Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: Australia beat Oman in their last group stage match1
మార్ష్‌ విధ్వంసం.. పసికూనను చిదిమేసిన ఆసీస్‌

టీ20 ‍ప్రపంచకప్‌ 2026 చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా పసికూన ఒమన్‌పై ప్రతాపం చూపింది. తొలుత బౌలింగ్‌లో 104 పరుగులకే (16.2 ఓవర్లలో) ఒమన్‌ను ఆలౌట్‌ చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి. సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి ట్రవిస్‌ హెడ్‌(32), ఇంగ్లిస్‌ (12 నాటౌట్‌) సహకరించారు. హెడ్‌ వికెట్‌ షకీల్‌ అహ్మద్‌కు దక్కింది.

T20 WC 2026: Aussies restricted Oman to just 104 runs2
అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చిన ఆసీస్‌.. పసికూనపై ప్రతాపం

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా జట్టు అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నిష్క్రమించిన ఈ మాజీ ఛాంపియన్‌.. ఇవాళ (ఫిబ్రవరి 20) పసికూన ఒమన్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆసీస్‌.. ఒమన్‌ను 104 పరుగులకే (16.2 ఓవర్లలో) కుప్పకూల్చింది.ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్‌ కెప్టెన్‌ జతిందర్‌ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తామని బీరాలు పలికి ఏమీ చేయలేకపోయాడు. ఈ టోర్నీ నుంచి ఆసీస్‌తో పాటు ఒమన్‌ కూడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ గ్రూప్‌ దశ మొత్తంలో చివరిది. ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి.

CM’s Cup 2025 State Finals Kick Off at Gachibowli.. 21,500 Athletes Compete After Record 5 Lakh Registrations3
సీఎం కప్‌ ఫైనల్స్‌ ఘనంగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్‌ రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ శివసేన రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.రికార్డు స్థాయిలో దరఖాస్తులు - ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. - మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్‌కు అర్హత సాధించారు. - ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ ప్రధాన ఉద్దేశం.. - గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం. - రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం. - క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.- భవిష్యత్తులో ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం.

Rahul Chahar Announces Separation from Ishani Johar in Emotional Instagram Post4
విడాకులు తీసుకున్న మరో టీమిండియా క్రికెటర్‌

ఇటీవలికాలంలో టీమిండియా క్రికెటర్లు (శిఖర్‌ ధవన్‌, మహ్మద్‌ షమీ, యుజ్వేంద్ర చహల్‌, హార్దిక్‌ పాండ్యా) వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. వివాహ బంధంలో ఇమడలేక భార్యలతో తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా మరో భారత క్రికెటర్‌ కూడా చేరాడు.26 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌, మరో టీమిండియా ఆటగాడు దీపక్‌ చాహర్‌ సోదరుడు అయిన రాహుల్‌ చాహర్‌ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహర్‌ ఓ భావోద్వేగపూర్వక నోట్‌తో ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.చిన్న వయసులోనే వివాహం చేసుకున్నానని, అప్పట్లో తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని, అది తనకు జీవిత పాఠాలు నేర్పిందని చాహర్‌ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలు అనుకోని పాఠాలు నేర్పాయని, గత పదిహేను నెలలు కోర్టు ప్రక్రియలతో గడిచాయని వివరించాడు. ఈ సమయం తనకు సహనం, ధైర్యం నేర్పిందని అన్నాడు. ఈ అధ్యాయం ఇప్పటికి ముగిసిందని.. ఇకపై స్వాభిమానంతో, శాంతితో, మంచి నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభిస్తానని తెలిపాడు.ప్రేమించి పెళ్లి చేసుకొని..!- రాహుల్‌–ఇషానీ జోహర్‌ 2019 డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. - 2022 మార్చిలో గోవాలో ఓ ప్రైవేట్‌ వేడుకలో వీరి వివాహం జరిగింది. - ఇషానీ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తూ, తరచూ రాహుల్‌ మ్యాచ్‌లకు హాజరై మద్దతు ఇచ్చేది. - వారి బంధం సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంది.- స్పష్టమైన కారణాలేమో తెలియరాలేదు కానీ, చాహర్‌ ఇవాళ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.విడాకుల తర్వాత రాహుల్‌ చాహర్‌ తిరిగి క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించనున్నాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసిన చాహర్‌.. తిరిగి ఫామ్‌లోకి రావాలని కృషి​ చేస్తున్నాడు. చాహర్‌ను 2026 ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటి తిరిగి టీమిండియా రీఎంట్రీ ఇవ్వాలని చాహర్‌ భావిస్తున్నాడు.

STAR SPORTS EXPERTS PICKS TOP 4 SEMI FINALISTS IN THIS T20 WORLD CUP 20265
T20 WC 2026: అందరిది ఒకే మాట.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయి.. పలానా జట్లు నిష్క్రమిస్తాయని ఎవరి అంచనాలను వారు సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ నిపుణులు కూడా ఈ టాపిక్‌పై తమ అంచనాలను షేర్‌ చేశారు.స్టార్‌ స్పోర్ట్స్‌ ప్యానెల్‌లో టీమిండియా మాజీలు యుజ్వేంద్ర చహల్‌, ఛతేశ్వర్‌ పుజారా, మొహమ్మద్‌ కైఫ్‌, వరుణ్‌ ఆరోన్‌, సబా కరీం, సంజయ్‌ బాంగర్‌ నిపుణులుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంచనా కలిగి ఉన్నారు. అయితే అందరి అంచనాల్లో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదే టీమిండియా. ఈ ఆరుగురు సెమీస్‌కు చేరే జట్లలో టీమిండియాకు అవకాశం ఇచ్చారు.చహల్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. పుజారా భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకకు ఛాన్స్‌ ఇచ్చాడు.కైఫ్‌ భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. వరున్‌ ఆరోన్‌ పై ముగ్గురికి భిన్నంగా భారత్‌తో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయిని అభిప్రాయపడ్డాడు.సబా కరీం విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయని గెస్‌ చేస్తున్నాడు. మాజీ టీమిండియా ఆల్‌రౌండర్‌ బాంగర్‌.. భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఈ నిపుణుల అంచనాల్లో ఎవరి అంచనాలు కరెక్ట్‌ అవుతాయో కామెంట్‌ చేయండి.

T20 WC 20226: Australia bow out in group stage, Pakistan Fans dreaming for title6
గ్రూప్‌ దశలోనే ఆసీస్‌ ఔట్‌.. పాక్‌కు మంచి జరుగబోతుందా..?

టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా గ్రూప్‌ స్టేజీలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఓ రేంజ్‌లో బీరాలు పలుకుతున్నారు. ఆసీస్‌ వైదొలిగితే పాక్‌కు కలిగే లాభమేమిటి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.పేరుకు జెంటిల్మెన్‌ క్రీడనే అయినా, క్రికెట్‌ లాంటి రియలిస్టిక్‌ గేమ్‌లోనూ సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. తాజాగా పాక్‌ అభిమానులు హడావుడి చేయడానికి ఈ సెంటిమెంటే కారణం. ఏంటా సెంటిమెంట్‌ అంటే..?ఐసీసీ మెగా టోర్నీల్లో, మరి ముఖ్యంగా ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సందర్భాల్లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలో పాక్‌ విజేతగా నిలిచి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2009 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలోనూ పాకే విజేతగా నిలిచి, తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది.2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే వైదొలగగా.. ఆ టోర్నీలోనూ పాక్‌ ఛాంపియన్‌గా నిలిచింది.తాజాగా ఆసీస్‌ టీ20 ప్రపంచకప్‌ 2026లోనూ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో పాక్‌ అభిమానులు సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఈ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. వాస్తవానికి పాక్‌ సూపర్‌-8కు చేరడమే అతికష్టం మీద జరిగింది. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ పాక్‌ అభిమానులు తాము ప్రపంచకప్‌ గెలుస్తామని బీరాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఏ జట్టైనా ఛాంపియన్‌గా నిలవాలంటే కనీస అర్హతలు ఉండాలి.ప్రస్తుత పాక్‌ జట్టుకు ఆ అర్హతలు లేవనే విషయం అందరికీ తెలుసు. గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏ లాంటి చిన్న జట్లపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. సూపర్‌-8లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లను దాటుకొని ముందుకెళ్లాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఇది ముమ్మాటికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే పాక్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచేంత గొప్పగా ఏమీ లేదు. ఆ జట్టులో మ్యాచ్‌ విన్నర్‌ వెతికితే కూడా కనపడడు. పైగా ఆ జట్టు స్టార్లుగా చెప్పుకేనే వారంతా ఫామ్‌లో లేక మడతమంచం ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ ప్రపంచకప్‌ గెలవడం​ జరిగే పని కాదు. పాక్‌ అభిమానులు సెంటిమెంట్లను నమ్ముకొని గాల్లో మేడలు కడుతుంటే, జింబాబ్వే లాంటి చిన్న జట్టు టాలెంట్‌ను నమ్ముకొని ముందుకు సాగుతుంది.

Special story on Jonathan Trott after ending tenure as Afghanistan coach7
Jonathan Trott: ఆఫ్ఘన్‌ క్రికెట్‌ తలరాతను మార్చిన ధీరుడు

జోనాథన్‌ ట్రాట్‌.. ఈ పేరు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రనే మార్చేసింది. ఈ మాజీ ఇంగ్లీష్‌ ఆటగాడు 2022లో ఆఫ్ఘనిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో ఊహించని అద్భుతాలు చేశాడు. అప్పటివరకు పసికూనగా ఉన్న జట్టును లెజెండ్‌ కిల్లర్‌గా తీర్చిదిద్దాడు. ఆఫ్ఘన్‌తో పోటీ అంటే ఎంతటి జట్టైనా ఉలిక్కిపడే స్థాయికి తీసుకెళ్లాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇకపై ఎంతమాత్రం చిన్న జట్టు కాదు.. ప్రపంచంలో ఏ జట్టైనైనా ఓడించగలిగే సత్తా ఉన్న జట్టు అని అనుకునేలా చేశాడు.ఆఫ్ఘన్‌ కోచ్‌గా ట్రాట్‌ పదవీకాలం పూర్తైన నేపథ్యంలో అతను సాధించిన విజయాలు, అతని హయాంలో ఆఫ్ఘన్‌ జట్టు సాధించిన పురోగతిపై ఓ లుక్కేద్దాం.వాస్తవానికి ట్రాట్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ కోచింగ్‌ బాధ్యతలు అనుకోకుండా దక్కాయి. ఆ స్థానాన్ని మరో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ గ్రహం థోర్ప్‌ భర్తీ చేయాల్సి ఉండింది. అయితే థోర్ప్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటంతో ట్రాట్‌కు లక్కీగా ఈ ఛాన్స్‌ వచ్చింది. ఈ అఫర్‌ను ఒడిసిపట్టుకున్న ట్రాట్‌.. మొదటి రోజు నుంచే తన పని మొదలుపెట్టాడు.ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారిలో స్పూర్తిని రగిల్చడం ప్రారంభించాడు. 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గన్‌ జట్టు అన్ని మ్యాచ్‌లు ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకొని ఉంది. ఆ సమయంలో ట్రాట్‌ వారికి ఆశాకిరణంలా మారాడు. ఆయన రాకతో జట్టులో క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచన, మానసిక దృఢత్వం పెరిగింది. ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడటం మొదలుపెట్టారు.ట్రాట్‌ బాధ్యతలు చేపట్టాక తొలి సిరీస్‌లోనే ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం ఎదురైంది. ఐర్లాండ్‌ చేతిలో ఆ జట్టు 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ట్రాట్‌ క్రమశిక్షణకు తొలి ఫలితం 2022 ఆసియా కప్‌లో వచ్చింది. ఆ టోర్నీలో ఆఫ్ఘన్‌ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు ఊహించని షాకిచ్చింది.ట్రాట్‌ మార్గదర్శకత్వంలో ఆఫ్ఘన్‌ జట్టు ఆ మురుసటి ఏడాది (2023) మరింత రాటుదేలింది. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం, పాకిస్తాన్‌పై టీ20 సిరీస్‌ గెలుపు, శ్రీలంకపై ఆధిపత్యం.. ఇవన్నీ ఒక్కొక్కటిగా సాధ్యమయ్యాయి. ఈ మధ్యలో చిన్న జట్లపై ఆధిపత్యం కూడా తారాస్థాయికి వెళ్లింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్‌ చేరిన క్షణం ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. పొట్టి ప్రపంచకప్‌ ఇచ్చిన స్పూర్తితో ఆఫ్ఘన్‌ జట్టు ఆతర్వాత సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టును కూడా మట్టికరిపించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు సంచలనాలు నమోదు చేస్తుందని అంతా ఊహించారు. అయితే దురదృష్టవశాత్తు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ చేతుల్లో ఓడి సూపర్‌-8కు అర్హత సాధించలేకపోయింది. అయితే ఈ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం (రెండు సూపర్‌ ఓవర్లు) కొదమసింహాల్లా పోరాడాయి. అంతిమంగా సౌతాఫ్రికాదే పైచేయి అయినప్పటికీ.. ఆఫ్ఘన్‌ పోరాటం​ క్రికెట్‌ ఉనికిలో ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్‌ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో కెనడాపై ఘన విజయం సాధించి, గెలుపుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచే ట్రాట్‌కు ఆఫ్ఘన్‌ కోచ్‌గా చివరి మ్యాచ్‌. మూడేళ్లపై పైగా పదవీకాలంలో ట్రాట్‌ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఆఫ్ఘన్‌ ఆటగాడు భావోద్వేగానికి గురయ్యాడు. ట్రాట్‌ ఇచ్చిన స్పూర్తితో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు మున్ముందు మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆశిద్దాం.

ACC Women's Asia Cup Rising Stars 2026: Bangladesh A beat Pakistan A by 54 Runs8
పాక్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. భారత్‌-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఫహీమా ఖాతూన్‌ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్‌ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్‌ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ 2, వహీదా అక్తర్‌, మొమినా రియాసత్‌, అనోషా నాసిర్‌, ఒమైమా సొహైల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్‌ పతనాన్ని శాశించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో షావాల్‌ జుల్ఫికర్‌ (14), యుస్రా ఆమిర్‌ (11), హఫ్సా ఖలీద్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో బంగ్లా-పాక్‌ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

Unconstitutional: Pak Govt Reverses Hockey Captain Ban Over AUS Fiasco9
పాక్‌ కెప్టెన్‌పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం

పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అమ్మాద్‌ బట్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడి పట్ల పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (PHF) మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు అక్రమమని.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒకప్పుడు తోపుకాగా పాక్‌ హాకీ పురుషుల జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. నాలుగుసార్లు ప్రపంచ కప్‌ విజేత, మూడు ఒలింపిక్‌ స్వర్ణాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది ఆ జట్టు. అయితే, గత కొన్నేళ్లుగా రోజురోజుకీ దిగజారి పోతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భాగంగా పాక్‌ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుస ఓటములతో చతికిలపడింది. దీంతో తాజా ఎడిషన్లో ఆడిన మ్యాచ్‌లన్నీ ఓడి పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచింది.ప్లేట్లు కడిగి మ్యాచ్‌కు వెళ్లాంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల ఫలితమే వరుస ఓటములకు కారణమంటూ కెప్టెన్‌ అమ్మాద్‌ బట్‌ సంచలన ఆరోపణలు చేశాడు. హోటల్‌లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపాడు. కిచెన్‌ను తామే శుభ్రపర్చుకున్న తర్వాతే మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.స్వదేశానికి తిరిగి రాగానే పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌)పై అమ్మాద్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ప్రస్తుత పీహెచ్‌ఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకా కొనసాగితే మేం ఆడటం కష్టం. ప్లేట్‌లు కడిగి కిచెన్‌ను శుభ్రం చేసుకున్న తర్వాతే మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా మా వైపు నుంచి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారు.బహిరంగంగా చెప్పాల్సి వస్తోందిదాదాపు 13–14 గంటల పాటు రోడ్డుపై వేచి చూసిన తర్వాత మాకు హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. మేం టోర్నీ కోసం అక్కడ 13 రోజులు ఉండాల్సి ఉంటే 10 రోజుల కోసమే హోటల్‌ను బుక్‌ చేశారు. దాంతో తర్వాతి మూడు రోజుల కోసం చవకైన మరో హోటల్‌కు మారాల్సి వచింది. ఎంతో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టే ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది’ అని షకీబ్‌ బట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయంఈ పరిణామాలపై దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌ బోర్డు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో PHF అధ్యక్షుడు తారిఖ్‌ బుగ్టీ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అంతకంటే ముందు అమ్మాద్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి పాక్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వంఈ క్రమంలో పాక్‌ ప్రభుత్వం వేగంగా స్పందించింది. PHF తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్‌ బ్యూరోక్రాట్‌ ముహుయుదీన్‌ వనీని నియమించింది. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టగానే ముహుయుదీన్‌ తొలుత అమ్మాద్‌ గురించే ప్రకటన చేశారు. అమ్మాద్‌పై నిషేధం విధిస్తూ బుగ్టీ తీసుకున్న నిర్ణయం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌ హాకీకి జరిగిన నష్టాన్ని పూడ్చి.. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుతామని తెలిపారు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Sikandar Raza Breaks Rohit World Record Becomes 1st Player In History Today10
T20 WC 2026: సికందర్‌ రజా ప్రపంచ రికార్డులు

జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అటు సారథిగా.. ఇటు ఆటగాడిగా అతడు సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. ‘అండర్‌డాగ్‌’గా ఈ టోర్నీ బరిలో దిగిన జింబాబ్వే.. అనూహ్య రీతిలో సూపర్‌-8 దశకు చేరుకుంది.మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి మార్గం సుగమం చేసుకున్న జింబాబ్వే.. శ్రీలంకను కూడా ఓడించి గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వే విజయంలో సికందర్‌ రజాదే కీలక పాత్ర. కొలంబో వేదికగా లంక విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (48 బంతుల్లో 63 నాటౌట్‌), తాడివనాషే మరుమాని (34) శుభారంభం అందించగా.. రజా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 45)తో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డులుఅంతర్జాతీయ టీ20లలో అత్యధికంగా ఇరవైసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి ఫుల్‌ మెంబర్‌ జట్టు ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా అత్యంత పెద్ద వయసులో ఐసీసీ టోర్నీలో ఈ పురస్కారం పొందిన ఆటగాడిగా భారత దిగ్గజం రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రజా బద్దలు కొట్టాడు.కాగా 2025 చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా రోహిత్‌ 37 ఏళ్ల 335 రోజుల వయసులో POTM పొందగా.. రజా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో తాజాగా 39 ఏళ్ల 301 రోజుల వయసులో అవార్డు పొందాడు.టెస్టు హోదా ఉన్న జట్ల (ఫుల్‌ మెంబర్‌) తరఫున అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు POTM పొందిన ఆటగాళ్లుసికందర్‌ రజా- జింబాబ్వే- 20సార్లుసూర్యకుమార్‌ యాదవ్‌- ఇండియా- 17సార్లువిరాట్‌ కోహ్లి- ఇండియా- 16సార్లుమహ్మద్‌ నబీ- అఫ్గనిస్తాన్‌- 14సార్లు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement