Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC SL vs PAK: Pakistan Semis Qualification Scenario As ENG Beat NZ1
T20 WC 2026: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ సెమీ ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్‌ విజయాలతో గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ ముందుగా సెమీస్‌ చేరగా.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు బెర్తుల కోసం గ్రూప్‌-1 నుంచి టీమిండియా, వెస్టిండీస్‌.. గ్రూప్‌-2 నుంచి న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ పోటీలో ఉన్నాయి.పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటేఇందులో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక (PAK vs SL) మధ్య శనివారం జరిగే ‘గ్రూప్‌–2’ సూపర్‌–8 మ్యాచ్‌ మూడో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేస్తుంది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక.. గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరుకుంటుంది. పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే మ్యాచ్‌లో గెలవడంతో పాటు రన్‌రేట్‌లో కూడా కివీస్‌ను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది.64 పరుగుల తేడాతో గెలవాలి లేదా..ఒకవేళ పాక్‌ ముందుగా బ్యాటింగ్‌ చేస్తే కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి లేదా శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్‌ రన్‌రేటు పరంగా పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌ (+1.390) సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీ క్రికెట్‌ మండలి (ICC) స్వయంగా చెప్పడం విశేషం. ఇక కోల్‌కతా వేదికగా ఆదివారం భారత్‌- వెస్టిండీస్‌ (IND vs WI) మధ్య జరిగే పోరు నాలుగో సెమీ ఫైనలిస్టును ఖరారు చేస్తుంది.సౌతాఫ్రికా రెండు విజయాలతోకాగా గ్రూప్‌ దశలో టాపర్లుగా నిలిచిన జట్లను సూపర్‌-8 గ్రూప్‌-1లో.. రెండో స్థానంతో ముగించిన జట్లను గ్రూప్‌-2లో సీడింగ్‌ చేశారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా.. టీమిండియా, వెస్టిండీస్‌లపై గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్‌-1 నుంచి ముందుగా సెమీస్‌ చేరింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడుతుంది.ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ఇక ఇప్పటికే జింబాబ్వే వెస్టిండీస్‌, టీమిండియా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌.. శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గ్రూపు నుంచి ఇప్పటికే శ్రీలంక రెండు పరాజయాలతో ఎలిమినేట్‌ అయింది.టీ20 ప్రపంచకప్‌-2026: శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్‌👉వేదిక: పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం, శ్రీలంక 👉రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంచదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

LSG unveils a new Jersey2
లక్నో జట్టు కొత్త జెర్సీతో...

లక్నో: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇటీవలే టీమ్‌ కొత్త లోగోను ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఎరుపు ప్రధాన రంగుగా ఉంటూ దానిపై నీలి రంగు నిలువు గీతలు హైలైట్‌ చేస్తూ జెర్సీని ముస్తాబు చేశారు. ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ బార్సిలోనా ఎఫ్‌సీ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌ తాజా సీజన్‌తో తమ టీమ్‌కు ‘జేకే సూపర్‌ సిమెంట్‌’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు కూడా ఫ్రాంచైజీ ప్రకటించింది. గత మంగళవారం టీమ్‌ కొత్త లోగోను కూడా ప్రదర్శించారు. మరింత బలంగా, మరింత ఎత్తుకు అంటూ తమ టీమ్‌ ఆలోచనను వివరిస్తూ ఏనుగు, గరుడ చిత్రాలతో ఈ లోగోను సిద్ధం చేశారు.

India and West Indies face crucial battle over batting pitch3
ఈడెన్‌లో ఈ సండే పరుగుల పండగే

కోల్‌కతా: భారత్, వెస్టిండీస్‌ల మధ్య రేపు జరిగే మ్యాచ్‌ ఈ టి20 ప్రపంచకప్‌కే ‘పైసా వసూల్‌’ మ్యాచ్‌ కానుంది. ముమ్మాటికి క్వార్టర్‌ ఫైనల్‌గా జరిగే ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీఫైనల్‌ చేరుతుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం వినియోగించే పిచ్‌ గురించి క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ ఆసక్తికర విషయం వెల్లడించగా... బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం పిచ్‌పై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది. ఈ వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య గ్రూప్‌–సి లీగ్‌ మ్యాచ్‌కు వేదికైన పిచ్‌పైనే ఆదివారం కీలక సూపర్‌–8 పోరు జరుగుతుందని క్యూరేటర్‌ ముఖర్జీ వెల్లడించారు. ఈడెన్‌ పిచ్‌పై జరిగిన ఆ రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 207/4 స్కోరు చేసింది. తర్వాత ఇటలీని 134 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ నేపథ్యంలో భారత్, కరీబియన్‌లాంటి మేటి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లోనూ పరుగుల విందు గ్యారంటీ కావడంతో ఈడెన్‌ గార్డెన్స్‌ కిక్కిరిసి పోతుందని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాటర్ల మెరుపులకే కాదు నాణ్యమైన స్పిన్‌కూ ఈడెన్‌ అచ్చొచ్చే వేదికని ఎన్నోమార్లు రుజువైంది కూడా! ఇటలీపై స్కాట్లాండ్‌ స్పిన్నర్లు మైకేల్‌ లిస్క్‌ (4/17), మార్క్‌ వ్యాట్‌ (2/24) 6 వికెట్లతో అదే నిరూపించారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ స్వయంగా ఈడెన్‌ గార్డెన్స్‌లోకి వెళ్లి పిచ్‌ను తదేకంగా పరిశీలించారు. క్యూరేటర్‌తో వికెట్‌ పరిస్థితిపై చర్చించారు. అలాగే బోర్డు చీఫ్‌ క్యూరేటర్‌ ఆశిష్‌ భౌమిక్‌ను కూడా కలిసి సమీక్షించారని ‘క్యాబ్‌’ వర్గాలు తెలిపాయి. వికెట్‌తో పాటు స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు.

Jammu and Kashmir close to Ranji Trophy title4
ఇక లాంఛనమే!

హుబ్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ విజేత తేలే సమయం ఆసన్నమైంది. సీజన్‌ ఆసాంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను ఓడిస్తూ ఫైనల్‌ చేరిన జమ్మూకశ్మీర్‌ జట్టు... తొలి రంజీ టైటిల్‌ అందుకోవడం ఇక లాంఛనమే! బ్యాటర్ల సమష్టి ప్రదర్శనకు... బౌలర్ల సంపూర్ణ సహకారం తోడవడంతో... కర్ణాటకతో జరుగుతున్న రంజీ ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ జట్టు భారీ ఆధిక్యం సాధించింది. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్‌ కమ్రాన్‌ ఇక్బాల్‌ (160 బంతుల్లో 94 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీకి చేరువకాగా... అబ్దుల్‌ సమద్‌ (70 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. 291 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఓవరాల్‌గా జమ్మూకశ్మీర్‌ జట్టు ప్రస్తుతం 477 పరుగుల ముందంజలో ఉంది. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న జమ్మూకశ్మీర్‌ జట్టు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతోనే టైటిల్‌ను ఖరారు చేసుకోవాలని భావిస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ కెప్టెన్ పారస్‌ డోగ్రా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేయడం ఖాయం. అదే జరిగితే... కర్ణాటక ముందు భారీ లక్ష్యం నిలవడంతో పాటు తగినంత సమయం ఉండదు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ప్రకారం జమ్మూకశ్మీర్‌ జట్టుకు టైటిల్‌ దక్కుతుంది. మయాంక్‌ ఒంటరి పోరాటం.. ఓవర్‌నైట్‌ స్కోరు 220/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక... చివరకు 93.3 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (266 బంతుల్లో 160; 21 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కృతిక్‌ కృష్ణ (101 బంతుల్లో 36; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. జమ్మూకశ్మీర్‌ బౌలర్లలో ఆఖిబ్‌ నబీ 5 వికెట్లతో సత్తాచాటగా... సునీల్‌ కుమార్, యుధ్‌వీర్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో జమ్మూకశ్మీర్‌ జట్టుకు 291 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఖతర్నాక్‌ కమ్రాన్‌... తొలి ఇన్నింగ్స్‌లో తోటివాళ్లంతా చక్కటి ఆటతీరు కనబరిస్తే... ఓపెనర్‌ కమ్రాన్‌ ఇక్బాల్‌ మాత్రం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో సహచరులు ఆకట్టుకోలేకపోయినా... ఈసారి బాధ్యత తన భుజాలపై వేసుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. యావర్‌ హసన్‌ (1), శుభమ్‌ పుండిర్‌ (4), కెప్టెన్ పారస్‌ డోగ్రా (16) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కడుతున్నా... ఏమాత్రం తడబడకుండా చక్కటి షాట్‌లతో స్కోరు పెంచాడు. 89 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్‌... శతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచాడు. అతడితో పాటు సాహిల్‌ (16 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులోఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్‌ 2 వికెట్లు తీశాడు. హుబ్లీలో జమ్మూకశ్మీర్‌ సీఎం దేశవాళీల్లో ఇప్పటి వరకు ఒక్క పెద్ద టైటిల్‌ కూడా గెలవని జమ్మూకశ్మీర్‌ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ అందుకునేందుకు సిద్ధమైంది. ఈ మధుర క్షణాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా హుబ్లీ చేరుకున్నారు. గతంలో జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ జట్టుకు ఆడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ సహా... పలువురు ప్రముఖులు సైతం జమ్మూకశ్మీర్‌ జట్టును అభినందించేందుకు ఫైనల్‌కు విచ్చేయనున్నారు. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 584; కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) కన్హయ్య (బి) ఆఖిబ్‌ నబీ 13; మయాంక్‌ (ఎల్బీ) (బి) ఆఖిబ్‌ నబీ 160; పడిక్కల్‌ (సి) సమద్‌ (బి) సునీల్‌ 11; కరుణ్‌ నాయర్‌ (బి) ఆఖిబ్‌ నబీ 0; స్మరణ్‌ (సి) కన్హయ్య (బి) ఆఖిబ్‌ 0; శ్రేయస్‌ గోపాల్‌ (ఎల్బీ) (బి) యుద్‌వీర్‌ 27; కృతిక్‌ (ఎల్బీ) (బి) సాహిల్‌ 36; విద్యాధర్‌ (సి) (సబ్‌) కుండల్‌ (బి) సునీల్‌ 11; విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ (నాటౌట్‌) 17; శిఖర్‌ శెట్టి (ఎల్బీ) (బి) ఆఖిబ్‌ నబీ 0; ప్రసిధ్‌ (సి)సునీల్‌ (బి) యుధ్‌వీర్‌ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (93.3 ఓవర్లలో ఆలౌట్‌) 293. వికెట్ల పతనం: 1–27, 2–56, 3–57, 4–57, 5–162, 6–241, 7–256, 8–278, 9–288, 10–293. బౌలింగ్‌: ఆఖిబ్‌ నబీ 23–7–54–5; సునీల్‌ కుమార్‌ 19–6–51–2; యుద్‌వీర్‌ సింగ్‌ 14.3–3–55–2; ఆబిద్‌ ముస్తాఖ్‌ 23–2–75–0; సాహిల్‌ లోత్రా 12–1–50–1; అబ్దుల్‌ సమద్‌ 2–0–5–0. జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌: కమ్రాన్‌ ఇక్బాల్‌ (బ్యాటింగ్‌) 94; యావర్‌ (బి) ప్రసిధ్‌ 1; శుభమ్‌ (సి) (సబ్‌) శ్రీజిత్‌ (బి) విజయ్‌కుమార్‌ 4; పారస్‌ (బి) ప్రసిధ్‌ 16; సమద్‌ (సి) విజయ్‌కుమార్‌ (బి) శ్రేయస్‌ గోపాల్‌ 32; సాహిల్‌ (బ్యాటింగ్‌) 16; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (57 ఓవర్లలో 4 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–72, 4–145. బౌలింగ్‌: విజయ్‌కుమార్‌ 10–1–30–1; ప్రసిధ్‌కృష్ణ 12–0–42–2; విద్యాధర్‌ పాటిల్‌ 9–0–39–0; శిఖర్‌ శెట్టి 10–3–27–0; శ్రేయస్‌ గోపాల్‌ 16–6–27–1.

Sunil Gavaskar on Abhishek Sharma performance5
అభిషేక్‌ డిఫెన్స్‌ ఆశ్చర్యపరిచింది

న్యూఢిల్లీ: డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ డిఫెన్స్‌ ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. మొత్తానికి జట్టుకు ఉపయోగపడే అర్ధసెంచరీతో విమర్శకుల నోళ్లకు తాళం వేశాడని కితాబిచ్చారు. లీగ్‌లో అసలు ఖాతానే తెరువలేకపోయిన అభిషేక్‌ ఎట్టకేలకు సూపర్‌–8లో దక్షిణాఫ్రికాతో 15 పరుగులు చేయగలిగాడు. ‘హిట్టర్‌గా అభిషేక్‌ ఎలాంటి ఆట ఆడతాడో మనందరికి తెలుసు. జింబాబ్వేపై మ్యాచ్‌లో మెరుపు ఫిఫ్టీతో తన ప్రదర్శనపై లేవనెత్తుతున్న సందేహాలకు చెక్‌ పెట్టాడు. కుదురుగా ఆడేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ... ఆడేకొద్ది తన శైలి బ్యాటింగ్‌కు మారాడు. ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్లను గుడ్డిగా ఎదుర్కోకుండా గౌరవించిన తీరు, అనవసర రిస్క్‌ తీసుకోకుండా తన పరుగుల పనిలో నిమగ్నమైన ఆటతీరు నన్ను బాగా ఆకట్టుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో డిఫెన్స్‌ షాట్లను ఆడటం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆడేది అభిషేకేనా అని అనిపించింది. నేర్చుకోవడం అంటే ఇదే! వైఫల్యాల్ని అధిగమించిన ప్రదర్శన నాకు ముచ్చటేసింది’ అని సన్నీ... అభిషేక్‌ ఆటను ప్రశంసించారు. సంజూ సామ్సన్‌తో ఓపెనింగ్‌ చేయించి లెఫ్ట్‌–రైట్‌ బ్యాటింగ్‌ కాంబినేషన్‌తో దిగడం మంచి ఎత్తుగడగా గావస్కర్‌ అభివర్ణించారు. అయితే వెస్టిండీస్‌తో ఎదురయ్యే సవాల్‌ భిన్నంగా ఉంటుందని, ఆదివారం జరిగే సూపర్‌–8 పోరు అంత ఆషామాషీగా ఉండదని సన్నీ టీమిండియాను జాగ్రత్త పరిచారు.

Bronze medal for Manav and Manush pair6
మానవ్‌–మనుశ్‌ జోడీకి కాంస్య పతకం

సింగపూర్‌: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) సింగపూర్‌ గ్రాండ్‌ స్మాష్‌ లెవెల్‌ టోర్నీలో మానవ్‌ ఠక్కర్‌–మనుశ్‌ షా (భారత్‌) జోడీ కాంస్య పతకం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆరో సీడ్‌ మానవ్‌–మనుశ్‌ ద్వయం 6–11, 11–7, 10–12, 11–9, 8–11తో నాలుగో సీడ్‌ ఫెలిక్స్‌ లెబ్రున్‌–అలెక్సిస్‌ లెబ్రున్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట సొంత సర్వీస్‌లో 22 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 24 పాయింట్లు గెలిచింది. మూడో గేమ్‌లో 10–9తో ఆధిక్యంలో నిలిచిన భారత జోడీ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. సెమీస్‌లో ఓడిన మానవ్‌–మనుశ్‌లకు 3,600 డాలర్ల (రూ. 3 లక్షల 27 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జంట రెండో రౌండ్‌లో 11–7, 11–5, 11–9తో గిలెర్మి టియోడోరో–లియోనార్డో ఇజుక (బ్రెజిల్‌)లపై, క్వార్టర్‌ ఫైనల్లో 11–8, 11–9, 11–9తో మారి్టన్‌ అలెగ్రో–ఆడ్రియన్‌ రసెన్‌ఫోస్‌ (బెల్జియం)లపై గెలుపొందింది.

England won by 4 wkts aganist New Zealand7
టీ20 వరల్డ్‌ కప్‌: ఇంగ్లండ్‌ 'హ్యాట్రిక్‌'

కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్‌ ఎయిట్స్‌’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్‌ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్‌ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్‌ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరే అవకాశాన్ని కివీస్‌ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), టీమ్‌ సీఫెర్ట్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్‌ బాంటన్‌ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్‌ అలెన్‌ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్‌ ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్‌ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడిన రేహన్‌ అహ్మద్‌ తన తొలి బంతికే రచిన్‌ రవీంద్ర (11)ను అవుట్‌ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్‌ మిడిలార్డర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్లు సాల్ట్‌ (2), బట్లర్‌ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెతెల్‌ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్‌ బాధ్యత తీసుకోగా, స్యామ్‌ కరన్‌ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్‌ చేసి కివీస్‌ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్‌ అహ్మద్‌ (7 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్‌ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్‌ ప్రధాన పేస్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్‌ ఫలితం తర్వాత కివీస్‌ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 35; అలెన్‌ (సి) బెతెల్‌ (బి) జాక్స్‌ 29; రచిన్‌ (సి) బెతెల్‌ (బి) రేహన్‌ 11; ఫిలిప్స్‌ (బి) జాక్స్‌ 39; చాప్‌మన్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 15; మిచెల్‌ (సి) జాక్స్‌ (బి) డాసన్‌ 3; సాంట్నర్‌ (నాటౌట్‌) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్‌ 14; హెన్రీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్‌: ఆర్చర్‌ 3–1–24–0, డాసన్‌ 4–0–32–1, కరన్‌ 1–0–10–0, రషీద్‌ 4–0–28–2, జాక్స్‌ 4–0–23–2, బెతెల్‌ 1–0–13–0, రేహన్‌ 3–0–28–2. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సీఫెర్ట్‌ (బి) హెన్రీ 2; బట్లర్‌ (సి) సీఫెర్ట్‌ (బి) ఫెర్గూసన్‌ 0; బ్రూక్‌ (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 26; బెతెల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 21; బాంటన్‌ (సి) చాప్‌మన్‌ (బి) రచిన్‌ 33; కరన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 24; జాక్స్‌ (నాటౌట్‌) 32; రేహన్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్‌: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్‌ 2–0–14–1, సాంట్నర్‌ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్‌ 4–0–43–1, రచిన్‌ 4–0–19–3, సోధి 2–0–21–0.

IND vs WI: Rinku Singh set to rejoin team after performing father last rites8
T20 WC: రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం!

టీమిండియా స్టార్‌ రింకూ సింగ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఖాంచంద్‌ సింగ్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాటంలో ఓడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గ్రేటర్‌ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.తండ్రి పాడె మోస్తూ..దీంతో రింకూ సింగ్‌ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలానికి పయనమయ్యాడు. భారత జట్టును వీడి.. చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకూ సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి అలీఘర్‌కు రింకూ రోడ్డు మార్గంలో వచ్చాడు. తండ్రి అంత్యక్రియలకు అతడు హాజరయ్యాడు.आंखों में आंसू, कंधे पर पिता की अर्थी…क्रिकेटर रिंकू सिंह के पिताजी के निधन की खबर बेहद दुखद है। इस कठिन घड़ी में रिंकू और उनके परिवार के साथ पूरे देश की संवेदनाएं हैं।ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को यह दुःख सहने की शक्ति प्रदान करे। 🙏#RinkuSinghFatherDemise pic.twitter.com/PUSPVIAt3l— Dinesh Kumar (@DineshRedBull) February 27, 2026రింకూ తిరిగి జట్టుతో చేరతాడుతన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు’’ అని చెప్పారు. మరోవైపు.. రింకూ అన్న మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంత్యక్రియల కోసమే రింకూ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమం పూర్తైంది. కోల్‌కతాలో మ్యాచ్‌ కోసం రింకూ తిరిగి జట్టుతో చేరతాడు’’ అని స్పష్టం చేశాడు.కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలనికాగా టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8లో టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్‌ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా వెస్టిండీస్‌ జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని రింకూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.బ్యాట్‌ ఝులిపించనేలేదుఇక లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే రింకూ ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్‌ దశలో నాలుగు.. సూపర్‌-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో కలిపి మొత్తంగా 24 పరుగులే చేయగలిగాడు. అయితే, కొన్నిసార్లు ఏకంగా అతడిని ఎనిమిదో స్థానంలో ఆడించడం కూడా ప్రభావం చూపింది. కాగా జింబాబ్వేతో గురువారం నాటి మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉన్నా.. అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది టీమిండియా.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Two day delay expected IPL 2026 to begin from March 28: Report9
IPL 2026: ఐపీఎల్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌!!... ముందుగా షెడ్యూల్‌ చేసినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్నట్లు సమాచారం.గతేడాది ఇలాగతేడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్‌.. జూన్‌ 3న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఐపీఎల్‌-2026 టోర్నీ మార్చి 26న ఆరంభం కానుందని తొలుత పాలక మండలి ఫ్రాంఛైజీలకు తెలిపింది. డిసెంబరులో జరిగిన వేలానికి ముందు ఈ మేరకు సమాచారం అందించింది.కారణం ఇదేనా?అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌ మార్చి 28న మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫైనల్‌ను మే 31న నిర్వహించనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్‌ ఆరంభ తేదీకి సంబంధించి పాలక మండలి వచ్చే వారం సమావేశమై డేట్‌ ఫిక్స్‌ చేయనున్నట్లు వెల్లడించింది.అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈమేరకు తేదీల్లో మార్పు చేసినట్లు పేర్కొంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తమిళనాడు (చెన్నై), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా) హోం గ్రౌండ్స్‌గా ఉండగా.. అసోంలోని గువాహటి రాజస్తాన్‌ రాయల్స్‌కి రెండో హోం గ్రౌండ్‌.ఆర్సీబీకి స్టేడియం దొరికిందా?ఇక ఐపీఎల్‌ రెండు రోజులు ఆలస్యంగా ఆరంభం కావడానికి అసెంబ్లీ ఎన్నికలు ఒక కారణం అయితే.. గత ఎడిషన్‌ విజేత ఆర్సీబీకి ఇంతవరకు తమ హోం గ్రౌండ్‌పై ఇంత వరకు స్పష్టత రానట్లు సమాచారం. కాగా మొట్టమొదటిసారి ట్రోఫీ గెలిచిన సంతోషాన్ని పంచుకునే క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు చర్య విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయోత్సవ విషాదంబెంగళూరులోకి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి ఎలాంటి అనుమతి లేకుండా పిలుపునివ్వగా భారీ ఎత్తున అభిమానులు కదలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేసులు నమోదు కావడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి తమ హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి నుంచి తరలించాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ వేదికల కోసం ఇప్పటికే నవీ ముంబై, రాయ్‌పూర్‌, పుణెలను ఎంచుకుని ఆయా స్థానిక బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

T20 WC 2026 Matt Henry to head back home after England Super 8 clash10
T20 WC 2026: జట్టును వీడనున్న న్యూజిలాండ్‌ స్టార్‌

న్యూజిలాండ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ ముందుకు సాగుతోంది. సూపర్‌-8లో తొలుత పాక్‌తో కివీస్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్‌ పడకుండానే రద్దై పోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది.నెట్‌ రన్‌రేటు పరంగానూఇక తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దసున్‌ షనక బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి నెట్‌ రన్‌రేటును భారీగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలతో కూడన గ్రూప్‌-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది.రెండో బెర్తు కోసం న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. కివీస్‌ మూడు పాయింట్లతో ముందంజలో ఉంది. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిచిందంటే న్యూజిలాండ్‌ నేరుగా సెమీస్‌ చేరుతుంది.ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ జట్టును వీడనున్నాడు. తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయం గురించి కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాట్‌, హోలీల రెండో సంతానం కోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.ఆ కుటుంబానికి ఇది అత్యంత కీలకమైన, ఆనందాయకమైన సమయం. వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాం. ఇక జట్టు విషయానికొస్తే.. గతం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు అదృష్టం మా వైపు ఉంటుందనే అనుకుంటున్నాం.మ్యాట్‌తో పాటు మాకు కూడా స్టార్లు కలిసి రావాలి. ఈ టోర్నీ తుది దశలో అతడు తప్పక జట్టుతో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు తప్పక సెమీస్‌ చేరుతుందని.. అప్పటికి మ్యాట్‌ హెన్రీ మళ్లీ జట్టుతో కలుస్తాడని వాల్టర్‌ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మార్చి 4న తొలి సెమీ ఫైనల్‌.. మార్చి 5న రెండో సెమీస్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement