Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: New zealand to take on england in their last super over match1
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరం

టీ20 ప్రపంచకప్‌ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్‌-2 నుంచి ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌.. మరో బెర్త్‌ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. తద్వారా పాక్‌ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్‌ గెలిస్తే సెమీస్‌ రెండో బెర్త్‌ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్‌, న్యూజిలాండ్‌ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్‌ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌ రన్‌ రేట్‌ 3.050గా ఉంది. అదే పాక్‌ రన్‌రేట్‌ -0.461గా ఉంది. పాక్‌ మైనస్‌ నుంచి ప్లస్‌ రన్‌రేట్‌లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా, న్యూజిలాండ్‌కు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్‌ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్‌తో జరగాల్సిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్‌ జరిగి ఉంటే, న్యూజిలాండ్‌ సునాయాసంగా పాక్‌ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సమతూకంగా కనిపించినా ఎడ్జ్‌ న్యూజిలాండ్‌వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. అదే ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌, జేకబ్‌ బేతెల్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్‌ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్‌: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్‌: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

India women set 252 runs target to australia in second ODI2
ఆసీస్‌తో రెండో వన్డే.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. హోబర్ట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తొలి వన్డేలో డకౌటైన ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (52) ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించింది. మరో ఓపెనర్‌ స్మృతి మంధన (31) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించింది. ఆతర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ 11 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (54) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీతో మెరిసింది. దీప్తి శర్మ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలం కాగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (13), రిచా ఘోష్‌ (22), కశ్వీ గౌతమ్‌ (25), క్రాంతి గౌడ్‌ (19), వైష్ణవి శర్మ (10 నాటౌట్‌) నామమాత్రపు స్కోర్లు చేసి 250 పరుగుల మార్కు దాటించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, అలానా కింగ్‌ తలో 2 వికెట్లు తీయగా.. మెగాన్‌ షట్‌, నికోలా క్యారీ చెరో వికెట్‌ పడగొట్టాడు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్‌, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే హోబర్ట్‌ వేదికగానే మార్చి 1న జరుగుతుంది. అనంతరం మార్చి 6న టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

jammu and kashmir Auqib nabi pick 5 wickets in first innings of ranji final vs karnataka3
టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఆకిబ్‌ నబీ

ప్రస్తుత రంజీ సీజన్‌లో జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఆకిబ్‌ నబీ పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనలతో ప్రత్యర్ది బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లోనూ అదే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, మయాంక్‌ అగర్వాల్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించి, ఆట కట్టించాడు. ఈ క్రమంలో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నబీ విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకే ఆలౌటై, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు (584) చాలా వెనుకపడి పోయింది. జమ్మూ బౌలర్లలో నబీతో పాటు సునీల్‌ కుమార్‌ (19-6-51-2), యుద్ద్‌వీర్‌ సింగ్‌ (14.3-3-55-2), సాహిల్‌ లోత్రా (12-1-50-1) సత్తా చాటారు. కర్ణాటక తరఫున ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (160) ఒంటరిపోరాటం చేసినా తన జట్టు పటిష్ట స్థితికి చేర్చలేకపోయాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి ఎవరి సహకారం లభించలేదు. స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (13), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (11), కరుణ్‌ నాయర్‌ (0), స్మరణ్‌ రవిచంద్రన్‌ (0) దారుణంగా విఫలమయ్యారు.అంతకుముందు షుభమ్‌ పుండిర్‌ (121) అద్భుత సెంచరీతో, యావర్‌ హస్సన్‌ (88), కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా (70), అబ్దుల్‌ సమద్‌ (61), కన్హయ్య వధావన్‌ (70), సాహిల్‌ లోత్రా (72) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో జమ్మూ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్‌లో జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ఫైనల్‌కు చేరడంలో ఆకిబ్‌ నబీ పాత్ర చాలా కీలకం. అతను దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటి జమ్మూను తొలిసారి రంజీ ఫైనల్‌కు చేర్చాడు. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో (క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల​్‌ తొలి ఇన్నింగ్స్‌) నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్వార్టర్‌ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు.. సెమీఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, ఇప్పుడు ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. తాజా ప్రదర్శన తర్వాత నబీ ఈ రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. నబీ ఈ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీశాడు.ఎలా ఎంపిక చేయరో చూస్తా..!ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ మెసేజ్‌ పంపిచినట్లైంది. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబర్చిన నన్ను టీమిండియాకు ఎలా ఎంపిక​ చేయరో చూస్తా అన్న సందేశాన్ని పంపాడు. 29 ఏళ్ల ఈ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌.. స్వింగ్‌ బౌలింగ్‌లో దిట్ట. ఎంతటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. అలాగే యార్కర్లు సంధించడంలోనూ అతను దిట్ట. కేఎల్‌ రాహుల్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్‌ నబీని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడంటే అతను ఎంత ప్రమాదకారో అర్దమవుతుంది. భారత సెలెక్టర్లు షమీలా కాకుండా నబీకి అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మేలు చేయాలని ఆశిద్దాం.

Abhishek Sharma Creates Unfortunate Record Despite T20 World Cup Comeback Vs Zimbabwe4
T20 WC 2026, IND VS ZIM: అభిషేక్‌ ఖాతాలో అనవసర రికార్డు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాట్రిక్‌ డకౌట్లు సహా నాలుగో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (15) ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో నిన్నటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు ముందు అభిషేక్‌పై భారీ ఒత్తిడి ఉండింది. అయితే ఈసారి అతను ఒత్తిడిని అధిగమించి 26 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్‌ 26 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసినా, ఓ అనవసర రికార్డు మూటగట్టుకున్నాడు. అభిషేక్‌కు ఇది తన టీ20 కెరీర్‌లో రెండో నిదానమైన (బంతుల పరంగా) హాఫ్‌ సెంచరీగా నిలిచింది. అభిషేక్‌ కెరీర్‌లో అత్యంత నిదానమైన హాఫ్‌ సెంచరీ కూడా జింబాబ్వేపైనే రావడం విశేషం. 2024లో హరారే వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో అతను హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేందుకు 33 బంతులు తీసుకున్నాడు. వాస్తవానికి సాధారణ ప్లేయర్లకు 26 బంతుల్లో అర్ద శతకం అంటే చాలా పెద్ద అఛీవ్‌మెంట్‌. అయితే అభిషేక్‌ లాంటి విధ్వంసకర ట్రాక్‌ రికార్డు ఉన్న ఆటగాడికి మాత్రం ఇది అనవసర రికార్డుగా మిగిలిపోయింది.తాజా ప్రదర్శనలతో అభిషేక్‌ మరో ఘనత కూడా సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్‌ ధవన్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్‌, అభిషేక్‌ తమ టీ20 కెరీర్‌లలో 11 సార్లు ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (32 ఫిఫ్టి ప్లస్‌), కేఎల్‌ రాహుల్‌ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. పై జాబితాలోని ఆటగాళ్లలో అభిషేకే అతి తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అతని కెరీర్‌ ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రోహిత్‌ శర్మను కిందకు దించి ఈ విభాగంలో టాప్‌ ప్లేస్‌కు చేరే అవకాశం ఉంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అభిషేక్‌ సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్‌ సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 256 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 55, సంజూ శాంసన్‌ 24, ఇషాన్‌ కిషన్‌ 38, సూర్యకుమార్‌ యాదవ్‌ 33, హార్దిక్‌ పాండ్యా 50 నాటౌట్‌, తిలక్‌ వర్మ 44 నాటౌట్‌ పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్‌ మొత్తంలో 17 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది కూడా ఓ ప్రపంచకప్‌ రికార్డు.అనంతరం ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (97 నాటౌట్‌) ఒంటరిపోరాటం చేసినా, తన జట్టును విజయతీరాలు దాటించలేకపోయాడు. కెప్టెన్‌ సికందర్‌ రజా (31) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతిమంగా జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో అర్షదీప్‌ 3, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌ భారత్‌కు డూ ఆర్‌ డై మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా, మ్యాచ్‌ రద్దైనా విండీస్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది.

ARSHDEEP SINGH BECOMES THE MOST WICKETS FOR INDIA IN T20 WORLD CUP HISTORY5
T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్‌ సింగ్‌

ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌-2026లో టీమిండియా లెఫ్డ్‌ అర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్షదీప్‌.. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా రికార్డును అధిగమించాడు. అర్షదీప్‌ తన టీ20 వరల్డ్‌కప్‌ కెరీర్‌లో 19 మ్యాచ్‌ల్లో 14.25 సగటున, 7.33 ఎకానమీతో 35 వికెట్లు తీయగా.. బుమ్రా తన 19 మ్యాచ్‌ల వరల్డ్‌కప్‌ కెరీర్‌లో 14.00 సగటున 33 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు (50) దక్కుతుంది.సూపర్‌ ఫామ్‌లో అర్షదీప్‌ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్షదీప్‌ సింగ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. టీమిండియా గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించడంలోనూ అర్షదీప్‌సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్‌లో 17 వికెట్లు తీసి జాయింట్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 81 టీ20లు ఆడిన అర్షీదప్‌.. 126 వికెట్లు తీసి భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో అర్షదీప్‌ సహా జట్టులోని ప్రతి ఒక్కరు సత్తా చాటడంతో జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌ భారత్‌కు డూ ఆర్‌ డై మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా, మ్యాచ్‌ రద్దైనా విండీస్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది.భారత్‌ వర్సెస్‌ జింబాబ్వే స్కోర్‌ వివరాలు..భారత్‌: 256-4 (అభిషేక్‌ (55), హార్దిక్‌ (50 నాటౌట్‌)జింబాబ్వే: 184-6 (బ్రియాన్‌ బెన్నెట్‌ 97 నాటౌట్‌, అర్షదీప్‌ 4-0-24-3)

What Happens If IND Vs WI T20 World Cup Super 8 Match Gets Abandoned Due To Rain6
T20 WC 2026: భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ రోజు వర్షం పడితే..?

టీ20 ప్రపంచకప్‌ 2026లో గ్రూప్‌-1 సూపర్‌-8 సమరాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్‌ కోసం భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నిన్న (ఫిబ్రవరి 26) వెస్టిండీస్‌ సౌతాఫ్రికా చేతిలో ఓడటం.. భారత్‌ జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో గ్రూప్‌-1 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్‌, భారత్‌ చెరి రెండు పాయింట్లు కలిగి ఉన్నాయి. రన్‌రేట్‌ మాత్రం భారత్‌తో పోలిస్తే విండీస్‌ది చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతానికి రన్‌రేట్‌ మ్యాటర్‌ కాదు.ఎందుకంటే, మార్చి 1న భారత్‌-విండీస్‌ మధ్య కోల్‌కతా వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే సెమీస్‌కు చేరతారు. ఒకవేళ ఆ మ్యాచ్‌ ఏ కారణంగా అయినా రద్దైతే మాత్రం రన్‌రేట్‌ అ‍త్యంత కీలకమవుతుంది. మ్యాచ్‌ రద్దైతే ఇరు జట్ల ఖతాలో చెరి 3 పాయింట్లు ఉంటాయి. రన్‌రేట్‌ విషయానికొస్తే.. విండీస్‌కు (1.791), భారత్‌ (-0.100) కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి, ఆ జట్టుకే సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది.అయితే దిగులు చెందాల్సిన అవసరం లేని విషయం ఏంటంటే.. భారత్‌-విండీస్‌ మ్యాచ్‌కు ప్రస్తుతానికి ఎలాంటి వర్షాటంకాలు లేవు. యాక్యూవెదర్‌ ముందస్తు సమాచాం ప్రకారం.. మార్చి 1న, ముఖ్యంగా మ్యాచ్‌ జరిగే 7-12 (రాత్రి) మధ్య సమయంలో ఎలాంటి వర్ష​ సూచన లేదు. ఉష్ణోగ్రత 23 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఈ భరోసాతో టీమిండియా అభిమానులు సల్ల బడ్డారు. మ్యాచ్‌ సజావుగా సాగితే విజయం తమదేనని ధీమాగా ఉన్నారు. ఈ టోర్నీ ఆరంభం నుంచి అజేయ జట్టుగా ఉండిన వెస్టిండీస్‌ నిన్న సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి కాన్ఫిడెన్స్‌ను కోల్పోగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వేపై ఘన విజయం సాధించి టీమిండియా మాంచి జోష్‌లో ఉంది. ఇదే జోష్‌ను విండీస్‌ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ ఖాయం. సెమీస్‌లో భారత్‌.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లలో ఏదో ఒక్క జట్టును ఎదుర్కొనే అవకాశం ఉంది.

Rinku Singh father Khanchandra Singh passes away after battling stage 4 liver cancer7
తీవ్ర విషాదం.. రింకూ సింగ్‌ తండ్రి కన్నుమూత

టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఇంట తీవ్ర విషాదం​ చోటు చేసుకుంది. గత కొంతకాలంగా స్టేజ్‌-4 లివర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న రింకూ తండ్రి ఖాచంద్ర సింగ్‌ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఖాచంద్ర సింగ్‌ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితి మరింత విషమించడంతో నిన్న రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. వైద్యులు శక్తివంచన లేకుండా కృష్టి చేసినా రింకూ తండ్రిని కాపాడలేకపోయారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2026తో బిజీగా ఉన్న రింకూ సింగ్‌ తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసి హుటాహుటిన నోయిడాకు బయల్దేరాడు. అక్కడ రెండు రోజులు గడిపి, జింబాబ్వేతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్‌ కోసం తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌ సమయానికి రింకూ జట్టులో చేరినప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయినా, ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.తండ్రి మరణవార్త విని రింకూ హుటాహుటిన తన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌కు బయల్దేరాడు. 28 ఏళ్ల రింకూ చాలా పేద కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. తన సక్సెస్‌లో తండ్రి పాత్ర చాలా కీలకమని రింకూ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. రింకూ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ.. అతని తండ్రి గ్యాస్‌ డెలివరీ చేస్తూనే జీవనం సాగించాడు. రింకూ తండ్రి మరణవార్త తెలిసి టీమిండియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

T20 WC 2026: Still there is chance for India vs Pakistan match in semis, here is how8
T20 WC 2026: సెమీస్‌లో భారత్‌ వర్సెస్‌ పాక్‌..?

టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్‌కు చేరబోయే జట్లపై ఓ అవగాహణ ఏర్పడింది. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌-4కు అర్హత సాధించగా.. రెండో బెర్త్‌ కోసం వెస్టిండీస్‌, భారత్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌పై కర్చీఫ్‌ వేసుకొని కూర్చోగా.. రెండో బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌, పాక్‌ పోటీపడనున్నాయి.సెమీస్‌ బెర్త్‌లపై ఓ క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఏ జట్టు ఎవరితో తలపడనుందనే అంశంపై కేంద్రీకృతమైంది. నిన్న (ఫిబ్రవరి 26) జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్‌ గ్రూప్‌-1 నుంచి విండీస్‌కు ప్రధాన పోటీదారుగా మారగా.. గ్రూప్‌-2లో రెండో బెర్త్‌ న్యూజిలాండ్‌కు దాదాపుగా ఫిక్స్‌ అయ్యింది. అలాగని పాక్‌ అవకాశాలను తీసిపారేయడానికి వీళ్లేదు.మిగతా జట్ల మాట ఎటున్నా, భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రపంచకప్‌లోనే మరోసారి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ కోరుకుంటున్నారు. ఇరు జట్లు సెమీస్‌లో తలపడాలని వారు ఆకాక్షిస్తున్నారు. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పక సెమీస్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అదెలా అంటే..ముందుగా భారత్‌ విషయానికి వద్దాం.. జింబాబ్వేపై గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌పై క్లియర్‌ పిక్చర్‌ ఏర్పడింది. తదుపరి మ్యాచ్‌లో విండీస్‌ గెలిస్తే టీమిండియా సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఓడినా లేక మ్యాచ్‌ రద్దైనా మెరుగైన రన్‌రేట్‌ కలిగిన విండీస్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది.సెమీస్‌లో పాక్‌తో తలపడాలంటే భారత్‌ విండీస్‌పై నామమాత్రపు విజయం సాధిస్తే సరిపోదు. ఆ మ్యాచ్‌లో భారత్‌ మంచి రన్‌ రేట్‌తో భారీ విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్‌, సౌతాఫ్రికా తలో 4 పాయింట్లతో ఉంటాయి. ఇక్కడ ప్లేసింగ్‌ విషయంలో రన్‌రేట్‌ కీలకమవుతుంది. విండీస్‌పై భారత్‌ భారీ తేడాతో గెలుస్తుంది కాబట్టి రన్‌రేట్‌ కూడా భారీగా పెరుగుతుంది. మరోవైపు సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడితే ఆ జట్టు రన్‌రేట్‌ భారత్‌ కంటే తక్కువై పోతుంది. అప్పుడు గ్రూప్‌ 1 టాపర్‌గా భారత్‌.. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంటాయి.గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలిచే జట్టు గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచే జట్టును సెమీస్‌లో ఢీకొంటుంది. సెమీస్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగాలి​ అంటే, పాక్‌ గ్రూప్‌-2 నుంచి రెండో స్థానంలో నిలివాలి. ఆ జట్టుకు ప్రస్తుతం అగ్రస్థానికి వెళ్లే ఛాన్స్‌లు లేవు. భారత్‌=పాక్‌ సెమీస్‌లో తలపడాలంటే టీమిండియానే గ్రూప్‌-1లో టాప్‌ ప్లేస్‌లో ఉండాలి.ఇక పాక్‌ గ్రూప్‌-2లో రెండో స్థానానికి ఎలా చేరుకునే అవకాశం ఉందంటే.. ఈ గ్రూప్‌ నుంచి ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారైపోయింది. పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కాలంటే వారి చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్‌రేట్‌ కూడగట్టుకోవాలి. ఇలా జరిగితే పాక్‌ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి. సెమీస్‌ బెర్త్‌ కోసం పాక్‌కు పోటీదారుగా ఉన్న న్యూజిలాండ్‌ ఇప్పటికే 3 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, భారీ రన్‌రేట్‌ను కూడా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ తమి చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో సాధారణంగా ఓడినా, రెండో స్థానంలో సెమీస్‌కు చేరుకుంటుంది. కానీ, సెమీస్‌లో మనకు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కావాలంటే న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ అతి భారీ తేడాతో గెలవాలి. అప్పుడు న్యూజిలాండ్‌ నెట్‌ రన్‌రేట్‌ బాగా తగ్గిపోతుంది. అప్పటికే శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్‌రేట్‌తో ఉన్న పాకిస్తాన్‌ గ్రూప్‌-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు చేరుతుంది.అప్పుడు గ్రూప్‌-1 టాపర్‌ భారత్‌.. గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచే పాకిస్తాన్‌ సెమీస్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లెక్కల వరకు ఇది బాగానే ఉంది కానీ, ఇలా జరగడం చాలా కష్టం. భారత్‌ అష్టకష్టాలు పడి గ్రూప్‌-1లో టాప్‌ ప్లేస్‌కు రాగలదేమో కానీ, ఏదైనా మహాద్భుతం జరిగితేనే పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది.

India beat Zimbabwe by 72 runs in T20 World Cup9
భారత్‌ ఘన విజయం

భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్‌ శుభారంభం అందిస్తే, అభిషేక్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక నెట్‌రన్‌రేట్‌ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్‌ పంచ్‌ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే చివరి పోరులో భారత్‌ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్‌–1’ మ్యాచ్‌లో భారత్‌ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్‌ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్‌ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్‌ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్‌ ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్‌ బ్రయాన్‌ బెన్నెట్‌ (59 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్‌ రెండో బంతికే సంజు సామ్సన్‌ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొట్టిన సిక్స్‌తో ఆరంభమైన భారత్‌ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్‌ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాది అభిషేక్‌ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు సామ్సన్‌ ధాటిగా ఆడాడు. సామ్సన్‌ వెనుదిరిగిన తర్వాత ఇషాన్‌ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్‌కు లైఫ్‌ లభించగా, 26 బంతుల్లో అభిషేక్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్‌ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్‌ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్‌ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్‌ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్‌ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఎన్‌గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్‌ వరుసగా 2 సిక్స్‌లు కొట్టగా, ఇవాన్స్‌ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్‌లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్‌కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్‌ బాదగా భారత్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్‌ సుందర్, రింకూ సింగ్‌ స్థానాల్లో అక్షర్‌ పటేల్, సంజు సామ్సన్‌ జట్టులోకి వచ్చారు. బెన్నెట్‌ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్‌ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్‌ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్‌ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టిన బెన్నెట్‌ 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్‌ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్‌కు బెన్నెట్‌తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్‌ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్‌ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) బర్ల్‌ (బి) ముజరబాని 24; అభిషేక్‌ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్‌ కిషన్‌ (సి) ఎన్‌గరవా (బి) రజా 38; సూర్యకుమార్‌ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవా 33; పాండ్యా (నాటౌట్‌) 50; తిలక్‌ (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్‌: ఎన్‌గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్‌ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్‌ 2–0–16–0, బర్ల్‌ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్‌: బెన్నెట్‌ (నాటౌట్‌) 97; మరుమని (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 20; మైయర్స్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 6; రజా (సి) అభిషేక్‌ (బి) అర్‌‡్షదీప్‌ 31; బర్ల్‌ (ఎల్బీ) (బి) అర్‌‡్షదీప్‌ 0; మున్‌యోంగా (బి) అర్‌‡్షదీప్‌ 11; ముసెకివా (సి) సామ్సన్‌ (బి) దూబే 7; ఇవాన్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్‌ 4–0–35–1, అక్షర్‌ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్‌కు... జింబాబ్వేపై భారత్‌ విజయంతో ‘గ్రూప్‌–1’ నుంచి సెమీఫైనల్‌ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్‌ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్‌ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్‌ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌ క్వార్టర్‌ ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్‌రేట్‌లతో సంబంధం లేకుండా సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్‌ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్‌ ఎయిట్స్‌’లో వెస్టిండీస్, భారత్‌లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఇంగ్లండ్‌ X న్యూజిలాండ్‌ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

South Africa beat West Indies by 9 wickets in T20 World Cup10
సెమీస్‌లో దక్షిణాఫ్రికా

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచకప్‌లో 2024 టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన సఫారీ టీమ్‌ ఇప్పుడు ‘సూపర్‌ ఎయిట్స్‌’లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నైలో జింబాబ్వేపై భారత జట్టు గెలుపొందడంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టుకు సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. గురువారం జరిగిన ‘గ్రూప్‌–2’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో గ్రూప్‌–1లో అగ్రస్థానంలో ఉంది. తమ చివరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌ను ఢిల్లీలో ఆదివారం జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా ఆ జట్టుకు 4 పాయింట్లు ఉంటాయి. ఆదివారమే కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే చివరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతోనే ముగిస్తుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు ఎన్‌గిడి (3/30), రబాడ (2/22), కార్బిన్‌ బాష్‌ (2/31) చెలరేగడంతో విండీస్‌ 83 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయింది. షై హోప్‌ (16), హెట్‌మైర్‌ (2), బ్రెండన్‌ కింగ్‌ (21), ఛేజ్‌ (2), రూథర్‌ఫర్డ్‌ (12), రావ్‌మన్‌ పావెల్‌ (9) పూర్తిగా విఫలమయ్యారు. 83/7 నుంచి విండీస్‌ జట్టును రొమారియో షెఫర్డ్‌ (37 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హోల్డర్‌ (31 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. దాంతో విండీస్‌ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 16.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 177 పరుగులు చేసి జట్టు విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్క్‌రమ్‌ (46 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆడగా... డికాక్‌ (24 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించారు. డికాక్‌తో తొలి వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగులు జోడించిన కెపె్టన్‌ మార్క్‌రమ్‌... రెండో వికెట్‌కు రికెల్టన్‌తో 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేశాడు. 89 అంతర్జాతీయ టి20ల్లో ఎనిమిదో వికెట్‌కు షెఫర్డ్‌–హోల్డర్‌ కొత్త ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో స్కాట్లాండ్‌ ప్లేయర్లు షరీఫ్‌–మోమ్‌సెన్‌ జోడించిన 80 పరుగుల రికార్డు (2015లో నెదర్లాండ్స్‌పై) కనుమరుగైంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement