Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

tim seifert slams blasting 50, New zealand set huge target to team india in 4th T20I1
నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌

వైజాగ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో డారిల్‌ మిచెల్‌ (18 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.సీఫర్ట్‌, కాన్వే ధాటి​కి న్యూజిలాండ్‌ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. సీఫర్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం​ 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో భారత్‌పై ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన న్యూజిలాండ్‌ ఆటగాడిగా రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు.వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్‌ మధ్యలో కాస్త తడబడింది. రచిన్‌ రవీంద్ర (2), మార్క్‌ చాప్‌మన్‌ (9) త్వరితగతిన ఔటయ్యారు. ఈ మధ్యలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో డారిల్‌ మిచెల్‌ బ్యాట్‌ ఝులిపించడంతో న్యూజిలాండ్‌ 200 పరుగుల మార్కును దాటింది. సాంట్నర్‌ (11), ఫౌల్క్స్‌ (13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్‌ను హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. మిచెల్‌తో పాటు మ్యాట్‌ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (4-0-33-2), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్‌ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్‌ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం​ లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Bangladesh get a spot in T20 World Cup 20262
ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌.. మరో జట్టుగా..!

జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్‌ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. నేపాల్‌లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌) థాయ్‌లాండ్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.మరోవైపు నెదర్లాండ్స్‌ జట్టు తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్‌ దశలో స్కాట్లాండ్, థాయ్‌లాండ్, నేపాల్, జింబాబ్వేపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించిన నెదర్లాండ్స్‌.. టాప్‌-4లో (సూపర్‌ సిక్స్‌లో) బంగ్లాదేశ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది.ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. సూపర్‌-6 దశలో టాప్‌-4లో నిలిచే జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌లను దక్కించుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌ టికెట్‌ను కన్ఫర్మ్‌ చేసుకోగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి.కాగా, జూన్‌ 12న బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్‌ 14న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్‌. ఆ ఎడిషన్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.

Ayush Badoni, Priyansh Arya selected for India T20 World Cup 2026 matches3
ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఎం​పికైన ఐపీఎల్‌ స్టార్లు

గత ఎడిషన్‌ ఐపీఎల్‌ స్టార్లు ఆయుశ్‌ బదోని, ప్రియాంశ్‌ ఆర్య లక్కీ ఛాన్స్‌లు కొట్టేశారు. టీ20 ప్రపంచకప్‌ 2026కు సన్నాహకంగా జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యారు. వీరద్దరు ఫిబ్రవరి 2న నవీ ముంబైలో యూఎస్‌తో జరిగే మ్యాచ్‌లో, ఫిబ్రవరి 6న బెంగళూరులో నమీబియాతో జరిగే మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ పాల్గొననున్నారు. ఐపీఎల్‌లో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడే బదోని (లక్నో), ఆర్య (పంజాబ్‌) దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ఆడతారు. భారత-ఏ జట్టుకు ఎంపిక కావడంతో వీరిద్దరు ఢిల్లీ రంజీ జట్టు నుంచి విడుదలయ్యారు. బదోని ఢిల్లీ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.బదోని, ఆర్య భారత-ఏ జట్టుకు ఎంపిక కావడంతో వారి స్థానాలను ఇతరులతో భర్తీ చేయనున్నారు. బదోని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఆయుశ్‌ దోసేజా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుత ఎడిషన్‌ రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో ఆరో స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేక, ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు స్టార్‌ ఆటగాళ్లు బదోని, ఆర్య కూడా దూరం కావడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.బదోని ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో భారత వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. బదోని ఎంపిక​ అనూహ్యంగా జరిగినప్పటికీ.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. బదోని 2025 ఐపీఎల్‌ సీజన్‌లో అంచనాలకు మించి ఆకట్టుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 148.20 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు.ప్రియాంశ్‌ ఆర్య విషయానికొస్తే.. ఇతను కూడా గత ఐపీఎల్‌ ఎడిషన్‌లో చెలరేగిపోయాడు. 166.48 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు చేసి, దూకుడు ప్రదర్శించాడు. తాజాగా ముగిసిన విజయ్‌ హజారే వన్డే టోర్నీలోనూ ఆర్య ఇదే జోరును కొనసాగించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 344 పరుగులతో సత్తా చాటాడు.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌ ఆడనుంది. అది ఫిబ్రవరి 4న నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగనుంది. ఫిబ్రవరి 6న వార్మప్‌ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ మెయిన్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌.. ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్‌-ఏ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్‌ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్‌ ఒమన్‌ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్‌ వర్సెస్‌ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్‌ నేపాల్‌ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్‌ యూఎస్‌ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్‌-ఏ వర్సెస్‌ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)

IND VS NZ 4th T20I: Team india won the toss and choose to bowl, here are playing XI4
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

వైజాగ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్‌మెంట్‌ ఇషాన్‌ కిషన్‌ను పక్కన పెట్టింది. గత మ్యాచ్‌లో అతను స్వల్ప గాయానికి గురయ్యాడు. అతని స్థానంలో అర్షదీప్‌ సింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఓ మార్పుతో బరలోకి దిగింది. జేమీసన్‌ స్థానంలో ఫౌల్క్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం​ లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Sophie Molineux to replace Alyssa Healy as new Australia all format captain5
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్‌

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ ఎంపిక ఖరారైనట్లు తెలుస్తుంది. దిగ్గజ వికెట్‌కీపర్-బ్యాటర్ అలైస్సా హీలీ రిటైర్మెంట్ (ఫిబ్రవరి-మార్చిలో జరిగే భారత్‌ సిరీస్‌ తర్వాత) ప్రకటించడంతో, ఆమె స్థానంలో సోఫీ మోలినెక్స్‌ను కొత్త ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక​ చేసినట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక​ ప్రకటన వెలువడనప్పటికీ.. మోలినెక్స్‌కు పట్టం కట్టడం దాదాపుగా ఖరారైనట్లు ఆసీస్‌ మీడియా వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రేసులో లేని మోలినెక్స్‌ అనూహ్యంగా కెప్టెన్సీని దక్కించుకుందని కథనాలు వెలువడుతున్నాయి. అందులోనూ ఆమెను ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా ఎంపిక​ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హీలీ తర్వాత కెప్టెన్సీ రేసులో ఎల్లిస్‌ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్‌ పేర్లు ప్రధానంగా వినిపించినా, క్రికెట్‌ ఆస్ట్రేలియా మోలినెక్స్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల మోలినెక్స్‌ 2018లో భారత్‌తో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌తో ఆసీస్‌ తరఫున అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె 3 టెస్ట్‌లు, 17 వన్డేలు, 38 టీ20లు ఆడింది. లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్‌గా 76 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఆమె, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా చాలా ఉపయోగకరమైన ప్రదర్శనలు చేసింది. హీలీ నాయకత్వం వహించిన జట్టులో మోలినెక్స్‌ కీలక పాత్ర పోషించింది. 2018, 2020 టీ20 వరల్డ్ కప్‌లలో ఆస్ట్రేలియా విజయాల్లో భాగమైంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటింది. మోలినెక్స్‌ ఎంపిక ఆసీస్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతుల్యత తీసుకొస్తుంది.

Moeen Ali takes a U turn on retirement, set to play T20 Blast and The Hundred6
రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్‌ స్టార్‌

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మరోసారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. 2021లో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, తిరిగి 2023 యాషెస్‌ సిరీస్‌ కోసం బరిలోకి దిగిన అతను.. తాజాగా తన దేశవాలీ రిటైర్మెంట్‌ విషయంలో యూ టర్న్‌ తీసుకున్నాడు.2025లో ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్‌ నుంచి తప్పుకున్న మొయిన​్‌.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, దేశవాలీ క్రికెట్‌లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే తన పాత జట్టును కాదని కొత్త జట్టుతో (యార్క్‌షైర్‌) ఒప్పందం చేసుకొని టీ20 బ్లాస్ట్‌, ద హండ్రెడ్‌ లీగ్‌ల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు.మిగతా దేశాల ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు మొయిన్‌ అప్పట్లో దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా ఆ రూల్స్‌ సవరించబడటంతో, దేశవాలీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.మొయిన్‌ రిటైర్మెంట్‌ యూటర్న్‌ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న ఇలాంటి ఉదం​తాలపై ఓ లుక్కేద్దాం. క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అనేక మంది రిటైర్మెంట్ ప్రకటించి, తిరిగి మైదానంలోకి వచ్చారు. కొందరు అంతర్జాతీయ కెరీర్‌లలో ఇలా చేస్తే, మరికొందరు ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొనేందుకు రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి వారిలో టాప్‌-10 ఆటగాళ్లను పరిశీలిద్దాం.ముందుగా అంతర్జాతీయ రిటైర్మెంట్‌ యూటర్న్‌ను తీసుకుంటే.. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ 1987లో రిటైర్మెంట్‌ ప్రకటించి, ఆ దేశ ప్రభుత్వం అభ్యర్థన మేరకు 1988లో దాన్ని​ ఉపసంహరించుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో ఇది అత్యంత ప్రభావవంతమైన యూటర్న్‌. ఎందుకంటే ఇమ్రాన్‌ రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకొని పాక్‌ను వన్డే ప్రపంచకప్‌ గెలిపించాడు.ఆతర్వాత అదే దేశానికి చెందిన జావిద్‌ మియాందాద్‌ 1993లో ఆటకు వీడ్కోలు పలికి, మూడేళ్ల తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నాడు. 1996 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అతను ఈ పని చేశాడు. రిటైర్మెంట్‌ ఉపసంహరించుకొని ఆ ప్రపంచకప్‌ బరిలోకి దిగినా మియాందాద్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.కార్ల్ హూపర్ (వెస్టిండీస్)రిటైర్మెంట్: 1999ఉపసంహరణ: 2001, రీఎంట్రీలో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడుప్రభావం: హూపర్‌ రీఎంట్రీతో విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సిర్థరత్వం వచ్చింది.షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్‌)రిటైర్మెంట్: అనేకసార్లు (2010, 2011, 2016)ఉపసంహరణ: మూడు సార్లుబ్రెండన్ టేలర్ (జింబాబ్వే)రిటైర్మెంట్: 2015ఉపసంహరణ: 2017మొహమ్మద్ ఆమీర్ (పాకిస్తాన్)రిటైర్మెంట్: 2020ఉపసంహరణ: 2024మొయిన్ అలీ (ఇంగ్లండ్)రిటైర్మెంట్: 2021 (టెస్ట్ క్రికెట్)రీఎంట్రీ: 2023 యాషెస్‌ సిరీస్‌తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)రిటైర్మెంట్: 2023ఉపసంహరణ: దేశ ప్రధాని జోక్యంతో మరుసటి రోజేఇమాద్ వసీమ్ (పాకిస్తాన్)రిటైర్మెంట్: 2023రీఎంట్రీ: 2024క్రికెట్‌కు ఓవరాల్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి ప్రైవేట్‌ టీ20ల్లో ఆడిన ఆటగాళ్లు..ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)రిటైర్మెంట్: 2018ఐపీఎల్‌లో రీఎంట్రీకెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్‌)రిటైర్మెంట్‌: 2012ఐపీఎల్‌, కౌంటీ క్రికెట్‌లోకి రీఎంట్రీబ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)రిటైర్మెంట్‌: 2016ఐపీఎల్‌ సహా మిగతా టీ20 లీగ్‌ల్లో రీఎంట్రీవీరే కాక ప్రొఫెషనల్‌ క్రికెట్‌ మొత్తానికి రిటైర్మెంట్‌ ‍ప్రకటించి ప్రైవేట్‌ టీ20 లీగ్‌ల్లో, దేశవాలీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు.

Suryakumar Yadav back in top 10, Abhishek Sharma retains 1st spot in ICC T20 rankings7
టీమిండియా ఆటగాళ్ల దూకుడు

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా బ్యాటర్లు భారీ ఎత్తున లాభపడ్డారు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. స్కై 717 రేటింగ్‌ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు. కొంతకాలంగా అగ్రపీఠంపై తీష్ట వేసిన విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రేటింగ్‌ పాయింట్లను మరింత పెంచుకొని, ఎవరికీ అందని ఎత్తుకు ఎదుగుతున్నాడు. అభిషేక్‌ ప్రస్తుతం 929 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా 2, శివమ్‌ దూబే 9, రింకూ సింగ్‌ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 53, 59, 68 స్థానాలకు ఎగబాకారు. గాయం​ కారణంగా న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్నా తిలక్‌ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.మిగతా దేశాలకు చెందిన బ్యాటర్లలో మార్క్రమ్‌ (9 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి), బ్రాండన్‌ కింగ్‌ (15 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి), గ్లెన్‌ ఫిలిప్స్‌ (18 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి), సెదిఖుల్లా అటల్‌ (13 స్థానాలు ఎగబాకి 65), ర్యాన్‌ రికెల్టన్‌ (12 స్థానాలు ఎగబాకి 82), దర్విష్‌ రసూల్‌ (29 స్థానాలు ఎగబాకి 88), హెట్‌మైర్‌ (27 స్థానాలు ఎగబాకి 93) భారీగా లబ్ది పొందారు.బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13కు, రవి బిష్ణోయ్‌ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్దిక్‌ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరారు. వరుణ్‌ చక్రవర్తి మినహా టాప్‌-10లో మరో భారత బౌలర్‌ లేడు. రషీద్‌ ఖాన్‌, హసరంగ 2,3 స్థానాలు నిలబెట్టుకున్నారు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 16, కుల్దీప్‌ యాదవ్‌ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే ఒకటి, 6 స్థానాలు మెరుగుపర్చుకొని 3, 12 స్థానాలకు ఎగబాకారు. టాప్‌-2గా సికందర్‌ రజా, సైమ్‌ అయూబ్‌ కొనసాగుతున్నారు.

Sanju Samson likely to be India preferred choice despite failures Morkel says8
వరల్డ్‌కప్‌లో అభిషేక్‌ శర్మ జోడీగా ఇషాన్‌ కిషన్‌?!

సంజూ శాంసన్‌.. గత కొన్నేళ్లుగా భారత క్రీడా వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశంగా ఉంది. ప్రతిభ ఉన్నా ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు తగినన్ని అవకాశాలు రావడం లేదని అతడి అభిమానులతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్ల వాదన. అయితే, టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనేది విశ్లేషకుల మాట.పేలవ ప్రదర్శనఆటలో నిలకడలేమి కారణంగానే సంజూను యాజమాన్యం నమ్మదగిన ఆటగాడిగా చూడటం లేదని ఇంకొంతమంది అభిప్రాయం. తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనలే ఇందుకు కారణం. నిజానికి గతేడాది కాలంగా భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా ఈ కేరళ ఆటగాడు కొనసాగుతున్నాడు.సెంచరీలతో సత్తా చాటి విధ్వంసకర బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)కు జోడీగా సంజూ విదేశీ గడ్డలపై సెంచరీలతో సత్తా చాటాడు. అయితే, ఆసియా టీ20 కప్‌-2025 టోర్నీకి ముందు వైస్‌ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తిరిగిరావడంతో సంజూపై వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనకంటూ ఓ స్థానం లేకుండా పోయింది.వికెట్‌ కీపర్‌ కోటాలోనూ సంజూకు జితేశ్‌ శర్మ పోటీగా రావడంతో.. తుదిజట్టులో అతడు స్థానం కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో టీ20 ఓపెనర్‌గా గిల్‌ విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది. ఫలితంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా తిరిగి ఓపెనర్‌గా అతడికి అవకాశం దక్కింది. అంతేకాదు.. ప్రపంచకప్‌ టోర్నీ-2026కు కూడా ప్రధాన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సంజూ ఎంపికయ్యాడు.10, 6, 0.. పొంచి ఉన్న ఇషాన్‌ ముప్పుఅయితే, కివీస్‌తో సిరీస్‌ సందర్భంగా సంజూ తొలి మూడు టీ20లలోనూ తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు 10, 6, 0. మరోవైపు.. దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపుతున్నాడు.వరల్డ్‌కప్‌లో అభిషేక్‌ జోడీగా ఇషాన్‌ కిషన్‌?!తిలక్‌ వర్మ గాయపడిన కారణంగా ఇషాన్‌ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. నిజానికి అతడు కూడా ఓపెనింగ్‌ బ్యాటర్‌. సంజూ వైఫల్యం కారణంగా ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తిలక్‌ వర్మ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధమవుతున్నాడని బీసీసీఐ ప్రకటించింది.నిజానికి తిలక్‌ గాయం వల్ల కివీస్‌తో మిగిలిన రెండు టీ20లకు కూడా దూరం కావడంతోనే సంజూ వేటు నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి న్యూజిలాండ్‌తో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్‌లు అతడికి అత్యంత కీలకంగా మారాయి.ఈ సందర్భంగా ఫామ్‌లోకి వస్తేనే వరల్డ్‌కప్‌లో సంజూ ఓపెనర్‌గా కొనసాగగలడు. లేదంటే.. అతడి స్థానాన్ని మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ భర్తీ చేయడం ఖాయం. ప్రస్తుతానికి టీమిండియా యాజమాన్యం సంజూకు మద్దతుగా నిలవడం అతడికి ఊరటనిచ్చే అంశం.అండగా మేనేజ్‌మెంట్‌సంజూ వైఫల్యాలలపై బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పందిస్తూ.. ‘‘సంజూ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ అవసరం. ఫలితంగా అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయంలో ఆటగాళ్లు పుంజుకునేలా చేసి.. ప్రపంచకప్‌ టోర్నీకి వారిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే మా మొదటి ప్రాధాన్యం.సంజూ శ్రద్ధగా శిక్షణలో పాల్గొంటున్నాడు. నెట్స్‌లో ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. మోర్కెల్‌ చెప్పినట్లు సంజూ తిరిగి పుంజుకుంటే సరి.. లేదంటే అభిషేక్‌ శర్మ ఓపెనింగ్‌ జోడీగా సంజూ స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ భర్తీ చేయడం లాంఛనమే అవుతుంది.చదవండి: ICC: పాకిస్తాన్‌ స్థానంలో ఉగాండా!.. ట్వీట్‌ వైరల్‌

Markram, Linde shines.. South africa beat west indies by 9 wickets in 1st T20I9
దంచికొట్టిన మార్క్రమ్‌.. విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

టీ20 ప్రపంచకప్‌ 2026కి ముందు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టంది. పార్ల్‌ వేదికగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వికెట్ల పరంగా సౌతాఫ్రికా టీ20 చరిత్రలో విండీస్‌పై ఇదే భారీ విజయం. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో, ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. బౌలింగ్‌లో జార్జ్‌ లిండే (4-0-25-3), కార్బిన్‌ బాష్‌ (4-0-35-2), కేశవ్‌ మహారాజ్‌ (4-0-44-2), రబాడ (4-0-35-0), మఫాకా (4-0-30-0) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హెట్‌మైర్‌ (48), రోవ్‌మన్‌ పావెల్‌ (29 నాటౌట్‌), బ్రాండన్‌ కింగ్‌ (27), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (22) తలో చేయి వేయడంతో ఈ స్కోర్‌ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో జాన్సన్‌ ఛార్ల్‌స్‌ 13, మాథ్యూ ఫోర్డ్‌ 16, రూథర్‌ఫోర్డ్‌ 6, జేసన్‌ హోల్డర్‌ ఒక్క పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా సునాయాసంగా విజయతీరాలకు చేరింది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ (86 నాటౌట్‌) అజేయ అర్ద సెంచరీతో సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించాడు. అతని ప్రిటోరియస్‌ (44), రికెల్టన్‌ (40 నాటౌట్‌) సహకరించారు. ఫలితంగా సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా కోల్పోయిన ఏకైక వికెట్‌ రోస్టన్‌ ఛేజ్‌కు దక్కింది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 జనవరి 29న సెంచూరియన్‌ వేదికగా జరుగనుంది.

Doesn't See Varun Axar Struggle At T20 WC But Kuldeep: Anil Kumble10
టీమిండియాకు అతడే కీలకం: అనిల్‌ కుంబ్లే

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిపై భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వరుణ్‌.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో స్పిన్‌ దళానికి‌ నాయకుడిగా ఉంటాడని పేర్కొన్నాడు. మంచు ప్రభావం అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపబోదని.. తడిచిన బంతితోనూ వరుణ్‌ (Varun Chakravarthy) అనుకున్న ఫలితం రాబట్టలగడని పేర్కొన్నాడు.మంచు ప్రభావంభారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు జరుగనుంది. ఇందుకు ఆఖరి సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 3-0తో గెలిచి.. సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ మంచు ప్రభావం కనిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటుతారని.. తేమ ప్రభావం వల్ల మనవాళ్లకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లకు కష్టమే.. కానీజియోహాట్‌స్టార్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వరల్డ్‌కప్‌ జరగనుంది. రాత్రి పూట మంచు ప్రభావం ఉండటం సహజం. కాబట్టి.. తడిసిన బంతితో బౌలింగ్‌ చేయడం స్పిన్నర్లకు కష్టమే.అయితే భారత స్పిన్నర్లకు ఇది పెద్ద ఇబ్బందేం కాకపోవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఆడాడు. తడిచిన బంతితోనూ ప్రభావం చూపగల సత్తా అతడికి ఉంది. అక్షర్‌ పటేల్‌కు కూడా ఇదేమీ పెద్ద కష్టం కాబోదు. కుల్దీప్‌ ఇబ్బంది పడే అవకాశంఅయితే మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాత్రం.. తన బౌలింగ్‌ శైలి కారణంగా తేమ కారణంగా కాస్త ఇబ్బంది పడవచ్చు. అయినా పరిస్థితులకు తగ్గట్లు ఎలా బౌలింగ్‌ చేయాలో కుల్దీప్‌నకు తెలుసు’ అని కుంబ్లే అన్నాడు.టీమిండియాకు ఆ సత్తా ఉందిఅదే విధంగా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా... వరల్డ్‌కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ గెలవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పటి వరకు ఏ జట్టూ ఆ ఫీట్‌ నమోదు చేయలేదు. అయితే టీమిండియాకు ఆ సత్తా ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేంత బలంగా ఉంది’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. చదవండి: ICC: పాకిస్తాన్‌ స్థానంలో ఉగాండా!.. ట్వీట్‌ వైరల్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement