Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

New Zealand beat West Indies by 323 runs in 3rd test1
వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం

మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 462 పరుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 138 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.43/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన కరేబియన్‌ జట్టు.. 95 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే మొత్తం ప‌ది వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌల‌ర్ల ధాటికి విండీస్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. ఓపెనర్‌ బ్రాండెన్‌ కింగ్‌(67) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ మరోసారి 5 వికెట్లతో సత్తాచాటగా.. అజాజ్‌ పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టారు.దుమ్ములేపిన ఓపెనర్లు..ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్‌(137) కదం తొక్కాడు. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ ఓపెనర్లు దంచికొట్టారు. కాన్వే(101), లాథమ్‌(101) సెంచరీలతో మెరిశారు. దీంతో కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను 306/2 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్‌ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్‌ క్యాప్స్‌ ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించలేక కరేబియన్ జట్టు చతకిల పడింది.కాన్వే, లాథమ్‌ 879 పరుగులు... ఈ సిరీస్‌లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి డెవాన్‌ కాన్వే 75.3 సగటుతో 452 పరుగులు (0, 37, 60, 28, 227, 100) చేయగా... టామ్‌ లాథమ్‌ 71.1 సగటుతో 427 పరుగులు (24, 145, 11, 9, 137, 101) చేశాడు. "వాళ్ల (లాథమ్, కాన్వే) కష్టానికి ప్రతిఫలం ఇది. చాన్నాళ్లుగా వాళ్లు ఇలాంటి ప్రదర్శన చేసేందుకు కఠోర సాధన చేస్తున్నారు. మెండైన ఆత్మవిశ్వాసం వల్లే ఇది సాధ్యం. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించారు. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది" అని న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ ల్యూక్‌ రోంచీ అన్నాడు.చదవండి: IND vs SL: చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా

Ayush Mhatre reflects on Indias disappointing loss against Pakistan2
మేము అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదు.. కానీ గర్వంగా ఉంది: మాత్రే

అసియాకప్ టైటిల్‌ను తొమ్మిదోసారి ముద్దాడాల‌నుకున్న భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు నిరాశే ఎదురైంది. అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ 2025 టోర్నీలో అజేయంగా ఫైన‌ల్‌కు చేరిన భార‌త జ‌ట్టు.. తుది మెట్టుపై బోల్తా ప‌డింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో భారత జట్టు 191 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ చేతిలో ఓడింది. గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌పై అలవోక విజయం సాధించిన యంగ్‌ ఇండియా... ఫైనల్లో అదే జోరు కనబర్చడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. అత‌డితో పాటు ఉస్మాన్‌ ఖాన్‌ (35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు.బౌలర్లలో దీపేశ్ మూడు వికెట్లు పడగొట్టగా... హెనిల్‌ పటేల్, ఖిలాన్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దీపేశ్‌ దేవేంద్రన్‌ (16 బంతుల్లో 36; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... 14 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుగైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.పాకిస్తాన్‌ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్‌ సయ్యమ్, అబ్దుల్‌ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు తీశారు. సమీర్‌ మన్హాస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఈ ఓటమిపై భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే స్పందించాడు. పాకిస్తాన్ అద్భుతంగా ఆడిందని, ఈ మ్యాచ్‌లో తమకు ఏది కలిసిరాలేదని అతడు చెప్పుకొచ్చాడు."టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. కానీ మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. మాకు ఏది కలిసిరాలేదు. ఫీల్డింగ్‌లో మాకు ఇది బ్యాడ్ డే. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ప్రత్యర్ధి జట్టు మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ కూడా బాగా చేశారు. మా బౌలర్లను సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు.వారు తమ ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నాము. కానీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాము. అయితే ఓటమి ఎదురైనప్పటికి మా జట్టుకు చాలా సానుకూల అంశాలు లభించాయి. టోర్నీ అసాంతం మా బాయ్స్ బాగా ఆడారు. ఈ టోర్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము" అని మాత్రే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా

Smriti Mandhana becomes fastest batter to score 4000 runs in Womens T20Is3
చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త సాధించింది. అంత‌ర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని అత్యంత‌వేగంగా అందుకున్న మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం వైజాగ్ వేదికగా శ్రీలం‍కతో జరిగిన తొలి టీ20లో మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది.స్మృతి ఈ రికార్డును కేవలం 3227 బంతుల్లోనే అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ 3675 బంతుల్లో ఈ ఘనత సాధించింది. తాజా ఇన్నింగ్స్‌తో కివీ ఓపెనర్‌ను స్మృతి అధిగమించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో 29.90 సగటుతో 4007 పరుగులు చేసింది.ఆమె అత్యధిక వ్యక్తిగా స్కోర్‌గా 112 పరుగులగా ఉంది. అయితే మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సుజీ బేట్స్‌(4716) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో మంధాన(4007), హర్మన్‌ప్రీత్ కౌర్‌(3657) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు శ్రీలంక బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు. అనంతరం 122 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమిమా కేవలం 44 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.చదవండి: నితీశ్‌ రెడ్డి సారథ్యంలో...

The singles winners are An Se young and Christo Popov4
సింగిల్స్‌ విజేతలు ఆన్‌ సె యంగ్, క్రిస్టో పొపోవ్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ సింగిల్స్‌ విభాగంలో ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా), క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) విజేతలుగా నిలిచారు. చైనాలోని హాంగ్జౌలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. 96 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌ 21–13, 18–21, 21–10తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది ఆన్‌ సె యంగ్‌కిది 11వ టైటిల్‌ కావడం విశేషం. 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ తుది పోరులో ప్రపంచ 8వ ర్యాంకర్‌ క్రిస్టో పొపోవ్‌ 21–19, 21–9తో ప్రపంచ నంబర్‌వన్‌ షి యు కి (చైనా)పై విజయం సాధించాడు. తద్వారా వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోరీ్నలో టైటిల్‌ నెగ్గిన తొలి ఫ్రాన్స్‌ ప్లేయర్‌గా పొపోవ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ టైటిల్‌ గెలిచే క్రమంలో పొపోవ్‌ ప్రపంచ 2వ ర్యాంకర్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌), ప్రపంచ 3వ ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌), ప్రపంచ 5వ ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)లను ఓడించడం విశేషం. విజేతలుగా నిలిచిన ఆన్‌ సె యంగ్, క్రిస్టో పొపోవ్‌లకు 2,40,000 డాలర్ల (రూ. 2 కోట్ల 14 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.

Andhra cricket team announced for Vijay Hazare Trophy5
నితీశ్‌ రెడ్డి సారథ్యంలో...

సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్‌ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్ర జట్టుకు భారత క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి సారథ్యం వహిస్తాడు. ఆంధ్ర జట్టు తమ మ్యాచ్‌లను బెంగళూరులో ఆడుతుంది. గ్రూప్‌ ‘డి’లో ఢిల్లీ, రైల్వేస్, ఒడిశా, సౌరాష్ట్ర, గుజరాత్, హరియాణా, సర్వీసెస్‌ జట్లతో ఆంధ్ర తలపడుతుంది. ఈనెల 24న తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో ఆంధ్ర ‘ఢీ’కొంటుంది. ఆంధ్ర వన్డే జట్టు: నితీశ్‌ కుమార్‌ రెడ్డి (కెప్టెన్‌), రికీ భుయ్, కోన శ్రీకర్‌ భరత్, అశ్విన్‌ హెబ్బర్, షేక్‌ రషీద్, మారంరెడ్డి హేమంత్‌ రెడ్డి, ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్, వై.సందీప్, ఎం.ధనుశ్, సౌరభ్‌ కుమార్, బి.వినయ్‌ కుమార్, టి.వినయ్, చీపురుపల్లి స్టీఫెన్, పీవీ సత్యనారాయణ రాజు, కేఎస్‌ఎన్‌ రాజు, జె.సాకేత్‌ రామ్, సీఆర్‌ జ్ఞానేశ్వర్, సీహెచ్‌ సందీప్‌.

Vijay Hazare Trophy One Day tournament will begin from the 24th of this month6
హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా రాహుల్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్‌ జట్టుకు రాహుల్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రాహుల్‌ బుద్ధిని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈనెల 24 నుంచి జనవరి 18వ తేదీ వరకు విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీ దేశంలోని నాలుగు నగరాల్లో (బెంగళూరు, జైపూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్‌) జరుగుతుంది. హైదరాబాద్‌ జట్టు తమ మ్యాచ్‌లను రాజ్‌కోట్‌లో ఆడుతుంది. గ్రూప్‌ ‘బి’లో జమ్మూ కశీ్మర్, విదర్భ, బెంగాల్, బరోడా, అస్సాం, ఉత్తరప్రదేశ్, చండీగఢ్‌ జట్లతో హైదరాబాద్‌ తలపడుతుంది. ఈనెల 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ను హైదరాబాద్‌ ‘ఢీ’ కొంటుంది. హైదరాబాద్‌ వన్డే జట్టు: జి.రాహుల్‌ సింగ్‌ (కెప్టెన్‌), రాహుల్‌ బుద్ధి (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, తనయ్‌ త్యాగరాజన్, పేరాల అమన్‌ రావు, ఎం.అభిరథ్‌ రెడ్డి, కె.నితేశ్‌ రెడ్డి, ఎ.వరుణ్‌ గౌడ్, ఎం.సాయి ప్రజ్ఞయ్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), ఎ.ప్రతీక్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), ఎన్‌.నితిన్‌ సాయి యాదవ్, సి.రక్షణ్‌ రెడ్డి, కార్తికేయ కక్, ఇల్యాన్‌ సథాని, మొహమ్మద్‌ అర్ఫాజ్‌. స్టాండ్‌ బై: పి.నితీశ్‌ రెడ్డి, కె.హిమతేజ, అనికేత్‌ రెడ్డి, రాహుల్‌ రాదేశ్, పున్నయ్య. వినోద్‌ కుమార్‌ (మేనేజర్‌), డీబీ రవితేజ (హెడ్‌ కోచ్‌), అభిజిత్‌ చటర్జీ (అసిస్టెంట్‌ కోచ్‌), రొనాల్డ్‌ రాయ్‌ రోడ్రిగ్స్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌), రంజిత్‌ కుమార్‌ (ట్రెయినర్‌), సంతోష్‌ కందుకూరి (ఫిజియో), కృష్ణా రెడ్డి (ఎనలిస్ట్‌).

Runner Gulveer Singh won the gold medal7
గుల్‌వీర్‌ రికార్డు

కోల్‌కతా: టాటా స్టీల్‌ వరల్డ్‌ 25 కిలోమీటర్ల రేసులో భారత అథ్లెట్ల కేటగిరీలో భారత రన్నర్‌ గుల్‌వీర్‌ సింగ్‌ జాతీయ రికార్డు సృష్టించి విజేతగా నిలిచాడు. గుల్‌వీర్‌ 25 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 12 నిమిషాల 06 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో 2024లో 1 గంట 14 నిమిషాల 10 సెకన్లతో తానే నెలకొల్పిన రికార్డును గుల్‌వీర్‌ సవరించాడు. హర్‌మంజోత్‌ సింగ్‌ (1గం:15ని:11 సెకన్లు) రజతం, సావన్‌ బర్వాల్‌ (1గం:15ని:25 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌ పురుషుల విభాగంలో రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ జోషువా కిప్తెగయ్‌ (ఉగాండా; 1గం:11ని:49 సెకన్లు) విజేతగా అవతరించి పసిడి పతకాన్ని గెలిచాడు. అల్ఫోన్స్‌ ఫెలిక్స్‌ సింబు (టాంజానియా; 1గం:11ని:56 సెకన్లు) రజతం, టెబెల్లో రామకొంగోనా (లెసెతో; 1గం:11ని:59 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు.

India registered a victory in the first T208
జెమీమా జోరు...

మహిళల వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ చేజిక్కించుకున్న తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన భారత జట్టు చాంపియన్‌ ఆటతీరు కనబర్చింది. శ్రీలంకతో తొలి టి20లో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి ని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హర్మన్‌ప్రీత్‌ బృందం... స్వల్ప లక్ష్యాన్ని మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సిరీస్‌లో బోణీ కొట్టింది. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్‌ విజయం సాధించిన నెల రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగు పెట్టిన భారత మహిళల జట్టు సమష్టి ఆటతీరుతో మెరిపించింది. శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. విశ్మీ గుణరత్నే (43 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... హాసిని పెరీరా (20; 2 ఫోర్లు), హర్షిత (21; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (44 బంతుల్లో 69 నాటౌట్‌; 10 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో దుమ్మురేపగా... వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన (25; 4 ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (15 నాటౌట్‌) ఆమెకు అండగా నిలిచారు. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ వికెట్‌ పడగొట్టకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం ఇక్కడే జరగనుంది. శుభారంభం లభించకున్నా... స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన షఫాలీ వర్మ (9) మరుసటి ఓవర్‌లో అవుట్‌ కాగా.. స్మృతి, జెమీమా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చమరి ఓవర్‌లో స్మృతి రెండు ఫోర్లు కొట్టగా ... శషిని ఓవర్‌లో జెమీమా వరుసగా రెండు ఫోర్లు బాదింది. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి భారత్‌ 55/1తో లక్ష్యం దిశగా సాగింది. కాసేపటికి స్మృతి అవుటైనా... హర్మన్‌ప్రీత్‌ అండతో జెమీమా దూసుకెళ్లింది. శషిని వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో జెమీమా నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. ఈ క్రమంలో 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఆమె... చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. స్మృతితో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించిన జెమీమా... హర్మన్‌తో మూడో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జత చేసింది. బౌలర్లు అదుర్స్‌... శ్రీలంక ఇన్నింగ్స్‌లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఆరంభం నుంచే మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లంకేయులు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించిన కెపె్టన్‌ చమరి (15) మూడో ఓవర్‌లోనే వెనుదిరగగా... విశ్మీ, హాసిని, హర్షిత తలా కొన్ని పరుగులు సాధించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన టీమిండియా... లంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఈ మ్యాచ్‌లో మూడు రనౌట్‌లు చేసిన మన అమ్మాయిలు ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 15వ ఓవర్‌ చివరి బంతికి హర్షిత కొట్టిన బంతిని అందుకునే క్రమంలో జెమీమా అమాంతం గాల్లోకి ఎగిరిన విధానం అబ్బురపరిచింది.2 మహిళల టి20 క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా స్మృతి మంధాన (154 మ్యాచ్‌ల్లో 4007) నిలిచింది. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్‌ (177 మ్యాచ్‌ల్లో 4716) అగ్రస్థానంలో... హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (183 మ్యాచ్‌ల్లో 3669) మూడో స్థానంలో ఉన్నారు.89 భారత్‌ తరఫున మహిళల అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 89వ ప్లేయర్‌గా వైష్ణవి శర్మ గుర్తింపు పొందింది. శ్రీచరణి, క్రాంతి గౌడ్‌ తర్వాత టి20 ఫార్మాట్‌లో భారత్‌ నుంచి ఈ ఏడాది అరంగేట్రం చేసిన మూడో ప్లేయర్‌గా వైష్ణవి నిలిచింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్‌: విశ్మీ గుణరత్నే (రనౌట్‌) 39; చమరి ఆటపట్టు (బి) క్రాంతి 15; హాసిని (సి) క్రాంతి (బి) దీప్తి 20; హర్షిత (బి) శ్రీచరణి 21; నీలాక్షిక (రనౌట్‌) 8; కవిశ (రనౌట్‌) 6; కౌశిని (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు)121. వికెట్ల పతనం: 1–18, 2–49, 3–87, 4–103, 5–108, 6–121. బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 3–0–23–1; అరుంధతి రెడ్డి 4–0–23–0; దీప్తి శర్మ 4–1–20–1; వైష్ణవి శర్మ 4–0–16–0; శ్రీచరణి 4–0–30–1; అమన్‌జ్యోత్‌కౌర్‌ 1–0–8–0. భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి (సి) నీలాక్షిక (బి) ఇనోక 25; షఫాలీ (సి) శషిని (బి) కావ్య 9; జెమీమా (నాటౌట్‌) 69; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–13, 2–67. బౌలింగ్‌: మల్కి మదార 2–0–19–0; కావ్య 3–0–20–1; చమరి 2–0–16–0; శషిని 2–0–32–0; ఇనోక 3.4–0–17–1; కవిశ 2–0–18–0.

How team india fared in test, odis and t20s in 20259
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో హిట్‌.. టెస్ట్‌ల్లో ఫట్‌..!

2025.. భారత పురుషుల క్రికెట్‌కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం​. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్‌ క్రికెట్‌లో చతికిలబడిన భారత్‌.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.షాకిచ్చిన దిగ్గజాలుఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.అప్పటికే (2024 టీ20 వరల్డ్‌కప్‌ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్‌ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్‌ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్‌. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్‌, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్‌ల్లో భారత్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. టెస్ట్‌ల నుంచి వైదొలుగుతూనే రోహిత్‌ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.గిల్‌ జమానా షురూదీంతో టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ శకం మొదలైంది. అయితే రోహిత్‌, కోహ్లి గైర్హాజరీలో గిల్‌కు టెస్ట్‌ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్‌ కెప్టెన్‌గా తొలి పర్యటనలో గిల్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్‌లో గిల్‌ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.5 మ్యాచ్‌ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్‌ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్‌ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌, పంత్‌, జైస్వాల్‌, సుందర్‌, సిరాజ్‌, బుమ్రా, ఆకాశదీప్‌ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్‌, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.ఓటమితో ప్రారంభం2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో (బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్ట్‌ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్‌ ఇదే.విండీస్‌ను క్లీన్‌ స్వీప్‌ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ సిరీస్‌లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్‌ స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.సొంతగడ్డపై పరాభవంఈ ఏడాది భారత్‌కు టెస్ట్‌ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్‌గా చూస్తే, ఈ ఏడాది భారత్‌కు విండీస్‌పై మినహా ఒక్క టెస్ట్‌ సిరీస్‌ విజయం కూడా దక్కలేదు.వన్డేల్లో తిరుగలేని భారత్‌ఈ ఏడాది భారత్‌ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.మూడోసారి ఛాంపియన్‌అనంతరం జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆసీస్‌ చేతిలో భంగపాటుఈ ఏడాది ఇంగ్లండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి, అనంతరం ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.రెచ్చిపోయిన రోహిత్‌.. నిరాశపరిచిన కోహ్లిఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ, హాఫ్‌ సెంచరీతో అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. విరాట్‌ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలుఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్‌లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్‌ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌ను ఘనంగా ముగించింది. ఆసీస్‌తో సిరీస్‌ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాపై సిరీస్‌ విజయాలతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని భారత్‌ పొట్టి ఫార్మాట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.ఈ మధ్యలో భారత్‌ ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్‌ను (ఫైనల్‌ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. అలాగే టైటిల్‌ గెలిచాక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు బాస్‌గా ఉన్న పాకిస్తానీ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.ఆసియా కప్‌ తర్వాత భారత్‌ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్‌ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా నిలిచింది.

INDW vs SLW 1st T20I: team india restricted sri lanka to 121 runs10
శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?

వన్డే ప్రపంచకప్‌ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్‌ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్ధిని 121 పరుగులకే పరిమితం చేసింది (6 వికెట్ల నష్టానికి).దీప్తి శర్మ (4-1-20-1) పొదుపుగా బౌలింగ్‌ చేసి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అరంగేట్రం బౌలర్‌ వైష్ణవి శర్మ (4-0-16-0) అంచనాలకు తగ్గట్టుగా రాణించి శభాష్‌ అనిపించింది. మరో బౌలర్‌ అరుంధతి రెడ్డి (4-0-23-0) కూడా పర్వాలేదనిపించింది. శ్రీచరణి (4-0-30-1), క్రాంతి గౌడ్‌ (3-0-23-1) కూడా రాణించారు.భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 39 పరుగులు చేసిన విష్మి గౌతమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈమె కాకుండా కెప్టెన్‌ చమారి (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు కూడా అద్బుతమైన ప్రదర్శన చేశారు. నిలాక్షి డిసిల్వ (8), కవిష దిల్హరిని (6) రనౌట్‌ చేశారు.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్‌), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement