Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

The first innings of both teams have ended on the first day of the Boxing Day Test1
మీ వెంటే మేము...

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ‘యాషెస్‌’ సిరీస్‌ నాలుగో టెస్టులో బౌలర్ల జోరు కొనసాగుతోంది. పచ్చికతో కూడిన పిచ్‌పై ఆట తొలి రోజే 20 వికెట్లు నేలకూలి రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన పోరులో... ఇరు జట్ల బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆడిన తొలి మూడు టెస్టుల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెసెర్‌ (49 బంతుల్లో 35; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... ఉస్మాన్‌ ఖ్వాజా (29), అలెక్స్‌ కేరీ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు పడగొట్టగా... అట్కిన్సన్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ కూడా ప్రత్యర్థి పేస్‌కు దాసోహమైంది. 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పోరాడగా... అట్కిన్సన్‌ (28), కెపె్టన్‌ బెన్‌ స్టోక్స్‌ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో నెసెర్‌ 4 వికెట్లు పడగొట్టగా... బోలాండ్‌ 3, స్టార్క్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్‌లో వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. స్కాట్‌ బోలాండ్‌ (4 బ్యాటింగ్‌), ట్రావిస్‌ హెడ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా... ఓవరాల్‌గా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకరి వెంట ఒకరు... గత మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆ్రస్టేలియాకు... ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ట్రావిస్‌ హెడ్‌ (12), జేక్‌ వెదరాల్డ్‌ (10) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లబుషేన్‌ (6) విఫలం కాగా... కెపె్టన్‌ స్టీవ్‌ స్మిత్‌ (31 బంతుల్లో 9) క్రీజులో నిలిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్‌ 51 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఖ్వాజా, కేరీ కాస్త ప్రతిఘటన కనబర్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పిచ్‌ నుంచి లభిస్తున్న సహకారాన్ని వినియోగించుకున్న ఇంగ్లండ్‌ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ... కంగారూలపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఐపీఎల్‌ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కామెరాన్‌ గ్రీన్‌ (17) కూడా ప్రభావం చూపలేకపోగా... ఆఖర్లో నెసెర్‌ ధాటిగా ఆడాడు. గ్రీన్, నేసెర్‌ ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఆసీస్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ పేసర్‌ జోష్‌ టంగ్‌ కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు (5/45) నమోదు చేసుకున్నాడు. తీరు మారని ఇంగ్లండ్‌... చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్‌లో తొలిసారి ఆధిపత్యం కనబర్చే అవకాశాన్ని ఇంగ్లండ్‌ వినియోగించుకోలేకపోయింది. జాక్‌ క్రాలీ (5), బెన్‌ డకెట్‌ (2), జాకబ్‌ బెథెల్‌ (1), జో రూట్‌ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌ బాట పట్టడంతో ఇంగ్లండ్‌ జట్టు 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో డకెట్‌ను అవుట్‌ చేసిన స్టార్క్‌... తన తదుపరి ఓవర్‌లో క్రాలీని బుట్టులో వేసుకున్నాడు. ఈ మధ్య డకెట్‌ను నెసెర్‌ అవుట్‌ చేయగా... 15 బంతులాడి ఖాతా తెరవలేకపోయిన రూట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్‌ కౌంటర్‌ ఎటాక్‌కు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు. కెపె్టన్‌ స్టోక్స్‌తో కలిసి చక్కటి షాట్‌లతో ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో బ్రూక్‌ వికెట్ల ముందు దొరికిపోగా... తక్కినవాళ్లు అతడిని అనుసరించారు. ఆఖర్లో అట్కిన్సన్‌ కొన్ని షాట్స్‌ ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. దీంతో ఆసీస్‌కు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 94,199 ఈ మ్యాచ్‌కు తొలి రోజు ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇదే అత్యధికం. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ మధ్య 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు 93,013 మంది హాజరయ్యారు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 3468 టెస్టు క్రికెట్‌లో 3000 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు హ్యారీ బ్రూక్‌కు అవసరమైన బంతులు. ఆ్రస్టేలియా మాజీ ప్లేయర్‌ గిల్‌క్రిస్ట్‌ 3610 బంతుల్లో ఈ మార్క్‌ అందుకున్నాడు. 4 మెల్‌బోర్న్‌ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో తొలి రోజే 20 అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూలడం ఇది నాలుగోసారి. 1894లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్‌ టెస్టు తొలి రోజు 20 వికెట్లు... 1902లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్‌ టెస్టు తొలి రోజు 25 వికెట్లు...1932లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టెస్టు తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి.

Andhra beat Railways by 6 wickets in Vijay Hazare Trophy2
ఆంధ్ర గెలుపు బోణీ

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆంధ్ర జట్టు... రెండో పోరులో గెలుపుబాట పట్టింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో రైల్వేస్‌ను ఓడించింది. మొదట రైల్వేస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్‌ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్ష్ యాదవ్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, కలిదిండి రాజు చెరో 3 వికెట్లు పడగొట్టగా... హేమంత్‌ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్‌ (74 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. మారంరెడ్డి హేమంత్‌ రెడ్డి (35 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షేక్‌ రషీద్‌ (53 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్‌ హెబ్బర్‌ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు), శ్రీకర్‌ భరత్‌ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన హేమంత్‌ రెడ్డికి ‘ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సోమవారం జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఒడిశా జట్టుతో ఆంధ్ర తలపడుతుంది. మళ్లీ ఓడిన హైదరాబాద్‌రాజ్‌కోట్‌: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధ్రువ్‌ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో ధ్రువ్‌కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్‌ జగదీశన్‌ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్‌ సమం చేశాడు. అమన్‌ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశ్‌ రాథోడ్‌ (68; 6 ఫోర్లు), సమర్థ్‌ (63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ గౌడ్‌ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... అభిరథ్‌ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్‌ రాహుల్‌ సింగ్‌ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.

Uttar Pradesh register huge win over Chandigarh in Vijay Hazare ODI tournament3
రఫ్ఫాడించిన రింకూ సింగ్‌

రాజ్‌కోట్‌: భారత ఆటగాడు రింకూ సింగ్‌ (60 బంతుల్లో 106 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్‌... మిడిలార్డర్‌లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్‌ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్‌ను చిత్తు చేసింది. మొదట ఉత్తర ప్రదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆర్యన్‌ జుయల్‌ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్‌ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్‌ జురేల్‌ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్‌ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్‌ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో జీషాన్‌ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూ కశీ్మర్‌ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయాలు సాధించాయి. కరుణ్‌ నాయర్, పడిక్కల్‌ సెంచరీలు భారత ఆటగాళ్లు కరుణ్‌ నాయర్‌ (130 బంతుల్లో 130 నాటౌట్‌; 14 ఫోర్లు), దేవదత్‌ పడిక్కల్‌ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్‌ అజహారుద్దీన్‌ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బాబా అపరాజిత్‌ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కరుణ్‌ నాయర్, దేవదత్‌ పడిక్కల్‌ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్‌ 73 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి. అన్‌మోల్, హర్‌నూర్‌ శతకాలు ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో పంజాబ్‌ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గింది. మొదట ఛత్తీస్‌గఢ్‌ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్‌దీప్‌ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్‌ 42.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌’ హర్‌నూర్‌ సింగ్‌ (114 బంతుల్లో 115 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (96 బంతుల్లో 105 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై విజయాలు సాధించాయి. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. ప్లేట్‌ గ్రూప్‌లో బిహార్‌ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్‌పై నెగ్గింది. బిహార్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేదు.

Surya Charishma reaches semifinals in womens singles4
సూర్య చరిష్మా సంచలనం

సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి తమరి సూర్య చరిష్మా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సూర్య చరిష్మా 21–12, 21–15తో టాప్‌ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్‌ ఉన్నతి హుడా (హరియాణా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తొలి గేమ్‌లో ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 10–8 వద్ద సూర్య చరిష్మా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15–8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఆంధ్ర షట్లర్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్‌ చేరే క్రమంలో సూర్య చరిష్మా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో రక్షిత శ్రీ (తమిళనాడు)తో ఆమె ఆడుతుంది.ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో రక్షిత శ్రీ 16–21, 21–14, 21–18తో తన్వీ శర్మ (పంజాబ్‌)పై, తన్వీ పత్రి (ఒడిశా) 21–16, 12–21, 22–20తో ఆకర్షి కశ్యప్‌ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)పై, శ్రుతి ముందాడ (మహారాష్ట్ర) 22–20, 21–12తో రెండో సీడ్‌ అనుపమ (ఢిల్లీ)పై గెలిచారు. తరుణ్‌ జోరు పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్‌ తరుణ్‌ మన్నేపల్లి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మన్‌రాజ్‌ సింగ్‌ (హరియాణా)తో 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్‌ తరుణ్‌ 21–13, 22–20తో గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో భరత్‌ రాఘవ్‌ (హరియాణా)తో తరుణ్‌ ఆడతాడు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ కిరణ్‌ జార్జి (కేరళ) 21–18, 21–18తో రౌనక్‌ చౌహాన్‌ (ఛత్తీస్‌గఢ్‌)పై, రితి్వక్‌ సంజీవి (తమిళనాడు) 21–13, 22–20తో సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ (తమిళనాడు)పై, భరత్‌ రాఘవ్‌ 21–17, 21–13తో జిన్‌పాల్‌ సోనా (ఢిల్లీ)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో కలగోట్ల వెన్నెల (తెలంగాణ)–రేíÙక (తమిళనాడు) జోడీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాతి్వక్‌ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్‌) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.

India win by 8 wickets in the third T205
రేణుక నిప్పులు షఫాలీ మెరుపులు

121/6... 128/9... 112/7... ఇప్పటివరకు జరిగిన మూడు టి20ల్లోనూ శ్రీలంక మహిళల జట్టు స్కోర్లివి... భారత బౌలింగ్‌ ప్రతాపానికి మచ్చుతునకలు. ప్రతీ మ్యాచ్‌లోనూ మనమ్మాయిలు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. దీంతో 20 ఓవర్ల కోటా పూర్తి చేసినా... ఆలౌట్‌ కాకపోయినా కూడా కనీసం 130 పరుగులైనా చేయకుండా శ్రీలంకనుతమ బౌలింగ్‌ బంధనాలతో కట్టడి చేస్తున్నారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ బృందం రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3–0తో వశం చేసుకుంది. తిరువనంతపురం: భారత్, శ్రీలంకల మధ్య ఈ వేదికపై ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆడిన తొలి (మూడో టి20) మ్యాచ్‌తోనే భారత మహిళల జట్టు ఐదు టి20ల సిరీస్‌ను 3–0తో కైవసం చేసుకుంది. భారత పేసర్‌ రేణుక సింగ్‌ (4/21), సీనియర్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ (3/18) కోలుకోలేని దెబ్బతీయడంతో... మొదట శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేసింది. ఆతిథ్య బౌలింగ్‌ ధాటికి సింహళ బ్యాటర్లలో ఏ ఒక్కరు కనీసం 30 పరుగులైనా చేయలేకపోయారు. ఇమిషా దులానీ (32 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్‌! అనంతరం సులువైన లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్‌ సేన 13.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (42 బంతుల్లో 79 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించింది. ఆమె దూకుడు వల్లే ఇంకా 6.4 ఓవర్లకు ముందే భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంది. ఇదే వేదికపై రేపు నాలుగో టి20 మ్యాచ్‌ జరుగుతుంది. షఫాలీ మళ్లీ ధనాధన్‌ ‘షో’ తొలుత లంక ఇన్నింగ్స్‌ రేణుక, దీప్తి చావుదెబ్బ తీశారు. దీంతో 45/4 స్కోరు వద్దే ప్రధాన బ్యాటింగ్‌ బలగాన్ని కోల్పోయింది. హాసిని (25), మిడిలార్డర్‌లో కవిషా దిల్హరి (20), కౌషిని (19) చేసిన పరుగులతో కష్టంగా జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత గత మ్యాచ్‌ల కంటే తక్కువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టులో షఫాలీ వర్మ మళ్లీ ధనాధన్‌ షో రెచ్చిపోయింది. చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకుంది. దీంతో స్మృతి మంధాన (1), జెమీమా (9)లు సింగిల్‌ డిజిట్‌లకు అవుటైనా... రవ్వంత ప్రభావం లేకుండానే లక్ష్యంవైపు భారత్‌ నడించింది. హర్మన్‌ప్రీత్‌ (21 నాటౌట్‌; 2 ఫోర్లు), షఫాలీ అబేధ్యమైన మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్‌: హాసిని (సి) దీప్తి శర్మ (బి) రేణుక 25; చమరి (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తిశర్మ 3; హర్షిత (సి అండ్‌ బి) రేణుక 2; ఇమిషా దులానీ (సి) జెమీమా (బి) రేణుక 27; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 4; కవీషా (సి) అమన్‌జోత్‌ (బి) దీప్తిశర్మ 20; కౌషని (నాటౌట్‌) 19; శేషని (బి) దీప్తిశర్మ 5; మాల్కి మదర (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–32, 4–45, 5–85, 6–90, 7–98. బౌలింగ్‌: రేణుక 4–1–21–4, క్రాంతి 4–0–22–0, దీప్తిశర్మ 4–0– 18–3, వైష్ణవి 3–0–14–0, అమన్‌జోత్‌ 4–0– 23–0, శ్రీచరణి 1–0–11–0. భారత ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (నాటౌట్‌) 79; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) కవిషా 1; జెమీమా (బి) కవిషా 9; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.2 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–27, 2–67. బౌలింగ్‌: శేహాని 2.2–0–28–0, మాల్కి మదర 2–0–11–0, నిమష మీపగె 2–0–29–0, కవిషా దిల్హరి 3–0–18–2, ఇనోక 4–0–28–0.151 అంతర్జాతీయ మహిళల టి20ల్లో దీప్తి శర్మ తీసిన వికెట్లు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మేగన్‌ షుట్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును దీప్తి సమం చేసింది.

India Women beat Sri Lanka Women by 8 wkts in 3rd T20I6
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్‌ ఘన విజయం

తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్‌ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(21) రాణించింది. అయితే స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్‌(9) మాత్రం విఫలమయ్యారు.అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 112 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భారత పేసర్‌ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి లంక టాపార్డ‌ర్‌ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఇమేషా దులాని 27 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫ‌ర్వాలేద‌న్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్‌ 28న జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Virat Kohli Creates History, Breaks MASSIVE World Record With 77 Vs Gujarat In Vijay Hazare Trophy7
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్‌, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్‌-ఎ కెరీర్‌లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే1. విరాట్ కోహ్లి (భారత్‌): 57.87- 16,207 పరుగులు2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు4. ఛతేశ్వర్ పుజారా (భారత్‌): 57.01-5759 పరుగులు5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్‌): 56.68- 4648 పరుగులుఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(70) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌ బౌలర్లలో విశాల్‌ జైశ్వాల్‌ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్‌ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్‌ బ్యాటర్లలో ఆర్య దేశాయ్‌(57) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సౌరవ్‌ చౌహన్‌(49), ఉర్విల్‌ పటేల్‌(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్‌ మూడు, ఇషాంత్‌ శర్మ, అర్పిత్‌ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్‌ సెంచరీతో సత్తాచాటిన విరాట్‌ కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

India Womens need 113 small target to win in 3rd T20I8
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే?

తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 112 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇండియ‌న్ పేస‌ర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి లంక టాపార్డ‌ర్‌ను దెబ్బ‌కొట్టింది.ఆమెతో పాటు స్పిన్నర్ దీప్తీ శ‌ర్మ కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప‌ర్యాట‌క జ‌ట్టును నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితం చేసింది. అయితే మిగితా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన‌ప్ప‌టికి వికెట్ మాత్రం సాధించ‌లేక‌పోయారు. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఇమేషా దులాని 27 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫ‌ర్వాలేద‌న్పించారు.కెప్టెన్ ఆత‌ప‌ట్టు కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచింది. అయితే భార‌త బ్యాట‌ర్లు ఉన్న జోరు ముందు ఈ స్ప‌ల్ప ల‌క్ష్యాన్ని లంక బౌల‌ర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇప్ప‌టికే తొలి రెండు టీ20ల్లో విజ‌యం సాధించిన భార‌త్‌.. మూడో మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే భార‌త్‌ మ‌రో రెండు టీ20ల మిగిలూండ‌గానే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(వికెట్ కీప‌ర్‌), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి

Tim David suffers hamstring injury scare during BBL9
ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. ఇక కష్టమే?

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్ ) గాయం బారిన పడ్డాడు. బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా డేవిడ్(హోబర్ట్ హరికేన్స్) తొడ కండరాలు పట్టేశాయి.151 పరుగుల లక్ష్య చేధనలో హోబర్ట్ హరికేన్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 41 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న సమయంలో అతడు అనుహ్యంగా గాయపడ్డాడు.సింగిల్ తీసే క్రమంలో అతడి కుడి తొడ వెనుక కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, నొప్పితోనే డేవిడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రమైనది అనిపిస్తోంది. స్కాన్ రిపోర్ట్‌ల తర్వాత అతడి గాయం తీవ్రత తేలనుంది. ఏదేమైనప్పటికి డేవిడ్ వంటి కీలక ఆటగాడు ప్రపంచకప్‌నకు ముందు గాయపడటం ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రత గ్రేడ్‌-1గా ఉంటే కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పడుతోంది. అదే గ్రేడ్‌-2 అయితే రెండు నుంచి మూడు నెలలు.. గ్రేడ్ 3 అయితే 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.డేవిడ్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్‌-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఐపీఎల్ వద్దంది.. క‌ట్ చేస్తే! అక్క‌డ చుక్క‌లు చూపిస్తున్నాడు

India tops global doping list for third consecutive year10
డోపింగ్‌ టెస్టుల్లో ఇండియా అథ్లెట్స్ ముందంజ..!

భారతదేశంలో డోపింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బహుమతులు అందుకునే దేశాల జాబితాలో ముందుండాల్సిన మన దేశం ఇప్పుడు డోపింగ్ కు పాల్పడుతూ దొరికిపోయిన దేశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఎవరో తెలుసా..? ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) The World Anti-Doping Agency.. అవును ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2023 పరీక్ష డేటాలో, 5వేలకుపైగా నమూనాలను విశ్లేషించిన దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడం మనకు అవమానకరమే. అయితే, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ చేసిన అభ్యంతరాలను గుర్తించి వెంటనే ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని, దీని కోసం సవరించిన డోపింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెడతామని భారత క్రీడా మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. నిషేధిత పదార్థాలకు సంబంధించి భారతదేశ సానుకూల రేటు 3.8 శాతం ఉంది. 5,606 నమూనాల్లో 214 ప్రతికూల ఫలితాలు కనుగొన్నారు. 2022లో 3,865 పరీక్షలు నిర్వహించగా 3.2 శాతం ప్రతికూల ఫలితాలు నమోదయ్యాయి.సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి..2024లో భారత దేశంలోని అథ్లెట్లు డోపింగ్ సంబంధిత కార్యకలాపాలలో రికార్డు స్థాయిలో 260 మంది పాల్గొన్నారని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అంటే World Anti-Doping Agency (వాడా) వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో భారత అథ్లెట్లు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. డోపింగ్ ఉల్లంఘనలలో భాగంగా తాజా నివేదిక ప్రకారం.. భారతదేశం వరుసగా మూడవసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణమైన డోపింగ్ అఫెండర్ లిస్ట్ లో చేరింది.2030లో కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఎడిషన్‌ను నిర్వహించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ కోసం దూకుడుగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. జూలైలో స్విస్ నగరం లౌసాన్‌లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం ఒలింపిక్ అండ్ పారాలింపిక్ క్రీడలను నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఇంటర్ నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ డోపింగ్ వ్యవహారం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది ఇలా ఉండగా ఢిల్లీ ప్రధాన కార్యాలయం కలిగిన నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ గత సంవత్సరం 7,113 పరీక్షలను నిర్వహించింది, ఇందులో 6,576 మూత్ర నమూనాలు, 537 రక్త నమూనాలు ఉన్నాయి. వీటిలో, 253 మూత్ర నమూనాల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు, అయితే ఏడు రక్త నమూనాలు డోప్ పరీక్షలో విఫలమయ్యాయి.2023లో సేకరించిన 5,606 నమూనాల్లో మొత్తం 213 కేసులు డోప్ పాజిటివ్‌గా వచ్చాయి, తాజా గణాంకాలు యాంటీ డోపింగ్ వాచ్‌డాగ్ మరింత దూకుడు పరీక్షా విధానాన్ని ప్రతిబింబిస్తాయని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ నొక్కి చెప్పింది. అయితే, అనేక ప్రముఖ క్రీడా దేశాలు మరింత విస్తృతమైన పరీక్షలు చేసినప్పటికీ తక్కువ శాతం డోపింగ్ కు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫ్రాన్స్ 11,744 నమూనాలను పరీక్షించగా, 91 డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలింది. ఇది 0.8 శాతం పాజిటివిటీ రేటు. 2021 వరకు ప్రపంచ డోపింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రష్యా, 10,514 నమూనాల్లో 76 నమూనాలతో 0.7 శాతం రేటును నమోదు చేసింది. చైనా కేవలం 43 డోపింగ్ వైఫల్యాలతో, 24,214 నమూనాల నుంచి అతి తక్కువగా 0.2 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది. అమెరికా డోపింగ్ నిరోధక సంస్థ భారతదేశం కంటే తక్కువ సంఖ్యలో, మొత్తం 6592 పరీక్షలు నిర్వహించి, 1.1 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది.డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో..?ఈ నివేదిక భారత క్రీడా సంస్కృతిలో డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో వెల్లడిస్తోంది. అంతేకాదు మన దేశంలో పటిష్టమైన శాస్త్రీయ, పరిశోధన వ్యవస్థ ఉండవలసిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పింది. వివిధ క్రీడా విభాగాల జట్లతో అనుబంధం ఉన్న భారతీయ కోచ్‌లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు పనితీరును మెరుగుపరిచే సప్లిమెంట్లు, మందుల వాడకంపై ప్రాథమిక జ్ఞానం లేదని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిస్థితి ఆందోళన కలిగించేదిగా కనిపిస్తున్నప్పటికీ, డోపింగ్ ప్రాబల్యం పెరిగిందనే భావన సరైనది కాదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ స్పష్టం చేసింది. బలమైన పరీక్షా విధానాలు, కఠినమైన గుర్తింపు యంత్రాంగాలను మరింత పటిష్టం చేయడం వల్లే ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయని నాడా ఒక ప్రకటనలో పేర్కొంది. అధిక పాజిటివిటీ రేటు కొనసాగడానికి ఇదే ప్రధాన కారణమని వివరించింది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ.2025లో ఇప్పటివరకు నాడా మొత్తం 7,068 డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 110 మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో పాజిటివిటీ రేటు 1.5 శాతంగా నమోదైందని తెలిపింది. డోపింగ్ ముప్పును ఎదుర్కొనే దిశగా భారత ఒలింపిక్ సంఘం తాజాగా కొత్త డోపింగ్ నిరోధక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో క్రీడల్లో అత్యున్నత స్థాయి సమగ్రతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ డోపింగ్ నిరోధక బిల్లును కూడా ఆమోదించడం గమనార్హం. కల్తీ సప్లిమెంట్ల సమస్యను పరిష్కరించడానికి, నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికైనా తగిన పరిష్కారాల ద్వారా ఇండియా అథ్లెట్స్ మరొకసారి నిషిద్ధ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని మన దేశ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -పసుపులేటి.వెంకటేశ్వరరావు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement