ప్రధాన వార్తలు

భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
ఆఫ్ఘనిస్తాన్ ఆల్టైమ్ గ్రేట్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ కొడుకు హసన్ ఐసాఖిల్ స్వదేశంలో జరుగుతున్న ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో అమో రీజియన్కు ఆడతున్న 18 ఏళ్ల హసన్.. బాంద్-ఎ-అమీర్తో జరిగిన మ్యాచ్లో 235 బంతుల్లో 143 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్లో హసన్కు ఇది తొలి సెంచరీ.ఈ మ్యాచ్లో హసన్ కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అంతకుముందు కమాల్ ఖాన్ (105), సెదిఖుల్లా పచా (77) కూడా సత్తా చాటడంతో అమో రీజియన్ తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది.అనంతరం బాంద్-ఎ-అమీర్ జట్టు ఓపెనర్ హరూన్ ఖాన్ (109) సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో 274 పరుగులు చేయగలిగింది. అమో బౌలర్లలో సఖీ 4 వికెట్లు తీశాడు. 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమో టీమ్.. హసన్ సెంచరీతో సత్తా చాటడంతో 235 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 45 బంతుల్లో 150 పరుగులుహసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న హసన్ తండ్రి నబీ కొడుకుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ముచ్చట పడుతున్నాడు.

IPL 2025: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్ 142 మ్యాచ్ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 261 మ్యాచ్ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లుక్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 295విరాట్ కోహ్లి- 285ఎంఎస్ ధోని- 260ఏబీ డివిలియర్స్- 251ఓవరాల్గా టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఈ ఫార్మాట్లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్ మినహా ఏ క్రికెటర్ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్ తర్వాత కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్లో 908 సిక్సర్లు బాదాడు. గేల్, పోలీ తర్వాత రసెల్ (737), పూరన్ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు విండీస్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో, విరాట్ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్ తన టీ20 కెరీర్లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 ఆటగాళ్లుక్రిస్ గేల్- 1056కీరన్ పోలార్డ్- 908ఆండ్రీ రసెల్- 737నికోలస్ పూరన్- 630కొలిన్ మున్రో- 557అలెక్స్ హేల్స్- 552రోహిత్ శర్మ- 540గ్లెన్ మ్యాక్స్వెల్- 530జోస్ బట్లర్- 528డేవిడ్ మిల్లర్- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్కు చేరే క్రమంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్ (11) టాప్-4లో ఉన్నాయి.

IPL 2025, KKR VS PBKS: చరిత్ర సృష్టించిన ప్రభ్సిమ్రన్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్తో జరిగిన రద్దైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి (2019) పంజాబ్ కింగ్స్కే ఆడుతున్న ప్రభ్సిమ్రన్ ఇప్పటివరకు 43 మ్యాచ్లు ఆడి 151.88 స్ట్రయిక్రేట్తో 1048 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా ప్రభ్సిమ్రన్ నిలిచాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్కు కూడా 1000 పరుగుల మార్కును తాకలేదు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 2018-2021 మధ్యలో 55 మ్యాచ్లు ఆడి 2548 పరుగులు చేశాడు.పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..కేఎల్ రాహుల్- 2548షాన్ మార్ష్- 2477డేవిడ్ మిల్లర్- 1974మయాంక్ అగర్వాల్- 1513మ్యాక్స్వెల్- 1431క్రిస్ గేల్- 1339సాహా- 1190మనన్ వోహ్రా- 1106మన్దీప్ సింగ్- 1073ప్రభ్సిమ్రన్ సింగ్- 1048కుమార సంగక్కర- 1009కాగా, నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీకి చేరువలో (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటైన ప్రభ్సిమ్రన్ తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ సహా ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) చేయగా.. మ్యాక్స్వెల్ (7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. జన్సెన్ 7 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వైభ్వ్ అరోరా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికి కేకేఆర్ స్కోర్ 7/0గా (ఒక ఓవర్లో) ఉంది. ఈ మ్యాచ్లో లభించిన పాయింట్తో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ టాప్-3లో ఉన్నాయి.

ప్రతీకార పోరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆరంభంలో పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో గెలుపు బాట పట్టిన ముంబై మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా మంచి టచ్లో ఉంది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు గత నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఓవరాల్గా రెండు జట్లు 9 మ్యాచ్లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇరు జట్లు గెలిచిన ఐదు మ్యాచ్ల్లోనూ... వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం... సమష్టి కృషికి నిదర్శనం. ముంబై తరఫున అశ్వని కుమార్, కరణ్ శర్మ, విల్ జాక్స్, రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ ఈ అవార్డు దక్కించుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ తరఫున శార్దుల్ ఠాకూర్, దిగ్వేశ్ రాఠీ, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అవేశ్ ఖాన్ గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. లక్నో 203 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో ముంబై 191 పరుగులకే పరిమితమైంది. ఈ పోరులోనే భారీ షాట్లు ఆడలేక తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. మరి రెండో మ్యాచ్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. జోరు సాగిస్తేనే... హిట్మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావడంతో... ముంబై కష్టాలు తీరిపోయాయి. సీజన్ ఆరంభంలో పరాజయాలతో సతమతమైన ముంబై.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్ దంచికొడుతూ శుభారంభాలు అందిస్తుండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ తన విలువ చాటుకుంటున్నాడు. రికెల్టన్, విల్ జాక్స్ కూడా మంచి టచ్లో ఉండగా... తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ రూపంలో ముంబైకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండడం ముంబైకి కలిసి రానుంది. ఇక బౌలింగ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ భారం మోయనుండగా... విగ్నేశ్, సాంట్నర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్పైనే భారం... లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించిందంటే... వారి టాప్–3 ఆటగాళ్లు రాణించడమే దానికి ప్రధాన కారణం. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ ఈ ముగ్గురూ దంచికొడుతుండటంతో... లక్నో భారీ స్కోర్లు చేస్తోంది. ముఖ్యంగా పూరన్ ఈ సీజన్లో 200 పైగా స్ట్రయిక్రేట్తో 377 పరుగులు చేశాడు. మార్క్రమ్, మార్ష్ కూడా ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేకపోతున్న పంత్ 9 మ్యాచ్ల్లో 106 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్ ఫర్వాలేదనిపిస్తుండగా... డేవిడ్ మిల్లర్ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్లో శార్దుల్, అవేశ్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, విగ్నేశ్. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.

కోహ్లి X రాహుల్
న్యూఢిల్లీ: భారత ప్రధాన బ్యాటర్లు... ఆ్రస్టేలియా ప్రధాన పేసర్ల మధ్య పోరులా అభివర్ణిస్తున్న మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో రాయల్ చెలంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఈ రెండు జట్లు... తాజా సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కెపె్టన్లు కాకపోయినా... బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లి మోస్తుండగా... ఢిల్లీ క్యాపిటల్స్కు కేఎల్ రాహుల్ వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధికారికంగా ఆడుతున్న ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాహుల్ రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన రాహుల్... ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఇది నా అడ్డా’ అన్న తరహాలో సంబరాలు జరుపుకొని వార్తల్లో నిలిచాడు. మరి ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లి ఆదివారం తన సొంత నగరంలో జరగనున్న పోరులో దీనికి సమాధానం చెప్తాడా చూడాలి. ఢిల్లీ స్టేడియంలో విరాట్కు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లాడిన కోహ్లి అందులో 5 అర్ధ శతకాలు సాధించి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇక బౌలింగ్లోనూ ఇరు జట్ల ఆసీస్ పేసర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఢిల్లీ ప్రధాన పేసర్ స్టార్క్ మంచి జోష్లో ఉండగా... బెంగళూరు తరఫున హాజల్వుడ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయమే! డుప్లెసిస్ రాకతో... ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఈ సీజన్లో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. అక్షర్ పటేల్ సారథ్యంలో ముందుకు సాగుతున్న క్యాపిటల్స్... 8 మ్యాచ్ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి అందుబాటులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచుతోంది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ మంచి ఫామ్లో ఉండగా... కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.స్టార్క్తో కలిసి ముకేశ్ కుమార్ పేస్ భారం పంచుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. జోరు సాగేనా..! అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆడుతున్న తొలి ఐపీఎల్లో విరాట్ దంచికొడుతున్నాడు. బరిలోకి దిగితే చివరి వరకు నిలవాలనే కసితో ముందుకు సాగుతున్నాడు. 65.33 సగటుతో అతడు పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లోనూ గెలిచిన బెంగళూరు అదే కొనసాగించాలనుకుంటోంది. కోహ్లితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మంచి టచ్లో ఉండగా... మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కీలకం కానున్నారు. టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఫినిషర్ల బాధ్యతలు మోస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, హాజల్వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ సీజన్లో 16 వికెట్లు తీసిన హాజల్వుడ్పై భారీ అంచనాలున్నాయి. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పొరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్ కుమార్, చమీరా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ.

కోచింగ్లో కొత్త ‘కీర్తి’
క్రీడల్లో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో గొప్ప విజయాలు అందుకున్న స్టార్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే అదే శిక్షణకు వచ్చేసరికి మాత్రం పురుషులే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీడాంశం ఏదైనా కోచింగ్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ పురుష క్రీడాకారులకు మహిళలు కోచింగ్ ఇవ్వడం మరీ అరుదు. అయితే 32 ఏళ్ల కీర్తి తివారి ఇప్పుడు కోచింగ్లో తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంకా ప్లేయర్ వయసులోనే ఉంటూ ఒక ప్లేయర్గానే కనిపించే ఆమె శిక్షణను చూస్తే ఎంత సాధికారికంగా కీర్తికి పట్టు ఉందో అర్థమవుతుంది. తనదైన శైలిలో ఆమె ఈతరం విజేతలను తయారు చేస్తోంది. ప్లేయర్నుంచి కోచింగ్ వైపు... కీర్తి స్వయంగా రన్నర్. 400 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్. కానీ అక్కడ పెట్టిన పరుగు ఫలితమివ్వకపోవడంతో కోచ్ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. వ్యాయామ విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కీర్తి తదనంతరం పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా పూర్తి చేసింది. 2019లో లక్నోలో తన శిక్షణను మొదలుపెట్టిన ఆమె ఫెడరేషన్ కప్లో ఓ విజేతను తయారు చేసింది. ఈ సీనియర్ జాతీయ ఈవెంట్లో పి. డేవిడ్ పురుషుల లాంగ్జంప్లో విజేతగా నిలువడంతో ఇప్పుడు కీర్తి పేరు తెరపైకి వచ్చిం ది. ఆమె నా కోచ్... కీర్తి ఫిజిక్ను చూసిన వారికి ఆమె ఓ అథ్లెట్గానే కనిపిస్తుంది. పురుషుల లాంగ్జంప్ పోటీ జరుగుతుంటే మహిళా అథ్లెట్కు ఏం పని అని అక్కడున్నవారు అనుకుంటుండగా... బరిలో ఉన్న డేవిడ్ కల్పించుకొని ఆమె నా కోచ్ అని చెప్పాల్సి వచ్చిం ది. ఎందుకంటే చాలామంది కోచ్లు మలివయసువారే ఉంటారు. యువకులెవరూ కోచ్లుగా ఉండరు. కానీ మూడు పదుల వయస్సున్న కీర్తిని సహజంగానే క్రీడాకారిణిగా భావించారంతా! అయితే ఈ యువ కోచ్ తన శిష్యుణ్ని తీర్చిదిద్దిన తీరు, విజేతగా మలచిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది. పురుష ప్రపంచంలో ఆమె ఒంటరి పయనం విదేశాల సంగతి పక్కనబెడితే భారత్లాంటి దేశాల్లో అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఏ ఆటలో ఆసక్తి వుంటే తీసుకెళ్లేది పురుష కోచ్ వద్దకే. దిగ్గజ షట్లర్లు సైనా, సింధు తదితరులంతా పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే ప్రపంచ బ్యాడ్మింటన్లో వెలిగారు. ఇలాంటి పురుష ప్రపంచంలో కీర్తి తన కోచింగ్ ప్రతిభతో పౌరుషాన్ని చాటింది. అకాడమీలో తాను ఒక ఒంటరనే ఫీలింగ్ ఉన్నా... తర్వాత అలవాటుపడింది. ఆటలో పడింది. కోచింగ్లోనే మమేకమైంది. దీంతో ఒంటరి పయనంలో ఆమె కనిపించేందుకు ఒక్కరే కావొచ్చు. కానీ కోచ్ పాత్ర తోడు–నీడ కావడంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. కష్టమైనా... కోచింగే ఇష్టం మహిళా కోచ్కు ఎదురయ్యే సవాళ్లు మామూలుగా వుండవు. పురుషాధిక్య సమాజంలో ఈ సవాళ్లతోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో దూరమయ్యే పరిస్థితి పురుషులకు సులువు... కానీ అమ్మాయిల పరిస్థితి చాలా భిన్నం. అందుకేనేమో చాలామంది మహిళలు కోచింగ్ వైపు వచ్చినప్పటికీ నిలదొక్కుకునే ముందే అస్త్రసన్యాసం చేస్తారు. తిరుగుటపా కట్టేస్తారు. కానీ కీర్తి మాత్రం ఎన్ని కష్టాలెదురైనా... తనకెంతో ఇష్టమైన కోచింగ్ను వదిలిపెట్టలేదు. కొన్నాళ్లుగా డేవిడ్ ప్రదర్శనకు మెరుగులు దిద్దుతున్న ఆమె చివరకు ఫెడరెషన్ కప్లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఇంత చేసినా కూడా కొందరు ఈ మాత్రం ప్రదర్శనతో ఒలింపిక్స్కు తీసుకెళ్తావా అని గేలి చేసినవారూ ఉన్నారు. దానికి ఆమె సమాధానం... అవును ఒలింపియన్ను తయారు చేయడమే తన లక్ష్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేది.

భారత్ X శ్రీలంక
కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత జట్టు తలపడుతోంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొంటున్న ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించాలని భారత్ భావిస్తోంది. ముక్కోణపు టోర్నీ మొదటి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా చూస్తోంది. కెపె్టన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఓపెనర్ షఫాలీ వర్మను సెలెక్టర్లు ఈ సిరీస్కు కూడా పరిగణనలోకి తీసుకోలేదు.గత రెండు సిరీస్ల్లోనూ చక్కటి విజయాలు సాధించిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముక్కోణపు టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్, ఐర్లాండ్పై సిరీస్లు గెలిచిన టీమిండియా వరుసగా ఆరు వన్డేలు నెగ్గి శ్రీలంకలో అడుగుపెట్టింది. కాశ్వి గౌతమ్ అరంగేట్రం! బ్యాటింగ్లో బలంగా ఉన్న టీమిండియాకు పేస్ బౌలింగ్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ బౌలర్లు రేణుక సింగ్, పూజ వస్త్రకర్, టిటాస్ సాధు గాయాలతో సతమతమవుతుండటంతో... యంగ్ ప్లేయర్లపై అధిక భారం పడనుంది. అండర్–19 మహిళల ప్రపంచకప్లో సత్తాచాటిన కాశ్వి గౌతమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయమే. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించిన కాశ్వి 9 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టింది. హైదరాబాద్ మీడియం పేసర్ అరుంధతి రెడ్డి, కాశ్వి తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే. మీడియం పేస్ ఆల్రౌండర్ అమన్జ్యోత్ కౌర్ కూడా అందుబాటులో ఉంది. అయితే శ్రీలంక పిచ్లపై స్పిన్నర్ల ఆధిపత్యమే ఎక్కువ. ఆ కోణంలోనూ భారత్ మెరుగ్గా ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, స్నేహ్ రాణాతో పాటు డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీచరణి జట్టులో ఉన్నారు. మరోవైపు శ్రీలంక జట్టు కెపె్టన్ చమరి ఆటపట్టుపై అధికంగా ఆధారపడుతోంది.

‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్కతా నైట్రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్ను పూర్తిగా ఆడిన ప్రభ్సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్రైజర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. గత మ్యాచ్కు దూరంగా ఉన్న మాక్సీకి పంజాబ్ మెనెజ్మెంట్ తిరిగి తుది జట్టులో చోటు ఇచ్చింది.మార్కస్ స్టోయినిష్ స్ధానంలో జట్టులోకి వచ్చిన మాక్స్వెల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్సీ పెవిలియన్కు చేరాడు. వరుణ్ అద్బుతమైన బంతితో ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్..87.50 స్ట్రైక్ రేటుతో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్.. 8.00 సగటుతో కేవలం 48 పరుగులు చేశాడు. దీంతో మాక్స్వెల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్లేయర్ అంటూ ఎక్స్లో ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్

ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి దూసుకు వెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఫాఫ్ గాయం కారణంగా వరుసగా నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించడంతో ఆర్సీబీతో మ్యాచ్లో డుప్లెసిస్ ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్గర్క్ ధ్రువీకరించాడు. ఆర్సీబీతో మ్యాచ్కు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండనున్నాడు. నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని మెక్గర్క్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం నెట్స్లో డుప్లెసిస్ తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతడు తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. డుప్లెసిస్ తిరిగి వస్తే కరుణ్ నాయర్పై వేటు పడే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్

పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శల...

‘మళ్లీ నా సమయం వచ్చింది’
పుణే: క్లాసికల్ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేయడ...

క్రీడాభివృద్ధికి ‘కార్పొరేట్’ సహకారం అవసరం
న్యూఢిల్లీ: భారత్లో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్...

కోనేరు హంపికి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపికి వైఎస్సార్ కాం...

IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
KKR vs PBKS Live Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్...

బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్పై బీసీస...

'శ్రేయస్ చాలా బాధపడ్డాడు.. కేకేఆర్కు చుక్కలు చూపిస్తాడు'
ఐపీఎల్-2025లో శనివారం ఈడెన్గార్డెన్స్ వేదికగా ...

ఈసారి వేలం వేస్ట్.. ధోని బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం తీరుపై ఆ జట...
క్రీడలు


సన్రైజర్స్ vs చెన్నై మ్యాచ్లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)


క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)


సచిన్ టెండుల్కర్ బర్త్డే.. అరుదైన ఫొటోలు చూశారా? (ఫోటోలు)


హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)


SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)


ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)


భర్త వెంకట దత్తసాయితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పీవీ సింధు (ఫోటోలు)


సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్తో సినీనటి సౌమ్యజాను (ఫొటోలు)


ఆస్ట్రేలియాలో చిల్ అవుతోన్న సచిన్ కూతురు సారా టెండూల్కర్ (ఫోటోలు)


చిచ్చరపిడుగు.. సిక్సర్తో ఆగమనం! తగ్గేదేలే.. (ఫొటోలు)
వీడియోలు


చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన SRH


IPL: MATCH FIX అడ్డంగా దొరికిపోయిన ముంబై


రోహిత్ పై పాండ్యా విషం.. నువ్వు మారవా బ్రో?


భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు


IPLలో వరుసగా 4 విజయం సొంతం చేసుకున్న ముంబై


ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి 2025 విజేతగా కోనేరు హంపి


Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో


IPLకు తగ్గుతున్న క్రేజ్ ...ఎందుకంటే..


బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లు ప్రకటన


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవేదన