Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Team India to face Italy in semi finals tomorrow1
సెమీస్‌లో భారత్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు భారత మహిళల జట్టు గెలుపు దూరంలో నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ టోర్నీలో బుధవారం జరిగిన పూల్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సలీమా టెటె బృందం 4–1 గోల్స్‌ తేడాతో వేల్స్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. మరో గోల్‌ను సాక్షి రాణా (7వ నిమిషంలో) అందించింది. వేల్స్‌ జట్టు తరఫున బెట్సాన్‌ థామస్‌ (39వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించింది. నవ్‌నీత్‌ కౌర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ లభించాయి. తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లలో రెండింటిని, పెనాల్టీ స్ట్రోక్‌ను నవ్‌నీత్‌ కౌర్‌ గోల్స్‌గా మలిచింది. ఈ గెలుపుతో భారత జట్టు ఏడు పాయింట్లతో పూల్‌ ‘బి’ టాపర్‌గా నిలిచింది. భారత్‌తోపాటు స్కాట్లాండ్‌ కూడా ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా భారత్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కగా... స్కాట్లాండ్‌కు రెండో స్థానం లభించింది. స్కాట్లాండ్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 3–1తో ఉరుగ్వేపై గెలిచింది. పూల్‌ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ 2–0తో ఆస్ట్రియా జట్టుపై గెలుపొందగా... కొరియాతో మ్యాచ్‌ను ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఇంగ్లండ్‌ 9 పాయింట్లతో పూల్‌ ‘ఎ’లో టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇటలీ, కొరియా 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన గోల్స్‌ సగటుతో ఇటలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో స్కాట్లాండ్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఇటలీతో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. ఫైనల్‌ చేరుకునే రెండు జట్లకు శుక్రవారమే ప్రపంచకప్‌ బెర్త్‌లు ఖరారవుతాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య శనివారం మూడో స్థానం కోసం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్రపంచకప్‌ బెర్త్‌ లభిస్తుంది.

IPL tournament starts from March 28th2
బెంగళూరు X హైదరాబాద్‌

న్యూఢిల్లీ: తాజా టి20 ప్రపంచకప్‌ విజయోత్సాహంతో అటు టీమిండియా, ఇటు యావత్‌ భారతావని ఊగిపోతోంది. ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న అభిమానులకు మరోవైపు నుంచి వేసవి మజాను పంచేందుకు ఐపీఎల్‌ సీజన్‌ కూడా ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం విడుదల చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి షెడ్యూల్‌ కాదు. ఇరాన్‌పై యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే ప్రకటించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక పూర్తి సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 నుంచి ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తలపడతాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ వేడుకలతో పాటు ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఇక హైదరాబాద్‌లో తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న సన్‌రైజర్స్, లక్నో జట్ల మధ్య జరుగనుంది. ఏప్రిల్‌ 12 వరకు జరిగే తొలి దశ 20 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌నే హైదరాబాద్‌కు కేటాయించారు. బెంగళూరు, ముంబై, లక్నో, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, గువాహటి, ముల్లాన్‌పూర్‌ వేదికలపై రెండేసి మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రారంభ శని, ఆదివారాల్లో ఒకే మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. తర్వాతి వారాంతాల్లో రెండేసి మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్‌) జరుగుతాయి. గతేడాది ఆర్‌సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట వల్ల 11 మంది మృతి చెందడంతో కర్ణాటక సర్కారు చిన్నస్వామి స్టేడియంపై నిషేధాన్ని విధించింది. అయితే ఇటీవలే ఈ నిషేధాన్ని ఎత్తేసిన సర్కారు నిపుణుల కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ స్టేడియంలోని సదుపాయాలు, ఏర్పాట్లను సమీక్షించి పూర్తిస్థాయి అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

Indian women cricketers in the Hundred Tournament3
రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు

లండన్‌: ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్‌’ (ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున) టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు బరిలో ఉన్నారు. బుధవారం వేలం కార్యక్రమం నిర్వహించగా... భారత జట్టు వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ జట్టు 50,000 పౌండ్లకు (రూ. 61 లక్షలు); ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టు 27,500 పౌండ్లకు (రూ. 34 లక్షలు) కొనుగోలు చేసింది. వేలంలో కాకుండా గతంలోనే భారత జట్టు వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లను ఆయా ఫ్రాంచైజీలు రీటెయిన్‌ చేసుకున్నాయి. స్మృతి మంధానను 90,000 పౌండ్లకు (రూ. 1 కోటీ 11 లక్షలు) మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌... జెమీమాను 60,000 పౌండ్లకు (రూ. 74 లక్షలు)సదరన్‌ బ్రేవ్‌ జట్టు అట్టిపెట్టుకున్నాయి. వేలంలో భారత్‌ నుంచి 14 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా... ఇద్దరిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

Satwik and Chirag pair in Swiss Open badminton pre quarterfinals4
ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–19, 21–19తో ఎంగ్‌ కీల్‌ వెస్లీ–జున్‌సుకె కుబో (సింగపూర్‌) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ జంట 19–21, 14–21తో రుతానపక్‌–జెనిచా (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 12–21, 4–21తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జ్‌ 23–21, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యెవ్‌ (సింగపూర్‌)పై సంచలన విజయం సాధించాడు. ఆయుశ్‌ శెట్టి 18–21, 19–21తో బ్రియాన్‌ యాంగ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు.

Inaugural Bangladesh Premier League Pushed Forward5
ప్రారంభానికి ముందే వాయిదా పడిన క్రికెట్‌ లీగ్‌

మహిళల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఈ లీగ్‌ ఏప్రిల్‌ 3 నుంచి 15 తేదీల మధ్యలో జరగాల్సి ఉండింది. అయితే స్పాన్సర్లు దొరక్క జులై నెలకు పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వాస్తవానికి ఈ లీగ్‌ టీ20 ప్రపంచకప్‌కు ముందు తమ ప్లేయర్లకు ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భావించింది. అయితే వాయిదా పడటంతో ప్రపంచకప్‌ వరకు బంగ్లాదేశ్‌ ప్లేయర్లకు ఎలాంటి అధికారిక మ్యాచ్‌లు ఉండవు. బంగ్లా ప్లేయర్లు నేరుగా జూన్‌ 14న నెదర్లాండ్స్‌తో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ దేశ పురుషుల క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలిగి, చాలా పెద్ద సాహసం చేసింది. ఈ పరిణామం తర్వాత ఆ దేశంలో క్రికెట్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ ప్రభావం పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే పురుషుల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌పై కూడా పడనుంది. ఇప్పటికే ఆ లీగ్‌లోని పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు రెమ్యూనరేషన్‌ ఎగ్గొట్టాయనే టాక్‌ ఉంది. పురుషుల బీపీఎల్‌కు కూడా స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ లీగ్‌ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది.

Gujarat Titans Sign Two Time IPL Winning Coach To Rediscover Victory Mantra6
టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌తో ఒప్పందం చేసుకున్న గుజరాత్‌

తమ తొలి సీజన్‌లోనే (2022) టైటిల్‌ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్‌ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌ విజయ్‌ దాహియాతో ఒప్పందం చేసుకుంది. రానున్న సీజన్‌ కోసం అతన్ని అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్‌ కోచ్‌ మాథ్యూ హేడెన్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్‌ టైటిల్‌ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. దాహియా తన ఐపీఎల్‌ కెరీర్‌లో కేకేఆర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా పని చేశాడు. అతని కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచిన గుజరాత్‌.. ఆతర్వాత సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరినా, సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్‌ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్‌లో చేరడంతో శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ తొలి సీజన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్‌కు చేరలేకపోయింది. రాబోయే సీజన్‌లో మరోసారి గిల్‌ నేతృత్వంలో గుజ.రాత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఇదిలా ఉంటే, 2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ (20 మ్యాచ్‌లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్‌ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.గుజరాత్‌ టైటాన్స్‌ తొలి విడత షెడ్యూల్‌.. - మార్చి 31: GT vs PBKS - ఏప్రిల్‌ 4: GT vs RR - ఏప్రిల్‌ 8: GT vs DC - ఏప్రిల్‌ 12: GT vs LSG దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.

SRH IPL Schedule 2026: Fixtures, Venues, Full Squad, Date And Time7
IPL 2026: సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

ఐపీఎల్‌ 2026 తొలి విడత షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను బీసీసీఐ ఇవాళ (మార్చి 11) ప్రకటించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.తొలి విడతలో మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ విడతలో అన్ని జట్లలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. టోర్నీ ఓపెనర్‌లోనే ఆరెంజ్‌ ఆర్మీ ఆర్సీబీతో తలపడనుంది. సన్‌రైజర్స్‌ రెండో మ్యాచ్‌ ఏప్రిల్‌ 2న కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరుగనుంది. మూడో మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. నాలుగో మ్యాచ్‌ ఏప్రిల్‌ 11న ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగనుంది. తొలి విడతలో సన్‌రైజర్స్‌ తమ హోం గ్రౌండ్‌ హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ (ఏప్రిల్‌ 5, లక్నోతో) ఆడనుంది. ఆర్సీబీ, కేకేఆర్‌ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. లక్నో, పంజాబ్‌ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి.ఐపీఎల్‌ 2026 కోసం సన్‌రైజర్స్‌ జట్టు..సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అమిత్ కుమార్, క్రియాన్స్‌ ఫులెట్రా, ప్రఫుల్‌ హింజ్‌, ఎషాన్‌ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ

Even if he hadnt said sorry: Gambhir on Arshdeep Daryl Mitchell clash8
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్‌

టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సమర్థించాడు. డారిల్‌ మిచెల్‌ విషయంలో అర్ష్‌దీప్‌ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్‌ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్‌ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.మిచెల్‌కు గట్టిగా తగిలిన బంతిఅహ్మదాబాద్‌లో జరిగిన టైటిల్‌ పోరులో క్రీజులో ఉన్న కివీస్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌కు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్‌ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్‌కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్‌ కోపంగా అర్ష్‌దీప్‌ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్‌‌ సూర్యకుమార్‌ సముదాయించడంతో చల్లబడ్డాడు.అనంతరం అర్ష్‌దీప్‌ కూడా మిచెల్‌ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్‌తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ అర్ష్‌దీప్‌నకు జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో అర్ష్‌దీప్‌ తప్పేమీ లేదుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ANI పాడ్‌కాస్ట్‌కు హాజరు కాగా అర్ష్‌దీప్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్‌లో బాదితే ఏ బౌలర్‌కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్‌ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్‌ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్‌ అర్ష్‌దీప్‌ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ టీ20 ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

IPL 2026: Defending champions RCB will face SRH in season opener9
ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదల

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదలైంది. బీసీసీఐ ముందుగా ప్రకటించినట్లుగానే తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది.🚨 News 🚨Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.More details ▶️… pic.twitter.com/8Iq492v8TE— IndianPremierLeague (@IPL) March 11, 2026ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.తొలి విడతలో 20 మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి.తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 4న జరుగుతాయి. ఈ విడతలో హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 5న లక్నో సూపర్‌ జెయింట్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.

The Hundred 2026: Deepthi Sharma to Sunrisers Leeds, Richa Ghosh to Manchester super giants10
హండ్రెడ్‌ లీగ్‌ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ది హండ్రెడ్‌ క్రికెట్‌ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్‌ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్‌ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్‌, డైరెక్ట్‌ సైనింగ్‌ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌, కశ్వీ గౌతమ్‌, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్‌ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొనడం లేదు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్‌ చేసుకున్నాయి.ఫ్రాంచైజీలు రీటైన్‌, ప్రీ సైనింగ్‌ చేసుకున్న ప్లేయర్లు..మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్‌) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్‌)లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్‌), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్‌)బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్‌), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్‌)ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్‌)సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్‌), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్‌)సన్‌రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రీటైన్‌)ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్‌), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్‌)వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్‌)కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement