Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Taniparthi Chikitha has won a gold medal at the 2025 Taipei Archery Open1
చికిత ‘పసిడి’ గురి 

తైపీ ఓపెన్‌ వరల్డ్‌ సిరీస్‌ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల అండర్‌–21 కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత చాంపియన్‌గా అవతరించింది. చైనీస్‌ తైపీలోని తావోయువాన్‌ సిటీలో జరిగిన ఈ టోరీ్నలో చికిత ఫైనల్లో 148–141 పాయింట్ల తేడాతో జిట్‌మున్‌ ఖెమనిత్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది. సెమీఫైనల్లో చికిత 147–145తో యోన్‌సియో కాంగ్‌ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 149–138తో సియోయూన్‌ కాంగ్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 149–143తో సో చేవన్‌ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌ వర్మ కూడా కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్‌ వర్మ 148–146తో మార్కో బ్రునో (ఇటలీ)పై గెలిచాడు. మహిళల రికర్వ్‌ అండర్‌–21 కాంస్య పతక మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కొండపావులూరి యుక్తశ్రీ 5–6తో షు యాన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది.

India vs South Africa T20 is scheduled for 9 December at Barabati Stadium2
ఇక ధనాధన్‌ షురూ... 

టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్‌ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్‌ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్‌ చేతిలో టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.పైగా నిలకడ లేని టీమ్‌తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్‌ కప్‌కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు. కటక్‌: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో కూడా సిరీస్‌లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్‌ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగడానికి ముందు భారత్‌ 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ తర్వాత న్యూజిలాండ్‌తో కూడా ఐదు టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్‌ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్‌ జరుగుతుంది. గిల్, పాండ్యా సిద్ధం... ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్‌ గెలిచిన తర్వాత భారత్‌ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్‌ కెప్టెన్‌ గిల్, హార్దిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం. అభిషేక్‌ శర్మతో పాటు గిల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా సూర్య, తిలక్‌ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్‌ కీపర్‌గా సంజూ సామ్సన్, జితేశ్‌ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్‌ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి ఉంటారు. అక్షర్‌ పటేల్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ పోటీలో ఉన్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌ కావాలంటే హర్షిత్‌ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్‌ సూర్యకుమార్‌ ఫామ్‌ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్‌ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్‌లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. బ్రెవిస్‌పై దృష్టి... దక్షిణాఫ్రికా టీమ్‌ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ల చేతిలో సిరీస్‌లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్‌ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటగాడు డేవిడ్‌ మిల్లర్, పేసర్‌ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్‌రమ్‌ మెరుగైన ఫామ్‌లో ఉండటం కలిసి రావచ్చు. ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్‌లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్‌ బ్రెవిస్‌పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్‌తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్‌ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్‌ పిచ్‌. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్‌ గెలవగానే ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్‌కు ఇబ్బంది లేకపోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, గిల్, తిలక్, జితేశ్‌ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్‌/సుందర్‌. దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్‌/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్‌గిడి, మహరాజ్‌.

Karun Nair dropped from Karnataka SMAT 2025 squad3
కరుణ్‌ నాయర్‌కు అక్కడ కూడా చుక్కెదురు

పేలవ ఫామ్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్‌ నాయర్‌.. తాజాగా అదే ఫామ్‌ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ ‍నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్‌.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్‌.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్‌ 8) జరిగిన మ్యాచ్‌ నుంచి తప్పించబడ్డాడు.ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ వరకు మంచి ఫామ్‌లో ఉండిన కరుణ్‌ పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్‌ గత ఎడిషన్ SMAT ఫామ్‌ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్‌లో విదర్భకు ఆడిన కరుణ్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. కరుణ్‌ను ఐపీఎల్‌ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్‌ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కరుణ్‌ గత ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్‌ చేసుకోవడం ఆశ్చర్యకరం.ఇదిలా ఉంటే, కరుణ్‌ లేని మ్యాచ్‌లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్‌ ఓవర్‌లో త్రిపుర ఊహించని విధంగా వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్‌ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది.

SMAT 2025: Sai Sudharsan Slams blasting hundred against saurashtra4
సాయి సుదర్శన్‌ విధ్వంసకర శతకం

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్‌ 8) జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్‌ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్‌ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్‌ గజ్జర్‌ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్‌ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్‌కుమార్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్‌ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత రిత్విక్‌ ఈశ్వరన్‌ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్‌ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్‌ ఉనద్కత్‌ (4-0-30-3), అంకుర్‌ పవార్‌ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్‌ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు.

Special story on Mohammed shami omitted from team india race5
షమీ చేసిన నేరం ఏంటి.. ఎందుకు రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు..?

భారత క్రికెట్‌లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అతను దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నా.. అతని అనుభవం టీమిండియాకు అవసరమైనా, సెలెక్టర్లు ఫిట్‌నెస్‌, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు. షమీని పక్కకు​ పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణముందన్నది చాలా మందికి తెలుసు. అయినా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేరు. ఓ ఆటగాడి కెరీర్‌ను ఆటతో ముడిపెట్టకూడని విషయాల పేర్లు చెప్పి నాశనం చేయడం సమంజసం కాదని కొన్ని గొంతులకు వినిపిస్తున్నా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్దించుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి.సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైంది షమీ ఫిట్‌గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్దనలో అర్దమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్‌గా లేకపోతే దేశవాలీ టోర్నీల్లో ఎలా అనుమతిస్తారు. అనుమతించినా.. నిజంగా ఫిట్‌గా లేకపోతే అతనెలా రాణించలడు. ఈ ఒక్క విషయం చాలు సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాను ఎంపిక చేయడం లేదన్న విషయం అర్దం అవడానికి. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు. వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్‌ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. కానీ అక్కడుంది షమీ కాబట్టి అలా జరగలేదు. అలాంటి ప్రదర్శనలు మరిన్ని పునరావృతం చేసినా షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కదు. కారణం బహిరంగ రహస్యమే.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం షమీ వయసు 35. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలామంది ఉన్నారు. ఇంగ్లండ్‌ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆండర్సన్‌ 40 ఏళ్ల వయసులోనూ ఏం చేశాడో జగమంతా చూసింది. అలాంటిది షమీకి 35 ఏళ్లకే వయసైపోయిందనడం ఎంత వరకు సమంజసం. వయసైపోయిన వాడికి అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, దేశవాలీ క్రికెట్‌ అయినా ఒకటే కదా. దేశవాలీ క్రికెట్‌లో వయసైపోయినా రాణిస్తున్నవాడు, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేడా..? ఏదో కారణం చెప్పాలని ఇలాంటి పొంతనలేని కారణాలు చెబుతున్నారు కానీ, అసలు కారణం వేరన్న విషయం చాలామందికి తెలుసు.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరో కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో సీనియర్లు తురుచూ విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు పోవాలి. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన, టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్‌ను యువత పేరుతో ఫ్రేమ్‌లోకి తెచ్చారు. అతని కంటే చిన్నవాడు, అతని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ టాలెంట్‌ ఉన్నా మరో పేసర్‌కు మాత్రం అవకాశాలు ఇవ్వరు. పెద్దల అండదండలున్న పేసర్‌ ఎన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా, మళ్లీమళ్లీ తుది జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల శారీరక కదలికలు, ఫిట్‌నెస్‌, ఫామ్‌ను బట్టి వయసు ప్రస్తావన వస్తుంది. ఈ మూడు బాగుంటే వయసుతో పనేముంది. పై మూడు అంశాల్లో షమీ పర్ఫెక్ట్‌గా ఉన్నా వయసు పేరు చెప్పి టీమిండియాకు ఎంపిక చేయకపోవడం ఎంత వరకు సమంజసం.ఇన్ని కారణాలు చెప్పి షమీని టీమిండియాకు ఎంపిక చేయకున్న సెలెక్టర్లు అంతిమంగా ఒక్క విషయం ఆలోచించాలి. షమీ స్థానంలో అతనిలా రాణిస్తున్న ఎవరినైనా ఎంపిక చేయకపోతే నష్టపోయే భారత జట్టే. అర్హులు జాతీయ జట్టులో లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్‌కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్‌ సింగ్‌, ఛతేశ్వర్‌ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. షమీ చేసిన నేరం ఏంటని బహిరంగంగా ప్రశ్నించారు. భారత సెలెక్టర్లు ఇకనైనా పంతాలు పక్కకు పెడితే భారత క్రికెట్‌కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

JioStar seeks exit from $3B ICC media deal ahead of T20 World Cup6
వరల్డ్‌కప్‌ స్ట్రీమింగ్‌ నుంచి తప్పుకున్న హాట్‌స్టార్‌..!

2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్‌ తగిలింది. మెగా టోర్నీ స్ట్రీమింగ్‌ నుంచి జియో హాట్‌స్టార్‌ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్దిక సమస్యల కారణంగా హాట్‌స్టార్‌ ఈ డీల్‌ను వదులుకోనున్నట్లు సమాచారం.జియో హాట్‌స్టార్‌ భారత్‌లో స్ట్రీమింగ్‌ హక్కుల కోసం నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఐసీసీతో కుదుర్చుకుంది. ఇంకా రెండేళ్లు మిగిలుండగానే హాట్‌స్టార్‌ ఈ డీల్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతుంది. హాట్‌స్టార్‌ అధికారికంగా తప్పుకుంటే ఈ రెండేళ్లు​ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకునేందుకు సోనీ పిక్చర్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.కాగా, జియో హాట్‌స్టార్‌ స్పోర్ట్స్ కాంట్రాక్టుల కారణంగా గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడంతో ప్రకటనదారులు కరువు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తుంది. దీని వల్ల $840 మిలియన్ లోటు ఏర్పడిందని అంచనా. దీనికి తోడు డాలర్‌ రేటు కూడా పెరగడం​ హాట్‌స్టార్‌పై అదనపు భారం పడేలా చేసిందని సమాచారం​.ఒకవేళ హాట్‌స్టార్‌ వరల్డ్‌కప్‌ స్ట్రీమింగ్‌ నుంచి తప్పుకుంటే భారతలో క్రికెట్‌ అభిమానుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. మెగా టోర్నీలో మ్యాచ్‌లు వీక్షించేందుకు డబ్బులు చెల్లించి కొత్త సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, 2026 టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగునున్న విషయం తెలిసిందే.

Henry, Smith and Santner ruled out of remainder of West Indies Tests7
న్యూజిలాండ్‌కు 'ట్రిపుల్‌' షాక్‌

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ట్రిపుల్‌ షాక్‌ తగిలింది. డిసెంబర్‌ 10 నుంచి వెల్లింగ్టన్‌ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్‌ బౌలర్లు గాయపడ్డారు. మ్యాట్‌ హెన్రీ కాఫ్‌ ఇంజ్యూరితో, నాథన్‌ స్మిత్‌ సైడ్‌ స్ట్రెయిన్‌తో, మిచెల్‌ సాంట్నర్‌ గ్రోయిన్‌ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌, ఫాస్ట్‌ బౌలర్‌ మైఖేల్‌ రే, గ్లెన్‌ ఫిలిప్‌ జట్టులోకి వచ్చారు. స్మిత్‌, హెన్రీ తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్‌ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన టామ్‌ బ్లండెల్‌కు కవర్‌గా మిచ్‌ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. విండీస్‌ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.షాయ్‌ హోప్‌ సూపర్‌ సెంచరీ (140).. జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీ (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తించింది.

India sanctioned for slow overrate in Raipur ODI vs south africa8
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఝలక్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్‌ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్‌ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత​ సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం​ మ్యాచ్‌ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్‌, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్‌ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక​్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌

IND VS SA T20 Series: Gill all set for comeback, once again Despair for sanju samson9
గిల్‌ వచ్చేశాడు.. సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే..!

డిసెంబర్‌ 9 నుంచి కటక్‌ (ఒడిషా) వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్‌కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్‌, వన్డే సిరీస్‌కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్‌ చేరుకున్నాడు.గిల్‌ మెడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్‌ రాకతో టీమిండియాకు ఓపెనింగ్‌ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్‌కు జోడీగా గిల్‌ బరిలోకి దిగితే సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్‌లో ఆడించాల్సి వస్తే మేనేజ్‌మెంట్‌ జితేశ్‌ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్‌గా అయితేనే సక్సెస్‌ కాగలడని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. ఇది ఆసీస్‌ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్‌గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్‌మెంట్‌ దగ్గర మిడిలార్డర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కోసం​ జితేశ్‌ శర్మ రూపం మంచి ఆప్షన్‌ ఉంది. జితేశ్‌ మంచి ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్‌ ఆకలితో ఉన్నాడు: గంభీర్‌గిల్‌ గాయంపై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ రెండు రోజుల ముందే అప్‌డేట్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిశాక గంభీర్‌ మాట్లాడుతూ.. అవును, గిల్‌ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్‌గా, ఫైన్‌గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన గిల్‌.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌

Powell, Cox power Dubai Capitals to victory over Abu Dhabi Knight Riders10
ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో విండీస్‌ వీరుడి విధ్వంసం

దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో విండీస్‌ వీరుడి రోవ్‌మన్‌ పావెల్‌ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడుతున్న పావెల్‌.. నిన్న (డిసెంబర్‌ 7) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్‌ మెరుపులకు జోర్డన్‌ కాక్స్‌ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్‌) మెరుపు హాఫ్‌ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో పావెల్‌, కాక్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.టాబీ ఆల్బర్ట్‌, సెదిఖుల్లా అటల్‌ తలో 8, షయాన్‌ జహంగీర్‌ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2, అజయ్‌ కుమార్‌, పియూశ్‌ చావ్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్‌రైడర్స్‌ తడబడింది. వకార్‌ సలామ్‌ఖీల్‌ (3.3-0-29-4), మహ్మద్‌ నబీ (4-0-12-2), డేవిడ్‌ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్‌ (16), రూథర్‌ఫోర్డ్‌ (19), రసెల్‌ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement