ప్రధాన వార్తలు
మెరుపుల పండగొచ్చింది
టి20 వరల్డ్ కప్లో భారత జట్టు జైత్రయాత్రను చూసి మూడు వారాలు గడిచాయి. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు మన అభిమానులంతా జేజేలు పలికారు. ఆ తర్వాత క్రికెట్ లేకుండా కాస్త స్తబ్దత. ఇప్పుడు మళ్లీ అందరిలో జోష్ నింపే వేసవి వినోదం వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు ఒకే జట్టుగా టీమిండియాను చాంపియన్గా నిలిపిన సహచరులంతా ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆరో టైటిల్ వేటలో రెండు టీమ్లు పోటీ పడుతుండగా, నాలుగో ట్రోఫీపై మరో జట్టు గురి పెట్టింది. రెండోసారి విజేతగా నిలవాలని మరో నాలుగు టీమ్లు సిద్ధం కాగా... తొలిసారి కప్ను ముద్దాడేందుకు ఇంకో మూడు జట్లు తమ పోరాటాన్ని కొనసాగించనున్నాయి. రెండు నెలల పాటు జరిగే 74 మ్యాచ్లతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ సమరానికి రంగం సిద్ధమైంది. ఇక పగలూ రాత్రీ అక్కడా ఇక్కడా ఎక్కడైనా ఐపీఎల్ స్కోర్లు, ఫలితాలు, విశ్లేషణలపైనే చర్చ షురూ కానుంది. బెంగళూరు: ఐపీఎల్–2026కు నేటితో తెర లేవనుంది. చిన్నస్వామి మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. గత నాలుగు సీజన్ల తరహాలోనే ఈసారి కూడా మొత్తం 10 టీమ్లు బరిలోకి దిగుతున్నాయి. మే 24 వరకు లీగ్ దశలు పోటీలు జరుగుతాయి. వీటిలో 12 రోజుల్లో డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్లు) ఉన్నాయి. ఆ తర్వాత ‘ప్లే ఆఫ్స్’ నిర్వహిస్తారు.‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్ల వేదికలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ మే 31న బెంగళూరులో నిర్వహిస్తారు. ప్రతీ ఏటా ప్రజాదరణలో, వాణిజ్యపరంగా కూడా స్థాయిని పెంచుకుంటూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ కూడా ఎప్పటిలాగే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. దిగ్గజ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్ ఈ సీజన్లో కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. లీగ్లో మరో రసవత్తర వినోదానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సీజన్కు సంబంధించి కొన్ని విశేషాలు.... » డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాల మధ్య హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. ఆ తర్వాత అనుమతి రాగా... ముందుగా ఇచి్చన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు సిద్ధమైంది. » ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు సీజన్లలో రెండేసి మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడింది. ఈసారి ఆ జట్టు వైజాగ్లో బరిలోకి దిగడం లేదు. తమ ఏడు హోం మ్యాచ్లు అన్నింటినీ ఢిల్లీలోనే ఆడనుంది. ప్రతీ సీజన్లాగే రాజస్తాన్కు గువాహటి, పంజాబ్కు ధర్మశాల ‘రెండో హోం గ్రౌండ్’గా ఉంటాయి. » ఐపీఎల్ జట్లకు ఈసారి కొత్త కోచ్లు వచ్చారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార్ సంగక్కర రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. కోల్కతా నైట్రైడర్స్ చంద్రకాంత్ పండిత్ స్థానంలో అభిõÙక్ నాయర్ను హెడ్ కోచ్గా ఎంచుకుంది. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రసెల్ను తమతోనే ఉంచుకున్న కేకేఆర్ ‘పవర్ కోచ్’ అనే కొత్త పదవిని సృష్టించి బాధ్యతలు అప్పగించింది. కేన్ విలియమ్సన్ను లక్నో ఫ్రాంచైజీ ‘వ్యూహాత్మక సలహాదారు’గా నియమించుకుంది. ఆసీస్ మాజీ స్టార్ మాథ్యూ హేడెన్ గుజరాత్కు బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనుండగా, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఇయాన్ బెల్ను ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా తీసుకుంది. » ఆటగాళ్లపరంగా చూస్తే టి20 వరల్డ్ కప్ స్టార్ సంజు సామ్సన్ జట్టు మారడమే ఆసక్తికర అంశం. 11 సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్కు ఆడిన సామ్సన్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. అదే తరహాలో 12 సీజన్ల పాటు చెన్నైతో అనుబంధం ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన తొలి జట్టు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈసారి ఆడబోతున్నాడు. » ఐపీఎల్లో మొదటి నుంచి భారత్ తర్వాత ఆ్రస్టేలియన్లదే ఆధిపత్యం. అటు ఆటగాళ్లు, ఇటు కోచింగ్ బృందంలో కూడా వారంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈసారి వేలంలో రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామెరాన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. కోల్కతా నైట్రైడర్స్ తరఫున అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడన్నదే ఆసక్తికరం. ముగ్గురు ఆసీస్ గ్రేట్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్ మాత్రం లీగ్ ఆరంభంలో కనిపించకపోవచ్చు. గాయాల నుంచి పూర్తిగా కోలుకొని కమిన్స్ (సన్రైజర్స్), హాజల్వుడ్ (ఆర్సీబీ) తమ టీమ్లతో చేరినా... ఎప్పటి నుంచి మ్యాచ్లు ఆడతారనే సందేహం ఉంది. స్టార్క్ అయితే ఇంకా భారత్కే రాకపోగా, దీనిపై ఢిల్లీ మేనేజ్మెంట్కు ఇంకా స్పష్టత లేదు. వీరు కాకుండా ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, షార్ట్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్‡్ష, ఇన్గ్లిస్, స్టొయినిస్, ఒవెన్, డ్వార్షుయిస్, కనోలీ, బార్త్లెట్ కూడా తమ ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నారు. మ్యాచ్ల ఫార్మాట్ మారింది... లీగ్లోకి పది టీమ్లు వచ్చిన తర్వాత ప్రతీ ఏటా అనుసరిస్తున్న ‘గ్రూపింగ్’ పద్ధతినే ఈసారి కూడా అనుసరించారు. ఆయా టీమ్లు సాధించిన ఐపీఎల్ టైటిల్స్ను బట్టి వీటిని రెండు గ్రూప్లుగా విభజించారు. దీని ప్రకారం గ్రూప్ ‘ఎ’లో చెన్నై (5), కోల్కతా (3), రాజస్తాన్ (1), బెంగళూరు (1), పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో ముంబై (5), హైదరాబాద్ (1), గుజరాత్ (1), ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గత సీజన్ వరకు ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు (మొత్తం 8), ప్రత్యర్థి గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ (మొత్తం 4), ఒక టీమ్తో రెండుసార్లు (2) ఆడేవి. ఇలా ప్రతీ జట్టుకు 14 లీగ్ మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది. అయితే ఈసారి ఇదే ఫార్మాట్ను భిన్నంగా మార్చారు. ఈ సీజన్లో ప్రత్యర్థి గ్రూప్లోని ఐదు జట్లతో రెండేసి సార్లు (మొత్తం 10), తమ గ్రూప్లోని టీమ్లతో ఒక్కో మ్యాచ్ (4)లో తలపడాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఐదుసార్లు చాంపియన్లు అయిన చెన్నై, ముంబైల మధ్య రెండు మ్యాచ్లు జరుగుతాయి.27 స్పాన్సర్లతో ప్రకటనల జోరు! ఐపీఎల్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు రావడం కొత్త కాదు. కానీ ఈసారి ప్రసారకర్తలు మరింత పెద్ద సంఖ్యలో భారీ మొత్తాలకు స్పాన్సర్లతో జత కట్టారు. తాజా సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్–జియో హాట్స్టార్లలో కలిపి ఏకంగా 27 సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. వీటితో బ్రాడ్కాస్టింగ్ టీమ్కు ప్రకటనల పండగ ఖాయం. స్పాన్సర్ల జాబితాలో గూగుల్ సెర్చ్ ఏఐ, క్యాంపా ఎనర్జీ, హావెల్స్, లాయిడ్, బిర్లా ఒపస్, హీరో మోటో కార్ప్, అమెజాన్, ఏఎంఎఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, విమల్ ఇలైచీ, సూపర్ మనీ, ఎంఆర్ఎఫ్, ఫ్లిప్కార్ట్, జిల్లెట్, వీడా, రూపే, మాండెలెజ్, మదర్ డెయిరీ, గ్రో, ర్యాపిడో, ముత్తూట్ ఫినాన్స్, సన్ఫీస్ట్, గూగుల్ పే, టీవీఎస్ ఈవీ, ఏంజెల్ వన్, క్యాంపా ష్యూర్, అమూల్ ఉన్నాయి. టాప్–4 సన్రైజర్స్వే... లీగ్లో జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు జాబితాలో హైదరాబాద్ హవానే సాగింది. టాప్–4 స్కోర్లు వరుసగా 287, 286, 278, 277 సన్రైజర్స్ నమోదు చేసింది. ఈసారి 300 నమోదవుతుందా అనేది ఆసక్తికరం.109 ఐపీఎల్ చరిత్రలో నమోదైన సెంచరీలు. 58 మంది క్రికెటర్లు సెంచరీలు చేశారు. 2024లో అత్యధికంగా 14 సెంచరీలు నమోదుకాగా ... 2009లో అత్యల్పంగా 2 సెంచరీలు వచ్చాయి. 4 ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ప్లేయర్లు (ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే) మాత్రమే ప్రతి సీజన్లో బరిలోకి దిగారు. రోహిత్ శర్మ (డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్), ధోని (చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్) రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించగా... కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే జట్టు (ఆర్సీబీ)కు ఆడుతున్నాడు. మనీశ్ పాండే మాత్రం ఏడు జట్లకు (ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్ ఇండియా, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ డేర్డెవిల్స్) ప్రాతినిధ్యం వహించాడు.278 ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ ధోని. వరుసగా 19వ సీజన్లో బరిలోకి దిగనున్న ధోని 278 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. రోహిత్ శర్మ (272), విరాట్ కోహ్లి (267) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.10 ఐపీఎల్లో కనీసం 200 మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు. ఈ జాబితాలో ధోని, రోహిత్, కోహ్లి, దినేశ్ కార్తీక్ (257), రవీంద్ర జడేజా (254), శిఖర్ ధావన్ (222), రవిచంద్రన్ అశ్విన్ (221), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (204) ఉన్నారు. ఈ సీజన్లో అజింక్య రహానే (198), భువనేశ్వర్ కుమార్ (190), సునీల్ నరైన్ (189) ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.ఐపీఎల్ రికార్డులు... ఐపీఎల్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. వీరిలో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొందరు ఆటనుంచి నిష్క్రమించినా వారు అందించిన వినోదం, మెరుపులు మర్చిపోలేనివి. ఇప్పుడు బరిలో ఉన్నా, లేకపోయినా 19వ సీజన్ నేపథ్యంలో కొన్ని ఘనతలను గుర్తు చేసుకోక తప్పదు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి (8661), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజువేంద్ర చహల్ (221) పేరిట రికార్డు ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్ (175 నాటౌట్) నమోదు చేయగా, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అల్జారి జోసెఫ్ (6/12) పేరిట ఉంది. అత్యధిక సిక్స్లు (357) క్రిస్ గేల్ బాదగా, ఒకే సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఘనత (973–2016లో) కోహ్లి పేరు మీద చెక్కు చెదరకుండా ఉంది.
ఎప్పటికీ మా హృదయాల్లో...
ఐపీఎల్లో గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన విజయోత్సవంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. వారి స్మారకార్థం ఆర్సీబీ యాజమాన్యం భిన్న రీతిలో నివాళి అర్పించనుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది. పీ1 స్టాండ్లోని ఈ సీట్లలో ఎవరూ కూర్చోకుండా ఆ 11 మంది జ్ఞాపకార్ధం శాశ్వతంగా అలాగే ఉంచనుంది. ‘జట్టుతో వారికి ఉన్న అనుబంధానికి ఇవి గుర్తుగా ఉండిపోతాయి. వారు ఎప్పటికీ ఆర్సీబీ అభిమానులే’ అని తమ గౌరవాన్ని ప్రకటించింది.
చికిత ఖాతాలో స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్తో కలిసి పసిడి పతకం సొంతం చేసుకుంది. చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత–రజత్ చౌహాన్ (భారత్) ద్వయం 158–156తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా) జంటపై గెలిచింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికిత, రాజ్ కౌర్, తేజల్ బృందం 227–229తో విక్టోరియా, డయానా, రొక్సానాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడి రజత పతకాన్ని గెల్చుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో దేవాంగ్ గుప్తా, సుఖ్చెయిన్ సింగ్, జుయెల్ సర్కార్ (భారత్) బృందం 4–5తో కరిమోవ్, ఇల్ఫాత్, దౌలత్కెల్దీ (కజకిస్తాన్) జట్టు చేతిలో ఓడి రజతం నెగ్గింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్లో తేజల్ సాల్వే 144–138తో మరియాపై గెలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఉదయ్ కంబోజ్ (స్వర్ణం), ప్రథమేశ్ (రజతం), రజత్ (కాంస్యం) క్లీన్స్వీప్ చేశారు. ఫైనల్లో ఉదయ్ కంబోజ్ 145–144తో ప్రథమేశ్పై, కాంస్య పతక మ్యాచ్లో రజత్ చౌహాన్ 145–144తో పీరావత్ (థాయ్లాండ్)పై నెగ్గారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి (భారత్) 2–6 సెట్లతో ఒయున్ బసాన్దోర్జ్ (మంగోలియా) చేతిలో ఓడి రజతం సొంతం చేసుకుంది. బుధవారం భారత పురుషుల కాంపౌండ్ జట్టు, భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్య పతకాలు సాధించాయి.
‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్నీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవ్నీత్ కౌర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. గతేడాది ప్రదర్శనకు గాను హాకీ ఇండియా శుక్రవారం ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. భారత మాజీ కెప్టెన్ 1980 మాస్కో ఒలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన జట్టులో సభ్యుడైన జాఫర్ ఇక్బాల్కు మేజర్ ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1978, 1982 ఆసియా క్రీడల్లో రజత పతకాలు గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ సభ్యుడు. 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ ఉన్నాడు. హాకీకి చేసిన సేవకుగానూ జాఫర్ ఇక్బాల్కు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందించారు. హార్దిక్, నవ్నీత్లకు అవార్డులతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. మహిళల జట్టు ప్లేయర్ బిచ్చూ దేవికి ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించగా... ఉత్తమ డిఫెండర్గా సంజయ్కు పురస్కారం దక్కింది. ‘మిడ్ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుమిత్కు దక్కగా... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుఖ్జీత్ సింగ్కు దక్కింది. వీరందరికీ అవార్డుతో పాటు రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. శుక్రవారం న్యుఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్–21 ఏజ్ గ్రూప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాక్షి రాణా, ప్రిన్స్ దీప్ సింగ్కు ‘అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు అందించారు. ఈ ఇద్దరికీ చెరో రూ. 10 లక్షల నగదు బహుమతి అందించారు. ప్లేయర్లతో పాటు అంపైర్లు, స్కోరర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆసియాకప్లో విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి తలా రూ. 1.5 లక్షలు అందజేశారు. జూనియర్ వరల్డ్కప్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.15 లక్షల చొప్పున అందజేశారు. » హైదరాబాద్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో సత్తా చాటిన నవ్నీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. » గతేడాది జరిగిన జాతీయ చాంపియన్షిప్లో సత్తాచాటిన ఏడు (జార్ఖండ్, హరియాణా, మిజోరం, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్) జట్లకు రూ. 10 లక్షల చొప్పున అందజేశారు. » అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లకు ఇన్సెంటివ్లను సైతం శుక్రవారం అందజేశారు. పురుషుల జట్టుకు రూ. 1.38 కోట్లు, మహిళల జట్టుకు రూ. 69 లక్షలు లభించాయి. » జాతీయ జట్టు తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మన్ప్రీత్ సింగ్కు రూ. 4 లక్షలు, 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్కు రూ. 2.5 లక్షలు అందించారు. » 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హార్దిక్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్, నిలకంఠ శర్మ, జర్మన్ప్రీత్ సింగ్, సలీమా టెటెకు రూ.1.50 లక్షలు... 100 మ్యాచ్లు ఆడిన అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్కు రూ. 1 లక్ష చొప్పున అందజేశారు. » మహిళల హాకీలో 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నవ్నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్కు రూ. 2 లక్షల చొప్పున ఇచ్చారు.
ఈసారి ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత ఏడాది టైటిల్ సాధించేందుకు చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్లో ఓటమి పాలైంది. లీగ్ దశలో 14 మ్యాచ్లలో 9 విజయాలు సాధించి దూసుకొచ్చిన పంజాబ్ను తుది పోరులో ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి విజేతగా నిలిచింది. అయితే ఈసారి అలాంటి పొరపాటుకు తావు ఇవ్వమని, కచ్చితంగా ట్రోఫీని అందుకుంటామని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన బెంగళూరు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మే 31న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ‘మే 31న చిన్నస్వామి మైదానంలో మేం ఫైనల్ ఆడి కప్ను సొంతం చేసుకోబోతున్నాం. ఇది నా ఆశ మాత్రమే కాదు. కచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం ఉంది. టీమ్ సభ్యులందరిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది కాబట్టి జట్టు మొత్తం కూడా ఇదే నమ్ముతోంది’ అని శశాంక్ వ్యాఖ్యానించాడు. అయితే గత ఏడాది ఫైనల్ గురించి ఆలోచిస్తూ తాము ఒత్తిడి పెంచుకోమని, ఒక్కో మ్యాచ్లో గెలుస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యమని అతను పేర్కొన్నాడు. 2025 సీజన్లో ఆడిన జట్టు నుంచి 21 మంది పంజాబ్ కింగ్స్ కొనసాగిస్తోంది. ‘గత ఏడాది చేసిన చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దుకుంటూ ఒక్కో మ్యాచ్లో విజయం సాధించడం ముఖ్యం. దాదాపు అదే జట్టు ఉండటం కూడా అందరిలో ప్రేరణ కలిగించే అంశం. ఈ సీజన్కు మేం మరింత బాగా సన్నద్ధమై వచ్చాం’ అని శశాంక్ వెల్లడించాడు. సాధారణంగా టాపార్డర్ బ్యాటర్ అయిన తాను పంజాబ్ కింగ్స్ జట్టు అవసరాల కోసం ఆర్డర్లో దిగువకు మారానని...అయితే ఈ పాత్రను, బాధ్యతను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు. ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలంఐపీఎల్కు అనుమతించని శ్రీలంక బోర్డుకొలంబో: ఐపీఎల్లో ఇప్పటికే హాజల్వుడ్ అందుబాటులో లేక పేస్ బౌలింగ్లో డీలాగా మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో సమస్య తోడైంది. హాజల్వుడ్ స్థానంలో తుది జట్టులో ఆడే అవకాశం ఉన్న శ్రీలంక పేసర్ నువాన్ తుషారా ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలమయ్యాడు. దాంతో అతనికి ఐపీఎల్ కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు లంక బోర్డు తిరస్కరించింది. ఫిట్నెస్ టెస్టులో వేర్వేరు ప్రమాణాల ద్వారా అందుబాటులో ఉన్న 29 పాయింట్లలో కనీసం 17 పాయింట్లు సాధించాల్సి ఉండగా... తుషారా వాటిని అందుకోలేకపోయాడు.
ప్రపంచకప్ ఆడే జట్టే ఆసియా క్రీడలకు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత హాకీ జట్టు మెగా ఈవెంట్లతో బిజీ షెడ్యూల్తో గడపనుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచకప్, ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ రెండు మేజర్ టోర్నీలకు కలిపి ఒకే జట్టు బరిలోకి దిగుతుందని పురుషుల హాకీ హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పష్టం చేశారు. తద్వారా రెండు వేర్వేరు జట్లను తయారు చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. ప్రపంచకప్, ఆసియా క్రీడలకు మధ్య కేవలం మూడు వారాల విరామమే ఉండటంతో ఆటగాళ్ల ఫిట్నెస్, పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు రెండు జట్లను సిద్ధం చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేసే మెరుగైన, ధీటైన జట్టునే ఆసియా క్రీడల్లోనూ ఆడిస్తామని ఆయన చెప్పారు. నిజానికి 15 నెల క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా జట్టు నిర్మాణ ప్రక్రియ చేపట్టామని, ఇందులో భాగంగానే భారత ‘ఎ’ జట్టుపై దృష్టి సారించామని, భవిష్యత్ అవసరాల కోసం సత్తాగల యువ రక్తాన్ని సీనియర్ జట్టుకు ఎక్కించేందుకే ఇలా చేశామని కోచ్ వివరించారు. అప్పుడు జట్టు సీనియర్లు, యువకుల మేళవింపుతో సమతూకంగా ఉంటుందని దక్షిణాఫ్రికాకు చెందిన కోచ్ క్రెయిగ్ చెప్పారు. ‘భారత జట్టుకు వరుస టోర్నీలు ఆడిన అనుభవం ఇదివరకు ఉంది. అజ్లాన్ షా, దక్షిణాసియా క్రీడలు, ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఇలా గతంలో పెద్ద పెద్ద టోర్నీలెన్నో ఆడింది. కాబట్టి పని ఒత్తిడి భారం అనే సమస్యయితే ఉండదు. జూన్లో హాకీ ప్రొ లీగ్ జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే ప్రపంచకప్లో బరిలోకి దించే జట్టుపై తుది కూర్పు పూర్తవుతుంది. అలా ఎంపికైన జట్టే బెల్జియం–నెదర్లాండ్స్కు వెళుతుంది. ఆ తర్వాత జపాన్కు బయల్దేరుతుంది’ అని క్రెయిగ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. బెల్జియం, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించబోయే ప్రపంచకప్ హాకీ ఈవెంట్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇది ముగిసిన మూడు వారాల్లోపే సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. జపాన్ ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్కు క్వాలిఫయర్స్గా జరుగబోతుంది.
'ఐపీఎల్ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్'
జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ ధార్ ఐపీఎల్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు నబీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండడంతో గతేడాది జరిగిన మినీ వేలంలో నబీని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.కేవలం రూ.30 లక్షల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన నబీనీ ఇతరు ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో నబీ పలు విషయాలను పంచుకున్నాడు. వేలం రోజు తన ఇంట్లో జరిగిన సందడిని నబీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ ఎంపిక కావడం సంతోషంగా ఉన్నప్పటికి, భారత్ తరపున ఆడడమే తన అంతిమ లక్ష్యమని నబీ తెలిపాడు."నాకు డబ్బు ముఖ్యం కాదు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్ వంటి మెగా టోర్నమెంట్లో ఆడాలనుకున్నాను. నాకు కనీస ధర రూ.30 లక్షలు వచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండేవాడిని. ఏదేమైనప్పటికి ఢిల్లీ ఇంత భారీ మొత్తం వెచ్చించి తీసుకోవడం నాకు ఆనందం కలిగించింది. వేలం రోజున నేను ఇంట్లోనే ఉన్నాను. వేలంలో నేను అమ్ముడుపోగానే బయట నం డ్యాన్స్లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. నా కటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. కానీ నేను ఇంట్లో ఉన్నానని వారికి తెలియదు. అయినప్పటికి నా విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్ నా కెరీర్ను మరింత ముందుకు తెసుకువెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్. దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తానే ఇక్కడ ఆడే అవకాశం లభిస్తోంది. నేను రెడ్ బాల్ క్రికెట్లో బాగా రాణించానని అన్పిస్తోంది. అందుకే నాకు ఆడే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా బాగా రాణించి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా అంతిమ లక్ష్యమని" నబీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు. హాజిల్వుడ్ గురువారం జట్టుతో చేరి ప్రాక్టీస్ చేసినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్కు అతడు అందుబాటులో లేడు."ఎస్ఆర్హెచ్తో జరిగే మా మొదటి మ్యాచ్కు జోష్ హాజిల్వుడ్ అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. జోష్ నిన్ననే మా జట్టుతో చేరాడు. అతడిపి ఫిట్నెస్ను మా వైద్యబృందం పరీక్షించనుంది. తర్వాతే తదుపరి మ్యాచ్లకు అతడి అందుబాటుపై నిర్ణయం తీసుకుంటాము" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఫ్లవర్ పేర్కొన్నాడు. కాగా ఈ జింబాబ్వే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు."కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడు, ఈసారి మరిన్ని పరుగులు సాధించాలన్న కసితో ఉన్నాడు. అతడు బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఈ సీజన్లో పరుగుల వరద పారించడం ఖాయమనిపిస్తోంది" అని ఫ్లవర్ అన్నారు.బెంగళూరు తుది జట్టు(అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?
ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?
ఐపీఎల్-2026 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. మార్చి 28న టోర్నీ ఆరంభ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎస్ఆర్హెచ్ ఢీకొట్టనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అన్ని విధాల సిద్దమైంది.అయితే ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం.గత ఏడాదిలాగే ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ తమ టాప్ ఆర్డర్ను కొనసాగించనుంది. ఓపెనర్లుగా విధ్వంసకర ప్లేయర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ రానున్నారు. కిషన్ గత సీజన్లో మూడో స్ధానంలోనే బ్యాటింగ్కు వచ్చి అద్బుతమైన సెంచరీ సాధించాడు.ఇక ఐదో స్ధానంలో హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్రౌండర్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మలు ఫినిషర్ పాత్రను పోషించనున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే ప్యాట్ కమ్మిన్స్ స్ధానాన్ని ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్తో భర్తీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.దూబే అరంగేట్రం?కార్స్ బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించగలడు. హర్షల్ పటేల్, శివమ్ మావి, జయదేవ్ ఉనద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అదేవిధంగా విధర్బ స్పిన్నర్ హర్ష్ దూబే ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశముంది. అయితే గత సీజన్లో ఆకట్టుకున్న జేషాన్ అన్సారీ కూడా తుది జట్టు రేసులో ఉన్నాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు(69) వికెట్లు పడగొట్టిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. దీంతో గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.30 లక్షల బేస్ప్రైస్కు అతడిని ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదేట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, శివమ్ మావిచదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ?
ధోనికి హ్యాట్సాఫ్.. మరో పదేళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్
ఐపీఎల్-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మార్చి 28) ఈ నుంచి ధానాధన్ క్రికెట్ లీగ్ షూరు కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే అందరి దృష్టి టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనిపైనే ఉంది.42 ఏళ్ల ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని 100 శాతం ఫిట్గా ఉన్నాడని, తన రిటైర్మెంట్ గురించి అనవసర చర్చలు పెడుతున్నారని యోగ్రాజ్ మండిపడ్డాడు."ధోని ఫిట్గా కన్పిస్తున్నాడు. ప్రతీ సీజన్లోనూ సరైన క్రమశిక్షణ, అంకితభావంతో తన ఫిట్నెస్ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికీ అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. అతడి మోచేతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ధోని ఒక అద్భుతం. అతడు రిటైర్ అవ్వాలని చెప్పడానికి అసలు వీళ్లెవరు? అనవసర చర్చలు పెడుతున్నారు. అతడు మరో పదేళ్లు ఆడాలి. క్రికెట్ పరంగా ధోనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ పేర్కొన్నాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా ధోనిపై విమర్శలు గుప్పించే యోగ్రాజ్.. ఈసారి మిస్టర్ కూల్కు మద్దతుగా నిలవడం గమనార్హం.మరోవైపు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు వచ్చిన సంజూ శాంసన్ధో.. ధోనికి సరైన వారసుడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 30న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. సీఎస్కే జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ?
పాక్పై భారత్దే పైచేయి
మాలే (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (...
‘ఆసియా’ పతకమే బాకీ ఉంది
రాయ్పూర్: ఒలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక విశ్వక్...
బెంగళూరు ఎఫ్సీ హెడ్ కోచ్గా మునోజ్
బెంగళూరు: స్పెయిన్ చెందిన పెప్ మునోజ్ను బెంగళూర...
‘ఆఫ్రికా కప్’ కోసం సెనెగల్ అప్పీల్
జెనివా: ఆఫ్రికా కప్ గెలిచిన మమ్మల్నే తిరిగి విజేత...
ధోనికి హ్యాట్సాఫ్.. మరో పదేళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్
ఐపీఎల్-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మా...
హార్దిక్ పాండ్యా మంచి మనసు.. ఆ 11 మందికి?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్...
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ?
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్ల...
విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తన రిటైర్...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
అభిషేక్, ఇషాన్ కాదు.. SRH X ఫ్యాక్టర్ అతనే
బెంగళూరులో ల్యాండ్ అయిన పాట్ కమ్మిన్స్.. ఇక RCB కి చుక్కలే
సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసేటోడు ఇంకా పుట్టలే..! రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.
మాతో పెట్టుకోవద్దు.. పాక్కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
