Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Who Is Nikhil Chaudhary Once Gill Teammate Scripts History In Australia FC1
మాంసం కొట్టులో పని.. ఆసీస్‌ గడ్డపై ‘భారత’ క్రికెటర్‌ సరికొత్త చరిత్ర

ఆస్ట్రేలియా గడ్డపై ఓ ‘భారత’ క్రికెటర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్‌ ఫస్ట్‌క్లాస్‌ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. అతడే నిఖిల్‌ చౌదరి. గిల్‌ సహచర క్రికెటర్‌ఢిల్లీలో జన్మించిన నిఖిల్‌ చౌదరి.. దేశీ క్రికెట్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. భారత స్టార్లు అభిషేక్‌ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్‌-ఎ క్రికెట్‌ ఆడాడు. అయితే, భారత్‌లో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు.ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్‌ చౌదరి.. కోవిడ్‌-19 (Covid 19)లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు భారత్‌కు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌ కావాలన్న అతడి కల మాత్రం అలాగే ఉండిపోయింది.మాంసం కొట్టులో పనిఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో నిఖిల్‌ చౌదరి.. శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం కొట్టులో పని చేయడంతో పాటు.. పార్శిళ్లు అందించే డెలివరీ బాయ్‌గా.. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా.. ఇలా ఎన్నో పనులు చేశాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు.కొన్నాళ్ల తర్వాత నిఖిల్‌ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్‌ హ్యారికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్‌ చౌదరి.. పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌ బౌలర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్‌ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఆసీస్‌ దేశీ క్రికెట్‌ జట్ల యాజమాన్యాలను ఆకర్షించిన నిఖిల్‌ చౌదరికి ఊహించని విధంగా ఓ అవకాశం వచ్చింది. స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు జాతీయ జట్టులోకి వెళ్లగా.. టాస్మేనియా జట్టు నుంచి నిఖిల్‌కు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అతడు జట్టులో భాగమైపోయాడు.ఆసీస్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్‌ ఇటీవలే సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూ సౌత్‌ వేల్స్‌తో మ్యాచ్‌లో ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. శతక్కొట్టాడు. 184 బంతుల్లోనే 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆసీస్‌ దేశీ రెడ్‌బాల్‌ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్మేనియా న్యూ సౌత్‌ వేల్స్‌పై ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో గెలవడం విశేషం.ఫాస్ట్‌ బౌలర్‌గా మొదలుపెట్టి..ఢిల్లీలో జన్మించిన నిఖిల్‌ చౌదరి పంజాబ్‌లో పెరిగాడు. పంజాబ్‌ తరఫున అన్ని ఏజ్‌ గ్రూపులలోనూ క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌తో సమయం గడిపే అవకాశం అతడికి వచ్చింది. నిజానికి నిఖిల్‌ తొలుత ఫాస్ట్‌ బౌలర్‌ కావాలని భావించాడు.అయితే, కాలక్రమేణా తన నైపుణ్యాలకు మెరుగు దిద్దుకుని లెగ్‌ స్పిన్నర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌ ట్రయల్స్‌లో ముంబై ఇండియన్స్‌ సెలక్షన్‌కు వెళ్లినప్పటికీ నిఖిల్‌కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన 29 ఏళ్ల నిఖిల్‌.. అక్కడి స్థానిక క్లబ్‌లలో ఆడుతూ టాస్మేనియా జట్టులో కుదురుకున్నాడు.చదవండి: స్మృతిని మోసం చేసిన పలాష్‌?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఏం జరిగింది?

Ind vs SA: India 27 Per 2 At Need 522 Runs More To Win Fans Slams batters2
రోడ్డు మీద కూడా ఆడలేరా?.. ఈ టెస్టు కూడా పోయినట్లేనా?

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్‌ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.రోడ్డు మీద కూడా ఆడలేరా?ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్‌ మీద సఫారీలు రయ్‌ రయ్‌మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్‌వాష్‌ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చేదు అనుభవం తప్పదా?స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది.భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్‌ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్‌ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్‌ (93) ఇన్నింగ్స్‌ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్‌కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.యాన్సెన్‌ ఆరు వికెట్లతో చెలరేగిసఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (58)తో పాటు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్‌ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.ఫలితంగా 201 పరుగులకే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలగా.. ప్రొటిస్‌ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.మరోసారి మనోళ్లు ఫెయిల్‌రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ (35), ఐడెన్‌ మార్క్రమ్‌ (29) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ భారీ హాఫ్‌ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్‌ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్‌ ముల్దర్‌ (35 నాటౌట్‌) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్‌ 13 పరుగులు చేసి.. యాన్సెన్‌ బౌలింగ్‌లో వెనుదిరగగా.. కేఎల్‌ రాహుల్‌ 6 పరుగులు చేసి సైమన్‌ హార్మర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్‌ 2, కుల్దీప్‌ యాదవ్‌ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

What Is Unexpected Drama Between Palash Muchhal And Smriti Mandhana Just A Night Before Wedding3
స్మృతిని మోసం చేసిన పలాష్‌?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...

భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)పై సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.ఇండోర్‌ కోడలు కాబోతోంది అంటూకాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్‌ మూలాలున్న పలాష్‌ ముచ్చల్‌తో 2019 నుంచి డేటింగ్‌లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పలాష్‌ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్‌ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్‌ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.తండ్రికి గుండెపోటు!ఆ తర్వాత పలాష్‌.. స్మృతి వరల్డ్‌కప్‌ గెలిచిన డీవై పాటిల్‌ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్‌ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్‌ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.‘బంధం’ పాతబడిందని..కొరిగ్రాఫర్‌ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్‌ తనతో చాట్‌ చేసినట్లుగా స్క్రీన్‌ షాట్స్‌ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్‌.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా, ఎంజాయ్‌ చేద్దామంటూ ‘పర్సనల్‌’ చాట్‌ చేసినట్లు వైరల్‌ అవుతోంది.నిజమేనా?ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్‌రాయుళ్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్‌ చేసినప్పటికీ.. పలాష్‌తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్‌ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్‌ అక్క, బాలీవుడ్‌ గాయని పాలక్‌ ముచ్చల్‌ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్‌స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

IND vs SA 2nd Test Target 549: Indias highest successful run chases List4
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

గువాహటి వేదికగా భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటారు.తొలి ఇన్నింగ్స్‌లో..ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌ను ఫాలో ఆన్‌ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్‌నైట్‌ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.టార్గెట్‌ ఎంతంటే?తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది సౌతాఫ్రికా. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (94) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్‌ ముల్డర్‌ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్‌ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్‌-5 జాబితా)🏏1976లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 403.. భారత్‌ విజయం (406/4)🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 387.. భారత్‌ విజయం (387/4)🏏2021లో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టార్గెట్‌ 328.. భారత్‌ విజయం (329/7)🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 276.. భారత్‌ విజయం (276/5)🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టార్గెట్‌ 264.. భారత్‌ విజయం (264/5).చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

Hazlewood likely to be available for Ashes 3rd Test Cummins Trains With5
గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు అదిరిపోయే శుభవార్తలు

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (Ashes 2025-26)ను ఆస్ట్రేలియా విజయంతో మొదలుపెట్టింది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4- 8 వరకు రెండో టెస్టుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు వచ్చేస్తున్నారా!బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో ఈ డే- నైట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ పింక్‌ బాల్‌ టెస్టు (Pink Ball Test)కు ముందు ఆస్ట్రేలియాకు అదిరిపోయే శుభవార్తలు అందాయి. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా తొడ కండరాల గాయంతో హాజిల్‌వుడ్‌ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.మరోవైపు.. ప్యాట్‌ కమిన్స్‌ ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, హాజిల్‌వుడ్‌ సిడ్నీలోని క్రికెట్‌ సెంట్రల్‌లో బాల్‌తో ప్రాక్టీస్‌ మొదలుపెట్టినట్లు సమాచారం. కమిన్స్‌ కూడా పింక్‌ బాల్‌తో నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ మాట్లాడుతూ..పూర్తి స్థాయిలో కోలుకుంటేనే‘‘యాషెస్‌ సిరీస్‌లో ఏదో ఒక దశలో హాజిల్‌వుడ్‌ అందుబాటులోకి వస్తాడని మాకు తెలుసు. అయితే, ఇంకాస్త ముందుగానే అతడు జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక కమిన్స్‌ రిహాబిలిటేషన్‌ దాదాపుగా పూర్తై పోయింది.తన బౌలింగ్‌లో వేగం కనిపిస్తోంది. అతడు సానుకూలంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, కమిన్స్‌ను మ్యాచ్‌ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటేనే రంగంలోకి దిగుతాడు’’ అని మెక్‌డొనాల్డ్‌ తెలిపాడు. కాగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టులకు జరుగనున్నాయి. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవెన్‌ స్మిత్‌ ఆసీస్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు.చదవండి: IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!

PM Modi Congratulates Indian Blind womens team for winning T20 WC6
ప్రపంచకప్‌ విజేతలకు ప్రధాని అభినందన

న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్‌. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్‌లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్‌ అంతకుముందు లీగ్‌ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌పై నెగ్గింది. అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్‌ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు.

He Was Shocked Cried Before Smriti He Take: Palash Muchhal Mother7
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్‌ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.స్మృతి- పలాష్‌ పెళ్లి నిరవధికంగా వాయిదాఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్‌తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్‌ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్‌ ఆస్పత్రిలో చేరాడు.వరుస మ్యూజిక్‌ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్‌ ముచ్చల్‌ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్‌డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్‌ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్‌ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడుఈ నేపథ్యంలో పలాష్‌ ముచ్చల్‌ తల్లి అమిత.. ట్రోల్స్‌కు దిమ్మతిగిరేలా కౌంటర్‌ ఇచ్చారు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ.ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్‌ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిహల్దీ తర్వాత పలాష్‌ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్‌ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్‌ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్‌ ముచ్చల్‌ తల్లి అమితా ముచ్చల్‌ తెలిపారు. కాగా పలాష్‌ అక్క, బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

IND vs SA 2nd Test Day 4: South Africa Lead 395 At Tea Break8
IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!

టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మరింతగా పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 395 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. గువాహటి వేదికగా 26/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది సౌతాఫ్రికా.ఈ క్రమంలో ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగాడు. జడ్డూ బౌలింగ్‌లో మూడో బంతికి షాట్‌ ఆడబోయి బంతిని గాల్లోకి లేపిన ర్యాన్‌ రికెల్టన్‌ (35) సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది.ఇక 29వ ఓవర్లో జడ్డూ మార్క్రమ్‌ (29)ను బౌల్డ్‌ చేయగా.. 32వ ఓవర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) అద్భుతం చేశాడు. కెప్టెన్‌ తెంబా బవుమా (3) రూపంలో కీలక వికెట్‌ పడగొట్టాడు. వాషీ బౌలింగ్‌లో లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి బవుమా పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత్‌ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. 1-0తో ఆధిక్యంలో సౌతాఫ్రికాఇందులో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం రెండో టెస్టు మొదలు కాగా.. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది.టాపార్డర్‌ మెరుగ్గా రాణించగా.. టెయిలెండర్లు సెనూరన్‌ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్‌ (91 బంతుల్లో 93) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ జట్టు 489 పరుగులకు ఆలౌట్‌ అయింది. తేలిపోయిన భారత బ్యాటర్లుఅనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఆడేందుకే మొగ్గుచూపింది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. UPDATE: లంచ్‌ బ్రేక్‌ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం 508 పరుగులుస్కోరు: 220/4 (70)చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

Body Working Against PV Sindhu Will Our current Pllayers need to: Saina Nehwal9
పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత షట్లర్లు బాగానే రాణిస్తున్నారని, అయితే అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ స్థాయికి తగ్గ శారీరక ఫిట్‌నెస్‌ను ఇంకాస్త మెరుగుపరుచుకోవాలని భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) సూచించింది. ప్రత్యర్థుల్ని ఓడించే సత్తా మన ఆటగాళ్లకు ఉందని కావాల్సిందల్లా శారీరక దృఢత్వమేనని చెప్పింది. సింగిల్స్‌లో భారత ఆశాకిరణం లక్ష్యసేన్‌ అని చెప్పింది.పాతవారిని మార్చాలిసైనా నెహ్వాల్‌ మాట్లాడుతూ తరచూ గాయాలపాలవడం, అమ్మాయిల్లో దూకుడు లోపించడం, ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో మరింత సుకుమారంగా మారడంపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచింది. ‘మునుపటిలా రాణించాలంటే మనం మరింత నిలకడ సాధించాలి. సాత్విక్‌–చిరాగ్‌ జోడీ, లక్ష్యసేన్, సింధు లేదంటే తర్వాతి తరం ఆటగాళ్లెవరైనా సరే ఫిట్‌నెస్‌కు మరింత ప్రాధాన్యమివ్వాలి.అప్పుడే ఆటలో స్థిరమైన ఫలితాలు సాధించగలం. దీనికోసం మన షట్లర్లు ముందుగా నిష్ణాతులైన కోచ్‌లు, సుశిక్షితులైన ఫిజియోల్ని ఎంచుకోవాలి. అనువైన, అవసరమైన కోచ్‌లు దొరికేవరకూ అన్వేషిస్తూనే ఉండాలి. కచ్చితంగా పాతవారిని మార్చాలి. అప్పుడే వరుసగా టోర్నీలు ఆడేందుకు, టైటిల్స్‌ గెలిచేందుకు ఫిట్‌నెస్‌ స్థాయిల్ని అమాంతం పెరిగేందుకు దోహదపడతాయి’ అని పేర్కొంది. అంతర్జాతీయ చాంపియన్లు విక్టర్‌ అక్సెల్సన్, కరోలినా మారిన్‌లు అదే చేశారని, మేటి కోచ్‌లు, ఫిజియోల కోసం పదే పదే ఫిట్‌నెస్, మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌లను మార్చారని సైనా గుర్తు చేశారు. సింధు గురించి సైనా మాటల్లో..‘‘శరీరం సహకరించినంత వరకు అంతా బాగుంటుంది. కానీ ఒక్కోసారి శరీరం మనసు మాట వినదు. మనమేమీ యంత్రాలం కాదు కదా!.. చాలా ఏళ్లుగా సింధు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటోంది. తను ఎప్పుడూ తీవ్రమైన గాయాలబారిన పడలేదు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సహకరించకపోవచ్చు.తనొక అద్భుతమైన ప్లేయర్‌. టోర్నీల్లో ఎలా గెలవాలో తనకు తెలుసు. అయితే, ముందుగా చెప్పినట్లు ఒక్కోసారి ఫిట్‌నెస్‌ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒకవేళ సింధు గనుక వాటిని అధిగమిస్తే మున్ముందు ఇంకా గొప్పగా ఆడుతుంది’’ అని సైనా నెహ్వాల్‌ చెప్పుకొచ్చింది.

Kane Williamson Returns New Zealand Announced Team For WI Test Series10
విలియమ్సన్‌ రీఎంట్రీ.. విండీస్‌తో టెస్టులకు కివీస్‌ జట్టు ఇదే

వెల్లింగ్టన్‌: సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు జాతీయ కాంట్రాక్టుకు దూరమైన విలియమ్సన్‌... పరిమిత మ్యాచ్‌ల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరమైన కేన్‌... వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్‌ (NZ vs WI Tests)తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. దీని కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్‌ లాథమ్‌ సారథ్యంలో..ఇప్పటికే వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌... సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. టామ్‌ లాథమ్‌ జట్టుకు సారథ్యం వహించనుండగా... కాన్వే, విలియమ్సన్, విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్, టామ్‌ బ్లండెల్‌ బ్యాటింగ్‌ భారం మోయనున్నారు. ఇక విలియమ్సన్‌ వంటి అనుభవం గల ఆటగాడు జట్టులో ఉండటం ఇతర ఆటగాళ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని న్యూజిలాండ్‌ హెడ్‌కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ అన్నాడు. పేస్‌ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నెర్‌ జట్టులో చోటు దక్కించుకోగా... గాయం నుంచి పూర్తిగా కోలుకోని కైల్‌ జెమీసన్‌ను ఈ సిరీస్‌కు పరిగణించలేదు. వెస్టిండీస్‌తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్‌నర్, కేన్‌ విలియమ్సన్‌, విల్‌ యంగ్‌.చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement