Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Asia Cup 2025: UAE Beat Oman By 42 Runs1
Asia Cup 2025: బోణీ కొట్టిన యూఏఈ

ఆసియా కప్‌-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్‌లో ఒమన్‌పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లో వెళితే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్‌ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్‌ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్‌ చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్‌ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసిఫ్‌ ఖాన్‌ (2), వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్‌ జోహైబ్‌ (21), హర్షిత్‌ కౌశిక్‌ (19 నాటౌట్‌) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్‌ బౌలర్లలో జితేన్‌ రామనంది 2, హస్నైన్‌ షా, సమయ్‌ శ్రీవాత్సవ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఆర్యన్‌ బిస్త్‌ (24), వినాయక్‌ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు. 18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్‌ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బకొట్టాడు. హైదర్‌ అలీ, ముహమ్మద్‌ జవాదుల్లా తలో 2, రోహిద్‌ ఖాన్‌ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో (సెప్టెంబర్‌ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్‌ 4 అవకాశాలు ఉంటాయి.

Muhammad Waseem becomes the fastest ever to complete 3000 runs in T20I history2
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్‌.. ప్రపంచ రికార్డు బద్దలు

యూఏఈ కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వసీంకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ పేరిట ఉండేది. బట్లర్‌ 3000 పరుగులు పూర్తి చేసేందుకు 2068 బంతులు తీసుకోగా.. వసీం కేవలం 1947 బంతుల్లోనే ఈ ల్యాండ్‌ మార్క్‌ను తాకాడు. ఈ జాబితాలో వసీం, బట్లర్‌ తర్వాతి స్థానాల్లో ఆరోన్‌ ఫించ్‌ (2077), డేవిడ్‌ వార్నర్‌ (2113), రోహిత్‌ శర్మ (2149) ఉన్నారు.మ్యాచ్‌ల పరంగా చూస్తే.. వసీం మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌), విరాట్‌ కోహ్లి (భారత్‌), బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు రిజ్వాన్‌కు 79, విరాట్‌ కోహ్లికి 81, బాబర్‌ ఆజమ్‌కు 81 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వసీం తన 84వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. ఆసియా కప్‌-2025లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 15) జరుగుతున్న మ్యాచ్‌లో వసీం​ పై రెండు ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వసీం 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. వసీంకు జతగా మరో ఓపెనర్‌ అలీషాన్‌ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్‌) కూడా అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఒమన్‌ తడబడుతుంది. ఆ జట్టు 6.1 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. షా ఫైసల్‌ (8), ఆర్యన్‌ బిస్త్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో యూఏఈ భారత్‌, పాక్‌, ఒమన్‌తో కలిసి గ్రూప్‌-ఏలో ఉంది. కొద్ది రోజుల కింద భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు చిత్తుగా ఓడింది.

More Drama In PCB, Mohsin Naqvi Fire Board Members After Handshake Row vs India Says Report3
హ్యాండ్‌ షేక్‌ వివాదంలో అనూహ్య పరిణామం

భారత్‌-పాక్‌ ఆటగాళ్ల హ్యాండ్‌ షేక్‌ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్‌ చేసింది. జట్టు క్రికెట్‌ ఆపరేషన్ష్‌ డైరెక్టర్‌ ఉస్మాన్‌ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్‌ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్‌ చేశాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని హ్యాండిల్‌ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్‌ ముందు పాక్‌ పరువు పోయింది. టాస్‌కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం​.కాగా, ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌-4 దశ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్‌షేక్‌ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్‌ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్‌ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది.

Will ICC Penalise India for Avoiding Post-Match Handshakes With Pakistan Players? Rules what say4
హ్యాండ్​ షేక్​ వివాదం.. భారత్​కు ఫైన్​ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఆసియాక‌ప్‌-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భార‌త్‌-పాకిస్తాన్ జట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భార‌త్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫ‌లితం కంటే హ్యాండ్‌షేక్ వివాద‌మే ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మ్యాచ్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న తెలిపింది.టాస్ ద‌గ్గ‌ర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంత‌వ‌ర‌కు పాక్ ఆట‌గాళ్ల‌ను టీమిండియా క‌నీసం ప‌ట్టించుకోలేదు. గ‌తంలో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ప్పుడు ఆట‌గాళ్లు ఒకరొక‌రు పల‌క‌రించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సంద‌ర్భంగా భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్.. పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అఘాతో క‌ర‌చాల‌నం చేసేందుకు నిరాకరించాడు. క‌నీసం అత‌డి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్ర‌ణాళిక‌లో భాగంగానే జ‌రిగింది.ఆ త‌ర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భార‌త జ‌ట్టు నిరాక‌రించింది. అంతేకాకుండా పాక్‌ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అస‌హ‌న‌నానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్‌ ప్రెజెంటేషన్ సెర్మ‌నీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ త‌ర్వాత విలేక‌రుల స‌మావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హ‌స‌న్‌ భార‌త ఆట‌గాళ్లు త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు బాధ క‌లిగించంద‌ని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిర‌స‌న‌లో భాగంగా త‌మ కెప్టెన్‌ను పోస్టు మ్యాచ్ సెర్మ‌నీకి పంప‌లేద‌ని" పీసీబీ ఓ ప్ర‌క‌ట‌నలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అస‌లు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విష‌యాల‌ను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాక‌ప్‌ను ఏషియ‌న్ క్రికెట్ కౌన్సిల్ నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జ‌ట్లు, ఆట‌గాళ్ల‌కు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్ల‌ప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆట‌గాళ్లు త‌మ నిబంధ‌న‌లకు వ్యతిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తే ఐసీసీ క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు తప్పనిసరిగా షేక్​ హ్యాండ్​ ఇవ్వాల‌నే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్‌లో ఎక్క‌డా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్ర‌మే ప‌రిగ‌ణిస్తారు. అదేమి ఖ‌చ్చిత‌మైన రూల్ కాదు. క‌ర‌చాల‌నం చేయాలా వ‌ద్దా అన్నది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాట‌లో ఆట‌గాళ్లు.. సహ‌చ‌రుల‌ను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌర‌వించ‌డం గురుంచి ఉంటుంది. అంతే త‌ప్ప షేక్ హ్యాండ్ ఇవ్వక‌పోవ‌డం నేర‌మ‌ని ఐసీసీ త‌మ రూల్స్‌లో ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు.ఒక‌వేళ ఆట‌గాళ్ల‌తో దురుస‌గా ప్ర‌వ‌ర్తించి క‌ర‌చాల‌నం చేయ‌క‌పోతే దాన్ని ఐసీసీ నేరంగా ప‌రిగ‌ణిస్తోంది. కానీ ఈ సంద‌ర్భంలో టీమిండియా ఆట‌గాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు. దీంతో భార‌త జ‌ట్టుకు ఐసీసీ ఎటువంటి జ‌రిమానా విధించే అవ‌కాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్క‌సారి రూల్ బుక్‌ను చ‌ద‌వండి. అందులో ఎక్క‌డ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవ‌లం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్న‌ది వారి సొంత నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అంతే త‌ప్ప ప్ర‌త్యేకంగా చ‌ట్టం ఏమీ లేదు. కాబ‌ట్టి ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయ‌క‌పోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని స‌ద‌రు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.

Zimbabwe Beat Namibia By 33 Runs In First T20I5
విధ్వంసం సృష్టించిన బెన్నెట్‌.. జింబాబ్వే ఘన విజయం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నమీబియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 15) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు.. ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.ఆఖర్లో ర్యాన్‌ బర్ల్‌ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ సికందర్‌ రజా (11 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్‌ ఎరాస్మస్‌ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్‌ 2, ట్రంపల్‌మెన్‌కు ఓ వికెట్‌ దక్కిందిఅనంతరం​ భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయినా లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌ల్లో తలా కొన్ని పరుగులు చేశారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. నికోల్‌ లాఫ్టీ (38), జేన్‌ గ్రీన్‌ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, ముజరబానీ తలో 2 వికెట్లు తీసి నమీబియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మసకద్జ, నగరవ, బ్రాడ్‌ ఈవాన్స్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 రేపు (సెప్టెంబర్‌ 16) జరుగనుంది.

Naveen Ul Haq Ruled Out Of Asia Cup 2025 With Injury, Afghanistan Name Replacement6
Asia Cup 2025: రషీద్‌ ఖాన్‌ సేనకు భారీ ఎదురుదెబ్బ

ఆసియా కప్‌ 2025లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో రేపు (సెప్టెంబర్‌ 16) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు స్టార్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ గాయపడ్డాడు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న నవీన్‌ ఆసియా కప్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నవీన్‌కు ప్రత్యామ్నాయంగా అహ్మదుల్లా అహ్మద్‌జాయ్‌ను ప్రకటించింది. ఇదివరకే రిజర్వ్‌ ప్లేయర్ల జాబితాలో ఉండిన అహ్మద్‌జాయ్‌ మెయిన్‌ జట్టులోకి ప్రమోట్‌ అయ్యాడు.కాగా, ఆసియా కప్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపుతో బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనర్‌లో హాంగ్‌కాంగ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్‌ సూపర్‌-4 దశకు చేరుకుంటుంది. ఈ టోర్నీలో ఆఫ్గన్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, హాంగ్‌కాంగ్‌తో పాటు గ్రూప్‌-బిలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానే గ్రూప్‌-బి టాపర్‌గా ఉంది. ఆ జట్టు అద్భుతమైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆఫ్ఘనిస్తాన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది.గ్రూప్‌-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో భారత్‌, పాక్‌, ఒమన్‌, యూఏఈ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ ఈ గ్రూప్‌ టాపర్‌గా ఉంది. పాకిస్తాన్‌, ఒమన్‌, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. యూఏఈ, ఒమన్‌ మధ్య మ్యాచ్‌ 5:30 గంటలకు మొదలైంది. రాత్రి 8 గంటలకు శ్రీలంక, హాంగ్‌కాంగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

Pakistan Threaten To Boycott Asia Cup Match Vs UAE If ICC Does Not Fulfill PCBs Demands7
ఐసీసీకి పాక్‌ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!

ఆసియా కప్‌ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 14) జరిగిన భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు పాక్‌ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్‌ సమయంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పాక్‌ సారధి సల్మాన్‌ అఘాకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ నిరాకరించడాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్‌ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్‌ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్‌ సమయానికి (సెప్టెంబర్‌ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్‌ హ్యాండ్‌ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్‌ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్‌ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్‌ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

BCCI Breaks Silence On India's Handshake Snub Against Pakistan8
'అలా ఎక్క‌డా రాసి లేదు'.. షేక్‌హ్యాండ్‌పై పాక్‌కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఆసియాక‌ప్‌-2025లో ఆదివారం పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌య‌భేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్‌ టాస్ సంద‌ర్భంగా గానీ, ఆట‌ ముగిశాక కానీ భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు ఇష్ట‌ప‌డలేదు. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా త‌మ ప‌ని తాము చేసుకుని మైదానం వీడారు.పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌సన‌గా ఇండియ‌న్ టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఒక‌వేళ సూప‌ర్‌-4లో మ‌రోసారి పాక్‌తో త‌ల‌ప‌డితే సూర్య అండ్ కో ఇదే ప‌ద్ద‌తిని కొన‌సాగించనున్న‌ట్లు తెలుస్తోంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి ల‌భించిన త‌ర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట‌. అయితే భార‌త ఆట‌గాళ్లు త‌మ‌తో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అస‌హ‌నం వ్యక్తం చేసింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమ‌ని, భార‌త జ‌ట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌కు బీసీసీఐ సీనియ‌ర్ అధికారి ఒకరు గ‌ట్టి కౌంట‌రిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్ల‌దు అని ఆయ‌న తెలిపారు."మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్క‌సారి రూల్ బుక్‌ను చ‌ద‌వండి. అందులో ఎక్క‌డ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవ‌లం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్న‌ది వారి సొంత నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అంతే త‌ప్ప ప్ర‌త్యేకంగా చ‌ట్టం ఏమీ లేదు. కాబ‌ట్టి ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయ‌క‌పోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని స‌ద‌రు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.చదవండి: Asia Cup 2025: ఇది క‌దా స‌క్సెస్ అంటే.. గురువు రికార్డునే బ‌ద్ద‌లు కొట్టిన అభిషేక్

PCB demands removal of match referee Pycroft9
ముదురుతున్న IND-PAK 'షేక్‌ హ్యాండ్‌' వివాదం

ఆసియా కప్‌ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్‌ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్‌ చేసింది. పైక్రాఫ్ట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్‌ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.పైక్రాఫ్ట్‌కు ఏం సంబంధం..?నిన్నటి భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్‌ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్‌గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్‌ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది. టాస్ సమయంలో పైక్రాఫ్ట్‌ ఇరు కెప్టెన్లను హ్యాండ్‌షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్‌ టీమ్‌ మేనేజర్‌ నవీద్‌ చీమా పైక్రాఫ్ట్‌పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్‌ ప్రవర్తనను “అస్పోర్ట్స్‌మన్‌షిప్”గా అభివర్ణించాడు.మొత్తంగా చూస్తే షేక్‌ హ్యాండ్‌ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్‌-పాక్‌ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్‌-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్‌ హ్యాండ్‌ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో భారత్‌ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్‌ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

Abhishek Sharma SHATTERS Mentor Yuvrajs Record In Explosive Cameo vs Pakistan10
ఇది క‌దా స‌క్సెస్ అంటే.. గురువు రికార్డునే బ‌ద్ద‌లు కొట్టిన అభిషేక్

ఆసియాక‌ప్‌-2025లో దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. 128 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ బౌల‌ర్ల‌ను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆట‌గాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాద‌డం మొద‌లు పెట్టాడు. అభిషేక్ కేవ‌లం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 31 ప‌రుగులు చేశాడు. ఈ యువ సంచ‌ల‌నం త‌న ఇన్నింగ్స్‌ను 238.46 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అద్బుత‌మైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచిన అభిషేక్‌.. త‌న మెంటార్ యువ‌రాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.పాకిస్తాన్‌పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన భార‌త బ్యాట‌ర్‌గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువ‌రాజ్ సింగ్ 2012లో పాక్‌పై 200.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 238.46 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అభిషేక్‌.. యువీని అధిగ‌మించాడు. కాగా అభిషేక్‌ శర్మ కెరీర్‌ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్‌ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు చేసింది.చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement