ప్రధాన వార్తలు
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది'
అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది: హర్భజన్
జాతీయ జట్టు సెలెక్టర్ల పని ఎప్పుడూ కత్తిమీద సామే. వారు ఎంపిక చేసిన జట్టు గెలిస్తే శెభాష్ అంటారు. అదే ఒక్క ఓటమి ఎదురైనా చాలు విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. పేలవ ఫామ్తో సతమతమవుతున్న గిల్ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్దానంలో రింకూ సింగ్.. జితేష్ శర్మ ప్లేస్లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు పదికి పది మార్కులు వేశాడు. కిషన్తో పాటు ఫినిషర్ రింకూ సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు."టీ20 వరల్డ్కప్కు అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్, మెనెజ్మెంట్కు 10కి 10 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయమైనప్పటికి.. జట్టు కూర్పుకే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ టీ20ల్లో ఇదే అతడికి చివరి అవకాశం కాదు. గిల్ తిరిగొస్తాడన్న నమ్మకం నాకు ఉంది.రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతడికి రాక జట్టుతో మరింత పటిష్టంగా మారింది. అదేవిధంగా జితేష్ శర్మ స్ధానంలో సెకెండ్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. ఎందుకంటే 7 లేదా 8వ స్థానాల్లో ఆడే బ్యాటర్లు ఇప్పటికే జట్టులో చాలా మంది ఉన్నారు. టాప్ ఆర్డర్లో మెరుపులు మెరిపించే పవర్ హిట్టర్ జట్టుకు కావాలి. ఆ బాధ్యతను ఇషాన్ నెరవేరుస్తాడన్న నమ్ముతున్నాను" అని భజ్జీ పేర్కొన్నాడు.
టి20 సమరానికి సై
సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మైదానంలో అడుగు పెట్టనుంది. శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా తొలి పోరు జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా 11 టి20 మ్యాచ్లు ఆడనుంది. గతేడాది జరిగిన టి20 వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత జట్టు... ఈసారి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది. అందుకు లంకతో సిరీస్ను ప్రాక్టీస్గా వినియోగించుకోవాలని చూస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లు కమలిని, వైష్ణవి శర్మను ఎంపిక చేశారు. 17 ఏళ్ల కమలిని ఇప్పటికే అండర్–19 ప్రపంచకప్తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటింది. తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు వైష్ణవి అండర్–19 ప్రపంచకప్లో 17 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి వచి్చంది. రాధ యాదవ్ గైర్హాజరీలో ఈ 19 ఏళ్ల మీడియం పేసర్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఇక తెలుగమ్మాయి శ్రీచరణి మరోసారి కీలకం కానుంది. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు అడ్డంకులు ఎదుర్కొన్న స్మృతి మంధాన ఎలాంటి ప్రదర్శన చేస్తుందోచూడాలి. క్రికెట్ కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదని ఇప్పటికే స్పష్టం చేసిన స్మృతిపై అందరి దృష్టి నిలవనుంది. ఇక అనూహ్యంగా వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకొని ఫైనల్లో అదరగొట్టిన షఫాలీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టు సైతం యువ ప్లేయర్లను పరీక్షించనుంది. 17 ఏళ్ల శశి్నని, 19 ఏళ్ల రషి్మక, 23 ఏళ్ల కావ్యను ఈ మ్యాచ్లో బరిలోకి దింపే అవకాశం ఉంది.
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు నిరాశ తప్పలేదు. ప్రతిష్టాత్మక ఈ టోర్నీలో సెమీఫైనల్కు చేరిన తొలి భారత పురుషుల ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పరాజయం పాలయ్యారు. శనివారం జరిగిన సెమీస్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంట 21–10, 17–21, 13–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గ్రూప్ దశలో ఈ జోడీపై సులువుగా గెలిచిన భారత జంట... సెమీస్లో అదే ఆటతీరు కనబర్చడంలో విఫలమైంది. తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న తర్వాత... అనవసర తప్పిదాలతో వరుసగా రెండు గేమ్లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత షట్లర్లు ప్రత్యర్థి కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. అదే జోరులో తొలి గేమ్ సొంతం చేసుకున్న సాత్విక్–చిరాగ్ దాన్ని కొనసాగించలేకపోయారు. రెండో గేమ్లో 3–6తో వెనుకబడిన భారత ప్లేయర్లు ఆ తర్వాత 7–7, 11–11తో స్కోరు సమం చేశారు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగగా కీలక దశలో పాయింట్లు సాధించిన చైనా జంట గేమ్ను చేజిక్కించుకుంది. ఇక అదే జోరులో మూడో గేమ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి రెచ్చిపోగా... భారత జంట పోటీనివ్వలేక పరాజయం వైపు నిలిచింది.
పోరాడుతున్న వెస్టిండీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్తో మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఓవర్నైట్ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కవెమ్ హడ్జ్ (254 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్సెంచరీ చేయగా... జాన్ క్యాంప్బెల్ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్ గ్రేవ్స్ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్బెల్ అవుట్ కాగా... కాసేపటికే బ్రాండన్ కింగ్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో హడ్జ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్ అవుట్ కాగా... అలిక్ అథనజె, జస్టిన్ గ్రేవ్స్ సాయంతో హడ్జ్ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోస్టన్ చేజ్ (2) విఫలం కాగా... హడ్జ్తో పాటు అండర్సన్ ఫిలిప్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ షై హోప్... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఎజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో విండీస్ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం.
శుబ్మన్ గిల్ అవుట్!
టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్లు అనూహ్య షాక్ ఇచ్చారు. వరుసగా విఫలమవుతున్నా, అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతున్నా పదే పదే తాము అండగా నిలిచిన శుబ్మన్ గిల్పై సరిగ్గా ప్రపంచ కప్కు ముందు వేటు వేశారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ అయిన ఆటగాడికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ప్రదర్శనను గుర్తిస్తూ జట్టులోకి తీసుకున్న సెలక్టర్లు, ఇప్పటికే రెండో కీపర్గా నిలదొక్కుకున్న జితేశ్పై వేటు వేశారు. ఫలితంగా ఫినిషర్గా మరోసారి రింకూ సింగ్కే అవకాశం దక్కింది. 2024లో విజేతగా నిలిచిన జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు ఈ సారి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.ముంబై: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సొంతగడ్డపై టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడు. 15 మంది సభ్యుల ఈ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. బ్యాటింగ్ ఫామ్తో సంబంధం లేకుండా కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్పైనే నమ్మకం ఉంచగా, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో 2026 వరల్డ్ కప్ జరుగుతుంది. రెండేళ్ల తర్వాత... ఇషాన్ కిషన్ 2023 నవంబర్లో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను జట్టుకు దూరమయ్యాడు. ప్రదర్శనపరంగా కాకుండా నాటి కోచ్ ద్రవిడ్ దృష్టిలో క్రమశిక్షణ తప్పిన కుర్రాడిగా ముద్ర పడింది. దేశవాళీ మ్యాచ్లు ఆడకపోవడంతో బీసీసీఐ హెచ్చరికకు కూడా గురయ్యాడు. ఇక భారత జట్టులో అటు పంత్, ఇటు సామ్సన్లతో పాటు జురేల్, జితేశ్ కూడా నిలదొక్కుకోవడంతో ప్రాధాన్యతపరంగా కిషన్ వెనుకబడిపోయాడు. దాంతో అతను తనను తాను మార్చుకున్నాడు. వరుసగా దేశవాళీ మ్యాచ్లు ఆడటంతో పాటు ఫిట్గా మారి నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. క్రమశిక్షణ విషయంలో కూడా మరో ఫిర్యాదు రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఇటీవలి ముస్తాక్ అలీ ట్రోఫీతో ఒక్కసారిగా పైకెగిసాడు. ఏకంగా 517 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్గా జార్ఖండ్ను చాంపియన్గా నిలపడంతో అందరి దృష్టీ పడేలా చేశాడు. ఫలితంగా అతను కూడా ఊహించని విధంగా వరల్డ్ కప్ టీమ్లో స్థానం లభించింది. ప్రత్యామ్నాయ ఓపెనర్ కం కీపర్గా అతను సిద్ధమయ్యాడు. ఆ ఇద్దరు ఇలా... దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో రింకూ సింగ్పై వేటు పడినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అతని గురించి చెప్పేందుకు వైఫల్యాలేమీ లేవు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లో అతను బాగానే ఆడాడు. కానీ వికెట్ కీపర్గా జితేశ్ను ఎంపిక చేస్తూ సెలక్టర్లు అతడిని ఫినిషర్ పాత్రను కూడా ఇచ్చారు. దాంతో రింకూకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు గిల్పై వేటు సామ్సన్కు ఓపెనింగ్ స్థానం ఖాయం చేశారు. ఫలితంగా ఫినిషర్గా జితేశ్కంటే రింకూ మెరుగైన ఆటగాడని అగార్కర్ బృందం భావించింది. దాంతో జట్టులోకి మళ్లీ పిలుపు రాగా...పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జితేశ్ను పక్కన పెట్టక తప్పలేదు.7 మార్పులు... 2024 చాంపియన్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఈ సారి కనిపించడం లేదు. రోహిత్, కోహ్లి, జడేజా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించగా...జైస్వాల్, పంత్, చహల్, సిరాజ్ తమ స్థానాలు కోల్పోయారు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఇదే తొలి టి20 వరల్డ్ కప్ కానుంది.‘నిప్పు–నిప్పు కావాలి’అగార్కర్ సెలక్టర్గా వచ్చిన దగ్గరినుంచి గిల్ను అసాధారణ ఆటగాడిగా చెబుతూ అండగా నిలుస్తూ వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా రోహిత్ను కాదని గిల్కు వన్డే కెప్టెన్సీ అప్పగించడంతో పాటు త్వరలోనే మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్ అంటూ ప్రచారం చేశారు. ఐపీఎల్లో అతని నిలకడైన ప్రదర్శన కూడా టి20ల్లోనూ నమ్మకం కలిగించింది. ఇదే క్రమంలో దాదాపు ఏడాది తర్వాతి జట్టులోకి వచ్చినా నేరుగా అతనికి ఆసియా కప్ వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే బ్యాటింగ్ పరంగా ఓపెనింగ్లో గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయా డు. ఒక వైపు అభిషేక్ శర్మ చెలరేగుతుండగా, మరో వైపు గిల్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. దీనికి ఆరంభంలో ‘నిప్పు–నీరు’ అంటూ కాంబినేషన్ గురించి సానుకూల వ్యాఖ్యలు చేసినా...ప్రస్తుతం టి20ల్లో ఓపెనింగ్ అంటే ‘నిప్పు–నిప్పు’గానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గిల్కు ఓపెనింగ్ ఇవ్వడంతో మూడు అంతర్జాతీయ టి20 సెంచరీల తర్వాత కూడా సంజు సామ్సన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అతడిని అలవాటు లేని మిడిలార్డర్కు తీసుకురావడంతో సామ్సన్ కూడా ఆశించిన విధంగా ఆడకపోవడంతో గిల్పై విమర్శలు మొదలయ్యాయి. అయినా సరే టీమ్ మేనేజ్మెంట్ సమర్థిస్తూ వచ్చింది. స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉండటమే కాదు అసలు పరుగులు రావడమే గగనంగా మారిపోయింది. గత 18 ఇన్నింగ్స్లలో ఓపెనర్గా ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం పరిస్థితిని చూపిస్తోంది. శుక్రవారం దక్షిణాఫ్రికాపై గిల్ స్థానంలో వచ్చిన సామ్సన్ దూకుడుగా ఆడి తన విలువను మళ్లీ చూపించాడు. మరో వైపు సూర్యకుమార్ కూడా ఘోరంగా విఫలమవుతున్నా...కీలక టోర్నీకి ముందు ఇద్దరినీ ఒకే సారి తప్పించలేని పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు ఫామ్లో లేకపోయినా...అంతకు ముందే టి20ల్లో తన స్థాయిని సూర్యకుమార్ నిరూపించుకున్నాడు కాబట్టి అతనిపై ఎంతో కొంత నమ్మకం మిగిలి ఉంది. దాంతో గిల్పై వేటు పడింది. టీమ్ కాంబినేషన్ కారణంగానే 2024 టి20 వరల్డ్ కప్లో కూడా గిల్కు చోటు దక్కలేదు.భారత జట్టు వివరాలుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా.
క్రికెట్ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే
2025 సంవత్సరం.. క్రీడా రంగంలో అనేక విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. ఆసియాకప్ నో షేక్ హ్యాండ్ నుంచి ఎన్బీఏ (NBA) బెట్టింగ్ స్కామ్ వరకు చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టాప్-5 కాంట్రవర్సీలపై ఓ లుక్కేద్దాం.నో హ్యాండ్ షేక్..ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'నో హ్యాండ్షేక్' వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం. కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. సూర్య బాటలోనే మిగితా భారత ప్లేయర్లు కూడా నడిచారు. టోర్నీ అసాంతం పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టుగానే వ్యవహరిచింది. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు.ఆ తర్వాత ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మెన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియాకప్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ పేసర్ హారిస్ రౌఫ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్లో అంతర్జాతీయ బాస్కెట్బాల్ అసోసియేషన్ (NBA)ని బెట్టింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) చేసిన దాడులలో కొంతమంది బాస్కెట్బాల్ దిగ్గజాలు.. మాఫియా ముఠాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు మాఫియా ముఠాలతో కలిసి ఇన్సైడర్ సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో చాన్సీ బిలప్స్, టెర్రీ రోజియర్, డామన్ జోన్స్ వంటి దిగ్గజాలు నిందితులగా ఉన్నారు.'గ్రోవెల్' (Grovel) వివాదంఈ ఏడాది నవంబర్లో భారత్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ నాడ్.. భారత జట్టును ఉద్దేశించి "గ్రోవెల్" (మా ముందు సాష్టాంగపడేలా చేస్తాం) అనే పదాన్ని వాడటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. దీనిపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ సైతం తప్పుబట్టాడు. ఆ తర్వాత షుక్రీ నాడ్ క్షమాపణలు చెప్పాడు.మెద్వెదేవ్ ఆగ్రహంయూఎస్ ఓపెన్ 2025 తొలి రౌండ్లోనే రష్యా టెన్నిస్ ఆటగాడు డానియిల్ మెద్వెదేవ్ వెనుదిరిగాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓడిపోడంతో మెద్వెదేవ్ అసహనానికి గురయ్యాడు. అతడు తన రాకెట్ను అక్కడే విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానాను నిర్వాహకులు విధించారు.హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలుఐపీఎల్-2025 సీజన్ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వ్యాఖ్యాతగా వ్యహరించిన హర్భజన్.. ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ జోఫ్రా ఆర్చర్ను లండన్లోని 'నల్ల టాక్సీ' (Kaali Taxi) తో పోల్చాడు. దీంతో జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని భజ్జీపై విమర్శల వర్షం కురిసింది.
'అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్.. నిజంగా ఇదొక సర్ప్రైజ్'
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీ20 వరల్డ్కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. మొన్నటివరకు వైస్ కెప్టెన్గా గిల్ను ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.అతడి కోసం ఇన్ ఫామ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికి గిల్పై మెనెజ్మెంట్ నమ్మకం ఉంచింది. కానీ ఆ నమ్మకాన్ని శుభ్మన్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ ప్రస్తుత ఫామ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికి.. అతడిలోని టాలెంట్ ఎప్పటికి పోదు అని గవాస్కర్ అన్నారు."నిజంగా ఇది సర్ప్రైజ్. గిల్ ఒక క్వాలిటీ బ్యాటర్. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో కూడా పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో అతడు విఫలమయ్యాడు. అందుకు నేను అంగీకరిస్తా.కానీ ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది శాశ్వతం. టీ20 ఫార్మాట్కు చాలా కాలం దూరంగా ఉండటం వల్లే గిల్ తన రిథమ్ను కోల్పోయాడు. టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్న గిల్కు టీ20 శైలి అలవడటానికి కొంత సమయం పడుతుందని" స్టార్ స్పోర్ట్స్ షోలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా శుభ్మన్ గిల్ స్ధానంలో జట్టులోకి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వచ్చాడు. రెండేళ్ల తర్వాత అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
విజయానికి చేరువలో ఆస్ట్రేలియా.. అదే జరిగితే?
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో విజయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల దూరంలో నిలిచింది. 435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంకా 228 రన్స్ వెనుకంజలో ఉంది. పర్యాటక జట్టు విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. క్రీజులో జెమ్మీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) ఉన్నారు. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టును ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకొట్టాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(85) టాప్ స్కోరర్గా నిలవగా.. జోరూట్ (39) కాస్త ఫర్వాలేదన్పించాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్తో పాటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.హెడ్ సూపర్ సెంచరీ..అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170 , 16 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. అలెక్స్ కారీ 72 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే మరో రెండు టెస్టులు మిగిలూండగానే యాషెస్ సిరీస్ను కంగారులు సొంత చేసుకోనున్నారు.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో ఆల్రౌండర్ అక్షర్పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ను మాత్రం కెప్టెన్గా సెలక్టర్లు కొనసాగించారు. కానీ వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ను తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.పేలవ ఫామ్లో సూర్య..స్కై కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్గా మాత్రం అట్టర్ప్లాప్ అయ్యాడు. ఒకప్పుడు టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగిన ఈ ముంబై ఆటగాడు.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. గత 14 నెలల్లో 24 టీ20 మ్యాచ్లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్పై పడుతున్నట్లు బీసీసీఐ భావిస్తోంది.దీంతో అతడి స్దానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు ఇండియా టూడే తమ కథనంలోపేర్కొంది. వాస్తవానికి సూర్యను కెప్టెన్సీ నుంచి ముందే తొలగించాలని భావించినప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మెగా టోర్నీ ముందు ప్రయోగాలు చేయడం ఇష్టం లేక సూర్యనే కెప్టెన్గా ఎంపిక చేశారు. సూర్యకు కెప్టెన్గా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు.కెప్టెన్సీ రికార్డు అదర్స్..సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 35 మ్యాచ్లు ఆడిన భారత్.. ఏకంగా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ ఓడిపోగా.. మరో రెండింట ఫలితం రాలేదు. అతడి విజయశాతం 84.9%గా ఉంది. కానీ అతడి పేలవ ఫామ్ను టీమ్ మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.కెప్టెన్సీ రేసులో అక్షర్, హార్దిక్..!అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. అటువంటిది గిల్ను టీ20 కెప్టెన్గా చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టీ20 కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్షర్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది హార్దిక్కు కెప్టెన్గా అనుభవం ఉందని, తిరిగి అతడికి జట్టు ప్గాలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. భారత జట్టుకు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరో తెలియాలంటే ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఈ ఏటి మేటి షోలో సామ్రాట్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: భారత షూటర్ సామ్రాట్ రాణా ప్రపంచ చాంప...
ధీరజ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చ...
సాత్విక్–చిరాగ్ జోడీకి రెండో విజయం
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్...
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములే...
'అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్.. నిజంగా ఇదొక సర్ప్రైజ్'
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీ20 వరల...
విజయానికి చేరువలో ఆస్ట్రేలియా.. అదే జరిగితే?
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూ...
బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత...
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్...
క్రీడలు
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
వీడియోలు
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
