breaking news
Vikarabad
-
ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి సీజ్
పరిగి: పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న తరగతిని మంగళవారం అధికారులు సీజ్ చేశారు. మండల విద్యాధికారి గోపాల్ పాఠశాలను సందర్శించి ఎలాంటి అనుమతులు లేకుండానే 9వ తరగతి పాఠాలు నిర్వహిస్తుండటంతో నోటీసులు జారీ చేసి తరగతి గదిని సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ఎన్ని తరగతుల వరకు అనుమతులు ఉంటేనే అంత వరకే తరగతులు నిర్వహించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఏసీ సిబ్బంది శ్రీశైలం, మోహన తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ పాఠశాల హెచ్ఎంగా వెంకటయ్య దౌల్తాబాద్: దౌల్తాబాద్ సీపీఎస్ హెచ్ఎంగా వెంకటయ్య నియమితులయ్యారు. ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా చిట్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వెంకటయ్య పదోన్నతి పొంది దౌల్తాబాద్ బాలికల ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎంగా వచ్చారు. ఇక్కడ ఇన్ఛార్జి పనిచేస్తున్న సాయిలు, పదోన్నతి పొందిన హెచ్ఎం వెంకటయ్యను స్థానిక ఉపాధ్యాయులు సన్మానించారు. పురుగు మందు కలిపిన నీటిని తాగి.. 15 మేకలు మృత్యువాత బంట్వారం: తొట్టిలో కలిపిన పురుగు మందు నీటిని తాగి 15 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన కోట్పల్లి మండలంలోని ఎన్నారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శైలజ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నారానికి చెందిన వెల్చాల్ రాసయ్య తన పొలంలో గడ్డి మందు కొట్టేందుకు నీటి తొట్టిలో పురుగు మందు కలిపి మూత పెట్టలేదు. అదే గ్రామానికి చెందిన అంజయ్య మేకలు మేపుతూ వస్తుండగా సమీపంలోని తొట్టిలో నీటిని తాగి 15 మేకలు మృత్యువాత పడ్డాయి. అంజయ్య కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శైలజ తెలిపారు. తామర పూలు కోసేందుకు వెళ్లి.. వ్యక్తి మృతి పరిగి: గణపతి పూజకు తామర పూలు తెచ్చేందుకు చెరువులోకి దిగిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మిట్టకోడూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం ఉదన్రావుపల్లికి చెందిన బాలయ్య(55), కృష్ణయ్య తామర పూలు కోసేందుకు మిట్టకోడూరు చెరువు వద్దకు వచ్చారు. చెరువులోకి దిగి తామర పూలు కోస్తుండగా బాలయ్య కాళ్లకు తామర తీగచుట్టుకుని నీట మునిగి గల్లంతయ్యాడు. గమనించిన కృష్ణయ్య ఒడ్డుకు చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పంచాయితీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృత దేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య బాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్కోట్ గ్రామంలో పేకాట రాయుళ్లను కరన్కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రాథోడ్ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం.. కరన్కోట్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది మంగళవారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.9,460తో పాటు పేక ముక్కలను స్వాధినం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
కొడంగల్: మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న భారత్ పెట్రోల్ పంప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని తదితరులు అనంతగిరి: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తదితరులుఅనంతగిరి: మట్టి వినాయకులను పూజిద్దామని వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్కుమార్ అన్నారు. పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాలె లక్ష్మణ్గుప్తా, కార్యదర్శి యాస్కి సునీల్, ఉపాధ్యక్షుడు రఘునందన్, కోశాధికారి దోమ శ్రీకాంత్, మహిళా విభాగం అధ్యక్షురాలు మ్యాడం లక్ష్మి పలువురు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏసీఆర్ విద్యాసంస్థ.. వికారాబాద్లోని ఏసీఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. మట్టి వినాయకులను పూజించాలి కొడంగల్ రూరల్: పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని లయన్స్క్లబ్ అధ్యక్షుడు కె మురహరి వాసిష్ట అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీవిద్య స్కూల్లో, కేశవస్వామి ఆలయంలో లయన్స్క్లబ్ సభ్యులతో కలిసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వడ్డె భీమరాజ్, డాక్టర్ సాకేత్, మిఠాయి రాజేందర్, దామోదర్రెడ్డి, శ్రీశైలం, మునీర్, మాజీ ఉప సర్పంచు ఎస్ఎం గౌసన్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి కొడంగల్: ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని అందుకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఫిల్లింగ్ స్టేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని కోరారు. పట్టణ శివారులోని కోస్గి రోడ్లోని భారత్ పెట్రోల్ పంపు ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి ధారూరు: గురువుల మార్గదర్శనంతో కుక్కింద ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను తయారుచేసి అబ్బురపర్చారు. నేషనల్ గ్రీన్ క్రాప్స్, ఈకో ఫ్రెండ్లీ గణేశ్ ప్రొగ్రాంలో భాగంగా జీహెచ్ఎం, ఉపాధ్యాయులు మట్టి వినాయకులను తయారు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్ఓ విశ్వేశ్వర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనేది పాఠశాల పరిశుభ్రత, పచ్చదనంతో పాటు విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపయోగపడుతుందన్నారు. పాఠశాల జీహెచ్ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ బంకమట్టి నుంచి ఈకో ఫ్రెండ్లీ గణేశ్లను తయారు చేసిన విద్యార్థుల ప్రతిభ అమోఘన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఇన్చార్జి కమాల్రెడ్డి, ఉపాధ్యాయులు గుణవంత్రెడ్డి, రవీందర్రెడ్డి, సుజాత, రాజశేఖర్, జగదీశ్వర్, సంతోష, శివప్రసాద్, యాకాంతం తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి సందర్భంగా ఊరూరా గణనాథులు కొలువుదిరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా గణనాథులను స్మరించుకుంటూ ఆయా మండపాలకు తరలిస్తున్నారు. ఈ సారి పలు భిన్న ఆకృతుల్లో విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మండపాల తయారీకి అవసరమైన డెకరేషన్ సామగ్రి, పూజా వస్తువులతో దుకాణాలు కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాల్లోని మండపాలను బుధవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు విద్యుద్దీపాలతో అలంకరించారు. పర్యావరణాన్ని కాపాడుదాం పరిగి: మట్టి వినాయకులను పూజిద్దం, పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మట్టి వినాయకుల పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ఆప్ పారిస్తో తయారు చేసిన వినాయకులతో జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. -
బస్సు ఢీకొని యువకుడి మృతి
బొంరాస్పేట: ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని మృతి చెందిన ఘటన కొడంగల్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు..ఎన్కెపల్లి గ్రామానికి చెందిన తలారి నర్సమ్మ కుమారుడు వినోద్(21) తండ్రి కొంత కాలం క్రితమే మృతి చెందడంతో కొడంగల్లోని ఓ సంస్థలో డెలివరీ బొయ్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. మంగళవారం ఉదయం తన స్నేహితులతో కలిసి పల్సర్ బైక్పై కొడంగల్కు వచ్చాడు. అక్కడ టిఫినన్్ చేసి తన స్నేహితులకు మళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. కొడంగల్నుంచి పరిగి రోడ్లో రాంగ్ రూట్లో అతివేగంగా వెళ్తూ హైదరాబాద్ నుంచి సేడం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో వినోద్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో 108 వాహనంలో స్థానికులు కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి బాబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో వీరభద్ర స్వామి జయంతి
కొడంగల్ రూరల్: పట్టణంలోని వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం వీరశైవ సమాజం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఆలయ పురోహితులు మడపతి జగదీష్స్వామి సమక్ష్యంలో వీరభద్రేశ్వరస్వామివారికి, భద్రకాళి అమ్మవారికి శివలింగానికి పంచామృతంతో అభిషేకం, విశేష అలంకరణ, దూప, దీప, నైవేద్యం సమర్పించారు. భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని వేడుకున్నారు. అనంతరం మంగళహారతులు ఇచ్చి స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం పట్టణ అధ్యక్షుడు జంగం శాంతుకుమార్, ఉపాధ్యక్షుడు బుక్క విజయకుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖరస్వామి, బొంరాస్పేట మండల సంఘం గౌరవ అధ్యక్షుడు జగదీష్స్వామి, గడ్డం అఖిలేశ్వర్స్వామి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
అనంతగిరి: న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్ డిమాండ్ చేశారు. కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్ అడ్వకేట్ తన్నీరు శ్రీకాంత్పై సోమవారం దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం వికారాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బస్వరాజ్ పటేల్ మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులంతా ఏకతాటిపైకి వచ్చి చట్టం చేసే వరకు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పోలీస్ వెంకట్రెడ్డి, న్యాయవాదులు కమాల్రెడ్డి, లవకుమార్, గోవర్ధనరెడ్డి, గోపాల్రెడ్డి, యాదవరెడ్డి, సంపూర్ణనంద్, శంకరయ్య, మాధవరెడ్డి, . శుక్లవర్ధన్ రెడ్డి, మహ్మద్ రఫీ, అశోక్ కుమార్, శుభప్రద్ పటేల్, ఆనంద్ గౌడ్, గోపాల్, రాజశేఖర్ మోహన్ రాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
దుద్యాల్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మలేరియా, పైలేరియా ప్రత్యేక అధికారి ఫకీరప్ప అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేజీబీవీలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ముసురు వర్షాల కారణంగా బ్యాక్టీరియా వ్యాప్తి చెంది దోమలు ప్రబలే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సునీత, కేజీబీవీ ప్రత్యేకాధికారి రాధిక, పాఠశాల సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.మలేరియా, పైలేరియా ప్రత్యేక అధికారి ఫకీరప్ప -
అప్పు ఇప్పిస్తామని భూమికి ఎసరు
కుల్కచర్ల: రైతు తెలియకుండానే భూమిని విక్రయించిన ముగ్గురు మధ్యవర్తులను మంగళవారం పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రమేశ్కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన రైతు కావలి పాండుకు సర్వే నంబర్ 287, 289లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సదరు రైతుకు ముగ్గురు మధ్యవర్తులు మనోజ్కుమార్, గణేశ్, మురళి నాయక్ రూ.2 చొప్పున రూ.5లక్షల అప్పు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో పాండుకు చెందిన 1.16ఎకరాల భూమిని షాద్నగర్కు చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు రిజిస్ట్రేషన్ చేయించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన రైతు ఫిబ్రవరి 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి రైతును మోసం చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందుతులను పరిగి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ముగ్గురు నిందితుల రిమాండ్ -
రైతులకు యూరియా అందించాలి
కొడంగల్ రూరల్: రైతాంగానికి సరిపడా యూరియా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ బి.విజయకుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఫర్టిలైజర్స్ దుకాణదారులు యూరియా కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆశమ్మ, రాజునాయక్, శైలజ, శంకర్నాయక్, బాబ్యనాయక్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శిసురేష్కుమార్ -
ఏటీసీతో ఉజ్వల భవిష్యత్
తాండూరు టౌన్: తాండూరులో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని పలువురు మండల విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు అన్నారు. సోమవారం పట్టణ శివారులో రూ.25 కోట్లతో నిర్మించిన ఏటీసీ కళాశాలను వారు సందర్శించారు. అనంతరం కళాశాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా కోర్సులను తీసుకురావడం శుభసూచకమన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే 100 శాతం ఉద్యోగ భద్రత దక్కడం హర్షణీయమన్నారు. తాండూరు ఏటీసీ కళాశాలలో ఆరు కోర్సుల్లో 172 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 28వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కృషితో ప్రభుత్వం పరికరాల కొనుగోలుకు రూ.65 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఏటీసీ కళాశాల ప్రిన్సిపాల్ సాయన్న, పలు మండల విద్యాధికారులు వెంకటయ్యగౌడ్, నర్సింగ్రావు, రమేష్, రాములు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లినాథప్ప, నర్సింహారెడ్డి, నర్సిములుతో పాటు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు రవీంద్ రెడ్డి, సుహాస్, శివ, మోహనకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లాపూర్లో ఆధ్యాత్మిక శోభ
తాండూరు రూరల్: మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రావణమాసం ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పల్లకిలో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. ప్రత్యేక కీర్తనలు, భజనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు అమర్నాథ్గౌడ్, విజయ్ కుమార్, గోపాల్రెడ్డి, పెద్ద నర్సిములుగౌడ్, నర్సిరెడ్డి, కిషోర్గౌడ్, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ రైతుకు అభినందన
కొడంగల్ రూరల్: వైవిద్య పంటలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతును వ్యవసాయాధికారులు అభినందించారు. మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన కొల్లేర్ నవీన్ సమగ్ర వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం మండల వ్యవసాయాధికారి జి.తులసి, ఏఈఓలు అశ్విని, శ్రీపతి, ఐజాక్ హెరాల్డ్, రాజులతో కలిసి రైతు నవీన్ సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను పరిశీలిస్తూ అభినందించారు. నాలుగున్నర ఎకరాల పొలంలో మొత్తం 13 రకాల పంటలను సాగుచేస్తున్నట్లు గుర్తించారు. పెసర, సెనగలు, కందులు, పల్లీలు, కందులు వరుసలుగా వేయగా, నువ్వులు, బంతి, ప్రొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నాడు. రైతు నవీన్పై మండల వ్యవసాయాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సత్యాగ్రహ దీక్షలో బీసీ నేతలు
అనంతగిరి: స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ. ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యగ్రహ దీక్షకు జిల్లా నుంచి బీసీ నాయకులు తరలివెళ్లారు. ఇందులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తరలివెళ్లిన బీసీ నాయకులు తాండూరు టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తలపెట్టిన సత్యాగ్రహ దీక్షలో సోమవారం పలువురు తాండూరు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ తదితరులు ఆయనను కలిసి సంఘీభావం తెలియజేశారు. అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. నాయకులు వెంకటేష్, పవన్, సత్తార్, శ్రీశైలం, వివేక్, మల్లేశం, జీషాన్, గోపాలకృష్ణ, రాఘవేంద్రాచారి, రాములు తదితరులు సత్యాగ్రహ దీక్షకు తరలివెళ్లిన వారిలో ఉన్నారు. -
విద్యుదాఘాతంతో గేదె మృతి
తాండూరు రూరల్: విద్యుదాఘాతంలో ఓ గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చెంగోల్లో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్ల మోనప్ప గేదెను అల్లాపూర్ శివారులోని ఓ పొలంలో మేతకు సోమవారం తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంలో అది అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి మోమిన్పేట: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని టేకులపల్లి ఉన్నత పాఠశాలలో 69వ ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలలో రానిస్తే భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ప్రదానోపాధ్యాయులు గౌరిశంకర్ తదితరులు ఉన్నారు. ఇన్చార్జి ఎంపీఓగా వీరన్న తాండూరు రూరల్: మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ) ఇన్చార్జిగా వీరన్న బాధ్యతలు సోమవారం చేపట్టారు. గతంలో పని చేసిన ఎంపీఓ సుశీల్కుమార్ వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్డీఏకు బదిలీపై వెళ్లారు. దీంతో చెన్గేస్పూర్ పంచాయతీ కార్యదర్శి వీరన్నకు ఇన్చార్జి ఎంపీఓగా నియమిస్తూ డీపీఓ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ విశ్వప్రసాద్ సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వనమహోత్సవానికి సిద్ధం దుద్యాల్: వన మహోత్సవానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో సోమవారం కొత్తగా మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలు గుంతలు తీశారు. ప్రధాన రోడ్ల గుండా పచ్చదనం ఉట్టి పడేలా ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందనే భావనతో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ఏపీఎం రాములు పరిశీలించారు. అనుమతి ఇవ్వండి కుల్కచర్ల: విద్యార్థుల ఇష్టానుసారంగా వినాయక ప్రతిమను పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్యముదిరాజ్, దిశ కమిటీ జిల్లా సభ్యుడు జానకిరాం అన్నారు. సోమవారం ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిభా ను కలిసి విద్యార్థుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఏటా నిర్వహించుకునే పండగను కొత్తగా నిరాకరించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో బిచ్చయ్య, నరేష్, మహేష్, విజయేందర్రెడ్డి, మల్లేష్, వెంకటేష్, శివకుమార్, జస్వంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. క్షయపై అప్రమత్తంగా ఉండాలి బంట్వారం: క్షయపై అప్రమత్తంగా ఉండాలి కోట్పల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ మేఘన అన్నారు. టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా సోమవారం కోట్పల్లి, అన్నాసాగర్, ఇందోల్, ఓగులాపూర్ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. టీబీ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె ప్రజలకు వివరించారు. అనంతరం పలువురిని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఖయూం, ఎంఎల్హెచ్పీ దివ్య, స్థానిక ఎఎన్ఎం అపర్ణ, ఎల్టీ నర్సింహ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
జెడ్పీ పీఠంపై గురి
ఇప్పటి వరకు టీడీపీ, బీఆర్ఎస్లకే అవకాశం వికారాబాద్: జిల్లా పరిషత్ పీఠం కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న తరుణంలో ఆశావహులు జెడ్పీ పీఠంపై కన్నేసిన నేతలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మండల, జిల్లా పరిషత్లు ఏర్పాటైన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలోగాని, ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో గాని టీడీపీ, బీఆర్ఎస్ జెండాలే ఎగురవేశాయి. అధికార కాంగ్రెస్కు ఇప్పటి వరకు జెడ్పీ పీఠం దక్కించుకున్న దాఖలాలు లేవు. వికారాబాద్ హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్గా సునీతారెడ్డి తన పదవీకాలం ముగిసే మూడు నెలల ముందు కాంగ్రెస్లో చేరడంతో ఆ మూడు నెలలు మాత్రం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరినట్లయింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ జిల్లాకు చెందిన వారే ఉండడంతో పాటు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో గెలుపు నల్లేరుపై నడకే కానుందని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఆశావహులు సైతం ఇదే మంచి సమయమని పరిషత్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ‘పట్నం’వారసుడి రంగప్రవేశానికి ప్రయత్నాలు జిల్లాలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో పోటీ అధికమయింది. ప్రతీ నియోజకవర్గం నుంచి నేతలు పోటీ పడుతున్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏపదవి లేకుండా ఉన్నారు. ఆమె కూడా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అవకాశం కలిసి వస్తే తన కుమారుడిని సైతం జెడ్పీటీసీగా పోటీ చేయించి జిల్లా పరిషత్ గద్దెనెక్కించి రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ కూతురిని జిల్లా పరిషత్ ఎన్నికల రంగంలోకి దించాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు కోరుతున్నారు. ఇదే నియోజకవర్గానికి రఘువీరారెడ్డి, సుధాకర్రెడ్డి, కొండల్రెడ్డి సైతం బరిలో ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పరిగి, తాండూరు నుంచి పోటీ పరిగి, తాండూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు సైతం జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి సతీమణిని పరిషత్ ఎన్నికల రంగంలోకి దింపాలని నియోజకవర్గ కార్యకర్తలు నేతలు కోరుతున్నారు. రామ్మోహన్రెడ్డి ఆశీర్వదిస్తే తాము సైతం పరిషత్ బరిలో ఉండేందుకు సిద్ధమని అదే నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు హన్మంత్ ముదిరాజ్, లాల్కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. తాండూరుకు చెందిన పలువురు నేతలు సైతం జిల్లా పరిషత్ పీఠంపై గురిపెట్టారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి, రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తే ఆయన సతీమణిని రంగంంలోకి దించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మురళీకృష్ణ తదితరులు సైతం ఆ సీటును ఆశిస్తున్నట్టు సమాచారం. ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు జిల్లా పరిషత్ పీఠంను ఆశిస్తున్న నేతలు జిల్లాకు చెందిన ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని ఆశీస్సులు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవటంతో పాటు స్థానిక కేడర్ మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆశావహుల్లో ఎమ్మెల్యేల సతీమణులు, కూతుళ్లు, ఇతర ముఖ్యనేతలు సైతం ఉండటంతో వారు నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పరిణామాలు, సమీకరణలు, రిజర్వేషన్లు ఎలా ఉన్న జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఈ ఎన్నికల్లో కీలకమని ప్రచారం సాగుతోంది. -
సంతకం పెట్టను!
ధారూరు: వారం రోజుల నుంచి తిరుగుతున్నాం.. నోడ్యూ సర్టిఫికెట్పై సంతకం పెట్టండి సార్ అంటూ రైతులు బ్యాంకు మేనేజర్కు మొరపెట్టుకున్నారు. సంతకం పెట్టాలన్న రూలేమైనా ఉందా, తర్వాత చూస్తానులే అంటూ దబాయించిన సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొంతమంది రైతులు వివిధ రకాల రుణాల తీసుకునేందుకు ఆయా బ్యాంకుల నుంచి నోడ్యూ సర్టిఫికేట్ అవసరం. దాని కోసం దీనికి నాగారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్కు ఆశ్రయించగా.. రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. నిత్యం రేపుమాపంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదేంటని కొందరు ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి సమాధానం ఇవ్వడంతో అన్నదాతలు నిశ్చేష్టులయ్యారు. వాస్తవానికి నోడ్యూ సర్టిఫికెట్ను కోరితే నిమిషాల్లో చెక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోజుల తరబడి తిప్పుకోవడంపై కర్షకులు కె.వెంకటయ్య, సీహెచ్.యాదయ్య, క్రిష్ణ, యాదయ్య, పాషం.క్రిష్ణయ్య మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రమేశ్ను వివరణ కోరగా.. ఏ రైతుతో అలా మాట్లాలేదన్నారు. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారన్నారు. రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నోడ్యూ సర్టిఫికెట్లపై సంతకాలు పెడుతున్నానని తెలిపారు. వివిధ పనుల్లో ఉన్నప్పుడు సంతకాలు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. నోడ్యూ సర్టిఫికెట్కు రోజుల తరబడి తిప్పుకొంటున్న బ్యాంక్ మేనేజర్ -
అనంతగిరి అభివృద్ధికి కృషి
అనంతగిరి: అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పూడూరు పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ నుంచి అనంతగిరికి చేరుకున్నారు. అనంతగిరి హరిత రిస్టార్ట్స్, వ్యూటవర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. హరిత హోటల్ను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశామని కలెక్టర్ ప్రతీక్జైన్ ప్రత్యేక చర్యలు తీసుకుని పర్యాటకులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించేలా తీర్చదిద్దుతార ని చెప్పారు. నిరుద్యోగులకు హోటల్ బాధ్యతలు అప్పగించి టూరిస్టులకు మంచి ఆహారం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతగిరి అభివృద్ధితో నిరుద్యోగులకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని హరిత హోటల్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, టూరిజం ఈడీ ఉపేందర్ రెడ్డి, డీఈ హన్మంత్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి పూడూరు: మద్యం తయారీలో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కంకల్లో ఉన్న బృందావనం స్పిరిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిస్టలరీస్ కంపెనీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తయారీ, విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు, పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డుల పరిశీలన అనంతరం బేవరేజ్లో లిక్కర్ త యారీ ముడిసరుకు నుంచి బాటిల్ తయారీ వరకు ఆబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో తెలుసుకున్నారు. మద్యం బాటిళ్ల భర్తీ ప్రక్రియలో లేబులింగ్ విధానాన్ని పరిశీలించారు. మంత్రి వెంట ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రజావాణికి 130 ఫిర్యాదులు
అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 130 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ప్రతీక్జైన్తో పాటు, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్ఓ మంగ్లీలాల్కు వివరిస్తూ అర్జీలు సమర్పించారు. ఆసరా పెన్షన్లకు ఫేస్ రికగ్నేషన్ పెన్షన్ దారులకు ఫేస్ రికగ్నేషన్తో పెన్షన్ పంపిణీ జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్జైన్తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోనిర్వహించిన కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 194 మంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లను ఎంపిక చేశామని వీరికి మొబైల్ ఫోన్లు అందజేస్తామన్నారు. వీటి ద్వారా ఫేస్ రికగ్నేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి పూడూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్రెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి నుంచి పూడూరు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. మండలం కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం శోచనీయమన్నారు. అనంతరం పూడూరు డిప్యూటీ తహసీల్దార్ వెంకటచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేశ్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవి, నాయకులు అనిల్, శ్రీశైలం, ఆంజనేయులు, బుచ్చన్న, ప్రకాశ్ నాయకులు రవీందర్, కృష్ణాచారి, సుభాన్, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రజక ఫెడరేషన్ఏర్పాటు చేయండి రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు గోపి పరిగి: రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి తమ కులస్తులకు న్యాయం చేయాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో సంఘం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. రజకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.వేయి కోట్లు కేటాయించాలని కోరారు. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మొగులయ్య, జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, అనిల్, ప్రభాకర్, వెంకటయ్య, మల్లేశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. ‘అనంతగిరి హాక్స్’ లోగో ఆవిష్కరణ అనంతగిరి: వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతగిరి హాక్స్ టీషర్ట్, లోగోను సోమవారం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుషురాం నాయక్, కార్యదర్శి వినోద్, ప్రతినిధులు నరేందర్, రమేశ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణంలో దూసుకెళ్తున్నాం
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తాండూరు నియోజకవర్గ మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గోనూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లాలో తాండూరు మొదటిస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీను, డైరక్టర్ ఉదయ్ భాస్కరెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, ప్రభాకర్రెడ్డి, మల్లేశం ఉన్నారు. రహదారి నిర్మాణ పనుల పరిశీలన యాలాల: మండల పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పరిశీలించారు. రసూల్పూర్ నుంచి లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోరోడ్డు విస్తరణ పనులను స్థానిక నాయకులతో కలిసి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో తొలగించిన దుకాణాలను పరిశీలించారు. -
కంప్యూటర్ల అందజేత
బొంరాస్పేట: మండలంలో ఏఐ కింద ఎంపికై న ప్రాథమిక పాఠశాలలకు సోమవారం కంప్యూటర్లను ఎంఈఓ హరిలాల్ అందజేశారు. మొదటి విడతలో 10 పాఠశాలలు ఎంపిక అయ్యాయని, అందులో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కుర్చీలు, బెంచీలు నేరుగా పాఠశాలలకు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు మల్లేశం, లక్ష్మయ్య, సీఆర్పీ సోమ్లా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తరలుతున్న గణపయ్యాలు తాండూరు రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది. తాండూరు పట్టణంలోని వినాయక తయారీ సెంటర్ల నుంచి గణనాథులను పల్లెలకు తరలిస్తున్నారు. సోమవారం చిన్నారులు తమ గణపయ్యను ట్రాక్టర్లో వారి గ్రామానికి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే మండపాలను సిద్ధం చేశారు. వాడవాడలా పండుగ వాతవారణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో వరాహస్వామి జయంతి కొడంగల్ రూరల్: పట్టణంలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో వరాహస్వామివారి జయంతిని సోమవారం ఆలయ ధర్మకర్తలు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, దూపం, దీపం, నైవేద్యాలను సమర్పిస్తూ మంగళహారతులు అందించారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. రోడ్డు విస్తీర్ణం తగ్గించండి దుద్యాల్: వంద ఫీట్ల రోడ్డుతో తీవ్రంగా నష్టపోతామని మండల పరిధిలోని పోలేపల్లి గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. సోమవారం గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో భాగంగా 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుతో ఇరుపక్కల ఉన్న మా ఇళ్లు పూర్తిగా పోతున్నాయని వాపోయారు. రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని కోరారు. -
అయ్యా.. యూరియా
ఆధార్ కార్డుకు ఒక్క బస్తా ధారూరు: యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి వేచి చూస్తే ధారూరు పీఏసీఎస్కు సోమవారం 280 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకున్నారు. సంఘం సిబ్బంది యూరియా పంపిణీకి ఈ పాస్ యంత్రం ఓపెన్ చేయడంతో మొరాయించింది. దీంతో సిబ్బంది కార్యాలయం లోపలే ఉండిపోయారు. ప్రతీ రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బాటిల్ లిక్విడ్ నానో యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ససేమీరా అన్నారు. రైతుల తోపులాట కారణంగా ఒకింత ఉద్రిక్తతత నెలకొంది. విషయం తెలుసుకున్న వ్యవసాయ విస్తరణ అధికారులు సంజూరాథోడ్, సంతోశ్లు, ఎస్ఐలు రాఘవేందర్, గోపాల్లు అక్కడ చేరుకున్నారు. ఈపాస్ యంత్రం పనిచేయడం లేదని రైతులు సంయమనం పాటించాలని సూచించారు. పోలీసులను చుట్టి ముట్టి యూరియా ఇప్పించాలని పట్టుబట్టారు. చివరకు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అభ్యర్థన మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజారత్నం ఆధార్కార్డు ద్వారా యూరియా ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. వచ్చిన రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. సరిపడా యూరియా లేక పోవడంతో టోకెన్లు ఇస్తామని చెప్పడంంతో రైతులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. పదేళ్లు లేని కొరత ఇప్పుడు ఎందుకు? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మోమిన్పేట: పదేళ్లలో లేని యూరియా కొరత కాంగ్రెస్ పాలనలోనే ఎందుకు వచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు అనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని పీఏసీఏస్ గోదాంను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులను పక్కదారి పట్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను గాలికొదిలేసిన రాష్ట్ర మంత్రి వర్గం ఢిల్లీ పర్యటనలు, పాదయాత్రలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం రైతు సమస్యలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎరువులు, రైతు బంధు క్రమం తప్పకుండా అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్, మాజీ సర్చంచ్లు ఎ.శ్రీనివాస్రెడ్డి, పి. శ్రీనివాస్రెడ్డి, అంజయ్య, రైతులు తదితరులు ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
పూడూరు: టీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్య క్షుడు ఎ.సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ పంక్షన్హాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభు త్వం నుంచి రావాల్సిన రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా రీజియన్ అధ్యక్షుడిగా సాయన్న, కార్యదర్శిగా అబ్ధుల్ మునీరా రెండో పర్యాయం నియ మితులయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, సత్యం, రాజారెడ్డి, రంగారెడ్డి రీజినల్ సెక్రటరీ అబ్ధుల్ జబ్బార్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పరిగి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ ఆరోపించారు. సోమవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలపై తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరిగి మండలంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో నస్కల్ రోడ్డులోని చిన్న వాగు బ్రిడ్జీ నిర్మాణం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పనులు చేయడం లేదన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ర్యాలీ ధారూరు: ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్ సాజిదాబేగంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ధారూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ధారూరు–చింతకుంట గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన అసంపూర్తి వంతెనను పూర్తి చేయాలని తదితర సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, జిల్లా దిశ కమిటీ సభ్యుడు వడ్లనందు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై బీజేపీ నేతల ఫిర్యాదు బంట్వారం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు సోమవారం బంట్వారం, కోట్పల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మహేష్, శివకుమార్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, నాయకులు వెంకటేశంగౌడ్, నందు, పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి యాలాల: మండలంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం మండల కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిని వాహనదారులు, ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులు విజయ్కుమార్, అశోక్, దస్తప్ప, యాదగిరి తదితరులు ఉన్నారు. బీజేపీ నాయకుల ధ్వజం -
నేత్రోనిలనంతో మహాశక్తి గణపతికి ప్రాణ ప్రతిష్ఠ
ఖైరతాబాద్: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి సోమవారం ఉదయం 10.30 గంటలకు కంటి పాపను అమర్చి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు విఠల్ శర్మ సిద్ధాంతి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి సోమవారం సాయంత్రం ఆగమన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మరాఠా బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు, తలపాగాలు ధరించి బ్యాండ్ వాయి స్తూ మహాగణపతి ఆగమనానికి స్వాగతం పలి కారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. -
ఉరుకులు.. పరుగులు
దౌల్తాబాద్: ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్) యాప్ ద్వారా టీచర్ల హాజరు నమోదు చేస్తుంది. ఉదయం 9గంటలకు.. సాయంత్రం 4.15 గంటల తర్వాత రెండుసార్లు ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మొన్నటి వరకు ఇష్టారాజ్యంగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఉదయం 9గంటల్లోపే స్కూల్కు వెళళ్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆన్లైన్ అటెండెన్స్ చూపిస్తుండడంతో ముందుగానే బడికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. సాకులకు చెక్ మొన్నటివరకు ఉపాధ్యాయులు కొందరు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవారు. ఒకవేళ హెచ్ఎం అడిగితే కొందరు ఎదురుతిరిగేవారు. మరికొందరు రాజకీయ నేతల అండతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేవారు. కొంతమంది హైదరాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట నుంచి వచ్చేవారు. వారు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు ఒక రోజు.. మరొకరు ఇంకో రోజు పాఠశాలకు వెళ్లేవారు. సాయంత్రం 4గంటలు కాకముందే ఇంటిబాట పట్టేవారు. బస్సులు దొరకడంలేదనే సాకుతో ముందే తోటి ఉపాధ్యాయులకు చెప్పి బడి నుంచి కొందరు బయటపడేవారు. వీటన్నింటికీ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ యాప్ చెక్ పెట్టంది. నిర్ణీత సమయం పాటించాలి ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి. ఆ పాఠశాల ఆవరణలో ఉండి అటెండెన్స్ వేస్తేనే ఫొటో క్యాప్చర్ అవుతుంది. 9గంటలకు ఒక్క నిమిషం దాటినా యాప్లో అటెండెన్స్ ప్రసెంట్ అని చూపినా పక్కన రెడ్మార్కు చూపుతుంది. అలాగే సాయంత్రం 4:15 గంటల లోపు వెళ్లినా హాజరు తీసుకోదు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు. సెలవులూ ఆన్లైన్లోనే ఏ ఉపాధ్యాయుడైనా తనకు సెలవు కావాలంటే గతంలో లిఖిత పూర్వకంగా లేదా మౌఖికంగా హెచ్ఎంకు చెప్పి తీసుకునేవారు. హెచ్ఎం సెలవు కాదంటే లీవ్ లెటర్ రాసి స్కూల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ అందుకు కాలం చెల్లింది. సెలవు కావాలనుకునే ఉపాధ్యాయుడు ఈ యాప్లోనే సెలవు పెట్టుకుంటే అది స్కూల్ హెడ్మాస్టర్కు వెళుతుంది. హెచ్ఎం ఆమోదిస్తేనే సెలవు తీసుకోవచ్చు. రిజక్ట్ చేస్తే కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. రెండుపూటలా హాజరుతో డుమ్మా కొట్టేందుకు నో ఛాన్స్ మంచి పరిణామంటున్న పలువురు విద్యావేత్తలు -
లగోరి పోటీల్లో విద్యార్థుల సత్తా
దోమ: మహారాష్ట్ర రాష్ట్రంలోని చిప్నూర్ నగరంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి లగోరి పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. 22 రాష్ట్రాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న దిర్సంపల్లి, ముజాహిద్పూర్, రాంనగర్, నారాయణపేట జిల్లాలోని కోస్గీకి చెందిన విద్యార్థులు పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారని రాష్ట్ర లగోరి అసోసియేషన్ కార్యదర్శి పి.నవీన్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో లగోరి చాంపియన్షిప్ హెడ్ కోచ్లు ఎం.విశాల్, సచిన్ మహిళా కోచ్ నవనీత తదితరులు పాల్గొన్నారు. -
చివరి చూపునకూ నోచుకోకపోతిమి బిడ్డా..
వికారాబాద్ జిల్లా: భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన ఐదు నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలను సోమవారం రాత్రి స్వగ్రామంలో నిర్వహించారు. రాత్రి 10:30 గంటలకు అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చేరుకున్న స్వాతి మృతదేహాన్ని (శరీరభాగాల మూట) నేరుగా గ్రామంలోని శ్మశానవాటికకు తరలించారు. ఆ మూటను విప్పకుండా అలాగే చితిపై పెట్టి నిప్పంటించారు. తండ్రి రాములు కూతురుకు తలకొరివి పెట్టారు. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతిమి బిడ్డా.. అంటూ కుటుంబ సభ్యులు చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా నిందితుడు మహేందర్రెడ్డి తరఫు వారెవరూ శ్మశానవాటిక వద్దకు రాలేదు. నిందితుడి ఇంటి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుని, అనుమానంతో హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆదివారమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కాగా, స్వాతి అంత్యక్రియలను మహేందర్రెడ్డి కుటుంబ సభ్యులే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె బంధువులు నిందితుడి ఇంటి ఎదుట టెంట్ వేసుకుని ఆందోళన చేపట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలో ఉన్న నిందితుడి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చేందుకు భయపడటంతో గ్రామ పెద్దలు కలి్పంచుకుని స్వాతి తల్లిదండ్రులను శాంతింపజేసి.. అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించారు.స్వాతి శరీర భాగాలకోసం కొనసాగుతున్న గాలింపు మరో పక్క బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరిగిన స్వాతి హత్యకేసులో శరీర భాగాల కోసం ప్రతాప సింగారం మూసీకాలువలో రెండో రోజు సోమవారం కూడా డీఆర్ఎఫ్ బృందాలు బోట్లతో గాలింపు కొనసాగించాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర వెతికినా మృతురాలి శరీర భాగాలు దొరకలేదని మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
రెండో భర్తతో కలిసి మొదటి భర్తను హత్య చేసిన భార్య
రంగారెడ్డి జిల్లా: అజీజ్నగర్ డెయిరీ ఫామ్లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్లో పనిచేయడానికి వచి్చన మహిళ తన మొదటి భర్తతో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న సామ రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పని చేసే రాజేశ్కుమార్(24) శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.నెల రోజుల క్రితమే.. అజీజ్నగర్లోని రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పనిచేసేందుకు బిహార్కు చెందిన ఏజెంట్ పవన్ ద్వారా నెల రోజుల క్రితం రాజేశ్కుమార్, పూనం దేవి దంపతులు వచ్చారు. అయితే తన మొదటి భర్త మహేశ్సాని అలియాస్ గుడ్డును వదిలేసిన పూనందేవి.. రాజేశ్కుమార్ను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాజేశ్కుమార్, పూనందేవి అజీజ్నగర్లోని డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నారు. ఇటీవల రాజేశ్కుమార్ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని పూనందేవి తన మొదటి భర్త మహేశ్సానీకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఈనెల 21న మహేశ్సాని అజీజ్నగర్ వచ్చాడు. అతను తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి రాజేశ్కుమార్ను హత్య చేసి, పారిపోయారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
బంట్వారం: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శాఖం నర్సింలు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని బస్వాపూర్కు మంజూరైన మినీ లైబ్రరీ ఏర్పాటుకు గ్రామస్తులతో కలిసి పాఠశాలలోని రెండు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్వాపూర్కు మంజూరైన మినీ లైబ్రరీని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ లైబ్రరీలో దిన పత్రికలు, కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్రెడ్డి, కృష్ణ, ఆనందం, రాజు, విద్యాకమిటీ మాజీ చైర్మన్ శివరాజ్ పాల్గొన్నారు. ఏఎంసీ డైరెక్టర్ మహేందర్రెడ్డి -
ఏటీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండు
తాండూరు: ఏటీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణ శివారులో రూ.85 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన అడ్వాన్ ్డ్స టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక విద్య, టెక్నికల్ విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో బోధన ప్రారంభమైందని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీఐ ఏటీసీ కేంద్రం ఏర్పాటు కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబల్లాల నాయకులు అబ్దుల్ రవూఫ్, సర్దార్ఖాన్, ప్రభాకర్గౌడ్, రామకృష్ణ, మలప్ప, వేణుగోపాల్, శ్రీనివాస్, సంతోశ్కుమార్, సత్యమూర్తి, గాజుల మాధవి తదితరులున్నారు. తాండూరు ఏఎంసీ చైర్మన్ బాల్రెడ్డి -
యువత ఆర్ఎస్ఎస్లో చేరాలి
మోమిన్పేట: ప్రతీ ఒక్కరు దేశ భక్తి కలిగి ఉండాలని పాలమూరు విభాగ సహ కార్యవిహ కెరెళ్లి అనంత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మోమిన్పేట, మర్పల్లి మండలాల స్వయం సేవకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భక్తితో పాటు హైందవ ధ్మర్మం కాపాటడంలో యువత ముందుండాలన్నారు. యువత అర్ఎస్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ శాఖలో చేరడం ద్వారా క్రమశిక్షణ, దేశ భక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో యుద్ధాలు, కరువులు, ప్రకృతి ప్రకోపించినప్పుడు మేమూ ఉన్నామని ఆర్ఎస్ఎస్ ముందుండి సహయం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యకరిణి వెంకటయ్య, మోమిన్పేట, మర్పల్లి స్వయం సేవకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలమూరు విభాగ సహ కార్యవిహ అనంత్రెడ్డి -
పనుల్లో పాతాళం
అంచనాల్లో అందలం..వికారాబాద్: జిల్లాకు మణిహారంగా ఉన్న కోట్పల్లి సాగునీటి ప్రాజెక్ట్ తీవ్ర వివక్షకు గురవుతోంది. ప్రాజెక్టు అభివృద్ధి నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. వికారాబాద్, తాండూరు రెండు నియోజకవర్గాలకు చెందిన 18 గ్రామాల వ్యవసాయ పొలాలకు నీరందించాల్సిన ఈ ప్రాజెక్టు అభివృద్ధి అంచనాలు.. ప్రతిపాదనలకే పరిమితమవుతూ వస్తోంది. దీంతో కాల్వలు పూడుకుపోయి.. ఆనకట్ట, అలుగు మరమ్మతులకు గురవుతున్నాయి. తూములు మరమ్మతులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కేవలం రెండు గ్రామాలకు మాత్రతమే సాగునీరందుతోంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలోనూ ఈ ప్రాజెక్టును విస్మరించారు. ప్రాజెక్టు అభివృద్ధి తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చి మూడు నెలలు గడిచినా పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ప్రాజెక్టు పట్టాలెక్కనుందా.? గతం మాదరిగా ప్రకటనలకే పరిమితమా అనే చర్చలు వినిపిస్తున్నాయి. నిధులు మంజూరు చేయించామని చెబుతున్న రెండు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.57 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తయితే కుడి, ఎడమ, బేబీ కెనాల్ మూడు కాల్వల ద్వారా 9,200 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. 20 పర్యాయాలు ప్రతిపాదనలు కోట్పల్లి ప్రాజెక్టు 20 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. ఒకటి రెండు సార్లు స్వల్ప నిధులు మంజూరైనా పొదల తొలగింపు, కాల్వలు, తూముల మరమ్మతులు చేయించామని చెప్పి చేతులు దులుపుకొన్నారు. రూ.3 కోట్లతో ప్రారంభమైన ప్రతిపాదనలు రూ.110 కోట్లకు చేరాయి. గడిచిన రెండు దశాబ్ధాలలో 15 పర్యాయాలు ప్రతిపాదనలు పంపినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టలేదు. గడిచిన ఐదేళ్లలో ఐదు సార్లు ప్రతిపాదనలు పంపంగా రాష్ట్ర స్థాయి అధికారులు ప్రాజెక్టును సందర్శించి వెళ్లారే తప్ప ఎటువంటి పురోగతి కనిపించలేదు. గత మూడు నెలల క్రితం రూ.89.3 కోట్లతో కోట్పల్లి ప్రాజెక్టుకు పాలనా పరమైన అనుమతులు వచ్చాయి. టెండర్ ప్రాసెస్ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతూనే ఉంది. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడంలో ప్రతీసారి అడ్డంకులు ఎదురవుతుండగా అందులో ఓ ప్రైవేటు సంస్థ బోటింగ్ పేరుతో నిర్వహిస్తున్న వ్యాపారానికి మాత్రం ఏ అడ్డంకులు కలగటంలేదు. 15 వేల ఎకరాలకు సాగు నీరు దశాబ్దాల కాలంగా మరమ్మతులు చేపట్టక కాల్వలు పూర్తిగా పాడయ్యాయి. అలుగు పారే చోట పెద్ద ఎత్తున ధ్వంసమైంది. ప్రాజెక్టు కట్ట సైతం చాలా చోట్ల మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం మంజూరైన నిధులతో కుడి, ఎడమ కాల్వలతో పాటు బేబీ కెనాల్ పాడైన చోట మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. పూర్తిగా పాడైన చోట కొత్తగా కాల్వలు నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు కట్ట పాడైన నేపథ్యంతో కట్టను బలంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అలుగు మరమ్మతులు చేపడితేనే నీటి ప్రవాహం ఆపే వీలుంటుందని ఇంజినీర్లు వెళ్లడిస్తున్నారు. ప్రాజెక్టును పునరుద్ధరిస్తే 15 వేల ఎకరల వరకు సాగునీరందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఓ ప్రైవేటు ఆర్గనైజేషన్ ద్వారా బోటింగ్ చేస్తున్న నేపథ్యంలో రైతులకు నీరు వదలడం లేదని రైతుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన నిధులు వెనక్కి వెళ్లకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయ్యేలా నేతలు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ఇరవై ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కోట్పల్లి ప్రాజెక్టు 9,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టు రెండు గ్రామాలకే పరిమితం తాజాగా రూ.89.3 కోట్లతో పాలనాపరమైన అనుమతులు పనులు పూర్తికి నేతలు చొరవ చూపాలని కోరుతున్న రైతులు -
‘లక్నాపూర్’కు నిధులు కేటాయించాలి
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ.. లక్నాపూర్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అనువుగా ఉందని ఇందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాలర్లకు చేపల వేటకు కావాల్సిన అధునాత పరికరాలు అందించేలా చూస్తానన్నారు. చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు పరిగి పట్టణ కేంద్రంలోనే మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర నాయకులు పరమేశ్వర్రెడ్డి, మండల అధ్యక్షురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
హిందూ ఉత్సవ సమితి స్థల అభివృద్ధికి కృషి
తాండూరు: హిందూ ఉత్సవ కేంద్ర సమితికి కేటాయించిన స్థలంలో పండుగలు జరుపుకునేందుకు వేదికగా మండపాలను నిర్మిస్తామని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, హిందూ ఉత్సవ సమితి చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని ఖాంజాపూర్ గేట్ వద్ద హిందూ ఉత్సవ కేంద్ర సమితి స్థలంలో బోరు వేయించారు. స్వప్నపరిమళ్, పట్లోళ్ల నర్సింహులు, బుయ్యని శ్రీనివాస్రెడ్డి, సందల్ రాజుగౌడ్ సంఘం సభ్యులతో కలిసి పూజలు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులు సంతోశ్ కుమార్, భానుకుమార్, రామకృష్ణ, నాయకులు ప్రభాకర్గౌడ్, రామకృష్ణ, ప్రవీణ్గౌడ్, పటేల్ కిరణ్, వేణుగోపాల్, శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి తదితరులున్నారు. వినాయక ఉత్సవాలను నిరాకరించడం తగదు హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు సాయిగణేశ్ కుల్కచర్ల: ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించొద్దని ప్రిన్సిపాల్ విద్యార్థులకు చెప్పడాన్ని ఖండిస్తున్నామని హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు సాయిగణేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆధ్యాత్మిక భావాలను విద్యార్థులకు అలవాటు చేయాల్సిన ప్రిన్సిపాల్..నిరాకరించడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రిన్సిపాల్ వ్యవహరించడం తగదన్నారు. వెంటనే మోడల్ స్కూల్లో విద్యార్థులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించునేలా ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను కోరుకున్న జీవితం ఇది కాదు.. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య బంజారాహిల్స్: ‘అమ్మా..నాకు ఈ జీవితం నచ్చడం లేదు..నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు.. నా జీవితాన్ని ఇంకోరకంగా ఊహించుకున్నా..ఇప్పుడు జరుగుతున్నది వేరేగా ఉంది..నాకు నచ్చని ఈ బతుకు ముగించాలనుకుంటున్నాను’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్బెంగాల్కు చెందిన దేబషిష్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ చెక్పోస్టులో నిర్మాణంలో ఉన్న మంత్రి కన్స్ట్రక్షన్స్లో క్వాలిటీ కంట్రోలర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఆవరణలో గత కొంతకాలంగా ఒక గదిలో ఉంటున్నాడు. అయితే వారం రోజుల నుంచి అదోలా ఉంటూ..తనకు ఈ జీవితం నచ్చడం లేదంటూ సహచర సిబ్బందితో వాపోయేవాడు. అనుకున్న విధంగా బతుకు కొనసాగడం లేదని అశాంతితో గడుపుతూ చివరకు తల్లికి సూసైడ్ నోట్ రాసి తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుంగ్ఫూ పోటీల్లో న్యూమాంక్స్ సత్తా వేర్వేరు విభాగాల్లో ముగ్గురికి గోల్డ్మెడల్ కొందుర్గు: నగరంలోని యూసూప్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆల్ స్టైల్ కుంగ్ఫూ, కరాటే పోటీల్లో కొందుర్గు న్యూమాంక్స్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు మాస్టర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు అండర్–12 కటాస్ విభాగంలో ఎదిర అనసూయ గోల్డ్ మెడల్, అండర్–14 బాలికల ఫైరింగ్ విభాగంలో నహీద్ గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. బాలురు అండర్–16 ఫైరింగ్లో సాయితేజ గోల్డ్ మెడల్ సాధించగా అండర్–8 విభాగంలో ఎండీ ముజీబ్ ప్రతిభ చూపినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను న్యూమాంక్స్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్పటేల్, తెలంగా చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాల్రాజ్ అభినందించారు. సామాజిక అంశాలపై అవగాహన శంషాబాద్ రూరల్: మండలంలోని రామంజాపూర్లో సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థు లు శనివారం రాత్రి నాటిక ప్రదర్శనతో పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ‘కృతజ్ఞత విలువ–వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ’ అనే అంశంపై నాటకాన్ని ప్రదర్శించారు. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగాలను గుర్తించుకుని వృద్ధాప్యంలో వారిని గౌరవిస్తూ సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. -
ఫ్లైవుడ్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సలీమ్ గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్లై వుడ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఇందులో మల్టీ పర్పస్గా వెల్డింగ్, ప్లైవుడ్, సోఫాల తయారీతో పాటు మేకలు, కోళ్లను పెంచుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గోడౌన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ అగ్నిమాపక అధికారి చంద్రనాయక్ నేతృత్వంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే చాంద్రాయణగుట్ట నుంచి అగ్నిమాపక కేంద్రంతో పాటు గౌలిగూడ నుంచి రోబోటిక్ యంత్రాన్ని రంగంలోకి దించి మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని మూగజీవాలు మంటల్లో చిక్కుకుపోయి చనిపోయాయి. కోళ్లు, రెండు మేకలు మృతి చెందాయి. ప్రమాదానికి గల కారణంగా ఇంకా తెలియరాలేదని అగ్నిమాపక అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కాటేదాన్లో ఫైర్ వాహనాలు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో గౌలిగూడ నుంచి రోబోటిక్ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి మంటలు ఆర్పారు. -
జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
చేవెళ్ల: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏడాదికి రెండు జతల యునిఫాం, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 19, 20 తేదీలలో జిల్లాలోని తుర్కయంజాల్లో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చేవెళ్ల మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా జి.నరేశ్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ నరేశ్, కోశాధికారిగా సిద్దమ్మ, ఉపాధ్యాక్షులుగా దస్తగిరి, భాస్కర్, నర్సింలు, సహాయ కార్యదర్శులుగా జనార్ధన్, అఫ్జల్, మహేందర్, కిష్టయ్య, కమిటీ సభ్యులుగా మాణిక్యం, మల్లమ్మ, జంగమ్మ, అడివమ్మ, శివయ్య, శ్రీనివాస్ తదితరులను నియమించారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ఆమనగల్లు: ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను విస్మరిస్తోందని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.కిషన్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యూనియన్ ఆమనగల్లు విభాగం 3వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ మాట్లాడుతూ.. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని.. చాలీ చాలని వేతనాలతోనే నెట్టుకొస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. రెండవ పీఆర్సీలో రూ.26వేల కనీస వేతనం అమలు చేయాలని, 60 ఏళ్లు పైబడిన, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉపాధి కల్పించాలని.. రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇంజమూరి నర్సింహ, శివశంకర్, వగ్గు రవి, హంసమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా నర్సింహ, కోశాధికారిగా గోపాల్, ఉపాధ్యక్షురాలిగా హంసమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రశాంత్, సహాయ కార్యదర్శిగా గణేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విజయ్కుమార్, సభ్యులుగా యాదమ్మ, పద్మ, సుగుణమ్మ, సుధాకర్, చిట్టిబాబు, రాములు, శివ, శ్రీను నియమితులయ్యారు. -
వసూళ్ల పర్వం!
లొసుగుల ముసుగులో సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులు.. చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి పెద్దమొత్తంలో దోచుకుంటున్నారు. అనధికారిక వెంచర్లలో నాలా కన్వర్షన్ కాని ఖాళీ స్థలాలు, జీపీ లే అవుట్లలో ప్రజావసరాల కోసం వదిలిన పార్కు స్థలాలు, గ్రామ కంఠం భూముల్లో వెలసిన నిర్మాణాలు, లీగల్ హైర్లేని జీపీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వీరి పాలిట వరంగా మారాయి. దీంతో జిల్లాలోని పలువురు సబ్రిజిస్ట్రార్ల(ఎస్ఆర్ఓ)కు కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. మధ్యవర్తుల సాయంతో.. ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుండగా వీటిద్వారా ప్రభుత్వానికి రూ.360 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇప్పించుకుంటున్న కొంతమంది ఇందుకోసం పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు డాక్యుమెంటుకో రేట్ పెట్టి వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలా ఒక్క గండిపేటకే నలుగురు అధికారులు వచ్చివెళ్లారు. లీగల్ హైర్ లేని, పాత లే అవుట్లలో ఏలింకూ లేని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు రూ.పది లక్షల నుంచి రూ.పదిహేను లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గ్రామ కంఠం, అర్బన్ సీలింగ్, 111 జీఓ పరిధిలోని భూముల్లో వెలిసిన బహుళ అంతస్తుల భవనాల్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకోసం డాక్యుమెంట్ రైటర్లు, పర్సనల్ డ్రైవర్లను మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారు. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో మధ్యవర్తుల నుంచి సొమ్ము తీసుకెళ్తున్నారు. మచ్చుకు కొన్ని.. ● కోర్టు పరిధిలో ఉన్న సికిందర్గూడలో పది ఎకరాల వివాదాస్పద భూమికి రాత్రికి రాత్రే నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేయడం, ఓ తెల్ల కాగితంపై లే అవుట్ గీయడం, ఖాళీ ప్లాట్లకు బండ్లగూడ మున్సిపాలిటీ ఇంటి నంబర్లు జారీ చేయడం, ఆ వెంటనే 23 ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఇటీవల స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విలువైన ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ● లీగల్ హైర్ సర్టిఫికెట్ లేదనే సాకుతో రాళ్లగూడ ప్రకాశ్నగర్లోని 250 గజాల చొప్పున ఉన్న రెండు ఏజీపీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు శంషాబాద్ ఎస్ఆర్ఓ ఆరు మాసాల క్రితం రూ.2 లక్షలు వసూలు చేశారు. ● మెయినాబాద్ సర్వే నంబర్ 176/23లోని 0.33 ఎకరాల లావణి పట్టా భూమిని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ చేయించారని, ఈ భూములకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కూడా చేశారని, తమకు తెలియకుండా తమ భూములకు నాలా కన్వర్షన్ చేయించి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు నాగమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేదని ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 334, 335లో 5.12 ఎకరాల భూమి పోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్కు ఉండగా, 2023మార్చి 17న శంకర్పల్లి తహసీల్దార్ ఎండీ నయిమొద్దీన్ ద్వారా వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నారు. ఆ తర్వాత మరో నలుగురు వ్యక్తులు కలిసి దీనికి నకిలీ పత్రాలు సృష్టించి 25,652 గజాల స్థలాన్ని ఇతరులకు విక్రయించారు. ఈ భూమిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతూ అప్పటి జిల్లా రిజిస్ట్రార్ దొంత వెంకటేశ్వర ప్రసాద్ శంకర్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. అప్పటి హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్తో పాటు శ్రీనివాస్ కూడా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిపై వేటు వేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం ఆరు రోజుల్లోనే 220 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేశారు. ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ(2020 ఆగస్టు 26) తర్వాత వెలిసిన లే అవుట్లలోని ప్లాట్లకు అంతకు ముందు తేదీలు వేసి, 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసి, ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చారు. అయితే డాక్యుమెంట్లను స్కానింగ్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటికు పొక్కింది. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఫసియొద్దీన్తో పాటు మరో ఉద్యోగిపై వేటు వేశారు. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల గ్రామ కంఠం భూమి రిజిస్ట్రేషన్కు రూ.70 వేలు లంచంగా తీసుకుంటూ నాలుగు రోజుల క్రితం వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ను కూడా పట్టుబడటం గమనార్హం.ఆస్తుల రిజిస్ట్రేషన్లలో లోపించిన పారదర్శకత ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేటు అక్రమాలకు నిలయంగా పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏసీబీకి చిక్కుతున్నా మారని తీరు -
రైతుల కష్టం.. వర్షాలతో నష్టం
● చేతికొచ్చిన పంటలు నీటిపాలు ● ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు బషీరాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షాలకు పాడయ్యాయి. కోతకొచ్చిన పెసర, మినుము పంటలు నీటిపాలయ్యాయి. భారీ పెట్టుబడులతో సాగు చేసిన పత్తి పంటలు సగానికిపైగా నీట మునిగాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక బషీరాబాద్ మండల రైతులకు వర్షాధార పంటలే దిక్కు. వానాకాలంలో 32,728 ఎకరాల్లో పత్తి, కంది పెసర, మినుము పంటలు సాగుచేశారు. ఇందులో పత్తి 13,057 ఎకరాలు, కంది 14,885 ఎకరాలు, పెసర 1,269 మినుము 372 ఎకరాల్లో సాగు చేశారు. వారం క్రితం కురిసిన భారీ వర్షాలకు సగానికి పైగా పాడైనట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెసర, మినుము పంటలకు 90 శాతం నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగ్నా పరివాహక ప్రాంతాలైన మంతట్టి, కంసాన్పల్లి, జీవన్గి, క్యాద్గీరా, గంగ్వార్, నావంద్గి, ఇందర్చెడ్ పరిధిలో పత్తిపంటలు వదర ముంపునకు గురయ్యాయి. ఇదే విషయమై మండల వ్యవసాధికారిణి అనితను సంప్రదించగా పంటల నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. కాత మొలక వస్తోంది నాలుగు ఎకరాల్లో పెసర పంట సాగు చేశా. కోతకొచ్చే సమయంలో ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో పంట పాడైంది. 70 శాతం మేర పంట నష్టం వాటిళ్లింది. పొలంలో ఇప్పటికీ బురద ఉండడంతో పంట కోయడానికి సైతం వీలులేకుండా పోయింది. వర్షానికి తడిసి కాత మొలకెత్తుతోంది. గింజలు రంగుమారాయి. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి. –నర్సింలు, రైతు, కాశీంపూర్ కంది పంట పాడైంది కాగ్నానది పక్కన నాలుగు ఎకరాల్లో కంది పంట సాగు చేశా. భారీ వర్షాల కారణంగా కాగ్నానది ఉప్పొంగి పొలాలు వరద ముంపునకు గురయ్యాయి. కంది పంట పూర్తిగా పాడైంది. రూ.20 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఒక్క కంది మొలక మిగల లేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి. – భీంరెడ్డి, రైతు, నావంద్గి -
ప్రజాసేవే ఉద్యోగుల ధర్మం
మొయినాబాద్: ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల ధర్మమని.. ప్రజలతో కలిసి పనిచేసే ఉద్యోగులను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. మొయినాబాద్ పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహించిన గణేశ్ జూలై 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆదివారం మొయినాబాద్లో ఆయన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిషన్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగులకు సాధారణమే అయినా ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులన్నీ ఇలాంటిస సమయంలోనే గుర్తొస్తాయన్నారు. ప్రతి ఉద్యోగి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, పోలీసు సిబ్బంది, గణేశ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చేవెళ్ల ఏసీపీ కిషన్ -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
తాండూరు రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ సదానందం హెచ్చరించారు. శనివారం తాండూరులోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ సెంటర్ డాక్టర్లు, కాంపౌండర్లు, గోపాలమిత్రలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నా సర్దుబాటు చేసి పశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 34 డాక్టర్ పోస్టులకు గాను 10 ఖాళీగా ఉన్నాయన్నారు. 60 సబ్ సెంటర్లలో 35 కాంపౌండర్ పోస్టులు భర్తీ కాగా 25 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. విధులకు సక్రమంగా హాజరుకాని తాండూరు ఇన్చార్జ్ ఏడీఏపై చర్యలు తీసుకుంటామన్నారు.ఽ ధారూరు మండలం కుక్కింద సబ్ సెంటర్ కాంపౌండర్ను ఏడీఏ కార్యాలయానికి డిప్యూటేషన్ వేసినట్లు తెలిపారు. పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించారు. జీతాలు ఇప్పించండి సారూ.. ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నామని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ సదానందం కోరారు. జిల్లాలో 56 మంది గోపాలమిత్రలు పని చేస్తున్నారని, ప్రతి నెలా జీతం అందేలా చూడాలని విన్నవించారు. -
ధాన్యం సేకరణకు సిద్ధంకండి
అనంతగిరి: ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం వడ్ల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో లక్షా 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. ఇందులో దొడ్డు రకం 31,200 మెట్రిక్ టన్నులు, సన్న రకం 73,800 మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అన్ని యంత్రాలను, గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం, డీసీఎస్ఓ సుదర్శన్, డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, మార్కెటింగ్ అధికారి సారంగపాణి, డీసీఓ నాగార్జున, డీసీఎంఎస్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు మీసేవ కేంద్రం నిర్వాహకులు సర్టిఫికెట్ల జారీ విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని లింగ్యానాయక్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీసేవ కేంద్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన రసుం మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అలా కాకుండా ఎక్కువ తీసుకుంటే మీసేవ కేంద్రం గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మీసేవ కేంద్రాలను వ్యాపార పరంగా కాకుండా సేవా దృక్ఫథంతో నడపాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ ప్రజలు, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. అనుమతి పొందిన ప్రాంతాల్లోనే కేంద్రాలను నిర్వహించాలని, వేరే చోటికి మార్చాల్సి వస్తే అధికారుల నుంచి అనుమతి పొందాలని పేర్కొన్నారు. కేంద్రాల నిర్వహకులు ఇబ్బంది పెడితే 1100 కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో జిల్లా మేనేజర్ మహమూద్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
బాధ్యతగా పని చేద్దాం
● ప్రజా సమస్యలపై తక్షణం స్పందించాలి ● మున్సిపల్ కమిషనర్ యాదగిరి తాండూరు టౌన్: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. శనివారం మున్సిపల్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పాటు ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పనులను పెండింగ్లో ఉంచరాదన్నారు. వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. పన్నుల వసూలులో బిల్కలెక్టర్లు శ్రద్ధ వహించాలన్నారు. త్వరలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వార్డుల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. తాగునీటి సరఫరా సక్రమంగా జరిగాలని ఆదేశించారు. వెలగని వీధి దీపాలను తక్షణం మార్చి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అన్ని విభాగాలు సమన్వంతో పనిచేయాలని సూచించారు. పనితీరు సరిగ్గా లేకుంటే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు సన్నద్ధం కావాలి మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ పరిగి: విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం కావాలని మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ సూచించారు. శనివారం మండలంలోని జాఫర్పల్లి మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థుల ప్రగతి రిపోర్టు, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా చదవాలి పరిగి: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఇంటర్మీడియట్ జాయింట్ సెక్రటరీ జ్యోత్స్నరాణి అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే కష్టపడి చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్, మెడికల్ బోర్డు డీడీ విద్ద్యులత, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లను బాగు చేయండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి అనంతగిరి: మండలంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం రోడ్ల సమస్యలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వికారాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ నవీన్కుమార్, పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి, సెన్సార్ బోర్డ్ మెంబర్ బసవలింగం, మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, సుధాకర్, మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు గోపాల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల్లో రాజీపడం
అనంతగిరి: శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదిలేదని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై శనివారం జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకోకుండా తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పాఠశాలలకు వెళ్లి బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని సూచించారు. ఇది పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అధికారులు తమ సిబ్బందితో నిరంతరం సమావేశాలు నిర్వహించుకొని, పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలన్నారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారితో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారులు వారివారి పరిధిలో ప్రతి నెలా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, ప్రజలకు మరింత దగ్గర కావాలని సూచించారు. జిల్లాలో గ్యాంగ్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. -
విస్తరాకుల తయారీతో ఉపాధి
కుల్కచర్ల: ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సౌకర్యాలను చెంచు ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం మండలంలోని సాల్వీడు గ్రామంలో సయోధ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వరంలో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచుల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని జీవన విధానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. చెంచులకు అవసరమైన ధ్రువపత్రాలు వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. విస్తరాకుల తయారీ రంగంలో మరింత మందికి ఉపాధిని కల్పించేటా చూడాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, ఏపీడీ నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ రామకృష్ణ, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, చెంచు సంఘం నాయకులు పాల్గొన్నారు. -
వ్యసనాలకు లోనుకావొద్దు
దౌల్తాబాద్: విద్యార్థులు వ్యసనాలకు బానిసకారాదని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కొడంగల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీరాం సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతలు, హక్కులు, విధుల గురించి తెలుసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివిన చాలా మంది నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. మీరు కూడా భవిష్యత్లో ఆ స్థాయికి ఎదగా లని సూచించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. అనంతరం అడ్వకేట్లు చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అడ్వకేట్లు వెంకటయ్య, బస్వరాజ్, రమేష్, ప్రిన్సిపాల్ వసంత తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రమైన నీరందించాలి విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని న్యాయమూర్తి శ్రీరాం ప్రిన్సిపాల్కు సూచించారు. కళాశాలలోని ట్యాంక్ సరిగ్గా లేకపోవడంతో దాని గురించి ఆరా తీశారు. అనంతరం ప్రిన్సిపాల్ వసంత మాట్లాడుతూ.. దౌల్తాబాద్కు కళాశాల కొత్తగా మంజూరైందని తెలిపారు. ప్రస్తుతం నిధులు కేటాయింపు జరగలేదని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఫిల్టర్ నీరు అందిస్తున్నామని జడ్జికి వివరించారు. కళాశాలలో కొత్త ట్యాంక్ ఏర్పాటు చేయాలని సోమవారం కలెక్టరుకు లేఖ రాయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
ఆగిన ప్లాన్
మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ తయారీ ప్రారంభానికే పరిమితంవికారాబాద్: మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ సర్వే ప్రారంభానికే పరిమితమైంది. పది నెలల క్రితం ప్రక్రియ చేపట్టినా నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో మన జిల్లా నుంచే డిజిటల్ ప్లాన్కు రూపకల్పన చేశారు. అయితే అధికారుల వద్ద సర్వే ఎంత వరకు వచ్చిందనే సమాచారం లేకపోవడం గమనార్హం. మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం డ్రోన్లను వినియోగించింది. 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా డిజిటల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న పురపాలికల్లో సర్వే చేయాలని భావించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వికారాబాద్, తాండూరును ఎంపిక చేశారు. సర్వే ఆఫ్ ఇండియా వారు ముందుగా వికారాబాద్లో ఆ తర్వాత తాండూరులో సర్వే ప్రక్రియను ప్రారంభించారు. తాండూరులో విద్యుత్ తీగలు డ్రోన్కు తగిలి అది పేలిపోయింది. అంతటితో ప్రక్రియ ఆగిపోయింది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా డిజిటల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా.. మౌలిక సదుపాయాలుకల్పించాలన్నా.. నిర్మాణాలు చేయాలన్నా ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగపడేలా తయారు చేయాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ ఉపరితం ఎత్తు, చెరువులు, వాగులు, డ్రైనేజీలు, ఇళ్లు, చెట్లు,రోడ్లు, వైకుంఠధామాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, భవన సముదాయాలు, మార్కెట్లు, సెల్ టవర్లు, టాయిలెట్లు, వాటర్ ట్యాంకులు, రిజర్వాయర్లు తదితర వనరులన్నింటినీ మ్యాపింగ్ చేస్తారు. అనంతరం మ్యాపుల ఆధారంగా 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి మున్సిపాలిటీలకు అందజేస్తారు. భవిష్యత్ తరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. విడతల వారీగా..కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాండూరుకు రూ.27 కోట్లు, పరిగికి రూ.15.5 కోట్లు, వికారాబాద్కు రూ.12 కోట్లు, కొడంగల్కు రూ.4.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను వాటర్ సప్లయ్, తాగు నీటి వనరుల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఆధారంగా భవిష్యత్తులో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వనరులు, మార్కెట్లు, డంపింగ్ యార్డులు తదితర వాటికి ఈ ప్లానే ఆధారం కానుంది. -
‘అభయహస్తం’ సంచులు సిద్ధం
తాండూరు: రేషన్ బియ్యం లబ్ధిదారులకు ప్రత్యేక సంచులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన కాటన్, పేపర్తో తయారు చేసిన బ్యాగులు ఇప్పటికే తాండూరులోని ఎంఎల్ఎస్ పాయింట్కు చేరుకున్నాయి. నియోజకవర్గంలోని 66,321 మంది లబ్ధిదారులకు ఒక్కోటి చొప్పున అందజేయనున్నారు. బ్యాగులపై ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోతో పాటు ఇందిరాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను ముద్రించారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధంగా వీటిని రూపొందించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పర్యావరణ హితానికి ఇవి దోహదం చేస్తాయని గోదాం ఇన్చార్జ్ రవి తెలిపారు. నియోజకవర్గంలోని 249 రేషన్ దుకాణాల ద్వారా 1,200 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. -
మహిళలు స్వయం శక్తితో ఎదగాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని జిల్లా పట్టణ పేదరిక నిర్మూళన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.వెంకటనారాయణ అన్నారు. మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా స్వయం శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటనారాయణ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక ప్రగతితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. మహిళా స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేయడానికి దశల వారీగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. మహిళలను చైతన్యం చేసి స్వయం శక్తితో ఎదిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ, ఏడీఎంసీ అశోక్, చైతన్యం, మేనేజర్ రమేశ్, టీపీఓ అబీబున్నీసాబేగం, డీఈ స్వర్ణకుమార్, సీనియర్ అసిస్టెంట్ స్వప్న, స్వయం సహాయక సంఘాల మహిళలలు తదితరులు పాల్గొన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ -
బాలికల రక్షణకే షీటీం
ఎస్ఐ ప్రవీణ్ అనంతగిరి: బాలికల రక్షణ కోసమే షీటీం పని చేస్తుందని ఎస్ఐ ప్రవీణ్ అన్నారు. శనివారం వికారాబాద్ కేజీబీవీలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలిక లు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాక్షించారు. ఈవ్టీజింగ్కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పబ్లి క్ ప్రదేశాల్లో షీటీం పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోలో ప్రిన్సిపాల్ స్వరూప, సిబ్బంది బుచ్చేందర్, రేష్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
హరితం.. ఆహ్లాదం
● ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు అనువైన సమయం ● వనమహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ షాద్నగర్: ఇటీవల ఇంటి ఆవరణలో మొక్కల పెంపకంపై ఆకస్తి పెరిగింది. వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి అనువుగా ఉంటుంది. ప్రభుత్వం వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేస్తుంది. వాయుకాలుష్యంతో ముప్పు రోజు రోజుకు వాతావరణం కలుషితమవుతతోంది. చెట్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ధూళి కణాలు గాలిల్లో కలుస్తున్నాయి. ఫలితంగా ఇది ప్రజారోగ్యానికి శాపంగా మారింది. ప్రతి ఏటా వాయు కాలుష్యంతో పలువురు మృత్యువాత పడుతుండగా ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారు. మొక్కలు నాటడం ● వర్షాలు కురుస్తుండటంతో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటుకోవచ్చు. ● ఇండోర్ ప్లాంట్ల పై ఇటీవల ఆసక్తి కనబరుస్తున్నారు. ● మల్లె, చామంతి, గులాబీ, ఆర్కే ఫామ్, సైకస్, కాకస్, జెర్బరా, ఉసిరి, లిల్లీ, అశ్వగంధ, ఆర్బిడ్, క్రోటాన్, మనీప్లాంట్, స్నే ప్లాంట్, పుదీనా, తులసీ, అలోవెరా, సరస్వతీ తదితర రకాలు ఇంటి పరిసరాల్లో నాటుకోవచ్చు. ● జమ్మి, మేడి, ఉత్తరేణి, తెల్ల జిల్లేడు, దత్తాత్రేయ, మారేడు, గరిక, బ్రహ్మ కమలం, వంటి నవగ్రహాల మొక్కల సైతం నాటుకోవచ్చు. ● స్ధ్ధలం ఎక్కవగా ఉంటే మామిడి, సీతాఫలం, జామ, వాటర్ ఆపిల్, బత్తాయి, జామ, దానిమ్మ, వంటి పండ్ల మొక్కలను నాటొచ్చు. కురగాయలకు ఎండే అండ నేల పై లేదా ఇంటి మేడ పై ప్లాస్టిక్ గ్రో బ్యాగులు, సిమెంట్ కుండీల్లో, పాత బకెట్లు, రంజన్లలో మొక్కలు పెంచుకోవచ్చు. అద్దె ఇంటిలో ఉంటున్న వారు కుండీల్లో పెంచితే మరో చోటుకు సులభంగా తరలించవచ్చు. తీగ జాతి మొక్కలతో చిన్న మొక్కలకు ఇబ్బంది రాకుండా తాళ్ల సాయంతో పైకి పాకించాలి. చీడ పీడలు ఆశిస్తే వేపనూనె లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్, మోనోక్రోటోపాస్ కలిపిన మిశ్రమాన్ని మొక్కల పై పిచికారీ చేయాలి. రోజులో కనీసం ఆరు గంటలు సూర్వరశ్మి తగిలే ప్రాంతాల్లో టమాట, బీర, బెండ, పొట్ల, చిక్కుడు, కాకర, వంకాయ, మిరపలతో పాటు ఆకు కూరల సాగుకు అనుకూలంగా ఉంటుంది. మట్టి ఎప్పుడు మార్చాలంటే.. ● ప్రతీ రెండేళ్లకు వానాకాలం ఆరంభంలో కుండీల్లోని మట్టిని మార్చాలి. ● ఎర్ర మట్టి లేదా సారవంతమైన మన్ను, ఇసుక, పశువుల పేడ, వర్మికంపోస్టు, ఎండుటాకులు, రంపపు పొట్టు, బొగ్గు, లిండేన్ పొడిని కలిపి కుండీల్లో నింపుకోవాలి. ● కుండీల్లో తయారయ్యే అమ్మోనియాన్ని బొగ్గు పీల్చేస్తుంది. లిండేన్ పొడి పురుగులను చంపుతుంది. ఇసుక, ఆకులు, రంపపు పొట్టు నేలలో గాలి ప్రసరణకు, తేమను నిలిపేందుకు దోహదపడతాయి. ● అతి తక్కువ పరిమాణంలో యూరియా, డీఏపీ, పొటాష్, జింక్ కలిసి వేయాలి ● నీటిలో కరిగే ఎరువులను మొక్కల పై పిచికారి చేయాలి. కుండీల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరు భాగపస్వామ్యం కావాలి. వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా పూలు, పండ్ల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం. ప్రతీ ఒక్కరు మొక్కలు, నాటడంతో పాటుగా వాటిని కాపాడాలి. – సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్ -
ఆక్రమణలు తొలగించిన హైడ్రా
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి సర్వే నంబర్ 201లోని శ్రీ సూర్య సాయి నగర్లో పార్కు ఆక్రమణలను శనివారం హైడ్రా అధికారుల బృందం కూల్చివేసింది. కాలనీలోని 482 గజాల విస్తీర్ణంలో 283, 284 నంబర్ ప్లాట్లను 2018లో మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయినప్పటికీ కొందరు స్థానికులు ప్రహరీ నిర్మించి ఆక్రమించారు. దీనిపై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. తాజాగా హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పార్కు స్థలంలోని నిర్మాణాలను కూల్చివేశారు. కొలతలు వేసి, మున్సిపల్ అధికారుల చేత బోర్డు ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాము 20 ఏళ్లుగా సర్వే నంబర్ 159లో కబ్జాలో ఉన్నామని, గతంలో హైడ్రా నుంచి నోటీసులు వచ్చినప్పటికీ రిప్లై ఇచ్చామని, అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని కబ్జాలో ఉన్న రైతులు వాపోయారు. గతంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉందని గుర్తు చేశారు. హైడ్రా ఏడీ సర్వే చేపట్టి రిపోర్టు ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రీకాస్టు వాల్ తొలగింపు ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. రోడ్డుకు అడ్డంగా వేసిన ప్రీకాస్టు వాల్ తొలగించి రోడ్డుకు విముక్తి కల్పించారు. మున్సిపల్ కేంద్రంలోని బీరప్ప గుడికి సమీపంలో చక్రధర వెంచర్లో రోడ్డుకు అడ్డంగా కొంతమంది ప్రీకాస్టు వాల్ నిర్మించారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లడంతో శనివారం హైడ్రా సీఐ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీలతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా సీఐ తిరుమలేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పనులు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. నిర్భయంగా హైడ్రాను సంప్రదిస్తే తగున్యాయం చేస్తామని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన
డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్, ఎంఈఓ రాంరెడ్డి దుద్యాల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన, మౌలిక సదుపాయాలు ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్, ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. శనివారం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం, అంగడిరాయిచూర్, ధర్మపూర్, టేకుల్కోడ్, అన్నారం, పాటిమీదిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటిపై గంజాయి మొక్కల సాగు నిందితుడికి రిమాండ్ మోమిన్పేట: ఇంటి డాబాపై గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ సహదేవుడు తెలిపారు. గ్రామానికి చెందిన బూర్జుగడ్డ మహ్మద్ ఫతేబాబా తన ఇంటిపై రెండు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు శనివారం తమ సిబ్బందితో వెళ్లి రెండు మొక్కలు సాగు చేసినట్లు గుర్తించాం. వాటిని స్వాధీనం చేసుకుని ఫతేబాబాను రిమాండ్కు తరలించామని ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. శనీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నవాబుపేట: మోమిన్పేట్ మండలం ఎన్కతల గ్రామంలో వెలసిన శనీశ్వర ఆలయంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. టాక్టర్ను ఢీకొట్టిన బైక్ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు పరిగి: ఇనుప చువ్వలు తరలిస్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని రూప్ఖాన్పేట గేటు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారంగాజులకుంట తండాకు చెందిన రాములు నాయక్ మండల కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను గమనించకపోవడంతో బైక్తో ట్రాక్టర్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే విషయమై పోలీసులను సంపద్రించగా ప్రమాద విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ బొంరాస్పేట: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై బాల వెంకటరమణ తెలిపిన ప్రకారం.. మహంతీపూర్కు చెందిన తిరుపతి లాలప్ప శనివారం తన ట్రాక్టరులో వాగునుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు జానకంపల్లి వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఇబ్రహీంపట్నం: వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్లో డివిజన్ స్థాయిలో గణేశ్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. శాంతియుతంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల, ఫార్మాసిటీ, ఆధిబట్ల, మాడ్గుల సీఐలు, విద్యుత్ ఏఈ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి -
24.12 ఎకరాలకు ఫెన్సింగ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్ రెవెన్యూ తుక్కుగూడ పరిధిలోని వర్టెక్స్ వెంచర్ సమీపం సర్వే నెంబర్ 68, 70, 71, 73, 85, 86లో ఉన్న 24.12 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు పోలీసుల సహకారంతో శనివారం చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ చేశారు. గతంలో ఈ భూమిని ప్రభుత్వం తుక్కుగూడలో భూమి లేని పేదలకు పంపిణీ చేసింది. సదరు భూమిని రైతులు ఓ రియల్ వ్యాపారికి విక్రయించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పీఓటీ నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి చుట్టూ పోలీసుల సహకారంతో రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పలువురు రియల్ వ్యాపారులు రెవెన్యూ, హెచ్ఎండీఓ అధికారులకు అడ్డుతగిలి మా పట్టా భూమిని స్వాధీనం చేసుకోవద్దంటూ వాగ్వావాదానికి దిగారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేస్తున్నామని, పట్టా భూమి జోలికి రావడం లేదని సర్ది చెప్పారు. పట్టా భూమి ఉంటే సర్వే చేసి కొలిచి చూపుతామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి చుట్టూ పోలీసుల పహారాలో ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, సీలింగ్ భూములను విక్రయిస్తే పీఓటీ కింద ప్రభుత్వం సాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, హెచ్ఎండీఓ తహసీల్దార్ దివ్య, హెచ్ఎండీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్, మహేశ్వరం డిప్యూటీ తహసీల్దార్ నరేశ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన రియల్టర్లు -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబుపేట మండలం దాతాపూర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పశువుల పాక పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఎల్లకొండ గ్రామంలో పశువుల పాక నిర్మాణానికి పంచాయత్రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ బుచ్చయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఏపీఓ లక్ష్మిదేవి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎక్బాల్, నాగిరెడ్డి, బల్వంత్రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య పరిగి: పట్టణంలోని అడ్డా కార్మికుల సమస్యల ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య కోరారు. శుక్రవారం అడ్డా కార్మికులతో మాట్లాడారు. పరిగి పట్టణంలో వందలాది మంది అడ్డా కార్మికులు ఉన్నారని తెలిపారు. వారికి కనీస సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పని చేయడం ద్వారా ప్రభుత్వానికి నిత్యం టాక్స్ రూపంలో కోట్లాది రూపాయలు వస్తోందన్నారు. కానీ వారి సంక్షేమం గురించి పట్టుంచుకోవడం లేదని తెలిపారు. మహిళా కార్మికులు పని కోసం అడ్డా వద్దకు వస్తే వారికి మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బంది పడుతు న్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. చాలా మంది కార్మికులు లేబర్ ఇన్సూరెన్స్ చేసుకోవడం లేదని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు హ బీబ్, సత్తయ్య, రఘురాం, శ్రీను, జగదీష్, బాబయ్య, నర్సింహులు పాల్గొన్నారు. ఉత్సవాలుప్రశాంతంగా జరగాలి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు టౌన్: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు డీఎస్పీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారు విధిగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు నిషేధమన్నారు. ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సిములు మాట్లాడుతూ.. ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగేలా సమితి తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈసారి నాల్గవ రోజే వినాయక లడ్డూ వేలం పాట ఉంటుందన్నారు. లడ్డూ ద క్కించుకున్న వారు ఐదవ రోజు పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూను తీసుకెళ్లాలన్నారు. దీనివల్ల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తి చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు. అనంతరం సమితి సభ్యులు డీఎస్పీ, పట్టణ సీఐ సంతోష్ కుమార్ను ఘనంగా సన్మానించారు. 25న సత్యాగ్రహ దీక్ష తాండూరు టౌన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేష న్లు కల్పించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇదే అంశంపై ఈనెల 25న హైదరాబాద్లో జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తలపెట్టిన సత్యా గ్రహ దీక్షను విజయవంతం చేయాలని కోరారు. -
నేవీ రాడార్ పనుల పరిశీలన
పూడూర్: మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో జరుగుతున్న నేవీ రాడార్స్టేషన్ పనులను శుక్రవారం భారత నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీకి ప్రశంసాపత్రం అనంతగిరి: అంకితభావంతో విధులు నిర్వహించినందుకు గాను ఎస్పీ నారాయణరెడ్డికి భారత నౌకాదళం ప్రశంసాపత్రం అందజేసింది. శుక్రవా రం దామగుండంలో నౌకాదళ ఉప అధికారి, వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ఎస్పీకి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు
తాండూరు రూరల్: స్థానిక సంస్థలకు త్వరగా ఎన్ని కలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు. సెప్టెంబరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండపల్లి, సిద్దన్న మడుగు తండా, ఇందూర్ గ్రామాల్లో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పాలన స్తంభించి పోయిందని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనుల జాతరలో కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గానికి రూ.8 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్లను బాగు చేయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమన్నారు. నిజమైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.6 కోట్లతో ఇందూరు – పెద్దేముల్ వరకు బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు రూ.100 కోట్లు మంజూరైనట్లు పేర్కొ న్నారు. కొంత మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వారి మార్పు రావాలని అన్నారు. తాండూరు మున్సిపాలిటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను వెంటనే బదిలీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తట్టెపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, సీడీపీఓ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో వసతులు కల్పిస్తాం యాలాల: గ్రామాల్లో వసతుల కల్పనే లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం జుంటుపల్లి, పగిడిపల్లి, ముకుందాపూర్ గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షుడు బీమప్ప, బీ బ్లాక్ అధ్యక్షుడు అనిల్కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ డైరెక్టర్ రాజు, నాయకులు హన్మంతు, అక్బర్బాబా, మహిపాల్, చంద్రశేఖర్గౌడ్, మల్లప్ప, విజయ్ పాల్గొన్నారు. -
అన్నదాత అరిగోస
యూరియా కోసం దుకాణాల వద్ద క్యూ వికారాబాద్: ఎరువుల కొరత లేదని అధికారులు అంటున్నా ఫెర్టిలైజర్ దుకాణాలు, ఆగ్రోస్, డీసీఎంఎస్, పీఏసీఎస్ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. నిత్యం రైతులు పడరాని పాట్లు పడుతు న్నారు. ఎరువుల విక్రయాల్లో ప్రైవేటు డీలర్లు మాయాజాలం సృష్టిస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో యూరియా నిల్వలు తక్కువగా ఉండటంతో వారు చేతులెత్తేస్తున్నారు. ఐదు ఎకరాల పొలం ఉన్న రైతుకు ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తంలో నిల్వలు ఉన్నా ఎంత స్టాక్ ఉందో చెప్పడం లేదు. నోటీసు బోర్డులో వివరాలు పొందుపరచడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీలకు నామమాత్రంగా కేటాయించి ప్రైవేటు డీలర్లకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యవసాయాధికారులు డీలర్లతో కుమ్మక్కవటంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. యూరియా కోసం అవస్థలు ఎరువుల కొరత రైతన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పది రోజుల తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖంపట్టడంతో యూరియా కొనుగోలుకు రైతులు ఎగబడుతున్నారు. ఫెర్టిలైజన్ దుకాణాల్లో స్టాకు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇస్తుండటంతో మళ్లీ మళ్లీ కొనేందుకు వస్తున్నారు. ప్రస్తుతం పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలకు పైపాటిగా ఎరువులు వేస్తున్నారు. ఇదే సమయంలో వరినాట్లు కూడా ముమ్మరంగా వేశారు. ఈ పరిస్థితుల్లో యూరియాకు డిమాండ్ పెరిగింది. జిల్లాకు అవసరమైన ఎరువుల్లో 25 శాతం కూడా అందుబాటులో లేవని తెలిసింది. ప్రైవేటు డీలర్ల వద్దే.. జిల్లాలో ఎరువుల అవసరం కొండంత ఉంటే అందుబాటులో ఉన్నది గోరంత మాత్రమే. ప్రస్తుతం 5,00,435 ఎకరాల్లో ఆయా పంటలు వేశారు. ఇందుకు 1,13,851 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 6,230 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 39,898 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుతం 1,138 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇందులో ప్రైవేటు డీలర్ల దగ్గర 876 మెట్రిక్ టన్నులు, ఆయా సొసైటీల వద్ద 261 మెట్రిక్ టన్నులు ఉంది. ప్రైవేటు డీలర్ల వద్ద 5,314 మెట్రిక్ టన్నులు సొసైటీల వద్ద 916 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఇలా ఉన్న వాటిలో ఎక్కువ శాతం ప్రైవేటు డీలర్లకే కేటాయించారు. డిమాండ్ ఎక్కువగా ఉంది జిల్లాలో ఎంత మేర ఎరువులు కావాలో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రస్తుత అవసరాలకు ఎలాంటి కొరత లేదు. డిమాండ్ ఎక్కువగా ఉంది. అవసరం మేరకు డీఏపీ, యూరియాని అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏరోజుకారోజు తెప్పించి పంపిణీ చేస్తున్నాం. – రాజరత్నం, జిల్లా వ్యవసాయాధికారి -
హామీలన్నీ అమలు చేస్తున్నాం
అనంతగిరి: బురాన్పల్లిని దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆ గ్రామంలో పనుల జాతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.63 లక్షలతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బురాన్పల్లి వరకు ఆరు కొత్త బీటీ రోడ్లు, మరో రూ.63 లక్షలతో బురాన్పల్లి – ధన్నారం బీడీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం రూ. 6వేల కోట్లు అప్పు చేసిందని, వీటికి రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. అయినా సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరించి భూములు లేని పేదలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని తహసీల్దార్కు సూచించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన మొక్కలు నాటేందుకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్ కుమార్, పంచాయత్ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి దయానంద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, నాయకులు మనోహర్గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడికి ముందస్తు చర్యలు
యాలాల: నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నూతన బోరును వేయించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ముద్దాయిపేటలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పనుల జాతరలో భాగంగా కొత్తగా వేసిన బోరుకు మోటారు బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మంజూరు చేసిన డీఎంఎఫ్టీ రూ.2.50లక్షక్షల నిధులతో గ్రామంలో కొత్త బోరు, మోటారు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్కుమార్, నాయకులు ఆరిఫ్ హుస్సేన్, వెంకటయ్యగౌడ్, మురళీగౌడ్, గోపాల్నాయక్, వాటర్మెన్ ఫరీద్ తదితరులు ఉన్నారు. -
మండపాలకు అనుమతులు తప్పనిసరి
బంట్వారం ఎస్ఐ విమల బంట్వారం: గణేశ్ మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని బంట్వారం ఎస్ఐ విమల పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఉత్సవ కమిటీలు పోలీసుల నియమాలను పాటించాలన్నారు. మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ రూల్స్తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యేకంగా డీజేలకు అనుమతిలేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్కో అధికారుల అనుమతి ఉండాలన్నారు. మండపాల్లో అనుమానిత బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దోమ: అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ నేత, దోమ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోప్పుల నాగిరెడ్డిని విచారణలో భాగంగా పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గురువారం మొదటి రోజు చన్గోముల్ పీఎస్కు తీసుకువచ్చిన ఆయనను అక్రమ మైనింగ్ ఎలా తీశారు? అనే కోణంలో తన తరఫు లాయర్ల సమక్షంలో పోలీసులు విచారణ చేశారు. శుక్రవారం సీన్ రీ కన్న్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు దిర్సంపల్లికి తీసుకువచ్చారు. ఏ ఏ ప్రాంతంలో మైనింగ్ జరిపారు? ఎంత మేరకు తీశారు? అనే కోణంలో ప్రశ్నించారు. తదనంతరం అక్కడి నుంచి పీఎస్కు తరలించారు. కుల్కచర్ల: మండల పరిధిలోని బండవెల్కిచర్లలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పాంబండ దేవాలయంలో ఓ పాము ప్రత్యేక్షమైంది. శుక్రవారం నాగుపాము ఆలయంలోనికి ప్రవేశించి పడగ విప్పింది. దీంతో ఆలయానికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు ముందుగా భయభ్రాంతులకు గురికాగా, ఆ తర్వాత పాము పడగ విప్పడంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోకి సర్పం రావడంతో నిష్టతో భక్తులు పూజలు చేశారు. కొద్దిసేపటికి ఆలయ సిబ్బంది పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ధారూరు: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి సూచించారు. మండలంలోని కుక్కింద గ్రామంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు, ప్రజా సమస్యలను కాంగ్రెస్ గాలికి వదిలివేసిందన్నారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు భీంసేన్చారీ, లక్ష్మయ్య, వేణుగోపాల్రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. పూడూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని డీఎల్పీఓ సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఎన్కేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని రెండు వందలకు పైగా ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతిఒక్కరూ హౌసింగ్ అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: నిషేధిత పొగాకు విక్రయాలపై ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు దాడి చేశారు. భారీ ఎత్తున పొగాకు, గుట్కా నిల్వలను సీజ్ చేశారు. ఈ ఘటన ఆదిబట్ల ఠాణా పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆదిబట్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఎక్స్రోడ్డు వద్ద మాతాజీ కిరాణం జనరల్ స్టోర్లో అక్రమంగా నిషేదిత గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారంతో మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిషేధిత పాన్మసాల నిల్వలను సీజ్ చేశారు. బొల్లారం కుమావత్, రాజ్కుమార్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
నాలుగు లేన్ల రోడ్లకు ప్రత్యేక కృషి
పరిగి: రాష్ట్రంలోని నలుమూలల నుంచి నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి తెలిపారు. అప్ప జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు జరుగుతున్న నేషన్ హైవే విస్తరణ పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.1,050 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. హైవే నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలిగా యన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యూనల్లో కేసు వేసిన పర్యావరణ వేత్తలు కేసు ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారన్నారు. మన్నేగూడ నుంచి రావులపల్లి వరకు రూ.1,000 కోట్లతో నాలుగు లేన్ల రహదారి మంజూరైందన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత కుల్కచర్ల: క్రీడలతో మానసిక ప్రశాంతత పొందవచ్చని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్లలో జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎంపీఓ భాస్కర్ గౌడ్ తన తల్లి ఈడిగి యాదమ్మ జ్ఞాపకార్థంతెచ్చిన దుస్తులను ఎమ్మెల్యేతో క్రీడాకారులకు అందజేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులకు చెక్
తాండూరు టౌన్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులను నివారించవచ్చని మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. డ్రైడేను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. దోమల నివారణకు రసాయనాల పిచికారీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు, మురు గు కాలువలను శుభ్రం చేయించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. టైర్లు, కొబ్బరి బొండాలు, పూల కుండీలు తదితర వాటిలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ శా నిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన కమిషనర్ తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న బి.యాదగిరి శుక్రవారం కలెక్టర్ ప్రతీక్జైన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీలో సమస్యలు లేకుండా చూడాలని, ప్రజలకు సత్వర సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. -
పారిశుద్ధ్యం లోపిస్తే వ్యాధుల విజృంభణ
తాండూరు: పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిఽధిలోని సాయిపూర్, 11వ వార్డు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 100 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా పారిశుద్ధ్య పనులను కార్మికులతో ముందుండి చేయించారు. మురుగు కాల్వల్లో చెత్త లేకుండా నిత్యం శుభ్రం చేయాలన్నారు. వర్షాకాల సీజన్ కావడంతో పారిశుద్ధ్యం లోపిస్తే సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. వీధుల్లో చెత్త వేసి పరిసరాలను అపరిశుభ్రంగా మార్చకుండా సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ ప్రవీణ్, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది శ్రీనివాస్, వీరన్న పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి -
వేగంగా అభివృద్ధి పనులు
దుద్యాల్: ప్రభుత్వ అభివృద్ధి పనుల నిర్మాణాలు వేగంగా కొనసాగించాలని కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని హకీంపేట్ గ్రామంలోని కొనసాగుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ నామునాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరగా భవనాలు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఏఈ సురేందర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీనివాస్, సాయిలు, రాజు పాల్గొన్నారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి -
ఫోర్జరీ కేసులో కొనసాగుతున్న విచారణ
తాండూరు: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళ దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిడ్ డబ్బులను ఫోర్జరీ చేసిన ఘటనలో విచారణను వేగవంతం చేశామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం డీఎస్పీ, బ్యాంకు మేనేజర్లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. తాండూరు ప్రాంతానికి చెందిన విశాలాక్షి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2008లో రూ.2.89 లక్షలు డిపాజిట్ చేసిందన్నారు. మూడేళ్ల తర్వాత అదే బ్యాంకులో మరో రూ.3.15 లక్షలను డిపాజిట్ చేసిందన్నారు. బాండ్ల గడువు ముగియడంతో డబ్బులను తీసుకొనేందుకు గత నెల 29వ తేదీన మహిళ బ్యాంకుకు కోరడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చిందన్నారు. అప్పట్లో డెక్కన్ గ్రామీణ బ్యాంకుగా సేవలు అందిస్తోంది. ఆన్లైన్ విధానం రావడంతో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. 2022 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్సింగ్పై అనుమానం రావడంతో ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి -
భారతి సిమెంట్కు తిరుగులేదు
తాండూరు: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్తో నిర్మాణాల వేగంగా పూర్తవుతాయని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండర్లో సబ్ డీలర్లకు భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ 5 స్టార్ గ్రేడ్తో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన సిమెంట్పై డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతోందన్నారు. ప్రధానంగా స్లాబులకు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు ఎంతో మన్నికగా ఉంటుందన్నారు. అల్టాఫాస్ట్ సిమెంట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందిస్తామన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిష్ణాతులైన ఇంజినీర్లను సైట్ వద్దకే వచ్చి సహయ పడతారన్నారు. అనంతరం డీలర్లు మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సంస్థ ప్రతినిధులు సేవలు చాలా పాస్ట్గా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ సతీష్ రాజు, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి, టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్, భారతి సిమెంట్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ -
బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
కొడంగల్ రూరల్: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సేవ్ హైదరాబాద్లో భాగంగా సచివాలయ ముట్టడికి తరలుతున్న నాయకులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా వెళుతున్న తమని అరెస్టు చేయడం అన్యాయమని పలువురు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో గంటి సర్వేష్కుమార్, కరాటే శ్రీనివాస్, సాయికుమార్, అరుణ్, అనిల్ తదితరులున్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి దోమ: అక్రమ అరెస్టుతో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన పథకాలను ఆపలేరని బీజేపీ మండల అధ్యక్షుడు బొంగు మల్లేశ్ మండిపడ్డారు. శుక్రవారం మండలం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు చలో సచివాలయానికి వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారన్నారు. ఇప్పటికై నా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు. లేని పక్షంలో గ్రామాలలో ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి పూడూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సినిమా సెన్సార్బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేవైఎం పూడూరు మండల అధ్యక్షుడు నవీన్జోషి, జిల్లా కార్యవర్గ సబ్యుడు శ్రీశైలం, బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, జంగయ్యలను అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులు అన్యాయం దౌల్తాబాద్: హైదరాబాద్లో సచివాలయ ముట్టడికి బయలుదేరుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ హైదరాబాద్లోని సెక్రెటరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందుకు ముందస్తుగా నాయకులను అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, నేతలు సములప్ప, సురేష్, మొహన్రెడ్డి, ప్రభాకర్ తదితరులున్నారు. అరెస్ట్లు అప్రజాస్వామికం కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండకట్టేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాటన్పల్లి అంజిలయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పిలుపు మేరకు చలో సచివాలయ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని అన్నారు. వెంటనే బీసీ రిజర్వేషన్ల ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
ఇదేం రహదారి!
● వర్షాలతో బురదమయం ● అవస్థలు పడుతున్న వాహనదారులు ● నత్తనడకన హైవే పనులు ● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ తాండూరు రూరల్: మండలంలో నిర్మిస్తున్న హైవే రోడ్డును చూసి జనాలు విసిగిపోతున్నారు. మహబూబ్నగర్ నుంచి కర్ణాటక రాష్ట్రం మన్నెకెళ్లి వరకు జాతీయ రహదారి నంబరు 167 నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు 15 కిలో మీటర్లమేర రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. అసంపూర్తిగా రహదారి పనులు కొనసాగడంతో మండల ప్రజలతో పాటు కర్ణాటకకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షానికి హైవే రోడ్డంతా బురదమయమైంది. ముఖ్యంగా అల్లాపూర్ బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇక రాత్రి సమయంలో గుంతలు కనిపించకపోవడంతో భయందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు జాతీయ రహదారిపై నరకం చూస్తున్నామని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా హైవే అధికారులు, కాంట్రాక్టర్లు చొరవచూపి హైవే పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గణేశ్ ఉత్సవాల్లో పొరపాట్లు జరగొద్దు
తాండూరు: వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులకు సూచించారు. శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు స్వప్న పరిమళ్, కార్యదర్శి పట్లోళ్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
ధర్నాను విజయవంతం చేయండి
తాండూరు రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల వినోద్కుమార్, పురుషోత్తరంరెడ్డిలు పేర్కొన్నారు. బెల్కటూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహాధర్నాకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. పాత సీపీఎస్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాంనర్సిహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలి దోమ: సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సీపీఎస్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్ దగ్గర సెప్టెంబర్ 1వ తేదీన జరిగే మహాధర్నా వాల్పోస్టర్ ఆ సంఘం నేతలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రవేశపెట్టిన సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. -
వీడిన ఆలయాల చోరీ కేసు
యాలాల: మండల పరిధిలోని సంగెంకుర్దు శివారులో గల సంగమేశ్వరాలయం, శనీశ్వర ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం రాత్రి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నగేష్ వివరాలు వెల్లడించారు. యాలాల గ్రామానికి చెందిన బోయిని హరీష్, ఉప్పరి అరవింద్ స్నేహితులు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి ప్లాన్ చేశారు. ఈ నెల 19న సంగెంకుర్దు శివారులో ఉన్న సంగమేశ్వరాలయం, శనీశ్వరాలయంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి చోరీకి వెళ్లే సమయంలో తమ వెంట ఒక సుత్తి, ఐరన్రాడ్, వంటలకు వినియోగించే గరిటేను తీసుకెళ్లారు. వాటితో ఆలయ ప్రధాన గేటు తాళం పగులగ్గొట్టి లోనికి వెళ్లారు. ఆలయ ఆవరణలో ఉన్న హుండీ తాళం విరగ్గొట్టి రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న శనీశ్వరాలయంలోకి వెళ్లి అక్కడి హుండీ తాళం విరగ్గొట్టి రూ.10వేల నగదుతో హైదరాబాద్కు ఉడాయించారు. చోరీ ఘటన అనంతరం ఫిర్యాదు అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానితులైన వీరిని అదుపులోకి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి చోరి సొత్తులో రూ.8 వేలు ఖర్చు కాగా, రూ.22వేలతో కొనుగోలు చేసిన సౌండ్ సిస్టంకు వినియోగించే (ఆంప్లిఫైర్)స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విఠల్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దస్తప్ప, కానిస్టేబుళ్లు నరేష్, వెంకటయ్య ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలింపు కేసు వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ నగేష్ -
తెగిన రోడ్డు.. రాకపోకలకు పాట్లు
● కొత్త బ్రిడ్జి నిర్మాణం వద్ద కొట్టుకుపోయిన రహదారి ● మండలవాసుల నరకయాతన బొంరాస్పేట: భారీ వానలకు రహదారి కొట్టుకుపోవడంతో మండలవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి నుంచి మండల కేంద్రానికి ఉన్న ప్రధాన రోడ్డు ఇటీవల వానలకు తెగిపోయింది. ఈ మార్గంలో చెరువు అలుగు పారే చోట నూతనంగా డబుల్ వే వంతెన నిర్మిస్తున్నారు. తాత్కాలికంగా పాత రోడ్డు నుంచి నిత్యం రాకపోకలు జరిగేవి. కాగా ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలకు వాగు ఉధృతంగా పొంగి పాత రోడ్డు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యం మండల కేంద్రానికి వెళ్లాలంటే వాహనదారులు బుర్రితండా, మెట్లకుంట మీదుగా 6కి.మీ దూరం నుంచి తిరిగి వస్తున్నారు. దూరభారంతో మండల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని పేర్కొంటున్నారు. ఆటోవాలా.. దివాలా మండల కేంద్రానికి నిత్యం ప్రజల రాకపోకలతో రవాణా చేసేందుకు మెట్లకుంట, తుంకిమెట్ల, పలు తండాలకు చెందిన సుమారు 30 ఆటోలున్నాయి. రహదారి బంద్ కావడంతో ఆటోవాలాలు రోజంతా దివాలా తీస్తున్నామని వాపోతున్నారు. దూరం గ్రామాల నుంచి వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదంటున్నారు. దీంతో రోజు గడవడమే అగమ్యగోచరంగా మారింది. మండల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన పరిశీలన మండల ప్రజల అవస్థలు తీర్చేందుకు రాష్ట్ర ఈజీఎస్ కమిషన్ సభ్యుడు నర్సింలుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి చొరవ తీసుకున్నారు. గురువారం సంబంధిత అధికారులతో వంతెనను పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం సంపూర్ణం కాలేదని, మరిన్ని పనులు కొనసాగుతున్నాయని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక ప్రత్యామ్నాయానికి చర్యలు చేపడతామన్నారు. మండల ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న అవస్థలను అధికారులకు వివరించారు. క్యూరింగ్ సమయం పూర్తికాలేదన్నారు. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతింటుందన్నారు. మరో ఐదు రోజుల్లో కొత్త వంతెనను వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
హిందూ ఉత్సవ సమితికి అండ
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హామీ తాండూరు టౌన్: హిందూ ఉత్సవ కేంద్ర సమితికి తాము వెన్నంటి ఉంటామని మండలి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. గురువారం నూతనంగా నియామకమైన తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి కార్యవర్గం మర్యాద పూర్వకంగా హైదరాబాద్లో వారిని వేర్వేరుగా కలిశారు. ఈసందర్భంగా హిందూ సంప్రదాయ పండగల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సిములు మాట్లాడుతూ.. సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు కార్యక్రమాలకు, భవన నిర్మాణానికి తదితరాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఒక విడత నిధులు మంజూరు చేశారని, విడతల వారీగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తామన్నారని చెప్పారు. అలాగే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయానికి వెళ్లగా, ఆయన అందుబాటులో లేరని తెలిపారు. కార్యక్రమంలో సమితి కోశాధికారి సంతోష్కుమార్, ఉపాధ్యక్షులు పరమేశ్వర్, శ్రీకాంత్రెడ్డి, అధికార ప్రతినిధులు రామకృష్ణ, అశోక్, గోపాల్, కుమార్ తదితరులు ఉన్నారు. -
ఉద్యాన పంటల్లో సస్యరక్షణ
కృషి విజ్ఞాన్ కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ కందుకూరు: ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలైన టమాటా, బెండ, వంగ, కాకర, జామ వంటి తదితర పంటల్లో ప్రధాన సమస్యలను ఉద్యాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు, పురుగులు, వాటి నివారణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన అంశాలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై కృషి విజ్ఞాన్ కేంద్రం క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ముందస్తు రక్షణ చర్యలివే సూక్ష్మజీవుల మిశ్రమం యొక్క అప్లికేషన్ అనగా ట్రైకోడెర్మా, సూడోమోస్, పెసెలోమైసెస్, అజాటోబాక్టర్, ఫాస్ఫో బాక్టీరియా, ఫోటాస్ బాక్టీరియా, జింక్ బాక్టీరియాలను మొక్కలను నాటడానికి ముందు పశువుల ఎరువులో అభివృద్ధి చేసి పొలంలో వేసుకుంటే తెగుళ్లు, వ్యాధులు, సాగు ఖర్చు తగ్గుతాయి. కూరగాయల పంటలలో ముందు జాగ్రత్త చర్యగా నాటిన 15 రోజుల్లోపు కార్బెండజమ్ 2గ్రా లీటరు నీటితో కలిపి నేల తడిచేలా పిచికారీ చేస్తే మట్టిలో పుట్టే రోగాలు రాకుండా చూడవచ్చు. రసం పీల్చే తెగుళ్లను నివారించడానికి లీటరు నీటికి ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి.లీ పిచికారీ చేయాలి. అన్ని ఉద్యాన పంటలు సూక్ష్మపోషక లోపం లక్షణాలను కనబరుస్తున్నట్లు గుర్తించడమైనది. మ్యాక్స్ లేదా గ్రోత్ లేదా విపుల్ లేదా స్వర్ణపాల్ లేదా ఫార్ములాస్– 4 లేదా అర్కా వెజిటబుల్ స్పెషల్ 2– 3 గ్రా. లీటరు నీటికి పూల మొగ్గ ప్రారంభించే ముందు, పుష్పించే ముందు, పండు దశల్లో మూడుసార్లు పిచికారీ చేయాలి. పంట గుర్తించిన సమస్య తీసుకోవాల్సిన చర్యలు ● టమాటాలో..ఆకు ముడత లీటర్ నీటిలో ఒక మి.లీ లేదా 1.5 గ్రాముల క్లోరోథలనిల్ లేదా ఒక మి.లీ.లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ప్రొఫికోనోజోల్ పిచికారీ చేయాలి ● బ్యాక్టీరియల్ ఎండు తెగులు..కాపర్ఆక్సీక్లోరైడ్ 30 గ్రా+స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి ఒక గ్రాముతో మట్టిని తడిపి, అదే మోతాదులో రసాయనాలతో ఫోలియర్ను పిచికారీ చేయాలి. ● బూజు తెగులు..లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రా లేదా డైఫెంకోనోజోల్ 0.5 మి.లీ లేదా సాఫ్ 2 గ్రాములు కలిపి స్ప్రే చేయాలి. ● తేనెబంగ, తామర పురుగుల.. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. లేదా డైఫెంతురియన్ 1.25గ్రా నివారణకు లేదా అసిఫెట్ 1.5 గ్రా లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పండు తొలుచు పురుగు .. వరి తవుడు+బెల్లం+ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరీఫాస్తో విషపు ఎరలను వరుసల మధ్య వేయాలి. అబామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ 1 మి.లీ లేదా థయోడికార్బ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పాము పొడ తెగులు ట్రైజోఫాస్ 2 మి.లీ లేదా డైఫెంతురీయన్ 1.25 గ్రాము, వేప నూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● కాయ కుళ్లు తెగులు..లీటరు నీటికి 5 గ్రా కాల్షియం నైట్రేట్ను వారం మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ● పూత, పిందె రాలకుండా..ప్లానోఫిక్స్ 3 మి.లీ+ సూక్ష్మపోషక మిశ్రమం 45 గ్రా. 15 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ● వంకాయలో సస్యరక్షణ..కాయ, కొమ్మ రెనాక్సిపైర్ 0.3 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ తొలిచే పురుగు ఒక మి.లీ లీటరుకు 5 మి.లీ వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● ఎర్ర నల్లి..సల్ఫర్ 3గ్రా లేద ఆఅబామెక్టిన్ 1.0 గ్రా. లేదా ఫెంతురియన్ 1.25 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా ప్రొపార్జైట్ 2 మి.లీ లీటరు నీటికి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● బెండతోటలో..కాయ తొలుచు పురుగు రెనాక్సిఫైర్ 0.3 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి 5 మి.లీ వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● రసం పీల్చే పురుగు..తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3గ్రా లేదా డైఫెంతురియన్ 1.25గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఎర్ర పురుగు..సల్ఫర్ 3గ్రా లేద ఆఅబామెక్టిన్ 1.0 గ్రా. లేదా డైఫెంతురియన్ 1.25 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా ప్రొపార్జైట్ 2 మి.లీ లీటరు నీటికి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి. ● కాకర,బెండలో..కాయ తొలుచు పురుగు సామూహిక ట్రాపింగ్ కోసం ఫెరోమోన్ ఉచ్చులు(15–20/ఎకరం)ఉంచాలి. డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి పిచికారీ చేయాలి. ● రసం పీల్చే పురుగు..తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3గ్రా లేదా డైఫెంతురియన్ 1.25గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● జామ..ఫ్రూట్ ఫ్లై సామూహిక ట్రాపింగ్ కోసం ఫెరోమోన్ ఉచ్చులు (15–20/ఎకరం) ఉంచాలి.మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
విత్తన మట్టి విగ్రహాల పంపిణీ
తాండూరు: వినాయక చవితి పండగ రోజు మట్టితో చేసిన విత్తన విగ్రహాలను పూజిస్తే వృక్ష సంపద పెంచడంతో పాటు సమాజ హితానికి మేలు జరుగుతోందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్పటేల్ అన్నారు. గురువారం గ్రీన్ ఇండి యా చాలెంజ్ హరిత సేన సంస్థ సౌజన్యంతో తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ చైర్పర్సన్ శివాని, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు తాటికొండ స్వప్నపరిమళ్, విజయలక్ష్మి స్థానికులకు మట్టితో తయారు చేసిన విత్తన గణపతి విగ్రహాలను పంపి ణీ చేశారు. పండగపూట అందరూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే వినియోగించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాండూరు లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు సోమనాథ్, ప్రైవేట్ స్కూల్ అసో షియేషన్ కార్యదర్శి మోహన్కృష్ణాగౌడ్, అసోషియేషన్ ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ చేసి.. నగదు కాజేసి
● తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అవినీతి బాగోతం ● రైతుల ఖాతా నుంచి డబ్బులు స్వాహా చేసిన ఉద్యోగులు తాండూరు: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అవినీతి బాగోతం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులే నకిలీ ఖాతాలను సృష్టించి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను స్వాహా చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పట్టణంలోని సాయిపూర్ రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులకు సేవలను అందిస్తోంది. కొన్నాళ్ల క్రితం తాండూరుకు చెందిన ఓ రైతు బ్యాంకులో రూ.4 లక్షల నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ప్రేమ్సింగ్, అరవింద్ ఈ విషయాన్ని గమనించారు. ప్రేమ్సింగ్ తన బంధువు అజయ్తో కలిసి డబ్బులను స్వాహా చేసేందుకు పథకం రచించారు. అందుకు అదే బ్యాంకులో ఓ మహిళ పేరిట నకిలీ ఖాతా తెరిచారు. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు విత్ డ్రా చేసుకొనేందుకు సదరు రైతు నుంచి సంతకాలు తీసుకున్నారు. అనంతరం నకిలీ ఖాతాలోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకొని పంచుకున్నారు. పోలీసుల అదుపులో ఉద్యోగులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను తీసుకొనేందుకు రైతు కుటుంబం బ్యాంకుకు వచ్చింది. మేనేజర్ ఖాతాను పరిశీలించి డబ్బులు డ్రా చేసుకుని మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన రైతు కుటుంబం ఫిర్యాదు చేసింది. సంబంధిత పత్రాలు పరిశీలించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు పక్కదారి మళ్లించినట్లు మేనేజర్ శ్రీనివాస్రావు గుర్తించారు. దీనిపై ప్రైమ్సింగ్, అరవింద్లపై పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. సీఐ సంతోష్ ఆధ్వర్యంలో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. -
నిబంధనలు తప్పనిసరి
దోమ: ఊరూరా వినాయక చవితి సందడి ప్రారంభమైంది. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. వివిధ రూపాల్లో గణనాథుడి విగ్రహాలను కొలువుదీర్చేందుకు బుకింగ్లు చేసుకొని సిద్ధమవుతున్నారు. దీంతో అధికారులు సైతం మండపాల ఏర్పాటుపై నియమనిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. ఊరురా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నారు. ఆన్లైన్ వెబ్సైట్లో పొందిన అనుమతి పత్రాన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వినాయక విగ్రహాల వద్ద, నిమజ్జన కార్యక్రమంలో డీజేలను నిషేధిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇవి పాటించాలి ● వినాయక చవితి నేపథ్యంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కచ్చితంగా పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. ఎన్ని రోజులు పెడుతున్నారు? ఎన్ని రోజుల్లో నిమజ్జనం చేస్తున్నారు? అనే అంశాలను ఆన్లైన్లో పొందుపర్చుకోవాలి. ● గణేశ్ మండపాలను ఏర్పాటుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి. మండపాల ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ● విద్యుత్ శాఖ అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యమైన వైరు ఉపయోగించాలి. ● మండపాల నిర్వాహకులు మండపాల కమిటీకి సంబంధించిన వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నంబర్లను పోలీసులకు అందించాలి. ● వృద్ధులు, చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్యం లేకుండా స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి. ● సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు. ● మండపాల్లో మంటలు చెలరేగితే ఆర్పేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో రెండు బకెట్ల నీళ్లు, ఇసుక ఏర్పాటు చేసుకోవాలి. ● మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడడం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకర నృత్యాలతో ప్రదర్శనలు చేయడం, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగాలు చేయడం పూర్తిగా నిషేధం. ● విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవాలి. పోలీస్ అధికారులు నిత్యం తనిఖీలు చేసినప్పుడు అందులో సమయం రాసి సంతకం చేసి వెళ్తారు. ● మండపాల్లో ఏదైనా అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 100 కానీ, లేదా స్థానిక పోలీసులకు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 87126 70056కు సమాచారం అందించాలి. డీజే వినియోగంపై నిషేధం పోలీసుల అనుమతితో నవరాత్రుల నిర్వహణ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ -
చికిత్స పొందుతూ రైతు మృతి
బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం బషీరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిగకలాన్ గ్రామానికి చెందిన మహిమూద్(42) ఓ చిన్నకారు రైతు. కొద్దిపాటి పొలంలో కూరగాయలు పండిస్తూ భార్య ఫాతిమాబేగం, నలుగురు పిల్లలను పోషిస్తున్నాడు. మంగళవారం(19న) ఆయన కాయగూరలు విక్రయించడానికి నవల్గా వెళ్లి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో బొంరాస్పేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రమేశ్ బైక్పై వేగంగా రావడంతో అదుపుతప్పి మహిమూద్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిమూద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బంధువులు ఆయన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాన్ని కోల్పోయిన భార్య, తన నలుగురు పిల్లలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా రమేశ్ బైక్పై మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. -
మ్యాపింగ్
సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రక్రియపక్కాగా విలేజ్ వికారాబాద్: రెవెన్యూ రికార్డుల విషయంలో సర్వేకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైతుల మధ్య పొలాల సరిహద్దు సమస్యలు.. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు.. రాష్ట్రాల సరిహద్దుల విషయంలో నిత్యం ఏదో ఒక చోట వివాదం చెలరేగుతూనే ఉంటుంది. విలేజ్ మ్యాపింగ్ విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో చేసిన సర్వే మ్యాపులే నేటికీ ఆధారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను జోడించి పక్కాగా గ్రామాల సరిహద్దులు నిర్ణయించే సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గురువారం నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు స్థానిక సర్వేయర్లు సర్వే ఆఫ్ ఇండియా సభ్యులకు సహకరించనున్నారు. డిజిటల్ పరికరాల సాయంతో.. డిజిటల్ పరికరాల సాయంతో శాటిలైట్ సేవలను వినియోగిస్తూ పక్కాగా సర్వే చేపట్టనున్నారు. ముందుగా గ్రామాల సరిహద్దులు నిర్ణయించనున్నారు. జిల్లాలో మొత్తం 594 జీపీలు.. 510 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల ఆధారంగా సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామ సరిహద్దుతో కూడిన మ్యాపింగ్ను జిల్లా అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ మ్యాప్లు కీలకం కానున్నాయి. జిల్లాలో సర్వే ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చేపడతారు. ప్రస్తుతం జిల్లా అధికారులు సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు సహకరిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులు తేలేనా..? మన జిల్లాకు కర్ణాటకతో సరిహద్దు వివాదం చాలా కాలంగా నడుస్తోంది. తాండూరు నియోజకవర్గం పరిధిలోని బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్, వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం, అలాగే కొడంగల్ మండలానికి కర్ణాటకతో సరిహద్దు వివాదం ఉంది. తెలంగాణ అటవీ శాఖకు చెందిన వేల ఎకరాలను కర్ణాటక వాసులు కబ్జా చేసినట్లు జిల్లా ఽఅధికారులు గుర్తించారు. ఈ విషయమై గతంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు కూడా జరిగాయి. కాగ్నా నదిలో ఇసుక వాటా విషయంలోనూ తగాదాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేపట్టే సర్వే వివాదానికి ముగింపు పడుతుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. సహకరించాలి గ్రామాల సరిహద్దు నిర్ధారణ కోసం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సర్వేకు అందరూ సహకరించాలి. సర్వేపై ఎలాంటి సందేహాలు వద్దు. ఈ ప్రక్రియ పూర్తయితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పొలాల మధ్య, గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలు ఉండవు. – రాంరెడ్డి, ఏడీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ -
కళ్లకు గంతలతో గణితావధానం
తాండూరు టౌన్: కళ్లకు గంతలు కట్టుకుని బోర్డుపై రాసిన పదాలను ఓ గణితావధాని అలవోకగా చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్లో ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోకట్కు చెందిన అనంతప్ప అవధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మాయా కూడిక, మాయా చదరంపై మెలకువలు నేర్పించారు. అనంతరం మెమొరీ శతావధానంలో భాగంగా, విద్యార్థులు బోర్డుపై 100 వరకు రాసిన ప్రముఖులు, వాహనాలు, జంతువులు, వస్తువుల పేర్లను కళ్లకు గంతలు కట్టుకుని చెప్పారు. ఏ ఒక్క పేరు తప్పు చెప్పకుండా అన్నీ కరెక్టుగా చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదివేలా చూడాలన్నారు.ఎలాంటి సమస్యలుఉన్నా సులువైన విధానంలో సమాధానం రాబట్టేలా వారి కి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలన్నారు. తాను తొలినాళ్లలో శిశుమందిర్లోనే ఉపాధ్యాయునిగా జీవనం ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు డీ విజయలక్ష్మి,కార్యదర్శి అనంతరెడ్డి,కోశాధికారిరాంరెడ్డి, ఆచార్య, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి కృషి
తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్గా బి.యాదగిరి నియమితులయ్యారు. ప్రభుత్వం బుధవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో పనిచేస్తూ వెయిటింగ్లో ఉన్న యాదగిరిని తాండూరుకు బదిలీ చేశారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్సింహారెడ్డి కొంత కాలంగా తాండూరు ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేయగా సీనియర్ అసిస్టెంట్ రమేష్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్చార్జ్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డిని తప్పించడం చర్చనీయాంశమైంది. గురువారం ఆయన రిలీవయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ యాదగిరి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పౌర సేవలను మరింత మెరుగు పరుస్తామన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్, మేనేజర్కు ఏసీబీ మెమోలు గత గురువారం వరకు తాండూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన విక్రంసింహారెడ్డి, మేనేజర్ నరేందర్రెడ్డికి గురువారం ఏసీబీ మెమోలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మున్సిపల్ కార్యాలయానికి చేరాయి. -
కళాశాల విద్యే కీలకం
బొంరాస్పేట: విద్యార్థికి ఉద్యోగం, ఉపాధితో బంగారు భవిషత్తుకు జూనియర్ కళాశాల విద్యే మూలాధారంగా ఉంటుందని ఇంటర్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ రోజారాణితో కళాశాల నిర్వహణ, విద్యాప్రగతి, వసతులపై చర్చించారు. నిధుల వినియోగానికి కమిటీ ఆయోదం చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు. భవన నిర్మాణ పనులు సాగుతున్నాయని అన్నారు. మౌలిక వసతులు, సదుపాయాలను కల్పించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో స్థానిక కళాశాల విద్యార్థులకు బెంచీలు, కార్యాలయానికి బీరువాలు, కుర్చీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అన్నారు. తల్లిదండ్రుల కలలు నిజం చేయడానికి తపించాలని విద్యార్థులకు సూచించారు. అధ్యాపక బృందం, విద్యార్థుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోటీతత్వాన్ని ఎదుర్కోవడానికి తగు సూచనలిచ్చారు. మార్కులే కాదు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. -
గల్లా ఎగరేస్తున్న గల్లీ లీడర్స్!
ధారూరు: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన కొంతమంది గల్లీ లీడర్లు అధికారులు, ద్వితీయ శ్రేణి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పలువురు ప్ర ముఖ నాయకులతో వీరికున్న సంబంధాన్ని చూసి అధికారులు సైతం వీరంటే జడుసుకుంటున్నారు. నా ఊరిలో నా మాటే చెల్లాలి.. బషీరాబాద్: మండలానికి చెందిన ఓ లీడర్ వ్యవహారం రాజకీయ, అధికారవర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. తన పనులు చేయించుకునేందుకు అధికారులతో పాటు తమనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు డీసీసీ అధ్యక్షుడితో పాటు స్థానిక ఎమ్మెల్యేకూ ఫిర్యాదు చేసినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ఊళ్లో నా మాటే చెల్లాలి.. రాజకీయ పరంగా, అభివృద్ధి పనుల్లో మండల నాయకులు, అధికారులు నేను చెప్పిందే వినాలి. లేదంటే అడ్డుపడిన వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ బెదిరింపులకు పాల్పడటంపై అధికారులు, నేతలు విస్తుపోతున్నారు. ఈ గొడవల్లోకి ఎమ్మెల్యే స్థాయి నాయకులను సైతం లాగాలని చూశాడని మండల నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇదే లీడర్ నెల రోజుల క్రితం బతికున్న ఓ రైతు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలున్నాయి. భూమి బదలాయింపు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చినా.. సకాలంలో వారు మేలుకొని పొరపాటును సరిదిద్దుకున్నారు. ఇతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలూ, నాయకులు పార్టీ పెద్దలకు విన్నపాలు అందించడం చర్చనీయాంశమైంది. తాము చెప్పిందే చేయాలంటూ అల్టిమేటం -
కంకల్ వాసికి డాక్టరేట్ పట్టా
పూడూరు: మండలంలోని కంకల్ గ్రామానికి చెందిన జియా ఉర్ రెహ్మన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్లో డాక్టరేట్ పట్టా పొందారు. ఇస్రో చైర్మన్ నారాయణ్, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకున్నారు.ఉచిత ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోండి : ఐఈఆర్పీ వేణుగోపాల్బొంరాస్పేట: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రత్యే క అవసరాలు కలిగిన దివ్యాంగులైన విద్యార్థులకు అలింకో సంస్థ వారు పలురకాల ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐఈఆర్పీ వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 18 సంవత్సరాలలోపు వారు, 40శాతం వికలత్వం గల విద్యార్థులు అర్హులన్నారు. అందుకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువపత్రాలను మండల కేంద్రంలోని ఐఈఆర్సీ (భవిత) సెంటర్లో అందజేశాయాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవా రికి ఈ నెల 29న వికారాబాద్లోని ఎమ్మార్సీ వద్ద ప్రత్యేక క్యాంపు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9603875349లో సంప్రదించాలని ఆయన సూచించారు.ఫీవర్ సర్వే చేయాలి డీఎంహెచ్ఓ లలితాదేవియాలాల: భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పెరుగుతున్న మలేరియా, చికెన్గున్యా, డెంగీ, టైఫాయిడ్ తదితర జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. లేబర్ రూంను విని యోగంలోకి తేవాలన్నారు. ప్రతి రోజూ ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు? ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్ భారతిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆస్పత్రికి దగ్గుతో వచ్చిన ఓ వృద్ధుడికి టీబీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ స్రవంతి, పీహెచ్ఎన్ విజయసుశీల, సూపర్వైజర్ శోభారాణి, ఏఎన్ఎంలు శ్రీదేవి, జగదీశ్వరి, సంగీత సిబ్బంది బసయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.రాంచందర్రావు వ్యాఖ్యలు అర్థరహితంబంట్వారం: రాజకీయ రంగంలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు వికారాబాద్లో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జగన్నాథంయాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నారనే విషయాన్ని రాంచందర్రావు గుర్తుంచుకోవాలన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భక్తిశ్రద్ధలతో భజనఅనంతగిరి: శ్రావణమాసాన్ని పురస్కరించుకు ని వికారాబాద్ సమీపంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు వారం అక్కమహాదేవి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం సామూహిక భజన చేసి శివపార్వతుల పాటలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
పీర్ల మసీదులో బోధన
పూడూరు: గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల శిథిల భవనాల్లో, వర్షాలకు ఉరుస్తున్న గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు స్కూళ్ల బిల్డింగులు లీకేజీ అవుతున్నాయి. మండలంలోని మేడికొండ పాఠశాల భవనం లీకేజీ అవుతుండటంతో టార్పాలిన్ కప్పి ఉంచారు. ప్రస్తుతం గణేశ్ మండపంలో స్కూల్ నిర్వహిస్తున్నారు. రాకంచర్ల గ్రామంలో పీర్ల మసీదులో బోధన చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రాకంచర్ల పాఠశాలలోకి నీరు చేరింది. విద్యార్థులు స్కూల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయులు స్కూల్ పక్కన ఉన్న పీర్ల మసీదులో పాఠశాలను నిర్వహిస్తున్నారు. బెంచీలు వేసి 30 మంది విద్యార్థులకు బోధన చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మన ఊరు మన బడి పథకం కింద నూతన భవనాలు మంజూరయ్యాయి. కొన్ని చోట్ల పనులు పూర్తయినా బిల్లులు రాలేదు. దీంతో కాంట్రాక్టర్లు స్కూళ్లకు తాళాలు వేసుకున్నారు. మేడికొండలో.. మండలంలోని మేడికొండ ప్రాథమిక పాఠశాలలో 15మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ల క్రితం మండల పరిషత్ నిధుల నుంచి నూతన భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.5.5లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండు గదులు నిర్మించాడు. బిల్లు మంజూరు కాకపోవడంతో భవనాన్ని పాఠశాలకు అప్పగించలేదు. వర్షాలు పడిన ప్రతిసారీ గణేశ్ మండపంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో.. మరమ్మతులు చేయిస్తాం మేడికొండ, రాకంచర్ల ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లీకేజీ అవుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రం, అసంపూర్తిగా ఉన్న భవనంలో పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రాకంచర్లలో అదనపు భవనం కోసం ప్రతిపాదనలు పంపాం. – సాయిరెడ్డి, ఎంఈఓ పూడూరు -
ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యం!
● చేయి తడిపితేనే ఫైల్ కదిలేది ● ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు తాండూరు: ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచావతారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఓ వైపు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వివిధ పనుల నిమిత్తం తాండూరు రెవెన్యూ డివిజన్ పరిఽధిలోని కార్యాలయాలకు వచ్చే ప్రజలను కొంతమంది ఉద్యోగులు పీక్కు తింటున్నారు. చేయి తడిపితేనే ఫైలు కదిలేది అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంతో పాటు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, విద్యుత్, ఎకై ్సజ్, మైన్స్, ఆర్అండ్బీతో పాటు మరికొన్ని ప్రధాన శాఖలు అవినీతిమయంగా మారాయి. ● తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన ఓ పార్టీ నాయకుడు తమ కాలనీలో ఇళ్లు కట్టుకున్న వారికి ఇంటి నంబర్ కేటాయించాలని మున్సిపల్ ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్ను రమేశ్ను కలిశాడు. ఇందుకు ఆయన ఒక్కో ఇంటికి రూ.6 వేలు ఇవ్వాలంటూ పది ఇళ్లకు రూ.60 వేలు వసూలు చేశాడు. లబ్ధిదారుల నుంచి ఈ మొత్తం ఇప్పించడంతో వారికి ఇంటి నంబర్లు కేటాయించారు. అనంతరం ఇదే నాయకుడు తాను నిర్మించుకున్న రేకుల షెడ్డుకు ఇంటి నంబర్ ఇవ్వాలని కోరగా రమేశ్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినా నెల రోజుల పాటు కాలయాపన చేశారని, దీంతో నేరుగా ఐజీకి ఫోన్ చేయడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు రెడ్ హ్యాండెడ్గా సీనియర్ అసిస్టెంట్ను పట్టుకున్నారని బాధితుడు తెలిపాడు. ● దాడులు జరుగుతున్న విషయం తెలియడంతో కమిషనర్ విక్రంసింహారెడ్డితో పాటు సిబ్బంది మొత్తం అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రమేశ్ను ఏసీబీకి పట్టించిన వ్యక్తి 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించాడు. ● తాండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది. గతంలో డీఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. చంపుతామని బెదరిస్తున్నారు..తాండూరు టౌన్: మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేశ్ను ఏసీబీకి పట్టించాననే కక్షతో తనను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు ఇర్షాద్ వాపోయాడు. ఈ మేరకు బుధవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేశ్ తమ్ముడు నాగేశ్తో పాటు బాతుల నాగు వ్యక్తి మున్సిపల్ ఆఫీసులో తనను బెదిరించారని తెలిపాడు. వీరినుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఈ విషయమై సీఐ సంతోష్కుమార్ను అడగగా సాక్ష్యాధారాలను పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
తాండూరు రూరల్: విద్యార్థులు కష్టపడి చదివి శాస్త్రవేత్తలుగా ఎదగాలని తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ అన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి శివారులోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు పర్యావరణం, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల రక్షణ కోసం రైతులు క్రిమిసంహారక మందులు వాడుతున్నారని, తద్వారా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. దీన్నిదృష్టిలో ఉంచుకొని సేంద్రియ వ్యవసాయం చేయాలని తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే శాసీ్త్రయ ఆలోచనలు పెంచుకొని మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాయత్రి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ -
డబ్బు తీసుకుని విరాసత్ చేయించలేదు
పూడూరు: భూమి విరాసత్ చేయించేందుకు రూ.50 వేలు తీసుకుని, పని చేయకుండా కాలయాపన చేస్తున్న పూడూరు మీ సేవ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ భరత్గౌడ్కు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరుకు చెందిన చాకలి బుచ్చన్న తన భూమిని విరాసత్ చేయించాలని మీ సేవ నిర్వాహకుడు షాబాద్ సురేష్ను కలిశాడు. ఇందుకు లక్ష రూపాయలు అవుతుందని చెప్పగా.. మొదటి విడతగా రూ.50 వేలు ఫోన్ పే ద్వారా పంపాడు. పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. కానీ డబ్బులు తీసుకున్న సురేశ్ ఏడాదిన్నరగా తన పని చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన డబ్బులైనా తిరిగి ఇవ్వమని కోరినా స్పందించడం లేదన్నాడు. అతనిపై చర్య తీసుకోవాలని తహసీల్దార్ను కోరాడు. ఇదిలా ఉండగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేశ్పటేల్, పాండు, శ్రీశైలం తదితరులు డిమాండ్ చేశారు. మీ సేవ నిర్వాహకుడిపై తహసీల్దార్కు ఫిర్యాదు -
నానో యూరియాపై అవగాహన కల్పించండి
● ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి ● ఎరువుల దుకాణాల్లో తనిఖీలుదుద్యాల్: నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎరువుల దుకాణాదారులకు పలు సూచనలు చేశారు. ద్రవరూప యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు. మండలంలో ఎరువుల కొరకు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం యజమాని ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టాలి కొడంగల్ రూరల్: వరుస వర్షాల నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. బుధవారం పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. నానో యూరియా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ ఓలు రాజు రాథోడ్, శ్రీపతిరెడ్డి పాల్గొన్నారు. -
సత్వరం పూర్తి చేయాలి
● దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ ● తాండూరు రైల్వే స్టేషన్ సందర్శన తాండూరు: అమృత్ భారత్ నిధులతో రైల్వే స్టేషన్లలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్.గోపాలకృష్ణన్ తెలిపారు. బుధవారం తాండూరు రైల్వే స్టేషన్ను అధికారులతో కలిసి సందర్శించారు. అమృత్ భారత్ స్కీం కింద రూ.24 కోట్లతో తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఎస్కులేటర్, ట్రాలీ రూట్, వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్ తదితర పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తాండూరు మార్వాడి యువ మంచ్ ప్రతినిధులు డీఆర్ఎంను కలిసి తాండూరులో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. -
రైతులకు పరిహారం అందించాలి
అనంతగిరి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేయాలన్నారు. పత్తి, మొక్కజొన్న, వరి, కంది, పసుపు, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ -
పరిగిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● పరిగిలో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ ● పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్జైన్ పరిగి: పరిగి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నిరు. బుధవారం పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. తహసీల్దార్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందాలన్న సంకల్పంతోనే వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు రూ.27 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఎక్కువ దృష్టి సారించిందన్నారు. నస్కల్ గ్రామ సమీపంలో రూ.10 కోట్లతో మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఈ ప్రాంతానికి సాగునీరు తెస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు చిన్న నర్సింహులు, శ్రీను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్గాంధీ సేవలు మరువలేం దేశానికి రాజీవ్గాంధీ చేసిన సేవలు ఎప్పటికి మరువలేమని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నా రు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్గాంధీ అని కొనియాడారు. పేదల సంక్షేమమే లక్ష్యం దోమ: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన కుట్టుమిషన్లను అర్హులైన మహిళలకు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య, నాయకులు మాలి శివకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి కుల్కచర్ల: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. మహిళలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, మాజీ ఎంపీపీ సత్యమ్మ పాల్గొన్నారు. -
గైరుహాజరు!
వికారాబాద్: విధులకు రాకుండానే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినట్లు హాజరు వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీలోని లూప్ హోల్స్ను పసిగట్టి విధులకు ఎగనామం పెడుతున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. దీంతో అసలు దొంగలు దొరికిపోయారు. పంచాయతీరాజ్, విద్యా శాఖల్లో ఈ వ్యవహారం బయటపడింది. పదిహేను రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలోని పలు పాఠశాలలను కలెక్టర్ ప్రతీక్జైన్ తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంత మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు.. కానీ ఆన్లైన్లో వచ్చినట్లు రికార్డు కావడంతో పూర్తిస్థాయి విచారణ జరపాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చాలా వరకు పంచాయతీ కార్యదర్శులు విధులకు రాకుండానే ఇంటి వద్ద నుంచే హాజరు వేసుకున్నట్లు గుర్తించారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉండగా 553 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 63 మంది విధులకు రాకుండానే హాజరు వేసుకున్నట్లు తేలింది. దీంతో వీరందరికీ చార్జి మెమోలు జారీ చేశారు. విద్యా శాఖలో 4,588 మంది ఉపాధ్యాయులు ఉండగా 75 మంది ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం కార్మికుల హాజరు ఆన్లైన్ చేయలేదు. ఈ విషయాలపై ఎంఈఓల నుంచి వివరణ కోరారు. అన్ని శాఖల్లో ఆన్లైన్ హాజరు విధుల్లో పారదర్శకత తేవడానికి ఆన్లైన్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అమలు చేస్తున్నారు. జూన్ చివరి వారంలో విద్య, ఆరోగ్య శాఖల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. జూలై మొదటి వారంలో అన్ని శాఖలకు విర్తింపజేశారు. కలెక్టరేట్లో కూడా అమలు చేశారు. ఆరోగ్య శాఖ పరిధిలో 24 పీహెచ్సీలు ఉండగా రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ పరిధిలో 1,063 పాఠశాలలు ఉండగా ముందుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని శాఖల్లో అమలు చేస్తున్నారు. జిల్లాలో 6,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖలో 4,588 మంది ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖలో 600 పైచిలుకు మంది, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 650 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రతి నెలా పర్యవేక్షిస్తేనే.. గతంలో కలెక్టరేట్, విద్య, ఆరోగ్యశాఖల్లో మాత్రమే బయోమెట్రిక్ విధానం అమలు చేసేవారు. గత కలెక్టర్ నారాయణరెడ్డి జీయో అటెండెన్స్ పేరుతో ఆన్లైన్ హాజరు విధానం అమలు చేశారు. ఆయన బదిలీపై వెళ్లడంతో ఆ విధానానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత విధి నిర్వహణ, రోజువారి హాజరులో పారదర్శకత కొరవడింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్జైన్ తిరిగి ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా చేయాలని నిర్ణయించారు. గత ఫెయిల్యూర్స్ను దృష్టిలో ఉంచుకొని నెలవారి పర్యవేక్షణ ఉంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందనేది స్పష్టమవుతోంది. గతంలోనూ ఆన్లైన్ హాజరు విధానం అమలు చేసినా ఎవరెవరు ఎన్ని రోజులు విధులకు డుమ్మా కొట్టారు.. ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారు.. అనే వివరాలు గుర్తించలేదు. హెచ్చరించడం కానీ శాఖాపరమైన చర్యలు తీసుకోవటం లాంటివి చేయలేదు. దీంతో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకాడం మానేసరనే విమర్శలు ఉన్నాయి. ఆన్లైన్ హాజరు విధానాన్ని కొంతమంది పంచాయతీ కార్యదర్శులు మిస్యూజ్ చేశారు. ఈ విషయం మా దృష్టికి రావడంతో మా వద్ద ఉన్న ఫేస్ రీడింగ్ యాప్లో చెక్ చేశాం. 63 మంది తప్పు చేసినట్లు గుర్తించాం. వారికి చార్జి మెమోలు ఇచ్చాం. ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాం. నిత్యం ఆన్లైన్ హాజరును పరిశీలిస్తున్నాం. – జయసుధ, డీపీఓ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న సిబ్బంది విధులకు రాకుండానేహాజరైనట్లు ఆన్లైన్లో నమోదు ఉన్నతాధికారుల నిఘాతో బయటపడిన భాగోతం 63 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జిమెమోలు -
మండపాలకు అనుమతులు తప్పనిసరి
ఎస్ఐ యాదగిరిదుద్యాల్: గణపతి మండపాలకు పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ యాదగిరి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27న వినాయక చవితి పురస్కరించుకుని మండలంలోని ప్రతీ గ్రామంలో వినాయకుల ప్రతిమలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకుగాను మండల వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర పోలీస్ శాఖ ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిందన్నారు. ఈ వెబ్ సైట్లో మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తే అనుమతి లభిస్తుందని తెలిపారు. ఈ అనుమతి ఉంటేనే అవసరమైన సమయంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.పోలీసులకు చిక్కినగ్యాంగ్ రేప్ నిందితుడుమంచాల: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మంచాల పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్ రాష్ట్రం బచ్చావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2006లో గ్యాంగ్ రేప్కు పాల్పడిన నిందితుడు సికిందర్ రహమతుల్లా 2014 వరకు శిక్ష అనుభవించాడు. 2014లో పెరోల్పై బయటకు వచ్చి, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతని కోసం గుజరాత్ పోలీసులు 11 ఏళ్లుగా గాలిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో మంచాల మండలంలోని లింగంపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్న రహమతుల్లాను పట్టుకున్న స్థానిక పోలీసులు గుజరాత్ పోలీసులకు అప్పగించారు.లాడ్జి గదిలో వ్యక్తి మృతికొత్తూరు: లాడ్జి గదిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన జోగన్నగూడెం రమేశ్(37) ఈ నెల 19న పని ఉందని ఇంట్లో చెప్పి కొత్తూరుకు వచ్చాడు. కొంత కాలంగా ఆయనకు మూర్చా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా పట్టణంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని మద్యం తాగాడు. మధ్యరాత్రి లాడ్జి సిబ్బంది గమనించగా పడుకున్న చోటనే రమేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.‘ఖజానా’ కేసులోమరో ఇద్దరి అరెస్ట్పుణేలో అంతర్రాష్ట్ర దొంగల్ని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులుచందానగర్: ‘ఖజానా’ జ్యువెలరీలో దోపిడీకి సంబంధించి మరో ఇద్దరు దొంగలను పుణేలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చందానగర్ డీఐ భాస్కర్ వివరాలు వెల్లడించారు. ఖజానా దొంగతనం కేసులో ఏడుగురు పాల్గొనగా ఇప్పటి వరకు నలుగుర్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే బిహార్కు చెందిన అశిష్, దీపక్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, మరో ఇద్దరు కూడా బిహార్కు చెందిన అనిష్కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్లుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. వీరిద్దరిని కూడా రిమాండ్కు తరలించామన్నారు. వారి వద్ద నుంచి 1015 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగితా ముగ్గుర్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు.పుస్తకాలు, పత్రికలుచదవండివిద్యార్థులకు హైడ్రా కమిషనర్ సూచనఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాలు, దిన పత్రికలను చదడం అలవాటుగా చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రంగనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సానుకూల థృక్పథంతో భవిష్యత్కు మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రమం తప్పకుండ తరగతులకు హాజరుకావాలన్నారు. విద్యార్థుల జీవితంలో 90 శాతం విజయం కష్టపడి పని చేయడం వల్ల, 5 శాతం స్మార్ట్ వర్క్, 5 శాతం నెట్ వర్కింగ్ వల్ల లభిస్తుందన్నారు. సోషల్ మీడియాపై ఆధారపడకుండ పుస్తకాలను చదవడం అలవాటుగా పెట్టుకోవాలని విద్యార్థులకు చూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.చంద్రశేఖర్, ఇంజినీరింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ సుమన్ సిన్హా, ఇంజినీరింగ్ డీన్ ప్రొ.ఎ.కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.మంగు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
సెకండ్ ‘హ్యాండ్’ !
మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. జనాన్ని మోసం చేసి ఈజీగా మనీ సంపాదించడం కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కార్లను అద్దెకు తీసుకుని, ఫేక్ నంబర్లు, ఆర్సీ తయారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. అదే కారును తస్కరించి, తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ ముఠాను మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ ఫేస్బుక్ అప్లికేషన్లో చూసి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రమయించిన వ్యక్తులకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొందరు ముఠాగా ఏర్పడి సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు. ముఠాగా ఏర్పడి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్కు చెందిన మహమ్మద్ ఇయాజ్, వికారాబాద్లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్ జాహీద్ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్ ప్లేట్లు మార్చేసి నకిలీ ఆర్సీ, ఇతర పత్రాలు సృష్టిస్తారు. అనుమానం రాకుండా నకిలీ ఆర్సీ తయారు చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్లలో ఖాళీ మైక్రో సిమ్ కార్డులు, ఖాళీ చిప్ కార్డులను కొంటారు. వాటిపై పేర్లు, వివరాలను ప్రింటింగ్ చేస్తారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతర పత్రాలన్నీ తయారు చేస్తారు. ఆపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటారు. కారు, చౌక ధరను చూసి ఆకర్షితులైనవారు వారి వలలో చిక్కుతున్నారు. ట్రాకర్లను అమర్చి చోరీ.. కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్ ట్రాకర్ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని కారు అమ్మిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. నిందితులపై పలు కేసులు.. నిందితులు ఈ విధంగా గతంలోనూ పలు చోట్ల నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. శంకర్పల్లి, మంచాల, అంబారిపేట, రామచంద్రాపురం, చందానగర్, మియాపూర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో నిందితులపై పలు కేసులు నఉన్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మాచారెడ్డిలో కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారిని బుధవారం రిమాండ్కు తరలించామన్నారు. మరో నిందితుడు అలీ ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, 15 సెల్ఫోన్లు, జీపీఎస్ పరికరాలు, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్కార్డులు, చిప్ కార్డులు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రామన్, ఎస్సై అనిల్, ఐటీ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది సుభాష్రెడ్డి, సిద్దిరాములు, శ్రీకాంత్లను అభినందించారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు ఫేస్బుక్ ద్వారా తక్కువ ధరకు విక్రయం ఆపై అదే కారును చోరీ చేసి.. యజమానికి అప్పగింత ముఠా గుట్టురట్టు చేసిన మాచారెడ్డి పోలీసులు ఆరుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరొకరు వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
కొత్వాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కోర్టు
సాక్షి, సిటీబ్యూరో: అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలు కలిగిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్ల సమస్యను పరిష్కరించారు. పోలీసుస్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన కొత్వాల్ ఆయా గ్యాంగ్లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం పది పోలీసుస్టేషన్లకు సంబంధించిన 11 గ్యాంగ్లకు చెందిన 101 మందిని విడిగా విచారించారు. అందులో ఆరు గ్యాంగ్లు తమ పెద్దలు, కుటుంబీకుల సమక్షంలో శాంతియుతంగా రాజీ చేసుకున్నామని కొత్వాల్కు తెలిపాయి. మిగిలిన గ్యాంగ్లు భవిష్యత్తులో కూడా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లయితే వారితో బాండ్ రాయించుకుంటామని తెలిపారు. ఆపై ఈ కోర్టు విచారణను తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ కోర్టుకు స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వరావుతో పాటు పది ఠాణాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. -
బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!
● వర్షం వస్తే రాకపోకలు బంద్ ● ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ● పట్టించుకోని అధికారులు సత్వరమే పనులు చేపట్టాలి.. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో సంగెంకలాన్ ఉంటుంది. ఇక్కడ బండి, దిద్దివాగులు ప్రవహిస్తాయి. భారీ వర్షం వస్తే గ్రామం చుట్టూ ఉన్న వాగులు పొంగిపొర్లుతాయి. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. గతంలో వాగుదాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా ఉంది. అధికారులు స్పందించి సత్వరమే నిర్మాణ పనులు చేపట్టాలి. – సంజీవ్రెడ్డి, సంగెంకలాన్ నివాసి ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. బెల్కటూర్ బ్రిడ్జి పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇక అల్లాపూర్, కోత్లాపూర్, ఐనెల్లి నిర్మాణ పనులు నేషనల్ హైవే అధికారులు చేపడుతారు. వర్షాకాలం ముగిసిన తర్వాత బొంకూర్ పనులు ప్రారంభమౌతాయి. సంగెంకలాన్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో నిధులు మంజూరవుతాయి. అవి రాగానే వెంటనే పనులు ప్రారంభిస్తాం. – శ్రావణ్కుమార్, డీఈ, ఆర్అండ్బీ, తాండూరు తాండూరు రూరల్: వానకాలం వచ్చిందంటే చాలు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా కుండపోత వర్షం పడితే వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతాయి. రోడ్లపై, బ్రిడ్జిలపైనుంచి నీరు ప్రవహించడంతో అక్కడక్కడ ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. వానాకాలంలో ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలం పూర్తిగా తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉంది. మండలంలో బ్రిడ్జిలు.. తాండూరు మండలంలో సంగెంకలాన్, అల్లాపూర్, బొంకూర్, ఐనెల్లి, కోత్లాపూర్ శివారులో వాగులు ఉన్నాయి. సంగెంకలాన్, అల్లాపూర్, ఐనెల్లి, కోత్లాపూర్ వాగుల వద్ద బ్రిడ్జిలు పురాతనమైనవి. ఒక్కోసారి భారీ వర్షాలకు వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్.. బిజ్వార్–బొంకూర్ వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంకా ప్రారంభించలేదు. వర్షాకాలం పూర్తయిన తర్వాత ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. అసంపూర్తిగా బెల్కటూర్ .. తాండూరు నుంచి కరన్కోట్ మార్గంలోని బెల్కటూర్ వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల సందర్భంగా వాగులో నిర్మించిన డైవర్షన్ రోడ్డు ఇప్పటి వరకూ నాలుగు సార్లు కొట్టుకపోయింది. దీంతో బెల్కటూర్, చిట్టిఘనాపూర్, చంద్రవంచ, కరన్కోట్, ఓగిపూర్తో పాటు కర్ణాటకలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వెంటనే పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. సంగెంకలాన్ చుట్టూ వాగులే.. భారీ వర్షం వచ్చిందంటే చాలు సంగెంకలాన్ చుట్టూ ఉన్న వాగులు పొంగిప్రవహిస్తాయి. గ్రామానికి వెళ్లేదారిలోని వంతెనపై నుంచి వర్షపు నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో రాకపోకలు నిలిచి పోతాయి. అత్యవసరమయితేనే తాము వెళ్తామని వాపోతున్నారు. ప్రస్తుతం తాండూరు మండలంలో నేషనల్ హైవే పనులు కొనసాగుతున్నాయి. అల్లాపూర్, ఐనెల్లి, కొత్లాపూర్ బ్రిడ్జిలు నేషనల్ హైవే పరిధిలో రావడంతో ఇప్పటి వరకు కనీసం పనులు కూడా ప్రారంభించలేదు. కరన్కోట్కు నిలిచిన బస్సు సౌకర్యంబెల్కటూర్ వద్ద తెగిన డైవర్షన్ రోడ్డు తాండూరు మండలం బెల్కటూర్ వద్ద నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. వాహనాల రాకపోకల కోసం డైవర్షన్ రోడ్డు నిర్మించారు. కానీ భారీ వర్షం వల్ల నేటి వరకు ఐదుసార్లు కోట్టుకపోయింది. దీంతో తాండూరు–కరన్కోట్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. కరన్కోట్ గ్రామానికి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం నిలిపివేశారు. ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. డైవర్షన్ రోడ్డు కొట్టుకపోవడంతో బెల్కటూర్, చిట్టిఘనాపూర్, చంద్రవంచ, కరన్కోట్, ఓగిపూర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు నుంచి బెల్కటూర్ వరకు ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. ఆ తర్వాత బ్రిడ్జిపైనుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. -
ఆలయాల్లో భారీ చోరీ
యాలాల: మండలంలోని సంగెంకుర్దు పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం, శనైశ్వరాలయంలో భారీ చోరీ జరిగింది. పక్కపక్కనే ఉన్న ఆలయాల్లోని హుండీలను ధ్వంసం చేసిన దుండగులు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగంకుర్దు శివారులోని కాకరవేణి నది ఒడ్డున సంగమేశ్వరాలయం, దీని పక్కనే శనైశ్వరాలయం ఉంది. ఎప్పటిలాగే ఆలయ పూజారి జగదీశ్ మంగళవారం రాత్రి గేట్లు మూసేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వెళ్లగా హుండీలు, సీసీ కెమెరాలు ధ్వంసమైనట్లు గుర్తించి, చైర్మన్తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ విఠల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సంగమేశ్వరాలయ హుండీలో సుమారు రూ.50 వేల నుంచి 60 వేల వరకు నగదు, బహుమతులు, శనైశ్వరాలయంలోని హుండీలో దాదాపు రూ.50 వేల నగదు, భక్తులు వేసిన కానుకలు చోరీకి గురయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా నాలుగో సారి.. సంగమేశ్వరాలయంలో వరుసగా నాలుగోసారి దొంగలు పడ్డారని స్థానికులు తెలిపారు. ఆలయం గ్రామానికి దూరంగా ఉండటంతో ఈ దురాఘతానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆలయ అభివృద్ధికి వినియోగించే భక్తుల డబ్బులు దొంగల పాలవుతున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేయడంతో పాటు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ● రూ.లక్షకు పైగా నగదు, కానుకలు ఎత్తుకెళ్లిన దుండగులు ● సీసీ కెమెరాల వైర్లు కట్చేసి, ధ్వంసం చేసిన వైనం -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వెంగళరావునగర్: నగరంలోని కాలనీలు, బస్తీలు నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్–19 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత, ప్రజారోగ్యం.. ఈ రెండూ విడదీయరాని అంశాలని, పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వానలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కర్ణన్ సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, జానకమ్మతోట, రహమత్నగర్, ఎస్సీఆర్ హిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కర్ణన్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్రావు, హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్రెడ్డి, ఏసీపీ ప్రసీద, డీఈఈ భద్రు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
ఎలక్షన్ కమిషన్ మోదీ కమిషన్గా మారింది
పంజగుట్ట: దేశంలో హిందుత్వ, ఫాసిస్టు విధానాల అమలులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ను మోదీ కమిషన్గా మార్చిందని పలువురు వక్తలు విమర్శించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం, జాగో నవ భారత్, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘వుయ్ డిమాండ్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్–ఫెయిర్ ఎలక్షన్స్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ చంద్రకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత చలపతిరావు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజాలంలో ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగ యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నారని, బిహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఎన్నికల కమిషన్ కొత్త నాటకం ఆడుతుందని, అందులో భాగమే ఓటర్ల సవరణ అని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర బాడీగా ఉండాలని, అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించారు. ఒకప్పుడు ఎన్నికల్లో ఫిజికల్ రిగ్గింగ్ జరిగేదని, ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. సమావేశంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, జానకి రాములు, పోటు రంగారావు, వి.శ్రీనివాస్, సోహ్రాబేగం, పాశం యాదగిరి, బండి దుర్గా ప్రసాద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల విమర్శ -
భారీ వర్షాలకు కూలిన ఇళ్లు
తాండూరు టౌన్: మల్రెడ్డిపల్లిలో కూలిన ఇంటి పైకప్పుమర్పల్లి: గుర్రంగట్టు తండాలో ఇల్లు కూలడంతో ఆదుకోవాలని కోరుతున్న బాధితులు పరిగిలో వర్షానికి కూలిన ఇల్లు పరిగి/తాండూరు టౌన్/మర్పల్లి/దోమ: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు మండలాల్లో మంగళవారం ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మర్పల్లి మండలం బూచన్పల్లి, గుర్రం గట్టుతండా, కొత్లాపూర్ గ్రామాల్లో మూడు ఇళ్లు పడిపోయాయి. తమను ఆదుకోవాలని బాధితులు నూతి లలితమ్మ, మెగావత్ సీతీబాయి, బేగరి పద్మమ్మ ప్రభుత్వాన్ని కోరారు. దోమ మండలం ఐనాపూర్లో నర్సమ్మకు చెందిన పెంకుటిల్ల్లు కూలిపోయింది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా దెబ్బతింది. పరిగి పట్టణ పరిధిలోని బోయవాడ కాలనీకి చెందిన కుమ్మరి నర్సింహులు ఇల్లు పడిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు. తాండూరు పట్టణం మల్రెడ్డిపల్లిలోని ఓ ఇల్లు కూలిపోయింది. మిట్టి చంద్రమ్మ భర్త మృతి చెందడంతో ఇద్దరు కుమారులతో నాపరాతి కప్పు గల ఇంటిలో జీవనం సాగిస్తోంది. ఇద్దరు కుమారులు పనుల కోసం హైదరాబాద్కు వలస వెళ్లారు. మంగళవారం ఇంటి పైకప్పు ఓ పక్క కూలిపోయింది. ఆ సమయంలో చంద్రమ్మ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తనకు ఇళ్లు తప్ప ఏ దిక్కూ లేదని, ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంది. -
పొలంలో నీరు ఉండొద్దు
ధారూరు: మండల కేంద్రంలో నీట మునిగిన పత్తి పంటను జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం పరిశీలించారు. మంగళవారం ధారూరు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధిక వర్షాలు కరుస్తునందున పంట పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. కాల్వలు తీసి నీటిని బయటకు పంపాలని సూచించారు. వేరుకుళ్లు తెగు లు రాకుండా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాముల ముందును లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్ల వద్ద పోయాలన్నారు. ప్రస్తుతం కంది పంట కొమ్మలు ఏర్పడే దశలో ఉందని, వేరుకుళ్లు తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాగ్జిన్ను లీటరు నీటిలో కలిపి మొదళ్లు తడిసెలా పోయాలన్నారు. నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు. -
మార్కెట్ అభివృద్ధికి కృషి
మర్పల్లి: మర్పల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చైర్మన్ వై మహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి ఆదాయ వ్యయాలు చదివి వినిపించారు. అనంతరం అభివృద్ధిపై సభ్యులు చర్చించారు. మోమిన్పేట్, బంట్వారం మండలాల్లో నిర్వహిస్తున్న మేకల సంతకు భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మోమిన్పేట్లో నందివాగు ప్రాజెక్టు పక్కన రెండు ఎకరాల భూమి, బంట్వారం బస్టాండ్ పక్కన ఎకరా భూమి కేటాయించాలని కలెక్టర్కు లేఖలు రాసినట్లు చెప్పారు. ఈ విషయమై స్పీకర్ ప్రసాద్కుమార్, కలెక్టర్ ప్రతీక్జైన్తో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం భూమి కేటాయించగానే మోమిన్పేట్, బంట్వారంలో రూ.కోటి చొప్పున రెండు షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. అలాగే సాగుకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఏఓ శ్రీకాంత్, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి -
ఘన స్వాగతం
పూడూరు: వికారాబాద్ పర్యటనకు విచ్చేసిన బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును మండల నాయకులు ఘనంగా సన్మానించారు. అంగడిచిట్టంపల్లి గేటు వద్ద, మన్నెగూడ చౌరస్తాల్లో శాలువా, గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లే ష్ పటేల్, నాయకులు వెంకటయ్య, రవీందర్, అనీల్, నవీన్జోషి తదితరులు పాల్గొన్నారు. కూరగాయల సాగుపై అవగాహన యాచారం: మండలంలోని చౌదర్పల్లిలో మంగళవారం కూరగాయల పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. ఏ సీజన్లో ఏవి సాగు చేయాలి, మార్కెట్కు తరలింపు, విత్తనాలు, నార్ల ఎంపికలపై అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి బసవన్నప్ప వివరించారు. -
వానలే వానలు
వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంవికారాబాద్: జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జాలువారి పంటలు పాడవుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన వర్షాలు మంగళవారం వరకు కురుస్తూనే ఉన్నాయి. సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. వరినాట్లు వేస్తున్న రైతులకు ఈ వానలు ఎంతో ఉపయోగకరం కాగా మిగతా పంటలు వేసిన వారికి శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్ల్లుతోంది. వాగులు పారుతూ చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. దాదాపు అన్ని చెరువులు అలుగు పారుతున్నాయి. పలు చోట్ల లో లెవెల్ వంతెనలపై నుంచి వాగులు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరికొన్ని చోట్ల సాహసం చేసి వాగులు దాటి వెళుతున్నారు. గత వారం పరిగి – వికారాబాద్ మార్గంలోని వంతెన కుంగిపోగా వాహనదారులు అవస్థలు పడ్డారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే మా ర్గంలో మద్గుల్ చిట్టంపల్లి సమీపంలో వాగుపై భారీ గుంత పడింది. మధ్యలో కుంగిపోవడంతో ఇరువైపులా మట్టిపోసి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. వేల ఎకరాల్లో.. ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. మరో లక్ష ఎకరాల్లో వరి సాగు చేయవచ్చని అధికారులు అంటున్నారు. చెరువులు, కుంటలు, బావులు, బోరు బావుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వరి నాట్లు వేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చేసిన వారు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 50శాతం పంట పొలాలు జాలువారే పరిస్థితి వచ్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పది ఇళ్లు కూలిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. వానలు తగ్గుముఖం పట్టి పది రోజుల పాటు ఎండ కాస్తేనే పంటలు గట్టెక్కుతాయని అన్నదాతలు అంటున్నారు. లేకుంటే పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు వర్షాభావ పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని 20 రోడ్లలో ప్రమాదకర వాగులు, బ్రిడ్జీలను గుర్తించారు. వాటి వద్ద అధికారుల పహారా కాస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి కాలనీలు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా.. బురదమయంగా మారాయి. పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో అధిక వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. -
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–15 బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారంతో ముగిసాయి. బాలుర విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రథమ స్థానంలో, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో, మంచిర్యాల తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానం సూర్యాపేట, తృతీయ స్థానం నారాయణ్పేట జిల్లాలు దక్కించుకున్నాయి. విజేతలకు షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి హీర్యానాయక్, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్రావు, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీఈటీలు, పీడీలు నాగరాజు, సుధాకర్, షబ్బీర్, చెన్నకిష్టారెడ్డి, భాస్కర్రెడ్డి, సుధాకర్, రవికుమార్, బస్వరాజ్, మల్లేష్, బాబయ్య, వెంకటేశ్, శ్రీలత, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల తదితరులు పాల్గొన్నారు. సాదాసీదాగా ముగింపు రాష్ట్ర స్థాయిలో 32 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్న టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. సాదాసీదా కార్యక్రమం ముగించడంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గురయ్యారు. -
భక్తిశ్రద్ధలతో శత రుద్రాభిషేకం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున భవనంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మంగళవారం లోక కల్యాణార్థం తెలంగాణ అర్చక జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 108 మంది అర్చకుల సమక్షంలో మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. డాక్టర్ ముద్ద భక్తవత్సలం దంపతులు ఈ కార్యక్రమం జరిపించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఇతర నాయకులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ వేదపండితులు సాంబశివశర్మ, డాక్టర్ మహంతయ్య, నాగయ్య స్వామి, ప్రహ్లాద్ సంగయ్య , ఆలయ ప్రధాన అర్చకులు బస్వరాజు తో పాటు ఆయా ఆలయాల జంగమ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకర వాగులు దాటొద్దు
మోమిన్పేట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కు పలు మార్గాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వాటిని దాటే ప్రయత్నం చేయరాదని ఎస్పీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటాల్సి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రమాదం జరగదని తేలిన తర్వాతే దాటే ప్ర యత్నం చేయాలన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టు అలుగు, కల్వర్టును పరిశీలించారు. ఇలాంటి వాటిని దాటరాదన్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వర కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. అత్యవసరం అయితే సుర క్షిత మార్గాల్లో మాత్రమే వెళ్లాలని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు లేదా డయల్ 100కు కాలే చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకట్, ఎస్ఐ అరవింద్ తదితరులు ఉన్నారు. -
డెంగీ నివారణకు చర్యలు
తాండూరు: మున్సిపల్ పరిధిలో డెంగీ నివారణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్రయాదవ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్, మల్రెడ్డిపల్లి, పాత తాండూరు ప్రాంతాల్లో దోమలు, లార్వాల నివారణకు మందు పిచికారీ చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్లకు వెళ్లి ఫీవర్ సర్వే చేశారు. పరిసరాలు, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ మాలశ్రీ, తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్మేళా అనంతగిరి: అపోలో హోం హెల్త్ కెర్ ప్రైవేట్ లిమిటెడ్ నందు హోం కేర్ నర్సస్ ఉద్యోగాల భర్తీ కోసం గురువారం వికారాబాద్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుభాన్ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో జాబ్మేళా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9676047444లో సంప్రదించాలన్నారు. ప్రవీణ్కుమార్ను కలిసిన నర్మద కొడంగల్: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఆ పార్టీ కొడంగల్ నాయకురాలు నర్మద మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కొడంగల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన సూచించారని తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలికి పీహెచ్డీ పట్టా దుద్యాల్: మండలంలోని పోలేపల్లికి చెందిన నర్సమ్మ హిందీలో పీహెచ్డీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని చెట్టుపల్లి తండా కేజీబీవీలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ దళిత సాహిత్యంపై హిందీలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు. సాదియా బేగంకు బంగారు పతకం పరిగి: పరిగి పట్టణానికి చెందిన నజీరుద్దీన్ కూతురు సాదియా బేగం బంగారు పతకం అందుకుంది. ఉస్మానియ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్ 2023 – 24లో టాపర్గా నిలవడంతో బంగారు పతకం అందజేశారు. మంగళవారం నగరంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు. -
విద్యుత్ షాక్తో మూగజీవాల మృత్యువాత
బంట్వారం: విద్యుత్ షాక్తో మేకలు మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కోట్పల్లి మండలం బార్వాద్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెంటయ్య ఎప్పటిలాగే తన మేకలను ఇంటి సమీపంలోని రేకుల షెడ్డులో ఉంచాడు. కరెంటు తీగలు రేకులకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎనిమిది మేకలు మృతిచెందాయి. దీంతో తన రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. పాడి గేదె దుర్మరణం.. యాలాల: విద్యుదాఘాతంతో ఓ గెదే మృతి చెందింది. దేవనూరుకు చెందిన గోరేపల్లి లక్ష్మప్పకు చెందిన గెదేను పొలం శివారులోని షెడ్డులో మేతకు వదిలాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు షెడ్డులో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు మోమిన్పేట: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ అరవింద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం మోమిన్పేటకు చెందిన అరిగే ఉదయ్కుమార్, కుడుగుంట విజయ్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని వికారాబాద్ మార్నింగ్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.3 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని హెచ్చరించారు. రహిమతున్నీసాకు బెస్ట్ టీచర్ అవార్డు అనంతగిరి: పూడూరు మండలం మీర్జాపూర్ ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న రహిమతున్నీసా బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. 600 ఎకరాల్లో పంట నష్టం తాండూరు రూరల్: వర్షాలకు దెబ్బతిన్న పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తాండూరు వ్యవసాయశాఖ ఏడీఏ కొముర య్య అన్నారు. మంగళవారం పలు గ్రామాల్లో ని పంట పొలాలను పరిశీలించారు. తాండూరు మండలంలో 600 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈనివేదికను జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు పంపిస్తామన్నారు. పత్తి పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏఈఓ, రైతులు ఉన్నారు. చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు ధారూరు: మండల పరిధిలోని గురుదోడ్ల చెరువు కట్టకు ఇరిగేషన్ అధికారులు మంగళారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈనెల 14న అర్ధరాత్రి వేళతెగిపోయిన కట్ట ముందు భాగంలో ఇసుక బస్తాలు వేసి మట్టితో పూడ్చారు. బుధవారం పనులను పూర్తి చేస్తామని చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు. చెరువు నుంచి పారిన వరదతో 35 ఎకరాల మేర పంట పాడైందని తెలిపారు. రూ.2.50 లక్షలు వెచ్చించి రాజమండ్రి నుంచి చేప పిల్లలు తీసుకువచ్చి వదిలామని, కట్ట తెగిపోవడంతో తాము నష్టపోయామని పీసీఎంతండా, జీడిగడ్డతండా గిరిజనులు వాపోయారు. తమకు పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. ఇద్దరికి జైలు మోమిన్పేట: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ అరవింద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం మోమిన్పేటకు చెందిన అరిగే ఉదయ్కుమార్, కుడుగుంట విజయ్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని వికారాబాద్ మార్నింగ్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.3 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. -
మీ సేవలో దోపిడీ!
● ఒక్కో రేషన్ కార్డుకు రూ.1,500 చొప్పున వసూలు ● నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల సేకరణ ● తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన బాధితులు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రేషన్కార్డులు అందిస్తోంది. కొన్ని చోట్ల మీ సేవ నిర్వాహకులు మాత్రం అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే దరఖాస్తులు పక్కన పెడుతున్నారు. అమాయక ప్రజలను దోచుకుంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. ఆయా పనుల కోసం వెళ్లే వారు నిర్దేశిత ఫీజులు మాత్రమే చెల్లించాలి. – అజీం పటేల్, డీసీసీ కార్యదర్శి చర్యలు తీసుకుంటాం మీ సేవ కేంద్రానికి వచ్చే ప్రజల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. రేషన్ కార్డులు ఇప్పిస్తామని మీ సేవ కేంద్రం నిర్వాహకుడు డబ్బులు తీసుకున్నాడని మన్నెగూడకు చెందిన వారు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – భరత్గౌడ్, తహసీల్దార్ పూడూరు పూడూరు: ప్రజలకు ఆన్లైన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాల్లో అవినీతి జలగలు పీక్కు తింటున్నాయి. కానీ సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్నెగూడకు చెందిన సనాబేగం, జాకీర్ హుస్సేన్ రేషన్కార్డుల దరఖాస్తు చేసుకునేందుకు పూడూరులోని మీ సేవ కేంద్రానికి వెళ్లారు. వీరి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1500 చొప్పున వసూలు చేసిన నిర్వాహకులు మొత్తం రూ.3 వేలు తీసుకున్నారు. రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాదేనని చెప్పారు. మండల పరిధిలోని అన్ని మీ సేవల పరిస్థితి ఇలాగే తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా దరఖాస్తులకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులకు విరుద్ధంగా వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది వీరితో కుమ్మకై ్క దండుకుంటున్నారు. అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో తరచూ ఎక్కడో ఓ చోట ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమాలు ఆగడం లేదు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో ఇటీవల ధారూరులోని మీ సేవ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. కానీ ప్రభుత్వ పథకాలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వరకు అన్ని దరఖాస్తులు మేమే చూసుకుంటాం అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. -
ఫిజిక్స్లో విద్యారాణికి పీహెచ్డీ పట్టా
షాద్నగర్రూరల్: ఫిజిక్స్లో ‘వేరియబుల్ అపోడైజేషన్ రీసెర్చ్ గైడ్ ఆప్టికల్ ఇమేజింగ్ సిస్టం’పై చేసిన పరిశోధనకు గాను షాద్నగర్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన ఎస్.విద్యారాణికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది. విద్యారాణి ప్రొఫెసర్ కరుణసాగర్ నేతృత్వంలో పరిశోధన చేసి గ్రంధాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణన్, వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. డాక్టరేట్ అందుకున్న సంధ్యారాణి సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ షాద్నగర్ డివిజన్లో సూపర్ వైజర్గా పని చేస్తున్న సంధ్యారాణి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గంగపుత్ర కమ్యూనిటీలో మహిళా సాధికారత అంశంపై అసోసియేటెడ్ ప్రొఫెసర్ ధీరజ్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్, యూనివర్సిటీ వీసీ కుమార్ మొలుగారం చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఐదుగురు అధ్యాపకులకు డాక్టరేట్ హయత్నగర్: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న లెక్చరర్లు అవేష్ మోహియుద్దీన్, మధు, మక్ల, యాదగిరిరెడ్డి, నాగరాజు డాక్టరేట్ అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, వీసీ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసినందుకు గాను అవేష్ మోహియుద్దీన్, మధుకు, రాజనీతి శాస్త్రంలో పరిశోధనలకు యాదగిరిరెడ్డి, నాగరాజులక, ఇంగ్లిష్లో పరిశోధనలకు మక్లకు దక్కాయి. -
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
తాండూరు టౌన్: తాండూరు ఫొటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈమేరకు స్థానిక వినాయక్ చౌక్లో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒక ఫొటో అనేక పాత, మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, హీరాలాల్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ మందలించిందని..
ఇబ్రహీంపట్నం: తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిన బాలున్ని ఇబ్రహీంపట్నం పోలీసులు క్షేమంగా అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దేవరకొండకు చెందిన విజయకుమారి, హరిష్ దంపతులు అబ్దుల్లాపూర్మెట్ మండలం బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు తుర్కయంజాల్ కాకతీయ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. చిన్న విషయంలో అమ్మ మందలించిందనే కారణంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తుర్కయంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసుల కంటపడ్డాడు. అతన్ని ఆరా తీసి, పీఎస్కు తీసుకెళ్లి తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు. ● ఇంట్లోనుంచి వెళ్లిన బాలుడు ● తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కలెక్టర్కు అంగన్వాడీల వినతిపత్రం అనంతగిరి: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్స్, వెల్ఫేర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యదర్శి ఎం.భారతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు చిన్నారుల కోసం వెలిసిన ప్రైవేటు స్కూళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనుభవం, అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని నినదించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రూ.5 లక్షలకు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.32 వేలు చెల్లించాని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వర్షంలో తడుస్తూనే గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైహిపాల్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మి, మంజుల, వనజ, బేబీ, రేణుక, వసంత, పుష్ప, అమృత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం: అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం్లో రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్–15 బాలుర, బాలికల వాలీబాల్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని, మేధో సంపత్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభాపాటవాలు చాటాలని, క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే విద్యార్థులను పీఈటీలు, పీడీలు ప్రోత్సహించి, వారికి మంచి అవకాశాలు దక్కేలా తమవంతు కృషి చేయాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 25న పుణేలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. పోటీలకు ములుగు జిల్లా మినహా 32 జిల్లాల నుంచి సుమారు 700 మంది వాలీబాల్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో గురుకుల విద్యాపీఠం్ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్రావు, మండల విద్యాధికారి హీర్యానాయక్, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి, పీడీ, పీఈటీల సెక్రటరీ ఎండీ షబ్బీర్, క్రీడల అబ్జర్వర్ వెంకట్నారాయణ, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కొడంగల్ రూరల్: పట్టణ శివారులోని కేజీబీవీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా బోటని(పీజీ సీఆర్టీ) సబ్జెక్టు బోధించేందుకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ స్రవంతి తెలిపారు. ఎంఎస్సీ (బోటని) బీఈడీ అర్హత ఉండి ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 19, 20వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, పూర్తి వివరాలకు విద్యాలయంలో సంప్రదించాలని ఆమె తెలిపారు. నేడు, రేపు స్పాట్ అడ్మిషన్లు అనంతగిరి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మంగళ, బుధవారాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సీట్లకు 19న, ప్రైవేట్ సీట్లకు 20న ఆయా కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 77807 40880లో సంప్రదించాలన్నారు. బాధ్యతలు చేపట్టిన డీటీ సందీప్ తాండూరు రూరల్: తాండూరు డిప్యూటీ తహసీల్దార్గా సందీప్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసి డిప్యూటేషన్పై ఏడాది పాటు తాండూరు సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. మళ్లీ యథావిధిగా తాండూరు డీటీగా విధుల్లో చేరారు. ముదిరాజ్లను బీసీ ఏలో చేర్చాలి కొడంగల్: ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ ఏలో కలపాలని ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన ముదిరాజ్లను బీసీ ఏలో కలిపితే మేలు జరుగుతుందన్నారు. జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని బీసీ కమిషన్ నివేదిక ఇస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్, ముదిరాజ్ సంఘం నాయకులు వేణుగోపాల్, సత్యపాల్, వెంకటయ్య, నర్సప్ప, బాలయ్య, మధుసూదన్, హన్మంతు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోండి తాండూరు: ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి, తాండూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో సోమవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. తాండూరులో డెంగీ కేసులు ప్రబలకుండా చూడాలన్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీల్లో మెరుగైన వైద్యం అందించాలన్నారు. మందుల కొరత ఉంటే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. తాండూరులో దోమల వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య పనులతో పాటు ఫాగింగ్ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయాన్ని సోమవారం విశ్రాంత ఐఏఎస్ శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆల య నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శరత్ దంపతులు లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శరత్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు సదానందం, సభ్యులు హనుమంతు, అర్చకులు ప్రమోద్, వీరేశ్ పాల్గొన్నారు. -
దరఖాస్తులు 11,718
భూ భారతి సమస్యల పరిష్కారానికి 14తో ముగిసిన గడువు 807 పరిష్కారం వికారాబాద్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రైతుల నుంచి తీసుకున్న అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. జూన్ 2 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రాగా 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కుప్పలు తెప్పలుగా అర్జీలు రావడంతో రెండు నెలలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దరఖాస్తుల పరిష్కార గడువు ఈ నెల 14తో ముగిసింది. కేవలం పది శాతం లోపే పరిష్కారమయ్యాయి. జి ల్లా వ్యాప్తంగా 11,718 దరఖాస్తులు రాగా కేవలం 807ని మాత్రమే పూర్తిస్థాయిలో పరిష్కరించారు. 11,117 సమస్యలకు సంబంధించి అర్జీదారులకు నోటీసులు జారీ చేశారు. మరో 2,147 చివరి దశకు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సమస్యల పరిష్కారంలో జిల్లా 10వ స్థానంలో ఉంది. ఆప్షన్ లేక డీలా.. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వ్యాజ్యాలు మినహా మిగిలిన వాటిని ఆగస్టు 14వ తేదీ నాటికి పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అనేక సమస్యలకు ఆప్షన్ లేకపోవడం అడ్డంకిగా మారుతోంది. వచ్చిన వాటిలో చాలా వరకు డబులు దరఖాస్తులు ఉన్నాయి. మీసేవా కేంద్రాలతో పాటు రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇచ్చారు. సాదాబైనామా దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ అర్జీలే అత్యధికం గత ప్రభుత్వ హయాంలో భూ సమస్యల పరిష్కారం కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించారు. అప్పట్లో కలెక్టర్ లాగిన్లో ఐదు వందల అర్జీలు మాత్రమే పెండింగ్లో ఉండేవి. రెవెన్యూ కొత్త చట్టం అమలులోకి రావడంతో మళ్లీ వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో మిస్సింగ్ సర్వే నంబర్లు, సాదాబైనామా, అసైన్డ్ భూముల సమస్యలు, పీఓబీ, విరాసత్, మ్యుటేషన్, డేటా కరక్షన్ తదితర దరఖాస్తులు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 4,013, డీఎస్ పెండింగ్కు 1,604, సక్సేషన్కు 1,654, ఎక్సెటెంట్ మిస్సింగ్కు సంబంధించి 690 దరఖాస్తులు వచ్చాయి. అక్కడికక్కడే కొన్ని పరిపరిష్కరించినవి పోనూ మరో 11,718 దరఖాస్తులు వచ్చాయి. త్వరగా పరిష్కరిస్తాం జిల్లా వ్యాప్తంగా పది వేలకు పైగా అర్జీలు వచ్చాయి. ఇప్పటికే పరిశీలన, డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేశాం. కోర్టు పరిధిలో ఉన్న వాటిని, సాదాబైనామా సమస్యలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తాం. డబుల్ దరఖాస్తులను పరిశీలించి తొలగిస్తాం. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ -
నేత్రపర్వం.. శివపార్వతుల కల్యాణం
వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారాన్నిపురస్కరించుకుని పార్వతీపరమేశ్వరుల కల్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకం చేశారు. 11 గంటలకు వేద మంత్రోచ్ఛారణ నడుమ అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన షెడ్ను ప్రారంభించారు. వేడుకల్లో వీరశైవ సమాజం ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, పట్టణ, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – అనంతగిరి -
పాపన్నగౌడ్ ఆశయాలు సాధిద్దాం
అనంతగిరి: బహుజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్గాల సమానత్వం, వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాప న్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసితెలంగాణ గడ్డపై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్ డీఆర్ఓ మంగ్లీలాల్, ఆర్డిఓ వాసుచంద్ర, బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. యూరియా అందుబాటులో ఉంది వానాకాలం సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా పంపిణీపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు నెలకు సంబంధించి 11,200 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, ఇప్పటి వరకు 4,250 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందన్నారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కలిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం, జనరల్ మేనేజర్ మహేశ్వర్, మార్కెటింగ్ శాఖ అధికారి సారంగా పాణి పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచరాదని, సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ, విద్యాశాఖ, ఆసరా పెన్షన్లకు సంబంధించి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలని సూచించారు. భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. -
ఓపెన్ వర్సిటీలో ఉపాధి అవకాశాలు
కొడంగల్ రూరల్: సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులకు ఆర్ఏఎస్సీఐ(రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కమర్షియల్ ఆఫ్ ఇండియా) వారితో ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు, మహిళలకు ఉమెన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్, ఐటిఐ, ఓపెన్ ఇంటర్ పాసైనవారు ఈ నెల 30వ తేదీలోపు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య నందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఓపెన్ వర్సిటీకి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్పాల్, ఓపెన్ వర్సిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
రహదారులకు మరమ్మతులు చేయిస్తాం
కుల్కచర్ల: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామీణ రోడ్లు పాడయ్యాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి వెళ్లే మెటల్ రోడ్డు వర్షానికి దెబ్బతిని గుంత ఏర్పడింది. దీంతో ఏఈ మణికుమార్, పంచాయతీ కార్యదర్శి మైమున బేగంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడైన రోడ్లను పరిశీలించి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నామని, ఆయన అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మండలంలో ఎక్కడ రోడ్లు పాడైన, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు గోపాల్, సతీష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు ఇబ్రహీంపట్నం: చెక్ బౌన్స్ కేసులో నిందితుడైన భాస్కర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఇబ్రహీంపట్నం ఎంఎం కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువర్చారు. న్యాయ వాది రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు దయానంద్కు రూ.24,87,500 చెల్లించాలని, అలాగే భాస్కర్ ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్చు చెప్పారన్నారు. శంకర్పల్లి ఎంపీడీఓ భార్య ఆత్మహత్య లాలాపేట: శంకర్పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ భార్య ఉష(37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎంపీడీఓ వెంకయ్యగౌడ్ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 4లోని హోమ్ సన్షైన్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొద్ది రోజులుగా మానసిక వేదన అనుభవిస్తున్న ఉష ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన వెంకయ్యగౌడ్ ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అపార్ట్మెంట్ వాచ్మన్ సాయంతో తలుపులు బద్ధలు కొట్టి, కిందకు దించగా అప్పటికే చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిఫాల్టర్లు చెల్లిస్తేనే.. మేమూ కడుతాం అబ్దుల్లాపూర్మెట్: రైతుల ముసుగులో కొందరు రైతుసేవా సహకార సంఘం నుంచి అధిక మొత్తంలో రుణాలు పొంది, చెల్లించడం లేదని.. డిఫాల్టర్లు చెల్లిస్తేనే తాము చెల్లిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణాలను త్వరగా చెల్లించాలని సంఘం అఽధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయం ఎదుట మజీద్పూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సాగు చేయని వారికి పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చి, వసూలు చేయకుండా కాలం గడుపుతారని, చిన్నమొత్తం రుణంగా ఇచ్చి చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుణాలు మంజూరు చేసి, డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. కొంత మంది 200 గజాల ప్లాటు తప్పుడు పత్రాలు పెట్టి, బ్యాంకులో రుణాలు పొందారని పేర్కొన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని రుణాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు పొంది సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి, రూ. కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత అలాంటి వారి నుంచి రుణం వసూలు చేయాలని సూచించారు. రాజకీయ లబ్ధికోసమే భూ ధారాదత్తం బడంగ్పేట్: పేదలు సాగుచేసుకుంటున్న భూములను గత ప్రభుత్వం లాక్కొని.. రాజకీయ లబ్ధికోసం, ఓట్ల కోసం క్రైస్తవులకు దారాదత్తం చేసిందని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొద్రమోని పురుషోత్తం ఆరోపించారు. సోమవారం కార్పొరేషన్ పరిధి కుర్మల్గూడలో జి.కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను నాటి బీఆర్ఎస్ సర్కార్ బలవంతంగా గుంజుకుందని విమర్శించారు. కుర్మల్గూడలో ఇళ్లులేని ఎంతో మంది పేదలు ఉన్నారని, వారికి 60 గజాలు కేటాయించడానికి మనస్సు రాని బీఆర్ఎస్.. క్రైస్తవుల మెప్పు పొందడానికి వారి సమాధులకు ఎకరాల కొద్దీ స్థలాన్ని ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. ఆ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. -
వర్షం జోరు.. వరద హోరు
దోమ/ధారూరు: జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సోమవారం ధారూరు మండల పరిధిలోని రుద్రారం–నాగసమందర్ గ్రామాల మధ్య కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలను కొన్ని గంటల పాటు స్తంభింపజేశారు. దోమ మండలం బ్రాహ్మణపల్లిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అటుగా రాకపోకలు బంద్ అయ్యాయి. అధికారులు వాహనదారులు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పొలాల్లోకి వరద చేరడంతో పంటలు నీట మునిగాయి. -
ఫాగింగ్.. పరేషాన్!
● దోమకాటుకు పల్లెలు విలవిల ● మూలనపడిన యంత్రాలు ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ దౌల్తాబాద్: దోమకాటుతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణకు గత ప్రభుత్వ హయాంలో వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్ మిషన్లు చాలా పంచాయతీల్లో చెడిపోగా.. మరికొన్నింటిలో మిషన్లు మాయమయ్యాయి. దోమకాటుకు పల్లెవాసులు విలవిలలాడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్తో పాటు ఇతర వైరల్ జ్వరాలు తాండవం చేస్తున్నాయి. దోమల నివారణకు కొనుగోలు చేసిన యంత్రాలు పంచాయతీల్లో లేకపోవడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ.35వేల నుంచి రూ.40వేలు వెచ్చించి కొనుగోలు చేసింది. కొన్ని గ్రామాల్లో మేజర్ పంచాయతీల నుంచి అడపాదడపా తీసుకుని పారిశుద్ధ్య కార్మికులు ఫాగింగ్ చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో యంత్రాలు మాయం కావడంతో పక్కన పంచాయతీల నుంచి తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటీవల స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించాలని అధికారులు సూచనలు చేస్తున్నప్పటికీ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్, పెట్రోలు, లిక్విడ్లను సమ పద్ధతుల్లో వినియోగించకపోవడంతో యంత్రాలు చెడిపోయినట్లు తెలుస్తోంది. ఖర్చు తడిసి మోపెడు మండలంలోని చాలా గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులు చేయించలేక మూలన పడేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. చెడిపోయిన యంత్రాలకు మరమ్మతులు చేయించాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల స్వైరవిహారం గ్రామ పంచాయతీల్లో వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేపట్టాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభంలో వీటి వినియోగం మరింత ఎక్కువ చేసినప్పుడే దోమలను సగం వరకు నియంత్రణ చేయవచ్చు. గ్రామం మొత్తంగా నెలలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదు. ఒకసారి పిచికారీ చేసిన ఫొటోలనే ప్రతి నెలా వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదేశాలు జారీ చేశాం ప్రతి గ్రామంలో దోమల నివారణ కోసం మందును పిచికారీ చేయాలని కార్యదర్శులకు సూచనలు చేశాం. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ మిషన్లు పాడైనట్లు తెలిసింది. వాటిని మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. వ్యాధుల తీవ్రత దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణకు నిరంతరం పర్యవేక్షించేలా కృషి చేస్తాం. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
నీళ్లపల్లి.. భక్తజనం ప్రణమిల్లి
● వైభవంగా ఏకాంబరి రామలింగేశ్వరుడి ఉత్సవాలు ● సప్తకొలనులలో భక్తుల పుణ్యస్నానాలు బషీరాబాద్: జడివానలోనూ ఏకాంబరి రామలింగేశ్వరస్వామి జాతరకు భక్తజనం పోటెత్తారు. మండలంలోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలోని సప్తకొలనులలో వెలసిన స్వామి వారి దర్శనం కోసం సోమవారం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రల సరిహద్దు గ్రామాల నుంచి వనాన్ని లెక్కచేయకుండా భక్తులు భారీగా కదిలి వచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రామలింగేశ్వరుడి ఆలయం చుట్టు ఉన్న సప్త కొలనులలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. తాండూరు, మహబూబ్నగర్ పట్టణాలతో పాటు కర్ణాటకలోని సేడం తాలుకా నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నడపడంతో వేలల్లో భక్తులు దర్శించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. యాకూబ్సాబ్ దర్గాకు పూజలు రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు కొలనులోని యాకూబ్సాబ్ దర్గాను దర్శించుకున్నారు. పూలు, పండ్లు పెట్టి మొక్కు తీర్చుకున్నారు. అలాగే ముస్లిం భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరై దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వైభవంగా రథోత్సవం స్వామి వారి రథాన్ని ఆలయ ధర్మకర్తల మండలి రకరకాల పూలతో అందంగా అలంకరించారు. రథంపై ఉత్సవమూర్తిని ఉంచి భక్తులు వీధుల గుండా ఊరేగించారు. ఈ జాతరకు ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు హాజరు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతరలో మిఠాయి దుకాణాలు, ఆటబొమ్మల దుకాణాలు, గాజుల దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. చీఫ్ విప్, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వర స్వామిని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి వేరువేరుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తం రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, నాయకులు సుధాకర్రెడ్డి, రుక్మారెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. -
శ్రావణమాసం.. పూజలు ప్రత్యేకం
తాండూరు టౌన్: చివరి శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని శ్రీభావిగి భద్రేశ్వర స్వామి దేవస్థానంలోని శివాలయంలో పరమశివుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటి పట్టణంలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దౌల్తాబాద్లో ఊరేగింపు దౌల్తాబాద్: మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో సోమవారం శ్రావణమాస ముగింపు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్లోని నీలకంఠస్వామి ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకం, పల్లకీసేవ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం చేశారు. జినుగుర్తిలో మండలి చీఫ్ విప్.. తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గ్రామ శివారులో ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద శ్రావణమాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ధర్మకర్తలు కరమ్చందు, ఉత్తమ్చందు, మోహన్దాస్, రఘుకిషోర్, అనంతయ్య, జగదాంబ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. ఘనంగా జాతర మోమిన్పేట: శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో రాళ్లగుడుపల్లి పరిధిలోని రామలింగేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి మొదలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం భక్తులు లెక్క చేయకుండా స్వామివారి అభిషేకంలో మునిగి తేలారు. అంబు రామేశ్వరంలో పూజలు తాండూరు రూరల్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులోని పెద్దేముల్ మండలం తట్టెపల్లి–పాషాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అంబు రామేశ్వరస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు ఉపవాసం దీక్షలు విరమించారు. అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్కుమార్తో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. -
ఇరుకు చౌరస్తా.. ప్రయాణం అవస్థ
● కొడంగల్ వినాయక కూడలిలో వాహనదారుల ఇక్కట్లు ● ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని వినతికొడంగల్: పట్టణంలోని వినాయక చౌరస్తాను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు వినాయక చౌరస్తా సమీపంలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది విద్యార్థులు తిరుగుతుంటారు. ప్రతి రోజు ఈ ప్రాంతం రద్దీగా ఉంటోంది. ప్రయాణికులను ఎక్కించుకోడానికి దించడానికి ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడనే ఆపుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వినాయక చౌరస్తాను విస్తరించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు. నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి పట్టణాల్లో ప్రధాన కూడళ్ల విస్తరణకు జాతీయ రహదారుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. మహబూబ్నగర్–చించోలీ(ఎంసీ) అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించోలీ వరకు జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారికి 167ఎన్గా పేరు పెట్టారు. విస్తరణకు రూ.630 కోట్లు మహబూబ్నగర్ నుంచి హన్వాడ, గండీడ్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. బెంగళూరు, ముంబాయి జాతీయ రహదారులను కలిపే ఈ రహదారి సుమారు 150 కిలోమీటర్లు పొడవు ఉంది. వికారాబాద్ జిల్లాలో 45 కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రంలో 50 కిలోమీటర్లు, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 55 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి ఉంది. మహబూబ్నగర్–చించోలీ(ఎంసీ) జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.630 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్నగర్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా చించోలి, మన్నాకెళ్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చౌరస్తాను విస్తరిస్తే ట్రాఫిక్కు ఇబ్బందులు ఉండవని స్థానికులు కోరుతున్నారు. పనులు వేగవంతం చేయాలి మహబూబ్నగర్–చించోలీ(ఎంసీ రోడ్డు) జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలి. వినాయక చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ జాం అవుతుంది. రాకపోకలు సాగించడానికి విద్యార్థులకు, స్థానికులకు అంతరాయం ఏర్పడుతోంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా వినాయక చౌరస్తాను విస్తరించి సమస్యలు పరిష్కరించాలి. – నర్సిరెడ్డి, కొడంగల్ -
మూగజీవాలు భద్రం
● సీజనల్ వ్యాధులతో జాగ్రత్త ● అప్రమత్తత తప్పనిసరి ● లేదంటే పశుసంపదకు ముప్పు ● పశువైద్యాధికారి విశ్వనాథం నవాబుపేట: వానాకాలం సీజన్లో మనుషులకే కాదు.. మూగజీవాలకు వ్యాధుల ముప్పు తప్పదు. ఈ కాలంలో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు తదితర రోగాలు చుట్టుముడతాయి. ఈగలు, దోమల దాడి పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు యాజమాన్య చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటి జీవన స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, ఎలాంటి వ్యాధి సోకినా వెంటనే వైద్య చికిత్స అందించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వనాథం రైతులకు సూచిస్తున్నారు. కాగా మండలంలో ఆవులు, ఎడ్లు 4,232 ఉండగా.. గేదెలు 1,162, గొర్రెలు 3,573, మేకలు 7,874 ఉన్నాయి. గాలికుంటు గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాలా బలహీనంగా ఉంటుంది. పాడి పశువులు నీరసించి పోతుంటాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. సాగు పనులకు ఎడ్లు సహకరించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకునే వాటికి ఈ రోగం వ్యాపిస్తుంటుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్,సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సోకే ప్రమాదం ఉంది. వ్యాధి బారిన పడిన పశువులకు నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3,4 వారాల్లోబొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడి మేత తీసుకోలేక నీరసించిపోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది. జబ్బవాపు వయసులో ఉన్న ఆరోగ్య వంతమైన పశువులు, తెల్లజాతి పశువులకు ఈ జబ్బవాపు వ్యాధి సంక్రమిస్తుంటుంది. ఇది సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయదు. నిత్యం పడుకొనే ఉంటుంది. జబ్బభాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతుంటుంది. వాపు ఉన్నచోట చేతితో తాకితేగరగరమని శబ్దం వస్తుంది. సకాంలో వైద్యం అందించకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. సకాలంలో సూదిమందు, గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకా వేయిస్తే మేలు. గొర్రెల్లో కాలిపుండ్లు వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వలన కాలిపుండ్ల వ్యాధి సోకుతుంది. గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లుతుంది. చీముపట్టి నొప్పితో ముందుకాళ్లపై గెంటుతాయి. వ్యాధి ముదిరితే గిట్ట లూడిపోతాయి. ఇది సోకిన జీవాలకు 10 శాతం మైలతుత్తం, పదిశాతం జింక్సల్ఫేట్, లేదంటే ఐదుశాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయిట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజెక్షన్ వరుసగా 3–5 రోజుల పాటు వేయించాలి. గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనియొద్దు. గురక వ్యాధి ప్రస్తుత కాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు(గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న వాటికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని బారిన పడిన వాటికి అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. మేత మేయదు. గొంతుపై, మెడ కింద వాపు కన్పిస్తుంది. ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే ఎడతెరపి లేకుండా దగ్గుతూ, అపస్మారక స్థితికి వెల్లి చనిపోతుంది. దోమలు దాడి చేస్తే.. నేల చిత్తడిగా ఉండి, వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో నీరు నిల్వ ఉన్న గుంతలు, మురుగునీటి కాల్వల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులపై దాడి చేస్తుంటాయి. ఈ సీజన్లో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. తద్వారా పశువులు మేత సరిగా మేయవు, నిద్ర పోవు. ఫలితంగా అవి రక్తహీనతకు గురవుతాయి. ఈగలు, దోమ కాటు వలన పశువు శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. అందుకు పశువుల పాకలు, నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్ను పిచికారీ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండుపిడుకలు, వేపాకుతో పొగపెడితే ఈగలు, దోమలు తగ్గుతాయి. లేత గడ్డి ప్రమాదం తొలకరి జల్లులకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు అతిగా తింటుంటాయి. అయితే ఆ గడ్డిలో హైడ్రో ౖసైనెడ్ విష పదార్థం ఉంటుంది. దీనిని మేసిన 15 నిమిషాలకే పశువుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే అది మృత్యువాత పడే ప్రమాదంఉంది. కాబట్టి రైతులు పశువులకు లేత గడ్డిని మేతగా వేయవద్దు. తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
విస్తారంగా వర్షాలు..
నీటమునుగుతున్న పంటలు పూడూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల పరిధి రేగడిమామిడిపల్లి, బార్లపల్లి, చన్గోముల్, తిమ్మాపూర్, కంకల్, మిట్టకంకల్, చింతలపల్లి, పూడూరు, పుడుగుర్తి తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చన్గోముల్– బార్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపై బురద వచ్చి చేరింది. పుడుగుర్తి, కడుమూరు, కంకల్, మంచన్పల్లి, మేడిపల్లికలాన్, ఈసి వాగు పరుగులు తీస్తోంది. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత బొంరాస్పేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ట్రాక్టర్ల యజమానులు అంజిలయ్య, శ్రీకాంత్లపై కేసునమోదు చేశా మని ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపారు. ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సాబెర్ హుస్సేన్ (20) రెండు నెలల క్రితం తుక్కుగూడకు వలస వచ్చి హర్షగూడలో ఉన్న కంపెనీలో లేబర్గా పని చేస్తున్నాడు. తనకు ఇక్కడ పని చేయడం ఇష్టలేదని తోటి స్నేహితుడు లస్కర్కు చెప్పి సొంతూరు వెళ్తానంటూ ఈ నెల 6న బయల్దేరాడు. సొంతూరుకు వెళ్లకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ విషయమై స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గానీ 87126 62367 నంబర్లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్దమ్మ ఆలయంలో భక్తురాలి గొలుసు చోరీ ఫిలింనగర్: జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించేందుకు వచ్చిన ఓ మహిళా భక్తురాలి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్కు చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చారు. అదే సమయంలో మొక్కు తీర్చుకుంటుండగా ఆమె హ్యాండ్బ్యాగ్ చోరీకి గురైంది. అందులో ఉన్న 13 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురి కావడంతోఆమె కొడుకు నరేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మొక్కు తీర్చుకునేందుకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు తన తల్లి హ్యాండ్బ్యాగ్ చోరీ చేశారని, అందులో బంగారంతో పాటు నగదు ఉందని పేర్కొన్నారు. ఇక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఆమె హ్యాండ్బ్యాగ్ను చోరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎకై ్సజ్ పోలీసులు దాడిచేశారంటూ ఫిర్యాదు తమపై కూడా దాడిజరిగిందని ఎకై ్సజ్ పోలీసులు సైతం జీడిమెట్ల: నాంపల్లి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ కోటమ్మ తన సోదరుడిపై సర్జికల్ బ్లేడ్తో దాడిచేయించారని కుత్బుల్లాపూర్కు చెందిన పవన్ కుమార్ జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదే విదంగా నాంపల్లిఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ కోటమ్మ సైతం తన విధులకు అటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ ఇరువురి పిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి ఓ యువకుడి గంజాయి,హష్ అయిల్ సేవిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. రెండవ వ్యక్తిని పట్టుకునేందుకు కుత్బుల్లాపూర్లోని అయోధ్యనగర్కు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కోటమ్మ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ దర్యాప్తు చేస్తుండగా స్థానికంగా ఉన్న హేమంత్, నితీష్, రవితేజ, చరణ్ పోలీసుల విధులకు అటంకం కలిగించారంటూ ఆమె జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఎకై ్సజ్ అధికారులు బాలు మహేందర్,హేమంత్ అనే ఇద్దరిని విచారణ చేస్తున్నారు. వెంకటేశ్వర నగర్కు చెందిన చంటియాదవ్ చూసి వారిని పట్టుకోవడానికి మీరెవరు అంటూ ప్రశ్నించాడు. దీంతో వారు దాడిచేశారని.. డాక్టర్లు 23 కుట్లు వేశారని బాధితుడి సోదరుడు పవన్కుమార్ జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకున్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం
శంషాబాద్ రూరల్: వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ రాజేంద్ర(35), పూజ దంపతులు ఉపాధి కోసం పదేళ్ల కిందట వలస వచ్చి ఇందిరానగర్ దొడ్డిలో నివామసుంటున్నారు. ఈ నెల 10న పూజ ఉదయం పనికి వేళ్ల సమయంలో రాజేంద్ర ఇంట్లోనే ఉన్నాడు. స్వగ్రామం వెళ్తానని చెప్పాడు. అదే రోజు సాయంత్రం పూజ పని నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. భర్తకు చెందిన దుస్తులు, బ్యాగు కనిపించలేదు. అతను స్వగ్రామం వెళ్లి ఉంటాడని భావించింది. దీంతో భర్తకు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ అయింది. అత్తకు ఫోన్ చేసి అడగగా అక్కడకు రాలేదని చెప్పింది. దీంతో అతని కోసం అన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోవడంతో ఆదివా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో... ముచ్చింతల్కు చెందిన బొడ్డు రత్నం(48) ఈ నెల 13న నందిగామ మండలం చేగూరులో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి రత్నం భార్య మంజుల తన కూతురుకు ఫోన్ చేసి వాకబు చేసింది. అతను కూతురు వద్దకు వెళ్లలేదని తెలియడంతో అన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మద్యానికి బానిసై.. ఉరివేసుకుని
డ్రైవర్ బలవన్మరణం మొయినాబాద్: మద్యానికి బానిసైన ఓ డ్రైవర్ కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్కు చెందిన కావలి వెంకటేశ్ (48) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. దీంతో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ మద్యం మత్తులో భార్యకు ఫోన్ చేసి తాను ఉరివేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిశీలించారు. మద్యం మత్తులో ఉండడంతో పోలీస్స్టేషన్కు తీసుకెళ్లకుండా ఇంటిదగ్గరే వదిలి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి
ఇబ్రహీంపట్నం: హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వీరయ్య డిమాండ్ చేశారు. రైస్ మిల్లు హమాలీ కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఒకటవ మహాసభను స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా హమాలీ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. రైస్ మిల్లు యాజమాన్యాలు కార్మికులకు సంవత్సరానికి రూ.7 వేల బోనస్, ప్రమాద బీమా రూ.15 లక్షలు ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రెండేళ్లకు ఒకసారి ఆగ్రిమెంట్ రూపంలో కూలీ రేట్లు పెంచాలని కోరారు. అనంతరం హమాలీ కార్మికుల మహాసభ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గయ్య, కోశాధికారిగా జంగయ్య, ఉపాధ్యక్షులుగా జంగయ్య, వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా శ్రీశైలం, రామ్రెడ్డి, జంగయ్య, ఆర్గనైజర్గా బుగ్గరాములు, పండిత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యోలమోని స్వప్న, మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్ పాల్గొన్నారు. -
అడుగుకో గుంత.. వెళ్లాలంటే చింత
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు ● వాహనదారులకు తప్పని పాట్లు మొయినాబాద్: రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. అడుగడుగునా గుంతలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్లతోపాటు గ్రామాల లింకు రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. వర్షాల కారణంగా హిమాయత్నగర్– తంగడపల్లి ఆర్ అండ్ బీ రోడ్డులో చిలుకూరు వద్ద పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులు నడుములు పట్టేస్తున్నాయని వాపోతున్నారు. చిలుకూరు–మొయినాబాద్ లింకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో గుంతల్లో వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. మొయినాబాద్– అమీర్గూడ రోడ్డులో అడుగుకో గుంత ఏర్పడింది. పెద్దమంగళారం–చందానగర్ రోడ్డుపై వెళ్లడానికే వాహనదారులు, స్థానికులు జంకుతున్నారు. సురంగల్–శ్రీరాంనగర్ రోడ్డుపై వర్షం నీరు నిలిచి గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. అజీజ్నగర్ ఎస్సీ కాలనీ వద్ద రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు ఇళ్ల మధ్యలోనుంచే ఉండటంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు
రాజేంద్రనగర్: వాహనదారులు ప్రమాదకర విన్యాసాలు, ప్రజలకు ఆటంకం కలిగించేలా ర్యాష్గా డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.రాజు హెచ్చరించారు. ఇటీవల మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన బాబానగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ రషీద్, చంపాపేట్కు చెందిన జాఫర్ అహ్మద్ షా, బాలాపూర్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్ అనే యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి హోండా షైన్ వాహనం (ఏపీ12పీ 7745), యాక్టివా (టీఎస్10ఎఫ్జీ 5061) వాహనాలను స్వాధీనం చేసుకొని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ 16వ తేదీన బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు ముగ్గురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలను నడుపుతూ వాహనాలపై మద్యం సేవిస్తూ ప్రజలకు, వాహనదారులు ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ విషయాన్ని ఇతర వాహనదారులు వీడియోలు తీసి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు ఆన్లైన్లో తెలపగా.. వారిని గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చి వారి పత్రాలను పరిశీలించి తదుపరి విచారణ నిమిత్తం మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించామని వివరించారు. -
మరమ్మతు చేపట్టరు సరఫరా పునరుద్ధరించరు
వృథాగా భగీరథ నీరు దుద్యాల్: మిషన్ భగీరథ నీరు వృథా అవుతోంది. మండల కేంద్రంలో రోడ్డు మధ్యలో పైపులైన్ పగిలి నీరు రోడ్డుపాలు అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల రకపోకల వలన పైపులైన్ ధ్వంసం అయింది. దీని కారణంగా దుద్యాలకు రావాల్సిన నీరు సరిపడా రావడం లేదని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. కానీ గ్రామంలోని పలు వీధులకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. పైపులైన్కు మరమ్మతు చేసి, సరఫరాను పునరుద్ధరించాలని భగీరథ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పరిగి: స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధి బసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందశాతం రిక్రూట్మెంట్ చేయాల్సిన పోస్టులను.. 2024 డీఎస్సీలో 30శాతం చేసి, మిగతా 70శాతం పదోన్నతులు కల్పించడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం 2016లో తెచ్చిన విక లాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి, వందశాతం నియామ కం చేపట్టి, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. అనంతగిరి: ఈ నెల 19న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు వికారాబాద్కు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రమేష్కుమార్, శివరాజు, వడ్లనందు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన ఇక్కడికి రానున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్నెగూడ రోడ్లో, వికారాబాద్లో శివారెడ్డిపేట వద్ద కమలనాథులు ఘన స్వాగతం పలికి, ర్యాలీగా వస్తారని చెప్పారు. అనంతరం ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. అనంతపద్మనాభ స్వామి దర్శనం అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నా రని చెప్పారు. స్థానిక ఎన్నికలపై దిశానిర్ధేం చేయనున్నారని వెల్లడించారు.ఆమనగల్లు: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్లో నిర్వహించే లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన, మహాత్మాగాంధీ సుస్థిర మహావిజ్ఞాన సదస్సు పోస్టర్ను ఆదివారం పట్టణంలో లయన్స్క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో గాంధీ భావజాలం ఉన్నట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. గాంధీ గ్లోబల్ సాహితీ అధ్యక్షుడు గోపాల్జీ, విగ్రహాల ప్రదర్శన కమిటీ కో కన్వీనర్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఆచార్య సోమశేఖర్, ఆచార్య గణపతి, ఆచార్య కేతన్ మహాజన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బోనగిరిపల్లి వద్ద ఉన్న మహర్షివేద గురుకులంలో ఆదివారం ఉపనయన సంస్కారం కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞ హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం దేవుడికి కేటాయించాలని సూచించారు. దేవాలయాలవద్దకు వెళ్లినప్పుడు నిష్టతో పూజలు చేయాలన్నారు. -
కలెక్టరేట్కు కళంకం
పాలనాధికారి కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది. కీలక శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు లంచావతారం ఎత్తారు. పైసలు ఇస్తే పనిచేస్తామని చెప్పడంతో పాటు.. తోటి ఉద్యోగులు, ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తించి కలెక్టరేట్కు కళంకం తెస్తున్నారు.వికారాబాద్: కీలక శాఖల్లో విధులు నిర్వహించే మెజార్టీ అధికారులు లంచావతారమెత్తడం కలకలం రేపుతోంది. జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. లంచం తీసుకుంటూ జిల్లాకు గుండెలాంటి కలక్టరేట్లోనే ఓ మహిళా ఉద్యోగి ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్పీ కార్యాలయంలో ఓ డీఎస్పీ, తాండూరు సబ్ కలెక్టరేట్లో ఓ తహసీల్దార్, మరో సీనియర్ అసిస్టెంట్ పట్టుబడగా.. తాజాగా పాలనాధికారి కార్యాలయమే అనిశా దాడులకు వేదికయింది. వరుస ఘటనలు ధారూరు ఎస్ఐ, డ్రైవర్ ఏసీబీకి చిక్కి నాలుగు నెలలు గడవక ముందే కలెక్టరేట్ ఉద్యోగి పట్టుబడటంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. కలక్టరేట్లోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం ఇక్కడే ట్రెజరీ శాఖకు చెందిన ఓ అధికారి, మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అపవాదు మరువక ముందే.. తాజాగా కో–ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే ఓ వ్యక్తి మద్యం సేవించి కలక్టరేట్ ఆవరణలోకి ప్రవేశించాడు. అక్కడ ఆడుకుంటున్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన కలక్టరేట్ ఎదుట ఉన్న కాలనీ వాసులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలా కలెక్టరేట్లో ఏదో ఒక ఘటన జరుగుతుండటంతో ప్రతిష్ట మసకబారుతుందనే వాదన వినిపిస్తోంది. ముడుపులు చెల్లించి పోస్టింగులు తీసుకొని! అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముడుపులు చెల్లించి పోస్టింగులు తీసుకున్న అధికారులు.. ఆ వెంటనే వసూళ్లకు తెగబడుతున్నారు. లంచంగా ఇచ్చిన సొమ్మును ఎలా పూడ్చుకోవాలని మొహమాటం లేకుండా కొందరు అధికారులు మాట్లాడటం గమనార్హం. ఇదే విషయం ఉన్నత స్థాయిలో ఉన్న పర్యవేక్షణాధికారులకు అడ్డంకిగా మారుతోంది. తమకు నేతల అండ ఉందన్న ధైర్యంతో కొందరు అధికారులు.. పర్యవేక్షణాధికారులను కూడా లెక్కచేయటం లేదన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నేతలే కీలక భూమిక పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాధితులు ఎందరో.. నాలుగు నెలల క్రితం ఎస్ఐతో పాటు అతని డ్రైవర్, ఐదు నెలల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టబడిన విషయం తెలిసిందే. ఇలా అధికారులు డబ్బుల డిమాండ్ను తట్టుకోలేక బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. గతంలో తాండూరులో ఓ సబ్ రిజిస్ట్రార్, పరిగిలో ఎంపీడీఓ, ఈజీఎస్ ఉద్యోగి, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్, వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారి, వికారాబాద్లో ఇంజినీర్, వికారాబాద్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పట్టుబడిన వారు పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వారు కాగా.. మిగతా డిపార్ట్ మెంట్లలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదన్నట్లు తెలుస్తోంది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, మైనింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎస్టీఓ, డీటీఓ, ఆర్టీఏ, పోలీస్ శాఖ ఏదైనా.. లెక్క తక్కువ కాకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు బాహటంగానే పేర్కొంటున్నారు. ముడుపుల విషయంలో వెలుపలకు రాని బాధితులు ఎందరు ఉన్నారో తెలియదని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మసకబారుతున్న ప్రతిష్ట పాలనాధికారి కార్యాలయకేంద్రంగా అవినీతి జలగలు లంచావతారమెత్తుతున్న అధికారులు తరచూ ఏసీబీకి చిక్కుతున్న ఉద్యోగులు అయినా మారని తీరుఅనంతగిరి: కలెక్టరేట్ కార్యాలయంలో కో–ఆపరేటివ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నరేందర్.. శనివారం ఓ ఎనిమిదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబీకులు అధికారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ భీంకుమార్ తెలిపారు.ఏసీబీ నిఘా మరికొందరు పర్యవేక్షణ అధికారులు.. తమ కింది స్థాయి సిబ్బంది చేసే అవినీతిలో భాగస్వాములుగా మారుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉండగా.. వరుస ఘటనలతో రెవెన్యూ, హెల్త్, పోలీసు, మున్సిపల్ శాఖల్లో విధులు నిర్వహించే పలువురు అధికారులపై అనిశా నిఘా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు సమాచారం. వికారాబాద్తో పాటు పూడూరు, నవాబుపేట, మోమిన్పేట తహసీల్దార్లపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పరిగిలో పనిచేసిన తహసీల్దార్పై కూడా ఆరోపణలు ఉన్నాయి. -
మందులు అందుబాటులో ఉంచాలి
సర్కారు దవాఖానాల్లో కుక్కకాటు చికిత్సకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి ఆదేశించారు. పరిగి ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు లేదన్న విషయం తెలుసుకున్న ఆయన.. ఆస్పత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడారు. కుక్కకాటు చికిత్సకు మందులుఅందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా వైద్యాఽధికారులతో మాట్లాడి.. సోమవారం నుంచి మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీఽధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు సమకూర్చుతుంటే.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. -
సర్దార్ పాపన్నగౌడ్ సేవలు మరువలేనివి
కడ్తాల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ముద్వీన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం వారు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్ధార్ పాపన్నగౌడ్ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ వీరత్వానికి ప్రతీక అంటూ కొనియాడారు. ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు సర్వాయిపాపన్న గౌడ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్బండ్పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు స్థలంతో పాటు రూ.3 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల వీరంగం
● పరిగి, కొడంగల్లో 26 మందిపై దాడి ● ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు నిల్ పరిగి/కొడంగల్: వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే పరిగి, కొడంగల్లో 26 మందిపై దాడి చేసి, విచక్షణా రహితంగా గాయపర్చి ఆస్పత్రి పాలు చేశాయి. పరిగి ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందులేక పోగా.. కొడంగల్లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితులను నగరానికి తరలించారు. పరిగి పట్టణ కేంద్రంలోని ఖాన్కాలనీ, మార్కెట్ యార్డులో ఓ శునకం 16 మందిని కరిచింది. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లగా.. సరైన మందు లేదని పేర్కొంటూ.. తాండూరుకు రిఫర్ చేశారు. దీంతో పలువురు ప్రభుత్వ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 పడకల ఆస్పత్రిలో కుక్క కాటుకు మందు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గడిచిన నెలలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 158 కేసులు నమోదు అయ్యాయని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. పురపాలిక అధికారులు స్పందించి వీధి కుక్కలను నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్కుమార్ ఆరోపించారు. కుక్కకాటు బాధితులు చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లగా.. మందు లేదని పంపించడం శోచనీయమన్నారు. దీంతో బాధితులకు వికారాబాద్లో చికిత్స చేయించామని పేర్కొన్నారు. కొడంగల్లో పదిమందిపై.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పది మందిపై ఆదివారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు జోగు అనంతయ్యతో పాటు మరికొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కార్గిల్ కాలనీలో నివాసం ఉంటున్న కురుమయ్య, పట్టణంలో ఓ చిన్నారిపై దాడి చేశాయి. బాధితులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. పట్టణంలో వీధి కుక్కల బెడద అధికమైందని, వాటి నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. -
ఆదమరిస్తే అంతే..
● రోడ్డు మధ్యలో గోతులు ● ప్రమాదపుటంచుల్లో పర్యాటకుల ప్రయాణం ● నిధులు లేక నీరసించిన పనులుధారూరు: నిత్యం వేలాదిమంది పర్యాటకులు కోట్పల్లి జలాశయానికి రాకపోకలు సాగించే మార్గం అధ్వానంగా తయారయింది. ప్రస్తుత వర్షాలతో పలు చోట్ల భారీగా గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. ధారూరు మండలం రుద్రారం గ్రామం దాటిన తరువాత రెండో కల్వర్టు వద్ద గోతులు ఏర్పడ్డాయి. కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. వాహనాలు దెబ్బ తింటున్నాయి. ఇలా మరమ్మతుకు గురైన వాహనాలను ఘటనా స్థలం రోడ్డు పక్కనే వదిలి వెళ్తుండడంతో మరిన్ని ప్రమాదాలకు దారి తీస్తుందని, ఏదైనా భారీ నష్టం జరగముందే తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అయినప్పటికీ.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి కారణం నిధుల లేమి అని తెలుస్తోంది. ఇప్పటికై నా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి, గుంతలు, ధ్వంసం అయిన చోట మరమ్మతులు చేయించాలని వాహనదారులు, పర్యాటకులు కోరారు. -
సరదాల దందా!
● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్లు ● పార్టీల పేరుతో గంజాయి, హుక్కా, మద్యం వినియోగం ● యథేచ్ఛగా పేకాట, కోడి పందేలు, ముజ్రా పార్టీలు ● అద్దెకు తీసుకుని గుట్టుగా నడుపుతున్న నిర్వాహకులు ● తరచూ వెలుగు చూస్తున్నా పడని అడ్డుకట్ట వీకెండ్ సరదాలకోసం నిర్మించుకున్న ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. బర్త్డే పార్టీలు, సరదా పార్టీలు, మందు పార్టీలు, రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు దందాలకు నిలయాలుగా తయారయ్యాయి. ఎస్ఓటీ పోలీసులు తరచూ దాడిచేసి గుట్టు రట్టుచేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు.మొయినాబాద్: నగర శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికిపైగా ఉన్నాయి. చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ నిర్మించి తరువాత వాటిని లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు తీసుకుని అడ్డగోలుగా.. లీజుకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్టుగెదర్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్డేలు అంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. వీటితోపాటు రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. యువకులను ఆకర్షించేలా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం సైతం చేయిస్తున్నట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటపెట్టాయి. పార్టీల్లో అక్రమంగా మద్యం తాగడం, హుక్కా, గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. కేసులు పెడుతున్నా మారని తీరు ఎస్ఓటీ పోలీసులు తరచూ దాడులు చేసి పార్టీలను భగ్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఫాంహౌస్ల యజమానులు, నిర్వాహకులపై సైతం కేసులు పెడుతున్నారు. అయినా దందాలు మాత్రం ఆగడంలేదు. మామూళ్ల మత్తులో స్థానిక పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెలుగుచూసిన కొన్ని ఘటనలు ● ఏడాదిన్నర క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ● ఏడాది క్రితం నజీబ్నగర్ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. ● ఏడాది క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ● ఆరు నెలల క్రితం అజీజ్నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ● ఆరు నెలల క్రితం తోలుకట్ట రెవెన్యూలో ఓ ఎమ్మెల్సీకి చెందిన ఫాంహౌస్లో కోడిపందేలు నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. నిర్వాహకుడితోపాటు 64 మందిని పట్టుకున్నారు. భారీగా మద్యం, నగదు, క్యాసినో కాయిన్స్, కోడికత్తులు, కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● నాలుగు నెలల క్రితం ఎత్బార్పల్లిలోని ఫాంహౌస్లో బర్త్డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, 7 మంది యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ● తాగాజా గురువారం రాత్రి బాకారంలోని ఓ ఫాంహౌస్లో అనుమతి లేకుండా మధ్యం వినియోగిస్తూ బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న 51 మంది విదేశీయులను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి హుక్కా, 20 లీటర్ల విదేశీ మద్యం, 65 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ డిటేన్ సెంటర్కు విదేశీయులు అనుమతి లేకుండా ఫాంహౌస్లో బర్త్డే పార్టీ నిహించడంతోపాటు హుక్కా, విదేశీ మద్యం వినియోగించి పోలీసులకు పట్టుబడ్డ విదేశీయులను పోలీస్ డిటేన్ సెంటర్కు తరలించారు. బాకారం రెవెన్యూలోని ఎస్కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్లో గురువారం రాత్రి విదేశీయులు ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ వినియోగిస్తూ నిర్వహించిన బర్త్డే పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇందులో పట్టుబడ్డ 51 మంది విదేశీయుల్లో 36 మందికి వీసాగడువు ముగిసినట్లు గుర్తించా రు. వారిని సొంత దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు వారిని కోర్టు సూచ నతో పోలీస్ డిటేన్ సెంటర్లో ఉంచుతామని ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. -
సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం
అనంతగిరి: సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దుకు పీఆర్టీయూటీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన మహాధర్న కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యంగ పోరాటం చేసి సాధించుకోవాలన్నారు. మొయినాబాద్: వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేసే విషయంలో మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ వ్యవహరించిన తీరుపై కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శనివారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ను ఆదేశించారు. ఈ విషయమై వారు విచారించగా కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయాల్లోనే జాతీయ జెండా ఎగురవేసినట్లు తెలిసింది. వార్డు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలో విషయంలో అక్కడి మున్సిపల్ కమిషనర్లు ప్రజలతో సమయస్ఫూర్తితో సానుకూలంగా మాట్లాడారని, మొయినాబాద్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మాత్రం స్థానికులతో దురుసుగా మాట్లాడటం వివాదంగా మారినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శంకర్పల్లి: ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్చార్జి ఇంద్రసేనారెడ్డి, అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని దుర్వినియోగం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి రామ్మోహన్, నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్, నాయకులు గౌరీ సతీశ్, వెంకటయ్య, చెన్నయ్య, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి, రమ్య, ప్రవీణ్, శ్రీనాథ్ పాల్గొన్నారు. ఆమనగల్లు: మార్వాడీ వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా పట్టణంలో వివిధ వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన బంద్ తాత్కాలికంగా వాయిదాపడింది. మార్వాడి గో బ్యాక్ అంటూ వర్తకులు ఇచ్చిన పిలుపు, మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన ఒకరోజు బంద్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్వాడీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్టణంలో బంద్కు పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బంద్పై మార్వాడీ వ్యాపారస్తులు, స్థానిక వర్తకసంఘం నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు మార్వాడీలు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు స్థానిక వర్తకసంఘం నాయకులను పోలీసులు పిలిపించి మాట్లాడారని, ఈ నేపథ్యంలో 18న తలపెట్టిన బంద్ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి ఏసీపీ శ్రీకాంత్గౌడ్ శంషాబాద్ రూరల్: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ శ్రీకాంత్గౌడ్ సూచించారు. శనివారం పెద్దషాపూర్లోని ఓ ఫంక్షన్ హాలులో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో తీసుకునే జాగ్రతలు, పాటించాల్సిన నిబంధనలను తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి, పాల్గొన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి
● బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు ● ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు శ్రీశైలం ముదిరాజ్ పరిగి: హైదరాబాద్ మాజీ మేయర్, రచయిత, జర్నలిస్ట్ కొరివి కృష్ణ స్వామిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్ అన్నారు. సంఘం నాయకులతో కలిసి శనివారం పట్టణంలో కృష్ణస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరానికి తొలి మేయర్గా విధులు నిర్వర్తించిన కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆశోక్కుమార్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం తాలూకా గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్యముదిరాజ్, కార్యదర్శి కృష్ణయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బాబయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీ మృతిపై కేసు నమోదు
కేశంపేట: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేశంపేటలో నిర్మిస్తున్న పోశమ్మ దేవాలయ పనులు చేసేందుకు తమిళనాడుకు చెందిన రాజుకు కాంట్రాక్టుకు ఇచ్చారు. అతడి వద్ద అదే రాష్ట్రానికి చెందిన విజయబాలన్ కృష్ణన్ (45) కూలి పనులు చేసేందుకు వచ్చాడు. శుక్రవారం పనులు చేస్తుండగా దేవాలయం పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. గమనించిన తోటి పనివారు చికిత్స నిమిత్తం కేశంపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి షాద్నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయబాలన్ కృష్ణన్ మృతి చెందాడు. ఈ విషయమై శనివారం కాంట్రాక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మారమోని శివకుమార్(21) స్థానిక వైన్స్లో పనిచేస్తున్నాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన బంధువు బోళ్ల మల్లేశ్ శుక్రవారం మైసిగండిలో నిర్వహించిన ఫంక్షన్లో శివకుమార్ పాల్గొన్నాడు. ఫంక్షన్ ముగిసిన అనంతరం అదే రాత్రి తలకొండపల్లిలోని బంధువుల ఇంటికి వారి వెంట తన బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో చల్లంపల్లి సమీపంలో బైక్పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కడ్తాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువకుడి నేత్రాలను కుటుంబసభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందజేశారు. యువకుడి అదృశ్యం కేశంపేట: యువకుడు అ దృశ్యమైన సంఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగడ్డతండా పంచాయతీ పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన లక్ష్మణ్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ముడావత్ శ్రీనివాస్ చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయ పనులు చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం కుమారుడు ఇంటి వద్ద ఉండగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చారు. కుమారుడు కన్పించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీటి వరద!
ధారూరు: మండల పరిధిలోని మోమిన్కలాన్ క్లస్టర్ పరిధిలోని భారీగా పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ విస్తరణ అధికారి మల్లేశం తెలిపారు. శనివారం ఆయన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెలిబుచ్చారు. పంటలు పూర్తిగా పాడయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు. 21 ఎకరాల్లో పసుపు, 113 ఎకరాల్లో పత్తి, 63 ఎకరాల్లో మొక్కజొన్న, 72 ఎకరాల్లో కంది పంటలకు నష్టం జరిగిందని ఏఈఓ తెలిపారు. మోమిన్కలాన్ కత్వ నుంచి పొలాల్లోకి భారీగా వరద రావడంతో ఇసుక మేటలు వేసి పత్తి పంటలు తుడిచిపోట్టుకుపోయాయన్నారు. ధారూరు క్లస్టర్లో 18 ఎకరాల పత్తి, 5 ఎకరాల వరి, 7ఎకరాల పెసర పంటలకు నష్టం వాటిల్లిందని ఏఈఓ సంతోష్ తెలిపారు. ● భారీ వర్షాలతో కొట్టుకుపోయిన పంటలు ● పొలాల్లో ఇసుక మేటలు ● కన్నీటి పర్యంతమవుతున్న కర్షకులు -
సీపీఐ మాటే తూటా
తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కొనసాగుతుందన్నారు. అయినా ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని పేర్కొ న్నారు. సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని అనలేమని తెలిపారు. ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులేనని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం పోవాలనే నినాదంతో పోరాటం చేశామని తెలిపారు. పార్టీ అనుబఽంధ కార్మిక సంఘాల ద్వారా కార్మికుల పక్షాన తాము గళం వినిపిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. విద్య రంగ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని ఆ సంఘం నాయకులు సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పస్య పద్మ, జిల్లా కార్యదర్శులు విజయలక్ష్మి పండిత్, సీపీఐ నాయకులు గోపాల్రెడ్డి, పీర్ మహ్మద్, వెంకటేశ్, రవీందర్, సురేష్కుమార్, బషీర్ హైమద్, మునీర్ హైమద్, అబ్దుల్ల్లా, జగదాంబ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వాజ్పేయి ఆశయాలు సాధిద్దాం
అనంతగిరి: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్లో వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. వాజ్పేయి దేశాభివృద్ధిలో తకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం, దేశం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజు, వడ్ల నందు, సీనియర్ నాయకుడు పాండు గౌడ్, కేపీ రాజు, నరోత్తంరెడ్డి, రాజేందర్రెడ్డి, నందు, రాములు, శ్రీనివాస్రెడ్డి, రాజేందర్గౌడ్, విజయ్భాస్కర్రెడ్డి, చరణ్రెడ్డి, అమర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏ దేశమేగినా.. పరిగి: పట్టణా నికి చెందిన ముస్లిం మత గురువు మహ మూద్ ఇసాక్అలీ దేశభక్తి చాటారు. ఇటీవల సౌదీ వెళ్లిన ఆయన ప్రస్తుతం మదీనే షరీఫ్లో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ జెండాను ప్రదర్శించి, పరిగి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భూమిపై మమకారానికి మించిన సంపద లేదన్నారు. నేడు ‘బాల గోకులం’ కొడంగల్: పట్టణంలోని కేశవ స్వామి ఆలయంలో ఆదివారం బాల గోకులం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు మురహరి వశిష్ట తెలిపారు. ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం నాలుగు గంటలకు బాలగోకులం,డోలారోహన మహోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులతో శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించి విజేతలైన 8 మందికి ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున వెండి బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నూతన దంపతులకు ఎమ్మెల్యేల ఆశీర్వాదం పరిగి: వికారాబాద్ ఎస్పీగా పనిచేసిన నారాయణ కూతురు వివాహం శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్రెడ్డి, కాలె యాదయ్య, బి.మనోహర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి మహేందర్రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
మహిళా సాధికారతకు కృషి
నవాబుపేట: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నా రు. శనివారం మండలంలోని చించల్పేట్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తో కలిసి ప్రారంభించారు. గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ను, రూ.20 లక్షలతో పశు వైద్య ఉపకేంద్ర భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన డ్వాక్రా భవనం, రూ.30 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో పీహెచ్సీ భవనం, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణా లు, క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోందన్నారు. మహిళా సంఘాలకు రూ.26 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో రూ.800 కోట్ల వడ్డీ లేకుండా ఇవ్వడం జరిగిందన్నారు. గృహలక్ష్మి పేరిట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. చించల్పేట్ గ్రామంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. మండలి చీఫ్విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, టీటీడబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం, పశుసంవర్ధక శాఖ అధికారి సదానందం, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈ ఉమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్లు పెంచుతావా.. గద్దె దిగుతావా?
పరిగి/తాండూరు: ఎన్నికల సమయంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల కు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని అమలు చేస్తారా లేకుంటే గద్దె దిగుతారా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు. శనివారం పరిగి పట్టణంలోని శారద గార్డెన్లో, తాండూరు పట్టణంలోని గగ్రాణి ఫంక్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ.4 వేల పింఛన్ను రూ.6 వేలు, చేయూత పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. సెప్టెంబర్ 9న నగరంలోని ఎల్బీ స్టేడియంలో దివ్యాంగులతో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పింఛన్ మొత్తం పెంచకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పెన్షన్లో ఇస్తున్నారో అదే తరహాలో ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాజీ సీఎం కేసీఆర్ను ఎలా గద్దె దించామో, సీఎం రేవంత్రెడ్డిని సైతం అలా దించాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిగి కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహులు మాదిగ, బి.కృష్ణ మాదిగ, నాయకులు మెట్లి సూర్యప్రకాష్ మాదిగ, ఉమాశంకర్ మాదిగ, ఆనంద్కుమార్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు చందు, సుందర్, రాజు, గజ్జలప్ప, బలరామ్, రవి,అనిల్, పరశురాం స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమం
ప్రజాపాలనతో అన్ని వర్గాలకు సమ న్యాయంవికారాబాద్: ‘రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు.. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలి’ అన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా స్కూళ్ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలరించారు. చక్కటి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పోలీసుల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సాగుభూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణాన్ని నాలుగు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నారని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ పథకం ద్వారా 1,04,300 సిలిండర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 1,39,812 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.47.99 కోట్లు వెచ్చించిందన్నారు. జిల్లాలో 980 మంది రైతులు మరణించగా రైతు బీమా పథకం ద్వారా బాధిత కుటుంబాలకు రూ.49 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 1,00,358 మంది రైతులు రు ణాలు రూ.849.30 కోట్లను మాఫీ చేసినట్లు తెలిపా రు. జిల్లాకు 13,640 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కా గా 10,885 నిర్మాణాలకు అనుమతి ఇచ్చామన్నా రు. 1,227 మంది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించా మని తెలిపారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద సేవలపై ప్రత్యేక దృష్టి ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 25,040 మందికి రూ.65.29 కోట్లతో వైద్య సేవలు అందించామన్నారు. అమ్మా ఆదర్శ పాఠశాల పథకానికి 1,062 స్కూళ్లు ఎంపిక చేసి మౌలిక వసతుల కల్పనకు రూ.17.55 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. 126 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. కడా ఏర్పాటు చేసి వెనుకబడిన కొడంగల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్చౌదరి, డీఆర్వో మంగిలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.