Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Joe Root equals Ricky Ponting with 41st Test hundred1
జో రూట్‌ 41వ శతకం

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ టెస్ట్‌ క్రికెట్‌లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్‌, రూట్‌ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్‌ (51), సంగక్కర (45) పాంటింగ్‌, రూట్‌ కంటే ముందున్నారు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ (84) ఒక్కడే రూట్‌ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్‌కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.తాజా శతకంతో రూట్‌ తన సమకాలీకులు, ఫాబ్‌-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్‌ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌ 36, కేన్‌ విలియమ్సన్‌ 33, విరాట్‌ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ చివరి టెస్ట్‌లో రూట్‌ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్‌కు ముందు రూట్‌కు ఆసీస్‌ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్‌లోనే ఆసీస్‌ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్‌కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్‌ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్‌ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (84) సెంచరీకి చేరువలో ఔట్‌ కాగా.. జేమీ స్మిత్‌ (46) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో నెసర్‌ 4, స్టార్క్‌, బోలాండ్‌ తలో 2, గ్రీన్‌, లబూషేన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ మూడో సెషన్‌ సమయానికి వికెట​ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్‌ 24, వెదరాల్డ్‌ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్‌ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

gangireddypalem srivalli kabaddi national level achievement2
ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే

ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్‌’గా గుర్తింపు పొందింది.యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్‌ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎనీ్వలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్‌.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది. పెరిగిన స్థాయి శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్‌ రీజియన్‌ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్‌వీలకే పరిమితం కాదు. సీబీఎస్‌ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యాన హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే అండర్‌ –19 జాతీయ పోటీలకు జేఎన్‌వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్‌ జేఎన్‌వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల.అవకాశాలు వదలొద్దు: శ్రీవల్లి కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్‌ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు.

Shrachi Bengal Tigers started its title defence with a 3-1 win over Soorma Hockey Club3
బెంగాల్‌ టైగర్స్‌ శుభారంభం 

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బెంగాల్‌ 3–1తో సూర్మ హాకీ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రెండు క్వార్టర్లు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్‌ మొదలైన మూడు నిమిషాలకే బెంగాల్‌ టైగర్స్‌ స్ట్రయికర్‌ సుఖ్‌జీత్‌ సింగ్‌ (33వ ని.) గోల్‌తో ఖాతా తెరిచాడు. ఈ క్వార్టర్‌ ముగిసే దశలో మళ్లీ అభిషేక్‌ (45వ ని.) గోల్‌ చేయడంతో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి క్వార్టర్‌లో ఎట్టకేలకు సూర్మ క్లబ్‌ తరఫున ప్రభ్‌జోత్‌ సింగ్‌ (54వ ని.) గోల్‌ కొట్టి 1–2తో బెంగాల్‌ ఆధిక్యానికి గండికొట్టినప్పటికీ ఆఖరి నిమిషంలో గుర్‌సేవక్‌ సింగ్‌ (60వ ని.) గోల్‌ చేయడంతో శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ 3–1తో విజయం సాధించింది. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌ 4–2తో రాంచీ రాయల్స్‌పై నెగ్గింది. అంతకు ముందు జరిగిన మహిళల హెచ్‌ఐఎల్‌లో శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ 1–0తో రాంచీ రాయల్స్‌పై నెగ్గింది. నేడు జరిగే అమ్మాయిల మ్యాచ్‌లో సూర్మ క్లబ్‌... రాంచీ రాయల్స్‌తో, పురుషుల ఈవెంట్‌లో ఎస్‌జీ పైపర్స్‌... హెచ్‌ఐఎల్‌ జీసీ జట్టుతో తలపడతాయి.

India making strong efforts to host the 2036 Olympics says PM Narendra Modi4
‘2036లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం’ 

వారణాసి: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఇప్పటికే 2030 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ హక్కులు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివారం వారణాసిలో సీనియర్‌ జాతీయ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ మొదలు కాగా...వర్చువల్‌గా ప్రధాని దీనిని ప్రారంభించారు. ప్రధాన వేదికపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్ధమాన అథ్లెట్లు ఒలింపిక్స్‌లో రాణించేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ‘ఖేలో ఇండియా’లాంటి క్రీడలు, పథకాలు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఒక గేమ్‌ చేంజర్‌ అని మోదీ పేర్కొన్నారు. ‘2030 కామన్వెల్త్‌ క్రీడలకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. అలాగే 2036 విశ్వక్రీడల ఆతిథ్యం కోసం గట్టిగానే కృషి చేస్తున్నాం. దీనివల్ల మన భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లలో సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. మేం ఇదివరకే ప్రారంభించిన ఖేలో ఇండియా సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతిభ గల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా విస్తృత అవకాశాల్ని కల్పించింది’ అని ప్రధాని వివరించారు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌) ఎంతోమంది అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెచ్చేందుకు తోడ్పడిందన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్‌లో 20కి పైగానే మేజర్‌ క్రీడా ఈవెంట్లు జరిగాయని గుర్తుచేశారు. ‘పదేళ్లుగా వివిధ నగరాల్లో చెప్పుకోదగిన స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్లు ఎన్నో జరిగాయి. ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, అంతర్జాతీయ చెస్‌ టోర్నీలు, ప్రపంచకప్‌ చెస్‌ ఈవెంట్లు జరిగాయి. కేంద్రం కూడా ప్రతీ ఏటా క్రీడల బడ్జెట్‌ను పెంచుతూ పోతోంది. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరిచేందుకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాం. ఎక్స్‌ప్రెస్‌ వేగంతో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. సీనియర్‌ జాతీయ వాలీబాల్‌ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు జరుగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సరీ్వసెస్‌కు చెందిన 58 పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు వేయికి పైగా ఆటగాళ్లు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఇరు విభాగాల్లో లీగ్‌ దశ పోటీలు జరుగుతాయి. గ్రూప్‌ దశ అనంతరం నాకౌట్‌ దశ మొదలవుతుంది. 11న జరిగే ఫైనల్స్‌తో ఈవెంట్‌ ముగుస్తుంది.

WPL 2026: Meg Lanning appointed as new UP Warriorz captain5
యూపీ వారియర్జ్‌కు కొత్త కెప్టెన్‌.. దీప్తి శర్మపై వేటు

మహిళల ఐపీఎల్‌ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌గా ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్‌ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.33 ఏళ్ల లాన్నింగ్‌ను వారియర్జ్‌ ఈ సీజన్‌ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్‌ నియామకంతో గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్‌లో దీప్తి సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్‌ వేలంలో వారియర్జ్‌ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.లాన్నింగ్‌కు కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్‌ ఓ వన్డే ప్రపంచకప్‌, 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. డబ్ల్యూపీఎల్‌ కెప్టెన్‌గానూ లాన్నింగ్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది. లాన్నింగ్‌ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.లాన్నింగ్‌ సారథ్యంలో వారియర్జ్‌ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్‌ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్‌లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్‌ సీజన్‌కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది. కాగా, డబ్ల్యూపీఎల్‌ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్‌ ఓపెనర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్‌ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న (గుజరాత్‌ జెయింట్స్‌తో) ఆడనుంది.

Virat Kohli record chase in 2026: Major milestones India's ODI legend could break6
2026లో విరాట్‌ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌.. గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌.. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్‌ నుంచే విరాట్‌ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్‌ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.28000 అంతర్జాతీయ పరుగులుఅంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో విరాట్‌ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.15000 వన్డే పరుగులు308 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్‌.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌ల్లో విరాట్‌ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్‌ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులువిరాట్‌ మరో 42 పరుగులు చేస్తే సచిన్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.అత్యధిక వన్డే పరుగులున్యూజిలాండ్‌ సిరీస్‌లో విరాట్‌ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్‌ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్‌ న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.ఐపీఎల్‌లో 9000 పరుగులుఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్‌ కూడా ఆడనున్న విరాట్‌.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్‌ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్‌లు) ఉన్నాయి.

BANGLADESH TEAM WILL NOT TRAVEL TO INDIA FOR T20 WORLD CUP 20267
T20 World Cup: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్‌-2026 తమ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ యూత్ మరియు స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్‌ నుంచి వారి స్టార్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను (కేకేఆర్‌) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.🚨 CONFIRMED - BANGLADESH TEAM WILL NOT TRAVEL TO INDIA FOR T20 WORLD CUP 2026 🚨 pic.twitter.com/aVF29iqMoY— Tanuj (@ImTanujSingh) January 4, 2026ముస్తాఫిజుర్‌ ఉదంతంపై బీసీబీ ఇవాళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకుంది. ఇందులోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించారు. ఈ విషయమై ఐసీసీకి లేఖ రాయాలని తీర్మానం చేశారు. భారత్‌లో తమ ఆటగాళ్లు రక్షణ లేదని, అందుకే తమ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరుతామని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ తెలిపారు. ఆటగాళ్ల భద్రత, గౌరవం తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పుకొచ్చారు.కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్‌ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్‌లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది.కాగా, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు గ్రూప్‌-సిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌, ఇటలీ, ఇంగ్లండ్‌, నేపాల్‌ మిగిలిన జట్లుగా ఉన్నాయి. భారత్‌లోని కోల్‌కతా, ముంబై నగరాల్లో బంగ్లాదేశ్‌ తమ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడనుంది.గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ ఆడబోయే మ్యాచ్‌లు - ఫిబ్రవరి 7: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా) - ఫిబ్రవరి 9: ఇటలీ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా) - ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా) - ఫిబ్రవరి 17: నేపాల్ vs బంగ్లాదేశ్ (ముంబై) ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును కూడా ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్‌ దాస​్‌, వైస్‌ కెప్టెన్‌గా మొహమ్మద్‌ సైఫ్‌ హస్సన్‌ ఎంపికయ్యారు.ఇటీవల జరిగిన ఐర్లాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ రీఎంట్రీ ఇచ్చాడు.వికెట్‌ కీపింగ్‌, బ్యాటర్‌ జాకిర్‌ అలీ, బ్యాటర్‌ మహిదుల్‌ ఇస్లాం అంకోన్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లో ఉన్నా, స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటోపై వేటు పడింది. టీ20 ప్రపంచకప్‌ 2026కు బంగ్లాదేశ్‌ జట్టు..- లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్) - మొహమ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్) - తంజీద్ హసన్ - మొహమ్మద్ పర్వేజ్ హొసైన్ ఎమోన్ - తౌహిద్ హ్రిదోయ్ - షమీమ్ హసన్ - ఖాజీ నూరుల్ హసన్ సోహాన్ - మహెది హసన్ - రిషాద్ హసన్ - నసుమ్ అహ్మద్ - ముస్తాఫిజుర్ రహ్మాన్ - తంజీమ్ హసన్ సకిబ్ - టాస్కిన్ అహ్మద్ - మొహమ్మద్ షైఫుద్దిన్ - షొరీఫుల్ ఇస్లాం

Pakistan provisional squad for T20 World Cup revealed8
టీ20 వరల్డ్‌కప్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. ఎట్టకేలకు స్టార్‌ ప్లేయర్‌కు చోటు

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్‌ ప్రొవిజనల్‌ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ అఘా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీ​ని (వైస్‌ కెప్టెన్‌) ప్రకటించలేదు.ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఎట్టకేలకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్‌కు బ్యాకప్‌గా మరో పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ ఎంపికయ్యాడు. షాహీన్‌ తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డ విషయం తెలిసిందే.స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజ్వాన్‌ స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. మెయిన్‌ స్క్వాడ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు. టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు- సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్) - బాబర్ ఆజమ్ - షాహీన్ అఫ్రిది (ఫిట్‌నెస్ అనిశ్చితి) - ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్) - షాదాబ్ ఖాన్ - మొహమ్మద్ నవాజ్ - ఫహీమ్ అష్రఫ్ - హారిస్ రౌఫ్ (షాహీన్‌కు ప్రత్యామ్నాయం) - ఫకర​్‌ జమాన్‌- మొహమ్మద్‌ వసీం జూనియర్‌- నసీం షా- అబ్దుల్‌ సమద్‌- సాహిబ్‌జాదా ఫర్హాన్‌- సైమ్‌ అయూబ్‌- సల్మాన్‌ మీర్జా- అబ్రార్‌ అహ్మద్‌కాగా, టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ గ్రూప్‌-ఏ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్‌లోనే టీమిండియా కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది.

no value for domestic performances, special story on team india chances9
సెంచరీలు ఎందుకు, వికెట్లు తీసుడు ఎందుకు..?

సాధారణంగా ఏ దేశ క్రికెట్‌లో అయినా దేశవాలీ ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లకు జాతీయ జట్టు అవకాశాలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దేశవాలీ టోర్నీల్లో శతక్కొట్టుడు కొట్టి, పరుగుల వరద పారించినా జాతీయ జట్టు అవకాశాలు రావు. బ్యాటింగ్‌ ఆధిపత్యం నడుస్తున్న జమానాలో చచ్చీ చెడి వికెట్లు తీసినా పట్టించుకునే నాథుడే లేడు.తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం​ ఎంపిక చేసిన భారత జట్టును చూస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో దేశవాలీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీలో కర్ణాటక ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ 5 మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. అయినా అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు.మరో యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో ఇతగాడు ఇరగదీస్తాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ చేశాడు. అయినా ఇతనికి కూడా టీమిండియాలో చోటు దక్కలేదు. రుతురాజ్‌ విషయంలో మరింత విడ్డూరమైన విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో అద్భుతమైన సెంచరీ చేసినా మొండిచెయ్యే ఎదురైంది.అద్భుత ప్రదర్శనలు చేస్తున్న మరో ఆటగాడు ధృవ్‌ జురెల్‌. ఇతగాడు కూడా విజయ్‌ హజారే ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మరో యంగ్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ పరిస్థితి కూడా ఇదే. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సుడిగాలి శతకం బాదాడు. వీహెచ్‌టీలో సత్తా చాటుతున్న దేశీయ టాలెంట్‌ గురించి అయితే చెప్పక్కర్లేదు. అనామక బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నారు. కాస్తోకూస్తో అనుభవం ఉండి, గుర్తింపు ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు లేనప్పుడు వీరు టీమిండియా బెర్త్‌లు ఆశించడం అత్యాశే అవుతుంది.బౌలింగ్‌ విషయానికొస్తే.. బ్యాటర్లు రాజ్యమేలే జమానాలో చచ్చీ చెడీ వికెట్లు తీస్తున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి సెలెక్టర్లు మరోసారి మొండిచెయ్యి చూపారు. షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నా, సెలెక్టర్లు అతన్ని కరుణించడం లేదు. షమీ విషయంలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం.దేశవాలీ టోర్నీల్లో అద్భుతమంగా రాణిస్తూ టీమిండియా బెర్త్‌లు దక్కించుకోలేకపోతున్న షమీ లాంటి బౌలర్లు చాలామంది ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ స్పిన్నర్‌ జీషన్‌ అన్సారీ, మహారాష్ట్ర పేసర్‌ రామకృష్ణ ఘోష్‌, ఆంధ్రప్రదేశ్‌ మీడియం పేసర్‌ సత్యనారాయణ రాజు లాంటి వారు ప్రస్తుతం జరుగుతున్న వీహెచ్‌టీలో చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నా, టీమిండియా బెర్త్‌ దక్కలేదు.ఇక్కడ ఓ ప్రశ్న ఉత్పన్నమవ్వవచ్చు. ఉన్నది 11 బెర్త్‌లు, ఎంతమందికి అవకాశాలు ఇస్తారని చాలామంది అడగవచ్చు. ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం ఉండదు. అయితే ఇలా జరుగుతూపోతే మాత్రం దేశీయ క్రికెట్‌లో సత్తా చాటాలన్న తపన ఆటగాళ్లలో చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా ప్రత్యామ్నాయం చూపకపోతే దేశీయ క్రికెట్‌కు విలువే లేదు. ఇప్పటికే దేశీయ క్రికెట్‌ నామమాత్రంగా మారిందని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎవరి దృష్టిలోనో పడి, ఐపీఎల్‌ అవకాశాలు వస్తే.. వచ్చి అక్కడ కూడా రాణిస్తేనే టీమిండియా అవకాశాలు వస్తాయన్నది జగమెరిగిన సత్యం.ఇలా ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా బెర్త్‌ దక్కించుకోవడమన్నది అందరికీ సాధ్యపడదు. ఏదో హర్షిత్‌ రాణా లాంటి వారిని మాత్రమే ఇలాంటి అదృష్టాలు వరిస్తాయి. హర్షిత్‌ రాణా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చర్చించక తప్పదు. ప్రస్తుతం వీహెచ్‌టీలో రాణిస్తున్న పేస్‌ బౌలర్లు హర్షిత్‌కు ఏ విషయంలో తీసిపోతారు. వారికంటే హర్షిత్‌కు ఉన్న అదనపు అర్హతలు ఏంటి..? దీనికి సమాధానం భారత సెలెక్టర్ల వద్ద కానీ, టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వద్ద కానీ ఉండదు. మొత్తంగా దేశీయ క్రికెట్‌కు విలువే లేకుండా పోయిందన్నది సగటు భారత క్రికెట్‌ అభిమాని అభిప్రాయం.

How Anthony Stuart made history in a 12 day long international career10
కెరీర్‌ నిడివి 12 రోజులే.. అయితేనేం చరిత్రలో నిలిచిపోయాడు..!

క్రికెట్‌ చరిత్రలో మనకు తెలీని చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అది 1997. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన కుడి చేతి వాటం మీడియం పేసర్‌ ఆంధొని స్టువర్ట్‌ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రోజు.ఈ బౌలర్‌ అంతర్జాతీయ కెరీర్‌ నిడివి కేవలం​ 12 రోజులు మాత్రమే. అయితేనేం, చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధొని తన స్వల్ప కెరీర్‌లో ఆడిన 3 వన్డేల్లోనే చారిత్రక ప్రదర్శనలు చేశాడు. అందులో ఒ‍కటి తన మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్‌ నమోదు చేయడం​.మెల్‌బోర్న్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆంథొని హ్యాట్రిక్‌ (ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ వసీమ్, మొయిన్ ఖాన్) సహా 5 వికెట్ల ప్రదర్శన (5/26) నమోదు చేయడంతో పాటు రెండు క్యాచ్‌లు (ఇంజమామ్-ఉల్-హక్, షాహిద్ ఆఫ్రిది) కూడా పట్టుకొని ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. తద్వారా నాటికి ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.Happy Birthday Anthony StuartTook an ODI hat-trick in his third ODI only but got injured and then never picked again to play for Australia.pic.twitter.com/TO3lDa9Spx— Cricketopia (@CricketopiaCom) January 2, 2026ఇక్కడ విశేషమేమింటంటే.. హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న మ్యాచే ఆంథొనికి కెరీర్‌లో చివరిది. సంచలన ప్రదర్శన నమోదు చేసిన తర్వాత అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. తొలుత గాయం, ఆతర్వాత పేలవ ఫామ్‌ కారణంగా ఒక్క అవకాశం కూడా రాలేదు.ఏడాది కాలంలోనే జాతీయ జట్టు సహా దేశవాలీ జట్టు నుంచి కూడా కనుమరుగైపోయాడు. అవకాశాల కోసం ఎదురుచూసీ, చూసీ చివరికి 2000 సంవత్సరంలో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆటగాడిగా కెరీర్‌ ముగిసాక ఆంధొని న్యూజిలాండ్‌లో కోచింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆతర్వాత స్వదేశంలోనూ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 56వ పడిలో ఉన్న ఆంథొని తన దేశవాలీ జట్టు న్యూ సౌత్‌వేల్స్‌కే కోచింగ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 12 రోజుల్లోనే అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినా, హ్యాట్రిక్‌ కారణంగా ఆంథొని చరిత్రలో నిలిచిపోయాడు. సంచలన ప్రదర్శన తర్వాత అతనికి మరో అవకాశం రాకపోవడం మరో విశేషం. చరిత్రలో ఇలాంటి ఎన్నో విశేషాలు ప్రస్తుత తరం క్రికెట్‌ అభిమానులకు తెలీవు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement