Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India plays its third T20 against South Africa today1
ధర్మశాలలో దుమ్మురేపేనా!

ధర్మశాల: సొంతగడ్డపై భారత క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో టి20 ఆడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్‌ 1–1తో సమం కాగా... ఇప్పుడు పైచేయి సాధించేందుకు సూర్యకుమార్‌ బృందం రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకున్న టీమిండియా... రెండో టి20లో భారీ లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చూపకుండానే పరాజయం పాలైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరగనుండగా... దానికి ముందు భారత జట్టు మరో 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. వీటిలో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌నకు జట్టును ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేర్పులను పరిశీలించుకునేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుబ్‌మన్‌ గిల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వీరిద్దరు రాణించాల్సిన అవసరముంది. మరోవైపు గత మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ధర్మశాలలో అడుగుపెట్టనుంది. ఇక్కటి చల్లటి వాతావరణం, పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌ సఫారీలకు మరింత సహాయపడనుంది. గిల్‌ రాణించేనా..! టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుబ్‌మన్‌ గిల్‌... టి20ల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నాడు. తొలి బంతి నుంచే దూకుడు కనబర్చాల్సిన ఈ ఫార్మాట్‌లో గిల్‌ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం టి20ల్లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే... టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు వ్యూహం మార్చాల్సి రావచ్చు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగగా... ఈ ఇద్దరి రిటైర్మెంట్‌ అనంతరం అభిషేక్‌ శర్మ, సంజూ సామ్సన్‌ ఎక్కువ మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సామ్సన్‌ను బెంచ్‌కు పరిమితం చేసిన మేనేజ్‌మెంట్‌... గిల్‌కు విరివిగా అవకాశాలు ఇస్తోంది. కానీ వాటిని వినియోగించుకోవడంలో మాత్రం అతడు విఫలమవుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్‌ పేలవంగా వికెట్‌ పారేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌కు దిగడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యుత్తమ ఆటగాళ్లను డగౌట్‌లో కూర్చోబెట్టి అక్షర్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏంటో కోచ్‌ గంభీర్‌కే తెలియాలి. అడపాదడపా షాట్‌లు ఆడటం తప్ప నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోతున్న అక్షర్‌ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఏడాది ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అభిషేక్‌ మెరుపుల మధ్య సూర్య వైఫల్యం బయటకు కనిపించడం లేదు కానీ... అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాన్నాళ్లైంది. తిలక్‌ వర్మ నిలకడగా రాణిస్తున్నా... అతడికి సహకారం కరువైంది. హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబే ఇలా స్టార్‌లకు కొదవ లేకపోయినా... వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. గత మ్యాచ్‌లో దూబేను ఎనిమిదో స్థానంలో బరిలోకి దింపడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తారా లేక గంభీర్‌ తన మొండి పట్టుదలను కొనసాగిస్తాడా చూడాలి. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రభావం చూపలేకపోవడం బౌలింగ్‌లో ప్రధాన సమస్యగా మారింది. గత మ్యాచ్‌లో అనామక బ్యాటర్‌ సైతం బుమ్రా బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు కొట్టడం అభిమానులకు ఇబ్బంది కలిగించింది. మరోవైపు అర్ష్ దీప్‌ నియంత్రణ కోల్పోతుండటం జట్టుకు మరింత భారం అవుతోంది. వరుణ్‌ చక్రవర్తి ఫర్వాలేదనిపిస్తుండగా... కుల్దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. పటిష్టంగా దక్షిణాఫ్రికా... సుదీర్ఘ పర్యాటనలో భాగంగా టెస్టు సిరీస్‌ ‘క్లీన్‌ స్వీప్‌’ చేసిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది. ఇప్పుడిక చివరగా జరుగుతున్న టి20 సిరీస్‌లో 1–1తో సమంగా ఉంది. ఈ టూర్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో డికాక్‌ తన దమ్మేంటో చూపగా... కెప్టెన్‌ మార్క్‌రమ్, హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, ఫెరీరా, లిండె, యాన్సెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. మెరుగైన ఆరంభం లభిస్తే చాలు... క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్‌లు ఆడగల సమర్థులే కావడం దక్షిణాఫ్రికా జట్టుకు కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో యాన్సెన్‌ భారత జట్టుకు సింహస్వప్పంలా మారగా... ఎన్‌గిడి, సిపామ్లా, బార్ట్‌మన్‌ సమష్టిగా కదంతొక్కుతున్నారు. పిచ్‌ పేసర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో... సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు కష్టసాధ్యమైన పనే. అభిషేక్‌ శర్మ ఆరంభంలోనే చెలరేగి వారి లయను దెబ్బతీయకపోతే... ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు సులువుగా ఒత్తిడి పెంచగలరు.పిచ్, వాతావరణం హిమాలయ పర్వత సానువుల్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చేజింగ్‌ జట్లు గెలుపొందాయి. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్‌లో బంతిపై బౌలర్లకు పట్టుచిక్కడం కష్టం. పిచ్‌ పేసర్లకు సహకరించనుంది. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్, అర్ష్ దీప్‌ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్), డికాక్, స్టబ్స్‌/హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, డొనొవాన్‌ ఫెరీరా, యాన్సెన్, లిండె, ఎన్‌గిడి, బార్ట్‌మన్, నోర్జే/సిపామ్లా.

Indian team match against Pakistan in the Under19 Asia Cup2
భారత్‌ X పాకిస్తాన్‌

దుబాయ్‌: అండర్‌–19 ఆసియాకప్‌లో ఘనవిజయంతో బోణీ కొట్టిన యువ భారత జట్టు ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో గెలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని యంగ్‌ ఇండియా భావిస్తోంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్‌ షేక్‌’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్‌ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌ టి20 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పాకిస్తాన్‌ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు 234 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచి మంచి జోష్‌లో ఉంది. ఐపీఎల్‌ సహా సీనియర్‌ స్థాయిలో ఆడిన పలు టోర్నమెంట్‌లలో సెంచరీలతో విజృంభించిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. యూఏఈతో పోరులో అతడు 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో 171 పరుగులు చేసి అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కూడా అతడు అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే, వైస్‌కెపె్టన్‌ విహాన్‌ మల్హోత్రాతో పాటు హైదరాబాద్‌ ఆటగాడు ఆరోన్‌ జార్జి మంచి టచ్‌లో ఉన్నారు. వీరంతా సమష్టిగా సత్తాచాటితే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక మరోవైపు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 297 పరుగుల తేడాతో మలేసియాపై గెలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరీహోరీ ఖాయమే!

Tilak Varma is ready to bat at any position3
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీ: తిలక్‌ వర్మ

ధర్మశాల: భారత జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని... హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో మ్యాచ్‌ జరగనుండగా... దానికి ముందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తిలక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిలక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘జట్టులో ఓపెనర్లు తప్ప మిగిలిన వాళ్లు ఎవరైనా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలి. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే. ఈ అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టంగా ఉంది. నా వరకైతే మూడో స్థానం నుంచి మొదలు ఎక్కడ బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే. అందరూ అలాగే ఉన్నారు. వన్‌డౌన్‌లో అక్షర్‌ ఎన్నోసార్లు ఆకట్టుకున్నాడు. అది పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయమే’అని తిలక్‌ అన్నాడు. ధర్మశాలలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని... అందుకు తగ్గట్లే జట్లు సన్నద్ధత ఉంటుందని తిలక్‌ అన్నాడు. ‘నేను అండర్‌–19 స్థాయిలో ఇక్కడ మ్యాచ్‌లు ఆడాను. పిచ్‌ను పరిశీలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తోంది. చలితీవ్రత అధికంగా ఉండే ధర్మశాలలో పిచ్‌ పేసర్లకు అనుకూలించనుంది. టాస్‌ మన చేతిలో ఉండదు. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి. బంతిపై పట్టు చిక్కించుకునేందుకు తడిచిన బంతితో సైతం ప్రాక్టీస్‌ చేస్తున్నాం.

Unnati has advanced to the final at the Odisha Masters4
ఫైనల్లో ఉన్నతి

కటక్‌: టాప్‌ సీడ్‌ హోదాకు తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ ఉన్నతి హుడా మరో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఉన్నతి ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి సెమీఫైనల్లో 18–21, 21–16, 21–16తో ప్రపంచ మాజీ జూనియర్‌ నంబర్‌వన్, భారత్‌కే చెందిన తస్నిమ్‌ మీర్‌పై విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాతో ఉన్నతి తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో అస్సాం ప్లేయర్‌ ఇషారాణి 18–21, 21–7, 21–7తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో కిరణ్‌ జార్జి 21–19, 8–21, 21–18తో సహచరుడు రౌనక్‌ చౌహాన్‌పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో అశ్విని భట్‌–శిఖా గౌతమ్‌ (భారత్‌) జోడీ 13–21, 16–21తో ఓంగ్‌ జిన్‌ యీ–కార్మెన్‌ టింగ్‌ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో కణపురం సాత్విక్‌ రెడ్డి–రేషిక (భారత్‌) ద్వయం 16–21, 19–21తో దెజాన్‌–బెర్నాదినె వర్దన (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.

Lionel Messi show has successfully concluded5
మెస్సీ మాయలో...

‘మెస్సీ కిక్‌ కొట్టిన బంతి నా వైపే దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’... ఒక పదో తరగతి పిల్లాడి ఆనందం... ‘పదేళ్ల క్రితం మెస్సీ చాంపియన్స్‌ లీగ్‌ గెలిచినప్పటి నుంచి అతని ఆటంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటంతో నా కల నెరవేరింది’... ఒంటిపై మెస్సీ టాటూ వేసుకున్న ఒక వీరాభిమాని సంతోషమిది. మెస్సీ మైదానంలో గడిపింది గంట సమయం మాత్రమే కావచ్చు. కానీ ఫ్యాన్స్‌కు సంబంధించి అది అమూల్యమైన సమయం... అతని ప్రతీ కదలిక, వేసిన ప్రతీ అడుగు వారిలో అమిత ఉత్సాహాన్ని రేపింది. మెస్సీ కూడా ఉన్నంత సేపు చాలాసరదాగా, జాలీగా కనిపించడం ఈ మెగా ఈవెంట్‌ సక్సెస్‌కు సరైన సూచిక. సాక్షి, హైదరాబాద్‌: నగర ఫుట్‌బాల్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన లయోనల్‌ మెస్సీ షో విజయవంతంగా ముగిసింది. ‘గోట్‌ ఇండియా టూర్‌’లో భాగంగా రెండో నగరమైన హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌ ఎలాంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా సాగింది. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ కార్యక్రమంపై కాస్త సందేహాలు తలెత్తాయి. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేసి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. దాంతో అటు మెస్సీ బృందంతోపాటు ఇటు అభిమానులు కూడా సంతృప్తిగా మైదానాన్ని వీడారు. రేవంత్‌కు పాస్‌లు... మెస్సీ టూర్‌ ఖరారైన రోజు నుంచి ప్రభుత్వం హడావిడి చేసిన మెస్సీ వర్సెస్‌ రేవంత్‌ మ్యాచ్‌ మాత్రం జరగలేదు కానీ... మెస్సీ, సీఎం మధ్య కొన్ని సరదా కిక్‌లు, పాస్‌లు మాత్రం నడిచాయి. మెస్సీ ఇచ్చిన పాస్‌లు చక్కగా అందుకున్న రేవంత్‌ రెడ్డి వాటిని మళ్లీ రిటర్న్‌ కూడా చేశారు. స్వారెజ్, రోడ్రిగో కూడా దీనికి జత కలిశారు. ఈ నలుగురు కలిసి ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున విజిల్స్, కేకలతో సందడి చేశారు. చివరకు మెస్సీ కొట్టిన ఒక కిక్‌ రేవంత్‌ను దాటి గోల్‌ పోస్ట్‌లోకి వెళ్లడంతో ఈ ఆట ముగిసింది. దీనికి ముందు రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్, అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్‌ టీమ్‌ మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో సింగరేణి టీమ్‌ విజేతగా నిలిచింది. చిన్నారులతో సందడి... ముందుగా ఎంపిక చేసిన వర్ధమాన ఫుట్‌బాలర్లు, చిన్నారులతో కూడా మెస్సీ కొద్దిసేపు ఆడాడు. వీటి కోసం నాలుగు వేర్వేరు జోన్‌లను ఏర్పాటు చేయగా, ప్రతీ చోటికి వెళ్లి ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ కొంత సమయం కేటాయించాడు. మెస్సీతో కలిసి ఆడిన వారిలో అంతుపట్టలేని ఆనందం కనిపించింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి మనవడు కూడా సందడి చేశాడు. అతని వైపు కూడా మెస్సీ రెండు పాస్‌లు ఇవ్వడం విశేషం. స్టాండ్స్‌లోకి బంతులు... స్టేడియంలో అభిమానులను బాగా అలరించి వారంతా పూర్తిగా ఎంజాయ్‌ చేసింది మాత్రం మెస్సీ స్పెషల్‌ కిక్‌లతోనే. ఆ సమయంలో మాత్రం స్టేడియంలో పూర్తి స్థాయిలో హోరెత్తిపోయింది. అతను ప్రత్యేకంగా పెనాల్టీలు ఆడకపోయినా... నిర్వాహకులు ఇచ్చిన బంతులను తనదైన శైలిలో కిక్‌లతో స్టాండ్స్‌లోకి పంపించాడు. బంతిని అందుకొని అర్జెంటీనా స్టార్‌ కిక్‌కు సిద్ధమైన ప్రతీ సారి ఉప్పల్‌ ఊగిపోయింది. ఆ బంతులను అందుకోవడంలో స్టాండ్స్‌లో ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఎగబడ్డారు. కానీ కొందరు అదృష్టవంతులకే ఆ అవకాశం దక్కింది! ఉల్లాసంగా...ఉత్సాహంగా... మెస్సీ మొత్తం ‘షో’లో అతను మైదానంలో గడిపిన తీరే చెప్పుకోదగ్గ విశేషం. అక్కడ ఉన్నంతసేపు అతను చాలా ఉత్సాహంగా, నవ్వుతూ గడిపాడు. ముందుగా ప్రేక్షకుల హర్షధ్వానాలతో మైదానంలోకి రావడం మొదలు చివరి వరకు అతను దీనిని కొనసాగించాడు. ఉదయం కోల్‌కతాలో రసాభాసగా మారిన ఈవెంట్‌లో పూర్తి అసౌకర్యంగా కనిపించిన అతను హైదరాబాద్‌లో మాత్రం అలాంటి ఛాయలు కూడా కనపడనివ్వలేదు. ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం, రేవంత్‌తో ఆడిన కొద్దిసేపు, ఆపై చిన్నారులతో ఆట, స్టాండ్స్‌లోకి కిక్‌ కొడుతూ ఉత్సాహం నింపడం, చివర్లో గ్రూప్‌ ఫోటోలు... ఇలా ఎక్కడైనా అతనిలో చిరునవ్వు చెక్కుచెదర్లేదు. ఎక్కడా ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు. ఆఖర్లో ‘హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. మీరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు’ అంటూ కృతజ్ఞతలు చెప్పడం వరకు చూస్తే అతను కూడా హైదరాబాద్‌ టూర్‌ను బాగానే ఎంజాయ్‌ చేసినట్లు కనిపించాడు. ఆఖర్లో మెస్సీకి ముఖ్యమంత్రి జ్ఞాపిక అందించగా, స్వారెజ్‌కు రాహుల్‌ గాంధీ జ్ఞాపిక ఇచ్చారు. వీరిద్దరికీ మెస్సీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీలను అందించాడు.

Rohit Paudel takes hat trick in NPL final, rattles Dipendra Airee's men with heroic spell6
నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లో సంచలనం

నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఫైనల్లో సంచలనం నమోదైంది. సుదుర్‌ పశ్చిమ్‌ రాయల్స్‌తో ఇవాళ (డిసెంబర్‌ 13) జరిగిన తుది పోరులో లుంబిని లయన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లయన్స్‌ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. కిరీటీపూర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో సుదుర్‌ పశ్చిమ్‌ రాయల్స్‌, లుంబిని లయన్స్‌ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. రోహిత్‌ పౌడెల్‌ హ్యాట్రిక్‌ సహా ట్రంపెల్మన్‌ (2.1-0-3-3), షేర్‌ మల్లా (4-0-18-3), తిలక్‌ భండారి (4-0-26-1) చెలరేగడంతో 19.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.రోహిత్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో చివరి మూడు బంతులకు దీపేంద్ర సింగ్‌, దీపక్‌ బొహారా, పూనీత్‌ మెహ్రా వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఇషాన్‌ పాండే (33) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. మిగతా వారిలో దీపేంద్ర సింగ్‌ (13), హర్మీత్‌ సింగ్‌ (10), కుగ్గెలిన్‌ (10) మాత్రమే రెండ​ంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లయన్స్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్‌ దినేశ్‌ అధికారి (42) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి లయన్స్‌ గెలుపును ఆదిలోనే ఖరారు చేశాడు. డి ఆర్కీ షార్ట్‌ 14, నిరోషన్‌ డిక్వెల్లా 11, రోహిత్‌ పౌడెల్‌ 16 పరుగులు చేసి లయన్స్‌ గెలుపుతో భాగమయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో హేమంత్‌ ధామి 2 వికెట్లు పడగొట్టగా.. దీపేంద్ర ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు టోర్నీ ఆధ్యాంతం రాణించిన రూబెన్‌ ట్రంపెల్మన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, టోర్నీ అవార్డులు లభించాయి.

What wrong has Sanju Samson done? Uthappa questions Gautam Gambhir on live TV7
సంజూ చేసిన తప్పు ఏంటి.. ఎందుకు బలి చేస్తున్నారు?: ఉతప్ప

ఈ ఏడాది ఆసియాకప్‌తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్.. దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికి టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. గిల్ తన చివరి పది మ్యాచ్‌లలో 181 పరుగులు మాత్రమే చేశాడు.అతడి స్ట్రైక్-రేట్ 140 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అతడి పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో టీ20ల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూను కాదని మరి గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ పునరాగమనం ముందువరకు టీ20ల్లో భారత్ ఓపెనింగ్ జోడీ అభిషేక్‌-సంజూ శాంసన్ ఉండేవారు. కానీ గిల్ రాకతో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్‌లోనే చోటు లేకుండాపోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై భారత మాజీ కెప్టెన్ రాబిన్ ఊతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు.శాంసన్ చేసిన తప్పేంటి?"సంజూ శాంసన్ చేసిన తప్పు ఏంటి? ఎందుకు అత‌డికి అవ‌కాశ‌మివ్వ‌డం లేదు? అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ జోడీ టీ20ల్లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవ‌స‌రం ఏమి వ‌చ్చింది. ఈ సిరీస్‌కు ముందు సూర్య‌కుమార్ మాట్లాడుతూ.. సంజూకు అవ‌కాశం రాక‌ముందే శుభ్‌మ‌న్ టీ20 జ‌ట్టులో భాగంగా ఉన్నాడ‌ని చెప్పుకొచ్చాడు.ఆ విష‌యం నాకు కూడా తెలుసు. కానీ సంజూ అవ‌కాశం వ‌స్తే ఏమి చేశాడో మ‌నందరికి తెలుసు. ఓపెన‌ర్‌గా వ‌చ్చి వ‌రుస‌గా మూడు సెంచ‌రీలు బాదాడు. ప్ర‌స్తుత యువ క్రికెట‌ర్లలో అంద‌రికంటే ముందు సంజూనే చేశాడు. ఆ త‌ర్వాత అభిషేక్‌, తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీలు సాధించారు. ఓపెన‌ర్‌గా సంజూ త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శ‌ర్మ సంజూనే విజ‌య‌వంతమైన ఓపెన‌ర్‌గా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికి అత‌డిని ఓపెన‌ర్‌గా త‌ప్పించారు. ఆ త‌ర్వాత అత‌డిని మిడిల్ ఆర్డర్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆపై నెమ్మదిగా జట్టు నుండి తొలగించారు. మ‌రోసారి అడుగుతున్న అత‌డు చేసిన త‌ప్పు ఏంటి? క‌చ్చితంగా ఓపెనింగ్ స్దానాన్ని అత‌డు అర్హుడు.ప్ర‌స్తుతం శుభ్‌మ‌న్ టీ20ల్లో రాణించ‌లేక‌పోతున్నాడు. త‌న శైలికి విరుద్దంగా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతున్నాడు. మొద‌టిలో అభిషేక్‌తో పోటీప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని నేను భావిస్తున్నాను. త‌డు బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదు. అత‌డు క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త స‌మయం తీసుకుంటాడు. 15 నుంచి 20 బంతులు ఆడిన త‌ర్వాత అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. తానంతంట తానే ఔట్ అవ్వాలి. అలా ఆడితే గిల్‌కు టీ20కు స‌రిపోతుంది" అని ఉత‌ప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.

Virat Kohli could play Vijay Hazare Trophy matches at M Chinnaswamy Stadium8
చిన్నస్వామిలో ఆడ‌నున్న విరాట్ కోహ్లి.. ఎప్పుడంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్ర‌వారం జ‌రిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్ ఎంపికైన వారం రోజులకే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన తొక్కిసలాటలో 11 మంది మ‌రణించారు.ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. అప్ప‌టి నుంచి ఇప్పటివరకు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా జ‌ర‌గలేదు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ చిన్న‌స్వామి మైదానంలో అభిమానులు సంద‌డి నెల‌కోనుంది.ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందే టీమిండియా స్టార్‌, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లి ఈ మైదానంలో ఆడ‌నున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్ నుంచి చిన్న‌స్వామి మైదానంలో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే ముందే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హాజారే ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నట్లు సమాచారం. వానికి వాస్త విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025-26 గ్రూపు-డి మ్యాచ్‌ల‌కు బెంగ‌ళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా ఉంది. గ్రూపు-డిలో విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్ ప్రాతినిథ్యం వ‌హించే ఢిల్లీ జ‌ట్టు కూడా ఉంది. కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఆడుతుండ‌డంతో అలూర్ వంటి చిన్న వేదిక‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ ఆడే మ్యాచ్‌ల‌ను అలూర్ నుంచి చిన్న‌స్వామికి త‌రలించాల‌ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విజయ్‌ హాజారే టోర్నీ డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడే ఛాన్స్‌ ఉంది.చదవండి: IND vs SA: గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..? గిల్‌కు ఊహించని షాక్‌!

Lionel Messi In Hyderabad: Check Complete Schedule9
హైద‌రాబాద్‌కు మెస్సీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్కోల్‌కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు.👉 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉండనుంది👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.👉8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో రానున్నారు.👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గోనున్నారు.👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోనున్నాడు.చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'

Captain Suryakumar Yadav under scrutiny for poor batting form10
'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ అంటే టాస్‌లు వేయడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 స‌గ‌టుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు."సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్‌తో కూడా రాణించాలి. టాప్ ఫోర్‌లో బ్యాటింగ్‌కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడాడు.అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు కన్పించలేదు. మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..? గిల్‌కు ఊహించని షాక్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement