Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC Under 19 world cup 2026: sri lanka collapsed for 58 runs against australia1
నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్‌.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్‌, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్‌ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం​ విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్‌లోని నమీబియా క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. పేసర్‌ విల్‌ బైరోమ్‌ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్‌ లచ్‌మండ్‌ (5-1-19-2), కేసీ బార్టన్‌ (4-0-13-2), హేడెన్‌ ష్కిల్లర్‌ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్‌ దిమంత మహావితన డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ విరాన్‌ చముదిత, దుల్నిత్‌ సిగెరా, ఆడమ్‌ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్‌ విమత్‌ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్‌ రింసర, కుగథాస్‌ మథులాన్‌ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్‌, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది.

Springer's hat trick seals consolation win for West Indies against afghanistan in 3rd T20I2
షమార్‌ హ్యాట్రిక్‌.. విండీస్‌ ఘన విజయం

దుబాయ్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ కంటితుడుపు విజయాన్ని సాధించింది. నిన్న (జనవరి 22) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్‌ ఫలితం తేలిపోయింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్‌ 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో తలో పిడికెడు పరుగులు చేశారు. బ్రాండన్‌ కింగ్‌ 47, జాన్సన్‌ ఛార్లెస్‌ 17, కీసీ కార్తీ 10, జస్టిన్‌ గ్రీవ్స్‌ 12, షిమ్రోన్‌ హెట్‌మైర్‌ 13, క్వెన్టిన్‌ శాంప్సన్‌ 3, మాథ్యూ ఫోర్డ్‌ 27, షమార్‌ స్ప్రింగర్‌ 16 (నాటౌట్‌), మోటీ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు.ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో రహ్మాన్‌ షరీఫి, రషీద్‌ ఖాన్‌, అహ్మద్జాయ్‌ తలో 2 వికెట్లు తీయగా.. షాహిదుల్లా ఓ వికెట్‌ పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు రహానుల్లా గుర్బాజ్‌ (71), ఇబ్రహీం జద్రాన్‌ (28) శుభారంభాన్ని అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. షమార్‌ స్ప్రింగర్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ పతనాన్ని శాశించాడు. షమార్‌ హ్యాట్రిక్‌ సహా 4 వికెట్లు, ఫోర్డ్‌, పియెర్రీ, సైమండ్స్ తలో వికెట్‌ తీశారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్‌, జద్రాన్‌ మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు.

Michael Clarke predicts Finalists of T20 WC 2026 Comments On Ind vs Pak3
T20 WC 2026: ఫైనల్‌ చేరేది ఆ జట్లే!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను చేర్చింది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC). ఇక ఈ దఫా ఇటలీ తొలిసారిగా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.ఏ గ్రూప్‌లో ఏ జట్లు?గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లతో కలిసి ఉంది ఇటలీ. ఇక గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.అదే విధంగా గ్రూప్‌-ఢిలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వనకు ఈ ఐసీసీ ఈవెంట్‌ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్‌- శ్రీలంక ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్‌ ప్రేమికులను ఆకర్షిస్తోంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు కొలంబో వేదిక. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.పాక్‌కు ఓటమి తప్పదు‘‘ఈ పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, సుదీర్ఘకాలంగా టీమిండియా పాకిస్తాన్‌ను ఓడిస్తూనే వస్తోంది. భారత జట్టుకు పాక్‌ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్‌ సానుకూల ఫలితం రాబట్టగలదు’’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు.ఫైనల్‌ చేరేది ఆ జట్లే!ఇక ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్‌-2026 ఫైనలిస్టులను కూడా మైకేల్‌ క్లార్క్‌ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో 2007లో మొదలైన ప్రపంచకప్‌ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది.ఆ తర్వాత 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఇక వన్డే వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది. ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్సీలో 2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్‌ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ’

Ranji Trophy AP vs VID: KSN Raju 5 Wicket Haul Vidarbha 295 All Out4
చెలరేగిన ఆంధ్ర బౌలర్‌.. అద్భుత ప్రదర్శన

డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్‌ కలిదిండి నరసింహ (కేఎస్‌ఎన్‌) రాజు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును నామమాత్రపు స్కోరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ రెండో దశ మ్యాచ్‌లు గురువారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-ఎలో భాగమైన విజయనగరం వేదికగా ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్‌ చేసింది.యశ్‌ రాథోడ్‌ శతకంమ్యాచ్‌ ఆరంభం నుంచే ఆంధ్ర బౌలర్లు కట్టిపడేయడంతో విదర్భ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, యశ్‌ రాథోడ్‌ (Yash Rathod- 104 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు.. ఈ సీజన్‌లో దంచి కొడుతున్న అమన్‌ మోఖడే (21), దానిశ్‌ మాలేవర్‌ (0), అథర్వ తైడె (13), సమర్థ్‌ (9)లను కేఎస్‌ఎన్‌ రాజు తన వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు. దీంతో విదర్భ ఒక దశలో 45/4తో కష్టాల్లో పడింది.ఈ సమయంలో యశ్‌ రాథోడ్‌ గొప్ప సంయమనం కనబర్చాడు. మొదట రోహిత్‌తో ఐదో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్‌ అండతో జట్టును ముందుకు నడిపాడు. ఫలితంగా గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.మరో 28 పరుగులు జతచేసి ఈ క్రమంలో 267/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన విదర్భ మరో 28 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్‌ అయింది. ఆంధ్ర బౌలర్లలో రాజు ఐదు వికెట్లు (5/62) కూల్చగా.. కావూరి సాయితేజ యశ్‌ రాథోడ్‌ (115), రోహిత్‌ బింకర్‌ (37) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పార్థ్‌ రేఖడే వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక టీమిండియా స్టార్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సౌరభ్‌ కుమార్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లు ఆడి 295 పరుగులు చేసి ఆలౌట్‌ కాగా.. ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌ మొదలుపెట్టింది.చదవండి: IND vs NZ: అతడు అవుట్‌!.. భారత తుదిజట్టులో మార్పు!

BCCI Told To Sack Gill As ODI Captain Reappoint Rohit Sharma5
‘గిల్‌పై వేటు.. వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే’

టీమిండియా వన్డే కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్‌ గిల్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో భారత్‌ 2-1 తేడాతో ఓడిపోయింది.అనంతరం తాజాగా న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు పరాభవం ఎదురైంది. స్వదేశంలో మొట్టమొదటి సారి కివీస్‌కు భారత్‌ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలి వన్డేలో విజయం సాధించిన గిల్‌ సేన.. ఆ తర్వాత వరుసగా రెండో వన్డేల్లోనూ ఓటమిపాలైంది. అయితే, ఈ సిరీస్‌లో కివీస్‌ తమ ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడటం గమనార్హం.గిల్‌పై వేటు.. రోహిత్‌ శర్మకే పగ్గాలు ఇవ్వండిఈ నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై వేటు వేసి వన్డే కెప్టెన్సీని తిరిగి రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు అప్పగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.ఈ మేరకు.. ‘‘ఇప్పటికీ సమయం మించిపోలేదు. తప్పును సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇదేదో ద్వైపాక్షిక సిరీస్‌ గురించి కాదు. ముందుంది వరల్డ్‌కప్‌ టోర్నీ. ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రయోగాలు అవసరం లేదు.అసలు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ కివీస్‌తో సిరీస్‌లో గనుక రోహిత్‌ కెప్టెన్‌గా ఉండి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అతడి సారథ్యంలోనే టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదు.రోహిత్‌ కెప్టెన్‌గా ఉంటేఅప్పుడే జట్టు సరైన దిశలో వెళ్తోందని నాకు అనిపించింది. గిల్‌ కంటే రోహిత్‌ ఎన్నోరెట్లు గొప్ప కెప్టెన్‌. అతడొక విజయవంతమైన సారథి. గిల్‌ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు ఉండవచ్చు. అయితే, రోహిత్‌ కెప్టెన్‌గా ఉంటే జట్టు కచ్చితంగా చాంపియన్‌గా నిలుస్తుంది. ఇందుకు 85- 90 శాతం అవకాశం ఉంది’’ అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మనోజ్‌ తివారి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథికాగా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ చేరిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌-2027లోనూ భారత జట్టును ముందుకు నడిపించాలని రోహిత్‌ భావించగా.. బీసీసీఐ అనూహ్య రీతిలో అతడిపై వేటు వేసింది. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్‌ను తప్పించి గిల్‌కు వన్డే పగ్గాలు అప్పగించింది.ఇక అంతకుముందే రోహిత్‌ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా.. అతడి స్థానంలో గిల్‌ సారథిగా నియమితుడయ్యాడు. మరోవైపు.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా.. సారథిగా సూర్య అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. చదవండి: వరల్డ్‌కప్‌-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్‌

Your Captain Is Hindu: Ex India Star Big Advice To Bangladesh T20 WC Row6
మీ కెప్టెన్‌ హిందువు: బంగ్లాదేశ్‌కు భారత మాజీ క్రికెటర్‌ సలహా

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలుగతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్‌పై కొంతమంది బంగ్లాదేశ్‌ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను బీసీసీఐ తప్పించింది.ఐసీసీ మాట వినని బీసీబీఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్‌ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ అతుల్‌ వాసన్‌ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.మీ కెప్టెన్‌ ఓ హిందువువార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్‌ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ ఇలా చేయడం సరికాదు.భారత్‌లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్‌ (Litton Das) ఓ హిందువు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్‌ వాసన్‌ బంగ్లాదేశ్‌కు హితవు పలికాడు. కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి బంగ్లాదేశ్‌ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌, టస్కిన్‌ అహ్మద్‌, మహ్మద్‌ షైపుద్దీన్‌, షోరిఫుల్‌ ఇస్లాం. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్‌ ఆరోపణలు

IND vs NZ 2nd T20I: Predicted XIs No Axar Big Selection Call Expected7
IND vs NZ: అతడు అవుట్‌!.. భారత తుదిజట్టులో మార్పు!

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. రాయ్‌పూర్‌ వేదికగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.ఆడతాడా? లేదా?నాగ్‌పూర్‌లో కివీస్‌తో తొలి టీ20 సందర్భంగా వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel Injured) గాయపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ వేసిన అక్షర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడగా.. బంతిని ఆపే క్రమంలో అక్షర్‌ ఎడమచేతికి గాయమైంది. చూపుడు వేలు చిట్లి రక్తం వచ్చింది. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు.అయితే, అక్షర్‌ పటేల్‌ గాయం తీవ్రతపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో కివీస్‌తో రెండో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్నది తేలలేదు. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ స్థానాన్ని.. మరో లెఫ్టాండర్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ భర్తీ చేసే అవకాశం ఉంది.కుల్దీప్‌ వైపు మొగ్గున్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ యాదవ్‌ అంతంత మాత్రంగానే రాణించినా.. టీ20లలో అతడికి అపార అనుభవం ఉంది. కాబట్టిరవి బిష్ణోయిని కాదని కుల్దీప్‌ వైపు యాజమాన్యం మొగ్గుచూపవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.బ్రేస్‌వెల్‌ వస్తాడా?కాగా కుల్దీప్‌ యాదవ్‌ ఇప్పటికి టీమిండియా తరఫున 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. న్యూజిలాండ్‌ జట్టుకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అతడు తుదిజట్టులోకి వస్తే యువ పేసర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌పై వేటు పడే అవకాశం ఉంది.ఇక రాయ్‌పూర్‌లోని షహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సన్నాహకంగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. నాగ్‌పూర్‌లో 48 పరుగులు తేడాతో గెలిచి ఆధిక్యంలో నిలిచింది.భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ రెండో టీ20 తుదిజట్లు అంచనాభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్ చక్రవర్తి.న్యూజిలాండ్‌మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), డెవాన్‌ కాన్వే, రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్, మార్క్‌ చాప్‌మన్, డారిల్‌ మిచెల్, క్రిస్టియన్‌ క్లార్క్‌/ మైకేల్‌ బ్రేస్‌వెల్, కైలీ జేమీసన్, ఇష్‌ సోధి, జేకబ్‌ డఫీ.చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్‌ ఆరోపణలు

Injury Blow New Zealand Star Ruled out of T20 WC NZ replacement Is8
న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ముందు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్‌ ఆడం మిల్నే గాయపడ్డాడు. ఫలితంగా ఐసీసీ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు.న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం ధ్రువీకరించింది. తొడ కండరాల గాయంతో మిల్నే వరల్డ్‌కప్‌ జట్టుకు దూరమైనట్లు తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26 సీజన్‌లో భాగంగా మిల్నే సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా అతడు గాయపడ్డాడు.మిల్నే స్థానంలో అతడేఇక ఆడం మిల్నే (Adam Milne) స్థానాన్ని బ్లాక్‌క్యాప్స్‌.. కైలీ జెమీషన్‌ (Kyle Jamieson)తో భర్తీ చేసింది. రిజర్వు ప్లేయర్‌గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి చేర్చింది. జెమీషన్‌ స్థానంలో మరో ట్రావెలింగ్‌ రిజర్వును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. కాగా కివీస్‌ జట్టును గాయాల బెడద వేధిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే విలియమ్‌ ఒరూర్కీ, బ్లేయర్‌ టిక్నర్‌, నాథన్‌ స్మిత్‌, బెన్‌ సియర్స్‌ వంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇక కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌, మార్క్‌ చాప్‌మన్‌, మ్యాట్‌ హెన్రీ తదితరులు ఇటీవలే గాయాల నుంచి కోలుకున్నారు. వీరంతా ప్రస్తుతం టీమిండియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నారు.ఫెర్గూసన్‌ సైతంఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ జట్టులో భాగమైన లాకీ ఫెర్గూసన్‌ పిక్కల్లో నొప్పి కారణంగా టీమిండియాతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ వరల్డ్‌కప్‌ నాటికి అతడు కోలుకోకపోతే జట్టుకు దూరమయ్యే పరిస్థితి.కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. కాగా భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతోంది. తొలి టీ20లో టీమిండియా గెలవగా.. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి రాయ్‌పూర్‌ వేదిక.టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీకి న్యూజిలాండ్‌ అప్‌డేటెడ్‌ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్‌, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: వరల్డ్‌కప్‌-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్‌

BCB Accuses ICC Says Double Standards India Privilege Reminder9
భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్‌ ఇస్లామ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే ఆడేలా భారత్‌కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్‌ ఇస్లామ్‌ గుర్తు చేశాడు. పాక్‌లో ఆడబోమని భారత్‌ చెబితే..‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?2025 చాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్తాన్‌లో ఆడబోమని భారత్‌ చెబితే వారి మ్యాచ్‌లను తరలించలేదా? అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్‌లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా? మేం పోరాడతాంశ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్‌) హైబ్రిడ్‌ మోడల్‌లో మ్యాచ్‌లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్‌ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి. పాక్‌లో పరిస్థితి వేరు.. వితండవాదంఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్‌ మ్యాచ్‌లు ఆడిస్తోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్‌ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం. లాంఛనమేకాగా టీ20 వరల్డ్‌ కప్‌నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు పట్టించుకోలేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్‌ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ పునరుద్ఘాటించారు.‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్‌ వ్యాఖ్యానించాడు.చదవండి: వరల్డ్‌కప్‌-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్‌

Irfan Pathan Surprise Pick Team India T20I star for 2027 ODI WC plans10
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!

టీమిండియా టీ20 ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌.1199 పరుగులుఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిషేక్‌ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్‌ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్‌ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్‌ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్‌ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్‌- గిల్‌ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్‌ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్‌ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement