Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sjoerd Marijne returns as coach of Indian womens hockey team1
జోయెర్డ్‌ మరీన్‌  మళ్లీ వచ్చాడు... 

న్యూఢిల్లీ: నెదర్లాండ్స్‌కు చెందిన జోయెర్డ్‌ మరీన్‌కే భారత మహిళల హాకీ జట్టు కోచింగ్‌ బాధ్యతలు అప్పజెప్పారు. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మళ్లీ చీఫ్‌ కోచ్‌గా 51 ఏళ్ల నెదర్లాండ్స్‌ మాజీ ఆటగాడిని నియమిస్తున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. ఆయన కోచింగ్‌లోనే 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తృటిలో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చీఫ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోగా... గత పారిస్‌ ఒలింపిక్స్‌కు అసలు అర్హతే సాధించలేకపోయింది. ఆ తర్వాత కూడా మహిళల జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. నానాటికీ తీసికట్టుగా పడిపోతూనే వచి్చంది. కానీ పురోగతి కనిపించలేదు. దీంతో జట్టు వైఫల్యాలకు, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హరేంద్ర సింగ్‌ డిసెంబర్‌లో తన చీఫ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆయన ఒంటెద్దు పోకడలు కూడా కారణమని, అందుకనే రాజీనామాతో తప్పుకునేలా చేశారని వార్తలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మరీన్‌ అండ్‌ టీమ్‌నే తీసుకురావాలని హెచ్‌ఐ నిర్ణయించింది. జోయెర్డ్‌ మరీన్‌ బృందంలో అప్పటి మథియస్‌ విల (అనలిటికల్‌ కోచ్‌), వేన్‌ లాంబార్డ్‌ (సైంటిఫిక్‌ అడ్వైజర్‌)గా ఉంటారు. ‘మరోసారి భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా రానుండటం సంతోషంగా ఉంది. కొత్త ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో ప్లేయర్లు రాణించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని మరిన్‌ అన్నారు. అప్పుడు ఐదేళ్లు సేవలు... నెదర్లాండ్స్‌కు చెందిన మాజీ ఫీల్డ్‌ హాకీ ప్లేయర్‌ జోయెర్డ్‌ మరీన్‌ గతంలోనూ భారత హాకీ జట్టుకు కోచ్‌గా సేవలందించారు. 2017 నుంచి 2021 వరకు ఐదేళ్ల పాటు ఆయన మహిళల హాకీ కోచింగ్‌ బాధ్యతలు చక్కబెట్టారు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు చక్కని ఫలితాలు అందించారు. ఆయన కృషి వల్లే పతకం రాకపోయినా మెరుగైన నాలుగో స్థానంతో హాకీ జట్టు సంతృప్తి చెందింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లోకి ఎగబాకింది. ఇంటా బయటా పలు టోరీ్నల్లోనూ రాణించింది. కుటుంబ కారణాలతో కోచింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన ఇక్కడి (భారత్‌) నుంచి వెళ్లిపోయారు. గాయాలు... వైఫల్యాలు... టోక్యో ఈవెంట్‌లో రాణి రాంపాల్‌ సేన రాణించింది. కానీ తదనంతరం ఆమెతో పాటు పలువురు సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అప్పటిదాకా నాణ్యమైన కోచింగ్‌ ఇచ్చిన మరీన్‌ వెనుదిరగడంతో ఒక్కసారిగా సరైనా మార్గదర్శనం కూడా కొరవడింది. 2022 కామన్వెల్త్‌ క్రీడలు, 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు తెచి్చనప్పటికీ ఆ తర్వాత జట్టు చెప్పుకోదగిన విజయాలే సాధించలేదు. గతేడాది అయితే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో 16 మ్యాచ్‌లాడి రెండే విజయాలతో అట్టడుగుకు పడిపోయింది. ఆసియా కప్‌లో రజతం నెగ్గినప్పటికీ ఈ ఆగస్టులో జరిగే ప్రపంచకప్‌కు ఆ ప్రదర్శన అర్హతను తెచి్చపెట్టలేకపోయింది. ఇప్పుడున్న సవాళ్లు... మరీన్‌ మళ్లీ మొదటి నుంచే ప్రారంభించాలి. ఎందుకంటే అప్పుడున్నట్లుగా జట్టు లేదు. తను తీర్చిదిద్దిన రాణి రాంపాల్, వందన కటారియా, దీప్‌ గ్రేస్‌ ఎక్కాలాంటి వెటరన్‌ ప్లేయర్లు అందుబాటులో లేరు. వీళ్లంతా రిటైరయ్యారు. దీంతో మరిన్‌కు సవాళ్లు తప్పవు. ముందుగా ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌ కోసం జట్టును సన్నద్ధం చేయాలి. హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి 14 వరకు ఈ క్వాలిఫయింగ్‌ పోటీలు జరుగుతాయి. ఇందుకోసం అమ్మాయిల జట్టుకు ఈ నెల 19 నుంచి బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోటీలకు ముందు ఆయన కోచింగ్‌ పాఠాలు ఇక్కడే మొదలవుతాయి. సరిగ్గా ఐదు రోజుల ముందే ఈ నెల 14న మరీన్‌ భారత్‌కు చేరుకుంటారు. నేరుగా బెంగళూరుకు బయల్దేరి జట్టును సిద్ధం చేసే బాధ్యతలు చేపట్టనున్నారు.

Sai Sudharsan suffers rib fracture, likely to miss remainder of Vijay Hazare Trophy2
టీమిండియా యంగ్‌ స్టార్‌కు తీవ్ర గాయం.. విరిగిన పక్కటెముక

మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ ఉదంతం మరవకముందే మరో టీమిండియా ఆటగాడు మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఇటీవల మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా యంగ్‌ స్టార్‌ సాయి సుదర్శన్‌ పక్కటెముక విరిగింది. పరుగు పూర్తి చేసే క్రమంలో డైవ్ చేసిన సుదర్శన్‌ ప్రమాదకర రీతిలో కింద పడ్డాడు. అప్పటికి గాయం పెద్దదిగా అనిపించనప్పటికీ స్కానింగ్‌ల్లో రిబ్‌ ఫ్రాక్చర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ గాయం కారణంగా సాయి వీహెచ్‌టీలో తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతనికి 6-8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. సాయి ఐపీఎల్‌ 2026 ప్రారంభ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం. సాయి గుజరాత్‌ టైటాన్స్‌లో కీలక సభ్యుడు. గత కొన్ని సీజన్లుగా అతను టైటాన్స్‌ తరఫున స్థిరంగా రాణిస్తున్నాడు.సాయికి ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భారత టెస్ట్‌ జట్టులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని తదుపరి టీమిండియా అవకాశాలు ఐపీఎల్‌ 2026 ప్రదర్శనలపై ఆధారపడి ఉంటాయి. 24 ఏళ్ల సాయి టీమిండియా తరఫున 6 టెస్ట్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 302 పరుగులు.. 3 వన్డేల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 127 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సాయికి ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అరంగేట్రం నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కే ఆడుతున్న సాయి.. 40 మ్యాచ్‌ల్లో 145కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో, కళ్లు చెదిరే 49.8 సగటున 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 1793 పరుగులు చేశాడు.

Too much attitude, Washington Sundar under fire from Indian cricket fans on viral video3
కుర్రాడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాషింగ్టన్‌ సుందర్‌

టీమిండియాలో అప్‌ కమింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్‌ సుందర్‌.. మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యాడు. సుందర్‌ తాజాగా ఓ హోటల్‌ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్‌ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు. అలాగే కొందరు ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం ప్రయత్నిస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Washington Sundar looks like a proper gentleman, but his attitude is on another level — even more than big names like Virat Kohli, Rohit Sharma, and Hardik Pandya. 😅🙏 pic.twitter.com/7lVDBGz66K— Jara (@JARA_Memer) January 2, 2026ఇది చూసి నెటిజన్లు సుందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు.. ఏంటా బలుపు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరేమో నువ్వేమైనా విరాట్‌ కోహ్లి లేదా రోహిత్‌ శర్మ అనుకుంటున్నావా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. మొత్తానికి ఆన్‌ ఫీల్డ్‌ ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్న సుందర్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ ప్రవర్తన కారణంగా అదే అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.ఇదిలా ఉంటే, ఇటీవలి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లకతీతంగా రాణించిన సుందర్‌..త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే హోం టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైన జట్టే టీ20 ప్రపంచకప్‌లో కూడా కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో స్థానాన్ని పక్కా చేసుకున్న సుందర్‌.. ప్రపంచకప్‌లో ఆడటం​ లాంఛనమే.న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం​ కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ఐదు టీ20లు జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, గౌహతి, వైజాగ్‌, తిరువనంతపురం వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌ జనవరి 11 నుంచే మొదలవుతుంది. ఈ సిరీస్‌ కోసం వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.

STUBBS AND RICKELTON DROPPED FROM SOUTH AFRICA T20 WORLD CUP SQUAD4
సౌతాఫ్రికా సెలెక్టర్ల సంచలన నిర్ణయం

సౌతాఫ్రికా జాతీయ జట్టు సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌ జట్టుకు పలువురు స్టార్‌ ప్లేయర్లను ఎంపిక​ చేయలేదు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపు శతకంతో సత్తా చాటిన ర్యాన్‌ రికెల్టన్‌.. ఇదే లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ కెప్టెన్‌ అయిన ట్రిస్టన్‌ స్టబ్స్‌.. ఫాస్ట్‌ బౌలర్‌ ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, విధ్వంసకర ఆటగాడు రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ను ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు.వీరిలో డస్సెన్‌పై వేటు ఊహించిందే అయినా స్టబ్స్‌, రికెల్టన్‌, బార్ట్‌మన్‌పై వేటు మాత్రం ఎవరూ ఊహించనిది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఎంపిక కాగా.. కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, జాసన్ స్మిత్ తొలిసారి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.పేసర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడి, 2024 వరల్డ్‌కప్‌ లీడింగ్‌ వికెట్‌టేకర్‌ అన్రిచ్‌ నోర్జే, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జన్సెన్‌, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌, అనుభవజ్ఞులైన బ్యాటర్లు డికాక్‌, మిల్లర్‌ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.కాగా, ఫిబ్రవరి 7 నుంచి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా గ్రూప్‌-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌, కెనడా, న్యూజిలాండ్‌, యూఏఈ జట్లు కూడా ఉన్నాయి. మెగా టోర్నీలో గత ఎడిషన్‌ రన్నరప్‌ అయిన సౌతాఫ్రికా ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్‌ (కెనడాతో) ఆడుతుంది. 2026 టీ20 ప్రపంచకప్‌ కోసం సౌతాఫ్రికా జట్టు..ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, జాసన్ స్మిత్‌

BCCI extends special support to Sri Lanka, India to play extra T20Is on already finalized tour5
బీసీసీఐ ఉదారత.. శ్రీలంక తుఫాన్‌ బాధితుల కోసం ప్రత్యేక సాయం

పొరుగు దేశాలను ఆదుకునే విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) మరోసారి తమ ఉదారత చాటుకుంది. డిట్వా తుఫానుతో అతలాకుతలమైన శ్రీలంకకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక సాయంతో ముందుకొచ్చింది. భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో శ్రీలంకలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.డిట్వా తుఫాన్‌ బాధితుల సహాయార్థం బీసీసీఐ ఈ టూర్‌ను పొడిగించేందుకు నిర్ణయించింది. టెస్ట్‌లకు అదనంగా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించింది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని డిట్వా తుఫాన్ బాధితుల పునరావాసానికి వినియోగించేందుకు షెడ్యూల్‌లో లేని టూర్‌ ఎక్స్‌టెన్షన్‌ను ప్లాన్‌ చేసింది.ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధ్యక్షుడు షమ్మి సిల్వా ధృవీకరించారు. భారత్‌-శ్రీలంక మధ్య ఉన్న సహృదయ వాతావరణాన్ని, పెరుగుతున్న స్నేహాన్ని ప్రస్తావించారు. అదనపు టీ20ల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.వాస్తవానికి తాజా పరిణామానికి ముందే భారత జట్టు డిసెంబర్‌లోనూ శ్రీలంకలో పర్యటించేందుకు (డిట్వా తుఫాన్‌ బాధితులకు నిధులు సమకూర్చేందుకు) ఒప్పుకుంది. ఆ పర్యటనలో భారత్‌-శ్రీలంక జట్లు రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ కార్యరూపం దాల్చకముందే, బీసీసీఐ ఆగస్ట్‌ విండో ప్రతిపాదనకు సమ్మతించింది.కాగా, గతేడాది నవంబర్ చివర్లో డిట్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించింది.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యక్రమాలుడిట్వా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను “Rebuilding Sri Lanka” కార్యక్రమానికి అంకితం చేసింది. ఈ సిరీస్‌లో #VisitSriLanka పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

Wisden 2025 Mens ODI Team of the Year Announced6
2025 విజ్డన్‌ జట్టు ప్రకటన.. భారత దిగ్గజాలకు చోటు

2025 సంవత్సరానికి గానూ విజ్డన్ (Wisden) పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత్‌ నుంచి దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఎంపికయ్యారు. మరో భారతీయ ఆటగాడు మిలింద్‌ కుమార్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కినా, ప్రస్తుతం అతను యూఎస్‌ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.వెస్టిండీస్‌ (షాయ్‌ హోప్‌, జేడన్‌ సీల్స్‌), న్యూజిలాండ్‌కు (మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ) కూడా భారత్‌తో సమానంగా రెండు బెర్త్‌లు దక్కాయి. మిగతా బెర్త్‌లు సౌతాఫ్రికా (మాథ్యూ బ్రీట్జ్కే), స్కాట్లాండ్‌ (జార్జ్‌ మున్సే), ఇంగ్లండ్‌ (ఆదిల్‌ రషీద్‌), శ్రీలంకకు (అషిత ఫెర్నాండో) చెందిన ఆటగాళ్లు దక్కించుకున్నారు.ఆటగాళ్ల వారిగా గతేడాది ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..రోహిత్‌ శర్మపరుగులు- 650 సగటు- 50.00స్ట్రయిక్‌రేట్‌- 100 అత్యుత్తమ ప్రదర్శనలు- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 76 పరుగులు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాపై సెంచరీలుజార్జ్ మున్సేపరుగులు- 735సగటు- 73.50స్ట్రయిక్‌రేట్‌- 1072 సెంచరీలువిరాట్‌ కోహ్లిపరుగులు- 651సగటు- 65.10స్ట్రయిక్‌రేట్‌- 96పాకిస్తాన్‌పై అజేయ శతకం, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీలో 84 పరుగులుషాయ్‌ హోప్‌ (వికెట్‌కీపర్‌)పరుగులు- 670 సగటు- 64.18స్ట్రయిక్‌రేట్‌- 99 పాకిస్తాన్‌పై 120*; 15 క్యాచ్‌లు, 2 స్టంపింగ్స్మాథ్యూ బ్రీట్జ్కేపరుగులు- 706సగటు- 64.18స్ట్రయిక్‌రేట్‌- 99అరంగేట్రంలోనే 150 పరుగులు; మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలుమిలింద్ కుమార్పరుగులు- 652సగటు- 81.50 స్ట్రయిక్‌రేట్‌- 992 శతకాలువికెట్లు- 20ఓ ఐదు వికెట్ల ప్రదర్శనమిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌)పరుగులు- 210వికెట్లు- 25 ఎకానమీ- 4.57కెప్టెన్‌గా స్థిరమైన ప్రదర్శనఆదిల్‌ రషీద్‌వికెట్లు- 30 సగటు- 23.63మ్యాట్‌ హెన్రీవికెట్లు- 27 వికెట్లుసగటు- 18.142025లో అత్యధిక వికెట్లు; ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ బౌలర్జేడన్‌ సీల్స్‌వికెట్లు- 27 సగటు- 18.14పాకిస్తాన్‌పై 6-18అషిత ఫెర్నాండో వికెట్లు- 23 వికెట్లుసగటు- 21.30

ILT20 2025-26: Narine, Pepper power Abu Dhabi Knight Riders to Eliminator win7
రాణించిన నరైన్‌.. ఎలిమినేటర్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2025-26 ఎడిషన్‌ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్‌-1లో గెలిచి డెజర్ట్‌ వైపర్స్‌ నేరుగా ఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. మరో ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీ కొనసాగుతుంది. నిన్న (జనవరి 1) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ క్యాపిటల్స్‌పై తిరుగులేని విజయం సాధించి, ఇవాళ జరుగబోయే క్వాలిఫయర్స్‌-2కు (ఎంఐ ఎమిరేట్స్‌తో) అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-2 విజేత జనవరి 4న జరిగే ఫైనల్లో డెజర్ట్‌ వైపర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌పై అబుదాబీ నైట్‌రైడర్స్‌ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. మైఖేల్‌ పెప్పర్‌ (49 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (43), ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (22 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ బౌలర్లలో నబీ 3 వికెట్లతో సత్తా చాటగా.. హైదర్‌ అలీ, వకార్‌ సలాంఖిల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన క్యాపిటల్స్‌.. 16.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సునీల్‌ నరైన్‌ (3-0-12-3), జేసన్‌ హోల్డర్‌ (3.2-0-18-3), లివింగ్‌స్టోన్‌ (4-0-26-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్యాపిటల్స్‌ పతనాన్ని శాశించారు. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన నబీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Rajasthan Royals beat RCB to secure this stadium home venue IPL 2026: Report8
IPL 2026: రాజస్తాన్‌ రాయల్స్‌ ‘ఫ్యాన్స్‌’కి భారీ షాక్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మొట్టమొదటి సీజన్‌ విజేతగా రాజస్తాన్‌ రాయల్స్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్‌ ఆడిన రాజస్తాన్‌.. ఆ తర్వాత జైపూర్‌లోని సొంత మైదానం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్‌ ఆడింది.సుదీర్ఘ బంధానికి వీడ్కోలుక్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న రాజస్తాన్‌ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్‌స్పోర్ట్స్‌ కథనం ప్రకారం.. ఐపీఎల్‌-2026 సీజన్‌ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ హోం గ్రౌండ్‌ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్‌ ఎంచుకుంది.కారణం ఇదేజైపూర్‌లోని ‘SMS’ గ్రౌండ్‌లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్‌ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్‌ తమ హోం గ్రౌండ్‌ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.పుణెలోఇప్పటికే రాయల్స్‌ ఆపరేషన్‌ టీమ్‌ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్‌ పరిస్థితులు, సీటింగ్‌ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్‌గా ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్‌గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్‌ కింగ్స్‌ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది. ఆర్సీబీని ఓడించి..ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్‌తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్‌కే ఇది హోం గ్రౌండ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్‌ మ్యాచ్‌ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్‌’కు భారీ షాక్‌ తగిలినట్లే!!ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్‌.. మళ్లీ ఫైనల్‌ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్‌ చేసిన రాయల్స్‌ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు.చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్‌ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే

Gautam Gambhir's India Head Coach position offered to Australian legend, denied online9
టీమిండియా కోచ్‌ పదవి ఆఫర్‌.. సున్నితంగా తిరస్కరించిన పాక్‌ మాజీ కోచ్‌..!

టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఆఫర్‌పై పాకిస్తాన్‌ మాజీ హెడ్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిల్లెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్‌లో ఓ పాకిస్తాన్‌ సోషల్ మీడియా యూజర్ గిల్లెస్పీని టీమిండియా కోచ్‌గా వ్యవహరించమని అడిగాడు. ఏడాది వ్యవధిలో భారత జట్టు స్వదేశంలోనే రెండు సార్లు (టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో) వైట్‌ వాష్‌ అయ్యిందని.. ఈ పరిస్థితుల్లో టీమండియాకు నీ సేవలు అవసరమని సదరు యూజర్‌ గిల్లెస్పీకి వ్యంగ్యంగా ఆఫర్‌ చేశాడు. ఈ ఆఫర్‌ను గిల్లెస్పీ సున్నితంగా తిరస్కరించాడు. 'నో థ్యాంక్స్‌' అంటూ రెండు ముక్కల్లో తన అభిమతాన్ని బయటపెట్టాడు. పాకిస్తానీ ఎక్స్‌ యూజర్‌-గిల్లెస్పీ మధ్య ఈ సంభాషణ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐకి పాకిస్తాన్‌ కోచ్‌గా పని చేసిన వారికి టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఇచ్చేంత కర్మ పట్టలేదని అంటున్నారు. వాస్తవానికి గిల్లెస్పీకి టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యేంత సీన్‌ లేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేసిన పాక్‌ ఎక్స్‌ యూజర్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. గంభీర్‌ను భారత టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తొలగించనున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు. అయితే ఈ అంశంపై బీసీసీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. గంభీర్‌ మూడు ఫార్మాట్లలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది.వాస్తవానికి గంభీర్‌పై దుష్ప్రచారాని కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నా, టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలొ క్లీన్‌ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్‌ టెస్ట్‌ ప్రస్తానం.. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్‌ స్వీప్‌ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్‌ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్‌ పర్యటనలో 1-3తో సిరీస్‌ కోల్పోయి, ఇంగ్లండ్‌ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది. ఇంత దారుణమైన ట్రాక్‌ ఉంటే సహజంగానే ఏ కోచ్‌పై అయినా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గంభీర్‌ కూడా ఇదే ఎదుర్కొంటున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి కావాల్సినంత మద్దతు లభిస్తుంది.గిల్లెస్పీ విషయానికొస్తే.. ఈ ఆసీస్‌ మాజీ ఆటగాడు 2024 ఏప్రిల్‌లో పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆతర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో రాజకీయాల కారణంగా కొంతకాలంలోనే (2024 డిసెంబర్‌) ఆ పదవికి రాజీనామా చేశాడు. గిల్లెస్పీ జమానాలో పాక్‌ బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడింది. గిల్లెస్పీ తాజాగా పీసీబీ బాస్‌ మొహిసిన్‌ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. నఖ్వీ తనను అవమానించాడని బాహాటంగా ప్రకటన చేశాడు.

Ashes 5th Test Bashir Potts IN Atkinson OUT England Name Playing XII10
‘యాషెస్‌’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ XII

యాషెస్‌ 2025-26 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్‌ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్‌ విజయాలతో సిరీస్‌ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్‌ బృందం వైట్‌వాష్‌ గండం నుంచి ముందుగానే గట్టెక్కింది.ఇక సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి మొదలయ్యే ఐదో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాషెస్‌ తాజా ఎడిషన్‌లో చివరి టెస్టుకు తమ ప్లేయింగ్‌ XIIను ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది.విల్‌ జాక్స్‌తో పోటీఈ జట్టులో ఎట్టకేలకు స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ (Shoaib Bashir) చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌తో పోటీ నెలకొన్న తరుణంలో ప్రస్తుతానికి 12వ ఆటగాడిగా ఉన్న బషీర్‌.. తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది మ్యాచ్‌ రోజు తేలనుంది. మరోవైపు.. ప్రధాన జట్టులో ఉన్నా ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన మాథ్యూ పాట్స్‌ (Matthew Potts)కు ఈసారి స్థానం దక్కింది.పాట్స్‌ రీఎంట్రీగాయం కారణంగా గస్‌ అట్కిన్సన్‌ దూరం కాగా.. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టు తర్వాత జోఫ్రా ఆర్చర్‌ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక మార్క్‌వుడ్‌ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరీ పాట్స్‌ పాలిట వరంగా మారింది. డిసెంబరు 2024లో చివరగా టెస్టు మ్యాచ్‌ ఆడిన ఈ పేస్‌ బౌలర్‌ యాషెస్‌ చివరి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గట్కిన్సన్‌ రీప్లేస్‌మెంట్‌గా అతడు తుదిజట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియాతో యాషెస్‌ 2025-26 చివరి టెస్టు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ XIIబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), జోష్ టంగ్.అదే జట్టుమరోవైపు.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌ చివరి టెస్టు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టులో ఏ మార్పు చేయలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్‌ 3–1తో సొంతం చేసుకోగా... ఆఖరిదైన ఐదో టెస్టు ఆదివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ అదే జట్టును కొనసాగిస్తోంది. స్టీవ్‌ స్మిత్‌ జట్టుకు సారథ్యం వహించనుండగా... ఆసీస్‌ బృందం గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి సిరీస్‌ నిలబెట్టుకున్న ఆతిథ్య ఆసీస్‌... నాలుగో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్‌ నెగ్గింది. పూర్తిగా పేసర్లకు సహకరించిన మెల్‌బోర్న్‌ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో... సిడ్నీలో ఐదో టెస్టుకు ఎలాంటి పిచ్‌ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్‌ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement