Vikarabad
-
జాగ ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం
బషీరాబాద్: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో గూడులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. బుధవారం బషీరాబాద్ మండలం కాశీంపూర్, ఇందర్చెడ్ గ్రామాల్లో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇళ్లకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వర లో మలివిడత కింద పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఇంటి జాగ ఉన్న వారికి ఇళ్లు ఇచ్చామని, మున్ముందు జాగలు లేని వారికి ప్రభుత్వమే జాగ ఇచ్చి ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సర్కారు అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. అందుకే సంక్షేమ పథకాలు వారి పేరునే అమలు చేస్తున్నామన్నారు. అంతరాష్ట్ర రోడ్ల అనుసంధానం జిల్లా సరిహద్దులో ఉన్న బషీరాబాద్కు పొరుగున ఉన్న కర్ణాటక రోడ్లతో అనుసంధానం చేయడానికి కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. యాలాల మండలం బండమీదిపల్లి గేటు–మైల్వార్ మీదుగా కర్నాటకలోని సేడం జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. బషీరాబాద్–హల్కోడ వరకు రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. జీవన్గీ రోడ్డు పూర్తయితే తాండూరు మండలం కరణ్కోట్ నుంచి బషీరాబాద్ మీదుగా కర్ణాటకకు భారీ వాహనాల రాకపోకలకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి, ఆత్మ చైర్మన్ శంకర్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్ రామ్రెడ్డి, బషీరాబాద్ సర్పంచ్ వెంకటేశ్ మహరాజ్, మాజీ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, మాజీ ఏఎంసీ మాణిక్రెడ్డి, నాయకులు సుధాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చందర్నాయక్, బిచ్చిరెడ్డి, జీవన్గీ నర్సిరెడ్డి, మంతట్టి తలారి సురేశ్, బిచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కుల్కచర్ల: ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు లందజేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాస్యనాయక్ తండాలో గంగావిఠల్ నాయక్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినహామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిరుపతయ్య, శ్రీను, ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య, చౌడాపూర్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్, ఏఎంసీ డైరక్టర్ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మలివిడతలో భారీగా ఇందిరమ్మ ఇళ్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి -
పిడుగుపాటుకు మేకల కాపరి మృతి
తాండూరు రూరల్: పిడుగుపాటుకు మేకల కాపరి మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన పెద్దేముల్ మండలం కొండాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కొడి ఆనందం(42), నీరటి నర్సింలు, ఏర్పుల జాని మేకలు మేపేందుకు పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామ సమీపంలోని ఓ చింత చెట్టుకింద జీవాలను తోలి అక్కడే నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. వర్షం తగ్గాక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లి పరిశీలించి వారిని తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆనందం మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి భార్య అనసూజ, కూతురు, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి
కందుకూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 257 మందికి కల్యాణలలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెబుతూ పురుషులకు టికెట్ల ధరలు పెంచారన్నారు. నేదునూరులో పండించిన కుసుమ పంట కోసం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, ఎంపీడీఓ బి.సరిత, స్థానిక సర్పంచ్ సరికొండ పాండు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆలయ భూముల కౌలుకు వేలం
దోమ: సంజీవ స్వామి ఆలయ భూములను దేవాదాయ శాఖ అధికారులు కౌలు వేలం వేశారు. బుధవారం మండల పరిధి దొంగ ఎన్కేపల్లి గ్రామం ఆలయ ఆవరణలో వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయ ఈఓ నరేందర్, శ్రీ సంజీవ స్వామి ఆలయ ఈఓ బాలనర్సయ్య, ఎండోమేంట్ అధికారి ప్రణీత్, పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఈఓ రాజేందర్రెడ్డిలు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం 104.19 ఎకరాల భూమి ఉండగా.. కొంత అన్యాక్రాంతం అయినప్పటికీ.. మిగతా వాటికి ప్రతి రెండేళ్లకు వేలం వేస్తుంటారు. వేలం వేసిన భూములు.. కిష్టాపూర్ 167 సర్వే నంబర్లో 38 గుంటలు, బ్రాహ్మణపల్లి 103 సర్వే నంబర్ 1.31 గుంటలు, హీరాపూర్ 23 సర్వే నంబర్ 4.18, రావులపల్లి 36 సర్వే నంబర్ 4.28, మంచన్పల్లి 66 సర్వే నంబర్ 9.39, ఖుదావంద్పూర్ 108 సర్వే నంబర్లో 4.20 గుంటలకు కౌలు వేలం వేయగా.. రూ.2,27,500లు ఆదాయం సమకూరింది. -
రసాయన ఎరువులతో భూసారం తగ్గుదల
● ‘ఏడబ్ల్యూడీ’తో సాగునీటి ఆదా ● జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం బషీరాబాద్: పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కాశీంపూర్ రైతువేదికలో ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడడం వలన భూమి సారం తగ్గిపోయి పంట ఉత్పాదక శక్తి తగ్గుతుందన్నారు. పురుగు మందుల ప్రభావం వలన పంటలకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశిస్తున్నాయని వివరించారు. రైతులు ప్రతీ ఏడాది పంట మార్పిడి తప్పని సరిగా చేసుకోవాలని సూచించారు. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పరిమళ మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలైన వరిరకాలను సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. వరి సాగులో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ) పద్ధతిని అనుసరించడం వలన సాగునీటిని ఆదా చేసుకోవచ్చని చెప్పారు. స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వంటి బిందు సేద్య పద్ధతులను అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిత, యంగ్ ప్రొఫెషనల్స్ సల్మాన్, కేశవ, కృష్ణ, ఏఈఓలు సౌమ్య, సామేల్, వసీం, ప్రవీణ్, విజయ్, నవీన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి
ఉద్యానశాఖ హెచ్ఈఓ బాబ్యానాయక్ కొడంగల్ రూరల్: రైతులు ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యానశాఖ హెచ్ఈఓ బాబ్యానాయక్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని పర్సాపూర్ రైతువేదికలో సర్పంచ్ కన్నం రాధాశ్రీనివాస్రెడ్డి అధ్యక్ష్యతన జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ఇంకో ఫామ్ఆయిల్, ఫాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, ఏకో ఫామ్ మేనేజ్మెంట్ సంజయ్సోని, వికారాబాద్ ఏరియా మేనేజర్ రాము పంట సాగులో ప్రభుత్వ సబ్సిడీలు, మార్కెటింగ్, దిగుబడి గురించి రైతులకు వివరించారు. టేకుల్కోడ్ గోవర్దన్రెడ్డి ఆయిల్పామ్ గురించి తన అనుభవాలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. అనంతగిరి: వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పలువురు ఫారెస్టు అధికారుల బదిలీల్లో జ్ఞానేశ్వర్ను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కాగా వికారాబాద్కు ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. అనంతగిరి: మే 3వ తేదీన నీట్ పరీక్ష నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లలోని మౌలిక వసతులు, తదితరాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను తనిఖీ చేసాకే సెంటర్లలోకి అనుమతించాలని సూచించారు. ● ఉరి వేసుకుని దుర్మరణం ● స్టేషన్ధారూరులో ఘటన ధారూరు: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్టేషన్ధారూరు గ్రామంలో ఉదయం 9:30 గంటలకు చోటుచేసుకుంది. సీఐ రఘురామ్, ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్ధారూరుకు చెందిన డెగావత్ రాములునాయక్, గమినిబాయిల కూతురు తులసి(23) కానిస్టేబుల్గా పనిచేస్తోంది. ఆమె అన్న రాజు వికారాబాద్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రాజు పనిచేస్తున్న చోటే నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ తులసి, రాజుకు చెందిన రూమ్లో ఏడాదిగా కలిసి ఉన్నారు. రాజు, మౌనిక మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో మౌనిక రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయింది. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు వివాహం కుదిర్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రాజు.. మౌనికతో దిగిన ఫొటోలను పెళ్లి కొడుకుకు పంపించినట్లు సమాచారం. దీంతో ఈనెల 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో వచ్చి రాజుతో పాటు తులసిపై వికారాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. రాజు తనను వెంటాడి టార్చర్ చేస్తున్నాడని, తులసి ఇందుకు సహకరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎస్ఐ తులసిని పీఎస్కు పిలిపించగా అక్కడే ఉన్న మౌనిక, అతని సోదరుడు మధు, స్నేహితుడు శేఖర్ ఆమెను బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తులసి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు మౌనికపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
కొడంగల్ రూరల్: చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని తెలంగ్వాడకు చెందిన శివకుమార్(31)న 27న రాత్రి రావులపల్లి రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శివకుమార్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడిని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శివకుమార్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఎదురుగా వస్తున్న లారీ వెనుక భాగం శివకుమార్కు తగలడంతోనే కిందపడిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పాదచారిని ఢీకొట్టిన కారు
వృద్ధుడు మృతి పరిగి: నడచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గండీడ్ మండలం పీర్లగుట్టతండాకు చెందిన తుక్యానాయక్(65) పట్టణ కేంద్రంలోని బాలాజీనగర్లో తన కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఉదయం టీ తాగేందుకు పట్టణ కేంద్రంలోని బహర్పేట్కు నడుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఎగిరిపడటంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొంరాస్పేట: ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని బుర్రితండా పంచాయతీ పరిధి పూల్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన ముడావత్ రాంచందర్(63) ఈ నెల 27న తనకు అనారోగ్యంగా ఉందని హైదరాబాద్లో ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి బయలు దేరాడు. తిరిగి రాకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కొడంగల్ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని రుద్రారం శివారు పాటిమీదిపల్లి రోడ్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జీవీ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ(26)ను తండ్రి నర్సింలు బంధువుల ఇంటికి వెళ్లి రమ్మని చెప్పి పంపాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన కుమారుడు మృతి చెందాడని సమాచారం అందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుడు హరికృష్ణ శరీరం నల్లగా మారడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడ, లేదా పిడుగుపాటుకు గురయ్యాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుట్టపహాడ్ సర్పంచ్ అంజిలయ్య కుల్కచర్ల: సివిల్ సప్లయ్ వ్యవస్థలో అధికారులు నియమనిబంధనలను పాటించడంలేదని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆరోపించారు. బుధవారం ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్కు తెలియకుండా తాత్కాలిక పద్ధతిన రేషన్డీలర్ను నియమించడం సరికాదన్నారు. కేవలం కొంతమందికి మద్ధతుగా మాత్రమే రేషన్ డీలర్ ఎంపిక ప్రక్రియ కొనసాగిందని జిల్లా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో అర్హులైన జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో డీపీఆర్ఓ బాలేశ్వరి, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కె.శ్రీకాంత్రెడ్డి, శేఖర్ ఉప్పరి, సయ్యద్ ఇక్రముల్లా హుస్సైని, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కొడంగల్కు దొంగల భయం
కొడంగల్: పట్టణంలోని పలు కాలనీల ప్రజలకు దొంగల భయం పట్టుకుంది. గతంలో శాంతినగర్ కాలనీలో పలుమార్లు చోరీలు జరిగాయి. ఇప్పుడు పట్టణంలోని సన్సిటీ కాలనీ ప్రజలు భయం గుప్పిట్లో నిద్రిస్తున్నారు. మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీకి యత్నించారు. ఇళ్లలోని బీరువాలను తెరిచి చూశారు. కాగా చోరీల్లో ఎటువంటి ఆస్తి నష్టం కలగలేదు. ఈ విషయంపై కాలనీవాసులు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ ఉదయం కాలనీకి వెళ్లి సీసీ పుటేజీలు పరిశీలించి దుండగులు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. రాత్రి వేళ గస్తీ పెంచుతామని ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని భరోసా కల్పించారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
అనంతగిరి: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. ప్రజాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిషన్ వాత్సల్య పథకం, జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణవేణి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు 80 శాతం మొబైల్ ఫోన్ల వల్లే జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. బహుమతులు పేరిట వచ్చే ఫోన్ కాల్స్కు స్పందిచవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ఆకర్శితులై లింకులు ఓపెన్ చేయొద్దని చెప్పారు. 1930 నంబర్కు కాల్ చేయాలి అనంతరం డీఎస్పీలు జాన్యయ్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైబర్నేరాలపై పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ అడుగుతున్న ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాల మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రై వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగూల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్ డేట్ మెసేజ్లకు స్పందించొద్దన్నారు. అనంతరం నశాముక్త్ భారత్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఐఓ వరలక్ష్మి, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవీణ, కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, లీడ్ బ్యాంక్ ఇండియా మేనేజర్ యాదగిరి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్, డీసీపీయూ కౌన్సిలర్ లక్ష్మణ్, సోషల్ వర్కర్ వనమాల, మహిళా సాధికారత సిబ్బంది వరలక్ష్మి, బాబు చైల్డ్ లైన్ సూపర్ వైజర్ ఆనంద్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి -
45 రోజుల తర్వాత ఇంటికి
పైలెట్ యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి 45 రోజుల తర్వాత బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. అజీజ్నగర్ ఫామ్ హౌస్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఆయన సోదరుడు రితీష్రెడ్డి, స్నేహితుడు అమిత్శర్మలను అరెస్టు చేసి మార్చి 15వ తేదీన చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం రోహిత్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ నాయకులు మణికొండలోని పైలెట్ నివాసానికి చేరుకొన్నారు. సాయంత్రం ఆయన్ను కలిసి యోగాక్షేమాలు తెలుసుకున్నారు. -
అవగాహనతోనే సాగులో లాభాలు
బొంరాస్పేట: అవగాహనతో సాగుచేస్తే అధిక లాభాలు వస్తాయని డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి అన్నారు. వ్వయసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ బీటీటీ(బ్లాక్ టెక్నాలజీ టీమ్) కన్వీనర్ శంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని రేగడిమైలారం రైతు వేదికలో రైతులకు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీఎఫ్ఏసీ, సామర్థ్య నిర్మాణం, నైపుణ్యత కొరకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, నవీన మార్పులు, నానో యూరియా, నానో డీఏపీ, పంటమార్పిడి, కంది పట్టి పంటలపై చీడపీడల నివారణ అంశాలపై వివరించారు. ఆయిల్పామ్ సాగుపై అవగాహన, సస్యరక్షణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ బాలకృష్ణ, వినోద్, ఏఈఓలు హేమ, స్వాతి, శైలజ, జగదీశ్, సర్పంచు చిట్టెమ్మ, ఉపసర్పంచు చంద్రప్ప, గుండప్ప, వీరప్ప, వార్ల సురేశ్ తదితరులున్నారు. డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి -
అనైక్యతతోనే గెలిచిఓడాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమనగల్లు: బీఆర్ఎస్ నాయకుల అనైక్యత వల్లే ఆమనగల్లు మున్సిపాలిటీ కోల్పోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమనగల్లులో గెలిచి ఓడిపోయామని, దీనికి ఎవరినీ బాధ్యులను చేయనని తెలిపారు. నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన ఎన్ఆర్ఐ, తెలంగాణ బ్లాక్ వాయిస్ అధ్యక్షుడు గోవింద్ శ్రీధర్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీన్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ అతనికి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 సీట్లకు గాను 8 బీఆర్ఎస్ గెలిచిందని, బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు వచ్చినా మున్సిపాలిటీ చేజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు మెచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రగతిపథంలో నిలిపారని గుర్తుచేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ద్యాప విజితారెడ్డి, జీఎల్ఎన్రెడ్డి, గంప వెంకటేశ్, నిర్మల శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్యాదవ్, ఏమిరెడ్డి జైపాల్రెడ్డి, రమేశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, లాలయ్యగౌడ్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జనగణన ఎన్యుమరేటర్ల శిక్షణ
కుల్కచర్ల: జనగణన సర్వే నిర్వహించేందుకు కొనసాగుతున్న రెండో విడత శిక్షణ కార్యక్రమాలు బుధవారంతో ముగిసాయి. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు జనగణనలో పాటించాల్సిన నియమనిబంధనల గూర్చి వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కొడంగల్: అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మే 6వ తేదీన మండల పరిధిలోని అప్పాయిపల్లి(ఎరన్పల్లి)లో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ బుధవారం వేర్వేరుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, ఎరన్పల్లి శ్రీనివాస్, మహిపాల్, గోకుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: చౌడాపూర్ మండలం మందిపల్ ఓంకారేశ్వరాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆలయంలో ఉన్న బోరును గుర్తుతెలియని వ్యక్తులు వేసి వదిలేశారు. తెల్లవారుజాము వరకు అలాగే ఉండడంతో మోటారు కాలిపోయి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆలయ అర్చకులు మఠం రాజశేఖర్ తెలిపారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామన్ని చెప్పారు. కుల్కచర్ల: కంటి వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైధ్యాధికారి కిరణ్కుమార్, ఆప్తమాలిక్ అసిస్టెంట్ జవహార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ వైద్యశిబిరంలో 54 మంది పాల్గొనగా 35 మందిని ఆపరేషన్ నిమిత్తం నగరంలోని పుష్పగిరి ఆస్పత్రికి రెఫర్ చేశామన్నారు. ● గొడ్డలితో దాడి చేసిన భర్త ● అక్కడికక్కడే ప్రాణం వదిలిన భార్య మీర్పేట: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమైపె గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా శివన్నగూడకు చెందిన నల్లబోతు నర్సింహ, వసంత (52)కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం వచ్చి, ఇరవై ఏళ్లుగా బీఎన్రెడ్డినగర్ టీచర్స్కాలనీలో ఉంటున్నారు. నర్సింహ కూలీ, వసంత ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 5:45 గంటలకు ఓ ఇంట్లో పని ముగించుకుని, ఇంటికి తిరిగి వస్తున్న భార్యకు ఎదురెళ్లిన నర్సింహ గొడ్డలితో దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో వసంత సంఘటనా స్థలిలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి, మీర్పేట డీఐ గౌరునాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
యాలాల: పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్సీ, ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో సివిల్ సప్లయ్ అధికారులు జిల్లాలోని అన్ని బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కృత్రిమ కొరత లేకుంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పంచాయతీ కార్యాలయ భవనాలను వేసవిలోనే పూర్తి చేసేందుకు అధికారులు దృష్టిసారించాలన్నారు. స్థానిక పీహెచ్సీ సందర్శించి ఓపీ రిజిస్టర్లు, మందుల వివరాలను సిబ్బందిని అఢిగి తెలుసుకున్నారు. యాలాల మండల కేంద్రంలో ఇటీవల పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రాజారత్నం, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, తహసీల్దార్ వెంకటస్వామి, డీటీ కిరణ్కుమార్, ఎంపీడీఓ శ్రీనిజ, ఎంఈఓ మహిపాల్రెడ్డి, ఏఓ శ్వేతరాణి, వైద్యాధికారి రూబియానాజ్, యాలాల సర్పంచ్ శివయ్య, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్బాబా తదితరులు ఉన్నారు. -
డ్రోన్ పైలెట్లుగా ట్రాన్స్జెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: అడుగడుగునా సామాజిక సవాళ్లు.. అయినా వారిలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ, ఉన్నతంగా జీవించాలనే కాంక్ష..! ఇదీ ట్రాన్స్జెండర్ల పరిస్థితి. అందుకే, వారి అభ్యున్నతికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... వివిధ రంగాల్లో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు సాంకేతికత, నైపుణ్య శిక్షణ ఇస్తోంది. వ్యవసాయం, సర్వేయింగ్, పారిశ్రామికంగా డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందున ఆ డిమాండ్ను తీర్చేందుకు ట్రాన్స్జెండర్లకు డ్రోన్ పైలెట్ శిక్షణ ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా.. బేగంపేటలోని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ)లో మొదటి బ్యాచ్లో 16 మందికి తర్ఫీదు ఇచ్చింది. ఇప్పటికే మెట్రో, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో పనితీరుతో గుర్తింపు తెచ్చుకుంటున్న ట్రాన్స్జెండర్లు... అతి త్వరలో పైలెట్లుగా డ్రోన్ రంగంలోనూ అడుగు పెట్టనున్నారు. డీజీసీఏ లైసెన్స్.. జ్యూట్ బ్యాగ్ల తయారీ, టైలరింగ్, వాహనాల డ్రైవింగ్ వంటి శిక్షణకే ట్రాన్స్జెండర్లు పరిమితమయ్యేవారు. ఏ విభాగంలోనైనా ఉద్యోగాలకు ప్రయత్నించినప్పుడు ప్రత్యేకంగా నైపుణ్యం ఉందా అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే సాంకేతిక శిక్షణ అవసరమని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, టాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ గుర్తించింది. ఈ మేరకు డ్రోన్ పైలెట్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న సేవల్లో సుశిక్షిత అభ్యర్థులకు జెండర్తో సంబంధం ఉండదు. అందుకే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ సహా పలు జిల్లాల నుంచి 16 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసి డ్రోన్ పైలెట్లో శిక్షణ ఇచ్చారు. డ్రోన్ ఫ్లయింగ్ నిబంధనల నుంచి మొదలుపెట్టి, పైలెట్ శిక్షణ, ఉపకరణాల బిగింపు, స్పేర్ పార్ట్స్ తొలగింపు, స్టిమ్యులేషన్ దాక అన్ని దశల్లో శిక్షణ సాగింది. అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లైసెన్స్, టీఎస్ఏఏ సర్టిఫికేషన్తో అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా డ్రోన్ పైలెట్ చేసేందుకు అర్హులు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ట్రెయినింగ్ డీజీసీఏ లైసెన్స్తో దేశంలో ఎక్కడైనా పైలెట్గా అవకాశం ఇప్పటివరకు మెట్రో, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో ట్రాన్స్జెండర్లు త్వరలోనే పైలెట్స్గా డ్రోన్స్ విభాగంలోనూ వీరి సేవలుడిమాండ్ ఉన్న రంగం ట్రాన్స్జెండర్లు లాభదాయకమైన ఉపాధిని పొందకుండా పలు సామాజిక అవరోధాలున్నాయి. డ్రోన్ పైలెట్ శిక్షణ అనేది సాంకేతిక నైపుణ్యత. దీనిని అందిచడంలో టీఎస్ఏఏ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగం కావడంతో త్వరలోనే వారు ఉపాధి పొందుతారని ఆశిస్తున్నాం. –దినకర్ దేవిరెడ్డి, హెడ్, తెలంగాణ ఏవియేషన్ అకాడమీ -
మొక్కజొన్న క్వింటాల్కు రూ.2,400
మోమిన్పేట: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్కు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిందని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఏఈఓ ఇచ్చిన కూపన్తో పాటు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పుస్తకం జిరాక్సు, ఫోన్ నంబర్ తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ నాగార్జున, పీఏసీఎస్ మోమిన్పేట ప్రత్యేకాధికారి మాధవి, తహసీల్దార్ రవీందర్, ఏఓ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సుభాశ్గౌడ్, ఎరాజ్, ఎజాస్, నర్సింలు, సీఈఓ శేఖర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి -
ఉత్తీర్ణత శాతం పెరగడం సంతృప్తి
గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు మెరుగుపర్చుకోగలిగాం. ఫలితాల పరంగా చూస్తే బాగా మెరుగయ్యాం. తాము ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ స్థానం పరంగా ఇంకా కాస్తా మెరుగవ్వాల్సింది. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. ఈ ఫలితాలను బేరీజు వేసుకొని సప్లిమెంటరీలో వందశాతం ఫలితాలకోసం కార్యాచరణను రూపొందిస్తాం. ఏయే సబ్జెక్టులల్లో, ఏయే పాఠశాలల్లో తక్కువ ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలని యోచిస్తున్నాం. ఉత్తీర్ణులకు అభినందనలు. – జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
నిరంతరంగా ఇంధన సరఫరా
● స్టాక్ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి ● కలెక్టర్ దీపక్ తివారీ ● పెట్రోల్ పంపు యాజమాన్యాలతో సమీక్ష అనంతగిరి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి పెట్రోల్ పంపు యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా, ధరల ప్రదర్శన, వినియోగదారులకు అందిస్తున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. ఇంధన సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను స్పష్టంగా ప్రదర్శించడం, వినియోగదారులకు సరైన కొలతలతో ఇంధనం అందించడం, అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పెట్రోల్ పంపుల వద్ద తహసీల్దార్, పోలీస్ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసి అన్ని పెట్రోల్ పంపులను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాము నాయక్, డీఎస్ఓ సుదర్శన్, ఆర్టీఓ వెంకట్ రెడ్డి, పెట్రోల్ పంపుల యజమానులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలి కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు పరిసరవాసులు సహకరించాలని కలెక్టర్ దీపక్ తివారీ కోరారు. బుధవారం ఆయన కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి నిర్మాణాలు కోల్పోతున్న వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. టీటీడీ తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి ప్రభుత్వం నూతన భవనాలను నిర్మంచనున్నట్లు వివరించారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న వారు ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కిరాణా కొట్టులో రూ.30 వేల చోరీ
యాలాల: కిరాణ కొట్టులో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని మార్కండేయ కాలనీలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాకాలి శ్రీనాథ్ కిరాణ కొట్టు వ్యాపారి. పొరుగింట్లో ఫంక్షన్ ఉండటంతో సోమవారం షాపును కట్టేసి త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తెరిచేందుకు వెళ్లగా, షట్టర్ తాళాలు విరిగి ఉండటాన్ని గమనించాడు. అనంతర షాపులో గమనించగా, గల్లాపెట్టెలో ఉంచిన రూ.30వేల నగదు కనిపించలేదు. నగదు మాత్రమే ఎత్తుకెళ్లిన దొంగ, ఇతర సామాన్లను ముట్టలేదు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. శతాధిక వృద్ధురాలి కన్నుమూత దౌల్తాబాద్: మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు కనక మ్మ (102) మంగళవా రం తెల్లవారుజామున కన్నుమూశారు. కొడుకులు, కూతుళ్లు, మనవ లు, మనవరాళ్లతో పాటు ముని మనవలు, ముని మనవరాళ్లను ఎత్తుకుని ఆడించిన అవ్వకు పలు వురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బస్సు ప్రమాదంలో మహిళకు గాయాలు అనంతగిరి: ఎమ్మార్పీ చౌరస్తాలో బస్సు ఎక్కుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బార్వాద్ గ్రామానికి చెందిన తాండ్ర బాలమ్మ సొంతూరుకు వెళ్లేందుకు తొర్మామిడి బస్సు ఎక్కుతోంది. ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు తోలడంతో కింద పడిపోయిన ఆమె కాలి పైనుంచి వెనక చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలమ్మ కాలు విరిగి, గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేపీహెచ్బీకాలనీ: కూకట్పల్లి జాతీయ రహదారిపై మంగళవారం వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేపీహెచ్బీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... బీహార్కు చెందిన అభినవ్ కుమార్ మిశ్రా(25) గాయత్రినగర్లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతడు ఓ ఫార్మసీ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వస్తుండగా నిజాంపేట క్రాస్రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తల ఛిద్రమై తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ జాన య్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తొలగించి ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించారు. -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. మహ్మదాబాద్ మండలం గాధిర్యాల్కు చెందిన మధు తన సొంత ట్రాక్టర్లో అనంతసాగర్ వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు చూపించాలని అడగగా లేవని చెప్పడంతో వాహనాన్ని సీజ్ చేసి, పీఎస్కు తరలించారు. పెట్రోల్ బంకుల్లో తనిఖీలు మాడ్గుల: మండల కేంద్రంలోని వివిధ పెట్రోలు బంక్లను మంగళవారం తహసీల్దార్ వినయ్సాగర్ తనిఖీ చేశారు. పెట్రోల్ బంక్లలో పెట్రోలు, డీజిల్ కొరత నేపథ్యంలో నిల్వలను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలలో మాత్రమే పోయాలని, బ్యారెల్స్, డబ్బాలలో నింపరాదని సూచించారు. అలాగే నిర్వాహకులు సకాలంలో డీడీలు చెల్లించి పెట్రోల్, డీజిల్ను తీసుకువచ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. కారు ఢీకొని ఇద్దరు మృతి యాచారం: అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాడ్గుల్ మండలం కొర్రతండాకు చెందిన కొర్ర జాను(47), కొర్ర నర్షా(39) వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు. ప్రస్తుతం తమ పొలాల్లోని తాటి చెట్లకున్న మంజలు కోసి, నగరంలోని ఇంజాపూర్ చెరువు కట్టపైకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 10 గంటలకు ఆటోలో ముంజలతో వెళ్లి, రాత్రి 8:30 గంటలకు తిరిగి వెళ్తున్నారు. ఈక్రమంలో సాగర్ హైవేపై యాచారం పీఎస్ సమీపంలోని మాల్ నుంచి అతి వేగంగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాన్, నర్షాలను మాల్, మాన్యగూడలోని ప్రవేట్ ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ రాత్రే మృతిచెందారు. నర్షాకు భార్య సబితతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. జాన్కు భార్య సరోజతో పాటు కొడుకు, కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని నందివనపర్తికి చెందిన కొర్రమోని వెంకటేశ్(38) మూడు రోజుల క్రితం నగరం నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, చౌదర్పల్లి గేట్ వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ను నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య సంగీత ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్: యజమానుల కళ్లుగప్పి పనిమనుషులు చేతివాటం ప్రదర్శించి 20 తులాల బంగారు నగలతో ఉడాయించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని గఫార్ఖాన్ కాలనీలో నివసించే విజయ ఎస్.నాయక్ అనే మహిళ ఇంటి డ్రెస్సింగ్ రూమ్లోని అల్మరాను ధ్వంసం చేసి రెండు జతల బంగారు గొలుసులు, వజ్రాలతో కూడిన బ్రాస్లెట్, జత బంగారు రూబీ గాజులు, పొడవైన బంగారు గొలుసు, నెక్లెస్, ఆరు బంగారు గాజులను తస్కరించారు. తమ ఇంట్లో చాలాకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఇద్దరు పనిమనుషులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పనిమనుషుల కదలికలపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఫ్యూచర్ దిశగా ఒక్కో అడుగు
● ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ ● హాజరైన మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ, స్థానిక నేతలు కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్సిటీలో ఒక్కో సంస్థ కొలువుదీరనుంది. ఫ్యూచర్సిటీ ప్రాంతంలో ఇప్పటికే ఎఫ్సీడీఏ, స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణాలతో పాటు 330 అడుగుల రహదారి నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వాటితో పాటు ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి కందుకూరు మండలం మీర్ఖాన్పేట రెవెన్యూలో 25 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, డీజీ మహేశ్భగవత్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్ఆర్, తీగల కృష్ణారెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటీవ్ సువర్ణ, సీపీలు సుధీర్బాబు, రమేష్ తదితరులు హాజరయ్యారు. పోలీస్ కమీషనరేట్ భవనానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ రెండేళ్లు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయని సీఎం అన్నారు. ఫ్యూచర్సిటీలో ఏ కార్యక్రమం జరిగినా ఆ పరిధిలోని ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించాలని కలెక్టర్, డీసీపీలను ఆదేశించారు. పేదల పట్ల మానవనీయ కోణంతో మెలగాలని, రైతులతో చర్చించి ప్రభుత్వానికి అవసమైన భూములు ఇచ్చేలా లోకల్ నాయకుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్సిటీ పరిధిలోకి పక్కనే ఉన్న గ్రామాలను కూడా చేర్చాలని వినతులు వస్తున్నాయని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
‘మణిపూలకు’ అద్వితీయ ఆదరణ
● కవి వడిచర్ల సత్యం ● కవి ఊర ఈశ్వరరెడ్డికి సన్మానం బొంరాస్పేట: మాత్రా ఛందస్సులో ఉన్న మణిపూసలు సాహిత్య ప్రక్రియకు దక్కుతున్న ఆదరణ అద్వితీయమని మణిపూసలు సృష్టికర్త మండల పరిధిలోని వడిచర్లకు చెందిన కవి వడిచర్ల సత్యం అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోవెలదిన్నెకు చెందిన ప్రముఖ కవి ఊర ఈశ్వరరెడ్డి రచించిన ‘అక్షర మణిపూసలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యవర్గం సమక్షంలో పుస్తకావిష్కరణ చేశారు. పుస్తక రచయితనుద్దేశించి కవి వడిచర్ల మాట్లాడుతూ.. మూడేళ్లుగా అనారోగ్యంతో మంచానికి పరిమితమై ఉన్నా అక్షర మణిపూసలు పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. ఈశ్వరరెడ్డి రచించిన వెంకటేశ్వర ద్విశతి, చెన్నకేశవ శతకం, కవితా లహరి, సమస్యాపూరణం, ముక్తపదం వంటి పద్యగ్రంథాలను కొనియాడారు. అచేతన స్థితిలో ఉండికూడా మణిపూసలు సాహిత్య రచన చేయడం పట్ల అనంతవేదిక ప్రతినిధులు ఈశ్వరరెడ్డిని అభినందించి సన్మానించారు. ఇందులో అనంత వేదిక అధ్యక్షుడు ఆశీర్వాదం, పాలమూరు జిల్లా అనుపటి రాంచంద్రయ్య, హనుమంతు సుమాల తదితరులున్నారు. -
విద్యుత్ తీగలను తొలగిస్తాం
● చెంచుపల్లిలో పర్యటించిన అధికారులు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటకంగా ఉన్న వైర్ల పరిశీలన పూడూరు: విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం మండల పరిధిలోని చెంచుపల్లిని సందర్శించి, సర్పంచ్ దయాకర్తో కలిని పరిస్థితిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న వైర్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్సీ రవి, ఏడీ నాయుడు ప్రసాద్ హామీ ఇచ్చారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కారించాలని ఏఈ రాజును ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ముక్రం, ఏఈ ఉదయ్ తదితరులు ఉన్నారు. -
ఎదురెదురుగా రెండు కార్ల ఢీ
● ఇద్దరి మృతి, పలువురికి గాయాలు ● వెల్జాల సమీపంలో ప్రమాదం ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అంతారానికి చెందిన పలువురు తలకొండపల్లి నుంచి కారులో వెల్జాలకు వెళ్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న శారదమ్మ, పెద్ద శ్రీను, శ్రీనుగౌడ్, పెద్దమ్మ, రిషి, మురళీధర్ శాస్త్రి, దత్తు గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. వీరిలో శారదమ్మ(52), పెద్ద శ్రీను(45) మార్గమద్యంలో మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
యువత చేతిలోనే దేశ భవిష్యత్
తాండూరు టౌన్: దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు వేడుకలు స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో నూతన ఆవిష్కరణలతో యువత ముందు దూసుకు పోతోందన్నారు. విద్యార్థులు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని, నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించాలన్నారు. మీరు చేరిన ఉన్నత స్థానంతో తల్లిదండ్రులకు, కళాశాలకు గొప్ప కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయన్నారు. సన్మార్గంలో నడిచి ఉత్తమ పౌరులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. కళాశాలలో క్రమశిక్షణ, అత్యుత్తమ బోధనతో పాటు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అకాడమిక్ ఫలితాల్లో విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మండలి అధ్యక్షుడు కల్వ రాధాకృష్ణ, కరస్పాండెంట్ మోముల మాణిక్యం, డైరెక్టర్లు సుధాకర్, వీరేందర్, మల్లేశం, రాధమ్మ, అకడమిక్ డైరెక్టర్ సిద్ధిలింగయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య -
మహిళా చట్టాలపై అవగాహన తప్పనిసరి
● భరోసా సెంటర్ కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత ● డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కొడంగల్ రూరల్: మహిళా చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భరోసా సెంటర్ కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత, కొడంగల్ ఎస్ఐ జివి.సత్యనారాయణ సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే 100, 109, 112 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్స్పాల్ రఫియాఖానమ్, సిబ్బంది టి.రాంబాబు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సోమ్లా, హరిప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘కల్యాణలక్ష్మి’
మహేశ్వరం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా చెక్కులు అందించాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డ పెళ్లి విషయంలో ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ మహిళలు, గర్భిణులు, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఎంపీడీఓ శైలజ, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఆర్ఐ స్వర్ణకుమారి పాల్గొన్నారు.మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
2న ఆలయ భూములకు కౌలు వేలం
అనంతగిరి: అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను మే 2న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఈఓ టీ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని తెలిపారు. వేలం హక్కులు పొందిన వారు మూడేళ్ల పాటు(మే 05 నుంచి ఏప్రిల్ 30 2029 వరకు) వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. వికారాబాద్ మండలం గుడుపల్లి సర్వే నంబర్ 65లో 328 ఎకరాలు, కొత్తగడి గ్రామ సర్వే నంబర్ 175లో 219 ఎకరాలు, మరో సర్వే నంబర్ 176లో 324 ఎకరాలు, పులుసుమామిడి గ్రామ సర్వే నంబర్ 180లో 228 ఎకరాలు, మరో సర్వే నంబర్ 181లో 110 ఎకరాలు, నారాయణపూర్ సర్వే నంబర్ 135లో 1,334 ఎకరాలు, పరిగి మండలం బిజ్వారం గ్రామ సర్వే నంబర్ 169/ఆలో 206 ఎకరాలు, తాండూరు మండలం అంతారం గ్రామ సర్వే నంబర్ 205లో 25ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశ్వాపూర్ గ్రామ సర్వే నంబర్ 105లో 803 ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి కౌలు హక్కు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.2 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన వచ్చని వారు తెలిపారు. కొడంగల్ రూరల్: తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉద్యానశాఖ రాజేంద్రనగర్లో తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ హెచ్ఈఓ బాబ్యానాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన 25 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ అందజేస్తారని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం ప్రాంభించాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి ప్సోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 99487 26997లో సంప్రదించాలని తెలిపారు. పార్కు పనులను వెంటనే పూర్తి చేయండి అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధిలో హెచ్ఎండీఏ కింద చేపట్టిన పార్కుల ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య తెలిపారు. మంగళవారం పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, మెప్మా ఇంచార్జి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: వికారాబాద్ డీఎస్పీగా అంజయ్య నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో అంజయ్యను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. -
అలసత్వాన్ని ఉపేక్షించం
మర్పల్లి: విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొత్లాపూర్, ఘణాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులను, మర్పల్లి కమ్యూనిటీ ఆస్పత్రి, హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది రిజస్టర్, వార్డులు, వైద్య పరికరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నరు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చొరవ చూపాలని ఆదేశించారు. ఎక్స్రే యంత్రం పాడైందని, అంబులెన్స్ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడాలని సర్పంచ్ రామేశ్వర్కు, హౌసింగ్ సిబ్బందికి సూచించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి నిర్మాణ దశలో ఉన్న అదనపు తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. సర్పంచ్ గ్రామ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, అట్టి భూమిని స్వాధీనం చేసుకొని పంచాయతీకి అప్పగిస్తే గోదాం నిర్మించుకుంటామని సర్పంచ్ కోరారు. స్పందించిన కలెక్టర్ కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు. అర్హులను గుర్తించండి అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఇందుకు కోసం గెజిటెడ్ అధికారుల వెరిఫికేషన్ యూజర్ మాన్యువల్ విడుదల చేసినట్లు వివరించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన వెరిఫికేషన్ యూజర్ మాన్యువల్ ద్వారా నిజమైన అర్హులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ పీడీ సయ్యద్ ముక్రం బాబా, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. టెలికాం కమిటీ సమావేశం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ దీపక్ తివారీ అధ్యక్షతన జిల్లాస్థాయి టెలికాం కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో టెలికాం సేవల విస్తరణ, నెట్వర్క్ నాణ్యత, ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సదుపాయంపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన టెలికాం సేవలు అందించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటుర్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందాలి ఇందిరమ్మ ఇళ్లనుసకాలంలో పూర్తి చేయాలి కలెక్టర్ దీపక్ తివారి -
చమురు కొరత.. బంకుల మూత
ఇంధనం కోసం ఆరాటపడుతున్న వాహనదారులు పరిగి/ దుద్యాల్: పశ్చిమ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధమో.. మరేదైనా కారణమో స్పష్టత లేకపోయినా.. రాష్ట్రంలో చమురు ఇక్కట్లు నెలకొన్నా యి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభు త్వం స్పష్టం చేస్తున్నా.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అసత్య ప్రచారాలతోఇంధనం కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో నిల్వలు అడుగంటాయన్న సమాచారంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఆరాట పడుతున్నారు. బంకులకు క్యూ కడుతున్నారు. తమ వాహనాలతో పాటు.. క్యాన్లతో బారులు తీరారు. ఇలా ఒక్కసారి డిమాండ్ పెరగడంతో బంకుల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. నో స్టాక్ అంటూ క్రమంగా మూసివేస్తున్నారు. సోమవారం దుద్యాల్ నుంచి కోస్గి వెళ్లే మార్గంలో నో స్టాక్ బోర్డుతో బంక్ వెలవెలబోయింది. పరిగి పరిసరాల ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలో మీటరు మేర ప్రజలు వరుస కట్టారు. -
ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తాం
● అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగింప చేస్తాం ● హసింగ్ డీఈఈ సయ్యద్సాజిద్ పూడూరు: ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తామని హౌసింగ్ డీఈఈ సయ్యద్ సాజిత్ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధి చెంచుపల్లి, ఎన్కేపల్లి గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. మండల పరిఽధిలోని ఆదర్శ గ్రామంగా ఎంపికై న ఎన్కేపల్లి, చెంచుపల్లిలో 241 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 109 నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 107 నివాసాలు వివిధ స్థాయి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 25 వరకు ఇళ్లు నాట్ స్టార్టెడ్ జాబితాలో ఉన్నాయన్నారు. ఇంటిని కూల్చి, గుడిసెలో నివాసం జాబితాలో పేరు వచ్చిన వారు తమ ఇళ్లను నేల మట్టం చేసుకున్నారు. తీరా ఆధార్ మ్యాపింగ్ కాలేదని జుబ్బురు పుష్షమ్మ ఇంటికి మార్కింగ్ ఇవ్వలేదు. దీంతో ఆమె ఉన్న ఇంటిని కూల్చి, గుడిసెలో ఉంటోంది. చెంచుపల్లిలో విద్యుత్ తీగలు అడ్డు వచ్చి నిర్మాణాలు అసంపూర్తిగా ఆగాయి. వీటి పరిశీలించిన హౌసింగ్ అధికారులు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్ల గురించి ఏఈతో మాట్లాడగా.. రెండు రోజుల్లో ఆ తీగలను తొలగిస్తామని తెలిపారు. నాట్ స్టార్టెడ్ జాబితా లో ఉన్న వారికి మరోసారి అవకాశం కల్పించాలని, ఇళ్లు లేని వారికి కొత్తగా మంజూరు చేయాలని సర్పంచ్ దయాకర్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, హౌసింగ్ అధికారి చందర్నాయక్, ఉప సర్పంచ్ విజయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, వార్డు సభ్యులునరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
డంపింగ్యార్డును తరిమికొడదాం
ఎకోటౌన్కు వ్యతిరేకంగా అఖిలపక్షం సమావేశం అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులోని బండరావిరాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకోటౌన్ పేరుతో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును తరిమి కొట్టాలని అబ్దుల్లాపూర్మెట్, భూదాన్పోచంపల్లి మండలాలకు చెందిన పలువురు సర్పంచులు, రాజకీయ పార్టీ నేతలు ప్రతినబూనారు. బండరావిరాల సర్వేనంబర్ 268లోని ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డును నెలకొల్పేందుకు సర్కారు జపాన్కు చెందిన ఓ కంపెనీకి స్థలం కేటాయించిందని ఇటీవల వచ్చిన వార్తా కథనాలతో ఆయా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిన్నరావిరాలలోని ఓ ఫంక్షన్హాల్లో అన్ని పార్టీల నాయకులు, ఆయా గ్రామస్తులతో సమావేశం(అఖిలపక్షం) ఏర్పాటు చేశారు. పోరాటానికి సిద్ధం కావాలి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును వ్యతిరేకించకపోతే బండరావిరాల, చిన్నరావిరాల, తారామతిపేట, గౌరెల్లి, బాచారం, సద్దుపల్లి, బలిజగూడ, అబ్దుల్లాపూర్మెట్, కవాడిపల్లి, దేశ్ముఖి, పిలాయిపల్లి, పెద్దగూడెం, పోచంపల్లిలోని మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు, పీల్చే గాలి కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దుర్వాసనతో ఈగలు, దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇక్కడి గ్రామాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, ఇప్పటికే క్రషర్లతో కొంత మేర సాగుకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ డంపింగ్ యార్డుతో కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదముందన్నారు. మన గ్రామాలను, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అన్యాయాన్ని ఎదురించి పోరాడటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని భీష్మించారు. డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటం కోసం త్వరలోనే బాధిత గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ మండల సర్పంచులు విజయ్కుమార్, బాలకిషన్గౌడ్, మాధవీనవీన్, పోచంపల్లి మండల సర్పంచులు జంగయ్యయాదవ్, మహాలక్ష్మిదానయ్య, మహేశ్యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దాసుగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, బీజేపీ నేతలు నవీన్కుమార్, సురేష్గౌడ్, కొండల్గౌడ్, వివిధ సంఘాల నేతలు వెంకటేశ్, అరుణ్కుమార్, మహేందర్, లింగారెడ్డి, అశోక్యాదవ్, సతీష్రెడ్డి, బసవయ్య, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు రాక ఇబ్బందులున్నాయి
కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, మైసిగండి, ఆమనగల్లు, షాద్నగర్, మహేశ్వరం పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి వేతన కూలీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్మికులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్కుమార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలల దినసరి వేతన కూలీలు మాట్లాడుతూ.. గత 13 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రికార్డుల్లో లోపాలు ఉండటంతో జీతాలు అందడంలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్కుమార్లు.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లో జీతాలు కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కూలీలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, దినసరి వేతన కూలీలు సైదమ్మ, సంతోష, శోభ, చంద్రకళ, బుజ్జి, మస్రూ, సునీత, రాములు, భూదేవి, సత్యమ్మ, అలివేలు, స్వరూప, లక్ష్మి, మల్లమ్మ తదితరులు ఉన్నారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేశారు. మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామానికిచెందిన అలవోని తిరుపతి.. తన వాహనంలో రాకొండ వైపునకు ఇసుక తీసుకెళ్తుండగా.. నమ్మదగిన సమాచారంతో పోలీసులు ట్రాక్టర్ను పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని ఠాణాకు తరలించారు. తిరుపతిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వసంత్ జాదవ్ హెచ్చరించారు. మహిళ మృతిపై విచారణ తుర్కయంజాల్: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతిపై పూర్తి విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్ రవినాయక్, డాక్టర్ భానుప్రకాశ్, డాక్టర్ వినయ్ కోట బృందం వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన కె.దివ్య వైద్యం నిమిత్తం ఈనెల 24న రాగన్నగూడలోని మహోనియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చి, మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈఅంశంపై విచారణ చేసేందుకు మహేశ్వరం మెడికల్ కళాశాలకు చెందిన వైద్య బృందాన్ని నియమించారు. సోమవారం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు దివ్యకు అందించిన చికిత్స వివరాలను సేకరించడంతో పాటు పలు రిపోర్ట్లను పరిశీలించారు. ఐసీయూలోని సీసీ పుటేజీలను సైతం తీసుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ లక్ష్మీప్రసన్న, మండల వైద్యాధికారి ప్రియాంక, డాక్టర్ శృతి తదితరులు పాల్గొన్నారు. యువకుడి అదృశ్యం అబ్దుల్లాపూర్మెట్: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవడ గ్రామానికి చెందిన పొడుగు ఈశ్వరమ్మ, యెరుకులు దంపతులు కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా అనాజ్పూర్లోని రామోజీ ఫిల్మ్సిటీకి చెందిన సహారా క్వార్టర్స్లో నివాసముంటున్నారు. ఫిల్మ్సిటీలో పనిచేస్తున్న వారి చిన్న కుమారుడు ఏసుకుమార్(24) ఈ నెల 21వ తేదీన పనికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూడగా ఏసుకుమార్ కనిపించకపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రొటోకాల్పై కలెక్టర్కు ఫిర్యాదు మంచాల: ప్రొటోకాల్ పాటించకుండా పనులకు అడ్డుతగిలి, తనను అవమాన పర్చిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆగపల్లి సర్పంచ్ లకుమల్ల ఉమ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25న గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారన్నారు. కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత సమయాభావంతో ఆయన వెళ్లిపోయారని, మిగిలిన వాటిని సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించాలని సూచించారన్నారు. అనంతరం గ్రామంలో ఓ ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను ఏర్పుల సంజీవ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాలితో తన్నడంతో పాటు కత్తెర లాక్కొని రిబ్బర్ కట్ చేశారని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించకుండా, మహిళా సర్పంచ్నైన తనను అవమానించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. -
బాలిక ఆత్మహత్య.. నిందితుడికి రిమాండ్
బంట్వారం: బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించామని కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపారు. ఎస్ఐ తెలిపిన ప్రకారం.. కోట్పల్లి మండలం నాగసాన్పల్లికి చెందిన కాళ్ల సాకేత్.. బాలికను ప్రేమపేరుతో వేధించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన బాలిక.. ఈ నెల 23న పురుగు మందు తాగి బలవన్మరణానికిపాల్పడింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25న మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. గృహిణి ఆత్మహత్య కేసులో ఇద్దరికి.. యాలాల: భర్త, తోటికోడలు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి కేసులో ఇద్దరిని సోమవారం పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన జటంగి దేవి(33)ని, ఆమె భర్త హన్మంతు నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఈ నెల 13న డబ్బుల విషయంలో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన ఆమె గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు.. దేవి మృతికి కారణమైన హన్మంతు, తోటి కోడలు సావిత్రమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
కార్మికుల పక్షపాతి సీఎం రేవంత్రెడ్డి
డీసీసీ అధికార ప్రతినిధి గోపాల్ తాండూరు: ఆర్టీసీ కార్మికుల పక్షపాతి సీఎం రేవంత్రెడ్డి అని డీసీసీ అధికార ప్రతినిధి గోపాల్ అన్నారు. సోమవారం తాండూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కార్మికులతో కలిసి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన సవరణతో 37,360 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరిందన్నారు. 2021 ఏప్రిల్ నుంచి ప్రయోజనాలు వర్తించడం హర్షనీయమన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఈ ప్రయోజనాలు వర్తించేలా సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వేతన సవరణతో కండక్టర్లకు రూ.4 వేల నుంచి 15 వేల వరకు, డ్రైవర్లకు రూ.4 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక భారం అయినప్పటికీ.. కార్మికుల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కార్మికులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. -
శాంతి సేవలకు హిందూ ధర్మం ప్రతీక
తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్ స్వామీజీ దౌల్తాబాద్: సనాతన ధర్మం, శాంతి సేవలకు హిందు ధర్మం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్ స్వామీజీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో హిందు సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, పరిరక్షణకు హిందు సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందు ధర్మం గొప్పతనం, సంస్కృతి పరిరక్షణ, సామాజిక ఐక్యతపై సందేశం ఇచ్చారు. యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించాలన్నారు. కలియుగంలో సనాతన ధర్మమే రక్షిస్తుందని, మునులు, ఋషులు ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కుటుంబ వ్యవస్థ బాగుపడినప్పుడే మన సామాజిక స్థితి బాగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వక్తలు కేరేల్లి అనంత్రెడ్డి, శ్రీలతరెడ్డి, బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: పొట్లి మహరాజ్ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అఽధికారులను ఆదేశించారు. సోమవారం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్రెడ్డితో కలిసి సందర్శించారు. ఆలయ పనులు అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. శివాలయ జీర్ణోద్ధారణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మరోవైపు ఆలయ కమిటీ పదవీ కాలం నాలుగు రోజుల క్రితం ముగియడంతో మరో 6 నెలల పాటు పొడగించేలా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం పట్టణ శివారులోని రసూల్పుర ఆంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్గా రాధాకిషన్బూప్, ధర్మకర్తలుగా మహేశ్ సార్డ, దినేష్పర్తాని, మొగులంపల్లి నర్సింహులు, డప్పు పద్మమ్మలు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. -
చోరీ కేసులో కేటుగాడి అరెస్టు
షాద్నగర్రూరల్: మాయమాటలు చెప్పి బంగారంతో ఉడాయించిన ఓ కేటుగాడిని పోలీసులు కటకటాలకు తరలించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో డిటెక్టివ్ ఎస్ఐ శివారెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన నరేష్ ఈ నెల 18న హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా బస్సు కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి బస్టాప్లో నరేష్ దగ్గరకు వచ్చి ఉద్యోగం ఖాళీగా ఉందని, ఇప్పిస్తానని, మరిన్ని విషయాలు మాట్లాడుకుందామని లాడ్జికి తీసుకెళ్లాడు. ఇద్దరు మాట్లాడుతుండగా వాష్ రూంకు వెళతానని నరేష్ చెప్పడంతో మెడలోని చైన్, చేతి ఉంగరాలను తీసిపెట్టి వెళ్లాలని భిక్షపతి సూచించాడు. దీంతో నరేష్ తన మెడలో చైన్, చేతికి ఉన్న నాలుగు ఉంగరాలను తీసిపెట్టి వాష్రూంకు వెళ్లాడు. నరేష్ బయటకు వచ్చేలోపు భిక్షపతి గది బయట నుంచి గడియపెట్టి బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించి భిక్షపతిని అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి బంగారు చైన్, 4 ఉంగరాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మినారాయణ, పట్టణ సీఐ సీతారం పర్యవేక్షణలో డీఎస్ఐ శివారెడ్డి, క్రై సిబ్బంది కేసును ఛేదించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి
అనంతగిరి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి పోరుబాట కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బోధనా రుసుం చెల్లించపోవడంతో విద్యార్థు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటి ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మైపాల్రెడ్డి, సీనియర్ నాయకులు సురేష్, అనంత్రెడ్డి, సుభాన్రెడ్డి బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు శాంతికుమార్, దత్తాత్రేయరావు, జుబేర్, అక్రం, పర్వేజ్, అరుణ్, ఇబ్రహీం, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలులు.. వడగండ్లు
● నేలరాలిన మామిడి కాయలు ● ఇళ్లపై పడిన విద్యుత్ స్తంభాలు పూడూరు: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్లు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మా మిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు కాయలు నేలరాలాయి. మండలంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. స గానికిపైగా కాయలు రాలిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కేపల్లిలో విద్యుత్ స్తంభాలు ఇళ్లపై పడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో ప్రధాన రోడ్డుపై చెట్లు పడింది. దీంతో రాకపో కలకు అంతరాయం కలిగింది. జేసీపీతో కూలిన చెట్టును తొలగించారు. నవాబుపేటలో భారీ వర్షం నవాబుపేట: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టింది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. -
సాగుకు దన్నుగా..
అన్నదాత చెంతకు వ్యవసాయ పరిశోధకులు బొంరాస్పేట: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాసీ్త్రయ పద్ధతులను అన్నదాతలకు నేరుగా చేరవేయాలని సంకల్పించింది. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మే 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మెళకువలపై అవగాహన కల్పించనున్నారు. సోమవారం బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో, చౌడాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాటించి రైతులకు సాగు పద్ధతులు, మెళకువలపై అవగాహన కల్పించారు. ఉద్దేశాలు.. కార్యక్రమాలు శాస్త్రవేత్తల సూచనలు ఫోన్లో శాస్త్రవేత్తలు.. జిల్లాలోని 20 మండలాల్లో.. జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశారు. 40 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో వరుసగా చౌడాపూర్, బొంరాస్పేట, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, దౌల్తాబాద్, దుద్యాల్, దోమ, మర్పల్లి, యాలాల, బంట్వారం, కుల్కచర్ల, ధారూరు, మోమిన్పేట, కోట్పల్లి, కొడంగల్, పరిగి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు రైతులతో మమేకమై వారి సమస్యలను నివృత్తి చేస్తారు. పంటల సాగుపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యకర నేల కోసం.. సేంద్రియ పద్ధతులు పా టించి ఆరోగ్యకరమైన నేల ను భావితరాలను అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తం. ఈ ఉద్దేశాన్ని రైతులు పాటించడం లేదు. ఆదాయ పంటలపై మక్కువతో రసాయనాలను మోతాదుకు మించి వాడుతూ నేలసారాన్ని నాశనం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టు, పశువుల పేడ, వానపాముల, కోళ్ల, పచ్చిరొట్టె ఎరువులు, జీలుగ, జనుము వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. గొప్ప శాస్త్రవేత్తలు రైతులకు వద్దకు వచ్చిచెప్పే సదావకాశం. – ప్రొ. డాక్టర్ సత్యనారాయణ, నేలవృచ్చిక శాస్త్రం శాస్త్రవేత్త, పాలెం పరిశోధన కేంద్రం -
ఆయుధ వినియోగంలో ప్రావీణ్యం అవసరం
అనంతగిరి: పోలీసు అధికారులకు ఆయుధాల వినియోగంపై పూర్తి ప్రావీణ్యం ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్రేపల్లి వద్ద నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్ ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఆయుధాల పనితీరును పరిశీలించి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీసు సిబ్బందిలో ఉండాలని ఆకాంక్షించారు. సీనియర్ అధికారులు, ఎస్హెచ్ఓలు తమ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్పై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. శిక్షణలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి స్పష్టంగా వివరించాలని తెలిపారు. ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. తుపాకుల దగ్గర పెట్టుకొని విధులు నిర్వహించే అధికారులు తగు జాగ్రతలు పాటించాలన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసుల ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ సులువవుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతి అధికారి అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాములునాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీశ్రీనివాసులు, డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్, వీరేష్, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక స్పృహపై షార్ట్ ఫిల్మ్ పోటీలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక స్పృహపై సామాజిక మాద్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ స్నేహమెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్ అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీదారులు ముఖ్యంగా సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ నివారణ, మహిళలు, పిల్లల రక్షణ, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ఏటీఎం దొంగతనాలు, ఉద్యోగాలు, బహుమతుల పేరిట మోసాలు, న్యాయ విజ్ఞానం, ఆత్మహత్యల నివారణ అవగాహన అంశాల్లో షార్ట్ ఫిలిమ్ చేయాలని తెలిపారు. వ్యవధి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉండాలన్నారు. జిల్లాలోని యువత, విద్యార్థులు, క్రియేటివ్ అర్టిస్టులు, కంటెంట్ క్రియేటర్లు, యూ ట్యూబర్లు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. వీడియో కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యతను పెంచే విధంగా ఉండాలన్నారు. ఉత్తమంగా ఐదు షార్ట్ ఫిల్మ్లను ఎంపిక చేసి నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల వారు మీరు తీసిన వీడియోతో పాటు మీ పేరు, ఫోన్ నంబర్ను టైటిల్ను జగదీశ్వర్రెడ్డి సెల్ నంబర్ 9948542227కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు ఎస్బీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ సెల్ నంబర్లో 8712670020లో సంప్రదించాలని తెలిపారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పీఎస్లకు ఫోన్ చేసి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడానికి పోలీస్ శాఖ ఎల్లపుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. -
ఆయుర్వేదం.. అందనంత దూరం
దోమ: పురాతన సంప్రదాయ వైద్యం, రోగులపై దుష్ప్రభావాలు కలిగించకుండా స్వస్థత చేకూర్చే వైద్యం ఆయుర్వేదం. ప్రకృతిలో లభించే వనమూలికలతో చూర్ణాలు, లేహ్యాలు తయారు చేసి రోగ నివారణ చేసే అద్భుత వైద్య విధానంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ప్రజాభిమతాన్ని గమనించిన పాలకులు ఆయుష్ పేరుతో ప్రతి మండల కేంద్రంలో ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కానీ దోమ మండలంలో వైద్యులు లేక మూతబడింది. రెండేళ్ల నుంచి వైద్యం, మందుల కోసం రోగులు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా జిల్లా అధికారుల్లో చలనం లేదు. నిరీక్షించి.. వెనుదిరిగి.. మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి నిత్యం అనేక మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఆయుర్వేద ఆస్పత్రికి వస్తుంటారు. కానీ వైద్యుడు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రైవేటును ఆశ్రయిస్తూ.. గతంలో ఆయుర్వేద ఆస్పత్రి సేవలు ఎంతో బాగుండేవి. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచేవారు. రోగులకు మెరుగైన సేవలు అందేవి.. వైద్యుడు లేని కారణంగా ఆస్పత్రి మూత పడింది. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో మహబూబ్నగర్, షాద్నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ప్రైవేటులో వైద్యం పొంది మందులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆస్పత్రికి వైద్యుడు, సిబ్బందిని నియమించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వైద్యం అందడం లేదు ఆయుర్వేద ఆస్పత్రిలో డాక్టర్ లేక వైద్యం అందడం లేదు. ఎప్పుడు వచ్చినా ఆస్పత్రికి తాళం ఉంటోంది. రెండేళ్లుగా తిరుగుతున్నా. ప్రస్తుతం నగరానికి వెళ్లి మందులు తెచ్చుకుంటున్నా. – ప్రభాకర్, బొంపల్లి సిబ్బందిని నియమించాలి ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బందిని నియమించాలి. డాక్టర్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – ఖాజాపాషా, కోఆప్షన్ మాజీ సభ్యుడు, దోమ -
స్వర్ణ కిరణం
దుద్యాల్: మారుమూల ప్రాంతంలోని ఓ పేదింట్లో పుట్టిన క్రీడాకారుడు బంగారు పతకాలతో సత్తాచాటుతూ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు. జిల్లాలోని దుద్యాల్ మండలం హస్నాబాద్కు చెందిన అల్వాల్ సాయికిరణ్ పుట్టి పెరిగింది సొంతూరిలోనే. గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. అనంతరం గురుకుల సీటు రావడంతో ఎంజేపీ గురుకులంలో చేరి ఇంటర్ వరకు అక్కడే చదివాడు. పాఠశాలలో నిర్వహించే షాట్పుట్ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చేవాడు. ఈక్రమంలో ఎస్జీఎఫ్ పోటీల్లో సత్తాచాటి, క్రీడాధికారుల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ప్రభుత్వం తరఫున ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కోచ్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించారు. దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా సాయికిరణ్ను తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్లిన చోటల్లా బంగారు పతకం సాధిస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు. సాధించిన పతకాలు.. షాట్పుట్లోసత్తాచాటుతున్న సాయికిరణ్ దేశం తరఫున ఆడేందుకు సిద్ధం ప్రభుత్వ సహకారంతో షాట్పుట్లో సత్తా చాటుతున్నా.మాది పే ద కుటుంబం సర్కా రు నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే భారత్ తరఫున పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా. శ్రమ, పట్టుదలను నమ్ముకుని ముందుకు సాగుతున్నా. – సాయికిరణ్, అథ్లెట్ -
బాలల రక్షణ మన బాధ్యత
అనంతగిరి: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా మే 2వ తేదీ వరకు బాలల భద్రత, రక్షణ, డ్రగ్స్ రహిత సమాజం అనే అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడి యో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలల భద్రత, డ్రగ్స్ రహిత సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతను భాగస్వాములను చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వీయ గణన చేసుకున్న కలెక్టర్ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టర్ దీపక్ తివారి స్వయ గణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిస్టంలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సెల్ఫ్ ఎమ్యూ నరేషన్ పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రజావాణికి 145 ఫిర్యాదులు ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు 145 అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో విచారణ చేపట్టి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దళారులకు ధాన్యం అమ్మొద్దు
జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం బొంరాస్పేట: రైతులు వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి టి.రాజరత్నం అన్నారు. సోమ వారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, కొత్తూరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. మెట్లకుంట, వడిచర్ల, బాపల్లి, చౌదర్పల్లి, తుంకిమెట్ల, ఏర్పుమళ్ల కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ పోలప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములు గౌడ్, డైరెక్టర్ మల్లేశ్, జయకృష్ణ, నాయకులు భీంరెడ్డి ఢాక్యా నాయక్, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. ‘టాలెంట్ సర్చ్’ అభినందనీయం యాలాల: ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన టాలెంట్ సర్చ్ టెస్ట్ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నా రు. సోమవారం ఎమ్మెల్యేను ఎంఈఓ మహిపాల్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టాలెంట్ సర్చ్ టెస్ట్ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూన్లో నియో జకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాల ని విద్యాశాఖకు చెందిన అధికారులను ఎమ్మె ల్యే ఆదేశించారు. అనంతరం ఎంఈఓను సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు, ప్రతినిధులు శ్రీధర్రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మను చంపి.. ఆపై ఉరివేసి..
తాండూరు రూరల్: మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వలేదని ఆగ్రహానికి లోనైన కొడుకు కర్రతో కన్నతల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి మృతిచెందడంతో, ఆమె శవాన్ని దూలానికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కరన్కోట్ ఎస్ఐ వినోద్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన రుకియాబేగం (50)కు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. రుకియాబేగం తాండూరు పట్టణంలోని ఓ హోటల్లో కూలి పనులు చేస్తూ జీవిస్తోంది.పెద్ద కుమారుడు మహబూబ్ సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇతను ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రామంలోని తల్లి వద్దకు వెళ్లి రూ.100 ఇవ్వమని అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో తల, మెడ భాగంలో విచక్షణా రహితంగా కర్రతో దాడి చేశాడు. దీంతో రుకియాబేగం అక్కడికక్కడే మృతిచెందింది.తనపై కేసు అవుతుందని భయపడిన నిందితుడు ఓ చీర తీసుకుని తల్లి మెడకు కట్టి ఇంట్లోని దూలానికి వేలాడదీశాడు. సోమవారం ఉదయాన్నే తన తల్లి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు, బంధువులకు చెప్పాడు. సోదరి మునీరాబేగం వచ్చి పరిశీలించగా తల్లి ఒంటిపై గాయాలు కనిపించడంతో బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. -
ఈత నేర్చుకునేందుకు వెళ్లి..
దోమ: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన కారవొని నాగేశ్కు ఏడేళ్ల బాలుడు శివకుమార్ ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం మహబూబ్నగర్ జిల్లా కొయిలకొండ మండలం కొత్లాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం పెద్దనాన్నతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అందరూ చూస్తుండగా శివకుమార్ బావిలోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అక్కడే ఉన్న కొందరు గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగిన బాలుడిని బయటికి తెచ్చారు. అప్పటికే శివకుమార్ చనిపోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నీట మునిగి చిన్నారి మృతి మహబూబ్నగర్ జిల్లాలో ఘటన దిర్సంపల్లిలో విషాదం -
‘అనంత వేదిక’ కృషి అభినందనీయం
బొంరాస్పేట: స్థానిక కవులు, సాహిత్య కృషిని వెలికి తీయడంలో వికారాబాద్ జిల్లా అనంత వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ వాగ్గేయకారుడు, జిల్లా ప్రముఖ కవి శ్రీ రాకమచర్ల వెంకటదాసు సంచికను ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పలువురు రాకమచర్ల సంకీర్తలను కీర్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి సంచికను ఆవిష్కరించారు. రాకమచర్ల సంకీర్తలను ప్రచారం చేయడంలో జిల్లా కవులు, రచయితల ప్రాత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో అనంత వ్యవస్థాపకులు దోరవెటి చెన్నయ్య, అధ్యక్షుడు ఆశీర్వాదం, కార్యదర్శి కమలేశ్, ఉపాధ్యక్షుడు వడిచర్ల సత్యం, అనంత సభ్యులు రవూఫొద్దీన్, మధుసూదన్రావు, డాకన్న, సురేశ్, రమేశ్, మల్లికార్జున్, రవికృష్ణస్వామి, రామన్న తదితరులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి -
బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
ఆమనగల్లు: ఓ మహిళను రుణం ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని అపహరించిన దొంగ పోలీసులకు చిక్కాడు. ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన ముగురాల రాజేందర్గౌడ్ అలియాస్ రాజు అలియాస్ గోలి శివ పాత నేరస్తుడు. గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో తొమ్మిమది కేసులు నమోదై ఉన్నాయి. ఈనెల 21న నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన ఓ మహిళకు రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. తన బైక్పై ఎక్కించుకుని ఆమనగల్లు సమీపంలోని చింతలపల్లి సరిహద్దులో ఆమెను బెదిరించి మెడలో ఉన్న రూ.31 వేల విలువైన బంగారు ఆభరణాన్ని లాక్కున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి సెల్ఫోన్, మోటార్బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్పోర్ట్ పీఎస్
జీవో ఎప్పుడు..?ఎయిర్పోర్ట్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటై 14 నెలలు సాంకేతికంగా ఇంకా వేరుపడని వైనం ఒకే పీఎస్.. రెండు స్టేషన్ల కేసులు ప్రభుత్వ జీఓ విడుదలైతే పూర్తిస్థాయి ఠాణాగా ఏర్పాటు శంషాబాద్: ఏటా పెరుగుతున్న ప్రయాణికులు.. మరోవైపు విమానాశ్రయ విస్తరణ.. ఎయిర్పోర్ట్ అనుబంధ పరిశ్రమలు.. ప్రయాణికులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ప్రతిరోజు లక్షకు పైగా జనాభాతో కిక్కిరిసిపోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శాంతిభద్రతలతో పాటు నేరాల నియంత్రణ కోసం ఎయిర్పోర్ట్లోనే గతేడాది మార్చి 1 ఆర్జీఐఏ పోలీస్ ఔట్పోస్టు స్టేషన్ను అప్పటి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రారంభించారు. పద్నాలుగు మాసాలుగా పోలీస్స్టేషన్ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నా దానికి పూర్తి స్థాయిలో పోలీస్స్టేషన్గా సాంకేతికంగా ఇంకా అనుమతి లభించలేదు. దీనికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల కావాల్సి ఉంది. 2008లోఆర్జీఐఏగా.. 2008 మార్చిలో 23 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. 2008 అక్టోబర్లో శంషాబాద్ పట్టణ కేంద్రంలో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్స్టేషన్ పేరుతో భౌగోళికంగా ఎయిర్పోర్ట్తో పాటు శంషాబాద్ పట్టణం, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్పహాడ్ రెవున్యూ ప్రాంతాన్ని కలిపి ప్రారంభించారు. విమానాశ్రయంలో వీఐపీల రాకపోకల బందోబస్తుతో పాటు నకిలీ పాస్పోర్టులు, వీసాలు, ఫేక్ సర్టిఫికెట్లు, ప్రమాదాలు ఇతరత్రా అనేక కేసులతో దర్యాప్తుతో పాటు పట్ణణానికి సంబంధించిన కేసుల దర్యాప్తు కూడా ఇక్కడే కొనసాగింది. గత నాలుగేళ్లుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణతో పాటు ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం కూడా రెట్టింప్పు అయ్యింది. దీనికి తోడు విమానాశ్రయంలో ఎరోసిటీ, అనేక ప్రత్యేక సెజ్లుగా ఏర్పాటు కావడంతో వివిధ రకాల కేసులు కూడా పెరుగుతువచ్చాయి. ఎయిర్పోర్ట్లో జరిగే ప్రతి చిన్న సంఘటనకు బాధితులు శంషాబాద్ పట్టణానికి చేరుకుని ఫిర్యాదు చేయడం భారంగా మారడంతో పోలీసులు కూడా ఉరుకులు.. పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక పోలీస్స్టేషన్ ఏర్పాటుకు మొగ్గుచూపి గతేడాది మిస్వరల్డ్ పోటీలకు ముందు ఎయిర్పోర్ట్లోనే ప్రత్యేక పోలీస్స్టేషన్ను ప్రారంభించింది. జీవో వస్తే.. బాధితుల నుంచి వెంటనే ఫిర్యాదులు స్వీకరించినా పట్టణంలో ఉన్న పోలీస్స్టేషన్ ద్వారానే నేటికి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. రెండు పోలీస్స్టేషన్ల కేసులు ఒకే పోలీస్స్టేషన్ సీరియల్ నంబర్లో కొనసాగుతున్నాయి. దీంతో సాంకేతికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. జీవో వస్తే సిబ్బంది సంఖ్య పెరిగితే పోలీసుల సేవలు కూడా మెరుగుపడే అవకాశముంది. మరిన్ని మార్పులు.. గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్ డీసీపీ జోన్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి మారింది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ శంషాబాద్ టౌన్ పోలీస్స్టేషన్గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం హైదారాబాద్ నగరపాలక సంస్థలో ఉన్న అనేక ప్రాంతాలు కూడా ఇంకా శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఆర్జీఐఏ పోలీస్ ఔట్పోస్టు స్టేషన్కు జీవోతో పాటు, శంషాబాద్టౌన్గా ఏర్పాటు కానున్న ప్రస్తుత ఆర్జీఐఏ స్టేషన్కు భౌగోళిక మార్పుల కోసం పోలీసు అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు. -
మార్వాడీ సమాజాభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: మార్వాడీ సమాజం అభివృద్ధికి అన్ని విధాలా చేయూతనందిస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ శివారులో మార్వాడీలకు కేటాయించిన స్థలంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం మార్వాడీలకు ఎకరా భూమిని కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, వ్యాపారులు సురేష్ పర్తాని, ఓం ప్రకాష్ సోమాని, మన్మోహన్ సర్డా, దినేష్ పర్తాని తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్పై దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి
కొత్తూరు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎలుకగూడెం సర్పంచ్ బందెయ్యపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పలువురు సర్పంచులతో కలిసి మండలకేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులమత తారతమ్యం లేకుండా రాజ్యాంగం మేరకు దేశంలో అన్నిచోట్ల రిజర్వేషన్లు అమలవుతున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ కృషి ఫలితంగా నేడు అన్ని వర్గాలకు చెందిన వారు రిజర్వేషన్ల కారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బహుజన కుటుంబానికి చెందిన బందెయ్య సర్పంచుగా గెలుపొందగా ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు గ్రామానికి చెందిన అగ్రకులాల నాయకులు దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఉద్ధేశపూర్వకంగా సర్పంచ్పై దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు జగన్, దయానంద్గుప్తా, శ్రీశైలం, నర్సింహారెడ్డి, శ్రీరాములు, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు. కులవివక్షను ప్రోత్సహించడం తగదు షాద్నగర్ రూరల్: అధికారం కోసం సర్పంచ్పై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సీనియర్ నాయకుడు నందిగామ రాంచందర్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని ఎల్కగూడ సర్పంచ్ బందయ్య పై అదే గ్రామానికి చెందిన రాంరెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ సమానత్వాన్ని ప్రొత్సాహిస్తుంటే గ్రామాల్లో కొందరు వ్యక్తులు ఇలాంటి దాడులతో కుల వివక్షను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. ఘటనకు కారణమైన రాంరెడ్డితో పాటు దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని కోరారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ -
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
పరిగి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. భక్తి మార్గంతో నే ముక్తి లభిస్తుందన్నారు. అనంతరం పరిగిలో జరిగిన వాసవిమాత జయంతిలో పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం కుల్కచర్ల: కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. వారం రోజుల క్రితం డ్రోన్ ప్రమాదంలో గాయపడిన రాంపూర్ సర్పంచ్ చెక్కల తిరుపతయ్య, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ ప్రమాదం అనుకోకుండా జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ఇద్దరికి మినహా ఎవ్వరికీ పెద్ద ప్రమాదం జరగలేదన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాస్యనాయక్ తండాలోని పంచముఖ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత రాజు, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, ముజాహిద్పూర్ సర్పంచ్ చంద్రభూపాల్ రావు, నాయకులు హరిలాల్, వెంకటయ్య, రాంచంద్రయ్య, తులసీరాం నాయక్, శంకర్ నాయక్, హన్మంతు పాల్గొన్నారు.ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
గొప్ప సంఘ సంస్కర్త పోతులూరి
● శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ● ఖాంజాపూర్ గుట్ట వద్ద ఆలయ నిర్మాణానికి భూమిపూజ తాండూరు రూరల్: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్ప సంఘ సంస్కర్త అని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని ఖాంజాపూర్ గుట్ట వద్ద విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందని కాలంలోనే స్వామివారు కాలజ్ఞానం ద్వారా భవిష్యత్ వాణి వినిపించారని కొనియాడారు. తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని పేర్కొన్నారు. కలియుగంలో జరిగే అనేక వింతలు, సామాజిక మార్పులు, విపత్తులను తన తాళపత్ర గంథాల్లో పొందుపరిచారని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తంరావు, శ్రీనివాసాచారి, ఎం.శ్రీనివాసాచారి, జయప్రసాద్, పులేందర్, యాదగిరి, పాండురంగాచారి, బాలకృష్ణ, వినోద్ కుమారాచారి, రమేష్, లక్ష్మణచారి, తిప్పన్నచారి పాల్గొన్నారు. విశ్వకర్మలకు అండగా ఉంటాం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి మండలి, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు అండగా ఉంటామన్నారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంజుగుల విఠల్రెడ్డి అన్నారు. తన కుమారుడు పైలెట్ రోహిత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విశ్వకర్మల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. -
మానవత్వం చాటుకున్న సీఐ
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ మానవత్వం చాటుకున్నారు. కందుకూరు మండలం మాలగూడూరు గ్రామానికి చెందిన బండి కరుణాకర్ ఆదివారం వ్యక్తిగత పనిమీద మీరాఖాన్పేటకు బైక్పై వచ్చి తిరుగుపయనమయ్యాడు. మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కరుణాకర్ను వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 108కు సమాచారం అందించగా మార్గమధ్యలో 108 వాహనం రావడంతో అందులో ఎక్కించి నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొడంగల్: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. మండలంలోని పర్సాపూర్లో రూ.30 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్ తిరుపతిరెడ్డి సహకారంతో నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతానికి అధిక మొత్తంలో నిధులు వస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్య రంగాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ గుప్తా, పర్సాపూర్ గ్రామ సర్పంచ్ రాధ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ బెస్త శివమ్మ, నాయకులు తట్టెపల్లి రాములు, శ్రీశైలం, గోరిపల్లి ఆంజనేయులు, బానకారి నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ -
భక్తిశ్రద్ధలతోవాసవీమాత జయంతి
అనంతగిరి: కలెక్టరేట్లో ఆదివారం వాసవీమాత జయంతిని ఘనంగా నిర్వహించారు. అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, క్రీడల విభాగం జిల్లా అధికారి సత్తార్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ధారూరు: స్పీకర్ ప్రసాద్కుమార్ సతీమణి స్వర్గీయ గడ్డం శైలజా స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్ ప్రమీలగౌడ్ ప్రారంభిచారు. ఇరుజట్ల తరఫున ఎస్ఐ రాఘవేందర్ టాస్ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత అన్ని క్రీడల్లో పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వ కిరణ్కుమార్, లింగనపల్లి అశోక్ ముదిరాజ్, టీ మల్లేశం, బుజ్జయ్య గౌడ్, సంగమేశ్వర్, పంచాయతీ వారు సభ్యులు పాల్గొన్నారు. అనంతగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు జన్మదినం సందర్భంగా సోమవారం వికారాబాద్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మెడికల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మా శారద హాస్పిటల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు తాండూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయంపై రైతులను చైతన్యం చేసేందుకు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నెల రోజుల పాటు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. సుధారాణి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గ్రామాలలో రైతులకు అవగహన కల్పించనున్నారు. ఈ నెల 23నుంచి మే 23వ తేదీ వరకు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. 40 గ్రామాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆమనగల్లు: ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రవాణ, బీసీ, సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానం వెళ్తున్న ఆయనకు ఆదివారం ఆమనగల్లు పట్టణంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులను పెంచినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థన మేరకు కల్వకుర్తి డిపోకు 20 కొత్త బస్సులు కేటాయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షాబుద్దీన్, వస్పుల శ్రీకాంత్, ఫరీద్, సురేశ్, అలీం తదితరులు పాల్గొన్నారు. -
టీఎఫ్ఐఈఎఫ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
వెంగళరావునగర్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా లింక రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా వెల్లంకి శ్రీనివాస్ విజయం సాధించారు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి వల్లభనేని అనిల్కుమార్, చిట్టినేని కిశోర్బాబులు పోటీ చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి అమ్మిరాజు కనుమిల్లి, లంక రాజేంద్రప్రసాద్, పేర్ని రాంబాబు, కోశాధికారి పదవికి జి.భీముడు(శ్రీకాంత్), వెల్లంకి శ్రీనివాస్కుమార్లు పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్ళ పాటు (2026–28) తమ పదవుల్లో కొనసాగుతారని చౌదరి తెలియజేశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం పంజగుట్ట: చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్ విషయంలో టెస్టులే కీలకమని ప్రెస్క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రమేష్ వరికుప్పల అన్నారు. ప్రెస్క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం జర్నలిస్టులకు, వారి కుటుంబాల కోసం బసవతారకం ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా జర్నలిస్టులు ఈ పరీక్షలు చేయించుకున్నారు. పలువురు సీనియ ర్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు షాద్నగర్రూరల్: ట్రాక్టర్ అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బుర్ల ఇసాఖ్ వసంత దంపతులు తమ కుమారుడు యశ్వంత్, కుమారై అవనీకతో కలిసి ఆదివారం బైక్పై చర్చికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా హాజిపల్లి రోడ్డులో వెనుకనుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుర్ల ఇసాఖ్ వసంత, కుమారై అవనీకకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వసంత తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రణయ్ తెలిపారు. దూసుకొచ్చి ఢీ కొట్టినలారీ.. వ్యక్తి మృతి బాలానగర్: బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాదాచారిని ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్ నుంచి వై జంక్షన్ వైపు వెళుతున్న ఓ లారీ ఇందిరానగర్ యూటర్స్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుడు ఇందిరానగర్ నివాసి బానోత్ కిషన్ (45)గా గుర్తించారు. బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిటీ స్విమ్మర్ మరో రికార్డు ● సముద్రాన్ని ఈదిన నగర మహిళ ● 10.10 గంటల్లో శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకుని రికార్డు కాచిగూడ: అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. కాచిగూడకు చెందిన క్వీనీ విక్టోరియా శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో కలిసి సముద్రాన్ని ఈది రికార్డును నెలకొల్పారు. గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), విజయవాడకు చెందిన ధాత్రిక మండప (48)లు మహిళలు శ్రీలంకలోని తలైమినార్లో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకున్నారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలకు కలిసి రామసేతువును ఈడదం ఇదే మొదటిసారి. -
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
శంకర్పల్లి: ఆర్టీసీ బస్సు, యూ టర్న్ చేస్తున్న వాటర్ ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు కథనం ప్రకారం.. మెహిదీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి శంకర్పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. జన్వాడ గ్రామ శివారులోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద రాగానే.. ఓ వాటర్ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటోంది. అతి వేగంతో ఉన్న బస్సు ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ భాగం భారీగా దెబ్బతింది. డ్రైవర్ రవీందర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ ఇంజన్ని పిలిపించారు. గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్ భాగాన్ని తొలగించి, డ్రైవర్ని బయటకు తీశారు. డ్రైవర్ కాలు విరగ్గా, కండక్టర్ ముక్కుకి, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం నార్సింగిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికుడికి గాయాలు -
వైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మీర్పేట: వైశ్యులు వ్యాపారంలో నిబద్ధతతో, ఆలోచనా విధానంలో సద్భావతనో ఉంటారని డీసీసీ అధ్యక్షుడు, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. మీర్పేట దీన్దయాల్నగర్లో నూతనంగా నిర్మించిన వాసవిమాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, జయంతి వేడుకలకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయం నిర్మించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలందరికి అమ్మవారి ఆశీర్వాదం ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైశ్యులకు కార్పొరేషన్ చైర్మన్తో పాటు ఆర్యవైశ్య భవన నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రజల సంక్షేమంతో పాటు మరో వైపు ఆలయాలను అభివృద్ధికి సహకారం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తెరేటిపల్లి శ్రీనివాస్గుప్తా, అధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి సురేష్గుప్తా, గందే వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్గౌడ్, సంతోశ్కుమార్, గజ్జెల రాంచందర్, శేఖర్రెడ్డి, సైదులు, మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి -
ఉద్యానానికి ఊతం
జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచే దిశగా చర్యలు వికారాబాద్: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న మన జిల్లాలో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. హైదరాబాద్ వాసుల కూరగాయల అవసరాలను చుట్టుపక్కల జిల్లాల రైతులు 50 శాతం కూడా తీర్చలేకపోతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, మొదక్, సంగారెడ్డి జిల్లాల్లో 50 శాతంలోపే పండిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన 50 శాతం కూరగాయలపే పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తద్వారా రైతుల ఆదాయం పెంచాలని భావిస్తోంది. సాగు విస్తీర్ణం రెండింతలయ్యేలా.. ఇతర జిల్లాలతో పోలిస్తే కూరగాయల సాగుకు అనువైన, సారవంతమైన భూములు మన జిల్లాలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచి సమీప భవిషత్తులో రెండింతలు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా యంత్ర పరికరాలను 50 నుంచి 100 శాతం రాయితీపై అందించాలని నిర్ణయించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి గాను రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించటం ప్రారంభించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లా రైతాంగం దశాబ్ద కాలంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకంపై మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం 49,495 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతుండగా ఇందులో 15,265 ఎకరాల్లో పండ్ల తోటలు.. 27,125 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. మరో 6,254 ఎకరాల్లో పసుపు, అల్లం, 851 ఎకరాల్లో పూల తోటలు సాగుచేస్తున్నారు. రాయితీ పరికరాలు డ్రిప్: పెద్ద రైతులకు 70 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు ఇవ్వనున్నారు. మిగతా 30 శాతం తోపాటు జీఎస్టీని రైతులు భరించాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్ప్రింక్లర్లు: అన్ని వర్గాల రైతులకు 65 శాతం రాయితీతో స్ప్రింక్లర్లు ఇవ్వాలని నిర్ణయించారు. గరిష్టంగా రెండున్నర ఎకరాలు ఉన్న రైతులకు రాయితీ వర్తిస్తుంది. పందిళ్లు: అర ఎకరం ఒక యూనిట్ చొప్పున రాయితీ వర్తిస్తుంది. మొత్తం ఖర్చులో 50 వేల రూపాయలను ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తుంది. ప్రతి రైతులకూ అమలు చేస్తారు. నారు కోసం: టమాటా, వంకాయ, క్యాప్సికం, మిరప తదితర కూరగాయ పంటల నారును ప్రభుత్వం అందించనుంది. రెండున్నర ఎకరాల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. నీటి గుంటలు: రైతులు పొలాల్లో నీటి గుంటలు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించనుంది. గుంతలకు ప్లాస్టిక్ లైనింగ్ ఏర్పాటుకు 50 రాయితీ ఇవ్వనుంది. ఉల్లి సాగుకు: ఉల్లి, పూల తోటల సాగుకు ఉద్యానవన శాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. ఎకరాకు రూ. 8వేలు సాగు సాయం చేస్తుంది. మల్చింగ్: ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్ల కొనుగోలుకు రూ.50 శాతం రాయితీ ఇస్తుంది. రెండున్నర ఎకరాల వరకు వర్తిస్తుంది. థైవాన్ స్ప్రేయర్లు: ఏ కంపెనీకి చెందిన స్ప్రేయర్ కావాలో రైతులు ఎంచుకుని అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.. వాటికి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తారు. మినీ ట్రాక్టర్: 20 హెచ్పీలోపు మినీ ట్రాక్టర్లకు దాదాపు రూ.లక్ష వరకు రాయితీ అందిస్తుంది. టమాటా, మామిడి కాయల రవాణాకు వినియోగించే ప్లాస్టిక్ ట్రేలను 50 శాతం రాయితీపై అందిస్తారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు 90 శాతం రాయితీతో మొక్కలు, నాలుగు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు, అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.4,200 చొప్పున ఇస్తారు. పొలాల చుట్టు నాటుకునే వెదురు మొక్కలను కూడా రాయితీపై సరఫరా చేస్తారు. 80 నుంచి 100 శాతం రాయితీతో స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలు పండ్లు, పూలు, కూరగాయల సాగుకు వర్తించేలా.. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణజిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం 15,265 ఎకరాలుకూరగాయలు 27,125 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలు 6,254 ఎకరాల్లో పూల తోటలు 851 ఎకరాల్లో దరఖాస్తు చేసుకోండి ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అవసరమైన పరికరాలను రాయితీపై అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం నియెజకవర్గ స్థాయి అధికారుల వద్ద ఫారాలు అందుబాటులో ఉన్నాయి. రాయితీ పొందాలనుకునే రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేయాలి. డ్రిప్ పరికరాల కోసం మీసేవా ద్వారా.. మిగతా వాటి కోసం నేరుగా ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. – సర్దార్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి -
బాధ్యతల స్వీకరణ
ఇబ్రహీంపట్నం రూరల్: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్కలెక్టర్గా పని చేశారు. జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం రూరల్: టీఎన్జీఓల సంఘం అర్బన్ యూనిట్ నూతన కమిటీ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. పలుబాయి ఈశ్వర్ పర్యవేక్షణలో ఎన్నిక కొనసాగింది. అధ్యక్షుడిగా గోపాల్ నాయక్ (వ్యవసాయ శాఖ), కార్యదర్శిగా సాయితేజ (ట్రెజరీ), ఏంఏ ఫిరోజ్ (ఆడిట్ విభాగం), ఉపాధ్యక్షులుగా శ్రీపతికుమార్ (వ్యవసాయ శాఖ), రవి, జి.సాయికుమార్ (ట్రెజరీ), సంయుక్త కార్యదర్శిగా స్వాగ్యవతి (సీ్త్ర సంక్షేమశాఖ), ఆర్గనైజింగ్ సెక్రట్రీగా భిక్షపతి(రెవెన్యూ), ప్రచార కార్యదర్శిగా మల్లేష్ (గిరిజన సంక్షేమశాఖ), ఈసీ సభ్యులుగా బాలరాజు, శంకర్ రాథోడ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అడ్హక్ కమిటీ నాయకులు రంగయ్య పాల్గొన్నారు. -
విన్యాసం.. అద్భుతం
● 10 రాష్ట్రాలు..11 నిమిషాలు.. 1,212 మంది క్రీడాకారులు ● గిన్నిస్ వరల్డ్ రికార్డులో కరాటే ప్రదర్శన గచ్చిబౌలి: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం అరుదైన అంతర్జాతీయ ఘనతకు వేదికై ంది. కరాటే రంగంలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 1,212 మంది క్రీడా కారులు ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. జయంత్రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, విజన్ మార్షల్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలో 1,212 మంది కరాటే క్రీడాకారులు అత్యంత క్రమశిక్షణతో, ఏకదాటిగా తమ విన్యాసాలను ప్రదర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా సుమారు 10 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ ఫీట్లో భాగస్వాములయ్యారు. ఈ తక్కువ సమయంలో లక్షలాది పంచులు, బ్లాక్స్ నమోదయ్యాయి. గతంలో ఉన్న 8 నిమిషాల రికార్డులను అధిగమిస్తూ ఇంత భారీ సంఖ్యలో క్రీడాకారులు ఏకతాటిపైకి వచ్చి ఈ ఘనత సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి స్వప్నిల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. గ్రాండ్ మాస్టర్ జయంత్రెడ్డి, విఠల్, సుమన్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిలిపివేత.. హారన్ల మోత
మణికొండ: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు. అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. సీఎం వస్తున్నారని ఎక్కడి వాహనాలు అక్కడే.. ఔటర్పై వాహనదారులనిరసన.. వాగ్వాదం తరచూ నరకయాతన పడుతున్నామని ఆవేదన -
మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాహు శ్రీలత
తాండూరు టౌన్: మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాండూరు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత నియమితులయ్యారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంఘటితానికి, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల రవాణా, సైంటిఫిక్ డిస్పోజల్ ఏజెన్సీల నియామకం కోసం ఈ నెల 7న నిర్వహించిన బహిరంగ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం దక్కించుకున్న మొదటి పాటదారుడు ఎండీ హమీద్, రెండో పాటదారుడు అబ్దుల్ రహీంలు నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో రద్దు చేసినట్లు చెప్పారు. మే 5న తిరిగి వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన ఏజెన్సీలు వివరాలతో వేలంలో పాల్గొనాలని కోరారు. అనంతగిరి: ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో శనివారం ఉదయం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై సానుకూలంగా వ్యవహరించడంతో వికారాబాద్ డిపోలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి కార్మికులు, ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎం నమ్రత, డ్రైవర్లు, కండక్టర్లు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు
● దోస్త్ సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలి ● ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తాండూరు టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు ప్రవేశ పెట్టినట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్ లక్ష్మణ్ తెలిపారు. డిగ్రీలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు దోస్త్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శనివారం కళాశాలలో దోస్త్ జిల్లా స్థాయి సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలం దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్కు అనుకూలంగా కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశ పెట్టామన్నారు. బీఎస్సీ(ఫిజికల్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్ అండ్ కంప్యూటర్ సైన్స్), బీకాం(రిటైల్ ఆపరేషన్), బీఏ(మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం), బీఏ (సోషియాలజి, ఆంథ్రోపాలజి, సైకాలజి, జియోగ్రఫి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) వంటి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే కళాశాలలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన నాలుగు అధునాతన డిజిటల్ తరగతుల సౌకర్యం, అత్యాధునిక నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వర్చువల్ తరగతి ఉన్నట్లు చెప్పారు. ఈ కోర్సుల్లో చేరడానికి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్, దోస్త్ సమన్వయ కర్త మహేందర్ రెడ్డి సెల్ నంబర్ 9885583432, టెక్నికల్ కో ఆర్డినేటర్ అమర్ సెల్ నంబర్ 9849432029, కిషన్ సెల్ నంబర్ 9959531273ను సంప్రదించాలన్నారు. -
నేటి నుంచి స్వీయ జనగణన
వికారాబాద్: ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వీయ జనగణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. నేటి(ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుందని ప్రజలు సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనిపై అధికారులు.. విద్యావంతులు అందరికీ అవగాహన కల్పించాలన్నారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వీయ జనగణన గురించి వివరించారు. అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అంతకుముందు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలో ఇళ్ల మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్కు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,46,109 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత జనగణన కార్యక్రమంలో 1,773 మంది ఎన్యుమరేటర్లు, 304 మంది సూపర్ వైజర్లు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంటుందన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసంhttpr://-re.cenrurవెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1855కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు 33 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఏడు అంకెలతో కూడిన సెల్ఫ్ ఐడి వస్తుందన్నారు. సమాధానాలను మరోసారి చెక్ చేసుకొని సబ్మిట్ చాయాలన్నారు. మే 11 నుంచి.. మే 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్ల సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ జూన్ 9తో పూర్తవుతుందన్నారు. ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో కూడా స్వీయ జనగణనకు అవకాశం ఉంటుందన్నారు. మనం వివరాలు నమోదు చేస్తే ఎన్యుమరేటర్లు అప్రూవ్ చేస్తారని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా తప్పులకు ఆస్కారం ఉండదన్నారు. ఈ పోర్టల్లో 14 రీజినల్ భాషలు ఉంటాయని ఏ భాషలోనైనా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకసారి భాషను ఎంచుకున్న తర్వాత మళ్లీ మార్చడానికి వీలుండదని తెలిపారు. ఇది పూర్తిగా సీక్రెట్ పోర్టల్ అని.. వివరాలు గోప్యంగా ఉంటాయని వివరించారు. హౌస్ హోల్డ్లో కుటుంబ పెద్ద ఒకరి పేరే నమోదు చేయాలన్నారు. ఒకే ఫోన్ నంబర్ పొందుపర్చాలన్నారు. లోకేషన్, మ్యాపింగ్ జాగ్రత్తగా యాడ్ చేయాలన్నారు. అందుబాటులో ఉండే మొబైన్ నంబర్నే పొందుపరచాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచయినా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం మీ ఏరియా ఎన్యుమరేటర్కు కాల్ చేసి అప్రూవ్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి దండోరా వేయించటం, శానిటేషన్ వాహనాల ద్వారా ప్రచారం చేయిస్తామన్నారు. జనగణనలో ఇచ్చిన వివరాల ద్వారా రేషన్ కార్డు, పింఛన్లు లాంటివి తీసేయడం జరగదన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎన్యుమరేటర్లకు పూర్తి సరియైన వివరాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓ వాసుచంద్ర, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రవికుమార్, మాస్టర్ ట్రైనర్ రమాకాంతం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ పోర్టల్లో 33 ప్రశ్నలు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1855కు కాల్ చేయాలి విలేకరుల సమావేశంలో కలెక్టర్ దీపక్ తివారి -
వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం
● మురుగు నిల్వ ఉండకుండా చూడాలి ● కీటక జనిత వ్యాధుల నిర్మూలన జిల్లా అధికారి రవీంద్ర యాదవ్కొడంగల్ రూరల్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని కీటక జనిత వ్యాధుల నిర్మూలన జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంతు కుమార్తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సివిల్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బందికి మలేరియా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు అందించారు. దోమల పుట్టుక వాటి స్థావరాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు. నిల్వ ఉన్న నీటిని పారబోసి కొత్త నీటిని వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యం, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బుస్రా ఫాతిమా, డాక్టర్ రోహిణి, సబ్ యూనిట్ ఆఫీసర్ పకిరప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత, వైద్య సిబ్బంది గీత, వాత్సల్య, విక్టోరియా, నర్సింగ్ విద్యార్థులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
లక్షల ఎకరాలు
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 20265.97వికారాబాద్: వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగుకు కసరత్తు ప్రారంభించింది. క్షేత్ర స్థాయి అధికారులు, అనుబంధ శాఖల అధికారులతో సంప్రదించి ప్రణాళికలో అనుసరించాల్సిన విషయాలను చర్చించింది. గత సీజన్లో సాగు విస్తీర్ణం ఎంత..? ఏయే పంటలు ఎంత మేర సాగయ్యాయి. ఈ సీజన్లో ఏయే పంటల సాగు విస్తీర్ణం పెంచాలి.. ఏయే పంటలు తగ్గించాలి.. రైతులకు ఏయే అంశాలపై అవగాహన కల్పించాలి అనే విషయాలు చర్చించారు. డివిజన్లు, మండలాల వారీగా కావాల్సిన ఎరువులు. అందుబాటులో ఉంచాల్సిన ఎరువులు వంటి వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల కొనుగోలు, అందుబాటులో ఉన్న ఎరువులు తదితర వివరాలు రైతులకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే రైతు చైతన్య యాత్రలు ఉంటాయా..? ఉండవా అనే దానిపై అధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడంలేదు. ప్రస్తుతం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతుండగా.. ఇందులో భాగంగా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై రైతులను అప్రమత్తం చేసే కార్చాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో కొందరు వ్యాపారులు బీటీ –3 పత్తి విత్తనాలను గుట్టుగా విక్రయించేందుకు తిరుగతున్నారు. గతంలో ప్రభుత్వమే పలు రకాల విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై అందించేది. ఐదారేళ్లుగా ఈ పథకాలను అమలు చేయడం లేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా రాయితీలు ఇస్తుందా లేదా అనేది తెలియడం లేదు. రైతులు మాత్రం రాయితీపై విత్తనాలు, యంత్ర పరికరాలు ఇవ్వాలని కోరుతున్నారు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతులు 5.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది 2.61 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఈ సారి స్వల్పంగా(2. 63 లక్షల ఎకరాలు) పెరగవచ్చని భావిస్తున్నారు. కంది 1.50 లక్షల ఎకరాలు, వరి 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 50,450 ఎకరాలు, పెసలు 13వేల ఎకరాలు, మినుములు 5వేల ఎకరాలు, జొన్నలు 2,500 సాగవుతుందని అంచనా వేస్తున్నారు. వరి, మొక్కజొన్న, జీలుగు, జనుము, సోయాబీన్, కంది విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉండటంతో అవసరం మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లైసెన్స్డ్ ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎరువులు, విత్తనాలు ఎంత మేర అవసరం అనే విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అంచనాలు సిద్ధం ఎరువుల విషయానికొస్తే.. డీఏపీ 17,719 మెట్రిక్ టన్నులు, యూరియా 32,329 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 19,877 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 3,658 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1,854 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 75,437 మెట్రిక్ టన్నుల ఎరువులు, 54,2400 క్వింటాళ్ల విత్తనాలు కావాల్సి ఉంటుందని అంచనాలు సిద్ధం చేశారు. ఖరీఫ్ సాగు ప్రణాళిక ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతాం. కొరత లేకుండా చూస్తాం. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. బీటీ – 3 గ్లైసిల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటాం. రైతులు జాగ్రత్తగా ఉండాలి. – రాజరత్నం, జిల్లా వ్యవసాయాధికారి -
శాంతి వర్దిల్లినప్పుడే అభివృద్ధి
పట్టణ పురోగతికి.. కొడంగల్ పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ కోరారు.మోమిన్పేట: ప్రపంచంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సంస్థలు శాంతిని కాపాడటంలో కీలకంగా మారాయన్నారు. నేడు కొన్ని దేశాలు యుద్ధం చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి వర్దిల్లినప్పుడే దేశాల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపై పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అఖిల భారత శాంతి సంఘీభావ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, శుభప్రద్పటేల్, మర్పల్లి మార్కెటు కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, నాయకులు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
మీడియా అక్రిడిటేషన్ కమిటీతో కలెక్టర్ సమావేశం
అనంతగిరి: మీడియా అక్రిడిటేషన్ నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్ దీపక్ తివారి సమావేశమయ్యారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, జీఓ నంబర్ 252 ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మీడియా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తారని, కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ, కమిటీ సభ్యులు రవి శంకర్, రఘు, మల్లేశం, ప్రహ్లాదచారి, పాపిరెడ్డి, శ్రీనివాస్, ఏపీఆర్ఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మా భూమి మాకే ఉండాలి
● ప్రభుత్వం సేకరించరాదు ● దివ్యాంగుల విన్నపం మోమిన్పేట: దివ్యాంగులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని ఎలా అభివృద్ధి చేద్దామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ లబ్ధిదారులను కోరారు. శనివారం మండలంలోని ఏన్కతల గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామ సర్వే నంబర్ 174లోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిని 2004 నవంబరులో 120 మంది దివ్యాంగులకు కేటాయించినట్లు తెలిపారు. అట్టి భూమిలో పండ్ల తోటలు, కూరగాయలు, ఆకు కూరల తదితర పంటలు పండించుకొని జీవనోపాధి పొందాలని అనాడు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. అప్పట్లో సీఎల్డీపీ పథకం కింద రెండు బోరు బావులను తవ్వించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి భూములు పడావుగానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అట్టి పొలాల్లో పనులు చేపడుతోందని లబ్ధిదారులు అధికారి దృష్టికి తీసుకెళ్లారు. మా భూమి మాకే ఉండాలని.. ఎట్టి పరిస్థితిల్లో ప్రభుత్వం సేకరించరాదని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సృజన సాహిత్య, ఏపీఎం మధుకర్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి మెడలోనుంచి బంగారు గొలుసు చోరీ
ఇబ్రహీంపట్నం రూరల్: వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గోదాసు జంగయ్య, యశోద అనే వృద్ధ దంపతులు కొంగరకలాన్ డివిజన్లోని ఎస్బీఐ పక్కన నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భోజనం చేసి, నిద్రకు ఉపక్రమించారు. వీరు ఉంటున్న గదికి కిటికీ తలుపు, గ్రిల్స్ లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి దూరారు. నిద్రపోతున్న యశోద (70) మెడలోని బంగారు లాక్కుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. చోరీ అనంతరం పక్కనే ఉన్న పొలాల నుంచి పారిపోయినట్లు గుర్తించారు. -
టైరు పేలి కిందపడిన ట్రాక్టర్
ధారూరు: టైర్ పేలి, ట్రాలీ నుంచి విడిపోయి ట్రాక్టర్ వంతెనపై నుంచి కింద పడింది. ఈ సంఘటన మండల పరిధి రుద్రారం– నాగసమందర్ గ్రామాల మధ్య వంతెన వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధారూరు గ్రామానికి చెందిన చంద్రయ్య బంట్వారం మండలం బస్వాపూర్ నుంచి ఎర్రరాయి లోడుతో వస్తున్నాడు. రుద్రారం– నాగసమందర్ల మధ్య ప్రాజెక్టు అలుగునీరు ప్రవహించే రోడ్డు వంతెన వద్ద ట్రాక్టర్ ముందటి టైర్ పగిలిపోయింది. దీంతో ట్రాలీ నుంచి ఇంజన్ భాగం విడిపోయి అదపు తప్పి వంతెన పైనుంచి కింద పడింది. ఈ సంఘటలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ట్రాక్టర్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. గడ్డివాము,పశువులపాక దగ్ధం దౌల్తాబాద్: మండల కేంద్రంలో శనివారం ప్రమాదవశాత్తు గడ్డివాము, పశువులపాక దగ్ధం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ ముత్యప్ప తన ఇంటి దగ్గర పశువులపాక, గడ్డివాము వేసుకున్నాడు. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే కొడంగల్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు మంటలను చల్లార్చారు. అప్పటికే పాక, గడ్డివాము కాలి బూడిదయ్యాయి. జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరు సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి హక్కుల సాధనే ధ్యేయంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని నేషనల్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ) నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ అధ్యక్షతన నగరంలో జరిగిన సదస్సు శనివారం ముగిసింది. జర్నలిస్టుల భద్రత, హక్కుల సాధనపై కీలక తీర్మానాలు చేశారు. మొదటి రోజు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రెండవ రోజు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా తదితర జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై నిరసన ఇబ్రహీంపట్నం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్తో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రజావాణిలో సోమవారం వినతిపత్రాలను అందజేస్తామని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష పోస్టు కార్డులతో మంగళవారం ఫిర్యాదులు చేస్తామని, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. -
పూడూరులో మరో పారిశ్రామిక వాడ
పూడూరు: మండల పరిధిలో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుంది. గతంలో రాకంచర్లలో నెలకొల్పారు. అప్పట్లో విశాలమైన రహదారులు, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం అందులో 15 వరకు పరిశ్రమలు వెలిశాయి. త్వరలో మీర్జాపూర్లో రెండో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకు కండ్లపల్లి, మీర్జాపూర్, కొత్తపల్లిలో ఉన్న అసైన్డ్ భూమితో పాటు ప్రైవేటు జాగాను సైతం సెకరించి (టీఎస్ఐఐసీ) పారిశ్రామిక వాడకు అప్పగించేందుకు రెవిన్యూయంత్రాంగం పావులు కదుపుతోంది. వెయ్యి ఎకరాలు అవసరం ఉందని పారిశ్రామిక శాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం రెవిన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ శాఖ అధికారులకు ఆయా గ్రామాల్లో సర్వే నంబర్లలోని సర్కారు భూమితో పాటు.. ప్రైవేటు పట్టా స్థలానికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాలు పారిశ్రామిక వాడలో కలిసి పోనుంది 90శాతం అసైన్డ్ భూములే పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమి 90 శాతం ప్రభుత్వం నిరుపేద రైతులకు అసైన్డ్ చేసిందే. ఆ భూముల్లో వారు బావులు, బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదిలో రెండు పర్యాయాలు పంటలు వచ్చే భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పేద రైతుల ఆర్థిక వనరులైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. డ్రోన్ కెమెరాలతో సర్వే పరిశ్రమలకు ముఖ్యంగా రోడ్డు సౌకర్యంతో పాటు నీరు పుష్కలంగా ఉండి, నగరానికి చేరువలో ఉండటంతో పారిశ్రామిక ఏర్పటుకు ప్రభుత్వంసంకల్పించింది. ఈ ప్రాంతంలో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తయితే.. రవాణా వ్యవస్థ సులభం అవడటంతో పాటు.. 40 నిమిషాల్లో నగరానికి చెరుకోవచ్చు. అప్ప జంక్షన్ నుంచి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసే మీర్జాపూర్, కండ్లపల్లి వరకు 50 కిలో మీటర్ల లోపే. మన్నెగూడ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరనుంది. పారిశ్రామిక ఏర్పాటు నేపథ్యంలో రెండు రోజుల క్రితం మీర్జాపూర్, కండ్లపల్లి, కొత్తపల్లి, చేవెళ్ల పరిధి హస్తేపూర్ రెవిన్యూ పరిధిలో డ్రోన్ కెమెరాలతో సర్వే చేశారని రైతులు తెలిపారు. ఇదే విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కలెక్టర్తో మాట్లాడినట్లు సమాచారం. నాడు రాకంచర్లలో..నేడు మీర్జాపూర్లో ఇండసి్ట్రయల్ పార్కుఏర్పాటుకు సర్కారు శ్రీకారం వెయ్యి ఎకరాలకు టీఎస్ఐఐసీ ప్రతిపాదనలు భూ సర్వే పనుల్లో రెవెన్యూ అధికారుల బిజీ ఆ గ్రామాల భూమలను పరిశీలిస్తున్నాం భూ సేకరణకు పరిశ్రమల శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. కండ్లపల్లి, మీర్జాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో కలిపి వెయ్యి ఎకరాలకు సంబంధించి సర్వే నంబర్లతో కూడిన వివరాలు ఉన్నాయి. రైతులతో మాట్లాడి.. ఆ భూముల వివరాలు సేకరిస్తున్నాం. మూడు గ్రామాల జాగాలను పరిశీలిస్తున్నాం. సేకరణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకుపంపిస్తాం. భూములను సర్వే చేసినట్లు మా దృష్టికిరాలేదు. –విజయ్కుమార్, తహసీల్దార్, పూడూరు -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
● వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు నిబంధనలు తప్పనిసరి ● ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ యాచారం: ఫ్యూచర్సిటీ కింద గుర్తించిన ప్రాంతంలో నింబంధనల ప్రకారమే వెంచర్లు, ఇంటి నిర్మాణాలను చేపట్టాలని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ అన్నారు. శనివారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నింబంధనల అమలుపై వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్యూచర్సిటీతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ విధంగానే అనుమతులు పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్యూచర్సిటీ విలీన గ్రామాల్లో నింబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అథారిటీ పరిధిలో నింబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఓ లక్ష్మీనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫికర్
మొయినాబాద్: స్థానికంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తీవ్రమైంది. రహదారికి ఇరు పక్కల వాణిజ్య సముదాయాలు(షాపులు) ఉన్నాయి. కానీ ఆ షాపుల ముందు మాత్రం సరైన పార్కింగ్ స్థలాలు లేవు. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సైతం యజమానులు చిన్న చిన్న బండి కొట్లు పెట్టడానికి అద్దెకు ఇస్తున్నారు. దీంతో షాపులకు, బండి కొట్ల వద్దకు వచ్చినవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి వెళ్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే విధంగా హిమాయత్నగర్ చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ట్రేడ్ లైసెన్స్లపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ముందు ఉన్న స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దెలు వసూలు చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. షాపుల ముందు అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. గత పదకొండు నెలలుగా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీ రూట్ అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా శాస న సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్కు వెళ్లాలన్నా ఇదే రూట్లో వెళ్లాలి. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికా రాబాద్ వెళ్లి వస్తూ ఉంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవడం లేదు. చలాన్లు వేయడమే విధి ట్రాఫిక్ పోలీసులు మొయినాబాద్ మాత్రం ఫొటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయకుండా రోడ్డు పక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి వేలకు వేలు చలాన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ నిత్యం ట్రాఫిక్ జాం షాపులు, హోటళ్ల ముందు లేని పార్కింగ్ రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు పట్టించుకోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నాం మొయినాబాద్లో షాపుల ముందు సామాన్లు పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశాం. మరోసారి తాఖీదులు ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెడతాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య వస్తుంది. ట్రాఫిక్ జాం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సతీష్, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల -
బషీరాబాద్ ఎస్ఐపై వేటు
బషీరాబాద్: బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్ను వికారాబాద్ టౌన్ పీఎస్కు అటాచ్ చేశారు. ఆర్టీసీ సమ్మె బందోబస్తులో భాగంగా ఈనెల 23న వికారాబాద్ వెళ్లిన ఆయనను సీఐ కార్యాలయంలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఈఅంశాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. మార్చి 13న బషీరాబాద్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీశైలం వచ్చీరావడంతోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇసుక అక్రమార్కులతో అంటకాగడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా కేవలం నెలరోజుల్లోనే నాలుగు మెమోలు అందుకున్నారు. అటాచ్ విషయమై వివరణ తీసుకునేందుకు ఫోన్ చేయగా ఎస్ఐ అందుబాటులోకి రాలేదు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సీఐ సీతారాం షాద్నగర్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని సీఐ సీతారాం, మున్సిపల్ చైర్మన్ బస్వం అన్నారు. శనివారం వారు పట్టణ శివారులోని చౌడమ్మగుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆధ్మాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ లతాశ్రీ, శ్రీశైలంగౌడ్ దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన సాగు
ఆమనగల్లు: రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లురవి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను, మండల పరిధిలోని శంకరకొండతాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. శంకరకొండతాండాలో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సర్పంచ్ మండ్లి రాములు ఆధ్వర్యంలో గిరిజనుల సంప్రదాయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన సభలలో ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు గణనీయంగా పెరిగిందని రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని చెప్పారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు. నియోజక వర్గంలో దాదాపు రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్గౌడ్, పీసీబీ సభ్యులు బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, మాజి వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, హౌసింగ్ డీఏ శైలజ, ఎంపీడీఓ మాధురి, ఏఈ శాలిని, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు వెంకటయ్య, మహేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జగన్, మానయ్య, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం వారు మండల కేంద్రంతో పాటు మక్తమాదారం గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్, పలువురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ నందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా మక్తమాధారం గ్రామంలో పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి,, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ నాయకులు బాలరాజు, చందోజీ, రాఘవేందర్, రవి, షాబుద్దీన్, రాజేశ్, శ్రీకాంత్, అశోక్, కృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి -
కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి
అబ్దుల్లాపూర్మెట్: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.శ్రీనివాస్ కోరారు. శనివారం ఆయన సంఘం నాయకులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఓపీఎస్లను జేపీఎస్లుగా మార్చాలని, జేపీఎస్లను నాలుగు సంవత్సరాల సర్వీస్ను నోషనల్ సీనియారిటీ కలిపించడంతో పాటు ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కార్యదర్శుల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించిన కార్యదర్శుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సతీశ్కుమార్, మహిళా ఉపాధ్యక్షులు వాణి, కవిత, కోశాధికారి పండరినాథ్, నాయకులు హరి నాయక్, మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సురేశ్, ప్రవీణ్, రాజేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్కు సంఘం నాయకుల వినతి -
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
అనంతగిరి: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను సత్వరం పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. భూస్వామ్య మార్పులు, పాస్బుక్ అప్డేషన్, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించాలన్నారు. పెండింగ్ దరఖాస్తును సమీక్షించి, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు. సాదా బైనామా, మ్యుటేషన్, భూ సమస్యలను పరిష్కరించి మాడ్యుల్ వారీగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో జనగణనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీఎల్ఓలు, ఏఆర్ఓలు ఇండ్ల గణన ప్రక్రియ, మ్యాప్ తయారీ ప్రక్రియను పోలింగ్ స్టేషన్ వారీగా సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గణన చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అనుమతి ఉన్న రీచ్ల నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పత్రాలు చూసి ఇసుక రవాణాకు పర్మిషన్ ఇవ్వాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓలు అనిత, వాసుచంద్ర, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. డబుల్ ఇళ్లను అందుబాటులోకి తెస్తాం తాండూరు రూరల్: పట్టణ శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను నెల రోజుల్లో పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ దీపక్ తీవారి అన్నారు. శుక్రవారం ఖాంజాపూర్ని ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరుకు 1,001 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాగా 585 ఇళ్లను పూర్తి చేశామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు చెప్పారు. తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో పనులు పూర్తి కావాలని సూచించారు. అనంతరం చిలుకవాగు పనులను, కాగ్నా నది వద్ద తాగునీటి పంప్హౌస్ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ డీఈ ఖలీమొద్దీన్, పీఆర్ డీఈ నాగభూషణం, ఏఈ నందిని, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలి కలెక్టర్ దీపక్ తివారి -
సద్వినియోగం చేసుకోవాలి
అనంతగిరి: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జెడ్పీ సీఈఓ సుధీర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్లోని ఐటీఐ ఏటీసీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ.. ఏటీసీలో కొత్త కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు జైపాల్రెడ్డి, మాధవరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మహేశ్వర్, జిల్లా ఉపాఽధి కల్పన అధికారి సుభాన్ పాల్గొన్నారు. బొంరాస్పేట: సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, కవి శ్రీ రాకమచర్ల వెంకటరామదాసు జీవితం, సాహిత్యంపై ఈ నెల 26న రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరగనున్నట్లు అనంత వేదిక వ్యవస్థాపకులు దొరవేటి చెన్నయ్య, జిల్లా కవులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు డా. తూర్పు మల్లారెడ్డి, తుల్జా రాంసింగ్ ఠాకూర్, ఆశీర్వాదం, వడిచర్ల సత్యం, గంటా మనోహర్రెడ్డి, చిగురాల్పల్లి ప్రసాద్, కమలేశ్ హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని కవులను, రచయితలను వెలికితీయడం, జిల్లా తెలుగు సాహిత్య చరిత్రను చాటిచెప్పడం కోసం అనంత వేదిక కృషి చేస్తోందన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చేవెళ్ల: మహనీయుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని తన నివాసంలో ఈ నెల 30న మున్సిపల్ కేంద్రంలో నిర్వహించనున్న మహనీయుల జాతర వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహనీయుల జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. సామాజిక న్యాయం, సమానత్వం, అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో మహనీయుల జాతర కమిటీ చైర్మన్ బురాన్ ప్రభాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ పాల్గొన్నారు. ఘన నివాళి బంట్వారం: మండలంలోని సల్బత్తాపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాండు రంగారెడ్డి(90) మృతి చెందాడు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. స్పీకర్ వెంట మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కుల్కచర్ల: భార్య ప్రసూ తి కోసం నగదు అవసరమై బయటకు వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారిన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బిందెంగడ్డ పంచాయతీ అనుబంధ గ్రామం చింతల్కుంటతండాకు చెందిన శ్రీనునాయక్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య ప్రసవం కోసం అవసరమైన డబ్బు సమకూర్చుకునేందుకు బైక్పై తెలిసిన వారి వద్దకు బయల్దేరాడు. ఈక్రమంలో మహ్మదాబాద్ మండలం మొకర్లాబాద్ శివారులో బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. రౌడీషీటర్కు రిమాండ్ ఆమనగల్లు: ఓ వ్యక్తిని బెదిరించి బైక్ను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్ను పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన రౌడీషీటర్ నేనావత్ పవన్కల్యాణ్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని బెదిరించి అతని బైక్ను ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి వద్ద పోలీసులను చూసిన నేనావత్ పవన్కల్యాణ్ బైక్తో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడిపై ఆమనగల్లు, మాడ్గుల, అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లలో పదికి పైగా కేసు ఉన్నాయని తెలిపారు. చెట్టును ఢీకొట్టిన స్కూటీ యువకుడి దుర్మరణం షాద్నగర్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎలికట్ట శివారులో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రాంచందర్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్కాలనీకి చెందిన సవాళ్ల స్వామి(23) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఫోన్ రావడంతో మళ్లీ వస్తాననిచెప్పి స్కూటీపై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో ఎలికట్ట శివారులోని భారత్ పెట్రోల్పంపు సమీపంలో స్కూటీ అదుపు తప్పడి చెట్టును ఢీకొట్టింది. దీంతో స్వామి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ఐ రాంచందర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష బాలానగర్: చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్ని ంచిన కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కూకట్పల్లిలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు. 2017లో బాలానగర్ పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన నిందితుడు కొర్ర శివశంకర్ అలియాస్ రాజు (41) యూసుఫ్గూడ చెక్పోస్ట్ సమీపంలోని ఎల్.ఎన్.నగర్లో నివసించేవాడు. నిందితుడు ఒక చిన్నారిపై లైంగిక దాడికి యత్నించడంతో పాటు, ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు పోక్సో చట్టం, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 10వేల జరిమానా విధించారు. కారు బోల్తా బంజారాహిల్స్: అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ బెంజ్ కారు ఫుట్పాత్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–79 పద్మాలయా స్టూడియో వైపు నుంచి ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన బెంజ్ కారు వేగంగా దూసుకొస్తూ మలుపు వద్ద అదుపుతప్పింది. స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఫుట్పాత్ను ఢీకొట్టగా బొల్తా పడింది. అందులో నుంచి ఓ యువకుడు దిగి పరారయ్యాడు. టెంపరరీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ కారు ఎవరిదనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును పక్కకు జరిపారు. కారులో ఒక్కరే ఉన్నారా.. ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
కొడంగల్ రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 18న మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు సమీపంలో అనారోగ్య కారణంగా ఓ మహిళ కింద పడిందనే సమాచారాన్ని పోలీసులు అందుకొని 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మహిళను ఎవరైనా గుర్తిస్తే కొడంగల్ పోలీస్స్టేషన్లో వివరాలు తెలియజేయాలని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఫోన్ నెంబర్ 87126 70046లో సంప్రదించాలని తెలిపారు. -
ప్రభుత్వ లాంఛనాలతో లక్ష్మీనృసింహుడి కల్యాణం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలో స్వయంభువుగా వెలిసిన శ్రీలక్ష్మీనృసింహస్వామి కళ్యాణోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఆకుల ఆనంద్కుమార్, కౌన్సిలర్లతో కలిసి ఆలయ భక్త బృందం శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న నిర్వహించే స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ప్రవీణ్కుమార్, తాళ్లపల్లి కృష్ణ, తమ్మల కృష్ణ, సొప్పరి లక్ష్మణ్, సూరమోని బాబు, శ్రీనివాసచారి, అశోక్రెడ్డి, అర్కే కృష్ణ, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
బ్రిడ్జి గుంతలో పడిన మహిళ
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు ఓ మహిళ బ్రిడ్జి గుంతలో పడింది. ఈ ఘటన తాండూరు పట్టణం పాత తాండూరు రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాణిక్ నగర్కు చెందిన ఆసియా బేగం కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి తాండూరులో మార్కెట్కు బయలుదేరింది. ఈ క్రమంలో బ్రిడ్జి పిల్లర్ల కోసం తవ్విన గుంతలో పడింది. స్థానికులు నిచ్చెన సాయంతో ఆసియాబేగంను బయటకు తీశారు. ఆమెను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నెముక వద్ద బలమైన గాయం కావడంతో హైదరాబాద్కు తరలించి వైద్యం చేయిస్తున్నట్లు తెలిసింది. గుంత వద్ద కాంట్రాక్టర్ సూచిక బోర్డు పెట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ కార్మికుల మౌన పోరాటం
పరిగి: ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం కార్మికులు డిపో ఎదుట ముఖానికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన తెలిపారు. ఆర్టీసీ అధికారులు పోలీసుల బందోబస్తుతో కొన్ని బస్సులు నడిపారు. ముందుగా ఆత్మబలిదానం చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆయన ఆశయాలు నెరవేరేవరకు వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఒకలా.. వచ్చాక ఒకలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బంది పెడితే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో గద్దె నెక్కిన కాంగ్రెస్ మళ్లీ కార్మికుల కారణంగా అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. చర్చల పేరుతో కాలయాపన అనంతగిరి: చర్చల పేరుతో కాలయాపన చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఉదయం వికారాబాద్ డిపో వద్ద ఆత్మహత్య చేసుకున్న శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నోటికి క్లాత్ కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు ప్రైవేటు డ్రైవర్లతో కొన్ని బస్సులను నడిపారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. భోజనం కూడా పెట్టనివ్వరా..! తాండూరు రూరల్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరులో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు మండిపడ్డారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులకు సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు భోజనం పెటేందుకు వస్తే పోలీసులు వారిని హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తాండూరు పట్టణంలోని కార్మికుల చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు సోమశేఖర్, శ్రీనివాస్, అంజలయ్య, అబ్దుల్ వహాబ్, చంద్రయ్య, శ్రీనివాస్, సాదిక్, నవీన్గౌడ్, బాష, సుదర్శన్, మోదీన్, పీఎస్ రెడ్డి పాల్గొన్నారు. మూడో రోజుకు చేరిన సమ్మె -
భద్రత కల్పిస్తాం
పరిగి: ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే చర్యల తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. శుక్రవారం పరిగి ఆర్టీసీ డిపో, బస్టాండ్ను పరిశీలించారు. కార్మికుల సమ్మె గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సుల రాకపోకలు, ప్రయాణికుల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. విధులకు హాజరయ్యే ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బంది భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్ శాఖ భద్రత కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజా స్వామ్యబద్దంగా నిరసన తెలుపుకోవచ్చని.. ప్రజల జీవనానికి, ప్రయాణికులకు ఇబ్బందిగా మారకూడదన్నారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ప్రశాంత వాతావరణం ఉందని తెలిపారు. స్వచ్ఛంగా విధులకు వచ్చే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యథావిధిగా ప్రయాణాలు సాగించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే చర్యలు ఎస్పీ స్నేహ మెహ్ర -
హామీలు అమలు చేయాలి
బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అనంతగిరి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ హయాంలో కూడా అన్యాయం జరిగిందన్నారు. శంకర్గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్కుమార్, జిల్లా నాయకులు మోహన్రెడ్డి, శివరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
తాగుతూ.. ఊగుతూ..!
గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్షాపులు వికారాబాద్: పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో కిరాణా దుకాణం లేని గల్లీ ఉంటుందేమో కానీ బెల్టు షాపు లేని వీధంటూ కనిపించడంలేదు. పాల ప్యాకెట్ దొరకని ఊర్లో కూడా మద్యం కావాల్సినంత దొరుకుతోంది. ఎకై ్సజ్ శాఖ కార్యాలయాల బోర్టుల్లో మాత్రం మద్య నిషేధ నియంత్రణ శాఖ అని రాసి ఉంటుంది.. కానీ వాస్తవంలో అమలు కావడం లేదు. ఉన్నతాధికారులు టార్గెట్లు విధిస్తుండటంతో కిందిస్థాయి అధికారులు మద్యం దుకాణారులను ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉండగా వైన్ షాపు యజమానులు నెలనెలా మామూళ్లు ఇస్తుండటంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు బెల్టు షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ పోలీసులకు సైతం వాటాలు అందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మందుబాబుల కారణంగా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిసింది. అయినా అధికారులు బెల్టు షాపుల జోలికి వెళ్లడంలేదు. జిల్లాలో 586 గ్రామ పంచాయతీలు ఉండగా 900 పైచిలుకు ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో ఆవాస ప్రాంతంలో రెండు నుంచి 12 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు తెలిసింది. విచ్చలవిడిగా.. గ్రామాల్లో మద్యం విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎకై ్సజ్ అధికారులే బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. సారాను కట్టిడి చేయడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మెజార్టీ కిరాణా దుకాణాల్లో మద్యం లభిస్తోంది. ఒక్కో ఎకై ్సజ్ ఠాణా పరిధిలో 400 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అంచనా. జిల్లాలో 59 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 వేలకు పైగా బెల్టు షాపులు కొనసాగుతున్నట్లు తెలిసింది. డాబాల్లో విక్రయాలు అదనం. మద్యం దుకాణాల్లో గిరాకి 30 శాతం ఉంటే బెల్టు షాపుల్లో 70 శాతం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే గ్రామాల్లో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో ఉన్నయో ఇట్టే తెలిసిపోతుంది. గతంలో మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష అమ్మకాలు జరిగేవి.. బెల్టు షాపుల కారణంగా నేడు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు దాటి సేల్స్ ఉంటున్నాయి. ● వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెర్గేట్పల్లి గ్రామంలో 800 పైచిలుకు జనాభా ఉంది. గతంలో ఏడు బెల్టు షాపులు ఉండేవి. మద్యం మత్తులో భార్యభర్తలు గొడవలకు దిగటం.. అదే మత్తులో పురుగు మందు సేవించి తునువు చాలించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల క్రితం స్థానికులు, గ్రామ పెద్దలు సమావేశమై మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేశారు. ఎవరైనా విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆరు నెలలుగా మద్యం అమ్మకాలు బందయ్యాయి. గెర్గేట్పల్లి తరహాలోనే మరి కొన్ని గ్రామాలు ముందుకు సాగుతున్నాయి. ● పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో రెండు వేల పైచిలుకు జనాభా ఉంది. ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు, దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులే ఉంటారు. ఈ గ్రామంలో 12 బెల్టు షాపులు ఉండగా గ్రామస్తులు సంపాదించిన దాంట్లో ఎక్కువ డబ్బు మద్యానికే తగలేస్తున్నారు. రోజుకు సగటున ఈ గ్రామంలో రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు గ్రామస్తులు మద్యం కోసం ఖర్చు చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. మెజార్టీ కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు ఒక్కో బాటిల్కు అదనంగా వసూలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఎకై ్సజ్ అధికారులు తండాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో గుడుంబాను కట్టడి చేసిన ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపుల నియంత్రణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి బాటిల్పై రూ.10 నుంచి రూ.50 వరకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒకవేళ అధికారుల దాడుల్లో బెల్టు షాపు నిర్వాహకులు పట్టుబడితే సదరు వైన్ షాప్ యజమాని వారికి రక్షణగా నిలుస్తున్నారు. కేసులు కాకుండా చూస్తుకుంటున్నారు. దీంతో బెల్టు షాపుల నిర్వాహకులు ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. -
పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి శంకర్పల్లి: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా శంకర్పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన తొండ రవిని నియమించినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేలా పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బీసీ ఉద్యోగుల సంఘండైరీ ఆవిష్కరణ షాద్నగర్రూరల్: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజమౌళి మహేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీసీ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మనళిని హాజరయ్యారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం సంఘంపని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్గౌడ్, గోపాల్, అనిత, మహేశ్ పాల్గొన్నారు. గిన్నిస్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక మీర్పేట: నగరంలో ఈనెల 26న నిర్వహించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు జిల్లెలగూడ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ద టెంపుల్ ఆఫ్ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ దాసరి జితేందర్కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ జైపాల్రెడ్డి, డైరెక్టర్ సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసూన అభినందించారు. చౌలపల్లి ఘటనలో కేసు నమోదు షాద్నగర్రూరల్: చౌలపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం పంచాయతీ కార్యదర్శితో ఘర్షణకు దిగిన వారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రణయ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చౌలపల్లికి చెందిన సయ్యద్ అక్రమ్ ఇందిరమ్మ ఇల్లు విషయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్తో వాగ్వివాదానికి దిగుతుండగా పక్కనే ఉన్న వార్డు సభ్యుడు ఇక్రంఅలీ సయ్యద్ అక్రమ్ను బయటకు గెంటేశాడు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సయ్యద్ అక్రమ్ తన కుమారులు సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఇర్ఫాన్తో కలిసి వార్డు సభ్యుడు ఇక్రంఅలీతో పాటు తనపై దాడికి ప్పాడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టి దాడికి పాల్పడిన తండ్రీకొడుకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తొందరపాటు నిర్ణయాలొద్దు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. సమ్మె కారణంగా పలు చోట్ల కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నం డిపోలో కార్మికులు, నాయకులకు పలు సూచనలు చేశారు. శాంతియుతంగా సమ్మెలో పాల్గొనాలని, ఎట్టి పరిస్థితిలోనూ క్షణికావేశానికి లోను కావొద్దని సూచించారు. ఆవేశానికి లోనయ్యే కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా చూడాలని జేఏసీ నేతలకు సూచించారు. అతనితోపాటు ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్, మధు, డీవీఎం శంకర్నాయక్, డీఎం సుజాత, ఎస్ఐ చందర్సింగ్ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు డీసీపీ సూచన -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొండాపురం బాబయ్య ఓ భూ వివాదంలో తన కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన డబ్బులు అందడం లేదని, వెంటనే ఇప్పించాలని గ్రామంలోని సెల్టవర్ ఎక్కాడు. తనవారి నుంచి డబ్బులు ఇప్పిస్తేనే కిందికి దిగుతానని, లేదంటే దూకుతానని హెచ్చరికలు చేశాడు. సమాచారం అందుకున్న యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అతనితో మాట్లాడారు. సీఐ హామీతో బాబయ్య సెల్టవర్ దిగివచ్చాడు. అతన్ని పీఎస్కు తీసుకెళ్లిన సీఐ బాబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి డబ్బులు ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని బాబయ్యను మందలించి, ఇంటికి పంపించారు. సీఐ చొరవతో సద్దుమణిగిన వివాదం -
భరోసగమే!
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడి చిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో? జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. నత్తనడకన సాగు సాయం రెండు విడతల్లో.. అందింది రెండెకరాలకే ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు -
అధునాతన బస్ షెల్టర్కు శ్రీకారం
● నక్కలపల్లిలో రీసైకిల్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ ● భూమిపూజ చేసిన లయన్స్ క్లబ్ నేతలు మొయినాబాద్ రూరల్: ప్రజలకు ఉపయోగపడేలా పర్యావరణ హితమైన రీసైకిల్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షురాలు రామసుందరి, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ అన్నారు. నక్కలపల్లి పంచాయతీ అభ్యర్థన మేరకు కేజీరెడ్డి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్తో ఇందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బస్ స్టాప్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల సేకరణ డ్రైవ్లో భాగంగా సేకరించిన ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి బస్ షెల్టర్ నిర్మాణానికి వినియోగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇది 500 సంవత్సరాల వరకు మన్నేలా, 240 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం చర్లపల్లి జైలులో మాత్రమే ఇలాంటి బస్ షెల్టర్ ఉందన్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, కె.నాగేశ్వరి, కె.కరుణ, సాయిసత్య నారాయణరెడ్డి, విజ్ఞాన్ కళాశాల చైర్మన్ సతీష్, డాక్టర్ పి.సంయుక్త, బి.లింగం, గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య, ఉప సర్పంచ్ గౌండ్ల నిరంజన్గౌడ్, వార్డు సభ్యులు మల్లేశ్, జీవన్, రవీందర్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌరీ రవి, శ్రీకాంత్, భానుకుమార్, నవీన్, రమేష్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎండలకు జాగ్రత్తలు తప్పనిసరి
● మూడు రోజుల్లో పెండింగ్ బకాయిలు ● డీఆర్డీఓ శ్రీలత యాచారం: కూలీలు ఎండలకు జాగ్రత్త.. పనులు చేసే చోట నీడ, పనులకు వెళ్లేటప్పుడు సరిపడా తాగునీరు తీసుకెళ్లాలని డీఆర్డీఓ శ్రీలత ఉపాధి కూలీలకు సూచించారు. శుక్రవారం ఆమె గ్రామంలో కూలీలు పనిచేసే ప్రదేశాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండలకు పనులు చేయడం కష్టంగా ఉందని, పనులు చేసినా సకాలంలో బకాయిలు రాక పస్తులుంటున్నామని చెప్పారు. ఇందుకు స్పందించిన డీఆర్డీఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ బకాయిలు రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఎండల తీవ్రత పెరగుతున్నందున కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, వడదెబ్బ తగిలితే వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కూలీ వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని, ఉదయం, సాయంత్రం పనులు చేయిస్తే కూలీలకు ఇబ్బంది ఉండదని వివరించారు. కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ఈజీఎస్ నర్సరీని సందర్శించి మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, యాచారం సర్పంచ్ మస్కు అనితశరణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
రైతు భరోసా సగమే… మిగిలిన డబ్బులు ఎప్పుడో?
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడిచిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో? జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. -
చదువుతోనే బంగారు భవిష్యత్
పంచాయతీ రాజ్ ఏఈ నందిని తాండూరు రూరల్: చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని పంచాయతీ రాజ్ ఏఈ నందిని అన్నారు. గురువారం మండలంలోని జినుగుర్తి మోడల్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం అందజేస్తారని పేర్కొన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన చేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తల్లి ఆరోగ్యం బిడ్డకు రక్ష డీడబ్ల్యూఓ కృష్ణవేణి బంట్వారం: గర్భిణి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డకు రక్ష అని డీడబ్ల్యూఓ కృష్ణవేణి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ మర్పల్లి ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ పక్వాడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు, మాంసకృతులు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత కేంద్రం బృందం సభ్యులు వరలక్ష్మి, బాబు, రామదాసు, ఇంచార్జి సీడీపీఓ రిజ్వానా బేగం, ఎంఈఓ విక్రమ్రెడ్డి, సీహెచ్ఓ విజయ్కుమార్, సూపర్వైజర్లు వైస్ణవి, బ్లెస్సీ అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్టులో చైత్రారెడ్డికి స్థానం తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ –17 బాలికల విభాగం రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు చైత్రారెడ్డి ఎంపికయ్యారు. పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామానికిచెందిన రాంరెడ్డి, స్వాతి దంపతుల కుమార్తె చైత్రారెడ్డి. పట్టణంలోని మల్రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్లో చైత్రారెడ్డి రాష్ట్ర జట్టుకు ఆల్రౌండర్గా ఎంపికయ్యారు. ఈనెల 29న హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. చైత్రారెడ్డిని స్పాన్సర్ లొంక నర్సింలు, లెజెండ్ క్రికెట్ అకాడమీ కోచ్లు సాహిల్, సోహైల్ తదితరులుఅభినందించారు. రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల గిర్మాపూర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఘన నివాళి అనంతగిరి: భగీరథుడు మహా జ్ఞాని అని పరోపకారానికి ఆయన పెట్టింది పేరని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజశ్రీ భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగీరథుడు ఎంత కష్టమైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వ్యక్తిత్వం కల మహావ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీపీఓ జయసుధ, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంవి కక్ష సాధింపు చర్యలు
కొడంగల్: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం లాంటిదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. తప్పుడు నివేదిక ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని పెద్ద సమస్యగా సృష్టించి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీ వారు ఉచితంగా మరమ్మతులు చేస్తామని ముందుకు వస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎకరానికి రూ.15వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు వితంతులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదన్నారు. పగ్గాలు చేపట్టి రెండున్నర ఏండ్లు గడిచినా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ జాడలేదన్నారు. తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా వందశాతం రైతు బంధు రాలేదన్నారు. కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, నాయకులు మధు యాదవ్, భీములు, నారాయణరెడ్డి, దయాకర్రెడ్డి, నరేష్గౌడ్, విష్ణువర్థన్, మహిపాల్, వెంకట్రెడ్డి, రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లంచనమే!
ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పలువురుఅధికారులు తరచూ అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నా.. యంత్రాంగంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తోటి ఉద్యోగులు అభాసు పాలవుతున్నా.. పక్కనున్న వారు జంకడం లేదు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ఆఫీసర్లు.. వారి పనులు చేసేందుకు మాత్రం లంచం..లాంఛనమే అనేలా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన వారికి కఠినమైన శిక్షలు అమలుకాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. వికారాబాద్: గడిచిన ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా నమోదైన అవినీతి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిలో పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో కేవలం పురుష అధికారులే పట్టుబడేవారు. ఇటీవల మహిళా ఉద్యోగులు సైతం లంచం డిమాండ్ చేస్తూ దొరికిపోతున్నారు. ఏడాది కాలంలో ఆరుగురు అధికారులు ఏసీబీకి చిక్కగా, వీరిలో ముగ్గురు మహిళలే ఉండటం విస్మయం కలిగిస్తోంది. తాజా గా గత మంగళవారం ఇద్దరు మహిళా పోలీసు ఆఫీసర్లు ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఆధారాలతో అదుపులోకి.. తాజాగా వికారాబాద్ మహిళా పీఎస్ సీఐ, ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడిన ఘటన గతంలో జరిగిన వాటికి పూర్తి భిన్నంగా ఉంది. సాధారణంగా ఏ కేసులో అయినా ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కానీ ఈ కేసులో లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ వద్ద ఆధారాలున్నప్పటికీ నగదుతో పట్టుబడలేదు. దీంతో అధికారులు సగమే చిక్కారనే చర్చ సాగుతోంది. లంచం ఇచ్చిన వ్యక్తి తీసిన వీడియోలు, మాట్లాడిన ఫోన్ సంభాషణలను ఏసీబీకి అందించాడు. వీటి ఆధారంగా ఈనెల 21న సీఐ, ఎస్ని అదుపులోకి తీసుకుని 22న ఉదయం వరకూ విచారించారు. అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 25న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇలా ఏసీబీ అధికారులు పట్టుకుని తిరిగి వదిలేసి వెళ్లటం జిల్లాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది. ఆరోపణలు కోకొల్లలు వికారాబాద్తో పాటు పరిగి, కొడంగల్, తాండూరు సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న కొందరు ఎస్హెచ్ఓలతో పాటు పర్యవేక్షణాధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిగి సబ్ డివిజన్ పరిధిలో ఓ బోరు బండిని పట్టుకుని వదిలేసిన కేసులో, రేసింగుకు వినియోగించే పావురాలను పట్టుకున్న కేసులోనూ పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్టు ప్రచారం జరుగుతోంది. మిషన్ భగీరథ పైపుల దొంగతనం కేసులోనూ పరిగి పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చన్గొముల్ ఎస్హెచ్ఓపై అనేక విమర్శలు వచ్చాయి. రోజువారీ కేసుల నమోదులో వచ్చే మామూళ్లతో పాటు కొందరు ఎస్హెచ్ఓలు నెలవారీ బేరా లు మాట్లాడుకుని దందా నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా రేషన్ బియ్యం, కిరోసిన్, ఇసుక, మట్టి, కలప అక్రమ రవాణా, మద్యం, బెల్టు దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో కేసులు ఇలా.. -
ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది
పరిగి: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల్లో కేసీఆర్ విలువలను తగ్గించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి అన్నారు. నేడు రాష్ట్రంలో 37లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయంటే అది కేవలం కాళేశ్వరంతోనే సాధ్యమైందన్నారు. ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్రావులపై బురదచల్లి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కోసం గంపెడు మట్టి తీశారా అని ప్రశ్నించారు. దాదాపు 90శాతం పూర్తయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారని, జిల్లాను విస్మరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్రావు, పార్టీ సీనియర్ నాయకులు శిశనోళ్ల భాస్కర్, సురేందర్, హన్మంత్రెడ్డి, రాజు, గుర్మిట్కల్ మల్లేష్, ఎదిరే కృష్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ కదలని బస్సులు
తాండూరు టౌన్: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో రెండో రోజుకు చేరింది. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే టు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాండూరు బస్టాండ్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో ఎదుట కార్మికులు వేసిన టెంటును పోలీసులు తొలగించారు. సమ్మె చేయరాదని హెచ్చరించారు. టెంట్లు, కుర్చీలు ఇతర సామగ్రి ఇచ్చే వ్యాపారులపై చర్యలు ఉంటాయన్నారు. టెంట్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపారు. దీంతో కార్మికులు చెట్టు నీడన కూర్చుని సమ్మెను కొనసాగించారు. పోలీసుల తీరుపై టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సోమశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమ్మె శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అబద్దాలు చెప్పడం సిగ్గు చేటన్నారు. కార్మికులు వేసుకున్న టెంటును పీకేసి, యజమానిపై కేసు నమోదు చేయడం హక్కుల ఉల్లంఘనే అన్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్తామని, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్ గౌడ్, సిద్రాల శ్రీనివాస్, ఇర్షాద్, జావేద్, సురేష్, రుద్రు, వెంకట్ రెడ్డి, దత్తు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రూట్లలో సర్వీసులు సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, చించోళి, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు కొన్ని సర్వీసులు నడిపారు. కండక్టర్ లేకుండానే బస్సులు తిరిగాయి. పురుషులకు సైతం పూర్తి ఉచితంగా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. అయితే అన్ని మార్గాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె -
ఉత్తమ పౌరులుగా ఎదగాలి
పరిగి: విద్యార్థుల కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రద్ధగా చది వితే మెరుగైన ఫలితాలు వస్తాయని, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమ లు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్న త స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి, మున్సిపల్ చైర్మన్ రజిత, డీఎస్డబ్ల్యూ జైపాల్రెడ్డి, కౌన్సిలర్ హబీబ్ ఉన్నిసా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించాలి అనంతగిరి: జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన మొదటి విడతలో ఇళ్ల గణన ఉంటుందన్నారు. కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుల గణనలో ఓబీసీ కాలం ఉండాలి
భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్ పరిగి: కుల గణనలో ఓబీసీ కాలాన్ని పొందు పరచాలని భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్నాయక్ అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా గురువారం పరిగి బస్టాండ్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1931లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుల గణనలో ఓబీసీలను లెక్కించారని పేర్కొన్నారు. నాటి నుంచి ఏ ప్రభుత్వాలు కుల గణన చేయలేదని తెలిపారు. దేశంలోని ప్రతి జంతువుకూ లెక్కలు ఉన్నా బీసీలకు ఎందుకు లెక్కలు లేవని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటున్నాయని విమర్శించారు. కేంద్రం బీసీ విద్యార్థుల కోసం తెచ్చిన యూజీసీ ఈక్విటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, నాగేష్ హబీబ్, సత్తయ్య, పీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కందుకూరు: రోడ్డు ప్ర మాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈసంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రాచులూరుకు చెందిన గుంటి ప్రశాంత్(25) వృత్తిరీత్యా మత్స్యకారుడు. బుధవారం ఉదయం చేపల వేటకు బైక్పై ధన్నారం వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో బైరాగిగూడ గేట్ సమీపంలో ట్రాలీతో పాటు కాంక్రీట్ మిషన్, దానికి అనుసంధానంగా ఉన్న ఆయిల్ ఇంజన్తో ఉన్న ట్రాక్టర్ రాచులూరు గేట్ వైపు మరలుతోంది. దీనికి ఎలాంటి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వెనక ఉన్న ఆయిల్ ఇంజన్ను అంచనా వేయలేక బైక్తో ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దారి దోపిడీ ముఠా అరెస్టు బంజారాహిల్స్: ఆవారాగా తిరుగుతూ జల్సాలు, గంజాయి కోసం దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లో మెట్రోస్టేషన్ వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ శుభాంకర్ కుమార్ను రహమత్నగర్, బోరబండ ప్రాంతాలకు చెందిన బర్ల పవన్కళ్యాణ్ అలియాస్ డీజే పవన్, సాయిరాజ్ కుమార్ అలియాస్ చిట్టి, రేసు ప్రణీత్రెడ్డి, జశ్వంత్, అఖిల్, చందు, గోవు ఈశ్వర్ అటకాయించారు. దాడి చేసి బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి పవన్కళ్యాణ్, రేసు ప్రవీణ్రెడ్డి, గోవు ఈశ్వర్గౌడ్లను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
పాఠశాలల బలోపేతమే లక్ష్యం
యాలాల: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నటు్ల్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని అగ్గనూరు, యాలాల, ముద్దాయిపేట గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అగ్గనూరులో రూ.42 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, యాలాల మండల కేంద్రంలో రూ.7 లక్షలతో చేపట్టిన ప్రహరీ, రూ.20 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు గాను కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అగ్గనూరు పాఠశాలలో మరో 4 అదనపు గదులను మంజూరు చేయాలని స్థానిక పాఠశాల సిబ్బంది కోరగా, ఇందుకు ఎమ్మెల్యే అనుకూలంగా స్పందించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మెరుగైన ఆరోగ్యం కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘బ్రేక్ ఫాస్ట్’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ బడులకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించాలన్నారు. అంతకుముందు అగ్గనూరు, యాలాలలో పూర్తి చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేసి లబ్ధిదారులతో ముచ్చటించారు. అగ్గనూరు పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పంచాయతీ భవనం ప్రారంభం ముద్దాయిపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పాత పంచాయతీ భవనంతో ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు, అధికారులకు కొత్త భవనంతో సమస్యలు తీరాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ మంజుల భీమప్ప, శివయ్య, పంతుల రుద్రమణి, సొసైటీ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాల్రెడ్డి, మత్స్య సంఘం జిల్లా చైర్మన్ శ్రీధర్, సీనియర్ నాయకులు పేరి రాజేందర్రెడ్డి, భీమప్ప, హన్మంతు, అక్బర్బాబా, మహిపాల్, మాజీ సర్పంచ్లు విఠలయ్య, దేవగారి రాములు, మధుసూదన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ఎంఈఓ మహిపాల్రెడ్డి, ఎంపీడీఓ క్రిష్ణారావు, అగ్గనూరు ఉప సర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘బ్రేక్ ఫాస్ట్’ ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తున్నాం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
టాటా.. బైబై
దుద్యాల్: విద్యా సంవత్సరం ముగిసింది. నేటి నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిడంతో విద్యార్థులు వారివారి సొంతూర్లకు వెళ్లారు. ఈ విద్య సంవత్సరానికి సంబంధించి చిన్నారులు రాసిన పరీక్షల మూల్యాంకనం అనంతరం.. అందిన ప్రగతి నివేదిక ఆధారంగా.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులను వారి తల్లిదండ్రులకు అందజేసి, ప్రగతిని వివరించారు. కాగా.. మండల పరిధి చెట్టుపల్లితండా కస్తూర్బాగాంధీ బాలిక పాఠశాలలో బాలికలు తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులకు, తోటివారికి టాటా చెబుతూ.. మళ్లీ కలుద్దామంటూ ఇంటి బాట పట్టారు. ధారూరులో.. ధారూరు: మండల పరిధి పాఠశాలల్లో పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించి, ఉపాధ్యాయులు వారికి గురువారం ప్రొగ్రెస్ రిపోర్టులను అందజేశారు. గురుదొట్ల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సెలవుల నేపథ్యంలో చిన్నారులు తోటివారికి బైబై చెబుతూ.. సొంతూళ్ల బాట పట్టారు. -
ప్రభుత్వ చర్యలు సరికావు
● ఆర్టీసీ కార్మికులు ● కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు ● మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు పరిగి: హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న తమపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదని ఆర్టీసీ కార్మికులు అన్నారు. పరిగి డిపో వద్ద కార్మికుల నిరసన గురువారం రెండో రోజుకు చేరుకుంది. డిపో, బస్టాండ్ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రైవేటు డ్రైవర్లతో పలు రూట్లలో బస్సులను నడిపారు. కార్మికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులతో మాపై దాడులు చేయించడం సరికాదన్నారు. మా ఓట్లతో గద్దె ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడం పెద్దపనేమీ కాదని హెచ్చరించారు. ప్రైవేటు డ్రైవర్లు వచ్చి మా పొట్ట కొట్టరాదని వారిని వేడుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. -
ఖర్గే వ్యాఖ్యలు దేశద్రోహమే
● ప్రధాని మోదీపై విమర్శలు సిగ్గుచేటు ● బీజేపీ జిల్లా నేత నర్సింహగౌడ్ కొత్తూరు: రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా, అభివృద్ధిపై మాత్రమే చర్చలు, విమర్శలు జరగాలని బీజేపీ జిల్లా కోశాధికారి అమడపురం నర్సింహగౌడ్ అన్నారు. దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మున్సిపాలిటీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు కనీస ఆలోచన ఉండాలన్నారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఖర్గే ఇవేవీ పట్టించుకోకుండా మోదీని ఉగ్రవాది అనడం దారుణమన్నారు. ప్రధానమంత్రిని ఉగ్రవాదితో పోల్చడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నేతను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కేవలం తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రణధీర్గౌడ్, నాగరాజుచారి, మహేందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రాఘవులు, హరికృష్ణ, శివకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డ వివాహానికి పుస్తెమెట్టెల వితరణ
యాలాల: మండల కేంద్రానికి చెందిన ఓ ఆడ బిడ్డ వివాహానికి కాంగ్రెస్ సీనియర్ నేత పేరి రాజేందర్రెడ్డి, సరిత దంపతులు గురువారం పుస్తెమెట్టెలు అందజేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లికూతురు తండ్రి మొగులయ్య ఆరేళ్ల క్రితమే మృతిచెందారు. ఈక్రమంలో తమవంతుగా రాజేందర్రెడ్డి అండగా నిలిచారు. పలువురు ఆడపడుచులతో కలిసి వెళ్లి, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు పుస్తెమెట్టెలు అందించారు. ఘన సన్మానం అనంతగిరి: జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లవకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతసేనారెడ్డి, ఆకుల మహేశ్కుమార్ను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు న్యాయవాదులు ఎన్నిక కావడం సంతోషకరమైన విషయమన్నారు. వారి విజయం ఈ ప్రాంత న్యాయవాదులకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ నాయకులు, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఐసీడీఎస్ ప్రాజక్ట్ సీడీపీఓ నిర్మల కొడంగల్ రూరల్: గర్భిణులు, బాలింతలు, బాలికలు పోషకాహారం తీసుకోవాలని అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజక్ట్ సీడీపీఓ నిర్మల అన్నారు. గురువారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో సర్పంచ్ కన్నం రాధ అధ్యక్షతన పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణులు, బాలంతలు, కిషోర బాలికలకు పలు సూచనలు అందించారు. శిశువుకు ఆరు నెలలపాటు తల్లి పాలు పట్టాలన్నారు. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం, గుడ్లు, ఆకుకూరలు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు దాసమ్మ, ప్రభ, సౌమ్య, పంచాయతీ కార్యదర్శి కల్పన, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ● ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం అనంతగిరి: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఆయన వికారాబాద్ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కమిటీల పేరుతో కాలాయాపన చేయడం సరికాదన్నారు. గతంలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో తరహాలో ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం చర్చలకు పిలిచి వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. పోలీసులు ఆనంద్తోపాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు శుభప్రద్పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, సీనియర్ నాయకులు శేఖర్రెడ్డి, నరసింహ, రాంరెడ్డి, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, మల్లికార్జున్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన.. హైరానా
విరిగిపడిన చెట్ల కొమ్మలు ● విద్యుత్ సరఫరాకు అంతరాయం ● చల్లబడిన వాతావరణం మొయినాబాద్, మొయినాబాద్ రూరల్: ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. మొయినాబాద్ మున్సిపాలిలోని అజీజ్నగర్, ఎనికేపల్లి, హిమాయత్నగర్, చిలుకూరు, పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, ముర్తూజగూడ, అప్పోజీగూడ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం సుమారు అరగంటకు పైగా భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు అజీజ్నగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలను తొలగించిన అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆకాశం మబ్బులుపడి దాదాపు గంటన్నర సేపు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో వరద నీరు చేరింది. మండుతున్న ఎండలకు ఇబ్బంది పడుతున్న జనం చల్లని వానతో ఉపశమనం పొందారు. -
పిడుగుపాటుతో మూగజీవాల మృతి
కుల్కచర్ల: పిడుగుపాటుకు మూగజీవాలు మృతిచెందిన ఘటనలు చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడ్డాయి. బొర్రహేమ్యానాయక్తండాకు చెందిన ముడావత్ చందర్కు చెందిన ఓ గేదె, ఓ ఆవు పిడుగుపాటు గురై అక్కడికక్కడే చనిపోయాయి. వీటి విలువ రూ.లక్షన్నర వరకు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సర్పంచ్ లావుడ్య శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితులను ఓదార్చారు. మందిపల్కు చెందిన సంటి అంజయ్య పొలంలో పడిన పిడుగుతో అతని పాడి గేదె మృతిచెందింది. దీని విలువ రూ.70 వేలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. అలాగే పుట్టపహాడ్కు చెందిన మిద్దె నిరంజన్ పొలంలో పిడుగు పడి, రూ.లక్ష విలువైన ఆవు మృత్యువాత పడింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. -
ప్లాట్లు మరింత లేట్!
యాచారం: ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిహారం చెల్లింపు విషయమై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మధ్య చోటుచేసుకున్న సవాల్, ప్రతిసవాళ్లతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఫార్మాసిటీ భూసేకరణ పరిహారం చెల్లింపు విషయంలో గతంలో జరిగిన అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అసలైన రైతులకు పరిహారంతో పాటు ప్లాట్లు ఇస్తే పర్వాలేదు కానీ రూ.కోట్లలో అక్రమంగా పరిహారం పొందినవారే తిరిగి ప్రభుత్వంపై నిందలు వేయడంపై అధికార పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. ఇందులో సింహభాగం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్దలోనే పది వేల ఎకరాల వరకు తీసుకున్నారు. పైనాలుగు గ్రామాల్లో దాదాపు 3,500 మందికిపైగా రైతులు పరిహారం పొందినట్లు తెలుస్తోంది. ఛాలెంజ్గా తీసుకున్న సర్కార్ సుమారు 500 ఎకరాలకు సంబంధించిన కోట్లాది రూపాయల పరిహారం పక్కదారి పట్టిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొద్ది రోజుల క్రితం ఆయా గ్రామాల్లోని రాజకీయ పక్షాల నాయకులు అనర్హుల వివరాలతో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది. దీంతో సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి అక్రమాలను వెలుగులోకి తేవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నక్కర్తమేడిపల్లిలో 250 ఎకరాలు, నానక్నగర్లో 150 ఎకరాలు, తాడిపర్తిలో 80 ఎకరాలు, కుర్మిద్దలో 150 ఎకరాలకుపైగా పరిహారాన్ని అనర్హులు తీసుకున్నారని ఆయా గ్రామాల నాయకులు కాంగ్రెస్ నేతలు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలున్నాయి. మళ్లీ జాబితాలు.. ప్రభుత్వం నుంచి గతంలోనే పరిహారం పొంది, ప్రస్తుతం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులతో కూడిన జాబితాను మళ్లీ ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా నక్కర్తమేడిపల్లి జీపీ వద్ద రైతుల జాబితాను ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు సూచించారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన వారిలో నక్కర్తమేడిపల్లి నుంచి 1,281 మంది, కుర్మిద్దలో 574, తాడిపర్తిలో 380, నానక్నగర్లో 201 మంది రైతులు ప్లాట్లు పొందారు. వీరికి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే, పరిహారం అందజేతలో నకిలీలకు సహకరించిన యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వీరిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనేపథ్యంలో పారదర్శకమైన జాబితా తయారీకి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున డాక్యుమెంట్ల పంపిణీ ఇప్పట్లో కష్టమేననే చర్చ సాగుతోంది. డాక్యుమెంట్ల పంపిణీకి ఆలస్యమయ్యే అవకాశం జాబితాలో అనర్హులున్నారని అధికారులకు ఫిర్యాదులు నకిలీల ఏరివేతనుసీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నక్కర్తమేడిపల్లిలో రై తుల జాబితాను ప్రకటించాం. ఇందులో నకిలీ పేర్లు ఉంటే ఫిర్యాదు చేయాలని గ్రామస్తులకు సూచించాం. వీటిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాం. కొంత ఆ లస్యమైనా అసలైన లబ్ధిదారులకు ప్లాట్ల డాక్యుమెంట్లు అందజేస్తాం. నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో కూడా త్వరలోనే జాబితా ప్రకటిస్తాం. – అయ్యప్ప, తహసీల్దార్ యాచారం -
డిగ్రీ కళాశాలకు ఫర్నిచర్ అందజేత
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ ప్రిన్సిపాల్ కీ.శే.డాక్టర్ వగ్గు మనోహర్గౌడ్ జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు బుధవారం రూ.రెండు లక్షల విలువ కలిగిన 15 గ్లాస్ అల్మారాలను అందజేశారు. మనోహర్గౌడ్ 2010–15 వరకు కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేశారని ప్రస్తుత ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి గుర్తు చేశారు. కళాశాలకు బహూకరించిన అల్మారాలు లైబ్రరీ, ప్రయోగశాలల అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సేవా దాతృత్వాన్ని కొనియాడారు. దాతలు వగ్గు ఉమాదేవి ఎన్ఆర్ఐ వగ్గు కిరిటీలకు ధన్యవాదాలు తెలిపారు. 2025–26విద్యా సంవత్సరం నుంచి పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో డా.మనోహర్గౌడ్ మెమోరియల్ అవార్డుతో రూ.5వేల నగదు, బంగారు పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్గౌడ్, సతీష్గౌడ్, నవీన్గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానమ్, అధ్యాపక సిబ్బంది టి.రాంబాబు, ఆర్.శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 2 లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం: రైతులందరూ జూన్ 2వ తేదీలోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని తహసీల్దార్ సునీతారెడ్డి, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి కోరారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, మీ సేవ కేంద్రాల సిబ్బందికి ఫార్మర్ రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సమీప మీ సేవ కేంద్రాలకు భూమి పాస్ బుక్ వివరాలు, ఆధార్, ఓటీపీ వచ్చే ఫోన్తో వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రైతులందరికీ తగు సలహాలు సూచనలు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, ఏఈఓలు శ్రవణ్, సృజన పాల్గొన్నారు. -
బిల్లు పట్టు!
పైసా కొట్టు..ట్రెజరీల్లో పర్సెంటేజీల పర్వం వికారాబాద్: ట్రెజరీల్లో (ఎస్టీఓ, డీటీఓ కార్యాలయాలు) పర్సెంటేజీల పర్వం కొనసాగుతోంది. బిల్లు మంజూరు కావాంటే చేయి తడపాల్సిందే. జిల్లాలోని నాలుగు ఎస్టీఓలతో పాటు డీటీఓలో సైతం ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీలు, ఎమ్మెల్యేల నిధులకు సంబంధించిన బిల్లులు మొదలుకొని ఉద్యోగుల బిల్లుల వరకు అమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. పనులను బట్టి 2 నుంచి 8 శాతం వరకు పర్సెంటీజీలు దండుకుంటున్నట్లు సమాచారం. డబ్బు ఇవ్వకుంటే బిల్లులు మంజూరు కావడం లేదు. ఒక్కోసారి ఏడాది నుంచి రెండేళ్ల పాటు వేచిచూడక తప్పడం లేదని సర్పంచులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఆరోపించారు. బిల్లు ఆలస్యం అయితే బయట తెచ్చిన డబ్బులకు వడ్డీ భారీగా కట్టాల్సి వస్తోందని.. ఈ కారణంగానే ట్రెజరీ అధికారులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఎవరికై న ఫిర్యాదు చేస్తే మీ ఇష్టం అని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో డీటీఓలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ విషయం కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. డీటీ ఆఫీసులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఓ అధికారి అందరినీ మ్యానేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వేతనాలు మినహా.. ఉద్యోగుల వేతనాలు మినహా మిగతా అన్ని రకాల బిల్లులకు పర్సెంటేజీలు ఇవ్వాల్సిందే. ఆర్థిక సంఘం నిధులు నేరుగా జీపీ ఖాతాల్లో జమ అవుతుండగా సర్పంచ్లు ఈ సమస్య నుంచి బయటపడ్డారనే చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వీటికి కూడా తొందరగా బిల్లులు చేసేందుకు ముడుపులు ఇవ్వాల్సిందేనని సర్పంచులు పేర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్డీఎఫ్ తదితర వాటికి డబ్బు ఇచ్చుకోవాల్సి వస్తోందని సర్పంచులు వాపోయారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులు, డీఏ, పీఆర్సీ ఏరియర్స్, జీపీఎఫ్, ఫెస్టివల్ అడ్వాన్స్లు, రిటైర్డ్మెంట్ సమయంలో వచ్చే డబ్బులు, ఈఎల్స్తో పాటు అత్యవసర బిల్లులు, పాల బిల్లులకు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. కింది స్థాయి అధికారులను మొదలుకుని జిల్లా స్థాయి అధికారుల వరకు ఈ చదివింపులు తప్పడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో గతంలో జెడ్పీ అధికారులు, ట్రెజరీ అధికారుల మధ్య పెద్ద వివాదమే నడిచింది. ఇటీవల కలెక్టరేట్లో విధులు నిర్వహించే ఓ అధికారి జీపీఎఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎనిమిది శాతం ఇస్తేనే బిల్లులు త్వరగా వస్తాయని తెలపడంతో ఆయన ఎవరికి చెప్పుకోవాలో తెలియక పక్క ఉద్యోగులతో చెప్పుకొని వాపోయాడు. అభివృద్ధి పనులకు సంబంధించి ఉన్నత స్థాయిలోనూ ఆరు నుంచి పది శాతం డబ్బులు ఇస్తేనే వారం పది రోజుల్లో బిల్లులు చెల్లిస్తున్నారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్లో ఫైనాన్స్ డిపార్ట్మెంటు వారితో వికారాబాద్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి ఈ లావాదేవీలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అడిగిన డబ్బు ముందే ఇస్తే అత్యవసర బిల్లుల పేరుతో వారం పది రోజుల్లో బిల్లులు అందేలా చూస్తున్నా రని.. లేదంటే నెలలు, సంవత్సరాలు ఆగాల్సి వస్తోందని ఓ కాంట్రాక్టర్ వాపోయాడు. మీడియాలో కథనాలు వచ్చిన సమయంలో మరింత ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. వైద్య శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి జీపీఎఫ్ డబ్బుల కోసం బిల్లులు పెట్టుకున్నాడు. అతనికి టోకెన్ వచ్చి కూడా తొమ్మిది నెలలు గడుస్తోంది. నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇటీవల తనకు తెలిసిన స్నేహితుని సూచన మేరకు డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగిని సంప్రదించగా టెన్ పర్సెంటేజీ ఇస్తే బిల్లులు వస్తాయని చెప్పటంతో చేసేదిలేక వెనుదిరిగాడు. అతని తోటి ఉద్యోగికి డబ్బులు అత్యవసరం ఉండటంతో అదే పది శాతం చెల్లించటంతో పని పూర్తయ్యింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఎవరిని కదిపినా ఆది తంతూ కనిపిస్తోంది. -
కదలని బస్సులు.. అవస్థల్లో ప్రయాణికులు
పరిగి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆయా గ్రామాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పరిగి కేంద్రం నుంచి మహబూబ్నగర్, హైదరాబాద్, వికారాబాద్, షాద్నగర్, కర్ణాటకకు ఎక్కువ మంది ప్రయాణిం చేస్తుంటారు. ఉదయం నుంచే బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. సమ్మె కారణంగా ప్రైవేటు వాహనదారులు రెండింతలు చార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్, శ్రీనివాష్, నరేష్, రవీందర్, తాహేర్అలీ తదితరులు పాల్గొన్నారు. కార్మికుడిపై చేయి చేసుకున్న డీఎస్పీ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుడిపై పరిగి డీఎస్పీ శ్రీనివాస్ చేయి చేసుకున్నారు. దీంతో కార్మిక సంఘాలు మండిపడ్డాయి. పరిగి డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. కార్మికులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
పనుల్లో వేగం పెంచండి
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ శివారులో చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. మెడికల్, నర్సింగ్, మహిళా డిగ్రీ, బాలిక, బాలుర హాస్టళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఇంజనీరింగ్ కళాశాలల పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, జీపీవో గోపాల్, ఎడ్యుకేషన్ హబ్ ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, డీఈఈ రాజయ్య, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, సూపర్వైజర్ వెంకటేశ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ భవనం ప్రారంభం విద్యార్థి జీవితంలో పూర్వ ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం మండలంలోని ఎక్కచెరువు తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన మోడల్ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పిల్లలను చదువుకు అలవాటు చేయాలని సూచించారు. పౌష్టికాహారంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లును పరిశీలించారు. ఎక్క చెరువు తండా మీదుగా రోడ్డు మంజూరై రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదని స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. హస్నాబాద్ నుంచి చిలుముల్ మైల్వార్ వరకు మంజూరైన రోడ్డు పల్గురాళ్ల తండా వరకు మాత్రమే వేశారని.. తర్వాత పనులు ఆపేశారని తెలిపారు. వెంటనే పనులు పూర్తియ్యేలా చూడాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో పనులు జరిగేలా చూస్తామన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు సీతారం నాయక్, మంగలి రాములు, ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మల, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు హన్మానాయక్, మాణిక్య నాయక్, లాలప్ప, గోపాల్, మోతీలాల్, నాయకులు నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలి కొడంగల్: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పనులు ఎంత వరకు జరిగాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అలసత్వం తగదని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయం చుట్టూ ఇళ్లు కోల్పోతున్న వారికి ఇచ్చే స్థలాల లే అవుట్ను సందర్శించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు తొలగించారని ఇంకా ఎన్ని తొలగించాల్సి ఉందని అధికారులను అడిగారు. ఆలయ నిర్మాణ పనులను వేగిరం చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్గుప్తా, కమిషనర్ బలరాం నాయక్ పాల్గొన్నారు. -
రోడ్డెక్కని బస్సులు
● సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు ● రవాణా సదుపాయం లేక ప్రయాణికుల అవస్థలు ● పోలీసు ఎస్కార్ట్తో నడిచిన బస్సు తాండూరు టౌన్: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంతో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తాండూరు పట్టణంలోని బస్సు డిపోలో బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు విధులకు గైర్హాజరై సమ్మెకు దిగారు. డిపోలో నుంచి బస్సులను బయటకు రానివ్వలేదు. బస్సు డిపో ఎదుట నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ, తెలంగాణ జనసమితి, సీఐటీయూ తదితర పార్టీలు, సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సోమశేఖర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్తో పాటు పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రయాణికుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్తో ఎట్టకేలకు తాండూరు డిపో నుంచి బస్సును రోడ్డెక్కించారు. తాండూరు నుంచి మహబూబ్నగర్ మార్గంలో బస్సును నడిపారు.బస్సులు రోడ్డెక్కక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, జీపుల వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తాండూరు బస్ డిపోలో 68 ఆర్టీసీ బస్సులు, 32 అద్దె బస్సులు ఉన్నాయని, వీటి వల్ల నిత్యం రూ.16లక్షల మేర ఆదాయం వస్తోందని డిపో మేనేజర్ సురేశ్కుమార్ తెలిపారు. మొత్తం 351 మంది ఉద్యోగులు తాండూరు డిపో పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సహాయంతో బస్సులను నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, పలువురు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని బస్సులు నడపనున్నట్లు చెప్పారు. -
బోసిపోయిన బస్టాండ్
అనంతగిరి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వికారాబాద్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదల్లేదు. ఉదయం 5గంటల నుంచే కార్మికులు డిపో వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేదాకా సమ్మె ఆపేది లేదన్నారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రైవేటు వాహనాలు, రైళ్లు కిటకిటలాడాయి. బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. నాలుగు ప్రైవేటు బస్సులను నడిపించారు. ప్రయాణికులు లేక వికారాబాద్ బస్టాండ్ బోసిపోయింది. -
ఇసుక డంప్ల సీజ్
బొంరాస్పేట: మండలంలోని దుప్చర్ల శివారులో వాగు నుంచి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను బుధవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శిరీష ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఇసుకకు వేలం నిర్వహించనున్నట్లు ఆర్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు పరిగి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని నస్కల్ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం బురాన్పల్లి గ్రామానికి చెందిన పెద్దింటి లాలయ్య, జయమ్మ దంపతులు పరిగి నుంచి వికారాబాద్కు బైక్పై వెళ్తుండగా నస్కల్ గ్రామానికి చెందిన రాములు, పొచయ్య వికారాబాద్ నుంచి నస్కల్కు తమ బైక్పై వస్తున్న క్రమంలో నస్కల్, గొట్టిముక్కల గేట్ మధ్యలో బైక్లు ఢీకొన్నాయి. గాయపడిన నలుగురిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వికారాబాద్కు తరలించారు. గిరిజన తండాలకు ప్రాధాన్యం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం గిరిజన పంచాయతీలకు ప్రాధాన్యం కల్పిస్తోందని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం మండలంలోని మదన్పల్లితండా, లోతికుంటతండా, బుర్రితండా, కట్టుకాల్వతండాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపనలు చేశారు. రూ.30లక్షల చొప్పున నిధులతో నూతన పంచాయతీ భవనాలు నిర్మంచనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, నాయకులు వెంకట్రాములుగౌడ్, జయకృష్ణ, మల్లేశ్, మల్లికార్జున్, అంజిల్రెడ్డి, నర్సింలునాయుడు, సర్పంచులు శంకర్నాయక్, శాంతిబాయి, రేణుక, కిషన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నలుగురు సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించనున్నారు. సమావేశానికి 15 మంది కౌన్సిలర్లతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరు కానున్నారు. -
కూలి పనులకు వెళ్తూ అనంతలోకాలకు..
దుద్యాల్: కూలి పనుల కోసం బైక్పై వెళ్తున్న దంపతులకు కుక్క అడ్డు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దుద్యాల్ ఎస్ఐ శ్రీశైలం కథనం మేరకు.. బొంరాస్పేట్ మండలం నాందర్పూర్ గ్రామానికి చెందిన డావుల యాదయ్య(35), భార్య నర్సమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలో కూలి పనుల కోసం బైక్పై బయలుదేరారు. దుద్యాల్ మండలం సంట్రకుంట తండా గేట్ వద్ద బైక్కు కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సమ్మకు తీవ్ర గాయాలు కావడంతో కొడంగల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఒక పాప ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. -
డిపో వీడని బస్సు
వికారాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా సదుపాయం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా ఉద్యోగులు, కార్మికులు డిపో గేట్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి. వికారాబాద్, పరిగి, తాండూరు డిపోల్లో ఆర్టీసీ, హయర్ బస్సులు కలిపి 247 వరకు ఉన్నాయి. 908 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొన్నారు. వికారాబాద్ డిపోకు చెందిన ఐదు ప్రైవేటు బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో గమ్యాలకు చేరుకోవాల్సి వస్తోంది. వాహనాలు జనంతో కిక్కిరిసి పోయాయి. రేట్లు పెంచినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట -
బిడ్డా బాగా చదువుకో..
యాలాల: పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిపన వివరాల ప్రకారం.. తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీనివాస్, శోభమ్మ దంపతుల కూతురు దేవి(33). ఈమెను చెన్నారం గ్రామానికి చెందిన జటంగి హన్మంతుకు ఇచ్చి 2010లో వివాహం చేశారు. కొన్నేళ్ల పాటు వీరి జీవితం అన్యోన్యంగా సాగింది. తాగుడుకు బానిసైనా హన్మంతు భార్యను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. గతంలో చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్దిచెప్పినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 13న ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన భార్య దేవిని మరో సారి డబ్బుల కోసం వేధించాడు. మీ పుట్టింటికి వెళ్లి డబ్బులు తెస్తావా? చస్తావా..? అని బెదిరించాడు. వేధింపులు తాళలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. వెంటనే తండ్రి ఎర్ర శ్రీనివాస్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. హుటాహుటీన ఆయన గ్రామానికి చేరుకొని కూతురు దేవిని ఆటోలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులపాటు చిక్సిత్స అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎర్ర శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అల్లుడు జటంగి హన్మంతుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు జన్మదినం రోజునే.. జటంగి దేవి, హన్మంతు దంపతులకు అభిలాష్(13), పున్నమి(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు కావడంతో కొడుకు అభిలాష్ ఆస్పత్రికి వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. బిడ్డా బాగా చదువుకో అని తల్లి చెప్పింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. సాయంత్రానికి ప్రాణాలు వదిలింది. దీంతో బాలుడు గుండె పగిలేలా ఏడ్చాడు. బుధవారం చెన్నారంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిలాష్ తల్లికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇది చూసిన బంధువులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. కొడుకుతో తల్లి చివరి మాటలు -
రెండు గంటల్లో బాలుడి ఆచూకీ
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం ఓ బాలుడు తప్పిపోయాడు. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా పోలీసులు పోస్ట్ చేయడంతో అదికాస్తా అన్ని గ్రూపుల్లో చకచకా ఫార్వర్డ్ కాగా రెండు గంటల్లోనే బాలుని ఆచూకీ లభించింది. పట్టణంలోని పురుషోత్తం ఆస్పత్రి వెనుక గల్లీలో నివాసం ఉండే బాబు ఇంటి పరిసరాల్లో నుంచి తప్పిపోయాడు, చుట్టూ పక్కల వెతికిన ఫలితం లేకపోవడతో పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే సోషల్ మీడియాలో సమాచారం ఫార్వర్డ్ చేశారు. కాగా బాలునికి మాటలు రాకపోవడంతో ఏం చెప్పలేకపోయాడు. కాసేపటికి బాబు రాజీవ్గృహ కల్ప సమీపంలో ఉన్నట్లు తెలియడంతో వారు బాబును పీఎస్కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు, దీంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటల్లోపే చిన్నారి ఆచూకీ తెలిసినందుకు అందరం సంతోషించారు. -
ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దాం
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ● కౌకుంట్లలో ఘనంగా ఇంద్రారెడ్డి వర్ధంతిచేవెళ్ల: ఇంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది చేవెళ్ల ప్రజలేనని.. నియోజకవర్గ ప్రజలకు ఇంద్రారెడ్డి కుటుంబ ఎప్పటికీ రుణపడి ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె చేవెళ్ల, ఖానాపురంగేట్, అంతారంగేట్ వద్ద ఆయన విగ్రహాలకు ఘన నివాళి అర్పించారు. అనంతరం మండల పరిధిలోని కౌకుంట్లలో ఆయన సమాధికి తనయులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులతో కలిసి పూలమాలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డ అంటే స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరు గుర్తుండి పోయేలా పాలన సాగించారన్నారు. ఆయన అనుచరులు పార్టీలకు అతీతంగా జిల్లాలో ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఆయన సాధనకు నిరంతరం కృషి చేద్దామన్నారు. ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అంజనేయులు, ప్రభాకర్, పి.హన్మంత్రెడ్డి, కరుణాకర్రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశ్, శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, బాల్రాజ్, యాదయ్య, నర్సింలు, రవీందర్, మాధవ్గౌడ్, రామగౌడ్, రాజు, సురేందర్, వెంకటేశ్వర్రెడ్డి, గోపాలకృష్ణ, రాజు, చంద్రశేఖర్, ప్రభాకర్రెడ్డి, మాధవ్రెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం మొయినాబాద్: ఇంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టిన చేవెళ్ల ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కేంద్రంలో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంద్రారెడ్డి కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తనయుడు కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, సీనియర్ నేతలు షేక్ మహబూబ్, కృష్ణారెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు డప్పు రాజు, రవూఫ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జీఎన్ రాజు, మాజీ సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సుధాకర్యాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్రెడ్డి, శ్రీనివాస్, నాయకులు రాంచందర్, సురేందర్గౌడ్, సూరియాదవ్, తిరుపతిరెడ్డి, నవీన్, అరవింద్, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు ఇంద్రారెడ్డి నగర్ కాలనీలోని ఆయన విగ్రహానికి మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
పరిగి: విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని పేటమాధారం గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంచన్పల్లి మల్లమ్మ, అనంతయ్య దంపతులకు చెందిన మహేశ్(22) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలోని బోరు మోటారు స్టార్టర్ చెడిపోవడంతో వైరు బిగిస్తుండగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్ చనిపోయిన విషయాన్ని చుట్టు పక్కల రైతులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
ఖర్గే వ్యాఖ్యలు అర్థరహితం
● బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంధయ్య ● చౌడాపూర్లో దిష్టిబొమ్మ దహనం కుల్కచర్ల: ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని మోదీ అని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంధయ్య, చౌడాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా చౌడాపూర్లోని ప్రధాన చౌరస్తాలో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలన లో.. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాంగ్రెస్వి అవకాశవా ద రాజకీయాలని విమర్శించారు. హిందుత్వవాదం బలపడుతుండటాన్ని జీర్ణించుకోలేక తమిళనాడు ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నా రు. పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించా రు.కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నాయకులు మాసయ్య, వెంకటేశ్, గిరిజన మోర్చా నాయకులు శంకర్ నాయక్, బాల్రాజ్, మల్లేశం, జనార్దన్, నర్సింలు, రాము, కృష్ణయ్య, రమేష్ పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్ట్టీస్ అనంతగిరి: జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో వార్షిక మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని కొత్రెపల్లి గ్రామ శివారులో పోలీసులు ఫైరింగ్ ప్రాక్ట్టీస్ చేశారు. ఎస్పీ స్నేహమెహ్ర పాల్గొని ఆయుధాల పనితీరును పరిశీలించారు. స్వయంగా ఫైరింగ్ ప్రాక్టిస్ చేశారు. ఆయుధాలు వాడే సమయంలో భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐ నాగరాజు, శ్రీశైలం, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. విజయశాంతికి హోంమంత్రి ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్యాదవ్ బంట్వారం: ఎమ్మెల్సీ విజయశాంతికి రాష్ట్ర క్యాబినెట్లో చోటు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్యాదవ్ కోరా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన ఆడ బిడ్డ విజయశాంతికి హోంమంత్రి పదవి ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణ బీసీ వర్గం అంతా ఆమెకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఇదే విషయమై సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవిస్తామన్నారు. 26 నుంచి గడ్డం శైలజ స్మారక క్రికెట్ టోర్నీ ధారూరు: స్పీకర్ ప్రసాద్కుమార్ సతీమణి గడ్డం శైలజ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 26 నుంచి ధారూరులో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకుడు తిరుగారి మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనే జట్లు రూ.999 ఎంట్రీ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేత జట్టుకు రూ.20 వేలు, ట్రోఫీ, రన్నర్ జట్టుకు రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9573337457, 7674804764, 709351 6593లలో సంప్రదించాలన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి అనంతగిరి: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలని కలెక్టర్ దీపక్తివారి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.ఇందుకు కోసం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలన్నారు.యాత్రికులు తమ ఆధార్,గుర్తింపు కార్డులు,ఇటీవల దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు ఆరోగ్య చికిత్స పత్రాలతో సంప్రదించాలన్నారు.ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.మరిన్ని వివరాలకు సెల్ నంబర్లో 9491738499లోసంప్రదించాలన్నారు. -
సీటు కోసం బస్సులో రచ్చ చేసిన మహిళ
ధారూరు: హైదరాబాద్–తాండూర్ ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ బస్లో మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ గొడవ ధారూరు పోలీస్స్టేషన్కు చేరింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బస్సు వికారాబాద్కు చేరుకోగా ధారూరు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బస్సు ఎక్కారు. కాగా బస్సులో తాండూర్కు వెళుతున్న ఓ ప్రయాణికురాలితో పంచాయితీ ఏర్పడింది. సీటులో చిన్న పిల్లను తీసుకుని సీటు ఇవ్వాలని అల్లిపూర్ మహిళలు కోరారు. ఇందుకు ఆమె నేను ఇవ్వనంటూ గొడవపడింది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో డ్రైవర్ నేరుగా బస్సును ధారూరు ఠాణాకు తీసుకెళ్లారు. బస్సు ఆపగానే తాండూర్కు చెందిన మహిళ బస్సులోంచి కిందకు దిగి పరుగుపెట్టింది. దీంతో పోలీసులు అల్లిపూర్ మహిళలకు సర్దిచెప్పి పంపించారు. గొడవ సద్దుమణగడంతో బస్సు తాండూర్కు వెళ్లింది. -
లంచం డిమాండ్.. ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ!
అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం.. తాండూరు: పట్టణానికి చెందిన కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అవినీతి అధికారుపై పోరాటం చేస్తున్నారు. ఓ భూమికి సంబంధించిన సేల్ డీడ్ రద్దు చేయాలని కోరుతూ 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను కలవగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన ఇర్షాద్ డిసెంబర్ 5న డబ్బులు ఇస్తూ సబ్ రిజి్రస్టార్తో పాటు అతని అసిస్టెంట్ను పట్టించాడు. 2025లో ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగి రమేశ్ను ఏసీబీకి పట్టించాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవ విషయంలో ఇర్షాద్ భార్య మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ బెయిల్కు లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారులను ఏసీబీకి పట్టించడం చర్చనీయాంశమైంది. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
● ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి ● టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం పరిగి ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే సమ్మెకు టీజేఎంయూ పూర్తి మద్దతు ప్రకటిస్తోందన్నారు. సమస్యలపై పోరాటం చేసేందుకు యూనియన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. 2021 – 25 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని.. చాలి చాలని వేతనాలతో ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కొడంగల్కు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
● ఏర్పాటుకు సన్నాహాలు ● సాగుపై రైతులు దృష్టి సారించాలి ● కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి దుద్యాల్: కొడంగల్ నియోజకవర్గానికి త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మంజూరు కానున్నట్లు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని హకీంపేట్ రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఒక్కసారి పంట సాగుచేస్తే దీర్ఘకాలం పాటు లాభాలు పొందవచ్చని తెలిపారు. కొడంగల్ రైతులను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, కొడంగల్ హార్టికల్చర్ అధికారి సురేందర్ నాథ్, హెచ్ఈఓ బాబ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏ శేఖర్, సర్పంచ్లు చంద్రయ్య, నరేఽశ్ రాఽథోడ్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సీతారాం నాయక్, లక్ష్మయ్య, రాములు, నరేందర్ గౌడ్, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
......
అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు.అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..తాండూరు: పట్టణానికి చెందిన కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అవినీతి అధికారుపై పోరాటం చేస్తున్నారు. ఓ భూమికి సంబంధించిన సేల్ డీడ్ రద్దు చేయాలని కోరుతూ 2022 డిసెంబర్లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్ను కలవగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన ఇర్షాద్ డిసెంబర్ 5న డబ్బులు ఇస్తూ సబ్ రిజిస్ట్రార్తో పాటు అతని అసిస్టెంట్ను పట్టించాడు. 2025లో ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగి రమేశ్ను ఏసీబీకి పట్టించాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవ విషయంలో ఇర్షాద్ భార్య మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ బెయిల్కు లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారులను ఏసీబీకి పట్టించడం చర్చనీయాంశమైంది. స్టేషన్ బెయిల్ విషయంలో లంచం డిమాండ్అవినీతి నిరోధక శాఖను సంప్రదించిన బాధితుడుకొనసాగుతున్న విచారణ -
కాంగ్రెస్తోనే తండాల అభివృద్ధి
దుద్యాల్: తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సంట్రకుంట తండాలో రూ.30 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తండాలను పట్టించుకోకపోవడంతో పూర్తిగా వెనుకబడిపోయాయన్నారు. తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు మాణిక్యనాయక్, నరేశ్ రాథోడ్, మొగులప్ప, మహిళా సమైక్య గ్రామ అధ్యక్షురాలు సరిత, పంచాయతీ కార్యదర్శి కిషన్, నాయకులు సంతోష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి -
విఠలేశ్వర ఆలయ అభివృద్ధికి చర్యలు
● జాతరను విజయవంతం చేయాలి ● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి యాలాల: మండలంలోని తిమ్మాయిపల్లి శివారులో గల విఠలేశ్వరాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు జాతర జరగనుంది. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జాతరకు రావాలని గ్రామ సర్పంచ్ అమర్నాథ్రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమప్ప, ఏఎంసీ డైరెక్టర్ రాజు, ఉపసర్పంచ్ నర్సింలు, గ్రామపెద్దలు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి వెళ్లే మార్గంలో అవసరమైన చోట సీసీ రోడ్డు, బోరు, విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్సవాను విజయవంతం చేయాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భీంరెడ్డి, వడ్ల దామోదర్, రవీందర్రెడ్డి, ఈడ్గి రాజు, శ్రీధర్రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లమ్మ ఆలయానికి రూ.7.16 లక్షల ఆదాయం
తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా మంగళవారం తైబజార్కు వేలం నిర్వహించారు. ఆలయ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్ రెడ్డి, ఈఓ శేఖర్ గౌడ్ అధ్యక్షతన ఈ ప్రక్రియ చేపట్టారు. జాతరలో కొబ్బరి కాయాల విక్రయానికి రూ.3.60 లక్షలు.. పార్కింగ్కు రూ.2 లక్షలు, తైబజార్కు రూ.1.09 లక్షలు, పప్పు దినుసులకు రూ.47 వేలకు పాట దక్కించుకున్నారు. వేలం ద్వారా ఆలయానికి రూ.7.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ శేఖర్గౌడ్ తెలిపారు. వచ్చే నెల నుంచి నెల రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరక్టర్లు సుజాత, నర్సింలు, రాజు, జీ రాజు, లక్ష్మీ, నాయకులు వెంకట్రాంరెడ్డి, సాయిలు, బసిరెడ్డి, ప్రదీప్రెడ్డి, శంషోద్దీన్, బీ రాజు, వెంకట్రెడ్డి, శాంతప్ప, గోపాల్, లాలయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్: కొడంగల్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. జనరల్ స్థానం నుంచి పట్టణ మాజీ సర్పంచ్ రమేష్బాబు, జనరల్ మహిళ నుంచి ఐనన్పల్లికి చెందిన సావిత్రమ్మ, మైనార్టీ నుంచి మాజీ కో ఆప్షన్ సభ్యుడు మునీర్ ఖాద్రీ, మైనార్టీ మహిళ నుంచి కలాల్వాడకు చెందిన షరీఫాబేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రశాంత్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. వార్డుల్లోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కమిషనర్ బలరాం నాయక్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, కౌన్సిలర్లు కృష్ణంరాజు, రాజశేఖర్, సుష్మ, అనిత, వాణిశ్రీ యాదవ్, హమీద్, బాలమ్మ, లక్ష్మమ్మ, సన ఆఫ్రీనా తదితరులు పాల్గొన్నారు. మోమిన్పేట: హిందూ సంస్కృతిలో భాగమైన గోమాతను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్వామి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ కుటుంబాల్లో గోవు మమేకమైందన్నారు. గోవును తల్లిగా భావిస్తారని పేర్కొన్నారు. నేడు గో రక్షణ ప్రతి హిందువు చేతిలో ఉందన్నారు. గోశాలలను నిర్వహించాలని సూచించారు. ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన మంగమోళ్ల శివరామ్రెడ్డి సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ సీటు దక్కించుకున్నారు. తుది ఫలితాల్లో ఆయనకు 99.46 స్కోరు సాధించారు. శ్రీనివాస్రెడ్డి, రజిత దంపతుల కుమారుడు శివరామ్రెడ్డి రంగారెడ్డి జిల్లా కీసర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివాడు, నగరంలోని నార్సింగిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. గ్రామస్థులు, విద్యార్థిని అతని తల్లిదండ్రులను అభినందించారు. -
నకిలీ విపత్తు!
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కొడంగల్: కర్ణాటక కేంద్రంగా నాసిరకం విత్తనాలు సరఫరా అవుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గానికి పడమర, దక్షిణ భాగంలో కర్ణాటక రాష్ట్రం విస్తరించి ఉంది. ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది దళారులు నాసిరకం విత్తనాలను హైదరాబాద్ – బీజాపూర్, మహబూబ్నగర్ – చించోలి జాతీయ రహదారుల మీదుగా కొడంగల్కు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో నకిలీ.. నాసిరకం విత్తనాల విక్రయాలకు కొందరు వ్యాపారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పలు గ్రామాల్లో యువకులను ఏజెంట్లుగా నియమించుకొని రైతులకు ఎర వేస్తున్నారు. జూన్ మాసంలో ఖరీఫ్ సీజం ప్రారంభం అవుతుంది. దీంతో ఈ దందాకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని వ్యాపారులు నాసిరకం గింజలను కొనుగోలు చేసి విత్తనాల పేరుతో విక్రయిస్తున్నారు. ఖరీఫ్కు ముందే పలు గ్రామాల్లో దందాకు ప్రయత్నిస్తున్నారు. రైతులను మోసం చేసి వేల రూపాయలు దండుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బ్రాండెడ్ కంపెనీల కవర్లలో నింపి విక్రయిస్తున్నారు. అభం శుభం తెలియని రైతులు వాటిని కొనుగోలు చేసి పంట దిగుబడి రాక నష్టపోతున్నారు. గుర్మిట్కల్లో నకిలీ మూలాలు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్లో ఒక ఎరువుల వ్యాపారి నకిలీ విత్తనాల దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను అక్కడి కుష్టిగిరి జిల్లాలోని జిన్నింగ్ మిల్లు నుంచి తక్కువ ధరకు పత్తి విత్తనాలను కొనుగోలు చేసి వాటికి రంగులు కలిపి బ్రాండెడ్ కంపెనీల కవర్లలో ప్యాకింగ్ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్లోని ఒక ప్యాకింగ్ కంపెనీలో బ్రాండెడ్ కంపెనీల కవర్లను కొనుగోలు చేసి ఆ కవర్లలో నాసిరకం విత్తనాలు పోసి ప్యాకెట్లుగా తయారు చేయించి ఏజెంట్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నాడు. వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాలతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల విక్రయించడానికి ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. వారి ద్వారా వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలుమార్లు పట్టుబడినా.. గతంలో కొడంగల్ మండలం అన్నారం గ్రామంలో ఒకరి ఇంట్లో నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో దొరికిన సామగ్రిని చూసి అధికారులు నివ్వెరపోయారు. 320 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న 60 ప్యాకెట్లు, వివిధ కంపెనీల పేరుతో తయారు చేయించిన 290 కవర్లు, విత్తనాలు కొలిచే డబ్బా దొరికింది. అదే రోజు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. నిఘా పెంచడంతో సూత్రధారులు, పాత్రధారులు పట్టుబడ్డారు. కొంత కాలానికి వారు రిమాండ్ నుంచి బయటకు వచ్చి తిరిగి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ వ్యవహారంపై వికారాబాద్ జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. కర్ణాటక కేంద్రంగా నాసిరకం విత్తనాల దందా బీబాపూర్, చొంచోలి హైవేల మీదుగా జిల్లాలోకి రవాణా బ్రాండెడ్ కంపెనీల కవర్లలో నింపి విక్రయం ఏటా పట్టుబడుతున్నా వెనక్కి తగ్గని అక్రమార్కులు ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఏజెంట్ల నియామకం రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు కఠిన చర్యలు తీసుకుంటాం నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపిస్తాం. నకిలీపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. సమాజానికి హాని కలిగించే కల్తీ, నకిలీ సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్రెడ్డి, సీఐ, కొడంగల్ -
ఎరువుల కొరత రావొద్దు
ఉక్కపోత.. కొడదాం ఈత వేసవితాపం నుంచి సేద తీరేందుకు విద్యార్థులు, చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.● అర్హులందరికీ పంట రుణాలివ్వాలి ● కలెక్టర్ దీపక్ తివారి బంట్వారం: ఖరీఫ్ సాగుకు ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం, రేషన్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రైతు వేదిక, కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పంట రుణాలు, ఎరువుల పంపిణీ గురించి సొసైటీ సీఈఓ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలం నాటికి ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ముందస్తు ప్రణాళికతో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు రేషన్ దుకాణాల్లో స్టాక్ వివరాలు, పంపిణీ చేసిన లబ్ధిదారుల సంఖ్యను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేజీబీవీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దే ఉండాలని ఎండలో తిరగరాదని జాగ్రత్తలు చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, డీఏఓ రాజరత్నం, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ విజయ్కుమార్, డీటీ మహేశ్, ఏఓ శ్రావ్య, సొసైటీ సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మండుటెండల్లో పనులు
కొడంగల్ రూరల్: మండుటెండలో చెమటోడ్చుతున్న ఉపాధికూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ ఉపాధి హామీ కూలీలకు నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాలలో టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. ఇవేమీ లేక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని ఉడిమేశ్వరం శివారులో కొనుసాగుతున్న ఉపాధి పనుల్లో ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది అందించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను సర్పంచ్ కె.శ్రీనివాస్ ఉపాధికూలీలకు అందిస్తూ జాగ్రత్తలను చెబుతున్నారు. మండల పరిధిలోని అప్పాయిపల్లి శివారులో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల్లో చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఎండలు మండుతున్న క్రమంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కూలీలు కలిసి కానుగ పొరకతో పని ప్రదేశంలో పందిరి మాదిరి ఏర్పాటు చేసుకుని సేదతీరుతున్నామన్నారు. ఇటీవల సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య, వైద్య సిబ్బంది అందించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉపాధికూలీలకు అందించారు. ఫొటో క్యాప్చర్తో ఇబ్బంది ఉపాధి పనుల్లో ఇటీవల ఉదయం, సాయంత్రం పని ప్రదేశంలో ఫొటో క్యాప్చర్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఫొటో అప్లోడ్ సమయంలో నెట్వర్క్ పనిచేయకున్నా, సర్వర్ బిజీగా ఉన్నా ఉపాధికూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన ఫోన్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – జనార్దన్, ఎఫ్ఏ, ఉడిమేశ్వరం -
టీబీ నిర్మూలనకు కంకణం
కొడంగల్ రూరల్: టీబీ ముక్త్ అభియాన్ను సద్వినియోగం చేసుకోవాలని టీబీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఉచిత ఛాతి ఎక్స్ రే క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోగులకు పలు సూచనలు అందించారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగానే హై రిస్క్ గ్రామాలను ఎంపిక చేసి ఎక్స్రే క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి వైద్యుల సూచనలు పాటిస్తే నయమవుతుందని తెలిపారు. 126 మందికి ఎక్స్ రే తీశారని ఇందులో 8 మందిని టీబీ అనుమానితులుగా గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పౌష్టికాహారం తీసుకుంటూ మందులను వాడటంతో వ్యాధిని నిర్మూలించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సాకేత్, అంగడిరాయిచూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుస్రా ఫాతిమా, టీబీ సూపర్ వైజర్ రాహత్అలీ, ఎంఎల్హెచ్పీ డాక్టర్ అమృత, ఎక్స్ రే టెక్నీషియన్ రవి, హెల్త్ అసిస్టెంట్ మధుసూదన్రెడ్డి, ఏఎన్ఎం చంద్రకళ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ జిల్లా అధికారి రవీంద్రయాదవ్ -
రూ.10 లక్షల విలువైన గంజాయి సీజ్
● ముగ్గురు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అనంతగిరి: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పట్టుకుని 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. వివరాలు.. ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని పర్బనీకి గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఒడిశా నుంచి ఓ వ్యక్తి 25 కేజీల గంజాయిని తీసుకువచ్చి ముగ్గురు వ్యక్తులకు ఇచ్చారు. వారు అనకాపల్లి నుంచి గుంటూర్కు వచ్చారు. అనంతరం పల్నాడ్ ఎక్స్ప్రెస్ ఎక్కి వికారాబాద్ స్టేషన్లో దిగారు. అక్కడ బెంగళూరు–నాందేడ్ రైలు కోసం వేచియుండగా పోలీసులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి 12 బ్యాగుల్లో ఉన్న 25.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారురూ.10 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఏఈఎస్ జీవన్కిరణ్, బాలరాజు, శ్రీనివాస్, వెంకటేశ్, రాకేశ్, శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పోలీసు ఫైరింగ్ శిక్షణ
అనంతగిరి: వికారాబాద్ మున్సిపాలిటీ కొత్రెపల్లి వార్డు శివారులోని ఓపెన్ జైలు ప్రాంతంలో ఈ నెల 22 నుంచి నెల రోజుల పాటు పోలీసు ఫైరింగ్ శిక్షణ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5నుంచి రాత్రి 9గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. భద్రతా దృష్ట్యా పట్టణ, సమీప గ్రామ ప్రజలు, పశువుల కాపరులు ఎవరు ఆ పరిసరాల్లోకి వెళ్లకూడదని అధికారుల హెచ్చరిక జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. నేరాల అదుపునకు తనిఖీలు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు టౌన్: నేరాలను అదుపు చేసేందుకు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆయన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశానుసారం తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించేందుకు పాపులాన్ డివైస్ను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనపడితే ప్రజలు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్ఐలు అంబర్య, సాజిద్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం అనంతగిరి: జిల్లా పోలీసు కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎస్పీ స్నేహ మెహ్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో సొసైటీ సాధించిన పురోగతి, సిబ్బందికి అందించిన రుణ సదుపాయాలను, ఇతర సంక్షేమ ఫలాలను కార్యనిర్వాహక సభ్యులు ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఆమె సొసైటీ అభ్యున్నతికి చేపడుతున్న పనులను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐ నాగరాజు, జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సొసైటీ డైరక్టర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి పరిగి: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పరిగి ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన రాధిక అలియాస్ జయలలిత(24), దస్తయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. కుటుంబ గొడవల కారణంగా ఈనెల 15న రాధిక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాధిక తల్లి మొగులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
రోజురోజుకూ తగ్గుతున్న కూలీలు
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వ ర్యంలో కొనసాగుతు న్న ఉపాఽధిహామీ పథ కం నిబంధనల కొర్రీ తో వేసవి ఎండల్లో కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపించటం లేదు. మండలంలో ప్రస్తుతం రెండు వేలకుపైగా జాబ్కార్డులు ఉంటే 220 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పనులు చేసేందుకు సైతం ముందుకు రావటంలేదు. వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో కూలీలకు పనిచేసే చోట తాగునీటి వసతి, టెంట్లు, పనిముట్లు అందించాలనే నిబంధనలు ఉన్నా కొన్నేళ్లుగా పట్టించుకోవటం లేదని కూలీలు వాపోతున్నారు. ఉపాధి పనుల నిర్వహణ ప్రస్తుతం పంచాయతీలకు అదనపు భారంగా మారుతుంది. కూలీలకు మూడు నెలల నుంచి డబ్బులు సైతం రావటం లేదని వాపోతున్నారు. -
గ్రామాల్లో డ్రోన్ల కలకలం!
భయాందోళనలో ప్రజలు దోమ: గ్రామాల్లో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిత్యం ఐదు నుంచి ఆరు డ్రోన్లు తిరుగుతున్నట్లు మోత్కూర్, దాదాపూర్ గ్రామాల ప్రజలు తెలిపారు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సోమవారం మండలంలోని మోత్కూర్, దాదాపూర్ గ్రామాల్లో అర్ధరాత్రి డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అట్టి వీడియోలను కొందరు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పటికే బట్లచందారం, అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం అధికారులు భూములు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్లు తిరుగుతున్నాయా అనే సందేహం వస్తోందని ప్రజలు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు డ్రోన్ల గురించి తెలియజేయాలని మోత్కూర్, దాదాపూర్ ప్రజలు కోరారు. -
నీడ లేదు.. నీళ్లు లేవు
● ఇబ్బంది పడుతున్న ఉపాధి కూలీలు● కొత్త నిబంధనలతో పనులకు దూరమవుతున్న పలువురు కార్మికులు భగభగ మండే భనుడి ప్రతాపాన్ని తట్టుకొని శ్రమించినా డబ్బులు సకాలంలో అందడం లేదని జాతీయ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదారు వారాలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందని మంగళవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేటతెల్లం అయింది. పని ప్రదేశంలో నీడ కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యం, పరికరాలు, మెడికల్ కిట్ల కల్పించాల్సిఉండగా అంతంతమాత్రంగానే యంత్రాంగం చర్యలు చేపట్టింది. హస్నాబాద్లో ఎండలోనే పనిచేస్తున్ను ఉపాధి కూలీలు -
వెల్డన్ మహిపాల్రెడ్డి
● ఎంఈఓను సన్మానించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ యాలాల: ఇటీవల మండల స్థాయిలో ఐదో తరగతి విద్యార్థులకు ఎంఈఓ మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ సెర్చ్ కార్యక్రమం అభినందనీయమని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఎంఈఓని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 53 ప్రాథమిక పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి టాలెంట్ టెస్ట్లను జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా పరిశీలిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎంఈఓ మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని పాఠశాలల సిబ్బంది, ఎమ్మార్సీ సిబ్బంది చేయూతతో టాలెంట్ సెర్చ్ కార్యక్రమం విజయవంతం చేశామన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ సిబ్బంది మధుసూదన్రెడ్డి, యాసిన్, మండల ఆర్పీ మురహరి తదితరులు ఉన్నారు. -
దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
తాండూరు టౌన్: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తాండూరు, యాలాల మండలాల కార్యకర్తల కోసం పండిట్ దీన్దయాళ్ ప్రశిక్షణా అభియాన్ రెండోరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచ పరివర్తనలు అనే ముఖ్యాంశాలపై కార్యకర్తలకు పలువురు సమగ్ర అవగాహన కల్పించారన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేయాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. కార్యక్రమంలో బాలేశ్వర్ గుప్తా, మనోహర్ రావు, కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, భద్రేశ్వర్, సందీప్, శ్రీకాంత్, పలు మండలాల అధ్యక్షులు, సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడురమేష్ కుమార్ -
పనిప్రదేశాల్లో ఇక్కట్లు
కొందుర్గు: ఉపాధిహామీ కూలీలు మండుటెండలో కూలిపనులు చేస్తున్నారు. మండలంలోని 22 గ్రామపంచాయతీలకు గాను 625 మంది కూలీలు పనులకు వస్తున్నారని ఏపీఓ నర్సింగ్రావు తెలిపారు. అయితే రేగడిచిల్కమర్రి, బైరంపల్లి, ఆగిర్యాల గ్రామాల్లో టెంట్లు లేవు. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో 623 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. చాలా గ్రామాల్లో కూలీలు సేదతీర్చుకోవడానికి టెంట్లు లేవు. ఇక తాగడానికి నీటివసతి, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. దీంతో కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.


