Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

PCB planning to take legal action against Zimbabwe pacer Blessing Muzarabani1
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు! స్టార్‌ ప్లేయర్‌పై పీసీబీ సీరియస్‌

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీపై పాక్ క్రికెట్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముజారబానీ వాస్తవానికి ఈ ఏడాది పీఎస్‌ఎల్ సీజన్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది.వెస్టిండీస్ పేసర్ షమీర్ జోసెఫ్ స్థానంలో ముజారబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజారబానీ తన మనసు మార్చుకున్నాడు.పీఎస్‌ఎల్ బదులుగా ఐపీఎల్‌లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో ముజారబానీని కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ముజారబానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు సమాచారం.ఏడాది పాటు పీఎస్ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోందంట. కాగా పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్ వైపు ఆటగాళ్లు వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కోర్బిన్ బాష్ ఇలాగే పెషావర్ జల్మీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరారు.దీంతో పీసీబీ అతడిపై ఏడాది నిషేధం విధించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరగనుండడంతో ఈ సమస్య తలెత్తుంది. పీఎస్‌ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అక్కడికి రెండు రోజులకే ఐపీఎల్ షురూ కానుంది.చదవండి: BAN vs PAK: 'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్‌ ఫైర్‌

Report Says Women Cricket Participation Doubles in India Since 20202
అమ్మాయిల ఆసక్తి క్రికెట్‌ వైపు

న్యూఢిల్లీ: భారతదేశంలో గత ఆరేళ్లలో అమ్మాయిలు క్రికెట్‌ ఆట వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. 2020తో పోలిస్తే ఇది ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. ‘బీబీసీ–కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఇది తేలింది. దాదాపు 10 వేల మంది మహిళలతో మాట్లాడి ఈ సర్వే ఫలితాలు వెల్లడించారు.గతంలో క్రికెట్‌లో చేరే అమ్మాయిల సంఖ్య ఐదు శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇది పది శాతానికి పెరిగింది. ముఖ్యంగా 15–24 మధ్య వయసు అమ్మాయిలు 2020లో ఆరు శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 16 శాతానికి పెరగడం విశేషం. ఈ వయో విభాగంలో ప్రతీ నలుగురిలో ఒక అమ్మాయి క్రికెట్‌ను పూర్తి స్థాయిలో కెరీర్‌కు మలచుకోవడం కోసం శ్రమిస్తున్నారని సర్వే చెబుతోంది. గత ఏడాది భారత జట్టు తొలిసారి వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడం ఒక్కసారిగా అందరి దృష్టీ మహిళా క్రికెట్‌పై నిలిచింది. మరోవైపు బ్యాడ్మింటన్‌ క్రీడపై పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మాయిల ఆసక్తి పెరిగిందని తేల్చిన సర్వే... వేర్వేరు కారణాలతో 13 శాతం అమ్మాయిలు అసలు ఏ క్రీడను ఆడటం లేదని వెల్లడించింది.

Mohammad Kaif Fumes At Salman Agha Run Out By Bangladesh Captain3
'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్‌ ఫైర్‌

ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వ‌న్డేలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అవుట్ అయిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో స‌ల్మాన్ ఊహించ‌ని విధంగా ర‌నౌట‌య్యాడు. పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన మెహదీ హ‌స‌న్ మిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని మ‌హ్మ‌ద్ రిజ్వాన్ స్ట్రైట్ షాట్ ఆడాడు.అయితే రిజ్వాట్ కొట్టిన‌ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆఘా ప్యాడ్లకు తగిలింది. ఆ సమయంలో బౌలర్ మిరాజ్, సల్మాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతిని అందుకున్న మిరాజ్‌ క్రీజు వెలుపల ఉన్న ఆఘాను చూసి వెంటనే వికెట్లను పడగొట్టి రన్-అవుట్ కోసం అప్పీల్ చేశాడు.ఫీల్డ్ అంపైర్‌లు థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశాడు. అఘా క్రీజు బ‌య‌ట ఉండ‌డంతో థ‌ర్డ్ అంపైర్ రూల్స్ ప్ర‌కారం ఔట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో బంగ్లా ప్లేయ‌ర్ల‌పై స‌ల్మాన్ తీవ్ర అగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. చాలా మంది మాజీలు కూడా మెహ‌ది హ‌స‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మెహ‌ది హ‌స‌న్ క్రీడా స్పూర్తిగా విరుద్దంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మండిపడుతున్నారు.తాజాగా ఈ జాబితాలోకి భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ చేరాడు. బంగ్లా కెప్టెన్ తీరును కైఫ్ త‌ప్పుబ‌ట్టాడు. "ఇది ఎంత‌మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. వికెట్ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నప్ప‌టికి.. ఇలాంటి ర‌న్-అవుట్ చేయ‌డం స‌రికాదు. అది కూడా ఒక కెప్టెన్ ఇలా చేయ‌డం బాధాక‌రం.యువ ఆట‌గాళ్ల‌కు ఒక్క విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచే అవకాశం ఉన్నా సరే, బంగ్లా కెప్టెన్ చేసిన పనిని మాత్రం ఎప్పుడూ చేయకండి. ఇదిక్రీడా స్పూర్తికి విరుద్దం. ఏదైనా న్యాయంగా ఆడి గెలవాలి" ఎక్స్‌లో కైఫ్ పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాపై 128 ప‌రుగుల భారీ తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించింది.చదవండి: ఇది కాదు.. గంభీర్‌కు ముందుంది అసలైన సవాల్‌: గంగూలీCrucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026

Sourav Ganguly Sends Clear Warning To Gautam Gambhir4
ఇది కాదు.. గంభీర్‌కు ముందుంది అసలైన సవాల్‌: గంగూలీ

గౌత‌మ్ గంభీర్‌.. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్లేయర్‌గా, హెడ్‌కోచ్‌గా ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు. సభ్యునిగా టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే ప్రపంచకప్‌-2011 గెలుచుకున్న గంభీర్‌.. ఇప్పుడు కోచ్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు వన్డే ప్రపంచకప్-2027 అసలైన సవాల్ ఎదురుకానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.వైట్‌వాల్ క్రికెట్‌లో గంభీర్‌కు అస‌లైన ప‌రీక్ష‌కు వ‌చ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో ఎదురుకానుంది. అక్కడి పరిస్థితులు జట్టును, కోచ్‌ను తీవ్రంగా పరీక్షిస్తాయి. అయితే గంభీర్ వ‌ద్ద ఉన్న జ‌ట్టుపై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. అత‌డు కోచ్‌గా మ‌రోసారి ఖచ్చితంగా సాధిస్తాడని గంగూలీ పేర్కొన్నాడు.కాగా వ‌న్డే వరల్డ్‌కప్‌-2023 టైటిల్‌ను తృటిలో కోల్పోయిన భారత జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ కానుండడంతో భారత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. "టెస్టుల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా పిచ్ ఎలా ఉంటుందనే ఆలోచనను పక్కన పెట్టాలి. పిచ్‌ను ఒక భూతంలా చూడటం మానేయాలి. స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదు.మంచి వికెట్లపై ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లండ్‌ సిరీస్ ఫలితాలే అందుకు నిదర్శనమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ నేతృత్వంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోయింది.చదవండి: BAN vs PAK: ప్ర‌తీకారం తీర్చుకున్న పాకిస్తాన్‌

Pakistan Thrash Bangladesh By 128 Runs In Rain-Hit Second ODI To Level Series5
ప్ర‌తీకారం తీర్చుకున్న పాకిస్తాన్‌

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరబాభావానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో (డీఎల్‌ఎస్ పద్దతి ప్రకారం) ఆతిథ్య బంగ్లాను పాక్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మెన్ ఇన్ గ్రీన్ 1-1తో సమం చేసింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో యువ ఆటగాడు మాజ్ సదాకత్ (75) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ ఆఘా (64), మహమ్మద్ రిజ్వాన్ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 15 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.ఈ స‌మ‌యంలో ఆట‌కు వ‌ర్షం కూడా అంత‌రాయం క‌లిగించింది. భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా ఆట రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఆ త‌ర్వాత‌ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 243 పరుగులుగా కుదించారు. కానీ ఆట తిరిగి మొద‌లయ్యాక కూడా బంగ్లా వికెట్ల ప‌త‌నం కొన‌సాగింది.లిటన్ దాస్ (41) కాసేపు పోరాడినా, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. దీంతో బంగ్లా జ‌ట్టు కేవలం 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో మాజ్ సదాకత్, హారిస్ ర‌వూఫ్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డే మార్చి 15న ఇదే వేదిక‌లో జ‌ర‌గ‌నుంది.చదవండి: IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్‌

KKR signs Blessing Muzarabani as replacement for Mustafizur Rahman6
కేకేఆర్‌ జట్టులోకి డేంజరస్‌ బౌలర్‌

జింబాబ్వే పేస్‌ బౌలర్‌ బ్లెస్లింగ్‌ ముజరబాని మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అవకాశం దక్కించుకున్నాడు. 2026 సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు ముజరబానిని ఎంచుకుంది. గత డిసెంబరులో తమ జట్టు నుంచి తప్పించిన ముస్తఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో కేకేఆర్‌ ముజరాబానికి అవకాశం కల్పించింది. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ముజరబాని తమ పేస్‌ బౌలింగ్‌ బృందంలో కీలకంగా మారతాడని కేకేఆర్‌ ఆశిస్తోంది. 89 అంతర్జాతీయ టి20ల్లో అతను 7.24 ఎకానమీతో 106 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టి20 వరల్డ్‌ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న 29 ఏళ్ల ముజరబాని మొత్తం 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్‌ ఎయిట్స్‌ దశకు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2025లో లుంగీ ఎన్‌గిడి స్థానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ముజరబానిని తమ టీమ్‌లోకి తీసుకుంది. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకున్నా... విజేతగా నిలిచిన ఆర్‌సీబీ జట్టులో అతను భాగమయ్యాడు.చదవండి: IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్‌

india beat Italy 1-0 in the Semi-Final of FIH Hockey World Cup Qualifiers 20267
ఫైనల్లో భారత్‌

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నిలో టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్‌–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్‌ టోర్నికి అధికారికంగా అర్హత సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 1–0 గోల్‌ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. ఆట 40 నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మనీషా చౌహాన్‌ గోల్‌గా మలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని టీమిండియా విజయాన్ని అందుకుంది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన భారత్‌ నాకౌట్‌ మ్యాచ్‌లోనూ రాణించింది. ఇటలీపై అవకాశం దొరికినపుడల్లా దాడులు నిర్వర్తించింది. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి. ఇందులో ఒక దానిని మాత్రమే భారత్‌ సద్వినియోగం చేసుకుంది. ఇటలీ తమకు లభించిన ఒక్క పెనాల్టీ కార్నర్‌ను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 2–0 గోల్స్‌ తేడాతో స్కాట్లాండ్‌పై గెలిచింది. ఇంగ్లండ్‌ తరఫున లాటీ బింఘామ్‌ (25వ నిమిషంలో), డార్సీ బుర్నీ (29వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ కూడా ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. నేడు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. మూడో స్థానం కోసం స్కాట్లాండ్‌తో ఇటలీ పోటీపడుతుంది.9 భారత జట్టు తొమ్మిదోసారి ప్రపంచకప్‌ టోర్నిలో ఆడనుంది. 52 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నిలో భారత జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానాన్ని సాధించింది. 1978లో 7వ స్థానంలో, 2018లో 8వ స్థానంలో నిలిచింది. 2010, 2022లో 9వ స్థానం పొందిన టీమిండియా 1983, 2006లలో 11వ స్థానం, 1998లో 12వ స్థానం సంపాదించింది.

Indian Duo Withdraw from Swiss Open After Satwik Shoulder Injury8
గాయంతో వైదొలిగిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత కథ ముగిసింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి ద్వయం బరిలోకి దిగకుండానే ప్రత్యర్థి జంట క్రిస్టియన్‌ జార్‌–రస్‌ముస్‌ జార్‌కు వాకోవర్‌ ఇచ్చింది. సాత్విక్‌ సాయిరాజ్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సాత్విక్‌ది పాత గాయమే.ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి కనీసం వారం రోజులు పడుతుంది’ అని భారత జోడీకి కోచ్‌గా ఉన్న టాన్‌ కిమ్‌ హెర్‌ (మలేసియా) తెలిపాడు. సాత్విక్‌–చిరాగ్‌ నిష్క్రమణతో ఈ టోర్నీలో భారత్‌ నుంచి తరుణ్‌ మన్నేపల్లి మాత్రమే బరిలో ఉన్నాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 51వ ర్యాంకర్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ తలపడతాడు.

Iran withdraws from FIFA World Cup over safety concerns9
‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’

జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనకుండా ఎవరూ ఆపలేరని ఇరాన్‌ జట్టు ప్రకటించింది. ఇరాన్‌ ఆటగాళ్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేం అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. నిజంగా వరల్డ్‌ కప్‌ నుంచి ఎవరినైనా తప్పించాలంటే అది ఆతిథ్య అమెరికానేనని ఇరాన్‌ బృందం అభిప్రాయ పడింది. గల్ఫ్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌–జూలైలో అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌లో ఇరాన్‌ పాల్గొనడం సందేహంగా మారింది.లీగ్‌ దశలో ఇరాన్‌ తమ మూడు మ్యాచ్‌లు కూడా అమెరికా వేదికగానే ఆడాల్సి ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్‌ వరుసగా నాలుగోసారి వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై అయింది. అయితే ఇరాన్‌ టీమ్‌ గురించి మాట్లాడుతూ... ‘ఆ జట్టు ఇక్కడికి వచ్చి ఆడుతుందని నేను అనుకోవడం లేదు. వారి భద్రత, జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇరాన్‌ టీమ్‌ స్పందిస్తూ... ‘వరల్డ్‌ కప్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్‌.ఇది ‘ఫిఫా’ ఆధ్వర్యంలో జరుగుతుందే తప్ప ఏదో ఒక దేశం నిర్వహించడం లేదు. కాబట్టి వరల్డ్‌ కప్‌ ఆడకుండా ఇరాన్‌ను ఎవరూ తప్పించలేరు. ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం చేతకాదని చెబుతున్న అమెరికానే నిజానికి తప్పించాలి’ అని ట్వీట్‌ చేసింది.

Big blog to KKR, star pacer Harshit Rana ruled out of IPL 2026 due to injury10
IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్‌

ఐపీఎల్‌-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజ‌న్‌కు ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్, యువ సంచ‌ల‌నం హ‌ర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. హర్షిత్ గ‌త నెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మాప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు.దీంతో త‌న బౌలింగ్ స్పెల్ మ‌ధ్య‌లోనే అత‌డు మైదానాన్ని వీడాడు. ఆ త‌ర్వాత ప‌లు స్కాన్ల త‌ర్వాత అత‌డికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్‌-19 సీజ‌న్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ క‌థ‌నంలో పేర్కొంది. హ‌ర్షిత్ త‌న ఐపీఎల్(2022) త‌న అరంగేట్రం నుంచి కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్‌ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గ‌త సీజ‌న్‌లో కూడా హ‌ర్షిత్ 15 వికెట్లతో స‌త్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా త‌ర‌పున కూడా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచాడు. మ‌రోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరాన సైతం గాయం కార‌ణంగా దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.గతేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప‌తిరానను రూ.18 కోట్ల‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా ప‌తిరాన కూడా గాయ‌ప‌డ్డాడు. అత‌డు ఇంకా శ్రీలంక‌లోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ స్ధానంలో జింబాబ్వే పేస‌ర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు