ప్రధాన వార్తలు
‘అదొక్కటే లక్ష్యంగా పెట్టుకున్నా.. నాన్న కల నేరవేర్చా’
ఐపీఎల్ 2026 సీజన్లో ముకుల్ చౌదరీ రూపంలో నయా స్టార్ పుట్టుకొచ్చాడు. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయే స్థితిలో ఉన్న లక్నో సూపర్జెయింట్స్ను ఒంటిచేత్తో గెలిపించిన ముకుల్ చౌదరీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముకుల్ చౌదరీ మాట్లాడాడు. ‘నేను క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. అయితే నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితి అంత బాగుండక పోవడంతో క్రికెట్ను ఆడలేకపోయాను. అయితే 12-13 ఏళ్ల వయస్సులో తొలిసారి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆరోజుల్లో క్రికెట్ అకాడమీలు ఎక్కువగా ఉండేవి కావు. అందుకే మాకు దగ్గర్లో ఉన్న సికర్లోని ఎస్బీఎస్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడే ఒక ఐదు నుంచి ఆరేళ్ల పాటు ఆటలో మెళుకువలు నేర్చుకోవడంతో పాటు క్రికెటర్గా ట్రెయిన్ అయ్యాను. ఆ తర్వాత హయ్యర్ లెవెల్కు ఆడాలనే ఉద్దేశంతో జైపూర్కు నా మకాం మార్చాను. ఆ తర్వాత టీ20 క్రికెట్ ఉన్నతస్థాయికి చేరుకోవడంతో గుర్గావ్లో మూడు నుంచి నాలుగు నెలలల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఢిల్లీలో ఆడిన చాలా మ్యాచ్లు నా కెరీర్కు ఉపయోగపడ్డాయి. ఇక యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్లో నా ప్రదర్శనను చూసి నేను క్రికెటర్ అవుతాననే విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మా జట్టులో ఎవరు పెద్దగా ఆడలేదు. నేను మాత్రమే మంచి స్కోర్ సాధించాను. అప్పుడే క్రికెట్లో నేను పెద్ద స్థాయికి చేరుతానన్న నమ్మకం మా నాన్నకు కలిగింది. ఇక ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్లా చూశాను. చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే. ఆఖరి ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. బంతి నా జోన్లో ఉంటే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఇవాళ రాత్రి నువ్వు ఒక జవాన్లా (దేశానికి సేవ చేసే సైనికుల్లో చాలా మంది రాజస్తాన్లోని ఝున్ఝు ప్రాంతం నుంచి వచ్చేవారు. ఇది ముకుల్ చౌదరీ స్వస్థలం)ఆడావు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అవును సార్.. అది నా రక్తంలోనే ఉంది. నేను ఇక్కడ గ్రౌండ్లో ఆడుతున్నాను.. వాళ్లు సరిహద్దులో కాపలా కాస్తూ దేశానికి సేవ చేస్తున్నారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే 182 పరుగుల ఛేదనలో లక్నో 6 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. 32 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరీ 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్కు ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, లక్నోకు ఇది రెండో విజయం.
ముకుల్ సిక్సర్ల మోత
182 పరుగుల ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగ్గా... లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు కావాలి. ఈ దశలో కోల్కతా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ యువ ఆటగాడు ముకుల్ చౌదరీ భిన్నంగా ఆలోచించాడు. చివరి మూడు ఓవర్లలో రెండేసి సిక్సర్లతో చెలరేగిపోయి కేకేఆర్ పని పట్టాడు.57లో తానొక్కడే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి 4 ఓవర్లలో వరుసగా 11, 13, 16, 14 పరుగులు రాబట్టి సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలుచుకుంది. సొంత మైదానంలో విజయానికి చేరువగా వచ్చిన కోల్కతా మరో ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. కోల్కతా: ఐపీఎల్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. ముందుగా కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రావ్మన్ పావెల్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. రెండో వికెట్కు రహానే, రఘువంశీ 52 బంతుల్లో 84 పరుగులు చేయగా... ఐదో వికెట్కు గ్రీన్, పావెల్ 40 బంతుల్లో అభేద్యంగా 70 పరుగులు జోడించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ముకుల్ చౌదరీ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, ఆయుశ్ బదోని (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్ తడబాటు... ప్రిన్స్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫిన్ అలెన్ (8) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌండరీ వద్ద రాఠీ పట్టిన ఈ క్యాచ్ చర్చకు దారి తీసింది. క్యాచ్ పట్టే సమయంలో అతని కాలు తగిలి కుషన్ స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తున్నా... మూడో అంపైర్ వేర్వేరు కోణాల్లో పరీక్షించకుండానే అలెన్ను అవుట్గా ప్రకటించాడు! ఈ దశలో రఘువంశీ, రహానే కలిసి కీలక పరుగులు జోడించారు. అయితే లక్నో బౌలర్లు చెలరేగడంతో ఒక్కసారిగా కోల్కతా జోరు తగ్గింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులు మాత్రమే చేసి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో గ్రీన్, పావెల్ దూకుడుగా ఆడారు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్ 54 పరుగులు రాబట్టింది. బదోని అర్ధ సెంచరీ... ఛేదనలో మార్క్రమ్ (22), మార్ష్(15) తొలి వికెట్కు 25 బంతుల్లో 41 పరుగులు జోడించి లక్నోకు మెరుగైన ఆరంభం అందించారు. సైనీ ఓవర్లో మార్క్రమ్ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. అయితే అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపి దెబ్బ కొట్టగా... ఎట్టకేలకు ఈ సీజన్లో బౌలింగ్కు దిగిన గ్రీన్ తన తొలి ఓవర్లోనే పంత్ (10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (13), సమద్ (2) విఫలం కాగా, బదోని కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. బదోని అవుటైన తర్వాత లక్నో దాదాపు ఆశలు కోల్పోగా... ముకుల్ అద్భుత బ్యాటింగ్తో గెలిపించాడు. రాజస్తాన్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరీ జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్బౌలర్గా మొదలు పెట్టినా...అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు మళ్లాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్లలో ఏకంగా 199 స్ట్రయిక్రేట్తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్గా ఎదగడం ఖాయం’ అని లక్నో కోచ్ లాంగర్ ఐపీఎల్కు ముందు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించాడు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: గువాహటిరాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షమీ (బి) రాఠీ 41; అలెన్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 9; రఘువంశీ (సి) మార్క్రమ్ (బి) సిద్ధార్థ్ 45; గ్రీన్ (నాటౌట్) 32; రింకూ (బి) అవేశ్ 4; పావెల్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–15, 2–99, 3–105, 4–111. బౌలింగ్: షమీ 4–0–27–0, ప్రిన్స్ యాదవ్ 4–0–47–1, సిద్ధార్థ్ 4–0–34–1, దిగ్వేశ్ రాఠీ 4–0–25–1, అవేశ్ 4–0–44–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్(సి) రఘువంశీ (బి) అరోరా 15; మార్క్రమ్ (సి) పావెల్ (బి) అరోరా 22; పంత్ (సి) త్యాగి (బి) గ్రీన్ 10; బదోని (సి) రింకూ (బి) రాయ్ 54; పూరన్ (సి) రమణ్దీప్ (బి) త్యాగి 13; సమద్ (బి) రాయ్ 2; ముకుల్ (నాటౌట్) 54; షమీ (సి) రాయ్ (బి) నరైన్ 1; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–41, 2–42, 3–73, 4–95, 5–104, 6–125, 7–128. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–38–2, రాయ్ 4–0–32–2, సైనీ 3–0–37–0, నరైన్ 4–0–13–1, త్యాగి 3–0–31–1, గ్రీన్ 2–0–28–1.
‘నేనైతే మిల్లర్ను తోసేసేవాడిని’
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చివరి ఓవర్ ఐదో బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ నిరాకరించడం తీవ్ర చర్చకు దారి తీసింది. మిల్లర్ తప్పు చేశాడని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఎక్కువ భాగం విమర్శలు వచ్చాయి. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు మిల్లర్ ఏం ఆలోచించాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తనకు అర్థం కావడం లేదని, మ్యాచ్ ఫలితాన్ని అసలు నమ్మలేకపోతున్నానని అతను వ్యాఖ్యానించాడు.‘ఆఖరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాల్సి ఉందంటే మిల్లర్ నిర్ణయం సరైంది అనుకోవచ్చు. కానీ 2 బంతుల్లో 2 పరుగులు అంటే మహా అయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే స్కోరు సమమయ్యేది. చివరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడు. అలా కాకున్నా అతను అవుటయ్యేవాడు. అలాంటిది 10 మ్యాచ్లలో ఒకసారి జరగవచ్చంతే. భారీ స్కోర్ల మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడంలో నష్టం ఏముంది. ఆ ఐదో బంతికి కుల్దీప్ స్థానంలో నేను ఉండి ఉంటే సింగిల్ కోసం దూసుకుపోయి అక్కడి నుంచి మిల్లర్ను పరుగెత్తమని తోసేసేవాడిని’ అని అశ్విన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు కొత్త తరహా దారులు వెతుకుతున్నట్లు అనిపిస్తుందని కూడా అశ్విన్ విశ్లేషించాడు. ‘ఈ తరహాలో ఓడిపోవడం వల్ల ముందుగా మీ జట్టులో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పైగా వరుసగా మూడు మ్యాచ్లు ఓడితే తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్న గుజరాత్ కోలుకొని మళ్లీ బరిలోకి నిలిచేందుకు మీరు అవకాశం కల్పించి మీరు నాలుగు పాయింట్ల వద్దే ఆగిపోయారు’ అని అశ్విన్ విమర్శించాడు. మిల్లర్ ఆలోచన తప్పు కాదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మాత్రం మిల్లర్ నిర్ణయాన్ని సమర్థించాడు. జట్టును గెలిపించాలనే అతని ఉద్దేశంలో తప్పేమీ లేదని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘మిల్లర్ అప్పటికి చాలా బాగా ఆడుతున్నాడు. గెలిపించగలనని తనపై తాను నమ్మకం ఉంచాడు. అతaని ఉద్దేశాన్ని మనం తప్పు పట్టవద్దు. చివరకు అతని ఆలోచన సరిగా అమలు చేయలేకపోయాడు. ప్రసిధ్ కృష్ణ చక్కటి స్లో బౌన్సర్తో మిల్లర్ను కట్టిపడేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈ స్థితిలోనే మన బుర్రను వాడాలి. నా ఉద్దేశం ప్రకారం కూడా ఐదో బంతికి సింగిల్ తీస్తే బాగుండేది. అంతకు ముందు కుల్దీప్ సింగిల్ రాబట్టగలిగాడనే విషయం మర్చిపోవద్దు’ అని గావస్కర్ అన్నాడు.
భారత మహిళల పంచ్ అదుర్స్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్స్లో నలుగురు భారత బాక్సర్లు మీనాక్షి హుడా (48 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), ప్రియ ఘన్ఘస్ (60 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 80 కేజీలు) మాత్రం రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.ఫైనల్స్లో మీనాక్షి 5–0తో నొముందరి (మంగోలియా)పై, ప్రీతి 5–0తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. అరుంధతి 4–1తో బకిత్ సెడిష్ (కజకిస్తాన్)పై, ప్రియ 3–0తో వన్ ఉన్ గ్యోంగ్ (ఉత్తర కొరియా)పై నెగ్గారు. జైస్మీన్ 0–5తో పున్రావి ర్యునర్స్ (థాయ్లాండ్) చేతిలో, అల్ఫియా 0–5తో దినా ఇస్లామ్బెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీలు)... టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన 10 వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు పతకాలు నెగ్గడం విశేషం.
సింధు పరాజయం... క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి ఆయుశ్ శెట్టి మినహా మిగతా భారత షట్లర్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో రెండో సీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఉన్నతి హుడా 17–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–16, 21–12తో ప్రపంచ 20వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 19–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 14–21తో నాలుగో సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) జోడీ 10–21, 13–21తో యూకీ ఫకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది.
భారత్కు రెండో ఓటమి
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఓడింది. తొలి మ్యాచ్లో వైష్ణవి అడ్కర్ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా నుగ్రోహో చేతిలో... రెండో మ్యాచ్లో సహజ యామలపల్లి 2–6, 1–6తో జనైస్ టిజెన్ చేతిలో... మూడో మ్యాచ్లో అంకిత రైనా–రుతుజా 3–6, 6–7 (4/7)తో అల్దిలా సుత్జియాది–జనైస్ టిజెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. నేడు జరిగే నాలుగో మ్యాచ్లో మంగోలియాతో భారత్ ఆడుతుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కొరియా, ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్లలో హన్సిక 6–1తో అరుకె కదిర్బెక్ (కిర్గిస్తాన్)పై, నేహా 10–4తో బొలోర్తుయా (మంగోలియా)పై గెలిచారు. మీనాక్షి క్వార్టర్ ఫైనల్లో 15–4తో ఎస్బోసినోవా (ఉజ్బెకిస్తాన్)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్ జిన్ జాంగ్తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్) చేతిలో ఓడిపోయింది.
రాకెట్ నేలకేసి కొట్టి...
మోంటెకార్లో: ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా టెన్నిస్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ సంయమనం కోల్పోయాడు. మోంటెకార్లో మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా... ఘోర పరాజయం మూటగట్టుకున్న మెద్వెదెవ్ తన రాకెట్ను విరగ్గొట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో ర్యాంకర్ మెద్వెదెవ్ 0–6, 0–6తో బెరెటిని (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెద్వెదెవ్ తన రాకెట్ను వరుసగా ఏడుసార్లు నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన మెద్వెదెవ్... క్రీడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. తొలి సెట్ కోల్పోయి అసహనంలో ఉన్న మెద్వెదెవ్... రెండో సెట్లో తన తొలి సర్వీస్ కోల్పోయిన సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. 2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన మెద్వెదెవ్ ఈ మ్యాచ్ను 49 నిమిషాల్లోనే కోల్పోయాడు. గతంలో బెరెటినితో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఈ రష్యా ఆటగాడు... ఈసారి మాత్రం అదే జోరు కనబర్చలేకపోయాడు. ఇటీవల ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్పై విజయం సాధించిన మెద్వెదెవ్... మట్టి కోర్టులో జరిగిన ఈ పోరులో స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి వరల్డ్ టాప్–10 ఆటగాడిని 6–0, 6–0తో ఓడించిన ఐదో ప్లేయర్గా బెరెటిని నిలిచాడు. దీన్ని ‘డబుల్ బేగల్’ అంటారు. చివరిసారిగా దశాబ్దం క్రితం ఇటాలియన్ ఓపెన్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–0, 6–0తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేశాడు.
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో స్వర్ణ, రజతాలు భారత్కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆర్చర్ శీతల్పై భారత్కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్పై గెలవడం పాయల్కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్షిప్లోనూ శీతల్పై పాయల్ పైచేయి సాధించింది.
ఓడిపోయే మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించాడు.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు. తన సంచలన బ్యాటింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల విఫలమైన చోట.. ఆ యువ ఆటగాడు అద్భుతం సృష్టించాడు. ఒంటో చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోయే మ్యాచ్ను ఓంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు.అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్ ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్ (22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్(10), పూరన్(13), సమద్(2) ముగ్గురు కూడా వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అయూశ్ బదోని(54) మాత్రం దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు.కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి కేకేఆర్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం అయూశ్ బదోని సైతం ఔటయ్యాడు. అప్పటికే చివరి నాలుగు ఓవర్లలో లక్నో విజయానికి 50 పరుగులు కావాలి. రెగ్యులర్ బ్యాటర్లు ఎవరు లేకపోవడంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు.తొలి ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసిన ముకుల్.. ఆఖరి నాలుగు ఓవర్లలో విశ్వరూపాన్ని చూపించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 4, 6, 1 బాది 11 పరుగులు రాబట్టిన ముకుల్ చౌదరి.. తర్వాత కార్తీక్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి.ఈ సమయంలో కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ముకుల్ 6, 4, 6 బాది 16 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆరోరా వేసిన చివరి ఓవర్లో లక్నో విజయ సమీకరణం 14 పరుగులుగా మారింది. తొలి బంతిని అవేష్ సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ముకుల్.. రెండో బంతిని డీప్ స్క్వేర్-లెగ్ దిశగా భారీ సిక్సర్గా మలిచాడు.అనంతరం వరుసగా రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాకపోవడంతో లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతికి ముకుల్ సిక్స్ బాది స్కోర్లను సమం చేశాడు. చివరి బంతికి బై రూపంలో పరుగు తీసి తన జట్టుని గెలిపించాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ముకుల్ చౌదరి నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?21 ఏళ్ల ముకుల్ చౌదరి.. రాజస్తాన్లోని ఝున్ఝునులో జన్మించాడు. ముకుల్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి ముకుల్ను గొప్ప క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. కానీ అప్పట్లో వారి ఆర్ధిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో సరైన అకాడమీలో చేర్చలేకపోయాడు. ఆఖరికి పైసా పైసా కూడబెట్టి 12-13 ఏళ్ల వయసులో తొలిసారి ముకుల్ను ఓ క్రికెట్ ఆకాడమీలో అతడి తండ్రి చేర్చాడు. ముకుల్ మొదట్లో మీడియం ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందాడు. అయితే తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఆపై అతడు బౌలింగ్ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్గా మారిపోయాడు. ముకుల్ 2023లో రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 165+ స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.అంతేకాకుండా గతేడాది జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్లో కూడా అతడు రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలానికి ముందు అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రయల్స్కు పిలిచింది.ట్రయల్స్లో కూడా తన అద్భుత బ్యాటింగ్తో ముంబై స్కౌట్లను ఆకట్టుకున్నాడు. దీంతో ముకుల్ను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై భావించింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. ఆఖరికి లక్నో రూ. 2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముకుల్ ఆడిన రెండు మ్యాచ్లలో అతడు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. కానీ అతడికి లక్నో మేనెజ్మెంట్ మరోసారి అవకాశమచ్చింది. ఈసారి తన మూడో మ్యాచ్లో అద్బుత ఇన్నింగ్స్తో మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకు 4 ఫస్ట్ క్లాస్, 5 లిస్ట్-ఎ, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు.
పాకిస్తాన్కు కొత్త హెడ్కోచ్.. ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి
కరాచీ: పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) తమ సీ...
ఆయుశ్ అద్భుతం
నింగ్బో (చైనా): ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ చాంపి...
22 ఏళ్ల తర్వాత...
పాథుమ్ థాని (థాయ్లాండ్): ఆసియా కప్ మహిళల అండర్...
నితేశ్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
భారత లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా...
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఊహకందని ఓ అద్భుతం జరిగ...
ఉత్కంఠపోరులో లక్నో విజయం
KKR vs LSG Live updates: కేకేఆర్తో జరిగిన ఉత్కంఠప...
గెలిపించిన గ్రీన్
ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ క్రిస్ గ్రీన్ పాకిస్త...
క్రీడలు
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వీడియోలు
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
పరుగు తేడాతో బోణీ కొట్టిన GT
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్!
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
హ్యాట్రిక్ కొట్టిన RR
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
