Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Fourth Test between Australia and England starts today1
మరో విజయం లక్ష్యంగా...

మెల్‌బోర్న్‌: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా జట్టు నేటి నుంచి నాలుగో టెస్టు ‘బాక్సింగ్‌ డే’ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి నెగ్గిన ఆసీస్‌ 3–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ‘క్లీన్‌స్వీప్‌’ చేయాలని కంగారూలు భావిస్తుండగా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న తరహాలో తెగించి ఆడేందుకు ఇంగ్లండ్‌ సిద్ధమైంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన నాథన్‌ లయన్‌ స్థానంలో మరో స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీకి బదులుగా ఆ్రస్టేలియా జట్టు అదనపు పేసర్‌కు అవకాశమివ్వనుంది. ‘బాక్సింగ్‌ డే’ టెస్టు కోసం మెల్‌బోర్న్‌ స్టేడియం ముస్తాబవగా... పచి్చకతో కూడిన పిచ్‌ ఆరంభంలో పేసర్లకు సహకారం అందించనుంది. అయితే కాస్త సంయమనం పాటిస్తే ఇక్కడ బ్యాటింగ్‌ చేయడం పెద్ద కష్టం కాదని రికార్డులు చెబుతున్నాయి. కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంతో మరోసారి స్టీవ్‌ స్మిత్‌ ఆసీస్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును నడిపించిన ఈ స్టార్‌ బ్యాటర్‌... రెండింట్లోనూ విజయాలు కట్టబెట్టాడు. ట్రావిస్‌ హెడ్‌ మంచి జోరు మీదుండగా... గత మ్యాచ్‌లో అలెక్స్‌ కేరీ గొప్ప ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. స్మిత్, లబుషేన్, ఉస్మాన్‌ ఖ్వాజా, వెదరాల్డ్‌తో ఆసీస్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. ఏడో స్థానంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై కంగారూలు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నారు. ఈ సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు దక్కించుకున్న మిచెల్‌ స్టార్క్‌ మరోసారి బౌలింగ్‌ దళాన్ని నడిపించనున్నాడు. మికెల్‌ నెసెర్, బోలాండ్, డగెట్‌ అతడికి సహకరించనున్నారు. సమష్టిగా రాణిస్తేనే... మరోవైపు ఇంగ్లండ్‌ విషయానికి వస్తే... ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన ఆ జట్టు... చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా పోరాడాలని భావిస్తోంది. ‘ఆ్రస్టేలియా నుంచి సానుకూల దృక్పథంతో తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. సిరీస్‌ కోల్పోయినప్పటికీ ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని ఇంగ్లండ్‌ కెపె్టన్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. ‘బాజ్‌బాల్‌’ ఆటతీరు పెద్దగా ఫలితాన్నివ్వని నేపథ్యంలో మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌ ఎలాంటి ప్రణాళికతో బరిలోకి దిగుతుందో చూడాలి. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్‌ రిసార్ట్‌కు వెళ్లిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించి వార్తల్లోకెక్కగా... అందులో వైరల్‌గా మారిన బెన్‌ డకెట్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది. ఈ సిరీస్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి డకెట్‌ 97 పరుగులే చేసినప్పటికీ... మరో మెరుగైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతడినే కొనసాగించాల్సిన పరిస్థితి. ఇక ప్రధాన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయంతో సిరీస్‌కు దూరం కావడం ఇంగ్లండ్‌ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. అతడి స్థానంలో అట్కిన్సన్‌ బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఈ సిరీస్‌లోనే ఆసీస్‌ గడ్డపై తొలి టెస్టు సెంచరీ నమోదు చేసుకున్న మాజీ కెప్టెన్‌ జో రూట్‌... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవడం సిరీస్‌ ఫలితంపై ప్రభావం చూపింది. మరి ఎలాంటి ఒత్తిడి లేని ఈ పోరులో క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్‌తో కూడిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏమాత్రం ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో కార్స్, జాక్స్‌ కీలకం కానున్నారు.4 మెల్‌బోర్న్‌ మైదానంలో ఆ్రస్టేలియా జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ నాయకత్వం వహించిన టెస్టులు. స్మిత్‌ సారథ్యంలో ఈ వేదికపై ఆ్రస్టేలియా రెండు టెస్టుల్లో నెగ్గి, మరో రెండు టెస్టులను ‘డ్రా’గా ముగించి అజేయంగా ఉంది.57 మెల్‌బోర్న్‌ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టులు. 29 టెస్టుల్లో ఆ్రస్టేలియా నెగ్గగా... 20 టెస్టుల్లో ఇంగ్లండ్‌ గెలిచింది. 8 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.117 మెల్‌బోర్న్‌ మైదానంలో ఇప్పటి వరకు ఆ్రస్టేలియా ఆడిన టెస్టులు. ఈ వేదికపై ఆస్ట్రేలియా 68 టెస్టుల్లో గెలిచి, 32 టెస్టుల్లో ఓడిపోయింది. 17 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. జట్ల వివరాలు ఆ్రస్టేలియా (అంచనా): స్మిత్‌ (కెప్టెన్), వెదరాల్డ్, హెడ్, లబుషేన్, ఖ్వాజా, కేరీ, గ్రీన్, నెసెర్, స్టార్క్, డగెట్‌/జే రిచర్డ్‌సన్, బోలాండ్‌. ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్, విల్‌ జాక్స్, అట్కిన్సన్, కార్స్, టంగ్‌.

New Zealand squads announced for the tour of India2
విలియమ్సన్‌ లేకుండానే...

వెల్లింగ్టన్‌: విదేశీ లీగ్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌... భారత్‌తో వన్డేసిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్‌ జట్టు.. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, 5 టి20లు ఆడనుంది. దీని కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. దక్షిణాఫ్రికా (ఎస్‌ఏ)20 లీగ్‌లో ఆడేందుకు గానూ విలియమ్సన్‌ ఈ సిరీస్‌కు దూరం కాగా... యువ ఆటగాళ్లకు న్యూజిలాండ్‌ బోర్డు పెద్దపీట వేసింది. వన్డేల్లో మైకేల్‌ బ్రేస్‌వెల్‌ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. పేసర్‌ కైల్‌ జేమీసన్‌ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ జేడెన్‌ లెనాక్స్‌ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సాంట్నర్‌ టి20ల్లో న్యూజిలాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రిస్టియన్‌ క్లార్క్, ఆదిత్య అశోక్, జోష్‌ క్లార్క్‌సన్, నిక్‌ కెల్లీ, మిచెల్‌ రే వంటి పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో న్యూజిలాండ్‌ బరిలోకి దిగనుంది. జేడెన్‌ లెనాక్స్‌పై ఆ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ‘న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టు తరఫున లెనాక్స్‌ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దానివల్లే అతడికి ఈ అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత కొన్నాళ్లుగా అతడు నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీల్లో కనబర్చిన దూకుడే... అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిస్తాడనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్‌ కోచ్‌ రోబ్‌ వాల్టర్‌ అన్నాడు. త్వరలో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో... గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న టామ్‌ లాథమ్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బెవాన్‌ జాక్స్, టిమ్‌ రాబిన్‌సన్‌ టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. జేమ్స్‌ నీషమ్, ఇష్‌ సోధి కూడా జట్టుకు ఎంపికయ్యారు. నాథన్‌ స్మిత్, బ్లెయిర్‌ టిక్నెర్, మార్క్‌ చాప్‌మన్‌లను వన్డే జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టులో మాత్రం చాప్‌మన్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్‌ వన్డే జట్టు: బ్రేస్‌వెల్‌ (కెప్టెన్ ), ఆదిత్య అశోక్, క్రిస్టియన్‌ క్లార్క్, జోష్‌ క్లార్క్‌సన్, డెవాన్‌ కాన్వే, జాక్‌ ఫౌల్క్స్, మిచ్‌ హే, కైల్‌ జేమీసన్, నిక్‌ కెల్లీ, జేడెన్‌ లెనాక్స్, డారిల్‌ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్‌ ఫిలిప్స్, మిచెల్‌ రే, విల్‌ యంగ్‌. న్యూజిలాండ్‌ టి20 జట్టు: సాంట్నర్‌ (కెప్టెన్‌), బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, జాకబ్‌ డఫీ, జాక్‌ ఫౌల్క్స్, హెన్రీ, జేమీసన్, బెవాన్‌ జాకబ్స్, డారిల్‌ మిచెల్, జేమ్స్‌ నీషమ్, గ్లెన్‌ ఫిలిప్స్, రచిన్‌ రవీంద్ర, టిమ్‌ రాబిన్‌సన్, ఇష్‌ సోధి.

Indian captain Rohit Rajpal on Sriram Balaji3
బాలాజీ కీలక ఆటగాడు

న్యూఢిల్లీ: అనుభవజ్ఞుడైన శ్రీరామ్‌ బాలాజీ భారత టెన్నిస్‌లో కీలక ఆటగాడని, తదుపరి డేవిస్‌ కప్‌ ‘టై’ కోసం అతని పేరును తప్పకుండా పరిశీలిస్తామని భారత కెప్టెన్ రోహిత్‌ రాజ్‌పాల్‌ తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడే భారత జట్టుకు డబుల్స్‌ స్పెషలిస్ట్‌ ప్లేయర్‌ బాలాజీ పక్కన బెట్టారు. దీనిపై రాజ్‌పాల్‌ స్పందిస్తూ మేలైన కాంబినేషన్‌లో భాగంగానే అతన్ని పక్కన బెట్టాల్సి వచ్చిందని అన్నాడు. బాలాజీ జట్టు అవసరాల కోసం గతంలో సింగిల్స్‌ కూడా ఆడాడని కెప్టెన్‌ గుర్తు చేశాడు. సీనియర్‌ డబుల్స్‌ ఆటగాడిని తప్పకుండా తదుపరి డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ల కోసం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ‘డబుల్స్‌లో మంచి కాంబినేషన్‌ కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా ‘డ్యూస్‌–కోర్ట్‌’ ప్లేయర్‌ అయితే బాగుంటుందనిపించింది. యూకీ బాంబ్రీ ‘ఆడ్‌–కోర్ట్‌’ ప్లేయర్‌ అందుకే హైదరాబాదీ ఆటగాడు రిచ్చింక్‌ బొల్లిపల్లిని ‘డ్యూస్‌–కోర్ట్‌’ ప్లేయర్‌గా భావించి యూకీకి జతగా ఎంపిక చేశాం’ అని రాజ్‌పాల్‌ వివరణ ఇచ్చాడు. డ్యూస్‌–కోర్ట్‌ అంటే ఆట మొదలయ్యే కోర్ట్‌ కుడివైపున ఉండేది. ఆడ్‌–కోర్ట్‌ అంటే అడ్వాంటేజ్‌ ఎడమ వైపున ఉంటుంది. ఆర్యన్‌ షా అవుట్‌ భారత డేవిస్‌ కప్‌ జట్టులో రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికైన ఆర్యన్‌ షాను తొలగించినట్లు ఆలిండియా టెన్నిస్‌ సంఘం (ఐటా) స్పష్టం చేసింది. ‘నెదర్లాండ్స్‌తో జరిగే డేవిస్‌ పోరుకు అందుబాటులో ఉంటానని ఆర్యన్‌ చెప్పడంతోనే అతని రిజర్వ్‌ ఆటగాడిగా తీసుకున్నాం. కానీ జట్టును ప్రకటించాక తాను ఆ సమయంలో అందుబాటులో ఉండలేనంటూ ఐటాకు లేఖ రాశాడు. ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కానేకాదు’ అని ఐటా ఉన్నతాధికారి ఒకరు ఆర్యన్‌ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సింగిల్స్‌లో 403 ర్యాంకర్‌ ఆర్యన్‌ షా భారత నంబర్‌ వన్‌ సుమిత్‌ నగాల్‌ (277 ర్యాంకు) తర్వాత మేటి ర్యాంక్‌ ప్లేయర్‌. అయితే అతని కన్నా తక్కువ ర్యాంకుల్లో ఉన్న కరణ్‌ (471), దక్షిణేశ్వర్‌ సురేశ్‌ (524) ప్రధాన జట్టుకు ఎంపిక చేసిన తనను మాత్రం రిజర్వ్‌గా ఉంచడంతో తప్పుకున్నాడు.

 Ivory Coast team got off to a good start in the Africa Cup football tournament4
ఐవరీకోస్ట్‌ గెలుపు బోణీ

రబాట్‌ (మొరాకో): ఆఫ్రికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఐవరీకోస్ట్‌ జట్టు శుభారంభం చేసింది. మొజాంబిక్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్‌ 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. ఆట 49వ నిమిషంలో ఎమాద్‌ చేసిన గోల్‌తో ఐవరీకోస్ట్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని ఐవరీకోస్ట్‌ తమ ఖాతాలో మూడు పాయింట్లను వేసుకుంది. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కామెరూన్‌ 1–0 గోల్‌ తేడాతో గాబోన్‌ జట్టును ఓడించింది. ఆట ఆరో నిమిషంలో ఇట్టా ఇయోంగ్‌ గోల్‌ చేసి కామెరూన్‌ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గాబోన్‌ జట్టు స్కోరును సమం చేసేందుకు యత్నించి విఫలమైంది. కామెరూన్‌–గాబోన్‌ మ్యాచ్‌తో ఆరు గ్రూప్‌ల తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్‌ ‘ఎ’లో ఆతిథ్య మొరాకో జట్టు... గ్రూప్‌ ‘బి’లో ఈజిప్‌్ట, దక్షిణాఫ్రికా జట్లు... గ్రూప్‌ ‘సి’లో ట్యునిషియా, నైజీరియా జట్లు... గ్రూప్‌ ‘డి’లో సెనెగల్, డీఆర్‌ కాంగో జట్లు... గ్రూప్‌ ‘ఇ’లో అల్జీరియా, బుర్కినఫాసో జట్లు... గ్రూప్‌ ‘ఎఫ్‌’లో ఐవరీకోస్ట్, కామెరూన్‌ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. నేడు జరిగే గ్రూప్‌ ‘ఎ’ రెండో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో జాంబియాతో కొమోరోస్‌; మొరాకోతో మాలి... గ్రూప్‌ ‘బి’ రెండో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో అంగోలాతో జింబాబ్వే; ఈజిప్ట్‌తో దక్షిణాఫ్రికా తలపడతాయి.

Salaries increased for domestic women cricketers5
దేశవాళీ మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంపు

న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీస్థాయిలో వేతనాలు పెంచింది. క్రికెటర్లతో పాటు మ్యాచ్‌ అఫీషియల్స్‌కు సైతం జీతభత్యాల్ని పెంచింది. ఇప్పుడు చెల్లిస్తున్న దానికి రెట్టింపును మించే విధంగా హెచ్చింపు చేసింది. ఈ మేరకు బోర్డు ఉన్నస్థాయి మండలి అమోదించడంతో పెరిగిన వేతనాల్ని మహిళా క్రికెటర్లు, అఫీషియల్స్‌ ఈ సీజన్‌ నుంచే అందుకోనున్నారు. ఇప్పటివరకు దేశవాళీ టోర్నీలు ఆడే సీనియర్‌ మహిళా క్రికెటర్లకు రోజుకి రూ. 20 వేలు (రిజర్వ్‌ ప్లేయర్లకి రూ. 10 వేలు) చొప్పున చెల్లిస్తున్నారు. తాజా వేతన సవరణతో ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు అందనున్నాయి. అంటే తుది జట్టులో ఆడితే రూ. 50 వేలు, రిజర్వ్‌ బెంచ్‌లో ఉంటే రూ. 25 వేలు ఇస్తారు. జాతీయ టి20 టోర్నీల్లో పాల్గొనే అమ్మాయిలకు మ్యాచ్‌కు రూ. 25 వేల చొప్పున (రిజర్వ్‌ రూ. 12,500) చెల్లించనున్నారు. దీంతో దేశవాళీ టోర్నీలకు సీజన్‌ ఆసాంతం అందుబాటులో ఉండే ఒక్కో సీనియర్‌ క్రికెటర్‌కు ఏడాదికి రూ. 12 లక్షల నుంచి 14 లక్షల చొప్పున వేతన భత్యాలు లభిస్తాయని బోర్డు అధికారులు వెల్లడించారు. జూనియర్లకు ఇలా... జూనియర్‌ మహిళా క్రికెటర్ల పంట కూడా పండింది. అండర్‌–23, అండర్‌–19 వయో విభాగాల టోర్నీలు ఆడే అమ్మాయిలు రోజుకి రూ. 25 వేలు (రిజర్వ్‌ రూ.12,500) చొప్పున పొందుతారు. దేశవాళీ మ్యాచ్‌లకు ఫీల్డ్‌ అంపైర్లు, రిఫరీలు, అఫీషియల్స్‌గా పనిచేసే వారికి రూ. 40 వేలు రోజుకు చెల్లిస్తారు. మ్యాచ్‌ ప్రాధాన్యతను బట్టి ఈ చెల్లింపు మొత్తం కూడా పెరగనుంది. అంటే నాకౌట్, సెమీఫైనల్స్, ఫైనల్‌ దశ మ్యాచ్‌ అధికారులకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తారు. దీనివల్ల రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ఒక్కో అఫీషియల్‌కు రూ. 1 లక్షా 60 వేలు, నాకౌట్‌ దశలో అయితే రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు మ్యాచ్‌ ఫీజుగా అందనుంది.

India plays its third T20 against Sri Lanka today6
సిరీస్‌ విజయంపై గురి

తిరువనంతపురం: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య టి20 సమరం వేదిక మారుతూ తిరువనంతపురానికి చేరింది. తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వగా... ఇప్పుడు తర్వాతి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌ మరో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హర్మన్‌ప్రీత్‌ బృందం ఇక్కడా అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా... ఇక్కడైనా పోటీనిచ్చి సిరీస్‌ను కాపాడుకోవాలని లంక లక్ష్యంగా పెట్టుకుంది. దీప్తి శర్మ పునరాగమనం... శ్రీలంకపై ఆడిన గత 11 టి20ల్లో భారత్‌ 9 గెలిచింది. 2024 జులై తర్వాత మన జట్టుకు ఓటమి ఎదురు కాలేదు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు పదునైన బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌లలో విజయం మన జట్టును వరించింది. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ తమ బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో క్రాంతి గౌడ్, శ్రీచరణి, వైష్ణవి ఆకట్టుకోవడంతో లంక భారీ స్కోర్లు చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 121 పరుగులకే పరిమితమైన జట్టు రెండో టి20లో 128 పరుగులే చేయగలిగింది. రెండో మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దీప్తి శర్మ దూరం కాగా, ఆమె స్థానంలో వచ్చిన స్నేహ్‌ రాణా కూడా 4 ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 1 వికెట్‌ తీసింది. ఇప్పుడు కోలుకున్న దీప్తి మూడో మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. తొలి టి20లో ఫీల్డింగ్‌ పేలవంగా కనిపించినా... దాని నుంచి పాఠాలు నేర్చుకున్న జట్టు గత పోరులో ఆకట్టుకుంది. మూడు రనౌట్లతో ప్రత్యరి్థని పడగొట్టింది. స్మృతి, హర్మన్, రిచాలతో భారత బ్యాటింగ్‌ బలంగా ఉండగా.. పేస్‌ బౌలింగ్‌లో అమన్‌జోత్, అరుంధతి రెడ్డి మరోసారి ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్‌లో కొత్త ప్లేయర్‌ కమలినితో అరంగేట్రం చేయించే అవకాశాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. సమష్టి వైఫల్యం... శ్రీలంక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. బలహీన బ్యాటింగ్‌తో కనిపిస్తున్న జట్టును విజయం దిశగా నడిపించడం కెపె్టన్‌ చమరి అటపట్టుకు కష్టంగా మారింది. కనీసం 150 పరుగులు కూడా చేయకుండా తాము గెలుపు గురించి ఆలోచించలేమని ఆమె వ్యాఖ్యానించింది. జట్టు లైనప్‌లో చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. అటపట్టు రెండో టి20లో ఆకట్టుకోగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ముఖ్యంగా లంక ఎన్నో ఆశలు పెట్టుకొని వరుసగా అవకాశాలు ఇస్తున్న టాపార్డర్‌ బ్యాటర్‌ హాసిని పెరీరా తన సత్తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. 86 అంతర్జాతీయ టి20లు ఆడినా ఆమె కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించలేకపోయింది. అయితే మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో శ్రీలంక గత మ్యాచ్‌లో ఆడిన తుది జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించే అవకాశం ఉంది. విష్మి గుణరత్నే, హర్షిత, కవీషా బ్యాటింగ్‌లో రాణిస్తేనే జట్టుకు అవకాశాలు ఉంటాయి. పిచ్, వాతావరణం ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు పురుషుల టి20 మ్యాచ్‌లు జరగ్గా, ఒక్క మహిళల మ్యాచ్‌ కూడా జరగలేదు. అయితే 2023లో జరిగిన చివరి మ్యాచ్‌ను బట్టి చూస్తే బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌. భారీ స్కోరుకు అవకాశం ఉంది. వర్షసూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అమన్‌జోత్, అరుంధతి, క్రాంతి, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్‌), విష్మి, హాసిని, హర్షిత, నీలాక్షిక, కౌశిని, కవీషా, మల్కి, ఇనోక, కావ్య, శషిణి.

Humpy will be competing in the World Rapid and Blitz Championships7
టైటిల్‌ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...

దోహా: ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు నేడు తెరలేవనుంది. తొలి మూడు రోజులు ర్యాపిడ్‌ విభాగం గేమ్‌లు... ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్‌ విభాగం గేమ్‌లు జరుగుతాయి. మహిళల ర్యాపిడ్‌ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2019, 2024లలో ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన హంపి మూడోసారి ఈ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మహిళల విభాగంలో భారత్‌ నుంచి హంపితోపాటు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, వంతిక, పద్మిని రౌత్, సవితా శ్రీ, నందిత, నూతక్కి ప్రియాంక, ఇషా శర్మ, రక్షిత, పర్ణాలి, చర్వీ పోటీపడుతున్నారు. ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణతోపాటు మరో 25 మంది గ్రాండ్‌మాస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఓపెన్‌ ర్యాపిడ్‌ విభాగంలో 13 రౌండ్లు... మహిళల ర్యాపిడ్‌ విభాగంలో 11 రౌండ్లు నిర్వహిస్తారు. ఓపెన్‌ బ్లిట్జ్‌ విభాగంలో 19 రౌండ్లు... మహిళల బ్లిట్జ్‌ విభాగంలో 15 రౌండ్లు ఉంటాయి. బ్లిట్జ్‌ విభాగంలో నిర్ణీత రౌండ్లు ముగిశాక టాప్‌–4లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ర్యాపిడ్‌ విభాగంలో మాత్రం అత్యధిక పాయింట్లు సాధించిన వారికి టైటిల్‌ లభిస్తుంది. ఓపెన్, మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్‌ విభాగాల విజేతలకు 70 వేల యూరోల (రూ. 74 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.

Surya Charishma in the quarterfinals of the National Senior Badminton Championship8
క్వార్టర్‌ ఫైనల్లో సూర్య చరిష్మా

సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సూర్య చరిష్మా 21–12, 21–9తో సాక్షి ఫొగాట్‌ (రాజస్తాన్‌)పై విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఉన్నతి హుడా (హరియాణా)తో సూర్య చరిష్మా తలపడుతుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఉన్నతి 19–21, 21–14, 21–12తో మేఘన రెడ్డి (తెలంగాణ)పై శ్రమించి గెలిచింది. తన్వీ శర్మ (పంజాబ్‌), రక్షిత శ్రీ (తమిళనాడు), తన్వీ పత్రి (ఒడిశా), ఆకర్షి కశ్యప్‌ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా), శ్రుతి (మహారాష్ట్ర), అనుపమ (ఢిల్లీ) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ ఎం.తరుణ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తరుణ్‌ 21–15, 21–5తో అభినవ్‌ గార్గ్‌ (కర్ణాటక)పై గెలిచాడు.

Srivalli Rashmika reaches quarterfinals in singles category of W35 womens tournament9
క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్‌ క్రీడాకారిణి, ప్రపంచ 481వ ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సింగిల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భారత రెండో ర్యాంకర్‌ రష్మిక 6–1, 6–1తో అరుజాన్‌ (కజకిస్తాన్‌)పై గెలిచింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఫస్ట్‌ సర్వ్‌లో 19 పాయింట్లు, సెకండ్‌ సర్వ్‌లో 7 పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిసర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసిన రష్మిక తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. డబుల్స్‌ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్‌) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–0తో లుండా కుమ్‌హోమ్‌–టానుచపోర్న్‌ యోంగ్‌మోడ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయంపై విజయం సాధించింది.

Khaled Mahmud, Talha storm out over mismanagement10
షాకింగ్‌.. అలిగి ఆటోలో వెళ్లిపోయిన హెడ్‌ కోచ్‌

బంగ్లాదేశ్‌లో ఓ వైపు అల్లర్లు కొనసాగుతుంటే.. మరోవైపు క్రికెట్ అభిమానులను అలరించేందుకు బీపీఎల్ 12వ సీజ‌న్ సిద్ద‌మైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26 శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఆరంభం రోజే రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా సిల్హెట్ టైటాన్స్, రాజ్‌షాహి వారియర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.ఆ త‌ర్వాతి మ్యాచ్‌లో నోఖాలి ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. నోఖాలి ఎక్స్‌ప్రెస్.. బీపీఎల్‌లో చేరిన కొత్త ఫ్రాంచైజీ. ఈ జ‌ట్టుకు ఇదే తొలి సీజ‌న్‌. అయితే నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్.. ఛటోగ్రామ్ రాయల్స్‌తో తమ మొదటి మ్యాచ్‌కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు గురువారం సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెల్ళింది.అలిగిన కోచ్‌లు..అయితే ప్రాక్టీస్ మధ్యలోనే హెడ్ కోచ్ ఖలీద్ మహముద్, అసిస్టెంట్ కోచ్ తల్హా జుబేర్ బయటకు వచ్చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రాక్టీస్ సెషన్‌లో కనీసం సరిపడా క్రికెట్ బంతులు కూడా లేకపోవడంతో వారిద్ద‌రూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ పేస‌ర్ అయిన ఖలీద్ మహముద్ గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఢాకా క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా ప‌నిచేశాడు. అయితే ఈ సీజ‌న్‌లో ఫ్రాంచైజీ నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్‌తో జ‌త క‌ట్టాడు.కానీ అత‌డికి ఆరంభంలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. ప్రాక్టీస్‌కు జ‌ట్టుతో పాటు వెళ్లిన ఖలీద్ మహముద్‌తో బీసీబీ అధికారి ఒక‌రు దురుసుగా ప్రవర్తించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఖలీద్,జుబేర్ ఇద్ద‌రూ స్టేడియం బ‌య‌ట‌కు వ‌చ్చి ఆటోలో వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా జుబేర్ మీడియాతో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఎన్నో బీపీఎల్ సీజ‌న్ల‌ను చూశాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప‌రిస్ధితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మిగతా వారు గురుంచి నాకు అన‌వ‌స‌రం. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేను కొనసాగలేను పేర్కొన్నారు.అదేవిధంగా హెడ్ కోచ్ ఖలీద్ మహముద్ స్పందిస్తూ.. నేను బీపీఎల్ నుంచి వైదొల‌గాల‌నుకుంటున్నాను. ఇటువంటి ప‌రిస్థితి ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని గంటల తర్వాత మహమూద్, జుబేర్ తిరిగి మైదానంకు వ‌చ్చారు.ఇద్దరి సన్నిహితుడు ఒక‌రు జోక్యంతో వారు మ‌న‌సు మార్చుకున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మ‌రోషాక్ త‌గిలింది. ఛటోగ్రామ్ రాయల్స్ జట్టు యాజ‌మాన్యం టోర్నీ ఆరంభానికి ముందు తప్పుకొంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆ ఫ్రాంచైజీ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్‌..

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement