Telangana
-
ఎస్సెస్సీ.. ఇంజనీర్!
ముదిగొండ: చదివింది పదో తరగతే... కానీ చిన్నతనం నుంచే ఇంజనీర్ కావాలన్న పట్టుదలను మాత్రం వీడలేదు. ఓ రైస్ మిల్లు మెకానిక్ వద్ద కొన్నేళ్లు పని నేర్చుకుని.. ఆతర్వాత సొంతంగా చిన్నచిన్న మరమ్మతులు చేయ డం మొదలుపెట్టాడు. ఆపై సొంతంగా కొత్త రైస్ మిల్లుల్లో పరికరాలు బిగించే స్థాయికి చేరాడు. ఒకటి కాదు రెండు కాదు 33 ఏళ్ల కాలంలో 110 మంది రైస్ మిల్లుల ఏర్పాటులో భాగంగా పంచుకున్న వ్యక్తి విజయగాథ ఇది. మిత్రులను చూస్తూ..ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన తునికిపాటి సుధాకర్ పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఆతర్వాత ఆయన పదో తరగతి మెమో పోయింది. డూప్లికేట్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆయన స్నేహితులు ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ విద్య మొదలుపెట్టారు. అయినప్పటికీ ఉన్నత విద్య చదవాలనే పట్టుదల వీడని సుధాకర్ ఎలా ముందుకు సాగాలా అని ఆలోచనలో పడ్డాడు. ఇంటర్ పాస్ అయి, బీటెక్ చదవాలంటే నాలుగేళ్లు పడుతుంది. ఆతర్వాత ఎంచుకున్న విభాగం లోనూ స్థిరపడాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. కానీ సుధాకర్కు మెకానికల్ ఇంజనీర్ కావాలని ఉండటం, చదివే పరిస్థితులు లేక తొలుత రైస్ మిల్లు మెకానిక్ వద్ద శిక్షణ ఆరం భించాడు. కొన్నేళ్లు ఆయన శిక్షణ రాటుదేలాక సొంతంగా మరమ్మతులు చేయడం మొదలుపెట్టాడు.కొత్త మిల్లులపై దృష్టిచాన్నాళ్లు రైస్ మిల్లు మరమ్మతుల రంగంలో పనిచేసిన సుధాకర్ నైపుణ్యం సాధించాడు. ఆతర్వాత కొత్త మిల్లుల ఏర్పాటుపై దృష్టి సారించాడు. ఇలా 33 ఏళ్లలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో 110 మిల్లుల ఏర్పాటులో భాగం పంచుకున్నాడు. ఏ స్థాయి మిల్లు అయినా సరి యజమానుల సూచనలతో కావాల్సిన విడిభాగాలు తెప్పించడం.. చకచకా రోజుల వ్యవధిలోనే మిల్లులు సిద్దం చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. విడిభాగాలు తెప్పిం చడం, అమర్చడం, విద్యుత్, వెల్డింగ్ ఇలా అన్నీ ప్రక్రియల్లో నైపుణ్యం సాధించినా సహాయకులతో కలిసి నెలలోగా మిల్లును సిద్ధం చేస్తుండటం విశేషం. అంతేగాక తాను అమర్చిన మిల్లుల్లో ఏ సమస్య వచ్చినా త్వరగా మరమ్మతు చేసి పనులు ఆగకుండా చూస్తుండటంతో పలు జిల్లాల్లో పేరు సాధించాడు.ఎక్కడెక్కడ..?: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ రైస్ మిల్లు షెడ్డులో పరికరాలు జిల్లాల్లోనే కాక ఏపీలోని పలు ప్రాంతాల్లో సుధాకర్ రైస్ మిల్లులు సిద్ధం చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో రైస్ మిల్లుల ఏర్పాటులో భాగం పం చుకున్నాడు. మిల్లుల ఏర్పాటుకు కావాల్సిన పరికరాలను విజయవాడ, బెంగళూరు, చైన్నై, హైదరాబాద్లో యజమానులతో తెప్పించి.. సామర్థ్యం మేరకు రోజుల వ్యవధిలోనే మిల్లులను సిద్ధం చేస్తుంటామని సుధాకర్ తెలిపారు.మూడు మిల్లులు సుధాకర్తోనే..2004లో పాల్వంచ సమీపాన పాండురంగాపురం, 2015లో తోడేళ్లగూడెం, 2023లో మిట్టపల్లిలో మూడు రైస్ మిల్లులు ఏర్పాటుచేశాం. ఈ పనులన్నీ సుధాకర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. మిల్లుల ఏర్పాటు పనులే కాక ఏ చిన్న మరమ్మతు వచ్చినా చేస్తాడు. తద్వారా మాతో పాటు రైతులకు ఇక్కట్లు లేకుండా పనులు సాగుతున్నాయి.- ఇలవల సంజీవరెడ్డి,పొందురంగాపురం, పాల్వంచ మండలం -
ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...
నెహ్రూసెంటర్: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ (32) ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.సంతోషం.. మరునాడే విషాదంమృతుడు క్రాంతికుమార్ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...క్రాంతికుమార్కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.ఇనుగుర్తిలో ఘటన...జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లో ఆస్పత్రికి తరలించారు. -
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, ఏదులాపురం, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి(సోమవారం) కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీపై స్పష్టతనిస్తామని తెలిపారు.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలంటూ ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు.రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తాం. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది. రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని.. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి’’ అని పొంగులేటి చెప్పారు. -
బీజేపీలోకి స్వప్న?
తాండూరు: మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ కాంగ్రెస్ను వీడి కాషాయదళంలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది తాండూరులో హాట్టాపిక్గా మారింది. పలువురు మాజీ కౌన్సిలర్లు సైతం స్వప్న బాటలో నడవనున్నట్లు సమాచారం.మహేందర్రెడ్డి వర్గం నుంచి..2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పట్నం మహేందర్రెడ్డి వర్గం నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా స్వప్న రేసులోకి వచ్చారు. మరో వైపు ఇదే పార్టీ నుంచి రోహిత్రెడ్డి వర్గం తరఫున పట్లోల్ల దీపనర్సింహులు చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేశారు. 36 వార్డులున్న తాండూరులో మహేందర్రెడ్డి వర్గీయులు ఎక్కువమంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. దీంతో చైర్పర్సన్ కుర్చీ కోసం పోటీ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నాయకులు కల్పించుకుని, చైర్పర్సన్ పదవీకాలాన్ని ఇద్దరూ చెరి సగం పంచుకోవాలని సూచించారు. మొదటిసారి స్వప్నకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో దీపకు వైస్ చైర్పర్సన్ కుర్చీ ఇచ్చి బుజ్జగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పదవీ కాలమంతా స్వప్ననే కొనసాగారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ప్రతీసారి గొడవలే జరిగాయి.రాష్ట్ర కమిటీ ఎన్నిక తర్వాతే..గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వప్న కాంగ్రెస్లో చేరారు. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆమెకు ఆహ్వానం ఆగిపోయింది. ఈ విషయమై తన సన్నిహితుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కమిటీ నియామకం తర్వాతే కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. -
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఎన్నికల షెడ్యూల్పై చర్చ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సోమవారం(రేపు) మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కానుంది. కేబినెట్ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.మరోవైపు.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సోమవారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే గడువుందని.. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని చెప్పారు. -
బాసరలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి
సాక్షి, నిర్మల్: బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. -
గ్రాండ్గా గద్దర్’ అవార్డ్స్ వేడుక.. పురస్కారాలు అందుకున్నది వీళ్లే (ఫోటోలు)
-
ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
సనత్నగర్(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్స్లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోటి తారల వీణ... సినీ తెలంగాణ
తారలు తళుకులీనాయి... నింగిలోని నక్షత్రాలు కూడా తొంగి చూశాయి. అశ్వత్థామలు, లక్కీ భాస్కర్లు, పుష్పరాజ్లు, ఇది చిన్న కథ కాదు అన్నట్టుగా మాదాపూర్ హైటెక్స్కు అరుదెంచారు. అలనాడు ఇంటింటా వెలిగిన జయప్రద, జయసుధ, సుహాసినిలను వేదిక మీద చూసి గృహిణిలు తెగ ముచ్చటపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఈ వేడుకకు కర్త, కర్మలై శోభ తెచ్చారు. ఆటలు, పాటలు, కళాప్రదర్శనలు...చూడ్డానికి వెండితెర చాలదు! అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాజమౌళి...చుక్కల్లో చందమామలుగా అభిమానులను అలరించారు. ఇంతకాలం ఎదురుచూసిన సినీ అవార్డుల వేడుకకు తెలంగాణ ప్రభుత్వం పదింతలు అట్టహాసం కలిపి నభూతో అన్నట్టుగా నిర్వహించింది. చిత్రమాలికను చిత్తగించండి...ఇది సినిమా అవార్డ్స్ గనక సరదాగా ఓ డైలాగ్ చెబుతా అంటూ... ‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా... గంగమ్మ జాతరలో యేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప..పుష్పరాజ్..అస్సలు తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలోని డైలాగ్ చెప్పి, అల్లు అర్జున్ అలరించారు. ‘‘ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి భట్టిగారికి, ‘దిల్’ రాజుగారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్గారు లేక పోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. డార్లింగ్... ఐ లవ్ యూ. ఈ అవార్డు ప్యూర్గా మీ విజన్. ‘పుష్ప’ నిర్మాతలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు టీమ్ అందరికీ ధన్యవాదాలు. రాజమౌళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే... మీరు ఆ రోజు ‘పుష్ప 1’ సినిమాను హిందీలో రిలీజ్ చేయమని చెప్పక పోయి ఉంటే, ఈ రోజు ఇంతటి రేంజ్ ఉండేది కాదు. ధన్యవాదాలు సార్. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డు. ‘పుష్ప 2’ గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ (ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ..)కి థ్యాంక్స్.– నటుడు అల్లు అర్జున్కళామతల్లి ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా గౌరవించి అవార్డులివ్వడం సంతోషం. ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సం పాదించుకున్నారు గద్దర్ అన్న. ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా అవార్డులిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ప్రారంభించాం. ఎంతోమంది ఈ అవార్డుని పొందారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ కొడుకుగా నాన్నగారి అవార్డుని తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా నాకు ఇచ్చిన పది లక్షల నగదును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పతిక్రి ఇచ్చినట్లు భావిస్తున్నాను. ఇందుకు రేవంత్ అన్నకి థ్యాంక్స్. – నటుడు నందమూరి బాలకృష్ణ (ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు) గద్దరన్న పేరు మీద ఈ అవార్డులు ప్రారంభించడం, సినిమా ఇండస్ట్రీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ అవార్డులివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా గర్వకారణమైన మూమెంట్. మహబూబ్నగర్లో పుట్టిన పిల్లోణ్ని.. కాంతారావుగారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అనేది ఆయనకు నిజమైన నివాళి. ఈ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తిని నేను అయినందుకు చాలా బాధ్యతగా భావిస్తున్నాను.. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. ఈ అవార్డు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కగారికి, ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్’’.– నటుడు విజయ్ దేవరకొండ (కాంతారావు ఫిల్మ్ అవార్డు)పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతోంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ జ్యూరీ వారు సెలెక్ట్ చేశారు. బెస్ట్ ఫిల్మ్ను సెలెక్ట్ చేయడానికి జ్యూరీ అన్ని సినిమాలు చూసింది. నేషనల్ అవార్డ్ పొందిన సినిమాలు, రివ్యూస్ వచ్చిన సినిమాలు, కమర్షియల్గా బాగా ఆడిన సినిమాలు... ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలుగా జ్యూరీ సెలెక్ట్ చేసింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి ప్రతి సినిమాకి నాలుగు అవార్డులు ఇవ్వడానికి జ్యూరీ కమిటీ అడగడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈరోజు ఆ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే 2024లో అద్భుతంగా, కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలను జ్యూరీ సెలెక్ట్ చేయడం, వారికి కూడా ఈ రోజు అవార్డులు ఇచ్చుకోవడం ఆనందకరం.– ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజుఎన్ని అవార్డులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇండస్ట్రీకి మొదటి నుంచీ చాలా ప్రత్యేకం. ఈ అవార్డుల కోసం వేచి చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిగారు, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు థ్యాంక్స్. మమ్మల్ని ప్రోత్సహించడానికి గద్దర్గారి పేరుమీద ఈ అవార్డులు పెట్టడం ఆనందంగా ఉంది. – దర్శకుడు సుకుమార్ (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు)గద్దర్గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీ దేవి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. – సంగీత దర్శకుడు కీరవాణిఎక్కడెక్కడ ఏం సాధించినా మన నేల మీద, మన వాళ్ల మధ్య ఇలాంటి గౌరవం పొందడం ఎప్పటికీ మరచి పోలేని విషయం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. – రచయిత చంద్రబోస్గద్దర్ పేరుపై ఫిల్మ్ అవార్డ్స్ను ఇవ్వడంతో పాటు గద్దర్ ఫౌండేషన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల రూ పాయలను మంజూరు చేశారు. గద్దర్ తనయుడు, గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యకిరణ్ గద్దర్ ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్ను స్వీకరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ గద్దర్ మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కగారికి, రాష్ట్ర మంత్రులు, అవార్డులు స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ అభినందనలు. రేవంత్ అన్నగారి ఆధ్వర్యంలో 31 జనవరి 2024న గద్దర్ ఫౌండేషన్ ని ప్రకటించడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డిగారు ప్రామిస్ చేసినట్లుగానే ఈ అవార్డు వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నాన్నగారి సాహిత్యం, నాన్నగారి విలువలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్ కి రూ. 3 కోట్లు కేటాయించడాన్ని ఫౌండేషన్ తరఫున మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు సార్... ప్రతి సంవత్సరం మీరు చేపడుతున్న కల్చరల్‡అండ్ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్కి స్థలం కేటాయిస్తున్నట్లుగా నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్.. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలు (గద్దర్), సినిమా వేడుకలు కూడా అక్కడే చేసుకుందామని కోరుతూ, మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు, భట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను’’ అన్నారు.‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు సాధించిన సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్లను ప్రత్యేకంగా సన్మానించారు -
పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్ సంపాదకులు అన్నారు.ఇటీవల ఏపీలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్రావు, ట్రెజరర్ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్ సంపాదకులుపత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. - టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులుమీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్ ,సంపాదకులు మన తెలంగాణకక్ష సాధింపునకు పరాకాష్ట సాక్షి టీవీ డిబెట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షిఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతానంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులుపాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. - కె.శ్రీనివాస్, సీనియర్ సంపాదకులుసుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్ బాబు,సీనియర్ సంపాదకులుపత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు. - దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసింది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్, సంపాదకులుకలిసి ఉంటేనే మనుగడవ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్ -
ఇంటి కాంపౌండ్లోకి చిరుత
కల్హేర్(నారాయణఖేడ్)/ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామంలో ఓ ఇంటి కాంపౌండ్లోకి శనివా రం ఉదయం చిరుత చొరబడటం స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీ పేట గ్రామానికి చెందిన కల్హేర్ మండల మాజీ జెడ్పీటీసీ స్వప్న భర్త గుండు మోహన్ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంటి కాంపౌండ్ గేటు గొళ్లెం వేసి బయటకు వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఇంట్లోని సీసీటీవీని పరిశీలిస్తున్న క్రమంలో చిరుత వెళ్లడాన్ని గుర్తించారు.ఫుటేజీని రికార్డు చేసి ఫోన్లో గుండు మోహన్కు పంపించగా అది చిరుత పులిలా ఉందని, తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. సమాచారాన్ని గుండు మోహన్ గ్రామస్తులకు చేరవేయగా వారు ఇంటి పరిసరాల్లో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిరుత ఇంటి వెనుక కాంపౌండ్ నుంచి దూకి వెళ్లిపోయింది. కాగా, ఘటనా స్థలాన్ని మెదక్ డీఎఫ్ఓ శ్రీధర్రావు పరిశీలించారు. చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. -
బతికుండగానే శ్మశానవాటికకు..
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవచ్ఛవంలా మారగా అతడిని అద్దె ఇంట్లోకి రానీయలేదు ఆ ఇంటి యజమాని. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు అతడిని శ్మశానవాటి కకు తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని ఎస్సీ కాలనీకి చెందిన రంగు గోపినాథ్ (45) స్థానిక నందికూడలి వద్ద టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లి సుజాత, ఆమె కుమారుడు అభిషేక్తో కలిసి ఏడాదికాలంగా ఎస్సీ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.కొన్ని రోజుల క్రితం గోపి అనారోగ్యం బారిన పడ్డాడు. కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వారం క్రితం గోపి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కరీంనగర్లో చికిత్స చేయించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. అప్పు చేసి రూ.50 వేల వరకు ఖర్చు పెట్టినా అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బతకడం కష్టమని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో గోపిని తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు. అయితే జీవచ్ఛవంలా ఉన్న గోపిని ఇంట్లోకి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు కొన ఊపి రితో ఉన్న అతడిని ముందుగా శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు. దయ చూపిన మున్నూరుకాపు సంఘం..శ్మశాన వాటిక వద్ద పడుకోబెట్టిన గోపి పరిస్థితిని గమనించిన మున్నూరుకాపు సంఘం వారు సంఘం భవనంలో ఆశ్రయమి చ్చారు. గోపి దీనస్థితిని తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణ సాయం కింద రూ.10 వేలు, బీజేపీ నాయకుడు దామెర రాంసుధాకర్ రూ.10,500 ఆర్థిక సాయాన్ని అందించారు. -
రక్తదాతల సేవ అమోఘం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ సేవనే ప్రజల జీవి తాన్ని కాపాడుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్క రించుకుని శనివారం రాజ్భవన్లో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రక్తదానం చేయడం సేవగా గుర్తించాల న్నారు. రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలి పారు. అత్యవసర సమయాల్లో రక్తం కావాల్సిన వారికి ఈ దాతలు ఇచ్చిన రక్తం ఎంతో ఉపయోగ పడుతుందని వ్యాఖ్యానించారు.స్వచ్ఛంద రక్త దానం చేసే వారిని, వారిని మోటివేట్ చేసిన వారిని గవర్నర్ అభినందించారు. డాక్టర్లు, రెడ్క్రాస్ వలంటీర్లు రక్తాన్ని సురక్షితంగా తీసుకోవడమేకాక, భద్రపరచడాన్ని ప్రశంసించారు. ఈ రక్తదానంలో రాజ్భవన్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాలు పంచుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. రక్తదానం చేసిన వారికి, ఎన్జీవో సంఘాలకు సర్టిఫికె ట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
గిరిజన బిడ్డ ‘వీల్’ పవర్
సంస్థాన్ నారాయణపురం: మారుమూల తండాలో పుట్టి పెరిగిన గిరిజన బిడ్డ సరిత.. ప్రగతి రథం స్టీరింగ్ పట్టి చరిత్ర సృష్టించింది. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్స్టాప్ బస్సు నడిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన వి.రాంకోటి, రుక్కల కుమార్తె సరిత అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో కుటుంబ బాధ్యతను తీసుకుంది.ఈ క్రమంలో ఆటో నడపడం నేర్చుకుంది. ఐదేళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. అనంతరం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపింది. రెండేళ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయగా, సరిత ఒక్కతే ఎంపికైంది. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్గా గుర్తింపు పొందింది. ఆమె ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చేస్తూ రోజూ 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం: తెలంగాణలో ఉద్యోగావకాశం కల్పించాలంటూ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి సరిత తీసుకెళ్లింది. కోమటిరెడ్డి సిఫార్సు మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఉద్యోగం సాధించింది. ఎంజీబీఎస్ డిపోలో పోస్టింగ్ ఇచ్చారు. -
ఆపరేషన్ సిందూర్తో వాయుసేన శక్తి చూపాం
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ భారత వైమానిక దళ సత్తాకు నిదర్శనంగా నిలుస్తుందని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (సీఏఎస్) ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. శత్రువును కచ్చితత్వంతో దెబ్బకొట్ట గలమని నిరూపించామని, భారత వాయుసేన సామర్థ్యాన్ని ఈ ఆపరే షన్లో ప్రదర్శించామని ఆయన పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన 254 మంది ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల ఫ్లైట్ కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసు కున్న సందర్భంగా దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) లో శనివారం ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న కేడెట్లకు రాష్ట్రపతి కమిషన్ను(అధికారిక బ్యాడ్జీలను) ప్రదానం చేశారు. వీరితోపాటు భారత నౌకాదళం నుంచి తొమ్మిది మంది అధికారులు, కోస్ట్గార్డ్స్ నుంచి ఏడుగురు, వియత్నాం నుంచి ఒకరు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు పతకాలు అందజేశారు. అనంతరం ఏపీ సింగ్ కేడె ట్లను ఉద్దేశించి మాట్లాడుతూ, యువ అధికారులు దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశానికి ఏదైనా ముప్పు సంభవించినప్పుడు దానిని ఎదుర్కోవడానికి మొదటి వరుసలో భారత వాయుసేన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తాను భారత వాయుసేనలో చేరి శుక్రవారంతో 40 ఏళ్లు పూర్తయినట్టు ఏపీ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువ అధికా రులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వాయుసేన అధికారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్ష ల్ పీకే వోహ్రా ఇతర ఎయిర్ఫోర్స్ అధికారులు, కేడెట్ల కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. -
నీట్ యూజీ తెలంగాణ టాపర్ కాకర్ల జీవన్సాయి
సాక్షి, హైదరాబాద్/అమరావతి: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ ప్రవేశ, అర్హత పరీక్ష (నీట్–యూజీ)లో రాజస్తాన్కు చెందిన మహేశ్కుమార్ జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర టాపర్గా కాకర్ల జీవన్ సాయికుమార్ మెరిశాడు. అతడికి జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ టాపర్గా నేషనల్ 19వ ర్యాంకు సాధించిన కార్తీక్ రామ్కిరీటి నిలిచాడు. నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. టాప్ వంద లోపు తెలంగాణ నుంచి 5 మంది, ఏపీ నుంచి ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిలో మొత్తంగా బాలుర కంటే బాలికలే అధికంగా ఉన్నప్పటికీ టాప్ 10 ర్యాంకుల్లో 5వ ర్యాంకు సాధించిన ఢిల్లీ విద్యార్థిని అవికా అగర్వాల్ ఒక్కరే బాలిక ఉండటం గమనార్హం. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ–2025 పరీక్షను ఎన్టీఏ మే 4న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 22.76 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 22,09,318 మంది పరీక్ష రాశారు. వారిలో 12,36,531 మంది అర్హత సాధించారు. టాప్ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా జనరల్ కేటగిరీవారే. వచ్చే నెలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి 72,094 మంది నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 70,259 మంది పరీక్ష రాశారు. వీరిలో 41,584 మంది అర్హత సాధించారు. అంటే 59.2 శాతం మంది అర్హత సాధించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే తక్కువే. నీట్–యూజీ 2024లో 77,848 మంది పరీక్ష రాయగా, 47,356 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో కూడా 2024 కన్నా 2025లో పరీక్ష రాసిన వారు, అర్హత సాధించినవారు తక్కువగానే ఉండడం గమనార్హం. తెలంగాణ నుంచి నేషనల్ టాప్ 100 ర్యాంకుల్లో కాకర్ల జీవన్ సాయికుమార్ (18), షణ్ముఖ నిశాంత్ అక్షింతల (37), మంగరి వరుణ్ (46), యండ్రపాటి షణ్ముఖ్ (48), బిదిష మజీ (95) ఉన్నారు. కాగా, జాతీయ స్థాయిలో టాప్ 20 మహిళా టాపర్లలో తెలంగాణ నుంచి బిదిష మజీ తోపాటు 108వ ర్యాంకు సాధించిన బ్రాహ్మణి రెండ్లకు స్థానం లభించింది. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) కేటగిరీలోని టాప్ 10లో 46వ ర్యాంకు సాధించిన మంగరి వరుణ్కు చోటు దక్కింది. టాప్–10 ఎస్సీ కేటగిరీలో 147 ర్యాంకు సాధించిన రెడ్డిమల్ల శ్రీశాంత్ ఉన్నాడు. టాప్ 10 ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 377 ర్యాంకు సాధించిన పుజారి హాసిని, 1,178 ర్యాంకు సాధించిన బానోత్ ధీరజ్ కుమార్ ఉన్నారు. ఏపీ నుంచి 36,776 మంది అర్హత నీట్ యూజీ–2025లో ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్–100లో ఆరు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఏపీ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసుకోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్ రామ్ కిరీటి రాష్ట్ర టాపర్గా నిలిచాడు. కొడవాటి మోహిత్ శ్రీరామ్ (56), దేశిన సూర్యచరణ్ (59), పొదిలపు అవినాష్ (64 ఓబీసీ), యర్రా సమీర్ కుమార్ (70 ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్ (92 ఓబీసీ) 100 లోపు ర్యాంకులు సాధించారు.వీరుగాక కారుమంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు 56 వేలు, ప్రైవేటు కాలేజీల్లో 52 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఏపీలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6,500 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 15 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర కోటా కింద భర్తీ చేస్తారు. 686 మార్కులకు మొదటి ర్యాంకు నీట్ యూజీ–2025 పరీక్ష మొత్తం 720 మార్కులకు నిర్వహించగా, 651 నుంచి 686 మధ్య మార్కులు వచ్చిన వారు 73 మంది ఉన్నారు. అంటే జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చిన రాజస్తాన్కు చెందిన మహేశ్ కుమార్కు 686 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం అర్హత సాధించినవారిలో 7.2 లక్షల మంది బాలికలు ఉండగా, 5.14 లక్షల మంది బాలురు ఉన్నారు. కార్డియాలజిస్ట్ లేదా స్కల్ సర్జన్ అవుతాతొమ్మిదో తరగతి నుంచే న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే వాడిని. అదిప్పుడు నెరవేరుతోంది. న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం పీజీ కార్డియాలజీ లేదా స్కల్ సర్జన్ రెండింటిలో ఒకటి చేసి వైద్య సేవలందించడమే నా లక్ష్యం. మా నాన్న డాక్టర్ డీఎస్ అరుణ్కుమార్ ఈఎన్టీ సర్జన్. అమ్మ లత గృహిణి. – డి. కార్తీక్రామ్ కిరీటి, ఆలిండియా ఓపెన్ కేటగిరీ 19వ ర్యాంకు, రాజమహేంద్రవరం -
అర్థం చేసుకోరూ..!
ఇంటర్నెట్ తెచ్చిన మార్పులతో 10, 12 ఏళ్లలోపు పిల్లలకే పెద్దలకు సంబంధించిన విషయాలు తెలిసొస్తున్నాయి. ఒక వయసు వచ్చేటప్పటికే గర్ల్/బాయ్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఉండాలనే ధోరణి ఏర్పడుతోంది. అయితే, టీనేజీలో వచ్చే మార్పులకు సంబంధించి భావోద్వేగపరంగా ఇతరత్రా మార్పు లపై మన విద్యా విధానంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగడం లేదు. శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో, భావోద్వేగ ఆరోగ్యమూ అంతే ముఖ్యం. యువతకు ఆరోగ్యకర సంబంధాలను బలంగా ఏర్పరచే శక్తిని ఇవ్వాలంటే విద్య కూడా మార్గదర్శకంగా మారాలని నిపుణులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: స్నేహం మొదలుకొని ప్రేమ వరకు... దీని పరిధిలో ప్రభావం చూపే అంశాల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల అభిప్రాయం, స్పందన–ప్రతిస్పందన ఎలా ఉండాలన్న దానిపై చాలామందికి అంటే మరీ ముఖ్యంగా జెన్–జెడ్ (జనరేషన్ జెడ్)గా పిలిచే నేటి యువతరానికి అవగాహన ఉండటం లేదు. స్నేహం, ప్రేమ, రిలేషన్షిప్లో చిన్నపాటి వైఫల్యం ఎదురైనా లేదా అలాంటి భావన కలిగినా అది మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. తిరస్కరణ పెను విపత్తుగా గోచరిస్తోంది.ఇది డిప్రెషన్, ఆత్మహత్యలు లేదా హింసకు పురిగొల్పుతోంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఇలాంటి అనేక ఘటనలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సంబంధాల ప్రభావం, భావోద్వేగ నైపుణ్యాల అవసరం విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తించగా.. ఢిల్లీ వర్సిటీ ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకుండా, విద్యాపరంగా ఓ కోర్సు రూపంలో పరిష్కరించేందుకు ముందుకు రావడం విశేషం.భావోద్వేగాల అవగాహనపై ముందడుగు..⇒ ప్రేమించడం ఒక్కటే కాదు, ప్రేమను ఒప్పించుకోవడం, అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవంతో నడిపించడమూ ఓ కళే. గందరగోళ ప్రపంచంలో జీవిస్తున్న జెన్–జెడ్ తరానికి, ఢిల్లీ యూనివర్సిటీ ‘నెగోషి యేటింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్’ అనే ఓ విశిష్టమైన కోర్సును అందుబాటు లోకి తెచ్చింది. ఈ కోర్సు ఒక గైడెన్స్ వ్యవస్థలా పనిచేస్తుందని కౌన్సెలర్లు, విద్యావేత్తలు, నిపు ణులు చెబుతున్నారు. జెన్–జెడ్ తరానికి అనుభవజ్ఞుల మార్గదర్శ నం కల్పించడం, భావోద్వేగ అవగాహన పెంపొందించడంలో ఇది ఓ ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...⇒ బాడీ ఇమేజ్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ వంటి అంశాలు సంబంధాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ⇒ నేటి విద్యార్థులు గత తరం కంటే చాలా వ్యక్తిగత ధోరణిలోకి వెళ్లారు. భావోద్వేగాలపై కోర్సులు వారిని అంతర్గతంగా మారుస్తాయి. ⇒ యువత నుంచి ‘నేను ఇష్టపడే వ్యక్తిని ఎలా అప్రోచ్ కావాలి?’, ‘వాళ్ల తల్లిదండ్రులను కలిసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధాలను నిర్మించుకోవడం, నమ్మకం పెంపొందించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి అంశాలను నేర్పే కోర్సులు తప్పనిసరిగా మారాయి.⇒ భావోద్వేగపరమైన అవగాహన వల్ల మన బాధను, ఇతరుల బాధను అర్థం చేసుకునే తత్వం అలవడుతుంది.⇒ స్వీయగౌరవం, ఇతరుల హద్దులను గౌరవించడం నేర్చుకోవచ్చు. అతి తక్కువ సమయంలో సంబంధాలు విడిపోవడం తగ్గించవచ్చు.‘నెగోషియేటింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్’ కోర్సు ప్రత్యేకతలివీ⇒ ఈ కోర్సు కేవలం థియరీతో నడవదు. విద్యార్థుల స్వీయ అనుభవాలు, డిజిటల్ జీవితం, పాప్ కల్చర్ ప్రభావం, డేటింగ్ చాలెంజెస్ వంటి అంశాలపై విశ్లేషణ చేయించడమే దీని లక్ష్యం.⇒ సంబంధాల్లో రెడ్ ఫ్లాగ్స్ (అపాయం సూచించే సంకేతాలు) గుర్తించడాన్ని నేర్పించటం.⇒ భావోద్వేగ సమతుల్యత పెంపొందించటం.⇒ గౌరవం, ఒప్పందం ఆధారంగా సంబంధాలు నిర్మించడం.⇒ సమస్యలు, ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో నేర్పడం.⇒ స్నేహం, ప్రేమ, లైంగికతలతో ముడిపడిన ప్రవర్తన గురించి మౌలిక అవగాహన కల్పించడం.⇒ సోషల్ మీడియా, షోలు, రీల్స్ వంటివి మన సంబంధాలపై చూపే ప్రభావాన్ని విశ్లేషించడం.ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించాలి...ళీ టీనేజీలో వచ్చే మార్పులకు సంబంధించి భావోద్వేగపరంగా ఇతరత్రా మార్పులపై మన విద్యా విధానంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగడం లేదు. టీచర్లకు కూడా విద్యార్థు లకు ఈ విషయంపై ఏమి బోధించాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వాలు కూడా ఆలోచించి ప్రతీ విద్యాసంస్థలో ఒకరిద్దరు ఫ్యాకల్టీ మెంబర్లకు భావోద్వేగపరమైన అంశాలు, స్నేహాలు, సంబంధాలపై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు బోధించేలా చూడాలి. మేము ఇప్పటికే 500కుపైగా స్కూళ్లలో ప్రేమలు, రిలేషన్స్ షిప్స్ను ఎలా అర్థం చేసుకోవాలి, వాటితో ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. – సి.వీరేందర్, సైకాలజిస్ట్ -
నదులు, నిధులు.. రెండూ ఆంధ్రాకేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల్లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు ద్రోహం చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పైసా సాయం చేయలేదని, కానీ ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి– బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మాట సాయం, మూట సాయం అందిస్తోందని మండిపడ్డారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్ పేరిట ఏపీ చేస్తున్న జల దోపిడి – కాంగ్రెస్ మౌనం’అనే అంశంపై హరీశ్రావు శనివారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ ఎక్కడ?‘రేవంత్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇరిటేట్ (అసహనానికి గురిచేయటం) చేయడం తప్ప ఇరిగేషన్పై దృష్టి పెట్టడం లేదు. బనకచర్ల లింక్ ద్వారా గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా ప్రతిపక్షాలపై కేసులు, విచారణలు, మంత్రివర్గ విస్తరణ అంటూ సీఎం దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాడు. నీటిపారుదలపై అఖిలపక్ష సమావేశానికి ముందుకు రాకుండా తాము సన్నద్ధం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్తున్నాడు.బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా కేంద్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీకి వత్తాసు పలుకుతోంది. సమైక్య పాలనలో సమైక్య పాలకుల వద్ద బానిసల్లా బతికిన వారు స్వరాష్ట్రంగా ఏర్పడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్ర నాయకత్వం వద్ద తాకట్టు పెడుతున్నారు. నదీ జలాలను ఏపీకి కేంద్రం దోచి పెడుతున్నా సీఎం రేవంత్ స్పందించడం లేదు’అని హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నదీ జలాల్లో అన్యాయంపై మాట్లాడటం లేదని ఆరోపించారు. చంద్రబాబుతో బీజేపీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ ప్రాజెక్టులను కేంద్ర మంత్రులు అడ్డుకోవడం పాటు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి ఏపీ జలదోపిడీని అడ్డుకునేలా ఏకగ్రీవ తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. కాళేశ్వరంపై త్వరలో ప్రజల వద్దకుత్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్హౌజ్లను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని హరీశ్రావు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత రైతులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడితే రేవంత్రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. -
బీసీ సీఎం కావడానికి సమయం ఆసన్నమైంది
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కావడానికి సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీసీలకు సీఎం పదవి వచ్చే రోజులు ముందున్నాయి. వస్తాయి కూడా. ఆ సమయం దగ్గరైంది. బీసీలందరూ ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది. ఈ పదవి కోసం ఏళ్లు గడిచాయి. 80ఏళ్లుగా అడుగుతున్నాం. దక్షిణాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులయ్యారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాలేదు. ఈ అవకాశం భవిష్యత్తులో వస్తుంది. వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఇవాళో, రేపో, మాపో అని చెప్పలేను కానీ భవిష్యత్తులో అవకాశం వస్తుందని గట్టి చెప్తున్నాను. ఆ ఆకాంక్ష, కోరిక మన వర్గాల్లో ఎక్కువగా ఉంది’ అని అన్నారు. శనివారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహేశ్ గౌడ్ ప్రసంగించారు. రాజకీయంగా మనకు కావాల్సింది ఆ పదవులు ఈ పదవులు కాదని, రాష్ట్రంలో ముఖ్యమైన పదవి రావాలని అన్నారు. ఈటల లీడ్ చేస్తే కేంద్రాన్ని అడుగుదాం..బీసీలంతా కులాలు పక్కనపెట్టి, రాజకీయ పార్టీలకు అతీతంగా హక్కుల కోసం ఉద్యమించాలని మహేశ్ గౌడ్ కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన కుల గణన సర్వే శాస్త్రీయంగా ఉందన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో రెండు బిల్లులను ఆమోదించామన్నారు. ‘ఎంపీ ఈటల రాజేందర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మీరు లీడ్ చేస్తే మీ నాయకత్వంలో మేమంతా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి ప్రయత్నం చేద్దాం. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. కేంద్ర మంత్రిగా మన రాష్ట్రం నుంచి బండి సంజయ్ ఉన్నారు. అందరం కలిసి వెళ్దాం. మా ముఖ్యమంత్రిని తీసుకొస్తాను.. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. అక్కడ విజయం సాధిస్తే అందరికీ ఆ వాటా పొందేందుకు అవకాశం మెండుగా ఉంటుంది’ అని అన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలిఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మధ్యప్రదేశ్ ప్రజారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పి.నరహరి, హైకోర్టు న్యాయవాది పృధ్వీరాజ్ రచించారు. కార్యక్రమంలో పి.నరహరి మాట్లాడుతూ.. రాజ్యాధికారమే ఓబీసీల అంతిమ లక్ష్యం కావాలని, ఆ దిశగా ఓబీసీలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. దేశమంతటా ప్రస్తుతం బీసీల గురించే చర్చ జరుగుతోందని, తెలంగాణలోనూ బీసీల గురించి యువత, మేధావులు ఆలోచిస్తున్నారని చెప్పారు. దేశంలోని 80 కోట్ల ఓబీసీల ఆశయాలు, ఆశలు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. భరోసా కల్పించే నాయకత్వం రావాలి: ఈటలసమాజహితం కోసం ఐఏఎస్ అధికారి పి.నరహరి ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రాయడం అభినందనీయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పాలకులు సంపూర్ణంగా అమలు చేయడంతోనే ఏబీసీడీ వంటి ఉద్యమాలు తలెత్తుతున్నాయని చెప్పారు. బీసీల్లో చైతన్యం, సామాజిక స్పృహ ఉందని, బలహీన వర్గాలకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించే నాయకత్వమే రావాలని ఆకాంక్షించారు. అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ ప్రారంభించిన నల్ల చొక్కాల ఉద్యమం ఘన విజయం సాధించిందని, ఇలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో నల్ల చొక్కా ఉద్యమం రావాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ డీజీపీ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, టీఎస్ఎండీసీ చైర్మన్ అనిల్కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
విన్యాసాల వాయిద్యం.. మార్ఫా సంగీతం..
గణేష్ చతుర్థి ఊరేగింపులైనా.. పెళ్లి వేడుకలైనా.. నగరాన్ని సందర్శించే ప్రముఖులను స్వాగతించాలన్నా టక్కున గుర్తొచ్చేది మార్ఫా బ్యాండ్. ఈ ఉల్లాసభరితమైన సంగీతం లేకపోతే హైదరాబాద్ సంప్రదాయం అసంపూర్ణమే. పాతబస్తీలో అందాల రాణులతో నృత్యం చేయించి, కొడుకు పెళ్లిలో నాగార్జునతో డ్యాన్స్ చేయించి.. తరాలకు, ప్రాంతాలకు అతీతంగా అలరించే శక్తి తనదని నిరూపించుకుంటోంది మార్ఫా సంగీత వాయిద్యం.. ఆఫ్రో, అరబ్ సంప్రదాయం నుంచి శతాబ్దాల క్రితం వలస వచ్చిన ఈ సంగీతం భాగ్యనగర సంస్కృతిలో భాగమైపోయింది. నగరంలో జరిగే ప్రతి వేడుకలోనూ తన ప్రశస్తిని చాటుకుంటోంది.. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో అబ్బురపరుస్తున్న రిథమిక్ ట్యూన్స్సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా కుల, మత సంబంధం లేకుండా అభిమానులున్న నగరానికి చెందిన మార్ఫా సంగీతం ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. మధ్యప్రాచ్యంలో మార్ఫా ప్రదర్శనలు జరుగుతుంటే, మరోవైపు ఇటీవలే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి ప్రదేశాల్లో ఔత్సాహికుల నృత్యాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆహార్యం నుంచి వైవిధ్యం..తల చుట్టూ ఎర్రటి చెక్కిన స్కార్ఫ్లు చుట్టుకుని, తెల్లటి కుర్తాలు, లుంగీలను «మార్ఫా కళాకారులు దరిస్తారు. ఈ కళాకారులు రాత్రిపూట, నిర్విరామంగా మూడు నుంచి ఆరు గంటల పాటు నిలబడి ప్రదర్శనలు ఇస్తారు. మెడలో బరువైన ఢోలక్ మోస్తూనే లయకు అనుగుణంగా> నృత్యం చేయాలి. ఉత్సవాలు, ఊరేగింపుల్లో తీవ్ర అలసట కారణంగా మార్ఫా కళాకారుల నోటి నుంచి రక్తస్రావం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంటుంది. మార్ఫా బ్యాండ్లో సంప్రదాయంగా 8, 12, 16, 22 మంది సభ్యులు ఉంటారు. ప్రేక్షకుల ఆదరణ మేరకు, బృందంలోని కొంతమంది సభ్యులు నృత్యం చేయవచ్చు. వారి సహచరులు వాయిద్యాలను వాయించేటప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన డాగర్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఒక కళాకారుడు కత్తిని గాలిలోకి ఊపుతూ నర్తిస్తుంటే, ఇతర సంగీతకారులు క్రమంగా బీట్ టెంపోను పెంచుతారు.వైవిధ్యభరిత వాయిద్యాల సమ్మేళనం..మార్ఫా సంగీతంలో ‘మార్ఫా, సవారీ, నాగిన్, యాబు బక్కే రబు సాలా’ వంటి వివిధ శైలితో కూడిన రిథమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ దానికంటూ సొంత విలక్షణమైన వైవిధ్యంతో అలరిస్తాయి. ఈ సంగీతం అనేక వాయిద్యాల సహాయంతో పలకిస్తారు. ప్రధానంగా మార్ఫాలు (ధోలక్, డాఫ్ అని పిలుస్తారు). వీటిని సంగీతకారులు ‘థాపి’ అని పిలిచే చెక్క స్ట్రిప్లతో కొడతారు. వీరి పూర్వీకులు మేక చర్మంతో తయారు చేసిన మార్ఫాలపై కొట్టేవారు. నేటి కళాకారులు వాయించడం సులభం. ఖర్చు తక్కువ అవుతుందిని ఫైబర్ వాయిద్యాలు ఇష్టపడతున్నారు. కొన్ని విభిన్న వాయిద్యాలను కందూర, ముషాద్ జెట్టా, మార్ఫాలు, బిండియా పీటల్ అని పిలుస్తారు. వాటిలో ఎక్కువ భాగం ధోలక్ను పోలి ఉన్నప్పటికీ పరిమాణంలో తేడాలుంటాయి. ‘కళాకారులకు వారు వాయించడానికి ఎంచుకున్న వాయిద్యం ఆధారంగా వేతనం చెల్లిస్తారు’ అని కళాకారులు చెబుతున్నారు.చరిత్రతో మమేకం.. ఈ మార్ఫా బ్యాండ్లు తరచూ జెండా మార్చ్ల వంటి కార్యక్రమాలకు నియమించుకుంటారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీదారుల పాతబస్తీ సందర్శన సందర్భంగా వారికి మార్ఫా సంగీతం స్వాగతం పలికింది. నిజాం పాలనలో నగరానికి చేరుకుందీ యెమెన్ కళారూపం. ఈ కళారూపాన్ని నగరానికి ఎవరు పరిచయం చేశారు? అనే దానిపై కొంత వివాదం ఉంది. ఇది తీసుకొచ్చింది సిద్ధిలు (ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు) అని కొందరు చెబుతుండగా, దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చింది యెమెన్ పూర్వీకులేనని కొందరు అంటున్నారు.కళాకారులు ఏమంటున్నారు? ‘నిజాం పాలనలో వేడుకల సందర్భాల్లో ఈ వాయిద్యాన్ని వినియోగించేవారు. నేటికీ గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మార్ఫా తప్పనిసరి’ అని మార్ఫా కళాకారుడు కయ్యూమ్ బిన్ ఒమర్ చెప్పాడు. గత 28 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న ఓమర్ ప్రారంభంలో 70–80 మంది మార్ఫా బృందం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 15కి తగ్గింది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నామనీ, తెలుగు రాష్ట్రాల వెలుపల కొన్ని ప్రదర్శనలు ఇస్తున్నామని ఒమర్ అంటున్నాడు. డాగర్ డ్యాన్స్ హైలెట్.. సాంప్రదాయ యెమెన్ నృత్యరూపం డాగర్ డ్యాన్స్కు అత్యంత డిమాండ్ ఉందని అరబి మార్ఫా బ్యాండ్ యజమాని మొహమ్మద్ యూసుఫ్ చెప్పారు. అయితే, నిజమైన కత్తులకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా చెక్క కత్తులను వినియోగిస్తున్నారు. ‘గతంలో కొంతమంది ప్రేక్షకులు మద్యం మత్తులో కత్తులను లాక్కొని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కత్తుల వినియోగాన్ని నిషేధించింది, కానీ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి చెక్క లేదా ప్లాస్టిక్ కత్తులను ఉపయోగిస్తున్నాం’ అని మహమ్మద్ చెప్పారు. కళను సజీవంగా ఉంచేందుకు.. ‘నా పేరు ఫిరోజ్. కానీ అందరూ నన్ను జాబ్రీ అని పిలుస్తారు. చిన్నతనం నుంచి అంటే 24 సంవత్సరాలుగా మార్ఫా ప్లే చేస్తున్నా. నగరంలో ముఖ్యంగా బార్కాస్ ఏసీ గార్డ్స్ వంటి ప్రదేశాల్లో మార్ఫా ప్రసిద్ధి చెందింది. నిజాంల కింద పనిచేసిన యెమెన్ సైనికుల ద్వారా 200 ఏళ్ల క్రితం మార్ఫా నగరానికి వచ్చిందంటారు. అదేమో గానీ మా పెద్దలు ఈ కళను నాకు అందించారు. దీనిని సజీవంగా ఉంచడానికి నా వంతు కృషి చేస్తున్నా. నా బృందంలో 20 మంది సభ్యులున్నారు. నగరం అంతటా వివాహాలు, వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తాం. మతాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటాం. కేవలం వారసత్వాన్ని సజీవంగా ఉంచాలన్నదే మా ఆలోచన. – ఫిరోజ్ మార్ఫా ఆర్టిస్ట్ (సోషల్ మీడియా పోస్ట్ నుంచి) -
ఉత్తర రింగు అంచనా వ్యయం 18,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి రూ.18,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈమేరకు కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సవరించిన డీపీఆర్ను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఏఐ అందజేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసలకు బదులు ఒకేసారి ఆరు వరుసలుగా, దానిమీద నిర్మించే వంతెనలు, ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్లను ఎనిమిది లేన్లుగా నిర్మించాలని ఇటీవల కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, దీని నిర్మాణానికి కొత్త డీపీఆర్ను రూపొందించారు. నాలుగు వరుసలుగా నిర్మించాలని తొలుత నిర్ణయించిన సమయంలో రూపొందించిన డీపీఆర్ ప్రకారం నిర్మాణ వ్యయం రూ.14,300 కోట్లుగా తేలగా, ఇప్పుడు మరో రూ.4,200 కోట్లు పెరిగింది.నిర్మాణ వ్యయం రూ.9,600 కోట్లుఉత్తర భాగం దాదాపు 162 కి.మీ. నిడివితో ఉండనుంది. దీని నిర్మాణానికి రూ.9,600 కోట్లు ఖర్చు అవుతుందని తాజా డీపీఆర్లో అంచనా వేశారు. మూడు నెలల క్రితం జరిగిన పీఎం గతిశక్తిలోని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూపు సమావేశంలో, రోడ్డు నాలుగు వరుస లుగా నిర్మిస్తే కేవలం ఐదారేళ్లలోనే ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇరుకుగా మారే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. అందువల్ల కనీసం 15 ఏళ్లపాటు విస్తరించాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మించాలని నిర్ణయించారు. రోడ్డు పొడవునా రెండు వైపులా సర్వీసు రోడ్లను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్ఛేంజ్ లూప్ స్ట్రక్చర్లు, 3 భారీ వంతెనలు, 105 చిన్న వంతెనలు, 85 కల్వర్టులుంటాయి. ఈ వంతెనలన్నీ ఒకేసారి ఎనిమిది వరుసలుగా ఉంటాయి. ఫలితంగా రోడ్డు నిర్మాణానికి భారీగా ఖర్చు కానుంది. ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరం. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. గ్రామాలవారీగా అవార్డులను పాస్ చేస్తున్నారు. త్వరలో నిర్వాసితులకు పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. డీపీఆర్లో ఈ భూసేకరణ పరిహారాన్ని రూ.5,500 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయి. అలైన్మెంటు పరిధిలో ఉన్న భూమిలోని స్తంభాలు, పైపు లైన్లు లాంటి వాటిని తరలించేందుకు రూ.400 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. టెండర్ల ప్రక్రియలో జాప్యం..నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఎన్హెచ్ ఏఐ టెండర్లు పిలిచింది. ఆ తర్వాత దీన్ని ఆరు వరుసలు, వంతెనలను ఎనిమిది వరుసలకు పెంచటంతో పాత టెండర్లనే సవరించి గడువు పొడిగిస్తారా, కొత్తగా మళ్లీ టెండర్లు పిలుస్తారా అన్నదానిలో స్పష్టత రాలేదు. ఓవైపు అవార్డులు పాస్ చేస్తూ, పరిహారం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, టెండర్ల విషయంలో మాత్రం ఎటూ తేల్చకుండా జాప్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కొత్త డీపీఆర్ను సమర్పించినందున దీని ఆధారంగా ఖర్చును సవరించి ఆ మేరకు టెండర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతానికి ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి మండలిలోని ఆర్థిక వ్యవహారాలు చూసే కమిటీ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. త్వరలో ఆ ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. ఆ వెంటనే టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తిస్తారని పేర్కొంటున్నారు. -
త్వరలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువలు త్వరలోనే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తును పూర్తి చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరిశీలించి.. సీఎం రేవంత్రెడ్డికి అందజేశారని, దానికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే పెరిగిన భూముల విలువలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. అయితే, ముందుగా హెచ్ఎండీఏ పరిధిలోని భూముల కు మాత్రమే ఈ విలువల సవరణ వర్తింపజేస్తా రని, కొన్ని రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతారని తెలుస్తోంది. కాగా, భూముల రిజి స్ట్రేషన్ విలువలు భారీగా పెరిగినా, ప్రజలపై ఎక్కువ భారం పడకుండా అర శాతం మేర స్టాంపు డ్యూటీ తగ్గించే అవకాశాలున్నాయని సమాచారం. ఏడాది క్రితమే..వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కార్య క్రమాన్ని చేపట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి వర్తించే విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి.. సబ్రిజిస్ట్రార్ల ద్వారా సవరణ ప్రతిపాదనలను తెప్పించారు. 2024, జూన్ 29 నాటికి సవరించిన విలువలను ప్రభుత్వానికి పంపి ఆమోదం అనంతరం ప్రజాభిప్రాయం సేకరించి 2024, ఆగస్టు1 నుంచి సవరించిన రిజిస్ట్రేషన్ విలువలను అందుబాటులోకి తేవాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సబ్రిజిస్ట్రార్ల స్థాయిలో కసరత్తు జరిగిన అనంతరం ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో భూముల విలువలు పెంచితే మరింత వ్యతిరేక ప్రభావం చూపుతుందని, తద్వారా మార్కెట్ నష్టపోతుందనే ఆలోచనతో అప్పట్లో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఆ తర్వాత థర్డ్ పార్టీ చేత విలువల సవరణ ప్రక్రియను చేపట్టింది. థర్డ్ పార్టీ కూడా నివేదిక ఇచ్చింది. అయినా, ఎప్పటికప్పుడు భూముల విలువల సవరణ అంశం వాయిదా పడుతూనే వచ్చింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మళ్లీ కసరత్తు ప్రారంభించింది. గత నెలలో మళ్లీ షెడ్యూల్..భూముల విలువల సవరణ కోసం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. విలువలను సవరించేందుకు వీలుగా మళ్లీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తూ, జీవో నం. 41ని విడుదల చేసింది. సవరణ ప్రతిపాదనలను పంపేందుకు మళ్లీ ప్రత్యేక ఫార్మాట్లను క్షేత్రస్థాయికి పంపింది. ఆ తర్వాత ఎప్పుడు ఏం చేయాలనే టైంటేబుల్ను కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసింది. ఈ టైంటేబుల్ ప్రకారం వివిధ అధికారుల స్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, వీటిని ఉన్నతాధికార వర్గాలు పరిశీలించాయని, అనంతరం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆమోదం తెలిపారని, ఇప్పుడు బంతి సీఎం రేవంత్ కోర్టులో ఉందని సమాచారం. తక్కువ ఉన్న చోట్ల ఎక్కువగావిశ్వసనీయ సమాచారం ప్రకారం భూముల విలు వలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ విలువలు సవరించే అవకాశాలు కని పిస్తున్నాయి. వ్యవసాయ భూముల ఎకరం కనీస విలువ రూ.4 లక్షలుగా నిర్ధారించాలని, 3 కేట గిరీల్లో ఈ విలువలను సవరించి, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు రూ.40–50 లక్షల వరకు పెంచాలనే ప్రతిపాదనలు సీఎం వద్దకు చేరి నట్టు సమాచారం. వ్యవసాయేతర భూములు, ఆస్తుల విషయంలోనూ కొంత మేర దూకుడు పెంచాలని, కనీసం 20 నుంచి 100 శాతం వరకు ఈ విలువలు సవరించాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రో చర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల ద్వారా కూడా సమాచారం సేకరించారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలు వలను నిర్ధారించనున్నట్టు తెలుస్తోంది. -
ప్రమాదంలో 26 మెడికల్ కాలేజీల మనుగడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల పనితీరుపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2025–26)లో ఎంబీబీఎస్ సీట్లు కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. వచ్చే విద్యా సంవత్సరానికి దాదాపు 2,700 మెడికల్ సీట్లు కొనసాగించడమా, రద్దు చేయడమా అనే విషయంలో కమిషన్ తేల్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులను వ్యక్తిగత విచారణకు పిలిచింది.ఈ నెల 18న ఢిల్లీలో వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) డైరెక్టర్ సుక్లా మీనా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు వర్చువల్గా విచారణకు హాజరు కావాలని సూచించారు. కొత్త కాలేజీల్లో అన్నీ సమస్యలే... వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను భర్తీచేసే ముందు ప్రతి సంవత్సరం ఎన్ఎంసీ ఆయా కళాశాలలను తనిఖీ చేస్తుంది. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు కావలసిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్ రికార్డింగ్, సీసీటీవీ వంటివి ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. ఈసారి కూడా రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసినప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన 26 కళాశాలల్లో ఎన్ఎంసీ పారా మీటర్లకు అనుగుణంగా వసతులు లేవని తేలింది.కాకతీయ మెడికల్ కళాశాలలో కూడా నిబంధనల మేరకు వసతులు లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లోపాలపై ఎన్ఎంసీ గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చినా, కాలేజీలు సమాధానాలు సంతప్తికరంగా లేవని పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్ ట్రైనింగ్ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలను కొనసాగించడమో.. రద్దు చేయడమో నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్ఎంసీ నిబంధనలు పాటించని 26 కళాశాలలు ఇవే.. ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్ (కాకతీయ మెడికల్ కాలేజీ), భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, జనగాం, జయశంకర్ భూపాల³ల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నల్లగొండ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, పెద్దపల్లి, వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిబంధనల మేరకు లేవని ఎన్ఎంసీ తేల్చింది. -
తగ్గుతున్న ఐఐటీల ప్రభ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో తొలి దశ సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) శనివారం వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు సహా జాతీయ ఇంజనీరింగ్ (ఎన్ఐటీలు), ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు (జీఎఫ్టీఐలు) మొత్తం 127 సంస్థలు ఈ కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. వీటి పరిధిలో 62,854 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం ఆరు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టాలని జోసా ఈ ఏడాది నిర్ణయించింది. తొలి దశ కౌన్సెలింగ్లో ఐఐటీల్లో 18,160 సీట్లను భర్తీ చేశారు. సామాజిక కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు జరిగినట్టు జోసా వెల్లడించింది. జాతీయస్థాయి టాప్ ర్యాంకర్లంతా ఐఐటీ బాంబేలోనే సీట్లు పొందారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులకు అన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రధానంగా ఆప్షన్లు ఇచ్చారు. మారిన ట్రెండ్గతంతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్ భిన్నంగా కన్పిస్తోంది. ఎక్కువ ర్యాంకులు వచ్చినవారికి కూడా తొలి దశలోనే సీట్లు వచ్చాయి. గత ఏడాది ఆఖరి రౌండ్లో కూడా ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో కటాఫ్ (బాలుర విభాగం) 6,375 దాటలేదు. ఈసారి తొలి రౌండ్లోనే 6,242 ర్యాంకు విద్యార్థికి కూడా సీటు వచ్చింది. తాజా కౌన్సెలింగ్ను గమనిస్తే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతున్నట్టు కన్పిస్తోంది. కోవిడ్ తర్వాత జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్కు విద్యార్థులు సీరియస్గా సన్నద్ధమవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్రాల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల కోసం పోటీ పడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కూడా కఠినంగా ఉంటోందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఐఐటీల నాణ్యత ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంచి ర్యాంకు రాకున్నా... ఆఖరివరకూ నిరీక్షించాలిమంచి ర్యాంకు రాకున్నా ఈసారి ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఎందుకంటే పోటీ తక్కువగానే కన్పిస్తోంది. వేలల్లో ర్యాంకులు ఉన్న వారికి ఈసారి సీట్లు వచ్చే వీలుందని భావించాలి. బ్రాంచీ, సంస్థ విషయంలో కొంత ఆలోచించి అడుగేయాలి. – ఎంఎన్ రావు (జేఈఈ అధ్యాపకులు) -
‘భూదాన్’ స్వాహాకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూదాన్ భూముల స్వాహాకు అక్రమార్కులు కుట్రపన్నారు.. ఫోర్జరీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు.. తద్వారా డీ నోటీఫై చేసిన భూదాన్, గైరాన్ (ప్రభుత్వ) భూములను విక్రయించారు.. దీనికి సబ్ రిజిస్ట్రార్ నుంచి కలెక్టర్ వరకు అంతా సహకరించారు.. డాక్యుమెంట్లు, కోర్టు ఉత్తర్వులను కనీస పరిశీలన చేయకుండానే డీనోటీఫైకి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.. ఆ వెంటనే అక్రమార్కులు భూములను విక్రయించేశారు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182లోని సర్కార్ భూముల స్వాహాపై విచారణ సందర్భంగా ఈమేరకు బహిర్గతమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.న్యాయస్థానం ఆదేశిస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని చెప్పింది. సర్వే నం. 181, 194, 195లో భారీ భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్పేట్కు చెందిన బిర్లా మహేశ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ గజ్రాజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈడీ కౌంటర్లోని ముఖ్యాంశాలివీ...ఖదీరుసా సహా పలువురిపై కేసు‘సర్వే నం. 181, 194, 195లోని భూమికి సంబంధించి మోసపూరిత కార్యకలాపాలపై పిటిషనర్ మహేశ్ పేర్కొన్నారు. ఇప్పటికే సర్వే నంబర్ 181, 182లోని భూముల అక్రమ విక్రయంపై కేసు నమోదైంది. ఖదీరున్సిసా, మునావర్, బొబ్బిలి విశ్వనాథ్, సంతోష్కుమార్, దామోదర్రెడ్డితో పాటు ఈఐపీఎల్ నిర్మాణ సంస్థపై దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్ఐఆర్ నమోదు నిమిత్తం డీజీపీ కార్యాలయానికి పంపించాం. అక్కడి నుంచి మాకు ఎలాంటి బదులురాలేదు. నవాబ్ హాజీఖాన్కు 779.77 ఎకరాల భూమి ఉంది. ఇందులో 103 ఎకరాలను కుమారులకు బహుమతి (హిబ్బా)గా, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డుకు విరాళంగా ఇచ్చారు.దీనికి అంగీకరిస్తూ నాటి తహసీల్దార్ 1995, నవంబర్ 26న ఉత్తర్వులిచ్చారు. సర్వే నం. 181లోని మిగిలిన భూమిని ప్రభుత్వం గైరాన్ భూమిగా ప్రకటించింది. కుమారులు తమ భూమిని 2005లో దస్తగిర్ షరీఫ్, ముజాఫర్ హుస్సేన్కు విక్రయించారు. అయితే, 2006లో సర్వే నం. 181లోని మొత్తం భూమి సర్కార్దిగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. చట్టప్రకారం 181లోని 95 ఎకరాల్లో 50 ఎకరాలు భూదాన్గా, 45 ఎకరాలు గైరాన్ భూమిగా పేర్కొంటూ ఎంఆర్వో 2012లో నిషేధిత జాబితాలో చేర్చి నోటిఫై చేశారు’తప్పుడు పత్రాలతో సేల్ డీడ్లు‘తప్పుడు పత్రాలతో తన భూమిని కబ్జా చేశారంటూ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీస్స్టేషన్లో 2023, మార్చిలో ఖదీరునిసా, మునావర్ ఖాన్, బొబ్బిలి దామోదర్రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్రెడ్డి, ఎన్.సంతోష్, కొండపల్లి శ్రీధరర్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2004లో తన తండ్రి 51 ఎకరాలను హిబ్బాగా ఇచ్చారంటూ ఖదీరునిసా, ఆమె కుమారుడు మునావర్ 2014లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఈడీ విచారణలో తేలింది.అక్రమంగా పొందిన పట్టా పాస్పుస్తకాలు, భూ విక్రయాలు కోర్టు ఆదేశాలతో రద్దయ్యాయి. మళ్లీ 2021లో ఖదీరున్నీసా.. విశ్వనాథ్రెడ్డి, సంతోష్కుమార్కు 40 ఎకరాలు విక్రయించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా నాటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, నిందితులతో కలసి కుట్రకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసిన భూములను మోసపూరితంగా బదిలీ చేసుకోవడంతోపాటు సేల్ డీడ్లు సృష్టించారు.’డీనోటిఫైలో అధికారుల పాత్ర‘హజీ అలీకి తాను ఏకైక కుమార్తెనని ఖదీరునిసా పేర్కొంది. కానీ, అప్పటికే రెవెన్యూ రికార్డుల్లో అలీఖాన్ ఇద్దరు కుమారుల పేర్లున్నాయి. తప్పు డు పత్రాలు సృష్టించేందుకు రెహమాన్, అక్తర్, షుకూర్, చంద్రయ్య, మరికొందరు సహకరించారు. నకిలీ లేఖతో నిషేధిత జాబితాలోని భూ మిని డీ–నోటిఫై చేయించారు. డీనోటిఫైకి భూదాన్ యజ్ఞ బోర్డుతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్కు భాగస్వామ్యం ఉంది. అబ్దుల్ షుకూర్ బంధువులు 1992లో నవాబ్ హాజీ అలీఖాన్ నుంచి సర్వే నం. 194లోని భూమిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.నకిలీ పత్రాలతో భూ కబ్జా చేసినందుకు షుకూర్పై రెండు కేసులు నమోదయ్యాయి. 1992లో కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న డాక్యు మెంట్లపైనా అనుమానాలున్నాయి. ఎందుకంటే.. 1992 కంటే ముందే హాజీఖాన్ భూ మంతా విక్రయించారు. నకిలీ పత్రాల వాడకం, రెవెన్యూ రికార్డులను తారు మారు చేయడం లాంటి వాటితో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికారుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు మా దృష్టికి వచ్చిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.’ -
హాలీవుడ్కు వేదికవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్కు హైదరాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్రెడ్డి అన్నారు. గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్లు గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. -
తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మాట సాయం, మూట సాయం కూడా కేంద్రం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్కు ఎలా నోటీసులు ఇవ్వాలనే ఆలోచనతోనే రేవంత్ సర్కార్ పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న హరీష్రావు.. బనకచర్లకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా?. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు’’ అంటూ హరీష్రావు మండిపడ్డారు. -
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
హన్మకొండ చౌరస్తా: వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా నాటి యతిరాజారావు నుంచి మొన్నటి దయాకర్రావు వరకు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా ఉంటున్నాం.. అంతకుముందు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి తమను కోరాగా.. పార్టీలతో సంబంధం లేకుండా దయాకర్రావుకు సపోర్ట్ చేశామన్నారు.అవమానాలు భరించలేకే రాజకీయాల్లోకి..దయాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబుల్బెడ్రూం ఇళ్ల కోసం సొంత ఖర్చుతో స్థలం కొనుగోలు చేసి ఇచ్చాం. స్థలం ఇచ్చే ముందు నా భర్త పేరుపెడతామని చెప్పి చేయలేదు. అప్పటి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ నిలిపివేస్తే, మా సంస్థ ఆధ్వర్యాన ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఆ కార్యక్రమానికి దయాకర్రావు రాలేదు. కలెక్టర్, స్కూల్ ఉపాధ్యాయులను సైతం రానివ్వకుండా చేశాడు. మేము చేసే అనేక కార్యక్రమాలను అడ్డుకుంటూ నన్ను అవమానించాడు. అమెరికా వెళ్లాక ఏనాడు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. దయాకర్రావు చేసిన అవమానాలను తట్టుకోలేకే రావాల్సి వచ్చింది. మంత్రిగా దయాకర్రావు నా ఫోన్ను సైతం ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్, సీ్త్రనిధి నిధుల గోల్మాల్, పంచాయతీ రాజ్ నిధుల్లో అక్రమాలు ఇలా అనేక విషయాల్లో ఆయన జైలుకు పోవడం ఖాయమన్నారు. -
కొమ్మినేని తప్పేమీ లేదు.. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే శక్తులు ఆరంభం నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో, వివిధ స్థాయిలో ఉన్నాయని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. రాజకీయ కక్షతో మీడియాపై దాడులు సరికాదని పాలకులకు హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ‘డెమోక్రసీ- ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే శ్రీనివాస్, దేవులపల్లి అమర్, దిలీప్రెడ్డి, విజయ్బాబు, శైలేశ్రెడ్డి, రెహమాన్, సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్. ధనంజయరెడ్డి.. ఇంకా పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను వీరంతా ఖండించారు. ఎవరేమన్నారంటే.. ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ.. ఈ రెండు ప్రశ్నార్థకాలే. కేఎస్ఆర్ కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదు. సాక్షి కార్యాలయాలపై దాడి సరికాదు: రామచంద్రమూర్తిప్రజల భాగస్వామ్యంతోనే పత్రిక స్వేచ్చను కాపాడాలి: టంకశాల అశోక్కొమ్మినేనిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు: కే. శ్రీనివాస్పత్రికా స్వేచ్చకు భగం కలిగించారు: విజయ్బాబుకొమ్మినేని శ్రీనివాస్ తప్పేమీ లేదు. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛ భాగమే: దేవులపల్లి అమర్ -
ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. రెండోరోజు ఆరోగ్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా కేసీఆర్.. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుప్రతికి వచ్చారు.వివరాల ప్రకారం.. కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం అక్కడికి చేరుకున్నారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆయన.. గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక, కేసీఆర్.. గత కొన్ని రోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో ఐదు రోజుల పాటు బంజారా హిల్స్లోని నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్లోని బాత్ రూంలో కాలు జారీ పడటంతో గాయమైన విషయం తెలిసిందే. అనంతరం, యశోద ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫాం హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. -
మన 'పైడి జయరాజ్' పేరుతో అవార్డ్.. అందుకోనున్న 'మణిరత్నం'
భారతీయ సినిమా మాటలు నేర్వకముందే అంటే మూకీయుగంలోనే పైడి జైరాజ్ సినీ ప్రయాణం మొదలైంది. భారత తొలి మాటల చిత్రం అలం ఆరా (1931) సినిమాతో తనదైన ముద్ర వేసిన పైడి జైరాజ్ హిందీలో కూడా గుర్తింపు పొందారు. నేడు (జూన్ 14)న తెలంగాణ సర్కారు ఆయన పేరుతో అవార్డు ప్రదానం చేస్తోంది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ సెప్టెంబర్ 28, 1909లో జన్మించారు. పంజాబీ అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. 2000 ఆగస్టు 11న ఆయన మరణించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 11 మూకీ సినిమాల్లో 156 టాకీ సినిమాల్లో హీరోగా, 300 సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.1929లో బొంబాయికినిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో జైరాజ్ నాటకలు, సినిమాలపై ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. స్టార్క్లింగ్ యూత్ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతభూమి, ఆల్ ఫర్ లవర్, మహాసాగర్ మోతి, ఫ్లైట్ ఇన్టు డెత్, మై హీరో మొదలైన పదకొండు నిశ్శబ్ద చిత్రాల్లో నటించాడు. శాంతారామ్, అశోక్ కుమార్, పథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ వంటి వారితో ఏడు దశాబ్దాల పాటు కొనసాగారు. నిరూపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ల సరసన నటించారు. 86ఏళ్ల వయసులో 1995లో గన్ అండ్ గాడ్ సినిమా తరువాత సినీరంగం నుంచి తప్పుకున్నారు. టాకీకాలంలో మోహర్, మాల, ప్రతిమ, రాజ్ఘర్, సాగర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అమర్సింగ్ రాథోడ్, పథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, షాజహాన్, టిప్పు సుత్తాన్, హైదర్ ఆలీ వంటి పా త్రలు పోషించిన ఆయన హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, మలయాళం తదితర భాషా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.పైడి జైరాజ్ సినీ పురస్కారంరాష్ట్ర విభజన నాటి నుంచి 2014–2024 మధ్యలో విడుదలైన చిత్రాలకు గద్దర్ పేరున తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డులైన రఘుపతి వెంకయ్య, బీఎన్రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులకు తోడు తెలంగాణకు చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనుంది. సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ పేరున తొలిసారిగా అవార్డు ప్రకటించగా, ఈనెల 14న ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ప్రదానం చేయనున్నారు.తెలుగు సినిమాల సమీక్షల్లో తనదైన ముద్ర వేసి, సినీ రంగం పైన అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసిన కరీంనగర్ ఫిల్మీ సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర పైడి జైరాజ్పై నిర్మించిన డాక్యుమెంటరీ గాను 2024 సంవత్సరానికి బెస్ట్ ఫిలిం క్రిటిక్గా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును శనివారం హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రవిచంద్ర అందుకోనున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యులు లక్ష్మీ గౌతమ్, మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, కోల రామచంద్రారెడ్డి, వారాల మహేశ్ తదితరులు అభినందించారు. -
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
యాదగిరిగుట్ట: ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్లో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాత్రికి రాత్రి రవి మృత దేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అయిలయ్య సందర్శించారు. -
కేటీఆర్పై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యంతర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కూడా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాగే, కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండడంతో పాటు, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇక, ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదుతో పోలీసులు.. కేటీఆర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో, సీసీఎస్ పోలీసులు.. కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో నోటీసులు..ఇదిలా ఉండగా.. ఫార్ములా–ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్ రేస్లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్కుమార్ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్ఎన్రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా విచారించారు. తాజాగా కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సైతం ధ్రువీకరించారు. కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవితఫార్ములా–ఈ రేసింగ్లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. -
కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్ రేస్లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్కుమార్ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్ఎన్రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా విచారించారు. తాజాగా కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సైతం ధ్రువీకరించారు. కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవితఫార్ములా–ఈ రేసింగ్లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. -
25లోగా రైతు భరోసా
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీలోగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చేనెల చివరి వరకు రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మిగతావి ఆగస్టు తర్వాత వస్తాయని తెలిపారు. బోనస్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో సన్న ధాన్యం సాగు పెరిగిందని చెప్పారు.ఇతర దేశాల్లో డిమాండ్ ఉన్న ఆరు రకాల వరి రాష్ట్రంలో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్పామ్ రైతులకు టన్నుకు రూ.25 వేలు తగ్గకుండా కనీస మద్దతు ధర కోసం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రానికి లేఖలు పంపించి, త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, అందులో తాను కూడా ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు చెపుతున్న మాటలన్నీ అబద్ధమని మంత్రి తుమ్మల అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి 15 రోజుల ముందుగానే మేడిగడ్డ బరాజ్ మంజూరైందని తెలిపారు. -
రేవంత్.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్రెడ్డి గారూ.. ఓటుకు నోటు కేసులో మీరు..ఫార్ములా ఈ అంశంలో నేను.. ఇద్దరమూ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. న్యాయమూర్తి సమక్షంలో మనిద్దరం లై డిటెక్టర్ పరీక్ష ఎందుకు చేయించుకోకూడదు. ఈ పరీక్షను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే అసలు దోషులు ఎవరో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నాతోపాటు లై డిటెక్టర్ పరీక్షకు హాజరయ్యే దమ్ముందా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు చేశారు. శుక్రవారం ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు. ‘ప్రభుత్వం నడిపే చేవలేనప్పుడు ప్రజలతో సర్కస్ చేస్తూ వారి దృష్టిని మళ్లిస్తారు.కానీ కాంగ్రెస్ పార్టీతోపాటు దాని జోకర్ సీఎం చేసే హడావుడి మమ్ములను అడ్డుకోలేవు. సోమవారం ఉదయం 10 గంటలకు ఫార్ములా–ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. చట్టానికి కట్టుబడిన పౌరుడిగా విచారణకు హాజరై ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నల్లటి బ్యాగ్ నిండా డబ్బుతో దొరికి పదేళ్లు పూర్తి చేసుకున్నదెవరో చెప్పగలరా. ఓ వైపు రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న సీఎం రేవంత్.. పదే పదే విచారణలు, ప్రచారాలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు’అని కేటీఆర్ ప్రశ్నించారు.విద్యా వ్యవస్థపై బాధ్యత లేదురాష్ట్రంలో విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు. దీని పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడ్డారు. పాఠశాలలు పునః ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. ఎమ్మెల్యే పల్లాకు పరామర్శసోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తాతా మధు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. -
ఇక అసెంబ్లీ పదవులు!
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, ఐఏఎస్ల బదిలీలు, జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అసెంబ్లీ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ల నియామకంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ విప్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశముందని, ఒకవేళ మండలిలో అదే సామాజిక వర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఉందని సీఎం భావించిన పక్షంలో బీసీ నేతకు కేటాయించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇక మొన్నటివరకు విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మంత్రిగా, మరో విప్ రాంచంద్రు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు పదవులను కూడా భర్తీ చేసే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సమీకరణలను బట్టి విప్ల సంఖ్యను 4 నుంచి 5 లేదా 6కు పెంచే అవకాశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం. చీఫ్ విప్ ఎవరికి?ప్రస్తుతం అసెంబ్లీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ వర్గాలకు చెందిన రాంచంద్రునాయక్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు బీసీలు.. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య, మున్నూరుకాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్లు విప్లుగా ఉన్నారు. మరో రెండు విప్ పదవులు (అడ్లూరి, రాంచంద్రు నాయక్) ఇటీవల ఖాళీ అయ్యాయి. ఇప్పటివరకు చీఫ్ విప్ను నియమించకపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది. ఇలావుండగా ఇప్పటివరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్ పోస్టులను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ ఆ వర్గం నేతలకు చాన్స్ దక్కలేదు.ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డికి కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానిపక్షంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి నియామకం ద్వారా అటు సామాజిక సమీకరణలను పాటించడంతో పాటు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శకు కొంతవరకు చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కాకపోతే మాత్రం ప్రస్తుతం విప్లుగా ఉన్న ఇద్దరు బీసీ నేతల్లో ఒకరికి పదోన్నతి లభించవచ్చని, బీర్ల అయిలయ్య లేదంటే ఆది శ్రీనివాస్లను చీఫ్ విప్లుగా నియమిస్తారని, తద్వారా మంత్రి పదవుల్లో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్న వాదనకు తెరపడినట్టవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విప్ల భర్తీకీ సమీకరణాలుఅసెంబ్లీలో ప్రభుత్వ విప్లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సీఎం రేవంత్ అంచనా వేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, మాల సామాజిక వర్గం నుంచి మేడిపల్లి సత్యం శ్రీగణేష్, ఎస్టీ కోటాలో మురళీ నాయక్, వెడ్మ బొజ్జుల పేర్లను పరిశీలిస్తున్నారని, సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల సమీకరణల్లో ఒక్కో వర్గానికి ఒకరిని నియమిస్తారని తెలుస్తోంది. మరోవైపు విప్గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం కల్పించే విషయాన్ని కూడా సీఎం రేవంత్ సీరియస్గా పరిశీలిస్తున్నారని, ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ పదవుల పందేరం అధికారికంగా ఉండే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచింది. పెంచిన డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం జారీచేసిన జీవోలు 78, 79లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39 శాతం ఇస్తుండగా.. తాజాగా పెంపుతో 30.03 శాతానికి చేరుతుంది.తాజాగా పెంచిన డీఏను జూన్ నెల వేతనంతో జూలైలో ఇస్తారు. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లిస్తారు.సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు 10 శాతం డీఏ బకాయిలను ప్రాన్ ఖాతాల్లో జమచేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 1 జూలై 2023 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ఆరు నెలల తర్వాత జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపును వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు కాలేజీల జమా ఖర్చుల ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అసలు ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా? అని కూడా ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.పాఠశాలల నిర్వహణ, ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సెలింగ్ షెడ్యూల్, టీచర్ల సమస్యలు, ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు, గురుకుల హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఇంజనీరింగ్ ఫీజుల విషయమై సీఎం.. అధికారులను అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ప్రైవేటు కాలేజీలపై గతంలో వేసిన టాస్క్ఫోర్స్ నివేదికలోని అంశాలేంటి? అని నిలదీశారు.ఫ్యాకల్టీ లేకపోవడం, ఇష్టానుసారం సీట్లు పెంచుకోవడం, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో తేలిందేంటని ప్రశ్నించారు. అయితే, అధికారులు ఇందుకు సంసిద్ధంగా లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దా?’అంటూ ప్రశ్నించారు. ఫీజులకు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లింక్ పెట్టడం సరికాదు.. కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఫీజుల వ్యవహారం చూద్దాం అని అన్నారు. తాళాలపై తీవ్ర ఆగ్రహం.. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు బిల్లులు విడుదల చేయలేదని యజమానులు తాళం వేయడంపై సీఎం సీరియస్గా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతుంటే కనీసం ప్రభుత్వం దృష్టికి ఎందుకు తేలేదని నిలదీశారు. విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కూళ్ళు రీ ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను అధికారులు వివరించలేకపోవడం కూడా సీఎంను ఆగ్రహానికి గురి చేసింది.బడిబాట కార్యక్రమం ఎక్కడా సజావుగా సాగడం లేదని, టీచర్లు దీన్ని సీరియస్గా తీసుకోలేదని, ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలాచోట్ల పుస్తకాలు, దుస్తులు అందడం లేదని విమర్శలు వస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని, నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు ఇచ్చిన వివరణపై కూడా సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళల్లో 25 శాతం ఉచిత సీట్లు ఇచ్చే అంశంపై కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం ప్రస్తావించారు. కొత్తగా 571 పాఠశాలలు: సీఎం ఇరవై మందికన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాశాఖపై సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబదీ్ధకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యం పెంచాలి విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యం పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మౌలికవసతుల కల్పన, టీచర్లకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. -
జల్దీ ఇల్లు కట్టుకోండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల కోసం ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటికి పనులు మొదలైనవి 69 వేలు మాత్రమే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండో సంవత్సరం కొనసాగుతుండటంతో మరో 4.50 లక్షల ఇళ్ల నిర్మా ణానికి కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేప థ్యంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.అసలే పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతుండగా, ప్రస్తుతం వానాకాలం కూడా మొదలు కావటంతో ఇళ్ల నిర్మాణం మరింత మందగించనుంది. భారీ వర్షాలు ప్రారంభమైతే అసలు పనులే చేపట్టేందుకు జనం ఆసక్తి చూపరు. వ్యవసాయ పనులు ఊపందుకుంటే పనుల్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి త్వరగా పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. పూర్తయిన ఇళ్లు రెండే..కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలి నుంచే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు జారీ చేస్తుండటంతో నెల రోజులుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 69 వేల ఇళ్లు మాత్రమే మొదలయ్యాయి. వాటిల్లో పూర్తయినవి రెండు మాత్రమే. 15 వేల ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక సాయం పంపిణీ జరిగింది.ఇందులో 10 వేల ఇళ్లకు సంబంధించి తొలి విడత బేస్మెంట్ లెవల్ నిధులు రూ.లక్ష చొప్పున విడుదల కాగా, మూడు వేల ఇళ్లకు రెండో విడత, మరో రెండు వేల ఇళ్లకు గోడలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. నిధులకు ఇబ్బంది లేదని, ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భారీ వర్షాలు పడితే ఇసుకకూ కష్టమే..రాష్ట్రంలో వానాకాలం మొదలు కావటంతో భారీ వర్షాలు కురిస్తే ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలేర్పడతాయని అధికార యంత్రాంగం భయపడుతోంది. దీంతో వర్షాలు ఊపందుకోక ముందే వీలైనన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ ఇళ్లకు కావాల్సిన ఇసుకను వాగులు, వంకల నుంచి సేకరించి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. భారీ వర్షాలు కురిసి వాగులు నీటితో నిండిపోతే ఇసుక సేకరణ కూడా కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపే వీలైనంత మందికి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. అది జరగాలంటే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి. ఇందుకోసం బృందాలుగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వెంటనే పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తోంది ఈడీ. కర్నాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అగ్రిగోల్డ్ బాదితులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్ లో ఇప్పటికే 33 మందిపై చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ.. వారి ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తోందిగత ఏడాది నవంంబర్లో ఈడీ ఛార్జ్షీట్ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్ చేసినట్లు కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగా రూ. 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్లో ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేశారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ జీవో విడుదల చేసింది. జనవరి1,2023 నాటి డీఏపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది -
విద్యా ప్రమాణాల పెంపే మా లక్ష్యం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(శుక్రవారం. జూన్ 13) విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్లో వారు తమకు ఇష్టమైన రంలగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. -
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడుచట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్పై దుయ్యబట్టారు.అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…— KTR (@KTRBRS) June 13, 2025 -
ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులుచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం(జూన్ 16)న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఓసారి ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.జనవరి 9వ తేదీన సుమారు ఆరున్నర గంటలపాటు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. ఆపై ఈ ఏడాది మే చివరి వారం(28వ తేదీ)లో మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలియజేశారు. దీంతో మరోసారి ఇవాళ మూడోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10గం. విచారణకు రావాలని ఏసీబీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది.ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. కిందటి ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. తిరిగి.. 9వ తేదీ విచారణకు హాజరై ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
వా.. నర ప్రేమ!
విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తే కుక్కనో, మరేయితర జంతువునో ప్రస్తావన తీసుకొస్తాం. ఎందుకంటే.. పట్టెడన్నం పెడితే మూగ జీవాలు చూపించే ప్రేమ అలాంటిది మరి!. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన.. పలువురిని కంటతడి పెట్టిస్తోంది. వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ.. తన ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడి వద్ద రోజూ సేవ చేస్తూ ఉండేది. ఆమె కొడుకు బొల్లె వీర్రాజు తల్లికి సాయంగా ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ వానరం వీర్రాజు దృష్టిని ఆకర్షించింది. అలా క్రమం తప్పకుండా ఆ వానరానికి ప్రసాదం పెట్టడంతో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. అయితే అంతలోనే.. విధి వక్రీకరించింది. అనారోగ్యంతో వీర్రాజు మొన్నీమధ్యే కన్నుమూశాడు. రోజూ తనకు తిండి పెట్టి అపురూపంగా చూసుకునే వీర్రాజు రాకపోవడంతో.. ఆ వానరమే కదిలి వచ్చింది. ఇంట్లో విగత జీవిగా చాపలో ఉన్న వీర్రాజు చుట్టూ తిరిగింది. పాపం.. అతన్ని శాశ్వత నిద్ర నుంచి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అవేవీ జరగకపోవడంతో చివరకు తన స్నేహితుడి చెంత కాసేపు విశ్రమించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. వీర్రాజు అంతిమ యాత్రలోనూ కాసేపు ఆ వానరం కనిపించింది. గుడి దగ్గరకు రాగానే వీర్రాజు పార్థివదేహం మీద పడి విలపించినంత పని చేసింది. కొద్ది దూరం అంతిమ యాత్రలో జనాలతో కలిసి వచ్చి.. ఆపై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించాయి. ఆ వా‘నర’ ప్రేమను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
‘ట్రాఫిక్’కు పోలీసు బకాయి రూ.68 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర పోలీసు విభాగానికి చెందిన వాహనాలు సైతం ఎడాపెడా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. వీటిని ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించి జారీ చేసిన ఈ–చలాన్ల బకాయిలు భారీగానే ఉన్నాయి. ఈ జరిమానాల చెల్లింపు విషయంలో మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారి నిబంధనలపై అవగాహనకు కృషి చేస్తున్న నగరవాసి లోకేంద్ర సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు.పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ–చలాన్లలో ఇప్పటికీ 17,391 పెండింగ్లో ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం రూ.68 లక్షలని లెక్క తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 210 బీ ప్రకారం ఆ చట్టాన్ని అమలు చేసే ఏ అధికారికి సంబంధించిన వాహనమైనా ఉల్లంఘనకు పాల్పడితే... సాధారణ జరిమానాకు రెట్టింపు విధించే అవకాశం ఉంది. ఆ కోణంలో లెక్కిస్తే జరిమానా మొత్తం రూ.1.36 కోట్లుగా పరిగణించవచ్చు. నగరంలోని రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను పోలీసు విభాగం ఈ–చలాన్ల రూపంలోనే జరిమానా విధిస్తోంది. చౌరస్తాలతోపాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు, క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులు ఆ ఉల్లంఘనలను ఫొటోలు తీస్తారు. ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి.. సాధారణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది తమ విభాగానికి చెందిన వాహనాలు చేసే ఉల్లంఘనలపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. అవి కంట పడినప్పటికీ ఫోటోలు తీయరు. అయితే ఓవర్ స్పీడింగ్ వంటి ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి ఫొటోలు తీస్తాయి. దీంతో పోలీసు వాహనాలపైనా ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సర్వర్కు ఆర్టీఏ డేటాబేస్ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా ఆయా వాహన చోదకుల రిజిస్టర్డ్ చిరునామాలకు ఈ–చలాన్లు, రిజిస్టర్డ్ మెబైల్ నెంబర్లకు ఎస్సెమ్మెస్లు వెళ్తాయి.అయితే పోలీసు విభాగానికి సంబంధించిన వాహనాలు అన్నీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) పేరుతోనే రిజిస్టరై ఉంటాయి. దీంతో ఈ ఈ–చలాన్లు కూడా ఆ పేరుతోనే జారీ అవుతాయి. ఆ వాహనం ఎవరు వినియోగిస్తున్నారో వారి చిరుమానాలు రికార్డుల్లో ఉండవు. ఈ కారణంగానూ పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ–చలాన్లలో అత్యధికం పెండింగ్లో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ ఈ–చలాన్లను అన్ని రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది.ఓవర్ స్పీడ్పైనే ఎక్కువ..ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్ తదితర ఉల్లంఘనలపై జారీ అయినవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వాహనాలపై గరిష్టంగా 15 చలాన్లు పెండింగ్లో ఉండగా... వీటిలో కొన్ని 2017 నాటివి కావడం గమనార్హం. అత్యంత ప్రముఖుల వాహనాలకు పైలెటింగ్, ఎస్కార్ట్ చేస్తున్న, ఆయా కాన్వాయ్లను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు పరిమితికి మించిన వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగానూ కొన్నింటిపై ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. కాగా, గత ఏడాది ట్రాఫిక్ విభాగం అధికారులు మొత్తం 56.3 లక్షలు ఈ–చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షలు చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహన చోదకులు చెల్లించారు. -
ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్
ఆన్లైన్ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసినట్లు భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఈవో అజయ్ అనంతపద్మనాభన్ చెప్పారు. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఈ–మెయిల్స్ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్ చేస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంస్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్టెల్ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. -
ట్యాపింగ్ కేసు.. వ్యూహం మార్చిన సిట్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు.ఎస్ఐడీలోని ఎస్ఓటీకి నేతృత్వం వహించిన డి.ప్రణీత్రావు ఈ కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్రావుతో కలిపి విచారించారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్రావు శనివారం మరోసారి సిట్ ఎదుట విచారణకు వస్తుండటంతో ఒక రోజు ముందు ప్రణీత్ను ప్రశ్నించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మూలం ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్డిస్క్లు ధ్వంసం చేయడం. ఎస్ఐబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న డి.రమేష్ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్ యాక్ట్ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పని చేస్తూ, ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబీలోకి ప్రవేశించిన దుగ్యాల ప్రణీత్ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సిలేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్ఐబీలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు.ఎస్ఐబీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకు 17 అత్యాధునిక కంప్యూటర్లతో పని చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్ తన అధికారాన్ని దురి్వనియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవ్ల్లో భద్రపరుచుకున్నారని, 2023 డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ రావు అక్కడి సీసీ కెమెరాలు పని చేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబీకి చెందిన 42 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.రెండు టీబీల డేటాను డిలీట్ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్లు, కొన్ని హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఎస్ఐబీలో పని చేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది.అప్పట్లో ఎస్ఐడీ చీఫ్గా ప్రభాకర్రావు ఉండటంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణల్లో అత్యధికం ప్రభాకర్రావు ఖండిస్తుండటంతో సిట్ అప్రమత్తమైంది. శుక్రవారం ప్రణీత్రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా శనివారం ప్రభాకర్రావుకు సంధించాలి్నన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులకూ నోటీసులు జారీ చేసి ప్రశి్నంచేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్చార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి (కరీంనగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఖమ్మం), కొండా సురేఖ (మెదక్)లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.అలాగే ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడ నుంచి మార్చి.. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమించగా, అక్కడి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్చార్జిలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతోపాటు మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నవీన్ మిత్తల్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయనతో పాటు హైదరాబాద్, మల్కాజిగిరి సహా పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత కార్యదర్శి బుద్దప్రకాశ్ను ఆ పోస్టు నుంచి తప్పించింది. కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు కొందరి బదిలీకి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే మిత్తల్ను దీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో కొనసాగించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆయన్ను బదిలీ చేసింది.గత ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించిన ఆయనపై..అధికారంలోకి రాకముందు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ .. అధికారంలోకి వచి్చన తర్వాత కూడా అక్కడే కొనసాగించడం చర్చనీయాంశమయ్యింది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ కూడా బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయన మొత్తం మూడుసార్లు బదిలీ కావడం గమనార్హం.ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించిన డాక్టర్ శశాంక్ గోయల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న గౌరవ్ ఉప్పల్ను కేంద్ర ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శిగా సర్కారు నియమించింది. మొత్తం 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రసుత్తం పరిశ్రమల శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న గుర్రం మల్సూర్ను ముఖ్యమంత్రి ముఖ్య పౌరసంబంధాల అధికారిగా నియమించారు.బదిలీలు ఇలా.. 1. డాక్టర్ శశాంక్ గోయల్; ప్రస్తుతం: స్పెషల్ సీఎస్, తెలంగాణ భవన్ (ఢిల్లీ); బదిలీ: స్పెషల్ సీఎస్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్.2. నవీన్ మిత్తల్; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ ; బదిలీ: ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ3. ఎన్. శ్రీధర్; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ; బదిలీ: ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,ఆర్డబ్ల్యూఎస్, అదనంగా ముఖ్య కార్యదర్శి మైన్స్, జియాలజీ.4. డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్; ప్రస్తుతం: కార్యదర్శి స్టాంప్స్, రిజి్రస్టేషన్స్, గృహనిర్మాణ శాఖ; బదిలీ: కార్యదర్శి ఎస్సీ అభివృద్ధి, అదనంగా ప్రణాళిక శాఖ, టీజీఆర్ఏసీ డీజీ.5. లోకేశ్కుమార్; ప్రస్తుతం: అదనపు సీఈవో; బదిలీ: పూర్తి అదనపు బాధ్యతలు కార్యదర్శి, రెవెన్యూ, సీసీఎల్ఏ.6.గౌరవ్ ఉప్పల్; ప్రస్తుతం: రెసిడెంట్ కమిషనర్ తెలంగాణ భవన్ ఢిల్లీ; బదిలీ: కార్యదర్శి సమన్వయం కేంద్ర ప్రాజెక్టులు, ప్రాయోజిత కార్యక్రమాలు.7. భారతీ లక్పతి నాయక్ ; ప్రస్తుతం: కార్యదర్శి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్; బదిలీ: కార్యదర్శి, సమాచార కమిషన్.8. హరిచందన దాసరి; ప్రస్తుతం: కార్యదర్శి, రోడ్లు, భవనాలు; బదిలీ: కలెక్టర్, హైదరాబాద్.9. కిల్లు శివకుమార్నాయుడు; ప్రస్తుతం: అదనపు కమిషనర్ జీహెచ్ఎంసీ; బదిలీ: కమిషనర్, ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ ఐ క్యాడ్.10. రాజీవ్గాంధీ హన్మంతు; ప్రస్తుతం: కలెక్టర్, నిజామాబాద్; బదిలీ: ప్రత్యేక కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్, కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అదనపు బాధ్యతలు.11. వినయ్ కృష్ణారెడ్డి; ప్రస్తుతం: కమిషనర్ ఆర్,ఆర్ అండ్ ఎల్ ఏ, ఐ క్యాడ్; బదిలీ: కలెక్టర్, నిజామాబాద్.12. జి.శ్రీజన ; ప్రస్తుతం: డైరెక్టర్, పీఆర్ అండ్ ఆర్డీ; బదిలీ: డైరెక్టర్ మహిళా శిశు సంక్షేమం(అదనపు బాధ్యతలు).13. శివశంకర్ లాహోటి; ప్రస్తుతం: వెయిటింగ్ ఫర్ పోస్టింగ్; బదిలీ: సంయుక్త కార్యదర్శి, వ్యవసాయం, సహకార శాఖ, సంయుక్త కార్యదర్శి డిజాస్టర్ మేనేజ్మెంట్ (అదనపు బాధ్యతలు)14. చిట్టెం లక్ష్మి; ప్రస్తుతం: వెయిటింగ్ ఫర్ పోస్టింగ్; బదిలీ: సంయుక్త కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ.15. కె.హైమావతి; ప్రస్తుతం: పీడీ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ; బదిలీ: కలెక్టర్, సిద్దిపేట.16. వాసం వెంకటేశ్వర్లు; ప్రస్తుతం: డైరెక్టర్ యువజన సరీ్వసులు; బదిలీ:డైరెక్టర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, కుటుంబ సంక్షేమం.17. వీపీ గౌతమ్ ; ప్రస్తుతం: ప్రత్యేక కార్యదర్శి, గృహ నిర్మాణం; బదిలీ: కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ (అదనపు బాధ్యతలు)18. గౌతం పొట్రూ; ప్రస్తుతం: కలెక్టర్, మల్కాజిగిరి–మేడ్చల్; బదిలీ: డైరెక్టర్ సింగరేణి పర్సనెల్ అండ్ అడ్మిని్రస్టేషన్.19.కె. నిఖిల; ప్రస్తుతం: సీఈవో, టీజీఐఆర్డీ; బదిలీ: డైరెక్టర్, మత్స్యశాఖ, సీఈవో (టీజీఐఆర్డీ అదనపు బాధ్యతలు)20.వల్లూరి క్రాంతి; ప్రస్తుతం: కలెక్టర్, సంగారెడ్డి; బదిలీ: మేనేజింగ్ డైరెక్టర్ , పర్యాటకాభివృద్ధి సంస్థ21.ఉదయ్కుమార్; బదిలీ: సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ప్రత్యేక కార్యదర్శి, పీఈ శాఖ22. ప్రియాంక ఆలా ; ప్రస్తుతం: డైరెక్టర్, మత్స్య శాఖ; బదిలీ: కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.23. పి. ప్రావీణ్య; ప్రస్తుతం: కలెక్టర్, హనుమకొండ; బదిలీ: కలెక్టర్, సంగారెడ్డి.24. నిర్మలా కాంతివెస్లీ ; బదిలీ: కార్యదర్శి, సీఈవో, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, వీసీ అండ్ ఎండీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్.25. మిక్కిలినేని మనుచౌదరి; బదిలీ: కలెక్టర్, మేడ్చల్–మల్కాజిగిరి.26. ముజమ్మిల్ ఖాన్; ప్రస్తుతం: కలెక్టర్, ఖమ్మం; బదిలీ: డైరెక్టర్ సివిల్ సప్లయ్స్, సీఆర్వో హైదరాబాద్ (అదనపు బాధ్యతలు).27. స్నేహ శబరీ‹Ù ; ప్రస్తుతం: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ; బదిలీ: కలెక్టర్, హనుమకొండ 28. అనుదీప్ దురిశెట్టి; ప్రస్తుతం: కలెక్టర్, హైదరాబాద్; బదిలీ: కలెక్టర్, ఖమ్మం29. నవీన్ నికోలస్; ప్రస్తుతం: కార్యదర్శి, టీజీపీఎస్సీ; బదిలీ: డైరెక్టర్, పాఠశాల విద్య, (ఎస్ ఎస్ఏ పీడీగా అదనపు బాధ్యతలు).30. చెక్క ప్రియాంక ; ప్రస్తుతం: ఉప కార్యదర్శి, ఎంఏ అండ్ యూడీ; బదిలీ: స్పెషల్ కమిషనర్, ఐ అండ్ పీఆర్.31. చాహత్ బాజ్పేయి; ప్రస్తుతం: కమిషనర్, కరీంనగర్ కార్పొరేషన్; బదిలీ: కమిషనర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్.32. అశ్విని తానాజీ వకాడే; బదిలీ: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కరీంనగర్33. ప్రఫుల్ దేశాయ్; బదిలీ: కమిషనర్, కరీంనగర్ కార్పొరేషన్.34. షఫీయుల్లా; ప్రస్తుతం: ప్రత్యేక కమిషనర్, గ్రామీణాభివృద్ధి; బదిలీ: కార్యదర్శి, మైనారిటీ సంక్షేమం, కార్యదర్శి, మైనారిటీ స్కూల్స్ (అదనపు బాధ్యతలు)35. వీఎస్ఎన్వీ ప్రసాద్ (ఐఎఫ్ఎస్); బదిలీ: డైరెక్టర్, హెచ్ఎండీ 36. నిఖిల్ చక్రవర్తి; ప్రస్తుతం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టీజీఐఐసీ; బదిలీ: డైరెక్టర్, పరిశ్రమల శాఖ, -
చేనేత.. దేశ వారసత్వ సంపద
సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు.అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు. -
బడిబుడి అడుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రతీచోట తొలి రోజు హడావిడి కనిపించింది. విద్యార్థులకు.. స్థానిక నేతలు, విద్యాశాఖ అధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో స్వాగత బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. యాభైరోజుల తర్వాత కలుసు కున్న విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవ డం కనిపించింది. అన్నిచోట్ల తొలిరోజే పాఠ్యపుస్త కాలు, యూనిఫాం అందించారు. మొత్తంగా 50 లక్షల పాఠ్యపుస్తకాలు, 20 లక్షల యూనిఫాం అంద జేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠ శాల ప్రారంభం రోజే పుస్తకాలు, యూనిఫాం అందించాలని సీఎం కార్యాలయం అన్ని జిల్లా లకు ఆదే శాలు ఇచ్చింది. పంపిణీ కార్యక్రమాలపై సీఎంవో వివరాలు తెప్పించుకుంది.కొన్ని జిల్లాల్లో పుస్తకాల పంపిణీ ఆలస్యమవ్వడం, మరికొన్ని చోట్ల అందరికీ అందుబాటులో యూనిఫాం లేకపోవడంతో పంపిణీ జరగలేదు. వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా రు. పాఠశాలలను తెరిచే నాటికే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,852 ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల పాఠశా లలకు 1,01,66,220 పుస్తకాలు చేరాయని ముఖ్య మంత్రి కార్యాలయం తెలిపింది. తొలిరోజు పాఠశాల లకు 8,33,398 లక్షల మంది హాజరయ్యారని, వీరిలో 54,52,708 మందికి పుస్తకాలు అందించా మని సీఎంవో పేర్కొంది.ఈ ఏడాది మొత్తం 20,30,667 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజు పాఠశాలలకు హాజరైన 8,33,398 విద్యార్థులకు ఒక జత యూనిఫాంలను ఉపాధ్యాయులు అందజేశారు. రెండో జత త్వరలో అందిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి పాఠశా లల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ను ఒక సబ్జెక్టుగా బోధిస్తారు. దీనికి సంబంధించిన పుస్తకాలను కూడా విద్యార్థులకు అందజే శారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో తొలి రోజు విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. -
బాపు పట్టుదల.. బడికి పునరుజ్జీవం!
వైరా రూరల్: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల మళ్లీ గాడిలో పడింది. గతేడాది స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి చదివే కీర్తన అనే ఒకే విద్యార్థిని ఉండగా, అధికారులు పాఠశాలను మూసివేయాలని నిర్ణయించారు. కానీ కీర్తన తండ్రి అనిల్శర్మ పాఠశాలను మూసివేస్తే తన కుమార్తె చదువు మాన్పిస్తానని పట్టుబట్టడంతో కొనసాగించారు.ఈ విషయంపై ఈ ఏడాది మార్చి 23వ తేదీన ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ‘బడిని బతికించిన బాపు’శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.6 లక్షలతో పాఠశాలలో సకల వసతులు కల్పించారు. బడిబాట ద్వారా ప్రచారం చేయటంతో ఈసారి పది మంది పిల్లలు చేరారు. రూ.లక్ష వ్యయంతో ‘వుయ్ కెన్ లెర్న్’పేరిట ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పాఠశాల మూతపడకుండా కొనసాగటానికి కారణమైన కీర్తనను స్కూల్కు ప్రచారకర్తగా ఎంపిక చేసి, ఆమె ఫొటో పాఠశాల గోడపై ఆకట్టుకునేలా అతికించారు. క్యాంపెయినింగ్కు దక్కిన ఫలితం..బడిబాటలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పాఠశాలలో విద్య, ఇతర వసతులపై అవగాహన కల్పించాం. దీంతో తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారు. – ఉమాపార్వతి, ఉపాధ్యాయురాలు, నారపునేనిపల్లి యూపీఎస్స్నేహితులు వచ్చారు..గతేడాది బడిలో నేను మాత్రమే ఉండేదాన్ని. మా నాన్న ఉదయం దింపి తిరిగి తీసుకెళ్లే వారు. ఈ ఏడాది మరికొంత మంది చేరడంతో నాకు స్నేహితులు దొరికారు. – నందిగామ కీర్తన, 5వ తరగతి -
జైళ్లలో డీ అడిక్షన్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన ఖైదీల్లో మానసిక, శారీరక పరివర్తన తెచ్చేలా తెలంగాణ జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శాఖ పరిధిలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో డీ అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనుంది. చర్లపల్లి, చంచల్గూడ, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లలో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆయా జైళ్లలో అవసరం మేరకు భవనాలు గుర్తించారు. కేంద్రాల్లో పనిచేయాల్సిన మెడికల్ ఆఫీసర్లు, సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు సహా ఇతర సిబ్బంది నియామకానికి సంబంధించి జైళ్ల శాఖ తరఫున ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23 నుంచి మూడురోజుల పాటు డీజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. డీ అడిక్షన్ టీంలో ఎవరెవరు ఉంటారుమెడికల్ ఆఫీసర్, సైకియాట్రిస్టు, క్లినికల్ సైకాలజిస్టులు, ఫిజీషియన్, మోటివేషనల్ స్పీకర్లు, మెంటార్లు, యోగా, మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, అకౌంటెంట్, అడ్మిన్ మేనేజర్. ఏ ఖైదీలను ఈ కేంద్రాల్లో పెడతారు..జైళ్లలో ఉండే శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) గైడ్లైన్స్ ప్రకారం జైల్ మెడికల్ అధికారి ద్వారా తొలుత హెల్త్ స్క్రీన్రింగ్ నిర్వహిస్తారు. ఇందులో మత్తు పదార్థాలకు బానిసలైన వారందరినీ గుర్తించి ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మాత్రమే జైళ్లలో ఏర్పాటు చేయబోతున్న డీ అడిక్షన్ సెంటర్లలో ఖైదీలను చేర్చి చికిత్స ప్రారంభిస్తారు. రకరకాల క్లాసులు.. వ్యాపకాలుడీ అడిక్షన్ ప్రక్రియలో భాగంగా ఖైదీలకు వ్యక్తిత్వ వికాసం, మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తారు. సైకియాట్రిస్టులతో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వ్యాపకాల వైపు వారి దృష్టి మళ్లిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో వ్యక్తిగత కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రతిరోజూ యోగా, పెయింటింగ్, ఆర్ట్ థెరపీ తరగతులు, మ్యూజిక్ సెషన్స్ ఉంటాయి. సదుపాయాలు ఇలా..ప్రతి డీ అడిక్షన్ సెంటర్లో 20 పడకలు, ఇంటెన్సివ్ కేర్ రూమ్లు, జనరల్ అబ్జర్వేషన్ రూమ్లు, 24 గంటల పాటు నర్సింగ్ కేర్ సదుపాయాలు ఉంటాయి. మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యం మత్తుపదార్థాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిపై స్పెషల్ డ్రైవ్లు పెరగడంతో రాష్ట్రంలోని జైళ్లకు వస్తున్న ఖైదీల్లోనూ డ్రగ్స్కు బానిసలైన వారి సంఖ్యా ఎక్కువగా ఉంటోంది. డ్రగ్స్కు అలవాటుపడి, నేరాలు చేసి జైళ్లకు వచ్చేవారిని మార్చేందుకు, వారికి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించేందుకు.. వారి శిక్షాకాలం సరైన సమయంగా మేం భావిస్తున్నాం. శిక్ష పూర్తి చేసుకుని బయటికి వెళ్లే సమయానికి వారిని సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా వారి కుటుంబాలకు, సమాజానికి అందివ్వడమే ఈ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. ఖైదీల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక పెంచేలా అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించబోతున్నాం. – సౌమ్యా మిశ్రా, డీజీ, తెలంగాణ జైళ్లశాఖ -
‘పీఎం కుసుమ్’లో దళారీలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కింద ఒకటి, రెండు మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం పొందిన రాష్ట్ర రైతులపై దళారీలు గద్దల్లా వాలుతున్నారు. ఈ పథకం లాభదాయకం కాదని.. సాంకేతిక పరిజ్ఞానం లేనందున గిట్టుబాటుకాక నష్టపోతారని ప్రచారంచేస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఎకరాకు లీజు కింద రూ. 33 వేలు చెల్లిస్తామని.. ఏటా దాన్ని 10 శాతం పెంచుతామని ప్రలోభాలకు గురిచేస్తూ అనుమతులను తమకు ఇచ్చేయాలని దళారులతోపాటు సౌర ఫలకాల తయారీ సంస్థలు నేరుగా రైతులకే ఫోన్లు చేస్తున్నాయి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం కూడా కల్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. 3 వేల మెగావాట్లు కాస్తా.. వాయు కాలుష్యానికి కారణమయ్యే డీజిల్ పంపుసెట్ల స్థానంలో సౌరశక్తితో నడిచే పంపుసెట్లను రైతులు ఉపయోగించేలా ప్రోత్సహించడంతోపాటు వారు అదనపు ఆదాయం పొందేందుకు 2 మెగావాట్ల వరకు సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్రం పీఎం కుసుమ్ పథకాన్ని తీసుకొచ్చింది. సోలార్ పంపుసెట్లపై 30 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 3,000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం మెగావాట్కు దాదాపు రూ. లక్ష వరకు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) చెల్లించాలని పేర్కొంది. 25 ఏళ్లపాటు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ను యూనిట్కు రూ. 3.13 చొప్పున కొనేలా ఒప్పందం (పీపీఏ) చేసుకుంటాయని వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేస్తాయని వివరించింది. అయితే సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉంటేనే ఈ పథకం కింద రైతులు అర్హులని పేర్కొంది. దీంతో దాదాపు 6,000 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. అయితే తాము నిర్దేశించిన గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించలేదంటూ కేంద్రం 3,000 మెగావాట్ల పథకాన్ని కాస్తా 1,000 మెగావాట్లకు కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో చివరకు ఈ పథకాన్ని 1,450 మెగావాట్లకు పెంచింది. రైతులు, రైతు బృందాలు, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, ప్రైవేటు వ్యక్తులు 6,000 మెగావాట్ల కోసం దరఖాస్తు చేసినా ఈఎండీ చెల్లించింది మాత్రం 1,600 మెగావాట్లకే కావడంతో ఈ ఏడాది 1,450 మెగావాట్లకు మాత్రమే అనుమతులిచ్చే అవకాశం ఉంది. 65 శాతం రైతుల నుంచే.. ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల్లో సుమారు 65 శాతం రైతుల నుంచే వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఎక్కువ మంది రైతులు ఒకటి, ఒకటిన్నర మెగావాట్ కోసం దరఖాస్తు చేసుకోగా కొందరు రెండు మెగావాట్లకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పొందిన రైతుల వద్దకు దళారులు ప్రత్యక్షమవుతున్నారు. ఆయా రైతులు ఆది, సోమవారాల్లో దక్షిణ డిస్కంతో పీపీఏలు కుదుర్చుకోవడానికి రాగా అక్కడ కూడా వారిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. కొందరు ఉద్యోగులు కూడా దళారులకు వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. కాగా, విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడానికి ఎక్కువగా మహబూబ్నగర్, నల్లగొండ జిల్లా నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు టీజీ రెడ్కో అధికారులు వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80మంది రైతులతో పీపీఏలు కుదుర్చుకుంది. ఎస్పీడీసీఎల్ జూలై 7 వరకు పీపీఏ ప్రక్రియ కొనసాగుతుందని ఓ అధికారి వివరించారు. మెగావాట్కు ఏడాదికి 16 లక్షల యూనిట్ల విద్యుత్.. సోలార్ విద్యుత్ ప్లాంట్లో ఒక మెగావాట్కు ఏడాదికి 16 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని అంచనా. సోలార్ ప్యానెల్స్ మేలు రకమైనవి అయితే ఇంకాస్త విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికార వర్గాల సమాచారం. పీపీఏలు చేసుకున్న తర్వాతే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఒక మెగావాట్కు మూడు కోట్ల వరకు వ్యయం అవుతుండగా బ్యాంకులు మాత్రం మెగావాట్కు రూ. 2 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయని.. మిగిలిన నిధులకూ పూచీకత్తు ఇవ్వాలంటున్నారని ఔత్సాహిక రైతులు రఘురామ్, అర్జున్ వివరించారు. 25 ఏళ్ల వరకు పీపీఏలు ఉన్న నేపథ్యంలో మొదట్లో భారీగా ఆదాయం రాకపోయినా పదేళ్ల తరువాత నిర్వహణ వ్యయం పోనూ ఏటా రూ. 15–20 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ముందస్తు నివారణ చర్యలే మేలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే.. నష్టం జరగకముందే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) చెపుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి గురువారం సచివాలయంలో ప్రకృతి విప త్తుల నిర్వహణ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధి కారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లో వరదల ముప్పును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి హైడ్రా కమిషనర్, అగి్నమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని వివరించారు. తర్వాత కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడ్తామని తెలిపారు. వర్షాకాలం ముందుస్తుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే భారీ వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి, వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మూసపద్ధతికి స్వస్తి చెప్పండి.. విపత్తుల నిర్వహణ విభాగం మూసపద్ధతికి స్వస్తి చెప్పి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వరద నియంత్రణ కట్టలు, చిన్న–మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్లు.. మొదలైన వాటిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార కిట్లను ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వారికి బాధితులను తరలించడం, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, విపత్తుల నిర్వహణ కమిషనర్, అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయితీరాజ్ కమిషనర్ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఆరుగురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: మూడుచోట్ల పిడుగులు పడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా ఆదివాసీలే. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన రైతు పెందూర్ మాధవరావు తన కుటుంబసభ్యులు, 14 మంది కూలీలతో కలిసి చేనులో గురువారం మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం తర్వాత మళ్లీ అదేపనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో వారంతా సమీపంలోని ఓ పందిరి కిందకు చేరారు. అక్కడే ఓ టేకు చెట్టు ఉంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో దానికి దగ్గరలోనే ఉన్న పెందూర్ మాధవరావు(45), ఆయన కూతురు పెందూర్ సుజాత(16), సిడం రంభబాయి(40), మంగం భీమ్బాయి (45) అక్కడికక్కడే మృతిచెందారు. మాధవరావు భార్య, ఇద్దరు కుమారులు, బంధువులు 10 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని పీహెచ్సీలకు, మరికొందరిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. బేల మండల పరిధిలోని సాంగిడి గ్రామంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగు పడి గెడం నందిని(30), సోన్కాస్ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా కోవ సునీత(40) అక్కడికక్కడే మృతిచెందారు. ఉట్నూర్ మండలం కుమ్మరితండాకు చెందిన ధర్మరాజు, కృష్ణబాయి, నిర్మల చేను పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.చేను సమీపంలోని చెట్టుపై పిడుగు పడడంతో ముగ్గురూ గాయపడ్డారు. వీరిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. -
రైలు బోగీలో ప్రసవం
బాసర: నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్లో గురువారం ఆగిన రైలులో ఒక గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలివి. మహారాష్ట్రలోని ధర్మబాద్ మండలం కర్కెళ్లి గ్రామానికి చెందిన గర్భిణి నాగేశ్వరి వైద్య పరీక్షల నిమిత్తం నిజామాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. గురువారం తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ నుంచి కాచిగూడ–నాగర్సోల్ రైలులో ధర్మబాద్ బయల్దేరింది. రైలు నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే.. ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికులు, ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై రైల్వేస్టేషన్ మేనేజర్ రవీందర్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. రైలు బాసర స్టేషన్లో ఆగగానే నాగేశ్వరికి నొప్పులు తీవ్రమయ్యాయి. తోటి ప్రయాణికులు సహకరించడంతో.. మగశిశువుకు జన్మనిచ్చింది. ఇంతలో 108 అంబులెన్స్ సిబ్బంది రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. తల్లీబిడ్డలను అంబులెన్స్లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. -
గురుకులాలకు తాళాలు!
సాక్షి, హైదరాబాద్: అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు గురుకుల పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. వేసవి సెలవుల అనంతరం గురువారం గురుకులాలకు వచ్చిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు గేట్లకు వేసిన తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రిన్సిపాళ్లు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చర్చలు జరపడంతో మధ్యాహ్నం తర్వాత కొన్నిచోట్ల యజమానులు తాళాలు తీశారు. గురుకులాలూ షురూ..: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పాఠశాల లు తెరుచుకున్నాయి. మిగతా స్కూళ్లతో పాటు గురుకుల విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకల్లా తరగతులు ప్రారంభం కావాల్సి ఉండడంతో గంట ముందే ప్రిన్సిపాళ్లు పాఠశాలలకు చేరుకున్నారు. అయితే ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు భవనాలకు పాఠశాల సిబ్బంది వేసిన తాళాల స్థానంలో భవన యజమానుల తాళాలు కనిపించాయి. అద్దె బకాయిలు చెల్లించే వరకు తాళాలు తీసే ప్రసక్తే లేదని యజమానులు ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి స్పష్టం చేశారు. మరికొందరు తమ భవనాలు వెంటనే ఖాళీ చేయాలని తేల్చిచెప్పడంతో పాఠశాలల సిబ్బంది, బడికెళ్లేందుకు వచ్చిన పిల్లలు బయటే నిలబడాల్సి వచ్చింది.జనరల్ మినహా అన్నీ అద్దె భవనాల్లోనే..రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా... విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ ఉంది. వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకులాలన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తుండగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు సంబంధించిన 662 గురుకుల విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇందులో పలు పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. అద్దె బకాయిలు చెల్లిస్తేనే తాళాలు తొలగిస్తామని స్పష్టం చేయగా... మరికొందరు మాత్రం భవనాలను ఖాళీ చేయాలని తేల్చిచెప్పారు. దీంతో పాఠశాల సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు గేటు బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.రూ.215 కోట్ల బకాయిలుప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు నెలకు సగటున రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బకాయిల మొత్తం రూ.215 కోట్లకు చేరింది. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులపై సంబంధిత యజమానులు గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే అద్దె చెల్లించాలంటూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. 63 గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలంటూ ఆయా భవనాల యజమానులు గత నెలలోనే సంబంధిత ప్రిన్సిపాళ్లకు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల కాలేదు.కాస్త ఉపశమనం..గురుకుల పాఠశాలలకు తాళాలు పడే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సంబంధించిన అద్దె బకాయిల్లో కొంతమేర చెల్లించేలా చర్యలు తీసుకుంది. దాదాపు 10 నెలల బకాయిలు ఉండగా.. మూడు నుంచి నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులకు ఆర్థికశాఖ మోక్షం కలిగించింది. ఈ మేరకు నిధులను సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లకు విడుదల చేసింది. వారు భవనాల యజమానులకు చెల్లించేందుకు గురువారం హడావుడిగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే యజమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే త్రైమాసికంలో (జూలై నెలాఖరులో) మిగిలిన బకాయిలు విడుదల చేస్తారని, అప్పటివరకు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో, చాలాచోట్ల మధ్యాహ్నం తర్వాత యజమానులు తాళాలు తీశారు.చేసిన పనులకు బిల్లులు రాలేదని ..– సిద్దిపేట జిల్లాలో బడికి కాంట్రాక్టర్ తాళంచేర్యాల (సిద్దిపేట):పాఠశాల అభివృద్ధిలో భాగంగా రెండేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ బడికి తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా ఆకునూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల క్రితం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద కాంట్రాక్టర్ డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టి టైల్స్, విద్యుత్ పనులు చేశారు. ఇందుకు సంబంధించి రూ.8.5 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్ పలుమార్లు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్ గురువారం పాఠశాల పునఃప్రారంభం రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకముందే పాఠశాల గేటుకు తాళం వేశారు. అయితే విద్యాశాఖ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ నీరేష్ వెంటనే అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడించడంతో తాళం తీశారు. -
సాగర్ కుడి కాల్వ మా అధీనంలోనే..
నాగార్జునసాగర్: సాగర్ ప్రాజెక్టు కుడివైపు (కృష్ణానదికి ఆవలివైపు) ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న ఆనకట్ట, కుడి కాల్వ తమ అధీనంలోనే ఉండాలని, కుడికాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ వైపు ప్రస్తుతం సీఆర్పీఎఫ్ బలగాలు పహారాలో ఉన్నాయి.తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం భద్రతను ఉపసంహరించుకొని ఏప్రిల్లో వెళ్లిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య కేఆర్ఎంబీ సమక్షంలో గతంలో జరిగిన సమావేశంలో.. ఏపీ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు జూన్ నెలాఖరులోగా వెళ్లిపోతాయని ఏపీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవంగా సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లిపోగానే సాగర్ డ్యాం మొత్తం తెలంగాణకు చెందిన ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) పర్యవేక్షణలో ఉంటుంది.అయితే, ఏపీ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించుకోగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎఫ్ డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. సొంత బలగాల ఏర్పాటుతో పాటు కుడి కాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డుకు కూడా తెలిపింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ కుడివైపున గల ప్రాజెక్టు భూభాగం పూర్తిగా తమ (ఏపీ)అధీనంలోనే ఉండాలని, కుడి కాల్వ గేట్లపై తెలంగాణ ప్రభుత్వ సాగునీటి అధికారుల అజమాయిషీ ఉండరాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. -
దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా
సాక్షి, వరంగల్ : దత్తత ప్రక్రియలో కొందరు బాలల సంరక్షణ విభాగాధికారులు దందాకు తేర లేపారన్న ఆరోపణలున్నాయి. తక్కువ వయసున్న పిల్లల కోసం..కొందరు దంపతులు తమ వయసును తక్కువగా చూపించేందుకు కొన్ని స్కూళ్ల నుంచి స్టడీ, కండక్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టీఫికెట్లు తీసుకున్నారు. కొందరైతే చదువుకోకున్నా, స్టడీ సరిఫికెట్లు తీసుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. తెర వెనుక ఉండి కొందరు అధికారులు ఈ తతంగాన్ని నడిపించనట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిరక్షరాస్యులకు వయసు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఓసిఫికేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు.లేదంటే పాన్కార్డులోని పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఎక్కువ వయసున్న దంపతులకు తక్కువ వయసు పిల్లలను దత్తత ఇచ్చే అవకాశం లేదని అధికారులే ‘మామూలు’గా మాట్లాడతారు. కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మక్కై సర్టీఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్గా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు.వాస్తవానికి దంపతులిద్దరి వయసు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను దత్తత ఇస్తారు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టీఫికెట్ల తీసుకొని దందాకు తెరలేపారు. ఇలా చేసి పిల్లల జీవితాల్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు పదో తరగతి చదువుకునే సమయంలో తల్లిదండ్రులు వృద్ధాప్య దశలోకి రావడం.. పిల్లల భవిష్యత్పై ప్రభావం చూపుతోంది. వరంగల్ కేంద్రంగా... వరంగల్ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటకు వచ్చింది. గత నెలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగ ఉన్నతాధికారి దత్తతకు సంబంధించి హోంస్టడీ రిపోర్టులను సమీక్షించాలని చెప్పడం, దరఖాస్తు చేసుకున్నవారు రెన్యూవల్కు వచి్చన సందర్భంలో నకిలీ సర్టిఫికెట్ల అంశం అధికారుల దృష్టికి వచ్చింది. అయినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సర్టీఫికెట్ల దర్యాప్తునకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నర్సంపేట నుంచే నకిలీ సర్టీఫికెట్లు ⇒ వరంగల్ జిల్లాలోని నర్సంపేట కేంద్రంగా శ్రీఅరుణోదయ విద్యాలయం, అరుణోదయ విద్యాలయం, ఏకశిల హైస్కూల్ పేర్లతో రెండు దశాబ్దాల క్రితం ఒకటి, రెండు, మూడో తరగతి చదువుకున్నారంటూ కొందరు పిల్లలు లేని దంపతులకు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టీఫికెట్లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పిల్లలు లేని భార్యాభర్తలిద్దరూ చదువుకోకపోయినా, ఒకటే పాఠశాలలో చదివినట్టుగా సరిఫ్టికెట్ ఇవ్వడం, ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనా, రెండు దశాబ్దాల క్రితం ఒకటే పాఠశాలలో చదివినట్టుగా ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. అసలు వారు చదువుకున్న సమయంలో ఆ పాఠశాలలు లేకపోవడం గమనార్హం. ⇒ పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఒకరు చదవుకున్నా చదివినట్టుగా పాఠశాల పేరుతో నకిలీ స్కూల్ రికార్డు షీట్ తీసుకున్నారని ఆ పాఠశాల నిర్వాహకుడు బి.సాంబయ్య లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ⇒ దత్తతకు వచ్చిన చాలామంది దంపతులు నర్సంపేటలోని పాఠశాలల నుంచే ఈ సర్టీఫికెట్లు తేవడంతో దీని వెనుక బడా నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఇక్కడే చదువుకున్నట్టుగా సర్టీఫికెట్లు తీసుకెళ్లారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. -
పిల్లల పెంపకం.. చాలా కాస్ట్లీ
‘ఒకరికి ఏడాదికి రు.13 లక్షలు’ముంబైకి చెందిన అంకుర్ ఝవేరీ అనే ఒక ప్రొఫెషనల్ తాజాగా లింక్డ్ఇన్లో పెట్టిన ఈ పోస్టు.. పట్టణ ప్రాంత మధ్యతరగతి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని ఎత్తి చూపుతూనే, పిల్లల పెంపకానికి, చదువుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన రేకెత్తించింది. మెట్రోపాలిటన్ నగరంలో ఒకరికి ఏడాదికి రూ.13 లక్షలు ఖర్చవుతుండగా, అందులో చదువుకు అయ్యే ఖర్చే రు.7 నుంచి 8 లక్షల వరకు ఉంటోందని ఝవేరీ తన పోస్టులో అంచనా వేశారు. ‘గత వారం నేను నా కజిన్ను కలిసే వరకు, భారతదేశంలోనిఇ నగరాల్లో పిల్లలను పెంచడం తలకు మించిన భారమని నాకు తెలియదు’ అని ఝవేరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నెలకు రూ.లక్షకు పైగానే ఏదైనా ఒక ఇంటర్నేషన్ స్కూల్లో ట్యూషన్ ఫీజు ఏడాదికి ఒకరికి రూ.7 నుండి 8 లక్షల మధ్య ఉందని, ఇక యూనిఫారాలు, పుస్తకాలు, ప్రైవేట్ ట్యూషన్లు, చదువుకు సంబంధించిన ఇతర ఖర్చులన్నీ కలిపితే – సంవత్సరానికి మరో రూ. 2 నుండి 4 లక్షల వరకు అవుతుందని అంకుర్ ఝవేరీ పేర్కొన్నారు. ఒక విద్యా సంవత్సరానికి మొత్తం ఖర్చు దాదాపుగా రూ.12 లక్షలు అవుతోందని చెప్పారు. ఝవేరీ మరికొన్ని ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రూ.12 లక్షలకు అదనంగా కోచింగ్ / పాఠ్యేతర కార్యకలాపాలు, దుస్తులు, పుట్టినరోజు పార్టీలు, హాలిడే ఖర్చులు మొదలైనవి కూడా నెలకు రూ.8000–10,000 (ఏడాదికి రూ.1 లక్ష) చొప్పున కలిపితే, మొత్తం వార్షిక వ్యయం రూ.13 లక్షలు అవుతుందని తన పోస్టులో అంచనా కట్టారు.ఆర్థిక భారానికి సిద్ధంఈ లెక్కలన్నీ కూడా తన పైపై అంచనాలు మాత్రమే అని అంగీకరిస్తూ, ‘నేనింకా ఏమైనా మిస్ అయ్యానేమో తల్లిదండ్రులు చెప్పాలి’ అని ఝవేరీ నెటిజనుల అభిప్రాయాన్ని కోరారు. తన పోస్టుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని భావించిన ఝవేరీ, ‘‘కొంతమంది ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలలు తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, పిల్లల్ని అక్కడ చేర్చవచ్చు కదా?’ అని అనొచ్చు. ఇక్కడ నేను రెండు విషయాలను తీసుకుని ఈ లెక్కలు వేశాను. అవి, ఒకటి : ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువును అందించాలని కోరుకుంటారు. రెండు : ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో ప్రవేశం దొరకటం చాలా కష్టం’ అని ఝవేరీ వివరించారు.సామాజిక ఒత్తిడీ కారణం! ఝవేరీ పెట్టిన పోస్టుపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆయనతో ఏకీభవించారు. మరికొంత మంది విభేదించారు. ఖరీదైన పాఠశాలలు కావాలనుకున్నప్పుడే ఇంత ఖర్చు అవుతుంది అని కొందరు వాదించారు. ఒక నెట్ యూజర్ ‘బ్రాండెడ్ స్కూళ్లలో అంతేగా’ అని కామెంట్ చేశారు. మరొకరు.. పిల్లల చదువు విషయమై తల్లిదండ్రుల మీద ఉండే సామాజిక ఒత్తిడి గురించి మాట్లాడారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారోనన్న భయంతో తల్లిదండ్రులు కష్టమో, నష్టమో తలకు మించిన ఆర్థిక భారానికి సిద్ధమౌతారు, ప్రైవేటు స్కూళ్లు చెప్పే ఫీజులు కడతారు అని చెప్పారు. ఒక నెటిజెన్ ఝవేరీ పోస్టుతో పూర్తిగా విభేదించారు. ‘సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూళ్లలో మీ పిల్లల్ని ఎవరు చదివించమన్నారు?’ అని విమర్శించారు. ఐ.సి.ఎస్.ఇ., సి.బి.ఎస్.ఇ., ఐ.జి.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో సీటు తెచ్చుకోగలిగితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పిల్లలకు అందివ్వవచ్చు అని కొందరు అన్నారు. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా జె.శంకరయ్య, ఆర్అండ్ఆర్ కమిషనర్గా శివకుమార్ నాయుడు, రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్.హనుమంతు, నిజామాబాద్ కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్కుమార్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను నియమించింది.తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా వల్లూరి క్రాంతి, హ్యూమన్ రైట్స్ కమిషనర్ సెక్రటరీగా నిర్మల క్రాంతి వెస్లీ, ఇండస్ట్రీస్ డైరెక్టర్గా నిఖిల్ చక్రవర్తి, సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్పతి నాయక్, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఈ. నవీన్ నికోలస్, హన్మకొండ కలెక్టర్గా స్నేహశబరీష్, స్త్రీ,శిశు సంక్షేమ డైరెక్టర్గా శ్రీజన, ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉదయ్ కుమార్, ఐఅండ్పీఆర్ స్పెషల్ కమిషనర్గా చెక్క ప్రియాంక బదిలీ అయ్యారు. -
కేటీఆర్పై ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. .హైదరాబాద్ సీసీఎస్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్.. ముఖ్యమంత్రి కూర్చిని గౌరవించాలని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైంది?.కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ సీఎం. ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నియంత్రణ చేయకుంటే.. మేం కూడా మీరు చేసిన స్కాంలు, అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
నా చావుకు.. నా భార్యే కారణం..
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం.. రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.కాగా, ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ప్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేలింది.రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్ సుదర్శన్రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం. ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్రెడ్డే వంద శాతం అడ్డంకి. తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రల్హాద్ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్ఎస్ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్ మాట్లాడలేదు. అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది. -
మంగళూరు పోర్ట్ టు సికింద్రాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: మంగళూరు పోర్ట్ను సికింద్రాబాద్తో అనుసంధానించే ముఖ్యమైన బళ్లారి– చిక్జాజూర్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3,342 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు 185 కిలో మీటర్ల పొడవుతో ఉంటుంది. ప్రస్తుతం సికింద్రా బాద్ నుంచి కృష్ణపట్నం పోర్టుకు మాత్రమే రైలు మార్గం ఉండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో కొత్తగా మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానిస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) రెండు కీలక రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్లోని కొడర్మా– బర్కాకానా డబ్లింగ్ ప్రాజె క్టు, బళ్లారి–చిక్జాజూర్ డబ్లింగ్ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సౌలభ్యం, సామగ్రి రవాణా సామర్థ్యం, తక్కువ లాజిస్టిక్ ఖర్చుతో సహజంగా కార్బన్ ఉద్గారాల తగ్గింపుతో ఉన్న మౌలిక వ్యవస్థను బలపరచనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.6,405 కోట్లు. ఈ రెండు కీలక ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.బళ్లారి–చిక్జాజూర్ ప్రాజెక్టు ఇలా...బళ్లారి–చిక్జాజూర్ రైలు డబ్లింగ్ ప్రాజెక్టు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా సాగుతుంది. 185 కి.మీ. మార్గంలో 19 స్టేషన్లు, 29 మెయిన్ బ్రిడ్జీలు, 230 మైనర్ బ్రిడ్జీలు, 21 ఆర్వోబీలు, 85 ఆర్యూబీలు ఉంటాయి. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు ఇనుము ధాతువు, కోక్ కోల్, స్టీల్, ఎరువులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం పదార్థాల రవాణాకు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు వల్ల 470 గ్రామాలకు మెరుగైన రవాణా సేవలు, 13 లక్షల జనాభాకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఏటా 18.9 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణాకు వీలవడమే కాకుండా ఈ మార్గం వల్ల ప్రతి సంవత్సరం 101 కోట్ల కిలోల కార్బన్డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది. ఈ నూతన ప్రాజెక్టు వల్ల దాదాపు 20 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. -
దాటవేత ధోరణిలో సమాధానం
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈయన్ను సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో వెస్ట్జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్రావును ప్రశ్నించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్రావును సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఇద్దరినీ కలిపి కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం తొలిసారిగా విచారణకు హాజరైన ప్రభాకర్రావు ఫోన్ ట్యాపింగ్తో తనకు ఏం సంబంధం అని, దానికి అనుమతి ఇవ్వడానికి సాధికారిక కమిటీ ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆయా ఫోన్లు ట్యాప్ చేయడానికి సహకరించాల్సిందిగా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ నుంచి వెళ్లిన లేఖల్ని సిట్ బుధవారం తీసుకొచ్చింది.వీటిపై డిజిగ్నేటెడ్ అధికారిగా ప్రభాకర్రావు పేరు, ఆయన సంతకం ఉండటాన్ని సిట్ ప్రస్తావించింది. ట్యాపింగ్తో సంబంధం లేనప్పుడు ఆయా లేఖలపై ఎందుకు సంతకం చేశారంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు, వ్యాపారులతోపాటు నేతలు, వారి కుటుంబీకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని, వారి నంబర్లను ట్యాప్ చేస్తున్నారని తెలిసినప్పుడు లేఖలపై సంతకాలు ఎందుకు చేశారని అధికారులు ప్రశ్నించారు.కొందరు జడ్జిలకు సంబంధించిన కాల్ డిటేల్స్ సేకరించడం వెనుక ఉన్న కారణాలపై ఆరా తీశారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్న లకు ప్రభాకర్రావు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రణీత్రావుతో కలిపి ప్రభాకర్రావును విచారించిన సిట్ గతంలో సేకరించిన ఆధారాలు, తదితరాలను వీరి ముందు ఉంచారు.హార్డ్డిస్క్ శకలాల్ని మూసీలో ఎందుకు వేశారు ఇద్దరినీ వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు... కలిపి అవే అడిగి, వారు చెప్పిన సమాధానాలతో సరిచూశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసమే ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేశానని చెప్పిన ప్రభాకర్రావు సమర్థత ఆధారంగానే ఆ బాధ్యతలు ప్రణీత్కు అప్పగించినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిట్ అధికారులు అలాంటప్పుడు ఎస్ఓటీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మావోయిస్టుల కోసం తాము చేసే కొన్ని అత్యంత రహస్య ఆపరేషన్ల కోసమే అలా ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కితే జాతీయ భద్రతతోపాటు కొందరు అధికారులకు ముప్పు అని, ఆ కారణంగానే ఆయా ఆపరేషన్ల సమాచారం ఉన్న హార్డ్డిస్్కలు పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేస్తుంటామని ప్రభాకర్రావు సిట్ అధికారులకు తెలిపారు. అలా ధ్వంసం చేయడం సర్వసాధారణమే అయితే వాటి శకలాలను తీసుకెళ్లి నాగోలు వద్ద మూసీనదిలో పారేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రభాకర్రావు, ప్రణీత్రావులను సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభాకర్రావు నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్రావుకు నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్పై ఉన్న మరో నిందితుడితో కలిపి విచారించనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ప్రభాకర్రావు నుంచి సరైన సహకారం లభించట్లేదని, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానాలు చెప్పట్లేదని సిట్ చెబుతోంది. తనను ట్యాపింగ్, సీడీఆర్ల విశ్లేషణకు సంబంధించిన ఆదేశాలు ప్రభాకర్రావు నుంచి వచ్చాయని ప్రణీత్రావు చెబుతుండగా... ప్రభాకర్రావు మాత్రం వీటిని ఖండిస్తున్నారని వివరిస్తున్నారు. -
మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు. -
ఎస్ఎల్బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సీఈ అజయ్కుమార్లు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ వీరేంద్ర తివారీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డీజీగా పనిచేసిన హర్పాల్సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టన్నెల్ పనుల పూర్తికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా డిప్యుటేషన్పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. -
‘కరెంట్’కు మాన్సూన్ షాక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎండ, ఉక్కపోత ఉంటే అంతమేర కరెంటు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా డిస్కంకు బిల్లుల రూపంలో రావాల్సిన రాబడి కూడా అధికంగా ఉంటుంది. కానీ, డిస్కం ఇంజనీర్ల అంచనాలను మాన్సూన్ తారుమారు చేసింది. ఆదాయానికి గండికొట్టింది. గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వాడకం మే నెలలో ఐదువేల మెగావాట్లకు చేరుకుంటుందని డిస్కం అంచనా వేసింది. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే అధికారుల అంచనాలకు భిన్నంగా మే రెండో వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఎండలకు రోళ్లు, రోకళ్లు పగలాల్సిన రోహిణి కార్తెలోనూ ఏకధాటి వర్షాలు కురియడం, ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లను నిలిపివేయడం వల్ల నగరంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. 2024 మే నెలతో పోలిస్తే 2025 మే నెలలో నమోదైన విద్యుత్ డిమాండ్లో భారీ వ్యత్యాసం నమోదైంది. ఫలితంగా వేసవిలో విద్యుత్ అమ్మకాల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని సంస్థ కోల్పోవాల్సి వచ్చింది. గృహ విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న కోర్ సిటీ సర్కిళ్లతో పోలిస్తే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న శివారు సర్కిళ్లలో మాత్రం ఆదాయం అనూహ్యంగా పెరిగింది. అంతేకాదు 2023 మే నెలలో నమోదైన విద్యుత్ డిమాండ్తో పోలిస్తే 2024 మే నెలలో సగటు విద్యుత్ డిమాండ్ 13.9 శాతం పెరిగింది. అదేస్థాయిలో వినియోగం కూడా 12.6 శాతం పెరిగింది. 2024 మేలో రికార్డైన సగటు విద్యుత్ డిమాండ్తో పోలిస్తే 2025 మేలో 3.2 శాతం తగ్గింది. వినియోగం 2.5 శాతానికి పడిపోయి అధికారుల అంచనాలను తలకిందులు చేసింది. -
బడి గంట మోగింది
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురువారం బడులు తెరుచుకోనున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా హడావుడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బడులను అలంకరిస్తున్నారు. స్టేషనరీ, యూనిఫామ్ షాపులు, షూస్ అమ్మే దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, బస్సులు విద్యార్థుల కోసం సిద్ధమవుతున్నాయి. అధికారుల్లోనూ హడావుడి మొదలైంది. వసతి గృహాలకు వెళ్లే విద్యార్థులు పెట్టేబేడాతో సన్నద్ధమవుతున్నారు. టీచర్లు తమ స్కూళ్లలో రిజిస్టర్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులు వాట్సాప్ మెసేజీలతో ప్రభుత్వ టీచర్లను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 41,354 స్కూళ్లలో సందడి వాతావరణం కనిపించబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు కలిపి మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరో పక్క వారం రోజుల్లో ప్రభుత్వ టీచర్ల సర్దుబాటు చేపడతామని అధికారులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఉండేలా చేస్తామంటున్నారు. తక్కువ విద్యార్థులున్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే, వారిని టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికిపైగా టీచర్లను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. సర్కారీ స్కూళ్ల సన్నాహాలుప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను నడిపించాలన్నది విద్యాశాఖ లక్ష్యం. ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యను కూడా అందించాలని నిర్ణయించారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు 60 వేల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సరికొత్త బోధన మెళకువలను రిసోర్స్ పర్సన్స్ ద్వారా అందించామని విద్యాశాఖ ధీమాగా ఉంది. విద్యార్థులను ఆకట్టుకునే బోధన ప్రణాళికనూ రూపొందించామని చెబుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం కేలండర్ను పాఠశాల విద్య డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రతీ రోజు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించింది. ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో చిన్న చిన్న రిపేర్లు వేసవిలోనే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మౌలిక వసతుల లోపం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెపుతున్నారు. స్కూళ్లు మొదలయ్యాక ఈ అంశంపై దృష్టి పెడతామని అంటున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పుస్తకాలు, యూనిఫామ్లు చేరాయని, మొదటి రోజే వాటిని విద్యార్థులకు అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొత్తగా చేరే విద్యార్థులకు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపారు. మరో పక్క ఈ నెలాఖరు వరకు బడిబాట నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ఆకర్షిస్తారు. ఏఐ పాఠాలు.. కంప్యూటర్ ల్యాబ్లుపాఠశాల విద్యాస్థాయి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం 3,412 స్కూళ్లను ఎంపిక చేశారు. పలు సంస్థలతో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. 604 మండలాల్లో కంప్యూటర్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ విద్య, ఏఐ పాఠాలపై ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వీటిపై గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం కల్పించాలని, విద్యార్థులను ఆకర్షించాలని ప్రభుత్వం డీఈవోలకు సూచించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలపై జాతీయ సర్వే సంస్థలు కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక లెర్నింగ్ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక విద్య స్థాయిలో తక్కువ ప్రమాణాలున్న వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
వానలకు అనుకూలంగా వాతావరణం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లదనం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ లేకుండా పోయింది. అక్కడక్కడా అడపాదడపా తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ..వాతావరణంలో నెలకొన్న మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. రుతుపవనాల కదలికలు చురుగ్గా మారుతుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు tకురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మాటూర్లో 4.93 సెం.మీ. వర్షం బుధవారం రాష్ట్రంలో సగటున 7.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో 11 రోజుల్లో 3.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. బుధవారం సాయంత్రానికి 2.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాటూర్లో 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో 4.35, నల్లగొండ జిల్లా ముదిగొండలో 3.38, పడమటిపల్లెలో 3.10, తిమ్మాపూర్లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తొలిదశ కింద 210 స్కూళ్లలో దీనికి సంబంధించిన తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లా అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఒకటవ తరగతిలో చేరే ముందు, అందుకు సన్నద్ధతగా ఈ పూర్వ ప్రాథమిక విద్య దోహదపడుతుంది. ఆటలు, పాటలు, కథల రూపంలో విద్యాబోధన ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ పేరిట ప్రీ ప్రైమరీ విద్య రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాది పాటే ఇందుకు సంబంధించిన తరగతులు ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
కేబినెట్ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నాం. సాంకేతికపరమైన అంశాలపై ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయం మేమే (ప్రభుత్వం) తీసుకున్నాం. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచించింది..’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాకపోవడం వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అని కమిషన్ ప్రశ్నించగా, కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని నాటి మహారాష్ట్ర సీఎం పృథీ్వరాజ్ చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ను నేను స్వయంగా కలిసి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సహకరించాలని కోరితే ససేమిరా అన్నారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సహకరిస్తామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల కింద 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా, తుమ్మిడిహట్టి వద్ద అంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడం వల్లే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేపట్టాం. ప్రత్యామ్నాయాలపై వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైడార్ సర్వే చేయించగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బరాజ్లు నిర్మించాలని సిఫారసు చేసింది. బొగ్గు గనులు ఉండడంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీళ్లను తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అందుకే మూడు బరాజ్లు నిర్మించి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే నిర్ణయం జరిగింది. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల జలాల లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నాం. బరాజ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఉంది. మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు జరిగాయి..’ అని కేసీఆర్ చెప్పారు. ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే... బరాజ్ల లొకేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇంజనీర్లు, సాంకేతిక బృందం తీసుకుందని కేసీఆర్ బదులిచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4 వేల మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. బరాజ్ల నుంచి పంప్హౌస్ల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన స్థాయిల్లో నిల్వలను కొనసాగించే అంశంపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక అంశాల్లో నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారు. మంత్రివర్గ ఆమోదంతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ఏర్పాటుకు అనుమతిచ్చాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత ఉండడంతో రుణాల సమీకరణ కోసం దీనిని ఏర్పాటు చేశాం. ప్రాజెక్టుకు ఆదాయం సమకూరే వరకు రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే..’ అని మాజీ సీఎం చెప్పారు. బరాజ్ల నిర్వహణకు రూ.280 కోట్ల నిధులిచ్చాం..కానీ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సీపేజీ ఏర్పడడం వెనక నిర్వహణ, పర్యక్షణ లోపాలు సైతం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. బరాజ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం రూ.280 కోట్లను కేటాయిస్తూ 2020లో తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 ప్రతిని కమిషన్కు అందజేశారు. నిధులు మంజూరు చేసినా ఇంజనీర్లు వాడుకోలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ క్వాలిటీ కంట్రోల్ డివిజన్నే ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ రూపొందించిన ఓ పుస్తకాన్ని కూడా కమిషన్కు కేసీఆర్ అందజేశారు. మాజీ మంత్రి హరీశ్రావు ఇటీవల విలేకరుల సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్నే పుస్తక రూపంలోకి మార్చి కమిషన్కు ఇచ్చారు. సిబ్బందిని, మీడియాను బయటకు పంపించి.. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇప్పటివరకు హాజరైన ఇతర సాక్షులందరినీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగంగానే ప్రశ్నించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా బహిరంగ విచారణలో పాల్గొనలేనని, తనను ప్రశ్నించేటప్పుడు ఎవరినీ అనుమతించరాదని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించి ‘ఇన్ కెమెరా’ విధానంలో (కేవలం కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మాత్రమే ఉన్నప్పుడు) క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. జస్టిస్ ఘోష్ అడిగే ప్రశ్నలు, కేసీఆర్ ఇచ్చే సమాధానాలను కంప్యూటర్పై టైప్ చేసేందుకు కమిషన్ కార్యదర్శిని అనుమతించారు. 18 ప్రశ్నలు...50 నిమిషాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 50 నిమిషాల పాటు సాగి 12.50 గంటలకు ముగిసింది. కేసీఆర్కు కమిషన్ 18 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. కేసీఆర్ను కమిషన్ కార్యాలయానికి తోడ్కొని వచ్చిన వారిలో మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచే అవకాశం ఉంది. -
తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.👉గడ్డం వివేక్- కార్మిక, మైనింగ్ శాఖలు👉వాకిటి శ్రీహరి- పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యూత్ శాఖలు👉అడ్లూరి లక్ష్మణ్- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖకాగా, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. అనంతరం నిర్ణయం తీసుకున్నారు. -
కళ్లు బైర్లు కమ్మేలా.. వామ్మో కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు ఇన్ని వందల కోట్లా
సాక్షి,హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం కేసులో నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో నూనె శ్రీధర్కు రూ.200కోట్లు ఆస్తుల్ని గుర్తించినట్లు సమాచారం.ఏసీబీ అధికారుల దాడుల్లో హైదరాబాద్తో పాటు 15 చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. హైదరాబాద్ , కరీంనగర్ వరంగల్లో 19 ప్లాట్లు, తెల్లాపూర్లో విల్లా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఇండివ్యూజువల్ హౌస్, నాంపల్లిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, పలు హోటల్స్ బినామీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు సోదాల్లో తేలినట్లు సమాచారం. నూనె శ్రీధర్ తన కుమారుడు డెస్టినేషన్ మ్యారేజీని థాయిలాండ్లో చేసినట్లు ఆధారాల్ని సేకరించారు. దీంతో పాటు భారీగా బంగారం, నగలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.కాగా, నూనె శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,7,8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. -
సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ బోధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేలా తెలంగాణ విద్యాశాఖ అనుమతులిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రీప్రైమరి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
తెలంగాణ హైకోర్టులో గ్రూప్1పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో గ్రూప్1పై తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా పడింది. గ్రూప్1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటీషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్) చేయాలని లేదా మరోసారి మెయిన్స్ నిర్వహించాలన్న పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే, అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని... నిపుణులతో మెయిన్స్ పత్రాలు మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన ఉపాసనా
హైదరాబాద్: హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై కొన్ని అపోహలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రచారం ముమ్మరంగా చేస్తారు.మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు చేరుకునే విధంగా దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు. నిర్మాణాత్మక సమాజ భాగస్వామ్యం, ఆరోగ్య ముప్పు అంచనాలతో శిక్షణ పొందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అపోలో ఫౌండేషన్ అమలు చేస్తోంది. ఆరోగ్యంపై అవగాహన కలిగిన సమాజాన్ని నిర్మించడంలో ఫ్యూజిఫిల్మ్ ఇండియా నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.భారతీయ మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. ఐసీఎంఆర్ వారి జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో 14% ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు, తగినంత అవగాహన లేకపోవడం, అపోహలు, సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకే ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.స్థానిక స్థాయిలో నమ్మదగిన, సాంస్కృతికంగా సున్నితమైన సమాచారాన్ని అందించేలా ఇది ఉంటుంది. గౌరవప్రదమైన బహిరంగ చర్చలు, వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహించి, మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేలా ఇది చూస్తుంది. తద్వారా వారు తమ లక్షణాలను త్వరగా గుర్తించి, స్వీయ పరీక్షల ద్వారా అర్థం చేసుకుని, సరైన సమయానికి చికిత్సలు పొందేలా చూస్తారు.ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కొణిదెల మాట్లాడుతూ, “వైద్యరంగంలో అగ్రగాములుగా ఉన్న మాకు.. కేవలం అనారోగ్యాలకు చికిత్స చేయడమే కాక.. ముందుగా గుర్తించాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తగిన సమాచారం లేకపోవడం, త్వరగా చికిత్స పొందడానికి వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. ఈ వాస్తవాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు ఫ్యూజిఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఆలస్యం కాకముందే మహిళలకు తగిన అవగాహన కల్పించడానికి, అవసరమైన చోట అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని చెప్పారు.ఫ్యూజిఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా మాట్లాడుతూ, “ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు ఇవ్వాలన్న మా గ్రూప్ లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎప్పుడూ వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తుంటుంది. విభిన్నమైన ఆలోచనలు, సామర్థ్యాలు, అసాధారణ వ్యక్తుల సాయాన్ని కలపడం ద్వారా ఈ ప్రపంచానికి సంతోషం, నవ్వులు అందించే పరిష్కారాలను సృష్టించడమే మా లక్ష్యం. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించే ఈ ప్రచారంతో మహిళలకు తగిన అవగాహన కల్పించి, ఈ వ్యాధిని త్వరగా గుర్తించి, వీలైనన్ని ప్రాణాలను కాపాడాలన్నదే మా లక్ష్యం” అని వివరించారు.తన సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా ఫ్యూజిఫిల్మ్ ఇండియా సంస్థ ఆరోగ్య సంరక్షణను అందరికీ మరింత అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ఇవి అందనివారికి అందించడం, త్వరగా గుర్తించడం, అవగాహన ద్వారా దాన్ని నివారించే చర్యలు చేపట్టడం కూడా ఇందులో భాగమే. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ప్రచారం.. ఫ్యూజిఫిల్మ్ గ్రూప్ సస్టెయినబుల్ వాల్యూ 2030 ప్రణాళికకు అనుగుణంగా ఉంది.వైద్యం అందరికీ సమానంగా అందాలని, ఇప్పటివరకు అందనివారికి అందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ప్రభావం బాగా అవసరమైన చోట సేవలు అందించడం ద్వారా ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు అందించడాలన్న కంపెనీ గ్రూప్ లక్ష్యాన్ని ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది. అది ఒక మారుమూల పట్టణమైనా, జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరమైనా.. ప్రతి మహిళకూ తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు, దాన్ని రక్షించుకోవడానికి తగిన అవకాశం ఉండాలని ఫ్యూజిఫిల్మ్ ఇండియా భావిస్తుంది. -
‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పారు’?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్పై ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ బృందం ప్రభాకర్ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం. -
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. 'కిషన్రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టే కిషన్రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. -
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం రాహుల్ దగ్గర’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందని, సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలనుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఒకవేళ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే 25–30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ కాంగ్రెస్ను వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని, త్వరలో ఇది జరగబోతుందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో పాల్ విలేకరులతో మాట్లాడారు. -
ఐదెకరాలు అమ్మైనా నిన్ను...!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూవివాదం కాస్త ముదిరి ‘హత్య చేస్తా’.. అని బెదింరింపులకు దిగే వరకు వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం నెలకొంది. కాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడికి దిగారు. అతడిపై పిడి గుద్దులు గుద్దుతూ దాడిచేయగా ఇద్దరు మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆగకుండా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ‘ఐదు ఎకరాలు అమ్మి అయినా సరే నిన్ను చంపేస్తా’ అంటూ ఒక వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఇదంతా ఫోన్లో మరొకరు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ను వివరణ కోరగా, దాడికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, భూ సంబంధిత అంశం కావడంతో ఇరువురిని పోలీస్స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. -
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తాజాగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను.ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను.నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే…— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) June 11, 2025 -
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య
తొగుట (సిద్ధిపేట జిల్లా): ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బండారుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైనట్టు గ్రామంలోని కొందరు నాయకులు తెలపడంతో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అందుతాయన్న ఆశతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుని బేస్మెంట్ వరకు నిర్మించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత మంజూరైన ఇళ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందంటూ బాధితుడికి నాయకులు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రవికాంత్రావు తెలిపారు. -
26న గోల్కొండ తొలి బోనం
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఆషాఢ మాసం బోనాల వేడుకలు ఈ నెల 26న గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆషాఢ మాసం బోనాల పండుగకు సంబంధించి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మాట్లాడుతూ జూన్ 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 13న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర, 14న రంగం, 20న అక్కన్న మాదన్న బోనాల జాతర, లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయన్నారు. జులై 24న బోనాల పండుగ ముగుస్తుందన్నారు. నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసం బోనాల పండుగ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వ్రస్తాలు సమరి్పస్తుందని, ఇందులో మంత్రులు పాల్గొంటారని, 19 దేవాలయాల్లో ఈఓలు, దేవాలయ శాఖ అధికారులు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమరి్పస్తారన్నారు. అగి్నమాపక శాఖ అధికారులు ముందుగా దేవాలయాలను సందర్శించి ప్రణాళిక రూపొందించుకుని ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలన్నారు. 700 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు. -
గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తాజాగా నిలుపుదల చేసింది. ఈ క్రమంలో గాలి జనార్థన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి.. దేశం విడిచి వెళ్లవద్దని.. ఆయన పాస్పోర్టును సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.కాగా, ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును గాలి జనార్దన్రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. మధ్యంతర అభ్యర్థనలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. -
రేవంత్ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్కు జాబితా
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకమాండ్కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఇక, సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
సిట్ అడిగింది తెస్తారా? ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత విచారణలో అధికారుల ప్రశ్నలకు ఆయన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు బృందం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణకు ప్రభాకర్ రావు(Prabhakar Rao) రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమయంలో వాడిన సెల్ఫోన్లు(రెండు), ల్యాప్ ట్యాప్, మ్యాక్ బుక్లను తీసుకురావాలని ఆయన్ని అధికారులు ఆదేశించారు. వీటి ద్వారా ఈ కేసులో కీలక సమాచారం రాబట్ట వచ్చని సిట్ భావిస్తోంది. దీంతో ఆయన వాటిని తీసుకొస్తారా? అధికారులకు అందిస్తారా? ఏదైనా కారణం చెబుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారంలోకి వెలుగులోకి వచ్చాక.. ఆయన అమెరికా వెళ్లారు. సుమారు 15 నెలల తర్వాత సుప్రీం కోర్టులో అరెస్ట్ నుంచి ఊరట లభించడం, పైగా విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ నెల 8వ తేదీ హైదరాబాద్కు వచ్చారు. ఆపై ఆ మరుసటిరోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి 8గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్.. ఫోన్ ట్యాఇపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్నింటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ, ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావు ఎస్ఐబీకి చెందిన హార్డ్డిస్క్ల డాటా మాయం చేశాడని విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు. ఎస్ఐబీలో పాత హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్తవి పెట్టడం.. కొన్ని దశాబ్దాలుగా నిఘా వర్గాలు దాచిన ఉగ్రవాద, తీవ్ర వాద సమాచారం మాయం కావడంపైనా ప్రభాకర్ రావును ఆరా తీశారు. అయితే వీటిలో దేనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు రెండో రౌండ్ విచారణపై రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. -
కమిషన్ విచారణకు కేసీఆర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గద. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే!. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు!. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!’ అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని… pic.twitter.com/aYrdkAwGXQ— KTR (@KTRBRS) June 11, 2025 -
ఎర్రవల్లి ఫాంహౌస్లో పల్లా రాజేశ్వర్కు గాయం.. యశోదకు తరలింపు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్లోని బాత్ రూమ్లో కాలు జారిపోయి కింద పడిపోవడంతో రాజేశ్వర్ రెడ్డి కాలు విరిగినట్టు తెలుస్తోంది. దీంతో, అంబులెన్స్లో ఆయనను హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం.అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ బాత్రూమ్లో కాలి జారి కింద పడిపోయారు. దీంతో, ఆయన కాలు విరిగినట్టు తెలుస్తోంది. అనంతరం, అంబులెన్స్లో ఆయనను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలిస్తున్నట్టు సమాచారం. -
కేసీఆర్కు 18 ప్రశ్నలు.. కమిషన్కు కీలక డాక్యుమెంట్స్
కేసీఆర్ విచారణ అప్డేట్స్.. కేసీఆర్కు 18 ప్రశ్నలు.. కమిషన్కు కీలక డాక్యుమెంట్స్జీవో-45 నెంబర్తో కలిగిన జీవోను కమిషన్కు ఇచ్చిన కేసీఆర్.ఆపరేషన్స్ అండ్ మెంటినెన్స్ బుక్ను కమిషన్కు అందజేసిన కేసీఆర్.కేసీఆర్ను 18 ప్రశ్నలు అడిగిన కమిషన్.THE LIFE LINE OF KALESWARAM PPRJECT అనే పేరుతో ఉన్న డాక్యుమెంట్ను కమిషన్కు అందించిన కేసీఆర్కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కేసీఆర్ను ప్రశ్నించిన కమిషన్.నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్న కేసీఆర్.బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్న.టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నట్లు తెలిపిన కమిషన్.బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ ప్రశ్న.టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయి.కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని క్యాబినెట్ అనుమతి ఉందని తెలిపిన కేసీఆర్.ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, CWC లేఖలను కమిషన్కు తెలిపిన కేసీఆర్. ఫాంహౌస్కు బయలుదేరిన కేసీఆర్.. కాళేశ్వరం విషయంలో 115వ సాక్షిగా కేసీఆర్ను విచారించిన కమిషన్.తెలంగాణలో నీటి లభ్యత, వినియోగంపై కేసీఆర్ వివరించినట్టు సమాచారం.బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.ముగిసిన కేసీఆర్ విచారణకాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్.. కేసీఆర్ను విచారించింది. కాళేశ్వరం నిర్మాణంపై ప్రశ్నలు అడిగిన కమిషన్పలు డాక్యుమెంట్లను కమిషన్కు అందజేసిన కేసీఆర్. కాసేపట్లో బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు రానున్నారు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్కు నివేదిక ఇచ్చిన కేసీఆర్.కమిషన్ విచారణలో పాల్గొన్న ఇద్దరు నోడల్ అధికారులు.మొత్తం నలుగురు అధికారుల సమక్షంలో సాగుతున్న కేసీఆర్ విచారణ.నోడల్ అధికారుల పేర్లు శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డివన్ టు వన్ విచారణ..కేసీఆర్ను వన్ టు వన్ విచారణ జరుపుతున్న పీసీ ఘోష్.అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ కోరిన కేసీఆర్ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించిన కమిషన్ చైర్మన్ ఘోష్. కేసీఆర్తో ప్రతిజ్ఞదేవుని పై ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని కేసీఆర్ తో ప్రతిజ్ఞ చేయించిన కమిషన్ చైర్మన్ ఘోష్.కమిషన్కు పలు డాక్యుమెంట్స్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తతబీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. 👉కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్..ఇవన్నీ సీఎం రేవంత్ డ్రామాలు: కేటీఆర్👉బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వంద కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే.. మొత్తం ప్రాజెక్ట్ వేస్ట్ అంటున్నారు. ఇరిగేషన్పై కేసీఆర్కు ఉన్న అవగాహన ఏ నాయకుడికి లేదు. ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం ఆడిస్తున్న డ్రామాలు ఇవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్లే కుట్ర చేసి ఉంటారు. సీఎం రేవంత్.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. 94వేల కోట్ల ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్కే భవన్కు చేరుకున్నారు. తన వెంటన కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాల ఫైల్ను కేసీఆర్ తీసుకెళ్లారు. కేసీఆర్ వెంటన తొమ్మిది లోపలికి వెళ్లారు. 👉బీఆర్కే భవన్ వద్దకు కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 👉నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీఆర్కే భవన్ వద్ద హైటెన్షన్కమిషన్ కార్యాలయానికి కేసీఆర్తో పాటు మరో 9 మందికి మాత్రమే అనుమతి.మధుసూదనాచారి, హరీష్రావు, ప్రశాంత్ రెడ్డి, రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్, పద్మారావు, మహమూద్ అలీ, లక్ష్మారెడ్డికి అనుమతి.బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.బీఆర్కే భవన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.రోప్తో బీఆర్ఎస్ కార్యకర్తలను కట్టడి చేస్తున్న పోలీసులు.బీఆర్కే భవన్ వద్ద పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం.జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ గులాబీ పార్టీ కార్యకర్తల నినాదాలు.. 👉ఎర్రవల్లి ఫాం హౌస్ నుండి బీఆర్కే భవన్ బయలుదేరిన కేసీఆర్, హరీష్ రావు, కవితకాళేశ్వరం పై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/s4rDIftNpe— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్రావుతెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి.తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది.కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు.ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు. From achieving Telangana statehood to delivering transformative projects like Kaleshwaram, KCR’s commitment to the people has been unwavering.While others chase power, he changed lives.Congress conspiracy or enquiry commission can't erase his legacy.His sacrifices for…— Harish Rao Thanneeru (@BRSHarish) June 11, 2025 కోర్టు హాల్ సిద్ధం..కమిషన్ కార్యాలయంలో కోర్టు హాల్ సిద్ధం చేసిన అధికారులు.ఇన్ కెమెరా ఏర్పాట్లను సైతం సిద్ధంగా ఉంచిన కమిషన్ సిబ్బంది.కేసీఆర్ సమ్మతితో ఓపెన్ కోర్టు విచారణ లేదా ఇన్ కెమెరా విచారణ చేయనున్న కమిషన్ 👉బీఆర్కే భవన్ వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.👉దేశ్కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు👉కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులనూ విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. కేసీఆర్ వస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్లో పోలీసులు ఆంక్షలు విధించారు.👉బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 11:30 గంటలకు బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ ముందు రోడ్డును అధికారులు మూసివేశారు. దాదాపు ఐదు వేల మందికిపైగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ట్యాంక్ బండ్ వైపు రోడ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్కు వచ్చే వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. 👉ఇదిలా ఉండగా.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తిచేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమై ఇన్కెమెరా విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
నిజామాబాద్లో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏసీబీ దాడుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు చేపట్టారు.వివరాల ప్రకారం.. ఏసీబీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు శ్రీధర్పై ఆరోపణలున్నాయి. నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బోయినపల్లి (కరీంనగర్): భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది.వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీంతో మనస్తాపం చెందిన హరీశ్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్ మృతదేహం లభ్యమైంది. హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. -
కాసుల కోసమే పాస్ల ధర పెంపు!
సాక్షి, హైదరాబాద్: మహిళల ఉచిత ప్రయాణం ఆర్టీసీకి సవాల్గా మారుతోంది. నగదు నిల్వలు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తోంది. తాజాగా విద్యార్థులు, ఎన్జీవోలు ఎక్కువగా వినియోగించే బస్పాస్లను సైతం వదిలిపెట్టకుండా ఉన్నఫలంగా చార్జీలను పెంచేశారు. ఏ రోజుకారోజు బస్సుల నిర్వహణ, విడిభాగాల కొనుగోళ్లు, తదితర ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడం వల్లనే బస్పాస్ల ధరలను పెంచవలసి వచి్చందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అన్ని రకాల పాస్లపైన 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. నగరంలో ప్రస్తుతం రోజుకు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వారిలో 17 లక్షల మందికి పైగా మహిళలే. వీరి చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ ఈ నిధులు సకాలంలో లభించడం లేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం వివిధ మార్గాలను అన్వేíÙస్తున్నారు. పెంచిన బస్పాస్ ధరల వల్ల ప్రతి నెలా రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకం కింద అన్ని ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలతోనే ఇవి కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా పురుషుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రయాణికులను పెంచేందుకు అధికారులు కండక్టర్లపైన ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి బస్సుకు నగదు టార్గెట్లు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులను సైతం వదిలిపెట్టకుండా అడ్డగోలుగా బస్పాస్ ధరలను పెంచడం గమనార్హం. సాధారణ నెలవారీ పాస్ను ఏకంగా రూ.400 నుంచి రూ.600లకు పెంచారు. ఈ పాస్ తీసుకున్న విద్యార్థులు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలి. మెట్రోల్లో ప్రయాణం చేయాలంటే అదనంగా చెల్లించవలసిందే. అందుకోసం స్పెషల్ పాస్లను ప్రవేశపెట్టారు.పురుష ప్రయాణికులు 6 లక్షలే... ఒకప్పుడు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్జోన్లో ఉచిత ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సాంకేతికంగా ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. కానీ అదే సమయంలో పురుషుల సంఖ్య 6 లక్షలకు తగ్గింది. గతంలో సుమారు 18 లక్షల మంది మగవాళ్లు ఉంటే 15 లక్షల మంది మహిళలు ఉండేవారు. బస్సుల్లో సీట్లు లభించకపోవడం, మహిళలతోనే నిండిపోవడంతో చాలామంది వ్యక్తిగత వాహనాలను, మెట్రోరైళ్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ‘ఈ 6 లక్షల మంది చెల్లించే టిక్కెట్ చార్జీలు రూ.2.5 కోట్ల వరకు ఉంటాయి. కానీ ఇటీవల పెరిగిన విడిభాగాల ధరలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చుల దృష్ట్యా రోజుకు రూ.3 కోట్ల వరకు భారం పడుతుంది.’ అని ఒక అధికారి తెలిపారు. ‘ కొన్ని రకాల విడిభాగాలు ఎప్పటికప్పుడు డిపోస్థాయిలోనే కొనుగోలు చేయవలసి ఉంటుంది. వాటికోసం బస్భవన్పైన ఆధారపడలేం కదా..’ అని పేర్కొన్నారు. పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఇటీవల 200 మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టారు. కానీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల కంటే మెట్రోడీలక్స్ చార్జీలు చాలా ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విద్యార్థి పాస్ల కోసం విస్తృత ఏర్పాట్లు.... స్టూడెంట్ బస్పాస్ల కోసం ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. విద్యార్థులు టీజీఎస్ఆరీ్టసీ వెబ్సైట్లో (https://tgsrtcpass.com) ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విద్యాసంస్థల ప్రిన్సిపాళ్ల ఆమోదంతో ఈ దరఖాస్తులు ఆర్టీసీకి చేరుతాయి.ఈ నెల 12వ తేదీ నుంచి నగరంలోని అన్ని బస్పాస్ కేంద్రాల నుంచివిద్యార్థులు తమ పాస్లను తీసుకోవచ్చు. ఆరాంఘర్, ఆఫ్జల్గంజ్, బాలానగర్, బోరబండ, సీబీఎస్, చార్మినార్, దిల్సుఖ్నగర్, ఈసీఐఎల్, ఫరూఖ్నగర్, ఘట్కేసర్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ, కోఠి బస్టెరి్మనల్, కేపీహెచ్బీ, లక్డీకాఫNల్, ఎల్బీనగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహదీపట్నం, మిధాని, మొయినాబాద్, ఎన్జీవో కాలనీ, శంషాబాద్, ఉప్పల్ తదితర బస్పాస్ కేంద్రాల నుంచి తీసుకోవచ్చు. -
ఎర్రవల్లి ఫాంహౌస్.. కేసీఆర్ను కలిసిన కవిత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. తాజాగా కవిత.. ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ను కవిత కలవడం విశేషం. కవిత.. తన భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కేసీఆర్తో కలిసి కవిత.. బీఆర్కే భవన్కు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం ఎర్రవల్లి ఫాంహౌస్కు చేరుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ కోసం కేసీఆర్.. ఈరోజు ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరనున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.బరాజ్లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. -
అనుమానంతో భార్యను అంతం చేశాడు
చైతన్యపురి(హైదరాబాద్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో తన భార్యను మెడకు చున్నీ బిగించి హతమార్చాడు ఓ వ్యక్తి. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి వివరాలు వెల్లడించారు. భాగ్యనగర్ కాలనీలో అమ్ములు (30), మరియదాస్లు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరియదాస్ కారు డ్రైవర్గా పనిచేస్తుండగా అమ్ములు ఇండ్లలో సనిచేస్తోంది. బార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి వివాహేతర సంబంధ అనుమానాలు ఉన్నాయి. కొంత కాలంగా ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరుగుతోంది.. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో గొడవ పెట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మరియదాస్.. అమ్ములు మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఇదే విషయాన్ని మరియదాస్ ఎదురు ఇంట్లో ఉండే మామ అర్జునుడుకి సమాచారం ఇచ్చాడు. దీంతో అర్జునుడు వారి ఇంటికి వెళ్లి చూడగా కూతురు విగతజీవిగా ఉండటం గమనించాడు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కార్పొరేట్స్కూళ్లలో ఫైనాన్షియర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందా ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరఫున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేసేలా ఈ కొత్త తరహా దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి.పుస్తకాలు, యూనిఫాం, యాప్ల పేరిట బాదుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం మేర ఫీజులు పెరిగాయి. సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక్క పాఠ్య పుస్తకాల వ్యయమే రూ.12 వేల వరకు ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత ‘యాప్’ల పేరిట మరో దోపిడీకి కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు (Fees) నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్లెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటులో చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం లేదు.. నియంత్రణ లేదు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్ళను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచే నిబంధన విధించే యోచనలో ఉంది.ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. తిరుపతిరావు కమిటీ సిఫారసులు కనుమరుగుతిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది. ‘ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే..యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10 శాతానికి పైగా ఫీజు పెంచే స్కూళ్ళన్నీ విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి.ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలి..’అని సూచించింది. ఈ మేరకు 2018లో కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఈ నేపథ్యంలో 10 శాతం లోపు ఫీజులు పెంచిన దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. అయితే ఆ తర్వాత ఈ విధానం కనుమరుగైంది. కమిటీ సిఫారసులు కఠినంగా అమలు చేస్తే చాలా వరకు స్కూళ్లు 10 శాతం లోపే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని అంచనా.చట్టం తేవాలిప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 25 శాతం పెంచారు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజులు నియంత్రించాలి. చిత్తశుద్ధితో చట్టాన్ని తెచ్చి అమలు చేయాలి. – పొలుసు సంజీవరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి)ప్రభుత్వ నియంత్రణ ఉండాలిప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)వడ్డీ వసూలు చేస్తున్నారుఫీజులు, సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశి్నస్తే..అన్ని పాఠశాలలు ఇలానే చేస్తున్నాయంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తాం తీసుకెళ్లండంటున్నారు. ఇలా వసూలు చేయడం చట్ట విరుద్ధం అని చెబుతున్న అధికారులు..ఈ పాఠశాలల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – ఆశ (విద్యార్థి తల్లి) -
3 నెలల రేషన్.. ఒకటే నిశాన్
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్ను ఈ నెలలోనే పొందుతున్న రేషన్కార్డుదారులు మూడుసార్లు, ఆరుసార్లు వేలిముద్రలు వేసే అవసరం లేకుండా సాఫ్ట్వేర్ను సరిచేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. కేంద్రం జారీ చేసిన ఎన్ఎఫ్ఎస్ కార్డులకు ఆరుసార్లు.. రాష్ట్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఎస్ కార్డులకు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి సరిచేసినట్లు తెలిపారు. ఇప్పుడు వినియోగదారులు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుందన్నారు. అయితే మూడు నెలల రేషన్ కాబట్టి బియ్యాన్ని రెండు, మూడుసార్లు తూకం వేయాల్సి వస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...మరో వారంలో ధాన్యం సేకరణ పూర్తిముందస్తు నైరుతి రుతుపవనాలు, అకాల వర్షాలు ముంచెత్తినా, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేశాం. సోమవారం నాటికి ఏకంగా 72.83 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని సేకరించాం. చాలా జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయింది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తాం. ఆలస్యంగా నాట్లేసిన మండలాల్లో ఒక్కో కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతాం. రైతుల నుంచి ఇప్పటివరకు రూ. 16,760 కోట్ల విలువైన ధాన్యాన్ని కొని రూ. 15,121 కోట్లు చెల్లించాం.కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లుయాసంగి కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన 8,378 కేంద్రాల్లో మౌలికవసతుల కల్పనతోపాటు వర్షం పడినా రైతులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఉన్న 2.5 లక్షల టార్పాలిన్లకు అదనంగా లక్ష టార్పాలిన్లను పంపించాం. దక్షిణాదిలోనే తొలిసారిగా 830 ప్యాడీ క్లీనర్లు, ధాన్యం ఆరబెట్టేందుకు డ్రైయర్లను కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచాం. తద్వారా పచ్చి ధాన్యాన్ని, రాళ్లురప్పలు ఉన్న ధాన్యాన్ని కూడా శుభ్రం చేసి కొని మిల్లులకు పంపాం.783 మంది డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం నిలిపివేశాంరాష్ట్రంలో 3 వేలకుపైగా ఉన్న మిల్లుల్లో 2022–23లో యాసంగి ధాన్యం సీఎంఆర్ చేయకుండా ఎగ్గొట్టిన మిల్లర్లతోపాటు కొన్నేళ్లుగా బకాయిపడ్డ మిల్లర్లకు యాసంగిలో ధాన్యం కేటాయించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 783 మంది మిల్లర్లను బ్లాక్ చేశాం. 2022–23 యాసంగి ధాన్యం సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల నుంచి రూ. 3,800 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం లేదా అందుకు సమానమైన విలువను రికవరీ చేశాం. ఇంకా రూ. 1,400 కోట్లు మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. మరో 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి ఫిలిప్పీన్స్కు పంపిస్తున్నాం. మిస్సింగ్ కింద చూపించిన (మిల్లర్లు అమ్ముకున్న) 5.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానమైన రూ. 1,000 కోట్లను సంబంధిత మిల్లర్ల నుంచి రికవరీ చేయాల్సి ఉంది. ఇప్పటికే నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది. సన్నబియ్యం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట గతంలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యాన్ని దళారులు తక్కువ ధరకు కొని విక్రయించేవారు. ఉగాది కానుకగా అమల్లోకి తెచ్చిన రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీతో అక్రమాలకు అడ్డుకట్టపడినట్ల యింది. నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు కూడా సన్నబియ్యం కోసం క్యూలలో నిలబడి మరీ తీసుకెళ్తున్నారు. ఫలితంగా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. గతంలో దొడ్డుబియ్యాన్ని 20 శాతం మంది ప్రజలే వినియోగిస్తే సన్నబియ్యం 90 శాతానికిపైగా సద్వినియోగం అవుతోంది. తెలంగాణలో పండిన దొడ్డు బియ్యాన్ని నేరుగా ఫిలిప్పీన్స్కు పంపిస్తున్నాం. ఇతర దేశాలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. -
ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేలా!
సాక్షి, హైదరాబాద్: నైజీరియన్ డ్రగ్స్ ముఠా లను మూలాల నుంచి దెబ్బకొట్టేందుకు ప్రత్యే క వ్యూహాలతో తెలంగాణ యాంటీ నార్కో టిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) ముందుకు వెళ్తోంది. ఇక్కడ సంపాదించిన సొమ్ము ను హవాలా మార్గాల్లో విదేశాలకు చేరవేస్తూ మనీలాండరింగ్కు పాల్పడుతున్న ఈ ముఠాల ఆర్థిక లావాదేవీలను కట్టడి చేసేదిశగా టీజీఏఎన్బీ అధికారులు కొంత పురోగతి సాధించారు. ఇటీవల గోవాలో నిర్వహించిన ఆపరేషన్లో పట్టు బడిన నైజీరియన్ డ్రగ్స్ ముఠాకు చెందిన మ్యాక్స్వెల్ 150కి పైగా బ్యాంకు ఖాతాలను వాడి డబ్బును నైజీరియాకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. మనీలాండరింగ్ ఆధారాలున్నందున రెడ్కార్నర్ నోటీ సుల జారీకి సన్నద్ధమయ్యారు. ఈ అంశంపై ఈడీ అధికారులకు కూడా సమాచారం చేరవేసినట్టు తెలిసింది. డ్రగ్స్ దందాలో సంపాదించిన సొమ్మును దేశం దాటించే మార్గాలను మూసివేస్తే.. నైజీరి యన్లు మనదేశం వైపు రాకుండా కట్టడి చేయవచ్చన్నది ఈ వ్యూహంలో ముఖ్య అంశం. వారికి స్థానికంగా ఇల్లు, విల్లాలు అద్దెకు ఇవ్వకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. విదేశీయు లకు ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని టీజీఏఎన్బీ అధికా రులు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. హవాలా మార్గాల మూసివేతపై ఫోకస్ గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ హైదరాబాద్కు కొకైన్ సరఫరా చేస్తున్న డీజే వనీష్ ఠాకూర్, సప్లయర్ బాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, గోవాలోని పర్రా ఏరియా సహా పలు కీలక ప్రాంతాల్లో నెల రోజులపాటు ఏఎన్బీ అధికారులు ఇటీవల సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించారు. మెడికల్ వీసాలపై భారత్కు వచ్చి గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ఎమ్యానుల్ బెడియాకో అలియాస్ మ్యాక్స్వెల్ అలియాస్ మ్యాక్స్ కదలికలపై నిఘా పెట్టారు. మ్యాక్స్వెల్ తన దందాను హైదరాబాద్కు విస్తరించేందుకు ప్రయత్నించగా సైనిక్పురి ప్రాంతంలో ఇటీవలే అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు ఈ డ్రగ్స్ నెట్వర్క్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సొమ్మును దేశం దాటిస్తున్న హవాలా వ్యాపారులు ఉత్తమ్సింగ్, రాజుసింగ్, మహేందర్ ప్రజాపతిని అరెస్టు చేసి రూ.49.65 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మ్యాక్స్వెల్ 150 బ్యాంకు ఖాతాల ద్వారా నైజీరియాలోని తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపినట్లు ఆధారాలు సేకరించారు. ఆ మార్గాలను మూసివేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చిక్కులు తప్పవు విదేశీయులు ఎవరైనా తమ హోటళ్లు, ఇళ్లు, అతిథి గృహా లు లేదా ఫ్లాట్లలో బస చేసినప్పుడు.. వాటి యజమాను లు తప్పక పోలీసులకు సమాచారం ఇవ్వాలని టీజీఏ ఎన్బీ అధికారులు తెలిపారు విదేశీయుల చట్టంలోని సెక్షన్–7 ప్రకారం సి–ఫారమ్ను 24 గంటల్లో తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టంచేశారు. సమాచారం ఇవ్వని పక్షంలో ఆ ఇళ్లలో విదేశీయులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, అందుకు యజమానులు సైతం బాధ్యత వహి ంచాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రధానంగా హైద రాబాద్లో విదేశీయులు ఎక్కువగా నివాసం ఉంటున్న పారామౌంట్ కాలనీ, బృందావన్ కాలనీ, సైనిక్పురి, సన్సిటీ, టోలీచౌకి, జూబ్లీహిల్స్, లంగర్ హౌస్, బంజారా హిల్స్ ప్రాంతాల ఇళ్ల యజమానులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా.. 1908 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. -
ఎంట్రీ లెవల్కూ ఏఐ సవాల్!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొత్తంగా ఎంట్రీ లెవెల్ (తొలి స్థాయి)ఉద్యోగార్థులు, గ్రాడ్యుయేట్లకు డిమాండ్ భారీ ఎత్తున తగ్గిపోతోంది. రాను రాను మొదటి ఉద్యోగం దొరకడం అనేది కష్టంగా, సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఇప్పటికే వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), తాజా గ్రాడ్యుయేట్లు తమ తొట్టతొలి కొలువు దక్కించుకోవడాన్ని కూడా కష్టసాధ్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలకు అవసరమైన డాక్యుమెంట్ల విశ్లేషణ, సమావేశాలకు అవసరమైన బ్రీఫింగ్ నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) రూపకల్పన, కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు లేదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వంటి పనులను ఏఐ సులువుగా చక్కబెట్టేస్తుండటమే ఇందుకు కారణం. ఏఐతో నెట్టుకొచ్చేస్తున్న కంపెనీలు.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువత తమ కెరీర్ మొదట్లో ఎక్కువగా ఈ తరహా పనులే చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఉద్యోగాలకు ఎసరు తెస్తోంది. కంపెనీలు కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ వైపు మొగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సైతం తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’ఉన్నతోద్యోగి ఒకరు.. ‘రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ అనేది అన్ని వైట్ కాలర్ జాబ్ (కార్యాలయాల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగం)ల్లో సగానికి సగం ఎంట్రీ లెవల్ జాబ్లను తుడిచి పెట్టేస్తుంది..’అంటూ ఇటీవల చేసిన ప్రకటనను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితికి తగ్గట్టుగానే కొన్ని కంపెనీలు ‘చాట్ జీపీటీ’ని ఇంటర్న్షిప్ చేసే జూనియర్ లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగిగా ఉపయోగించుకోవడాన్ని ఆచరణలో పెట్టేయడం గమనార్హం. కాగా వివిధ రంగాలకు సంబంధించిన ఎంట్రీ లెవల్ జాబ్లకు డిమాండ్ తగ్గుదలను తాము గమనించామని లండన్లోని రిక్రూట్మెంట్ సంస్థ ‘ఫ్రెష్ మైండ్స్’ప్రతినిధులు ఇటీవల వెల్లడించడాన్ని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు. తమ సంస్థల్లో చేరబోయే ఉద్యోగులు ‘వర్క్ రెడీ ప్రొఫెషనల్స్’గా ఉండాలని ఆయా సంస్థలు కోరుకుంటున్నాయని వారు తెలిపారు. కొన్ని కంపెనీలు జూనియర్ పోస్టులను సైతం సీనియర్ ఉద్యోగులతో భర్తీ చేస్తున్న ఉదంతాలను వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ తన ‘స్టేట్ ఆఫ్ టాలెంట్ 2025’నివేదికలో ప్రస్తావించింది.సంసిద్ధులుకావాల్సిందే..: నిపుణులుప్రస్తుత పరిస్థితులన్నీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు మొదటి ఉద్యోగం సాధించడాన్ని సమస్యాత్మకంగా మారుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నవ యువత సాంకేతికంగా ఒక అడుగు ముందుకేసి తమకు సవాళ్లు విసురుతున్న వ్యవస్థలను అధిగమించేందుకు సంసిద్ధులై ఉండాలని సూచిస్తున్నారు. కృత్రిమ మేధనే ఓ ఆయుధంగా మలుచుకోవాలని చెబుతున్నారు. చాట్ జీపీటీ, గ్రోక్, తదితరాలను ఉపయోగిస్తూ తమపై పడే పనిభారాన్ని తగ్గించుకోవడంతో పాటు విధుల నిర్వహణలో వేగంగా ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు. సిద్ధమే అంటున్న యువత.. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ ఒకరు.. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన 70 మంది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ విద్యార్థులను ఏఐతో, ఎంట్రీ లెవల్ జాబ్స్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ప్రశ్నించారు. ఏఐ వల్ల వారికి రావాల్సిన ఉద్యోగాల్లో భారీగా కోతగా ఏర్పడబోతోందా? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? అని అడిగారు. పలువురు విద్యార్థులు స్పందిస్తూ.. ఏఐ వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించడం లేదని చెప్పారు. తాము ఏఐనే ఓ సాధనంగా ఉపయోగించుకుని పని ప్రదేశాల్లో రాణించేందుకు సిద్ధమంటూ సమాధానమిచ్చారు. ఏఐ టూల్స్ వినియోగంలో తాము పైచేయి సాధించినందున తమకు పెద్దగా సమస్య ఎదురుకాబోదని అన్నారు. తమలో అత్యధికులు ఒక్క చాట్ జీపీటీనే కాకుండా... జెమిని, క్లాడ్, ఫైర్ఫ్లై, హేజెన్, గామా, హిగ్స్ఫీల్డ్, యుడియో, నోట్బుక్ ఎల్ఎం, మిడ్ జర్నీ వంటి వివిధ రకాల టూల్స్ను ఉపయోగిస్తున్నామంటూ ప్రశ్న అడిగిన ప్రొఫెసరే ఆశ్చర్యపోయేలా సమాధానమివ్వడం..ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా యువతలో వస్తున్న మార్పునకు సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.యువతను ప్రోత్సహిస్తే కంపెనీలకే మేలు కంపెనీలు కూడా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఎంట్రీ లెవల్ జాబ్లను ఏఐకు అప్పగించకుండా యువతకున్న టాలెంట్ను ఉపయోగించుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చేసే పనికి సృజనాత్మకతను జోడించి కొత్త ఆవిష్కరణలు చేసేలా యువతను ప్రోత్సహించడం వల్ల కంపెనీలకే మేలు జరుగుతుందని చెబుతున్నారు. కేవలం ఏఐ టూల్స్ వినియోగానికి పరిమితమవుతూ ఎక్కువ ఉత్పాదకత సాధనపై దృష్టి పెట్టకుండా వ్యూహాత్మకంగా, క్రియాశీలంగా పని చేసే వర్క్ఫోర్స్ను పెంపొందించుకుంటే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. -
విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద బీమా కింద రూ. కోటి చెల్లించేలా ఎస్బీఐతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన సమక్షంలో బ్యాంకర్లతో విద్యుత్ సంస్థలు ప్రమాద బీమా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 52 వేల మంది ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రమాద బీమా కింద ఉద్యోగులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.80 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. ఉద్యోగి సహజ మరణం చెందితే రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని, ఉద్యోగితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. త్వరితగతిన ‘యాదాద్రి’ పూర్తికి భట్టి ఆదేశం: యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. త్వరితగతిన ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ను ఆదేశించారు. ప్రతి వారానికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను సోమవారం పరిశీలించి వచ్చిన బీహెచ్ఈఎల్ సీఎండీ, డైరెక్టర్లు, టీజీ జెన్కో సీఎండీ అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని భట్టికి వివరించారు. యూనిట్–1, యూనిట్–2 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగతా మూడు యూనిట్ల పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. అన్ని యూనిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ప్రారంభమవుతాయన్నారు. కాగా ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్లు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఇద్దరు కొత్త మంత్రులు ఆయన్ను సత్కరించారు. -
మిర్చికి ఆ ‘తేజ’స్సు ఏదీ?
ఖమ్మం వ్యవసాయం: విదేశీ ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడంతో మిర్చి ధర పెరగలేదు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో పండించే తేజా రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఉంటుంది. ఈ మిర్చిని చైనా, మలేషియా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది చైనాలోనూ ఇదే రకం పంట సాగు విస్తీర్ణం పెరగడంతో అక్కడి నుంచి ఎగుమతిదారులకు ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాలేదు. ప్రస్తుతం మిర్చి ధర క్వింటాల్కు సగటున రూ.13 వేలు పలుకుతుండగా, ఇది నాణ్యమైన మిర్చికే చెల్లిస్తున్నారు. కాస్త నాణ్యత తక్కువగా ఉంటే రూ.12 వేలు, మరీ తక్కువగా ఉంటే రూ.11 వేలకు మించి ధర పలకడం లేదు. అన్ సీజన్లో ధర వస్తుందనే ఆశతో రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 40 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, 48 లక్షల బస్తాలు నిల్వ చేసినట్లు అంచనా. సీజన్ ఆరంభం నుంచీ ఇంతే... పంట సీజన్ ఆరంభం నుంచే మిర్చి ధర పతనం సాగుతోంది. అంతకు ముందు సీజన్(2023–24)లో మిర్చి క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.23 వేల ధర రావడంతో గతేడాది రైతులు ఆశగా సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా తెగుళ్లతో దిగుబడి తగ్గినా.. మిగిలిన పంటకూ ధర లభించలేదు. గతేడాది నవంబర్లో రూ.18 వేలు ఉన్న ధర డిసెంబర్ నాటికి రూ.16,500కు పడిపోయింది. ఇక జనవరి నుంచి కొత్త పంట విక్రయాలు ప్రారంభం కాగా రూ.15,500 వద్ద మొదలై ఫిబ్రవరిలో రూ.14,200కు, మార్చిలో రూ.14 వేలకు తగ్గింది. ఆపై మార్చి చివరి వారం నుంచి మరింత తగ్గుతూ ఏప్రిల్, మేలో రూ.13,500 నుంచి రూ.14 వేలు పలికింది. సాధారణంగా అన్ సీజన్లో పంటకు డిమాండ్ ఉండాల్సి ఉన్నా, జూన్లో మరికొంత తగ్గడం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.101 బస్తాలు నిల్వ చేశా.. సీజన్లో క్వింటాల్కు రూ.14 వేలు అడిగితే అన్ సీజన్లో అ మ్మొచ్చని 101 బస్తాల నిల్వ చేశా. ఇప్పుడు సాగు అవసరాలకు అమ్ముదామంటే అప్పటి ధర రాక పోగా అదనంగా నిల్వ ఖర్చులు పడ్డాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. – పేలప్రోలు నరేశ్, గార్లొడ్డు, ఏన్కూరు మండలం -
నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బరాజ్లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? వాటికి మంత్రివర్గ ఆమోదం ఉందా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఎందుకు ఏర్పాటు చేశారు? బరాజ్లలో నిరంతరం నీళ్లు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై కమిషన్ లోతుగా ప్రశ్నిస్తోంది. విచారణ చివరి దశకు చేరడంతో ఈ నెల 6న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావును కమిషన్ ప్రశ్నించింది. చివరగా బుధవారం కేసీఆర్ను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్ గుర్తించిన అవకతవకతలను కేసీఆర్ ముందు ఉంచుతూ ఆయన నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. కేసీఆర్ను ప్రశ్నించడంతో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్ తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. హరీశ్రావు సహా ఇంజనీర్లు, నిపుణులతో కేసీఆర్ మంతనాలు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్ సోమ, మంగళవారాల్లో పార్టీ నేత హరీశ్రావుతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటిరంగ నిపుణులకు ఫోన్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సందేహాలను కేసీఆర్ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్కు భారీగా తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రతోనే తమ అధినేతను విచారణ పేరిట ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతకు సంఘీభావంగా తరలిరావాలని కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
తీవ్రమైతే.. వర్కవుట్ కావు
తీవ్రమైన వర్కవుట్లు, వ్యాయామాలు కుర్ర గుండెలకు కూడా మంచివి కావట. ప్రత్యేకించి బాడీబిల్డింగ్పై మోజున్న వారు, సిక్స్ ప్యాక్ల వంటివాటిపై శ్రద్ధ పెట్టేవారు.. తమ చిన్ని గుండెల గురించి మరిచిపోతున్నారు. ఫలితంగా తీవ్రమైన వ్యాయామాల ఒత్తిడి.. గుండె లయ తప్పేలా చేస్తోంది. ఇది ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ చెబుతున్న మాట. ఫిట్నెస్, బాడీబిల్డింగ్ కోసం కఠోర శ్రమ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం హెచ్చరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా బాడీ బిల్డర్ జోడీ వాన్స్.. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో కన్నుమూసింది. బాడీబిల్డింగ్లో భాగంగా శరీరాన్ని తీవ్రమైన డీహైడ్రేషన్కు గురిచేయడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. కార్డియాక్ అరెస్ట్తో కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం!మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేష్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.ఈ జాబితా చాలా పెద్దదే. అందరి మరణాలకూ సాధారణ కారణం.. గుండెపోటు.వీళ్లందరి హృదయాలకూ ఉమ్మడి శత్రువు.. అతి వ్యాయామం, తీవ్రమైన వర్కవుట్లు.బాడీ బిల్డింగ్ మోజుబాడీ బిల్డింగ్ అంటే కుర్రాళ్లకు భలే మోజు. కండలు పెంచడం.. సిక్స్ ప్యాక్.. చాలామందికి ఒక ప్యాషన్. వర్కవుట్లు, జిమ్, వ్యాయామం.. జెన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవాళ్లు) తరంలో చాలామందికి, జెన్ వై (1981–1996 మధ్య పుట్టినవాళ్లు) తరంలో కొందరికి దినచర్యలో భాగం. సాధారణ వ్యాయామం చేసేవాళ్లకు ఫర్వాలేదుగానీ.. తీవ్రమైన వర్కవుట్లు చేసేవాళ్లకు, బాడీబిల్డర్లకు మాత్రం.. అది వారి శారీరక సౌందర్యాన్ని పెంచాల్సింది పోయి.. ప్రాణాలు తీస్తోంది.మరికొందరు బరువు తగ్గే క్రమంలో డీహైడ్రేషన్కు గురవడం, కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ హృదయ సంబంధ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గుండెపోటు వల్ల హఠాన్మరణం అన్నది యువకులలో, ఆరోగ్యంగా ఉండేవారిలో అరుదే అయినప్పటికీ బాడీబిల్డింగ్ ప్రొఫెషన్లో ఉండేవారికి ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లు ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ ప్రచురించిన అధ్యయన పత్రం పేర్కొంది. బాడీ బిల్డర్లకూ ముప్పేస్టేజీ ఎక్కి కండరాల ప్రదర్శన చేయటమే బాడీబిల్డర్ల పని అనుకుంటాం కానీ... అంత తీరుగా, అంత దృఢంగా, అందరిలోనూ ఒకే ఒక్కడిలా, అంతిమ విజేతగా నిలిచేందుకు వారు పడే శ్రమ, చేసే సాధన ఎంత కఠినమైనవో.. వారి గుండెకు మాత్రమే తెలుస్తుంది. మరి అంత ఒత్తిడిని ఆ గుండె తట్టుకోగలుగుతోందా అని గమనించకపోతే ఏమవుతుంది? సంకేతం ఇవ్వకుండానే సెలవు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా పురుష బాడీబిల్డర్లలో ఆకస్మిక మరణాలకు గుండె పోట్లే ప్రధాన కారణం అవుతున్నాయని ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ వెల్లడించింది. ఈ అధ్యయనానికి ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మార్కో వెచియాటో నేతృత్వం వహించారు.సుదీర్ఘ అధ్యయనంఅధ్యయనం కోసం డాక్టర్ వెచియాటో, ఆయన బృందం అధికారిక బాడీబిల్డింగ్ పోటీల రికార్డులు, అనధికారిక ఆన్ లైన్ డేటాబేస్ నుండి 20,286 మంది పురుష బాడీబిల్డర్ల పేర్లను సేకరించారు. వారంతా 2005 – 2020 మధ్య కనీసం ఒక అంతర్జాతీయ ఫిట్నెస్ ఈవెంట్లో పాల్గొన్నవారే. ఆ తర్వాత మీడియా నివేదికలు, సోషల్ మీడియా, బాడీబిల్డింగ్ ఫోరమ్లు, బ్లాగుల వంటి వివిధ వెబ్ సైట్లలో ఐదు వేర్వేరు భాషలలో తమ జాబితాలో ఉన్న పోటీదారులలో మరణించిన వారెవరైనా ఉన్నారా అని శోధించారు. తమ దృష్టికి వచ్చిన వారి మరణాలను వివిధ వనరులను ఉపయోగించి జాగ్రత్తగా పోల్చి చూసుకున్నారు. ఆ డేటాను ఇద్దరు క్లినికల్ వైద్యులకు సమర్పించి ఆ మరణాలకు కారణాలను నిర్ధారించుకున్నారు. ప్రొఫెషనల్ బాడీబిల్డర్లలో ఎక్కువ..: డాక్టర్ వెచియాటో బృందం పురుష బాడీబిల్డర్లలో సంభవించిన 121 మరణాలను కనుగొన్నారు. వారి సగటు మరణ వయస్సు 45 సంవత్సరాలు. వారిలో 38 శాతం మంది గుండె సంబంధ కారణాలతో మరణించినవారే. ముఖ్యంగా ఆకస్మిక గుండెపోట్ల ప్రమాదం ప్రొఫెషనల్ బాడీబిల్డర్లలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాన్–ప్రొఫెషనల్స్తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. బాడీబిల్డింగ్లో ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉంటాయి. కఠినమైన కండర శిక్షణ, తీవ్రమైన ఆహార నియమాలు, డీహైడ్రేషన్, వేగంగా బరువును తగ్గించే వ్యాయామాలు, కండర సామర్థ్యాన్ని పెంచే మందులను అతిగా వాడకం.. వాటిలో ప్రధానమైనవి.బాడీబిల్డర్లూ.. పారాహుషార్..: బాడీబిల్డింగ్ ప్రక్రియలో శరీరం తీవ్రమైన మార్పులకు లోనవుతుంది. ఆ ప్రభావం గుండెపై పడుతుంది. అందువల్ల సుశిక్షుతులైన వారి మార్గదర్శకత్వంలో.. సురక్షితమైన శిక్షణా విధానాలు పాటించాలి. మెరుగైన వైద్య పర్యవేక్షణలో ఉండాలి. కండర సామర్థ్యాన్ని పెంచే ఔషధాలకు అలవాటు పడకూడదు.బాడీబిల్డర్ల విషయంలో పైకి ఆరోగ్యంగా కనిపించేదంతా నిజమైన ఆరోగ్యం కాకపోవచ్చని, తీరైన ఆ శరీరాకృతి వెనుక కూడా ప్రమాదం దాగి ఉండొచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్లో ఎక్కువ మంది పురుషులే కాబట్టి పరిశోధకులు వారిపైనే దృష్టి సారించారు. మహిళా బాడీబిల్డర్లపైనా ఇలాంటి అధ్యయనం చేయబోతున్నారు.బాడీబిల్డింగ్ మంచిదే కానీ...!క్రీడలు, వ్యాయామ వైద్యుడిగా నేను బాడీబిల్డర్లను చాలా దగ్గరగా చూశాను. బాడీబిల్డింగ్ అనేది ఫిట్నెస్ను, స్వీయ–క్రమశిక్షణను ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల అంశాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సవాళ్లను, ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టడాన్ని నేను గుర్తించాను. బాడీబిల్డింగ్, ఫిట్నెస్ సాధనలో ఉన్నవారిలో అకాల మరణాలు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్న అథ్లెట్లలో కూడా ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. – డాక్టర్ మార్కో వెచియాటో -
సీఎం శాఖలు సీనియర్లకు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారికి పాత మంత్రుల శాఖలు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరూ పార్టీ వీడకుండా చూడండి మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్ నేతలు సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్ నేత సుదర్శన్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం. -
బోగస్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పిస్తున్న బోగస్ విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ సంస్థలతో కుమ్మక్కయిన డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలపైనా చర్యలు తప్పవన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ‘నైపుణ్యంగా నయా మోసం’పేరుతో ‘సాక్షి’దినపత్రిక మే 27న ఓ కథనాన్ని ప్రచురించింది. అనుమతులు లేని సంస్థలతో కలిసి డీమ్డ్ వర్సిటీలు క్లాసులు నిర్వహించడాన్ని వెలుగులోకి తెచి్చంది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాల యం తీవ్రంగా స్పందించింది. వాటిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో మండలి అధికారులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మండలి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కె మహమూద్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆ నాలుగు సంస్థలు... ఎలాంటి అనుమతి లేని నాలుగు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఏఐ ఎంఎల్ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ప్రచారం చేస్తున్నాయని బాలకిష్టారెడ్డి తెలిపారు. NxtWave, byeteXl TechEd ప్రైవేట్ లిమిటెడ్, LEAPSTART స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, Intellipaat స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలు ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. ఇవి మల్లారెడ్డి, అరోరా, చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుంటున్నాయని, అడ్మిషన్లు ఈ కాలేజీల్లో తీసుకొని, క్లాసులు మాత్రం అనుమతి లేని విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇది పూర్తి చట్ట విరుద్ధమన్నారు. ఈ సంస్థలకు ఈ నెల 3వ తేదీన నోటీసులు ఇచ్చామని, ఏ విధంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు? అనుమతులు ఏమున్నాయి ? అనే పలు వివరాలు అడిగామని చెప్పారు. ఈ నెల 13వ తేదీనాటికి జవాబు చెప్పమన్నామని తెలిపారు. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంస్థల్లో విద్యార్థులు చేరొద్దని చెప్పారు. ఈ తరహా కోచింగ్ సెంటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. వచ్చే నెల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సూచనల మేరకు ఆగస్టు 14 నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో క్లాసులు మొదలవుతాయని చెప్పారు. జోసా కౌన్సెలింగ్ రెండో దశ పూర్తయితే సీట్లపై స్పష్టత వస్తుందన్నారు. ఫీజుల నిర్ధారణపై ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందన్నారు. ఇంజనీరింగ్ యాజమాన్య కోటాను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఇంజనీరింగ్లో సీట్లు ఉన్నాయని, తొందరపడి ప్రైవేటు కాలేజీల్లో డొనేషన్లు కట్టి చేరొద్దని సూచించారు. ఉన్నత విద్యా మండలికి అవసరమైన అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికోసం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ బిల్లును తేవాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తాం ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లపై అవగాహన కల్పించేందుకు జోసా తరహాలో మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.విద్యార్థులకు సీట్లపై అవగాహన కల్పించేందుకు, సందేహాల నివృత్తికి కౌన్సెల్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొబైల్ ఫోన్ నంబర్కు విద్యార్థులు ఫోన్ చేస్తే అవసరమైనసమాచారం వస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగి్వజయంగా ముగించామని, ఈ నెల 13న రెండో దశ దోస్త్ సీట్ల కేటాయింపు ఉంటుందనితెలిపారు. -
ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు. -
కేసీఆర్ విచారణలో కీలక మార్పులు!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు (బుధవారం) కేసీఆర్ను నేరుగా విచారిస్తామని, అంగీకరించకపోతే ఇన్ కెమెరా విచారణ చేపడతామని కాళేశ్వరం కమీషన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, అంతకుందు కేసీఆర్ను ఓపెన్ కోర్ట్ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేస్తే ఎలా ఉంటుందని కమిషన్ యోచించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ? చేపట్టనుందని వార్తలు వచ్చాయి. బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండా ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో పాల్గొనే అవకాశం కేసీఆర్కు కలిగింది. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారించింది. కేసీఆర్ను మాత్రం మాజీ సీఎం హోదాలో ఇన్ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. కాగా, రేపు కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతారా? ఇన్ కెమెరాకు హాజరవుతురా? అనేది తెలియాల్సి ఉంది. -
Bonalu ఉత్సవాల రాజు.. పోతరాజు
బోనాలు.. పోతురాజులు.. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు ఒకదానికొకటి పోటీపడుతూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల ముందు పోతురాజుల విన్యాసాలు కళ్లప్పగించి చూడాల్సిందే. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే బోనాల ఊరేగింపుకు పోతురాజుల విన్యాసాలు హైలెట్గా నిలుస్తాయి. ఒళ్లు గగుర్పొడిచే వీరి విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి గీంకారాలతో ఆ ప్రాంతంలో నిశబ్దం ఆవహిస్తుంది. చూసేవారంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా పోతురాజు నిమ్మకాయలతో చేసే విన్యాసం చూడ ముచ్చటగా అనిపిస్తుంది. రెండు చేతుల్లో కోరడాలతో సై..సై అని చప్పుడు చేస్తూ పోతురాజుల వీరంగం భలే ఆకట్టు కుంటుంది.– గోల్కొండ పోతురాజుల ప్రత్యేక ఆకర్షణ.. పోతురాజు వేషంలో తయారవడమే ఒక ప్రత్యేక కళ. బోనాలలో పోతురాజులది ప్రత్యేక ఆకర్షణ. శరీరం మొత్తం వివిధ రకాల రంగులు, కాళ్లకు గల్లు గల్లు మనే గజ్జెలతో పోతురాజులు ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, రెండు చేతుల్లో కోరడాలతో, నాలుక బయటకు తీస్తే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. కాగా గోల్కొండ కోట బోనాలలో గత దశాబ్ద కాలంగా పోతురాజుగా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తల్వార్ శివ. పోతురాజు వేషంలో స్థానిక ప్రజల అభిమానాన్ని పొందాడు. అమ్మమీద భక్తితోనే బోనాల ఉరేగింపులో పోతురాజు వేషం వేస్తున్నానని తల్వార్ శివ అంటున్నాడు. ఒక్క రోజు వేషానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఊరేగింపులో విన్యాసాలు చేస్తుంటే ప్రజలు తమను ఆదరిస్తారని, ఇది తమకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని అంటున్నారు. -
మరోసారి.. కేసీఆర్తో హరీష్ రావు భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లిన ఆయన.. కేసీఆర్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. -
భార్య టార్చర్ను భరించలేకపోతున్నా ఫ్రెండ్స్.. ఆర్మీ జవాన్
శాయంపేట(జయశంకర్): భార్య వేధింపులు తట్టుకోలేక ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబీకుల కథనం వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ 125 బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో 2020లో వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ గొడువలు జరుగుతున్నాయి. భార్యతోపాటు అత్తింటి వారు కూడా ప్రవీణ్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లకుండా ఐడీ కార్డు దాచిపెట్టి వేధించారు. ఈక్రమంలో ప్రవీణ్ రెండు నెలల క్రితం విధులకు వెళ్లగా తన భార్య బెటాలియన్ వద్దకు వెళ్లింది. అక్కడ గొడవ చేసి ప్రవీణ్ పరువు తీయడంతో మనస్తాపం చెందాడు. దీంతో సెలవుల నిమిత్తం ప్రవీణ్.. ఈ నెల 6న ఇంటికొచ్చి కుటుంబీకులతో మాట్లాడి హనుమకొండకు వెళ్లాడు. 8న హనుమకొండలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి తన అన్న ప్రసాద్కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే ప్రవీణ్ను తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రవీణ్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘డియర్ ఫ్రెండ్స్ నేను చనిపోతున్నా.. నా చావుకి కారణమెవరో వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. అన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో. మన గ్రామంలో వాలీబాల్ టీమ్ బతకాలి, ఎప్పుడూ గేమ్ను వదలొద్దు’ అని పేర్కొన్నారు. -
లే నాన్నా.. అమ్మ, తమ్ముడు వచ్చాం
జయశంకర్: నాన్న లే ఒకసారి.. అమ్మ, తమ్ముడు వచ్చాం అంటూ.. తండ్రి మృతదేహన్ని చూసి కూతురు విలవిల్లాడింది. రేపాకలో ట్రాక్టర్తో సçహబావిలో పడి చనిపోయిన యువరైతు బోయిని తిరుపతి రాజ్ (30) మృతదేహం వద్ద అతడి కుమార్తె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి రాజ్ తన వ్యవసాయ భూమిలో రోటవేటర్తో దున్నేందుకు ఉద యం ట్రాక్టర్పై వెళ్లాడు. దున్నే క్రమంలో ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని వ్యవసాయ బావిలో పడ్డాడు. బావిలో నీరు లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతి రాజ్ మృతదేహం మీద పడి భార్య, కూతురు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. నాన్న లే .. నాన్న లే అంటూ దిక్కులు పిక్కటిలేలా కూతురు, కుమారుడు విలపించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోయిని రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్ దాఖలు చేశారు.నాడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన హరీష్ రావు తమ ఆస్తులను సరిగా వెల్లడించలేదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు చక్రధర్ గౌడ్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. ఈ కేసులో హరీష్ రావు తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. ఇది కూడా చదవండి: ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య.. బెంగళూరు తొక్కిసలాటపై చర్చ? -
తల్లి వైద్యానికి వెళ్లి.. కొడుకు మృతి!
కాళేశ్వరం(మహబూబాబాద్): తల్లికి ఆరోగ్యం బాగాలేదని కొడుకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేసుకున్న తల్లి తన కొడుకు అన్నం సరిగ్గా తింటలేడు, కడుపు నొప్పి అంటున్నాడని వైద్యులకు చూపించింది. పరీక్షలు చేసిన వైద్యులు (సెలెన్) గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ ఇవ్వడంతో అస్వస్థతకు గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సరోజన తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో కుమారుడు నాగరాజు(23) బైక్పై మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసిచ్చారు. కాగా, తల్లి తన కొడుకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదని వైద్యులకు తెలిపింది. వైద్యులు నాగరాజుకు పరీక్షలు చేసి (సెలెన్) గ్లూకోజ్ ఎక్కించి, అందులో ఇంజక్షన్ వేశారు. ఈ క్రమంలో ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తల్లికి సూచించి వెంటనే పంపారు. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కొడుకు మరణవార్తతో కోపోద్రేకులైన తల్లిదండ్రులు మృతదేహంతో కలెక్టరేట్ గేట్ వద్ద వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మహదేవపూర్ ఎస్సై వారికి నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ ఘటనపై తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వపన్కుమార్ తెలిపారు. సరోజన సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మృతితో శోకసంద్రంలో మునిగారు. కాగా, వైద్యుల తప్పిదంతోనే నాగరాజు చనిపోయాడని, వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత వైద్యులను సస్పెండ్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. -
SITHA APP మహిళా సాధికారత చేతల్లో చూపిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సాధికార తను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని, ఇప్ప టికే ఆ దిశగా ప్రయాణం మొదలైందని చెప్పారు. సోమవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ‘షీ జాబ్స్’ఆధ్వర్యంలో రూపొందించిన ‘సీత’(షి ఈజ్ ది హీరో ఆల్వేస్ SITHA)’యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కుటుంబాల్లో తమ హక్కులను మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకుని నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఆ దిశగా ఇంటి నుంచే మొదటి అడుగు పడాలి. కేంద్ర గణాంక శాఖ భారత్లో పురుషులు, మహిళలు – 2024 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86%, పట్టణాల్లో 89% మంది మహిళలు భాగస్వాములవుతున్నారు. మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తు న్న తెలంగాణ విజయగాథ ఇది’అని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ‘ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025’కు శ్రీకారం చుట్టి, 17 రకాల వ్యాపారాల్లో వారిని పారిశ్రామిక వేత్తలుగా మారేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.మహిళా సంఘాలకు తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 31 జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ప్రారంభానికి చమురు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’అని వివరించారు. ‘సీత’యాప్ మహిళల ఉత్పత్తు లకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. కార్య క్రమంలో ప్రముఖ సినీనటి శ్రీలీల, సినీ డైరెక్టర్ హరీష్ శంకర్, షీ జాబ్స్ నిర్వాహకురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఒక్కరూ కాపురం చేయలేదు..!
కామారెడ్డి: డబ్బులు ఉన్నప్పుడు దుబార ఖర్చులు చేశారు. కాలక్రమేనా.. కనీసం టీ తాగటానికి కూడా డబ్బులు లేక సతమతమయ్యారు. దానికి తోడు కొడుకు సతీశ్కు ఆరు నెలల క్రితం పక్షవాతం రావటంతో సేవలు చేయటానికి కూడా ఎవ్వరు లేకపోవడంతో.. 75 సంవత్సరాల వృద్ధుడైన తండ్రి ఆకుల చిన్న సాయిలు ఓపిక ఉన్నకాడికి సేవలు చేశాడు. చివరికి నీకు సేవలు చేయటం నాతో కావటం లేదు బిడ్డా... ఇక నేను ఏదైన మందు తాగి చచ్చిపోతాను అని తన అభిప్రాయాన్ని ఈ నెల 6 న కొడుకు సతీశ్తో చెప్పాడు. నీతోపాటు నేను కూడా అదే పని చేస్తా బాపూ అంటూ చెప్పి అదే రోజు విష గుళికలు తెప్పించుకుని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్భండార్ గ్రామంలోని సొంత ఇంట్లోనే ఇద్దరూ కలిసి విషగుళికలు మింగారు. ఇద్దరూ వాంతులు చేసుకోవటంతో గమనించిన సాయిలు పెద్ద కుమారుడు సంతోష్ వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్సపొందుతూ సతీశ్ (32) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఆకుల చిన్న సాయిలు (75) ఆదివారం మృతి చెందాడు. రెండ్రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో మాణిక్భండార్ గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన సుమారు రూ. 90 లక్షలకు పైగా డబ్బులను సతీశ్ దుబారాగా ఖర్చు చేశాడు. తీరా చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండాపోయింది. పైగా సతీశ్ మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఒక్క భార్య కూడా కాపురం చేయలేదు. దీంతో తీవ్రమనస్తాపానికి గురై గత సంవత్సం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల క్రితం సతీశ్కు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అప్పటి నుంచి తండ్రి సేవలు చేశాడు. డబ్బులు లేక ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతోంది
హనుమకొండ అర్బన్: ‘కుమారుడితో సహజీ వనం చేస్తున్న మహిళ మాకు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది’ అని ఓ వృద్ధ దంపతులు సోమ వారం హనుమకొండ కలెక్టరే ట్లో జరి గిన గ్రీవెన్స్లో కలెక్టర్కు మొరపెట్టు కున్నారు. ఈ మేరకు వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ‘నా పేరు ఊడత కొమురమ్మ, భర్త పేరు సమ్మ య్య. మాది పరకాల మండలం సీతారాంపూర్ గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు. వారసత్వంగా వచ్చిన భూమిని 1.30 ఎకరాల చొప్పున ఇద్దరికీ సమానంగా పంచాము. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని జీవితాంతం సాదాలని చెప్పారు. కానీ, పిల్లలు ఆస్తి తీసుకున్నాక మా ఆలనాపాలనా చూడటం లేదు. ఒక కొడుకుకు ఇబ్బందుల కారణంగా మూడు పెళ్లిళ్లు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మా కోడలు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది. మాకు తిండి పెట్టని కొడుకులకు మా ఆస్తి ఎందుకివ్వాలి. అందుకే అధికారులకు విన్నవిస్తున్నాం.. మా ఆస్తిని మా పేర్ల పైకి మార్చండి. మా ఆలనాపాలనా చూసుకున్న వారికి మా తదనంతరం ఆస్తి చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
ఫిర్యాదుదారు వద్దకే జడ్జి
జగిత్యాల జిల్లా: అనారోగ్యంతో కోర్టు హాల్లోకి రాలేని ఫిర్యాదీ దగ్గరకు.. స్వయంగా జడ్జి వచ్చారు. బాధితురాలి కేసుకు పరిష్కారం చూపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టులో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్కు చెందిన చల్ల రమక్క.. అదే గ్రామానికి చెందిన చల్ల మల్లేశ్, చల్ల శంకర్లపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2024 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు.రమక్క ఫిర్యాదు మేరకు 174/2024 క్రైం నంబరు కింద సెక్షన్ 329(4), 292, 118(1) ప్రకారం చల్ల మల్లేశ్, చల్ల శంకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మెట్పల్లి కోర్టుకు చార్జిషీట్ పంపించారు. ఆ కేసుకు కోర్టులో కేలండర్ కేసు నంబర్ 549/2024 కేటాయించి నిందితుల హాజరుకు నోటీసులు పంపించారు. నిందితులు, ఫిర్యాదీ కలిసి రాజీ చేసుకుని సోమవారం కోర్టుకు వచ్చారు. పక్షవాతంలో బాధపడుతున్న ఫిర్యాదీ చల్ల రమక్క.. కోర్టు హాల్లోకి జడ్జి అరుణ్కుమార్ ముందుకు రాలేక ఆటోలోనే ఉండిపోయారు. పరిస్థితిని తెలుసుకున్న జడ్జి అరుణ్కుమార్ కోర్టుహాల్ బయటకు వచి్చ.. ఆటోలో ఉన్న ఫిర్యాదీ చల్ల రమక్క నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇరు పక్షాలకు రాజీ కుదిరిన క్రమంలో.. చల్ల మల్లేశ్, చల్ల శంకర్లపై ఉన్న కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. -
బస్పాస్లపై బాదేశారు!
సాక్షి, హైదరబాద్: ఆర్టీసీ బస్పాస్ ధరలను భారీగా పెంచేసింది. ఈ పెంపు గ్రేటర్లోని సుమారు 2.5 లక్షల మందిపై పిడుగుపాటుగా మారింది. అకస్మాత్తుగా చార్జీలను 20 శాతం పెంచడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆరీ్టసీలో నగదు నిల్వలు దారుణంగా పడిపోవడంతో బస్సుల నిర్వహణ, విడిభాగాల కొనుగోళ్లు, డిపోల రోజువారీ ఖర్చులు తదితర అవసరాలకు కష్టంగా మారింది. ఈ క్రమంలో ఒకవైపు పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్న ఆర్టీసీ అధికారులు.. తాజాగా బస్పాస్లపై దృష్టి సారించారు. ప్రతి నెలా బస్పాస్ చార్జీల రూపంలో నగదు ఆదాయం లభించనున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బస్పాస్ చార్జీల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త చార్జీలు ఇలా.. సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వినియోగించే ఆర్డినరీ నెలవారీ పాస్ రూ.1,150 నుంచి రూ.1,400కు పెరిగింది. మెట్రో ఎక్స్ప్రెస్ రూ.1,300 నుంచి రూ.1,600కు చేరింది. మెట్రోడీలక్స్ రూ.1,450 నుంచి రూ.1,800. మెట్రో లగ్జరీ (ఏసీ) రూ.1,800 నుంచి రూ.2,200. విద్యార్ధుల నెలవారీ ఆర్డినరీ పాస్ రూ.400 నుంచి రూ.600కు పెరిగింది. క్వార్టర్లీ (మూడు నెలలు) పాస్ రూ.1,200 నుంచి రూ.1,800. గ్రేటర్ హైదరాబాద్ ఆర్డినరీ రూ.470 నుంచి రూ.705కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్ రూ.1,350 నుంచి రూ.1,950కి చేరింది. ఆర్డినరీ స్పెషల్ పాస్ రూ.450 నుంచి రూ.650. ఎన్జీఓల నెలవారీ ఆర్డినరీ బస్పాస్ రూ.400 నుంచి రూ.600, మెట్రో ఎక్స్ప్రెస్ రూ.550 నుంచి రూ.800, మెట్రో డీలక్స్ పాస్ రూ.700 నుంచి రూ.1000కి పెంచారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడిచే పుష్పక్ ఏసీ బస్సుల పాస్ ధర రూ.5000 ఉంది. ఆర్టీసీ అధికారులు ప్రస్తుతానికి పుష్పక్ పాస్ జోలికి వెళ్లలేదు. -
పడకేసిన ప్రతిపాదన!
సాక్షి, హైదరాబాద్: శాటిలైట్ బస్టెరి్మనళ్ల ప్రతిపాదన అటకెక్కింది. నగరంలో రోజు రోజుకూ తీవ్రమవుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని శివార్లలో శాటిలైట్ బస్ టెర్మినళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులన్నీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి సిటీరోడ్లపైనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. సంక్రాంతి, దసరా వంటి పర్వదినాలు, వరుస సెలవులు, వేసవి సెలవుల్లో రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో బస్సుల నిర్వహణలో మరింత జాప్యం నెలకొంటోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు శివారు ప్రాంతాల్లో స్థలం అందుబాటులో ఉన్నచోట శాటిలైట్ టెర్మినళ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సిటీసర్వీసులను నడపాలనేది ప్రతిపాదన. ఈ మేరకు మియాపూర్తో పాటు వనస్థలిపురంలో రెండు టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మియాపూర్లోని స్థలాన్ని ట్రక్ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేయడం ద్వారా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే బస్సులను వనస్థలిపురం వరకు పరిమితం చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది. అటవీశాఖ సానుకూలత.. వనస్థలిపురంలోని హరిణ వనస్థలి పార్కు వద్ద టెర్మినల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు అప్పట్లో అటవీశాఖ నుంచి సానుకూలత వ్యక్తమైంది. 680 మీటర్ల విస్తీర్ణంలో టెరి్మనల్ నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సైతం ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా అధునాతన సదుపాయాలతో ప్రతిరోజూ కనీసం 1000 బస్సులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుందని అప్పట్లో అధికారులు తెలిపారు. మరోవైపు దీన్ని పర్యావరణహిత ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సోలార్ విద్యుత్ను వినియోగించాలని భావించారు. వనస్థలిపురం టెర్మినల్ సాకారమైతే విజయవాడ, గుంటూరు, ఖమ్మం, సూర్యాపేట్, భద్రాచలం, నల్లగొండ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులన్నింటినీ అక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పటాన్చెరు, బీహెచ్ఈఎల్ నుంచి జేఎన్టీయూ, కూకట్పల్లి, అమీర్పేట్, లక్డీకాపూల్, కోఠి, ఎల్బీనగర్, హయత్నగర్ వరకు అన్నిచోట్లా ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులను నిలపడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. శాటిలైట్ టెరి్మనల్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. -
‘కాచిగూడ’కు చారిత్రక ప్రాముఖ్యత
కాచిగూడ: ఫసాడ్ లైటింగ్ వ్యవస్థ ద్వారా కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన కాచిగూడ రైల్వే స్టేషన్లో రూ.2.33 కోట్ల వ్యయంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలంలో 1916లో ‘గోతిక్ శైలి’లో కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. ఈ స్టేషన్ అద్భుత నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా చూపించడానికి మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారతీయ రైల్వేలో తొలి డిజిటల్ పేమెంట్ సేవలు కాచిగూడలోనే ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నో రకాల ప్రాముఖ్యతను సంతరించుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్ను రూ.421.66 కోట్లతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద పునరభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 30 సంవత్సరాల అవసరాలను తీర్చేలా రూ.2,750 కోట్లతో రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కొర్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, బీజేపీ నేతలు డాక్టర్ ఎన్.గౌతంరావు, కృష్ణ యాదవ్, వై.అమృత, సి.నందకిషోర్ యాదవ్, ఎ.సూర్యప్రకాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప డం మాట అటుంచితే.. ఆయనే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆదివారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన ప్రభాకర్రావు సోమవారం తన న్యాయవాదితో కలిసి సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి ప్రభాకర్రావు చేరుకున్నారు. వెస్ట్జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్రావును ప్రశ్నించింది. మధ్యాహ్నం గంటసేపు లంచ్ బ్రేక్ ఇచ్చి, రాత్రి 7.30 గంటల వరకు ఆయన్ను విచారించారు. ప్రభాకర్రావు చెప్పిన వివరాలను ఆయన స్టేట్మెంట్గా రికార్డు చేసుకున్నారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్రావుకు పోలీసులు సూచించారు.వారితో వృత్తిగత బంధమే..డీఎస్పీగా పని చేసిన ప్రణీత్రావు తనవద్ద పని చేశారని, విధి నిర్వహణలో భాగమైన మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్రావు చెప్పినట్లు తెలిసింది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు తదితరులతో తనకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టంచేసినట్లు సమాచారం. 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబీ కార్యాలయంలో హార్డ్డిస్క్ల ధ్వంసంపైనా అధికారులు ప్రభాకర్రావును ప్రశ్నించారు. ఆ నెల 30న సాయంత్రం 4 గంటలకే తాను ఎస్ఐబీ చీఫ్ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పిన ప్రభాకర్రావు... ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్ అధికారు లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ హార్డ్డిస్క్లు ధ్వంసం చేసి, కొత్తవి పెట్టమన్నది ఎవరు? అని పోలీసులు ప్రశ్నించగా... ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్రావుకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు సెల్ఫోన్లు, ట్యాబ్, మ్యాక్బుక్, ల్యాప్టాప్ తీసుకువచ్చి అప్పగించాలని ఆదేశించారు.ట్యాపింగ్కు నేను అనుమతివ్వలేదుఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్రావును ప్రశ్నించారు. అయి తే, ఆయన మాత్రం ఈ కేసుతో తనకు సంబంధమే లేదని వాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం? ఏయే ఫోన్లు ట్యాప్ చేయాలి? ఎంత కాలం చేయాలి? ఎందుకు చేయాలి? అనేది ఖరారు చేయడానికి, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమి టీలో సభ్యులుగా ఉండే ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారు?’ అని ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా అధికారులను విచారించి, వాంగ్మూ లాలు నమోదు చేశామని పోలీసులు చెప్పగా... ట్యాపింగ్కు అనుమతి ఇచ్చింది వారేనని.. తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
మా యూనిట్లు మార్చండి..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల్లో యూనిట్ల మార్పు, కేటగిరీల సవరణ కోసం అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలువురు అర్జీదారులు వాటిలో మార్పులు కోరుతూ ఆ మేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తులో మార్పులు చేసేందుకు సంబంధించిన లాగిన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల వద్ద ఉండడంతో వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన తొలి రెండు కేటగిరీల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కానీ చివరి నిమిషంలో ఎంపిక ప్రక్రియ, మంజూరు కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తొలి రెండు కేటగిరీ లకే ముందుగా మంజూరు పత్రాలు ఇవ్వనుందనే ప్రచారంతో.. తొలి విడతలోనే లబ్ధిదారులుగా ఎంపికయ్యే ఉద్దేశంతో తొలుత చివరి రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది, ప్రస్తుతం తమ కేటగిరీలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.చివరి రెండు కేటగిరీలకు అధిక దరఖాస్తులురాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువి వికాసం పథకం కింద వివిధ రకాల యూనిట్ల కోసం మొత్తం 4 కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఆన్లైన్ పద్ధతిలో మార్చి 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖలు..ఏప్రిల్ 14వ తేదీ 11.59 గంటల వరకు కొనసాగించింది. మొత్తం 16,23,764 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.50 వేల లోపు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1 లక్షలోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించింది. తొలి విడతలో కేటగిరీ–1,. కేటగిరీ–2లోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ క్రమంలో తొలి రెండు కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. అయితే ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీ–1లో 1,58,650 మందికి అవకాశం కల్పించాలని భావించగా.. కేవలం 39,401 దరఖాస్తులే వచ్చాయి. కేటగిరీ–2లో 1,22,540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,48,556 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కానీ కేటగిరీ–3, కేటగిరీ–4 కింద మాత్రం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.అయితే ప్రభుత్వం తొలుత మొదటి రెండు కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలనే చేపట్టడం, ఆయా కేటగిరీలకు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో.. కేటగిరీ–3, కేటగిరీ–4 కింద దరఖాస్తు చేసుకున్న వారు తొలి విడతలోనే అర్హత సాధించేందుకు, ఆ మేరకు ఆయా యూనిట్లకు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుంటున్నారు. సుమారు లక్షకు పైబడి దరఖాస్తుదారులు ఈ విధంగా మార్పులు కోరుకుంటున్నట్లు సంక్షేమ శాఖల వర్గాలు తెలిపాయి. -
మార్చిలోనే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం (2025–26) టెన్త్ పరీక్షలను 2026 మార్చిలో నిర్వహించాలని విద్యాశా ఖ నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నాటికి మొత్తం సిలబస్ బోధన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. విద్యాశాఖ 2025–26 విద్యా సంవత్సరం కేలండర్ను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీన మొదలయ్యే పాఠశాలలు 2026 ఏప్రిల్ 23వరకు నడుస్తాయని, మొత్తం 230 పనిదినాలు ఉంటాయని వెల్ల డించింది.స్కూళ్లలో ప్రతిరోజూ 5 నిమిషాలపాటు విద్యా ర్థులకు మెడిటేషన్ చేయించాలని సూచించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలువులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. 2026 జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. -
ఎండకు ‘కంది’పోదు!
సాక్షి, హైదరాబాద్: గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకొని.. హెక్టార్కు 2 టన్నుల దిగుబడిని ఇచ్చే కంది వంగడాన్ని ఐసీపీవీ 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది. కేవలం 125 రోజుల్లో పంట చేతికి వచ్చే ఈ వంగడాన్ని ఖరీఫ్, రబీలో ఎప్పుడైనా సాగు చేయొచ్చు. కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పెరిగే ఈ కందిని మిషన్ ద్వారా కోయొచ్చు. కూలీల సమస్య, ఎరువుల అవసరం తగ్గుతుంది. ఈ మేరకు ఇక్రిశాట్ అధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి మీడియాను పటాన్చెరులో సంస్థ అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 రకం కంది చేల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, ప్రోగ్రాం డైరెక్టర్ షాన్ మైట్స్, లీడ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాష్ గంగశెట్టి, అసోసియేట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రుతి బెలియప్ప తదితరులు ఐసీపీవీ 25444 కంది వంగడం గురించి వివరించారు. అత్యధిక వేడిని తట్టుకునే పంట కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఐసీపీవీ 25444 వంగడాన్ని విజయవంతంగా పరీక్షించామన్నారు. 2021లో దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించి, 2024 నాటికి స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో పూర్తి చేశామని తెలిపారు. కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి అయ్యే 15 సంవత్సరాల పనిని కేవలం ఐదేళ్లలో పూర్తి చేసినట్టు వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కందిపప్పుకు ఒక కొత్త దశను తీసుకొచ్చే అద్భుత ఆవిష్కరణగా వారు పేర్కొన్నారు. దేశీయ పప్పుదినుసుల లోటును తీర్చే శుభవార్తభారత్లో కందిపప్పు వినియోగం 5 మిలియన్ టన్నులుగా ఉండగా, దేశీయంగా 3.5 మిలియన్ టన్నుల కందిపప్పు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని లీడ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాశ్ గంగశెట్టి తెలిపారు, దేశ అవసరాలకు మరో 1.5 మిలియన్ టన్నులు అవసరం కాగా, ఇందుకోసం సంవత్సరానికి రూ. 6,700 కోట్ల దిగుమతుల భారం పడుతోందని తెలిపారు. ఇక్రిశాట్ ద్వారా అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 వంగడంతో ఈ లోటు తీరే అవకాశముందన్నారు. తాండూరు, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంటకు అనుకూలమని చెప్పారు.భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా...భారత్తోపాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఈక్వడార్ దేశాల్లోనూ ఈ కందిని ఉత్పత్తికి వినియోగించేందుకు అవకాశముందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ స్థిరత్వ పంటగా ఐసీపీవి 25444కి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే శక్తి ఉందన్నారు. -
ఇడ్లీ పిండి కూడా షాపు నుంచే!
ఇడ్లీలు, దోసెల వంటి అల్పాహారం కోసం కావాల్సిన పిండిని ఇంట్లోనే రుబ్బి తయారు చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా దుకాణం నుంచి కొని తెచ్చుకునేవారి సంఖ్య పెరిగింది. రెడీమేడ్ పిండి కొనుక్కోవడం ఎప్పటి నుంచో ఉంది. ఇదేం కొత్త విషయం కాదంటారా? నిజమే.. రుబ్బిన పిండి వంటి రెడీ టు కుక్ మిశ్రమాలను గడిచిన రెండేళ్లలో కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలు కొనుగోలు చేయడమే ఇక్కడ సరికొత్త విషయం. అంతర్జాతీయ పరిశోధన సంస్థ కాంటార్ ‘ఎఫ్ఎంసీజీ పల్స్’ నివేదికలో ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.ఇంటికి కావాల్సిన సరుకుల కోసం భారతీయులు ఒక ఏడాదిలో దుకాణాలకు 156 సార్లు వెళ్లారట. అంటే 56 గంటలకు ఒకసారి లేదా ప్రతి రెండు రోజులకోసారి సరుకులు కొనుగోలు చేశారని కాంటార్ తన ‘ఎఫ్ఎంసీజీ పల్స్’ నివేదికలో వెల్లడించింది. 2023–24లో సైతం భారతీయులు ఇదే స్థాయిలో షాపింగ్ చేశారని తెలిపింది. అంతేకాదు, వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం, కొనుగోలు చేసిన ఉత్పత్తుల సంఖ్య పెరిగిందని వివరించింది. 2025 జనవరి–మార్చి కాలంలో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో 3.5% వృద్ధి నమోదైంది.అన్ బ్రాండెడ్ హవా..స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 22 కంపెనీల పరిమాణ వృద్ధి రేటు కేవలం 3.6% మాత్రమే. కానీ, ప్రముఖ కంపెనీలవి కాని అన్ బ్రాండెడ్ ఉత్పత్తులు ఏడాదిలో 6.1% వృద్ధి సాధించాయి. 2023–24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుడు కొనుగోలు చేసిన సగటు ప్యాక్ పరిమాణం 16% పెరిగింది. అంటే పావుకిలో బదులు అరకిలో.. అరకిలో బదులు కిలో ఇంటికి తెచ్చుకున్నారన్న మాట. అలాగే ప్యాక్ల సంఖ్య 13% పెరిగింది. 2023–24లో వినియోగదార్లు సగటున 200 ప్యాక్లు కొనుగోలు చేస్తే.. 2024–25కు వచ్చే సరికి ఇది 226కి చేరింది.⇒ సరుకుల కోసం ఒక ఏడాదిలో 156 సార్లు వెళ్లారు. అంటే 56 గంటలకోసారి అన్నమాట.⇒ ప్యాక్ సైజు 16 శాతం, ప్యాక్ల సంఖ్య 13 శాతం పెరిగింది.⇒ జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణ ఢిల్లీ వాసుల ఎఫ్ఎంసీజీ వినియోగం రెండింతలు అధికం.⇒ పశ్చిమ ఢిల్లీవాసులు గరిష్టంగా ఏటా రూ.39,325 ఖర్చు చేశారు.⇒ వ్యయాల పరంగా నైరుతి బెంగళూరు ప్రీమియం ఎఫ్ఎంసీజీ మార్కెట్గా నిలిచింది.వాషింగ్ లిక్విడ్స్..దుస్తులు ఉతికేందుకు వాడే సబ్బుల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. సబ్బులకు బదులు కస్టమర్లు లిక్విడ్స్ను ఎంచుకుంటున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో వాషింగ్ లిక్విడ్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా అవతరించాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో వీటి పరిమాణం 2.7 రెట్లు దూసుకెళ్లింది. వాషింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేస్తున్న గృహాల సంఖ్య 2022–23 నుంచి కొత్తగా 2.4 కోట్లు పెరిగింది. 20 శాతం కుటుంబాలే దేశంలో వీటిని వినియోగిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. గత 5 ఏళ్లలో దేశంలో వాషింగ్ మెషీన్ల అమ్మకాలు పెరగడమే.అంతా రెడీమేడ్..రెడీ–టు–కుక్ మిశ్రమాల అమ్మకాలు రెండింతలై కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలకు ఇవి చేరాయి. ప్రధానంగా దోసె, ఇడ్లీల తయారీకి వాడే రుబ్బిన పిండ్లు ఎక్కువగా కొంటున్నారు. రెడీ–టు–కుక్ కూరలను నూతనంగా 6 లక్షల గృహాలు ఆస్వాదించాయి. మ్యూస్లీ, పొరిజ్, ఓట్స్తో తయారైన అల్పాహార ఉత్పత్తులు రెండు సంవత్సరాలలో 1.5 రెట్లు వృద్ధి చెందాయి. కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పండ్ల రసాలు, పాల ఆధారిత పానీయాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాల్టీ స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వంటి ఉత్పత్తుల విక్రయాలు 2.4% పెరిగాయి. బిస్కెట్స్ వినియోగం ఇంటి వెలుపల తగ్గితే, ఇళ్లలో పెరిగింది.చిన్న ప్యాక్లవైపు..దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 10–40 లక్షల మధ్య జనాభా ఉన్న మినీ మెట్రో పట్టణాల్లో.. వినియోగ వస్తువులు, ఇతర విభాగాల ధరల పెరుగుదల, వేతన వృద్ధి స్తబ్ధుగా కొనసాగుతుండడం కొనుగోళ్లను తగ్గిస్తోంది. దుకాణాలకు వెళ్తున్న సంఖ్యలో మార్పు లేనప్పటికీ చిన్న, మరింత చవకైన ప్యాక్ పరిమాణాల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. అంటే ధరను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటున్నారన్నమాట. ఇక 2024–25లో సూపర్ మార్కెట్స్లో అమ్మకాల పరిమాణం 43% ఎగిసింది. కిరాణా దుకాణాల వ్యాపారం మాత్రం స్థిరంగా ఉంది. పట్టణ మార్కెట్లు మెరుగ్గా..పట్టణ మార్కెట్లు 2025 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.4% వృద్ధిని సాధించగా, గ్రామీణ మార్కెట్లు 2.7% పెరిగాయి. పట్టణ మార్కెట్.. గ్రామీణ ప్రాంతాల కంటే వేగంగా వృద్ధి చెందడం ఇది వరుసగా మూడో త్రైమాసికం. చాలా లిస్టెడ్ కంపెనీల అమ్మకాల్లో పట్టణ మార్కెట్ల నుంచి 50–70% సమకూరుతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటం, ఇంటి అద్దెలు పెరగడం గత సంవత్సరంలో పట్టణాల్లో రోజువారీ కిరాణా, ప్రధాన వస్తువుల డిమాండ్పై ప్రభావం చూపాయి.హిందూస్తాన్ యూనిలీవర్, గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్, మారికో వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. వాటి అమ్మకాల్లో పెరుగుదల గరిష్ఠంగా 7 శాతాన్ని మించలేదు. ఖరీదైన వస్తువులు, పెద్ద ప్యాక్ల వైపు కస్టమర్లు ఆకర్షితులవుతున్నందున రాబోయే రోజుల్లో పట్టణ ఎఫ్ఎంసీజీ రంగంలో బలమైన వృద్ధి కనిపించే అవకాశం ఉందని కాంటార్ నివేదిక పేర్కొంది. -
భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే!
మిర్యాలగూడ: భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం లాంటిదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 22 మండలాల్లో 22 రెవెన్యూ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలు పరిష్కరించామని చెప్పారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ధరణి ద్వారా వచ్చిన 9.26 లక్షల దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 6 వేల మంది సర్వేయర్లను, 10,956 మంది వీఆర్వో, వీఆర్ఏలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు.వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి: ఉత్తమ్కుమార్రెడ్డిఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తకుమార్రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను, లిఫ్టులను పూర్తిచేసి తీరుతామని చెప్పారు. సాగర్ ఎడమకాల్వ మరమ్మతులకు రూ.67 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బు రూ.15,181 కోట్లను 12 లక్షల మంది రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రోడ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని నిర్ణయాలూ మంత్రివర్గ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగిందని నీటిపారు దల శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు. మంత్రివర్గ ఆమోదంతోనే డీపీఆర్ తయారీ పనులను వ్యాప్కోస్కు అందించినట్టు తెలిపారు. బరాజ్ల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం తన కార్యాలయంలో హరీశ్రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు సంధించింది.సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పరిధి ఏమిటి? అని కమిషన్ ప్రశ్నించగా, హరీశ్రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో.. వాటి నిర్మాణాన్ని పునఃసమీక్షించి రీఇంజనీరింగ్పై సిఫారసులు చేసేందుకు గత ప్రభుత్వం తన నేతృత్వంలో నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావుతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల ఆధారంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించడం జరిగిందని, ఒక భాగాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేయగా, రెండో భాగాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించడం జరిగిందని తెలిపారు. అందుకే మేడిగడ్డకు బరాజ్.. మహారాష్ట్ర అభ్యంతరాలు, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ పేర్కొనడంతో బరాజ్ లొకేషన్ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు హరీశ్రావు చెప్పారు. ‘2014 జూలై 23న నేను మహారాష్ట్ర వెళ్లి అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీఫ్ను కలవగా, తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పారు. అక్కడ బరాజ్ నిర్మాణానికి అంగీకరించమబోని, పనులు చేపట్టి నిధులు వృధా చేసుకోవద్దని కోరుతూ నాటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి రాసిన లేఖ ప్రతిని ముష్రీఫ్ నాకు అందజేశారు.బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ధర్నాలు చేస్తుండడంతో అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర రాజ్భవన్లో ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తాను స్వయంగా ఆందోళనలు చేసిన నేపథ్యంలో అనుమతించడం సాధ్యం కాదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు..’ అని హరీశ్రావు వివరించారు.అలాగైతే 48 టీఎంసీల లభ్యతే.. ‘మహారాష్ట్ర అనుమతించిన మేరకు తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 48 టీఎంసీల లభ్యతే ఉంటుంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీలను తరలించుకోగలం. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత మాత్రమే ఉండగా, అందులో 63 టీఎంసీలపై ఎగువ రాష్ట్రాలకు హక్కులున్నట్టు తేల్చుతూ 2015 ఫిబ్రవరి 18న సీడబ్ల్యూసీ లేఖ రాసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 160 టీఎంసీల నీళ్లు అవసరం. ఆ మేరకు నీళ్లను నిల్వ చేసుకోవడానికి బరాజ్ల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని 2008 ఆగస్టు 12న సీడబ్ల్యూసీ ఇంకో లేఖ రాసింది. అందుకే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది.మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని 2017 నవంబర్ 12న సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. అక్కడ బరాజ్ నిర్మించాలని 2016 జనవరి 17న వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది..’ అని మాజీమంత్రి చెప్పారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మార్చాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసిందా? అని కమిషన్ అడగగా.. ఇలాంటి సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ నిర్ణయాలు తీసుకుందని బదులిచ్చారు. ఇంజనీర్ల సూచనలను గౌరవించారా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని హరీశ్ చెప్పారు. సైట్ పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టుల లొకేషన్లు మారడం సహజమేనని, నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ వంటి ప్రాజెక్టుల విషయంలో సైతం అలానే జరిగిందని అన్నారు. కేఐపీసీఎల్ ఏర్పాటుపై కేబినెట్లో నిర్ణయం ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉండడంతోనే రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేశాం. కేఐపీసీఎల్ ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా, దాని రుణాలు, వడ్డీలను ఎలా తిరిగి చెల్లించాలనే అంశంపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు..’ అని హరీశ్ తెలిపారు. రుణాలకు ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇచ్చి వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించిందని వివరించారు. నీటి నిల్వ ఇంజినీర్లకు సంబంధించిన బాధ్యత ఎవరి ఆదేశాలతో బరాజ్లలో నీళ్లను నిరంతరంగా నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. ఇది ఇంజనీర్లకు సంబంధించిన బాధ్యత అని హరీశ్ చెప్పారు. ఈ విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదన్నారు. నీటి నిల్వ కోసమే బరాజ్లు నిర్మించారా? అని కమిషన్ అడగగా, ఇది పూర్తిగా సాంకేతిక పరమైన అంశమని జవాబిచ్చారు. బరాజ్లలో ఏ పరిమాణంలో నీళ్లను నిల్వ చేయాలి అని కమిషన్ ప్రశ్నించగా, మొత్తం 141 టీఎంసీలను నిల్వ చేసేందుకు వాటిని నిర్మించామని చెప్పారు.కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక కొత్తగా ఫ్లడ్ బ్యాంకులు, డిశ్చార్జి ఛానల్స్ నిర్మాణం పనులు అప్పగించడం ప్రణాళిక లోపం కాదా? అని కమిషన్ అడగగా, సాంకేతిక అంశాలపై సమాధానమివ్వలేనని హరీశ్ బదులిచ్చారు. టెండర్లు పూర్తై కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక నిబంధనలు మార్చవచ్చా? అని ప్రశ్నించగా, క్షేత్ర స్థాయి పరిస్థితుల ఆధారంగా నీటిపారుదల శాఖ సిఫారసులు చేస్తే మార్చవచ్చని వివరణ ఇచ్చారు. నిపుణుల కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని కమిషన్ అడగగా, మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపుపై సిఫారసులు చేసేందుకని బదులిచ్చారు. ఎన్టీపీపీసీ పవర్ ప్లాంట్తో పాటు బొగ్గు గనులుండడంతో నేరుగా నీటి తరలింపు సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. హిందీలో చెప్పండి పరవాలేదు.. దాదాపు గంట పాటు హరీశ్రావు క్రాస్ ఎగ్జామినేషన్ను కమిషన్ నిర్వహించింది. తెలుగు మాధ్యమంలో చదివిన తనకు ఆంగ్లంపై పట్టులేదని ప్రారంభంలోనే హరీశ్రావు తెలపగా, హిందీలో సమాధానమిస్తే ఆంగ్లంలో తర్జుమా చేసుకుంటామని జస్టిస్ ఘోష్ చెప్పారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలకు సైతం కోర్టు హాల్లోకి కమిషన్ అనుమతినిచ్చింది.న్యాయవాదులకు అనుమతి లేదని కమిషన్ సిబ్బంది తెలియజేయగా, లిఖిత పూర్వక ఆదేశాలు తీసుకొస్తేనే బయటకు వెళ్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమ భరత్కుమార్ వాగ్వాదానికి దిగారు. దీంతో సాధారణ వ్యక్తులుగా కూర్చోవడానికి వారికి కమిషన్ అనుమతినిచ్చింది. క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బీఆర్కేఆర్ భవన్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన హరీశ్రావు వివరాలను వెల్లడించారు. -
టీపీసీసీ జంబో కార్యవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.సోమవారం ఢిల్లీకి వచి్చన సీఎం ఎ.రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం కార్యవర్గ జాబితాను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన జాబితాను సోమవారం రాత్రి పార్టీ విడుదల చేసింది. నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పరి్ణకారెడ్డి, డా.మట్ట రాగమయిలకు అవకాశం ఇచ్చారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చోప చర్చలు మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు మంత్రులు అధికారం చేపట్టడంతో వారికి కేటాయించాల్సిన శాఖలపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవం దృష్టా వీరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై చర్చించారు. సీఎం వద్దే హోం, న్యాయ, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు ఉన్నందున వాటిని కొత్త మంత్రులకు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న మరో మూడు స్థానాల్లో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చర్చించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిలతో పాటు ఇద్దరు మైనార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటే చీఫ్ విప్, రెండు విప్ల పదవుల భర్తీపైన చర్చ జరిగింది. చీఫ్ విప్ పదవిని రెడ్డి లేదా వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు 1) టి.కుమార్ రావు 2) కె.రఘువీర్ రెడ్డి, ఎంపీ 3) నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే 4) డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే 5) బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ 6) బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ 7) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి 8) బండి రమేశ్ 9) కొండ్రు పుష్పలీల 10) కోట నీలిమ 11) బి. కైలాష్ కుమార్ 12) నమిండ్ల శ్రీనివాస్ 13) ఆత్రం సుగుణ 14) గాలి అనిల్ కుమార్ 15) చిట్ల సత్యనారాయణ 16) లకావత్ ధన్వంతి 17) ఎం. వేణుగౌడ్ 18) కోటంరెడ్డి వినయ్ రెడ్డి 19) కొండేటి మల్లయ్య 20) ఎం.ఏ.ఫహీమ్ (సంగారెడ్డి) 21) ఎస్. సురేష్ కుమార్ 22) బొంతు రామ్మోహన్ 23) అఫ్సర్ యూసుఫ్ జాహీ 24) ఎస్. జగదీశ్వర్ రావు 25) నవాబ్ ముజాహిద్ ఆలంఖాన్ 26) గుమ్ముల మోహన్ రెడ్డి 27) చిన్నపటాల సంగమేశ్వర్ పీసీసీ ప్రధాన కార్యదర్శులు 1) వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే 2) సీహెచ్ పరి్ణకా రెడ్డి, ఎమ్మెల్యే 3) డా.మట్ట రాగమయి, ఎమ్మెల్యే 4) సీహెచ్.రాంభూపాల్ 5) ఏ. సంజీవ్ ముదిరాజ్ 6) బొజ్జా సంధ్యా రెడ్డి 7) మల్లాది రాంరెడ్డి 8) అబ్దేశి సదాలక్ష్మి 9) ఎం. బేబి స్వర్ణ కుమారి 10) దారాసింగ్, తాండూరు 11) జి. శశికళా యాదవ రెడ్డి 12) ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి 13) ముహమ్మద్ అబ్దుల్ ఫహీమ్ 14) సంతోష్ కుమార్ రుద్ర 15) దుర్గం భాస్కర్ 16) ముహమ్మద్ ఖాజా ఫఖ్రుద్దీన్ 17) వి.జగదీశ్వర్ గౌడ్ 18) నరేశ్ జాదవ్ 19) అల్లం భాస్కర్ 20) డా. గిరిజ షెట్కార్ 21) కొప్పుల ప్రవీణ్ కుమార్ 22) ఏ. జంగా రెడ్డి 23) కస్బా శ్రీనివాస్ రావు 24) దుడ్డిల్ల శ్రీనివాస్ 25) బద్దం ఇంద్రకరణ్ రెడ్డి 26) చరగాని దయాకర్ 27) పీసారి మహిపాల్ రెడ్డి 28) గజ్జెల కాంతం 29) ఏడుపుగంటి సుబ్బా రావు 30) చకిలం రాజేశ్వర్రావు 31) ఎర్ల కొమరయ్య 32)డా.ఏ.రవిబాబు 33) నాగ సీతారాములు 34) సనెం శ్రీనివాస్ గౌడ్ 35) పృథ్వి చౌదరి వేణుల 36) అంబడి రాజేశ్వర్ 37) డి.డి.వెంకట్ రాజ్ 38) బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 39) పల్లె శ్రీనివాస్ గౌడ్ 40) మొహమ్మద్ సబీర్ అలీ 41) కట్ల రంగారావు 42) పి. శ్రీనివాస్ రెడ్డి 43) మడు సత్యనారాయణ గౌడ్ 44) టోపాజీ అనంత కిషన్ 45) వి. రామారావు గౌడ్ 46) అచ్యుత్ రమేష్ బాబు 47) పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ (చిన్న) 48) ఎం. రాజీవ్ రెడ్డి 49) ఆదంరాజ్ దేకపాటి 50) షమీం ఆఘా 51) ఈ.వి.శ్రీనివాస్ రావు 52) మిథున్ రెడ్డి 53) అమొగోత్ వెంకటేశ్ పవార్ 54) రాయగిరి కల్పనా యాదవ్ 55) రాజేష్ కాశిపాక 56) రహమత్ హుస్సేన్ 57) పి. ప్రసన్న కుమార్ శర్మ 58) ముహమ్మద్ అసదుద్దీన్ 59) నందిమల్ల యాదయ్య ముదిరాజ్ 60) దైదా రవీందర్ 61) ఉప్పల శ్రీనివాస్ గుప్తా 62) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 63) జి. నాగభూషణం 64) ఉపేందర్ రెడ్డి 65) ధర్మారావు 66) నూతి సత్యనారాయణ గౌడ్ 67) దుర్గాప్రసాద్ 68) డా. సి. వేంకటగోవింద్ రావు 69) పెండ్లి శ్రీనివాసులు రెడ్డి -
TPCC: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండా పోమవారం రాత్రి పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. తాజా టీపీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా 27 మందిని నియమించింది. అదే సమయంలో ప్రధాన కార్యదర్శులుగా 69 మంది నియమించింది. -
‘వారికి తెలియకుండా నేను ఏ పనీ చేయలేదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ఎస్ఐబీ(special intelligence bureau) మాజీ చీఫ్ ప్రభాకర్రావు విచారణ ముగిసింది. సుమారు 8 గంటలపాటు ఆయన్ని ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ ఆయన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు.. ఇవాళ్టి విచారణలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా.. సిట్కే ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్కు తాను ఆదేశాలు ఇవ్వలేదని.. అలా చెప్పినట్లు ఆధారాలు చూపించాలని సిట్ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. తాను ఎఫ్ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపై అధికారులు ఉన్నారని.. తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పనీ తెలుసని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సిట్ కోరింది. తాను చేసిన ప్రతీ పనికి నిరంతర పర్యవేక్షణ ఉంటందని, వారికి తెలియకుఉండా తాను ఏ పనీ చేయలేదన్నారు. అయితే ఎస్ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా ఉండి ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకాలం అమెరికాలో ఉన్న ప్రభాకర్రావు సుప్రీం కోర్టు ఆదేశాలతో నిన్న (ఆదివారం, జూన్8) హైదరాబాద్ చేరుకున్నారు. -
మాజీ సీఎం కేసీఆర్తో హరీష్రావు భేటీ..
సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హారీస్రావు సమావేశమయ్యారు. ఈరోజు(జూన్9వ తేదీ) కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్రావు.. ఆపై నేరుగా కేసీఆర్తో సమావేశం కావడానికి బయల్దేరి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హరీష్ రావు హాజరు అయిన నేపద్యంలో వీరి మధ్య సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్య క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం నడుమే హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు,. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తాను వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు. -
అయ్యో, బిడ్డా.. చివరిచూపైనా దక్కదా?
కురవి (మహబూబాబాద్): మండల కేంద్రానికి చెందిన తొడుసు నేహ(15) శనివారం సాయంత్రం మండల కేంద్రం శివారు లింగ్యా తండా వద్ద 365 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి సరిత అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూతురు నేహ మృతి చెందిన విషయం తల్లికి తెలియదు. ఈ క్రమంలో ఆదివారం నేహకు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య నేహ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నేహ కడసారిచూపునకు నోచుకోకుండా తల్లి సరిత అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతుండడంపై గ్రామస్తులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. నేహ అంత్యక్రియలకు సహ విద్యార్థినులు తరలొచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎర్ర నాగేశ్వరరావు, రాజేందర్కుమార్, మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, నూతక్కి నర్సింహరావు, సంగెం భరత్, బాదె నాగయ్య, మేక నాగిరెడ్డి, గుగులోత్ రవి, నూతక్కి సాంబశివరావు, దుడ్డెల వినోద్.. నేహ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. బిడ్డను చూసేందుకు వచ్చిన నాయకులను చూసిన తండ్రి వెంకన్న బోరున విలపించాడు. బిడ్డ నీకోసం సార్లు వచ్చారంటూ గుండెలవిసేలా రోదించాడు. -
ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. బస్పాస్ చార్జీలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక, పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. బస్ పాస్ ఛార్జీలు పెరగడంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం.. రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ రూ.1600లకు పెంపురూ.1,150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ రూ.1400లకు పెంపు. బస్ పాస్ చార్జీలు భారీగా పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కాలేజీలకు ఎలా వెళ్లాలని విద్యార్థులు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యరి్థగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జని్మంచారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ముకుందం రమేష్ పాల్గొన్నారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పారీ్టలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కలి్పంచాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.రాజకీయ నేపథ్యం.. వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2022 సెపె్టంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. -
ఫోన్ ట్యాపింగ్.. సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుండి డేటాను సిట్ అధికారులు తెప్పించుకున్నారు. -
బీఆర్కే భవన్కు హరీష్రావు.. లీగల్ టీమ్తో పోలీసుల వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీమ్.. ఓపెన్ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా లీగల్ టీమ్ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు.. రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను వారికి అందిస్తాం’ అని తెలిపారు. -
ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయాల్లో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎనీ్టఆర్ మీద అభిమానంతో మాగంటి గోపీనాథ్ 1983లో టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. కొద్ది కాలానికే ఎనీ్టఆర్ ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా, 1988 నుంచి 1993 వరకు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పని చేశారు. 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించిన మాగంటి గోపీనాథ్.. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. పార్టీల జిల్లా అధ్యక్షుడిగా... టీడీపీలో ఉండగానే తొలుత 2014లో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. బీఆర్ఎస్లో చేరడానికి ముందు గోపీనాథ్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్లో సైతం 2022 నుంచి పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నగరంలో ఎందరో నేతలున్నప్పటికీ, కేసీఆర్ ఆయనకే పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించారంటే ఆయనకు ఎంతటి ప్రాధాన్యమిచ్చారో అంచనా వేసుకోవచ్చు. సినీ నిర్మాతగా.. మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో మాత్రమే కాకుండా సినీ నిర్మాతగానూ గుర్తింపు పొందారు. పాతబస్తీ (1995), రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004,) నా స్టైలే వేరు (2009) సినిమాలను నిర్మించారు. బుల్లెట్ వాహనాలతో ర్యాలీలు.. బుల్లెట్ బండ్లతో ర్యాలీలు నిర్వహించడం ద్వారా మాగంటి తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. 1984లో ఎనీ్టఆర్ను సీఎం పదవి నుంచి దించినప్పుడు, అనంతరం 1985లో ఎనీ్టఆర్ తిరిగి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు బుల్లెట్ ర్యాలీలు నిర్వహించారు. ఏ పారీ్టలో ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాల వేళ విభిన్న ప్రచారాలతోనూ ప్రత్యేకంగా నిలిచారు. ఆయా సందర్భాల్లో తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్, కేటీఆర్ల కటౌట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్పై గెలిచారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే ఎదిగి గోపీనాథ్ 1963, జూన్ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటరీ్మడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆయనకు భార్య సునీత, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
Yadagirigutta: బస్సుల కొరత.. భక్తుల అవస్థ
యాదగిరిగుట్ట: వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధికంగా వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి భక్తుల కొండ పైన, కొండ కింద బస్టాండ్లలో నిరీక్షించాల్సి వస్తోంది. ఆదివారం భక్తులు ఎక్కువగా రావడంతో చాలామంది కొండ కింద వాహనాలు పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం తొమ్మిది బస్సులే..యాదగిరిగుట్ట పైకి, కొండ కిందకు ఆదివారం 9 బస్సులను మాత్రమే అధికారులు నడిపించారు. ఒక్కో బస్సులో 60 మంది ప్రయాణికులు ఎక్కాల్సి ఉండగా.. 100 మంది వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది భక్తులు సీట్ల కోసం పోటీపడడంతో పాటు ఫుట్బోర్డుపై నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. చాలామంది భక్తులు మెట్ల మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చిన్న పిల్లలు, తల్లుల ఇబ్బందులు..ధర్మ దర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. క్యూలైన్లలో ఉక్కపోతతో పాటు క్యూకాంప్లెక్స్ నుంచి గోల్డ్ క్యూలైన్లోకి వచ్చే వరకు నీళ్లు లేకపోవడంతో చిన్నారులు తీవ్రంగా ఏడ్చారు. ఆలయాధికారులు రూ.150 క్యూలైన్, గోల్డ్ క్యూలైన్లోని భక్తులకు మాత్రమే తాగునీటిని సరఫరా చేశారు. పలువురు భక్తులు తమ పిల్లలతో నేరుగా తూర్పు రాజగోపురం ముందు ఉన్న మెయిన్ గేట్ ద్వారా ఆలయంలోకి వెళ్లేందుకు గాను ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందిని వేడుకున్నా తాళాలు తీయలేదు. ఆలయ అధికారులు వచ్చి జోక్యం చేసుకోవడంతో తాళాలు తీసి పంపించారు. చిన్నారులతో వచ్చిన పలువురు భక్తులు తూర్పు రాజగోపురం ముందు నుంచి, వైకుంఠద్వారం వద్ద స్వామిని మొక్కి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోయారు.ప్రసాద విక్రయశాలలోనూ అవస్థలే..ప్రసాదం కౌంటర్ శివాలయం ముందు ఉండటంతో అక్కడికి మెట్లు దిగి వెళ్లి, టిక్కెట్ కొనుగోలు చేసి తిరిగి ప్రసాద విక్రయశాలలో గంటల తరబడి ప్రసాదం కోసం వేచి చూడాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. ప్రసాద విక్రయశాల పక్కకే కౌంటర్ పెట్టి ఉంటే బాగుండేదని పలువురు భక్తులు పేర్కొన్నారు. గంటల తరబడి దర్శనం క్యూలైన్లలో నిల్చోని, ప్రసాదం కోసం కూడా వేచి ఉన్నామని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.బస్సులు సరిగ్గా లేవుయాదగిరీశుడిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో వచ్చాను. కొండ కింద నుంచి ఆర్టీసీ బస్సులో కొండపైకి వచ్చాం. సుమారు నాలుగు గంటలు ధర్మ దర్శనం క్యూలైన్లో నిల్చోని స్వామిని దర్శించుకున్నాం. మధ్యాహ్నం 12గంటల తర్వాత కొండ పైన బస్టాండ్ వద్దకు వచ్చేసరికి బస్సులు లేవు. ఒకేసారి 4 బస్సులు వచ్చినప్పటికి భక్తులంతా గుంపులుగా వెళ్లి పోటీపడుతూ ఎక్కారు. సుమారు 45 నిమిషాల పాటు మరో బస్సు కోసం వేచి చూడాల్సి వచ్చింది. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలి. – శ్రీనివాస్, పాల్వంచప్రసాదం కోసం వేచి చూశాంకుటుంబ సభ్యులతో కలిసి రూ.150 టిక్కెట్ కొనుగోలు చేసి స్వామిని దర్శించుకున్నాం. అనంతరం లడ్డూ, పులిహోర ప్రసాదం కొనుగోలు కోసం వెళ్తే భారీ లైన్ ఉంది. వృద్ధులు, దివ్యాంగులకు ప్రసాదం సెక్షన్ వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. అధికారులు ప్రసాద విక్రయశాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.– విజయలక్ష్మి, సిద్దిపేట -
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందులో జిల్లా నేతలు ఇద్దరికి చోటు దక్కుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచన చేయడంతో జిల్లాకు పక్కా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆదివారం ప్రకటించిన మంత్రివర్గంలో జిల్లా నేతలకు చోటు దక్కకపోవడంతో ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అయితే మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా? అవకాశం దక్కుతుందా? ముఖ్యంగా ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అవకాశం ఇస్తారా? అన్న దానిపై జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది.రాజగోపాల్రెడ్డికి మంత్రి వర్గంలో దక్కని చోటుఈసారి మంత్రి వర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చోటు దక్కలేదు. ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినందునే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న చర్చ జరిగింది. అయితే మొదటి మంత్రివర్గంలో రాజగోపాల్రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి చోటు దక్కడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపకపోవడంతో రాజగోపాల్రెడ్డికి అప్పట్లో చోటు దక్కలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం రాజగోపాల్రెడ్డితో మాట్లాడి భువనగిరి ఎంపీ గెలుపు బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అన్నీ తానై ఆ బాధ్యతను భుజాన వేసుకుని భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దీంతో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ వర్గాలతో పాటు జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది.వాయిదా పడుతూ విస్తరణ..పార్లమెంట్ ఎన్నికల నాటినుంచి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ వార్తలు వెలువడినా.. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన అలకవహించినట్లు చర్చ జరగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆదివారం రాత్రి వరకు వారికి అందుబాటులోకి రాలేదు.బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని మొన్నటి వరకు చర్చ మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లంబాడా కోటాలో మంత్రి పదవిని ఇవ్వాలని గతంలోనే అధిష్టానాన్ని అడిగారు. ఆ దిశగా అధిష్టానం కూడా మొగ్గు చూపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నందున, మరో రెండు మంత్రి పదవులు ఇస్తే ఇతర సమస్యలు వస్తాయన్న ఆలోచనతో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని అసెంబ్లీ సమావేశాల సమయంలో జోరుగా చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా బెర్తు దక్కలేదు.చర్చనీయాంశంగా మారిన జానా లేఖరెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో రాజగోపాల్రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. కొన్నాళ్ల తరువాత ఆ చర్చ సద్దుమణిగినా ప్రస్తుతం విస్తరణలో రాజగోపాల్రెడ్డికి, బాలునాయక్కు పదవులు దక్కలేదు. -
హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు.. ఎయిర్పోర్టులో బౌన్సర్ల ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్సైబీ) ఓఎస్డీ ప్రభాకర్రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్కు దిగారు.శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా చేశారు. విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు. కొంతమంది యూనిఫాంలో ధరించి.. మరి కొంత మంది సివిల్ డ్రెస్లో ఉన్న బౌన్సర్లు ఓవరాక్షన్కు దిగారు. ప్రభాకర్ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Em Ganakaryam chesinav Ani siggupaduthunav Prabhakar Rao! Khaaki Paruvu Theesindi Kaakunda!🗣️ pic.twitter.com/VMpKSj2OWn— Rishi Karan Reddy (@Rishi_Karan_) June 8, 2025ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రభాకార్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులు అరెస్టయి దీర్ఘకాలం రిమాండులో ఉండి బెయిల్ పొందారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్రావు.. ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్టు రద్దు చేయించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్కు తిరిగి రావడంతో విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకు వచ్చింది. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. -
హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నగరంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న కారు ప్రమాదంతో మృతి చెందడంతో మే నెలలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత సోదరి నివేదితకు ఓటమి ఎదురైంది. సీనియర్ నాయకుడు జి.సాయన్న మరణంతో ఆయన వారసురాలిగా లాస్యనందిత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. ఆమె మరణంతో మేలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నారాయణ్ శ్రీగణేశ్ గెలిచారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో మళ్లీ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యాక ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక రెండేళ్లలోపునే రెండు ఉప ఎన్నికలు.. హైదరాబాద్లోనే కాదు.. బహుశా ఏ జిల్లాలోనూ జరిగి ఉండవు. -
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్.. మాదిగ, గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు. -
స్కూలింగ్ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్ వద్ద
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు. దత్తాత్రేయ ప్రజల మనిషి హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. హైదరాబాద్లో మాస్ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్నాథ్ కోవింద్ ఉత్తర్ప్రదేశ్లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్ వివరించారు. లేఖలకు బ్రాండ్ అంబాసిడర్: చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ అని చమత్కరించారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
దారులన్నీ యాదగిరిగుట్టకే..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ సన్నిధితో పాటు పట్టణ పరిసరాలు, ఆధ్యాత్మిక వాడ.. ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు.. శ్రీస్వామి జన్మ నక్షత్రం స్వాతి కలిసి రావడంతో ఆదివారం శ్రీస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశంలోని ఆయా ప్రాంతాల భక్తులు అధికంగా తరలి వచ్చారు. ఉదయం నుంచే యాదగిరీశుడి క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలన్నీ నిండిపోయాయి. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీనృసింహస్వామిని 90 వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ పూజలతో ఆలయానికి నిత్యాదాయం రూ.85,57,558 వచి్చనట్లు అధికారులు వెల్లడించారు. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని ఆదివారం భక్తులు, ఆలయాధికారులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేశారు. ఉదయం 5 గంటలకు కొండ కింద గల వైకుంఠద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు వివిధ ప్రాంతాల కళాకారులు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, ఈవో వెంకట్రావు పాల్గొన్నారు.