Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

WPL 2026: Mumbai Indians beat Royal Challengers Bengaluru by 15 runs1
రిచా మెరుపులు వృథా.. ఆర్సీబీపై ముంబై విజయం

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియ‌న్స్ గెలుపు బాట ప‌ట్టింది. సోమ‌వారం వ‌డోద‌ర వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరుతో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 15 ప‌రుగుల తేడాతో ముంబై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో హ‌ర్మ‌న్ సేన త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా స్కివర్ రికార్డులెక్కింది. 57 బంతులు ఎదుర్కొన్న స్కివర్‌ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీలీ మాథ్యూస్(56) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయంకా పాటిల్, ఎన్‌డి క్లార్క్ తలా వికెట్ సాధించారు.రిచా విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి రిచా ఘోష్ మాత్రం విధ్వంసం సృష్టించింది. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్‌, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు సాధించారు.

West Indies Announced T20 World cup 2026 squad2
టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ జట్టు ప్రకటన.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌కు అవకాశం

భారత్‌, శ్రీలంక వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్‌ హోప్‌ కొనసాగనుండగా.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌, 25 ఏళ్ల గయానీస్‌ బ్యాటర్‌ క్వెంటిన్‌ సాంప్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.మాజీ కెప్టెన్లు జేసన్‌ హోల్డర్‌, రోవ్‌మన్‌ పావెల్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కడం విశేషం​. పేసర్లుగా ఫోర్డ్‌, సీల్స్‌ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. స్పిన్‌ విభాగంలో ఆకీల్‌ హొసేన్, రోస్టన్‌ చేజ్, గుడకేశ్‌ మోటీ, ఆల్‌రౌండర్‌ విభాగంలో విధ్వంసకర బ్యాటర్‌ రొమారియో షెపర్డ్‌ అవకాశాలు దక్కించుకున్నారు. గాయాల కారణంగా ఎవిన్‌ లూయిస్‌, అల్జరీ జోసఫ్‌ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తంగా గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా, ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ గ్రూప్‌-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో మిగతా జట్లుగా ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, నేపాల్‌, ఇటలీ ఉన్నాయి. విండీస్‌ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్‌పై తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఇదే వేదికపై వారు చివరిసారి వరల్డ్‌కప్‌ గెలిచారు. టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం విండీస్‌ జట్టు..షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసిన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్

PCB head Mohsin Naqvi makes official tweet on Pakistan's T20 World Cup 2026 participation3
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్‌ నఖ్వీ ట్వీట్‌

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌-2026లో దాయాది పాకిస్తాన్‌ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్‌ బాటలోనే పాక్‌ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్‌లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్‌లో ప్రస్తుత ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్‌ మహ్మద్‌ నవాజ్‌ షరీఫ్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్‌ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్‌ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్‌ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్‌ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.వివాదం ఎలా మొదలైందంటే..? బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్‌లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్‌ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్‌ బంగ్లాదేశ్‌ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్‌ను మధ్యలోనే వదిలేసి యూటర్న్‌ తీసుకుంది.

Perth Scorchers beat CSK and MI to become the most successful T20 franchise4
చరిత్ర సృష్టించిన బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ

బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ పెర్త్‌ స్కార్చర్స్‌ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025-26 ఎడిషన్‌ విజేతగా నిలవడం ద్వారా ఆరోసారి బీబీఎల్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఈ ఫ్రాంచైజీ.. ఓ టీ20 లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. తాజా టైటిల్‌కు ముందు స్కార్చర్స్‌ ఐదు టైటిళ్లతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌తో సమంగా ఉండింది. సీఎస్‌కే 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్ల ఐపీఎల్‌ టైటిళ్లు సాధించగా.. ముంబై ఇండియన్స్‌ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఐపీఎల్‌ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.స్కార్చర్స్‌ విషయానికొస్తే.. తాజా బీబీఎల్‌ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజీ గుర్తింపు పొందిన టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో బీబీఎల్‌ టైటిళ్లు సాధించింది. జనవరి 25 జరిగిన ఫైనల్లో స్కార్చర్స్‌ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకుంది.టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు పెర్త్‌ స్కార్చర్స్‌ (బిగ్‌బాష్‌ లీగ్‌)- 6ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే (ఐపీఎల్‌)- 5కొమిలా విక్టోరియన్స్‌ (బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌)- 4జాఫ్నా కింగ్స్‌ (లంక ప్రీమియర్‌ లీగ్‌)- 4ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌)- 3ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ (హండ్రెడ్‌ లీగ్‌)- 3సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ (సౌతాఫ్రికా టీ20 లీగ్‌)- 3ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే (ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20)- 2ఎంఐ న్యూయార్క్‌ (మేజర్‌ లీగ్‌ క్రికెట్‌)- 2బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 ఫైనల్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జై రిచర్డ్స్‌ (4-0-32-3), డేవిడ్‌ పేన్‌ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్‌ (4-0-29-2), ఆరోన్‌ హార్డీ (3-0-16-1), కూపర్‌ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఫిలిప్‌, కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ తలో 24 పరుగులు చేయగా.. జోయల్‌ డేవిస్‌ 19, లచ్లాన్‌ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్‌ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (44), ఫిన్‌ అలెన్‌ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్‌ ఇంగ్లిస్‌ (29 నాటౌట్‌) పూర్తి చేశాడు. ఇంగ్లిస్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్‌ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (4-0-19-2), మిచెల్‌ స్టార్క​్‌ (4-0-33-1), జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

Yuvraj Singh tweet on Abhishek Sharma after 2nd fastest fifty5
అభిషేక్ శ‌ర్మకు యువరాజ్ స‌వాల్‌!

టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ జోరు కొన‌సాగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో గువాహ‌టిలో ఆదివారం జ‌రిగిన మూడో టి20 మ్యాచ్‌లోనూ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. కివీస్ బౌల‌ర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డి ప‌రుగుల సునామీ సృష్టించాడు. అభిషేక్‌కు తోడుగా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా దంచుకొట్టుడు కొట్ట‌డంతో 10 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్‌ను ముగించేశారు. బంతితో బుమ్రా నిప్పులు చెర‌గ‌డంతో 8 వికెట్ల తేడాతో కివీస్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫ‌లితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవ‌సం చేసుకుంది.ఈ సిరీస్‌లో రెండో అర్ధ‌సెంచ‌రీ న‌మోదు చేసిన అభిషేక్ శ‌ర్మ.. మ‌రో ఘ‌న‌త సాధించాడు. గువాహ‌టి మ్యాచ్‌లో 14 బంతులోనే 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ బాదేశాడు. దీంతో ఇంట‌ర్నేష‌న‌ల్ టి20ల్లో త‌క్కువ బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేసిన రెండో భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఓవ‌రాల్‌గా 7వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసి స‌త్తా చాటాడు. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 68 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. 340 స్ట్రైక్‌రేట్‌తో న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. నాగ్‌పూర్‌లో జ‌రిగిన ఫ‌స్ట్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచ‌రీ (35 బంతుల్లో 84 ప‌రుగులు; 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) కొట్టాడు. ఎప్పుడు బ్రేక్ చేస్తావ్‌?అభిషేక్ శ‌ర్మ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌పై మాజీ ఆట‌గాళ్లు, సీనియ‌ర్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అత‌డి గురువు యువ‌రాజ్ సింగ్ త‌న శిష్యుడికి స‌వాల్ విసిరాడు. త‌న పేరిట రికార్డ్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ ఆట ప‌ట్టించాడు. ''ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావా?'' అంటూ ఎక్స్‌లో కామెంట్ పెట్టాడు. ''బాగా ఆడావు, ఇదే జోరు కొన‌సాగించాల‌''ని ఎంక‌రేజ్ చేశాడు. కాగా, టీమిండియా త‌ర‌పున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ రికార్డు 19 ఏళ్లుగా యువీ పేరిటే ఉంది. 2007 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే అత‌డు అర్ధ‌శ‌త‌కం సాధించి రికార్డు నెల‌కొల్పాడు.నెటిజ‌న్ల స్పంద‌న‌కాగా, అభిషేక్ శ‌ర్మ‌ను మోడ్ర‌న్ యువ‌రాజ్ సింగ్‌గా వ‌ర్ణిస్తూ.. గురువును రికార్డును అధిగ‌మించే స‌త్తా శిష్యుడికే ఉందని నెటిజ‌నులు అంటున్నారు. అభిషేక్ శ‌ర్మ ఇదే హై కొన‌సాగిస్తే త్వ‌ర‌లోనే యూవీ రికార్డు బ్రేక్ అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కుర్రాడిని ఇలా ట్రోల్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని కొంత‌మంది నెటిజ‌నులు అంటే.. శిష్యుడిని ఉత్సాహ‌ప‌రిచేందుకే యువీ స‌వాల్ విసిరాడ‌ని ఇంకొంత మంది అంటున్నారు. ఏదేమైనా రానున్న టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ అభిషేక్ శ‌ర్మ ఇదే జోరు కొన‌సాగించాల‌ని ఏకాభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.చ‌ద‌వండి: రోహిత్‌శ‌ర్మ‌పై అభిషేక్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లుభార‌త్‌- న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నాలుగో మ్యాచ్ ఈ నెల 26న విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతుంది. చివ‌రి మ్యాచ్ ఈ నెల 31న తిరువ‌నంత‌పురంలో జ‌ర‌గ‌నుంది. చూడాలి మరి.. ఈ రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శ‌ర్మ గురువు రికార్డును బ్రేక్ చేస్తాడో, లేదో!Still can’t get a 50 off 12 balls, can you? 🤪 Well played - keep going strong! 💪🏻 @OfficialAbhi04 #IndVSNz pic.twitter.com/6MQe1p6sx4— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2026

Ranji Trophy: KL Rahul in, Karun Nair out against Punjab and Devdutt Padikkal named Karnataka captain6
దేవదత్‌ పడిక్కల్‌కు ప్రమోషన్‌

కర్ణాటక ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌కు ప్రమోషన్‌ లభించింది. ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతన్ని (725 పరుగులు 90.62 సగటుతో) కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ తమ రంజీ కెప్టెన్‌గా నియమించింది. ఈనెల 29 నుంచి పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గ్రూప్‌ దశలో కర్ణాటకకు ఇదే చివరి మ్యాచ్‌. కీలకమైన ఈ మ్యాచ్‌కు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ కేవలం రెండు మ్యాచ్‌ల అనుభవమున్న పడిక్కల్‌కు కెప్టెన్‌గా అవకాశమిచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో పడిక్కల్‌ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. 2023లో అతను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెద్దగా ఫామ్‌లో లేని మయాంక్‌ అగర్వాల్‌ను తప్పించి పడిక్కల్‌కు రంజీ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చారు.పంజాబ్‌తో మ్యాచ్‌కు ప్రకటించిన జట్టులో మరిన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లు కేఎల్‌ రాహుల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం టీమిండియా విధులు లేకపోవడంతో వీరిద్దరూ రంజీ బాట పట్టారు.మరో స్టార్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ కరుణ్‌ స్థానాన్ని నికిన్‌ జోస్‌ భర్తీ చేశాడు. మరో స్టార్‌ ఆటగాడు అభినవ్‌ మనోహర్‌పై వేటు పడింది. మనోహర్‌ గత కొంతకాలంగా ఫామ్‌లో లేడు. మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించినా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.కీలక పోరాటం గ్రూప్‌ బి పాయింట్ల పట్టికలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ముందంజలో ఉండగా, సౌరాష్ట్ర వెనుక నుంచి (నాలుగో స్థానం) ఒత్తిడి పెంచుతోంది. క్వార్టర్‌ ఫైనల్‌ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌ కర్ణాటకకు అత్యంత కీలకంగా మారింది. కర్ణాటక జట్టు (పంజాబ్‌ మ్యాచ్‌ కోసం) - మయాంక్‌ అగర్వాల్ - కేఎల్‌ రాహుల్ - అనీష్ KV - దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌) - స్మరణ్ R - శ్రేయస్‌ గోపాల్ - కృతిక్‌ కృష్ణ (wk) - వెంకటేష్ M - విద్యాధర్‌ పటిల్ - విద్యవత్‌ కావేరప్ప - ప్రసిద్ధ్‌ కృష్ణ - మొహ్సిన్‌ ఖాన్ - శిఖర్‌ శెట్టి - శ్రీజిత్‌ (wk) - ధ్రువ్‌ ప్రభాకర్

IND VS NZ 3rd T20I: Sanju Samson joins Virat Kohli shameful India record7
విరాట్‌ కోహ్లి సరసన సంజూ శాంసన్‌

గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన (తొలి బంతికే ఔట్‌) శాంసన్‌.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక గోల్డెన్‌ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సరసన చేరాడు. విరాట్‌, శాంసన్‌ భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్‌ డకౌట్లు అయ్యారు. విరాట్‌ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్‌ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ తన 151 మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక గోల్డెన్‌ డకౌట్స్‌- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్‌లు) - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్‌లు)* - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్‌లు) - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్‌లు) - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్‌లు) మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. న్యూజిలాండ్‌ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్‌ (4-0-18-2), హార్దిక్‌ (3-0-23-2), హర్షిత్‌ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. న్యూజిలాండ్‌ తరఫున గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్‌గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్‌ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అభిషేక్‌, ఇషాన్‌ విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరి ధాటికి భారత్‌ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్‌ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.శాంసన్‌ ఫామ్‌పై ఆందోళనలు ఈ సిరీస్‌లో శాంసన్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ శాంసన్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది. వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్‌ కిషన్‌ దూసుకొస్తున్నాడు. ఇషాన్‌ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్‌ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్‌ కాకపోయినా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

RS Ambrish Son of A Former Cricketer Who Can Be Next Hardik Pandya8
యువ సంచలనం.. మరో హార్దిక్‌ పాండ్యా అవుతాడా?

జింబాబ్వే వేదికగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌-2026లో భారత యువ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఆయుశ్‌ మాత్రే సేన.. తదుపరి బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది.చివరగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ యువ భారత్‌.. డీఎల్‌ఎస్‌ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. కివీస్‌ యవ జట్టుతో మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ (RS Ambrish) కీలక పాత్ర పోషించాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి న్యూజిలాండ్‌ అండర్‌-19 జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో అంబరీశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పద్దెమినిదేళ్ల ఈ కుర్రాడు ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ముందుకు సాగితే టీమిండియాకు మరో హార్దిక్‌ పాండ్యా దొరికినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో హార్దిక్‌ పాండ్యా అవుతాడా?హార్దిక్‌ మాదిరి ఆరో స్థానంలో చక్కగా ‍బ్యాటింగ్‌ చేయడంతో పాటు.. కొత్త బంతితో బౌలింగ్‌ చేయగల సత్తా కలిగి ఉండటం ఇందుకు కారణం. తమిళనాడుకు చెందిన ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఎడమచేతి వాటం బ్యాటర్‌ అయిన అతడు.. రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌.తండ్రి కల నెరవేరుస్తున్న తనయుడుకూచ్‌ బెహర్‌ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబరీశ్‌.. 33 ఏళ్ల నిరీక్షణ తర్వాత జూనియర్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో జట్టుకు ట్రోఫీని అందించాడు. అతడి తండ్రి ఆర్‌. సుకుమార్‌ కూడా క్రికెటరే. జూనియర్‌ క్రికెట్‌లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత రైల్వేస్‌ జట్టుకు మారిన సుకుమార్‌ సీనియర్‌ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.రైల్వేస్‌లో సెక్యూరిటీగా ఆ తర్వాత రైల్వేస్‌లో సెక్యూరిటీ జాబ్‌ పొందిన సుకుమార్‌.. తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలని భావించాడు. అందుకు తగ్గట్లే చిన్ననాటి నుంచే అంబరీశ్‌ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని తాను నెరవేరుస్తున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన అంబరీశ్‌.. భారత అండర్‌-19 జట్టులోనూ ఎంట్రీ ఇచ్చాడు.గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌ గడ్డ మీద యూత్‌ వన్డేల ద్వారా యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన అంబరీశ్‌.. అప్పటి నుంచి భారత అండర్‌-19 తుది జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌ టోర్నీలో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఆల్‌రౌండర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలు ఉన్న అంబరీశ్‌ మెరుగ్గా రాణిస్తే.. టీమిండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తాడనటం అతిశయోక్తి కాదు. చదవండి: యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!

Former BCCI President IS Bindra passes away aged 849
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

భారత క్రికెట్‌ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్జిత్‌ సింగ్‌ బింద్రా (ఐఎస్ బింద్రా) వయోభారంతో (84 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. బింద్రా 1993 నుండి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1978 నుండి 2014 వరకు 36 సంవత్సరాల పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.బింద్రా మరణం భారత క్రికెట్‌ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికింది. పరిపాలకుడిగా తన దూరదృష్టి, సాహసోపేతమైన నిర్ణయాలతో బింద్రా భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలిపారు. 1987 వరల్డ్‌కప్‌ను భారత ఉపఖండానికి తీసుకురావడంలో బింద్రా కీలక పాత్ర పోషించారు. ఇది మొదటిసారి ఇంగ్లండ్‌ వెలుపల జరిగిన వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించిన బింద్రా.. భారత క్రికెట్‌ ఆర్థికస్థితిగతుల రూపురేఖల్ని మార్చారు. అనంతరం బింద్రా ప్రోద్భలంతోనే 1996 వరల్డ్‌కప్‌ కూడా భారత ఉపఖండంలో జరిగింది. ఈ ప్రపంచకప్‌ నిర్వహణ ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ కేంద్రస్థానంగా మారడానికి దోహదపడింది. ప్రపంచకప్‌ లాంటి ఐసీసీ మెగా టోర్నీలను భారత్‌కు తీసుకురావడంలో సఫలీకృతుడైన బింద్రా.. ప్రసార హక్కుల విషయంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. 1994లో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించి, దూరదర్శన్‌ ఏకాధికారాన్ని సవాలు చేశారు. ఆ తీర్పుతో ప్రైవేట్‌ మరియు అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత క్రికెట్‌లోకి ప్రవేశించాయి. ESPN, TWI వంటి సంస్థలు మార్కెట్లోకి రావడంతో టెలివిజన్‌ ద్వారా క్రికెట్‌ భారత దేశ నలుమూలకు చేరింది. దీంతో ఆదాయాలు పెరిగి, భారత క్రికెట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మార్కెట్‌గా మారింది. ఈ ఆర్థిక బలమే బీసీసీఐని స్వతంత్రంగా, శక్తివంతంగా నిలబెట్టింది.

Shreyas Iyer set to stay back for remainder of New Zealand T20Is10
శ్రేయస్‌ అయ్యర్‌కు మరో ఛాన్స్‌

న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌కు మరో లక్కీ ఛాన్స్‌ దక్కింది. తిలక్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ను చివరి రెండు టీ20లకు కూడా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ప్రపంచకప్‌కు ముందు శ్రేయస్‌ తనను తాను నిరూపించుకునేందుకు ఇది సువర్ణావకాశం. శ్రేయస్‌ భారత్‌ తరఫున టీ20లు ఆడక చాలా కాలమైంది.న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు అతను ఎంపికైనా, తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-0తో చేజిక్కించుకోవడంతో శ్రేయస్‌కు చివరి రెండు టీ20ల్లో అవకాశం​ దక్కవచ్చు. ఈ అవకాశాన్ని శ్రేయస్‌ సద్వినియోగం చేసుకోగలిగితే, ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.ప్రపంచకప్‌కు ఎంపికైన వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఒకవేళ సుందర్‌ ప్రపంచకప్‌కు దూరమైతే అతని​ స్థానాన్ని శ్రేయస్‌తో భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది అంత సులువుగా జరిగే విషయం అయితే కాదు. ఎందుకంటే, సుందర్‌ స్థానానికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది.సుందర్‌కు ప్రత్యామ్నాయంగా న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైన రవి బిష్ణోయ్‌ ప్రధాన పోటీదారుగా మారాడు. బిష్ణోయ్‌ చాలాకాలం తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మూడో టీ20లో సత్తా చాటాడు. ప్రపంచకప్‌ భారత ఉపఖండంలో జరుగుతుంది కాబట్టి, సెలెక్టర్లు సుందర్‌ లాంటి ఆల్‌రౌండర్‌ కాకపోయినా, బిష్ణోయ్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌తో అడ్జస్ట్‌ కావచ్చు.సుందర్‌ స్థానానికి మరో ప్రధాన పోటీదారుడు రియాన్‌ పరాగ్‌. పరాగ్‌ సుందర్‌ లాగే స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాబట్టి, సెలెక్టర్లు అతనివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పరాగ్‌ సైతం చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నా, ఐపీఎల్‌ 2025 సత్తా చాటడం అతనికి కలిసొచ్చే అంశం.ఈ లెక్కన వాషింగ్టన్‌ సుందర్‌ ప్రపంచకప్‌కు దూరమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్‌ అయ్యర్‌, రియాన్‌ పరాగ్‌, రవి బిష్ణోయ్‌ రేసులో ఉంటారు. వీరిలో బిష్ణోయ్‌ ఇదివరకే (మూడో టీ20) తనను నిరూపించుకున్నాడు. శ్రేయస్‌కు ఒకవేళ చివరి రెండు టీ20ల్లో అవకాశం వచ్చి, అతను కూడా సత్తా చాటితే, సుందర్‌ స్థానానికి ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, శ్రేయస్‌ చివరి రెండు టీ20లకు కొనసాగనుండటంతో, న్యూజిలాండ్‌ సిరీస్‌కు తిలక్‌ వర్మ అందుబాటులో ఉండడనే విషయం స్పష్టమవుతుంది. విజయ్‌ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్‌ను న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపిక చేయలేదు. అతను చివరి రెండు టీ20లకు అందుబాటులో వస్తాడని సెలెక్టర్లు ఆశించారు. అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రేయస్‌ చివరి రెండు మ్యాచ్‌లకు కూడా కొనసాగనున్నాడు. తిలక్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌ మొత్తానికి దూరమైనా ప్రపంచకప్‌కు అందుబాటులోకి వస్తాడని కన్ఫర్మ్‌ అయ్యింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా జనవరి 28, 31 తేదీల్లో జరుగనున్నాయి.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement