Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India vs Bangladesh U19 World Cup 20261
బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ జట్టు 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ టీమ్‌పై విజయం సాధించింది. సవరించిన 165 పరుగుల (29 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ కుర్రాళ్ల టీమ్‌ తడబడింది. 146 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా 14 పరుగులకు 4 వికెట్లు తీశాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు 238 పరుగులు చేసింది. 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు 80 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ తరఫున పేసర్ అల్ ఫహద్ ఐదు వికెట్లు తీశాడు.

Vaibhav Suryavanshi Shatters World Record, Scripts U-19 World Cup History2
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్‌

అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా..అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్‌-19 ప్రపంచకప్‌లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో కమల్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్‌లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్‌ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్‌లో కొనసాగుతున్నాడు.కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్‌, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్‌, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!

KSCA get state government nod to host IPL, internationals at Chinnaswamy Stadium3
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్యాన్‌కు గుడ్ న్యూస్‌. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.ఈ విష‌యాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ధ్రువీక‌రించింది. ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలతో కూడిన అనుమతిని మంజూరు చేసిన‌ట్లు కేఎస్‌సీఏ తెలిపింది. "ప్రభుత్వం విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పోటీల‌తో కళకళలాడనుంది" అని కేఎస్‌సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.స‌ర్కార్ నిబంధ‌న‌లు ఇవే..స్టేడియం లోపల, వెలుపల రద్దీని పర్యవేక్షించడానికి ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సుమారు రూ.4.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఏఐ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని క‌ర్ణాట‌క స‌ర్కార్‌ ప్రతిపాదించింది. అభిమానులు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్‌లను పూర్తిగా మార్చాలని ప్ర‌భుత్వం సూచించింది. కాగా ఐపీఎల్‌-2025 ఆర్సీబీ ఛాంపియ‌న్‌గా నిలిచిన అనంత‌రం.. చిన్న‌స్వామి స్టేడియంలో విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీంతో అప్ప‌టి నుంచి చిన్న‌స్వామి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా జ‌ర‌గలేదు. మహిళల ప్రపంచకప్ 2025, మెన్స్ టీ20 ప్రపంచకప్-2026 వేదికల జాబితా నుండి కూడా ఈ వేదిక‌ను తొలిగించారు. అయితే తిరిగి మ‌ళ్లీ చిన్న‌స్వామి స్టేడియంలో క్రికెట్ క‌ళ సంత‌రించుకోనుండ‌డంలో కొత్తగా ఎన్నికైన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్‌ది కీల‌క పాత్ర‌.చదవండి: WPL 2026: ముంబైపై యూపీ వారియర్స్‌ ఘన విజయం

WPL 2026: UPW Notch Up Second-Straight Win4
ముంబైపై యూపీ వారియర్స్‌ ఘన విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లానింగ్ కేవలం 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సైతం దుమ్ములేపింది. లిచ్‌ఫీల్డ్ 37 బంతుల్లో 61 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కివర్ బ్రంట్ రెండు, నికోలా కారీ,మాథ్యూస్‌, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.పోరాడిన ఓడిన ముంబై..అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఘనమైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు హేలీ మథ్యూస్‌(13), సజన(10) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (15), నాట్ స్కివర్-బ్రంట్ (15) నిరాశపరిచారు.చివర్లో అమేలియా కెర్(49 నాటౌట్‌) అమంజోత్ కౌర్(41) పోరాడినప్పటికీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్‌, ఎకిలిస్టోన్‌, దీప్తీ శర్మ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో యూపీతో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై ఓటమి పాలైంది.చదవండి: కివీస్‌తో మ్యాచ్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్ లాంటిది: మహ్మద్‌ సిరాజ్‌

Abhigyan Kundu, Vaibhav Suryavanshi suryavanshi Fiftys Help India set 239-run target5
వైభవ్‌, అభిజ్ఞాన్ హాఫ్‌ సెంచరీలు.. బంగ్లాదేశ్‌ టార్గెట్‌ ఎంతంటే?

అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.ప్రారంభంలోనే కెప్టెన్ ఆయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లోపడింది. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72), అభిజ్ఞాన్ కుండు(80 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.అయితే వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్‌ చేసేలా కన్పించిన భారత్‌.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధిముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్‌, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ప్రస్తుతం బంగ్లా-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్లు కెప్టెన్‌లు టాస్ సందర్భంగా కరచాలనం చేసుకునేందుకు నిరాకరించారు.చదవండి: U19 World Cup 2026: భార‌త్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్‌'

Mohammed Siraj relishes rare opportunity to play a decider6
కివీస్‌తో మ్యాచ్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్ లాంటిది: మహ్మద్‌ సిరాజ్‌

న్యూజిలాండ్‌తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌ను వరల్డ్‌కప్ ఫైనల్‌లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్‌తో పోల్చాడు.భారత్‌లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్‌. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు సలహాలు, సూచనలు అందుతున్నాయి.దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్‌కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.అతడు స్పిన్‌ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. సిరీస్ డిసైడర్‌లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!

Mumbai Indians need 188 to beat UP Warriorz7
లానింగ్, లిచ్‌ఫీల్డ్‌ మెరుపులు.. ముంబై ముందు భారీ టార్గెట్‌

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీవారియర్స్ బ్యాటర్లు మెరిశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముఖ్యంగా యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ విధ్వంసం సృష్టించింది.ఈ ఆసీస్ లెజెండ్ ముంబై బౌలర్లను ఉతికారేసింది. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లానింగ్‌ 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఫీభీ లిచ్‌ఫీల్డ్ మెరుపులు మెరిపించింది. 37 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసింది. ఆఖరిలో హర్లీన్‌ డియోల్‌(25), ట్రయాన్‌(21) రాణించారు. ముంబై బౌలర్లలో అమీలియా కేర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ట్‌ స్కివర్‌ బ్రంట్‌ రెండు, హీలీ మాథ్యూస్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌ తలా వికెట్‌ సాధించారు.తుది జట్లుయుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట

After IND vs PAK, no handshakes in IND vs BAN matches as Ayush Mhatre gives cold shoulder in U19 World Cup8
భార‌త్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్‌'

నో హ్యాండ్ షేక్‌.. ఈ వివాదం గ‌తేడాది క్రికెట్ ప్ర‌పంచాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఆసియాక‌ప్‌-2025 సంద‌ర్భంగా భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు నిరాక‌రించారు. పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.ఆ త‌ర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఫిర్యాదు చేయ‌డం, పీసీబీ చీఫ్ మోహ్షిన్ న‌ఖ్వీ చేతుల మీద‌గా భార‌త్ విన్నింగ్ ట్రోఫీని తీసుకోక‌పోవ‌డం వంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మ‌రోసారి ఇప్పుడు అదే సీన్ రీపీట్ అయింది. కానీ ఈసారి ప్ర‌త్య‌ర్ధి మారింది.ఏమి జ‌రిగిందంటే?అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో బుల‌వాయో క్రికెట్ క్లబ్ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే టాస్ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ ఒకరికొకరు కనీసం చూసుకోలేదు. టాస్ గెలిచి బౌలింగ్ బంగ్లా బౌలింగ్‌ ఎంచుకున్న తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా భారత్‌-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపర్యమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి.మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపింది. అంతేకాకుండా బంగ్లాలో హిందువలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండంతో రెండు పొరుగు దేశాల మధ్య వైర్యం తీవ్రస్థాయికి చేరుకుంది.అయితే ఈ రాజకీయ విభేదాల ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా 2026లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల కారణంగానే ఇరు జట్ల కెప్టెన్లు కరాచలానికి నిరాకరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!

India vs New Zealand 2nd ODI Predicted Playing 11: Ayush Badoni Or Nitish Kumar Reddy, Who Steps In?9
న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!

భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డే ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే ఈ నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ భార‌త తుది జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.తొలి రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మూడో వ‌న్డేలో ఆడించాల‌ని టీమ్‌మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అర్ష్‌దీప్‌కు అవ‌కాశ‌మివ్వ‌క‌పోవ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ త‌న మన‌సు మార్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పేస‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ స్ధానంలో అర్ష్‌దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.బదోని అరంగేట్రంఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనుహ్యంగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు అయూశ్ బదోని.. ఇండోర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రెండు వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. జడ్డూ వన్డేల్లో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని పలువరు మాజీలు టీమ్‌మెనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.పిచ్ రిపోర్ట్:ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్‌ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్‌లో టీమిండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్‌పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (219 పరుగులు) డబుల్ సెంచరీతో మెరిశాడు.మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)శుభ్‌మన్ గిల్‌(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌(వికెట్ కీపర్‌), అయూష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్ సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్‌

MI have won the toss and opted to bowl first, Debut for Nalla Kranthi Reddy10
యూపీతో మ్యాచ్‌.. ముంబై త‌ర‌పున తెలుగు అమ్మాయి అరంగేట్రం

మహిళల ప్రీమియర్ లీగ్‌-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌ అమ్మాయి నల్లా క్రాంతి రెడ్డి ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ ఇస్మాయిల్‌కు ముంబై విశ్రాంతి ఇచ్చింది. ఆమె స్ధానంలో హేలీ మాథ్యూస్ తుది జ‌ట్టులోకి వ‌చ్చింది. యూపీ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు.కాగా యూపీ వారియ‌ర్స్ త‌మ చివ‌రి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరును ఈ మ్యాచ్‌లో కూడా కొన‌సాగించాల‌ని లానింగ్ సేన ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుయుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement