ప్రధాన వార్తలు
ఒక్కో ఫార్మాట్కు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్న "పెద్ద తలకాయ"..!
భారత పురుషుల క్రికెట్కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది. వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్ 9) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కటక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో అందరూ ఊహించిన విధంగానే శుభ్మన్ గిల్ ఓపెనర్గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.వాస్తవానికి గిల్ స్థానం సంజూ శాంసన్ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్ను బలి చేస్తున్నారు. నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు చేస్తున్నారు.ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది. ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతోనే మైండ్ గేమ్ ఆడాడు. వారంతట వారే టెస్ట్, టీ20 కెరీర్లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్ కోసం సంజూ కెరీర్ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ గౌరవం పోతుంది.
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
డిసెంబర్ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే.పలాష్ ముచ్చల్తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్కప్ స్టార్ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. అలాగే వరల్డ్కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, వరల్డ్కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్కప్ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.షెడ్యూల్..తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నంరెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం
‘అతడి త్యాగం.. నా సెంచరీ.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను’
సచిన్ టెండుల్కర్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్ గాడ్గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్.అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్ సీజన్. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్రెస్టాఫ్ ఇండియాకు ఆడుతున్న సచిన్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. అప్పటికి బ్యాటింగ్కు రావాల్సిన ప్లేయర్ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ గురుశరణ్ సింగ్ (Gursharan Singh). అతడు బ్యాటింగ్కు వస్తేనే సచిన్ తన శతక మార్కును అందుకోగలడు.సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్ చేసేందుకు గురుశరణ్ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.అతడి త్యాగం.. నా సెంచరీనాటి ఈ ఘటన గురించి సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్కు రావాల్సిన గురుశరణ్ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ రాజ్ సింగ్ దుంగర్పూర్ .. గురుశరణ్ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.టీమిండియాకు సెలక్ట్ అయ్యానుఆయన మాట ప్రకారం గురుశరణ్ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.డ్రెసింగ్రూమ్లో నేను గురుశరణ్కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్ టెండుల్కర్.. గురుశరణ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.మ్యాచ్ ఓడినా..కాగా నాటి ఇరానీ కప్ మ్యాచ్లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో గురుశరణ్ సాయంతో ఆఖరి వికెట్కు సచిన్ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్ ఇండియా ఆలౌట్ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్కు టీమిండియా నుంచి పిలుపు అందింది.చదవండి: టీమిండియాకు ఆల్రౌండర్లు కావలెను!
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. సంజూకు మొండిచెయ్యి
కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్కీపర్ బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్కీపర్),అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే
భారత ఆటగాడి కోటాలో ఐపీఎల్ వేలంలోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్ చౌదరి 2026 సీజన్ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్క్లాస్ ఆడుతూ, బిగ్బాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.ఓ ఆటగాడు విదేశీ లీగ్ల్లో ఆడుతూ, ఐపీఎల్లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన నిఖిల్ వేలంలో సెట్ 35లో (ఆల్రౌండర్లు) షార్ట్లిస్ట్ అయ్యాడు. షార్ట్లిస్ట్ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!నిఖిల్కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్మన్ గిల్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.దీంతో అతని కెరీర్కు పుల్స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్.. తొలి సీజన్లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కింది. అరంగేట్రం మ్యాచ్లోనే నిఖిల్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్పై శతకంతో విరుచుకుపడ్డాడు.
క్యాన్సర్ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను క్యాన్సర్ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్ 14) బిగ్బాష్ లీగ్ 2025-26 కోసం సిడ్నీ థండర్తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్తో బీబీఎల్ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. థండర్తో ఒప్పందం అనంతరం మాడిన్సన్ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.మాడిన్సన్ థండర్తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మాడిన్సన్ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్ బిగ్బాష్ లీగ్లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్ (7 సీజన్లు), మెల్బోర్న్ స్టార్స్ (3), మెల్బోర్న్ రెనెగేడ్స్ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్ అతని నాలుగో జట్టు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన మాడిన్సన్ ఆసీస్ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్ 2014 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్లు ఆడాడు. బిగ్బాష్ లీగ్ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్గా సేవలు అందిస్తూ.. టాపార్డర్లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్డౌన్లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్కప్ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్కప్లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
పునర్జన్మ పొందిన 'గిల్లీ దండ'.. ఇప్పుడు లీగ్గా..!
స్పెయిన్లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది. బిల్లార్డా అంటే ఏమిటి..?ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు. ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది.
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్ పాండ్యా ఆగ్రహం
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..భార్య నటాషా స్టాంకోవిక్కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్ మొదలు బీచ్ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.తీయకూడని యాంగిల్లో ఫొటో..‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.ప్రైవేట్ మూమెంట్అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్ మూమెంట్ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్లైన్స్ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.కాస్త మానవత్వం చూపండిప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్
'మహా' విషాదం.. క్రికెట్ బంద్..!
ఒడిశాలోని కటక్ నగరంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టి20 మ్యాచ్ మంగళవారం రాత్రి జరగనుంది. స్థానిక బారామతి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం నాలుగు రోజుల క్రితం అభిమానులు పోటెత్తారు. టికెట్లు దక్కించుకునేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు అభిమానులు వెనుకాడలేదని స్థానిక మీడియా వెల్లడించింది. క్రికెట్ అంటే పిచ్చా అనేంతగా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు. కటక్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నువాగర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కారణం 21 ఏళ్ల క్రితం జరిగిన ఓ విషాదం.ఏం జరిగింది?జగత్సింగ్పూర్ జిల్లాలోని నువాగర్ గ్రామం (Nuagarh village) ఒకప్పుడు క్రికెట్కు ప్రసిద్ధి. ఆ ఊరి ప్రజలకు క్రికెట్ అంటే ఇష్టం. 2004 ముందు వరకు గ్రామస్తులు నిరంతరం క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉండేవారు. దీంతో ఆ ఊరిలో ఎప్పుడు చూసినా క్రికెట్ సందడి కనిపించేది. అంతేకాదు నువాగర్ గ్రామానికి ప్రత్యేకంగా ఉత్కల్మణి క్రికెట్ క్లబ్ పేరుతో ఒక జట్టు కూడా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంది. 2004, మార్చి 1 ముందు వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ రోజు నువాగర్ గ్రామం చరిత్రలో దుర్దినంగా మిగిలిపోయింది.కేంద్రపార జిల్లా మహాకలపాడలో స్థానిక టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 2004, మార్చి 1న ఉత్కల్మణి క్రికెట్ క్లబ్ (Utkalmani youth club) జట్టు పడవలో బయలుదేరింది. 15 మంది ఆటగాళ్లు, మరో ఏడుగురు కలిసి పయనమయ్యారు. బహాకుడా ఘాట్ సమీపంలో దురదృష్టవశాత్తు పడవ ప్రమాదానికి గురవడంతో 13 మంది క్రికెటర్లు మహానదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊహించని విషాదంతో నువాగర్ గ్రామం దిగ్బ్రాంతికి గురైంది. అప్పటివరకు స్థానికంగా క్రికెట్కు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆ ఊరిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. క్రికెట్కు ఫుల్స్టాప్ పడింది. ఆ దుర్ఘటన తర్వాత తమ ఊరిలో క్రికెట్ ఆడరాదని గ్రాస్తులంతా నిర్ణయం తీసుకున్నారని నువాగర్ మాజీ సర్పంచ్ సుధాల్ స్వాన్ మీడియాకు తెలిపారు.పెళ్లైన 6 నెలలకే..పడవ ప్రమాదంలో చనిపోయిన 13 మంది ఆటగాళ్ల పేరుతో 2007లో స్మారక స్థూపం (memorial pillar) ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటన రోజాలిని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె భర్త బిశ్వజిత్ రే ఈ ప్రమాదంలో చనిపోయాడు. వారిద్దరికీ పెళ్లయి అప్పటికే ఆరు నెలలు మాత్రమే అయింది. ''నా భర్త కుడిచేతి వాటం బ్యాటర్, మీడియం పేస్బౌలర్. అప్పుడప్పుడు వికెట్ కీపర్గానూ ఉండేవాడు. క్రికెట్పై ఉన్న మక్కువే అతడి ప్రాణాలు తీసింది. చనిపోయిన 13 మంది క్రీడాకారుల కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం రూ. 25 వేలు చొప్పున సహాయం అందించింద''ని రోజాలిని గుర్తు చేసుకున్నారు.క్రికెట్ చూడకూడదనుకున్నాంఇదే దుర్ఘటనలో చనిపోయిన ప్రదీప్ పరిడా కుటుంబానికి దాదాపు ఇదే పరిస్థితి. ఏడాది ముందే అతడికి పెళ్లైంది. ''నదిలో మునిగి చనిపోయిన 13 మందిలో నా భర్త కూడా ఉన్నాడు. నాతో పాటు, ఆరు నెలల కూతురిని వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయాడు. మా ఊరిలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రికెట్ చూడకూడదని నిర్ణయించుకున్నామ''ని ప్రదీప్ భార్య టికీ చెప్పారు. చదవండి: హెచ్సీఏ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ ల...
అబ్బురం.. ఇండియన్ సూపర్ క్రాస్రేసింగ్ లీగ్
గచ్చిబౌలి (హైదరాబాద్): ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఇండ...
వెర్స్టాపెన్కు ‘పోల్’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ చివరి రేసులో ...
సురుచికి స్వర్ణం
దోహా: భారత యువ షూటర్ సురుచి సింగ్... అంతర్జాతీయ ...
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్కు వరుస అవ...
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్ పాండ్యా ఆగ్రహం
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చ...
చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్
సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. ఓ క్రికెటర్ దే...
టీమిండియాకు ఆల్రౌండర్లు కావలెను!
ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్రౌండర్లు కావలెను...
క్రీడలు
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
వీడియోలు
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
