Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Suryakumar Yadav has most Player of the match award for India in T20 History1
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్‌ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం​ 105 మ్యాచ్‌ల్లోనే 17 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచాడు. ఈ జాబితాలో స్కై, విరాట్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్‌దీప్‌ సింగ్‌కు (22) దక్కుతుంది. విరన్‌దీప్‌ తర్వాతి స్థానాల్లో సికందర్‌ రజా (19), సూర్యకుమార్‌ (17) ఉన్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు.

T20 WC 2026: new zealand beat afghanistan by 5 wickets2
ఆఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌ 2026లో న్యూజిలాండ్‌ ఘనంగా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 8) ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుల్బదిన్‌ నైబ్‌ (63) టాప్‌ స్కోరర్‌ కాగా.. రహానుల్లా గుర్బాజ్‌ 27, ఇబ్రహీం జద్రాన్‌ 10, సెదిఖుల్లా అటల్‌ 29, దర్విష్‌ రసూల్‌ 20, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 14, మొహమ్మద్‌ నబీ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్‌ 2, రచిన్‌ రవీంద్ర, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తలో వికెట్‌ తీశారు.న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ 65 పరుగులతో సత్తా చాటగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 42, మార్క్‌ చాప్‌మన్‌ 28, డారిల్‌ మిచెల్‌ 25 (నాటౌట్‌), మిచెల్‌ సాంట్నర్‌ 17 (నాటౌట్‌), ఫిన్‌ అలెన్‌ ఒక పరుగు చేశారు. రచిన్‌ రవీంద్ర గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రహ్మాన్‌ 2, ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, నబీ తలో వికెట్‌ తీశారు.

hyderabad batsman aaron george under 19 world cup hero3
అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలుపులో నగర కుర్రోడు

మల్లాపూర్‌/కాప్రా: హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్‌ 19 ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్‌ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్‌లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్‌ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్‌లో మైమరిపిస్తూ.. ఫ్లిక్‌లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్‌ క్రికెట్‌ స్టయిల్‌ను ప్రపంచానికి చాటాడు. బిహార్‌కు చెందిన మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీతో కలిసి టీమ్‌ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్‌ బ్యాటింగ్‌తో అరోన్‌ అదరహో అనిపించాడు. మన మల్లాపూర్‌ వాడే.. అరుదైన రికార్డు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌లో నివసిస్తోంది అరోన్‌ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్‌. కేరళకు చెందినవారైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అరోన్‌ అండర్‌–19 హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ కూడా. ప్రపంచ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్‌ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్‌పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్‌ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్‌–19 క్రికెట్‌లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్‌లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్‌ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్‌లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్‌ ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్‌ కాలేజీలో బీకాం (ఫైనాన్స్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్‌ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్‌ చేశాడు. టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ పర్యవేక్షణలో కోచింగ్‌ తీసుకున్నాడు. ‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం తండ్రి ఈసో వర్గీస్‌ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్‌పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్‌ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ రానున్న అరోన్‌కు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు.

Pakistan Cricket Board has given an explanation to the ICC4
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్‌తో మ్యాచ్‌ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్‌ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి!

Elavenil Valarivan won two gold medals5
ఇలవేనిల్‌కు రెండు స్వర్ణాలు

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఒలింపియన్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్‌ 252 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మేఘన సజ్జనార్‌ 229.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించింది. ఇలవేనిల్, మేఘన, ఆర్యా బోర్సెలతో కూడిన భారత బృందం 1892.6 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది.

Dakshineswar wins against the world number 88 ranked player6
ప్రపంచ 88వ ర్యాంకర్‌పై దక్షిణేశ్వర్‌ విజయం

బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెదర్లాండ్స్‌ జట్టుతో జరుగుతున్న ఈ పోరులో మొదటి రోజు భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ ఓటమి చవిచూడగా... భారత నాలుగో ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ సురేశ్‌ సంచలన విజయం సాధించాడు. దాంతో తొలి రోజు ముగిశాక భారత్, నెదర్లాండ్స్‌ 1–1తో సమంగా నిలిచాయి. నేడు మూడు మ్యాచ్‌లు (డబుల్స్, రెండు సింగిల్స్‌) జరుగుతాయి. ప్రపంచ 162వ ర్యాంకర్‌ గయ్‌ డెన్‌ ఉడెన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 281వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ 0–6, 6–4, 3–6తో ఓడిపోయాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. ప్రపంచ 88వ ర్యాంకర్‌ జెస్పెర్‌ డి జాంగ్‌తో జరిగిన రెండో సింగిల్స్‌లో ప్రపంచ 465వ ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ అద్భుత ఆటతీరుతో మెరిపించాడు. 88 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ 6–4, 7–5తో జెస్పెర్‌ను బోల్తా కొట్టించాడు. దక్షిణేశ్వర్‌ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. నేడు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సాండెర్‌ అరెండ్స్‌–డేవిడ్‌ పెల్‌ జోడీతో యూకీ బాంబ్రీ–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం ఆడుతుంది. అనంతరం రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో జెస్పెర్‌తో సుమిత్, ఉడెన్‌తో దక్షిణేశ్వర్‌ తలపడతారు.

Boxer Mohammed Hussamuddin won a bronze medal at the Boxam Elite International Boxing Tournament7
హుసాముద్దీన్‌కు కాంస్యం

లా నూసియా (స్పెయిన్‌): బాక్సమ్‌ ఎలైట్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల 60 కేజీల వెయిట్‌ కేటగిరీలో అతను సెమీఫైనల్లో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, ప్రపంచకప్‌ చాంపియన్‌ సచిన్‌ సివాచ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో కలుపుకొని మొత్తం 12 మంది బాక్సర్లు స్వర్ణం వేటలో పడ్డారు. ఇందులో 8 మంది మహిళా బాక్సర్లున్నారు. దీంతో భారత్‌కు కనీసం 12 రజతాలు ఖాయమైనట్లే! దీనికి అదనంగా మరో స్వర్ణం కూడా కచి్చతంగా భారత్‌ ఖాతాలో పడనుంది. ఎందుకంటే మహిళల 54 కేజీల కేటగిరీలో ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రీతి పవార్, పూనమ్‌ ఇద్దరు భారత బాక్సర్లే తుదిపోరుకు అర్హత సాధించారు. సెమీస్‌లో పూనమ్‌ 4–1తో ఇవి జేన్‌ స్మిత్‌ (ఇంగ్లండ్‌)పై, ప్రీతి 5–0తో అయ హమ్ది (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు. మహిళల 75 కేజీల కేటగిరీ సెమీస్‌లో లవ్లీనా 5–0తో వేల్స్‌కు చెందిన రోజీ ఎక్‌లెస్‌పై ఏకపక్షమైన విజయాన్ని సాధించింది. మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు), ప్రియా (60 కేజీలు) అరుంధతి (70 కేజీలు), నైనా (80 కేజీలు) కూడా సెమీఫైనల్లో గెలిచి పసిడి పతక రేసులో నిలిచారు. పురుషుల 60 కేజీల సెమీఫైనల్లో సచిన్‌ సివాచ్‌ 5–0తో జాక్‌ డ్రైడెన్‌ (ఇంగ్లండ్‌)పై గెలుపొందారు. సచిన్‌తో పాటు దీపక్‌ (70 కేజీలు), ఆకాశ్‌ (75 కేజీలు), అంకుశ్‌ (80 కేజీలు)లు కూడా స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సంపాదించారు.

IND vs USA: Team India wins against USA in ICC T20 World Cup 20268
IND vs USA: 'సమ్‌'తృప్తికర ఆరంభం

అభిషేక్‌ శర్మ డకౌట్‌... పవర్‌ప్లే ముగిసేసరికి 46/4... ఒకదశలో వరుసగా 26 బంతుల పాటు బౌండరీనే రాలేదు... 12.4 ఓవర్లు ముగిసేసరికి 77/6... పరిస్థితి చూస్తే అమెరికా సంచలన విజయానికి పునాది వేసుకున్నట్లు అనిపించింది. కానీ సూర్యకుమార్‌ అసలు సమయంలో తన స్థాయిని ప్రదర్శించాడు. ఒంటి చేత్తో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. మిగిలిన 44 బంతుల్లో భారత్‌ మరో 84 పరుగులు జోడిస్తే వీటిలో సూర్య ఒక్కడే 7 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 63 పరుగులు సాధించాడు. ఛేదనలో ఆరంభం నుంచే తడబడిన అమెరికా ఆతిథ్య జట్టు సవాల్‌ ముందు నిలవలేకపోయింది. భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్‌ పటేల్‌ సమష్టిగా రాణించడంతో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. బలహీన జట్టుతో మ్యాచ్‌లో చివరకు గట్టెక్కినా... ఈ మ్యాచ్‌ భారత బ్యాటింగ్‌కు చిన్న హెచ్చరికను జారీ చేసింది. ముంబై: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శుభారంభం చేసింది. చిన్న జట్టు చేతిలో కాస్త పోటీ ఎదురైనా చివరకు పైచేయి సాధించింది. శనివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 29 పరుగుల తేడాతో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సహచరులంతా విఫలమైనా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అమెరికా బౌలర్లలో వాన్‌ షాక్‌విక్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. శుభమ్‌ రంజనే (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజయ్‌ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిలింద్‌ కుమార్‌ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్, అక్షర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనారోగ్యం కారణంగా భారత టాప్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌ బరిలోకి దిగలేదు. భారత్‌ తమ తర్వాతి పోరులో గురువారం న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. సూర్యకుమార్‌కు లైఫ్‌... హిట్టర్‌ అభిషేక్‌ శర్మ (0) తాను ఆడిన తొలి బంతికే అనూహ్యంగా ‘డకౌట్‌’ కాగా... ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నేత్రావల్కర్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో తిలక్‌ ధాటిని ప్రదర్శించగా, అలీఖాన్‌ ఓవర్లో ఇషాన్‌ వరుసగా 4, 6 కొట్టాడు. అయితే షాల్‌విక్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ వెనుదిరగ్గా, ఓవర్లోని చివరి రెండు బంతుల్లో వరుసగా తిలక్, శివమ్‌ దూబే (0) అవుటయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49/4 వద్ద నిలిచింది. లెగ్‌స్పిన్నర్‌ మొహసిన్‌ బౌలింగ్‌లో వరుసగా ఏడు బంతుల పాటు సింగిల్‌ కూడా తీయలేకపోయిన రింకూ సింగ్‌ (6) అసహనంతో తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కాగా, హార్దిక్‌ పాండ్యా (5) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్‌ బాధ్యత తీసుకున్నాడు. 15 పరుగుల వద్ద శుభమ్‌ తన బౌలింగ్‌లోనే సూర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలం కావడంతో భారత కెప్టెన్ కు లైఫ్‌ లభించింది. దీనిని అతను సమర్థంగా వాడుకుంటూ చకచకా పరుగులు రాబట్టాడు. నేత్రావల్కర్‌ ఓవర్లో సూర్య, అక్షర్‌ పటేల్‌ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి 3 ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 21 పరుగులు రాబట్టారు. 36 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. నేత్రావల్కర్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాది ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు. సిరాజ్‌కు 3 వికెట్లు.. ఛేదనలో అమెరికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి 20 బంతుల్లో 5 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వరుస ఓవర్లలో గూస్‌ (6), సాయితేజ ముక్కామల (2)లను వెనక్కి పంపగా, మోనాంక్‌ పటేల్‌ (0) వికెట్‌ అర్ష్ దీప్ ఖాతాలో చేరింది. ఈ దశలో మిలింద్, కృష్ణమూర్తి కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే మిలింద్‌ను అవుట్‌ చేసి వరుణ్‌ ఈ జోడీని విడగొట్టగా... 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్‌ వరుస బంతుల్లో కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్‌ (0)లను అవుట్‌ చేశాడు. దాంతో అమెరికా గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో శుభమ్‌ కొంత పోరాడినా లాభం లేకపోయింది. 2024 జూలైలో భారత్‌ తరఫున చివరి టి20 ఆడి జట్టుకు దూరమైన సిరాజ్‌... అనూహ్యంగా వరల్డ్‌ కప్‌ అవకాశం దక్కించుకొని తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.సొంతగడ్డపై ముగ్గురు ముంబైకర్లు... అమెరికా జట్టులో సభ్యులైన సౌరభ్‌ నేత్రావల్కర్, శుభమ్‌ రంజనే, హర్మీత్‌ సింగ్‌లకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ ముంబైలోనే ఓనమాలు నేర్చుకొని ఇక్కడే కెరీర్‌ను మలచుకున్నారు. ముగ్గురు కూడా జూనియర్, అండర్‌–19 క్రికెట్‌ను ముంబై తరఫునే ఆడటంతో పాటు రంజీ ట్రోఫీలో కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రంజనే చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడినప్పుడు జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. తర్వాతి రోజుల్లో యూఎస్‌కు వలస వెళ్లి వీరు అక్కడి జాతీయ జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. అయితే వాంఖెడే మైదాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ అయినా ఆడాలనేది వీరి చిరకాల కోరిక! అది ఈ మ్యాచ్‌తో నెరవేరింది. మ్యాచ్‌లో ముగ్గురూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా... సొంతగడ్డపై వరల్డ్‌ కప్‌ ఆడిన జ్ఞాపకం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) మిలింద్‌ (బి) షాల్‌విక్‌ 20; అభిషేక్‌ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్‌ 0; తిలక్‌ వర్మ (సి) మోనాంక్‌ (బి) షాల్‌విక్‌ 25; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 84; దూబే (సి) నేత్రావల్కర్‌ (బి) షాల్‌విక్‌ 0; రింకూ (సి) మిలింద్‌ (బి) మొహసిన్‌ 6; పాండ్యా (సి) ముక్కామల (బి) హర్మీత్‌ 5; అక్షర్‌ (సి) మొహసిన్‌ (బి) హర్మీత్‌ 14; అర్ష్ దీప్ (సి) మిలింద్‌ (బి) షాల్‌విక్‌ 4; వరుణ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్‌: సౌరభ్‌ నేత్రావల్కర్‌ 4–0–65–0, అలీ ఖాన్‌ 2–0–13–1, షాల్‌విక్‌ 4–0–25–4, మొహసిన్‌ 4–0–16–1, శుభమ్‌ 2–0–16–0, హర్మీత్‌ 4–0–26–2. అమెరికా ఇన్నింగ్స్‌: గూస్‌ (సి) తిలక్‌ (బి) సిరాజ్‌ 6; సాయితేజ ముక్కామల (సి) వరుణ్‌ (బి) సిరాజ్‌ 2; మోనాంక్‌ (సి) దూబే (బి) అర్ష్ దీప్ 0; మిలింద్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) వరుణ్‌ 34; కృష్ణమూర్తి (సి) రింకూ (బి) అక్షర్‌ 37; శుభమ్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 37; హర్మీత్‌ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 0; మొహసిన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్ 8; షాల్‌విక్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71, 5–98, 6–98, 7–110, 8–132. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–18–2, సిరాజ్‌ 4–0–29–3, వరుణ్‌ 4–0–24–1, అక్షర్‌ 4–0–24–2, పాండ్యా 4–0–34–0.టి20 ప్రపంచకప్‌లో నేడున్యూజిలాండ్‌ X అఫ్గానిస్తాన్‌వేదిక: చెన్నై; ఉదయం 11 గంటల నుంచి ఇంగ్లండ్‌X నేపాల్‌ వేదిక: ముంబై; మధ్యాహ్నం 3 గంటల నుంచిశ్రీలంక X ఐర్లాండ్‌వేదిక: కొలంబో; రాత్రి 7 గంటల నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

T20 WC 2026: Pakistan Letter to ICC on India boycott Get Strong response9
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడి.. కేవలం భారత్‌తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్‌కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.బంగ్లాదేశ్‌కు మద్దతుగాఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిస్కరిస్తామంటూ పాక్‌ కొత్త రాగం ఎత్తుకుంది.కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.ఒకవేళ రద్దయితేకానీ బంగ్లాదేశ్‌ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రకటించింది. పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఈ ప్రకటన చేశాడు.కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్‌ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.తెలివి ప్రదర్శించిన పీసీబీఅయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్‌ తెలివిగా.. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.గట్టిగానే బదులిచ్చిన ఐసీసీఅయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్‌.. ఆ తర్వాత మాట మార్చి భారత్‌తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

T20 WC 2026 IND vs USA: Suryakumar Yadav 49 Ball 84 Check Ind Score 10
IND vs USA: సూర్యకుమార్‌ విధ్వంసం

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్‌ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్‌ రెండో బంతికే అలీ ఖాన్‌ అభిషేక్‌ శర్మ (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..ఆ తర్వాత వాన్‌ షాల్‌విక్‌ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ (20), ఐదో బంతికి తిలక్‌ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్‌ చేసి.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌మిగిలిన వారిలో రింకూ సింగ్‌ (6), హార్దిక్‌ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.A fine innings from the man in top form! 👏@surya_14kumar brings up his 25th T20I fifty, just when the team needed it the most! 💙PS. India win 88% of matches when captain SKY scores 50+ ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/GQYypRHKDJ— Star Sports (@StarSportsIndia) February 7, 2026మెరుపు అర్ధ శతకంధనాధన్‌ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అమెరికా బౌలర్లలో వాన్‌ షాల్‌విక్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్‌ సింగ్‌ రెండు, అలీ ఖాన్‌, మొహమ్మద్‌ మొహ్సిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా గ్రూప్‌-‘ఎ’లోచదవండి: అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను: వైభవ్‌ సూర్యవంశీ తండ్రి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement