breaking news
Kakinada
-
రత్నగిరిపై కొనసాగుతున్న రద్దీ
అన్నవరం: రత్నగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది భక్తులు ఆదివారం సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. క్యూ లైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తుల తో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామి ని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడికి, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటలకు టేకు రథంపై ఊరేగించారు. ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం -
రైతుకు విపత్తి
ఎప్పుడూ ఇంత దారుణంగా నష్టపోలేదు పదేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ప్లాటినం రకం విత్తనాలు ఒక ఎకరం, మరో రకం విత్తనాలు మరో ఎకరంలో సాగు చేశాను. ప్లాటినం రకం విత్తనాలు వేసిన చేలో మొక్క లు చనిపోతున్నాయి. మొక్క ఎర్రబారి ఎండిపోతోంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారు తప్ప ఏ సమాధానమూ చెప్పలేదు. మాకు విత్తనాలు అమ్మిన దుకాణదారు కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. – ధూళిపూడి వెంకటరావు, రైతు, చేబ్రోలు పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రైతులు కష్టాలకు గురవుతూనే ఉన్నారు. చిన్న విషయానికి కూడా జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చేసి హడావుడి చేసే ఈ నియోజకవర్గంలో ఏడాదిన్నర నుంచి రైతులు అనేక సందర్భాల్లో ఆందోళన బాట పడుతున్న పరిస్థితులే నెలకొంటున్నాయి. గతంలో ధాన్యం కొనుగోళ్లు, వరద నష్టం పంపిణీ.. కొద్ది రోజుల కిందట యూరియా అందక అన్నదాతలు ఆందోళనలు చేశారు. ఈ కోవలోనే తాజాగా నకిలీ విత్తనాలపై పత్తి రైతులు రోడ్డెక్కారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పత్తి సాగు అధికంగా జరుగుతూంటుంది. ముఖ్యంగా గొల్లప్రోలు మండల రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇక్కడి రైతులు వేదా కంపెనీ ఉత్పత్తి చేసిన ప్లాటినం రకం విత్తనాలు కొనుగోలు చేశారు. పంట వేసి రెండు నెలలు గడిచింది. అయినప్పటికీ దిగుబడి రాకపోగా, మొక్కలు వాటంతట అవే ఎండిపోవడం ప్రారంభమైంది. ఎందుకిలా జరుగుతోందో వారికి అర్థం కాలేదు. రకరకాల పురుగు మందులు వాడి చూశారు. అయినా ప్రయోజనం లేదు. విత్తనాలు కొన్న దుకాణదారుకు ఈ సమస్య చెప్తే ఎగతాళిగా మాట్లాడారు. సమస్యను విత్తన కంపెనీ దృష్టికి తీసుకుని వెళ్లడంతో దాని ప్రతినిధులు వచ్చి పంటను చూసి వెళ్లారు. ఆ తరువాత ఎటువంటి స్పందనా లేదు. తమకు జరిగిన నష్టంపై దుకాణదారు, కంపెనీ ప్రతినిధులు కనీసం ఎటువంటి సమాధానం చెప్పకపోవడంపై మండిపడిన రైతులు చేబ్రోలులోని విత్తనాల షాపు ముందు శనివారం రాత్రి ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో ప్లాటినం రకం పత్తి విత్తనాలను రైతులు వేసినట్లు సమాచారం. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలు, చెందుర్తి, దుర్గాడ, తాటిపర్తి తదితర ప్రాంతాల్లోనే సుమారు 2 వేల ఎకరాల్లో ఈ రకం విత్తనాలు సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఒక చేబ్రోలులోనే 400 ఎకరాల్లో ఈ విత్తనం వేశారు. ఎకరానికి సుమారు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. మొత్తం చేనంతా నాశనమైందని రైతులు వాపోతున్నారు. కేవలం ప్లాటినం రకం విత్తనాలు సాగు చేసిన పంట మాత్రమే దెబ్బ తినడంతో ఆ విత్తనాలు నాసిరకం లేదా నకిలీవి అయి ఉంటాయని ఆరోపిస్తున్నారు. ఎకరానికి రూ.80 వేల నష్టం కంపెనీ ప్రతినిధితో రైతులు ఫోనులో మాట్లాడితే.. ‘కావలిస్తే సైంటిస్టుల్ని తెచ్చుకోండి.. మీకు నచ్చింది చేసుకోండి’ అని చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా డీలర్లు, దుకాణం యజమానులు రెండు నెలలుగా పట్టించుకోలేదు. దీంతో, ఆందోళనకు దిగాల్సి వచ్చింది. రెండెకరాల్లో సాగు చేసేందుకు ప్లాటినం రకం పత్తి విత్తనాలను చేబ్రోలు సాయికృష్ణ ఏజెన్సీస్లో కొన్నాను. కాయలు కాసే దశలో పత్తి మొక్కలు ఎక్కడికక్కడే చనిపోవడం మొదలైంది. ఎక్కడైనా పత్తికాయ పగిలితే నల్లబారిపోతోంది. కాయ రాలిపోతోంది. మొక్క గిడసబారి గుడ్డి పత్తిలా పగులుతోంది. చివరకు మొక్క చనిపోతోంది. గత సంవత్సరం ఎకరం పత్తి సాగు చేస్తే రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ లాభం వచ్చింది. ఇప్పుడు మేం పెట్టిన పెట్టుబడి రూ.80 వేలు వచ్చే పరిస్థితి లేదు. తీవ్ర నష్టాల పాలయ్యాం. విత్తనాలమ్మిన దుకాణదారు తనకు సంబంధం లేదని చెబుతున్నారు. – ఓరుగంటి సూర్యచంద్రశేఖర్, పత్తి రైతు, చేబ్రోలు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. సుమారు రూ.2 లక్షలు పైగా పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకూ కేజీ పత్తి కూడా చేతికి రాలేదు. చెట్లన్నీ చనిపోతున్నాయి. కాయ పగలడం లేదు. విత్తనం గురించి దుకాణదారుకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా తిరుగుతున్నాం. కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ప్లాటినం రకం విత్తనాలు సాగు చేసిన వారి పంటే పూర్తిగా దెబ్బ తింది. మిగిలిన రకాలు వేసిన వారి పంటలు బాగానే ఉన్నాయి. అందువల్లనే విత్తనాల్లో తేడా ఉందని చెబుతున్నాం. దీనిపై అధికారులు విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుని, రైతులను ఆదుకోవాలి. – ధూళిపూడి గనికిరాజు, రైతు, చేబ్రోలు సరిగ్గా పండకుండానే ఎండిపోయిన పత్తి మొక్క ఫ పవన్ ఇలాకాలో రైతుకు మరో విపత్తు ఫ నిండా ముంచేసిన నకిలీ పత్తి విత్తనాలు ఫ 2 వేల ఎకరాల్లో పంట నష్టం ఫ రూ.లక్షల్లో నష్టపోయిన రైతులు ఫ పట్టించుకోని విత్తన కంపెనీ, అధికారులు చర్యలు తీసుకుంటాం ప్లాటినం రకం విత్తనాలు దెబ్బ తీసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మాకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటాం. అవసమైతే శాస్త్రవేత్తలను రప్పించి, పంట నష్టం ఎందువల్ల జరిగిందనే దానిపై పరిశీలన చేయిస్తాం. విత్తనాల వల్లే ఇలా జరిగిందా లేక ఏదైనా తెగులు సోకిందా అనే అంశాలను కూడా పూర్తిగా పరిశీలించి నిర్ధారించాల్సి ఉంది. – సత్యనారాయణ, వ్యవసాయ అధికారి, గొల్లప్రోలు -
కిటకిటలాడిన లోవ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చిన 10 వేల మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,77,700, పూజా టికెట్లకు రూ.1,15,860, తలనీలాలకు రూ.11,200, వా హన పూజలకు రూ.5,340, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.55,412, విరాళాలు రూ.77,780 కలిపి మొత్తం రూ.4,43,292 ఆదాయం సమకూరిందని వివరించారు. ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు ఏలేశ్వరం: పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయంలోకి ఆదివారం 1,616 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.46 మీటర్లు కాగా, ప్రస్తుతం 84.37 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గానూ నీటి నిల్వలు 19.81 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 900, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు. నేడు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ ఏడాది మన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 52 అవార్డులు ప్రకటించిందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ గోదావరి క్షేత్రంలో అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అవార్డులు పొందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
ఆయనొస్తేనే చేపల వేట
కొత్తపల్లి: తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల వలన సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించకపోవడంతో మండలంలోని మత్స్యకారులు ఇటీవల కుటుంబ సమేతంగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి, తమకు న్యాయం చేయాలని ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి త్వరలోనే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని అప్పట్లో జిల్లా కలెక్టర్ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఆందోళన చేపట్టినప్పటి నుంచీ ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేటకు చెందిన మత్స్యకారులు పవన్ వచ్చి హామీ ఇచ్చేంత వరకూ వేటకు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రామన్నపాలెం, కోనపాపపేట తీర ప్రాంతంలో బోట్లకు లంగరు వేశారు. మరోవైపు రొయ్యల శుద్ధి పరిశ్రమలకు వెళ్లే మత్స్యకార మహిళలు కూలి పనులు కూడా మానుకున్నారు. ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేటలో చేపలను విక్రయించే అంగళ్లు సైతం నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. తమ సూచనలు పాటించకుండా వేటకు వెళ్లే వారికి జరిమానా విధిస్తామని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు. తమ ఓట్లు వేయించుకుని గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ కల్యాణ్ తక్షణం ఉప్పాడ వచ్చి, మత్స్యకారులతో సమావేశం నిర్వహించి, సమస్య పరిష్కరించేంత వరకూ వేటకు వెళ్లబోమని మత్స్యకారులు చెబుతున్నారు. న్యాయం చేయకపోతే ఈ నెల 13 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మత్స్యకార గ్రామాల్లో నాయకులు సమావేశమై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. ఫ పవన్ రావాల్సిందే.. ఫ మా సమస్యలు పరిష్కరించాల్సిందే.. ఫ మత్స్యకారుల స్పష్టీకరణ ఫ ఉప్పుటేరులో నిలిచిపోయిన బోట్లు ఫ 13 నుంచి ఉద్యమం ఉధృతం చేసేందుకు అడుగులు -
సివిల్ పెన్షనర్ల నూతన కార్యవర్గం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కాకినాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్గా పి.మహేశ్వరరావు, కన్వీనర్గా తురగా సూర్యారావు, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శిగా డీఎల్ఎన్ శాస్త్రి, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు అందించాలని డిమాండ్ చేశారు. వాలిడేషన్ చట్టం రద్దుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే రాజ్యసభ, ఎంపీలను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. -
నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..
● వాడపల్లి క్షేత్రంలో భక్తజన ప్రవాహం ● ఒక్క రోజులోనే దేవస్థానానికి రూ.53.41 లక్షల ఆదాయం కొత్తపేట: గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. శ్రీనివాసా... శ్రీ పురుషోత్తమా.. అంటూ వాడపల్లి వాసుని స్మరిస్తూ భక్తులు తన్మయులయ్యారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన చేరుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులతో లైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను చేరవేశారు. విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి సాయంత్రం 7 గంటల సమయానికి రూ.53,41,146 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తునికి చెందిన నల్లమిల్లి గోవింద్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. అలాగే, పిఠాపురానికి చెందిన అనిశెట్టి కాశీ విశ్వనాథరెడ్డిని పార్టీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ కార్యదర్శిగా నియమించారు. జల్ జీవన్ మిషన్పై రేపటి నుంచి శిక్షణ సామర్లకోట: జల్జీవన్ మిషన్ కార్యక్రమంపై 11 జిల్లాల్లోని ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 402 మందికి ఈ నెల 17 వరకూ బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతి బ్యాచ్కు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలందరికి జల భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల శిక్షణలో భాగంగా జల్ జీవన్ మిషన్ అమలు చేస్తున్న గ్రామాల సందర్శన కూడా ఉంటుందని ప్రసాదరావు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు సహాయం పంపిణీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. జిల్లాలోని 12,966 మంది డ్రైవర్ల ఖాతాల్లో శనివారం రూ.19.44 కోట్లు జమ చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, అర్హులైన వారికి ఈ పథకం అందకపోతే సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారి దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి, డబ్బులు జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొన్నారు. నేడు పారా స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ఆదివారం పారా స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల పారా స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి.రామస్వామి, సాఖీర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఏలూరులో జరగనున్న 7వ రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ సందర్భంగా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 9 గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్దకు హాజరు కావాలని, వివరాలకు 93901 31777 నంబరులో సంప్రదించాలని సూచించారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వివిధ కోర్టుల్లోని కేసులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జె.వెంకటరావు అన్నారు. పీపీలు, ఏపీపీలతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో వివిధ కేసుల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ఎన్ని కేసులు వేశారు.. ఎన్నింటికి తీర్పులు వెలువడ్డాయి.. పెండింగ్ కేసులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం పిఠాపురం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పద్ధతిలో పని చేయడానికి కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కావాలని ప్రిన్సిపాల్ పి.సుభాషిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. -
అన్నవరం.. భక్తజనసంద్రం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన అన్నవరం దివ్యక్షేత్రం శనివారం భక్తజనసంద్రాన్ని తలపించింది. వేలాదిగా వచ్చిన భక్తులకుతోడు వివాహ బృందాల వారు, నవ దంపతులు, వారి బంధువులు తరలి రావడంతో రత్నగిరిపై తెల్లవారుజాము నుంచే తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 60 వేల మంది భక్తులు సత్యదేవుడిని దర్శించుకున్నారు. సత్యదేవుని సర్వ దర్శనానికి మూడు గంటలు, రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి రెండు గంటల చొప్పున సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 5 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 8 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. భక్తులకు ఇబ్బందులు ఫ ఉదయం నుంచే వివిధ వాహనాల్లో వేలాదిగా భక్తులు వచ్చారు. రత్నగిరిపై పార్కింగ్కు చోటు చాలకపోవడంతో ఆ వాహనాలను సత్యగిరికి మళ్లించారు. దీంతో, భక్తులు అక్కడి నుంచి ఆలయానికి నడిచి రావాల్సి వచ్చింది. ఉచిత బస్సు ఉన్నప్పటికీ అందులో 50 మందికి మించి ఎక్కే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు. ఫ అంతరాలయం టికెట్టు తీసుకున్నప్పటికీ వెలుపల నుంచే సత్యదేవుని దర్శనం కల్పించడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి రావడంతో వృద్ధులు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. పలుమార్లు తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో క్యూ లైన్లను నియంత్రించే వారే లేకుండా పోయారు. ఫ ప్రత్యేక దర్శనం చేయిస్తామంటూ పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్లు భక్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. వారిని దేవస్థానం ఉద్యోగుల సహాయంతో ఆలయానికి తీసుకువెళ్లారు. దీనిని అడ్డుకునే వారే లేకపోవడంతో ఇతర భక్తులు ఇబ్బంది పడ్డారు. ·˘ సత్యదేవుని దర్శించిన 60 వేల మంది భక్తులు ·˘ రూ.60 లక్షల ఆదాయం -
కడుపుకొట్టి.. బుజ్జగింపులా..?
సాక్షి, అమలాపురం/పి.గన్నవరం: ఓవైపు ఉచిత బస్సు పేరుతో తమ పొట్ట కొట్టారనే ఆగ్రహం.. దీనికి తోడు ఇస్తానన్న రూ.15 వేల సాయానికి నిబంధనల కొర్రీలు.. ఇలా గిల్లి జోల పాడినట్టుగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. టీడీపీ శనివారం నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రసాభాసగా మారింది. ‘గోరంత సాయానికి.. కొండంత హడావుడి’ అనే తీరులో ప్రచారార్భాటం చేయాలనుకున్న నేతల వ్యూహం బెడిసికొట్టింది. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఎదురు తిరిగారు. కూటమి సర్కారు తీరుపై అసంతృప్తితో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆటో డ్రైవర్ల సేవలో ర్యాలీకి వంద ఆటోలు కూడా రాలేదు. వచ్చిన వారిలోనూ చాలా మంది కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఇతర టీడీపీ నేతలు వచ్చిన సమయంలో కొంతమంది చోటామోటా నాయకులు ఆటోల ముందు టీడీపీ జెండాలతో ఫొటోలు దిగేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆటో డ్రైవర్లు అభ్యంతరం చెప్పడంతో తమ్ముళ్లు కంగుతిన్నారు. టీడీపీ, జనసేన బాహాబాహీ నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటు, పరుష పదజాలతో తిట్ల దండకం అందుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కోసం రవాణా శాఖ తయారు చేసిన ఫ్లెక్సీపై, ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసే నమూనా చెక్కుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసేన నేతలు విరుచుకుపడ్డారు. జనసేనకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే అధికారులపై మండిపడ్డారు. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. తాము నిర్వహించే కార్యక్రమాల్లో చంద్రబాబు ఫొటో వేస్తున్నామని, టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఫొటో వేయ డం లేదని ప్రశ్నించారు. అధికారులు సర్ది చెబుతున్న సమయంలో టీడీపీకి చెందిన మద్దాల సుబ్రహ్మణేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు మండిపడ్డారు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఇతర టీడీపీ నాయకుల పైకి దూసుకుపోయారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. ఫ బెడిసికొట్టిన ‘ఆటో డ్రైవర్ సేవలో..’ ఫ ఉచిత బస్సు నేపథ్యంలో మొక్కుబడిగా పాల్గొన్న ఆటో డ్రైవర్లు ఫ పసుపు జెండాలతో ఫొటోలకు అంగీకరించని వైనం -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,49,570, అన్నదాన విరాళాలు రూ.51,217, కేశఖండన ద్వారా రూ.7,480, తులాభారం ద్వారా రూ.700, ప్రసాదం విక్రయాలకు రూ.18,600 కలిపి మొత్తం రూ.2,27,627 ఆదాయం సమకూరిందని వివరించారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి
తుని: అన్నవరం రైల్వేస్టేషన్ ట్రాక్పై గుర్తుతెలియని రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన గురువారం జరిగిందని సామర్లకోట రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ పి.వాసు తెలిపారు. మృతుని వద్ద తుని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్రావుకు దొరికిన ఆధారాలను బట్టి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హోనార్ గ్రామానికి చెందిన సులం పాన్(25)గా తెలిసింది. మృతుడికి తండ్రి మంగళ్సింగ్ పాన్, తల్లి, ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి ఉన్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కొంతకాలం నుంచి మానసికంగా మృతుడు ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. సుమారు నెలక్రితం చేపల చెరువు వద్ద ప్యాకింగ్ నిమిత్తం వచ్చినట్టు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
సత్యదేవుని సన్నిధిన ధ్యాన మందిరం
అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో చైన్నెకి చెందిన దాత గురుపరన్, శాంతి దంపతులు రూ.27 లక్షల వ్యయంతో ధ్యాన మందిరం నిర్మిస్తున్నారు. దీనికి విజయ దశమి పర్వదినమైన గురువారం నాడు వారు శంకుస్థాపన చేశారు. సత్యగిరిపై ఆగమ పాఠశాల సమీపాన ఈ ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఎనిమిది నెలల్లో నిర్మాణం పూర్తి చేసి, దీనిని భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. శంకుస్థాపనలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ కూడా పాల్గొన్నారు. దేవస్థానంలో వివిధ పథకాలకు గురుపరన్, శాంతి దంపతులు గతంలో రూ.25 లక్షల మేర విరాళాలు అందజేశారు. -
ఉమ్మడి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా గణేశ్
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా అడారి గణేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పుటి వరకు భీమవరం జిల్లా ట్రెజరీ శాఖలో అసెస్టెంట్ డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తూ పదోన్నతిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా గణేశ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, ఉద్యోగులు కలిశారు. -
ప్రాణ సంకటంగా బాణసంచా
రాయవరం: దీపావళి పండగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. ఈ నెల 21న దీపావళి పర్వదినం జరుపుకొనేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. అయితే జీవితంలో వెలుగులు నింపాల్సిన దీపావళి పండగ..కొందరి స్వార్థంతో చీకట్లును తెస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ, నిల్వలు చేస్తుండడంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండగ అంటేనే బాణసంచా కాల్చడం. లైసెన్స్ పొందినవారు బాణసంచా తయీరీలో నిమగ్నమయ్యారు. అధికారికంగా బాణసంచా తయారీ చేసే వారికంటే అనధికారికంగా చేసేవారు ఎక్కువ. గతంలో అధికారికంగా బాణసంచా తయారీ చేసే కేంద్రాలతో పాటు అనధికారికంగా బాణసంచా తయారీ చేసే చోట కూడా ప్రమాదాలు సంభవించి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. 45 వరకు బాణసంచా తయారీ కేంద్రాలు దీపావళికే కాక పలు సందర్భాల కోసం బాణసంచా తయారు చేస్తుంటారు. ప్రస్తుతం దీపావళికి బాణసంచా తయారు చేసే పనిలో జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అతి పెద్ద ఘటన అదే బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామ, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన జిల్లాలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. గతేడాది మండపేట మండలం ఏడిదలో దీపావళి ముందు రోజు జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో తాము నిర్వహిస్తున్న కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అనధికార నిల్వలతోనే.. బాణసంచా తయారీకి పేరొందిన తమిళనాడులోని శివకాశి నుంచే రాష్ట్రానికి ఎక్కువగా సరకు దిగుమతి అవుతుంది. చైనా బాణసంచా కూడా అధికంగానే దిగుమతి చేసుకుంటున్నారు. పలువురు వ్యాపారులు దీపావళికి బాణసంచాను దిగుమతి చేసుకుని నిల్వలు పెట్టుకుంటారు. నిబంధనలు అతిక్రమించి గోడౌన్లలో నిల్వలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా గొడౌన్ ఏర్పాటు చేయాలంటే ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. జనావాస ప్రాంతంలో బాణసంచా నిల్వలు ఏర్పాటు చేయరాదు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ, గ్రామ శివారు ప్రాంతాల్లోనే బాణసంచా కేంద్రాలను నెలకొల్పాలి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేమీ పాటించకుండా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది లైసెన్స్లు పొందకుండానే జనావాసాల మధ్య అవగాహన లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనధికార తయారీదారులతోనే సమస్య జిల్లాలో లైసెన్స్ పొందిన బాణసంచా తయారీదారులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని పలువురు అనధికారికంగా జనావాసాల మధ్య బాణసంచా తయారు చేయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్, ఫైర్ అధికారులు వచ్చి తరచుగా తనిఖీలు చేపడుతున్నారు. – వి.సత్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ యజమానుల సంఘం, రాయవరంరాజీపడే ప్రసక్తి లేదు బాణసంచా తయారీ కేంద్రాలు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడే రెన్యువల్ లైసెన్స్లకు సిఫారసు చేస్తాం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అధికారిక తయారీ కేంద్రాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనధికారికంగా తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం బాణసంచా తయారీదారులు పాటించాల్సిన నిబంధనలు బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల ఖాళీ స్థలం ఉంచాలి. అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అనువుగా నాలుగువైపులా 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. గ్రామ పంచాయతీ, పట్టణాలకు 1.5 కిలోమీటర్లలోపు మందుగుండు సామగ్రి తయారు చేయకూడదు. బాణసంచా తయారుచేసే ప్రదేశాల్లో అగ్నినిరోధక పరికరాలు ఉండాలి. షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటిరీయల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధంచగలగాలి. షెడ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గుమ్మాలు కనీసం 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. తయారీ కేంద్రంలో ఆటోమెటిక్ వెంటిలేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 18 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను బాణసంచా తయారీకి ఉపయోగించకూడదు. అక్కడ పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైర్ఫైటింగ్ కోర్సులో ప్రాథమిక శిక్షణ తీసుకుని ఉండాలి. తయారీ కేంద్రం విస్తీర్ణాన్ని బట్టి 5 కిలోల సామర్థ్యం ఉన్న డ్రై పౌడర్ ఎస్టింగ్విషర్ (అగ్నిమాపక సిలిండర్)లు నాలుగు సిద్ధంగా ఉండాలి. ఐదు ట్రక్కుల పొడి ఇసుకను కూడా ఆ ఆవరణలో సిద్ధంగా ఉంచాలి. ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి అవసరమైన నీటి కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మంటలు, అగ్నిని సష్టించే ద్రవ పదార్థాలు (పెట్రోలు, డీజిల్ వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచకూడదు. తయారీ కేంద్రంలో విద్యుద్దీకరణలోను జాగ్రత్తలు పాటించాలి. వైర్లను బహిరంగంగా ఉంచకూడదు. వైర్ల జాయింట్లు ఎక్కడా ఉండకూడదు. తయారీ కేంద్రంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచాలి. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా చూడాలి. అత్యవసర సమయంలో అలారం మోగించేందుకు, అవసరమైతే లోపలి వారిని బయటకు తీసుకువచ్చేందుకు తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. అగ్నిప్రమాద సమాచారాన్ని అత్యవసరంగా తెలియజేసేందుకు ఫోన్లు అందుబాటులో ఉంచాలి. మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఈ నిబంధనలను పాటించకుంటే లైసెన్సు రద్దు అవుతుంది. ఎక్స్ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్ఫారం తగినంత దూరంలో ఉండాలి. తయారీ కేంద్రాలపై నిఘా అవసరం ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాలి దీపావళి వేళ అప్రమత్తతే రక్ష ప్రమాదాల్లో కొన్ని.. తేదీ ఊరు మృతులు 2012 డిసెంబర్ 30 వి.సావరం (రాయవరం) 3 2014 అక్టోబర్ 22 వాకతిప్ప(యు.కొత్తపల్లి) 18 2015 జూలై 22 పలివెల (కొత్తపేట మండలం) 5 2025 సెప్టెంబర్ 30 విలస (అయినవిల్లి మండలం) 2 -
వృద్ధుడి గల్లంతు
నిడదవోలు రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలోకి జారిపడి వృద్ధుడు గల్లంతైనట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు శుక్రవారం తెలిపారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఉల్లూరి చిరంజీవి (64) ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు గోదావరి ఒడ్డున బహి ర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. చిరంజీవి అల్లుడు ప్రత్తిపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి గోదావరిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ జగన్నాథరావు శుక్రవారం పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్ర గాయాలు ● మోటార్ సైకిల్ను ఢీకొట్టిన కారు పెరవలి: విజయ దశమి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద మోటార్ సైకిల్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం రాత్రి 9.20 గంటలకు నల్లాకులవారిపాలెం వద్ద రోడ్డు కట్టింగ్ను దాటే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మోటార్ సైకిల్పై ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో పాటు వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో ఇంజేటి ఇస్సాకు (49)పై కారు వెళ్లటంతో తీవ్ర గాయాలు అయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ మృతి చెందాడు. కంతేటి పోసయ్య (29) కారు ఢీకొట్టిన వేగానికి గాలిలోకి ఎగిరి రోడ్డు మధ్యలో ఉండే డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాతు వెంకటేశ్వరరావు ప్రమాద సమయంలో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై కొట్టుకుంటుండగా స్థానికులు 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు అక్కడ నుంచి విజయవాడ, అక్కడ నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వెనక్కి వెళ్లిపోదామనుకోగా... పండగ రోజు కావటంతో స్నేహితులు ముగ్గురు కలసి ఖండవల్లి నుంచి తణుకు వెళ్లటానికి మోటార్ సైకిల్పై వస్తుండగా నల్లాకులవారిపాలెం వచ్చేటప్పటికి తిరిగి ఖండవల్లి వెళ్లిపోదామని ఉద్దేశంతో మోటార్ సైకిల్ టర్నింగ్ తిప్పటంతో అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వస్తున్న కారు వేగంగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దీనికితో కారు ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నీటి సంద్రమైన ఖండవల్లి ప్రమాదం జరిగిందని తెలిసిన ఖండవల్లిలో మూడు కుంటుంబాలు కన్నీటి పర్యతం అయ్యాయి. పండగ రోజు ఎంతో ఆనందంగా గడిపిన ఈ ముగ్గురు స్నేహితులు రాత్రి అయ్యే సమయానికి మృతి చెందటంతో ఆ కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. గ్రామస్తులు ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ కనిపించిన భయానక దృశ్యాలను చూచి కన్నీరు పెట్టుకున్నారు. మృతుడు పోసియ్య భార్య కనకదుర్గ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరావు తెలిపారు. -
అంబరాన్నంటిన దసరా సంబరాలు
● గగుర్పాటు కలిగించిన చెడీ తాలింఖానా విన్యాసాలు ● కత్తులు తిప్పిన ప్రజాప్రతినిధులు అమలాపురం టౌన్: విజయ దశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన అమలాపురం దసరా ఉత్సవాలు, ఊరేగింపుల సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. పట్టణంలోని ఏడు వీధులైన కొంకాపల్లి, మహిపాల వీధి, నల్లా వీధి, గండువీధి, రవణం వీధి, శ్రీరామపురం, రవణం మల్లయ్యవీధిలకు చెందిన దేవతా మూర్తుల వాహనాలతో ఊరేగింపులు వైభవంగా జరిగాయి. జిల్లావాసులతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా అమలాపురానికి తరలివచ్చి దసరా ఊరేగింపులను కన్నులారా వీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఏడు వీధుల ఊరేగింపుల సమ్మేళనంతో ఉత్సవాలు జరిగాయి. ఊరేగింపుల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు ఉత్కంఠభరితంగా, గగుర్పాటు కలిగించేలా సాగాయి. కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి పొట్ట, గొంతుపై కొబ్బరి కాయలు, కూరగాయలు ఉంచి పట్టా కత్తితో నరికే సన్నివేశాలను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. అగ్గి బరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములు, బల్లేలతో పోరాటాలు, కర్రసాము ప్రదర్శనలతో ఊరేగింపులు హోరెత్తాయి. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీలు గంటి హరీష్ మాధుర్, సానా సతీష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పలు వీధుల దసరా ఊరేగింపుల్లో పాల్గొని కొద్దిసేపు సరదాగా కత్తులు తిప్పారు. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ కూడా ఊరేగింపుల్లో పాల్గొని సరదాగా కత్తులు, కర్రలు తిప్పారు. ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో దాదాపు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఏడు వీధుల ఊరేగింపుల వద్ద అడుగడుగునా పోలీసులు వలయంగా మోహరించి ఆయుధాల ప్రదర్శనలతో సాగిన చెడీ తాలింఖానా బృందాలను పర్యవేక్షించారు. ఏడు వీధుల ఊరేగింపులతో అమలాపురం పట్టణం కత్తుల సవ్వడితో హోరెత్తింది. చెడీ తాలింఖానా ప్రదర్శనలకు తోడు ప్రతి వీధి ఊరేగింపులో శక్తి వేషాలు, తీన్ మార్ డప్పులు ఇలా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఉత్సవాలు జరిగాయి. అమలాపురంలో ఊరేగింపులు సాగిన మెయిన్ రోడ్లన్నీ జనం రద్దీతో నిండిపోయాయి. ఇళ్ల అరుగులుపై, డాబాలపై ఎటు చూసినా ఊరేగింపులను జనం ఉత్కంఠగా, ఉత్సాహంగా తిలకించారు. ఊరేగింపులను వీక్షించిన డీఐజీ ఏడు వీధుల దసరా ఊరేగింపుల సమ్మేళనాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్ శుక్రవారం తెల్లవారుజామున వీక్షించారు. గడియారం స్తంభం సెంటరులోని పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వద్ద ఐజీ, ఎస్పీ, ఏఎస్పీలు ఊరేగింపులను దాదాపు గంటన్నర సమయం పాటు వీక్షించారు. ఊరేగింపుల్లో భాగంగా రవణం వీధి మహిషాసురమర్దినీదేవి ఉత్సవ వాహనానికి ఐజీ, ఎస్పీలు ప్రత్యేక పూజలు చేశారు. -
న్యాయం చేయాలంటూ ధర్నా
గణేశ్ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని బ్లూ ఓషన్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికురాలు లొల్ల దుర్గమ్మను గత నెల ఏడవ తేదీన ఫ్యాక్టరీకి చెందిన వాహనం ఢీ కొనడంతో రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చెందిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించి ఇంటికి పంపించి వేశారు. అయితే ఆమెకు ప్యాక్టరీ యాజమాన్యం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ చూపలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ధర్నా చేయడానికి నిర్ణయించారు. ఆమెకు జి. రాగంపేట సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు బుంగా శేఖర్బాబు, ప్రజలు మద్దతు ఇచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. భర్త పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో ఫ్యాక్టరీలో ఆమె పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటోందని చెప్పారు. దుర్గమ్మ మంచాన పడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. దుర్గమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, గ్రామ నాయకులు కల్యాణ్, బాబీ, విజయ్లు ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. -
అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలి
కాకినాడ రూరల్: అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రమణయ్యపేట శ్రీపీఠంలో గత నెల 22న మహాశక్తి యాగం ప్రారంభమైన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన మహిళలు దీక్షా వస్త్రాలు ధరించి లలితా సహస్ర నామాలు పఠిస్తూ భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు చేశారు. దీంతో, నవరాత్రుల్లో 9వ రోజుకే 100 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయి. అనంతరం విజయ దశమి పర్వదినమైన గురువారం నాడు యాగం పరిపూర్ణమైనట్లు స్వామీజీ ప్రకటించారు. ఉదయం ఒకసారి లలితా సహస్ర నామాలు, దేవీ ఖడ్గమాలతో కుంకుమార్చనలు నిర్వహించి, పూర్ణాహుతి గావించారు. భక్తులు తీసుకువచ్చిన బూరెలను హోమగుండంలో వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వరుసగా మూడేళ్ల పాటు 100 కోట్ల చొప్పున ఇప్పటికి 300 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయని చెప్పారు. వెయ్యి కోట్లు లక్ష్యంగా 400 కోట్ల కుంకుమార్చనలకు వెళ్దామని అన్నారు. యాగం విజయవంతానికి శ్రీపీఠం ట్రస్ట్ చైర్మన్ సుధీర్రాజు, రాగిరెడ్డి దొరబాబు (కన్నా), అశోక్, సురేష్ వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. పీఠంలో 25 సంవత్సరాలుగా ఆస్థాన సంగీత విద్వాంసుడిగా సేవలందిస్తున్న వినుకోట వెంకటేశ్వరరావును సత్కరించారు, సుధీర్రాజు బంగారు ఉంగరం ప్రదానం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా మరుసటి రోజున శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారు భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చారు. మహాశక్తి యాగానికి రెండు నెలల ముందు నుంచే రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఐడీ కార్డులు పొంది, కుంకుమార్చనల్లో పాల్గొని, హాలోగ్రామ్ వేయించుకున్న భక్తులకు శని, ఆదివారాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఐశ్వర్య కంకణాలు (రాగి కంకణాలు) పంపిణీ చేయనున్నారు. 21 నుంచి కార్తిక మాసోత్సవాలు సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపురసుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి నవంబర్ 20 వరకూ కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి కాలభైరస్వామి ఆలయం వద్ద శుక్రవారం ముహూర్తపు రాట వేశారు. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు వెంకన్న, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి, సన్నిధిరాజు అంజిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ విలేకర్లతో మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ రాత్రి ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించి, కార్తిక మాసోత్సవాలు ప్రారంభిస్తామని చెప్పారు. 22 తేదీ నుంచి భక్తులకు కార్తిక మాస దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. క్యూలైన్లు, ఇతర పనులు శుక్రవారం ప్రారంభిస్తామన్నారు. రాట ముహూర్తం కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులుసాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని అధిష్టానం పలు హోదాల్లో నియమించింది. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల చంటిబాబులను నియమించారు. స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా నెక్కంటి సాయి, ఆవాల లక్ష్మీనారాయణ, చల్లగళ్ల పద్మనాభుడు (దొరబాబు), రావు చిన్నారావు, వడిశెట్టి నారాయణరెడ్డి, గండేపల్లి రామారావు, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణ (బాబ్జీ), బెజవాడ సత్యనారాయణ, అడ్డూరి ఫణీశ్వర రవికుమార్ నియమితులయ్యారు.మహాశక్తి యాగం ముగింపు కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని టెన్నిస్ కోర్టులలో బాలబాలికల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలను ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 కార్యదర్శి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలకు 70 మంది హాజరయ్యారు. టెన్నిస్ కోచ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఎంపికల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి మాచరరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, సీనియర్ పీడీలు ఎల్.జార్జి, పట్టాభిరామం పాల్గొన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో త్వరలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపిక నిర్వహించామన్నారు. అండర్–14 బాలురు–5, బాలికలు–5, అండర్–17 బాలురు–5, బాలికలు–5 మందిని ఎంపిక చేశారు. ఎంపికలు ఎస్జీఎఫ్ఐ బాలికల కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వారితో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దీనికి తోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని సన్నిధికి తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో ఏడు గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. శని, ఆదివారాల్లో కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో శనివారం తిరుచ్చి వాహనం మీద, ఆదివారం టేకు రథ పైన ఉదయం 10 గంటలకు ఊరేగిస్తారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన వేలాది మంది ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగారు. రత్నగిరి తొలి పావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి పావంచా వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తులు తమ వాహనాలను మెయిన్ రోడ్డుపై నిలిపివేయడంతో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
అనుమతి ఉండాలి
ప్రభుత్వ అనుమతి పొందిన జూనియర్ కళాశాలల వివరాలు జిల్లా ఇంటర్మీడియెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మూడు కళాశాలలకు కొత్తగా అనుమతి వచ్చింది. మరి కొన్నింటికి రావాల్సి ఉంది. అనుమతి లేకుండా ఈ ఏడాది అడ్మిషన్లు చేసుకుని, తరగతులు నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలలో చేరితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం గమనించాలి. – ఐ.శారద, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అడ్డూ అదుపూ లేదు అనేక ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదు. ఈ విషయం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు సైతం తెలుసు. అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొన్ని కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుని, మరో కళాశాలలో చదివినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లు రాయిస్తున్నారు. ఇలాంటి అవకతవకలు చాలా ప్రైవేటు కళాశాలల్లో జరుగుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. – బి.సిద్ధు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం
కాకినాడ రూరల్: అమ్మవారికి అందరూ చేసిన దీక్షను సమర్పించి ఆమె ఆనుగ్రహానికి పాత్రులవుదామని, విజయ దశమి అందరి కుంటుంబాలలో సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. మహాశక్తి యాగంలో భాగంగా 10వ రోజు బుధవారం శ్రీపీఠంలో లక్ష కుంకుమార్చనలు వంద కోట్లపై బడి కొనసాగించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీసూక్త, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. సాయంత్రం భక్తులు తీసుకువచ్చిన పండ్లను నివేదించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ మహాశక్తి యాగం గురువారం పూర్ణాహుతితో ముగుస్తుందన్నారు. అమ్మవారికి మూల మంత్ర సంపుటితో ఒక్కసారి పారాయణం చేసుకుందామన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవేంకటేశ్వరుడి అలంకరణలో ఐశ్వర్యాంబిక అమ్మవారు దర్శనమిస్తారని అన్నారు. అమ్మ అనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఎలా లభిస్తుందో తెలియదన్నారు. మంగళవారం రాత్రి బగళాముఖి హోమంలో అమ్మవారు బిడ్డలను లాలిస్తూ దర్శనమిచ్చారన్నారు. పూర్ణాహుతి కోసం ప్రతి ఒక్కరూ మూడు బూరెలను చిన్న సైజులో తీసుకురావాలని కోరారు. రెండు నెలలు మహాశక్తి యాగం విజయవంతానికి ఏర్పాట్లు చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ పీఠంలో నేటితో ముగియనున్న మహాశక్తి యాగం, కుంకుమార్చనలు 10వ రోజు మహాలక్ష్మి దేవి అలంకరణలో ఐశ్వర్యాంబిక అమ్మవారు -
అనాథ శిశువు జాడ కోసం...
కాకినాడ క్రైం: రోడ్డు పక్కన లభ్యమైన సుమారు నాలుగు నెలలు వయసున్న ఓ అనాథ ఆడ శిశువు జాడ కోసం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ రాత్రి 10.40 సమయంలో జగ్గంపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఓ ఆడ శిశువు ఏడుస్తూ ఉండడాన్ని మేడపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్ గమనించాడని తెలిపారు. శిశువుని చేరదీసి అనారోగ్యంగా ఉండడాన్ని గుర్తించి కాకినాడ జీజీహెచ్లో చేర్చి, చికిత్స అనంతరం ఆగస్టు 13వ తేదీన శిశు గృహకు అప్పగించాడని పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది శిశువుని సంరక్షిస్తుండగా, బాలిక లభ్యతపై గత నెల 24న జగ్గంపేట పోలీసులు జీడీలో నమోదు చేశారన్నారు. శిశువు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మళ్లీ జీజీహెచ్లో చేర్చామని తెలిపారు. శిశువు రక్త సంబంధీకులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సమీపంలో ఉన్న పీడీ కార్యాలయ అధికారులను లేదా 0884–2368442, 89191 23488 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. రీజెన్సీ తెరిచేందుకు ప్రజా మద్దతు అవసరం ● సంస్థ ఎండీ జీఎన్ నాయుడు యానాం: రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ పునఃప్రారంభానికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ జీఎన్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక ఐఏఎస్ అఽధికారి, ఆర్ఏఓ అంకిత్కుమార్ను ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్తో పాటు ఆయన కలిసారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది క్రితం సీఎం రంగసామితో చర్చించిన అనంతరం రూ.30 కోట్ల పెట్టుబతో మెషినరీ అమర్చినట్టు తెలపారు. గెయిల్ ద్వారా వచ్చే గ్యాస్ నిలిపివేయడంతో ఆ పైపులు తుప్పుపట్టాయని, వాటికి అయ్యే రూ.80 కోట్ల వ్యయాన్ని తామే భరిస్తామని, ఫ్యాక్టరీ ప్రారంభమైతే వచ్చే రెవెన్యూ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వారిని కోరినట్టు తెలిపారు. సంస్థకు సహజవాయువు కేటాయింపుపై అక్టోబర్ 15వ తేదీలోగా ఎంపీల బృందం ప్రధానిని కలవనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి సైతం రీజెన్సీ తెరవాలని ప్రజల మద్దతు తెలిసేలా పోరాటం చేయాలని ఆయన అన్నారు. 2012 జనవరి 27న జరిగిన ఫ్యాక్టరీ విధ్వంసం తదనంతర పరిణామాలు, ఇద్దరు మృతి ఘటనలపై సీబీఐ విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయుడు కోరారు. 665 మంది కార్మికులకు 25 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. వారు సైతం వాటిలో నివాసాలకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో వారితో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం–తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి తొలి విమాన సర్వీసు బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ సర్వీసును ప్రారంభించారు. వర్చువల్ ద్వారా ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థఈ సర్వీసు వారానికి 3 రోజులు నిర్వహిస్తుంది. ఉదయం 7–40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9–25 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. ఇక్కడ నుంచి 9–50 గంటలకు తిరుపతికి బయలుదేరి ఉదయం 11–20 గంటలకు చేరుతుంది. మొదటి 35 సీట్లు రూ.1,999కు, తర్వాత 35 సీట్లు రూ.4,000కు అందిస్తారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, శ్రీనివాసు, బలరామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి, ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
దండెత్తిన దళితులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్న కూటమి సర్కార్పై దళితులు దండెత్తారు. పేద, మధ్య తరగతి, ఎస్సీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా కాకినాడలో సోమవారం నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యాన ఈ ఆందోళన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా ఆధ్వర్యాన కదం తొక్కుతూ ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని వివిధ మండలాల నుంచి నేతలు సామర్లకోట మీదుగా కాకినాడ చేరుకున్నారు. తుని, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుంచి పిఠాపురం, కాకినాడ భానుగుడి సెంటర్ రోడ్డు మీదుగా కాకినాడ ఇంద్రపాలెం అంబేడ్కర్ సెంటర్కు ర్యాలీగా తరలివచ్చారు. కూటమి సర్కారు తీరును తీవ్ర స్వరంతో ఎండగట్టారు. తక్షణమే నిలిపివేయాలి వైద్య విద్యను సొంత వారికి పప్పుబెల్లాల మాదిరిగా ఇచ్చే ఉద్దేశంతోనే కూటమి సర్కారు ప్రైవేటీకరణ జపం చేస్తోందని నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ డౌన్ డౌన్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం నిలిపివేయాలి, పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రలను తిప్పికొడతాం, ప్రైవేటీకరణ జీఓను ఉపసంహరించుకోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎస్సీలు, పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి నేతలు ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు లంకా కృపానందం, గుడాల వెంకటరత్నం, బూలా అబ్బులు, బంగారు కృష్ణ, బళ్ల సూరిబాబు, పెదపాటి రమేష్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు చిల్లి దేవరాజు, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిబత్తుల సురేష్ కుమార్, రామప్రసాద్, అప్పలరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల భీమారావు, ఎస్సీ సెల్ మండల, గ్రామ నేతలు, అనుబంధ విభాగా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపసంహరించేంత వరకూ ఉద్యమం వైద్య విద్యను ప్రైవేటీకరించే జీఓను ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. పేద కుటుంబాలపై చంద్రబాబు ఎందుకంత కక్ష కట్టారో అర్థం కావడం లేదు. ఇప్పుడు 33 ఏళ్లు లీజు అంటున్న కూటమి పాలకులు కొన్ని రోజులు గడిచాక 99 ఏళ్లు లీజులంటారు. పేద, దళిత కుటుంబాల్లో పిల్లలకు వైద్య విద్య అందకూడదనే కుట్రతోనే ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారు. మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో మంజూరయ్యేవంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు సీఎంగా పని చేసిన అన్ని సంవత్సరాల్లో ఒక్క వైద్య కళాశాలైనా తీసుకువచ్చారా? – శెట్టిబత్తుల కుమార్రాజా, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడుఫ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఆగ్రహం ఫ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యాన నిరసన ఫ జీఓ ఉపసంహరించాలని డిమాండ్ ఫ లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక ‘బాబు’ దివాళాకోరుతనానికి నిదర్శనం వైద్య విద్యను పేదలకు, దళితులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం దేశంలోనే ఒక చరిత్ర. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ రంగంలో ఐదు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, వైద్య విద్యను పేదల దరి చేర్చారు. అటువంటి నాయకుడి వారసుడిగా జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఏకకాలంలో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేశానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాగలిగారా? అటువంటిది సొంత వారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయిన కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రైవేటీకరణపై చినబాబు, పెదబాబు మనసు మార్చుకోవాలి. ప్రైవేటీకరణపై కూటమి వెనక్కు తగ్గేంత వరకూ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది. – అంగూరి లక్ష్మీశివకుమారి, మాజీ ఎమ్మెల్సీచంద్రబాబు దళిత వ్యతిరేకి జగన్ దళితుల పక్షపాతిగా నిలిచిపోతే.. చంద్రబాబు దళితుల వ్యతిరేకిగా ఉన్నారు. ఇంగ్లిషు విద్యను పేదలు, దళితులకు చంద్రబాబు దూరం చేయాలనుకుంటే.. వాటిని ఆ వర్గాలకు జగన్ మరింత దగ్గర చేశారు. వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే కుట్రలతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. – గుల్లా ఏడుకొండలు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి -
కాజేసిన మొత్తం రూ.95 లక్షలు
కరప: కూరాడలో వేళంగి ఎస్బీఐ బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ) చిన్నం ప్రియభారతి మొత్తం రూ.95 లక్షల మేర మహిళాశక్తి సంఘాల సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ అయ్యిందని వెలుగు ఏపీఎం ఎంఎస్బీ దేవి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 66 గ్రూపుల సభ్యులు బాధితులుగా ఉన్నారని చెప్పారు. కూరాడ గ్రామస్తులతో కలసి ఏపీఎం సోమవారం 39 గ్రూపులను తనిఖీ చేయగా బీసీ రూ.52 లక్షలు కాజేసిందని గుర్తించారు. మిగిలిన గ్రూపుల అకౌంట్లను మంగళవారం ఏపీఎం తనిఖీ చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలున్నాయి. వీటిలో 40 గ్రూపుల వారు వేళంగిలోని యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్రాంచిల్లో తాము తీసుకున్న రుణాల వాయిదా, పొదుపు సొమ్ము జమ చేశారు. అక్కడకు వెళ్లలేని మిగిలిన 66 గ్రూపుల వారు కూరాడలోని ఎస్బీఐ బీసీ పాయింట్లో సొమ్ము చెల్లించేవారు. ఈ బీసీ పాయింట్ను ఆ గ్రామానికి చెందిన చెందిన ప్రియభారతి నిర్వహిస్తోంది. యానిమేటర్గా ఉన్న తన తల్లి మంగ సహకారంతో మహిళాశక్తి సంఘాలు చెల్లించే పొదుపు, వాయిదాల సొమ్మును పథకం ప్రకారం ఆమె కాజేసింది. ఎన్ని రోజులైనా రుణం తీరకపోగా ఇంకా బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు మహిళాశక్తి సంఘాల సభ్యులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై వారు గగ్గోలు పెట్టడంతో ఈ నెల 27న శ్రీమహిళాశక్తి సంఘాల సొమ్ము గోల్మాల్శ్రీ, 30న శ్రీతవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలుశ్రీ శీర్షికలతో శ్రీసాక్షిశ్రీ కథనాలు ప్రచురించింది. ఈ మేరకు ఏపీఎం సోమ, మంగళవారాల్లో ఆ గ్రామంలోని అన్ని గ్రూపుల అకౌంట్లను తనిఖీ చేశారు. కాజేసిన సొమ్ముతో బీసీ తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో ఒక ఇల్లు, కాకినాడలో ఒక ఇంటి స్థలం కొనుగోలు చేసినట్టు కూరాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అకౌంట్లను తనిఖీ చేసి స్వాహా అయిన సొమ్ము లెక్క తేల్చామని, తప్పులేమైనా ఉంటే సవరించి, ఎంత మేర అక్రమాలు జరిగాయో తుదిగా నిర్ధారించి, అన్ని ఆధారాలతో కరప పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేస్తామని ఏపీఎం దేవి తెలిపారు. ఫ బాధితులు 66 గ్రూపుల సభ్యులు ఫ కూరాడ బీసీ అవినీతిని వెల్లడించిన ఏపీఎం -
మహా సంకల్పం.. పరిపూర్ణం
కాకినాడ రూరల్: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని కాకినాడ శ్రీపీఠంలో నిర్వహిస్తున్న మహాశక్తి యాగంలో భాగంగా వంద కోట్ల కుంకుమార్చనలు మంగళవారం పూర్తయ్యాయి. పీఠంలో సెప్టెంబర్ 22 నుంచి లలితా నహస్ర నామాలు పఠిస్తూ వేలాదిగా మహిళలు పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యాన కుంకుమార్చనలు నిర్వహించారు. వరుసగా మూడో సంవత్సరం వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేశామని, మూడేళ్లలో మూడు వందల కోట్ల కుంకుమార్చనలు చేశామని ఈ సందర్భంగా స్వామీజీ తెలిపారు. వెయ్యి కోట్ల కుంకుమార్చనలు లక్ష్యంగా శ్రీపీఠంలో మహాశక్తి యాగం కొనసాగిస్తున్నామని ప్రకటించారు. అష్టమి మంగళవారం రావడంతో దీనిని మంగళాష్టమి, జయ అష్టమి అని పిలుస్తామని చెప్పారు. అష్టమి తిథి నాడు అమ్మవారిని పూజిస్తే గొప్ప ఫలితం ఉంటుందని అన్నారు. శ్రీకృష్ణుడు అష్టమి తిథినాడు పుట్టడంతో కష్టాలు అనుభవించాడని, కానీ అమ్మవారు ఆయనకు కష్టాలను భరించే శక్తిని ఇచ్చారని చెప్పారు. అమ్మను అందరూ ఆరాధించాలని, ఈ క్రమంలో మనం ఒకరి కీడు కోరుకోకూడదని హితవు పలికారు. శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారు బగళాముఖిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం దేవీ కవచం, బగళాముఖి హోమం నిర్వహించారు. వేలాదిగా తరలిచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్న ప్రసాదం అందించారు. ఫ మహాశక్తి యాగంలో వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తి ఫ వేలాదిగా పాల్గొన్న మహిళలు -
ప్రాణాలు తీసిన బాణసంచా
● భార్యాభర్తల మృత్యువాత ● విలస గ్రామంలో విషాద ఛాయలు అయినవిల్లి: దీపావళి పండగకు కిరాణా సామగ్రితో పాటు బాణసంచా అమ్ముకుని నాలుగు రూపాయలు వెనుక వేసుకుందామనే ఆశ ఆ భార్యాభర్తలను బలిగొంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణసంచా పేలి కంచర్ల శ్రీనివాసరావు (51). అతని భార్య సీతామహా లక్ష్మి(46) మృత్యువాత పడ్డారు. కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు గతేడాది దీపావళికి అమ్మగా మిగిలిన బాణసంచా సామగ్రిని ఇంటి అటక పై నుంచి తీసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి వారి ఇంటిపై శ్లాబు, ప్రహరీ కూలింది. పక్కనున్న ఇల్లు కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరారు. వారి కుమారుడు ప్రదీప్ గాయపడ్డాడు. అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అమలాపురం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ సుంకర మురళీకృష్ణ, సీఐ ఆర్. భీమరాజు, ఎస్ఐ హరికోటి శాస్త్రి పరిళీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న భార్యాభర్తల మృతదేహాలను అంబులెన్స్లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయినవిల్లి ఎస్సై హరికోటిశాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోవాలి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పి.గన్నవరం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లైసెన్సు కలిగిన గోడౌన్స్లోనే బాణసంచా భద్రపరచాలి: ఎస్పీ బాణసంచా సామగ్రి లైసెన్సు పొందిన గోడౌన్స్లోనే భద్రపరచాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. లైసెన్సు లేకుండా బాణసంచా సామాగ్రి నిలువ ఉంచడం, తయారు చేయడం నేరమన్నారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఇలా బాణసంచా నిలువ ఉంచితే ఇటువంటి ప్రమాదాలే ముంచుకొస్తాయని ఆయన హెచ్చరించారు. శిథిలాల మధ్య ఉన్న కంచర్ల శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న పోలీసులు, స్థానికులు పేలుడు శబ్దానికి కూలిన ఇంటి శ్లాబు, ప్రహరీ ప్రమాద స్థలంలో గుమిగూడిన గ్రామస్తులు -
శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు. సరస్వతీదేవి, ఐశ్వర్యలక్ష్మిగా..అయినవిల్లి: మండలంలోని నల్లచెరువు గ్రామంలో కొలువైన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారు మంగళవారం సరస్వతీదేవి, ఐశర్యలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు ఉదయం అమ్మవారిని పెన్నులతో సరస్వతీదేవిగా అలంకరించారు. మధ్యాహ్నం అమ్మవారిని రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ఉపయోగించారు. నోట్ల పెళపెళ.. లక్ష్మీ కళకళ! పిఠాపురం: మండలంలోని రాపర్తిలో వేంచేసియున్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని రూ.15 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పి.గన్నవరం: స్థానిక ఏటిగట్టు సెంటర్లో మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు సమీపంలోని బట్టాయగూడెంనకు చెందిన షేక్ నాగూర్ మీరా (50) 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి డీఎస్ పాలెంలో నివసిస్తున్నాడు. మంగళవారం, శుక్రవారాల్లో అతడు షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఏటిగట్టు సెంటర్లో షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేసి, మూడు రోడ్ల సెంటర్కు సైకిలుపై వస్తుండగా అతడిని వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద స్థానికులు అడ్డుకుని లారీని ఆపారు. మృతదేహం వద్ద అతడి భార్య జీ బాషా బోరున విలపించింది. అందరితో కలివిడిగా ఉండే నాగూర్ మీరా ప్రమాదంలో మృతి చెందడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు. రైల్వే ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి.. తుని రూరల్: అన్నవరం రైల్వే రెండవ ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ తుని ఎస్సై పి.వాసు మంగళవారం తెలిపారు. ప్లాట్ఫాంపై బెంచీ కింద మరణించి ఉన్న వ్యక్తి శరీరంపై నలుపు రంగు టీ షర్టు, నీలం రంగు ట్రాక్ ఉన్నాయన్నారు. మృతుడికి కొంతదూరంలో కాఫీ రంగు బ్యాగ్ ఉందన్నారు. ఎవరైన గుర్తిస్తే జీఆర్పీకి 9490619020 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. హెచ్సీ మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాం తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామన్నారు. పాము కాటుకు మహిళ.. ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలోని బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని ధారపల్లిలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం మేరకు బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని బాపన్నధారకు చెందిన బుట్టారి సన్యాసిరావు, లోవకుమారిలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ధారపల్లిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే సోమవారం రాత్రి బుట్టారి లోవకుమారి తన ఇంటిలోనే నేలపై నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున పాము కాటుకు గురైంది. ఆమెను బంధువులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు భర్త బుట్టారి సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహానైవేద్యం సమర్పయామి
గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో శ్రీ లలితా దేవికి, గర్భాలయంలో సూర్యదేవునికి, ఉమాదేవి అమ్మవార్లకు, లక్ష్మీనారాయణులకు, గణపతికి, పరమేశ్వరునికి మంగళవారం ఏకకాలంలో అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, మహన్యాస పారాయణ, 27 ద్రవ్యాలతో, 27 కలశాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారికి 108 రకాల పిండి వంటలతో మహాభోగ నివేదన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – పిఠాపురం దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకుని, గొల్లప్రోలు మండలం తాటిపర్తి అపర్ణాదేవి ఆలయంలో అమ్మవారిని పసుపు కొమ్ముల మాలలతో మంగళవారం మంగళప్రదంగా అలంకరించారు. సమస్త మంగళాలను ప్రసాదించే అమ్మవారు మహాగౌరీదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. – పిఠాపురం -
గురువు మార్గదర్శకత్వం అవసరం
సహస్రావధాని గరికపాటి రాయవరం: సన్మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరికీ గురు మార్గదర్శకత్వం అవసరమని, అప్పుడే దైవానుగ్రహానికి దగ్గరవుతామని సాగరఘోష కవి, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆధ్మాత్మిక ప్రసంగం చేస్తూ తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అన్నారు. తల్లిదండ్రులను, గురువును ఆరాధించడం భగవంతుడిని ప్రార్థించడం కంటే గొప్పదన్నారు. ఐశ్వర్యం, భోగభాగ్యాలు అశాశ్వతమని, గురువు చూపిన మార్గంలో పయనిస్తే దైవానుగ్రహానికి దగ్గరవుతారన్నారు. విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) చూపిన దారిలో భక్తులు నడవాలన్నారు. మరో సాహితీవేత్త మహామహాపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మతత్వాన్ని వివరించారు. పీఠంలో ఆర్డీవోల పూజలు కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు శ్రీకర్, అఖిల దంపతులు మంగళవారం విజయదుర్గా పీఠాన్ని సందర్శించారు. అనంతరం పీఠంలో విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పీఠాన్ని సందర్శించినట్లు తెలిపారు. విజయదుర్గా అమ్మవారి ఆశ్శీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు. -
డీఎస్సీలో విజయం సాధించిన హాకీ క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డీఎస్సీ–2025లో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో హాకీ కోర్టులో కోచ్ రవిరాజు వద్ద తర్ఫీదు పొందుతున్న నలుగురు క్రీడాకారిణులు పీఈటీలుగా ఉద్యోగాలు సాధించారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన జి.వరలక్ష్మి, డీఎస్ సింధు దేవి, ఎస్.పరంజ్యోతి, కె.భారతి ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. వీరు అనేకసార్లు రాష్ట్ర చాంపియన్షిప్ సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన క్రీడాకారిణులను, తర్ఫీదునిచ్చిన కోచ్ రవిరాజును డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్ మంగళవారం డీఎస్ఏలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. -
విరిసిన ధరలు!
కడియం: మండలంలోని కడియపులంక అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్లో దసరా సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల అలంకరణలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో పువ్వుల ధరలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా దసరా అలంకరణలో వినియోగించే బంతి, చామంతి తదితర రకాల ధరలు పెరిగాయని వివరించారు. స్థానికంగా పువ్వుల దిగుబడులు స్వల్పంగానే ఉన్నాయంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా పువ్వులు దిగుమతి అయ్యాయని వ్యాపారులు తెలిపారు. మంగళవారం కడియపులంక పువ్వుల మార్కెట్లో కేజీ చామంతులు రూ.150 నుంచి రూ.200 ధర పలికాయి. లిల్లీలు రూ.400, మల్లెపువ్వులు రూ.1,500, జాజులు రూ.1,000, కాగడాలు రూ.1,100, బంతి రూ. 100 నుంచి రూ.130, కనకాంబరం బారు రూ.270–రూ.300 ధర పలికాయి. -
యువకుడి బలవన్మరణం
సీతానగరం: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై డి.రామ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సీతానగరం మండలం మునికూడలికి చెందిన మురాల అనిల్దేవ (22) వెల్డర్గా పని చేస్తున్నాడు. తల్లి కువైట్లో ఉండటంతో అమ్మమ్మ నూకతట్ల సుభద్రమ్మ వద్ద ఉంటున్నాడు. ఉదయం పనిపై వేరే వీధిలోకి సుభద్రమ్మ వెళ్లగా, ఇంట్లో ఫ్యాన్కు అనిల్దేవ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ కాకినాడ క్రై: గంజాయి క్రయ, విక్రయాలతో పాటు తరలింపులో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ బిందుమాధవ్ సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఒక ఇన్నోవా వాహనం అనుమానాస్పద రీతిలో పోలీసులను, టోల్ ప్లాజా సిబ్బందిని ఢీకొని దూసుకుని వెళ్లినట్టు ఆ వాహనం కదలికలపై నిఘా ఉంచాలని విశాఖ జిల్లా పోలీసులు కాకినాడ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. విశాఖ పోలీసులు తెలిపిన వాహనాన్ని జగ్గంపేట సర్కిల్ పరిధిలో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఈ నెల 23న మధ్యాహ్నం గుర్తించారు. కారును ఆపే క్రమంలో డ్రైవర్ కారులో నుంచి పోలీసులతో పోరాడాడు. ఈ క్రమంలో కారు అద్దాలు బద్దలైనా లెక్కచేయకుండా ప్రత్తిపాడు వైపు వేగంగా దూసుకుపోయాడు. అయితే ఈ పెనుగులాటలో పోలీసులకు డ్రైవర్ సెల్ఫోన్ లభ్యమైంది. ఆ వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు, వెనుక సీట్లో పోలీస్ యూనిఫాం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉందని నిర్ధారించుకున్నారు. ప్రత్తిపాడు వైపు వెళుతున్న ఆ వాహనాన్ని వెంబడించగా, కొంత దూరంలో ఆ వాహనం మిస్సైంది. ఇదిలా ఉంటే టోల్ప్లాజా వద్ద ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత కిర్లంపూడిలో పైడితల్లి అమ్మవారి గుడి పక్కన ఉన్న రోడ్డుపై వెళుతున్న కారు నుంచి పడిపోయిన రెండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ పూటేజీల ఆధారంగా టోల్ప్లాజా వద్ద రచ్చ చేసిన కారు నుంచే ఈ ప్యాకెట్లు పడ్డాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. సాంకేతికత, ఈగల్ టీమ్ సహకారంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కారును ట్రాక్ చేసే పనిలో పడింది. పోలీసుల కష్టం ఫలించి కారు కిర్లంపూడి మండలం రాజుపాలెం సమీపంలో ఒక రావిచెట్టు వద్ద లభ్యమైంది. కారుతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాజస్థాన్కు చెందిన వారని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగలకు వ్యాపారం నిమిత్తం వచ్చారని గుర్తించారు. వ్యాపారం ముసుగులో విశాఖ, ఒడిశా నుంచి గంజాయిని సేకరించి రాజస్థాన్ తరలిస్తున్నట్టు నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అలాగే జొన్నాడ టోల్ ప్లాజా వద్ద సిబ్బంది, పోలీసులను గాయపరిచిన ఘటనలో భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 175 కిలోల గంజాయితో పాటు ఇన్నోవా కారు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నేరంలో ఏడుగురు భాగస్వాములు అయినట్టు గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు.సామర్లకోట: స్థానిక జయలక్ష్మీ థియేటర్ సమీపంలోని ఒక భవనానికి పెయింటింగ్ వేస్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట పెన్షన్లైన్కు చెందిన అరవ అరుణ్కుమార్ (37) పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ మాదిరిగానే రెండు అంతస్తుల భవనానికి పెయింటింగ్ వేస్తున్న సమయంలో తాడు జారిపోవడంతో అరుణ్కుమార్ కింద పడిపోయాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏనుగమ్మా... ఏనుగు
ఫ గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రసిద్ధి ఫ దసరా రోజున భారీ ఊరేగింపు ఫ పోటీపోటీగా ఉత్సవాల నిర్వహణ కాజులూరు: దసరా.. ప్రతి పల్లెకూ ప్రత్యేకతే. అచ్చం అలానే కాజులూరు నియోజకవర్గం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రఖ్యాతి గాంచింది. ఏటా విజయ దశమిని పురస్కరించుకుని ఇక్కడ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా ప్రతి గ్రామంలో శరన్నవరాత్ర ఉత్సవాల్లో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తుంటారు. అయితే గొల్లపాలెంలో పాత మార్కెట్ సెంటర్ వద్ద రామాలయం సమీపంలో మాత్రం శరన్నవరాత్ర రోజుల్లో భేతాళునికి పూజలు నిర్వహించడం విశేషం. చివరి రోజు దసరా పండగ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామ వీధుల్లో చిన్న ఏనుగు ప్రతిమను, రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ట్రాక్టరుపై పెద్ద ఏనుగు ప్రతిమను ఊరేగిస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల నుంచి ప్రతి ఏటా ఈ సంబరం నిర్వహిస్తుండడం విశేషం. ఐరావతాన్ని తలపించేలా తెల్లని వస్త్రం, ఎండు గడ్డితో తయారు చేసిన ఏనుగు ప్రతిమలకు పెద్ద, పెద్ద చావిళ్లు నిర్మించి ఏడాది పొడవునా స్థానికులు వాటిని పరిరక్షిస్తుంటారు. విజయ దశమికి 10 రోజుల ముందు ఏనుగు ప్రతిమలను బయటకు తీసి శుభ్రం చేసి మెరుగులు దిద్ది ప్రత్యేక పూజలు చేసి సంబరం చేస్తారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ గ్రామంలోని వెలమ కులస్తుల ఆధ్వర్యంలో చిన్న ఏనుగు సంబరం, కాపు, బలిజ కులస్తుల సారథ్యంలో పెద్ద ఏనుగు సంబరం చేస్తుంటారు. చిన్న ఏనుగును ఎడ్లబండి మాదిరి బండిపై ఉంచి భక్తులు జేజేలు పలుకుతూ తోసుకుంటూ ముందుకు సాగుతారు. పెద్ద ఏనుగునైతే ట్రాక్టర్పై ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఎండు గడ్డి, తెల్లని వస్త్రం, తదితర వస్తువులతో తయారు చేసిన భారీ ఏనుగుల ప్రతిమలను ఊరేగించే సమయంలో వేలాది మంది ముందుకు సాగుతుంటారు. భేతాళుని రూపంలో భక్తులు ఏనుగుల ప్రతిమలకు పూజలు చేస్తుంటారు. గరగ నృత్యాలు, కోయ డ్యాన్సులు, గారడీ, బ్యాండ్ మేళాలతో ఈ ఊరేగింపు కోలహలంగా సాగుతోంది. ఇరువర్గాల వారూ పోటీపోటీగా సంబరం నిర్వహిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఈ సంబరాల్లో ఘర్షణలు జరిగేవి. పెద్దలు సఖ్యత కుదర్చడంతో ఇటీవల ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి ఉత్సవాలను తిలకిస్తుంటారు. అలాగే బాణసంచా కాల్పులకు ప్రత్యేకత ఉంది. రాత్రి మిరుమిట్లు గొలిపేలా ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం అనాదిగా వస్తుంది. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం ఈ పండగకు తిరిగి గ్రామానికి వస్తుంటారు. –టేకుమూడి దుర్గారావు, స్థానికుడు సంప్రదాయాలను కొనసాగిస్తూ.. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కాస్త తీరిక దొరికితే సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. పండగలు, సంబరాలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో మన ఆచారాలను తెలిపేలా పురాతన సంప్రదాయాలు కొనసాగిస్తూ నేటికీ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అభినందనీయం. –జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు -
ఈవీఎంలతో ఓట్ల దుర్వినియోగం
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు అమలాపురం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓట్ల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏవీఎంల విధానం వద్దు.. దాని స్థానే మాన్యువల్ విధానమైన బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్, పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల అక్రమాలను కాంగ్రెస్ పార్టీ అనేక ఆధారాలతో బయట పెట్టినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఓట్ల అక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పరంగా వైఎస్సార్ సీపీకి జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ సంతకాలను సేకరిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, యార్లగడ్డ రవీంద్ర, కుడుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా అమలాపురం ప్రెస్క్లబ్ భవనంలో ఫర్నీచర్ కొనుగోలు నిమిత్తం రుద్రరాజు రూ.25 వేల చెక్కును ప్రెస్క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. -
ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘ ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడిగా సీనియర్ పీడీ కె.పట్టాభిరామ్ ఎన్నికయ్యారు. సోమవా రం కాకినాడలోని కుడుపూడి రామ్కుమార్ క్రీడాభవన్లో జిల్లా ఖోఖో సంఘ ఎన్నికలు రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షుడు టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా ఒలింపిక్ సంఘ నుంచి వి.రవిరాజు, డీఎస్ఏ పరిశీలకులుగా పాపారావు హాజరయ్యారు. అలాగే ఎన్నికల పరిశీలకుడిగా అడ్వకేట్ ఎం.సత్యనారాయణ వ్యవహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడిగా కె.పట్టాభిరామ్, కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ కుమార్, కోశాధికారిగా కె.రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎల్.గోవిందరాజులు, కె.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా మాచరరావు, ఎండీ ఇబ్రహీం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా పి.సూర్యనారాయణ, డి.సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు టీవీఎస్ రంగారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి నాగు, చీఫ్ టెక్నికల్ అడ్వయిజర్ సాయిప్రసాద్, బంగార్రాజులు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి మరోసారి ఖోఖో సంఘ ఐక్యతను చాటి చెప్పారని కొనియాడారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పోస్టులు సాధించిన ఖోఖో క్రీడాకారులు వై.జగదీష్, బి.ఆదినారాయణ, వై.సతీష్లను సంఘ సభ్యులు అభినందించారు. -
అంతర పంటగా అశ్వగంధను సాగు చేయొచ్చు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆయిల్పామ్ తోటల్లో మూడేళ్ల వరకూ అశ్వగంధను అంతర పంటగా సాగు చేయవచ్చని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ సంస్థ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని నిర్కాను సందర్శించి అశ్వగంధ పంటను ఆయిల్పామ్లో అంతర పంటగా సాగు చేయడానికి, అధిక దిగుబడులు పొందడానికి, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఉన్న అవకాశాలను విశ్లేషించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషుమాధవ్ మాట్లాడుతూ అన్ని నేలల్లో అశ్వగంధ వేయవచ్చని తెలిపారు. అంతే కాకుండా అశ్వగంధ సాగుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సహకరిస్తామన్నారు. అశ్వగంధ పంట మార్కెటింగ్, బైబ్యాక్ విధానాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. పలు అంశాలను విశ్లేషించి ఆయిల్ఫెడ్ సలహాదారుడు ఎ.కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ముసాయిదాను రూపొందించడానికి నిర్ణయించారు. నిర్కా సంస్థ పరిధిలో చేస్తున్న మిరప, పసుపు పంట ఉత్పత్తులను తెలంగాణ ఆయిల్ఫెడ్ వారి విజయబ్రాండ్ స్టోర్స్లో చేర్చి అమ్మడానికి ఉన్న అవకాశాలను చర్చించి ఎంఓయూ ఏర్పాటు చేసి సంయుక్తంగా ముందుకెళ్లాలని రెండు సంస్థలు నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ ఆయిల్ఫెడ్ అధికారులు టి.సుధాకరరెడ్డి, ఎన్.శ్రీకాంత్రెడ్డి, అభ్యుదయ రైతులు భాస్కర్, అప్పారావు, నిర్కా సంస్థ విజన్ హెడ్స్ కె.సరళ, రాజశేఖర్, ఎల్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్తలు కస్తూరి, సుబ్బయ్య, సుమన్కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ గ్రూపు నుంచి బయటకు..
సచివాలయ సెక్రటరీల నిరసన అమలాపురం టౌన్: వలంటీర్ల మాదిరిగా తమను ఇంటింటికీ పంపించి పథకాలపై ప్రచారం చేయిస్తూనే, సర్వే చేయమని ఒత్తిడి తెస్తున్న పరిణామాలపై అమలాపురం మున్సిపాలిటీలోని 15 వార్డు సచివాలయాల సెక్రటరీలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ సర్వేలను వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి సోమవారం వార్డు సెక్రటరీలు లెఫ్ట్ అవడం మొదలు పెట్టారు. మున్సిపాలిటీలోని 15 వార్డు సచివాలయాల్లో 139 మంది వివిధ విభాగాల సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. ఇందులో సోమవారం రాత్రికి 80 మందికి పైగా సెక్రటరీలు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు. మంగళవారం కూడా మరికొంత మంది సెక్రటరీలు బయటకు రానున్నారని ఓ వార్డు సచివాలయ సెక్రటరీ చెప్పారు. మున్సిపాలిటీ అఫీషియల్ వాట్సాప్ గ్రూపు ప్రతి మున్సిపాలిటీకి ఉంటుంది. ఇందులో మున్సిపాలిటీకి చెందిన కమిషనర్తో పాటు అన్ని విభాగాల అధికారులు ఉంటారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చేసే పనులను తమకు అప్పగించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల పదో తేదీన విజయవాడలో చేపట్టనున్న రాష్ట్ర స్థాయి మార్చ్పాస్ట్కు మున్సిపాలిటీలోని సెక్రటరీలు వెళ్లి నిరసన తెలిపేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రచారం, సర్వే భారాన్ని మోపడాన్ని వార్డు సచివాలయ సెక్రటరీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సరస్వతీ కటాక్షంతో విజయం తథ్యం
విజయదుర్గా పీఠం పీఠాధిపతి ‘గాడ్’ రాయవరం: సరస్వతీ కటాక్షం ఉంటే విజయం తథ్యమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) అన్నారు. పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగిస్తూ.. జ్ఞానప్రదాయినిగా ఉన్న సరస్వతీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. జ్ఞాన సంపన్నులుగా మెలగాలంటే మంచి వాక్శుద్ది లభించాలన్నారు. అమ్మవారి దయకు పాత్రులు కావాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పీఠం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. పీఠంలో విజయదుర్గమ్మ వారిని సరస్వతీమాత అవతారంలో అలంకరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వేణుగోపాల్, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమా తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సరస్వతీదేవికి పూజలు చిన్నారులకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ విజయదుర్గా పీఠంలో సరస్వతీ పూజలు నిర్వహించారు. చీమలకొండ వీరావధాని, శివ, చక్రవర్తుల మాధవాచార్యులు, గండికోట సూర్యనారాయణ అర్చకత్వంలో చిన్నారులు సరస్వతీ అష్టోత్తర సహస్రనామాలతో సామూహిక సరస్వతీ పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు సరస్వతీదేవి ప్రతిమను, రక్షాబంధనాన్ని ప్రసాదంగా అందజేశారు. -
భర్త ఆత్మహత్య
సీతానగరం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నాగంపల్లికి చెందిన గుడాల ప్రసన్న కుమార్ (34) భార్యపై అనుమానం పెంచుకుని మనస్తాపంతో ఉన్నాడు. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిలోకి వస్తానని చెప్పి రాకపోవడంతో స్థానికులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లంపల్లి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు -
ఆటాడుకుంటున్నారు
20 ఏళ్లుగా పని చేస్తున్నాను నేను 20 సంవత్సరాలుగా అమలాపురం బాలయోగి స్టేడియంలో వాచ్మన్గా పని చేస్తున్నాను. రూ.వెయ్యి జీతానికి ఉద్యోగంలో చేరాను. తరువాత రూ.3 వేలు, రూ.6,700, రూ.12 వేలకు జీతం పెంచారు. ఇప్పుడు రూ.15 వేలకు జీతం పెరిగింది. కానీ, 13 నెలలుగా ఆ జీతం ఇవ్వకపోగా తాజాగా దీనిని రూ.8 వేలకు కుదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – ఆకుల వీరబాబు 2017లో టాలీ ఆపరేటర్గా చేరా.. శాప్ అనుమతి, కలెక్టర్ ఆదేశాల మేరకు నేను 2017లో కాకినాడ డీఎస్ఏలో టాలీ ఆపరేటర్గా తాత్కాలిక ప్రాతిపదికన చేరాను. ఇప్పుడు శాప్ అనుమతి లేదని నా పేరు తీసేశారు. డీఎస్ఏ అధికారులు న్యాయం చేయాలి. – తేజ రూ.15 వేల నుంచి రూ.6 వేలకు.. నేను 20 ఏళ్లుగా డీఎస్ఏలో స్వీపర్గా పని చేస్తున్నాను. ప్రస్తుతం నా జీతం రూ.15 వేలు. దానిని రూ.6 వేలకు కుదించారు. ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రూ.6 వేలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? – గుబ్బల జ్యోతి ● డీఎస్ఏలో సిబ్బంది జీతాల కుదింపు ● సగానికి సగం కోత ● శాప్ బోర్డు మీటింగ్ సాకునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచుతారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) తీరే వేరు. ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న చిరుద్యోగుల జీతాల్లో సగానికి సగం కోత పెట్టింది. వారి జీవితాలతో ఆటాడుకుంటోంది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తున్నదే చాలీచాలని జీతమైతే.. అందులోనూ కోత పెడితే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. 2003 నుంచి.. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లో 2003 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన సుమారు 20 మంది చిరుద్యోగులు పని చేస్తున్నారు. వీరందరినీ అప్పట్లో జిల్లా కలెక్టర్, శాప్ అనుమతితోనే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వీరిలో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇళ్ల భీమేశ్వరరావు (బాస్కెట్బాల్ కోచ్), నల్లా కామేశ్వరరావు (గ్రౌండ్స్మన్), ఆకుల వీరబాబు (నైట్ వాచ్మన్), కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జి.జ్యోతి (స్వీపర్), కె.లోవ (స్వీపర్), జి.పుల్లారావు (నైట్ వాచ్మన్), ఎం.లక్ష్మీనారాయణ (టెన్నిస్బాల్ పిక్కర్), ఎస్.నారాయణరావు (బ్యాడ్మింటన్ కోచ్), అబ్దుల్ వదూద్ (సీని యర్ అసిస్టెంట్), ఎన్.సత్యకృష్ణ (డేటా ఎంట్రీ ఆపరేటర్), శ్రీను, ఎన్వీ సాగర్ (గ్రౌండ్స్మన్) తదితరులున్నారు. 13 నెలలుగా.. వీరిలో ఆఫీస్ సిబ్బందికి ప్రతి నెలా రూ.18 వేల నుంచి రూ.21 వేలు, మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున జీతాలు ఇచ్చేవారు. అయితే గత 13 నెలలుగా వీరికి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వడం లేదు. గత ఆగస్టులో జరిగిన శాప్ బోర్డు మీటింగ్లో ఆఫీస్ సిబ్బందికి రూ.15 వేలు, గ్రౌండ్స్మన్, వాచ్మన్ల్కు రూ.8,000, స్వీపర్లకు రూ.6,000 చొప్పున జీతాలు కుదించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆయా డీఎస్ఏలను ఆదేశించారు. దీంతో, ఈ చిరుద్యోగులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇరవయ్యేళ్లకు పైబడి పని చేస్తూంటే.. ఇప్పుడిలా అన్యాయం చేయడమేమిటంటూ జిల్లా క్రీడాభిృద్ధి అధికారుల (డీఎస్డీఓ) వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, శాప్ నుంచి ఆదేశాలు వచ్చాయని, తామేమీ చేయలేమని వారు చెప్పారు. కాకినాడ డీఎస్ఏలో 2017లో టాలీ ఆపరేటర్ను నిమించాలని శాప్ ఆదేశించింది. ఆ మేరకు తేజ అనే వ్యక్తిని ఆ పోస్టులో నియమించారు. అయితే, ఇప్పుడు శాప్ అనుమతి లేకుండా నియమించారని పేర్కొంటూ మొత్తం అతడి పేరును తొలగించారు. అసలుకే ఎసరు పెట్టేలా.. రెండు దశాబ్దాలకు పైగా సర్వీసు ఉన్న తమను ఆయా ఉద్యోగాల్లో పర్మినెంట్ చేసి, జీతాలు పెంచాల్సింది పోయి, సగానికి సగం కోత పెట్టడమేమిటని ఆ చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికై నా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో పని చేస్తూండగా అసలుకే ఎసరు పెట్టినట్టు శాప్ వ్యవహరిస్తోందని వాపోతున్నారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే చాలీచాలని జీతాలతో కుటుంబాలు భారంగా నెట్టుకొస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు. సోమవారం కాకినాడ వచ్చిన శాప్ డైరెక్టర్ల బృందం ఎదుట వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, వారి జీతాలు తగ్గించిన విషయం తమకు తెలియదని శాప్ డైరెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్లో కొసమెరుపు. చివరకు సమస్య అర్థం చేసుకుని, ఆ చిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. -
పీజీఆర్ఎస్కు 365 అర్జీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 365 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటిపై సత్వరం సమగ్ర విచారాణ చేపట్టి, తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపు లబ్ధిపై అవగాహన కల్పించాలి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జీఎస్టీ తగ్గింపు వలన కలిగే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నా రు. ఈ అంశంపై డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, ని యోజకవర్గ, మండల, వార్డు, సచివాలయ స్థా యిల్లో జీఎస్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జీఎస్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 19 వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఐటీఐలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించారు. కాకినాడ, జగ్గంపేటల్లోని ప్రభుత్వ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో మిగిలిస 43 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ప్రైవేట్ ఐటీఐలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ జీవీకే వర్మ తెలిపారు. లంకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అమలాపురం రూరల్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, మంగళవారం రెండో ప్రమాద హెచ్చరికకు వరద నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీంతో గోదావరి తీరం వెంబడి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల కాజ్ వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయని, బోట్ల సహకారంతో అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే తరలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పోలియో ఫండ్కు రూ.లక్ష విరాళం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ రోటరీ పోలియో ఫండ్కు క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు సోమవారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు అంతర్జాతీయ రోటరీ కృషి చేస్తోందని చెప్పారు. ఫలితంగా నేడు పోలియో రహిత ప్రపంచంగా ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ఇటీవల కొన్ని పోలియో కేసులు నమోదవడం పట్ల అంతర్జాతీయ రోటరీ ఆందోళన వ్యక్తం చేసిందని, ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలన్న దృక్పథంతో ఏటా రెండుసార్లు పల్స్పోలియో కార్యక్రమం నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి రోటరీ సభ్యులు విరాళాలు ఇప్పించాలని కోరారు. డాక్టర్ రావు విరాళం అందించడం పట్ల గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సాన, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, నయన శ్రీరామ్ అభినందించారు. -
ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
● సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ● ఎయిర్పోర్ట్ వరకూ భారీ బైక్ ర్యాలీసాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో అరెస్టయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలను పరిశీలించిన జైలు అధికారులు మిథున్రెడ్డిని సాయంత్రం 5.55 గంటలకు విడుదల చేశారు. ఎంపీ విడుదల విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ జైలు నుంచి మధురపూడి ఎయిర్పోర్ట్ వరకూ ఈ ర్యాలీ సాగింది. మిథున్రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఆయన తండ్రి, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కొవ్వూరు, అనపర్తి కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్ల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పాల్గొన్నారు. మిథున్రెడ్డి అరెస్టు పైశాచిక ఆనందం ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు కూటమి ప్రభుత్వ పైశాచిక ఆనందానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ భయపడరు. లిక్కర్ అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిన వారందరూ కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు శాడిజం మిథున్రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టినది మ్యానేజ్డ్ కేసు అనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నాం. బెయిల్ పత్రాలు వచ్చినా కావాలనే విడుదల ఆలస్యం చేశారు. ఇది చంద్రబాబు శాడిజానికి నిదర్శనం. చంద్రబాబు ఎప్పుడూ హింసించి ఆనందం పొందుతారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బాబు ఎవరు? – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకే ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు. ఆయన జైలు నుంచి బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్ -
క్రీడా అకాడమీలు పునఃప్రారంభిస్తాం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభిస్తామని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) బోర్డు సభ్యుడు, అకాడమీస్ కమిటీ సభ్యుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎ.రమణారావు తెలిపారు. ఆయనతో పాటు శాప్ సభ్యులు ఎ.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె.జగదీశ్వరి, పీబీవీఎస్ఎన్ రాజు, శాప్ క్రీడాధికారి జూని గాలియోట్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) శ్రీనివాస్కుమార్తో కూడిన అకాడమీస్ కమిటీ సోమవారం కాకినాడలోని జిల్లా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) క్రీడా ప్రాంగణాన్ని సందర్శించింది. క్రీడా అకాడమీల ఏర్పాటుకు ఉన్న వసతులు, కావలసిన సౌకర్యాలపై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా డీ ఎస్ఏ కార్యాలయంలో రమణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూ రు, తిరుపతి డీఎస్ఏలలోని అకాడమీలను నెల రోజుల్లోగా పునఃప్రారంభించే అంశంపై తమ కమిటీ శాప్ కు నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ ఇచ్చేందుకు 100 మంది కోచ్ల నియామకానికి శాప్ ప్రభుత్వ అనుమతి కోరిందన్నారు. 14 నుంచి 16 రకాల క్రీడాంశాల్లో సుమారు 100 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అన్ని వసతులూ అకాడమీల్లో కల్పిస్తామని చెప్పారు. -
ఘనంగా త్రికోటి మహా సరస్వతీ పూజ
కాకినాడ రూరల్: శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని శ్రీపీఠం విద్యార్థులతో కళకళలాడింది. జిల్లా నలుమూలల నుంచీ వేలాదిగా వచ్చిన విద్యార్థులతో పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి త్రికోటి మహా సరస్వతి పూజ చేయించారు. సరస్వతీ కటాక్షం కలగాలనే సంక్పలంతో కుంకుమ పూజ నిర్వహించారు. పూజ కోసం విద్యార్థులకు సరస్వతీదేవి ఫొటో, పెన్ను, కుంకుమను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చన్నారు. ఒక్కో వయసులో ఒక్కో సంకల్పం ఉంటుందని, విద్యార్థులకు విద్య మాత్రమే మహా సంకల్పమని చెప్పారు. విద్యతో కుటుంబ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని, మనను లీనం చేసుకుని చదువు యజ్ఞం కొనసాగించాలని ఆకాంక్షించారు. పూజ అనంతరం విద్యార్థులు సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న ఐశ్వర్యాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు 8వ రోజుకు చేరుకున్న సందర్భంగా మేథా సూక్త, సరస్వతీ హోమం నిర్వహించారు. మంగళవారం నాటికి వంద కోట్లకు చేరువవుతామని, దసరా వరకు కుంకుమార్చనలు జరుగుతాయని స్వామీజీ తెలిపారు. ఆ రోజు మహా పూర్ణాహుతి ఉంటుందన్నారు.సరస్వతీ పూజకు హాజరైన విద్యార్థులు -
హడలెత్తిస్తున్న ధార్గ్యాంగ్
రాజమహేంద్రవరం రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు షాపులో ఒక గోల్డుషాపులో దుండగులు ఈ నెల 23వ తేదీన షట్టర్ పైకి వంచి అద్దాలు పగలు గొట్టి 11 కిలోల వెండి దొంగతనం చేశారు. ● తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల జంక్షన్ వెనుక ఒంటరిగా నివసిస్తున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి ఈ నెల 24వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వెళ్లి రాళ్లతో ఆమైపె దాడి చేసి 15 కాసుల బంగారం అపహరించుకు పోయారు. ● అంతకు ముందు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సైతం ఈ తరహా చోరీలకు పాల్పడ్డారని సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు ఈ చోరీలకు పాల్పడుతన్న వ్యక్తులు మధ్యప్రదేశ్కు చెందిన ధార్గ్యాంగ్గా గుర్తించారు. చోరీలకు పాల్పడిన ప్రదేశాలలో ఒకరి వేలిముద్రలు మధ్యప్రదేశ్కు చెందిన నేరస్తుడి వేలిముద్రలతో సరిపోవడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన ధార్గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ధార్గ్యాంగ్లో నలుగురి నుంచి ఆరుగురు వరకు సభ్యులు ఉంటారన్నారు. వీరికి రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, శివారు ప్రాంతాలతో పాటు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్. ఉదయం సమయంలో ఆటోల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో నలుగురు నుంచి ఆరుగురు వెళ్లి చోరీలకు పాల్పడతారు. ఒకవేళ ఇంటిలో ఎవరైనా ఉంటే వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి సొత్తును చోరీ చేస్తుంటారు. అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా పోలీస్ స్షేషన్ల పరిధిలో ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు శివారు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని, వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్కి చెందిన ధార్ గ్యాంగ్ తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రైమ్ పోలీసుల హెచ్చరిక అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆదివారం హెచ్చరించింది. ధార్గ్యాంగ్తోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు చెందిన గ్యాంగ్లు కూడా రాష్ట్రంలోకి వచ్చినట్టు సమాచారం ఉందని పేర్కొంది. ఈ గ్యాంగ్ ఒంటరిగా ఉన్న మహిళలను, ఇళ్లను టార్గెట్ చేస్తుందని క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. ధార్గ్యాంగ్లోని ఎనిమిది మంది ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఒంటరి మహిళలు, తాళాలు వేసిన ఇళ్లు, శివారుప్రాంతాలే టార్గెట్ నల్లజర్ల, ప్రత్తిపాడుతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వైనం ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు -
● బొమ్మ అమ్మాలి.. బొజ్జ నిండాలి
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు.. బడి బయటి పిల్లలు బడిలోనే ఉండాలంటూ సర్కారు వారు ఊరంత హడావుడి చేస్తూంటారు. పనుల్లో మగ్గిపోతున్న పిల్లలను రెక్క పట్టుకుని మరీ బడుల్లో చేరుస్తారు. ఆరంభ శూరత్వంలా ఆ ఆర్భాటమంతా అక్కడితోనే సరి! ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం.. పిల్లలు సైతం నాలుగు డబ్బులు సంపాదిస్తేనే కానీ ఆ బడుగుల ఆకలి మంటలు చల్లారని దుస్థితి. దీంతో, అనేక మంది చిన్నారులు రకరకాల పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వక తప్పని దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. కాకినాడ మసీద్ సెంటర్లో ఆదివారం బుడగలు విక్రయించుకుంటూ ఓ బాలుడు ఇలా జీవన పోరాటం సాగిస్తున్నాడు. – బోట్క్లబ్ (కాకినాడ సిటీ) -
నేతన్నలకు బకాయిల వెతలు
కపిలేశ్వరపురం: తమ శ్రమతో స్థాపించిన చేనేత సహకార సంఘం నిర్వహణకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు గుదిబండలా మారాయంటూ అంగర చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు పూనుకున్నారు. అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘం రెండు జాతీయ స్థాయి అవార్డులను సాఽధించింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందుకుంది. అలాంటి సంఘానికి ప్రభుత్వం నుంచి రూ.3,85,18,292 బకాయిలు రావాల్సి ఉంది. అందులో రూ.1,00,11, 858 ఆప్కో సంస్థ చెల్లించాల్సి ఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. గ్రామంలో ఆదివారం నిరసన ర్యాలీ చేశారు. చేనేత సహకార సంఘం ఎదుట సుమారు 100 మంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. నాయకులు మాట్లాడుతూ ఆప్కో ద్వారా బకాయిలను చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో బకాయిలకు తోడు మరిన్ని పథకాల ద్వారా రావాల్సిన బకాయిలు సైతం సంఘం నిర్వహణకు సమస్యగా మారాయన్నారు. తమ డిమాండ్ను పరిశీలించి పరిష్కరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. వారికి పలువురు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. -
నన్నయ వర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ డి.ఎల్.రెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించారు. పోటీల్లో 70 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ కె.వి.స్వామి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభతో అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ యూనివర్సిటీ పరిధిలో 395 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయన్నారు. 2006లో ప్రారంభించిన యూనివర్సిటీ తక్కువ కాలంలోనే పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందిందన్నారు. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో జరగనున్న జాతీయ స్థాయి అంతర విశ్వవిద్యాలయాల పురుషుల కబడ్డీ జట్టు పోటీల్లో తమ యూనివర్సిటీ జట్టు పాల్గొంటుందన్నారు. జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ– కరస్పాండెంట్ డీ.ఆర్.కె.రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ సెలెక్షన్స్ తమ కళాశాలలో నిర్వహించేందుకు అనుమతినిచ్చిన యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. -
రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలి
రావులపాలెం: నూతనంగా ఎన్నికై న చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూర్వపు అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్రి శ్రీనివాస్రెడ్డి, మామిడిశెట్టి సోమరాజు, ఆకుల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్లవరపు సూరిబాబు, సంయుక్త కార్యదర్శులుగా కొవ్వూరి వంశీకృష్ణారెడ్డి, మన్యం ప్రదీప్, మల్లూరి నీలకంఠ దుర్గారావు, కోశాధికారిగా మండవిల్లి నగేష్, సహ కోశాధికారిగా కండిచర్ల వీర వెంకట నాగరాజుతో ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. కనికిరెడ్డికి ఆయన శాలువా కప్పించి అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రెడ్డి అనంత కుమారి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి పాల్గొన్నారు.చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం -
ఇద్దరు భవానీ మాలధారుల మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు● వెనుక నుంచి ఢీకొట్టిన కారునల్లజర్ల: జాతీయ రహదారిపై నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద ఆదివారం ఉదయం కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ మాలధారులను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోశలపాడు గ్రామానికి చెందిన పక్కురి శివ, పక్కుర్తి శ్రీను, పక్కురి శేశీలు, కోనాగోవిందు భవానీ మాలలు ధరించి ఈ నెల 24న తమ స్వగ్రామం నుంచి ఇరుముళ్లు కట్టుకొని విజయవాడలోని దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా బయలు దేరారు. వీరంతా ఆదివారం ఉదయం పుల్లలపాడు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి విశాఖపట్టణం నుంచి హైదరాబాదు వెళ్తున్న పశ్చిమబెంగాల్కు చెందిన కారు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివ చక్రాల కింద, గాలిలోకి ఎగిరి పక్కనే పంటబోదెలోకి పడిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా శేశీలుకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందు ఫోన్ మాట్లాడుతూ దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. మృతిచెందిన శివకు భార్యదేవి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీను అవివాహితుడు కాగా వీరంతా వ్యవసాయ కూలీలే. మృతదేహాలను కోసం తాడేపల్లిగూడెం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆందోళనకరంగా గుండెపోటు
గుండె రక్తనాళాలు మూసుకుపోయి రక్తం సరఫరా తగ్గిపోవడం వల్లనే ఛాతిలో నొప్పి వస్తుంది. ఛాతిలో బరువుగా అనిపించడం, మెడ భాగం నుంచి మొదలై, ఎడమ చేతి వరకు లాగడం, నొప్పి వీపు వెనక భాగంలో రావడం, ఆయాసం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, కడుపులో మంట రావడం జరుగుతాయి. ఈ లక్షణాలు ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ కారెం రవితేజ, ఎండీ ఫిజీషియన్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ప్రతి రోజూ వ్యాయామం చేయాలి ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్స్ అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. తెలియకుండానే శరీరంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో పెరిగి, రక్తంలో బ్లాక్స్ ఏర్పడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె, మెదడు స్ట్రోక్స్ వస్తాయి. – డాక్టర్ సుమలత, డిస్ట్రిక్ట్ నోడల్ అధికారి, ఎన్సీడీ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● -
గుండె లయ తప్పుతోంది
●రాయవరం: ఇటీవలి కాలంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఎలా చనిపోయారు అని ప్రశ్నించగానే ఎక్కువగా వినిపించే సమాధానం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చోటు చేసుకునే మరణాల్లో హార్ట్ ఎటాక్తో జరిగేవే అధికం. మన శరీరానికి పెద్దదిక్కుగా వ్యవహరించే హృదయం లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అతి ప్రధానమైన అవయవం మనిషి శరీరంలో పనిచేసే అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత లేకుండా పోతోంది. వ్యాయామం లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం. పొగ తాగడం, ఒత్తిళ్లతో గుండెపోటుకు గురవుతున్నారు. మనుషుల్లో మారుతున్న అలవాట్లు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలకు దారి తీయడంతోపాటు అంతిమంగా గుండైపె ప్రభావం పడుతోంది. అయితే మధుమేహం (సుగర్)తోనే అధిక ముప్పు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు రెండు దశాబ్దాల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెపోటు, మారిన జీవన శైలి కారణంగా నేడు 20 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయసువారే ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి కారణం అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, సుగర్, ఫాస్ట్ ఫుడ్ , లావు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధికంగా ఫోన్ చూడడం, ప్యాక్డ్ ఫుడ్ను అధికంగా తీసుకోవడం, మితిమీరి శీతలపానీయాలు తాగడం, తరచుగా ఆయిల్ ఫుడ్ను తీసుకోవడం. జిల్లాలో 14 శాతం బాధితులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు 14 శాతం ఉన్నట్లు అంచనా. ఆకస్మిక హృద్రోగ సమస్య ఎదురైన వారిలో 10 శాతం మంది మాత్రమే చికిత్స పొంది, కోలుకుంటున్నారు. హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడేవారు 1.06 లక్షల మంది, సుగర్ వ్యాధిగ్రస్తులు 43వేల మంది ఉన్నారు. కోవిడ్–19తో పెరిగిన కేసులు జిల్లాలో కోవిడ్ వైరస్ వల్ల గుండె సమస్యలు 50 నుంచి 60 శాతానికి పెరిగాయి. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, సుగర్, మద్యం, సిగరెట్ వల్ల ఈ సమస్య ఉండేది. గుండె నొప్పి, అధిక ఆయాసం ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారంలో సాధ్యమైనంతవరకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 20 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను అధిగమించవచ్చు. మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పార్కులు, ఇతర ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించాలి. కరోనాతో మరింత పెరిగిన గుండెపోటు బాధితులు ఆహారపు అలవాట్లు అదుపు చేసుకుంటేనే మంచిది నేడు వరల్డ్ హార్ట్ డే -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఆలమూరు: మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం 216 ఏ జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలగల సుజాత (45) మృతి చెందారు. కడియం మండలంలోని పొట్టిలంకకు చెందిన సుజాత తన భర్త సూరిబాబుతో కలిసి బైక్పై కపిలేశ్వరపురం వెళుతున్నారు. స్థానిక ఏటిగట్టు రోడ్డుకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న సైక్లిస్ట్ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న సుజాత రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ ఢీకొని.. మండలంలోని చొప్పెల్లలో శనివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పసుపులేటి వేణుగోపాలరావు (47) మృతి చెందారు. వివరాలలోకి వెళితే మోరంపూడికి చెందిన వేణుగోపాలరావు కొద్దికాలంగా పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో రోజ్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా స్థానిక ఇరిగేషన్ లాకుల వద్దకు వచ్చేసరికి తాను నడపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణుగోపాలరావును హైవే, పోలీసు సిబ్బంది అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. -
వాడపల్లి వెంకన్నకు దసరా శోభ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా దాదాపు ఆ స్థాయిలో ఈ ఆదివారం భక్తజనంతో ఆ క్షేత్రం కిక్కిరిసింది. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా అత్యధికంగా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు, ఆదివారం కావడంతో అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. కొందరు స్వామివారి కల్యాణం చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ.8,90,146 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.● అత్యధికంగా తరలివచ్చిన భక్తజనం ● ఒక్కరోజు రూ 8.90 లక్షల ఆదాయం -
గోదావడి..
కోటిలింగాల ఘాట్ వద్ద వరద గోదారితగ్గుతూ.. పెరుగుతూ..ధవళేశ్వరం: కొద్ది రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. అయితే, ఎగువన నీటిమట్టాలు పెరుగుతూండటంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. అనంతరం క్రమేపీ రాత్రి 8 గంటలకు 12 అడుగులకు తగ్గింది. బ్యారేజీ నుంచి 10,09,208 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఇక్కడ నీటి ఉధృతి క్రమేపీ తగ్గుతూండగా మరోవైపు ఎగువన భద్రాచలంలో ఆదివారం సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతోంది. దీని ప్రభావంతో ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి సోమవారం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టా కాలువలకు 10,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో మూడోసారి.. ఈ సీజన్లో మూడుసార్లు వరదలు వచ్చాయి. గత నెల 21వ తేదీన ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటిమట్టం చేరింది. ఆ మర్నాడు.. అంటే గత నెల 22న బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ఉధృతి చేరింది. ఆ సమయంలో అత్యధికంగా 14.30 అడుగులకు నీటిమట్టం చేరగా 13,57,119 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రెండోసారి గత నెల 30వ తేదీన మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. ఆ సమయంలో నీటిమట్టం 13.10 అడుగులకు చేరుకోగా 11,79,236 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మూడోసారి శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరింది. గరిష్టంగా 12.50 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 10,78,317 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 11.20 పేరూరు 15.89 దుమ్ముగూడెం 11.84 భద్రాచలం 43.40 (అడుగులు) కూనవరం 18.46 కుంట 9.75 కొయిదా 24.55 పోలవరం 12.01 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.08 ధవళేశ్వరం వద్ద స్వల్పంగా తగ్గిన ఉధృతి ఉదయం నీటిమట్టం 12.50 అడుగులు రాత్రి 12 అడుగులకు తగ్గుదల ఎగువన పెరుగుతున్న నీటిమట్టాలు కాటన్ బ్యారేజీ వద్ద వరద నేడు స్వల్పంగా పెరిగే అవకాశం -
స్టెత్ డౌన్.. సమ్మె సైరన్
● ఉద్యమ పథంలో పీహెచ్సీ వైద్యులు ● నేటి నుంచి ఓపీ సేవల నిలిపివేత ● ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● పేదల వైద్య సేవలకు ఆటంకం కాకినాడ క్రైం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) వైద్యులు స్టెతస్కోప్ కాసేపు పక్కన పెట్టి సమ్మె బాట పట్టారు. తొలి దశలో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడి న్యాయపరమైన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పూర్తి స్థాయిలో విధుల బహిష్కరణకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రజల కోసం ఆలోచించి సమ్మె నిర్ణయాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వస్తే అది తమ చేతకానితనంగా ప్రభుత్వం పరిగణించిందని మండిపడుతున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మె పరిష్కారం దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే జిల్లాలోని పేదల వైద్య సేవలకు ఆటంకం కలగనుంది. ఇవీ సమస్యలు ● సర్వీస్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ రిజర్వేషన్ ఉండేది. ప్రభుత్వం జీఓ నంబర్ 85 ద్వారా ఈ కోటాను 15, 30 శాతానికి కుదించేసింది. ● ఈ ఏడాది జీఓ నంబర్ 99 ద్వారా ఆరు బ్రాంచిల నిబంధన తెర మీదికి తెచ్చారు. దీని ప్రకారం, 15 శాతానికి కుదించిన క్లినికల్ సీట్ల రిజర్వేషన్ రేడియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్థీషియా బ్రాంచిలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ అన్యాయాన్ని వైద్యులు ఏడాది కాలంగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ● ఎంబీబీఎస్ చదివి వైద్యాధికారిగా నియమితులైన వారు పీజీ చదువుకోవడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. రూ.50 లక్షల ష్యూరిటీ ఇవ్వాలని, కనీసం పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో అదే హోదాలో పని చేస్తామంటూ బాండ్ రాయాలని చెబుతోంది. అదీ కాక మెడిసిన్ చదివిన ఒరిజినల్ సర్టిఫికెట్ను కూడా ప్రభుత్వం తన వద్ద హామీగా పెట్టుకుంటోంది. వైద్య వృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలో చేరే ఉద్యోగికి కూడా ఇన్ని కఠిన షరతులు ఉండవని వాపోతున్నారు. ఈ నిబంధనలు సడలించాలని కోరుతున్నా ప్రభుత్వం మనసు కరగడం లేదు. ● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పని చేస్తున్న ఎంతో మంది వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గళమెత్తిన పలు జిల్లాల సంఘ నాయకులను ప్రభుత్వ పెద్దలు నేరుగా బెదిరించారని ఆరోపిస్తున్నారు. ● కోవిడ్ వేళ అత్యవసర పరిస్థితిలో చేరి, ప్రాణాలకు తెగించి మరీ రోగులకు వైద్య సేవలు అందించిన తమపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 2020–22 మధ్య ఉద్యోగంలో చేరిన వైద్యులకు ఇప్పటికీ రూ.53,500 మాత్రమే జీతం ఇస్తున్నారు. 2023లో నియమితులైన ఫ్రెషర్లకు రూ.80 వేల నుంచి రూ.90 వేల పే స్కేల్ అమలు చేస్తున్నారు. ఇలా సీనియర్లు అన్యాయానికి గురవుతున్నారు. తమ జీతాలను తాజా పే స్కేల్తో సమానం చేసి, పెండింగ్ జీతాన్ని నోషనల్ ఇంక్రిమెంట్ల కింద చెల్లించాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ● గత ఏడాది ఇదే నెలలో వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నాయకులు, అధికారులు చెప్పారు. తీరా నిరసన విరమించాక ఏమాత్రం పట్టించుకోలేదు. నాటి అనుభవంతో రగిలిపోతున్న మెడికల్ ఆఫీసర్లు ఈసారి అటువంటి మోసాలకు గురి కాబోమని స్పష్టం చేస్తున్నారు. ● చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగి సేవలందిస్తున్నందుకు ప్రతి నెలా అదనంగా రూ.5 వేలు చెల్లించాలని కోరుతున్నారు. ● గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యుల భత్యానికి 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉండగా దానినీ గాలికొదిలేశారు. ● నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం ఫైల్ పెట్టినా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. పైగా రిజెక్ట్ అయినట్లు చెబుతూ మభ్యపెడుతోంది. ● రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇప్పటికీ స్థానికత వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం వైద్యాధికారులకు శాపంగా మారింది. దశల వారీ ఆందోళన ఈ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం (ఏపీపీహెచ్సీడీఏ) పిలుపు మేరకు వైద్యులు సమ్మె బాట పట్టారు. దీనిని దశల వారీగా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా నల్ల రిబ్బన్లతో వైద్యులు నిరసన తెలిపారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగారు. సోమవారం నుంచి ఓపీ సేవలు బహిష్కరించనున్నారు. అత్యవసర సేవలు మాత్రమే అందిస్తారు. మంగళవారం జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతారు. వచ్చే నెల 1న ప్లకార్డులు చేబూని జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారు. 2న విజయవాడకు దీక్షా యాత్ర నిర్వహిస్తారు. 3న నిరాహార దీక్షలు చేపడతారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా సహా తమ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో ఉద్యమించనున్నారు. సార్ డెన్మార్క్ వెళ్తున్నారంటూ.. తమ సమస్యలు పరిష్కరించాలని పీహెచ్సీ వైద్యుల సంఘం నాయకులు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, అంతకుముందు కృష్ణబాబు, కమిషనర్ వీరపాండియన్, హెల్త్ డైరెక్టర్ పద్మావతితో పాటు నేరుగా ముఖ్యమంత్రికి సైతం తమ ఆవేదన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేదు. తాజాగా సౌరవ్ గౌర్ డెన్మార్క్ వెళ్తున్నారని, నెల రోజుల వరకూ రారని, సమ్మె వాయిదా వేసుకోవాలని, సోమవారం నుంచి ఆయన స్థానంలో కృష్ణబాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని, ఆయనకు ఎటువంటి అధికారాలూ ఉండవని ప్రభుత్వం చెబుతోంది. ఇదంతా తమను మరోసారి బురిడీ కొట్టించే వ్యూహమేనని పీహెచ్సీల వైద్యులు భావిస్తున్నారు. అన్ని వర్గాల మద్దతు వైద్యాధికారుల సమ్మెకు అన్ని వర్గాల మద్దతూ లభిస్తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్ వైద్యులు, వైద్య సంఘాలతో పాటు నాన్ మెడికల్, పారా మెడికల్ సిబ్బంది సహకారం అందుతోంది. సమస్యలు పరిష్కరించే వరకూ వెనకడుగు వేయం. ప్రజారోగ్యం పట్ల మాకున్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదు. తక్షణమే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు సహకరించాలి. – డాక్టర్ సందీప్ పోల్సపల్లి, ఏపీపీహెచ్సీడీఏ జిల్లా సెక్రటరీ, పి.మల్లాపురం పీహెచ్సీ వైద్యాధికారి జిల్లాలో పీహెచ్సీల వివరాలు మొత్తం పీహెచ్సీలు 37 రెగ్యులర్ వైద్యాధికారులు 104 పీహెచ్సీల్లో రోజువారీ ఓపీ సుమారు 2,500 -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
రాజోలు: స్నేహితుడిని కలిసేందుకు మోటార్ సైకిల్పై బయలుదేరిన పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడికి చెందిన బీటెక్ విద్యార్థి కడలి అక్షయ్(22) రాజోలు మండలం ములికిపల్లి–కడలి రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్షయ్ తండ్రి కడలి మోహనరావు ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలగంపూడి గ్రామానికి చెందిన అక్షయ్ చైన్నెలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ రాత్రి కలగంపూడి వచ్చాడు. మర్నాడు ఉదయమే తన స్నేహితుడిని కలిసేందుకు బుల్లెట్ మోటార్ సైకిల్పై ములికిపల్లి రాగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చైన్నె నుంచి ఇంటికి వచ్చి తమతో గడపకుండానే కుమారుడు మృతి చెందడం పట్ల తండ్రి మోహనరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మహాచండీదేవిగా...
అన్నవరం దేవస్థానంలో కొలువు తీరిన దుర్గామాతలు కూడా మహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రత్నగిరిపై సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీ దేవితో పాటు వనదుర్గమ్మ, తొలి పావంచా వద్ద కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవార్లకు అర్చకులు అష్టోత్తర శత సహస్ర నామార్చన, లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం మహిళలు కనకదుర్గమ్మ ఆలయంలో లలితా పారాయణ చేశారు.– తొండంగిలోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారు శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఏడో రోజైన ఆదివారం భక్తులకు మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. వేదపండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.– తుని రూరల్ -
వైభవంగా సత్యదేవుని ప్రాకార సేవ
తొండంగి: రత్నగిరిపై సత్యదేవుని ప్రాకార సేవ ఆదివారం వైభవంగా జరిగింది. ప్రధానాలయంలో మూలవిరాట్టుకు వేదమంత్రోచ్చారణతో అర్చకులు అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీపై రాజగోపురం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ గావించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు జయలక్ష్మి సొసైటీ మహాజన సభ కాకినాడ రూరల్: జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ నాలుగో మహాజన సభ సోమవారం కాకినాడలో జరగనుంది. సాంబమూర్తి నగర్ మున్సిపల్ కార్యాలయం వెనక దంటు కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సభ్యులందరూ హాజరు కావాలని చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు కోరారు. పలు తీర్మానాలతో పాటు సభ్యులు ప్రతిపాదించిన అంశాలను సభ అజెండాలో ఉంచుతామన్నారు. మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం కాకినాడ రూరల్: మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. పీఠంలో మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం వారాహి, కీలక స్తోత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనల్లో వేలాదిగా పాల్గొన్న మహిళలనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, కోట్ల కుంకుమార్చనలు అందుకున్న అమ్మవారు మహాశక్తిగా అందరినీ కాపాడేందుకు మహాశక్తి దీపం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మహాశక్తి దీపంలో 108 అడుగుల ఎత్తున ఒక మహాపర్వతం, దానిని ఆనుకుని 64 అడుగుల ఎత్తున అమ్మవారు ఉంటారని వివరించారు. అమ్మవారి చుట్టూ చండీ, భైరవి, మాతంగి, వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర తదితర 8 శక్తులు ఉంటాయన్నారు. దేశంలోని వన మూలికల వృక్షాలను అమ్మవారి చుట్టూ పెంచుతామన్నారు. అందరూ కూర్చుని హాయిగా పారాయణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. లలితా సహస్ర నామ పారాయణతో 72 వేల నాడులు యాక్టివేట్ అవుతాయని స్వామీజీ చెప్పారు. ప్రతి ఒక్కరూ లలితా పారాయణ చేసుకోవాలని సూచించారు. మహాశక్తి యాగంలో మొదటి, రెండో సంవత్సరం పాల్గొన్న భక్తురాలికి వివాహమైన 14 ఏళ్లకు ముగ్గురు కుమార్తెలు శశిరేఖ, శశిప్రియ, శశికళ జన్మించారని, ఇది యాగ ఫలితమని పేర్కొంటూ వారిని ఒడిలోకి తీసుకుని ముచ్చటించి, భక్తులకు చూపించారు. -
జగన్, చిరంజీవిలకు క్షమాపణ చెప్పాలి
● మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్ ● అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని వ్యాఖ్యలపై మండిపాటు కాకినాడ రూరల్: సభా మర్యాద పాటించకుండా సభలో లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సినీ నటుడు చిరంజీవిలను కించపరిచేలా మాట్లాడిన బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్లు వెంటనే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడ వైద్యనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో చిరంజీవి, జగన్ గురించి మాట్లాడిన తరువాత బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో తేటతెల్లమైందన్నారు. ‘కౌన్సిల్లో కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పంట. కానీ మీరు మాత్రం సైకో అనవచ్చా?’ అని ప్రశ్నించారు. ‘జగన్పై విషం కక్కుతూ మానసికంగా కుంగదీయాలని మీరు చూసి నా ఆయన మాత్రం లెక్క చేయకుండా పెద్ద పార్టీని నడుపుతూ ముందుకు సాగుతున్నారు’ అని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదని నిలదీశారు. ఎఫ్డీసీ జాబితాలో బాలకృష్ణ పేరును 9వ స్థానంలో వారి ప్రభుత్వమే పెట్టిన సంగతి చూసుకోవాలని అన్నారు. బజారు భాష మాట్లాడవద్దని హితవు పలికారు. ఆన్లైన్లో తిట్టడం, ఆఫ్లైన్లో కాళ్లు పట్టుకోవడం పరిపాటైందని, పద్ధతి మార్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో యూ రియా దొరక్క రైతులు అల్లాడుతున్నారని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కట్టక ముందే పోలవరం కొట్టుకుపోతోందని, ఇటువంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సింది పోయి జగన్ను అవమానించడం, చిరంజీవిని అందులోకి లాక్కురావడం చేశారని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు డ్రైవింగ్ లైసెన్స్ మాదిరిగా బాలకృష్ణకు పిచ్చి సర్టిఫికెట్ ఉందని, దాంతో ఏదైనా మాట్లాడవచ్చనుకుంటూ కళ్లజోడు నెత్తికి పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఎవడాడు అంటూ చిరంజీవిని, సైకో అంటూ మాజీ సీఎం జగన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పు కాదా అని ప్రశ్నించారు. కామినేని శ్రీనివాస్ భాష ఎలా ఉందో చూశామన్నారు. చిరంజీవిని లాక్కుని రావల్సిన పనేముందన్నారు. తమను జగన్మోహన్రెడ్డి అవమా నించలేదని చిరంజీవి చెప్పారన్నారు. ఇదే విషయాన్ని ఆర్.నారాయణమూర్తి కూడా ఉద్ఘాటించారన్నారు. చి రంజీవి లేఖతో నిజాలు నిలకడగా తెలుస్తాయనే రుజువైందని అన్నారు. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని, చిరంజీవిని అవమానించారని ఇన్నాళ్లూ జగన్పై తప్పుడు ప్రచారం చేశారన్నారు. అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణ మాటలకు క్షమాపణలు చెబుతారమో చూశామని, కానీ అలా చేయలేదని అన్నారు. డిప్యూటీ స్పీకర్ను కూడా కామినేని అవమానకరంగా మాట్లాడారన్నారు. రికార్డుల నుంచి తొలగిస్తామంటున్నారని, సోషల్ మీడియాలో రికార్డులను ఎవరు తొలగిస్తారని ప్రశ్నించారు. చిరంజీవి, జగన్కు అవమానం జరిపోయింది కదా! అని అన్నారు. జగన్ శక్తిని తట్టుకోలేకే కూటమి కట్టారు ‘పేదల పక్షాన పని చేసిన జగన్ శక్తిని తట్టుకోలేకే మీరందరూ కూటమి కట్టారు. 40 శాతం ఓటు షేర్ ఉన్న నాయకుడిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతారా?’ అని కన్నబాబు ప్రశ్నించారు. కూటమిలోని మూడు పార్టీల్లో ఎవరి ఓటు షేర్ ఎంతో తేల్చి చెప్పాలన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, వారిలో వారే కొట్టుకుని, వారిలో వారే తిట్టుకుని ప్రజల సమస్యలను వదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ వ్యక్తిగత అజెండా కొనసాగుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్లను టార్గెట్ చేశారన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు వారైనా అర్థవంతమైన చర్చ జరపాలి కదా! అని అన్నారు. విలేకర్ల సమావేశంలో శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజలను వేధించడానికే.. కూటమి అధికారంలోకి వచ్చింది’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు అని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులను నేర్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కాకినాడ రూరల్లో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ను ఉత్తరాంధ్ర జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమికి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి.. వైఎస్సార్సీపీని అణగదొక్కడానికే. సామాన్యుల నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు. పోలీసులు ఎందుకు దిగజారిపోయి పని చేస్తున్నారని సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అని చెప్పాలి. అలా కాకుండా.. ప్రజల్ని పీడించుకుని, వేధించుకుని తిను అని చంద్రబాబు తన కొడుక్కి నేర్పించాడు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్ డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పకుండా డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
కూటమి అరాచకాలకు మూల్యం తప్పదు
ఫ కార్యకర్తలకు వెన్నంటి నిలుస్తాంఫ అభాగ్యులకు అండగా ‘డిజిటల్ బుక్’ ఫ ధైర్యంగా క్యూఆర్ కోడ్, ఐవీఆర్ఎస్కు ఫిర్యాదు చేయండి ఫ వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేఫ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలనలో అన్యాయానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్ బుక్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో డిజిటల్ బుక్ను రాజా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్ కోడ్, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనికోసమే జగన్ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. తుని నియోజకవర్గం బెండపూడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త, కాపు సామాజికవర్గ నేత హత్యకు గురైతే పోలీసులు కేసు నమోదు చేయని దుస్థితి చూశామని గుర్తు చేశారు. అప్పట్లో కోర్టుకు వెళ్లి కేసు నమోదు చేయించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కూటమి పాలనలో నెలకొందన్నారు. మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమనే విషయం ప్రజల్లో బలంగా వినిపిస్తోందన్నారు. చివరకు అసెంబ్లీలో కూటమి ప్రజాప్రతినిధులు సైతం కంగారు పడుతున్న విషయం స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. కూటమి దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైనా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని రాజా స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల సమస్య వస్తే వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్డెక్కి, పోలీసు కేసులకు సైతం వెరవకుండా పోరాటం చేయబట్టే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎరువులు దిగుమతి చేసుకుందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడేది వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ప్రతి సమస్యపై స్పందిస్తున్న పార్టీగా రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్ సీపీని చూస్తున్నారన్నారు. టీడీపీ మాదిరిగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే తమ పార్టీ బయటకు రాలేదన్నారు. సూపర్ సిక్స్లో ఏ పథకాలు వచ్చాయనేది ప్రజలకు తెలియంది కాదని రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి తోట నరసింహం, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, కొప్పన శివనాథ్, ఒమ్మి రఘురామ్, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి దీప్తికుమార్, జమ్మలమడక నాగమణి, ప్రచార సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి సుంకర సాగర్, బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, కర్రి వీర్రెడ్డి (చినబాబు), పార్టీ నేతలు యనమల కృష్ణుడు, పసుపులేటి వెంకటలక్ష్మి, రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం కూటమి ప్రభుత్వానికి దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కె.ఆదిత్య కుమార్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా లీగల్ సెల్ ఆధ్వర్యాన న్యాయవాదులు కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య కుమార్ మాట్లాడుతూ, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయలతో వాటి నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ కళాశాలల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. విద్య, వైద్యం రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిన హక్కని, వీటిని ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఎంతోమంది ప్రాణాలు నిలిపారన్నారు. ఆ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాయని గుర్తు చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వాసుపత్రులు ఎంతో మేలు చేస్తాయని ఆదిత్య కుమార్ అన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు లీగల్ సెల్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ కాకినాడ సిటీ అధ్యక్షుడు గెద్దాడ వెంకటేశ్వరరావు, నాయకులు విశ్వనాథరెడ్డి, బాలకృష్ణ, నాగేంద్ర, పితాని శ్రీనివాస్, కలిదిండి శ్రీనివాస్, నున్న కృష్ణ, గెడ్డం శ్రీనాథ్, జి.వరప్రసాద్, ఎంజీకే రాజు, మహిళా న్యాయవాదులు కళ, ప్రసన్న, శ్వేత పాల్గొన్నారు. -
లలితాదేవిగా తలుపులమ్మ తల్లి
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఆరో రోజైన శనివారం శ్రీ లలితాదేవిగా అలంకరించారు. అమ్మవారిని భవానీ భక్తులు దర్శించి, సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఆదివారం మహాచండీదేవిగా అమ్మవారిని అలంకరించనున్నట్లు వేదపండితులు తెలిపారు. వేలాదిగా.. శృంగార వల్లభుని దర్శనానికి.. పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామివారిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకు న్నారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లతో పాటు అన్నదాన విరాళాలు కలిపి స్వామివారికి రూ.4,77,983 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. పుష్కర ఘాట్లో ఇద్దరి గల్లంతు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు భవానీ భక్తులు గల్లంతైన సంఘటన స్థానిక పుష్కర ఘాట్లో చోటు చేసుకుంది. గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గుబ్బల బాపిరాజు (28) వాచ్మెన్గా పని చేస్తూ రాజమహేంద్రవరంలో ప్రస్తుతం నివసిస్తున్నాడు. రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన అతడి బావమరిది రాయుడు వీరబాబు (25) హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. భవానీమాల వేసుకోవడానికి అతడు ఇటీవల ఇంటికి వచ్చాడు. బాపిరాజు, వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్కు వచ్చారు. అక్కడ బాపిరాజు, వీరబాబు స్నానానికి దిగారు. నది లోతు ఎంత ఉందో తెలియక ఊబిలో దిగి ఇద్దరూ గల్లంతయ్యారు. వారి కోసం త్రీటౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యాన ఎస్సైలు, సిబ్బంది స్థానిక మత్స్యకారులతో గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గల్లంతైన బాపిరాజు, వీరబాబు (పాత చిత్రాలు) -
వేతన వేదన
● సమగ్ర శిక్షలో చాలీచాలని జీతాలు ● ఇబ్బందుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ● కనికరించని కూటమి పాలకులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమగ్ర శిక్షలో నిరుద్యోగులైన క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ (సీఆర్ఎంటీ), పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లు మండల లెవెల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కు తోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా జీతాలు పెరగడం లేదని ఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అమలు చేయకపోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లావ్యాప్తంగా మండల వనరుల కేంద్రాల్లో 220 మంది పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 81 మంది సీఆర్ఎంటీలు (వీరిలో ఇద్దరు మరణించారు), 24 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 19 మంది మండల లెవెల్ అకౌంటెంట్లు, 24 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 24 మంది మెసెంజర్లు పని చేస్తున్నారు. వీరందరూ 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 వేతనం చెల్లించేవారు. తరువాత వచ్చిన పాలకులు వీరి జీతాల పెంపును విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాన్ని 2020లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.23,500కు పెంచారు. కక్ష కట్టినట్టు కూటమి తీరు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా కాంట్రాక్టు అవుట్సో ర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్స్కేల్ వర్తింపజేయరాదని ఈ ఏడాది జనవరిలో జీఓ నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కు సూత్రానికి ఈ జీఓ విరుద్ధమని సమగ్ర శిక్ష సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు అమలు కావడం లేదని వాపోతున్నారు. అమలు కాని హామీలు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు గొప్పగా ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత షరా మామూలుగానే మొండిచేయి చూపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, కొత్త రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలను సమగ్ర శిక్షలో పని చేస్తున్న చిరుద్యోగులకు వర్తింపజేయలేదు. ప్రభుత్వం ఓవైపు ఇలా అన్యాయం చేస్తూండగా.. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, రవాణా, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడంతో ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తమకు వెంటనే జీతం పెంచాలని, దీంతో పాటు రిటైర్మెంట్ వయసు పెంపు, ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్, సంక్షేమ పథకాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల వంటివి ప్రత్యేకంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ సార్.. ట్వీట్ మరిచారా! గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్ నెలలో మినిమమ్ టైమ్స్కేలు అంశంపై సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అప్పట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనకు టీడీపీ సంఘీభావం తెలియజేస్తోందని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ట్వీట్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు మద్దతు తెలిపి, నేడు అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోవడం లేదని చిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచాలి జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర ధరలు, రవాణా, వైద్యం, ఇంటి అద్దె వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కుటుంబ పోషణ భారమవుతోంది. నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా జీతాలు పెంచాలి. – తరాల మీరాసాహెబ్ సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉద్యోగ భద్రత కల్పించాలి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధ్యాయుల మాదిరిగానే సెలవులు వర్తింపజేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. – ఎ.రాంజీ ప్రసాద్, సీఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
అమ్మను మరువకండి
● రోజుకు 24 నిమిషాలు కేటాయించండి ● పరిపూర్ణానంద స్వామి ● శ్రీపీఠంలో 60 కోట్లకు చేరిన కుంకుమార్చనలు ● 50 వేల మంది మహిళలు హాజరుకాకినాడ రూరల్: ‘అమ్మ ఒక శక్తి. అమ్మ ఒక అద్భుతం. అన్నీ ఉన్నా అమ్మను మాత్రం మరువకండి. ప్రతి రోజూ గంటకు ఒక నిమిషం చొప్పున 24 నిమిషాలు అమ్మకు కేటాయించి, ఆమెను స్మరిస్తే మీ మెదడులో గామా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. మహా ఆనందం కలుగుతుంది’ అని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. రమణయ్యపేటలోని శ్రీపీఠంలో మహాశక్తి యాగం మూడో సంవత్సరం వంద కోట్ల కుంకుమార్చనలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు శుక్రవారం, పంచమి రావడంతో సుమారు 50 వేల మంది మహిళలు దీక్షా వస్త్రాలతో ఈ పూజలకు తరలివచ్చారు. వారి సంఖ్యకు తగినట్టుగా కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేసి, అనంతరం మహా ప్రసాదం అందించారు. పీఠం అధిష్ఠాన దేవత ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సౌభాగ్య పూజ, సాయంత్రం దుర్గా సూక్త, ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, శ్రీపీఠం సీ్త్ర శక్తి పీఠమని, ఇక్కడ ఐశ్వర్యాంబిక అమ్మవారు అన్నీ నడిపిస్తున్నారని అన్నారు. వందల కోట్ల కుంకుమార్చనలు జరిగే తపో భూమిగా ఈ ప్రాంతం మారిందని చెప్పారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఏదో ఒక తపస్సు జరిగి ఉంటుందని, లేకపోతే ఇన్ని వేల మందితో పూజలు జరుగుతాయా అని అన్నారు. 64 లక్షల కోట్ల తపస్సుల సారమే లలితా సహస్ర నామాలు అని చెప్పారు. అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశీర్వదించారు. అయోధ్య బాలరాముని విగ్రహానికి పూజలు శ్రీపీఠంలో వంద కోట్ల కుంకుమార్చనల వేదికకు అయోధ్యలో స్థిరపడిన చల్లా శ్రీనివాసశాస్త్రి అక్కడి నుంచి బాలరాముని బంగారు ఉత్సవ విగ్రహం, పాదుకలు, ధనుర్బాణాలు తీసుకు వచ్చారు. వాటికి పరిపూర్ణానంద స్వామి పూజలు చేశారు. మహాశక్తి యాగంలో అయోధ్య రాముని ఆయుధాలు, పాదుకలు రావడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ఆయననే స్వయంగా విగ్రహంగా వచ్చారని చెబుతూ, ఒక్కొక్కటీ భక్తులకు చూపించారు. మొదటి సంవత్సరం పాదుకలు, రెండో సంవత్సరం ధనుర్బాణాలు, మూడో సంవత్సరం స్వయంగా బంగారు రాముడే వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. స్వామి వారి కోసం అనేక విగ్రహాలు తంజావూరులో తయారు చేయిస్తున్నానని, అయోధ్య వచ్చేవారికి వసతి, భోజనం ఉచితంగా ఏర్పాటు చేస్తానని చల్లా శ్రీనివాసశాస్త్రి తెలిపారు. ఐశ్వర్య రక్ష కంకణాలకు పూజ మహాశక్తి యాగంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులకు తన తల్లి దాచుకున్న సొమ్ముతో ఐశ్వర్య రక్ష కంకణాలు తయారు చేయించి, అందించనున్నట్లు పరిపూర్ణానంద స్వామి ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన కంకణాలను మహాశక్తియాగం వేదికపై లలితా అమ్మవారి విగ్రహం ముందుంచి పూజలు నిర్వహించారు. కుంకుమార్చనల్లో పాల్గొన్న మహిళలు కుంకుమ పూజలకు తరలివస్తున్న భక్తులు -
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీహోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి గావించారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, ఉపాధ్యాయుల రమేష్, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు నరసింహమూర్తి ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. -
వ్యక్తిగత విమర్శలు మానుకోండి
వైఎస్సార్ సీపీ నేత వంగా గీతా విశ్వనాథ్ పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ తీవ్రంగా ఖండించారు. ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సభను అగౌరపరచడమేనని మండిపడ్డారు. ఆమె ఇక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన చట్టసభలో ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఇతర నాయకుల వ్యక్తిగత జీవితాలపై లేనిపోని మాటలు మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం అహర్నిశలూ కృషి చేస్తూనే ఉంటారని, అటువంటి నాయకుడిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని గీత హితవు పలికారు. ఏళ్ల తరబడి సీఎంగా పని చేసిన చంద్రబాబు హయంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరును కనీసం ఒక జిల్లాకు పెట్టలేకపోయారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారని, దీనిని బట్టి ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. వైఎస్ జగన్పై నోటికొచ్చినట్టు మాట్లాడటం మా నుకోవాలన్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చాలా సౌమ్యుడని, ఎప్పుడూ ఒక అడుగు తగ్గే ఉంటారన్నారు. వైఎస్ జగన్, చిరంజీవి ఎదుటి వారిని గౌరవించే వ్యక్తులని, ఎవ్వరినీ తక్కువ చేయాలనుకునే వారు కాదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరినీ చాలా తేలికగా మాట్లాడటం చాలా తప్పని అన్నారు. మహేష్ బాబు డైలాగ్లా ‘ఎవరైనా అబద్ధం ఆడొచ్చు. కానీ గూగుల్ తల్లి అబద్ధం ఆడదు. మీకు అనుమానం ఉంటే గూగుల్లోకి వెళ్లి రికార్డులు తీసి చూడండి. ఎవరేం చేశారో తెలుస్తుంది’ అని గీత సూచించారు. జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జీఎస్టీ తగ్గింపుపై ఈ నెల 27 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ అంశంపై కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జీఎస్టీపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో ఏ మేరకు లబ్ధి కలుగుతుందో ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలన్నారు. ప్రతి వారం ఒక థీమ్ తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ డి.శ్రీలక్ష్మి, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, డీపీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎగసిపడుతున్న అలలు తొండంగి: అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలో మండలంలోని దానవాయిపేట, అద్దరిపేట, కొత్తచోడిపల్లిపేట తీరాల్లో సముద్ర అలలు రెండు మీటర్ల వరకూ ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లరాదని తుని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్ ఉమామహేశ్వరరావు సూచించారు. -
మహాలక్ష్మీ నమోస్తుతే
అన్నవరం: శరన్నవరాత్ర వేడుకలను పురస్కరించుకుని ఐదో రోజైన శుక్రవారం సత్యదేవుని సన్నిధిలో రత్నగిరి దుర్గామాతలైన వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు సిరులొసంగే శ్రీమహాలక్ష్మిగా అలంకరించి పూజలు చేశారు. పద్మంలో ఆశీనులై, ఆకుపచ్చ రంగు చీరలు ధరించి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారితో పాటు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దర్బారు మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ రుత్విక్కులు శ్రీసూక్త, పురుషసూక్త, మన్యుసూక్త, లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు చేశారు. లింగార్చన, నవావరణార్చన, సూర్య నమస్కారాలు నిర్వహించారు. యంత్రాలయంలో శ్రీమహా వైకుంఠ నారాయణ విభూతి యంత్రానికి పూజలు చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ సత్యదేవుని ప్రధానాలయంతో పాటు, వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్ల ఆలయాల్లో లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ సత్యదేవుని ప్రధానాలయంలో అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్శర్మ తదితరులు పాల్గొన్నారు. లోవలో.. తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని కూడా మహాలక్ష్మీదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణి, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. దసరా వేడుకల్లో ఆరో రోజైన శనివారం అమ్మవారిని లలితాదేవిగా అలంకరించనున్నట్లు వేదపండితులు, ప్రధానార్చకులు తెలిపారు. -
ధాన్యం కొనుగోలుపై అవగాహన అవసరం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులకు అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యాన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణ తరగతులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాల అమలు, కనీస మద్దతు ధర, గోనె సంచులు, మండల స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ ఏర్పాటు, కస్టోడియన్ అధికారుల నియామకం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా రైస్ మిల్లులకు తరలింపు, ఈ–క్రాప్ బుకింగ్ వంటి అంశాలపై మండల స్థాయి అధికారులకు జేసీ అవగాహన కల్పించారు. జిల్లాలో 269 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో అవసరమైన సిబ్బంది, తేమ శాతం కొలిచే యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. దళారులు, మిల్లర్ల చేతిలో నష్టపోకుండా కనీస మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ 85 శాతం ఈ–పంట నమోదు పూర్తయిందని, మిగిలినది ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.దేవల నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి సత్యనారాయణరాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్ కుమార్, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, జిల్లా సహకార అధికారి బి.శ్రీనివాసరెడ్డి, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కమిషనర్ ఎన్.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ శారదాంబా నమోస్తుతే..
అన్నవరం: దసరా వేడుకల్లో నాలుగో రోజైన గురువారం రత్నగిరి దుర్గామాతలు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లను శారదాదేవిగా అలంకరించారు. ఒక చేత పుస్తకం, మరో చేత గులాబీ, మిగిలిన రెండు చేతులు అభయహస్తాలుగా చూపుతూ దర్శనమిచ్చిన అమ్మవార్లకు పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో రుత్విక్కులు చండీ, సప్తశతీ పారాయణలు, రామాయణ, మహాభారత పారాయణ, మహాలింగార్చన, సూర్యనమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ దుర్గామాతల ఆలయాల్లో రుత్విక్కులు లక్ష కుంకుమార్చనలు చేశారు. రాత్రి 7 గంటల నుంచి సత్యదేవుని ఆలయంలో స్వామి అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించారు. కాత్యాయనీదేవిగా తలుపులమ్మ తల్లి తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గెడ్లబీడు వీఎల్సీ ఫ్యాక్టరీ వద్ద ధారాలమ్మ తల్లికి కూడా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యాన భవానీ భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. -
నేరం వారిది.. శిక్ష వీరికి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ అండదండలుంటే చాలు తిమ్మిని బమ్మిని చేసేయవచ్చని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్టున్నారు. అక్రమాలకు పాల్పడినా ఇట్టే తప్పించేసుకుని, చిరుద్యోగులను బలి చేసేయవచ్చని అనుకుంటున్నారేమో! నేరం ఒకరిది.. శిక్ష మరొకరికి అన్న చందంగా.. యూరియా సరఫరాలో చేతివాటం చూపుతూ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో తాజాగా ఇటువంటి ఉదంతం చోటు చేసుకుంది. ఇటీవల జిల్లాలో సంచలనం రేపిన చేబ్రోలు యూరియా బాగోతాన్ని తలదన్నే రీతిలో ఒమ్మంగి పీఏసీఎస్లో తెలుగు తమ్ముళ్లు యూరియా దోపిడీకి తెగబడ్డారు. ఏం జరిగిందంటే.. ఒమ్మంగి సొసైటీకి రెండు విడతల్లో 90 టన్నుల యూరియా వచ్చింది. రెండో విడత వచ్చిన యూరియాలో ఆ సొసైటీకి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత ప్రోద్బలంతో సుమారు 170 బస్తాలను ఆ పార్టీ సానుభూతిపరులకు దోచి పెట్టేశారు. ఎకరం ఉన్నా, ఐదెకరాలున్నా ఆధార్ కార్డు చూసి ఒకటి రెండు యూరియా బస్తాలు ఇవ్వడమే గగనమైన తరుణంలో.. అధికారం అండ, అడిగేవారెవరున్నారనే తెగింపుతో ఏకంగా 170 బస్తాల యూరియాను పక్కదారి పట్టించేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఆ మేరకు ఒమ్మంగి సొసైటీలో వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం నలుగురు అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఒకరు 50 బస్తాలు, మరో ముగ్గురు 40 బస్తాలు కలిపి మొత్తం 90 యూరియా బస్తాలు గద్దల్లా తన్నుకుపోయారని గుర్తించారు. పీఏసీఎస్ అటెండర్ రామకుర్తి వంశీ, సొసైటీ చిరుద్యోగి సుంకర గంగాధర రామారావుతో పాటు మరో ఇద్దరు బయటి వారు కలిసి మొత్తం 170 యూరియా బస్తాలు తీసుకు వెళ్లినట్టు అధికారులు తేల్చారు. అసలైన పెద్దలను తప్పించి.. అయితే, యూరియాను పక్కదారి పట్టించినట్లు గుర్తించిన నలుగురిలో ఇద్దరు అదే సొసైటీలోని చిరుద్యోగులని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. విషయం బయట పడటంతో అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి, ఈ సంఘటనను మసి పూసి మారేడు కాయ చందంగా చేసేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోటాకు మించి యూరియా బస్తాలను అడ్డగోలుగా తరలించుకుపోయిన అసలైన పెద్దలను తప్పించేసి, చిరుద్యోగులను బలి చేశారని ఒమ్మంగి రైతులు తూర్పార పడుతున్నారు. ఒమ్మంగి సొసైటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న ఇద్దరు టీడీపీ కీలక నేతలు కనుసన్నల్లోనే ఆ పార్టీ సానుభూతిపరులకు యూరియా దోచి పెట్టారని పలువురు చెబుతున్నారు. ఆ ఇద్దరు కీలక నేతలే ఈ యూరియా బాగోతంలో అసలైన దొంగలను తప్పించి, అమాయకులైన చిరుద్యోగులను బలి పశువులను చేశారని అంటున్నారు. సంఘానికి ఒకేసారి యూరియా భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో దీని విక్రయాలు క్రమపద్ధతిలో జరపలేని గందరగోళంలో ఎవరెంత తీసుకువెళుతున్నారో తెలియలేదని మరో కట్టుకథ కూడా అల్లారంటున్నారు. ఇదే కారణంతో యూరియా నిల్వలను ఆన్లైన్లో నమోదు చేయలేకపోయామంటూ వాస్తవాన్ని తొక్కిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతరుల పేరిట దోపిడీ! మొత్తం 170 బస్తాల యూరియాను దారి మళ్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇదే సొసైటీలో మరో పెద్ద కుంభకోణానికి కూడా పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని పలువురి ఆధార్ కార్డులు సేకరించి, వారి పేరున పెద్ద ఎత్తున యూరియా దోచేసినట్టు బయటపడింది. అధికారులు గుర్తించిన దాని కంటే రెండుమూడు రెట్లు అధికంగా యూరియాను తెలుగు తమ్ముళ్లు దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సొసైటీలో బస్తా రూ.266కు కొనుగోలు చేసి బ్లాక్లో రూ.350 నుంచి రూ.400కు అమ్మి వారు సొమ్ములు వెనకేసుకున్నారనే విషయం ఒమ్మంగిలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ‘తమ్ముళ్ల’ యూరియా దోపిడీ ఒమ్మంగి సొసైటీలో వెలుగు చూసిన బాగోతం 170 బస్తాలు పక్కదారి ఇద్దరు నేతల క్రియాశీలక పాత్ర చిరుద్యోగులను బలి చేసే యత్నం ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తీరు కూటమి సర్కారుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్లో అదునుకు యూరియా లభించక రైతులు నానా అగచాట్లూ ఎదుర్కొంటున్నారు. ముందుగా కూపన్లు ఇచ్చినా.. ఎన్నెకరాల భూమి ఉన్నా ఒక బస్తా యూరియా దొరికితే గొప్పే అన్నట్టుగా ఉంది రైతుల పరిస్థితి. సరిగ్గా ఇదే తరుణంలో తెలుగు తమ్ముళ్లు యూరియా అమ్మకాలను గుప్పెట్లో పెట్టుకుని రైతులను దోచుకుంటున్నారనే విమర్శలు జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ సానుభూతిపరులకు బస్తాలకు బస్తాల యూరియాను గంపగుత్తగా తరలించేసి, సొమ్ము చేసుకున్న సంఘటనలు వివిధ మండలాల్లో ఇటీవల వెలుగు చూశాయి. దాదాపు అన్నిచోట్లా ‘తమ్ముళ్ల’ పెత్తనం మితిమీరి నడిచిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్తిపాడు రూరల్, గండేపల్లి, జగ్గంపేట, గొల్లప్రోలు తదితర మండలాల్లో ఇందుకు బలం చేకూర్చే సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పీఏసీఎస్కు కోటా ప్రకారం వచ్చిన 20 టన్నుల యూరియా అమ్మకాలను టీడీపీ నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సుమారు 100 బస్తాలు పార్టీ సానుభూతిపరులకు దోచిపెట్టడం, రైతుల చేతుల్లో కూపన్లను బలవంతంగా లాగేసుకోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీనిపై వైఎస్సార్ సీపీ గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యాన రైతులు రోడ్డెక్కారు కూడా. -
కనకదుర్గమ్మకు చీర, సారె
అన్నవరం: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారికి దసరా మహోత్సవాల సందర్భంగా రత్నగిరి సత్యదేవుని తరఫున అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు గురువారం చీర, సారె సమర్పించారు. సత్యదేవుని సోదరిగా కనకదుర్గమ్మకు ఏటా దసరా వేడుకల్లో చీర, సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు వేద పండితులు సూర్యనారాయణ, సంతోష్, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వారికి విజయవాడ దేవస్థానం పండితులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీస్సులు అందజేసి ప్రసాదాలు బహూకరించారు. -
లలితా నామం.. ఎంతో మాహాత్మ్యం
● శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ● 40 కోట్లకు చేరిన కుంకుమార్చనలు కాకినాడ రూరల్: లలితా నామంలో ఎంతో మాహాత్మ్యం ఉందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. రమణయ్యపేట శ్రీపీఠంలో మహాశక్తి యాగం గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. వంద కోట్ల కుంకుమార్చనల క్రతువులో భాగంగా నాలుగు రోజులకు 40 కోట్ల అర్చనలు పూర్తయ్యాయని స్వామీజీ ప్రకటించారు. అమ్మను ఆరాధిస్తే ప్రకృతి మన పక్కనే ఉంటుందన్నారు. సకల సృష్టికి అమ్మ నిలయమని, సృష్టి మొత్తం సీ్త్రమయమని చెప్పారు. పంచభూతాల్లో సైతం సీ్త్ర లింగం ఉందన్నారు. అమ్మవారిని కొలిచేందుకు భక్తులు శ్రీపీఠం వస్తున్నారని, వారి సంకల్పం నెరవేరాలంటే అనవసరమైన మాటలు తగ్గించుకుని సద్భావనతో ఉండాలని సూచించారు. కుంకుమార్చనల్లో అన్ని మంత్రాలూ వింటూ వీలైనంత సమయం అమ్మవారిని స్మరించుకోవాలని అన్నారు. ఈ నెల 29న 24 వేల మంది విద్యార్థులతో త్రికోటి మహా సరస్వతి పూజతో పాటు సామూహిక అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. మహాశక్తి యాగంలో పాల్గొనేందుకు వేలాదిగా వస్తున్న భక్తులకు తమ శక్తికొద్దీ అద్భుతమైన ఔషధాలు కలిిపి మహా అన్న ప్రసాదం అందిస్తున్నామని స్వామీజీ తెలిపారు. అంతకు ముందు యాగ వేదిక వద్ద ఉదయం గాయత్రి, సౌర హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం ఐశ్వర్యాంబికా అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనలకు ముందు సినీ సంగీత దర్శకుడు నాగరాజు వేణుగానంతో అమ్మవారి గీతాలు వినిపించి అలరించారు. -
రూ.3.41 కోట్లతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు స్క్రీనింగ్ బస్సును అందుబాటులోకి తీసుకు రానున్నామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సీఎస్ఎఆర్ నిధులు రూ.3.41 కోట్లతో అత్యాధునిక సదుపాయాలు, అధునాతన వైద్య పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును జిల్లాకు ఇచ్చేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకు వచ్చింది. ఈ మేరకు కలెక్టర్కు ఆయన క్యాంపు కార్యాలయంలో బీపీసీఎల్ ప్రతినిధులు గురువారం ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ బస్సు మూడు నెలల్లో జిల్లాకు చేరుతుందని కలెక్టర్ తెలిపారు. బీపీసీఎల్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీపీసీఎల్ టెరిటరీ మేనేజర్ బి.సురేష్, సీపీఓ పి.త్రినాథ్ పాల్గొన్నారు. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్కు దరఖాస్తుల ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: ఇండియా స్కిల్స్ కాంపిటీషన్లో ప్రతిభ చూపడానికి ఆసక్తి గల విద్యార్థులు, యువతీ యువకులు ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జీవీడీ మురళి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ట్రేడ్ను బట్టి 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు అర్హులన్నారు. పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన 63 ప్రాధాన్య రంగాల్లో ప్రతిభ చూపే అవకాశాన్ని ఈ పోటీ కల్పిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేరా యువ భారత్ కార్యకర్తలు, ఐటీఐలు, డిప్లొమా/పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలు తమ ఆధ్వర్యంలోని యువతను ఈ పోటీలో భాగస్వాముల్ని చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. https://www.skillindiadigital.gov.in/ account/register?returnUrl=%2Findia–skills–2025 వెబ్సైట్లో పోటీ జరిగే ట్రేడ్ల వివరాలు, వయోపరిమితి వివరాలు ఉంటాయని, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మురళి తెలిపారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ కోరారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య వేదిక ఆధ్వర్యాన వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేయనున్నారు. దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలోని సచివాలయ ఉద్యోగుల కార్యాచరణపై స్థానిక 48వ డివిజన్ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు, సమయపాలన లేని టెలి కాన్ఫరెన్సులు, పదోన్నతులు, సర్వేలు, ఉద్యమ కార్యాచరణపై వార్డు కార్యదర్శుల అభిప్రాయం తీసుకున్నామని నిఖిల్కృష్ణ తెలిపారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించామన్నారు. -
పోస్టులు ఖాళీ.. పని భారీ
రాయవరం మండలం కురకాళ్లపల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక కేంద్రంలో వర్కర్, హెల్పర్ కూడా లేరు. మరో కేంద్రంలో హెల్పర్ లేరు. వీటిని ఓ అంగన్వాడీ కార్యకర్త నిర్వహిస్తోంది. ఆ రెండింటినీ ఆమె ఒక్కరే ఎలా సమర్థవంతంగా నిర్వహించగలరన్నది ప్రశ్నార్థకం. జిల్లాలో మరిన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. రాయవరం: ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక ఆయా ఉండాలి. టీచర్ ప్రతి రోజు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి. అదే సమయంలో చిన్నారులకు పౌష్టికాహారంగా గుడ్డు, పాలు, ఆకుకూరలతో కూడిన భోజనం అందిస్తారు. అలాగే గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) రెండు విడతల్లో పౌష్టికాహారం అందజేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వం ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల వారికి అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఏటా కోట్లాది రూపాయలు చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం, టీకాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాయి. వివిధ సామగ్రి అందిస్తున్నాయి. చాలా కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదన్న విమర్శలున్నాయి. ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని నిరుద్యోగ యువతులు ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారా అని వారు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. కోనసీమ జిల్లాలో 22 మండలాలున్నాయి. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1,726 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 7,725 మంది గర్భిణులు, 5,848 మంది బాలింతలు, ఆరు నెలల లోపు చిన్నారులు 901 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో మొత్తం 18 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలున్నాయి. వీటిలో న్యాయస్థానం పరిధిలో మూడు పోస్టులు ఉండగా, మరో తొమ్మిది పోస్టులు పదోన్నతుల్లో భాగంగా భర్తీ చేయాల్సి ఉంది. ఆరు పోస్టులు క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. అలాగే, 77 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలుగా ఉండడంతో త్వరలో జరగనున్న ఉద్యోగ విరమణలతో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇబ్బందులివీ.. ● పూర్తి స్థాయిలో సిబ్బంది అంగన్వాడీ కేంద్రంలో లేకపోవడం వల్ల సమర్థవంతంగా చిన్నారులకు విద్యను అందించలేకపోతున్నారు. ● అలాగే పౌష్టికాహారం అందించడం కష్టసాధ్యంగా మారుతోంది. ● ఆరోగ్యవంతమైన సమాజానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ● కార్యకర్తలపై పనిభారం అధికమవుతోంది. ● ప్రీ స్కూల్ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ● సెలవులు పెట్టుకునే అవకాశాలున్నా, ఆ హక్కును సిబ్బంది కోల్పోతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత గర్భిణులకు, బాలింతలకు అందని పోషకాహారం చిన్నారులకు అందని ప్రాథమిక విద్య జిల్లాలో 18 టీచర్, 77 ఆయా పోస్టులు ఖాళీ వేరే కేంద్రాల టీచర్లకు అదనపు బాధ్యతలు పని భారంతో సిబ్బందికి అవస్థలు రెండు కేంద్రాలకు ఒకే కార్యకర్త -
కుప్పకూలిన పవన్ భారీ కటౌట్
జన సంచారం లేకపోవడంతో తప్పిన ముప్పు కాకినాడ క్రైం: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. భారీ కటౌట్ కుప్పకూలగా.. అక్కడ జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గురువారం ‘ఒజి’ చిత్రం విడుదల సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మరో జనసేన నేత నున్న దొరబాబు పేర్లతో నిత్యం రద్దీగా ఉండే భానుగుడి జంక్షన్లో 70 అడుగుల భారీ పవన్కల్యాణ్ కటౌట్ను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ కటౌట్ కుప్పకూలింది. భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల బరువు తాళలేక ఆ కటౌట్ను నిలిపిన కర్రలు తునాతునకలయ్యాయి. కటౌట్ రోడ్డుపై కూలగా.. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు కటౌట్ను రోడ్డు మధ్య నుంచి అతికష్టంగా పక్కకు నెట్టారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పార్టీ లీడర్లు ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ, ప్రజల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. -
షట్టర్ వంచి.. ఆపై అద్దాన్ని పగులగొట్టి..
● నగల దుకాణంలో 11 కిలోల వెండి చోరీ ● ఆభరణాల విలువ రూ.2 లక్షలు ప్రత్తిపాడు రూరల్: దుకాణం షట్టర్ను పైకి వంచి.. దానిని ఆనుకుని ఉన్న అద్దాలను పగులగొట్టిన దొంగలు నగల దుకాణాన్ని కొల్లగొట్టిన ఉదంతమిది. పోలీసుల వివరాల మేరకు, స్థానిక అల్లూరి సీతారామరాజు జంక్షన్ సమీపంలో సురేష్ జ్యూయలర్స్ అండ్ బ్యాంకర్స్లో మంగళవారం అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆరుగురు దొంగలు దుకాణం వద్దకు చేరుకుని, షట్టర్ కింది భాగాన్ని ఇనుప రాడ్లతో పైకి వంచి, షట్టర్కు ఆనుకుని ఉన్న అద్దాలను పగలుగొట్టారు. దాని ద్వారా లోనికి ప్రవేశించిన నలుగురు దుకాణంలో ఉన్న రూ.2 లక్షలు విలువైన 11 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించారు. దుకాణంలోని లాకర్ను తెరిచేందుకు వారు విఫలయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంలో చేతికందిన వెండి ఆభరణాలను తస్కరించారు. లాకర్లో బంగారు వస్తువులు ఉన్నాయి. ఆయా ఘటనల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రత్తిపాడు సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్సైలు ఎస్ లక్ష్మీకాంతం, శ్రీహరిరాజు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఫారెస్టు చెక్ పోస్ట్ వైపు కాలినడకన వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించినట్టు తెలిసింది. గ్రామంలోని దుర్గమ్మ గుడి వీధిలో మోటార్ బైక్ మంగళవారం రాత్రి చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడు గుడివాడ వెంకటసత్య రవి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ప్రాణం మీదకు తెచ్చిన ప్రచార పిచ్చి
● ఎమ్మెల్యే ఫ్లెక్సీ పడి మహిళకు తీవ్ర గాయాలు ● పరిస్థితి ఆందోళకరం అనపర్తి: అధికార పార్టీ ప్రచార పిచ్చి ప్రయాణికులకు ప్రాణాంతకంగా మారింది. అనుమతులు లేకుండా ఊరంతా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. బిక్కవోలు గ్రామానికి చెందిన గువ్వల విజయలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులు బుధవారం మోటార్ సైకిల్పై అనపర్తిలోని కంటి ఆసుపత్రికి వెళుతున్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్న వంతెన వద్ద స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ఆకస్మికంగా ఆ దంపతులపై కూలింది. దీంతో వారు కింద పడిపోగా, ఫ్లెక్సీ ఫ్రేమ్ ఊచలు విజయలక్ష్మి తలకు నాలుగు అంగుళాల మేర చీరుకుని తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను స్థానిక కానిస్టేబుల్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆమె భర్త హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఫ్లెక్సీని కర్రలకు కట్టకుండా జార వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుందని, ఇందుకు కారణమైన ఎమ్మెల్యేపై కేసు పెట్టాల్సి వస్తుందని ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా టీడీపీ నాయకులు ఆ ఫ్లెక్సీని మళ్లీ అలాగే జారేయడం గమనార్హం. -
‘నన్నయ’లో ప్రీ రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక
రాజానగరం: ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులలో సేవా దృక్పథం, క్రమశిక్షణ, విలువలు, సమాజంపై అవగాహన వంటివి అలవడుతాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలో వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ సెలక్షన్స్ బుధవారం జరిగాయి. గోదావరి జిల్లాల నుంచి 190 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు హాజరై, తమ ప్రతిభను కనబరిచారు. ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ ఎం.రామకృష్ణ మాట్లాడుతూ, ఈ క్యాంప్లో ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ప్రీ ఆర్డీ క్యాంప్కి ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు హైట్, రన్నింగ్ రేస్, మార్చ్ఫాస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు, ఇతర టాలెంట్ను పరిశీలించడానికి ఇంటర్ూయ్వలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ సంజయ్, పీఓలు, పీఈటీలు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన మత సామరస్యం
దసరా అన్న సమారాధనల్లో ముస్లిం మహిళ సేవలు అమలాపురం టౌన్: సేవకు కులాలు, మతాలు అడ్డురావడానికి అమలాపురానికి చెందిన ముస్లిం మహిళ మెహబూబ్ షకీలా నిదర్శనంగా నిలుస్తారు. స్థానిక శ్రీదేవి మార్కెట్లోని శ్రీదేవి అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు దాతల విరాళాలతో వేలాది మందికి అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ అన్నదానంలో షకీలా మొదటి పంక్తి నుంచి చివరి దాకా తానూ భోజనాలు వడ్డించి సేవలు అందిస్తున్నారు. ఏటా ఈ ఆలయం వద్ద అమ్మ సన్నిధిలో జరిగే అన్నదానాల్లో దసరా తొమ్మిది రోజులూ షకీలా భోజనాలను భక్తులకు కొసరి కొసరి మరీ వడ్డిస్తుంది. ముస్లిం మహిళ అయినప్పటికీ ఆమె ఆలయం వద్ద జరిగే అన్నదాన కార్యక్రమాల్లో సేవలు అందించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. -
ఓడలరేవు తీరంలో బోటు దగ్ధం
రూ.పది లక్షలకు పైగా నష్టం అల్లవరం: ఓడలరేవు వైనతేయ నదీ తీరం జెట్టీ వద్ద మరమ్మతులు నిర్వహిస్తున్న బోటు మంగళవారం అర్ధరాత్రి దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మండలంలోని కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కొపనాతి శంకరానికి చెందిన బోటుకు రెండు నెలలుగా మరమ్మతులు చేస్తున్నారు. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తయి.. చేపల వేటకు సిద్ధమవుతున్న తరుణంలో మత్స్యకార బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. కాలిపోతున్న బోటుని కాపాడేందుకు స్థానికులు ఓడలరేవు ఓఎన్జీసీకి చెందిన ఫైరింజిన్ విభాగానికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం అంతు చిక్కడం లేదు. అర్ధరాత్రి బోటు అగ్ని ప్రమాదానికి గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే బోటు యజమానికి చెందిన మరో బోటు వైనతేయ నదిలో లంగరు వేసి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. బోటుకు ఎవరైనా నిప్పు పెట్టారా లేక యాదృచ్చికంగా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై బోటు యజమాని శంకరం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సత్యదేవుని సన్నిధిలో రీల్స్ షూటింగ్
● పవిత్ర నక్షత్ర వనంలో నృత్యాలు ● మండిపడుతున్న భక్తులు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని రెండు యువ జంటలు బుధవారం తమ రీల్స్ షూట్కు వేదికగా చేసుకున్నాయి. ఓవైపు దసరా నవరాత్రుల సందర్భంగా దేవస్థానంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇలా సినిమా పాటలకు స్టెప్పు లేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం దేవస్థానంలోని సత్యగిరిపై ఘాట్ రోడ్, నక్షత్ర వనంలో నాగార్జున, దుర్గ, లోవరాజు లక్ష్మి సినిమా పాటలకు స్టెప్పులేశారు. తర్వాత ఆ రీల్స్ను సంక్రాంతి పేరుతో, డ్రైవర్ రాజు అనే పేరుతో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దేవస్థానం 27 నక్షత్రాల పేరుతో పవిత్రమైన వృక్షాలను పెంచుతున్న నక్షత్ర వనం లోపలకు వెళ్లి మరీ స్టెప్పులేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నా వీరు దర్జాగా రీల్స్ షూట్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. దేవస్థానంలో సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ఆరోగ్య భాగస్వామి.. ఫార్మాసిస్ట్
రాయవరం: రోగికీ, వైద్యునికీ మధ్య వారధిగా, ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామిగా ఫార్మాసిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు. పూర్వం ఫిజీషియన్ స్వయంగా ఔషధాలను తయారు చేసేవారు. కాలక్రమంలో ఔషధ ఉత్పత్తి రంగం ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. నిపుణులైన ఔషధ ప్రయోక్తలే ఫార్మసిస్ట్లుగా అవతరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆరోగ్య రక్షణ నిపుణుల సమూహంగా ఫార్మసిస్టులు ఉన్నారు. కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మసీ పరిశ్రమ, ఔషధ నియంత్రణ, పరిశోధన–అభివృద్ధి, బోధన వంటి పలు రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారు. ఫార్మాసిస్ట్ డే ప్రాముఖ్యమిదీ.. 1912 సెప్టెంబర్ 25న నెదర్లాండ్లోని హేగ్ నగరంలో ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్(ఐపీఎఫ్) ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తునారు. ఈ ఏడాది థింక్ హెల్త్.. థింక్ ఫార్మాసిస్ట్ అనే నినాదంతో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పేషెంట్కు చేరే వరకు.. కాలానుగుణంగా ప్రపంచంలో మందుల తయారీ అతి పెద్ద రంగంగా అవతరించింది. కొత్త రకం వైరస్లు అవతరిస్తూ.. కొత్త రోగాలు వస్తున్నాయి. వీటిని తట్టుకునేందుకు మందుల తయారీ సవాలుగా మారింది. ఎలాంటి రోగానికై నా మందును కనుగొనే ఫార్ములానైనా ఫార్మాసిస్ట్లు తమ భుజాలపై వేసుకుని, ప్రపంచ జనాభాకు అనుగుణంగా, వివిధ ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మందులు తయారు చేస్తున్నారు. మందుల తయారీ నుంచి పేషెంట్కు చేరే వరకు అన్ని విషయాల్లో ఫార్మాసిస్ట్లదే కీలక పాత్ర. ఫార్మసీ కోర్సులు చదివితే.. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు మార్కుల ఆధారంగా ఫార్మసీ సీట్లు కేటాయిస్తారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివితే మెడికల్ షాపు పెట్టుకోవడానికి అర్హత వస్తుంది. ఆపై బీఫార్మసీ చేసిన వారు ల్యాబ్స్లో ఔషధాలకు సంబంధించి పని చేస్తారు. ఎం.ఫార్మసీ చేసిన వారు ఔషధ తయారీ సంస్థల్లో నూతన ఔషధాలు, కాంబినేషన్లు కనిపెట్టడం, పరిశోధించడం, క్వాలిటీ కంట్రోల్ వంటి విభాగాల్లో ఉంటారు. అలాగే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులను కూడా చేయవచ్చు. కోనసీమలో పరిస్థితి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డైరెక్టర్ సెకండరీ హెల్త్ పరిధిలో ఇద్దరు చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లు, తొమ్మిది మంది సీనియర్ ఫార్మసీ ఆఫీసర్లు, 16 మంది ఫార్మసీ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే జిల్లాలో మూడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులుండగా, ప్రతి ఏరియా ఆస్పత్రిలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్, నలుగురు ఫార్మసీ పోస్టులు ఉంటాయి. తొమ్మిది సీహెచ్సీలుండగా, ప్రతి సీహెచ్సీలో సీనియర్ ఫార్మసీ, ఫార్మసీ ఆఫీసర్ ఉంటారు. అదేవిధంగా 46 పీహెచ్సీలు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఫార్మాసిస్ట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఫార్మాసిస్ట్ గ్రేడ్–2 ఫార్మసీ ఆఫీసర్గా మార్పు చేశారు. వైద్యులతో సమానంగా సేవలు ఫార్మాసిస్టులకు మాత్రమే వైద్యులతో సమానంగా సేవలందించే అవకాశం ఉంటుంది. కరోనా విజృంభించిన సమయంలో నిరంతర సేవలు అందించాం. కరోనా బారిన పడినా, తిరిగి విధుల్లో చేరి పేషెంట్లకు అవసరమైన మందులు ఆందిస్తూ, వారు కోలుకునేందుకు చేసిన సేవలు వృత్తిపరంగా సంతృప్తినిచ్చాయి. – ఎన్ వసంతరావు, ఫార్మాసిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం పూర్తి బాధ్యత ఫార్మాసిస్ట్దే.. మందులు పేషెంట్కు చేరే వరకు పూర్తి బాధ్యత ఫార్మాసిస్టుల దే. మందుల స్టోరేజీ, బ్యాచ్ నంబర్, కాలం చెల్లే తేదీ, క్వాలిటీ వంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పేషెంట్కు ప్రమాదం. గత 12 ఏళ్లుగా ఉద్యోగం చేసిన అన్ని ప్రాంతాల్లో సంతప్తికరమైన సేవలు అందించాను. – సీహెచ్ పేరిందేవితాయారు, ఫార్మాసిస్ట్, పీహెచ్సీ, రాయవరం తయారీ నుంచి మందులు పేషెంట్కు చేరే వరకు పూర్తి బాధ్యత కొత్తగా వచ్చే వ్యాధులను అడ్డుకోవడంలో కీలకపాత్ర 25న ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం -
ముగిసిన 11 జిల్లాల టీఓటీల శిక్షణ
సామర్లకోట: పేదరిక నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని సీనియర్ ఫ్యాక్టలీలు డి.శ్రీనివాసరావు, ఎస్ఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు వరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు నిర్వహించిన ఆరో బ్యాచ్ శిక్షణ బుధవారంతో ముగిసింది. మొత్తం 300 మంది టీఓటీలకు శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్టు ఫ్యాకల్టీలు వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండల పరిధిలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు జగన్నాథరావు, రామకృష్ణ, కె.శేషుబాబు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. -
జయలక్ష్మి సొసైటీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలి
అమలాపురం టౌన్: అనేక మంది విశ్రాంత ఉద్యోగులు జయలక్ష్మి కో–ఆపరేటివ్ సొసైటీ మోసాలకు బలవ్వగా, నేటికీ న్యాయం జరగలేదని కోనసీమ ప్రాంతానికి చెందిన ఆ సొసైటీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని ఏఎస్ఎన్ కళాశాలలో విశ్రాంత తహసీల్దార్ భాస్కర వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం జయలక్ష్మి సొసైటీ బాధితుల సమావేశం జరిగింది. ప్రస్తుత సొసైటీ బోర్డు పూర్తి రాజీనామా చేసి, దాని స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది రాజమహేంద్రవరం సీఐడీ కోర్టులో జయలక్ష్మికి చెందిన నలుగురు మేనేజర్లపై అవినీతి కేసులు నమోదైనా, ప్రస్తుత బోర్డు వారిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. మొత్తం 2,450 మంది ఈ సొసైటీలో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేదని పేర్కొంది. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ట్రిబ్యునల్లో కేసులు పెట్టారని గుర్తు చేసింది. రుణాలు తిరిగి చెల్లించని వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఏ విధమైన ఆదాయం రాకుండా, వాటికి తాళాలు వేసి అలాగే వదిలేశారని విజయవాడకు చెందిన టీవీడీఎన్ ప్రసాదరావు తెలిపారు. అన్నింటా విఫలమైన ప్రస్తుత బోర్డు సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు భాస్కర్ మీనన్ మాట్లాడుతూ, అమలాపురం సొసైటీ బ్రాంచి నుంచి రుణాలు తీసుకున్న వారంతా తిరిగి చెల్లించినా, మిగిలిన బ్రాంచీల్లో రుణాలు తీసుకున్న వ్యక్తులు ఎగ్గొట్టడం వల్లే ఇక్కడి సభ్యులైన బాధితులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ బాధితులు, విశ్రాంత ఉద్యోగుల గుళ్లపల్లి వెంకట్రామ్, వేదనభట్ల కళా పూర్ణారావు, జి.కృష్ణారావు, తురగా చిన్న, ఇళ్ల నరసింహారావు, పుత్సా కృష్ణ కామేశ్వర్, రెహమాన్, రాజ్కుమార్, మావుళ్లయ్య, అర్జునుడు, నాగ అన్నపూర్ణ తదితరులు మాట్లాడారు. కాకినాడలో 5న డైరెక్టర్ పదవులకు ఎన్నిక కాకినాడ రూరల్: స్థానిక ది జయలక్ష్మి కోఆపరేటివ్ మాక్ సొసైటీలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు అక్టోబర్ 5వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల ఆఫీసర్ కంబాల శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం 5వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ పేర్రాజుపేట, మున్సిపల్ గరల్స్ హైస్కూల్లో ఎన్నిక నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు డైరెక్టర్ పదవులకు ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటల నుంచి స్థానిక సర్పవరం జంక్షన్లోని సొసైటీ హెడ్ ఆఫీస్లో నామినేషన్లు తీసుకోవాలని ఎన్నికల అధికారి తెలిపారు. బాధితుల సమావేశం డిమాండ్ -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి బుధవారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా సెలవులు కావడం, భవానీ మాలధారులతో పాటు సాధారణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది ● దేవస్థానం ఆదాయం రూ.30 లక్షలు -
వచ్చేనెల పదో తేదీలోపు పరిష్కారం!
● హామీ ఇచ్చిన కలెక్టర్, నేతలు ● ఆందోళన విరమించిన మత్స్యకారులు కొత్తపల్లి: కాలుష్యాన్ని వదిలే పరిశ్రమల నిర్మాణంతో సముద్ర జలాలు పాడై జీవనోపాధి కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని అమీనాబాద్ మత్స్యకారులు చేపట్టిన ఆందోళనను బుధవారం విరమించారు. ముందుగా కలెక్టర్ షణ్మోహన్ మత్స్యకారుల వద్దకు వచ్చి ఆందోళన విరమించి వేటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర జలాలు కలుషితమై చేపలు పడడం లేదంటుంటే వేటకు ఎలా వెళ్లమంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. దీంతో జిల్లా అడిషనల్ ఎస్పీ మణిదేవ్ రాజ్, సీఐ శ్రీనివాసులు అక్కడి నుంచి కలెక్టర్ను కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇంతలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మత్స్యకార నాయకులతో ఫోన్లో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్టోబర్ పదో తేదీలోపు ఈ సమస్యలపై సమావేశమవుతానని హామీ ఇచ్చారని వివరించారు. దీంతో వారంతా కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్తో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ సైతం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఒకవేళ పవన్ కల్యాణ్ సమావేశం కాకుంటే అక్టోబర్ 13వ తేదీ నుంచి ఆందోళన చేస్తామని మత్స్యకార నాయకులు ఉమ్మడి జాన్, నక్కా మణికంఠ, సూరాడ రాజు, ఉమ్మడి జగన్నాథం తదితరులు తెలిపారు. -
అందరూ అమ్మ అనుగ్రహం పొందాలి
కాకినాడ రూరల్: లలితా సహస్ర నామ స్తోత్రం 64 లక్షల కోట్ల మంత్రాలతో సమానమని, అటువంటి అమ్మవారిని కొలుస్తూ వెయ్యి కోట్ల కుంకుమార్చనలో పాల్గొన్న తల్లులందరూ అదృష్టవంతులని పరిపూర్ణానంద స్వామిజీ పేర్కొన్నారు. మండలంలోని రమణయ్యపేట శ్రీపీఠంలో బుధవారం మూడో మహాశక్తి యాగం వంద కోట్లు కుంకుమార్చనకు భారీగా మహిళలు తరలివచ్చి కుంకుమ పూజ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ లలితా సహస్ర నామాల విశిష్టత, అమ్మవారి వైభవాన్ని వివరించారు. బుధవారం దేవీ సూక్త, రాజమాతంగి హోమం నిర్వహించారు. సాయంత్రం లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు భక్తులకు శ్రీరాజ మాతంగిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం రాపర్తి గ్రామానికి చెందిన పిన్నమనేని సుధీర్రాజు నిర్మాతగా, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచయిత, దర్శకుడిగా సంగీత దర్శకులుగా మణి, నాగరాజు వ్యవహరిస్తూ నిర్మించనున్న చిత్రంలోని మొదటి పాట సీడీని పరిపూర్ణానంద స్వామి ఆవిష్కరించారు. స్వామి పరిపూర్ణానంద -
నేడు యూటీఎఫ్ రణభేరి
రాయవరం: సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి పేరుతో మోటార్ సైకిల్ జాతా నిర్వహించారు. యాప్ల పని భారం తగ్గించాలని, బోధనేతర పనులు వద్దని కోరుతూ, అలాగే వారి ఆర్థిక సమస్యల నేపథ్యంలో గురువారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూటీఎఫ్ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, సుబ్బారావు తెలిపారు. హైదరాబాద్కు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు బోట్క్లబ్ (కాకినాడసిటీ): దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లాకు ప్రయాణీకులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే 9 సర్వీసుల రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30 నుంచి అదనంగా నాలుగు బస్సులు, అక్టోబర్ 1 నుంచి ఏడు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తునట్టు ఆయన తెలిపారు. రద్దీని బట్టి విజయవాడకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నపూర్ణేశ్వరిగా దుర్గమ్మ అన్నవరం: దసరా నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రత్నగిరిపై దుర్గా మాతలను అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవార్లకు రుత్విక్కులు లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఆరు గంటలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. ఏడు గంటలకు దర్బారు నిర్వహించారు. వేదపండితులు గొల్లపల్లి ఘనాపాఠీ, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం వనదుర్గ, కనకదుర్గ ఆలయ అర్చకస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని బాలగా, మరో సువాసినిని అమ్మ ప్రతిరూపంగా అర్చించారు. -
ప్రచారం పీక్
రాజమహేంద్రవరం లాలాచెరువు నగరపాలక సంస్థ పాఠశాలలో ఎంపికై న డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడుతున్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరంలో బస వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బారులు తీరిన ఎంపికై న అభ్యర్థులుసాక్షి, అమలాపురం: పావలా కోడికి ముప్పావలా మషాలా అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ తీరు. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అన్నట్టుగా సాగుతోంది. పుష్కరాలైనా.. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో జనాన్ని తరలించుకువచ్చి మీడియాలో హైప్ సృష్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలో భాగంగానే తాజా డీఎస్సీలో కష్టపడి ఉద్యోగాలు పొందిన వారికి ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈవెంట్గా మార్చేస్తున్నారు చంద్రబాబు. కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఇది వ్యయప్రయాసలకు గురి చేస్తోంది. మెగా డీఎస్సీ–2025 పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ మొదలు.. ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేయడం వరకూ ప్రతి విషయంలోనూ హంగూ ఆర్భాటానికి పెద్దపీట వేస్తోంది. చిన్న పని చేసినా విపరీత ప్రచారం కల్పించుకోవడం సీఎం చంద్రబాబు కోరుకుంటారనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేసిన డీఎస్సీ విషయంలోనూ అదే తీరును కనబరుస్తున్నారు. ఫోన్లలో సందేశాలు తొలుత ఈ నెల 19న విజయవాడ వేదికగా నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. వాతావరణం అనుకూలంగా లేదని దానిని వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 25న అమరావతి రావాలంటూ ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అమరావతికి రావాలని విద్యా శాఖ కార్యాలయం నుంచి ఫోన్ సందేశాలు ఎంపికై న అభ్యర్థులకు వస్తున్నాయి. అభ్యర్థితో పాటు ఓ సహాయకుడిని కూడా తీసుకురావాలంటూ ఫోన్లో సమాచారం అందిస్తున్నారు. దీనిపై ఎంపికైన అభ్యర్థులు మండిపడుతున్నారు. వ్యయప్రయాసలకు లోనై అక్కడికి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. 3,500 మందికి ఏర్పాట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,349 మంది టీచర్లు ఎంపికై నట్టు ప్రకటించారు. జోనన్–2 నుంచి టీజీటీ, పీజీటీకి ఎంపికై న194 మంది ఉపాధ్యాయులనూ జిల్లా నుంచే సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 15న డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. నియామకపత్రాల పంపిణీని కూటమి ప్రభుత్వం రా జకీయ ప్రచారంగా మలచుకుంటోంది. ఈ ప్రక్రియ ను రాష్ట్ర స్థాయిలో అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా రావాలని విద్యా శాఖ అధికారులు సందేశాలు పంపారు. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి జిల్లా నుంచి అమరావతి వెళ్లేందుకు అభ్యర్థులు కనీసం 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. వీరిలో మహిళలు, గర్భణులు, చిన్న పిల్లలతో ఉన్నవారున్నారు. వీరంతా ప్రయాసలకోర్చి నియామక ఉత్తర్వులు అందుకోవడానికి వెళ్లాల్సిందే. అలా కాకుండా ప్రతి జిల్లాలో కార్యక్రమం పెట్టి.. నియామక పత్రాలు ఇచ్చి ఉంటే బాగుండేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,543 మంది అభ్యర్థులు, వారితో పాటు మరో 1,543 మంది సహాయకులు వెళ్లాల్సి ఉంది. వీరికి 288 మంది ఉపాధ్యాయులను ఎస్కార్టుగా నియమించారు. పది మంది వైద్య సిబ్బంది, 12 మంది విద్యా శాఖ ఉన్నతాధికారులు కలిపి మొత్తం 3,528 మంది వరకు వెళ్లనున్నారు. మొత్తం 72 బస్సులను ఏర్పాటు చేశారు. డ్యూటీలు పడిన వారికీ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలు కావడంతో లోపల నొచ్చుకుంటూనే బయటకు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లాల్సిన పరిస్థితి. పైగా నేరుగా వెళ్లేందుకు వీల్లేకుండా, అందరినీ బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రావాల్సిందిగా నిర్దేశించారు. వీరందరికీ స్థానికంగా శ్రీచైతన్య, బీవీఎం ఉన్నత పాఠశాల, లాలాచెరువు మున్సిపల్ హైస్కూల్, సత్యసాయి గురుకులం, సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం (బొమ్మూరు)లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరు గురువారం ఉదయం బయలుదేరి అమరావతి వెళ్లాల్సి ఉంది.ముందెన్నడూ లేదు డీఎస్సీ నియామకాల సమయంలో గతంలో ఎప్పుడూ ఈస్థాయి ప్రచారం చేసుకున్న ఘనత మరే ప్రభుత్వానికీ, మరే ముఖ్యమంత్రికీ దక్కలేదు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 2008 మెగా డీఎస్సీ ప్రకటించారు. ఏకంగా 52,655 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఎన్నికలు రావడం, వైఎస్సార్ రెండోసారి సీఎం అయినా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తర్వాత సీఎం అయిన రోశయ్య కాలంలో ఈ పోస్టులు భర్తీ అయ్యాయి. మెరిట్ లిస్టు ప్రకటించడం, తర్వాత రెండు, మూడు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తవడం, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం అంతా కేవలం నాలుగైదు రోజుల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు కేవలం 16,347 పోస్టులు మాత్రమే. కానీ ప్రచారం మాత్రం పీక్ స్టేజ్లో నిర్వహిస్తున్నారు. నేడు అమరావతిలో డీఎస్సీ నియామకపత్రాల అందజేత ఆర్డర్లకు అభ్యర్థులు 250 కిలోమీటర్లు వెళ్లాల్సిందే.. రాజమహేంద్రవరంలో రాత్రి బస అక్కడి నుంచి అమరావతికి ప్రయాణం మండిపడుతున్న ఎంపికై న ఉపాధ్యాయులు గతంలో ఎన్నడూ లేని విధానం -
అందరూ మహానుభావులే.. మరి ఎవరి పేరు పెట్టాలి?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రశాంతతకు మారుపేరుగా.. పెన్షనర్స్ పేరడైజ్గా పేరొందిన కాకినాడలో శేషజీవితం గడపాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు అనుకుంటారు. అటువంటి కాకినాడ పేరు మార్పు ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. కూటమి సర్కార్ ఏర్పడిన ఏడాదిన్నర తరువాత జిల్లాలు, మండలాల పునరి్వభజన, ఊరు పేర్ల మార్పు అంటూ హడావుడి చేస్తోంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన కాకినాడ మార్చాలనే ప్రతిపాదనపై విభిన్న వర్గాలు భిన్న రీతుల్లో స్పందిస్తున్నాయి. పేరు మార్పు అనే అంశం తెరపైకి వచ్చినదే తడవుగా అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఒకప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడతో విడదీయరాని అనుబంధం ఉన్న మహానుభావులు ఎందరో ఉన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం రూ.కోట్ల విలువైన ఆస్తులను తృణప్రాయంగా, నిస్వార్థంగా, నిబద్ధతతో దానం చేసిన ప్రముఖులకు ఇక్కడ కొదవ లేదు. పిఠాపురం మహారాజా పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్. ఈయన దానం చేసిన వేల ఎకరాల్లో ఇప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు నడుస్తున్నాయి. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను ఆయన ప్రజల మేలు కోరి ఎంతో ఉదారంగా దానం చేశారు. మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ సమీపాన కోరంగి వద్ద బలహీనవర్గాల కుటుంబంలో జన్మించిన మల్లాడి సత్యలింగ నాయకర్ స్వశక్తితో కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నారు. అమ్మ, నాన్న చనిపోతే మేనమామ వద్ద పెరిగిన నాయకర్ 12 ఏళ్ల వయస్సులో కోరంగిలోని ఓడ రేవులో పని చేస్తూండేవారు. అక్కడి నుంచి రంగూన్ వెళ్లి పని చేయడమే కాకుండా.. కూలీలను తీసుకువెళ్లేవారు. అనంతరం ఎగుమతి, దిగుమతుల కాంట్రాక్టులు చేశారు. పిల్లలు లేకపోవడంతో సుబ్రహ్మణ్య నాయకర్ను దత్తత తీసుకున్నారు. ధనవంతులు మాత్రమే చదువుకునే రోజులవి. రూపాయి జీతానికి ఒక అధికారి నెలంతా పని చేసే రోజుల్లో నాయకర్ రూ.8 లక్షలు సంపాదించి 1,800 ఎకరాలు కొనుగోలు చేసి ఎంఎస్ఎన్ చారిటీస్ సంస్థకు ఇచ్చి, ఈ ప్రాంతంలో విద్యాభ్యున్నతికి బాటలు వేశారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఆయన రాసిన మరణ శాసనంలో ‘నా వంశంలో ఎవరైనా ప్రాణాలతో లేకుంటే నా యావదాస్తిని ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలు లేదు. అవసరమైతే స్థానిక సంస్థలకు అప్పగించాలి’ అని రాశారు. తన సేవలతో ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఇంకా ఎందరో.. కాకినాడకు చెందిన మహర్షి బులుసు సాంబమూర్తి తనకున్న కోట్ల విలువైన యావదాస్తిని దేశ స్వాతంత్య్రం కోసం అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు ధారాదత్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత జ్యోతుల సీతారామ్మూర్తి ముత్తాత జ్యోతుల వెంకయ్య అప్పట్లో విక్టోరియా మహారాణికి 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. కాకినాడలో ప్రస్తుతం కుళాయి చెరువు ఉన్న ప్రాంతం అదేనని చెబుతున్నారు. హిందూ శ్మశానం కోసం 100 ఎకరాలు దానంగా ఇచ్చిన విజ్జపురెడ్డి వంశీయులతో పాటు మూడు తరాల కిందట ముత్తా వంశీయులు, మంత్రిప్రగడ, పైండా, పైడా తదితర వంశీయులు అప్పట్లో సత్రాలు నిర్మించి, అన్నదానాలకు, విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందించారు. దివంగత పంతం పద్మనాభం పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. ఆగర్భ శ్రీమంతుడు సీవీకే రావు అప్పట్లోనే విదేశాల్లో ఐఏఎస్ చదువుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా రెండు పదవులూ ఏకకాలంలో నిర్వహించారు. రెల్లి వృత్తి పనివార్లను గత సంస్కృతి నుంచి విముక్తికి బాటలు వేసి, వినూత్న సంస్కరణలతో నిస్వార్థ ప్రజాజీవితానికి నిలువుటద్దంగా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో కేఎస్ఆర్ మూర్తి, జ్ఞానానంద కవి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కృత్తివెంటి పేర్రాజు పంతులు, మద్దూరి అన్నపూర్ణయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, మెక్లారెన్ దంపతులు, విశ్వవిజ్ఞాన మదీనా కబీర్ షా వంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ‘పేరు’ కోసం పోరు జిల్లాలు, ప్రాంతాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను కూటమి సర్కారు తెర పైకి తెచ్చినప్పటి నుంచీ కాకినాడ జిల్లా పేరు మార్పు డిమాండ్ ముందుకు వచ్చింది. కాకినాడ పేరుకు ముందు పిఠాపురం రాజా, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లు పెట్టాలనే డిమాండుతో సాధన సమితులు కూడా ఏర్పాటయ్యాయి. కలెక్టరేట్ వరకూ ర్యాలీలు, రౌండ్టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే, ఘనకీర్తిని సొంతం చేసుకున్న మహానుభావులు ఎంతో మంది కాకినాడలో ఉన్నారు. వీరిలో ఎవరి పేరు పెట్టినా మరొకరిని తక్కువ చేసినట్టే అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందువలన పేరు మార్పు వద్దన్నది వారి వాదన. కాకినాడ పేరు మార్పు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఎటు మొగ్గు చూపినా అనవసరంగా తేనెతుట్టెను కదిల్చినట్టు అవుతుందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.‘కాకినాడ’ పేరు ఇలా..ఈ ప్రాంతాన్ని 500 ఏళ్లు పరిపాలించిన కాకనందివాడ వంశీయుల పేరిట కాకినాడ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. చాళుక్యుల కాలం నుంచీ ప్రసిద్ధి చెందిన కాకనందివాడ వంశీయులు ఇప్పుడు లేకపోయినా.. పూర్వ చరిత్రకు సంబంధించిన కాకినాడ పేరును యథాతథంగా ఉంచాలనే డిమాండు కూడా ఉంది. కాకనందివాడ వంశీయులు.. ఆ తరువాత ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు పాలించిన సమయంలో కాకినాడకు కో కెనడాగా కూడా దేశ, విదేశాల్లో ఘన చరిత్ర ఉంది. చరిత్రాత్మక కాకినాడ 160 ఏళ్ల మున్సిపాలిటీగా ప్రసిద్ధి. పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరు పెట్టాలి. ఆయన తెలుగు భాషకు చిరస్మరణీయమైన రచనలు అందించి, గొప్ప సంస్కరణవాదిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహనీయుడు. విద్యాభివృద్ధితో పాటు దళిత జనోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. తెలుగు భాషా వికాసానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కవులు, రచయితలను శ్రీకృష్ణదేవరాయలు తరువాత అదే స్థాయిలో ఆదరించి, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. తెలుగు ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసి ఆయన పేరును జిల్లాకు పెట్టడం సముచితం. – నల్లమిల్లి శేషారెడ్డి, చాన్సలర్, ఆదిత్య యూనివర్సిటీ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు పిఠాపురం మహారాజా 1852లో కాకినాడలో పీఆర్ హైసూ్కల్ను స్థాపించారు. అప్పట్లో బాలికా విద్యకు అవకాశం కలి్పంచారు. 1884లో పిఠాపురం రాజా కళాశాలను స్థాపించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యా సంస్థలకు భారీ విరాళం ఇచ్చారు. కాకినాడలో బ్రహ్మసమాజ మందిరం, అనాథ శరణాలయం తదితర ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడలో 100 ఏళ్ల క్రితం పీఆర్ డిగ్రీ కళాశాల, పిఠాపురంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వేలాది మంది విద్యార్థుల విద్యాభ్యున్నతికి బాట వేశారు. విద్యార్థి లోకంతో పాటు అటు అధ్యాపక సంఘాలు కూడా పిఠాపురం రాజా పేరు పెట్టాలని కోరుతున్నాయి. – వలవల శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, పీఆర్ డిగ్రీ కళాశాలనాయకర్ పేరు సముచితమే.. వందల ఎకరాలు దానం చేసిన మహానీయుడు నాయకర్. ఆ రోజుల్లో చాలా మంది వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రమే దానం చేశారు. కానీ, స్వశక్తితో సంపాదించిన యావదాస్తినీ పేద విద్యార్థుల అభ్యున్నతికి నాయకర్ ధార పోశారు. ఎటువంటి చదువు, వారసత్వంగా వచ్చిన ఆస్తి లేనప్పటికీ పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో నాయకర్ చేసిన దానం వెలకట్టలేనిది. జిల్లాకు ఆయన పేరు పెట్టడంలో సందేహించాల్సిందేమీ లేదు. – పంపన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు, నాయకర్ సాధన సమితి యావదాస్తినీ ధార పోశారు కోరంగి ఓడరేవులో ఒక శ్రామికుడిగా మూటలు మోసి, తన తెలివితేటలతో రంగూన్ వెళ్లి, అక్కడ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఎదిగి, కష్టంతో సంపాదించిన యావదాస్తినీ విద్యాభివృద్ధికి దానం చేసిన మహనీయుడు నాయకర్. జిల్లాకు ఆయన పేరు పెట్టాలి. ఇందుకు అన్ని వర్గాలూ ఆమోదం తెలియజేస్తాయనే నమ్మకం ఉంది. రెక్కల కష్టంపై సంపాదించిన ఆస్తినంతటినీ దానం చేసిన, ఉదారమైన మనస్తత్వం కలిగిన నాయకర్ అందరివాడు. – మల్లాడి రాజు, అధ్యక్షుడు ఎంఎస్ఎన్ చారీ్టస్ పరిరక్షణ సమితి పేరు మార్పు వద్దు దేశ విదేశాల్లో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పేరు మార్పునకు కూటమి ప్రభుత్వం అంగీకరించకూడదు. చరిత్రాత్మక కాకినాడ పేరు రాజమహేంద్రవరం కంటే కూడా ముందుగా అవతరించింది. కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి పిఠాపురం మహారాజా, మల్లాడి సత్యలింగ నాయకర్, బులుసు సాంబమూర్తి, సీవీకే రావు, జ్యోతుల, ముత్తా, పైడా, పైండా తదితరుల కుటుంబాలు తమ ఆస్తులను ధార పోశారు. పలు ఆస్తులు అన్యాక్రాంతంలో ఉన్నాయి. వాటిని తిరిగి ఆయా సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. – దూసర్లపూడి రమణరాజు, పురపాలక సంఘం పూర్వ పాలక సభ్యుడు పేరు మార్పుతో విభేదాలు జిల్లాలో ఎన్నో ఆస్తులు ఇచ్చిన మహనీయులకు గుర్తింపు ఉండేలా అనేక నిర్మాణాలకు వారి పేరు పెట్టాలి. జిల్లాకు ఎవరికి తోచిన పేరు వారు కోరుకుంటారు. దీనివల్ల వర్గ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన జిల్లాకు కాకినాడ పేరు ఉంటేనే బాగుంటుంది. మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా ఇదే అనుకుంటున్నాను. – కొటికలపూడి సత్య శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు, కాకినాడ బార్ అసోసియేషన్ -
ఆంధ్రా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా శ్రీనివాస్
అంబాజీపేట: అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల ఎస్.ఎస్.ఎస్. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రంజీ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా మరోసారి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఉత్తర్వులు అందినట్టు శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అకాడమీ క్రికెట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఆయన రంజీ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా సేవలందించారు. అంబాజీపేటకు చెందిన శ్రీనివాస్ క్రీడాకారునిగా సైతం రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. 2005లో ఏపీ రంజీ క్రికెట్ జట్టు ప్రోబబుల్స్కు ఎంపికయ్యారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన క్రికెట్ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంబాజీపేటలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ సబ్ సెంటర్ కోచ్గా ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. 2014 నుంచి 2022 వరకూ కడప జిల్లాలో ఏసీఏ అకాడమీ కోచ్గా సేవలందించారు. తరువాత మంగళగిరి, విజయనగరం అకాడమీలలో కూడా పనిచేశారు. ప్రస్తుతం మంగళగిరి అకాడమీ అసిస్టెంట్ కోచ్గా రాష్ట్ర అండర్–14 జట్టుకు రెండుసార్లు, అండర్–16 జట్టుకు ఒకసారి కోచ్ వ్యవహరించారు. తనను రంజీ జట్టు కోచ్గా ఎంపిక చేయడం పట్ల ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, ఏసీఏ ఎఫెక్స్ కౌన్సిల్ సభ్యులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. -
సత్యదేవునిపై అదనపు భారం
త్వరలోనే అగ్రిమెంట్ అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థతో వెంటనే అగ్రిమెంట్ కుదుర్చుకుని, అక్టోబర్ 1 నుంచి కాంట్రాక్ట్ అప్పగించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అగ్రిమెంట్ అయ్యాక కానీ నెలకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఈసారి శానిటేషన్తో పాటు హౌస్ కీపింగ్, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ, ప్లంబింగ్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, వాషింగ్ తదితర పనులు కూడా ఆ కాంట్రాక్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. అందువలన ఖర్చు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానంఅన్నవరం: దసరా పండగ అందరికీ శుభాలను చేకూరుస్తుంది. కానీ, అన్నవరం దేవస్థానంపై మాత్రం ఈ పండగ వేళ భారీ ఆర్థిక భారం పడుతోంది. విజయ దశమి పర్వదినానికి ఒక రోజు ముందు.. అంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచే దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్ను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సంస్థ చేపట్టనుంది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు ఒకే యూనిట్గా పిలిచిన టెండర్ను ఆ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ ఆయా దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణ, సత్రాల్లో హౌస్ కీపింగ్, రోడ్లు, టాయిలెట్ల క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు నిర్వహణ తదితర పనులను రెండేళ్ల పాటు నిర్వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న జీఓ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థతో త్వరగా అగ్రిమెంట్ కుదుర్చుకుని, అక్టోబర్ 1 నుంచి శానిటేషన్ బాధ్యతలు అప్పగించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఏడు దేవస్థానాల ఈఓలను ఆదేశించారు. వార్షికాదాయంలో 6 శాతం ఈ పద్దుకే.. ‘పద్మావతి’ సంస్థతో కాంట్రాక్టు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. దీనిలోని షరతుల ప్రకారం ప్రతి నెలా దేవస్థానం ఆ సంస్థకు రూ.80 లక్షలు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండేళ్లకు కలిపి సుమారు రూ.20 కోట్లు చెల్లించాలి. దేవస్థానం వార్షికాదాయం రూ.170 కోట్లు కాగా, ఇందులో సుమారు 6 శాతం ఈ పద్దుకే చెల్లించాల్సి ఉంటుంది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు ఇప్పటి వరకూ నెలకు రూ.67 లక్షల వరకూ మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం ప్రతి నెలా రూ.15 లక్షలకు పైగా అదనపు భారం పడనుంది. అంటే ఏడాదికి రూ.1.8 కోట్లు, రెండేళ్లకు రూ.3.6 కోట్ల మేర భారం పడుతుంది. వ్యూహాత్మకంగా.. ఆయా దేవస్థానాల్లో 2014కు ముందు పారిశుధ్య టెండర్లను విడివిడిగా పిలిచేవారు. స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా.. అతి తక్కువకు కోట్ చేసిన వారు ఆ కాంట్రాక్ట్ దక్కించుకునేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు కలిపి ఒకే టెండర్ పిలిచి ‘పద్మావతి’ సంస్థకే ఆ టెండర్ దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహారం పూర్తి చేశారనే విమర్శలు వచ్చాయి. ఆ సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడంతో అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తరువాత 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో ఏడు దేవస్థానాలకు విడివిడిగా పారిశుధ్య టెండర్లు పిలిచారు. దీంతో, ఇతర కాంట్రాక్టర్లు ఆయా టెండర్లు దక్కించుకున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడు దేవస్థానాల్లో పారిశుధ్య కాంట్రాక్టుకు ఒకే యూనిట్గా టెండర్ పిలవాలని గత ఏడాది ఆగస్టులో కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గత ఏప్రిల్లో తొలిసారి టెండర్ పిలిచారు. దీనికి 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో ఆ టెండర్లను రద్దు చేసి, గత జూన్ 12న తిరిగి టెండర్లు ఆహ్వానించారు. దీంతో ‘విషయం’ అర్థం చేసుకున్న కాంట్రాక్టర్లు ఈసారి టెండర్లు వేయలేదు. పద్మావతి సంస్థతో పాటు విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి సంస్థ మాత్రమే టెండర్ దాఖలు చేసింది. గత ఆగస్టులో టెక్నికల్ బిడ్ తెరవగా చైతన్యజ్యోతి సంస్థ డిస్క్వాలిఫై కాగా, పద్మావతి సంస్థ మాత్రమే అన్ని సాంకేతిక అర్హతలూ కలిగిఉన్న ఏకై క సంస్థగా నిలిచింది. ఈ మేరకు ఆ సంస్థను ఎంపిక చేసినట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాడ్రేవు వినయ్చంద్ పేర్కొన్నారు. ఆ మేరకు జీఓ విడుదల చేశారు. పాత కాంట్రాక్ట్ రూ.49 లక్షలే.. అన్నవరం దేవస్థానంలో 2022–24 మధ్య పారిశుధ్య కాంట్రాక్టును కేఎల్టీసీ సంస్థ నిర్వహించింది. ఆ సంస్థకు నెలకు రూ.49 లక్షలు చెల్లించేవారు. గడువు ముగియడంతో ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో వైదొలగింది. అనంతరం, కనకదుర్గా ఏజెన్సీకి తాత్కాలికంగా పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్ ఉద్యోగుల జీతాలు పెరగడంతో ఆ బిల్లు 365 మంది సిబ్బందికి నెలకు రూ.55 లక్షలకు పెరిగింది. దేవస్థానం శానిటేషన్ మెటీరియల్కు రూ.12 లక్షలు ఖర్చు చేస్తోంది. ఈవిధంగా ప్రతి నెలా పారిశుధ్య నిర్వహణకు రూ.67 లక్షలు వెచ్చిస్తున్నారు. కొత్త కాంట్రాక్టులో పొందుపరచిన నిబంధనల ప్రకారం ‘పద్మావతి’ సంస్థకు ప్రతి నెలా రూ.80 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫినాయిల్, బ్లీచింగ్ తదితర శానిటేషన్ మెటీరియల్కు రూ.7.50 లక్షలు, యంత్రాల నిర్వహణకు రూ.3.68 లక్షలు, సుమారు 365 మంది సిబ్బందికి కార్మిక చట్టం ప్రకారం వేతనాలుగా రూ.65 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తం మీద కాంట్రాక్టర్కు 4.95 శాతం సర్వీస్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఫ అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టు ‘పద్మావతి’కే.. ఫ ప్రతి నెలా రూ.80 లక్షల పైనే వ్యయం! ఫ అక్టోబర్ 1 నుంచి కాంట్రాక్ట్ అమలులోకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకోవాలని కమిషనర్ ఆదేశం ఫ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఆ సంస్థకే కాంట్రాక్టు -
భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లిలో భార్యపై హత్యాయత్నం చేసిన భర్తపై కె.గంగవరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కె.గంగవరం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోహమాటి అశ్విని, రామచంద్రపురం పట్టణానికి చెందిన దత్త వీర వెంకట శివకుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల శివకుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ నేపథ్యంలో అశ్విని కోటిపల్లిలో అమ్మగారి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఇదే క్రమంలో సోమవారం రాత్రి శివకుమార్ దళిత కాలనీలో ఉన్న అశ్విని వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆమెను కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై భార్య అశ్విని ఫిర్యాదు చేయగా కె.గంగవరం ఎస్సై జానీ బాషా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై రామచంద్రపురం ఇన్చార్జి డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శివకుమార్ను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. -
కరుడు గట్టిన నేరస్తుడి కోసం ముమ్మర గాలింపు
● 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు ● 70 కేసుల్లో ప్రభాకర్ ముద్దాయి ● నాలుగు రాష్ట్రాల్లో కేసులు ● ఇద్దరు ఎస్కార్ట్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ● డీఎస్పీ దేవకుమార్ వెల్లడి దేవరపల్లి: పోలీసుల కళ్లు కప్పి సోమవారం రాత్రి పారిపోయిన కరుడు గట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు మమ్మురంగా గాలిస్తున్నారు. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ప్రభాకర్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద చేతులకు బేడీలతో పరారైన సంఘటన పాఠకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏలూరు డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సీఐ నాగేశ్వరనాయక్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 50 మంది యువకులతో బైక్లపై పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి వరకు యువకులు, పోలీసులు పొలాల్లో గాలించారు. 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు పోలీసుల కళ్లుకప్పి పరారైన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం దేవరపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. నేరస్థుడు ప్రభాకర్పై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో సుమారు 80 కేసులు నమోదైనట్టు తెలిపారు. 2011 నుంచి ప్రభాకర్ నేరాలకు పాల్పడుతూ పట్టుబడినట్టు ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లలో దొంతనం కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్టు ఆయన చెప్పారు. 2022లో హైదరాబాద్లోని గచ్బౌలిలోని పబ్లో ఉన్న అతనిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపినట్టు ఆయన చెప్పారు. ఫీజులు కట్టే సమయంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, గృహాలను లక్ష్యంగా పెట్టుకుని ఒంటరిగా దొంగతనాలు చేస్తాడని తెలిపారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను కాలేజీలో రూ.30 లక్షలు, దేవరపల్లి మండలంలో రోమన్ కేథలిక్స్ స్కూల్లో రూ.3 లక్షలు చోరీ చేసినట్టు ఆయన తెలిపారు. 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 40 మంది పోలీసులతో రాత్రంతా పొలాల్లో గాలించడంతో పాటు ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం డాగ్ స్క్వాడ్తో గాలించినట్టు ఆయన తెలిపారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. పీటీ వారెంట్లపై రాష్ట్రంలో ఎక్కడైతే కేసులు ఉన్నాయో అక్కడకు తీసుకు వెళుతున్నట్టు చెప్పారు. పారిపోయిన సమయంలో చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్టు తెలిపారు. ఎక్కడెక్కడ నేరాలు చేస్తున్నాడు, సన్నిహితుల ఆచూకీని తెలుసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల పారితోషికం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు దేవరపల్లి పోలీసుల మొబైల్ నెంబర్లు 94407 96584 (సీఐ), 9440796624 (ఎస్సై)కు సమాచారం ఇవ్వాలని కోరారు. అనేక కేసుల్లో నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ కరుడుగట్టిన నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభాకర్పై అనేక కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఒక కేసులో పోలీసులు విజయవాడ కోర్టుకు తీసుకు వెళ్లి తిరిగి వస్తుండగా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద హైవేపై గల హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో ప్రభాకర్ టీ తాగడానికి చేతులకు ఉన్న హ్యాండ్స్ కప్స్ను ఒక చేతిది తీసి మరొక చేతికి ఉంచారు. టీ తాగుతున్న క్రమంలో బత్తుల ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లు కప్పి హోటల్ వెనుక నుంచి పొలాల్లోకి పరారయ్యాడు. ఎస్కార్ట్ పోలీసులు వెంటపడినప్పటికీ దొరకలేదని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ప్రభాకర్కు ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎస్కార్ట్గా వెళ్లారు. వీరిద్దరిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. -
పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
సామర్లకోట: శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని సామర్లకోట పంచారామ క్షేత్రంలో రెండో రోజైన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమారారామ భీమేశ్వరస్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యాన ఉదయం, సాయంత్రం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో చండీహోమం నిర్వహించారు. అన్నపూర్ణమ్మగా బాలాత్రిపురసుందరీదేవి సామర్లకోట: శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా సామర్లకోట పంచారామ క్షేత్రంలో వేంచేసియున్న బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు మంగళవారం అన్నపూర్ణ స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వైఎస్సార్ సీపీకి ముద్రగడ కృషి ఎంతో అవసరం కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడి లోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముద్రగడ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కృషి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరి, లాలం బాబ్జీ, నాగం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్లో 2డీ ఎకో సేవలు పునఃప్రారంభం కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో 2డీ ఎకో సేవలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ వానపల్లి వరప్రసాద్ ఈ విషయం తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆదేశాల మేరకు, ఇన్సోర్సింగ్ విధానంలో కార్డియాలజిస్టులను ఆసుపత్రికి తీసుకొచ్చి రోగులకు 2డీ ఎకో సేవలు అందిస్తున్నామని వివరించారు. దీని ద్వారా హృద్రోగాలతో బాధపడుతున్న వారికి తొలి దశ వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తొలి రోజు 30 మందికి 2డీ ఎకో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బార్ తొలగించాలని ఆందోళన
నిడదవోలు : పట్టణంలో సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన చైతన్య బార్ – రెస్టారెంట్ తొలగించాలని స్థానికులు మంగళవారం బార్ వద్ద ఆందోళన చేశారు. దళితులు, శ్రామికుల కుటుంబాలను దోచుకోవటానికే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మద్యం బార్లు తెరుస్తున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బైపే రాజేశ్వరరావు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, టి.ప్రేమ్కుమార్ ఎం. భాను, బి.నాని, నక్కా సురేష్, గుమ్మడి రాజు, ఎం.డేవిడ్ వి. పవన్ కుమార్, వి. కళ్యాణ్, జాన్, పుల్లారావు పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే భద్రత
● తల్లిదండ్రులూ..పిల్లలపై ఓ కన్నేయండి ● సెలవుల్లో వెన్నాడే ప్రమాదాలు రాయవరం: పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చేశారు. పిల్లలు పట్టలేని ఆనందంతో ఉన్నారు. సెలవుల సమయంలో ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు. ఈ సమయంలో ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. పాఠశాలల్లో నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండే విద్యార్థులు సెలవుల్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయాన్ని గమనిస్తుండాలి. కాలువల్లో స్నానాలకు వెళ్లే వారు కొందరైతే మరికొందరు సెల్ఫోన్లలో గేమ్స్ను చూస్తుంటారు. మరికొందరు సాహసాలు చేస్తుంటారు. ఈత సరదా తీస్తుంది ప్రాణం జిల్లాలో గోదావరి తీరం ఒక పక్క, మరో పక్క కాలువలు అధికంగా ఉంటాయి. సెలవుల్లో సరదా కోసం, కాలక్షేపం కోసం కొందరు ఈతకు దిగుతుంటారు. ఆ సమయంలో కాలక్షేపం కోసం వారు చేసే పనులు ఒక్కోసారి ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. దసరా, సంక్రాంతి సెలవుల్లో పిల్లలకు అధిక సమయం దొరుకుతుంది. ఆ సమయంలోనే వారు ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పిల్లల సంరక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువలు, చెరువుల్లో నీరు నిండుగా ఉంది. సాధారణంగా నీరు కనిపిస్తే పిల్లలకు ఈత కొట్టాలనిపిస్తుంది. గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎక్కువగా ఈత వస్తుంది. చిన్నప్పటి నుంచి పట్టణాలు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఈత పెద్దగా తెలియదు. అటువంటి వారు గ్రామాలకు వచ్చి తోటి పిల్లలతో సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఈత రాక ప్రమాదాలకు గురవుతుంటారు. అటు వంటి వారి విషయంలో తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. చెరువులు, కాలువల వైపుగా వెళ్లి నప్పుడు.. పెద్దవారిని తోడుగా తీసుకొని వెళ్లాలని వివరించాలి. మితి మీరిన వేగంతో ప్రమాదం కొందరు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో ఉన్న వాహనాలను తీసుకొని రోడ్లపైకి వచ్చేస్తుంటారు. మితిమీరిన వేగానికి తోడు రహదారి భద్రతా చర్యలు పాటించడం లేదు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి.. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. పిల్లలకు మోటార్ సైకిల్ ఇస్తే తల్లిదండ్రులకు కూడా శిక్షలు పడతాయన్న విషయాన్ని విస్మరించకూడదు. చిన్నారుల చేతికి వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ తరగతులు, అదనపు పరిజ్ఞానం కోసం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్స్ ఇస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో ప్రయోజనం ఎంత ఉంటుందో చెప్పలేము కాని, అనర్థాలే అధికంగా ఉంటాయి. ఒక్కోసారి అవసరమైన యాప్స్ నుంచి అనవసరమైన, ప్రమాదకరమైన యాప్స్లోకి వెళ్లిపోతుంటారు. తల్లిదండ్రులు దగ్గర ఉండి గమనించకుంటే పిల్లలు చెడుదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా అకౌంట్లు తెరిస్తే పిల్లలు పక్కదారి పట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. కంట కనిపెట్టాలి దసరా సెలవుల్లో విద్యార్థులను కంట కనిపెట్టాలి. సృజనాత్మకత, నైతికత విలువలు పెంచేందుకు కథల పుస్తకాలు చదివించాలి. దీనివల్ల పుస్తక పఠనం పెరుగుతుంది. సెల్ఫోన్స్కు పిల్లలను దూరంగా ఉంచే విధంగా చూడాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోషల్ మీడియాతో ప్రమాదం పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్తో పిల్లలు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటారు. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం సహవాస దోషాలతో ప్రమాదాలు సహవాస దోషంతో వారు వీరవుతారు..వీరు వారవుతారనేది సామెత. మనం చేసే స్నేహాలను బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నది కూడా వాస్తవం. ఇటీవల కాలంలో జిల్లాలో మైనర్లు, విద్యార్థులు మత్తు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్నేహితుల్లో ఎవరికో ఒకరికి సిగరెట్లు, గంజాయి వంటి అలవాటు ఉంటే మిగతావారు చెడు ప్రభావాలకు లోనవుతుంటారు. సరదాగా ఒకసారి మొదలైన అలవాటు, వ్యసనానికి దారి తీస్తుంది. అందుకే సెలవుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఆగని మరణ మృదంగం
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. దీంతో పాడి రైతులు విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన గెడ్డం మణికంఠకు చెందిన పాడి గేదె కొద్ది రోజులుగా వ్యాధిభారిన పడి మంగళవారం మృతి చెందింది. మందులు వాడినా, వ్యాక్సిన్లు వేసినా ప్రయోజనం లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జమ్ముల శ్రీనుకు చెందిన పాడి గేదె కూడా మృతి చెందింది. మృతి చెందిన గేదెలను బయటకు తరలించడానికి రూ.15 వేల వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 23 మంది రైతులకు చెందిన 33 గేదెలు అంతు చిక్కని వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డాయని రైతులు చెబుతున్నారు. -
రోగి నుంచి వివరాల సేకరణ
గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడుకు చెందిన గరగ నాగ ఆంజనేయ దుర్గారావును వైద్య, ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది కలిసి అతనికి ఉన్న అనారోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. శ్రీసాక్షిశ్రీలో మంగళవారం ప్రచురించిన శ్రీసాయమందించి ప్రాణభిక్ష పెట్టండిశ్రీ కథనానికి స్పందించారు. గండేపల్లి పీహెచ్సీ వైద్యాధికారి కేవీ నరేష్, సీహెచ్ఓ శర్మ, ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది నాగేశ్వరరావు, ఏఎన్ఎం రామలక్ష్మి, ఆశ లక్ష్మి మంగళవారం దుర్గారావు ఇంటికి వెళ్లి వ్యాధి వివరాలు అడిగి తెలుసుకుని ఇందుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించి తగు సూచనలు, సలహాలు అందజేశారు. -
పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి
కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరు పెట్టాలి. ఆయన తెలుగు భాషకు చిరస్మరణీయమైన రచనలు అందించి, గొప్ప సంస్కరణవాదిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహనీయుడు. విద్యాభివృద్ధితో పాటు దళిత జనోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. తెలుగు భాషా వికాసానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కవులు, రచయితలను శ్రీకృష్ణదేవరాయలు తరువాత అదే స్థాయిలో ఆదరించి, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. తెలుగు ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసి ఆయన పేరును జిల్లాకు పెట్టడం సముచితం. – నల్లమిల్లి శేషారెడ్డి, చాన్సలర్, ఆదిత్య యూనివర్సిటీ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు పిఠాపురం మహారాజా 1852లో కాకినాడలో పీఆర్ హైస్కూల్ను స్థాపించారు. అప్పట్లో బాలికా విద్యకు అవకాశం కల్పించారు. 1884లో పిఠాపురం రాజా కళాశాలను స్థాపించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యా సంస్థలకు భారీ విరాళం ఇచ్చారు. కాకినాడలో బ్రహ్మసమాజ మందిరం, అనాథ శరణాలయం తదితర ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడలో 100 ఏళ్ల క్రితం పీఆర్ డిగ్రీ కళాశాల, పిఠాపురంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వేలాది మంది విద్యార్థుల విద్యాభ్యున్నతికి బాట వేశారు. విద్యార్థి లోకంతో పాటు అటు అధ్యాపక సంఘాలు కూడా పిఠాపురం రాజా పేరు పెట్టాలని కోరుతున్నాయి. – వలవల శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, పీఆర్ డిగ్రీ కళాశాల -
పరిశ్రమల కాటుష్యంపై ఆగ్రహం
న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మత్స్యకారులు కొత్తపల్లి: తీర ప్రాంతంలో నిర్మించిన కాలుష్య పరిశ్రమలతో సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించక జీవనోపాధి కోల్పోయామని మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మత్స్యకారుల సమస్యలపై ఉప్పాడ బీచ్రోడ్డు సెంటర్లో మంగళవారం అమీనాబాదు, ఉప్పాడ గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. మత్స్యకారులకు మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. బీచ్రోడ్డు వైపు వెళ్ళే అన్ని రోడ్లను మూసివేశారు. పరిశ్రమలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలు విడుదల చేసే కలుషిత వ్యర్థాల వల్ల సుమారు 20 కిలోమీటర్ల మేర సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని, దీంతో మత్స్యసంపద అంతరించిపోతోందని చెప్పారు. ఆరు నెలులుగా మత్స్య సంపద లభించక జీవనోపాధి కోల్పోయామని, ఓఎన్జీసీ, రిలయన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో గాడిమొగతో పాటు పరిసర గ్రామాల్లో ఏ విధంగా పరిహారం ఇస్తున్నారో ఆ విధంగానే అందించాలని కోరారు. పరిశ్రమల్లో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలని, బోట్లుకు ఇచ్చే ఆయిల్ సబ్సిడీ పెంచాలని అమీనాబాదులో నిర్మించిన హార్బరులో మార్పులు చేయాలి, నిర్మించిన వాలు వలన దెబ్బతిన్న బోట్లు, వలలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉప్పాడ, కోనపాపపేట తీరప్రాంత గ్రామాల్లో రాతి గోడను నిర్మించడంతో పాటు తమ సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులతో చర్చించిన అధికారులు ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దారు చిన్నారావు చర్చించారు. అయినా వారు ఆందోళన విరమించేలేదు. దీంతో కలెక్టర్ షన్మోహన్ సగిలి స్ధానిక తహసీల్దారు కార్యాలయంలో మత్స్యకారులతో చర్చించేందుకు ప్రయత్నించగా వారు నిరాకరించారు. కోనపాపపేటలో సంఘీభావం ఉప్పాడలో ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులకు సంఘీభావంగా కోనపాపపేటలోని మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. బీచ్రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మోటార్ సైక్లిస్ట్ మృతి
పెరవలి: గోతుల రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మోటార్ సైకిలిస్టును ఢీకొట్టి అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న రేకుల షెడ్డును ఆ తరువాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిలిస్ట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిడదవోలు–నరసాపురం ఆర్అండ్బీ రోడ్డులో తీపర్రు వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు వీరంగం సృష్టించింది. తణుకు నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ఆర్టీసీ బస్సు తీపర్రు వద్ద రోడ్డుపై ఉన్న గోతుల్లో పడి బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో మండలంలోని కడింపాడు గ్రామానికి చెందిన సలాది సత్యనారాయణ (50) మోటార్ సైకిల్పై తీపర్రు నుంచి పెరవలి వస్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టటంతో అతను మోటార్ సైకిల్ పై నుంచి ఎగిరి రోడ్డ పక్కన ఉన్న ఇంటి అరుగుపై పడ్డాడు. బస్సు ఢీకొన్న వేగానికి సత్యనారాయణ తలకు బలమైన గాయం అయింది. తణుకులోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. బస్సు వేగంగా ఢీకొట్టడంతో రేకుల షెడ్డు, విద్యుత్ స్తంభం నేలకొరిగాయి. ఈ బస్సు ప్రమాదం రోడ్డుకి రెండవ వైపున జరిగి ఉంటే బస్సు నేరుగా కాలువలోకి వెళ్లిపోయేదని, ఆ సమయంలో బస్సులో ఉన్న 60 మందికి ప్రమాదం సంభవించేదని స్థానికులు అంటున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పెరవలి ఎస్సై యం వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు సత్యనారాయణకి భార్య సత్యరాధ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
సాధనతో దైవ బలం
శ్రీ పీఠంలో రెండో ప్రసంగంలో పరిపూర్ణానంద స్వామి కాకినాడ రూరల్: సాధనతోనే దైవబలం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ బలంతోనే అమ్మ అనుగ్రహం పొందుతారని పరిపూర్ణానంద స్వామి అభిభాషించారు. మహాశక్తి యాగం కార్యక్రమంగా రమణయ్యపేటలోని శ్రీ పీఠంలో రెండో రోజు మంగళవారం వేలాది మంది మహిళలు దీక్షా వస్త్రాలను ధరించి రూ.వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం అర్గల స్తోత్ర ఐశ్వర్యాంబిక హోమం, సాయంత్రం లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు రెండో శ్రీ హరిద్రా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కుంకుమార్చనలలో భాగంగా మూడు సార్లు లలితా సహస్ర నామార్చనలను పరిపూర్ణనంద స్వామి భక్తులతో పఠింపజేసి కుంకుమార్చన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీజం(విత్తనం) మొలకెత్తాలంటే ఐదు కారణాలు ఉంటాయని వాటిలో ఐదవది దైవమన్నారు. మొట్ట మొదటిది భూమి గర్భంలో ఉన్న జలధారలని, రెండవది సారవంతమైన భూమి, 3వ కారణం విత్తనంలోని శక్తి అని, 4వ కారణం నైసర్గిక సహకారం అన్నారు. ఇవన్నీ ఉన్నా దైవ అనుగ్రహం ఉండాలన్నారు. మనిషి అమ్మవారిని తమలో శక్తిగా నిలుపుకోగలిగే అంత సాధన పొందాలన్నారు. మనం మూలాలను తెలుసుకోగలిగితేనే ముందుకు వెళ్లగలుగుతామన్నారు. ఇందుకోసం చాలా వాటిని త్యాగించాలన్నారు. నీ సంతానంగా భావించి నన్ను నడిపించు అని అమ్మవారిని వేడుకోవాలన్నారు. నవరాత్రుల్లో తొలి రోజు ఐశ్వర్యాంబిక అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా చూసుకున్నామని, అమ్మవారికి అర్చన చేసిన లక్ష అంకురాలను అన్న ప్రసాదంలో వినియోగించామన్నారు. -
పిఠాపురం.. పైగా పవన్ చేతిలో పనే.. అయినా సైలెన్స్!
సాక్షి, కాకినాడ జిల్లా: సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం పరిధిలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతోందని, ఓఎన్జీసి కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమవుతోందన్నది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఓఎన్జీసి కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు.. వేటకు ఆటంకంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. వేలాఇ కుటుంబాల జీవనాధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసి ద్వారా నష్టపరిహరం ఇప్పించడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Fishermen Protests). పవన్ చేతిలో పనే, కానీ.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు కూడా. అయినప్పటికీ, స్థానిక సమస్యలపై ఆయన స్పందన లేకపోవడం గంగపుత్రులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. సముద్రం కలుషితమైతే, మత్స్యకారుల ఆరోగ్యం.. వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే.. నియంత్రించాల్సిన బాధత్య పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే, వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండడం అక్కడి జనాలకు కోపం తెప్పిస్తోంది. మరి ఇప్పుడైనా పవన్ స్పందిస్తారా? లేదంటే తన శాఖ పరిధిలోకి రాదని.. అధికారులదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి.. -
మనసు పెట్టి పూజిస్తేనే అమ్మ కరుణ
● మహాశక్తి యాగం ప్రారంభ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి ● శ్రీపీఠంలో ఘనంగా కుంకుమార్చనలు కాకినాడ రూరల్: అమ్మవారిపై మనస్సు ఉంచి పూజలు చేస్తేనే అమ్మవారి కరుణ లభిస్తుందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా స్థానిక రమణయ్యపేట శ్రీపీఠంలో సోమవారం మహాశక్తి యాగం ఘనంగా ప్రారంభమైంది. వరుసగా మూడో సంవత్సరం వంద కోట్ల లలితా సహస్ర నామార్చనలతో కుంకుమ పూజలు నిర్వహించేందుకు తొలి రోజు అంకుర్పారణ చేశారు. తొలుత యాగ వేదికపై కొలువైన లలిత, బగళాముఖి, వారాహి అమ్మవార్లు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి మూర్తులకు హారతి ఇచ్చి, వంద కోట్ల కుంకుమార్చనలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, లలితా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, మీ సంకల్పం నెరవేరాలని తాను కోరుకుంటూ మహాశక్తి యాగం చేపడుతున్నానని చెప్పారు. మూడో సంవత్సరం మహాశక్తి యాగంలో పాల్గొనేందుకు సుమారు 36 వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వారందరికీ చివరిలో ఐశ్వర్య రక్ష (రాగి కంకణం) అందజేస్తామన్నారు. భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. మహాశక్తి యాగంలో సేవ చేసేందుకు సుమారు 3,600 మంది ముందుకు వచ్చారని తెలిపారు. సంకల్పమే అందరినీ ముందుకు నడిపిస్తుందని, అది నెరవేరితే ఆనందం కలుగుతుందని, కాకినాడలో మహాశక్తి యాగం ఒక సంకల్పమైతే.. దేశంలోనే ఎక్కడ జరగని విధంగా తమ పీఠంలో వెయ్యి కోట్ల కుంకుమార్చనలు చేయాలనేది మహాసంకల్పమని అన్నారు. తొలి రోజు రెండుసార్లు సహస్ర నామార్చనలు, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని భక్తులతో చేయించారు. సుమారు 15 వేల మంది భక్తులు హాజరైనట్టు స్వామీజీ తెలిపారు. భక్తులకు మహాశక్తి యాగం గురించి వివరిస్తున్న పరిపూర్ణానంద స్వామి -
బీమా.. దూరం
● ‘ఫ్రీ’మియం.. మంగళంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంట బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి.. ప్రీమియం చెల్లింపు విధానాన్ని తీసుకుని వచ్చింది. ఇది భారం కావడంతో పలువురు రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2.10 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దీంతో పాటు పత్తి, మొక్కజొన్న, అరటి వంటి వాణిజ్య పంటలు కూడా సాగు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ఉచిత పంటల బీమా అమలు చేశారు. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు.. బీమా వర్తింపజేసేవారు. ఆ ఐదేళ్లలో పంటల బీమా కింద అన్నదాతలకు రూ.96.51 కోట్ల మేర అందించారు. ఇది పంటలు నష్టపోయిన రైతులకు కొండంత అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రీమియం చెల్లించిన రైతులకే పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇలా ప్రీమియం చెల్లించడం భారమవుతూండటంతో అనేక మంది రైతులు పంటల బీమా పొందలేకపోతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది రైతులుండగా.. వీరిలో ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 40 వేల మంది మాత్రమే పంటల బీమా చేయించుకున్నారు. మిగిలిన 1.50 లక్షల మంది దీనికి దూరమయ్యారు. ప్రీమియం భారమై.. ఎకరా వరి పంటకు బీమా చేయించుకోవాలంటే రైతులు సంబంధిత బీమా కంపెనీకి రూ.678 ప్రీమియం చెల్లించాలి. వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా ఎకరా వరి పంట దెబ్బ తింటే బీమా కంపెనీ ఆయా రైతులకు రూ.24 వేల వరకూ పరిహారం చెల్లిస్తుంది. సాగుదార్లలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వీరు సుమారు 10 ఎకరాల వరకూ కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తూంటారు. వీరు పంటల బీమా పొందాలంటే పదెకరాలకు ప్రీమియం కింద రూ.6,780 చెల్లించాలి. ఇది భారం కావడంతో అనేక మంది రైతులు పంటల బీమాకు విముఖత చూపుతున్నారు. ఉదాహరణకు కొత్తపల్లి మండలంలో 1,987 మంది, కరప మండలంలో 8,212 మంది మాత్రమే బీమా చేయించుకోగా మిగిలిన వారు ఈ పథకానికి దూరమయ్యారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే బీమా కంపెనీలు సంబంధిత రైతులకు పరిహారం చెల్లిస్తాయి. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఇటు ఉచిత బీమా లేక.. అటు తాము ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే తమ గతేం కావాలని రైతులు కలత చెందుతున్నారు. రుణం తీసుకున్న వారికే పంటల బీమా డీసీసీబీతో పాటు, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలు తీసుకుంటే వారు తీసుకున్న రుణం నుంచి పంటల బీమా ప్రీమియాన్ని తగ్గించుకుని, మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తారు. దీంతో, రుణాలు తీసుకున్న రైతుల పంటలకు బీమా వర్తిస్తోంది. ఆవిధంగా రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులకు పంటల బీమా సదుపాయం లేకుండా పోయింది. గత ఏడాది ఖరీఫ్, రబీల్లో అధిక వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లింది. గత ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అప్పట్లో రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చింది. అదే ఉచిత పంటల బీమా అమలు చేసి ఉంటే రైతులకు రూ.20 వేలకు తక్కువ కాకుండా పరిహారం అంది ఉండేది. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టడంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. ఉచిత బీమా అమలు చేయాలి గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగేది. ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం చెల్లించడం చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఐదెకరాలు సాగు చేస్తున్నారు. ప్రీమియం చెల్లించాలంటే రూ.3,390 చెల్లించాలి. అంత డబ్బు చెల్లించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. – నున్న వెంకటేశ్వరరావు, రైతు, విజయరాయుడుపాలెం, కరప మండలం ఉచితాన్ని ఎత్తివేసిన కూటమి సర్కారు ఎకరానికి రూ.678 చెల్లిస్తేనే పంటల బీమా ఆ మేరకు రైతులపై భారం జిల్లాలో సాగుదార్లు సుమారు 1.90 లక్షలు ప్రీమియం చెల్లించిన వారు 40 వేల మందే ప్రభుత్వ నిర్ణయంతో 70 శాతం మందికి అన్యాయం -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను మానుకోవాలి
● ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి ● సీపీఎం జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ అమలాపురం టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అమలాపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరింది. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వం చేపడుతున్న పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చింది. పలు ప్రజా సంఘాల ప్రతినిధులు కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని ఖండించారు. సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుబ్బారావు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్వహించాలన్న నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకేనని అభిప్రాయపడ్డారు. విలువైన ప్రజాధనాన్ని ప్రైవేటు వారికి కారుచౌకగా కట్టబెట్టే పీపీపీ విధానంతో వైద్య రంగాన్ని ప్రైవేటీకరించాలనుకోవడం సరికాదని విమర్శించారు. పీపీపీ విధానానికి ఈ ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో అమలాపురం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణాలు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సదుద్దేశంతో రాష్ట్రంలో పలు మెడికల్ కాలేజీల నిర్మాణాలు 30 నుంచి 50 శాతం పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అవి చూపకుండా ఖాళీ స్థలాలను, పునాది దశల్లో ఉన్న పాత ఫొటోలను చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. అమలాపురం ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ఎ.రవి, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, కేవీపీఎస్ జిల్లాకన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, యూటీఎఫ్ నాయకులు బీఎన్ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ తదితరులు కూడా ప్రసంగించారు. -
ముగిసిన సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికలు
తాళ్లరేవు: కాకినాడ జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా సీనియర్ పురుష, మహిళల జట్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. చొల్లంగి జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన ఎంపికలకు కాకినాడ జిల్లా నుంచి 40 మంది పురుషులు, 30 మంది మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, కార్యనిర్వాహక కార్యదర్శి వి.నీలిమ, సీనియర్ వ్యాయామోపాధ్యాయులు ధనలక్ష్మీ కుమారిల సమక్షంలో జరిగిన ఈ పోటీలలో ప్రతిభ కనబరచిన 8 మంది పురుషులు, 8 మంది మహిళలను కాకినాడ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. పురుషుల జట్టులో లివేష్, వినయ్, కేఎస్ నారాయణ, రాజేంద్రప్రసాద్, సాత్విక్, బద్రేష్, తేజ, సన్నీ, మహిళల జట్టుకు మానవి, మానస, తేజస్వి, శాన్వి, దివ్యజ్యోతి, బ్లెస్సీ, పద్మ, బిఎస్ఎస్ లక్ష్మిఐశ్వర్య ఎంపికై నట్లు నీలిమ తెలిపారు. -
నాందీ ఫౌండేషన్తో నన్నయ ఎంఓయూ
రాజానగరం: నాందీ ఫౌండేషన్తో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సోమవారం ఇందుకు సంబంధించిన పత్రాలపై వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఏపీలో తొలిసారిగా శ్రీనన్నయశ్రీ వర్సిటీతో నాందీ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందని వీసీ తెలిపారు. దీని ద్వారా యూనివర్సిటీ క్యాంపస్తోపాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లు, అనుబంధ కళాశాలల్లోని 22 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధితోపాటు ఉద్యోగావకాశాలకు అవసరమైన శిక్షణను ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బీమాపై జీఎస్టీ తగ్గింపు సరైన నిర్ణయం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ రద్దు నిర్ణయం సరైనదేనని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీని సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో గీతను ఆమె నివాసంలో ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు సత్కరించారు. గతంలో కాకినాడ ఎంపీగా ఉన్న సమయంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ కారణంగా 30 కోట్ల మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని గీత పార్లమెంటులో ప్రస్తావించారు. ఆమె కృషి కారణంగానే కేంద్రం జీఎస్టీ రద్దు చేసిందని ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఆనందం వ్యక్తం చేశారు. గీతను సత్కరించిన వారిలో ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు రావుల మాధవరావు, ట్రెజరర్ పి.రెడ్డమ్మ, పిఠాపురం బ్రాంచ్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్.రామకృష్ణ, కేవీవీ సత్యనారాయణ, ట్రెజరర్ కె.రాంబాబు, పెద్దాపురం బ్రాంచ్ ఉపాధ్యక్ష కార్యదర్శులు ఎస్.గోపి, ఎస్వీవీ సత్యనారాయణ, కాకినాడ బ్రాంచి అధ్యక్షుడు పి.ప్రసాద్, కాకినాడ మెయిన్ బ్రాంచి అధ్యక్షుడు వంగా త్రిమూర్తులు పాల్గొన్నారు. పీహెచ్సీ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి కాకినాడ క్రైం: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు, 50 శాతం ప్రాథమిక వేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, నెలవారీ రూ.5 వేల మొత్తాన్ని చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమం కోసం భత్యంగా ఇవ్వాలన్నారు. స్థానికతతో పాటు పట్టణ అర్హత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపాలని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం సమ్మె విరమణ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. డీఎంహెచ్వోను కలిసిన వారిలో వైద్యులు అరుణ, ప్రభాకర్, ప్రశాంతి, రవికుమార్, విల్సన్, అర్చన, బాబు శివ, మౌనిక, ప్రత్యూష, సాయి రోహిత, ఈశ్వర్ కుమార్, కమల్నాథ్ ఉన్నారు. బాలాత్రిపుర సుందరిగా విజయదుర్గా అమ్మవారు రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.19 గంటలకు పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ గాదె సత్య వెంకటకామేశ్వరి కలశస్థాపన ప్రతిష్ఠించారు. విజయదుర్గాదేవి ఉత్సవమూర్తి సహిత పంచాయతన దేవతలు, శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి విగ్రహాల మధ్య వేలాదిగా భక్తులు కలశాలను ఏర్పాటు చేసుకున్నారు. తొలిరోజు 1,050 మంది కలశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహఅర్చన, గోపూజ, శ్రీచక్ర అర్చనతో పాటు, సప్తశతి పారాయణం, రుద్రాభిషేకం, గణపతి, నవగ్రహ, రుద్ర, మృత్యుంజయ, నక్షత్ర హోమాలు, దేవీయాగం నిర్వహించారు. విజయదుర్గా అమ్మవారిని పూలు, సర్వాభరణాలతో బాలాత్రిపుర సుందరీదేవిగా నయనానందకరంగా అలంకరించారు. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వి.వేణుగోపాల్(బాబి), విజయదుర్గా సేవా సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. -
అంతర్జాతీయ లఘుచిత్ర పోటీల్లో తృతీయ బహుమతి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ లఘుచిత్ర పోటీల్లో కాకినాడకు చెందిన యూట్యూబర్, సినీ నటుడు సూర్య ఆకొండి దర్శకత్వం వహించి, నటించిన ‘తెలుగు వైభవం’ లఘుచిత్రం తృతీయ స్థానంతో పాటు రూ.50 వేల నగదు బహుమతి గెలుచుకొంది. ఎడిటింగ్ విభాగంలో కూడా ఆయన వ్యక్తిగత బహుమతి సాధించారు. దర్శక, నిర్మాతలు సూర్య ఆకొండి, మార్ని జానకిరామ చౌదరి స్థానిక దంటు కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యాన వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో గుంటూరులో నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుభాషా వికాసంపై అంతర్జాతీయ లఘుచిత్ర పోటీలు నిర్వహించారని వివరించారు. ఇందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి బహుమతి సాధించిన ఏకై క చిత్రం తనదే కావడం చాలా సంతోషంగా ఉందని సూర్య అన్నారు. జానకిరామ చౌదరి మాట్లాడుతూ, ఆంధ్ర సాహిత్య పరిషత్ నేపథ్యంగా తీసిన చిత్రంలో తాను కూడా చక్కటి పాత్రలో నటించడంతో పాటు బహుమతి సాధించడం ఆనందకరమన్నారు. ఈ చిత్రంలో నటించిన రంగస్థల, సినీ నటులు కెర్ల పుల్లారావు, వర్ధమాన నటి సౌందర్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు దంటు భాస్కరరావు, ఎన్.ప్రభుదాసు, పారిశ్రామికవేత్త గుబ్బల శ్రీనివాసరావు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు జోస్యుల కృష్ణబాబు అభినందించారు. అన్నప్రసాద భవనానికి రూ.1.25 లక్షల విరాళంకొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కంకటాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, లక్ష్మీసుందరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.1,00,007, రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన సత్తి కుమారి దంపతులు రూ.25,116 విరాళంగా అందజేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ పి.రాంబాబు దాతలకు స్వామివారి చిత్రపటాలను అందించారు. -
యువకుడి మృతదేహం స్వాధీనం
పెదపూడి: పెదపూడికి చెందిన ఒక యువకుడి మృతదేహాన్ని పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై ఎస్.తులసిరామ్ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి గ్రామానికి చెందిన కె.వీరరాఘవేంద్ర(22), జి.మామిడాడ గ్రామానికి చెందిన యు.అనుకుమార్, స్టాలిన్, అభిలాష్, విజయకుమార్ స్నేహితులు. వీరరాఘవేంద్ర వరి కోత యంత్రంపై ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరిలో అనుకుమార్ కొంతకాలం క్రితం ఒక ప్రమాదంలో మృతి చెందాడు. మృతి అనంతరం అనుకుమార్ భార్యతో వీరరాఘవేంద్ర వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అనుకుమార్ సోదరులైన స్టాలిన్, అభిలాష్ వీరరాఘవేంద్ర వ్యవహారంపై కోపం పెంచుకున్నారు. దీంతో ఈ నెల 21వ తేదీ సాయంత్రం జి.మామిడాడ మెయిన్రోడ్డు సెంటర్లో వీరరాఘవేంద్ర ఉండటాన్ని వారు గమనించి గాజు సీసాలతో దాడికి పాల్పడ్డారు. అనంతరం గాయాలపాలైన అతన్ని మోటార్ బైక్పై ఎక్కుంచుకుని తీసుకునిపోయారు. ఈ ఘటనపై వీరరాఘవేంద్ర తల్లి వరలక్ష్మి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే దర్యాప్తు లో భాగంంగా దాడికి గురై గాయాలపాలైన వీరరాఘవేంద్ర మృతదేహం సోమవారం సాయంత్రం అన్నవరం గ్రామంలో లభ్యమైందన్నారు. వెంటనే పోలీసు లు మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్కు పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై ఎస్సై తులసిరా మ్ను వి వరణ కోరగా వీరరాఘవేంద్ర ఏవిధంగా చనిపోయా డో లేక హత్యకు గురయ్యాడో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, వివరాలు తెలియజేస్తామని చెప్పారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు జట్ల ఎంపిక
పెదపూడి: రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్–19 బాస్కెట్బాల్, బాలీబాల్, బాడ్మింటన్ పోటీలకు బాలురు, బాలికల విభాగాల్లో జట్లు ఎంపిక చేశామని ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్రెడ్డి అన్నారు. జి.మామిడాడ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఎంపికలు పాఠశాల హెచ్ఎం అప్పలచారి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమాన్ని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుగ సూర్యకుమారి, కాకినాడ డివిజనల్ ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఎంపికల్లో సుమారు 400 బాలురు, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పూర్వ క్రీడాకారుల సంఘం అధ్యక్షుడు సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి, ఇల్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పప్పు శ్రీనివాసరెడ్డి, రామచంద్రపురం ఎంఈఓ తాడి వీర రాఘవరెడ్డి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మాజీ అధ్యక్షుడు లంక జార్జ్ స్కూల్ గేమ్స్ సెక్రెటరీ సుధ, పుర్వ క్రీడాకారులు మల్లిడి శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మణులు పాఠశాల పిడి నల్లమిల్లి అప్పారెడ్డి, దీప్తి ఎస్తేర్, యువ రాజారెడ్డి, బులిగంగిరెడ్డి, గౌరీ శంకర్రెడ్డి, పాల్గొన్నారు. -
సాయమందించి ప్రాణభిక్ష పెట్టండి
● ఏమి తిన్నా, తాగినా రక్తంతో కూడిన వాంతులు ● ఆదుకోవాలంటూ దాతలకు వినతి గండేపల్లి: ఆర్థిక సాయమందించి తనకు ప్రాణభిక్ష పెట్టాలని అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడు దాతలను వేడుకుంటున్నాడు. గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన గరగ నాగ ఆంజనేయ దుర్గారావు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తల్లి అమ్మాజీ, భార్య గౌరీ పార్వతి, కొడుకు సూర్యగణేష్ ఉన్నారు. ఇతను రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఏమి తిన్నా, తాగినా వాంతులు కావడంతో కాకినాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్లోను వైద్య పరీక్షలు చేయించగా కడుపులో పుండ్లు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే కొన్ని వైద్య పరీక్షలు ప్రైవేటుగా చేయించుకోవాల్సి వచ్చిందని అందుకు తగిన సొమ్ము లేకపోవడంతో చేయించుకోలేదన్నాడు. పుట్టపర్తిలో ఉచితంగా వైద్యం చేస్తారని తెలియడంతో అప్పట్లో కొందరు దాతల సహాయంతో రెండు సార్లు పుట్టపర్తి వెళ్లగా అక్కడి వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో తిరిగివచ్చేశానని, కాలక్రమేణ వ్యాధి ముదరడంతో మరింత నీరసించిపోతున్నానని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘన పదార్థం కడుపులోకి వెళ్లకపోవడంతో కనీసం ద్రవ పదార్థాలు తాగేందుకు వైద్యుల సూచనల మేరకు ఇంజెక్షన్ చేయించుకుంటున్నానని, అది మూడు రోజుల వరకు పనిచేస్తుందని దానివల్ల తాగిన ద్రవ పదార్థాలు వాంతి కాకుండా చేస్తుందన్నాడు. ఆ ఇంజెక్షన్ విలువ రూ.400 అని దానికి దాతలే సాయమందిస్తున్నట్టు తెలిపాడు. లివర్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, గొట్టం పరీక్షలతోపాటు బ్లడ్ అవసరం ఉందని వైద్యులు చెప్పినట్టుగా పేర్కొన్నాడు. తన తల్లికి వస్తున్న పింఛన్ నుంచి సాయం చేస్తోందని తెలిపాడు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీకి వర్తించదని వైద్యులు చెప్పడంతో దాతల సాయం చేయాలని వేడుకుంటున్నాడు. సాయం అందజేసే దాతలు తన బ్యాంక్ అక్కౌంట్ (జెడ్ రాగంపేట యూనియన్ బ్యాంక్) 066910100082940 కు జమ చేయాలని వేడుకుంటున్నాడు. -
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కలెక్టరేట్కు వరకూ సాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు అసోసియేషన్ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డెత్ బెన్ఫిట్ ఫండ్ కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి.ఫృధ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్బార్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు. అర్హులైన న్యాయవాదులకు రూ.10 లక్షలు ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు రూ.10వేలు చొప్పున ఐదేళ్ల పాటు స్టయిఫండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐ.ఎల్.ఏ. జిల్లా ఉపాధ్యక్షుడు కోలా శ్రీహరిరావు మాట్లాడుతూ ప్రభుత్వం నోటరీ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేయాలన్నారు. ఐఎల్ఏ జిల్లా మహిళా కన్వీనర్ డాక్టర్ వై.వసంతకుమారి మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగాలలో మహిళలకు రూల్ ఆఫ్ రిజర్వేషనన్ పాటించాలని కోరారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెక్కపల్లి వీరభద్రరావు, ఐ.ఎల్.ఏ. జిల్లా నాయకులు పిల్లి శ్రీనివాస్ గౌడ్, మంగం శివరామకృష్ణ, జె.వి.రమణ, ఎం.సరోజిని, బండి నరేంద్ర, నాగభూషణం, పంతగడ అప్పారావు, బి.వి.రమణ, చక్రవర్తి,అశోక్, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
గంధం చెట్ల దొంగలు దొరికారు
రాజానగరం: మండలంలోని నందరాడలో గంధం చెట్లను దొంగిలించినవారిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన స్థానిక సీఐ వీరయ్యగౌడ్ సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలావున్నాయి. నందరాడలో ఒక రైతుకు చెందిన 12 ఎకరాల తోటలో కొబ్బరి, మామిడి, టేకు, ఎర్రచందనంతోపాటు గంధం చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో రెండు గంధం చెట్లను ఈ నెల 16న గుర్తు తెలియని వ్యక్తులు మొదళ్ల వరకు నరికి తీసుకుపోయారు. ఈ మేరకు ఆ తోట కాపలాదారు దొడ్డా సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా సుగవాన్కు చెందిన జులిస్ ఆదివాసీ, శివరాజ్ ఆదివాసీ, ఉల్లిస్లను నిందితులుగా గుర్తించి, దివాన్చెరువు జీరో పాయింట్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి 53 గంధం ముక్కలను, చెట్టు నరకడానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీన పర్చుకున్నారు. దొంగిలించిన రెండు గంధం చెట్ల విలువ రూ.3.50 లక్షలకు పైనే ఉంటుందన్నారు. గతంలో కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో జరిగిన గంధం చెట్ల చోరీ కేసులో శివరాజ్ ఆదివాసీ నిందితునిగా ఉన్నాడు. ఇది ఒక ముఠా అని, ఇందులో ఉన్న సభ్యులంతా ఒక కుటుంబం మాదిరిగా గ్రామ శివార్లలో గుడారాలు వేసుకుని, రుద్రాక్షలు, కాశీ తాళ్లు, గవ్వలు అమ్ముతూ సంచరిస్తుంటారన్నారు. ఆయా ప్రాంతాలలో ఉండే గంధం చెట్లను టార్గెట్గా చేసుకుని వీరి సంచార జీవితం నడుస్తుందన్నారు. వీరిని గైడ్ చేసేది మాత్రం కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్కి చెందిన రాజా అని పేర్కొన్నారు. ఇతనిపై కూడా ఏలూరు పోలీసు స్టేషనులో కేసులున్నాయని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై ఎస్.ప్రియకుమార్, హెడ్ కానిస్టేబుల్ పి.అమ్మిరాజు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, కరీమ్, వెంకటరమణ, నాగేశ్వరరావు, కిషోర్కుమార్ పాల్గొన్నారు. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకు కృషి
ఈటీసీ ప్రిన్సిపాల్ ప్రసాదరావు సూచన సామర్లకోట: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకు కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో టీఓటీలుగా ఎంపిక చేసిన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు సుస్థిరాభివృద్ది లక్ష్యాలపై శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. టీఓటీలకు మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న టీఓటీలు ఆయా మండలాలకు వెళ్లి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. 11 జిల్లాలో 300 మందికి శిక్షణ ఇవ్వవలసి ఉండగా ఆరవ బ్యాచ్తో శిక్షణ పూర్తి అవుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పేదరికం లేని గ్రామాలు, ఆకలి నిర్మూలన, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతీ గ్రామంలో అమలు జరిగే విధంగా చూడాలన్నారు. గ్రామాలల్లో ప్రజలందరిని ఆరోగ్యంగా ఉంచటం ద్వారా మంచి గ్రామాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రజల్లో పోషకాహర లోపాలను గుర్తించడం, కౌమారఽ దశలో ఉన్న బాలికలు, సీ్త్రలలో రక్త హీనతను తొలగించడం, తక్కువ బరువు కలిగిన పిల్లలను గుర్తించవలసి ఉంటుందన్నారు. ఈ మేరకు ఈ పనులను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ చేయవలసి ఉంటుందని చెప్పారు. స్థానికంగా సేకరించిన తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. మాతాశిశు మరణాలు లేకుండా చేయాలని సూచించారు. ఈ మేరకు హెల్త్ సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన, పోషకమైన మధ్యాహ్న భోజనం అందించే విధంగా చూడాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ ఆయుష్ మిషన్, ఐసీడీఎస్ అనుబంధ పథకాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్లు పంచాయతీ స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ ఫ్యాకల్టీలు డి.శ్రీనివాసరావు, కె.సుశీల, ఎస్ఎస్ శర్మ, ఎం. చక్రపాణిరావు, కేఆర్ నిహారిక, పి.రామకృష్ణ, వి.జగన్నాథం, ఎం.రాజ్కుమార్ శిక్షణ నిర్వహించారు. -
ఇంటర్ పరీక్ష ఫీజుకు వేళాయె
● అపరాధ రుసుం లేకుండా అక్టోబర్ 10 తుది గడువు ● ఆలస్యమయ్యే కొద్దీ పెరగనున్న అపరాధ రుసుం ● జిల్లాలో 27,618 మంది ఇంటర్ విద్యార్థులు రాయవరం: వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి తొలి అడుగు పడింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అపరాధ రుసుం లేకుండా ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. 2026 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్ష ఫీజు ఈ నెల 15వ తేదీ నుంచి చెల్లించే విధంగా ఇంటర్మీడియేట్ బోర్డు కమిషనర్ ఆదేశాలు విడుదల చేశారు. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అక్టోబర్ 10వ తేదీ వరకు తొలుత గడువు విధించింది. అక్టోబర్ 11 నుంచి 21వ తేది వరకు రూ.1,000 అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించేందుకు విద్యార్థులు అప్రమత్తమవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ఫీజుల చెల్లింపు ఇలా.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్ష నిమిత్తం రూ.600 చెల్లించాల్సి ఉంది. జనరల్ కోర్సులు చదివే సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్ (సెకండియర్ విద్యార్థులు మాత్రం) రూ.275 చెల్లించాల్సి ఉంది. ఒకేషనల్ కోర్సు చదువుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష రుసుంగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది. సెకండియర్ చదువుతూ ఫస్టియర్ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం థియరీ ఫీజు కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సు చదివే విద్యార్థులు రెండేళ్లు పరీక్షలు కడితే రూ.330 చెల్లించాలి. ఫస్టియర్, సెకండియర్ పాసై ఉండి, మార్కులు ఇంప్రూవ్మెంట్కు పరీక్ష రాసే ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350 వంతున, సైన్స్ విద్యార్థులు రూ.1,600 వంతున పరీక్ష ఫీజుగా చెల్లించాలి. జిల్లాలో పరిస్థితి ఇదీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 130 జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 13, ఎయిడెడ్ ఒకటి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఆరు, హైస్కూల్ ఫ్లస్ 19, ఒకేషనల్ కళాశాలలు 25, ప్రైవేట్ కళాశాలలు 66 ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ 13,750 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సెకండియర్ విద్యార్థులు 13,868 మంది చదువుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) రాయాలంటే దరఖాస్తుతో పాటు పరీక్ష ఫీజును తప్పనిసరిగా చెల్లించాలి. జిల్లాలో 27,618 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువులోగా చెల్లించాలి పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను అప్రమత్తం చేయాలని సూచించాం. గడువు ముగిసిన తర్వాత అపరాధ రుసుంతో చెల్లించాల్సి వస్తుంది. – వనుము సోమశేఖరరావు, ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
అప్పు ఎగ్గొట్టేందుకే హతమార్చాడు!
ఫ మధ్యవర్తులను బావిలోకి తోసేసిన వైనం ఫ ఇద్దరి హత్య కేసులో నిందితుడి అరెస్ట్ పిఠాపురం: అప్పు ఎగ్గొట్టేందుకు పథకం వేశాడు.. ఇందులో ఇద్దరు మధ్యవర్తులను హతమార్చి, ఆపై అప్పు ఇచ్చిన వ్యక్తినీ చంపేయాలని ప్రయత్నించిన ఘటనలో నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల 16న తాటిపర్తిలో ఇద్దరిని హత్య చేసి, ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటనపై గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ఏడాది కిందట తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ అదే గ్రామానికి చెందిన కుంపట్ల సూరిబాబు వద్ద రుణం తీసుకున్నాడు. ఆ సందర్భంలో తన బంధువులైన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబులను మధ్యవర్తులుగా పెట్టి అప్పు తీసుకున్నాడు. కొంత కాలంగా అప్పు తీర్చమని సూరిబాబు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యవర్తులుగా ఉన్న రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబులపై కుంపట్ల సూరిబాబు ఒత్తిడి తెచ్చాడు. వీరందరూ కలసి అప్పు తీర్చాలంటూ గంగాధర్ను అడిగారు. దీంతో ఆ ముగ్గురినీ చంపేస్తే ఇక అప్పు తీర్చాల్సిన అవసరం లేదని భావించిన గంగాధర్ ఓ పథకం రచించాడు. ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని చెప్పి మధ్యవర్తులుగా ఉన్న రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబులను ఫోన్ చేసి రమ్మన్నాడు. వారంతా తాటిపర్తి ఎన్టీఆర్ కాలనీ శివారు మొగిలి చిన్న పొలంలోని బావి వద్దకు వెళ్లి కలసి తింటున్నారు. శ్రీనివాస్, తోరాటి సూరిబాబు ఫ్రైడ్ రైస్ తింటుండగా అదును చూసి వారిని బావిలోకి తోసి హతమార్చాడు. అనంతరం అదేరోజు రాత్రి అప్పు ఇచ్చిన వ్యక్తి కుంపట్ల సూరిబాబును కూడా టీ తాగడానికి గొల్లప్రోలు వెళ్దామంటూ ఫోన్ చేసి రమ్మన్నాడు. అతను వచ్చాక బైక్ ఎక్కించుకుని తాటిపర్తి గ్రామ శివారులోని పుంత రోడ్డులో కొండ కాలువ వాగు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కావాలనే ముందుగా తన సెల్ ఫోన్ కాలువలో పడేసి కుంపట్ల సూరిబాబును తన సెల్ఫోన్ లైట్ వేయాలని అడిగాడు. ఇలా వెతుకుతున్నట్లు నటించి సూరిబాబును కూడా కొండ కాలువలో ముంచి హతమార్చాలని గంగాధర్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన సూరిబాబు తప్పించుకుని, తర్వాత రోజు ఉదయం తాటిపర్తి గ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని మృతుల బంధువులకు తెలిపాడు. దీంతో మృతుల బంధువులు వెళ్లి మొగిలి చిన్న పొలంలోని బావిలో చూడగా, ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీశ్ పర్యవేక్షణలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. రంపం గంగాధర్ విశాఖపట్నం పారిపోయి డబ్బులు అయిపోవడంతో తన మోటార్ సైకిల్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని మళ్లీ దూరంగా వెళ్లిపోవడానికి పిఠాపురం రైల్వే స్టేషన్కు రాగా, అతనిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ సానుభూతిపరుడి గూండాగిరి
ఫ పేద కుటుంబంపై దాడికి యత్నం ఫ ఇల్లు కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు కాకినాడ క్రైం: తన కుటుంబంపై టీడీపీ సానుభూతిపరుడు దౌర్జనానికి పాల్పడినట్లు ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటిని కబ్జా చేసే యత్నంలో భాగంగా బెదిరింపులకు దిగాడని చెబుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ 28వ డివిజన్లోని సూర్యనారాయణపురం జ్యోతులవారి వీధిలో మాన్యం నాగేశ్వరరావు తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. అతను సుమారు 15 ఏళ్ల కిందట గుండు సత్యవతిని చేరదీసి ఆలనా పాలనా చూశాడు. దీంతో ఆమె చనిపోయే ముందు (సుమారు రెండేళ్ల కిందట) జ్యోతులవారి వీధిలోని తన 54 గజాల ఇంటిని నాగేశ్వరరావుకు రాసిచ్చింది. దీంతో నాగేశ్వరరావు అక్కడకు మకాం మార్చాడు. ఇదిలా ఉండగా.. ఆ ఇల్లు తనదంటూ కొద్దిరోజుల కిందట టీడీపీ సానుభూతిపరుడు నగరమాని సతీష్ వాదనకు దిగాడు. సత్యవతి కుమార్తె అయిన సామర్లకోటలో నివాసం ఉంటున్న ఊడి పద్మ తనకు ఆ ఇంటిని విక్రయించిందని చెప్పుకొచ్చాడు. దానికి సాక్ష్యంగా కొన్ని పత్రాలు చూపాడు. అయితే అవివాహిత అయిన సత్యవతికి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని నాగేశ్వరరావు ప్రశ్నించడంతో సతీష్ ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి, పదిహేను రోజుల తర్వాత ఈ నెల 20న మరోసారి వచ్చి, సుమారు 20 మందితో మూక దాడికి యత్నించినట్లు బాధితుడు చెప్పాడు. వెంటనే స్థానికులు స్పందించి నాగేశ్వరరావు దంపతులను కాపాడారు. దీనిపై బాధితుడు మాట్లాడుతూ అసలు ఊడి పద్మ ఎవరు, సతీష్ చూపుతున్న ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పద్మ, సతీష్ అతడి అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకుని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని అధికారులకు విన్నవించారు. తనకు జరిగిన అన్యాయంపై ఈ నెల 16న మున్సిపల్ అధికారులు, తహసీల్దార్, 19న కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 20 జరిగిన దాడిపై కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించాలి
బోట్క్లబ్ (కాకినాడసిటీ): భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో శనివారం ఇటీవల విడుదలైన డీఎస్సీలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ గుంటూరి శ్యామ్ మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే డీఎస్సీలో 712 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి వారు జీవితాల్లో స్ధిరపడడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ద్వారా సామాజిక సేవ చేయాలన్నారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో బెండపూడి ప్రసాద్ మాస్టారు పాల్గొన్నారు. -
తిరుపతికి విమాన సేవలు
అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎలయన్స్ ఎయిర్ సంస్థ ఏటీఆర్ 72 విమానం అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం 7.40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9.25 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు. తిరిగి 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి మధ్యాహ్నం 11.20 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో ఈ విమాన సేవలు ఉంటాయని వివరించారు. కాగా.. గతంలోనే తిరుపతికి మధురపూడి నుంచి విమాన సర్వీసు ఉండేది. కొంత కాలం తర్వాత ఆగిపోయింది. తిరిగి పునః ప్రారంభం అవుతోంది. -
నిందితుల అరెస్ట్
గంజాయి కేసులో కరప: గంజాయి కేసులో ఇద్దరు నిందితులను కరప పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం జెడ్.భావారం గ్రామానికి చెందిన గుణ్ణం రాజశేఖర్ ఇంటి వద్ద కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో తహసీల్దార్ తుమ్మల దుర్గాప్రసాద్, కరప ఎస్ఐ టి.సునీత రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలసి వెళ్లేసరికి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకుని, విచారించగా అసలు విషయం బయటపడింది. గుణ్ణం రాజశేఖర్ అనే వ్యక్తి వెన్నపు లక్ష్మీగణపతి (గణేష్)కు డబ్బులు ఇచ్చి కిలో గంజాయి కావాలని అడగ్గా తన వద్దలేదని, తన స్నేహితుడు వాసంశెట్టి బన్ని వద్ద తీసుకు ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత బన్నీ ప్రస్తుతం తన వద్ద గంజాయి లేదని రామచంద్రపురంలోని చెల్లూరి మణికంఠ (లడ్డు) వద్ద ఉందని అన్నాడు. ఈ నెల 20న జెడ్.భావారంలోని రాజశేఖర్ ఇంటి వద్ద గంజాయిని నిందితులు పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.174 కిలోల గంజాయిని కరప ఎస్ఐ సునీత సీజ్ చేశారు. ఒక చానల్లో పాత్రికేయుడిగా చలామణి అవుతున్న రాజశేఖర్ (ప్రథమ నిందితుడు) గణేష్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నాడు. మరో నిందితుడు వాసంశెట్టి బన్నీపై రామచంద్రపురంలో గంజాయి కేసు నమోదైంది. నిందితులు రాజశేఖర్, వాసంశెట్టి బన్నీకి సహకరిస్తున్న సత్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని, కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తొలుత నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరినే అరెస్ట్ చూపడం అనుమానాలకు తావిస్తోంది. నిందితులు గణేష్, మణికంఠ, బన్నీ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. -
వనదుర్గమ్మకు ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వన దేవత వనదుర్గమ్మ వారికి భాద్రపద అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హోమం ప్రారంభించి, హోమ ద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 20 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, వనదుర్గమ్మ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పరిచారకులు శివ, గాడేపల్లి పవన్ తదితరులు పూజలు చేశారు. అనంతరం ఊరేగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. -
మోడ్రన్ పెంటాథలాన్ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం అంతర్ జిల్లాల మోడ్రన్ పెంటాథలాన్, బయాథలాన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మోడ్రన్ పెంటాథలాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెంటాథలాన్ అనే ఒలింపిక్ క్రీడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మోడ్రన్ పెంటాథలాన్ పోటీలు డీఎస్ఏలో జరుగుతున్నాయని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గౌరవ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బీఎస్ఎస్ కుమారి, కోచ్ కట్టా జగన్ మోహన్ కిశోర్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, వి.మాచరరావు, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి ప్రసాద్, బీఎస్వీఎస్ ప్రసాద్, డీఎస్ఏ స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
యువతకు స్ఫూర్తి
స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే తలచిన ఆశయం సాధించడం సులభమేనని ఆ దంపతులు నిరూపించారు. నారపాటి నాగేశ్వరరావు, భార్య లీలా శివజ్యోతి జిల్లా డీఎస్సీ ఫలితాల్లో నాగేశ్వరరావు 17వ ర్యాంకు, లీలా శివజ్యోతి రెండో ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్లగా ఎంపికై ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కష్టాలు, వివాహ బంధాలు లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డురావని భార్యాభర్తలు నిరూపించారు. – ఎన్.నాగేశ్వరరావు, లీలా శివజ్యోతి (భార్యాభర్తలు) తెలుగు, హిందీ ఉద్యోగాల్లోకి వదినామరదళ్లు 2025 డీఎస్సీలో లోకవరపు అప్పలనాయుడు భార్య మంగాదేవి హిందీ, సోదరి శెట్టి కుమారి తెలుగు విభాగాల్లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మహిళల్లో దాగి ఉన్న శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేసింది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, జీవిత భాగస్వాముల ప్రోత్సాహమే తమ విజయ రహస్యాలుగా పేర్కొన్నారు. – లోకవరపు మంగాదేవి, శెట్టి కుమారి (వదినామరదళ్లు) -
కిటకిటలాడిన పాదగయ క్షేత్రం
పాదగయ క్షేత్రంలో భారీగా పిండ ప్రదానాలు పిఠాపురం: త్రిగయలలో ప్రాధాన్యం కలిగిన పిఠాపురం పాదగయ క్షేత్రం గయాసురుని పాదాలు ఉండడం వల్ల పితృకార్యాలకు అత్యంత విశిష్టమైందిగా పేరొందింది. మహాలయ అమావాస్య కావడంతో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి పితృకార్యాలు నిర్వహించారు. మహాలయ పక్షం పితృ దేవతలకు మోక్షం అనే నమ్మకంతో భక్తులు పాదగయ క్షేత్రంలో భారీగా పిండప్రదానాలు చేశారు. దీంతో పాదగయ క్షేత్రం పిండ ప్రదానాలతో కిటకిటలాడింది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసేందుకు తరలివచ్చారు. తద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. పాదగయ క్షేత్రంలో గయాసురుని పాదాలు ఉండడం వల్ల ఇక్కడ పితృకర్మలు చేసి పిండాలు గయాసురుని పాదాలు ఉన్న పాదగయ పుష్కరిణిలో వదిలితే అవి నేరుగా పితృదేవతలకు చేరుతాయని భక్తుల విశ్వాసమని పురాణ గాధలు చెబుతున్నాయి. అన్ని చోట్ల పితృ కర్మలు చేసుకునే వీలు ఉన్నా ఈ క్షేత్రానికి మాత్రం పితృమోక్షకరమైన క్షేత్రంగా పేరుండడంతో ఇక్కడ చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. అందువల్లే ఏటా మహాలయ పక్షంలో ఈ క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో 20 నుంచి 50 వరకు పిండప్రదానాలు జరిగితే మహాలయ పక్షం రోజుల్లో మాత్రం రోజుకు వెయ్యికి పైగా జరుగుతుంటాయి. అందువల్ల ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఇక అమావాస్య ఆదివారం కావడంతో సుమారు 3 వేల మందికి పైగా భక్తులు పిండప్రదానాలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణ భక్తులతో పాటు పిండ ప్రదానాలు చేయించుకునే భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామని, పిండప్రదానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ప్రాంగణంతో పాటు పాదగయ పుష్కరిణి చుట్టూ షామియానాలు వేయించి తగిన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. -
వైఎస్సార్కు పిండ ప్రదానం
అనపర్తి: మహాలయ అమావాస్యను పురస్కరించుకుని అనపర్తికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఆదివారం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవులో గోదావరి ఒడ్డున ఈ కార్యక్రమం జరిపారు. అలాగే తన కుమారుడు సురేష్ రెడ్డి, తల్లి బాపాయమ్మతో పాటు సర్ ఆర్థర్ కాటన్, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, తన రాజకీయ గురువు సత్తి వీర్రెడ్డి, సహచరుడు మోకా సూరిబాబులకు కూడా పిండ ప్రదానం చేశారు. -
అంతర్జాతీయ నాటక ప్రదర్శనకు శ్రీప్రకాష్ విద్యార్థులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీప్రకాష్ కాకినాడ సినర్జీ స్కూల్ విద్యార్థులు కజకిస్తాన్ దేశంలో విభిన్న ప్రదర్శనలు ఇవ్వడానికి ఆదివారం పయనం అయ్యారు. వీరు కజకిస్తాన్ వర్సిటీ, షిమ్కెంట్లో, కజికిస్తాన్ తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ యూనివర్సిటీలలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నటుడు, దర్శకుడు, విద్యావేత్త నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి కుమార్ సుమిత్ రూపకల్పన, దర్శకత్వంలో కింగ్లియర్, జూలియస్ సీజర్ వంటి క్లాసిక్ స్పియర్ నాటక ప్రదర్శనతో ప్రతిభ చూపనున్నారు. విద్యార్థులు సి.సాయిశృతి, ఎన్.ఐశ్యర్య, పి.దక్షిత, ఎన్.షణ్ముకి, కె.శ్రీసాన్వి, ఎం.ఫణి, పి.మణిరాజు, ఎండీ ఇబ్రహీం, డి.అహిల్, పి.శ్రీచరణ్రాజ్, సి.నమిత ఆర్యన్, జె.వివేక్ల బృందం వెళ్లారు. 23వ తేదీ మంగళవారం ఆల్మాటి టీజీ కజక్ నేషనల్ అకాడమీలో ఆఫ్ ఆర్ట్స్లో కింగ్ లియర్ ప్రదర్శన, 24వ తేదీన జూలియస్ సీజర్, 25న భారత రాయబార అధికారులు, విద్యార్థులతో సమావేశం, 28న షిమ్కెంట్లో నజర్బాయేవ్ ఇంటలెక్చువల్ స్కూల్లో కింగ్ లియర్ గ్రాండ్ షో, 29న అదే స్కూల్లో జూలియస్ సీజర్ ప్రదర్శన, అక్టోబర్ 1న తాష్కెంట్లో ప్రదర్శన ఉంటుందని పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ వివరించారు. -
పదవుల్లో నియామకాం
● ఒక్కొక్కరికీ రెండు పదవులా.. ● జెండా మోసిన వారికి మొండిచెయ్యేనా! ● పార్టీ అధ్యక్షులపై అసమ్మతి సెగ ● తాడోపేడో తేల్చుకోవాలంటున్న సీనియర్లు ● జనసేనలో పదవుల ముసలంసాక్షిప్రతినిధి, కాకినాడ: జనసేనలో జోడు పదవుల ముసలం రాజుకుంది. ఉన్న వారికే జోడు పదవులు ఇచ్చేస్తుంటే జెండా మోసిన వారు ఏమైపోతారంటూ అసమ్మతి సెగ తగిలింది. ఇదే సంస్కృతి కొనసాగితే వేరే దారి చూసుకుంటామని ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు చాలా కాలంగా కుతకుతలాడిపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ఉనికికే ప్రమాదం అనుకున్నారో ఏమో తెలియదు కానీ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతోన్న నేతలపై ధిక్కారస్వరం కాస్త గట్టిగానే వినిపించారు. పార్టీ పదవుల దగ్గర నుంచి అధికారిక పదవుల నియామకం వరకూ అన్నింటా ఆ ఇద్దరి పెత్తనాన్ని పార్టీ సీనియర్లు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానాన్ని పక్కదోవ పట్టించి ఒంటెద్దు పోకడలతో తమ అనుయాయులకే అగ్రాసనం వేస్తూ పార్టీ లో క్రమశిక్షణతో పనిచేస్తున్న నేతలకు అసలు ప్రాధాన్యం లేకుండా అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. గడచిన ఆరేడు నెలలుగా వేచిచూసే ధోరణిలో ఉన్న సీనియర్లంతా శనివారం రాత్రి కాకినాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవులు, ఒంటెద్దు పోకడలు అనే రెండు అంశాలే అజెండాగా ఈ సమావేశం నడిచిందని సమాచారం. పార్టీలో మత్స్యకార సామాజికవర్గం నుంచి కాకినాడ సూపర్బజార్ చైర్మన్ పెసింగి ఆదినారాయణ, మచ్చా గంగాధర్, పవన్కల్యాణ్ సామాజికవర్గం నుంచి డాక్టర్ చిట్లా కిరణ్, దుగ్గన బాబ్జీ, నల్లం శ్రీనివాస్ తదితర నేతలు కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు)కి పార్టీ పదవితో పాటు జోడు పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు తొలుత కౌడా (కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన పెద్దాపురం సీటు పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకు ప్రతిగా పార్టీ పగ్గాలు అప్పగించి ప్రభుత్వంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామనే హామీ పొందారు. ఈ క్రమంలోనే కౌడా చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఒకపక్క పార్టీ జిల్లా అధ్యక్ష పదవి, మరోపక్క కౌడా జోడు పదవుల్లో బాబు కొనసాగుతున్నారు. ఈ రెండు పదవులు చాలవా అన్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవి కూడా బాబుకే కట్టబెట్టారు. ఇలా వరుసగా మూడు పదవులు ఒకరికే ఇవ్వాల్సి రావడాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి కంటే జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన మరో నాయకుడే లేకుండా పోయాడా అని కాకినాడ సమావేశంలో సీనియర్లు నిప్పులు చెరిగారని పార్టీ వర్గాల సమాచారం. డీసీసీబీ చైర్మన్ గిరీ ప్రకటించిన సందర్భంలో కౌడా చైర్మన్ పదవికి తుమ్మల రాజీనామా చేసినట్టు జనసేన సోషల్మీడియా గ్రూపుల్లో హల్చల్ చేసింది. కౌడా చైర్మన్ పదవి మరొకరికి దక్కుతుందని ఆశావహులు గంపెడాశతో ఎదురుచూశారు. అనంతరం కౌడాకు చైర్మన్ పీఠం ఎవరికీ ఖరారు కాకపోవడంతో జోడు పదవులు బాబు గుప్పెట్లోనే ఉన్నాయని తేలిపోయింది. ఆ క్షణం నుంచి పార్టీ కోసం పనిచేస్తోన్న కీలక నేతలంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నియామకం ఒక్కటే చాలదా అన్నట్టు అదే సామాజికవర్గం నుంచి పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడిగా తోట సుధీర్ నియామకంపై కూడా ఆదిలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివిధ సామాజికవర్గాల్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా వ్యయప్రయాసలు ఎదుర్కొన్న వారున్నా సుధీర్నే ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని అప్పట్లో పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇవేమీ లెక్క చేయకుండా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పౌరసరఫరాల సంస్థకు చైర్మన్ పదవి కూడా తోటకే అప్పగించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నియామకాలపై నేతల్లో అంతర్లీనంగా ఉన్న ఆగ్రహమే తాజా భేటీకి దారి తీసిందంటున్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్తో ఉన్న బంధుత్వమే తోటకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై కాకినాడ జిల్లా పార్టీలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ ద్వారా సంక్రమించిన పదవులతో పార్టీ నేతలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారనే అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్న సీనియర్లు కాస్తా ఇక ముందు తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం అప్పటికీ చలనం లేకుంటే రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. చివరకు ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లా నుంచి పలువురికి చోటు లభించింది. రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా పలకా సూర్యకుమారి, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పేరిశెట్టి ముత్యంజయరావు, సోషల్ మీడియా విభాగం జనరల్ సెక్రటరీగా మంతెన గోపాలకృష్ణంరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా బత్తుల భీమారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీలుగా శెట్టిబత్తుల సురేష్, లోడ అప్పలరాజు, రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధికార ప్రతినిధిగా పిడుగు కృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా ములికే సత్యనారాయణ, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర సెక్రటరీ ఎన్.శ్రీనివాసరాజు, వైఎస్సార్టీఎఫ్ జాయింట్ సెక్రటరీగా తొండెపు రఘురామ్ప్రసాద్ నియమించారు. లోవ దేవస్థానంలో నేటి నుంచి శరన్నవరాత్రులు తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు శరన్నవరాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు ఆదివారం తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజులు వేదపండితులు, ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో తలుపులమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు చేస్తామన్నారు. మొదటి రోజు సోమవారం బాలత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. 25 కాత్యాయనీదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాష్టమి పర్వదినాన దుర్గాదేవి అలంకరణలు చేస్తామన్నారు. అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్ధినిగా, రెండున విజయదశమి, శమీపూజ సందర్భంగా రాజరాజేశ్వరీదేవిగా విశేష అలంకరణలు చేస్తామన్నారు. యూటీఎఫ్ రణభేరి సభను విజయవంతం చేద్దాం అమలాపురం టౌన్: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే యూటీఎఫ్ రాష్ట్ర రణభేరి సభను విజయవంతం చేద్దామని జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు పిలుపునిచ్చారు. అమలాపురంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా యూటీఎఫ్ ఆఫీసర్స్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో యూటీఎఫ్ రణభేరి జాతాలు నిర్వహించిందని తెలిపారు. గుంటూరులో రాష్ట్ర స్థాయిలో రణభేరి సభ 25న జరుగుతోందని గుర్తు చేశారు. -
విభిన్న ప్రతిభ
లోకవరపు శిరీష విభిన్న ప్రతిభ ప్రదర్శించి డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఎంపికయింది. చిన్నప్పటి నుంచి ఎన్నోకష్టాలను చవిచూసిన శిరీష వివాహం జరిగినప్పటికీ కృషి, పట్టుదలతో మొదటి ప్రయత్నంలోనే రెండు ఉద్యోగాలను సాధించింది. పుట్టింట, మెట్టినింట నుంచి ప్రోత్సహం లభించడం వల్లే ఈ విజయాలను సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. – లోకవరపు శిరీష ప్రతిబంధకాలే ప్రేరణ చదువుకునే రోజుల్లో ఎదురైన అడ్డంకులు ప్రతిబంధకాలే ప్రేరణగా, పట్టుదలతో డీఎస్సీలో గణిత విభాగంలో స్కూల్ అసిస్టెంట్గా విజయం సాధించాను. చిన్పప్పటి నుంచి అంకెలు, లెక్కలపై ఉన్న మక్కువతో చదువుకుంటూనే వందల మందికి ట్యూషన్లు చెప్పాను. నిరంత కృషి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో డీఎస్సీ పరీక్షల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను. – రెడ్డి గంగాధర్ అర మార్కులో చేజారింది చిన్నతనం నుంచి విద్యలో ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ 2018 డీఎస్సీలో అరమార్కుతో ఉద్యోగం చేజారిపోయింది. నిరాశ చెందకుండా ఉపాధ్యాయుడిని అవ్వాలన్న కల 2025 డీఎస్సీలో నెరవేరింది. తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో పాటు తన ప్రతిభ, లక్ష్యంతో ఓపెన్ కేటగిరిలో 89 మార్కులతో ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించాను. మరోసారి విఫలం కాకూడదన్న అసాధారణ శ్రమే గెలిపించింది. – శెట్టి నాగేశ్వరరావు -
కష్టబడి గెలిచి
క్రీడాస్ఫూర్తితో ఆదర్శ విజయం ప్రభుత్వ పాఠశాలలో క్రీడలతో మొదలైన తమ స్నేహం ఒకరికి మరొకరం ప్రోత్సహించుకుంటూ పెరిగాం. టీచర్ల కావాలన్నదే ఇద్దరి గమ్యం. డీఎస్సీ పరీక్షలకు సైతం కలిసే చదువుకున్నాం. ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాదు.. చదువుల్లోనూ, ఆటల్లోనూ ఆడపిల్లలు తీసిపోరన్నది సమాజానికి చెప్పాలనుకున్నాం. కష్టపడి చదివితే గ్రామీణ బాలికలు లక్ష్యాన్ని సాధించగలరని నిరూపించాం. – చందక శ్రావణి, సుర్ల కృష్ణవేణి (స్నేహితులు) ● కేఓ మల్లవరం నుంచి 9 మంది ఉపాధ్యాయులు ● భార్యాభర్తలు, స్నేహితులు, వదినామరదళ్లకు కొలువులు ● జిల్లాలో చివరైనా.. ఉద్యోగాల్లో ముందంజ తుని రూరల్: వారంతా ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిచేసిన వారే.. అయితేనేం ఎంతో కష్టమైనా ఇష్టపడి చదివి అనుకున్నది సాధించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడినా ఆ గ్రామంలోని వారు ఉండాల్సిందే.. అంటే ఆ ఊరిలో ఉద్యోగాల కోసం ఎంత కష్టపడి విజయం సాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. డీఎస్సీలో ఏకంగా 9 మంది అభ్యర్థులు ఒకేసారి ఉపాధ్యాయులు కావడం నిజంగా మామూలు విషయం కాదు. కాకినాడ జిల్లాలో శివారు గ్రామంగా అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం సరిహద్దుగా ఉన్న కేఓ మల్లవరం యువత ఉద్యోగాలు సాధించడంలో ముందంజ వేస్తున్నారు. ప్రభుత్వం ఏ ఉద్యోగాలు భర్తీ చేసినా అందులో కేఓ మల్లవరం గ్రామస్తులకు భాగస్వామ్యం తథ్యం. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన విద్యార్థులే కావడం విశేషం. గడిచిన రెండు దశాబ్దాల్లో రెండు వందల మందికిపైగా ఉద్యోగాలు సాధించడం, అందులోనూ అత్యధికులు ఉపాధ్యాయులే కావడం మరో విశేషం. డీఎస్సీ ఫలితాల్లో ఏకంగా తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని తుది జాబితాలో స్థానం దక్కించుకుని పాఠశాలల్లో విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
కాకినాడలో సీజీహెచ్ఎస్ సెంటర్ ఏర్పాటు చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయోగపడేలా కాకినాడలో సెంట్రల్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) సెంటర్ను ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగులు, పెన్షనర్ల సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ హాస్పిటల్ ఉందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా ఇంకా సీజీహెచ్ఎస్ సెంటర్ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదన్నారు. రాజమండ్రిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం వెల్నెస్ సెంటర్ అయినా కాకినాడలో ఏర్పాటు చేయాలని, అలాగే ఈఎస్ఐ ఆసుపత్రికి అనుసంధానం చేస్తే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఇబ్బందులు తప్పుతాయన్నా రు. రిఫరల్ ఆసుపత్రి కూడా కాకినాడ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాగా వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, విజయ్కుమార్, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జనరల్ కార్యదర్శి ఎస్వీఎమ్ సాయిరామ్, ఆల్ ఇండియా పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్శి తురగా సూర్యారావు, ఆర్థిక కార్యదర్శి సీహెచ్ రామారావు ఈ సమావేశంలో తమ సంఘీభావం ప్రకటించారు. -
శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
రూ.2.53 లక్షల ఆదాయం పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్బకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామిని పూలదండలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామి వారికి రూ.2,53,756 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా నాలుగు వేల మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నవరప్పాడుకు భక్తుల రద్దీపెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేల మంది భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లో రద్దీ ఏర్పడింది. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. బండారు సుబ్బారావు దంపతుల ఆర్థిక సాయంతో సుమారు ఎనిమిది వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్వామికి పూల అలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానాల కు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక అమలాపురం టౌన్: రాష్ట్ర స్థాయి వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీలకు అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారులు ఎంపికయ్యారని ఆ జిమ్ లైఫ్ టైమ్ మెంబర్ గారపాటి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు జి.దినేష్ ప్రసాద్ అండర్–17 విభాగం 79 కిలోల కేటగిరీలో బంగారు పతకం, పవర్ లిఫ్టింగ్ అండర్–19 74 కిలోల కేటగిరీలో కె.నాని బంగారు పతకం, 83 కిలోల కేటగిరీలో వి.సోమశేఖర్ బంగారు పతకాన్ని సాధించారని చెప్పారు. బంగారు పతకాలు సాధించిన ఈ ముగ్గురూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిమ్లో జరిగిన అభినందనలో జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, నేషనల్ వెయిట్ లిఫ్టర్ మారే వీరేంద్ర, సీనియర్ లిఫ్టర్లు జె.జితేంద్రదొర, ఎం.అవినాష్, సీహెచ్ సత్యగోపాల్, చోడే శంకరనారాయణ పాల్గొని విజేతలను ప్రశంసించారు. -
సత్యదేవునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● ఆలయ ప్రాకారంలో ఊరేగింపు ● స్వామిని దర్శించిన 30 వేల మంది భక్తులు ● ఆదాయం రూ.30 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి జన్మనక్షత్రం ‘మఖ’ సందర్బంగా శనివారం స్వామి, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేకపూజలు, ఆయుష్యహోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి సుప్రభాత సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవారు, శంకరులు మూలవిరాట్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో స్వామికి ఆయుష్య హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్య హోమం ప్రారంభించి 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు కోట వంశీ, వేదపండితులు యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభిరామ్మూర్తి, పరిచారకుడు యడవిల్లి ప్రసాద్ తదితరులు నిర్వహించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు.ఐదు వేల మందికి అన్నదానం శనివారం సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని సర్వదర్శనానికి గంట, రూ.200 టికెట్పై అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. 1,600 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది అన్నదానం స్వీకరించారు. -
ఉద్యోగి... విసిగి విసిగి
● దగాకోరు ‘కూటమి’పై పోరుబాట ● సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల డిమాండ్ ● 25న విజయవాడలో ఉపాధ్యాయుల ‘రణభేరి’ సభ ● విద్యుత్, సచివాలయ సిబ్బంది నిరసన గళం కొత్తపేట: వినీ విని విసిగిపోయారు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆక్రోశంతో ఉన్నారు.. ప్రజా పాలనలో ప్రభుత్వానికి చేదోడుగా ఉంటున్నా తమను పట్టించుకోవడం లేదంటూ నిరసన స్వరం వినిపిస్తున్నారు.. ప్రభుత్వ తీరుపై ప్రజలే కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర శాఖల ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ శాఖ, సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. తమ శాఖాపరమైన సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ శాఖల యూనియన్లలో సుమారు 4 వేల మంది సమైఖ్యంగా నిలిచారు. ఈ నెల 15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 17, 18 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన, 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 22న అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ, కలెక్టరేట్కు వెళ్లి వినతిపత్రాలు సమర్పించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని హెచ్చరించారు. డిమాండ్లు ఇవీ ● విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి. ● రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న జీపీఎఫ్తో కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు నియమితులైన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలి. ● ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి. ● దీర్ఘకాలిక సర్వీసున్న వారందరినీ విద్యుత్ సంస్థలలో విలీనం చేయాలి. వారికి సంబంధించి మరో 4 డిమాండ్లు పరిష్కరించాలి. ● కారుణ్య నియామకాలు కల్పించడంలో కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి, నాలుగు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించాలి. 2019లో నియమింపబడిన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్ఎం గ్రేడ్–2)లను రెగ్యులర్ జేఎల్ఎంలుగా పరిగణించి వేతనాలు, తదితర ప్రయోజనాలు కల్పించాలి. వాటితో సహా 17 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. -
పాఠాలు నేర్వరా?
రేపటి సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాల్సిన బృహత్తర బాధ్యత గురువులదే. ఆ గురువులు ఎంతమంది నిష్ణాతులో.. ఎంతమంది కేవలం ‘గురూ’ అని పిలిపించుకునేవారో తెలియని పరిస్థితి నేటి పాఠశాలల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు.. విద్యా ప్రగతి.. విద్యార్థుల అభ్యసన తదితర వివరాలను సహజంగానే ఆ శాఖ అధికారులు నిర్వహిస్తారు. ఎటొచ్చీ ప్రైవేటు పాఠశాలల విషయంలోనే ఈ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించడం లేదన్నది నిర్వివాదాంశం. క్వాలిఫైడ్ టీచర్లు లేని పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి రేపు ఏమిటన్నది ప్రశ్నార్థకమవుతోంది. ప్రభుత్వం గుర్తించని పాఠశాలల యాజమాన్యాలు విద్యా సంవత్సరం చివరిలో గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి విద్యార్థులను పరీక్షలకు పంపించి వారి పబ్బం గడుపుకొంటున్నారు. ఈ పరిస్థితి ఏటా అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నా విద్యాశాఖ మొద్దునిద్ర వీడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ తనిఖీలు చేపడితే విద్యార్థులకు వెంటనే గుర్తించిన పాఠశాలల్లో చేరే అవకాశం ఉంటుంది. ఆలస్యం జరిగే కొద్దీ ఆయా పాఠశాలల్లో సీట్లు దొరకక విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలైంది. అధికారులు ఇప్పటికై నా సమాయత్తమై విద్యార్థులు ప్రైవేటుకు బలికాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రాథమిక 152, ప్రాథమికోన్నత 202, ఉన్నత పాఠశాలలు 219 కలిపి మొత్తం 573 పాఠశాలలకు మాత్రమే గుర్తింపు ఉందంటూ లెక్కల్లో నమోదయింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ 50–70, ఉన్నత పాఠశాలలు మరో 50 వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ ఏడాది జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలల జాబితా పూర్తి స్థాయిలో లేదు. డివిజన్, మండల స్థాయిలో విద్యాశాఖాధికారులు పాఠశాలల తనిఖీ చేపట్టి గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా ఝుళిపించేవారు. ముఖ్యంగా కాకినాడ కార్పొరేషన్ వంటి ప్రాంతంలో అర్బన్ స్కూల్ ఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టి ఏటా కనీసం 10 పాఠశాలలైనా గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేవారు. ఈ విద్యాసంవత్సరంలో అటువంటి చర్యలు ఎక్కడా తీసుకున్న దాఖలాలు లేవు. ఏటా కొత్త పాఠశాలలు జిల్లాలో పుట్టుకొస్తున్నా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట వివిధ ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అటువంటి పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదీ లేనిదీ తెలియని పరిస్థితి. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆమోదం ఉన్నట్లు నిర్దేశించుకుంటూ కొన్ని పాఠశాలలు సీబీఎస్ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదటి ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. గత విద్యా సంవత్సరం మెట్ట ప్రాంతం జగ్గంపేటలో ఓ కార్పొరేట్ పాఠశాల తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ ప్రచారాలు చేసుకుని ప్రవేశాలు కల్పించింది. ఈ విషయంపై అవగాహన లేక కొందరు తమ పిల్లలను అందులో చేర్పించారు. పుస్తకాలు తీసుకున్నారు. వేలల్లో ఫీజులు చెల్లించాక పాఠశాలలను మరో పాఠశాలలోకి విలీనం చేశారంటూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్డ్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే తల్లిదండ్రులు పిల్లలను చేర్పి ంచాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కచ్చితంగా విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకోవాలి. గుర్తింపు జాబితా విడుదల చేస్తాం ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు ఉండాలి. లేకుంటే ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. విద్యాసంస్థ పక్కా గా రిజిస్ట్రేషన్తో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలు తెలియజేస్తాం. – జి.నాగమణి, విద్యాశాఖ ఆర్జేడీ. కాకినాడ విద్యార్థుల జీవితాలతో చెలగాటం తమ ఉన్న ఇంటికో లేదో గ్రామానికో దగ్గరగా ఉంటుందన్న కారణంలో ప్రైవేట్ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. కనీసం ఆ స్కూళ్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో కూడా తల్లిదండ్రులకు తెలియడం లేదు. సరైన వసతులు కూడా ఉండటం లేదు. తీరా పరీక్షల సమయం వచ్చేసరికి వేరే పాఠశాల నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. – బి.సిద్దూ, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గమనించాల్సిన విషయాలివీ.. తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి. మౌలిక వసతులు చూసుకోవాలి. మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. విద్యార్థులు మానసిక, శారీరకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉ పాధ్యాయులు ఉన్నారా లేదా అని ఆరా తీయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాల అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ సామర్థ్య పరీక్ష పత్రాన్ని జారీ చేస్తుం ది. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి. జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రభుత్వం అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడతాయి. అనుమతులపై కొరవడిన నిఘా ప్రారంభం కాని పాఠశాలల తనిఖీ ఏటా పదుల సంఖ్యలో ప్రారంభం కొన్నింటికే అనుమతులున్నాయని విద్యార్థి సంఘాల గగ్గోలు మీనమేషాలు లెక్కిస్తున్న విద్యాశాఖ -
ఉద్యమం ఉధృతం చేస్తాం
విద్యుత్ శాఖ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరుతూ ఈ నెల 15 నుంచి వివిధ రూపాల్లో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ప్రస్తుతం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. – జగత అచ్యుతరామయ్య, చైర్మన్, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ, బొమ్మూరు (రాజమహేంద్రవరం) ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. ఉపాధ్యాయులకు, విద్యారంగ పరిరక్షణ కోసం చేసే పోరాటాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి. ఈ నెల 25న సుమారు 10 వేల మందితో విజయవాడలో రణభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం. – ఎస్.జ్యోతిబసు, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్, రావులపాలెం -
సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదని విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘ నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం దశల వారి ఆందోళనలో భాగంగా విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ప్రాంగణం వద్ద విద్యుత్ కార్మికులతో రిలే నిరాహార దీక్ష రెండో రోజు శనివారం కొనసాగించారు. కార్యక్రమంలో 50 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వారికి మద్దతుగా సుమారు 150 మంది తమ సంఘీభావాన్ని తెలియజేశారు. యాజమాన్యం ఇంతకుముందే అంగీకరించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయని పలు డిమాండ్ల సాధన కోసం ఈ దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామన్నారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పింఛన్ విధానానికి అమలు చేయలని, జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగులను సంస్థలో విలీనం చేసి ప్రమోషన్లు కల్పించాలని, త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా ఇచ్చిన నూతన సర్వీస్ రెగ్యులేషనన్ రద్దు చేయాలన్నారు, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కాంట్రా క్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వివిధ యూనియన్లు, అసోసియేషన్ల నాయకులు వి. బాలకుమార్, బి.పైడిరాజు, ఎస్.మురళీకృష్ణ, ఎన్ఎస్ నాయుడు, కె.బాబి, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం పిఠాపురం: పాదగయ క్షేత్రంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పాదగయ లో దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయగా పిఠా పురం నియోజకవర్గంలో అమ్మవారి ఆలయాలు స ర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు ని ర్వహించనుండగా అమ్మవారు కాత్యాయనిదేవిగా ప్ర త్యేక అవతారంలో దర్శనమివ్వనున్నారు. రోజుకో అ లంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో వెలసిన అష్టా దశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం అయిన పురూహూతి కా అమ్మవారు, రాజరాజేశ్వరిదేవి, తాటిపర్తిలో వేంచేసిన అపర్ణాదేవి అమ్మవార్ల ఆలయాలను శరన్నవరాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. -
భార్యపై ప్రేమతో..
కరోనా కారణంగా 2021 మే 22న నా భార్య సత్యవేణి ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె చూపిన ప్రేమాభిమానాలు ఇప్పటికీ నన్ను కదిలిస్తాయి. నిత్యం నా కళ్ల ముందు ఆమె రూపం నిలవాలనే తలంపుతో మందిరం ఏర్పాటు చేసుకుని, దానిలో నా భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూనే రోజూ మందిరానికి వెళ్లి భార్య విగ్రహాన్ని చూస్తుంటాను. – కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, విశ్రాంత లెక్చరర్, పసలపూడి, రాయవరం మండలం ఆమెతోనే జీవితం భార్యగా దుర్గాభవాని రావడంతో నా జీవితం మలుపు తిరిగింది. భార్యాభర్తలు అంటే ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం, గౌరవం ఉండాలి. నేను ఎప్పుడూ ఆమెతో అలాగే ప్రవర్తిస్తాను. తన ఇష్టాలను, అలవాట్లను గౌరవిస్తాను. ఆమె కూడా నా విషయంలో అలాగే ఉంటుంది. కుటుంబం సాఫీగా ముందుకు సాగాలంటే నమ్మకంగా చాలా అవసరం. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం ఆనందంగా సాగిపోతుంది. – భార్యతో యండమూరి శ్రీనివాస్, ఎస్జీటీ, మధురవారిపేట, ఉప్పలగుప్తం మండలం -
త్వరలో ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో త్వరలో ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ పోటీలు నిర్వహించనున్నామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఆమె శనివారం యూనివర్సిటీని సందర్శించిన ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్)అధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్తో వివిధ రకాల క్రీడా పోటీలు, నిర్వహణపై చర్చించారు. స్పోర్ట్సు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి బెస్ట్ ఫిజిక్ పోటీల నిర్వహణకు కమిటీలు, తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఈ పోటీల నిర్వహణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యూత్ ఐకాన్స్ను తీసుకువచ్చి, యూనివర్సిటీ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు రూపొందించనున్నామన్నారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి, పద్మ విభూషణ్ మేరీ కోమ్, ప్రపంచ అథ్లెటిక్స్లో బంగారు పతకాలు అందుకున్న తొలి భారతీయ మహిళ అథ్లెట్ హిమదాస్ వంటి వారిని త్వరలోనే తీసుకువచ్చి, విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తామన్నారు. యూనివర్సిటీలో విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచే విధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. స్వామి రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలుగువాడినైన తనకు ఐబీబీఎఫ్ అధ్యక్షుడిగా అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. నన్నయ వర్సిటీలో త్వరలో జరిగే ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ పోటీలకు ఐబీబీఎఫ్ చేయూతనిస్తుందన్నారు. అనంతరం స్వామి రమేష్ కుమార్ను వీసీ ప్రసన్నశ్రీ సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు, పీడీలు పాల్గొన్నారు. ● ‘నన్నయ’లో నిర్వహించేందుకు సన్నాహాలు ● వెల్లడించిన వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ