Telangana
-
రెండో భార్యపై అనుమానం.. మల్కాజ్గిరిలో దారుణం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గిరి మారుతీనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్కుమార్కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. మొదటి భార్య సోదరి నిషారాణి(నిషిత రాణి)నే మరో వివాహం చేసుకున్నాడు. అయితే నిషాకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని నిషారాణిని బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. తుపాకీ గాయాలతో నిషారాణి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, నిషా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
వరంగల్ : కనుల పండువగా ఎస్సార్ స్నాతకోత్సవం (ఫొటోలు)
-
‘కోటి’ సంపద సృష్టి
సాక్షి, హైదరాబాద్: మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలుగా ఎదిగేవిధంగా సముచితమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. వారిని రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకెళ్లే ఆర్థిక విప్లవానికి ఈ బస్సులు చిహ్నలుగా నిలుస్తాయని అన్నారు. ఆర్టీసీకి లీజుకు.. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర రాష్ట్రంలో ఒకేరకమైన పంటలు పండించే విధానానికి స్వస్తి పలకాలని, అన్ని రకాల పంటలను పండించేవిధంగా పంట మార్పిడి విధానంపై మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, ఇతర ఆస్తులపై మహిళలకు యాజమాన్యం కల్పింస్తున్నట్లు చెప్పారు. మహిళలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు.మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మార్కెటింగ్, వాణిజ్య మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా ఈ బస్సుల పంపిణీ నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, గణేష్, మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్షి్మ, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కలువ సుజాత గుప్తా, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై అఘాయిత్యం చేసి.. పైనుంచి తోసేసి..
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం బట్టబయలైంది. వేసవి సెలవుల కోసం తాత ఇంటికి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలికపై అతను అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ఆ బాలికను హతమార్చేందుకు ప్రయత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధితురాలు అసలు విషయం చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి కుమార్తె తన భర్తతో గొడవపడి తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక కూడా తల్లి, తాత వద్దకు వేసవి సెలవుల్లో వచ్చింది. అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) బాలికపై కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్లోని మహిళకు చెప్పగా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. అదే అదునుగా.. : ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని వేళ తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా కిందకు వచ్చి బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూటౌన్ పోలీసు స్టేషన్లో గౌస్పై కేసు పెట్టారు. అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్పై పోక్సో కేసుతోపాటు హత్యాయత్నం కూడా నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మంత్రి పొంగులేటి భరోసా..: బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగిపోయాయని.. కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రి, సర్పంచ్తో ఫోన్లో మాట్లాడారు. ‘ముందు పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా’అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం వెంటనే హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని.. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
కష్టాల్లో కౌలు రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్నది కౌలు రైతులే అయినా, ప్రభుత్వ పథకాలు, మద్దతు వ్యవస్థలు కేవలం పట్టాదారులకే పరిమితం కావడం వల్ల వీరు దారుణమైన ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. తెలంగాణలో వ్యవ సాయాన్ని ప్రధానంగా కౌలు రైతులే నడిపిస్తున్నా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంట కొనుగోళ్లు, ప్రకృతి విపత్తు పరిహారం వంటి కీలక మద్దతు వ్యవస్థలకు వారు దూరమవుతున్నారు.కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే–2026’లో 22 జిల్లాల్లోని 57 గ్రామాలకు చెందిన 1,816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేశారు. సర్వే ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి నేతృత్వంలో సాగింది. మంగళవారం అధ్యయన నివేదికను జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ తదితరుల సమక్షంలో హైదరాబాద్లో విడుదల చేశారు. పెరిగిన కౌలు ధరలు.. తగ్గిన నికర ఆదాయం తెలంగాణలో కౌలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. గరిష్టంగా ఎకరాకు రూ.53,000 వరకు వసూలు చేస్తున్నారని సర్వేలో తేలింది. 2022లో సగటున 5 ఎకరాలుగా ఉన్న కౌలు భూమి, ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగింది. చిన్న కౌలు రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఎక్కువ భూమిని కౌలుకు తీసుకోవాల్సి వస్తుండగా, ఉన్న తక్కువ నికర ఆదాయం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. వ్యవసాయంలో లాభాలు తగ్గుతున్నా కౌలు రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఎక్కువ భూమి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వే పేర్కొంది. ఓటీపీలతో యూరియా కొనుగోలు, పంట అమ్మకాల అవస్థలు యాసంగి సీజన్లో ప్రవేశపెట్టిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినట్టు అధ్యయనం తేల్చింది. ⇒ భూ యజమాని ఓటీపీ తప్పనిసరి కావడంతో సర్వేలో పాల్గొన్న 1,816 మందిలో కేవలం 412 మంది (22.8 శాతం) మాత్రమే సబ్సిడీ యూరియాను పొందగలిగారు. వారిలో కూడా కేవలం 40 మంది మాత్రమే తమ పేర్లపై యూరియా తీసుకున్నారు. మిగతావారు భూ యజమానుల వివరాలపై ఆధారపడాల్సి వచి్చంది. సబ్సిడీ అందని రైతులు బహిరంగ మార్కెట్లో ఒక్కో సంచికి రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్టు సర్వే తెలిపింది. ⇒ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింకేజీ, ఓటీపీ వంటి నిబంధనలు ఉండటంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే తమ పేర్లతో సీసీఐకి విక్రయించగలిగారు. ⇒ వరి విషయంలో ఖరీఫ్లో 20 శాతం, యాసంగిలో 17.2 శాతం మంది మాత్రమే తమ పేరుతో విక్రయించినట్టు సర్వే వెల్లడించింది. మిగతా వారు ఇతరుల పేర్లతో విక్రయించి కమీషన్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. ప్రకృతి విపత్తు పరిహారం కూడా అందని ద్రాక్షే గత మూడు సంవత్సరాల్లో వరదలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టాన్ని చవిచూశారు. అయితే బాధితుల్లో కేవలం 11 మందికి మాత్రమే, అంటే 0.7 శాతం మందికి మాత్రమే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమైంది. కొన్ని సందర్భాల్లో భూ యజమానులు పరిహారం తీసుకొని కౌలు రైతులకు ఇవ్వలేదని సర్వే గుర్తించింది. పంట రుణాలు భూయజమానులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో కౌలు రైతులు పూర్తిగా ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారు. 24 నుంచి 36 శాతం వరకు వడ్డీతో అప్పులు తీసుకుంటున్నట్టు రైతులు తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రైవేట్ అప్పుల భారం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. రుణమాఫీ పథకాల ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదని పేర్కొంది. ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు అమ్మకాలు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు లేకపోవడంతో కౌలు రైతులు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పంటలు అమ్ముకోవాల్సి వస్తోందని సర్వే తెలిపింది. దీంతో 5 ఎకరాల కౌలు రైతుకు పత్తిలో రూ.64,400, వరిలో రూ.40,350, మొక్కజొన్నలో రూ.87,800, సోయాబీన్లో రూ.53,120 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా వేసింది. ఎరువుల సబ్సిడీ, పంట కొనుగోలు, విపత్తు పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా కౌలు రైతుల ఖాతాల్లోకి చేరేలా వ్యవస్థను రూపొందించాలని కోరింది. ‘కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలి’ హిమాయత్నగర్ : కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివేదిక విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా అందించాలన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కల్పించాలని చెప్పారు. సీఎం, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిని కోరారు. దీనికి స్పందించిన కోదండరెడ్డి కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
రాగానే దంచికొట్టింది
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం‘నైరుతి’ వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అడిక్మెట్, విద్యానగర్, అంబర్పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. పలు జంక్షన్లు చెరువులను తలపించాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే వేళ వర్షం పడటంతో ఐటీ కారిడార్ సహా పలు మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.దీంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవించారు. మల్కాజ్గిరిలో 12.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్పేటలో 8.7 సెం.మీ., విఠల్వాడీలో 7.8 సెం.మీ. వాన పడింది. మొత్తం 14 ప్రాంతాల్లో 5 సెం.మీ.కుపైగా వర్షం నమోదైంది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. భారీ సైన్బోర్డులు, ఫ్లెక్సీలు ఊడి పడటంతో కార్లు, బైక్లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వందల కాలనీలు గంటల తరబడి చీకట్లో మగ్గాయి. టీ తాగుదామని వచ్చి.. బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జహంగీరాబాద్కు చెందిన అఫ్రోజ్(30), జాఫర్(15) పరిచయస్థులు. వీరు మంగళవారం సాయంత్రం టీ తాగేందుకు బండ్లగూడ చౌరస్తా సమీపంలోని రాయల్ సి హోటల్కు ఆటోలో వచ్చారు. అప్పటికే అక్కడ ఓ స్ట్రీట్లైట్కు సంబంధించిన విద్యుత్ వైరు తెగిపడి ఉంది. నీరు నిలిచి ఉండటంతో గమనించలేకపోయారు. ఈ క్రమంలో మొదట ఆటో దిగిన జాఫర్.. షాక్ తగిలి కింద పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో అఫ్రోజ్ నేరుగా వైర్కు తగలడంతో విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాఫర్ను స్థానికులు చికిత్స నిమిత్తం ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాల్లో తడిసిన ధాన్యం నిర్మల్ జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కుంటాల మండలంలోని జామున ఓల, లింబా(కె), కల్లూరు, కుంటాల, పెంచికల్పాడ్లో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో జొన్న, వరి ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సొనాల మండలం పెద్దగూడ సరిహద్దులో వాగు ఉధృతికి వంతెన సమీపంలోని రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రేవంత్వి బెదిరింపు రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసత్యపు వార్తలతో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అకారణంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేద్దామని, తనపై ఆరోపణలకు ఉన్న ఆధారాలను వారికి ఇవ్వాలని అన్నారు.వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇచ్చిన హామీల అమలుపై ప్రెస్క్లబ్లో గానీ, అమరవీరుల స్తూపం వద్ద గానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు భయపడను.. ‘పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అంటూ రేవంత్రెడ్డి చేస్తున్న తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా. వారి ఇళ్ల ముందే ఘెరావ్లు చేసి, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీకి వచ్చా. అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా. రేవంత్రెడ్డి సరి్టఫికెట్ నాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని.ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్లు పీకి గోలీలు ఆడటం, పేగులు మెడలో వేసుకోవడం వంటి నీచమైన, చిల్లర రాజకీయాలు నాకు రావు. నేను మాటకారిని కాకపోయినా మాట మీద నిలబడే వ్యక్తిని. పదవుల కోసం పార్టీలు మారే రకం కాదు. పదేళ్లు తానే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, అభద్రతాభావం, అహంకారంతో సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారు..’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. మంత్రులు దోచుకుంటున్నారు.. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వంచనలో, దోపిడీలో ఇరు పార్టీలది ఒకే వ్యవహారశైలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి..’అని కేంద్రమంత్రి విమర్శించారు. ఆఖరి గింజ వరకు కొంటామన్నారుగా.. ‘రాష్ట్రం అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం ఇప్పించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతోంది. తెలంగాణలో దొడ్డు బియ్యం వాడకపోయినా, గోడౌన్లు ఖాళీ లేకపోయినా 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి, ఇప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలి. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణలో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం..’అని కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్లో రాష్ట్రం నుంచి మరొకరికి చాన్స్! ఈ నెలలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, బీజేపీ పార్టీ కమిటీలను కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తారని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్లో అవకాశం ఉంటుందన్నారు. -
రూ. 200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో భారీ అవినీతి అనకొండ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జరుప్ల మోహన్ నాయక్పై అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టబద్ధ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.మియాపూర్లోని ఆయన నివాసం, ఎర్రమంజిల్లోని కార్యాలయం, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17,94,62,617 అని ఏసీబీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. భూములు, ఫ్లాట్లు, విల్లాలు.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అధికారిక విలువ ప్రకారం దీని ధర రూ.82.89 లక్షలు. కొంపల్లిలో 3, గచ్చి»ౌలిలో 4 కలిపి మొత్తం 7 ఫ్లాట్లు గుర్తించారు. వీటి అంచనా విలువ రూ.7.34 కోట్లు. మియాపూర్లో ట్రిప్లెక్స్ విల్లా విలువ రూ.2.50 కోట్లు, కూకట్పల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటి విలువ రూ.62.14 లక్షలుగా పేర్కొన్నారు. నిజామాబాద్లో నిర్మిత విల్లా కొనుగోలుకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సోదాల్లో రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల నిల్వలు గుర్తించారు.సుమారు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు. అలాగే 6 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.26 కోట్ల గృహోపకరణాలు, 9 మొబైళ్లు, 4 ల్యాప్టాప్లు సహా రూ.11.25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.25 లక్షల విలువైన రెండు వాహనాలు గుర్తించారు. రూ.4.44 లక్షల విలువైన 22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను కూడా సీజ్ చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు కూడా సోదాలు? సోదాల అనంతరం మోహన్ నాయక్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. సోదాలు బుధవారం కూడా కొనసాగే అవకాశముందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆర్అండ్బీలో కలకలం భారీ ప్రాజెక్టులు, టెండర్లు, నిర్మాణ పనులకు సంబంధించిన నిర్ణయాధికార స్థానంలో ఉన్న ఆర్అండ్బీ ఉన్నతాధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం శాఖలో కలకలం రేపింది. బినామీ ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.వందల కోట్ల అవినీతిలో అక్రమార్కులు రాష్ట్రంలో ఉన్నతాధికారుల అవినీతి వ్యవహారాలు వరుసగా బయటపడుతున్నాయి. ఏకంగా వందల కోట్లలో అవినీతి కార్యకలాపాలు ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు లాకర్లు, భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల పత్రాలు పెద్ద ఎత్తున బయటపడటం రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చాటుతోంది. ఈఎన్సీలు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, అదనపు ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ స్థాయి అధికారులు సైతం భారీ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుతున్నారు.హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ వద్ద బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. నీటిపారుదల శాఖలో కాలేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పేర్లు కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అదనపు కలెక్టర్గా పనిచేసిన అధికారి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన నాయిని భుజంగరావు, జలమండలిలో ఇటీవల పట్టుబడిన ఉన్నతాధికారి, మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ ఆస్తులు పదుల కోట్లలో ఉంటే.. కొందరి ఆస్తులు ఏకంగా వందల కోట్లు దాటుతున్నాయి. -
ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి టాస్క్ లు పూర్తి కావడంతో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ప్రస్తుత కేబినెట్ నుంచి వీలును బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం, ఇద్దరు లేదా ముగ్గురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలని హస్తిన పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేరకు అధిష్టానం కసరత్తు చేయగా, మంత్రుల పనితీరుపై తమ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి కబురు వస్తుందని, ఈ నెలాఖరులోపే మార్పులు జరగవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంకేతాలిస్తున్న ఇటీవలి పరిణామాలు.. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దలను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతుండడం, మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాహుల్గాం«దీని ఇటీవల కలవడం లాంటి ఘటనలు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదంటే ప్రక్షాళన జరుగుతుందనే దానికి ఊతమిస్తున్నాయి. పలు కోణాలు.. పలువురు ఆశావహులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం పలు కోణాలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు ఈసారికి పీసీసీ అధ్యక్ష పదవి తోనే సరిపెట్టే అవకాశాలున్నాయి. నల్లగొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్రెడ్డి, ఎస్టీ లంబాడా కోటాలో బాలూనాయక్లో కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ కూర్పు ప్రకారం ఈ రెండు సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.కానీ రాజగోపాల్రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎస్టీ కోటాలో బాలూనాయక్ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా లంబాడా వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులవుతారనే సమీకరణం బాలూనాయక్కు ఆటంకంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.ఒకవేళ లంబాడా వర్గానికి కేబినెట్లో అవకాశం ఇస్తే బాలూనాయక్కే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. లేదంటే అసెంబ్లీ స్పీకర్గా ఆయన్ను నియమించే అవకాశముందని కూడా సమాచారం. ఇక బీసీ సామాజికవర్గాల్లో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కు కేబినెట్లో చోటు కల్పించే అంశం కూడా ఇటు సీఎం, అటు అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్లో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కేబినెట్లోకి స్పీకర్! అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఈసారి కేబినెట్లో తీసుకుంటారని, ఈ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం కల్పిస్తారని, గడ్డం ప్రసాద్కు మంత్రిగా అవకాశమివ్వడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఆ జిల్లా రెడ్డి సామాజికవర్గం నుంచి తీవ్రంగా ఉన్న పోటీకి చెక్ పెట్టవచ్చనే ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఆయన ఇటీవల పార్టీ పెద్దలను కలవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. పని భారం తగ్గించుకునే యోచనలో సీఎం ఎన్నికల కేబినెట్ రానున్న నేపథ్యంలో తన పనిభారాన్ని తగ్గించుకోవాలనే యోచనలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారు. తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఆయన వదులుకుంటారని, ఈ శాఖలను కూర్చే పనిలో భాగంగా ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న కీలక శాఖలు కూడా మారతాయని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లుగా గుర్తింపు ఉన్న కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖలు మార్చాలని అధిష్టానాన్ని, సీఎంను కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎవరి శాఖలు మారుతాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎప్పుడన్నది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఒకరిపై వేటు తప్పదా?ప్రస్తుత మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలున్నాయని, ఈ నివేదికల ఆధారంగా ఒక కేబినెట్ మంత్రిని తప్పిస్తారనేది కూడా గాం«దీభవన్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. రాజకీయంగా మంత్రుల వ్యవహారశైలితో పాటు ఆయా శాఖల్లో వారి పనితీరును అధిష్టానంతో సత్సంబంధాలున్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా అంచనా వేస్తున్నారని, ఈ నివేదికల ఆధారంగానే ఎవరిని తప్పించాలన్నది నిర్ణయిస్తారని సమాచారం. అయితే సామాజిక సమీకరణలు కూడా ఈ తొలగింపునకు ప్రాతిపదికగా మారతాయని, అన్నీ కుదిరితేనే ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన ఉంటుందని సమాచారం. -
హైదరాబాద్లో భారీ వర్షంపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్: భారీ వర్షం కారణంగా నగరంలో ఏర్పడిన పరిస్థితులపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.తక్కువ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.నగరంలోని ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలుసుకున్న సమాచారంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.కూలిన చెట్లు ,తెగిన విద్యుత్ తీగలు తొలగించడానికి సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
గచ్చిబౌలి చోరీ కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హిల్ రిడ్జ్ విల్లాలో చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించారు. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా భావించిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయగా ఆ గ్యాంగ్ చోరీకి పాల్పడి విషయం బయటపడింది. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు కనిపించలేదు. నెల రోజుల క్రితమే పనిలో చేరిన వారు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. అయితే పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు వ్యాపారవేత్త. దీనిపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితులు గాలించి ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. -
ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్. ‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం -
TG: మహిళా సంఘాలకు 553 బస్సులు కేటాయింపు
హైదరాబాద్: మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ప్రత్యేకంగా 553 బస్సులను ప్రారంభించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ఆడబిడ్డలను లక్ష్మీ దేవితో కొలిచే సంస్కృతి మనది. భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారుమహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలి. ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. వెయ్యి కాదు… 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంచితే, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభకు బస్సులో రాగా అదే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. CM Revanth Reddy flagged off 553 buses operated by Mandal Mahila Samakhyas (MMS) మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పరేడ్ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్,… pic.twitter.com/IPhuWbxu9X— Congress for Telangana (@Congress4TS) June 9, 2026 -
మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్కు షాక్ తగిలింది. ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అపిడవిట్లో వెల్లడించలేదని, ఆస్తుల వివరాలు తెలపలేదని బీజేపీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ నామినేషన్ను తిరస్కరించింది. కాగా మధ్యప్రదేశ్నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేశారు.కాగా తొలినుంచి మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ సాగింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. అయితే కాంగ్రెస్ ఓట్లతో సులువుగా ఒక రాజ్యసభ సీటు గెలువగలదు. అయితే బీజేపీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ఈ ఉత్కంఠల నడుమ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడింది. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం రద్దవడం సంచలనంగా మారింది. -
హైదరాబాద్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల కుండపోతగా వాన కురిసింది. నగర పరిధిలోని అడిక్మెట్, విద్యానగర్, అంబర్ పేట్, ఉస్మానియా యూనివర్శిటీ, హఫీజ్పేట్, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే యత్నం చేస్తున్నారు. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించిన దక్షిణ–పశ్చిమ రుతుపవనాలు రాకతో, మంగళవారం(జూన్ 9వ తేదీ) సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. తద్వారా రహదారులు నీట మునగడంతో పాటు విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో భారీ ట్రాఫిక్ జామ్..నగర ఐటీ కారిడార్లో కురిసిన కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాయదుర్గం, ఐకియా, మైండ్స్పేస్ పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకునే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరుఅంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది. హైడ్రా చేసిన ఏర్పాట్లతో పరిసర బస్తీలకు వరద ముప్పు తప్పింది. చెరువు నిండటంతో స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు యువకుల మృతిహైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షపాతం రికార్డు వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి..అడిక్మెట్-36.3 mmవిద్యానగర్- 31.5 mmఅంబర్ పేట్-31.3 mmఉస్మానియా యూనివర్శిటీ-హఫీజ్పేట్-27.5 mmనెహ్రూ నగర్-21 mmమలక్పేట్-మియాపూర్-18 mmఉప్పల్-సరూర్నగర్- 12 mm RTC X Roads after HEAVY DOWNPOUR at 5pm Around 60-70mm was recorded ⚠️ pic.twitter.com/XrTaW8x4Rq— Telangana Weatherman (@balaji25_t) June 9, 2026 -
భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35)కొమురంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిను ప్రేమించి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మనించారు. అదేగ్రామానికి చెందిన మండల రవీందర్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సరైన పద్ధతి కాదని రాజు తన భార్యతోపాటు రవీందర్నూ పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈక్రమంలో ఆర్నెల్లక్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని తన స్వస్థలం వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా, మందలించినా రవీందర్ తీరు మారకపోగా.. తన భార్యను తరచూ కలుసుకోవడంతో అవమానంగా భావించి మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇందుకు కారణమని భావించి రవీందర్ ఇందిఎదుట మృతదేహతో ధర్నా చేశారు. ఆత్మహత్యకు కారణమైన మృతుడి భార్యతోపాటు రవీంరద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీస్స్టేషన్ వద్దకు తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
చీఫ్ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగళం బయిటపడింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జే. బాలు నివాసంలో ఈ రోజు ( మంగళవారం) తెల్లవారుజామున ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ లోని నివాసంతో సహా ఏకకాలంలో పదకొండు చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా అధికారుల తనిఖీల్లో ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలు.. బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, విదేశీ మద్యం సీసాలు దొరికాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇంకా ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయా అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. కాగా మోహన్ నాయక్ పై గతం నుంచే పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ వసూల్ చేస్తున్నట్లు పలు మార్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టగా పెద్ద మెుత్తంలో ఆస్తులు బయిటపడ్డాయి. -
భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య..
వరంగల్ జిల్లా: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ∙ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికిన నరేశ్ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
గోదావరి నదిలో స్నానం.. ముగ్గురు గల్లంతు
సాక్షి, బాసర: గోదావరి నదిలో నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. చంద్రశేఖర్, రామచందర్, మల్లేశ్గా గుర్తించారు. గల్లంతైన వారంతా కాచిగూడ చెప్పల్ బజార్కు చెందిన వారిగా తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో గాలింపులు చేపడుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపు వర్షం వస్తుంది !
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.నేరుగా వాట్సాప్కు...వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.విత్తనాలు, ఎరువులపై కూడా..వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.రైతులకు ప్రయోజనంఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ఫోన్ ఉంటున్నందున వాట్సాప్కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్కు ముందే విషాదం..!
నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్రెడ్డి, అనురూప్రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. రాజేందర్రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్రెడ్డిది గతేడాది ఎంఎస్ పూర్తికాగా.. అనురూప్రెడ్డిది ఇటీవలే కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ పూర్తిచేశాడు. అశ్రిత్రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..అశ్రిత్రెడ్డి, అనురూప్రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్ రిజర్వాయర్’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్రెడ్డి ఫోన్కాల్ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. చదువులో చురుకుఅనురూప్రెడ్డి హైదరాబాద్లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్రెడ్డికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.నేడు హైదరాబాద్కు రానున్న మృతదేహం..అనురూప్రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నేరాలు చేసి నేపాలీలు పరార్!
సాక్షి, సిటీబ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితులైన ఏడుగురు నేపాలీల్లో ఒక్కరే చిక్కారు. సూత్రధారి, కీలక నిందితురాలు కల్పన సహా మిగతవారు పరారీలోనే ఉన్నారు.ఈ ఒక్క కేసులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేపాలీ సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారి సంఖ్య 170గా తేలింది. నేపాలీ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి సమన్వయంతో, సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఈ నేపాలీ నేరగాళ్లు సంపన్నుల ఇళ్లల్లో పని వాళ్లు, వంట వాళ్లు, వాచ్మెన్లుగా చేరుతున్నారు. తొలినాళ్లలో నమ్మకంగా పనిచేసినా.. ఆపై అదును చూసుకుని పంజా విసురుతున్నారు. సరైన సమయంలో తమ ముఠాకు చెందిన మిగిలిన వారిని రంగంలోకి దింపుతున్నారు. అంతా కలిసి తమ ‘పని’ పూర్తి చేసుకున్న తర్వాత ముందు నగరం..ఆపై దేశం దాటేస్తున్నారు. కల్పన కూడా నేపాల్ చేరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేటుగాళ్లు నేరం చేసిన వెంటనే తమ సెల్ఫోన్లు, సిమ్కార్డులు ధ్వంసం చేసేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.రెండు రకాల వ్యూహంతో ముందుకు..వాంటెడ్గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి పోలీసులు రెండు రకాలైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతిక నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు, ఇతర విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క ఈ నేరగాళ్ల వివరాలు, ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుతూ ఆయా అసోసియేషన్లు, యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినప్పటికీ నేపాల్లోకి ప్రవేశించి, వీరికి అరెస్టు చేసుకురావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.బెయిల్ వస్తే మళ్లీ దొరకరు... ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు వాంటెడ్గా ఉన్న 170 మందీ నేరం చేసిన వెంటనే పరారు కాలేదు. వీరిలో కొందరు అరెస్టయి.. బెయిల్పై వచి్చ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ష్యూరిటీలు ఇచి్చన వారికీ వీరి వివరాలు తెలియట్లేదు. శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పంథా అనుసరిస్తుండటంతో వీరిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాయి.కీలకంగా వ్యవహరిస్తున్న జీవన్... రాష్ట్రంలో నేపాలీలకు ఉద్యోగాలు ఇప్పించడం, నేరాలు చేయించడంలో జీవన్ అనే నేపాలీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఓ దళారిగా వ్యవహరిస్తూ సంపన్నుల ఇళ్లల్లో నేపాలీలను పనిలో పెడుతున్నాడు. ఆపై పథక రచన చేసి, మిగతవారిని రంగంలోకి దింపి టార్గెట్ చేసిన ఇంట్లో నేరం చేయిస్తున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత నేరం జరగడానికి ముందు తొలుత అతగాడే నేపాల్ వెళ్లిపోతాడు. అతని సహచరులు ఇక్కడే ఉండి ప్రణాళికను అమలు చేస్తారు. కొన్నాళ్లకు మరో పేరుతో వస్తున్న జీవన్ నేర పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. అతడి కోసం ఆరా తీస్తున్నారు. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు.చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. -
మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి
హైదరాబాద్: మామిడిపండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందింది. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ తెలిపిన మేరకు.. బీదర్ చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు విఠల్ వాడిలో ఉంటున్నారు. నివారం వారి బంధువు రేణుక నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని వీరి ఇంటికి వచ్చింది. ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు ఆదివారం తిన్నారు. అయితే అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మూడో కుమార్తె భువనే శ్వరి(17) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్మెట్ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్మెట్లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్కుమార్ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇదిలా తండ్రి వెంకట్రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. -
హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి
మల్కాజిగిరి: ఏడేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో కొడుకు, కూతురుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హతుడి భార్య గంగాబాయి(65)కి వయసురీత్యా జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కొడుకు కిషన్ (47) కూతురు ప్రపుల్ల (36)కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జి వి.బాలభాస్కర్ రావు తీర్పు వెలువరించారు. సోమవారం మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టకు చెందిన కిషన్ మారుతీ సుతార దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్ ట్రైన్ డ్రైవర్గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని మల్కాజిగిరిలో ఎన్ఏ కృష్ణానగర్లో ఇల్లు కొనుగోలు చేశాడు. అక్కడ భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లతో నివాసముంటున్నాడు. మరో కూతురు అనుపమ వివాహం కావడంతో వేరుగా ఉంటున్నది. కిషన్ ఖాళీగా ఇంటి వద్దనే ఉంటూ తన జల్సాలకు డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. అతనికి సోదరి ప్రపుల్ల, తల్లి గంగాబాయి వత్తాసు పలికేవారు. ప్రపుల్ల కూడా పీజీ చేసినా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో తండ్రి మందలించేవాడు. ఇది వారికి నచ్చలేదు. పింఛను మొత్తాన్ని కూడా ప్రపుల్ల పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడంతో మారుతీ ఒప్పుకోక పోవడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని చంపడానికి ప్రపుల్ల యూట్యూబ్లో చూసి ఒక పథకం రచించి విషయాన్ని తల్లి, సోదరుడుతో పంచుకొంది. ఉమ్మెత్త చెట్టు గింజలను నూరి ఆ పొడిని ఆహారంలో కలిపి విషప్రభావంతో చనిపోయేలా చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి బయట నాలాలో పడేద్దామని చెప్పింది. ఆవిధంగా పలుమార్లు ఆహారంలో ఉమ్మెత్త చెట్టు గింజల పొడిని ఆహారంలో కలిపి మారుతీకి ఇవ్వగా 2019 ఆగష్టు 16న మృతి చెందాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో ఉంచి పూజగదిలో దాచివుంచారు. జన సంచారం ఉండటంతో రెండు రోజులు అలాగే ఉంచారు. దుర్వాసన రాకుండా అగరబత్తీలు వెలిగించి, సెంట్ చల్లి జాగ్రత్తపడ్డారు. జనసంచారం తగ్గడంతో 18వ తేదీన బయటకు తీసుకొని రావడంతో ఒక్కసారిగా దుర్వాసన వచి్చంది. దీంతో స్థానికులు గుమిగూడటంతో విషయం బయటపడ్డది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోమవారం తీర్పు వచి్చంది. -
చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే బత్తిని కుటుంబం ఆనవాయితీగా నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీకి ఈసారి కూడా భారీ స్పందన లభిస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు జనం పోటెత్తారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆస్తమా రోగులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. చేప ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.నిన్న (సోమవారం) రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా చేప ప్రసాదం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. చివరి గంటల్లోనూ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఉచితంగా ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. వీఐపీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.3 లక్షల చేప పిల్లలకు మించి..చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ (ఫిషరీస్ డిపార్ట్మెంట్) ఇప్పటికే సుమారు 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేప పిల్లలను సమకూర్చేందుకు కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ పూర్తైంది.చేప ప్రసాదం ప్రత్యేకత ఇదేమృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం ప్రత్యేకంగా తయారు చేసే ఔషధ మిశ్రమాన్ని చిన్న చేప నోట్లో ఉంచి రోగులకు అందిస్తారు. దీనిని ప్రజల్లో "చేప ప్రసాదం"గా పిలుస్తారు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కారణంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కు వస్తుంటారు.చేప ప్రసాదం ప్రభావంపై శాస్త్రీయంగా స్పష్టమైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతుంటే.. మరోవైపు దీనివల్ల తమ ఆరోగ్యం మెరుగుపడిందని వేలాది మంది రోగులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
నైరుతి వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా భూభాగంలోకి సోమవా రం ఉదయం రుతుపవనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయి. గతేడాది రెండు వారాల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించగా... ఈసారి సాధారణ సగటు సమయానికి రెండ్రోజుల ముందు చేరుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది.గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఉక్కపోత కూడా కాస్త తగ్గింది. రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. అదేవిధంగా రానున్న 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఎల్నినో పరిస్థితులు ఉన్నాయని, ఇవి క్రమంగా బలపడి నైరుతి సీజన్ సమీపించిన తర్వాత ఎల్నినో పరిస్థితులు పూర్తిగా కేంద్రీకృతమవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా లోటు వర్షపాతం ఉంటుందని శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల తేలికపాటి వానలు సోమవారం రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కొనసాగిన ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, సంచుల మూటలు మోయడం, పార్టీలు మారడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమర్థుడే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. ఏమీ చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సోమవా రం తన మంత్రిత్వ శాఖ రెండేళ్లలో సాధించిన ప్రగతిపై మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి పైవిధంగా స్పందించారు. కేంద్రం దొడ్డు బియ్యం సేకరించి ఏం చేయాలి? ‘ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు. వారికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం దొడ్డు బియ్యాన్ని సేకరించి ఏం చేయాలి? దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రజలే తిననప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలు తినాలని ఎలా చెప్తాం? దేశంలోని గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడం, రబీ సీజన్లో భారీగా ధాన్యం వస్తుందన్న ఉద్దేశంతోనే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఏకంగా 70 లక్షలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. రాష్ట్రంలో పండించే సన్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు క్వింటాల్కు రూ.4,500కు విక్రయిస్తూ.. ఇక్కడకు మాత్రం రూ.3,500 క్వింటాల్కు కొనుగోలు చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. పది రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామని అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సన్న ధాన్యానికి ప్రకటించి.. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు..’ అని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం సమకూర్చింది ‘ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వా«దీనానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. రైల్వేనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 13,500 కోట్లు రుణాన్ని ఇచ్చింది. అంతేకాక మెట్రో రెండో దశకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 50 శాతం నిధులను రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. మెట్రో టేకోవర్ పూర్తయ్యాక తిరిగి డీపీఆర్ పంపించాలి. అలా పంపించిన డీపీఆర్ను కేంద్రంలోని మెట్రోబోర్డు, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతాయి. అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారుల కోసం దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలిపింది. ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లు కేంద్రం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసింది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? ‘సింగరేణిలో ఏదో బొగ్గు కుంభకోణం జరిగిందని కేటీఆర్ మాకు లేఖ రాసిన విషయం వాస్తవమే. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక్క విషయంలోనూ హరీశ్రావు, కేటీఆర్లకు నేను కేంద్ర మంత్రినని గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ.. అందులో కిషన్రెడ్డికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించడం ఏమిటి. వారి హయంలో సింగరేణిలో అవినీతి జరగలేదా? ఒక్క సింగరేణిలోనే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విభాగంలో అవినీతి జరగడం లేదో చెప్పాలి?..’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిస్తేనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సబర్మతీ రివర్ఫ్రంట్ కడితే ఆహా.. ఓహో.. అబ్బా అని పొగుడుతారు. కానీ మనకు అవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం అడ్డుకుంటారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్రావు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మన అభివృద్ధికి, మన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు? ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపీలకు లేదా? నగర తాగునీటి అవసరాలకు గోదావరి, సింగూరు జలాలు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్, మూసీ ప్రక్షాళనలకు అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు.‘మున్సిపల్ వార్డు ఎన్నికలకు సైతం మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇక్కడి మన మోరీలో మురికి తీయాలంటే మోదీ వస్తారా? అందుబాటులో ఉండి పనులు చేసేవారిని, ఇక్కడి సమస్యలు తెలిపిన వారిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని అన్నారు. ‘పదేపదే నేనేం చేశాననిఅడుగుతున్న వాళ్లు.. ప్రస్తుతం ఫామ్హౌస్లో ఉన్న కేసీఆర్ పదేళ్లలో, ప్రధాని మోదీ పన్నెండేళ్లలో ఏం చేశారో చెబితే.. గత రెండేళ్లలో నేనేం చేశానో చెబుతా. ఈ అంశంపై అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ పెడతాం. నేనేం చేశానో, ఏం ప్రణాళికలున్నాయో పీఏసీ చైర్మన్ గాంధీతోనే చెప్పిస్తా..’ అని చెప్పారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మియాపూర్లో దాదాపు రూ.1,675 కోట్ల విలువైన..సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనం సహా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వివక్ష, వితండవాదం వద్దు ‘రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వివక్ష, వితండవాదం లేకుండా ప్రతిపక్ష పారీ్టలు ముందుకు రావాలి. 2009 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయం చేద్దాం.. అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలి. చేతనైతే కేసీఆర్, కిషన్రెడ్డి విలువైన సూచనలివ్వాలే కానీ, అబద్ధాలు, అవినీతి, అహంకారంతో అడ్డుపడొద్దు. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.నేను ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన ప్రతిసారీ మూడు రోజుల తర్వాత వారిని కలిసి.. పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదని కిషన్రెడ్డి చెడగొడతారు. ఇలాగే అభివృద్ధికి అడ్డం పడితే రాబోయే రోజుల్లో ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పు ఇస్తారు. మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లకుండా చేస్తారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే.. ‘ప్ర«దాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివసించే ఢిల్లీలో కాలుష్యం సమస్య. ముంబైలో వరదనీరు, ట్రాఫిక్, మురికివాడల సమస్యలు. ఐటీకి పేరెన్నికగన్న బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. ఇంటినుంచి వెళ్తే ఎయిర్పోర్టుకు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. చెన్నైలో అపార్ట్మెంట్లు, కాలనీలు వర్షమొస్తే నీళ్లలోనే. కోల్కతాలో బయటకు వెళ్లినవారు ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని శాంతిభద్రతల సమస్య. వాటి తీవ్రతను అర్థం చేసుకునే హైదరాబాద్కు ఆ దుస్థితి రాకుండా నిపుణుల సూచన మేరకు మూడు కార్పొరేషన్లు చేశాం. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సరిహద్దులు నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు. పేదల కోసం లక్ష ఇళ్లు ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆడబిడ్డలు.. ఆదానీ, అంబానీలతో, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. అమెజాన్లో ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆడబిడ్డలకు ప్రథమ ప్రాధాన్యం, నిరుద్యోగ యువతకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్పోర్ట్స్ స్కూళ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మహానగరంలో పేదల కోసం లక్ష ఎల్ఐజీ, ఎంఐఈ ఇళ్లు కడతాం. గాజుల రామారంలో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజుల రామారంలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ పనులు త్వరలో ప్రారంభించనున్నాం. సీఎంసీ కార్యాలయాన్ని సైతం ఐటీ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలను తలపించేలా నెట్జీరోగా నిర్మిస్తాం..’ అని సీఎం చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..రాబోయే కాలంలో విశ్వనగరంగా ఎదిగేందుకు పనులు చేపడతామని చెప్పారు. శేరిలింగంపల్లిలో 1,500 ఐటీ సంస్థలు ఉండగా, 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి రవాణా, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుదని అన్నారు. ఒకేచోట 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన గచ్చిబౌలి: సీఎంసీ, విద్యాశాఖ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ శాఖల నిధులతో ఒకేచోట 11 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మియాపూర్లోని లక్ష్మీనగర్లో వేదిక వద్ద ఈ మేరకు 11 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సీఎంసీ ప్రధాన కార్యాలయం, మియాపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్, శేరిలింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణం, ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన, పలు రోడ్లు, ఆర్వోబీలు, యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమానంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.కాగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేసిన శాలువ, బొకెతో సీఎం రేవంత్రెడ్డిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సన్మానించారు. వాటర్ పెట్ బాటిల్స్ వ్యర్థాలతో శాలువ తయారు చేయగా, బొకెను షాంపు బాటిల్స్ వ్యర్థాలతో రూపొందించారు. ప్లాస్టక్ వ్యర్థాలతో తయారు చేసిన కుర్చిలలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు కూర్చున్నారు. దుండిగల్లో ఏర్పాటు చేయనున్న చెత్త ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. -
Hyd: చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే అంతర్-రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కింద పనిచేసే 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ వైద్యుల బృందం ఉమ్మడిగా దాడి చేసి రట్టు చేశాయి.నమ్మకమైన సమాచారం మేరకు సోమవారం(జూన్ 8వ తేదీ) తెల్లవారుజామున ఉమ్మడి బృందాలు అంబర్పేట్, కుల్సుంపురా, అత్తాపూర్ మరియు రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 7 నాలుగు చక్రాల రవాణా వాహనాలను పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న సుమారు 90 టన్నుల పచ్చి చికెన్ వ్యర్థాలను (Poultry Waste) గుర్తించి సీజ్ చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్వాహకులు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వివిధ చికెన్ షాపుల నుండి ఈ వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్కు తరలించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా, వాణిజ్య చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించడం కోసం వీటిని ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలకు, అలాగే నల్గొండలోని మాల్ టౌన్కు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నిర్దేశిత నిబంధనల ప్రకారం సురక్షితంగా పారదోలారు (హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సుదీర్ఘ ఆపరేషన్ జరిగింది. హెచ్-ఫాస్ట్ ఇన్స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్, ఎమ్. అంజయ్యలతో పాటు సబ్-ఇన్స్పెక్టర్లు, హెచ్-ఫాస్ట్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యులు ఈ దాడులలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.ప్రజలకు,వ్యాపారులకు ముఖ్య హెచ్చరికపచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం మరియు వాణిజ్య చేపల చెరువుల్లో వాటిని ఆహారంగా వేయడం పూర్తిగా నిషేధించబడింది. ఇటువంటి అత్యంత అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల ఆహార గొలుసు (Food Chain) లోకి ప్రమాదకరమైన బయోలాజికల్ బ్యాక్టీరియా/విషపదార్థాలు ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను తినడం వల్ల మనుషులకు క్యాన్సర్ (Carcinogenic) వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం.అందుచేత చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరుతున్నారు. -
పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ కవచ్' ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ గారు సోమవారం కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు.సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత -2023లో ఉన్న నిబంధనలను అడ్వైజరీలో ప్రధానంగా పేర్కొన్నారు. యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.అడ్వైజరీలోని ప్రధానాంశాలు!● డీలర్లు ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలి. ఇందుకోసం విక్రేత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును సేకరించడంతో పాటు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు, చిరునామాతో వాటిని సరిపోల్చుకోవాలి.● ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే, చట్టబద్ధమైన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.● ఒకవేళ విక్రేత గుర్తింపు లేదా వాహన యాజమాన్య వివరాలు సంతృప్తికరంగా ధృవీకరించబడకపోతే.. అటువంటి వాహనాన్ని డీలర్లు తమ వద్దకు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ లేదా తిరిగి విక్రయించడం గానీ పూర్తిగా నిషేధం.● వాహనం కొనుగోలు చేసే ముందే అది దొంగిలించబడినదా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలి.● వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలతో పాటు ఎటువంటి టోల్ గేట్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి.● ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వాహన్ పోర్టల్ రికార్డులలో సదరు వాహనానికి సంబంధించి ఎటువంటి ఇతర భారాలు లేవని (ఎన్కంబరెన్స్ ఫ్రీ), స్పష్టమైన యాజమాన్య హక్కులు (క్లియర్ టైటిల్) ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాహన బదిలీ లేదా డెలివరీ ప్రక్రియ చేపట్టాలి.● వాహనాల ఓడోమీటర్ రీడింగ్లను మార్చడం లేదా ఇంజిన్, ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి కస్టమర్లను మోసం చేయడం శిక్షార్హమైన నేరం. బాధ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318తో పాటు వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు ఉంటాయి.● డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, అలాగే వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్ను నమోదు చేయడంతో పాటు, ఇంజిన్/ఛాసిస్ నంబర్లను ఫోటో తీసి భద్రపరచుకోవాలి.● మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 192A, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 లోని రూల్ 50 నిబంధనల ప్రకారం.. వాహనంపై కంపెనీ ముద్రించిన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను గానీ, ఇతర గుర్తింపు చిహ్నాలను గానీ మార్చడం, చెరపడం, ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం.● ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్కు గురైనా లేదా అసలు లేకపోయినా.. ఆ వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. అంతేకాకుండా, సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)-2023’ సెక్షన్ 317(2) కింద దొంగ సొత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించి కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.● కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన జీఎస్ఆర్ 901(ఇ) (తేదీ: 22 డిసెంబరు, 2022) నిబంధనల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ మోటార్ వాహన నిబంధనల (CMVR-1989) రూల్ 48 కింద సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ (అథరైజేషన్ సర్టిఫికేట్) పొంది ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి.● డీలర్లు తమ వద్ద జరిగే ప్రతి వాహన లావాదేవీకి సంబంధించి డిజిటల్ లేదా రాతపూర్వక రూపంలో ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. ఈ రిజిస్టర్లో కొనుగోలుదారు, విక్రయదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి సంతకాలతో పాటు లావాదేవీ జరిగిన తేదీ, సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి.● అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. తిరిగి కస్టమర్కు డెలివరీ ఇచ్చే సమయంలో ఉన్న ఒడోమీటర్ రీడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.● వాహనం డీలర్ వద్ద ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర దుర్వినియోగాలకు మోటారు వాహన నిబంధనల రూల్ 55ఇ ప్రకారం డీలర్లదే పూర్తి కస్టడీ ఆధారిత బాధ్యత.● మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 2(30) కింద అసలు యజమానికి ఉండే చట్టబద్ధమైన యాజమాన్య బాధ్యతకు ఇది పూర్తిగా భిన్నమైనది. టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్ లేదా ఇతర అవసరాల కోసం వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారీ డ్రైవర్ పేరు, లైసెన్స్ నంబర్, వెళ్లే ఉద్దేశం, ప్రయాణ సమయం, ప్రయాణించిన దూరం (మైలేజీ) వివరాలను 'ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్' లో తప్పనిసరిగా నమోదు చేయాలి.● డీలర్ల కస్టడీలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడబడినా.. అసలు వాహన యజమాని (ఆర్సీ ఓనర్) అనవసరంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్ల ట్రిబ్యునల్ (MACT) వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా రక్షించేందుకే ఈ నిబంధనలను తీసుకువచ్చారు.సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాలలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిపై భారతీయ న్యాయ సంహిత లోని దొంగతనం (సెక్షన్ 303), దొంగిలించిన సొత్తును కలిగి ఉండటం (సెక్షన్ 317), మోసం (సెక్షన్ 318), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం (సెక్షన్ 221/222) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియకు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. -
తెలంగాణను తాకిన రుతుపవనాలు ఏపీకి ఎప్పుడంటే...?
-
ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్
హైదరాబాద్: ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది దీనిలో భాగంగా ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై 21 రోజుల పర్యవేక్షణ ఉంచనున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్కు తరలిస్తారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్న ఇద్దరు విదేశీయులకు ఎబోలా వైరస్ నెగిటివ్ వచ్చింది. అయినా రెండోసారి పరీక్షల కోసం శాంపిల్స్ను పుణె పంపారు. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరొకవైపు విదేశీ ప్రయాణికులు తప్పుడు చిరునామాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద చర్యలకు ఆదేశించారు. ఎయిర్పోర్ట్లోనే చట్టపరమైన హెచ్చరికలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషా సిబ్బంది నియామకానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. EFLU సహకారంతో 24 గంటల భాషా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్కు శాఖల మధ్య సమన్వయం పెంచాలని, ఆరోగ్యశాఖ-జీహెచ్ఎంసీ-పోలీసుల సమన్వయంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఎబోలా నివారణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎబోలా టెస్టింగ్ కిట్లు అందాయని, పరీక్షలు ప్రారంభించామని జాతీయ పరిశోధన సంస్థ సీసీఎంబీ తెలిపింది. శాంపిల్ వచ్చిన వెంటనే ఫలితాలు అందిస్తామని పేర్కొంది. -
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: తెలంగాణకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకాయి. గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. ఇప్పటికే ఇవి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి. ఏపీ, మహారాష్ట్రలో 30 శాతం విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వరకు విస్తరించాయని, ప్రస్తుతం తెలంగాణ దక్షిణ సరిహద్దులోకి ప్రవేశించే స్థితిలో ఉన్నాయని తెలిపింది. చెప్పినట్లే ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి.“పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి కేవలం 2 నుంచి 3 రోజులు చాలు” అని అధికారులు తెలిపారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
వరి కొయ్యలే ఊపిరాపె
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చని పొలాల్లో సిరుల రాశులను తీయాల్సిన రైతులకు వరి కొయ్యలు మృత్యుపాషాల్లా మారుతున్నాయి. అవగాహన రాహిత్యంతో కాలుస్తున్న వరి కొయ్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటిని కాల్చే క్రమంలో వచ్చే పొగ ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎగసి పడే మంటలు రైతుల ప్రాణాలను తీస్తున్నాయి. వరి కొయ్యలను కాల్చే క్రమంలో పచ్చని చెట్లు, వ్యవసాయ సామగ్రి దగ్ధమవుతుండగా, మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో మిరుదొడ్డి, అందె, దుబ్బాక మండలం ఎనగుర్తిలో వరి కొయ్యలను కాల్చే క్రమంలో ముగ్గురు రైతులు బలయ్యారు. సిరులు పండాల్సిన పంట పొలాల్లో రైతుల శవాల కమురు ముసురుకుంటోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వరి కొయ్యలను కాల్చడం వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నల్లనిమట్టే పారాణి.. గడ్డిపరకలే బాసింగం
ఉపాధిహామీ పనుల వద్ద ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి నిర్వహించి కూలీలు సందడి చేశారు. ఈ ఆసక్తికర ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఉపాధి పనుల వద్ద వధువు, వరుడికి గడ్డిపరకలతో చేసిన బాసింగం కట్టారు. కాళ్లకు నల్లనిమట్టినే పారాణిగా పెట్టారు. గడ్డిపరకతో తయారు చేసిన మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఉపాధి పనులకు తీసుకువచ్చిన తట్టనే డప్పుగా చేసుకొని పెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు చేసి అలరించారు. ఇదంతా పనులు ముగిశాక రెండో ఫొటో క్యాప్చర్ కోసం వేచి చూసే సమయంలో ఉపాధి కూలీలకు వేదికగా నిలిచింది. -చిన్నశంకరంపేట(మెదక్) -
పొలిమేర దాటనివ్వననడానికి రేవంత్రెడ్డి ఎవరు..?: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులపై సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సోయిలేకుండా మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.‘‘పొలిమేర దాటనివ్వననడానికి అతను ఎవరు..? కలసికట్టుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం. అలాగే, టీబీజేపీ నేతలమంతా ఐక్యంగానే ఉన్నాం. అందుకు ఎలాంటి అనుమానాలకు తావులేదు’’ అని డీకే అరుణ తెలిపారు. -
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. మంచిర్యాల జిల్లా: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.ఏ బస్తీలో చూసినా..మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.వారం రోజుల్లో..పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అ«ధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. -
కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య
సాక్షి,ఒంగోలు: కాచిగూడా రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్కు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడాలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు.తాజాగా ఒంగోలు సమీపంలోని సింగరాయికొండ వద్ద ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ అదృశ్యం, ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్
చేపల మార్కెట్లపై మృగశిర కార్తె ప్రభావం కనిపించింది. నగరంలోనే ప్రసిద్ధి గాంచిన ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. సోమవారం మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కూడా తోడవ్వడంతో చేపల ప్రియులు మార్కెట్కు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. రాంనగర్ చౌరస్తా నుంచి దాయారా మార్కెట్ రోడ్డుపై చేపల విక్రయాలు కొనసాగాయి. కిలో రవ్వ, బొచ్చె మామూలు రోజుల్లో రూ.120– 130 ఉండగా.. రూ.230– 250 వరకు విక్రయించారు. కిలో కొరమీను రూ.450 వరకు ఉండగా.. ఆదివారం రూ.650కు విక్రయించారు. – ముషీరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం -
రాజకీయ నేత ఇంట్లో రూ.కోటిన్నర చోరీ?
సనత్నగర్: ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారం సనత్నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఏకంగా కోటిన్నర రూపాయలు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెక్కాలనీలో ప్రాంతంలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం లేదంటూ సదరు నాయకుడు సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి ఆ రాజకీయ నేత కుమార్తె డబ్బులు తీసినట్లు తెలిసింది. ఇంట్లో త్వరలో జరిగే వివాహం నిమిత్తం నగదు జమ చేసి కోటిన్నర రూపాయల వరకు అల్మారాలో దాచి ఉంచారు. శుక్రవారం కొంత నగదు వేరే వారికి ఇవ్వాల్సి ఉండగా అల్మరాలో నుంచి డబ్బును తీసుకునేందుకు చూడగా అందులో నగదు కనిపించలే దు. దీంతో కంగారు పడి ఆ రాజకీయ నేత పోలీసులకు విషయం తెలపగా వారు వచ్చి విచారణ జరిపారు. చివరకు తమ కుమార్తెనే నగదు తీసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. -
ర్యాపిడో రైడర్ను బెదిరించి రూ. 20 వేలు వసూలు
హైదరాబాద్: ర్యాపిడో బైక్ రైడర్ను ప్రమాదం పేరుతో బురిడీ కొట్టించి, రూ. 20 వేలు వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహార్ నగర్కు చెందిన సురేష్ (29) మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తూ పార్ట్ టైమ్గా రాపిడో రైడర్గా జీవనం సాగిస్తున్నాడు.జూన్ 4వ తేదీ రాత్రి భవాని నగర్ నుండి బోడుప్పల్కు ప్రయాణికుడిని తీసుకెళ్తుండగా, బంగారు మైసమ్మ వైన్ షాప్ సమీపంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సురేష్ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోగా, మిగిలిన ఒక వ్యక్తి తన కాలు విరిగిందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సురేష్ ను కోరాడు. అతని మాటలు నమ్మిన సురేష్ తన బైక్పై అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యంలో ఆ వ్యక్తి తన సహచరులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికే మిగతా ఇద్దరూ సురేష్ను అడ్డగించి, బలవంతంగా తమ వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి, ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో సురేష్ తన స్నేహితుడు రాజశేఖర్కు ఫోన్ చేసి, నిందితులు చెప్పిన ’బద్దం శ్రీకాంత్’ అనే మొబైల్ నెంబర్కు ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేయించాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
నేడు చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని, పలువురు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఒక రోజు ముందుగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వీరి కోసం పలువురు ఆహారం పంపిణీ చేశారు. -
భార్య గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కింగ్స్ అండ్ క్వీన్’ ఓ మచ్చుతునక మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ డెకాయ్ ఆపరేషన్ చేయడంతో మంజీరా మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. స్థానిక పోలీసులతో కుమ్మక్కై తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి దందాలకు వ్యవస్థీకృతంగా నడపటంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడితో పాటు అతడు నడిపిన పబ్స్పై గతంలోనూ అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. యువతులను రప్పించి.. ఈ పబ్స్ దందాలో ఏళ్లుగా ఉన్న ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువస్తున్నాడని తెలిసింది. అలా వచ్చే వారికి బస, భోజనం తదితరాలన్నీ అతడే సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ వారు వినియోగించడానికి తాత్కాలిక ఫోన్లు, నెంబర్లు వారిని తీసుకువచి్చన వాళ్లే కేటాయిస్తున్నారు. ఓసారి పబ్కు వచి్చన యువకుల ఫోన్ నెంబర్లు ఈ యువతులు తీసుకుంటారు. తమ వద్ద ఉన్న తాత్కాలిక నెంబర్లకు వారికి ఇస్తారు. ఇలా నిత్యం వారితో చాటింగ్ చేస్తూ పదేపదే అదే పబ్కు వచ్చేలా ఆకర్షిస్తుంటారు. ఇలా చేసిందుకు నిర్వాహకులు వీరికి అదనంగా చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ చేసిన బిల్లు నుంచి కమీషన్ కూడా ఇస్తారు. దీనికి అదనంగా ఆయా యువకుల నుంచి ఈ యువతులు కంపెనీ ఇచి్చనందుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. కొన్ని చోట్ల శ్రుతి మించి..ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్లకు ఆకర్షించడం, మద్యం తాగడం.. తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదనుగా ద్వితీయ, తృతీయ శ్రేణులకు చెందిన కొన్ని పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు శ్రుతి మించుతున్నాయి. దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ యువతుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఈ దందాలతో పాటు ఓ డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అతడి వ్యవహారాలు ఆయా ఠాణాలకు చెందిన అధికారులకు తెలిసినా ‘అనివార్య కారణాల’ నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇకపైనా టాస్్కఫోర్స్, ఎస్ఓటీలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పబ్స్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. -
డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సాక్షి,ఖమ్మం: పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు మితిమీరిన వేగంతో బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36మంది ప్రయాణికుల్లో 26మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన తోటి వాహనదారులు, సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకోగా.. ప్రమాదానికి గురైన బస్సు కేవీఆర్ ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
4 గంటలు.. 90 వేల మంది
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం శ్రీనృసింహస్వామిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు క్యూకట్టారు. దీంతో శ్రీస్వామి వారి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, కొండపైన, కొండ కింద బస్టాండ్లు, మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, క్యూకాంప్లెక్స్, శివాలయం, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాలు భక్తుల రాకతో సందడిగా మారాయి.ధర్మ దర్శనానికి 4 గంటలకు పైగా, వీఐపీ రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. ఇక బ్రేక్ దర్శనానికి 30 నిమిషాలకు పైగానే సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 90 వేల మంది భక్తులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వివిధ పూజలతో యాదగిరీశుడికి నిత్యాదాయం రూ.73,75,642 వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. -
యూరియా.. ‘గ్రీన్’ ఐడియా..
ఒక సంక్షోభం మరో సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో..నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన గ్రీన్ యూరియా ఉత్పత్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వీడన్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ కనిపెట్టిన గ్రీన్ యూరియా టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రముఖ స్వీడిష్ క్లీ¯న్ టెక్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ గుళికల రూపంలో ఉండే హరిత నత్రజని ఎరువుల తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేసి పేటెంట్ పొందింది. మన దేశంలోని అధిక సబ్సిడీలతో నడిచే, అధిక ఉద్గారాలు వెలువరించే హేబర్–బోష్ యూరియా ప్లాంట్లకు.. పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ అత్యంత ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.10 దేశాలు.. 34 ఒప్పందాలుగత ఏడాది 20 లక్షల డాలర్ల ఫుడ్ ప్లానెట్ అవార్డును గెల్చుకున్న ఈ సాంకేతికతపై ఇప్పటికే పది దేశాల కంపెనీలు 34 ఒప్పందాలు చేసుకున్నాయని నైట్రోక్యాప్ట్ చెబుతోంది. తూర్పు ప్రాంతానికి చెందిన ఒక భారతీయ కంపెనీ ఈ సాంకేతికతో గ్రీన్ యూరియా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఈ గ్రీన్ యూరియా టెక్నాలజీ వినియోగం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. సాధారణ యూరియా వర్సెస్ నైట్రోక్యాప్ట్ గ్రీన్ యూరియాహేబర్–బోష్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను పారిశ్రామికంగా సంశ్లేషణ చేస్తారు. గ్రీన్ యూరియా ప్రక్రియలో ఇనుము ఉత్ప్రేరకాల సహాయంతో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజని, హైడ్రోజన్లను కలిపి యూరియాను తయారు చేస్తారు. -
రూరల్ టీనేజర్లకు టెన్షన్
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆరుగురు టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హరియాణాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ దిగ్భ్రాతికరమైన విషయాలు వెలుగుచూశాయి.ఒత్తిడికి ప్రధాన కారణాలు చదువు, పరీక్షల భయంతోపాటు తక్కువ మార్కులు వస్తాయనే ఆందోళన, మరోవైపు ఫెయిల్ అవుతామనే భయం, భవిష్యత్పై అభద్రతా భావం. వీటితోపాటు కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, శారీరక లేదా మానసిక వేధింపులు. కుటుంబ పెద్దల వ్యసనాల కారణంగా ఒత్తిడికి గురైనట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది టీనేజర్లు తమ ఇంట్లో పెద్దవారు మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలైనట్టు తెలిపారు. ఇవేకాకుండా పేదరికం వల్ల అబ్బాయిలు చదువు మానేసి కూలి పనులకు వెళ్తుంటే.. భద్రతా కారణాలు, సామాజిక ఆంక్షల వల్ల అమ్మాయిల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. స్కూళ్లలో లేదా బయట జరిగే అవమానాలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.నిశ్శబ్దంగా నరకం.. అవగాహనా రాహిత్యం!ఈ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. చాలామంది టీనేజర్లు తమ బాధను, ఆత్మహత్యా ఆలోచనలను ‘జీవితంలో ఒక భాగం’గా భావిస్తూ భరిస్తున్నారు. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ ఉంటుందనే కనీస అవగాహన కూడా వారికి లేదు. సమాజంలో ఎక్కడ అవమానం జరుగుతుందోననే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.గణాంకాలు ఇలా: ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం దేశంలో జరిగే మొత్తం ఆత్మహత్యల్లో 6 శాతం 18 ఏళ్ల లోపు పిల్లలవే. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో 7.6 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.అందుబాటులో లేని చికిత్స: భారతదేశంలో మానసిక ఆరోగ్య చికిత్సకు సంబంధించిన లోటు 83 శాతంగా ఉంది. అంటే సమస్య ఉన్న మెజారిటీ ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. నిపుణుల సూచనలు: చిన్న వయసులోనే వచ్చే మానసిక సమస్యలను పట్టించుకోకపోతే, అవి వారు పెద్దయ్యాక కూడా వెంటాడుతాయని, కాబట్టి తక్షణమే జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. స్కూల్ కౌన్సెలింగ్: ప్రతి పాఠశాలలోనూ పిల్లల సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి.ఉపాధ్యాయులకు శిక్షణ: పిల్లల్లో మారుతున్న ప్రవర్తనను, ఒత్తిడిని గుర్తించేలా టీచర్లకు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలి.టెలి–మానస్ వినియోగం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ సేవలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. -
పని భారం.. ఏఐతో దూరం!
2025 నవంబర్–2026 జనవరి మధ్య కాలంలో యూఎస్ఏ, యూకే, జర్మనీ ఆస్ట్రేలియాల్లో ఎన్బీఈఆర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ‘ఫర్మ్ డేటా ఆన్ ఏఐ’ నివేదికను విడుదల చేసింది. ఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 6 వేల మంది సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, జర్మన్ బుందెస్ బ్యాంక్, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీ ³రిశోధక బృందాలు సంయుక్తంగా ఈ డేటాను సేకరించాయి.సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఓ సాధారణ ఉద్యోగి రోజువారీ పనిభారాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు. పునరావృతమయ్యే పనులను స్వయంచాలకం చేయడం, సమాచారాన్ని సంగ్రహించడం, భావ ప్రసారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఆధునిక ఏఐ సాధనాలు ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్బీఈఆర్) వంటి సంస్థల వాస్తవ–ప్రపంచ ప్రభావ అధ్యయనాలను బట్టి చూస్తే.. పని సంక్లిష్టతను బట్టి 14% జనరేటివ్, 30% ఏఐ సహాయకాలు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచగలవని నిరూపితమవుతోంది. ఏమిటీ అధ్యయనం ?ఏయే రంగాలు ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఏ రంగాలపై దీని ప్రభావం ఎక్కువ పడనుందో వంటి వివరాలు పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, వినియోగ విధానం ఎలా ఉందంటే...సమాచార, కమ్యూనికేషన్ల రంగం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఏఐని అత్యధికంగా వాడుతున్నాయిఅడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ : ఆఫీస్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులలో ఏఐ వాడకం చాలా ఎక్కువగా ఉంది⇒ హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ఫుడ్ సర్వీసెస్, హోటళ్లు, క్యాటరింగ్ రంగాలు⇒ చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏఐ టూల్స్ను వేగంగా స్వీకరిస్తున్నాయిఅధిక జీతాలు ఇచ్చే కంపెనీలు : ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థలలో ఏఐ ప్రయోగాలు, దాని ద్వారా వచ్చే ఉత్పాదకత లాభాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చిందిమొత్తంగా చూస్తే, శారీరక శ్రమ లేదా సాధారణ క్లరికల్ పనులు ఎక్కువగా ఉండే రంగాల కంటే, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లోనే ప్రస్తుతం ఏఐ విప్లవం వేగంగా విస్తరిస్తోంది.భారత్లో ఏఏ రంగాల్లో ఏఐ ప్రభావం అధికం ?ఐటీ మరియు టెక్నాలజీ సర్వీసెస్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ ఆటోమేషన్ వల్ల 10% నుంచి 20% వరకు ఉత్పాదకత పెరిగిందిబ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) : లోన్ ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, కస్టమర్ సపోర్ట్ (ఏఐ చాట్బాట్స్) విభాగాల్లో పనిభారం భారీగా తగ్గిందిరిటైల్, ఈ–కామర్స్ (రిటైల్,కన్జూమర్ గూడ్స్) : కస్టమర్ల అవసరాలను అంచనా వేయడానికి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం ఏఐని ఎక్కువగా వాడుతున్నారుఉద్యోగాల మార్కెట్–భవిష్యత్ (2026 – 2031): ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్. నాస్కామ్ నివేదికల ప్రకారం ఇండియాలో ఏఐ సంబంధిత ఉద్యోగాల డిమాండ్ 10 లక్షలు దాటింది⇒ ప్రపంచంలోనే ఏఐ టాలెంట్ను ఆకర్షించడంలో భారత్ (33% హైరింగ్ రేటుతో) ముందుందినీతి ఆయోగ్ అంచనా : భారత్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తే, టెక్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో కోటి దాటే అవకాశముంది. ⇒ ఒకవేళ కంపెనీలు అప్గ్రేడ్ అవ్వకపోతే ఉద్యోగాల కోత తప్పదని ఈ నివేదిక హెచ్చరించిందిభారత్ మెరుగైన స్థితిలోనే...ఇండియాలో ఏఐ వినియోగం..దాని వల్ల పెరుగుతున్న ఉత్పాదకత, ఉద్యోగాలపై ప్రభావం గురించి నాస్కామ్, ఈవై, నీతి ఆయోగ్ వంటి సంస్థల నివేదికలు కీలక వివరాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని వేగంగా స్వీకరిస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో ఏఐ కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకతను పెంచే ఒక కీలక శక్తిగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఏఐ అడ్వాంటేజ్, ఉత్పాదకత సమయం ఆదాలో టాప్‘ఈవై 2025 వర్క్ రీఇమేజిన్డ్’ సర్వే ప్రకారం పనిలో ఏఐ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంలో ప్రపంచంలోనే అత్యధికంగా 53 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది (ప్రపంచ సగటు కేవలం 34 పాయింట్లు మాత్రమే)⇒ దాదాపు 75% మంది భారతీయ ఉద్యోగులు 72% మంది యజమానులు జనరేటివ్ ఏఐతో కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిందని అభిప్రాయపడ్డారుళీ భారత్లో కూడా కొత్తగా చేరిన లేదా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత ఏఐ టూల్స్ వల్ల ఏకంగా 34% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి -
గోదావరి–కావేరి లింక్పై రేవంత్ సర్కార్ జలద్రోహం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–నల్లమల సాగర్ ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో ముడిపెట్టడం తెలంగాణ జలహక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు అన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ హక్కుల కోసం ముందుండి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణభవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘968 టీఎంసీల హక్కులే ముందుగా’... గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడిందని హరీశ్రావు గుర్తు చేశారు. జీడబ్ల్యూడీటీ (గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే తెలంగాణకు 45 టీఎంసీల అదనపు హక్కు ఉంటుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. నదుల అనుసంధానంపై జరిగిన ఎన్డబ్ల్యూడీఏ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు వచి్చన తర్వాతే తదుపరి చర్చలు జరగాలని పట్టుబట్టామని వెల్లడించారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని, ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్కు లింక్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే...పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను ఎన్ఓసీతో ముడిపెట్టడం ప్రమాదకరమని హరీశ్రావు అన్నారు. తెలంగాణకు ట్రిబ్యునల్ ద్వారా రావాల్సిన 1,005 టీఎంసీలతోపాటు మరో 45 టీఎంసీల అంశం పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం వదులుకుంటోందని ఆరోపించారు. సమ్మక్కసాగర్, వార్ధా, ఎల్లంపల్లి, లోయర్ పెన్గంగా వంటి ప్రాజెక్టులకు సంబంధించిన 139 టీఎంసీల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి–కావేరి లింక్ అమలైతే తెలంగాణకు కనీసం 211 టీఎంసీల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఢిల్లీ వరకు పోరాటం చేస్తాంపోలవరం–బనకచర్ల మార్గం ద్వారా నీటిని తరలించాలంటే సుమారు రూ.82 వేల కోట్ల వ్యయం అవుతుందని, తెలంగాణ మీదుగా నదుల అనుసంధానం జరిగితే రూ.48 వేల కోట్లకే సాధ్యమని వివరించారు, దీనిపై కేంద్ర మంత్రులు.కిషన్రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సంజయ్, చింత ప్రభాకర్తో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిహారం ఇస్తేనే..పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు సాగనిస్తాం
సాక్షి, హైదరాబాద్: భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకు కోహెడలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు జరగనివ్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోహెడలో 239 ఎకరాల్లో ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు భూములు రైతులవని, వారి నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు.ఇప్పటికే అక్కడ ఫ్రూట్ మార్కెట్ అందుబాటులో ఉందని, అయినా, రైతుల భూములను సేకరించి, వాటిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నం జరుగుతోందని, ఈ భూసేకరణను రైతులు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆయా రైతులను అరెస్టు చేశారని, సాయంత్రం వారిని విడుదల చేశారని తెలిపారు. పాలమూరు జిల్లాలో కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగినవి కాదన్నారు.సీఎంతోపాటు కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, ప్రాజెక్టులు, జాతీయ సంస్థలపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉంటే తేదీ, సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ గేట్ వద్ద అయినా చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేస్తే, తాము కూడా వివరాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ’ది హిందూ’ సదస్సులో (ది హిందూ కాన్క్లేవ్) సీఎం రేవంత్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆదివారం స్పందించారు. రేవంత్రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘మీకు స్ఫూర్తి హిట్లర్ ముమ్మాటికి నిజమేం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక అస్సాసినేషన్ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిది! మీరు నియంతలను పూజిస్తారు, పేదల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతారు.తెలంగాణ ప్రజలకు మీ నియంత నైజం ముందే తెలుసు.. ఇప్పుడు మీ నోటితోనే మీ ఫాసిస్ట్ ఆలోచనలను దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు రేవంత్రెడ్డి’అని కేటీఆర్ తన ట్వీట్లో విమర్శించారు. ‘రేవంత్రెడ్డి.. మీలాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత మేధావులం మేము కాదు. అందుకే, మా పదేళ్ల పరిపాలనను మేము డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
వాటర్ రీసైక్లింగ్కు వేళయింది..
సాక్షి, స్పెషల్డెస్క్: భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ‘నీటి సంక్షోభం’. భూగర్భ జలాలు పడిపోవడం, జనాభా పెరుగుదల వల్ల నీటిఎద్దడి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడగలిగే ఏకైక అస్త్రం ‘వాటర్ రీసైక్లింగ్’(మురుగునీటి శుద్ధి). నీటిని అత్యంత విలువైన వస్తువుగా భావించి బాధ్యతగా వాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం..ఏడాదికి తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తగ్గితే ఆ దేశం నీటి ఒత్తిడి (వాటర్ స్ట్రెస్)లో ఉన్నట్లు లెక్క. 2021 నాటికే భారత్లో ఇది 1,486 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. అంటే మనం ఎప్పుడో ప్రమాద గీతను దాటేశాం. మరోవైపు 2031 నాటికి ఇది 1,367 క్యూబిక్ మీటర్లకు పడిపోనుంది. ఇది కనుక 1,000 క్యూబిక్ మీటర్ల కంటే తగ్గితే దేశం ‘తీవ్ర నీటి కొరత’లోకి వెళ్లిపోతుంది. సరైన లెక్కలు లేక.. సీఈఈడబ్ల్యూ (కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్) అధ్యయనం ప్రకారం పలు ప్రధాన లోపాలను ప్రస్తావించింది. మున్సిపాలిటీల వద్ద ఎంత మురుగునీరు ఉత్పత్తి అవుతోంది? ఎంత శుద్ధి చేస్తున్నారనే సరైన లెక్కలు లేవని, శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, వ్యవసాయానికి వాడటం చాలా తక్కువగా ఉందని, మెజారిటీ నీరు వృథా అవుతోందని తెలిపింది. ‘మురుగునీరు’అనే ముద్ర ఉండడం వల్ల ప్రజలు దీనిని వాడటానికి వెనుకాడుతున్నారని పేర్కొంది. రీసైక్లింగ్ నీటితో ప్రయోజనాలు వర్షాలు పడకపోయినా నగరాల నుంచి ప్రతిరోజూ మిలియన్ల లీటర్ల మురుగునీరు వస్తోంది. దీనిని శుద్ధి చేసి ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాలు, పార్కులకు మంచినీటికి బదులు వాడాలి. దేశంలో 80 శాతానికి పైగా నీరు వ్యవసాయానికే ఖర్చవుతుంది. శుద్ధి చేసిన నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉండటం వల్ల పంటలకు మేలు జరుగుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ఆదర్శ నగరాలు ఇవే సింగపూర్ దేశం తన అవసరాల్లో 40 శాతం పైగా రీసైకిల్ నీటితోనే తీర్చుకుంటోంది. భారత్లోనూ కొన్ని నగరాలు ఈ బాటలో ఉన్నాయి. చెన్నైలో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని చట్టబద్ధం చేసి, 10 శాతం కంటే ఎక్కువ మురుగునీటిని శుద్ధి చేసి భారీ పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ఇక సూరత్లో అయితే శుద్ధి చేసిన నీటిని టెక్స్టైల్ పరిశ్రమలకు విక్రయించడం ద్వారా మున్సిపాలిటీకి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. బెంగళూరులో మురుగునీటిని మూడో దశ వరకు శుద్ధి చేసి, 55 కి.మీ. దూరంలో ఉన్న కరువు ప్రాంతాల చెరువులను నింపుతున్నారు. దీనివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరిగాయి. చేయాల్సింది ఏంటి? భారత్లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిలో కేవలం 30 శాతంలోపే శుద్ధి అవుతోంది. మిగతాదంతా నదులను కలుషితం చేస్తోంది. ఇకపై వర్షాలు, భూగర్భ జలాలపైనే ఆధారపడటం సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్కువ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీలు) నిర్మించి, వ్యర్థ జలాలను వాడుకోవడమే దేశ భవిష్యత్కు ఏకైక మార్గం. -
ప్రాణహిత–చేవెళ్లకు కొత్తరూపు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు కొలిక్కి వస్తున్నాయి. మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రతిపాదించిన బరాజ్ ఎత్తు మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. ప్రాజెక్టు పాత అలైన్మెంట్కు కొన్ని మార్పులతో ప్రీఫీజబిలిటీ నివేదిక (పీఎఫ్ఆర్)కు తుదిరూపు కల్పిస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, దానికి 3 కి.మీ. ఎగువన వార్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతానికి లొకేషన్ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే ఛాప్రాలా వన్యప్రాణుల అభయారణ్యం ప్రభావితం కానుండడం, వరదలు ఉధృతంగా పోటెత్తినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం ఉండడం కూడా లొకేషన్ మార్పునకు మరో కారణమని అధికార వర్గాలు తెలిపాయి. వార్ధా– వెయిన్గంగాపై సమాంతర బరాజ్... కొత్త అలైన్మెంట్ ప్రకారం..వార్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతానికి కొంత ఎగువన రెండు నదులపై లంబకోణంలో సమాంతర బరాజ్ నిర్మించి మధ్యలో కాంక్రీట్ బండ్ (నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్)తో కలిపివేయనున్నారు. రెండు వైపులా ఉండే బరాజ్లకు గేట్లు ఉండనుండగా, మధ్యలో ఉండే కాంక్రీట్ బండ్ చెక్ డ్యామ్ తరహాలో పనిచేయనుంది. బరాజ్లు నిండినప్పుడు గేట్లు ఎత్తకపోయినా మధ్యలోని కాంక్రీట్ బండ్పై నుంచి వరద పొంగిపొర్లనుంది. బరాజ్ ప్రతిపాదిత ప్రదేశంలో తాజాగా జియోఫిజికల్ పరీక్షలను ప్రారంభించారు. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) విభాగ ఇంజనీర్లు శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి బరాజ్ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు. మారిన అలైన్మెంట్ ప్రకారం వార్ధా–వెయిన్ గంగా బరాజ్ నుంచి నీటిని కాల్వ, సొరంగ మార్గంలో తరలించి సుందిళ్ల బరాజ్కు పూర్తిగా గ్రావిటీతో తరలించనున్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోయనున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దాదాపు 71.5 కి.మీ.ల పొడవున కాల్వ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది. రూ.1,700 కోట్లు విలువైన పనులు జరిగిన తర్వాత ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. అర్ధంతరంగా వదిలేసిన కాల్వను సుందిళ్ల బరాజ్తో అనుసంధానం చేయడానికి మంచిర్యాల జిల్లాలో నన్నెల నుంచి జైపూర్ వరకు భూగర్భంలో 110 మీటర్ల లోతుల్లో 26 కి.మీ.ల పొడవున సొరంగంతోపాటు మరో 6 కి.మీ.ల కాల్వను నిర్మించాల్సి ఉంటుంది. సొరంగం అటవీ ప్రాంతం గుండా వెళ్లనుండడంతో భూసేకరణ అవసరం లేదు. కాల్వలకు 160 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. రూ.10 వేల కోట్లతో ప్రాథమిక అంచనాలు ప్రాథమిక అంచనాల ప్రకారం వార్ధా–వెయిన్ గంగా బరాజ్ల నిర్మాణానికి రూ.5వేల కోట్లు, సొరంగం నిర్మాణానికి రూ.3,700 కోట్లు, మిగిలిన కాల్వ నిర్మాణానికి రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.10,000 కోట్ల వ్యయం కానుంది. బరాజ్, కాల్వల భూసేకరణ వ్యయం దీనికి అదనం. పాత అలైన్మెంట్ ప్రకారం ప్యాకేజీ–5 కింద 50 కి.మీ.ల కాల్వతో పాటు పంప్హౌస్ నిర్మించాల్సి ఉండగా, నాటి ధరల ప్రకారమే రూ.16 వేల కోట్ల వ్యయం కానుందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త అలైన్మెంట్తో కాల్వ పొడవు తగ్గడం, పంప్హౌస్ నిర్మాణం అవసరం లేకపోవడంతో వ్యయం తగ్గనుందని పేర్కొన్నాయి. పాత అలైన్మెంట్ ప్రకారం 50 కి.మీ.ల కాల్వను తవ్వాల్సి ఉండగా, మధ్యలో బొగ్గు గనులు ఉండడంతో అలైన్మెంట్ మార్చి సొరంగాన్ని నిర్మించనున్నారు. బరాజ్ ఎత్తుపై చిక్కులు.. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే తమ రాష్ట్రంలో ముంపు ఏర్పడుతుందని గతంలో మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్లకు ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. తాజాగా వార్ధా–వెయిన్గంగా బరాజ్ను సైతం 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే కనీసం 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అప్పుడు ఆశించిన మేర ఆయకట్టుకు సరఫరా చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో మళ్లీ సంప్రదింపులు జరిపి ఒప్పించడానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరుతూ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తొలుత లేఖ రాయగా, అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డి లేఖ రాసినా, మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మహారాష్ట్ర అంగీకరించే అంశంపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లు, 149 మీటర్లు, 150 మీటర్ల, 151 మీటర్లు, 152 మీటర్ల వేర్వేరు ఎత్తులతో బరాజ్ నిర్మాణానికి వేర్వేరు ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుకుంటున్నట్టు 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 1,200 ఎకరాల పట్టాభూములు, ఇతర భూములు కలిపి మొత్తం 3,000 ఎకరాల్లో ముంపు ఏర్పడనుందని అంచనా వేశారు. ఒక వేళ 148–149 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాల్సి వస్తే అక్కడి నుంచి నీటిని తరలించే కాల్వను 69 నుంచి 75 మీటర్లకు వెడల్పు పెంచితేనే ఆశించిన ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బరాజ్ ఎత్తును ఖరారు చేసిన తర్వాతే ప్రాజెక్టు స్వరూపం విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
యువశక్తి క్షీణిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిళ్ల ఆలస్యం.. పిల్లలను కనే విషయంలో ఆసక్తి చూపకపోవడం లేదా ఒకరితోనే సరిపెట్టుకోవాలనే ఆలోచనలు పెరుగుతుండడం వంటి కారణాలు రాష్ట్ర జనాభాపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జపాన్, దక్షిణకొరియా, ఇటలీ, చైనా వంటి దేశాల తరహాలో భవిష్యత్లో యువశక్తి క్షీణించి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశముందని తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–6 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023– 24లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (ఎన్ఎఫ్హెచ్ఎస్–6) ఫ్యాక్ట్ షీట్లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత మే 29న విడుదల చేసింది. దేశంలోని 715 జిల్లాల్లో సుమారు 6.79 లక్షల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.7కు చేరడం, రీప్లేస్మెంట్ స్థాయి 2.1 కంటే గణనీయంగా తగ్గి, జాతీయ సగటు కన్నా క్షీణిస్తుండడం భవిష్యత్లో యువశక్తి తగ్గి, వృద్ధ జనాభా పెరుగుదలకు సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగువకు చేరిన జననాల రేటు ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచికే టీఎఫ్ఆర్. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఈ రేటు 2.1 ఉండాలి. దీనినే రీప్లేస్మెంట్ స్థాయి అంటారు. కానీ తెలంగాణలో ఈ స్థాయి చాలాకాలంగా అందుబాటులో లేదు. ఎన్ఎఫ్హెచ్ఎస్–3 (2005–06)లో 1.8గా ఉన్న టీఎఫ్ఆర్ ఎన్ఎఫ్హెచ్ఎస్ –4, ఎన్ఎఫ్హెచ్ఎస్–5లో కూడా అదే స్థాయిలో కొనసాగగా, తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్–6లో 1.7 స్థాయికి తగ్గింది. అంటే ప్రతితరం తన స్థానంలో వచ్చే తరాన్ని పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితి క్రమంగా ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ సవాళ్లకు నాంది ప్రస్తుతం తెలంగాణలో పనిచేసే వయసు జనాభా అధికంగా ఉండటంతో రాష్ట్రానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ లభిస్తోంది. అయితే జననాల రేటు దీర్ఘకాలంగా తక్కువగానే కొనసాగితే ఉద్యోగ, కార్మిక రంగంలోకి వచ్చే యువత సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది. అదే సమయంలో మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీంతో భవిష్యత్లో పెన్షన్లు, ఆరోగ్య సేవలు, వృద్ధుల సంరక్షణపై ప్రభుత్వ వ్యయం పెరిగే అవకాశం ఉంది. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వృద్ధ జనాభా సమస్యలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. దక్షిణాది ధోరణిలోనే తెలంగాణ దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలోనూ సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ స్థాయి కంటే దిగువనే ఉంది. తెలంగాణ టీఎఫ్ఆర్ 1.7గా ఉండగా, ఏపీలో కూడా ఇదే స్థాయిలో నమోదైంది. కేరళ (1.5), తమిళనాడు (1.6), కర్ణాటక (1.6) రాష్ట్రాల్లో జననాల రేటు మరింత తక్కువగా ఉంది. -
అర్ధరాత్రి.. పబ్.. మఫ్టీలో మహిళా డీసీపీ
సాక్షి, హైదరాబాద్/కేపీహెచ్బీ కాలనీ: నగరంలో అదో పేరుమోసిన పబ్.. నిబంధనలకు పాతరేసి నిత్యం అర్ధరాత్రి దాటినా నడుపుతుండటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగుతూ భారీగా డబ్బు దండుకుంటోంది. దీనిపై సమాచారం అందుకున్న కూకట్పల్లి మహిళా డీసీపీ రుతురాజ్ ఈ పబ్బులో గబ్బు పనులకు తెరదించేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని మంజీరా మాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ (క్లబ్ మస్తీ) పబ్లోకి ఓ సగటు మహిళా టెకీలాగా స్వయంగా వెళ్లారు.సెక్యూరిటీ సిబ్బందిని దూరంగా ఉంచి ఒంటరిగానే పబ్లోకి ప్రవేశించారు. ఆపై అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల తతంగాన్ని రికార్డు చేసి ఆధారాలు సంపాదించారు. అనంతరం అదనపు డీసీపీ షమీర్, కేపీహెచ్బీ ఠాణా అదనపు ఇన్స్పెక్టర్ కె.రవిలతోపాటు సిబ్బందికి సమాచారం ఇచ్చి పబ్పై దాడి చేశారు. ఈ తనిఖీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిగ్గుతేలడంతో నలుగురు మహిళా సిబ్బంది, ఐదుగురు పురుష సిబ్బందిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.అలాగే పబ్తోపాటు నిందితులపై బీఎన్ఎస్లోని 223, 292, 318(4) రీడ్ విత్ 3 (5) సెక్షన్లతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లోని 5, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి ఆదివారం వెల్లడించారు. కస్టమర్లకు మహిళా సిబ్బందితో ప్రలోభాలు.. పబ్ నిర్వాహకులు అక్కడ పనిచేస్తున్న యువతుల ద్వారా పురుష కస్టమర్లను వ్యభిచారం కోసం ప్రలోభపెట్టేలా చేస్తున్నారని.. వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని డెకాయ్ ఆపరేషన్లో వెలుగుచూసిందని ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి వివరించారు. యువతులను ఎర వేయడం ద్వారా అక్రమ లాభం పొందేందుకు నిర్వాహకులు కస్టమర్లు తాగిన మద్యం, తిన్న ఆహార పదార్థాలకు అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు.అలాగే పబ్లోకి మైనర్ల ప్రవేశాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలేవీ యాజమాన్యం తీసుకోకుండా యథేచ్ఛగా దందా సాగిస్తోందని చెప్పారు. అనుమతించిన సమయానికి మించి పబ్ను నిర్వహించడంతోపాటు ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా మద్యం, ఆహారం అందిస్తున్నారని గుర్తించామన్నారు. వాటన్నింటికీ మించి పోలీసు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేకుండానే పబ్ నడుస్తోందని పేర్కాన్నారు. స్థానిక పోలీసుల తీరుపై డీసీపీ ఆగ్రహం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన డీసీపీ రితిరాజ్ ఆ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు నిరోధించలేకపోయారంటూ స్థానిక పోలీసులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
అభివృద్ధికి కలసిరండి
సాక్షి, హైదరాబాద్: ‘మల్కాజిగిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నా. రాజకీయాలకతీతంగా ఎన్ని నిధులైనా, ఎన్ని అనుమతులైనా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, మెట్రో విస్తరణ తదితరమైనవి ఏవి కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచిస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. కావాల్సినవి అడిగి సాధించుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొడంగల్లో ఓడిపోయాక, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. అక్కడి నుంచే సీఎం వరకు రాగలిగానన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. శనివారం ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం, టీకేఆర్ జంక్షన్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారులు, వంద పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపనల శిలాఫలకాలను రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం, ఎన్నికల లబ్ధి కోసం మూడు కార్పొరేషన్లు చేశానని కొందరంటున్నారు కానీ, పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం చేశానని తెలిపారు. క్యూర్ పరిధిలోని 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1.34 కోట్లమంది ప్రజల సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లుగా, అదే మాదిరిగా పోలీసు వ్యవస్థను వికేంద్రీకరించినట్లు చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ను పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిచుకుంటున్నామని, రూ. 1,511 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. కనీస కనికరం ఉండొద్దా? ‘గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునానది, యూపీలో గంగానది రివర్ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. మనం మూసీనది ప్రక్షాళన చేయొద్దా? అని అడ్డంపడుతున్న వారిని అడుగుతున్నా’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు, 55 కి.మీ. ప్రక్షాళన చేసి మూసీని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరతానన్నారు. ‘న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యనున్న రివర్ఫ్రంట్ దగ్గర ఒక్కో అపార్ట్మెంట్ వందల కోట్ల విలువ ఉంది. ఇక్కడ మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. ఇక్కడ ప్రజలు నివసించడం లేదు. నల్లగొండ ప్రజలను కాలుష్యం కాటేస్తుంటే కనికరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి, ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా పెళ్లయిన వారికి గర్భధారణ సమస్యలొస్తాయని, కలుషిత నీరు, ఆహారంతో కడుపుకోతకు గురవుతారని పట్టణానికి పంపిస్తున్నారన్నారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కళేబరాలు కొట్టుకువస్తుంటే, అక్కడి ప్రజలు ప్రక్షాళన చేయాలని కోరారని చెప్పారు. సింగపూర్, న్యూయార్క్తో పోటీ నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు నాగోల్ జంక్షన్– ఎల్బీనగర్ –ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–రాజేంద్రనగర్–ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు, ఎల్బీనగర్ – హయత్నగర్ వరకు కూడా చేయాలన్నారు. మెట్రోను 122 కి.మీ.వరకు పొడిగించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయనగరం చేయాలని తాను ప్రయత్నిస్తుంటే, అన్ని అనుమతులొచ్చాక , ఇక్కడి నుంచి మంత్రిగా చేస్తున్నాయన పోయి పుల్లలు పెట్టి అర్ధంతరంగా ఆపారని ఆరోపించారు. ఓఆర్ఆర్ వచ్చినందుకు అంతర్జాతీయ నగరంగా మారిందని.. రీజినల్ రింగ్రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే, ప్రపంచంలోనే పోటీపడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు. అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోదని, ఆమేరకు అభివృద్ధి జరగాలన్నారు. జెడ్పీటీసీ నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆడబ్డిలే కారణమని, తన ప్రతిసభలో వారికి ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూర్–1 యాప్ను సీఎం ప్రారంభించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారి రాజిరెడ్డిపేరు పెట్టామని, చౌరస్తాలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కిషన్రెడ్డి గారూ ఉపన్యాసాలు ఆపండి... ‘హైదరాబాద్కు రెండో దశ మెట్రో రావాల్సిందే. ట్రిపుల్ ఆర్కు అనుమతులివ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. రాష్ట్రంలో పండించిన పంటలను మొత్తం కొనాల్సిందే. వీటన్నింటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చూస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నీ పార్టీకి నువ్వు ఎప్పుడూ పనిచేయలేదని మీ కార్యకర్తలే అంటున్నారు. మా సార్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ చెప్పింది వింటారని చెబుతున్నారు. ఇక నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఉపన్యాసాలు ఆపండి కిషన్రెడ్డి గారూ..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాను కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీ వెళ్లినా, ఐదుసార్లు మోదీని కలిసినా ఏ అనుమతులూ రాకపోవడానికి కారణం కిషన్రెడ్డే అని తెలిసిందన్నారు. వీటికి అనుమతులు తీసుకురా.. లక్ష మంది సమక్షంలో ఎల్బీ స్టేడియంలో శాలువా కప్పి గండపెండేరం తొడుగుతామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఓసారి అంబర్పేటలో వారేంటో చూపించారన్నారు. ఇప్పటికైనా సహకరించాలని, లేని పక్షంలో 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. -
సెల్ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
గూడూరు: సెల్ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు–కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి సెల్ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
కామ్రేడ్.. జెన్ జెడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాక్రోచ్ జనతా పార్టీ పేరు తో పెల్లుబుకుతున్న అసంతృప్తి, నిరసన కార్యక్రమాలు ఇటు మావోయిస్టులు, అటు నిఘా వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎవరికి వారుగా తమ కార్యాచరణను అమలు చేసేందు కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే జెన్జెడ్లను కలుపుకొని పోవాలనే ఆలోచనలో మాజీ మావోలు ఉన్నట్టు తెలుస్తోంది.రాజ్యాంగ పరిధిలోతిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అజ్ఞాతం వీడిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ‘మా పార్టీపై నిషేధం, మాపై కేసులు ఎత్తివేస్తే రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు తోటి కామ్రేడ్లకు పిలుపునిస్తా’అని ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు సైతం కొంచెం అటూఇటుగా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పట్లో మావో యిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసే అవకాశం కనిపించడం లేదు.కార్యాచరణ ఎలా?ఓ వైపు ఆపరేషన్ కగార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే శ్రీలంక, నేపాల్లో జెన్జెడ్ ఆధ్వర్యాన తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ యువతలో సైతం నేపాల్, శ్రీలంక తరహాలో అసంతృప్తి ఉందనేది మాజీల అంచనా. అయితే దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు అమలైన తీవ్ర నిర్బ«ంధం కారణంగా సాయుధ విప్లవ పోరాటం ప్రధానంగా అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలకే పరిమితమైంది, ఫలితంగా 2000కి అటూఇటుగా జన్మించిన జెన్జెడ్ తరంతో సాయుధ విప్లవ పార్టీలకు పెద్దగా సంబంధాలు లేవు. అయితే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో మావోయిస్టు అగ్ర నాయకత్వం అడవులను వదిలింది. అయితే, ఏ తరహా పోరాటం చేయాలి.. ఎవరి కేంద్రంగా పోరాటాలు చేయాలనే కచ్చితమైన కార్యాచరణకు మాజీ మావోయిస్టులు రాలేకపోతున్నారు. వామపక్ష పార్టీలు మాజీ మావోలను తమ పార్టీలోకి రావాలంటూ రెడ్ కార్పెట్ పరిచాయి. అయితే వారితో కలిసి పనిచేయడం సబబా, కాదా అన్న మీమాంస లొంగిపోయిన మావోయిస్టు నేతల్లో ఉన్నట్టు సమాచారం.యువత కేంద్రంగానే బెస్ట్..సోషల్ మీడియా వేదికగా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తోన్న ప్రభంజనం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.దీంతో కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్ కామ్రేడ్లతో కలిసి నడవడం కంటే, ఉవ్వెత్తున ఎగిసిపడే శక్తి సామర్థ్యాలు, తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత కేంద్రంగానే తమ దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ మేలనేది ఎక్కువ మంది మాజీల అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలకంగా అడవులకు దగ్గరగా పనిచేసిన ఖాకీలు ఇప్పుడు జెన్జెడ్ల అడ్డా అయిన సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్నారు. మారు గుర్తింపులతో ఖాతాలు తెరుస్తున్నారు. గడిచిన రెండు వారాలుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా ధోరణి కనిపిస్తోంది. జెన్జెడ్ అడుగులు ఎటువైపు అనేది అన్ని వర్గాలకు గమనించతగ్గ అంశంగా మారిపోయింది. -
సీఎంకు ‘హిట్లర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించగా, జాతీయ మీడియా సైతం ‘ఎమర్జెన్సీ మైండ్సెట్’గా అభివర్ణించింది. హిందూ గ్రూప్ శనివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్తో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి సంభాషిస్తూ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.‘హైడ్రా పదం హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా. ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టి ఒక సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి..’ అని హైడ్రాపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్ మహానగరం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్పాత్ల ఆక్రమణల నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సంస్థను స్థాపించడం తెలిసిందే. ఇప్పటివరకు కబ్జాదారుల చెర నుంచి రూ. 80,000 కోట్ల విలువైన 2,182 ఎకరాల భూమిని స్వా«దీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైడ్రా కార్యకలాపాలు ఆది నుంచి వివాదాలు, విమర్శలకు దారితీశాయి. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన జరుగుతోందని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించి వివాదాల్లో ఉన్న స్థలాల్లోని కట్టడాల కూల్చివేతలు చేపట్టడాన్ని యుద్ధ వాతావరణంతో రాష్ట్ర హైకోర్టు పోల్చింది. హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ను విచారణకు పిలిపించి మొట్టికాయలు సైతం వేసింది. హైడ్రా ఎడాపెడా కూల్చివేతలు జరుపుతుండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విపక్షాలు ఆరోపణలూ చేశాయి. ఇప్పటికే హైడ్రా పనితీరుపై విమర్శలు, లెక్కలేనన్ని కోర్టు కేసులుండగా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థకు నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం మరింత దూమారం రేపింది. హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసాలతో పోల్చడాన్ని విపక్షాలు విమర్శించాయి. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. ‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మళ్లీ బహిర్గతమైంది. హిట్లర్ స్ఫూర్తి కలిగించాడని రేవంత్రెడ్డి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్ వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రజలను అణచివేసింది. రేవంత్రెడ్డి సిగ్గుతో తలవంచి క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంతికిరణ్ రిజిజు సైతం ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘వాహ్.. కాంగ్రెస్ సీఎం హిట్లర్తో పూర్తిగా స్ఫూర్తి పొందారు. ఒకవేళ బీజేపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మా వ్యతిరేకులందరూ నాజీయిజం, ఫాసిజం అంటూ విమర్శలు చేసేవారు’ అని ఆయన విమర్శించారు. ‘ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మొదలు రేవంత్రెడ్డి జర్నలిస్టులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు.. ఇది కాంగ్రెస్ తానాషాహీ మనస్తత్వం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజలకు ఇది ముందే తెలుసు. యావత్ దేశానికి స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను రద్దు చేస్తూ తొలి ఫైల్పై సంతకం చేస్తామని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా పేరు లేదు హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా అనే పేరు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు లేవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ట్లు సౌత్ ఫస్ట్, మరికొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి 1943 ఆగస్టు 17–18 రాత్రి బ్రిటన్ ఆపరేషన్ హైడ్రా పేరుతో నాజీల వీ–ఆయుధ కార్యక్రమంపై బాంబు దాడి చేసిందని గుర్తుచేశాయి. మార్వెల్ కామిక్ పుస్తకం, సినిమాల్లోని ఊహాజనిత నియో–ఫాసిస్ట్ సంస్థ ‘హైడ్రా’తో సీఎం పొరబడినట్లు పేర్కొన్నాయి. -
దేవుడి శాఖలో బదిలీ.. గోడకు కొట్టిన బంతి!
సాక్షి, హైదరాబాద్: ఆ అధికారులు యాదగిరిగుట్ట దేవాలయంలో పనిచేస్తున్నారు... సాధారణ బదిలీల్లో భాగంగా వారు వేరే ఆలయాలకు బదిలీ అయ్యారు... కానీ, రెండుమూడు నెలల్లోనే తిరిగి యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చేశారు. డిప్యూటేషన్ అనో, పరిపాలనపరమైన సర్దుబాటు అనో వారిని తిరిగి మార్చారు. ఇది ఒక్క యాదగిరిగుట్ట ఆలయానికే పరిమితం కాలేదు. ఇది జరిగి ఏడాదికిపైగా గడుస్తోంది. ఇప్పుడు మళ్లీ సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతించటంతో, రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల్లో మళ్లీ బదిలీల కసరత్తు మొదలైంది. కానీ, గతేడాది జరిగిన బదిలీల్లో పైరవీలు చేసుకుని పాత దేవాలయాలకే వచ్చిన వారిని కదిలించకుండా ఇప్పుడు కొత్త బదిలీలకు కసరత్తు చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. దేవాదాయ శాఖ వ్యవహారాలపై ప్రభుత్వానికి పట్టులేకపోవటంతో స్థానిక నేతలు, కొందరు అధికారులు చెప్పిందే వేదంగా మారింది.ఆరు ప్రధాన ఆలయాల్లో...ప్రభుత్వ శాఖల్లో నెలరోజులపాటు సాగిన సాధారణ బదిలీల ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం వారం క్రితం బదిలీలపై నిషేధం విధించింది. కానీ, సరస్వతీ నది అంత్య పుష్కరాల నేపథ్యంలో దేవాదాయ శాఖలో బదిలీలు జరగలేదు. ఇప్పుడు పుష్కరాలు ముగియటంతో సాధారణ బదిలీలు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఆనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఆరు ప్రధాన దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు, కొమురవెల్లిలోని ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఏడాది క్రితం ఈ ఆరు ఆలయాల్లో 40 శాతం మందిని బదిలీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులోని నిబంధనల మేరకు బదిలీలు చేయబోతున్నారు. కానీ, గత బదిలీల్లో చోటు చేసుకున్న ఇష్టారాజ్యాన్ని సరిదిద్దకుండానే కొత్త బదిలీలు చేయనుండటం పట్ల ఆయా ఆలయాల్లోని మిగతా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడేం జరిగింది... ఈ ఆరు దేవాలయాలల్లోని 40 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేశారు. కానీ, వారిలో కొందరికి పాత దేవాలయాలపై ‘మమకారం’ అలాగే ఉంది. దీంతో ఆ ఉద్యోగులు పలుకుబడి ఉన్న నేతలు, కొందరు అధికారులను ‘కలిశారు’. ఇంకేముంది, ఆయా దేవాలయాల్లో ‘అవసరం’ ఉందంటూ డిప్యూటేషన్/సర్దుబాటు పేరుతో ఆర్డర్లు జారీ అయ్యాయి. వెంటనే ఆ పైరవీ ఉద్యోగులు పాత దేవాలయాల్లో వాలారు. బదిలీ అయినా, గోడకు కొట్టిన బంతి మాదిరి వచ్చిన వారిని అలాగే ఉంచి, ఇతర ఉద్యోగులను బదిలీ చేయబోతున్నారు. భారీ ఆదాయమార్గంగా ఉన్న యాదగిరి గుట్ట ఆలయాన్ని వదిలి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. బదిలీ అయి వెళ్లిన వారిలో కొందరు తిరిగి ఇక్కడికి వచ్చి చేరుతుండటంతో ఇక్కడ ఖాళీలు లేక గందరగోళం నెలకొంది. ఇక వేములవాడలో దాదాపు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది సరిపోక ఇబ్బంది నెలకొంది. ఇక్కడ ఓ నేత జోక్యం దీనికి కారణంగా మారింది. గతంలో ఈ ఆలయానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఆయనకు ఇటీవల సూపరింటెండెంట్గా పదోన్నతి వచ్చింది. మాతృ దేవాలయంలోనే పదోన్నతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ ఉద్యోగిని అక్కడ చేర్చుకోకుండా ఆ నేత అడ్డుకున్నారు. దీంతో కొండగట్టు దేవాలయానికి మార్చారు. కానీ అక్కడ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీ లేకపోవటంతో ఆ ఉద్యోగి పదోన్నతి గందరోగళంగా మారింది. ఇప్పటికీ సీనియర్ అసిస్టెంట్గానే పనిచేయాల్సి వచ్చింది. అతని జూనియర్లు కొందరు పదోన్నతి పొందటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖలో ఇంత గందరగోళం ఉన్నా ప్రభుత్వం దృష్టి సారించలేకపోతోంది. -
విద్యతో పాటు స్కిల్కూ పీరియడ్స్
సాక్షి, హైదరాబాద్: పాఠాలతో పాటు నైపుణ్యం, సృజనాత్మకత పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు విధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిజిటల్ లెర్నింగ్తోపాటు వ్యాయా మ, ఆరోగ్య సంబంధమైన విద్యను తప్పనిసరి చేసింది. ఆర్ట్స్, కల్చర్, వ్యాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్తోపాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ను తప్పనిసరి చేసింది. పాఠశాల నిర్వహణకు సంబంధించిన 2026–27 విద్యా కేలండర్ను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం విడుదల చేశారు. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలను జూన్ 13 నుంచి తెరవాలి. కానీ, 14వ తేదీ రెండో శనివారం, ఆ మర్నాడు ఆదివారం కావడంతో జూన్ 15 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తంగా ఈ ఏడాది 227 పని దినాలు పాఠశాలలు పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెన్త్ సిలబస్ను 2027 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని, ఆ తర్వాత రివిజన్ ప్రారంభించి, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని కేలండర్లో పేర్కొన్నారు. ప్రతీ రోజు ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ చేపడతారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు జూన్ 19 వరకూ బడిబాట నిర్వహించనున్నారు. టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 2027లో నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో 13 రోజులపాటు దసరా, 5 రోజులు క్రిస్మస్, 5 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి. -
రేవంత్.. ఆ మొనగాడు ఇంకా పుట్టలేదు: కిషన్రెడ్డి
హైదరాబాద్: తనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటరిచ్చారు. తనను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదంటూ రేవంత్కు రిప్లై ఇచ్చారు. ‘రేవంత్ రాజకీయపరమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడు. కాంగ్రెస్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, నిన్న(శనివారం, జూన్ 6వ తేదీ) కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా’ అని పేర్కొన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద యువ క్రికెటర్ల ధర్నా
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద "తెలంగాణ క్రికెట్ కోసం ప్రజా ఉద్యమం" పేరుతో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నేతలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై పలు ఆరోపణలు చేశారు.టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు హెచ్సీఏలో సరైన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన ఆటగాళ్లు హెచ్సీఏ వ్యవస్థ కారణంగా నష్టపోతున్నారని ఆరోపించారు.ప్రత్యేక తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, మండలాల స్థాయిలో ఇతర క్రీడలకు ఉన్నట్లుగా క్రికెట్కు కూడా ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీసీఐ టోర్నమెంట్లలో ఆడాలంటే హెచ్సీఏ పరిధిలోనే ఉండాల్సిన పరిస్థితి జిల్లాల ఆటగాళ్లకు ఇబ్బందిగా మారిందన్నారు.హెచ్సీఏలో అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లేదని టీసీఏ నేతలు ఆరోపించారు. క్లబ్ల నమోదు, ఎన్నికలు, ఆర్థిక వ్యవహారాలు, క్రీడాకారుల ఎంపికలో పలు అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు. హెచ్సీఏలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.అలాగే హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగ్లకు సంబంధించిన అనుమతులు, క్లబ్ల చట్టబద్ధత, పాలకవర్గ నియామకాలపై కూడా టీసీఏ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో సమర్పించిన ఫిర్యాదులపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామీణ, జిల్లా స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ స్పై ఆపరేషన్
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సెక్యూరిటీని తప్పించుకుని పబ్లోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించారు.డీసీపీ స్వయంగా పబ్ యాక్టివిటీని చిత్రీకరించి, వెంటనే లోకల్ పోలీసులను పిలిపించారు. అనంతరం సోదాలు నిర్వహించి, పబ్లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో మొత్తం 9 నుంచి 10 మంది సిబ్బంది అరెస్టు అయ్యారు. యాజమాన్యం యువతుల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కూకట్పల్లి ప్రాంతంలో పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
హిట్లర్, తుగ్లక్ కలిస్తే ఆయనే..: ఏలేటి మహేశ్వర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.‘సాక్షి’తో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్సీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ‘‘హిట్లర్ ప్లస్ తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్ రెడ్డి.పదవి కాపాడుకోవడానికి సోనియాకు పన్నులు కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. -
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ వరకు సెలవులను విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 15న పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది.తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేసవి ఎండల బారిన పడకూడదని అధికారులు ఈ నిర్ణయం తీసకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవడానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. -
11 రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో
సాక్షి, హైదరాబాద్: జగిత్యాలకు చెందిన రాహుల్ అనే బీటెక్ విద్యార్థి కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. రాహుల్ చదువుతున్న కాలేజీలో ఎంక్వైరీ చేశారు. సదరు అబ్బాయికి ఒక అమ్మాయితో గొడవ జరిగినట్లు సమాచారం. కాగా ఆయన చివరిసారిగా కాచిగూడలోని రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలు స్టేషన్ సీసీటీవీ చిత్రాలలో నమోదయ్యాయి.కాగా ప్రస్తుతం సదరు విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రాహుల్ సైదాబాద్లోని ఓ ప్రైవేట్ హస్టల్లో నివాసం ఉంటున్నాడు. మే 27నుంచి విద్యార్థి కనిపించడం లేదు. విద్యార్థి మిస్సింగ్కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్కు రైల్వే ఉద్యోగి బలి
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ మండలం వెన్నారంలో విషాదం చోటుచేసుకుంది. ఒక రైల్వే ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్లో అధికంగా డబ్బులు వస్తాయని ఆశతో అధికంగా డబ్బులు పెట్టాడు. అయితే బెట్టింగ్లో వాటిని కోల్పోయాడు. దీంచో తీవ్ర మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.కాగా ఆన్లైన్ బెట్టింగ్పై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల తీరులో మార్పు రావడం లేదు. వాటి జోలికి పోవద్దంటూ ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన తీరుమారడం లేదు. తాజాగా మహబూబాబాద్లో జరిగిన సంఘటనే దానికి నిదర్శనం. -
వినూత్నంగా పెళ్లి రోజు వేడుక
జగిత్యాలరూరల్: పెళ్లి చేయాలంటే.. ఆకాశమంతా పందిరి.. భూదేవి అంతా పీట.. పురోహితులు.. బంధువులు.. బలగం తరలిరావాలంటారు. కానీ ఈ పెళ్లి వేడుకకు తోటి ఉపాధిహామీ కూలీలే పెళ్లి పెద్దలుగా మారారు. తట్ట.. పార పట్టిన వారే పురోహితులుగా అవతారం ఎత్తి పెళ్లి తంతు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వినూత్న పెళ్లి వేడుక సోషల్మీడియాలో వైరల్గా మారింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది శుక్రవారం ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత పని స్థలంలో రెండు గ్రామాల కూలీలు ఒక్కచోట చేరారు. ఈ సమయంలోనే పొరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి–సత్తమ్మ దంపతుల 41వ పెళ్లి రోజు అని చర్చకు వచ్చింది. వెంటనే తోటి కూలీలు ఘనంగా వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మామిడితోటనే పెళ్లి వేదికగా మార్చుకున్నారు. మామిడి ఆకులతో బాసింగాలు తయారు చేసి వారిద్దరికి కట్టి పెళ్లి జరిపించారు. నిజమైన వివాహ వేడుకలను మైమరిపించేలా తలంబ్రాలు, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు నిర్వహించారు. అక్కడే ఉన్న వారందరికీ కూరగాయలు, మటన్, బగార అన్నం, మక్కగుడాలతో విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్నకానుకలు సమర్పించారు. ఈ పెళ్లి తతంగం అంతా సోషల్మీడియాలో వైరల్గా మారింది. -
అవయవదాత కుటుంబాలకు ఘన సన్మానం
అవయవదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. శనివారం ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ‘‘ఎ కీ దట్ ఓపెన్స్ న్యూ హోప్ – సెలబ్రేటింగ్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్’’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డా. శ్రీభూషణ్ రాజు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అపోలో ఆస్పత్రుల సీఈవో తేజస్వి రావు వీరపల్లి మాట్లాడుతూ అవయవదానం అనేది ఒక వ్యక్తి అందించగలిగే గొప్ప బహుమతి అని అన్నారు. అవయవాల అవసరానికి, లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. లివర్ ట్రాన్స్ ప్లాంట్ విభాగాధిపతి డా. శరత్ పుట్ట మాట్లాడుతూ, 1984లో ట్రాన్స్ ప్లాంట్ సేవలను ప్రారంభించినప్పటి నుంచి అపోలో దేశవ్యాప్తంగా 27,500కు పైగా ఘన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిందని తెలిపారు. వీటిలో 21,500కు పైగా కిడ్నీ, 5,000 లివర్, 400 హార్ట్–లంగ్ ట్రాన్స్ ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు. అనంతరం అవయవదాత కుటుంబాలకు ఘనంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు డా. ఏ. నరేంద్ర కుమార్, లివర్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స నిపుణులు డా. రాఘవేంద్రబాబు, డా. రవిచంద్, హార్ట్–లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా. గోపాలకృష్ణ గోఖలే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా. ఏ. నాగేశ్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ వైద్యులు డా. చైతన్య భట్టు, డా. చేతన్ రావు వడ్డెపల్లి, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ నిపుణులు డా. సోమశేఖర్, డా. శ్రీధర్, డా. సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే యూరాలజిస్ట్ డా. సుబ్రహ్మణ్యం కొలనుకుదురు, హీమటో–ఆంకాలజిస్టులు డా. పవన్ కుమార్ బోయెల్ల, డా. పద్మజ లోకిరెడ్డి, నేత్ర వైద్య నిపుణుడు డా. రాజేష్ ఫోగ్లా, మైక్రో హ్యాండ్ సర్జన్ డా. జి.ఎన్. భండారి తదితరులు పాల్గొన్నారు. -
భర్తను కాదని.. కాలేజీ ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. - బెంగళూరు -
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్నగర్లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. -
..ఇచ్చేద్దాం దేవుడి పటం!
సాక్షి, హైదరాబాద్: పూజలు పూర్తయ్యాక దేవతా చిత్రాలు, విగ్రహాలు, పూజా సామగ్రి వంటి పవిత్ర వస్తువుల నిర్వహణకు శాస్త్రీయ, పర్యావరణహిత విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్లోని ఇస్కాన్ ఆలయంలో శనివారం ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ పేరుతో చేపట్టిన ఈ పైలట్ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా వాలంటీర్ల ఆధ్వర్యంలో పవిత్ర వస్తువుల సేకరణ డ్రైవ్ను నిర్వహించింది. జీహెచ్ఎంసీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ (ఇస్కాన్) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా భక్తులు ఉపయోగించిన దేవతా చిత్రాలు, పాడైన ఫోటో ఫ్రేములు, విగ్రహాలు తదితర పవిత్ర వస్తువులను గౌరవప్రదంగా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా రీ సైక్లింగ్ చేస్తారు. నగరంలోని అనేక కుటుంబాలు పాత దేవతా చిత్రాలు, దెబ్బతిన్న విగ్రహాలు, పూజా సామగ్రిని సరైన పారవేత విధానం లేక సంవత్సరాల పాటు ఇళ్లలోనే ఉంచుకుంటుంటాయి. కొందరు వాటిని చెట్ల కింద, చెరువుల వద్ద లేదా దేవాలయాల సమీపంలో వదిలివేయడం వల్ల అవి చివరకు చెత్తలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భక్తి భావనకు భంగం కలగకుండా, పర్యావరణ బాధ్యతతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 68 కిలోల పవిత్ర వస్తువుల సేకరణ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది భక్తులు ఈ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 68 కిలోల మేర దేవతా చిత్రాలు, ఫ్రేములు, విగ్రహాలు, ఇతర పవిత్ర వస్తువులు సేకరించారు. సేకరించిన పవిత్ర వస్తువులను వాటి స్వభావం ఆధారంగా వర్గీకరించారు. అనంతరం సంప్రదాయ ‘ఉద్వాసన పూజ’ నిర్వహించి, దైవిక ఉనికిని శా్రస్తోక్తంగా ఉపసంహరించిన తర్వాత వాటిని పునరి్వనియోగం లేదా రీసైక్లింగ్కు అనుగుణంగా శాస్త్రీయంగా వేరు చేశారు. సాధారణ మున్సిపల్ చెత్తతో కలపకుండా మొత్తం ప్రక్రియను ప్రత్యేక కేంద్రంలోనే నిర్వహించారు.పైలట్ దశ విజయవంతమైతే, భవిష్యత్తులో నగరవ్యాప్తంగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత సేవల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతిపాదనను జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది. ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’లో భాగంగా తదుపరి పవిత్ర వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని జూన్ 13న యూసుఫ్గూడలోని శ్రీ హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. -
వారికి ఎబోలా నెగెటివ్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు సూడాన్ దేశస్తులకు ఎబోలా నెగెటివ్ వచ్చినట్లు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. సూడాన్ నుంచి మోకాలి చికిత్స కోసం నగరంలోని అపోలో ఆస్పత్రికి వచ్చిన అబ్దుల్ రజీమహ్మద్ (23) ఎబోలా లక్షణాలతో ఈనెల 4వ తేదీ రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డులో చేరాడు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపించగా ఎబోలా నెగెటివ్ వచ్చింది.ఈమేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని పుణే వైరాలజీ ల్యాబ్ తమకు అందిన శాంపిల్స్లో ఎబోలా వైరస్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేస్తూ శనివారం సాయంత్రం ధ్రువీకరించిందని గాంధీ సూపరింటెండెంట్ వాణి, గాంధీ నోడల్ ఆఫీసర్ వంశీకృష్ణ తెలిపారు. గాంధీ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న సూడాన్కే చెందిన మరోవ్యక్తి మహ్మద్ యాహ్యాయాగోబ్ అహ్మద్ (35)కు కూడా ఎబోలా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అబ్దుల్రజీ మహ్మద్కు సహాయకుడిగా సూడాన్ నుంచి వచ్చిన 22 ఏళ్ల యువకుడిలో ఎలాంటి ఎబోలా లక్షణాలు లేనప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్కు తరలించారు.ఐసోలేషన్లో ఉన్న ఇరువురికి ఎబోలా నెగెటివ్ రావడంతో తెలంగాణ ప్రజలతోపాటు వైద్యవర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎబోలా నెగిటివ్ వచ్చినప్పటికీ 48 గంటల తర్వాత మరోమారు శాంపిల్స్ సేకరించి నిర్ధారణకు పంపిస్తారు. రెండవ నివేదికలో కూడా ఎబోలా నెగెటివ్ వస్తే ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి చేసి 21 రోజులు హోం క్వారంటైన్కు తరలిస్తారని వంశీకృష్ణ వెల్లడించారు. -
స్త్రీల కోసం రైడ్
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతతోపాటు వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర మహిళా భద్రత విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒంటరి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైక్, ఆటోలతో కూడిన క్యాబ్ సర్విసులను స్త్రీ రైడ్ పేరిట అందుబాటులోకి తెచి్చంది. మహిళా డ్రైవర్ల వాహనాలను డీజీపీ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో కలిసి శనివారం హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు.ఈ సేవలను పొందేందుకు మహిళా ప్రయాణికులు మోవో ఫ్లీట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే వచ్చి పికప్ చేసుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇందులో భాగంగా తొలివిడతలో మొత్తం 55 మంది మహిళా డ్రైవర్లకు బైక్, ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించడంతోపాటు వారంతా రవాణా, డెలివరీ రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా మొబిలిటీ సర్విస్ ప్రొవైడర్లు, అగ్రిగేటర్స్తో మహిళా భద్రత విభాగం అనుసంధానం చేసింది. మహిళలు కూడా గిగ్ వర్కర్లుగా రావడం శుభపరిణామం: డీజీపీ అంతకుముందు డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ స్విగ్గీ, జొమోటో వంటి గిగ్వర్కర్లలో ఇప్పటివరకు పురుషులే ఉండేవారని.. ఇకపై అందులోకి మహిళలు కూడా రావడం శుభపరిణామం అన్నారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న మహిళలకు ఏ ఇబ్బందులున్నా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ చారుసిన్హా అన్నారు. కార్యక్రమంలో శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, డీజీ ఆర్గనైజేషన్స్ స్వాతిలక్రా పాల్గొన్నారు. ధైర్యం పెరిగింది భర్త చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లల కోసం కష్టపడుతున్నాను. నాలుగు నెలలుగా బైక్ నేర్చుకుంటున్నాను. ఈ శిక్షణతో నాలో ధైర్యం పెరిగింది. – అర్చన, శ్రీరామ్కాలనీ, శంషాబాద్ నెలకు రూ. 30 వేలకు సంపాదిస్తున్నా ‘మోవో ఫ్లీట్’లో రెండేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నాను. ఇప్పుడు స్త్రీ రైడ్లోకి వచ్చాక మరింత ధైర్యం పెరిగింది. ఉమెన్ టు ఉమెన్ పికప్, డ్రాప్లు చేసేందుకు మహిళా భద్రత విభాగం అవకాశం కల్పిస్తోంది. -
‘పంట’ మారితేనే సాగు.. బాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి, పత్తి పంటల ఉచ్చు నుంచి బయటపడకపోతేభవిష్యత్తులో వ్యవసాయం ప్రమాదకరంగా మారనుందా..? అవుననే అంటోంది రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్. వరి, పత్తి పంటలనే నమ్ముకుంటే దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్థికంగా, పర్యావరణపరంగా తీవ్ర నష్టమని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యవసాయాన్ని వరి, పత్తి ఆధారిత వ్యవస్థ నుంచి అధిక ఆదాయం, తక్కువ నీటి వినియోగం, మెరుగైన పర్యావరణ సమతుల్యత కలిగిన వైవిధ్యభరిత వ్యవసాయ విధానంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది.సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత, సహజ వనరుల పరిరక్షణ కోసం పంటల మార్పిడి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వరి, పత్తికి విని యోగిస్తున్న ఎరువులు నేలతల్లిని నిస్సారంగా మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరికొన్నాళ్లు అదే పరిస్థితి కొనసాగితే ఆ భూముల్లో గడ్డి మొలవడం కూడా కష్టమేనని వెల్లడించింది. 2013–14లో ఉన్న పంటల సాగు 2024–25 నాటికి పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ముఖ్యంగా వరి, పత్తి సాగును క్రమంగా తగ్గించి ఉద్యానవన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ‘పంటల మార్పిడి’నివేదికను శనివారం విడుదల చేశారు. వరి, పత్తిని సర్కారే సేకరిస్తుండటంతో... వరి, పత్తికి మాత్రమే కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్ల భరోసా ఉండటంతో రైతులు ఏకపంట సాగు వైపు మొగ్గుచూపుతున్నారని కమిషన్ పేర్కొంది. దీనివల్ల భూసారం క్షీణించడం, నీటి వినియోగం పెరగడం, ఎరువులు, పురుగుమందుల వినియోగం అధికమవడం, పంటల వైవిధ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం వరి, పత్తి కొనుగోళ్లను పరిమితం చేసే అవకాశం కూడా ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కమిషన్ సూచించింది. వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి ఏటా 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. పత్తికి కూలీల సమస్య ఉన్నప్పటికీ, పురుగు మందులను వినియోగిస్తే అధిక పంటతో గిట్టుబాటు కలుగుతుందనే భావనతో రైతులు వరి తరువాత పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యాన పంటలకు అడ్డంకులు ఉద్యాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నప్పటికీ రైతులకు అధిక ఆదాయం అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ మార్కెటింగ్ సదుపాయాల కొరత, ధరల అనిశ్చితి, కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం, ప్రాసెసింగ్ యూనిట్ల కొరత రైతులను ఉద్యాన పంటల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. వీటికి తోడు ఇటీవలి కాలంలో అధికమైన కోతులు, అడవి పందులు, జింకల బెడద రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలపై వన్యప్రాణుల దాడులు పెరగడంతో రైతులు ఉద్యాన పంటల నుంచి దూరమవుతున్నారని కమిషన్ గుర్తించింది.ఈ సమస్యకు పరిష్కారంగా నాబార్డు సహకారంతో సోలార్ ఫెన్సింగ్కు సబ్సిడీ ఇవ్వాలని సూచించింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలను ‘వెజిటబుల్ జోన్’లుగా ప్రకటించి హైదరాబాద్ మార్కెట్ అవసరాలను స్థానికంగా తీర్చాలని ప్రతిపాదించింది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’విధానాన్ని అమలు చేసి, ఆయా జిల్లాల్లో ప్రత్యేక పంటలకు ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు, ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కమిషన్ సూచించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), పంట కాలనీలు, ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమలు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తేనే పంటల మార్పిడి విజయవంతమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం తీరు ఇలా (విస్తీర్ణం ఎకరాల్లో)... పంట 2013–14 2024–25 వరి 49,28,000 1,27,03,000 పత్తి 15,00,000 45,00,000 పండ్ల తోటలు 9,11,200 4,48,960 కూరగాయలు 5,52,352 1,02,698 పూల తోటలు 17,220 6,248 ఆయిల్పామ్ 33,742 2,43,498 పసుపు 1,52,445 42,246 పప్పుధాన్యాలు 10,20,418 8,83,710 నూనెగింజలు 12,41,845 7,13,572 చిరుధాన్యాలు 19,58,378 18,84,528 మొత్తం ఉద్యాన పంటలు 19,82,270 12,46,032 -
ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమే..
సాక్షి, హైదరాబాద్: ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమేనని, సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలంపై మార్క్స్ రాసిన ‘దాస్ కాపిటల్’గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. అమెరికా వంటి దేశాల్లో కూడా వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతుండటం అందుకు నిదర్శనమన్నారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో జాన్ వెస్లీ మాట్లాడారు. మత, ప్రాంత, కుల, డబ్బు, ప్రలోభాలతో చట్టసభల్లో తమకు సీట్లు తగ్గిన మాట వాస్తవమేననీ, అయితే, వాటి పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. తాము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నెలలు విస్తృత పర్యటనలు గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని, వచ్చే మూడు నెలలపాటు గ్రామాలు, బస్తీల్లో విస్తృత పర్యటనలు నిర్వహించి ప్రజలను కలుస్తామని జాన్ వెస్లీ తెలిపారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదన్నారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దేశంలో అసమానతలు పెరిగేకొద్దీ ప్రతిఘటన, తిరుగుబాట్లు అనివార్యమవుతాయన్నారు. మత విద్వేషాలు, భ్రమల ఆధారంగా చేసే రాజకీయాలు శాశ్వతంగా నిలవవని వ్యాఖ్యానించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం ఆధారంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలనే దురాలోచనతో ఉందని ఆరోపించారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ప్రయోగం చేసిన బీజేపీ తెలంగాణవైపు దృష్టి సారించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత మాట మార్చిందనీ, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ సర్కారు విస్మరించిందని విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలని జాన్ వెస్లీ కోరారు. ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేపడతామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు గృహాలు లేవని, వారికి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన జాన్ వెస్లీ, కమ్యూనిజంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న అజ్ఞాని అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు హష్మీ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి వి.రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
సెంటు భూమి లేకున్నా.. రూ.లక్షల్లో పంట రుణాలు
మర్రిగూడ (చింతపల్లి): సెంటు భూమి కూడా లేని నిరుపేద కూలీల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి.. పంట రుణాలు మంజూరు చేసి లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్బీఐ సిబ్బంది. 2024లో విధులు నిర్వహించిన బ్యాంకు మేనేజర్, మరికొంతమంది కిందిస్థాయి సిబ్బంది కలిసి పథకం ప్రకారం ఈ అక్రమాలకు తెరతీశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.50 లక్షల చొప్పున పంట రుణాలను మంజూరు చేసి ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసి.. క్షణాల్లో ఇతర ఖాతాలకు మళ్లించారు. మొత్తం మీద రూ.కోటికి పైగానే ఈ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.బంగారం విడిపించుకోవడానికి వెళ్తే షాక్..చింతపల్లి మండలం హరిజనాపురం గ్రామానికి చెందిన ఓ ఖాతాదారుడు తాను బ్యాంకులో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి వెళ్లగా.. అతడి పేరిట రూ.1.50 లక్షల పంట రుణం బకాయి ఉందని సిబ్బంది చెప్పారు. అసలు తనకు భూమే లేదని, రుణం ఎలా ఇస్తారని ఆ ఖాతాదారుడు బ్యాంకు అధికారులతో వాదించడంతో నకిలీ బ్యాంకు ఖాతాల వ్యవహారం బయటపడింది.కూలీల పేరిట భూమి ఉన్నట్లు సృష్టించి..రోజువారీ కూలీల పేరిట ఏకంగా మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. తీరా ఇప్పుడు బ్యాంకు ఉన్నతాధికారులు లోన్ రికవరీ కోసం బాధితుల ఇళ్లకు నోటీసులు పంపించడంతో అమాయక రైతులు, కూలీలు లబోదిబోమంటున్నారు. ఆన్లైన్లో చెక్ చేస్తే ఈ పాసుపుస్తకాల నంబర్లు ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇవన్నీ బ్యాంక్ సిబ్బంది సృష్టించిన నకిలీవేనని స్పష్టమవుతోంది. నాంపల్లి మండలం తుంగపాడుగౌరారం గ్రామానికి చెందిన ఓ మహిళ పేరున 194/1/2 సర్వే నంబర్లో మూడెకరాలు ఉండగా, హరిజనాపురం గ్రామానికి చెందిన దామెర విజయమ్మ పేరు పైన అదే సర్వే నంబర్ సబ్ డివిజన్పై నాలుగు ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించారు. భూమి లేని దాదాపు 60 మందికి పైగా నిరుపేదల పేరిట ఈ దందా చేయగా.. అందులో సగం మంది నుంచి బ్యాంకు సిబ్బంది లోన్ రికవరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, బ్యాంకు అధికారుల తప్పిదానికి మమ్మల్నెలా బాధ్యులను చేస్తారంటూ బాధితులు పెద్దఎత్తున చింతపల్లి ఎస్బీఐ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని, తమ పేరిట ఉన్న అక్రమ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో 8 ఎకరాలు వేలానికి సిద్ధం
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాజధాని నగరంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యేకాలనీలో ఏసీబీ కార్యాలయం ఎదురుగా షేక్పేట మండల రెవెన్యూ అధికారులు 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏడాది క్రితం స్వాధీనం చేసుకున్నారు. సర్వేనంబర్ 102/1లోని ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తోపాటు అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో అందమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతామని, స్థానికులకు అనుకూలంగా వారి ప్రయోజనాల కోసమే స్థలాన్ని వినియోగిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత నెల రోజులకే ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించారు. పంచనామా అనంతరం స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హెచ్ఎండీఏ ఇందులో 8 ఎకరాల 24 గుంటల స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వేలం వివరాలను తెలియజేస్తూ భారీ బోర్డు అక్కడ ఏర్పాటుచేసింది. మంత్రి ఇచ్చిన హామీలు, తాము చేసిన డిమాండ్లు ఫలించకపోగా, స్థలాన్ని వేలం వేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేలానికి సిద్ధమైన హెచ్ఎండీఏ.. ఈ నెల 12న ప్రీబిడ్ మీటింగ్ నిర్వహిస్తామని, రిజిస్ట్రేషన్లకు, బిడ్ డాక్యుమెంట్ ఫీజుకు ఈ నెల 17వ తేదీ గడువు అని పేర్కొంది. వేలాన్ని ఈ నెల 19న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా నోటీసులో తెలిపింది. బహి రంగ మార్కెట్లో ఈ స్థలం విలువ రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటుంది. ఈ స్థలాన్ని వేలం వేయడం ద్వారా సర్కార్ ఖజానాకు కోట్లాది రూపాయలు సమకూరనున్నాయి. -
2028లో మళ్లీ కేసీఆరే సీఎం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధ్వజమెత్తారు. అలాంటి విషనాగులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు నమ్మబోరని పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మలేసియా తెలుగు అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ ఎన్నారై మలేసియా శాఖ కౌలాలంపూర్లో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని, వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పోరాటాల వారసత్వాన్ని మోస్తున్న జాతి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణవాసులమని గర్వపడే స్థాయికి రాష్ట్రం ‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’అని ప్రతి తెలంగాణవాసి గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరిందని కేటీఆర్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకునే ప్రత్యేక జాతి తెలంగాణ జాతి మాత్రమేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితమని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలను ఏకం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు కరువులు, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వంటి రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడు కూడా కేసీఆరేనని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ వంటి రంగాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 25 ఏళ్ల తెలంగాణ కోసం బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. 24 గంటల నాణ్యమైన తాగునీటి సరఫరా, బలోపేతమైన ప్రజారవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన తమ లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని.. అనుభవం, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. -
మేం పన్నులు కట్టి.. ఢిల్లీకి సలాం కొట్టాలా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. వాళ్లు చెప్పినట్లు పార్లమెంట్ సీట్లు పెంచితే కేరళలో లోక్సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120కి పెరుగుతాయి. మేం దీనినే వ్యతిరేకిస్తున్నాం. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ. తీసుకునేది తక్కువ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా?..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని సవాలు విసిరారు. ‘వాళ్లు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు’అని కేంద్రానికి హితవు పలికారు. ‘ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత: తెలంగాణకు సుపరిపాలన’అనే అంశంపై శనివారం బెంగళూరులో ‘ది హిందూ’గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్ నిర్వహించిన ముఖాముఖిలో రేవంత్ పాల్గొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రేవంత్ ఏమన్నారంటే.. రాష్ట్ర పెట్టుబడులు గుజరాత్కు మళ్లింపు కేంద్రంపై ప్రతిపక్షంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతాం. మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకుండా గుజరాత్ వెళ్లి పెట్టాలని వాళ్లు (మోదీ ప్రభుత్వం) ఒత్తిడి చేస్తున్నారు. బలవంతంగా గుజరాత్లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పని చేస్తున్నారు. 18 గంటలు పని.. ఫ్రెండ్స్ లేరు.. రోజుకు 16–18 గంటలు పనిచేస్తా. వేరే ఇతర వ్యాపకాలు లేవు. అదే నాకు పెద్ద సమస్య. సమయం గడపాలంటే రాజకీయ స్నేహితులు తప్ప వేరే ఎవరూ లేరు. రాత్రి 10 గంటల తరా>్వత ఫుట్బాల్ ఆడతా. ఇప్పుడు సమయం చిక్కడం లేదు. నేను మెస్సీకి అభిమానిని. అందుకే మెస్సీని ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఆర్ఎంపీ డాక్టర్ టీజీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. టీజీపీఎస్సీ పునరావాస కేంద్రం కాకూడదు. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను కలిసి ఎలా పని చేస్తుందో తెలుసుకుని టీజీపీఎస్సీలో అమలు చేశా. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. కేసీఆర్ మీడియాకూ అనుమతిస్తా.. పది రోజులకో ప్రెస్మీట్ నిర్వహించి ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా. కేసీఆర్ మీడియా సంస్థ ప్రతినిధినీ అనుమతిస్తా. ఎంత లేటైనా జర్నలిస్టులతో మాట్లాడతా. వ్యతిరేక వార్తలు రాస్తే దూషించను. వ్యంగ్యంగా మాట్లాడతా. చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం. పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతుంటేనే హైడ్రాను ఏర్పాటు చేశా. ‘హైడ్రా’.. ఇది హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా... ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టాను. మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లో ఆక్రమణలు, పర్యావరణం, నీటి కొరతపై సొంత మోడళ్లను అనుసరించాలి. జీఎస్టీ ఆదాయం పెంచాం.. వడ్డీలను 11–11.50 శాతం నుంచి 7–8 శాతానికి తగ్గించుకోవడానికి రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం. గత 7–8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్లకు మించి జీఎస్టీ రాబడి లేదు. గత ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం. ఆరు నెలల్లోనే రూ.5 వేల కోట్లు అదనంగా వచ్చింది. రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి. రూ.20,616 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశా. 2024–25లో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఏఐ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యామ్నా యం సృష్టించలేదు. ఏఐ అన్నీ సృష్టించ వచ్చు. రాజకీయ నాయకున్ని సృష్టించలేదు.నాకు ఏఐ భయం లేదు. యువతరం స్కిల్స్ పెంచుకోవాలి. అధికారులు ఏం అడిగినా ‘యెస్..’అంటారు. నేను ముందుగా ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని రాసుకుంటా. చివరకు నా అభిప్రాయం చెబుతా. ముందే నా అభిప్రాయం చెబితే దానికి అనుగుణంగా వారు చెబుతారు. 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎంతో తెలుసుకున్నా. నన్ను తప్పుదోవ పట్టించలేరు. నేను ప్రతి బ్యూరోక్రాట్ మైండ్సెట్ను అర్ధం చేసుకోగలను. -
రైతును రాజును చేస్తా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే.. పండుగ అని నిరూపిస్తా.. ‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి. అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్ఆర్కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం. ఎవరి మెడలైనా వంచుతా... ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్లో ఎలా కట్టాలో? మాకు హరీశ్రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మార్కెట్ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది. అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా.. అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. -
నిద్రతో పేగుబంధం
మంచినిద్ర లేకపోతే పొట్ట పనిచేయదు... నిజమే నిద్రకు, పేగు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది. దీన్ని గట్–స్లీప్ యాక్సిస్ అంటారు. పేగులోని బ్యాక్టీరియా మనం నిద్రపోవడానికి అనువైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సుఖ నిద్రతో దేహంలోని మైక్రోబయోమ్ యంత్రాంగం చక్కగా పనిచేసి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) ప్రకారం మంచి నిద్ర–జీర్ణకోశ ఆరోగ్యం పరస్పర ఆధారితాలు.యంత్రం పనిచేయాలంటే..మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆ సముదాయాన్ని, వాటి జన్యు పదార్థం, ఫంగస్లను మైక్రోబయోమ్ అంటారు. ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈ మైక్రోబయోమ్ చక్రం సవ్యంగా సాగాలంటే మంచి నిద్ర అవసరం.మంచినిద్ర లేకపోతే...⇒ పేగులో ఉండే ప్రో–బ్యాక్టీరియా (దేహానికి ప్రయోజనకారి) వృద్ధి తగ్గుతుంది. ప్రో–బ్యాక్టీరియా వృద్ధి తగ్గిందంటే హానికారక బ్యాక్టీరియా వృద్ధిపై నియంత్రణ లేకపోవడంతో ఆ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ స్థితిని డిస్బయోసిస్ అంటారు.⇒ గాఢనిద్రలో ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యత నిద్రలేమి కారణంగా దెబ్బతింటుంది.⇒ జీవక్రియలు మందగించడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు దారితీస్తుంది.శరీరంలో ఉత్పత్తి అయ్యే 90% సెరోటోనిన్ హార్మోన్ పేగులోనే ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెలటోనిన్ హార్మోన్కు ముందస్తు దశగా చెప్పవచ్చు. నిద్రపట్టడం, మెలకువ రావడం అనే ప్రక్రియలను మెలటోనిన్ నియంత్రిస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం మంచిగా నిద్రపోతేనే జీర్ణవ్యవస్థ తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే నిద్ర పడుతుంది. -
జల్లంత.. తుళ్లింత.. మరింత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ విస్తరించి సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి పశ్చిమ–మధ్య, తూర్పు–మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా అంతటా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరించాయి.శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగానే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 23.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు శనివారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో కురవడంతో ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు పడ్డారు. -
ఆర్టీసీ థౌజండ్వాలా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ అరుదైన మైలురాయిని అధిగమించింది. వెయ్యికిపైగా విద్యుత్ బస్సులున్న సంస్థగా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు దేశంలో ఢిల్లీ 4,286 విద్యుత్ బస్సులు, మహారాష్ట్ర 4,001, కర్ణాటక 1,989, గుజరాత్ 1,041 తర్వాత వెయ్యికిపైగా విద్యుత్ బస్సులున్న ఐదో రాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 1,040 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. ఇటీవలే 60 విద్యుత్ బస్సులు రోడ్డెక్కడంతో ఈ ఘనత సాధించింది.దశలవారీగా సమకూరిన ఈ–బస్సులుదేశంలో విద్యుత్ బస్సుల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్–1 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద తొలిసారి హైదరాబాద్కు 40 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. ఒక్కో బస్సుపై రూ. కోటి వరకు సబ్సిడీ ఇచ్చింది. టెండర్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ సంస్థ ఈ ఏసీ బస్సులను నడుపుతోంది. ప్రస్తుతం అవి పుష్పక్ పేరుతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చారు. కిలోమీటర్కు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ ఆ సంస్థకు అద్దె చెల్లిస్తుంది.అలాగే ఫేమ్–2 పథకం కింద మరో కంపెనీ టెండర్ దక్కించుకున్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఆ బస్సులను సరఫరా చేయలేదు. ఆ తర్వాత జీసీసీ పద్ధతిలో ఆర్టీసీ టెండర్లు పిలిస్తే పుష్పక్ బస్సులు తిప్పుతున్న కంపెనీ దక్కించుకుంది. ఆ టెండర్ కింద 500 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉండగా దశలవారీగా 440 సరఫరా చేసింది. చివరి విడత 60 బస్సులు ఇటీవలే అందజేసింది.ఇక హైదరాబాద్ వెలుపల కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ఉద్దేశంతో నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్ఈబీపీ) పథకం కింద ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేసింది. దీనికింద ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ జీసీసీ పద్ధతిలో సరఫరా చేసేందుకు 500 బస్సుల కాంట్రాక్టు పొందింది. ఆ బస్సులన్నీ రోడ్డెక్కాయి.త్వరలో 2,200 బస్సులు...హైదరాబాద్లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే ఆర్టీసీ ద్వారా తిప్పాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు బస్సులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకోగా కేంద్రం 2,200 బస్సులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి మూడు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని నెలల్లో ఈ బస్సుల రాక మొదలవుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం బస్సులు ఆర్టీసీకి అందనున్నాయి.మరోవైపు డీజిల్ బస్సులను రెట్రోఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే కార్యక్రమాన్ని కూడా ఆర్టీసీ ప్రారంభించింది. ఇటీవలే ఓ బస్సును ప్రయోగాత్మకంగా తయారు చేయగా అది సత్ఫలితాలనిచ్చిందని ఆర్టీసీ పేర్కొంటోంది. దీంతో 200 బస్సులను రెట్రోఫిట్మెంట్ చేసేందుకు టెండర్లు పిలవగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. వచ్చే ఏడాదిలో ఆ బస్సులు కూడా మొదలవుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య సుమారు 3,500కు చేరుతుంది. -
డాక్టర్ స్మార్ట్ స్కేల్స్!
కేవలం బరువును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని చెప్పలేము. ఒకే బరువు ఉన్న ఇద్దరిలో ఒకరు ఫిట్గా, మరొకరు అన్ఫిట్గా ఉండవచ్చు. అందుకే, కేవలం బరువునే కాకుండా శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే స్మార్ట్ స్కేల్స్ (బాడీ స్కానర్లు) ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బి.ఐ.ఎ. టెక్నాలజీతో పనిచేస్తాయి.అందించే ఆరోగ్య వివరాలు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్: బరువు తగ్గడం కంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గడమే ముఖ్యం. ఈ స్కేల్ మీ శరీరంలో కొవ్వు శాతం ఎంతో కచ్చితంగా చెబుతుంది.బాడీ వాటర్ పర్సంటేజ్: శరీరం ఎంతవరకు హైడ్రేటెడ్గా (నీటి శాతం) ఉందో చూపిస్తుంది.మెటబాలిక్ ఏజ్: మీ శరీరం లోపల ఎంత యాక్టివ్గా ఉందో మీ అసలు వయసుతో పోల్చి చెప్తుంది. (ఉదాహరణకు: మీ వయసు 30 ఏళ్లయితే, బాడీ మెటబాలిజం 25 ఏళ్ల యువకుడిలా ఉందా లేదా 40 ఏళ్ల వ్యక్తిగా ఉందా అనేది చెబుతుంది).విసెరల్ ఫ్యాట్: గుండె, కాలేయం వంటి అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు ఇది. దీని స్థాయిని బి.ఐ.ఎ. ద్వారా తెలుసుకుని, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించవచ్చు.ఎముకల సాంద్రత: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.మజిల్ వర్సెస్ ఫ్యాట్: కొవ్వు శరీరాన్ని లావుగా చూపిస్తే, కండరాలు ఫిట్గా ఉంచుతాయి. సాధారణ బరువు మిషన్లలో ఈ తేడా తెలియదు, కానీ స్మార్ట్ స్కేల్ ఈ రెండింటి బరువును విడివిడిగా చూపిస్తుంది. బి.ఐ.ఎ. అంటే ఏమిటి? బయోఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్కి సంక్షిప్త రూపమే బి.ఐ.ఎ.ఈ స్మార్ట్ స్కేల్పై నిలబడినప్పుడు, మనకు తెలియకుండానే ఒక చిన్న విద్యుత్ తరంగం శరీరం ద్వారా వెళ్తుంది. ఇది శరీరంలోని కొవ్వు, కండరాలు, నీటి శాతాన్ని బట్టి వేర్వేరు వేగంతో ప్రయాణించి, కచ్చితమైన బాడీ రిపోర్ట్ను లెక్కిస్తుంది.ఇంటిల్లిపాదికీ ఒకటే స్కేల్: ఒకే స్మార్ట్ స్కేల్ను కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. స్కేల్పై ఎవరు నిలబడ్డారో వారి బాడీ ప్రొఫైల్ను బట్టి ఆటోమేటిక్గా గుర్తించి, వారి వ్యక్తిగత మొబైల్ యాప్కే డేటాను పంపుతుంది. ఒకరి డేటా మరొకరికి కలవదు. -
సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం
సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని... ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. మలేషియా – పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్ మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్కు ఉన్న అనుభవం... గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం" అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు. -
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
హైదరాబాద్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్లో తెలుగు యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లి నివాసి అయిన అన్షుల్ కుంచ.. జీవనోపాధి వేటలో భాగంగా పిజ్జా డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ చేసే క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల బారిన పడ్డ అన్షుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..?
-
నీ అయ్య జాగీరా.. పవన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
-
హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారు. అయితే తాజాగా హైడ్రాపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్. హైడ్రా అనే పేరు హిట్లర్కు చాలా ఇష్టమని, హిట్లర్కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఫిల్మ్నగర్తో పాటు పలు ప్రాంతాలలో భారీగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురువడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలుచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అప్పటి దాకా ఎండ వేడిమికి తల్లడిల్లిపోయిన పట్టణవాసులకు అకాల వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించాయి. -
చేప ప్రసాదం.. ఏర్పాట్లు ముమ్మరం
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8న ఉదయం చేప ప్రసాదాన్ని తయారు చేసిన అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభమవుతుంది. 179 ఏళ్లుగా పంపిణీ చేప ప్రసాదానికి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్బౌలిలోని స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్బౌలిలో పంపిణీ జరిగిన చేప ప్రసాదం వివిధ కారణాలతో 2013 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే కొనసాగుతూ వస్తోంది. ప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 50 కిలోల నుంచి 5 క్వింటాళ్ల వరకు.. మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాళ్లకు చేరిందని అనిరుధ్ గౌడ్ తెలిపారు. మొదట్లో చేప మందుగా ప్రాచుర్యం పొంది అనంతరం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం తమ వద్దకు వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడు రకాల చేప ప్రసాదం... చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజలలో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే ఫలితాలిస్తుందని చెబుతున్నారు. ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించకూడదు. ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా స్వీకరించకూడదు. -
రహస్య గదులు.. స్పా ముసుగులో వ్యభిచారం..!
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. #Hyderabad:Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.Cases have… pic.twitter.com/yz44plNGKq— NewsMeter (@NewsMeter_In) June 5, 2026 -
బదిలీ అయినట్టా.. కానట్టా?
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో నిబంధనలు ఉల్లంఘించి, నియమాలను పట్టించుకోకుండా ఇంజినీర్ల బదిలీలు జరిగినా వారికి కొత్త పోస్టులు, బాధ్యతలు అప్పగించలేదు. పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా ఆగమాగంగా జరగడం.. నాలుగేళ్లు మించి ఒకేచోట ఉన్నవారు సైతం బదిలీ కాకపోవడం, ఇంజినీర్ల బదిలీ వివరాలు కేవలం వారికి తప్ప పైఅధికారులైన సీఈ, ఎస్ఈలకు సైతం తెలియకపోవడం, అసలు బదిలీ ప్రక్రియే షెడ్యూలు కనుగుణంగా జరగకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయినప్పటికీ, రిలీవింగ్ ఆర్డర్ లేకుండానే సీఎంసీలో చేరేందుకు వెళ్లిన ఇంజినీర్ను అక్కడ చేర్చుకోలేదు. ఎంఎంసీ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయి వచి్చన పదిమందికి పైగా ఇంజినీర్లు జాయినింగ్ రిపోర్టులు ఇచ్చినప్పటికీ, వారికి ఎలాంటి పోస్టింగులు, బాధ్యతలు అప్పగించలేదని తెలిసింది. ఇందుకు కారణం ఏమిటంటే.. బదిలీలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి ఎవరికీ రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దని, ఇతర కార్పొరేషన్ల నుంచి వచి్చన వారిని చేర్చుకోవద్దనీ కమిషనర్ కర్ణన్ తెలిపినట్లు సమాచారం. బదిలీల రగడ ఏ మలుపు తిరగనుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఎండలకు బ్రేక్.. తెలంగాణపై వర్షాల మోత
మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న కీలక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరానికి సమీపంలో మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయిలో భారీ వాయుగుండం (మిడ్ ట్రోపోస్ఫెరిక్ వోర్టెక్స్) ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కేరళ తీరం నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఏర్పడ్డాయి.ఈ ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అదే సమయంలో హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక కేరళ, తీర కర్ణాటక ప్రాంతాల్లో జూన్ 10-11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అక్కడ ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా కనిపించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. -
నేడే ‘కొహెడ’ మార్కెట్కు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి సహా నల్లగొండ, మహబూబ్నగర్ వంటి సరిహద్దు జిల్లాల నుంచి 50 వేల మందిని తరలించనున్నారు. మార్కెట్ ప్రత్యేకతలివే.... ⇒ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3,367.35 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వం రూ.2,284.32 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, మిగతాది ప్రైవేట్ భాగస్వామ్యం.ఈ మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ⇒ ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న విక్రయాలు.. 2047 నాటికి 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశముంది. తద్వారా మార్కెట్ వార్షిక ఆదాయం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరగనుంది. ⇒ వ్యాపారుల సంఖ్య 341 నుంచి 967కు, వినియోగదారుల సంఖ్య 16,450 నుంచి 53 వేల మందికి పెరుగుతుంది. ⇒ వాహనాల రాకపోకలకు 10 వరుసల ఎంట్రీ టోల్ప్లాజా, తిరిగి వెళ్లేందుకు ఆరు వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా సహా క చ్చితమైన తూకానికి అత్యాధునిక డిజిటల్ వెయింగ్ బ్రిడ్జి. ⇒ పూల వ్యాపారానికి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్. దీని ద్వారా 3,600 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ⇒ వంద మందికి సరిపడా రైతు మార్కెట్. రిటైల్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం. ⇒ రైతులు, హమాలీలు, వ్యాపారులు, సందర్శకులకు విశ్రాంతి భవనాలు, సమావేశ మందిరాలు. క్యాంటీన్, హెల్త్సెంటర్, పోలీసు ఔట్లెట్, ఫైర్ స్టేషన్ ఉంటుంది. ⇒ మార్కెట్ మొత్తానికి కమాండ్ కంట్రోల్ సెంటర్గా నిలిచే టవర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నిర్మించనున్నారు. ⇒ ఇందులో బహుళజాతి వ్యాపారులు, సీసీ టీవీ వ్యవస్థ, హెలికాప్టర్ ల్యాండింగ్కు హెలిపాడ్ ఏర్పాటు చేయనున్నారు. ⇒ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు సహా ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం 210 షాపులతో రిటైల్ వ్యాపార ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు 30 షాపులతో ప్రత్యేక వేదిక అందుబాటులోకి ఉంటుంది. ⇒ మామిడి, బత్తాయి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్స్ వంటి పండ్ల వేలానికి ఆరు ప్రత్యేక ఆక్షన్ హాళ్లు సహా 250 మేజనైన్ షాపులను వ్యాపారులకు కేటాయించనున్నారు. ⇒ పండ్లు పాడవకుండా కాపాడేందుకు 335 షాపులతో కూడి న విశాలమైన నాలుగు శీతలీకరణ షెడ్లు నిర్మించనున్నారు. ⇒ పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, పైనాపిల్ మార్కెటింగ్కు దేశంలోనే తొలి ‘డ్రైవ్–త్రూ మెలన్ మార్కెట్’ను నిర్మించబోతున్నారు. ⇒ వ్యాపారస్తుల కోసం 52 ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తారు. ⇒ డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, డ్రైఫ్రూట్స్ కోసం 40 ఏసీ షాపులు సహా నానో క్లోరినేషన్, ఇన్–హౌస్ ఐస్ ఫ్లేక్ ఉత్పత్తి వ్యవస్థలతో కూడిన ఫిష్ అండ్ సీ ఫుడ్స్ మార్కెట్ ⇒ ఫౌల్ట్రీ, మాంస ఉత్పత్తుల విక్రయాలకు 24 ఏసీ షాపులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే ఇది అత్యాధునిక మార్కెట్: తుమ్మలతుర్కయాంజల్: సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశంలోనే అత్యాధునిక వ్యవసాయ మార్కెట్గా రూపుదిద్దుకోనుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొన్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వీటి ద్వారా ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ అభివృద్ధి, ధరల సమాచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. -
‘డిస్కమ్’పై డౌట్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రైతు డిస్కమ్పై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేయకుండా అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) భావిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లువెత్తిన విమర్శలను ఈఆర్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఆర్థిక, నిర్వహణతో పాటు డిస్కమ్ల మధ్య సమన్వయం ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై డిస్కమ్ అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారులే సరైన వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ ఎలా ఇవ్వాలో అర్థమవ్వక ఈఆర్సీ తలపట్టుకుంది. తక్కువ సిబ్బందితో క్షేత్రస్థాయిలో ఇబ్బందులురాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉచిత విద్యుత్తో పాటు మరికొన్ని కనెక్షన్ల కోసం రైతు డిస్కమ్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ను కొత్త డిస్కమ్కు సీఎండీగా నియమించింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు డిస్కమ్లున్నాయి. వీటి పరిధిలోనే ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29,05,779 వ్యవసాయ పంపు సెట్లు, 489 భారీ లిఫ్టు పథకాలు, 99 హైదరాబాద్ మెట్రో కనెక్షన్లు, 1,132 మిషన్ భగీరథ కనెక్షన్లు, 639 తాగునీటి కనెక్షన్లను రెండు డిస్కమ్ల నుంచి తప్పించి మూడో డిస్కమ్ పరిధిలోకి తెస్తారు.అంటే మొత్తంగా 29,08,138 కనెక్షన్లు రైతు డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. అనధికారికంగా ఉండే రైతు కనెక్షన్లు కలుపుకుంటే మొత్తంగా 30 లక్షల వరకూ ఉండే వీలుంది. ఇన్ని కనెక్షన్లకు కలిపి కేవలం 2 వేల మంది సిబ్బంది మాత్రమే నియమించారు. వీళ్ళలో వెయ్యి మంది విద్యుత్ కార్యాలయాల్లో పాలన విభాగంలో పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వెయ్యి మాత్రమే.వీళ్ళలో చాలా వరకూ మండల కేంద్రాల్లో ఉంటారు. రైతు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, సాంకేతిక సమస్యలు వచ్చినా సిబ్బంది చేరుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే వీలుంది. మండలంలో ప్రతీ గ్రామానికి పరిమిత సంఖ్యలో ఉండే సిబ్బంది వెళ్ళడం కష్టమే. సిబ్బందితో త్వరగా పనులు చేయించుకోవడానికి రైతులు భారీగా ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తే వీలుందని పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఎలా అనే దానిపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు.ఆర్థిక పరిస్థితీ అయోమయంగత ఏడాది డిసెంబర్ 18 నాటికి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న మొండి బకాయిలు రూ. 48,398 కోట్లు. ఈ మొత్తంలో రూ. 25,950 కోట్లు మూడో డిస్కమ్కు బదిలీ చేస్తున్నారు. అంటే డిస్కమ్ అప్పులతో పుడుతుంది. రైతు విద్యుత్ ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్క స్మార్ట్ మీటరుకు రూ. 25 వేలు వెచ్చించాలి. మొత్తంగా రూ.1,306 కోట్లు ఖర్చు పెట్టాలి. మూడవ డిస్కమ్కు 35,218 (42%) మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందని అంచనా వేశారు.ఈ డిస్కం నుంచి ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశం లేదు. వ్యయం మాత్రం పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,95,58,748 కనెక్షన్లు ఉండగా అందులో 1,05,58,748 కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నారు. సుమారు రు.4000 కోట్ల వరకు సబ్సిడీ వస్తుంది. ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో రూ.14,000 కోట్లు లోటు చూపుతున్నారు. మూడో డిస్కమ్ను ఆర్థికంగా గట్టెక్కించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఈఆర్సీ కోరుతోంది. దీంతో పాటు పలు సందేహాలను కూడా నివృత్తి చేయాలని కోరింది. -
ఆదిలాబాద్లో యుద్ధవిమానాల గర్జన!
ఆదిలాబాద్లో యుద్ధ విమానాలు గర్జించబోతున్నాయి. పట్టణానికి ఆనుకొని కొత్తగా నిర్మించబోయే పౌర విమానాశ్రయానికి అనుబంధంగా భారీస్థాయిలో భారత వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన పౌర విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రన్వే కూడా ఉండనున్నందున ఇది ‘జాయింట్ ఎయిర్ ఫీల్డ్‘గా రూపొందనుందని తెలిసిందే. కానీ, శిక్షణ కేంద్రాన్ని సాధారణస్థాయిలో కాకుండా దేశంలోనే కీలక స్థావరంగా మార్చాలని తాజాగా భారత వైమానిక దళం నిర్ణయింది. యుద్ధ విమానాల శిక్షణలో దీన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించింది.ఇది భారీ స్థాయిలో ఉండనున్నందున, ఇక్కడ ఎయిర్ఫోర్స్ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతోంది. దీంతో వారి కుటుంబాల కోసం వందల సంఖ్యలో గృహాలను నిర్మించనున్నారు. శిక్షణ, యుద్ధ విమానాలకు రన్వేలు, వాటిని నిలిపేందుకు భారీ హ్యాంగర్లు, మూమెంట్ కోసం ఏప్రాన్లు, టాక్సీవేలు, శిక్షణ కేంద్రానికి సంబంధించిన భారీ భవనాలు, పరిపాలన కార్యాలయ భవనాలు, రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు... వెరసి దేశంలో ప్రధాన ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రంగా మారబోతోంది. – సాక్షి, హైదరాబాద్చిన్న స్ట్రిప్ నుంచి... ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకునే గతంలో వాయుసేన ఎయిర్ర్స్టిప్ ఉండేది. ఆ తర్వాత దాని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. కానీ, నిజాం కాలం నాటి ఆ ఎయిర్స్ట్రిప్ పరిధిలో దాదాపు 369 ఎకరాల భూమి ఇప్పటికీ ఎయిర్ఫోర్స్ అ«దీనంలోనే ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలో పాత ఎయిర్్రస్టిప్ స్థానంలో పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనికి అంగీకరించిన ఎయిర్ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం మరో 400 ఎకరాలు ఇస్తే ఉమ్మడి విమానాశ్రయం (పౌర విమానాశ్రయం, ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రం)గా రూపొందించేందుకు సిద్ధమైంది. వెరసి 700 ఎకరాల్లో ఎయిర్బస్ 380 స్థాయి పెద్ద విమానాలు దిగే 9 వేల అడుగుల పొడవైన రన్వేను ప్రతిపాదించారు. కానీ, తాజాగా రక్షణశాఖ ఇక్కడ భా రీ వైమానిక శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనంగా మరో వేయి ఎకరాలు సేకరించి ఇవ్వాలని ప్రతిపాదించింది.వ్యూహాత్మక ప్రాంతం ఆదిలాబాద్ దేశానికి రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర–దక్షిణ భారత దేశాల జంక్షన్గా ఉంటుంది తీర ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతాల మధ్యన ఉన్నందున దీన్ని రక్షిత ప్రాంతంగా భారత వాయుసేన భావిస్తోంది. దీంతో ఇక్కడ పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దుండిగల్, హకీంపేటల్లోని శిక్షణ కేంద్రాల కంటే ఇది భిన్నంగా ఉండనుందని సమాచారం. నిర్మాణాలు ఈ శిక్షణ కేంద్రంలో భాగంగా యుద్ధ విమానాలు దిగడానికి భారీ రన్వే, విమాన రక్షణ కేంద్రం, పైలట్లకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లతోపాటు రక్షణ సిబ్బంది నివాసానికి ఒక పెద్ద టౌన్షిప్ నిర్మించనున్నారు.ట్రైనింగ్ అకాడమీ–హ్యాంగర్లుఫైటర్ జెట్స్, హెలికాప్టర్ల నిర్వహణకు భారీ హ్యాంగర్లు, అత్యాధునిక రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు నిర్మిస్తారు. రన్వేకు చేరువలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాయుసేన విమానాలు నిలిపేందుకు ఏప్రాన్, రన్వేకు అనుసంధానమయ్యే టాక్సీవేలను నిర్మిస్తారు. ఇవి సాధారణ విమానాశ్రయం తరహాలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని సమాచారం. భూమి కావాలంటే పరిహారం ఖర్చు చెల్లించాల్సిందే... ప్రస్తుతం రక్షణశాఖ అ«దీనంలో 369.45 ఎకరాలు ఉండగా, మరో నాలుగొందల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం మరో వేయి ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున, దాన్ని కేంద్రమే భరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఆదిలాబాద్లో డీఫంక్ట్ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధీనంలోని భూములను దీనికి వినియోగించాలని భావిస్తున్నారు.ఫలితంగా పరిహా ర ఖర్చు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు నిషానీ ఘాట్, సమీపంలోని రెండు గ్రామాల భూములను సేకరించే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నా రు. ఇప్పటికే రక్షణశాఖ ఈ విమానాశ్రయ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ను ఆమోదించాల్సి ఉంది. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రస్తుత ప్రణాళిక. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ఆలోచన. -
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మోటార్ల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ మేరకు హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ మోటార్లను పదేపదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని మేము ముందుగానే హెచ్చరించినా, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిని కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టు ద్వారా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి పడిపోయింది.కృష్ణా జలాల్లో తెలంగాణ తాత్కాలిక వాటా 34 శాతం, ఆంధ్రప్రదేశ్కు వాటా 66 శాతం. 2025–26లో ఏపీ వినియోగం 74.90 శాతానికి పెరగ్గా తెలంగాణ వినియోగం ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయిలో 25.10 శాతానికి పడిపోయింది. తెలంగాణ జల హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం’అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తో సాగునీటి రంగానికి ముప్పు ‘సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్కో సూచించడంతో భారీ పంపులను తరచూ ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తోంది. ఈ విధానంతో పంపులు, మోటార్లకు జరిగే నష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.8 ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ పరిమిత సమయంలోనే జరిగే ప్రమాదం పొంచి ఉంది.తద్వారా నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా–గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతు డిస్కమ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
పాలమూరు, డిండికి ఏపీ ఒప్పుకుంటేనే..
సాక్షి, హైదరాబాద్: ‘పక్క రాష్ట్రం (ఏపీ)తో చర్చలు జరుగుతున్నాయి. తొందర్లోనే వాటిని (జల వివాదాలను) పరిష్కరించుకుంటాం. మీకు తొందర్లోనే మంచి వార్త వినపించబోతున్నా. ముందు మాకు పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నూటికి నూరు శాతం నికర జలాలను ఇస్తే సముద్రంలో పోయే నీళ్ల గురించి ఏపీతో మాట్లాడతాం. కృష్ణా జలాల పంపిణీ అంశం బచావత్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాలు చాలు.. మీరు (ఏపీ) 512 టీఎంసీలు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకాలు చేసి కృష్ణా పరీవాహక ప్రాంతానికి శాశ్వతంగా మరణశాసనం రాసిండు.ఆ మరణశాసనాన్ని తిరగరాయడం చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులకు అంగీకరిస్తూ ఏపీ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఏపీ ప్రాజెక్టులపై చర్చిస్తాం. లేకపోతే చర్చించే సమస్యే లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ శుక్రవారం కరివేన రిజర్వాయర్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నికర జలాల్లో ఒక చుక్కకూ రాజీపడం...‘గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నికర జలాల్లో ఒక చుక్కకే రాజీపడం. వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతి చుక్క నీటి హక్కునూ కాపాడే బాధ్యత నేను, మంత్రి ఉత్తమ్ తీసుకుంటాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇస్తేనే పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై మాట్లాడటానికి ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీకి చెప్పించాం. పాలమూరుకు 90 టీఎంసీల కేటాయింపులను సైతం తీసుకొస్తాం.డిసెంబర్లోగా చర్చల ద్వారా జిల్లాకు సంబంధించి కృష్ణా జలాల విషయంలో మెజారిటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రాజెక్టులు కట్టుకొని మనం 968 టీఎంసీలను వాడుకున్న తర్వాతే సముద్రంలో పోయే నీళ్ల లెక్క తేలుతుంది. 968 టీఎంసీలను మనం భద్రం చేసుకొని మిగిలిన దాని (వరద జలాలు) గురించి మళ్లీ చర్చ చేస్తాం. గోదావరిలో ఏపీకి ఉన్న 516 టీఎంసీలను వాళ్లు ఎక్కడ వాడుకుంటారో వారిష్టం. అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.కమీషన్ల కోసమే లిఫ్టులు, పంపులు...‘కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్ల ఖర్చు చేసిండు. అందులో అధిక భాగం పంపులు, లిఫ్టులకే ఇచ్చి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసిపోయిండు. వాళ్లలాగా కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పనిచేసే వాడిని కాదు. 20 ఏళ్లలో జెడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం వరకు జిల్లాలో రూ. వేల కోట్ల పనులు జరిగినా ఒక్క రోజైనా నాపై చిన్న ఆరోపణ అయినా వచ్చిందా?’ అని రేవంత్ ప్రశ్నించారు.పంచె కట్టుకున్నోళ్లంతా రాజశేఖరరెడ్డి కాదు..‘పాలమూరు’ ప్రాజెక్టును కొలిక్కి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తుంటే రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వారు (బీఆర్ఎస్) బయలుదేరారు. ఒకాయన పంచె కట్టుకొని రాజశేఖరరెడ్డి అనుకుంటడు. పంచె కట్టుకున్నోళ్లంతా రాజ శేఖరరెడ్డి అయితే బానే ఉండే. ఇంటి పేరు మార్చుకున్నడు ఇంకొకాయన. ప్రజలు చీదరించుకుంటారనే సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని రేవంత్ విమర్శించారు.జూన్కల్లా పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలు..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. తక్కువ భూసేకరణతో ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాం. పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలను జూన్ వరకు పూర్తి చేస్తాం. బ్రాంచి కాల్వలు, మిగతా పనులకు ఆ తర్వాత టెండర్లు. పంపులు, లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్లను 2027 జూన్లోగా పూర్తి చేసి ఉదాండాపూర్ వరకు నీళ్లను తరలిస్తాం. లక్ష్మీదేవిపల్లికి నీళ్లు ఎలా తీసుకెళ్లాలి? డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఎలా చేయాలో 6 నెలల తర్వాత సమీక్షిస్తాం’ అని సీఎం తెలిపారు.కర్ణాటక సరిహద్దులో బరాజ్లు‘కృష్ణా, భీమా నదులపై కర్ణాటక చిన్న బ్రిడ్జీ కమ్ బరాజ్లు కట్టి దాదాపు 100 టీఎంసీలు నిల్వ చేసుకుంటోంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జి కమ్ బరాజ్లు కట్టుకుంటే నిల్వతోపాటు భూగర్భ జలాలూ పెరుగుతాయి. కర్ణాటక కాంగ్రెస్ సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చెరి సగం ఖర్చు భరించేలా 60–70 శాతం నీళ్లు మనం వాడుకునేలా కార్యాచరణ తీసుకున్నం’ అని సీఎం రేవంత్ చెప్పారు.మోదీనే దిగిపోమనండి..‘ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఏం వెలగబెట్టిండో అర్వింద్, బండి సంజయ్ చెప్పాలి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కో పేదోడి ఖాతాలో రూ. 15 లక్షలు వేశాడా? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసిండా? అందుకే తక్షణమే మోదీని గద్దెదిగమనండి. రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ నెరవేరేలా చేయిస్తా. పాలమూరు–రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేయిస్తా. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా కేంద్రంతో కొనిపిస్తా. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చూపిస్తాం’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఆర్నెల్లలో సమస్యలన్నీ పరిష్కారం: మంత్రి ఉత్తమ్ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాసం, పునర్నివాసం సమస్యలతోపాటు పర్యావరణ, అటవీ అనుమతులను వచ్చే 6 నెలల్లో పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్తో కలిసి కరివేన రిజర్వాయర్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం గూడెందొడ్డి, భూత్పూర్ జలాశయాల సామర్థ్యం పెంచడంతోపాటు భీమా, కృష్ణా నదులపై కొత్తగా బ్రిడ్జి కమ్ బరాజ్లను నిర్మించనున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత సర్కారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రూ. 1.81 లక్షల కోట్ల అప్పులు చేసి ఎలాంటి సాగునీటి ప్రయోజనాలు కల్పించలేకపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం కృష్ణా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. తమ పాలన పూర్తయ్యేలోగా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తామన్నారు. -
ఆరుగురు జల సమాధి
కమ్మర్పల్లి(భీమ్గల్)/బాన్సువాడ:నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ పరిధిలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో నివాసం ఉండే కంది మహేశ్ కొడుకు హరీశ్ (10), కూతురు వర్షిణి (5), ధ్యారంగుల సురేశ్ కొడుకు అరవింద్ (4) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆడుకుంటూ కాలనీ పక్కనే ఉన్న బ్రాహ్మణకుంట వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు బట్టలు విప్పి ఒడ్డున పెట్టి కుంటలోకి దిగారు. ఇటీవల కుంటలో మొరం తవ్వకాలు జరపడంతో గుంతలు ఏర్పడ్డాయి.గుంతలు తవ్విన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు మునిగి పోయారు. మధ్యాహ్న సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడంతో మహేశ్, సురేశ్ కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. కాలనీలో, పక్కనే ఉన్న వ్యవసాయ తోటల్లో ఇతర ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్ఐ సీహెచ్ తిరుపతి, పోలీస్ సిబ్బంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్ద ఒడ్డున పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో అగి్నమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను ఘటన స్థలానికి రప్పించి గల్లంతైన పిల్లల కోసం గాలించారు. రెండు గంటల పాటు శ్రమించిన గజ ఈతగాళ్లు చివరికి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎల్లమ్మ పండగ చేస్తుండగా.... కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి బోలక్పల్లి శివారులోని మంజీర బ్రిడ్జి కింద ఎల్లమ్మ గుడి వద్ద పండగ చేశాడు. అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్ల కుటుంబాలను పిలిచాడు. అందరూ కలిసి సంతోషంగా పండగ చేసుకున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో పండరి కుమార్తె పావని(15)తోపాటు, లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన పండరి చెల్లి అనిత (40), ఆమె కుమార్తె శివాణి (13), పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన పండరి మరో చెల్లి సుజాత కుమారుడు భానుప్రసాద్తోపాటు అక్షయ, అశ్వీతలు మంజీర నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు.అయితే అక్షయ, అశ్వీతలు ఒడ్డున ఉన్నారు. అనిత, శివాణి, పావని, భానుప్రసాద్లు నదిలో స్నానానికి దిగారు. లోతుగా ఉండడంతో ఒక్కసారిగా అందరూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న అక్షయ, అశ్వీతలు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్ హుటాహుటిన వచ్చి నీటిలో మునిగిన అక్క అనిత, మేనకోడలు శివాణి, అన్న కుమార్తె పావని, అక్క కుమారుడు భానుప్రసాద్లను బయటకు తీశాడు. నీట మునిగిన వారందరినీ బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత, శివాణి, పావని మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. భానుప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
9న నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 9న రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలిక మరింత చురుకుగా ఉంటే ఒక రోజు ముందే రాష్ట్ర భూభాగంలోకి ప్రవేశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాటి పరిస్థితుల ఆధారంగా నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (నార్తన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్), మంగళూరు, ఊటీ, కొడైకెనాల్, తూత్తుకుడి మీదుగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.రానున్న రెండ్రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని భాగాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలతో పాటు నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ–మధ్య, తూర్పు–మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలలోకి రుతుపవనాలు విస్తరిస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి వర్షాలు...పలుచోట్ల మోస్తరు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. వాతావరణంలో మార్పులు, వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్ల సాధారణం కంటే కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రత 40.8డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 23.4 డిగ్రీ సెల్సీయస్గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(సెల్సీయస్లలో) ================================ కేంద్రం గరిష్టం కనిష్టం భద్రాచలం 40.8 27.0 ఖమ్మం 40.4 25.4 ఆదిలాబాద్ 40.3 24.7 రామగుండం 40.3 27.7 హనుమకొండ 39.0 24.0 నిజామాబాద్ 39.0 24.3 నల్లగొండ 39.0 23.4 మహబూబ్నగర్ 37.4 26.5 మెదక్ 36.8 24.2 హకీంపేట్ 36.6 27.4 హైదరాబాద్ 36.6 27.0 దుండిగల్ 36.5 26.0 -
నిర్మాణ భారం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా నిర్మాణ విలువలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. అయితే ఈ నిర్మాణ విలువల సవరణ ప్రక్రియపై పెద్దగా చర్చ జరగకుండానే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన రోజున నేరుగా కార్డ్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసింది.కొత్త విలువల ప్రకారం రీయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్సీసీ) కేటగిరీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.250, రూ.200 చొప్పున సవరించగా, నాన్ ఆర్సీసీ కేటగిరీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాణ విలువను చదరపు అడుగుకు రూ.150 చొప్పున సవరించింది. కాగా, కొత్త విలువలు అమలైన తొలిరోజు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోయాయి. చిన్నచిన్న సాఫ్ట్వేర్ సమస్యలు వచ్చినా ఉన్నతాధికారులు వెంటనే స్పందించారని సమాచారం. చివరి రోజు భారీగా లావాదేవీలు పాతవిలువలు అమల్లో ఉన్న చివరి రోజు గురువారం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్కరోజే వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి 8,200కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్తో కలిసి ఈ సంఖ్య 10,700 దాటడం గమనార్హం. ఈ నెలలో తొలి నాలుగు రోజుల్లోనే 22వేలకు పైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి. వ్యవసాయ భూముల లావాదేవీలతో కలిపితే ఈ సంఖ్య 34 వేలకు చేరింది. అంటే సగటున రోజుకు 8,500 వరకు లావాదేవీలు జరిగాయన్నమాట.అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల లావాదేవీలు మాత్రం సగటున రోజుకు 5 వేలు జరిగాయి. వాస్తవానికి సాధారణ రోజుల్లో రోజుకు సగటున 2 వేల వరకు వ్యవసాయేతర లావాదేవీలు జరుగుతుండగా, విలువల సవరణకు నాలుగు రోజుల ముందు సగటున 5 వేలకు పైగా లావాదేవీలు జరగడం గమనార్హం. కొత్త విలువలు అమలైన శుక్రవారం తొలిరోజు 3,200కు పైగా వ్యవసాయేతర లావాదేవీలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.భూభారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం పాత విలువలు అమల్లో ఉన్న చివరి రోజు గురువారం 3,506 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2,515 లావాదేవీలను పూర్తి చేశారు. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో మొత్తం 17 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 12 వేల వరకు లావాదేవీలు పూర్తయ్యాయి. అంటే భూభారతి పోర్టల్లో కూడా ఈ నెలలో సగటున రోజుకు 3వేలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయన్నమాట. కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలి రోజు శుక్రవారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 3వేల వరకు దరఖాస్తులు రాగా, అందులో 1,500 వరకు లావాదేవీలు పూర్తి చేసినట్టు సమాచారం. విలువల సవరణపై అధికారిక ప్రకటన రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువలను ఎలా సవరించామన్న దానిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం రాష్ట్రంలోని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని వాణిజ్య అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్ విలువలను 11 శాతం తగ్గించారు. ⇒ రంగారెడ్డి (ఆర్ఓ), శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్, మేడ్చల్ (ఆర్ఓ), వల్లభ్నగర్, బాలానగర్, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం కమర్షియల్ అపార్ట్మెంట్స్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చదరపు అడుగు రూ.7,300, మిగతా ఫ్లోర్లలో ఒక చదరపు అడుగు రూ.6,600 ఉండగా ఇప్పుడు అన్నీ ఫ్లోర్లలో ఒకే విలువ రూ.6,600 గా నిర్ణయించారు. ⇒ వల్లభ్నగర్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒక చదరపు అడుగు రూ.8,600 ఉండగా, మిగతా ఫ్లోర్లలో రూ.7,800 ఉండగా ఇప్పుడు అన్నీ ఫ్లోర్లలో రూ.7,800లుగా నిర్ణయించారు. ⇒ నివాస అపార్ట్మెంట్లకు సంబంధించి చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్బండ్, హిమాయత్నగర్, హైదర్గూడ లాంటి ప్రాంతాల్లో పెంచలేదు. ⇒ బంజారాహిల్స్లో ఉన్న రూ.4,500, ఫిల్మ్నగర్లో ఉన్న రూ.4,800 విలువను యథాతథంగా కొనసాగించారు. ⇒ పుప్పాలగూడ, నార్సింగి, ఆదిబట్లలో ఒక చదరపు అడుగు రూ.2,200 నుంచి రూ.2,700కు పెంచారు. ⇒ బంజారాహిల్స్లో కమర్షియల్ అపార్ట్మెంట్స్కు చదరపు అడుగు రూ.7,600 నుంచి రూ.8,400 కు పెంచారు. మొత్తంగా నివాస, వాణిజ్య అపార్ట్మెంట్స్లో 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించారు. ⇒ ఆదిలాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లోని 65 గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువలు పెంచలేదు. ⇒ మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఉప్పల్, కాప్రా, పటాన్చెరు, హయత్నగర్లలో 15 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, సరూర్నగర్, శేరిలింగంపల్లిలలో 25 శాతం పెంచారు. ⇒ ఖాళీ ప్లాట్ల విషయానికి వస్తే ఆమనగల్లు మున్సిపాలిటీలో గజం విలువ రూ.3,200, రావిర్యాలలో రూ.4,900, పుప్పాలగూడలో రూ.36,800, నార్సింగిలో రూ.27,000, కోకాపేటలో రూ.47,600, గండిపేటలో రూ.22,600, అత్తాపూర్లో రూ.30,500, కందుకూరులో రూ.4,900, బంజారాహిల్స్లో రూ.1,16,000 (కమర్షియల్), ఉప్పల్లో రూ.25,200, హబ్సిగూడలో రూ.46,800, జనగాంలో రూ.3,200, వేములవాడలో రూ.4,800, నాచారంలో రూ.25,400, నాగోల్లో రూ.25,200, బైరామల్గూడలో రూ.24,300గా నిర్ణయించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది. -
పాలమూరులో నీ జెండా ఎగరనియ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్కు ఇదే నా సవాల్. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్మీట్ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, అనిరు«ద్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’
జడ్చర్ల: పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించానని, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు తెలుసన్నారు సీఎం రేవంత్రెడ్డి. జడ్చర్ల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కేసీఆర్ ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కెసీఆర్ను లంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే…పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. పది వేల కోట్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికిఖర్చు చేశాం. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత
సాక్షి,భువనగిరి: అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా గత 20 రోజుల నుండి నిమ్స్ దవాఖానలో డైరెక్టర్ డా.బీరప్ప పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డిని పరామర్శించి నిమ్స్ డాక్టర్లతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించారు. కొమ్మిడి నర్సింహారెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జానారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుండి రెండు దఫాలుగా 1978లో, 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4), వర్షిని(5), హరీష్(10)గా గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకొచ్చిన చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బ్రాహ్మణ కుంటలో దిగారు. స్నానం చేద్దామని దిగిన చిన్నారులు అక్కడ లోతు గ్రహించకపోవడంతో అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డారు. పిల్లలను తల్లిదండ్రులు వెతుక్కునే క్రమంలో బ్రాహ్మణ కుంట వైపు వెళ్లారని ఎవరో చెప్పడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలించగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Hyd: స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు
హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) 100పైగా స్పా సెంటర్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.గత మూడు, నాలుగు నెలల నుంచి హైదరాబాద్లోని పలు స్పా సెంటర్లపై పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. హబ్సిగూడ, కూకట్పల్లి, వసంత్నగర్ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా పోలీసులు రైడ్లు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా చేసిన దాడుల్లో కూడా పలుచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. -
భారీ వర్షం.. పిడుగుపడి కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. పలు జిల్లాల్లో భారీగా వర్షం పడుతోంది. నాగర్కర్నూల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. గద్వాలలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. మామిళ్లపల్లిలో పిడుగుపడి రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం పడుతోంది. పెద్దఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విస్సన్నపేట, మైలవరంలో ఈదురుగాలులలో కూడిన జల్లులు పడుతున్నాయి. -
నిమ్మగడ్డ రమేష్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఆయన తమను వేధింపులు, వివక్షకు గురి చేశారంటూ నలుగురు అధ్యాపకులు ఆయనపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల్లో ఒకటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించినది కాగా, మిగిలినవి తమను పక్కనపెట్టి తనకు సన్నిహితులైన వారికి రమేష్ కుమార్ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలతో ఉన్నాయి.హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రభుత్వానికి, ప్రైవేట్ సంస్థలకు మధ్య అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. 2024 ఆగస్టులో ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులకే తనకు రమేష్ కుమార్ నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా నాలుగు సార్లు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మహిళా ప్రొఫెసర్పై వేధింపులుడైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రమేష్ కుమార్ తనను ఒంటరిగా కలవాలని కోరినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 ఏళ్లకు పైగా ఏఎస్సీఐలో పనిచేస్తున్న తనను లైంగిక వేధింపులకు గురిచేశారని వాపోయారు. ఉన్నత పదోన్నతుల కోసం 'కొంతమందిని సంతృప్తి పరచాల్సి ఉంటుందని' పెడార్థంతో వ్యాఖ్యానించారని, తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇతర సిబ్బంది ఎదుట అవమానించడం, తాను నిర్వహిస్తున్న కేంద్రం డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం, పెద్ద కార్యాలయ గదిని తీసేసి చిన్న గదికి మార్చడం వంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.కాంట్రాక్ట్ పునరుద్ధరణలో వివక్ష?ఏఎస్సీఐలో అధ్యాపకులు ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఆదాయం సమకూర్చాలి. ప్రతి అధ్యాపకుడు సంవత్సరానికి కనీసం రూ.95 లక్షల ఆదాయం తీసుకురావాల్సి ఉంటుంది. గత మూడేళ్లుగా తాను సగటున రూ.1 కోటి ఆదాయం సమకూర్చినా, ఫిర్యాదు చేసిన తర్వాత తనకు పనులు కేటాయించడం నిలిపివేశారని మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2025 నవంబరులో ముగిసిన తన కాంట్రాక్ట్ను కేవలం ఆరు నెలలపాటు మాత్రమే పొడిగించారని వాపోయారు. ఆ గడువు మే 31తో ముగియగా జూన్ 1న కళాశాలకు వెళ్లినప్పుడు భద్రతా సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ చర్యలు POSH చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు ప్రొఫెసర్ల ఫిర్యాదులునిమ్మగడ్డ రమేష్ కుమార్పై 2026లో మరో ముగ్గురు ప్రొఫెసర్లు ఏఎస్సీఐ పాలన బోర్డుకు ఫిర్యాదులు చేశారు. వారు తమ కాంట్రాక్ట్ రెన్యువల్పై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ల్యాండ్ అక్విజేషన్ సెంటర్ను విలీనం చేయడం, సైబర్ ల్యాబ్ మూసివేసేలా ప్రయత్నాలు చేయడం, విస్తరణ పనులపై సమాచారం ఇవ్వకుండా సంబంధిత శాఖ అధికారుల్ని దూరం చేశారని ఆరోపణలు వినిపించాయి. రమేష్ ఆగడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తమకు మరిన్ని వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. పబ్లిక్ ఈవెంట్లలో అవమానించడం, అసభ్యంగా మాట్లాడడం, కాలేజీలో జరిగే ఈవెంట్ల నుంచి బయటకు పంపి అవమానించడం, బెదిరింపులకు పాల్పడడం చేశారని బాధితులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2029 వరకు ఉన్న తన కాంట్రాక్ట్ను 2024లో అకస్మాత్తుగా రద్దు చేశారని మాజీ మహిళా ప్రొఫెసర్ కూడా ఆరోపించారు. ఇందులో ఏఎస్సీఐ చైర్మన్ పద్మనాభయ్య పాత్ర ఉందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందనతనపై వచ్చిన ఆరోపణలు దురుద్దేశపూరితమైనవి, ఆధారరహితమైనవిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని, ఏఎస్సీఐ రిజిస్ట్రార్ సమాధానం ఇస్తారని చెప్పారు. అయితే ఇప్పటివరకు రిజిస్ట్రార్ నుంచి అధికారిక స్పందన రాలేదు. -
విషాదం.. నదిలో కాలు జారి ముగ్గురు మృతి
సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి శివారులో మంజీరా నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.మృతులు పిట్లం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన పావని (15),లింపేట్ మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన అనిత (40), శివాని (13) తల్లి కూతురని తెలుస్తోంది. భాను ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.పండరి అనే వ్యక్తి మంజీరా నది వద్ద ఎల్లమ్మ పండగ నిర్వహించడంతో బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటిలోకి దిగిన ఓ యువతి, ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో కొట్టుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు నీటిలో మునిగి మృతి చెందారు. -
మరోసారి 300 మందికి ఉచిత వీసాలు
మోర్తాడ్(బాల్కొండ): యూఏఈలో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకోసం యూఏఈకి చెందిన ఏడీఎన్హెచ్, మన దేశానికి చెందిన జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ మేళా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈనెల 12న సిరిసిల్ల, జగిత్యాల, 13న నిజామాబాద్, ఆర్మూర్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికైన వారికి ఉచితంగా వీసాలు ఇచ్చి, విమాన చార్జీలను సైతం కంపెనీయే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు రూ.24 వేల వేతనం చెల్లిస్తూ.. నివాసం, భోజన సదుపాయాన్ని ఏడీఎన్హెచ్ కంపెనీ సమకూర్చనుంది. వివరాల కోసం సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999 నంబర్లలో సంప్రదించాలి.ఈ సందర్భంగా జీటీఎం సంస్థ చైర్మన్ సతీష్రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉచితంగా వీసాలు జారీ చేసే అవకాశం తమ సంస్థకు రావడం ఎంతో విశేషం అన్నారు. వలస వెళ్లేవారిపై నయాపైసా భారం లేకుండా అన్ని వసతులు ఉచితంగా సమకూర్చడం తమ ప్రత్యేకత అని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అన్నామలై రాజీనామాపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగి, ఆ పార్టీతో తన ప్రస్థానాన్ని ముగించుకున్న అన్నామలై వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ స్పందించారు. ప్రధానంగా అన్నామలై రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తెచ్చిన అన్నామలై పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. ‘ అన్నామలై ఆరేళ్ల కింద ఐపీఎస్కి రాజీమానా చేసి బీజేపీలో చేరారు. ఆయన తమిళనాడు లో బీజేపీకి గుర్తింపు తెచ్చాడు. అన్నామలై పార్టీని వీడడం దురదృష్టకరం. ఇలాంటి నేతలు పార్టీ వీడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే.. దానికి కారణం తెలుసుకోవాలి... వారిని పిలిచి మాట్లాడాలి. నాకు జరిగిందో అన్నామలై విషయంలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగిన విషయాలనే కేంద్ర పెద్దలకు చెప్పాను. పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నం చేశా.. ఎవ్వరు కలవలేదు.. చివరకి పార్టీకి రాజీనామా ఇచ్చాను. కనీసం ఎందుకు రాజీనామా ఇచ్చావో అడగకుండా రాజీనామాను ఆమోదించారు. నేను బయటకి వచ్చి ఏడాది అయింది.. ఏ పార్టీ లోకి వెళ్ళలేదు.. వెళ్ళను కూడా. నాలాంటి, అన్నామలై లాంటి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత పార్టీ పై ఉంది. ఇలాంటి వాళ్ళు బాధ పడితే.. రాష్ట్ర, కేంద్ర నాయకులు పిలిచి మాట్లాడాలి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు.. -
అమీర్పేట ప్రమాదం.. స్పాట్కు ‘హైడ్రా’ రంగనాథ్
హైదరాబాద్: అమీర్పేట మైత్రివనం సిగ్నల్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘మంటల్లో బిల్డింగ్ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్కు ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. .. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్ కట్టారని అంటున్నారు. ఫుట్పాత్, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్ అనుమతలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ మాల్ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి పెరగనుండటంతో.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయనే ఉద్దేశంతో గురువారం మూసాపేట్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చంపాపేట్, శంషాబాద్, గండిపేట్ తదితర సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు దస్తావేజుదారులతో కిటకిటాడాయి. భూ విక్రయదారులు, బిల్డర్లతో ఆస్తుల అగ్రిమెంట్ చేసుకున్న కొనుగోలుదారులు రిజి్రస్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆయా కార్యాలయాలు ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, క్రయ విక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. పరిమితికి మించి స్లాట్లు బుక్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది రాత్రిపొద్దు పోయే వరకు ఆఫీసుల్లోనే ఉండి రిజి్రస్టేషన్ల ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం. శంషాబాద్లో విజిలెన్స్ తనిఖీలు శంషాబాద్: శంషాబాద్ సబ్రిజి్రస్టార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టారా? సాధారణ తనిఖీల్లో భాగంగానేనా? అనే విషయం బయటికి రాలేదు. రెండు గంటల పాటు రికార్డులు పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల తర్వాత అనేక ఆరోపణలు బయటపడడంతో తాజాగా సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలపై చర్చ జరుగుతోంది. -
చెత్తకు నిప్పు.. ఎంత పనిచేసింది..
హైదరాబాద్: ఖాళీ స్థలంలో చెత్త కుప్పకు నిప్పు పెట్టగా, పక్కనే పార్కింగ్ చేసిన మూడు కార్లు దగ్ధమయ్యాయి. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్ సర్కిల్ శ్రీనివాస్నగర్ కాలనీలో ఖాళీ స్థలంలో స్థానికులు కార్లు పార్క్ చేశారు. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్న చెత్తకు నిప్పు అంటించారు. గాలికి ఆ మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మూడు కార్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేశారు. ఒక కారు పూర్తిగా దగ్ధం కాగా మరో రెండు సగం వరకు కాలిపోయాయి. -
భార్య గొంతు కోసి హత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ భర్త.. భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన షేక్ రహీం (32)తో సుమేరా బేగం (23)కు 2024లో వివాహం జరిగింది. వీరికి 20 నెలల కుమారుడు ఉన్నాడు. కైత్లాపూర్లోని ఇందిరమ్మ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. ఇటీవల దంపతుల మధ్యగొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం ఏప్రిల్లో సుమేరా బేగం భర్తపై గృహహింస కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం ఉదయం భార్యా భర్తలు గొడవపడసాగారు. ఈ క్రమంలో భర్త షేక్ రహీం కూరగాయల కత్తితో సుమేరా బేగం గొంతు కోశాడు. దీంతో ఆమె మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి భర్త షేక్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం రేవంత్రెడ్డికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డికి కమలాపూర్లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. రేవంత్రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించారని, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. -
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం
సాక్షి, నల్గొండ జిల్లా: మిర్యాలగూడ గాంధీ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనమయ్యారు. మృతులను చంద్రమ్మ(50), లక్ష్మణ్(17), ప్రణతి(14)గా గుర్తించారు.చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఎరువు.. ధరల దరువు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరల పెరుగుదల నేపథ్యంలో కాంప్లెక్స్ ఎరువుల గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్పీ) ఎరువుల కంపెనీలు భారీగా పెంచాయి.రాష్ట్రంలో ఈ నెల నుంచే ప్రారంభమయ్యే వానాకాలం సీజన్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు సాగు చేసే రైతులపై అదనపు భారం పడనుంది. ఈ పంటల్లో ప్రారంభ దశలోనే కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే విత్తనాలు, కూలీల వేతనాలు, పురుగు మందుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే యూరియా, డీఏపీ ధరలను కేంద్రం పెంచకపోవడం కొంత ఊరట. దిగుమతి భారం కావడంతో...దేశంలో ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో రవాణా వ్యయాలు, దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం కాంప్లెక్స్ ఎరువుల ధరలపై ప్రత్యక్షంగా పడింది. దీంతో సాగులో వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ భారీగా పెంచింది.ఎరువుల వ్యాపార వర్గాలు, వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 20:20:0:13, 10:26:26, 17:17:17 వంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలను బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచారు. ముఖ్యంగా ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల తయారీకి అవసరమైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్, అమోనియా, పొటాష్ వంటి ముడి పదార్థాలను భారత్ పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఎంఆర్పీలను సవరించినట్టు తెలుస్తోంది.యూరియా ధర పెంచకపోవడం ఊరటే రైతులు అత్యధికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరలు యథాతథంగా ఉన్నాయి. యూరియా బస్తా రూ.266.50, డీఏపీ బస్తా రూ.1,350కే లభిస్తోంది. భారీ సబ్సిడీ కారణంగా ఈ ధరలను ప్రస్తుతం పెంచకుండా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ భారం భరిస్తుండటంతో ఈ రెండు ఎరువుల ధరలను ప్రస్తుతం పెంచలేదు. దీంతో రైతులకు కొంత మేర ఊరట లభించినా, కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల మొత్తం సాగు వ్యయాన్ని పెంచనుంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు.ఈ నేపథ్యంలో ధరల పెంపు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా రైతులపై పడే అవకాశం ఉంది. కాంప్లెక్స్ ఎరువులపై పడిన భారం కార ణంగా ఖరీఫ్ సాగు ఖర్చులు పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 20:20:0:13 బస్తాపై రూ.500 పెరిగితే వరి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనపు భారం కానుంది.పత్తి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనంగా భరించాల్సి వస్తుంది. అయితే రాష్ట్రంలో వరి, పత్తి, సోయాబీన్, మొక్క జొన్న, కూరగాయల పంటలకు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను కూడా అధికంగానే వినియోగించడం పరిపాటిగా మారింది. -
కొత్త కోర్సుల్లేవా దోస్త్?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పించడం లేదు. మండలి, సాంకేతిక విద్య అధికారుల మధ్య వివాదమే దీనికి ప్రధాన కారణం. ఇంజనీరింగ్ విద్యకు సమాంతరంగా మండలి రూపొందించిన కోర్సులను సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపివేసింది. డిగ్రీ ద్వారా ఈ కోర్సులు చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతోనే అత్యధిక వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందే వీలుంది. అంతర్జాతీయంగా బహుళ జాతి కంపెనీల్లోనూ పేద విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా రూపొందించారు.ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యా మండలి విస్తృత ప్రచారం చేపట్టింది. రూ. లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్లో యాజమాన్య కోటా సీటు పొందేకన్నా ఎమర్జింగ్ కోర్సులున్న డిగ్రీ విద్యను ఎంచుకోవాలని విద్యార్థులు సైతం ఆశపడ్డారు. వీటివల్ల బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని భావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యా మండలి ద్వారా కోర్సుల వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆసక్తి చూపడంతో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో మండలి చైర్మన్ సమావేశం ఏర్పాటు చేసి కోర్సుల నిర్వహణకు ఒప్పించారు.బీవోఎస్ అనుమతులు ఆపిందెవరు?కొత్త కోర్సులు, సిలబస్ను రూపొందించేప్పుడు ప్రతీ యూనివర్సిటీ పరిధిలోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇందులో విశ్వవిద్యాలయం అధికారులతో పాటు బయట నుంచి పారిశ్రామిక నిపుణులు, వ్యాపారవేత్తలూ ఉంటారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో సిలబస్, కోర్సుల రూపకల్పనపై ఈ బోర్డు చర్చిస్తుంది. కోర్సులపై ఏడాదిగా కసరత్తు జరుగుతున్నా, యూనివర్సిటీలు మాత్రం బీవోఎస్ సమావేశాలు నిర్వహించలేదు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కారణంగానే తాము ముందుకు వెళ్ళడం లేదని పలు వర్సిటీల వీసీలు తెలిపారు.ఈ విషయమై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంను వివరణ కోరగా బీవోఎస్లోని సభ్యులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, అందుకే సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ఇది సహేతుక కారణమే కాదని, సాంకేతిక విద్య అధికారుల ఒత్తిడే దీని వెనుక పని చేసిందని మండలి వర్గాలు అంటున్నాయి. అయితే కొన్ని వర్సిటీల నుంచి బీవోఎస్ అనుమతులు వచ్చాయని, వీటిని విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే దోస్త్ రెండో ఫేజ్ ఇప్పటికే పూర్తయింది. మూడో విడత నడుస్తోంది. ఇది కూడా ఈ నెల 16తో ముగుస్తుంది. అయినా కొత్త కోర్సులపై పంచాయితీ ఇప్పటికీ తెగకపోవడం, ఆన్లైన్లోకి ఇవి రాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.ఇంజనీరింగ్కు దీటుగా..డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటి కోర్సులను డిగ్రీలో ప్రతిపాదించారు. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను సైతం ప్రతిపాదించారు. ఈ మేరకు ఏడాదిగా కసరత్తు చేసిన ఈ కోర్సులను ఆపలేమని కౌన్సిల్ చెప్పడంతో సాంకేతిక విద్య ఉన్నతాధికారి బీవోఎస్ నివేదికలు ఇవ్వొద్దని వీసీలపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రైవేటు కాలేజీల నుంచి భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.అసలు కారణం ఏమిటి?ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. యాజమాన్య కోటా సీట్లు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకూ పలుకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సుల వల్ల ఉపాధి అవకాశాలు అంతగా ఉండటం లేదు. తాజాగా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఇంజనీరింగ్ విద్యకు దీటుగా, మెరుగ్గా ఉండే వీలుంది. అందువల్ల విద్యార్థులు డిగ్రీ కోర్సులకు వెళ్తే ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్లు నిండటం కష్టం. దీంతో యాజమాన్యాలు లాబీయింగ్ చేసి కోర్సులు ఆపాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతో సాంకేతిక విద్య అధికారులు సంప్రదింపులు జరపడం, కౌన్సిల్పై కోర్సులు ఆపమని ఒత్తిడి చేయడం వివాదానికి కారణమైంది. -
మాకూ కావాలి ‘జస్టిస్’
సాక్షి, హైదరాబాద్: తీవ్ర పని భారం వల్ల సత్వర న్యాయం అందించలేని స్థితిలో న్యాయస్థానాలు విధులు నిర్వహిస్తున్నాయి. జనాభాకు సరిపడా జడ్జీలు లేక కేసుల ఒత్తిడితో వారు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోర్టు విచారణ సమయం తర్వాత కూడా తీర్పులు డిక్టేషన్ చేయడం, మరలా వాటిలో తప్పొప్పులను పరిశీలించి సరిచేయడం.. ఇలా పనిభారంతో సతమతం కావాల్సి వస్తోంది. సెలవు రోజుల్లో విచారణ కొనసాగించకున్నా.. ఇతర పనులు తప్పడం లేదు. వాదనల నమోదు, గత తీర్పుల విశ్లేషణ.. అనంతరం తాజా కేసుల్లో తీర్పు రాయడం.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మరోవైపు ప్రజలు తమ కేసుల విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్తగా పోస్టుల సంఖ్య పెంపు మాటేమోగానీ.. మంజూరైన వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం.. నిరంతరం 20 నుంచి 30 శాతం ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచిన నేపథ్యంలో హైకోర్టులోనూ జడ్జీల సంఖ్య కూడా పెంచాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. అదీగాక ఇరురాష్ట్రాల ఎన్సీఎల్టీ, క్యాట్ ఇక్కడే ఉండటంతో బెంచ్లు సరిపోవడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. సరిపడా జడ్జీలు లేకుంటే సమస్యలివీ.. ⇒ కోర్టుల్లో పేరుకుపోయే కేసుల భారం ⇒ న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని ఒత్తిడి ⇒ సామాన్యుడికి ‘న్యాయం’అందేందుకు ఏళ్లకు ఏళ్లు ⇒ కోర్టుల్లో సత్వర న్యాయం దక్కేందుకు అవకాశం లేకపోవడంతెలంగాణలోనూ జడ్జీల సంఖ్య పెంచాలి జడ్జీల సంఖ్య జనాభాకు సరిపడా లేకపోవడంతో కేసుల పెండింగ్ రేటు అంతకంతకు పెరిగిపోతోంది. హైకోర్టులో విభజన సమయంలో మంజూరైన పోస్టులే తప్ప.. ఇప్పటివరకు పెంచలేదు. అందులోనూ ఖాళీలతో కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. హైకోర్టుతోపాటు ఇతర కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి.. సత్వర న్యాయానికి ప్రభుత్వాలు దోహదం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలి. –హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.సురేందర్రెడ్డిదేశంలో పెండింగ్ కేసులు 5 కోట్లకుపైగా ఉన్నాయి. ఇందులో దశాబ్దాల కేసులు కూడా ఉండటం ఆశ్చర్యకరం. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జేడీజీ) ఈ ఆలస్యానికి కారణాలను అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఏడు ప్రధాన కారణాలు ఇలా.. న్యాయవాది అందుబాటులో లేక..: 59,72,394 నిందితుడు పరారీలో: 34,17,009 సాక్ష్యం కారణంగా: 25,79,442 స్టే కారణంతో: 20,62,339 డాక్యుమెంట్ల కోసం: 13,74,611 కక్షిదారుల నిరాసక్తత: 7,35,127 పదేపదే అప్పీళ్లు: 4,29,373 -
కేటగిరీల మార్పు.. కార్మికుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కార్మికుల కనీస వేతనాల అమలు ఉత్తర్వుల్లో ఉద్యోగాల మార్పు తీవ్ర గందరగోళానికి దారితీసింది. రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాలు సంబరాలు చేసుకోగా... తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉద్యోగాల మార్పులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మార్పుతో వేతనాలు పెంచినా, కేటగిరీలో మార్పులతో నష్టం కలుగుతుందని కార్మిక సంఘాలు లబోదిబోమంటున్నాయి.రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి కనీస వేతనాలను ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీఓ 6ను మే 30వ తేదీన కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన జారీ చేశారు. తాజాగా ఈ ఉత్తర్వుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. ఇందులో పలు ఉద్యోగాల కేటగిరీలు మారాయి. కేటగిరీ మార్పుతో వేతనాల్లో కోత... రాష్ట్రంలో 67 ఎంప్లాయ్మెంట్లకు కనీస వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులను నాలుగు కేటగిరీలుగా విభజించింది. అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీలుగా విభజిస్తూ... రాష్ట్రంలో కొత్తగా మూడు జోన్లు ఏర్పాటు చేసి... జోన్ల వారీగా ఉద్యోగులకు వేతనాలను ఖరారు చేసింది. ఉద్యోగాలను నైపుణ్యం ఆధారంగా నాలుగు కేటగిరీల్లో చేర్చారు. ఏళ్లుగా ఆయా కేటగిరీల్లో కొనసాగిన ఉద్యోగాల్లో కొన్నింటిని కార్మిక శాఖ అధికారులు మార్పు చేశారు.హైలీ స్కిల్డ్ ఉన్న ఉద్యోగాన్ని స్కిల్డ్లోకి, సెమీ స్కిల్డ్లోని ఉద్యోగాలను అన్స్కిల్డ్లోకి... ఇలా మూడు కేటగిరీల్లోని ఉద్యోగాల స్థాయి తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా మార్పుతో ఉద్యోగాలు డీగ్రేడ్ కావడంతో ప్రస్తుతం అందుకునే వేతనాలు సైతం తగ్గనున్నాయి. ⇒ హెల్పర్ (కుక్, లారీ, బాయిలర్, బైండర్, బ్లాక్స్మిత్, ఆర్టిజన్, సాయర్, కార్పెంటర్, మేస్త్రీ), బోట్మెన్, ప్లాగ్మెన్, సిగ్నల్మెన్, టింకర్ ఉద్యోగాలు ఇప్పటివరకు సెమీ స్కిల్డ్లో ఉండగా... ప్రస్తుతం వీటిని అన్స్కిల్డ్ జాబితాలోకి చేర్చారు. ⇒ మేట్ మిస్ట్రీ, బోట్మెన్ హెడ్, ఎక్సావేటర్, విన్్చమెన్ (మెకానికల్ ఇక్విప్మెంట్ ఆపరేటర్), అటెండెన్స్ కీపర్ తదితర ఉద్యోగాలు ఇప్పటివరకు స్కిల్డ్ కేటగిరీలో ఉండగా... తాజాగా వీటిని సెమీ స్కిల్డ్లోకి మార్పు చేశారు. ⇒ ట్రైన్ ఎగ్జామినర్, ఆటో ఎల్రక్టీషియన్, లోకో డ్రైవర్, అసిస్టెంట్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్ తదితర ఉద్యోగాలు ఇప్పటివరకు హైలీ స్కిల్డ్ కేటగిరీలో ఉండగా, ఇప్పు డు వాటిని స్కిల్డ్ జాబితాలో పెట్టారు. ⇒ ఈ ప్రక్రియ యాజమాన్యానికి, ఉద్యోగికి మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొత్త ఎంప్లాయ్మెంట్లదీ అదే పరిస్థితి...మారుతున్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా కొత్త ఎంప్లాయ్మెంట్లు చేర్చాలంటూ కార్మిక సంఘాలు ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. కనీసం వెయ్యిమంది కార్మికులు పనిచేస్తున్న ఒక రంగానికి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్గా ఏర్పాటు చేయాలని సూచించాయి. విద్యుత్ ఉత్పత్తి (థర్మల్, హైడ్రో, సోలార్, విండ్). టైర్లు ట్యూబ్ తయారీ, లైట్ మెటల్, హెవీ మెటల్ కాస్టింగ్ అండ్ మోల్డింగ్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ, ప్రభుత్వ స్కీమ్ల పరిధిలోని కార్మికులు, గని కార్మికులు, ఇంటర్నెట్ ప్రొవైడర్, ఐటీ సంస్థల కార్మికులను నూతన ఎంప్లాయ్మెంట్ల పరిధిలోకి తేవాలని ఐఎన్టీయూసీ, టీఎనీ్టయూసీ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, బీఎంఎస్, ఐఎఫ్టీయూ తదితర సంఘాలు వినతులిచ్చాయి. కొత్తగా పది రకాల షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లను ప్రకటించినా, సంఘాల వినతులను పరిగణనలోకి తీసుకోకపోవడంపైనా నేతలు మండిపడుతున్నారు. -
15% నుంచి 100% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల సవరించిన విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో నేటి నుంచి జరిగే రిజిస్ట్రేషన్లన్నీ కొత్త విలువల ప్రకారమే జరగనున్నాయి. వాస్తవానికి, గత నెలలోనే కొత్త విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నా, వ్యవసాయ భూముల అప్లోడ్ ప్రక్రియలో కొంత గందరగోళం కారణంగా జూన్ 5వ తేదీనుంచి అమల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించిన సవరించిన విలువలన్నింటినీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో కార్డ్, భూభారతి సాఫ్ట్వేర్లలో అప్లోడ్ చేశారు. గురువారం అర్ధరాత్రి సర్వర్ను డౌన్ చేసి విలువలన్నింటినీ అప్డేట్ చేసి మళ్లీ ఆన్ చేయనున్నారు.దీంతో కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూముల విలువలను సవరించడం ఇది మూడోసారి. 2021, 22 సంవత్సరాల్లో ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు సవరించిన ప్రభుత్వం రిజి్రస్టేషన్ ఫీజును కూడా పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత విలువలను సవరించాలని నిర్ణయించింది. అయితే, ఈసారి భూముల విలువల సవరణకు బహిరంగ మార్కెట్లో ఉన్న విలువలను ప్రాతిపదికగా తీసుకున్నారు.బహిరంగ మార్కెట్లో ఉన్న విలువకు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఈసారి విలువలు పెంచారు. మొత్తం మీద కనిష్టంగా 15 శాతం, గరిష్టంగా 100 శాతం మాత్రమే పెంచడం గమనార్హం. అయితే, బహిరంగ మార్కెట్కు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య పెద్దగా తేడా లేని ప్రాంతాల్లో పెంచలేదు. కాగా, ఈ విలువల సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కనీసం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది. మేం సిద్ధం స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఐజీ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణకు తాము సిద్ధంగా ఉన్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్గాంధీ హనుమంతు వెల్లడించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేశామని చెప్పా రు. వ్యవసాయ, వ్యవసాయేతర భూ ములు, ఆస్తుల విలువలు అప్లోడ్ చేయడం పూర్తి అయిపోయిందని, శుక్రవారం ఉదయం సర్వర్ ఆన్ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని అన్ని సర్వే నంబర్లలో కొత్త విలువలు డిస్ప్లే అవుతా యని, వాటి ప్రకారం యథావిధిగా రిజి్రస్టేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. -
ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు ఉపసంహరించాలి
హిమాయత్నగర్ (హైదరాబాద్): భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజకీయ విశ్లేషకుడు కె.నాగేశ్వర్పై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొ.నాగేశ్వర్పై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్ మీడియా ట్రోలింగ్, కేసులను ఖండిస్తూ గురువారం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్, సీపీఎం నేత ఎస్.వీరయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. కూనంనేని మాట్లాడుతూ నాగేశ్వర్ గొంతును కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. కోదండరాం మాట్లాడుతూ అభిప్రాయ భేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ కేసులకు భయపడబోనని, ప్రజా సమస్యలపై తన రచనలు, విశ్లేషణలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సమావేశం చివర్లో భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలని, నాగేశ్వర్పై కేసులను ఎత్తేయాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో సీపీఐ నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈ.టి. నరసింహా, వి.ఎస్.బోస్, బి.స్టాలిన్ పొల్గొన్నారు. -
ఇదేనా మాకిచ్చే 'గౌరవం'!
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు ఇంతవరకూ గౌరవ వేతనాలు అందలేదు. 2025 డిసెంబర్లో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా, డిసెంబర్ 22న నూతన సర్పంచ్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఐదునెలలకు పైగా కాలానికి వారికి గౌరవ వేతనమంటూ ఇవ్వలేదు. సర్పంచ్లకు నెలకు రూ.ఆరున్నర వేల చొప్పున ఈ వేతనం చెల్లించాల్సి ఉండగా, ఒక్కొక్కరికీ రూ.32,500 చొప్పున (ఐదు నెలలకు) బకాయి పడినట్లు అయ్యింది. రాష్ట్రంలోని మొత్తం 12,762 గ్రామ పంచాయతీలకు గాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ. 41.28 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పర్యటన లకు, పాలనా వ్యవహారాలకు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడానికి గౌరవ వేతనం ఉపయోగప డుతుందని ఆశిస్తే తమకు నిరాశే ఎదురవుతోందని సర్పంచ్లు వాపోతున్నారు. సర్పంచ్లకేకాకుండా పల్లెల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వార్డు సభ్యులకు అందాల్సిన సిట్టింగ్ ఫీజులు సైతం ఇవ్వకపోవడంతో అవి కూడా పెండింగ్లోనే పడినట్లు సమాచారం. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆరా తీస్తే వీరి గౌరవ వేతనం చెల్లింపునకు సంబంధించిన ఫైల్ సర్క్యులేషన్(ఒక అధికారిక పత్రాన్ని లేదా ఫైల్ను నిర్ణీత క్రమంలో వివిధశాఖలు లేదా అధికారుల పరిశీలన మరియు ఆమోదం కోసం పంపే ప్రక్రియ)లో ఉన్నదనే సమాధానం వస్తోంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్ గౌరవ వేతనాలు విడుదల చేయాలని, పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించాలని సర్పంచ్ల సంఘాలు కోరుతున్నాయి.అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రెండు నెలలుగా అందని గౌరవభృతికమిషనర్, కార్యదర్శికి వినతులు సమర్పించినా మారని తీరుసాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా గౌరవభృతి అందకపోవడంతో ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు ఇవ్వగా ఆ తర్వాత చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. కమిషనరేట్ కార్యాలయ అధికారుల వైఖరితో వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ నెల నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ విడుదలలో ఆలస్యం కావడంతో వేతనాల విడుదలలో జాప్యం జరిగినట్లు అధికారులు నచ్చజెబుతున్నారని, నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సంఘాల నేతలు మండిపడుతున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవ వేతన చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై సంఘాల నేతలు పలుమార్లు కమిషనరేట్, కార్యదర్శులకు వినతులు సమర్పిస్తూనే ఉన్నారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు టీచర్లు, హెల్పర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. 35,781 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 24,942 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 6,655 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో, 4,184 కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 62వేల మంది టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. -
ఊపిరాడక ఊరు.. మారాలి మన తీరు!
భాగ్యనగరం స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు చెట్లుచేమలు, చెరువులతో కళకళలాడిన హైదరాబాద్ ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్ను తలపిస్తూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ వలసలతో నలువైపులా శరవేగంగా విస్తరిస్తుండటంతో పచ్చదనం క్రమంగా తగ్గిపోతోంది. దీంతో ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం పెరుగుతున్నాయని, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం తీవ్రమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నగరం పశ్చిమం వైపు నిర్మాణాల సాంద్రత పెరగడంతో వేసవిలో ఇతర ప్రాంతాల కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు అధిక వేడి నమోదవుతోందని అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి నగరంలో ప్రజాజీవనం దుర్భరం అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మార్చాలంటే నగరవాసులు మొక్కలు నాటడమే కాకుండా నగరంలో అక్కడక్కడా మిగిలిన చెట్లు, చెరువులతోపాటు పట్టణ అడవులను కాపాడేందుకు తమ వంతు తోడ్పడాలని నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్2040 నాటికి హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉండాలంటే..» అర్బన్ ఫారెస్టులు పెంచాలి. ప్రతి కాలనీలో మినీ అర్బన్ ఫారెస్టును ఏర్పాటు చేయాలి.» చెరువుల రక్షణ అత్యవసరం. చెరువులచుట్టూ గ్రీన్ బఫర్ ఏర్పాటు చేయాలి.» గ్రీన్ రూఫ్స్,గ్రీన్ కారిడార్లు, వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలి.» వందేళ్ల వయసున్న ప్రతి చెట్టుకూ ప్రత్యేక రక్షణ కల్పించాలి.» ప్రతి పెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ సమతుల్యత తప్పనిసరి.చెట్టు విలువ ఇదీ..» ఒక పరిపక్వ చెట్టు ఏటా వందల కిలోల కార్బన్ను శోషిస్తుంది, ఆక్సిజన్ అందిస్తుంది. » చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గిస్తుంది» పక్షులకు నివాసం కల్పిస్తుంది » వర్షపు నీటి సంరక్షణకు దోహదం చేస్తుందినగరంలో మిగిలి ఉన్న హరిత ప్రాంతాలుకేబీఆర్ పార్కు, మహావీర్ హరిణి వనస్థలి పార్కు, మృగవని పార్కు, బొటానికల్ గార్డెన్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా, గోల్కొండ పరిసరాలు, కీసర అటవీ ప్రాంతంచెట్ల వల్ల ఉష్ణోగ్రత 10 డిగ్రీల దాకా తగ్గుతుందిచెట్లు వాయు, ధ్వని కాలుష్యాల్ని తగ్గిస్తాయి. ఆకులపై తేమ గాలిలోని ధూళి కణాలను పట్టుకుంటుంది. గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఎండ తీవ్రతను తగ్గిస్తుంది. చెట్టు నీడలో ఉష్ణోగ్రత దాదాపు 7 నుంచి 10 డిగ్రీల వరకు తగ్గుతుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది. – డా. డబ్ల్యూజీ ప్రసన్నకుమార్, తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ డైరెక్టర్నగరానికి కావాల్సిన పచ్చదనం ఎంత?ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వ్యక్తికి కనీసం 9 చదరపు మీటర్ల పచ్చదనం ఉండాలి. కానీ గ్రీన్ స్పేసెస్ ఇన్ ఇండియా సహా వివిధ అధ్యయనాల ప్రకారం హైదరాబాద్లో ఆయా కాలాల్లో ఒక్కో వ్యక్తికి గ్రీన్స్పేస్ ఇలా ఉంది. -
మీపై కుట్ర అవసరం వైఎస్సార్కు లేదు
సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనపై రాజకీయ కుట్ర చేశారని ఓ పోలీస్ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు. పవన్కల్యాణ్పై కుట్ర చేయాల్సిన అవసరం వైఎస్సార్కు లేదని, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్పై లేదా ఆయన కుటుంబ సభ్యులపై రాజకీయ కక్షతో కేసులు పెట్టినట్టుగా ఆధారాలు ఏవీ లేవని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి తన రాజకీయ వ్యూహాలను పోలీసు అధికారులతో పంచుకోవడం కూడా వాస్తవ దూరమని తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రస్తావించిన పోలీసు ఉన్నతాధికారి లై డిటెక్టర్ పరీక్షకు హాజరై వైఎస్సార్ అలాంటి వ్యాఖ్యలు చేశారని చెబితే, తాను, వైఎస్సార్ అభిమానులు కలిసి రూ.10 కోట్లను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లేదా పవన్ సూచించే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఆరోపణలపై నిజంగా విశ్వాసం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం పవన్ కల్యాణ్కు బహిరంగ లేఖ రాశారు. మీపై అంత ప్రజాభిమానం అప్పుడూ లేదు..‘కొంత మంది తెలంగాణ నాయకులు.. మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అని పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడం మీ హృదయాన్ని ఎంతో గాయపరిచిందని అర్థం చేసుకోగలను. అయితే జనం మెచ్చిన నాయకుడు వైఎస్సార్పై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు బాధపడతారు. రాజశేఖరరెడ్డి ఉంటే తమకు అన్యాయం జరగదని అనుకున్న వారి అచంచల విశ్వాసమే ఆయన లేనప్పుడు కూడా ఆ అభిమానాన్ని చూపిస్తున్నాయి. ప్రజల విశ్వాసం గెలుచుకున్న గొప్పదనం ఆయనది. 2005–06 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్కు అపార ప్రజాదరణ ఉండేది. అప్పట్లో రాజకీయాల్లో లేని మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేయాల్సిన అవసరం వైఎస్సార్కు లేదు. ఆ సమయంలో మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అప్పటికి మీరు, మీ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీపట్ల అప్పుడూ లేదు.. ఆ తర్వాత లేదన్నది సత్యం. మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019లో రెండుచోట్ల స్వయంగా పోటీ చేసి ఓడిపోవడం, 2023లో తెలంగాణ శాసనసభ, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలు. ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం తగని పని..’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
సీఎం బామ్మర్దిది రూ.15 వేల కోట్ల కుంభకోణం
చంచల్గూడ: సీఎం రేవంత్రెడ్డి బామ్మర్ది సృజన్రెడ్డి రూ.15 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆయన గురువారం చంచల్గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. సోలార్ టెండర్ల అంశం, నైనీ బొగ్గు టెండర్ల అవకతవకలను మాజీమంత్రి హరీశ్రావు వెలుగులోకి తెచ్చారని చెప్పారు.సింగరేణిలో ఉద్యోగ నియామకాలపై విజిలెన్స్ విచారణ చేపిస్తామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలతో కార్మికులు కలత చెందారన్నారు. కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే సుమన్ను జైల్లో పెట్టారని చెప్పారు. బాంబులు పెట్టి సీఎం అధికారిక భవనం ప్రగతి భవన్ను లేపేస్తామని గతంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారని, అది కూడా శిక్షార్హమేనన్నారు. హరీశ్రావుపై పెట్రోల్ పోసి తగులబెడతానని మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. ఇతరులకో న్యాయం, బీఆర్ఎస్ పార్టీ నాయకులకో న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో సుమన్పై 220 కేసులు పెట్టారని, ఇప్పుడు ఇంకా అక్రమ కేసులు పెట్టి రికార్డు బ్రేక్ చేసేలా ఉన్నారని చెప్పారు. తీయని 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును తీసినట్టు అవకతవకలకు పాల్పడి రూ.1,600 కోట్ల గోల్మాల్కు తెరలేపారన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు శ్రీనివాస్యాదవ్, సుధీర్రెడ్డి ఉన్నారు.పాతబస్తీలో సందడి చేసిన కేటీఆర్..చార్మినార్ (హైదరాబాద్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం పాతబస్తీలో పర్యటించారు. చంచల్గూడ జైల్లో తమ పార్టీ నాయకుడు బాల్క సుమన్ను పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు అలీ మస్కతీ తదితరులతో కలిసి అక్కడి నిమ్రా కేఫ్లో ఉస్మానియా బిస్కెట్లు తిని ఇరానీ చాయ్ తాగారు. తర్వాత ఆయన చార్మినార్ వద్ద పర్యాటకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్ను సందర్శించి, ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ని ఆస్వాదించాను’అని పేర్కొన్నారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు కేఫ్ సిబ్బందికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ నీళ్లు కర్ణాటకకు ధారాదత్తం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ తెలంగాణ నీటి వాటా ధారాదత్తం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో కర్ణాటకకు అదనపు వాటా లేకపోయినా రాయచూర్ వద్ద నిర్మిస్తున్న కోరకుంట ప్రాజెక్టుకు నీటి సరఫరాకు అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మెప్పు పొందేందుకే డీకే శివకుమార్ సీఎం కాగానే రేవంత్ ఈ బహుమతినిచ్చారని విమర్శించారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడడంతో..మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రధాన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నానని, రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి మాట్లాడదామా? అని అన్నారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ‘12 ఏళ్ల తెలంగాణ: ఆకాంక్షల సాధన– భవిష్యత్ ప్రయాణం’పై నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో రాంచందర్రావు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ నేతృత్వంలో సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుదీర్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా.. రామచందర్రావు మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే.. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలకు స్పష్టమైన పాలసీ లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కార్ రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంటూ ప్రకటనలు చేస్తోంది. తాగు, సాగునీటిపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే మన నీళ్లు ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కచ్చితంగా బీజేపీకి అధికారం కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ సమాజం అంశాన్నే ఎజెండాగా తీసుకోదు. అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. గతంలో ఒక్క వార్డులో కూడా గెలవని త్రిపురలో ఇంకా హర్యానా, అస్సాంలలో మూడేసి సార్లు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లలో గెలిచిన బీజేపీ తెలంగాణలోనూ గెలిచి డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ సాధనలో బీజేపీ చరిత్రాత్మకమైన పాత్రను పోషిస్తే, బీఆర్ఎస్, కాంగ్రెస్ సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ బిల్లు రూపకల్పన, సవరణల ప్రక్రియలో నేను ప్రత్యక్షంగా భాగస్వామినయ్యా. పార్టీ నేతల మధ్య విభేదాల్లేవు.. అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్సిటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని చెప్పి, ఆ తర్వాత తెలంగాణ వ్యతిరేకులను బీఆర్ఎస్లో చేర్చుకుని ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్ ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేయాల్సి రావడం దురదృష్టకరం. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్ ధర్మపురి సహా ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సోషల్ మీడియాలో ’కాక్రోచ్ జనతా పార్టీ’ లాంటి దు్రష్పచారాల వెనుక అర్బన్ నక్సల్స్ శక్తులు పనిచేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని రాజకీయ విధానాలు, అంశాలు, రాజకీయ ఎజెండా వేర్వేరుగా ఉంటాయి. వచ్చే జీహేచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎన్నికల విధానాలు, పొత్తులు వంటివి జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సభకు అనుమతినిస్తే సరిపోయేది. ఎలాంటి వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
ఆరు నెలల్లో ‘పాలమూరు’ నీరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్/సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నెలల్లో కర్వెన రిజర్వాయర్ వరకు నీరందించాలని చెప్పారు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను సత్వరంగా పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ప్రధాన భూసేకరణను వేగవంతం చేయాలని, ఈ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. గురువారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో అధికారులతో రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేగంగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. నార్లాపూర్, ఏదుల, కరివెన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాగా, వీటి లింకేజీకి సంబంధించి పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. నెలవారీగా ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నిధులతో పూర్తయ్యే పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. ఆరు నెలల్లోగా కరివెన రిజర్వాయర్ వరకు నీళ్లు అందించే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మరో 15 రోజుల తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానన్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తొలి రోజు చకచకా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం చకచకా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి పలు ప్రాజెక్టులను సందర్శించారు. కొడంగల్– నారాయణపేట– మక్తల్ ఎత్తిపోతలు, గుడ్డెందొడ్డి పంప్హౌస్ పనుల ప్రగతిపై స్వయంగా ఆరా తీశారు. కోయిల్సాగర్, కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బరాజ్ల ప్రతిపాదిత స్థలం, జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించిన అనంతరం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో రేవంత్రెడ్డి బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. హామీల అమలుకు కట్టుబడి... మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటిపారుదల రంగాన్ని మరింత బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా పురోగతిపై రేవంత్రెడ్డి ఒక్కో ప్యాకేజీలో పెండింగ్ పనులకు గత కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ పనులు నూరు శాతం పూర్తికాగా, ఏదుల రిజర్వాయర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వట్టెం రిజర్వాయర్ కట్ట పనులు పూర్తికాగా, ప్రస్తుతం కాంక్రీట్, రివిట్మెంట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల అంచనాలను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. కీలకమైన కాల్వల నిర్మాణంపై... గరిష్ట ప్రయోజనాల కోసం కీలకమైన కాల్వల నిర్మాణం పైనే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. నిధుల అవసరాలు, కాలపరిమితులతో కూడిన వాస్తవిక గడువులను సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారన్నారు. కోర్టు కేసుల్లో ఉన్నవి, పనులపై స్టే విధించిన వాటి విషయంలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులను మొదటి ప్రాధాన్యతగా భావించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. -
కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు
సాక్షి,హైదరాబాద్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. బీమా కృష్ణా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకోగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి లకు జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి వీక్షించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనులు పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన ఇరిగేషన్ అధికారులు. -
పిల్లర్కు పగుళ్లంటూ ప్రచారం.. ఖండించిన మెట్రో అధికారులు
సాక్షి,హైదరాబాద్: సోషల్ మీడియాలో మెట్రో పిల్లర్కు పగుళ్లు వచ్చాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు ఖండించారు. గురువారం అమీర్పేట్లో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో అక్కడి ప్రకటన బోర్డులు కాలిపోయాయి. ఆ బోర్డులలోని కెమికల్ లిక్విడ్ పిల్లర్పై పడడంతో మరకలు ఏర్పడ్డాయి. అవి పగుళ్లలా కనిపించడంతో కొందరు అపోహలు పడ్డారు.ఆ అపోహలపై అధికారులు వివరణిచ్చారు. బిల్బోర్డు కాలిపోవడం వల్ల వచ్చిన కెమికల్ మరకలు మాత్రమే పిల్లర్పై కనిపించాయి. వాస్తవానికి పిల్లర్కు ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదని స్పష్టం చేశారు. నిపుణుల బృందం తనిఖీలు నిర్వహించి, పిల్లర్ సురక్షితంగానే ఉందని నిర్ధారించింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, మెట్రో పిల్లర్లు బలమైన నిర్మాణ ప్రమాణాలతో నిర్మించబడ్డాయని భరోసా ఇచ్చారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని, మెట్రో సేవలు ఎప్పటిలాగే సురక్షితంగా కొనసాగుతున్నాయని వారు స్పష్టం చేశారు. -
మీ పిల్లలు తింటున్నది చాక్లెట్లు కాదు..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నకిలీ చాక్లెట్ల తయారీ కలకలం రేపింది. ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్లను తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీతారాంబాగ్లో నకిలీ, గడువు ముగిసిన చాక్లెట్ల తయారీ కేంద్రంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహించారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. భారీగా నిషేధిత, గడువు ముగిసిన చాక్లెట్ ఉత్పత్తులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు కొండ కార్తీక్ నిబంధనలకు విరుద్ధంగా చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాక్లెట్ ప్యాకెట్ల లేబుళ్లపై తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు ముగింపు తేదీ, 'బెస్ట్ బిఫోర్' వివరాలు ఏవీ లేకపోవడాన్ని అధికారులు నిర్థారించారు. మరింత లోతుగా పరిశీలించగా, చాక్లెట్ల తయారీలో గడువు ముగిసిపోయిన ఫ్లేవర్లు, ఎస్సెన్స్లు, వివిధ రకాల రంగు పొడులను నిల్వ ఉంచి వాడుతున్నట్లు గుర్తించారు.అలాగే సదరు సంస్థకు కొత్త ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ ఉన్నప్పటికీ.. పాత లైసెన్స్ నంబర్ వివరాలతో ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తేలింది. వీటితో పాటు, అక్కడ పనిచేసే సిబ్బందికి ఎలాంటి వైద్య ధృవీకరణ పత్రాలు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులను నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. -
హైదరాబాద్లో ఎబోలా కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. ఎబోలా లక్షణాలతో సూడాన్ దేశస్తుడు.. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరాడు. శాంపిల్స్ సేకరించిన అధికారులు పుణే ల్యాబ్కు పంపించారు. టెస్ట్ రిజల్ట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని.. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇప్పటికే నిబంధనలను జారీ చేసింది. ఇటీవలే ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచి పరిశీలిస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం
అమరావతి: ఎండలతో ఠారెక్కిపోతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వరుణుడు ఒక్కసారిగా ఉపశమనం కల్పించారు. ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా వర్షం కురిసింది. విజయవాడలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు తెలంగాణలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి నీరు చేరింది. అదేవిధంగా పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో మోస్తారుగా వానలు కురిశాయి. ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కొంతమేర ఉపశమనం కల్పించాయి.అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎండలు సైతం మండిపోయాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో44.7 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 43.8, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.7, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.6, కృష్ణా జిల్లా కంకిపాడులో 43.4, ప్రకాశం జిల్లా కొండపిలో 43, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఏం మాట్లాడుతున్నారు మీరు.. పవన్ మా పార్టనర్, అలా మాట్లడరు.. మీరే సృష్టించారు
-
తెలంగాణలో ఏం వాగుతున్నావ్!? పవన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ స్ట్రాంగ్ రియాక్షన్
-
అమీర్పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్జామ్
సాక్షి, హైదరాబాద్: అమీర్పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్పేట మెట్రో జంక్షన్కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది.అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్పేట నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.మెట్రో సేవలకు అంతరాయం!మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్ మెట్రో ట్రాక్కు సమీపంలో ఉండడం, పిల్లర్కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జనార్ ట్వీట్మైత్రివనం సిగ్నల్ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. ట్రాఫిక్ అలర్ట్!అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026 -
ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. గంజాయి సిండికేట్ గుట్టురట్టు
హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్స్ విభాగం ‘ఈగల్ ఫోర్స్’ (EAGLE Force) విజయవంతంగా ఛేదించింది. బ్యాంకాక్ కేంద్రంగా హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాలకు హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న భారీ సిండికేట్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మెరుపు దాడిలో భాగంగా అధికారులు కోట్లాది రూపాయల విలువైన 13 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న 40 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు.మూడు నెలల రహస్య ఆపరేషన్కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ భారీ ఆపరేషన్ను నిర్వహించింది. దాదాపు మూడు నెలల పాటు అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా సాగిన ఈ నిఘా ప్రక్రియలో డ్రగ్స్ ముఠా కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పసిగట్టారు. చివరకు పక్కా ఆధారాలతో ఉచ్చు బిగించి, అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా చైన్ను చేదించగలిగారు.చిక్కిన ప్రధాన సూత్రధారులు ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో కీలక పాత్ర పోషించిన సోధా మోసిన్ బహదూర్భాయ్, సోధా మోసిన్, హర్షద్ మన్సుఖ్భాయ్ ప్రజాపతి అనే ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుండి భారతదేశానికి ఈ మత్తు పదార్థాలను అక్రమంగా తరలించడంలో వీరు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.200 మందితో భారీ నెట్వర్క్ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన వివరాలను ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్, ఇతర భారతీయ నగరాలకు హైడ్రోపోనిక్ గంజాయిని సరఫరా చేసే ఈ నెట్వర్క్లో సుమారు 200 మంది వరకు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సిండికేట్లో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేశామని తెలిపారు. -
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
రండి దొర.. రండి.. ప్రకాశ్రాజ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్రాజ్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రకాశ్రాజ్ తాజాగా ఎక్స్ వేదికగా..‘మీరొస్తానంటె మేమొద్దంటామా?. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?. లేదా సింగల్గా వస్తున్నారా?. అది చెప్పి రండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking— Prakash Raj (@prakashraaj) June 4, 2026 -
తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
జై ఆంధ్రా అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వరు
సాక్షి, అమరావతి : ‘తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన ఉంది. తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉంటుంది. కానీ, ఆంధ్రా వాళ్లకు ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు’ అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జై ఆంధ్రా అంటే ఇక్కడి వాళ్లు కనెక్ట్ అవ్వరని చెప్పారు. బుధవారం ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి రాజధాని ప్రాంతం శాఖమూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తానెప్పుడూ తెలంగాణ–ఏపీ విభజనను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో తాను అంత గట్టిగా మాట్లాడడం వెనుక ఎలాంటి ముందస్తు ప్లాన్ లేదని చెప్పారు. తాము సభ పెట్టుకుంటామంటే అడ్డుకోకూడదు కదా.. అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అదంతా ఎవరో ఒకరు కూర్చొని చేసింది కాదు కానీ, చిలికి చిలికి గాలివానగా మారిందన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకొని చేసిందని, రేవంత్రెడ్డి చేశారని నేను అనుకోను. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలి. కేటీఆర్తో నాకు మంచి సంబంధాలున్నాయి’ అని చెప్పారు.రాష్ట్రంలో ఎన్నెన్నో కులాల సంఘాలు ఏర్పాటు అవుతున్నాయని, అయితే వాటి వల్ల ఆ సంఘ నాయకులు బాగుపడుతున్నారేమో తెలియదు గానీ, ఆ కుల ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ‘గత ముఖ్యమంత్రి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటూ రాజధాని ప్రాంతాన్ని ఇంకా పెంచారు. మూడు జిల్లాలు కలిపి రాజధాని అంటున్నారు. అంతా చేయాలంటే ఎప్పటికి సాగుద్ది.. రాజధాని రాత్రికి రాత్రే పూర్తవదు. హైదరాబాద్లో ఇంకా జరుగుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదు. అయినా అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానిని ముందుకు తీసుకెళ్లాలి’ అని చెప్పుకొచ్చారు. -
పిండం 'పొల్యూషన్' గండం
సాక్షి, హైదరాబాద్: నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం గర్భస్థ శిశువుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పీఎం 2.5, పీఎం 10 ధూళి కణాలు గర్భాశయ పొరను దాటి లోపలికి ప్రవేశిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్త పరిశోధనలో తేలింది. ఈ సూక్ష్మ ధూళి కణాలు పిండం ఎదుగుదలలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఐజీఎఫ్బీపీ3 అనే ప్రొటీన్ ఉత్పత్తిని నిరోధిస్తున్నాయని గుర్తించింది. ఫలితంగా తల్లి నుంచి పిండానికి అందాల్సిన పోషకాలు నిలిచిపోతున్నాయని, దీంతో పిండం శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావం బాల్యం ముగిసే వరకు ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలకు నిర్వహించే వైద్య పరీక్షల్లో పొల్యూషన్ మానిటరింగ్ను భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ అధ్యయనం స్పష్టం చేస్తోంది.జన్యువుల పనితీరుపై...ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగం సంయుక్తంగా వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, తక్కువ కాలుష్యం ఉన్న జార్ఖండ్లోని దేవ్గఢ్ పట్టణాల్లో మొత్తం 994 మంది గర్భి ణీలపై అధ్యయనం చేసింది. ప్రసవ నివేదికల ఆధారంగా చూస్తే ఢిల్లీలో పీఎం 2.5 ప్రభావంతో పుట్టే పిల్లలు త క్కువ బరువుతో జన్మించారు. గర్భధారణ సమయంలో రక్తపో టు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గర్తించారు. పుట్టిన పిల్లలు నడవడంలో సమన్వయ లోపం, విపరీతమైన ఆందోళన, ఒత్తిడి, నరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించాయని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల జన్యు వుల పనితీరు శాశ్వతంగా దెబ్బతింటున్నట్లు అధ్యయనంలో తేలింది. మనుషులతోపాటు ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మరింత ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో ఎలుకల్లో పుట్టే పిల్లల సంఖ్య 25 శాతం తగ్గింది.గ్రేటర్లో కాలుష్య కోరలు వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ మహానగరం ఢిల్లీతో పోటీపడుతోంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 50 ఉండాల్సి ఉండగా, హైదరాబాద్లో 150 నుంచి 300 మధ్య నమోదవుతోంది. ఢిల్లీలో ఏక్యూఐ 250 నుంచి 450 మధ్య ఉంటోంది. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో హైదరాబాద్ కాలుష్య గణాంకాలు నమోదయ్యాయి. 2026 ఫిబ్రవరి 14 రాత్రి 8.31 గంటల సమయంలో మణికొండ ప్రాంతంలో ఏక్యూఐ 2,063గా నమోదైంది. వాయుకాలుష్యం వల్ల నగరంలో సామాన్య వ్యక్తుల్లోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.


