Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

 Ex-India Player Shows Support KL Rahul Decision Vs RCB1
‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సోమ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో దారుణ ఓట‌మిని చ‌విచూసింది. 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ విధ్వ‌సంక‌ర సెంచ‌రీతో పంజాబ్‌పై భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ, ఆ మ్యాచ్‌ను కూడా కాపాడుకోవ‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విఫ‌ల‌మైంది. అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో 152 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. అయితే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా డెబ్యు ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు చాన్స్ ఇవ్వ‌డంపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే కేఎల్ రాహుల్‌కు భార‌త మాజీ క్రికెటర్‌ దొడ్డ గ‌ణేశ్ అండ‌గా నిల‌బ‌డ్డాడు. ‘ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. డెబ్యూ ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు స్ట్రైక్ ఇవ్వ‌డంపై కొంతమంది జ‌ర్న‌లిస్టులు విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేశారు. అయితే సాహిల్ ప‌రాక్ టెయిలెండ‌ర్ కాదు, అత‌డొక బ్యాట‌ర్‌. అందుకే అత‌డిని ఓపెన‌ర్‌గా ఎంచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌క రాహుల్‌ను అకార‌ణంగా తిడుతున్నారు. పిచ్ ప‌రిస్థితులపై అవ‌గాహ‌న‌లేమి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణ ఆట‌తీరుకు కార‌ణ‌మ‌య్యింది. కానీ కేఎల్ రాహుల్ ఏదో త‌ప్పు చేసిన‌ట్లు అంద‌రూ అత‌డిపై క్రూర‌త్వం ప్రద‌ర్శించ‌డమేంటనేది నాకు అర్థం కావ‌డం లేదు. అత‌డిపై విషం చిమ్మ‌డం ఆపండి’ అని చెప్పు కొచ్చాడు.మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఇక దొడ్డ గణేశ్‌ టీమిండియా తరఫున ఒక వన్డే, నాలుగు టెస్టులు ఆడాడు.Saw a couple of journalists’ tweet yesterday where they blamed KL Rahul for exposing the debutant from ball one.FYI guys, that kid is no tail ender; he’s a proper batter and that’s why he was chosen to open. Can’t understand this toxicity around KL Rahul #IPL2026— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) April 28, 2026చదవండి: భార‌త్‌కు తప్పని చైనా గండం!

Son Of Virat Kohli’s Massive Fan From West Indies Breaks Multiple Records2
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ అభిమాని కొడుకు

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్‌ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్‌ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ బిహేవియర్‌ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్‌ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్‌లో సంచలనంగా మారింది.వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్‌పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్‌ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్‌తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్‌ తరఫున చేశాడు.వెస్టిండీస్‌ తరఫున అడపాదడపా టెస్ట్‌ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు.

IPL 2026: Suyash Sharma Leaves Legends Behind With Historic IPL Record3
చరిత్ర సృష్టించిన సుయాశ్‌ శర్మ

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ ప్రత్యర్దిని 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది.ఢిల్లీని 75 పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4), రసిక్‌ సలాం దార్‌ (2-0-21-1), సుయాశ్‌ శర్మ (4-1-7-1), కృనాల్‌ పాండ్యా (2-0-9-1) కీలకపాత్ర పోషించారు. వీరిలో భువీ, హాజిల్‌వుడ్‌ ఆరంభంలో చెలరేగగా.. ఆతర్వాత సుయాశ్‌ శర్మ పేట్రేగిపోయాడు. ఈ క్రమంలో సుయాశ్‌ చారిత్రక ప్రదర్శన నమోదు చేశాడు.తన కోటా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చిన సుయాశ్‌, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అంతేకాదు, తన స్పెల్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అతడిని నిలిపింది. ఈ ఘనతను ఇంతకుముందు దీపక్‌ చాహర్‌ సాధించాడు. చాహర్‌ 2019 ఎడిషన్‌లో సీఎస్‌కేకు ఆడుతూ కేకేఆర్‌పై ఈ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఇక్కడ దీపక్‌ చాహర్‌ పేస్‌ బౌలర్‌ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా సుయాశ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి టాప​-5 బౌలర్లలో సుయాశ్‌ ఒక్కడే స్పిన్నర్‌గా ఉన్నాడు.ఐపీఎల్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్లు (టాప్‌-5)సుయాశ్‌ శర్మ- 20దీపక్‌ చాహర్‌- 20ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌- 19జహీర్‌ ఖాన్‌- 19మహ్మద్‌ షమీ- 19కాగా, ఈ చారిత్రక ప్రదర్శనలో సుయాశ్‌ ఇచ్చిన 7 పరుగుల్లో 3 వైడ్ల రూపంలో వచ్చాయి. ఇవి కూడా వేయకపోయుంటే సుయాశ్‌ ఐపీఎల్‌లో అత్యంత​ పొదుపైన స్పెల్‌ వేసిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కేవాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్‌ మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. ఢిల్లీ ఏడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ ఏప్రిల్‌ 30న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

PV Sindhu loses-India womens team crashes out of Uber Cup 20264
భార‌త్‌కు తప్పని చైనా గండం!

ప్రతిష్ఠాత్మ‌క ఉబెర్ క‌ప్‌లో భారత్ ఆట ముగిసింది. భార‌త మ‌హిళ‌ల నంబ‌ర్‌వ‌న్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు చైనా గండాన్ని దాటి ముందుకెళ్ల‌లేక చ‌తికిల‌ప‌డింది. విష‌యంలోకి వెళితే ఉబెర్ క‌ప్‌లో భాగంగా గ్రూప్‌-ఏలో ఉన్న భార‌త్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో చైనాతో త‌ల‌ప‌డింది. అయితే చైనా చేతిలో 5-0తో ప‌రాజ‌యం చ‌విచూసిన భార‌త్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. అయితే నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 16-21, 21-19, 19-21తో వాంగ్ జియి చేతిలో ఓట‌మి చ‌విచూసింది. దీంతో డ‌బుల్స్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిలో ప్రియా కొన్‌జెంగ‌మ్‌-శ్రుతి మిశ్రా జంట చైనా జంట చేతిలో ఓట‌మిపాలైంది. ఆ త‌ర్వాత మ‌రో డ‌బుల్స్‌లో ట్రిసా జాలీ-క‌విప్రియ సెల్వ‌మ్ జోడి కూడా ఓట‌మి పాల‌వ్వ‌డంతో భార‌త్ ఓట‌మి ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో రివ‌ర్స్ సింగిల్స్‌లో ఇషారాణి బ‌రుహా తొలి గేమ్‌ను గెలిచిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు గేముల్లో ఓట‌మిపాలైంది. ఇక థామ‌స్ క‌ప్‌లో భాగంగా ప‌రుషుల విభాగంలో భార‌త జ‌ట్టు బుధ‌వారం చైనాతో త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!

ICC Rewards South Africa Captain, Smriti Mandhana Demoted In T20I Rankings5
సౌతాఫ్రికా కెప్టెన్‌కు భారీ లబ్ది

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌కు భారీ లబ్ది చేకూరింది. తాజాగా భారత్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆమె.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్‌లో లారా 168కిపైగా స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 330 పరుగులు చేసింది.మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి, ఐదో స్థానానికి పడిపోయింది. ఈ సిరీస్‌లో మంధన 3 మ్యాచ్‌ల్లో కేవలం 62 పరుగులే చేయగలిగింది. తాజా ర్యాంకింగ్స్‌లో విండీస్‌ బ్యాటర్‌ హేలీ మాథ్యూస్‌ కూడా ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది. టాప్‌-2 బ్యాటర్లుగా జార్జియా వాల్‌, బెత్‌ మూనీ కొనసాగుతున్నారు.టాప్‌-10లో ఉన్న షఫాలీ వర్మ ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని పదో స్థానానికి చేరింది.బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. పాక్‌ బౌలర్‌ సదియా ఇక్బాల్‌, ఇంగ్లండ్‌ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్‌, లారెన్‌ బెల్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. భారత్‌తో సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా బౌలర్‌ మ్లాబా 2 స్థానాలు మెరుగుపర్చుకొని దీప్తి శర్మతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానం షేర్‌ చేసుకుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్‌ శ్రీచరణి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 11వ స్థానానికి ఎగబాకింది.కాగా, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత్‌ కేవలం​ నాలుగో మ్యాచ్‌ మాత్రమే గెలవగా.. సౌతాఫ్రికా మిగతా మ్యాచ్‌లన్నీ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ గెలుపులో లారా వోల్వార్డ్ట్‌ కీలకపాత్ర పోషించింది.

Young Fan Breaks Down In Tears Throws Bat Fails-To Get Kohli Autograph6
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!

క్రికెట్‌లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్ద‌వాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగ‌బ‌డ‌డం చూస్తుంటాం. ఇక‌ ప్ర‌స్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆట‌గాళ్లు బ‌స చేస్తున్న హోటల్ రూం వ‌ద్ద ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్‌తో అత‌డి వ‌ద్ద‌కు ప‌రిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అధికారులు అత‌డిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని ప‌ట్టించుకోలేదు. దీంతో కోహ్లి త‌న‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వ‌కుండానే వెళ్లిపోయాడ‌న్న కోపంతో త‌న చేతిలోని బ్యాట్‌ను విసిరేసి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘ‌ట‌న మ్యాచ్‌కు ముందు జ‌రిగిందా లేక త‌ర్వాత జ‌రిగిందా అన్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ బుడ్డోడు మాత్రం త‌న చ‌ర్య‌తో రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడ‌నుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?

England pick 18 year old Tilly Corteen Coleman for Women's T20 World Cup7
టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు మరో నెలన్నర సమయం ఉండగానే ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా నాట్‌ స్కీవర్‌ బ్రంట్‌ ఎంపిక కాగా.. ఆమెకు డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) ఛార్లీ డీన్‌ ఎంపికైంది.ఈ జట్టుకు ఓ సంచలన ఎంపిక జరిగింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండానే 18 ఏళ్ల టిల్లీ కార్టీన్‌-కోల్‌మన్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అయిన టిల్లీ, సర్రే తరఫున అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి కీలక బలంగా మారే సామర్థ్యం ఆమెకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ జట్టుకు ఇస్సీ వాంగ్‌, లారెన్‌ ఫైలర్‌ కూడా ఎంపికయ్యారు. వీరికి ఇదే తొలి టీ20 ప్రపంచకప్‌. మొత్తంగా ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్‌ జట్టు కొత్త వారు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ఈ జట్టు ఎంపికపై హెడ్‌ కోచ్ ఛార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక చాలా కఠినమైన ప్రక్రియగా మారిందన్నారు. ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటం ఇంగ్లండ్ మహిళా క్రికెట్ బలాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న ఈ ప్రపంచకప్ తమకు ప్రత్యేకమని, అభిమానుల మద్దతుతో గొప్ప ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.కాగా, జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 జరుగనుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్‌లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ​్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి.

Delhi Capitals Coach Badani Told To Shut Up Old Dhoni Fleming Dig8
ధోని వల్లేనా?.. నోర్ముయ్‌.. ముందు నీ సంగతి చూసుకో!

ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయ పరంపర కొనసాగుతోంది. సొంత మైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది ఢిల్లీ. తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఘోర పరాభవం పాలైంది.టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీకి ఐపీఎల్‌లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అభిషేక్‌ పొరేల్‌ (33 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.బ్యాటర్లకు చుక్కలు‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోష్‌ హాజల్‌వుడ్‌ (4/12), భువనేశ్వర్‌ కుమార్‌ (3/5) అద్భుత బౌలింగ్‌తో క్యాపిటల్స్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బెంగళూరు 6.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాతుమ్‌ నిస్సాంక స్థానంలో ఢిల్లీ ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన సాహిల్‌ పరేఖ్‌కు చేదు అనుభవమే మిగిలింది.ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఢిల్లీ హెడ్‌కోచ్‌ హేమంగ్‌ బదానీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గురించి మాట్లాడిన బదానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో చూడాలని ఉందన్నాడు.నోర్ముయ్‌.. నీ సంగతి చూసుకో ముందు!‘‘హేయ్‌ హేమంగ్‌.. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ జట్టు ఎలా ఆడుతుందో చూడు. ఆ తర్వాత వేరేవాళ్ల గురించి మాట్లాడు. ఎక్కువగా మాట్లాడేవాళ్లు పెద్ద గొప్పేమీ కాదని నేను తరచూ చెబుతూ ఉంటాను.ఎంఎస్‌ ధోని వల్లే అతడు గెలిచాడా?అయితే, బదానీ చాలా ఎక్కువగా మాట్లాడేస్తాడు. కానీ ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు అతడిని విమర్శిస్తున్నారు. నిజానికి నువ్వు ఇతరుల గురించి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటే బాగుండేది. ఆరోజు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ గురించి ఏమన్నావో గుర్తుందా? ఎంఎస్‌ ధోని వల్లే అతడు గెలిచాడా?మరి నువ్వేం చేశావు? ఏమీ లేదు కదా!.. అయినా పృథ్వీ షా ఉండగా.. కేఎల్‌ రాహుల్‌కు ఓపెనింగ్‌ జోడీగా సాహిల్‌ను తీసుకువస్తావా?’’ అంటూ చిక్కా మండిపడ్డాడు. కాగా క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రస్తావన ప్రకారం.. గతంలో హేమంగ్‌ బదానీ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ను ఉద్దేశించి..ఫ్లెమింగ్‌ మంచి కోచ్‌ కాదు‘‘ఫ్లెమింగ్‌ అంత పెద్ద కోచా? అలా అయితే, ఐపీఎల్‌ కాకుండా ఇతర టీ20 లీగ్‌లలో అతడు ఎందుకు విజయవంతం కావడం లేదు? ధోని వల్లే చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుస్తోంది. ఆ జట్టులో అంతా ధోనినే. ఫ్లెమింగ్‌ మంచి కోచ్‌ అని ఎవరైనా అంటే నేను మాత్రం అందుకు అస్సలు అంగీకరించను’’ అని అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిక్కా బదానీకి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.చదవండి: PSL: డేవిడ్‌ వార్నర్‌ సంచలన వ్యాఖ్యలు!

Kohli Makes Time For Childhood Coach-Inaugurates Cricket Academy9
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?

ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజ‌న్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న మూలాల‌ను మాత్రం మ‌రిచిపోలేదు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ జ‌ట్టు ఢిల్లీ వీడిన‌ప్ప‌టికీ కోహ్లి మాత్రం త‌న స్వ‌స్థ‌లంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్ర‌ధాన కార‌ణ‌ముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడ‌మీ (డ‌బ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్స‌వానికి కోహ్లితో పాటు అత‌డి చిన్న‌నాటి కోచ్ రాజ్‌కుమార్ శ‌ర్మ కూడా హాజ‌ర‌య్యారు. ఇది త‌న కోచ్ రాజ్‌కుమార్ శ‌ర్మ క్రికెట్ అకాడ‌మీ కావ‌డంతో ఆయ‌న మీద గౌర‌వంతో కోహ్లి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్య‌క్ర‌మంలో భాగంగా అకాడ‌మీ స్టూడెంట్ల‌కు కోహ్లి అవార్డులు అంద‌జేశాడు. ఈ నేప‌థ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్ల‌ను మొక్కే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కోహ్లి వ‌ద్ద‌ని వారించి అత‌డికి షేక్ హ్యాండ్ ఇచ్చి హ‌గ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడ‌మీలోని స్టూడెంట్స్‌ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వ‌య‌సులోనే క్రీడ‌ల‌ను నా కెరీర్‌గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజ‌యితీతో చేయాల‌నుకున్నా. అందుకే క్రికెటర్ కావాల‌ని ధృడంగా నిర్ణ‌యించుకున్నా. ఈ స‌మ‌యంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వ‌ద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్లు త‌మ ఆశ‌యాల ప‌ట్ల పూర్తి నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌తో ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది. మీరు కంటున్న క‌ల‌ల ప‌ట్ల‌, ఏమి చేయాల‌నుకుంటున్నార‌నే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు వంద‌శాతం నిజాయితీతో క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం మ‌న‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్‌లాడి 351 ప‌రుగులు సాధించాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 81 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక సోమ‌వారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో 23 ప‌రుగులు చేయ‌డం ద్వారా ఐపీఎల్‌లో 9వేల ప‌రుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 9వేల ర‌న్స్ పూర్తి చేసుకున్న తొలి ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్‌ గేమ్‌?’.. వినేశ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ఆగ్రహం

Vinesh Phogat Slams WFI They Deliberately Blocking My Return10
‘ఎందుకీ డబుల్‌ గేమ్‌?’.. వినేశ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ఆగ్రహం

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రెజ్లింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌కుండా రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూఎఫ్ఐ) త‌న‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా అడ్డుకుంటుంద‌ని పేర్కొంది. మీడియా ప్ర‌తినిధుల‌తో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ.. ‘నేష‌న‌ల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పున‌రాగ‌మ‌నం చేయాల‌ని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేష‌న్ గ‌డువు ఏప్రిల్ 30 వ‌ర‌కు ఉంది. అయితే నేను రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, గ‌డువు ముగిసిన‌ట్లు పోర్ట‌ల్‌లో చూపిస్తోంది. ఈ విష‌యాన్ని డ‌బ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించాను. కానీ వారు నా ఫోన్‌కాల్‌కు రెస్పాండ్ అవ్వ‌డం లేదు. నేను టోర్నీలో పాల్గొనాల‌ని చూస్తుంటే ఫెడ‌రేష‌న్ మాత్రం న‌న్ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే రెజ్లింగ్‌లో రీఎంట్రీ ఇవ్వ‌కుండా అడ్డుకుంటున్న‌ట్లుగా అనిపిస్తోంది. ఫెడ‌రేష‌న్ క‌ప్‌లో పాల్గొందామంటే అక్క‌డ నిబంధ‌న‌లు పూర్తిగా మార్చేశారు. ఇలా ప్ర‌తి అంశంలోనూ డ‌బ్ల్యూఎఫ్ఐ అడ్డుప‌డుతూనే వ‌స్తోంది. ఏషియ‌న్ గేమ్స్‌, ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్ వంటి సెలెక్ష‌న్ ట్ర‌య‌ల్స్‌లో పోటీలో ఉండాలంటే ఈ టోర్న‌మెంట్ నాకు ఎంతో కీల‌కం.’ అని వినేశ్ ఆరోపించారు. వినేశ్‌ రిజిస్ట్రేషన్ చేసుకుంది: సంజయ్‌అయితే వినేశ్ ఆరోప‌ణ‌ల‌పై డ‌బ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ సంజ‌య్ సింగ్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫొటో స్క్రీన్‌షాట్‌ను సంజయ్ సింగ్ పంచుకున్నారు. ‘వినేశ్ లాగే చాలా మంది రెజ్ల‌ర్లు మొదట ఇదే స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు. అయితే వారు మా స్టాఫ్‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య రాలేదు. అయినా టోర్నీలో పాల్గొన‌కుండా తాము ఎవ‌రిని అడ్డుకోవ‌డం లేదు. వినేశ్ ఇప్ప‌టికే త‌న రిజిస్ట్రేష‌న్‌ను పూర్తి చేసుకున్నారు. కానీ దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీడియాతో మాట్లాడే బదులు ఆమె రెజ్లింగ్‌పై దృష్టి సారిస్తే బాగుంటుంది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక ఏషియ‌న్ గేమ్స్ సెప్టెంబ‌ర్‌లో, ఆ త‌ర్వాత అక్టోబ‌ర్‌లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి.2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ‌రువు ఎక్కువ ఉన్న కార‌ణంగా వినేశ్ ఫొగాట్‌ ప‌త‌కానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. అయితే గ‌తేడాది డిసెంబ‌ర్‌లో త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న వినేశ్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించింది.చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement