Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Rajasthan Royals Pacer Handed Big Punishment By BCCI1
రాజస్తాన్‌ పేసర్‌కు భారీ షాక్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ నండ్రీ బర్గర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. ఐపీఎల్‌ పాలక మండలి ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించింది. ఐపీఎల్‌-2026లో భాగంగా రాజస్తాన్‌ బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే.40 పరుగుల తేడాతోఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. అయితే, బౌలర్ల విజృంభణ కారణంగా లక్నోను 119 పరుగులకే ఆలౌట్‌ చేసి.. 40 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీయగా.. నండ్రీ బర్గర్‌, బ్రిజేశ్‌ శర్మ తలా రెండు.. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి చెరో వికెట్‌ దక్కించుకున్నారు.అయితే, లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా నండ్రీ బర్గర్‌ ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా శిక్ష పడింది. అతడు ఆర్టికల్‌ 2.5లోని లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటం.. దురుసుగా ప్రవర్తిస్తే ఈ నిబంధన కింద చర్యలు తీసుకుంటారు.2⃣ good catches by the #RR captain 🫡Nandre Burger 🤝 Brijesh Sharma with the wickets ✌️Updates ▶️ https://t.co/5SaPY8wfsc#TATAIPL | #KhelBindaas | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/bS8yT5QFYh— IndianPremierLeague (@IPL) April 22, 2026మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోతఈ నేపథ్యంలో తప్పును అంగీకరించిన నండ్రీ బర్గర్‌కు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో డీమెరిట్‌ పాయింట్‌ చేర్చింది ఐపీఎల్‌ పాలక మండలి. ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌లో నండ్రీ బర్గర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను డకౌట్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (55) రూపంలో మరో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

Mitchell Starc Cleared To Play IPL 2026 For Delhi Capitals2
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇకపై మంచి రోజులు

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 3 విజయాలు, 3 అపజయాలతో నాట్‌ గుడ్‌ నాట్‌ బ్యాడ్‌ అన్నట్లుగా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇకపై మంచి రోజులు రానున్నాయి. స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ టోర్నీలో పాల్గొనేందుకు తన జాతీయ బోర్డు (క్రికెట్‌ ఆస్ట్రేలియా) నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందాడు. స్టార్క్‌ మే 1 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.స్టార్క్‌ గాయాలు, వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా ఐపీఎల్‌ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ధృవీకరించింది. స్టార్క్‌ పూర్తిగా కోలుకొని, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.స్టార్క్‌ రాక ఢిల్లీ బౌలింగ్‌ విభాగానికి మరింత బూస్టప్‌ ఇస్తుంది. ఆ జట్టు ఇప్పటికే ఎంగిడి, ముకేశ్‌ కుమార్‌, నటరాజన్‌ వంటి పేసర్లతో కలకలలాడుతుంది. స్పిన్‌ విభాగంలోనూ ఢిల్లీ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఈ జట్టులోనే ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీకి బౌలింగ్‌ విభాగంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ జట్టు విజయాలకు దోహదపడ్డారు. బ్యాటింగ్‌లోనే ఢిల్లీ కాస్త తడబడుతుంది. కేఎల్‌ రాహుల్‌, డేవిడ్‌ మిల్లర్‌, సమీర్‌ రిజ్వి పర్వాలేదనిపిస్తున్నా.. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శలను ఇవ్వలేకపోతున్నారు. ఈ జట్టు తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 25న మధ్యాహ్నం జరుగనుంది.

Another CSK Player Leaves IPL Midway After Mother's Sad Demise3
సీఎస్‌కే శిబిరంలో తీవ్ర విషాదం​

ఐపీఎల్‌ 2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కష్టకాలం కొనసాగుతోంది. గాయాలు, ఫామ్ సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు.. తాజాగా మరో సాడ్‌ న్యూస్‌ తెలిసింది. జట్టు పేసర్ ముకేశ్‌ చౌదరి తన తల్లిని కోల్పోయాడు. ఆతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ వార్తతో సీఎస్‌కే శిబిరం విషాదంలో మునిగిపోయింది. జట్టు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ముకేశ్‌ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్‌తో ఉన్నామని భరోసా ఇచ్చింది.The CSK family mourns the passing of Mukesh Choudhary’s mother. We stand with Mukesh and his family, keeping them in our thoughts and prayers during this incredibly difficult time.— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026మ్యాచ్‌కు దూరం కానున్న ముకేశ్‌తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో, ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 23) జరగనున్న కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సీఎస్‌కే బౌలింగ్‌ విభాగానికి ఇది మరో భారీ దెబ్బగా మారింది.ఈ సీజన్ ప్రారంభం నుంచే సీఎస్‌కేను సమస్యలు వెంటాడుతున్నాయి. ధోని ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. బ్రెవిస్‌ ఆరంభంలో పలు మ్యాచ్‌లు మిస్‌ అయ్యాడు. మంచి టచ్‌లో ఉన్న ఆయుశ్‌ మాత్రే, ఖలీల్‌ అహ్మద్‌ గాయాల కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు.ఖలీల్‌ స్థానాన్ని గత మ్యాచ్‌లో భర్తీ చేసిన ముకేశ్‌ కూడా ఇప్పుడు వ్యక్తిగత కారణంగా జట్టుకు దూరం కావడంతో సీఎస్‌కే బౌలింగ్‌ కూర్పులో మార్పులు అనివార్యమయ్యాయి. మ్యాట్‌ హెన్రీని జట్టులోకి తీసుకుంటే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. టోర్నీ కీలక దశలో సీఎస్‌కేకు ఈ పరిస్థితి రావడం, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ దశలో ఉన్నపాటి అడపాదడపా వనరులు కూడా దూరం కావడంతో సీఎస్‌కే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

IPL 2026: Rajasthan Royals Captain Riyan Parag Comments After Winning Against LSG4
వైభవ్‌, జైస్వాల్‌ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నారు: రియాన్‌ పరాగ్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 40 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ బ్యాటర్లు తడబడినా, బౌలర్లు అద్భుతంగా రాణించి తమ జట్టును గెలిపించారు. ఆర్చర్‌ (4-1-20-3), బర్గర్‌ (4-0-27-2), బ్రిజేష్‌ శర్మ (3-0-18-2), జడేజా (4-0-29-1), బిష్ణోయ్‌ (3-0-23-1) సత్తా చాటడంతో రాయల్స్‌ 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. లక్నో తరఫున మిచెల్‌ మార్ష్‌ (55) ఒంటరిపోరాటం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ జట్టు టాప్‌-4లో ఏకంగా ముగ్గురు (బదోని, పంత్‌, మార్క్రమ్‌) డకౌటయ్యారు.మ్యాచ్‌ అనంతరం జట్టు ప్రదర్శనపై రాయల్స్‌ సారధి రియాన్‌ పరాగ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నామని అన్నాడు. పిచ్‌ పరిస్థితిని బట్టి 180 పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డారు.పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నారుగత 2-3 మ్యాచ్‌ల్లో ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌ కాస్త నెమ్మదించారన్న అంశంపై స్పందిస్తూ.. అది వ్యూహాత్మక మార్పు కాదని, పిచ్‌కు అనుగుణంగా ఆడుతున్నారని తెలిపాడు. పరిస్థితులను అంచనా వేసి, అందుకు తగ్గట్టు ఆడటమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఫ్లాట్ పిచ్ ఉంటే దూకుడుగా ఆడతారు. కఠిన పరిస్థితుల్లో సమయం తీసుకుంటారని చెప్పాడు.బౌలర్లపై ప్రశంసలుఈ విజయం బౌలర్ల ప్రదర్శన వల్లే దక్కిందని అన్నాడు. ఆర్చర్‌, బర్గర్‌లను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వారు పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబునిచ్చాడు. తన వ్యక్తిగత ఫామ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం దుర్దశను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడ్డాడు. త్వరలోనే మంచి ఇన్నింగ్స్‌ ఉంటుందిఇలాంటి సమయంలో జట్టు నన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తోందని తెలిపాడు. తన ఆటపై విశ్వాసం వ్యక్తం చేశాడు. త్వరలోనే మంచి ఇన్నింగ్స్ ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత గణాంకాలకంటే జట్టు అవసరాలే ముఖ్యమని స్పష్టం చేశాడు. జట్టు ఎలా కోరుకుంటే అలా ఆడతా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడమంటే అలాగే ఆడతా. నెమ్మదిగా ఆడమంటే కూడా సిద్ధమే అని అన్నాడు.

IPL 2026: LSG Captain Rishabh Pant Comments after Losing to Rajasthan Royals5
తీవ్ర అసంతృప్తిలో పంత్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో లక్నో 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 40 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. మిచెల్‌ మార్ష్‌ (55) మినహా లక్నో బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బదోని, పంత్‌, మార్క్రమ్‌ మరీ తీసికట్లుగా డకౌక్లయ్యారు. ఈ సీజన్‌లో లక్నోను ఇది ఐదో ఓటమి. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ ప్రదర్శనలతో లక్నో ప్లే ఆఫ్స్‌ ఆశలను వదులుకోవాల్సిందే. ఈ సీజన్‌లో ఆ జట్టు బౌలింగ్‌లో సత్తా చాటుతున్నా, బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. ఈ ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ పంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా విఫలమవుతున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. వరుస పరాజయాల తర్వాత నిరాశలో ఉన్నట్లు తెలిపాడు. బయట కారణాలు వెతక్కుండా, లోపలే పరిష్కారాలు వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు.పిచ్ పరిస్థితులపై స్పందిస్తూ.. కొంచెం సమయం తీసుకుని ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇన్నింగ్స్‌ను మరింత లోతుగా తీసుకెళ్లాల్సిందని అన్నాడు. ఓటమికి సాకులు చెప్పకుండా, బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపాడు.బౌలర్లపై ప్రశంసల వర్షం​ కురిపించాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే అద్భుతంగా రాణించారని కితాబునిచ్చాడు. బౌలర్లు వారి పనిని సమర్దవంతంగా నిర్వర్తించారని, ఈ ఓటమి పూర్తిగా బ్యాటర్ల బాధ్యత అని అంగీకరించాడు.వరుస ఓటములు ఎదురైనా ధైర్యం కోల్పోలేదని స్పష్టం చేశాడు. బౌలింగ్‌తో పాటు తమ జట్టు బ్యాటింగ్‌లోనూ బలంగా ఉందని అన్నాడు. ఇప్పటికీ పరిస్థితులను అనుకూలంగా సామర్థ్యం తమకుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టుగా తలెత్తుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

Duck Master: Rishabh Pant Goes Past MS Dhoni After Dismal Show Vs Rajasthan Royals6
ధోనిని దాటేసిన పంత్‌

ఐపీఎల్‌ 2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా, మ్యాచ్‌ను గెలిపించే నాథుడు ఒక్కడు కూడా లేడు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 5 పరాజయాలు ఎదుర్కొంది. కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.తాజాగా (ఏప్రిల్‌ 22) రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి ప్రత్యర్దిని 159 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. ఆపాటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. బౌలింగ్‌లో షమీ (4-0-30-2), ప్రిన్స్‌ యాదవ్‌ (4-0-29-2), మొహిసిన్‌ (4-1-17-2) రాణించారు. రాయల్స్‌ తరఫున బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా (43 నాటౌట్‌) రాణించాడు.అనంతరం స్వల్ప ఛేదనలో లక్నో ఆదిలోనే చేతులెత్తేసింది. ఆర్చర్‌ (4-1-20-3), బర్గర్‌ (4-0-27-2), బ్రిజేష్‌ శర్మ (3-0-18-2), జడేజా (4-0-29-1), బిష్ణోయ్‌ (3-0-23-1) ధాటికి 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ మార్ష్‌ (55) ఒంటరిపోరాటంతో లక్నోను గెలిపించే ప్రయత్నం చేశాడు. ఇతను మినహా టాప్‌-4లో మిగతా ముగ్గురు (బదోని, పంత్‌, మార్క్రమ్‌) డకౌటయ్యారు.డక్‌ మాస్టర్‌ఈ సీజన్‌లో పంత్‌ వైఫల్యాల పరంపర కొనసాగింది. రాయల్స్‌ మ్యాచ్‌లో అతను 3 బంతులు ఆడి బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ డక్‌తో పంత్‌ ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక​ డకౌట్లైన వికెట్‌కీపర్‌ బ్యాటర్ల జాబితాలో ధోనిని (6) దాటాడు. 7 డక్‌లతో గిల్‌క్రిస్ట్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. డక్‌ మాస్టర్ల జాబితాలో దినేశ్‌ కార్తీక్‌ (16), పార్థివ్‌ పటేల్‌ (10), నమన్‌ ఓఝా (8) టాప్‌-3లో ఉన్నారు.

Expensive Players Failing Miserably in IPL 20267
IPL 2026: కోట్లు పోసి కొంటే నిలువునా ముంచారు..!

ఐపీఎల్‌ 2026లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమవుతున్నారు. లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్‌ పంత్‌ (లక్నో కెప్టెన్‌, 27 కోట్లు), లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు కెమరూన్‌ గ్రీన్‌ (కేకేఆర్‌, 25.2 కోట్లు), లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు కార్తీక్‌ శర్మ (సీఎస్‌కే, 14.2 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌ (సీఎస్‌కే, 14.2 కోట్లు), నికోలస్‌ పూరన్‌ (లక్నో, 21 కోట్లు), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌, 13 కోట్లు), ఆకిబ్‌ నబీ (ఢిల్లీ, 8.4 కోట్లు).. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా చాంతాడంత ఉంది.ఈ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నారు. అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారంతా ఫ్రాంచైజీలకు దించుకోలేని భారంగా మారారు. వీరిని ఏం చేయాలో ఫ్రాంచైజీలకు పాలుపోవడం​ లేదు. ఒక మ్యాచ్‌ కాకపోతే మరో మ్యాచ్‌లోనైనా రాణిస్తారు అని ఆశ పెట్టుకోవడం తప్పిస్తే, వారు చేసేదేమీ లేదు.ప్రస్తుతం ఇలాంటి వారి వల్ల ఎక్కువగా నష్టపోతున్న ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న పంత్‌, పూరన్‌పై దాదాపు 50 కోట్ల పెట్టుబడి ఉంది. వీరి ఈ మొత్తానికి కనీస న్యాయం చేయలేకపోతున్నారు. పంత్‌ ఒకటి అరా ఇన్నింగ్స్‌లతో బండి నెట్టుకొస్తుండగా.. పూరన్‌ మరీ దారుణంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రయిక్‌ రేట్‌ అయితే మరీ దారుణంగా (82) ఉంది.గత సీజన్‌లో సిక్సర్ల వర్షం​ (40) కురిపించిన ఇతను ఈ సీజన్‌లో కేవలం మూడే సిక్సర్లు కొట్టాడు. ఇలాంటి వారు ఏ జట్టుకైనా భారమే. పంత్‌ పరిస్థితి పూరన్‌ కంటే కాస్త బెటర్‌ అని చెప్పాలి. 7 ఇన్నింగ్స్‌ల్లో అతను 147 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ద సెంచరీ ఉంది. మొత్తంగా పంత్‌ , పూరన్‌ కలిసి 49 కోట్లకు 198 పరుగులు చేశారు.కేకేఆర్‌ గ్రీన్‌ విషయానికొస్తే.. ఇతను కూడా పంత్‌ తరహాలో మమ అనిపించాడు. ఈ సీజన్‌లో అతనాడిన 7 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 162 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓ వికెట్‌ తీశాడు. ఇతనిపై కేకేఆర్‌ అతి భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొడతాడని భావించింది. అయితే ఇతను గాయం పేరు చెప్పి అసలు బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపడం లేదు. యాజమాన్యం, అభిమానలు నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో గత 2-3 మ్యాచ్‌ల్లో ఏదో చేయాలంటే చేశాడు.ఇక సీఎస్‌కే అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ప్రశాంత్‌ వీర్‌, కార్తీక్‌ శర్మ విషయానికొస్తే.. ఈ ఇద్దరిలో ఆ ఫ్రాంచైజీ ఏం చూసిందో ఏమో తెలీదు కానీ, వేలంలో కోట్ల వర్షం కురిపించింది. అయితే ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి వీరు కనీస న్యాయం కూడా చేయడం లేదు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తారని అనుకుంటే, వచ్చిన అడపాదడపా అవకాశాలను జారవిడుచుకున్నారు. ప్రశాంత్‌ వీర్‌ 2 మ్యాచ్‌ల్లో 49 పరుగులు, కార్తీక్‌ శర్మ 3 మ్యాచ్‌ల్లో 25 పరుగులు మాత్రమే చేశారు. ఈ కార్తీక్‌ శర్మ పరిస్థితి అయితే మరీ దారుణం. భారీ హిట్టర్‌ అని ఓవర్‌ హైప్‌ అందుకున్న ఇతగాడు కనీసం బంతిని కనెక్ట్‌ చేసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు.లియామ్‌ లివింగ్‌స్టోన్‌ విషయానికొస్తే.. ఇతగాడికి అవకాశాలు రావడమే తక్కువగా వచ్చాయి. వాటిని సైతం ఒడిసిపట్టుకోలేకపోయాడు. 2 మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణించడం ద్వారా ఐపీఎల్‌ అవకాశం దక్కించుకున్న ఆకిబ్‌ నబీ (ఢిల్లీ క్యాపిటల్స్‌) దారుణంగా నిరాశపరిచాడు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకొని ఉసూరుమనిపించాడు.వీరి పరిస్థితి ఇలా ఉంటే, ఈ సీజన్‌లో ఫ్రాంచైజీల జేబులకు మరో రూపంలోనూ చిల్లు పడింది. కోట్లు పోసి కొందరు ఆటగాళ్లకు కనీసం అవకాశాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. వేలం సమయంలో జట్టు సమీకరణలను అంచనాల వేయలేకపోయిన కొన్ని ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను భారీ మొత్తాలకు కొనుగోలు చేసి డగౌట్‌లో ఖాళీగా కూర్చోబెడుతున్నాయి. కొందరేమో (స్టార్క్‌, ఇంగ్లిస్‌, కమిన్స్‌) గాయాలు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటివరకు జట్టుకు అందుబాటులోకి కూడా రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో కేకేఆర్‌ బౌలర్‌ మతీష పతిరణ (18 కోట్లు), జేసన్‌ హోల్డర్‌ (7 కోట్లు) తదితరులు ఉన్నారు.

Today Mumbai Indians face Chennai Super Kings8
స్టార్స్‌ ఆడతారా?

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడినా మహేంద్ర సింగ్‌ ధోని ఇంకా బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడగా... తొలి నాలుగు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య వాంఖెడే మైదానంలో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు భారత స్టార్లు బుధవారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే గత మ్యాచ్‌కు ముందు కూడా సాధన చేసినా... చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈసారి వారి పునరాగమనం మళ్లీ ఆసక్తిగా మారింది. టోర్నీలో ఇరు జట్లు ప్రస్తుతం చెరో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ముంబై ఏడో స్థానంలో, చెన్నై ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగు వరుస పరాజయాల తర్వాత తిలక్‌ వర్మ మెరుపులతో గత మ్యాచ్‌లో నెగ్గిన ముంబై సొంతగడ్డపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డికాక్, నమన్‌ ధీర్‌లతో పాటు సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా కూడా రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా, అశ్వని కుమార్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇద్దరు విదేశీ స్పిన్నర్లు సాంట్నర్, ఘజన్‌ఫర్‌ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. మరోవైపు వరుసగా రెండు విజయాలతో కోలుకున్నట్లు అనిపించిన చెన్నై గత పోరులో హైదరాబాద్‌ చేతిలో ఓడి మళ్లీ వెనుకబడింది. సంజూ సామ్సన్‌ ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్ రుతురాజ్‌ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. పైగా సత్తా చాటిన యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రే గాయంతో టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. టాపార్డర్‌లో అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి.

India set a target of 193 runs for South Africa in the third T20I9
మెరిసిన షఫాలీ, హర్మన్‌

జొహనెస్‌బర్గ్‌: సిరీస్‌ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు 193 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది. షఫాలీ వర్మ (46 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి షఫాలీ తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 68 పరుగులు జోడించింది. స్మృతి, జెమీమాలను మలాబా వరుస బంతుల్లో అవుట్‌ చేసింది. జెమీమా స్థానంలో క్రీజులో వచ్చిన హర్మన్‌తో కలిసి షఫాలీ మూడో వికెట్‌కు 73 పరుగులు జత చేసింది. షఫాలీ వెనుదిరిగాక వచ్చిన రిచా ఘోష్‌ (10 బంతుల్లో 18 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడింది. అంతకుముందు వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. శ్రీచరణి, అనుష్క శర్మ, క్రాంతి గౌడ్‌ స్థానాల్లో భారతి ఫుల్మాలి, కాశ్వీ గౌతమ్, రేణుక సింగ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడిపోయింది.

India to host South Asian Womens Football Tournament10
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం

ఢాకా: దశాబ్దం తర్వాత భారత్‌ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్‌లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్‌) దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్‌ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్‌ ‘ఎ’లో నేపాల్‌ (87వ ర్యాంక్‌), శ్రీలంక (162), భూటాన్‌ (164)... గ్రూప్‌ ‘బి’లో భారత్‌ (69వ ర్యాంక్‌), బంగ్లాదేశ్‌ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి. భారత్‌ తమ లీగ్‌ మ్యాచ్‌లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. లీగ్‌ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌ జూన్‌ 3న జరుగుతాయి. ఫైనల్‌ను జూన్‌ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్‌ సాధించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement