Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

The stage is set for the first double header of the IPL season1
ఐపీఎల్‌లో నేడు ‘డబుల్‌’ ధమాకా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ‘డబుల్‌ హెడర్‌’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్‌ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్‌ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్‌ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్‌–5 బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గుజరాత్‌ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్‌ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్‌ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్‌–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది.

Punjab Kings defeated Chennai Super Kings by 5 wickets2
పంజాబ్‌ బల్లే బల్లే...

చెన్నై సూపర్‌కింగ్స్‌కి కోట లాంటి చెపాక్‌ మైదానంలో ఒక్క పంజాబ్‌కు మాత్రమే చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన ఘనమైన రికార్డు ఉంది. గత మూడు సీజన్లలో ఇక్కడ సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపించిన పంజాబ్‌ ఈసారీ దానిని కొనసాగించింది. ముందుగా చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినా... మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ గెలుపు సొంతం చేసుకుంది. స్పిన్నర్‌ చహల్‌ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరును నియంత్రించగా, ఛేదనలో కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టును విజయం దిశగా నడిపించాడు. చెన్నై: గత ఏడాది ఐపీఎల్‌ రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (43 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా...శివమ్‌ దూబే (22 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) సర్ఫరాజ్‌ ఖాన్‌ (12 బంతుల్లో 32; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. అనంతరం పంజాబ్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కూపర్‌ కనోలీ (22 బంతుల్లో 36; 6 ఫోర్లు) మెరిపించారు. సర్ఫరాజ్‌ జోరు... వరల్డ్‌ కప్‌ హీరో సామ్సన్‌ (7) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపకపోగా... కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే మరోవైపు ఆయుశ్‌ మాత్రే జోరుతో స్కోరు దూసుకుపోయింది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. మాత్రేతో రెండో వికెట్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌ 55 బంతుల్లో 96 పరుగులు జోడించగా... అతని వాటా 22 పరుగులు మాత్రమే! ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మాత్రే, కార్తీక్‌ (1) అవుట్‌ కాగా, అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతోసర్ఫరాజ్‌ చెలరేగాడు. ఆ తర్వాత వైశాక్‌ ఓవర్లో వరుసగా 4, 4, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అర్ష్ దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూబే జట్టు స్కోరును 200 దాటించాడు. సమష్టి ప్రదర్శన... ఛేదనలో పంజాబ్‌ టాప్‌–4 తమ వంతు పాత్ర పోషించారు. తాను ఆడిన తొలి 6 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో ప్రియాన్ష్ దూకుడుగా మొదలుపెట్టగా, కంబోజ్‌ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ 3 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో స్కోరు 68 పరుగులకు చేరింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కనోలీ, శ్రేయస్‌ అదే ధాటిని కొనసాగించారు. చహర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన శ్రేయస్‌... హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 26 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. విజయానికి 24 పరుగుల దూరంలో అతను అవుటైనా, ఇతర బ్యాటర్లు లాంఛనం పూర్తి చేశారు. ప్రశాంత్‌ వీర్‌ అరంగేట్రం... గత మ్యాచ్‌లో రూ.14.20 కోట్ల విలువైన ఆటగాడు కార్తీక్‌ శర్మతో అరంగేట్రం చేయించిన చెన్నై... ఈ మ్యాచ్‌లో మరో రూ.14.20 కోట్ల ప్లేయర్‌ ప్రశాంత్‌ వీర్‌కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన 20 ఏళ్ల ప్రశాంత్‌ లోయర్‌ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. బీసీసీఐ అండర్‌–23 టోర్నీతో పాటు సీఎస్‌కే ట్రయల్స్‌లో ఆకట్టుకోవడంతో రవీంద్ర జడేజా తరహా ఆటగాడైన వీర్‌ను జట్టు ఎంచుకుంది. యూపీ టి20 లీగ్‌లో 155 స్ట్రయిక్‌రేట్‌లో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ప్రశాంత్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు.కుర్రాడు అదరహో... ఆయుశ్‌ గత ఏడాది చెన్నై జట్టు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ముందుగా టీమ్‌లో లేకపోయినా...రుతురాజ్‌ గాయంతో తప్పుకోవడంతో జట్టుకు ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన మాత్రే ముంబైలోనే ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత బెంగళూరుపై కూడా 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 పరుగులు సాధించి సత్తా చాటాడు. గత సీజన్‌ను ఘనంగా ముగించిన మాత్రే ఆ తర్వాత భారత అండర్‌–19 జట్టు సారథిగా వరల్డ్‌ కప్‌ను అందించాడు. ఈ సీజన్‌ తొలి పోరులో మొదటి బంతికే వెనుదిరిగి నిరాశపర్చిన అతను ఈ మ్యాచ్‌లో తన కసిని ప్రదర్శించాడు. బార్ట్‌లెట్‌ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో అతను తన పరుగుల ఖాతా తెరిచిన అతను యాన్సెన్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. ఆపై స్టొయినిస్‌ ఓవర్లో సిక్స్‌తో 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్న అతను తర్వాతి బంతినీ సిక్స్‌గా మలిచాడు. 59, 67 పరుగుల వద్ద చహల్‌ బౌలింగ్‌లో వైశాక్, శశాంక్‌ క్యాచ్‌లు వదిలేయడం అతనికి కలిసొచ్చింది.6 చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును అత్యధికసార్లు (6) ఓడించిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ గుర్తింపు పొందింది. ముంబై ఇండియన్స్‌ (21 సార్లు) తర్వాత ఐపీఎల్‌లో చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు పంజాబ్‌ (17 సార్లు). బెంగళూరు (16 సార్లు) మూడో స్థానానికి వెళ్లింది. 36 ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించింది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 36 సార్లు 200 మార్క్‌ను దాటింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 35 సార్లు... పంజాబ్‌ కింగ్స్‌ 33 సార్లు, ముంబై ఇండియన్స్‌ 32 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 30 సార్లు ఈ ఘనత సాధించాయి. స్కోరు వివరాలుచెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) బార్ట్‌లెట్‌ 7; రుతురాజ్‌ (సి) వధేరా (బి) చహల్‌ 28; ఆయుశ్‌ (సి) మాత్రమే (బి) వైశాక్‌ 73; దూబే (నాటౌట్‌) 45; కార్తీక్‌ (ఎల్బీ) (బి) యాన్సెన్‌ 1; సర్ఫరాజ్‌ (సి) వధేరా (బి) వైశాక్‌ 32; ప్రశాంత్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–14, 2–110, 3–123, 4–130, 5–168. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–41–0, బార్ట్‌లెట్‌ 4–0–48–1, యాన్సెన్‌ 4–0–43–1, వైశాక్‌ 4–0–38–2, చహల్‌ 3–0–21–1, స్టొయినిస్‌ 1–0–17–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (బి) హెన్రీ 39; ప్రభ్‌సిమ్రన్‌ (రనౌట్‌) 43; కనోలీ (సి) హెన్రీ (బి) కంబోజ్‌ 36; శ్రేయస్‌ (సి) చహర్‌ (బి) కంబోజ్‌ 50; వధేరా (సి) నూర్‌ (బి) హెన్రీ 10; శశాంక్‌ (నాటౌట్‌) 14; స్టొయినిస్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–61, 2–95, 3–127, 4–186, 5–186. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–28–0, హెన్రీ 4–0–54–2, కంబోజ్‌ 3.4–0–43–2, నూర్‌ 4–0–38–0, రాహుల్‌ చహర్‌ 4–0–46–0.

Nitish Kumar Reddy says bowling has improved3
‘ప్రత్యేక వ్యక్తి’ కృషి వల్లే...

కోల్‌కతా: తన బౌలింగ్‌ మెరుగుపడటం వెనుక ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్‌ ఆల్‌రౌండర్, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించాడు. గాయాలతో ఇబ్బంది పడిన సమయంలో అతడి అండతోనే తిరిగి కోలుకొని బౌలింగ్‌ లయను అందుకోగలిగానని చెప్పాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగి 24 బంతుల్లో 39 పరుగులు చేసిన ఈ ఆంధ్ర ప్లేయర్‌... ఆ తర్వాత బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో నైట్‌రైడర్స్‌ వైస్‌ కెప్టెన్‌ రింకూ సింగ్‌ వికెట్‌ కూడా ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న నితీశ్‌... ఆ తర్వాత తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్‌లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హార్దిక్‌ పాండ్యా తరహాలో టీమిండియాకు పేస్‌ ఆల్‌రౌండర్‌ లభించినట్లే అనుకుంటున్న దశలో గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలు అతడిని వెనక్కి లాగాయి. గత ఐపీఎల్‌ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన 22 ఏళ్ల నితీశ్‌... కోల్‌కతాతో పోరులో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. మ్యాచ్‌ అనంతరం నితీశ్‌ మాట్లాడుతూ... ‘బౌలింగ్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు ఎప్పుడూ ప్రయతి్నస్తూనే ఉంటా. అయితే గతేడాది గాయాల కారణంగా ఎక్కువ సమయం లభించలేదు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు దొరికిన కొద్దిపాటి సమయంలో బాగా శ్రమించా. ఓ ప్రత్యేక వ్యక్తి పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ చేశాను. అది ఎంతగానో ఉపయోగపడింది’ అని అన్నాడు. ‘స్లో బౌన్సర్ల’తోనే ఫలితం... అయితే ఆ ‘స్పెషల్‌ పర్సన్‌’ పేరు మాత్రం నితీశ్‌ వెల్లడించలేదు. ‘ఆ వ్యక్తి ఎవరో తర్వాత చెప్తా. కోల్‌కతాతో మ్యాచ్‌లో మా ఓపెనర్లు చక్కటి ఆరంభం ఇచ్చారు. క్లాసెన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం గొప్ప అనుభూతి. దక్షిణాఫ్రికా సీనియర్‌ ప్లేయర్‌ మీకు సలహాలు ఇస్తుంటే దాని ఫలితం రాకపోదు. అందుకే మా భాగస్వామ్యం బాగా సాగింది. సీనియర్‌లు జట్టులో ఉంటే ఇలాంటి ప్రయోజనం చేకూరుతుంది. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను వారు ఇంతకుముందే అధిగమించి ఉంటారు. వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ‘స్లో బాల్స్‌’తోనే ఫలితం ఉంటుందని బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే అర్థమైంది. అందుకే బౌలింగ్‌కు వచ్చినప్పుడు అదే ప్రయత్నించా. స్లో బౌన్సర్‌ ద్వారానే రింకూ వికెట్‌ పడగొట్టా. నెమ్మదైన బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం నా బలం. దాన్నే వినియోగించా. మా బౌలింగ్‌లో కావాల్సినంత వైవిధ్యం ఉంది. జైదేవ్‌ ఉనాద్కట్‌కు ఎంతో అనుభవం ఉంది. ఇషాన్‌ మలింగ, డేవిడ్‌ పేన్‌ రూపంలో మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్‌లో మా జట్టు పటిష్టంగా ఉందనేది వాస్తవం. అలాగే బౌలింగ్‌లోనూ మాకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. అక్కడ బౌలింగ్‌ చేయడం ఎవరికైనా కష్టమే’ అని నితీశ్‌ రెడ్డి వివరించాడు. చాలా కాలంగా ఎదురు చూశా... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంపై నితీశ్‌ రెడ్డి స్పందిస్తూ... ‘చాన్నాళ్లుగా ఇలాంటి ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నా. సరైన సమయంలో అది వచ్చింది. బౌలింగ్‌లో మెరుగవడం నా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. గతేడాది ఆశించిన స్థాయిలో ఆడలేకపోయా. దీంతో మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కనపెట్టి నా బలాన్ని నమ్ముకున్నా. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఫిన్‌ అలెన్‌ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలుసు. చూస్తుండగానే మ్యాచ్‌ను మార్చేసే ప్లేయర్‌ అతడు. అతడి వికెట్‌ ఆరంభంలోనే తీయడం కలిసొచ్చింది’ అని తెలిపాడు.

Billie Jean King Cup starts from 7th 4
ప్లేఆఫ్‌ బెర్త్‌ లక్ష్యంగా...

న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే జరిగే బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు భారత మహిళల టెన్నిస్‌ జట్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జట్టు సభ్యులంతా తుది కసరత్తుల్లో చెమటోడ్చుతున్నారు. పురుషుల టీమ్‌ టెన్నిస్‌లో జరిగే డేవిస్‌ కప్‌లాగే మహిళల విభాగంలో యేటా ఈ బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలోని డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీని నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో ఆతిథ్య భారత్‌ సహా ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్‌లు మిగతా జట్లు కాగా... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్‌లో జరిగే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. చిట్టచివరి రెండు జట్లు మాత్రం వచ్చే ఏడాది జరిగే ఆసియా–ఓసియానియా గ్రూప్‌–2కు దిగజారుతాయి. కీలకమైన ఈ టోర్నీకి ముందు జట్టు సన్నద్ధతపై కెప్టెన్‌ విశాల్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ భారత అమ్మాయిల జట్టు మరోసారి ప్లే–ఆఫ్స్‌ బెర్తు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్డ్‌కోర్టుల్ని ఆకళింపు చేసుకునేందుకే కాస్త ముందుగా వచ్చామని... రాగానే కసరత్తు మొదలుపెట్టామని చెప్పాడు. జట్టు అనుభవజు్ఞలు, యువ క్రీడాకారిణిలతో సమతుల్యంగా ఉందన్నాడు. వరుసగా ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌ బెర్తు సాధించే సత్తా ఈ జట్టుకు ఉందన్నాడు. భారత జట్టులో ఇద్దరు తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ఉన్నారు. వీరితో పాటు రుతుజా బోసలే, అంకిత రైనా, వైదేహి, కొత్త ప్లేయర్‌ వైష్ణవి ఆడ్కర్‌ మిగతా సభ్యులు. భారత మూడో ర్యాంకర్‌ వైదేహి మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో పటిష్టమైన జట్టే బరిలోకి దిగుతోందని చెప్పింది. ప్రతీ జట్టుపై విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపింది. గత 2025–26 సీజన్‌లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సహజ మాట్లాడుతూ ‘ఎదురయ్యే ప్రతీ ప్రత్యరి్థని దీటుగా ఎదుర్కొంటాం. గతేడాది ప్లేఆఫ్స్‌ అనుభవం కూడా గడించాం. ఇప్పడు కూడా స్ఫూర్తిదాయక పోరాటం కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. టెన్నిస్‌ వ్యక్తిగత ఈవెంట్‌ అయినా... ఇక్కడ మాత్రం జట్టుగా ఆడుతున్నాం. మా అందరిలోనూ ఇప్పుడు నా అనే కంటే మా మ్యాచ్‌లనే సమష్టి భావనే ఉంది’ అని పేర్కొంది. ఆశించిన ఫలితాలు సాధిస్తామనే ధీమాను శ్రీవల్లి రషి్మక వ్యక్తం చేసింది.

India tops doping disqualification list5
డోపింగ్‌ అనర్హుల జాబితాలో భారత్‌ ‘టాప్‌’

న్యూఢిల్లీ: డోపింగ్‌ ఉల్లంఘనల్లో భారత్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్స్‌ (ఏఐయూ) అనర్హులైన అథ్లెట్ల జాబితాలో కెన్యా అగ్రస్థానంలో ఉండగా... తాజా నివేదికలో కెన్యాను అధిగమించి భారత్‌ తొలి స్థానానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు డోపింగ్‌ ఉల్లంఘనలకు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్నారు. కెన్యా (146 మంది అథ్లెట్లు), రష్యా (66 మంది అథ్లెట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్‌ ద్యుతీ చంద్, మిడిల్‌ డిస్టాన్స్‌ రన్నర్‌ పర్వేజ్‌ ఖాన్, తమిళనాడు స్పింటర్‌ శేఖర్‌ ధనలక్ష్మి ఉన్నారు. ద్యుతీ చంద్‌పై 2022 డిసెంబర్‌లో నాలుగు సంవత్సరాల నిషేధం పడగా... పర్వేజ్‌పై విధించిన నిషేధం జూలై 2030 వరకు కొనసాగనుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే ఏఐయూ అన్నీ దేశాల డోపింగ్‌ వివరాలు సేకరిస్తుంది. డోపింగ్‌ను రూపుమాపాలని కంకణం కట్టుకున్న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) దీనితో సంబంధం ఉన్న కేంద్రాలను గుర్తించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటోంది. అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడటం వెనక శిక్షకుల హస్తం కూడా ఉంటుందని భావిస్తున్న ఏఎఫ్‌ఐ... కోచ్‌లందరూ తమ వద్ద పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఏఎఫ్‌ఐలో నమోదు చేసుకోని కోచ్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు... వారి వద్ద శిక్షణ తీసుకున్న వారిని జాతీయ అవార్డులకు అనర్హులుగా ప్రకటించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఏఎఫ్‌ఐ జాతీయ శిబిరాలను వికేంద్రీకరించింది. ప్రస్తుతం రిలే జట్లకు మాత్రమే నేషనల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. మిగిలిన అగ్రశ్రేణి అథ్లెట్లందరూ రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, టాటా వంటి ప్రైవేటు సంస్థలు... ఆర్మీ, నేవీ వంటి ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు.

IPL 2026: PBKS beat CSK6
సత్తా చాటిన శ్రేయస్‌.. పంజాబ్‌ ఖాతాలో వరుసగా రెండో విజయం

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసింది. సీఎస్‌కే విషయానికొస్తే.. ఈ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడి, తాజాగా పంజాబ్‌ చేతిలో పరాజయంపాలైంది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్‌ దూబే (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) రాణించారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (7), కార్తీక్‌ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 2, చహల్‌, జన్సెన్‌, బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిలో ప్రియాంశ్‌ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్‌ కాగా.. ప్రభ్‌సిమ్రన్‌ (43), కూపర్‌ కన్నోల్లీ (36), శ్రేయస్‌ అయ్యర్‌ (50) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి గెలుపుకు పునాది వేశారు. ఆఖర్లో శశాంక్‌ సింగ్‌ (14 నాటౌట్‌), స్టోయినిస్‌ (9 నాటౌట్‌) ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పంజాబ్‌ను గెలుపు తీరాలు దాటించారు. సీఎస్‌కే బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, అన్షుల్‌ కంబోజ్‌ తలో 2 వికెట్లు తీశారు. సీఎస్‌కే సొంతగడ్డపై భారీ స్కోర్‌ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది.

Chennai super kings has most 200 totals in IPL history7
చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్‌ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్‌ చేసిన ఆ జట్టు.. 36వ సారి 200 ప్లస్‌ మార్కును తాకింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు సీఎస్‌కే, ఆర్సీబీ (35) పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ విభాగంలో సీఎస్‌కే, ఆర్సీబీ తర్వాతి స్థానాల్లో పంజాబ్‌ కింగ్స్‌ (32), ముంబై ఇండియన్స్‌ (31), కేకేఆర్‌ (29) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉంది. 2024 ఎడిషన్‌లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే ఆయుశ్‌ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్‌ చేసింది. శివమ్‌ దూబే (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) పర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్‌ (7), కార్తీక్‌ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 2, చహల్‌, జన్సెన్‌, బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 210 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ సైతం ధాటిగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్‌ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్‌ కాగా.. ప్రభ్‌సిమ్రన్‌ (38), కూపర్‌ కన్నోల్లీ (7) క్రీజ్‌లో ఉన్నారు. ప్రియాంశ్‌ ఆర్యను మ్యాట్‌ హెన్రీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

IPL 2026: Ayush Mhatre Shatters Suresh Raina’s 18 Year Old CSK Feat With Record 50 vs PBKS8
చరిత్ర సృష్టించిన ఆయుశ్‌ మాత్రే

సీఎస్‌కే యువ బ్యాటర్‌, అండర్‌ 19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు సురేశ్‌ రైనా పేరిట ఉండేది. రైనా ఐపీఎల్‌ అరంగేట్రం ఎడిషన్‌లో (2008) 21 ఏళ్ల 148 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు. తాజాగా మాత్రే 18 కిందటి ఆ రికార్డును బద్దలు కొడుతూ 18 రోజుల 261 రోజుల వయసులో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ విభాగంలో మాత్రే, రైనా తర్వాతి స్థానంలో పార్థివ్‌ పటేల్‌ (23 ఏళ్ల 76 రోజుల, 2008) ఉన్నాడు.ఈ హాఫ్‌ సెంచరీతో మాత్రే మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. ఈ హాఫ్‌ సెంచరీ అతనికి ఐపీఎల్‌లో రెండవది. తద్వారా 19 ఏళ్లలోపు ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షాతో (2) కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. గత ఎడిషన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన వైభవ్‌ ఇప్పటికే 3 అర్ద సెంచరీలు చేశాడు. కొద్ది రోజుల కిందటే వైభవ్‌ 15వ పడిలోకి అడుగుపెట్టన విషయం తెలిసిందే.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ శాంసన్‌ (7) వికెట్‌ కోల్పోయినా, ఆయుశ్‌ మాత్రే ధాటిగా ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 156-4గా ఉంది. శివమ్‌ దూబే (14), సర్ఫరాజ్‌ ఖాన్‌ (20) క్రీజ్‌లో ఉన్నారు.

IPL 2026 CSK VS PBKS: Sanju Samson Fails in two consecutive matches9
IPL 2026: నిరాశలో సీఎస్‌కే ఫ్యాన్స్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో భీకర ఫామ్‌ ప్రదర్శించి, టీమిండియా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌.. మెగా టోర్నీ పూర్తైన కొద్ది రోజులకే ఫామ్‌ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అతను ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ అయిన చెటా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటైన సంజూ.. ఇవాళ (ఏప్రిల్‌ 3) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.అప్పటివరకు భీకర ఫామ్‌లో ఉండిన సంజూ తమ ఫ్రాంచైజీకి వచ్చే సరికి వరుసగా విఫలం​ కావడాన్ని సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంద చెటా ఇది అంటూ బాధపడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉండిన సంజూపై సీఎస్‌కే భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. అయితే అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తేలిపోవడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం తలలు పట్టుకుంది.అసలే ఆ జట్టుకు ధోని అందుబాటులో లేడు. యువ చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువకులతో నిండిన ప్రస్తుత జట్టులో సంజూనే అనుభవజ్ఞుడు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ నుంచి ఆశించడం తప్పేమీ కాదు. నేటి మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది, ఆ మరుసటి బంతికే వికెట్‌ కీపర్‌ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 71-1గా ఉంది. సంజూ త్వరగా ఔటైనా, ఆయుశ్‌ మాత్రే ధాటిగా ఆడుతున్నాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (14) అండగా ఉన్నాడు. కాగా, ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే కనీసం 130 పరుగులు కూడా చేయలేకపోయింది. వారు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. ఛేదనలో యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, ఆదిలోనే తన జట్టు గెలుపును ఖరారు చేశాడు.

IPL 2026: Only the second instance of CSK fielding four players aged 21 or younger10
IPL 2026: సీఎస్‌కే చరిత్రలో అరుదైన సందర్భం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు నలుగురు 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న ఆటగాళ్లను బరిలోకి దించింది. ఆ జట్టు చరిత్రలో ఇలా జరగడం​ ఇది రెండో సారి మాత్రమే. గత ఎడిషన్‌ ఆరంభంలో తొలిసారి ఇలా జరిగింది. సాధారణంగా సీఎస్‌కేను ముసలివాళ్ల జట్టుగా పరిగణిస్తారు. ఆ జట్టు చరిత్ర చూస్తే 30 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. గత రెండు సీజన్లుగా సీఎస్‌కే ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది.పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయుశ్‌ మాత్రే, కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌, నూర్‌ అహ్మద్‌ లాంటి యువకులను సీఎస్‌కే బరిలోకి దించింది. వీరంతా 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు.ఆయుశ్‌ మాత్రే (18 ఏళ్ల 261 రోజులు)కార్తీక్ శర్మ (19 ఏళ్ల 342 రోజులు)ప్రశాంత్ వీర్ (20 ఏళ్ల 130 రోజులు)నూర్ అహ్మద్ (21 ఏళ్ల 90 రోజులు)ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌ చివరి బంతికి సంజూ శాంసన్‌ (7) ఔటయ్యాడు. సీఎస్‌కేకు మారిన తర్వాత సంజూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 24-1గా ఉంది. ఆయుశ్‌ మాత్రే (0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement