Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sachin Tendulkar meets Mumbai team before Ranji Trophy knockouts, gives Yashasvi Jaiswal and others priceless advice1
ముంబై జట్టుకు సచిన్‌ సలహాలు

ముంబై: కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై ముంబై రంజీ జట్టుకు... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పలు సూచనలు చేశాడు. గ్రూప్‌ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ముంబై జట్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటకతో తలపడనుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకోగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సచిన్‌ టెండూల్కర్‌ ముంబై జట్టుతో ముచ్చటించాడు.ప్లేయర్లు, కోచింగ్‌ స్టాఫ్‌తో సుదీర్ఘంగా సంభాషించాడు. ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో సచిన్‌ సార్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. విజయ పరంపర కొనసాగించడం, మానసిక దృఢత్వం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి ఎన్నో అంశాలపై కీలక సూచనలు చేశారు. ప్లేయర్లు, కోచింగ్‌ స్టాఫ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయన మాటలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కీలక సమరాల్లో ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చో చక్కగా వివరించారు. రంజీ ట్రోఫీలో ఆ సూచనలు పాటిస్తూ విజయాలు సాధించాలని భావిస్తున్నాం’ అని ముంబై కెప్టెన్‌ శార్దుల్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు.

Getting better day by day: Rishabh Pant offers positive update on comeback2
గాయంపై కీలక ఆప్‌డేట్‌ ఇచ్చిన రిషభ్‌ పంత్‌

ముంబై: గాయం నుంచి కోలుకుంటున్న భారత డాషింగ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ త్వరలోనే మైదానంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోజు రోజుకి తన ఫిట్‌నెస్‌ మెరుగవుతోందని అన్నాడు. ప్రపంచ పికిల్‌బాల్‌ లీగ్‌ కార్యక్రమంలో ముంబై పికిల్‌ పవర్‌ సహ యజమాని హోదాలో పాల్గొన్న పంత్‌ తను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో తిరిగి క్రికెట్‌ ఆడేందుకు చెమటోడ్చుతున్నట్లు చెప్పాడు. ‘నా ఫిట్‌నెస్‌ క్రమంగా మెరుగవుతోంది. త్వరలోనే క్రికెట్‌ మైదానంలోకి దిగుతాను’ అని 27 ఏళ్ల పంత్‌ ఆశాభావం వ్యక్తం చేశడు. గత నెల వడోదరలో ప్రాక్టీస్‌ సెషన్‌లో అతను గాయపడ్డాడు. క్రికెట్‌పై తనకున్న ప్రేమే ఎన్ని గాయాలైనా... కష్టనష్టాలెదురైనా కోలుకునే స్థైర్యాన్నిస్తుందని ఈ స్టార్‌ వికెట్‌ కీపర్‌ చెప్పుకొచ్చాడు. ‘ప్రతి గాయం, పునరాగమనం నాకో పాఠం నేర్పింది’ అని పంత్‌ తెలిపాడు.

Badminton Asia Team C’ships: Kidambi Srikanth stars in decider as Indian men edge Singapore, women beat Myanmar convincingly3
భారత్‌ను గెలిపించిన శ్రీకాంత్‌

కింగ్డావో (చైనా): ఆసియా సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్‌ ‘సి’లో భాగంగా సింగపూర్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–2తో గెలిచింది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గి స్కోరు 2–2తో సమమైన దశలో... నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 21–16తో జియా వె జోయల్‌ కో (సింగపూర్‌)పై నెగ్గి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 16–21, 21–19, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యెవ్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–10, 21–8తో ఇంగ్‌ కీట్‌ వెస్లీ కో–జున్‌సుకె కుబో జంటపై గెలిచింది.మూడో మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 21–17, 21–15తో జియా హెంగ్‌ జేసన్‌ టెను ఓడించి భారత్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో పృథ్వీ కృష్ణమూర్తి–సాయి ప్రతీక్‌ ద్వయం 21–8, 21–23, 20–22తో ఎన్జీ జూ జె–డొనోవాన్‌ విలార్డ్‌ వీ జంట చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ తలపడుతుంది. మరోవైపు గ్రూప్‌ ‘వై’లో భారత మహిళల జట్టు 5–0తో మయన్మార్‌ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున సింగిల్స్‌లో తన్వీ శర్మ, మాళవిక, రక్షిత శ్రీ, డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా; ట్రెసా జాలీ–గాయత్రి జోడీలు గెలుపొందాయి. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్‌ ఆడుతుంది.

Special story on team India under 19 world cup semi final hero Aaron George4
భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్‌ జార్జ్‌' ఎవరు..?

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ పదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఇన్ని సార్లు ఫైనల్స్‌కు చేరలేదు. ఇందులో టీమిండియా ఐదు సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్‌గా నిలిచి, నాలుగు సందర్భాల్లో (2006, 2016, 2020, 2024) రన్నరప్‌గా నిలిచింది. ఏ జట్టూ ఇన్ని సార్లు ఛాంపియన్‌గా, రన్నరప్‌గానూ నిలవలేదు. యంగ్‌ ఇండియా మరోసారి ఫైనల్‌కు చేరి అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో తిరుగులేని జట్టుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.నిన్న జరిగిన 2026 ఎడిషన్‌ రెండో సెమీఫైనల్లో భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ అద్భుత శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరోన్‌ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీతో (33 బంతుల్లో 68; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 90 పరుగులు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రేతో (59 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు, ఆతర్వాత వేదాంత్‌ మల్హోత్రాతో (47 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి 96 పరుగులు జోడించి, భారత్‌ గెలుపు ఖరారయ్యాక మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా ఆరోన్‌ వన్‌మ్యాన్‌ షో కారణంగా భారత్‌ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అత్యుత్తమ ఛేదనఈ ఛేదన అండర్‌ 19 వరల్డ్‌కప్‌ చరిత్రలోనే అత్యధికం, అత్యుత్తమం. గతంలో ఏ జట్టూ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ పేరిట ఉండేది. 2006 ఎడిషన్‌లో ఐర్లాండ్‌ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఛేదించింది.ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు శతకాలు వృధాఅంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలి బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్‌ చౌహాన్‌ తలో 2 వికెట్లు తీశారు. ఆరోన్‌ అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించడంతో ఫైజల్‌, ఉజైరుల్లా శతకాలు వృధా అయ్యాయి.ఇంగ్లండ్‌తో అమీతుమీతొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్‌ కెప్టెన్‌ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) జరిగే ఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఈ ఆరోన్‌ జార్జ్‌ ఎవరు..?ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో సూపర్‌ సెంచరీతో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన ఆరోన్‌ జార్జ్‌ గురించి తెలుసుకునేందుకు క్రికెట్‌ అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా సెంచరీ తర్వాత చాలామంది ఆరోన్‌ గురించిన సమాచారం కోసం గూగుల్‌ చేస్తున్నారు.మన హైదరాబాదీనే..!19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినా.. జానియ‌ర్ స్దాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్‌కు అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డ‌ర్ ఆట‌గాడికి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆడే స‌త్తా ఉంది. ముఖ్యంగా జ‌ట్టు క‌ష్టాల్లో ఉందంటే అంద‌రి చూపు జార్జ్‌పైనే ఉంటుంది.సంజూ శాంసన్‌లా..!అత‌డి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ను పోలి ఉంటుంది. అదేవిధంగా అత‌డికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైద‌రాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(2022-23)లో బీహార్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పరుగుల వరదగత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.అప్పడు పాక్‌పై..ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్‌-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా గాయ‌ప‌డితే జార్జ్‌ను ప్ర‌త్న‌మ్నాయంగా తీసుకునే అవ‌కాశ‌ముంది.

Dubai Royals beat Pune Panthers by 8 wickets to win the inaugural edition of World Legends Pro T20 League5
శిఖర్‌ ధవన్‌ మెరుపులు

వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌ టైటిల్‌ను దుబాయ్‌ రాయల్స్‌ ఎగరేసుకుపోయింది. గోవా వేదికగా నిన్న (ఫ్రిబవరి 5) జరిగిన ఫైనల్లో పూణే పాంథర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పూణే ఫాంథర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాంథర్స్‌ ఇన్నింగ్స్‌లో ఉపుల్‌ తరంగ (55), మార్టిన్‌ గప్తిల్‌ (62), షేన్‌ వాట్సన్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ 1, రాబిన్‌ ఉతప్ప 15, సమీవుల్లా షిన్వారి (4 నాటౌట్‌) పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో పియుశ్‌ చావ్లా 2, క్రిస్‌ మోఫు, పర్వేజ్‌ రసూల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం బరిలోకి దిగిన రాయల్స్‌ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు మన్విందర్‌ బిస్లా (67), శిఖర్‌ ధవన్‌ (64) మెరుపు అర్ద సెంచరీలు చేసి రాయల్స్‌ గెలుపును ఖరారు చేశారు. మిగతా పనిని సమిత్‌ పటేల్‌ (2 నాటౌట్‌), అంబటి రాయుడు (29 నాటౌట్‌) పూర్తి చేశారు. పాంథర్స్‌ బౌలర్లలో అంకిత్‌ రాజ్‌పుత్‌, డ్వేన్‌ బ్రావోకు తలో వికెట్‌ దక్కింది. రాయల్స్‌ గెలుపుతో కీలకపాత్ర పోషించిన శిఖర్‌ ధవన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది.కాగా, వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొన్నాయి.గోవా వేదికగా జనవరి 26న మొదలైన ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరిగాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, మార్టిన్‌ గప్తిల్‌, కీరన్‌ పోలార్డ్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొన్నారు.

Womens Premier League final match is today6
ఢిల్లీ... ఈసారైనా?

వడోదర: ఒకటి కాదు రెండు కాదు...వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు... గత మూడు ప్రయత్నాల్లోనూ తుది మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సారైనా తమ తొలి కప్‌ కలను నెరవేర్చుకోవాలని ఒకవైపు పట్టుదలగా ఉంది. మరోవైపు అద్భుత ఫామ్‌తో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు నేరుగా అర్హత సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే టైటిల్‌ పోరులో 2024 చాంపియన్‌ ఆర్‌సీబీతో ఢిల్లీ తలపడనుంది. జోరు మీదున్న స్మృతి బృందం అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ లీగ్‌ చరిత్రలో వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్‌ స్మృతి మంధాన 290, గ్రేస్‌ హారిస్‌ 228 పరుగులు నమోదు చేశారు. రిచా ఘోష్‌ 150కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో దూకుడును ప్రదర్శించింది. ఆల్‌రౌండర్‌గా డిక్లెర్క్‌ అంచనాలకు మించి రాణించింది. 15 వికెట్లు తీసిన డిక్లెర్క్‌ బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. ప్రధాన పేసర్‌ లారెన్‌ బెల్‌ ప్రత్యర్థిని ఆరంభంలోనే కట్టిపడేస్తోంది. ఈ సీజన్‌లో ఆమె ఏకంగా 116 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. స్పిన్నర్‌ శ్రేయాంక కూడా 11 వికెట్లతో రాణించగా, ఎలైస్‌ పెరీ స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచి్చన సయాలీ కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే జోరును అందరూ కొనసాగిస్తే బెంగళూరుకు మరో విజయం దక్కవచ్చు. బ్యాటర్లదే బాధ్యత... ఢిల్లీ ఈ సీజన్‌లో సాధించిన ఐదు విజయాలు కూడా ఛేదనలోనే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కంటే టీమ్‌ ఛేదనకే ఆసక్తి చూపిస్తోంది. అయితే ఫైనల్‌ ఒత్తిడిని ఏమేరకు అధిగమిస్తుందనేది ఆసక్తికరం. గత సీజన్‌ ఫైనల్లో ఢిల్లీ ఛేదనలోనే ఓడిపోయింది. తాజా సీజన్‌లో కొత్త కెపె్టన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ నేతృత్వంలో జట్టు మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన ఉత్సాహంలో ఉన్న జెమీమా నాయకురాలిగా తొలి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. ఓపెనర్లు షఫాలీ, లిజెల్‌ లీ తొలి వికెట్‌కు కనీసం అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఢిల్లీ గెలిచింది. మూడో స్థానంలో వోల్‌వార్ట్‌ నిలకడగా ఆడుతుండగా, జెమీమా కూడా ఎలిమినేటర్‌లో చక్కటి ఇన్నింగ్స్‌ ఆడింది. బౌలింగ్‌లో మరోసారి శ్రీచరణి (14 వికెట్లు), నందిని శర్మ (16 వికెట్లు), స్నేహ్‌ రాణాలపై జట్టు ఆధారపడుతోంది. పేసర్‌ షినెల్‌ హెన్రీ కూడా ప్రభావం చూపించగలదు.

Dhoni in an interview given to a sports broadcaster7
ఈ కప్‌లో మనమే ప్రమాదకరం

న్యూఢిల్లీ: ఐసీసీ మొదలుపెట్టిన తొలి టి20 ప్రపంచకప్‌నే చేజిక్కించుకున్న భారత కెప్టెన్ ధోని. తర్వాత మరో రెండు ఐసీసీ (వన్డే ప్రపంచకప్, చాంపియన్స్‌) ట్రోఫీలను అందించిన విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ‘మిస్టర్‌ కూల్‌’ ఎమ్మెస్‌ ధోని శనివారం మొదలయ్యే టి20 ప్రపంచకప్‌ గురించి వ్యాఖ్యానించాడు. ఇంకా కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్‌ శర్మ, 37 ఏళ్ల విరాట్‌ కోహ్లి కెరీర్‌పై స్పందన కోరితే ఘాటుగానే జవాబిచ్చాడు. ఎక్కడా తగ్గలేదు. అన్నింటికి తగిన సమాధానాలిచ్చాడు. మైదానంలో వికెట్ల వెనక చురుకైన వికెట్‌ కీపర్‌గా, తెలివైన కెప్టెన్ వ్యవహరించిన ధోని కామెంట్రీ మాత్రం కష్టమంటున్నాడు. స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇంకా ఏమన్నాడంటే... వయసు అడ్డంకి కాదు రోహిత్, కోహ్లి బాగానే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతారు. అయితే ఏంటి? ఎందుకు ఆడకూడదు? పెరిగిన వయసే అడ్డంకా? నా దృష్టిలో వయసు అసలు ప్రాతిపదికే కాదు. ప్రదర్శనే ప్రామాణికం. ఫిట్‌నెస్సే ప్రధానం. అలాంటప్పుడు వయసును పరిగణించాల్సినపనేంటి చెప్పండి. ఆ వయసులో ఉన్న వారందరూ ఒకటేనా... అందరిని ఒకేలా చూస్తామా? నా విషయమే చెబుతా... నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను. అప్పుడెవరూ మాట్లాడలేదు. పదేళ్లకు పైగానే భారత్‌కు ఆడాను. 20 ఏళ్లయినా ఇంకా (ఐపీఎల్‌) ఆడుతున్నాను. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కానీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి గురించే ఎందుకు ఈ చర్చంతా! ఎంతకాలం ఆడాలనేది వాళ్లకే వదిలేయండి ఆ విషయాన్ని. ఫామ్, ప్రదర్శన బాగున్నంత కాలం ఆడతారు. ఇందులో తప్పేంటి. నొప్పి ఎవరికి?. ఆ అనుభవం ఒక్క సచిన్‌కే అనుభవమనేది ఆడుతుంటేనే వస్తుంది. ఒక్క సచిన్‌ తప్ప 20 ఏళ్లకే అనుభవజు్ఞలైన ఆటగాళ్లుండటం అరుదు. 16, 17 ఏళ్లకు అరంగేట్రం చేస్తేనో రాదు. క్రమంగా ఆడితేనే వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే అబ్బుతుంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిస్తేనే అలవాటవుతుంది. అనుభవమంటే అదే. ఏదో 20, 25 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవజు్ఞలైపోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉంటుందో అనే అనుభవజ్ఞున్ని చేస్తుంది. భారత జట్టే ప్రమాదకారి సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో మనకు ఎదురుపడే ప్రత్యర్థులకు మనతోనే ముప్పు. ఈ మెగా ఈవెంట్‌లో ప్రమాదకర జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఒక మేటి జట్టులో ఏమేమి ఉండాలో అవన్నీ మన బృందంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌నే పరిగణిస్తే మన టీమ్‌కు మంచి అనుభవం ఉంది. ఈ విశేషానుభవం మన జట్టుకు అదనపు బలంగా పనికొస్తుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడగలిగే స్థయిర్యం అనుభవంతోనే వస్తుంది. అయితే నాకు జట్టుపై ఎలాంటి బెంగా లేదు కానీ మంచుతోనే ఏదైనా సమస్య ఉండొచ్చు. శీతాకాలం కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టొచ్చు. దీంతో టాస్‌ కీలకంగా మారుతుంది. కామెంట్రీ కష్టం... అందుకే దూరం మైదానంలో మైక్‌ పట్టుకొని మాట్లాడటం వేరు. టీవీల్లో మైక్‌ పట్టుకొని వ్యాఖ్యానించడం వేరు. అందుకే కామెంటరీ కష్టమనే అంటాను. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు దీన్ని వివరించే ప్రక్రియలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించే వైనానికి మధ్యలో సన్నని గీత ఒకటి ఉంటుంది. దాన్ని చెరపలేం... అతిక్రమించలేం. వ్యాఖ్యాతగా మాట్లాడుతుంటే ఆ గీత ఒకటుంది అది తప్పని అనిపించదు. మ్యాచ్‌ వివరించేందుకు ఓ వైపు ఉండటానికే ఇష్టపడతారు. మ్యాచ్‌ సమయంలో తప్పని అనిపిస్తే వెంటనే దాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. సున్నితంగా విమర్శించగలితే నేర్పుండాలి. హుందాగా వ్యాఖ్యానించాలి. ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నొప్పించకుండా వ్యాఖ్యానించగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. నాకు ఇవేమీ లేవు. అందుకే కామెంట్రీకి దూరం. అంతెందుకు గణాంకాలు సైతం గుర్తుండాలి. నాకేమో నా గణాంకాలే తెలియవు. కొందరైతే ఇందులోనిష్ణాతులై ఉంటారు. వారైతేనే కామెంటేటర్‌ పాత్రకు న్యాయం చేస్తారు. నేనో మంచి స్పీకర్‌ను కాదు నాకు వినడం మీద ఉన్న శ్రద్ద మాట్లాడటం మీద ఉండదు. వాదించడం నా వల్ల కానేకాదు. అందుకే అనిపిస్తుంది... నేను మంచి స్పీకర్‌ను కాదు. ఎప్పటికీ కాలేను కూడా! నేను మాట్లాడేది చాలా తక్కువ. నాకు అనువైన, నా మాటలు అర్థం చేసుకోగలిగిన వారితోనే మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడలేను. కానీ ఎవరు చెప్పినా వినే ఓపికైతే నాకు చాలానే ఉంది. ఎంత సేపయినా వింటాను.

Indian U 17 team advances to final of U19 Womens Championship8
పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ ‘హ్యాట్రిక్‌’

పొఖారా (నేపాల్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 మహిళల చాంపియన్‌షిప్‌లో భారత అండర్‌–17 జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్‌ రాబిన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8–0 గోల్స్‌ తేడాతో భూటాన్‌ను చిత్తు చేసింది. ఈ ఏడాది చైనా వేదికగా ఏఎఫ్‌సీ అండర్‌–17 ఆసియా కప్‌ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో భారత్‌ అండర్‌–17 బాలికల జట్టును బరిలోకి దింపింది. భారత జట్టు తరఫున పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ (16వ, 39వ, 41వనిమిషాల్లో) ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌తో విజృంభించింది. ప్రీతిక బర్మన్‌ (25వ, 90 నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటగా... అలీషా లింగ్డో (6వ నిమిషంలో), అభిష్ట బాస్నెట్‌ (10వ నిమిషంలో),దివ్యాణి లిండా (17వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. బుధవారమే జరిగిన మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ జట్టు 4–0 గోల్స్‌ తేడాతో ఆతిథ్య నేపాల్‌పై నెగ్గింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన బంగ్లాదేశ్‌ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆట ఆరంభమైనప్పటి నుంచే మన అమ్మాయిలు వరుస దాడులు చేస్తూ విజృంభించారు. ఆరో నిమిషంలో అలీషా గోల్‌ కొట్టడంతో భారత్‌ ఖాతా తెరిచింది. పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ ప్రథమార్థంలోనే మూడు గోల్స్‌ కొట్టడంతో మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యం కనబర్చారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 7–0తో నిలిచింది. రెండో అర్ధభాగంలో భారత్‌ తరఫున ఒక గోల్‌ నమోదు కాగా... భూటాన్‌ మ్యాచ్‌ మొత్తంలో ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది.

Isha Singh won two gold medals9
ఇషా సింగ్‌కు రెండు స్వర్ణ పతకాలు

ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌ప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. న్యూఢిల్లీలో బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో 21 ఏళ్ల ఇషా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన వ్యక్తిగత ఫైనల్లో ఇషా సింగ్‌ 239.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన సురుచి సింగ్‌ 197.7 పాయింట్లతో నాలుగో స్థానంలో, మను భాకర్‌ 135.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. టీమ్‌ విభాగంలో ఇషా, సురుచి, మను భాకర్‌లతో కూడిన భారత బృందం 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు కాంస్యం, రజతం లభించాయి. వ్యక్తిగత విభాగంలో సామ్రాట్‌ రాణా 220.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచాడు.టీమ్‌ విభాగంలో సామ్రాట్‌ రాణా, శ్రవణ్‌ కుమార్, వరుణ్‌ తోమర్‌లతో కూడిన భారత బృందం 1732 పాయింట్లతో రజతం దక్కించుకుంది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో గావిన్‌ ఆంటోనీ స్వర్ణం నెగ్గాడు. టీమ్‌ విభాగంలో గావిన్‌ ఆంటోనీ, చిరాగ్‌ శర్మ, ముకేశ్‌ నేలవల్లి (ఆంధ్రప్రదేశ్‌)లతో కూడిన భారత బృందం 1735 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

India Script World Record Aaron Vaibhav Led Ind U19 WC Final Win vs Afg10
చరిత్ర సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్‌ వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్‌ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్‌.. అఫ్గనిస్తాన్‌తో తలపడింది. హరారేలో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.కొండంత లక్ష్యం కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన యువ భారత్‌ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు).. వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే కూడా హాఫ్‌ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.ఇదే అత్యధిక లక్ష్య ఛేదనవీరికి తోడు విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్‌ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఆరోన్‌కు లభించింది. కాగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్‌ ఐర్లాండ్‌ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్‌ను ఫినిష్‌ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.ఇంగ్లండ్‌ వర్సెస్‌ భారత్‌మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్‌ కెప్టెన్‌ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.Highest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | #INDvENG | FRI, 6th FEB, 1 PM #ENGvIND pic.twitter.com/LMRhFgBzST— Star Sports (@StarSportsIndia) February 4, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement