Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Max Verstappen wins Las Vegas Grand Prix title1
లక్కీ వెర్‌స్టాపెన్‌

లాస్‌ వేగస్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2025 సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ సీజన్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయి డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో వెనుకబడిన ఈ నెదర్లాండ్స్‌ డ్రైవర్‌... ద్వితీయార్థంలో అదరగొడుతున్నాడు. తాజాగా లాస్‌ వేగస్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అతడికిది ఆరో విజయం కావడం విశేషం. మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్‌ పియాస్ట్రి అనర్హతకు గురవడంతో... డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ రేసులో దూసుకొచ్చాడు. సీజన్‌లో మరో రెండు రేసులు మాత్రమే మిగిలుండగా... చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకునేదెవరనేది ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌ 50 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 21 నిమిషాల 8.429 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రిని వెర్‌స్టాపెన్‌ సమం చేశాడు. గతేడాది ఈ రేసు ద్వారానే నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెర్‌స్టాపెన్‌... మరోసారి ఈ రేసు ద్వారానే పోటీలోకి వచ్చాడు. తొలి మలుపులోనే... రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌... తొలి మలుపులోనే రేసుపై పట్టు సాధించాడు. నోరిస్‌ వాయువేగంతో దూసుకెళ్తున్నా... వెర్‌స్టాపెన్‌ నిలకడగా ప్రయత్నిస్తూ అతడిని అధిగమించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని వెర్‌స్టాపెన్‌... చివరి వరకు అదే జోరు కొనసాగిస్తూ కెరీర్‌లో 69వ విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వెర్‌స్టాపెన్‌ ఫాస్టెస్ట్‌ ల్యాప్‌ను సైతం తన పేరిట లిఖించుకున్నాడు. నోరిస్‌ రెండో స్థానంతో రేసును ముగించినా... అతడిపై అనర్హత వేటు పడటంతో మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ (1 గంట 21 నిమిషాల 31.975 సెకన్లు)కు ద్వితీయ స్థానం దక్కింది. మెర్సిడెస్‌కే చెందిన కిమీ ఆంటొనెల్లి (1 గంట 21 నిమిషాల 38.917 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 21 నిమిషాల 39.107 సెకన్లు; ఫెరారీ), కార్లోస్‌ సెయింజ్‌ (1 గంట 21 నిమిషాల 43.353 సెకన్లు; విలియమ్స్‌ రేసింగ్‌) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 22 నిమిషాల 7.798 సెకన్లు; ఫెరారీ) ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆ ఇద్దరిపై అనర్హత వేటు ఎందుకంటే... ఈ ఏడాది డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ సాధించాలని కలలు కంటున్న మెక్‌లారెన్‌ డ్రైవర్లకు షాక్‌ తగిలింది. రేసులో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఆ జట్టుకు చెందిన నోరిస్‌ (2వ స్థానం), పియాస్ట్రి (4వ స్థానం)పై అనర్హత వేటు పడింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రధాన రేసు అనంతరం తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటారనుకుంటే... సాంకేతిక కారణాల వల్ల ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నోరిస్‌ కారు ప్లాంక్‌ పరికరాల మందం... అనుమతించిన కనీస మందం కంటే తక్కువగా ఉండటంతో అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే కారణంగా పియా్రస్టిపై కూడా వేటు పడింది. నిబంధనల ప్రకారం దాని కనీస మందం 9 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉంది. అయితే పియాస్ట్రి నడిపిన కారు ఎల్‌హెచ్‌ఎస్‌ ముందు భాగం 8.96 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్‌ఎస్‌ ముందు భాగం 8.74 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్‌ఎస్‌ వెనుక భాగం 8.90 మిల్లీమిటర్లుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నోరిస్‌ కారు కూడా 9 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు. తయారీ సమయంలో అత్యధికంగా 0.001 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ తేడా ఉండదని... కానీ, రేసు అనంతరం ఈ ఇద్దరి కార్లు పరిశీలించగా... అవి నిబంధనలకు లోబడి లేవని నిర్వాహకులు తేల్చారు. దీంతో నోరిస్, పియా్రస్టిపై అనర్హత వేటు విధించారు. టైటిల్‌ రేసు రసవత్తరం 24 రేసుల తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 22 రేసులు ముగిశాయి. అందులో మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్‌ పియాస్ట్రి చెరో ఏడు రేసుల్లో విజయాలు సాధించగా... వెర్‌స్టాపెన్‌ ఆరు టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే పాయింట్ల పరంగా చూసుకుంటే నోరిస్‌ 390 పాయింట్లతో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో అగ్రస్థానంలో ఉండగా... పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌ చెరో 366 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. ‘టాప్‌’లో ఉన్న నోరిస్‌కు... వెర్‌స్టాపెన్‌కు మధ్య 24 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉన్నాయి. గరిష్టంగా 50 పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి రెండు రేసుల్లో నోరిస్‌ టాప్‌–10లో నిలవకుండా... వెర్‌స్టాపెన్‌ టైటిల్‌ గెలిస్తే వరుసగా ఐదో ఏడాది అతని ఖాతాలో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ అతడికే దక్కుతుంది. సీజన్‌లోని తదుపరి రెండు రేసులు వరుసగా ఈ నెల 30న ఖతర్‌ గ్రాండ్‌ప్రి... డిసెంబర్‌ 7న అబుదాబి గ్రాండ్‌ప్రి జరుగుతాయి.

Ireland lose second Test2
బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌

మిర్పూర్‌: బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను బ్లంగాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 217 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. 509 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 176/6తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ చివరకు 113.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. కర్టీస్‌ కాంపెర్‌ (259 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి చక్కటి పోరాటంతో బంగ్లాదేశ్‌ను విసిగించాడు. ఆఖరి రోజు దాదాపు 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన అతడు మ్యాచ్‌ను కాపాడలేకపోయినా... తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌ నీల్‌ (46 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి 85 బంతుల్లో 48 పరుగులు జోడించిన కాంపెర్‌... ఆ తర్వాత పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచి్చన గవిన్‌ హోయ్‌ (104 బంతుల్లో 37; 4 ఫోర్లు)తో సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ జోడీ 9వ వికెట్‌కు 191 బంతులాడి 54 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు ఎంతగా పరీక్షిస్తున్నా ఈ జంట సహనం కోల్పోలేదు. దీంతో ఐర్లాండ్‌ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునేలా కనిపించినా... హసన్‌ మురాద్‌ వరుస బంతుల్లో గవిన్, మాథ్యూ (0)ను అవుట్‌ చేసి ఐర్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్, హసన్‌ మురాద్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేయగా... ఐర్లాండ్‌ 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బంగ్లా 297/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెరీర్‌లో వందో టెస్టులో సెంచరీతో మెరిసిన ముష్ఫికర్‌ రహీమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, తైజుల్‌ ఇస్లామ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

Indian team off to a good start in Sultan Azlan Shah Cup hockey tournament3
భారత్‌ శుభారంభం

కౌలాంపూర్‌: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి పోరులో ఐదుసార్లు చాంపియన్‌ భారత జట్టు 1–0 గోల్స్‌ తేడాతో మూడు సార్లు చాంపియన్‌ దక్షిణ కొరియాను చిత్తుచేసింది. భారత్‌ తరఫున మొహమ్మద్‌ రాహీల్‌ (15వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించాడు. ఆరేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో ఆడిన భారత జట్టు... ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. 2019లో చివరిసారిగా ఈ టోర్నమెంట్‌లో ఆడిన టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు ఫైనల్లో ఓడిన కొరియాపైనే గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. దిల్‌ప్రీత్‌ సింగ్‌ చక్కటి పాస్‌తో రాహీల్‌కు గోల్‌ చేసే అవకాశం దక్కగా... మ్యాచ్‌ ఆసాంతం మనవాళ్ల పైచేయి సాగింది. మ్యాచ్‌ 27వ నిమిషంలో కొరియా జట్టుకు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోయింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ నిర్ణీత సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు జరిగిన ఇతర రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్, మలేసియా జట్ల మధ్య మ్యాచ్‌ 2–2 గోల్స్‌తో సమం కాగా... బెల్జియం, కెనడా జట్ల మధ్య పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. తదుపరి పోరులో సోమవారం బెల్జియంతో భారత జట్టు తలపడనుంది. మొత్తం ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్‌లో రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఒక్కో జట్టు మిగిలిన ఐదు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది.

South Africa dominate in second Test4
బ్యాటర్లదే ఇక భారం

సఫారీతో ఆడుతోంది భారతగడ్డపైనే అయినా సవాల్‌ మాత్రం భారత్‌కే ఎదురవుతోంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌ అదిరింది... కానీ బ్యాటింగ్‌ కుదరక, చిన్న లక్ష్యాన్ని సైతం చేధించలేక శుభారంభం చెదిరింది. ఈ రెండో టెస్టులో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాల్సిన మన పేస్‌ బేల చూపులు చూసింది. తిప్పేయాల్సిన స్పిన్‌ తెల్లమొహమేసింది. వెరసి దక్షిణాఫ్రికా భారీ స్కోరే చేసింది. ఇప్పుడు భారమంతా భారత బ్యాటర్లపైనే పడింది. గువాహటి: రెండో టెస్టులో దక్షిణాఫ్రికా దంచేసింది. ఈ రెండు రోజులూ సఫారీదే పైచేయి! భారత బౌలింగ్‌ భారత గడ్డపై ఎంతలా భంగపడిందంటే... ఏడో వరుస బ్యాటింగ్‌కు దిగిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సేనురాన్‌ ముత్తుసామి (206 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక్కొట్టగా... తొమ్మిదో వరుస పేస్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ (91 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ మిస్‌ చేసుకున్నా... వన్డే తరహా ధాటిని కనబరిచాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 151.1 ఓవర్లలో 489 పరుగుల భారీస్కోరు వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. బుమ్రా, సిరాజ్, జడేజా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 6.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (7 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇంకా 480 పరుగుల సుదూరంలోనే ఆతిథ్య జట్టు ఉంది. తొలి సెషన్‌లో ఫిఫ్టీ, రెండో సెషన్‌లో శతక్కొట్టి... సఫారీ ఓవర్‌నైట్‌ స్కోరు 247/6. అంటే స్పెషలిస్టు బ్యాటర్లంతా అవుటయ్యారు. ఇక మిగిలిందల్లా బౌలింగ్‌ ఆల్‌రౌండర్లే. వీరిని మన స్పిన్‌ త్రయం, పేస్‌ త్రయం తేలిగ్గా పడేస్తుందనుకుంటే ఓవర్‌నైట్‌ బ్యాటర్లు ముత్తుసామి, వెరీన్‌ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. దీంతో తొలిసెషన్‌లో ఆరుగురి ఆతిథ్య బౌలర్ల శ్రమ ఏమాత్రం ఫలించనేలేదు. ముత్తుసామి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... వెరీన్‌ ఆ దిశగా కదిలాడు. జట్టు స్కోరు 316/6 వద్ద టీ విరామానికెళ్లారు. ఎట్టకేలకు తొలిసెషన్‌లో లభించని సాఫల్యం రెండో సెషన్‌లో దక్కింది. వెరీన్‌ (45; 5 ఫోర్లు)ను జడేజా అవుట్‌ చేయడంతో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ఈ వికెట్‌ ఆనందం ఆలౌట్‌కు తీసుకెళ్లలేదు. యాన్సెన్‌ రాకాతో అంతలోనే ఆవిరైంది. ఈ క్రమంలో ముత్తుసామి శతకం, యాన్సెన్‌ అర్ధశతకం పూర్తయ్యాయి. 428/7 వద్ద లంచ్‌ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్‌ ఆరంభంలో ముత్తుసామి అవుటైనప్పటికీ హార్మర్‌ (5), కేశవ్‌ మహారాజ్‌ (12 నాటౌట్‌)ల కొసరంత అండతోనే యాన్సెన్‌ మరో 58 పరుగులు జతచేశాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుటవడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు 489 వద్ద తెరపడింది.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) బుమ్రా 38; రికెల్టన్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 35; స్టబ్స్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 49; బవుమా (సి) జైస్వాల్‌ (బి) జడేజా 41; టోని జోర్జి (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 28; ముల్డర్‌ (సి) జైస్వాల్‌ (బి) కుల్దీప్‌ 13; ముత్తుసామి (సి) జైస్వాల్‌ (బి) సిరాజ్‌ 109; వెరీన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) జడేజా 45; యాన్సెన్‌ (బి) కుల్దీప్‌ 93; హార్మర్‌ (బి) బుమ్రా 5; కేశవ్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (151.1 ఓవర్లలో ఆలౌట్‌) 489. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–166, 4–187, 5–201, 6–246, 7–334, 8–431, 9–462, 10–489. బౌలింగ్‌: బుమ్రా 32–10–75–2, సిరాజ్‌ 30–5–106–2, నితీశ్‌ 6–0–25–0, సుందర్‌ 26–5–58–0, కుల్దీప్‌ 29.1–4–115–4, జడేజా 28–2–94–2. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ బ్యాటింగ్‌ 7; రాహుల్‌ (బ్యాటింగ్‌) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 9. బౌలింగ్‌: యాన్సెన్‌ 3.1–1–9–0, ముల్డర్‌ 3–3–0–0.

India wins Blind Womens T20 World Cup5
మన ఖాతాలో మరో ప్రపంచకప్‌

కొలంబో: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత క్రికెట్‌ హవా నడుస్తోంది. విభాగం ఏదైనా... వేదిక ఎక్కడైనా... ప్రత్యర్థుల ఎవరైనా... అదరగొట్టే ఆటతీరుతో భారత జట్లు జయభేరి మోగిస్తున్నాయి. ఇటీవల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను తొలిసారి సొంతం చేసుకోగా... తొలిసారి నిర్వహించిన మహిళల అంధుల టి20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు జగజ్జేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జమున రాణి, అను కుమారి చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 12.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాంగి కరుణ కుమారి (27 బంతుల్లో 42) రాణించింది. ఫూలా సరేన్‌ (27 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు)తో కలిసి కరుణ కుమారి మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన 15 ఏళ్ల కరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో మొత్తం ఆరు (భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆ్రస్టేలియా, అమెరికా) దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది భారత పురుషుల జట్టు ఆసియా కప్‌ టి20 టోర్నీలో, చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీలో టైటిల్స్‌ సాధించగా... భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను దక్కించుకుంది.

Cricket Australia Set For Huge Loss As Ashes Opener In Perth Ends In 2 Days6
కొంప‌ముంచిన హెడ్‌.. క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ.17 కోట్లు నష్టం!

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్‌ విధ్వంసకర సెంచరీ ఫలితంగా ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 28.2 ఓవర్లలో ఊదిపడేసింది.అయితే పెర్త్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) భారీ నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల ఆటకు సంబంధించిన టిక్కెట్లు దాదాపుగా అమ్ముడైపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ. 17 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిందరికి రిఫండ్ చేయనున్నారు. ఈ యాషెస్ ఓపెనింగ్ టెస్టును వీక్షించేందుకు తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1,01,514 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. గ‌తేడాది ఆఖ‌రిలో ఇదే వేదికలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్‌కు కూడా ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కాలేదు. మొద‌టి నాలుగు రోజుల్లో మొత్తంగా 96,463 మంది స్టేడియంకు వ‌చ్చారు. పెర్త్‌లో జ‌రిగిన యాషెస్‌ తొలి టెస్టును టీవీల్లో కూడా 245,000 మంది వీక్షించిన‌ట్లు ఛాన‌ల్ 7 ప్ల‌స్ వెల్ల‌డించింది. ఇక ఆదివారం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు హెడ్ క్షమాపణలు చెప్పాడు. "మూడో రోజు కూడా స్టేడియం నిండిపోతుందని అనుకున్నాను. కానీ రెండో రోజుల్లోనే ఆట ముగిసిపోయింది. టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారిందరికి సారీ" ఓ ప్రకటనలో హెడ్‌ పేర్కొన్నాడు.కాగా క్రికెట్ ఆస్ట్రేలియా రిఫండ్ పాలసీ ప్రకారం.. రద్దు చేయబడిన రోజులకు సింగిల్-డే టిక్కెట్లు ఉన్న అభిమానులుపూర్తి రిఫండ్‌కు అర్హులు. కాబట్టి, డే 3, డే 4, డే 5 టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి బోర్డు తప్పనిసరిగా డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

India squad announcement for South Africa ODIs 7
టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్‌కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు. నవంబర్‌ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు గిల్‌ స్థానంలో రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మెడ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ గిల్‌ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. ఇక విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు డిప్యూటీగా రిషభ్‌ పంత్‌ వ్యవహరిస్తారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుకేఎల్‌ రాహల్‌(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జైశ్వాల్‌, విరాట్‌ కోహ్లి, తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, కల్దీప్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ రాజ్‌ గైక్వాడ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్షదీప్‌ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌

Major injury blow for Australia as Josh Hazlewood out of the entire Ashes: Reports8
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

యాషెస్ 2025-26 తొలి టెస్టులో విజయం సాధించి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్(తొడ కండరాలు) గాయం కారణంగా మిగిలిన యాషెస్ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.రెండు వారాల క్రితం విక్టోరియాతో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత స్కానింగ్ తరలించగా చిన్న బ్రేక్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టు నుంచి అతడిని తప్పించింది.అయితే రెండో టెస్టు సమయానికి హాజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆసీస్ మేనెజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ప్రముఖ క్రికెట్ రిపోర్టర్ పీటర్ లాలర్ తెలిపాడు. '7 క్రికెట్'లో పీటర్ లాలర్ మాట్టాడుతూ.. హాజిల్‌వుడ్ గురుం‍చి కొన్ని వార్తలు నేను విన్నాను. అవే నిజమైనతే ఈ సిరీస్‌లో హాజిల్‌వుడ్‌ను మని చూడకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు. కాగా హాజిల్‌వుడ్‌ను గ‌త కొంత‌కాలంగా గాయాలు వెంటాడుతున్నాయి. గత వేస‌వి సీజ‌న్‌లో పిక్క సమస్య కారణంగా అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేక‌పోయాడు. అలాగే 2021-22 యాషెస్ సిరీస్‌లో కూడా అతను కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.క‌మ్మిన్స్ అనుమానమే?మరోవైపు పెర్త్‌ టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం అనుమానమే. కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. తొలి టెస్టులో కమ్మిన్స్‌, హాజిల్‌వుడ్ లేనిప్పటికి సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతం చేశాడు. మొత్తంగా ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు గ‌బ్బా వేదిక‌గా డిసెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్‌? పంత్ సీరియ‌స్‌

Is Smriti Mandhanas Father Suffered Heart Attack9
స్మృతి మంధాన తండ్రికి హార్ట్‌ ఎటాక్‌

ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్‌ ఎటాక్‌ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తర్వాత శ్రీనివాస్‌ అస్వస్థతగా కనిపించారు. అయితే మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైన వేళ.. మంధాన తండ్రి శ్రీనివాసన్‌ గుండె పోటుకు గురైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా సైతం ధ్రువీకరించాడు. "ఈ పరిస్థితుల్లో త‌న‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంంధాన తెల్చి చెప్పేసింది.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుందని" తుహిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్‌ సంగ్లీ లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా మంధాన వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆదివారం(నవంబర్ 23) జరగాల్సి ఉంది. గత రెండు రోజులగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాల్డీ, మెహందీ, సంగీత్ కార్యకమాల్లో స్మృతితో పాటు సహచర భారత క్రికెటర్లు సందడి చేశారు. కానీ అంతలోనే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

Team India beat Nepal to lift inaugural Blind Women’s T20 World Cup10
టీ20 వరల్డ్‌కప్‌ విజేత భారత్‌

అంధుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. ఈ రోజు నేపాల్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ జట్టు, ఆపై కేవలం 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. కొలంబోలో జరిగిన తుదిపోరులో భారత మహిళల అంధుల జట్టు ఆద్యంతం ఆకట్టుకుంది. నేపాల్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి భారత జట్టు.. అటు తర్వాత ఇంకా ఎనిమిది ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. భారత వైస్‌ కెప్టెన్‌ పూలా సారెన్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇదిలా ఉంచితే, సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి పైనల్‌కు చేరిన భారత జట్టు.. ఫైనల్‌లో కూడా మెరిసింది. ఏమాత్రం తడబాటు లేకుండా ఫైనల్‌ అడ్డంకిని కూడా అధిగమించి ఔరా అనిపించింది. ఇది భారత మహిళల అంధుల క్రికెట్‌ జట్టుకు తొలి టీ20 వరల్డ్‌కప్‌. ఈ వరల్డ్‌కప్‌తో(వన్దేలు, టీ20లు) కలిపి భారత అంధుల జట్లు(పురుషులు, మహిళలు) మొత్తం ఆరు టైటిల్స్‌ సాధించాయి.వివరాలు 2002 (టీ20, పురుషులు): మొదటి అంధుల టీ20 వరల్డ్‌కప్ విజయం2012 (టీ20, పురుషులు)2014 (వన్డే, పురుషులు)2017 (టీ20, పురుషులు)2018 (వన్డే, పురుషులు)2025 (టీ20, మహిళలు)

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement