breaking news
Other Sports
-
మీరాబాయి మెరిసేనా!
అహ్మదాబాద్: ఏడాది విరామం తర్వాత భారత స్టార్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను పోటీల బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఇక్కడ జరిగే కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆమె స్టార్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. పారిస్ ఒలింపిక్స్లో కేవలం ఒక కిలోగ్రామ్ తేడాతో పోడియంలో నిలువలేకపోయిన మీరాబాయి తర్వాత గాయాల బారిన పడింది. దీంతో చాలా టోర్నీలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా పతకం పట్టుపట్టేందుకు 32 ఏళ్ల మీరా 48 కేజీల కేటగిరీకి మారింది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్లో ఆమె రెగ్యులర్ కేటగిరీ కాకుండా 48 కేజీల కేటగిరీ ఉండటంతో ఇప్పటి నుంచే ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు ఈ తాజా చాంపియన్షిప్ క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో మీరాబాయి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు కామన్వెల్త్ క్రీడల రజత విజేత బింద్యారాణి దేవి, కాంస్య విజేతలు హర్జిందర్ కౌర్, లవ్ప్రీత్ సింగ్లు సహా భారత లిఫ్టర్లే ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. భారత జట్ల వివరాలు: మహిళలు: మీరాబాయి చాను (48 కేజీలు), స్నేహా సోరెన్ (53 కేజీలు), బింద్యారాణి (58 కేజీలు), నిరుపమా (63 కేజీలు), హర్జిందర్ కౌర్ (69 కేజీలు), హర్మన్ప్రీత్ కౌర్ (77 కేజీలు), వన్షిత (86 కేజీలు), మెహక్ (+86 కేజీలు). పురుషులు: రిషికాంత సింగ్ (60 కేజీలు), ఎం.రాజా (65 కేజీలు), నారాయణ అజిత్ (71 కేజీలు), వల్లూరి అజయ్ బాబు (79 కేజీలు), అజయ్ సింగ్ (88 కేజీలు), దిల్బాగ్ సింగ్ (94 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), లవ్ప్రీత్ సింగ్ (+110 కేజీలు). -
రాడుకాను శుభారంభం
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన ఈ మెగా టోర్నీలో తొలి రౌండ్లో రాడుకాను 6–1, 6–2తో ఇనా షిబహారా (జపాన్)పై గెలుపొందింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో 2021 చాంపియన్ రాడుకాను రెండు ఏస్లు సంధించింది. నెట్ వద్దకు ఏడుసార్లు దూసుకొచి్చన ఆమె ఐదుసార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని రాడుకాను ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు షిబహారా ఐదు డబుల్ ఫాల్ట్లతోపాటు 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. షెల్టన్ బోణీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గెలుపు బోణీ కొట్టాడు. ఇగ్నాసియో బుసె (పెరూ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో షెల్టన్ 6–3, 6–2, 6–4తో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 7 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో షెల్టన్ ఐదు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ అమెరికా స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని షెల్టన్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 16వ సీడ్ జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 6–3, 6–4తో నికోలస్ జారీ (చిలీ)పై, 18వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–1, 6–1, 6–2తో అలెగ్జాండర్ షెవ్చెంకో (కజకిస్తాన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
భారత షూటర్ల జోరు
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం సీనియర్ పురుషుల విభాగంలో భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, అఖిల్ షెరాన్లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ 462.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెన్యు జావో (చైనా; 462) రజతం, నయోవా ఒకాడా (జపాన్; 448.8) కాంస్యం గెలిచారు. చెయిన్ సింగ్ (435.7) నాలుగో స్థానంలో, అఖిల్ (424.9 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ (584 పాయింట్లు), చెయిన్ సింగ్ (582 పాయింట్లు), అఖిల్ (581 పాయింట్లు) బృందం మొత్తం 1747 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత భారత్కు చెందిన అడ్రియన్ కర్మాకర్ (463.8 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. టీమ్ విభాగంలో అడ్రియన్, నితిన్, రోహిత్లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో పసిడి పతకాన్ని నెగ్గింది. ఓవరాల్గా భారత్ 26 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 46 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
చికిత ‘పసిడి’ గురి
ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ పతకంతో మెరిసింది. కెనడాలోని విన్నీపెగ్లో ఆదివారం ఈ మెగా ఈవెంట్ ముగిసింది. అండర్–21 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత విశ్వవిజేతగా అవతరించింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత ఫైనల్లో 142–136 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాకు చెందిన యెరిన్ పార్క్పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో చికిత 142–133తో మొరిలాస్ డియాజ్ (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 146–143తో పర్ణీత్ కౌర్ (భారత్)పై గెలుపొందింది. క్వాలిఫయింగ్ రౌండ్లో చికిత 687 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి మెయిన్ ‘డ్రా’లో నేరుగా రెండో రౌండ్కు ‘బై’ పొందింది. రెండో రౌండ్లో చికిత 143–140తో మా యువెన్ (చైనీస్ తైపీ)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 142–138తో జిమెనా ఎ్రస్టాడా (మెక్సికో)పై గెలిచింది. అండర్–21 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, పర్ణీత్ కౌర్, తేజల్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 229–232తో టర్కీ చేతిలో ఓడిపోయింది. -
చాంపియన్ హరియాణా
జలంధర్: జాతీయ జూనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్లో హరియాణా జట్టు విజేతగా నిలిచింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో హరియాణా 3–2తో ఒడిశా జట్టుపై గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్ల ఆటగాళ్లు అదేపనిగా ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేసినప్పటికీ ఏ జట్టుకు ఫలితం దక్కలేదు. కానీ రెండో క్వార్టర్ మొదలవగానే ఒడిశా అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకొని 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసింది. దీపక్ ప్రధాన్ (17వ ని.), ప్రతాప్ టొప్పొ (19వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచారు. దీంతో ఒడిశా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. కానీ ఆఖరి క్వార్టర్ మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసింది. హరియాణా ఆటగాళ్లు చిరాగ్ (50వ ని.), మరుసటి నిమిషంలోనే నితిన్ (51వ, 60వ ని.) స్కోరును 2–2తో సమం చేశారు. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠరేకిత్తించగా ఆఖరి నిమిషంలో నితిన్ గోల్ చేసి హరియాణాను విజేతగా నిలిపాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో షూటౌట్లో ఉత్తర ప్రదేశ్పై విజయం సాధించింది. -
ప్రజ్ఞానందకు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శనివారం మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానందకు ఇది వరుసగా నాలుగో ‘డ్రా’. ఇక ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్... జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్)తో గేమ్ను 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. సామ్ సెవియాన్ (అమెరికా), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)... అరోనియన్ (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) మధ్య మ్యాచ్లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మొత్తంగా శనివారం జరిగిన అన్నీ మ్యాచ్లు ‘డ్రా’గానే ముగిశాయి. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫాబియానో కరువానా (అమెరికా) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, అరోనియన్ చెరో 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గుకేశ్, మాక్సిమి లాగ్రెవ్, వెస్లీ సో, అలిరెజా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడతారు. -
ఇలవేనిల్–అర్జున్ పసిడి ధమాకా
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలారివన్ డబుల్ ధమాకా సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో శుక్రవారం బంగారు పతకం చేజిక్కించుకున్న ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ మరో పసిడి నెగ్గింది. తమిళనాడుకు చెందిన ఈ యువ షూటర్... శనివారం జరిగిన పోటీల్లో అర్జున్ బబుతాతో కలిసి స్వర్ణంపై గురిపెట్టింది. చైనీస్ జంట డింగ్కె లూ–జిన్ లూ పెంగ్తో పోటీ ఎదురైనప్పటికీ చివరకు భారత జోడీ 17–11తో విజేతగా నిలిచింది. మొదట్లో చైనా జోడీ ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఇలవేనిల్–అర్జున్ ద్వయం లక్ష్యంపై గురి పెట్టడంలో సఫలమైంది. ఇటు తమిళ షూటర్ ఇలవేనిల్కు, అటు పంజాబ్ షూటర్ బబుతాకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో అర్జున్ బబుతా తొలి పసిడి పతకం నెగ్గాడు. రుద్రాం„Š పాటిల్, కిరణ్ జాదవ్, అర్జున్లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది.జూనియర్ ఈవెంట్లోనూ శాంభవి శ్రవణ్–నరేన్ ప్రణవ్ జంట బంగారం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జంట 16–12తో చైనా జోడీపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్లో చైనాకే చెందిన రెండు జట్లు 632.3 స్కోరు, 630 స్కోర్లతో శాంభవి– నరేన్ ప్రణవ్ (629.5) జోడీ కంటే ముందు వరుసలో నిలిచాయి. కానీ అసలైన పతకం రేసులో భారత ద్వయం పుంజుకుంది. గురి తప్పని షాట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. భారత్కే చెందిన ఇషా తక్షలే–హిమాన్షు జోడీ (628.6 స్కోరు) క్వాలిఫికేషన్లో నాలుగో స్థానంలో నిలిచింది. జూనియర్ పోటీల్లో శాంభవికిది రెండో స్వర్ణం. మహిళల టీమ్ ఈవెంట్లో ఆమె హృదయశ్రీ, ఇషా అనిల్లతో కలిసి తొలిరోజే బంగారు పతకం గెలిచింది. -
కేరళకు మెస్సీ సేన
కొచ్చి: ప్రపంచ ఫుట్బాల్ చాంపియన్ అర్జెంటీనా జట్టు భారత్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో భాగంగా లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది మొత్తం మూడు మ్యాచ్లు ఆడాల్సివుంది. ప్రత్యర్థి జట్లు, నగరాలు ఖరారు కానప్పటికీ ఏ ఏ దేశాల్లో జరిగేవి వెల్లడించారు. ముందుగా మెస్సీ సేన అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీల మధ్యలో అర్జెంటీనా... అమెరికాలో ఈ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నవంబర్ 10 నుంచి 18వ తేదీల మధ్యలో లువాండా (అంగోలా), కేరళ (భారత్) రెండు ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఎదుర్కోబోయే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొంది. అయితే మొరాకో, కోస్టా రికో, ఆస్ట్రేలియాలతో పాటు ఆసియా మేటి జట్టు జపాన్లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఘనమైన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్నాళ్లుగా సాకర్ స్టార్ మెస్సీని కేరళకు తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తానికి అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) షెడ్యూల్లో కేరళను చేర్చడంలో సఫలమైంది. మెస్సీ నవంబర్లో గనక జట్టుతో పాటు వస్తే నెల వ్యవధిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ డిసెంబర్లో భారత్కు రానున్నాడు. దీనికి సంబంధించి షెడ్యూల్ను ఆర్గనైజర్లు ఇటీవలే ప్రకటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్లోని సాకర్ ప్రియులకు, మెస్సీని ఆరాధించే అభిమానులకు ఇది పెద్ద పండగే. -
నువ్వా... నేనా?
న్యూయార్క్: పురుషుల టెన్నిస్లో 2023నుంచి జరిగిన గత 11 గ్రాండ్స్లామ్లలో 8 టైటిల్స్ను యానిక్ సినెర్, కార్లోస్ అల్కరాజ్ పంచుకోగా...మరో మూడు ట్రోఫీలు జొకోవిచ్ ఖాతాలో చేరాయి. అయితే ఈ ఏడాది తాజా ఫామ్ను, గత రెండు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ప్రదర్శనను బట్టి చూస్తే సినెర్, అల్కరాజ్ మరో టైటిల్ వేటలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు తన 25వ గ్రాండ్స్లామ్ కోసం తీవ్రంగా పోరాడుతున్న జొకోవిచ్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్లో సింగిల్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే 2025 చివరి గ్రాండ్స్లామ్ను ఎవరు సొంత చేసుకుంటారనేది ఆసక్తిరం. అల్కరాజ్ (స్పెయిన్) తొలి రౌండ్లో భారీ సర్వీస్లకు పెట్టింది పేరయిన 7 అడుగుల రీలీ ఒపెల్కా (యూఎస్)ను ఎదుర్కోనున్నాడు. ఇటీవలే జొకోవిచ్, డి మినార్, రూన్లను ఓడించిన రికార్డు ఒపెల్కాకు ఉంది. ఆ తర్వాత ముందంజ వేస్తే అల్కరాజ్కు ప్రిక్వార్టర్స్లో 2021 చాంప్ మెద్వెదెవ్ ఎదురయ్యే అవకాశం ఉంది. తొలి రౌండ్లో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో సినెర్ (ఇటలీ) తలపడతాడు. క్వార్టర్స్ వరకు వెళితే జేక్ డ్రేపర్ (యూకే) అతనికి ఎదురు పడతాడు. ఈ టాప్ ప్లేయర్లతో పాటు తాజా సీజన్లో అద్భుతంగా ఆడుతున్న ఇతర ఆటగాళ్లు జాకబ్ మెన్సిక్, హోల్గర్ రూన్, కాస్పర్ రూడ్, టియాఫో, ఫ్రిట్జ్, బబ్లిక్ తదితరులు కూడా తమ తొలి గ్రాండ్స్లామ్ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సబలెంకా జోరు సాగేనా...మహిళల విభాగంలో టైటిల్ వేటలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైంది. రెబెకా మసరోవా (స్విట్జర్లాండ్)తో జరిగే తొలి రౌండ్ మ్యాచ్తో ఆమె తన పోరును మొదలు పెడుతుంది. అయితే ఈ సారి సొంతగడ్డపై ట్రోఫీని గెలిచేందుకు అమెరికా అమ్మాయిల మధ్యే గట్టి పోటీ ఉంది. కోకో గాఫ్, మాడిసన్ కీస్, జెస్సికా పెగులా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2023లో గాఫ్ ఇక్కడ విజేతగా నిలిచింది. వరల్డ్ నంబర్ 2 స్వియాటెక్ (పోలండ్) తొలి రౌండ్లో ఎమీలియానా అరాంగో (కొలంబో)ను ఎదుర్కొంటుంది. ఇదే క్రమంలో ముందంజ వేస్తే ఆమెకు తాను వింబుల్డన్ ఫైనల్లో చిత్తు చేసిన అనిసిమోవా (అమెరికా) ఎదురవుతుంది. జాస్మిన్ పొవొలిని, మిరా ఆండ్రీవా, ఎమా నవరో కూడా సంచలనాన్ని ఆశిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న సీనియర్ ప్లేయర్, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లో కరోలినా ముకోవాను ఎదుర్కొంటుంది.‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవాప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మాజీ స్టార్ మారియా షరపోవాకు చోటు దక్కింది. ఆమెతో పాటు పురుషుల డబుల్స్లో ఆల్టైమ్ గ్రేట్గా నిలిచిన ‘బ్రైన్ బ్రదర్స్’ను ఇందులో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. రష్యాకు చెందిన 38 ఏళ్ల షరపోవా కెరీర్లో ఐదు సింగిల్స్ గ్రాండ్స్లామ్లను గెలుచుకుంది. నాలుగు గ్రాండ్స్లామ్లను కూడా సాధించిన 10 మంది మహిళా ప్లేయర్లలో షరపోవా కూడా ఉంది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్వన్ కు చేరిన తొలి రష్యా మహిళగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తన ఆటతో పాటు అందంతో ప్రపంచ టెన్నిస్లో స్టార్గా వెలిగింది. 2020లో ఆమె ఆటనుంచి రిటైరైంది. అమెరికాకు చెందిన కవల సోదరులు బాబ్ బ్రైన్, మైక్ బ్రైన్ టెన్నిస్ ప్రపంచంలో ‘బ్రైన్ బ్రదర్స్’గా ఆడిన సంచలన రికార్డులను నెలకొల్పారు. వీరిద్దరు జోడీగా 119 డబుల్స్ టైటిల్స్ గెలవగా...ఇందులో 16 గ్రాండ్స్లామ్లు ఉన్నాయి. ప్రతీ గ్రాండ్స్లామ్ను కనీసం రెండు సార్లు నెగ్గి వీరు డబుల్ కెరీర్ గ్రాండ్స్లామ్ను సాధించారు. ఈ జంట ఏకంగా 438 వారాలు వరల్డ్ నంబర్వన్గా కొనసాగడం విశేషం. -
Durand Cup 2025: సరికొత్త చరిత్ర.. విజేత ఎవరంటే..
నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవాళీ వార్షిక పుట్బాల్ టోర్నమెంట్ డ్యురాండ్ కప్ టైటిల్ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. తద్వారా ఈస్ట్ బెంగాల్ జట్టు (మూడుసార్లు) తర్వాత అత్యధికసార్లు ఈ ట్రోఫీ గెలిచిన రెండో జట్టుగా నిలిచింది.డ్యూరాండ్ కప్-2025 (Durand Cup) ఎడిషన్లో అరంగేట్ర జట్టు డైమండ్ హార్బర్ ఫుట్బాల్ క్లబ్ను ఓడించి నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ ఈ ఘనత సాధించింది. కాగా ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్గా డ్యూరాండ్ కప్ టోర్నీకి పేరుంది.డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి..ఈ మెగా ఈవెంట్లో ఈ ఏడాది అడుగుపెట్టిన డైమండ్ హార్బర్ జట్టు తొలి ప్రయత్నంలోనే.. సంచలన ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్తో శనివారం నాటి టైటిల్ పోరులో తలపడింది.ఆరు గోల్స్.. వేర్వేరు ఆటగాళ్లుఈ క్రమంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ ఆది నుంచే అదరగొట్టింది. అషీర్ అక్తర్ మ్యాచ్ ముప్పైవ నిమిషంలో గోల్ కొట్టి జట్టుకు శుభారంభం అందించగా.. పార్థిబ్ గొగొయ్ రెండో గోల్ కొట్టాడు.సెకండాఫ్ యాభైవ నిమిషంలో థోయీ సింగ్ మూడో గోల్ కొట్టగా.. 81వ నిమిషంలో జైరో సంపేరియో, 86వ నిమిషంలో ఆండీ రోడ్రిగెజ్ గోల్స్ కొట్టారు. ఇక అలాడిన్ అజారీ ఆరో గోల్ కొట్టగా.. నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ విజయం ఖరారైంది. 6-1 తేడాతో డైమండ్ హార్బర్ను చిత్తు చేసి వరుసగా రెండోసారి డ్యూరాండ్ కప్ను కైవసం చేసుకుంది. కాగా డైమండ్ హార్బర్ జట్టు తరఫున జాబీ జస్టిన్ సాయంతో మైకేల్ కొర్టాజర్ ఓ గోల్ కొట్టాడు.విజేతకు రూ. 1.21 కోట్లుఇక డ్యూరాండ్ కప్-2025 విజేత నార్త్ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్కు రూ. 1.21 కోట్ల భారీ ప్రైజ్మనీ దక్కింది. గతేడాది ప్రైజ్మనీ కంటే ఇది 250 శాతం ఎక్కువ. ఇక రన్నరప్ డైమండ్ హార్బర్ క్లబ్కు రూ. 60 లక్షలు దక్కుతాయి. ఇదిలా ఉంటే.. డ్యూరాండ్ కప్- 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత 34 ఏళ్లకు అంటే మళ్లీ ఇప్పుడే నార్త్ ఈస్ట్ ఇలా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. -
ఆసియా కప్ కోసం భారత్కు రావడం లేదు: పాక్ హాకీ దిగ్గజం
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్కు ఇదివరకే పాకిస్తాన్ జట్టు దూరంగా ఉంది. ఇప్పుడు ఆ దేశ దిగ్గజం సొహైల్ అబ్బాస్ కూడా మలేసియా జట్టు అసిస్టెంట్ కోచ్ హోదాలో భారత్కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈ మేరకు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే టోరీ్నకి అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. పాక్ దిగ్గజ డ్రాగ్ఫ్లికర్గా ఖ్యాతి గడించిన అతను ప్రస్తుతం మలేసియా హాకీ జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ జట్టు ఆసియా కప్ కోసం భారత్కు రానుంది. ఈ టోర్నీ విజేత నేరుగా ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆసియా ఈవెంట్కు మలేసియా జట్టు తరఫున వచ్చేందుకు అనాసక్తి చూపడం విడ్డూరంగా ఉంది. అయితే తన నిర్ణయానికి స్వదేశం (పాక్) తీసుకున్న గైర్హాజరుకు సంబంధం లేదని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.‘నేను ఆసియా కప్ కోసం భారత్కు వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఈవెంట్కు అందుబాటులో ఉండటం లేదు. ఇది నా సొంత నిర్ణయం. దీనిపై ఎవరి ప్రభావం లేదు’ అని అన్నాడు. అబ్బాస్ 2012లో అంతర్జాతీయ హాకీకి గుడ్బై చెప్పారు. ఆ తర్వాత 2024 వరకు లోప్రొఫైల్ జీవితాన్నే గడిపారు. గతేడాది మలేసియా కోచింగ్ బృందంలో చేరారు. 48 ఏళ్ల సొహైల్ అబ్బాస్ ఏకంగా నాలుగు ప్రపంచకప్లు (1998, 2002, 2006, 2010), మూడు ఒలింపిక్స్ (2000, 2004, 2012)లలో పాల్గొన్నారు. 1998, ఫిబ్రవరిలో భారత్తో పెషావర్లో జరిగిన మ్యాచ్తో అరంగేట్రం చేసిన అబ్బాస్ 311 మ్యాచ్లు ఆడి 21 సార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. భారత్లో 20 ఏళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ హాకీ లీగ్లో విజేత హైదరాబాద్ సుల్తాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. -
‘కూత’ మారుతోంది
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫార్మాట్ మారినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 29 నుంచి జరిగే 12వ సీజన్ పీకేఎల్ను మారిన ఫార్మాట్ ప్రకారం నిర్వహిస్తారు. మ్యాచ్ల్లో రసవత్తర పోటీ పెరిగేందుకు అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని పంచేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగా టైబ్రేకర్, గోల్డెన్ రెయిడ్ నిబంధనలను తీసుకొచ్చారు. గతంలో గోల్డెన్ రెయిడ్ కేవలం ప్లేఆఫ్స్లోనే ఉండేది. ఇప్పుడు లీగ్ ఆసాంతం కొనసాగిస్తారు. మ్యాచ్ ‘టై’ అయితే కొత్త టైబ్రేకర్తో ఫలితం కచ్చితంగా ఫలితం రానుంది.స్కోరు సమమైన పక్షంలో ఒక్కో జట్టుకు ఫుట్బాల్ తరహాలో 5 రెయిడ్ షూటౌట్ అవకాశాలిస్తారు. ఇరు జట్లు ఏడుగురు చొప్పున ఆటగాళ్లను నామినేట్ చేస్తాయి. ఇందులో ఐదుగురు రెయిడ్ చేస్తారు. ‘షూటౌట్’ స్కోరు సమమైతే అప్పుడు గోలెడ్న్ రెయిడ్ తెరపైకి వస్తుంది. ఇలాంటి మార్పులతో మ్యాచ్లో మరింత నాటకీయత పెరుగుతుందని, ఆటలోనూ పోటీ కూడా అభిమానుల్ని ఆకర్శిస్తుందని పీకేఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో లీగ్ దశలో 108 మ్యాచ్లుంటాయి. ఒక్కో ఫ్రాంచైజీ జట్టు 18 మ్యాచ్లు ఆడుతుంది. పాత పద్ధతిలో ప్లే ఆఫ్స్ ఉంటాయి... కానీ ఇకపై పాయింట్ల పట్టికలో మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి. తద్వారా టైటిల్ రేసులో 8 జట్లు పోటీలోనే ఉంటాయి. 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన ఫ్రాంచైజీలు ‘ప్లే–ఇన్’ మ్యాచ్లు ఆడతాయి. గెలిచిన జట్లు ముందంజ వేస్తాయి. అలాగే 3, 4 స్థానాల జట్లు ‘మినీ క్వాలిఫయర్’ ఆడతాయి. ఇక్కడ గెలిచిన జట్టు ముందుకెళుతుంది. కానీ ఓడిన జట్టు నిష్క్రమించదు. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ చేరేందుకు మరో అవకాశముంటుంది. ఈ ప్రక్రియలో మొత్తం మూడు ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్–1 ఆడతాయి. విజేత జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్–2 ఆడుతుంది. ఎలిమినేటర్ ఫలితాల విజేత క్వాలిఫయర్–2కు అర్హత సాధిస్తుంది. అంటే 3 నుంచి 8వ స్థానం వరకు నిలిచే ఏ జట్టయిన ఇకపై ఫైనల్కు చేరే అవకాశంఉందన్న మాట! -
విజేత ఎవరో?
కోల్కతా: ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్గా గుర్తింపు సాధించిన... దేశవాళీ వార్షిక పుట్బాల్ టోర్నీ డ్యురాండ్ కప్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నీ 134వ ఎడిషన్ ఫైనల్లో శనివారం డైమండ్ హార్బర్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)తో నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్తోనే అరంగేట్రం చేసిన డైమండ్ హార్బర్ జట్టు... తొలిసారే టైటిల్ హస్తగతం చేసుకోవాలని తహలాడుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ నార్త్ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ టైటిల్ నిలబెట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. తద్వారా 34 ఏళ్లలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలని చూస్తోంది. ఈ టోర్నీలో చివరగా 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత మరే జట్టు వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలవలేకపోయింది. నార్త్ ఈస్ట్ హెడ్ కోచ్ జాన్ పెడ్రో బెనాలీ మాట్లాడుతూ... ‘తుదిపోరులో ఫేవరెట్స్ ఉండరు. మెరుగైన ప్రదర్శన చేసిన జట్లే ఫైనల్కు చేరుతాయి. మానసికంగా పైచేయి సాధించగల జట్టే ట్రోఫీ చేజిక్కించుకుంటుంది’ అని అన్నాడు. మరోవైపు కిబు వికునా శిక్షణలో రాటుదేలిన డైమండ్ హార్బర్ జట్టు... ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం పోరులో డైమండ్ హార్బర్ జట్టు విజయం సాధిస్తే... ఓపెన్ ఎరాలో అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలవనుంది. తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్ట్ 1–0 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజాంగ్ జట్టుపై విజయం సాధించగా... రెండో సెమీస్లో డైమండ్ హార్బర్ 2–1తో ఈస్ట్ బెంగాల్పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. విజేతకు రూ. 1.21 కోట్లు డ్యురాండ్ కప్ 134వ ఎడిషన్ విజేతకు భారీ ప్రైజ్మనీ దక్కనుంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రైజ్మనీని 250 శాతం పెంచినట్లు డ్యురాండ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డీసీఓసీ) వెల్లడించింది. ఫైనల్లో నెగ్గిన జట్టుకు రూ. 1.21 కోట్లు లభిస్తుందని డీసీఓసీ శుక్రవారం పేర్కొంది. రన్నరప్ జట్టుకు రూ. 60 లక్షలు దక్కనున్నాయి. సెమీఫైనల్స్లో ఓడిన జట్లకు రూ. 25 లక్షల చొప్పున... క్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్లకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. ‘గోల్డెన్ బాల్’, ‘గోల్డెన్ బూట్’, ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లకు రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు ఒక మహింద్ర ఎక్స్యూవీ కారు లభించనుంది. -
ఇలవేనిల్కు స్వర్ణ పతకం
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో శుక్రవారం భారత్కు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తమిళనాడుకు చెందిన ఇలవేనిల్ వలారివన్ భారత్కు పసిడి పతకాన్ని... ఇలవేనిల్, మెహులీ ఘోష్, అనన్య నాయుడులతో కూడిన బృందం కాంస్య పతకాన్ని అందించింది. స్కీట్ మిక్స్డ్ విభాగంలో గనీమత్ సెఖోన్–అభయ్ సింగ్ సెఖోన్ జోడీ భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని జమ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో 26 ఏళ్ల ఇలవేనిల్ 253.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఇలవేనిల్ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. 2019 నుంచి అపూర్వీ చండేలా (భారత్; 252.9 పాయింట్లు) పేరిట ఉన్న ఆసియా రికార్డును ఇలవేనిల్ సవరించింది. భారత్కే చెందిన మెహులీ ఘోష్ 208.9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. టీమ్ విభాగంలో ఇలవేనిల్ (630.7 పాయింట్లు), మెహులీ (630.3 పాయింట్లు), అనన్య (630 పాయింట్లు) మొత్తం 1891 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. స్కీట్ మిక్స్డ్ కాంస్య పతక మ్యాచ్లో గనీమత్–అభయ్ ద్వయం 39–37తో అబ్దుల్లా అల్రషీది–అఫ్రా (కువైట్) జంటపై నెగ్గింది. మరోవైపు మహిళల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో శాంభవి, హృదయశ్రీ, ఇషాలతో కూడిన భారత జట్టు 1896.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ విభాగంలో హర్మెహర్ సింగ్–యశస్వి రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. -
ఎంపికైంది 35 ... హాజరైంది 25!.. కోచ్ ఏమన్నాడంటే..
బెంగళూరు: నేషన్స్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల ఫుట్బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ శిబిరానికి మొత్తం 35 మంది ప్లేయర్లు ఎంపిక కాగా... 16 నుంచి బెంగళూరులో శిక్షణ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం 25 మంది ప్లేయర్లు మాత్రమే శిక్షణలో పాల్గొంటున్నారు. మరో 11 మంది ఆటగాళ్లు ఇంకా శిబిరంలో చేరాల్సి ఉంది. జాతీయ శిబిరానికి ఎంపికైన ప్లేయర్లలో ఏడుగురు ఆటగాళ్లు... డ్యురాండ్ కప్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆ ఏడుగురు ఎవరంటే?ఈ ఏడుగురిని ఆ క్లబ్ ఇంకా విడుదల చేయకపోవడంతో... అనిరుధ్ థాపా, దీపక్, రాల్టె, లిస్టన్ కొలాకో, మాన్వీర్ సింగ్, సహల్ అబ్దుల్ సమద్, విశాల్ జాతీయ శిబిరంలో పాల్గొనలేకపోతున్నారు. నేషన్స్ కప్లో భాగంగా ఈ నెల 29న భారత జట్టు తజకిస్తాన్తో పోటీపడాల్సి ఉంది. అయితే నేషన్స్ కప్ ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్ల్లో భాగం కాకపోవడంతో... నిబంధనల ప్రకారం ప్లేయర్లను విడుదల చేయాల్సిన అవసరం లేదు.డ్యురాండ్ కప్లో భాగంగా ఈ నెల 17న జరిగిన క్వార్టర్ ఫైనల్లోనే మోహన్ బగాన్ పరాజయం పాలై... టోర్నీ నుంచి వైదొలిగినా ఇప్పటి వరకు ఆటగాళ్లను మాత్రం జాతీయ శిబిరానికి పంపలేదు. ఈ టోర్నీ సెమీస్లో ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టులోనూ శిబిరానికి ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లు అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ ఉండగా... వాళ్లు కూడా ఇప్పటి వరకు క్యాంప్లో అడుగు పెట్టలేదు.కోచ్ ఏమన్నాడంటే..ఈ నేపథ్యంలో కొత్త కోచ్ జమీల్ మాట్లాడుతూ... ‘ఆటగాళ్ల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిబిరం కొనసాగుతోంది. మరింత మంది ప్లేయర్లను పరీక్షిస్తాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతాం’ అని అన్నాడు.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాశిబిరంలో పాల్గొంటున్న మాన్వీర్ మాట్లాడుతూ... ‘గత ఆరేళ్లుగా జాతీయ జట్టు జెర్సీ వేసుకోవాలని ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు ఇప్పు డు అవకాశం వచి్చంది. అండర్–19 స్థాయిలో 2019లో ఏఎఫ్సీ అండర్–19 ఆసియా చాంపియన్షిప్లో పాల్గొన్నా. భారత జట్టుకు స్ట్రయికర్ స్థానంలో ఆడటం చాలా కష్టం. కోచ్ జమీల్ ఆధ్వర్యంలో గతంలో మ్యాచ్లు ఆడా. నా శక్తి సామర్థ్యాలు కోచ్కు తెలుసు. నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నాడు. -
Asia Cup: భారత జట్టు ఇదే
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్కు చెందిన 23 ఏళ్ల సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సెప్టెంబరు 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ ‘బి’లో జపాన్, థాయ్లాండ్, సింగపూర్ జట్లతో కలిసి భారత్కు చోటు లభించింది.సెప్టెంబరు 5న థాయ్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్... 6న జపాన్తో, 8న సింగపూర్తో పోటీపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, మలేసియా జట్లున్నాయి. ఆసియా కప్లో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా కప్లో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్గా, రెండుసార్లు రన్నరప్గా (1999, 2009) నిలిచింది. భారత మహిళల హాకీ జట్టు: బన్సరీ సోలంకి, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్ కీపర్లు), మనీషా చౌహాన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి థౌడమ్, నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, వైష్ణవి విఠల్ ఫాల్కే, సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్రెమ్సియామి, సునీలితా టొప్పో (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ ఖాన్, దీపిక, సంగీత కుమారి (ఫార్వర్డ్స్).ఇదీ చదవండి: రజత పతకాలు నెగ్గిన రీనా, ప్రియ సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు రజత పతకాలు లభించాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను గెల్చుకున్నారు. ప్రియ 0–4తో నదియా సొకోలవ్స్కా (ఉక్రెయిన్) చేతిలో, రీనా 2–10తో ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు.మరోవైపు 72 కేజీల విభాగంలో కాజల్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ పతకం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో కాజల్ 13–6తో జాస్మిన్ (అమెరికా)పై విజయం సాధించింది. 50 కేజీల విభాగంలో శ్రుతి... 53 కేజీల విభాగంలో సారిక కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. సెమీఫైనల్స్లో సారిక 0–10తో అనస్తాసియా పొలాస్కా (ఉక్రెయిన్) చేతిలో... శ్రుతి 0–11తో రింకా ఒగావా (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
సారా ఎరాని–వవసోరి జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
సింగిల్స్లో ఎంతటి మేటి క్రీడాకారులైనా... డబుల్స్ విభాగంలో రాణించాలంటే మాత్రం విశేష ప్రతిభ, చక్కటి సమన్వయం ఉండాలని సారా ఎరాని–ఆండ్రియా వవసోరి (ఇటలీ) నిరూపించారు. మ్యాచ్లను, టోర్నీని కొత్త ఫార్మాట్లో నిర్వహించినా... సింగిల్స్ స్టార్స్ను బరిలోకి దించినా... డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ‘మిక్స్డ్ డబుల్స్’ విభాగంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ‘సూపర్ టైబ్రేక్’లో పైచేయి సాధించిన సారా ఎరాని–వవసోరి ద్వయం ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్ను నిలబెట్టుకున్నారు. న్యూయార్క్: కొత్త ఫార్మాట్కు ఆహ్వానం పలికి... డబుల్స్ స్పెషలిస్ట్ అవకాశాలను దెబ్బ తీశారని నిర్వాహకులను విమర్శించినా... మరోవైపు తమ సహజ నైపుణ్య ప్రదర్శనతో సారా ఎరాని–ఆండ్రియా వవసోరి జోడీ అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ ఇటలీ జంట వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచింది. గురువారం ఉదయం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి 6–3, 5–7, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే)లపై గెలుపొందారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఎరాని–వవసోరి నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన ఎరాని–వవసోరిలకు 10 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ స్వియాటెక్–రూడ్లకు 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 50 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. రెండు రోజుల్లోనే ముగిసిన మిక్స్డ్ ఈవెంట్లో ఎరాని–వవసోరి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారమే జరిగిన సెమీఫైనల్స్లో ఎరాని–వవసోరి 4–2, 4–2తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా)లను ఓడించింది. మరో సెమీఫైనల్లో స్వియాటెక్–రూడ్ 3–5, 5–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)–జాక్ డ్రేపర్ (బ్రిటన్)లపై గెలిచారు. 2018, 2019లలో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ వరుసగా రెండేళ్లు ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్ నెగ్గగా... ఇప్పుడు ఎరాని–వవసోరి ఈ ఘనత సాధించారు. -
ఇకపై లింగ నిర్ధారణ తర్వాతే పోటీలకు...
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్ బాక్సింగ్ ఈవెంట్లో ఇకపై లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గతంలో పురుషుల స్థాయి హార్మోన్లతో ఉన్న మహిళా బాక్సర్లు పోటీలకు దిగినపుడు విమర్శలు వచ్చాయి. ఇకపై ఇలాంటి విమర్శలు పునరావృతం కాకూడదనే ఉద్దశంతో మహిళా ఈవెంట్లలో పోటీ పడే ప్రతి ఒక్కరికి పరీక్షలు తప్పనిసరి చేశారు. ఇందులో భాంగా వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనే బాక్సర్లకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడు బోరిస్ వాన్ డిర్ వోర్స్ వెల్లడించారు. ‘సమాఖ్య అందరిపట్ల హుందాగా వ్యవహరిస్తుంది. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది’ అని బోరిస్ అన్నారు. బాక్సింగ్ లాంటి పోరాట క్రీడలో భద్రత, పోటీతత్వం సమన్యాయంను పాటించాల్సి ఉంటుందని, మరింత జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. జీవసంబంధ లింగ సూచిక అయిన ‘వై’ క్రోమోజోమ్ జన్యువుల ఉనికిని ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇంగ్లండ్లోని లివర్పూల్లో సెపె్టంబర్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. గత జూన్లో అల్జీరియాకు చెందిన ఇమాన్ ఖెలిఫ్ను నెదర్లాండ్స్లో జరిగిన పోటీల్లో అనుమతించలేదు. నిర్ధారిత టెస్టుల తర్వాతే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. పారిస్ ఒలింపిక్స్లో ఆమెతో పాటు లిన్ యూ తింగ్ (చైనీస్ తైపీ) శారీరక సామర్థ్యంలో ఉన్న తేడాల వల్ల పెను విమర్శలకు దారితీసింది. వీరిని మహిళల ఈవెంట్లో అనుమతించడమేంటని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బాక్సింగ్ లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేసింది. -
అజేయంగా ప్రజ్ఞానంద
సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద అజేయంగా సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ తమ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో... స్యామ్ సెవియాన్ (అమెరికా)తో జరిగిన గేమ్ను ప్రపంచ చాంపియన్ గుకేశ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఇతర గేముల్లో ఫాబియానో కరువానా (అమెరికా) 46 ఎత్తుల్లో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... అరోనియన్ (అమెరికా)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 73 ఎత్తుల్లో; వెస్లీ సో (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కరువానా, అరోనియన్ రెండు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
భారత్ గురి ‘బంగారం’
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారు పతకం లభించింది. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్లతో కూడిన భారత జట్టు 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెల్చుకుంది. రుద్రాంక్ష్ 632.3 పాయింట్లు, అర్జున్ 631.6 పాయింట్లు, అంకుశ్ 628.6 పాయింట్లు స్కోరు చేశారు. అయితే వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ 207.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, అర్జున్ 185.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. సత్పయేవ్ (కజకిస్తాన్; 250.1 పాయింట్లు) స్వర్ణం... లూ డింగ్కి (చైనా; 249.8 పాయింట్లు) రజతం... హజున్ పార్క్ (కొరియా; 228.7 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగంలో భారత్కే స్వర్ణాలు దక్కాయి.వ్యక్తిగత విభాగంలో అభినవ్ షా 250.4 పాయింట్లతో పసిడి పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో అభినవ్, హిమాంశు, ప్రణవ్లతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గింది. జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో మాన్సి స్వర్ణం, యశస్వి రజతం... జూనియర్ పురుషుల స్కీట్ ఈవెంట్లో హర్మెహర్ రజతం, జ్యోతిరాదిత్య సిసోడియా కాంస్యం గెలిచారు. హర్మెహర్, జ్యోతిరాదిత్య, అతుల్లతో కూడిన బృందం టీమ్ స్కీట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా భారత్ 16 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో 31 పతకాలతో ‘టాప్’లో ఉంది. -
Asia Cup 2025: పాక్ అవుట్.. భారత జట్టు ఇదే
స్వదేశంలో ఈనెల 29 నుంచి జరిగే ఆసియాకప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్ప్రీత్ సింగ్ నాయ కత్వం వహిస్తాడు. సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.టైటిల్ పోరు బాట ఇలాచైనాతో ఈనెల 29న జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్తో భారత్ తమ టైటిల్ వేటను మొదలుపెడుతుంది. అనంతరం ఆగస్టు 31న జపాన్తో, సెప్టెంబరు 1న కజకిస్తాన్తో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు గ్రూప్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ‘సూపర్–4’ దశకు చేరుకోనున్నాయి. ‘సూపర్–4’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు 7న టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే.. భారత్లో జరిగే ఈ ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్ గ్రూప్-‘బి’లో చేరింది.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), సుమిత్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్స్). -
మరింత ప్రాక్టీస్ కోసం...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ (డీఎల్) చివరి అంచె పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే డైమండ్ లీగ్ ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్... ప్రధాన టోర్నీకి ముందు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బెల్జియంలోని బ్రస్సెల్స్లో జరుగనున్న మీట్ నుంచి తప్పుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా... ఈ నెల 28న స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ వేదికగా జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు.ఒక సీజన్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నాలుగు డైమండ్ లీగ్ అంచె పోటీలు జరగడం పరిపాటి కాగా... ఇందులో ప్రదర్శన ఆధారంగా అథ్లెట్లు ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఈ సీజన్లో నీరజ్ చోప్రా రెండు పోటీల్లోనే పాల్గొన్నా... మెరుగైన ప్రదర్శనతో ఫైనల్కు చేరాడు. ఇటీవల సిలెసియా టోర్నీ నుంచి సైతం నీరజ్ తప్పుకున్నాడు. 27 ఏళ్ల నీరజ్ చోప్రా ఈ సీజన్లో తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు. మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ అంచె పోటీల్లో నీరజ్ జావెలిన్ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం జూన్లో పారిస్ డైమండ్ లీగ్లో నీరజ్ జావెలిన్ను 88.16 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. శుక్రవారం జరగనున్న బ్రస్సెల్స్ అంచె పోటీల అనంతరం టాప్–6లో నిలిచిన త్రోయర్లు డైమండ్ లీగ్ ఫైనల్కు అర్హత సాధించనున్నారు. జూలై 5న భారత్లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తర్వాత భారత స్టార్ తిరిగి బరిలోకి దిగలేదు. బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆ టోర్నీలో నీరజ్ జావెలిన్ను 86.18 మీటర్ల దూరం విసిరి టైటిల్ గెలుచుకున్నాడు. ఓవరాల్గా ఈ సీజన్లో ఆరు పోటీల్లో పాల్గొన్న నీరజ్ అందులో నాలుగింట టైటిల్ సాధించడంతో పాటు మరో రెండు టోర్నీల్లో రెండో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ ఫైనల్ అనంతరం వచ్చే నెల 13 నుంచి 21 వరకు టోక్యో వేదికగా ప్రపంచ చాంపియన్షిప్ జరగనుండగా... అందులో నీరజ్ డిఫెండింగ్ చాంపియన్గా టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగనున్నాడు. పెరిగిన ప్రైజ్మనీ... అథ్లెటిక్స్లో డైమండ్ లీగ్కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా 14 అంచెల పోటీలు నిర్వహించిన అనంతరం అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లను ఫైనల్కు ఎంపిక చేస్తారు. ఇందులో మొత్తం 32 ఈవెంట్స్ జరుగుతాయి... వాటి విజేతలకు డైమండ్ ట్రోఫీతో పాటు... వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నేరుగా పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ లభిస్తుంది. ఈ నెల 28న జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్ జావెలిన్ త్రో పోటీల్లో విజేతగా నిలిచిన అథ్లెట్కు రూ. 26.11 లక్షల ప్రైజ్మనీ సైతం లభించనుంది. ఈ ఏడాది పురుషుల 100 మీటర్ల పరుగు, 1500 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, పోల్వాల్ట్... మహిళల 100 మీటర్ల పరుగు, 100 మీటర్ల హర్డిల్స్, 3000 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్ల విజేతలకు మెరుగైన ప్రైజ్మనీ లభించనుంది. ఈ విభాగాల్లో విజేతగా నిలిచిన వారికి రూ. 43.52 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 17.40 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 8.70 లక్షలు దక్కనున్నాయి. -
ఆనంద్ X కాస్పరోవ్ , గుకేశ్ X కార్ల్సన్
న్యూఢిల్లీ: ఇద్దరు చదరంగ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్లో అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరగనున్న క్లచ్ చెస్ ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో ఈ దిగ్గజాలు ఎత్తులు పైఎత్తులు వేయనున్నారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య కూడా గేమ్లు జరగనున్నాయి.ప్రపంచ చదరంగంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు సాధించిన ఆనంద్, కాస్పరోవ్ మధ్య ఇప్పటి వరకు 82 గేమ్లు జరిగాయి. చివరిసారిగా 2021లో క్రొయేషియా ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు తలపడగా... భారత గ్రాండ్మాస్టర్ విజయం సాధించాడు. ‘ఇద్దరు ప్రపంచ మాజీ చాంపియన్లు గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్... క్లచ్ చెస్ (లెజెండ్స్) ఎగ్జిబిషన్ మ్యాచ్లో తలపడనున్నారు. అక్టోబర్ 7 నుంచి 11 మధ్య ఈ టోర్నీ జరగనుంది. తరానికి ఒక్కసారి జరిగే మ్యాచ్ ఇది’ అని సెయింట్ లూయిస్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ టోర్నీ ప్రైజ్మనీ రూ. 1 కోటీ 25 లక్షలు కాగా... ఇద్దరు దిగ్గజాల మధ్య 12 గేమ్లు నిర్వహించనున్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఇక ఇదే వేదికపై అక్టోబర్ 27 నుంచి 29 వరకు ప్రస్తుత అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్, రెండో ర్యాంకర్ నకముర, మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా, ప్రపంచ స్టార్ గుకేశ్ తదితరులు పాల్గొననున్నారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన వారికి భారీ ప్రైజ్మనీ దక్కనుంది. ‘ఈ టోర్నీ ప్రైజ్మనీ రూ. 3 కోట్ల 58 లక్షలు. దీంతో పాటు ప్లేయర్లకు ప్రతిరోజు బోనస్, విజేతకు జాక్పాట్ వంటి ఎన్నో ఇతర ప్రయోజనాలు ఉంటాయి’ అని నిర్వాహకులు తెలిపారు. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 18 గేమ్లు జరుగుతాయి. -
అనంత్ అదరహో...
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. బుధవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ అనంత్ జీత్ సింగ్ నరూకా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్కు చెందిన అనంత్కు ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో ఇదే తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం కావడం విశేషం. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 27 ఏళ్ల అనంత్ 60 పాయింట్లకుగాను 57 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించాడు. ఆసియా క్రీడల చాంపియన్ మన్సూర్ అల్ రషీది (కువైట్) 56 పాయింట్లు సాధించి రజత పతకం నెగ్గాడు. 43 పాయింట్లతో అల్ ఇషాక్ అలీ అహ్మద్ (ఖతర్) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 46 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో అనంత్ 119 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందాడు.క్వాలిఫయింగ్లో టాప్–6లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్లు లభిస్తాయి. 2023 ఆసియా చాంపియన్షిప్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచిన అనంత్ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల స్కీట్ టీమ్ విభాగంలో భారత బృందానికి కాంస్య పతకం లభించింది. మహేశ్వరి చౌహాన్ (113 పాయింట్లు), గనీమత్ సెఖోన్ (109 పాయింట్లు), రైజా ధిల్లాన్ (107 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు 329 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో మహేశ్వరి చౌహాన్ 35 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. సురుచి–సౌరభ్ జోడీకి కాంస్యం ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సౌరభ్ చౌధరీ జోడీ భారత్కు కాంస్య పతకం అందించింది. కాంస్య పతక మ్యాచ్లో సురుచి–సౌరభ్ 17–9 పాయింట్లతో లియు హెంగ్ యు–సెయి సియాంగ్ చెన్ (చైనీస్ తైపీ)లపై విజయం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వన్షిక చౌధరీ–జొనాథన్ గావిన్ ఆంటోనీ ద్వయం భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది. ఫైనల్లో వన్షిక–జొనాథన్ 16–14తో కిమ్ యెజిన్–కిమ్ డూయోన్ (దక్షిణ కొరియా)లపై గెలుపొందింది. సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో కలిపి ప్రస్తుత చాంపియన్షిప్లో భారత్ ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
తపస్య ‘పసిడి పట్టు’
సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో తపస్య (57 కేజీలు) భారత్కు మొదటి బంగారు పతకాన్ని అందించింది. బుధవారం జరిగిన ఫైనల్లో తపస్య 5–2 పాయింట్ల తేడాతో ఫెలిసిటాస్ దొమయెవా (నార్వే)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో తపస్య 4–3తో సొవాకా ఉచిద (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–0తో రొమైసా (ఫ్రాన్స్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో డొల్జాన్ (రష్యా)పై గెలుపొందింది. భారత్కే చెందిన సృష్టి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 68 కేజీల ఫైనల్లో సృష్టి 0–7తో రే హోషినో (జపాన్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్కే చెందిన రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) కూడా స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. వీరిద్దరూ తమ కేటగిరీల్లో ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సెమీఫైనల్స్లో రీనా 11–1తో అలెగ్జాండ్రా వాయిసులెసు్క(రొమేనియా)పై, ప్రియ 10–0తో ఎవెలిన్ ఉజెల్జి (సెర్బియా)పై విజయం సాధించారు. అంతకుముందు రీనా క్వార్టర్ ఫైనల్లో 8–2తో జెర్డా టెరెక్ (హంగేరి)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–6తో ఖాలియున్ బ్యామ్బసురెన్ (మంగోలియా)పై... ప్రియ క్వార్టర్ ఫైనల్లో 4–0తో డయానా టిటోవా (రష్యా)పై, తొలి రౌండ్లో 10–0తో వెరోనికా నికోస్ (హంగేరి)పై గెలుపొందారు. నేడు జరిగే ఫైనల్స్లో నదియా సొకోలోవ్స్కా (ఉక్రెయిన్)తో ప్రియ; ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా)తో రీనా తలపడతారు. -
స్టార్ జోడీలు తొలి రౌండ్లోనే అవుట్
న్యూయార్క్: సింగిల్స్లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్డ్ డబుల్స్ ఆడించాలని యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్ కాలేదు. స్టార్ ఆటగాళ్లతో నిర్వహించిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. సెర్బియా దిగ్గజం, ప్రపంచ ఏడో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్... ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మిక్స్డ్ డబుల్స్లో తమ తొలి మ్యాచ్లలోనే పరాజయం పాందగా... ప్రపంచ ఆరో ర్యాంకర్ బెన్ షెల్టన్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. జొకోవిచ్–డానిలోవిచ్ (సెర్బియా) జంట 2–4, 3–5తో మెద్వెదెవ్–మిరా ఆండ్రీవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. అల్కరాజ్ (స్పెయిన్)–ఎమ్మా రాడుకాను (బ్రిటన్) జంట 2–4, 2–4తో జెస్సికా పెగూలా (అమెరికా)–జేక్ డ్రేపర్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. జ్వెరెవ్–బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) ద్వయం 0–4, 3–5తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో పెగూలా–డ్రేపర్ ద్వయం 4–1, 4–1తో మెద్వెదెవ్–ఆండ్రీవా జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో కొలిన్స్–హారిసన్ జోడీ 4–1, 5–4 (7/2)తో టేలర్ టౌన్సెండ్–బెన్ షెల్టన్ (అమెరికా) ద్వయంపై నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. -
స్వియాటెక్ సాధించె... విజేతగా అల్కరాజ్.. యూఎస్కు పయనం
సిన్సినాటి (ఒహాయో): ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో పోలాండ్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో తన లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీలో ఆడిన స్వియాటెక్ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో మాత్రం స్వియాటెక్ చాంపియన్గా అవతరించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ 7–5, 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది.1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ తుదిపోరులో స్వియాటెక్ తొమ్మిది ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 24వ సింగిల్స్ టైటిల్కాగా... ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ టైటిల్ తర్వాత రెండోది.విజేతగా నిలిచిన స్వియాటెక్కు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ పావోలినికి 3,91,600 డాలర్ల (రూ. 3 కోట్ల 40 లక్షలు ) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.విజేత అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్ ఏటీపీ–1000 టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 5–0తో గెలిచాడు. తొలి సెట్లో 0–5తో వెనుకబడిన దశలో అనారోగ్యం కారణంగా సినెర్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు.ఇక టైటిల్ నెగ్గిన అల్కరాజ్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 78 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సినెర్కు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 20 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా ఈ ఏడాది అల్కరాజ్కిది ఆరో టైటిల్కాగా, కెరీర్లో 22వది కావడం విశేషం.ఒకే విమానంలో..ఇదిలా ఉంటే.. సిన్సినాటి ఓపెనర్ టైటిల్స్ గెలిచిన తర్వాత స్వియాటెక్, అల్కరాజ్ కలిసి ఒకే విమానంలో న్యూయార్క్కు బయలుదేరారు. యూఎస్ ఓపెన్లో విజేతలుగా నిలవడమే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టారు. వీరిద్దరు ఒకే విమానంలో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Iga Swiatek and Carlos Alcaraz sharing a plane to New York. 🗽Cincinnati champions ready for the US Open.Love this. ❤pic.twitter.com/nLD6KMnHJd— The Tennis Letter (@TheTennisLetter) August 19, 2025 -
మను గురికి రెండు కాంస్యాలు
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో మంగళవారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత స్టార్ మనూ భాకర్ వ్యక్తిగత విభాగంతోపాటు టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను 219.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మనూ భాకర్, సురుచి సింగ్, పలక్లతో కూడిన భారత జట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మను 583 పాయింట్లు, సురుచి 574 పాయింట్లు, పలక్ 573 పాయింట్లు సాధిచారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో రష్మిక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. ఫైనల్లో రషి్మక 241.9 పాయింట్లు స్కోరు చేసింది. రషి్మక, వన్షిక, మోహిని సింగ్లతో కూడిన భారత జట్టు 1720 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
గుకేశ్కు ప్రజ్ఞానంద షాక్
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ సంచలన ఫలితంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో భారత్కే చెందిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ను ఓడించాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ లైవ్ రేటింగ్స్లో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో మొదలైన ఈ గేమ్లో ప్రజ్ఞానంద ఎత్తులకు సమాధానం ఇచ్చేందుకు గుకేశ్ తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. ఒకదశలో సమయాభావంవల్ల గుకేశ్ దీటైన ఎత్తులు వేయలేకపోయాడు. చివరకు 36 ఎత్తులు ముగిశాక గుకేశ్ ఓటమిని అంగీకరించాడు. 10 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. మరోవైపు లెవోన్ అరోనియన్ (అమెరికా) 41 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందగా... సో వెస్లీ (అమెరికా)–సామ్ సెవియాన్ (అమెరికా) మధ్య గేమ్ 56 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 58 ఎత్తుల్లో... ఫాబియానో కరువానా (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
సెమీస్లో సారా ఎరాని–వావసోరి జోడీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో మంగళవారం మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ జోడీ సారా ఎరాని–ఆండ్రియా వావసోరి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ముందుగా తొలి రౌండ్లో ఎరాని–వావసోరి ద్వయం 4–2, 4–2తో రెండో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ వెంటనే జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎరాని–వావసోరి జోడీ 4–1, 5–4 (7/5)తో ముకోవా (చెక్ రిపబ్లిక్)–రుబ్లెవ్ (రష్యా) జంటను ఓడించి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను 4–1తో నెగ్గిన ఇటలీ జోడీ రెండో సెట్ను టైబ్రేక్లో దక్కించుకుంది. రెండో సెట్లో స్కోరు 4–4తో సమం కావడంతో టైబ్రేక్ను నిర్వహించారు. టైబ్రేక్లో ముందుగా ఏడు పాయింట్లు గెలిచిన ఎరాని–వావసోరి జంట విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్–రూడ్ జంట 4–1, 4–2తో కేటీ మెక్నాలీ (అమెరికా) –ముసెట్టి (ఇటలీ) జోడీపై గెలిచింది. అంతకుముందు తొలి రౌండ్లో స్వియాటెక్–రూడ్ 4–1, 4–2తోనే మాడిసన్ కీస్–ఫ్రాన్సిస్కో టియాఫో (అమెరికా)లపై... కేటీ మెక్లానీ–ముసెట్టి 5–3, 4–2తో ఒసాకా (జపాన్)–Vమోన్ఫిల్స్ (ఫ్రాన్స్) లపై గెలిచారు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ముకోవా–రుబ్లెవ్ 4–2, 5–4 (7/4)తో వీనస్ విలియమ్స్–రీలీ ఒపెల్కా (అమెరికా)లపై నెగ్గారు. -
జాతీయ క్రీడా పాలన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశ క్రీడా పరిపాలన వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు... క్రీడా రంగానికి మరింత చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జాతీయ క్రీడా పాలన చట్టం–2025’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో బిల్లు చట్టంగా మారిందని... ఇది దేశ క్రీడారంగంలో విప్లవాత్మక సంస్కరణ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ‘ఆగస్టు 18న జాతీయ క్రీడా పాలన చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం లభించింది’ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత నెల 23న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా... ఈ నెల 11న ఆమోదం పొందింది. ఈ నెల 12న రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లుకు కొన్ని సవరణల అనంతరం ఉభయసభలు ఆమోదించాయి. దీంతో ప్రభుత్వ నిధులపై ఆధారపడే క్రీడా సంస్థలు మాత్రమే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రానున్నాయి. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్టీఐ పరిధిలోకి రాదు. -
రూ. 7 కోట్లు పెరిగిన ప్రైజ్మనీ.. ‘సోలో’ స్టార్స్ జోడీగా.. వాళ్లకు అన్యాయం?
న్యూయార్క్: టెన్నిస్లో ‘సోలో’ స్టార్స్ కాస్త ఇకపై ‘మిక్స్డ్’ చాంపియన్స్ కాబోతున్నారు. సింగిల్స్ టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డే పురుషుల, మహిళల సింగిల్స్ సీడెడ్లు ఇకపై జోడీగా స్ట్రాంగ్... డబుల్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్కు ‘సై’ అంటున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ ఆర్గనైజర్లు గ్రాండ్స్లామ్లో సరికొత్త శోభను తీసుకొస్తున్నారు.‘మిక్స్డ్ డబుల్స్’కు సింగిల్స్ స్టార్లతో మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 24న యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మొదలుకానుండగా... మిక్స్డ్ డబుల్స్ పోటీలు మాత్రం మంగళవారం ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల్లోనే మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ను నిర్వాహకులు ముగించనున్నారు.ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ప్రపంచ సింగిల్స్ స్టార్లంతా ఇప్పుడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కోసం కూడా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు జోడీలను ఎంపిక చేశారు. అల్కరాజ్, సినెర్, స్వియాటెక్, మాడిసన్ కీస్లు ‘మిక్స్డ్ డబుల్స్’ దశను మార్చే ఆట ఆడతారా లేదో కొన్ని రోజుల్లోనే తేలనుంది. ‘మిలియన్’ మార్పు గతేడాది యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ను సారా ఎరాని–వావసొరి (ఇటలీ) జోడీ గెలుచుకుంది. వీరిద్దరు ట్రోఫీతో పాటు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 75 లక్షలు)ను పంచుకున్నారు. కానీ ఇప్పుడు మిక్స్డ్ ప్రైజ్మనీ ఏకంగా 10 లక్షల డాలర్లకు (రూ. 8 కోట్ల 73 లక్షలు) చేరింది. ఐదు రెట్లకు పెరిగిన మొత్తం సింగిల్స్ స్టార్లకు వరమైతే... స్పెషలిస్టు డబుల్స్ ప్లేయర్లకు గుండెకోతను మిగిల్చనుంది.ఒక్క ప్రైజ్మనే కాదు... ఆట కూడా మారింది. 6 గేమ్ల స్థానంలో 4 గేమ్లతో ఆడిస్తారు. అంటే 6–0, 6–1 స్కోర్లు కాస్తా 4–0, 4–1గా ఉంటాయి. 32 జోడీలకు బదులుగా 16 జోడీలనే బరిలో దించుతారు. అంటే ప్రిక్వార్టర్స్ నుంచే మిక్స్డ్ పోరు మొదలవుతుంది. ఒక్క మ్యాచ్ గెలవగానే ఆ జోడీ క్వార్టర్స్ చేరుతుంది. మ్యాచ్లు కూడా ప్రధాన వేదికల్లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. జోడీ కట్టించారిలా... స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ సరికొత్త సమరాన్ని ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో కలిసి ప్రారంభిస్తాడు. ఇటలీ సంచలనం యానిక్ సినెర్ (ఇటలీ)... కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జోడీ కట్టాడు. షెడ్యూల్ ప్రకారం ఎమ్మా నవారో (అమెరికా)తో సినెర్ ఆడాల్సి ఉండగా... ఆమె తప్పుకోవడంతో చెక్ స్టార్ను జతచేశారు.సెర్బియా దిగ్గజం జొకోవిచ్ తన దేశానికే చెందిన డానిలోవిక్తో మిక్స్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే), మాడీసన్ కీస్–టియాఫె (అమెరికా), నయోమి ఒసాకా (జపాన్)–మోన్ఫిల్స్ (ఫ్రాన్స్), జ్వెరెవ్ (జర్మనీ)–బెన్చిచ్ (స్విట్జర్లాండ్), రుబ్లెవ్ (రష్యా)– కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్), రీలి ఒపెల్కా–వీనస్ విలియమ్స్ (అమెరికా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)– రిబాకినా (కజకిస్తాన్) తదితర హేమాహేమీ జోడీలు ఈసారి కొత్తగా మిక్స్డ్ డబుల్స్ బరిలో ఉన్నారు.మరి మా సంగతేం కాను? పాత ఒక రోత... కొత్త ఒక వింత.. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో కొత్త మిక్సింగ్పై అసలు సిసలైన డబుల్స్ ఆటగాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటీపీ, డబ్ల్యూటీఏలతో పాటు వందకు పైగా టోర్నీలు జరుగుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్ మాత్రం కేవలం నాలుగే నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో నిర్వహిస్తారు. ఇందులోనే పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ ఆడే ప్లేయర్లు అదనంగా మిక్స్డ్ జోడీ కడతారు.సాధారణంగా గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రైజ్మనీ కూడా ఎక్కువ. తొలిరౌండ్లో ఓడినా పెద్ద మొత్తంలోనే వస్తాయి. అలాంటి సువర్ణావకాశాన్ని ఇప్పుడు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు సరికొత్త మిక్స్తో మార్చేయడంతో స్పెషలిస్టు డబుల్స్ ఆటగాళ్ల ఆదాయానికి గండికొట్టారు. మిగతా మూడు గ్రాండ్స్లామ్ల నిర్వాహకులు సైతం ఇదే ధోరణిని అవలంభిస్తే డబుల్స్ ప్లేయర్లకు కోలుకోలేని దెబ్బ పడుతుంది. గత యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విజేతగా నిలిచిన ఇటలీ జంట సారా ఎరాని–వావసొరి నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. -
డోపింగ్లో దొరికిన ట్రిపుల్ జంపర్ షీనా
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పతకాలెన్నో సాధించిన ట్రిపుల్ జంపర్ షీనా వార్కే డోపింగ్లో దొరికిపోయింది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. కేరళకు చెందిన 32 ఏళ్ల షీనా ఈ ఏడాది ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడల్లోనూ రజత పతకంతో మెరిసింది. ఫెడరేషన్ కప్లో కాంస్యం గెలుచుకుంది. ఆసియా ఇండోర్ చాంపియన్షిప్ (2018)లో రజతం గెలిచింది. రెండేళ్ల క్రితం హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కూడా ఆమె పోటీపడింది. డోపింగ్లో పట్టుబడిన షీనాను సస్పెండ్ చేస్తున్నట్లు ‘నాడా’ వర్గాలు తెలిపాయి. అయితే ఆమె తీసుకున్న ఉత్ప్రేరకాలెంటో నాడా బహిర్గతపరచలేదు. డోపింగ్ పాజిటివ్ ఫలితాల రేటింగ్లో భారత్ 3.8 శాతంతో చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాల కంటే ముందువరుసలో నిలవడం భారత క్రీడల ప్రతిష్టను మసకబారుస్తోంది. ఒక్క అథ్లెటిక్స్లోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) జరిపిన పరీక్షల్లో 1223 పాజిటివ్ కేసులుంటే ఇందులో 61 మంది భారత అథ్లెట్లు ఉండటం క్రీడావర్గాలను కలవరపెడుతోంది. -
Europe Smash 2025: మనికపై శ్రీజ పైచేయి
మాల్మో (స్వీడన్): యూరోప్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత నంబర్వన్ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీజ 5–11, 11–9, 15–13, 10–12, 11–8తో భారత్కే చెందిన ప్రపంచ 52వ ర్యాంకర్ మనిక బత్రాపై విజయం సాధించింది. 44 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు కీలకదశలో పాయింట్లు నెగ్గిన శ్రీజను విజయం వరించింది. శ్రీజ మొత్తం 52 పాయింట్లు సాధించగా... అందులో తన సర్విస్లో 27 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్లో 25 పాయింట్లు సంపాదించింది. మనిక బత్రా మొత్తం 53 పాయింట్లు గెలవగా... అందులో తన సర్విస్లో 28, ప్రత్యర్థి సర్విస్లో 25 పాయింట్లు సాధించింది. భారత్కే చెందిన ప్రపంచ 77వ ర్యాంకర్ యశస్విని తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యశస్విని 6–11, 2–11, 1–11తో ఐదో ర్యాంకర్ వాంగ్ యిది (చైనా) చేతిలో ఓడిపోయింది. మానవ్ సంచలనం ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ 43వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో మానవ్ 12–10, 11–5, 5–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ హిరోటో షినోజుకా (జపాన్)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. -
ఛెత్రికి తలుపులు తెరిచే వున్నాయి
బెంగళూరు: భారత స్టార్ ఫుట్బాలర్, మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రికి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని కొత్త కోచ్ ఖాలీద్ జమీల్ అన్నారు. సెంట్రల్ ఏషియా ఫుట్బాల్ కాన్ఫడరేషన్ (సీఏఎఫ్ఏ) నేషన్స్ కప్ కేవలం సన్నాహక టోర్నీ మాత్రమే అని, దీని కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్లో ఛెత్రి పేరు లేనంత మాత్రాన అతని ఆటకు తెరపడినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లలో జరిగే నేషన్స్ కప్ కోసం 35 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించారు. అయితే ఇందులో స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి పేరు లేకపోవడంతో మీడియాలో వస్తున్న ఊహాగానాలకు హెడ్ కోచ్ ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్లకు ఛెత్రి సహా ఇతర కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్లో భారత్ ఇంటాబయటా సింగపూర్తో రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. 9న సింగపూర్లో, 14న సొంతగడ్డపై ఈ మ్యాచ్లు జరుగుతాయి. ‘భారత ఫుట్బాల్లో సునీల్ ఒక దిగ్గజం. మన సాకర్కు అతనో రోల్ మోడల్. అంతేకాదు... నా ఫేవరెట్ ఆటగాడు కూడా! అతడితో తలపడిన (క్లబ్, లీగ్) సందర్భాలెన్నో ఉన్నాయి’ అని జమీల్ తెలిపినట్లు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటనను విడుదల చేసింది. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు ఉమ్మడిగా నిర్వహించబోయే నేషన్స్ కప్లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. ఈ నెల 29న తొలి మ్యాచ్లో తజికిస్తాన్తో భారత్ పోటీపడుతుంది. సెప్టెంబర్1న ఇరాన్, 4న అఫ్గానిస్తాన్తో ఆడుతుంది. మూడో స్థానం సహా ఫైనల్ పోటీలు 8న తాష్కెంట్లో జరుగుతాయి. ఈ టోర్నీ కోసం శనివారమే ప్రాబబుల్స్కు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 22 మంది ఆటగాళ్లు శిబిరంలో ఉండగా... మిగతా 13 మంది డ్యురాండ్ కప్ ముగిసిన వెంటనే క్యాంప్లో పాల్గొంటారు. -
గుకేశ్పైనే దృష్టి
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తిరిగి క్లాసికల్ చెస్ పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా ఐదో టోర్నీ అయిన సింక్ఫీల్డ్ కప్లో భారత్ తరఫున గుకేశ్తోపాటు ప్రజ్ఞానంద విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పదిమంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతుంది. సోమవారం నుంచి ఇక్కడ జరిగే ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్మాస్టర్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో, లెవోన్ అరోనియన్, స్యామ్ సేవియన్లతో పాటు ఫ్రాన్స్కు చెందిన మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్, అలీరెజా ఫిరూజా... పోలాండ్ స్టార్ జాన్ క్రిస్టోఫ్ డూడా... ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ కూడా పాల్గొంటున్నారు. అయితే ప్రపంచ నంబర్వన్, మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ఆడకపోవడమే టోర్నీకి ప్రధాన లోటు అని చెప్పొచ్చు. ఈ నార్వే గ్రాండ్మాస్టర్ క్లాసికల్ చెస్ను ఆస్వాదించలేకపోతున్నానని ఇదివరకే ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అందువల్లే ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అయితే చెస్ దిగ్గజం కార్ల్సన్ లేకపోయినప్పటికీ భారత ఆటగాళ్లకు ప్రధానంగా అమెరికా ఆటగాళ్లు ఆరోనియన్, కరువానా, అలీరెజా నుంచి గట్టిపోటీ తప్పదు. సెయింట్ లూయిస్లోనే జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గుకేశ్ ఆశించినంతగా రాణించలేకపోయాడు. అయితే తనకు పట్టున్న క్లాసికల్ ఫార్మాట్లో సత్తా చాటుకోవడానికి గుకేశ్ రెడీగా ఉన్నాడు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 3,50,000 డాలర్లు (రూ. 3 కోట్ల 6 లక్షలు). విజేతకు 1,00,000 డాలర్లు (రూ.87 లక్షల 51 వేలు) అందజేస్తారు. రన్నరప్గా నిలిచిన ప్లేయర్కు 65 వేల డాలర్లు (రూ. 56 లక్షల 88 వేలు), మూడో స్థానం పొందిన ప్లేయర్కు 48 వేల డాలర్లు (రూ. 42 లక్షలు) లభిస్తాయి. -
‘మళ్లీ సత్తా చాటుతాం’
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో సంచలన జోడీగా ఘన విజయాలు అందుకున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి గత కొంత కాలంగా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్నారు. వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం, థామస్ కప్లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకొని రెండేళ్ల క్రితమే వరల్డ్ నంబర్వన్ జంటగా నిలిచారు. అయితే గాయాలు తదితర కారణాలతో వెనుకబడిన వీరికి 2025లో కూడా కలిసి రాలేదు. ఏడాది కాలంగా సాత్విక్–చిరాగ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అయితే ప్రదర్శన మరీ పేలవంగా ఏమీ లేదు కానీ ట్రోఫీలు మాత్రం సాధించలేకపోతున్నారు. పారిస్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన తర్వాత వరుసగా మూడు టోర్నీల్లో వారు సెమీఫైనల్ చేరారు. ఇటీవల కూడా సింగపూర్, చైనా ఓపెన్ టోర్నీల్లో కూడా సెమీఫైనల్ వరకు రాగలిగారు. తాము విఫలమవుతున్న విషయాన్ని వీరు కూడా అంగీకరించారు. ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. నేను గాయపడ్డాను. ట్రైనర్ను మార్చాల్సి వచ్చింది. అంత మళ్లీ కొత్తగా మొదలు పెట్టినట్లు అనిపించింది. గాయాలు, వ్యక్తిగత సమస్యలతో లయ కోల్పోయాం. మొత్తంగా చూస్తే మెరుగ్గానే ఆడినా ఇంకా ఫలితాలు రావాల్సింది. అయితే త్వరలోనే అది జరుగుతుందని నమ్ముతున్నాం. వరుసగా టోర్నీలు ఆడితే అది సాధ్యమవుతుంది’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ తర్వాత చిరాగ్కు గాయం కావడంతో రెండు నెలలు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సింగపూర్ టోర్నీలో ఊహించిదానికంటే మెరుగైన ప్రదర్శనే చేసారు. ‘సింగపూర్ టోర్నీలో మేం ఒక గేమ్ గెలవడం కూడా గగనంగా అనిపించింది. తొలి రౌండ్ దాటలేం అనుకున్న స్థితిలో కూడా సెమీస్ చేరగలిగాం’ అని చిరాగ్ గుర్తు చేశాడు. అయితే తాము పూర్తి స్థాయిలో ఫిట్గా లేమని మాత్రం సాత్విక్– చిరాగ్ వెల్లడించారు. ‘గత ఏడాది కాలంలో మేం పూర్తి ఫిట్గా ఉండి ఆడిన మ్యాచ్లు లేవు. ఏదో చిన్న చిన్న సమస్యలతోనే ఆడుతూ పోయాం. గాయాలు మా ఆటలో జోరును నిలువరిస్తున్నాయి. మేం 100 శాతం ఫిట్గా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే వరుస విజయాలు దక్కుతాయి’ అని ఈ భారత ద్వయం పేర్కొంది. ఈ నెల 25 నుంచి పారిస్లో వరల్డ్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో వీరిపై గెలుపు అంచనాలు ఉన్నాయి. తమ ఫిట్నెస్ మెరుగవుతోందని, పూర్తి స్థాయిలో కోలుకొని మళ్లీ సత్తా చాటుతామన్న డబుల్స్ జంట వరల్డ్ చాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. -
డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తి
కోల్కతా: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడా వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డ 80 ఏళ్ల వేస్ గురువారం కన్నుమూయగా... ఆదివారం కోల్కతాలోని సెయింట్ థామస్ చర్చ్లో జరిగిన ఆయన అంత్యక్రియల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సహా పలు క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. భారత హాకీకి ఆయన చేసిన సేవలకు గుర్తుగా... వేస్ పార్థీవ దేహానికి యువ ఆటగాళ్లు హాకీ స్టిక్లతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వేస్ కుమారుడు లియాండర్ పేస్ను గంగూలీ ఓదార్చాడు. మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రియన్తో పాటు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, హాకీ బెంగాల్, కోల్కతా క్రికెట్ క్లబ్, ఫుట్బాల్ క్లబ్ల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టులో వేస్ సభ్యుడు కాగా... ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వైద్యుడిగా భారత క్రీడారంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్, అఖిల భారత ఫుట్బాల్ సంఘం, భారత ఒలింపిక్ సంఘం, భారత డేవిస్ కప్కు వేస్ వైద్య కన్సల్టెంట్గా పనిచేశారు. వేస్ సేవలు వెలకట్టలేనివి: టిర్కీ హాకీ, రగ్బీ, ఫుట్బాల్, టెన్నిస్ ఇలా అనేక క్రీడల్లో ప్రవేశం ఉన్న వేస్... ఆ తర్వాతి కాలంలో భారతీయ క్రీడా వైద్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ‘వేస్ పేస్ లోటు పూడ్చలేనిది. ఆటతో సంబంధం లేకుండా భారతీయ క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ప్లేయర్గా, డాక్టర్గా, మెంటార్గా, కన్సల్టెంట్గా, క్రీడా పరిపాలకుడిగా ఆయన జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. జాతీయ శిబిరాల సమయంలో ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ప్లేయర్లతో పాటే ఉండి వారి బాగోగులు చూసుకునేవారు. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ సమయంలో ఆయన సేవలను దగ్గర నుంచి చూశా. ప్రస్తుతం క్రీడా రంగంలో వైద్యుల ప్రాధన్యత పెరిగింది. అవేవీ లేని సమయంలో ఆయనే అన్నీ అయి నడిపించారు’ అని టిర్కీ గుర్తుచేసుకున్నాడు. వేస్ది పూర్తి స్పోర్ట్స్ ఫ్యామిలీ అని... ఒకే కుటుంబం నుంచి వీస్ హాకీలో ఒలింపిక్స్ పతకం నెగ్గితే ఆయన కుమారుడు లియాండర్ పేస్ టెన్నిస్లో ఆ కల తీర్చుకున్నాడని.. వేస్ భార్య జెన్నిఫర్ భారత బాస్కెట్బాల్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించారని టిర్కీ గుర్తు చేశాడు. -
ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్ ‘చాంద్’ ఆవిష్కరణ
రాజ్గిర్ (బిహార్): ఈ నెలాఖరులో భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీకి సంబంధించి కనువిందు చేసే ‘మస్కట్’ను ఆదివారం ఆవిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక మస్కట్గా ‘చాంద్’ (చందమామ)ను ఆవిష్కరించారు. భారత దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ ప్రాక్టీస్ స్ఫూర్తితో పాటు బిహార్లోని ప్రఖ్యాత వాల్మీకి టైగర్ రిజర్వ్లోని పులుల శౌర్యానికి ప్రతీకగా ‘చాంద్’ను ఆవిష్కరించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. ఫ్లడ్లైట్లు కాదు కదా... కనీసం పూర్తిస్థాయి వీధి దీపాలు లేని ఆ రోజుల్లో చందమామ పంచిన వెన్నెల వెలుగుల్లోనే ధ్యాన్చంద్ తన ప్రాక్టీస్ను పూర్తి చేసేవారు. ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆయన పుట్టిన రోజున (ఆగస్టు 29) మొదలయ్యే ఆసియా కప్ టోర్నీకి ‘చాంద్’ మస్కట్ను ఖరారు చేశారు. సెపె్టంబర్ 7 వరకు రాజ్గిర్లోని స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదట్లో ఆసక్తి కనబరిచిన దాయాది పాకిస్తాన్ జట్టు చివరకు వైదొలగింది. పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ విజేత వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. 16 జట్లు పోటీపడే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. -
టాప్ షూటర్లంతా బరిలోకి...
న్యూఢిల్లీ: కజకిస్తాన్లో జరిగే ఆసియా చాంపియన్షిప్లో భారత టాప్ షూటర్లంతా పతకాలపై గురిపెట్టేందుకు సిద్ధమయ్యారు. డబుల్ ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్, సిఫ్త్ కౌర్, అర్జున్ బబుతా, సౌరభ్ చౌదరి తదితర మేటి షూటర్లు సహా 182 మందితో కూడిన భారత బృందం ఆసియా చాంపియన్షిప్లో పాల్గొంటోంది. ఈ టోర్నీ బరిలోకి దిగుతున్న భారీ సేన మన జట్టే కావడం విశేషం. సోమవారం నుంచి కజకిస్తాన్లోని షింకెంట్ నగరంలో ఈ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్గన్ విభాగాల్లో 58 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో 46 వ్యక్తిగత ఈవెంట్లు కాగా, 12 మిక్స్డ్ టీమ్ ఈవెంట్ పోటీలు నిర్వహిస్తారు. భారత్ సీనియర్ విభాగంలోనే ఒక్కో ఈవెంట్లో ఐదుగురు చొప్పున షూటర్లను బరిలోకి దింపుతోంది. వీటిలో మూడు పతకాలకు ఆస్కారం ఉండగా, మరో ఇద్దరు ర్యాంకింగ్ పాయింట్స్ కోసం ఆడతారు. ఇప్పటివరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లలో భారత్ 59 పతకాలు గెలుపొందింది. ఇందులో 21 స్వర్ణాలు, 22 రజతాలు, 16 కాంస్యాలున్నాయి. చివరిసారిగా చాంగ్వాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఈవెంట్లో భారత జట్టు ఆరు బంగారు పతకాలు, 8 రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 19 పతకాలతో టాప్–3లో నిలిచింది. గత టోర్నీలో సత్తా చాటిన మను భాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ విజయోత్సాహంతో ఉంది. ఆమె 10 మీ., 25 మీ పిస్టల్ ఈవెంట్లతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ పోటీపడనుంది. ఆమెతో పాటు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా, సౌరభ్, అనిశ్ భన్వాలాలపై భారత్ పతకాల ఆశలు పెట్టుకుంది. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఒలింపిక్ ఈవెంట్స్తో పాటు ఒలింపిక్స్లో లేని సెంటర్ ఫైర్, స్టాండర్డ్, ఫ్రీ పిస్టల్, రైఫిల్ ప్రోన్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో కూడా పోటీలు నిర్వహిస్తారు. -
ఆంధ్రప్రదేశ్ ఓటమి
జలంధర్: హాకీ ఇండియా (హెచ్ఐ) జూనియర్ పురుషుల జాతీయ చాంపియన్షిప్లో ఆంధ్ర ప్రదేశ్కు ఘోర పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో కర్ణాటక 10–1 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటక తరఫున హర్పాల్ (12వ, 35వ నిమిషాల్లో), తనీశ్ రమేశ్ (17వ, 56వ ని.) చెరో రెండు గోల్స్ సాధించారు. మిగతా వారిలో రాజు మనోజ్ గైక్వాడ్ (5వ ని.) నితీశ్ శర్మ (10వ ని.) కెపె్టన్ ధ్రువ (25వ ని.), అచ్చయ్య (24వ ని.), కుశాల్ బోపయ్య (51వ ని.), పూజిత్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. మిగతా మ్యాచ్ల్లో హరియాణా 3–0తో దాద్రా నగర్ హవేలిపై విజయం సాధించగా, ఉత్తర ప్రదేశ్ 9–2తో మహారాష్ట్రపై జయభేరి మోగించింది. ఆతిథ్య పంజాబ్ 8–4తో తమిళనాడుపై గెలుపొందింది. -
సునీల్ ఛెత్రీకి దక్కని చోటు
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా భారత ఫుట్బాల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సునీల్ ఛెత్రీకి... తాజా ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు. త్వరలో జరగనున్న సీఏఎఫ్ఏ నేషన్స్ కప్ కోసం కొత్త కోచ్ ఖాలిద్ జమీల్ శనివారం 35 మందితో ప్రాబబుల్స్ను ప్రకటించాడు. అందులో స్టార్ స్ట్రయికర్ ఛెత్రి పేరు లేదు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి... ఆ తర్వాత జట్టు అవసరాల కోసం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి బరిలోకి దిగిన సునీల్ ఛెత్రి గత నాలుగు మ్యాచ్ల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. అయితే కేవలం ప్రదర్శన ఆధారంగానే ఛెత్రిని ఎంపిక చేయలేదా లేక... అతడే స్వయంగా ఈ టోర్నీకి దూరంగా ఉంటానని చెప్పాడా అనే విషయంలో స్పష్టత కొరవడింది. దీనిపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారులను వివరణ కోరగా... ‘జట్టు ఎంపికలో మా ప్రమేయం లేదు. దీనికి సంబంధించిన అన్నీ విషయాలు హెడ్ కోచ్ చూసుకుంటారు’ అని వెల్లడించారు. రెండేళ్ల పదవీ కాలానికి గానూ భారత మాజీ ప్లేయర్ జమీల్ ఇటీవలే టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రాబబుల్స్కు ఎంపికైన వారితో శనివారమే బెంగళూరులో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అందులో 22 మంది పాల్గొనగా... మిగిలిన 13 మంది ఆటగాళ్లు డ్యురాండ్ కప్ మ్యాచ్లు ముగియగానే జట్టుతో చేరనున్నారు. ప్రాబబుల్స్లో గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, చింగ్లెన్సనా సింగ్, రాహుల్ భేకె, రోషన్ సింగ్, సురేశ్ సింగ్, అనిరూధ్ థాపా, దీపక్ టాంగ్రి, లాలెంగ్మావియా రాల్టె, లిస్టన్ కొలాకో, మన్వీర్ సింగ్, అమ్దుల్ సమద్, అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ తదితరులు ఉన్నారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని... గతేడాది జూన్లో కువైట్తో మ్యాచ్ అనంతరం ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత భారత జట్టు ప్రదర్శన మరింత పడిపోవడంతో... ఈ ఏడాది మార్చిలో మాల్దీవులుతో మ్యాచ్కు ముందు అప్పటి టీమిండియా హెడ్ కోచ్ మారŠెక్వజ్ మనోలో విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని పక్కన పెట్టి ఛెత్రీ తిరిగి జట్టుతో చేరాడు. మాల్దీవులుతో మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించగా.. అందులో ఛెత్రీ ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... హాంకాంగ్ చేతిలో టీమిండియా ఓడింది. థాయ్లాండ్తో స్నేహపూర్వక మ్యాచ్లో సైతం పరాజయం పాలైంది. దీంతో జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ మనోలో హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఏఐఎఫ్ఎఫ్ జమీల్ను కొత్తకోచ్గా ఎంపిక చేసింది. అతడి ఆధ్వర్యంలో భారత జట్టు నేషన్స్ కప్లో బరిలోకి దిగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 29న తజకిస్తాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 1న ఇరాన్తో, 4న అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. అనంతరం ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భాగంగా అక్టోబర్లో సింగపూర్తో టీమిండియా ఇంటా బయట మ్యాచ్లు ఆడనుంది. -
విజేత అరోనియన్
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. బ్లిట్జ్ విభాగంలో 18 పాయింట్లతో వియత్నాంకు చెందిన లియామ్ లె క్వాంగ్తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికా ప్లేయర్ లెవాన్ అరోనియన్ 24.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన అరోనియన్... మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్ గెలుచుకున్నాడు. ఫాబియానో కరువానా (అమెరికా; 21.5 పాయింట్లు), మ్యాక్సిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్; 21 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇటీవల లాస్ వెగాస్ ్రïఫీస్టయిల్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన 42 ఏళ్ల అరోనియన్... అదే జోరులో ఇక్కడ కూడా విజేతగా నిలిచాడు. అరోనియన్కు 40 వేల డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. రెండు రోజుల విశ్రాంతి అనంతరం గుకేశ్ సింక్యూఫీల్డ్ కప్లో బరిలోకి దిగనున్నాడు. దీంట్లో భారత్ నుంచి యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద కూడా పాల్గొననున్నాడు. సింక్యూఫీల్డ్ టోర్నీ క్లాసికల్ పోరు కావడంతో ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన గుకేశ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగే అవకాశం ఉంది. -
తాన్యా హేమంత్కు సింగిల్స్ టైటిల్
న్యూఢిల్లీ: సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తాన్యా హేమంత్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 86వ ర్యాంకర్ తాన్యా 15–10, 15–8తో కానాయ్ సకాయ్ (జపాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన తాన్యా తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్ల్లో గెలుపొందింది. 21 ఏళ్ల తాన్యాకు ఇది నాలుగో అంతర్జాతీయ టైటిల్.అంతకుముందు ఇండియా ఇంటర్నేషనల్ (2022), ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ (2023), బెండిగో ఇంటర్నేషనల్ (2024)లో తాన్యా టైటిల్స్ గెలుచుకుంది. గతేడాది అజర్బైజాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లో భారత షట్లర్ మాళవిక బన్సోద్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. తాజా టోర్నీలో తాన్యా... సెమీఫైనల్లో రిరినా హిరామొటో (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో లీ జిన్ యీ మెగన్ (సింగపూర్)పై, ప్రిక్వార్టర్స్లో నొడొకా సునకవా (జపాన్)పై విజయాలు సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ట్రయల్స్లో భాగంగా... ఈ టోర్నమెంట్లో ఒక్కో గేమ్లో 21 పాయింట్లకు బదులు 15 పాయింట్లుగా నిర్వహించారు. -
ఫైనల్లో అనాహత్
బేగా (ఆస్ట్రేలియా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) చాలెంజర్ టూర్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్కు దూసుకెళ్లింది. న్యూ సౌత్వేల్స్ స్క్వాష్ బేగా ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం 17 ఏళ్ల అనాహత్ సింగ్ 3–2 (10–12, 11–5, 11–5, 10–12, 11–7)తో నూర్ ఖఫాగీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. 54 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో టాప్సీడ్గా బరిలోకి దిగిన భారత ప్లేయర్ అదరగొట్టింది. 14 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అనాహత్... అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 18 పీఎస్ఏ టోర్నీల్లో పాల్గొన్న అనాహత్... అందులో 12 టైటిల్స్ గెలిచింది. మరో సెమీఫైనల్లో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే 1–3 (9–11, 11–7, 10–12, 6–11)తో హబీబా హనీ (ఈజిప్ట్) చేతిలో ఓడింది. 42 నిమిషాల పాటు సాగిన పోరులో ఆకాంక్ష చక్కటి పోరాట పటిమ కనబర్చినా... కీలక సమయంలో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఫైనల్లో హబీబా హనీతో అనాహత్ తలపడనుంది. పీఎస్ఏ స్క్వాష్ టూర్ సీజన్లో ఇదే తొలి ప్రపంచ స్థాయి ఈవెంట్ కాగా... టైటిల్ సాధించడమే లక్ష్యంగా అనాహత్ బరిలోకి దిగనుంది. -
మానసిక దృఢత్వం కోసం.. తొమ్మిది మంది మార్గనిర్దేశకులు
లుసానే: అంతర్జాతీయ క్రీడాకారులు శారీరకంగా ఎదుర్కొనే ఫిట్నెస్ సమస్యలతో పాటు ఇటీవలి కాలంలో మానసిక సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆటపరంగా అద్భుతాలు చేసే స్థాయి ఉన్నా... మానసిక దృఢత్వం లేక కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోలేక కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి వారికి తగిన మార్గనిర్దేశనం చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) యోచిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా 9 మందితో ‘మెంటల్ హెల్త్ అంబాసిడర్స్’ అంటూ ప్రచారకర్తలను నియమించింది. భారత తొలి ఒలింపిక్ వ్యక్తిగత స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రాకు ఈ బృందంలో సభ్యుడిగా అవకాశం దక్కింది. హోలీ బ్రాడ్షా (పోల్వాల్ట్), కెమిలె చెంగ్, బ్రూన్ ఫాటస్, ర్యాన్ పీనీ (స్విమ్మింగ్), గ్రేసీ గోల్డ్ (ఫిగర్ స్కేటింగ్), మారీ జోసీ, అకానీ సింబైన్ (స్ప్రింట్), మాసోమా అలీ జాదా (సైక్లిస్ట్) కూడా బింద్రాతో పాటు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. 42 ఏళ్ల బింద్రా ఇప్పటికే ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. సానుకూల వాతావరణం ఉండేలా..‘శారీరక ఆరోగ్యంతో పాటు ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఐఓసీ భావిస్తోంది. ఏ ఆటగాడు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొనరాదు. అందుకే ఐఓసీ మెంటల్ హెల్త్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపియన్లతో ఈ టీమ్ను ఎంపిక చేశాం. వీరు తమ పరిజ్ఞానం, అనుభవంతో ఆటగాళ్లకు సరైన సూచనలిస్తారు. సమస్యలతో బాధపడుతున్న క్రీడాకారులతో స్వయంగా మాట్లాడి దాని ప్రకారం వారికి తగిన విధంగా సహాయం చేస్తారు. ఐఓసీ ఆలోచన ప్రకారం ఏ అథ్లెట్ కూడా ఎలాంటి మానసిక సమస్యలతో బాధపడకూడదు. అలాంటి సానుకూల వాతావరణాన్ని తయారు చేయడమే దీని లక్ష్యం’ అని ఐఓసీ ప్రకటించింది. -
‘మహిళలు ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలి’
చెన్నై: మహిళల చెస్లో భారత క్రీడాకారిణులు ముందంజ వేయాలంటే ఎక్కువ సంఖ్యలో ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని సీనియర్ ప్లేయర్, ఉమెన్ గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) తానియా సచ్దేవ్ అభిప్రాయపడింది. మహిళల టోర్నీలకు పూర్తిగా దూరం కావద్దని... అయితే పురుషులతో ఓపెన్ కేటగిరీలో పోటీ పడితే ఆట ఎంతో మెరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన తానియా... ప్రస్తుతం చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ‘చెస్ కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమ్మాయిలు సాధ్యమైనన్ని ఎక్కువ ఓపెన్ టోర్నమెంట్లలో ఆడాలి. కేవలం మహిళల టోర్నీలకే పరిమితం కాకుండా పురుషులతో కలిసి శిక్షణ పొందడంతో పాటు వారితో పోటీ పడాలి. అప్పుడే వారి ఆట మరింత పదునెక్కుతుంది’ అని తానియా పేర్కొంది. అయితే పెద్ద స్థాయికి చేరే ముందు మహిళా టోర్నీల్లో విజయాలు సాధించడం కూడా ముఖ్యమని, అవి కెరీర్లో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయని తానియా చెప్పింది. ‘మహిళల విభాగంలో సాధించే విజయాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొత్త తరం అమ్మాయిలు చెస్ను ఎంచుకునేందుకు కావాల్సిన స్ఫూర్తిని ఇస్తాయి. ఓపెన్ టోర్నీల్లో పాల్గొనడం, మహిళల టోర్నీల్లో టైటిల్స్ గెలవడం రెండూ కూడా ముఖ్యమే. ఏదీ తక్కువ కాదు. సరిగ్గా చెప్పాలంటే కెరీర్లో ఎదిగే సమయంలో ఇది మధ్యేమార్గంలాంటిది. అయితే కేవలం మహిళల టోర్నీల్లోనే పాల్గొంటే వారు తమ స్థాయిని తగ్గించుకున్నట్లే. పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని వారు కోల్పోతారు’ అని 38 ఏళ్ల తానియా విశ్లేషించింది. అంతర్జాతీయ స్థాయిలో మన మహిళా చెస్ క్రీడాకారిణుల తాజా ప్రదర్శన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్లపై ఆమె ప్రశంసలు కురిపించింది. ‘మన దేశానికి సంబంధించి ఇప్పుడు చెస్లో స్వర్ణ యుగం నడుస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో మేమేం తక్కువ కాదన్నట్లుగా మహిళలు నిరూపించుకుంటున్నారు. ఒక మెగా టోర్నీ ఫైనల్లో రెండు వేర్వేరు తరాలకు చెందిన భారత ప్లేయర్లు పోటీ పడటం మామూలు విషయం కాదు. చెస్ను చూసి ఈ ఆటను ఎంచుకోవాలనుకునే అమ్మాయిలకు ఇది కావాల్సినంత స్ఫూర్తిని అందిస్తుంది’ అని తానియా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నా తనలో ఇంకా సత్తా ఉందన్న తానియా... ఏడాదికి ఒకటి లేదా రెండు చొప్పున టోర్నీలు ఆడుతూ చెస్ వ్యాఖ్యానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. -
భారత్లో రొనాల్డో ఆట!
చెన్నై: అంతా అనుకున్నట్లు జరిగితే... పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆటను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) చాంపియన్స్ లీగ్–2లో భాగంగా రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ జట్టుతో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్లో పాల్గొనేందుకు పోర్చుగల్ స్టార్ భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్ నాసర్ క్లబ్తో కాంట్రాక్ట్ ప్రకారం విదేశీ వేదికలపై జరిగే మ్యాచ్ల్లో రొనాల్డో పాల్గొనే అంశంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. మరి రొనాల్డో గోవా ఎఫ్సీతో మ్యాచ్ కోసం భారత్కు వస్తాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్2కు సంబంధించిన ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి గోవా ఎఫ్సీతో పాటు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు పాల్గొననుంది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొననుండగా... వాటిని ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి. గత సీజన్లో లీగ్ షీల్డ్ దక్కించుకోవడం ద్వారా మోహన్ బగాన్ జట్టు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా... ‘సూపర్ కప్’ గెలవడం ద్వారా గోవా ఎఫ్సీ ముందంజ వేసింది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్లో గోవా జట్టు పాల్గొనడం ఇది రెండోసారి. 2021లోనూ గోవా జట్టు ఈ టోర్నీలో ఆడింది. సెపె్టంబర్ 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్... వచ్చే ఏడాది మే 16న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. లీగ్లో భాగంగా... ఇంటాబయట మ్యాచ్లు జరగడం పరిపాటి కావడంతో గోవా ఎఫ్సీతో తలపడేందుకు అల్ నాసర్ తరఫున రొనాల్డో భారత్కు వస్తాడనే వార్తలు వ్యాపించాయి. గ్రూప్ ‘సి’లో ఫూలద్ మొబారకేశ్ సెపాహన్ ఎస్సీ (ఇరాన్), అల్ హుసేన్ (జోర్డాన్), అహల్ ఎఫ్సీ (తుర్క్మెనిస్తాన్)తో కలిసి మోహన్ బగాన్ పోటీ పడనుంది. గ్రూప్ ‘డి’లో గోవా ఎఫ్సీతో పాటు అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా), అల్ జవ్రా ఎస్సీ (ఇరాక్), ఇస్తిక్లోల్ ఎఫ్సీ (తజకిస్తాన్) ఉన్నాయి. -
డిసెంబర్లో మోదీతో మెస్సీ భేటీ
కోల్కతా: అర్జెంటీనా సూపర్స్టార్ ఫుట్బాలర్ లయోనల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. చాలా రోజులుగా భారత టూర్ ఉంటుందని వార్తలు వస్తుండగా... తాజాగా షెడ్యూల్ను ప్రకటించారు. మెస్సీ పర్యటనను ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’గా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈవెంట్ ప్రమోటర్ శతద్రు దత్తా శుక్రవారం వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీలు టెన్నిస్ తరహా రాకెట్తో ఆడే ఆటే ‘ప్యాడెల్’. అయితే ఇది పూర్తిగా టెన్నిస్ ఆడే రాకెట్ కాదు. కాస్త భిన్నంగా ఉంటుంది. డిసెంబర్ 12 నుంచి 15 వరకు భారత్లోని ప్రముఖ నగరాలైన కోల్కతా, ముంబై, ఢిల్లీ అహ్మదాబాద్లలో మెస్సీ భారత అభిమానులను అలరిస్తారు. ప్రతీ నగరంలోనూ చిన్నారులు, యువ ఫుట్బాలర్లతో కలుస్తారు. మన ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నాలుగు రోజుల బిజీ పర్యటనలో ముందుగా అతను కోల్కతాలో అడుగు పెడతాడు. ఫుట్బాల్ అంటేనే శివాలుగే కోల్కతాలో డిసెంబర్ 12న మెస్సీ గడుపుతారు. ఈడెన్ గార్డెన్స్ లేదంటే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు గోట్ ఆట ఆడతారు. దీంతో పాటు భారత మాజీ కెపె్టన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, ఫుట్బాల్ కెపె్టన్ బైచుంగ్ భూటియాలతో కలిసి సెవెన్–ఎ–సైడ్ సాఫ్ట్టచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సెలబ్రిటీ మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తారు. రూ. 3500 నుంచి మొదలయ్యే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నిర్వాహకుడు శతద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనపై బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి వెల్లడించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఈ సందర్భంగా ఆమె పోలీసు శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కోల్కతా పోలీస్ కమిషనర్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పక్కా ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు దత్తా చెప్పారు. 14న ముంబైలో హేమాహేమీలతో... మరుసటి రోజు డిసెంబర్ 13న మెస్సీ అహ్మదాబాద్కు పయనమవుతాడు. అక్కడ అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో అతను పాల్గొంటాడు. అటునుంచి 14న నేరుగా ముంబై చేరుకుంటాడు. సీసీఐ బ్రాబౌర్న్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో హేమాహేమీలతో భేటీ అవుతాడు. వాంఖెడే స్టేడియంలో ముంబై ప్యాడెల్ కప్లో పాల్గొంటాడు. అధికారికంగా వెల్లడించనప్పటికీ బాలీవుడ్, స్పోర్ట్స్ దిగ్గజాలు షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మలతో టెన్నిస్ తరహా రాకెట్తో ఆడే ప్యాడెల్ ఈవెంట్లో మెస్సీ కాసేపు ఆడనున్నాడు. మరుసటి రోజు డిసెంబర్ 15న ఢిల్లీకి పయనమవుతాడు. అక్కడ మొదట భారత ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా కలిశాక... ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగే ఢిల్లీ అంచె గోట్ కప్లో కింగ్ కోహ్లి, శుబ్మన్ గిల్లతో కలిసి ఆడతాడు. సరిగ్గా ధర్మశాలలో డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జరిగే టి20 అనంతరం ఢిల్లీలో ఈ ఈవెంట్ జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) వర్గాలు తెలిపాయి. -
అర్జున్కు మూడో స్థానం
చెన్నై: చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్), అర్జున్, కార్తికేయన్ మురళీ (భారత్) 5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. దాంతో అనీశ్కు రెండో స్థానం, అర్జున్కు మూడో స్థానం, కార్తికేయన్కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 7 పాయింట్లతో జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్ చాంపియన్గా నిలిచాడు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు నిహాల్ సరీన్ 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో, విదిత్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో, ప్రణవ్ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించారు. శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేముల్లో కీమెర్ 41 ఎత్తుల్లో రే రాబ్సన్ (అమెరికా)పై, అనీశ్ గిరి 33 ఎత్తుల్లో జోర్డెన్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. అర్జున్–కార్తికేయన్ గేమ్ 49 ఎత్తుల్లో... విదిత్ (భారత్)–లియాంగ్ (అమెరికా) గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. విజేత కీమెర్కు రూ. 25 లక్షలు... అనీశ్కు రూ. 15 లక్షలు... అర్జున్కు రూ. 10 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. ఇదే వేదికపై జరిగిన చాలెంజర్స్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రాణేశ్ 6.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా వచ్చే ఏడాది చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. హైదరాబాద్ ప్లేయర్ హారిక 1.5 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. -
కొత్త ‘క్రీడా విధానం’తో రాత మారిపోతుంది
న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థలో పలు మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్ఎస్పీ) బిల్కు ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. త్వరలోనే చట్టంగా మారనున్న ఈ బిల్లుతో క్రీడా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇచ్చిన ప్రసంగంలో ఆయన భారత క్రీడల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అభివృద్ధిలో క్రీడలు కూడా ఒక భాగం. ఒకప్పుడు ఆటలు ఆడితే తల్లిదండ్రులు కోప్పడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రోత్సహించే వరకు పరిస్థితి మారడం సంతోషంగా ఉంది. ఇది మంచి సంకేతం. భారతీయ కుటుంబాల్లో క్రీడలు కూడా అంతర్భాగం కావడం నాకు గర్వంగా అనిపిస్తోంది. భారత భవిష్యత్తుకు కూడా ఇది చాలా మంచిది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్తగా అమల్లోకి రాబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో పలు మార్పులకు శ్రీకారం చుడుతుందని, జవాబుదారీతనం పెంచుతుందని ఆయన అన్నారు. ‘క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకే పలు దశాబ్దాల తర్వాత కొత్త పాలసీని తీసుకొచ్చాం. పాఠశాలలనుంచి ఒలింపిక్స్ వరకు ఇది ఆటలను అభివృద్ధి చేసేలా ఉంటుంది. కోచింగ్, ఫిట్నెస్, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి ఒక వ్యవస్థను దీని ద్వారా రూపొందిస్తున్నాం. ఇది దేశంలోని మారుమూలలకు వెళ్లి పని చేస్తుంది’ అని మోదీ స్పష్టం చేశారు. ఫిట్నెస్, క్రీడల ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రధాని... ప్రస్తుతం దేశంలో ఊబకాయం అతి పెద్ద సమస్యగా మారిందని, దీనిలో మార్పుల తేవాలంటే నూనెల వినియోగాన్ని తక్కువ చేయాలని సూచించారు. -
కరువానాకు గుకేశ్ షాక్
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ చివరి మూడు రౌండ్లలో రాణించాడు. ర్యాపిడ్ విభాగం పోటీలు ముగిశాక 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. లీనియర్ డొమింగెజ్ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్లో గుకేశ్ 45 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఈ ఓటమి నుంచి వెంటనే కోలుకున్న గుకేశ్ ఎనిమిదో రౌండ్ గేమ్లో 45 ఎత్తుల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ వెస్లీ సో (అమెరికా)పై గెలిచాడు. అనంతరం ప్రపంచ 6వ ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్లో గుకేశ్ 89 ఎత్తుల్లో సంచలన విజయం సాధించాడు. క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో ఉన్న గుకేశ్... ర్యాపిడ్ ఫార్మాట్లో 27వ ర్యాంక్లో, బ్లిట్జ్ ఫార్మాట్లో 93వ ర్యాంక్లో ఉన్నాడు. ర్యాపిడ్ విభాగం గేమ్లు ముగియడంతో... ఇక బ్లిట్జ్ ఫార్మాట్లో 18 గేమ్లు జరుగుతాయి. -
45 ఏళ్ల వయసులో...
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ 45 ఏళ్ల వయసులో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఓస్ ఓపెన్లో వీనస్ పోటీ పడనుంది. మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో వీనస్కు ‘వైల్డ్ కార్డ్’ ప్రవేశం లభించింది. దీంతో రెనీ రిచర్డ్స్ (1981లో; 47 ఏళ్ల వయసులో) తర్వాత యూఎస్ ఓపెన్ బరిలోకి దిగనున్న అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలవనుంది. కెరీర్లో 7 సింగిల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు నెగ్గిన వీనస్... మహిళల డబుల్స్లో 14, మిక్స్డ్ డబుల్స్లో రెండు టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్లో నాలుగు స్వర్ణాలు సహా మొత్తం 5 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆమె కెరీర్లోని ప్రధానాంశాలను ఓసారి పరిశీలిస్తే... » 1994లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన వీనస్... 14 ఏళ్ల వయసులో ఆక్లాండ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో పాల్గొంది. » 1997 ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా వీనస్ గ్రాండ్స్లామ్ అరంగేట్రం చేసింది. తొలి రౌండ్లో గెలిచిన వీనస్... రెండో రౌండ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. » అదే ఏడాది యూఎస్ ఓపెన్లో నిలకడైన ప్రదర్శన కనబర్చిన వీనస్... ఫైనల్ వరకు చేరింది. తుది సమరంలో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. » 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలిసారి సోదరి సెరెనా విలియమ్స్తో వీనస్ విలియమ్స్ తలపడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య 31 మ్యాచ్లు జరగగా... అందులో 19 మ్యాచ్ల్లో సెరెనా విజయం సాధించింది. 12 మ్యాచ్ల్లో వీనస్ నెగ్గింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సెరెనా 11–5తో వీనస్పై పైచేయి కనబర్చింది. » సెరెనాతో కలిసి వీనస్ 1999లో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలిచింది. అదే సంవత్సరం ఈ అక్కాచెల్లెళ్లు యూఎస్ ఓపెన్లో సైతం విజేతలుగా నిలిచారు. » 20 ఏళ్ల వయసులో వీనస్ తొలి గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచింది. 2000 వింబుల్డన్ టోర్నీలో వీనస్ విజేతగా నిలిచింది. తద్వారా గిబ్సన్ (1950లో) తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన నల్లజాతి ప్లేయర్గా వీనస్ రికార్డుల్లోకెక్కింది. అంతకుముందే 1999 యూఎస్ ఓపెన్లో సెరెనా విలియమ్స్ తొలి టైటిల్ గెలవడంతో... టెన్నిస్ చరిత్రలో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మొదటి సోదరీమణులుగా సెరెనా, వీనస్ రికార్డుల్లోకెక్కారు. » వీనస్ సుదీర్ఘ కెరీర్లో ఐదుసార్లు (2000, 2001, 2005, 2007, 2008లో) వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలిచింది. 2000, 2001లో యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచింది. » 2000 సిడ్నీ ఒలింపిక్స్లో వీనస్ విలియమ్స్ ‘డబుల్ ధమాకా’ మోగించింది. సింగిల్స్లో స్వర్ణం గెలిచిన ఈ అమెరికా ప్లేయర్... మహిళల డబుల్స్లో సోదరి సెరెనాతో కలిసి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. » 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్లో బంగారు పతకాలు నెగ్గిన వీనస్... 2016 రియో విశ్వక్రీడల్లో మిక్స్డ్ డబుల్స్లో రజతం కైవసం చేసుకుంది. » 2002 నుంచి 2003 వరకు వరుసగా నాలుగు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో సెరెనా, వీనస్ మధ్య హోరాహోరీ సమరాలు జరిగాయి. అందులో నాలుగింట సెరెనానే విజయం సాధించింది. 1884 వింబుల్డన్లో మౌడ్ వాట్సన్, లిలియన్ వాట్సన్ తర్వాత గ్రాండ్స్లామ్ ఫైనల్లో తలపడ్డ అక్కాచెల్లెళ్లు సెరెనా, వీనస్ కావడం విశేషం. » 2002 ఫిబ్రవరిలో వీనస్ విలియమ్స్ తొలిసారి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. మొత్తంగా ఆమె 11 వారాల పాటు ‘టాప్’లో కొనసాగింది. సెరెనా 319 వారాల పాటు అగ్రస్థానంలో నిలవడం విశేషం. » 2011 యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్కు ముందు వీనస్ తనకు స్జోగ్రెన్స్ సిండ్రోమ్ ఉన్నట్లు వెల్లడించింది. కీళ్ల నొప్పుల కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. » గాయాల నుంచి కోలుకున్న అనంతరం తిరిగి కోర్టులో అడుగుపెట్టిన వీనస్... 2016–17లో అదరగొట్టింది. ఆ ఏడాది ఆ్రస్టేలియా, ఓపెన్ వింబుల్డన్లో ఫైనల్కు చేరి అదుర్స్ అనిపించుకుంది. మరో రెండు గ్రాండ్స్లామ్లలో సెమీఫైనల్స్ ఆడింది. » ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వీనస్ విలియమ్స్... వరుసగా 10 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో తొలి రెండు రౌండ్లలోనే నిష్క్రమించింది. అందులో 2023 యూఎస్ ఓపెన్ కూడా ఉంది. ఆ తర్వాత రాకెట్ పక్కన పెట్టిన వీనస్... శస్త్రచికిత్సల అనంతరం గత నెల డీసీ సిటీ ఓపెన్ ద్వారా తిరిగి మైదానంలో అడుగు పెట్టింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో లేటు వయసులోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. -
డీగో జోటా కుటుంబానికి చెల్సీ క్లబ్ సాయం
లండన్: ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) విఖ్యాత ఫుట్బాల్ క్లబ్ చెల్సీ పెద్ద మనసు చాటుకుంది. గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోర్చుగల్ యువ మిడ్ఫీల్డర్, లివర్పూల్ క్లబ్ ఫార్వర్డ్ డీగో జోటా కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగిన క్లబ్ వరల్డ్కప్ ఫైనల్లో చెల్సీ జట్టు 3–0తో యూఈఎఫ్ఏ చాంపియన్ పారిస్ సెయింట్ జర్మయిన్ (పీఎస్జీ)పై ఘనవిజయం సాధించింది. దీంతో క్లబ్కు ప్రైజ్మనీతో పాటు బోనస్ కలిపి మొత్తం 11.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) లభించాయి. ఈ మొత్తాన్ని ఆటగాళ్లంతా సమాన భాగాలు చేశారు. ఇందులో నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4.38 కోట్లు) మృతి చెందిన లివర్పూల్ క్లబ్ ప్లేయర్ డీగో జోటా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు చెల్సీ సిద్ధమైంది. ఈ మేరకు చెల్సీ క్లబ్ గురువారం అధికారికంగా ప్రకటించింది. పోర్చుగల్కు చెందిన జోటా పావోస్ డి ఫెరీరాతో ఫుట్బాల్ కెరీర్ను ప్రారంభించాడు. తర్వాత 2016లో అట్లిటికో మాడ్రిడ్తో జట్టు కట్టాక కెరీర్లో ఊపందుకున్నాడు. ప్రీమియర్ లీగ్లో వాల్వొర్హాంప్టన్ వాండరర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2020 నుంచి లివర్పూల్ జట్టుకు ఆడుతున్నాడు. 2024–2025 ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ సీజన్లో లివర్పూల్ చాంపియన్గా నిలిచింది. -
డాక్టర్ వీస్ పేస్ కన్నుమూత
కోల్కతా: క్రీడాకారుడు, క్రీడలకు సంబంధించిన వివిధ రంగాల్లో నైపుణ్యం... స్వయంగా ఒలింపిక్ పతకం గెలిచిన జట్టులో సభ్యుడు, మరో ఒలింపిక్ మెడలిస్ట్కు తండ్రి... వైద్యుడిగా వేర్వేరు క్రీడాంశాల్లో ప్రత్యేక గుర్తింపు... బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వీస్ పేస్ బయోడేటా ఇది. 80 ఏళ్ల వీస్ పేస్ గురువారం అనారోగ్య కారణాలతో కోల్కతాలో కన్ను మూశారు. చికిత్స కోసం మంగళవారం ఆయనను ఆస్పత్రిలో చేర్చించగా ఆపై కోలుకోలేకపోయారు. గత కొంత కాలంగా వీస్ పేస్ పార్కిన్సన్ వ్యాధితో కూడా బాధపడుతున్నారు. భారత మహిళల బాస్కెట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ జెన్నిఫర్ను వివాహమాడిన వీస్కు కుమారుడు లియాండర్తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారిద్దరు తిరిగొచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. ప్లేయర్గా మొదలై... 1945లో గోవాలో పుట్టిన వీస్ పేస్ మొదటి నుంచి అటు క్రీడల్లోనూ, ఇటు క్రీడా వైద్యంలోనూ చురుగ్గా ఉండేవారు. ఫుట్బాల్, క్రికెట్, రగ్బీ వంటి ఆటల తర్వాత ఆయన హాకీని పూర్తి స్థాయిలో ఎంచుకొని సత్తా చాటారు. మిడ్ ఫీల్డర్గా భారత హాకీ జట్టు తరఫున రాణించిన వీస్కు 1968 మెక్సికో ఒలింపిక్స్లో పాల్గొనే భారత జట్టులో ఆడే అవకాశం త్రుటిలో చేజారింది. అయితే ఆ తర్వాత టీమ్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. 1971 హాకీ వరల్డ్ కప్లో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. తర్వాతి ఏడాదే మరో కీలక విజయంలో ఆయన భాగమయ్యారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన జట్టులో కూడా వీస్ కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా గుర్తింపు పొందక ముందే 1964–65లో ఆయన కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ప్రి మెడికల్ కోర్సు పూర్తి చేశారు. స్పోర్ట్స్ డాక్టర్గా... హాకీ నుంచి తప్పుకోగానే వీస్ పేస్ పూర్తి స్థాయిలో క్రీడా వైద్యంపై దృష్టి పెట్టారు. నాటి రోజుల్లో మన దేశంలో స్పోర్ట్స్ మెడిసిన్పై పెద్దగా అవగాహన, గుర్తింపు రాని రోజుల్లోనే వీస్ ఆధునిక వైద్య విధానాలతో భిన్న క్రీడాంశాల్లో ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశారు. దశాబ్దకాలం పాటు భారత డేవిస్ కప్ జట్టుతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్లో పాల్గొన్న టీమ్లకు కూడా ఆయన టీమ్ డాక్టర్గా పని చేశారు. స్పోర్ట్స్ మెడిసిన్ ద్వారా పలువురు భారత ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడంలో వీస్ సహకరించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, బీసీసీఐకి కూడా ఆయన సుదీర్ఘకాలం కన్సల్టెంట్గా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ బోర్డుకు సహకరించారు. కొడుకును తీర్చిదిద్ది... తండ్రీ కొడుకులు ఒలింపిక్ పతక విజేతలు కావడం ప్రపంచ క్రీడల్లో చాలా అరుదు. అలాంటి ఘనతను పేస్ కుటుంబం సాధించింది. తండ్రి ప్రోత్సాహంతో క్రీడాకారుడిగా మారిన లియాండర్ తర్వాతి కాలంలో భారత టెన్నిస్ దిగ్గజంగా తన పేరును లిఖించుకున్నాడు. లియాండర్ కెరీర్ను తీర్చిదిద్దడంతో తండ్రిగా, మేనేజర్గా, మెంటార్గా వీస్ పాత్ర చాలా పెద్దది. 18 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో పాటు 1996 అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన లియాండర్ తండ్రి అంచనాలను అందుకోగలిగాడు. వీస్ పేస్ మృతి పట్ల హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీతో పాటు మాజీ ఆటగాళ్లు అజిత్పాల్ సింగ్, వీరెన్ రస్కిన్హా, బీపీ గోవింద, హర్బీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ‘వీస్ అంకుల్తో నాకు దాదాపు పాతికేళ్ల అనుబంధం ఉంది.2002 బుసాన్ ఆసియా క్రీడల నుంచి ఆయన ఎన్నోసార్లు మాతో కలిసి పని చేశారు. స్వయంగా ఆటగాడు కావడంతో ఆయనకు క్రీడాకారుల మానసిక స్థితిపై కూడా సరైన అవగాహన ఉండేది. దాని ప్రకారమే ఆయన వైద్యం చేసేవారు. భారత క్రీడారంగానికి ఆయన లోటు తీరనిది’ అని నివాళి అర్పించింది. -
ప్రపంచ చెస్లో భారత్ ఆధిపత్యం
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్లో భారత్ ఆధిపత్యం కనబరుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కితాబిచ్చారు. దేశ పౌరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె తన సందేశంలో భారత చెస్ క్రీడాకారుల ఘనతను ప్రస్తావించారు. క్రీడల్లో భారత్ గణనీయమైన విజయాలను సాధిస్తోందని ప్రశంసించారు. ‘దేశ యువత సరికొత్త ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో ముందడుగు వేస్తోంది. చెస్ ఈవెంట్ను చూసుకుంటే... భారత యువ చదరంగ క్రీడాకారులదే హవా! మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ చెస్లో ఆధిపత్యాన్ని మన గ్రాండ్మాస్టర్లు చలాయిస్తున్నారు. ఇక మీదట అమలయ్యే కొత్త క్రీడా పాలసీతో ప్రపంచ క్రీడాశక్తిగా భారత్ ఆవిర్భవించే అవకాశలున్నాయి. మన అమ్మాయిలు మనకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుకుంటున్నారు. రక్షణ, భద్రత, క్రీడలు ఇలా ఏ రంగమైనా సరే ఎవరికీ తీసిపోని విధంగా సాటిలేని విజయాలు సాధిస్తున్నారు. పురుషుల్లో 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చాంపియన్షిప్ సాధించడం, మహిళల్లో 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి దివ్య దేశ్ముఖ్, 38 ఏళ్ల వెటరన్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ ఫైనల్స్కు అర్హత సాధించడం చెస్లో మన సత్తా ప్రపంచానికి చాటినట్లయ్యింది’ అని రాష్ట్రపతి తన సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. తరాలు మారుతున్నా... మన మహిళలు స్థిరంగా ప్రతిభ చాటుకుంటున్నారని, ప్రపంచంతో పోటీ పడేందుకు సై అంటున్నారని ప్రశంసించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’ ఇకపై నినాదం మాత్రమే కాదు... నిజమైన సార్థకతగా అభివర్ణించారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ చెస్లో భారత క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారు. గుకేశ్, దివ్యలతో పాటు తెలంగాణ తేజం ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, వైశాలి ఇంటా బయటా విజయకేతనం ఎగురవేస్తున్నారు. -
విజేత విన్సెంట్ కీమెర్
చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే... చెన్నై గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. జోర్డెన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)తో గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను విన్సెంట్ కీమెర్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఎనిమిదో రౌండ్ తర్వాత కీమెర్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు గేముల్లో నెగ్గిన కీమెర్, మరో నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. భారత గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, కార్తికేయన్ మురళీ 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో కీమెర్ ఓడిపోయినా... అర్జున్, కార్తికేయన్ తమ గేమ్ల్లో విజయం సాధించినా జర్మనీ గ్రాండ్మాస్టర్ను అందుకోలేకపోతారు. ఎనిమిదో రౌండ్లో అర్జున్–విదిత్ గేమ్ 32 ఎత్తుల్లో; నిహాల్ సరీన్–కార్తికేయన్ మురళీ గేమ్ 61 ఎత్తుల్లో; అవండర్ లియాంగ్ (అమెరికా)–అనీశ్ గిరి (నెదర్లాండ్స్) గేమ్ 37 ఎత్తుల్లో; ప్రణవ్ (భారత్)–రే రాబ్సన్ (అమెరికా) గేమ్ 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్కు ఐఓఏ ఆమోదం
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను స్వదేశంలో నిర్వహించేందుకు వేసిన బిడ్కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ఒలింపిక్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా మూకుమ్మడిగా బిడ్ను ఆమోదించారు. చివరిసారిగా 2010లో కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యమివ్వగా... ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి అవకాశం దక్కితే పూర్తి స్థాయిలో టోర్నమెంట్ను నిర్వహిస్తామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు.2026లో గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్ వంటి పలు క్రీడాంశాలను తొలగించారు. ఈ నేపథ్యంలో తదుపరి క్రీడలకు ఆతిథ్యమిచ్చే చాన్స్ వస్తే పూర్తి స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని ఉష పేర్కొన్నారు.‘సభ్యులంతా సమష్టిగా బిడ్కు ఆమోదం తెలపడం ఆనందం. అహ్మదాబాద్లో మాత్రమే క్రీడలు నిర్వహిస్తామని చెప్పలేదు. న్యూఢిల్లీ, భువనేశ్వర్లో కూడా మెరుగైన సదుపాయాలు ఉన్నాయి. 2026 గ్లాస్గో కామెన్వెల్త్ క్రీడల్లో పలు క్రీడాంశాలను తీసేశారు. 2030 ఆతిథ్య హక్కులు దక్కితే 2010లో మాదిరిగా అన్నీ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తాం’ అని పీటీ ఉష తెలిపారు. ఐఓసీ ఫండ్పై సానుకూలత.. జాతీయ క్రీడా సమాఖ్యల్లోని అనిశ్చితి నేపథ్యంలో... ఏడాది కాలంగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. గతేడాది అక్టోబర్ 8న జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం నుంచి నిధుల విడుదలను నిలిపివేశారు. అయితే అంతర్గత విబేధాలు అధిగమించిన నేపథ్యంలో తిరిగి గ్రాంట్లు వస్తానయని భారత ఒలింపిక్ సంఘం ఆశిస్తోంది. బుధవారం ఐఓఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీ సజావుగా సాగడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని పీటీ ఉష ఆశిస్తున్నారు. -
13వ సారి ప్రపంచ రికార్డు
బుడాపెస్ట్: ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడం అలవాటుగా మార్చుకున్న స్వీడన్ విఖ్యాత పోల్వాల్టర్ మోండో డుప్లాంటిస్ మరోసారి అదరగొట్టాడు. ఇస్తవాన్ గ్యులాయ్ స్మారక అథ్లెటిక్స్ మీట్లో 25 ఏళ్ల డుప్లాంటిస్ 13వసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అయిన డుప్లాంటిస్ రెండో ప్రయత్నంలో 6.29 మీటర్ల ఎత్తుకు ఎగిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో గత జూన్లో 6.28 మీటర్లతో స్టాక్హోమ్ డైమండ్ లీగ్ మీట్ సందర్భంగా నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ఐదేళ్ల క్రితం పోలాండ్లో జరిగిన మీట్లో డుప్లాంటిస్ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి తొలిసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 6.16 మీటర్లతో రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ తిరగరాశాడు. అప్పటి నుంచి డుప్లాంటిస్ వెనుదిరిగి చూడలేదు. 2020లో రెండోసారి... 2022లో మూడుసార్లు... 2023లో రెండుసార్లు... 2024లో మూడుసార్లు... 2025లో మూడుసార్లు అతను ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2020 టోక్యో ఒలింపిక్స్... 2024 పారిస్ ఒలింపిక్స్...2022 ప్రపంచ చాంపియన్షిప్, 2023 ప్రపంచ చాంపియన్షిప్లలో స్వర్ణ పతకాలు నెగ్గిన డుప్లాంటిస్ గత నాలుగేళ్లుగా డైమండ్ లీగ్లో విజేతగా నిలుస్తున్నాడు. 2022, 2024, 2025లలో జరిగిన ప్రపంచ ఇండోర్ చాంపియన్షిప్ పోటీల్లోనూ ఈ స్వీడన్ స్టార్ బంగారు పతకాలు గెలిచాడు. పురుషుల, మహిళల పోల్వాల్ట్ విభాగాల్లో అత్యధికసార్లు ప్రపంచ రికార్డులు సృష్టించిన ఘనత సెర్గీ బుబ్కా (ఉక్రెయిన్), ఎలీనా ఇసిన్బయేవా (రష్యా)ల పేరిట ఉంది. వీరిద్దరూ 17 సార్లు చొప్పున ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇదే జోరు కొనసాగిస్తే డుప్లాంటిస్ ఏడాదిలోపు వీరిద్దరిని అధిగమించే అవకాశాలున్నాయి. -
6 నెలల్లో క్రీడా బిల్లు అమలు
న్యూఢిల్లీ: రాబోయే ఆరు నెలల్లో జాతీయ క్రీడా బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు ఆమోద ముద్ర లభించడంతో... ప్రపంచంలో క్రీడా చట్టం అమల్లోకి వచ్చిన 21వ దేశంగా భారత్ నిలిచింది. ఈ బిల్లు అమలుతో దేశ క్రీడారంగానికి ఎంతో లబ్ధి చేకూరనుంది. మౌలిక వసతులు మెరుగు పడటంతో పాటు... క్రీడల్లో పారదర్శకత పెరగనుంది. పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం క్రీడా మంత్రి దీనిపై స్పందిస్తూ... ఇప్పటికే నియమ నిబంధనల రూపకల్పన ప్రారంభమైందని వెల్లడించారు. ‘ఈ బిల్లు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తుంది. రాబోయే ఆరు నెలల్లో వంద శాతం దీన్ని అమలు చేసే విధంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. దీనివల్ల క్రీడారంగానికి ఇతోధిక లబ్ధి చేకూరుతుంది. భారత అథ్లెట్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గేనే సమయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే జాతీయ విధానానికి అనుగుణంగా కొన్ని సూచనలు ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వినియోగిస్తారు. అవసరమైన పోస్టుల సృష్టి, పరిపాలనా అనుమతుల వంటి వాటి ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ), జాతీయ క్రీడా ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ)కు విధానపరమైన అనుమతులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం’ అని మాండవీయ పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో క్రీడా రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణ అని క్రీడా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వానికి సర్వాధికారాలు... బిల్లు ఆమోదంతో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. గతంలోనూ ఇదే పద్ధతి కొనసాగినా... దానికంటూ ప్రత్యేకమైన విధానం లేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో క్రీడల్లో పోటీపడాల్సి వచ్చిన సందర్భంతో పాటు దౌత్యపరంగా సఖ్యతగా లేని మరే దేశంలో పర్యటించాల్సి వచ్చినా... ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా క్రీడా చట్టం అమలవుతున్న దేశాల్లో... అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అంశంపై ఆయా దేశాల ప్రభుత్వాలదే తుది నిర్ణయం. ఇది కేవలం అసాధారణ పరిస్థితుల కోసం ఉద్దేశించి రూపొందించింది... అంతే తప్ప జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం కోసం తీసుకొచ్చింది కాదు. జాతీయ భద్రతా బెదిరింపులు, దౌత్య బహిష్కరణలు లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితులు వంటివి సంభవించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. 2008 ముంబై దాడుల సమయం నుంచే పాకిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ప్రధాన మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో విదేశాంగ శాఖ అనుమతులతోనే టీమిండియా మ్యాచ్లు ఆడుతోంది. ఇకపై కూడా ఈ విధానమే కొనసాగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... ఈ బిల్లు ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలు, జాతీయ క్రీడా ట్రైబ్యునల్, జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ ఇలా అన్నింటిని జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ) పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. దీంతో క్రీడల్లో పారదర్శకత పెరగడంతో పాటు వివాద పరిష్కారం మరింత సులువు కానుంది. ఆరంభంలో ఈ బిల్లుపై అవగాహన కొరవడినా... ఆ తర్వాత జాతీయ క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దీనికి మద్దతునిచ్చాయని క్రీడా శాఖ మంత్రి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో చర్చించి విశ్లేషించి 60 రౌండ్లకు పైగా ‘చింతన్ శిబిర్’లను నిర్వహించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరమే బిల్లును పార్లమెంట్ ముందుంచినట్లు క్రీడా మంత్రి వెల్లడించారు. కొత్త చట్టంతో దేశ క్రీడా రంగం పురోగతి సాధిస్తుందనే నమ్మకముందన్న మాండవీయ... రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్ను క్రీడల్లో సూపర్ పవర్గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ... ‘జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో రోజుల తరబడి మాట్లాడిన తర్వాతే ఈ బిల్లును రూపొందించాం. అథ్లెట్లు, కోచ్లు, క్రీడా విశ్లేషకులు, నిపుణులు ఇలా ఒక్కరేంటి అందరీని సంప్రదించాం. బిల్లులోని ప్రతి నిబంధనను వారికి వివరించాం. వాటి అవసరమేంటో స్పష్టంగా చెప్పిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఎలాంటి బిల్లు కావాలో వారినే అడిగాం. వారిచ్చిన సూచనలు సలహాలతో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని క్రీడా న్యాయవాదుల నుంచి కూడా సలహాలు తీసుకున్నాం. వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ముసాయిదా క్రీడా బిల్లును రూపొందించింది. కానీ దాన్ని అమలు చేయలేకపోయింది’అని క్రీడా శాఖమంత్రి వెల్లడించారు. అథ్లెట్లతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే క్రీడా సమాఖ్యల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ‘మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం పెంచాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీలో నలుగురు మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ‘స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ’’ని కూడా తీసుకొస్తాం. ఇది అంతర్జాతీయ టోర్నీల్లో మన అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రోడ్మ్యాప్లా నిలవనుంది’ అని మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. -
తమిళ్ తలైవాస్ కెప్టెన్గా పవన్
న్యూఢిల్లీ: ఈనెల 29న ప్రారంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పోటీపడే పలు జట్లు తమ కెప్టెన్లను ప్రకటించాయి. తమిళ్ తలైవాస్ కొత్త కెప్టెన్గా పవన్ సెహ్రావత్, వైస్ కెప్టెన్గా అర్జున్ దేశ్వాల్ వ్యవహరిస్తారు. గత సీజన్లో తమిళ్ తలైవాస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. 22 మ్యాచ్ల్లో ఆ జట్టు కేవలం ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచి ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. తొమ్మిదో సీజన్ వేలంలో తమిళ్ తలైవాస్ రూ. 2 కోట్ల 26 లక్షలు చెల్లించి పవన్ను కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో పవన్ ఆడిన తొలి మ్యాచ్లోనే గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సీజన్ ముగిశాక పవన్ను తలైవస్ విడుదల చేయగా... తెలుగు టైటాన్స్ రూ. 2 కోట్ల 60 లక్షలు వెచ్చించి పవన్ను సొంతం చేసుకుంది. రెండు సీజన్లపాటు టైటాన్స్కు పవన్ ప్రాతినిధ్యం వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన పవన్ 2019 దక్షిణాసియా క్రీడల్లో, 2023 ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు కెప్టెన్గా అంకిత్ జగ్లాన్, వైస్ కెప్టెన్గా దీపక్ సింగ్... యూపీ యోధాస్ జట్టు కెప్టెన్గా సుమిత్ సాంగ్వాన్, వైస్ కెప్టెన్గా అశు సింగ్ నియమితులయ్యారు. -
సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్కు కొత్తగా మళ్లీ బెయిల్కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది. -
కెనడా అవుట్.. రేసులోకి భారత్.. ఆతిథ్య హక్కులు మనకే!
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను స్వదేశంలో నిర్వహించాలనే ఉద్దేశంతో వేసిన బిడ్ను భారత ఒలింపిక్ సంఘం (IOA) బుధవారం ఆమోదించనుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న భారత్... 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సైతం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వక్రీడలకు ముందు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించి మన సత్తా ప్రపంచానికి చాటాలనుకుంటోంది.ఇప్పటికే ఈ క్రీడలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నట్లు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యకు భారత్ వెల్లడించింది. అహ్మదాబాద్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 31 తుదిగడువు కాగా... దానికి ముందే ఫైనల్ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న భారత ఒలింపిక్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ఇతర అంశాలు సైతం సమావేశంలో చర్చకు రానున్నాయి.ఆతిథ్య రేసు నుంచి కెనడా అవుట్ఇక ఆతిథ్య రేసు నుంచి కెనడా తప్పుకోవడంతో... భారత్కే హక్కులు దక్కే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడు రోజుల పాటు అహ్మదాబాద్లో పర్యటించి వేదికలను పరిశీలించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించింది.ఈ నెలాఖరులో కామన్వెల్త్ గేమ్స్కు చెందిన మరో ప్రతినిధి బృందం భారత్ను సందర్శించనుంది. ఆతిథ్య హక్కుల ప్రకటన ఈ ఏడాది నవంబర్లో వెలువడే అవకాశాలున్నాయి. ‘కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు పలు అంశాలతో ముడిపడి ఉంటాయి. క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ సహకారం, నిర్ణయాల్లో స్థిరత్వం, ఆకర్షణ ఇలాంటివి కీలకం. 2030 కామన్వెల్త్ ఆతిథ్య హక్కులు భారత్కే దక్కుతాయనే నమ్మకముంది’ అని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు హర్పాల్ సింగ్ పేర్కొన్నారు. చదవండి: మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం -
అర్జున్–కీమెర్ ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’
చెన్నై: చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇతర గేముల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) 51 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై, అవండర్ లియాంగ్ (అమెరికా) 61 ఎత్తుల్లో ప్రణవ్ (భారత్)పై గెలిచారు. రే రాబ్సన్ (అమెరికా)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 123 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–అనీశ్ గిరి (నెదర్లాండ్స్) గేమ్ 109 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఆరో రౌండ్ తర్వాత కీమెర్ 4.5 అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్మాస్టర్,హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తొలి విజయం అందుకుంది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన ఆరో రౌండ్ గేమ్లో నల్ల పావులతో ఆడిన హారిక 80 ఎత్తుల్లో గెలిచింది. -
పార్లమెంట్లో క్రీడా బిల్లు పాస్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జాతీయ క్రీడా బిల్లు పాసయ్యింది. సోమవారం లోక్సభ ఆమోదించిన బిల్లును 24 గంటల్లోనే మోదీ సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును ఎగువ సభ ఆమోదించింది. అలాగే సవరించిన జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ రెండు బిల్లులను రాష్ట్రపతి నోటిఫై చేయగానే చట్టంగా మారతాయి. రాజ్యసభలో బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ ‘20 దేశాల్లో క్రీడా చట్టం అమలవుతోంది. ఈ 21వ శతాబ్దిలో మన దేశంలో క్రీడా చట్టం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం’ అని అన్నారు. అనంతరం బిల్లుపై దాదాపు 2 గంటలకు పైగానే చర్చ జరిగింది. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం క్రీడారంగంలో పారదర్శకత పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడం పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. చట్టరూపం దాల్చనున్న బిల్లు స్వరూపమిది... » ఈ బిల్లులో అత్యంత కీలకమైంది జాతీయ క్రీడల బోర్డు (ఎన్ఎస్బీ) ఏర్పాటు. జాతీయ సమాఖ్యలకు గుర్తింపు, లేదంటే రద్దులాంటి విశేషాధికారాలు బోర్డుకు ఉంటాయి. సకాలంలో ఎన్నికలు, సక్రమంగా జట్ల ఎంపికలు చేసేలా చూస్తుంది. బోర్డు గుర్తించిన సమాఖ్యలకే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. » కొత్త బిల్లు ప్రకారం జాతీయ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ కూడా ఏర్పాటు అవుతుంది. సమాఖ్యలో కుమ్ములాటలు, జట్ల ఎంపికల్లో వివాదాలను పరిష్కరించే అధికారం ఈ ట్రైబ్యునల్కే కల్పించారు. ఈ ట్రైబ్యునల్ తీర్పులపై కేవలం సుప్రీం కోర్టులోనే సవాలు చేసే అవకాశముంటుంది. దిగువ కోర్టుల్లో ఇకమీదట కేసుల విచారణ ఉండదు. » క్రీడా పాలకులు ఏళ్లతరబడి తిష్టవేసేందుకు వీలుండదు. అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు గరిష్టంగా 12 ఏళ్ల పాటు పదవుల్లో కొన సాగవచ్చు. కాగా గరిష్ట వయసును 70 నుంచి 75కు పెంచారు. అయితే సదరు సమాఖ్యకు సంబంధించిన అంతర్జాతీయ సమాఖ్య నియమావళికి లోబడే ఈ పరిమితి ఉంటుంది. -
స్వర్ణ పతకం వెనక్కి.. మూడేళ్ల నిషేధం కూడా!
న్యూఢిల్లీ: డోపింగ్ వ్యవహారంలో పట్టుబడిన పలువురు ఆటగాళ్లపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కొరడా ఝళిపించింది. వీరందరినీ మూడేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆటగాళ్లపై గతంలోనే నాలుగేళ్ల నిషేధం పడింది. అయితే ఈ ప్రకటన వచ్చిన 20 రోజుల్లోగా తమ తప్పును అంగీకరిస్తూ ముందుకు రావటంతో ‘నాడా’ చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక ఏడాది నిషేధం తగ్గింది.ఈ ఆటగాళ్లంతా స్టనొజొలోల్, మెటాండినోన్, నొరాన్డ్రోస్టెరాన్, మెఫంటర్మైన్వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లుగా పరీక్షల్లో తేలింది. నిషేధానికి గురైన ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు అథ్లెట్లు ఉన్నారు. ఈ ఏడాది డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల్లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన గగన్ దీప్ సింగ్పై వేటు పడింది. పోటీల్లో అతను సర్వీసెస్కు ప్రాతినిధ్యం వహించాడు.స్వర్ణం కూడా వెనక్కిఇక గగన్నుంచి స్వర్ణం కూడా వెనక్కి తీసుకోనుండగా... రెండో స్థానంలో నిలిచిన నిర్భయ్ సింగ్ (హరియాణా)కు ఇప్పుడు పసిడి పతకం దక్కుతుంది. మరో ఇద్దరు అథ్లెట్లు సచిన్ కుమార్, జైను కుమార్ కూడా నిషేధానికి గురయ్యారు. మోనికా చౌదరి, నందని వత్స్ (జూడో), ఉమేశ్పాల్ సింగ్, శామ్యూల్ వన్లల్తన్పుయ (పారా పవర్లిఫ్టింగ్), కవీందర్ (వెయిట్లిఫ్టింగ్), శుభమ్ కుమార్ (కబడ్డీ), ముగలి శర్మ (రెజ్లింగ్), అమన్, రాహుల్ తోమర్ (వుషు)పై కూడా ‘నాడా’ మూడేళ్ల వేటు వేసింది. -
కొత్త హెడ్కోచ్.. భారత జట్టు దశ మారేనా?.. పెను సవాళ్లకు సిద్ధం
మిడ్ఫీల్డర్గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఖాలిద్ జమీల్ తదనంతం కోచ్గా క్లబ్ జట్లపై ప్రభావం చూపాడు. అరకొర నిధులతో సరిపెట్టినా జట్టును మేటిగా నిలిపేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. అలా తక్కువ బడ్జెట్లో విజయవంతమైన కోచ్గా నిరూపించుకున్నాడు. అందుబాటులో ఉన్న రూ. 2 కోట్ల నిధులతో 2016–17 సీజన్ ఐ–లీగ్లో ఐజ్వాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)ని విజేతగా నిలబెట్టాడు. అదే విధంగా.. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, ముంబై ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్, జంషెడ్పూర్ ఎఫ్సీ క్లబ్లకు కోచ్గా సేవలందించాడు. ఇక ఐఎస్ఎల్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ప్లేఆఫ్కు చేర్చిన తొలి భారత కోచ్గా జమీల్దే ఘనత! తాజాగా మనొలో (స్పెయిన్) స్థానంలో భారత హెడ్ కోచ్గా నియమితుడైన 49 ఏళ్ల ఖాలిద్ తొలిసారిగా ఓ అంతర్జాతీయ జట్టుకు సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. జమీల్కు కలిసొచ్చిందిలా... చాలా ఏళ్లుగా క్లబ్, ఫ్రాంచైజీ జట్లకు కోచింగ్ ఇచ్చిన ఖాలిద్ జమీల్కు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి నియామకం. అయితే ఇదేమీ గాలివాటంగా రాలేదు. ఇండియా లీగ్ (ఐ–లీగ్)లో ప్లేయర్గా విజయవంతమయ్యాడు. 2005లో మహీంద్ర యునైటెడ్ విజేత జట్టు సభ్యుడైన జమీల్ తదనంతరం మేనేజర్గా ఐజ్వాల్ ఎఫ్సీ తరఫున కమాల్ చేశాడు. ఐజ్వాల్ను విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర ఖాలిద్దే!కేవలం పరిమిత నిధులతోనే తక్కువ బడ్జెట్లోనే జట్టును విజయపథాన నిలిపాడు. ఆ తర్వాత ముంబై ఎఫ్సీకి కోచ్గా వెళ్లాడు. తదనంతరం ఐఎస్ఎల్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ను సెమీఫైనల్ చేర్చిన కోచ్గా పేరు తెచ్చుకున్నాడు. జంషెడ్పూర్ ఎఫ్సీ కోచ్గాను పనిచేశాడు. టైటిళ్లు సాధించకపోయిన జట్టును సానబెట్టిన తీరుతో ఏఐఎఫ్ఎఫ్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’గా రెండు సీజన్లపాటు అవార్డు గెలుచుకున్నాడు. ఇవన్నీ కూడా టీమిండియా కోచ్ అయ్యేందుకు సోపానంలా పనిచేశాయి.అద్భుతాలు కాదు... కానీ! ఇప్పటికిప్పుడు జమీల్ నుంచి అద్భుతాలను ఆశించడమంటే అది అత్యాశే అవుతుంది. అయితే ఆచరణీయ సాధన సంపత్తితో జట్టును తీర్చిదిద్దుతాడని గత ఫలితాలను బట్టి చెప్పొచ్చు. స్వయంగా ప్లేయర్ అయిన ఖాలిద్ జట్టు లోటుపాట్లపై తక్షణం విశ్లేషించగలడు. డిఫెన్స్ వైఫల్యంతో ఇటీవల దిగువ ర్యాంక్ జట్లతోనూ ఓడిన భారత్ జట్టును ఓ మెట్టుపైనే నిలబెట్టేందుకు తన వంతు కృషి చేయగలడు. డిఫెన్స్, ఫార్వర్డ్లపై తనకున్న అపారమైన అనుభవం జట్టుకు మేలు చేస్తుంది.ముఖ్యంగా ఆటగాళ్లపై వ్యక్తిగత శ్రద్ద పెట్టి తీర్చిదిద్దే సామర్థ్యం అతనిలో ఉంది. సీనియర్లు, యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఫలితాలు సాధించే నైపుణ్యం జమీల్లో ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒక్క సిరీస్తో, ఒక్క ఏడాదితో జరిగేది కాదు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త కోచ్కు తగినంత సమయం ఇవ్వాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు చేరాలంటే మాత్రం ప్రణాళికబద్ధంగా శ్రమించాలి. కాబట్టి కోచ్గా కుదిరేందుకు, జట్టును మార్చేందుకు కచ్చితంగా సమయం పడుతుంది. పెను సవాళ్లకు సిద్ధం భారత కోచ్ పదవి కోసం సుమారు 170 మంది పోటీపడ్డారు. వీరిలో పేరున్న విదేశీ కోచ్లు కూడా ఉన్నారు. వారందరిని వెనక్కినెట్టిన ఖాలిద్ జమీల్ కొత్త హెడ్ కోచ్ అయ్యాడు. 2011–2012 తర్వాత స్వదేశీ కోచ్ ఈ బాధ్యతలు చేపట్టాడు. ఆ వెంటనే జమీల్ ముందున్న సవాళ్లపై దృష్టి పెట్టాడు. ఈ నెలలోనే సీఏఎఫ్ఏ నేషన్స్ కప్ జరుగనుంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే టోర్నీతో టీమిండియాకు అతని కోచింగ్ మొదలవుతుంది.తజికిస్తాన్తో జరిగే తొలిపోరులో భారత్ సాధించే సానుకూల ఫలితం అతన్ని ఆత్మవిశ్వాసంతో నడిపించనుంది. ఇటీవల హాంకాంగ్ చేతిలో 0–1తో ఓడిపోయిన భారత్... 2027 ఆసియా కప్ రేసులో ఉండాలంటే సింగపూర్తో తదుపరి జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. తద్వారా ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత్ ఎగబాకేందుకు అవకాశముంటుంది. ఇంటాబయటా జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లు, ఆసియా క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్ రాణించాలంటే వెంటనే చేయాల్సింది సమీక్ష ఆ తర్వాతే సన్నద్ధతపై పూర్తి అవగాహన వస్తుంది. తన శిష్యులకు కలిసొచ్చేనా... సుదీర్ఘ కాలంపాటు క్లబ్, ఫ్రాంచైజీ జట్లతో ఉన్న అనుబంధంతో ఎంతో మంది శిష్యులు జతయ్యారు. వీరిలో అపూయా రాల్తే, సందేశ్ జింగాన్, మో సనన్లతో ఖాలిద్కు చక్కని బంధమేర్పడింది. ఇప్పుడు వీరందరికి అనుకూలమైన కోచ్ రావడం కాస్త అనుకూలించనుంది. నార్త్ఈస్ట్, జంషెడ్పూర్, ముంబై ఎఫ్సీ ఇలా క్లబ్ జట్లలో విశేషంగా రాణించిన వారికి తప్పకుండా భారత జట్టులో చోటు లభిస్తుంది. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చే కోచ్ వల్ల తప్పకుండా కుర్రాళ్లకు కలిసిరానుంది. భారత జట్టు కోసం తన దృష్టిలో ఉన్న కోర్ గ్రూప్ ప్లేయర్లను సానబెడతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. తద్వారా జమీల్ జట్టులో తన ‘మార్క్’ చూపించే ప్రయత్నమైతే గట్టిగానే చేస్తాడు. -సాక్షి క్రీడా విభాగం -
2036 ఒలింపిక్స్ భారత్లో.. చర్చలు కొనసాగుతున్నాయన్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: 2036లో ఒలింపిక్స్ను నిర్వహించాలని ఆసక్తి కనబరుస్తున్న భారత్ ఈ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒలింపిక్ నిర్వహణా హక్కుల ప్రక్రియలో భాగంగా రెండో దశలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో తాము ‘నిరంతర చర్చలు’ కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్లో ఆప్ పార్టీ ఎంపీ గురీ్మత్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ‘ఒలింపిక్స్ నిర్వహణ బిడ్డింగ్ ప్రక్రియను పూర్తిగా భారత ఒలింపిక్ సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే తమ ఆసక్తిని కనబరుస్తూ ఐఓసీకి లెటర్ ఆఫ్ ఇన్టెంట్ను ఐఓఏ ఇచ్చింది. దీనిపై ఐఓసీలో భాగమైన ఆతిథ్య కమిషన్తో సంప్రదింపులు సాగుతున్నాయి. అయితే ఒకవేళ భారత్కు క్రీడలను కేటాయిస్తే వేదికలు ఏమిటనే విషయంపై ఇప్పుడే చర్చ అవసరం. మన దేశానికి ఒలింపిక్స్ను కేటాయించడమే అన్నింటికంటే ముఖ్యం’ అని మంత్రి స్పష్టం చేశారు. ఒలింపిక్స్ హక్కుల కేటాయింపులో రెండో దశ అయిన ‘కంటిన్యూయస్ డైలాగ్’లో బిడ్ వేసిన ఆయా దేశాల సన్నద్ధత, ఆర్ధిక పరిస్థితి, ఆ దేశంలో సాధ్యాసాధ్యాలపై ఐఓసీ ఒక అంచనాకు వస్తుంది. 2036 క్రీడల కోసం భారత్తో పాటు ఖతర్, టర్కీ కూడా పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ దశను ఐఓసీ నిలిపివేయడం గమనార్హం! ప్రస్తుత ఐఓసీ అధ్యక్షురాలు కిర్స్టీ కొవెంట్రీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ‘2028, 2032 క్రీడలతో పాటు 2030లో జరిగే వింటర్ గేమ్ ఆతిథ్య హక్కులు కూడా వరుసగా లాస్ ఏంజెలిస్, బ్రిస్బేన్, ఫ్రెంచ్ ఆల్ప్స్కు ఇప్పటికే ఇచ్చేశాం. ముందు వీటి నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో 2036 క్రీడల కేటాయింపు గురించి ఆలోచించడం అనవసరం. అందుకే డైలాగ్ ప్రక్రియను ఆపేస్తున్నాం. ఐఓసీ సభ్యులందరూ దీనికి మద్దతు పలికారు’ అని గత నెలలో కొవెంట్రీ స్పష్టం చేసింది. మరోవైపు భారత్లో ఫుట్బాల్ అధ్వాహ్న పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానిస్తూ... ‘ఈ విషయంలో భారత ఫుట్బాల్ సమాఖ్యదే పూర్తి బాధ్యత. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచన ప్రకారం వారు అన్ని అంశాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు’ అని చెప్పారు. -
రితిక ‘పసిడి’ పంచ్
బ్యాంకాక్: ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్షిప్ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. చివరిరోజు సోమవారం భారత్కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు లభించాయి. మహిళల ప్లస్ 80 కేజీల విభాగంలో రితిక భారత్కు పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో రితిక 4:1తో అసెల్ తొక్తాసియన్ (కజకిస్తాన్)పై గెలిచింది. ఫైనల్స్లో ఓడిన యాత్రి పటేల్ (57 కేజీలు), ప్రియ (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (ప్లస్ 90 కేజీలు) కూడా రజత పతకాలు సాధించారు. ఫైనల్స్లో బొల్తాయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో నీరజ్... ఖాలిమ్జన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఇషాన్ ఓడిపోయారు. -
National Sports Bill 2025: లోక్సభ ఆమోదం.. ఇందులో ఏముంది?
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు-2025 (National Sports Governance Bill)కి లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. అదే విధంగా.. జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లుకు కూడా ఈరోజే ఆమోదం లభించింది. అయితే, విపక్షాలు మాత్రం ఇందుకు సహకరించలేదు. అయినప్పటికీ నిరసనల నడుమే క్రీడా పరిపాలనా బిల్లుకు ఆమోదం లభించింది.అతిపెద్ద సంస్కరణ ఇదిఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడా రంగంలో ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుంది. క్రీడా సమాఖ్యలన్నీ అత్యుత్తమంగా పరిపాలన చేసేందుకు ఇది తోడ్పడుతుంది’’ అని పేర్కొన్నారు.స్పోర్ట్స్ ఎకోసిస్టమ్లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్న మాండవీయ.. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదంలో పాలు పంచుకోలేకపోయాయన్నారు. ‘‘1975లో మేము ఈ బిల్లుకు సంబంధించి తొలి డ్రాఫ్ట్ తయారుచేశాము. కానీ క్రీడలు కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయ రంగు పులుముకున్న కారణంగా ఇది సాధ్యం కాలేదు.అయితే, కొంతమంది మంత్రులు ఈ బిల్లును ప్రవేశపెట్టగలిగారు కానీ.. దీనికి ఆమోదం లభించేలా చేయలేకపోయారు. 2011లో మనకు జాతీయ స్పోర్ట్స్ కోడ్ వచ్చింది. దానిని బిల్లుగా మార్చేందుకు మేము కృషి చేశాం.అనంతరం క్యాబినెట్లో చర్చల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఇది పార్లమెంట్ వరకు చేరుకోలేకపోయింది. ఏదేమైనా నేనషల్ స్పోర్ట్స్ బిల్ గవర్నెన్స్ బిల్ ఒక సంచలనాత్మక మార్పునకు నాంది.అతి పెద్దదైన మన దేశంలో ఒలింపిక్స్లో, అంతర్జాతీయ స్థాయిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం నిజంగా విచారకరం. క్రీడా రంగ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది’’ అని మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు.ఇందులో ఏముంది?కాగా క్రీడా సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించడం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా సాధ్యమవుతుంది. రాజకీయ ఒత్తిడి, జోక్యం ఉండదని చెబుతున్నారు. స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా.. అథ్లెట్లు, ఆఫీస్ బేరర్లు, క్రీడా సమాఖ్యల మధ్య తగాదాలను త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆటగాళ్ల ఎంపిక ఉండేలా చూసుకుంటారు.జాతీయ క్రీడా సమాఖ్యలకు సంబంధించిన ఆడిట్లు సకాలంలో పూర్తి చేయడంతో పాటు.. నిధుల వినియోగానికి సంబంధించి పారదర్శకత ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. క్రీడా పరిపాలనా విభాగాన్ని మెరుగుపరచి, ఎవరి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టతనివ్వడం ద్వారా ఒలింపిక్స్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్లు నిర్వహించడం కాస్త సులువుగా మారుతుంది. అయితే, అన్నింటికీ మించి ఆటగాళ్లకు సురక్షిత వాతావరణం కల్పించడం.. అంటే.. అన్ని రకాల వేధింపుల నుంచి ఉపశమనం కలిగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.బీసీసీఐకి రిలీఫ్ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మాత్రం ఈ బిల్లులో ఉపశమనం లభించింది. బోర్డు వ్యవహారాల గురించి ఆర్టీఐ నుంచి సమాచారం కోరేందుకు మాత్రం అనుమతి ఉండదు. బీసీసీఐ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదు.. కాబట్టి అందుకే ఈ మేరకు మినహాయింపు ఇచ్చారని సమాచారం. అదే విధంగా.. అడ్మినిస్ట్రేటర్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బాడీ అనుమతించినట్లయితే.. 70- 75 ఏళ్ల వ్యక్తులు కూడా క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పాల్గొనవచ్చు.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు! -
బాక్సింగ్ రింగ్లో పెను విషాదం.. ఇద్దరు బాక్సర్ల మృతి
టోక్యోలోని (జపాన్) కొరాకుఎన్ హాల్లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఈవెంట్లో జరిగిన రెండు వేర్వేరు బౌట్లలో (మ్యాచ్లు) ఇద్దరు జపనీస్ బాక్సర్లు మృతి చెందారు. వీరిద్దరికి ఒకే రకమైన గాయాలు (బ్రెయిన్ ఇంజ్యూరీ) కావడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. మృతుల పేర్లు షిగెటోషి కొటారి, హిరోమాసా ఉరకావా. వీరిద్దరి వయసు కూడా 28 కావడం గమనార్హం. రోజు వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన బాక్సింగ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యువ బాక్సర్లు, ఒకే వయసు వాళ్లు, ఒకే ఈవెంట్లో, రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం క్రీడా ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. జపాన్ బాక్సింగ్ చరిత్రలో ఒకే ఈవెంట్లో పాల్గొన్న ఇద్దరు బాక్సర్లకు స్కల్ ఓపెన్ సర్జరీ (పుర్రెని ఓపెన్ చేసి మెదడుకు సర్జరీ) జరగడం ఇదే మొదటిసారి. ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు బాక్సింగ్ రింగ్ తరహాలోనే వీరోచితంగా పోరాడారు. అయితే చివరికి మరణమే వారిపై విజయం సాధించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. టోక్యోలోని కొరాకుఎన్ హాల్లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్లో సూపర్ ఫెథర్ వెయిట్ విభాగంలో కొటారి, లైట్ హెవి వెయిట్ విభాగంలో హిరోమాసా పోటీ పడ్డారు. ఆగస్ట్ 2న జరిగిన బౌట్లో కొటారి జపాన్కే చెందిన యమోటా హటాతో 12 రౌండ్ల పాటు పోరాడి బౌట్ను డ్రా చేసుకున్నాడు. అయితే పోటీ ముగిసిన వెంటనే కొటారి స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కొటారి తలకు తీవ్ర గాయాలైనట్లు (మెదడులో రక్తం గడ్డ కట్టింది) డాక్టర్లు గుర్తించారు. వెంటనే బ్రెయిన్ సర్జరీ చేయగా.. కొటారి మృత్యువుతో పోరాడి ఆగస్ట్ 8న తది శ్వాస విడిచాడు.ఈ విషాద ఘటన నుంచి తేరుకోకముందే ఇదే ఈవెంట్లో పాల్గొన్న హిరోమాసా ఆగస్ట్ 9న ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్ట్ 2నే జరిగిన పోటీలో హిరోమాసా యోజీ సైటోతో 8 రౌండ్ల పాటు పోరాడి ఓడాడు. పోటీ సందర్భంగా తలకు తీవ్ర గాయాలు కావడంతో హిరోమాసాను ఆసుపత్రికి తరలించారు. కొటారి మృతికి గత కారణాలే (మెడదులో రక్తం గడ్డ కట్టడం) హిరోమాసా మరణానికి కూడా కారణమయ్యాయి. కొటారి తుది శ్వాస విడిచిన మరుసటి రోజే హిరోమాసా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద మరణాలు బాక్సింగ్ ప్రపంచాన్ని కుదిపేశాయి. -
2006 తర్వాత...
యాంగాన్ (మయన్మార్): భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టుతో స్ఫూర్తి పొందిన భారత జూనియర్ మహిళల జట్టు అద్భుతం చేసింది. 2006 తర్వాత ఆసియా కప్ అండర్–20 మహిళల టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం ముగిసిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాలుగు జట్లు పోటీపడ్డ గ్రూప్ ‘డి’లో టీమిండియా రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో ఏడు పాయింట్లు సాధించి టాపర్గా నిలిచి ఆసియా కప్ బెర్త్ను సంపాదించింది. 2026 ఆసియా కప్ అండర్–20 టోర్నీ థాయ్లాండ్లో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా మయన్మార్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 27వ నిమిషంలో పూజ చేసిన గోల్తో ఖాతా తెరిచిన టీమిండియా నిర్ణీత సమయం పూర్తయ్యే వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని అందుకుంది. తొలి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం చలాయించగా... రెండో అర్ధభాగంలో మయన్మార్ ఆకట్టుకుంది. నేహా, షిబాని దేవి సమన్వయంతో ముందుకు దూసుకెళ్లడంతో ఆట మూడో నిమిషంలో భారత్ గోల్ చేసినంత పని చేసింది. మరోవైపు మయన్మార్ ఫార్వర్డ్ సు సు ఖిన్ తొమ్మిదో నిమిషంలో ఎదురుదాడికి దిగినా ఫినిషింగ్ లోపంతో గోల్ చేయలేకపోయింది. 27వ నిమిషంలో కుడి వైపు నుంచి మయన్మార్ గోల్ పోస్ట్ వైపునకు దూసుకెళ్లిన పూజ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్ బోణీ కొట్టింది. రెండో అర్ధభాగంలో మాత్రం సొంత ప్రేక్షకులు ఉత్సాహపరుస్తుండగా మయన్మార్ తమ దాడుల్లో పదును పెంచింది. పలుమార్లు భారత గోల్పోస్ట్ వైపు దూసుకొచ్చింది. కానీ టీమిండియా గోల్కీపర్ మోనాలీసా దేవి సదా అప్రమత్తంగా ఉంటూ మయన్మార్ జట్టు ఆశలను వమ్ము చేసింది. ఈ మ్యాచ్కంటే ముందు భారత్... ఇండోనేసియాతో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకొని ... తుర్క్మెనిస్తాన్ జట్టుపై 7–0తో గెలిచింది. చివరిసారి భారత జట్టు 2006లో జరిగిన ఆసియా కప్ అండర్–20 టోర్నీలో పోటీపడి ఒక్క మ్యాచ్లోనూ నెగ్గకుండానే లీగ్ దశలోనే వెనుదిరిగింది. 25 వేల డాలర్ల నజరానారెండు దశాబ్దాల తర్వాత ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించిన భారత మహిళల జట్టుకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నజరానా ప్రకటించింది. జట్టు మొత్తానికి 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 88 వేలు) అందజేస్తామని తెలిపింది. -
కష్టాల్లో క్లబ్ ఫుట్బాల్!
న్యూఢిల్లీ: దేశంలోని అగ్రశ్రేణి ఫుట్బాల్ టోర్నమెంట్... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా క్లబ్ ఫుట్బాల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అఖిల భారత ఫుట్బాట్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే అన్నారు. ఈ కఠిన పరిస్థితులను అధిగమించడానికి సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. 2010లో ఏఐఎఫ్ఎఫ్ చేసుకున్న మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్ఏ) పునరుద్ధరణపై అనిశ్చితి కారణంగా 2025–26 ఐఎస్ఎల్ సీజన్ను నిలిపేయాల్సి వచ్చింది. లీగ్ నిర్వాహకుల నిర్ణయం అనంతరం ఐఎస్ఎల్లోని మూడు క్లబ్లు తమ జట్టు కార్యకలాపాలను ఆపేశాయి. ఇందులో భాగంగా ఆటగాళ్లు, సిబ్బందికి వేతనాలు సైతం నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కల్యాణ్ చౌబే మాట్లాడుతూ... ‘సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామన్నది నిజమే. స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది ఈ పరిస్థితిని సృష్టించారు. అయితే సమష్టి కృషితోనే దీన్ని దాటి ముందుకు సాగగలమనే నమ్మకముంది’ అని 1999 నుంచి 2006 వరకు భారత సీనియర్ జట్టుకు గోల్కీపర్గా వ్యవహరించిన కల్యాణ్ చౌబే అన్నారు. క్లబ్ సీఈవోలతో చర్చలు విఫలం భారత ఫుట్బాల్లోని ప్రస్తుత పరిస్థితిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని ఐఎస్ఎల్లోని 11 క్లబ్లు కోరడంపై కల్యాణ్ చౌబే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏఐఎఫ్ఎఫ్ తమ అభ్యర్థనపై చర్య తీసుకోకపోతే స్వతంత్రంగా న్యాయ సహాయం కోరడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఐఎస్ఎల్ క్లబ్లు ఒక లేఖలో పేర్కొన్నాయి. మొత్తం 13 క్లబ్లలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ మినహా మిగిలిన 11 జట్లు దానిపై సంతకం చేశాయి. క్లబ్ సీఈవోలతో చర్చించిన మరుసటి రోజే ఈ లేఖ వెలుగు చూడటం ఆశ్చర్యపరిచిందని కల్యాణ్ అన్నారు. ‘ఈనెల 7న ఢిల్లీలో 13 క్లబ్ల సీఈవోలతో జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించాం. అయితే మరుసటి రోజే 11 క్లబ్లు లేఖ రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ సమాచార లోపాన్ని నివారించి ఉండాల్సింది. ఏదేమైనా దేశంలో ఫుట్బాల్ అభివృద్ధికి ఏఐఎఫ్ఎఫ్ కట్టుబడి ఉంది. ఆటకు ఏది మంచిదో అది చేసేందుకు సదా సిద్ధంగా ఉంటాం. దీనిపై న్యాయ సలహా తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ఆ తర్వాత తిరిగి క్లబ్ల సీఈవోలతో భేటీ అవుతాం. ఈ నెల 17 తర్వాత మరోసారి సమావేశమవుతాం. క్లబ్ల ఆదాయ మార్గాలు పెంపొందించేందుకు ప్రణాళికలు రచించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నాం. తక్షణం తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 5 అంశాల అజెండాను రూపొందిస్తున్నాం’ అని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. సొంతంగా ఐఎస్ఎల్ సాధ్యమా.. మాస్టర్స్ రైట్స్ అగ్రిమెంట్ పునరుద్ధరణ అంశంలో అనిశ్చితి నెలకొనడంతో... ఐఎస్ఎల్ లీగ్ను సొంతంగా నిర్వహించే అంశాన్ని కూడా ఏఐఎఫ్ఎఫ్ పరిశీలిస్తోంది. ‘ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేం లేదు. అయితే అన్ని దారులు తెరిచే ఉన్నాయి. వాటాదారులతో చర్చిస్తున్నాం. ఎంఆర్ఏ పునరుద్ధరణ అంశంలో ఆలస్యం జరిగింది. దేశంలో ఫుట్బాల్ అభివృద్ధి కోసం ఎలాంటి సమావేశానికి అయినా ఫుట్బాల్ సమాఖ్య సదా సిద్ధంగా ఉంటుంది. ఐఎస్ఎల్తో దేశంలో ఫుట్బాల్ మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయనేది ముమ్మాటికి నిజం. మైదానాలు, ఆటగాళ్ల జీతాలు, విదేశీ ప్లేయర్ల సూచనలు, ప్రముఖ కోచ్ల మార్గనిర్దేశం, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, సినీ రంగ ప్రముఖుల ప్రమేయం ఇలా అన్నీ అంశాల్లో భారత ఫుట్బాల్లో గణనీయమైన మార్పుకు ఈ లీగ్ కారణమైంది. దీంతో భారత ఫుట్బాల్ బ్రాండ్ విలువ పెరిగింది. ఈ సహకారం ఇలాగే కొనసాగుతూ... యువ నైపుణ్యాన్ని సరైన పద్ధతిలో వినియోగిస్తే వచ్చే పదేళ్లలో భారత జాతీయ జట్టు ర్యాంకింగ్ మెరుగవడం ఖాయమే’ అని 48 ఏళ్ల కల్యాణ్ అన్నారు. ర్యాంకింగ్స్లో మెరుగవ్వాలంటే... గత నెల విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత పురుషుల జట్టు 133వ స్థానంలో నిలిచింది. తొమ్మిదేళ్లలో మన జట్టుకు ఇదే అత్యల్ప ర్యాంకు. ఇటీవలి కాలంలో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తుండటంతో ఆరు స్థానాలు కోల్పోవాల్సి వచి్చంది. దీనిపై కల్యాణ్ స్పందిస్తూ... ‘అంతర్జాతీయ మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే ర్యాంకింగ్స్లో పురోగతి ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్ విధానం కూడా కాస్త సంక్లిష్టమైంది. ఆడిన మ్యాచ్లు, ప్రత్యర్థి ర్యాంక్ల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2023లో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న సమయంలో మన జట్టు 106వ ర్యాంక్ నుంచి 99వ స్థానానికి చేరింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత 133వ ర్యాంక్లో నిలిచింది. ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్ వంటి బలమైన జట్ల చేతిలో ఓడటంతో ర్యాంకింగ్స్పై అధిక ప్రభావం చూపింది. అయితే ఆటగాళ్లపై విశ్వాసం కోల్పోము. సీఏఎఫ్ఏ నేషన్స్ కప్, ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మన జట్టు మెరుగైన ఆటతీరు కనబరుస్తుందనే నమ్మకముంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్ వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో భారత్ 143వ ర్యాంక్తో ప్రారంభించింది. ఆ తర్వాత అత్యల్పంగా 173వ స్థానానికి పడిపోయింది. 1996లో అత్యుత్తమంగా 94వ ర్యాంక్లో నిలిచింది. ఐఎస్ఎల్ ద్వారా దేశంలో క్లబ్ క్రికెట్కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆసియాలో అత్యధిక మంది వీక్షించిన ఫుట్బాల్ టోర్నీ ఐఎస్ఎల్నే. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఐఎస్ఎల్ ఫలాలు జాతీయ జట్టుకు అందడం లేదు. కానీ కష్టం ఎప్పటికే వృథా పోదు. దాని ప్రభావం టీమిండియాపై కనిపించే రోజులు ఎక్కువ దూరంలో లేవు’ అని కల్యాణ్ వివరించారు. -
భారత మహిళల రగ్బీ జట్టుకు కాంస్యం
రాజ్గిర్ (బిహార్): ఆసియా రగ్బీ మహిళల అండర్–20 సెవెన్–ఎ–సైడ్ టోర్నమెంట్లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం బిహార్లోని రాజ్గిర్లో ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో 12–5 పాయింట్ల తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టును ఓడించింది. భారత జట్టు తరఫున భూమిక శుక్లా 7 పాయింట్లు, గురియా కుమారి 5 పాయింట్లు స్కోరు చేశారు. ఉజ్బెకిస్తాన్ తరఫున హుల్కర్ ఒలెమ్బెర్గనోవా 5 పాయింట్లు సాధించింది.అంతకుముందు లీగ్ దశలో భారత జట్టు కజకిస్తాన్, యూఈఏ జట్లపై గెలిచి హాంకాంగ్ చేతిలో ఓడిపోయి తమ గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన హాంకాంగ్ తొలి స్థానంలో నిలిచి భారత్తోపాటు సెమీఫైనల్ చేరుకుంది. మరో గ్రూప్ నుంచి చైనా, ఉజ్బెకిస్తాన్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్స్లో భారత్ 7–28తో చైనా చేతిలో, ఉజ్బెకిస్తాన్ 5–24తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయాయి. ఫైనల్లో చైనా 29–21తో హాంకాంగ్ను ఓడించి చాంపియన్గా అవతరించింది. -
చరిత్ర పుటల్లో రమేశ్
చెన్నై: ఆసియా సర్ఫింగ్ చాంపియన్షిప్లో భారత యువ సర్ఫర్ రమేశ్ బుధియాల్ కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల ఓపెన్ విభాగంలో ఫైనల్కు చేరిన తొలి భారత సర్ఫర్గా చరిత్ర సృష్టించిన రమేశ్ కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఓపెన్ పురుషుల కేటగిరీ ఫైనల్లో రమేశ్ 12.60 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కనోవా హీజే 15.17 పాయింట్లతో పసిడి పతకం గెలుచుకోగా... పజార్ అరియానా (14.57 పాయింట్లు; ఇండోనేసియా) రజతం దక్కించుకున్నాడు. మహిళల ఓపెన్ విభాగంలో జపాన్కు చెందిన అన్రి మసునో (14.90 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా... సుమోమో సటో (13.70 పాయింట్లు; జపాన్), ఇసాబెల్ హిగ్స్ (11.76 పాయింట్లు; థాయ్లాండ్) వరుసగా రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు. ఐదేళ్ల ప్రాయం నుంచే... కేరళలోని కోవలంకు చెందిన 24 ఏళ్ల రమేశ్ బుధియాల్... ఐదేళ్ల ప్రాయం నుంచే అలలపై తేలియాడే క్రీడలో ఆరితేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించకపోగా... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ముందడుగు వేశాడు. ప్రాణాంతక క్రీడ కావడంతో కుటుంబ సభ్యులు ప్రోత్సాహించకపోగా... తన నైపుణ్యంపై విశ్వాసమున్న రమేశ్ ఎనిమిదో తరగతిలో చదువుకు స్వస్తి చెప్పి సర్ఫింగ్నే సర్వస్వంగా సాధన ప్రారంభించాడు. అతడి కష్టానికి తాజాగా ఆసియా సర్ఫింగ్ చాంపియన్షిప్లో ఫలితం దక్కింది. ఈ టోర్నమెంట్ ఫైనల్కు చేరిన తొలి భారతీయుడిగా నిలిచిన అనంతరం రమేశ్ మాట్లాడుతూ... ‘నా కెరీర్లో ఇదే అతిపెద్ద ఘనత. ఆసియా క్రీడలకు ముందు ఇది నాలో ఆత్మవిశ్వాసం నింపింది. ఈ టోర్నీ భారత్లో జరగడంతో మరింత మెరుగైన ప్రదర్శన చేయగలిగా. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తా’ అని పేర్కొన్నాడు. రమేశ్ తండ్రి మృతిచెందగా... తల్లి కోవలం తీరప్రాంతంలో ఓ చిన్న హస్తకళల దుకాణం నిర్వహిస్తోంది. -
ముస్కాన్, నిషా, రాహుల్లకు స్వర్ణ పతకాలు
బ్యాంకాక్: ఆసియా అండర్–19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 14 పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో మహిళా బాక్సర్లవే తొమ్మిది పతకాలు ఉండటం విశేషం. ముస్కాన్ (57 కేజీలు), నిషా (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... ఆర్తి కుమారి (75 కేజీలు), కృతిక వాసన్ (80 కేజీలు), ప్రాచీ టోకస్ (ప్లస్ 80 కేజీలు), వినీ (60 కేజీలు), నిషా (65 కేజీలు) రజత పతకాలు గెలిచారు. యశిక (51 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్స్లో ముస్కాన్ 3:2తో అయజాన్ ఎర్మెక్ (కజకిస్తాన్)పై, నిషా 4:1తో సిరుయ్ యాంగ్ (చైనా)పై నెగ్గారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాహుల్ కుందు బంగారు పతకాన్ని సాధించాడు. ఫైనల్లో రాహుల్ 4:1తో యాకుబోవెక్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఫైనల్లో ఓడిన మౌజమ్ సుహాగ్ (65 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (90 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. శివమ్ (55 కేజీలు), గౌరవ్ (85 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
రాణించిన నిత్య
భువనేశ్వర్: వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి నిత్య గంధె ఆకట్టుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన నిత్య... 200 మీటర్ల విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 100 మీటర్ల ఫైనల్ రేసును నిత్య 11.70 సెకన్లలో ముగించింది. అభినయ (భారత్) 11.57 సెకన్లతో అగ్రస్థానంలో నిలువగా... స్నేహ (భారత్) 11.70 సెకన్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. నిత్య, స్నేహ ఒకే సమయం నమోదు చేసినా ఫొటో ఫినిష్ ద్వారా స్నేహకు రెండో స్థానాన్ని ఖరారు చేశారు. 200 మీటర్ల ఫైనల్ రేసును నిత్య 24.11 సెకన్లలో పూర్తి చేసింది. ఏంజెల్ సిల్వియా (భారత్; 23.95 సెకన్లు) తొలి స్థానంలో, ఉన్నతి అయ్యప్ప (భారత్) 24.56 సెకన్లు మూడో స్థానంలో నిలిచారు. కాంటినెంటల్ టూర్ మీట్లలో విజేతలకు పతకాలకు బదులుగా ప్రైజ్మనీ చెక్లు అందజేశారు. తొలి స్థానం పొందిన వారికి 800 డాలర్లు (రూ. 70 వేలు), రెండో స్థానం దక్కించుకున్న వారికి 400 డాలర్లు (రూ. 35 వేలు), మూడో స్థానంలో నిలిచిన వారికి 300 డాలర్లు (రూ. 26 వేలు), నాలుగో స్థానం సంపాదించిన వారికి 200 డాలర్ల (రూ.17 వేలు) చొప్పున ప్రదానం చేశారు. పురుషుల 200 మీటర్లలో అనికుశ్ కుజుర్ (భారత్; 20.77 సెకన్లు)... లాంగ్జంప్లో మురళీ శ్రీశంకర్ (భారత్; 8.13 మీటర్లు), ట్రిపుల్ జంప్లో అబుబాకర్ (భారత్; 16.53 మీటర్లు).. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (భారత్; 62.01 మీటర్లు)... లాంగ్జంప్లో శైలి సింగ్ (భారత్; 6.28 మీటర్లు) అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. -
అర్జున్కు తొలి పరాజయం
చెన్నై: క్వాంట్బాక్స్ చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్కు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో అర్జున్ 70 ఎత్తుల్లో భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ నిహాల్ సరీన్ చేతిలో ఓడిపోయాడు. మరో గేమ్లో కార్తికేయన్ మురళీ (భారత్) 46 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. రే రాబ్సన్ (అమెరికా) –అవండర్ లియాంగ్ (అమెరికా) గేమ్ 26 ఎత్తుల్లో ... విదిత్ (భారత్)–ప్రణవ్ (భారత్) గేమ్ 86 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–విన్సెంట్ కీమెర్ (జర్మనీ) గేమ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్మాస్టర్, హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో ఓటమిని చవిచూసింది. భారత్కే చెందిన లియోన్ ల్యూక్తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో హారిక 59 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆధిబన్ (భారత్)–ప్రాణేశ్ (భారత్) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇతర గేముల్లో దీప్తాయన్ ఘోష్ (భారత్) 76 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ఇనియన్ (భారత్) 45 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై, అభిమన్యు పురాణిక్ (భారత్) 43 ఎత్తుల్లో వైశాలి (భారత్)పై విజయం సాధించారు. -
‘నా కల... ప్రపంచకప్లో ఆడటం’
గువాహటి: ‘ఫిఫా’ ప్రపంచకప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగడం తన కల అని భారత మహిళల ఫుట్బాల్ జట్టు స్టార్ ప్లేయర్ మనీషా కల్యాణ్ పేర్కొంది. ఇటీవల చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న భారత మహిళల ఫుట్బాల్ జట్టు వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరగనున్న ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. దీంతో భవిష్యత్తులో ఒలింపిక్స్, ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనగలమనే నమ్మకం పెరిగిందని మనీషా వెల్లడించింది. శుక్రవారం గువాహటిలో జరిగిన ‘అస్మిత’ అండర్–13 బాలికల లీగ్ ప్రారంభోత్సవంలో మనీషా పాల్గొంది. ఈ సందర్భంగా 23 ఏళ్ల మనీషా మాట్లాడుతూ... ‘యంగ్ప్లేయర్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు ‘అస్మిత’ఒక్క చక్కటి వేదిక. వరల్డ్కప్లో పాల్గొనాలనేది నా చిరకాల కల. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరగనున్న ఆసియా కప్నకు అర్హత సాధించడంతో ఆ దిశగా మరింత నమ్మకం పెరిగింది’ అని పేర్కొంది. మారుమూల ప్రాంతాల పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు ‘అస్మిత’ తోడ్పడుతోందని వెల్లడించింది. అస్మిత గువాహటి లెగ్ పోటీల్లో 8 జట్లు పాల్గొంటుండగా... మనీషా ప్లేయర్లతో కాసేపు సరదాగా ఫుట్బాల్ ఆడింది. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) చాంపియన్స్ లీగ్లో పాల్గొన్న ఏకైక భారత మహిళా ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన మనీషా... ‘అస్మిత’వంటి వేదికతో యువ ఆటగాళ్లకు నాణ్యమైన మ్యాచ్లు ఆడే అవకాశం దక్కుతుందని చెప్పింది. ‘అస్మిత’ లీగ్ ద్వారా వెలుగులోకి వచి్చన రేఖ కటాకీ, డొసోమి రోటియాను మనీషా ప్రత్యేకంగా అభినందించింది. ‘ఈశాన్య రాష్ట్రాల ప్రజల రక్తంలోనే ఫుట్బాల్ ఉంది. స్టార్ ప్లేయర్ బాలాదేవి ఆట చూస్తూ పెరిగాను. ప్రస్తుత భారత మహిళల ఫుట్బాల్ జట్టులో 11 మంది ఈశాన్య రాష్ట్రాల ప్లేయర్లు ఉన్నారు. ఇక్కడి ప్లేయర్లలో ఎంత నైపుణ్యం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో ఐదేళ్లలో ఈ చిన్నారుల్లో నుంచి కూడా కొందరు రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించవచ్చు. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుంది. ఫిట్నెస్, నైపుణ్యం పెంపొందించుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వ సహకారంతో ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా మౌలిక వసతులు పెరుగుతున్నాయి. దీంతో మరింత మంది వెలుగులోకి వస్తున్నారు’ అని మనీషా వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల ఆటలకు ప్రాధన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం... తాజా ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో వాటిని చేర్చింది. ఈ పరిణామాన్ని మనీషా ఆహ్వానించింది. దీనివల్ల కేవలం ఫుట్బాల్కు కాకుండా... మిగిలిన ఆటలకు కూడా ఆదరణ పెరుగుతందని వెల్లడించింది. -
సెమీస్లో హరియాణా, ఛత్తీస్గఢ్
సాక్షి, కాకినాడ: జూనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్షి ప్లో హరియాణా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా 4–1తో ఒడిశాపై ఘనవిజయం సాధించింది. హరియాణా జట్టులో కాజల్ (2వ ని.), సుప్రియా (27వ ని.), శశి ఖాస (36వ ని.), సాది (60వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఒడిశా తరఫున నమోదైన ఏకైక గోల్ను అమిషా ఎక్కా 47వ నిమిషంలో సాధించింది. ఛత్తీస్గఢ్ 2–1తో పెనాల్టీ షూటౌట్లో మధ్య ప్రదేశ్పై గెలిచింది. నిర్ణీత సమయంలో ఛత్తీస్గఢ్ నుంచి యశోద (2వ ని.), మధ్యప్రదేశ్ తరఫున హుడా ఖాన్ (15వ ని.) గోల్ చేయడంతో 1–1తో డ్రా అయింది. మరో క్వార్టర్స్లో జార్ఖండ్ 3–1తో పంజాబ్ను ఓడించింది. పంజాబ్ జట్టులో పవన్ప్రీత్ కౌర్ (6వ ని.) గోల్ చేయగా, జార్ఖండ్ జట్టులో స్వీటి డంగ్డంగ్ (7వ ని), శాంతి కుమారి (22వ ని.), రోషిణి ఐంద్ (46వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఆఖరి క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్ 2–1తో మహారాష్ట్రపై నెగ్గింది. యూపీ తరఫున సల్లు పుఖ్రంబమ్ (36వ ని.), రష్మీ పటేల్ (55వ ని.) చెరో గోల్ చేయగా, మహారాష్ట్ర జట్టులో దీక్షా షిండే (45వ ని.) ఒక గోల్ సాధించింది. -
మురళీ శ్రీశంకర్పై భారత్ ఆశలు
భువనేశ్వర్: సొంతగడ్డపై తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ పోటీల్లో భారత అథ్లెట్లు అన్ను రాణి, మురళీ శ్రీశంకర్, అనిమేశ్ కుజుర్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. నేడు ఒక రోజు మాత్రమే జరిగే ఈ తృతీయ శ్రేణి ఈవెంట్లో 15 దేశాలకు చెందిన 150 పైచిలుకు అథ్లెట్లు ఇందులో పోటీపడుతున్నారు. టోర్నీ ప్రైజ్మనీ 25,000 డాలర్లు (రూ.21.89 లక్షలు) కాగా... కళింగ స్టేడియంలో ఆదివారం పోటీలు నిర్వహిస్తారు. లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్ వరుస విజయాలతో జోరుమీదున్నాడు. ఇదే పట్టుదలను ఇక్కడా కొనసాగిస్తే మరో విజయం ఖాయమవుతుంది. ఈ సీజన్లో మెరుగైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచిన 2023 ఆసియా క్రీడల చాంపియన్, జావెలిన్ త్రోయర్ అన్ను రాణి... స్వర్ణంపై కన్నేసింది. ఇటీవలే పోలండ్లో జరిగిన మీట్లో ఆమె 62.59 మీటర్ల దూరంలో ఈటెను విసిరింది. టోక్యో ప్రపంచ చాంపియన్íÙప్ లక్ష్యంగా తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకుంటున్న అన్ను మరోమారు 60 ప్లస్ మీటర్ల ప్రదర్శనను కనబరచాలని ఆశిస్తోంది. భువనేశ్వర్లోని వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తన ప్రదర్శన మరింత మెరుగవుతుందని ఆమె భావిస్తోంది. వచ్చే నెల టోక్యోలో జరిగే ఈవెంట్లో ప్రపంచ టాప్ 36 జావెలిన్ త్రోయర్లు అర్హత సాధిస్తారు. అయితే ఇప్పటికే 64 మీటర్ల క్వాలిఫికేషన్ మార్క్తో 11 మంది అథ్లెట్లు అర్హత పొందారు. ఇక మిగతా 25 మంది జావెలిన్ త్రోయర్లు ప్రపంచ ర్యాంకింగ్, ప్రదర్శన ద్వారా అర్హత సాధిస్తారు. ఈ నెల 24న జపాన్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్తో ఆ 25 మంది అథ్లెట్ల బెర్తులు ఖాయమవుతాయి. భారత స్ప్రింటర్ అనిమేశ్ కుజూర్ 200 మీటర్ల పరుగు పందెంలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 42వ స్థానంలో ఉన్న కుజూర్ కూడా టోక్యో బెర్తుపై గంపెడాశలతో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ స్ప్రింటర్ నేడు జరిగే ఈవెంట్లో 20.16 సెకన్ల టైమింగ్ నమోదు చేస్తే గనక నేరుగా టోక్యో పోటీలకు అర్హత సంపాదిస్తాడు. మహిళా లాంగ్జంపర్లు శైలీ సింగ్, అన్సీ సోజన్లతో పాటు మొహమ్మద్ అఫ్జల్ (800 మీ. పరుగు), సచిన్ యాదవ్ (జావెలిన్ త్రో), శ్రీలంకకు చెందిన సుమేద రణసింఘే (జావెలిన్ త్రో), రుమేశ్ తరంగ (జావెలిన్ త్రో) ఈ పోటీల బరిలో ఉన్నారు. -
చాంపియన్ పంజాబ్
చెన్నై: జాతీయ సబ్ జూనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్లో పంజాబ్ జట్టు చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్ 4–3 గోల్స్ తేడాతో జార్ఖండ్ జట్టును ఓడించింది. తొలి క్వార్టర్లో రెండు జట్లు ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్లో జార్ఖండ్ దూకుడు పెంచి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 21వ నిమిషంలో ఆశిష్ గోల్తో ఖాతా తెరిచిన జార్ఖండ్... 24వ నిమిషంలో అనీశ్ డుంగ్డుంగ్ గోల్తో 2–0తో ముందంజ వేసింది. అయితే పంజాబ్ కూడా తగ్గేదేలే అన్నట్లు ఆడింది. నిమిషం తేడాలో రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. 29వ నిమిషంలో అక్షిత్ సలారియా గోల్తో బోణీ కొట్టిన పంజాబ్, 30వ నిమిషంలో వరీందర్ సింగ్ గోల్తో స్కోరును సమం చేసింది. 42వ నిమిషంలో సుఖు గురియా గోల్తో జార్ఖండ్ 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు నిమిషాల తర్వాత మన్దీప్ సింగ్ (45వ నిమిషంలో) గోల్తో పంజాబ్ స్కోరును 3–3తో సమం చేసింది. మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా మన్దీప్ సింగ్ (53వ నిమిషంలో) గోల్ చేసి పంజాబ్కు 4–3తో ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పంజాబ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని టైటిల్ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన కాంస్య పతక పోరులో ఉత్తరప్రదేశ్ 5–3 గోల్స్ తేడాతో మధ్యప్రదేశ్ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. -
మూడో రౌండ్లో అర్జున్ గెలుపు
చెన్నై: తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ నిలకడైన ప్రదర్శనతో మూడో రౌండ్ గేమ్లో విజయం సాధించాడు. దీంతో చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ‘మాస్టర్స్’ కేటగిరీలో భారత ఆటగాడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన గేమ్లో అర్జున్... అమెరికా గ్రాండ్మాస్టర్ రే రాబ్సన్ను కంగుతినిపించాడు. ఆరంభం నుంచే దీటైన పైఎత్తులు వేస్తూ వచి్చన అర్జున్ గెలిచేదాకా పట్టుదల కనబరిచాడు. అమెరికా గ్రాండ్మాస్టర్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పావులు కదిపాడు. ఇదే జోరుతో అర్జున్ 46 ఎత్తుల్లో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. తొలిరౌండ్లో గెలిచిన తెలంగాణ ఆటగాడు రెండో రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ఒక్కడే రెండో స్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు రౌండ్లూ గెలిచిన జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్ (3) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో రౌండ్లో కీమర్... కార్తీకేయన్ మురళీపై గెలుపొందాడు. మిగతా భారత ఆటగాళ్లలో గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతి కీలకమైన విజయాన్ని సాధించాడు. సహచరుడు నిహాల్ శరిన్ (0.5)పై విదిత్ (1.5) గెలుపొందాడు. అతనికిది మొదటి విజయం కాగా... భారత యువ ఆటగాడు వి.ప్రణవ్ మూడో రౌండ్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీ టాప్ సీడ్, గ్రాండ్మాస్టర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)ను ఆద్యంతం నిలువరించాడు. దీంతో డచ్ ఆటగాడు డ్రా చేసుకోక తప్పలేదు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి. హారిక గేమ్ డ్రా ఇక్కడే జరుగుతున్న చెన్నై గ్రాండ్మాస్టర్స్ ‘చాలెంజర్స్’ టోర్నీలో హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఆధిబన్ భాస్కరన్తో జరిగిన మూడో రౌండ్ గేమ్ను హారిక డ్రా చేసుకుంది. ఆర్. వైశాలికి లియోన్ ల్యూక్ (భారత్) చేతిలో చుక్కెదురైంది. అభిమన్యు పురాణిక్... హర్షవర్ధన్పై, ప్రాణేశ్... ఇనియన్పై గెలుపొందారు. ఆర్యన్ చోప్రా, దీప్తాయన్ ఘోష్ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది -
రిషభ్ యాదవ్కు కాంస్యం
చెంగ్డూ (చైనా): భారత యువ ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. ప్రపంచ క్రీడల్లో శనివారం జరిగిన పోటీల్లో మిగతా ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో జరిగిన కాంస్య పతక పోరులో 22 ఏళ్ల రిషభ్ 149–147 స్కోరుతో భారత సీనియర్ సహచరుడు అభిషేక్ వర్మపై గెలుపొందాడు. తొలి సెట్లో కచి్చతమైన గురితో పదికి పది పాయింట్లు సాధించడంతో రిషభ్ 30–29తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండు, మూడు సెట్లలో ఇద్దరు 29–29, 30–30 స్కోర్లు చేశారు. మళ్లీ నాలుగో సెట్లో రిషభ్ గురి అదరడంతో 30–29 స్కోరు సాధించాడు. దీంతో మొత్తం 119–117తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆఖరి సెట్లో ఇద్దరు 30–30 స్కోరు సాధించడంతో రిషభ్కు పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో అతను 145–147తో రెండు పాయింట్ల తేడాతో అమెరికన్ ఆర్చర్ కుర్టిస్ లి బ్రాడ్నాక్స్ చేతిలో ఓడిపోగా, అభిషేక్ వర్మ 145–148తో టాప్ సీడ్ మైక్ ష్లోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ పోటీల్లో భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 12వ సీడ్ పర్నిత్ కౌర్ 140–145తో కొలంబియాకు చెందిన నాలుగో సీడ్ అలెజాండ్రా వుస్క్వియానో చేతిలో, మూడో సీడ్ మధుర ధమన్గొంకర్ 145–149తో ఆరో సీడ్ లీసెల్ జాట్మా (ఈస్తోనియా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన అభిషేక్ వర్మ–మధుర జోడీ నిరాశపరిచింది. అనూహ్యంగా తొలిరౌండ్లోనే భారత ద్వయం 151–154తో దక్షిణ కొరియాకు చెందిన మూన్ యియున్–లీ వున్హో చేతిలో కంగుతింది. మిక్స్డ్ రికర్వ్లో భారత జోడీలు బరిలోకి దిగలేదు. -
చరిత్ర సృష్టించిన రమేశ్
చెన్నై: అలలపై తేలియాడే సర్ఫింగ్లో రమేశ్ బుధియాల్ చరిత్ర సృష్టించాడు. ఆసియా సర్ఫింగ్ చాంపియన్షిప్ ఓపెన్ మెన్స్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారత సర్ఫర్గా రమేశ్ రికార్డుల్లోకెక్కాడు. శనివారం సెమీఫైనల్లో రమేశ్ 11.43 పాయింట్లు సాధించి రెండో స్థానంతో తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇండోనేసియాకు చెందిన పజర్ అరియానా 13.83 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో రమేశ్ 14.84 పాయింట్లతో ఫిలిప్పిన్స్ సర్ఫర్ నీల్ సాంచెస్ (12.80 పాయింట్లు) వెనక్కి నెట్టి ముందంజ వేశాడు. భారత్కు చెందిన కిషోర్ కుమార్ కూడా సెమీఫైనల్కు చేరగా... అతడు 8.03 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. మరో భారత సర్ఫర్ శ్రీకాంత్ క్వార్టర్స్లో పోరాడి ఓడాడు. అండర్–18 ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసింది. ఈ విభాగంలో హరీశ్, ఆద్య సింగ్, దమయంతి శ్రీరామ్ క్వార్టర్స్లో పరాజయం పాలై ఇంటిబాట పట్టారు. -
వీనస్ విలియమ్స్ అవుట్
సిన్సినాటి (ఒహాయో): గత నెల టెన్నిస్ సర్క్యూట్లోకి పునరాగమనం చేసిన అమెరికన్ దిగ్గజం వీనస్ విలియమ్స్కు సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె 4–6, 4–6తో స్పెయిన్కు చెందిన బౌజస్ మనీరో చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూసింది.ఈ ఏడాది ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన వీనస్ సన్నాహకంగా ఈ హార్డ్కోర్ట్ టెన్నిస్ టోర్నీలో ఆడింది. 7 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్లు, 14 డబుల్స్ టైటిళ్లు నెగ్గిన అమెరికన్ వెటరన్ స్టార్కు స్వదేశంలోని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 45 ఏళ్ల అమెరికన్ నాలుగు (వింబుల్డన్–2000, 2001; యూఎస్ ఓపెన్ 2000, 2001) గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచేనాటికి బౌజస్ మనీరో పుట్టనేలేదు.తాజాగా 51 ర్యాంకర్ మనీరో వరుస సెట్లలోనే ఓ దిగ్గజ ప్లేయర్కు ఇంటిదారి చూపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత 22 ఏళ్ల స్పెయిన్ అమ్మాయి నిజంగానే అద్భుతంగా ఆడిందని వీనస్ కితాబు ఇచ్చింది. సిన్సినాటిలో ఆమె బరిలోకి దిగడం ఇది 11వ సారి! టైటిల్ గెలవనప్పటికీ 2012లో సెమీస్, 2019లో క్వార్టర్స్ చేరింది. ఈ నెల 19 నుంచి జరిగే యూఎస్ ఓపెన్లో వీనస్ సింగిల్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్ బరిలోనూ దిగుతోంది. మిక్స్డ్లో సహచర క్రీడాకారుడు రీలి ఒపెల్కాతో జతకట్టింది.సూపర్ షెల్టన్టొరంటో: అమెరికా రైజింగ్ టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ తన కెరీర్లోనే గొప్ప టైటిల్ సాధించాడు. నేషనల్ బ్యాంక్ ఓపెన్ టొరంటో ఏటీపీ మాస్టర్స్–1000 టోరీ్నలో ప్రపంచ ఆరో ర్యాంకర్ షెల్టన్ విజేతగా నిలిచాడు.ఫైనల్లో షెల్టన్ 6–7 (5/7), 6–4, 7–6 (7/3)తో ప్రపంచ 12వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో షెల్టన్ 16 ఏస్లు సంధించి, 6 డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. విజేత షెల్టన్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 84 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టోర్నీ నిర్వహణపై సందిగ్దం.. సమస్యను ‘సుప్రీం’ దృష్టికి తీసుకురండి!
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎస్) ఫుట్బాల్ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐఎస్ఎల్ జట్ల యాజమాన్యాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. దీని సత్వర పరిష్కారానికి తగిన చర్య తీసుకోవాలని వారు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను కోరుతున్నారు. ఈ క్రమంలో ఐఎస్ఎల్ తాజా పరిస్థితిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.మొత్తం 13 క్లబ్లలో మోహన్బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ మినహా మిగతా 11 క్లబ్ల ప్రతినిధులు ఏఐఎఫ్ఎఫ్కు రాసిన లేఖపై సంతకం చేశారు. ఐఎస్ఎల్ నిర్వహణ హక్కులు ఉన్న ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)కు, ఏఐఎఫ్ఎఫ్కు మధ్య 2010లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఏడాది డిసెంబర్లో ముగిసే ఈ ఎంఓయూను పునరుద్ధరించుకునే విషయంలో స్పష్టత రాకపోవడంతో టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఎఫ్ఎస్డీఎల్ ప్రకటించింది.ఈ ఒప్పంద పునరుద్ధరణ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఎంఓయూ కుదుర్చుకోరాదని సుప్రీం ఇప్పటికే ఆదేశించింది. న్యాయపరంగా ఎంఓయూలో తాము భాగం కాదు కాబట్టి నేరుగా ఈ కేసులో జోక్యం చేసుకోలేకపోతున్నామని... సుప్రీం కోర్టులో సమస్యను వివరించి ఫుట్బాల్ను కాపాడమంటూ ఐఎస్ఎల్ టీమ్లు విజ్ఞప్తి చేశాయి.‘న్యాయపరమైన చిక్కులు ఇప్పుడు భారత ఫుట్బాల్ను బాగా నష్టపరుస్తున్నాయి. ఐఎస్ఎల్ క్లబ్లలో పెట్టుబడులు, వాణిజ్యపరమైన కాంట్రాక్ట్లు గందరగోళంలో పడటంతో ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర భాగస్వాముల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. దీని వల్ల దేశంలో ఆట ఆగిపోతుంది. కాబట్టి సుప్రీం దృష్టికి దీనిని తీసుకురండి’ అని ఐఎస్ఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఐఎస్ఎల్ భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా చెన్నై, బెంగళూరు జట్ల యాజమాన్యాలు కూడా ఇప్పటికే తమ సిబ్బందికి జీతాలు ఆపేయడంతో పాటు టీమ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశాయి. -
తొలిసారి రెండేళ్ల నిషేధం... రెండోసారి జీవితకాలం!
న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్య ఆటగాళ్లు తమ వయసును తప్పుగా చూపించడం. నకిలీ వయోధ్రువీకరణ పత్రాలతో ఎంతోమంది ఇతర వయోవిభాగాల పోటీల్లో పాల్గొని వాటి ద్వారా ప్రయోజనం పొందారు. వైద్యపరీక్షల్లో అప్పుడప్పుడు ఇలాంటి కేసులు కొన్ని పట్టుబడినా... కఠినమైన శిక్షలు లేక అందరూ బయటపడిపోయారు. అయితే ఇప్పుడు దీనిని నిలువరించేందుకు ప్రభుత్వం ‘ఎన్సీఏఏఎఫ్ఎస్’ పేరుతో కొత్తగా నేషనల్ కోడ్ను తీసుకువస్తోంది.ఈ కోడ్కు సంబంధించిన ముసాయిదాను గత మార్చిలోనే రూపొందించిన ప్రభుత్వం... ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు కోరింది. అనంతరం వయో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కేంద్ర క్రీడా శాఖ వద్ద తమ పేరును నమోదు చేసుకున్న ఆటగాడు ఎవరైనా బర్త్ సర్టిఫికెట్, ఆధార్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. వీటి విశ్వసనీయతను స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పరీక్షిస్తుంది.అంతా బాగుంటే ఈ పుట్టిన తేదీనే శాశ్వతంగా రికార్డుల్లోకి చేరుస్తారు. ఆటగాడి కెరీర్ ముగిసే వరకు ఇదే తేదీ ప్రామాణికంగా మారుతుంది. ఆటగాడు తన వయసును తప్పుగా చూపించాడని తేలితే మొదటిసారి రెండేళ్ల నిషేధాన్ని విధిస్తారు.రెండోసారి కూడా ఇదే తప్పు చేసినట్లు తేలితే జీవితకాల నిషేధం విధించి భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు కూడా నమోదు చేస్తారు. ఇప్పటికే రిజిస్టర్ అయిన ఆటగాళ్లలో ఎవరైనా తమ వయసును తప్పుగా నమోదు చేసి ఉంటే... కోడ్ అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా స్వచ్ఛందంగా తామే చెప్పి దానిని సరి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
విక్టరీ విక్టోరియాదే...
మాంట్రియల్: తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడిస్తూ... సంచలన ప్రదర్శన చేసిన కెనడా టెన్నిస్ టీనేజర్ విక్టోరియా ఎంబోకో... మాంట్రియల్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో అద్భుతమైన ‘ఫినిషింగ్’ ఇచ్చింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన 18 ఏళ్ల ఎంబోకో చివరకు చాంపియన్గా అవతరించి ఔరా అనిపించింది. ఈ టోర్నీకి ముందు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్లో ఒక్క టైటిల్ నెగ్గని ఎంబోకో... గ్రాండ్స్లామ్ తర్వాతి స్థాయి టోర్నీగా పరిగణించే డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోర్నీనే మొదటి టైటిల్గా గెల్చుకోవడం విశేషం.ప్రపంచ మాజీ నంబర్వన్, నాలుగు గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, 49వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్)తో జరిగిన ఫైనల్లో విక్టోరియా ఎంబోకో 2–6, 6–4, 6–1తో గెలిచింది. విజేత ఎంబోకోకు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 58 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ ఒసాకా ఖాతాలో 3,91,600 డాలర్లు (రూ. 3 కోట్ల 42 లక్షలు) చేరాయి. టైటిల్ నెగ్గిన క్రమంలో ఎంబోకో తొలి రౌండ్లో ప్రపంచ 79వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (అమెరికా)పై, రెండో రౌండ్లో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 27వ ర్యాంకర్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, మూడో రౌండ్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, 2023 యూఎస్ ఓపెన్, 2025 ఫ్రెంచ్ ఓపెన్ విజేత కోకో గాఫ్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 51వ ర్యాంకర్ జెస్సికా మనీరో (స్పెయిన్)పై, సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, 2022 వింబుల్డన్ విజేత ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. ఈ టోర్నీకి ముందు 85వ ర్యాంక్లో ఉన్న ఎంబోకో తాజా టైటిల్తో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్లో 60 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్కు చేరుకోనుంది. ఫాయె అర్బన్ (1969లో), బియాంక ఆండ్రెస్కు (2019లో) తర్వాత మాంట్రియల్ ఓపెన్ టైటిల్ సాధించిన మూడో కెనడా ప్లేయర్గా ఎంబోకో గుర్తింపు పొందింది. మరియా షరపోవా (రష్యా; 2011లో సిన్సినాటి ఓపెన్), బియాంక ఆండ్రెస్కు (కెనడా; 2019లో ఇండియన్ వెల్స్ ఓపెన్) తర్వాత... ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచిన మూడో ప్లేయర్గా ఎంబోకో ఘనత సాధించింది. -
మేటి జట్టుతో ఆడినపుడే...
బెంగళూరు: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో తలపడితే లోపాలు సవరించుకొని మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 29 నుంచి రాజ్గిర్ వేదికగా పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా... అంతకుముందు భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తోంది. ఈ టూర్లో భాగంగా పెర్త్లోని హాకీ స్టేడియంలో ఆతిథ్య ఆ్రస్టేలియాతో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడనుంది. దీని కోసం శుక్రవారం బెంగళూరు నుంచి జట్టు ఆ్రస్టేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా వంటి బలమైన ప్రత్యర్థితో వారి సొంతగడ్డపై మ్యాచ్లు ఆడటం సవాలుతో కూడుకున్నది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఇలాంటి క్లిష్టమైన సిరీస్ ఆడనుండటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేమంతా ఇలాంటి సన్నద్ధతే కోరుకున్నాం. ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. బలమైన ప్రత్యర్థితో తలపడినప్పుడే మన లోపాలు బయటపడతాయి. వాటిని ఎలా అధిగమించాలో మార్గాలు వెతికి మరింత మెరుగైన ప్రదర్శన చేయవచ్చు. జట్టు మొత్తం సమష్టిగా రాణించాలని భావిస్తున్నాం. ఈ సన్నద్ధత ఆసియా కప్లో తప్పక ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. ఆగస్టు 15, 16, 19, 21న పెర్త్లో భారత్, ఆ్రస్టేలియా మధ్య హాకీ మ్యాచ్లు జరగనున్నాయి. ప్రదర్శన ఆధారంగా ఆసియాకప్ తుది జట్టు కూర్పు ఉండనుంది. మెరుగైన ఆటతీరు కనబర్చిన ప్లేయర్లనే ఆసియాకప్నకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుత జట్టులో అటు అనుభవజ్ఞు, ఇటు యువకులు ఉండటంతో... ఆ్రస్టేలియాపై వారి ఆటతీరును అంచనా వేసిన తర్వాతే ఆసియాకప్నకు జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటిన జట్టు వరల్డ్కప్నకు నేరుగా అర్హత సాధించనుంది. -
అర్జున్ గేమ్ ‘డ్రా’
చెన్నై: చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ‘మాస్టర్స్’ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)తో శుక్రవారం జరిగిన రెండో రౌండ్ గేమ్ను అర్జున్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్ వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. భారత గ్రాండ్మాస్టర్ వి.ప్రణవ్తో జరిగిన రెండో రౌండ్ గేమ్లో కీమెర్ 46 ఎత్తుల్లో గెలిచాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన గేమ్లో అమెరికా ప్లేయర్ రే రాబ్సన్ 54 ఎత్తుల్లో విజయం సాధించాడు. కార్తికేయన్ మురళీ (భారత్)–లియాంగ్ (అమెరికా) గేమ్ 42 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–నిహాల్ సరీన్ (భారత్) గేమ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. హారిక ఓటమి ఇదే వేదికపై జరుగుతున్న చెన్నై గ్రాండ్మాస్టర్స్ ‘చాలెంజర్స్’ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్, హైదరాబాద్కు చెందిన ద్రోణవల్లి హారిక వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. భారత్కే చెందిన ఇనియన్తో జరిగిన రెండో రౌండ్ గేమ్లో హారిక 39 ఎత్తుల్లో ఓడిపోయింది. అభిమన్యు పురాణిక్ (భారత్) 48 ఎత్తుల్లో లియోన్ ల్యూక్ (భారత్)పై గెలిచాడు. వైశాలి (భారత్)–ఆధిబన్ (భారత్) గేమ్ 36 ఎత్తుల్లో... ప్రాణేశ్ (భారత్)–దీప్తాయన్ ఘోష్ (భారత్) గేమ్ 29 ఎత్తుల్లో... ఆర్యన్ చోప్రా (భారత్)–హర్షవర్ధన్ (భారత్) గేమ్ 21 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
ఫిట్నెస్ ఉంటేనే ఏదైనా సాధ్యం
న్యూఢిల్లీ: ఆటలో కొత్తగా వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ... ఫిట్నెస్ కాపాడుకోవడం ద్వారానే ఇంకా జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నానని మన్ప్రీత్ సింగ్ అన్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన జాబితాలో మన్ప్రీత్ 402 మ్యాచ్లతో రెండో స్థానంలో ఉండగా... మాజీ కెప్టెన్ , ప్రస్తుత హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ 412 మ్యాచ్లాడి అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలోనే టిర్కీని దాటేయనున్న మన్ప్రీత్... ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించాడు. కఠినమైన సాధనతో పాటు కఠోరమైన ఆహార నియమాలతో ఫిట్నెస్ను కాపాడుకుంటున్నట్లు వెల్లడించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన మన్ప్రీత్... 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 32 ఏళ్ల మన్ప్రీత్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి... 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్ను పొడిగించాలంటే ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. జట్టులోకి ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. వారితో పోటీపడి రేసులో నిలవాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. అనుభవం మంచిదే కానీ, కేవలం అనుభవంతో జాతీయ జట్టులో కొనసాగే పరిస్థితి లేదు. టాలెంట్తో పాటు వేగం కూడా అవసరం. శరీరాకృతిని కాపాడుకునేందుకు కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నా. తీపి పదార్థాలు తినడం పూర్తిగా మానేయడంతో పాటు జంక్ఫుడ్కు స్వస్తి చెప్పా. ‘లో–కార్బ్’ డైట్ ఫాలో అవుతున్నా. వారంలో ఒక్కసారి చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్వీట్స్ తీసుకుంటున్నా. కసరత్తులు కూడా క్రమపద్ధతిలో చేస్తున్నా. దీని వల్ల ఏడు కిలోల బరువు తగ్గా. ఆ మార్పు మైదానంలో స్పష్టంగా కనిపిస్తుంది. బరువు తగ్గిన తర్వాత వేగం పెరిగింది. యోయో పరీక్షల్లోనూ ఎంతో మెరుగయ్యా. అందుకే ఇక ముందు కూడా దీన్నే కొనసాగించాలనుకుంటున్నా. క్రిస్టియానో రొనాల్డో నాకు స్ఫూర్తి... 19 ఏళ్ల వయసులో 2011లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. అప్పటి నుంచి అంతే ఉత్సాహంతో ఆడుతున్నా. గత రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత జట్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా 2020 టోక్యో ఒలింపిక్స్లో నా కెప్టెన్సీలో భారత జట్టు 41 ఏళ్ల తర్వాత పతకం గెలవడం ఎప్పటికీ మరచిపోలేనిది. 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్ గురించి ఇప్పటినుంచి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించా. ఇదే ఫిట్నెస్ కొనసాగిస్తే అది పెద్ద కష్టం కాదు. నేను ఫిట్గా లేనని అనుకుంటే తక్షణమే తప్పుకొని మరో ఆటగాడికి జట్టులో అవకాశమిస్తా. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభిమానిస్తా. అతడు నలభై ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్గా ఉంటాడు. అతడే నాకు స్ఫూర్తి. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా... దీన్ని మరింత పొడిగించేందకు నిరంతరం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నా. ప్రతి మ్యాచ్ ఆడాలనుకుంటా... ప్రస్తుత భారత జట్టు నైపుణ్యం, ఫిట్నెస్, తీవ్రత విషయంలో అగ్రజట్లకు ఏమాత్రం తీసిపోదు. టోక్యో ఒలింపిక్స్ ముందు నుంచే ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, జర్మనీ వంటి జట్లపై నిలకడగా విజయాలు సాధిస్తున్నాం. అయితే వ్యూహాలను అమలు చేసే విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరముంది. మేం దానిపై దృష్టి సారించాం. జాతీయ జట్టు, భారత్ ‘ఎ’, భారత్ అండర్–19 ఇలా ఎందరో ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. యువ ఆటగాళ్లకు కూడా అవకాశాలు లభిస్తాయి. వర్క్లోడ్ నిర్వహణను జాగ్రత్తగా చూసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ప్రతిఒక్కరికీ రాదు. అలాంటి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోను. నా వరకైతే జాతీయ జట్టు ఆడే ప్రతి మ్యాచ్లో నేను ఉండాలనుకుంటా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది. టోర్నమెంట్ అనంతరం తిరిగి ఎలా కోలుకోవాలో తెలుసు. దానిపై దృష్టి పెట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటా అంతేకాని మ్యాచ్లకు దూరంగా ఉండాలని అనుకోను. హాకీ వరల్డ్కప్లో సత్తా చాటుతాం... వచ్చే ఏడాది జరగనున్న హాకీ ప్రపంచకప్నకు భారత జట్టు అర్హత సాధించడం ఖాయమే. 1975లో జరిగిన టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచింది. 2023లో భువనేశ్వర్ వేదికగా జరిగిన మెగా టోరీ్నలో ఆతిథ్య భారత జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్కు ముందు 41 ఏళ్లుగా విశ్వక్రీడల్లో మన ప్రదర్శన నామమాత్రమే. అలాంటి ఒక సందర్భం వస్తుంది. ఈసారి ప్రపంచకప్లో మెరుగైన ఆటతీరు కనబరుస్తాం. గత వరల్డ్కప్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆధునిక హాకీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు. ఎవరు ఎవరినైనా ఓడించవచ్చు. ఒలింపిక్స్లో జర్మనీపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. అనూహ్య ఫలితాలు అంటూ ఏమీ ఉండవు. మా వరకైతే ప్రత్యర్థుల గురించి పట్టించుకోము... మా బలాలను పెంచుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో వరస పరాజయాలు ఎదురైన మాట వాస్తవమే. అయితే ఓడిన మ్యాచ్ల్లో సైతం మేం ఎంతో పోరాడాం. చివరి నిమిషంలో ప్రత్యరి్థకి ఆధిక్యం సమర్పించుకునే అలవాటును దూరం చేసుకోవాల్సి ఉంది. డిఫెన్స్లో మరింత రాటుదేలుతాం. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల సిరీస్ యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష కానుంది. -
11 మంది రెజ్లర్లపై వేటు
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కన్నెర్ర చేసింది. 11 మంది రెజ్లర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. కొందరు రెజ్లర్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) జారీ చేసినట్లుగా నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో వయో విభాగాల టోర్నీలో పాల్గొనేందుకు చూస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టగా కొందరు కావాలని పుట్టిన ఏడాదిలోపు కాకుండా చాలా ఆలస్యంగా ఎంసీడీలో జనన నమోదు చేస్తున్నారు. తద్వారా తక్కువ వయస్సు విభాగంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. విచారణలో జనన నమోదు చేసుకున్న వారిలో కొందరు ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారని తేలడంతో డబ్ల్యూఎఫ్ఐ 11 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. సక్ష్యం, మనుజ్, కవిత, అన్షు, అరుశ్ రాణా, శుభమ్, గౌతమ్, జగ్రూప్ ధన్కర్, నకుల్, దుష్యంత్, సిద్ధార్థ్ బలియాన్లపై నిషేధం విధించారు. ప్రత్యేకించి రెజ్లింగ్లో రెండు రకాల నకిలీ పత్రాలు సమాఖ్యకు తలనొప్పిగా మారాయి. ఇందులో మొదటిది తప్పుడు వయో ధ్రువీకరణ కాగా... రెండోది ఒక ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్రాలతో స్థానికత నిబంధనకు విరుద్ధంగా పోటీపడటం. హరియాణాలో రెజ్లింగ్కు విపరీతమైన పోటీ ఉంటుంది. కుప్పలుతెప్పలుగా ఉన్న అఖాడాల నుంచి వందల సంఖ్యలో రెజ్లర్లు తయారవుతారు. కానీ వీరంతా జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే రాష్ట్రం తరఫున గట్టి పోటీ ఉంటుంది. చాలామందికి అవకాశాలు రావు. దీంతో హరియాణా రెజ్లర్లు పక్క రాష్ట్రాలకు చెందిన రెజ్లర్లుగా నకిలీ పత్రాలు సృష్టించి పోటీల్లో పాల్గొంటారు. ప్రతి క్రీడలోనూ వయో విభాగాలు, జూనియర్ టోర్నీల్లో నకిలీ సరి్టఫికెట్ల బెడద వేధిస్తోంది. దీనివల్ల అర్హులైన పిన్న వయసు్కలు నష్టపోతున్నారు. క్రీడా శాఖకు రెజ్లర్ తండ్రి ఫిర్యాదు హరియాణాకు చెందిన ఇషిక రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఢిల్లీ తరఫున పోటీపడింది. దీనిపై ఢిల్లీ రెజ్లర్ రితిక తండ్రి నీరజ్ కుమార్ కేంద్ర క్రీడాశాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. స్థానికత నిబంధనలకు విరుధ్దంగా ఇషికను 53 కేజీల కేటగిరీలో ఢిల్లీ తరఫున పోటీపడేందుకు అనుమతించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇషిక నివాస ధ్రువీకరణ పత్రాలను ఆ ఫిర్యాదుకు జతచేసినట్లు ఆయన చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు. -
చైనా చేతిలో భారత్ పరాజయం
జిద్దా (సౌదీ అరేబియా): ఆసియా కప్ పురుషుల బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో భారత్ 69–100 పాయింట్ల తేడాతో చైనా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. తొలి క్వార్టర్లో భారత్ 14 పాయింట్లు, చైనా 29 పాయింట్లు... రెండో క్వార్టర్లో భారత్ 17 పాయింట్లు, చైనా 24 పాయింట్లు... మూడో క్వార్టర్లో భారత్ 17 పాయింట్లు, చైనా 22 పాయింట్లు... చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ 21 పాయింట్లు, చైనా 25 పాయింట్లు స్కోరు చేశాయి. భారత్ తరఫున అరవింద్ ముత్తు కృష్ణన్ 16 పాయింట్లు, సహజ్ సెఖోన్ 14 పాయింట్లు, ప్రణవ్ ప్రిన్స్ 14 పాయింట్లు సాధించారు. చైనా తరఫున మింగ్జువాన్ జు, జియాజి జావో 17 పాయింట్ల చొప్పున... షుయెపెంగ్ చెంగ్, జున్జీ వాంగ్ 13 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. నాలుగు జట్లను గ్రూప్ ‘సి’లో రెండు మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను శనివారం ఆతిథ్య సౌదీ అరేబియాతో ఆడుతుంది. -
ఏడు స్థానాలు ఎగబాకి...
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా ఏడు స్థానాలు ఎగబాకి 63వ ర్యాంక్లో నిలిచింది. గత రెండేళ్లలో భారత జట్టుకిదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. 2023 ఆగస్టులో టీమిండియా 61వ స్థానంలో నిలిచింది. 2013లో భారత జట్టు తమ అత్యుత్తమ ర్యాంక్ (49)ను అందుకుంది. థాయ్లాండ్లో ఇటీవల జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. భారత్... మంగోలియాపై 13–0తో... 4–0తో తిమోర్ లెస్టెపై, 5–0తో ఇరాక్పై, చివరి మ్యాచ్లో 2–1తో థాయ్లాండ్పై గెలిచింది. ‘టాప్’ ర్యాంక్లో స్పెయిన్ మరోవైపు యూరోపియన్ టోర్నీలో రన్నరప్గా నిలిచిన స్పెయిన్ జట్టు వరల్డ్ నంబర్వన్గా అవతరించింది. ‘టాప్’ ర్యాంక్లో ఉన్న అమెరికాను స్పెయిన్ రెండో స్థానానికి నెట్టేసింది. స్వీడన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్కు చేరుకోగా... యూరోపియన్ టైటిల్ నిలబెట్టుకున్న ఇంగ్లండ్ ఒక స్థానం పురోగతి సాధించి నాలుగో ర్యాంక్లో నిలిచింది. -
వెలుగులు విరజిమ్మిన వృక్షం
క్రీడల నిర్వహణలోనే కాదు... పోటీల ప్రారంబోత్సవంలో కూడా అంచనాలకు మించి అద్భుతాలను చూపించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా 12వ వరల్డ్ గేమ్స్ సందర్భంగా ఇది మరోసారి కనిపించింది. చైనాలోని చెంగ్డూలో గురువారం మొదలైన ఈ పోటీలు ఆగస్టు 17 వరకు జరుగనున్నాయి. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తమ చరిత్ర, సంస్కృతి తెలిపే వివిధ ఘట్టాలను చైనా ప్రేక్షకుల ముందు ఉంచింది. వీటిలో బాణాసంచాతో ప్రత్యేకంగా రూపొందించిన వెలుగులు విరజిమ్మే చెట్టు ఆకారాన్ని ప్రదర్శించడం హైలైట్గా నిలిచింది. శాంతి, స్నేహానికి ప్రతిరూపంగా చెంగ్డూలోని మ్యూజియంలో ఉన్న ‘ట్రీ ఆఫ్ ఫ్రెండ్షిప్’ను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ చెట్టును ప్రదర్శించారు. ఈ 12వ వరల్డ్ గేమ్స్లో 116 దేశాలకు చెందిన 3,942 మంది అథ్లెట్లు 34 క్రీడాంశాల్లో పోటీ పడుతుండగా... ఆర్చరీలో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. -
నోర్ముయ్... చెప్పింది చెయ్!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో దేశప్రతిష్టను ఇనుమడింప చేసిన స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్కు ఓ క్రీడా సమాఖ్య డైరెక్టర్ నుంచి వివక్ష ఎదురైంది. దీన్ని ఏమాత్రం సహించని ఆమె ఫిర్యాదు చేయడంతో భారత ఒలింపిక్ సంఘం, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణ చేపట్టాయి. గత నెలలో జూమ్ మీటింగ్ (ఆన్లైన్) జరిగింది. ఇందులో బాక్సర్ల లవ్లీనాతో పాటు భారత బాక్సింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ అరుణ్ మలిక్, పలువురు ‘సాయ్’, టాప్స్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఆన్లైన్ మీటింగ్లో లవ్లీనా తన వ్యక్తిగత కోచ్ను కూడా శిబిరాలకు తనతో పాటు అనుమతించాలని కోరింది. దీనిపై అరుణ్ మలిక్ వివక్షాపూరిత ధోరణితో వ్యవహరించాడని లవ్లీనా వాపోయింది. ‘ఆయన చాలా కోపంగా మాట్లాడారు. నోర్ముయ్. తలదించుకొని మేం చెప్పింది చెయ్ అంతే అని తీవ్రస్థాయిలో స్పందించడం నన్ను లింగ వివక్షకు గురి చేసింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ఏం మాట్లాడాలో కూడా పాలుపోలేదు. కొన్ని క్షణాలపాటు షాక్లోనే కూరుకుపోయాను. ఆయన పురుషాధిక్య ధోరణితో మహిళనైనా నన్ను తక్కువ చేసి మాట్లాడారు. ఇది నన్ను అవమానించడం కాదు. మహిళా అథ్లెట్ల పట్టుదలని అవమానించడమే’ అని లవ్లీనా... క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఫిర్యాదు చేయడంతో ఐఓఏ, సాయ్ విచారణ చేపట్టాయి. 2 వారాల్లోనే దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది. మరోవైపు అరుణ్ లలిక్ మాట్లాడుతూ లవ్లీనా అరోపణలు అసత్యమని అన్నారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నిబంధనల ప్రకారమే వ్యవహరించానని చెప్పారు. జాతీయ శిబిరాల్లో వ్యక్తిగత కోచ్లకు అనుమతించడం కుదరదని సున్నితంగానే చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. -
అర్జున్ శుభారంభం
చెన్నై: క్వాంట్బాక్స్ చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన మాస్టర్స్ కేటగిరీ తొలి రౌండ్ గేమ్లో తెల్ల పావులతో ఆడిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 49 ఎత్తుల్లో అవండర్ లియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్ర యువజన క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తొలి ఎత్తు వేసి అర్జున్–లియాంగ్ గేమ్ను ప్రారంభించారు. ప్రణవ్ (భారత్)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 44 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–రే రాబ్సన్ (అమెరికా) గేమ్ 59 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... విన్సెంట్ కీమెర్ (జర్మనీ) 52 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై విజయం సాధించాడు. ‘మాస్టర్స్’ కేటగిరీలో పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. హారిక పరాజయం మరోవైపు ఇదే వేదికపై జరుగుతన్న చెన్నై గ్రాండ్మాస్టర్స్ చాలెంజర్స్ టోర్నీని హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక పరాజయంతో ప్రారంభించింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ దీప్తాయన్ ఘోష్తో జరిగిన తొలి గేమ్లో హారిక 44 ఎత్తుల్లో ఓడిపోయింది. ఇతర గేముల్లో లియోన్ ల్యూక్ (భారత్) 47 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ప్రాణేశ్ (భారత్) 26 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై నెగ్గారు. అభిమన్యు పురాణిక్ (భారత్)–ఆధిబన్ (భారత్) గేమ్ 46 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–ఇనియన్ (భారత్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. చాలెంజర్స్ టోర్నీ విజేతకు వచ్చే ఏడాది ‘మాస్టర్స్’ టోర్నీలో పాల్గొనే అవకాశం ఇస్తారు. -
ఆసియాకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్..?
ఆసియాకప్ హాకీ టోర్నమెంట్-2025 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ టీమ్ తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ బీహార్లోని రాజ్గిర్లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరగనున్నది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఆసియా కప్ కోసం భారత్కు ప్రయాణించకూడదని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా తొలుత ఈ టోర్నీలో పాల్గోనేందుకు పాక్ జట్టు వీసాలకు ధరఖాస్తు చేసింది. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. భారత ప్రభుత్వం కూడా పాక్ ఆటగాళ్ల వీసాలను ఆమోదించడానికి సిద్దంగా ఉందంట. కానీ అంతలోనే పాక్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం."పీహెచ్ఎఫ్ బుధవారం ఆసియా హాకీ సమాఖ్యకు ఒక లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్లో పోటీ పడలేమని అందులో పేర్కొంది. తమ దేశంలో ఆడేందుకు బంగ్లాదేశ్ హాకీ జట్టును పాక్ ఆహ్వానించింది" అని హాకీ ఇండియా అధికారి ఒకరు ది హిందూకు తెలిపారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.కాగా పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి. అపరేషన్ సింధూర్ పేరిట పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ప్రతిస్పందనగా దాడికి యత్నించగా భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. దాదాపు వారం రోజుల పాటు సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతవారణం నెలకొంది. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు కాస్త శాంతించాయి. ఈ క్రమంలో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్తో మ్యాచ్లను ఇండియా లెజెండ్స్ బహిష్కరించింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది సమర్ధించారు. అయితే ఆసియాకప్-2025 క్రికెట్ టోర్నీలో మాత్రం భారత్-పాక్ జట్లు తలపడే అవకాశముంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్ను కూడా భారత్ బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.చదవండి: టీమిండియా స్టార్ వికెట్ కీపర్కు ప్రమోషన్.. ఆ జట్టు కెప్టెన్గా -
స్పాన్సర్లు లేరు, ప్రభుత్వ మద్దతు లేదు.. అయినా చరిత్ర సృష్టించిన భారత యువ జట్టు
భారత్కు చెందిన ఓ యువ జట్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్బాల్ టోర్నీని నెగ్గి చరిత్ర సృష్టించింది. కొద్ది రోజుల కిందట నార్వేలో జరిగిన నార్వే కప్ 2025లో పంజాబ్కు చెందిన మినర్వా అకాడమీ అబ్బురపరిచే ప్రదర్శనలతో టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అండర్-13 జట్టుకు బ్రాండింగ్ లేకపోయనా, స్పాన్సర్లు లేకపోయినా, ప్రభుత్వ మద్దతు లేకపోయనా సంచలనాలు సృష్టించింది. ఈ యువ జట్టు తమ అభిరుచి, పట్టుదలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో మినర్వా అకాడమీ స్థానిక జట్టు ఎస్ఐఎఫ్పై 14-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. మినర్వా అకాడమీ తరఫున దనమోని, రాజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. చింగ్కే, కే చేతన్, పున్షిబా, అమర్సన్, ఆజమ్, రీసన్ గోల్స్ చేశారు.ఈ టోర్నీలో మినర్వా అకాడమీ ఆది నుంచి సంచలన ప్రదర్శనలు నమోదు చేసింది. గ్రూప్ స్టేజీలో అలస్కా ఐఎల్పై 25-0, ఫోర్డ్ ఐఎల్-3పై 15-0, క్కొకెల్వ్డలాన్ ఐఎల్పై 22-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.నాకౌట్ మ్యాచ్ల్లో రోగ్లాండర్స్పై (Round of 32) 11-0, అమ్డాల్ టొక్కెపై (Round of 16) 17-0, క్వార్టర్ ఫైనల్లో ఫైల్లింగ్స్డలెన్పై 18-1, సెమీస్లో రదథెల్ చరిఫ్ క్లబ్పై (పాలస్తీన్) 8-2 గోల్స్ తేడాతో నెగ్గి ఫైనల్కు చేరింది. ఈ టోర్నీలో మినర్వ అకాడమీ 8 మ్యాచ్ల్లో మొత్తం 130 గోల్స్ చేసింది. ఈ యూరప్ సీజన్లో భారత్కు చెందిన జట్లు మూడు టైటిళ్లు సాధించాయి. నార్వే కప్కు ముందు భారత జట్లు గోథియా కప్, డానా కప్లు గెలిచాయి.అనామక కుర్రాళ్లు ప్రతిష్టాత్మక నార్వే కప్ గెలిచిన తర్వాత స్వదేశంలో వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టు యూరప్లో ట్రోఫీని మాత్రమే కైవసం చేసుకోలేదు. ప్రతి భారత ఫుట్బాల్ ప్రేమికుడి కలను సాకారం చేసింది. ఎక్కడో మారుమూల అకాడమీ నుంచి వచ్చి విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఆట పట్ల అభిరుచి ఏమి చేయించగలదో నిరూపించింది. మొత్తంగా దేశం గర్వపడేలా చేసింది. -
మార్పు... మంచి కోసమే!
చెస్... అందరికీ సుపరిచతమైన ఆట... ఏదో ఒకదశలో ఒక్కసారైనా ఆడిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతర్జాతీయంగానూ ఈ క్రీడకు ఎంతో పేరుంది. కానీ ఒలింపిక్స్లో మాత్రం చెస్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఆ దిశగా అడుగులు వేయాలంటే ముందుగా ఆట అందరికీ మరింత చేరువయ్యేలా చేయాలి. ఒకప్పుడు క్లాసికల్ ఫార్మాట్లోనే ఎక్కువగా చెస్ టోర్నీలు జరిగేవి. కాలక్రమేనా చెస్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుంటున్నాడు. గ్రాండ్చెస్ టూర్... ఫ్రీస్టయిల్ చెస్... సూపర్బెట్ చెస్... ఇలా మేటి గ్రాండ్మాస్టర్లను భాగస్వామ్యం చేస్తూ నిలకడగా టోర్నీలు నిర్వహిస్తున్నాడు. ఈ తరహా మార్పులతో చెస్కు మరింత ఆదరణ పెరుగుతోందని... ఈ ఆట కొత్త శిఖరాలకు చేరుకోవడానికి దోహదం పడుతుందనిప్రపంచ ఆరో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ అభిప్రాయపడుతున్నాడు. నేటి నుంచి జరగనున్న చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న అర్జున్ గత ఫలితాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తాతని తెలిపాడు. చెన్నై: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత స్టార్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి స్వదేశంలో మెగా టోర్నీకి సిద్ధమయ్యాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్మాస్టర్లు తలపడనున్నారు. భారత్ నుంచి అర్జున్తో పాటు, విదిత్ గుజరాతీ, నిహాల్ సరీన్, కార్తికేయన్ మురళి, ప్రణవ్ బరిలో ఉన్నారు. ఇటీవల నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ టూర్తో పాటు ఇ–స్పోర్ట్స్ వరల్డ్కప్లో సెమీఫైనల్స్కు చేరుకున్నాడు. స్వదేశంలో జరగనున్న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా అర్జున్ అడుగులు వేస్తున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు అర్జున్ మాట్లాడుతూ... ‘ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంటా. క్లాసికల్ టోర్నమెంట్లో ప్లేయర్లు దీర్ఘాలోచనలో మునిగిపోతారు. దీంతో అభిమానులు విసుగు చెందుతారు. కానీ ఇ–స్పోర్ట్స్లో అలా జరగదు. వెంట వెంటనే ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అవసరముంటుంది. అందుకే అభిమానులు ఈ తరహా ఆటలను ఆదరిస్తారు. సమయం అనేది చాలా కీలకం అవుతుంది. ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. దీంతో చూసేవాళ్లకు బాగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఆటగాళ్లు, అభిమానులు దీని వైపే మొగ్గుచూపడం ఖాయమే’ అని అన్నాడు. క్యాండిడేట్స్ టోర్నీపై దృష్టి ఇక తాజాగా ఇ–స్పోర్ట్స్ వరల్డ్కప్ సెమీఫైనల్లో ఓటమి పాలవడం బాధించిందని వరంగల్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ‘ఇ–స్పోర్ట్స్ వరల్డ్కప్’లో సెమీఫైనల్కు చేరడం ఆనందంగానే ఉంది. కానీ ఆశించిన ఫలితం రాలేదనే అసంతృప్తి ఉంది. ఆఖరి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలయ్యాను. ఇలాంటి చేదు అనుభవాల నుంచి బయటపడి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నా’ అని అర్జున్ వెల్లడించాడు. లాస్వేగస్లో జరిగిన గ్రాండ్స్లామ్ టోర్నీ చివరి మూడు మ్యాచ్ల్లోనూ అర్జున్ ఓటమి పాలయ్యాడు. ఫ్రీస్టయిల్ ఆడటం చాలా బాగుంటుందన్న అర్జున్... భవిష్యత్తులో గ్రాండ్స్లామ్కు టూర్ చెస్ క్యాలెండర్లో తప్పక చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ప్రపంచ ఆరో ర్యాంక్లో ఉన్న అర్జున్... అన్ని ఫార్మాట్లలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుండగా... 8 మంది ప్లేయర్లు టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఇప్పటికే అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానా ఈ టోర్నీకి అర్హత సాధించగా... మిగిలిన ఏడు స్థానాల కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. ముఖ్యంగి వరల్డ్కప్లో సత్తా చాటిన వారిలో ముగ్గురు, గ్రాండ్ స్విస్ టూర్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఇద్దరు. ‘ఫిడే సర్క్యూట్’ నుంచి ఒకరు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించనున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ మాట్లాడుతూ... ‘క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాలంటే నా ముందు రెండే దారులు ఉన్నాయి. గ్రాండ్స్విస్, వరల్డ్కప్ అ రెండింట్లో మెరుగైన ఆటతీరు కనబర్చాలని భావిస్తున్నా. రెండిట్లో కనీసం ఒక్క టోర్నీలో అయినా టైటిల్ సాధించాలి. రేటింగ్లో టాప్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న 10 మంది ప్లేయర్లలో... అర్జున్ అత్యధిక రేటింగ్ (2,776 పాయింట్లు) కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ గ్రాండ్మాస్టర్ అనీశ్ గిరి (2748 పాయింట్లు) రెండో... స్థానంలో విన్సెంట్ కీమర్ (2730 పాయింట్లు; జర్మనీ) మూడో స్థానంలో ఉన్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. గత రెండు ఎడిషన్లలో అర్జున్ త్రుటిలో టైటిల్కు దూరమయ్యాడు. 2023లో గుకేశ్తో టైబ్రేకర్లో ఓడి రెండో స్థానానికి పరిమితం కాగా... గతేడాది కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ‘గత రెండు పర్యాయాలు ఇక్కడ టైటిల్ గెలవకపోవడంతో నాపై ఎలాంటి అంచనాలు లేవు. అదే సమయంలో ఒత్తడి కూడా ఉండదు. దీంతో ప్రదర్శనపై మరింత దృష్టి పెడతా’ అని అర్జున్ అన్నాడు. అగ్ని ప్రమాదంతో...నేడు మొదలయ్యే ‘చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025’ టోర్నమెంట్లో అర్జున్ టాప్ సీడ్గా బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ బుధవారమే ప్రారంభం కావాలి. కానీ టోర్నీ వేదికైన హయాత్ రీజెన్సీ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్తో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగ కమ్ముకోవడంతో హోటల్ సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. టోర్నీ నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న 20 మంది క్రీడాకారులను వెంటనే సమీపంలో మరో హోటల్లో బస ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రానికల్లా అంతా సర్దుకోవడంతో గురువారం నుంచి ఈ టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో 11వ తేదీన విశ్రాంతి దినం కేటాయించారు. అయితే ఒకరోజు వృథా కావడంతో విశ్రాంతి దినం తొలగించి... వరుసగా తొమ్మిది రోజులపాటు టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. -
తొలిసారి కూతురు సమక్షంలో...
చెన్నై: కూతురు సమక్షంలో టైటిల్ సాధించడమే తన లక్ష్యమని చెన్నై గ్రాండ్ మాస్టర్స్–2025 టోర్నమెంట్... చాలెంజర్స్ విభాగంలో బరిలోకి దిగుతున్న భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వెల్లడించింది. పాపకు జన్మనిచ్చిన తర్వాత... స్వదేశంలో తొలిసారి ఓ పెద్ద టోర్నీ ఆడుతుండటం ఆనందంగా ఉందని హారిక పేర్కొంది. రెండేళ్ల హన్వికను వదిలి విదేశాల్లో టోర్నీలు ఆడటం కష్టంగా ఉండేదని... ఇప్పుడు చెన్నైలోనే పోటీలు జరుగుతుండటంతో కుటుంబంతో కలిసి పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ‘ఇంటికి దగ్గరగా ఆడుతుండటం చాలా ఆనందంగా ఉంది. పాపతో కలిసి ఓ టోర్నీకి రావడం ఇదే తొలిసారి. నా క్రీడా జీవితంలో ఇప్పుడు తను కూడా ఒక భాగం కానుంది. కూతురు సమక్షంలో మ్యాచ్లు ఆడనుండటం చాలా ఉద్వేగంగా ఉంది. తల్లి అయిన తర్వాత పాపను వదిలి ఉండటం ఎంత కష్టమో తెలిసొచ్చింది. పాపను ఇంట్లో వదిలి టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిసారీ ఎంతో బాధపడేదాన్ని. వెంట తీసుకెళ్లాలని ఎంతో అనిపించేది. కానీ, అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఆహారం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని వెనకడుగు వేసేదాన్ని’ అని హారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుత భారత చెస్ బృందంలో చిన్నపిల్లలతో గడపడంలో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అత్యుత్తమమని హారిక కితాబిచ్చింది. ‘గుకేశ్ పిల్లలను బాగా హ్యాండిల్ చేస్తాడు. అతడు మంచి ‘బేబీ సిట్టర్’. ఢిల్లీలో ఒకసారి అతడు చిన్న పిల్లలతో మమేకమైన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా వల్ల కూడా అలా సాధ్యం కాదేమో’ అని హారిక చెప్పింది. జార్జియాలో ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ ‘టైబ్రేక్’లో దివ్య దేశ్ముఖ్ చేతిలో పరాజయం పాలైన హారిక... ఆ పరాజయాన్ని పక్కన పెట్టి చెన్నైలో తిరిగి సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. -
బెంగాల్ క్రికెట్ ఎన్నికల బరిలో గంగూలీ!
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రీడా పరిపాలనలో అడుగుపెట్టనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకొని మూడేళ్లు కావొస్తుండగా... త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించడానికి ముందు వరకు ‘దాదా’...‘క్యాబ్’ అధ్యక్షుడిగా కొనసాగాడు. గంగూలీ పదవీ కాలం ముగిసిన అనంతరం రోజర్ బిన్నీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ‘గంగూలీ తిరిగి పాలకవర్గంలో అడుగుపెట్టనున్నాడు. క్యాబ్ అధ్యక్ష పదవికి అతడు పోటీ పడటం ఖాయమే. బీసీసీఐ నియమావళి అంగీకరిస్తే ఆ పదవికి గంగూలీ ఎన్నికవడం ఖాయమే. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలపై స్పష్టత రాదు’ అని బెంగాల్ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ‘క్యాబ్’ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఈ పదవిలో ఆరేళ్లుగా కొనసాగుతుండటంతో... లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. దీంతో గతంలో ‘క్యాబ్’ను సమర్థవంతంగా నడిపించిన గంగూలీ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
బీసీసీఐ సమాచారం ఇవ్వనవసరం లేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ (ఎన్ఎస్జీబీ)లో కొత్త సవరణను చేర్చింది. ఇప్పటి వరకు ఉన్న బిల్లులో ‘గుర్తింపు పొందిన ఏ క్రీడా సంఘమైనా ప్రజలకు చెందినదే. తమ విధులు, అధికారాలు నిర్వహించే విషయంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ )–2005 పరిధిలోకే అది వస్తుంది’ అని స్పష్టంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ చాలా కాలంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇతర క్రీడా సంఘాల తరహాలో తాము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదని, బోర్డు ఆర్టీఐ పరిధిలోకి రాదని చెబుతూ వచ్చింది. చివరకు బోర్డు ఆశించిన ప్రకారం వారికి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కొత్త బిల్లులో సవరణను జోడించింది. దీని ప్రకారం ‘ప్రభుత్వం నుంచి నిధులు, సహాయం పొందే క్రీడా సంఘాలకే ఆర్టీఐ నిబంధన వర్తిస్తుంది. అలా ఆర్థిక సహకారం తీసుకుంటేనే దానిని ప్రజా సంస్థగా గుర్తిస్తారు’ అని స్పష్టతనిచ్చింది. తాజా సవరణ నేపథ్యంలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తూ సామాన్యులు ఎవరైనా బీసీసీఐని ప్రశ్నించడానికి లేదా వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కోరడానికి గానీ అవకాశం లేదు. ‘తాజా బిల్లులో ఇది ఒక సమస్యగా కనిపించింది. ఆర్థిక సహకారం తీసుకోవడం లేదనే కారణం చూపించి ఈ బిల్లు ఆమోదం కాకుండా పార్లమెంట్లో అడ్డుకునే అవకాశం ఉండేది. లేదా ఇదే కారణంతో బీసీసీఐ కోర్టుకెక్కేది కూడా. అందుకే సవరణ చేయాల్సి వచ్చింది’ అని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆర్టీఐ పరిధిలోకి రాకపోయినా... కొన్ని ఇతర నిబంధనలు బీసీసీఐని కూడా ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది చట్టంగా మారితే బీసీసీఐ కూడా వెంటనే జాతీయ క్రీడా సమాఖ్యగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడగా మారనుండటం దీనికి ఒక కారణం. కొత్త బిల్లు ప్రకారం నిధులు పొందకపోయినా... వ్యవస్థ నడిచేందుకు ఇతర రూపాల్లో సహాయ సహకారాలు తీసుకుంటుంది కాబట్టి జవాబుదారీతనం ఉండాల్సిందే. పైగా బీసీసీఐ కూడా నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ) పరిధిలోకి వస్తుంది. క్రీడా సంఘాల్లో ఎన్నికల నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు ఏదైనా వివాదం వస్తే ఎన్సీటీ పరిష్కరిస్తుంది. ట్రైబ్యునల్ తీర్పులను సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది. -
అహ్మదాబాద్లో ఆసియా కప్ అండర్–17 క్వాలిఫయర్స్ టోర్నీ
న్యూఢిల్లీ: ఆసియా కప్ అండర్–17 ఫుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత్ కూడా ఓ వేదికైంది. ఆసియా కప్–2026 కోసం నిర్వహించే క్వాలిఫయర్స్కు ఏడు దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. భారత్కు సంబంధించిన పోటీలను ఈ నవంబర్ 22 నుంచి 30 వరకు అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిసింది. పాల్గొనే మొత్తం 38 దేశాల జట్లను ఏడు గ్రూప్లుగా విభజిస్తారు. మూడు గ్రూప్ల్లో ఆరేసి జట్లు, నాలుగు గ్రూప్ల్లో ఏడేసి జట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన ‘డ్రా’ను రేపు తీయనున్నారు. ఈ ఏడు గ్రూప్ల విజేత జట్లు సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇంతకుముందే 9 జట్లకు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. ఈ ఏడాది ఖతర్లో జరిగిన అండర్–17 ప్రపంచకప్లో తలపడటం ద్వారా 9 జట్లకు ఈ అవకాశం లభించింది. ఆసియాకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ కూడా వేదికవడం పట్ల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే హర్షం వ్యక్తం చేశారు.అండర్–17 ఫిఫా ప్రపంచకప్ నిర్వహించే సత్తా తమకు ఉందని ఏఎఫ్సీ క్వాలిఫయర్స్ ద్వారా నిరూపించుకుంటామని చెప్పారు. అహ్మదాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
తెలంగాణ స్కేటర్లకు పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్కేటర్లు పతకాల పంట పండించారు. దక్షిణ కొరియా వేదికగా ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో... తెలంగాణ స్కేటర్లు గ్రూప్ స్వర్ణం సహా మొత్తంగా.... 16 పతకాలు సాధించారు. ఇందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. గత రెండేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో రాణిస్తున్న యువ స్కేటర్లు... 20వ ఆసియా చాంపియన్షిప్లో పతకాలతో మెరిశారు. శ్రియ మురళి, తేజేశ్ మూడేసి పతకాలు కైవసం చేసుకోగా... అనుపోజు కాంతిశ్రీ, రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆకాంక్ష, జూహిత్, జయేశ్ పటేల్, రక్షిత్ మురళి, సంచిత్ చౌదరీ, ప్రతీక్, సౌరవ్ సింగ్ సీనియర్ విభాగంలో వ్యక్తిగత పతకాలు సాధించారు. జూనియర్ విభాగంలో కావ్యశ్రీ రజత పతకం నెగ్గింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గిన యువ స్కేటర్లను కోచ్ అనూప్ కుమార్ యామ ప్రత్యేకంగా అభినందించాడు. భారత్ తరఫున రోలర్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణ పతకం సాధించిన ఏకైక స్కేటర్ అయిన అనూప్ దిశానిర్దేశంలో రాష్ట్ర యువ స్కేటర్లు పతకాలతో సత్తాచాటారని తెలంగాణ రోలర్ స్కేటింగ్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆటగాళ్లు, సిబ్బందికి వేతనాలు నిలిపివేత
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భాగమైన ఫ్రాంచైజీ బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తమ ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి వేతనాలు నిలిపివేసింది. ఈ సీజన్ ఐఎస్ఎల్పై అనిశ్చితి నెలకొనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరు యాజమాన్యం వెల్లడించింది. ‘భారత్లో ఒక ఫుట్బాల్ క్లబ్ను నడపడం, కొనసాగించడం కత్తిమీద సాములాంటింది. అయినా సరే మేము ఎన్నో కష్టనష్టాలను దాటి ప్రతీ సీజన్లో పాల్గొన్నాం. అయితే ప్రస్తుత సీజన్ విషయమైన తొలగని అనిశ్చితి, లీగ్ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వల్లే వేతనాలను నిలిపివేస్తున్నాం. ప్రస్తుతం ఇది తప్ప మాకు వేరే మార్గం లేదు. మా ఆటగాళ్ళు, సిబ్బంది... వారి కుటుంబాల శ్రేయస్సు మాకు చాలా ముఖ్యమైనది. కానీ ఏం చేస్తాం... ఏదైనా పరిష్కారం వచ్చాకే మా టీమ్ కార్యకలాపాలు యథావిధిగా ఎప్పట్లాగే మొదలుపెడతాం’ అని 2018–19 ఐఎస్ఎల్ సీజన్ విజేత బెంగళూరు క్లబ్ పేర్కొంది. అయితే తమ క్లబ్ చేపట్టిన క్రీడాభివృద్ధి కార్యకలాపాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రకటించింది. యూత్, పురుషులు, మహిళల జట్ల శిబిరాలు ఎప్పట్లాగే కొనసాగుతాయని పేర్కొంది. ఏం జరిగిందంటే... ఐఎస్ఎల్ నిర్వాహక సంస్థ ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్) 2010లో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)తో 15 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గడువు గతేడాది డిసెంబర్ 18వ తేదీతోనే ముగిసింది. దీనిపై తదుపరి ఒప్పందంగానీ, గడువు పొడిగింపుపై గానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో జూలైలోనే ఎఫ్ఎస్డీఎల్ 2025–26 సీజన్ నిర్వహణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సీజన్ ఐఎస్ఎల్పై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, జంషెడ్పూర్, గోవా, హైదరాబాద్, కేరళ బ్లాస్టర్స్, నార్త్ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, పంజాబ్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)లు ఏఐఎఫ్ఎఫ్ తక్షణ జోక్యం కోరుతూ లేఖ రాశాయి. ముంబై, చెన్నైయిన్ సహా బెంగాల్కు చెందిన మోహన్ బగన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్లు లేఖలో సంతకం చేయలేదు. ఇటీవల ఏఐఎఫ్ఎఫ్ చీఫ్ కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ ఈ సీజన్ ఐఎస్ఎల్ జరిపేందుకు భరోసా ఇచ్చారు. రేపు క్లబ్ సీఈఓలతో సమావేశం ఐఎస్ఎల్ ఫ్రాంచైజీలతో ఏఐఎఫ్ఎఫ్ భేటీ కావాలని నిర్ణయించింది. 8 ఫ్రాంచైజీలకు చెందిన సీఈఓలతో భారత ఫుట్బాల్ సమాఖ్య ఉన్నతాధికారులు రేపు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సీజన్ ఐఎస్ఎల్ నిలిపివేత తదితర పరిణామాలపై ఏఐఎఫ్ఎఫ్ చర్చించనున్నట్లు తెలిసింది. గతంలో సుప్రీమ్ కోర్టు మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎమ్ఆర్ఏ)పై తుది తీర్పు వచ్చే వరకు కొత్త షరతులపై సంప్రదింపులు జరపరాదని ఆదేశించింది. -
‘ఇక స్వర్ణంపై గురి’
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో సాధించిన కాంస్య పతకం తన జీవితాన్ని సమూలంగా మార్చివేసిందని భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అన్నాడు. అదే సమయంలో నిలకడగా రాణించాలనే బాధ్యతను పెంచిందని వెల్లడించాడు. ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అమన్... ఒలింపిక్స్లో పతకం నెగ్గిన అనంతరం డబ్బుకు కొదవ లేకుండా పోయిందని అన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ ట్రయల్స్లో విజయం సాధించిన అనంతరం అమన్ తన సాధన తీరును వివరించాడు. విశ్వక్రీడల్లో కాంస్య పతకం గెలిచిన విషయాన్ని మరిచి ప్రపంచ చాంపియన్షిప్, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పసిడి పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పారిస్ పతకంతో అమన్ జీవితంలో వచ్చిన మార్పుల వివరాలు అతడి మాటల్లోనే... విదేశీ టోర్నీల్లో పాల్గొంటా... ఒలింపిక్స్ తర్వాత విదేశాల్లో శిక్షణ పొందాలని అనుకున్నా... కానీ మనం కోరుకున్నవన్నీ జరగవు కదా. అదే సమయంలో గాయం కావడంతో ఇక ఆ ప్రయత్నాలు విరమించుకున్నా. పారిస్ ఒలింపిక్స్ పతకం నా భుజాలపై అదనపు భారాన్ని మోపింది. ఒకవేళ నేను పరాజయం పాలైతే... పారిస్ పతకంతో వచ్చిన కీర్తి నన్ను చెడగొట్టిందనే విమర్శలు వస్తాయనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇటీవల పాల్గొన్న రెండు టోర్నీలో ఒక దాంట్లో పతకం సాధించా మరో దాంట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. దాదాపు ఏడాది తర్వాత బరిలోకి దిగడం కూడా అందుకు ఒక కారణం. అయినా నా కోచ్లు నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించారు. మరింత కఠోర సాధన చేస్తున్నా. విదేశీ రెజ్లర్లను పడగొట్టడం అంత తేలికైన పనేం కాదు. ఆ అంశంపై దృష్టి సారించా. వచ్చే నెలలో క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్స్కు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం ఫిట్గా ఉన్నా. అయితే బలమైన ప్రత్యర్థులతో తలపడాలంటే... విదేశాలకు వెళ్లక తప్పదు. రష్యా, అమెరికాలో జరిగే టోర్నమెంట్లలో పాల్గొని మరింత రాటుదేలాలని భావిస్తున్నా. శ్రమకు దక్కిన ఫలితమిది విశ్వక్రీడల్లో పతకం సాధించిన తర్వాత నా జీవితం 90 శాతం మారిపోయింది. అంతకుముందు నన్ను ఎవరూ గుర్తించేవారు కాదు. కనీసం మా పక్క వీధిలో వారికి కూడా నేనెవరో తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పారిస్ ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే... నేను దేశం కోసం ఏదో సాధించాననే సంతృప్తి కలుగుతోంది. అయితే అది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి దక్కిన ఫలితమది. పారిస్ ఒలింపిక్స్కు ముందు పతకం సాధిస్తానని అసలు ఊహించలేదు. ఆ సమయంలో భారత మహిళా రెజ్లర్లపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. భగవంతుడి దయతో నేను పతకం సాధించగలిగా. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు నాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో కాంస్యం గెలిచిన నేను... ఇప్పుడు స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పారిస్లో సాధించిన కాంస్య పతకాన్ని నా మనసులో నుంచి తీసేసి తిరిగి కఠోర సాధనపై దృష్టి పెట్టాను. కష్టనష్టాలకు ఓర్చి... ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎవరూ లేరు అనుకున్న సమయంలో బంధువుల అండతో సాధన కొనసాగించా. సోదరి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని... ఒక అన్నగా తన బాగోగులు ఎలా చూసుకోవాలని మదన పడుతుండే వాడిని. ఇప్పుడా చింత లేదు. ఆమె బంగారు భవిష్యత్తుకు కావాల్సినంత సాధించా. ఇప్పుడిక ప్రశాంతంగా ప్రాక్టీస్పై దృష్టి సారించొచ్చు. అయితే విజయాన్ని తలకెక్కించుకొని గతాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు నేను. అప్పటికి ఇప్పటికీ నాలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. ఎందుకంటే ఒలింపిక్ పతక విజేతగా ఇప్పుడు అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి జాగరుకత అవసరం. ఒలింపిక్స్ అనంతరం చాన్నాళ్ల వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దానికి గాయంతో పాటు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. -
అర్జున్ సత్తాకు సవాల్... నేటి నుంచి చెన్నై గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నీ
స్వదేశంలో సత్తా చాటుకునేందుకు భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి సిద్ధమయ్యాడు. చెన్నై వేదికగా నేటి నుంచి చెన్నై గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నీ జరగనుంది. 10 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది. మాస్టర్స్ విభాగంలో అర్జున్తోపాటు భారత్ నుంచి విదిత్ గుజరాతి, కార్తికేయన్ మురళీ, నిహాల్ సరీన్, ప్రణవ్ వెంకటేశ్ బరిలో ఉన్నారు. ఇతర గ్రాండ్మాస్టర్లు అనీశ్ గిరి (నెదర్లాండ్స్), విన్సెంట్ కీమర్ (జర్మనీ), అవండర్ లియాంగ్ (అమెరికా), రే రాబ్సన్ (అమెరికా), జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కోటి రూపాయల ప్రైజ్మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్మాస్టర్లకు ప్రైజ్మనీ లభించనుంది. టాప్–3లో నిలిచిన వారికి వరుసగా రూ. 25 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు అందజేస్తారు. మాస్టర్స్ టోర్నీతోపాటు కేవలం భారత క్రీడాకారులు మాత్రమే పాల్గొనే ‘చాలెంజర్స్’ ఈవెంట్ కూడా జరగనుంది. గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రాణేశ్, ఇనియన్, లియోన్ ల్యూక్ మెండోంకా, దీప్తాయన్ ఘోష్, ఆధిబన్, ఆర్యన్ చోప్రా, అభిమన్యు పురాణిక్, అంతర్జాతీయ మాస్టర్ హర్షవర్ధన్ పోటీపడుతున్నారు. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నమెంట్కు సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు ఈ నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించనుంది. ఆగస్టు 15 నుంచి 21 వరకు జరిగే ఈ పర్యటనలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. కర్ణాటకకు చెందిన డిఫెండర్ సీబీ పూవణ్ణ తొలిసారి జాతీయ సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం జరుగుతోంది. ఈ పర్యటన కోసం భారత జట్టు శుక్రవారం బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ (గోల్కీపర్లు), సుమిత్, జర్మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), సంజయ్, అమిత్ రోహిదాస్, నీలం సంజీప్, జుగ్రాజ్ సింగ్, పూవణ్ణ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్ (మిడ్ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, సెల్వం కార్తీ, ఆదిత్య లలాగే (ఫార్వర్డ్స్). -
ప్రపంచ చాంపియన్ షిప్పోటీలకు అమన్, అంతిమ్
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్... ప్రపంచ చాంపియన్షిప్లో తొలి పతకంపై గురి పెట్టాడు. సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల ఫ్రీస్టయిల్ జట్లను సోమవారం ప్రకటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. 22 ఏళ్ల అమన్ జూన్లో మంగోలియాలో జరిగిన ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచాడు. రెండు నెలల తర్వాత మళ్లీ మ్యాట్పైకి అడుగు పెట్టిన అమన్ చురుకైన కదలికలతో ఆకట్టుకున్నాడు. ట్రయల్స్లో తన ప్రత్యర్థులు సుమీత్, రాహుల్లపై అమన్ ‘టెక్నికల్ సుపిరీయారిటీ’ పద్ధతిలో (ప్రత్యరి్థపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించడం) అలవోకగా గెలిచాడు. ‘నా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాను. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధంగా ఉన్నా. ఏడాది తర్వాత బరిలోకి దిగిన మంగోలియా టోర్నీలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఓవరాల్గా నా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా’ అని అమన్ వ్యాఖ్యానించాడు. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన అమన్ ప్రపంచ చాంపియన్షిప్లో మాత్రం ఇంకా పతకాల బోణీ కొట్టలేదు. మరోవైపు మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఈసారి ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 2023 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన అంతిమ్ జాతీయ ట్రయల్స్లో తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన 20 ఏళ్ల అంతిమ్ ఇప్పటికే ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్షిప్లో, గ్రాండ్ప్రి సిరీస్ టోరీ్నల్లో, అండర్–20, అండర్–17 ప్రపంచ చాంపియన్షిప్లలో పతకాలు సాధించింది. భారత పురుషుల ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), ఉదిత్ (61 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), రోహిత్ (70 కేజీలు), జైదీప్ (74 కేజీలు), అమిత్ (79 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (92 కేజీలు), విక్కీ (97 కేజీలు), రజత్ (125 కేజీలు). భారత మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: అంకుశ్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), నిశు (55 కేజీలు), తపస్య (57 కేజీలు), నేహా (59 కేజీలు), మనీషా (62 కేజీలు), వైష్ణవి (65 కేజీలు), సృష్టి (68 కేజీలు), జ్యోతి (72 కేజీలు), ప్రియా మలిక్ (76 కేజీలు). -
బ్రె‘జిల్...జిల్...జిల్’
క్విటో (ఈక్వెడార్): ఆరుసార్లు ప్రపంచ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు నెగ్గిన మార్టా రెండు గోల్స్తో విజృంభించడంతో... బ్రెజిల్ జట్టు తొమ్మిదోసారి కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం అత్యంత హోరాహోరీగా సాగిన ఫైనల్లో బ్రెజిల్ ‘షూటౌట్’లో 5–4 గోల్స్ తేడాతో కొలంబియాపై విజయం సాధించింది. నిరీ్ణత సమయంలో ఇరు జట్లు 4–4 గోల్స్తో నిలవడంతో... విజేతను తేల్చేందుకు షూటౌట్ అనివార్యమైంది. ఇందులో బ్రెజిల్ ఆధిక్యం కనబర్చింది. అంతకుముందు మ్యాచ్లో బ్రెజిల్ తరఫున మార్టా (90+6వ, 105వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరవగా... ఏంజెలీనా (45+9వ నిమిషంలో), అమండా గుటెరెస్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొలంబియా తరఫున లిండా కైసెడో (25వ నిమిషంలో), టర్సియానె (69వ నిమిషంలో), మైరా రమిరెజ్ (88వ నిమిషంలో), లైసీ సంటోస్ (115వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. 39 ఏళ్ల మార్టా 82వ నిమిషంలో మైదానంలో అడుగుపెట్టి బ్రెజిల్ స్కోరును 3–3తో సమం చేసింది. అనంతరం అదనపు సమయంలో మార్టా మరో గోల్ సాధించడంతో బ్రెజిల్ 4–3తో ఆధిక్యంలోకి వెళ్లినా... చివర్లో లైసీ గోల్తో కొలంబియా స్కోరు సమం చేసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో గోల్ కీపర్ లొరెనా డా సిల్వా రెండు పెనాల్టీ కిక్లను సమర్థవంతంగా అడ్డుకోవడంతో... బ్రెజిల్ వరుసగా ఐదోసారి కోపా అమెరికా కప్ కైవసం చేసుకుంది. గత ఐదు ఫైనల్స్లో బ్రెజిల్ జట్టు నాలుగుసార్లు కొలంబియాపైనే విజయం సాధించడం విశేషం. బ్రెజిల్ తరఫున 6 ఫుట్బాల్ ప్రపంచకప్లు, 6 ఒలింపిక్స్లో బరిలోకి దిగిన మారా్ట... కెరీర్లో 206 మ్యాచ్లాడి 122 గోల్స్ సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అమెరికా చేతిలో ఓడిన బ్రెజిల్ జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోరీ్నలో అమండా గుటెరెస్ ఆరు గోల్స్తో అత్యధిక స్కోరర్గా నిలిచింది. -
నోరిస్ ‘పాంచ్ పటాకా’
బుడాపెస్ట్ (హంగేరి): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన హంగేరి గ్రాండ్ప్రి ప్రధాన రేసులో నోరిస్ విజయం సాధించాడు. ఈ సీజన్లో నోరిస్కిది ఐదో విజయం కాగా... మెక్లారెన్ జట్టుకిది 200వ ఎఫ్1 గెలుపు కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో నోరిస్ నిర్ణీత 70 ల్యాప్లను అందరికంటే వేగం6గా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 21.231 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన పియాస్ట్రి 1 గంట 35 నిమిషాల 21.929 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. 0.698 సెకన్ల తేడాతో పియాస్ట్రి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి ల్యాప్ ముగిసే సమయానికి ఐదో స్థానానికి పరిమితమైన నోరిస్ ఆ తర్వాత వాయువేగంతో దూసుకెళ్లాడు. ‘ఇది చాలా కష్టమైంది. ప్రాణం పోయినంత పనైంది. చివరి క్షణాల్లో పియాస్ట్రిని దాటేసేందుకు ఎంతగానో ప్రయత్నించా’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. గత వారం జరిగిన బెల్జియం గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజయం సాధించగా... నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ (1 గంట 35 నిమిషాల 43.147 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ ఏడాది తొలిసారి పోల్ పొజిషన్ దక్కించుకొని అగ్రస్థానంతో రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 36 నిమిషాల 3.791 సెకన్లు) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (1 గంట 36 నిమిషాల 33.876 సెకన్లు; రెడ్బుల్) తొమ్మిదో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 35 నిమిషాల 31.092 సెకన్లలో 69 ల్యాప్లు; ఫెరారీ) పన్నెండో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 14 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 284 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 275 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల అంతరం 9కి తగ్గగా... డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 187 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఈ నెల 31న డచ్ గ్రాండ్ప్రి జరుగుతుంది. -
ఈత కొలను అమెరికన్లదే...
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ పోటీల్లో తమకు తిరుగులేదని అమెరికా మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో అమెరికా 29 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇందులో 9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. చివరిరోజు మహిళల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలేలో రేగన్ స్మిత్, కేట్ డగ్లస్, గ్రెట్చెన్ వాల్ష్, టోరీ హుస్కీలతో కూడిన అమెరికా బృందం కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 49.34 సెకన్లలో రేసును ముగించింది. ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 49.63 సెకన్లతో అమెరికా బృందమే నెలకొల్పిన ప్రపంచ రికార్డును అమెరికా జట్టే బద్దలు కొట్టింది. ‘ప్రపంచ చాంపియన్షిప్ను ప్రపంచ రికార్డుతో, పసిడి పతకంతో ముగించడం చాలా ఆనందంగా ఉంది. ఈత కొలనులో దూకితే మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. సింగపూర్ నుంచి నవ్వుతూ తిరిగి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ప్రపంచ రికార్డు నెలకొల్పిన అమెరికా మెడ్లీ రిలే బృందం సభ్యురాలు గ్రెట్చెన్ వాల్ష్ వ్యాఖ్యానించింది. ఆ్రస్టేలియా 8 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 20 పతకాలు సాధించి రెండో స్థానంలో... ఫ్రాన్స్ 4 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో కెనడా టీనేజ్ స్టార్ సమ్మర్ మెకింటోష్... పురుషుల విభాగంలో ఫ్రాన్స్ స్టార్ లియోన్ మర్చండ్ ‘ఉత్తమ స్విమ్మర్లు’ పురస్కారాలు గెల్చుకున్నారు. ఆఖరి రోజు ఆదివారం ఎనిమిది ఈవెంట్స్లో ఫైనల్స్ జరిగాయి. పురుషుల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రష్యాకు చెందిన క్లిమెంట్ కొలెస్నికోవ్ (23.68 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా క్రీడాకారులపై నిషేధం ఉన్న నేపథ్యంలో క్లిమెంట్ తటస్థ స్విమ్మర్గా ఈ పోటీల్లో బరిలోకి దిగాడు. మహిళల 50 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్లో రుటా మెలుటైట్ (లిథువేనియా; 29.55 సెకన్లు) బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో మెగ్ హారిస్ (ఆస్ట్రేలియా; 24.02 సెకన్లు) విజేతగా నిలిచింది. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో అహ్మద్ జవోది (ట్యూనీషియా; 14 నిమిషాల 34.41 సెకన్లు) పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలే ఈవెంట్లో తటస్థ స్విమ్మర్లుగా బరిలోకి దిగిన రష్యా బృందం బంగారు పతకాన్ని గెలిచింది. మిరోన్ లిఫింత్సెవ్, కిరిల్ ప్రిగోడా, ఆండ్రీ మినాకోవ్, ఇగోర్ కొర్నెవ్లతో కూడిన తటస్థ బృందం 3 నిమిషాల 26.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది.మర్చండ్ ‘హ్యాట్రిక్’...పురుషుల 400 మీటర్ల మెడ్లీ విభాగంలో లియోన్ మర్చండ్ (ఫ్రాన్స్; 4 నిమిషాల 04.73 సెకన్లు) చాంపియన్గా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. 2022, 2023 ప్రపంచ చాంపియన్షిప్ల్లోనూ ఈ విభాగంలో మర్చండ్ స్వర్ణ పతకాలు నెగ్గ డం విశేషం. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్ చరిత్ర లో మర్చండ్కిది ఏడో పసిడి పతకం కావడం గమనార్హం.ఐదు పతకాలతో....మహిళల 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్లో సమ్మర్ మెకింటోష్ (కెనడా; 4 నిమిషాల 25.78 సెకన్లు) విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్ను నాలుగో స్వర్ణ పతకంతో, ఓవరాల్గా ఐదో పతకంతో ముగించింది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మెడ్లీ, 200 మీటర్ల మెడ్లీ, 200 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన 18 ఏళ్ల మెకింటోష్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో కెనడా గెల్చుకున్న మొత్తం ఎనిమిది పతకాల్లో ఐదు మెకింటోష్వే కావడం విశేషం. -
విజేత కార్ల్సన్... అర్జున్కు నాలుగో స్థానం
రియాద్: తొలిసారి నిర్వహించిన ఈ–స్పోర్ట్స్ వరల్డ్కప్ చెస్ టోర్నమెంట్లో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చాంపియన్గా అవతరించాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన ఫైనల్లో కార్ల్సన్ 3–1, 3–1తో విజయం సాధించాడు.సెట్–1లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్సన్ రెండు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. సెట్–2లో భాగంగా జరిగిన నాలుగు గేముల్లో కార్ల్సన్ మూడు గేముల్లో నెగ్గి, ఒక గేమ్లో ఓడిపోయాడు. హికారు నకముర (అమెరికా) మూడో స్థానం పొందగా... భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ స్టార్ ఇరిగేశి అర్జున్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.నకమురతో జరిగిన వర్గీకరణ మ్యాచ్లో అర్జున్ 2.5–3.5తో ఓడిపోయాడు. ఐదు గేముల్లో అర్జున్ రెండింటిలో గెలిచి, ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన కార్ల్సన్కు 2,50,000 డాలర్లు (రూ. 2 కోట్ల 18 లక్షలు) లభిస్తాయి.రెండో స్థానం పొందిన అలీరెజాకు 1,90,000 డాలర్లు (రూ. 1 కోటీ 65 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన నకమురకు 1,45,000 డాలర్లు (రూ. 1 కోటీ 26 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన అర్జున్కు 1,15,000 డాలర్లు (రూ. 1 కోటీ 33 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
Hungarian GP: లెక్లెర్క్కు తొలి ‘పోల్’
బుడాపెస్ట్ (హంగేరి): ఎట్టకేలకు ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లోని 14వ రేసులో ఐదో కొత్త ‘పోల్ పొజిషన్’ డ్రైవర్ అవతరించాడు. గత 13 రేసుల్లో లాండో నోరిస్ (మెక్లారెన్), ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్), మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్), జార్జి రసెల్ (మెర్సిడెస్) ‘పోల్ పొజిషన్స్’ దక్కించుకున్నారు.శనివారం జరిగిన హంగేరి గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్, పియాస్ట్రి జోరు సాగుతుండగా... వారిద్దరినీ వెనక్కి నెట్టి లెక్లెర్క్ ఈ ఏడాది తొలి ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు.క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా 1 నిమిషం 15.372 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి ‘టాప్’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును లెక్లెర్క్ అగ్రస్థానం నుంచి నుంచి ప్రారంభిస్తాడు. పియాస్ట్రి (1 నిమిషం 15.398 సెకన్లు; మెక్లారెన్), నోరిస్ (1 నిమిషం 15.413 సెకన్లు; మెక్లారెన్) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు.‘మాటలు రావడం లేదు. ఏమాత్రం ఊహించలేదు. అందుకే ఇది నా ప్రదర్శనల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అగ్రస్థానంలో నిలిచేందుకు చేయాల్సిందంతా చేశాను’ అని కెరీర్లో 27వసారి పోల్ పొజిషన్ పొందిన లెక్లెర్క్ పేర్కొన్నాడు. ఓవర్టేక్ చేయడం చాలా కష్టమైన హంగేరి ట్రాక్పై పోల్ పొజిషన్ సాధించడం ప్రధాన రేసులో ఫెరారీ డ్రైవర్కు ఎంతో సహకరించనుంది. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ (1 నిమిషం 15.728 సెకన్లు; రెడ్బుల్) 8వ స్థానంలో నిలవగా.... ఫెరారీకే చెందిన మరో డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 15.702 సెకన్లు) 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
800 మీటర్లలో సప్త స్వర్ణం
సింగపూర్: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్లో తనకు తిరుగులేదని అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 7వసారి లెడెకీ చాంపియన్గా నిలిచింది. 28 ఏళ్ల లెడెకీ 800 మీటర్ల విభాగంలో 7వసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన 800 మీటర్ల ఫైనల్ రేసును లెడెకీ 8 నిమిషాల 05.62 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్షిప్లో నాలుగో స్వర్ణంపై గురి పెట్టిన సమ్మర్ మెకింటోష్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మెకింటోష్ 8 నిమిషాల 07.29 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. లానీ పాలిస్టర్ (ఆస్ట్రేలియా; 8 నిమిషాల 05.98 సెకన్లు) రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 700 మీటర్లు ముగిశాక మెకింటోష్ 0.14 సెకన్ల ఆధిక్యంలో ఉండగా... చివరి 100 మీటర్లలో లెడెకీ జోరు పెంచడంతో చివరకు మెకింటోష్ మూడో స్థానంతో, లానీ పాలిస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్షిప్లో 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న లెడెకీ... 2015లో, 2017లో, 2019లో, 2022లో, 2023లోనే బంగారు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో లెడెకీ 23 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఒలింపిక్స్లో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం కైవసం చేసుకుంది. ఓవరాల్గా లెడెకీ 44 ప్రపంచ, ఒలింపిక్ పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.మిక్స్డ్ రిలేలో ప్రపంచ రికార్డుమరోవైపు మిక్స్డ్ ఫ్రీస్టయిల్ 4్ఠ100 రిలేలో జాక్ అలెక్సీ, ప్యాట్రిక్ సామన్, కేట్ డగ్లస్, టోరి హుస్కీలతో కూడిన అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 18.48 సెకన్లలో రేసును ముగించి 2023లో 3 నిమిషాల 18.83 సెకన్లతో ఆ్రస్టేలియా బృందం నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల 50 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగంలో గ్రెట్చెన్ వాల్‡్ష (అమెరికా; 24.83 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ కామెరాన్ మెక్ఇవోయ్ (ఆ్రస్టేలియా; 21.14 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో డిఫెండింగ్ చాంపియన్ కేలీ మెక్కియోవన్ (ఆ్రస్టేలియా; 2ని:03.33 సెకన్లు) విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. నేటితో ముగియనున్న ప్రపంచ చాంపియన్షిప్లో ప్రస్తుతం అమెరికా 8 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో నంబర్వన్ స్థానంలో ఉంది. -
మెస్సీ మేనియా షురూ!
కోల్కతా: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్కు విచ్చేసిన మెస్సీ... రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్లో కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫుట్బాల్ను అమితంగా ఇష్టపడే కోల్కతా నుంచి మెస్సీ పర్యటన ప్రారంభం కానుంది. అందకు తగ్గట్లే ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే భారత పర్యటనపై ఇప్పటి వరకు మెస్సీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అతి త్వరలో అది వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మెస్సీ పర్యటన ఖరారైంది. అతడి నుంచి అధికారిక స్పందన రావడమే తరువాయి. అది సామాజిక మాధ్యమాల ద్వారా ఏ క్షణమైనా రావచ్చు’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 12న మెస్సీ కోల్కతాలో అడుగు పెట్టనున్నాడు. 70 అడుగుల విగ్రహం... ఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే కోల్కతా వాసులు... మెస్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ రోడ్లోని లేక్టౌన్ శ్రీభూమిలో మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మెస్సీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ప్రపంచంలో మెస్సీకి ఇదే అతి ఎత్తయిన విగ్రహం కానుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించే ‘గోట్ కాన్సెర్ట్’లో మెస్సీ పాల్గొననున్నాడు. మెస్సీ ఘనతలను వివరించేలా సాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘అభిమానులను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. గోట్ కాన్సెర్ట్తో పాటు ఏడుగురు ప్లేయర్లతో కూడిన ‘సెవెన్–ఎ–సైడ్’ గోట్ కప్ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తదితరులు పాల్గొననున్నారు. ఇది మెస్సీ గౌరవార్ధం నిర్వహిస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడే అవకాశం ఉండగా... టికెట్ ధరలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయి. సుమారు గంటన్నర పాటు మెస్సీ మైదానంలో ఉంటాడు. అతడిని దగ్గర నుంచి చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయమే’ అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీని సత్కరించే అవకాశముంది. ముంబైలో క్రికెట్ మ్యాచ్! కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ అహ్మదాబాద్, ముంబైలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. డిసెంబర్ 14న ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనున్న ‘గోట్ కాన్సెర్ట్’, ‘గోట్ కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. దీని కోసం ఇప్పటికే మైదానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ముంబైలో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వస్తుండగా... నిర్వాహకులు మాత్రం వాటిని ఖండించారు. ‘మెస్సీ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడబోవడం లేదు. భారత సెలెబ్రిటీలతో సరదాగా సాఫ్ట్బాల్ ఆడుతాడు’ అని వెల్లడించారు. అదే సమయంలో భారత ఫుట్బాల్ జట్టును సైతం మెస్సీ కలిసే అవకాశముంది. అనంతరం డిసెంబర్ 15న ఢిల్లీ చేరుకోనున్న మెస్సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి నగరంలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా గడపనున్నాడు. ఈ టూర్లో మెస్సీ కేరళకు వెళ్లడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అప్పుడేం జరిగిందంటే...2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి భారత్లో పర్యటించాడు. వెనిజులాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం కోల్కతాకు విచ్చేసిన మెస్సీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జట్టుతో పాటు వచి్చన మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకగా... మ్యాచ్ జరుగుతున్నంత సేపు ‘సాల్ట్లేక్’ స్టేడియం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. కోల్కతా నగరం మొత్తం ‘మెస్సీ మేనియా’తో ఊగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత... ప్రపంచ చాంపియన్ హోదాలో మెస్సీ భారత్లో అడుగుపెట్టనుండటంతో... ఈ సారి మరింత మంది అభిమానులు అర్జెంటీనా స్టార్ను చూసేందుకు ఎగబడటం ఖాయమే. -
దివ్యకు రూ. 3 కోట్ల నజరానా
నాగ్పూర్: మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందించారు. జార్జియాలో ఇటీవల జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో భారత స్టార్ కోనేరు హంపిపై ‘టైబ్రేక్’లో నెగ్గి చాంపియన్గా అవతరించిన 19 ఏళ్ల దివ్యను శనివారం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో ఫడ్నవీస్ ప్రత్యేకంగా అభినందించారు. నాగ్పూర్కు చెందిన దివ్య యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఫడ్నవీస్ అన్నారు. చిన్న వయసులోనే పెద్ద ఘనత సాధించిన దివ్యను సత్కరించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ... ‘ఇది నాకు ప్రత్యేకమైన సందర్భం. చిన్నారులకు స్ఫూర్తిగా నిలవడంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో మహారాష్ట్ర చెస్ సంఘం దివ్యకు రూ. 11 లక్షల నజరానా అందించింది. ఒక్క జీఎం నార్మ్ కూడా లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన దివ్య... టైటిల్తో పాటు నేరుగా గ్రాండ్మాస్టర్ హోదా సైతం దక్కించుకుంది. మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ శనివారం దివ్య దేశ్ముఖ్ ఇంటిని సందర్శించి... వరల్డ్కప్ టైటిల్ గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దివ్య కుటుంబంతో తనకున్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్న చీఫ్ జస్టిస్... భవిష్యత్తులో దివ్య మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
భర్తతో విడాకులు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సైనా నెహ్వాల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) అభిమానులకు శుభవార్త చెప్పింది. భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kasyap)తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘దూరం దగ్గర చేసింది’’ అని క్యాప్షన్ ఇచ్చింది. తద్వారా తాము తిరిగి కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చింది.కాగా భర్త పారుపల్లి కశ్యప్తో తాను విడిపోతున్నట్లు (Divorce) సైనా నైహ్వాల్ గత నెలలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూలై 13న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఆలోచించే విడాకుల నిర్ణయం‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణించేలా చేస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల అనంతరం నేను, కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఈ బంధంలో నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇకపై కూడా మేము స్నేహితుల్లా కొనసాగుతాం’’ అని సైనా నోట్ విడుదల చేసింది.ఊహించని ట్విస్ట్అయితే, తాజాగా శనివారం పారుపల్లి కశ్యప్తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు దూరమే.. మన సన్నిహితులతో కలిసి ఉండటం ఎంత విలువైనదో నేర్పుతుంది. మేము కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం’’ అని రెండు హార్ట్ ఎమోజీలతో సైనా క్యాప్షన్ జతచేసింది. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసేవాళ్లు. అయితే, సైనా విడాకుల ప్రకటన చేయగా.. కశ్యప్ మాత్రం అపుడు స్పందించలేదు.ఇక ఇప్పుడు భార్యతో కలిసి పోస్ట్ షేర్ చేస్తూ తమ రీయూనియన్ని మాత్రం తెలియజేశాడు. కాగా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా కాంస్యం గెలవగా.. అదే ఎడిషన్లో కశ్యప్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు.చదవండి: నిప్పుతో చెలగాటం ఆడటమే.. వరల్డ్కప్ గెలిస్తే ధోని గొప్పవాడు అయిపోతాడా? View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
కిన్ డబుల్ ధమాకా..
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ ఆరో రోజు స్టార్ స్విమ్మర్లు లాన్ మర్చెండ్ (ఫ్రాన్స్), టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ (కెనడా) బరిలో లేకపోవడంతో... ఐదు వేర్వేరు దేశాలకు చెందిన స్విమ్మర్లు పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం పోటీల్లో నెదర్లాండ్స్, చైనా, హంగేరి, అమెరికా, ఇంగ్లండ్కు చెందిన స్విమ్మర్లు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో మ్యారిట్ స్టీన్బెర్గన్ (నెదర్లాండ్స్) పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్ రేసులో స్టీన్బెర్గన్ 52.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మొల్లీ ఓ కల్లాఘన్ (52.67 సెకన్లు; ఆ్రస్టేలియా), టారీ హుస్కే (52.89 సెకన్లు; అమెరికా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. 2024లో దోహా వేదికగా జరిగిన పోటీల్లో సైతం విజేతగా నిలిచిన స్టీన్బెర్గన్... చివరి 50 మీటర్లలో జోరు పెంచి చాంపియన్గా అవతరించింది. ఆ్రస్టేలియా, అమెరికా స్విమ్మర్ల నుంచి కఠిన పోటీ ఎదురైనా... ఆఖర్లో ఆధిక్యం కనబర్చింది. ‘దోహాలో సునాయాసంగా విజయం సాధించా. కానీ ఈ సారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఈ విజయం చాలా సంతృప్తినిచి్చంది’ అని పోటీ అనంతరం స్టీన్బెర్గన్ పేర్కొంది. ఆరో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా, ఆ్రస్టేలియా ఐదేసి స్వర్ణ పతకాలతో పట్టిక అగ్రస్థానంలో నిలిచాయి. ఓవరాల్గా అమెరికా 20 పతకాలు సాధించగా... ఆ్రస్టేలియా 13 పతకాలు ఖాతాలో వేసుకుంది. కిన్ విన్ పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో చైనా స్విమ్మర్ కిన్ హైయాంగ్ విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కిన్ 2 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పీ వటనబె (2 నిమిషాల 7.70 సెకన్లు; జపాన్) రజతం గెలుచుకోగా... కాస్పర్ కారŠూబ్య (2 నిమిషాల 7.73 సెకన్లు; నెదర్లాండ్స్) కాంస్య పతకం నెగ్గాడు. ఈ విభాగంలో రెండేళ్ల క్రితం ప్రపంచ రికార్డు (2 నిమిషాల 5.48 సెకన్లు) తనపేరిట రాసుకున్న కిన్... విజయం అనంతరం ‘ఇదో అద్భుతం’ అని వ్యాఖ్యానించాడు. 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లోనూ పసిడి నెగ్గిన కిన్... 200 మీటర్లలోనూ జోరు కనబర్చి డబుల్ ధమాకా మోగించాడు. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ హబర్ట్ (హంగేరి) పసిడి పతకం గెలిచాడు. 1 నిమిషం 53.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పీటర్ కోట్జీ (1 నిమిషం 53.36 సెకన్లు; దక్షిణాఫ్రికా), యోహాన్ బ్రౌర్డ్ (1 నిమిషం 54.62 సెకన్లు; ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్... అమెరికాకు ఐదో స్వర్ణం అందించింది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో 2 నిమిషాల 18.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్ కావడం విశేషం. చికునోవా (2 నిమిషాల 19.96 సెకన్లు) రజతం గెలుచుకోగా.. కైలెన్ కార్బెట్, అలీనా ముసుకా (2 నిమిషాల 23.52 సెకన్లు) ఒకే సమయంలో లక్ష్యాన్ని చేరి కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 4–200 ఫ్రీస్టయిల్ రిలేలో బ్రిటన్ జట్టు 6 నిమిషాల 59.84 సెకన్ల టైమింగ్తో స్వర్ణం పసిడి గెలుచుకుంది. చైనా (7 నిమిషాల 0.91 సెకన్లు), ఆ్రస్టేలియా (7 నిమిషాల 0.98 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన 12 ఏళ్ల స్విమ్మర్ యూ జిడి ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగంలో చైనా జట్టులో సభ్యురాలైన యూ జిడి కాంస్యం గెలుచుకుంది. ఆ్రస్టేలియా, అమెరికా బృందాలు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గారు. 200 మీటర్ల బటర్ఫ్లై, 200 మీటర్ల మెడ్లీ వ్యక్తిగత విభాగాల్లోనూ యూ జిడి పతకానికి దగ్గరగా వచ్చింది. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకానికి దూరమైంది. 400 మీటర్ల విభాగం యూ జిడి ఇంకా పోటీ పడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత స్విమ్మర్ల నిరాశజనక ప్రదర్శన ఆరో రోజు కూడా కొనసాగింది. పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో రోహిత్ 47వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
ఫైనల్కు లక్కీ
ఏథన్స్ (గ్రీస్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ లక్కీ పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 110 కేజీల విభాగంలో లక్కీ ఫైనల్కు దూసుకెళ్లాడు. జపాన్, ఇరాన్కు చెందిన రెజ్లర్లపై విజయాలతో లక్కీ ముందంజ వేశాడు. జపాన్ రెజ్లర్ హంటో హయేషిపై టెక్నికల్ సూపీరియారిటీతో విజయం సాధించిన లక్కీ... తదుపరి రౌండ్లో 8–0తో ముర్తాజ్ బగ్దవద్జె (జార్జియా)పై గెలుపొందాడు. ఇక హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో లక్కీ 15–7 పాయింట్ల తేడాతో ఇరాన్కు చెందిన అమీర్ హుసేన్పై నెగ్గాడు. 65 కేజీల విభాగంలో గౌరవ్ పూనియా తొలి రెండు రౌండ్లలో టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించినా... క్వార్టర్స్లో ఓడి ఇంటిబాట పట్టాడు. -
భారత్ ఫుట్బాల్ కోచ్గా జమీల్
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చాన్నాళ్ల తర్వాత స్వదేశీ కోచ్ను నియమించారు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత్కు చెందిన ఖాలిద్ జమీల్కు జాతీయ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కోచ్ పదవి కోసం విదేశీ కోచ్లు స్టీఫెన్ కాన్స్టంటైన్, స్టీఫాన్ టర్కోవిచ్లు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరిని వెనక్కినెట్టిన 48 ఏళ్ల జమీల్ భారత్ హెడ్ కోచ్గా నియమితులయ్యారు. 13 ఏళ్ల తర్వాత జాతీయ ఫుట్బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ శిక్షణ ఇవ్వనున్నారు. చివరి సారిగా భారత్కే చెందిన సావియో మెడెరా 2011 నుంచి 2012 వరకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. తాజా నియామకంపై ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ ‘ఐఎమ్ విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ ముగ్గురితో కూడిన తుదిజాబితా నుంచి జమీల్ను ఎంపిక చేసింది. అయితే ఆయన పదవీ కాలాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. జమీల్ మూడేళ్ల గడువును ఆశిస్తున్నారు. అయితే రెండేళ్లా లేదంటే మూడేళ్లా అనేది జట్టు ప్రదర్శన, ఆయన ఇచ్చే శిక్షణను బట్టి ఉంటుంది’ అని అన్నారు. భారత మాజీ ఫుట్బాలర్ అయిన జమీల్ శిక్షణలో 2017లో ఐజ్వాల్ ఫుట్బాల్ క్లబ్ ‘ఐ–లీగ్’ టైటిల్ను సాధించింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్సీ కోచ్గా ఉన్నారు. అయితే భారత కోచ్గా నియమితులైన జమీల్ పూర్తి స్థాయిలో టీమిండియా కోచ్గా పనిచేయాల్సి ఉంటుందని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు చౌబే స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఎల్ ఫ్రాంచైజీకి జమీల్ గుడ్బై చెప్పాల్సి ఉంది. గత కోచ్ మారŠె భారత జట్టు హెడ్ కోచ్గా ఉంటూనే, ఎఫ్సీ గోవా కోచ్గాను పనిచేశారు. స్పెయిన్కు చెందిన మనోలో గత నెల కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. టీమిండియా గత కొంతకాలంగా తక్కువ ర్యాంకు జట్లతోనూ ఓడిపోతుండటంతో ఇంకో ఏడాది పదవీకాలం మిగిలిండగానే కోచ్ తన పదవికి రాజీనామా చేశారు. -
సెమీస్లో తరుణ్
మకావ్: సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి... మకావ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్కు చేరాడు. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)పై ప్రిక్వార్టర్స్లో సంచలన విజయం సాధించిన తరుణ్... క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ 21–12, 13–21, 21–18తో ప్రపంచ 87వ ర్యాంకర్ హు జె (చైనా)పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్–300 టోర్నీల్లో తరుణ్ సెమీస్కు చేరడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు అత్యుత్తమంగా జర్మన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఆడాడు. 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ను సులువుగా గెలుచుకున్న 23 ఏళ్ల తరుణ్... రెండో గేమ్లో వెనుకబడ్డాడు. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్లు సాగగా... కీలక దశలో పాయింట్లు సాధించిన తరుణ్ ముందంజ వేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్ 21–14, 18–21, 21–14తో జియాన్ చెన్ జూ (చైనా)పై విజయం సాధించాడు. 63 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో లక్ష్యసేన్ ఆధిక్యం కనబర్చాడు. నేడు జరగనున్న సెమీఫైనల్స్లో ఐదో సీడ్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో లక్ష్యసేన్, జస్టిన్ హో (మలేసియా)తో తరుణ్ తలపడనున్నారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 14–21, 21–13, 20–22తో చూంగ్ హాన్ జియాన్–హైకల్ ముహమ్మద్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
ఓటమితో వీడ్కోలు.. టెన్నిస్ స్టార్ కన్నీటి పర్యంతం
మాంట్రియల్: కెనడాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ జెనీ బుచార్డ్ ఆటకు వీడ్కోలు పలికింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. నేషనల్ బ్యాంక్ ఓపెన్లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బుచార్డ్ 2–6, 6–3, 4–6తో 17వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో పోరాడి గెలిచిన బుచార్డ్... రెండో రౌండ్లో అదే ఆటతీరు కనబర్చలేకపోయింది. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో... తొలి సెట్లో ఓడిన బుచార్డ్... ఆ తర్వాత పుంజుకుంది. రెండో సెట్ గెలిచి... మూడో సెట్లోనూ చక్కటి పోరాటం కనబర్చినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన బెన్చిచ్ విజయం సాధించింది. ప్రత్యేక అనుబంధం‘మాంట్రియల్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఎదో ఒక రోజు ఇదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకాలని బలంగా అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇదో భావోద్వేగ సందర్భం. కెరీర్లో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా’ అని బుచార్డ్ పేర్కొంది. 2014లో కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో బుచార్డ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరింది. ఆ ఏడాదే కెరీర్లో ఏకైక డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆమె.... ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో సెమీఫైనల్కు చేరింది. 2014లో వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన బుచార్డ్... తిరిగి పుంజుకోలేకపోయింది. కన్నీటి పర్యంతం‘ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఇక్కడి వరకు వచ్చా. టెన్నిస్ ధ్యాసలో పడి చదువుకు దూరమయ్యా. ఇష్టాలను వదులుకొని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇక ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. టెన్నిస్ నాకు తిరిగిచి్చన దాంతో సంతృప్తిగా ఉన్నా. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్లు వీక్షించేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగు పెట్టాలని కలలు కనేదాన్ని. అది నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నా’ అని మ్యాచ్ అనంతరం బుచార్డ్ కన్నీటి పర్యంతమైంది. -
గురువును గుర్తు చేసుకుంటూ..
నాగ్పూర్: దివ్య దేశ్ముఖ్... ప్రస్తుత చెస్ సంచలనం. 19 ఏళ్ల వయసులో మహిళల ప్రపంచకప్ను గెలుచుకొని సత్తా చాటిన ఘనాపాటీ. జార్జియాలో జరిగిన ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన అనంతరం చాంపియన్గా నిలిచిన అనంతరం దివ్య బుధవారం రాత్రి స్వదేశానికి తిరిగి వచ్చింది. సొంత ఊరు నాగ్పూర్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అంతా సందడిగా ఉంది. దివ్య రాగానే వారంతా బాజా భజంత్రీలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అప్పుడే దివ్య తన వద్ద ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ను బయటకు తీసి ప్రదర్శించింది. అది ఆమె మొదటి కోచ్ రాహుల్ జోషి చిత్రం. దానిని చూపిస్తూ దివ్య భావోద్వేగానికి లోనైంది. చెస్లో రాహుల్ వద్దే దివ్య ఓనమాలు నేర్చుకుంది. కేవలం కోచ్గానే కాకుండా తన సొంత ఇంట్లో మనిషిగా చూస్తూ రాహుల్ ఆమెకు శిక్షణనందించాడు. కెరీర్ ఆరంభంలో అండర్–9 స్థాయి నుంచి అండర్–14 వరకు పలు విజయాలు రాహుల్ కోచ్గా ఉండగానే వచ్చాయి.ఆమె మరింత ఎదుగుతున్న దశలో 2020లో కరోనా మహమ్మారి వచి్చంది. దీనికి 40 ఏళ్ల వయసులోనే జోషి బలయ్యాడు. కొన్ని విజయాలు సాధించగానే గతాన్ని మరిచిపోయే క్రీడాకారులు మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు. కానీ ఆదిగురువును ఆమెకు గౌరవించిన తీరు దివ్యను ప్రత్యేకంగా చూపించింది. ‘నేను ఈ స్థాయికి చేరడంతో మొదటి కోచ్ రాహుల్ జోషి సర్ పాత్ర ఎంతో ఉంది. నేను గ్రాండ్మాస్టర్ కావాలని ఆయన ఎంతో కోరుకునేవారు. ఈ విజయం ఆయనకే అంకితం’ అని దివ్య తన మనసులో భావాన్ని వెల్లడించింది. నా ఆటపైనే దృష్టి పెట్టాను... హంపితో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, తాను ఓడినా కోల్పోయేదేమీ లేదనే ఆలోచనతోనే బరిలోకి దిగినట్లు దివ్య పేర్కొంది. ప్రత్యర్థికి ఎంతో అనుభవం ఉన్నా... దాని గురించి ఆందోళన చెందకుండా తన ఆటపైనే దృష్టి పెట్టానని ఆమె వెల్లడించింది. ‘నేను ఓడిపోతాననే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. నిజానికి హంపి చేసిన పెద్ద తప్పుతోనే విజయం నా సొంతమైంది. నేను వేయబోయే ఎత్తుల గురించే తప్ప తుది ఫలితం ఎలా వస్తుందని పట్టించుకోలేదు. కాబట్టి ఒత్తిడికి లోను కాలేదు.అంతర్జాతీయ చెస్లో భారత మహిళలు సాధించే విజయాలు ఇక్కడ మరింత మంది అమ్మాయిలు ఈ ఆట వైపు ఆకర్షితులయ్యేందుకు స్ఫూర్తినిస్తాయి. అయితే నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రుల మద్దతే అన్నింటికంటే అవసరం. ముఖ్యంగా విజయాలు సాధించినప్పుడు కాకుండా ఓటములు ఎదురైనప్పుడు కూడా అండగా నిలవాల్సి ఉంటుంది’ అని దివ్య అభిప్రాయ పడింది. సెప్టెంబర్ లో తర్వాతి టోర్నీ... ప్రపంచకప్ను గెలుచుకోవడంతో తనకు దక్కిన కొత్త గుర్తింపు పట్ల దివ్య దేశ్ముఖ్ సంతోషం వ్యక్తం చేసింది. మున్ముందు ఇలాంటి విజయాలను కొనసాగిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్పింది. స్వస్థలం నాగపూర్లో లభించిన ఘన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని దివ్య పేర్కొంది. ‘నా కోసం ఇంత మంది ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వారంతా నన్ను సన్మానించిన తీరు చూస్తే గర్వంగా అనిపిస్తోంది. నాతో పాటు చెస్కు లభించిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నాను. తల్లిదండ్రులు నాకు అండగా నిలిచి ప్రోత్సహించడంతోనే ఇది సాధ్యమైంది. నా విజయంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ బరిలోకి దిగుతాను. సెపె్టంబర్ 2 నుంచి ఉజ్బెకిస్తాన్లో జరిగే గ్రాండ్ స్విస్ నా తర్వాతి టోర్నీ కానుంది’ అని దివ్య వెల్లడించింది. తాను వరల్డ్ కప్ గెలుచుకోవడంలో సహకరించిన మాజీ ఆటగాళ్లు, కోచ్లు అభిజిత్ కుంతే, అభిమన్యు పురాణిక్, సబా బలోగ్ (హంగేరీ)లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
మెకింటోష్ పసిడి ‘హ్యాట్రిక్’
సింగపూర్: ఈత కొలనులో తనకు తిరుగులేదని కెనడా టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరోసారి చాటుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తన జోరు కొనసాగిస్తూ 18 ఏళ్ల మెకింటోష్ మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఫైనల్లో మెకింటోష్ 2 నిమిషాల 01.99 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ చాంపియన్షిప్లో ఇప్పటికే మెకింటోష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్లో మెకింటోష్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ మెకింటోష్ స్వర్ణాలు సాధిస్తే... ఒకే ప్రపంచ చాంపియన్షిప్లో అత్యధికంగా 5 స్వర్ణ పతకాలు సాధించిన స్విమ్మర్గా మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా; 2007లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మెకింటోష్ సమం చేస్తుంది. గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో మెకింటోష్ 200 మీటర్ల బటర్ఫ్లయ్, మెడ్లీ, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్లో స్వర్ణాలు గెలిచి, 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో రజతం సాధించింది. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గిన మెకింటోష్ ... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు సాధించింది. మూడోసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడుతున్న మెకింటోష్ ఇప్పటి వరకు మొత్తం ఏడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి 11 పతకాలు గెలిచింది. మరోవైపు పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో ఫేవరెట్ లియోన్ మర్చండ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం సెమీఫైనల్ రేసులో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన 23 ఏళ్ల మర్చండ్... గురువారం జరిగిన ఫైనల్ రేసును 1 నిమిషం 53.68 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో డేవిడ్ పొపోవిచి (రొమేనియా; 46.51 సెకన్లు)... మహిళల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో కేథరీన్ బెర్కోఫ్ (అమెరికా; 27.08 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఆస్ట్రేలియా బృందం స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మరో మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ మెగా ఈవెంట్లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (5 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 11 పతకాలతో అగ్రస్థానంలో... అమెరికా (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) 18 పతకాలతో రెండో స్థానంలో... కెనడా (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) ఐదు పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి. గెలిచిన స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్ను నిర్ణయిస్తారు. -
రచన, అశ్విని బంగారం
ఏథెన్స్ (గ్రీస్): అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత ‘పట్టు’ చాటుకుంటూ... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో మహిళా రెజ్లర్లు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 43 కేజీల విభాగంలో రచన... 65 కేజీల విభాగంలో అశ్విని విష్ణోయ్ బంగారు పతకాలు సొంతం చేసుకోగా... 57 కేజీల విభాగంలో మోనీ, 73 కేజీల విభాగంలో కాజల్ రజత పతకాలు గెలిచారు. 49 కేజీల విభాగంలో కోమల్ వర్మ కాంస్య పతకాన్ని హస్తగతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్స్లో రచన 3–0తో జిన్ హువాంగ్ (చైనా)పై, అశ్విని 3–0తో ముఖాయో రఖిమ్జొనోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. మద్ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్)తో జరిగిన తుది పోరులో మోనీ 5–6 పాయింట్ల తేడాతో... వెన్జిన్ కియు (చైనా)తో జరిగిన ఫైనల్లో కాజల్ 5–8 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో కోమల్ వర్మ 8–3 పాయింట్ల తేడాతో అన్హెలీనా బుర్కినా (రష్యా)పై గెలిచింది. మరోవైపు భారత్కే చెందిన యశిత (61 కేజీలు) స్వర్ణ పతకం కోసం... మనీషా (69 కేజీలు) కాంస్య పతకం కోసం ఈ రోజు పోటీపడనున్నారు. -
తరుణ్ సంచలనం
మకావ్: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 19–21, 21–14, 22–20తో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తరుణ్ తొలి గేమ్లో ఒకదశలో 7–1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ అదే జోరును కొనసాగించలేకపోయాడు. తొలి గేమ్ చేజార్చుకున్నప్పటికీ ఆందోళనకు గురి కాకుండా సంయమనంతో ఆడిన తరుణ్ రెండో గేమ్ను దక్కించుకొని మ్యాచ్లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో గేమ్లు పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒకదశలో 17–14తో ముందంజ వేసిన తరుణ్ ఆ తర్వాత తడబడి స్కోరును 20–20తో సమం చేసుకున్నాడు. అయితే వెంటనే వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన తరుణ్ చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. భారత్కే చెందిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఆయుశ్ శెట్టి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ 21–14, 14–21, 21–17తో చికో వర్దోయో (ఇండోనేసియా)పై నెగ్గగా... ఆయుశ్ 18–21, 16–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రక్షిత శ్రీ (భారత్) 21–14, 10–21, 11–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 13–21, 18–21తో జిమ్మీ వోంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 10–21, 22–20, 21–16తో కకేరు కుమగాయ్–హిరోకి నిషి (జపాన్)లపై గెలిచింది. 61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్లో 19–20తో ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదలతో పోరాడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సాత్విక్–చిరాగ్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. -
PKL 12: ఆరోజే ఆరంభం.. వైజాగ్లో తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు
సాక్షి, విశాఖపట్నం: కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. ఆగష్టు 29న ప్రారంభం కానున్న ఈ మెగా కబడ్డీ టోర్నమెంట్ను నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు 12 జట్లు తలపడే ఈ మెగా లీగ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్..ప్రొ కబడ్డీ 12వ సీజన్ ప్రారంభ వేడుకలు వైజాగ్లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆగస్టు 29 శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్ను ఢీకొట్టనుంది.ఇక ఆగస్టు 30న, తెలుగు టైటాన్స్ మరోసారి బరిలోకి దిగి యూపీ యోధాస్తో పోటీపడనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్లో యు ముంబా, గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. ఇక సూపర్ సండే 30న తలైవాస్, యు ముంబా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ తమ టైటిల్ వేటను బెంగాల్ వారియర్స్ మ్యాచ్తో ప్రారంభించనుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత పీకేఎల్ మళ్లీ వైజాగ్కు రావడం విశేషం. గతంలో 2018లో ఆరో సీజన్కు అంతకుముందు 1,3 వ సీజన్ పోటీలకు అతిథ్యం ఇచ్చిన ఈ నగరంలో ఇప్పుడు మళ్ళీ కబడ్డీ సందడి నెలకొననుంది.చాలా ఆనందంగా ఉందిఈ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ, "ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్ ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్ను తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖపట్నంకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. కాగా 12వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్ కలిసి ఈ లీగ్ను దేశంలో అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగ్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.మిగతా నగరాల్లో షెడ్యూల్జైపూర్వైజాగ్లో తొలి అంచె ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుంచి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్తో తలపడనుంది. 10వ సీజన్లో చారిత్రాత్మక 1000వ మ్యాచ్కు జైపూర్ ఆతిథ్యం ఇచ్చింది.చెన్నైసెప్టెంబర్ 29 నుంచి చెన్నైలోని ఎస్డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.ఢిల్లీఅక్టోబర్ 13 నుంచి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో లీగ్ చివరి దశ మ్యాచ్లు జరుగుతాయి. ప్లేఆఫ్స్కు ముందు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు, ఈ దశలో ట్రిపుల్ హెడర్ (రోజుకు మూడు మ్యాచ్లు) మ్యాచ్లు కూడా నిర్వహించనున్నారు. -
హర్దీప్ ‘పసిడి’ పట్టు
ఏథెన్స్ (గ్రీస్): అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్ గ్రీకో రోమన్ స్టయిల్లో భారత యువ రెజ్లర్ హర్దీప్ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన 110 కేజీల విభాగం ఫైనల్లో హర్దీప్ 3–3 పాయింట్లతో యజ్దాన్ రెజా డెల్రూజ్ (ఇరాన్)పై గెలుపొందాడు. ఇద్దరి స్కోర్లు సమమైనప్పటికీ... నిబంధనల ప్రకారం చివరి పాయింట్ హర్దీప్ సాధించడంతో భారత రెజ్లర్కు స్వర్ణం ఖరారైంది.యజ్దాన్కు రజతం దక్కింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన నాలుగో రెజ్లర్గా 16 ఏళ్ల హర్దీప్ గుర్తింపు పొందాడు. గతంలో వినోద్ కుమార్ (45 కేజీలు; 1980లో).. పప్పూ యాదవ్ (51 కేజీలు; 1992లో)... సూరజ్ (55 కేజీలు; 2022లో) ఈ ఘనత సాధించారు.ప్రస్తుతం ఆసియా అండర్–17 విభాగంలో చాంపియన్గా ఉన్న హర్దీప్... తొలి రౌండ్లో 2–0తో బక్తూర్ సొవెట్ఖాన్ (కజకిస్తాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–2తో తొమెల్కా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–0తో అనతోలి నవచెంకో (ఉక్రెయిన్)పై, సెమీఫైనల్లో 4–2తో ఎమ్రుల్లా కప్కాన్ (టర్కీ)పై విజయం సాధించాడు. హరియాణాలోని ఝాజర్ జిల్లాకు చెందిన హర్దీప్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రస్తుతం హర్దీప్ బహదూర్గఢ్లోని ‘హింద్ కేసరి’ సోనూ అఖాడాలో ధర్మేందర్ దలాల్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. మరో నాలుగు పతకాలు ఖాయం... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు మరో నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు రచన (43 కేజీలు), మోనీ (57 కేజీలు), అశ్విని విష్ణోయ్ (65 కేజీలు), కాజల్ (73 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈరోజు జరిగే ఫైనల్స్లో జిన్ హువాంగ్తో రచన... మద్ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్)తో మోనీ, ముఖాయో రఖిమ్జొనోవా (ఉజ్బెకిస్తాన్)తో అశ్విని; వెన్జిన్ కియు (చైనా)తో కాజల్ తలపడతారు. -
తరుణ్ ముందుకు...
మకావు: మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, పారిస్ ఒలింపియన్ లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్ఎస్ ప్రణయ్, మన్రాజ్ సింగ్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, కిరణ్ జార్జి, సతీశ్ కుమార్ కరుణాకరన్, రిత్విక్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో తరుణ్ 21–19, 21–13తో సహచరుడు మన్రాజ్ సింగ్పై, లక్ష్య సేన్ 21–8, 21–14తో జియోన్ హైయోక్ జిన్ (దక్షిణ కొరియా)పై, ఆయుశ్ 21–10, 21–11తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించారు. ప్రపంచ 33వ ర్యాంకర్ ప్రణయ్ 21–18, 15–21, 16–21తో ప్రపంచ 75వ ర్యాంకర్ యోహానెస్ మార్సెలినో (ఇండోనేసియా) చేతిలో... శంకర్ 18–21, 14–21తో హు జె ఆన్ (చైనా) చేతిలో... కిరణ్ జార్జి 15–21, 10–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సతీశ్ కుమార్ 19–21, 12–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, రిత్విక్ 16–21, 8–21తో చికో వర్దాయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. రక్షిత శ్రీ సంచలనం మహిళల సింగిల్స్లో ఆరుగురు భారత క్రీడాకారిణులు బరిలోకి దిగగా... రక్షిత శ్రీ మినహా మిగతా ఐదుగురు తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. తొలి రౌండ్లో రక్షిత శ్రీ 63 నిమిషాల్లో 18–21, 21–17, 22–20తో ప్రపంచ 35వ ర్యాంకర్ పోర్న్పిచా చోయికివోంగ్ (థాయ్లాండ్)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఉన్నతి హుడా 21–16, 19–21, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, తస్నీమ్ మీర్ 6–21, 14–21తో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 14–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 16–21, 10–21తో రికో గుంజి (జపాన్) చేతిలో, అన్మోల్ 21–23, 11–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. రుత్విక జోడీకి నిరాశ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీకి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ ద్వయం 20–22, 17–21 తో వు గువాన్ జున్–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్లో తనీషా–ధ్రువ్ ద్వయం 21–10, 21–15తో రచాపోల్–నత్తమోన్ (థాయ్లాండ్) జంటపై నెగ్గింది.ఇతర మ్యాచ్ల్లో హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) 11–21, 14– 21తో ఫువానత్–ఫుంగ్ఫా (థాయ్లాండ్) చేతిలో ... సతీశ్–ఆద్య (భారత్) 18–21, 21– 23 తో అమ్రీ–నితా (ఇండోనేసియా) చేతి లో... ఆయుశ్ –శ్రుతి (భారత్) 10–21, 11– 21 తో రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
14 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఫ్రాన్స్ స్టార్ స్విమ్మర్ లియోన్ మర్చండ్ పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. బుధవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ సెమీఫైనల్ ఈవెంట్ను 23 ఏళ్ల మర్చండ్ 1 నిమిషం 52.61 సెకన్లలో ముగించాడు. ఈ క్రమంలో 14 ఏళ్లుగా అమెరికా మేటి స్విమ్మర్ ర్యాన్ లోచ్టె (1ని:54 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మర్చండ్ బద్దలు కొట్టాడు. సెమీఫైనల్లో తొలుత 50 మీటర్లను (బటర్ఫ్లయ్ స్టయిల్) 24.10 సెకన్లలో పూర్తి చేసిన మర్చండ్... తదుపరి 50 మీటర్లను (బ్యాక్స్ట్రోక్ స్టయిల్) 28.40 సెకన్లలో ముగించాడు. తర్వాత 50 మీటర్లను (బ్రెస్ట్స్ట్రోక్ స్టయిల్) 32.13 సెకన్లలో... చివరి 50 మీటర్లను (ఫ్రీస్టయిల్) 28.06 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. ఈరోజు జరిగే ఫైనల్లో మర్చండ్ తన పేరిట నమోదైన కొత్త ప్రపంచ రికార్డును మళ్లీ సవరించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన లియోన్ మర్చండ్కు 30 వేల డాలర్లు (రూ. 26 లక్షల 28 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గత ఏడాది స్వదేశంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో మర్చండ్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి ఐదు పతకాలు సాధించి అదరగొట్టాడు. గత రెండు ప్రపంచ చాంపియన్íÙప్లలో (2022, 2023) మర్చండ్ 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో స్వర్ణ పతకాలు సాధించాడు. -
లెడెకీ పసిడి ‘సిక్సర్’
సింగపూర్: సంవత్సరాలు గడుస్తున్నాయి.... ప్రత్యర్థులు మారుతున్నారు... కానీ ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో మాత్రం విజేత పేరు మారడం లేదు. 2013 నుంచి 2025 వరకు ఏడు ప్రపంచ చాంపియన్షిప్లు జరిగాయి. ఇందులో ఆరింటిలో (2013, 2015, 2017, 2022, 2023, 2025) కేటీ లెడెకీకే స్వర్ణ పతకం లభించింది. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో లెడెకీ ఫైనల్ చేరుకున్నా అనారోగ్యం కారణంగా ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. లేదంటే లెడెకీ ఖాతాలోనే స్వర్ణం చేరేది. ప్రస్తుతం సింగపూర్లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్షిప్లో మంగళవారం జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో లెడెకీ తన సత్తా చాటుకుంది. ఇంతకుముందు 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం నెగ్గిన లెడెకీ... 1500 మీటర్లలో పసిడి పతకం కైవసం చేసుకుంది. 15 నిమిషాల 26.44 సెకన్లలో రేసును ముగించిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల సంగతి పక్కన పెడితే... 1500 మీటర్లలో తనకు తిరుగులేదని లెడెకీ మరోసారి నిరూపించింది. ఈ విభాగంలో ప్రపంచ అత్యుత్తమ స్విమ్మర్గా గుర్తింపు సాధించిన లెడెకీ... దశాబ్ద కాలంగా 1500 మీటర్లలో అత్యుత్తమ మహిళా స్విమ్మర్గా కొనసాగుతోంది. ఈ ఈవెంట్లో ప్రపంచ 26 అత్యుత్తమ ప్రదర్శనల్లో 25 ఆమె పేరిట ఉన్నాయంటే... 1500 మీటర్లలో ఆమె ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థంచేసుకోవచ్చు. ‘నాకు ఈ రేసు అంటే చాలా ఇష్టం. 2013లో మొదటిసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినప్పటి నుంచి 1500 మీటర్ల రేసును ప్రేమిస్తున్నా. ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప విజయాలు దక్కడం ఆనందంగా ఉంది. కొలనులో అడుగు పెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే భావిస్తా. అందుకు తగ్గట్లే కష్టపడతా. ప్రస్తుత టైమింగ్తో సంతోషంగా ఉన్నా’ అని లెడెకీ వెల్లడించింది. మంగళవారం పోటీలో ఒకానొక దశలో ప్రపంచ రికార్డు వేగం కంటే ముందున్న లెడెకీ చివర్లో కాస్త వెనుకబడింది. మహిళల స్విమ్మింగ్లో ఏకఛత్రాధిపత్యం కనబరుస్తున్న లెడెకీకి ప్రపంచ చాంపియన్షిప్లో ఇది 22వ స్వర్ణం కాగా... ఓవరాల్గా 28వది. ఒలింపిక్స్లో సాధించిన 9 పసిడి పతకాలు, మొత్తంగా 14 మెడల్స్ కలుపుకుంటే... ఓవరాల్గా ఆమె పతకాల సంఖ్య 42. అందులో 31 స్వర్ణాలు ఉండటం విశేషం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు, 2004, 2008 ఒలింపిక్స్ 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ స్వర్ణ పతక విజేత క్రిస్టీ కొవెంట్రీ సమక్షంలో లెడెకీ పతకం నెగ్గింది. పోటీల మూడో రోజు మంగళవారం ఐదు అంశాల్లో ఫైనల్స్ నిర్వహించగా... పురుషుల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో రొమేనియాకు చెందిన డేవిడ్ పొపొవిక్ వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోట్జీ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో జర్మనీకి చెందిన అన్నా ఎలెన్ సంచలనం సృష్టించింది. అమెరికా స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్ను వెనక్కి నెడుతూ బంగారు పతకం కైవసం చేసుకుంది. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ల్యూక్ హబ్సన్ విజేతగా నిలిచాడు. భారత స్విమ్మర్లకు నిరాశ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్విమ్మర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు భారత స్విమ్మర్లు హీట్స్ దాటి ముందడుగు వేయలేకపోయారు. పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగంలో సజన్ ప్రకాశ్ 24వ స్థానంలో నిలిచి సెమీఫైనల్కు దూరమయ్యాడు. ఈ విభాగంలో తొలి 16 స్థానాల్లో నిలిచిన వాళ్లు సెమీస్కు అర్హత సాధించారు. భారత్ నుంచి నేరుగా ఒలింపిక్స్ (టోక్యో 2020)కు అర్హత సాధించిన తొలి స్విమ్మర్గా రికార్డు సృష్టించిన 31 ఏళ్ల సజన్ ప్రకాశ్... ఈ టోర్నీ 200 ఫ్రీస్టయిల్లో 43వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.ఇక 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఆర్యన్ నెహ్రా 23వ స్థానంలో నిలిచాడు. మంగళవారం పోటీలో ఆర్యన్ 8 నిమిషాల 21.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తొలి 8 స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్కు చేరారు. మరోవైపు 50 మీటర్ల బటర్ఫ్లయ్ విభాగంలోనూ ఆర్యన్ 57వ స్థానంతో సరిపెట్టుకోగా... ఎస్పీ లికిత్ 50వ స్థానంలో నిలిచాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
మకావు: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో లో హాంగ్ యీ–ఎన్జీ ఇంగ్ చెయోంగ్ (మలేసియా) జంటపై గెలిచి శుభారంభం చేసింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మహిళల డబుల్స్లో ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ప్రియ–శ్రుతి 21–15, 16–21, 21–17తో జి లింగ్ హువాంగ్–వాంగ్ జు మిన్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ అన్మోల్, తస్నీమ్ మీర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో అన్మోల్ 21–11, 21–13తో ఫాతిమా (అజర్బైజాన్)పై, తస్నీమ్ 21–14, 13–21, 21–17తో టిడాప్రోన్ క్లీబైసన్ (థాయ్లాండ్)పై గెలుపొందారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా)తో తస్నీమ్; రెండో సీడ్ బుసానన్ (థాయ్లాండ్)తో అన్మోల్ తలపడతారు. టాప్ సీడ్ గాయత్రి జంటకు షాక్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. లిన్ జియో మిన్–పెంగ్ యు వె (చైనీస్ తైపీ) జోడీతో జరిగిన మ్యాచ్లో గాయత్రి–ట్రెసా జంట 21–16, 20–22, 15–21తో ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో అపూర్వ–సాక్షి (భారత్) 8–21, 11–21తో తియో మె జింగ్–గో పె కి (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హరిహరన్–రూబన్ (భారత్) 21–15, 19–21, 14–21 తో టోరి ఐజవా–దైసుకె సానో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. డింకూ సింగ్–అమాన్ (భారత్) జోడీ క్వాలిఫయింగ్ మ్యాచ్లో 21–18, 21–17తో లా చెయుక్ హిమ్–యెంగ్ షింగ్ చోయ్ (హాంకాంగ్) జంటపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. మెయిన్ ‘డ్రా’కు హేమనాగేంద్ర జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తాండ్రంగి హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన హేమనాగేంద్ర బాబు–ప్రియ జోడీ 21–17, 21–19తో జి వె హి–యాన్ ఫె చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.మళ్లీ టాప్–10లోకి సాత్విక్–చిరాగ్ జోడీన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ టాప్–10లోకి దూసుకొచ్చింది. గతవారం చైనా ఓపెన్లో సెమీఫైనల్కు చేరడం ద్వారా సాత్విక్ జంట మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 10వ ర్యాంక్కు చేరింది. గతేడాది థాయ్లాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనంతరం ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ దక్కించుకున్న భారత ద్వయం... ఈ సీజన్లో మూడు టోర్నీల్లో సెమీఫైనల్కు చేరింది. చైనా ఓపెన్ కంటే ముందు సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో సైతం ఈ జోడీ సెమీస్ ఆడింది. పురుషుల సింగిల్స్లో భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్లో ఇటీవల పీవీ సింధుపై నెగ్గిన 17 ఏళ్ల ఉన్నతి హుడా కెరీర్ బెస్ట్ 31వ ర్యాంక్ దక్కించుకుంది. ఈ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా సింధు 15వ స్థానంలో ఉంది. టాప్–100లో భారత్ నుంచి 16 మంది ఉండటం విశేషం. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రిæ–ట్రెసా జాలీ జంట 11వ ర్యాంక్లో కొనసాగుతోంది. -
‘మానసిక దృఢత్వమే గెలిపించింది’
న్యూఢిల్లీ: మహిళా చెస్ దిగ్గజం సుసాన్ పోల్గర్ భారత గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్పై ప్రశంసలు కురిపించింది. వరల్డ్ కప్లో వేర్వేరు సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దివ్య గెలిచిన తీరు అద్భుతమని ఆమె వ్యాఖ్యానించింది. మానసిక దృఢత్వం, పోరాటతత్వమే ఆమెను చాంపియన్గా నిలిపిందని పోల్గర్ అభిప్రాయపడింది. ‘చారిత్రక విజయం సాధించిన దివ్యకు నా అభినందనలు. చాలా బాగా ఆడింది. టోర్నీకి ముందు ఫేవరెట్లలో ఆమె పేరు లేదు. అయితే గెలవాలనే పట్టుదల, మానసిక దృఢత్వంతో ఆమె ముందంజ వేయగలిగింది. టోర్నీలో దివ్య ఇబ్బంది పడిన గేమ్లు ఉన్నాయి. మంచి అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఆమెపై పడలేదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఆమె పోరాడింది. అదే పట్టుదల చివరి వరకు నిలిచి గెలిచేలా చేశాయి’ అని పోల్గర్ వ్యాఖ్యానించింది. ప్రపంచ చెస్లో ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలు అపూర్వమని ఆమె పేర్కొంది. వీరందరికీ గొప్ప భవిష్యత్తు ముందుందని పోల్గర్ జోస్యం చెప్పింది. ‘గుకేశ్ పెద్ద స్థాయికి చేరతాడని అతనికి 12 ఏళ్లు ఉన్నప్పుడే నేను చెబితే ఎవరూ నమ్మలేదు. 50 మంది గ్రాండ్మాస్టర్లను తయారు చేసిన నా అనుభవంతో ఆ వ్యాఖ్యలు చేశాను. దివ్య విషయంలో కూడా అదే జరిగింది. పెద్ద ప్లేయర్గా గుర్తింపు లేకపోయినా ఆమెలో ప్రత్యేక ప్రతిభ ఉంది కాబట్టే ఈ స్థాయిలో గెలిచింది. ప్రస్తుతం భారత చెస్లో స్వర్ణయుగం నడుస్తోంది. వారి ఆట గొప్పగా ఉండటంతో పాటు సరైన రీతిలో మద్దతు, దిశానిర్దేశం లభిస్తున్నాయి. దివ్య ఇక్కడితో ఆగిపోవద్దు. ఆమె ఆటపై అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి మరింతగా కష్టపడి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. హంపి అంటే కూడా నాకు గౌరవం ఉంది. సుదీర్ఘ కాలం ఆమె అగ్రస్థాయిలో కొనసాగింది. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారడం సహజం’ అని పోల్గర్ పేర్కొంది. -
భారత్కు క్లిష్టమైన ‘డ్రా’
సిడ్నీ: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్లో పాల్గొంది. మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్తో... మూడో మ్యాచ్లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి. సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి... ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్కు క్వాలిఫై అవుతాయి. ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్లు లభిస్తాయి. -
Divya Deshmukh: అసలైన హీరో మాత్రం ఆమెనే: ఆనంద్ మహీంద్ర
దివ్య దేశ్ముఖ్ (Divya Deshmukh).. భారత చెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం. ఫిడే మహిళల ప్రపంచకప్ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.దూకుడు ప్రదర్శిస్తూనేపందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది. క్లాసిక్ గేమ్స్ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్ రౌండ్స్లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్గా అవతరించింది.అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ఈ నేపథ్యంలో దివ్య దేశ్ముఖ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ ఇవ్వడం విశేషం.ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్-2025 విజేత దివ్య దేశ్ముఖ్. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.అయినా, ప్రతీ గ్రాండ్ మాస్టర్ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్సంగ్ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్ముఖ్ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్ స్టార్లు ఆర్.ప్రజ్ఞానంద, ఆర్.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దివ్య భావోద్వేగంప్రపంచకప్ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు.నేను ఎప్పుడు నార్మ్ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్మాస్టర్ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన దివ్య దేశ్ముఖ్ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్. వీరిద్దరూ డాక్టర్లే!చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’ Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.Through this victory she also achieves Grandmaster status. At the age of 19. And behind the Grandmaster is the caring mother…As always, the unsung hero behind many stars…pic.twitter.com/9AyeBBPbM5— anand mahindra (@anandmahindra) July 28, 2025 -
ఇంగ్లండ్... తగ్గేదేలే
బాసెల్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల జట్టు యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్లో టైటిల్ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఆఖరి క్షణం దాకా పోటాపోటీగా పోరాడిన స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా చిత్తయ్యింది. కేవలం ఒకే ఒక్క స్ట్రయికర్ గోల్ చేయడం గమనార్హం. మరోవైపు ఇంగ్లండ్ బృందంలో ఇద్దరు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమవగా... ముగ్గురు గోల్స్ చేశారు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లండ్, స్పెయిన్ జట్లు 1–1 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. ముందుగా స్పెయిన్ శిబిరం నుంచి గోల్ నమోదైంది. తొలి అర్ధభాగంలోనే మరియాన కాల్డెంటే (25వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు శుభారంభాన్నిచి్చంది. 1–0తో ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలవగానే ఇంగ్లండ్ ప్లేయర్లు దాడులకు పదును పెట్టారు. ఈ క్రమంలో అలెసియా రుసో (57వ నిమిషంలో) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు ఎంతగా శ్రమించిన ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నిరీ్ణత సమయంలో ఫలితం తేలకపోవడంతో అదనపు సమయం ఆడించారు. అయినా... స్కోరులో ఏ మార్పు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ తొలి షాట్ నుంచే ‘డ్రా’ మొదలైంది. స్పెయిన్ ఒకటే గోల్ చేసినా... ఇంగ్లండ్ గెలిచేందుకు ఆఖరి షాట్ గోల్దాకా వేచిచూడక తప్పలేదు. ఎందుకంటే మొదట కిక్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో బెత్ మీడ్ విఫలమైంది. స్పెయిన్ తరఫున ప్యాట్రిసియా గూజారో గోల్ కొట్టడంతో నిరీ్ణత సమయం మ్యాచ్లోలానే 1–0తో ‘షూటౌట్’లోనూ తొలుత పైచేయి సాధించింది. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లు అలెక్స్ గ్రీన్వుడ్, నియామి చార్లెస్లు వరుసగా షాట్లు కొట్టడంతో రేసులో పడగా... మరోవైపు స్పెయిన్ శిబిరంలో మరియానా, ఐతాన బొన్మటి విఫలమవడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా 2–1తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. నాలుగో షాట్ లియా విలియమ్సన్ (ఇంగ్లండ్), సాల్మ పారాల్యులో (స్పెయిన్) ఎవరి వల్లా కాలేదు. 2–1తో ఇక ఆఖరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఇంగ్లండ్ ఐదో షాట్ విఫలమై, స్పెయిన్ చేసి ఉంటే 2–2తో సమమై విజేత కోసం డ్రామా కొనసాగేది. కానీ క్లో కెల్లీ (ఇంగ్లండ్) స్పెయిన్కు ఆ ఆఖరి ఛాన్స్ ఇవ్వకుండా గోల్ చేసింది. 3–1తో ఫలితం రావడంతో స్పెయిన్ ఆఖరి షాట్ తీసుకోలేదు. 2022లో జరిగిన అమ్మాయిల యూరోలోనూ ఇంగ్లండే చాంపియన్గా నిలిచింది. స్టేడియానికి ‘రాయల్’ కళసెయింట్ జాకబ్ పార్క్లో జరిగిన ఈ టైటిల్ పోరుకు ‘రాయల్’ హాజరు లభించింది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు బ్రిటన్ యువరాజు విలియమ్స్ (కింగ్ చార్లెస్ తనయుడు) కుమార్తె ప్రిన్సెస్ చార్లట్తో విచ్చేశారు. ప్రిన్స్ విలియమ్స్ ఇంగ్లిష్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు స్పెయిన్ రాజవంశానికి చెందిన యువరాణి ప్రిన్సెస్ లియోనర్ తన సోదరి ఇన్ఫాంటా సోఫియాతో కలిసి టైటిల్ పోరును వీక్షించింది. సోఫియా 2023లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ను తల్లి, స్పెయిన్ రాణి లెటిజియాతో కలిసి వీక్షించింది. ఆ మ్యాచ్లో స్పెయిన్ విజేతగా నిలిచింది. మొత్తానికి 2023 ప్రపంచకప్, 2024 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లతో జోరుమీదున్న స్పెయిన్ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక టైటిల్ గెలవాలనే గంపెడాశలతో బరిలోకి దిగింది. కానీ తుదిమెట్టుపై చతికిలబడింది. దీంతో ‘యూరో’ కప్ స్పెయిన్ మహిళల జట్టుకు ఇన్నేళ్లయినా అందని ద్రాక్షగానే ఉంది. -
దివ్యమైన విజయం
అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి దివ్య దేశ్ముఖ్ రూపంలో తొలిసారి చాంపియన్ ఆవిర్భవించింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణులు బరిలో ఉండటం... ఫేవరెట్ ముద్ర లేకపోవడం... 19 ఏళ్ల ఈ మహారాష్ట్ర అమ్మాయికి కలిసొచ్చింది. ఫలితంగా... ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ... అందరి అంచనాలను తారుమారు చేస్తూ... మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే... పక్కా ప్రణాళికతో చకచకా ఎత్తులు వేస్తే... ప్రత్యర్థి ఎంతటి మేధావి అయినా... ఒకానొక దశలో ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేస్తారని.... చివరకు చేతులెత్తేస్తారని... దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో నిరూపించింది. వెరసి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే గెలుపుతో... దివ్య స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడంతోపాటు...మరోవైపు ఊహ కందని విధంగా గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను కూడా ఖాయం చేసుకోవడం విశేషం. బతూమి (జార్జియా): అనుభవంపై యువతరం గెలిచింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ విజేతగా అవతరించింది. రెండు సార్లు ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్ముఖ్ ఓవరాల్గా 2.5–1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం క్లాసికల్ ఫార్మాట్లో నిరీ్ణత రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. ర్యాపిడ్ ఫార్మాట్లో 15 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు జరిగాయి. తొలి గేమ్లో తెల్ల పావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో టైబ్రేక్లో తొలి గేమ్ ముగిశాక ఇద్దరూ 0.5–0.5తో సమంగా నిలిచారు. రెండో గేమ్ను హంపి తెల్ల పావులతో ప్రారంభించింది. ఒకానొక దశలో ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసేలా అనిపించింది. చాంపియన్ను నిర్ధారించేందుకు మరో రెండు ర్యాపిడ్ గేమ్లు అవసరం పడతాయనిపించింది. అయితే సమయాభావం వల్ల కీలక దశలో హంపి ఒత్తిడికిలోనై పొరపాట్లు చేయడం... వాటిని దివ్య సది్వనియోగం చేసుకుంది. ఫలితంగా రెండో గేమ్లో దివ్య 75 ఎత్తుల్లో గెలుపొంది 1.5–0.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. టైబ్రేక్లో తొలి రెండు ర్యాపిడ్ గేముల్లోనే విజేత తేలిపోవడంతో తదుపరి గేమ్లు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఈ గెలుపుతో ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) టైటిల్తో ఉన్న దివ్యకు గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ ఖాయమైంది. విజేత దివ్య దేశ్ముఖ్కు స్వర్ణ పతకంతోపాటు 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 38 వేలు)... రన్నరప్ హంపికి రజత పతకంతోపాటు 35 వేల డాలర్లు (రూ. 30 లక్షల 36 వేలు)... మూడో స్థానం పొందిన చైనా గ్రాండ్మాస్టర్ టాన్ జోంగికి కాంస్య పతకంతోపాటు 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గాలివాటమేమీ కాదు... 46 దేశాల నుంచి మొత్తం 107 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ ప్రపంచకప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్న దివ్య 15వ సీడింగ్తో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ నాగ్పూర్ అమ్మాయి టైటిల్ గెలిచే క్రమంలో తన కంటే ఎంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు, గ్రాండ్మాస్టర్ హోదా ఉన్న నలుగురు ప్లేయర్లను ఓడించి ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపించుకుంది. ఫైనల్లో హంపి (2543 రేటింగ్ పాయింట్లు), సెమీఫైనల్లో టాన్ జోంగి (చైనా; 2546), క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్; 2483), ప్రిక్వార్టర్ ఫైనల్లో జు జినెర్ (చైనా; 2547 రేటింగ్)లపై దివ్య గెలిచింది. దివ్య 2005లో జన్మించగా... హంపి 2002లోనే గ్రాండ్మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి రెండుసార్లు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ (2019లో, 2024లో) నిలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో హంపినే ఫేవరెట్ అనుకున్నారంతా... కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయంతో ‘దివ్య’మైన చెస్ ప్రపంచాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన వెంటనే దివ్య తన భావోద్వేగాన్ని తల్లితో పంచుకుంది. డాక్టర్ల ఫ్యామిలీ నుంచి... దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్లిద్దరూ డాక్టర్లు. 2005 డిసెంబర్ 5న నాగ్పూర్లో జన్మించిన దివ్య ఐదేళ్ల ప్రాయంలో చెస్లో అడుగు పెట్టింది. దివ్య సోదరి బ్యాడ్మింటన్ శిక్షణకు వెళుతున్న సమయంలో అక్కడే జరుగుతున్న చెస్ శిబిరంలో దివ్య చేరింది. ఆ తర్వాత చెస్పై మక్కువ ఏర్పడటంతో ఆటను సీరియస్గా తీసుకుంది. 2020లో ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ చాంపియన్గా నిలిచింది. 2022 చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత కాంస్య పతకం... 2023లో ఆసియా చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. 2023లోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక, హంపి, సవితాశ్రీ, వంతిక అగర్వాల్, ఇరీనా క్రష్లను ఓడించిన దివ్య వరల్డ్ చాంపియన్ జు వెన్జున్తో, అనా ఉషెనినాతో గేమ్లు ‘డ్రా’ చేసుకొని టోర్నీ విజేతగా నిలిచింది. 2024లో గాంధీ నగర్లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో టైటిల్ నెగ్గిన దివ్య... హంగేరిలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది.ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అయిన హంపి ఓటమి ఊహించలేనిది. ఎండ్గేమ్లో ఆమె వరుసగా తప్పులు చేసింది. 54వ ఎత్తులో చిన్న పొరపాటు చేసి హంపి వెనుకబడినా... ఆమెకు కోలుకునే అవకాశం కూడా వచి్చంది. అయితే సమయాభావ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపించింది. 67వ ఎత్తు వేసే సమయానికి దివ్యకు సానుకూల పరిస్థితి ఏమీ లేదు. దీనిని హంపి జాగ్రత్తగా వేసి ఉంటే గేమ్ డ్రా వైపు వెళ్లేది. కానీ ఇక్కడే హంపి మళ్లీ మరో పెద్ద తప్పు చేసింది. కొత్త తరానికి ప్రతినిధి అయిన దివ్య కొత్తగా నేర్చుకోవడంలో, దూసుకుపోవడంలో సహజంగానే కాస్త ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన హంపిని ఎదుర్కొనేందుకు దివ్య పక్కాగా కొత్త ప్రణాళికలతో సిద్ధమై వచ్చినట్లు కనిపించింది. –చంద్రమౌళి, ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ -
ప్రపంచకప్ చాంపియన్గా దివ్య దేశ్ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE World Cup) ఫైనల్లో యువ తరంగం దివ్య దేశ్ముఖ్ (Divya Deshmukh) సత్తా చాటింది. తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy)ని 2.5-1.5తో ఓడించి.. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.జార్జియాలోని బతూమీ వేదికగా సోమవారం జరిగిన టై బ్రేకర్లో హంపీ తొలుత నల్ల పావులతో ఆడగా.. దివ్యతో కలిసి డ్రా చేసుకుంది. పదిహేను నిమిషాల పాటు సాగిన గేమ్లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. అనంతరం పదిహేను నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్లో 38 ఏళ్ల హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఎత్తులు వేసింది. అయితే, ఈ టై బ్రేక్లో 38 ఏళ్ల హంపి చేసిన తప్పిదాల ఫలితంగా 19 ఏళ్ల దివ్య చాంపియన్గా అవతరించింది.ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్గా ప్రమోషన్ పొందడంతో పాటు.. క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఇక హంపిపై గెలిచిన అనంతరం దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది.దివ్య భావోద్వేగం‘‘ఇలా నేను గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. నా విధిరాతలో ఇది ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నాకు ఈ హోదా లేదు. ఈ విజయం నాకెంతో విలువైనది. ఇంకా నేను సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అంటూ దివ్య దేశ్ముఖ్ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా దివ్య తల్లి ఆమెను అక్కున చేర్చుకుని.. విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.ట్రై బ్రేకర్ ఇలా..టైబ్రేక్లలో 10 నిమిషాల చొప్పున రెండు రాపిడ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి కదలిక తర్వాత 10 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. స్కోరు సమంగా ఉంటే, ప్రతి కదలిక తర్వాత మూడు సెకన్ల ఇంక్రిమెంట్లతో రెండు, ఐదు నిమిషాల మ్యాచ్లు ఆడతారు. టై కొనసాగితే, ప్రతి కదలిక తర్వాత రెండు సెకన్ల ఇంక్రిమెంట్లతో మూడు నిమిషాల చొప్పున రెండు బ్లిట్జ్ మ్యాచ్లు ఆడాలి. Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq— Chessdom (@chessdom) July 28, 2025 -
గొప్పగా హాకీ ‘శత’ వసంతం
మహాబలిపురం: భారత హాకీ స్వర్ణోత్సవాన్ని (వందేళ్ల పండగను) గొప్పగా నిర్వహించేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే శత వసంతం సందర్భంగా రాష్ట్ర హాకీ సంఘాలకు నిధుల వితరణను పెంచింది. సీనియర్, జూనియర్ అంతర్జాతీయ, జాతీయ, మహిళల టోర్నీల నిర్వహణ కోసం అందజేసే గ్రాంట్ల మొత్తాన్ని కూడా గణనీయంగా హెచ్చింపు చేసింది. క్షేత్రస్థాయిలో జరిగే ఈవెంట్ల నిర్వహణను ప్రోత్సహించేలా ఆర్థిక సాయాన్ని పెంచింది. ఏదేని రాష్ట్రంలో ఇకపై పురుషుల, మహిళల సీనియర్ జాతీయ చాంపియన్షిప్ జరిగితే రూ. 70 లక్షలు గ్రాంట్గా అందజేయనుంది. అదే జూనియర్, సబ్–జూనియర్ స్థాయి ఈవెంట్లను నిర్వహిస్తే రూ. 30 లక్షలు ఇవ్వనున్నట్లు హెచ్ఐ ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా టోర్నీల నిర్వహణ కోసం రూ. 25 లక్షలు ఇస్తామని ప్రకటించింది. నవంబర్ 7న దేశవ్యాప్తంగా హాకీ వందేళ్ల స్వర్ణోత్సవ సంబరాన్ని అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా... నిధుల పెంపుదలతో ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. దీంతో పాటు ఈవెంట్ను ఘనంగా నిర్వహించే ఆరి్థక వెసులుబాటు కలుగుతుందని హెచ్ఐ భావిస్తోంది. దీంతో టోర్నీ ఆకర్షణీయగా మారుతుంది. అదనపు హంగులతో నిర్వహించబడుతుంది. నిష్ణాతులైన రిఫరీలు, అధికారుల మార్గదర్శనంలో జరగడం వలన పోటీల నాణ్యత కూడా పెరుగుతుంది. ప్లేయర్లకు వసతులు పెరుగుతాయి. కొత్తగా మరెంతో మంది ఉత్సాహంగా హాకీ క్రీడను కెరీర్గా ఎంచుకుంటారు. ఇలా బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని హాకీ ఇండియా బలంగా నమ్ముతోంది. ఆటగాళ్లే కాదు హాకీ క్రీడ కోసం పనిచేసే అధికారులు, కోచ్లు, ఫిజియోలకు ఒనగూరే ప్రయోజనాలూ ఇందులో ఇమిడి ఉంటాయి. వీళ్లందరి భవిష్యత్తుకు భరోసా పెరుగుతుంది. ఒకేసారి 1000 మ్యాచ్ల నిర్వహణ శత వసంతాల హాకీ మైలురాయి ఘనతకు గుర్తుగా జాతీయ స్థాయి వేడుకలే కాదు... పోటీలు కూడా హాకీని మరింత శోభాయమానం చేయనుంది. ‘హాకీ–100’ను చిరస్మరణీయంగా మలిచేందుకు మహిళలు, పురుషుల విభాగాల్లో ఒకే సమయం దేశ వ్యాప్తంగా వెయ్యి చొప్పున మ్యాచ్ల్ని నిర్వహించేందుకు హెచ్ఐ ఏర్పాట్లు చేస్తోంది.మహిళల్లో, పురుషుల్లో 18 వేల మంది చొప్పున ఏకంగా 36 వేలమంది క్రీడాకారులు ఈ పోటీల్లో ఒకేసారి పాల్గొనబోతున్నారు. మన హాకీ స్వర్ణ శకం వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలకు మన హాకీ ప్రభ, శోభ తెలిసేలా వందేళ్ల వేడుక ఉంటుందని హెచ్ఐ అధ్యక్షుడు దిలిప్ టిర్కీ తెలిపారు. -
పియాస్ట్రి ‘సిక్సర్’
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ తాజా సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజయం సాధించాడు. ఈ సీజన్లో పియాస్ట్రికిది ఆరో విజయం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో పియాస్ట్రి నిరీ్ణత 44 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 25 నిమిషాల 22.601 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన నోరిస్ 1 గంట 25 నిమిషాల 26.016 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్తో రేసును ప్రారంభించిన నోరిస్... 3.415 సెకన్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వర్షం అంతరాయం కారణంగా షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ప్రారంభమైన రేసులో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 25 నిమిషాల 42.786 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 గంట 25 నిమిషాల 44.432 సెకన్లు; రెడ్బుల్) నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 26 నిమిషాల 3.280 సెకన్లు; ఫెరారీ) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 13 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 266 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 250 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 185 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్ప్రి ఆగస్టు 3న జరుగుతుంది. -
అంకితకు రజతం
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టీపుల్ఛేజర్ అంకిత ధ్యాని రజత పతకంతో మెరిసింది. మహిళల 3000 మీటర్ల పోటీలో అంకిత 9 నిమిషాల 31.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలవగా... పురుషుల 4x100 మీటర్ల రిలేలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఆదివారంతో ఈ టోర్నీ ముగియగా... చివరి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఓవరాల్గా ఈ క్రీడల్లో భారత్ 12 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. మహిళల స్టీపుల్చేజ్లో 23 ఏళ్ల అంకిత తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మింది. అంతకుముందు హీట్స్లో అగ్రస్థానంతో ఫైనల్కు చేరిన అంకిత... తుది రేసులోనూ జోరు కనబర్చి మిల్లీ సెకన్ల తేడాతో స్వర్ణానికి దూరమైంది. ఈ క్రమంలో తన గత వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కంటే 7 సెకన్ల టైమింగ్ను మెరుగు పరుచుకోవడం విశేషం. పురుషుల 4x100 మీటర్ల రిలే టీమ్ రేసులో లాలు ప్రసాద్ భోయ్, అనిమేశ్, మణికంఠ, మృత్యం జయరాంతో కూడిన భారత జట్టు 38.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలుచుకుంది. దక్షిణ కొరియా (38.50 సెకన్లు), దక్షిణాఫ్రికా (38.80 సెకన్లు) జట్లు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గాయి. మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ విభాగంలో అనఖ బిజుకుమార్; దివ్యనిబ జాలా, రష్దీప్ కౌర్, రూపాల్తో కూడిన భారత జట్టు 2 నిమిషాల 35.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 4x100 మీటర్ల రిలేలో విశాల్, అశ్విన్, జెరోమ్, బాలకృష్ణతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 6.5 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. రేస్ వాక్లో భారత పురుషుల, మహిళల అథ్లెట్లు టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయారు. అంతకుముందు మహిళల 20 కిలోమీటర్ల రేస్వాక్ టీమ్ విభాగంలో సెజల్ సింగ్, మునిత ప్రజాపతి, మాన్సి నేగితో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. -
ఐదులో నాలుగు చైనాకే...
చాంగ్జౌ: బ్యాడ్మింటన్ సీజన్లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ చైనా ఓపెన్లో చైనా క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం ఐదు విభాగాలకుగాను నాలుగు విభాగాల్లో టైటిల్స్ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో చైనా క్రీడాకారులే ఫైనల్ చేరుకున్నారు. ఫలితంగా విన్నర్స్, రన్నరప్గా చైనా ప్లేయర్లే నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా) 64 నిమిషాల్లో 14–21, 21–14, 21–15తో ప్రపంచ 23వ ర్యాంకర్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచాడు.మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) 39 నిమిషాల్లో 21–8, 21–13తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) 69 నిమిషాల్లో 24–22, 17–21, 21–14తో ప్రపంచ ఏడో ర్యాంక్ జాంగ్ షు జియాన్–జియా యి ఫాన్ (చైనా) ద్వయంపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ 47 నిమిషాల్లో 23–21, 21–17తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ 210వ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా) ద్వయం 21–15, 21–14తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై సంచలన విజయం సాధించి టైటిల్ను దక్కించుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,40,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 21 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విజేత జోడీలకు 1,48,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 28 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
వాషింగ్టన్: ముబాదాల సిటీ డీసీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–వీనస్ ద్వయం 6–3, 4–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నీల్ స్కప్స్కీ (బ్రిటన్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–కివీస్ ద్వయం మూడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో స్కప్స్కీ, స్మిత్ జంట కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–వీనస్లకు 19,860 డాలర్ల (రూ. 17 లక్షల 17 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వరల్డ్కప్ టైటిల్ ఫలితం ఇక టై బ్రేకర్లోనే..!
బతూమి (జార్జియా): ఫిడే వరల్డ్కప్ టైటిల్ కోసం ఇద్దరు భారత చెస్ క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడతున్నారు. అందులో ఒకరు తెలుగు తేజం కోనేరు హంపి కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్. టైటిల్ పోరులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన రెండు వరుస గేమ్లు డ్రాగా ముగియడమే హోరాహోరీని తలపించింది.నిన్న జరిగిన తొలి గేమ్లో అనుభవాన్ని ఉపయోగించి కోనేరు హంపి డ్రా వరకు తీసుకెళ్లగా, ఈరోజు( ఆదివారం, జూలై 27) కూడా ఇంచుమించు అదే రిపీట్ అయ్యింది. తెల్లపావులతో ఈరోజు ఆటను మొదలు పెట్టిన హంపి.. నెమ్మదిగా ఆటన ప్రారంభించింది. గేమ్ లో ఇరువురు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పావుల్ని ఒకరి నుంచి ఒకరు ఎక్చేంజ్ చేసుకుంటూ ఆధిక్యాన్ని నిలుపుకోవడం లో విఫలమయ్యారు.. ఇలా వీరి మధ్య గేమ్ కు డ్రాకు దారితీసింది. అయితే గేమ్పై ఫలితం వచ్చే అవకాశాలు లేవని భావించిన ఇరువురు 34 మూవ్ వద్ద డ్రాకు అంగీకరించారు. -
నోరిస్కు పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ 1 నిమిషం 40.562 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. 2012లో జాన్సన్ బటన్ తర్వాత బెల్జియం గ్రాండ్ప్రిలో పోల్ పొజిషన్ దక్కించుకున్న తొలి మెక్లారెన్ డ్రైవర్గా నోరిస్ నిలిచాడు. మెక్లారెన్కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 నిమిషం 40.647 సెకన్లలో ల్యాప్ను ముగించి రెండో స్థానం దక్కించుకోగా... ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ 1 నిమిషం 40.903 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 40.903 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 41.939 సెకన్లు) 16వ స్థానానికి పరిమితమయ్యాడు. అంతకుముందు జరిగిన స్ప్రింట్ రేస్లో రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్షిప్లో పియాస్ట్రి 241 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 232 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 173 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
జాదవ్కు స్వర్ణం పర్నీత్కు రజతం
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత ఆర్చర్ సాహిల్ జాదవ్ స్వర్ణంపై పెట్టిన గురి కుదిరింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అతను బంగారు పతకం సాధించాడు. అయితే మహిళల కాంపౌండ్లో పర్నీత్ కౌర్కు తృటిలో పసిడి పతకం చేజారింది. ఆర్చర్లు ఐదు పతకాలతో ఈ పోటీలను ముగించారు. మిగతా మూడు పతకాలు టీమ్ ఈవెంట్లో వచ్చాయి. మిక్స్డ్ టీమ్ స్వర్ణం, పురుషుల టీమ్ రజతం, మహిళల టీమ్ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్ క్రీడ అయిన రికర్వ్లో మాత్రం భారత ఆర్చర్లు నిరాశపరిచారు. పురుషుల కాంపౌండ్ టైటిల్ పోరులో సాహిల్ జాదవ్ గురి అదిరింది. మొత్తం 15 బాణాలను సంధించగా... ఇందులో ఏకంగా 14 షాట్లు కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరాయి. దీంతో పదికి పది పాయింట్లు లభించగా, ఆఖరి బాణం 9 పాయింట్లు తెచ్చింది. దీంతో జాదవ్ 149–148 స్కోరుతో అజయ్ స్కాట్ (బ్రిటన్)పై గెలిచి బంగారం అందుకున్నాడు. అంతకుముందు భారతీయుల మధ్యే జరిగిన సెమీస్లో సాహిల్ 148–148తో కుశాల్ దలాల్తో సమంగా నిలిచాడు. అయితే షూటాఫ్లో సాహిల్ జాదవ్ మెరుగైన స్థితిలో ఉండటంతో ఫైనల్ చేరాడు. మహిళల కాంపౌండ్లో ఆసియా క్రీడల టీమ్ఈవెంట్ స్వర్ణ పతక విజేత అయిన పర్నీత్ కౌర్ దాదాపు స్వర్ణంపైనే గురిపెట్టింది. కానీ ఆఖరి మెట్టుపై అనూహ్యంగా ఒత్తిడికి గురై తృటిలో పసిడి పట్టలేకపోయింది. చివరకు పాయింట్ తేడాతో బంగారాన్ని దూరం చేసుకున్న పర్నీత్ రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 146–147 స్కోరుతో మూన్ యీన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో టాపర్గా నిలిచింది. సెమీస్లో 145–144తో ఐదో సీడ్ కిమ్ సూయెన్ (దక్షిణ కొరియా)ను కంగుతినిపించింది. -
తన్వీ, వెన్నెలకు కాంస్యాలు
సోలో (ఇండోనేసియా): భారత రైజింగ్ షట్లర్లు వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మలు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. అండర్–19 మహిళల సింగిల్స్లో సెమీఫైనల్స్కు చేరడం ద్వారానే కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్న వీళ్లిద్దరికి శనివారం సెమీఫైనల్లో చుక్కెదురైంది. తెలుగమ్మాయి వెన్నెల 15–21, 18–21తో చైనాకు చెందిన లియూ సి యా చేతిలో పోరాడి ఓడింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండో గేమ్ను చేజిక్కించుకునేందుకు వెన్నెల చెమటోడ్చింది. 15–20తో ఇక మ్యాచ్ ఓడిపోయి స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిరాశచెందకుండా వరుసగా మూడు పాయింట్లను సాధించి రేసులో నిలిచింది. కానీ చైనా ప్రత్యర్థి ఈ దశలో మరింత జాగ్రత్త పడటంతో గెలిచేందుకు అవసరమైన పాయింట్ సాధించి ముందంజ వేసింది. మరో మ్యాచ్లో తన్వీ శర్మ 13–21, 14–21తో ఎనిమిదో సీడ్ యిన్ యి కింగ్ (చైనా) ధాటికి నిలువలేకపోయింది. తొలి గేమ్ను కోల్పోయిన పంజాబీ షట్లర్ ఒక దశలో రెండో గేమ్ను దూకుడుగా మొదలుపెట్టింది. 6–1 ఆధిక్యంతో జోరుపెంచింది. కానీ వరుస తప్పిదాలతో పాయింట్లను కోల్పోయి 8–8 వద్ద సమం కాగా అక్కడి నుంచి పట్టు కోల్పోయింది. గత నెల యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్గా నిలిచిన తన్వీ వరుసగా ఈ టోర్నీలో కాంస్యం గెలుపొందడం విశేషం. మొత్తం మీద ఈ జూనియర్ ఆసియా టోర్నీలో 13 ఏళ్ల పతక నిరీక్షణకు వెన్నెల, తన్వీ కాంస్యాలతో తెరదించారు. చివరిసారిగా భారత్ 2012లో స్వర్ణం గెలుచుకుంది. పీవీ సింధు ఆ ఏడాది విజేతగా నిలిచింది.