Kakinada
-
కోస్ట్గార్డు ‘విన్యాసం’
కాకినాడ క్రైం: కాకినాడ కోస్ట్గార్డు స్థానిక అధికారులు సొంత పెత్తనాలకు తెరలేపి శాఖ పరువును దిగజార్చుతున్నారు. గురువారం కాకినాడ శాఖ అధికారులు సాగర తీరంలో చాటుగా విన్యాసాలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏటా సంప్రదాయంగా జరిగే ఈ విన్యాసాలకు ఈ ఏడాది ఉన్నతాధికారులు ఎవరూ రాకపోవడం చర్చకు దారితీసింది. ఎక్కడా ప్రచారం లేకుండా చాటుగా నిర్వహించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం మీడియా సహా అనుబంధ విభాగాల సమక్షంలో కోస్ట్గార్డు విన్యాసాలు సముద్రంలో జరగాల్సి ఉంది. అయితే, ఎవరినీ ఆహ్వానించకుండానే, ఎంతోమంది తరలి వచ్చారని లెక్కల్లో చూపి అధిక బిల్లులు రాసుకోవడం కాకినాడ అధికారులకు పరిపాటిగా మారిందని కాకినాడ కోస్ట్గార్డు కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా చాటుగా విన్యాసాలు ఎందుకు నిర్వహించారనే అంశంపై స్థానిక అధికారులను ఉన్నతాధికారులు వివరణ కోరడం చర్చనీయాంశమైంది. అన్నవరంలో మాక్ డ్రిల్ అన్నవరం: విజయవాడకు చెందిన 80 మంది ఉగ్రవాద నిరోధక దళం (ఆక్టోపస్) పోలీసులు గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి 10–30 గంటల వరకు రత్నగిరిపై సత్యదేవుని ఆలయ సమీపంలో ‘ఆగమ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు దేవస్థానంలో చొరబడితే వారిని ఎలా పట్టుకుంటారో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఒక్కసారిగా 80 మంది పోలీసులు ఆలయం వద్దకు రావడంతో అందరూ కంగారు పడ్డారు. చివరకు ఇది మాక్ డ్రిల్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ఆక్టోపస్ డీఎస్పీలు విశ్వనాఽఽథ్, తిమ్మయ్య తెలిపారు. -
జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం
● కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కోసం ప్రశ్నించిన జనసేన నాయకుడు ● పవన్కల్యాణ్ ఆరోగ్యం కోసం ఎవరూ అడగలేదని అసహనం పిఠాపురం రూరల్: జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ కె.నాగబాబు మండలంలోని కుమారపురంలో ఒక ప్రైవేట్ హోటల్లో గురువారం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కోసం ఒక జనసేన నాయకుడు ప్రశ్న వేశారు. అది విన్న నాగబాబు పవన్కల్యాణ్ ఆరోగ్యం కోసం ఎవరూ అడగలేదని జనసేన నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. సెన్స్ ఉందా? అంటూ నిలదీశారు. ఎంత కష్టపడ్డారో, ఆయన ఆరోగ్యందెబ్బతిందని, అది ఎవరూ అడగటం లేదని మండిపడ్డారు. సదరు జనసేన నాయకుడు ‘సారీ సార్..’ అనడంతో ‘అది.. అదే కావాలి’ అంటూ శాంతించారు. -
పెట్రోలు పోసి, నిప్పు పెట్టాలని చూసి..
● ప్రేమించడం లేదని యువతిపై యువకుడి దాడి ● సకాలంలో ఇతర విద్యార్థులు రావడంతో తప్పిన ప్రమాదం రాజానగరం: ప్రేమించిన తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఓ యువకుడు ఆ యువతిపై పెట్రోలు పోసి, అంటించబోయాడు. ఇతర విద్యార్థులు చూసి, అతన్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో అతను వెలిగించబోయిన లైటర్ వెలగకపోవడం ఆమె అదృష్టం. ఓ కాలేజీలో చదువుతున్న కోనసీమకు చెందిన యువతిని చొప్పెల్లకు చెందిన యర్రంశెట్టి లోకేష్ ప్రేమించాడు. మూడేళ్లు చదివి మానేసిన లోకేష్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆ యువతి దూరం పెట్టింది. అయినప్పటికీ ఆమెను వెంటపడి వేధించడం మానకపోవడంతో కాకినాడకు మకాం మార్చి అక్కడ లేడీస్ హాస్టల్లో ఉంటూ ఆమె చదువుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలు రాసేందుకు రాజానగరంలో ఓ కాలేజీకి వచ్చిన ఆమెను కాలేజీ ప్రాంగణంలోకి బైకుపై వచ్చిన లోకేష్ జుట్టు పట్టుకుని బలవంతంగా పక్కకు తీసుకువెళ్లి, ఆమె పై పెట్రోలు పోసి, లైటర్తో అంటించబోయాడు. ఆ లైటర్ వెలగకపోవడంతోపాటు ఆమె పెట్టిన అరుపులకు సమీపంలో ఉన్న ఇతర విద్యార్థులు పరుగున వచ్చి లోకేష్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ తరువాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపించామని ఎస్సై ప్రియకుమార్ తెలిపారు. -
నేడు కొలువు తీరనున్న ‘అన్నవరం’ ట్రస్ట్ బోర్డు
అన్నవరం: వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలోని రామాలయం వద్ద గల విశ్రాంతి మండపంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు 16 మంది సభ్యులు, నలుగురు ఆహ్వానితులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నదానంలో సత్యదేవుని ప్రసాదంపై తొలి తీర్మానం సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని ప్రసాదం కూడా పెట్టాలంటూ భక్తులు కోరుతున్న నేపథ్యంలో దీనిపై ఈ నెల 12న ‘సాక్షి’లో ‘అమాత్యా.. మొరాలకించవా! ’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అదేరోజు అన్నవరం వచ్చిన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దీనిపై స్పందించి అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని ఆదేశించారు. ట్రస్ట్ బోర్డు తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల పైనా.. 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం వచ్చే భక్తులు సత్యదేవుని కూడా దర్శించుకుంటారు. పుష్కరాల 12 రోజులూ ఈ విధంగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై ట్రస్ట్బోర్డు తీర్మానించి కమిషనర్ అనుమతికి పంపించాల్సి ఉంటుంది. -
సర్పవరం జంక్షన్ వద్ద ఉద్రిక్తత
● గుండె సంబంధిత వైద్యం కోసం వెళ్లిన ఉపాధ్యాయుడి మృతి ● ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ కాకినాడ రూరల్: జిల్లా సైన్స్ అధికారి, కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పోలవరం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మైలపల్లి శ్రీనివాస్ వినీల్ అకాల మృతి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర విషాదంలో నింపింది. ఆయన గుండె సంబంధిత సమస్యతో సర్పవరం జంక్షన్ వద్ద గల ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం చేరారు. బుధవారం శస్త్ర చికిత్స జరగగా రాత్రి మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందారని, ఇద్దరు చిన్న పిల్లలను వీధిన పడేశారని భార్య విలపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ఆందోళనకు దిగారు. మరోవైపు ఆస్పత్రిలోని వైద్యులకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)సభ్యులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆస్పత్రి ఎదురుగా ఉన్న వలసపాకల రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రి వద్ద ఆందోళన జరగడంతో సర్పవరం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వర్గాలు, మృతుడి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల మధ్య చర్చలు అనంతరం రాత్రి ఆందోళన విరమించారు. -
వాకింగ్ చేయాలంటే పన్ను కట్టాలా?
కాకినాడ రూరల్: కూటమి పాలనలో విశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొందని, నగరంలో వాకింగ్ చేయాలంటే పన్ను కట్టాలా అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి నిలదీశారు. విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం నగర వాసులు, సామాన్యుల ఆరోగ్యంపై పడేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రతి పార్కు, స్టేడియం వద్ద ప్రతీ వాకర్ రూ.750 చెల్లించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో జనం అవాక్కయ్యారని, బలవంతపు వసూళ్లకు పూనుకోవడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఖరీదైన జిమ్లు, హెల్త్ క్లబ్బులకు వెళ్లలేని పేద మధ్య తరగతి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా సొమ్ము చెల్లించాల్సిన దుస్థితిని తీసుకురావడం సిగ్గు చేటు అన్నారు. విశాఖపట్నంలో అమలు చేయనున్న బలవంతపు వసూళ్లను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. దీనిని విశాఖ వాసులతో పాటు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మేధో సంపత్తి హక్కులపై సదస్సు బాలాజీచెరువు: పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేధోసంపత్తి హక్కులపై జాతీయ స్థాయి సదస్సు కళాశాల మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది ఎం.డీ.జవహర్ ఆలీ హాజరై మేధోసంపత్తి హక్కుల రక్షణలో ఉన్న సందేహాలు, వాటి ప్రాధాన్యం వివరించారు. ఏఐ కాలంలోనూ మేధోసంపత్తి హక్కుల రక్షణ సాధ్యమని, ప్రతి వ్యక్తి విలువలను పాటించి యాజమాన్య హక్కులను చెందవలసినవారికి ఇస్తే అది సాధ్యమని వివరించారు. చైన్నె పేటెంట్ ఆఫీసు నుంచి ఆన్లైన్లో హాజరైన సుబారాబెనర్జీ కాపీరైట్స్కు సంబంధించి అనేక అంశాలు వివరించారు. రిజిస్టర్ అయిన పేటెంట్ కాపీరైట్ ఎలా కాపాడుకోవాలో తెలిపారు. ప్రొఫెసర్ గంటా సత్యనారాయణ, కామర్స్ విభాగాధిపతి పాండు రంగారావు, వైస్ ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ పి.హరిరామప్రసాద్ పాల్గొన్నారు. వసతి గృహాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ బధిర బాలుర, బాలికల వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ఏ వై. శ్రీనివాసు గురువారం ప్రకటనలో తెలిపారు. కాకినాడ సాంబమూర్తినగర్లో గల ప్రభుత్వ బధిరుల పాఠశాలలో నేరుగా అడ్మిషన్ పొంది, అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బధిర బాలుర వసతి గృహంలో అడ్మిషన్ పొందాలనుకొనేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 0884 2352303 నంబర్లో సంప్రదించాలన్నారు. భగీరథుడి కృషి ఆదర్శనీయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమాజ అభ్యున్నతి, సమాజ హితం కోసం పట్టుదల, సంకల్పబలంతో భగీరథుడు చేసిన తపస్సు, కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. కలెక్టర్ భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. ప్రజల సంక్షేమం కోసం, అంకితభావంతో పనిచేయడం వంటి విలువలు భగీరథుని జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.శ్యామల కుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పవన్ మాట నిలబెట్టుకోవాలి
సార్వత్రిక ఎన్నికల్లో పవన్కలాణ్ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. పెదమల్లాపురం కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ఐటీడీఏ హోదా కల్పిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జర్తా ముసలయ్య, జిల్లా అధ్యక్షుడు, గిరిజన హక్కుల సాధన సంఘం, పెదమల్లాపురం ఐటీడీఏ ఏర్పాటు చేయాలి 1985లో శంఖవరంలో మినీ ఐటీడీఏ ఉండేది. అదే తరహాలో ఏర్పాటు చెయ్యాలి. – బూసరి బాలరాజు, జిల్లా కార్యదర్శి, గిరిజన హక్కుల సాధన సంఘం, దారమల్లాపురం నిధులు రావడం లేదు సబ్ప్లాన్ ఏరియాలో గ్రామాలు నాన్ షెడ్యూల్ పరిధిలో ఉండటం వల్ల 2 శాతం సబ్ ప్లాన్ నిధులు కూడా రావడం లేదు. – తరుం నాగేశ్వరరావు, గిరిజన నేత, పెదమల్లాపురం -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
కాకినాడ లీగల్: తాళ్ళరేవు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు డి.శిరీషను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డీఐజీ జానకీదేవి మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ శిరీష సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో క్రయవిక్రయదారులు ఇబ్బంది పడుతున్నామని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ దార్వా ఫిర్యాదులు చేశారని చెప్పారు. ఆమైపె అనేక ఫిర్యాదులు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె.ప్రసాదరావుకు రాగా ఆయన వెళ్లి పరిశీలించారని అన్నారు.బుధవారం తాళ్ళరేవు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిశీలించగా ఏపీఎఫ్ఆర్ఎస్లో సుమారు 4నెలల నుంచి లాగిన్ అవ్వలేనట్టు గుర్తించానని డీఐజీ తెలిపారు. గతంలో పిఠాపురం సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించినప్పడు ఏసీబీ తనిఖీల్లో ఆమైపె కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాలని ప్రభుత్వం అదేశించారు. -
గిర్జినకరి జనారే!
● పెదమల్లాపురం కేంద్రంగా మండలం లేదా ఐటీడీఏ సాధనకు పోరుబాట ● 1980 నుంచీ నెరవేరని ఆకాంక్ష ● మళ్లీ గళమెత్తుతున్న గిరిజనం ప్రత్తిపాడు రూరల్: ఒకే భౌగోళిక ప్రాంతం.. ఒకే విధమైన సంస్కృతి.. పరిపాలన మాత్రం నాలుగు ముక్కలు! ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని 59 ఏజెన్సీ గ్రామాల ప్రజలు నాలుగు వేర్వేరు మండలాల చుట్టూ తిరగలేక, సరైన అభివృద్ధి అందక అల్లాడుతున్నారు. 90 శాతం గిరిజన జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని పెద్దమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మండలంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ ఇప్పుడు మళ్లీ గళమెత్తుతోంది. శంఖవరంలో (23 గ్రామాలు), రౌతులపూడి (16), ఏలేశ్వరం (15), కోటనందూరు (5) మండలాల్లోని మొత్తం 59 సబ్ ప్లాన్ ఏజెన్సీ గ్రామాలను కలిపి ప్రత్యేక మండలంగా ప్రకటించాలని స్థానిక గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. సుదీర్ఘ పోరాటం ఈ 59 గ్రామాలకు పెద్దమల్లాపురం భౌగోళికంగా మధ్యలో ఉండటంతో పాటు కీలక గిరిజన గ్రామం కావడంతో దీనినే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ఈ గ్రామాల పరిధిలో సుమారు 40 వేల మంది జనాభా ఉండగా, అందులో దాదాపు 90 శాతం అంటే 32 వేల మంది గిరిజనులే. ప్రత్యేక మండల డిమాండ్ 1980 నుంచీ ఉంది. అప్పట్లో ఐటీడీఏ వ్యవస్థలు బలపడుతున్న తరుణంలోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక మండలం ఉండాలని ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ గ్రామాలు నాలుగు వేర్వేరు మండలాల్లో ఉండటంతో సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోంది. రవాణా, విద్య, వైద్య సమస్యల పరిష్కారం కోసం ఈ గ్రామాల వారు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యేక మండలం ఏర్పడితే పెద్దమల్లాపురంలో ిపీహెచ్సీ, పోలీసు స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు అందుబాటులోకి వస్తాయి. గిరిజన ఉప ప్రణాళిక నిధులు పూర్తిస్థాయిలో ఈ ప్రాంతాలకే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అనేక విజ్ఞాపనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 50 సబ్ప్లాన్ ఏజెన్సీ గ్రామాల గిరిజనులకు రంపచోడవరం ఐటీడీఏ కేంద్రంగా ఉండేది. అయినా గిరిజనులకు అందాల్సిన సదుపాయాలు వీరికి దక్కేవి కావు. ఈ క్రమంలో గిరిజన హక్కుల సాధన సంఘం, కొండరెడ్డి, కమ్మర, శృంగధార గిరిజన సంక్షేమ సంఘం, ఆదివాసి గిరిజన సంఘాలు కలిసి పెదమల్లాపురం మండల సాధన కమిటీగా ఆవిర్భవించాయి. ఎస్టీ కమిషన్ చైర్మన్కు అనేక సందర్భాల్లో విజ్ఞాపనలు అందజేశారు. పవన్ కల్యాణ్ హామీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏలేశ్వరం రోడ్లో జరిగిన సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పెదమల్లాపురం గిరిజన మండలం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పదవినధిష్టించి 22 నెలలు దాటినా పట్టించుకోలేదని గిరిజనం మండిపడుతోంది. ఇన్నేళ్లకు మళ్లీ.. ప్రభుత్వం జిల్లాలు, మండలాల పునర్విభజనకు సిద్ధమవుతుండటంతో తెరమరుగైన పెదమల్లాపురం కేంద్రంగా ఐటీడీఏ ప్రతిపాదన మళ్లీ పురుడు పోసుకుంటోంది. సబ్ప్లాన్ ఏరియా గిరిజనులు పెదమల్లాపురం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలకు దిక్కు లేదు ఈ ప్రాంత గిరిజనులకు పెద్దాపురం ఆర్టీఓ ద్వారా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. పురుషులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నా, మహిళలకు భర్త ఇంటి పేరున మంజూరు చేయడానికి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉన్నత విద్యకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి స్కాలర్ షిప్లకు దూరమవుతున్నారు. -
మద్యం అక్రమ తయారీపై కఠిన చర్యలు
రాజమహేంద్రవరం రూరల్: మద్యం అక్రమ తయారీ, బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎకై ్సజ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ విధానం అమలు తీరు, ఆదాయ వృద్ధి, నేరాల నియంత్రణ తదితర అంశాలపై శ్రీధర్ విశ్లేషించారు. అనుమతులు పొందిన మద్యం షాపులు, బార్లలో తనిఖీలు నిర్వహించాలని, సమయ పాలన పాటించేలా చూడాలన్నారు. అక్రమ మద్యం నియంత్రణలో విఫలమయ్యే అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంగళగిరి ప్రొహిబిషన్– ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ ఎం.వినయ్ బాబు, జిల్లా ఎకై ్సజ్ అధికారులు వై.శ్రీలత, ఆర్ఎస్ కుమారేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. -
లాభాలు వెదజెల్లీ
స్టాల్లో తాండ్రను విక్రయిస్తున్న మహిళ చాపలపై మామిడి గుజ్జును పూస్తున్న మహిళలు ●ఆత్రేయపురం: పూతరేకుల పేరు వినగానే అందరికీ వెంటనే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. ఈ గ్రామంలో తయారయ్యే పూతరేకులు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే మామిడి తాండ్ర (మ్యాంగో జెల్లీ) తయారీకి కూడా ఆత్రేయపురం పేరు గాంచింది. శతాబ్దాలుగా ఇక్కడ తాండ్ర తయారీ పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉపాధిగా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మామిడి తోటలు హెచ్చుగా ఉండటం వల్ల పండ్లను నిల్వ చేసుకోవటానికి ఇదొక ప్రధాన మార్గంగా భావించి అప్పట్లో తాండ్ర తయారీ చేయడం ప్రారంభించారని పూర్వీకులు చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి మామిడి తాండ్ర దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడి పండ్లతో తాండ్ర తయారు చేస్తుంటారు. యంత్రాల వినియోగం ప్రస్తుతం తాండ్ర తయారీకి రసం తీసే చిన్నపాటి యంత్రాలను వినియోగిస్తున్నారు. రసం తీసిన తర్వాత పంచదార, బెల్లం కలిపి ఈత ఆకు చాపలపై రసం పోసి ఆరబెడతారు. ఇలా వారం, పది రోజుల పాటు దళసరి సరిపడినంత వచ్చిన తర్వాత వాటిని చాపపై కోసి నిర్దిష్ట సైజులో ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక కేజీ లేదా అర కేజీ చొప్పున ప్యాకింగ్ చేసి అట్టపెట్టెలలో నిల్వ చేసుకుంటారు. కొంత తాండ్రను రాజమహేంద్రవరంలోని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసుకుని, ఇక్కడి వ్యాపారానికి అవసరమైనప్పుడు తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. వేసవి అనంతరం తాటి పండ్లతో తాటి తాండ్రను సైతం తయారు చేస్తారు. పంచదార తాండ్రను కిలో రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. బెల్లం తాండ్రను రూ.250 నుంచి రూ.350కు అమ్ముతున్నారు. లాభసాటిగా.. ఆత్రేయపురం గ్రామంలో వందల సంఖ్యలో పూతరేకుల వ్యాపారం కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడాది పొడవునా మామిడి తాండ్రను కూడా విక్రయిస్తున్నారు. గతంలో ఈ తాండ్రను ముంబై, చైన్నె, కోల్కతా తదితర నగరాలకు ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు చాలా వరకూ స్థానిక స్టాళ్లలోనే అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా వ్యాపారం లాభసాటిగా సాగుతోందన్నారు. ఇటీవల కాలంలో మామిడి కాయలను జ్యూస్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో వాటికి డిమాండ్ ఏర్పడి, ధరలు కూడా పెరిగాయి. గతంలో ఒక మెట్రిక్ టన్ను రూ.2 వేలు ఉండగా, ఇప్పుడు సుమారు రూ.20 వేలు పలుకుతోంది. కొన్నిచోట్ల జ్యూస్తో జెల్లీ తాండ్రను యంత్రాలపై తయారు చేస్తున్నారు. ఆ తాండ్ర ఇక్కడ స్టాళ్లలో లభిస్తోంది. మామిడి తాండ్ర తయారీ కేంద్రంగా ఆత్రేయపురం పూతరేకులతో పాటు ఎంతో ప్రసిద్ధి మహిళలకు జీవనోపాధి విదేశాలకూ ఎగుమతి -
తల్లిని ఇంటి నుంచి గెంటేయడం నేరం
● లక్ష్మీకాంతంకు న్యాయం చేయండి ● దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ రాజామణి అనపర్తి: కని పెంచిన తల్లిని ఇంటి నుంచి గెంటేయడం చట్టరీత్యా నేరమని దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్, న్యాయవాది కొంకి రాజామణి అన్నారు. గురువారం బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. పందలపాక గ్రామానికి చెందిన కొవ్వూరి లక్ష్మీకాంతానికి ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. వీరి తండ్రి చిన్నప్పుడే విడిచి వెళ్లిపోవడంతో లక్ష్మీకాంతం ఆ ముగ్గురి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశారన్నారు. అలాగే ఆమెకు ఉన్న పూర్వపు ఆస్తులు కూడా ఆ కుమారులకు ఇచ్చేశారన్నారు. ఇది లా ఉండగా మార్చి 5న జరిగిన ఓ సంఘ టనలో నమోదైన కేసు లో ముగ్గురు కుమా రులు నిందితులుగా ఉన్నారని, ఈ నేపథ్యంలో తల్లి లక్ష్మీకాంతం కుమారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదన్న కోపంతో మార్చి 21న ముగ్గురు కుమారులు, కోడలు, లక్ష్మీకాంతం సోదరుడు, అతని భార్య కలసి లక్ష్మీకాంతం వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కుని కొట్టి బయటకు గెంటేశారన్నారు. అప్పటి నుంచి దేవాలయాల వద్ద తలదాచుకుంటుందని, తన కుమారులు, సోదరులు కలసి తనను చంపాలని చూస్తున్నారని బాధితురాలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని రాజామణి తెలిపారు. అలాగే దళిత, బహుజన మహిళా శక్తి ఆధ్వర్యంలో గురువారం బాధితురాలితో కలసి బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఎస్సై రవిచంద్రకుమార్కు ఫిర్యాదు కాపీని ఇవ్వడానికి రాగా, ఆమె కుమారులను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. -
రాష్ట్ర బాస్కెట్బాల్ టోర్నీ విజేత రామచంద్రపురం
బాస్కెట్బాల్ విజేత రామచంద్రపురం మహిళా జట్టుకు, పురుషుల జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు, దాతలు దేవరపల్లి: రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. బుధ, గురువారాల్లో హైదరాబాద్కు చెందిన కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. హైస్కూల్ హెచ్ఎం, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ పర్యవేక్షణలో నిర్వహించిన టోర్నమెంట్లో పురుషులు, మహిళా విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో రామచంద్రపురం, ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 42–31 పాయింట్లతో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. ఏలూరు జట్టుకు ద్వితీయ, రామహేంద్రవరం జట్టుకు తృతీయ స్థానాలు లభించాయి. పురుషుల విభాగంలో రామచంద్రపురం – గుంటూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 65 – 61 పాయింట్ల తేడాతో రామచంద్రపురం జట్టు విజయం సాధించింది. గుంటూరు జట్టు ద్వితీయ, రాజమహేంద్రవరం జట్టు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు ఆంఽధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమని రవినాయుడు చేతుల మీదుగా కప్లు, నగదు బహుమతులు, మెడల్స్ అందజేశారు. గ్రామానికి చెందిన కూచిపూడి రమేష్ కప్లు సమకూర్చగా, కేర్ ఫౌండేషన్ చైర్మన్ రాపాక గాంధీ ప్రథమ నగదు బహుమతిగా పురుషుల జట్టుకు రూ.50 వేలు, రాపాక యూత్ అధ్యక్షుడు రాపాక అశోక్ ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, ఐటీ కంపెనీ ప్రతినిధులు గోపాల్, రవి తృతీయ బహుమతిగా రూ. 20 వేలు సమకూర్చారు. మహిళల జట్టుకు ప్రథమ బహుమతిని ఇమ్మణి సూరిబాబు రూ. 30 వేలు, కొయ్యలమూడి చినబాబు ద్వితీయ బహుమతిని రూ. 20 వేలు, తృతీయ బహుమతిని అనిశెట్టి ప్రభాకరరావు రూ. 10 వేలు సమకూర్చారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, ఆనంద్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల చైర్మన్ సువర్ణరాజు, పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం శివప్రసాద్, కేర్ ఫౌండేషన్ సీఈఓ రాపాక శ్రీ పాల్గొన్నారు. -
వ్యక్తి దుర్మరణం
శంఖవరం: కత్తిపూడిలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి తుని వైపు కంటైనర్ వెళ్తుండగా కత్తిపూడిలో వెనుక నుంచి వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ షేక్ సుభాని (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది కృష్ణా జిల్లా నూజివీడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం శంఖవరం: గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు ధ్వంసం అయ్యింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ప్రగడ కల్పన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు బీటలు వారాయి. పేలుడు ధాటికి వస్తువులు, దుస్తులు చెల్లాచెదురయ్యాయి. స్టౌపై అన్నం వండుతూ మిగతా పని చూసుకునేందుకు మేడ పైకి వెళ్లిన సమయంతో పెద్ద పేలుడు శబ్దం వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు అదుపు చేశారు. ఇండియన్ గ్యాస్ కంపెనీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. -
సబ్సిడీపై రుణాలు అందించాలి
మామిడి తాండ్ర తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్న మాకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి. బ్యాంకుల ద్వారా తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి భారీగా రుణాలు ఇవ్వాలి. మామిడి పండ్లు, పంచదార, బెల్లం ధరలు పెరుగుతున్నాయి. – మల్లవరపు రమేష్, తాండ్ర తయారీదారు, ఆత్రేయపురం భరోసా కల్పించాలి సంప్రదాయంగా తాండ్ర తయారు చేస్తున్నప్పటికీ కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగడం లేదు. ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలతో పాటు, తాండ్రను రిటైల్గా వ్యాపారం చేస్తున్న మహిళలకు కూడా ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించాలి. ఈ పరిశ్రమ వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. – సంధ్య, స్టాల్ నిర్వాహకురాలు, ఆత్రేయపురం● -
‘మీకు కార్పొరేషన్ కావాలా?’.. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా?
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గత వారం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
పి.గన్నవరం: మండల కేంద్రం పి.గన్నవరంలో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కనిపించిన వారిని కరుస్తూ భయబ్రాంతులకు గురి చేసింది. మొత్తం ఆరుగురిని గాయపరిచింది. రెండు కుక్క పిల్లల్ని కూడా హతమార్చింది. తొలుత స్థానిక మూడు రోడ్ల సెంటర్లో కొప్పాడి నాగలక్ష్మి, అనంతరం శివాలయం వెనుక రోడ్లో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బెజవాడ గీతిక అనే 7వ తరగతి విద్యార్థినితో పాటు, ఆమె కూడా వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని జి.శ్రీనివాస మంగతాయారును, బాలురు ఎస్హెచ్ఎస్ సాయి, కోట ఏసేబు, మరో వ్యక్తి ఐ.మణికంఠను తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులకు పి.గన్నవరం సీహెచ్సీలో డాక్టర్ వందన వైద్య సేవలు అందించారు. ఇందులో ఏసేబు, గీతిక, నాగలక్ష్మి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. చివరికి స్థానిక అంబేడ్కర్ కాలనీలో స్థానికులు పిచ్చికుక్కను హతమార్చారు. అలాగే రాజులపాలెం గ్రామంలో ఎం.సత్యవతి, బెల్లంపూడిలో డి.వీరేంద్రలను కుక్కలు కరవడంతో పి.గన్నవరంలో చికిత్స పొందారు. బుధవారం 9 డాగ్ బైట్ కేసులకు వైద్య సేవలు అందించినట్టు డాక్టర్ వందన తెలిపారు.ఆరుగురికి తీవ్ర గాయాలు -
‘ఉపాధి’ అమలులో ప్రభుత్వం విఫలం
యుద్ధోన్మాదంపై పోరాడాలి గండేపల్లి (జగ్గంపేట): సామ్రాజ్యవాద దురహంకార అధర్మ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా లెనిన్ స్ఫూర్తితో పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. రష్యన్ విప్లవ యోధుడు లెనిన్ జయంతి, సీపీఐ (ఎంఎల్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట ట్రావెలర్స్ బంగ్లా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ బుధవారం ప్రదర్శన నిర్వహించారు. తొలుత లెనిన్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆ చిత్రపటాన్ని ప్రదరిస్తూ, ప్లకార్డులతో జరిగిన ఈ ప్రదర్శనలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ, అత్యంత దుర్మార్గంగా దేశాధినేతలను హతమార్చే స్థాయికి అమెరికా తెగబడుతోందన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న సంయుక్త దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు వింటున్న మోదీ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ ఆధ్వర్యాన మహిళా పారిశ్రామికవేత్తలు విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను 50 మంది మహిళా వ్యాపారవేత్తలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. వీరితో సంవత్సరానికి రూ.3 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నామని ఎలియాజర్ తెలిపారు. రాగులు, కొర్రలతో లడ్డూలు, బియ్యం నూక వంటి ఉత్పత్తులు, అటుకులు, మురుకులు, చక్కిలాల వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. -
పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు
పిఠాపురం: పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదని, నర్సింగపురం ప్రభుత్వ లే అవుట్లో పేదలకు వెంటనే ఇళ్లు నిర్మించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటామని, లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు. నిరుపేద లబ్ధిదారులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పిఠాపురం మండలం నర్సింగపురంలో జగనన్న కాలనీకి భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని తెలంగాణకు చెందిన ప్రైవేటు స్కూలు నిర్మాణానికి కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఆ భూమి వద్ద లబ్ధిదారులతో కలసి బుధవారం వంగా గీత ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా, ఇచ్చిన స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నర్సింగపురం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించి, వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కళాశాలలు, స్కూళ్లు నిర్మించడానికి ఎన్నో ప్రభుత్వ స్థలాలుండగా, నర్సింగపురంలో పేదలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు స్కూలుకు కట్టబెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నర్సింగపురంలో పేదలకు పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని పక్కన పెట్టి, ఆ భూములు ఖాళీగా ఉన్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని అన్నారు. కేవలం వైఎస్సార్ సీపీకి పేరు వస్తుందనే అక్కసుతో కావాలనే పేదల స్థలాలను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. నిరుపేదల ఇళ్ల స్థలాలపై ఎవరు ఎటువంటి అక్రమాలు చేయాలని ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్టేనని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరుగుతూంటే నేతలందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పునరాలోచించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని గీత కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, నాయకులు కొత్తెం దత్తుడు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు. నర్సింగపురంలో పేదలకు ఇళ్లు నిర్మించాలి ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటాం న్యాయం జరిగే వరకూ పోరాడతాం వైఎస్సార్ సీపీ నేత వంగా గీతా విశ్వనాథ్ లబ్ధిదారులతో కలసి ఆందోళన -
కొండపై పెద్ద పులి తిష్ట
దేవీపట్నం: రెండు రోజుల క్రితం గోదావరి నదిని దాటుకుని దేవీపట్నం వైపు వెళ్లిన పెద్ద పులి నేలకోట వద్ద కొండపై తిష్టవేసింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద నుంచి రామదుర్గం కొండను దాటుకుని సమీపంలో శరభవరం వైపున కొండపైకి చేరింది. ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు సిబ్బందితో కలసి పులి గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారంపై సమీప గ్రామాలైన దేవారం, శరభవరం, పోతుకొండ, నేలకోట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అడవి, తోటల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు పులి పయనాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. బుధవారం రాత్రికి పులి కొండ దిగితే శరభవరం నేలకోట రహదారిని దాటుకుని సీతానగరం మండలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● బతికినా.. బతకలేకపోతున్నా.. ఎలా బతకాలి? సామర్లకోట: ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 28 మందిని బలి తీసుకున్న ఘోర విస్ఫోటం ఆ కుటుంబాల్లో ఎప్పటికీ తీరని మహావిషాదాన్నే మిగిల్చింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో గత ఫిబ్రవరి 28న ఈ మృత్యు విలయ విన్యాసం ఇప్పటికీ బాధితుల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. విస్ఫోటం రగిల్చిన చిచ్చులో సంఘటన స్థలంలోనే ఆ రోజు 20 మంది సజీవదహనమైపోయారు. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వీరిలో చికిత్స పొందుతూ ఎనిమిది మంది ఒకరొకరుగా మరణించారు. ఈ ప్రమాదం నుంచి ఆ రోజు ప్రాణాలతో బయట పడిన ఒకే ఒక్కడు పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్. అయితే, నాటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యులోకపు అంచుల వరకూ వెళ్లి.. మృత్యువును జయించి, సుదీర్ఘ చికిత్స అనంతరం ప్రాణాలు దక్కించుకున్న మరో వ్యక్తి సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు. వైద్యుల కృషే ఫలించిందో.. బతకాలనే ఆశే అతడి ఊపిరి నిలిపిందో.. ప్రార్థించిన దేవుడే కరుణించాడో కానీ.. సుమారు 40 రోజుల చికిత్స అనంతరం కోలుకుని దావీదు కొద్ది రోజుల కిందట ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తనను కలసిన ‘సాక్షి’కి.. నాటి ఘోర కలిని, కుటుంబ పోషణకు పడుతున్న ఇబ్బందులను అతడు వివరించాడు. క్షతగాత్రులకు సాయమేదీ? బాణసంచా విస్ఫోటం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకూ ఆ సహాయం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి రూ.2 లక్షలు మాత్రమే అందాయని అంటున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి సహాయమూ చేయలేదు. దీంతో, దావీదు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బాణసంచా ఘోర విస్ఫోటంలో తనువెల్లా దహించుకుపోయింది.. కోలుకున్నాక చర్మం, కండరాలు బిగిసిపోయాయి.. అవయవాలు స్వాధీనంలోకి రావడం లేదు.. ఏ పని చేయడానికీ సహకరించడం లేదు.. ప్రాణాలతో బయట పడినా.. బతికే దారి కానరావడం లేదు.. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో గత ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా కాలి, గాయపడి, సుదీర్ఘ చికిత్స అనంతరం కోలుకున్న వేమగిరి దావీదు దుస్థితి ఇది. వేట్లపాలెం బాణసంచా విస్ఫోటంలో మృత్యుంజయుడి దుస్థితి సుదీర్ఘ చికిత్సతో నిలిచిన ప్రాణాలు ఇటీవల ఇంటికి చేరుకున్న వేమగిరి దావీదు పని చేయడానికి సహకరించని శరీరం ఏ పనీ చేయలేని దుస్థితి కుటుంబ పోషణకు ఇబ్బందులు ప్రభుత్వమే ఆదుకోవాలి సుమారు పదేళ్లుగా సామర్లకోట, వేట్లపాలేల్లో బాణసంచా తయారీలో పని చేసినా ఎప్పుడూ ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. తెలిసిన విద్య కావడం, బాణసంచా తయారీని బట్టి కూలి ఇస్తూండటంతో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,200 సంపాదించవచ్చనే ఆశతో ఈ పనికి వెళ్లేవాడిని. బాణసంచా ప్రమాదంలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో అవయవాలు సహకరించడం లేదు. మా అమ్మ రాఘవ 57 సంవత్సరాల వయస్సులోనూ తాటాకు విసనకర్రలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె సంపాదనపై ఆధారపడి అద్దె ఇంట్లో జీవిస్తున్నాం. రేకులతో ఉన్న ఇంట్లో వేడి రావడంతో పైన తాటాకులు వేసుకుని నివాసం ఉంటున్నాం. నాకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినయ్ కుమార్, కుమార్తెలు రమ్యప్రియ, కరుణ ఉన్నారు. కొడుకు పదో తరగతి చదివి మానేశాడు. ఏ పనీ చేయడం లేదు. పెద్ద కుమార్తె పది, చిన్న కుమార్తె ఎనిమిది తరగతుల్లోకి వస్తున్నారు. ఏ పనీ చేయలేని పరిస్థితిలో వారిని ఏవిధంగా పోషించుకోవాలో తెలియడం లేదు. కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ప్రభుత్వం నా క్షేమ సమాచారం తెలుసుకోలేదు. కనీసం దివ్యాంగ పింఛను ఇచ్చి ఆదుకోవాలి. అత్తగారు ఇచ్చిన స్థలం బ్యాంకులో ఉండటంతో ఇల్లు కట్టుకోవడానికి గతంలో రూ.8 లక్షల అప్పు చేసి స్థలం విడిపించాను. ఈ ప్రమాదం తరువాత ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అప్పులు తీర్చలేని దుస్థితిలో ఉన్నాను. కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. – వేమగిరి దావీదు, సామర్లకోట -
డొంకరాయి జలాశయం నుంచి నీటి విడుదల
మోతుగూడెం: లోయర్ సీలేరు డొంకరాయి జలాశయం ప్రమాదకర స్థాయికి చేరడంతో రెండు రోజుల నుంచి డ్యామ్ ఆరో నంబర్ గేటు ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డొంకరాయి ఎగువన ఉన్న సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంతో డొంకరాయి డ్యామ్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏడీఈ శివశంకర్ తెలిపారు. బుధవారం సాధారణ స్థాయికి చేరడంతో సాయంత్రం గేటు మూసివేసినట్లు ఆయన వివరించారు. డొంకరాయి జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా 1035 అడుగులకు చేరుకుంది. -
గోడ దూకి.. పొలంలో పడిపోయా..
‘ఆ రోజు బాణసంచా తయారీ పనిలో సుమారు 30 మంది ఉన్నాం. మధ్యాహ్నం భోజనం చేసి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, 2.30 గంటలకు పనిలోకి దిగాం. ఆ సమయంలో నా చుట్టూ 10 మంది పని చేస్తున్నారు. అలసటగా ఉండటంతో పైకి లేచి నిలబడ్డాను. అదే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడుతో ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. ఎవ్వరికీ ఏమీ చెప్పలేని, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. కొంత దూరం పరుగెత్తి పడిపోయాను. అయినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రాణాలతో బయట పడాలనే ఆశతో గోడ దూకి పొలంలో పడ్డాను. అప్పటికే మంటలు వ్యాపించాయి. ఎలాగో గోదావరి కాలువ గట్టుకు చేరుకున్నాను. మొదట నన్ను వేట్లపాలెం పీహెచ్సీకి, అక్కడి నుంచి కాకినాడ ఆస్పత్రికి తరలించారు. నేను చికిత్స పొందుతున్న వార్డులోనే రోజుకు ఒకరిద్దరు చనిపోయేవారు. నేను ధైర్యంతో దేవుడిని ప్రార్థించుకున్నాను. అందువల్లనే ప్రాణాలతో మిగిలి, నా కుటుంబాన్ని మళ్లీ చూడగలిగాను’ అంటూ ప్రమాదం జరిగిన తీరును, ప్రాణాలు దక్కించుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలను దావీదు చెమ్మగిల్లిన కళ్లతో వివరించాడు. మనిషిగా ఉన్నా.. ఏ పనీ చేయలేకపోతున్నా.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడి ఇంటికి వచ్చానన్న మాటే కానీ, తనను ఇప్పటి వరకూ పట్టించుకున్న నాథుడు లేడని దావీదు ఆవేదన వ్యక్తం చేశాడు. నాటి ప్రమాదంలో శరీరం కాలిపోవడంతో చర్మం, కండరాలు బిగుసుకుపోయాయి. దీంతో, కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు పూర్తి స్థాయిలో సాగని దుస్థితి. మామూలుగా నడవడానికే దావీదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో, ఏ పనీ చేయలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాడు. ‘ఇంటికి వచ్చి, మనిషిగా ఉన్నాను తప్ప ఏ పనీ చేయలేకపోతున్నా. కూలి పనికి వెళ్లే పరిస్థితి లేదు. నాకు అందిన రూ.2 లక్షల ఆర్థిక సాయం వైద్య ఖర్చులకే సరిపోయింది’ అని దావీదు ఆవేదన వ్యక్తం చేశాడు. -
మార్కులు పెంచుకుందాం రండి
● ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవకాశం ● 27 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంరాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సైతం మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. వాస్తవానికి 2024లో ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఇంటర్ బోర్డు నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 27వ తేదీలోగా ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంఫ్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్కు అవకాశం ఉండేది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఇంప్రూవ్మెంట్కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు ఇంటర్ బోర్డు చెక్ పెట్టింది. ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు.. ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు.. ఏవీ ఎక్కువ మార్కులు అయితే వాటినే ఇంటర్ బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇంటర్ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఓకేషనల్ కలిపి మొత్తం 43,108 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 18,337 మంది పరీక్షలు రాయగా, 15,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో కనీసం రెండు వేల మంది ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
జేఈఈ మెయిన్స్లో విజయకేతనం
రాజమహేంద్రవరం రూరల్: జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాల్లో రాజమహేంద్రవరం ఎస్ఆర్ విద్యా సంస్థకు చెందిన విద్యార్థి చిట్టాల మోహన్స్వరూప్ ఆల్ ఇండియా 790వ ర్యాంకును సాధించాడు. అదే విధంగా యర్ర గుణవీరబాబు జాతీయ స్థాయిలో 1568వ ర్యాంకు పొందాడు. ఎస్ఆర్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కేటగిరీలలో అద్భుతమైన ఘన విజయాలు సాధించారని రాజమహేంద్రవరం జోనల్ ఇన్చార్జి మురళీధర్ తెలిపారు. ఆ విద్యా సంస్థల డైరెక్టర్ ఎ.సంతోష్రెడ్డి, సీఈఓ సురేంద్రరెడ్డి, జీఎం రాజేంద్రప్రసాద్, డీజీఎం రమణ, రాజమహేంద్రవరం జోనల్ ఇన్చార్జి మురళీధర్లు విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. మందుబాబులకు జైలు శిక్ష పిఠాపురం: మందుబాబులకు పిఠాపురం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పిఠాపురం మండలం నర్సింగపురం రోడ్డులో రూరల్ ఎస్సై ఎస్ఎస్కే జాన్బాషా తనిఖీలు చేపట్టారు. ఇందులో పది మందిని బుధవారం కోర్టులో హాజరు పరిచగా, ఇద్దరికి ఐదు రోజుల చొప్పున సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బొమ్మిడి విజయభారతి శిక్ష విధించారు. మిగిలిన ఎనిమిది మందికి రూ.10 వేల చొప్పున జరిమానా వేశారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులుతొండంగి: ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చని ఏపీ సీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ జె.ఎలియాజర్, మండల వ్యవసాయశాఖ అధికారి ఎంఎంవీఎస్ పద్మశ్రీ అన్నారు. బెండపూడిి గ్రామ రైతు సేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎంతో ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పొందవచ్చన్నారు. రసాయన ఎరువులు వాడకుండా ఘన జీవామృతం, బీజామృతం వంటి వాటిని తయారు చేసి వినియోగించడం ద్వారా తెగుళ్ల నివారణకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం రబీ వరి పంట కోతలు కోస్తున్న నేపథ్యంలో రైతులు పచ్చి రొట్ట విత్తనాలను (పీఎండీఎస్) వేయాలన్నారు. ఈ పైరు సాగు చేయడం ద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. వేసవిలో భూమి వేడి తగ్గి వచ్చే ఖరీఫ్ పంట సాగుకు మేలు జరుగుతుందని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల సహాయ వ్యవసాయ అధికారి మాదన సతీష్వర్మ, గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు -
నిధుల్లేక.. నీరుసిస్తూ..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక గ్రామీణ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం శాశ్వత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయకపోవడంతో ఏటా వేసవిలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల పరిధిలో 667 శివారు ప్రాంతాలున్నాయి. ప్రధాన గ్రామాలకు వాటర్ ట్యాంకులు ఉండటంతో పైపులైన్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. కానీ, ఈ సౌకర్యం లేకపోవడంతో శివారు ప్రాంతాలకు మంచినీరు అందని దుస్థితి. దీంతో, మార్చి నెలాఖరు నుంచే శివారు ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కార్యాచరణ ప్రణాళిక లేక.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం లేదు. దీంతో, శివారు ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో గుర్తించిన 667 శివారు ప్రాంతాలకు గతంలో ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆవిధంగా చేయకపోవడంతో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. సామర్లకోట మండలం వీకే రాయపురం శివారు సత్యవరపుపేట వాసులు 20 రోజులుగా మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ రెండు రోజుల క్రితం గ్రామంలో ఆందోళన చేశారు. అయినప్పటికీ వారికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. సత్యవరపుపేటతో పాటు సామర్లకోట మండలం మామిళ్లదొడ్డి, వల్లూరు, బోయినపూడి, కాపవరం తదితర గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నీటి ఎద్దడి రావడంతో గ్రామ పంచాయతీ నిధులతో సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. గొల్లప్రోలు మండలంలోని 11 శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొంది. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఎండలు మరింతగా ముదిరే మే నెలలో సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతుందని, ప్రభుత్వమే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నిధులివ్వని ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేవారు. దీని ద్వారా శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించేవారు. దీనికోసం జిల్లాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ కేటాయించేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా పైపుల ద్వారా నీరు రాక, ట్యాంకర్ల ద్వారా సరఫరా కాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నయాపైసా కూడా విదల్చకపోగా.. పైపులైన్లు, ట్యాంకులకు మరమ్మతులు చేసి, గ్రామ పంచాయతీల ద్వారానే శివారు ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చి ఊరుకుంది. మండలం శివారు ప్రాంతాలు గండేపల్లి 20 గొల్లప్రోలు 11 జగ్గంపేట 21 కాజులూరు 32 కాకినాడ రూరల్ 31 కరప 35 కిర్లంపూడి 21 కోటనందూరు 24 పెదపూడి 29 పెద్దాపురం 25 పిఠాపురం 29 ప్రత్తిపాడు 39 రౌతులపూడి 47 సామర్లకోట 28 శంఖవరం 37 తాళ్లరేవు 51 తొండంగి 54 తుని 50 యు.కొత్తపల్లి 53 ఏలేశ్వరం 30 పంచాయతీలో నిధులు లేక.. ఇప్పటికే గ్రామ పంచాయతీల ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. సిబ్బంది జీతాలు, వీధి దీపాల నిర్వహణ వంటి వాటికే నిధులు సరిపోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో ప్రభుత్వం ఆదేశించినట్టుగా పంచాయతీల ద్వారా శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందని గ్రామ ప్రత్యేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాలకు సర్పంచులుంటే స్థానికంగా ట్యాంకర్ల ద్వారా ఎవరో ఒకరి సహాయంతోనో, అవసరమైతే తన సొంత నిధులతోనో శివారు ప్రాంతాలకు తాగునీరు అందించేవారు. కానీ, ఏప్రిల్ మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గ కాలపరిమితి ముగిసిపోయింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. వారు ఆయా మండల కేంద్రాల్లో మాత్రమే ఉంటున్నారు. ఏదో ఒక సమయంలో గ్రామ పంచాయతీకి వచ్చి వెళ్లిపోతున్నారని, తాగునీరు తదితర స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ ప్రజలు మండిపడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం గ్రామంలోని పైపులైన్ల ద్వారా గత 20 రోజులుగా మంచినీరు సరఫరా కావడం లేదు. గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులును కోరినా పట్టించుకోవడం లేదు. తాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నా కూడా చేశాం. అయినప్పటికీ ప్రభుత్వానికి మా సమస్య తెలియడం లేదు. – రేలంగి రాంబాబు, వీకే రాయపురం, సామర్లకోట మండలం ప్రత్యేకంగా నిధులివ్వలేదు ఈ ఏడాది జిల్లాలోని 667 శివారు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి ఉంటుందని గుర్తించాం. ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించలేదు. గ్రామాల్లో తాగునీటి సమస్యలుంటే ఆయా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ద్వారా మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారు. – అబ్దుల్ మతిన్, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఇన్చార్జి ఎస్ఈ పెరుగుతున్న ఎండలు గొంతెండుతున్న గ్రామాలు జిల్లాలో 667 శివారు ప్రాంతాలు అక్కడ తాగునీటికి నయాపైసా ఇవ్వని సర్కారు గత ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల కేటాయింపు -
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
అడ్డతీగల: పోక్సో కేసులో నేరారోపణ రుజువు కావడంతో ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పినట్లు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డతీగల మండలం కోవెలపాలేనికి చెందిన చెక్కా బాలురెడ్డి అదే గ్రామానికి చెందిన బాలిక(6)కు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అడ్డతీగల పోలీసులు 2024 జూన్ 11న కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు అనంతరం నిందితుడు బాలురెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టులో విచారణ అనంతరం నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీదేవి బుధవారం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారని సీఐ వెల్లడించారు. అంతేకాకుండా బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందించాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని న్యాయమూర్తి శ్రీదేవి ఆదేశించారు. బస్సు ఢీకొని యువకుడి మృతితాళ్లపూడి: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగేశ్వరపురం గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రామిశెట్టి పోసిబాబు అనే సందీప్ (25), కొంజర్ల సత్తిబాబులు ప్రైవేట్ ఎలకీ్ట్రషియన్లుగా పని చేస్తున్నారు. వీరు బుధవారం రాత్రి పనులు ముగించుకుని బైక్పై తాళ్లపూడి నుంచి భోజనం తెచ్చుకోవడానికి వెళుతున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి పోలవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో బైక్ను ఢీకొంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ బస్సు కింద పడిపోయారు. పోసిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, సత్తిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ కథనం ప్రకారం.. జగ్గంపేట నుంచి పెద్దాపురం వైపు బైక్పై వస్తున్న సామర్లకోటకు చెందిన పొట్నూరి గణేష్ (37)ను వెనుక నుంచి ధాన్యం లోడ్ ట్రాక్టర్ మంగళవారం రాత్రి ఢీకొంది. స్థానిక కట్టమూరు సెంటర్ దుర్గమ్మ గుడి సమీపంలో రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న గణేష్ను స్థానికులు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి అన్నయ్య శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు సీఐ వివరించారు. ఉలిక్కిపడిన ప్రజలుముమ్మిడివరం: వార్షిక తనిఖీల్లో భాగంగా లంకాఫ్ ఠానేల్లంకలో ఓఎన్జీసీ అధికారులు పైపులైన్లు తనిఖీ చేస్తుండగా భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురై స్థానికులు ఓఎన్జీసీ సైట్లో బ్లోఅవుట్ సంభవించిందని అనుకుని ఆ విషయాన్ని రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులంతా హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తనిఖీలు చేస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు నిర్వహించడాన్ని స్థానికులు తప్పుపట్టారు. గ్యాస్ లీకేజీపై సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయిల్ ఇండియా అధికారులు వివరణ ఇచ్చారు. ఠానేల్లంకలో ప్రతి 9 నెలలకోసారి పరిస్థితులను బట్టి సాధారణ నిర్వహణ (జనరల్ చెకప్) ప్రక్రియ నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. బుధవారం అదే విధంగా టెస్ట్ మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా, కొంత గ్యాస్ విడుదల కావడంతో ప్రమాదకర గ్యాస్ లీకేజీగా తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అధికారులు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనం చోరీకాకినాడ లీగల్: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో ఉంచిన ద్విచక్ర వాహనం మంగళవారం చోరీకి గురైంది. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని వేంకటేశ్వర కాలనీకి చెందిన మల్లాడి ధనేష్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి పని నిమిత్తం వచ్చారు. కార్యాలయ ఆవరణలో తన బైక్ను పెట్టి లోపలకు వెళ్లి బయటకు వచ్చేసరికి కనిపించలేదు. దీంతో ధనేష్ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పుస్తకం.. అక్షర సుమాల హారం
● రచనలకు పుట్టినిల్లు ఉమ్మడి జిల్లా ● సమాజ హితానికి ఎన్నో ప్రచురణలు ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవంకపిలేశ్వరపురం: పుస్తకం.. అక్షర సుమాల హారం. జ్ఞాన దీపాల సమూహం. భావాలను వ్యక్తపరిచే ఓ సాధనం. కొత్త విషయాలను తెలిపే ఆయుధం.. అలాంటి పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించేందుకు యునెస్కో ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున సదస్సులు, సమావేశాలు, పరిశోధనాపరమైన అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించింది. గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ కథనం. కందుకూరి వీరేశలింగం పంతులు 1903లో మద్రాస్లో ఉంటూ స్వీయ చరిత్రను తొలుత 112 పేజీలతో ఆయన సొంత చింతామణి ప్రెస్లో ముద్రించారు. మిగిలిన భాగాలను బెంగళూరులో ఉంటుండగా, పూర్తి చేసినట్టు ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో 1920 డిసెంబర్ 15న రాసిన ముందుమాటలో తెలిపారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ ఇప్పటి వరకూ 21 పుస్తకాలను ప్రచురించింది. మారుమూల గ్రామమైన కపిలేశ్వరపురం మండలం టేకికి చెందిన కావూరి పట్టాభిరామయ్య ‘టేకి నుండి టెగ్జాస్ వరకూ’ పేరుతో రాసుకున్న తన ఆత్మకథను 1981 మే నెలలో వెలువరించారు. అప్పటి ఏపీ ప్రభుత్వ ఆస్థాన కవి డాక్టర్ దాశరథి, మహాకవి డాక్టర్ బోయి భీమన్నలు కావూరి కృషిని ప్రశంసిస్తూ పలు మాటలు ఆ పుస్తకంలో రాశారు. కొనసాగుతున్న రచన కందుకూరి వీరేశలింగం 1920లో రాసుకున్న స్వీయ చరిత్రను చదవడంలో ఆధునిక పాఠకులకు భాషాపరమైన ఇబ్బంది తలెత్తుతుంది. ఆ పుస్తకానికి ఉన్న ప్రాశస్త్యాన్ని డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు చెలికాని స్టాలిన్ గుర్తించి, అదే పేరుతో కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చారు. 800 పేజీల ఆ పుస్తకాన్ని కాకినాడకు చెందిన పీఎస్ ప్రకాశరావు సరళతరం చేస్తూ, 172 పేజీలకు సంక్షిప్తం చేశారు. 2025 జూలైలో ప్రథమ ముద్రణ రామచంద్రపురంలో, రెండో ముద్రణ కాకినాడలో, మూడో ముద్రణ ఈ నెల 16న రాజమహేంద్రవరంలోని ఏబీ నాగేశ్వరరావు పార్క్లో సీనియర్ సిటిజన్స్, ప్రజా సంక్షేమ వేదిక పర్యవేక్షణలో ఆవిష్కృతమయ్యాయి. పిఠాపురానికి చెందిన మేకా గౌరవ్ జర్మన్ రచయిత విలియం లిబ్నిక్ పుస్తకాన్ని ‘సాలీడు, ఈగ’ పేరుతో అనువాదం చేశారు. నందిమూపురం, పురుషుడు– సీ్త్ర, చదువు అంటే ఏమిటి?, ప్రత్యామ్నాయ సినిమాలు తదితర పుస్తకాలను రాశారు. ఈ నెల కాకినాడలోని దంటు కళాక్షేత్రం యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో ‘తెలుగు నాటకరంగం– నాడు– నేడు– రేపు’ పేరుతో గౌరవ్ సంపాదకత్వాన తీసుకొచ్చిన వ్యాస సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాకినాడకు చెందిన గనారా తదితరుల బృందం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో భారీ పరిశ్రమలపై ప్రత్యేక సర్వే చేశారు. అందులోని అంశాలను ‘కడలి కల్లోలం’ పేరుతో నవలగా రాయగా 2016 వైజాగ్లో నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్త డా.ప్రభాత్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఎలాంటి సాహితీ పునాది లేని కుటుంబానికి చెందిన దేవగుప్తం పేరలింగం మూఢ నమ్మకాల గుట్టును రట్టు చేసే పుస్తకాలను తన సైకిల్కు కట్టుకుని క్షేత్ర స్థాయిలో పంచుతూ చర్చ పెట్టేవారు. తన సైకిల్కు ‘హేతువాద చైతన్య రథం’ పేరు పెట్టుకున్నారు. అధ్యయనం అలవాటు చేసుకుని 13 పుస్తకాలను సొంతంగా రచించారు. తన ఇంట్లో ‘సైన్స్ గ్రంథాలయం’ నడిపారు. పేరలింగం 82 ఏళ్ల వయసులో 2014 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచే వరకూ తన కృషి కొనసాగించారు. కాకినాడకు చెందిన రావు కృష్ణారావు రచనలు జంగాలోపాఖ్యానం, ఆధునిక బేతాళ కథలు, బతుకుపోరు కథా సంకలనం, మనిషి, సమాజం తదితర పుస్తకాలు సమాజ మార్పునకు కృషి చేసేలా మనిషికి ప్రేరణ కల్పిస్తాయి. సాహిత్య కార్యక్రమాలు ఇలా.. ఈ నెల 5న రాజమహేంద్రవరంలో వారణాసి సుబ్రహ్మణ్యం రచించిన ‘శతాయుష్మాన్ భవ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలోని ఏటూరి సాహిత్యభిమాన సమితి ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు, ఎనిమిది గ్రంథాలుగా రూపొందిన పుస్తకాలను రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన వికాసానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021 ఆగస్టులో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ గ్రంథాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిని విస్మరిస్తోంది.సామాజిక బాధ్యతగా.. పుస్తకాన్ని రచించడం, అధ్యయనం చేయడం సామాజిక బాధ్యత. ఏపుస్తకమైనా సమాజ మార్పునకు ప్రేరణ కలిగించేదిగా ఉండి తీరాలి. మూఢత్వాన్ని, ఛాందసాన్ని ప్రజలకు దూరం చేసేదిలా ఉండాలి. – గనారా, రచయిత, కాకినాడ వివిధ కాలాలకు వారధిలా.. గత, వర్తమాన, భవిష్యత్ సామాజిక పరిస్థితులను తెలిజేసే సాధనం పుస్తకం. ఆయా కాలాలకు వారధిగా పుస్తకం ఉండాలి. 1920 నాటి రోజుల్లోని కందుకూరి స్వీయ చరిత్ర నేటికీ ప్రాంగికత కలిగి ఉంది. పుస్తకం చదవడం రోజువారీ జీవితంలో భాగం కావాలి. – డాక్టర్ పీఎస్ ప్రకాశరావు, రచయిత, కాకినాడ -
పారిశుధ్య సిబ్బందికి వేతనాల చెల్లింపు
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పారిశుధ్య సిబ్బందికి వేతనాల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. దేవస్థానంలో పారిశుధ్యం, హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పద్మావతి సంస్థలో 413 మంది వివిధచోట్ల పని చేస్తున్నారు. ఏప్రిల్లో మూడు వారాలు పూర్తయినా వీరికి గత ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలు చెల్లించలేదు. వారి ఇబ్బందులపై ‘సత్యదేవా సాపాట్లు కనవా!’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ నెల 12న అన్నవరం దేవస్థానానికి వచ్చిన దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి ఈ విషయం రావడంతో వెంటనే వేతనాలు చెల్లించాలని వారు ఆదేశించారు. ఇది జరిగి వారం రోజులైనా వేతనాలు చెల్లించకపోవడంతో ‘వేతన యాతన ఎన్నాళ్లు..? శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరా తీయగా ఫిబ్రవరి నెల వేతనాల బిల్లును దేవస్థానం చెల్లించినప్పటికీ సిబ్బందికి కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వని విషయం వెల్లడైంది. దీంతో, దేవస్థానం అధికారులు శానిటేషన్ కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి, కెనరా బ్యాంక్లో అకౌంట్ కలిగిన సిబ్బందికి ఫిబ్రవరి నెల వేతనాలు చెల్లించారు. మిగిలిన బ్యాంకుల్లో అకౌంట్లు కలిగిన సిబ్బందికి కూడా ఒకటి రెండు రోజుల్లో చెల్లించనున్నారు. మార్చి నెల వేతనాల బిల్లును కూడా ఒకటి రెండు రోజుల్లో కాంట్రాక్టర్కు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాల బిల్లును పద్మావతి సంస్థ 15వ తేదీ తరువాత మాత్రమే అందిస్తోందని, దీనివలన చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బందికి ఇకపై ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్ట్ సంస్థ కూడా ప్రతి నెలా ఐదో తేదీ లోగా దేవస్థానానికి బిల్లు అందించాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. -
టిడ్కో రుణాలు రద్దు చేయండి
ఫ పాడైన ఇళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలి ఫ మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధిదారుల ధర్నా సామర్లకోట: టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన బ్యాంకు రుణాలను వెంటనే రద్దు చేయాలనే డిమాండుతో సీపీఎం ఆధ్వర్యాన లబ్ధిదారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, పాడైపోయిన టిడ్కో ఇళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. పైభాగంలో ఉన్న వారి వాడకపు నీరు కింద నివాసం ఉంటున్న వారిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైన్లు శుభ్రం చేయడం లేదని, తుప్పలు పెరిగిపోయాయని వాపోయారు. జగ్గమ్మగారిపేటలో జీ+1 ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వం జీ+3 ఇళ్లు నిర్మించి మోసం చేసిందని ఉప్పువారి సత్రం, జగ్గమ్మగారిపేటల్లోని లబ్ధిదారులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఫ్లాటు ధర రూ.7 లక్షలుగా నిర్ణయించారన్నారు. దీనిలో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల చొప్పున సబ్సిడీ ఇవ్వగా, మిగిలిన రూ.4 లక్షల్లో రూ.లక్ష లబ్ధిదారు వాటా పేర్కొన్నారు. మిగిలిన రూ.3 లక్షలకు బ్యాంకు నుంచి రుణాలు అందజేశారని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు తమ ఇళ్లకు వచ్చి బ్యాంకు రుణాలు రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చారన్నారు. కానీ, నెలకు రూ.4 వేల చొప్పున 20 సంవత్సరాల పాటు రుణ వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. సీపీఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్లకు రూ.3 లక్షల రుణమని చెప్పి, చివరకు రూ.10 లక్షలకు మించి వసూలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు వచ్చిన రుణాలను, మిగిలిన లబ్ధిదారులకు వస్తున్న ప్రభుత్వ పథకాల సొమ్మును బ్యాంకు అధికారులు అప్పుల కింద జమ చేసుకుంటున్నారని చెప్పారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో ఎవ్వరికీ ఏ బ్యాంకులూ రుణాలివ్వడం లేదని, ఇదెక్కడి దారుణమని కమిషనర్ను ప్రశ్నించారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇచ్చినట్టుగానే రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించిన వారికి ఇళ్లను స్వాధీనం చేయాలని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తారనే ఆశతో చంద్రబాబుకు ఓట్లు వేశామని, కానీ ఆయన వలన తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్ష చెల్లించి పదేళ్లు కావడంతో వడ్డీగా రూ.4 లక్షల వరకూ చెల్లించామని వాపోయారు. టిడ్కో ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, పారిశుధ్య పనులు జరిగేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు, బ్యాంకు రుణాల రద్దు ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పారు. టిడ్కో కమిటీలో తాను కూడా సభ్యురాలిని కావడంతో రుణాల వసూలుకు బ్యాంకు అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని మహిళలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కరణం ఏడుకొండలు,, బాలం సత్తిబాబు, కె.తులసీదాసు, బాలం హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పొత్తులు.. కత్తులు
‘దొర’తనాన్ని సహించలేక.. అయితే, తరచూ ఇలా మాట్లాడటం వర్మకు ఫ్యాషన్ అయిపోయిందని జనసేన నేతలు కొట్టిపారేస్తున్నారు. బాబు ఫొటో వివాదం కేవలం సాకు మాత్రమేనని ఇరు పార్టీల్లోని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అటు వర్మ, ఇటు దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలే. సహజంగానే ఎవరి స్థాయిలో వారికి అనుచరగణం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్కు వ్యతిరేకంగా పని చేసిన దొరబాబు అకస్మాత్తుగా జనసేనలోకి వచ్చీ రాగానే పెత్తనం చెలాయించడం వర్మ, ఆయన వర్గీయులకు ఎంతమాత్రం రుచించడం లేదు. టీడీపీ మద్దతు లేకపోతే పవన్కు అంత మెజార్టీ వచ్చేది కాదని వర్మ పదేపదే అంటున్నారు. తాజా వివాదంలో కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్కు వెన్నుపోటు పొడిచి వచ్చిన దొరబాబుపై తీవ్ర ఆరోపణలు చేయడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నాడు దొరబాబు సాగించిన రూ.150 కోట్ల అవినీతి, అక్రమాలను రికార్డులతో సహా బయటపెడతానని, ఈ అవమానాలను భరించే ఓపిక ఇక లేదని, కలబడితే గాజులు తొడుక్కుని కూర్చునేది లేదని, రేపు ఎలా ఉంటుందో చూద్దామంటూ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఫ పిఠాపురంలో పెత్తనం కోసం తరచూ తగాదాలు ఫ చంద్రబాబు ఫొటో లేదంటూ తాజాగా మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపాటు ఫ ఆయనను తోసేసిన మరో మాజీ.. పెండెం దొరబాబు ఫ ఇరు వర్గాల మధ్య బాహాబాహీ ఫ డిప్యూటీ సీఎం ఇలాకాలో పదేపదే వివాదాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు సారథ్యంలో కూటమి కట్టిన టీడీపీ, జనసేన నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. పైకి పొత్తులంటూనే కత్తులు దూస్తున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన, టీడీపీ ముఖ్య నేతలు నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు. కూటమి గద్దెనెక్కిన దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పిఠాపురం మున్సిపల్ కల్యాణ మండపంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం, జనవరిలో మూడు రోజుల పాటు జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టకపోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. అయినప్పటికీ అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్న చందంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య సఖ్యత కోసం వీసమెత్తు కూడా ప్రయత్నించిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో తాజాగా మరో రచ్చ చోటు చేసుకుంది. తారస్థాయికి.. పట్టణంలోని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం వద్ద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, బ్యానర్లపై కూడా చంద్రబాబు ఫొటో పెట్టకపోవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనను జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య అరుపులు, కేకలతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలూ బాహాబాహీకి దిగాయి. ఈసారి వర్మపై జనసేన వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు దూకుడు ప్రదర్శించడం చూస్తూంటే వారిద్దరి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరిందని చెప్పుకొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన ఫొటోకు ప్రాధాన్యం ఇచ్చినా చంద్రబాబు ఫొటో కూడా పెడుతున్నామన్నది జనసేన నేతల వాదనగా ఉంది. ఏదో ఒక అంశాన్ని ఆసరాగా చేసుకుని వర్మ తరచూ రాద్ధాంతం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, నియోజకవర్గం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది వర్మతో పాటు టీడీపీ నేతలు డిమాండ్గా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కావాలనే చంద్రబాబు ఫొటో పెట్టకుండా అవమానిస్తున్నారనేది వర్మ వాదన. ఒకటీ రెండు కాదు నాలుగైదు పర్యాయాలుగా ఇలానే అవమానిస్తున్నారని, దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటనతో ఆయన అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. చోద్యం చూస్తున్న అగ్ర నేతలు నియోజకవర్గంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చోద్యం చూస్తున్నారంటూ ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కూటమి గద్దెనెక్కిన తొలినాళ్లలో జనసేన నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన వర్మ.. చంద్రబాబు ఆశీస్సులతో తొలి ఎమ్మెల్సీ సదవి వస్తుందని గట్టిగా నమ్మారు. కానీ, ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో పవర్ సెంటర్ వస్తుందనే ఉద్దేశంతో బాబు, పవన్ కూడబలుక్కునే మోకాలడ్డారని టీడీపీ నేతలు చాలా కాలంగా విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు జనసేనలో దొరబాబు చేరిన తదనంతర పరిణామాల్లో ఇరు పార్టీల నేతల మధ్య వర్గాలకు మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. నియోజకవర్గంలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని వర్మ, అసలు వర్మకు మునుపటి బలగం లేనేలేదని దొరబాబు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఎన్నికలప్పుడున్న జనసేన శ్రేణులతో తనకు పొరపొచ్చాలు లేవని వర్మ అంటున్నారు. దొరబాబు వెంట వచ్చిన కొత్త జనసేన కేడర్తోనే సమస్య మొదలైందని తాజా ఘటన నేపథ్యంలో ఆయన చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. పొత్తు ధర్మం పాటించరా? పిఠాపురంలో జనసేన పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో జనసేన నేతల నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏ రకంగా చూసినా నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యం లేకపోవడమే కాకుండా కనీసం విలువ కూడా లేకుండా చేస్తున్నారంటూ రగిలిపోతున్నాయి. చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కినా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ ప్రతిపక్ష పాత్రనే పోషించాల్సి వస్తోందని వర్మ సహా ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంత ప్రాతినిధ్యం వహిస్తూంటే మాత్రం జనసేన నేతలు టీడీపీని ఇంత దారుణంగా అవమానిస్తారా అని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వారు మరోసారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ అవమానిస్తే ఉపేక్షించేది లేదని వర్మ చేసిన హెచ్చరికలు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే. -
ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిండాడ ప్రదీప్కుమార్, బి.నూకరాజు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం, కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలన్నారు. నూతన పీఆర్సీ వేసి, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాల ఏర్పాటుతో పాటు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను గ్రేడ్–1గా మార్చాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను, ప్రతి ఉన్నత పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, ఐదేళ్లకోసారి మాత్రమే ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టాలని, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో చేపట్టాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ పెడల ఏడుకొండలు, సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, ఏజీవీ సుబ్బారావు, ఎం.శివయ్య పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లోతృతీయ స్థానం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చిత్తూరులో ఇటీవల జరిగిన అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో జిల్లా మహిళా జట్టు తృతీయ స్థానం సాధించింది. హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) హాకీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ మాట్లాడుతూ, క్రీడల్లో రాణించేవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కాకినాడ క్రీడా మైదానంలో తర్ఫీదు పొందుతున్న జట్టు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించడం అభినందనీయమని అన్నారు. జట్టుకు కోచ్గా రవిరాజు, మేనేజర్గా పి.నందిని, కెప్టెన్గా సాయి బంగారు వ్యవహరించారు. సాధారణ సీనియారిటీ తాత్కాలిక జాబితా విడుదల ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యా శాఖ పరిధిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా విడుదల చేశారు. తూర్పు గోదావరి డీఈఓ కంది వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ జాబితాలు డీఈఓఈజీ.ఓఆర్జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 25లోగా కాకినాడలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
నాగళ్లపల్లిలో పులి సంచారం
దేవీపట్నం: పది రోజుల విరామం అనంతరం పులి మళ్లీ పోలవరం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తూరు వద్ద ఆదివారం రాత్రి గోదావరి దాటి దేవీపట్నం మండలం లింగవరం వద్దకు చేరిన ఈ పులి దండంగి వాగు దాటుకుని తిరిగి నాగళ్లపల్లికి చేరింది. ఇది మంగళవారం సాయంత్రానికి నాగళ్లపల్లి వద్ద కొండపై ఉన్నట్లు ట్రాకర్ ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. సమీప గ్రామాలైన చిన్నారిగండి, దేవారం ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పులి మంగళవారం రాత్రికి కొండ దిగి అటు రామదుర్గం మీదుగా సీతానగరం వైపు లేదా దేవారం, శరభవరం గ్రామాల వైపు మరలే అవకాశం ఉంది. ముంపు గ్రామాల్లోని జీడిమామిడి తోటల్లోకి రైతులు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు. -
పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ డివిజన్లో రీమోడలింగ్ పనుల నిమిత్తం మే ఒకటి నుంచి ఐదో తేదీ వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. మే 1, 2, 4 తేదీల్లో కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775), 2, 3, 5 తేదీల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్ (12776), మే 1న విశాఖపట్నం – చర్లపల్లి (18527), 2న చర్లపల్లి – విశాఖపట్నం (18528), ఒకటిన షాలిమార్ – చర్లపల్లి (08045), 2న చర్లపల్లి – షాలిమార్ (08046) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు పూర్తి సొమ్మును వాపసు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
రేపటి నుండి మేం ఏంటో చూపిస్తాం: వర్మ వార్నింగ్
కాకినాడ: జనసేన నాయకులకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు వర్మ. ‘ వెనుక నుండి టీడీపీ గిల్లితే ఎవరు ఊరుకుంటారు. టీడీపీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు. టీడీపీ బలంగా ఉంది కనుకే పవన్కు 70 వేల మెజార్టీ ఇచ్చాం. టీడీపీ బలహీనంగా లేదు.. రేపటి నుండి తామేంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు వర్మ.కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోజనసేన, టీడీపీల మధ్య చిచ్చు రాజుకుంది. ఫ్లెక్సీ గొడవతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మని జనసేన నేత పెండెం దొరబాబు దాదాపు కొట్టినంత పని చేశారు. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేదు. పవన్ కల్యాణ్ ఫొటో మాత్రం హైలైట్ అయ్యింది. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫొటో ఎందుకు పెట్టలేని అక్కడున్న నేతల్ని నిలదీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నేత తుమ్మలబాబు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరు నేతల మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. వర్మపైకి దూసుకొస్తూ దాడి చేసే ప్రయత్నం చేయబోయారు. అది గమనించిన తోటి నేతలు ఆయన్ని నిలవరించారు. ఈలోపు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ.. తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్ గెలిస్తే.. తమపైకే దాడి చేయడానికి వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ జనసేన నాయకుల్ని తీవ్రంగా హెచ్చరించారు. -
అరకోటి భూమి కొట్టేసేందుకు జనసేన నేత స్కెచ్
సాక్షి, కాకినాడ సిటీ: వరుసకు సోదరి అయిన మహిళ భూమి కొట్టేసేందుకు డీసీసీబీ చైర్మన్, కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు స్కెచ్ వేశారు. కాకినాడ జిల్లా యర్రవరంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 94 సెంట్ల భూమిని తన ఆధీనంలో పెట్టుకుని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసీ కిరణ్మయిని తుమ్మల బాబు వేధిస్తున్నారు. కిరణ్మయి భర్త కిడ్నీ పేషెంట్ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకుంటానని నమ్మించి.. ఆ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఆమె పేరిట ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.అధికార పార్టీ నేత కాదనడంతో స్థానిక తహసీల్దార్ ఆమెకు పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తనకు పాస్బుక్ ఇవ్వకపోవడంతో బాధితురాలు తల్లితో కలసి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ హరేందిరప్రసాద్కు ఫిర్యాదు చేసింది. తుమ్మల బాబు తన పెదనాన్న కొడుకు అని, తన భూమి తనకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు తనకు పసుపు కుంకుమ మాన్యం కింద ఇచ్చిన ఈ భూమిని కొన్నేళ్లుగా తుమ్మల బాబు ఆధీనంలో ఉంచుకొని తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపింది.తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. తుమ్మల బాబు అధికారం బలంతో ఆ భూమికి పట్టాదార్ పాస్బుక్ కూడా సంపాదించినట్టు తెలిసిందన్నారు. ఆ భూమికి సంబంధించి పంట డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు ఆమె తెలిపింది. భూమి గొడవల నేపథ్యంలో తన భర్త గత ఏడాది సెప్టెంబర్లో ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో తన తండ్రికి చెందిన 5 సెంట్ల స్థలం కూడా కాజేసేందుకు తుమ్మల బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విషయం జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు. -
వీఆర్కు సర్పవరం సీఐ
కాకినాడ రూరల్: సర్పవరం సీఐ బొక్కా పెద్దిరాజును పోలీసు ఉన్నతాధికారులు వీఆర్(వేకెన్సీ రిజర్వ్)కు పంపించారు. పరిపాలనా పరమైన కారణాలతో ఆయనను వీఆర్కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారని సమాచారం. ఆయన స్థానంలో కాకినాడ దిశా పోలీసు స్టేషన్ సీఐ రవికుమార్ సర్పవరం ఇన్చార్జి సీఐగా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పెద్దిరాజుకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉండగా వీఆర్కు పంపడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వ్యక్తి మృతిపై ఆందోళన కాకినాడ క్రైం: వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సోమవారం కాకినాడలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తుని మండలం వెలమ కొత్తూరుకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి తారేపల్లి నాగేశ్వరరావు(60)కు నాగేశ్వరరావుకు ఆయాసం వస్తూండటంతో ఉదయం 10 గంటలకు గూగుల్ రివ్యూల ఆధారంగా భానుగుడి సెంటర్లోని ఓ క్లినిక్కు తీసుకు వెళ్లారు. బాధితుడిని అక్కడి వైద్యులు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఓ స్కానింగ్ సెంటర్కు పంపారని మృతుడి మేనకోడలు సత్యదేవి తెలిపింది. అసలే ఆయాసంతో ఉన్న నాగేశ్వరరావును స్కానింగ్ సెంటర్లోని సిబ్బంది మెట్ల మార్గంలో రెండంతస్తులు ఎక్కించారని, స్కానింగ్ పూర్తి చేసి, కిందికి వచ్చేసరికి అతడు పూర్తి అచేతన స్థితికి చేరుకున్నాడని చెప్పింది. అక్కడి నుంచి మళ్లీ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుడు స్థానిక ఫౌండేషన్ ఆస్పత్రికి రిఫర్ చేశాడని, అక్కడికి చేరేసరికే నాగేశ్వరరావు ప్రాణం పోయిందని సత్యదేవి తెలిపింది. స్కానింగ్కు తీసుకువెళ్లి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ ఇంటి పెద్దను కోల్పోయామని వైద్యులు, సిబ్బందిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ చేసి కేసు పెట్టాలని చూస్తే పోస్ట్మార్టం చేయాల్సి వస్తుందంటూ బెదిరించారని, దీంతో, భయపడి విరమించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించామని చెప్పారు.పీజీఆర్ఎస్కు 368 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 368 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ హరేందిర ప్రసాద్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు.చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా చైర్మన్గా రమేష్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా చైర్మన్గా డేగల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, స్టేట్ కో ఆర్డినేటర్ గ్రంధి బాబ్జీ సమక్షంలో రమేష్తో పాటు జిల్లా కార్యదర్శిగా గుర్రం సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సుతాపల్లి పద్మరాజు, కొమ్మిశెట్టి కుమార్, రత్నగీతార్థలు నియామక పత్రాలు అందుకున్నారు. -
కొండబాబుకు ఇంటి పోరు
● పదవి ఇచ్చి చిచ్చు పెట్టిన చంద్రబాబు ● ఎమ్మెల్యే అన్న కోడలు సుస్మితకు పార్టీ పదవి ● పోటీగా పదవి కట్టబెట్టడంపై ఎమ్మెల్యే వర్గం కినుక సాక్షి ప్రతినిధి, కాకినాడ: నగర టీడీపీలో అన్నదమ్ముల మధ్య వార్ నువ్వా నేనా అనే స్థాయికి చేరుకుంది. సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. పార్టీపై పట్టు బిగించేందుకు అన్నయ్య వనమాడి సత్యనారాయణ తగ్గేదే లేదంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇన్నాళ్లూ సిటీ టీడీపీలో చాప కింద నీరులా ఉన్న ఆధిపత్య పోరు ఇటీవల రోడ్డెక్కింది. అధిష్టానం కూడా ఎమ్మెల్యే కొండబాబుకు సరితూగే రీతిలో ఆయన అన్నయ్య సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తోంది. రెండు రోజుల క్రితం అధినాయకత్వం ప్రకటించిన పదవుల్లో సత్యనారాయణ కోడలు సుస్మితను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. కొండబాబు రాజకీయంగా ఈ స్థాయికి రావడం వెనుక సత్యనారాయణ కృషిని గుర్తించే సుస్మితకు పార్టీలో అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ పరిణామంతో భవిష్యత్లో కొండబాబుకు సత్యనారాయణ కుటుంబం రాజకీయంగా ఏకు మేకయ్యే ప్రమాదం లేకపోలేదని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా సుస్మితకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టడంపై కొండబాబు కినుక వహించారు. గత ఎన్నికల నుంచే.. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి తన కుమారుడు, మాజీ కార్పొరేటర్ ఉమాశంకర్కు టీడీపీ టికెట్టు దక్కించుకునేందుకు సత్యనారాయణ గట్టి ప్రయత్నమే చేశారు. నాడు పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలో సైతం ఆయనకు అంతా సానుకూలంగా ఉందనే ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో జరిగిన సీట్ల సర్దుబాటులో జనసేన మొదట కాకినాడ సిటీకే మొగ్గు చూపింది. మత్స్యకార సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో దీనిని ఎంపిక చేసుకోవాలని ఆలోచించింది. ఆ సామాజిక వర్గానికే ఉమాశంకర్ పేరు అప్పట్లోనే పరిశీలనకు వచ్చిందనే ప్రచారం కూడా నడిచింది. నాడు సీట్ల సిగపట్లు మొదలైనప్పటి నుంచీ అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేచింది. కొండబాబు తన టికెట్టు కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నప్పుడే తన తనయుడు ఉమాశంకర్కు కూడా అవకాశం ఇవ్వాలంటూ సత్యనారాయణ తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఇంటా బయటా చర్చనీయాంశమయ్యాయి. దీనిని కొండబాబు సహా కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా పరిగణించారని అప్పట్లో పార్టీలో విస్తృత చర్చే జరిగింది. చివరిలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణల్లో కొండబాబుకే సీటు దక్కింది. సత్యనారాయణ వర్గం కూడా ఆయనకే పని చేయడాన్ని గుర్తించే తాజాగా పదవుల పందేరంలో ఆయన కోడలికి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ‘సానా’ ఆశీస్సులు! ఉమాశంకర్కు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు. కొండబాబుకు అన్నీ తానై పార్టీని భుజాన మోసినా సత్యనారాయణకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే విషయాన్ని సతీష్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుస్మితకు ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. సిటీ టీడీపీలో కొండబాబుకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలకు మిగిలి ఉన్న మూడేళ్ల కాలంలో రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.సై అంటే సై ఎన్నికల అనంతరం సిటీ టీడీపీలో కొండబాబు, సత్యనారాయణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. వారిద్దరి కుటుంబాల మధ్య మాటామంతీ కూడా లేదనే చెబుతున్నారు. తమను, తమ వర్గాన్ని కొండబాబు పూర్తిగా విస్మరించారని సత్యనారాయణ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో ఇరు వర్గాలూ పోటాపోటీగా తమ చేతల ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఉమాశంకర్ పుట్టిన రోజు సందర్భంగా నగరమంతటా హోర్డింగ్లు పెట్టి, రాజకీయాల్లో సై అంటూ కొండబాబుతో కాలు దువ్వారు. ఇందుకు పోటీగా ఎమ్మెల్యే తనయుడు మోహన్వర్మ.. అమరావతికి చట్టబద్ధతపై ర్యాలీలు, సంబరాలతో ప్రతి సవాల్ విసిరారు. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వాతావరణం ఇక్కడి టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా సుస్మితకు పదవి ఇవ్వడాన్ని స్వాగతిస్తూ నగరంలోని ముఖ్య కూడళ్లలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఎమ్మెల్యే కొండబాబు ఫొటోకు చోటు దక్కక పోవడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండబాబును బాహాటంగానే వ్యతిరేకిస్తున్న సత్యనారాయణ కోడలు సుస్మితకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. సత్యనారాయణకు ప్రాధాన్యం ఇవ్వడమంటే కొండబాబుకు పక్కలో బల్లెమేనంటూ ముందస్తు సంకేతాలు పంపించడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
మార్గం సుగమం
● భారత్మాల రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు ● అన్నవరం రైతులకు పరిహారం చెల్లింపు ● వాకలపూడి నుంచి ప్రారంభమైన పనులు అన్నవరం: కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం వరకూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్మాల పరియోజన ఫేజ్–1 రోడ్డు (ఎన్హెచ్–516ఎఫ్) నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. అన్నవరంలో సేకరించిన భూమి పరిహారం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోవడంతో ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. 2020లో గ్రీన్ సిగ్నల్ సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధి కోసం వాకలపూడి లైట్ హౌస్ నుంచి అన్నవరం వరకూ 40.621 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి 2020లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1,040 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణానికి 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేశారు. తిరిగి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) గత ఏడాది జూలైలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్ లోయెస్ట్గా వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్ను రద్దు చేసి, గత ఏడాది ఆగస్టులో మరోసారి టెండర్ పిలిచారు. ఆ దఫా 9 సంస్ధలు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో అతి తక్కువకు కోట్ చేసిన సంస్థకు ఈ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగించారు. రైతుల ఆందోళన ఈ రోడ్డు నిర్మాణానికి అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఆరెంపూడి, అన్నవరం గ్రామాలకు చెందిన 20 ఎకరాల భూమిని ఎన్హెచ్ఏఐ సేకరించింది. అన్నవరంలో 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ పలుకుతోంది. అయితే, 2022లో ఆరెంపూడి గ్రామ రైతులు 20 మందికి పదెకరాలకు ఎకరానికి రూ.కోటి చొప్పున ఎన్హెచ్ఏఐ పరిహారం చెల్లించింది. ఆరెంపూడి, అన్నవరం గ్రామాల రైతులకు హైవే పక్కన ఒకేచోట భూమి ఉంది. మధ్యలో గట్టు మాత్రమే అడ్డు. అయినప్పటికీ రికార్డుల్లో గ్రామం పేరు, సర్వే నంబర్లు మారాయనే సాకుతో అన్నవరం పరిధిలో మొత్తం పదెకరాలకు సంబంధించి సుమారు 20 మంది రైతులకు ఎటువంటి పరిహారమూ చెల్లించలేదు. దీనికోసం వారు 2022 నుంచి ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో టెండర్లు ఖరారవడంతో కలెక్టర్ను పలుమార్లు కలసి తమ పరిహారంపై విన్నవించారు. నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లిస్తామని, పైసా పెంచేది లేదని ఎన్హెచ్ఏఐ అధికారులు అప్పట్లోనే చెప్పారు. అయితే, గ్రామంలో భూముల విలువ ఎక్కువగా ఉన్నందున పరిహారం పెంచాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. దీనిపై ఎన్హెచ్ఏఐ ఏమీ తేల్చకపోవడంతో పునరాలోచనలో పడిన అన్నవరం రైతులు ఆలస్యమయ్యేకొద్దీ తమకే నష్టమని భావించారు. దీంతో, గతంలో ఇస్తామన్న పరిహారం ఇప్పించాలని, ఆలస్యమైనందుకు ఆ మేరకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు గతంలో చెప్పిన విధంగా ఎకరాకు రూ.కోటి పరిహారం, దానిపై 9 శాతం వడ్డీ లెక్కించి ఎన్హెచ్ఏఐ రైతులకు చెక్కులు అందజేసింది. నష్టపోయాం పరిహారం విషయంలో అన్యాయం జరిగింది. మా భూమి 2.5 ఎకరాలు సేకరించారు. ఆరెంపూడి పరిధిలో మా కుటుంబ సభ్యుల భూమి రెండెకరాలు తీసుకున్నారు. వారికి ఎకరానికి రూ.కోటి చొప్పున 2023లోనే చెల్లించారు. మా భూమి అన్నవరం పరిధిలో ఉండటంతో పరిహారం ఇవ్వలేదు. ఆలస్యమైనందున రెట్టింపు పరిహారం ఇవ్వాలని కోరాం. మూడేళ్లయినా పట్టించుకోలేదు. విధి లేని పరిస్థితుల్లో గతంలో ఇస్తానన్న పరిహారమైనా ఇప్పించాలని, ఆలస్యమైనందుకు న్యాయం చేయాలని కోరాం. కేవలం 9 శాతం వడ్డీతో పరిహారం ఇచ్చారు. గతంలో పరిహారం పొందిన వారు మరోచోట భూములు కొనుక్కొని లాభపడ్డారు. మేం నష్టపోయాం. – బండారు ముత్యాలరావు, రైతు, అన్నవరం -
● జాతి భేదాలను మరచి..
కులాలు, మతాల పేరుతో కుమ్ములాడుకుంటూ.. రక్త సంబంధాలు, కుటుంబ బంధాలను మరచి.. ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తున్న ప్రపంచమిది. అటువంటి మనుషుల కన్నా తామే నయమని నిరూపిస్తోందా వానరం. జగ్గంపేట బాలాజీ నగర్లోని చెట్లపై అప్పుడప్పుడు కోతులు నివాసం చేస్తూంటాయి. ఈ క్రమంలో సమీపంలోని ఇళ్ల మధ్య ఉంటున్న ఓ పిల్లి పిల్ల, ఓ ఆడ కోతి.. జాతి భేదాలను మరచి మసలుతూండటం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ పిల్లి పిల్లను ఆడ వానరం చేతుల్లోకి తీసుకుంటూ, హృదయానికి హత్తుకుంటూ, ముద్దాడుతూ, మురిపిస్తూ లాలిస్తోంది. తప్పటడుగులు వేస్తున్న బిడ్డ పడిపోకుండా కాపాడుకునే కన్న తల్లిలా.. ఆ మార్జాలాన్ని సంరక్షిస్తోంది. తోటి వానరాల నుంచి ఎటువంటి హానీ జరగకుండా కాపాడుకుంటోంది. – గండేపల్లి -
గుక్కెడు నీళ్లివ్వండి
● సత్యవరపుపేట దళితుల ఆందోళన ● వివక్ష వీడాలని నినాదాలు కాకినాడ వెళ్లి కలెక్టర్కు వినతి సామర్లకోట: తాగడానికి గుక్కెడు నీళ్లందించాలని డిమాండ్ చేస్తూ వీకే రాయపురం శివారు సత్యవరపుపేట ప్రజలు సోమవారం ఆందోళన నిర్వహించారు. సత్యవరపుపేట నుంచి కాలిబాట వంతెన మీదుగా ప్రధాన గ్రామం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీళ్లివ్వండి – ప్రాణాలు కాపాడండి, దళితులపై వివక్షతన విడనాడండి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తాగునీటి కోసం సత్యవరపుపేట ప్రజలు 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దీంతో, తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని బాధిత ప్రజలు నిర్ణయించుకున్నారు. మండే ఎండలో 10 ఆటోలు, మోటారు సైకిళ్లపై సుమారు 200 మంది కాకినాడ కలెక్టరేట్కు బయలుదేరారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, గుక్కెడు నీళ్లు అడుగుతున్నామని చెప్పారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే బోర్లు మొరాయించడం, కలుషిత జలాలు వస్తూండటంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రతరమైందని తెలిపారు. అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. జలజీవన్ మిషన్ బోరు నుంచి కూడా కలుషిత జలాలు వస్తున్నాయని చెప్పారు. బోర్లు పని చేయని సమయంలో ఉదయం, సాయంత్రం కనీసం రెండు చొప్పున వాటర్ ట్యాంకర్లను కూడా అధికారులు ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గ్రామంలో బోరు తవ్వితే సుద్ద నీరు వస్తోంది. సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని ఉండూరు రోడ్డులో మూడు బోర్లు తవ్వి ఇప్పటి వరకూ తాగునీరు సరఫరా చేసేవారు. ఆ బోర్లు పాడైపోవడంతో సమస్య తీవ్రతరమైంది. సుమారు 2 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన పైపులైన్ తరచూ లీకవుతోంది. ఫిల్టర్ బెడ్ను నిర్వహణలోకి తీసుకురావడం ఒక్కటే దీనికి పరిష్కారమని గతంలోనే ‘సాక్షి’ సూచించింది. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే దీని నిర్వహణ పంచాయతీకి భారమవుతుందనే వాదనలున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తుల తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేంత వరకూ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామంటూ కలెక్టర్ హామీ ఇచ్చారని సత్యవరపుపేట వాసులు విలేకర్లకు తెలిపారు. -
పని పడుతున్నారు
విరవాడ చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు● ఉపాధి కూలీలకు సాంకేతిక చిక్కులు ● ఐరిస్ నమోదుకు గంటల తరబడి నిరీక్షణ ● సగం మందికి దొరకని పని ● పస్తులుంటున్న కుటుంబాలు పిఠాపురం: కడుపు నింపుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఉపాధి కూలీలకు ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు శాపంగా మారుతున్నాయి. చాలా సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట అమలు చేస్తున్న పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీజీ రామ్జీ)గా మార్చింది. గత మార్చి 7 నుంచి ఈ పథకంలో కొత్తగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) తీసుకుని వచ్చింది. దీనివలన ఇటు ఉపాధి కూలీలకు, అటు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వీబీజీ రామ్జీ పథకం కింద మరిన్ని పనిదినాలు కల్పించాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్యలతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో పనులు కల్పించే అవకాశం ఉండడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో దాదాపు 50 వేల మంది పైగా ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం 50 శాతం మందికి మాత్రమే పనులు దొరుకుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశానికి వెళ్లి, హాజరు వేసుకునేంత వరకూ ఉపాధి పని ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గంపెడాశతో కిలోమీటర్ల మేర నడిచి వెళ్లిన వారికి సాంకేతిక సమస్యలు గుదిబండగా మారుతున్నాయి. గంటల తరబడి నిరీక్షణ పని జరుగుతున్న ప్రదేశంలో భువన్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మాత్రమే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) యాప్ ద్వారా ఉపాధి కూలీల హాజరు నమోదు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సిబ్బంది ఏ చెరువును ఎక్కడి నుంచి ట్యాగ్ చేశారో అక్కడ మాత్రమే హాజరు నమోదవుతోంది తప్ప, పని జరుగుతున్న చెరువు ప్రాంగణంలో నమోదు కావడం లేదు. దీంతో, అనేక మంది కూలీలు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంటోంది. మండుటెండల్లో మధ్యాహ్నం వరకూ కూడా వారికి నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు యాప్లో కూలీ ఫొటో మళ్లీ మళ్లీ తీయాలని చూపిస్తోంది. సర్వర్ సక్రమంగా పని చేస్తే 2 నిమిషాల్లో అవ్వాల్సిన నమోదు ప్రక్రియ ఒక్కోసారి 10 నిమిషాల వరకూ కూడా పడుతోంది. దీంతో, వందల మంది కూలీలకు ఫేస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలంటే గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తోంది. పని పని ప్రదేశానికి వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా ఫేస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తూండగా.. తిరిగి వెళ్లేటప్పుడు గ్రూప్ ఫొటో తీయాలి. పలువురు కూలీలకు ఆధార్ బయోమెట్రిక్ పూర్తి కాకపోవడంతో ఫేస్ ఆథరైజేషన్ (ముఖ ధ్రువీకరణ) లేక తరచూ కే–100 ఎర్రర్ వస్తోంది. ఆధార్ బేస్డ్ ఈ–కేవైసీ మస్టర్ నమోదు వలన అనేక మందికి ఈ–కేవైసీ పూర్తి కాలేదు. పూర్తయిన వారి వివరాలను కూడా ఎన్ఎంఎంఎస్ సర్వర్లో లోపాల వలన యాప్లో చూపించడం లేదు. ఫలితంగా అనేక మంది కూలీలకు పని లేకుండా పోతోంది. తగ్గిపోతున్న కూలీలు యాప్ ద్వారా హాజరు నమోదులో ఇబ్బందులతో అనేక మంది కూలీలకు పని లేకుండా పోతోంది. దీంతో, జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. పని దొరుకుతుందనే ఆశతో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. తీరా వెళ్లాక పని ప్రదేశంలో హాజరు నమోదు కాకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఫలితంగా ఈ పథకంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న వేలాది మంది అర్ధాకలితో పస్తులుండాల్సి వస్తోంది. అంత దూరం వెళ్లిన తరువాత పని దొరుకుతుందో లేదోననే అనుమానంతో అనేక మంది ఈ పథకంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పనులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు వారాల తరబడి వేతనాలు సైతం అందడం లేదు. గత 10 వారాలు పైనే వేతనాలు తమ ఖాతాల్లో జమ కావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఉపాధి కూలీలు వాపోతున్నారు. ఐరిస్ పడటం లేదని పని ఇవ్వడం లేదు గతంలో కంటి ఆపరేషన్ జరిగింది. ఉపాధి హామీ పనికి వెళితే కంటి ద్వారా హాజరు వేస్తున్నారు. కంటి ఆపరేషన్ కారణంగా నాకు హాజరు పడటం లేదు. హాజరు పడటం లేదు కాబట్టి పనికి రావద్దని చెబుతున్నారు. గత 20 రోజులుగా ప్రతి రోజూ ఉపాధి హామీ పనికి వెళ్తున్నా పని ఇవ్వడం లేదు. ఐరిస్ విధానం నాలాంటి వారికి ఇబ్బందికరంగా ఉంది. గతంలో ఫొటో లేదా వేలిముద్ర ద్వారా హాజరు వేసి, పని కల్పించేవారు. ఇప్పుడు కూడా అదేవిధంగా పని కల్పించాలని కోరుతున్నాను. – దిబ్బిడి సూర్యనారాయణ, ఉపాధి కూలీ, విరవాడ, పిఠాపురం మండలం జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు ఉపాధి పనులు జరిగే మండలాలు 20 పనులు జరిగే గ్రామాలు 267 జాబ్ కార్డులు 2,29,000 వేతనదారులు 2,03,000 ప్రతి రోజూ పని చేసే వారు 1,46,000 ఈ ఏడాది ‘ఉపాధి’ పొందుతున్న వారు 25,000 రోజువారీ సగటు వేతనం రూ.281.79 -
బెంగాలీలపై బెంగ!
● పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూలీల పయనం ● జిల్లాలో కుదేలైన ఇటుకల పరిశ్రమ ● ఉత్పత్తి లేక అమాంతం పెరిగిన ధర ● అదే స్థాయిలో ముడిసరకు ధరలకు రెక్కలు ● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం ఆలమూరు: వలస కూలీల మీదే ఆధారపడిన ఇటుక పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితో భవన నిర్మాణ రంగం కుదేలైంది. అయినప్పటికీ స్థానిక పరిస్థితుల ప్రభావంతో ఇటుక ధర మాత్రం క్రమేపీ పెరుగుతోంది. సరిగ్గా ఇదే తరుణంలో మరోవైపు ముడిసరకు ధరలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో, ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించడం లేదని బట్టీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. నెల రోజుల క్రితం ఒక్కో ఇటుక ఖరీదు రూ.4.50 వరకూ ఉండగా ప్రస్తుతం రూ 8.50కు పెరిగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు పయనం ఇక్కడి ఇటుక బట్టీల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. ఈ నెల 23, 29 తేదీల్లో ఆ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడి బెంగాలీ కూలీలు దశల వారీగా వెళ్లిపోతున్నారు. వేసవి పూర్తయితేనే కానీ వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటుక ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో, కొరత ఏర్పడి, ఇటుక ధర దాదాపు రెట్టింపు పెరిగింది. చిన్న తరహా బట్టీల యజమానులు తమ వద్ద ఉన్న ఇటుకను ఆర్థిక లావాదేవీల కోసం పూర్తిగా విక్రయించుకున్నారు. కానీ, కొంతమంది కార్పొరేట్ స్థాయి బట్టీ యజమానుల దగ్గర మాత్రం ఇటుక పుష్కలంగా ఉంది. ఒకవైపు డిమాండుకు తగినట్టు ఉత్పత్తి లేకపోగా.. మరోవైపు ఉన్న నిల్వలు ఒకే వర్గం వద్ద పోగుపడిపోతున్నాయి. ఇదే అదనుగా వారు కృత్రిమ కొరత సృష్టించి, ధర పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే పరిస్థితి నెలల తరబడి కొనసాగితే జిల్లాలో మూడు వంతుల బట్టీలు మూసివేయక తప్పదని యజమానులు అంటున్నారు. దీనికి తోడు పులి మీద పుట్రలా ముడిసరకు ధరలను కూడా వ్యాపారులు ఇష్టానుసారం పెంచేస్తున్నారని వాపోతున్నారు. ఆ కూలీలు వస్తేనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల ఇటుక బట్టీలున్నాయి. వీటిలో ఒక్క కోనసీమ జిల్లాలోనే దాదాపు 800 బట్టీలున్నాయి. జిల్లాలోని బట్టీల్లో పని చేస్తున్న సుమారు 25 వేల మంది కార్మికుల్లో 70 శాతం మంది బెంగాలీ కూలీలే. మరో 20 శాతం ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. పది శాతం మాత్రమే స్థానిక కూలీలు పని చేస్తున్నారు. ఈ బట్టీల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 20 లక్షల వరకూ ఇటుక ఉత్పత్తి అవుతూండగా.. బెంగాలీ కూలీలు లేకపోవడంతో అది ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. ఇటీవల తెలంగాణ లోని ఖమ్మం జిల్లాకు స్థానిక ఇటుక ఎగుమతులు అధికంగా ఉండం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఇటుక ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం.. కూలీల మీదనే ఆధారపడటం కూడా ఒక్కోసారి ఇటుక పరిశ్రమ సంక్షోభానికి కారణమవుతోంది. ముడి సరకు గత ధర (రూ.) కొత్త ధర (రూ.) నల్లమట్టి ట్రాక్టర్) 1,500 2,500 బొండు ఇసుక (లారీ) 7,500 11,500ఊక (టన్ను) 3,500 4,000బూడిద (టన్ను) 1,000 1,800పుల్లలు (టన్ను) 1,800 3,200పెరిగిన ముడి సరకు ధరలు ఇటుక ధరలు ఆశాజనకంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ముడిసరకు ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గత ఏడాది ధరలతో పోలిస్తే ప్రస్తుతం 50 నుంచి 150 శాతం వరకూ ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. అలాగే, బెంగాలీ కార్మికుల కొరతతో పరిశ్రమలో పోటీతత్వం పెరిగి కూలీలకు చెల్లించే ధర కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో, వెయ్యి ఇటుక తయారీకి సుమారు రూ.5 వేల వరకూ ఖర్చవుతోంది. గతంలో ఇటుక తయారీకి కూలీలకు సగటున రూ.900 వరకూ ఖర్చవుతూండగా ప్రస్తుతం అది రూ.1,400కు పెరిగింది. గతంలో ప్రదేశాన్ని, సానుకూలతను బట్టి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉన్న లీజు ధర ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పలుకుతోంది. -
ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు
ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రతతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో, ఆయకట్టుకు నీటి సరఫరాను తగ్గించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 77.07 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 10.27 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 150, విశాఖపట్నానికి 225, పంపా జలాశయానికి 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి సరఫరా నిలిపివేశారు. తలుపులమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,02,680, పూజా టికెట్లకు రూ.2,65,540, కేశఖండన శాలకు రూ.15,520, వాహన పూజలకు రూ.7,890, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.71,730, విరాళాలు రూ.43,929 కలిపి మొత్తం రూ.6,07,289 ఆదాయం సమకూరిందని వివరించారు. రేపు పీఆర్టీయూ ధర్నా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు, డీవైఈఓ, ఎంఈఓ, జూనియర్ లెక్చరర్, పీజీటీల పదోన్నతులు కల్పించాలని, 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఇంకా ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు. నర్సరీలో మొక్కల నరికివేత కడియం: మండలంలోని దామిరెడ్డిపల్లిలో సుమారు రూ.6 లక్షల విలువైన నర్సరీ మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపాన ఏడు కుంచాల చేనులో బాధితుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విత్తనాల సాయికుమార్ కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అందులో మిర్చి మేరీ గ్రీన్, పోక రకాలకు చెందిన 25 అంగుళాల బ్యాగు సైజు మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ నర్సరీలోకి చొరబడి మొక్కల మొవ్వులను నరికేశారు. మొత్తం మొక్కలన్నిటినీ ఇదే విధంగా చేయడంతో తనను నష్టపరచడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని సాయికుమార్ గ్రహించారు. దీనిపై కడియం పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. తనకు ఎవ్వరితోనూ వివాదాలు లేవని, తనను ఇంతగా నష్టపరచాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మొవ్వులు నరికేసిన మొక్కలు తిరిగి కోలుకోవని చెప్పారు. -
సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో దేవస్థానంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లను ఊరేగించే ఉత్సవ వాహనాలు, వెండి గజ, గరుడ, ఆంజనేయ వాహనాలకు మెరుగులు పెట్టిస్తున్నారు. కొండ దిగువన రావణబ్రహ్మ, పొన్నచెట్టు చెక్క వాహనాలకు కూడా రంగులు వేయించి ముస్తాబు చేయించారు. ఈ నెల 30న స్వామి, అమ్మవార్లను ఊరేగించే టేకు రథం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, ఇతర భవనాలు, వ్రత మండపాలకు రంగులు వేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, యనమల దివ్యలను దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం కలసి, స్వామివారి కల్యాణ ఆహ్వాన పత్రికలను అందజేసి, ఉత్సవాలకు ఆహ్వానించారు. -
ఆహా.. వకాయ
● మొదలైన ఊరగాయల సీజన్ ● జోరుగా పచ్చడి మామిడి అమ్మకాలు ● ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు పిఠాపురం: ఆవకాయ– ఈ మాట వింటే ఎవ్వరికై నా నోరూరిపోతూంటుంది. ముద్దపప్పు అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని, ఆవకాయ నంజుకుని తింటే ఆ రుచికి వేరేదీ సాటి రాదని భోజన ప్రియులు అంటూంటారు. ఆంధ్రాలో పుట్టిన ఈ ఆవకాయ రుచికి తెలుగువాళ్లే కాదు.. ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు సైతం ఫిదా అవుతూంటారు. ప్రస్తుతం సీజ న్ కావడంతో దాదాపు ప్ర తి ఇంటా ఆవకాయల త యారీ ఊపందుకుంటోంది. దీనికి తగినట్టుగానే మా ర్కెట్లో పచ్చి మామిడికాయల అమ్మకాలు కూడా జోరందుకుంది. అంతేకాదు.. మిరప పంటకు పెట్టింది పేరైన గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎండు మిర్చి అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. ఎన్ని రకాలో.. ఆవకాయలో మళ్లీ ఎన్నో రకాలున్నాయి. బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, నూపిండి ఆవకాయ, పులిహోర ఆవకాయ, పెసర ఆవకాయ, పచ్చ ఆవకాయ, శనగల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఎండు ఆవకాయ వంటి రకాలున్నాయి. వీటితో పాటు మెంతికాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి (తురుము మాగాయ), ఉడుకు మాగాయ, పిందె మాగాయ వంటి ఊరగాయలను ఎక్కువ మంది పెడుతూంటారు. వీటి కోసం చెరకురసాలు, కొత్తపల్లి కొబ్బరి, కలెక్టర్ తదితర అనేక రకాల మామిడి కాయలను ఉపయోగిస్తూంటారు. దీంతో, సీజన్ ప్రారంభం నుంచీ వీటికి మంచి గిరాకీ ఉంటుంది. విదేశాలకు సైతం.. జిల్లావ్యాప్తంగా సుమారు 48 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం చిన్న సైజులో ఉన్న కాయలను రోజువారీ వంటల కోసం విక్రయిస్తున్నారు. ముదిరిన కాయల ను ఊరగాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఊరగాయలకు ఉపయోగించే కేజీ పచ్చి మా మిడి కాయల ధర రూ.35 నుంచి రూ.45 వరకూ పలుకుతోంది. సైజును బట్టి కేజీకి ఐదారు కాయల వరకూ వస్తాయి. జిల్లావ్యాప్తంగా నిత్యం సుమారు 120 టన్నులకు పైగా మామిడి కాయల అమ్మకాలు జరుగుతున్నాయన్నది అధికారుల అంచనా. మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది 30 శాతం కాయలు శ్రీలంకకు ఎగుమతి అయ్యాయట. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఒమన్, కువైట్, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నాం తదితర దేశాలున్నాయి. దాదాపు 50కి పైగా దేశాలకు మన ఆవకాయ తదితర ఊరగాయలు సైతం ఎగుమతి అవుతున్నాయి. పిఠాపురంలో ఆవకాయ పచ్చడికి మామిడి కాయలు ముక్కలు కోస్తున్న మహిళ సీజన్ మొదలైంది ఏటా పచ్చళ్లు పెట్టుకునే వారు గతంలో ఇళ్ల వద్దే ముక్కలు కోసుకునే వారు. కోత సరిగ్గా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకే మా దగ్గర ముక్కలు కొట్టిస్తున్నారు. మామిడి కాయల సీజన్ వచ్చిందంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా మామిడి కాయలను ముక్కలుగా కొడుతూంటాం. మామూలు రోజుల్లో వెదురు బుట్టలు అల్లుకునే మాకు ఈ సీజన్లో మామిడి కాయలు కొట్టే పనే పొట్ట నింపుతుంది. – పిల్లి లక్ష్మి, పిఠాపురం ఇక నుంచి ఖాళీ ఉండదు వారం రోజులుగా మామిడి కాయ ముక్కలు కోయడం ప్రారంభమైంది. మామిడి పండ్లు వచ్చేంత వరకూ రోజూ ఈ పని ఉంటుంది. మాతో పాటు చాలా మంది ముక్కలు కోసే పనిలో ఉన్నారు. ప్రత్యేకమైన కత్తులతో ఎక్కడా ముక్క దెబ్బ తినకుండా, పీచు విడిపోకుండా కోయాల్సి ఉంటుంది. ఈ పని మాకు అలవాటు కాబట్టి మా దగ్గర కోయించుకుంటారు. – పిల్లి అప్పయ్యమ్మ, పిఠాపురం -
ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు డీఏ రాజశేఖర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద శనివారం నిర్వహించిన ధ ర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, జాప్యం లేకుండా పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని, ఉపాధ్యాయుల వర్క్ లోడ్ వారానికి గరిష్టంగా 32 పీరియడ్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని, మున్సిపల్, కార్పొరేషన్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కేఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ టెట్ రద్దు చేయాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, అసంపూర్తిగా ఉన్న పాఠశాలల తరగతి గదులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డీఆర్ఓ తిప్పేనాయక్కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రఘురామ హద్దులు మీరుతున్నారు ● అధికార యంత్రాంగం ఆయనకు దాసోహం ● మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజం జగ్గంపేట: ఆకివీడు క్రైస్తవుల విషయంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అఽధికార యంత్రాంగం ఆయనకు వత్తాసు పలుకుతోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట నుంచి ఆకివీడు వెళ్లేందుకు శుక్రవారం బయలుదేరి పోలీసుల నిర్బంధానికి గురైన క్రైస్తవులను ఆయన శనివారం జగ్గంపేటలో కలసి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ క్రిస్టిరయన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్వెస్లీ ఆధ్వర్యాన క్రైస్తవులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం హర్షకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రఘురామకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు చేసేందుకు ఆకివీడు వెళ్తుండగా వారిని పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. ఆకివీడులో తనకు విశేష అధికారాలున్నట్టు రఘురామ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అక్కడి సమస్యను అయోధ్య రామాలయమంత సమస్యలా చిత్రిస్తూ, అక్కడి క్రైస్తవులను భయపెడుతున్నారని అన్నారు. వాస్తవాలను గుర్తించకుంటే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. క్రైస్తవుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హర్షకుమార్ ధ్వజమెత్తారు. -
వేతన యాతన ఎన్నాళ్లు?
● రత్నగిరిపై పారిశుధ్య సిబ్బంది అవస్థలు ● మంత్రి ఆనం, కలెక్టర్, ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు సైతం బేఖాతరు అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన వెతలు ఇంకా కొలిక్కి రాలేదు. పద్మావతి సంస్థ కాంట్రాక్టు నిర్వహణ పనిచేస్తున్న 413 మందికి ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు నేటికీ పడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ సమస్యపై ఈ నెల 11వ తేదీన ‘సత్యదేవా సాపాట్లు కనవా’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ తరువాతి రోజు దేవస్థానానికి వచ్చిన దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ కథనంపై స్పందించారు. వారికి సత్వరం వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సైతం సిబ్బంది వేతనాలపై ఆరా తీశారు. ఇది జరిగి ఐదు రోజులైనా ఆలయ అధికారుల్లో స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆ సిబ్బంది తమ కుటుంబ పోషణకు నానా అవస్థలూ పడుతున్నారు. శానిటరీ సంస్థ ఖర్చులన్నీ పోను సిబ్బందికి చెల్లించాల్సింది నెలకు రూ.50 లక్షలు. రెండు నెలలకు కలిపి రూ.కోటి చెల్లించాలి. ఈ వేతన బకాయిలు సత్వరం చెల్లించాలని మంత్రి సమక్షంలోనే దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వయంగా ఆదేశించినా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం.సిబ్బంది సంఖ్యపై సందిగ్ధం అసలు పద్మావతి సంస్థ కింద దేవస్థానంలో 413 మంది పని చేస్తున్నారా? ఎక్కడ ఎంత మంది పని చేస్తున్నారన్న వివరాలు సరిగా లేవన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఆడిట్ అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా దేవస్థానంలో కేవలం 350 మంది మాత్రమే పని చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైనా అధికారులు ఆరా తీయాల్సి ఉంది. సీఎంకు సన్నిహితుడని చర్యలకు వెనుకంజ దేవస్థానంలో శానిటరీ పనులు దక్కించుకున్న పద్మావతి సంస్థ అధిపత భాస్కర నాయుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొండపై పారిశుధ్య నిర్వహణ బాగోకపోయినా, సకాలంలో వేతనాలు చెల్లించకపోయినా ఎవరూ ఆయనను ప్రశ్నించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వసూల్ రాజా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం విదేశాలకు తరలిపోతోందనే బూచిని చూపిస్తూ కూటమి నేతలు వసూళ్ల దందాకు బరి తెగిస్తున్నారు. దీనికోసం వ్యూహాత్మకంగా ఆకస్మిక తనిఖీల పేరుతో ఆర్భాటం చేసి వ్యాపార వర్గాలను భయకంపితులను చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు తనిఖీలతో హడలెత్తించి, చివరిలో ‘పైసల ఫార్ములా’తో డీల్కు సై అంటున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారం అటు అధికారులు, ఇటు వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. పీడీఎస్ బియ్యం ఎగుమతులు లేకపోయినా.. వాస్తవానికి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడ పోర్టులో ఎగుమతులు మందగించాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ అంటూ స్వయంగా చేసిన హడావుడి ప్రభావం పోర్టుపై పడింది. ఈ క్రమంలో ఎక్స్పోర్టర్లు కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు తగ్గించుకుని, ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం, నెల్లూరు, కాండ్లా పోర్టుల వైపు మళ్లించారు. ఫలితంగా కాకినాడ పోర్టులో ఎగుమతులు సగానికి సగం పడిపోయాయని సమాచారం. ఈవిధంగా వ్యాపార వర్గాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పేరిట కాకినాడకు చెందిన అధికార కూటమి నేత ఒకరు స్థానిక పోర్టులో ఆకస్మిక తనిఖీల పేరిట హడావుడి చేశారు. వాస్తవానికి కాకినాడ పోర్టు నుంచి బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి అవుతోంది. పీడీఎస్లో బాయిల్డ్ రైస్ అనే మాటే ఉత్పన్నం కాదు. అటువంటప్పుడు కాకినాడ నుంచి పీడీఎస్ బియ్యం రవాణాకు ఆస్కారమే లేదని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగానికి కూడా తెలియనిది కాదని వ్యాపారులు అంటున్నారు. అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో సాన్నిహిత్యం, కూటమిలో రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ కలిగిన ఓ నాయకుడు అధికార దర్పంతో ఇటీవల హడావుడి చేశారు. దీనిపై అధికారులు సైతం కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. పెద్ద స్కెచ్చే.. ఇంత హడావుడి చేసిన ఆ నాయకుడు రెండు రోజుల్లోనే మధ్యవర్తుల ద్వారా రాజీ ఫార్ములా తెర మీదకు తీసుకువచ్చారు. పార్టీ సభ్యత్వాల కోసం తాను రూ.15 లక్షల పైగానే సొంత సొమ్ము ఖర్చు పెట్టానని ఆ నేత చెప్పుకుంటున్నారు. ఈ మొత్తాన్ని ఏదో ఒక విధంగా తిరిగి రాబట్టుకోవడానికి ఆయన పెద్ద స్కెచ్చే వేశారు. పోర్టులో ఆకస్మిక తనిఖీల పేరుతో వ్యాపారులను భయపెడితే వారి నుంచి పార్టీ సభ్యత్వానికి వెచ్చించిన సొమ్ము తిరిగి రాబట్టుకోవచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ నాయకుడు పోర్టులో హడావుడి చేశారని, ఆ తర్వాత రూ.15 లక్షల కోసం మధ్యవర్తుల ద్వారా ప్రతిపాదించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆకస్మిక తనిఖీలు చేస్తేనే నయానా భయానో తనకు గుర్తింపు ఉంటుందని, లేదంటే పదవి ఉన్నా అలంకారప్రాయంగానే మిగులుతుందని అన్నట్టు చెబుతున్నారు. కుదరని బేరం అయితే, రూ.15 లక్షల ప్రతిపాదనతో కంగు తిన్న వ్యాపారుల్లో కొందరు అంత మొత్తం ఇచ్చుకోలేమని తెగేసి చెప్పినట్లు తెలిసింది. మధ్యేమార్గంగా రూ.9 లక్షలు ముట్టజెప్పేందుకు ముందుకొచ్చారని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమని వారు చెప్పినట్లు తెలియవచ్చింది. అయితే, ముందుగా అనుకున్న మొత్తం ముట్టజెప్పాల్సిందేనని, పార్టీ సభ్యత్వాల కోసం వదిలిపోయిన చేతిచమురు ఈ డీల్ ద్వారా తిరిగి రావాల్సిందేనని అధికారులకు ఆ నాయకుడు గట్టిగానే చెప్పారని అంటున్నారు. పార్టీ సభ్యత్వాల సొమ్ము తిరిగి రాబట్టుకునేందుకు తమను బలి చేయడమేమిటని, మునుపెన్నడూ ఈవిధంగా ఒత్తిళ్లు తెచ్చిన దాఖలాలు లేవని వ్యాపారులు మండిపడుతున్నారు. ఆ నాయకుడు ఇలానే మొండిపట్టు పడితే పోర్టులో లావాదేవీలు నిలిపివేసే విషయంపై ఒక నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి చాంబర్ ప్రతినిధులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులు వేచి చూసి, ఆపై ఓ నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. జనసేన అధినేత ‘సీజ్ ద షిప్’ అని అంటే అనుచరగణం మాత్రం రేటు, డీల్ అంటున్నారంటూ అధికార పార్టీ నేతలే నివ్వెరపోతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం చివరకు ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే. హాట్ టాపిక్గా కూటమి నేత వ్యవహార శైలి పీడీఎస్ బియ్యం అక్రమాలంటూ పోర్టులో హడావుడి ఆకస్మిక తనిఖీల పేరిట వసూళ్లకు బరితెగింపు పార్టీ సభ్యత్వ రుసుం రాబట్టుకునే ఎత్తుగడ రూ.15 లక్షలు ఇవ్వాలంటూ బేరాలు మండిపడుతున్న వ్యాపారులు -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి తిరుపతి కిటకిట సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఆలయం ఽశనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలతో పాటు కాలి నడకన పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున ఇచ్చిన తొలి హారతిని దర్శించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,63,500, అన్నదాన విరాళాలు రూ.65,516, కేశఖండన ద్వారా రూ.5,520, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.20,235, ఇతరత్రా కలిపి రూ.2,54,871 ఆదాయం వచ్చిందని వివరించారు. సుమారు 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. వేసవి నేపథ్యంలో ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్కు పంచాయతీ ఆశీలు వసూలు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. -
చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్టు
భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం కాకినాడ క్రైం: ఇళ్ల తాళాలు పగులగొట్టి సొత్తు దోచుకుంటున్న ముగ్గురిని, నకిలీ తాళాలతో బైక్ చోరీలు చేసే ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ ఈ వివరాలు వెల్లడించారు. కాకినాడ ఏటిమొగకు చెందిన 32 ఏళ్ల రేకాడి వెంకటేశ్వర్లు నగరంతో పాటు శ్రీకాకుళంలో 30కి పైగా దొంగతనాలు చేశాడు. అతడి నుంచి 117 గ్రాముల బంగారు, 629 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.1.95 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోరంగి ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అతడికి సహకరించిన ఇద్దరు మైనర్లను వన్టౌన్, టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. స్థానిక జె.రామారావు పేటకు చెందిన వనమాడి జానకిరామ్, మాడుగుల మండలం సత్యవరం గ్రామానికి చెందిన రేఖా సతీష్లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ చోరీలో మరో నిందితుడు కాకినాడ ఘాటీ సెంటర్కు చెందిన తోట శివశంకర్ పరారీలో ఉన్నాడన్నారు. సామర్లకోట – కాకినాడ రహదారిలో సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ బృందం ముద్దాయిలను పట్టుకుందని తెలిపారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్టు చేయడం ద్వారా కాకినాడ వన్ టౌన్, టూ టౌన్, కోరింగ, సామర్లకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన 10 కేసులను ఛేదించి, సుమారు రూ.26 లక్షల సొత్తు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు. -
మంత్రి సుభాష్ మాట నీటిమూట
కపిలేశ్వరపురం: స్వాతంత్య్రానికి ముందు వలసపాలనలో బ్రిటిష్ పాలకులు దోపిడీదారులే అయినప్పటికీ భారత చేనేత నైపుణ్యాన్ని ప్రశంసించారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత వృత్తిని, కార్మికులను విస్మరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాక కనీస చేయూతను సైతం చేనేతకు ఇవ్వని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రూ.వెయ్యి ఎక్కువ వేసి ఏడాదికి రూ.25 వేలు సాయమందిస్తానంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 22 నెలల ఆయన పాలనాకాలంలో ఆ హామీ గాలికి కొట్టుకుపోయింది. అదే ఒరవడిని అందిపుచ్చుకున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. చేనేతకు ప్రసిద్ధి చెందిన అంగర గ్రామంలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘానికి రావాల్సిన ఆప్కో, ప్రభుత్వ బకాయిలను 2025 అక్టోబర్ నెలాఖరులోగా జమ చేయిస్తానంటూ మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. ఆరు నెలలు గడిచినా ఆ హామీ అమలు కాలేదు. మంత్రి సుభాష్ హామీ నేపథ్యమిదీ... 2025 సెప్టెంబర్ 28న మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ సంఘానికి రావాల్సిన ఆప్కో, ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షలు ప్రారంభించిన నాటికి అంగర చేనేత సంఘానికి రావాల్సిన వివిధ రకాల బకాయిలు రూ.3.85 కోట్లు ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్ 27న అంగర గ్రామంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో 28 నుంచి సహకార సంఘం ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. 14 రోజులపాటు సాగిన దీక్షలకు ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మికుల నుంచి స్పందన లభించింది. వైఎస్సార్ సీపీ నాయకులు, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న ఇతర జిల్లాల చేనేత సహకార సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించారు. జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్టోబర్ 11న స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి సహకార సంఘం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. అక్టోబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలా హామీ ఇచ్చి నేటికి ఆరు నెలలు పూర్తయినా అమలు కాలేదు. వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న నేతన్నలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం పేరుతో ఆదుకున్న రోజులను చేనేత కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలో 916 చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. బకాయిలు జమ చేయిస్తానంటూ నేతన్నలకు హామీ ఆరు నెలలుగా అమలు కాని వైనం కాకినాడలో రిలే దీక్షలు చేస్తున్న నేతన్నలు పట్టించుకోని కూటమి నాయకులు శిబిరం వైపు కన్నెత్తి చూడని కూటమి నాయకులుఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు విసిగి పోయి కాకినాడ కేంద్రంగా ఈ నెల 13 నుంచి ఆత్మగౌరవ దీక్షల పేరుతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తొలిరోజు అంగర చేనేత సహకార సంఘం సభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఐదు రోజులుగా సాగుతున్న దీక్షలు అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. అలాగని మరోసారి హామీ ఇస్తే నమ్మే పరిస్థితిలో చేనేత కార్మికులు లేరు. అంగరలో స్వయంగా మంత్రి సుభాష్ ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఈ ఏడాది ఫిబ్రవరి 22న 16 భాగస్వామ్య సంఘాలతో కలిసి చేనేత గర్జన పేరుతో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా సంఘాల నాయకులు చేసిన డిమాండ్లను ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో తమ సంఘాలకు రావాల్సిన బకాయిలను జమ చేయడం తప్ప మరే మాటా వినేది లేదని నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నిరసనను నిలిపివేయాలని కార్మికులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడులు తెస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. కాకినాడలోని దీక్షా శిబిరం వైపు కీలక కూటమి నాయకులు కానీ, మంత్రులు కానీ కన్నెత్తి చూడకపోవడమే ఇందుకు నిదర్శనమని చేనేత కార్మికులు అంటున్నారు. -
పేదల పట్టా భూములు అన్యాక్రాంతం కానివ్వకండి
సాక్షి ప్రతినిధి కాకినాడ: పిఠాపురం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూములు అన్యాక్రాంతం చేయడానికి ఇచ్చన ఉత్తర్వులను వెంటనే నిలిపివేసి వారికి అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్కు కలెక్టరేట్లో శుక్రవారం ఆమె వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ పిఠాపురం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, గొల్లప్రోలు రూరల్, కొత్తపల్లి మండలాల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 400 ఎకరాలు భూమి కొనుగోలు చేసి సుమారు 10 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. లబ్ధిదారులకు ఆయా పట్టా భూములు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించిందన్నారు. వాటిలో కొంతమంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారన్నారు. కొన్ని లే అవుట్లలో రోడ్లు, కరెంటు, నీరు లేక పోవడం వల్ల, ఎన్నికల కారణంగా గృహ నిర్మాణాలకు అనుమతులు రాక లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఎదురు చూస్తున్నారన్నారు. ఇంతలో పిఠాపురం మసీదు మాన్యం లేఅవుట్లో సుమారు 250 మందికి కేటాయించిన భూమిలో కాలేజీ నిర్మాణానికి అనుమతిస్తూ వచ్చిన ఉత్తర్వులు పేద ల్లో ఆందోళన కలిగించాయన్నారు. పిఠాపురం మండలం నర్శింగపురంలో లేఅవుట్లో 1,000 మందికి కేటాయించిన భూమిలో ఒక పాఠశాల నిర్మాణం కోసం ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఇప్పటికే కేటాయించిన భూములను పేదల అధీనంలోనే ఉంచాలని ఆమె కోరారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబీ, పచ్చిమళ్ల జ్యోతి, రావుల మాధవరావు, అడపా రఘు, ఆనాల సుదర్శన్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సోమరౌతు లలిత, పెదపాటి రాజేష్ పాల్గొన్నారు.కలెక్టర్కు మాజీ ఎంపీ వంగా గీత వినతి -
నేతన్నలకు అండగా ఉంటా : ఎమ్మెల్సీ తోట
కపిలేశ్వరపురం: చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లించే వరకూ తాను నేతన్నలకు అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత కార్మికులు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట చేస్తున్న ఆత్మగౌరవ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తోట సందర్శించారు. చేనేత సంఘాల నాయకులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టడం ద్వారా వృత్తిని పరిరక్షించవచ్చన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికులు పట్ల వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమైనదన్నారు. ఓట్ల కోసం హామీలను ఇవ్వడం తప్ప మనస్ఫూర్తిగా చేనేత కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. చేనేత వృత్తి రక్షణకు మాజీ సీఎం ఎన్టీఆర్ పని చేశారన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి చేనేత రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు సాయాన్ని అందజేశారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా చూపడంలేదని తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోటకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పప్పు దుర్గారమేష్, డాక్టర్ సమతం రమణ మహేష్, ఏపీ చేనేత సహకార సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జేఏసీ అల్లక రాజు, ఆత్మ గౌరవ దీక్షా నిర్వహణ కమిటీ కార్యదర్శి దొంతంశెట్టి సత్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. కాకినాడ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రీజనల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఏటా కొండలా పేరుకుపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అవికూడా పూర్తి స్థాయిలో చెల్లించకుండా కాలయాపన చేస్తోందని చెప్పారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారు? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పెండింగ్ పెట్టిన డీఏలుకు ఈ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. కొంత మంది లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోలేక.. ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా ప్రభుత్వం మాత్రం హెల్త్కార్డులకు ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం డబ్బు యథావిధిగా తీసుకుంటోందని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అధికారిని అదే శాఖలో అదే పోస్టులో ఉంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతున్నాయన్నారు. ఒకటో తేదీన ఎప్పుడైనా జీతం ఇచ్చావా.. ఉద్యోగులుకు, పెన్షనర్స్కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబూ ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చావా అని నిలదీశారు. పేరివిజన్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఐఆర్, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సీపీఎస్ రద్దు దిశగా ఒక్క సమావేశం కూడా నిర్వహించడ లేదన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆ ఊసే లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా మరణిస్తున్నారన్నారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ లావణ్య పాల్గొన్నారు. పేరుకు పోయిన బకాయిలు తక్షణం చెల్లించాలి వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి -
లింగ వివక్షను రూపుమాపాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): లింగ వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం గర్భస్థ పిండ లింగ నిర్థారణ వెల్లడి నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వెయ్యికి మహిళల నిష్పత్తి జాతీయ స్థాయిలో 991, రాష్ట్రంలో 943 ఉండగా, జిల్లాలో 969 ఉందన్నారు. జిల్లా సగటు కంటే తక్కువ మహిళా జనాభా ఉన్న పీహెచ్సీల పరిధిలోని ప్రాంతాలపై దృష్టి సారించి, కారణాలను విశ్లేషించాలన్నారు. జిల్లాలో కొత్తగా రెండు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్కు, 8 స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్కు అందిన దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. స్కానింగ్ సెంటర్లలో మెషీన్లు, పేరు మార్పులు, మూసివేతకు అనుమతి కోరుతూ అందిన మరో 8 దరఖాస్తులను ఆమోదించింది. భవన నిర్మాణ కార్మికులకు మరింత భరోసా భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కార్మికశాఖ కొన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. వివాహ కానుక కింద రూ.20 వేలు, కార్మికుని కుమార్తె, మహిళా కార్మికురాలి వివాహానికి అందిస్తారన్నారు. గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు ఇస్తారన్నారు. ప్రసూతి సాయంగా రూ.20 వేలు అందజేస్తారన్నారు. వివరాలకు 94925 55112 నంబర్లో సంప్రదించాలన్నారు. మహిళలకు రుణాలివ్వాలి మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు మరిన్ని రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ, సెర్ప్, మెప్మా శాఖలలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యకలాపాలపై శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరు చేస్తున్న రుణాలు, వాటి వినియోగం, రికవరీ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ప్రతి లబ్ధిదారునికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
చేనేత సమస్యలను గాలికొదిలేశారు
● ప్రభుత్వంపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శ ● ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చేనేత కార్మికుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులు చేస్తున్న ఆత్మగౌరవ దీక్షకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలసి నేతన్నలు ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, చర్చలకు పిలవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నియంతలా వ్యవరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికుల ఖాతాల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏటా డబ్బులు వేసేవారని, అటువంటిది ఈ ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇచ్చేందుకు 3 లక్షల దుప్పట్లకు ఆర్డర్ పెట్టిందని, ప్రస్తుతం అవి గోడౌన్లో ఉన్నాయని అన్నారు. చేనేత కార్మికులను అధికారులు కూడా పట్టించుకోవడం లేదని, వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలని రాజా డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పావలా వడ్డీ, 30 శాతం మార్కెటింగ్ ఇన్సెంటివ్ వంటి పథకాలు పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, చేనేత సంఘం ప్రతినిధి ముప్పన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఈఓగా చక్రధరరావు బాధ్యతల స్వీకరణ
అన్నవరం: వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 6 గంటలకు సత్యదేవుని దర్శించి, పూజలు చేసిన అనంతరం, ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ఈఓ కార్యాలయంలో కూర్చుని ఆర్థికపరమైన ఫైల్స్పై సంతకాలు చేశారు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధా నార్చకుడు కోట సుబ్రహ్మణ్య శర్మ, వ్రత పురోహి త సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, ఇతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయంతో శాంతిభద్రతల పరిరక్షణ కాకినాడ రూరల్/కొత్తపల్లి: నగరంలో ఆరు పోలీ సు స్టేషన్లతో పాటు రెండు ట్రాఫిక్ స్టేషన్లున్నాయని, ఆయా స్టేషన్ల సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పని చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఇంద్రపాలెం పోలీసు స్టేషన్ తనిఖీకి వచ్చిన ఆయనకు రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వీరబాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కేసులు, పరిష్కారం వంటి వాటిపై రికార్డులు తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాకినాడ నగరం, ఇంద్రపాలెం స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు బాగున్నాయన్నారు. స్టేషన్ల మధ్య పరిధి సమస్య వచ్చినపుడు తొలుత నమన్వయంతో సమన్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సూచించామన్నారు. జిల్లాలో హైవే పరిసరాల్లో గంజాయి పట్టుబడుతోందని, దీనిపై నిఘా ఉంచామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కూడా నిఘా పెట్టామన్నారు. యాప్ల ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు అప్రమత్తగా ఉన్నారన్నారు. నగర భద్రతలో ఆటో డ్రైవర్లు, యజమానులను భాగస్వాములను చేసే ఆలోచన ఉందన్నారు. విశాఖ వైపు వెళ్లే హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంత మంది స్మగ్లర్లు బోట్లలో ఒడిశా వంటి ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెస్తున్నారని, మార్గం మధ్యలోనే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని చెప్పారు. పాత వారితో పాటు కొత్త నేరస్తులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు
● భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యం ● సమన్వయ కమిటీ సమావేశంలో అధికారుల నిర్ణయం అన్నవరం: రత్నగిరిపై ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ, అన్నవరం దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన రత్నగిరిపై గురువారం జరిగిన సమావేశంలో నూతన ఈఓ నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ, ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులూ సహకరించాలని కోరారు. ఉత్సవాలకు దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుని కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశమున్నందున ఆ రోజు విస్తృత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ ఎన్కే శ్రీధర్, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్సై హరిబాబు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశం నిర్ణయాలివీ.. ● కల్యాణోత్సవానికి వచ్చే భక్తులు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, కల్యాణానంతరం తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి 9 కౌంటర్ల ఏర్పాటు. అందరికీ మంచినీరు అందించాలి. ● వీఐపీలకు స్వామివారి శేషవస్త్రం, తలంబ్రాలను వారివద్దకే అందించాలి. వారితో పాటు ఎవ్వరినీ కల్యాణ వేదిక వద్దకు అనుమతించరాదు. ● ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కల్యాణ వేదిక వద్ద బారికేడ్ల ఏర్పాటు. ● రత్నగిరి పైన, దిగువన, కల్యాణ వేదిక వద్ద విద్యుద్దీపాలంకరణ. ● కల్యాణం జరిగే 27వ తేదీ సాయంత్రం నుంచి పెద్ద వాహనాలను, ఆటోలను కొండ మీదకు అనుమతించరు. భక్తులు, గ్రామస్తుల కోసం 8 ఉచిత బస్సులు నడపాలి. ● శ్రీచక్రస్నాన మహోత్సవానికి పంపా నదిలో 100 అడుగుల నీటిమట్టం ఉండేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ● కల్యాణోత్సవం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి, ఊరేగింపులు జరిగే ఐదు రోజులూ ఆ వేడుకలు పూర్తయ్యేంత వరకూ అన్నవరంలో సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలి. ● ఉత్సవాల ఏడు రోజులూ అదనపు పారిశుధ్య సిబ్బందితో అన్నవరం గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచాలి. ● కల్యాణోత్సవం, శ్రీపుష్పయాగం నాడు ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్లు సిద్ధంగా ఉంచాలి. ● కల్యాణోత్సవం నాడు 500 మంది, వాహనాల ఊరేగింపుల్లో 50 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు. ● కల్యాణోత్సవాలు జరిగే వారం రోజులూ పాయకరావుపేట ఫీడర్ నుంచి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. ● ఈ ఏడు రోజులూ రత్నగిరి పైన, దిగువన వైద్య శిబిరాల నిర్వహణ. ● దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు. ● ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు 38 అడుగుల ఎత్తయిన టేకు రథంపై జరిగే సత్యదేవుని రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అన్నవరం మెయిన్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ఒకౖవైపు రోడ్డులో రథోత్సవం జరుగుతూండగా రెండోవైపు రోడ్డులో భక్తులు ఉండి తిలకించేలా ఏర్పాట్లు చేయాలి. మధ్యాహ్నం నుంచి మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేయాలి. రథం లాగేందుకు నిపుణులను నియమించాలి. మెయిన్ రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉన్నందున రెండు వైపులా పగ్గాలతో రథాన్ని నియంత్రించాలి. గతం కంటే వైభవంగా.. వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాల మాదిరిగా సత్యదేవుని కల్యాణోత్సవాల్లో విశేషంగా పుష్పాలంకరణ చేయిస్తాం. వాడపల్లి పుష్పాలంకరణ వీడియోలను అన్నవరం దేవస్థానం సిబ్బందికి చూపించాం. అలాగే, విద్యుద్దీపాలంకరణ కూడా బాగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గతంలో కన్నా వైభవంగా కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం. – నల్లం సూర్య చక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఇకపై ప్రతి రోజూ కోకనాడ ఎక్స్ప్రెస్
● 22 నుంచి నిత్యం నడవనున్న రైలు ● ప్రయాణికుల ఒత్తిడితో సామర్లకోటలో హాల్ట్ సామర్లకోట: హైదరబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్తే. కాకినాడ టౌన్ – లింగంపల్లి స్టేషన్ల మధ్య ఇప్పటి వరకూ వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తున్న కోకనాడ ఎక్స్ప్రెస్ (12775/12776) ఇక నుంచి ప్రతి రోజూ అందుబాటులోకి రానుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ స్థానిక విలేకర్లకు గురువారం ఈ వివరాలు తెలిపారు. గతంలో కాకినాడ టౌన్ నుంచి మంగళ, గురు, ఆదివారాల్లో మాత్రమే ఈ రైలు లింగంపల్లి బయలుదేరేది. అలాగే, లింగంపల్లి నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరేది. కీలక జంక్షన్ అయిన సామర్లకోటలో ఈ రైలుకు హాల్ట్ ఉండేది కాదు. ఈ రైలును ప్రతి రోజూ నడపాలని సామర్లకోటలో హాల్డ్ ఇవ్వాలని ఇక్కడి ప్రయాణికులు డివిజనల్ రైల్వే మేనేజర్తో పాటు ఇతర రైల్వే అధికారులు ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ విజ్ఞాపనలు అందించేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ప్రతి రోజూ నడపాలని, సామర్లకోటలో హాల్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 21న ఈ రైలు లింగంపల్లిలో బయలుదేరి 22వ తేదీ ఉదయం 4.55 సామర్లకోట వస్తుందని రమేష్ తెలిపారు. అలాగే, కాకినాడలో 22వ తేదీ రాత్రి 8.15 గంటలకు బయలుదేరి సామర్లకోటకు 8.35కు చేరుకుని, 8.37 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. కీలకమైన ఈ రైలుకు సామర్లకోటలో హాల్ట్ ఇవ్వడంతో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, బిక్కవోలు తదితర మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో..మరో భూ సంతర్పణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పిఠాపురం మసీదు మాన్యంలో 245 మంది అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన భూములను.. ఆయుష్ వైద్య కళాశాల నిర్మాణం పేరుతో తిరిగి స్వాధీనం చేసుకునేందుకు.. చంద్రబాబు సర్కార్ ప్రత్యేక జీఓ విడుదల చేయడంపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీతో పాటు వామపక్షాలు ప్రత్యక్ష ఆందోళనకు కూడా ఉపక్రమించాయి. మరోవైపు కాకినాడలో స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఆయుష్ ఆస్పత్రికి ఆనుకుని 4 ఎకరాలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కుటుంబానికి కట్టబెట్టడం కూడా వివాదాస్పదమైంది. ఈ భూములపై ఓవైపు ఆందోళనలు కొనసాగుతూండగానే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకా పిఠాపురంలో రాష్ట్ర ప్రభుత్వం మరో భూ సంతర్పణకు తెర తీసింది. పిఠాపురం మండలం నర్సింగపురంలో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని.. ఓ విద్యా సంస్థకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు ఏకంగా 20 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. నాడు పేదలకు కేటాయించిన జగన్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే సదుద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నర్సింగపురంలో రైతుల నుంచి సుమారు 55 ఎకరాలు కొనుగోలు చేసింది. నర్సింగపురం రెవెన్యూ పరిధిలోని 211, 212, 213, 214, 215, 216, 217, 218 సర్వే నంబర్లలో ఈ భూమిని సేకరించారు. ఎకరాకు రూ.55 లక్షల చొప్పున రైతులకు చెల్లించారు. ఈ 55 ఎకరాల్లో పిఠాపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన సుమారు 4 వేల మంది నిరుపేదల కోసం నాడు జగన్ సర్కార్ ఈ భూములను కొనుగోలు చేసింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు చూపించి, పట్టాలు కూడా ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు నెమ్మదించాయి. పేదల భూములపై కన్ను నర్సింగపురం భూముల్లో కొంత మంది పేదలు ఇళ్ల నిర్మాణాలు చేపడుతూండగా.. ఈ భూమిపై చంద్రబాబు సర్కారు కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఈ 55 ఎకరాల్లో సుమారు 20 ఎకరాలను హైదరాబాద్ స్వామి నారాయణ గురుకుల ట్రస్టు నిర్వహించే పాఠశాల నిర్మాణానికి కేటాయిస్తూ ఈ నెలలో జీఓ జారీ చేసింది. ఫలితంగా ఈ 20 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పొందిన సుమారు 1,000 మంది లబ్ధిదారుల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితి దాపురించింది. నాడు జగన్ సర్కార్ పేదల కోసం కేటాయించిన దాదాపు రూ.11 కోట్ల విలువైన ఈ భూమిని ఒక ట్రస్టుకు ఎలా బదలాయిస్తారని లబ్ధిదారులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం మసీదు మాన్యంలో మాయ చేసినట్లుగానే ఇక్కడ కూడా భూమి ఖాళీగా ఉన్నట్లు రికార్డులు రూపొందించి, ఈ 20 ఎకరాలను ఆ ట్రస్టుకు కట్టబెట్టే ఎత్తుగడకు అధికార పార్టీ నేతలు తెర తీయడంపై మండిపడుతున్నారు. తమకు కేటాయించిన భూమిని ట్రస్టుకు ఎలా బదలాయిస్తారని లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన భూములు తమకే ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నర్సింగపురంలో స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు కట్టబెడుతున్న పేదల భూములుపేదల భూములే కనిపిస్తున్నాయా? హోటళ్లు, కళాశాలలు, పాఠశాలలు నిర్మించాలంటే ఎన్నో భూములుంటాయి. కానీ, మాలాంటి పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములే అధికారులకు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్ల స్థలం లేక ఇబ్బంది పడుతున్నాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇళ్ల స్థలాలిచ్చారు. అలాంటి భూములను ఇప్పుడు వేరే నిర్మాణాలకు కేటాయించడం దారుణం. దళితులకు అన్యాయం జరిగితే వారి కుటుంబాలు వీధుల పాలవుతాయి. వారి సొంతింటి కలను నాశనం చేయాలని చూడొద్దు. – దిమ్మల సత్తిబాబు, 30వ వార్డు, పిఠాపురం వెంటనే ఇళ్లు నిర్మించాలి నర్సింగపురంలో మాకు కేటాయించిన స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి. ఆ భూములను వేరొకరికి కట్టబెట్టాలని చూస్తే ఆందోళనకు దిగుతాం. మాకు అన్యాయం చేయకుండా, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఎదురు చూస్తూంటే.. ఉన్న స్థలాన్ని లాగేసుకోవాలని చూడటం దారుణం. ఇటువంటి చర్యలకు వెంటనే స్వస్తి చెప్పి, పేదలకు న్యాయం చేయాలి. – బీరా నాగేశ్వరరావు, ఒకటో వార్డు, పిఠాపురం పేదల పక్షాన పోరాటం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ కోసం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన నర్సింగపురం పేదల భూములను పాఠశాలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా.. ఇచ్చిన స్థలాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. నర్సింగపురంలో పేదలకు వెంటనే ఇళ్లు నిర్మించాలి. లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం. – వంగా గీత, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం ఈసారి నర్సింగపురం వంతు స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు పేదల భూములు 20 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విలువ సుమారు రూ.11 కోట్లు రోడ్డున పడనున్న 1,000 మంది లబ్ధిదారులు -
అందరికీ అందేనా!
● వేట నిషేధ భృతికి మత్స్యకారుల ఎదురుచూపులు ● నేడు నమోదు ప్రక్రియ ● బోట్లు, మత్స్యకారుల గుర్తింపుకాకినాడ రూరల్: మత్స్య సంపద పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ రెండు నెలలూ మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు. మత్స్య, ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణలో నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని కోల్పోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం రూ.20 వేల వేట నిషేధ భృతి ఇవ్వనుంది. ఈ మేరకు మైరెన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్కు సంబంధించిన మార్గదర్శకాలను మత్స్యశాఖ కమిషనర్ విడుదల చేశారు. దీనిని అనుసరించి జిల్లాలోని అన్ని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో బోటు ఓనర్ల సమక్షంలో వేట సాగించే మత్స్యకారుల నమోదును మత్స్యశాఖ అధికారులు పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈ క్రమంలో నిబంధనల సాకుతో వేట సాగించే వారి పేర్లు తొలగించకుండా అందరికీ ఆర్థిక సాయం అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇలా.. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో నేడు ఎన్యూమరేషన్. ఏప్రిల్ 19 – 22 మధ్య డేటా పరిశీలించి, పోర్టల్లో నమోదు. ఏప్రిల్ 23న సచివాలయాల్లో ప్రాథమిక జాబితా ప్రదర్శన. ఏప్రిల్ 23 – 25 మధ్య అభ్యంతరాల స్వీకరణ. ఏప్రిల్ 27న కలెక్టర్ తుది ఆమోదం. ఏప్రిల్ 30 లేదా ప్రకటించిన తేదీన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వేట నిషేధ భృతి విడుదల. ఇవీ అర్హతలు ఎంఎస్ చట్టం–1958 కింద ఈ నెల 14వ తేదీ నాటికి బోటు రిజిస్టరై ఉండాలి. వచ్చే జూన్ వరకూ చెల్లుబాటయ్యే ఫిషింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. బోట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిషింగ్ లైసెన్స్, క్రూ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకాల జిరాక్స్లు సమర్పించాలి. వీరు అనర్హులు 2025–26లో ఏపీఎంఎఫ్ఆర్ చట్టం కింద పెనాల్టీ పడిన బోట్లకు ఈ సాయం ఇవ్వరు. ఎన్టీఆర్ భరోసా (మత్స్యకార పెన్షన్) పొందుతున్న వారు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, 4 చక్రాల వాహనం ఉన్నవారికి ఈ భృతి ఇవ్వ రు. దీనికి గాను ఆరంచెల తనిఖీ చేస్తారు. బోట్ల వారీగా అనుమతించిన క్రూ (సభ్యుల) సంఖ్య కేటగిరీ కొలత అనుమతించిన సభ్యులు మెకనైజ్డ్ బోటు 18 మీటర్ల పైన 10 మెకనైజ్డ్ బోటు 18 మీటర్ల లోపు 8 మోటారైజ్డ్ బోటు ––– 6 సంప్రదాయ బోట్లు ––– 3 -
తేనెటీగల దాడిలో ఉపాధి హామీ కూలీలకు గాయాలు
కాకినాడ: జిల్లాలోని పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేసిన ఘటనలో ఐదుగురికి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ తేనెటీగల దాడిలో మొత్తం 24 మందికి గాయపడ్డారు. అందులో 19 మందికి స్వల్పంగా గాయపడగా, ఐదుగురి తేనెటీగల దాడి బారిన పడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి సామాజిక కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తుండగా, తీవ్రంగా గాయపడిన ఐదుగుర్ని మాత్రం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. -
తలుపులమ్మ పుట్టింటి సంబరాలకు సర్వం సిద్ధం
తుని రూరల్: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దేవత తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు గురువారం నుంచి జరగనున్నాయి. లోవ దేవస్థానం ఆధ్వర్యాన లోవ కొత్తూరులో జాగరణోత్సవాలు, తీర్థం, ఊరేగింపు నిర్వహించనున్నారు. అలాగే, పలు గ్రామాల్లో కూడా ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యాన గురువారం జాతరలు నిర్వహిస్తున్నారు. లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) పెన్మెత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో అధికారులతో పాటు ఆయా గ్రామ కమిటీలు ఈ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశాయి. గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరులో 13 రోజుల పాటు అమ్మవారి పుట్టింటి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల ఐదో తేదీన అమ్మవారి గరగలను సంప్రదాయంగా పుట్టధార జలాలతో శుద్ధి చేశారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఈఓ తెలిపారు. లోవ కొత్తూరు, లోవ దేవస్థానం గాలి గోపురం, జగన్నాథగిరి వద్ద నమూనా ఆలయాన్ని విద్యుద్దీపాలతో విశేషంగా అలంకరించారు. సంబరాలు జరుగుతాయిలా.. ఫ గురువారం నాడు లోవ దేవస్థానం నుంచి శక్తివేషాలు, కేరళ వాయిద్యాలు, కొమ్ము డ్యాన్సులు, చువ్వరాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా లోవ కొత్తూరు చేరుకుంటారు. రాత్రి ఒంటి గంట వరకూ గ్రామంలోని నాలుగు ఎకరాల అమ్మవారి ప్రాంగణంలో జాతర నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటల నుంచి నరసింహస్వామి నృత్యం, జాతర నృత్యరీతుల ప్రదర్శన, మణిపురి నృత్య ప్రదర్శన, ఇతర సంప్రదాయ నృత్యాలు, స్టేజ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఫ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గ్రామస్తులతో పౌరాణిక వేషధారణలు, బళ్లవేషాల ప్రదర్శనతో ఊరేగింపు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు భరతనాట్యం, ఇతర నృత్యాలు ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ గాయనీ గాయకులచే భక్తిరస సంగీత విభావరి, స్టేజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేశారు. ఫ గంధామావాస్య సందర్భంగా మండలంలో వి.కొత్తూరు, సీతయ్యపేట, కొత్త వెలంపేట, రాజుపేట, తాళ్లూరు, మర్లపాడు, కుమ్మరిలోవ, కోళ్లఫారం కాలనీ, జగన్నాథగిరి, గెడ్లబీడు తదితర గ్రామాల్లో గురువారం తలుపులమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించనున్నారు. టీవీ కళాకారులచే సంగీత విభావరి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, నృత్య ప్రదర్శనలు, బళ్లవేషాలు, తీర్థాలు ఏర్పాటు చేశారు. గ్రామ దేవత కావడంతో ఇప్పటికే వివిధ పట్టణాలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, ఆడపడుచులు, అల్లుళ్లు ఆయా గ్రామాలకు తరలివచ్చారు. ఫ నేడు జాగరణ ఫ రేపు ఊరేగింపు, తీర్థం ఫ లోవ దేవస్థానం ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు ఫ మరో 10 గ్రామాల్లో జాతరలు -
ఈసారైనా.. కళ కట్టేనా!
అన్నవరం: ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఏర్పాట్లలో చోటు చేసుకున్న లోపాలతో గత ఏడాది ఈ ఉత్సవాలు పెద్దగా కళ కట్టలేదు. ఈ ఏడాదైనా ఆ లోపాలను సరి చేసి, ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుభ వేడుకల నిర్వహణపై గురువారం రత్నగిరిపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. పెద్దాపురం ఆర్డీఓ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పెద్దాపురం డీఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నూతన ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు హాజరు కానున్నారు. ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం తరఫున చేపడుతున్న ఏర్పాట్లను ఈఓ ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో చేయాల్సిన ఇతర ఏర్పాట్లపై ఈ సమన్వయ సమావేశంలో చర్చించనున్నారు. వీటిపై దృష్టి పెడితే మేలు ఫ కల్యాణోత్సవాల మొదటి రోజున స్వామి, అమ్మవారిని వధూవరులను చేసే కార్యక్రమంలో తూతూమంత్రంగా నలుగురికి తాంబూలం ఇచ్చి మమ అనిపించేస్తున్నారు. ఈ కాార్యక్రమానికి వచ్చే మహిళలే 25 మందికి మించి ఉండరు. వారందరికీ తాంబూలం ఇస్తే సంతోషిస్తారు. ఫ ఈ నెల 27వ తేదీ రాత్రి 9.30 గంటలకు జరిగే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ, స్వామివారి వార్షిక కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో సుమారు 2 వేల మంది మాత్రమే కల్యాణాన్ని తిలకించే అవకాశం ఉంది. మిగిలిన వారు కూడా ఈ ఉత్సవాన్ని తిలకించేందుకువ వీలుగా ఆ షెడ్డుకు ఇరువైపులా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. ఫ ఆ రోజున ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. చిన్న, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకూ కొండ దిగువనే నిలిపివేయాలి. భక్తులను కొండ మీదకు తరలించేందుకు ఉచిత బస్సులు నడపాలి. ఫ కల్యాణానికి హాజరయ్యే భక్తులకు మంచినీరు, కల్యాణానంతరం అన్నదాన పథకంలో ఉచిత ఫలహారాన్ని రెండు మూడు చోట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫలహారం కూడా ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తే భక్తులు వాటిని తీసుకుని వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఫ కల్యాణానంతరం ఉచిత ప్రసాదం, తలంబ్రాలను ఒక్కచోట మాత్రమే పంపిణీ చేస్తూండటంతో భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది. స్వామివారి సర్కులర్ మండపంతో పాటు మరో రెండుచోట్ల పంపిణీ చేస్తే ఈ ఇబ్బంది తప్పుతుంది. ఫ పంపా జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 88 అడుగులు ఉంది. బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులకు తోడు, ఆయకట్టులో రబీ సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు నుంచి రోజుకు 50 క్యూసెక్కులు పంపాకు మళ్లిస్తున్నా వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో, రోజు రోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. కల్యాణోత్సవాల నాటికి ఇది మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కల్యాణోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవస్థానంలో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంది. దీంతోపాటు మే 1న స్వామివారి శ్రీచక్రస్నానం నిర్వహించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏలేరు నుంచి నీటి విడుదలను పెంచాలి. ఫ భక్తులు భారీగా రానున్నందున వారిని నియంత్రించేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను నియమించాలి. ఫ పశ్చిమ, తూర్పు రాజగోపురాల పరిసరాల్లో పార్కింగ్ స్థలాల వద్ద ఎక్కువ సంఖ్యలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ఫ ఈ నెల 30న సత్యదేవుడు, అమ్మవార్లను భారీ టేకు రథంపై కొండ దిగువన ఊరేగించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఫ గత ఏడాది మధ్యాహ్నం 3.30 గంటలకే రథోత్సవాన్ని ప్రారంభించడంతో ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ ఈ ఉత్సవాన్ని తిలకించేవారే లేరు. ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అందువలన ఈసారి రథోత్సవాన్ని సాయంత్రం 5 గంటల తరువాత ప్రారంభిస్తే మేలు. ఫ సత్యదేవుని శ్రీపుష్పయాగం అనంతరం మహిళలకు జాకెట్టు ముక్కల పంపిణీలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలి. గత ఏడాది లోపాలివీ.. గత ఏడాది సత్యదేవుని కల్యాణోత్సవాల నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రధానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ పేలవంగా ఉన్నాయనే అభిప్రాయం భక్తుల నుంచి వినిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది కల్యాణోత్సవాల సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం, పౌర్ణమి నాడు ప్రత్యంగిర హోమం నిర్వహించలేదు. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి, వైదిక కమిటీని వివరణ కోరారు. ఈసారి కొత్తగా ప్రతి శుక్రవారం ఉదయం ఖడ్గమాల పూజ కూడా ప్రారంభించారు. వీటన్నింటినీ ఈ ఏడాదైనా ఏ వివాదం లేకుండా నిర్వహిస్తారో లేక ఉత్సవాల సాకుతో నిలిపివేస్తారో వేచి చూడాలి. కల్యాణోత్సవాల చివరి రోజున శ్రీపుష్పయాగం నాడు ఊయలలో స్వామి, అమ్మవార్ల అలంకరణపై కూడా గతంలో విమర్శలు వచ్చాయి. ఈ లోపాలను ప్రస్తావిస్తూ ‘ప్చ్.. కళ కట్టలే..’ శీర్షికన అప్పట్లో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఆ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ మాట ఏమేరకు నిలబెట్టుకుంటారో చూడాలి. ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలపై నేడు సన్నాహక సమావేశం ఫ హాజరు కానున్న వివిధ శాఖల అధికారులు -
ఆక్వా కల్చర్పై మూడు రోజుల శిక్షణ
కాకినాడ రూరల్: ఏటిమొగలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ఎస్ఐఎఫ్టీ)లో ఆక్వా కల్చర్లో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ (మూలాలను గుర్తించే విధానం) ప్రాముఖ్యత అనే అంశంపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలపై రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులకు సాంకేతిక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ తరగతులను మత్స్యశాఖ కమిషనర్ రమా శంకర్ నాయక్ వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ఆక్వా చెరువుల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్వా పరిశ్రమ ప్రస్తుత స్థితిగతులను మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్, ఎస్ఐఎఫ్టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి వివరించారు. ఆక్వా సాగు దీర్ఘకాలం నిలకడగా కొనసాగాలన్నా.. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలన్నా ప్రామాణిక సర్టిఫికేషన్ తప్పనిసరని అన్నారు. ఆలిండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.రవికుమార్, ఈఐఏ అసిస్టెంట్ డైరెక్టర్ జోన్స్ వర్కీ తమ అనుభవాలను వివరించారు. మత్స్యశాఖ అధికారులు పి.కిరణ్కుమార్, దత్తాత్రేయ సమన్వయంతో శుక్రవారం శిక్షణ జరుగుతుంది. నేడు నూతన ఈఓ బాధ్యతల స్వీకరణ అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతన ఇన్చార్జి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావు ద్వారకా తిరుమల ఇన్చార్జి ఈఓగా బదిలీ అయిన విషయం తెలిసిందే. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఈఓ చక్రధరరావు సత్యదేవుని హుండీల ఆదాయం లెక్కింపును పర్యవేక్షించనున్నారు. సత్యదేవుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై సాయంత్రం జరిగే ప్రభుత్వ, దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కూడా పాల్గొంటారు. జయలక్ష్మీ సొసైటీపై నేడు విచారణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జయలక్ష్మీ సొసైటీలో జరిగిన అవినీతిపై సెక్షన్–29 విచారణ నివేదిక పైన, గంగిరెడ్డి త్రినాథరావు, 10 మంది డైరెక్టర్ల అవినీతి పైన గురువారం ఉదయం 11 గంటలకు సహకార అధికారులు విచారణ జరపనున్నారు. జయలక్ష్మీ విక్టిమ్స్ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి ఈరంకి రఘుభూషణ్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సొసైటీలో జరిగిన రూ.4.6 కోట్ల నష్టాన్ని ఏవిధంగా రికవరీ చేయలనే విషయంపై సహకార శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈ విచారణ చేస్తారని పేర్కొన్నారు. సెజ్లో మెటలర్జికల్ కోక్ ప్లాంట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: చైన్నెకి చెందిన గ్రీన్ కోక్ – ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ ఏరియాలో రూ.700 కోట్లతో భారీ మెటలర్జికల్ కోక్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. సంబంధిత అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై గ్రీన్ కోక్ – ఎనర్జీ ఎండీ నటరాజన్, కాకినాడ సెజ్ ఎండీ, సీఈఓ ఓజిలి రామ్రెడ్డి బుధవారం సంతకాలు చేశారు. సెజ్లో 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఉక్కు ఉత్పత్తిలో మెటలర్జికల్ కోక్ను కీలకంగా వినియోగిస్తారు. ఈ ప్లాంట్తో కాకినాడ జిల్లా తొండంగి, పిఠాపురం ప్రాంతాల్లో పారిశ్రామిక రంగం విస్తరించనుందని సెజ్ సీఈవో రామిరెడ్డి తెలిపారు. స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. 22న ‘నన్నయ’లో 20 వసంతాల వేడుక రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఏర్పడి 20 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈ నెల 22న 20 రకాల థీమ్స్తో వర్సిటీలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ 20 థీమ్స్కి 20 మందిని కన్వీనర్లుగా నియమించారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను నన్నయ వర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ బుధవారం విడుదల చేశారు. -
ప్రతిభ కార్పెంటర్ కుమార్తె
సాధారణ కుటుంబంలో పుట్టిన ఒంపోలు సత్య ప్రకాశిని కాకినాడ ఎంఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. ఫస్టియర్లో ఏకంగా 465 మార్కులు సాధించింది. ఆమె తల్లి కనకమహాలక్ష్మి గృహిణి. తండ్రి దుర్గాప్రసాద్ కార్పెంటర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కుమార్తెను చదివిస్తున్నారు. హైస్కూలు విద్యను స్థానిక ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ పాఠశాలలో చదివిన సత్య ప్రకాశిని గత ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో 577 మార్కులు సాధించింది. ఏమాత్రం ఒత్తిడి పడకుండా, నిరంతరాయంగా ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ ప్రోత్సాహం వల్లనే ఇంటర్లో మంచి మార్కులు సాధించానని ఆమె ఆనందంగా చెబుతోంది. బైపీసీలో జిల్లా టాపర్ పిఠాపురం రూరల్: పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని గంటా డెల్మా బైపీసీలో వెయ్యికి 985 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలిచింది. ఫ గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొర్ర అనూష 987 మార్కులతో ప్రభుత్వ కళాశాలల నుంచి జిల్లా టాపర్గా నిలిచింది. -
24¯]l M>MìS-¯éyýl ˘ బార్ ఎన్నికలు
కాకినాడ లీగల్: ఈ నెల 24న కాకినాడ బార్ అసోసియేషన్కు 2026–27 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సీఈవో టీపీఆర్ చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. వివిధ పదవులు పోటీ చేయడానికి జాబితా విడుదల చేశారు. అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్మి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, కోశాధికారి, మహిళా ప్రతినిధి, సూపర్ సీనియర్ కమిటి మెంబర్, సీనియర్ కమిటీ మెంబర్, మహిళా కమిటీ మెంబర్, కమిటీ మెంబర్స్, ఎగ్టిక్యూటివ్ మెంబర్లకు సీనియార్టీ ప్రకారం పోటీ చేసుకోవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 15,16,17 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలకు 1,039 మంది ఓటు అర్హత కలిగి ఉన్నారన్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. నేడు ఇంటర్మీడియెట్ ఫలితాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్–26 ఫలితాలు బుధవారం అమరావతిలో విడుదల చేస్తున్నట్టు పీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం 20,120, ఒకేషనల్ 1,891 మంది, ద్వితీయ సంవత్సరం 19,442, ఒకేషనల్ పరీక్షలు 1,443 మంది రాశారని తెలియజేశారు. ఫలితాల విడుదల అనంతరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు ’దివీస్’ విరాళం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాకినాడ ఒంటిమామిడికి చెందిన దివీస్ ల్యాబ్రేటరీస్ లిమిటెడ్ సంస్థ రూ.3.10 కోట్ల విలువైన వస్తువులను విరాళంగా అందించినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా 500 పరుపులను జిల్లాలో గల నాలుగు బీసీ హాస్టల్కు అందించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని మంగళవారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 8,500 మంది విద్యార్థులకు అవసరమైన వస్తువులను దివీస్ ల్యాబ్రేటరీస్ అందించడం అభినందనీయమన్నారు. పరుపులు, ఎల్ఈడి ట్యూబ్ లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు, దోమతెరలు, ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లను రూ.3.10 కోట్లతో సమకూర్చారన్నారు. గృహోపకరణాల దగ్ధం తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో మంగళవారం రాత్రి రెడ్డి నాగరాజు ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీతో పాటు ఏసీ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
ముమ్మిడివరం: నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి (డీటీవో) దేవిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న 23 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, అత్యవసర ద్వారం, ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్కు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు క్షేమంగా బయటపడే మెళకువలను బస్సులో ప్రయాణికులకు వివరించారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
కొత్త ఈఓ ‘చక్ర’ం తిప్పగలరా?
● రత్నగిరిపై స్వాగతం పలుకుతున్న సమస్యలు ● ఐదేళ్లుగా అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా నియమితులైన వాడపల్లి ఈఓ ఎన్ఎస్ చక్రధర్రావుకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, శానిటేషన్ సమస్య, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, త్వరలో జరుగనున్న స్వామివారి కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు వంటివి కొత్త ఈఓకు చాలెంజ్గా మారనున్నాయి. క్లిష్టంగా పరిస్థితి ఒకప్పుడు అనుభవం గలిగిన సిబ్బంది, మిగులు ఆదాయంతో కళకళలాడిన దేవస్థానంలో నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన చాలామంది సిబ్బంది పదవీ విరమణ చేశారు. మిగిలిన సిబ్బందిలో కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించే చొరవ, అనుభవం లేకపోవడంతో తూతూ మంత్రంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం భక్తుల నుంచి వినిపిస్తోంది. వార్షికాదాయం రూ.157 కోట్లు 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం ఆదాయం రూ.157 కోట్లు వచ్చింది. 2026–27 దేవస్థానం బడ్జెట్ రూ.180 కోట్లుగా ఖరారు చేశారు. ఐదేళ్ల క్రితమే దేవస్థానం ఆదాయం సుమారు రూ.150 కోట్లు. పది శాతం చొప్పున పెరిగినా ఈ ఐదేళ్లలో రూ.200 కోట్లుకు చేరుకోవాలి. కాని ఆ మేరకు పెరగలేదు. ఆదాయం పెరగకపోవడంతో బడ్జెట్ కూడా పెరగలేదు. కీలక అధికార్లదీ ప్రేక్షక పాత్రే ఇక్కడ కీలకంగా బాధ్యతలు నిర్వహించాల్సిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, ఏ వ్యవహారమైనా చక్కదిద్దే భాధ్యత ఈఓ మీదనే ఉండడం తదితర కారణాల వల్ల గతంలో ఇక్కడ పనిచేసిన ఈఓలు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 220 మంది రెగ్యులర్ సిబ్బంది... వేయికి పైగా తాత్కాలిక సిబ్బంది దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది 220 మంది ఉంటే ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేయి కి పైగా ఉన్నారు. రెగ్యులర్ సిబ్బందిలో కూడా దాదాపు సగం మంది కారుణ్య నియామకాల ద్వారా నియమితులైనవారే. కీలకమైన పోస్టులలో కూడా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందినే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవస్థానంలో ఒక ఏఈఓ, నాలుగు సూపరిండెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో పది రోజుల్లో కల్యాణోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గురువారం కో ఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. పెరిగిన రాజకీయ జోక్యం దేవస్థానంలో ప్రతీ విషయంలో ప్రజాప్రతినిధుల అనుమతి తప్పనిసరి అనే ధోరణి ప్రబలింది. దీంతో చిన్న స్థాయి ఉద్యోగిని మరో సెక్షన్కు బదిలీ చేయాలన్నా ఈఓ సొంతంగా చేయలేని పరిస్థితి. ఈ పద్ధతి మారకపోతే ఇబ్బందే. ప్రోసీడింగ్స్ ఇచ్చాక బాధ్యతల స్వీకరణ మంగళవారం అంబేడ్కం జయంతి కావడంతో దేవదాయశాఖ కమిషనర్ ప్రోసీడింగ్స్ పంపించ లేదు. బుధవారం ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు. అవి రాగానే ఈఓ బాధ్యతలు స్వీకరిస్తారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
కిర్లంపూడి: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వజరీ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. మంగళవారం కిర్లంపూడిలోని ఎస్సీపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత పెద్దలు, గ్రామస్తులు, అంబేడ్కర్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్చేసి స్వీట్స్ పంచారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన బీఆర్ అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను మన దైనందిన జీవితంలో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే కేవలం ఆయన చేసిన కృషి వల్లనే అని తెలిపారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం -
ఆటుబోట్లు!
ఏటా మాదిరిగానే చేపల వేటకు విరామం ప్రారంభమైంది. నిత్యం గంగమ్మ ఒడిలో గడిపిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. వేటకే కాదు ఇటు ఐస్ ఫ్యాక్టరీల నిర్వహణకు, ఆయిల్ అమ్మకాలకు బ్రేక్ పడింది. నిత్యం చేపలు రవాణా చేసే వందలాది వాహనాలు ఉప్పాడ సాగర తీరానికి దూరమయ్యాయి. చేపల క్రయ విక్రయాలతో కళకళలాడిన సాగర తీరం బోసిపోనుంది. – పిఠాపురం ఒడ్డుకు చేరుతున్న బోట్లు ఒడ్డుకు చేరిన బోట్లు -
సహకారాలు.. మిరియాలు
● డీసీసీబీలో నామినేటెడ్ చిచ్చు ● గత ఏడాది చైర్మన్ నియామకం ● ఇప్పటి వరకూ డైరెక్టర్ల ఊసే లేదు ● మండిపడుతున్న ఆశావహులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: సిద్ధాంత వైరుధ్యాలున్నప్పటికీ.. అధికారమే పరమావధిగా.. పదవులే పరమార్థంగా.. పరస్పర ప్రయోజనాల కోసం ఎన్నికల్లో సహకరించుకున్న కూటమి నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆశించిన పదవులు దక్కకపోవడంతో అగ్రనేతలపై వారు కారాలు, మిరియాలు నూరుతున్నారు. కూటమిని గద్దెనెక్కించేందుకు రేయింబవళ్లు పార్టీ జెండాలు భుజాన మోశామని.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవుల పందేరంలో ప్రాధాన్యం ఇస్తామంటే నిజమేననుకున్నామని.. తీరా చూస్తే ఇప్పుడు మొండిచెయ్యి చూపిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్ పదవులపై ఆశ పెట్టుకున్న వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏం జరిగిందంటే.. కాకినాడ కేంద్రంగా ఉన్న డీసీసీబీ సుమారు రూ.6 వేల కోట్ల వార్షిక టర్నోవర్తో నడుస్తోంది. దీని పరిధిలో 298 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇవి సుమారు నాలుగైదు లక్షల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సుమారు 2.90 లక్షల మంది రైతులు ఖాతాదారులుగా ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న డీసీసీబీ చైర్మన్గా జిల్లాలోని మెట్ట ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు)ని గత ఏడాది జూలై నెలలో నామినేట్ చేశారు. వాస్తవానికి ఈ పదవి కోసం టీడీపీలోనే తీవ్ర స్థాయిలో పోటీ జరిగింది. అయితే, జిల్లాలోని పిఠాపురం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో.. పదవుల పందేరంలో జనసేనకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ పదవి ఆశించి, భంగపడిన తెలుగు తమ్ముళ్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయినప్పటికీ వారి విన్నపాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ పదవిని జనసేనకే చంద్రబాబు కట్టబెట్టారు. ఊరించి.. ఉసూరుమనిపించి.. మరోవైపు పీఏసీఎస్లకు గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించ లేదు. ప్రత్యామ్నాయంగా కూటమి పార్టీల నేతల్లో ఒకరు చైర్మన్గా, మరో ఇద్దరు సభ్యులుగా త్రీమెన్ కమిటీలను నియమించింది. వీరి నుంచి కూడా తమకు డీసీసీబీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నియామకాలు జరగకపోవడంతో డీసీసీబీలో ప్రతి ఆరు నెలలకోసారి జరిగే పాలకవర్గ సమావేశంలో పీఏసీఎస్ల స్థాయిలో ఇవ్వాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక పంట రుణాలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులిస్తామని రెండేళ్లుగా ఊరించి, చివరకు ఉసూరుమనింపించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణ కర్తవ్యంపై మూడు పార్టీల్లోని ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా...డీసీసీబీలో చైర్మన్ కాకుండా 10 నుంచి 20 మందిని డైరెక్టర్లుగా నియమించే చాన్స్ ఉంది. చైర్మన్గా తుమ్మల బాబు నియామకం జరిగి దాదాపు 10 నెలలు కావస్తోంది. కానీ, ఇప్పటి వరకూ ఒక్కరిని కూడా డీసీసీబీలో డైరక్టర్గా నియమించలేదు. దీనిపై కూటమి మూడు పార్టీల్లోని ఆశావహులు మండిపడుతున్నారు. పాలకవర్గంలో బెర్త్ కోసం ఆశల పల్లకీలో ఊరేగిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చైర్మన్ పదవి దక్కిన తరువాత డైరెక్టర్ల నియామకంపై తుమ్మల బాబు కనీసంగా కూడా దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. డీసీసీబీ పాలకవర్గ సభ్యులుగా నియమిస్తామంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు తమకు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని అసంతృప్తివాదులు కన్నెర్ర చేస్తున్నారు. చైర్మన్ను నియమించి, డైరెక్టర్లను నియమించకుండా చేతులు దులిపేసుకుంటారా అని మూడు పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జనసేన కోటాలో చైర్మన్ నియమించేస్తే సరిపోతుందా? టీడీపీ, బీజేపీల్లోని ఆశావహుల పరిస్థితేమిటో ఆలోచించనవసరం లేదా అని పార్టీ నేతలను క్షేత్ర స్థాయిలో నిలదీస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవిని ప్రతి ఆరు నెలలకోసారి రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రెన్యువల్ చేశారు. కానీ, డైరెక్టర్లను నియమించడానికి మాత్రం చంద్రబాబుకు చేతులు రావడం లేదని ఆశావహులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూటమిలోని మూడు పార్టీల నుంచి డజను మందికి పైగా ఆశావహులు డీసీసీబీ డైరెక్టర్ పదవులను ఆశిస్తున్నారు. వారందరూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల లేఖలతో సిఫారసులు కూడా చేయించుకున్నారు. ఆ లేఖలు ఇచ్చినా, పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఫ వసంతంలోనే ‘సన్’స్ట్రోక్
ప్రస్తుతం వసంత రుతువు నడుస్తోంది. గ్రీష్మం ఇంకా రానేలేదు.. అప్పుడే కొద్ది రోజులుగా మార్తాండుడు ఆకాశ వీధి నుంచి అగ్నివర్షం కురిపిస్తున్నాడు. జిల్లాలోని కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని తదితర ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండలకు తోడు.. సముద్ర తీర ప్రాంతం కావడంతో తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే చాలు.. సూర్యుడి ప్రతాపానికి తాళలేకపోతున్నారు. మధ్యాహ్నమైతే చాలు.. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తప్పనిసరిగా రాకపోకలు సాగిస్తున్న వారు నానా ఇక్కట్లూ పడుతున్నారు. కొబ్బరి బొండాలు, చెరకు రసాలు తాగుతూ, తాటిముంజెలు తింటూ పలువురు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక పలువురు కూలీలు జీవనోపాధికి సైతం దూరమవుతున్న దుస్థితి నెలకొంది. వేసవి తాపంతో డీహైడ్రేషన్కు గురై పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మరోవైపు పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో నిలువ నీడ లేక, తాగేందుకు గుక్కెడు నీరు దొరకక మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు ఏవిధంగా పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. – పిఠాపురం/కాకినాడ రూరల్ -
పీజీఆర్ఎస్కు 437 అర్జీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 437 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. వీటిని గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనులు వేగవంతం చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, కాలువలు, చెరువులు, నీటికుంటలు, తాగునీటి పనులు, భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 ఏప్రిల్లో 11.40 లక్షల పని దినాలు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. జలజీవన్ మిషన్ కింద 1,007 పనులను రూ.49,859.42 లక్షల అంచనాతో చేపట్టగా ఇప్పటి వరకూ 581 పూర్తయ్యయన్నారు. 426 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇంటింటికీ కుళాయి అందించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గడువులోగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డ్, ఇతర కార్యక్రమాల కింద చేపట్టిన రోడ్లు, హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. చేనేత సమస్యలు వెంటనే పరిష్కరించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన చేనేతల ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నందున జీవనోపాధిని కాపాడుకోవడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యమని అన్నారు. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని, సహకార సంఘాలకు నిరంతర పని కల్పించాలని, రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది కనీసం రూ.1,000 కోట్లు కేటాయించాలని, చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల హామీగా ప్రకటించిన నేతన్న భరోసా కింద రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని, చేనేత సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన రూ.2,003 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, చేనేత, జౌళి శాఖలో అక్రమాల నేపథ్యంలో కమిషనర్ రేఖారాణిని వెంటనే సస్పెండ్ చేయాలని దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. -
ఆస్పత్రికి బయల్దేరి.. అనంత లోకాలకు..
● డ్రైనేజీలో పడి తల్లీకొడుకుల మృతి ● రాయుడుపాలెం సబ్ స్టేషన్ వద్ద ప్రమాదం కాకినాడ రూరల్: అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లికి చికిత్స చేయించాలనుకున్నాడు.. ఆమెను తీసుకుని మోటార్ సైకిల్పై బయలుదేరాడు.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో సహా అనంత లోకాలకు పయనమైపోయాడు. కాకినాడ రూరల్ రమణయ్యపేట శివారు రాయుడుపాలెం జంక్షన్ సమీపాన తల్లీకొడుకులిద్దరూ దుర్మరణం పాలైన ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలివీ.. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన దాసరి సత్యనారాయణ, లక్ష్మి (50) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. సత్యనారాయణ కొబ్బరి కాయల వ్యాపారం చేస్తూంటారు. కుమార్తెకు వివాహమైంది. కొద్ది రోజులుగా లక్ష్మి భుజం నొప్పితో బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను కాకినాడలోని ఆస్పత్రిలో చూపించేందుకని చిన్న కుమారుడైన దుర్గా గణపతి (28) సోమవారం సాయంత్రం బైక్పై బయలుదేరాడు. రాయుడుపాలెం సబ్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి వారి బైక్ అదుపు తప్పి, రోడ్డు పక్కనే 4 అడుగుల లోతున ఉన్న మురుగు నీటి డ్రైనేజీలోకి నేరుగా దూసుకుపోయింది. మురుగు నీటిలో బైక్తో సహా కూరుకుపోయిన తల్లీకొడుకులను కొద్దిసేపటి వరకూ ఎవ్వరూ గమనించలేదు. ఆలోగా అధిక మొత్తంలో మురుగు నీరు వారి కడుపులోకి చేరిపోయింది. పది నిమిషాల తరువాత స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తల్లీ కొడుకులను బయటకు తీశారు. ఆ తరువాత బైక్ను తాళ్లతో బయటకు తీశారు. కాలువ నుంచి బయటకు తీసే సమయానికి తల్లీ కొడుకులిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారు. ఆస్పత్రికి వెళ్తున్నామని స్థానికులకు చెప్పారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని పవర వద్ద ఉన్న ట్రినిటీ ఆస్పత్రికి బాధితులను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీ కొడుకులిద్దరూ మృతి చెందారు. దుర్గా గణపతి తాపీ పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనతో చిత్రాడ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సర్పవరం ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలం వద్ద అందుబాటులో ఉన్న సీసీ టీవీల ఫుటేజీని సేకరిస్తున్నామని, మృతదేహాలను మంగళవారం జీజీహెచ్కు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. సంఘటన స్థలంలోని డ్రైనేజీ వద్ద ప్రమాదానికి గురైన బైక్ మురుగు కాలువలో కూరుకుపోయిన బైక్ -
అన్నవరం దేవస్థానం ఇన్చార్జి
ఈఓగా చక్రధరరావు ద్వారకా తిరుమల ఇన్చార్జిగా త్రినాథరావు బదిలీ అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇన్చార్జి ఈఓగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం ఈఓ ఎన్ఎస్ చక్రధరరావు పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్లాల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) వి.త్రినాథరావు నాలుగు నెలలుగా అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. ప్రస్తుతం ఇన్చార్జి ఈఓగా నియమితులైన చక్రధరరావు గత కార్తిక మాసంలో సత్యదేవుని తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణ తదితర కార్యక్రమాలకు నియమించిన ప్రత్యేక అధికారుల్లో ఒకరిగా ఇక్కడ సేవలందించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావి చెట్టు మొదట్లో వెలిగించే దీపాల సెగ వలన చెట్టుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చినపుడు దీనికి ఆయనే పరిష్కారం సూచించారు. వాడపల్లి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా చెట్టుకు దూరంగా ఇనుప ర్యాక్లపై దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు. ఆ మేరకు అక్కడి నుంచి ర్యాక్లు తీసుకువచ్చారు. కార్తికం తరువాత అన్నవరం దేవస్థానం అధికారులు సొంతంగా ఇనుప ర్యాక్లు తయారు చేయించి చెట్టు చుట్టూ ఏర్పాటు చేశారు. దీంతో రావి చెట్టుకు దీపాల సెగ తప్పింది. చక్రధరరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
● కత్తులతో దాడులు ● ఒకరి మృతి ● నలుగురికి తీవ్ర గాయాలు ● ముకులూరులో ఘటన రౌతులపూడి: సబ్ప్లాన్ ఏజెన్సీ ప్రాంతం రాఘవపట్నం శివారు ముకులూరులో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ముకులూరుకు చెందిన జర్తా గంగరాజుకు అదే గ్రామంలో జీడిమామిడి తోట ఉంది. ఆ తోటలోని జీడిగింజలను అతడి కుమారుడు దొంగిలించాడు. అయితే, సరిహద్దు తోటల రైతులైన గోము రమణ, జర్తా ఎర్రబ్బాయి, ముర్ల చినబ్బాయి తదితరులే తన తోటలోని జీడిగింజలను దొంగిలించి ఉంటారని గంగరాజు అనుమానపడ్డాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి వారి ఇళ్లకు వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గోము రమణ, అతడి భార్య కోటమ్మ, వియ్యంకుడు జర్తా ఎర్రబ్బాయి, ముర్ల చినబ్బాయి తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్మాదిగా మారిన గంగరాజు.. గ్రామంలో అడ్డు వచ్చిన వారందరిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమణ, ఎర్రబ్బాయి, చినబ్బాయిలు అతడిని ప్రతిఘటించి, తిరిగి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గంగరాజు విపరీతంగా రక్తస్రావమై, అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను తొలుత రౌతులపూడి సీహెచ్సీకి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి 108లో తరలించారు. రౌతులపూడి ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
దిగిరాకుంటే ఆమరణ దీక్షలు
సామర్లకోట: న్యాయమైన డిమాండ్ల సాధనకు నేతన్నలు సోమవారం నుంచి రోడ్డు ఎక్కనున్నారు. ఇందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ బయట చేనేతల ఆత్మ గౌరవ దీక్షకు సమాయత్తమవుతున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న విజ్ఞప్తులను, ఉద్యమాలను పట్టించుకోకపోవడంతో వారి హక్కుల సాధనకు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ దీక్షలు చేయాలని నిర్ణయించినట్టు పెద్దాపురం పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్టా రాజబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే పెద్దాపురం ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు మాట్లాడుతూ చేనేత రంగానికి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేటు, సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు ఇవే ● చేనేత సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ● ఆప్కో చేనేత సహకార సంఘాలకు ముడిసరకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని కల్పించాలి. ● సహకార సంఘాల వద్ద ఉన్న వస్త్ర నిల్వలనను ఆప్కో కొనుగోలు చేయాలి. ● చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహింలి. ● ఎన్నికై న ప్రతినిధులు ప్రభుత్వానికి నేతన్నలకు వారధిలా ఉండి సమస్యలు పరిష్కరించాలి. ● ఆప్కో ఎండీ రేఖారాణిని వెంటనే బదిలీ చేయాలి.● నేటి నుంచి చేనేత ఆత్మ గౌరవ దీక్ష ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -
పుష్కర పనులకు రూ.863 కోట్లు
● దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ● రత్నగిరిపై శ్రీసీతారామ సత్రానికి శంకుస్థాపన ● రూ.11.4 కోట్ల వ్యయంతో 105 గదుల నిర్మాణం అన్నవరం: వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం రత్నగిరిపై రూ.11.40 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో 105 గదులతో నిర్మించనున్న శ్రీసీతారామ సత్రం మొదటి బ్లాక్కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలసి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.3 కోట్ల వ్యయంతో మొదటి ఘాట్ రోడ్డు నుంచి సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన రెండో మెట్ల దారిని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేవదాయ శాఖ తరఫున గోదావరి పుష్కరాలకు రూ.863 కోట్ల వ్యయంతో 715 నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వాటిలో కాకినాడ జిల్లాలోనే రూ.51.70 కోట్ల వ్యయంతో 43 పనులకు టెండర్లు పిలిచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాలపై సోమవారం రాజమహేంద్రవరంలో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిన అధికారులు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైనందున వారు వచ్చాక ఈ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ధూప దీప నైవేద్యాలకు రూ.70 కోట్లు ధూప దీప నైవేద్యాల కింద రాష్ట్రంలో 5,821 గుళ్లకు రూ.70 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి ఆనం తెలిపారు. రూ.200 కోట్ల కామన్ గుడ్ ఫండ్ నిధులతో 194 చిన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఐదువేల భజన మండళ్లకు రూ.700 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సమావేశంలో దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు, దేవదాయశాఖ సీఈ జీవీ శేఖర్, అన్నవరం దేవస్థానం ఈఈలు నూకరత్నం, వి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.భోజనంలో సత్యదేవుని ప్రసాదం పెట్టండి దేవదాయశాఖా మంత్రి ఆనం ఆదేశం పారిశుధ్యం, వేతన బకాయిలపై ‘పద్మావతి’ సంస్థపై ఆగ్రహం సాక్షి వరుస కథనాలపై కమిషనర్కు సూచనలు అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామి వారి గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టాలని దేవదాయ, ధర్మదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆదివారం ‘సాక్షి’లో ‘అమాత్యా....మొరాలకించవా..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. సత్యదేవుని అన్నప్రసాద పథకంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని భక్తులు కోరడంపై గతంలో పెట్టిన ప్రసాదాన్ని ఎందుకు తీసేశారని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు బదులిస్తూ కొందరు వడ్డించిన ప్రసాదాన్ని వదిలేస్తున్నారని వివరించారు. దీనికి మంత్రి మాట్లాడుతూ భక్తులను అడిగే ప్రసాదం పెట్టాలని సూచించారు. వారం రోజుల పాటు భోజనంతో పెట్టి భక్తుల అభిప్రాయాలు కోరాలని, తరువాత స్థానిక ఎమ్మెల్యేతో పథకాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పారిశుధ్యంపైనా.. అలాగే అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ.80 లక్షలు వెచ్చిస్తున్నా అక్కడి అధ్వాన పరిస్థితులపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంపైనా మంత్రి స్పందించారు. పద్మావతి సంస్థ పనితీరుపైన, నాసిరకం శానిటరీ మెటీరియల్ పైన, వాషింగ్ మెషీన్ మరమ్మతులపైనా తనిఖీలు చేపట్టి కమిషనర్ రామచంద్రమోహన్కు నివేదించాలని ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ శేఖర్ను ఆదేశించారు. అలాగే వేతన బకాయిలపై శనివారం ‘సాక్షి’ ‘సత్యదేవా సాపాట్లు కనవా..!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కూడా స్పందిస్తూ సత్వరం వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కమిషనర్ జోక్యం చేసుకుని ప్రతి నెలా ఐదో తేదీ లోపు కాంట్రాక్టర్ నుంచి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
బతుకు నావకు లంగరు!
17న బోట్ల గుర్తింపు చేపల వేటకు విరామం అమలులోకి వచ్చాక 17వ తేదీ నుంచి వేట నిషేధ భృతి కోసం మత్స్యకార లబ్ధిదారుల గుర్తింపు చేపడతాం. ఆ సమయంలో బోట్తో పాటు మత్స్యకారులు (క్రూ) ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకురావల్సి ఉంటుంది. వేట నిషేధ కాలంలో చేప గుడ్లు పెట్డడం ద్వారా పునరుత్పత్తి జరుగుతుందని మత్స్యకారులు సహకరించాలన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టి చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. చేపల అమ్మడం గాని, ప్యాకింగ్ గాని చేయరాదు. ఐస్ విక్రయించకూడదు. – కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, కాకినాడ● రేపు అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం ● జూన్ 14 వరకు అమలు ● విరామ సమయంలో వేట నిషేధ భృతి ● పగ్గాలు చేపట్టిన ఏడాదే ఎగవేసిన కూటమి ప్రభుత్వం ● తరువాతి సంవత్సరంలో 990 మందికి కోత కాకినాడ రూరల్: సముద్ర జలాల్లో చేపల వేటకు రెండు నెలల పాటు విరామం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు, రొయ్యల పునరుత్పత్తి సజావుగా సాగడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏటా బంగాళాఖాతంలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం అమలు చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖకు జీవో 88 ద్వారా వెల్లడించారు. మత్స్యశాఖ అధికారుల సహకారంతో బుధవారం నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు దాదాపు 61 రోజుల పాటు వేట నిషేధం అమలుకానుంది. జిల్లాలోని తొండంగి మండలం నుంచి తాళ్లరేవు వరకు సుమారు 94 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో ఆరు తీర ప్రాంత మండలాలలో 58 మత్స్యకార హేబిటేషన్లు ఉండగా సుమారు 1,95,184 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో చేపల వేట ద్వారా సుమారు 29 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. చేపల వేటకు 392 మెకనైజ్డ్, 3993 మోటరైజ్డ్, 238 సంప్రదాయ బోట్లు కలిపి సుమారుగా 4623 బోట్లు వినియోగిస్తున్నారు. ఒడిశా నుంచి కన్యాకుమారి వరకు.. బంగాళాఖాతంలో ఒడిశా నుంచి కన్యాకుమారి వరకు వేట నిషేధం అమలులో ఉంటుంది. జిల్లాలో తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, తాళ్లరేవు మండలాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో మత్స్యకారులు వేట ముగించుకుని ఒడ్డుకు చేరున్నారు. ఇప్పటికే అధికారులు వేట నిషేధం అమలుపై సంబంధిత ప్రాంతాల్లో ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.10వేల ‘భరోసా’ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి వేట విరామ భృతిగా రూ.10 వేలు చొప్పున అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో వేట నిషేధ భృతి రూ.4 వేలు మాత్రమే ఉండేది. లబ్ధిదారులు గుర్తింపు ఇలా మత్స్యకారులు వేట విరామ భృతి పొందేందుకు మెకనైజ్డ్ బోట్కు (18 మీటర్ల పొడవు ఉండాలి) యజమానిని మినహాయించి 8 మంది అర్హులు. అలాగే 18 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న మెకనైజ్డ్ బోట్కు యజమానిని మినహాయించి పది మందికి, మోటరైజ్డ్ బోట్లుకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులు అర్హులు. బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు, షిప్పింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్ను గుర్తింపు సమయంలో అందజేయాల్సి ఉంది. 2024లో భృతి ఎగవేత 2025లో 990 మందికి మొండిచేయి మత్స్యకార మిత్రగా గొప్పగా చెప్పుకొనే కూడమి నేతలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదే మత్స్యకారులకు వేట నిషేధ భృతిని ఎగ్గొట్టారు. ఎన్నికలకు ముందు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తొలి ఏడాది ఇవ్వకుండా ముఖం చాటేశారు. 2025లో మాత్రం మొత్తం లబ్ధిదారులు 25,752 మంది కాగా బాంకు ఖాతాలు ఆధార్కు లింక్ అవ్వలేదన్న సాకుతో సుమారు 24,762 మందికి మాత్రమే సుమారు రూ.49.53 కోట్ల వరకు అందజేసింది. -
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 20 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,195, పూజా టికెట్లకు రూ.1,57,020, కేశఖండన శాలకు రూ.12,160, వాహన పూజలకు రూ.9,500, కాటేజీలు, వసతి గదులు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.68,535, విరాళాలు రూ.40,262, వెరసి మొత్తం రూ.4,84,163 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు. రత్నగిరికి భక్తుల తాకిడి సత్యదేవుని దర్శించిన 40 వేల మంది అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తా రు. రత్నగిరితో పాటు పలు ప్రాంతాలలో శనివా రం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహా లు చేసుకున్న నవ దంపతులు, వారి బందుమిత్రులతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల సత్యవ్రతాలు జరిగా యి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాల య దర్శనానికి అరగంట పట్టింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లిఅయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకదశ రుద్రాభిషేకాల్లో 46 మంది పాల్గొన్నారు. 26 మంది భక్తులు శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎనిమిది మంది చిన్నారులకు అక్షరభ్యాసం, తొమ్మిది మంది పిల్లలకు తులాభారం వేశారు. 2,664 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,87,185 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
మధురఫలం.. మరింత ప్రియం
● ఆలస్యమైన మామిడి దిగుబడి ● తుని మామిడికి ఎనలేని డిమాండ్ ● ప్రారంభమైన ఎగుమతులు ● ఉమ్మడి జిల్లాలో 15,362 హైక్టార్లలో సాగు తుని: మండు వేసవికి మధుర ఫలానికి అవినాభావ సంబంధం. ఉష్ణం ఉష్ణేన సీతలే అని వేసవి ఉడుకుకు మామిడిని మితంగా తింటే చలవ చేస్తుందంటారు. అందులోనూ తుని మామిడి అంటే తిని తరించాలంతే అంటారు ఆ ప్రాంత వాసులు. మూడు తరాలుగా మామిడి పండ్ల వ్యాపారం చేస్తూ.. రెండేళ్లుగా విదేశాలకు సైతం ఉద్యానశాఖ ద్వారా ఎగుమతులు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక్కడి మామిడి రైతులు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులతో మామిడి దిగుబడులు తగ్గడంతో వ్యాపారం కాస్త తగ్గుతుందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. తుని సబ్ డివిజన్లో 3458 హైక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణ రేఖ, పంచదార కంచి, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లలకు ఎంతో డిమాండ్. గతంలో ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు 60 వేల టన్నులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం దిగుబడి 10,374 టన్నులు ఉందని, ఉద్యానశాఖ అంచనాల ప్రకారం రూ.24 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనా. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్యానశాఖ 3500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది ఇతర రాష్ట్రాలకు.. ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్య ప్రదేశ్, బీహర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఇక్కడి మామిడిని ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం సువర్ణరేఖ టన్ను రూ.55 వేలు, బంగినపల్లి, రసాలు టన్ను రూ.45 వేలు, తోతాపురి టన్ను రూ.35 వేలు పలుకుతోంది. పండూరు, కొత్తపలి కొబ్బరి రకాల ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది కొంచెం ఆలస్యం మామిడి ఎగుమతులు ఉగాది నుంచి ప్రారంభం కావాలి. ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడం, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి దగ్గింది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందలేదు. దీంతో ఇక్కడి పండ్లను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. – పి.వెంకటరమణ, మామిడి ఎగుమతిదారుడు,తుని. నేల స్వభావంతో రుచి తుని ప్రాంతం నేల మామిడికి అనుకూలం. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ఇక్కడి మామిడికి రంగు, రుచి, వాసన బాగుంటాయి. పండు నాణ్యత కోసం ఫ్రూట్ కవర్ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కట్టాలి. దింతో నాణ్యత, సైజు, రంగు బాగుటుంది. చీడ పీడలు వ్యాపించవు. సబ్ డివిజన్ పరిధిలో 100 హెక్టార్లలో కవర్లు కట్టించాం. ప్రస్తుతం పక్వానికి వచ్చిన 10 రోజుల్లో వీటిని దింపి ఎగుమతి చేస్తారు. మాకు ఉన్న అంచనా ప్రకారం ఏరకమైనా టన్ను రూ.45 వేలు నుంచి 80 వేలు వరకు ధర ఉంటుంది. – సుజాత, ఉద్యానశాఖ అధికారి,తుని -
ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు
ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రమవుతుండడంతో ఏలేరు జలశయంలో నీటినిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి నీటి సరాఫరా అంతంతమాత్రంగా ఉండడంతో దిగువ ఆయకట్టుకు నీటి సరాఫరా తగ్గించారు. శనివారం నాటికి ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.38 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.58 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి దిగువ ఆయకట్టుకు 600, విశాఖకు 225, పంపాకు 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి సరాఫరా నిలిపివేశారు. సీతారామ సత్రానికి రూ.5 లక్షల విరాళం తొలి విడతగా రూ.2.6 లక్షలు అందజేత అన్నవరం: రత్నగిరిపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రంలో ఒక గది నిర్మాణానికి కర్నూలుకు చెందిన ఎల్.రవీంద్రారెడ్డి దంపతులు రూ. ఐదు లక్షల విరాళాన్ని శనివారం ప్రకటించారు. రూ. 11.40 కోట్లు వ్యయంతో 105 గదులతో నిర్మించనున్న సత్రానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా శనివారం దాత రవీంద్రారెడ్డి సత్యదేవుని దర్శించి పూజల అనంతరం ఆయన ప్రకటించిన విరాళంలో తొలి విడత రూ.2.6 లక్షల చెక్కును దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.రామకృష్ణకు అందజేశారు. డోనార్ స్కీం కింద సత్రంలో 15వ నంబరు గదిని దాతకు కేటాయించనున్నట్టు ఈఈ తెలిపారు. గోదావరి దాటిన పెద్ద పులి దేవీపట్నం: గడిచిన రెండు వారాలుగా దేవీపట్నం మండలంలోనే తిష్ట వేసిన పెద్ద పులి ఎట్టకేలకు గోదావరి దాటింది. దేవీపట్నం, లింగవరం గ్రామాల వద్ద ఐదు రోజుల పాటు మకాం ఉండడంతో ఆ ప్రాంతంలోనే ఉంటుందని భావించినప్పటికీ పులి తన గమనాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున దేవీపట్నం, లింగవరం గ్రామాల సమీపంలో గోదావరి నదిని దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సంగనపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పులికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో దేవీపట్నం తరహాలోనే అక్కడ కూడా సమృద్ధిగా నీరు, పులికి ఆహారం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్ద పులి వచ్చిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అంధేరి అభయారణ్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరి జిల్లా దాటుకుని తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రలోని తడోబా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పులి ఉన్న ప్రాంతం నుంచి సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. -
స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు ఫూలే
మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాద రూరల్: సామాజిక రుగ్మతలను రూపుమాపాలని పెద్ద ఎత్తున ఉద్యమించిన మహాత్మా జ్యోతిరావుఫూలే స్ఫూర్తి ప్రధాత అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఫూలే జయంతిని రమణయ్యపేట వైద్యనగర్లోని కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. మాజీ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో ఫూలే చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి ఎప్పటికీ చిరస్మరణీయులన్నారు. ఆ రోజుల్లో మహిళా విద్య కోసం సావిత్రీబాయి పోరాడారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాలు, పేద వారి కోసం జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో పని చేశారన్నారు. పార్టీ తరఫున పేదల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా కన్నబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు రామదేవు సూర్య ప్రకాశరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు, పార్టీ నాయకులు అనుసూరి ప్రభాకరావు, ఇసుకపట్ల లక్ష్మీ కుమారి, ప్రసన్న, సవరం చిట్టిబాబు, నల్ల శ్రీను, జాన్ ప్రభాకర్, పాము సూరిబాబు, కృప, భావవరం రవి, దుగ్గన దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘జయలక్ష్మి’ బాధితుల దీక్షల విరమణ
కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఆ సభ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్పల సూర్య శంకరం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం విరమించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన దీక్షలకు అధికారులు స్పందించారు. జిల్లా సహకార అఽధికారి బి.శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న చర్యలను సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డి త్రినాథరావుకు ఈ నెల 9న లేఖ ద్వారా వివరించి దీక్షలు విరమించాలని కోరారు. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తుతో పాటు సీఐడీతో విచారణ చేయించిన విషయం తెలిసిందే. వయసు మీద పడి చాలా మంది డిపాజిట్లరు చనిపోతుండడంతో తక్షణ న్యాయం కోరుతూ సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. శనివారం దీక్షలో కూర్చున్న పైడికొండల హనుమంతరావు, దేవికుమారిలతో సొసైటీ అధ్యక్షుడు త్రినాథరావు చర్చలు జరిపి ఒప్పించడంతో మధ్యాహ్నం దీక్షను విరమించారు. చైర్మన్ త్రినాథరావు మాట్లాడుతూ సొసైటీ బాధితులకు సాయం చేయాలని, ముందుగా రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీలకు, కలెక్టర్, తదితరులకు వినతి పత్రాలు ఇచ్చామని వివరించారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీఓ తెలియజేయడంతో పాటు ఎండలో దీక్షలు వద్దని అభ్యర్థించిన మేరకు దీక్ష విరమింపజేశామన్నారు. -
నోరు విప్పకుండా ఉండలేం..
● విప్ప పూలలో ఎన్నో పోషకాలు ● వివిధ రకాల తిను బండారాల తయారీ ● రోగనివారిణి ● సేకరణతో గిరిజనులకు రాబడి అడవి తల్లి తన బిడ్డల్లాంటి గిరిజనులకు ప్రసాదించిన తియ్యని కానుకల్లో విప్ప పూలు ప్రధానమైనవి. వేసవిలో వేకువజామునే ఈ చెట్ల వైపు వెళ్లేవారికి సువాసన వెదజల్లుతోంది. ఈ పూలు గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. గిరిజన సంస్కృతిలో భాగంగా సారా తయారీకి, ఆలయాల్లో ప్రసాదంగా, తినుబండారాల తయారీకి కూడా వినియోగిస్తున్నారు. ఇక కాయల విషయానికొస్తే విప్పబద్దను నూనెగా చేసి ఇంటి వంటకాలు, దీపారాధనలు, నొప్పులు తగ్గేందుకు మసాజ్గా వాడుతుంటారు. ఏటా ముందుగా విప్ప చెట్టుకు పూజలు చేసిన అనంతరం విప్ప పూల సేకరణను గిరిజనులు ప్రారంభిస్తారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ప్రధానంగా ఈ చెట్లు పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వీఆర్ పురం, ఎటపాక ప్రాంతాల్లో ఉంటాయి. ఇళ్ల వద్ద, అడవిలో ఉండే ఈ చెట్ల నుంచి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూలు రాలుతుంటాయి. ఈ చెట్లున్న ఇంటి వద్ద గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ మంచి సువాసనతో కూడిన విప్పపూలు రాలడం ప్రారంభమవుతుంది. అనంతరం ఇంటిల్లపాదీ కలసి బుట్టలు, చేటల్లో వాటిని సేకరిస్తారు. అలా సేకరించిన పూలను నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన విప్ప పూలను గిరిజనులు సంతల్లో వ్యాపారులకు విక్రయించడంతో పాటు తమ ఇళ్లలో సారా తయారీకి వాడతారు. కొన్ని దేవస్థానాలు విప్ప పూలను ప్యాకింగ్ చేసి ప్రసాదాలుగా విక్రయిస్తుంటాయి. తియ్యని కానుకలా.. విప్ప పూలను ఇప్పటి వరకూ సారా తయారీ లేదా ప్రసాదాల కోసమే ఉపయోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. విప్ప పూలతో లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి వాటిని చేయడం విశేషం. వీటికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ పూలకు డిమాండ్ పెరుగుతోంది. పోషక గుణాలెన్నో.. విప్ప పూలలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఎన్నో రోగాలను హరించే గుణాలు విప్ప పూలలో ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయం చేసే గుణం విప్పపూలలో ఉంది. విప్పకాయలతో చేసిన నూనె వినియోగించి మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయి. ఈ పూలలో ప్రొటీన్లు, కార్బో హైడ్రేడ్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి పోషక విలువలు ఉంటాయి. ఇతర అవ‘సారాలకు’.. ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా పండగలు, శుభకార్యాల్లో విప్పసారాను వినియోగిస్తారు. ఎటువంటి రసాయనాలు ఇతర పదార్థాలు వినియోగించకుండా బెల్లం ఊటతో కలిపి విప్పసారాను తయారు చేస్తారు. శుభకార్యాల సమయంలో తమ ఇళ్లకు వచ్చే బంధువులకు విప్పసారాను పోస్తారు. శుభకార్యాలు, దినకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమవెంట వారు తీసుకువెళ్లడం ఆనవాయితీ. -
పంపాలో నిలువు దోపిడీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అధికారం అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు వాటాలు వేసుకుని లక్షలు దిగమింగుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పెద్దన్న పాత్ర పోషించిన తుని నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు వారికి కాసులు కురిపిస్తున్నాయి. దీని వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్కు గర్భశోకం మిగులుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి అక్రమంగా తవ్వి రిజర్వాయర్ను గుల్ల చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూడిక తీసి వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన గ్రావెల్, మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుకల బట్టీలకు విక్రయించి రూ.లక్షలు పంచుకుంటున్నారు. ప్రజాప్రతినిధి కనుసన్నల్లో.. ప్రత్తిపాడు, తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పంపా రిజర్వాయర్లో కొంత కాలంగా ఇదే దందా సాగుతున్నా అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. తునికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో నడుస్తోన్న ఈ దందాలో అనుచరులే బినామీలు కావడం గమనార్హం. రిజర్వాయర్ పూడికతీత పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తవ్వుతున్నారు. 15 వేల ఎకరాలకు సమస్య తొండంగి, తుని మండలాలతో పాటు అన్నవరం ఆయకట్టులో సుమారు 15 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 1970–71లో ఈ పంపా రిజర్వాయర్ నిర్మించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే వరద నీటిలోని బురదతో దీని గర్భం పూడుకుపోయింది. పూడుకుపోయిన ఆ మట్టిని తీసే ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీ నేతలు గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఈ మట్టిని తవ్వేందుకు అన్నవరానికి చెందిన కూటమి నేతలు బినామీ రైతుల పేరుతో క్యూబిక్ మీటర్కు రూపాయి వంతున 10 వేల క్యూబిక్ మీటర్ల వ్యవసాయ భూమి సారవంతం చేసుకునేందుకు వీలుగా మట్టి తవ్వుకునేందుకు జలవనరుల శాఖ నుంచి మార్చి 24న అనుమతులు తీసుకున్నారు. తుని పెద్దన్నకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక నాయకుడుకి ఈ అక్రమ తవ్వకాల బాధ్యతలు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ దోపిడీ సాగుతూనే ఉంది. నిజానికి ఈ మట్టిని పంపా ఆయకట్టులో వ్యవసాయ భూములు సారవంతం చేసుకునేందుకు, అది కూడా రైతుల అవసరాల కోసమే వినియోగించాలి. రైతులు సొంత ఖర్చులతో మట్టిని తవ్వుకుని తరలించుకునేలా నిబంధనలు ఉన్నాయి. రిజర్వాయర్ వాస్తవ గర్భానికి మించి ఈ తవ్వకాలు చేయకూడదు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ తవ్వకాల సాగాలనేది నిబంధన. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా భారీ యంత్రాలతో రోజుకు వంద నుంచి 120 టిప్పర్లు వరకు గ్రావెల్, మట్టిని పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, తుని రూరల్ సహా కాకినాడ వరకు కూడా అక్రమంగా తరలిస్తున్నారు. సింహభాగం పెద్దన్నకే.. గ్రావెల్తో పాటు మట్టిని లే–అవుట్లకు తరలించేస్తున్నారు. ఇక్కడి నుంచి తరలించిన గ్రావెల్ను లే అవుట్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. టిప్పర్ మట్టి రూ.5 వేలకు, టిప్పర్ గ్రావెల్ ఏడు, ఎనిమిది వేలకు తక్కువ కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తెల్లవారు జామున మొదలుపెడుతున్న తవ్వకాలు అర్థరాత్రి దాటే వరకు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ వాటాల్లో సింహభాగం అంటే 70 శాతం ఒక్క పెద్దన్నకు ముడుపు కట్టి వారం వారం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపేస్తున్నారు. మిగిలిన 30 శాతంలోనే రవాణా ఖర్చులు, మధ్యలో ఉన్న ఇద్దరు దళారులు పంచుకుంటున్నారు. ఇలా మట్టి అక్రమ రవాణాతో రూ.6 లక్షలు, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో రూ.10 లక్షలు కలిపితే నిత్యం తెలుగు తమ్ముళ్ల అక్రమాల రాబడి ఖరీదు రూ.16 లక్షలుగా లెక్కలు కడుతున్నారు. గడచిన నెల రోజులుగా లెక్క వేస్తే తమ్ముళ్ల అక్రమ దందా రూ.4 కోట్ల పైమాటగానే కనిపిస్తోంది. ఇందులో రెండున్నర కోట్లు తునికి చెందిన పెద్దాయన, అతని అనుచరుల జేబుల్లోకి వెళ్లిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం తక్కువలో తక్కువ రూ.16 లక్షల దందా ఈ రిజర్వాయర్ పూడిక తీతతోనే సాగుతోంది. తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతూ ఆయకట్టు రైతుల నోట మట్టికొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులలో చలనం రావడం లేదు.రైతులకు తీరని అన్యాయం పంపా రిజర్వాయర్లో సారవంతమైన మట్టిని ఆయకట్టులో సాగు చేస్తున్న రైతులు వినియోగించుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వంలో నాయకుల అండతో పంపాలో మట్టిని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెండ్యాల బాబీ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీతారాంపురం, తొండంగి మండలం దోపిడీ పాలనగా సాగుతోంది నాకు, నా కుటుంబ సభ్యులకు పంపా ఆయకట్టులో 8 ఎకరాల భూమి ఉంది. వరదల వల్ల భూ ములు చౌడు బారాయి. ఇలానే ఆయకట్టు భూముల పరిస్థితి ఉంది. మట్టి తవ్వకాల ద్వారా కూటమి నాయకులు దోపిడీ చేస్తూ ఆయకట్టు రైతుల నోట మట్టి కొడుతున్నారు. బెక్కం చంద్రగిరి రైతు ఏ కొత్తపల్లి గ్రామం తొండంగి మండలం -
అమాత్యా.. మొరాలకించవా
● సత్యదేవుని చెంత సమస్యల చింత ● భక్తులలో అసంతృప్తి వెల్లువ ● నేడు దేవదాయ శాఖ మంత్రి ‘ఆనం’ రాక ● సీతారామ సత్రం శంకుస్థాపన, మెట్ల దారి ప్రారంభం అన్నవరం: రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేస్తాం.. సూపర్ సిక్స్ హామీలు, లక్షలాది ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి.. గత ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి నేతలు ఇచ్చిన బూటకపు హామీలివి. అధికారం అందగానే అవన్నీ బుట్టదాఖలైన రెండేళ్లయినా ఒక్కటీ అమలు చేయకుండానే అన్నీ చేసేశాం అని ఆ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. సనాతన ధర్మానికి సారథులం అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి పెద్దలు ఆచరణలో మాత్రం దేవాలయాలకు, దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనలో మొండి చేయి చూపుతున్నారు. రత్నగిరిపై రూ.11.4 కోట్లతో నిర్మించిన సీతారామ సత్రానికి శంకుస్థాపన, మెట్ల దారిని ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు నిర్మాణాలు గత వైఎస్సార్ సీపీ హయాంలోనే మొదలై నేడు ప్రారంభం కానుండడం గమనార్హం. కాగా ఆలయంలో పలు సమస్యలు, వసతుల లేమితో భక్తులు అవస్థ పడుతున్నారు. వాటి పరిష్కారానికి ఆయన సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంది. పారిశుధ్యం అధ్వానం అన్నవరంలో పారిశుధ్య బాధ్యతలు చూస్తున్న పద్మావతి సంస్థకు నెలకు రూ.80 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. అయినా ఎక్కడా సంతృప్తి వ్యక్తం కావడం లేదు. మూలన పడిన వాషింగ్ మెషీన్లు దేవస్థానంలో సత్రాలలో వస్త్రాలను మెషీన్ల ద్వారా ఉతికిస్తామని చెప్పిన ఆ సంస్థ దోబీలతో ఉతికించింది. వీటికే సుమారు రూ.ఐదు లక్షల బిల్లు దేవస్థానం నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులతో ఉద్యోగ నియామకాలు దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం 220 మంది మాత్రమే ఉండగా, వారిలో 16 మంది ఈ ఏడాది, మరో పది మంది వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. వీరి నియామకాలు ఏపీపీ ఎస్సీ ద్వారా కాకుండా ప్రజా ప్రతినిధుల సిఫార్సులతోనే పూర్తి చేస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది తక్కువగా ఉండడంతో కీలక పోస్టుల్లో వీరే ఉన్నారు. అర్చకుల కొరత దేవస్థానంలో 40 ఏళ్ల క్రితం 24 మంది అర్చకులు ఉంటే ఇప్పుడు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. సేవలు మాత్రం గతం కంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న వారిలో ఇద్దరు పదవీ విరమణ చేయనున్నారు. కనీసం మరో 15 మంది అర్చకులు అవసరమని ఆ వర్గం కోరుతోంది. వనదుర్గ గుడి రహదారి పూర్తి చేయండి మొదటి ఘాట్రోడ్లోని మూడో మలుపు నుంచి వనదుర్గ ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మాణం ఎంతో అవసరం. ఇది జరిగితే ట్రాఫిక్ అంతరాయాలు నివారించవచ్చు. అన్నదానంలోనూ సత్యదేవుని ప్రసాదం పెట్టాలి తిరుమలలోని అన్నదానంలో చిన్న లడ్డూ వడ్డిస్తారు. అలాగే సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలోనూ సత్యదేవుని ప్రసాదాన్ని పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వినియోగంలో ఉన్న విధానాన్నే ఇటీవల నిలిపివేయడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
● వేసారే వేసవికి వీవన వీచిక..
వేసారే వేసవిలో వీవన వీచికను మించిన సాంత్వన లేదు. కాలం మారింది. మధ్య తరగతి ఇళ్లలో సైతం ఏసీలు వచ్చి వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. ఎంత ఆధునిక సౌకర్యాలు వచ్చినా విద్యుత్ కోతల వేళ అందరికీ దిక్కయ్యేది కచ్చితంగా విసనకర్రే అనడం అతిశయోక్తి కాదు. ఏ చెట్టు కిందో.. ఏ బాల్కనీలోనో కూర్చుని ఉస్సురుస్సురుమంటూనే విసనకర్రతో విసురుకుంటూ ఉపశమనం పొందాల్సిందే. కాలాన్ననుసరించి అవసరమైన ఉత్పత్తులు తయారు చేస్తూ కొందరు ఉపాధి పొందుతుంటారు. కోరుకొండ మండలం గాడాల గ్రామంనకు చెందిన పి.సత్తిబాబు విసినకర్రలు తయారు చేసుకుని, వాటిని రాజమహేంద్రవరం, పరిసర గ్రామాలలో విక్రయిస్తున్నాడు. ఒకొక్కటి రూ.20కి విక్రయిస్తున్నానని, రోజుకు 25 వరకు తయారు చేసి వంద పూర్తయ్యాక ఇలా ఊరూరూ తిరిగి విక్రయిస్తుంటానని ‘సాక్షి’కి తెలిపాడు. శనివారం రాత్రి బొమ్మూరు బాలాజీపేట సెంటర్లో విసనకర్రలు విక్రయిస్తున్నాడు. – రాజమహేంద్రవరం రూరల్ -
మంచంపై నిద్రిస్తున్న బాలికకు పాముకాటు..
ఏలూరు జిల్లా: కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజును వేడుకగా చేసుకున్న ఆనందం మరువక ముందే ఆ చిన్నారిని పాము రూపంలో మృత్యువు కబళించింది. మంచంపై తల్లితో నిద్రిస్తున్న ఆ బాలిక పాముకాటుకు గురై మృతి చెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోనపాపపేట మత్స్యకార కుటుంబానికి చెందిన చప్పా దీపిక (13) తల్లి మల్లీశ్వరితో గురువారం జన్మదిన వేడుక జరిగింది. ఆ రాత్రి తన ఇంటిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2.30 సమయంలో ఏదో కుట్టినట్టు అనిపించి తల్లికి చెప్పింది. ఏ ఎలకో కరచి ఉంటుందని భావించి ఉదయం ఇంజెక్షన్ చేయిస్తామని నచ్చచెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇబ్బందిగా ఉందని మరోసారి తల్లిని లేపింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి సమీపంలోని బంధువులకు విషయం చెప్పి చికిత్స కోసం 108కి సమాచారం ఇచ్చారు. ఆ వాహనం వచ్చేలోపే బాలిక నోటి వెంట నురగ రావడంతో చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా చికిత్స నిమిత్తం ఆధార్ కార్డు కావలసివచ్చి దీపిక పడుకున్న మంచం పరుపుకింద వెతకగా ఆ పక్కనే తాచుపాము బుసకొడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అంతలోనే తేరుకుని దానిని హతమార్చారు. దీపిక స్థానిక జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్సై వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పచ్చటి బతుకుల్లో కారుచిచ్చు
● కలవరపెడుతున్న ప్రమాదాలు ● మానవ తప్పిదాలు తోడవుతున్న ప్రభుత్వ వైఫల్యం కపిలేశ్వరపురం: కారులో షికారు ఓ మధురానుభూతి. ఆ అనుభూతిని తీరుస్తున్న కారే శకటంగా మారితే... ఆవిరైపోయేది ప్రాణాలే కాదు.. వారిపై ఆధారపడిన కుటుంబాల ఆనందం కూడా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2025లో 2,258 వాహన ప్రమాదాలు సంభవించగా 883 మంది మృత్యువాత పడ్డారు. అందులో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 382 కారు ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో కారు ప్రమాదాలు పై కథనం.. ప్రభుత్వ వైఫల్యంతో.. ప్రభుత్వం ఒక పక్క మద్యం విక్రయాలతో ఆదాయాన్ని ఆర్జిస్తుండగా దాని ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రహదారులపై సైన్బోర్డులు, అప్రోచ్రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వంటి లోపాలనేకం ప్రభుత్వ వైఫల్యాన్ని పట్టిచూపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రమాదాల్లో కొన్ని.. కాకినాడ జిల్లాలో 2025లో 803 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 330 మంది చనిపోయారు. అందులో 185 కారు ప్రమాదాలు కాగా 65 మంది చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో 837 ప్రమాదాల్లో 328 మంది చనిపోయారు. అందులో 197 కారు ప్రమాదాలు. కోనసీమ జిల్లాలో 618 ప్రమాదాలకు గానూ 225 మంది మృత్యువాత పడ్డారు. దుర్ఘటనలు ఇలా.. ● ఈ ఏడాది ఫిబ్రవరి 1న దివాన్ చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని మృతిచెందింది. ● ఫిబ్రవరి 9న గొల్లప్రోలు మండలం వన్నెపూడి–కొడవలి జంక్షన్ వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని పల్టీలు కొట్టిన ప్రమాదంలో వాటిల్లో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ● ఫిబ్రవరి 14న దేవరపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో యాదవోలు రోడ్డు వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న కారు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ● ఫిబ్రవరి 20న రాజవొమ్మంగి మండలం జడ్డంగి శివారు మడేరువాగు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తాపడగా అందులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ● ఫిబ్రవరి 22న చింతూరు మండలం సింగన్నగూడెం వద్ద కారు రహదారి రెయిలింగ్పైకి దూసుకుపోయిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ● మార్చి 22న కాకినాడ–పిఠాపురం రోడ్డులో తిమ్మాపురం వద్ద కారు ఎదురుగా వెళ్తున్న బైక్, స్కూటీలను ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. ● మార్చి 22న దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై గండి చెరువు సమీపంలో కారు అదుపు తప్పి మరో రెండు కార్లను ఢీకొనగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ● ఈ నెల 6న తెలంగాణ ప్రాంతంలో కారు భారీ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ధవళేశ్వరం పంచాయతీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ దంపతులు దుర్మరణం పాలయ్యారు. ● ఈ నెల 6న అర్ధరాత్రి మండపేట మండలం పేకేటిపాకలు వద్ద కాలువలోకి కారు బోల్తాపడిన ప్రమాదంలో యువజంట చనిపోయారు. కారణాలనేకం ఉమ్మడి జిల్లాలో సగటున రోజుకు ఆరు ప్రమాదాలు జరుగుతుండగా వాటిలో ఇద్దరు చనిపోతున్నారన్నది ఓ విశ్లేషణ. 2025లో అతివేగంగా వాహనం నడుపుతున్న కేసులు కాకినాడ జిల్లాలో 10,737, తూర్పుగోదావరి జిల్లాలో 791 కేసులు నమోదయ్యాయి. 18 ఏళ్లలోపు వారు వాహనాన్ని నడపడం నేరం. వారికి వాహనాన్ని ఇచ్చినవారే బాధ్యులవుతారు. ఆ నేరంపై కాకినాడ జిల్లాలో 350, తూర్పుగోదావరి జిల్లాలో 388 కేసులు నమోదయ్యాయి. సెల్ఫోన్ చూస్తూనో, మాట్లాడుతూనో డ్రైవింగ్ చేసిన నేరంపై 2025లో తూర్పుగోదావరి జిల్లాలో 1,843, కాకినాడ నగరంలో 510 కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు 2025లో కోనసీమ జిల్లాలో 3,500, కాకినాడ జిల్లాలో 7,578 నమోదయ్యాయి. స్థానికుల స్పందన కీలకం ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ప్రాణాలను కాపాడటం కీలకం. ఈ నెల 6న పేకేటిపాకలు వద్ద కాలువలోకి కారు బోల్తాపడిన ఘటనలో స్థానికులు స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడారు. – పి.దొరరాజు, సీఐ, మండపేట రూరల్, తూర్పుగోదావరి జిల్లా. -
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– మాజీ ఎంపీ వంగా గీత పిఠాపురం: ఈదురు గాలులు, అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మల్లవరం ప్రాంతాల్లో పర్యటించారు.రైతులను అడిగి నష్టాలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి అందే దశలో భారీ నష్టం జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పంట నష్టం నమోదు చేయాలన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. ఒక పక్క వాణిజ్య పంటలతో పాటు మరో పక్క కోత దశలో ఉన్న వరి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉన్నందున రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో రైతులకు అందాల్సిన ఇన్ఫుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదని, కౌలు రైతులకు ఏవిధమైన ప్రభుత్వ సహకారం అందడం లేదన్నారు. అధికారులు సలహాలు ఇవ్వడం కాకుండా జరిగిన నష్టాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, వైఎస్సార్ సీపీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అరిగెల రామయ్యదొర ఉన్నారు. -
నేడు జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం ఽఆధ్వర్యంలో శనివారం కాకినాడ డీఎస్ఏ జిమ్నాజియంలో రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు విఠల్ శుక్రవారం తెలిపారు. జూనియర్ బాలురు, బాలికల విభాగంలో ఆర్టిస్టిక్ విభాగంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24న ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. మళ్లీ శాప్ అకాడమీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో రాష్ట్ర స్థాయి అకాడమీలను తిరిగి ప్రారంభిస్తుందని డిఎస్డీఓ వి.సతీష్కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి శాప్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి వెయిట్ లిఫ్టింగ్లో 15, జిమ్నాస్టిక్స్లో 15, హాకీలో 20, ఖోఖోలో 20 మంది బాలికలకు ప్రవేశం కల్పించనున్నారు. 19 సంవత్సరాలలోపు వారు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారు ప్రవేశానికి అర్హులు. ఎంపికై న వారికి కోచింగ్, వసతి, భోజన, ఆధునిక శిక్షణ సదుయాలు కల్పిస్తారన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో ఈ శాప్ అకాడమీలు ప్రారంభమవుతాయన్నారు. విశాఖలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్లో బాలుర, అకాడమీలు, తిరుపతిలో బాలురు, బాలికలకు జుడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్లో అకాడమీలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో ఈ నెల 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్లో, 30న హాకీ, ఖోఖోలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. వివరాలకు 9440031601 నంబరులో సంప్రదించాలని కోరారు. మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలి ఆర్జేడీ నాగమణి అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్దేశిత సమయంలోనే త్వరగ పూర్తి చేయాలని విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఈవో పి. నాగేశ్వరరావు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీవైఈవోలు జి.సూర్య ప్రకాశం, లక్ష్మణమూర్తి, కె.వెంకటేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ బీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 13న మినీ ఉద్యోగ మేళా అమలాపురం రూరల్: ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్ వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. తమిళనాడులోని హోసూర్లోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 19–35 ఏళ్ల మధ్య ఉన్న మహిళా అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, బీటెక్ పీజీ పూర్తి చేసిన వారు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు. సిబ్బంది సమస్యలపై ‘ఎస్పీ సంపర్క్’అమలాపురం టౌన్: పోలీస్ సిబ్బంది బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, ఇతర సర్వీస్ సమస్యలపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ‘ఎస్పీ సంపర్క్’ను శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పోలీసులు కొందరు నేరుగా, మరికొందరు ఫోన్ల ద్వారా ఎస్పీతో తమ సమస్యలను చెప్పుకొన్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లను అధిగమించేందుకు సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రవ్వ వద్ద రాజుకున్న జ్వాల
● ఆందోళనలకు స్పందించని యాజమాన్యంపై ఆగ్రహం ● వేదాంత జిఎం మను ఖన్నా దిష్టిబొమ్మ దగ్ధం ● స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ ఉప్పలగుప్తం: ఎస్.యానంలోని వేదాంత ఆయిల్ కంపెనీ (రవ్వ ప్లాంట్) ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు వంద ఉద్యోగాలు, గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న నిరసనలకు యాజమాన్యం స్పందించకపోవడంతో శుక్రవారం ప్లాంటు వద్ద ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదాంత కంపెనీ జీఎం మనుఖన్నా దిష్టిబొమ్మను దగ్ధం చేసి కంపెనీ గో బ్యాక్ అంటూ డిమాండ్ చేశారు. ధర్నాకి నాయకత్వం వహించిన నాయకులు మాట్లాడుతూ ఈ సంస్థ 15 ఏళ్లుగా గ్రామస్తులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, గ్రామాన్ని శ్మశానంలా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాంటు వల్ల కాలుష్యం పెరిగి పంట లు నాశనమయ్యాయని, ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెట్టా అప్పారావు, నీటి సంఘం చైర్మన్ దంగేటి చిట్టిబా బు, జోగి రాజా, లంకే భీమరాజు పాల్గొన్నారు. -
స్నాతకోత్సాహం
● ‘నన్నయ’లో ఘనంగా ‘పట్టాల’ పండగ ● మొత్తం 722 మందికి అందజేత ● 14 మందికి బంగారు పతకాలు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం సందడిగా సాగింది. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ పట్టాల పండగలో పాల్గొన్నారు. చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 14 మంది బంగారు పతకాలు అందుకున్నారు. పట్టభద్రులు దేశాభివృద్ధిలో కీలకం : చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నత చదువులతో పట్టభద్రులైన వారందరూ సమాజ హితంగా పయనాన్ని కొనసాగిస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన ‘నన్నయ’ పేరిట ఏర్పడిన ఈ యూనివర్సిటీ దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా అభివృద్ధిని సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ‘వసుదైక కుటుంబం’ అనే భావనతో ముందుకు సాగాలన్నారు. యూనివర్సిటీలోని కన్వెన్షన్ హాలులో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి 16, 17 స్నాతకోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. 45 మందికి బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలను అందజేశారు. పట్టాలు అందుకునేందుకు 722 మంది దరఖాస్తు చేసుకోగా, మిగిలిన వారికి వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అతిథులు జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, యాప్షీ చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిల చేతుల మీదుగా అందజేశారు. ‘నన్నయ’ కీర్తిని ఇనుమడింపజేసేలా.. వీసీ ప్రసన్న శ్రీ ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి జిల్లావాసుల చిరకాల కోరిక మేరకు ఆవిర్భవించిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యను అందస్తోందన్నారు. తెలుగు సాహిత్యానికి ఆదికవి అయిన నన్నయ భట్టారకుని కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఆరు జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా నిలిచిందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులను సమాజానికి కావలసిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరమే : ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా మాట్లాడుతూ విద్యార్థులు ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్ శాఖల అధ్యయనం వైపు అడుగులు వేయాలని సూచించారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరాన్ని ప్రస్తావిస్తూ, పాఠ్యాంశాలతోపాటు నైపుణ్యాలు, సృజనాత్మకత, అనుభవాత్మక అభ్యాసం కూడా అవసరమనే విషయాన్ని గ్రహించాలన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో చదువును మరచిపోకుండా నిరంతరం పుస్తక పఠన చేయాలన్నారు. అందుకు అనుగునంగా తల్లిదండ్రులు కూడా నచుకోవాలని, ఇంటిలోని ర్యాక్లలో భాగవత, రామాయణాలతోపాటు చరిత్రను తెలియజేసే పుస్తకాలను కూడా పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉంచాలని సూచించారు. ఘన స్వాగతం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కులపతి హోదాలో వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలోని హెలీపాడ్ వద్ద ఉదయం 11 గంటలకు కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రజాప్రతినిధలు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.722 మందికి పట్టాల ప్రదానం 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు చెందిన పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి, దరఖాస్తు చేసుకున్న 722 మంది విద్యార్థులకు పట్టాలను ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అందజేశారు. వీరిలో 21 మంది పీహెచ్డీ, 14 మంది గోల్డ్ మెడల్స్, 10 ప్రైజ్లు పొందిన వారున్నారు. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన 6,113 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 45,337 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించేందుకు చాన్సలర్ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య మునిరత్నంనాయుడు, జీజీయూ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పనుల్లో జాప్యంపై స్పందించిన కలెక్టర్
● యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యదేవుని ఆలయం దిగువన గల యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ పనులు త్వరగా పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ పనులు ఆరు నెలలుగా నత్తనడకన నడుస్తున్న విషయమై శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘నత్త నయం’ శీర్షికన ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించారు. దీనిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీ త్రినాథరావును ఆదేశించారు. దీనిపై పండితులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో ఈఓ సమావేశం నిర్వహించి సెంట్రల్ ఏసీ పనులు రెండ్రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏసీ బ్లోయర్ గొట్టాలు వెలుపలకు తీసుకుని రావడానికి ఆలయ గోడలకు రంధ్రం చేసేందుకు పండితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించినట్టు ఈఓ ‘సాక్షి’కి తెలిపారు. -
అసభ్య వ్యాఖ్యలపై.. ఆగ్రహం
● వైఎస్సార్ సీపీ నిరసనల హోరు ● అనుచిత వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు ● పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ● ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలపై అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జర్నలిజం నైతిక విలువలను ఆయన మంటగలిపారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. నీతి బాహ్యమైన వ్యాఖ్యలతో ఏబీఎన్లో రాధాకృష్ణ చేసిన ప్రసారాలను పార్టీ మహిళా నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ నేతలు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల నుంచి పోలీస్ స్టేషన్ల వరకూ ర్యాలీలు నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఏబీఎన్ను బ్యాన్ చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడకించపరిచే వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననంతుని: ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియా సొంత లాభం కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచే వ్యూహరచనకు తెర తీసిందని ఎల్లో మీడియానుద్దేశించి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలపై భారం లేకుండా ఉండాలనే ఆలోచనతో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని, రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాలకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇదంతా అప్పేనని రాజా చెప్పారు. దీనికే ఇంత అయితే ఇతర నిర్మాణాలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిని ఐదు జిల్లాలను కలిపి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం రూ.20 వేల కోట్లతో నిర్మాణాలు పూర్తి చేయవచ్చునని చెప్పారు. ఇదే విషయాన్ని జగన్ ప్రతిపాదిస్తే చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధానికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు పన్నిన కుట్రకే వ్యతిరేకమని రాజా స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన తుని మండలం ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీపీ లగుడు శ్రీనివాస్, పార్టీ తుని, తొండంగి, తుని పట్టణ అధ్యక్షులు దుంగల నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, అన్నవరం శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణను అరెస్టు చేయాలంటూ పార్టీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు నాయకత్వాన సర్పవరం ఎస్సై ఏసుబాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో పెన్ డ్రైవ్ అందజేసి, రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సై నుంచి రసీదు కూడా తీసుకున్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొప్పన శివ, జెడ్పీటీసీ, పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రామదేవు చిన్నా, ఎస్ఈసీ సభ్యుడు గోపుశెట్టి బాబ్జీ, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పిశెట్టి గణేష్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పార్టీ నాయకులు, మహిళలతో కలసి మాజీ ఎంపీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ పట్టణ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీ్త్ర జాతిని కించపరిచిన రాధాకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమం ఎప్పుడూ తప్పుడు కథనాలు, తప్పుడు ఆరోపణలతోనే నడుస్తోందని ఆక్షేపించారు. చివరకు బరితెగించి ఇటీవల జుగుప్సాకరమైన భాషలో మహిళలను కించపరిచే విధంగా కథనాన్ని ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం తదితరులు పాల్గొన్నారు. సామర్లకోటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలసి నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పెద్దాపురం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దాపురం సీఐ ఎ.కృష్ణభగవాన్కు ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యరక సంఘం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, ఉమ్మడి రాష్ట్ర కార్మి క సంఘం నాయకుడు దవులూరి సుబ్బారావు, ఆప్కో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉబా జాన్మోజెస్, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలసి గిరిబాబు ర్యాలీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రాధాకృపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై ఎస్.అనంతలక్ష్మికి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రికార్డు చేసిన పెన్ డ్రైవ్ను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ సభ్యులు బెహరా రాజరాజేశ్వరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఏబీఎన్ చానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమాన్ని మహిళలను కించపరచడానికే నిర్వహి స్తున్నట్టుగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం దుయ్య బట్టారు. రాధాకృష్ణ తీరును నిరసిస్తూ ఆయన ఆధ్వర్యాన పార్టీ నాయకులు, కార్యకర్తలు జగ్గంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు చేరుకుని రాధాకృష్ణకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం నరసింహం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేతలు ఒమ్మి రఘురాం, కె.జాన్వెస్లీ, గుల్లా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర లక్ష్మీశివప్రసన్న ఆధ్వర్యాన పార్టీ సిటీ కార్యాలయం నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణ డౌన్డౌన్.. ఏబీఎన్ హఠావో అంటూ నినాదాలు చేశారు. రాధాకృష్ణపై కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన పట్టెపు హేమంత కుమార్ టూటౌన్ ఎస్సైకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల దుర్గాప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, చిట్నీడి మూర్తి, బోరా పెద్ద తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం కక్కడమే ఏబీఎన్ రాధాకృష్ణ పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సర్పవరం పో లీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్రెడ్డిని, ఆయన కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా చిత్రిస్తోందని ధ్వజమెత్తారు. అమరావతికి చట్టభద్రత కల్పించే పేరుతో పార్లమెంట్లో చట్టాన్ని చేస్తూ అదేదో పెద్ద ఘనకార్యంలా చంద్రబాబునాయుడు చిత్రీకరించుకున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెర పైకి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతికి రూ.2 లక్షల కోట్లు కావాలని, అదే రూ.20 వేల కోట్లు ఖర్చు పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ కాపిటల్ కారిడార్గా చేసుకోవచ్చని జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారని వివరించారు. దీనిపై రాధాకృష్ణ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే సభ్యత, సంస్కారం వదిలేసి, మహిళలను, వైఎస్సార్ సీపీ నాయకుల భార్యలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కన్నబాబు హెచ్చరించారు. రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ వేసే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. -
నిర్లక్ష్యానికి భారీ మూల్యం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వ్రత విభాగం సిబ్బంది, కొంత మంది వ్రత పురోహితులు నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దేవస్థానం వ్రత విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి, తమ విధులను ఓ వ్రత పురోహితునికి అప్పగించడం.. అతడు 2024 జనవరి నుంచి గత ఏడాది డిసెంబర్ వరకూ వ్రత పురోహితుల పారితోషికం బిల్లును పెంచి, ఆ మొత్తాన్ని చేతివాటం చూపి కాజేయడం.. ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ అవకతవకలపై విచారణ జరిపి, ఆ పురోహితుని చేతివాటం చూపిన మొత్తం రూ.58.39 లక్షలుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం గత డిసెంబర్లో వెలుగు చూడటంతో అధికారులు నిలదీయగా అతడు సగం సొమ్ము చెల్లించాడు. అనంతరం, అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనలు గత జనవరిలో దేవస్థానంలో తీవ్ర సంచలనం రేపాయి. ఆ పురోహితుడు చేతివాటం చూపిన రూ.58.39 లక్షల్లో ఎక్కువ మొత్తం తన ఖాతాకు, తన భార్య, అత్త, బావమరిది ఖాతాలకే మళ్లించాడు. ఇందులో రూ.28.54 లక్షలు గత డిసెంబర్లో రికవరీ చేశారు. మిగిలిన రూ.29.85 లక్షల్లో రూ.8 లక్షలు తన ఖాతాకు, రూ.2.5 లక్షలు భార్య ఖాతాకు, తన ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్కు రూ.1.40 లక్షలు మళ్లించాడు. మిగిలిన రూ.17.95 లక్షలు 12 మంది పురోహితుల అకౌంట్లకు జమ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ 12 మందిలో తన బావమరిదికి రూ.4 లక్షలు, మరో పురోహితునికి రూ.5 లక్షలు, ఒకరికి రూ.1.90 లక్షలు, మరొకరికి రూ.90 వేలు పంపించినట్టు తేలింది. మిగిలిన ఎనిమిది మందిలో ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకూ పంపించాడు. ఈ అవకతవకల్లో సిబ్బంది నిర్లక్ష్యం, ఇతర పురోహితుల తప్పిదం ఉన్నట్టు తేలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు గురువారం ఆదేశాలు ఇచ్చారు. క్రమశిక్షణ చర్యలు ఇలా.. ● ఏఈఓలు పి.జగ్గారావు, ఎల్.శ్రీనివాసరావు, వ్రత విభాగంలో 2024 నుంచి సూపరింటెండెంట్లుగా పని చేసిన భాస్కర్, కె.సతీష్, కేవీఎస్ఎన్ మూర్తి, ఎంవీ సుబ్రహ్మణ్యం, సీనియర్ అసిస్టెంట్ వెలగా రమేష్లకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేశారు. ● ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావుపై చర్య తీసుకోవాలని కమిషనర్కు నివేదిక ఇచ్చారు. ● తమ ఖాతాలకు అధిక మొత్తాలు జమ అవుతున్నా ఆ విషయాన్ని దేవస్థానానికి తెలియజేయకపోవడాన్ని అపరాధంగా భావిస్తూ 13 మంది వ్రత పురోహితులపై కూడా ఈఓ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ● రూ.4 లక్షలు అంతకు మించిన మొత్తం జమ అయిన ఇద్దరు పురోహితులకు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు. వీరికి సుమారు 30 ఏళ్ల సర్వీసు ఉంది. పురోహితులకు నెలకు రూ.2 వేల ఇంక్రిమెంట్ జమ అవుతుంది. రెండు ఇంక్రిమెంట్లు అంటే రూ.4 వేలు. ఆవిధంగా చూస్తే ఈ ఇద్దరు పురోహితులకు ఒక్కొక్కరికి రూ.14.40 లక్షల మేర కట్ కానుంది. ● రూ.2 లక్షల వరకూ అకౌంట్లో జమ అయిన మరో ఇద్దరు పురోహితులకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేశారు. వీరికి కూడా సుమారు 25 ఏళ్ల సర్వీసు ఉంది. అంటే ఒక్కొక్కరికి సుమారు రూ.6 లక్షలు కట్ అవుతుంది. ● మిగిలిన తొమ్మిది మంది పురోహితులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానా విధించారు. ● ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత కలిగిన రెగ్యులర్ ఉద్యోగుల కన్నా వ్రత పురోహితులకే భారీ పనిష్మెంట్ విధించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురోహితులు ఈఓను కలిసి నలుగురు పురోహితుల ఇంక్రిమెంట్లు కట్ చేయడాన్ని నిలిపివేయాలని కోరనున్నట్లు సమాచారం. అన్నవరం దేవస్థానం పురోహితుని చేతివాటం వ్యవహారంలో 20 మందిపై క్రమశిక్షణ చర్యలు ఏడుగురు సిబ్బందికి ఒక ఇంక్రిమెంట్ కట్ 13 మంది పురోహితుల పైనా చర్యలు విశ్రాంత ఏసీపై చర్యకు కమిషనర్కు నివేదిక ఈఓ త్రినాథరావు ఆదేశం -
ఐదు అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సుల సీజ్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు రాజమహేంద్రవరం నుంచి నడుస్తున్న ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఆర్.సురేష్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కలసి బుధ, గురువారాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి ఈ బస్సులలో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. బస్సుల దిగువ భాగాన అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లను (ఎస్కేప్ హ్యాచ్, డోర్) లగేజీతో మూసివేయడం, నిబంధనల ప్రకారం వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. జిల్లా రవాణా అధికారి సురేష్ గురువారం స్వయంగా ఒక బస్సును తనిఖీ చేయగా, అందులో కూడా అదనపు డీజిల్ ట్యాంకు ఉన్నట్లు గుర్తించారు. పర్మిట్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా చర్యలు అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. సీజ్ చేసిన 5 బస్సులను రాజమహేంద్రవరం రవాణా శాఖ కార్యాలయంలో భద్రపరిచారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వీటి యజమానులు సుమారు రూ.2.15 లక్షల పన్ను, అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రవాణా అధికారులు సంపత్ కుమార్, ప్రణీత్, ఉమామహేశ్వరరావు, రాధిక, సుమ పాల్గొన్నారు. -
కనకదుర్గమ్మ చైత్ర మాసోత్సవాలు ప్రారంభం
అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి చైత్రమాస ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో పండితులు కలశ స్థాపన, మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించి, ఘనంగా పూజలు చేశారు. రుత్విక్కులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం, రుత్విక్కులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ గరగల సంబరం నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 17న అమావాస్య నాడు జరిగే చండీహోమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా, కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా అమ్మవారికి బుధవారం చండీహోమం నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీల్లో జేసీ ఆకస్మిక తనిఖీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో జిల్లాలో వంట గ్యాస్కు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. నగరంలోని జ్యోతి, రామకృష్ణ గ్యాస్ ఏజెన్సీలలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం వినియోగదారులు ఆన్లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేయాలని, వారి మొబైల్ నంబర్ ఎల్పీజీ గ్యాస్ కన్జూమర్ నంబర్కు అనుసంధానమై ఉండాలని అన్నారు. వినియోగదారులలు కంట్రోల్ రూముకు మాత్రమే కాకుండా సమస్యలపై నేరుగా తన వాట్సాప్ నంబర్ 88869 03611కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించి గ్యాస్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వ్యక్తుల పేరిట గ్యాస్ కనెక్షన్లు ఉండి, వారసుల పేరిట మార్పు జరగనప్పుడు తాత్కాలిక ఇబ్బంది ఉండవచ్చని అన్నారు. కానీ, మొబైల్ నంబరు, వివరాలు మార్చుకుని సులభంగా ఆన్లైన్ బుకింగ్ చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని 42 గ్యాస్ ఏజెన్సీలు తప్పనిసరిగా ఓటీపీ విధానం అమలు చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఆన్లైన్ వివరాలు, మొబైల్ నంబర్లు సరి చేయాలని జిల్లా పౌర సరఫరా అధికారి ఆర్.సత్యనారాయణరాజుకు జేసీ సూచించారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చట్లు పిఠాపురం రూరల్: మండలంలోని జల్లూరు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సరకుల నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మాతా శిశు సంరక్షణపై అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం ఆయన కుమారపురం జెడ్పీ హైస్కూల్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో తాగునీరు, ఇతర సదుపాయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
చివరిలో ముంచిన వరుణుడు
పిఠాపురం: నీటి ఎద్దడి, యూరియా కష్టాలు, పెట్టుబడి సమస్యల వంటి అనేక ఒడుదొడుకులకు ఎదురీది మరీ అన్నదాత పడిన మూడు నెలల కష్టాన్ని ఒక్క గాలివాన నేలపాలు చేసింది. పండిన పంట కొద్ది రోజుల్లో చేతికందుతుందనుకున్న వేళ.. కళ్ల ముందే నీళ్లపాలవుతూంటే రైతులు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. చండ మార్తాండుడి ప్రతాపంతో బుధవారం పగలంతా జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు. ఈ తరుణంలో గొల్లప్రోలు, తుని తదితర ప్రాంతాల్లో సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకుని, బలమైన ఈదురు గాలులు వీచాయి. చూస్తూండగానే అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు అకాల వర్షం కురిపించి, ప్రజలకు ఉపశమనం కలిగించాడు. కానీ, అన్నదాతలను మాత్రం ఆందోళనలోకి నెట్టేశాడు. పొలాల్లో కోత కోసి, ఆరబెట్టిన వరి పనలు, కళ్లాల్లో ధాన్యపు రాశులు ఈ వర్షానికి తడిసిపోయాయి. వానబారి నుంచి ధాన్యాన్ని కాపాడుకోడానికి రైతులు అనేక వ్యయప్రయాసలకు గురయ్యారు. వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు భారీ ఈదురు గాలుల తాకిడికి పలుచోట్ల వరి పైరు నేలకొరిగిపోయింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మల్లవరం తదితర ప్రాంతాలతో పాటు తుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో, విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చెట్టు కూలిపోవడంతో నిలిచిన వాహనాలు చేబ్రోలు – మల్లవరం రోడ్డులో విరిగిన చెట్టుధాన్యం తడిసిపోకుండా బరకాలతో రక్షణఫ అకాల వర్షంతో రైతుల కలవరపాటు ఫ ఈదురు గాలులకు నేలకొరిగిన వరి పైరు ఫ తడిసిన పనలు.. ధాన్యపు రాశులు -
రాధాకృష్ణ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలి
కాకినాడ రూరల్: మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి కోరారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తల దించుకునేలా రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మహిళలను గౌరవించడం చేతకాని రాధాకృష్ణ వ్యాఖ్యలను కూటమి నేతలు సమర్థించడం చూస్తూంటే వారిపై అసహ్యం కలుగుతోందని అన్నారు. ఆయనను వెనకేసుకుని రావడానికి పడుతున్న శ్రమలో కాస్తయినా రాష్ట్రాభివృద్ధిపై పెట్టాలని అధికార కూటమి ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. రాధాకృష్ణ చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలను సిగ్గులేని వారే సమర్థిస్తారని మండిపడ్డారు. మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించి చంద్రబాబు మెప్పు పొందాలనుకోవడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. గతంలో ఏబీఎన్ చానల్ను బహిష్కరించాలన్న ఆయన.. ఇప్పుడు ఆ చానల్కు మద్దతుగా ట్వీట్ చేయడం చూస్తేనే మహిళల పట్ల ఆయనకున్న దృక్పథం అర్థమవుతోందన్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధత విషయంలో అనేక లొసుగులున్న విషయాన్ని తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయమని 2020లో ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, అటువంటిది ఇప్పుడు చట్టబద్ధతకు ఎలా ఆమోదం తెలుపుతుందని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో న్యాయపరమైన వివాదాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు మొదటి నుంచీ చెబుతున్నారని, అయితే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాత్రం అది సాధ్యం కాదంటూ కుండబద్దలు కొట్టారని గుర్తు చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అమరావతి కాస్తా ఇప్పుడు అప్పుల అమరావతిగా మారిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ తరువాత ప్రపంచ బ్యాంకు రుణంతో అని మాట మార్చిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావించి, మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారని నాగమణి పేర్కొన్నారు. -
ఆటాడుకుంటున్నారు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో మిగిలిన తరగతుల వార్షిక పరీక్షలు కూడా పూర్తి కానున్నాయి. అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసంతో పాటు వివిధ క్రీడల్లో శిక్షణ పొందేందుకు విద్యార్థులు మక్కువ చూపుతూంటారు. క్రీడల ద్వారా తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు తల్లిదండ్రులు కూడా తపన పడుతూంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా వేసవిలో ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూంటాయి. ఏటా మే 1 నుంచి 31వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యాన కాకినాడ అర్బన్, రూరల్ ప్రాంతాలతో పాటు కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న క్రీడాకారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వివిధ క్రీడా ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేవారు (కోచ్లు) జిల్లా క్రీడా మైదానంలో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు ఒకింత నిరాశ కలిగిస్తోంది. క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు తగినట్టుగా చర్యలు తీసుకోవడం లేదు. ఖాళీ పోస్టుల్లో కొత్త కోచ్ల నియామకం చేపట్టడం లేదు. దీంతో, క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందనే విమర్శలు క్రీడాకారుల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా క్రీడా మైదానంలో ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో శిక్షణలకు అవకాశం జిల్లా క్రీడా మైదానంలో హాకీ, ఫుట్బాల్, జుడో, రెజ్లింగ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, క్రికెట్, యోగా, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు శిక్షణ ఇస్తారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో చేరిన విద్యార్థులకు సుమారు నెల రోజుల పాటు వారు ఎంచుకున్న క్రీడల్లో శిక్షణ ఇస్తారు. వారిలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి, సంవత్సరం పొడవునా శిక్షణ కొనసాగిస్తారు. ఈ క్రమంలో జిల్లా తరఫున రాష్ట్ర, జాతీయ, సౌత్ జోన్ పోటీల్లో ఆడేలా తర్ఫీదు ఇస్తారు. తద్వారా క్రీడాకారుల సంఖ్యను పెంచుతూ జిల్లా కీర్తిని రాాష్ట్ర, జాతీయ స్థాయిలకు విస్తరిస్తారు. వేసవి క్రీడా శిక్షణలకు ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పటికీ అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, యోగా, తైక్వాండో, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలకు శాప్ కోచ్లు లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. దీంతో, కొత్తగా క్రీడా శిక్షణలు పొందే వారికి సీనియర్ క్రీడాకారులు, ప్రైవేటు కోచ్లే దిక్కవుతున్నారు. వీరు ఏ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దగలరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా క్రీడా మైదానానికి వచ్చిన శాప్ పాలకవర్గం త్వరలోనే కోచ్ల నియామకాలు చేపడతామని, జిల్లాలో క్రీడల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని ఘనంగా చెప్పారు. కానీ, ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, శాప్ అధికారులు జిల్లా క్రీడా మైదానంలో ఖాళీగా ఉన్న కోచ్ల స్థానాల్లో అర్హులైన శాప్ కోచ్లను నియమించి, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సజావుగా జరిగేలా చూడాలని క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఫ పలు క్రీడలకు కోచ్ల కొరత ఫ పట్టించుకోని శాప్, ఉన్నతాధికారులు ఫ ప్రశ్నార్థకంగా వేసవి క్రీడా శిక్షణ -
కనకదుర్గమ్మకు సత్యదేవుని తరఫున సారె
అన్నవరం: సత్యదేవుని తోబుట్టువుగా రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారికి చైత్ర మాసోత్సవాల సందర్భంగా స్వామివారి తరఫున సిబ్బంది బుధవారం చీర, సారె సమర్పించారు. ఉదయం 8 గంటలకు సత్యదేవుని ఆలయం నుంచి దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాలతో ఊరేగింపుగా సారె తీసుకుని మెట్ల దారిన కనకదుర్గమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. ఊరేగింపునకు సిబ్బంది దూరం సారె సమర్పించే కార్యక్రమానికి సిబ్బంది అందరూ హాజరు కావాలని దేవస్థానం అధికారిక గ్రూపులో మంగళవారం మెసేజ్ పెట్టినా సిబ్బంది పట్టించుకోలేదు. సారెతో బయలుదేరేటప్పుడు సిబ్బంది, పండితులు 50 మంది వరకూ ఉండగా.. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరేసరికి 25 మంది కూడా లేరు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి, గంగబాబు, రమేష్, ముష్టి పురుషోత్తం, మరో నలుగురు పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు, ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి, సూపరిండెంట్ పీవీ రమణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, మరో పది మంది వ్రత పురోహితులు, పరిచారకులు మాత్రమే పాల్గొన్నారు. దేవస్థానంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలు పది మంది, హోంగార్డులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబీకుల పెళ్లి ఊరేగింపులో సైతం పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు పాల్గొంటారు. అటువంటిది కనీసం ఆ స్థాయిలో కూడా ఈ ఊరేగింపు నిర్వహించలేదు. దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది సుమారు 200 మంది, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది మరో 1,200 మంది ఉన్నారు. వీరు కాకుండా 250 మంది వ్రత పురోహితులు, వంద మంది నాయీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వీరిలో కనీసం 10 శాతం మంది పాల్గొన్నా కార్యక్రమం కళ కట్టేదని పలువురు అన్నారు. ఈ నెల 26 నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆ సందర్భంగా జరిగే ఊరేగింపుల్లోనైనా ఎక్కువ మంది సిబ్బంది పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
పిల్లల్ని హింసిస్తే కఠిన చర్యలు
● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు సూర్యనారాయణ ● తండ్రి చేతిలో దాడికి గురైన బాలుడికి జీజీహెచ్లో పరామర్శ కాకినాడ క్రైం: తండ్రి చేతిలో దాడికి గురై చావు అంచుల వరకు వెళ్లి ఆసుపత్రి పాలైన ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు పెండ్యాల నిహాల్ను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు మందాల గంగా సూర్యనారాయణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మితో కలిసి సోమవారం కాకినాడ జీజీహెచ్లో పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పక్కింటి వారి ఆటో సీటు కవర్ చింపాడని చెప్పడంతో తండ్రి చంద్రయ్య శనివారం తాగి వచ్చి బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడన్నారు. ఇనుప ఊచతో కొట్టి అట్ల కాడ కాల్చి శరీరంపై అంటించాడని తెలిపారు. బాలుడి ఆర్తనాదాలు చేస్తూ ఇంట్లో పడిపోయి రాత్రంతా చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుండగా ఆదివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి బాలుడిని రక్షించారన్నారు. తండ్రి చంద్రయ్య అప్పటికే పరారయ్యాడని, స్థానిక ఆసుపత్రికి చేర్చగా మెరుగైన వైద్యం కోసం ఆదివారం కాకినాడ జీజీహెచ్కు తరలించామని తెలిపారు. చంద్రయ్యపై ప్రత్తిపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశామని సూర్యనారాయణ అన్నారు. బాలుడి కడుపులో రక్తస్రావం అయిందని వైద్యులు తెలిపారని చెప్పారు. పిల్లల్ని హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాలుడిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. బాలుడి సంరక్షణ బాధ్యతలు డీసీపీవో వెంకట్ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ విభాగం చేపడుతుందని అన్నారు. బాలుడిని పరామర్శించిన వారిలో పీడీ, డీసీపీవోల సహా జిల్లా బాలల పరిరక్షణ అధికారులు కె.శ్రీనివాసరావు, కె.విజయ ఉన్నారు. -
మరణంలోనూ కలిసే పయనం
ఫ అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు ఫ మండపేట వద్ద దంపతుల దుర్మరణం ఫ మృతుల పిల్లలు, తల్లిదండ్రులను కాపాడిన స్థానికులు కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్ రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్నైట్ ఫంక్షన్కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్ కారు నడపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్, కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్, తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రూరల్ ఎస్సై వి.కిశోర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు. కొడుకు కౌన్సెలింగ్కు బయలుదేరి.. తిరిగి రాని లోకాలకు.. ధవళేశ్వరం/కపిలేశ్వరపురం: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ దంపతులు కలలు కన్నారు. ఆ తపనతో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గం మధ్యలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సహోద్యోగుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఉండమట్ల వీర్రాజు (42) ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్ సమీపాన గాదాలమ్మ నగర్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య వీరశైలజ (37), కుమారుడు యశ్వంత్ ఉన్నారు. కుమారుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అతడిని హైదరాబాద్లో ఇంటర్మీడియెట్లో జాయిన్ చేయాలని తల్లిదండ్రులు భావించారు. తద్వారా మంచి భవిష్యత్తును అందించాలని తపన పడ్డారు. కళాశాలలో సీటు కౌన్సెలింగ్ కోసం, బంధువులను కలిసేందుకు సోమవారం తెల్లవారుజామున కుమారుడితో కలిసి వీర్రాజు, వీరశైలజ దంపతులు కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్లలో సాగర్ కాలువ బ్రిడ్జి పైన వద్ద వారి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోయింది. ఆ లారీ కిందకు కారు దూసుకుపోయింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జికి అడ్డంగా తిరిగింది. అదే సమయంలో వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య వీర శైలజ తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కు పోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో ఆ వాహనాలను విడదీసి వీర్రాజును, లారీ డ్రైవర్ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా వీర్రాజు మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే వీర్రాజు దంపతులు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ధవళేశ్వరం పంచాయతీ ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీర్రాజు మృతి పట్ల పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్రావు, సిబ్బంది సంతాపం తెలిపారు. వీర్రాజు గతంలో మండపేట మండలం ఏడిద పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. అంగరలో విషాద ఛాయలు వీర్రాజు దంపతుల మరణ వార్త ఆయన స్వగ్రామం అంగరలో విషాదం నింపింది. వీర్రాజు తండ్రి ఉండమట్ల వెంకటేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ సెంటర్లో చాలా కాలం పాటు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. ఆయనకు వీర్రాజు పెద్ద కుమారుడు. చదువుకునే రోజుల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తిగా వీర్రాజు అంగర గ్రామస్తులకు చిరపరిచితుడు. పదో తరగతి వరకూ అంగర ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్మీడియెట్ మండపేటలోని ప్రైవేటు కళాశాలలోను చదివారు. జూనియర్ అసిస్టెంట్గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, కోరుమిల్లి, అంగర, నిడసనమెట్ట, వెదురుమూడి, ఏడిద గ్రామాల్లో పని చేశారు. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ తరచూ అంగర వచ్చి వెళ్లేవారు. వీర్రాజు మృతి పట్ల ఆయన స్నేహితుడు, గ్రామ మాజీ సర్పంచ్ బట్టా షణ్ముఖ శ్రీనివాస్, స్నేహితులు ఎం.సత్యనారాయణ, ఎస్.అప్పారావు, ఎ.రవికిరణ్, బడుగు కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు. కళ్ల ముందే జలసమాధి తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీర్ణించుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్, కిరణ్మయి దంపతుల పలకరింపులు ఇంకా మరచిపోక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. దంపతుల మృతితో గ్రామస్తులు సైతం తల్లడిల్లారు. వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. -
పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకోం
● మసీదు మాన్యంలో ఇళ్లు నిర్మించాలి ● ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటాం ● లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం ● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత ● పిఠాపురంలో లబ్ధిదారులతో కలిసి ఆందోళన, భారీ ర్యాలీ పిఠాపురం: పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదని పిఠాపురం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ కోసం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన పిఠాపురం మసీదు మాన్యంలో ఆయుష్ కళాశాల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఆమె ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నేతలు లబ్ధిదారులకు అండగా ఆందోళన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ఇచ్చిన స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నర్సింగపురంలో జగనన్న కాలనీలో కేటాయించిన స్థలాల్లో ఇప్పటికే పట్టాలిచ్చిన లబ్ధిదారులకు రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడలో ఆయుష్ ఆసుపత్రి నిర్మించిన స్థలానికి పిఠాపురంలో మసీదు మాన్యం సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఈ విషయాన్ని పక్కనపెట్టి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా చూపించారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలు ఆస్పత్రులకు దగ్గరలోనే ఉండాలన్న నిబంధనను కూడా మర్చిపోయారన్నారు. తెలుగుదేశం నేతకు అక్కడ స్థలాన్ని కట్టబెట్టడం కోసమే ఇక్కడ పేదలకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నేతకు కేటాయించాలనుకుంటే చాలా స్థలాలు ఉన్నాయని, నిరుపేదలకు స్థలాలను ఆక్రమించుకోవడం దారుణం అన్నారు. వైఎస్సార్ సీపీకి పేరు వస్తుందన్న అక్కసుతోనే.. వైద్య కళాశాల ఆసుపత్రి పక్కనే ఉండాలన్న నిబంధనను పక్కన పెట్టి దూరంగా ఉన్న పేదల స్థలాలను ఉన్నతాధికారులు రికమండ్ చేయడం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తే వైఎస్సార్ సీపీకి పేరు వచ్చేస్తుంది అన్న అక్కసుతో కావాలని పేదల స్థలాలను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. నిరుపేదలకు కేటాయించిన జగనన్న కాలనీలను అడ్డుకుని వారి నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమని, చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టే అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే నేతలు అందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై పవన్ కల్యాణ్ పునరాలోచించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. పిఠాపురం మసీదు మాన్యంలో కొద్ది సేపు ఆందోళన నిర్వహించిన అనంతరం లబ్ధిదారులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి పాడా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబీ, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, పచ్చిమళ్ల జ్యోతి, ఉలవల భూషణం, బత్తుల సాయిరాం, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోను దేవ, సోమరౌతు లలిత, పలువురు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు. -
గూడుపుఠాణి
పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీ కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు నజరానాగా సుమారు రూ.250 కోట్ల విలువైన 3.4 ఎకరాలను కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. వర్మ కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసి అమలు చేసింది. ఇందుకోసం కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ (జీపీటీ)కి సమీపాన ఆయుష్ ఆస్పత్రికి ఆనుకుని ఉన్న స్థలాన్ని ధారాదత్తం చేసింది. వాస్తవానికి ఈ ఆస్పత్రికి అనుబంధంగా ఆయుష్ కాలేజీ నిర్మాణానికి కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. కాకినాడలో ఆయుష్ ఆస్పత్రికి ఆనుకుని నిర్మించాలనుకున్న ప్రతిపాదిత కాలేజీని పిఠాపురం తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మేధావులు మండిపడుతున్నారు. ఎక్కడైనా ఆస్పత్రికి దగ్గర్లోనే కాలేజీని కూడా ఏర్పాటు చేయడం అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి కాలేజీ మంజూరు చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అటువంటి కాలేజీని కాకినాడ నుంచి పిఠాపురం తరలించే ఎత్తుగడలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఆస్పత్రి వద్దనే కాలేజీ ఏర్పాటుకు మోకాలడ్డుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సభ్యులకు అయాచిత లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటున్నారు. ● పేదల ఇళ్ల స్థలాల్లో కాలేజీ నిర్మాణానికి స్కెచ్ ● 245 కుటుంబాలను రోడ్డు పాల్జేసే కుట్ర ● వర్మకు కట్టబెట్టడమే అసలు మర్మం ● విస్తుబోతున్న జనం, లబ్ధిదారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వం పేదల సొత్తును పెద్దోళ్లకు దోచిపెడుతోంది. సెంటు భూమి లేని నిరుపేదలకు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉదారంగా ఇళ్ల స్థలాలు అందించింది. ఇళ్ల పట్టాలు ఇచ్చి, స్థలాలు చూపించింది. ఇళ్లు నిర్మించుకోలేదనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ఆ స్థలాలను లాగేసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక జీఓను విడుదల చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా నిరుపేదల ఇళ్లు నిర్మించుకోలేని దీనావస్థను ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించాల్సింది పోయి అన్యాయంగా స్థలాలు వెనక్కు తీసేసుకునేలా ఇచ్చిన జీఓపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కుటుంబ సభ్యులకు అయాచిత లబ్థి చేకూర్చేందుకనే తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. నిస్సిగ్గుగా నిరుపేదల గూడు కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. స్థలాలు వెనక్కు తీసేసుకుంటే ఏమైపోతాం ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. స్థలాలు కూడా చూపించారు. ఇళ్లు నిర్మించుకునే సమయంలో ఎన్నికలు రావడంతో అవి ఆగిపోయాయి. స్థలాలు మాత్రం అలా గే ఉన్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇళ్లు నిర్మిస్తామని నాయకులు చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. చాలామంది నాయకులు, అధికారులను కలిశాం. త్వరలో ఇళ్ల నిర్మా ణం చేపడతాం అని చెప్పారు. తీరా ఇప్పుడు స్థలాలు వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెబుతుంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదు. మాదిరాజు శ్రీదేవి, నూకాలమ్మ గుడివీధి, పిఠాపురం. అన్యాయం చేయడం తగునా? ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకోవచ్చునుకుంటున్నాం. ప్రభుత్వం అకస్మాత్తుగా స్థలాలు వెనక్కు తీసేసుకుంటే రోడ్డు పాలైపోతాం. ఇల్లు నిర్మిస్తారనుకుంటే ఇప్పుడు ఇలా చేయడం తగునా. స్థలాలు ఉన్నాయి, ఈ వేళ కాక పోతే రేపు కట్టుకుందామనుకుంటే నాయకులు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇల్లు కట్టివ్వాలి. – పొట్నూరి లోవలక్ష్మి, గొల్లపేట, పిఠాపురం ఇళ్లు కట్టించడానికి బదులు స్థలాలకు ఎసరు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి దుర్మార్గమైన జీఓ విడుదల చేయడంపై వైఎస్సార్ సీపీ, వామపక్షాలతో సహా ప్రజా సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. పిఠాపురంలోని మసీదు మాన్యం భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతోన్న నిరుపేదలైన సుమారు 245 కుటుంబాల వారిని రోడ్డు పాల్జేస్తున్న సర్కార్ తీరుపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. మూడేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు ఐదు ఎకరాలలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణాలకు సమాయత్తమవుతోన్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చిన భూముల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని కూటమి నేతలు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కి రెండేళ్లైనా నిర్మాణాల ఊసే మరచిపోయారు. అప్పటి నుంచి లబ్ధిదారులు ఇళ్ల మంజూరు చేసి నిర్మించాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారికి ఇళ్లు మంజూరు చేయకుండా, ఉన్న స్థలాలు వెనక్కి తీసుకుని ఆయుష్ కళాశాల నిర్మించాలనే ప్రయత్నాలపై బాధిత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. బాధితుల పక్షాన మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ వంగా గీత పోరాటానికి శ్రీకారం చుట్టారు. సోమవారం మసీదు మాన్యంలో లబ్ధిదారులతో సమావేశం అయిన ఆమె బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి పాడా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై సీపీఐ నేతలు ఇప్పటికే ఆందోళనకు ఉపక్రమించారు. -
జాతీయ రెజ్లింగ్ పోటీలకు హారిక
సామర్లకోట: మండల పరిధిలోని వేట్లపాలెం కొండపల్లి గంగన్న మెమోరియల్ జిల్లా పరిషత్తు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న దాసరి హారిక జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక అయినట్టు పాఠశాల హెచ్ఎం అనురాధ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో హారిక ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించడంతో అండర్ 17 రెజ్లింగ్ అసోసియేషన్ టోర్నమెంట్ నేషనల్కు ఎంపిక అయినట్టు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని బైరంగాబాద్లో జరిగే నేషనల్ చాంపియన్ షిప్లో పాల్గొంటారన్నారు. ఈ మేరకు హారికను ఫిజికల్ డైరెక్టర్లు యార్లగడ్డ బంగార్రాజు, ఇబ్రహీం, గ్రామ పెద్దలు అభినందించారు. -
ఆ మూర్తి యువతకు స్ఫూర్తి
● జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ● ఘనంగ నివాళులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నేటి తరం యువతకు బాబూ జగ్జీవన్ రామ్ స్పూర్తిదాయకంగా నిలుస్తారని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం స్థానిక లేడీస్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. బిహార్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి తన స్వయంకృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని బాబూ జగ్జీవన్రామ్ను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు. వివిధ మంత్రి పదవులు చేపట్టి నవ భారత నిర్మాణం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రధానంగా భూసంస్కరణ ద్వారా దున్నేవాళ్ళకే భూమి మీద హక్కు కల్పించారన్నారు. వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికి గోధుమలు, ఇతర ఆహార దినుసులను దిగుమతి చేసుకునే మన దేశానికి స్వయం సమృద్ధితెచ్చారన్నారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే 1971లో పాకిస్తాన్ పై మన దేశం విజయం సాధించిందని, కొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకుందన్నారు. కేంద్ర మంత్రిగా పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, భవిష్యనిధి చట్టం వంటి ఎన్నో కార్మిక సంక్షేమ చట్టాలు తెచ్చారని, ఎయిర్ లైన్స్, రైల్వేల విస్తరణకు బాటలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తలుపులమ్మ పుట్టింటి సంబరాలు ఆరంభం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. లోవ దేవస్థానంలో గరగలను శిరస్సుపై అధిష్టించి వార్షిక జాతరోత్సవాలను ఈఓ పి.విశ్వనాథరాజు, మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, ప్రధాన అర్చకులు సంప్రదాయ నృత్యాలతో ప్రారంభించారు. గత సంవత్సరం లోవ కొత్తూరులో భద్రపర్చిన అమ్మవారి గరగలను కళాకారులు, గ్రామస్తులు ఆదివారం లోవ దేవస్థానానికి తీసుకువెళ్లి పుట్టధార నుంచి జాలువారే పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అమ్మవారి ప్రధాన గర్భాలయంలో ఉంచి ప్రధాన అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన వస్త్రాలతో గరగలను అలంకరించి ఈఓ, మాజీ చైర్మన్ శిరస్సులపై ఉంచుకుని నృత్యాలు చేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహిస్తూ తలుపులమ్మ అమ్మవారి గరగలను ఊరేగింపుగా లోవకొత్తూరు గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాన్పుపై గరగలను ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ విశ్వనాథరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంధామావాస్య సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి లోవకొత్తూరులో పుట్టింట 13 రోజులు జాతరోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. 16న జాగరణోత్సవం, 17న తీర్థం, అమ్మవారి ఊరేగింపు, భక్తులు అమ్మవారి దర్శనాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. జాతరోత్సవాలను పురస్కరించుకుని 16, 17 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
పోర్ట్ అధారిత కార్మికుల సంక్షేమం కోసం కృషి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ చైర్మన్, షేక్ ఖలీఫతుల్లా తెలిపారు. స్థానిక హోటల్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్ట్ రంగంలో కార్మికుల పాత్ర దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, వారి హక్కులు, భద్రత, ఆరోగ్య సదుపాయాలు ఇంకా పలు ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా అమలు స్థాయిలో తీసుకువెళ్లేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా ప్రమాణాలు, సామాజిక భరోసా కల్పించడం ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రగతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక స్థాయిలో కార్మిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పోర్టుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం పరస్పర అనుసంధానమైన అంశాలని, కార్మికుల సంక్షేమం బలోపేతం అయితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు. భవిష్యత్తులో కూడా కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమగ్ర అభివృద్ధి దిశగా నిరంతరంగా కృషి కొనసాగిస్తామని ఖలీఫతుల్లా స్పష్టం చేశారు. ఫెడరేషన్ విస్తరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలోకి వంశీ కృష్ణను, జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణను నియమించినట్లు ప్రకటించారు. అనంతరం వారికి నియామక పత్రాలు అందించారు. -
శోషల్ మీడియా
‘బ్యాన్’ మాటల్లోనే.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని బ్యాన్ చేస్తామని ఈ ఏడాది మార్చి 6న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. నేటికి సరిగ్గా నెల రోజులు గడిచినా ఆయన చేసిన ప్రకటనపై ఏ మాత్రం ముందుకు వెళ్లింది లేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారు. ఎలా అమలు చేస్తారు. 13 ఏళ్లపై బడ్డ టీనేజర్ల పరిస్థితి ఏమిటి వంటి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. నియంత్రణ కరవు సామాజిక మాధ్యమాలలో చోటు చేసుకుంటున్న కార్యకలాపాల నుంచి, కాల పరిమితి వరకు ఎటువంటి నియంత్రణ లేదు. చట్టపరంగా నియంత్రించే చర్యలు కూడా దాదాపుగా శూన్యమే. అరచేతిలో ఇమిడిపోతున్న సెల్ఫోన్ అందులో ఇంటర్నెట్ ఉన్నంత వరకు చిన్న పిల్లలు కూడా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులు కూడా ఈ మత్తులోనే జోగుతుండడంతో పిల్లలకు మంచి చెప్పే పరిస్థితి లేకుండా పోతోంది. సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్ట్రాగాం, సహా డేటింగ్ యాప్లు, అశ్లీల కంటెంట్తో రెచ్చిపోతున్న మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాంలు పూర్తిగా యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. ● వెర్రి తలలు వేస్తున్న సోషల్ మీడియా ● బానిసలవుతున్న యువత, పిల్లలు ● మానసిక, శారీరక అనారోగ్యాలు ● ఆరు నెలల్లో 141 అనుబంధ నేరాలు కాకినాడ క్రైం: ఓ యువతి వాట్సాప్ స్టేటస్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలు పెట్టుకునేది. స్క్రీన్షాట్లు తీసి అశ్లీల మార్ఫింగ్కు పాల్పడ్డాడు ఓ యువకుడు. యువతి కుటుంబీకులు పోలీసుల్ని ఆశ్రయిస్తే స్టేటస్ నేనే కాదు చాలామంది చూసి ఉంటారు. మార్ఫింగ్ నేనే చేశానన్న గ్యారంటీ ఏంటి అంటూ సునాయాసంగా తప్పించుకున్నాడు. ● ఇన్స్ట్రాగాంలో వైరల్ అయిన ఓ అడ్వర్టైజ్మెంట్ను చూసి క్లిక్ చేసిన ఓ డీటీపీ ఆపరేటర్ తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.40 వేలు పోగొట్టుకున్నాడు. ● ఫేస్బుక్లో ఓ అకౌంట్ హోల్డర్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంతో అతడిని ఫాలో అవుతున్న కాకినాడ యువకుడు బెట్టింగ్ యాప్స్లో జూదం మొదలు పెట్టాడు. గత ఐపీఎల్ సమయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ● తన ఇన్స్ట్రాగాం ఐడీకి వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సప్ట్ చేసింది ఓ యువతి. కాకినాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న ఆమె తన స్నేహితులకు.. ఆకర్షణీయంగా ఉన్న యువకుడు తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడని చెప్పుకుంది. కొద్దిరోజుల పాటు స్నేహం నడిచేసరికి అసలు విషయం వెల్లడైంది. ఆ అకౌంట్ ఆన్లైన్ వ్యభిచారం నిర్వహించే ఓ గ్రూప్ అకౌంట్ అని, వారు ఇలా యువతులపై వలలు వేస్తూ వ్యభిచారంలోకి దించుతున్నారని తెలిసింది. సోషల్ మీడియా ఒక మిథ్యా ప్రపంచం. ఎక్కడో ఉన్నవారిని దగ్గర చేస్తున్నానపించి పక్కనే ఉన్న అయిన వారిని దూరం చేస్తున్న ఓ సామాజిక సాధనం. కలలు, కల్పితాలు, షేర్లు, లైక్లు కామెంట్లే ఇంధనంగా మనల్ని మనకి కాకుండా చేసేస్తున్న డిజిటల్ బానిసత్వం. మునిగామా.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టింపు ఉండదు, మనం, మనవారు ఏమైపోతున్నా తల తిప్పం. ఏం పోస్ట్ చేద్దాం అన్న ఆత్రం, పోస్ట్ చేశాక ఎవరి స్పందన ఏంటన్న కుతూహలం. లైక్లు లేకపోతే తినం, షేర్లు లేకపోతే నిద్రపోం, నెగటివ్ కామెంట్లయితే జీర్ణించుకోలేం. ఆకాశం ఊడినట్లు, కూడనిది ఏదో జరిగినట్లు మనల్ని మనం కోల్పోతాం. ఇదీ సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం. మన ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన సోషల్ మీడియా వేదిక దుర్వినియోగం అవుతోంది. ఇలా చేస్తే మేలు ● సోషల్ మీడియా వేదికల వినియోగం తప్పనిసరి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ● చిన్నపిల్లలను అనుమతించవద్దు ● ముందుగా నిర్దేశించుకున్న సమయం మేరకే యాప్లో ఉండాలి. ● యాప్స్లో ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి. ● అకౌంట్ రిజిస్ట్రేషన్, వినియోగం వేళ వ్యక్తిగత, కుటుంబ ఫొటోలు, ఫోన్ నంబర్లు, చిరునామా షేర్ చేయకూడదు. ● తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సప్ట్ చేయవద్దు. ● నిద్రకు కనీసం గంటన్నర ముందు సోషల్ మీడియా, ఫోన్ వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి. ● అకౌంట్లకి స్ట్రాంగ్ పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలి. తరచుగా మార్చుతుండాలి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఆన్ చేసుకోవాలి. వ్యక్తిగత ఫొటోలు పోస్ట్ చేయవద్దు వాట్సాప్ స్టేటస్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టడం, ఎక్కడికి వెళుతున్నాం. ఏం చేస్తున్నామో పోస్ట్ చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ సమాచారాల వల్ల దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మిగిలిన సోషల్ మీడియా వేదికల కంటే వాట్సాప్ స్టేటస్ మరింత వేగంగా చేరుతుంది. సైబర్ నేరాలకు గురైతే 1930కి డయల్ చేసి కంప్లైంట్ చేయాలి. – గరికపాటి బిందుమాధవ్, ఎస్పీ, ఐడీలతోనే పరిచయాలు నేటి తరంతో సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. పరిచయ ప్రక్రియలు సమూలంగా మారిపోయాయి. మరీ దారుణంగా, ఒకరికొకరు నూతన పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు సొంత ఊరు, పేర్లతో పరిచయం చేసుకోవడం మానేశారు, ఎవరివి వారు సోషల్ మీడియా ఐడీలు చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటున్నారు. ‘పోటుగాడు’, ‘పంచ్ పటాక్’, ‘ఖతర్నాక్ కుర్రోడు’ , ‘బిల్డప్ బాబాయ్’, ‘ఆల్ ఇండియా అందగత్తె’ అంటూ ఒకటా రెండా చిత్ర విచిత్రమైన పేర్లు ఎన్నో వినిపిస్తున్నాయి. ఓ స్నేహితుడు తన స్నేహితుడికి మరో వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తున్నాయి. ఎన్ని అనర్థాలో.. సామాజిక మాధ్యమాల వేదికగా అనేక నేరాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ మొత్తంలో నగదుతో పాటు కీలక డేటా చౌర్యానికి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతుల మాన, ప్రాణాలకు సోషల్ మీడియా వేదికలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. బెట్టింగ్ యాప్లు వీటి ద్వారానే ప్రమోట్ అవుతున్నాయి. పిల్లల చదువుపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. తీవ్ర మానసిక, శారీరక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. కాకినాడ జిల్లాలో సోషల్ మీడియా అఽనుబంధ నేరాలు నానాటికీ అధికమవుతున్నాయి. ఫొటోలు మార్ఫింగ్, ఖాతాలో డబ్బులు చోరీ, ఫేక్ అకౌంట్లు సృష్టి, ఖాతా హ్యాకింగ్ నేరాలపై గడచిన ఆరు నెలల్లో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో 141 ఫిర్యాదులు అందాయి. వీటిలో పరిష్కారమైనవి ఏవీ లేవు. ఇటువంటి ఫిర్యాదులు అందుకునేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు లేవు. ముందుగా 1930 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, ఆ అక్నాలెడ్జ్మెంట్ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
మహిళ మృతదేహం లభ్యం
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో నరసాపురం పెదకాలువలో గల్లంతైన గున్నం భార్గవీదుర్గ ప్రసన్న (26) మృతదేహం శనివారం లభ్యమైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గున్నం భార్గవి దుర్గాప్రసన్నతో పాటు స్నేహితుడు రావుపల్లి సమీర్చక్రవర్తి, ఆళ్ల పవన్శ్రీకర్ తేజలు శుక్రవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చారు. గుడ్ఫ్రైడే సెలవు కావడంతో శనివారం రావాలని అక్కడ సిబ్బంది చెప్పడంతో తణుకు పట్టణానికి వచ్చి భోజనం చేశారు. తహసీల్దార్ పీఎస్డీ ప్రసాద్, ఉండ్రాజవరం ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా కాలువరేవు సమీపాన గున్నం భార్గవి దుర్గాప్రసన్న మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాబుకు బుద్ధినివ్వు.. నాయుడిని గద్దె దింపు
● వేంకటేశా..సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి బర్తరఫ్ చేసి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ శనివారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు జిల్లా అంతటా పెద్ద ఎత్తున జరిగాయి. ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసన కార్యక్రమాలు, ఆలయాల్లో పూజల్లో భాగస్వాములయ్యారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నారనే విధంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయినా చంద్రబాబు ఉదాసీనంగా ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు నిలదీశారు. ఇటువంటి వీడియోలు వెలుగులోకి వచ్చినప్పుడు తన సచ్చీలత నిరూపించుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడవల్సిన పాలక మండలి చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఇటువంటి కార్యకలాపాలలో ఉన్నారని తెలిసి కూడా చంద్రబాబు తన వెంట బీఆర్ నాయుడును తిప్పుకోవడం సిగ్గు, సిగ్గు అంటూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నినాదాలు చేశారు. శనివారం కావడంతో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుని నుంచి కాకినాడ వరకు అన్ని నియోజకవర్గాల్లోను నిరసన ర్యాలీలు, చైర్మన్ నాయుడును వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరును ఎండగడుతూ ప్ల కార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. హిందువుల మనోభావాలు గాలికొదిలేసిన చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ప్ల కార్డులతో నిరసన జిల్లాలోని తుని, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు సంయుక్తంగా పూజల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆదేశాలతో కోటనందూరు మండలం కొట్టం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయుడును పదవి నుంచి తొలగించకపోవడంపై ఆలయం బయట ప్ల కార్డులతో నిరసన తెలియజేశారు. కాకినాడ రూరల్ ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రమణయ్యపేట నుంచి ర్యాలీ నిర్వహించారు.ఆర్టీసీ కాలనీలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తిరుమల పవిత్రను కాపాడు దేవుడా అని వేడుకున్నారు. ఆలయం బయట చైర్మన్ నాయడును తొలగించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి, గొడ్డు కొవ్వు కలిసిందని, తీవ్రమైన దుష్ప్రచారం చేశారని ద్వజమెత్తారు. తీరా అది తేలిపోయి ప్రజల్లో చులకన అయిపోయిన తరువాత ఇంకా టీటీడీని అపవిత్రం చేసే కార్యక్రమాలే చేస్తున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు వీడియోలు బయటకు వచ్చినా చంద్రబాబు ఎందుకు చర్యలకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తిరుమల, ఒంటిమిట్ట వెళ్లినా నాయుడు, చంద్రబాబు పక్కనే ఉండటం చూస్తుంటే వీరిది ఫెవికాల్ బంధమన్నట్టుగా ఉందన్నారు. టీటీడీ పవిత్రను కాపాడుతానని చెప్పిన చంద్రబాబు ఎందుకు నాయుడు విషయంలో మౌనంగా ఉన్నారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామి కుల దైవమని చెప్పుకునే చంద్రబాబు స్వామి పవిత్రను కాపాడేందుకు ఎందకు ముందుకు రావడం లేదని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తోందన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొప్పన శివ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ(కిట్టు), మండల ఉపాధ్యక్షుడు రామదేవు సూర్య ప్రకాశరావు, పార్టీ నాయకులు మాకినీడి శేషుకుమారి, మాజీ మేయర్ సరోజ పాల్గొన్నారు. పిఠాపురం పిఠాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు వంగా గీత ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాధించాలని గీత కోరారు. తప్పుడు విధానంలో వెళ్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును వెంటనే తొలగించాలని గీత డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి రామారావు (బాబి), జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గంపేట టీటీడీ చైర్మన్ పదవి నుంచి నాయుడుని తప్పించాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట కోఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో జగ్గంపేట వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగ్గంపేట మండల అధ్యక్షుడు రావుల గణేష్ రాజా, పబ్లిసిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామకుర్తి జగాలు, సగర సంగం జిల్లా అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పెద్ద రాజబాబు పాల్గొన్నారు. గోకవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. అనంతరం మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, మండల అధ్యక్షుడు పార్టీ రాంబాబు, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తోలేటి రాంప్రసాద్, నరాలశెట్టి నరసయ్య మాట్లాడుతూ టీటీడీ పవిత్రతను అపవిత్రం చేస్తున్న చైర్మన్ నాయుడుని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్దాపురం టీటీడీ చైర్మన్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయి ప్రసాద్ సామర్లకోట–పెద్దాపురం రోడ్డులో ఉన్న పాండురంగ స్వామి ఆలయంలో కార్యకర్తలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని పూజలు నిర్వహించారు. పాండురంగ స్వామి ఆలయ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి దొరబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వీడియోలు బయటకు వచ్చినా పాలక మండలి చైర్మన్ను తొలగించకుండా, అతనిని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నాయకులు ఆక్షేపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గౌరసాన సూరిబాబు, ఎంపీపీలు బి.సత్తిబాబు, మిరియాల లోవరాజు, ఎస్ఈసీ సభ్యుడు గోపు మురళి పాల్గొన్నారు. ప్రత్తిపాడు టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు కలియుగదైవమైన వేంకటేశ్వరస్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి పద్మావతి అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట ప్లకార్డు ప్రదర్శించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమ్మీలు, జెడ్పీటీసీ సభ్యులు బెహరా రాజరాజేశ్వరి, గొల్లు చిన్న దివాణం, పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా, బెహరా దొరబాబు, బదిరెడ్డి గోవింద్ పాల్గొన్నారు. జగ్గంపేటలోని రాజగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి తోట నరసింహం, పార్టీ నేతలు ఉత్తరకంచి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు తిరుమల పవిత్రతను కాపాడు స్వామీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును బర్తరఫ్ చేయాలంటూ ఆలయాల్లో పూజలు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసనల్లో పాల్గొన్న జనం -
ప్రాణాలతో జలగాటం
ఫ సరదాగా ఈతకెళ్లిన నలుగురు స్నేహితులు ఫ ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు ఫ ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద ఘటన ఫ మృతులంతా రాజమహేంద్రవరం వాసులు సాక్షి, అమలాపురం/ ఆత్రేయపురం: ఉరకలేసే గోదావరి అప్పుడప్పుడూ యువత ఉసురు తీస్తోంది. జల క్రీడ వారిని మృత్యుఒడిలోకి లాగేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక శివారు గోదావరిలో శనివారం మధ్యాహ్నం ఒకరు మృతి చెందడం, ఇద్దరు యువకులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద స్నానాలకు దిగగా ఈ ఘటన జరిగింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామ శివారు పిచ్చుకలంకలో గోదావరి నదిలోకి రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు స్నేహితులు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్నానాలకు దిగారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గోరక్షణపేట, తుమ్మలావ ప్రాంతాలకు చెందిన మహ్మద్ అర్ఫాద్, షేక్ బిలాల్ (29), షేక్ సుల్తాన్ మహ్మద్ గల్లంతయ్యారు. ఇందులో షేక్ బిలాల్ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారు వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం. నలుగురు స్నేహితుల్లో ముసలి మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈత కోసం వెళ్లి.. ధవళేశ్వరం – బొబ్బర్లంక మధ్య ఉండే పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో ఈత కొట్టేందుకు వారంతా దిగారు. బ్యారేజీ గేట్ల దిగువన ఉన్న ఆనకట్టును దాటుకుని ఇసుక తిన్నెలు మొదలయ్యే ప్రాంతంలో వరకూ వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ నది లోతు పది నుంచి ఇరవై అడుగులు (మడుగులా) ఉంటోంది. నీటి ప్రవాహం కూడా అధికం. ఇది తెలియని యువకులు ఈత కొడుతూ కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ఆధ్వర్యంలో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. స్నానానికి వెళ్లిన యువకుడు ముసలి మణికంఠ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఏటా విషాద ఘటనలే.. ఏటా వేసవి వచ్చిందంటే గోదావరి చెంతన విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వైనతేయ, వశిష్ఠ, గౌతమీ నదీపాయల వెంబడి పలుచోట్ల లంకలు, గోదావరి ఏటిగట్టు దిగువన స్నానాలకు దిగడం పరిపాటి. ఇటువంటి చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది మే 27న ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో స్నానాలకు వెళ్లి ఎనిమిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకకు వచ్చిన 20 ఏళ్ల వయస్సు లేనివారు గోదావరిలో మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనితో పాటు పి.గన్నవరం అక్విడెక్టు, ముంగండ, రాజోలు, మలికిపురం, ఊడిమూడిలంక, గంటి పెదపూడి, కోటిపల్లి, శేరులంక, మురమళ్ల వంటి ప్రాంతాల్లో గోదావరి స్నానాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రమాదాలు జరిగినప్పుడు రెండు, మూడు రోజులు హడావుడి చేసే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు తరువాత గాలికి వదిలేస్తున్నారు. పిచ్చుకలంక వద్ద గోదావరిలో గాలింపు చర్యలను పరిశీలిస్తున్న పోలీసులు ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు పర్యాటకుల తాకిడి అధికం ధవళేశ్వరం బ్యారేజ్ నాలుగు ఆర్ముల్లో వేసవి సమయంలో పెద్ద ఎత్తున స్నానాలకు వస్తుంటారు. అధికంగా ధవళేశ్వరం, బొబ్బర్లంక ఆర్ముల వద్ద పర్యాటకుల తాకిడి ఉంటుంది. కొత్త, పాత బ్యారేజ్ మధ్య ఉండే ప్రాంతం స్నానాలకు అనువుగా ఉంటోంది. ఇది మండుటెండల నుంచి ఉపశమనం కలిగించేది కావడంతో కోనసీమ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. యువకులు, పెద్దలతో పాటు మహిళలు వస్తుంటారు. అయితే ఇక్కడ కనీస రక్షణ చర్యలు లేవు. హెచ్చరిక బోర్డులకే పరిమితం కావడంతో ఏటా ప్రమాదాలు తప్పడం లేదు. -
ఏపీఈఏపీ సెట్కు ఉచిత కోచింగ్
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కేశవరావు బాలాజీచెరువు (కాకినాడ): ఏపీఈఏపీ సెట్ రాసే విద్యార్థుల కోసం పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వి.కేశవరావు పేర్కొన్నారు. కళాశాలలో శనివారం కంప్యూటర్ ల్యాబ్లో మెటీరియల్ విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తోడైతే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడగలరన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు మాట్లాడుతూ కళాశాల పూర్వవిద్యార్థులు కర్రిభామిరెడ్డి, వైఎస్ఎన్ చొరవతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా డాక్టర్ వంగూరి చిట్టెన్, అభ్యదయ ఫౌండేషన్, పైడా చారిటబుల్ ఆర్గనైజేషన్, ఎస్ఆర్ఏంటీ సంస్థల సహకారంతో 20 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ ఏపీఈఏపీసెట్తో పాటు నీట్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నామని, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పహార సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్ట్స్ విద్యార్థుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (క్యూట్), లాసెట్ కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇతర వివరాలకు కన్వీనర్ పీ.వీ.కృష్ణ 98493 76980, బాలకృష్ణ 83286 56065 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.కొడుకుపై తండ్రి ఘాతుకం ● అట్లకాడ కాల్చి ముఖంపై వాతలుప్రత్తిపాడు రూరల్: మానవత్వాన్ని మరిచిన అతను కన్న కొడుకు ముఖంపై అట్లకాడ కాల్చివాతలు పెట్టి తండ్రి స్థానానికే మచ్చ తెచ్చిన ఘటన ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఏడేళ్ల నిహాల్ ఆటలాడుకుంటూ ఇంటి సమీపలోని వేరే వ్యక్తికి చెందిన ఆటో షీట్ కవర్ను కోసి ధ్వంసం చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న తండ్రి పెండ్యాల చంద్రయ్య గాఢనిద్రలో ఉన్న కన్న కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో అట్లకాడను కాల్చి ముఖంపై వాతలు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన నిహాల్ను కుటుంబ సభ్యులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి స్థానంలో ఉన్న చంద్రయ్య మందలిస్తే పోయేదానికి చిత్రహింసలు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటి నుంచి తలుపులమ్మ పుట్టింటి సంబరాలు తుని రూరల్: లోవ తలుపులమ్మ పుట్టింటి సంబరాలు ఆదివారం నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరులో తలుపులమ్మ తల్లికి పుట్టింటి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ. 13 రోజులు నిర్వహించే ఈ సంబరాలు చివరి రోజు అమ్మవారి ఊరేగింపు, భక్తుల దర్శనాలు, తీర్థంతో ముగుస్తాయి. గ్రామస్తుల అభీష్టం మేరకు దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోవ కొత్తూరు గ్రామంలో ఉన్న ఉపాలయం వద్ద నాలుగు ఎకరాల విస్తీర్ణంలో జాతరోత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, బాణ సంచా పేలుళ్లు, తదితర భారీ ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి పుట్టింటి సంబరాలు కావడంతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉపాధి, ఉద్యోగాలు చేసుకునే కుటుంబీకులు, ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులు లోవకొత్తూరు వచ్చి గంధామావాస్య, అమ్మవారి జాతరోత్సవాలలో పాల్గొంటారు. ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామస్తులతో సమావేశం నిర్వహించామని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. మొదటి రోజు ఆదివారం వివిధ గ్రామాల్లో గరగలను ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
రాజానగరం: కానవరంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్చార్జ్ డీఎస్పీ బి.రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కానవరం గ్రామంలో కోరాడ శివలక్ష్మి ఇరవై ఏళ్లుగా తన కుమార్తెతో కలసి ఉంటుంది. అదే గ్రామంలోని జీడిపప్పు ఫ్యాక్టరీలోకి ఆమె కూలికి వెళ్తుండగా, కుమార్తె రాజమహేంద్రవరంలోని ఓ నగల దుకాణంలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో గత నెల 25న ఉదయం ఇంటికి తాళం వేసి, ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన శివలక్ష్మి తాళం వేసిన తలుపులు తీసి ఉండటాన్ని గమనించి కంగారుగా లోనికి వెళ్లి చూస్తే బీరువా కూడా తెరిచి ఉంది. అందులోని 82.5 గ్రాముల బంగారు నగలు, 45 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రల ఆధారంగా చోరీకి పాల్పడిన ముద్దాయి జామ వీరగణేష్ని కాకినాడలో అరెస్టు చేశారు. అతడి నుంచి దొంగిలించిన నగల్లో 75.8 గ్రాముల బంగారం, 253.80 గ్రాముల వెండి వస్తువులను స్వాధీన పర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు నారాయణమ్మ, జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
‘తిరుమల’లో సదస్సుకు అనూహ్య స్పందన
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం జరిగిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుమారు 13 వేల మంది హాజరయ్యారని తెలిపారు. తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ ప్రవేశ పరీక్షలకు జరిగే విద్యా బోధన, సాధనను వివరించారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, బిట్స్పిలాని వంటి సంస్థల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు చేయాల్సిన కృషిని వివరించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశ వ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్) పరీక్షలలో 30 మంది పరీక్ష రాస్తే, కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందన్నారు. అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. మెడికల్లో దేశ వ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 25 మంది పరీక్ష రాస్తే, కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో సేవాగుణం, పెద్దల పట్ల గౌరవం అలవాటు చెయ్యాలన్నారు. 2025లో ఐఐటీ మద్రాస్లో సీటు సాధించిన యార్లగడ్డ తనూజ, నీట్లో స్టేట్ ఫస్ట్, ఆలిండియా 19వ ర్యాంకర్, ఎయిమ్స్ న్యూఢిల్లీలో సీటు సాధించిన డి.రామ్కిరీటి తండ్రి డి.అరుణ్కుమార్ పాల్గొని తిరుమల విద్యా సంస్థలో వారికున్న అనుభవాలను సదస్సుకు వివరించారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, తిరుమల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
● శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి దివ్య దర్శనం పరమ పావనమే.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి శనివారం అశేష భక్తజనం వచ్చారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఏడు శనివారాల స్వామివారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తూ, ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ.76.26 లక్షల ఆదాయం వచ్చింది. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు తదితరులు పర్యవేక్షించారు. –ఆత్రేయపురం -
ప్రభుత్వ ఆస్తి వర్మకు ఇవ్వడం తగదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలో ప్రభుత్వానికి చెందిన మూడున్నర ఎకరాల స్థలాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కానుకగా ఇవ్వడం కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణమని, ఆ స్థలంలోనే ఆయుష్ మెడికల్ కళాశాల నిర్మించాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన పక్కనే ఆ కళాశాల నిర్మించి ఆసుపత్రిని అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని, మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించిన రూ.175 కోట్లకు పైగా విలువ చేసే మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం టూరిజం శాఖ పేరుతో ఎస్వీఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెడుతున్నట్లు ఒక జీవోను విడుదల చేసిందన్నారు. ఎటువంటి వివరాలు లేకుండా ప్రజలను మాయ చేసే విధంగా ఈ జీవోను విడుదల చేసిందన్నారు. మూడున్నర ఎకరాల భూమిని వర్మకు తాజ్ హోటల్ పేరుతో కట్టబెట్టే విధంగాను, అక్కడ నిర్మాణం చేయనున్న మెడికల్ కళాశాలను పిఠాపురంలోని పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చిన చోట నిర్మాణం చేసేందుకు చీకటి ఒప్పందాలు జరగనున్నట్లు ఆయా పార్టీల నేతలు తెలియజేశారు. ఉన్న ఐదు ఎకరాల్లో ఇప్పటికి 240 మందికి పట్టాలు ఇచ్చారని, మిగిలిన వారికి కూడా పట్టాలిచ్చి ఆ భూమి అక్కడ పేదలకే ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వ భూమి ఇస్తే మాత్రం అటు న్యాయస్థానంలోనూ ఇటు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం తరుణంలో వైద్యం పేదలకు అందడం లేదని, కాకినాడకు ఆయుర్వేద కళాశాల రావడం శుభ పరిణామన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన చోటే కళాశాలను కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖ నిబంధనలను అనుసరించి ఆసుపత్రి, కళాశాల ఒకే చోట ఉండాలని చెప్పారు. విశాఖలో ఎకరం భూమిని 99 పైసలకు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కట్టబెడుతోందని చెప్పారు. అమరావతిలో లక్ష ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం సేకరిస్తున్నారని, అక్కడ 99 పైసలకు భూమిని కేటాయించగలరని కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఈశ్వరయ్య ప్రశ్నించారు. వర్మకిచ్చిన భూమిని రద్దు చేయాలని లేనిపక్షంలో అమరావతిలో ఈ సమస్యలపై భారీ ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని ఈశ్వరయ్య హెచ్చరించారు. õ³§ýlÌS ¯øsZÏ Ð]l$sìæt Möyýl$-™èl$-¯é²Æý‡$ : ˘ మాజీ మంత్రి కన్నబాబు చంద్రబాబు తన పార్టీ వారి కోసం కాకినాడలో స్థలం ఇస్తున్నాడని, పిఠాపురంలో పేదలకు ఇచ్చిన స్థలంలో ఈ కళాశాల నిర్మించి పేదల నోట్లో మట్టి కొడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. లేని కంపెనీలకు ప్రభుత్వ భూములను తన వారి కోసం కారు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, ఈ ఉద్యమానికి వైస్సార్ సీపీ తన వంతుగా సహకరిస్తుందన్నారు. 99 పైసలకు ఎకరం భూమిని లీజికిస్తున్న చంద్రబాబు.. తన హెరిటేజ్ కంపెనీలో ఒక్క చాక్లెట్ కూడా ఆ ధరకు ఇవ్వరని చెప్పారు. భూమిని ధారాధత్తం చేయడం తగదు : మాజీ ఎంపీ గీత మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ తమ హయాంలో ఆయుష్ కళాశాలకు స్థల సేకరణ కోసం కాకినాడ గరల్స్ పాలిటెక్నిక్ ఎంపిక చేశామన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయినా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. ఒక వ్యక్తి కోసం విలువైన భూమిని ధారాధత్తం చేయడం తగదని గీత సూచించారు. దీనిపై పోరాటం చేసేందుకు తమ పార్టీ శ్రేణులు సహకరిస్తాయని గీత తెలిపారు. ప్రముఖ న్యాయవాది జవహర్ ఆలీ మాట్లాడుతూ కాకినాడ ప్రశాంతమైన సిటీ అని ఇక్కడ భూమికి విలువ ఉంటుందని అలాంటి విలువైన భూములను ఒక వ్యక్తి సొంతం కోసం టూరిజం శాఖ అప్పనంగా ఇచ్చిందని అన్నారు. తాజ్ హోటల్ పేరుతో వర్మ ప్రజలను మోసం చేస్తున్నారని కాకినాడ పౌరులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆమ్ఆద్మీ నేత నరాల శివ, బీఎస్పీ నేత సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతూరు: మండలంలోని చట్టిలో బైక్ను తుఫాన్ వాహనం ఢీకొన్న ఘటనలో చింతూరు మండలం వీరాపురానికి చెందిన మోసం బుచ్చయ్య (35) మృతి చెందాడు. అనంతరం అదుపు తప్పిన తుఫాన్ వాహనం బోల్తా పడడంతో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తెలంగాణలోని పెద్దిపల్లికి చెందిన కొంతమంది గిరిజనులు తుఫాన్ వాహనంపై ఛత్తీస్గఢ్లో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో, చట్టి నుంచి వీరాపురానికి బైక్పై వెళుతున్న బుచ్చయ్యను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బుచ్చయ్య అక్కడికక్కడే మృతిచెందగా, తుఫాను వాహనం కూడా బోల్తా పడడంతో డ్రైవర్తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. బోల్తా పడిన వాహనంలో పిల్లలు, పెద్దలు కలిసి 17 మంది వరకూ ఉన్నారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోటారు సైకిల్ ఢీకొని.. ఉప్పలగుప్తం: మోటారు సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్కే జానీ బాషా తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న సుందరనీడి నాగేశ్వరరావు (58) శుక్రవారం రాత్రి మూత్ర విసర్జనకు ఇంటి ఎదురుగా ఉన్న సిరిపల్లి – మునిపల్లె ఆర్అండ్బీ ప్రధాన రహదారిపైకి రాగా, ఉప్పలగుప్తం మధురపేటకు చెందిన సురేష్ గొల్లవిల్లి నుంచి ఉప్పలగుప్తం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో నాగేశ్వరరావు తలకు తీవ్ర గాయం కావడంతో అతనిని 108లో అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడి కుమారుడు బాబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ఏడో తరగతి విద్యార్థినికి అస్వస్థత రాజవొమ్మంగి: మండలంలోని అమీనాబాద్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న ఏడో తరగతి విద్యార్థిని కర్రి నందిని శనివారం పాఠశాలలో ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురైంది. అదే గ్రామంలోని బాలిక తండ్రికి ఈ విషయం తెలిసి ఆమెను వెంటనే మోటారు సైకిల్పై జడ్డంగి పీహెచ్సీకు తరలించారు. నందినికి డాక్టర్ నాగార్జున ప్రథమ చికిత్స చేశారు. అనంతరం రక్త పరీక్షలు, మెరుగైన చికిత్స కోసం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని నాగార్జున తెలిపారు. నాలుగు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతోందని, జ్వరం తగ్గడంతో ఈ రోజు బడికి వెళ్లిందని, ఇంతలో పాఠశాలలోనే తమ కుమార్తె కళ్లు తిరిగి పడిపోయిందని తండ్రి చక్రధర్ తెలిపారు. పాఠశాలలో తమ కుమార్తెను ఎవరూ పట్టించుకోక పోవడంతో తామే ఆసుపత్రికి తరలించామని బాలిక తల్లిదండ్రులు విలేకరుల వద్ద వాపోయారు. కాగా ప్రస్తుతం నందిని అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. -
ఉరేసుకుని కార్మికుడి ఆత్మహత్య
సామర్లకోట: ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు పెద్దాపురం శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఆ రోడ్డులో వెళుతున్న ప్రయాణికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై వి.మౌనిక తన సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. మృతుడు షిఫ్రూప్ (50) ఒడిశా నుంచి వచ్చి పెద్దాపురం రోడ్డులో వాలుతిమ్మాపురంలోని ఓ రైస్మిల్లులో కూలిగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై మౌనిక తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ దుర్మరణంజగ్గంపేట: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగ్గంపేటకు చెందిన రాయి చక్రవర్తి (35) డ్రైవర్గా జీవిస్తున్నాడు. శనివారం ఉదయం జగ్గంపేట శివారులో ఉన్న లారీ యూనియన్ ఆఫీస్కు వెళ్లి తిరిగి వెనుక నుంచి లారీ ఢీకొంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
దళిత మహిళపై జనసేన నాయకుడి అమానుషం
గొల్లప్రోలు (పిఠాపురం): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రాజకీయ అండదండలతో ఒక దళిత మహిళపై జనసేన నేత అమానుష ఘటనకు పాల్పడ్డారు. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఐ.సుబ్రహ్మణ్యం, అతని అనుచరులు ఒక ఎస్సీ మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా కులం పేరుతో దూషించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన కందేటి ప్రమీలరాణి అనే మహిళ భర్త సతీష్ భవన నిర్మాణ కాంట్రాక్ట్లు చేస్తుంటారు. తాటిపర్తిలో ఇటీవల ఒక ఇల్లు నిర్మాణం చేశారు. అందుకు సంబంధించిన డబ్బు విషయంలో ఇంటి యజమానికి, కాంట్రాక్టర్కు వివాదం తలెత్తడంతో సెటిల్మెంట్ చేసుకోవడానికి శుక్రవారం ప్రమీలారాణి, ఆమె భర్త తాటిపర్తి వచ్చారు. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం, గోవిందరాజు, సత్యనారాయణ మరో ఇద్దరు జనసేన నాయకులతో కలిసి డబ్బు విషయం తేల్చకుండా వివాదాస్పదంగా మాట్లాడుతుండటంతో భద్రత కోసం తాను సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా తనపై దాడికి దిగారని బాధితురాలు ప్రమీలరాణి ఆరోపించారు. తాను వీడియో తీస్తుండగా తనపై దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. సుబ్రహ్మణ్యం, అతని అనుచరులైన గోవిందరాజు, సత్యనారాయణ తనపై విరుచుకుపడ్డారని, తన చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించి తనను కిందకు తోసేశారని బాధితురాలి వివరించింది. అందరూ చూస్తుండగానే తన ఒంటిపై దుస్తులు చింపి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని తెలిపింది. కులం పేరుతో దూషిస్తూ ‘నీ బతుకెంత? నీ జాతి ఎంత?‘ అంటూ అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులకు ఇచ్చి న ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తూ తీవ్రంగా హింసించినట్లు తెలిపింది. ‘నా వెనుక పార్టీ ఉంది. నా దగ్గర డబ్బు ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు‘ అంటూ నిందితుడు సుబ్రహ్మణ్యం తనను బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది. ఈ అమానుష ఘటనపై బాధితురాలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. -
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టీకం ప్రదర్శించారు. సెటిల్మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత బారతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు.తన భర్త ఆర్థి లావాదేవిల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో సెల్లో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు.. సెల్ ఫోన్ లాక్కుని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
26 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ, వైశాఖ శుద్ధ దశమి నుంచి మే రెండో తేదీ వరకు వారం రోజుల పాటు సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ వీ త్రినాథరావు తెలిపారు. రత్నగిరిపై శుక్రవారం కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం పండితులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ లోగా వివిధ విభాగాల వారీగా దేవస్థానం అధికారులు చేపట్టే పనుల గురించి నివేదికలు తయారు చేసి తనకు అందజేయాలని ఆదేశించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మంజులా దేవి, ఈఈ లు నూకరత్నం. వీ రామకృష్ణ పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవాల షెడ్యూల్ ● ఏప్రిల్ 26న సత్యదేవుడు, అమ్మవారిని వధూవరులను చేయడం ● 27న రాత్రి తొమ్మిది గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం ● 28న స్థాలీపాక హోమాలు, అరుంధతి దర్శనం, రావణ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ● 29న పండిత సదస్యం, కొండ దిగువన పొన్న వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ● 30న వనవిహారోత్సవం, రథోత్సవం. ● 1న ఉదయం పంపానదిలో శ్రీచక్రస్నానం, సాయంత్రం నాకబలి, దండియాడింపు ● 2న రాత్రి ఏడు గంటల నుంచి శ్రీపుష్పయాగం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ● భక్తులు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు. కల్యాణం అయ్యాక తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి తొమ్మిది కౌంటర్ల ఏర్పాటు. ● కల్యాణానికి విచ్చేసే వీఐపీల వద్దకే వెళ్లి స్వామివారి శేషవస్త్రం, తలంబ్రాలు అందజేయాలి. వారితో బాటు ఎవరినీ కల్యాణ వేదిక వద్దకు అనుమతించరాదు. ● ఉత్సవాల ఏడు రోజులు రత్నగిరిపై, కొండదిగువన మెడికల్ క్యాంపుల నిర్వహణ. ● దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్లు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరాలి. 27న కల్యాణం 30న రథోత్సవం -
స్పాట్ పెట్టేస్తారిక..
రాయవరం: గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 391 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో రెగ్యులర్, ప్రైవేటుగా మొత్తం 72,797 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, సగటున 99.48 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2022 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లా కేంద్రం కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకనం జరిగేది. 2023 నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. కాకినాడలో సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, కోనసీమ జిల్లాలో అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్లోని బీవీఎం హైస్కూల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. జిల్లాలకు చేరిన జవాబు పత్రాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5,43,694 జవాబు పత్రాలకు ఉమ్మడి మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇందులో కాకినాడ జిల్లాలో 1,85,811, తూర్పు గోదావరి జిల్లాలో 1,76,106, కోనసీమ జిల్లాలో 1,81,777 చొప్పున జవాబు పత్రాలున్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే జవాబు పత్రాలు ఆయా జిల్లాలకు దాదాపు చేరుకున్నాయి. ఆయా జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు క్యాంప్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు పాల్గోనున్నారు. సబ్జెక్టుల వారీగా.. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, సంస్కృతం, ఒకేషనల్ సబ్జెక్టులకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు నేరుగా ఉత్తర్వులు అందజేశారు. ఆరు సబ్జెక్టులు, ఒకేషనల్ పరీక్షలు కలిపి మొత్తం పది రోజుల పాటు మూల్యాంకనం జరుగుతుంది. ఇవీ నిబంధనలు ఫ మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సెల్ఫోన్, స్మార్ట్ఫోన్లు, వైట్నర్, ఎరేజర్ తదితర వస్తువులను తీసుకుని వెళ్లరాదు. ఫ మూల్యాంకన సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి తప్పిదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫ శిబిరానికి నిర్దేశిత సమయాల్లో హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. స్పాట్కు జిల్లాల వారీగా నియామకాలు ఇలా..కేటగిరీ తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు 1 1 1 స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జి 1 1 1 అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు 8 7 8 ఏఏసీఓలు 8 7 8 చీఫ్ ఎగ్జామినర్లు 100 79 79 అసిస్టెంట్ ఎగ్జామినర్లు 453 476 483 స్పెషల్ అసిస్టెంట్లు 267 237 242 ఫ 6 నుంచి 15 వరకూ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ ఫ ఉమ్మడి జిల్లాలో 5.44 లక్షల జవాబు పత్రాలు ఫ ఇప్పటికే లీప్ యాప్లో ఉత్తర్వులు ఫ ఏఈలు, సీఈలు, స్పెషల్ అసిస్టెంట్లకు నేడు శిక్షణ పొరపాట్లకు తావు లేకుండా.. స్పాట్ వాల్యుయేషన్ విధులకు నియమితులైన వారు తప్పనిసరిగా హాజరు కావాలి. ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. మూల్యాంకన విధులకు హాజరయ్యే వారు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. – జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ -
శ్రీసీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం
అన్నవరం : శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజు, శుక్రవారం రాత్రి 7–30 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ సీతారాములకు శ్రీపుష్పయాగం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవ దంపతులు శ్రీసీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. అనంతరం శ్రీసీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. శ్రీ సీతారాములకు వివిధ రకాల పిండివంటలు నివేదించారు. అనంతరం పండితులు వేదాశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టుముక్కలను పంపిణీ చేశారు. భక్తులు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు. నేడు సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలని కోరుతూ శనివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక బాలాజీ చెరువు సమీపంలో కాస్మోపాలిటన్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పాల్గొంటారన్నారు. మూడు ఎకరాల 4 సెంట్ల భూమి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కట్టపెట్టడం దారుణమని పేర్కొన్నారు. హాకీ క్రీడాకారిణుల ఎంపికలు రేపు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జూనియర్స్ బాలికల విభాగంలో క్రీడాకారిణుల ఎంపికలు నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 15 నుంచి చిత్తూరులో జరిగే ఏపీ అంతర్ జిల్లాల హాకీ పోటీలలో పాల్గొంటుందన్నారు. 1–12007 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 8 గంటలకు డీఎస్ఏలోని హాకీ మైదానంలో హాజరుకావాలని కోరారు. ఏలేరు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ హరేందిరప్రసాద్ ఏలేశ్వరం: కలెక్టర్ హరేందిర ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఏలేరు ప్రాజెక్టును శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యంతో పాటు ప్రస్తుత నీటిమట్టం, సాగునీటి పరిస్థితులు, తాగునీటి సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద సిబ్బంది కొరత ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న మణిహంస పవర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈఈ వెంకటేశ్వరావు, డీఈ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. టెన్త్ ఇంగ్లిషు ప్రశ్నపత్రంపై ఆందోళన రాయవరం: పదో తరగతి పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. ఇంగ్లిషు పేపరు బ్లూప్రింట్కు డీవియేట్ అయినట్లు ఇంగ్లిషు ఫోరమ్ సైతం ఆరోపిస్తోంది. ముఖ్యంగా 17, 18, 22, 25, 28, 31, 32 ప్రశ్నలు సబ్జెక్టుకు డీవియేట్ అయ్యాయని డీజీఈకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. దీనివల్ల విద్యార్థులు 15 మార్కులు నష్టపోతున్నారని చెబుతున్నారు. తాము కోల్పోతున్న 15 మార్కులూ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్ర శుక్రవారం
సామర్లకోట: జీసస్ సిలువలో మరణించిన రోజైన గుడ్ ప్రైడేను విశ్వాసులు జిల్లావ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏసుక్రీస్తును సిలువకు అప్పగించిన సందర్భానికి సంబంధించి 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాస దీక్షను అవలంబించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానిస్తూ గుడ్ ఫ్రైడే ఆరాధనల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో చర్చిలు భక్తులతో నిండిపోయాయి. సామర్లకోట గడియార స్తంభం సెంటర్ నుంచి బ్రౌన్పేట వరకు ఏసుప్రభు వేషధారణలోని సిలువ మోస్తూ నిర్వహించిన యాత్ర కంట తడి పెట్టించింది. -
కోతుల బెడదను పట్టించుకోరా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు కష్టపడి పండించిన పంటలను కోతుల బెడద నుంచి రక్షించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీకి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు స్థాయీ సంఘ సమావేశాలు గురువారం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. 1,2,4,7 స్థాయి సంఘాల చైర్మన్ వి.వేణుగోపాలరావు అధ్యక్షతన, 3వ స్థాయి సంఘం వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన, 5వ స్థాయి సంఘ జేడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి అధ్యక్షతన, 6వ స్థాయీ సంఘం సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. వివిధ అంశాలు చర్చించి ఆమోదించారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించి ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై అధికారులతో చర్చించారు. వేసవి నేపథ్యంలో అన్ని మండలాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, చలివేంద్రాలు ఏర్పాట్లు చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. జేడ్పీ సీఈవో లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యుల ఆవేదన -
ఆపతాపాలు
● సుర్రుమనిపిస్తున్న సూరీడు ● ఉమ్మడి జిల్లాలో గుబులు ● వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు అవసరం ఇలా చేస్తే మేలు ● వేసవిలో రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తరచూ తాగాలి. ● లేత రంగు కలిగిన తేలికగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రెండు పూటలా స్నానం చేయాలి. ● ఎండ తీవ్రత అఽధికంగా ఉన్నప్పుడు బయటకు వెళితే గొడుగు లేదా టోపీ ధరించాలి. లేకుంటే తలకు రుమాలు చుట్టుకోవాలి. ● ఇంట్లో కిటికీలు తెరిచి గదిలోకి గాలి వచ్చి చల్లబడే విధంగా చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ప్రచారం వేసవికాలం దృష్టా సంభవించే వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ సిబ్బందితో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. వడదెబ్బకు గురికాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏరియా, ప్రభుత్వ, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం. –ఎం.సుమలత, అదనపు జిల్లా వైద్యాధికారి, కోనసీమ ఆలమూరు: వేసవి వచ్చేసింది.. మండే ఎండలను తెచ్చేసింది.. బయటకు వెళ్తే సుర్రుమనిపిస్తోంది.. ఈ ఏడాది మార్చి తొలి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాధారణంగా మే నెల ప్రథమార్థంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. రెక్కల కష్టం మీద జీవనం సాగించే సామాన్యులపై ఎండ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు, ఇటుక పరిశ్రమ, భవన నిర్మాణ కార్మికులు, రోగ నిరోధశక్తి తగిన మోతాదులో లేని అనారోగ్య తీవ్రత ఉన్నవారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఏరియా, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఉన్న సమయంలో మానవుని శరీరంలోకి సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. వేడిగాలుల వల్ల వడదెబ్బ (హీట్ స్ట్రోక్), శరీరంలో లవణాలు కోల్పోవడం (డీహైడ్రేషన్)తో కలిగే దుష్ఫరిణామాలు వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని ప్రాథమిక అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వడదెబ్బకు కారణమవుతుంది. సత్వరం ప్రాథమిక చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతోంది. మగత నిద్ర రావడం, కలవరింతలు పలకడం, పెదవులు తడిబారి పోవడం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందే విధంగా చూడాలి. త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలే విధంగా చేయాలి. శరీరం సాధారణ స్థాయి ఉష్ణోగ్రత వరకూ వచ్చే వరకూ మెత్తటి తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిగిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ లేక ఓఆర్ఎస్ను తాగించాలి. అపస్మారక స్థితికి వెళ్లిన రోగితో నీరు తాగించరాదు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందించాలి. -
అట్టహాసంగా పట్టాల ప్రదానం
టాపర్లకు బంగారు పతకాలు అందజేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్వర్సిటీ ప్రగతిని వివరిస్తున్న వీసీ ప్రసాద్బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూలో గురువారం 12వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 18 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది జూలై 4వ తేదీన వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు ఎనిమిది నెలల తరువాత హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు అందుకునేవారు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్.. శాంత బయోటెక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఒక గంట ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందడి చేశారు. ప్రగతి వివరించిన వీసీ ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తన ప్రసంగంలో వర్సిటీ సాధించిన ప్రగతి వివరించారు. దాదాపు 20 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రేరణ కలిగించేలా ఆయన ప్రసంగం సాగింది. అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ కాకినాడ స్థిరపడిందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలో యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు ఒడిసి పట్టాలని సూచించారు. ముఖ్యంగా ఫైనాన్స్, లాజిస్టిక్స్, మానవ వనరుల నిర్వహణ, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే ప్రాజెక్టులను ప్రొత్సహించాలన్నారు. యువత ఉద్యోగం కోసమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆలోచించాలని కోరారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా 39 బంగారు పతకాలు, 48 పీహెచ్డీలు ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ డే అంటే యూనివర్సిటీతో సంబంధం ముగించడం కాదని, కేవలం యూనివర్సిటీ నుంచి ప్రపంచంలోకి ప్రవేశించడమన్నారు. శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అధ్యయనం చేస్తే ఇంజినీర్లు ప్రపంచాన్ని సృష్టిస్తారన్నారు. సైన్స్ రంగంలో పీహెచ్డీలు పొందిన సంఖ్యలో యూఎస్, చైనా తరువాత మూడో స్థానం భారతదేశం సాధించిందని, స్టార్టప్ల సంఖ్యాపరంగా కూడా 3వ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వీ.ఎస్.ఎస్. కుమార్, కే.వీ.ఎస్.జీ మురళీకృష్ణ, రామలింగరాజు, పాలక మండలి సభ్యులు బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, సంకురాత్రి చంద్రశేఖర్, వర్సిటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. అందజేసిన పట్టాల వివరాలు 2024–25 విద్యా సంవత్సరానికి బీటెక్ 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎం ఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్ 70 ఓడీలు (ఒరిజనల్ డిగ్రీ) విద్యార్థులు పొందారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్ రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభించారు. అలా మొదలై.. ఇలా ముగిసి.. షెడ్యూల్ ప్రకారం స్నాతకోత్సవం ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. గంటా మూడు నిమిషాల ఆలస్యంగా 11.48 గంటలకు కార్యక్రమం ప్రారంభించారు. 11.49 గంటలకు గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభం 11.55కు పీహెచ్డీ, గోల్డ్మెడల్ విజేతలతో ప్రతిజ్ఞ 12.00 గవర్నర్ అనుమతితో వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం 12.05 బంగారు పతకాలు, పీహెచ్డీల ప్రదానం 12.30 ముఖ్య అతిథి వరప్రసాద్రెడ్డి ప్రసంగం 12.45 గవర్నర్ ప్రసంగం 12.50 వీసీ ప్రసాద్ చేతుల మీదుగా గవర్నర్, ముఖ్య అతిథులకు సత్కారం 1.00 గంటలకు రెక్టార్ సుబ్బారావు ధన్యవాదాలు, జాతీయ గీతంతో ముగింపు వైభవంగా జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం 39 బంగారు పతకాలు, 48 పీహెచ్డీలు ప్రదానం గంట ఆలస్యంగా ప్రారంభం -
కొండెక్కి కూర్చుంది!
● పులి మళ్లీ సీతానగరం మండలంలోకి.. ● భయాందోళన చెందుతున్న జనం రాజానగరం: సీతానగరం మండలంలోకి పులి మళ్లీ వచ్చింది.. కొండెక్కి కూర్చుంది.. ఏటిపట్టు ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులి సంచారంపై వస్తున్న సమాచారంతో తమ ప్రాణాలతో పాటు పశువులను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక జనం భయపడిపోతున్నారు. వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. పెద్ద పులి సీతానగరంలో ఉన్న చిట్టిబాబాజీ ఆశ్రమ గోశాల సమీపంలోని కొండపై ఉన్నట్టు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారి హరీష్ విజ్ఞప్తి చేశారు. రామదుర్గంలోని పురాతన రామాలయం ఉన్న కొండపైకి చేరిన పులి బుధవారం రాత్రి సీతానగరంలోని చిట్టి బాబాజీ ఆశ్రమం గోశాలకు సమీపంలో ఉన్న కొండపైకి చేరుకున్నట్టు తెలుసుకున్నారు. పులి పగలంతా విశ్రాంతి తీసుకుని, చీకటి పడిన తరువాత వేటకు వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో ప్రస్తుతం కొండపై నుంచి దిగి నేలకోట, రామవరపు ఆవ వైపు వెళ్లే అవకాశం ఉందని, లేకుంటే వచ్చిన మార్గంలోనే పెదకొండేపూడి వైపు దిగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పులి సంచారంపై ప్రజలను భయబ్రాంతులను చేసే విధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అటువంటి వాటిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రథోత్సవంలో అపశ్రుతి
భద్రతా వైఫల్యానికి యువకుడి బలి పిఠాపురం: అధికారుల భద్రతా వైఫల్యం ఓ అమాయకుడిని బలి తీసుకుంది. చేబ్రోలు జరిన రాములవారి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం కిందపడి శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కా వెంకటేష్ (22) మృత్యువాత పడిన సంఘటన భక్తులను కలవరపాటుకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి చేబ్రోలులో రాములవారి రథోత్సవం నిర్వహిస్తుండగా, చూడడానికి కత్తిపూడికి చెందిన యువకుడు దుక్కా వెంకటేష్ (శ్రీను) వచ్చాడు. రథం తాడు లాగే క్రమంలో ప్రమాదవశాత్తూ రథం తగిలి కింద పడ్డాడు. అతని పొట్ట మీదుగా రథం చక్రం నొక్కింది. వెంటనే అతనిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు మృతుడి తండ్రి దుక్క శ్రీను చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. ఏర్పాట్లలో విఫలం దేవాలయ చరిత్రలో వందల ఏళ్ల నుంచి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో ఇప్పటి వరకూ చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రస్తుత రథోత్సవంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. రథం చక్రాల వద్ద కేవలం రథాన్ని మలుపు తిప్పే శీలలతో ఉన్న వ్యక్తులు, పోలీసులు మాత్రమే ఉండాలి. అయితే జనాన్ని అదుపు చేయడంలో ఆలయ కమిటీ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నారు. అత్యంత భారీ జన సందోహం మధ్య సాగే రథయాత్ర జరిగే చేబ్రోలు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్దీకరించకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఆలయ కమిటీపై ఫిర్యాదు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల రథోత్సవంలో తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి దుక్కా శ్రీను గొల్లప్రోలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఆలయ కమిటీపై తగిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఇళ్ల స్థలాల భూమిని అన్యాక్రాంతం చేస్తే ఊరుకోం
● లబ్ధిదారులతో కలిసి ఆందోళనకు దిగుతాం ● వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత పిఠాపురం: స్థానికంగా నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అన్యాక్రాంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వెంటనే దానిని ఆపకపోతే ఆందోళనకు దిగుతామని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత హెచ్చరించారు. ఆమె గురువారం పిఠాపురం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పిఠాపురం మసీదు మాన్యంలో ఐదు ఎకరాల భూమిలో సుమారు 250 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేసి మరీ అప్పగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారికి ఇళ్లు కట్టించకపోగా ఆ భూమిని స్వాధీనం చేసుకుని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల భూమి ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఇచ్చిన స్థలాలను లాక్కోడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పేదలకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాటం చేసి ఇళ్లు కట్టించే వరకు వారికి అండగా ఉంటామన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతీ పేదవాడి సొంతింటి కల నెరవేరాలనే సంకల్పంతో రూ.కోట్లు వెచ్చించి రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏకంగా కొత్త కాలనీలనే నిర్మించారన్నారు. కాని కూటమి నేతలు పేదల స్థలాలను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అక్కడ ఆస్పత్రి.. ఇక్కడ కాలేజీ హాస్యాస్పదం కాకినాడలో మంజూరైన ఆయుష్ కాలేజీ నిర్మాణానికి పిఠాపురంలో మసీదు మాన్యం భూమిని కేటాయించడం దారుణమన్నారు. మసీదు మాన్యంలో వందల మంది పేదలు ఇళ్లు కట్టుకోడానికి సిద్ధపడుతుంటే వారికి అన్యాయం చేస్తు కాకినాడ కట్టాల్సిన కాలేజీని పిఠాపురంలో కట్టడానికి ప్రయత్నించడం పేదలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. కాకినాడలో ఉన్న భూమిని తెలుగుదేశం నేతకు కట్టబెట్టడానికి అక్కడ కట్టాల్సిన కాలేజీని ఇక్కడకు మార్చారని ఆమె ఆరోపించారు. కాకినాడలో ఆయుష్ ఆస్పత్రిని తన హయాంలో నిర్మిస్తే రెండేళ్లు దానిని ప్రారంభించకుండా వదిలేశారన్నారు. ఆయుష్ ఆస్పత్రి ఉన్న చోటే ఆయుష్ కాలేజీ కూడా ఉండాలన్న విషయం పాలకులకు అర్థం కాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిరు పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, ఉలవల భూషణం, పచ్చిమళ్ల జ్యోతి, సోమరౌతు లలిత, బొజ్జారామయ్య పాల్గొన్నారు. ఇంత బరి తెగింపా? పిఠాపురం: చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి కాకినాడలో రూ.కోట్ల విలువైన ఆయుష్ కళాశాల భూమిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కట్టబెట్టి, పిఠాపురంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను ఆయుష్ కళాశాలకు ప్రతిపాదించడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఆయన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకినాడ గరల్స్ పాలిటెక్నిక్ సమీపంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని తాజ్ హోటల్ పేరుతో మోసం చేస్తూ వర్మకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై శనివారం కాకినాడలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యమేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నెల రోజులుగా ఆయుష్ ఆసుపత్రిపై చర్చ జరుగుతున్నా స్పందించడం లేదన్నారు. -
కాలువలో పడి బాలుడి మృతి
మోతుగూడెం: కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి సుకుమామిడి గ్రామానికి చెందిన కుత్తిమ ఆదిలక్ష్మి తన కూతురు, కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికి పంపి కూలి పనులకు వెళ్లిపోయింది. సాయంత్రం వచ్చి చూడగా, కుమారుడు ఉత్తమ లక్ష్మణ్రెడ్డి (4) కనిపించలేదు. దీంతో గ్రామస్తుల సాయంతో వెతకగా ఆ బాలుడు గ్రామ సమీపంలోని కాలువలో నీటిలో తేలాడుతూ కనిపించాడు. ఈ సమాచారాన్ని ఎస్సై నాజీర్ హుస్సేన్కు తెలపడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతానికి ఎలక్ట్రీషియన్ మృతి ఏలేశ్వరం: విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. యర్రవరంలోని లేఅవుట్ సమీపంలో విద్యుత్ స్తంభం వద్ద గ్రామానికి చెందిన బిరుసు రాజు (40) మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను వెంటనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రైసుమిల్లు, గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు
సామర్లకోట: పెద్దాపురంలోని వెంకటేశ్వరా రైసుమిల్లులో గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసుమిల్లులో రేషన్ బియ్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ కన్నబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లులో రైతుల నుంచి సేకరించిన ధాన్యం, బియ్యం నిల్వ వివరాలను నమోదు చేసుకున్నారు. రైసుమిల్లు సామర్థ్యం, కార్మికుల భద్రత, రైసు మిల్లుల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల అమలును జేసీ పరిశీలించారు. అంతకుముందు పట్టణ పరిధిలోని రేషన్ షాపులలో పేద ప్రజలకు బియ్యం ఏవిధంగా సరఫరా చేస్తున్నారో ఆరా తీశారు. షాపులలో బియ్యం నిల్వ, స్టాక్ రిజిస్టర్, సరకుల నాణ్యత, తూకం, బిల్లింగ్ వివరాలను పరిశీలించారు. అనంతరం మెయిన్రోడ్డులోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీని క్షుణ్ణంగా పరిశీలించారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఆ గ్యాస్ ఏజెన్సీ వద్ద రోజూ వినియోగదారులు బారులు తీరడంతో ఏజెన్సీ ప్రతినిధి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్లో బుకింగ్ లోపాలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయం జరుగుతున్నట్టు గుర్తిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి సత్యనారాయణరాజు, తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఏ ప్రమాదం జరుగుతుందో..
రామేశ్వరం నుంచి గుడిమూల శివాలయం వరకూ ఉన్న ఏటిగట్టు మార్గం పూర్తి అధ్వానంగా ఉంది. ఈ మార్గంలో అంతర్వేది క్షేత్రానికి వాహనాలపై వెళ్లే భక్తులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు – డి.మార్టిన్, సఖినేటిపల్లి ఈ మార్గం చాలా దగ్గర సఖినేటిపల్లి బోను సెంటర్ నుంచి రామేశ్వరం మీదుగా ఏటిగట్టు వెంబడి అంతర్వేదికి ఉన్న మార్గం చాలా దగ్గర. అయితే మధ్యలో అధ్వానంగా మారిన 4 కిలోమీటర్ల రోడ్డును బాగు చేస్తే మంచింది. ఇప్పుడు చుట్టూ తిరిగి మరో 4 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. – కోన ప్రభాకర్రావు, గుడిమూలప్రతిపాదనలు పంపించాం సఖినేటిపల్లి బోను సెంటర్ నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పు, రెండు వరుసల రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. రామేశ్వరం సరిహద్దు నుంచి గుడిమూల శివాలయం వరకూ ఎన్ఆర్జీఎస్లో పెట్టాం. అలాగే బోను వద్ద నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పునకు కూడా అవసరమైన చోట్ల పనులకు పుష్కర గ్రాంటులో పెడుతున్నాం. నిధులు మంజూరైన పనులు మొదలు పెడతాం. –సురేష్, ఆర్అండ్బీ, జేఈ, రాజోలు -
2,818 కిలోల గంజాయి ధ్వంసం
అమలాపురం టౌన్: జిల్లాలో 77 కేసులకు సంబంధించి సీజ్ చేసిన 2,818 కిలోల గంజాయిని విశాఖపట్నం జిందాల్ పవర్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. విశాఖపట్నం జిందాల్ పవర్ ప్లాంట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనాతో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు గంజాయి ధ్వంసం చేసిన విషయాలను ఎస్పీ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈగల్ టీమ్ల ద్వారా జిల్లాలో గంజాయి ముఠాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ‘తిరుమల’లో అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం తిరుమల క్యాంపస్లో తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ అండ్ నీట్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల ద్వారా ప్రసిద్ధ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ లాంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలి, తల్లిదండ్రుల తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, అలాగే వారికి ఉన్నత విలువలు ఎలా నేర్పాలో తెలియజేస్తారన్నారు. ఈ సదస్సుకు హాజరవ్వాలంటే ముందుగా తమ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏఈడీయూ.సీవోఎం నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకోని వారు అదే రోజు ఉదయం 9 గంటల లోపు క్యాంపస్లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. బాలిక అదృశ్యం నిడదవోలు రూరల్: పదో తరగతి పరీక్షకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. కోరుమామిడి గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి పరీక్ష రాసేందుకు గురువారం ఉదయం తాడిమళ్ల జెడ్పీ హైస్కూల్కు వెళ్లి తిరిగి రాలేదన్నారు. తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెల్లం ఊట ధ్వంసం తాళ్లరేవు: కోరంగి మడ అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై గురువారం అటవీ సిబ్బంది, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్, ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి 26 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ మడ అడవులలో ఎవరైనా చట్ట విరుద్ధంగా సారా కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రి మందలించాడని ఆత్మహత్య కొత్తపల్లి: తండ్రి మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు మాయాపట్నానికి చెందిన మెరుగు సత్తిరాజు (55) తన తండ్రి మందలించాడనే కోపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కుటుంబ సభ్యులు సత్తిరాజును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు. కోళ్ల మేత మెషీన్పై పడి వ్యక్తి మృతి నిడదవోలు రూరల్: కోళ్లఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ, కోళ్ల మేత మెషీన్పై పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ నూతంగి సత్యానందం (33) ఎలక్ట్రికల్, ప్లంబింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. కాటకోటేశ్వరం గ్రామంలో కొత్తపల్లి వెంకటేశ్వరరావుకు చెందిన కోళ్లఫారంలో గురువారం మధ్యాహ్నం వాటర్షెడ్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కోళ్ల మేత మెషీన్పై పడ్డాడు. ఈ నేపథ్యంలో సత్యానందం తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. భార్య కోట సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సత్యానందం మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
ఘనంగా సీతారాముల శ్రీచక్రస్నానం
అన్నవరం: రత్నగిరిపై నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఎనిమిదో రోజు చైత్ర పౌర్ణిమ, గురువారం పంపా నదిలో సీతారాములకు శ్రీచక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు వెంట రాగా పల్లకీ మీద నవదంపతులు సీతారాములను పంపా తీరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వేదికపై నవదంపతులు సీతారాములను ఒక సింహాసనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను మరో సింహాసనంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. తరువాత సీతారాములకు, శ్రీచక్రానికి పండితులు అవభృత స్నానం నిర్వహించారు. అనంతరం సీతారాముల విగ్రహాలను శ్రీచక్రాన్ని పండితుల మంత్రోఛ్చాటన మధ్య ఊరేగింపుగా పంపా నదికి తీసుకువెళ్లారు. తరువాత పంపా నదిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. స్నానం అనంతరం మళ్లీ సీతారాములను సింహాసనంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరి రామాలయంలో సీతారాములకు నాకబలి, దండియాడింపు కార్యక్రమాలను నిర్వహించారు. పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు సమక్షంలో నవదంపతులు సీతారాములుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు సీతారాముల విగ్రహాలతో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నృత్యం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి రామాలయంలో సీతారాములకు శ్రీపుష్పయాగం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. -
భక్తులకు సదుపాయాలు కల్పిస్తా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేవాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సదుపాయాలు కల్పిస్తానని జిల్లా దేవదాయశాఖాధికారి తలాటం వెంకట సూర్యనారాయణ అన్నారు. స్థానిక జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో తన చాంబర్లో గురువారం ఆయన జిల్లా దేవదాయశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సూర్యనారాయణకు జిల్లాలోని పలు దేవాలయాల ఈవోలు, సత్రాల ఈవోలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూర్యనారాయణ కలెక్టర్ హరేందిరప్రసాద్ను కలెక్టరేట్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వాడపల్లి వెంకన్నకు వైభవోపేతంగా చక్రస్నానం ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గౌతమీ గోదావరిలో స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం హోమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే చక్రస్నానంలోనూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం గౌతమీ గోదావరి తీరంలో చోర సంవాదం జరిగింది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి అమలాపురం రూరల్: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూషి జాన్ మోషే ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ గెడ్డం సంపదరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి రోజు ఆకివీడు గ్రామంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తిక సత్యనారాయణ, కార్యదర్శి కోణాల ప్రకాష్, కోశాధికారి కాండ్రేగుల గంగరాజు, అమలాపురం ఇన్చార్జి పొలమురి మోహన్ బాబు పాల్గొన్నారు. -
పట్టాభిషేకానికి సిద్ధం
● నేడు జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం ● హాజరుకానున్న వర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదివినవారికి యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి ఆహ్వానాలు పంపారు. అతిరథ మహారథుల చేతుల మీదుగా స్నాతకోత్సవ సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు పట్టా (ఒరిజనల్ డిగ్రీ) తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీవితంలో మధురానుభూతిగా నిలిచే ఈ వేడుకలకు అర్హులైనవారు తమ వివరాలు వర్సిటీకి పంపించారు. గత ఏడాది డిసెంబర్లో స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ జారీచేసి గవర్నర్ అనుమతితో గురువారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వర్సిటీ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. 12వ స్నాతకోత్సవంలో భాగంగా 2024–25 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైనవారికి పట్టాలు అందజేస్తున్నారు. బీటెక్ విభాగంలో 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎంఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్ 70 ఓడీలు (ఒరిజనల్ డిగ్రీ) విద్యార్థులు పొందనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన 39 మందికి బంగారు పతకాలు, 48 మందికి పీహెచ్డీలు అందజేయనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నారు. శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ స్నాతకోత్సవం సందర్భంగా శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. 1948 నవంబర్ 17న నెల్లూరు జిల్లాలో జన్మించిన ఈయన శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన తరువాఈ జేఎన్టీయూకేలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ, జర్మనీలో కంప్యూటర్ సైన్స్ డిప్లమా చేశారు. 1993లో తన తల్లి శాంతమ్మ పేరుతో శాంత బయోటెక్ ప్రారంభించి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. హైపటైటిస్ బీ–టీకా వంటి ప్రాణరక్షణ టీకాలను తక్కువ ఖర్చుకే అందించేలా కృషి చేశారు. భారతీయులకు టీకాను అందుబాటు ధరలోకి తీసుకువచ్చారు. ప్రజారోగ్య రంగాలకు ఆయన చేసిన సేవలకు 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశంలో పేరొందిన యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లతోపాటు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును బయోటెక్ రంగంలో ఆయన సాధించారు. -
రెండేళ్లయినా సమస్యలు పరిష్కరించలేదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రెండేళ్లు గడిచినా చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించ లేదని యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణకుమారి అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రణభేరి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పీఆర్సీ కమిషన్ను నియమించడం లేదని, ఐఆర్ ప్రకటించడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడం లేదన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ సూరిబాబు, కేవీపీ నగేష్బాబు మాట్లాడుతూ హైస్కూల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను చాలా చులకనగా చూస్తున్నారన్నారు. రేషనలైజేషన్ పేరుతో వేలాది పోస్టులు తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి తమ హామీలను నెరవేర్చే వరకూ ఈ పోరాటం ఆగదన్నారు. అసోసియేషన్ నాయకులు గోవిందరాజులు, నాగమణి, పీవీ సత్యనారాయణ, వీవీ రమణ, జి నాగరాజు, జి ప్రభాకరవర్మ పాల్గొన్నారు. యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణకుమారి -
ఘనంగా సీతారాముల వన విహారోత్సవం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం సీతారాముల వన విహారోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి వెంట రాగా నవ దంపతులు సీతారాములను ఊరేగింపుగా కొండదిగువన దేవస్థానం ఉద్యానవనం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక సింహాసనంపై నవదంపతులు, సీతారాములను, మరో ఆసనం మీద పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. నవదంపతులకు నూతన పట్టువస్త్రాలను దేవస్థానం అధికారులు అందజేశారు. విఘ్నేశ్వరపూజ, తదితర కార్యక్రమాలనంతరం అర్చకస్వాములు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించగా, పండితులు వేదాశీస్సులు అందజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నేడు చక్రస్నానం ఉత్సవాల ఎనిమిదో రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పవర్హౌస్ వద్ద గల పంపా నది వద్ద సీతారాములకు చక్రస్నానం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రామాలయంలో నాకబలి, దండియాడింపు నిర్వహిస్తారు. -
అధినేతతో ఆత్మీయ కలయిక
పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో బుధవారం పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యురాలు, మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి కొత్త కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. జిల్లా నూతన కలెక్టర్గా ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తన కార్యాలయ చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన విశాఖపట్టణం నుంచి అన్నవరం చేరుకుని రమా సత్యనారాయణస్వామివారిని దర్శించి, అర్చన, ఆశీర్వాద కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జేసీ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డీఆర్వో డి.తిప్పేనాయక్, జిల్లా అధికారులు, వేద పండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కలెక్టర్ చాంబర్లో ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూ సంతకం చేసి, పండితుల వేదస్వస్తి, ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖపట్నంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్గా పనిచేసిన అనుభవంతో కాకినాడ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అన్నవరం దేవస్థానం బడ్జెట్ రూ.179.71 కోట్లు అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 179,71,20,000 బడ్జెట్ను ఆమోదిస్తూ దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ బడ్జెట్లో సిబ్బంది జీతభత్యాలకు రూ.33.50 కోట్లు, పింఛన్లు, గ్రాట్యుటీకి రూ.15 కోట్లు, కొనుగోళ్లకు రూ.33.20 కోట్లు, ఉత్సవాలకు రూ.1.50 కోట్లు, పురోహితుల రెమ్యునరేషన్ రూ.16.80 కోట్లు, ప్రసాదం ప్యాకర్లు, బార్బర్స్ రెమ్యునరేషన్ రూ.4.70 కోట్లు, శానిటేషన్కు రూ.పది కోట్లు, వాటర్ వర్క్స్ కు రూ.2.5 కోట్లు, భద్రతా సిబ్బందికి రూ.5.50 కోట్లు, శాట్యుటరీ పేమెంట్స్కు రూ.20 కోట్లు, ఇంజినీరింగ్ వర్క్స్ కు రూ. ఏడు కోట్లు, అన్నదాన పథకానికి రూ.5.5 కోట్లు, గో సంరక్షణకు రూ.75 లక్షలు కేటాయించారు. 2025–26లో రాబడి రూ.157.54 కోట్లు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి రూ.157.54 కోట్ల రాబడి వచ్చినట్లు ఈఓ త్రినాథరావు తెలిపారు. గతేడాదికన్నా సుమారు రూ.తొమ్మిది కోట్లు పెరిగిందన్నారు. -
ఉత్తమ నాటికగా ‘ఇంద్రప్రస్థం’
అమలాపురం టౌన్: అమలాపురం రస వాహిని సాంస్కృతిక వేదిక నిర్వహణలో కేఎన్ మూర్తి నాటక పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం షాదీఖానా భవన ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రథమ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ మూడు రోజుల్లో ప్రదర్శించిన నాటికల్లో సోమవారం రాత్రి ప్రదర్శితమైన ‘ఇంద్రప్రస్థం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి రూ.30 వేల నగదు బహుమతిని గెలుచుకుంది. ప్రేమించుకున్న జంట ఒక వైపు, వారి తల్లిదండ్రులు మరోవైపు, వారి వాదనలు, చివరకు ఉభయుల అంగీకారంతో పెళ్లి జరగడంతో నాటిక ముగుస్తుంది. పోటీల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్లు హాజరయ్యారు. రసవాహని సంస్థ అధ్యక్షుడు, కేఎన్ మూర్తి నాటక పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి మహ్మద్ షెహన్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కొండాబత్తుల వేణుగోపాలరావు, కేఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి డాక్టర్ గోదశి గంగరాజు, అమలాపురం పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, పరిషత్ కో ఆర్డినేటర్ ఎంవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ప్రతినిధులు కొండాబత్తుల నరసింహమూర్తి, కొండాబత్తుల శ్రీరాములును రస వాహిని రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. అలాగే డాక్టర్ కె.సాంబశివరావు, మల్లాది శివన్నారాయణ, నాయుడు గోపి, దేవిశెట్టి రామకోటేశ్వరరావు, నటకుమారిలను దివంగత నల్లా సత్యనారాయణ రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ ప్రతినిధి నల్లా శ్రీధర్, రమణ పాల్గొన్నారు. -
ఆదాయానికి పాతర
కాకినాడ లీగల్: ప్రభుత్వ సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ట్రెజరీ (ఖజానా) కార్యాలయంలోనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల ఉదాసీనత వల్ల లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తి తుప్పు పట్టిపోతోంది. కొత్త భవనంలోకి మారడానికి ఉత్సాహం చూపిన అధికారులు.. పాత సామగ్రిని మాత్రం గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా పార్కింగ్లోనే.. స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తోంది. ఈ భవనంలో జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరీ వంటి ఇతర విభాగాలు కొలువుదీరాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభమైన సమయంలో కోట్లాది రూపాయలతో సరికొత్త టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పాత కార్యాలయం నుంచి తీసుకొచ్చిన టేబుళ్లు, కుర్చీలు, ఇనుప బీరువాలు, కంప్యూటర్ భాగాలు వీటన్నింటినీ భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో ఒక మూలన పడేశారు. నిబంధనలు ఇవే.. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వాడని పాత సామగ్రి జాబితాను ఎప్పటికప్పుడు తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది వేలం వేయాల్సి ఉంటుంది. ఆ వేలం ద్వారా వచ్చే నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నాలుగేళ్లనా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పలు ఆరోపణలు ఏటా పాత ఫర్నిచర్ లెక్కలు చూడకపోవడంతో విలువైన వస్తువులను కొందరు సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడాలంటే ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పాత కార్యాలయం నుంచి ఇక్కడకు ఎన్ని వస్తువులు తరలించారు. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి అనే విషయాలపై సమగ్రంగా తనిఖీ జరగాలి. పనికిరాని వస్తువులను వెంటనే వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తిని దుర్వి నియోగం చేసిన అధికారులపై విచారణ జరిపించాలి. ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి లెక్క కూడా పక్కాగా ఉండాలి. కానీ ఇక్కడ కళ్ల ముందే విలువైన ఫర్నిచర్ పాడవుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. పాత సామగ్రిపై అధికారుల నిర్లక్ష్యం నిబంధనల మేరకు వేలం వేయని వైనం కాకినాడ జిల్లా ట్రెజరీలో తుప్పు పడుతున్న బీరువాలు, కుర్చీలు ప్రభుత్వ ఆదాయానికి గండి


