Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Shikhar dhawan scored 99 runs in world legends pro league 20261
మొన్న పుజారా.. నిన్న శిఖర్‌ ధవన్‌

టీమిండియా తాజా మాజీ క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌, ఛతేశ్వర్‌ పుజారా లేటు వయసులోనూ చెలరేగిపోతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లు ముగిసాక కూడా వీరిద్దరూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్‌ క్రికెటర్లతో కలిసి వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌లో ఆడుతున్న ధవన్‌, పుజారా.. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో తృటిలో సెంచరీలను కోల్పోయారు. ఈ టోర్నీలో గుర్‌గ్రామ్‌ థండర్‌కు ఆడుతున్న పుజారా దుబాయ్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న మహారాష్ట్ర టైకూన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుయాబ్‌ రాయల్స్‌ తరఫున శిఖర్‌ ధవన్‌ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్‌, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్‌ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.కాగా, వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొంటున్నాయి.జనవరి 26న మొదలై పది రోజుల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.గోవా వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ లయన్స్‌, కీరన్‌ పోలార్డ్‌ నేతృత్వంలోని పూణే పాంథర్స్‌, గుర్‌కీరత్‌ సింగ్‌ మాన్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ వారియర్స్‌, శిఖర్‌ ధనవ్‌ నేతృత్వంలోని దుబాయ్‌ రాయల్స్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇవాళే (ఫిబ్రవరి 3) ఈ సెమీస్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి సెమీస్‌లో రాజస్థాన్‌, పూణే.. రెండో సెమీస్‌లో ఢిల్లీ, దుబాయ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌ మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండో సెమీస్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

No South Africa as ex-England skipper picks his four semifinalists for 2026 T20 World Cup2
పాక్‌, సౌతాఫ్రికా కాదు.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొంది. దీంతో బంగ్లా స్ధానాన్ని స్కాట్లాండ్‌తో ఐసీసీ భర్తీ చేసింది. తాజాగా పాకిస్తాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు వాన్ షాకిచ్చాడు. తను ఎంచుకున్న టాప్‌-4 జట్ల జాబితాలో సౌతాఫ్రికాకు వాన్ చోటు ఇవ్వలేదు. భారత్, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌కు వాన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా భారత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ సన్నాహ‌ల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో భార‌త్ దుమ్ములేపింది.చదవండి: పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్‌

Sunil Gavaskars Blunt Message To ICC After Pakistan Announce India Boycott At T20 World Cup3
పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్‌తో మ్యాచ్‌ను బాయ్‌క‌ట్ చేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడుతామ‌ని, భార‌త్‌తో మాత్రం త‌ల‌ప‌డ‌బోమ‌ని పాక్ స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. ఈ అనుహ్య‌ నిర్ణ‌యంపై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందన వ‌స్తోంది.చాలా మంది పాక్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఇదే విష‌యంపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం త్వరలోనే మారిపోతుందని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అంచనా వేస్తున్నారు. "నాలుగు రోజుల పాటు ఈ అంశంపై స్పందనలు చూసిన తర్వాత పీసీబీ తమ నిర్ణయం మార్చుకుంటుంది. ఇందులో కొత్తేమీ లేదు. పాక్‌ క్రికెటర్లంతా రిటైర్మెంట్‌ ప్రకటించడం... కొద్ది రోజులకే అభిమానులు మా ఆటను ఇంకా చూడాలనుకుంటున్నారు అంటూ రిటైర్మెంట్‌ ప్రకటన వెనక్కి తీసుకోవడం ఎన్నోసార్లు జరిగింది. పీసీబీ నిర్ణయంపై ఐసీసీ చర్య కూడా తీసుకోవచ్చు" అని గావస్కర్‌ పేర్కొన్నారు.మరోవైపు పాక్‌ ఆడబోమని చెబుతున్నా...నిబంధనల ప్రకారం భారత జట్టు మ్యాచ్‌ కోసం కొలంబోకు ప్రయాణించాల్సి ఉంటుంది. మైదానానికి వెళ్లిన తర్వాత మరో జట్టు ఆడటం లేదని నిర్ధారణ అయ్యాకే ఐసీసీ రిఫరీ అధికారిక ప్రకటనతో మ్యాచ్‌ రద్దు అవుతుంది.చదవండి: భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!

Will Formula 1 Return To India? Sports Ministry Makes Big Revelation4
భారత్‌లో మళ్లీ ఫార్ములావన్‌?

సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో ‘రయ్‌... రయ్‌’ మోత మోగింది. రేస్‌ ప్రియుల ఫేవరెట్‌ ‘ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్‌1 రేసు మూడేళ్ల పాటు జరిగింది. 2013 రేసు అనంతరం మనకు ఈ ‘ఫార్ములా’ దూరమైంది! కారణాలు ఏవైనా మళ్లీ ప్రతిష్టాత్మక ఫార్ములావన్‌ ఆతిథ్య భాగ్యం భారత్‌కు దక్కలేదు. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత ‘రయ్‌ రయ్‌’ మోత మోగించాలని కేంద్ర క్రీడాశాఖ చొరవ చూపిస్తోంది.గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్‌ను ఇటీవలే క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సందర్శించారు. అంతేకాదు, సంబంధిత వర్గాలతోనూ చర్చించినట్లు క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. బుద్ధ సర్క్యూట్‌ యజమాని జేపీ గ్రూప్‌. ఈ కార్పొరేట్‌ సంస్థ దివాళా తీసింది. ఇప్పుడు సర్క్యూట్‌ బాధ్యతల్ని ‘యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండ్రస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ చూస్తోంది.ఈ అథారిటీ వర్గాలతోనే క్రీడల మంత్రి భేటీ అయినట్లు తెలిసింది. అప్పుల్లో కూరుకుపోయిన జేపీ గ్రూప్‌ నుంచి బుద్ధ సర్క్యూట్‌ను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ప్రాథమిక దశలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయితే తిరిగి భారత్‌లో ‘ఫార్ములావన్‌’ రేసుకు చేపట్టాల్సిన కార్యాచరణ మొత్తం చకచకా జరిగిపోతుందని భావిస్తున్నారు.అయితే యాజమాన్య బదిలీ జరగకపోయినా... కనీసం రెండు, మూడేళ్లు ఈ ట్రాక్‌ బాధ్యతల్ని క్రీడా సమాఖ్యకు అప్పగించాలని మంత్రి మాండవీయ సంబంధిత వర్గాలను కోరినట్లు తెలిసింది. పన్ను, అధికారిక సమస్యల్ని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఫార్ములావన్‌ను తిరిగి భారత్‌ ట్రాక్‌లో నిర్వహించే ప్రణాళికతో క్రీడాశాఖ ఉంది. భారత మోటార్‌స్పోర్ట్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఎంఎస్‌సీఐ) మాజీ అధ్యక్షుడు విక్కీ చందోక్‌ తాజా ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఎఫ్‌1 భారత్‌కు తిరిగొస్తే అంతకుమించిన ఆనందం మరొటి ఉండదని అన్నారు. ఆయన కృషివల్లే 2011లో ఫార్ములావన్‌ జరిగింది.

ICC could suffer INR 2289 crore loss if Pakistan boycotts India match in T20 World Cup5
భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!

క్రికెట్ ప్ర‌పంచంలో భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జ‌ట్లు ఎప్పుడెప్పుడూ త‌ల‌ప‌డ‌తాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా చిరకాల ప్రత్యర్ధులు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడతున్నాయి. అయితే మ‌రోసారి దాయాదుల పోరు చూడాలనుకున్న అభిమానుల‌కు నిరాశే ఎదురయ్యే అవకాశముంది.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్‌తో జ‌ర‌గాల్సిన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోర్నీలో ఇతర జట్లతో ఆడుతామని, కానీ భారత్‌తో మాత్రం తలపడబోమని పాక్‌ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.ఐసీసీకి భారీ నష్టం..ఒకవేళ భారత్‌-పాక్ మ్యాచ్ రద్దు అయితే అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు భారీ న‌ష్టం వాటిల్లే అవ‌కాశ‌ముంది. ఐసీసీ ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ. 27,465 కోట్లు)గా ఉంది. ఇందులో 40 శాతం కంటే ఎక్కువ ఆదాయం ఒక్క భారత్-పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుంది.గ‌త మూడేళ్ల‌లో జ‌రిగిన ప్రతీ భారత్-పాక్ మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,289 కోట్లు)గా ఉంది. అదేవిధంగా టోర్నీ బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ ఈ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ యాడ్స్ రెవెన్యూ కోల్పోతుంది. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది. దీంతో ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవ‌కాశ‌ముంది. పాక్ త‌మ మొండి ప‌ట్టు వీడ‌క‌పోతే ఆ న‌ష్టాన్ని వారి నుంచే ఐసీసీ రాబ‌ట్ట‌నుంది.చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా

Ombudsman declares Amarnath president of Hyderabad Cricket Association6
హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా అమర్నాథ్

హైద‌రాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యుక్షుడిగా అమర్నాథ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఈ మేరకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ కైత్ ఉత్తర్వలు జారీ చేశారు. 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమ‌ర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రావ్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అతడు అర్హుడు కాదని అంబుడ్స్‌మన్ స్పష్టం చేసింది.దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష బాధ్యతలను అమ‌ర్నాథ్‌కు అప్పగించారు. ప్రస్తుతం హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా సర్దార్ దల్జీత్ సింగ్ ఉన్నారు. మరో వారం రోజుల్లో అతడి స్ధానాన్ని అమర్నాథ్ భర్తీ చేయనున్నారు. ఐపీఎల్ సమీపిస్తుండటంతో ఈ నూతన ప్రెసిడెంట్ నియమాకం అనివార్యమైంది.దాదాపు ఏడాది నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా జరగలేదు. ఆఖరికి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హో‍ం మ్యాచ్‌లను కూడా వేరే చోటకు తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అమ‌ర్నాథ్‌ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపిక కావడంతో పరిస్థితులు మారే అవకాశముంది.చదవండి: T20 WC 2026: రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్‌ వర్మ

Gujarat Giants and Delhi Capitals are set to lock horns in the WPL 2026 Eliminator match7
ఎవరిదో ‘ఫైనల్‌’ బెర్త్‌?

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఇప్పటి వరకు మూడు సీజన్లు జరగ్గా ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు సార్లూ ఫైనల్‌కు చేరింది. అయితే దురదృష్టవశాత్తూ ప్రతీసారి ఓడి రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఫైనల్‌ చేరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్‌ జెయింట్స్‌ తొలి రెండు సీజన్లలో ఆఖరి స్థానానికే పరిమితం కాగా... గత ఏడాది మాత్రం రెండో స్థానంతో ఎలిమినేటర్‌కు అర్హత సాధించినా ... అదే మ్యాచ్‌లో ఓడి ని్రష్కమించింది. ఈసారైనా ఆ దశను దాటి తొలిసారి తుది పోరుకు చేరాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, గుజరాత్‌ జట్ల మధ్య ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడుతుంది. స్పిన్నర్లు కీలకం... గత మూడు సీజన్లలో గ్రూప్‌ దశలో అగ్రస్థానంతో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఈసారి కాస్త తడబాటును ప్రదర్శించిన జట్టు ఇప్పుడు ఫైనల్‌ కోసం ఎలిమినేటర్‌లో ఆడుతోంది. బ్యాటింగ్‌ పరంగా చూస్తే టాప్‌–5తో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లు లిజెల్‌ లీ, షఫాలీ వర్మ శుభారంభం అందిస్తే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాతి బ్యాటర్లలో లారా వోల్‌వార్ట్, కెప్టెన్‌ జెమీమా, మరిజాన్‌ కాప్‌ చకచకా పరుగులు రాబట్టగలరు. అయితే టీమ్‌ ప్రధానంగా స్పిన్నర్లపై ఆధారపడుతోంది. శ్రీచరణి, స్నేహ్‌ రాణా, నందిని శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగల సమర్థులు సమష్టి ప్రదర్శనపై భారం... విదేశీ క్రికెటర్ల ప్రదర్శనతోనే తాజా సీజన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ముందంజ వేసిందనడంలో సందేహం లేదు. ముగ్గురు ఆ్రస్టేలియన్లు కెపె్టన్‌ యాష్లీ గార్డ్‌నర్, బెత్‌ మూనీ, జార్జియా వేర్‌హామ్‌ తమ ఆటతో ప్రతీసారి ప్రభావం చూపించగా, న్యూజిలాండ్‌ సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌ సోఫీ డివైన్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటింది. మరోసారి జెయింట్స్‌ ఈ ప్లేయర్లపైనే ఆధారపడుతోంది. భారత ఆటగాళ్లలో అనుష్క శర్మ మాత్రమే మూడో స్థానంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది. గుజరాత్‌ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు గెలవగా... ఐదుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసి విజయాన్నందుకోవడం విశేషం.

ICC Warns Pakistan Over Reported Boycott Of India T20 World Cup 2026 Match8
‘ఆడకుంటే మీకే నష్టం’ 

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడమంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఇప్పటికిప్పుడే దీనిపై తీవ్రంగా జవాబివ్వకపోయినా... వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తూ పాక్‌కు ఒక రకమైన హెచ్చరిక జారీ చేసింది. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే మున్ముందు పాక్‌ క్రికెట్‌కే నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, పారదర్శకతపై ఆధారపడి ఐసీసీ టోరీ్నలు జరుగుతాయి. ఎంపిక చేసుకున్న మ్యాచ్‌లలో ఆడతామంటే దాని విశ్వసనీయత దెబ్బ తింటుంది. పోటీకి అర్హత సాధించిన అన్ని జట్లూ ఒకే తరహా నిబంధనల ప్రకారం బరిలోకి దిగాలని ఐసీసీ ఆశిస్తోంది. జాతీయ విధానాల ప్రకారం ప్రభుత్వ జోక్యం ఉండటాన్ని మేం గౌరవిస్తాం కానీ ఇది ఆటకే కాకుండా క్రికెట్‌ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందే పాక్‌ క్రికెట్‌కు కూడా మంచిది కాదు. జట్టుపై ఇది దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పీసీబీ అర్థం చేసుకోవాలి. ప్రపంచకప్‌ను సమర్థంగా నిర్వహించడంలో ఐసీసీతో పాటు పీసీబీకి కూడా బాధ్యత ఉంది. అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కార మార్గాన్ని పాక్‌ కనుక్కుంటే అందరికీ మేలు చేస్తుంది’ అని ఐసీసీ ప్రకటన జారీ చేసింది. అయితే తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐసీసీ బోర్డు సమావేశమయ్యే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 12 శాశ్వత దేశాల ప్రతినిధులు, 3 అసోసియేట్‌ జట్లకు చెందిన ప్రతినిధులు ఐసీసీ బోర్డులో భాగంగా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఐసీసీ అత్యవసర సమావేశంపై ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ అంశంపై చర్చ జరిగినా లేదా ఏదైనా చర్య తీసుకునేందుకు సిఫారసు చేసినా ఈ బోర్డు సమావేశంలోనే జరుగుతుంది. భారీ నష్టానికి అవకాశం... భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే కేవలం ప్రసారకర్తలు, ప్రకటనల గురించే కాదు... ఆ మ్యాచ్‌ కారణంగా ప్రభావం చూపించే ఇతర అంశాలన్నీ కలిపితే మ్యాచ్‌ విలువ సుమారు 250 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2200 కోట్లు) ఉంటుందని అంచనా. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది కాబట్టి ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చు. పీసీబీ వార్షిక ఆదాయం 35.5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.324 కోట్లు) మాత్రమే. ఇలాంటి స్థితిలో ఐసీసీ చర్య తీసుకుంటే పాక్‌ కోలుకునే అవకాశం ఉండదు. టోర్నీలో కూడా మ్యాచ్‌ ఆడకుండా 2 పాయింట్లు కోల్పోయేందుకు పాక్‌ సిద్ధమవుతున్నా... ఐసీసీ మ్యాచ్‌ నిబంధనల ప్రకారం పాయింట్లు మాత్రమే కాదు, రన్‌రేట్‌లో కూడా ఆ జట్టు పూర్తిగా వెనుకబడిపోతుంది.

Sri Lanka to head into T20 World Cup without SRH stars services9
శ్రీలంకకు ఊహించని షాక్‌

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20‍లో మలింగ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి 4 నుండి 6 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మలింగ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టు తరపున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలోనే అతడికి వరల్డ్‌కప్‌ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుహ్యంగా గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడి స్ధానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్‌ తీక్షణ

T20 World Cup warm-up: India A beat USA by 38 runs10
కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్‌ ఘన విజయం

టీ20 వరల్డ్‌కప్‌-2026 వార్మప్ మ్యాచ్‌లు సోమవారం నుంచి షురూ అయ్యాయి. ఈ క్రమంలో అమెరికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఇండియా ‘ఏ’ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ నారాయణ్ జగదీశన్(55 బంతుల్లో 104: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ అయుష్ బదోని( 26 బంతుల్లో 60 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ 24 బంతుల్లో 38 పరుగులు చేసి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్‌, శుభమ్‌, జస్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజయ్ కృష్ణమూర్తి (41),శుభమ్ (28), హర్మీత్ సింగ్ (25), మహ్మద్ మోసిన్ (21) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్ అహ్మద్, తిలక్ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఫిబ్రవరి 4న సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. తిలక్ వర్మ మంగళవారం సీనియర్ జట్టుతో కలవనున్నాడు.చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement