Narayanpet
-
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీ పంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీప ంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్చువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
ప్రైవేట్దే జోరు..!
కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి రైతుల అనాసక్తి● తేమశాతం, తాలు అంటూ జాప్యం ● అకాల వర్షాలతో ఆందోళనలో అన్నదాతలు ● ప్రైవేట్లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్న వైనంనారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్యార్డుకు ధాన్యపు రాశుల కళ వచ్చింది. యా సంగి కోతలు ఊపందుకోవడంతో రైతులతో కళకళాడుతుంది. జిల్లాలో ప్రభుత్వం 161 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రైవేట్ వ్యా పారం జోరుగా సాగుతుంది. మంచిధరలు వచ్చేలా మార్కెట్లో వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ● ఓ వైపు అకాల వర్షాలు.. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక ఎక్కడ తడిసిపోతుందోననే భయంతో రైతులు నేరుగా జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు తరలిస్తున్నారు. ఇటు తెలంగాణ.. అటు కర్ణాటక సరిహద్దులోని పలు గ్రామాల నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొస్తున్నారు. రెండ్రోజులుగా మార్కెట్యార్డుకు ధాన్యం పోటెత్తింది. వ్యాపారులు సైతం తేమ శాతం 17 ఉంటే క్వింటాకు రూ.2,440 వరకు చెల్లిస్తుండటంతో రైతులు ప్రైవేట్లో విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రతి కేంద్రం పరిధిలో చివరి గింజ వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేశాం. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – సైదులు, డీఎం, పౌరసరఫరాలసంస్థ -
ఎస్పీని కలిసిన వనపర్తి ఏఎస్పీ
నారాయణపేట: ఎస్పీ డా. వినీత్ వనపర్తి ఇన్చార్జ్ ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్య తలు చేపట్టిన రాజేష్ మీనా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కానిస్టేబుల్ కుమార్తెకు అభినందనలు.. ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ రాఘవేందర్ కుమార్తె నవ్య ఇంటర్మీడియట్లో 991 మార్కులు సాధించింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. వినీత్ను విద్యార్థిని మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవ్య కృషి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే కానిస్టేబుల్ రాఘవేందర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ కుమార్తె ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం పిల్లల విజయానికి ముఖ్యమని తెలిపారు. ఈ విజయం పోలీసుశాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఏఎస్పీ రాజేష్ మీనా, కానిస్టేబుల్ రాఘవేందర్ ఉన్నారు. -
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నారాయణపేట: కలెక్టర్గా సోమవారం బాధ్య తలు చేపట్టిన సీహెచ్ ప్రియాంక మంగళవారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి బోయ శ్రీనివాసులును కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని కలెక్టర్కు సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి నారాయణపేట: ఉపాధినిచ్చే సాంకేతిక విద్య ను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని చేనేత, జౌళిశాఖ అధికారులు బి.రాజేష్బాబు, ఎస్.విజయ్కుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు సంప్రదాయ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా 100 శాతం ఉపాధి అవకాశాలు కలిగిన సాంకేతిక వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. 2026–27 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు ప్రత్యేకతలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.2,500 స్టైఫండ్ అందిస్తోందని, చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అదనంగా నెలకు రూ.5 వేలు చెల్లిస్తుందని వివరించారు. ఏడాదికి కేవలం రూ.4,250 నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రముఖ వస్త్ర పరిశ్రమల్లో డిజైనర్లు, మేనేజర్లు వంటి పదవుల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత 10వ తరగతి అని, 60 సీట్లు ఉండగా.. మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారని తెలిపారు. దరఖాస్తునకు చివరి గడువు ఏప్రిల్ చివరి వారమని, హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న దరఖా స్తు కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా లోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఆంజనేయులు, బత్తుల సతీష్, సౌడం నర్సింహులు, ఐఐహెచ్టీ సిబ్బంది ఎం.శివమణి, బి.స్వప్న (అధ్యాపకులు), పలు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
85 శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ లక్ష్యం
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సమగ్ర, పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని.. జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతం చేసి మూడు రోజుల్లో 85 శాతం మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీనుతో కలిసి ఎస్ఐఆర్, సాదా బైనామాపై తహసీల్దార్లు, డీటీలు, సూపర్వైజర్లు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 85 శాతం ఎస్ఐఆర్ పూర్తి కావాలని.. లేనిపక్షంలో సంబంధిత అధికారులు, ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఓ నంబర్ 74, 76 ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 2,075 సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయని.. 2,674 సర్వేనంబర్లను విచారణ చేసి నెలాఖరు నాటికి పరిష్కరించాలని.. తిరస్కరిస్తే తగిన కారణాలను స్పష్టంగా పేర్కొనాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తహసీల్దార్లను ఆదేశించారు. చివరగా భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై చర్చించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయాలి.. కలెక్టరేట్ నిర్మాణ పనులు మే నెలాఖరుకు పూర్తిచేసి జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నూతన భవనంలోని కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం, వివిధ సెక్షన్ గదులలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. జూన్ 2 వరకు పనులు పూర్తికావడం సాధ్యం కాదని, జులైలో పూర్తవుతాయని ఆర్అండ్బీ అధికారులు వివరించగా.. పనుల్లో వేగం పెంచి మే నెలాఖరుకు పూర్తి చేసే ప్రయత్నం చేయాలని కోరారు. భవన నిర్మాణానికి నిధులు సరిపోవడం లేదని.. అదనపు నిధులు కావాలని అధికారులు కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని బదులిచ్చారు. గ్రీనరీ, వాహనాల పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఆమె వెంట ఆర్అండ్బీ ఎస్ఈ. వెంకటరమణ, డీఈ రాములు, ఏఈలు, సూపర్వైజర్లు ఉన్నారు. జిల్లాకేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్కు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని.. లాభాల బాటలో నడుస్తుందని, ఐ అండ్ పీఆర్ కమిషనర్గా తాను పలు పత్రికల్లో పాజిటివ్ కథనాలు ప్రచురింప చేయించిన విషయాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గుర్తుచేశారు. ఇప్పుడు జిల్లాకు కలెక్టర్గా వచ్చానని.. కొత్త ఆలోచనలతో మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుడదామని సూచించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ భవనంలో జరిగిన జిల్లా మహిళా సమాఖ్య ఈసీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత నెలలో జరిగిన సమావేశ వివరాలపై సమీక్షించి ఎస్హెచ్జీల పనితీరు, జిల్లా సమాఖ్య, పెట్రోల్ బంక్ లావాదేవీలు, బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, సెర్ప్ పీఎం బాలస్వామి, డీపీఎం గోవింద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అరుంధతి, సుజాత, కోశాధికారి అంజమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందన ఇక్కట్లు..
ధన్వాడలో బారులు తీరిన వాహనాలు బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత తలెత్తడంతో మంగళవారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి కోతలు ఉపందుకోవడంతో వరి కోత యంత్రాల నిర్వాహకులు డీజిల్ కోసం బైక్లపై డబ్బాలతో మక్తల్, దేవరకద్ర, మరికల్ జాతీయ రహదారిపై ఉన్న బంకుల చుట్టూ చక్కర్లు కొట్టడం కనిపించింది. ఎక్కడికి వెళ్లినా నో–స్టాక్ బోర్డులు కనిపించాయి. మరికల్లో ఐదు బంకులు ఉండగా.. నాలుగింటిలో నో–స్టాక్ బోర్డులు పెట్టారు. ధన్వాడలోని పెట్రోల్ బంక్లో మూడురోజులుగా విక్రయాలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున మరికల్లోని ఒక బంకుకు, ధన్వాడలోని బంక్కు డీజిల్ ట్యాంకర్ రావడంతో పౌరసరఫరాలశాఖ అధికారుల సూచన మేరకు బంకు నిర్వాహకులు వరికోత యంత్రాల పత్రాలను పరిశీలించి డీజిల్ పోశారు. గంటల తరబడి వేచి చూసి డీజిల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క కిలోమీటర్ల మేర వాహనాలు డీజిల్ కోసం బారులు తీరాయి. – మరికల్, ధన్వాడ మరికల్లో డీజిల్ కోసం వరుసలో పెట్టిన డబ్బాలు -
మార్కెట్ ఏర్పాటు చేయాలి..
కొల్లాపూర్లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ● -
ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును ప్రారంభించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ఉద్యానవిద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉండగా.. మరో యూనివర్సిటీలో అదే కోర్సు ప్రవేశపెట్టడంతో ఉద్యాన విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని, ఈ నిర్ణయంతో అకాడమిక్ వ్యవస్థలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
వారబందీ మరో రెండ్రోజులే..
● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న వరి పంటలు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి పంటలు తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్రమే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజేపీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. -
స్వీయగణనను వినియోగించుకోవాలి
నారాయణపేట: స్వీయగణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక కోరారు. జనగణన ప్రక్రియలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్లోని తన చాంబర్లో స్వీయ నమోదు చేసుకొని మాట్లాడారు. జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయగణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్లోగాని, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ నమోదుకు అవకాశం ఉందని చెప్పారు. వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రత్యేక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ జారీ అవుతుందని.. మే నెల 11 నుంచి జూన్ 9 మధ్యకాలంలో ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్లకు ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో చేసుకుంటే ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదని.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ ద్వారా పరిశీలించి ధ్రువీకరిస్తారని వివరించారు. అయితే స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఈ వివరాలు ఎంతో దోహదపడతాయని.. ఈ ప్రక్రియ జిల్లాలో విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. వైద్య కళాశాల, ఆస్పత్రి తనిఖీ.. మండలంలోని అప్పక్పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పతి, ప్రభుత్వ వైద్య కళాశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ వద్దకు వెళ్లి రోజుకు ఎంతమంది రోగులు వస్తారని అడిగి తెలుసుకున్నారు. రెండో అంతస్తులో పలు వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవలు, వసతులపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉందని రోగుల బంధువులు వివరించగా.. ఆర్వో ప్లాంట్ లేదా అని ఆర్ఎంఓ శ్రీనివాసులును ప్రశ్నించారు. బోరు వేస్తే నీళ్లు రాలేదని, ఆర్వో ప్లాంట్ లేదని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆస్పత్రి సమావేశ మందిరంలో ఆర్ఎంఓ, అన్ని విభాగాల హెచ్ఓడీలు, వైద్యులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి క్యాడర్ స్ట్రెంథ్, అవసరమైన వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. డయాలసిస్ సేవలపై ఆరా తీయగా పాత చిన్నపిల్లల ఆస్పత్రిలో కొనసాగుతోందని ఆర్ఎంఓ తెలిపారు. వైద్య కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రశ్నించగా మొదటి, రెండో సంవత్సరం కలిపి 100 మంది ఉన్నారని, నర్సింగ్ కళాశాల కొనసాగుతోందని వివరించారు. ఆస్పత్రి నిర్వహణ, ఇతర సదుపాయాలు, సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో 23 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ట్రక్షీట్లు
ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు అమలు మరికల్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వాహనంలో ఏ రోజు లోడ్ చేస్తే అదేరోజు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేసిన తర్వాత మాన్యువల్ ట్రక్షీట్తో రైస్మిల్లులకు తరలించేవారు. అనంతరం సొసైటీ, ఐకేపీ సిబ్బంది ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు రైతు సెల్ఫోన్కు ఓటీపీ వచ్చేది. కాగా కొత్త విధానంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా.. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను 160 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ ధాన్యాన్ని 51 రైస్మిల్లులను తరలించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి ఆయా కేంద్రాల్లో ఽఆన్లైన్ ధాన్యం కొనుగోళ్లు అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగానే రైతు మొబైల్కు ఓటీపీ వస్తోంది. అనంతరం ఆన్లైన్ ట్రక్షీట్ జారీ చేయడంతో పూర్తి వివరాలు రైతు తెలుసుకొనే అవకాశం ఉంది. అంతేగాకుండా ఆన్లైన్లో చూపించిన రైస్మిల్లుకు మాత్రమే జీపీఎస్ ఉన్న ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం తరలించాల్సి ఉంటుంది. అయితే మండలానికి ఒక్కటే ట్యాబ్ ఇవ్వడంతో ఏ రోజు ధాన్యం తరలిస్తే అదేరోజు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యం జీపీఎస్ ఉన్న వాహనంలో ఆన్లైన్లో ఎంపికై న మిల్లుకు ధాన్యం తరలిస్తారు. కొత్త పద్దతి విధానంలో రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. – సైదులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ గత సీజన్ వరకు ధాన్యాన్ని మిల్లులకు మాన్యువల్ విధానంలో కేటాయించే వారు. ధాన్యం ఏ మిల్లుకు వెళ్లనుందో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి ముందే తెలిసేది. కొత్త విధానంలో ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో తెలియదు. ఆన్లైన్లో ట్రక్షీట్ జనరేట్ అయిన తర్వాత అటోమెటిక్గా మిల్లు చూపిస్తుంది. ఆ మిల్లుకే డ్రైవర్ ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. ఇలా అంతా ఆన్లైన్లోనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. జీపీఎస్ వాహనాల్లో ధాన్యం మిల్లులకు తరలింపు అదే రోజున వివరాల నమోదు పూర్తి సమాచారం రైతుల సెల్ఫోన్కు.. -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
కోస్గి రూరల్: ౖరెతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు పొందాలని ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్రెడ్డి, రాజా మధుశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రవంచలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పరిగి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు–2026 కార్యక్రమం నిర్వహించగా.. వారు హాజరై వానాకాలం సాగుపై అవగాహన కల్పించారు. వానాకాలంలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఎంపిక, పచ్చిరొట్ట ఎరువులతో నేలసారం పెంపొందించే విధానం, అధిక రసాయన ఎరువుల వినియోగంతో పర్యావరణం, నేల ఆరోగ్యానికి కలిగే నష్టాలు, డ్రిప్, స్ప్రింక్లర్లతో నీటి పొదుపు తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటిని పొందే విధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్, వినోద్, సర్పంచ్ విద్యావతి, ఆదర్శ రైతులు వెంకట్రాములు, అనిత, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
మామి‘డీలా’..!
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20 వేలు.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు టన్నుకు రూ.20 వేల నుంచి రూ.45వేలకు మాత్రమే కొనుగోలు కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ఆందోళనలో మామిడి రైతులు -
బాధ్యతలు చేపట్టిన కలెక్టర్
నారాయణపేట: జిల్లా కలెక్టర్గా సీహెచ్ ప్రియాంక సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఏఓ శ్రీధర్, జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక కోస్గి రూరల్: స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గందె ఓంప్రకాశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఎన్నికల అధికారి వెంకటనర్సింహగౌడ్ సోమవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మల్లికార్జున్, ప్రధానకార్యదర్శిగా రాజలింగం, మహిళా రిప్రజెంటేటివ్గా పర్వీన్బేగం, స్పోర్ట్స్లో తాజ్ఖాన్, సంతోష్నాయక్, లైబ్రరీ కార్యదర్శులుగా భీమప్ప, మురళి, సభ్యులుగా ప్రభాకర్, వీఎన్ గౌడ్, మల్లేష్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడోసారి తనను ఎన్నుకున్నందుకు ఓంప్రకాశ్ న్యాయవాదులందరికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టు భవన నిర్మాణానికి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని కార్యవర్గం హామీ ఇచ్చింది. వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత ఆత్మకూర్: పట్టణానికి చెందిన విశ్రాంత డీఏఓ రాజశేఖరరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులకు మృతదేహం ఉపయోగపడుతుందని, ఇందుకు ముందుకొచ్చిన రాజశేఖర్రావు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్లు అభినందించారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజశేఖరరావు సతీమణి నాగమణి, కుమారుడు వెంకటనాంగేంద్రప్రసాద్, కుమార్తెలు విజయ లక్ష్మి, నాగజ్యోతి, బంధువులు పాల్గొన్నారు. -
వేరుశనగ @ రూ.6,899
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.5,688 ధర పలికింది. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.6,239, జొన్నలు రూ.2,177, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,256, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,786, పొద్దుతిరుగుడు రూ.5,690, కందులు రూ.6,276 చొప్పున లభించాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,959, హంస గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,719, ఆముదాలు గరిష్టంగా రూ.6,080, కనిష్టంగా రూ.6,050 చొప్పున నమోదయ్యాయి. -
కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీపద్మావతి శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ సర్పంచ్ బత్తిని అమృత్రెడ్డి – భార్గవి దంపతుల కై ంకర్యంతో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపాదస్వామి బృందం కల్యాణతంతు జరిపించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి ఘట్టాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
ఎరువు.. దరవు
●మరికల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్లో బస్తాకు రూ.50 నుంచి రూ.300 పెరగగా.. ఈ యాసంగి సీజన్లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి ఽరూ.300 పెంచడంతో రానున్న వానాకాలం సీజన్లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సుమారుగా 1.14 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా నిలిచిపోవడం, రవాణా చార్జీలు పెరగడం తదితర కారణాలతో ధరలు పెరుగుతున్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల గగ్గోలు.. ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు. ఎరువు పాతఽ ధర కొత్త ధర పెంపు 19–19–19 2,075 2,300 225 20–20–13 1,500 1,800 300 14–35–14 2,175 2,250 225 12–32–15 2,025 2,250 225 పొటాష్ 1,850 1,975 125 ఎరువుల ధరలు ఇలా (రూ.లలో..) ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఈ ఏడాది నాలుగు సార్లు పెంపు రైతన్నలపై అదనపు భారం -
ఇదేం శిక్షణ!
ఉమ్మడి జిల్లాలో అడ్డగోలుగా కోచింగ్ సెంటర్ల నిర్వహణ ● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. -
సమాజాన్ని సంస్కరించడమే కవి పని
స్టేషన్ మహబూబ్నగర్: సమాజాన్ని సంస్కరించడమే కవి పని అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లోని కాళోజీ హాల్లో ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్గౌడ్ రచించిన ‘నిశ్శబ్దం మాట్లాడితే’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా హాజరై మాట్లాడారు. లక్ష్మణ్గౌడ్ స్థానిక సమస్యలనే కాకుండా అంతర్జాతీయ సమస్యలను సైతం అద్భుతంగా కవిత్వం రాశారన్నారు. ధిక్కారంతో రాసిన కవిత్వం ఇందులో కనిపిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ లక్ష్మణ్గౌడ్ కవిత్వం సమకాలిన సమస్యలను బలంగా ఆవిష్కరించిందన్నారు. నిరంతరం కవిత్వం రాస్తూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. పుస్తక సమీక్షకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ప్రపంచ కవులైన ఇలియట్, జాన్కిట్స్, ప్లాబో నెరుడా వంటి వారు రాసిన కవిత్వం లక్ష్మణ్గౌడ్ కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఆయన కవిత్వంలో శ్రీశ్రీ ధిక్కారం, కాళోజీ ప్రజాస్వరం కనిపిస్తుందన్నారు. ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్గౌడ్ కవిత్వం రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ విద్యావేత్త, అనువాదకులు జలజం సత్యనారాయణకు అంకితం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రారెడ్డి, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, లిటిల్ స్కాలర్స్ పాఠశాల కరస్పాండెంట్ అరుంధతీరాయ్, సంయుక్తరాయ్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బాదేపల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
రైతులపైనే భారం..
ఏటా పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావారణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించేందుకు, ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి. – రాములు, రైతు, మరికల్ ధాన్యం ధరలు పెంచాలి.. ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కాని రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యం ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, రైతు, పెద్దచింతకుంట ● -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ సీజ్ చేయాలి కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ అడ్డగోలుగా ఫీజులు.. ఉమ్మడి జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు, హాస్టర్లు నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారులు జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు.–మారుతి, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూ, మహబూబ్నగర్ ● -
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పోరాటం
నారాయణపేట: రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో నేడు రైతులకు రూ.4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాకు సుమారు 5 కిలోల తరుగు చూపిస్తున్నారని.. అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇటీవల కొత్తగూడెంలో మూడురోజుల పాటు రాష్ట్ర మూడో మహాసభలు విజయవంతంగా కొనసాగాయని.. మహాసభల్లో రైతులకు సంబంధించిన 31 అంశాలపై చర్చించి తీర్మానం చేసినట్లు చెప్పారు. రైతుభరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ మాట్లాడుతూ.. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్ట పరిహారంతో పాటు అర్హులైన వారికి ఇల్లు, స్థలాలు, వారి పిల్లలకు గురుకులాల్లో చదివేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సీఎంఆర్ అప్పగించని మిల్లులపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన మిల్లు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుండెగారి దస్తప్ప తదితరులు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం కావాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శారీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
మూడోరోజు కొనసాగిన సమ్మె
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజు శుక్రవారం ప్ర శాంతంగా కొనసాగింది. డిపో ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు కూర్చొని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ త మ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వి జ్ఞప్తి చేశారు. సీఐటీయూ, భూ నిర్వాసితుల సంఘం, జాగృతిసేన, బహుజన సమాజ్పార్టీ నాయకులు సమ్మె శిబిరానికి చేరుకొని ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికుల పక్షాన సీఎం రేవంత్రెడ్డి నిలబడాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మౌన ర్యాలీ.. ఆత్మహత్య చేసుకున్న శంకర్గౌడ్ చిత్రపటానికి నారాయణపేట ఆర్టీసీ కార్మికులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డిపో నుంచి సత్యనారాయణ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు మౌనం పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆత్మహత్యలు పరిష్కారం కావని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మూడురోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా బస్టాండ్ ప్రాంగణంలో ఫైరింజన్తో పాటు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. -
సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు : ఎస్పీ
నారాయణపేట: యాసంగి వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం అక్రమంగా తరలకుండా, అలాగే రాష్ట్రంలోని పీడీఎస్, సీఎంఆర్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిరోధించేందుకు జిల్లా పరిధిలో ఆరు సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ డా. వినీత్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా లోని నారాయణపేట మండలం జలాల్పూర్, దా మరగిద్ద మండలం కానుకుర్తి, కృష్ణా మండలం చేగుంట సమీపంలోని కృష్ణానది వంతెనపై, ఊట్కూర్ మండలం సమస్తాపూర్, మాగనూర్ మండలం ఉజ్జెల్లి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయి నిఘా ఉంచాలని ఎస్పీ తెలిపారు. వరి ధాన్యం అక్రమంగా జిల్లాకు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. చెక్పోస్టు నుంచి వెళ్లే ప్రతి వాహనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వేబిల్స్, ఇతర రవాణా పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అక్ర మంగా తరలిస్తున్నట్లు నిర్ధారణ అయితే చట్టపరమై న చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్ర తి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ వివరాలు, గమ్యస్థానం వంటి సమాచారాన్ని రిజిస్టర్లో నమో దు చేయాలని, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. చెక్పోస్టుల వద్ద మాత్రమే కాకుండా సరిహద్దు గ్రామాల ద్వారా అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్ల హెచ్ఓలు చెక్పోస్టుల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, విధుల్లో ఉన్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది తరచూ తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. జిల్లా ప్రజలు సహకరించి, అనుమానాస్పద వాహనాలు, వరి అక్రమ రవాణాను గుర్తించే చవెంటనే సమీప పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో ఎంతోమంది పిల్లలు, యువత ఎండ నుంచి ఉపశమనానికి ఈత నేర్చుకోవడానికి జలాశయాలు, స్విమ్మింగ్ పూల్స్కు వెళ్తుంటారని.. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డా. వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈత రానివారు నదులు, బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లరాదని, నేర్చుకునేపై వారి తల్లిదండ్రులు, శిక్షకుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామ అధికారులతో కలిసి జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. -
ఆటలకు వేళాయె..
–8లో uనర్వ: గ్రామీణ ప్రాంతాల్లో ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు వేళయింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో శనివారం నుంచి జూన్ 6 వరకు పది గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. 41 రోజుల పాటు వివిధ ప్రాంతాల మైదానాల్లో శిబిరాలు కొనసాగనున్నాయి. వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు శిక్షకుల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నారు.ఆసక్తి కలిగిన పీ డీలు, పీఈటీలు, సీనియర్ జాతీయస్థాయి క్రీడాకారులు పూర్తి వివరాలతో శనివారం సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా యువజన క్రీడాశాఖలో దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షకులకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నేటి నుండి జూన్ 6 వరకు.. మండలస్థాయిలో శిక్షకులకు పారితోషికం ఆన్లైన్లో నమోదు.. ధ్రువపత్రాల అందజేత గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు వివిధ ఆటల్లో శిక్షణ ఇవ్వడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. శిబిరాల్లో 14 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే శిక్షణనిస్తారు. నచ్చిన క్రీడలో శిక్షణ పొంది నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం. కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, నెట్బాల్, హాకీ, జూడో తదితర క్రీడల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగు లకు 44 వాహనాలు, డిగ్రీ విద్యా ర్థులకు 17 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లు అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఉపకరణాలను అందజేస్తుందని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోటీ లేకుండా ‘సహకారం’
● పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్ ● నూతన సంస్కరణలా..? రాజకీయ వ్యూహమా..? ● ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు ● డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగించేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 76 సొసైటీలుంటే.. నాగర్కర్నూలు జిల్లాలో 23, వనపర్తి15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్నగర్17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పక్షం నేతలు పీఏసీఎస్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. ప్రభుత్వం నామినేటేడ్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులకు పోటీ లేకుండానే సహకార సొసైటీలో పదవులు దక్కే అవకాశం దక్కుతుంది. పీఏసీఎస్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. -
ఇక ఆటా.. పాట
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ● విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ ● తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశాలు ● సెలవుల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన ● జూన్ 12న పునఃప్రారంభం కానున్న పాఠశాలలు నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ బదిలీలు.. ప దోన్నతులు.. ఎన్నికల నిర్వహణ.. ఇలా అన్ని రకా ల అవాంతరాలను అధిగమించి విజయవంతంగా విద్యా సంవత్సరం ముగిసింది. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. గురువారం ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను విద్యా ర్థులకు అందించారు. జూన్ 12న తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. చివరి రోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి.. విద్యార్థుల ప్రగతిని వివరించారు. అదే విధంగా ఏడాది మొత్తం నిర్వహించిన నాలుగు ఎఫ్ఏ, రెండు ఎస్ఏ పరీక్షలకు సంబంధించిన మార్కులను ఆన్లైన్లో పొందుపరిచి.. ప్రగతి నివేదికను అందజేశారు. సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఆన్లైన్లో విద్యార్థుల ప్రగతి.. సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ)–2 పరీక్షలు ఈ నెల 18న పూర్తి కావడంతో ఉపాధ్యాయులు వారం రోజులపాటు సమాధాన పత్రాల మూల్యాంకనంలో బిజీగా గడిపారు. విద్యార్థుల ప్రగతిని తెలిపే ప్రోగ్రెస్ రిపోర్టులను తయారుచేసి.. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రగతి పత్రాలను అందజేశారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జరిగిన నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1, 2, 3, 4) పరీక్షలతో పాటు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1, 2) పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచారు. సమగ్ర ప్రగతి పత్రం పేరుతో ప్రోగ్రెస్ కార్డులను అధునాతన పద్ధతిలో ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఇలా.. ప్రభుత్వ బడులు : 2,993 స్థానిక సంస్థలు : 41,721 గురుకులాలు : 7,868 -
ప్రగతి పత్రాలు అందజేశాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి తొ మ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రగతి పత్రాలను అందజేశాం. ఇప్పటికే పాఠశాలలో నిర్వహించిన అన్ని రకాల పరీక్షల మార్కులను సంబంధిత హెచ్ఎంలు వెబ్సైట్లో పొందుపరిచారు. మార్కులు క్రాస్ చెక్ చేసుకుని గురువారం పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి.. ప్రోగ్రెస్ కార్డులను అందించారు. సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. – గోవిందరాజులు, డీఈఓ ● -
భగీరథుడి దీక్ష సంకల్పం స్ఫూర్తిదాయకం
నారాయణపేట: భగీరథ మహర్షి దీక్ష సంకల్పం, నిస్వార్థ సేవాభావం అందరికీ స్ఫూర్తిదాయక మని అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కఠోర దీక్ష, పట్టుదలకు భగీరథ మహర్షి ప్రతీకగా నిలుస్తారన్నారు.సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించేందుకు భగీరథుడి అ డుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నా రు. ముఖ్యంగా యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, జిల్లా బీసీ సంక్షే మశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో ఎంఏ రషీద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు విజయ్ సాగర్, సంఘం సభ్యులు ఆంజనేయులు, నరేందర్, వెంకటేశ్, మన్నె లక్ష్మణ్, హన్మంతు, రవి, రాంపూర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
చాలీచాలని బస్సులు!
● రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ● నామమాత్రపు సర్వీసులతో ప్రయాణికుల ఇక్కట్లు ● ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు ధరతో దోపిడీ నారాయణపేట రూరల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగింది. జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. స్థానిక బస్టాండ్ ఆవరణలో శాంతియుతంగా నిరసన వ్యక్తంచేశారు. పోలీసులతో కలిసి ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సులను రోడ్డుపైకి పంపించారు. తాత్కాలిక పద్ధతిన కాంట్రాక్టు సిబ్బందిని ఎంపికచేసి.. సంస్థకు చెందిన బస్సులను సైతం నడిపించారు. మొత్తానికి గురువారం నారాయణపేట డిపోలో 94 సర్వీసులకు గాను 56 బస్సులు ప్రధాన రూట్లలో ఆపరేట్ చేశారు. వీటిలో 8 సంస్థకు చెందినవి కాగా.. 48 అద్దె బస్సులను మహబూబ్నగర్, హైదరాబాద్, మక్తల్, మద్దూరు, కోస్గి మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఆదాయం లేకుండానే? కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకుండా.. ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు చాలావరకు బస్సులను రోడ్లపైకి పంపించారు. పూర్తిస్థాయిలో అద్దె బస్సులను నడిపించగా.. వాటిలో కొంతవరకు డ్రైవర్లే టికెట్ పేరుతో డబ్బులు సేకరించారు. మరోవైపు పల్లెవెలుగు బస్సుల్లో ఆడ, మగవారికి డబ్బులు లేకుండానే గమ్యస్థానాలకు చేర్చారు. ఒక బస్సులో అలా.. మరో బస్సులో ఇలా.. టికెట్టు పేరుతో డబ్బులను తీసుకోవడంపై గొడవలు జరిగాయి. ఏదేమైనా రోజువారీగా రూ. లక్షల్లో వచ్చే ఆదాయం.. సమ్మె కాలంలో కనీసం రూ.వేలల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆదాయం లేకుండానే ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కార్మికులకు మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు సంఘాలు ప్రత్యక్షంగా మద్దతు తెలిపాయి. కార్మికులకు బీసీ జాగృతి సేన, టీయూసీఐ, బీజేపీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సామాజిక కార్యకర్తలు అండగా నిలిచారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.. సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు. భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఎస్పీ డా.వినీత్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్ఐ వెంకటేశ్వర్లకు సూచించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నాయకులతో మాట్లాడారు. అదే విధంగా భద్రతా ఏర్పాట్లను సీఐ శివశంకర్ పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయని విషయం తెలుసుకున్న ప్రజలు యథావిధిగా తమ కార్యకలాపాల నిర్వహణకు బస్సులపై ఆధారపడ్డారు. అయితే ప్రధాన మార్గాల్లోనే బస్సులు నడవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక ఉద్యోగులు, వ్యాపారుల సైతం చాలీచాలని బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు. ఉదయం వేళలోనే సమయపాలన లేకుండా నడపడంతో సాయంత్రానికి బస్సుల కొరత తీవ్రంగా కనిపించింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ధరలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రీజియన్లో 426 బస్సులు రోడ్డెక్కాయి.. రెండు రోజు గురువారం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి. -
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు
మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ఖేల్ మహోత్సవ ముగింపు వేడుకలను జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే అతిథులుగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, గొంగిడి త్రిషారెడ్డి, డబ్ల్యూపీఏల్ మహిళా క్రికెటర్ త్రిషా పూజితలు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా.. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్, నవీన్కుమార్రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్తో పీయూ వీసీ సమావేశం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జాతీయ విద్యావిధానంలో భాగంగా విజయ్ అండ్ మిషన్ అమలులో పాలమూరు యూనివర్సిటీ పాత్ర, 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పీ యూలో జరిగిన కార్యక్రమాలపై గవర్నర్ శివప్రతాప్శుక్లా ఆఽ ద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూ అధ్యాపకులు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్ పొందారని, రీసెర్చ్కు మరింత ప్రోత్సాహం ఇస్తున్నట్లు వీసీ వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
మక్కలు.. తిప్పలు..
అరకొరగా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ● వేగం పెరగని మొక్కజొన్న కొనుగోళ్లు, రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు ● నాగర్కర్నూల్లో వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేత ● ప్రైవేటు అమ్మకాలతో దక్కని మద్దతు ధర ●25 క్వింటాళ్లే కొంటారంట నాకున్న 9 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తే.. ఎకరాకు 30– 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 20 రోజుల క్రితమే పంట కల్లాల్లో నిల్వ చేశాను. దళారులను ఆశ్రయిస్తే క్వింటా రూ.1,600లకు కొంటారంట. దేవరకద్రలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో అమ్ముదామంటే పారంభించారు. అక్కడ అమ్ముకుందామనుకుంటే ఎకరాకు 25 క్వింటాళ్లే కొంటామని అధికారులు చెబుతున్నారు. – రమేష్, రైతు, పర్దీపురం గ్రామం, చిన్నచింతకుంట మండలం ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం.. మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొ నుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. రైతుల అవస్థలు.. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్ల తీరు.. జిల్లా కొనుగోలు మొక్కజొన్న సాగు కొనుగోళ్ల లక్ష్యం ఇప్పటివరకు కేంద్రాలు (ఎకరాల్లో) (మె.టన్నులు) కొనుగోళ్లు మహబూబ్నగర్ 3 30,325 50,000 760 నాగర్కర్నూల్ 13 1,80,564 1,00,000 24,000 వనపర్తి 4 15,337 30,000 1,000 జోగుళాంబ గద్వాల 7 53,482 1,00,000 8,500 నారాయణపేట 1 1,450 3,200 0 ప్రైవేటులో తక్కువ ధరతో దోపిడీ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల నేపథ్యంలో రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి పంటను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇదే అదనుగా ప్రైవేటు దళారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాలు రూ. 2,400 లభిస్తుండగా, ప్రైవేటులో ఎక్కడా క్వింటాలు రూ.1,700 దాటడం లేదు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రతీ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
‘పల్లె’ చక్రం కదలలే..
నారాయణపేటగురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నారాయణపేట రూరల్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో బుధవారం ప్రజా రవాణా స్తంభించింది. జిల్లాలో నారాయణపేట, కోస్గి డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాకుండా తెల్లవారుజామున నుంచే కార్మికులు డిపో గేటు ఎదుట బైఠాయించారు. యాజమాన్యా నికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వెంటనే యూ నియన్లను పునరుద్ధరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమ లు చేయాలని కోరారు. సమ్మెకు బీజేపీతో పాటు పీవైఎల్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్ద తు ప్రకటించింది. మొదట ఆర్టీసీ అధికారులు స్థాని క పోలీసుల సహకారంతో బస్సులు నడిపే ప్రయ త్నం చేయగా అది విఫలమైంది. ఉదయం ఐదు బస్సులను హైదరాబాద్ రూట్లో నడపగా.. మహబూబ్నగర్లో ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. డిపార్ట్మెంట్ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు లేకపోవడంతో ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ప్రైవేట్ బస్సులను నడిపే ప్రయత్నం ఆర్టీసీ చేసింది. అద్దె బస్సుల డ్రైవర్లు సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా విధులకు హాజరు కాలేదు. కొంతమంది బస్సుల యజమానులు బలవంతంగా డ్రైవర్లను విధులకు హాజరు కావాలని ఒత్తిడి తేవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు కలగజేసుకొని వారిని సముదాయించి బయటికి పంపారు. ఇష్టపూర్వకంగా ఎవరైనా బస్సులను నడిపితే వారిని అడ్డుకోద్దని పోలీసులు హెచ్చరించారు. సమ్మె తొలిరోజు కార్మికులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బస్సులను నడిపించాలని ఉద్దేశంతో అధికారులు చేసిన ప్రయత్నం మధ్యాహ్నం వరకు ఫలించలేదు. హైదరాబాద్, కోస్గి, మక్తల్ మూడు రూట్లలో సాయంత్రం వరకు 13 బస్సులు నడిపించారు. అయితే సమ్మె ప్రభావం లేదని చూపించేందుకు సాయంత్రం వేళలో పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను కాంట్రాక్ట్ డ్రైవర్లతో నడిపించారు. 6.30 తర్వాత వరుసగా ఒకే మార్గంలో బస్సులను పంపించడం విమర్శలకు తావిచ్చింది. ప్రయాణికులు లేకుండానే ఖాళీ బస్సులను తిప్పడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నించారు. అయితే మొదటగా మహిళలు మాత్రమే ఎక్కించుకోవాలని సంబంధిత డ్రైవర్లకు సూచించగా, అది వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని గుర్తించి టికెట్లు లేకుండానే అందరిని గమ్యస్థానాలకు చేర్చాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే టికెట్లు ఇచ్చేందుకు కండక్టర్లు లేకపోవడం, టిమ్ మిషన్లు సైతం కాంట్రాక్ట్ డ్రైవర్లకు రాకపోవడంతో అందరికీ ఉచితంగా బస్సుల్లో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సమ్మె కారణంగా డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు గేటు ఎదుట బైఠాయించారు. అదే సమయంలో కర్ణాటక నుంచి వచ్చే బస్సులు బస్టాండ్లోకి రావడంతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కలుగజేసుకొని వారిని నివారించేందుకు ప్రయత్నించగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే కార్మికులను బస్టాండ్ నుంచి పోలీసులు బయటికి పంపించారు. శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు పోలీసులు సహకరించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు. సమ్మె మొదటి రోజు నడిచిన బస్సులు డిపో ఆర్టీసీ ప్రైవేట్ ఈవీ హైర్ అచ్చంపేట 5 9 గద్వాల 10 15 0 కల్వకుర్తి 0 9 0 మహబూబ్నగర్ 0 24 16 నాగర్కర్నూల్ 3 6 0 నారాయణపేట 0 9 0 షాద్నగర్ 5 0 0 వనపర్తి 11 2 7 కొల్లాపూర్0 0 3 0 -
ప్రతిభకు వేదికగా ‘చదువుల పండుగ’
నారాయణపేట: విద్యార్థుల ప్రతిభకు చదువుల పండగ కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ‘చదువుల పండుగ 2.0’ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతీక్ జైన్ సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ అమలులో పురోగతి సాధిస్తున్నాయని, నవకల్పనలు రాష్ట్ర విద్యాశాఖకు దిక్సూచిగా మారాలని ఆయన ఆకాంక్షించారు. తాను రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు విద్యా అభివృద్ధికి నారాయణపేట జిల్లాలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు గురించి విన్నానని, కలెక్టర్లు కోయ శ్రీహర్ష, సిక్తా పట్నాయక్ జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు కలెక్టర్ చేసిన స్టాళ్లను సందర్శించి, విద్యార్థులను అభినందించారు. మండల స్థాయి పోటీల్లో విజేతలైన 3, 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన తెలుగు, ఆంగ్లం, గణితం పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అదనంగా 6, 7 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో కూడా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారి.. విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్, సామర్థ్యాలకు అద నంగా ఎల్బీ రీడింగ్, కాంప్రహెన్షన్, రైటింగ్, మెమరీ టెక్నిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పోటీలను నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వి ద్యా కార్యక్రమాలను ప్రదర్శిస్తూ ప్రత్యేక స్టాళ్ల ను ఏర్పాటు చేశాయి. బోష్ సంస్థ సహకారంతో అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రదర్శించారు. స్వతః ఫౌండేషన్ వారు ఆర్థిక అవగాహ న కార్యక్రమాలు, ఇంక్వి–ల్యాబ్ సంస్థ ద్వారా విద్యార్థుల ఆవిష్కరణలను ప్రదర్శించారు. డిజిటల్ ఈక్విటీ సంస్థ డిజిటల్ లిటరసీ కార్యక్రమాలను, ఫ్యూచర్డాట్స్ సంస్థ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను పరిచయం చేసింది. ఆలోకిట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఒరేటర్స్ క్లబ్ ప్రదర్శనలో విద్యార్థులు తమ ఆంగ్ల నైపుణ్యాలను అద్భుతంగా చూపించారు. రైజింగ్ జిల్లాగా ‘పేట’ ఎఫ్ఎల్ఎన్ పనితీరులో రాష్ట్రంలో టాప్ 5 జిల్లాల్లో పేట స్థానం సంపాదించిందని ల్లా విద్యాశాఖాధికారి డా.గోవిందరాజు తెలిపారు. అలాగే పరక్/నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో జిల్లాను రైజింగ్ జిల్లాగా గుర్తించారని వెల్లడించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారులు విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారులు నాగార్జున, శ్రీనివాస్, సైన్స్ అధికారి భానుప్రకాష్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉంచుకోవాలి
కోస్గి రూరల్: రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఫర్టిలైజర్స్ దుకాణ యజమానులు ఎరువుల నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ సూచించారు. బుధవారం గుండుమాల్ మండలంతో పాటు కోస్గి పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులను రైతుల అవసరాల మేరకు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులందరూ యూరియా యాప్ను తప్పనిసరిగా వాడలన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన పారాక్వాట్ కలుపు మందును పూర్తిగా నిషేధించిందని, ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు దుకాణాల్లో బిల్ బుక్స్, రికార్డులను, యూరియా, డీఏపీ నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ రామకృష్ణ ఉన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
నారాయణపేట: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టిందని.. ఆర్టీసీ కార్మికులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయి పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్సుల రాకపోకలు, డిపో ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమ్మెలో పాల్గొనే కార్మికులు, ప్రజలు పరస్పర సంయమనం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సమ్మె చేసుకోవాలని సూచించారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రత్యామ్నాయం ఏది?
నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్ర యాణాలు సాగించి గమ్య స్థానాలకు చేరుకునే ప్ర యాణికులకు సమ్మె కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 40 రోజుల ముందు కార్మికులు నోటీసు ఇచ్చినా ప్రభు త్వం పట్టించుకోకపోవడం సరికాదు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి నో చుకోకపోయినా, సమ్మెను గుర్తించి ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైంది. – రాజేష్, మొబైల్ షాప్ నిర్వాహకుడు, కొల్లంపల్లి. సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రైవేట్ వాహనాలు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రతకు ఎక్కువసేపు బస్టాండ్, రోడ్డుపైన నిలబడలేక తప్పని పరిస్థితుల్లో ప్రజలు డబ్బులు ఎక్కువ చెల్లించి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అధికారులు దృష్టి సారించి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ విరోజ, వైద్యురాలు, చిన్నజట్రం ఎన్నికల ప్రచారంలో ఆర్టీ సీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకో వాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. యూనియన్లను పునరుద్ధరించడంతో పాటు పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులను విస్మరించడం సరికాదు. – సురేష్, కండక్టర్, నారాయణపేట● -
కుక్కలు.. బాబోయ్..
నారాయణపేట: జిల్లావ్యాప్తంగా కుక్కల దాడులు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలో 24, 745 మంది కుక్కకాటుకు గురికాగా.. ఈ ఏడాది మూ డు నెలల్లోనే 1,773 మంది కుక్కకాటుతో ప్రభుత్వాస్పత్రులకు పరుగులు తీయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చిన్నారులు, వృద్ధులే కాక.. ఈ ఏడాది 207 గొర్రెలు, 586 మేకలపై కుక్కలు దాడు లు చేసినట్లు పశుసంవర్ధక శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థలు, మున్సిపల్ పాలకవర్గాలు, అధికార యంత్రాంగం కుక్కల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోవడంలో తీవ్రంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించాలని ఉన్నతా ధికారులు ఆదేశిస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం మొక్కుబడిగా నిర్వహిస్తుందనేది స్పష్టంగా కనబడుతుంది. నారాయణపేట మున్సిపాలిటీలో 725 శునకాలకు గాను దాదాపు 430 శునకాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించారు. మద్దూర్, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలో మొక్కుబడిగానే జరుగుతుంది. కాగా జిల్లాలోని 272 జీపీల్లో వీధి కుక్కలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రోజురోజుకూ వాటి సంతతి పెరుగుతుంది. వీధి కుక్కలను వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడంతో వాటి బారిన పడిన వారికి ప్రాణాంతకమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలో.. గాయపడిన చిన్నారి (ఫైల్) ఈ ఏడాది 207 గొర్రెలు.. 586 మేకలపై దాడులు ఐదేళ్లలో జిల్లాలో కుక్కకాటు కేసులు 24,725 ఈ ఏడాదిలో 1,773 మందిపై దాడి స్టెరిలైజేషన్ అంతంతే వణికిస్తున్న వీధి కుక్కలు -
సమ్మెకు సై..
నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్ ● డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట ● రీజియన్లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు ● అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి. ● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ● రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లించాలి. ● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. డిపో బస్సులు అచ్చంపేట 80 గద్వాల 108 కల్వకుర్తి 103 కొల్లాపూర్ 65 కోస్గి 27 మహబూబ్నగర్ 152 నాగర్కర్నూల్ 81 నారాయణపేట 97 షాద్నగర్ 91 వనపర్తి 121 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు.. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ -
హెచ్పీవీ.. అంతంతే!
30 రోజులు.. 170 టీకాలు నర్వ: మహిళలను గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వెంటాడుతోంది. దీని నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా మార్చి 8న కార్యక్రమం ప్రారంభం కాగా.. 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు టీకాలు వేస్తున్నారు. కానీ అవగాహన లోపంతో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులే.. జిల్లావ్యాప్తంగా 7,325 మంది కిశోర బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో చాలామంది 9, 10 తరగతి చదివే వారే. వీరు వార్షిక పరీక్షల సన్నద్ధతలో ఉండటంతో టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడం లేదు. మూడు నెలల పాటు కొనసాగే కార్యక్రమంలో 45 రోజులు పూర్తయ్యాయి. మార్చి 8 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 65 సెషన్లు నిర్వహించి సుమారు 170 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి వారం ఉత్సాహంగా సాగినా.. తర్వాత పండుగలు, పరీక్షలు రావడంతో బాగా తగ్గింది. మరో రెండు నెలల్లో 7 వేల మందికి టీకాలు వేయాల్సి ఉంది. మండలాల వారీగా టీకాల పంపిణీ.. కోస్గి 35 మద్దూర్ 61 నారాయణపేట 17 మక్తల్ 57 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు పంపిణీ గర్భాశయ క్యాన్సర్కు అడ్డుకట్ట వేసేందుకే.. జిల్లాలో 7,325 మంది కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలంటున్న వైద్యశాఖ అధికారులు -
సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాలోని కిశోర బాలికలు హెచ్పీవీ టీకా తీసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో ని కోస్గి, మద్దూర్, నారా యణపేట, మక్తల్ జీజీహెచ్, ఏహెచ్, సీహెచ్సీల లో 170 మందికి టీకాలు అందించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల పీహెచ్సీల్లో టీకాల పంపిణీ ప్రారంభమైంది.టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదు. గర్భాశయ క్యా న్సర్ను పూర్తిస్థాయిలో అడ్డుకుంటుంది. ఆడపిల్లలకు ఇది మంచి అవకాశం. దీనిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. కిశోర బాలికలు టీకా పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి. – డా. జయచంద్రమోహన్, జిల్లా వైద్యాధికారి ● -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● ఎస్పీ డా. వినీత్ నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూ ర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇ చ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తా మని సదరు అధికారి ద్వా రా ఆర్డీ ఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూ డు రోజుల క్రితం ఏసీ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించా రు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మాట్లాడుతున్న ఎస్పీ డా. వినీత్ నారాయణపేట: జిల్లాలో నమోదవుతున్న కేసు ల విచారణను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి కేసును లోతుగా విచారించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ డా. వినీత్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐ లు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ముందుగా పెండింగ్, యూఐ కేసుల వివరాలు అడిగి తెలుసుకొని పెండింగ్కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, మహిళా, బాలికల నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. బాధితులకు మరింత సౌకర్యం కల్పించడానికి ఇంటి వద్దకు వెళ్లి ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలన్నారు. అలాగే పార్ట్–1, పార్ట్–2 స్టేట్మెంట్ రికార్డ్, సీడీఎఫ్, రిమాండ్ డైరీ, చార్జ్షీట్ నమోదు, ఆస్తుల జప్తు, నిందితుల వివరాల నమోదు తదితర అంశాలపై ఎస్హెచ్ఓలకు తగిన సూచనలు చేశారు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన హాట్స్పాట్లలో ప్రమాదాలు జరగుకుండా ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి అవసరమైన సిగ్నల్స్, తగిన మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు. ఎస్ఐలు తప్పనిసరిగా గ్రామాలను సందర్శించాలని, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తించేలా అధికారులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలనినాదేశించారు. ప్రాపర్టీ నేరాలపై నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు. 5 విధానంలో భాగంగా పోలీస్స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఫైళ్లను క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్రెడ్డి, సైదులు, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్కుమార్, బాలరాజు, వెంకటేష్గౌడ్, రమేష్, భాగ్యలక్ష్మిరెడ్డి, అశోక్బా బు, నవీద్, నరేష్, విజయభాస్కర్, పురుషోత్తం, శ్రీనివాసులు, సునీత, గాయత్రి, రేవతి, మహేశ్వరి, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు. బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
మక్తల్ ఆరో వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపు
మక్తల్: స్థానిక పురపాలికలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఎర్కలి సత్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థి ఎర్కలి మారెప్పపై 37 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన పుర ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి ఎర్కలి మహదేవప్ప పోలింగ్కు ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. తిరిగి శనివారం ఎన్నిక నిర్వహించి సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 1,453 ఓట్లకుగాను 1,294 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థికి 628, కాంగ్రెస్ అభ్యర్థికి 591, బీఆర్ఎస్ అభ్యర్థికి 46, నోటాకు నాలుగు, చెల్లని ఓట్లు 25 ఉన్నట్లు ఎన్నికల అధికారులు వివరించారు. 37 ఓట్ల మెజార్టీతో ఎర్కలి సత్యమ్మ విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఉప ఎన్నికను అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి పర్యవేక్షించారు. -
పదోన్నతి బాధ్యత పెంచుతుంది : ఎస్పీ
నారాయణపేట: ప్రజలకు బాధ్యతగా సేవలు అందిస్తే సమాజంలో పోలీసులపై గౌరవం, మర్యాద మరింత పెరుగుతాయని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ తన చేతులతో శ్రీనివాసులుకు జమిందార్ పట్టీలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పదోన్నతి అనేది కేవలం ఉత్సాహానికే కాదని, మరింత బాధ్యతను తీసుకొస్తుందని చెప్పారు. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా, నమ్మకం కలిగించే విధంగా పని చేయాలని, నిరుపేద ప్రజలకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు. -
చేరువైన రక్తశుద్ధి..
● ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు ● నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట ● మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు ● పాలమూరు వ్యాప్తంగా 908 మంది బాధితులు వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్వోఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు కొత్తగా మంజూరైన డయాలసిస్ కేంద్రాలు ఇలా.. జిల్లా యూనిట్ పడకలు గద్వాల వడ్డేపల్లి 5 గద్వాల గట్టు 5 గద్వాల అయిజ 5 వనపర్తి ఖిల్లాఘనపురం 5 వనపర్తి రేవల్లి 5 వనపర్తి వీపనగండ్ల 5 నారాయణపేట కోస్గి 5 నారాయణపేట మద్దూరు 5 నాగర్కర్నూల్ లింగాల 5 నాగర్కర్నూల్ అమ్రాబాద్ 5 నాగర్కర్నూల్ తిమ్మాజిపేట 5 పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్– ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా వందలాది మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. మహబూబ్నగర్లో 10, బాలానగర్లో 5, నారాయణపేటలో 10, మక్తల్లో 5, ఆత్మకూర్లో 5, వనపర్తిలో 10, నాగర్కర్నూల్లో 10, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 5, కల్వకుర్తిలో 5, గద్వాలలో 12, అలంపూర్లో 5 మిషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. 5 పడకల చొప్పున.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దూరం, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ చొప్పున డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు నూతనంగా 11 కేంద్రాలు మంజూరు చేయగా.. అన్నిచోట్ల ఐదు పడకలకు ఐదు మిషన్స్ ఏర్పాటు చేసి మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీలు లేదా సివిల్ ఆస్పత్రులు ఉన్నచోట ఒక గదిలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించనున్నారు. ప్రతి కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతో పాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా జీవన విధానం పాటించాలి. సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. -
‘ప్రాజెక్టులపై కాంగ్రెస్కు అవగాహన లేదు’
మక్తల్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని, ఏ సమయంలో ఏ పనులు చేయాలనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మక్తల్–నారాయణపేట రోడ్డు మరమ్మతుకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేసి రూ.200 కోట్లు మంజూరు చేశారని చెప్పుకుంటున్న నాయకులు ఇంతవరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. సంగంబండ రిజర్వాయర్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, అయినా మంత్రి తనకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేసిన అభివృద్ధి పనులనే కాంగ్రెస్ నాయకులు మళ్లీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభివృద్ధికి సహకరిస్తుంది కానీ అడ్డుకోదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం చేతకాక బీఆర్ఎస్పై బురద జల్లుతుందని దుయ్యబట్టారు. సమావేశంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నర్సింహగైడ్, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గుప్తా, అన్వర్, చిన్నహన్మంతు, ఈశ్వర్,శివారెడ్డి, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.వరి (సోనారకం) క్వింటా రూ.2,433 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం వరి ధాన్యం (సోనారకం) క్వింటా గరిష్టంగా రూ.2,433, కనిష్టంగా రూ.1,640 ధరలు పలికాయి. అదేవిధంగా ఎర్ర కంది సరాసరిగా రూ.6,899, ఆలసందలు గరిష్టంగా రూ.5,169, కనిష్టంగా రూ.5,079 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ రూ.2,300.. దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,300, కనిష్టంగా రూ.1,980గా ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,739, కనిష్టంగా రూ.1,600, ఆముదాలు గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.6,091గా ధరలు నమోదయ్యాయి. సీజన్ కావడంతో మార్కెట్కు దాదాపు 6 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ● గద్వాల మార్కెట్ యార్డులో వేరుశనగ గరిష్టంగా రూ.6,325, కనిష్టంగా రూ.4,280, ఆముదాలు గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.5,921, కంది గరిష్టంగా రూ.6,506, కనిష్టంగా రూ.6,259, వరి (సోనా) గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,329 మంది విద్యార్థులకు 1,250 మంది హాజరయ్యారు. ఇక ఎస్సెస్సీలో 19 పరీక్ష కేంద్రాలు ఉంటే 836 మందికి 725 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెండు ఫ్లయింగ్స్క్వాడ్స్, 15 మంది సిట్టింగ్స్క్వాడ్స్ను నియమించారు. ఎస్సీ గురుకులాల్లో దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మినీ గురుకులాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్లాక్ సీట్ల భర్తీకి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని, వచ్చే నెల 5వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని పేర్కొన్నారు. 11వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, 12వ తేదీన అడ్మిషన్ల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ‘22 వరకు దరఖాస్తు చేసుకోవాలి’ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఉన్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రిల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మోహన్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 22వ తేదీ వరకు అవకాశం ఉందని, వచ్చేనెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మొక్కలు సిద్ధం చేయాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మొక్కల పెంపకం.. లక్ష్యాలపై జిల్లాస్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశం, అలాగే చిత్తడి నేలలు డీమ్డ్ ఫారెస్ట్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 12.71 లక్షల మొక్కలు నాటడం లక్ష్యమని, శాఖల వారీగా వారి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. వన మహోత్సవంలో నాటేందుకు పొడవాటి మొక్కలు, పూల మొక్కలు, మల్బరీ మొక్కలు, పండ్ల మొక్కలను నిల్వ చేసుకోవాలన్నారు. అంతకుముందు వెట్ ల్యాండ్ డీమ్డ్ ఫారెస్ట్ అంశంపై మాట్లాడుతూ.. జిల్లాలోని 375 చెరువులను సర్వేచేసి సరిహద్దులు నిర్ణయించాలని తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల, అటవీశాఖల అధికారులు సమన్వయంతో హద్దులు నిర్ణయించాలన్నారు. శిఖం, పట్టా భూముల వివరాలు నమోదు చేయాలని కోరారు. వారం రోజుల్లో మళ్లీ సమావేశం ఏర్పాటు చేసుకుందామని.. అంతలోపు ఎన్ని చెరువులకు హద్దులు చేస్తారో చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఆర్డీఓ రాంచందర్నాయక్, అటవీశాఖ అధికారి సత్యనారాయణ, నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. ‘ప్రజావాణి’కి ప్రాధాన్యం.. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి అదనపు కలెక్టర్తో కలిసి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం పరిష్కారానికి అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొత్తం 28 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బసవేశ్వరుడి బోధనలుఅనుసరణీయం.. కుల, మత, లింగ భేదాలను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో సీ్త్రలకు సమాన హక్కులు ఉండాలని నినదించిన బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై బసవేశ్వరుడి చిత్రపటానికి జిల్లా అధికారులు, వీరశైవ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బసవన్న తన వచన సాహిత్యంతో ప్రజలందరిని కులమతాలకు అతీతంగా ఏకం చేశారన్నారు. ఆయన బోధనల్లోని సమదృష్టి ఎందరినో ఆకర్షించిందని, సూక్ష్మమైన తత్వం సులువుగా బోధపడేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, పలువురు జిల్లా అధికారులు, వీరశైవ సంఘం నేతలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సరాఫ్ బజార్ వెలవెల
● అక్షయ తృతీయ రోజున దుకాణాల్లో కానరాని రద్దీ నారాయణపేట: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియనే మనం అక్షయ తృతీయగా జరుపుకొంటాం. ఈ శుభ గడియలు ఆదివారం వచ్చి సోమవారం ఉదయం ముగుస్తుండటంతో దాదాపు ఆదివారమే శుభదినంగా భావిస్తున్నారు. శుభకార్యాలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలకు మంచి ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ‘అక్షయ’ అంటే ‘ఎప్పటికీ తరగనిది’ అని అర్థమని.. అందుకే ఈ రోజున బంగారం కొంటే శాశ్వత సంపదను అందిస్తుందని విశ్వసిస్తూ మహిళలు కొంతైనా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. కాగా.. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో మాసం కూడా కొనేందుకు సైతం జనం వెనుకడుగు వేస్తున్నారు. ● జిల్లాకేంద్రంలోని సరాఫ్బజార్లో ఆదివారం సెలవు రోజైనా.. అక్షయ తృతయ కావడంతో పలు బంగారు దుకాణాలు తెరుచుకొని కనిపించాయి. ఏ దుకాణంలో చూసినా జనం లేక వెలవెలబోయాయి. ఇదేమిటని వ్యాపారులను అడుగగా బంగారం ధరలు పెరగడమే కారణమని జవాబిచ్చారు. అక్షయ తృతీయ సెంట్మెంట్ ఉన్నవారు కనీసం మూడు మాసాలు కొనేవారని.. ఇప్పుడు మాసం కూడా కొనేందుకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతేడాది 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షలోపు ఉంటే.. ఈసారి ఏకంగా రూ.1.56 లక్షలు కావడంతో జనం కొనేందుకు ఉత్సాహం చూపడం లేదని చెబుతున్నారు. 40 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వ్యాపారులు తెలిపారు. నిర్మానుష్యంగా కనిపిస్తున్న సరాఫ్బజార్ -
లెక్కలంటే భయం పోయింది..
ముందు ఒక లెక్క చేయడానికి నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు అదే లెక్కను సెకండ్లలో చేస్తాం. గణితం అంటే భయం పోయింది. – గౌతమి, విద్యార్థిని, పెదిరిపాడు విస్తరణ అవసరం.. ప్రస్తుత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించి మరింత మంది విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. లెక్కలంటే భయం అనే భావనను తొలగించి ఆసక్తిగా మార్చగల సామర్థ్యం ఈ కార్యక్రమంలో ఉందని స్పష్టం అవుతోంది. – బాలకిష్టప్ప, ప్రధానోపాధ్యాయుడు స్పష్టమైన మార్పు.. విద్యార్థులు గణితాన్ని సులభంగా అర్థం చేసు కొని వేగంగా చేయగలిగే స్థాయికి చేరుకోవడం ఈ కార్య క్రమం విజయాన్ని సూచిస్తోంది. తక్కువ సమయంలోనే స్పష్టమైన మార్పు కనిపించడం ప్రత్యేకం. – విద్యాసాగర్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి మంచి ఫలితాలొచ్చాయి.. గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తగ్గిస్తూ ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేసే దిశగా వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో ఆత్మవిశ్వాసం పెరగడం ప్రశంసనీయమైన అంశం. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ● -
రైతుల త్యాగం భావితరాలకు ఆదర్శం
దామరగిద్ద: పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల కల సాకారమైందని.. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని కాన్కుర్తి శివారులో మల్రెడ్డిపల్లి చెరువు దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, కాన్కుర్తి, మల్రెడ్డిపల్లి సర్పంచ్లు నారాయణ, స్వేత శివకుమార్తో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని చెప్పి మొదటి విడత కూడా పూర్తి చేయలేదని, అఖిలపక్షం, ప్రజా, రైతుసంఘాలు పార్టీలకు అతీతంగా సహకారం అందించడంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయన్నారు. బ్రిటీష్ కాలంలో ఆంధ్రప్రదేశ్కు సాగునీరు అందించిన సర్ అర్ధన్ కాటన్ మాదిరిగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగానే మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సుమారు 20 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రైతుల త్యాగం భావితరాలకు ఆదర్శమని.. సర్వం కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇల్లు, ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి అండగా నిలస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కృషితోనే ‘పేట–కొడంగల్’ కల సాకారం రూ.45 వేల కోట్లతో యుద్ధప్రాతిపదికన పనులు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
తాగునీటికి ఢోకా లేనట్టే!
● ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం ● 800 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ● వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. సరఫరా ఇలా.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు. రోజూ 0.02 టీఎంసీలు అవసరం.. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది. కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ -
గుప్తుల కాలం నాటి కోట
అమరచింత: క్రీ.శ. 17వ శతాబ్దంలో గుప్తుల కాలంలో నిర్మించిన చంద్రగఢ్ కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అమరచింత మండలంలోని చంద్రగఢ్ గ్రామంలోని కొండపై భాగాన నిర్మించిన ఈ కోట చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. కనుచూపు మేరలో కృష్ణానది కనిపిస్తుండటంతో పర్యాటకులు ప్రాజెక్టుకు వెళ్తూ.. ప్రాచీన కట్టడమైన చంద్రగఢ్ను సందర్శిస్తుంటారు. ఇక్కడి చిన్నచిన్న రాజ్యాల నుంచి కప్పం రూపంలో వసూలు చేసిన ధాన్యం, డబ్బులు, బంగారం, వెండి నిల్వలను తరలించే క్రమంలో బసతోపాటు శత్రువుల బారి నుంచి వీటిని కాపాడుకునేందుకు కోటను చంద్రగుప్తుడు నిర్మించాడు. వేసవిలో సైతం తాగేందుకు నీరు లభ్యమయ్యేలా రాతి శిలలలో నీటి గుండాలు ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఫిరంగులు పెట్టి కాపాడేవారు. కోట మధ్యలో శివాలయం నిర్మించి పూజలు ఆచరించేవారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. -
డీలిమిటేషన్ను మహిళా బిల్లుతో లింక్ పెట్టడం సరికాదు: మంత్రి పొన్నం
స్టేషన్ మహబూబ్నగర్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో లింక్పెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచారని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన పుర 6వ వార్డు పోలింగ్ మక్తల్: పుర పరిధిలోని 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగగా.. 13, 14 పోలింగ్ కేంద్రాల్లో 1,294 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 680, మహిళలు 614 మంది ఉండగా.. 89 శాతం పోలింగ్ నమోదైంది. అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి చందాపూర్లో కేంద్రాన్ని తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఎస్పీ డా. వినీత్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించలేదు. సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, కృష్ణా ఎస్ఐ నవీద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తిర్మలాపూర్ ఓటర్లు చందాపూర్కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాలిసెట్కు దరఖాస్తు చేసుకోండి కోస్గి రూరల్: పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోందన్నారు. తక్కువ సమయంలోనే సాంకేతిక నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని వివరించారు. -
రోడ్డుభద్రత నియమాలు పాటిద్దాం
● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ నారాయణపేట: రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటిస్తూ.. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ కోరారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయనతో పాటు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డా. వినీత్తో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమై అంబేడ్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిర్ రోడ్, పాత బస్టాండ్, సెంటర్ చౌక్ మీదుగా శ్రీ గార్డెన్ వరకు కొనసాగింది. అనంతరం శ్రీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఐజీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని.. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్బెల్ట్ విధిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదన్నారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి.. ప్రజలు ఇంటి నుంచి వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకోవడమే అరైవ్ అలైవ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సమాజంలో మార్పునకు యువత ముందుకు రావాలని కోరారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏటా 100కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఆ సంఖ్య తగ్గించాలంటే డిఫెనన్స్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దైనందిన జీవితంలో రోడ్డు భద్రతను భాగం చేసుకోవాలని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, సైదులు, భగవంత్రెడ్డి, ఆర్ఐ విజయభాస్కర్, ఆర్టీఓ సభ్యుడు పోషల్ రాజేష్, కౌన్సిలర్ మహేష్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, రమేష్, సతీష్రెడ్డి, వెంకటేష్గౌడ్, నరేష్, బాలరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మరో పది ఇసుక రీచ్ల ఏర్పాటు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్లతో పాటు అదనంగా మరో పది రీచ్లను ఏర్పాటు చేసి మన ఇసుక.. మన వాహనం ద్వారా రవాణాకు ఆన్లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆయన అధ్యక్షతన డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ట్ లేవల్ సాండ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని వర్కూరు పరిధిలో ఉన్న నాలుగు రీచ్లతో పాటు ఉట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి రీచ్ నుంచి ఇసుక రవాణాకు ఆన్లైన్ అనుమతులు జారీ చేస్తున్నామని చెప్పారు. ఇకపై జిల్లాలో గుర్తించిన మరో పది ఇసుక రీచ్ల నుంచి కూడా ఇసుక తరలింపునకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా రీచ్లను కేఏంఎల్ మ్యాపింగ్ చేసి రెవెన్యూ, మైనింగ్, భూగర్భ జలవనరులు, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే అమ్మికుంట, నేరెడుగాం, సంగంబండ, ముశ్రీఫా, రాకొండ(చెక్ డ్యాం) పరిధిలోనూ ఇసుక లభ్యత, రవాణాపై అధికారులు క్షేత్రసాయి పరిశీలన చేయాలని సూచించారు. గతంలో 21 రీచ్లు ఉండగా.. ఇప్పుడు నాలుగైదు రీచ్లను గుర్తించడం ఏమిటని, కనీసం 18 రీచ్ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మన రాష్ట్ర పరిధి ముగింపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదే నెలలో మరోమారు నిర్వహించే సమావేశంలో పది రీచ్ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి, మైనింగ్ ఏడీ గోవిందరాజు, భూగర్భ జలవనరులశాఖ ఏడీ రవి, నీటిపారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, ధన్వాడ, మరికల్, ఊట్కూర్, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సురభి వంశీయుల అడ్డా కొల్లాపూర్
కొల్లాపూర్: జటప్రోల్ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది. -
కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం
చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్తో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి. -
నిబంధనల మేరకే అనుమతులు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పాట్ల లే–అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో డిస్ట్రిక్ట్ లే–ఆవుట్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లే–అవుట్ల జారీలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాకేంద్రానికి సంబంధించి వచ్చిన నాలుగు లేఅవుట్ల దరఖాస్తులపై అన్ని శాఖల అధికారుల క్లియరెన్న్స్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కాగా కమిటీకి వచ్చిన నాలుగింటిలో రెండింటికే అనుమతులు జారీ చేసింది. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ బ్రహ్మానందరెడ్డి, డీటీసీపీఓ కిరణ్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, ఆర్అండ్బి, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. -
బీసీలు 54.82%
నారాయణపేట● కులాల వారీగా జనాభా మొత్తం 37.01 లక్షలు ● ఇందులో బీసీలు 20,29,001 మంది ● బీసీల్లో ముదిరాజ్లు, ఎస్సీల్లో మాదిగలదే అగ్రస్థానం ● గద్వాల, వనపర్తిలో ప్రభావిత వర్గాలుగా వాల్మీకి బోయలు ● కందనూలులో చెంచుజనాభా 9 వేలకే పరిమితం ● రాష్ట్ర సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్ట్లో వెల్లడి .. కొనుగోలు మంట రాజోళిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు తామే కారణమంటూ మూడు ప్రధాన పార్టీల నేతలు పరస్పర వాదనకు దిగారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో మెజార్టీ వర్గాలు ఓసీల్లో రెడ్డిలదే ఆధిపత్యం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓసీ జనాభా 2,97,406 మంది కాగా, 8.03 శాతంగా నమోదైంది. ఓసీల్లో మెజార్టీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిలో నారాయణపేటలో అత్యధికంగా 69.19 శాతం, వనపర్తిలో 66.84 శాతం, జోగుళాంబ గద్వాలలో 63.30 శాతం, నాగర్కర్నూల్లో 61.06 శాతం, మహబూబ్నగర్లో 52.40శాతం రెడ్డి జనాభా ఉంది. ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్యులు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్లో 15.69 శాతం, వనపర్తిలో 13.86 శాతం వైశ్యుల జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా.. సామాజికవర్గం జనాభా మాదిగ (ఎస్సీ) 1,04,613 మాల (ఎస్సీ) 16,873 బంజార(ఎస్టీ) 1,12,127 ముదిరాజ్ (బీసీ) 1,34,794 యాదవ(బీసీ) 94,144 రెడ్డి(ఓసీ) 44,825 నాగర్కర్నూల్ జిల్లా మాదిగ (ఎస్సీ) 1,26,990 మాల (ఎస్సీ) 56,426 బంజార(ఎస్టీ) 96,053 ఎరుకల(ఎస్టీ) 8,073 చెంచు(ఎస్టీ) 8,739 ముదిరాజ్(బీసీ) 95,079 రెడ్డి(ఓసీ) 47,021 వైశ్య(ఓసీ) 12,083 వనపర్తి జిల్లా మాదిగ(ఎస్సీ) 91,157 మదాసికురువ(ఎస్సీ) 8,076 మాల(ఎస్సీ) 5,703 బంజార(ఎస్టీ) 48,978 ఎరుకల (ఎస్టీ) 5,373 వాల్మీకిబోయ(బీసీ) 79,364 ముదిరాజ్(బీసీ) 65,605 యాదవ(బీసీ) 79,140 రెడ్డి(ఓసీ) 34,319 వైశ్య(ఓసీ) 7,114 ఎస్సీల్లో 70 శాతానికి మించి మాదిగలే.. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సామాజికవర్గాల జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా జనాభా 37,01,072 మంది కాగా.. అందులో అత్యధికంగా 20,29,001 మంది బీసీలు ఉండడం విశేషం. మొత్తం జనాభాలో బీసీలదే 54.82శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన వర్గాల్లో 20.09 శాతంతో 7,43,606 మంది ఎస్సీ జనాభా ఉండగా, 9.37 శాతంతో 3,42,055 మంది ఎస్టీ జనాభా ఉంది. ఓసీల జనాభా 2,97,408 మందితో 8.03 శాతం కాగా, మైనార్టీల జనాభా 2,89,004 మందితో 7.80 శాతంగా తేలింది. ఉమ్మడి జిల్లాలో బీసీల తర్వాత 20.09 శాతంతో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉండగా, ఇందులో సింహభాగం 70 శాతానికి మించి మాదిగలే ఉన్నారు. ఎస్సీల్లో వీరి జనాభా అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 83.13 శాతం, వనపర్తిలో 78.86 శాతం, మహబూబ్నగర్లో 71.88 శాతం, నారాయణపేటలో 71.18 శాతం, నాగర్కర్నూల్లో 62.41 శాతం ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలో మాలల జనాభా అత్యధికంగా 27.73 శాతం ఉంది. ఎస్సీల్లో మాదాసికురువల జనాభా నారాయణపేటలో అత్యధికంగా 10.75 శాతం, గద్వాలలో 5.61 శాతం నమోదైంది. బీసీల్లో ముది‘రాజులు’.. ఉమ్మడి జిల్లాలోని జనాభాలో సింహభాగం బీసీలే కాగా, ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం బీసీ జనాభా 20,29,001 కాగా, వీరి శాతం మొత్తం జనాభాలో సగానికి మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజుల ప్రాబల్యమే ఎక్కువగా ఉండగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 36.03 శాతం ఉండటం గమనార్హం. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 22.92 శాతం, నాగర్కర్నూల్లో 20.37 శాతం, వనపర్తి జిల్లాలో 17.35 శాతం ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వాల్మీకి బోయ, కురుమ, యాదవ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో కులాల వారీగా జనాభా.. జిల్లా ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం బీసీలు శాతం ఓసీలు శాతం ముస్లిం శాతం మహబూబ్నగర్ 1,45,543 15.46 1,22,358 12.99 4,76,910 50.65 85,550 9.09 1,11290 11.82 నాగర్కర్నూల్ 2,03,470 23.61 1,14,503 13.29 4,21,022 48.86 77,004 8.94 45,676 5.30 వనపర్తి 1,15,594 19.22 56,365 9.37 3,46,031 57.54 51,342 8.54 32,032 5.33 జోగుళాంబగద్వాల 1,51,075 22.66 12,141 1.82 4,11,783 61.76 41,749 6.26 49,992 9.51 నారాయణపేట 1,27,924 20.32 36,688 5.83 3,73,255 59.28 41,761 6.63 50,014 7.94 మొత్తం 7,43,606 20.09 3,42,055 9.37 20,29,001 54.82 2,97,408 8.03 2,89,004 7.80 ఉమ్మడి పాలమూరులో తేలిన లెక్క -
ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలి
కోస్గి రూరల్: రైతులు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక, అధిక ఆదాయం వచ్చే ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సూచించారు. శుక్రవారం గండుమాల్ మండలం హన్మన్పల్లి రైతువేదికలో రైతులకు సమగ్ర వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తమ పొలాల్లో గొర్రెల మందలను నిలుపడంతో సారవంతం అవుతుందని, రసాయన ఎరువులను తగ్గించి సహజ ఎరువులను వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఆయిల్పాం తోటల్లో పత్తి, కంది అంతర పంటగా వేసుకోవడంతో అదనపు ఆదాయం పొందవచ్చని, నానో యూరియా, డీఏపీతో ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంటకు సమతుల పోషకాలు అంది దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. అనంతరం కోస్గి పుర పరిధిలోని మాసాయిపల్లిలో ఉన్న వెంకటయ్యగౌడ్ ఆయిల్పాం తోటను సందర్శించారు. సాగు విధానం, నిర్వహణ, దిగుబడి, ఉప ఉత్పత్తులతో వచ్చే ఆదాయం తదితర వివరాలను రైతులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయిల్పాం ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించేందుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఆయిల్పాం సాగుకు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ రామకృష్ణ, ఏఈఓలు నరేందర్, అజయ్, ఉద్యానశాఖ, ఆయిల్ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు. -
బడి.. భద్రత
నర్వ: విద్యా సంవత్సరం ఈ నెల 23న ముగుస్తుండగా.. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవు రోజుల్లో పాఠశాలలు సురక్షితంగా ఉండేలా 20 విభాగాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మౌలిక వసతులు, రికార్డులు, భద్రత వ్యవస్థలను పటిష్టం చేయాలంటూ సమగ్రశిక్ష తెలంగాణ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ జిల్లా విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, కేజీబీవీ అధికారులకు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. పీఎంశ్రీ, సమగ్రశిక్ష నిధుల ద్వారా పాఠశాలలకు ప్రింటర్లు, కంప్యూటర్లు, సంగీత పరికరాలు, బ్యాండ్ సామగ్రి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, క్రీడా పరికరాలు, లైబ్రరీ, వసతులు, ఒకేషనల్ సాధనాలు, మధ్యాహ్న భోజన వంటగది, ఫర్నీచర్ తదితర అనేక వసతులు కల్పించారు. వీటి రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఫోన్నంబర్ల ప్రదర్శన.. అత్యవసర సమయాల్లో స్పందించేలా పోలీస్, ఫైర్, విద్యుత్శాఖల కాంటాక్ట్ నంబర్లు స్కూల్ ఆవరణలో ప్రదర్శించాల్సి పేర్కొన్నారు. డిజిటల్ సెక్యూరిటీ కోసం పరికరాలను ఆఫ్చేసి కవర్ చేయడం, ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన వంటశాలలను శుభ్రపర్చడం, సరుకులను సురక్షితంగా నిల్వచేయడం, ఎల్పీజీ సిలిండర్లను ఆఫ్ చేయడం, సెక్యూర్ చేయడం తప్పనిసరి. వర్షాలు, గాలివాన వంటి విపత్తులకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెలవుల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని నియమించి వారి కాంటాక్ట్ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని వివరించారు. పునః ప్రారంభం నాటికి.. జూన్లో పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు శుభ్రత, తాగునీరు, శానిటేషన్, భద్రత అంశాలపై పూర్తి తనిఖీ చేసి రెడీనెస్ రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఏదైనా నష్టం, దొంగతనం, అవాంచనీయ ఘటన జరిగితే వెంటనే నివేదించాలని, ఫిర్యాదుల రిపోర్టు సెలవుల ముందు, తర్వాత అందజేయాలని పేర్కొన్నారు. పాఠశాలల ఆస్తుల సంరక్షణలో నిర్లక్ష్యం కనబరిస్తే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ బాధ్యులని స్పష్టం చేస్తూ డీఈఓలకు ఆదేశాలు జారీ చేస్తూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నర్వ మండలం పెద్దకడ్మూర్ పీఎంశ్రీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ (ఫైల్) ముందస్తు జాగ్రత్తలు.. పాఠశాలల సమగ్ర భద్రతలో భాగంగా పాఠశాలల గేట్లు, తరగతి గదులు, ల్యాబ్లకు తాళాలు వేయడంతో పాటు రక్షణకు స్థానిక పోలీసులు, పూర్వ విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. విలువైన పరికరాలను పటిష్ట గదుల్లో భద్రపర్చడం, ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, అనధికార ప్రవేశాన్ని నియంత్రించడం తప్పనిసరి చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు పరికరాలు, మెయిన్ పవర్ స్విచ్ఛాఫ్ చేయడం, లోపాలున్న వైరింగ్ను ముందుగానే సరి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛతలో భాగంగా టాయిలెట్లు, నీటిట్యాంకులు శుభ్రపర్చడం, లీకేజీలు లేకుండా చూడటం, దోమల వృద్ధిని అరికట్టేందుకు నీటి నిల్వలను తొలగించాలని చెప్పారు. క్యాంపస్ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, రికార్డులను లాకర్లలో భద్రపర్చడం, డిజిటలైజేషన్ను ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా సూచించారు. ప్రధానోపాధ్యాయులు సెలవుల్లో కూడా పాఠశాలలను పర్యవేక్షిస్తూ వాచ్మెన్ లాగ్బుక్ నిర్వహించాలని తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో సమన్వయం కొనసాగిస్తూ బడి మూసివేత విషయాన్ని స్థానికులకు తెలియజేయాలని సూచించారు. ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు కంప్యూటర్లు, అటల్ టింకరింగ్ ల్యాబ్లో విలువైన పరికరాలు రక్షణకు సీసీ టీవీ, డిజిటల్ భద్రతకు ప్రాధాన్యం జిల్లా విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
మరికల్: ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా లక్ష్యంతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనం, కూరగాయలు తదితర వాటిని పరిశీలించారు. నిత్యం అందించే భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ విధిగా పాటిస్తూ భోజనం అందించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు విలువతో కూడిన నాణ్యమైన బోధన అందించాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ఆమె వెంట రాష్ట్ర కమిటీ సభ్యులు అపర్ణ, ప్రిన్సిపాల్ నాగమణిమాల, తహసీల్దార్ రాంకోటి, నందన్గౌడ్ తదితరులు ఉన్నారు. -
నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుదాం
● గోల్డెన్ అవర్ సాయంపై అవగాహన కలిగి ఉండాలి ● ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) డా. గజరావు భూపాల్ కొత్తకోట రూరల్: ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకునేలా అవగాహన కల్పించడమే ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) డా. గజరావు భూపాల్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు చేయా ల్సిన గోల్డెన్ అవర్ రెస్పాన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, నారాయణపేట ఎస్పీ వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డ్రైవర్లు, విద్యార్థులు, ప్రజలు హాజరుకాగా.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ లో స్పందించాల్సిన తీరు, సీపీఆర్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సందర్శించి రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం మత్యువాత చెందుతున్న వారు ద్విచక్ర వాహనదారులేననని, అందులో 18 నుంచి 40 ఏళ్లలోపు వారేనని తెలిపారు. కాబట్టి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్బెల్ట్ ధరించాలని సూచించారు. అత్యధిక దూరం ప్రయాణించేవారు బైక్లు వినియోగించకుండా ఇతర మార్గాలు ఎంచుకోవాలని, అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు నెలల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి పైగా దుర్మరణం చెందారని.. ఇది అత్యంత బాధాకరమన్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం సరైన పద్ధతి కాదని, సరైన మార్గంలో ప్రయాణించి క్రమశిక్షణగా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రికి తరలించే మొదటి క్షణాల్లో క్షతగాత్రులకు అందించాల్సిన సాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలా చేసిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి అందిస్తుందని వివరించారు. నారాయణపేట ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. దేశంలో ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే, అందులో 1.20 లక్షల మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సరైన చికిత్స అందిస్తే మృతుల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, కొత్తకోట పుర చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీఐ రాంబాబు,ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
‘చమ్మగిల్లిన’ ఖాన్దొడ్డి..!
గట్టు: ఊరి కోసం ఊరంతా ఏకమయ్యారు.. ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన వారిని గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, ఎప్పుడు ఎవరు వచ్చి తమను ఖాళీ చేయిస్తారోనని చమ్మగిల్లిన కళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్ఖాన్దొడ్డి గ్రామస్తులు. గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది, యజమానుల తరఫున వచ్చిన బంధువులను ఘటన గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా గ్రామస్తులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బుధవారం కోర్టు ఉత్తర్వులతో కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామానికి చేరుకుని గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నించిన సంఘటన ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గ్రామస్తులంతా కలిసి కోర్టు సిబ్బందితో పాటు భూ యజమానులుగా చెప్పుకొంటున్న బంధువులపై రాళ్లు, రప్పలు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనను తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న తాము ఇప్పుడు ఉన్నదంతా వదిలి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు. పరస్పర కేసుల నమోదు.. కోర్టు ఉత్తర్వులతో చమన్ఖాన్దొడ్డి గ్రామానికి వెళ్లిన కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామస్తులు కొట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, భయబ్రాంతులకు గురి చేసిన ఘటనపై కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్యారాణి ఫిర్యాదు మేరకు చమన్ఖాన్దొడ్డికి చెందిన 8 మందితో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. మరోవైపు తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చిన వారిపై గ్రామానికి చెందిన పూజారి భీమయ్య ఫిర్యాదు చేయగా, భూమి యజమానులతో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ చెప్పారు. ఇక్కడే పుట్టి పెరిగినం.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పు డు ఈ స్థలం మాది, ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలి. మా పెద్దల నుంచి ఇప్పటి పిల్లల దాకా ఇక్కడే పుట్టి పెరిగాం. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. – ఆంజనేయులు, చమన్ఖాన్దొడ్డి ఎక్కడికి పోవాలి.. మా తాతలకాలం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు ఎవరో వచ్చి.. ఈ జాగ మాది.. ఖాళీ చేయాల్సిందే అంటే మేం ఎక్కడికి పోవాలి. ఇదే జాగలో కొత్తగా ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా. మాకు న్యాయం చేయాలి. మేం ఎక్కడికి పోం. ఇక్కడే ఉంటాం. – మల్లేష్, చమన్ఖాన్దొడ్డి ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన ఘటనను తలుచుకుని ఆందోళన బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. వీడని ఉత్కంఠ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుని మాత్రం వదులుకోమని ప్రతిన పరస్పర ఫిర్యాదులతో గ్రామస్తులు.. భూ యజమాని, బంధువులపై కేసుల నమోదు -
హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ
● అరైవ్–అలైవ్ అవగాహన సదస్సులోడీజీపీ శివధర్రెడ్డి జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ బైక్లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. -
డిఫెన్స్ డ్రైవింగ్తో ప్రమాదాల నివారణ
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని.. డిఫెన్స్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ డా.వినీత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఆరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో డ్రైవర్లకు ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రైవర్ల వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపు మందగించడం.. కలర్ బ్లైండ్ వంటి సమస్యలు రావొచ్చన్నారు. డ్రైవర్లు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటిచూపు స్పష్టంగా ఉంటేనే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలను గుర్తించి, సురక్షితంగా వాహనాలు నడపగలరని అన్నారు. వేగ పరిమితులను మించకుండా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనం నడపకూడదన్నారు. కారులో సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనంపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించరాదన్నారు. అలసట లేదా నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దని హెచ్చరించారు. అదే విధంగా వాహనాలకు సంబంధించిన లైసెన్స్, ఇన్సూరెన్స్, ప్యూసీ, రిజిస్ట్రేషన్ పత్రాలు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని.. వాహనం బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని ఎస్పీ సూచించారు. కాగా, జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గతంలో కంటి పరీక్షలు చేయించుకున్న కొందరు డ్రైవర్లకు కళ్లద్దాలు అందించడం జరిగిందని.. ప్రస్తుతం 100 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి కళ్లద్దాలు అందించడంతో పాటు తగిన చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీఓ రాంచందర్, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఓ మెంబర్ పోశాల్ రాజేష్, సీఐ శివశంకర్, లయన్స్ క్లబ్ సభ్యులు హరినారాయణ భట్టడ్, కంటివైద్య నిపుణులు డాక్టర్లు సునీల్, మల్లిక, సాయి ఆదిత్య, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
● అధికారులు బాధ్యతగా పనిచేయాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ కోస్గి రూరల్: కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంటే.. అధికారులు మాత్రం పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ, విద్యుత్శాఖ అదికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణ అబివృద్ధి కోసం కేటాయించిన రూ.305 కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీశారు. అదే విధంగా సీసీరోడ్లు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, జంక్షన్ల నిర్మాణం, పార్కుల అబివృద్ధి, అప్రోచ్ రోడ్లు, చెరువుల సుందరీకరణ, అండర్ డ్రెయినేజీల నిర్మాణాలపై చర్చించారు. పండుగలు, లేబర్ లేరనే సాకుతో పనులను ఆలస్యంగా చేపట్టే సంబంధిత కాంట్రాక్టర్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతగా పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం 7వ వార్డులో నిర్మిస్తున్న సైన్స్ మ్యూజియం, పంచతంత్ర పార్కు, శివాజీ చౌరస్తాలో జంక్షన్ ఏర్పాటు, డంపింగ్యార్డు వరకు రూ.10.50 కోట్లతో సీసీరోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులను ఆయన పరీశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఎండోమెంట్, ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అంతకుముందు 7వ వార్డులో జరిగిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పట్టణ సభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, కడా చైర్మన్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మొగులప్ప, విద్యుత్శాఖ ఎస్ఈ వినయ్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ అఽశోక్, అర్అండ్బీ డీఈ శ్రీహరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, వైస్ చైర్పర్సన్ సరిత, కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. జాగ్రత్తలు పాటించాలి నారాయణపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ డా.వినీత్తో కలిసి ఏర్పాటుచేసిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ఇకపై ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ అధికారులు రోడ్ల పక్కనున్న పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జంక్షన్ల వద్ద సూచిక బోర్డులు, హజార్డ్ మార్కర్లు, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను ఎస్పీ డా.వినీత్ వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటరమణ, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేశ్, ఆర్టీసీ డీఎం లావణ్య, డీఈఓ గోవిందరాజులు, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ తదితరులు ఉన్నారు. -
జీపీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేయాలి
నారాయణపేట రూరల్: జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లాశాఖ పక్షాన జెడ్పీ సీఈఓ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల ఫైనల్ పేమెంట్తో పాటు పార్ట్ ఫైనల్ డబ్బులు సైతం వేగంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. కాగా, ఈ విషయంపై సీఈఓ స్పందిస్తూ.. నెలరోజుల్లోగా ఆన్లైన్ ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ, కోశాధికారి కిషోర్ కుమార్, సహా కోశాధికారి శ్రీనివాస్, అశోక్, నర్సింహ, విశ్వేశ్వర్ పాల్గొన్నారు. -
బోనస్ అందేనా..?
నారాయణపేట: గతేడాది యాసంగి వరిధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన రైతులు బోనస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాది దాటినా ప్రభుత్వం యాసంగి బోనస్ ఊసెత్తకపోవడంతో కొందరు ఆశలు వదులుకుంటున్నారు. గతేడాది మార్చి నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన ప్రభుత్వం.. జూన్ మొదటి వారం వరకు 1.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అందులో 1,40,983 ఎంటీఎస్ సన్నరకాలు, 57,299 ఎంటీఎస్ దొడ్డు రకాల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. కొనుగోళ్లకు సన్నద్ధం జిల్లాలో సన్నరకం వరిసాగుపై ఈ సారి యాసంగిలోనూ రైతులు మక్కువ చూపారు. జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సన్నరకం 1,81,998 మెట్రిక్ టన్నుల దిగుబడి, దొడ్డు రకం 62,815 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం 160 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తం 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల మొదటి వారం నుంచే వరికోతలు ప్రారంభం కావడంతో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు సివిల్ సప్లయ్, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 245 క్వింటాళ్లు విక్రయించా.. నేను వరిధాన్యం విక్రయించి ఏడాది అవుతుంది. ఇంతవరకు బోనస్ పడలేదు. యాసంగి సీజన్లో పది ఎకరాల్లో వరిసాగు కోసం దాదాపు రూ. 3లక్షలు ఖర్చుచేశా. 245 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటివరకు బోనస్ డబ్బులు రూ.1,22,500 రాలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు బోనస్ అందించాలి. – నర్సింహారెడ్డి, రైతు, మక్తల్ రూ.25వేలు రావాల్సి ఉంది.. గతేడాది యాసంగిలో 50 క్వింటాళ్ల సన్నరకం వరిధాన్నాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. అందుకు సంబంధించి రూ. 25వేల బోనస్ అందాల్సి ఉంది. మళ్లీ యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం బోనస్ అందించడంలో జాప్యం చేయడం సరికాదు. – శ్రీనివాస్గౌడ్, రైతు, మరికల్ ఎదురుచూస్తున్నా.. పోయిన యాసంగిలో 3 ఎకరాల్లో వరిసాగు చేసి, పండించిన 58 క్వింటాళ్ల సన్నరకం వడ్లను పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అమ్మినా. క్వింటాకు రూ. 500 చొప్పున రూ. 29వేల బోనస్ ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ఇస్తామన్న బోనస్ అందించి రైతులను ఆదుకోవాలి. – కె.బాల్రాజ్, రైతు, మద్దెల్బీడ్ ఈసారి ధాన్యం డబ్బులతో పాటే గతేడాది వానాకాలం బోనస్ డబ్బులను రైతు లు ఖాతాల్లో జమచేశాం. యాసంగి డబ్బులు రావాల్సి ఉంది. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ రూపొందించాం. ఇప్పటికే 4 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. వారం రోజుల్లో 156 కేంద్రాలను ప్రారంభిస్తాం. ఈ సారి ధాన్యం డబ్బులతోపాటు బోనస్ జమయ్యే అవకాశం ఉంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి. – సైదులు, జిల్లా సివిల్సప్లయ్ అధికారి ఒక్క రూపాయి రాలే.. గతేడాది యాసంగి సీజన్లో సేకరించిన సన్నాలకు సంబంధించి క్వింటాకు రూ.500 చొప్పున రూ. 70.44కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. యాసంగి కొనుగోళ్లు ముగిసి ఏడాది కావొస్తున్నా బోనస్ చెల్లించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులకు సకాలంలో బోనస్ రాక.. ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఈ ఏడాది యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. రైతులు మాత్రం అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి పౌరసరఫరాల సంస్థ రూ. 460,01,65,600 జమచేసింది. అయితే ఆర్థికశాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే సన్నరకం ధాన్యం బోనస్ డబ్బులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. -
రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
నారాయణపేట: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడంతో మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని డీటీఓ మేఘాగాంధీ అన్నారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లాకేంద్రంలోని వీర సావర్కర్ (ఓల్డ్ బస్టాండ్) చౌరస్తాలో సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా డీటీఓ మేఘాగాంధీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, వేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనతోనే జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే తగ్గించవచ్చన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణాలను రక్షించే ముఖ్యమైన సాధనాలని.. వీటిని తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. యువత రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ఇతరులకు వివరించాలన్నారు. రహదారి నియమాలు పాటించడంతో సమాజాన్ని రక్షించగలమని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య, ఎస్ఐ–2 గాయత్రి, పోలీసు, డీటీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మామిడి క్లస్టర్తో మేలు
కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. ఇక్కడ పండే మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కేంద్రం ప్రకటించిన క్లస్టర్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు సయన్వయంతో నిర్వహిస్తున్నాయి. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 62 లక్షల మామిడి కవర్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా కోటికిపైగా కవర్ల పంపిణీ జరిగింది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల ఎలాంటి రసాయనాలు వాటిపై పడవు. చీడపీడలు కూడా ఆశించవు. కాయలు మంచి రంగులో ఉంటాయి. కవర్లు కట్టిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కాయలకు, కవర్ కాయలకు మధ్య టన్నుకు రూ.30 వేలకు పైగా ధర అధికంగా పలుకుతోంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. నాణ్యతలో బెటర్.. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ రైతులకు అప్పగించాలి పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్మూడేళ్ల క్రితం పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ఎగుమతులకు ఉపయోగపడేమామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతాంగం -
భూగర్భ జలాలను సంరక్షించాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలోని భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన భూగర్భజలాల వినియోగం–సంరక్షణపై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో భూగర్భజలాల వివరాలు, లభ్యత, వినియో గం, వర్గీకరణ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ నిర్మాణాలు–నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. భూగర్భ జల వనరు లశాఖ ఏడీ రవి భూగర్భ జలాల లభ్యత, వినియోగం, మండలాల వారీగా వర్గీకరణ, నీటి ప్రాముఖ్యతను వివరించారు. భూగర్భజల వనరులపై ఆధార పడి వ్యవసాయం చేయడం తగ్గించుకోవాలని.. పరిమితంగా వినియోగించుకోవాలని కోరారు. నీ టిని సృష్టించలేం.. సంరక్షించుకోగలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇష్టారాజ్యంగా భూ గర్భ జలాల్ని వెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత వరకు భూమిలోకి ఇంకింపజేసే విషయంపై దృష్టి సారించాలని, నీటి సంరక్షణ అందరి సామాజిక బాధ్యతని తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లా క్రియాశీలక భూగర్భ జల వనరులు పుస్తకం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, సీపీఓ ఖాఘవాహన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, పరిశ్రమలశాఖ జీఎం రామలింగేశ్వరగౌడ్, భూగర్భ జల వనరులశాఖ అధికారులు నరేష్, వెంకన్న పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి.. జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్లతో పాటు రెవెన్యూ, వాటర్షెడ్ పరిధిలోని చెక్ డ్యాంల వద్ద నుంచి ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు తప్పనిసరి అని.. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాల్సిందేనని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ట్ లేవల్ స్యాండ్ కమిటీ) సమావేశం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జలశాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇరిగేషన్, జల వనరులశాఖ ఏడీని ప్రశ్నించారు. మాగనూరు మండలంలోని 5 ఇసుక రీచ్లు, ఉట్కూర్ మండలంలో 2, మక్తల్లో రెండు, ధన్వాడలోని గోటూరు, కొత్తపల్లి, లింగాల్చేడ్ రీచ్ల నుంచి ఇసుక రవాణాకు ప్రతిపాదనలు పంపినట్లు మైనింగ్ ఏడీ వివరించారు. గుర్తించిన ప్రాంతాల నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని, ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి, పారదర్శక నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఒకరిద్దరు తహసీల్దార్ల పనితీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ మీట్లో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, మిషన్ భగీరథ ఎస్ఈ రంగారావు, ఇరిగేషన్ అధికారి, ఆయా మండలాల తహసీల్దార్లు, సీఐలు, ఎస్ఐలు, కలెక్టరేట్లోని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఖజానా గలగల..
● పేటలో ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగపైనే మార్కెట్ సెస్ ● మక్తల్, కోస్గి మార్కెట్లకు చెక్పోస్టుల ద్వారా.. ఏటా పెరుగుతున్న మార్కెట్యార్డుల ఆదాయం నారాయణపేట: జిల్లాలో ఏటా వ్యవసాయరంగం పురోగతి సాధిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులు ఆశించిన మేర పెరిగి మార్కెట్యార్డులో జోరుగా క్రయ, విక్రయాలు కొనసాగడంతో ఆదాయం పెరిగింది. కోస్గి, మక్తల్ మార్కెట్యార్డుల్లో క్రయవిక్రయాలు తక్కువగా ఉన్నా.. చెక్పోస్టులు, రైస్మిల్లులు, కాటన్ మిల్లుల ద్వారానే ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో నారాయణపేట, మక్తల్లో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరగా.. కోస్గి మార్కెట్యార్డులో లక్ష్యం చేరుకోలేదని వార్షిక ఆదాయం లెక్కల ద్వారా తెలుస్తోంది. చెక్పోస్టులతో ఆదాయం.. చెక్పోస్టులతోనే మార్కెట్లకు అదనపు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని నారాయణపేట మండలం జలాల్పూర్ దగ్గర, మరికల్లో హైదరాబాద్ రోడ్, మక్తల్ మార్కెట్ పరిధిలోని కృష్ణా మండలం టైరోడ్ దగ్గర, కోస్గిలో ఒకటి చొప్పున చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టుల ద్వారా ఏటా రూ.లక్షల ఆదాయం వస్తోంది. నారాయణపేట ప్రాంతానికి యాద్గిర్, కృష్ణాకు శక్తినగర్ కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. ఆయా మార్గాల్లో సరుకులు తరలించే భారీ వాహనాలు అనేకం రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లా మీదుగా వెళ్లే ఈ వాహనాల నుంచి భారీగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని మక్తల్, కోస్గి మార్కెట్యార్డులో క్రయవిక్రయాలు తక్కువగానే ఉన్నా.. చెక్పోస్టులు, రైస్మిల్లుల నుంచే ఆదాయం సమకూరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లాలో 30కి పైగా రైస్మిల్లులు, 7 కాటన్ మిల్లులు, ఒక దాల్ మిల్, 37 మంది ఖరీదుదారులు, 55 మంది కమీషన్ ఏజెంట్లు నిర్వహించే క్రయ విక్రయాలతో మార్కెట్లకు ఆదాయం సమకూరుతుంది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని మరికల్, మద్దూర్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ అధికారులు తనిఖీలు చేపడితే మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పత్తి, వరి పైనే.. జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గిలో వ్యవసాయ మార్కెట్లు.. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధి దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారం కావడంతో జిల్లా రైతులు ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పంటల సాగుకు మక్కువ చూపుతారు. కృష్ణానది పరీవాహకంలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటం, చెరువులు, బోరుబావుల కింద పంటలు పండించారు. యాసంగిలో వేరుశనగ, వరి పంటలు సాగుచేశారు. మరికల్, ఊట్కూర్ మండలాలతో పాటు కర్ణాటకలోని సమీప ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులు వస్తుండటంతో ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు కొనసాగుతుండటంతో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరుతుంది. ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పైనే మార్కెట్సెస్ అధికంగా వస్తోంది. దీంతో పేట మార్కెట్యార్డు ప్రస్తుతం ఉన్న గ్రేడ్–2 నుంచి మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంతో గ్రేడ్–1 దాటి స్పెషల్ గ్రేడ్గా మారాల్సిన అవసరం ఉంది. లక్ష్యాన్ని అధిగమించాం.. నారాయణపేట వ్యవసాయ మార్కెట్యార్డుకు ఏటా లక్ష్యానికి మించిన ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది కూడా ఇచ్చిన లక్ష్యాన్ని దాటి క్రయవిక్రయాలు జరిగాయి. ఆ ఆదాయంతో మార్కెట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. – ఆర్.శివారెడ్డి, మార్కెట్ చైర్మన్, నారాయణపేట -
రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి
పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీశక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలన్నారు. -
ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు..
ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవి లత, మహిళా రైతు -
‘గరళ’కంఠుడే రావాలేమో..!
‘పోలేపల్లి’ పరిసర ప్రాంత వాసుల దీనగాధ విచారణలో తేలినా.. జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. కాగితాలకే పరిమితం.. విచారణ బృందం నివేదిక అందజేసిన క్రమంలో అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ప్రతి నెలా 11న కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సెలవు దినమైతే మరుసటి రోజున సందర్శించి పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. కాలుష్య కట్టడిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీజీఐఐసీ అధికారులకు సైతం సూచనలు చేశారు. అయితే ఇవేమీ అమల్లోకి రాకముందే వెంకట్రావ్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. అనంతరం రవినాయక్, ఆయన తర్వాత విజయేందిర బోయి మహబూబ్నగర్ కలెక్టర్లుగా పనిచేశారు. వీరి హయాంలో నెలనెలా తనిఖీల అంశం తెర మీదకే రాలేదు. ఇటీవల ఖుష్బూ గుప్తా కలెక్టర్గా రాగా.. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదులుతున్న పలు పరిశ్రమలపై కొందరు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఫొటోలతో సహా పలు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ‘పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు, పంటల సాగుకు, జీవచరాల ఉనికికి ఈ నీరు అసలే పనికి రాదు.’ ...పరిశ్రమల కాలుష్యం, ప్రభావిత ప్రాంతాలపై పలు ప్రభుత్వ శాఖలతో ఏర్పాటైన విచారణ కమిటీ 2023 జనవరి 31న అప్పటి కలెక్టర్ వెంకట్రావ్కు అందజేసిన నివేదికలోని అంశాలు ఇవి. మూడేళ్లుగా ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలతో పాటు ప్రభావిత పల్లెల్లో సంరక్షణ చర్యలనూ ‘అధికార’ యంత్రాంగం గాలికొదిలేసింది. ఈ క్రమంలో నెలనెలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. అటు పీసీబీ, ఇటు జిల్లా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ సెజ్లోని ఓ పరిశ్రమ బయటికి వదిలిన కాలుష్యం జలాలు ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట.. పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమరైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు తెలుస్తోంది. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకూ రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ అయినా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా, తదితర పరిశ్రమల పొల్యూషన్తో బతుకులు ఛిద్రం తాగు, సాగుకు ఆ నీరు పనికిరాదని తేల్చిన విచారణ బృందం కలెక్టర్లు మారినా.. మారని బాధిత గ్రామాల ప్రజల తలరాతలు ఉత్తుత్తి మాటలుగానే నెలనెలా తనిఖీలు.. పీసీబీ తీరుపై అనుమానాలు ? ప్రస్తుత కలెక్టర్ అయినా దృష్టి సారించాలని బాధిత రైతుల విజ్ఞప్తి -
అందరికీ ఆదర్శం బీఆర్ అంబేడ్కర్
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: భారత రాజ్యాంగం రచించి దేశ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన డా. బీఆర్ అంబేడ్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శకంగా తీసుకొని ముందుకుసాగాలని కలెక్టర్ ప్రతీక్జైన్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయనతో పాటు ఎస్పీ డా. వినీత్ హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... డా. బీఆర్ అంబేడ్కర్ కష్టపడి చదివి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగాన్ని రచించడానికి తన మేధాశక్తిని వినియోగించారని గుర్తు చేశారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపర్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆనాడే విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లేంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గొప్ప సందేశం, మార్గదర్శకమన్నారు. కులమతాలకు అతీతంగా సంఘటితంగా నిలబడి అన్యాయాలపై పోరాడితేనే సమాజంలో సుస్థిర మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన సాధనం చదువు ఒక్కటే అని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకుసాగి తమ లక్ష్యాలను సాధించాలని, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కొండ శ్వేత సత్యయాదవ్, సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆర్అండ్బీ ఈఈ.వెంకట్రాములు, షెడ్యూల్డ్ కులాల అధికారి అబ్దుల్ ఖలీల్, పుర కమిషనర్ నర్సయ్య, సీపీఓ కాగవాహన్, డీపీఆర్వో రషీద్, డీటీఓ మేఘాగాంధీ, కౌన్సిలర్ మహేష్, సంఘం నాయకులు శరణప్ప, ఆశప్ప, కృష్ణ, సూర్యకాంత్, ఈశ్వరమ్మ, మాధవ, సోఫీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పన.. ఊట్కూర్: వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్సీ, ఎస్టీ బాలురు వసతిగృహాన్ని ఎస్పీ డా. వినీత్తో కలిసి ఆయన సందర్శించారు. వంటశాల, నివాస గదులు, పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు సక్రమంగా వినియోగిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వసతులు, సమస్యనల గురించి ఆరా తీశారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజు మెనూ విధిగా పాటించాలని వార్డెన్ను ఆదేశించారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను విద్యార్థులతో కలిసి టీవీలో వీక్షించారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే వసతులను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. చదువుతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రేణుక భరత్, ఈడీ ఖలీల్, ఏఎస్డబ్ల్యూ పరమేశ్, వార్డెన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని వాహన చోదకులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి చోదకులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం, డిఫెన్స్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి వివరించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని వారు సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, పుర చైర్పర్సన్ కొండ శ్వేత, సత్యయాదవ్, సీఐ శివశంకర్, డీటీఓ మేఘాగాంధీ, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, పురుషోత్తం, కృష్ణచైతన్య, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భూ సారం.. ఫలితం శూన్యం
–8లో uనర్వ: రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటల సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ జిల్లా రైతులకు భూసార పరీక్షలు అందని ద్రాక్షగా మారాయి. 2018లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 77 క్లస్టర్లకు మినీ భూసార పరీక్ష కేంద్రాలు మంజూరు చేసింది. ఆయా కేంద్రాల్లో కేటాయించిన గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి ఫలితాల పత్రాలు అందజేయాలని ఆదేశించింది. కాగా ఆయా కేంద్రాలకు పరీక్షల నిమిత్తం ఉపయోగించే రసాయనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. భూ సమగ్ర సర్వేలో అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను జడ్చర్లలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల ఫలితాల కార్డులను నేటికీ అందించలేదని రైతులు చెబుతున్నారు. వృథాగా పరీక్షల కిట్లు.. కేంద్ర ప్రభుత్వం ఒక్కో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ.1.30 లక్షలు మంజూరు చేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 523 వ్యవసాయ క్లస్టర్లకు భూసార పరీక్షల కిట్లు ఇచ్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)భూసార పరీక్షలు నిర్వహించాలి. ప్రారంభంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా కొన్నాళ్ల పాటు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రైతులకు అందించారు. 2020 కంటే ముందు వానాకాలం ప్రారంభంలోగా భూసార పరీక్షలు చేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత ఈ కిట్లు అటకెక్కాయి. నిధులు లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదని మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 476, నారాయణపేట జిల్లాలో 77 రైతువేదికలు ఉన్నాయి. వీటిలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు మంజూరుచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది నిర్వహించాం.. నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషన్ బ్లాక్గా ఎంపికై న నర్వ మండలంలో గత ఏడాది ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించాం. ఫలితాల కార్డులను ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. – అఖిలారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, నర్వ జడ్చర్లలో మాత్రమే.. రైతులు తాము సాగు చేస్తున్న భూముల మట్టి పరీక్షలను ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్లలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రం ఉంది. 2018లో ఏఈఓ క్లస్టర్ల వారీగా మినీ కేంద్రాలను మంజూరు చేశారు. ఆయా కేంద్రాలకు కెమికల్స్, సామగ్రి పూర్తిస్థాయిలో సరఫరా గాకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. భూసార పరీక్షలు అవసరమైన రైతులు జడ్చర్ల ల్యాబ్లో నామినల్ ఫీజు చెల్లించి చేయించుకోవచ్చు. – నాగేష్కుమార్, ఏడీఏ, మక్తల్ జిల్లాలో 77 క్లస్టర్లకు మినీ కేంద్రాలు మంజూరు ఘనంగా ప్రారంభం.. తర్వాత నిరుపయోగం వృథాగా మారిన కిట్లు పాత పద్ధతిలో సాగు.. రైతులు నష్టాల పాలు -
మాకు న్యాయం చేయాలి..
కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చారు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి -
రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలి
గట్టు: భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు ప్రాంత వాసుల వాహనదారులకు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, మల్లాపురం గ్రామాల ప్రజలు కోరారు. ఆయా గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 57వ రోజుకు చేరుకుంది. మిట్టదొడ్డి, చాగదోన గ్రామాల ప్రజలు వారికి మద్దతు తెలిపారు. రాయాపురం స్టేజీ దగ్గర ఉన్న డబుల్ రోడ్డును మూసి వేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తులో వంతెనను నిర్మించడం వలన భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు స్పందించి గట్టు మండలానికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడంతో పాటుగా రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు, ఆప్కో మాజీ డైరెక్టర్ దోమ వీరన్న, మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, గోవిందు, ఆంజనేయులు, కృష్ణయ్య, సాలే కర్రెప్ప,సుధాకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు. గ్రామానికి చెందిన తోకల మహేశ్వరి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేది. అయితే సోమవారం ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లింది. ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
మహబూబ్నగర్ కలెక్టరేట్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల బాధితులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ ఖష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 900మందికి 60– 75చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఇంటి స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను నమ్మించి మోసం చేసి అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చినమాట నిలబెట్టుకోకుండా పేదలను మోసం చేశారని ఆరోపించారు. పట్టాలు తీసుకున్న 900మంది నిరుపేదలు రోడ్డు మీదకు వస్తే దానికి ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్ శ్రీదేవి, టీఎఫ్టీయూ జిల్లా నాయకులు జలాల్ పాషా, గట్టన్న, డబుల్ బెడ్రూమ్ బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనిఫాబేగం, లాల్బీ, మహమ్మద్ సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
పోషక విలువల అక్షయపాత్ర.. మునగ
మదనాపురం: ప్రకృతి మాత తన అక్షయపాత్ర నుంచి మానవాళికి ప్రసాదించిన అపురూప వరప్రసాదం మునగ. ఇది కేవలం పెరటి చెట్టు కాదు.. ప్రాణదాత. వినీల ఆకా శం కింద పచ్చని తోరణంలా విరిసే ఈ మొక్క, మానవ దేహానికి అవసరమైన పోష కాలను తన ప్రతి అణువులోనూ నింపుకొన్న ఒక శాకాహార నిధి. మునగలోని మాధుర్యం, దాని వెనుక ఉన్న ఆరోగ్యం గురించి మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత వివరించారు. కనుచూపునకు వెలుగురేఖ.. క్యారెట్ కన్నా పది రెట్లు మిన్నగా విటమిన్ అని నింపుకుని, నయనాలకు కాంతిని ఇస్తుంది. పాల కన్నా పదిహేడు రెట్లు అధికంగా కాల్షియాన్ని అందిస్తూ ఎముకలను దృఢంగా మలుస్తుంది. పాలకూరను మించిన ఐరన్ ధారల తో రక్తహీనతను పారద్రోలుతుంది. నారింజను తలదన్నే విటమిన్–ఈ, అరటిని మించిన పొటాషియంతో దేహానికి నవ చైతన్యాన్ని ఇస్తుంది.తొమ్మిది రకాల ప్రాణధార అమైనో ఆమ్లాలు మునగలో కొలువై ఉన్నాయి. ఇది ఒక పరిపూర్ణ ప్రోటీన్ల కల్పవృక్షమని తెలిపారు. ఆరోగ్య సౌరభం.. జీవన రాగం ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు.. రోగకారక క్రి ములకు సింహస్వప్నంలా నిలుస్తుంది.రక్తంలో చ క్కెరకు అడ్డుకట్ట వేసి.. మధుమేహ బాధితులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కొలెస్ట్రాల్ కల్మషాలను కడిగివేసి, గుండె వేగానికి భరోసా ఇస్తుంది. కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు ఇది గెలాక్టాగోగ్గా మారి, పసిబిడ్డలకు పౌష్టికాహార లోపం లేకుండా చూస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ రేచీకటిని తరిమికొట్టి, కంటి చూపును శరత్కాల చంద్రికలా ప్రకాశింపజేస్తుంది. విలువ ఆధారిత ఉత్పత్తులు.. మునగను కేవలం పంటగా చూడకుండా, ఒక లాభసాటి వ్యాపారంగా మలిచే అద్భుత అవకాశం ఉంది. మునగ ఆకుల పొడి, సుగంధ భరితమైన టీ, చిన్నారుల కోసం న్యూట్రిమిక్స్ రుచికరమైన బిస్కెట్లు, లడ్డూలు.. ఇలా మునగతో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ఒక ఆదాయ వనరులాంటిది. గ్రామీణ మహిళా సంఘాలు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని చేపడితే వారి ఆర్థిక స్వాలంబనకు ఆకాశమే హద్దని తెలిపారు. -
అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసు
అమరచింత: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నానని, అభివృద్ధికి తానెప్పుడు అడ్డుపడే వ్యక్తిని కాదని ఇక్కడ జరిగే అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. ఈసందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల వద్ద హైలెవల్ బిడ్జ్రి నిర్మించడం వల్ల అమరచింత, ఆత్మకూర్ పట్టణాలు అభివృద్ది చెందుతాయని నిధులు కేటాయిస్తే వంతెన నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ అరుణ కేంద్ర నిధులు అంటూ తమ ప్రమేయం ఉండాలంటూ చెప్పుకురావడం, చేసిన శంకుస్థాపనలకు మళ్ల శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మునుపెన్నడు లేని విధంగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో ఎవరెన్ని నిధులు తెచ్చిందో తేల్చుకుందామని దమ్ముంటే చర్చకు రావాలని ఎంపీకు సవాల్ విసిరారు. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో పె ట్టుకుని జూరాల ప్రాజెక్టు ఎగువలో బిడ్జ్రిలు, బ్యారేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీమా నదిపై రెండు బ్యారేజీలు, కృష్ణ నదిపై మినీ జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించారన్నారు. ప్రతి వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి సాయం చేయ్యమ ని అడిగే వాళ్లమని బ్యారేజీలు, బిడ్జ్రిలు నిర్మించుకుంటే అలాంటి పరిస్థితి ఇకపై ఉండదన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం.నాగరాజ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, లోకల్బాడీ కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. -
విహారయాత్రలో విషాదం
● గోవాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం ● చెట్టును ఢీ కొట్టిన కారు ● ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు గద్వాల క్రైం: నలుగురు స్నేహితులు కలసి గోవా పర్యటనకు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన గద్వాల మండలం వీరాపురం గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామానికి చెందిన ఇంతియాజ్ (24), ముజమ్మిల్ మరో ఇద్దరు హైదరాబాద్కు చెందిన హజీ, ఇర్ఫాన్ నలుగురు స్నేహితులు కలసి ఈ నెల 9న కారులో గోవాకు వెళ్లారు. అక్కడే మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున వీరాపురం శివారులో డ్రైవింగ్ చేస్తున్న ఇర్ఫాన్ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపుతప్పింది. రోడ్డు ఎడమ వైపున ఉన్న భారీ చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షత్రగాతులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతియాజ్ చికిత్స పొందుతూ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్, ముజమ్మిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ముర్తజావలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతివేగమే కారణం.. గోవా నుంచి కారులో బయలుదేరిన స్నేహితులు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో అతివేగంగా కారును డ్రైవ్ చేసినట్లు సమాచారం. మరోవైపు సరైన నిద్రలేకపోవడం గంటల తరబడి రోడ్డు ప్రయాణంతో అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా స్నేహితులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
మిడ్జిల్: అక్రమంగా నిల్వ ఉన్న బియ్యాన్ని ప ట్టుకున్న ఘటన ఆదివారం మండలంలోని మసిగొండ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహ్మద్ సుల్తాన్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు పో లీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి సుల్తాన్ నివాసంలో సోదా లు నిర్వహించారు. 52 క్వింటాళ్ల రేషన్ బి య్యం బొలెరో వాహనంలో తరలిస్తుండగా గుర్తించారు.వాహనంలో 104 బస్తాలు ఉన్న ట్లు తేలింది. రెవెన్యూ అధికారులకు సమాచా రం ఇవ్వగా, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్రెడ్డి ఘటన స్థలానికి వచ్చి విచారణ చేసి బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.2.66 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ధాన్యం రాశులతో కళకళ దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డు ధాన్యం రాశులతో కళకళలాడింది. సోమవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకానికి తెచ్చారు. కోయిల్సాగర్ ఆయకట్టుతోపాటు చెరువులు, కుంటలు, బోరుబావుల కింద యాసంగిలో సాగు చేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతో రైతులు దిగుబడులను నేరుగా మార్కెట్కు అమ్మకానికి తెస్తున్నారు. సోమవారం మార్కెట్కు దాదాపు 6 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,150 మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,150, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,799, కనిష్టంగా రూ.1,736 చొప్పున పలికాయి. ఇసుక ట్రాక్టర్ పట్టివేత పాన్గల్: అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ యజమానిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. మండలంలోని మాధరావుపల్లి గ్రామం నుంచి పాన్గల్కు ఏలాంటి అనుమతులు లేకుండా శివ తన ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్ను స్టేషన్కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘ టన మండలంలోని కుమ్మెరలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. కుమ్మెర గ్రామానికి చెందిన సురేందర్బాబు (39) కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడు గ్రామ సమీపంలోని పల్లె చంద్రశేఖర్ వ్యవసాయ పొలం వద్ద బోరు మో టారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసి ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాల్వలో పడి వృద్ధుడు మృతి ● నారాయణపేట జిల్లావాసిగా గుర్తింపు నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం సమీపంలో జాన్పహాడ్ మేజర్ కాల్వలో వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. కందులవారిగూడెం గ్రామ సమీపంలో జాన్పహాడ్ మేజర్ కాల్వలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకువస్తుండగా.. స్థానిక వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. మృతదేహాన్ని ఫొటో తీసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయగా.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన నామల్ల రాయప్ప(70)గా గుర్తించారు. రాయప్ప సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న తన కుమారుడు నామల్లి వెంకటేష్ను కలిసేందుకు ఈ నెల 10న వచ్చాడని, ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రాయప్ప కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
జనగణనలో ఓబీసీల లెక్క తేల్చాలి
● ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం ● మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా గణనలో ఓబీసీల లెక్క తేల్చాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్జోడో యాత్రతో దేశంలో ఓబీసీల ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఎవరు ఎంత ఉన్నారో.. వారికి అంతస్థాయిలో వాటా ఉండాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. రాహుల్గాంధీ ఆలోచన మేరకు ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టి 56 శాతం బీసీలు ఉన్నారని లెక్క తేల్చి రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించడానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలా బీసీలకు అవకాశం దక్కిందన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఈ వర్గానికి చేసిందేమిలేదని విమర్శించారు. ఓబీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ కేతూరి వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, లక్ష్మణ్, సీజే బెనహర్, రాములుయాదవ్, ఉషారాణి, పరమేశ్, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలు బాలికల భవిష్యత్కు నిలయాలు
తిమ్మాజిపేట: కేజీబీవీలు బాలికల సమగ్ర అభివృద్ధి, భవిష్యత్కు నిలయాలుగా మారాయని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివి బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు సోమిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం తిమ్మాజిపేటలోని కేజీబీవీని ఆర్జెడీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. బాలికలకు విద్యతోపాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, సృజనాత్మకత అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకునే బాలికలు విద్యద్వారా జీవితంలో ఉన్నత స్థానాలను సాధించే అవకాశాలు కేజీబీవీలో విస్తతంగా ఉన్నాయన్నారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, వంటి లక్షణాలను పెంపొందించుకొని భవిష్యత్లో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, యోగా, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం బలంగా ఉంటేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. బాలికల విద్యాభివృద్ధి ద్వారా సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం పెరుగుతాయని మహిళలు అన్నిరంగాల్లో మందంజలో ఉండేలా ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుమందు ఉపాధ్యాయునులతో సమావేశమై పలు విద్యా అంశాలపై చర్చించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రంశసా పత్రాలు అందజేశారు. రూ.80వేల పరికరాలు అందజేత మార్చిలో కేజీబీవీని సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించిన సమయంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.80వేల విలువైన పరికరాలను అందజేశారు. 30లీటర్ల సామర్థ్యం గల రెండు చల్లని తాగునీటి విద్యుత్ యంత్రాలను పంపిణీ చేశారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు బీపీ కొలిచే యంత్రం, థర్మామీటరు, స్టెతస్కోప్, బరువు కొలిచే యంత్రం వంటి వైద్య పరికరాలను అందజేశారు. బాలికలకు ప్రత్యేకంగా సిక్రూమ్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. త్వరలో 10కంప్యూటర్ బేబుళ్లను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఉద్రిక్తంగా కో–ఆప్షన్ ఎన్నిక
పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు. అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ స్వాతి తెలిపారు. కమిషనర్ ఫిర్యాదుతోకౌన్సిలర్పై కేసు నమోదు పోలీసుల జోక్యంతోసద్దుమణిగిన వివాదం మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం -
రహదారి భద్రత.. అందరి బాధ్యత
● రాష్ట్రంలో ఏటా 5 లక్షల ప్రమాదాలు.. లక్షల సంఖ్యలో మరణాలు ● అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎస్పీ డా. వినిత్ దామరగిద్ద/కోస్గి రూరల్: రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారిద్దామని ఎస్పీ డా. వినీత్కుమార్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం దామరగిద్దలో సర్పంచ్ కన్కిరెడ్డి అధ్యక్షతన, గుండుమాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన అరైవ్–అలైవ్ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని .. అందులో 1.50 లక్షల మంది మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదల కంటే రోడ్డు ప్రమాదాలే అధికమని.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రత వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్స్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ముఖ్య నాయకులతో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని యువత ప్రమాదాలకు గురికాకుండా రహదారి నిబంధనలు పాటించేలా కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఈ నెల 18 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని, అలాంటి ఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని వివరించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల చోదకులు సీట్బెల్ట్ ధరించాలని, మితిమిరిన వేగం పనికిరాదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా వెంటబెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రమాదాల నివారణకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, డీటీఓ మేఘాగాంధీ, తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీఓ ఉదయ్, ఉప సర్పంచ్ సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఈదప్ప, ఎస్ఐ రాజు, బాలరాజు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, రఘు, వెంకట్రామారెడ్డి, నీలి మాణిక్యప్ప, గుండుమాల్లో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ తిరుపతయ్య, సర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన కో–ఆప్షన్ ఎన్నిక
కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు పుర కార్యాలయంలో సోమవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 16 వార్డులు ఉండగా 9 వార్డుల్లో అధికార కాంగ్రెస్పార్టీ, 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కై వసం చేసుకున్నారు. 4 కో–ఆప్షన్ స్థానాలు ఉండగా.. అధికార పార్టీ నుంచి నలుగురు, బీఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. దీంతో ముందస్తుగా అధికార పార్టీ సభ్యులు క్యాంపునకు వెళ్లి సోమవారం ఎన్నిక సమయానికి కౌన్సిల్ కార్యాలయానికి చేరుకొని ఓటింగ్లో పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన ఎండీ యాసిన్, హబీబా బేగం, కొత్తూరు యాదవరెడ్డి, మాజీ ఎంపీపీ కూనె విజయలక్ష్మి కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు పుర కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. అనంతరం వారికి పుర చైర్పర్సన్ సరస్వతి జనార్దన్తో కలిసి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది భీములు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, నిడ్జింత తిరుపతిరెడ్డి, అల్లీపూర్ మాజీ సర్పంచ్ రమేశ్రెడ్డి, కూనె సంజీవ్కుమార్, జనార్దన్, జంగం బాబు, జీడీ వెంకట్రాములు, గురుగుంట నర్సింహులు, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.. పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డె స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె -
ఇంకెన్నాళ్లు.. సాగదీత?
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ 2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
నారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఏడు పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించారు. ప్రతి పరీక్షకు చదువుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజులు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ సమయం పట్టింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకపోవడంతో ఇటు విద్యాశాఖ, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 43 కేంద్రాలకు 8,319 మంది విద్యార్థులను కేటాయించగా.. సోమవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 8,304 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారు. 99.8 హాజరు శాతం నమోదైంది. అదేవిధంగా ఒక ప్రైవేట్ కేంద్రంలో ఇద్దరిని కేటాయించగా.. వందశాతం హాజరు నమోదైంది. సిట్టింగ్స్కాడ్, ఫ్లయింగ్స్కాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. బుధవారం ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష జరగనున్నట్లు డీసీఈబీ కార్యదర్శి శశికుమార్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు రాసిన విధానంపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులు సినిమా థియేటర్ల వైపు వెళ్లగా, మరికొందరు మిత్రులతో కలిసి హోటళ్లలో భోజనాలు చేయడం కనిపించింది. కేజీబీవీ, గురుకుల, ఇతర హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు తమ ఇళ్లకు పయనమయ్యారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తోందని ఆర్జేడీ సోమిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతోందని, నాణ్యమైన విద్యతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఎకరా పొలంలో రూ.70 వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్కు తీసుకెళ్తే క్వింటా రూ.800 అడిగారు. తిరిగి తీసుకొచ్చి ఊరూరా తిరిగి విక్రయిస్తున్నా. క్వింటాకు రూ,1,200 వరకు ధర వస్తోంది. ఇలా చేస్తే కనీసం పెట్టుబడినైనా చేతికందే అవకాశం ఉంది. ఈ ఏడాది ఉల్లికి ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – రాజు, ఉల్లి రైతు, మాధవరం రూ.50 వేల నష్టం.. వాతావరణ మార్పులు ఉల్లి సాగుపై ప్రభావం చూపింది. పంట చేతికొచ్చే సమయంలో కూడా గడ్డ సైజు పెరగలేదు. దీంతో అర ఎకరంలో ఉల్లి సాగుచేస్తే కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. – వెంకటయ్య, ఉల్లి రైతు, మరికల్ ● -
ప్రజావాణి వినతులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలు విని పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా ప్రజావాణికి 48 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన బాలికలు
● జిల్లాలో 77.2 శాతం ఉత్తీర్ణత నమోదు ● 46.6 శాతానికేపరిమితమైన బాలురు ● మొదటి సంవత్సరంలో 58 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 68 శాతం పాస్ ● రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తునకు ఈ నెల 20 వరకు అవకాశం ద్వితీయ సంవత్సరంలో.. రెగ్యులర్ విద్యార్థులు బాలురు 1,312 మందికిగాను 753, బాలికలు 1,927 మందికిగాను 1,511 ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 3,239 మంది విద్యార్థుల్లో 2,264 మంది పాసై 69.9 శాతంతో రాష్ట్రంలో జిల్లా 24వ స్థానంలో నిలిచింది. ● ఒకేషనల్ విభాగంలో బాలురు 128 మందికిగాను 82 మంది, బాలికలు 410 మందికిగాను 383 మంది.. మొత్తం 538 మంది విద్యార్థులకుగాను 465 మంది పాస్ కావడంతో 86.43 ఉత్తీర్ణత శాతం నమోదై రాష్ట్రంలో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. నారాయణపేట రూరల్: ఇంటర్మీడియట్బోర్డు ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 10 ప్రభుత్వ, 11 కస్తూర్బాగాంధీ, 6 సోషల్ వెల్ఫేర్, 6 బీసీ వెల్ఫేర్, రెండు ఆదర్శ, రెండు మైనార్టీ, ఒక ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలతో పాటు 7 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 8,660 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5,433 మంది పాస్ కావడంతో 62.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక మొదటి సంవత్సరంలో 4,395 విద్యార్థులకుగాను 2,531 మంది పాస్కాగా 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 4,265 మంది విద్యార్థులకుగాను 2,902 మంది ఉత్తీర్ణత సాధించి 68 శాతంలో నిలిచింది. ఇక మొత్తంగా 3,604 మంది బాలురు పరీక్షలు రాయగా.. 1,680 మంది పాస్ కావడంతో 46.6 శాతం, 4856 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 3,753 మంది పాస్ కావడంతో ఏకంగా 77.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా జిల్లాలో బాలికల హవా కొనసాగిందని చెప్పవచ్చు. మొదటి సంవత్సరంలో.. జిల్లావ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు బాలురు 1,623 మంది పరీక్షలు రాయగా 651 మంది.. బాలికలు 2,070 మందికిగాను 1,537 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 3,893 మంది విద్యార్థులకుగాను 2,188 మంది పాస్ కావడంతో 56.2 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 26వ స్థానంలో జిల్లా నిలిచింది. ● ఒకేషనల్ విభాగంలో బాలురు 198 మందికిగాను 83 మంది, బాలికలు 304 మందికిగాను 260 మంది .. మొత్తం 502 మందికిగాను 343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 68.33 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. ‘రప్రైవేట్’ విద్యార్థులు.. ప్రైవేట్ జనరల్ విభాగంలో బాలురు 328 మంది విద్యార్థులకుగాను 105 మంది, బాలికలు 138 మంది విద్యార్థులకుగాను 57 మంది.. మొత్తం 467 మంది విద్యార్థులకుగాను 462 మంది పాసై 34.48 శాతంతో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. ఒకేషనల్ విభాగంలో బాలురు 15 మందికిగాను ఆరుగురు, బాలికల్లో ఆరుగురికిగాను ఐదుగురు మొత్తం 21 మందికిగాను 11 మంది పాసై 52.38 శాతంతో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులు.. మద్దూర్ సాంఘిక సంక్షేమ, మక్తల్ బీసీ సంక్షేమ, నర్వ కేజీబీవీ కళాశాలల్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రభుత్వ, అనుబంధ కళాశాలల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది. చాలాచోట్ల ఎంపీసీ, బైపీసీలో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటంతో వారికి డీఐఈఓ సుదర్శన్రావు అభినందనలు తెలిపారు. -
ఆర్టిజన్ కార్మికులకు అండగా ఉంటాం
నారాయణపేట: ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఏపీఎస్ఈబీ రూల్స్ సాధించే వరకు 1104 యూనియన్ అండగా ఉంటుందని సంఘం డివిజన్ కార్యదర్శి శ్రీధర్రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలో విద్యుత్ ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది. 1104 యూనియన్ నారాయణపేట డివిజన్ కార్యదర్శి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ ప్రెసిడెంట్ గోవిందరాజు, సర్కిల్ అదనపు కార్యదర్శి రవీంద్రాచారి, ఎల్ఎం అచ్యుతారెడ్డి, భీంరెడ్డి, రమేష్, శాంతకుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీపీఎస్లో సమ్మె నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం టర్మినేషన్ నోటీసులు వాట్సప్లో పంపించగా యూనియన్ అండగా నిలిచి ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా కృషి చేసిందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సంఘం కార్మికుల పక్షాన పోరాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అవసరమైతే తాము సైతం విధులు బహిష్కరించేందుకు వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు రాఘవేదర్గౌడ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ దిల్దార్, డివిజన్ చైర్మన్ నర్సింహులు, కో–చైర్మన్ లక్ష్మీకాంత్, రమేష్, కన్వీనర్ జైపాల్, శ్రీధర్, ప్రచారకార్యదర్శి వెంకటేష్, గుండప్ప, మహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు: ఎస్పీ
నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో రోడ్డు భద్రతపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఎస్పీ డా. వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో టెలీ కాన్ఫరెనన్స్ నిర్వహించి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఒక్క నిర్లక్ష్యం.. ఒక కుటుంబం నాశనం అనే సందేశంతో ప్రజల్లో బాధ్యత పెంపొందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన, అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రమాణ స్వీకారం, బ్లాక్స్పాట్ల గుర్తింపు, ప్రమాదాల నివారణ చర్యలు, పిల్లల కోసం ప్రత్యేక రోడ్ సేఫ్టీ డే నిర్వహణ, హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన, గోల్డెన్ అవర్పై పోలీస్, అంబులెన్న్స్ సిబ్బంది, వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ తదితర కార్యకమ్రాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక హాట్లైన్ నంబర్ 88898 08182 ఏర్పాటు చేశామని, సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షల కంటే అవగాహనతో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల పరిసరాల్లో జీబ్రా క్రాసింగ్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేసి చిన్నారుల భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. బాధ్యతగా డ్రైవింగ్ చేస్తే సమాజం మారుతుందని, ప్రతి గ్రామం సురక్షితంగా మారితే జిల్లా సురక్షితం అవుతుందని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. -
అతి పెద్ద క్రీడా మహోత్సవం సంసద్ ఖేల్
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నర్వ: దేశంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ నిలవబోతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సంసద్ ఖేల్ క్రీడా మహోత్సవాన్ని ఆమె ప్రారంభించి క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేసిన అనంతరం క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపర్చారు. అంతకుముందు నాగిరెడ్డిపల్లిలో శుద్ధజల కేంద్రం, నర్వలో ఉపాధిహామీ నిధులు రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రహ దారి, లంకాల్లో సీసీ రహదారులు, ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆమె ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి సీసీ రహదారులు, హైమాస్ట్ లైట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామా ల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కొత్తపల్లి, లక్కర్దొడ్డి గ్రామస్తులు ఎంపీకి వినతిపత్రం ఇవ్వగా వారితో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ఇరు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.7 కోట్లతో టెండర్లు పూర్తిచేసి త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, కొండయ్య, జిల్లా నాయకురాలు లలిత వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అజిత్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి విజయ్రామ్, నాయకులు కుర్వ సత్యం, నీరజ్, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణయ్య, ఆయా గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పక్కదారి?
● అధికారుల పర్యవేక్షణ కరువు ● రైస్మిల్లుల్లో రీ సైక్లింగ్ ? ● రెండేళ్లలో 60 కేసులు నమోదు.. 778 క్వింటాళ్ల బియ్యం పట్టివేత నారాయణపేట: లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 301 రేషన్ దుకాణాల్లో 1,70,641 రేషన్ కార్డులు ఉన్నాయి. మూడు నెలలకుగాను 11,972 ఎంటీఎస్ బియ్యం పంపిణీ చేయనున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినా.. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా తరచూ పట్టుబడుతున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. అయితే బియ్యం మూడు నెలల కోటా రావడం.. అందులో ఎంతోకొంత పక్కాదారి పట్టించి వాటాలు పంచుకుందామనే ఓ అధికారి లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ కరువు.. చౌకధర దుకణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని చెప్పవచ్చు. రెండేళ్లుగా ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు బియ్యాన్ని పట్టుకున్నారే తప్ప స్థానిక అధికారులు మాత్రం తనిఖీలు చేయడం లేదనిపిస్తోంది. రేషన్ దుకాణాలను తనిఖీ చేసి విక్రయాలు, నిల్వలకు వ్యత్యాసం ఉంటే వెంటనే సదరు డీలర్పై కేసు నమోదు చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు కనబడటం లేదు. వ్యాపారులు అధికారులను మచ్చిక చేసుకొని ఈ దందా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిహద్దులు దాటిస్తూ.. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని రావల్పల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం కానుకుర్తి, నారాయణపేట మండలంలో జలాల్పూర్, ఎక్లాస్పూర్, మక్తల్ నియోజకవర్గంలో ఊట్కూర్ మండలంలోని సంస్తాపూర్, మక్తల్, మాగనూర్ మండలాల సరిహద్దులో ఉజ్జెలి, కృష్ణా మండలం టై రోడ్డు తదితర సరిహద్దు మార్గాల్లో బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. అటు రాయిచూర్, ఇటు యాద్గిర్, గుర్మిట్కల్ ప్రాంతాలకు అక్రమ వ్యాపారులు రాత్రి వేళలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపడుతుందగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. డీలర్లే దళారులుగా మారి..? జిల్లాలోని చాలామంది లబ్ధిదారులు డీలర్ వద్ద బియ్యం తీసుకొని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి మూడు నెలల కోటా బియ్యం రావడంతో బియ్యం బయట ఎందుకు అమ్ముతారు.. ఆ ధర ఎంతో తామే ఇస్తామంటూ పలువురు డీలర్లు సైతం అక్రమ సంపాదనకు తెర తీసినట్లు సమాచారం. ప్రధానంగా దామరగిద్ద, మద్దూర్, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాలతో పాటు తండాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులు దళారులను పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. చౌక బియ్యం తినని లబ్ధిదారులను గుర్తించి పలువురు డీలర్లే లబ్ధిదారుల నుంచి రూ.15 నుంచి రూ.20 వరకు కొంటున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో ఉంచి ఒకేసారి పెద్దమొత్తంలో బడా వ్యాపారులు, రైసుమిల్లర్లకు కిలో రూ.22 నుంచి రూ.25 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగాతరలిస్తే చర్యలు.. రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన.. డీలర్లు కొనుగోలు చేసినా.. ఇతరులకు విక్రయించినా.. చట్టరీత్యా చర్యలు తప్పవు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇకపై నిఘా పెంచుతాం. – సైదులు, సివిల్ సప్లయ్ డీఎం -
ఏడు ఎకరాలు సాగుచేశా..
యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి. – మైను, రైతు, నందిమళ్ల ఐదు తడులు అవసరం.. జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. – దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) సీఎం దృష్టికి తీసుకెళ్తా.. జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ఇబ్బంది లేదు.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ ● -
అడుగంటిన జూరాల
గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధా న కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తు తం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తా గునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. ఆందోళనలో అన్నదాతలు.. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. మార్చి చివరి నుంచే.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రా జెక్టుల పరిధిలో సుమారు 7లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పాటు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. తాగునీటికి ఎలా.. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 0.442 టీఎంసీలే.. కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకుపైనే సాగు ఈ నెల 15 వరకు పంటలకు సాగునీరు అందించాలి వేసవిలో తాగునీటి అవసరాలకుఅర టీఎంసీ అవసరం మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి -
వరి కొనుగోళ్లకు సిద్ధం కావాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 82, పీఏసీఎస్ 65, మెప్మా 5, ఎఫ్పీఓఓ ఏడు, ఏఎంసీ ఆధ్వర్యంలో ఒకటి మొత్తం 160 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలకుండా ఆరు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం సేకరిస్తామన్నారు. క్వింటా గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించామని, సన్న రకం వరి క్వింటాకు రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తామని తెలిపారు. కేంద్రాలను కాస్త ఎతైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల సౌకర్యార్థం తాగునీరు, నీడ, మూత్రశాలలు తదితర మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి కేంద్రంలో కచ్చితంగా 2 ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు, 30 టార్పాలిన్లు, 1 ప్యాడీ క్లీనర్ అందుబాటులో ఉంచాలని, ప్యాడీ క్లీనర్ లేకుంటే ట్రాక్టర్ మౌంటెడ్ ఫ్యాన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, కౌలు రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాలని తెలిపారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరు లారీల్లో తరలించాలని.. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని.. కొనుగోలు పూర్తయిన వెంటనే సంబంధిత రైతుకు తూకం వివరాలతో కూడిన కొనుగోలు పత్రం అందజేయాలని తెలిపారు. జిల్లాలో కేటాయించిన రైస్మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజు కొనుగోలు కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ, రైస్మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం సైదులు, డీసీఓ ప్రసాదరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పురపాలికల వారీగా ఇలా..
● నారాయణపేట మున్సిపాలిటీలో 9,306 ఆస్తులకుగాను రూ.3.82 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ముందస్తుగా 5 శాతం రాయితీతో చెల్లిస్తే రూ.19.10 లక్షల రాయితీపోను రూ.3.62 కోట్లు ఆదాయం సమకూరుతుంది. ● మక్తల్ పురపాలికలో 7,636 ఆస్తులకు రూ.2.14 కోట్లు వసూలు కావాల్సి ఉంది. 5 శాతం రాయితీతో రూ.10.70 లక్షలు పోను రూ.2.03 కోట్ల ఆదాయం సమాకూరుతుంది. ● కోస్గిలో 6,446 ఆస్తులుండగా.. రూ.2.09 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో 5 శాతం రాయితీ రూ.10.45 లక్షలు పోతే రూ.1.98 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● మద్దూర్లో 3,192 ఆస్తులుండగా.. రూ.53 లక్షలు పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో రూ.2.65 లక్షల రాయితీపోను రూ.50.35 ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోవాలి.. మున్సిపాలిటీలోని వివిధ సేవలకు సంబంధించిన పన్నులను క్యూఆర్ కోడ్, వాట్సప్ నంబర్తో చెల్లించవచ్చు. పుర ప్రజలు డిజిటల్ విధానంలో పన్ను చెల్లింపులు చేయాలని కోరుతున్నాం. ముందస్తు పన్ను చెల్లింపునకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఆస్తి పన్ను చెల్లించి పురపాలిక అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. – గోల్కొండ నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట ● -
పకడ్బందీగా ‘అరైవ్.. అలైవ్’
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించనున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తు, సెక్రటరీ (ప్లానింగ్) గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంక హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతపై అనేక చర్యలు చేపట్టినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల సంఖ్య పెరగడం, మెరుగైన రహదారులతో అధిక వేగం, సరైన డ్రైవింగ్ శిక్షణ లోపం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తదితర కారణాలు ప్రమాదాల పెరుగుదలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు వారం పాటు జరిగే అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచడం, బాధ్యతాయుత డ్రైవింగ్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 13న గ్రామస్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రమాణ స్వీకారం, 15న ‘చిల్డ్రెన్ రోడ్ సేఫ్టీ డే’ నాలుగేళ్లు పైబడిన పిల్లలకు సీట్బెల్ట్ వినియోగంపై అవగాహన, 16న ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక ప్రచారం, సోషల్ మీడియా ద్వారా అవగాహన, 17న ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సాయం కోసం గోల్డెన్ హవర్ శిక్షణ కార్యక్రమాలు, 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్, ప్రవర్తన మార్పు, ట్రాఫిక్ నియమాలు పాటించడం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మేఘాగాంధీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాం పటిష్ట భద్రత మధ్య ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీనుతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత, పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ... ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. వారి వెంట తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, కలెక్టరేట్ సి–సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి ఉన్నారు. -
క్రీడల్లో రాణించి దేశ కీర్తిని చాటాలి
నారాయణపేట: క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని.. క్రీడాకారులు క్రీడల్లో రాణించి భారతదేశ కీర్తిని చాటాలని, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల కో–ఆర్డినేటర్లకు క్రికెట్, వాలీబాల్ కిట్లును పంపిణీ చేశారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించడంతో పాటు క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు బ్యాటింగ్ చేశారు. సర్వీస్ చేసి వాలీబాల్ ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్, వాలీబాల్, ఖో–ఖో, కబడ్డీ పోటీలు మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్స్థాయిలో కొనసాగుతాయని చెప్పారు. మండలస్థాయిలో గెలుపొందిన జట్లు నియోజకవర్గస్థాయిలో.. అక్కడ గెలిచిన జట్లు పార్లమెంట్ స్థాయిలో ఆడుతారని, మహిళల విజేత జట్లకు ప్రత్యేక బహుమతులు ఉంటాయన్నారు. మొదటిసారి నాలుగు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి అన్నిరకాల పోటీలు నిర్వహించుకుందామని చెప్పారు. ఈ నెల 24న ముగింపు వేడుక మహబూబ్నగర్లో ఉంటుందని.. వేడుకకు గవర్నర్ హాజరై విజేత జట్లకు బహుమతులు అందజేస్తారని వివరించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు కేంద్ర నిధులతో కొనసాగుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్పార్టీ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లును ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని తగ్గించి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని.. కాంగ్రెస్ను గెలిపించి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రత్యర్థి దేశాలు కుట్రలు పన్నుతున్నాయని.. ప్రజలపై యుద్ధం ప్రభావం లేకుండా పాలన కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కేంద్ర పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయన్నారు. వికాసిత్ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జ్ ముచ్చర్లపల్లి జనార్దన్రెడ్డి, పేట జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రతంగ్పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొండయ్య, మున్సిపల్ చైర్మన్ కొండా శ్వేత, వైస్ చైర్మన్ మంజుల జీఆర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కుమార్, కౌన్సిలర్ సత్య రఘుపాల్రెడ్డి, నాయకులు రఘురామయ్యగౌడ్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మద్దూరులో సీఎంఓ ముఖ్య కార్యదర్శి
కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు పురపాలికలో గురువారం సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు పర్యటించారు. పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం, ప్రహరీ నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి అంచనాలను సిద్ధం చేసి నివేదిక పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంకన్న, సృషాఖాన్, ఆర్ఎం సంతోష్కుమార్, తహసీల్దార్ మహేష్గౌడ్, పుర కమిషనర్ శ్రీకాంత్, చైర్మన్ సరస్వతి జనార్దన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గూళ్ల నర్సింహులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు: ఎస్పీ నారాయణపేట: బాధితుల సౌలభ్యం కోసం తెలంగాణ పోలీసులు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ డా. వినీత్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానంలో బాధితులు పోలీస్స్టేషన్న్కు రావాల్సిన అవసరం ఉండదని.. ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి, అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో పోలీసులే వాంగ్మూలాన్ని వారి భాషలో రాసి చదివి వినిపించి సంతకం తీసుకొని అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రతిని అందజేస్తారని చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీనవర్గాల వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపర్చే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ, ఆస్తి సంబంధిత నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించారు. మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తామని.. అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారని చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. 11న భారీ ర్యాలీ పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ బలోపేతం దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ వెల్లడించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని సరోజిని రాములమ్మ ఫార్మసీ కళాశాలలో డ్రగ్ అబ్యూస్–డ్రగ్ అడిక్షన్ అనే అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న క్లాక్టవర్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ ఉంటుందని తెలిపా రు. అనంతరం శివమ్ కన్వెన్షన్ హాల్లో డ్రగ్ దుర్వినియోగం నివారణతో పాటు మరో ఏడు రకాల అంశాలపై అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా నకి లీ మందులు ఉంటే వెంటనే 180059 96969కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
‘ఏదుల’ ఉండగా.. ‘గొల్లపల్లి’ అనవసరం
వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడిచేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏదుల, వట్టెం, ఉదండాపూర్ వినియోగంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. వలసల జిల్లా సస్యశ్యామలం.. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.లగచర్లపునరావృతం అవుతుంది.. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచారయత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. కమీషన్ల కోసమే రిజర్వాయర్ నిర్మాణానికి ఆసక్తి 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు -
అవకాశాలు మెరుగు..
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీఎం ఇంటర్న్షిప్ ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేరుగా ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుపడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్ యాప్ ద్వారా విద్యార్థుల చదువులు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. పీయూ పరిధిలో చదువుతున్న వారిని కార్పొరేట్ సెక్టార్కు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ విద్యార్థులకు సువర్ణావకాశం... పీయూలో తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే పీయూలో ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్షిప్తో పాటు టీసీఐఎల్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఇందులో 32 వేలకు పైగా విద్యార్థులు చేరారు. పలువురు ఆన్లైన్ శిక్షణ పొందుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు
160 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ● జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 2.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం ● 51 రైస్మిల్లులకు ధాన్యం కేటాయింపులు ● రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు –8లో uనర్వ: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత శాఖల అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ఆయా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక సహకార సంఘం, మెప్మా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంట కోతల ఆధారంగా ఈ నెల రెండో వారం నుంచి కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 2,44,813 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. కాగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభం కాగానే మరిన్ని చెప్పించాలని సూచించారు. ప్రైవేట్ను ఆశ్రయించకుండా.. జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. పంట నూర్పిళ్లు ప్రారంభించే నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,380, సాధారణ రకం క్వింటాకు రూ.2,360 మద్దతు ధర నిర్ణయించారు. 4.37 లక్షల మె.ట. దిగుబడి.. జిల్లాలోని 13 మండలాల్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అంచనా ఉండగా 4,37,167 మెట్రిక్ టన్నుల పంట ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 1,92,354 మెట్రిక్ టన్నులు బయట మార్కెట్కు వెళ్లే అవకాశం ఉండగా.. మిగిలిన ధాన్యం పౌరసరఫరాలశాఖ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
జిల్లాలో ఇలా..
యాసంగి సాగు విస్తీర్ణం1.80 లక్షల ఎకరాలు దొడ్డురకం పంట దిగుబడి అంచనా 62,815 మెట్రిక్ టన్నులు దొడ్డురకం కేంద్రాలు48 సన్నరకం కేంద్రాలు 112మెప్మా కేంద్రాలు 4ఎఫ్పీఓ కేంద్రాలు 9సాధారణ రకం రూ.2,300 సన్నరకానికి బోనస్ రూ.500 అవసరమైన గన్నీ బ్యాగులు 61,20,325 -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: డీఈఓ
నారాయణపేట రూరల్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గిర్ జనార్దన్రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఉపాధ్యాయుడు ఫయాజుద్దీన్ కుటుంబానికి మంగళవారం సంఘం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జిల్లా విద్యాధికారి గోవిందరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కుటుంబ రక్షణకు ఏర్పాటుచేసిన సంఘ సంక్షేమనిధి నుంచి డబ్బులను చెక్కు రూపంలో అందించామన్నారు. భవిష్యత్లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, బాధిత కుటుంబ సభ్యులు కౌసర్ బేగం, ఫసియోద్దీన్, సంఘం నాయకుడు వాణిశ్రీ, జహీరుద్దీన్, రఘువీర్, సత్యనారాయణరెడ్డి, హనీఫ్, నరేష్, శ్రీనివాస్, అరవింద్, బాలాజీ పాల్గొన్నారు. -
త్వరలోనే ప్రారంభిస్తాం..
జిల్లాలో 160 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ నెల రెండో వారంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం. రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – సైదులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ, నారాయణపేట ● -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు ● టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ● ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు ● పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ● డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. విద్యార్థులు చదువు పూర్తయ్యాక ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్.. విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కళాశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తాము ప్రాక్టికల్గా సబ్జెక్టు, వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఆయా కంపెనీలు, సంస్థల్లో చేరి ఇంటర్న్షిప్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇంటర్న్షిప్ చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లో మార్కులు కూడా వేయనున్నారు. పేద విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదివేందుకు ఇది దోహదపడుతుంది. ఈ స్కీం ద్వారా ఇప్పటికే పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీటి ద్వారా నచ్చిన సంస్థల్లో ఇంటర్న్షిప్ చేయవచ్చు. డీట్తో ఉద్యోగాలు.. -
నిర్ణీత గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి
నారాయణపేట: రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ప్రభుత్వానికి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ మందిరంలో పౌరసరఫరాలసంస్థ డీఎం సైదులుతో కలిసి రైస్మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ డీటీలతో 2025–26 వానాకాలం సీఎంఆర్పై సమీక్ష నిర్వహించారు. 2025–26 యాసంగి వరి ధాన్యం కేటాయింపునకు బ్యాంకు గ్యారెంటీలు, ఒప్పందాలు సమర్పించాలని, అలాగే మిగిలిన గన్నీ బ్యాగులను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజు పాల్గొన్నారు. -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. వాడీవేడిగా చర్చ.. గత నెల ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సాగునీటిపారుదల శాఖ అధికారులతో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో జూరాల సేఫ్టీపై పెద్దఎత్తున వాడీవేడిగా చర్చ జరిగింది. డ్యాం సేఫ్టీని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీ అరుణకు కౌంటర్గా ప్రెస్మీట్ పెట్టి ఖండించారు. ఈ క్రమంలోనే డ్యాం సేఫ్టీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో జూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన బ్రిడ్జి నిర్మాణంతోపాటు బరాజ్ నిర్మాణం చేపట్టాలని హైదరాబాద్లో ఆదివారం జరిగిన సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీంతో బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపట్టాలని ఇందుకు సంబంధించి వెంటనే స్థల ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీచేశారు. వేగంగా మరమ్మతు.. జూరాల ఎగువ భాగాన బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణంతోపాటు ప్రాజెక్టు గేట్లు, రోప్ల మరమ్మతుకు సంబంధించి విడుదల చేసిన నిధులతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు జూరాల ప్రాజెక్టుకు మరమ్మతు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేలా చర్యలకు ఉపక్రమించారు. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
సమస్యల సంత..!
మరికల్: గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు తైబజారు పేరిట ప్రభుత్వం ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. కానీ వారాంతపు సంతలు, పశువుల మార్కెట్లో కనీసం మౌలిక వసతుల కల్పనలో పంచాయతీ పాలకవర్గాలు అశ్రద్ధ చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంతలకు ఆదరణ లేదంటూ వేలంపాట దారులు కుమ్మకై ్క తక్కువ పాట పాడుతూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోపక్క మేజర్ గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు తైబజార్ డబ్బుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. వారాంతపు సంతలు.. జిల్లాలోని 13 మండలాలు ఉండగా మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామాల్లో వారాంతపు సంతలు నిర్వహిస్తారు. నారాయణపేట, మక్తల్, మరికల్, కోస్గిలో జరిగే సంతలకు వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఏటా తైబజార్ వేలం నిర్వహిస్తారు. గతేడాది మరికల్ తైబజార్ వేలం జిల్లాలోనే అత్యధికంగా రూ.13 లక్షలు పలికింది. ఈ ఏడాది పాటదారులు కుమ్మకై ్క రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. ఈ డబ్బులను సంతలో వసతుల కల్పనకు వెచ్చించాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పక్కదారి పడుతున్నట్లు వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువు.. అధికారులు తైబజార్ వేలం నిర్వహణకు చూపుతున్న శ్రద్ధ వసతుల కల్పనపై చూపడం లేదు. సంతలకు వచ్చే చిరువ్యాపారులు, కొనుగోలుదారులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, నీడ, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. సంతలో కూరగాయలు విక్రయించేందుకు అత్యధికంగా మహిళ ఉంటారు. వీరు ఉదయం వచ్చి రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరికల్లో వారాంతపు సంత నిర్వహణకు ప్రత్యేక స్థలం లేదు. గతంలో పాత బస్టాండ్ దగ్గర నిర్వహించారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా.. అక్కడి నుంచి జాతీయ రహదారి, మాధవరం రోడ్డుకు మార్చారు. అక్కడ కూడా వాహనాల రాకపోకలతో ఇబ్బందులు కలుగుతుండటంతో బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్చారు. ఈ స్థలంలోనే కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు గత ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భూమి పూజ కూడా చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అలాగే ధన్వాడ, దామరగిద్ద, మక్తల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, కోస్గి, మద్దూరులో కూడా వారాంతపు సంతలు రోడ్లకు ఇరువైపునే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా పంచాయతీ కార్యదర్శులు మౌలిక వసతులు కల్పించకపోవడంతో అటూ వ్యాపారులు, ఇటూ కొనుగోలుదారులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాల కల్పనలోఅధికారులు విఫలం ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు తైబజార్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ వసతుల కల్పనపై లేదని ఆరోపణ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
గంపకు రూ.50 వసూలు..
వారాంతపు సంతలో గంపకు రూ.50 తీసుకుంటున్నారు. గంటల తరబడి ఎండలో కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్నాం. తాగునీరు, నీడ సౌకర్యం లేక పోవడంతో ఎండకు తట్టుకోలేక డబ్బులు పెట్టి నీళ్లు కొని తాగుతున్నాం. కొనుగోలుదారులు కూడా మాలాగే ఇబ్బందులు పడుతున్నారు. సంతలో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలి. – శంకరమ్మ, చిరు వ్యాపారి, తీలేరు తాగునీటి వసతి లేదు.. ఎన్నో ఏళ్లుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ సంతలో కూరగాయలు విక్రయిస్తున్నా. వేసవిలోనైనా తాగునీటితో పాటు నీడ సౌకర్యం కల్పించాలని కార్యదర్శి విన్నవించినా పట్టించుకోవడం లేదు. చేసేది లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడుగు పట్టుకొని వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – రాములు, కూరగాయల వ్యాపారి, మరికల్ కనీస సౌకర్యాలు కల్పిస్తాం.. వారాంతపు సంతల్లో తాగునీటితో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తాం. నీడ కోసం టెంట్లు వేసే నిబంధన తైబజార్ వేలంలో లేదు. కనీస వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. – సుధాకర్రెడ్డి, డీఎల్పీఓ, నారాయణపేట ● -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● మొర్రం, మట్టి రవాణాకు ఆన్లైన్ అనుమతి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘మన ఇసుక.. మన వాహనం’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఇసుక మన వాహనం ఆన్లైన్ విధానంలో జిల్లాలో ఇసుక రవాణా జరగాలని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన ఐదు రీచ్ల నుంచి ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయాలన్నారు. కోస్గి, మాగనూరు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఎక్కడా జరగడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. తహసీల్దార్లు, ఎస్ఐలు, ఎంపీడీఓలు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఇవ్వాలని.. మొర్రం, మట్టి రవాణాకు సైతం ఆన్లైన్లోనే అనుమతి ఇచ్చేలా త్వరలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఎస్పీ డా. వినీత్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నష్టం కలగకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందితే దాడులు చేసి వాహనాలను సీజ్చేసి పోలీసుస్టేషన్కు తరలించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన ఇసుక మన వాహనం దరఖాస్తు ప్రక్రియను వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, జిల్లాలోని మూడు సర్కిళ్ల సీఐలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్ఐలు, మైనింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులను పరిశీలించిన రాష్ట్ర బృందం
ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో కొనసాగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను సోమవారం రాష్ట్ర బృందం పరిశీలించింది. ప్రోగ్రాం అధికారి మురళి ఎన్ఎంఎంఎస్లోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని మస్టర్ డౌన్లోడ్, పని ప్రదేశంలో కూలీల హాజరు, ఫొటో అప్లోడ్ను స్వయంగా చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడి హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంసాన్పల్లిలో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. వారి వెంట డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ సురేందర్రెడ్డి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు కోర్టులో చలివేంద్రం ప్రారంభం
పాలమూరు: వేసవి కాలం నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే ప్రజలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ చలివేంద్రం సేవలు వినియోగించుకోవాలన్నారు. తాగునీరు సకాలంలో అందుబాటులో ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, శ్రీదేవి, రాధిక, రాజా రాజేశ్వరి, మమతారెడ్డి, రవిశంకర్, మునవార్ హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు పాల్గొన్నారు. ●జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సోమవారం కేజీబీవీలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులతో పాటు బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. అనంతరం శిశు గృహను సందర్శించి వేసవి నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చిన్నారుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశంపై పరిశీలించారు. -
కాంగ్రెస్లో కోల్డ్వార్!
ముఖ్య నేత వర్సెస్ డీసీసీ వర్గాలు ● కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చీలిక ● కాంగ్రెస్ కార్యాలయం మెట్లెక్కని పలువురు నాయకులు ● హైకమాండ్కు పోటాపోటీగా పరస్పర ఫిర్యాదులు ● నేడు టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ రాక ● ఇరువురు నేతలు, వారి వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా? ● ‘హస్తం’ శ్రేణుల్లో జోరుగా చర్చ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకరేమో జిల్లాస్థాయిలో పార్టీ పరమైన కార్యకలాపాలను పర్యవేక్షించే నేత. మరొకరేమో అదే పార్టీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్కారు పథకాలను ప్రజలకు చేరవేయడం, పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెట్టే హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి. ఇరువురు అధికార కాంగ్రెస్కు చెందిన వారే. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా ఆ ఇద్దరు కీలకం. కానీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు రచ్చకెక్కగా.. నిన్నమొన్నటి వరకు ఇరువర్గాల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇరు నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. వర్గాల వారీగా నాయకులు చీలిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం తొలిసారిగా మహబూబ్నగర్కు రానుండగా.. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రమక్రమంగా ఆధిపత్య పోరు.. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం సీనియర్ నేత, ముదిరాజ్ వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలు పలువురు భిన్నస్వరాలు విన్పించగా.. ఇవే విభేదాలకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇరువర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల్లో బట్టబయలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేష న్ ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలు, వారి అనుచరుల మధ్య అంతర్గ త విభేదాలు రచ్చకెక్కాయి. డివిజన్లలో కా ర్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు టికెట్ల కేటాయింపు వరకు వర్గాల వారీగా నేతలు తమతమ అ నుచరుల కోసం పోటాపో టీ రాజకీయాలకు తెరలేపారు. ప్రచారపర్వంలో సైతం ఆయా వర్గాల నేతలు వేర్వేరుగానే పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేషన్ పీఠాన్ని కై వసం చేసుకోగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తొలి నుంచి మేయర్ రేసుల్లో ఉన్న ప్రసన్న ఆనంద్ గౌడ్ను కాదని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమాల మమత శ్రీనివాస్ పేరు తెరపైకి తేవడం పార్టీలో అలజడి సృష్టించింది. చివరకు ఆమెనే మేయర్గా, డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్రెడ్డి ఎన్నిక కావడంతో పార్టీలో ఇరువర్గాల నేతల మధ్యదూరం మరింత పెరిగినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పలువురు నేతలు బహిరంగంగానే వెల్లడించారు. ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని.. పలువురి ఓటమికి వారే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యనేత వర్గీయులు పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం. పార్టీని దెబ్బతీసేలా కొందరు యత్నించారని.. ప్రజల్లో బలం లేదని తెలిసినా వారినే నిలబెట్టి వారి ఓటమికి వారే కారకులయ్యారని...అధిష్టానం సూచించిన వారికి పదవులు ఇవ్వకుండా.. ఆధిపత్య ధోరణితో వ్యక్తిగత ఎజెండాను అమలు చేశారని ఎదుటి వర్గం నేతలు పీసీసీ పెద్దలకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. -
‘ఫీజు రీయింబర్స్మెంట్’ రద్దుకు ప్రభుత్వం కుట్ర
మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కుట్రలు చేస్తోందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై భారం మోపాలనే ఆలోచనకు రావడం దుర్మార్గమైన చర్యన్నారు. మరోవైపు చాలా ప్రైవేటు కళాశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయని.. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని.. లేనిచో బీసీ జాగృతిసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నరేందర్, కేశవులు, శివకుమార్, భాస్కర్, నవీన్, వీరేశ్ ఉన్నారు. -
పారాక్వాట్పై నిషేధం
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర రసాయన పురుగు మందుగా గుర్తించిన పారాక్వాట్, ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్రభావంతో 60 రోజుల పాటు పూర్తి నిషేధం విధించింది. అన్ని దశల్లో నిషేధం అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వంటి అన్ని దశల్లో పారాక్వాట్పై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇన్సక్టిసిడ్స్ యాక్ట్– 1968 ప్రకారం అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుదిట్టంగా అమలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఇన్పుట్ డీలర్లు, పురుగు మందుల దుకాణాలపై ప్రత్యే క తనిఖీలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. రైతులకు అవగాహన ప్రతి గ్రామంలో రైతులకు పారాక్వాట్ ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఈ రసాయన వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, భద్రమైన ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. హానికర రసాయనం పారాక్వాట్ మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల దెబ్బతినడం, లంగ్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అదే విధంగా కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విష ప్రభావం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. పర్యావరణానికి ముప్పు పారాక్వాట్ కారణంగా పశువులు, పక్షులు విష ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. నేల నాణ్యత తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. రైతుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణే లక్ష్యం -
ఉత్సాహంగా ‘అథ్లెటిక్స్’ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: హనుమకొండలో ఈనెల11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళలకు ఆయా అథ్లెటిక్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్కుమార్, సునీల్కుమార్, శ్రీనివాస్, పీడీలు రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పాత నేరస్తుడే హంతకుడు..!
నారాయణపేట రూరల్: ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, హతమార్చిన కామాంధుడు కటకటాలపాలయ్యాడు. వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కేసును పోలీసులు చేధించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డా.వినీత్ వెల్లడించారు. నారాయణపేట మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన శిరీష, ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటుండగా.. వారి కుమార్తె తేజశ్రీ (5) గ్రామంలోనే నాయనమ్మ, తాతతో కలిసి నివాసం ఉంటుంది. గతనెల 31న రాత్రి భోజనం అనంతరం చిన్నారితో కలిసి అవ్వ, తాత ఆరుబయట నిద్రించగా.. అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులు మద్యం తాగి అటువైపు వచ్చాడు. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి, సమీపంలోని చెరువు కట్టపై పాడేశాడు. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న పట్టీలను తీసుకుని.. ఇది దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి పొలం పనులు పూర్తిచేసుకుని అటుగా వస్తున్న రైతులు చంద్రప్ప, కేశవులు అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని గమనించి.. గ్రామస్తులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డీఎస్పీ లింగయ్య, సీఐ శివకుమార్, ఎస్ఐ గాయత్రి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎస్పీ వినీత్.. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేశారు. చిన్నారి మృతదేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టు ఆధారంగా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ బృందాలు పాత నేరస్తుల జాబితాను పరిశీలించి.. గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులును అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చేసిన తప్పును ఒప్పుకొని జరిగిందంతా పోలీసులకు వివరించారు. అతడి నుంచి కాళ్ల పట్టీలను రికవరీ చేశారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. కాగా, నిందితుడు నర్సింహులుకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు సైతం ఆయనతో కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లారు. అతడు 2014లో ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బెయిల్పై బయటకు వచ్చిన అతడు.. మార్చి 31న అర్ధరాత్రి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, సతీశ్కుమార్రెడ్డి ఉన్నారు. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చిన కామాంధుడు 48 గంటల్లోనే నిందితుడినిపట్టుకున్న పోలీసులు చిన్నారి కాళ్ల పట్టీలు స్వాధీనం వివరాలు వెల్లడించిన నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
గొప్ప సంఘ సంస్కర్త.. : ఎస్పీ
అణగారినవర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త, విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలక సేవలందించిన గొప్ప వ్యక్తి, కులరహిత సమాజం, సామాజిక సమా నత్వానికి పోరాడిన ఆదర్శ నేత దేశ మొదటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ సేవలు మరువలేనివని ఎస్పీ డాక్టర్ వినీత్ కొనియాడారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు ఆయన హాజరై పోలీసులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సోదరభావం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు విజయభాస్కర్, సురేష్, శివశంకర్, శిరీష, ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు పాల్గొన్నారు. -
అగ్గి.. రాజుకుంటే బుగ్గే
● 13 స్టేషన్లు.. 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. ● పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ● ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం ● కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి అగ్ని ప్రమాదాలు 112 మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు.. బుల్లెట్లు ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేరుకుంటేనే.. వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. దూరభారంతో నష్టం.. ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు -
కృష్ణా జలాలు వినియోగించుకుందాం
కృష్ణా: కృష్ణా జలాలను పంటల సాగుకు సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం రాయిచూర్లో కర్ణాటక మైనర్ ఇరిగేషన్శాఖ మంత్రి బోసురాజుతో పాటు ఆ శాఖ అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. ప్రధానంగా కృష్ణానదిపై కొల్పూర్ గ్రామం వద్ద నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి బ్యారేజీ, అదేవిధంగా కుసుమర్తి సమీపంలో బ్రిడ్జి కం బ్యారేజీ విషయమై వారితో ప్రాథమిక చర్చలు జరిపినట్లు వివరించారు. భవిష్యత్లో ఈ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీరేందుకు అవకాశం ఉంటుందని, ఇందుకుగాను తమ ప్రభు త్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరిస్తుందని అధికారులు వివరించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ నాయకులు ఆనంద్గౌడ్, శివరాంరెడ్డి, నాగేందర్, శంకర్గౌడ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో జాప్యం సరికాదు : ఎమ్మెల్యే
మదనాపురం: మదనపురం–కొత్తపల్లి మధ్య ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని.. నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని, రాజీ పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో చేపట్టే పనులు వారికి శాశ్వతంగా ఉపయోగపడాలన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల ఇంజనీర్లు ఉన్నారు. -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. పాలమూరు నగరంలో మున్సిపల్ బావి సైతం అందుబాటులో ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమ లు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమా దం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచే స్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
అందరికీ స్ఫూర్తి బాబు జగ్జీవన్రామ్
నారాయణపేట: దేశ మాజీ ఉప ప్రధాని, సమతా వాది బాబు జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ స్ఫూ ర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతీ క్ జైన్ కోరారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజా వాణి సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో అర్ధ శతాబ్ధానికి అగ్రశ్రేణి నేత గా శాసన సభ్యత్వంతో మొదలు దేశ ఉప ప్రధా ని వరకు ఎన్నో పదవులు నిర్వర్తించాలని గుర్తుచేశారు. మొద టి న్యాయ, కార్మికశాఖ మంత్రిగా పనిచేసి చేసిన సంస్కరణలు అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యతోనే తనకు కలెక్టర్గా గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని.. అనుకుంటే ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధనకు నిరంతరం కృషి చేయా లని సూచించారు. తాను కొత్తగా వచ్చానని.. జిల్లాలోని అన్ని వసతి గృహాలను సందర్శిస్తానని చెప్పారు. వసతిగృహాల్లో ప్ర తి వారం విద్యార్థులకు సందేశాత్మక సినిమాలను చూపించాలని, మూవీ క్లబ్ను అమలు చేయాలన్నారు. అనంతరం వసతిగృహ విద్యార్థినులతో జగ్జీవన్రామ్ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పించారు. అభినందించి రాత పుస్తకాలు, పెన్ను లు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, కౌన్సిలర్లు మహేష్, రాజేష్, భరత్, ఏఎస్డబ్ల్యూఓ పరమేశ్, సింగిల్విండో డైరెక్టర్ సంక్లాపురం మల్లేష్, దళిత సంఘాల నాయకులు మొచ్చ శరణప్ప, సూర్యకాంత్, పరిగి రమేష్ ఈశ్వరమ్మ, మహదేవ్, ఎస్సీ వసతిగృహాల వార్డెన్లు, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
‘కో–ఆప్షన్’ సందడి
దరఖాస్తుల స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు నారాయణపేట: పురపాలికల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం ఉంటుంది. నారాయణపేట, మద్దూరు పురపాలికల్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు సోమవారం సాయంత్రం గడువు ముగియనుంది. సాయంత్రం 5లోగా పుర కార్యాలయములో సమర్పించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ఎన్నిక పూర్తి చేశారు. మద్దూరులో ఆరుగురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు ఉపసంహరించుకోవడంతో మిగిలిన నలుగురు ఖరారైనట్లే. పేటలో కమలం కసరత్తు.. జిల్లాలోని మూడు పురపాలికలను అధికారంలో ఉన్న కాంగ్రెస్పార్టీ కై వసం చేసుకోగా.. నారాయణపేటలో కమలం పాగ వేసింది. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి అవకాశం దక్కని వారికి కో–ఆప్షన్ భరోసానిచ్చి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పావులు కదిపింది. ప్రస్తుతం ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు పోటీ పడుతున్నారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్, కో–ఆప్షన్ సభ్యులుగా అనుభవం ఉన్న వారే అర్హులనే నిబంధన ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ స్థానాలను త్యాగం చేసిన 1వ వార్డు మాజీ కౌన్సిలర్ అనూష, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ జయశ్రీ సైతం తమకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ కొండ శ్వేత సత్యయాదవ్ నాలుగో వార్డు నుంచి గెలుపొందారు. మున్సిపాలిటీలో దాదాపు అందరూ కొత్తవారే ఉండటంతో బీజేపీ తరఫున 2014లో వైస్ చైర్మన్గా పనిచేసిన నందూనామాజీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని పార్టీ శ్రేణులు చర్చించినట్లు సమాచారం. ముస్లిం మైనార్టీ కోటాలో జమీర్ పాషా, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్తో పాటు పలువురు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి సూచనలతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కుమార్ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ ఎన్నిక పూర్తయింది. మంత్రి తనదైన శైలిలో ఎన్నిక పూర్తి చేయించడంలో సఫలీకృతులయ్యారు. కో–ఆప్షన్ సభ్యులుగా మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్, సరస్వతిబాయి, మాజీ కో–ఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, హసీనాబేగం ఉన్నారు. మద్దూరు పురపాలికలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కృష్ణయ్య, ఖయ్యూం, రొయ్యల నర్సమ్మ, శంకర్నాయక్, రబియాబేగం దరఖాస్తు చేసుకున్నారు. కాగా కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి సూచన మేరకు ఆ పార్టీ ఆశావహులు సోమవారం దరఖాస్తు చేసుకోనున్నారు. మంత్రి ఇలాక మక్తల్లో పూర్తి కోస్గిలో అభ్యర్థులు ఫైనల్ నారాయణపేట, మద్దూర్లో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ సీఎం ఇలాకాలోని కోస్గి పురపాలికలో నలుగురు కో–ఆప్షన్ సభ్యులను సోమ వారం ఎన్నుకోనున్నారు. పుర పాలకలో అనుభవం ఉన్న సభ్యుల నుంచి 4, మైనార్టీ సభ్యుల నుంచి 2 మొత్తం 6 నామి నేషన్లు వచ్చాయి. వాటిలో ఇద్దరు ఉపసంహరించుకోగా గందె ఓంప్రకాష్, వసంతమ్మ, సయ్యద్ అబ్దుల్ సలీం, అష్రఫ్ బేగం మిగిలారు. సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. 15 ఏళ్లుగా 108 వాహ నం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చా లా ప్రమాదాలు జరుగు తుంటాయి. నిరంత రం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలంది స్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట ఎందరో ప్రాణాలు కాపాడా.. 108 వాహనంలో టెక్నీషియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట సద్వినియోగం చేసుకోండి.. 108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహ నం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ , మహబూబ్నగర్ ● -
మహిళల భద్రత.. అందరి బాధ్యత
నారాయణపేట: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, తక్షణ సాయం అందించడం పోలీస్శాఖ ముఖ్య బాధ్యతని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. శనివారం సఖి బృందం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మహిళల భద్రత, అవగాహన పెంపునకు రూపొందించిన వాల్పోస్టర్ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గృహహింస, వరకట్నం, పనిచేసే చోట వేధింపులు, లైంగిక దాడులు, బాలికల అక్రమ రవాణావంటి ఘటనలను అరికట్టేందుకు పోలీస్శాఖ, మహిళా సంక్షేమ విభాగం సమన్వయంతో పని చేస్తోందని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవతో పాటు బాధితులకు కౌన్సిలింగ్, న్యాయ సాయం, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే సఖి సిబ్బంది బాధితుల వద్దకే చేరుకుంటారన్నారు. 24 గంటలు అందుబాటులో ఉన్న సఖి కేంద్రాన్ని ఫోన్నంబర్ 08506–295181 లేదా టోల్ఫ్రీ నంబర్ 181ను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్లైన్ 181, సఖి (వన్ స్టాప్ సెంటర్) సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ క్రాంతిరేఖ, కేస్ వర్కర్ చంద్రకళ, పారా మెడికల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డా. వినీత్ -
81,546 మంది వినియోగం..
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉమ్మడి జిల్లాలోని 71 వాహనాల్లో 81,546 మందిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ప్రజల మన్ననలు పొందారు. కేసులు బాధితులు ప్రసవాలు 18,739 అత్యవసర వైద్యసేవలు 14,900 రోడ్డు ప్రమాదాలు 8,712 కడుపునొప్పి 8,445 శ్వాసకోస సమస్యలు 6,464 అంతర్గత కారణాలతో 4,740 గుండె సంబంధిత సమస్యలు 4,734 అపస్మారక స్థితి 4,103 పురుగుమందు తాగినవారు 3,515 మూర్చ వ్యాధిగ్రస్తులు 2,638 ఆత్మహత్య 1,790 వన్యప్రాణుల ప్రమాదాలు 1,527 పక్షవాతం 1,003 అగ్నిప్రమాదాలు 230 ఉమ్మడి జిల్లాలో ఇలా.. -
క్రీడా ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యం
● ఏప్రిల్ 9 నుంచి 24 వరకు ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ● ఎంపీ డీకే అరుణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో శిక్షణ పొందడం అదృష్టం
నారాయణపేట: జిల్లాలో శిక్షణ పొందడం అదృష్టంగా భావిస్తున్నానని శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ కలెక్టర్ వీడ్కోలు సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ప్రతీక్జైన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్గౌడ్, జిల్లా అధికారులు పాల్గొని పూలమాల, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో ప్రణయ్కుమార్ చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని కొనియాడారు. ముఖ్యంగా నర్వ యాస్పిరేషన్ బ్లాక్లో చేపట్టిన కార్యక్రమాలు, ఆలోచనలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం అభినందనీయమన్నారు. భవిష్యత్లో ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా నారాయణపేటను మరవొద్దని కోరారు. అనంతరం ప్రణయ్కుమార్ మాట్లాడుతూ.. బదిలీపై వెళ్లిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీఓ, ఇతర అన్నిశాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, సూపరింటెండెంట్ జయసుధ, డీపీఆర్వో రషీద్, ఎస్పీకార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీటీ అఖిల ప్రసన్న, నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, మక్తల్ తహసీల్దార్ సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య పోరాటం ఆదర్శనీయం
నారాయణపేట: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్ఓ రషీద్ అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ శ్రీధర్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సమాన త్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డెన్లు రేణుక, మంజుల, జ్యోతి, అన్వేష్, ముస్తఫా, శివ పాల్గొన్నారు. -
పంటలు పండడం లేదు..
కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా.. మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయికాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్ రైతు మా చెరువులోకి కాల్వ తీస్తే ఊరుకోం.. మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. గతంలో పొల్యుషన్ బోర్డు వాళ్లు వచ్చి కళ్లారా చూశారు. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి ● -
విద్యార్థి సామర్థ్యం ఎంత?
నారాయణపేట రూరల్: ప్రాథ మిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాల పెంపు, చతుర్విధ ప్రక్రియలో రాణించడానికి మూడేళ్లు గా ప్రభుత్వం ఎఫ్ఎల్ఎన్ (తొ లిమెట్టు) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చి న్నారుల్లో తెలుగు, ఆంగ్లం భాష లో చదవడం, రాయడంతో పాటు గణితంలో కూడికలు, తీసివేతలు చేయడం ఎలా ఉందనే విధానాన్ని పరీక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్) పేరుతో మార్చి 30, 31 తేదీల్లో చేపట్టిన సర్వే చేసేందుకు జిల్లాలో బీఈ డీ, డీఎడ్ విద్యార్థులను ఎంపిక చేశారు. 2022లో సీబీఎస్ఈ ఆధ్వర్యంలో బేస్లైన్ సర్వే పేరిట జిల్లావ్యాప్తంగా 123 పాఠశాలల్లో దీన్ని చేపట్టారు. తాజాగా ఎన్సీఈఆర్టీ పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 18 పాఠశాలలను ఎంపిక చేసి మరోసారి సర్వే నిర్వహించారు. ఇందుకుగాను జిల్లా స్థాయిలో డీఆర్పీలను ఎంపిక చేసి హైదరాబాద్లో శిక్షణ సైతం ఇచ్చారు. సామర్థ్యాల పెంపే లక్ష్యం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్ాధ్యలు అంచనా వేసినందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రతి విద్యార్థి సొంతంగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు సాధించేలా కృత్యాధార బోధన కొనసాగేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న బోధన, చిన్నారుల చదువులు ఎలా సాగుతున్నాయో గుర్తించేందుకు మూడో తరగతి విద్యార్థులతో సర్వే చేపట్టింది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో రెండు రోజులపాటు ఈ ప్రక్రియ నిర్వహించారు. సర్వేలు తేలిన అంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలు మరింత మెరుగైన బోధనా ప్రక్రియ నిర్ణయించనున్నారు. సర్వే కొనసాగింది ఇలా.. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ సర్వే నిర్వహించారు. విద్యార్థులు ఇందులో ప్రతిభ చాటేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మాదిరి పరీక్షలు నిర్వహించింది. గత డిసెంబర్లో మొదటిసారి, జనవరిలో రెండోసారి, ఫిబ్రవరిలో మూడోసారి మాదిరి పరీక్షలు నిర్వహించారు. ఇక ఫైనల్ పరీక్షకు గాను అంత సిద్ధం చేసి జిల్లా కేంద్రం సమీపంలో గల బీఈడీ కళాశాల ఛాత్రోపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. ఆయా ఛాత్రోపాధ్యాయులు సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో సర్వే చేపట్టారు. బొమ్మను చూపిస్తూ మాట్లాడించడం, తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలను గుర్తించి చదవడం, అదేవిధంగా అక్షరాలు, పదాలు రాయించడం, గణితంలో కూడిక, తీసివేత, గుణాకారం, భాగాహారం సంబంధిత సామర్థ్యాలను పరీక్షించారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలో మౌఖిక సామర్థ్యం, అక్షరాలు, పదాలు, వాక్యాలు ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం వంటి వాటిని పరిశీలించారు. ప్రతి పాఠశాలలో 8 నుంచి 10 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలు మొబైల్ యాప్లో నమోదు చేశారు. సర్వే వివరాలు మూడో తరగతి చిన్నారులకు ఎఫ్ఎల్ఎస్ పరీక్షల నిర్వహణ జిల్లాలో రెండు రోజులపాటు కొనసాగిన సర్వే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఛాత్రోపాధ్యాయులు ఆన్లైన్ పోర్టల్లో వివరాల నమోదు 18 పాఠశాలల ఎంపిక -
భక్తిశ్రద్ధలతో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠానోత్సవం
దామరగిద్ద: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శిరిడి సాయిబాబ ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్ఠాననోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. సాయి నామస్మరణతో గ్రామం మార్మోగింది. ఆలయ నిర్మాణ దాత వన్నాడ వెంకటప్ప విజయలక్ష్మి దంపతుల సమక్షంలో జరిగిన ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వేదపండితుల సమక్షంలో శిరిడి సాయిబాబ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. కాసా మఠం గుర్మిట్కల్ శ్రీ శాంతవీర మృగ రాజేంద్రస్వామి, మల్కేడ్ కోటేశ్వర శివాచార్య స్వాములు, అంద్రికే లింగప్పతాత, శ్రీశైలం రుద్రస్వాములు ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహాబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సీంజీవ్కుమార్, నారాయణపేటకు చెందిన బీస్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్కుమార్రెడ్డి హాజరై ఆలయ నిర్మాణ దాత వన్నాడ వెంకటప్పను శాలువాతో సత్కరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. -
జాతర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి
కొత్తపల్లి: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన బావోజీ జాతర సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు వేడుకలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ రియాజుల్హక్ సూచించారు. బావాజీ జాతరకు అదనపు ఎస్పీతో పాటు, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మొత్తంగా 150 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జాతరలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్ జరగకుండా మఫ్టీలో పోలీసులు నిరంతరం గస్తీ చేయాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘టాస్’ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి
నారాయణపేట రూరల్: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసుకునే విద్యార్థుల సౌకర్యార్థం టాస్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. బుధవారం డీఈఓ గోవిందరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సుమారు 400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వీరందరూ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రానికి రావడానికి రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గతంలో మక్తల్లో పరీక్షా కేంద్రం ఉండేదని, రద్దు చేసిన పరీక్షా కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సూర్యచంద్ర, హైమావతి, అశోక్ పాల్గొన్నారు. ‘పారాక్వాట్’ కలుపు మందుపై నిషేధం నారాయణపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 24 ప్రకారం ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్ అనే కలుపు మందును రాష్ట్రంలో నిషేఽ దించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారాక్వాట్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం అని, పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా తాగితే ప్రాణాపాయం కలిగిస్తుందన్నారు. ఇందుకు సంబధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యేక వైద్యం లేదన్నారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా వాడటం వలన క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతున్నట్లు శాసీ్త్రయంగా నిర్ధారించారని తెలిపారు. ఇప్పటి నుంచి పారాక్వాట్ నిల్వ చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, వినియోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యా క్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నా లు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. పోలీస్ హెచ్చరికలను అతిక్రమిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాల ను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఏవైనా కార్యక్రమాలు జరపాలనుకుంటే ముందస్తు దరఖాస్తు చేసుకొని, పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. హనుమాన్ శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు జిల్లా పరిధిలో నిర్వహించనున్న 62 హనుమాన్ శోభాయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. హనుమాన్ శోభాయాత్రల సందర్భంగా ప్రధాన చౌరస్తాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామని, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించేందుకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ర్యాలీల సమయంలో వీడియో రికార్డింగ్ నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.


