ప్రధాన వార్తలు
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన వారియర్జ్
డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్లో ఆర్సీబీ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో కలిసికట్టుగా రాణించి, ప్రత్యర్ధిని స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. వడోదర వేదికగా యూపీ వారియర్జ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. యూపీని 143 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (41), దీప్తి శర్మ (55) తొలి వికెట్కు 49 బంతుల్లో 74 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి వారియర్జ్ను కుదురుకోన్విలేదు. పేసర్ లారెన్ బెల్ (4-0-21-1) మరోసారి తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా.. నదినే డి క్లెర్క్ (4-0-22-4) వారియర్జ్ వెన్ను విరిచింది. ఆఫ్ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (4-0-27-1), గ్రేస్ హ్యారిస్ (3-0-22-2) కూడా అద్భుతంగా రాణించారు. రాధా యాదవ్ (2-0-11-0) వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. సయాలీ సత్ఘరే (2-0-21-0), అరుంధతి రెడ్డి (1-0-14-0) ఓ మోస్తరుగా పరుగులు సమర్పించుకున్నారు. వారియర్జ్ ఇన్నింగ్స్లో లాన్నింగ్, దీప్తి శర్మ మినహా ఎవ్వరూ రాణించలేదు. హర్లీన్ డియోల్ (14), సిమ్రన్ షేక్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్ (1), క్లో ట్రయెన్ (6), శ్వేతా సెహ్రావత్ (7), సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ డకౌటైంది. ఆఖరి ఓవర్లో క్లెర్క్ 2 వికెట్లు తీసి వారియర్జ్ను కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోనివ్వలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఈ ఎడిషన్లో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ఏకైక జట్టుగా చలామణి అవుతంది. అయితే చివరి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై, ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
గత కొంతకాలంగా ఇంటా-బయటా.. ఆ ఫార్మాట్-ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు టీ20 ప్రపంచకప్కు ముందు, స్వదేశంలో ఊరట కలిగించే విజయం లభించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి, వన్డే ప్రపంచ ఛాంపియన్లైన ఆస్ట్రేలియన్లను చిత్తు చేశారు. 169 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని ప్రపంచకప్కు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ లేకుండా ట్రవిస్ హెడ్ నాయకత్వంలో బరిలోకి దిగింది. మిచెల్ లేని లేటు ఆసీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. వ్యూహ్యాల అమలు దగ్గరి నుంచి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిచెల్ లేని ఆసీస్ సాధారణ జట్టులా కనిపించింది. ఈ గెలుపులో పాక్ బౌలర్ల గొప్పతనం పెద్దగా లేకపోయినా, ఆసీస్ బ్యాటర్ల డొల్లతనం స్పష్టంగా తెలిసింది. బౌలింగ్లో ఆడమ్ జంపా నైపుణ్యం వల్ల పాక్ను తక్కువ స్కోర్కే పరిమితం చేయగలిగినా, దాన్ని ఛేదించడంలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితం మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను జేవియర్ బార్ట్లెట్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అయితే ఆతర్వాత పాక్ కుదురుకుంది. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (40), వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా (39) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయూబ్ ఔటయ్యాక బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (24) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ఈసారి కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (16 బంతుల్లో 10) జిడ్డుగా ఆడి పాక్ భారీ స్కోర్ చేయకపోవడానికి అడ్డు గోడ అయ్యాడు. చివర్లో ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆడమ్ జంపా (4-0-24-4) పాక్ ఆటగాళ్ల పాలిట కొరకరాని కొయ్యలా మారగా.. బార్ట్లెట్ (4-0-26-2), బియర్డ్మన్ (4-0-33-2) పాక్ ఆటగాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్లో బియర్డ్మన్ రెండు వికెట్లు తీసి పాక్ను 168 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమిమతమయ్యేలా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆతర్వాత ట్రవిస్ హెడ్ (23), గ్రీన్ (36) కాసేపు మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయారు. వీరద్దరు ఔటయ్యాక ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో బార్ట్లెట్ (34 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా, అప్పటికే ఆసీస్ ఓటమి ఖరారైపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా పాక్ స్పిన్నర్లు ఆసీస్ ఆటగాళ్లను విజయవంతంగా కట్టడి చేసి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో టీ20 ఇదే లాహోర్ వేదికగా జనవరి 31న జరుగనుంది.
నిప్పులు చెరిగిన సిరాజ్
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్ఘడ్తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 17 ఓవర్లలో 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్తో పాటు రక్షన్ (9.3-1-28-2), తనయ్ త్యాగరాజన్ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్ యాదవ్ (99 బంతుల్లో 106; 10 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా సెంచరీ చేసి ఛత్తీస్ఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ప్రతీక్కు వికల్ప్ తివారి (94) సహకరించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 183 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని త్యాగరాజన్ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్ సెంచరీకి చేరువైన వికల్ప్ తివారిని ఔట్ చేసి ఛత్తీస్ఘడ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వికల్ప్, ప్రతీక్ మినహా ఛత్తీస్ఘడ్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్ పాండే 11, అనుజ్ తివారి 4, సంజీత్ దేశాయ్ 1, కెప్టెన్ అమన్దీప్ ఖారే 16, మయాంక్ వర్మ 3, సహబాన్ ఖాన్ 20, ఆదిత్య సర్వటే 4, దేవ్ ఆదిత్య సింగ్ 16 పరుగులకు ఔటయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్రావ్ 32, అభిరథ్ రెడ్డి 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న జురెల్
టీమిండియా భవిష్యత్ తారగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తర్ప్రదేశ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 7 ఇన్నింగ్స్ల్లో 93 సగటున, 122.90 స్ట్రయిక్రేట్తో 558 పరుగులు చేసిన ఇతను.. ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన రంజీ మ్యాచ్లోనూ అదే సూపర్ ఫామ్ను కొనసాగించాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జురెల్ ఒంటరిపోరాటం చేశాడు. 122 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో ఎంతో అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. జురెల్కు మరో ఎండ్లో శివమ్ మావి (47) సహకరించడంతో ఉత్తర్ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులు చేయగలిగింది. జురెల్, మావి మినహా యూపీ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే 6 వికెట్లతో చెలరేగి యూపీని ఘెరంగా దెబ్బ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్ మోఖడే (19), సత్యం భోయార్ (13) క్రీజ్లో ఉన్నారు.సూపర్ ఫామ్జురెల్ ఇటీవల కాలంలో అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత ఏడు లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, నాలుగు సెంచరీలు బాదాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన (14 & 13, 0 & 2) జురెల్.. దానికి ముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో అదరగొట్టాడు. దీనికి ముందే టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసిన జురెల్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం రెండో టెస్ట్లోనూ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు.
వరల్డ్కప్కు సంబంధించి బిగ్ అప్డేట్
త్వరలో భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్కప్కు సంబంధించి ఓ ముఖ్య సమాచారం అందుతోంది. ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ ఖరారు కావడంతో పాటు వేడుక జరిగే తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. టోర్నీ ప్రారంభమయ్యే ఫిబ్రవరి 7వ తేదీనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.ఆ రోజు వేర్వేరు వేదికల్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనుండగా.. మూడో మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మూడో మ్యాచ్లో భారత్, యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి ముందే ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది.అదే రోజు టోర్నీ ఓపెనర్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలొంబో వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య కోల్కతా వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలన్నీ గ్రూప్కు ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విడిపోయాయి. గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. భారత్, పాక్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. పాక్ తమ మ్యాచ్లన్నీ (భారత్ మ్యాచ్తో సహా) శ్రీలంకలో ఆడనుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు.. సెమీస్లో గెలిచే జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్లు వీరే: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లలో గ్లెన్ మెగ్రాత్కు తప్పక స్థానం ఉంటుంది. కంగారూ జట్టు తరఫున 1993 నుంచి 2007 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. 124 టెస్టులు, 250 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్లలో భాగమయ్యాడు.తన కెరీర్లో మొత్తంగా టెస్టుల్లో ఏకంగా 563 వికెట్లు కూల్చిన మెగ్రాత్.. వన్డేల్లో 381, టీ20లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల వంటి మేటి జట్లకు చెందిన బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేసిన ఘనత అతడికి ఉంది.ఈ ఐదుగురూ తక్కువేమీ కాదుతాజాగా ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన గ్లెన్ మెగ్రాత్ (Glenn McGrath).. తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ఐదుగురు బ్యాటర్ల పేర్లను వెల్లడించాడు. అయితే, అంతకంటే ముందు ఈ టాప్-5ని భర్తీ చేయగల సత్తా ఉన్న మరో ఐదుగురు బ్యాటర్ల పేర్లు కూడా మెగ్రాత్ తెలిపాడు.శ్రీలంకకు చెందిన అరవింద డిసిల్వ, ఇంగ్లండ్ స్టార్లు కెవిన్ పీటర్సన్, అలిస్టర్ కుక్.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు సయీద్ అన్వర్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)లను మెగ్రాత్ ఈ జాబితాలో చేర్చాడు.అతడే అందరికంటే టఫ్ఇక తన టాప్-5 టఫెస్ట్ బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానాన్ని ఇంగ్లండ్ లెఫ్టాండర్ బ్యాటర్, దివంగత గ్రాహమ్ థోర్పేకు ఇచ్చాడు మెగ్రాత్. నాలుగో స్థానాన్ని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్కు కట్టబెట్టిన ఈ రైటార్మ్ పేసర్.. మూడో స్థానంలో భారత టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్ను నిలిపాడు.అదే విధంగా... టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్కు రెండో స్థానం ఇచ్చిన మెగ్రాత్.. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్గా వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా పేరు చెప్పాడు.పరుగుల వరదకాగా మెగ్రాత్ టాప్-5లో ఉన్న వారంతా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన వారే. గ్రాహమ్ థోర్పే 9000 పరుగులు చేయగా.. డివిలియర్స్ ఖాతాలో ఇరవై వేల రన్స్ ఉన్నాయి. ఇక లక్ష్మణ్ టెస్టుల్లో 8781 పరుగులు సాధించగా.. సచిన్ 34,357 రన్స్తో టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అదే విధంగా లారా 430 మ్యాచ్లలో కలిపి 22000 పరుగులు సాధించాడు.గ్లెన్ మెగ్రాత్ ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్లు టాప్-5🏏బ్రియన్ లారా🏏సచిన్ టెండుల్కర్🏏వీవీఎస్ లక్ష్మణ్🏏ఏబీ డివిలియర్స్🏏గ్రాహమ్ థోర్పే. చదవండి: ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్ సాంట్నర్
ఆస్ట్రేలియా కెప్టెన్గా ట్రవిస్ హెడ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్కప్ ఈవెంట్కు సన్నాహకంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆసీస్- పాక్ మధ్య లాహోర్ వేదికగా గురువారం తొలి టీ20తో సిరీస్ మొదలైంది.ఆస్ట్రేలియా కెప్టెన్గా ట్రవిస్ హెడ్గడాఫీ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. కంగారూలు బౌలింగ్ అటాక్ మొదలుపెట్టారు. ఇక పాక్తో తొలి టీ20 నేపథ్యంలో ఆస్ట్రేలియా తుదిజట్టులో కీలక మార్పు కనిపించింది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ దూరం కాగా.. అతడి స్థానంలో విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.ముగ్గురి అరంగేట్రంఅంతేకాదు.. ఈ మ్యాచ్లో ఆసీస్ భారీ ప్రయోగానికి తెరతీసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్మాన్, జాక్ ఎడ్వర్డ్స్, మ్యాట్ రెన్షా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టారు. ఇటీవల ముగిసిన బిగ్బాష్ లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా యాజమాన్యం వీరికి అవకాశం కల్పించింది. అయితే, ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో లేకపోవడం గమనార్హం. ఇక మార్ష్తో పాటు గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ వంటి స్టార్లు కూడా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు.పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టీ20 తుదిజట్లుఆస్ట్రేలియాట్రవిస్ హెడ్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, కామెరాన్ గ్రీన్, మ్యాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్(వికెట్ కీపర్), జాక్ ఎడ్వర్డ్స్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా, మహ్లి బియర్డ్మాన్పాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ ఆయుబ్, బాబర్ ఆజం, సల్మాన్ ఆఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.చదవండి: అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్
భారత్లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత కూడా బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. అయితే మీరనుకున్నట్లు ఇది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కాదు. షూటింగ్ జట్టు. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ కోసం బంగ్లా టీమ్ భారత పర్యటనకు రానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరగనుంది. క్రికెట్ మ్యాచ్లు భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్.. షూటింగ్ పోటీల్లో ఎలా పాల్గొనబోతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ మ్యాచ్లకు లభించని భద్రత షూటింగ్కు లభిస్తుందా అని భారత క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు.కాగా, భారత్లో జరగాల్సిన తమ టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లను భద్రతా కారణాలు సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదం మొదలైంది. ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భారత్పై ప్రతీకార చర్యగా స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసింది. ఇంతటితో ఆగకుండా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, భారత్లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఐసీసీ ససేమిరా అనడంతో చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. ఇప్పుడేమో తమ దేశ షూటింగ్ జట్టును భారత్కు పంపుతూ కొత్త చర్చకు తెరలేపింది. ఈ విషయంలో భారత షూటింగ్ సమాఖ్య ఎలా స్పందిచబోతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.
అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్
టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు అందించిన సేవలు మరువలేనివి. టీ20 ప్రపంచకప్- 2007, 2011లో వన్డే వరల్డ్కప్ టైటిళ్లను భారత్ గెలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలక పాత్ర.ఇక 2007 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్తో మ్యాచ్లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యువీ (Yuvraj Singh) తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే వరల్డ్కప్-2011లో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.క్యాన్సర్ బారిన పడి..అయితే, యువీ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. చిన్ననాడు తండ్రి యోగ్రాజ్ సింగ్ శిక్షణలో ఎన్నో కష్టాలు అనుభవించిన యువీ.. ఆ తర్వాత తల్లిదండ్రులు విడిపోగా.. తల్లి సమక్షంలో ఉన్నాడు. అవరోధాలను అధిగమించి క్రికెటర్గా ఉన్నత శిఖరాలకు చేరిన వేళ క్యాన్సర్ మహమ్మారి బారినపడ్డాడు. వన్డే వరల్డ్కప్ గెలిచిన తర్వాత అతడికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.పడిలేచిన కెరటంఛాతిలో నొప్పి, రక్తపు వాంతులు తదితర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన యువీకి.. ఊపిరి తిత్తులు, గుండె మధ్య భాగంలో ట్యూమర్ ఉన్నట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్. కీమోథెరపీ చేయించుకున్నాడు. క్రమక్రమంగా కోలుకుని 2012 సెప్టెంబరులో క్రికెటర్గా రీఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత టీమిండియా తరఫున 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న యువీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీలోనూ భాగమయ్యాడు. అయితే, వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డ యువీ 2019లో అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని అప్పటి కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి తొక్కేసారంటూ యోగ్రాజ్ సింగ్ గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేశాడు.తాజాగా తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ యువరాజ్ సింగ్ సైతం పరోక్షంగా తండ్రి వ్యాఖ్యలకు మద్దతు పలికినట్లు సంకేతాలు ఇచ్చాడు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా యూట్యూబ్ షోలో మాట్లాడుతూ..గౌరవం దక్కడం లేదనే భావన‘‘కెరీర్ భారంగా మారిపోయింది. నా ఆటను ఆస్వాదించలేకపోతున్నాని అప్పుడు స్పష్టంగా తెలిసింది. నా ఆటకు.. రిటైర్మెంట్కు నడుమ సన్నని గీత. అసలు ఆటను ఆస్వాదించలేనపుడు ఆడటం ఎందుకన్న ప్రశ్న.నాకెవరూ మద్దతుగా లేరనిపించింది. నాకు గౌరవం దక్కడం లేదనే భావన కలిగింది. నాలో సత్తా లేకున్నా ఆడటం ఎందుకనే ప్రశ్న తలెత్తింది. ఆట నాకెంతో ఇచ్చింది. అందుకు ప్రతిగా నేనూ అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాను.ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి?మరి అలాంటి ఆటను నేనెందుకు ఆస్వాదించలేకపోతున్నానని బాధగా అనిపించింది. నేను ఆడాల్సిన అవసరం ఇక లేదనిపించింది. ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి? శారీరకంగా, మానసికంగా ఇంతకంటే నేను ఏమీ చేయలేను. ఏదో తెలియని బాధ. కాబట్టి ఆటను ఇక ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైతే ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానో.. అప్పుడే మళ్లీ నన్ను నేను.. అసలైన నన్ను చేరుకోగలిగాను’’ అంటూ తాను పడిన మానసిక వేదన, ఒత్తిడిని గుర్తు చేసుకుంటూ యువీ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్ సాంట్నర్
పుజారా ఉగ్రరూపం
టీమిండియా మాజీ క్రికెటర్, నయా వాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ కెరీర్ ముగిసాక తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. సహజంగా నిదానంగా ఆడే అతను.. శైలికి భిన్నంగా వేగంగా పరుగులు సాధించాడు. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్లో గుర్గ్రామ్ థండర్స్కు ఆడుతున్న పుజారా.. నిన్న (జనవరి 28) దుబాయ్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తనలోని విధ్వంసకర యాంగిల్ను అభిమానులకు పరిచయం చేశాడు.201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓపెనర్గా బరిలోకి దిగి 14 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తు 99 పరుగుల వద్ద (60 బంతుల్లో) మరో భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. మరో దురదృష్టమేమిటంటే.. పుజారా శైలికి భిన్నంగా చెలరేగినా, ఈ మ్యాచ్లో తన జట్టు గెలవలేకపోయింది. అతనితో పాటు కెప్టెన్ తిసారా పెరీరా (56 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించినా థండర్స్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పియూశ్ చావ్లా (4-0-35-3) వికట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్స్ను దెబ్బకొట్టాడు. అంతకుముందు అంబటి రాయుడు (45), సమిత్ పటేల్ (65 నాటౌట్) రాణించడంతో దుబాయ్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ గోవా వేదికగా జనవరి 26న మొదలైంది. ఈ లీగ్లో ఇదే తొలి ఎడిషన్. ఇందులో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్లో మొత్తం 18 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లీగ్లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.
అల్కరాజ్ అదరహో
మెల్బోర్న్: ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేస...
‘పద్మభూషణ్’ విజయ్ అమృత్రాజ్
న్యూఢిల్లీ: తన ఆటతీరుతో అంతర్జాతీయస్థాయిలో భారత టె...
గుకేశ్కు వరుసగా రెండో ఓటమి
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ ...
జొకోవిచ్ @ 400
మెల్బోర్న్: స్టార్ ఆటగాడు, వరల్డ్ మాజీ నంబర్వ...
ఆస్ట్రేలియా కెప్టెన్గా ట్రవిస్ హెడ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు ఆస్ట్ర...
భారత్లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత క...
అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్
టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒ...
పుజారా ఉగ్రరూపం
టీమిండియా మాజీ క్రికెటర్, నయా వాల్గా పేరొందిన ఛత...
క్రీడలు
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
వీడియోలు
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
