Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

WPL Womens 2026: Sophie Devine led Gujarat to victory1
గుజరాత్‌ను గెలిపించిన సోఫీ డివైన్‌

వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్‌ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్‌ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్‌ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్‌ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్‌ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్‌ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్‌నర్‌ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్‌ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్‌ చేయడంతో గుజరాత్‌ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్‌ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్‌ (బి) కాప్‌ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్‌నర్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) మిన్నుమణి 2; వేర్‌హమ్‌ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్‌: కాప్‌ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్‌ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్‌నర్‌ (బి) సోఫీ 11; వోల్వార్డ్‌ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్‌ (బి) గార్డ్‌నర్‌ 0; చినెల్లి (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) డివైన్‌ 47; స్నేహ్‌ రాణా (సి) వేర్‌హమ్‌ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్‌: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్‌ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్‌నర్‌ 4–0–37–1, వేర్‌హమ్‌ 1–0–12–0.

U19 WC 2026: India beat zimbabwe by 204 runs in super six match2
World Cup 2026: టీమిండియా ఘన విజయం

అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్‌ దశలో హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ సిక్స్‌కు చేరిన యంగ్‌ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఒడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విహాన్‌ మల్హోత్రా (109 నాటౌట్‌) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది.మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్‌ (62), కియాన్‌ బ్లిగ్నాట్‌ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉధవ్‌ మోహన్‌, ఆయుశ్‌ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్‌ 2, హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ చెరో​ వికెట్‌ తీశారు. సూపర్‌ సిక్స్‌లో భారత్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ దాయాది పాకిస్తాన్‌. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది.

Former India cricketer arrested after ramming into three vehicles amid intoxication3
టీమిండియా మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌

మద్యం​ మత్తులో కారు యాక్సిడెంట్‌ చేసిన కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌ జేకబ్‌ మార్టిన్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఇవాళ (జనవరి 27) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను వడోదర నగరంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో జేకబ్‌ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.జేకబ్‌ తన ఎంజీ హెక్టార్‌ కారుతో హ్యుందాయ్‌ వెన్యూ, మారుతీ సిలేరియో, కియా సెల్టోస్‌ కార్లను ఢీకొట్టాడు. మద్యంపై ఉండటంతో నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్‌ చేసినట్లు పోలీసులు కేసు కట్టారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.పోలీసులు జేకబ్‌ను అదుపులోకి తీసుకొని, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటర్‌ వెహికిల్‌ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కొద్ది గంట్లోనే జేకబ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. కానీ, కారు పోలీసుల ఆధీనంలోనే ఉంది.53 ఏళ్ల జేకబ్‌ మార్టిన్‌ 1999-2001 మధ్యలో భారత్‌ తరఫున 10 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, దేశీయ క్రికెట్‌లో (బరోడా, రైల్వేస్‌, అస్సాం) అతనికి మంచి రికార్డు ఉంది. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 శతకాల సాయంతో 9192 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలోనూ 2948 పరుగులు (3 సెంచరీలు) చేశాడు. జేకబ్‌ బరోడా కెప్టెన్‌గా కూడా సేవలందించాడు.కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ కమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా అయిన జేకబ్‌ దేశవాలీ కెరీర్‌లో 19 వికెట్లు తీశాడు. క్రికెటర్‌గా కెరీర్‌ ముగిసిన తర్వాత జేకబ్‌ జీవితం వివాదాలు, ప్రమాదాలతో నిండిపోయింది. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఊపిరితిత్తులు, కాలేయానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో జేకబ్‌ కుటుంబానికి బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, కృనాల్ పాండ్యా వంటి వారు ఆర్థిక సహాయం చేశారు.

Joe root continuing superb form in ODI format too4
వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్‌ సెంచరీల పర్వం

ఈ జనరేషన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌ ఎవరని అడిగితే.. కొద్ది రోజుల కిందటి వరకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు క్రికెట్‌ అభిమానులు ఇబ్బంది పడేవారు. ఎందుకంటే, ఫాబ్‌ ఫోర్‌గా పిలువబడే విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ మధ్య అత్యుత్తమ బ్యాటర్‌ అనిపించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉండేది. వీరంతా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, ఏ ఒక్కరికీ అత్యుత్తమ బ్యాటర్‌ అనే కీర్తి దక్కకుండా పోటీపడేవారు.అయితే గత కొద్ది రోజులగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అత్యుత్తమ బ్యాటర్‌ అనిపించుకునేందుకు జో రూట్‌ సోలోగా ముందుకొస్తున్నాడు. సహచరులు విరాట్‌, స్టీవ్‌, కేన్‌ను వెనక్కు నెడుతూ తానే అత్యుత్తమ బ్యాటర్‌నంటూ బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు. విరాట్‌ (37), స్టీవ్‌ (36), కేన్‌ (35) వయసు మీద పడటంతో ఏదో ఒక ఫార్మాట్‌కు/ఫార్మాట్లకు పరిమితం కాగా.. రూట్‌ (35) కూడా వారి ఏజ్‌ గ్రూప్‌లోనే ఉన్నా, మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అత్యుత్తమంగా సత్తా చాటుతున్నాడు. రూట్‌ మినహా ఫాబ్‌లోని మిగతా ముగ్గురు ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు.టెస్ట్‌, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ వన్డేల్లో దూసుకుపోతుండగా.. వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టీవ్‌ స్మిత్‌ టెస్ట్‌ల్లో మాత్రమే సత్తా చాటుతున్నాడు. కేన్‌ విషయానికొస్తే.. ఇటీవలికాలంలో ఫాబ్‌-4లో బాగా వెనుకపడిపోయింది ఇతనే. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కేన్‌.. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నా, ఏ ఒక్క ఫార్మాట్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.రూట్‌ పరిస్థితి మాత్రం పై ముగ్గురికి భిన్నంగా ఉంది. ఇతను ఏ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకుండా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో యంగస్టర్లకు సైతం పోటీగా మారాడు.ఇటీవలికాలంలో టెస్ట్‌, వన్డేల్లో రూట్‌ ప్రదర్శనలు చూస్తే ఔరా అనక మానదు. గత ఆరేడేళ్ల కాలంలో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఫాబ్‌-4లోని మిగతా ముగ్గురికి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో రూట్‌కు కల్లెం వేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో అతను ఏకంగా 22 సెంచరీలు బాదాడు. వన్డేల్లో కెరీర్‌ ముగిసిందనుకున్న దశలో ఈ ఫార్మాట్‌లోనూ రూట్‌ మెరుపులు ప్రారంభమయ్యాయి. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న అతను.. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మాట్లోనూ మూడు, నాలుగు సెంచరీలు చేశాడు.తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రూట్‌ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలతో సర్దుకున్న అతను.. ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 20వ సెంచరీ. ఓవరాల్‌గా 61వది. ప్రస్తుత తరం బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (85) మాత్రమే రూట్‌ కంటే ముందున్నాడు.వాస్తవానికి విరాట్‌, స్టీవ్‌, కేన్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు రూట్‌ చాలా వెనుకపడి ఉండేవాడు. వారికి రూట్‌కు పదుల సంఖ్యలో సెంచరీల వ్యత్యాసం ఉండేది. వారంతా రూట్‌ కంటే చాలా ముందుండే వారు. అయితే ఐదేళ్లలో సీన్‌ మొత్తం తలకిందులైంది. అతను స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి విరాట్‌తో పోటీపడుతున్నాడు. వాస్తవానికి విరాట్‌ కూడా టెస్ట్‌ల్లో రూట్‌ ముందు దిగదుడుపే. నంబర్ల విషయంలో అతన్ని రూట్‌ ఎప్పుడో దాటేశాడు. ఇక టెస్ట్‌ల్లో రూట్‌ ముందున్న ఏకైక టార్గెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ మాత్ర​మే. రూట్‌ తర్వలోనే సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్డేల్లోనూ రూట్‌ జోరు ఇలాగే కొనసాగితే విరాట్‌ సెంచరీల సంఖ్య దాటడం​ పెద్ద కష్టం కాకపోవచ్చు.

Root and Brook Slams Hundreds, england set Huge target to sri lanka in 3rd ODI5
కనికరం లేని బ్రూక్‌.. లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు..!

కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 27) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదాడు. మరో ఎండ్‌లో జో రూట్‌ కూడా బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. వీరిద్దరి ధాటికి టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.జేకబ్‌ బేతెల్‌ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) ఔటయ్యాక 31.1వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్‌ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. పడ్డ బంతిని పడ్డట్టు బౌండరీ లేదా సిక్సర్‌కు తరలించాడు. బ్రూక్‌ విధ్వంసాన్ని తట్టుకోలేక లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓ పక్క బ్రూక్‌ చెలరేగుతుంటే రూట్‌ నిదానంగా తన 20వ వన్డే శతకాన్ని (100 బంతుల్లో), 61వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేశాడు.కఠినమైన పిచ్‌పై వీరిద్దరు నాలుగో వికెట్‌కు 113 బంతుల్లో అజేయమైన 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 42 ఓవర్ల తర్వాత 38 పరుగులుగా (32 బంతుల్లో) ఉండిన బ్రూక్‌ స్కోర్‌ 50 ఓవర్‌ ముగిసే సరికి 66 బంతుల్లో అజేయమైన 136 పరుగులైంది. దీన్ని బట్టి చూస్తే బ్రూక్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్దమవుతుంది. చివరి 8 ఓవర్లలో బ్రూక్‌ 34 బంతులు ఎదుర్కొని ఏకంగా 98 పరుగులు బాదాడు. బ్రూక్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.మరోవైపు బాధ్యతాయుతంగా సెంచరీ పూర్తి చేసిన రూట్‌.. జోరు మీదున్న బ్రూక్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తూ అజేయమైన 111 పరుగుల వద్ద (108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌) ఇన్నింగ్స్‌ను ముగించాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లలో రెహాన్‌ అహ్మద్‌ 24, బెన్‌ డకెట్‌ 7 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, హసరంగ, వాండర్సే తలో వికెట్‌ తీశారు. వెల్లాలగే (10-0-49-0), లియనగే (3-1-7-0) మినహా మిగతా లంక బౌలర్లందరినీ బ్రూక్‌ ఆటాడుకున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే శ్రీలంక గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

U19 WC 2026 IND VS ZIM: Vihaan malhotra shines with century, team scored huge score6
World Cup 2026: టీమిండియా భారీ స్కోర్‌

జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 ప్రపంచకప్‌-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్‌ ఇండియా మ్యాచ్‌ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్‌ (352-8) చేసింది.మిడిలార్డర్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్‌; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.కాగా, గ్రూప్‌ దశలో భారత్‌ వరుసగా యూఎస్‌ఏ, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ​్‌పై విజయాలు సాధించి సూపర్‌ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగానే భారత్‌ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

Walton slams ton as Harbhajan's Delhi Warriors beat Dhawan's Dubai Royals in opening game of World Legends Pro T20 League7
విండీస్‌ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్‌ ప్రారంభమైంది. వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌ పేరిట భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ లీగ్‌.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్‌కు ఆడుతున్న విండీస్‌ ఆటగాడు చాడ్విక్‌ వాల్టన్‌ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్‌ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. పీటర్‌ ట్రెగో (60), కిర్క్‌ ఎడ్వర్డ్స్‌ (41), అంబటి​ రాయుడు (36), కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్‌ పఠాన్‌ (2), రిషి ధవన్‌ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్‌ బౌలర్లలో సుభోత్‌ భాటి 3, హర్భజన్‌ సింగ్‌ 2, ఇసురు ఉడాన ఓ వికెట్‌ తీశారు.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్‌ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్‌ వాల్టన్‌ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్‌ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్‌ శ్రీవట్స్‌ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ పియుశ్‌ చావ్లాకు దక్కింది.

I Am Not That Important No Point In: KL Rahul Opens Up On Retirement8
ఆ మరుక్షణమే రిటైర్మెంట్‌: కేఎల్‌ రాహుల్‌

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ రిటైర్మెంట్‌పై తొలిసారి నోరు విప్పాడు. గతంలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన వచ్చిందని.. తన విషయంలో రిటైర్మెంట్‌ కష్టతరంగా ఉండబోదని వ్యాఖ్యానించాడు. కర్ణాటకకు చెందిన కేఎల్‌ రాహుల్‌.. 2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.ఇప్పటి వరకు 67 టెస్టులు, 94 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడిన కేఎల్‌ రాహుల్‌.. టెస్టుల్లో 4053, వన్డేల్లో 3360, టీ20లలో 2265 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 8 శతకాలు, టీ20లలో రెండు సెంచరీలు ఉన్నాయి.వికెట్‌ కీపర్‌గానూటీమిండియా తరఫున ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లలో కీలకంగా ఉన్న 33 ఏళ్ల కేఎల్‌ రాహుల్‌ (KL Rahul).. యాభై ఓవర్ల ఫార్మాట్లో వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. అయితే, గతంలో ఈ మంగళూరు ప్లేయర్‌ చాలాసార్లు గాయాల బారిన పడ్డాడు. అదే విధంగా.. నిలకడలేమి ఆట తీరు కారణంగా ఓపెనర్‌గా ఉన్న అతడు మిడిలార్డర్‌కు డిమోట్‌ అయ్యాడు. మరికొన్నిసార్లు తిరిగి ఓపెనర్‌గా వచ్చాడు.మరుక్షణమే రిటైర్మెంట్‌ ప్రకటిస్తాప్రస్తుతానికి జట్టులో కేఎల్‌ రాహుల్‌ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. అయితే, తన అవసరం టీమ్‌కు లేదని భావించిన మరుక్షణమే రిటైర్మెంట్‌ ప్రకటిస్తానంటూ తాజాగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో ముచ్చటిస్తూ..‘‘రిటైర్మెంట్‌ (Retirement) గురించి నేనెప్పుడో ఆలోచించాను. నా విషయంలో ఇది మరీ అంత కష్టంగా ఉండబోదు. మన పట్ల నిజాయితీగా ఉంటే.. రిటైర్మెంట్‌కు సరైన సమయం ఏమిటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా నాన్చాల్సిన పని ఉండదు.ఇంకాస్త సమయం ఉందినేనైతే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నా రిటైర్మెంట్‌కు ఇంకాస్త సమయం ఉంది. అయితే, ఆటను వదిలేయాలని అనిపించినపుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవడమే మంచిది.క్రికెట్‌ ఒక్కటే జీవితం కాదు. మనకంటూ ఓ కుటుంబం ఉంటుంది. నాకు కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా నా దృష్టి కోణం మారిపోయింది. జీవితంలో మరెన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఏదేమైనా ఆటకు నా అవసరం లేదని అనిపించిన మరుక్షణం నేను తప్పుకొంటా.నేను లేకపోయినా దేశంలో, ప్రపంచంలో క్రికెట్‌ కొనసాగుతూనే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు గాయపడ్డాను అప్పుడు మనతో మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఫిజియో, సర్జన్ల వల్ల మన శరీరానికి నొప్పి కలగవచ్చు.మానసిక స్థితి బలహీనపడుతుందిఅయితే, ఆ సమయంలో మన మానసిక స్థితి బలహీనపడిపోతుంది. ఇంకెన్నాళ్లు ఇలా.. ఇక చాలు అని మెదడు చెబుతుంది. అదృష్టవశాత్తూ క్రికెట్‌ వల్ల మనం ఎక్కువగా డబ్బు సంపాదించగలం. కాబట్టి ఆటను వదిలినా పెద్దగా నష్టమేమీ లేదు.. ఇంకొన్నాళ్లు జీవితం సాఫీగా సాగించవచ్చు అని సంకేతాలు ఇస్తుంది. ఇలాంటి మానసిక స్థితిని అధిగమిస్తేనే మళ్లీ మనం మైదానంలోకి దిగగలము’’ అని కేఎల్‌ రాహుల్‌ తన మనసులోని భావాలను వెల్లడించాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!An Incredibly Honest KL Rahul On Retirement 💭 pic.twitter.com/8LJcxVLpnG— The Switch | Kevin Pietersen (@kptheswitch) January 26, 2026

ICC T20 World Cup 2026 warm ups schedule finally announced9
టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల

2026 టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్‌ రన్నరప్‌ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్‌ఏ, నమీబియాకు ప్రాక్టీస్‌ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్‌ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్‌ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్‌-ఏ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్‌ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్‌ ఒమన్‌ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్‌ వర్సెస్‌ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్‌ నేపాల్‌ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్‌ యూఎస్‌ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్‌-ఏ వర్సెస్‌ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ మెయిన్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.

Kane Richardson announces retirement from professional cricket10
రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌

ఆస్ట్రేలియా స్టార్‌ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్‌లో లిస్ట్-ఏ మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ సాధించడంతో రిచర్డ్సన్ భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే రిచర్డ్సన్‌కు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ లీగ్‌ ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్ ఒకరు. మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిగా 2025-26 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్‌ కెరీర్‌లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్‌ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్‌గా రిచర్డ్సన్‌కు మంచి గుర్తింపు ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement