Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

FIDE World Cup 2025 Final Goes To Tiebreaks1
విజేత తేలేది టైబ్రేక్‌లోనే...

పనాజీ: పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. సిందరోవ్‌ జవోఖిర్‌ (ఉజ్బెకిస్తాన్‌), వె యి (చైనా) మధ్య ఫైనల్‌ మ్యాచ్‌లోని నిర్ణీత రెండు క్లాసిక్‌ గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నేడు టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. సిందరోవ్, వె యి మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అంతకుముందు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) ముఖ్య అతిథిగా విచ్చేసి రెండో గేమ్‌ను ప్రారంభించింది. టైబ్రేక్‌ జరిగేది ఇలా... సిందరోవ్, వె యి మధ్య నేడు ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫలితం తేలకపోతే 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా ఫలితం రాకపోతే 5 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను నిర్వహిస్తారు. అయినా విజేత తేలకపోతే 3 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా స్కోరు సమమైతే ఇద్దరి మధ్య ‘సడన్‌ డెత్‌’ గేమ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ ‘సడెన్‌ డెత్‌’ గేమ్‌ కూడా ‘డ్రా’ అయితే నల్లపావులతో ఆడిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు. మరోవైపు రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఆండ్రీ ఎసిపెంకో (Andrey Esipenko) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నొదిర్‌బెక్‌ యాకుబొయేవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన పోటీలో ఎసిపెంకో 2–0తో గెలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోరీ్నకి అర్హత సాధించాడు. నొదిర్‌బెక్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచిన ఎసిపెంకో... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 26 ఎత్తుల్లో విజయం సాధించాడు. చ‌ద‌వండి: ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌- పాకిస్థాన్ టి20 మ్యాచ్‌

Mushtaq Ali Domestic T20 Tournament from today2
ధనాధన్‌ ధమాకా

హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచం మొత్తం కన్నేసే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల కంట... వేలం పంట పండించుకునేందుకు యువ ఆటగాళ్లకు చక్కని అవకాశమిది. నేటి నుంచి జరిగే దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మెరుపులు మెరిపించేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు. కుర్రాళ్లతో పోటీ పడేందుకు, తిరిగి టీమిండియా తరఫున పునరాగమనం చేసేందుకు భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా సన్నద్ధమవుతున్నాడు. ఇతనొక్కడే కాదు... మరో 74 రోజుల్లోనే ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి, సంజూ సామ్సన్, శార్దుల్‌ ఠాకూర్‌లతో పాటు తెరమరుగైన పృథ్వీ షా కూడా ముస్తాక్‌ అలీ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు. బరోడా బలం పాండ్యా హార్దిక్‌ పాండ్యా ఆసియా కప్‌ సందర్భంగా కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో టైటిల్‌ గెలిచిన సూర్యకుమార్‌ జట్టులో లేడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఈ ఆల్‌రౌండర్‌ ఫామ్‌పై ఎవరికి ఏ అనుమానాలు లేకపోయినా... భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వబోయే టి20 మెగా ఈవెంట్‌కు మధ్యలో ఉన్నది ఒకే ఒక్క టి20 సిరీస్‌ దక్షిణాఫ్రికాతో డిసెంబర్‌ 9న మొదలవుతుంది. దీంతో ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు హార్దిక్‌కు ఈ టోర్నీ కీలకంగా మారింది. అతనింకా బరోడా జట్టుతో చేరకపోయినప్పటికీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నట్లు కోచ్‌ ముకుంద్‌ పర్మార్‌ వెల్లడించారు. ముంబై తరఫున సూర్యకుమార్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లన్నీ ఆడేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. సహచరుడు శివమ్‌ దూబే సైతం ముంబైకి సై అంటున్నాడు. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైకి శార్దుల్‌ ఠాకూర్‌ సారథ్యం వహిస్తున్నాడు. ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి తమిళనాడు కెప్టెన్‌గా, సంజూ సామ్సన్‌ కేరళ కెప్టెన్‌గా తమ జట్లను నడిపించనున్నారు.ఐపీఎల్‌పైనే వృథ్వీ ఆశలుఐపీఎల్‌ సహా టీమిండియా తరఫున ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా ఫామ్‌ లేమి, ఫిట్‌నెస్, ప్రవర్తన సరళి బాగోలేక జాతీయ జట్టుతో పాటు సొంత ముంబై జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మహారాష్ట్ర తరఫున రంజీలాడుతున్న పృథ్వీ... టీమిండియా బెర్త్‌ సంగతి దేవుడెరుగు ముందు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కంటపడితే చాలనే ఆశతో ముస్తాక్‌ అలీ టోర్నీలో మెరిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. నేటి నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో వేదికల్లో ఈ దేశవాళీ టి20 టోర్నీ జరుగుతుంది. ఏ గ్రూప్‌లో ఎవరున్నారంటే...గ్రూప్‌ ‘ఎ’ (8): ఆంధ్ర, అస్సాం, ఛత్తీస్‌గఢ్, కేరళ, ముంబై, ఒడిశా, రైల్వేస్, విదర్భ. గ్రూప్‌ ‘బి’ (8): హైదరాబాద్, బిహార్, చండీగఢ్, గోవా, జమ్మూ కశీ్మర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌. గ్రూప్‌ ‘సి’ (8): బరోడా, బెంగాల్, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, పంజాబ్, సర్వీసెస్‌. గ్రూప్‌ ‘డి’ (8): ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, రాజస్తాన్, సౌరాష్ట్ర, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌. టోర్నీ జరిగేదిలా... మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 8 జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌లోని ఒక జట్టు మిగతా ఏడు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక... నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (8) ‘సూపర్‌ లీగ్‌’ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్‌ లీగ్‌కు అర్హత పొందిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్‌ ‘ఎ’లో 4 జట్లు... గ్రూప్‌ ‘బి’లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌ ‘ఎ’ విజేత... గ్రూప్‌ ‘బి’ విజేత ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మ్యాచ్‌లు ఎక్కడంటే... గ్రూప్‌ దశ లీగ్‌ మ్యాచ్‌లు దేశంలోని నాలుగు వేదికల్లో జరుగుతాయి. గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లను లక్నోలో... గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లను కోల్‌కతాలో... గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లను హైదరా బాద్‌లో... గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లకు, ఫైనల్‌ మ్యాచ్‌కు ఇండోర్‌ ఆతిథ్యమిస్తుంది. గ్రూప్‌ దశ లీగ్‌ మ్యాచ్‌లు డిసెంబర్‌ 10వ తేదీ వరకు జరుగుతాయి. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లు డిసెంబర్‌ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తారు. ఫైనల్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 18న జరుగుతుంది.

Indias number one shuttler Lakshya Sen comments on Austalian Open3
కొన్ని మార్చుకున్నా... ఇంకొన్ని నేర్చుకున్నా!

న్యూఢిల్లీ: వైఫల్యాలను అధిగమించేందుకు నేర్చుకున్న పాఠాలు, మార్చుకున్న ఆటతీరే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టైటిల్‌ విజయానికి కారణమని భారత నంబర్‌వన్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ అన్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ వైఫల్యం తన గుండెను బద్దలు చేసిందని, తన ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసిందని... దీంతో శారీరక ఫిట్‌నెస్, మానసిక స్థైర్యంపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని 24 ఏళ్ల ఈ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ చెప్పాడు. ‘పారిస్‌’లో కాంస్య పతకం కోసం గట్టిగానే పోరాడినా... చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకెదురైన అనుభవాలు, ఆటలో లక్ష్యాలు లక్ష్య సేన్‌ మాటల్లోనే... ఫలితాలు పక్కనబెట్టి... నాకెదురైన చేదు అనుభవాలు నాలోని స్ఫూర్తిని కొరవడేలా చేశాయి. దీంతో నా పంథా మార్చుకున్నా. ఫలితాల కోసం కాదు... ముందు ఆటతీరును మెరుగు పర్చుకోవడం కోసమే ఆడటం మొదలుపెట్టాను. దీంతో ఈ సీజన్‌లో టైటిల్స్‌లో వెనుకబడినప్పటికీ ఆటలో మార్పు, ఫిట్‌నెస్‌లో మెరుగుదల, మానసిక బలం అన్ని సానుకూలంగా మలచుకున్నాను. ఇవే తాజా విజయానికి కారణం. పోటీ పెరిగింది బ్యాడ్మింటన్‌లో పోటీ బాగా పెరిగింది. ఎంతో మంది మేటి షట్లర్లు వస్తున్నారు. నిలకడగా రాణిస్తున్నారు. మనం కూడా దీటుగా తయారు కావాలి. అదే ఉత్సాహంతో ఆటను కొనసాగించాలి. వచ్చే ఏడాది మాకెంతో కీలకం. రెగ్యులర్‌ ఈవెంట్లతో పాటు అంతర్జాతీయ టోర్నీలున్నాయి. ఫిట్‌నెస్, నిలకడ ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతానికి ఒక్కో టోర్నీ ఆడటంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యం చూపించాల్సిందే సీనియర్‌ సర్క్యూట్‌లోకి వచ్చి మూణ్నాలుగేళ్లవుతోంది. ప్రత్యర్థులకు మన ఆట ఏంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైవిధ్యం చూపించాల్సిందే. నా కోచ్‌ యూ యంగ్‌ సాంగ్‌ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాడు. ఫిట్‌నెస్‌తో చురుకుదనం, షాట్ల వైవిధ్యంతో ఆటతీరు నన్ను మేటిగా మార్చుతుంది. అందుకే ఇప్పుడు ఒకప్పటిలా కాకుండా కొత్తగా ఆడేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నా. పూర్తి వైవిధ్యమైన ఆటతీరును కనబరచడంపైనే ఉత్సాహంగా ఉన్నా.

India heading for defeat in second Test4
మరో పరాభవం పిలుస్తోంది!

పుష్కర కాలం పాటు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ ఓడిపోని జట్టు ఇప్పుడు 12 నెలల వ్యవధిలో రెండో సిరీస్‌ పరాజయానికి చేరువైంది. స్వదేశీ పిచ్‌లపై పరుగుల వరద పారించి ప్రత్యర్థికి సవాల్‌ విసిరే టీమ్‌ ఇప్పుడు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో పరువు కోసం పోరాడుతోంది. టెస్టులో చివరి రోజు ఒక్కో బంతి గండంలా కనిపిస్తుంటే... మ్యాచ్‌ను కాపాడుకునేందుకు విదేశీ జట్లు పడిన పాట్లు ఎన్నో చూశాం. ఇప్పుడు మన జట్టు సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అవతలి వైపు బౌలర్లు చెలరేగిపోతుంటే ఎనిమిది వికెట్లతో రోజంతా నిలిచి బేలగా ‘డ్రా’ కోసం ఆడాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ రకంగానూ సాధ్యం కాదు కాబట్టి సిరీస్‌ ఓటమి అనేది ఖాయమైపోయింది. ఇక తేడా 0–1తోనా లేక 0–2తోనే అని తేలడమే మిగిలింది! ఏదైనా అద్భుతం జరిగి ఓటమి నుంచి తప్పించుకుంటారేమో అనే ఆశ ఉన్నా... ఈ సిరీస్‌లో భారత్‌ ఆట చూస్తే అలాంటి నమ్మకం కూడా కనిపించడం లేదు. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ భారత్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (13), కేఎల్‌ రాహుల్‌ (6) అవుట్‌ కాగా... ప్రస్తుతం సాయి సుదర్శన్‌ (2 బ్యాటింగ్‌), కుల్దీప్‌ యాదవ్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఆఖరి రోజు భారత్‌ మరో 522 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 26/0తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (180 బంతుల్లో 94; 9 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... టోనీ జోర్జి (68 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మంగళవారం ఆటలో జడేజాకు వికెట్లు దక్కిన తీరు, ఆ తర్వాత హార్మర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ అయిన బంతిని చూస్తే చివరి రోజు పిచ్‌పై అనూహ్యమైన టర్న్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో మన బ్యాటర్లు రోజంతా నిలవడం కూడా అసాధ్యం కావచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితిని బట్టి 80 ఓవర్ల ఆట మాత్రమే జరిగే అవకాశం ఉంది. కీలక భాగస్వామ్యాలు... ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం ఉన్నా... దక్షిణాఫ్రికా వేగంగా ఆడి డిక్లేర్‌ చేసే ప్రయత్నం చేయలేదు. సాధారణ టెస్టు ఇన్నింగ్స్‌ తరహాలోనే బ్యాటర్లు పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు జోడించారు. ఫలితంగా ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్లు రికెల్టన్‌ (64 బంతుల్లో 35; 4 ఫోర్లు), మార్క్‌రమ్‌ (84 బంతుల్లో 29; 3 ఫోర్లు)లను తక్కువ వ్యవధిలో వెనక్కి పంపించగా, బవుమా (3)ను సుందర్‌ లెగ్‌ స్లిప్‌ ఉచ్చులో పడేశాడు. అయితే స్టబ్స్, జోర్జి కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం 27 ఓవర్ల పాటు సాగింది. 129 బంతుల్లో స్టబ్స్‌ అర్ధ సెంచరీని చేరుకోగా, జడేజా బౌలింగ్‌లో స్వీప్‌ చేసే ప్రయత్నంలో జోర్జి అర్ధసెంచరీ కోల్పోయాడు. లంచ్‌ విరామ సమయానికే దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులకు చేరింది. అయినా సరే ఆ జట్టు డిక్లేర్‌ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విరామం తర్వాత స్టబ్స్‌ జోరు పెంచాడు. తాను ఆడిన తర్వాతి 24 బంతుల్లో 34 పరుగులు రాబట్టిన అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే జడేజా ఓవర్లో సిక్స్‌ బాది 94కు చేరిన అతను మరో సిక్స్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. దాంతో బవుమా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అదే తడబాటు... రెండో ఇన్నింగ్స్‌ను జైస్వాల్‌ కొంత ధాటిగా మొదలు పెట్టినా, రాహుల్‌ వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే మరోసారి యాన్సెన్‌ చక్కటి బంతితో జైస్వాల్‌ను అవుట్‌ చేసి పతనానికి శ్రీకారం చుట్టగా... హార్మర్‌ స్పిన్‌కు రాహుల్‌ స్టంప్‌ కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్‌ కుల్దీప్‌ ఈసారి కూడా డిఫెన్స్‌ ఆడే పాత్రను పోషిస్తూ 22 బంతులు సమర్థంగా ఎదుర్కొన్నాడు. సాయి, కుల్దీప్‌ కలిసి 39 బంతులు ఆడి మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. దక్షిణాఫ్రికా ఆలస్యంగా డిక్లేర్‌ చేసినట్లు అనిపించినా... జట్టు తీసిన 2 వికెట్లు వారి నిర్ణయాన్ని సరైందిగా నిరూపించాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 489; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 35; మార్క్‌రమ్‌ (బి) జడేజా 29; స్టబ్స్‌ (బి) జడేజా 94; బవుమా (సి) నితీశ్‌ (బి) సుందర్‌ 3; జోర్జి (ఎల్బీ) (బి) జడేజా 49; ముల్డర్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (78.3 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్‌) 260. వికెట్ల పతనం: 1–59, 2–74, 3–77, 4–178, 5–260. బౌలింగ్‌: బుమ్రా 6–0–22–0, సిరాజ్‌ 5–1–19–0, జడేజా 28.3–3–62–4, కుల్దీప్‌ 12–0–48–0, సుందర్‌ 22–2–67–1, జైస్వాల్‌ 1–0–9–0, నితీశ్‌ రెడ్డి 4–0–24–0. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 13; రాహుల్‌ (బి) హార్మర్‌ 6; సుదర్శన్‌ (బ్యాటింగ్‌) 2; కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 27. వికెట్ల పతనం: 1–17, 2–21. బౌలింగ్‌: యాన్సెన్‌ 5–2–14–1, ముల్డర్‌ 4–1–6–0, హార్మర్‌ 3.5–2–1–1, మహరాజ్‌ 3–1–5–0.

2026 T20 World Cup tournament schedule released5
ఫిబ్రవరి 15న పాక్‌తో భారత్‌ పోరు

ముంబై: భారత్, పాకిస్తాన్‌ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వరల్డ్‌ కప్‌ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ చైర్మన్‌ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్‌ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్‌ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్‌ లీగ్‌ దశను ముగిస్తుంది. గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్‌ దశ తర్వాత తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్‌–8’కు అర్హత సాధిస్తాయి. ‘సూపర్‌–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్‌–8’ మ్యాచ్‌ల తర్వాత రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్‌... మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఎనిమిది వేదికలు ఖరారు... టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్‌లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్‌ఎస్‌సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు. గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్‌ జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్‌ సెమీస్‌ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్‌ను కోల్‌కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్‌ ఫైనల్‌ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్‌ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ... భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్‌ల విజేత రోహిత్‌ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్‌ కప్‌ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా. 9 వరల్డ్‌ కప్‌లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్‌ ఆడే టి20 మ్యాచ్‌లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కార్యదర్శి దేవజిత్‌ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్‌ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొన్నారు.గ్రూప్‌ల వివరాలు గ్రూప్‌ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా. గ్రూప్‌ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్‌. గ్రూప్‌ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.గ్రూప్‌ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ.

Who Is Nikhil Chaudhary Once Gill Teammate Scripts History In Australia FC6
మాంసం కొట్టులో పని.. ఆసీస్‌ గడ్డపై ‘భారత’ క్రికెటర్‌ సరికొత్త చరిత్ర

ఆస్ట్రేలియా గడ్డపై ఓ ‘భారత’ క్రికెటర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్‌ ఫస్ట్‌క్లాస్‌ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. అతడే నిఖిల్‌ చౌదరి. గిల్‌ సహచర క్రికెటర్‌ఢిల్లీలో జన్మించిన నిఖిల్‌ చౌదరి.. దేశీ క్రికెట్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. భారత స్టార్లు అభిషేక్‌ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్‌-ఎ క్రికెట్‌ ఆడాడు. అయితే, భారత్‌లో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు.ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్‌ చౌదరి.. కోవిడ్‌-19 (Covid 19)లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు భారత్‌కు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌ కావాలన్న అతడి కల మాత్రం అలాగే ఉండిపోయింది.మాంసం కొట్టులో పనిఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో నిఖిల్‌ చౌదరి.. శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం కొట్టులో పని చేయడంతో పాటు.. పార్శిళ్లు అందించే డెలివరీ బాయ్‌గా.. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా.. ఇలా ఎన్నో పనులు చేశాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు.కొన్నాళ్ల తర్వాత నిఖిల్‌ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్‌ హ్యారికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్‌ చౌదరి.. పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌ బౌలర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్‌ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఆసీస్‌ దేశీ క్రికెట్‌ జట్ల యాజమాన్యాలను ఆకర్షించిన నిఖిల్‌ చౌదరికి ఊహించని విధంగా ఓ అవకాశం వచ్చింది. స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు జాతీయ జట్టులోకి వెళ్లగా.. టాస్మేనియా జట్టు నుంచి నిఖిల్‌కు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అతడు జట్టులో భాగమైపోయాడు.ఆసీస్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్‌ ఇటీవలే సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూ సౌత్‌ వేల్స్‌తో మ్యాచ్‌లో ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. శతక్కొట్టాడు. 184 బంతుల్లోనే 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆసీస్‌ దేశీ రెడ్‌బాల్‌ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్మేనియా న్యూ సౌత్‌ వేల్స్‌పై ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో గెలవడం విశేషం.ఫాస్ట్‌ బౌలర్‌గా మొదలుపెట్టి..ఢిల్లీలో జన్మించిన నిఖిల్‌ చౌదరి పంజాబ్‌లో పెరిగాడు. పంజాబ్‌ తరఫున అన్ని ఏజ్‌ గ్రూపులలోనూ క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌తో సమయం గడిపే అవకాశం అతడికి వచ్చింది. నిజానికి నిఖిల్‌ తొలుత ఫాస్ట్‌ బౌలర్‌ కావాలని భావించాడు.అయితే, కాలక్రమేణా తన నైపుణ్యాలకు మెరుగు దిద్దుకుని లెగ్‌ స్పిన్నర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌ ట్రయల్స్‌లో ముంబై ఇండియన్స్‌ సెలక్షన్‌కు వెళ్లినప్పటికీ నిఖిల్‌కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన 29 ఏళ్ల నిఖిల్‌.. అక్కడి స్థానిక క్లబ్‌లలో ఆడుతూ టాస్మేనియా జట్టులో కుదురుకున్నాడు.చదవండి: స్మృతిని మోసం చేసిన పలాష్‌?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఏం జరిగింది?

Ind vs SA: India 27 Per 2 At Need 522 Runs More To Win Fans Slams batters7
రోడ్డు మీద కూడా ఆడలేరా?.. ఈ టెస్టు కూడా పోయినట్లేనా?

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్‌ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.రోడ్డు మీద కూడా ఆడలేరా?ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్‌ మీద సఫారీలు రయ్‌ రయ్‌మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్‌వాష్‌ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చేదు అనుభవం తప్పదా?స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది.భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్‌ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్‌ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్‌ (93) ఇన్నింగ్స్‌ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్‌కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.యాన్సెన్‌ ఆరు వికెట్లతో చెలరేగిసఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (58)తో పాటు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్‌ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.ఫలితంగా 201 పరుగులకే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలగా.. ప్రొటిస్‌ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.మరోసారి మనోళ్లు ఫెయిల్‌రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ (35), ఐడెన్‌ మార్క్రమ్‌ (29) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ భారీ హాఫ్‌ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్‌ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్‌ ముల్దర్‌ (35 నాటౌట్‌) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్‌ 13 పరుగులు చేసి.. యాన్సెన్‌ బౌలింగ్‌లో వెనుదిరగగా.. కేఎల్‌ రాహుల్‌ 6 పరుగులు చేసి సైమన్‌ హార్మర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్‌ 2, కుల్దీప్‌ యాదవ్‌ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

What Is Unexpected Drama Between Palash Muchhal And Smriti Mandhana Just A Night Before Wedding8
స్మృతిని మోసం చేసిన పలాష్‌?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...

భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)పై సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.ఇండోర్‌ కోడలు కాబోతోంది అంటూకాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్‌ మూలాలున్న పలాష్‌ ముచ్చల్‌తో 2019 నుంచి డేటింగ్‌లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పలాష్‌ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్‌ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్‌ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.తండ్రికి గుండెపోటు!ఆ తర్వాత పలాష్‌.. స్మృతి వరల్డ్‌కప్‌ గెలిచిన డీవై పాటిల్‌ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్‌ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్‌ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.‘బంధం’ పాతబడిందని..కొరిగ్రాఫర్‌ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్‌ తనతో చాట్‌ చేసినట్లుగా స్క్రీన్‌ షాట్స్‌ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్‌.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా, ఎంజాయ్‌ చేద్దామంటూ ‘పర్సనల్‌’ చాట్‌ చేసినట్లు వైరల్‌ అవుతోంది.నిజమేనా?ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్‌రాయుళ్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్‌ చేసినప్పటికీ.. పలాష్‌తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్‌ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్‌ అక్క, బాలీవుడ్‌ గాయని పాలక్‌ ముచ్చల్‌ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్‌స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

IND vs SA 2nd Test Target 549: Indias highest successful run chases List9
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

గువాహటి వేదికగా భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటారు.తొలి ఇన్నింగ్స్‌లో..ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌ను ఫాలో ఆన్‌ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్‌నైట్‌ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.టార్గెట్‌ ఎంతంటే?తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది సౌతాఫ్రికా. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (94) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్‌ ముల్డర్‌ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్‌ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్‌-5 జాబితా)🏏1976లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 403.. భారత్‌ విజయం (406/4)🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 387.. భారత్‌ విజయం (387/4)🏏2021లో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టార్గెట్‌ 328.. భారత్‌ విజయం (329/7)🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 276.. భారత్‌ విజయం (276/5)🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టార్గెట్‌ 264.. భారత్‌ విజయం (264/5).చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

Hazlewood likely to be available for Ashes 3rd Test Cummins Trains With10
గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు అదిరిపోయే శుభవార్తలు

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (Ashes 2025-26)ను ఆస్ట్రేలియా విజయంతో మొదలుపెట్టింది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4- 8 వరకు రెండో టెస్టుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు వచ్చేస్తున్నారా!బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో ఈ డే- నైట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ పింక్‌ బాల్‌ టెస్టు (Pink Ball Test)కు ముందు ఆస్ట్రేలియాకు అదిరిపోయే శుభవార్తలు అందాయి. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా తొడ కండరాల గాయంతో హాజిల్‌వుడ్‌ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.మరోవైపు.. ప్యాట్‌ కమిన్స్‌ ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, హాజిల్‌వుడ్‌ సిడ్నీలోని క్రికెట్‌ సెంట్రల్‌లో బాల్‌తో ప్రాక్టీస్‌ మొదలుపెట్టినట్లు సమాచారం. కమిన్స్‌ కూడా పింక్‌ బాల్‌తో నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ మాట్లాడుతూ..పూర్తి స్థాయిలో కోలుకుంటేనే‘‘యాషెస్‌ సిరీస్‌లో ఏదో ఒక దశలో హాజిల్‌వుడ్‌ అందుబాటులోకి వస్తాడని మాకు తెలుసు. అయితే, ఇంకాస్త ముందుగానే అతడు జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక కమిన్స్‌ రిహాబిలిటేషన్‌ దాదాపుగా పూర్తై పోయింది.తన బౌలింగ్‌లో వేగం కనిపిస్తోంది. అతడు సానుకూలంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, కమిన్స్‌ను మ్యాచ్‌ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటేనే రంగంలోకి దిగుతాడు’’ అని మెక్‌డొనాల్డ్‌ తెలిపాడు. కాగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టులకు జరుగనున్నాయి. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవెన్‌ స్మిత్‌ ఆసీస్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు.చదవండి: IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement