా భారతదేశ సంపదలో పెరుగుతున్న కొత్త తరం మహిళా నాయకుల ప్రతిభను చాటి చెప్పారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List) ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, రోష్ని నాదర్ మల్హోత్రా అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎంపికయ్యారు. హురున్ ప్రకారం రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీ మరోసారి తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంబానీ ఫ్యామిలీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ ఆనిలిచారు. మొత్తం ఆస్తి .రూ.9.55 కోట్లు. ఇక రూ. రూ.8.15 లక్షల కోట్ల కోట్ల సంపదతో అదానీ గౌతమ్ అదానీని అధిగమించారు.భారతదేశంలోని సంపన్న వర్గం గణనీయంగా పెరిగింది. దేశం ఇప్పుడు 350 మందికి పైగా బిలియనీర్లు ఉండగా. ఈజాబితా ప్రకారం గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య గణనీనయంగా పెరుగుతూ వస్తోంది. జాబితా వీరి మొత్తం సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు.ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగం.కాగా హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్. HCL గ్రూప్లో అధిక వాటాను స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు రోష్నీ. -
స్ఫూర్తిదాయక సురేఖ!
ముంబై: ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా, 36 ఏళ్లకు పైగా తన వృత్తి జీవితంలో దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన సురేఖ యాదవ్ (Surekha Yadav) మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె ధైర్యసాహసాలు, స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారని సెంట్రల్ రైల్వే కొనియాడింది. ఈ ’మార్గదర్శి అద్భుత ప్రయాణం’రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది. పురుషాధిక్య ప్రపంచంలో మెరిసి.. యాదవ్ 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పురుషాధిక్యం ఉన్న రైల్వే రంగంలో అడ్డంకులను ఛేదించారు. ఆమె 1990లో అసిస్టెంట్ డ్రైవర్గా మారారు, తద్వారా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్గా (woman loco pilot) గుర్తింపు పొందారు. క్లిష్టమైన మార్గాల్లో రైళ్లు నడిపి ముంబై సబర్బన్ లోకల్ రైళ్లతో పాటు, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన కొండ మార్గాల గుండా సురేఖ యాదవ్ గూడ్స్ రైళ్లను నడిపారు. వందేభారత్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్ వరకు.. దేశంలోని కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లను కూడా ఆమె నడపడం విశేషం. రైతు కుటుంబంలో పుట్టి.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబంలో సెపె్టంబర్ 2, 1965న జన్మించిన యాదవ్, రైల్వే ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆమె క్రమంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 1996లో మొదటి గూడ్స్ రైలును నడిపారు, ఆపై 2000 సంవత్సరంలో మోటార్ ఉమన్గా పదోన్నతి పొందారు. 2010లో, ఆమె ఘాట్ డ్రైవర్గా అర్హత సాధించారు. ఆ తర్వాత వివిధ మార్గాల్లో సుదూర మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు సారథ్యం వహించారు. వందేభారత్కు సారథ్యం ఆమె వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా 2023 మార్చి 13వ తేదీ నిలిచిపోతుంది. సోలాపూర్, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య తొలిసారిగా నడిపిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఆమె సారథ్యం వహించారు. ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు, చివరి బాధ్యతగా, ఇగత్పురి సీఎస్ఎంటీ మధ్య హజ్రత్ నిజాముద్దీన్–సీఎస్ఎంటీ మార్గంలో ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్ప్రెస్ను నడిపే అవకాశం ఆమెకు లభించింది. యాదవ్ తన చివరి రోజు ఉద్యోగ విరమణకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం, ఆమె సహోద్యోగులు కొద్ది రోజుల క్రితం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.మార్గదర్శికి వీడ్కోలు ఒక మార్గదర్శికి వీడ్కోలు. ఆసియా తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ యాదవ్.. 36 ఏళ్ల అద్భుతమైన సేవల తర్వాత నేడు సెలవు తీసుకుంటున్నారు. ఆమె అద్భుత ప్రయాణం.. రాబోయే తరాల రైల్వే మహిళలు, పురుషులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. – ‘ఎక్స్’లో సెంట్రల్ రైల్వే పోస్టు -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు.. 66 శాతం మంది వారే!
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలోపే ఫలితాలను విడుదల చేసి రికార్డు నెలకొల్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. ఈసారి ఫలితాల్లో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. జనరల్ మెరిట్ టాప్ -10లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇక టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు.గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా ప్రాతినిథ్యం పెరుగుతూ వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో మహిళా అధికారుల సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా వెల్లడైన గ్రూప్-1 ఫలితాల (Group 1 Results) ఆధారంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కొత్తగా కేటాయించిన ఉద్యోగుల్లో 66 శాతం మంది మహిళలు ఉన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లుగా జీఎస్టీ (GST) సంబంధిత వ్యవహారాలను వీరు పర్యవేక్షిస్తారు.48 మందిలో 31 మంది వారే!తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో ప్రస్తుతం 8 మంది మహిళా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (commercial tax officers) ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతోందని సీనియర్ అధికారి కె. హరిత తెలిపారు. 1990 ప్రాంతంలో తన బ్యాచ్లో తానొక్కరే మహిళా సీటీవోగా ఉన్నానని గుర్తు చేసుకున్నారామె. తాజాగా ప్రభుత్వం 48 మందిని సీటీవోలుగా నియమించగా, వీరిలో 31 మంది మహిళలు ఉండటం విశేషం.కీలక పోస్టుల్లో 24 మందికమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల సహా 34 కీలక పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 24 మహిళలు ఉన్నారు. 1996లో 8 మంది మహిళలు ఈ విభాగంలో చేరారు. అప్పటి నుంచి క్రమంగా మహిళా ఉన్నతోద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది అధికారులు ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. దీంతో తెలంగాణ వాణిజ్య విభాగంలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుని తమదైన ముద్ర వేయడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి మెరుగైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమని సీనియర్ మహిళా అధికారి ఒకరు అన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలు తరచు మారుతుంటాయని, దానికి అనుగుణంగా ఉద్యోగులు అప్డేట్ కావాల్సి ఉంటుందని వివరించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాన్ని బాలెన్స్ చేసేవిధంగా ఉండడం వల్లే ఎక్కువ మంది మహిళలు ఈ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారని వెల్లడించారు.చదవండి: ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళగతంలో వాణిజ్య పన్ను శాఖ కమిషనర్లుగా పనిచేసిన టికె శ్రీదేవి, నీతు ప్రసాద్ (Neetu Prasad) వంటి అధికారులు మహిళా శక్తిని చాటిచెప్పారు. సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే ఉన్నత ఉద్యోగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పడానికి వాణిజ్య పన్నుల విభాగం నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇది ఆమె "మన్ కీ బాత్"..! నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం..
భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమె ఆత్మకతకు ముందు మాట రాశారు. అందులో ఇటలీ ప్రధాని మెలోని జీవితం ఎప్పుడూ రాజకీయాలు, అధికారం గురించి కాదు అంటూ పలు ఆసక్తి కర విషయాలు వెల్లండించారు. ఒకరి ఆత్మకథలో ముందుమాట ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా..మెలోని గురించి చాలా చక్కగా వివరించారు ప్రధాని మోదీ. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్(I Am Giorgia — My Roots, My Principles)’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం అధికారం గురించి కాదని అన్నారు. నిశితంగా చూస్తే అడగడుగున ధైర్యం దృఢనిశ్చయం ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తాయని చెప్పారు. నాయకురాలిగా ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కూడా రాజకీయ విశ్లేషకులు సందేహాస్పదంగా ఉన్నారు. అయితే ఆమె నాయకురాలిగా తన బలం, స్థిరత్వాన్ని అందించారన్నారు. అంతేగాదు ఎల్లప్పుడూ ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలను అద్భుతమైన స్పష్టతతో వినిపించింది. ఆమె ఎదుగుదల, నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అయితే తాను భారతీయ సంప్రదాయంలో అనే రూపాల్లో గౌరవించబడుతున్న దైవిక స్త్రీ శక్తి, నారీ శక్తి భావనలతో సరిపోలుస్తానన్నారు. ప్రధాని మెలోనీ ప్రపంచం వేదికపై తన దేశాన్ని నడిపిస్తూ..తన మూలలను మరవలేదు. అందుకే ఆమె రాజకీయ ప్రస్థానం భారతదేశంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. రోమ్లోని ఓ సాదాసీదా పొరుగు ప్రాంతం నుంచి ఇటలీ అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించేంత వరకు సాగిన రాజకీయ ప్రస్థానం...ఆమె శక్తిని హైలెట్ చేస్తోంది. అంతేగాదు మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశ్యం తదితరాలు భారత పాఠకులతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అలాగే ప్రపంచంతో నిమగ్నమవుతూనే సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి పడుతున్న ఆరాటం, తపన.. ఆమె వ్యక్తిగత నమ్మకాలు, విలువలకు నిదర్శనమని అన్నారు. పైగా ఆమెకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణ, బాధ్యత తోపాటు శాంతిమార్గంలో నడిపించాలనే ఆలోచనలు ఈ పుస్తకం అంతటా ప్రతిధ్వనిస్తాయి అని రాసుకొచ్చారు మోదీ.వాస్తవానికి ఈ బుక్ అసలు వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయి, బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అప్పుడు మెలోనీ (Giorgia Meloni) విపక్షంలో ఉన్నారు. 2025, జూన్లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు. కాగా.. మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు ఎప్పుడూ నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.(చదవండి: వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి. పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిషన్ పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగింది. అలా 2023లో అల్వార్లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. (చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
21 ఏళ్లకే న్యాయవాది అయ్యింది
భలే భలే. ఈమె చిన్న వయసులో న్యాయవాది అయ్యింది. అదీ మన దేశంలో కాదు. ఇంగ్లాండ్లో. ఇంకా గొప్ప కదూ. న్యాయవాది కావాలంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉండాలి. చట్టాలు, న్యాయ సూక్ష్మాలు తెలిసి ఉండాలి. బారెడు పుస్తకాలు చదివి ఉండాలి. నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో గమనిస్తుండాలి. ఇవన్నీ చేస్తేనే న్యాయవాదిగా నిలదొక్కుకుంటారు. పాతికేళ్లు దాటితే తప్ప చాలామంది న్యాయవ్యాద వృత్తిని చేపట్టరు. అలాంటిది 18 ఏళ్లకే లా డిగ్రీ పొంది, 21 ఏళ్లకు న్యాయవాదిగా కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకుంటోంది ఓ యువతి. తనే కృషాంగి మేష్రామ్ (Krishangi Meshram). భారత సంతతికి చెందిన తను ఇంగ్లాండ్లో అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్కు చెందిన కృషాంగి మెష్రామ్కు చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. న్యాయవాదుల్లా తాను కోర్టులో వాదనలు వినిపించాలని, బాధితులకు న్యాయం అందించాలని భావించింది. వారి కుటుంబం ఇంగ్లండ్లో స్థిరపడింది. 15 సంవత్సరాల వయస్సులో స్థానికంగా లా కాలేజీలో చేరాలని భావించినా, ఇంటికి దూరంగా ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. ఆ సమయంలో మిల్టన్ కీన్స్లోని ఓపెన్ యూనివర్సిటీలో లా చదివేందుకు అవకాశం ఉందని తెలుసుకొని, అందులో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఉంటూ మూడేళ్లపాటు కష్టపడి లా పూర్తి చేసింది. న్యాయవాదిగా పేరు తెచ్చుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలను ఆ సమయంలోనే అప΄ోసన పట్టింది. 18 ఏళ్ల వయస్సులో బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సింగపూర్లో ఓ ఉద్యోగంలో చేరింది. మూడేళ్లు అక్కడ పని చేసి, తగిన అనుభవాన్ని గడిచింది. తిరిగి ఇంగ్లండ్ చేరుకున్న ఆమె అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా మారింది. ప్రైవేట్ క్లయింట్లకు న్యాయవాదిగా మారి సేవలందిస్తానని వివరిస్తోంది. -
చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సమయానికి తగ్గట్టు ఆలోచించడంలో వారికి వారే సాటి. కృషి, పట్టుదలే వారికి పెట్టుబడి. అలా గత దాదాపు రెండు దశాబ్దాలుగా మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన వందన ప్రభాకర్ పాటిల్ (Vandana Prabhakar Patil) మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) పనిచేస్తూ తనదైన వ్యాపారానికి నాంది పలికారు. తన ఆలోచనకు పదునుపెట్టి నెలకు మూడు లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు.వందన పాటిల్ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఉంది. ఆమె చదివింది. 12వ తరగతి మాత్రమే ఉంది. ఆమె వ్యవసాయంలో కూరగాయల నుండి ఆదాయం పొందేది, కానీ కూరగాయల ఉత్పత్తి వచ్చినప్పుడు, మార్కెట్లో కూరగాయల ధరలు ఆశించిన లాభాలు రాకపోవడంతో ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. దీంతో 2021లో ఆమె జల్గావ్లోని మామురాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని (KVK) సందర్శించి, కూరగాయలు, పండ్లను పొడి లేదా ఒరుగులుగా మార్చే ప్రక్రియ డీహైడ్రేషన్ (Dried Vegetables and Fruits) గురించి తెలుసుకుంది. అంతే ఆమె మెదడులో ఆలోచన రూపుదిద్దుకుంది. అందరికలా కాకుండా తాను భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. తనలాంటి అనేక మంది రైతుల సమస్యలను కూరగాయలను సౌరశక్తితో ఎండబెట్టడం ద్వారా పరిష్కరించవచ్చని, కూరగాయల డీహైడ్రేషన్ పరిష్కరిస్తుందని గ్రహించింది.వందన తన పాలస్ఖేడ గ్రామంలో కూరగాయలను డీహైడ్రేట్ చేసి వాటి నుండి పొడిని తయారు చేయడానికి ఒక కంపెనీని స్థాపించింది. ఆమె తన గ్రామంలోని కొంతమంది మహిళల సహకారంతో గాయత్రి ఫుడ్స్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది. దీనికి సౌరశక్తితో ఎండబెట్టిన ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ కలిసి వచ్చింది. తన యూనిట్ను ప్రారంభించడానికి,2021లో కూరగాయల డీహైడ్రేషన్లో శిక్షణ తీసుకుంది. వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకుంది, కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించారు అధికారులు. ఆ తర్వాత ఆమె రూ. 10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం కింద, సూక్ష్మ సంస్థలు అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఖర్చులో 35 శాతం సబ్సిడీని పొందే అవకాశాన్ని వినియోగించుకుంది. తన వ్యాపారంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 నుండి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. .సోలార్ డ్రైయింగ్ యూనిట్న్నెల్ ఆకారంలో పాలికార్బోనేట్తో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ఏర్పాటు, పల్వరైజర్, కటింగ్ మెషిన్ కొనుగోలు మరియు ప్యాకేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇది సౌర వికిరణాన్ని బంధించి లోపల గాలిని వేడి చేస్తుంది, గ్రీన్హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. కూరగాయలను సోలార్ ఎండబెట్టడానికి ముందు కడిగి, శుభ్రం చేసి, ముక్కలుగా కోస్తారు. వేడిచేసిన గాలి సొరంగం ద్వారా లోనికి వెళ్లి, తేమను తొలగించడం ద్వారా ట్రేలు లేదా రాక్లపై ఉంచిన ఉత్పత్తులను ఎండేలా చేస్తుంది. చివరల్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తేమ గాలిని బయటకు వెళ్లేలా చేస్తాయి.ప్రధానంగా ఉల్లిపాయ, టమోటా, దుంప, సెవ్గా, మెంతులు, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం లాంటివి కూరగాయలు ఉన్నాయి.కూరగాయల పొడిని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంది. కూరగాయలను కడిగి శుభ్రం చేస్తారు. తరువాత వాటిని కటింగ్ మెషిన్ ద్వారా ఎండబెట్టి, ఆపై వాటి పొడిని తయారు చేస్తారు. సౌరశక్తి ద్వారా సహజంగా ఎండబెట్టడం వల్ల, వాటి రంగు , నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుందని వందన పాటిల్ చెప్పారు. అవి పూర్తిగా సహజమైనవి కాబట్టి, కూరగాయల పొడి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, ఆమ్లత్వం, మధుమేహం, చర్మం, జుట్టు మొదలైన అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా ఉంటుంది. .వందన పాటిల్ వ్యాపారం తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించింది. కంపెనీలో ఇప్పుడు కొత్త ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని వందన పాటిల్ చెప్పారు. తమ డీహైడ్రేటెడ్ కూరగాయలు పునఃవిక్రేతలు, టోకు వ్యాపారుల ద్వారా US, మాల్దీవులు మరియు కెనడాకు కూడా చేరుతాయని వందన చెప్పారు.యూనిట్ను విస్తరించాలని మరియు ఎగుమతి ఆర్డర్లను అందించే సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు.వందన కుటుంబం తన గ్రామంలో ఐదు ఎకరాలకు పైగా నిమ్మకాయతో మునగ పంటను అంతర పంటగా పండిస్తుంది. రెండింటినీ డీహైడ్రేట్ చేస్తూ, స్థానిక రైతుల నుండి ఇతర కూరగాయలను కొనుగోలు చేస్తుంది. ఏదైనా కూరగాయల కొరత ఉంటే, వ్యవసాయ-ఎండబెట్టడం కోసం ఆమె వాటిని హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తుంది. 22 కిలోల తాజా టమోటాలు 1 కిలోల డీహైడ్రేట్ టమోటాలు వస్తాయి. కనుక ఒక కిలో డీహైడ్రేట్ టమోటా ధర దాదాపు రూ.700. అలాగే బీట్రూట్ ధర 100 గ్రాములకు రూ. 100 ,హోల్సేల్లో కిలోకు రూ. 700గా ఉంటుంది. ఉల్లిపాయలు కిలోకు రూ. 500 నుండి రూ. 600 వరకు ఉంటుంది. తాజా ఉత్పత్తుల మార్కెట్ ధరలను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. తద్వారా వీరి సగటు నెలవారీ టర్నోవర్ రూ. 3 లక్షలు. ఒక్కోసారి రెండు,మూడు రోజుల్లోనే రూ. 8-10 లక్షల టర్నోవర్ వస్తుంది అంటారు ఆ యూనిట్లో పనిచేసే ఇతర మహిళలు. వందనా సందేశంఈ ప్రాజెక్ట్ రైతులకు సహాయం చేయడంతోపాటు, గ్రామంలోని మహిళలకు తాను ఉపాధి కల్పించడం గర్వంగా ఉంటుందనీ, ఏ స్త్రీ కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకోకూడదని, పట్టుదలతో ఉంటే, మహిళలు తమ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలరని వందనా పాటిల్ మహిళలకు సందేశం ఇస్తుంది.మార్కెట్: భారతదేశపు డీహైడ్రేషన్ పండ్లు, కూరగాయల మార్కెట్ 2023లో రూ. 17,200 కోట్లుగా ఉండగా 2035 నాటికి రెట్టింపు రూ. 37,200 కోట్లుగా ఉంటుందని అంచనా. డీహైడ్రేటెడ్ కూరగాయలు మరియు పండ్లకు డిమాండ్ పెరుగుతున్న సౌకర్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే అవి అవసరమైన పోషకాలను నిలుపుకుంటూ నిల్వ చేయడం , తయారు చేయడం సులభం. సౌర ఎండబెట్టడం వాటి షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది మరియు పోషక విలువను ప్రభావితం చేయకుండా బరువును తగ్గిస్తుంది. -
పయనమే జీవనం..
‘ఇల్లే తీర్థం–వాకిలే వారణాసి–కడుపే కైలాసం’ అనుకుంటారు కొందరు. కొందరు మాత్రం ‘ప్రపంచమే అతి పెద్ద ఇల్లు’ అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. ఒక వయసు దాటిన తరువాత ‘ఈ వయసులో ప్రయాణం ఏమిటి’ అనుకుంటారు ఇంకొంతమంది. అయితే ప్రయాణం వయసెరుగదు. ఎందుకంటే వయసు భారాన్ని అధిగమించే ఉత్సాహం ప్రయాణాలలో ఉంది. అలాంటి ఒక ఉత్సాహవంతురాలు ఇందిర. కేరళకు చెందిన ఇందిర ఎం. ఉపాధ్యాయురాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత 35 దేశాలు పర్యటించింది.కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చిన్నప్పుడు కలలు కనేది ఇందిర. అయితే అరవై ఏళ్ల వయసులోగానీ ఆ కల నెరవేరలేదు. సౌత్ ఆఫ్రికన్ సవానా తన తొలి ఇంటర్నేషనల్ ట్రిప్. తొలి ప్రయాణ విశేషాల గురించి అపురూపంగా చెబుతుంది. జీవవైవిధ్యంతో అలరించే ప్రకృతి, బిగ్ఫైవ్లాంటి వన్య ప్రాణులు, వైవిధ్యమైన వాతావరణం... స్థూలంగా తొలి పర్యటన ఇందిరకు ఎంతో సంతోషాన్నిచ్చింది.చదవండి : బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తసఫారీలో తాను చూసిన ఏనుగులు, సింహాల గురించి చిన్నపిల్లలా ఉత్సాహపడుతూ... ‘ప్రయాణాల పుణ్యమా అని నాకు ఎంతోమంది స్నేహితులయ్యారు. జీవితంతో పాటు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం. మాలో చాలామందికి ఒకేరకమైన జీవితానుభవాలు ఉన్నాయి. నా స్నేహబృందంలో వివిధ వయసుల వాళ్లు,ప్రాంతాల వాళ్లు ఉన్నారు. అయితే మా స్నేహానికి వయసు,ప్రాంతం ఎప్పుడూ అడ్డుగోడ కాలేదు’ అంటుంది ఇందిర.పెళ్లికావడానికి ముందు ప్రయాణాలు చేయాలనే ఉత్సాహం ఉన్నా ఆమె దగ్గర సరిపడా డబ్బు ఉండేది కాదు. ఉద్యోగం వచ్చి, పెళ్లయిన తరువాత కుటుంబ ఖర్చులు, బాధ్యతల వల్ల ప్రయాణాలు చేయలేక పోయింది. ‘సోలో ట్రావెలింగ్ గురించి ఆలస్యంగా తెలిసింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేను లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది’ అంటుంది ఇందిర.ప్రతి ప్రయాణంలో ఆమె ఎన్నో అనుభవాలను మూటగట్టుకుంది. ఇస్తాంబుల్లో ఉన్నప్పుడు సూట్కేస్ కోడ్ మరిచి పోయింది. జపాన్లో ఒకరోజు గాయపడింది... ఇలాంటి ఎన్నో సందర్భాలలోనూ ఎవరో ఒకరు ఆమెకు సహాయంగా నిలిచేవారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, దయాగుణం అనుకోని అతిథిలా వచ్చేది.సోలో ట్రావెల్ను ఎంజాయ్ చేసినట్లే గ్రూప్ ట్రావెల్ను కూడా ఎంజాయ్ చేసింది ఇందిర. ‘గ్రూప్తో కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబసభ్యులతో ఉన్నట్లుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడతారు’ అంటున్న ఇందిర ఇప్పటివరకు 35 దేశాలకు వెళ్లింది. మరిన్ని దేశాలకు వెళ్లడానికి సన్నద్ధం అవుతోంది. తాజాగా స్కాండినేవియా దేశాల పర్యటనకు సిద్ధం అవుతోంది.తొలి ప్రయాణానికి సంబంధించి పిల్లలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మొదటి ప్రయాణ సమయంలో ఖర్చు గురించి ఆలోచించాను. అయితే విలువైన ప్రయాణ అనుభవాల ముందు ఆ ఖర్చు ఒక లెక్కే కాదని తెలుసుకున్నాను. ప్రయాణాన్ని ఇంత బాగా ఆస్వాదిస్తానని ఊహించలేదు. తొలి ప్రయాణం అనేది నేను ప్రయాణాలను ఇష్టపడేలా చేసిన ఒక ట్రిగ్గర్.చదవండి: ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి ఎప్పుడూ ఉండే ఇంటిని దాటి మనల్ని మనం కనుగొనడంలో ఒక నిర్దిష్ట నిశ్శబ్ద శక్తి ఉంది. నేను చాలా ఆలస్యంగా ప్రయాణాలు ప్రారంభించాను. చాలా ముందుగానే మొదలు పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తోంది. సోలో ట్రావెల్కు చాలామంది వెనకాడుతుంటారు. అయితే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.– ఇందిర ఎం -
ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సివిల్ సర్వీస్ అధికారి విశాఖా యాదవ్ (Vishakha Yadav) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాలో పర్యటన ఐఏఎస్ అధికారి విశాఖా యాదవ్ప్రధాని మోదీకి స్వాగతం పలికిన దృశ్యాలు నెట్టింటసందడిగా మారాయి. దీంతో ఆ ఆఫీసర్ ఎవరు? ఏంటి? అనే ఆసక్తి మొదలైంది.అరుణాచల్లోని పాపుమ్ పరే జిల్లాలో డిప్యూటీ కమీషనర్గా పనిచేస్తున్నారు విశాఖా యాదవ్. ప్రధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోదీకి వెల్కమ్ చెప్పడం గర్వంగా ఉందంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు.ఎవరీ విశాఖా యాదవ్?విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేశారు.కానీ ఆమె కల IAS అధికారిణి కావడమే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించారు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించారు.UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు. 1994లో ఢిల్లీలో జన్మించిన ఆమె తండ్రి రాజ్కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ కాగా, ఆమె తల్లి గృహిణి. -
బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తే
ప్రకృతి దగ్గరగా జీవించాలని, ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆచరణ ఎలాగో అర్థంకాదు. అలా నిస్తేజంగా, నిర్జీవంగా జీవితం గడపకుండా, పచ్చని ప్రకృతి,స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని భోజనమే జీవితం అనుకుంది స్నేహా రాజ్గురు. ఇది తన ఒక్కదానికే పరిమితం కాకుండా తన తండ్రితో కలిసి ‘బాప్ బేటీ ఫామ్స్’’ పేరుతో సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతోంది. ఎవరీ స్నేహ, తెలుసుకుందాం పదండి.స్నేహ రాజ్గురు పుణెలో పుట్టి పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు. తండ్రి అనిల్ రాజ్గురు. స్నేహ రాజ్గురు సినిమాల్లో పనిచేస్తానంటే సంపూర్ణ మద్దతిచ్చారు. స్నేహ బాలీవుడ్లో స్క్రిప్ట్ సూపర్వైజర్గా, ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసింది, 'బుల్బుల్', 'లుకా చుప్పి' వంటి సినిమాలకు పనిచేసింది. వృత్తిలో భాగంగా భారతదేశం అంతటా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె జీవితం మలుపుతిరిగింది. ‘లూకా చుప్పి’ సినిమా లొకేషన్ల కోసం మదురై వెళ్లింది. అక్కడి ప్రకృతి, మట్టితో కట్టిన ఇళ్లు చూసి పరవశించి పోయింది. అపుడే నిర్ణయించుకుంది..ప్రకృతిలో మమేకమవుతూ, సేంద్రియ ఆహారాన్ని సేవిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని. మట్టిలో మెరుపుపశ్చిమ బెంగాల్ అడవులలోని పెర్మాకల్చర్ ఫామ్లో 52 రోజుల బస చేయడం తన ఆలోచనలకు మరింత బలం వచ్చింది. అలంకరణలు లేవు, ఫిల్టర్లు లేవు, కేవలం ఒక టెంట్, అడవి. స్నేహ ఇక్కడే పెర్మాకల్చర్ సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని వినడం, వర్షంలో లయను, కలుపు మొక్కలలోని జ్ఞానాన్ని చూడటం నేర్చుకుంది. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన వృత్తిని వదిలిపెట్టి, తన తండ్రి అనిల్ రాజ్గురుతో కలిసి పూణే సమీపంలో 'బాప్ బేటీ ఫామ్స్'ను ఏర్పాటు చేసింది. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm)బాప్ బేటీ ఫామ్స్ (BaapBeti Farms) "నేను కథలు చెప్పడం మాత్రమే కాదు.. ఆ కథల్లో ఈ ప్రకృతిలో జీవించాలనుకున్నాను. అదే నన్ను భూమికి అనుసంధానించినది. భూమినుంచే తీసే తాజాగా తినే ఆహారం, పాలిష్ చేయని, ప్రాసెస్ చేయని , స్వచ్ఛమై ఆహారంతో నా సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసింది”అంటారు స్నేహ. ముంబైలో తన జీవితాన్ని సర్దుకుని పూణేకు తిరిగి వచ్చింది. బ్యాకప్ ప్లాన్ ఏమీ లేదు. ఉన్నదల్లా నమ్మకం. ఓర్పు, అభిరుచే పెట్టుబడి. దీనికి కూతురి కలలకు అండగా నిలిచిన తండ్రి తోడ్పాటు, పెర్మాకల్చర్లో కోర్సులు, భూమి భాషను అధ్యయనం తోడైంది. టాటా మోటార్స్ పనిచేస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న స్నేహ తండ్రి అనిల్ రాజ్ గురు తొలుత ఆమె నిర్ణయానికి విస్మయం చెందాడు. అయితే “స్నేహ ఎప్పుడూ ఆరుబయట ఉండటం ఇష్టపడేది. చిన్నప్పుడు కూడా, ఆమె నేల వైపు ఆకర్షితురాలైంది," అని గుర్తు చేసుకుంటారుపూణే దగ్గర ఉందీ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ సేంద్రీయ కూరగాయలు, పళ్లు పండిస్తారు. అందుకే ఆమె వ్యవసాయం గురించి ప్రస్తావించగానే మారు మాట్లాడకుండా ఆమెతో చేయి చేయి కలిపారు.పూణే బయట బంజరుగా ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కనుగొన్నారు. విత్తనాలు నాటారు. భూమిని పెర్మాకల్చర్ జోన్లుగా విభజించారు, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, అందంగా అమర్చుకున్న పర్యావరణ వ్యవస్థ. పక్షులు, తేనెటీగలు, కూరగాయలు, కోళ్లు, కంపోస్ట్ కుప్పలు - ప్రతిదీ ఈ పచ్చని సోయగంలో తన పాత్రను పోషించింది. (ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్) ప్రతీ ఆకులో ఒక వారసత్వాన్ని వెతుక్కున్న వారి కృషి ఫలించింది. స్ట్రాబెర్రీల నుండి లెట్యూస్, క్యాప్సికమ్ వరకు స్థానిక ఉత్పత్తులలో ప్రయోగాలు వరకు, బాప్బేటి ఫామ్స్ పూర్తిగా సేంద్రీయం మారిపోయింది. వ్యక్తిగత ప్రయాణంగా ప్రారంభమై, ఉద్యమంగా మారింది. స్నేహ ఈ పొలాన్ని Airbnbలో జాబితా చేసింది, అతిథులను స్థిరమైన జీవనశైలిని అనుభవించమని ఆహ్వానించింది. నగరవాసులు క్యూ కట్టారు. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతోమంది రైతులకు మార్గ నిర్దేశకులయ్యారు. ఆమె తండ్రి అనధికారిక టూర్ గైడ్ అయ్యాడు. అంతేకాదు నచ్చిన పనిచేస్తూనే ప్రతి ఉదయం ప్రకృతిలో నడక. దీంతో సుగర్ నియంత్రణలోకి వచ్చింది. 18 కిలోగ్రాముల బరువ తగ్గాను అంటూ సంతోషంగా చెబుతారు అనిల్. అన్నింటికంటే ముఖ్యం నా బిడ్డ కల సాకారంలో నేను ముఖ్య భూమికనయ్యాను అంటారు. చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీసంపాదన కాదు ముఖ్యంబాప్ బేటి ఫామ్స్ నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తుంది. కానీ తనకు డబ్బు కాదు ముఖ్యం. ప్రకృతిలో జీవించడం, వ్యవసాయ క్షేత్రం స్వయం సమృద్ధిగా, నిరంతరం అభివృద్ధి చెందడం. అలాగే ఏ హాలీవుడ్ చిత్రం రాయలేని ట్విస్ట్లు, విలువల కంటే మేటి జ్ఞానం.అదే నిజమైన బహుమతి అంటారు స్నేహ. -
ఫోర్బ్స్ జాబితాలో కాలేజ్ డ్రాపౌట్! ఏకంగా రూ.1.15 లక్షల కోట్లు..
ప్రపంచంలో అత్యంత ప్రముఖ బిలియనీర్లు కథలు వింటంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. అసాధారణ నేపథ్యం నుంచి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి అవాక్కయ్యేలా చేస్తుంటారు. అంతేగాదు సక్సెస్ అసలైన అర్థం చెబుతుంటారు. కష్టపడేతత్వం ఉన్నవారు ఎన్నటికైనా విజయం సాధిస్తారనేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవలో బిల్గేట్స్, మార్క్ జుకర్బర్గ్వంటి ప్రముఖులను చూశాం. తాజాగా వారి సరసన 30 ఏళ్ల లూసీ గోవా(Lucy Guo) అనే మహిళ నిలిచింది. ఎవరామె అంటే..కాలేజ డ్రాపౌట్ అయినా ఆమె ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు ఫోర్బ్స్ ఆమెను అతిపిన్న వయస్కురాలైన స్వీయ నిర్మిత బిలియనీర్గా పేర్కొంది. ఆమె నికర విలువ సుమారు రూ. 1.15 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే లూసీ విజయ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసీ అమెరికాలో కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యుమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ని కోర్సులో చేరింది. అయితే ఆమె డిగ్రీ పూర్తిచేయడానికి కేవలం ఒక ఏడాది ఉండగానే కాలేజ్ నుంచి తప్పుకుంది. 2011లో థీల్ ఫెలోషిప్లో చేరింది. ఈ ఫెలోషిప్ పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ ఎంపిక చేసిన యువకులకు వారి స్వంత కంపెనీలను ప్రారంభించేందుకు కోటి రూపాయలు పైనే తోడ్పాటుని అందిస్తుంది. అయితే ఆమె ఇలా కాలేజ్కి స్వస్తి చెప్పి ఫెలోషిప్లో జాయిన్ అవుతాననడం లూసీ తల్లిదండ్రులను చాలా షాక్కి గురి చేసింది. ఎందుకంటే లూసీ అమెరికాలో మంచి భవిష్యత్తు లభించాలని ఆమె పేరెంట్స్ ప్రతిదీ పణంగా పెట్టి చదివించారు. ఇలా మద్యలో కాలేజ్ చదువుని వదలేయడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఒకరకంగా లూసీ కూడా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందే గానీ మనసులో ఏదో భయం వెంటాడుతూనే ఉంది. కానీ తన కలల ప్రపంచం కోస ఈ మాత్రం డేర్ చేయకపోతే కష్టం అని తనకు తాను సర్ది చెప్పుకుని మొండి ధైర్యంతో ముందుకు సాగింది. అలా ఆమె తన తొలి ఏఐ బిజినెస్ని ప్రారంభించింది. దీని తర్వాత టెక్ దిగ్గజం మెటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అలా ఆమె అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కంపెనీలకు సారథ్యం వహిస్తూ..2022లో కంటెంట్ క్రియేటర్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకురాలిగా మారింది. ఆ విధంగా అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తి అత్యంత ధనవంతురాలైన వ్యవస్థాపకురాలిగా మారిందామె. అయితే లూసీ ఒకటో లేక రెండు సంత్సరాలైనా.. కాలేజ్కి వెళ్లాలని అంటుంది. అక్కడే మంచి స్నేహితులు, జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు గురించి తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. పైగా కాలేజ్ అనేది నేర్చుకోవడానికే కాదు మంచి స్నేహితులను సంపాదించుకోవడం కూడా నేర్పుతుందని చెబుతోంది. అదే భవిష్యత్తులో పెట్టబోయే కంపెనీల్లో వాళ్లు ఉద్యోగులు గానో లేక మీ కంపెనీ భాగస్వాములు గానో ఎంపిక చేసుకునేందుకు దారితీస్తుందని చెబుతుంది. అంతేగాదు విజయవంతమైన కంపెనీ నిర్మించాలంటే పిచ్చి తపన, ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమని చెప్పింది. తనకు ఈ థీల్ ఫెలోషిప్ తాను ఈ పనిచేయగలను అనే వాతావరణాన్ని అందించిందని చెబుతోంది లూసీ. ఆమె కథ కాలేజ్కి వెళ్లి ఎంజాయ్ చేసే యువతకు ఆదర్శం. భవిష్యత్తు మంచిగా నిర్మించుకునే కీలక వయసుని సరైన మార్గంలోకి తీసుకువెళ్లాలంటేజజ కచ్చితమైన వ్యూహం, ప్రణాళికి ఎంతలా అవసరం అనేందుకు వ్యవస్థాపకురాలు లూసీ స్టోరీనే ఉదహారణ. 30 ఏళ్లకే పాస్సెస్ అనే కంపెనీ నడిపి, కంటెంట్ క్రియేటర్లను సరికొత్త స్థాయిలో నిలిపింది, వాళ్లతో సంపదను ఎలా సృష్టించచ్చో చూపించింది. కృషికి తోడు ధైర్యం ఉంటే ఏదైనా అవలీలగా సాధించొచ్చని లూసీ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!
కడుపున పుట్టిన పిల్లలే కాదు.. కనిపించకుండా ఎక్కడో నక్కిన సైబర్ నేరస్తుల చేతిలోనూ వేధింపులు, సైబర్ మోసాలకు గురవుతున్న వృద్ధులకు భరోసా కల్పించేందుకు రాచకొండ పోలీసులు అడుగులు ముందుకేశారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ)తో కలిసి గోల్డెన్ కేర్ ‘మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ’ అనే వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వృద్ధులకు రక్షణ, సంరక్షణ, గౌరవం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. గోల్డెన్ కేర్ ద్వారా వారికి భద్రత మాత్రమే కాదు, ఆప్యాయం, గౌరవం, ఆతీ్మయతను అందించనున్నారు. వృద్ధులు సమాజానికి నిజమైన మూలస్తంభాలు, జ్ఞాననిధులని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు కొనియాడారు. రాచకొండ పోలీసులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యుల్లా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్స్ అందరికీ కిట్స్ పంపిణీ చేశారు. సైబర్ భద్రత, ఆరోగ్య బీమా..గోల్డెన్ కేర్ కార్యక్రమం కింద వృద్ధులకు నియమిత పర్యటనలు, నైతిక సహకారం అందించడంతో పాటు ఎస్ఓఎస్ సెటప్, వైద్య, అత్యవసర సహాయం కోసం ఆస్పత్రులతో ఒప్పందాలు, ఆరోగ్య బీమా సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మార్గదర్శనం అందిస్తారు. వృద్ధులకు ఆర్థిక, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తారు. మోసాల బారిన పడితే పోలీసులకు తెలియజేసే ప్రక్రియలో సహాయం, శారీరక లేదా మానసిక వేధింపుల కేసుల దర్యాప్తు, జోక్యం చేసుకోవడం, నిర్లక్ష్యానికి గురైనా విడిచిపెట్టే సంఘటనలలో తగిన పరిష్కారం అందిస్తారు. వీటితో పాటు వృద్ధులు తప్పిపోయినా, ఏదైనా వస్తువులు పొగొట్టుకున్నా వాటిని కనుగొనడంలో పోలీసులు సహాయం అందిస్తారు. గోల్డెన్ కేర్ సేవల కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్ హెల్ప్లైన్ నంబరు 14567 లేదా రాచకొండ వాట్సాప్ నంబర్ 87126 62111లతో సంప్రదించవచ్చు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్–144 కింద వృద్ధులను పోషించకుండా నిర్లక్ష్యం చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అలాగే, మెయింటెనెన్స్ యాక్ట్ (సెక్షన్లు 4, 5) వృద్ధులు తమ పిల్లల నుండి ఆర్థిక సహాయం పొందేలా అవకాశం కలి్పస్తుంది. డీసీపీలు పద్మజ, ప్రవీణ్ కుమార్, ఆకాం„Š యాదవ్, సునీతా రెడ్డి, అరవింద్ బాబు, ఇందిరా, ఉషా రాణి, నాగలక్ష్మీ, రమణా రెడ్డి, మనోహర్, ఆర్కేఎస్సీ జాయింట్ సెక్రటరీ శివ కారడి, చీఫ్ కో–ఆర్డినేటర్ సావిత్రి పాల్గొన్నారు. (చదవండి: She Astra App for Women : రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..: దేశంలోనే తొలి ఉమెన్ యాప్) -
రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..
సోషల్ మీడియా యాప్స్ అంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్.. వ్యక్తిగత అనుభూతి, అభిరుచులు ఉత్సాహంగా పంచుకోవడం.. కానీ ప్రస్తుతం హేట్ స్పీచ్, విద్వేషాలు, నెగెటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటి అంశాలకు ఆన్లైన్ వేదికలుగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఫేస్బుక్, ఇన్స్టా వంటి వేదికలు మరింత అసభ్యకరంగా మారాయి. జెన్ జీ బ్యాచ్ అయితే మరీ హద్దు అదుపు లేకుండా ట్రోలింగ్, లీచింగ్కు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు, యూత్ గర్ల్స్కు ప్రత్యామ్నాయ ఆన్లైన్ వేదికల అవసరముందని ఆలోచించారు నగరానికి చెందిన మహిళా అడ్వొకేట్ వెన్నెల. ఇందులో భాగంగానే కేవలం మహిళల కోసమే అనే సోషల్ యాప్ రూపొందించారు. ఇన్నోవేషన్ల వేదికగా.. ఈ ‘షీ అస్త్ర’ యాప్లో మహిళల కోసం ప్రత్యేకంగా రూమ్స్ ఉంటాయి. టాలెంట్ రూమ్లో యువత ఆర్ట్స్, స్కిల్స్ ప్రోత్సహించేలా రూపొందించారు. ముఖ్యంగా జెన్ జీ అట్రాక్షన్, గుర్తింపునకు వారిలోని నైపుణ్యాన్ని, కళలను షేర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి, చర్చించుకోడానికి గాసిప్ రూమ్, ఈ తరం ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోడానికి రికమండేషన్ రూమ్ వంటివి ఉన్నాయి. డిప్రెషన్, ట్రోమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రైవసీతో సిస్టర్ ఎస్ఓఎస్ వేదిక ఉంది. మహిళలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘షీ అస్త్ర స్కూల్’ తయారు చేశారు. ఇది మహిళలకు పెద్దబాలశిక్ష మాదిరి అని వెన్నెల తెలిపారు. మిగతా సోషల్ యాప్స్లో ట్రోలింగ్ రిపోర్ట్ చేయడానికి ట్రోల్ పోలీస్, సెకండరీ విక్టిమైజేషన్, హాష్ట్యాగ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. అడ్వొకేట్ ప్రాక్టీస్లో భాగంగా మహిళలకు సైబర్, ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన పలు సున్నితమైన, సూక్ష్మమైన అంశాలను.. అవి ప్రభావితం చేసే పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని యాప్ రూపొందించిన వెన్నెల తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్తో ఎందరో అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్స్ నిరాశ, నిరాస నిస్ప్రుహలోకి చేరుకోవడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా మిగతా సోషల్ యాప్స్లాగే కేవలం ఉమెన్ కోసం ‘షీ అస్త్ర’ యాప్ రూపుదిద్దుకుంది. దీనికి మహిళగా తప్పనిసరి ఆధార్ అప్రూవల్ అవసరం. దేశంలో మొదటి ఆధార్ అనుసంధానిత యాప్ కావడం దీని ప్రత్యేకత. ఈ యాప్ను నగరంలోని టీహబ్ వేదికగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఐఏఎస్ ఆఫీసర్ భవానీ శ్రీ, ఐఆర్ఎస్ అధికారి బలరాం, ఐఏఎమ్సీ డిప్యూటీ రిజి్రస్టార్ నిక్షిత నిరంజన్ ఆవిష్కరించారు. నా వంతు సహకారంగా..సోషల్ మీడియాలో ఒక ఫొటో పెడితే ఎన్నో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్.. మహిళలు స్వేచ్ఛగా తమ ఆలోచలనలు పంచుకోలేకపోతున్నారు. దీనిని మార్చడానికి నేనేం చేయగలను అనే ఆలోచన నుంచి నా సాంకేతిక బృందం అశ్విన్, నవ్య, దీక్ష, నవీన్ సహకారంతో దీనిని సృష్టించాం. ప్రస్తుతం దేశంలో మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. నెలకు చిన్నమొత్తం రుసుముతో దీనిని వినియోగించుకోవచ్చు. షీ అస్త్ర మహిళ కోసం మొదటి సారి భారత్ నుంచి ఆవిష్కృతమైందని గర్వంగా చెప్పుకుంటాను. – వెన్నెల, యాప్ క్రియేటర్, అడ్వొకేట్కామెంట్లకు గ్రూప్రిపోర్ట్.. ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు సురక్షితమైన వర్చువల్ స్పేస్ లేదనే చెప్పాలి. 10వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు సైతం అన్లైన్లో ట్రోల్ చేయడం, అభ్యంతరకరమైన, అశ్లీల కామెంట్లు పెట్టడం సాధారణమైపోయింది. ఈ తరుణంలో షీ అస్త్ర యాప్ మంచి ఆవిష్కరణ. అశ్లీల, అసభ్య కామెంట్లకు గ్రూప్ రిపోర్ట్ ఆప్షన్ ప్రతిఒక్కరూ వినియోగించాలి. చట్టాలు, సైబర్ క్రైమ్ ప్రభావవంతంగా ఉంటే మహిళలు తమ ఆలోచనలను మరింత ఉన్నతంగా పంచుకోగలుగుతారు. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడుట్రోలింగ్ నుంచి రక్షణగా.. మహిళలకు సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది యూనివర్స్ ప్రాబ్లం.. ఈ మధ్య ఒక అమ్మాయి విడాకులు తీసుకుని వేడుక చేసుకుంటే.. సోషల్ మీడియాలో వచి్చన నెగెటీవ్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించింది.. నాగాలాండ్లో ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతుందని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. అనంతరం కేసులు, కౌన్సిలింగ్తో పరిష్కారం చూపించగలిగా. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు రిపోర్ట్ చేయడం అలవర్చుకోవాలి. – భవానీ శ్రీ, ఐఏఎస్, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి నెగెటివిటీకి దూరంగా.. గత ఇరవై సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరగడం.. దీంతో పాటు మహిళలపై ట్రోలింగ్ పెరిగింది. ముఖ్యంగా మార్ఫింగ్, ఫేక్ అకౌంట్స్ వంటివి సమస్యగా మారాయి. సాంకేతిక పరంగా మహిళలకు సురక్షితమైన షీ అస్త్ర వంటి ఆన్లైన్ వేదికలు పెరగాలి. ఇది అనువైన డిజైనింగ్ క్రియేటింగ్ స్పేస్ కావలి.. ట్రోలింగ్, నెగెటివిటీకి దూరంగా.. షీ అస్త్రలోని ప్రైవసీ పాలసీ, మలి్టపుల్ ఫీచర్స్, రిపోర్టింగ్ ఆప్షన్స్ అమ్మాయిలకు మేలు చేస్తాయి. – నిక్షిత నిరంజన్, ఐఏఎమ్సీ డిప్యూటీ రిజి్రస్టార్. రెండు అంశాల సమ్మిళితం.. సామాజికంగానే కాదు ఆన్లైన్ వేదికగా కూడా అమ్మాయిలకు అనువైన పరిస్థితులు కనపడట్లేదు. ఈ తరంలో వచి్చన మార్పు ఇది.. దీనికి అనుగుణంగా సాంకేతికంగా, న్యాయ శాఖ పరంగా మార్పులు రావాల్సిన అవసరముంది. ఈ రెండు అంశాల సమ్మిళితమే షీ అస్త్ర యాప్. అడ్వొకేట్ సేవలందింస్తూనే ఇలాంటి సాంకేతిక పరిష్కారం అందించిన వెన్నెల టీం ప్రయత్నం అభినందనీయం. – బలరాం, ఎస్సీసీఎల్ చైర్పర్సన్–ఎండీ -
'ఏక్లా నారీ శక్తి సంఘటన్'..! ఒంటరి సైన్యం
పెళ్లైన రెండు సంవత్సరాలకే నిర్మల్ చందేల్ భర్త చనిపోయాడు. హిమాచల్ప్రదేశ్లోని మండీకి చెందిన నిర్మల్కు ఒకవైపు తట్టుకోలేని దుఃఖం, మరోవైపు ఎన్నో ఆంక్షలు. నిర్మల్ అలంకరించుకోవడానికి లేదు. కొత్త దుస్తులు ధరించడానికి లేదు. బయటికి వెళ్లడానికి లేదు. ఉత్సవాలు, వేడుకలలో పాల్గొనడానికి లేదు. ఆంక్షల వల్ల తనలో విషాదం మరింత ఎక్కువ అయింది. కొంతకాలానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. కాస్త ఉపశమనంగా అనిపించింది. సోలన్ జిల్లాలోని ఒక స్వచ్ఛంద సంస్థలో అకౌంటెంట్గా చేరింది. ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉండేది. అక్కడ తనలాగే ఎంతోమంది ఒంటరి మహిళలు ఉంటున్నారు. వారు కూడా తనలాగే ఎన్నో బాధలు అనుభవించారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఏక్లా నారీ శక్తి సంఘటన్ (ఇఎన్ఎస్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ హిమాచల్ప్రదేశ్ చాప్టర్కు ప్రాతినిధ్యం వహించడంతో నిర్మల్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఈ చాప్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,445 సభ్యులు ఉన్నారు. 1999లో 350 మంది ఒంటరి మహిళలతో జైపూర్లో ప్రారంభమైన ఏక్లా నారీ శక్తి సంఘటన్లో ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలలో 2,50,000 మంది మహిళలు ఉన్నారు. రాజస్థాన్లో అత్యధిక సంఖ్యలో 1,02,000 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడేలా చేయడం నుంచి వారి ఆరోగ్య సంరక్షణ వరకు ఎన్నో విషయాలలో కృషి చేస్తోంది ఏక్లా నారీ శక్తి సంఘటన్. మన దేశంలో ఒంటరి మహిళల (సింగిల్ ఉమెన్) సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య 2011లో 51.2 మిలియన్లు ఉండగా 2024కు 71.4 మిలియన్లకు చేరింది. (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!
చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో రికార్డు సృష్టించి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్.కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. ఉదయమే భర్త సామ్సన్ జాకబ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్ ఆర్ట్కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్స్ ఎగ్షెల్, పిస్తా షెల్లతో తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్లో ఆరితేరిపోయింది. ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్లలోనూ, పలు స్టాల్స్ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్ 19 రావడంతో తన పనికి బ్రేక్పడినా..ఆ లాక్డౌన్ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. రికార్డుల స్థాయికి..అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..) -
నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్ లెహంగా చోళిలో అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్కు మ్యాచింగ్గా ప్యాచ్వర్క్ , బంగారు జరీ వర్క్తో పింక్ బ్లౌజ్ను ఆమె ఎంచుకున్నారు. గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో నీతా అంబానీ లుక్మరింత ఎలివేట్ అయింది. మల్టీ లేయర్డ్ డైమండ్స్, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్తో పాటు స్టేట్మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్ను ధరించారు. ఈ కాస్ట్యూమ్స్ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. (Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్)అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్స్టిక్తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్స్టైల్ , నుదిటిపై ఎర్రటి బొట్టు తదితర వివరాలను అందించారు. (సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు)నెటిజన్ల స్పందనసోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్కు అవార్డు నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉన్నారంటూ కొనియాడటం విశేషం. -
సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు
కరోనా (corina) సమయంలో రాష్ట్రానికి కీలక సేవలు అందించిన ఐఏఎస్ అధికారిణి బీలా వెంకటేశన్ (Beela Venkatesan) (56) ఇక లేరు. ప్రజా సేవకు, అంకితభావానికి పేరుగాంచిన ఉన్నతాధికారిణి, తమిళనాడు ఇంధన శాఖ కార్యదర్శిగా బీలా బుధవారం (సెప్టెంబర్ 24న) అనారోగ్యంతోకన్నుమూశారు.గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్నారు. ఆమె మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. పాలన ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధత మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆమెకు నివాళులర్పించారు,2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వెంకటేశన్ తమిళనాడులో సుపరిచితం.ఆ సమయంలో రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిగా, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి తన రోజువారీ మీడియా బ్రీఫింగ్ల ద్వారా కీలకమైన నవీకరణలను అందిస్తూ తమిళనాట బహుళ ప్రజాదరణ పొందారు.డాక్టర్ బీలా వెంకటేశన్ మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసి) నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా వైద్యురాలైన 1997లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. మొదట బీహార్, ఆ తరువాత జార్ఖండ్లోనూ పనిచేసి అనంతరం తమిళనాడుకు బదిలీ అయ్యారు.తమిళనాడులో, ఆమె చెంగల్పట్టు సబ్-కలెక్టర్గా పనిచేశారు; ఫిషరీస్ కమిషనర్; కమీషనర్ ఫర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్; ఆరోగ్య ప్రధాన కార్యదర్శి,ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతికి కమిషనర్గా విశేష సేవలందించారు.బీలా తల్లి, నాగర్కోయిల్కు చెందిన రాణి వెంకటేశన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే. ఆమె తండ్రి, SN వెంకటేశన్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ -
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్టర్మ్ కోచింగ్కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
దేశానికి రక్తతర్పణం చేసిన అహింసా మూర్తి!
ఆమె 73 ఏళ్ల ముదుసలి. జాతీయ పతాకాన్ని ఎత్తిపట్టి ‘వందేమాతరం’, ‘ఆంగ్లేయులారా! ఇండియాను వదిలి వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ ఆరువేల మందితో ఒక పోలీస్ స్టేషన్ను ఆక్రమించేందుకు శాంతియుతంగా దండయాత్ర చేస్తోంది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరి పారు. అయినా ఆమె ముందుకే కదిలింది. ఈసారి జెండా పట్టుకున్న చేతిని గురిచూసి కాల్చారు. వెంటనే రెండో చేతిలోకి జెండాను మార్చుకుని మునుముందుకు దూకింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆమె రెండో చేతి పైనా, నుదుటి పైనా కాల్పులు జరిపారు. తెల్లని ఖద్దరు చీర రక్తసిక్తమయ్యింది. ఆ బక్కచిక్కిన వృద్ధ యోధ కుప్పకూలింది – కానీ జెండాను మాత్రం కిందపడకుండా గుండెలకు హత్తుకునే!1942 సెప్టెంబర్ నాలుగవ వారంలో చోటు చేసుకున్న ఈ బలిదానం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ‘వృద్ధ మహిళా గాంధీ’ (గాంధీ బురి)గా పేరుగాంచిన ఆమె పేరు మాతంగినీ హజ్రా (Matangini Hazra). 1869లో బెంగాల్లోని హొగ్లా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు పన్నెండేండ్లకే వివాహం చేశారు. కానీ 18 ఏండ్లకే వితంతువయ్యింది. పిల్లలు లేని ఆమె సమాజ సేవ, దేశ సేవకే తన జీవితాన్ని అంకితమిచ్చింది. ఆమెకు చదువు లేదు. అయినా గాంధీజీ బోధనలకు ఆకర్షితురాలయ్యింది. ఆయన చెప్పినట్లే జీవించింది. 1930లలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు మిగతా ఉద్యమాల్లోనూ పాల్గొని జైలుకెళ్లింది. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని 1942 ఆగస్ట్ 8న ‘క్విట్ ఇండియా’ (ఇండియా వదిలి వెళ్లండి) ఉద్య మాన్ని ప్రారంభించింది. గాంధీజీ ‘డూ ఆర్ డై’ (విజయమో, వీరస్వర్గమో) అంటూ ఉద్య మాన్ని ఉరకలెత్తించారు. ఈ ఉద్యమ సమయా నికి మాతంగినికి 73 ఏండ్లు. బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఉద్యమానికి సరైన నాయకత్వం అందించే గాంధీవాదులు లేకపోవడంతో ఈ ఉద్యమం ప్రజల తిరుగుబాటుగా మారింది. బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాలు చేసే సమాంతర ప్రభుత్వాన్ని లేదా ‘జాతీయ సర్కా ర్’ను తామ్లుక్లో ‘సమర్ పరిషద్’ ఏర్పాటు చేసింది. మాతంగినీ పక్కా గాంధేయవాదే కానీ ఈ తిరుగుబాటుదారుల్లో ఒకరుగా మారారు. పోలీస్స్టేషన్పైకి దండయాత్ర1942 సెప్టెంబర్ 29న తామ్లుక్ పోలీస్ స్టేషన్ (అప్పట్లో సెయ్లన్ స్క్వేర్)పై నియంత్రణ సాధించడానికి తామ్లుక్ జాతీయ సర్కార్ ఒక నిరసన మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇది బ్రిటిష్ అధికారంపై ప్రత్యక్ష తిరుగుబాటే! పోలీస్ స్టేషన్పై భారత జాతీయజెండాను ఎగురవేయడానికి వేలాదిమందితో (వీరిలో ఎక్కువమంది స్త్రీలు) మాతంగినీ బయలుదేరింది. పోలీస్ స్టేషన్ ఉన్న ఊరు సమీపానికి ఆమె తన అనుయాయులతో చేరుకున్నప్పుడు, యూరోపియన్ అధికారుల ఆధ్వర్యంలోని బ్రిటిష్ ఇండియన్ పోలీసు దళాలు అడ్డంగించాయి. అయినా ముందుకే కదలడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆమె ‘వందేమాతరం’ నినాదం చేస్తూనే కుప్పకూలిపోయింది. ఆమె పక్కనే మార్చ్ చేస్తున్న ఇద్దరు యువకులు సఖావత్ అలీ, సతీష్ చంద్ర సామంతా పైనా పోలీసులు కాల్పులు జరపడంతో వారూ వీర మరణం పొందారు. మాతంగినీ హజ్రా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత ధైర్యవంతురాలిగా చరిత్ర లిఖించారు. తామ్లుక్లో ఆమె బలిదానం జరిగిన చోట ఆమె విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. ప్రస్తుతం ఉన్న తామ్లుక్ పోలీస్ స్టేషన్ పేరు ‘మాతంగినీ హజ్రా పోలీస్ స్టేషన్‘గా మార్చారు. భారత ప్రభుత్వం 2002లో ఆమె గౌరవార్థం ఒక తపాలా బిళ్లను జారీ చేసి తనను తాను గౌరవించుకుంది. -
భర్త కంపెనీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అనురాధ
కొన్ని దశాబ్దాల క్రితం మారుతి వినాయక్ గోకర్ణ అనే యువ ఇంజినీర్ ఎన్నో కలలతో చిన్న కంపెనీ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత వినాయక్ చనిపోవడంతో కంపెనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వినాయక్ భార్య అనురాధ (Anuradha M Gokarn) కు వ్యాపార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన అనురాధ కంపెనీ నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకుంది. పాఠాలు చెప్పినంత తేలిక కాదు’ అన్నారు విమర్శకులు. అయితే కంపెనీ బాధ్యతలు తీసుకున్న తరువాత తానే ఒక గెలుపు పాఠం అయింది. అప్పుల బారిన పడిన కంపెనీని ఆరు సంవత్సరాల వ్యవధిలో లాభాల బాట పట్టించింది.కట్ చేస్తే...ఆ కంపెనీ పేరు... ట్రిటాన్ వాల్వ్(Triton Valves Ltd) మన దేశంలో ఆటోమోటివ్ టైర్ వాల్వ్లు, ఉపకరణాల తయారీలో అతి పెద్ద సంస్థ. వాహన పరిశ్రమకు అవసరమైన అత్యున్నతమైన టైర్ వాల్వ్లను అందించే ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది.‘నిన్న చేసిన పొరపాటు నేడు పాఠం అవుతుంది. నా వ్యాపార ప్రస్థానంలో అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను’ అని తన సక్సెస్మంత్రా గురించి చెప్పింది అనురాధ గోకర్ణ.చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడు -
కాక్పిట్ - క్యాబిన్ : మలేషియన్ ఎయిర్లైన్స్ చరిత్ర
మహిళా సాధికారత విషయంలో మలేషియా ఎయిర్లైన్స్ కీలక అడుగు వేసింది. పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని ప్రారంభించింది. చెక్-ఇన్ కౌంటర్ల నుండి, కాక్పిట్ నుండి క్యాబిన్ వరకు, మొత్తం విమాన ప్రయాణంలోని ప్రతి దశలోనూ మహిళలేబాధ్యతల్లో ఉండటం విశేషం. తద్వారా పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా మలేషియా ఎయిర్లైన్స్ చరిత్ర సృష్టించింది. సెక్యూరిటీ, పైలట్లు, కో-పైలట్లు , క్యాబిన్ క్రూ సహా పూర్తిగా మహిళా బృందమే ఉండటమే దీని విశేషం. కౌలాలంపూర్ నుండి కోటా కినాబాలుకు బయలుదేరిన విమానం (MH2610) ఎగిరింది.ఈ సమాచారాన్ని మలేషియన్ ఎయిర్లైన్స్ ఫేస్బుక్లో వెల్లడించింది. మహిళల శక్తి సామర్థ్యాలను, వృత్తి నైపుణ్యం,నాయకత్వం గుర్తించాలని పేర్కొంది.మలేషియా ఏవియేషన్ గ్రూప్ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 36 శాతంగా ఉంది. పురుషాధిపత్యం ఉన్న విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) 2025 మైలురాయిని అధిగమిండమనే కేవలం పురోగతిని మాత్రమే కాదు, ఆకాశానికి పరిమితులు లేవనే విషయాన్ని ఇది సూచిస్తుందని అని మలేషియా ఎయిర్లైన్స్ ఫేస్బుక్ పోస్ట్లో రాసింది. ఇది మరింతమందికి ప్రేరణ కావాలని అభిలషించింది. ఆశావహులైన విమానాన్ని నడపాలనుకునే వారు, తదుపరి తరం అమ్మాయిలు అడ్డంకులను అధిగమించి, తమ కలలను సాధించడంలో తమ చర్య ప్రోత్సాహాన్నిస్తుందని ఎయిర్లైన్ పేర్కొంది.ఇదీ చదవండి: Hair Dye: మెరిసిందని మురిసిపోవద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్ మలేషియా ఎయిర్లైన్స్ ప్రకారం, దేశీయ , అంతర్జాతీయ మార్గాల్లో 8,200 గంటలకు పైగా అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన పైలట్ కెప్టెన్ నూర్సజ్రినా బింటి జుల్కిఫ్లి , ఇటీవల సర్టిఫికేషన్ పొందిన యువ పైలట్ సెకండ్ ఆఫీసర్ సితి నూర్ సయామిరా బింటి బహారుద్దీన్ బోయింగ్ 737-800 ను నడిపారు. -
విజయ దశమి: స్త్రీ శక్తి విజయానికి ప్రతీక
ఈ సకల చరాచర సృష్టిని నడిపించేది శక్తి. ఈ శక్తి లేకుండా త్రిమూర్తులు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు—తమ కృత్యాలైన సృష్టి, స్థితి, లయాలను నిర్వర్తించలేరు; కదలడం కూడా సాధ్యపడదు. ఆ పరమ శక్తినే అదిశక్తి లేదా పరాశక్తి అంటారు. ఈ శక్తి త్రిగుణాత్మకమైనది—సత్వ, రజస్, తమో గుణాలతో కూడినది. ఈ గుణాలు శక్తిబీజంతో సంయోగమైతే 'స్త్రీ' రూపం ధరిస్తుంది. అటువంటి త్రిగుణమయ శక్తి ఆవిర్భవించి దుష్ట రాక్షస సంహారం చేసిన కాలం శరదృతువు, ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు.హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి శక్తివంతమైన ఆచారం దసరా! ఇది అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు చేసే మహోత్సవం. ఆ శక్తిస్వరూపిణి సృష్టిలోని సకల ప్రాణకోటికి అమ్మ, అందుకే జగన్మాత. అమ్మవారి రూపంలో దైవాన్ని ఆరాధించడం అనాదికాలం నుంచి వస్తున్న సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు ప్రధాన స్థానం ఉంది, ముఖ్యంగా దేవీ మహాత్మ్యం (మార్కండేయ పురాణంలోని భాగం)లో వివరించినట్లు, ఆమె దుష్ట సంహారం మరియు శిష్ట రక్షణ కోసం అవతరిస్తుంది.మహాశక్తి అవసరమైనప్పుడు దుష్ట సంహారం చేయడానికి లేదా శిష్ట రక్షణకు అవతరిస్తుంది. జీవులపై ఆమెకు అంతులేని ప్రేమ ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆమె అవతరణ మరియు రాక్షస సంహారం జరుగుతుంది. ఆ సమయంలో ఆదిపరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయం. దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలిగించేందుకు యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణాలు చేశారు. మనుషులు కూడా తమకు తోచిన దీక్షలు పూనుకున్నారు.ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైన మహాకాళి. నిర్గుణ పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం మహాకాళి, అందుకే త్రిశక్తులలో—మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి—మహాకాళి మొదటిది. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి కారణం మహిషాసురుడు. ఈ తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఏ కాలంలోనైనా అవసరం. మహిషాసురులు—అంటే అహంకారం, కామం వంటి దుర్గుణాలు—ఎప్పుడూ ఉంటాయి. అందుకే మహిషాసుర మర్దిని మహాలక్ష్మి అవసరం ఎప్పుడూ ఉంటుంది.మహిషాసుర సంహార కథ: త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా రూపుదాల్చింది. దేవతలందరూ తమ తేజస్సు, ఆయుధాలు సమకూర్చారు. మహిషుడు తన సంహారం కోసమే ఆమె వచ్చిందని తెలిసినా, ఆమెను ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవటంతో, కామరూపిగా రకరకాల రూపాల్లో యుద్ధం చేశాడు. దేవి తగిన రూపాలు ధరించి మహిష రూపంలోని రాక్షసుని సంహరించింది. ఇది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున జరిగింది. దీక్ష వహించినవారు దశమి నాడు జగదంబను స్తుతించి, పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయాన్ని జరుపుకున్నారు. ఆమె వారిని వరం కోరమని చెప్పగా, అవసరమైనప్పుడు కాపాడమని కోరారు. ఆమె తలచినప్పుడు అవతరిస్తానని మాటిచ్చింది.మరొక కథ శుంభ-నిశుంభులది. వారు బ్రహ్మను తపస్సుతో మెప్పించి, అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం పొందారు. స్త్రీలు బలహీనులని భావించి, వారి వల్ల భయం లేదని చెప్పారు. ఆ తర్వాత స్వర్గంపై దాడి చేసి, ఇంద్రాసనాన్ని ఆక్రమించారు. దిక్పాలకులు, సూర్య-చంద్రాది దేవతలను ఓడించి, వారి పదవులు గ్రహించారు. దేవతలు బృహస్పతి సూచనతో హిమవత్పర్వతంపై దేవిని శరణు వేడారు. జగదంబ అభయం ఇచ్చింది.ఆ సమయంలో సర్వదేవతలు తమ శక్తులను మాతృకాగణాలుగా పంపారు. ఇవి ఆయా దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలతో వచ్చి రక్తబీజ సైన్యాన్ని సంహరించాయి.మాతృకాగణాలు:బ్రహ్మ శక్తి: బ్రహ్మాణి (హంస వాహనం, కమండలు).విష్ణు శక్తి: వైష్ణవి (గరుడ వాహనం, చక్రం).శివ శక్తి: మాహేశ్వరి (వృషభ వాహనం, త్రిశూలం).కుమారస్వామి శక్తి: కౌమారి (మయూర వాహనం, శక్తి).ఇంద్ర శక్తి: ఐంద్రి (ఐరావత వాహనం, వజ్రం).వరాహ శక్తి: వారాహి (మహిష వాహనం, ఖడ్గం).నరసింహ శక్తి: నారసింహి (సింహ వాహనం, చక్రం).వీటికి తోడు వారుణి (పాశం), యామి (దండం), శివదూతి మొదలైనవి దానవులను సంహరించాయి. రక్తబీజుడు రక్త బిందువుల నుంచి కొత్త రాక్షసులు పుట్టించాడు. అప్పుడు అంబిక కాళికను రక్తం తాగమని చెప్పింది. కాళిక రక్తం తాగి, దేవి రక్తబీజుని సంహరించింది. తర్వాత నిశుంభుని తల నరికి, మొండెం కూడా నాశనం చేసింది. శుంభుని మాటలతో యుద్ధానికి ఆహ్వానించి సంహరించింది. ఇది మహా సరస్వతి అవతారం. మాట నైపుణ్యంతో విజయానికి సంకేతం.నవరాత్రులలో లలితా దేవి అవతారం ప్రాధాన్యం. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వివరించినట్లు, ఆమె సర్వచైతన్య స్వరూపిణి. బండాసురుడు (అజ్ఞానం, మూఢత్వం)ను సంహరించేందుకు అవతరించింది. జీవితం కేవలం భౌతిక సుఖాలే కాదు; చైతన్యం అవసరం. బండతనం మీద చైతన్యం విజయం—విజయదశమి సంకేతం.ప్రాంతీయ వైవిధ్యాలు: బెంగాల్లో దుర్గాపూజ ఘనంగా జరుపుకుంటారు, మహిషాసుర సంహారాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. దక్షిణ భారతంలో బొమ్మల కొలువు (గొల్లు), బతుకమ్మ (తెలంగాణలో పూలను పూజించే పండగ), కుంకుమార్చన, చండీహోమాలు చేస్తారు. ఇవన్నీ సామూహిక ఐక్యత, స్త్రీ శక్తి గౌరవాన్ని పెంపొందిస్తాయి.‘యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’సమాజంలో మంచి-చెడు సంఘర్షణలో మంచి గెలుస్తుంది. విజయదశమి దానికి ప్రతీక. శరీర అనారోగ్యం, మానసిక దుర్గుణాలు, సామాజిక దురాచారాలు, పర్యావరణ మాలిన్యాలు, స్వార్థం, అహంకారం.. వీటన్నింటి మీద విజయం సాధించడమే విజయ దశమి. ముఖ్యంగా స్త్రీల పట్ల చులకన భావం మీద స్త్రీ శక్తి విజయం. సద్భావనలు పెంపొందించుకునే పవిత్రమైన రోజు ఇది.హిందూ సంస్కృతిలో విజయ దశమి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఉత్సవం. ఆశ్వయుజ మాసంలో జరిగే ఈ నవరాత్రి ఉత్సవం జగన్మాత శక్తి స్వరూపాన్ని ఆరాధించే సమయం. ఈ పండుగ దుష్ట సంహారం, శిష్ట రక్షణ మరియు స్త్రీ శక్తి విజయానికి ప్రతీక.- చింతా గోపిశర్మ సిద్ధాంతి -
ఫస్ట్ క్లాస్ జర్నీ
కాస్త సరదాగా చెప్పుకోవాలంటే... ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అనే ఆరుద్ర మాట సురేఖ యాదవ్కు వర్తించదు. నిజానికి రైలే ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఆసియా ఫస్ట్ ఉమెన్ ట్రైన్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సురేఖ రిటైర్ అయింది. ఆమె ఒక రైలుబడి. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. భావితరాలకు మార్గదర్శకాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతారలో పుట్టి పెరిగింది సురేఖ. అయిదుగురు పిల్లల్లో పెద్దది. తండ్రి రామచంద్ర భోంస్లే రైతు. సతారాలోని సెయింట్ పాల్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకున్న సురేఖ వృత్తివిద్యా కోర్సులో చేరింది. ఆ తరువాత.. కరాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్), బీయీడీ చేసింది.టీచర్ కాదు రైలు డ్రైవర్బీయీడీ చేసిన సురేఖ టీచర్ కావాలనుకునేది. అయితే ఆమెకు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసుకొని సెంట్రల్ రైల్వేస్లో ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్గా చేరింది. 1985లో కల్యాణ్ ట్రైనింగ్ స్కూల్లో ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంది. అసిస్టెంట్ డ్రైవర్గా ఆమె వృత్తి ప్రయాణం మొదలైంది. వాడి బందర్, కల్యాణ్ల మధ్య నడిచే గూడ్స్ ట్రైన్లో ఇంజిన్ రన్నింగ్ కండీషన్, సిగ్నల్స్... మొదలైన వాటిని పర్యవేక్షించేది. కొన్ని సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో గూడ్స్ డ్రైవర్గా బాధ్యతలు స్వీకరించింది. ఆ తరువాత వెస్ట్రన్ ఘాట్ రైల్వేస్లో డ్రైవర్గా పనిచేసింది.→ దక్కన్ క్వీన్ డ్రైవ్ చేసిన క్వీన్దక్కన్ క్వీన్(డైలీ పాసింజర్ ట్రైన్) డ్రైవర్గా పాసింజర్ ట్రైన్ను నడిపిన ఆసియాలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. ఘాట్ లైన్ కోసం రెండు–ఇంజిన్ల ప్యాసింజర్ ట్రైన్ నడపడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంది. గతంలో మహిళలు ఎవరూ ఘాట్ లైన్లో ట్రైయిన్ నడపక పోవడం వల్ల పై అధికారులకు సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంది సురేఖ. ‘దక్కన్ క్వీన్ ట్రైన్ నడపాలనేది నా కలగా ఉండేది. ఎందుకంటే మహిళ పేరుతో నడిచే రైలు అది. ఆ పేరులో రాజసం ధ్వనిస్తుంది. ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. భారతీయ రైల్వే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఉంది. మహిళలకు ప్రత్యేకించిన ట్రైన్స్ను నడపడం కూడా సంతోషంగా ఉంది’ అంటుంది సురేఖ.→ గురువుగా...ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్గా 2011లో ప్రమోట్ అయిన సురేఖ ఆ తరువాత కల్యాణ్లో డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్ (డిటీసి)లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా పాఠాలు బోధించింది. మన దేశంలో ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది. 2011లో 50 మంది మహిళలు సబర్బన్, గూడ్స్ ట్రైన్ డ్రైవర్లుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి...సురేఖ.→ ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై...‘ఆడవాళ్లు ట్రైన్ డ్రైవర్ ఏమిటి! అని ఆశ్చర్యపోయే రోజుల్లో కూడా నా కుటుంబం, మిత్రులు, బం«ధువుల నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై నన్ను ముందుకు నడిపించింది. వృత్తిజీవితంలో నాకు ఎలాంటి వివక్షా ఎదురుకాలేదు. ట్రైన్ ఎక్కిన తొలి క్షణం నుంచి మరే విషయాలు మదిలో రాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది సురేఖ. నిజానికి ఆమె రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ ఉద్యోగమే ఆమెను చరిత్రలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.ఘనమైన వీడ్కోలుసురేఖ యాదవ్ ఫేర్వెల్ సెలబ్రేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సురేఖ ఆత్మీయలు, స్నేహితులు, బంధువులు, రైల్వే ఉద్యోగులు ఆమె మెడలో పూలమాలలు వేశారు. డోళ్లు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘సురేఖ రిటైర్ అయినప్పటికీ... ఆమెలోని శక్తి సామర్థ్యాలు రిటైర్ కావు. అవి ఎప్పుడూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి’ అన్నారు వక్తలు.కష్టం లేదు... ఎప్పుడూ ఇష్టమే!‘ట్రైయిన్ నడపడం అంటే మాటలా!’లాంటి మాటలు వినిపించినప్పటికీ నేను ఎప్పుడూ భయపడలేదు. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా శిక్షణ తీసుకున్నాను. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగం ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. కుటుంబ, వృత్తి బాధ్యతలను జాగ్రత్తగా సమన్వయం చేసుకునేదాన్ని.– సురేఖ యాదవ్ -
ఫుడ్ ఇంజనీర్..మిల్లెట్ బిజినెస్తో నెలకు రూ. 3 లక్షలు
అవసరం అన్నీ నేర్పించడమే కాదు.. ప్రయోగాల దిశగా ప్రేరేపిస్తుంది కూడా!అలాంటి ఒకానొక అవసరమే ఢిల్లీ వాసి పలక్ అరోరాను ఆంట్రప్రెన్యూర్గా మార్చింది! సద్గురు సూపర్ ఫుడ్స్’ను స్థాపించేలా, ‘మిల్లియమ్’ బ్రాండ్ను లాంచ్ చేసేలా చేసింది!కాలంతో పరుగులు పెడుతున్న కుటుంబాలకు దాన్నో వరంలా అందించింది! అయితే.. ఫుడ్ టెక్నాలజీలో ఎఫ్ఎస్సెస్సీ (ఊ ఇ) 22000 లీడ్ ఆడిటర్ సర్టిఫికెట్ పొందిన ఆమె ప్రయాణం హైటెక్ ల్యాబ్లోనో.. స్టార్టప్ ఇంక్యుబేటర్లోనో మొదలవ్వలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్టీఈఎమ్) థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు.. కోవిడ్ లాక్ డౌన్ టైమ్లో మొదలైంది.ఆ అవసరం ఏంటంటే.. కోవిడ్ టైమ్లో ఇమ్యూనిటీని పెంచేదేగాక తేలికగానూ వండుకోగలిగే ఫుడ్ కోసం ఆన్లైన్లో వెదకడం మొదలుపెట్టింది. ఆ జాబితాలో రా మిల్లెట్స్ ... లేదంటే ముతక పిండే కనబడసాగింది. తప్ప రెడీ టు కుక్ లేదా రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఏమీ కనిపించలేదు. మిల్లెట్స్ పౌష్టికాహారమని అందరికీ తెలుసు.. కానీ వాటిని రాత్రంతా నానబెట్టడం, తెల్లవారి ఉడకబెట్టడం లాంటి సుదీర్ఘ ప్రక్రియ లేకుండా అప్పటికప్పుడు అత్యంత తేలికగా వండటమెలాగో ఎవరికీ తెలియదు. పలక్ ఆలోచనల్లో ఉన్నప్పుడే ఆమె తండ్రికి కిడ్నీ ఫెయిల్యూర్ అని నిర్ధారణ అయింది. దీర్ఘకాలంగా మైక్రోన్యూట్రియెంట్స్ అందక΄ోవడం వల్లే వాళ్ల నాన్నకు కిడ్నీ జబ్బు వచ్చిందని డాక్టర్స్ తేల్చారు. దాంతో తన అన్వేషణను మరింత వేగవంతం చేసింది.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!పోషక విలువల బంచ్ఈజీ టు కుక్ ఫుడ్ మీద ప్రయోగాల కోసం పలక్.. తమ ఇంటి టెర్రస్నే కిచెన్గా మార్చుకుంది. ఆమె కనిపెట్టిన తొలి వంటకాల్లో స్ప్రౌటెడ్ మిల్లెట్ పోరిడ్జ్, మిక్స్డ్ వెజిటబుల్ ఇడ్లీలు, పంజాబీ స్టయిల్ చీలా (పాన్కేక్ లాంటిది) వంటివి ఉన్నాయి. ప్రతి వంటకాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో వంద సార్లు టేస్ట్, టెస్ట్ చేయించేది. ‘నా ఈ ప్రయత్నాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్న మాత్రం నమ్మారు. ప్రోత్సహించారు. ప్రతి చాలెంజ్లో నాకు అండగా నిలబడ్డారు. నా బిగ్గెస్ట్ స్ట్రెన్త్ మా నాన్నే!’ అని చెబుతుంది పలక్ అరోరా. 2021లో ‘సద్గురు సూపర్ఫుడ్స్’ పేరుతో సంస్థను రిజిష్టర్ చేయించింది. 2022లో ‘మిల్లియమ్’ అనే బ్రాండ్ను లాంచ్ చేసింది. దానికి హెల్దీ అండ్ జల్దీ అనే ట్యాగ్లైన్నూ పెట్టింది. ప్రిజర్వేటివ్స్,అడిటివ్స్ లేని ఈ ఫ్యూజన్ ఫుడ్ పోషకవిలువల సముదాయం. . మిల్లియమ్ ఉత్పత్తులన్నీ ఎఫ్ఎస్సెస్ఏఐ, ఏపిఈడీఏ, ఎమ్ఎస్సెమ్మీ, స్టార్టప్ ఇండియా ధ్రువీకరించినవే. అలా టెర్రస్ కిచెన్ నుంచి ఫుల్ప్లెడ్జ్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎదిగిన ఆ బ్రాండ్ నెలకు ఎనిమిది టన్నుల రెడీ టు కుక్ ఆహారపదార్థాలను, 21 టన్నుల రెడీ టు ఈట్ మిల్లెట్ ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేస్తోంది. రాగి సూప్, మిల్లెట్ నూడుల్స్, పాస్తా, మిల్లెట్ పోహా నుంచి పాన్కేక్స్ దాకా మొత్తం పదిహేను రకాల వెరైటీస్ ఉన్నాయి. అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. నేడు, ఆమె చిరు ధాన్యాల ఆధారిత ఆహార వ్యాపారం ద్వారా ప్రతి నెలా రూ. 3 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తుంది, సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో మేళవించి చక్కటి ఆహారాన్ని అందిస్తోంది. అలాగే చిరు ధాన్యాల సాగును పూర్తిగా వదిలివేసిన గ్రామీణ రైతులను మిల్లెట్స్ సాగుదిశగా ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలుస్తోంది. ఆమె దగ్గర ప్రస్తుతం ఎనిమిది మంది ఉద్యోగులున్నారు. స్థానికంగా మరింతమంది మహిళలకు కొలువులిచ్చి తన సంస్థను విస్తరింపచేయాలనుకుంటోంది పలక్. ‘ఈ మిల్లెట్ రివైవల్ అనేది కేవలం ఒక బిజినెస్ ఆపర్చునిటీయే కాదు సస్టెయినబుల్ అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ కూడా. అందుకే పొలం నుంచి ఫోర్క్ దాకా ప్రతి దశలోనూ అవకాశాలను క్రియేట్ చేస్తూ పౌష్టికాహారాన్ని అందించడమే మా లక్ష్యం. అదే నిజమైన విజయంగా భావిస్తాను’ అంటుంది పలక్. -
ఈ బామ్మ రోజూ జైలుకు!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!‘చాలా మంది ఉదయం ఆలయానికి వెళ్లినట్లే నేనూ జైలుకు వెళుతుంటాను’ నవ్వుతూ అంటుంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన అరుణ. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అరుణ విపశ్యన ధ్యానప్రక్రియను సాధన చేసేది. ఆ సమయంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కోర్సులకు సంబంధించి కరపత్రం ఒకటి చదివింది. ఆ కోర్సులు నేర్చుకోవడానికి రెడీ అయింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాంపస్లో ఎన్నో కోర్సులు నేర్చుకుంది. ఆ తరువాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.‘తొలిసారిగా జైలుకు వెళ్లినప్పుడు భయంగా ఏమీ అనిపించలేదు. జైలులో ఎలా ఉంటుందో ఆసక్తికరంగా పరిశీలించాను. ఖైదీలతో వివరంగా మాట్లాడాను. వారితో కలిసి భోజనం చేశాను. ప్రతి నిమిషం హాయిగా గడిచినట్లు అనిపించింది. యోగా, «ధ్యానం ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది అరుణ.ఆనాటి నుంచి ప్రతిరోజూ ఉదయం జైలులో నాలుగు గంటల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తోంది. జబల్పూర్ మాత్రమే కాదు ఇండోర్, సాత్న, భోపాల్లతో పాటు మధ్యప్రదేశ్లోని పది కారాగారాలలో యోగా సెషన్లు నిర్వహిస్తోంది.‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ పేరుతో తాను నిర్వహించే కార్యక్రమాల వల్ల ఖైదీల ఆలోచనా ధోరణిలో మార్పు రావడాన్ని ఆమె గ్రహించింది. చాలామంది ఖైదీలు ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహలతో కనిపించేవారు. అలాంటి వారికి జీవనోత్సాహాన్ని కలిగించడంలో ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ ప్రభావం ఎంతోఉంది.‘కోర్స్ పూర్తి చేసుకున్న ఖైదీలలో ఎంతో మార్పు వచ్చింది. తగాదాలు తగ్గాయి. కొద్దిమంది ఖైదీలలో విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపంలో బ్లేడ్తో కోసుకొని తమకు తాము హాని చేసుకునేవారు. అలాంటి వారిలో పూర్తిగా మార్పు వచ్చింది’ అంటుంది అరుణ. గతంలో కొందరు ఖైదీలు జైలు నుంచి పారి΄ోవడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వారిలో కూడా ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ మార్పు తీసుకువచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లాడు రాజు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మళ్లీ అదే అక్రమ వ్యాపారం చేయాలనుకునేవాడు. అయితే అరుణ నిర్వహించే హ్యాపీనెస్’ కార్యక్రమంతో అతడిలో మార్పు వచ్చింది.జైలు నుంచి విడులైన రాజు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా కూలి పనులు చేసుకొని బతుకుతున్నాడు. స్థూలంగా ‘హ్యాపీనెస్ ప్రోగ్రాం’ ద్వారా ఖైదీలకు యోగా, ధ్యానం మాత్రమే పరిచయం కాలేదు. ఉత్సాహంతో కూడిన కొత్త జీవన విధానం పరిచయం అయింది. జైలు బయట రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలలో పాల్గొంటుంది అరుణ. మద్యం బారిన పడిన ఎంతోమందిని ఆ దురలవాట్ల నుంచి బయటకు తీసుకువచ్చింది. ‘జైలులో నిర్వహించే హ్యాపీనెస్ ప్రోగ్రాం వల్ల ఖైదీలలో క్రమశిక్షణ పెరిగింది’ అంటున్నాడు జబల్పూర్ సెంట్రల్ జైలు సూపరిండెంట్ అఖిలేష్ తోమర్. -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్రౌండర్గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్లో భాగంగా 2023లో హైదరాబాద్లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్గా నిలిచింది. బౌలింగ్లో, ఫీల్డింగ్లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..
ఇంతవరకు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం, ఎంటర్టైన్మెంట్, రవాణ, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అస్సలు ఇక మ్యాన్పవర్తో పనిలేదు, అస్సలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి..పాలకులకు పనిలేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికత మయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటేఓ దేశంలో ఏఐ.. ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేగాదు రాజకీయాల్లో మహామహులునే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది. ఔను ఇదంతా నిజం. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..అల్బేనియా దేశం ఆ చొరవను తీసుకుని సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే ఏఐ డియెల్లా అనే మహిళా కేబబినేట్ మంత్రినే నియమించి అందర్ని విస్తుపోయాలా చేసింది అల్బేనియా ప్రభుత్వం. అంతేగాదు ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినేట్ మంత్రిని నియమించుకున్న దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి, హాట్టాపిక్గా మారింది.అల్బేనియాలో ఈ ఏఐ మంత్రి పాత్ర..ఒకానొక సమ్మర్లో ప్రధాన మంత్రి ఏడీ రామ మాట్లాడుతూ..ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్ మంత్రి, ప్రధాన మంత్రి కూడా రావొచ్చేమో అని కామెడీగా అన్నారు. ఇలా అన్నారో లేదో ఊహకందని విధంగా ఆ రోజు రానే వచ్చేయడం విశేషం. ఇటీవలి జరిగిన సోషలిస్ట్ పార్టీ సమావేశంలో ఏయే మంత్రులు తదుపరి పదవికి కొనసాగుతారో, ఎవరో వెళ్లిపోతారో ప్రధాని రామ ప్రకటించారు. ఆ సమయంలోనే మానవేతర సభ్యురాలు డీయోల్లా అనే మహిళా ఏఐని కూడా ఆయన నేతలకు పరిచయం చేశారు. ఆమె భౌతికంగా హాజరు కానప్పటికీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమెనే. కృత్రిమ మేధస్సుతో (ఏఐ) సృష్టించబడిన ఏఐ మంత్రి అని పార్టీ సభ్యులకు తెలిపారు. అంతేగాదు ఇది సైన్స్ ఫిక్షన్ కాదని, డీయెల్లా విధి అని నాయకులకు చెప్పారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు కూడా. ఇక ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశల వారీగా జరుగుతుందని, పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు.సింపుల్గా చెప్పాలంటే అల్బేనియా ప్రభత్వం చేసిన నిజమైన రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇక ఈ ఏఐ మంత్రి గారు వాయిస్ కమాండ్ల ద్వారా బ్యూరోక్రాటిక్ అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తూనే ఉన్నా.. ఇప్పటికే దేశ డిజిటల్ సేవల పోర్టల్ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రధాని రామా ప్రకారం..ఈ వ్యవస్థ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం. దీనిని నిజంగా పాలన పరిణామంలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ఈ డెవలప్మెంట్ అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనది నిలిచేలా చేసినప్పటికీ..ఈ ఘటన మాత్రం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.(చదవండి: పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!) -
తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్గా జనరల్గా వీణాకుమారి
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్గా డాక్టర్ వీణా కుమారి డెర్మల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఆమె పదోన్నతితో తెలంగాణ సర్కిల్కు బదిలీ అయ్యారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1998 బ్యాచ్ అధికారి అయిన వీణాకుమారి ఆ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. తపాలా శాఖ ఇటీవలే ప్రారంభించిన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 తయారీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేసి ఆ శాఖలో పలు సంస్కరణలు ప్రారంభించటంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు సెంట్రల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్గా, ఢిల్లీ ఢాక్ భవన్ పీఎంయూ డైరెక్టర్గా, మైసూరు పోస్టల్ శిక్షణ కేంద్రం డైరెక్టర్గా, ధార్వాడ్ రీజియన్ డైరెక్టర్గా కూడా ఆమె విధులు నిర్వర్తించారు. (చదవండి: ‘రండి.. ఫొటో దిగుదాం’) -
మ్యాథ్స్ విత్ ఏఐ పఢాయి... హాయి
‘సైంటిస్ట్ కావాలి’ ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.రాజస్థాన్లోని టోంక్కు చెందిన అమన్ గుజర్ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్ ఏఐ’ ఫుల్స్టాప్ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.‘పఢాయి విత్ ఏఐ’ అంటే?అమన్ చదివే స్కూల్లో ‘పఢాయి విత్ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్.ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్ ఏఐ. ఆమె టోంక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్ట్లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.ఐఏఎస్ తొలిరోజులలో కొన్ని సబ్జెక్లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ‘పఢాయి విత్ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్–2’గా లాంచ్ చేశారు. ఈ అప్గ్రేడెడ్ వెర్షన్లో టీచింగ్ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్ ఏఐ’ని టోంక్ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది. -
ఆర్మీడ్యూటీ అసలు బ్యూటీ
ఒక మోడల్ ఆర్మీ ఆఫీసర్ కావడమంట సౌందర్యం కంటే దేశం ముఖ్యం అనుకోవడమే. 2023లో ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన కషిష్ మెత్వాని 2024లో ‘కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్’లో 2వ ర్యాంకు సాధించింది. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ పొందాక తాజాగా ఆమె లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్గా దేశసేవకై అడుగు ముందుకేసింది. అందాల కిరీటం కన్నా ఆర్మీ యూనిఫామ్ గొప్ప సంతృప్తిని ఇస్తుందంటున్న పూణె అమ్మాయి కషిష్ పరిచయం.‘ముఝే సబ్కుచ్ కర్నా హై’... (నాకు అన్నీ సాధించాలని ఉంది)... ఇదీ కషిష్ మెత్వాని తరచూ చెప్పేమాట. ‘నాకు నచ్చిన పనులన్నీ చేస్తూ సంతోషాన్ని పొందడమే నాకు కావలసింది’ అని కూడా ఆమె చెబుతూ ఉంటుంది. పుణెకు చెందిన ఈ యువతి చిన్నప్పటి నుంచి సాధించినవి వింటే ఆశ్చర్యం వేస్తుంది. మోడల్గా, ‘మిసెస్ ఇంటర్నేషనల్ ఇండియా’ టైటిల్ విన్నర్గా గ్లామర్ రంగంలో రాణిస్తుందనుకుంటే ఏకంగా ఆర్మీ ఆఫీసర్గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో లెఫ్టినెంట్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’లో పని చేయడానికి సిద్ధమైంది. ‘మా ఇంట్లో ఎవరూ ఆర్మీలో పని చేయలేదు. నేనే మొదటిదాన్ని. ఈ పని చాలా కష్టమని తెలుసు. కష్టమైనది సాధిస్తేనే కదా సంతోషం’ అంటోంది.న్యూరో సర్జన్ కాబోయి..కషిష్ మెత్వానీది పుణె. ఆమె తండ్రి సైంటిస్ట్గా పని చేస్తుంటే తల్లి టీచరుగా ఆర్మీ స్కూల్లో పాఠాలు చెప్పేది. ‘మా ఇంట్లో టీవీ ఉండేది. కాని ఏ రోజూ నేను దానిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోలేదు. స్కూలు పుస్తకాలు చదవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చేసేదాన్ని. నేను ప్రతి పోటీలో పాల్గొని గెలవాలని కోరుకునేదాన్ని. అలాగే గెలిచేదాన్ని కూడా’ అంది కషిష్. చదువులో విశేష ప్రతిభ చూపిన కషిష్ చిన్నప్పుడు న్యూరోసర్జన్ కావాలనుకుంది. కాని స్కూల్లో, ఇంటర్లో ఎన్.సి.సిలో చేరడంతో ఆమె ఆలోచనలు మారాయి. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్.సి.సి కాడెట్గా పాల్గొనడం ఆమె మీద ప్రభావం చూపింది. ఆర్మీలో చేరాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఈలోపు చదువు కొనసాగించి ఎం.ఎస్సీ. చేశాక బెంగళూరులో న్యూరోసైన్స్లో థీసిస్ సమర్పించింది. ఆ సమయంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా పని చేయడానికి ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది.బహుముఖ ప్రజ్ఞాశాలికషిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుతూనే పిస్టల్ షూటింగ్ నేర్చుకుంది. వాలీబాల్ ప్లేయర్గా ప్రతిభ చాటింది. తబలా నేర్చుకుంది. భరతనాట్యం సాధన చేసింది. అదేవిధంగా గ్లామర్ రంగంలో కూడా తన ఉనికి చాటుకోవడానికి మోడల్గా మారింది. అదే సమయంలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇవన్నీ 24 ఏళ్లలో సాధించింది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. ‘ఇన్ని చేయడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడమే. ఆర్మీ శిక్షణలో కూడా నేను ఎక్కడా తగ్గలేదు. శిక్షణా కాలంలో అనేక పోటీల్లో నేను ఫస్ట్ నిలిచాను’ అంటుంది కషిష్.సామాజిక సేవలో ఇన్ని పనులు చేసిన కషిష్ సామాజిక సేవలో కూడా తనదైన కృషి సాగిస్తోంది. ‘క్రిటికల్ కాజ్’ అనే ఎన్.జి.ఓ.ను స్థాపించి అవసరమైన వారికి ΄్లాస్మా, అవయవ దానం వంటి ప్రాణాధార సహాయం అందేలా చేస్తోంది. ‘మన కోసం మనం కష్టపడుతూనే సమాజం కోసం కూడా కష్టపడాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటోంది కషిష్.నిజంగానే ఆమె ఒక భిన్నమైన ప్రతిభాశాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించి, శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది కషిష్. -
సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపం
దాదాపు 120 వేల సంవత్సరాల ప్రయాణం నుంచి ఓ 5 వేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను వేరు చేసి, సూక్ష్మంలో మోక్షంగా అందించడం సాహసమే! అమెరికాకు చెందిన చరిత్ర పరిశోధకురాలు, బోధకురాలైన ఆడ్రే త్రుష్కీ ఆ పని చేశారు. ఈ‘ఇండియా... 5000 ఇయర్స్’ పుస్తకం రాశారు. మధ్య యుగం కాలంలో సంస్కృతంపైన, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపైన గతంలో రాసిన పుస్తకాల ద్వారా ఆడ్రే పేరు సుపరిచితమే. ఔరంగజేబును ఆనాటి సమకాలీన హిందూ, ముస్లిములిరువురూ గౌరవభావంతో చూశారనీ, ఆ తర్వాత కాలంలోనే ఆయనను రాక్షసుడిగా చిత్రించడం జరిగిందని ఆమె పేర్కొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఒక వర్గం దాడులకు దిగవచ్చనే శంకతో ఆమె భారత్కు రావడానికి కూడా వెనుకాడాల్సి వచ్చింది. అయితే, బెదిరింపులు ఎన్ని ఉన్నా చరిత్ర పరిశోధకురాలిగా తన అధ్యయనం ఆగదని పేర్కొనే ఆడ్రే నాలుగో పుస్తకం ఈ ‘ఇండియా’. సాధికారికంగా చెబుతూనే, సామాన్యులకు అర్థమయ్యేలా చరిత్ర లోగుట్టు విప్పడం ఈ రచన ప్రత్యేకత. ఈ ప్రసిద్ధ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రచురణ ఒక రకంగా ఇది భారత భూఖండ చరిత్ర కాదు. ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన పరిణామాలు, ప్రజల చరిత్ర. వలసలు మానవ నాగరికతతో పాటు చరిత్రను మారుస్తాయని భావించిన ఆడ్రే ఆ కోణం నుంచి కలం కదిపారు. గతమెంతో ఘనమనే కీర్తిగానానికి భిన్నంగా రచన చేశారు. అందుకే, ఈ పుస్తకంలోని ఆనాటి జీవిత కథలు తెలియని కోణం తెర మీదకు తెచ్చి ఆశ్చర్యపరుస్తాయి. సుమారు 65వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికా పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చి, స్థిరపడిన జనమే ‘ఫస్ట్ ఇండియన్స్’ అనే మాటను ఆడ్రే పునరుద్ఘాటిస్తారు. వారి జన్యువులే ఇప్పటికీ ప్రధానంగా దక్షిణ భారతావనిలో కనిపిస్తాయంటారు.సాక్ష్యాధారాల సహితంగానే తప్ప అనుశ్రుత కథలతో చరిత్రను అక్షరీకరించలేమన్నది సరైన శాస్త్రీయ దృక్కోణం. ఈ రచన ఆ కోణంలోనే సాగుతుంది. దానివల్ల కొన్ని అంశాల్లో పాతుకుపోయిన నమ్మకాలను ‘ఇండియా’ సమర్థించదు. గతంలోకి తొంగి చూస్తున్నప్పుడు చరిత్రలోని భిన్న స్వరాలను వినిపించడం ముఖ్యమని ఆడ్రే భావన. అందుకే, బౌద్ధం, హైందవం వగైరా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళల గొంతుకలను వినిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ చరిత్ర పునఃకథనంలో నిమ్నవర్గాలను ముందు నిలుపుతారు. అలాగే, ఆ రోజుల్లోనే ఉన్న ‘సోకాల్డ్’ శూద్ర రాజుల గాథల నుంచి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని చూపే అలనాటి సాహిత్య రచనల్ని కూడా చాలామందికి భిన్నంగా అప్పటి చరిత్రపై అవగాహనకు ఆకరాలుగా వాడారు. హైందవం, బౌద్ధం, జైనం, ఇస్లామ్, వేదాలు, మౌర్య సామ్రాజ్యం, చోళులు, మొఘల్ సామ్రాజ్యం, యూరోపియన్ వలస పాలన, భారత స్వాతంత్య్రోద్యమం, చివరకు తాజాగా పెరిగిన హిందూ జాతీయవాదం దాకా అనేక అంశాలను ఈ రచనలో వివరించారు.అయిదు వేల ఏళ్ళ సుదీర్ఘకాలాన్ని దాదాపు 700 పేజీల ఒకే సంపుటంలో పొందుపరచాలన్నప్పుడు నిడివి రీత్యా ఉండే ఇబ్బందులు సహజం. అందుకే, చాలామందికి తెలిసిన అంశాలు, చరిత్ర అనగానే ఎక్కువగా కనిపించే రాజవంశ గాథలను రచయిత్రి పక్కనపెట్టేశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ రాజుల చరిత్ర, రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో... సామాజిక, ఆర్థిక చరిత్ర అంతే కీలకమని గుర్తించి, ఈ రచనలో వాటికి ఆమె పెద్ద పీట వేశారు. ఆ రకంగా ఇది రోమిలా థాపర్ (romila thapar) లాంటి పలువురి కాలక్రమాణిక చరిత్ర రచనలకు పరిపూరకం.అయితే, ఆధునిక భారత చరిత్రలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, నైజామ్లో రజాకార్ల ఆగడాలు, ప్రాంతీయ చరిత్రలను ఆడ్రే ప్రస్తావించక పోవడం ఆశ్చర్యకరమే. భారత్పై చైనా దురాక్రమణ, బంగ్లాదేశ్ విమోచన వగైరా ప్రస్తావించిన తీరేమో నిరాశపరుస్తుంది. వెరసి, సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపమే తప్ప ఈ పుస్తకం సమగ్రం కాదు. సర్వజన సమ్మతమూ కాదు. అది గుర్తించి, ఒకే అంశానికున్న పలు పార్శ్వాలను తెలుసుకొనేందుకు చదివితే... ఈ రచన ఆసక్తి అనిపిస్తుందే తప్ప ఆశాభంగం కలిగించదు. -
ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!
అందం పరంగానూ సేవలోనూ మేటీ అనేలా విభిన్న రంగాల్లో సత్తా చాటారామె. గ్లామర్పరంగా నటన, మోడల్ రంగంల వైపుకి పరిమితం కాకుండా దేశ సేవలో పాలుపంచుకుని సైనికురాలు కావాలని ఆకాంక్షించిందామె. అత్యంత విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని యువతకు ఆదర్శంగా నిలిచింది. సుకుమారం అనేది శరీరానికే గానీ మనసుకు కాదని, మనః సంకల్పం ఉంటే ఎందులోనైనా రాణించగలం అని ప్రూవ్ చేసి స్ఫూర్తిగా నిలిచింది.ఆమెనే కాశీష్ మెత్వానీ. ఆమె 2023లో మిస్ ఇంటర్నేషనల్గా ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుంది. నిజానికి అందాలరాణిగా సత్తా చాటగానే మోడలింగ్ ఆఫర్లు, యాక్టింగ్ ఆఫర్లు అందుకుని గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు చాలామంది. కానీ కాశీష్ అందుకు విరుద్ధంగా సాయుధ రంగాన్ని ఎంచుకోవడం విశేషం. నిజానికి ఆమె కుంటుంబం ఆర్మీ నేపథ్యానికి చెందింది కూడా కాదు. అయినా ఆమె దేశ సేవలో భాగం కావాలనే ఆకాంక్షతో ఆర్మీలో చేరింది. పూణేకి చెందిన కాశీష్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో కీలక భాద్యతలు నిర్వర్తిస్తోందామె. ఎప్పుడూ కొంగొత్త విషయాలను తెలుసుకోవడంపై ఉన్న ఆసక్తే ఆమెనే ఈ విరుద్ధమైన రంగంలోకి వచ్చేలా చేసింది. అదీగాక ఎన్సీసీలో ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ కవాతులో భాగస్వామ్యం అయినప్పుడు తనకు ఆర్మీ ఫీల్డే బెస్ట్ అని ఫీలయ్యేదట. ఆ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని ఒప్పించి మరి ఇలా ఆర్మీలో చేరానని చెబుతోంది కాశీష్. విద్యా నేపథ్యం..పూణేలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఇంటిగ్రేటడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో థీసిస్ పూర్తి చేసి, హార్వర్డ్ విశ్వవిద్యాయలంలో పీహెచ్డీ చేసే ఛాన్స్ కొట్టింది కూడా. కానీ సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ని తిరస్కరించినట్లు కాశీష్ వెల్లడించింది. రెండేళ్ల క్రితమే మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా కిరీటం కైవసం చేసుకున్న తాను మోడలింగ్, నటన వైపుకు వచ్చేలా పలు ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఆర్మీ రంగాన్ని ఎంచుకోవాలనే ఆలోచన మనసులో ఉండటంతో వెళ్లలేదని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఇటీవల ఆపరేషన్ సిందూర్లో కీలకపాత్ర పోషించిందామె. ఆ సమయంలో ఆమె ఎయిర్ డిఫెన్స్ విభాగంలో సేవలందించింది. ఇక కాశీష్ తండ్రి మాజీ శాస్త్రవేత్త. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (DGQA)లో డిఫెన్స్ సివిలియన్గా చేరారు. ఆమె తల్లి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. తన కుటుంబానికి ఎలాంటి ఆర్మీ నేపథ్యం లేకపోయినా తన నిర్ణయానికి మద్దతిచ్చారని అంటోంది కాశీష్. ఇక ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ శిక్షణలో అత్యున్నత మెరిట్ని అందుకుని ప్రతిష్టాత్మకమైన ఏఏడీ మెడల్, సిఖ్ లి రెజిమెంట్ మెడల్, షూట్ డ్రిల్, డిసిప్లీన్ బ్యాడ్జ్, కమాండెంట్స్ పెన్ వంటి విశిష్ట పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం బెటాలియన్ అండర్ ఆఫీసర్గా, అకాడమీ అండర్ ఆఫీసర్గా సారథ్యం వహించనుంది. ఇక కాశీష్ బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్లో కూడా అకాడమీకి ప్రాతినిధ్యం వహించింది. ప్రతిభను చాటడమే కాకుండా, ప్రధాన ఈవెంట్లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిందామె. (చదవండి: టీ బ్రేక్' అలా మన లైఫ్లో భాగమైంది..!) -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
నాన్నా... నువ్వెక్కడ?
2016లో ‘లయన్’ అనే సినిమా వచ్చింది. కథానాయకుడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్. లయన్ కథకు వస్తే సరూ అనే అయిదేళ్ల పిల్లాడు ఇంటి నుంచి పారిపోయి రైలెక్కుతాడు. అది వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్కతా చేరుకుంటుంది. అప్పటినుంచి ఆ పిల్లాడి ఒంటరి పోరాటం మొదలవుతుంది. అక్కడ ఆ బాలుడి జీవితం రకరకాల మలుపులతో ఆఖరుకు ఒక ఆస్ట్రేలియన్ జంటకు దత్తతతో ఆస్ట్రేలియా చేరుకుంటుంది. పాతికేళ్ల తర్వాత సొంతకుటుంబాన్ని కలవాలనే తాపత్రయంతో గుప్పెడు బాల్య జ్ఞాపకాలను తోడు చేసుకుని, గూగుల్ ఎర్త్ సాయంతో తన ఇంటిని కనుక్కుంటాడు, కుటుంబాన్ని కలుసుకుంటాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అది.సంధ్యారాణి కథా అలాంటిదే! అయితే ఆమె ఇంకా సొంత కుటుంబాన్ని కలుసుకోలేదు. అన్నం, పప్పు తిన్న లీలామాత్రపు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల అన్వేషణలో ఉంది. తన కథ సుఖాంతం కావడం కోసం ఎదురు చూస్తోంది. సంధ్యారాణి చెప్పిన వివరాల ప్రకారం ఆ కథ ఎక్కడ మొదలైందంటే..1987...హైదరాబాద్, ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వాసి కె.రామయ్య నిజాం కాలేజ్లో తోటమాలి. అతనికి అబిడ్స్లోని పరాస్ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్ బి. రాజ్కుమార్తో స్నేహం కుదిరింది. మాటల్లో తనదీ, రాజ్కుమార్దీ ఇద్దరిదీ ఒకే కులమని తేలింది. దాంతో తన మరదలు అనసూయకు రాజ్కుమార్తో పెళ్లి చేయాలనుకుని రాజ్కుమార్ ని అడిగాడు. అయితే తనకు అంతకుముందే పెళ్లై, మూడేళ్ల కూతురూ ఉందని, కాకపోతే భార్య చనిపోయిందని చెప్పాడు రాజ్కుమార్. అయినా సరే తమ ఆర్థికపరిస్థితి దృష్ట్యా మరదలికి రాజ్కుమార్తో వివాహం జరిపించాడు రామయ్య. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి. రాజ్కుమార్ పత్తాలేకుండా పోయాడు బిడ్డను అనసూయ దగ్గరే వదిలి. పరాస్ బార్ అండ్ రెస్టరెంట్కి వెళ్లి వాకబు చేశాడు రామయ్య. నెల రోజులుగా పనిలోకి రావట్లేదని చెప్పారు హోటల్ సిబ్బంది. రాజ్కుమార్ కోసం వెదికి వేసారిన రామయ్య.. సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజం.. బాలికా నిలయమనే అనాథాశ్రమంలో వదిలేశాడు.1988...సంతానం లేని స్వీడన్ జంట మిస్టర్ అండ్ మిసెస్ లిండ్గ్రెన్ సంధ్యారాణిని దత్తత తీసుకున్నారు. అలా స్వీడన్ వెళ్లిన సంధ్యారాణి.. ఊహ తెలిసేప్పటికి అది తన మాతృదేశం కాదని.. వాళ్లు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారనే సత్యాన్ని గ్రహించింది! పై చదువు కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో తన అసలు పేరెంట్స్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తనది హైదరాబాద్ అని, సేవా సమాజం బాలికా నిలయం నుంచి తనను తెచ్చుకున్నామనే స్వీడన్ పేరెంట్స్ చెప్పిన విషయం తప్ప ఇంకే సమాచారమూ లేదు. కాబట్టి యూకేలో ఉంటూ హైదరాబాద్లో తన మూలాల కోసం చేసిన వాకబు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. దాంతో 2009లో తొలిసారిగా హైదరాబాద్కు వచ్చింది సంధ్య. తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమానికి వెళ్లింది. పెద్దగా వివరాలేవీ దొరకలేదు. చదువైపోయి లండన్లో ఉద్యోగం చేస్తూ, వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా ఒంటరి వెదుకులాట దారీతెన్నూ చూపలేదు.2025...జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలవాలనుకునే దత్తత పిల్లలెందరికో సహాయపడుతున్న సంస్థ.. పుణేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ గురించి సంధ్యకు తెలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ అంజలి తారా బబన్రావ్ పవార్ని కాంటాక్ట్ చేసింది. ఆమె.. సంధ్యకు సాయం చేయడానికి సిద్ధపడింది. మొత్తానికి అంజలి సహకారంతో రామయ్యను కలుసుకోగలిగింది సంధ్య. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సంధ్య సవతి తల్లి అనసూయ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు రాజ్కుమార్ సొంతూరు వరంగల్ అని, అతని తోబుట్టువులు అక్కడే ఉన్నారనీ తెలిపాడు. ఆ మాత్రం ఆధారంతోనే ఆత్రంగా సంధ్య వరంగల్ ప్రయాణమైంది. అమ్మానాన్నలు కనిపిస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా అంటుంది నీళ్లు నిండిన కళ్లతో. ‘వరంగల్లో నాన్నే కాదు అమ్మా కనిపిస్తుందని ఆశ. అమ్మ చనిపోయిందని రామయ్యగారితో నాన్న చెప్పినా నాకు మాత్రం అమ్మ బతికే ఉందనిపిస్తోంది. నాలా విదేశాలకు దత్తత వెళ్లి.. సొంత తల్లిదండ్రులను కలవాలనుకుంటున్న వాళ్లెందరో! పెద్దలందరికీ నాదొకటే విన్నపం.. దయచేసి పిల్లలను విదేశీయులకు దత్తత ఇవ్వకండి. ఎంత కష్టమైనా సొంత దేశంలోనే పెరగనివ్వండి. దత్తత వెళ్లిన పిల్లలకు అక్కడ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అమ్మానాన్నలనే కాదు సొంత ఊరు, భాష, సంస్కృతి.. ఒక్కమాటలో చెప్పాలంటే మా గుర్తింపును, ఉనికినే కోల్పోతున్నాం. దానంత నరకం ఇంకోటి లేదు. నా సంబంధీకులెవరైనా ఉండి.. నన్ను పోల్చుకోగలిగితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవండి. మా అమ్మానాన్నల జాడ చెప్పండి!’ సంప్రదించాల్సిన నంబర్.. 9822206485.’’ అంటూ తన కథ చెప్పింది సంధ్య. ఆమె త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటుందని ఆశిద్దాం.– సరస్వతి రమ– ఫొటోలు: గడిగె బాలస్వామి -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
గురి తప్పని బాణం
ప్రపంచయూత్ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణిగా సత్తా చాటింది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత....చికిత హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో పతకం సాధించింది. ఆమె స్ఫూర్తితో కూతురిని క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తండ్రి శ్రీనివాసరావు చికితకు మొదట కరాటే నేర్పించాడు. అందులో బ్లాక్బెల్ట్ సాధించింది. ఒకసారి కరీంనగర్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు జరుగుతుండగా చూసిన చికితకు ఆసక్తి కలిగింది. ‘ఆర్చరీ నేర్చుకుంటాను’ అని తండ్రికి చెప్పింది. తమ పొలంలోని గడ్డివాములనే లక్ష్యంగా ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టింది. సీనియర్ ప్లేయర్ శ్రీనివాస్ దగ్గర ఆర్చరీలో మెలకువలు నేర్చుకుంది. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో, 2022లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పతకం సాధించి నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా (న్ ఏఏఐ) దృష్టిలో పడింది. ఆర్చరీ అకాడమీలో చోటు లభించడంతో వరుస విజయాలు నమోదు చేస్తూ ΄ోయింది. ఈ ఏడాదిలో చైనాలోని షాంఘైలో జరిగిన టోర్నిలో టీమ్ విభాగంలో రజత పతకం, ఆసియా గ్రాండ్ప్రి టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. తాజాగా కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంఫియన్షిప్ కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సత్తా చాటింది. – శ్రీనివాస్ గుడ్ల, సాక్షి. పెద్దపల్లి (చదవండి: Saurabh Pandey: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
సూపర్ బైకర్
‘ఆడపిల్లలకు బైక్లు ఎందుకు!’ అని ఆ తండ్రి నిరాశపరిచి ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేది కాదు. ‘బైక్ రేసింగ్ అంటే బాయ్స్కు మాత్రమే’ అనే అలిఖిత నిబంధనను జగతిశ్రీ కుమరేశన్ బ్రేక్ చేసింది. ప్రొఫెషనల్ మోటర్ సైకిల్ రేసర్గా దూసుకుపోతోంది. ట్రిపుల్ నేషనల్ చాంపియన్ జగత్శ్రీ కుమరేశన్ థాయ్లాండ్లో జరిగే ఎఫ్ఐఎం ఆసియా మహిళల కప్ ఆఫ్ సర్క్యూట్ రేసింగ్(ఏసీసీఆర్)లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... చెన్నైకి చెందిన జగత్శ్రీ ఒకానొక రోజు బైక్ రేసింగ్ చూసి ఆహా అనుకుంది. ఆరోజు నుంచి బైక్ రేసింగ్పై పాషన్ మొదలైంది. తండ్రికి తన మనసులోని మాట చెబితే సరే అని ప్రోత్సహించాడు. అలా శిక్షణ మొదలైంది. పెద్ద పెద్ద బైక్లపై ప్రాక్టీస్ మొదలుపెట్టేది. 2021లో టీవీఎస్ రూకీస్ ఛాంపియన్షిప్ కోసం బాయ్స్తో పోటీ పడి సత్తా చాటింది. చదువు కారణంగా 2022లో పోటీలకు విరామం ఇచ్చింది. 2023లో ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎసీఐ ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్షిప్లో నేషనల్ టైటిల్ గెలుచుకుంది. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆర్కియాలజీ గ్రాడ్యుయేట్ అయిన జగత్శ్రీ ఎఫ్ఐఎం ఉమెన్స్ సర్క్యూట్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్(వరల్డ్ డబ్ల్యూసీఆర్) తనదైన స్థానాన్ని నిలుపుకోవాలని పట్దుదలగా ప్రయత్నిస్తోంది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎంతలా ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఒంటిరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వాళ్ల డబ్బుని కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆగడాలు అంత ఇంత కాదు. పైగా వయసు మళ్లడంతో వస్తున్న కాల్స్, మెసేజ్లు ఒక స్కామ్ అని గ్రహించలేనితనం, టెక్నాలజీ లేమి తదితరాలను ఆసరా చేసుకుని ఈ నేరాగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఆగడాలకు చెక్పెట్టేలా పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది ఈ టీనేజర్. తన తాతమామల్లాంటి ఎందరో వృద్ధులకు భరోసానిచ్చే వెబ్సైట్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాదు వాళ్లు కూడా సులభంగా టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ 16 ఏళ్ల అమ్మాయి చేస్తున్న కృషికి మేధావులు సైతం ఆశ్చర్యపోవడమే కాదు, అవార్డులతో ప్రశంసించారు కూడా. ఎవరా ఆ టీనేజర్ అంటే..ఆ అమ్మాయే 16 ఏళ్ళ తేజస్వి మనోజ్. టెక్సాస్ ఫ్రిస్కోలో హైస్కూల్ జూనియర్గా ఉండగా ఆమె ఎదుర్కొన్న సంఘటనే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన తాతగారిలాంటి వృద్ధులు సైబర్ నేరాగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకుని, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజు తన 85 ఏళ్ల తాతాగారి మాదిరిగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు అయిపోయాయని, ఒక లక్ష రూపాయాలు పంపించాల్సిందిగా మెయిల్ ఐడీ, ఫోన్ కాల్స్ రెండూ వచ్చాయి. దాంతో ఆమె డబ్బు పంపేందుకు రెడీ అవుతుండగా, ఎందుకైనా మంచిది ఒకసారి డబుల్ చెక్చేసి పంపు అని తండ్రి సూచన మేరకు చెక్చేయడంతో..అదిస్కామ్ అని తేలింది. దాంతో తేజస్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాన్న అలా సూచించి ఉండకపోతే..అంతేగా పరిస్థితి అంటూ ఊపిరి పీల్చుకుంది. వృద్ధుల సంరక్షణ కోసం..ఇక ఆ తర్వాత అలాంటి సైబర్ క్రైం నేరాల గురించి ఆరా తీసింది తేజస్వి. ఒక్క 2024 ఏడాదిలోనే ఆన్లైన్ స్కామ్లకు సంబంధించిన సుమారు రూ. 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసి కంగుతింది. అంతేగాదు వాటిల్లో వృద్ధులే ఎక్కువ మొత్తం డబ్బు నష్టపోతున్నట్లు గుర్తించింది. దాంతో తేజస్వి తన తాతా లాంటి వాళ్లు ఇలాంటి సైబర్ క్రైంలో చిక్కుకోకుండా ఏదైనా చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే "షీల్డ్ సీనియర్స్" అనే వెబ్సైట్. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం వృద్ధుల సేఫ్టీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని నెలల తరబడి కోడింగ్ రాసి దీన్ని డిజైన్ చేసింది. ఈ వెబసైట్ సాయంతో పెద్దలు ఎలాంటి మోసాల్లో చిక్కుకుండా, సులభంగా వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది. సీనియర్ సిటీజన్లు సులభంగా పాస్వర్డ్లు, సెట్టింగులు, స్కామ్ వ్యూహాలు గుర్తించేలా మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అలాగే తరుచుగా సాంకేతిక పరిభాష సమస్య రాకుండా తక్కవ వాక్యాల సమాధానాల చాట్బాట్ని కూడా డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్లోని ఏఐ ఆధారిత సాధనం అనుమానాస్పద సందేశాలు, ఇమెయిల్లను 95% కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. అంతేగాదు సీనియర్ సిటీజన్లు కూడా ధైర్యంగా ఆన్లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేసేలా తయారుచేసింది. ప్రస్తుతం ఆమె దాన్ని వాణిజ్య ఏఐ ఫ్లాట్ఫాంగా మార్చేలా నిధులను సేకరిస్తున్నందున ఈ "షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్" ప్రివ్యూ మోడ్లో ఉంది. అయితే ఇది అమెరికా అసోసీయేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, వాళ్లు నేరుగా ఆమెని సంప్రదించి తమ ఫీడ్బ్యాక్ని ఇచ్చి లింక్డ్ఇన్లో షేర్ చేశారు కూడా. దాంతో తేజస్వి సేవనిరతి ప్రయత్నాలకుగానూ టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 గౌరవం లభించడమే కాదు ఇలా టైమ్ ఫర్ కిడ్స్ సర్వీస్ స్టార్గా పేరొందిన తొలి గ్రహితగా ఘనతను కూడా దక్కించుకుందామె. అంతేగాదు సీనియర్ సిటీజన్లకు ఈ టీనేజర్ సైబర్ సెక్యూరిటీ పాఠాలను కూడా బోధిస్తూ..తన సేవనిరతిని చాటుకుంటోంది కూడా. జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ టీనేజ్ వయసులో పెద్దల పట్ల ఇంతలా బాధ్యతతో వ్యవహరిస్తూ..సాంకేతిక సాయం అందిస్తున్న ఆ అమ్మాయి యువతరానికి గొప్ప స్ఫూర్తి కదూ..!.(చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!) -
విలేజ్ సైంటిస్ట్ బనిత
‘అలా సరే, ఇలా అయితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడమే ఆవిష్కరణ. వచ్చిన ఆలోచనను ఇష్టపడి, కష్టపడి నిజం చేసుకోవడమే ఆవిష్కరణ. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆమె సైన్స్ పుస్తకాలు చదివింది కూడా లేదు. అయితే కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఆమె ఇష్టం. అదే సమయంలో మనం మరిచిపోయిన సంప్రదాయ వస్తువులు అంటే ఇష్టం. వాటిని ఈ తరానికి పరిచయం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అంటే ఇష్టం.పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన బనితకు ఇన్స్టాగ్రామ్లో లక్షమందికి పైగాఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తూ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది.ఇందులో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా...ఫ్యాన్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ బాక్స్,నీళ్లు, ఐస్, వైర్లను ఉపయోగించి ‘మినీ ఏసీ’ తయారుచేసింది. ‘ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎలా తయారుచేయాలో తెలుసా?’ అంటూ డెమో కూడా ఇచ్చింది.‘విలేజ్లైఫ్ విత్ బనిత’ ట్యాగ్లైన్తో బనిత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేసే వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. (చదవండి: చేతుల పరిశుభ్రత కోసం..!) -
వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!
బృందంగా శాస్త్రీయ నృత్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో అనుకోని అవాంతరంలా వర్షం వస్తే.. కాలు కదపడం కష్టం. అడుగు వేస్తే జరర్రుమని జారిపోవడం ఖాయం. ఆ చిరుజల్లుల్లో అడుగులు తడబడకుండా..లయబద్ధంగా నృత్యం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ బృందం వర్షానికే సవాలు విసిరేలా అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. ఇదంతా ఎక్కడ అంటే..కర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులు బృందంగా భరతనాట్యం చేశారు. అది కూడా హనుమాన్ చాలిసాను నృత్య రూపకంగా ప్రదర్శన ఇస్తున్నారు. అయితే కుండపోత వర్షం కురుస్తున్న ఆ విద్యార్థులంతా ఎక్కడ ఆగకుండా ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేశారో చూస్తే..వావ్ ఏం భరతనాట్య ప్రదర్శన అని ప్రశంసించకుండా ఉండలేరు. అందులో అత్యంత హైలెంట్.. అంతమంది అమ్మాయిల మధ్య ఒకేఒక పురుషుడు భరతనాట్య చేస్తూ కనిపించడం. మన కళ్లుచూస్తోంది నిజమేనా అన్నట్లుగా ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన ఆ కళాకారుడి నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోని ప్రత్యక్షంగా వీక్షించిన ఒక ప్రేక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆయన ఆ వీడియోకి జత చేసిన పోస్ట్లో వర్షం మీ ప్రదర్శనను అడ్డుకోలేకపోగా..మీ అసామాన్యమైన ప్రదర్శనకు అందంగా మారింది ఆ వర్షపు జల్లు. జోరు వానలో నాట్యం చేయడం మాటలు కాదనేది సత్యమే అయినా..మీ బృందమంతా ప్రతి స్టెప్ని అత్యంత అద్భుతంగా ప్రదర్శించి అలరించారు అంటూ ఆ వీడియోకి వర్షం మీ బృందం ప్రదర్శన ఇవ్వకుండా ఆపలేకపోయింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Prarthana Rao (@prarthana_nanana) (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్..! నిబద్ధతకు నిదర్శనం..
కుటుంబంలో ఒక్కరు సక్సెస్ సాధిస్తే..ఆ తర్వాత తరాలకు వాళ్లు ఆదర్శంగా మారడమే కాదు వారిలా అధికారుల పరంపరను కొనసాగిస్తారు కొందరు. అలా వారసత్వాన్ని కొనసాగించడం అనేది అరుదు కూడా. అలా కంటిన్యూస్గా వారసత్వాన్ని అందిపుచుకుని కొనసాగడమే గాక, ఒకే కుంటుంబంలోని రెండు జనరేషన్లు వరుసగా కొనసాగడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకోవడమే కాదు, చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలవనుంది ఈ అరుదైన ఘటన. ఏం జరిగిందంటే..లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్ ఐదు తరాలుగా ఆర్మీసేవలందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఆమె తన కుటుంబంలోని ఐదోతరం ఆర్మీ అధికారిగా కొనసాగనున్నారు. చెన్నైలోని ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో చేరారు. ఆమె తన అంకితభావం, నైపుణ్యానికి గుర్తింపుగా ఈ ట్రైనింగ్ కోర్సులో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తొలి స్థానంలో నిలిచి రాష్ట్రపతి బంగారు పతకాన్ని కూడా సొంతం చేసుకున్నారు. పారుల్ ధద్వాల్ నేపథ్యం..ఆమె పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని జనౌరి గ్రామం నుండి వచ్చింది. ఈ ప్రాంతం యుద్ధానికి సంబంధించిన వీరసైనికుల నిలయంగా పేరుగాంచింది. ఇక పారల్ ధద్వాల్ కుటుంబ ఆర్మీలో ముత్తాతల కాలం నుచి సేవలందిస్తోంది. ఆమె ముత్తాత సుబేదార్ హర్నామ్ సింగ్ జనవరి 1, 1896 నుంచి జూలై 16, 1924 వరకు సేవలందించారు. ఆమె రెండో ముత్తాత ఎల్ఎస్ ధద్వాల్ 3 JATతో పనిచేశారు. మూడోతరంలో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్కు చెందిన కల్నల్ దల్జిత్ సింగ్ ధద్వాల్ 3 కుమాన్కు చెందిన బ్రిగేడియర్ జగత్ జామ్వాల్లో ఉన్నారు. ఇక ఆమె తండ్రి మేజర్ జనరల్ కేఎస్ ధద్వాల్ ఎస్ఎమ్ విశిష్ట సేవా మెడల్ గ్రహిత. ప్రస్తుతం ఆమె తన సోదరుడు కెప్టెన్ ధనంజయ్ ధద్వాల్లతో కొనసాగుతోంది. వీరిద్దరు 20 మంది అత్యున్నత సిక్కు అధికారుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అదీగాక ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలకు చెందిన ముగ్గురు అధికారులు దేశానికి సేవలందిస్తున్న అరుదైన ఘటన ఇది. ఈ ఘటన దేశం పట్ల ఉన్న వారి శాశ్వత నిబద్ధతకు తార్కాణంగా నిలిచింది. A Legacy of Five GenerationsOne Uniform – Infinite PrideThe journey of Lt Parul Dhadwal is a saga of a family dedicated to service to the Motherland. A proud descendant of a long lineage of brave soldiers, she represents the fifth-generation who now dons the Olive Green in… pic.twitter.com/3BtXn8SlT8— ADG PI - INDIAN ARMY (@adgpi) September 6, 2025 (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
మహిళా పాఠకులు చదవాల్సిన 20 పుస్తకాలు
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబతొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డితెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మజానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.4. శారద లేఖలు– కనుపర్తి వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలంస్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవితెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరాప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.10. రాజకీయ కథలు– ఓల్గాస్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మవారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.12. రాయక్క మాన్యం (కథలు)– తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.13. నల్లపొద్దు– సంపాదకురాలు: దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. 14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మమెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది. 19. కుప్పిలి పద్మ కథలుఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతిబడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి. -
చాకిరీనే ఆమె నౌకరీ
భారతీయ మహిళకు ఇంటా, బయటా మోయలేనంతగా రెండింతల పని భారం ఉంటోందని తాజాగా విడుదలైన ‘టైమ్ యూజ్’ సర్వే వెల్లడించింది. ఎక్కువ చదువుకున్న, సంపన్నులైన మహిళలు సైతం ఈ విషయంలో మెరుగ్గా ఏమీ లేరని కూడా వ్యాఖ్యానించింది. పురుషులు జీతం వచ్చే పనికి బయట ఎంత సమయం వెచ్చిస్తున్నారో, అంతకుమించిన సమయాన్ని మహిళలు జీతం రాని పనికి ఇంట్లో వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది.భారత ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఒ.) 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘టైమ్ యూజ్’ సర్వేలో – రోజువారీ పనులకు స్త్రీలు, పురుషులకంటే రెండింతలు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే కోసం ఎన్.ఎస్.ఒ. 1,67,000 మందిని కలిసి వివరాలు సేకరించింది. శ్రమలో అసమానతలుఉద్యోగం, నిద్ర, ఆహారం, విశ్రాంతి మొదలు.. చదవటం, షాపింగ్, వంట పని వంటి 165 రోజువారీ పనులకు స్త్రీ పురుషులు వెచ్చించిన సమయాన్ని సర్వే నమోదు చేసింది. పురుషులు, మహిళలు నిద్రించడానికి దాదాపు సమాన సమయాన్ని వెచ్చిస్తుండగా, సగటు స్త్రీ, సగటు పురుషుడు బయట నలుగురితో కలిసి గడిపే దాని కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తోంది. నిద్రను మినహాయిస్తే, పురుషులు ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పనులలో రోజుకు సగటున గ్రామాలలో 4.6 గంటలు, పట్టణ ప్రాంతాలలో 5.3 గంటలు వెచ్చిస్తున్నారు. ఆ తరువాతనైనా వారికి విశ్రాంతి లభిస్తోంది. లేదా బయటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాని మహిళల్లో ఇంటి పనులు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ఈ ధోరణి శ్రమ చేయటంలో స్త్రీ పురుష అసమానతల్ని స్పష్టంగా చూపిస్తోంది. 2024–25లో దేశంలో 15ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 41.7 శాతం ఉండగా, పురుషులలో ఈ శాతం 78.8 వరకు ఉంది. తక్కువ జీతం, తక్కువ అవకాశాలు స్త్రీలు ఉద్యోగం చేయటానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.రెండింతల రెట్టింపు పని మహిళలు విద్యలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా, ఉద్యోగాలలో పెద్దగా ప్రయోజనం పొందటం లేదు. జీతం ఉన్న పని, జీతం లేని పని రెండింటినీ కలిపి, విద్యాస్థాయి లేదా సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు సగటున రోజుకు 103 నిమిషాలకు పైగా జీతం ఉన్న ఉపాధి పనులకు, 281 నిమిషాలకు పైగా జీతం లేని పనికి వెచ్చిస్తున్నారు. డిగ్రీ ఉన్న మహిళలు సైతం ఉపాధి కోసం 106 నిమిషాలు, జీతం లేని పనికి చాలా ఎక్కువగా 323 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఇది పురుషులు చేస్తున్న శ్రమ కంటే చాలా ఎక్కువ. నేటికీ నెమ్మదిగానే పురోగతిఅనేక విద్యా స్థాయులలో బాలురు, పురుషుల కంటే బాలికలు, మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉద్యోగావకాశాలలో మహిళలింకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు తరచుగా వారిని ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంచుతున్నాయని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న విషయమే. కాగా 2023 నోబెల్ గ్రహీత క్లాడియా గోల్డిన్, 200 సంవత్సరాల అమెరికా ఉద్యోగ రంగ డేటాను అధ్యయనం చేసి... వేతనం లేని పని భారం, ముఖ్యంగా మాతృత్వం... ఉపాధి అవకాశాలలో లింగ భేదాలకు దారి తీసిందని తెలిపారు. గర్భనిరోధక మాత్రల లభ్యత, సేవా రంగ ఉద్యోగాల ఆవిర్భావం కారణంగా పరిస్థితి కొంత మెరుగవటం కూడా క్లాడియా గమనించారు. అయితే, భారతదేశంలో ఈ పురోగతి ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది. ∙∙ కాస్త బ్రేక్ తీస్కో తల్లీ! సినిమా మధ్యలో ‘విశ్రాంతి’ పడుతుంది, ప్రేక్షకుల రెస్ట్ కోసం. యుద్ధం మధ్యలో ‘కాల్పుల విరమణ’ ఉంటుంది, సైనికుల రెస్ట్ కోసం. ఆఫీస్లలో చిన్న చిన్న బ్రేక్లు ఉంటాయి, ఉద్యోగుల రెస్ట్ కోసం. ‘‘ఎటూ కదలకండి’’ అని డాక్టర్లు సలహా ఇస్తారు. పేషెంట్ల రెస్ట్ కోసం. డాక్టర్లే కాదు, ఒక పనిలో అదే పనిగా ఉండిపోతే, మన శరీరం కూడా మనకు రెస్ట్ సిగ్నల్ కొడుతుంది. ‘‘కాస్త ఆగు తల్లీ’’ అంటుంది. కానీ మనం ఆ సిగ్నల్స్ను పట్టించుకోం. పని పూర్తి చేసేస్తే ఒక పనైపోతుంది అనుకుంటాం. మన ఆలోచన ఏమిటంటే, పనిని మధ్యలోనే వదిలేయటం ఎందుకని? ఆలోచన మంచిదే కాని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పని మధ్యలో రెస్ట్ అవసరం అయినప్పుడు పనిని మధ్యలోనే కదా వదిలేయాలి అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... మహిళలకు చెబుతున్నారు. రెస్ట్ తీసుకోవటం అంటే?అలసట నుండి తేరుకోవటానికి రెస్ట్ అవసరం కనుక, అలసట తీరేవరకు పనిని పక్కన పెట్టటమే రెస్ట్ తీసుకోవటం. చేస్తున్న పనిని బట్టి, అప్పటి మీ శారీరక స్థితిని బట్టి కొన్ని నిముషాల రెస్ట్, లేదా కొన్ని గంటల రెస్ట్, లేదంటే కొన్ని రోజుల రెస్ట్ అవసరం అవుతుంది. అయితే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బాడీ, మైండ్ రెండూ రీచార్జ్ అవుతాయని చెప్పలేం. రెస్ట్ ఉంటుంది. ఉత్సాహం ఉండదు. ఉత్సాహం లేని రెస్టు కూడా మళ్లీ పనితో సమానమే. అందుకే, ముల్లును ముల్లుతోనే తీసినట్లుగా పని వల్ల వచ్చిన అలసటను పనితోనే పోగొట్టుకోవటం అవసరం. అందుకోసం ఏ రకం రెస్టు మనల్ని ఏ రకం అలసట నుంచి కోలుకునేలా చేస్తుందో తెలుసుకోవాలి. ముందు, రెస్టులోని రకాలు ఏమిటో తెలుసుకుంటే, వాటిల్లో ఏ రెస్ట్ మన స్థితికి సరిపోతుందో తెలిసిపోతుంది.రెస్టులో 7 రకాలుఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, సోషల్ రెస్ట్, సెన్సరీ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్, మెంటల్ రెస్ట్ అని ఏడు రకాలైన రెస్ట్లు ఉన్నాయి.ఫిజికల్ రెస్ట్: ఇది శారీరక విశ్రాంతి. చక్కగా నిద్రపోతే సరిగ్గా రెస్ట్ దొరుకుతుంది. ఇందుకు భిన్నంగా యోగా, బాడీనీ స్ట్రెచ్ (సాగతీయటం) వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది. పని కోసం మళ్లీ మనసు పరుగులు పెడుతుంది. ఫిజికల్ రెస్ట్ వల్ల క్రియాశీలం అయ్యే రక్త ప్రసరణ మహిమ ఇది. ఇవి కాక.. మసాజ్, చిన్న చిన్న విరామాలు, వాకింగ్.ఎమోషనల్ రెస్ట్: ఇది భావోద్వేగ విశ్రాంతి. అంటే మీ కోపాన్ని, అసహనాన్ని, విసుగును, అసంతృప్తిని, ఆందోళనను.. ఆరోగ్యంగా వ్యక్తపరచడం. మీ మనసు లోపలి ఉద్దేశాల గురించి నిజాయితీగా బయటికి చెప్పుకోవటం. అవసరం అయితే సహాయం తీసుకోవటం. ఉద్వేగం మితిమీరకుండా నిగ్రహించుకోవటం. ఇందువల్ల మీకు మానసికమైన విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. ఒంటరిగా సమయం గడపడం, మీ గురించి మీరు శ్రద్ధ వహించటం. డైరీ రాయటం, ప్రకృతిలో గడపటం.స్పిరిచ్యువల్ రెస్ట్ : ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి. దినచర్యలకు మించి జీవితానికి అర్థం, పరమార్థం కనుగొనే ప్రయత్నం చేయటం. అందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం. హృదయంతో ఆలోచించటం. ఇవన్నీ మనసును తేటపరుస్తాయి. భౌతికమైన ఒత్తిళ్ల నుంచి విశ్రాంతిని చేకూరుస్తాయి. ఇవి కాక.. మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం, ఒక సత్కార్యం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం.సోషల్ రెస్ట్: ఇది సామాజిక విశ్రాంతి. సానుకూలంగా ఉండేవాళ్లు, మనకు మద్దతుగా ఉండేవాళ్లతో సమయాన్ని గడపటం. అదే సమయంలో అలసట కలిగించే, ఒత్తిడితో కూడిన సంబంధాలకు దూరంగా ఉండటం. మనం సామాజిక జీవులం. అయినప్పటికీ అంతర్ముఖులకు ఈ సోషల్ రెస్ట్ అలసట కలిగించేది కావచ్చు. అలాంటి వారికి సోషల్ రెస్ట్ వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇవి కాక.. ఒంటరిగా లేదా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం. సోలో పిక్నిక్, టూర్ లేదా ఉన్న చోటే బయటికి వెళ్లి భోజనం చేయడం, మీ ఒంటిపై మీరు ధ్యాస పెట్టటం.సెన్సరీ రెస్ట్: ఇది ఇంద్రియ విశ్రాంతి. దేదీప్యమానంగా వెలిగే లైట్లు, రణగొణధ్వనులు; టీవీ, స్మార్ట్ఫోన్ స్క్రీన్ల వంటి వాటికి దూరంగా, డిమ్ లైట్లు, నిశ్శబ్దాల మధ్య పొందే విశ్రాంతి. ఇవి కాక.. కాసేపు కళ్లు మూసుకోవడం, నిశ్శబ్దంగా ఉండే గదిలో సమయం గడపడం, ఎక్కువసేపు స్నానం చేయడం.క్రియేటివ్ రెస్ట్: సృజనాత్మక విశ్రాంతి. ఇది మీలోని క్రియేటివిటీని తట్టి లేపుతుంది. అలసటకు ఇది దివ్యౌషధం. మెదడుకు మేత వల్ల మీ మనసు పునరుత్తేజితం అవుతుంది. ఇవి కాక.. పని నుండి విరామం తీసుకోవడం, సృజనాత్మకమైన పనులు చేయటం (డ్రాయింగ్, పెయింటింగ్, అల్లికలు మొదలైనవి)మెంటల్ రెస్ట్: ఇది మానసిక విశ్రాంతి. ఇది మీ మెదడుకు బ్రేక్ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కారం వెతకటం వంటి ఒత్తిళ్ల నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తుంది. ధ్యానం వంటి అభ్యాసాలు లేదా తీవ్రమైన ఏకాగ్రత అవసరం లేని తేలిక పాటి సాధనల్లో పాల్గొనడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. మీ ఫోన్ను ఆఫ్ చేయడం, సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండటం. (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
టోరంటోలో ఉమెన్ టాలెంట్
ఈ నెల పద్నాలుగు వరకు జరగనున్న టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(టిఐఎఫ్ఎఫ్)కు తొలిసారిగా మహిళల నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పంపుతోంది ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియా. దేశవ్యాప్తంగా వచ్చిన రెండు వందలకు పైగా దరఖాస్తుల నుంచి ఈ ఆరుగురు మహిళా దర్శకులను ఎంపిక చేశారు.అర్ష్లే జోస్ – ఏ డాండిలయన్ డ్రీమ్; దీపాభాటియా – రాబిట్ హోల్; కాత్యాయని కుమార్– సన్స్ ఆఫ్ ది రివర్; మధుమిత సుందర్రామన్ – ది గెస్ట్ హౌజ్; పరోమిత దార్ –ఉల్టా ; ప్రమిత ఆనంద్ – ఏ లేట్ ఆటమ్ డ్రీమ్.‘ప్రతిభావంతులైన భారతీయ మహిళా దర్శకులను ప్రపంచ సినిమాతో అనుసంధానం చేయడానికి మా ప్రయత్నం తోడ్పడుతుంది’ అని ప్రకటించింది డబ్ల్యూఐఎఫ్.ఒక మహిళ చేసే పోరాటాన్ని కథావస్తువుగా తీసుకొని రూపొందించిన ‘బయాన్’ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ డిస్కవరీ విభాగానికి ఎంపికైంది. ఈ చిత్రంలో హుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రపోషించింది.ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియాను గుణిత్ ముంగ కపూర్ ప్రారంభించారు. భారతీయ సినీ పరిశ్రమలో లింగ సమానత్వం (Gender Equality) కోసం కృషి చేస్తోంది డబ్లూఐఎఫ్.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా? -
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
శాస్త్రీయ సాంకేతిక అవగాహనకు...
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్పహడ్ జిల్లా పరిషత్తు స్కూల్లో బయాలజీ టీచర్గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు పవిత్ర. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారు. ఆట పాటలను మిళితం చేస్తూ బోధించే విధానానికి శ్రీకారం చుట్టారు పవిత్ర. పాఠ్యాంశాలకు అనుగుణంగా గేమ్స్ రూ΄÷ందించి విద్యార్థులకు బాగా అర్థం అయ్యేలా చేస్తున్నారు.ఆడుతూ హాయిగా నేర్చుకునేలా...బయాలజీ కాన్సెప్ట్స్ను తీసుకొని ఫైండ్ ద వర్డ్ సర్చ్, క్రాస్ వర్డ్ పజిల్స్ తదితర గేమ్స్ రూపొందించారు. పాఠం చెప్పిన తరువాత ఈ గేమ్స్ ఆడిస్తే విద్యార్థులకు కాన్సెప్ట్ను మరోసారి రిపీట్ చేసినట్లు అవుతుంది. ప్రతి దశను తెలుసుకుంటారు. ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి మరచి΄ోకుండా ఉంటారు.విద్యా వారధిఅమెరికా వంటి దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో విద్యార్థులకు అర్థమయ్యేలా చేసేందుకు ‘విద్యా వారధి’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. ‘విద్యా వారధి’లో స్కూల్ పిల్లలు అమెరికాలోని విద్యార్థులతో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. అమెరికాలో విద్య. బోధన విధానం, పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి...మొదలైన విషయాలను అక్కడి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటారు.వ్యక్తిత్వ వికాస డైరీవిద్యార్థులు తమ డైరీలో సబ్జెక్ట్కు సంబధించిన అసైన్మెంట్స్ రాసుకుంటారు. కానీ ఈ స్కూల్ పిల్లల డైరీ ప్రత్యేకం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తమ దినచర్య రాయాలి. తప్పు చేసినా, మంచి పని చేసినా రాయాలి. వారం రోజుల తరువాత డైరీలో రాసుకున్న విషయాలను విద్యార్థులే చదువుకునేలా చేస్తారు. వారం రోజుల్లో చేసిన మంచి పనులు, తప్పులు ఏమిటి? ఎలా ఉండాలనేది విద్యార్థులు స్వయంగా తెలుసుకుంటారు. తద్వారా వారిలో క్రమంగా సత్ప్రవర్తన పెంపొందుతుంది.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ (చదవండి: మానవ రక్తం కంటే అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా..!) -
ఆడపిల్ల చదువుకు జీవితాన్ని ఇచ్చింది
‘ప్రపంచంలో చదువుకు దూరమైన అతి ఎక్కువ మంది ఆడపిల్లలున్న దేశం భారత్ ఒక్కటే’ అంటారు సఫీనా హుసేన్. స్కూల్లో ఉన్న ఆడపిల్లల కంటే స్కూల్ మానేసిన ఆడపిల్లలు ఎక్కువ ఉండటంతోవారిని తిరిగి స్కూళ్లకు పంపడానికి ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. ఏళ్ల తరబడి ఆమె సాగించిన కృషి బాలికల జీవితాల్లో చదువును తెచ్చింది. ఆమెకు ‘రామన్ మెగసెసె ఆవార్డు’ తెచ్చిపెట్టింది. ఆసియా నోబెల్గా భావించే రామన్ మెగసెసెను సఫీనా స్థాపించిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓకు ప్రకటించారు.‘మారుమూల గ్రామంలో అయినా సరే ఏ ఒక్క ఆడపిల్ల స్కూలుకు వెళ్లకుండా ఉండకూడదు. అదే మా ఎడ్యుకేట్ గర్ల్స్ లక్ష్యం’ అంటారు సఫీనా హుసేన్. 54 ఏళ్ల ఈ సామాజిక కార్యకర్త 2007 లో బాలికా విద్య కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ఎన్.జి.ఓను స్థాపించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకూ సుమారు నాలుగు లక్షల మంది బాలికలను అక్షరాస్యత వైపు నడిపించారు. అందుకే ఆమె సంస్థకు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు 2025ను ప్రకటించారు. 1958 నుంచి ఇస్తున్న ఈ అవార్డు కింద 50 వేల యు.ఎస్.డాలర్ల నగదు కూడా ఉంటుంది.‘ఎడ్యుకేట్ గర్ల్స్కు రామన్ మెగసెసే అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదొక చారిత్రాత్మక క్షణం. భారతదేశంలో బాలికల విద్యకోసం ప్రజలతో కలిసి మేము చేస్తున్న ఈ ఉద్యమం గురించి ఈ అవార్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. బాలికలను శక్తిమంతం చేయడానికి, వారు అడ్డంకులను ఛేదించి మరిన్ని విజయాలు సాధించడానికి మనమంతా మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని అవార్డు ప్రకటన తర్వాత సఫీనా అన్నారు.‘టీమ్ బాలిక’ల విజయం‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా స్కూలు మానేయించిన బాలికలను తిరిగి స్కూలుకు పంపడానికి సఫీనా ఎన్నుకున్న మార్గం ప్రతి ఊరి నుంచి ఒక చురుకైన యువతి ని కార్యకర్తగా ఎంచుకోవడం. వీరిని ‘టీమ్ బాలిక’ అంటారు. ఈ బాలికలే ఇంటింటికి తిరిగి కుటుంబాలను ఒప్పించి డ్రాపవుట్ ఆడపిల్లలను తిరిగి బడికి చేరుస్తున్నారు. 2007లో 50 గ్రామాల్లో మొదలెట్టిన ఈ కార్యక్రమం నేడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 వేల గ్రామాల్లో బాలికలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 13 వేల మంది యువతులు టీమ్ బాలికలుగా గ్రామాల్లో పని చేస్తున్నారు. ‘నా ఊరు.. నా సమస్య... నేనే సమాధానం’ అనేది వీరి నినాదం. తమ ఊరిని తామే బాగు చేసుకుందామని వీరు ముందుకొస్తే పెద్దలు మద్దతు తెలుపుతున్నారు. ‘స్కూలు మాన్పించి ఇంటి పనులు చేయించడం బాలికల కలలను ఛిద్రం చేయడమే’ అంటారు సఫీనా. కేవలం బాలికల్ని బడికి పంపడమే కాకుండా పాఠశాలలకు సౌకర్యాలు అందించడం, బాగా చదివే పిల్లలను కళాశాలల్లో చేర్పించడం, వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం వంటివి కూడా ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేపడుతుంది.ఎవరీ సఫీనా?సఫీనా హుస్సేన్ 1971లో దిల్లీలో జన్మించారు. ఈమె తండ్రి యూసఫ్ హుసేన్ అనే టీవీ నటుడు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సఫీనా 1998 నుంచి 2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్’కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. 2005లో అమెరికా నుంచి ముంబయికి తిరిగొచ్చిన ఆమె స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రపంచంలో స్త్రీల జీవన విధానాలు అత్యంత దుర్భరంగా ఉన్న 20 దేశాల్లో భారత్ కూడా ఉందన్న సర్వే వివరాలు తెలుసుకొని ఆమె కలవరపడ్డారు. ప్రధానంగా విద్య విషయంలో తల్లిదండ్రులు ఆడ, మగ అంటూ భేదం చూపించడం, కొడుకును చదివిస్తూ కూతుర్ని ఇంటి పనుల్లో పెట్టడం వంటివి ఆమెను ఆలోచింపజేశాయి. ఆ పరిస్థితి మారాలంటే పల్లెల నుంచి పని మొదలుపెట్టాలని భావించారు. అలా 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె చేస్తున్న కృషి నచ్చి కత్రినా కైఫ్ తనకు తానుగా ముందుకొచ్చి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు అంబాసిడర్గా, టీమ్ బాలికగా పని చేశారు.2035 నాటికి కోటి మంది బాలికలు‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చేసిన కృషి ఫలితంగా లక్షలాది బాలికలు బడులకు చేరి అక్షరాలు దిద్దారు. వారిలో కొందరు స్కూళ్లు దాటి కాలేజీల్లోనూ అడుగుపెట్టారు. ఇదంతా సమష్టి కృషితో సాధ్యం అంటారు సఫీనా హుస్సేన్. సంస్థ నిర్వహణలో తనకు సాయం అందించినవారు, తనతో కలిసి పనిచేస్తున్నవారందరి కృషి ఈ విజయంలో ఉందని అంటున్నారు. 2035 నాటికి కోటి మంది బాలికల్ని బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. -
ఆరాటం ముందు ఆటంకం ఎంత!
చిన్నచిన్న సమస్యలకే గాబరా పడిపోతుంటాం. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాం. అయితే కొంతమంది మాత్రం ఓటములనే తమ విజయానికి మెట్లుగా మలుచుకుంటారు. అవరోధాలను అధిగమించడానికి అనుభవాలుగా అపజయాలను అనుకుంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయరు. కష్టాలు ఎదురొచ్చినా తాము అనుకున్నది సాధించే వరకు పట్టువదలరు. దీపేష్ కుమారి కూడా ఈ కోవలోకే వస్తారు.ఎవరీ దీపేష్ కుమారి?రాజస్థాన్లోని భరత్పూర్కు దీపేష్ కుమారిది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి గోవింద్ కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలను పోషించడానికి పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఏడుగురు సభ్యుల కుటుంబం పరిమిత వనరులతో ఒక చిన్న గదిలో నివసించింది. చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబం నెట్టుకొచ్చేది. అయితే ఇంత కష్టంలోనూ పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యతోనే తమ కష్టాలు తీరతాయని గోవింద్ భావించాడు. ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లలను చదివించాలని గట్టిగా అనుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె దీపేష్ కుమారి. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని తొలగించాలంటే చదువుతోనే సాధ్యమని ఆమె గట్టిగా విశ్వసించింది. అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. భరత్పూర్లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్లో చదివి.. 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% స్కోర్ సాధించి సత్తా చాటింది. జోధ్పూర్లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ( B.Tech), ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పట్టా సాధించింది.ప్రైవేట్ జాబ్ వదిలేసి..చదువు ముగిసిన తర్వాత ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసింది. సివిల్ సర్వెంట్ కావాలన్న తన కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి UPSC పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. 2020లో మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ ఆమె పట్టు వదలేదు. తాను దాచుకున్న డబ్బుతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంది. దీక్షగా చదవడంతో మరుసటి ఏడాదే ఆమె కల సాకారమయింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్, EWS విభాగంలో 4వ ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికైంది. శిక్షణ పూర్తైన తర్వాత జార్ఖండ్ కేడర్కు నియమించబడింది.తోబుట్టువులకు స్ఫూర్తిదీపేష్ కుమారి విజయం ఆమె తోబుట్టువులకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా, ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నాడు. మరొక సోదరుడు లాతూర్లో చదువు కొనసాగిస్తున్నాడు.చదవండి: 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు నాన్నే ప్రేరణదీపేష్ కుమారి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ (Inspiration) అని చెప్పారు. "నేను అలసిపోయినప్పుడల్లా, ఆయన పోరాటం నాకు బలాన్నిచ్చింది" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పరిమిత మార్గాలు ఉన్నప్పటికీ గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించే యువతకు దీపేష్ కుమారి ఇన్స్పిరేషన్గా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..
పొట్టివాడైనా..గట్టివాడమ్మ అన్న నానుడిలా ..ఓ మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకుంది. అది శారీరక లోపం కాదు..విభిన్నంగా చూపే విశిష్ట లక్షణంగా భావించింది. అదే తన ఉన్నతికి సోపానంగా మార్చి.. తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే రేంజ్కి చేరుకుంది. తనను చూడగానే శారీరక లోపం కాదు..సాధించిన విజయమే తలంపుకు వచ్చేలా అందరి మదిలో చిరస్థాయిగా నిలిచేలా అనితర సాధ్యమైన సక్సెస్ని అందుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగేలా చేసుకుంది.ఆమెనే డెహ్రాడూన్కి చెందిన ఆర్తి డోగ్రా. తన శారీరక ఎత్తు సమాజం నుంచి అవహేళనలు, అవమానాలను బహుమతులుగా అందంచింది. ఇంతేనా అనిపించేలా అడుగడుగున జాలి చూపులు. అందరిలో సులభంగా కలిసిపోయి ఇమడలేని పరిస్థితి. అయినా సరే ఈ పరిస్థితిని ఏదో అనితర సాధ్యమైన విజయంతో సమాధానమిచ్చేలా తన తలరాతను తిరిగి రాయాలని సంకల్పించింది. ఆ నేపథ్యంలో ఆర్తి మొండి పట్టుదలతో ముందుకెళ్లెందేకు ప్రయత్నించింది. అందుకు తండ్రి కల్నల్ రాజేంద్ర డోగ్రా, అమ్మ కుంకుమ్ డోగ్రా చక్కటి ప్రోద్భలం అందించారు. అయితే తన శారీరక ఎత్తు ఎగతాళి, అవమానాల తోపాటు తన కెరీర్ అవకాశాలను మింగేస్తోందని తెలిసి కుంగిపోలేదు. దానికే సవాలు విసిరేలా అందనంత అత్యున్నత స్థాయిలో ఉండాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. అలా ఆమె డెహ్రాడూన్లో పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని, మాస్తర్స్ని పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి అయిన ఆర్తి సివిల్స్ సర్వీస్ని ఎంపిక చేసుకుంది. అందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో అవమానాలు, అవహేళనలు తప్పలేదు. అయినా తన ప్రయత్నం తనదే..అన్నట్లుగా సాగింది. ఈ అమ్మాయా ఐఏఎస్ అయ్యింది అని విస్తుపోయేలా అనితరసాధ్యమైన విజయఢంకా మోగించింది. అత్యంత పొట్టి ఐఏఎస్గా చరిత్ర సృష్టించి..ఎందరో సివిల్స్ ఔత్సాహిక అభ్యుర్థులుకు స్ఫూర్తిగా నిలిచింది. శారీరక లోపం అనేది మన అంతరంగంలో ఉన్న విశిష్ట శక్తిని మనకే పరిచయం చేసే సాధనంగా మలుచుకుంటే..సాధ్యం కాదనుకున్న విజయాలన్నీ ఒళ్లోకొచ్చి వాలిపోతాయంటోందామె. అంతేగాదు ఆ సక్సెస్ ఆమె శారీరక ఎత్తుని చూడనీయడం లేదు. ఈమె నాకు రోల్ మోడల్ అనిపించేలా ఆమె అత్యున్నత హోదా ప్రేరణ కలిగిస్తోంది. ఒక్క విజయంతో వేలెత్తి చూపే మాటలన్నింటికీ తగిన సమాధానం ఇవ్వడం అంటే ఇదే కదూ..!. ప్రస్తుతం ఆమె రాజస్థాన్లో సమాచార, సాంకేతిక కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.(చదవండి: హ్యక్ హా.. అప్డేట్ హా..?!) -
KBC 17: హైదరాబాద్ మహిళ.. ఎంత గెలిచారంటే..?
బుల్లి తెరపై కౌన్ బనేగా కరోడ్పతి 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. 25 ఏళ్లుగా సోనీ టెలివిజన్లో ప్రసారమవుతున్న ఈ క్విజ్ షోకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు వరకు ఈ షోలో పాల్గొనేందుకు అమితాసక్తి చూపిస్తుంటారు. ఇప్పటివరకు ఇందులో పాల్గొన్న చాలా మంది భారీగా నగదు గెలుచుకున్నారు.తాజాగా హైదరాబాద్కు చెందిన మహిళా సైంటిస్ట్ ఒకరు రూ.12.5 లక్షలు గెలిచి సత్తా చాటారు. రూ. 25 లక్షలు గెలిచే అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యారు. హరిప్రియ సాకేతపురం.. ఇస్రోలో శాస్త్రవేత్తగా (ISRO scientist) పనిచేస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్పతిలో తాజాగా బిగ్ బి ఎదురుగా హాట్ సీటులో కూర్చునే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ముందుగా ఆమెను అమితాబ్ సాదరంగా ఆహ్వానించి, ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్త తొలిసారిగా కేబీసీకి రావడం తమ అదృష్టమని ఆయన అన్నారు.ఉద్యోగం, కుటుంబంఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ.. సవాళ్లతో కూడిన ఉద్యోగ జీవితం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్లతో తన ప్రయాణం గురించి మాట్లాడారు. కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ కెరీర్లో ఏవిధంగా ముందుకెళుతున్నారో వివరించారు. తర్వాత గేమ్ మొదలు పెట్టారు. ఒక్కో ప్రశ్నకు సమాధానాలు చెబుతూ 13వ క్వశ్చన్ దగ్గర ఆగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిష్క్రమించడంతో రూ.12.5 లక్షలు గెలిచారు. ఆ ప్రశ్నకు కూడా సమామాధానం చెబితే ఆమెకు పాతిక లక్షలు దక్కేవి. అయితే పోటీ నుంచి తప్పకున్నాక ఆమె గెస్ చేసిన సమాధానం కరెక్ట్ అని తేలడం విశేషం. ఇంతకీ ఏంటా ప్రశ్న?పరమహంస యోగానంద ఆత్మకథ ప్రకారం.. ఆయన మహాత్మా గాంధీకి ఏ పండును సూచించి, కాలిఫోర్నియా నుంచి వార్ధాకు కొన్ని మొక్కలను పంపారు?ఎ. కాంటాలౌప్బి. హకిల్బెర్రీసి. అవకాడోడి. పీచ్సరైన సమాధానం: అవకాడోఇంకా ఆడాల్సింది..షో చూస్తున్న వారంతా హరిప్రియ అనవసరంగా క్విట్ చేసిందని, పోటీలో ముందుకెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేబీసీలో హరిప్రియ రూ. 25 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, ఆమె ప్రయాణం (Journey) చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. చదవండి: కష్టాలనూ ఆడేసుకున్నారు -
ఉమెన్ కమాండో టీమ్
కీలకమైన ఆపరేషన్ల కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలిసారిగా ఉమెన్ కమాండో టీమ్ను ప్రారంభించింది. వందమంది మహిళా సీఐఎస్ఎఫ్లకు ఫిట్నెస్, వెపన్స్ హ్యాండ్లింగ్, లైవ్–ఫైర్ డ్రిల్స్లాంటి ఆపరేషన్ స్కిల్స్, రన్నింగ్, అబ్స్టకిల్ కోర్సులు, రఫెలింగ్, సర్వైవల్ ఇన్ ఫారెస్ట్స్, 48 గంటల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లు... మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు.మధ్యప్రదేశ్లోని బర్వాహత రీజనల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్టిసి)లో శిక్షణ మొదలైంది. శిక్షణ పూర్తి చేసుకున్న తొలిబ్యాచ్ మహిళలు ఎయిర్΄ోర్ట్స్లాంటి సున్నిత ప్రాంతాలలో విధులు నిర్వహిస్తుంది.(చదవండి: బ్యాట్ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...) -
పరిశ్రమిస్తున్న నారీ లోకం!
‘అన్నీ తెలిసిన వారు ఉండరు.అలాగే ఏమీ తెలియని వారూ ఉండరు’ అనేది సామెత. ‘నీకు తెలిసిందే నీ శక్తి’ అనేది నీతికథ. జిమ్మి రాజుకు అంతర్జాతీయ వ్యాపారాల గురించి తెలియదు కానీ పచ్చళ్ల గురించి బాగా తెలుసు. ‘గ్రాండ్మా’ పేరుతో పచ్చళ్ల కంపెనీ ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయింది. ఒకప్పుడు కేరళలోని త్రిసూర్కే పరిమితమైన ఆ కంపెనీ ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కూడా సత్తా చాటుతోంది. జిమ్మి రాజు మాత్రమే కాదు ఘనమైన వ్యాపార నేపథ్యం లేని ఎంతోమంది సాధారణ మహిళలు చిన్న చిన్న అడుగులు వేస్తూనే ఎంటర్ప్రెన్యూర్లుగా పెద్ద స్థాయికి చేరుకున్నారు.గ్రాండ్మా..గ్రాండ్ సక్సెస్‘నేను వ్యాపారవేత్త కాగలనా?’ తనకు తాను ప్రశ్న వేసుకుంది జిమ్మి రాజు. ‘కచ్చితంగా!’ తనలో నుంచే సమాధానం వచ్చింది. ‘నాకు ఏం తెలుసు?’ మరో ప్రశ్న.‘పెద్దగా ఏమీ తెలియనక్కర్లేదు. నడిచే దారిలో అన్నీ తెలుస్తాయి’ ఆ ప్రశ్నకు జవాబు.తనకు పచ్చళ్లు అంటే ఇష్టం. ఆసక్తి. ‘యస్...పచ్చళ్లతోనే మొదలెడదాం’ అనుకొని ప్రయాణం ప్రారంభించింది జిమ్మి రాజు. కేరళలోని మరడీలో ‘గ్రాండ్మా’ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించింది. ‘గ్రాండ్మా’ గ్రాండ్ సక్సెస్కు కారణం నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్లు. ‘గ్రాండ్మా’ ఇంట గెలిచింది. ఇప్పుడు రచ్చ గెలవాలి. వ్యాపారాన్ని విస్తరించాలంటే ముందు డబ్బు కావాలి. ‘ఫెడరల్ బ్యాంక్’ నుంచి లోన్ ద్వారా తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి, యూరోపియన్ దేశాల వరకు తీసుకువెళ్లింది జిమ్మి రాజు. ‘గ్రాండ్మా’ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇస్తోంది.నష్టాల నుంచి లాభాలకుపంజాబ్లోని మన్సాకు చెందిన కుల్విందర్ కౌర్ కుటుంబం డెయిరీ ఫామ్ను నిర్వహించేది. ఈ డైరీ వల్ల లాభాల మాటేమిటోగానీ నష్టాలే నష్టాలు! ‘ఇలా అయితే కుదరదు’ అని గట్టిగా అనుకున్న కుల్విందర్ ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని లోతుగా ఆలోచించింది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘మనీబాక్స్’ను సంప్రదించింది. ఈ కంపెనీ నుంచి అందిన రుణంతో డెయిరీని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. నష్టాల నుంచి బయటపడడానికి, లాభాల బాట పట్టి పెద్ద డెయిరీ ఫామ్ స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.అమ్మ నేర్పిన విద్యలక్ష్మి పది సంవత్సరాల వయసులో ఉన్నప్పడు తల్లి వినయ కేరళ, కొంకణి వంటకాలకు సంబంధించి చిన్నపాటి వ్యాపారాన్ని నిర్వహించేది. స్కూలు నుంచి రాగానే తల్లి చేసిన రకరకాల వంటకాలను రుచి చూసేది చిన్నారి లక్ష్మి. ప్యాకింగ్, డెలివరీకి సంబంధించిన పనుల్లో తల్లికి సహాయపడుతుండేది. ఏళ్ల తరువాత... వినయ కోవిడ్ బారిన పడింది. అప్పుడు కూడా వైద్యులతో తన వ్యాపారం గురించి మాట్లాడేది. తల్లి చనిపోయి తరవాత విషాదంలో కూరుకుపోయింది లక్ష్మి. ఆ సమయంలోనే తన భవిష్యత్ని మార్చే నిర్ణయం తీసుకుంది.‘అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటే వ్యాపారం ఆగకూడదు’ అనుకుంది. అలా ‘లక్ష్మి’ ఫుడ్ స్టార్టప్ మొదలైంది. రకరకాల వంటకాలకు సంబంధించి తల్లి రాసిన నోట్స్ తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మొదట్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్లకు సంబంధించిన సమస్యలు ఎదురైనా ఆ తరువాత మాత్రం కంపెనీని పెద్ద ఎత్తున విస్తరించింది.‘అమ్మ మా వ్యాపారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని కలలు కనేది. ఆమె కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం. స్థానిక అమ్మకాలు, ఆన్లైన్ అమ్మకాలు, సోషల్ మీడియా మార్కెటింగ్తో అమ్మ కలను సాకారం చేశాం’ అంటుంది కేరళలోని త్రిసూర్కు చెందిన లక్ష్మి.మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణాకోవిడ్ కల్లోల కాలంలో దొరికిన విరామంలో ‘కొత్తగా ఏదైనా చేయాలి’ అని ఆలోచించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ సోనియ దాహియ. ఆ ఆలోచనలే ఫలితమే... పుట్టగొడుగుల పెంపకం. ఆమె నిర్ణయం చాలా మందిని షాక్కు గురి చేసింది. ‘భద్రతను ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పుట్టగొడుగుల పెంపకం ఏమిటి!’ అని ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సోనియా. నలభై లక్షల రూపాయలతో ‘డాక్టర్ దాహియ మష్రూమ్ ఫామ్’ ప్రారంభించింది.రోజు రోజుకూ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయింది. ఊహించని లాభాల స్థాయికి తీసుకువచ్చింది. అయితే మొదట్లో ఆమె ప్రయాణం సజావుగా ఏమీ జరగలేదు. తరచు విద్యుత్ కోతలుండేవి. ఆ ప్రభావం పుట్టగొడుగులపై పడేది. ఇదొక్కటే కాదు...ఎన్నో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను కనుక్కుంటూ వెళ్లిన సోనియ ‘మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణా’గా పేరు తెచ్చుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో సోనియాకు బయోటెక్నాలజీ నేపథ్యం ఎంతగానో ఉపయోగపడింది.ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు→ ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. నేను చెప్పే గెలుపు మంత్రం...‘అపజయం అనేది తాత్కాలికం’ → ‘లింగ వివక్షత’ కనిపించకుండా చేసే శక్తి మన విజయానికి ఉంటుంది → ఎంటర్ప్రెన్యూర్ చేసే ప్రయాణం అనేది విరామమెరుగని నిరంతర ప్రయాణం → మీరు ఒక పని ఎంచుకుంటే, మీ జీవితం మొత్తం ఆ పని మీదే ఆధారపడినంతగా కష్టపడాలి → వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించడం అంటే బడిలో విద్యార్థిగా చేరడమే. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటాం.– కిరణ్ మజుందార్–షా, బయోకాన్ వ్యవస్థాకురాలు -
కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..
చిన్నప్పటి నుంచి కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగింది. అవే ఆమెను కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని సాధించే దిశగా నడిపించాయి. పోని అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలి..తన కుటుంబం తనను చూసి గర్వించేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడేది. ఆ క్రమంలోనే యూపీఎస్సీకి సన్నద్ధమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆమెను అపజయం పలకరిస్తూనే ఉంది. అది కూడా ప్రిలిమినరీ స్టేజ్లోనే విఫలమవ్వడం అంటే..అస్సలు సివిల్స్ విజయం దరిదాపుల్లోకి వెళ్లకుండానే ఆమెను ఫెయిల్యూర్ భూతం భయపెట్టేస్తూ ఉండేది. మరేవరైనా అయితే మూడేళ్లు వృధా అయ్యిందని డిప్రెషన్కి గురై ఆ ప్రయత్నమే మానుకుంటారు కానీ.. ఈమె మొండి పట్టుదలతో తాడోపేడో అన్నట్లుగా ముందుకు సాగి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఐఏఎస్ సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ అమ్మాయే కేరళ నిర్మాణ కార్మికుడి కుమార్తె అశ్వతి. తండ్రి నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చిన్నతనం నుంచి ఆమెకు స్ఫష్టమైన జీవిత లక్ష్యం ఉంది. ఐఏఎస్ (IAS) కావాలనేది ఆమె ధ్యేయం. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చేరి కుటుంబానికి ఆసరాగా మారింది. అయితే అక్కడితో తన సక్సెస్కి బ్రేక్ వేయలేదామె. తన చిన్ననాటి కల ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా ఐఏఎస్ కావాలనే కోరిక ఆమె మనసులో చాలా బలంగా ఉండేది. అందుకోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలనై నిర్ణయాన్ని అత్యంత ధైర్యంగా తీసుకుని మరీ యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సన్నద్ధమైంది. అయితే 2017, 2018, 2019లలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేక తిప్పలు పడింది. ఇక లాభం లేదని, చేస్తున్న తప్పిదాలను సమీక్షిస్తూ.. మెరుగ్గా రాసేలా ప్రాక్టీస్ చేసింది. ఆమె దృఢ సంకల్పంతో మరోసారి సివిల్స్ ప్రయత్నించగా.. ఈసారి అపజయం తోకముడవడమే కాదు, సక్సెస్ సంతోషంగా ఒడిలోకి వచ్చి చేరింది. అలా ఆమె 2020 నాల్గో ప్రయత్నంలో 481వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారామె. ఈ సక్సెస్ స్టోరీ (Success Story).. ధైర్యంగా రిస్క్ తీసుకునేందుకు సన్నద్ధం కావడమే గాక, దాంట్లో ఎదురై ఫెయిల్యూర్లను ఓర్చుకునే ఓపిక కూడా అవసరమని చెప్పకనే చెబుతోంది. అప్పుడే విజయ ఢంకాను సగర్వంగా మోగించగడం సాధ్యమని నొక్కి చెబుతోంది కదూ..!.చదవండి: పనిమనిషికి రూ. 8 లక్షల జరిమానా..! ఎందుకో తెలుసా..? -
బాయ్ ఫ్రెండ్తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్ను శాసించిన లెజెండ్మేరీ కోమ్ గోల్డెన్సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్లో కనిపించి ఫ్యాన్స్తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు. 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించారు.ఎవరీ హితేష్ చౌదరి కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. -
ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్ని ఆస్వాదించేలోపే..
సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినమైన ప్రతిష్టాత్మక ఎగ్జామ్ అనేది తెలిసిందే. ఐపీఎస్ కావాలంటే ఎన్నో క్లిష్టమైన ఎగ్జామ్లు దాటుకుంటూ చేరుకోవాలి. ఏ ప్రాసెస్లో ఫెయిలైనా అంతే సంగతులు. అలాంటి ప్రతిష్టాత్మక ఈ సివిల్స్ పరీక్షలో ఓ అందమైన యువతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలెంది. ఆ ఏడాది ఆమె ఫోటోలు నెట్టింట హల్చల్ కావడంతో ఆమె మోడల్ అని అనుకున్నారంతా..!. బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం. అంతేగాదు ఆమె అపారమైన ప్రతిభ, ఆకర్షించే సౌందర్యం కలగలసిన బ్యూటిఫుల్ అధికారిణిగా గుర్తింపు తెచ్చుకోవడమే గాదు యువతకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె పేరు పూరవ్ చౌదరి. 2024 సివిల్స్ ఎగ్జామ్లో 533 ర్యాంక్తో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ఆఫీసర్ అయ్యారు. లక్షలాది మంది పోటీపడే ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్ కొంతమంది సక్సెస్ని అందుకుంటారు. వారిలో ఒకరు ఈ పూరవ్ చౌదరి. అయితే ఆమె చదువులోనే కాదు అందంలోని బాలీవుడ్ నటీమణులకు తీసిపోని విధంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటారామె. ఆమెకు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా యూపీఎస్సీ ఎగ్జామ్ని ఎంచుకున్నారు. అదే ఏడాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించింది ప్రయాగ్ రాజ్కు చెందిన శక్తి దూబే. ఆమె నేపథ్యం..పూరవ్ రాజస్థాన్కి చెందిన మహిళ. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS)లో అధికారిగా కోట్పుట్లీలో అదనపు జిల్లా కలెక్టర్ పదవిని నిర్వహిస్తున్నారు. ఆమె చదువులో ఎప్పుడూ తెలివైన విద్యార్థిగా ఉండేది. సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కి పూర్తి సమయం కేటాయించింది. తొలి ప్రయత్నంలో ఐపీఎస్ కేడర్ రాగా, మరో ప్రయత్నంలో ఐఏఏస్ సాధించిందామె. చిక్కుకున్న వివాదం..యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించగానే అధికారిక ఫలితాల్లో పూర్వ పేరు వద్ద ఓబీసీ నమోదు చేసింది. దీనితో వివాదం రాజుకుంది. ఆమె తండ్రి ఆ ఆరోపణలన్నింటిని తిప్పి కొట్టారు. 40 ఏళ్ల లోపు ప్రత్యక్ష ఆర్ఏఎస్ నియామకం విషయంలో OBC NCL ప్రయోజనం వర్తించదు. కానీ తాను 44 ఏళ్ల వయసులో ఆర్ఏఎస్ అధికారిని అయ్యాను కాబట్టి తన కుమార్తె సర్టిఫికేట్ దుర్వినియోగానికి పాల్పడిందనేది అవాస్తవం అని వివరణ ఇచ్చారు.(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్
ఆపద సమయంలో, విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే అసలైన హీరోలు. ఒక పసిబిడ్డను కాపాడేందుకు షీరోనర్స్ చేసిన సాహసం, ధైర్యం విశేషంగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మీ ధైర్యానికి సెల్యూట్! అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.టిక్కర్ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు కమల అనారోగ్యంతో ఉన్న పసిపాపకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు హురాంగ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా విస్తృతంగా విధ్వంసం సంభవించింది. సిల్బుధాని , తార్స్వాన్ పంచాయతీలలో రోడ్లు , ఫుట్బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామానికి వెళ్లే మార్గం కష్టంగా మారింది. పద్దర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌహార్ లోయ మండిలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. అటు చూస్తే కాలువ పొంగిపొర్లుతోంది నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఏ మాత్రం స్లిప్ అయినా ప్రాణాలకే ముప్పు. అయినా సరే వృత్తి ధర్మం నెరవేర్చాలనే ఆశయంతో రాళ్లపై ఒక్క ఉదుటున దూకి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కాలువ దాటింది. Meet Staff Nurse Kamla, who risked her life to ensure a two-month-old baby received a crucial injection. With the bridge in her area swept away, she crossed the river to reach the child. She is From Paddhar's Chauharghati, Mandi. @CMOFFICEHP @mansukhmandviya @nhmhimachalp @WHO pic.twitter.com/o9JFmIHskx— Vinod Katwal (@Katwal_Vinod) August 23, 2025> అద్భుత సాహసానికి సంబంధించిన ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని సుధార్ పంచాయతీలోని చౌహర్ఘాటిలో చోటు చేసుకుంది. నర్సు ధైర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అదే సమయంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్రంట్లైన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
మహిళా ఇన్వెస్టర్లపై సెబీ స్పెషల్ ఫోకస్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
చంపా... చరిత్ర సృష్టించింది
అడుగడుగునా ఆర్థిక కష్టాలు. ‘అమ్మాయికి ఈ మాత్రం చదువు చాలు’ అనే ఇరుగు పొరుగు వెటకారాలు. అయినా సరే, చదువు విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ‘పదవ తరగతి అయినా పూర్తి చేయగలనా’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. దిదై అనేది ఒడిశాలోని ఒక గిరిజన తెగ. ఈ తెగ నుంచి జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత సాధించిన తొలి విద్యార్థిగా చంపా రాస్పెడా చరిత్ర సృష్టించింది.ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని అమ్లిబెడ గ్రామానికి చెందిన చంపా రాస్పెడా తల్లి గృహిణి. తండ్రి ఓ పేద రైతు. ఆర్థిక కష్టాల వల్ల ఒకానొక దశలో చంపాకు చదువు కొనసాగించడం కష్టమైంది. అయినా సరే, ఎలాగో ఒకలా ఆర్థిక కష్టాలను అధిగమించి ముందడుగు వేసింది.చిత్రకొండలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత గోవింద్పల్లిలోని ఎస్ఎస్డీ హైయర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఆర్థిక కష్టాలతో బీఎస్సీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయితే హైస్కూల్ రోజుల్లో చంపాకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్ ధైర్యం చెప్పడమే కాదు బాలసోర్లోని నీట్ ఉచిత శిక్షణ తరగతులలో చేర్పించారు.ఆ క్లాస్లలో చేరిన క్షణం నుంచే ‘ఎలాగైనా డాక్టర్ కావాల్సిందే’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. తన కలను నిజం చేసుకుంది చంపా. బాలసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ పొందింది.మల్కన్గిరి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే దిదై తెగ ప్రజలకు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు ప్రధాన జీవనాధారం. చదువు వారికి చాలా దూరంగా ఉండేది. ఇప్పుడిప్పుడే వారు చదువుకు దగ్గరవుతున్నారు. ఈ దశలో చంపా సాధించిన విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.‘వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆర్థిక కష్టాలు అడ్డంకి కాదు... అనే విషయాన్ని విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’ అంటుంది చంపా రాస్పెడా.‘ఈ విజయానికి మూలం ఆమె పడిన కష్టం. అంకితభావం. ఆమె విజయం ఒడిశాలోని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను. ఆమె భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంపా రాస్పెడా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి.ఈ ఇంట్లోనే...‘రకరకాల మూఢనమ్మకాల వల్ల మా కమ్యూనిటీలో ఆడపిల్లల చదువుకు పెద్దగాప్రాధాన్యత ఇవ్వరు’ అంటున్న చంపా రాస్పెడా తన తల్లిదండ్రులను ఒప్పించి, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చదువు దారిలో ముందుకు వెళ్లింది. పెద్దగా సౌకర్యాలు లేని ఇంట్లో పెరిగింది చంప. ఇప్పుడు సాధారణ దృశ్యంగా కనిపిస్తున్న ఆమె ఇంటి చిత్రం భవిష్యత్లో స్ఫూర్తిదాయక చిత్రంగా నిలవనుంది. ‘ఈ ఇంట్లోనే చదివి చంప డాక్టర్ అయింది’ అనే ఒక్కమాట చాలదా ఎంతోమంది అమ్మాయిలలో ధైర్యం నింపడానికి, ‘మేము కూడా సాధించాలి’ అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి! -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్షిప్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత


