Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND VS NZ 2nd ODI: New Zealand won the toss and choose to bowl, here are playing XI1
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్‌

రాజ్‌కోట్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్‌ లెన్నాక్స్‌ (ఆదిత్య అశోక్‌ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

England cricket mogul David Collier passes away, ECB pours tribute2
ఇంగ్లండ్‌ క్రికెట్‌ మొగల్‌ కన్నుమూత

ఇంగ్లండ్ క్రికెట్‌ మొగల్‌గా పేరొందిన, ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ECB) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కాలియర్ (70) మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణాన్ని ECB ధృవీకరించి, అధికారిక నివాళి అర్పించింది. ప్రస్తుత ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ.. డేవిడ్ కాలియర్ క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించాని అన్నారు. ఆయన కాలంలో ఆట విస్తృతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు. కాలియర్‌ నిజమైన జెంటిల్‌మన్, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. డేవిడ్ కాలియర్ 2004 అక్టోబర్‌లో ECB రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన జమానాలో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచకప్‌ డబుల్‌ (2009లో టీ20 మరియు వన్డే వరల్డ్‌కప్) సాధించింది.అలాగే పురుషుల జట్టు 2010 టీ20 వరల్డ్‌కప్‌ సాధించి, తమ ఖాతాలో తొలి ఐసీసీ ట్రోఫీ జమ చేసింది. వీటితో పాటు కాలియర్‌ హయాంలో ఇంగ్లండ్‌ పురుషులు, మహిళల జట్లు తొమ్మిది సార్లు (పురుషులు 4, మహిళలు 5) ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి. ECBలో చేరకముందు కాలియర్ ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్సెక్స్ కౌంటీలో అసిస్టెంట్ సెక్రటరీగా.. గ్లోస్టర్‌షైర్, లీసెస్టర్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్‌లో (1980–2004) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందించారు. కాలియర్‌ ECB పదవిలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్లు కోల్పోయిన ప్రభను తిరిగి దక్కించుకున్నాయి. అతని మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు పెద్ద లోటుగా భావించబడుతుంది.

Harmanpreet Kaur becomes 1st Indian to score 1000 WPL runs3
చరిత్ర సృష్టించిన హర్మన్‌

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. నిన్న (జనవరి 13) గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ (43 బంతుల్ల 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి, తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత WPLలో హర్మన్‌ పరుగుల సంఖ్య 1016కు (29 ఇన్నింగ్స్‌ల్లో 46.18 సగటు, 146.18 స్ట్రైక్ రేట్) చేరింది.ఈ ఇన్నింగ్స్‌తో హర్మన్‌ మరో రికార్డు కూడా సాధించింది. WPL చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు (10) చేసిన బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్‌ ఆఫ​్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న హర్మన్, ఈ విభాగంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. WPLలో హర్మన్‌కు ఇది తొమ్మిదో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. WPL చరిత్రలో ఏ ప్లేయర్‌ కూడా ఐదుకు మించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకోలేదు. గత మ్యాచ్‌లోనూ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై) హర్మన్‌ అజేయమైన అర్ద సెంచరీ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకుంది.ఓవరాల్‌గా చూసినా WPL చరిత్రలో హర్మన్‌ కాకుండా ఒకే ఒకరు 1000 పరుగుల మైలురాయిని తాకారు. హర్మన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్‌ సీవర్‌ బ్రంట్‌ 1000 పరుగుల మైలురాయిని తాకింది. బ్రంట్‌ ప్రస్తుతం 1101 పరుగులతో కొనసాగుతుంది. భారతీయులకు సంబంధించి హర్మన్‌ తర్వాత అత్యధిక WPL పరుగులు చేసిన ప్లేయర్లుగా షఫాలీ వర్మ (887), స్మృతి మంధన (711) ఉన్నారు. హాఫ్‌ సెంచరీల రికార్డుకు సంబంధించి హర్మన్‌ తర్వాత అత్యధికంగా బ్రంట్‌, లాన్నింగ్‌ తలో 9 హాఫ్‌ సెంచరీలు చేశారు. భారతీయులకు సంబంధించి షఫాలీ 6, మంధన 4 అర్ద సెంచరీలు చేశారు.

India Coach officially confirms Virat Kohli, Rohit Sharma for 2027 World Cup4
రో-కో ఫ్యాన్స్‌కు గ్రేట్‌ న్యూస్‌

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికు సంబంధించి బిగ్‌ న్యూస్‌ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్‌ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాంషు కోటక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో టీమిండియా 2027 వరల్డ్‌కప్ ప్రణాళికల్లో కీలక భాగమని అధికారికంగా ధృవీకరించాడు. ఈ ప్రకటనతో రో-కో భవితవ్యంపై స్పష్టత వచ్చింది. వారి ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు 2027 వరకు తమకు అలరిస్తారని తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు.ఇంతకీ కోటక్‌ ఏమన్నాడంటే.. మేనేజ్‌మెంట్‌, రో-కో మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్‌ లేదు. కోచ్‌ గౌతమ్ గంభీర్‌తో వీరిద్దరూ తరచూ చర్చలు జరుపుతున్నారు. 2027 వరల్డ్‌కప్ ప్రణాళికలపై వీరి అనుభవం జట్టుకు మార్గదర్శకంగా ఉంటుంది.వీరిద్దరూ చాలా ప్రొఫెషనల్. ప్రాక్టీస్, ఫిట్‌నెస్, ప్రణాళికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైతే ముందుగానే వేదికకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తారు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తారని కోటక్ అన్నాడు. కోటక్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కెరీర్‌ భవితవ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చాయి. రో-కో ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. మొదటి వన్డేలో అతను 93 పరుగులు చేసి, తృటిలో మరో శతకాన్ని మిస్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 26 పరుగులే చేసినా, క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.ఇవాళ రాజ్‌కోట్‌ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ రో-కో తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం​ వ్యక్తం చేస్తున్నారు.

Ex-RCB player Swastik Chikara faces harassment allegations, here are some international cricketers charged for harassing women5
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. వివాదాల్లో చిక్కుకున్న అంతర్జాతీయ క్రికెటర్లు వీరే..!

క్రీడల్లో ఆన్‌ ఫీల్డ్‌ ప్రదర్శన ఎంత ముఖ్యమో, ఆఫ్‌ ద ఫీల్డ్‌ ప్రవర్తన కూడా అంతే కీలకం. రెండిటిలో ఏది సరిగ్గా లేకపోయినా, ఆటగాళ్ల ​కెరీర్‌లు అర్దంతరంగా ముగిసిపోతాయి. తాజాగా ఓ భారత యువ క్రికెటర్‌ పెద్దగా పరిచయం లేని యువతితో సోషల్‌మీడియాలో అసభ్యకరమైన సంభాషణ చేసి వార్తల్లోకెక్కాడంతో ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మూల్యం చెల్లించుకున్న అంతర్జాతీయ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాతో ముందుగా వచ్చేది టీమిండియా ఆటగాడు పృథ్వీ షా. అద్భుతమైన టాలెంట్‌ కలిగి, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు.. 2023లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్లిక్‌లో ఘర్షణకు దిగి అప్పటికే పతనమైన కెరీర్‌ను అదఃపాతాళానికి పడేసుకున్నాడు. ఈ ఎడిసోడ్‌ కారణంగా షా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనప్పటికీ.. కెరీర్‌లో నిలదొక్కుకునే అవకాశాలు కోల్పోయాడు.ఈ జాబితాలో రెండో పేరు లూక్ పోమర్స్‌బాచ్. ఆ మాజీ ఆసీస్‌ ఆటగాడు 2013 ఐపీఎల్‌ సందర్భంగా ఢిల్లీలో ఓ మహిళపై దాడి చేసి కటకటాలపాలయ్యాడు. ఆ తర్వాత ఆ కేసు సెటిల్‌మెంట్‌కు వచ్చినప్పటికీ.. పోమర్స్‌బాచ్‌ కెరీర్‌ పెద్దగా ముందుకు సాలేదు.రుబెల్ హొసైన్ఈ బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ 2015లో నటి నజ్నిన్ ఆక్టర్ హ్యాపీపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నిలబడనప్పటికీ.. రుబెల్‌ కెరీర్‌లో ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఉదంతం తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.మొహమ్మద్ షహ్జాద్ ఈ ఆఫ్ఘనిస్తాన్ విధ్వంసకర బ్యాటర్‌ 2018లో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతం తర్వాత షహ్జాద్‌ క్రికెట్‌ సర్కిల్స్‌ నుంచి కనుమరుగయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణలో షహ్జాద్‌ తప్పుచేసినట్లు తేలిందని ప్రచారం జరిగింది.దనుష్క గుణతిలక శ్రీలంకకు చెందిన ఈ మాజీ ఆటగాడు 2018లో ఇంగ్లండ్‌లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇతగాడు 2022లో ఆస్ట్రేలియాలో కూడా ఓ మహిళపై లైంగిక దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో గుణతిలక అరెస్టు కూడా అయ్యాడు. ఈ రెండు ఉదంతాల కారణంగా అతని కెరీర్‌ పట్టాలెక్కకుండానే గాడి తప్పింది. గుణతిలక చెడుకు శ్రీలంక క్రికట్‌ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.అంతర్జాతీయ క్రికెటర్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇవే కాక ఇం​కా చాలా ఉన్నాయి. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు స్వస్తిక్‌ చికారా ఓ మహిళతో సోషల్‌మీడియా వేదికగా అసభ్యంగా సంభాషిస్తూ వార్తల్లోకెక్కాడు. తనతో చికారా చేసిన అభ్యంతరకరమైన చాట్‌ను సదరు యువతి సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అదే యువతి తాజాగా మరో ఐపీఎల్‌ ఆటగాడు (డీసీకి చెందిన అభిషేక్‌ పోరెల్‌) కూడా తనతో చాట్‌ చేశాడని పోస్ట్‌ పెట్టింది. ​

Sam Curran to lead MI London in The Hundred 2026, Franchise confirm 3 pre auction signings6
ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా ఇంగ్లండ్‌ స్టార్‌.. కెప్టెన్‌ కూడా అతడే..!

ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలోకి కొత్తగా మరో ముగ్గురు చేరారు. ది హండ్రెడ్ లీగ్‌ 2026 ఎడిషన్‌ కోసం ఎంఐ లండన్ ఫ్రాంచైజీ (మునుపటి ఓవల్ ఇన్విన్సిబుల్స్) ఇంగ్లండ్‌ ప్లేయర్లు సామ్‌ కర్రన్‌ , విల్‌ జాక్స్‌, డ్యానీ వ్యాట్‌-హాడ్జ్‌ (మహిళ)ను ప్రీ-ఆక్షన్ సైనింగ్స్‌గా ఎంపిక చేసుకుంది. వీరిలో సామ్‌ కర్రన్‌ను ఎంఐ లండన్ పురుషుల జట్టు కెప్టెన్‌గానూ ప్రకటించింది. గత సీజన్‌ వరకు ఈ ఫ్రాంచైజీకి సామ్‌ బిల్లంగ్స్‌ సారథ్యం వహించాడు. బిల్లంగ్స్‌ నాయకత్వంలో నాటి ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ (ప్రస్తుత ఎంఐ లండన్‌) 2023–2025 మధ్యలో వరుసగా మూడు టైటిళ్లు గెలిచించి. అయినా యాజమాన్యం బిల్లింగ్స్‌ను మార్చి సామ్‌ కర్రన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఎంఐ లండన్‌ ఫ్రాంచైజీ అంబానీల (ముకేశ్‌, నీతా) యాజమాన్యంలో నడిచే ముంబై ఇండియన్స్‌కు (ఐపీఎల్‌) సిస్టర్‌ ఫ్రాంచైజీ. ప్రపంచవాప్తంగా చాలా లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఐపీఎల్‌, WPLలో ముంబై ఇండియన్స్‌ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్‌, హండ్రెడ్‌ లీగ్‌లో ఎంఐ లండన్‌ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాయి. హండ్రెడ్‌ లీగ్‌లో కొత్తగా ఎంపికైన తమ కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ను ముంబై ఇండియన్స్‌ సాదరంగా తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించింది. అలాగే జాక్స్‌, డానీకి కూడా వెల్‌కమ్‌ చెప్పింది. హండ్రెడ్‌ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ప్రస్తుతం ఎంఐ లండన్‌) మొత్తంగా ఐదు టైటిళ్లు సాధించింది. ఇందులో పురుషుల విభాగంలో 3.. మహిళల విభాగంలో 2 టైటిళ్లు ఉన్నాయి.కాగా, హండ్రెడ్‌ లీగ్‌ 2026 ఎడిషన్‌ జులై 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్ట్‌ 16 వరకు సాగే ఈ టోర్నీ కోసం జనవరి చివరి వరకు నాలుగు ముందస్తు వేలం ఒప్పందాలు (అన్ని ఫ్రాంచైజీలకు) అనుమతించబడతాయి. వీటిలో గరిష్టంగా మూడు ప్రత్యక్ష ఒప్పందాలు కావచ్చు. వీరిలో ఒకరు వారివారి జాతీయ జట్లతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగి ఉండాలి. కనీసం ఒకరిని (ఎవరైనా) రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఎంఐ లండన్‌ లాగే హండ్రెడ్‌ లీగ్‌లోని మిగతా ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్‌రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్, సదరన్ బ్రేవ్, వెల్ష్ ఫైర్) కూడా ప్రీ-ఆక్షన్ సైనింగ్స్‌ చేసుకుంటున్నాయి.

Paarl Royals needed 2 from 1 balls, Sikander Raza won the match win a six7
సంచలన ప్రదర్శన.. గర్జించిన సికందర్‌ రజా

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో నిన్న (జనవరి 13) ఓ రసవతర్త సమరం జరిగింది. పార్ల్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌, జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా చివరి బంతికి సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించాడు. 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా ఊహించని విధంగా బౌలర్‌ డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ డేవిడ్‌ వీస్‌పై ఎదురుదాడి చేశాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్సర్‌ బాదాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రూబిన్‌ హెర్మన్‌ను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హెర్మన్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి రాయల్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.SIKANDAR RAZA, THE FINISHER OF PAARL ROYALS 🥶- He smashed an iconic six when they needed 2 from the final ball. pic.twitter.com/SrjGLFL31e— Johns. (@CricCrazyJohns) January 14, 2026వాస్తవానికి చివరి ఓవర్‌కు ముందు రాయల్స్‌ గెలుపుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. అయితే వీస్‌ అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్స్‌ గెలుపును చివరి బంతి వరకు అడ్డుకున్నాడు. వీస్‌ తొలి 5 బంతుల్లో కేవలం​ 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్‌ రాయల్స్‌ గెలుపును అడ్డుకునేలా కనిపించాడు. అయితే రజా సంచలన ప్రదర్శనతో రాయల్స్‌కు అపురూపమైన విజయాన్నందించాడు. ఈ గెలుపుతో రాయల్స్‌ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. టాప్‌ ప్లేస్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఉంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స​, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.స్కోర్‌ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ (66), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (32 నాటౌట్‌) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రాయల్స్‌ బౌలర్లలో ముజీబ్‌ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి సత్తా చాటాడు.అనంతరం డాన్‌ లారెన్స్‌ (63), రూబిన్‌ హెర్మన్‌ (65 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్‌ గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో సికందర్‌ రజా (27 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Danish Shuttler Alleges Unsanitary Conditions At India Open, Badminton8
ఇదేం టోర్నీ.. ఇదేం నిర్వాకం!

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నిర్వహణ పట్ల డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘ఇలాంటి అనారోగ్యకర వాతావరణంలో, ప్రొఫెషనల్‌ ప్లేయర్లు పోటీపడే టోర్నీని నిర్వహిస్తారా? ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 స్థాయి టోర్నీని నిర్వహించే వేదిక ఇంత చెత్తగా ఉంటుందా?’ అని బ్లిచ్‌ఫీల్డ్‌ నిలదీసింది. ఈ నిర్వాకంపై వెంటనే ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) జోక్యం చేసుకొని ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందే పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరింది. ఢిల్లీలోని కేడీ జాదవ్‌ స్టేడియంలో ఈ ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనుంది. 17 ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఈ ఆతిథ్య భాగ్యం కోసం కేడీ జాదవ్‌ స్టేడియాన్ని నవీకరిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రస్తుత ఇండియా ఓపెన్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందిరా గాంధీ స్టేడియం దుమ్ము ధూళితో కూరుకుపోయిందని, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే వాతావరణం అక్కడ ఏమాత్రం లేనేలేదని, షట్లర్లు సరిగ్గా వార్మప్‌ చేసుకునే పరిస్థితి కూడా లేదని డెన్మార్క్‌ అమ్మాయి తీవ్రస్థాయిలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)పై విరుచుకుపడింది. గతేడాది ఆమె ఇండియా ఓపెన్‌ను కేడీ జాదవ్‌ స్టేడియంలో ఆడింది. ఇప్పుడు వేరే వేదికకు మార్చడం పట్ల మెరుగైన స్టేడియం అయి ఉంటుందని ఆశించానని, కానీ దానికంటే మరింత ఘోరంగా ఇందిరాగాంధీ స్టేడియం ఉందని విమర్శించింది. గతేడాది కూడా ఆమె సౌకర్యాలు, వేదికపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మెరుగైందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఏమాత్రం మారలేదు. మెరుగు అనే మాటే లేదు. అప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది’ అని బ్లిచ్‌ఫీల్డ్‌ ‘బాయ్‌’ అధికారుల తీరుపై మండిపడింది.

Mumbai Indians defeated Gujarat Giants by 7 wickets in WPL9
హర్మన్‌ప్రీత్‌ తడాఖా

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై నెగ్గింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన గుజరాత్‌కు లీగ్‌లో తొలి పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హమ్‌ (33 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.బెత్‌ మూనీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కనిక (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారతి (15 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆఖర్లో మెరిపించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దంచికొట్టిన సోఫీ డివైన్‌ (8) ఈసారి విఫలమైంది. జార్జియా, భారతి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 24 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఈ జోడీ చివరి రెండు ఓవర్లలో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు రాబట్టడం విశేషం. ముంబై బౌలర్లలో షబ్నమ్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమెలియా కెర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం ముంబై ఇండియన్స్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... అమన్‌జ్యోత్‌ కౌర్‌ (26 బంతుల్లో 40; 7 ఫోర్లు), నికోలా కేరీ (23 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు) ఆమెకు అండగా నిలిచారు. గుజరాత్‌ జెయింట్స్‌ బౌలర్లలో రేణుక, కాశ్వీ, సోఫీ డివైన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ముంబై జట్టు అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్లు కమలిని (13), హేలీ మాథ్యూస్‌ (22) ఎక్కువసేపు నిలవలేకపోయినా... హర్మన్‌ జట్టును ముందుండి నడిపించింది. అమన్‌జ్యోత్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 బంతుల్లో 72 పరుగులు... నాలుగో వికెట్‌కు నికోలాతో 43 బంతుల్లోనే 84 పరుగులు జత చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరి ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించింది. డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కాగా... ఈ మ్యాచ్‌ ద్వారా హర్మన్‌ లీగ్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి అండ్‌ బి) కెర్‌ 33; సోఫీ డివైన్‌ (సి) కమిలిని (బి) షబ్నిమ్‌ 8; కనిక (సి) నికోలా (బి) హేలీ 35; గార్డ్‌నర్‌ (ఎల్బీ) (బి) నికోలా 20; జార్జియా (నాటౌట్‌) 43; ఆయుషి (రిటైర్డ్‌ అవుట్‌) 11; భారతి (నాటౌట్‌) 36; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు)192. వికెట్ల పతనం: 1–22, 2–64, 3–97, 4–99, 5–136.బౌలింగ్‌: షబ్నమ్ 4–0–25–1; హేలీ మాథ్యూస్‌ 3–0–34–1; నికోలా కేరీ 4–0–36–1; అమెలియా కెర్‌ 4–0–40–1; అమన్‌జ్యోత్‌ కౌర్‌ 4–0–48–0; సంస్కృతి 1–0–5–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: కమలిని (స్టంప్డ్‌) మూనీ (బి) రేణుక 13; హేలీ (సి) డివైన్‌ (బి) కాశ్వి 22; అమన్‌జ్యోత్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) డివైన్‌ 40; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 71; నికోలా కేరీ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–20, 2–37, 3–109. బౌలింగ్‌: రేణుక 4–0–39–1; కాశ్వి 4–0–33–1; రాజేశ్వరి 2–0–22–0; సోఫీ డివైన్‌ 3.2–0–29–1; జార్జియా 2–0–23–0; తనూజ 3–0–29–0, గార్డ్‌నర్‌ 1–0–10–0.

India vs New Zealand 2nd ODI on January 14: India aims to seal the ODI series against New Zealand10
సిరీస్‌ సొంతం చేసుకోవాలని...

రాజ్‌కోట్‌: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్‌ జట్టు... నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్‌ కోహ్లి సూపర్‌ ఫామ్‌ జట్టుకు కలిసి రానుంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే రిషభ్‌ పంత్‌ గాయపడగా... తొలి మ్యాచ్‌ సందర్భంగా వాషింగ్టన్‌ సుందర్‌కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు.సుందర్‌ స్థానంలో ఆయుశ్‌ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్‌ పేసర్‌ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్‌లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్‌లో మన స్పిన్‌ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్‌ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్‌ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనుంది. ఆ ఇద్దరే అసలు బలం... టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్‌ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో విరాట్‌ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్‌లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్‌లతో కదంతొక్కారు.టీమిండియా ఆడిన గత సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన గిల్‌... హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్‌ బౌలింగ్‌ను బాగా ఆడగల శ్రేయస్‌ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్‌ కనిపించడం లేదు. సుందర్‌ స్థానంలో బదోనీ, నితీశ్‌లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్‌ జురేల్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్‌తో కలిసి అర్‌‡్షదీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా పేస్‌ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. సమం చేయాలని... గత మ్యాచ్‌లో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్‌ విఫలమైంది. కాన్వే, నికోల్స్‌ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్‌ యంగ్, గ్లెన్‌ ఫిలిప్స్, హే, బ్రేస్‌వెల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్‌ సత్తా చాటుతుండగా... ఫోల్‌్క్స, క్లార్క్‌ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్‌ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తుది జట్లు (అంచనా) భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్‌ రెడ్డి/ఆయుశ్‌ బదోనీ, జడేజా, హర్షిత్‌ రాణా, కుల్దీప్, అర్‌‡్షదీప్, సిరాజ్‌. న్యూజిలాండ్‌: బ్రేస్‌వెల్‌ (కెప్టెన్‌), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్‌్క్స, ఆదిత్య అశోక్‌.1. రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్‌ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు