ప్రధాన వార్తలు
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో షఫాలీ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్రౌండ్ షోతో భారత వరల్డ్కప్ స్టార్ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్ (థాయ్లాండ్)లు కూడా పోటీ పడుతున్నారు. ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీలో (బ్యాంకాక్)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గాను సఫారీ స్పిన్నర్ హార్మర్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లామ్, పాకిస్తాన్ ఆల్రౌండర్ నవాజ్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్ కీలక భూమిక పోషించాడు.
‘అవసరమైతే... అధికారిక ఆదేశాలిస్తాం’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్షిప్ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్ల సీజన్లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ 408 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో మెక్లారెన్కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (392 పాయింట్లు) ఉన్నాడు.సీజన్లో చివరి రేస్ అబుదాబి గ్రాండ్ప్రి ఈ ఆదివారం జరగనుండగా... నోరిస్ పోడియంపై నిలిస్తే అతడికే ఈ ఏడాది టైటిల్ దక్కనుంది. ఈ నేపథ్యంలో... మెక్లారెన్ యాజమాన్యం శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే జట్టు తరఫున ఆదేశాలిస్తామని పేర్కొంది. ‘అవును, తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ఈ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ గెలవాలని అనుకుంటున్నాం. మా ఇద్దరు డ్రైవర్లు టైటిల్ రేసులో ఉన్నా... ఒకరికి మాత్రమే ఎక్కువ అవకాశాలున్నాయనేది సుస్పష్టం. ఇది జట్టు క్రీడ. చాంపియన్షిప్ సాధించేందుకు చేయగలిగినదంతా చేస్తాం. అలా చేయకపోవడం పిచ్చితనం అవుతుంది’ అని మెక్లారెన్ సీఈవో జాక్ బ్రౌన్ అన్నాడు. వెర్స్టాపెన్ కంటే 12 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న నోరిస్ సీజన్ చివరి రేసులో తొలి మూడు స్థానాల్లో నిలిస్తే చాలు టైటిల్ దక్కనుంది. ఈ నేపథ్యంలో సహచర డ్రైవర్ పియాస్ట్రిని చాంపియన్షిప్ గెలిచేందుకు సహకరించమని అడగలేనని నోరిస్ ఇప్పటికే పేర్కొనగా... తాజాగా జట్టు మేనేజ్మెంట్ మాత్రం టైటిల్ కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని వెల్లడించింది. మెక్లారెన్ జట్టు చివరిసారిగా 2008లో డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ నెగ్గింది.
లెబ్రాన్ జేమ్స్బాండ్ 008!
టొరంటో: లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ బాస్కెట్బాల్ ప్రియులకు చిరపరిచితుడు! హాలీవుడ్లోని ‘జేమ్స్బాండ్ 007’ సిరీస్ సినిమాల్లాగే విజయవంతమైన సూపర్ బాస్కెట్బాలర్ లెబ్రాన్. అరంగేట్రం మొదలు ఇప్పటివరకు ఆడిన 1297 వరుస మ్యాచ్ల్లో అతను ప్రతీసారి కూడా పదుల సంఖ్యని మించే పాయింట్లు సాధించాడు. లెబ్రాన్ జేమ్స్ ఇన్నేళ్ల తర్వాత, వెయ్యిపైచిలుకు మ్యాచ్ల అనంతరం తొలిసారి సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. బాగా ఆడి ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేమ్స్... ఈసారి బాగా ఆడలేక కూడా నిలవడమే ఈ వార్తకున్న విశేషం!లాస్ ఏంజెలిస్ లేకర్స్కు ఆడే ఈ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్బాలర్ టొరంటో రాప్టర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 8 పాయింట్లే చేశాడు. అయితే ఈ మ్యాచ్లో పాయింట్లు చేయడంలో వెనుకబడినప్పటికీ సహచరులకు పదేపదే స్కోరు చేసేందుకు సాయపడ్డాడు. దీంతో లేకర్స్ 123–120తో టొరంటో రాప్టర్స్పై గెలుపొందింది. 40 ఏళ్ల జేమ్స్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అలుపెరగని యోధుడు. 2003లో క్లీవ్లాండ్ కెవలియర్స్ తరఫున ఎన్బీఏలో అరంగేట్రం చేసిన ఈ పవర్ ఫార్వర్డ్ ప్లేయర్ తదనంతరం మయామి హీట్కు మారాడు. 2018 నుంచి లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని కెరీర్ మొత్తం హైలైట్స్ అంటే అతిశయోక్తి కాదు. 2005 నుంచి 2025 వరకు ఏకంగా 21 సార్లు ‘ఎన్బీఏ ఆల్ స్టార్స్’లో నిలిచాడు. 2012, 2013, 2016, 2020 ఈ నాలుగేళ్లు ఎన్బీఏ చాంపియన్గా, ఫైనల్స్లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచిన ఘనత లెబ్రాన్ జేమ్స్దే! ‘ఫోర్బ్స్’ గణాంకాల ప్రకారం అతని నికర సంపద 1.3 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ. 11, 689 కోట్ల రూపాయలు! లెబ్రాన్ జేమ్స్ కుమారుడు బ్రోనీ జేమ్స్ కూడా బాస్కెట్బాల్ ప్లేయరే. లెబ్రాన్, బ్రోనీ ఇద్దరూ కలిసి గత సీజన్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ తరఫున బరిలోకి దిగి ఎన్బీఏ మ్యాచ్ ఆడిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టించారు.
‘షూటౌట్’లో గెలిచి సెమీస్లోకి భారత్
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ సత్తా చాటుకుంది. అండర్–21 ప్రపంచకప్లో వరుసగా నాలుగోసారి టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (45వ నిమిషంలో), శార్దానంద్ తివారి (48వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టుకు గాస్పర్డ్ కార్నెజ్ (11వ నిమిషంలో), నాథన్ రొగె (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లో భారత గోల్కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెల్జియం జట్టుకు చెందిన రెండు పెనాల్టీ స్ట్రోక్లను నిలువరించి భారత్ను గెలిపించాడు. ‘షూటౌట్’లో భారత్ తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్లను శార్దానంద్ తివారినే తీసుకొని మూడింటిని గోల్స్గా మలిచాడు. మరోవైపు బెల్జియం తరఫున తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్లను హుగో లబుచెరి, గుర్లెయిన్, చార్లెస్ గోల్స్గా మలిచారు. భారత్ తరఫున నాలుగో పెనాల్టీ స్ట్రోక్లో మన్మీత్ సింగ్... బెల్జియం తరఫున నాథన్ రొగె విఫలమయ్యారు. భారత్ తరఫున ఐదో పెనాల్టీ స్ట్రోక్ను అంకిత్ పాల్ లక్ష్యానికి చేర్చగా... బెల్జియం ప్లేయర్ నికోలస్ పెనాల్టీ స్ట్రోక్ను భారత గోల్కీపర్ ప్రిన్స్ దీప్ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఆదివారం జరిగే సెమీఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో భారత్; అర్జెంటీనాతో స్పెయిన్ తలపడతాయి.
సిరీస్ ఎవరి సొంతం!
భారత పర్యటనకు వచ్చిన ఏ విదేశీ జట్టయినా ఒకే టూర్లోని రెండు ఫార్మాట్ (టెస్టు, వన్డే)లలో మన టీమ్పై సిరీస్లు గెలుచుకోవడం 1986–87 తర్వాత మళ్లీ జరగలేదు. ఇప్పుడు అలాంటి మరో అవమానకర రికార్డును ప్రస్తుత భారత జట్టు నెలకొల్పే ప్రమాదం ఉంది. సఫారీల చేతుల్లో ఇప్పటికే టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా... ఇప్పుడు వన్డేల్లోనూ సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్లలో ఫలితాన్ని ‘టాస్’ శాసించడంతో ఈ సారైనా టాస్ గెలవాలని భారత్ కోరుకుంటోంది. మ్యాచ్ కూడా గెలిచి రాహుల్ బృందం సిరీస్ను సాధిస్తుందా అనేది చూడాలి. సాక్షి, విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లలో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు చేతికి సిరీస్ చిక్కుతుంది. గత రెండు మ్యాచ్లలో ప్రదర్శనను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పర్యటనలో లభిస్తున్న వరుస విజయాలు దక్షిణాఫ్రికా బృందంలో మరింత ఆత్మవిశ్వాసం పెంచగా... స్వదేశంలో వన్డే సిరీస్ను కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. జైస్వాల్పై దృష్టి... తొలి రెండు మ్యాచ్లలో రెండు సెంచరీలు సాధించి కోహ్లి అద్భుత ఫామ్లో ఉండటం భారత్కు ప్రధాన సానుకూలాంశం. రోహిత్ తొలి మ్యాచ్లో చెలరేగగా, రుతురాజ్ గత మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు. కెపె్టన్ రాహుల్ నిలకడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. అయితే ఈ టాప్–5లో జైస్వాల్ ఒక్కడే విఫలమయ్యాడు. చివరి మ్యాచ్లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఉంది. జడేజా, సుందర్ కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేపోయారు. కుల్దీప్ ఫర్వాలేదనిపించగా, పేసర్లు హర్షిత్, అర్‡్షదీప్, ప్రసిధ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసిధ్ గత మ్యాచ్లో ఘోరంగా విఫలమైనా... టీమ్లో మరో ప్రత్యామ్నాయ పేస్ బౌలర్ అందుబాటులో లేకపోవడంతో అతడినే కొనసాగించక తప్పని పరిస్థితి. బౌలర్ల ప్రదర్శన పేలవంగానే ఉంటుండటంతో భారత్ విజయావకాశాలన్నీ బ్యాటర్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. రెండు మార్పులతో... 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రెండో వన్డే గెలవడం సఫారీల పట్టుదలకు నిదర్శనం. చేయాల్సిన రన్రేట్ పెరిగిపోతున్నా సరే... ఏ దశలోనూ జట్టు బ్యాటర్లు ఒత్తిడిని దరి చేరనీయలేదు. ప్రతీ ఒక్కరు పోరాడి సమష్టి ప్రదర్శనతో టీమ్ను విజయం వరకు తీసుకెళ్ళారు. మార్క్రమ్ సెంచరీతో ఫామ్లోకి రాగా, బవుమా మిడిలార్డర్లో మూలస్థంభం. రెండు వన్డేల్లోనూ విఫలమైన డికాక్ తన అనుభవంతో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ ఆశిస్తోంది. బ్రీట్కే, బ్రెవిస్, యాన్సెన్, బాష్ నిలకడగా ఆడుతుండటం జట్టుకు ప్రధాన బలం. గత మ్యాచ్లో కండరాల గాయంతో మధ్యలోనే తప్పుకున్న జోర్జి, బర్గర్ ఈ మ్యాచ్కు దూరం కాగా... వారి స్థానాల్లో బార్ట్మన్, రికెల్టన్ జట్టులోకి వస్తారు. టాస్ గెలిచేనా! సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో మంచు ప్రభావం చాలా కనిపించింది. రాత్రి సమయంలో బౌలింగ్ బాగా కష్టంగా మారిపోతోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే పరిస్థితి వస్తోంది. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. అయితే ఈ విషయంలో చాలా కాలంగా భారత్ను దురదృష్టం వెంటాడుతోంది. భారత్ వరుసగా గత 20 వన్డేల్లో టాస్ ఓడిపోయింది! 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత భారత్ మళ్లీ టాస్ గెలవలేదు. ఈ సారైనా రాత మారుతుందా అనేది చూడాలి.
అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు.. క్లారిటీతో ఉన్నాము: టీమిండియా కోచ్
భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? గత కొన్ని సిరీస్లగా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే సుందర్ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉంటున్నాడు. కానీ ఓ మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడితే..మరో మ్యాచ్లో స్పిన్నర్గా తన బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. బ్యాటింగ్లో కూడా ఒక స్దానంలో పంపడం లేదు. ఒక మ్యాచ్లో మూడో స్దానం, మరో మ్యాచ్లో ఆరో స్దానం అలా అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంది. బౌలింగ్లో కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై తీవ్రస్దాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జట్టులో సుందర్ రోల్పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్గానే వాషీని జట్టులోకి తీసుకున్నట్లు టెన్ డెష్కాట్ తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేలలోనూ బ్యాట్తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడిని మూడో వన్డే నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంచు ప్రభావం కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించడం లేదు. అందుకే సుందర్కు రాంచీలో 3 ఓవర్లు, రాయ్పూర్లో 4 ఓవర్లు మాత్రమే ఇచ్చాము. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. గత ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా సుందర్ కృషి చేస్తున్నాడు అని పోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ర్యాన్ పేర్కొన్నాడు.చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్లో ఎక్కువ మంది వెతికింది అతడినే
రసవత్తరంగా యాషెస్ రెండో టెస్టు..
బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో మాత్రం ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పై చేయి సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.ఆతిథ్య జట్టు ప్రస్తుతం 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అలెక్స్ కారీ (46*), నీసర్(15*) ఉన్నారు. అదేవిధంగా ఆసీస్ టాపర్డర్ బ్యాటర్లు జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. పెర్త్ టెస్టు హీరో ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్ మూడు, స్టోక్స్ రెండు, ఆర్చర్ ఓ వికెట్ సాధించారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోర్(325/9)కు తొమ్మిది పరుగులు జోడించి 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ క్రికెటర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ముక్కోణపు టీ20 సిరీస్కాగా స్వదేశంలో శ్రీలంక- జింబాబ్వేలతో పాకిస్తాన్ ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్- శ్రీలంక (Pakistna vs Sri Lanka) ఫైనల్ చేరగా.. శనివారం (నవంబరు 29) రావల్పిండి వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్ చేసింది.కుప్పకూలిన లంక బ్యాటింగ్ ఆర్డర్ఓపెనర్ కామిల్ మిశారా (59) తప్ప మిగతా వారంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో.. 19.1 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి లంక ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), మొహమ్మద్ నవాజ్ చెరో మూడు వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) రెండు, సల్మాన్ మీర్జా, సయీమ్ ఆయుబ్ చెరో వికెట్ కూల్చారు.రాణించిన పాక్ టాపార్డర్అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (23), సయీబ్ ఆయుబ్ (36) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.మిగిలిన వారిలో కెప్టెన్ సల్మాన్ ఆఘా(14)తో పాటు ఫఖర్ జమాన్ (3) విఫలమయ్యారు. అయితే, పవన్ రత్ననాయకే బౌలింగ్లో దసున్ షనక క్యాచ్ పట్టడంతో ఫఖర్ జమాన్ అవుట్ కాగా.. అంపైర్ నిర్ణయాన్ని ఫఖర్ వ్యతిరేకించాడు. పాక్ ఇన్నింగ్స్లో పందొమ్మిదో ఓవర్లో ఈ మేరకు ఆన్ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. అతడితో వాగ్వాదానికి దిగాడు.ఫఖర్ జమాన్ ఓవరాక్షన్.. షాకిచ్చిన ఐసీసీఈ నేపథ్యంలో ఫఖర్ జమాన్కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఫఖర్ జమాన్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కాబట్టి ఓ మెరిట్ పాయింట్ మాత్రమే జత చేస్తున్నాం.అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ నిర్ణయం పట్ల ధిక్కారం చూపినందుకు గానూ అతడికి శిక్ష విధిస్తున్నాం. అతడు కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు’’ అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే.. సదరు ప్లేయర్ తదుపరి మ్యాచ్లు ఆడకుండా నిషేధం పడుతుంది. చదవండి: IND vs SA: మనసు మార్చుకున్న గంభీర్..!
కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్లో ఎక్కువ మంది వెతికింది అతడినే
టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్లో అతడి ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నప్పటికి వారిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యువ క్రికెటర్ అధిగమించాడు. అతడి గురుంచి తెలుసుకునేందుకు నెటజన్లు గూగుల్లో తెగ వెతికేశారు. అతడే భారత అండర్-19 సంచలనం, ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది గూగుల్లో భారత్లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ వండర్ కిడ్ ఐపీఎల్, ఇండియా 'ఎ'మ్యాచ్లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. వైభవ్ అగ్రస్ధానంలో ఉండగా మరో యువ సంచలనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సెకెండ్ ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్దానంలో అభిషేక్ శర్మ మరియు షేక్ రషీద్ నిలిచారు. అదేవిధంగా మహిళల ప్రపంచకప్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.చదవండి: ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్!
ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసిన స్మృతి!?.. తొలి పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ విజేతగా నిలవడం ఇందుకు ఓ కారణం అయితే.. అర్ధంతరంగా ఆమె పెళ్లి ఆగిపోవడం మరో కారణం.సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో ప్రేమలో ఉన్నట్లు గతేడాది స్మృతి వెల్లడించింది. టీమ్ టూర్లకు సైతం అతడిని స్మృతి వెంట తీసుకువెళ్లేది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత స్మృతి (Smriti Mandhana) ఇండోర్ (పలాష్ స్వస్థలం) కోడలు కాబోతోందంటూ పలాష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ..అందుకు తగ్గట్లుగానే వరల్డ్కప్ గెలిచిన తర్వాత.. తాము నిశ్చితార్థం (Engagement) చేసుకున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. స్మృతి మంధాన తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి వీడియో విడుదల చేసింది. అనంతరం పలాష్ సైతం స్మృతి వేలికి ఉంగరాన్ని తొడుగుతూ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియోను షేర్ చేశాడు.ఘనంగా వేడుకలుఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే, మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి మేనేజర్ వెల్లడించారు.అకస్మాత్తుగా ఆగిన పెళ్లి.. అనుమానాలుఅయితే, ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిలో చేరడం.. అతడు తనతో అసభ్యకర రీతిలో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి స్క్రీన్షాట్లు షేర్ చేయడం అనుమానాలు రేకెత్తించాయి. ఈ క్రమంలో స్మృతిని పలాష్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా.. ఇరు కుటుంబాలు మౌనం వహించాయి.భిన్న స్పందనలుఈ క్రమంలో త్వరలోనే స్మృతితో తన కుమారుడి వివాహం జరుగనుందని పలాష్ తల్లి అమితా వెల్లడించగా.. స్మృతి సోదరుడు శ్రవణ్ మాత్రం పెళ్లికి సంబంధించిన తాము కొత్త తేదీ ఫిక్స్ చేయలేదని స్పష్టం చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో స్మృతి మంధాన శుక్రవారం తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.రింగ్ తీసేసిన స్మృతి?ఓ ప్రముఖ బ్రాండ్ కోసం చేసిన యాడ్లో స్మృతి.. తన వరల్డ్కప్ విన్నింగ్స్ మూమెంట్స్ గురించి మాట్లాడింది. ఇందులో స్మృతి వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించలేదు. దీంతో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ యాడ్ ఎంగేజ్మెంట్కు ముందే షూట్ చేశారని ఆమె అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా స్మృతి ముఖం కళ తప్పినట్లు కనిపిస్తోందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా పెళ్లి వాయిదా పడిన వెంటనే స్మృతి.. తన వివాహ వేడుకలు, ఎంగేజ్మెంట్ రివీల్ వీడియోలను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: ‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’ View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana)
ఆశిష్ అద్భుతం
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత లభించడంత...
క్వార్టర్ ఫైనల్లో భారత హాకీ జట్టు
మదురై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు...
కలిసికట్టుగా పోరాడి భారత్ను గెలిపించిన కుకి-మీతై ఫుట్బాలర్లు
వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే ఆసియా కప్కు అర్హ...
భారీ విజయంతో భారత్ బోణీ
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ ట...
ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసిన స్మృతి!?.. తొలి పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి ...
ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లకు ముందు...
‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’
భారత మహిళా క్రికెట్ జట్టు తొలి వన్డే వరల్డ్కప్ ...
మనసు మార్చుకున్న గంభీర్..!
సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డేల సిరీస్లో కీలక ప...
క్రీడలు
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
వీడియోలు
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
