Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

DC Youngster Sameer Rizvi Smashes Consecutive Fifties In UP T20 League1
చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ చిచ్చరపిడుగు

ఉత్తర్‌ప్రదేశ్‌ టీ20 లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఆటగాడు సమీర్‌ రిజ్వి (21) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో కాన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. వరుస విధ్వంసాలతో హోరెత్తిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట గోరఖ్‌పూర్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 93 పరుగులు చేసిన రిజ్వి.. ఇవాళ మీరట్‌ మెవెరిక్స్‌పై అజేయమైన మెరుపు అర్ద శతకంతో (48 బంతుల్లో 78) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో రిజ్వి మెరుపు ఇన్నింగ్స్‌కు లక్‌ కూడా తోడవ్వడంతో కాన్పూర్‌ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాన్పూర్‌.. మీరట్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాన్పూర్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వి ఒక్కడే రాణించాడు.సహచరులు ఒక్కో పరుగు సాధించేందుకు ఇబ్బంది పడుతుండగా.. రిజ్వి భారీ షాట్లతో చెలరేగాడు. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్‌లో రిజ్వి ఒక్కడే సగానికి పైగా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మీరట్‌ను వరుణుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు స్కోర్‌ 41/2 వద్ద (8 ఓవర్ల తర్వాత) ఉండగా భారీ వర్షం​ మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోగా డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిన కాన్పూర్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి మీరట్‌ గెలుపుకు 14 పరుగుల దూరంలో (డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) ఉండింది. ఆర్సీబీ యువ ఆటగాడు స్వస్తిక్‌ చికారా (29), మాధవ్‌ కౌశిక్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, సమీర్‌ రిజ్వి గత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్‌లో ఒత్తిడిలో అజేయమైన అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. యూపీ లీగ్‌లో తాజా ప్రదర్శనలతో రిజ్వి మరోసారి డీసీ మేనేజ్‌మెంట్‌ దృష్టిలో పడి ఉంటాడు. ఈ ప్రదర్శనలు అతడికి మరిన్ని ఐపీఎల్‌ అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు.

Jonathan Trott Replaces RCB Head Coach Andy Flower In Gulf Giants Overhaul For ILT202
ఆండీ ఫ్లవర్‌పై వేటు.. కొత్త హెడ్‌ కోచ్‌గా జోనాథన్‌ ట్రాట్‌

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ (దుబాయ్‌) ఫ్రాంచైజీ గల్ఫ్‌ జెయింట్స్‌ తమ కోచింగ్‌ బృందంలో సమూల ప్రక్షాళన చేపట్టింది. వచ్చే సీజన్‌ కోసం హెడ్‌ కోచ్‌, బ్యాటింగ్‌ కోచ్‌, బౌలింగ్‌ కోచ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ పదవుల్లో కొత్త వారిని నియమించుకుంది.ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టిన జింబాబ్వే మాజీ బ్యాటర్‌ ఆండీ​ ఫ్లవర్‌ గత ILT20 సీజన్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆండీ​ ఫ్లవర్‌ పర్యవేక్షణలో జెయింట్స్‌ గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. 10 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో జెయింట్స్‌ యాజమాన్యం ఆండీ​ ఫ్లవర్‌పై వేటు వేసి ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జోనాథన్‌ ట్రాట్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది.అలాగే గత సీజన్‌లో జెయింట్స్‌ కోచింగ్‌ బృందంలో పని చేసిన ఒట్టిస్‌ గిబ్సన్‌, రిచర్డ్‌ హల్సాల్‌, గ్రాంట్‌ ఫ్లవర్‌, గ్యారీ బ్రెంట్‌ స్థానాల్లో బ్యాటింగ్‌ కోచ్‌గా ఆండ్రూ పుట్టిక్‌, బౌలింగ్‌ కోచ్‌గా షేన్‌ బాండ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా జేమీ ట్రఫ్టన్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌గా నికోలస్‌ లీను నియమించుకుంది.తమ కోచింగ్‌ బృందంలో సమూల ‍ప్రక్షాళన చేసిన విషయాన్ని గల్ఫ్‌ జెయింట్స్‌ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్‌ 25) సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. గల్ఫ్‌ జెయింట్స్‌ మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన గుజరాత్‌ జెయింట్స్‌కు సిస్టర్‌ ఫ్రాంచైజీ. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ అరంగేట్రం ఎడిషన్‌లో (2023) ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత గల్ఫ్‌ జెయింట్స్‌ వరుసగా రెండు ఎడిషన్లలో చెత్త ప్రదర్శన చేసింది. 2024 ఎడిషన్‌లో మూడో స్థానంలో, 2025 ఎడిషన్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ లీగ్‌ వచ్చే ఎడిషన్‌ 2026 జనవరి తొలి అర్ద భాగంలో ప్రారంభమవుతుంది.

Snubbed From Pakistan Asia Cup Squad, Usman Khan Responds With Scintillating Hundred3
ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కలేదు.. కట్‌ చేస్తే 'మెరుపు శతకం'తో బీభత్సం

ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్‌ జట్టులో విధ్వంసకర బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఫామ్‌లేమి కారణంగా పాక్‌ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఆసియా కప్‌ కోసం ఎంపి​క చేయకపోవడాన్ని అవమానంగా భావించిన ఉస్మాన్‌ ఖాన్‌.. దేశవాలీ టీ20 టోర్నీలో తన ప్రతాపాన్ని చూపించాడు.ఘనీ రాయల్‌ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో వైటల్‌ టీ జట్టుకు ఆడుతున్న ఖాన్‌.. ఆదివారం​ జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం​ ఈ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది.కాగా, ఉస్మాన్‌ ఖాన్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ మధ్యకాలంలోనే మరో షాక్‌ కూడా ఇచ్చింది. ఈ ఏడాది సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తొలగించింది. ఖాన్‌ గతేడాది డి-కేటగిరిలో కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. పేలవ ఫామ్‌ కారణంగా ఖాన్‌ పీసీబీ తాజాగా కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. పీసీబీ తమ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌లను తమ అత్యున్నత కాంట్రాక్ట్‌ అయిన ఏ కేటగిరి నుంచి తప్పించి బి కేటగిరికి డిమోట్‌ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతున్న కారణంగా పీసీబీ ఏ ఒక్క పాక్‌ ఆటగాడికి కూడా ఏ కేటగిరి కేటాయించలేదు.30 ఏళ్ల ఉస్మాన్‌ ఖాన్‌కు పాక్‌ దేశవాలీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. పీఎస్‌ఎల్‌ ద్వారా ఇతను భారీ హిట్టర్‌గా పేరు గడించాడు. అయితే ఖాన్‌కు పాక్‌ తరఫున పేలవమైన రికార్డు ఉంది. ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌ తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ 19 టీ20ల్లో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ద సెంచరీ మాత్రమే ఉంది. పాక్‌ తరఫున 2 వన్డేలు కూడా ఆడిన ఖాన్‌.. ఇక్కడ కూడా విఫలమయ్యాడు.

Back To Back Fifties For Joe Root In The Hundred League4
టీ20ల్లోనూ రూట్‌ హవా.. వరుస విధ్వంసాలతో హంగామా

ఇంగ్లండ్‌ దిగ్గజ బ్యాటర్‌, ఫాబ్‌ ఫోర్‌లో ముఖ్యుడు జో రూట్‌ గత కొన్నేళ్లుగా టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఫాబ్‌ ఫోర్‌లో మిగతా ముగ్గురు (కోహ్లి, స్మిత్‌, కేన్‌) సహా ఈతరం బ్యాటర్లలో ఎవ్వరూ ఈ మధ్యకాలంలో రూట్‌ జోరును అందుకోలేకపోతున్నారు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్‌ కెరీర్‌.. ఆ ఏడాది నుంచి కట్టలు తెంచుకుంది.అప్పటివరకు 17 టెస్ట్‌ సెంచరీలు మాత్రమే చేసిన రూట్‌.. ఈ ఐదేళ్లలో ఏకంగా 22 శతకాలు బాదాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో మెజార్టీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్ట్‌ల్లో రూట్‌ ముందున్న ప్రధాన రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్‌ పరుగుల రికార్డు. ఈ రికార్డుకు రూట్ మరో 3000 పైచిలుకు పరుగుల దూరంలో ఉన్నాడు.టెస్ట్‌ల్లో హవా కొనసాగిస్తూనే రూట్‌ ఈ మధ్యకాలంలో వన్డేల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రూట్‌ వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై అద్భుత శతకాలు బాదాడు. అప్పటివరకు వన్డేల్లో తన పని అయిపోయిందన్న వారికి రూట్‌ వరుస సెంచరీలతో సమాధానం చెప్పాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో సత్తా చాటుతున్నా రూట్‌ పొట్టి క్రికెట్‌కు పనికి రాడన్న అపవాదు మాత్రం నిన్నమొన్నటి వరకు ఉండింది.అయితే దీన్ని కూడా రూట్‌ అధిగమించడం మొదలుపెట్టాడు. ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన రూట్‌.. అదే ఫామ్‌ను ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే జరుగుతున్న ద హండ్రెడ్‌ లీగ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌ తొలి మ్యాచ్‌ల్లో తేలిపోయిన రూట్‌.. ఆతర్వాత వరుస మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఇరగదీశాడు. ఆగస్ట్‌ 21న ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌పై 41 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 76 పరుగులు చేసిన రూట్‌.. తాజాగా వెల్ష్‌ ఫైర్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్‌ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి తన జట్టును నాకౌట్‌కు కూడా చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్‌లోని భారీ హిట్టర్‌ కోణం బయటపడింది. సహజంగా గ్రౌండ్‌ స్ట్రోక్స్‌ మాత్రమే ఆడే రూట్‌.. ఈ మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

He Should Have Played 100 Tests: Sarandeep Singh On India's Retired Star5
అతడు కనీసం 100 టెస్టులు ఆడాల్సింది: భారత మాజీ క్రికెటర్‌

యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh).. క్రికెట్‌ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ​బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించాడు యువీ. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో అతడి పాత్ర కీలకం.2007 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup), 2011 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ప్రధానంగా నాటి వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో యువీ దుమ్ములేపాడు.ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీఈ ఐసీసీ ఈవెంట్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ సింగ్‌ 362 పరుగులు సాధించాడు. వెస్టిండీస్‌పై సెంచరీ (113)తో రాణించిన అతడి ఖాతాలో నాలుగు ఫిప్టీలు కూడా ఉన్నాయి. అదే విధంగా.. లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ అయిన యువీ ఈ టోర్నీలో పదిహేను వికెట్లు పడగొట్టాడు.తద్వారా సొంతగడ్డపై దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత భారత్‌ మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచాడు. టీమిండియా తరఫున మొత్తంగా 304 వన్డేలు ఆడిన యువీ.. 8701 పరుగులు చేయడంతో పాటు.. 111 వికెట్లు తీశాడు.కేవలం 40 టెస్టులుఅదే విధంగా.. 58 అంతర్జాతీయ టీ20లలో 1177 పరుగులు చేయడంతో పాటు.. 28 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ టెస్టుల్లో మాత్రం యువీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. కేవలం 40 టెస్టులు మాత్రమే ఆడిన అతడు 1900 పరుగులకు పరిమితమయ్యాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి.క్యాన్సర్‌ బాడిన పడిన విషయం తెలిసిందిసచిన్‌ టెండుల్కర్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు భారత టెస్టు క్రికెట్‌ను ఏలుతున్న సమయంలో యువీ లైమ్‌లైట్‌లోకి రాలేదు. అయితే, గంగూలీ రిటైర్‌ అయిన తర్వాత టెస్టుల్లో ఛాన్స్‌ వచ్చినా ఆ సమయంలోనే యువీ క్యాన్సర్‌ బాడిన పడిన విషయం బయటపడింది.దీంతో టెస్టు ఫార్మాట్లో వంద మ్యాచ్‌లు ఆడాలన్న యువీ కల నెరవేరలేదు. ఈ విషయం గురించి గతంలో అతడు మాట్లాడుతూ.. ‘‘దాదా రిటైర్మెంట్‌ తర్వాత నాకు టెస్టుల్లో ఆడే అవకాశం వచ్చింది. కానీ అప్పుడే.. నాకు క్యాన్సర్‌ సోకిన విషయం తెలిసింది.నా బ్యాడ్‌లక్‌అది నా దురదృష్టం. ప్రతి క్షణం భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చి 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకునేందుకు నా శాయశక్తులా కృషి చేసినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. రెండు రోజుల పాటు క్రీజులో ఉండాలని.. ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవాలని నాకూ ఉండేది. కానీ అది సాధ్యపడలేదు’’ అని పేర్కొన్నాడు.అతడు కనీసం వంద టెస్టులు ఆడాల్సిందిఈ నేపథ్యంలో.. యువీ టెస్టు కెరీర్‌ గురించి భారత మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ సెలక్టర్‌ సరణ్‌దీప్‌ సింగ్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘యువరాజ్‌ సింగ్‌ మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సింది. అతడు కనీసం వంద టెస్టులైనా పూర్తి చేసుకోవాల్సింది’’ అని తరువార్‌ కోహ్లి ఇంటర్వ్యూలో సరణ్‌దీప్‌ సింగ్‌ పేర్కొన్నాడు. చదవండి: ఛతేశ్వర్‌ పుజారా నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

Toyota Eye Team India Jersey Sponsorship After Dream11 Breaks Tie With BCCI6
టీమిండియా జెర్సీ కొత్త స్పాన్సర్‌గా టొయోటా..?

ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తమ జట్లకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న ప్రధాన గేమింగ్‌ ప్లాట్‌ఫాం డ్రీమ్11తో(Dream11) ఒప్పందాన్ని ఉన్నపళంగా ర‌ద్దు చేసుకుంది.దీంతో ప్రస్తుతానికి భారత క్రికెట్‌ జట్ల జెర్సీలకు అధికారిక స్పాన్సర్ లేకుండా పోయారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో కూడా టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ లేకుండానే బరిలోకి దిగవచ్చు. ఈలోపు కొత్త జెర్సీ స్పాన్సర్‌ దొరికితే వారి లోగోతో ఉన్న జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు ఆసియా కప్‌ బరిలోకి దిగుతారు.డ్రీమ్‌11 స్థానంలో టీమిండియా జెర్సీని స్పాన్సర్‌ చేసేందుకు టొయోటా మోటార్ కార్పొరేషన్‌ ఆసక్తి చూపుతోంది. టొయోటాతో పాటు ఓ ఫిన్‌టెక్ స్టార్టప్‌, టాటా గ్రూప్, రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు కూడా బీసీసీఐకి తమ ఆసక్తిని తెలిపాయని సమాచారం. జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ త్వరలో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించనుంది.కాగా, 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్‌11 ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్‌ స్థానాన్ని డ్రీమ్‌11 భర్తీ చేసింది. తాజాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో డ్రీమ్11-బీసీసీఐ అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయ్యింది.

Didnt Feel It Was Right to tell Siraj to stop: Jurel on Altercation in ENG vs IND7
‘సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా.. గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా’

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు మంచి ఆరంభమే లభించింది. అతడి సారథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య జరిగిన ఈ ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీలో గిల్‌ 754 పరుగులు సాధించి.. టాప్‌ రన్‌ స్కోరర్‌గానూ నిలిచాడు.సిరాజ్‌.. సూపర్‌హిట్‌ఇక టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సమం చేసుకోవడంలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)ది కీలక పాత్ర. ముఖ్యంగా ఆఖరిదైన ఓవల్‌ టెస్టులో చివరి రోజు ఈ హైదరాబాదీ బౌలర్‌ అద్భుతమే చేశాడు. విజయానికి ఇంగ్లండ్‌ 35 పరుగులు.. భారత్‌ నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ.. ప్రసిద్‌ కృష్ణ (Prasidh Krishna) ఒక వికెట్‌ తీయగా... సిరాజ్‌ మూడు వికెట్లు కూల్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.అయితే, ఐదో టెస్టు ఆఖరి రోజు ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోగానే.. భుజం విరిగినప్పటికీ టెయిలెండర్‌ క్రిస్‌ వోక్స్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.అప్పటికి క్రీజులో ఉన్న అట్కిన్సన్‌ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా తానే సింగిల్స్‌ తీస్తూ.. ఓవర్‌ ముగిసే సరికి తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.రనౌట్‌ ప్లాన్‌ఈ క్రమంలో కెప్టెన్‌ గిల్‌తో కలిసి సిరాజ్‌ ఈ జోడీని రనౌట్‌ చేయాలని ప్రణాళిక రచించారు. ఇందుకు అనుగుణంగా నాటి మ్యాచ్‌ 84 ఓవర్లో వైడ్‌ యార్కర్‌ వేయాలని వీరు ప్లాన్‌ చేశారు. ఇక సిరాజ్‌ సంధించిన డెలివరీని మిస్సయినప్పటికీ.. అట్కిన్సన్‌ సింగిల్ తీసేందుకు వెళ్లాడు. అయితే, వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ మాత్రం సరైన సమయంలో బంతిని అందుకోలేకపోయాడు.దీంతో రనౌట్‌ ఛాన్స్‌ మిస్‌ కాగా.. గిల్‌పై సిరాజ్‌ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. జురెల్‌కు ముందే మన ప్లాన్‌ చెప్పి ఉండవచ్చు కదా అని అన్నాడు. విజయానంతరం గిల్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక ధ్రువ్‌ జురెల్‌ కూడా తాజా ఈ విషయంపై స్పందించాడు.సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా‘‘ఆరోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బాల్‌ బాగా స్వింగ్‌ అవుతోంది. అప్పుడు నా కుడివైపు.. గిల్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ‘యార్‌.. సిరాజ్‌ ఇప్పుడు వైడ్‌ యార్కర్‌ వేయబోతున్నాడు’ అని నాతో చెప్పాడు.అయితే, నేను బదులిచ్చేలోపే సిరాజ్‌ బౌలింగ్‌ వేసేందుకు తన పరుగు మొదలుపెట్టాడు. అప్పుడు.. ‘నువ్వు కాస్త ఆగు’ అని సిరాజ్‌కు చెప్పడం సరికాదనిపించింది. నేను కుదురుకునేలోపే సిరాజ్‌ బంతి వేయడం.. బ్యాటర్లు పరుగుకు వెళ్లడం జరిగిపోయింది.గెలిస్తే చాలు దేవుడా అనుకున్నానిజానికి అది రనౌట్‌ కావాల్సింది. కానీ.. నా చేతుల్లో గ్రిప్‌ అంతగా లేదు. సరైన సమయంలో స్పందించలేకపోయాను. అప్పుడు ఒకటే అనుకున్నా.. ‘దేవుడా.. ఎలాగైనా మమ్మల్ని ఈ మ్యాచ్‌లో గెలిపించు’’ అని ప్రార్థించా.ఆరోజు రనౌట్‌ చేసేందుకు నాకు మంచి అవకాశం ఉంది. కానీ నేను మిస్సయిపోయా. ఏదేమైనా సిరాజ్‌ ఆరోజు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మేము కచ్చితంగా మ్యాచ్‌ గెలుస్తామని అనుకున్నాం. అనుకున్నదే జరిగింది’’ అని ధ్రువ్‌ జురెల్‌ పేర్కొన్నాడు. వివేక్‌ సేతియా పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదికాగా రనౌట్‌ ప్రమాదం నుంచి అట్కిన్సన్‌- వోక్స్‌ తప్పించుకునే సమయానికి ఇంగ్లండ్‌ విజయానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ జురెల్‌ రనౌట్‌ మిస్‌ చేసిన తర్వాత.. సిరాజ్‌ అట్కిన్సన్‌ను బౌల్డ్‌ చేయకపోయి ఉంటే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు ఆఖరికి ఆరు పరుగుల తేడాతో ఓవల్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేయగలిగింది.చదవండి: ఛతేశ్వర్‌ పుజారా నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

Former South African captain revokes international retirement8
రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకున్న సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌

సౌతాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నీకెర్క్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు​ తీసుకుంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో డేన్‌ ఇలా రాసుకొచ్చింది.రిటైర్మెంట్‌ ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చాలా మిస్‌ అయ్యాను. మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం​ వస్తే, నా సర్వస్వం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.కాగా, డేన్‌ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డేన్‌ 2023లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పింది. నాటి టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కాకపోవడంతో డేన్‌ అప్పట్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంది.ఫిట్‌నెస్‌ లేకపోవడం​, తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు డేన్‌ను ఎంపిక చేయలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది అకస్మాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించింది. డేన్‌ ఆకస్మిక రిటైర్మెంట్‌ తర్వాత సూన్‌ లస్‌ కెప్టెన్‌గా ఎంపికై, ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది.ప్రస్తుతం 32వ పడిలో ఉన్న డేన్‌ సౌతాఫ్రికా తరఫున మొత్తం 194 మ్యాచ్‌లు (107 వన్డేలు, 86 టీ20లు, ఓ టెస్ట్‌) ఆడింది. ఇందులో 4074 పరుగులు చేసి, 204 వికెట్లు తీసింది. డేన్‌ సౌతాఫ్రికాకు 50 వన్డేల్లో, 30 టీ20ల్లో సారథ్యం వహించింది. ఇందులో 29 వన్డేలు, 15 టీ20ల్లో జట్టును విజయవంతంగా నడిపించింది.సౌతాఫ్రికా జట్టులో కీలక సభ్యురాలిగా ఉండిన డేన్‌ కోవిడ్‌ సమయంలో గాయాల బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.2022 వన్డే ప్రపంచకప్‌ సమయంలో ఆమె మడమ గాయానికి గురై టోర్నీ మొత్తానికి దూరమైంది. అప్పటి నుంచి తరుచూ గాయాలతో ఇబ్బంది పడిన డేన్‌.. జట్టులో క్రమంగా ఉనికి కోల్పోయింది.ఇప్పుడు ఆమె రిటైర్మెంట్‌ విషయంలో తొందరపడ్డానని పశ్చాత్తాపడుతూ సెలెక్టర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా సెలెక్టర్లకు క్షమాపణ కూడా చెప్పినట్లు తెలుస్తుంది.

Cheteshwar Pujara Net Worth 2025 Lifestyle Cars Check Details9
ఛతేశ్వర్‌ పుజారా నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

టీమిండియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఛతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) ఒకడు. రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత మోస్ట్‌ డిపెండబుల్‌ బ్యాటర్‌గా ఈ సౌరాష్ట్ర ఆటగాడు పేరొందాడు. 2005లో ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన పుజారా.. ఆదివారం (ఆగష్టు 24) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.దేశీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ఆడిన పుజారా.. విదర్భతో మ్యాచ్‌ సందర్భంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రోజురోజుకూ తన ఆటను మెరుగపరచుకుని దేశీ క్రికెట్‌ రన్‌ మెషీన్‌గా మారిపోయిన పుజ్జీ.. 2025లో గుజరాత్‌తో పోరు సందర్భంగా తన చివరి మ్యాచ్‌ ఆడేశాడు.పుజారా నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?ఇక 2010లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన పుజారా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)-2023 ఫైనల్‌ సందర్భంగా తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. కాగా భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్నాడు పుజారా. ఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 37 ఏళ్ల పుజారా నెట్‌వర్త్‌ (Networth) ఎంతో తెలుసా?!వివిధ మీడియా రిపోర్టుల ప్రకారం పుజారా నికర ఆస్తుల విలువ రూ. 24 కోట్లు అని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులో ‘బి’ కేటగిరిలో ఉన్న ఆటగాడిగా అప్పట్లో రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందిన పుజ్జీ.. మ్యాచ్‌ ఫీజుల ద్వారా కూడా మంచి మొత్తమే అందుకున్నాడు.నెల సంపాదన రూ. 15 లక్షలు!ఇక జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశీ క్రికెట్‌ ఆడటం ద్వారా కూడా ఆర్జించిన పుజారా.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. కామెంటేటర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. తాజా రిపోర్టుల సమాచారం ప్రకారం.. అతడి నెల సంపాదన రూ. 15 లక్షలు అని అంచనా.తన కెరీర్‌లో టీమిండియా తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా.. ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు. సంప్రదాయ క్రికెట్‌లో మేటి బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ టీ20 ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే.. ఐపీఎల్‌లో అతడికి ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు.మిగతా వారితో పోలిస్తే కాస్త తక్కువే!అందుకే తన సమకాలీన ఆటగాళ్లతో పోలిస్తే పుజారా సంపాదన తక్కువగానే అనిపించవచ్చు. నిరాడంబర జీవితానికి పెద్ద పీట వేసే పుజారా గ్యారేజీలో కొన్ని విలాసవంతమైన కార్లు కూడా ఉండటం విశేషం. ఆడి ఏ6, ఫోర్డ్‌, బీఎండబ్ల్యూ 5- సిరీస్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌లు పుజ్జీ వద్ద ఉన్నాయి.పెన్షన్‌ ఎంతంటే?రిటైర్ అయిన‌ మాజీ క్రికెటర్లు, అంపైర్ల‌కు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు చెప్పిన తమ ప్లేయర్లకు ఆర్థిక చేయూతను ఇవ్వడంతో పాటు.. వారి సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2022లో పలు మార్పుల అనంతరం.. మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్‌ భారీగానే పెరిగింది.టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, ఎంతకాలం జట్టులో ఉన్నారన్న అంశాలతో పాటు అంతర్జాతీయ టెస్టులు ఆడారా? లేదా? అని పరిశీలించి మూడు కేటగిరీల్లో పెన్షన్‌ ఇస్తారు. ఉన్నత శ్రేణిలో ఉన్న వారికి రూ. 70 వేలు, దిగువ శ్రేణి ఆటగాళ్లకు రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేల చొప్పున బీసీసీఐ పెన్షన్‌ అందిస్తోంది. దీని ప్రకారం పుజారాకు రూ. 60 వేల మేర పెన్షన్‌ లభించవచ్చు.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..

Punjab Kings Player Vishnu Vinod Turns Heads With Kerala Cricket League Blinder10
పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడి విధ్వంసం.. 10 సిక్సర్లతో వీరంగం

కేరళ టీ20 లీగ్‌లో నిన్న (ఆగస్ట్‌ 24) రసవత్తర మ్యాచ్‌ జరిగింది. ఏరీస్‌ కొల్లమ్‌ సైలర్స్‌, కొచ్చి బ్లూ టైగర్స్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ ప్రేక్షకులకు అసలుసిసలు టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సైలర్స్‌ 236 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. టైగర్స్‌ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి అద్బుత విజయం సొంతం చేసుకుంది.టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్‌ విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చగా.. ఆషిక్‌ అనే ఆటగాడు ఆఖరి బంతికి సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించాడు.ఈ మ్యాచ్‌కు సంబంధించి అందరూ సంజూ శాంసన్‌, అషిక్‌ హీరోయిక్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌మీడియా మొత్తం సంజూ నామస్మరణతో మార్మోగిపోతుంది.అయితే సంజూ విధ్వంసకర శతకం నీడలో కొల్లమ్‌ సైలర్స్‌ ఆటగాడు, పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ విష్ణు వినోద్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ మరుగున పడింది. ఈ మ్యాచ్‌లో కొల్లమ్‌ సైలర్స్‌ అంత భారీ స్కోర్‌ చేయడంలో విష్ణు వినోద్‌ కీలకపాత్రధారి.వినోద్‌ 41 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 94 పరుగులు చేశాడు. వినోద్‌ సిక్సర్ల సునామీ ధాటికి గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియం తడిసి ముద్దైంది. వినోద్‌ 229.28 స్ట్రయిక్‌రేట్‌తో మెరుపులు మెరిపించాడు. శతకానికి మరో సిక్సర్‌ దూరంలో ఔటయ్యాడు.వినోద్‌కు అతని కెప్టెన్‌ సచిన్‌ బేబి కూడా జతకలిశాడు. సచిన్‌ బేబి కూడా ఇంచుమించు విష్ణు తరహాలోనే విధ్వంసం సృష్టించాడు. 44 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 91 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్‌లో సైలర్స్‌ ఓడినా విష్ణు వినోద్‌ భారత టీ20 సారధి సూర్యకుమార్‌ యాదవ్‌ను గుర్తు చేశాడు. విష్ణు అచ్చం స్కై లాగే 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడి అలరించాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో విష్ణును పంజాబ్‌ కింగ్స్‌ ఎంపిక చేసుకున్నప్పటీకీ అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. విష్ణు 2017, 2023 ఐపీఎల్‌ సీజన్లలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ తరఫున అవకాశాలు దక్కించుకున్నా పెద్దగా రాణించలేకపోయాడు.తాజా ప్రదర్శనతో విష్ణు ఐపీఎల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఒకవేళ పంజాబ్‌ విష్ణును వేలానికి వదిలేస్తే అతడికి మంచి గిరాకీ ఉండవచ్చు. కొన్ని ఫ్రాంచైజీలు స్థానిక విధ్వంసకర వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కోసం అన్వేషిస్తున్నాయి. ఈ పాత్రకు విష్ణు లాంటి టాలెంటెడ్‌ బ్యాటర్‌ న్యాయం చేయవచ్చు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement