Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Multiple new No.1s crowned in latest ICC Women's Rankings1
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం చోటు చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఒకేసారి టాప్‌ ర్యాంక్‌లు మారాయి. ఇలాంటి పరిణామం చాలా అరుదుగా జరుగుతుంది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్‌ను కిందకి దించి స్మృతి మంధన (భారత్‌).. ఇంగ్లండ్‌కు చెందిన సోఫి ఎక్లెస్టోన్‌ను కిందకి దించి అలానా కింగ్‌ (ఆస్ట్రేలియా) అగ్రపీఠాలను అధిరోహించారు.తాజాగా జరిగిన భారత్‌-ఆసీస్‌ వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు. తద్వారా తమతమ విభాగాల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరారు. బౌలింగ్‌ విభాగంలో నాలుగేళ్లు అగ్రపీఠంపై కూర్చున్న సోఫిని అలానా కింగ్‌ తాజా ప్రదర్శనలతో (3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) కిందికి దించింది. కింగ్‌తో పాటు టాప్‌-8లో మరో నలుగురు ఆసీస్‌ బౌలర్లు ఉన్నారు. ఆష్లే గార్డనర్‌ (3), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (5), మెగాన్‌ షట్‌ (7), కిమ్‌ గార్త్‌ (8) స్థానాల్లో నిలిచారు.మంధన విషయానికొస్తే.. గత వారం ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో ఆమె 58, 31 స్కోర్లతో రాణించింది. తద్వారా స్వల్ప తేడాతో వోల్వార్డ్ట్‌ను అధిగమించి టాప్‌ ర్యాంక్‌కు చేరింది. కెరీర్‌లో చివరి వన్డే (భారత్‌తో మూడో వన్డే) ఆడిన ఆలైస్సా హీలీ అద్భుతమైన సెంచరీ చేసి 2 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి, అదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన బెత్‌ మూనీ కూడా 2 స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది.భారత్‌ నుంచి మంధనతో సహా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాత్రమే టాప్‌-10లో చోటు దక్కించుకుంది. ఆసీస్‌ సిరీస​్‌లో రాణించిన ఆమె నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానాకి ఎగబాకింది.బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10 భారత్‌ను ఒక్క దీప్తి శర్మకు మాత్రమే అవకాశం దక్కింది. ఆమె కూడా ఐదు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. ఇటీవలి ఆసీస్‌ సిరీస్‌లో దీప్తి నామమాత్రపు ప్రదర్శనలు కూడా చేయలేక చతికిలపడింది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ దీప్తి ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయింది. ఈ విభాగంలో ఆష్లే గార్డ్‌నర్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుంది.

India to play five ODIs in New Zealand instead of three2
రోహిత్‌, కోహ్లి అభిమానులకు పండగే..!

టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అభిమానులకు శుభవార్త. టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్‌ ద్వయానికి అదనపు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో టీమిండియా మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌లు షెడ్యూలయ్యాయి.2027 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా వన్డే మ్యాచ్‌ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్‌ల సంఖ్య 4కు పెంచితే, టీ20 మ్యాచ్‌ల సంఖ్యను 3కు కుదించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. వన్డేల పెంపు ఖరారైందని సమాచారం.ఈ అంశం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులకు వాణిజ్యపరమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోహిత్‌-విరాట్‌ ఎక్కువ మ్యాచ్‌ల్లో కనబడితే న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే వన్డే ప్రపంచకప్‌కు ముందు రో-కోకు వీలైనంత రియల్‌ ప్రాక్టీస్‌ కూడా లభించినట్లవుతుంది. కాబట్టి న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డే లెగ్‌ పొడిగించడం​ దాదాపుగా ఖరారైనట్టే. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.ఐపీఎల్‌ తర్వాత వన్డేలపై దృష్టిఐపీఎల్‌ 2026 సీజన్‌ మే చివర్లో ముగిసిన వెంటనే, భారత జట్టు దృష్టి వన్డే ప్రపంచకప్‌ సన్నాహాలపై కేంద్రీకృతమవుతుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో బిజీగా ఉన్న భారత జట్టు.. జూన్‌ మొదటి వారం​ నుంచి వన్డేలపై దృష్టి సారించనుంది.ఐపీఎల్‌ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్‌ - జూన్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు - జూలైలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లు - ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌లు - అక్టోబర్‌లో న్యూజిలాండ్‌ పర్యటన- సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు

Sri Lanka women completes West Indies tour with a win3
విండీస్‌ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక

వెస్టిండీస్‌ గడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టు తిరుగులేని విజయాలు సాధించింది. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించిన శ్రీలంక.. తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది.నిన్న (మార్చి 4) గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది.టాపార్డర్‌ బ్యాటర్లు హేలీ మాథ్యూస్‌ (8), ఎబోని బ్రాత్‌వైట్‌ (8), షవ్నిషా హెక్టార్‌ (5) దారుణంగా విఫలం కాగా.. మిడిలార్డర్‌ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్‌ (24), డియాండ్రా డొట్టిన్‌ (28), చిన్నెల్‌ హెన్రీ (32 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో రణవీర (4-0-16-2), కవిష దిల్హరి (4-0-13-1), సుగంధిక కుమారి (4-0-32-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.హాసిని పెరీరా (52 నాటౌట్‌), చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 నాటౌట్‌) రాణించడంతో 17.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అర్ద సెంచరీతో రాణించిన హాసినికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌.. సిరీస్‌ ఆధ్యాంతం రాణంచిన చమారికి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు దక్కాయి.

Kashvee Gautam replaces Renuka Singh Thakur for one-off Test in Perth4
ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌.. టీమిండియాలో కీలక మార్పు

ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్ స్థానంలో యువ పేసర్‌ కశ్వీ గౌతమ్‌ను ఎంపిక చేశారు. వర్క్‌లోడ్‌ కారణంగా రేణుకా సింగ్‌కు విశ్రాంతినిచ్చినట్లు సెలెక్టర్లు చెప్పారు. రేణుకా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది, కానీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది. ప్రస్తుత ఆసీస్‌ పర్యటనలోనూ 3 టీ20లు (4 వికెట్లు), 2 వన్డేలు (ఒక్క వికెట్‌) ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రేణుకా ఫామ్‌లో లేకపోయినా ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల భారత పేస్‌ విభాగం అనుభవం కోల్పోనుంది. కశ్వీ విషయానికొస్తే.. ఆమెకు ఇదే తొలి టెస్ట్‌ మ్యాచ్‌. ఇప్పటివరకు 6 వన్డేలు మాత్రమే ఆడింది. ప్రస్తుత ఆసీస్‌ సిరీస్‌లో 3 వికెట్లు తీసి, 68 పరుగులు చేసింది. కశ్వీకి రేణుకా అంత అనుభవం లేకపోవడంతో ఆసీస్‌ మ్యాచ్‌లో టీమిండియా పరీక్ష ఎదుర్కోవచ్చు.భారత పేస్‌ విభాగంలో కశ్వీతో పాటు క్రాంతి గౌడ్‌, సయాలి సత్ఘరే, అమంజోత్‌ కౌర్‌ కూడా టెస్ట్‌ స్థాయిలో కొత్తవారే. అనుభవలేమితో భారత పేస్‌ విభాగం ఆసీస్‌ బ్యాటర్లను ఏమేరకు నిలువరించగలరో చూడాలి. మార్చి 6న పెర్త్‌లోని WACA మైదానంలో ఈ ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. పింక్‌బాల్‌తో జరిగే ఈ మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ ఫార్మాట్‌లో ఉంటుంది.కాగా, భారత మహిళల జట్టు మల్లీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ జరగగా భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్‌ స్వీప్‌​ చేసింది. ఈ పర్యటనలో చివరిదైన ఏకైక టెస్ట్‌ మార్చి 6న ప్రారంభం​ కానుంది. సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 8-4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌కి నాలుగు పాయింట్లు ఉన్నాయి. భారత్‌ గెలిస్తే సిరీస్‌ను సమం చేయగలదు. ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు..స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌, ప్రతీక రావల్‌, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), అమన్‌జోత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, రిచా ఘోష్‌, ఉమా ఛెత్రి, క్రాంతి గౌడ్‌, కశ్వీ గౌతమ్‌భారత్‌తో ఏకైక టెస్ట్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్‌లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్‌ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్‌గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్

Indian Women’s Cricket Team Nominated for Prestigious Laureus Team Award5
‘లారెస్‌’ టీమ్‌ అవార్డు రేసులో భారత మహిళల క్రికెట్‌ జట్టు

మాడ్రిడ్‌: గతేడాది తొలిసారి వన్డే ప్రపంచకప్‌ కొట్టిన భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో పురస్కారం ముంగిట నిలుచుంది. ప్రతిష్టాత్మక ‘లారెస్‌’ టీమ్‌ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఉంది. అంతర్జాతీయ క్రీడల్లో సాధించిన ఘన విజయాలు, ఘనతలకు ప్రతి యేట ‘లారెస్‌’ స్పోర్ట్స్‌ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సారి భారత అమ్మాయిల జట్టు ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ అయ్యింది. ఒక భారత జట్టు అంతర్జాతీయ పురస్కారాల రేసులో నిలవడం ఇదే మొదటిసారి! భారత క్రికెట్‌ జట్టుతో పాటు ఈ టీమ్‌ కేటగిరీలో ఇంగ్లండ్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు, యూరోపియన్‌ రైడర్‌ కప్‌ స్క్వాడ్, ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంప్‌ పారిస్‌ సెయింట్‌–జెర్మయిన్, మెక్‌లారెన్‌ ఫార్ములావన్‌ టీమ్‌లు పోటీలో ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘లారెస్‌’ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి క్రికెట్‌ జట్టు భారత్‌ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెమీస్‌లో జగజ్జేత ఆ్రస్టేలియా మహిళల జట్టుపై 339 పరుగుల భారీస్కోరును ఛేదించి ఫైనల్‌ చేరడం, అక్కడ దక్షిణాఫ్రికాను కంగుతినిపించి ప్రపంచకప్‌ సాధించిన ప్రదర్శనతో ‘లారెస్‌’ నిర్వాహకులు హర్మన్‌ సేనను నామినేట్‌ చేశారు. ఏప్రిల్‌ 20న స్పెయిన్‌ రాజధాని నగరం మాడ్రిడ్‌లో అవార్డుల వేడుక జరుగుతుంది. గతంలో భారత్‌ తరఫున వ్యక్తిగత విభాగంలో మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (2019), జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (2022), క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (2025) నామినేట్‌ అయ్యారు.

Indian cricket team preparing for semi final match6
భారత జట్టు ముమ్మర సాధన

టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెట్‌ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్‌లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్‌ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ పర్యవేక్షణలో అభిషేక్‌ శర్మ ప్రత్యేకంగా ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్‌ ఆఫ్‌ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ అటు స్పిన్, ఇటు పేస్‌ బౌలింగ్‌లో సాధన చేశారు. కుల్దీప్‌ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌లపై తిలక్‌ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్‌ సింగ్‌ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్‌ లేకుండా తనదైన శైలిలో స్పాట్‌ బౌలింగ్‌కే ప్రాధాన్యతనిచ్చాడు. హార్దిక్‌ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్‌కు రెండు రోజుల మాత్రం పిచ్‌పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్‌ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది.

New Zealand face South Africa in the first semi final of the T20 World Cup 2026 today7
సెమీస్‌ సమరానికి సిద్ధం

టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో రెండు టీమ్‌లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్‌ వరకు చేరగలిగినా టైటిల్‌ గెలుచుకోలేక రన్నరప్‌గానే సంతృప్తి చెందాయి. లీగ్‌ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్‌లు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్‌ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ సిద్ధమయ్యాయి. రెండు టీమ్‌లలో ఒకరికి మాత్రమే టైటిల్‌ వేటలో పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. కోల్‌కతా: టి20 వరల్డ్‌ కప్‌ తొలి నాకౌట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్‌ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్‌ చేరగా...కివీస్‌ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్‌ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్‌ ఎయిట్స్‌లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరుతుందా లేక గత మ్యాచ్‌కు కివీస్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. అద్భుత ఫామ్‌లో... 2024 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్‌పై పోరు సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. టాపార్డర్‌లో డికాక్, రికెల్టన్‌లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌లతో మిడిలార్డర్‌ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్‌ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్‌ మెరుపు బ్యాటింగ్‌తో ఏ టీమ్‌పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్‌ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్‌రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్‌లో ఇద్దరు బెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. రబాడ, ఎన్‌గిడి ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్‌గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కేశవ్‌ మహరాజ్‌ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది. తడబడుతూనే... ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్‌ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్‌–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్‌లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఫిలిప్స్‌లో కూడా నిలకడ లోపించగా...చాప్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్‌తో సిరీస్‌లో చెలరేగిన మిచెల్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్‌ సాంట్నర్‌ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్‌లో విఫలమైన సాంట్నర్‌ బ్యాటింగ్‌లో కూడా ఒక్క ఇన్నింగ్స్‌ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. బౌలింగ్‌లో ఫెర్గూసన్‌పైనే ప్రధానంగా పేస్‌ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్‌ వరకు తిరిగి వస్తాడని మేనేజ్‌మెంట్‌ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్‌ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు. తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్‌గిడి న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ5-0 టి20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. పిచ్, వాతావరణంబ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్‌ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు.

Lakshya Sen wins over world number one Shi Yuqi8
లక్ష్యసేన్‌ సంచలనం

బర్మింగ్‌హామ్‌: భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను పెను సంచలనంతో మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే కొరకరాని ప్రత్యర్థి, చైనా గోడను తొలి రౌండ్లోనే బద్దలు కొట్టాడు. చైనాకు చెందిన టాప్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ షి యూకిపై భారత షట్లర్‌ చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, సుదిర్మన్‌ కప్, థామస్‌ కప్‌లాంటి ఎన్నో టోర్నీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన షి యూకిని ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 23–21, 19–21, 21–17తో టాప్‌ సీడ్, తాజా ప్రపంచ చాంపియన్‌ షి యూకిని కంగుతినిపించాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమె 11–21, 6–21తో వరుస గేముల్లో మూడో సీడ్‌ చెన్‌ యూ ఫె (చైనా) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ పొర్న్‌పవీ చోచువాంగ్‌ (థాయిలాండ్‌) 21–12, 21–18తో ఉన్నతి హుడా (భారత్‌)ను ఓడించి ముందంజ వేసింది. డబుల్స్‌ జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జోడీ 21–17, 21–19తో హూ పాంగ్‌ రాన్‌–చెంగ్‌ సు యిన్‌ (మలేసియా) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 15–21, 21–15, 18–21తో జపాన్‌కు చెందిన సయాక హిరోత–అయాకొ సకురమొతొ జంట చేతిలో పరాజయం చవిచూసింది. సింధు స్వదేశానికి... భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ కోసం బయల్దేరిన సింధు తాజా యుద్ధ పరిణామాల కారణంగా ఫ్లయిట్‌లు ఆగిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుంది. ఇంగ్లండ్‌ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. అయితే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ నిబంధనల ప్రకారం ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంటే 5 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. అయితే సింధు ఇచి్చన వివరణ, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆల్‌ ఇంగ్లండ్‌ ఆర్గనైజర్లు జరిమానాను రద్దు చేశారు.

Indian womens football team ready for first match in Asia Cup tournament9
భారత్‌ X వియత్నాం

పెర్త్‌: మైదానం లోపలా బయటా సమస్యలతో సతమతమవుతున్న భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు... ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో తొలిపోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం మొదటి మ్యాచ్‌లో మనకంటే మెరుగైన ర్యాంక్‌ గల వియత్నాంతో టీమిండియా తలపడనుంది. చైనీస్‌ తైపీ, జపాన్, వియత్నాంతో కలిసి గ్రూప్‌ ‘సి’నుంచి భారత్‌ పోటీ పడుతోంది. గతేడాది అక్టోబర్‌ తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇదే. చివరగా ఇరాన్, నేపాల్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మన అమ్మాయిలు పరాజయం పాలయ్యారు. మరి ఆ వైఫల్యాలను అధిగమించి బుధవారం మనవాళ్లు మైదానంలో ఆకట్టుకుంటారా చూడాలి. ఈ టోర్నమెంట్‌ కోసం గత నెల 11నే పెర్త్‌ చేరుకున్న భారత జట్టు... అక్కడ స్థానిక క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడి అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో వియత్నాం 36వ ర్యాంక్‌లో ఉండగా... భారత్‌ 67వ స్థానంలో కొనసాగుతోంది. ఫామ్‌ పరంగా చూసుకున్నా... వియత్నాం ఇటీవలే బలమైన ప్రత్యర్థులపై విజయాలతో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి అలాంటి జట్టుపై ఆధిక్యం కనబర్చాలంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పదు. 2003లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వియత్నాం విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌ మూడు గ్రూప్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన రెండు మేటి జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరనున్నాయి. అందులో విజయం సాధించిన జట్లకు 2027లో బ్రెజిల్‌ వేదికగా జరగనున్న మహిళల ఫిఫా వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కనుంది. ‘2023 ఆసియాకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ ఈ సారి మంచి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాం. ఈ టోర్నీకి ముందు టర్కీలో ప్లేయర్ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఆసియాకప్‌లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌ అమేలియా వాల్‌వెర్డ్‌ పేర్కొంది. సరైన్‌ కిట్‌లు లేక... ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ కోసం చాలా ముందుగానే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టుకు అనూహ్య ఇబ్బంది వచ్చి పడింది. జట్టు స్పాన్సర్‌ సరైన సమయానికి సరైన్‌ కిట్‌లు అందించకపోవడంతో ప్లేయర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన ప్లేయర్లు తమ సమస్యను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) దృష్టికి తీసుకొచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రొఫెషనల్‌ ప్రమాణాలు అవసరం. కనీసం కిట్‌లను కూడా సరిగ్గా సమకూర్చలేకపోతే కష్టం. ప్రాక్టీస్‌ సమయంలోనే సరైన దుస్తులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి కీలక టోర్నమెంట్‌ ఆడుతున్న సమయంలో కిట్‌లు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతో బాధిస్తోంది. మ్యాచ్‌కు ముందు ఇలాంటి సమస్యలు మా ఏకాగ్రతను దెబ్బతీశాయి’ అని ప్లేయర్లు ఏఐఎఫ్‌ఎఫ్‌కు లేఖ రాశారు. కెపె్టన్‌ స్వీటి దేవి నాంగ్‌బమ్‌తో పాటు ఎనిమిది మంది ప్రధాన ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సమాఖ్య మంగళవారం ప్లేయర్లకు కొత్త కిట్‌లు అందించినట్లు తెలిపింది.

Australia captain bids farewell to career10
హ్యాట్సాఫ్‌ హీలీ

ఆరుసార్లు ఐసీసీ మహిళల టి20 ప్రంపచకప్‌ ముద్దాడిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఘనత... మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు... అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన గుర్తింపు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌! ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. సుదీర్ఘ కెరీర్‌లో ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆ్రస్టేలియా మహిళల క్రికెట్‌ జట్టు దిగ్గజ ప్లేయర్‌ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం టీమిండియాతో ఆడిన తన కెరీర్‌ చివరి వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కిన హీలీ... శుక్రవారం నుంచి పెర్త్‌ వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో చివరిసారి ఆసీస్‌ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. మహిళల క్రికెట్‌లో దిగ్గజ స్థాయికి చేరిన హీలీ కెరీర్‌ను ఓసారి విశ్లేషిస్తే... – సాక్షి, క్రీడావిభాగం ఇప్పుండంటే అలీసా హీలీ పెద్ద స్టార్‌ అయిఉండవచ్చు కానీ... కెరీర్‌ తొలినాళ్లలో ఆమె మెరుగైన జీవనం కోసం రెస్టారెంట్‌లో పనిచేసింది. 2009–10 మధ్య హీలీ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కేఎఫ్‌సీలో పనిచేస్తూ క్రికెట్‌ ప్రాక్టీస్‌ కొనసాగించింది. అలా ఆమె పడ్డ శ్రమ వృథా పోలేదు. నిలకడగా రాణిస్తున్న హీలీకి 2010లో తొలిసారి జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అలీసా... 11 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసింది. అప్పటికీ అదీ మహిళల వన్డేల్లో ఈ దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. లోయర్‌ ఆర్డర్‌లో జట్టుకు మంచి ‘పించ్‌ హిట్టర్‌’ దొరికిందని మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే ఆ జోరు ఎక్కువ కాలం కొనసాగలేదు. వికెట్‌ల వెనక అద్భుతమైన ప్రతిభ కనబర్చిన హీలీ... బ్యాటింగ్‌లో ఆ స్థాయిలో రాణించలేకపోయింది. అయినా... కీపింగ్‌లో ఆమె అసాధారణ గణాంకాలు జట్టులో చోటుకు భరోసానిచ్చాయి. మలుపుతిప్పిన 2017 అప్పటి వరకు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం... అవసరమైనప్పుడు ధాటిగా ఆడటం అలవాటు చేసుకున్న హీలీకి 2017లో అతిపెద్ద ప్రమోషన్‌ దక్కింది. ఆ ఏడాది అక్టోబర్‌లో హీలీకి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం దక్కింది. అప్పటి వరకు అడపాదడపా మెరుపులు మెరిపించిన అలీసా... ఇక దంచికొట్టడం ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ... ఇన్నింగ్స్‌ను వాయువేగంతో ప్రారంభించడం అలవాటుగా మార్చుకుంది. 2017కు ముందు... ఆ తర్వాత ఆమె కెరీర్‌ను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. 2017 ముందు వరకు 52 మ్యాచ్‌లాడి 15.96 సగటుతో 495 పరుగులే చేసిన ఈ వికెట్‌కీపర్‌... ఆ తర్వాత 74 మ్యాచ్‌ల్లో 46.22 సగటుతో 3282 పరుగులు చేసింది. వన్డేల్లో అలీసా స్ట్రయిక్‌రేట్‌ వందకు పైగా ఉంది అంటే ఆమె ఆటతీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘నిజం చెప్పాలంటే కెరీర్‌ తొలి ఏడెనిమిది సంవత్సరాలు నేనేం అంత బాగా ఆడలేదు. అంతగా అవకాశాలు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశా’ అని ఇటీవల హీలీ వెల్లడించింది. 8 వరల్డ్‌కప్‌ల విజేత... అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ్రస్టేలియా హవా సాగుతున్న సమయంలోనే హీలీ కెరీర్‌ కొనసాగింది. దీంతో సహజంగానే ఆమె ఖాతాలో అత్యధిక వరల్డ్‌కప్‌లు చేరాయి. 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో హీలీ సభ్యురాలు... మహిళల క్రికెట్‌లో మరే ప్లేయర్‌ ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఇక 2013, 2022 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులోనూ హీలీ ప్రధానపాత్ర పోషించింది. 2022 వరల్డ్‌కప్‌ పైనల్లో ఆమె కొట్టిన సెంచరీని అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో 138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు చేసి ఆసీస్‌ భారీ విజయానికి అలీసా బాటలు వేసింది. గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు సృష్టించిన హీలీ... టీమిండియాతో జరిగిన సెమీఫైనల్లో విఫలమైంది. ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన ఆసీస్‌ సారథి... ఆసీస్‌లో టీమిండియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగనుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో హీలీ బ్యాటింగ్‌ చూసిన వారెవరైనా ఆమెకు 35 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. కెరీర్‌ ఆఖరి వన్డేలోనూ అలవోకగా పరుగులు రాబట్టిన హీలీ అనవసరంగా రిటైర్మెంట్‌ ప్రకటించిందనే అనుమానం రాకమానదు. తన కెరీర్‌లో చివరి వన్డేలో కెప్టెన్ గా బరిలోకి దిగిన ఈ ఓపెనర్‌ 98 బంతుల్లోనే 158 పరుగులు చేసింది. ఆమె కెరీర్‌లో ఎన్నో శతకాలు ఉన్నా... దీని ప్రత్యేకతే వేరు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం బౌండరీల ద్వారానే అలీసా 120 పరుగులు రాబట్టడం విశేషం. ఇన్ని ఘనతలు సాధించిన హీలీ... శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనుంది. గతేడాది జరిగిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో ఆమెను ఏ జట్టు తీసుకోకపోయినా... భవిష్యత్తుల్లో అలీసా మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడటం ఖాయమే. మిచెల్‌ స్టార్క్‌తో వివాహబంధం...క్రీడా కుటుంబానికే చెందిన హీలీ మొదటి నుంచే మంచి అథ్లెట్‌. దీంతో కష్టతరమైన క్యాచ్‌లను సైతం ఎంతో ఒడుపుగా అందుకునేది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రికెటర్‌ ఇయాన్‌ హీలీ అన్న కుమార్తెగా తనమీద ఉన్న ముద్రను చెరిపేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015లో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో హీలీకి పరిచయం ఏర్పడింది. స్టార్క్‌ కూడా వికెట్‌ కీపర్‌గానే కెరీర్‌ ప్రారంభించగా... వీరిద్దరి మనసులు కలిసి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు అండగా నిలుస్తూ... రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడిన తొలి భార్యాభర్తలుగా రికార్డు సృష్టించిన వీరిద్దరూ... పలు సందర్భాల్లో తమ మధ్య అవగాహనను బాహాటంగానే వెల్లడించారు. 2020లో మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో తన భార్య ఆట చూసేందుకు స్టార్క్‌ వన్డే సిరీస్‌ నుంచి సెలవు తీసుకొని స్వదేశానికి చేరడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement