Other Sports
-
వైశాలి, దివ్య ‘హ్యాట్రిక్’ డ్రా
పెయియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు వైశాలి, దివ్య దేశ్ముఖ్ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేశారు. అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను వైశాలి 41 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్ను దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఓపెన్ విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద తొలి ఓటమి చవిచూశాడు.జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన మూడో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో, మహిళల విభాగంలో ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 14 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నిర్ణిత 14 రౌండ్ల తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతలుగా నిలుస్తారు. మహిళల విభాగం చాంపియన్ ప్రస్తుత విశ్వవిజేత జు వెన్జున్తో... ఓపెన్ విభాగం విన్నర్ ప్రస్తుత జగజ్జేత గుకేశ్తో ప్రపంచ చాంపియన్షీప్ టైటిల్ కోసం తలపడతారు. -
నికిత్ శ్రీ చక్రికి రజత పతకం
జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో నికిత్ శ్రీ చక్రి ఆకుల సత్తా చాటాడు. రికర్వ్ అండర్-10 బాలుర విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నికిత్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.2025-26లో నికిత్ శ్రీ చక్రి సాధించిన విజయాలుజాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ చాంపియన్షిప్స్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్రంగారెడ్డి జిల్లా ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్తమిళనాడు స్టేట్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్సౌత్ ఇండియన్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)-గోల్డ్ మెడల్ -
బెంగాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్ దిగ్గజం
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పేస్ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్కతాలో లియాండర్ పేస్ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్ నిలిచారు.ప్రొఫెషనల్ టెన్నిస్లో సింగిల్స్ కంటే డబుల్స్పై దృష్టి సారించిన పేస్ పురుషుల గ్రాండ్స్లామ్ టోర్నీల్లో డబుల్స్లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026 -
స్పోర్ట్స్ హ్యాకథాన్లో 2,132 వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి బండా ప్రకాశ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.ఈ హ్యాకథాన్లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, చెస్, క్యారమ్ వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు.హ్యాకథాన్లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను సావనీర్ రూపంలో ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు.హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ... 'క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు. అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం' అని తెలిపారు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
ప్రతిభకు పురస్కారం
లుసానే: భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రతిభకు ప్రపంచ పురస్కారం దక్కింది. భుజాల నుంచే రెండు చేతులు లేని ఈ కశీ్మరి ఆర్చర్ అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తాచాటుతోంది. దీంతో 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్చరీ ప్రకటించిన ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు శీతల్ దేవికి దక్కింది. గతేడాది గ్వాంగ్జూ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో ఆమె అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఇందులో బరిలోకి దిగిన ఆమె అసలు చేతులే లేని ఏకైక మహిళా ఆర్చర్... వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో చేతులుండి వైకల్యమున్న ప్రపంచ స్థాయి పారా ఆర్చర్లను ఢీకొట్టి మరీ విజేతగా నిలిచింది. తన కాలి వేళ్లు, భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ప్రతిభ చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఆమె పోటీ మొదలైతే ప్రేక్షకులెవరూ కనులు తిప్పుకోనివ్వని నైపుణ్యం ఆమె సొంతం. ఈ నైపుణ్యంతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల్ని సాధిస్తున్న శీతల్కు వార్షిక అవార్డుల రేసులో ప్రపంచ ఆర్చరీ పట్టం కట్టింది. ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. కొరియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఆమె కేవలం ఒక స్వర్ణంతోనే సరిపెట్టుకోలేదు... మహిళల టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ టీమ్లో కాంస్యం సాధించింది. ప్రపంచ ఆర్చరీ అవార్డులకు నామినేట్ కావడం ఇప్పుడు పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషాన్నిచి్చందని, వ్యక్తిగతంగా ఈ అవార్డు తన గుండెను తాకిందని శీతల్ దేవి భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పారిస్లో జరిగిన పారాలింపిక్స్లోనూ ఈ కశ్మీరీ ఆర్చర్ సత్తా చాటుకుంది. ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గింది. 2022 పారా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లో రజతం, 2023 ఆసియా చాంపియన్íÙప్లో రజతం గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీలో ఈ తరహా అవార్డుల్ని 2011లో ప్రారంభించారు. అసాధారణ నైపుణ్యం కనబరిచిన ఆర్చర్లు, పారా ఆర్చర్ల ఘనతను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
సినెర్దే మయామి మాస్టర్స్
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ చేజార్చుకున్నా... మరోసారి ‘టాప్’ క్లాస్ ఆటతీరును ప్రదర్శించి ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ కెరీర్లో ఏడో మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ రెండోసారి చాంపియన్గా నిలిచాడు. ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో ప్రపంచ 14వ ర్యాంకర్ జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. సినెర్కు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 89 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లెహెస్కాకు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 79 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా సినెర్ కెరీర్లో ఇది 26వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ పది ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్లో 33 పాయింట్లు, రెండో సర్వీస్లో తొమ్మిది పాయింట్లు సాధించాడు. మూడుసార్లు తన సర్వీస్ బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. 2024లో తొలిసారి మయామి ఓపెన్లో టైటిల్ నెగ్గిన సినెర్ గత ఏడాది తనపై విధించిన మూడు నెలల నిషేధం కారణంగా బరిలోకి దిగలేదు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన సినెర్ మయామి ఓపెన్లోనూ విజేతగా నిలవడం ద్వారా ‘సన్షైన్ డబుల్’ సాధించిన ఎనిమిదో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్ను వరుసగా గెలిస్తే ‘సన్షైన్ డబుల్’గా పరిగణిస్తారు. ఈ రెండు టోర్నీల్లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సినెర్ చాంపియన్గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. చదవండి: IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ! -
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేపై మహిళల కమిటీ హెడ్ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్బాల్ హౌస్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు. వలంకా అలేమావో ఎవరు..? AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్బాల్ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా. వివాదం నేపథ్యం మహిళల ఆసియా కప్ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది. -
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్తో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఇటీవలే టైగర్వుడ్స్ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ (డీయూఐ) కింద ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైగర్వుడ్స్ను మార్టిన్ కౌంటీ జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయిన టైగర్వుడ్స్పై అతడి భాగస్వామి వెనెస్సా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టైగర్వుడ్స్ తన ప్రవర్తన, పద్దతులను మార్చుకోకపోతే విడిచిపెట్టి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీమెయిల్ కథనం ప్రకారం.. వెనెస్సా ట్రంప్ టైగర్వుడ్స్కు ఇదే అతడికి చివరి అవకాశమని, ఒకవేళ మళ్లీ ఎలాంటి తప్పు చేసి జైలుకెళితే మాత్రం తమ రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అర్థం చేసుకోవాలని తెలిపింది. ‘ఇది కచ్చితంగా టైగర్వుడ్స్కు రెడ్ ఫ్లాగ్ వంటిది. సమస్యలన్నింటిని పరిష్కరించుకొని సక్రమంగా ఉంటే మంచిది. లేదంటే రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ వేసి నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుంది. ’ అని వెనెస్సా ఘాటుగానే హెచ్చరించినట్లు డైలీమెయిల్ పేర్కొంది.కాగా అమెరికన్ మోడల్ అయిన వెనెస్సా ట్రంప్ 2005 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ను పెళ్లాడింది. 2018లో విడాకులు తీసుకున్న ఈ జంటకు కాయ్ ట్రంప్ సంతానం. ఆ తర్వాత గోల్ప్ దిగ్గజం టైగర్వుడ్స్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు 2024లో తొలిసారి వార్తలు బయటకొచ్చాయి. టైగర్వుడ్స్ మార్చి 2025లో వెనెస్సాను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా పోస్టు పెట్టాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా టైగర్వుడ్స్ ప్రవర్తనతో విసిగిపోయిన వెనెస్సా మరోసారి ఇలా చేస్తే మాత్రం రిలేషన్ బ్రేకప్ చేసుకుంటానని బెదిరింపులకు దిగడం ఆసక్తిగా మారింది.చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్! -
సూపర్ సబలెంకా
ఫ్లోరిడా: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్, బెలారూస్ స్టార్ సబలెంకా మూడో టైటిల్ను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆదివారం జరిగిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సబలెంకా చాంపియన్గా నిలిచి టైటిల్ను నిలబెట్టుకుంది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–2, 4–6, 6–3తో విజయం సాధించి కెరీర్లో 24వ టైటిల్ను దక్కించుకుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈ క్రమంలో ‘సన్షైన్ డబుల్’ ఘనత నమోదు చేసింది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్ను వరుసగా గెలిస్తే ‘సన్షైన్ డబుల్’గా పరిగణిస్తారు. కోకోగాఫ్తో 2 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా మూడు ఏస్లు సంధించింది. తొలి సర్వీస్లో 35 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ సబలెంకాకు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 92 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కోకోగాఫ్కు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఆంటోనెల్లి మళ్లీ...
సుజుకా: ఇటలీ టీనేజర్ కిమీ ఆంటోనెల్లి తాజా ఫార్ములావన్ సీజన్లో వరుసగా రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రోజు జపాన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకు చెందిన 19 ఏళ్ల కిమీ ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఆంటోనెల్లి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రాక్పై దూసుకుపోయాడు. అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా 1 గంట 28 నిమిషాల 03.403 సెకన్లలో 53 ల్యాప్లను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈనెల 15న చైనాలో జరిగిన షాంఘై గ్రాండ్ప్రిలోనూ ఆంటోనెల్లి చాంపియన్గా నిలిచాడు. తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన జార్జ్ రసెల్ టైటిల్ గెలిచాడు. దాంతో ఈ సీజన్లోని తొలి మూడు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లే గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. జపాన్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి (మెక్లారెన్) రెండో స్థానంలో, లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో, జార్జ్ రసెల్ నాలుగో స్థానంలో నిలిచారు. డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్, మెక్లారెన్ డ్రైవర్ నోరిస్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏప్రిల్ 12న జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్ప్రి, ఏప్రిల్ 19న జరగాల్సిన సౌదీ అరేబియా గ్రాండ్ప్రిని ఫార్ములావన్ నిర్వాహకులు రద్దు చేశారు. తదుపరి రేసు మయామి గ్రాండ్ప్రి మే 3వ తేదీన జరుగుతుంది. -
ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’
హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ సంయుక్త ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది. ఈ రన్లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.రన్తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర ఐటీ మంత్రి దుదెల శ్రీధర్ బాబు , సినీ నటుడు శర్వానంద్ హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ,వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్ను ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించి, యువతకు దిశానిర్దేశం చేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు, పాల్గొన్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపైనే ఆధారపడి ఉందన్నారు. కేవలం పరుగుగానే కాకుండా, ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి కుటుంబం క్రియాశీల జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అవసరమని పేర్కొన్నారు.యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని, అందరూ తమ మాతృభాషలో మాట్లాడాలని కోరారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. -
సవాల్కు ప్రజ్ఞానంద సిద్ధం
పఫోస్ (సైప్రస్): ప్రపంచ చాంపియన్ను ఢీకొట్టే అర్హత కోసం భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘ఫిడే’ క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాడు. ఎనిమిది మంది ఎలైట్ గ్రాండ్మాస్టర్లు తలపడే ఓపెన్ కేటగిరీలో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తరఫున తమిళనాడు గ్రాండ్మాస్టర్ మాత్రమే బరిలో ఉండగా... 8 మంది డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సై అంటున్నారు. ప్రతి ఆటగాడు మిగతా ఏడు మంది ప్రత్యర్థులను రెండేసి సార్లు ఢీకొంటాడు. ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన ఆటగాడే చివరకు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్తో టైటిల్ కోసం పోటీపడతాడు. ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్షిప్ సమరం జరుగుతుంది. ప్రస్తుత క్యాండిడేట్స్ టోర్నమెంట్లో అమెరికన్ స్టార్లు ఫేబియానో కరువాన, హికరు నకముర, డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరి, వే యి (చైనా), జావొఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అండ్రీ ఎసిపెంకో (రష్యా), మథియస్ బ్లూబామ్ (జర్మనీ)లు చాంపియన్ గుకేశ్ను ఢీకొట్టే వేటలో ఉన్నారు. ఇటీవలి టోర్నీల ఫలితాలు, ఫామ్ దృష్ట్యా అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫేబియానో కరువాన క్యాండిడేట్స్లో ఫేవరెట్గా కనిపిస్తున్నాడు. దీంతో భారత ఆటగాడు ప్రజ్ఞానందకు కఠిన సవాళ్లు తప్పవు. బరిలోకి ప్రపంచ శ్రేణి గ్రాండ్మాస్టర్లు ఉండటంతో దీనికి తగినట్లుగానే తమిళ గ్రాండ్మాస్టర్ సన్నద్ధమయ్యాడు. ప్రత్యేకించి క్యాండిడేట్స్ ఈవెంట్ కోసం మరే ఇతర టోర్నీలవైపు కన్నెత్తి చూడలేదు. తన కోచింగ్ బృందం, సాంకేతిక నిపుణులతో కలిసి క్యాండిడేట్స్లో ఎదురయ్యే ప్రత్యర్థుల ఎత్తుగడ్డలపైనే దృష్టిసారించాడు. కరువాన ఫేవరెట్ అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ సిందరోవ్ డార్క్హార్స్గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది గోవాలో జరిగే చెస్ వరల్డ్ కప్లో విజేతగా నిలిచి అందరి కంటా పడిన ఈ యువ సంచలనం ఇదే జోరును ఇక్కడా కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మహిళల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ అయిన తెలుగుతేజం, వెటరన్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ఫేవరెట్గా దిగాల్సివున్నా... చివరి నిమిషంలో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. పశ్చిమాసియా పరిస్థితులే తను వైదొలగడానికి కారణమని, భయంతో ఆడలేనని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె స్థానాన్ని నార్వే చెస్ టోర్నీ విజేత అన్న ముజిచుక్ (ఉక్రెయిన్)కు కేటాయించారు. హంపి లేకపోయినా భారత ఆశల పల్లకిని మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్, ఆర్. వైశాలి మోస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి టోర్నీ ఆరం¿ోత్సవ వేడుక జరిగింది. ఇందులో ప్లేయర్ల పరిచయ కార్యక్రమం, ర్యాంకింగ్ (ఎలో రేటింగ్), క్యాండిడేట్స్కు అర్హత సాధించిన వైనం వివరించారు. ఆదివారం నుంచి తొలిరౌండ్ పోటీలు జరుగుతాయి.‘క్యాండిడేట్స్’ కహానీ... టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 1 మిలియన్ డాలర్లు (రూ. 9.49 కోట్లు) ఓపెన్ కేటగిరీ: 7,00,000 డాలర్లు (రూ. 6.65 కోట్లు) మహిళల విభాగం: 3,00,000 డాలర్లు (రూ. 2.85 కోట్లు) -
ఆంటోనెల్లికి ‘పోల్ పొజిషన్’
సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) జపాన్ గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి ‘పోల్ పొజిషన్’సాధించాడు. గత రేసు చైనా గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన 19 ఏళ్ల ఈ డ్రైవర్... వాయు వేగంతో దూసుకెళ్లి అందరికంటే ముందు నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో ఆంటోనెల్లి 1 నిమిషం 28.778 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 5.8 కిలోమీటర్ల కష్టతరమైన సర్క్యూట్ను ఆంటోనెల్లి అవలీలగా పూర్తిచేశాడు. మెర్సిడెస్కే చెందిన జార్జ్ రసెల్ (1 నిమిషం 29.076 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మూడు రేసుల్లోనూ ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది మెక్లారెన్ డ్రైవర్లు ఆస్కార్ పియాస్ట్రి, నోరిస్ సత్తాచాటగా... ఆ ఈసారి మెర్సిడెస్ డ్రైవర్లు జోరు కనబరుస్తున్నారు. తాజా క్వాలిఫయింగ్ రేసులో పియాస్ట్రి (1 నిమిషం 29.132 సెకన్లు; మెక్లారెన్), చార్లెస్ లెక్లెర్క్(1 నిమిషం 29.405 సెకన్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు. లాండో నోరిస్ (1 నిమిషం 29.409 సెకన్లు) ఐదో స్థానానికి పరిమితం కాగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 29.567 సెకన్లు) ఆరో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమషం 30.262 సెకన్లు) పదకొండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
’అదంతా మీడియా, సోషల్ మీడియా సృష్టే’
న్యూఢిల్లీ: హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీతో ఎలాంటి విబేధాలు లేవని... వెటరన్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ వెల్లడించాడు. భారత్ తరఫున టిర్కీ అత్యధికంగా 412 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడగా... ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు మన్ప్రీత్ సింగ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు మన్ప్రీత్ కెరీర్లో 411 మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ప్రాబబుల్స్ నుంచి మన్ప్రీత్ పేరును తొలగించడంతో... ఇద్దరి మధ్య అనుబంధం సరిగ్గా లేదనే పుకార్లు వినిపించగా... మన్ప్రీత్ వాటిని కొట్టేశాడు. ‘ఆసియా క్రీడల వరకు ఆడాలనుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా దానిపైనే ఉంది. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ తర్వాత ఫిట్నెస్ను బట్టి కెరీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటా. దిలీప్ టిర్కీతో వ్యక్తిగతంగా మాట్లాడా. ఆయన పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడితే సంతోషిస్తా అని ప్రోత్సహించారు. మా మధ్య చక్కటి అనుబంధం ఉంది. 500 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలవాలని ఆకాంక్షించారు’ అని మన్ప్రీత్ వెల్లడించాడు. మరోవైపు టిర్కీ స్పందిస్తూ... ‘అదంతా మీడియా, సోషల్ మీడియా సృష్టే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు’ అని అన్నాడు.కాగా 2020, 2024 ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడైన మన్ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో మూడేసి పతకాలు సొంతం చేసుకున్నాడు. శుక్రవారం నిర్వహించిన హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమంలో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్నందుకుగాను మన్ప్రీత్ ప్రత్యేక బహుమతిని తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నాడు. -
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ అరెస్ట్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ను ఫ్లోరిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేయడం ఆసక్తి కలిగించింది. వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించడమేగాక, ప్రమాదానికి కారణమైన టైగర్వుడ్స్ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లూయెన్స్ (డీయూఐ) కింద అదుపు లోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం జూపిటర్ ఐలాండ్లోని తన నివాసం సమీపంలో టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు, మరొక ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దానికి తగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వుడ్స్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ప్రమాదం తర్వాత మార్టిన్ కౌంటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజ్పరీక్ష నిర్వహించారు. టెస్టులో టైగర్ వుడ్స్ మద్యం సేవించినట్లుగా తేలలేదు. కానీ, ఆయన ఏదైనా మందులు, డ్రగ్స్ ప్రభావంతో కారు నడిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూత్ర పరీక్షకు ఆయన నిరాకరించడంతో, నిబంధనల ప్రకారం డీయూఐ కేసు నమోదు చేసి టైగర్వుడ్స్ను జైలుకు తరలించారు. 2017లో కూడా టైగర్ వుడ్స్ ఇదే తరహాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంతో నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రమాదం నేపథ్యంలో త్వరలో జరగనున్న మాస్టర్స్ టోర్నమెంట్లో టైగర్వుడ్స్ పాల్గొనడం అనుమానంగా మారింది.చదవండి: IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు! -
గాయాలతో సతమతం.. ఆటకు గుడ్బై
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న భారత హాకీ ఆటగాడు గుర్జంత్ సింగ్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్... కెరీర్లో 130 మ్యాచ్లు ఆడాడు. పంజాబ్కు చెందిన 31 ఏళ్ల గుర్జంత్ 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు పసిడి నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2017లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అతను కెరీర్ మొత్తంలో 33 గోల్స్ చేశాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన గోల్ చేసిన ప్లేయర్గానూ రికార్డు సృష్టించాడు. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో గుర్జంత్ 13 సెకన్లలోనే గోల్ నమోదు చేశాడు. హాకీ ఇండియా వార్షిక అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గుర్జంత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘ఇదే సరైన సమయం అనుకుంటున్నా. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నా. కోలుకొని తిరిగి వచ్చినా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయా. కెరీర్లో సాధించిన దానితో సంతృప్తిగా వీడ్కోలు పలుకుతున్నా. ఇక మీద దేశవాళీలు, హాకీ ఇండియా లీగ్లో ఆడుతా’ అని గుర్జంత్ వెల్లడించాడు. A player for the big moments 🫡Thank you, Gurjant Singh, for the passion, grit, and unforgettable memories you’ve given Indian hockey.From Punjab to the biggest stages in world hockey, your journey has been defined by resilience and impact. Time and again, you rose to the… pic.twitter.com/4e8sAT6YGU— Hockey India (@TheHockeyIndia) March 27, 2026Flashback to January 18, 2020, at the iconic Kalinga Stadium 🏟️, where Gurjant Singh set the turf on fire with a rapid goal scored 13 seconds into the match against the Netherlands! 🔥 This electrifying opener laid the foundation for Team India’s remarkable 5-2 victory in their… pic.twitter.com/6Jf6eMNFCN— Hockey India (@TheHockeyIndia) January 18, 2025చదవండి: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
చికిత ఖాతాలో స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్తో కలిసి పసిడి పతకం సొంతం చేసుకుంది. చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత–రజత్ చౌహాన్ (భారత్) ద్వయం 158–156తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా) జంటపై గెలిచింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికిత, రాజ్ కౌర్, తేజల్ బృందం 227–229తో విక్టోరియా, డయానా, రొక్సానాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడి రజత పతకాన్ని గెల్చుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో దేవాంగ్ గుప్తా, సుఖ్చెయిన్ సింగ్, జుయెల్ సర్కార్ (భారత్) బృందం 4–5తో కరిమోవ్, ఇల్ఫాత్, దౌలత్కెల్దీ (కజకిస్తాన్) జట్టు చేతిలో ఓడి రజతం నెగ్గింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్లో తేజల్ సాల్వే 144–138తో మరియాపై గెలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఉదయ్ కంబోజ్ (స్వర్ణం), ప్రథమేశ్ (రజతం), రజత్ (కాంస్యం) క్లీన్స్వీప్ చేశారు. ఫైనల్లో ఉదయ్ కంబోజ్ 145–144తో ప్రథమేశ్పై, కాంస్య పతక మ్యాచ్లో రజత్ చౌహాన్ 145–144తో పీరావత్ (థాయ్లాండ్)పై నెగ్గారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి (భారత్) 2–6 సెట్లతో ఒయున్ బసాన్దోర్జ్ (మంగోలియా) చేతిలో ఓడి రజతం సొంతం చేసుకుంది. బుధవారం భారత పురుషుల కాంపౌండ్ జట్టు, భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. -
‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్నీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవ్నీత్ కౌర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. గతేడాది ప్రదర్శనకు గాను హాకీ ఇండియా శుక్రవారం ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. భారత మాజీ కెప్టెన్ 1980 మాస్కో ఒలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన జట్టులో సభ్యుడైన జాఫర్ ఇక్బాల్కు మేజర్ ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1978, 1982 ఆసియా క్రీడల్లో రజత పతకాలు గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ సభ్యుడు. 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ ఉన్నాడు. హాకీకి చేసిన సేవకుగానూ జాఫర్ ఇక్బాల్కు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందించారు. హార్దిక్, నవ్నీత్లకు అవార్డులతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. మహిళల జట్టు ప్లేయర్ బిచ్చూ దేవికి ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించగా... ఉత్తమ డిఫెండర్గా సంజయ్కు పురస్కారం దక్కింది. ‘మిడ్ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుమిత్కు దక్కగా... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుఖ్జీత్ సింగ్కు దక్కింది. వీరందరికీ అవార్డుతో పాటు రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. శుక్రవారం న్యుఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్–21 ఏజ్ గ్రూప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాక్షి రాణా, ప్రిన్స్ దీప్ సింగ్కు ‘అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు అందించారు. ఈ ఇద్దరికీ చెరో రూ. 10 లక్షల నగదు బహుమతి అందించారు. ప్లేయర్లతో పాటు అంపైర్లు, స్కోరర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆసియాకప్లో విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి తలా రూ. 1.5 లక్షలు అందజేశారు. జూనియర్ వరల్డ్కప్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.15 లక్షల చొప్పున అందజేశారు. » హైదరాబాద్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో సత్తా చాటిన నవ్నీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. » గతేడాది జరిగిన జాతీయ చాంపియన్షిప్లో సత్తాచాటిన ఏడు (జార్ఖండ్, హరియాణా, మిజోరం, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్) జట్లకు రూ. 10 లక్షల చొప్పున అందజేశారు. » అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లకు ఇన్సెంటివ్లను సైతం శుక్రవారం అందజేశారు. పురుషుల జట్టుకు రూ. 1.38 కోట్లు, మహిళల జట్టుకు రూ. 69 లక్షలు లభించాయి. » జాతీయ జట్టు తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మన్ప్రీత్ సింగ్కు రూ. 4 లక్షలు, 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్కు రూ. 2.5 లక్షలు అందించారు. » 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హార్దిక్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్, నిలకంఠ శర్మ, జర్మన్ప్రీత్ సింగ్, సలీమా టెటెకు రూ.1.50 లక్షలు... 100 మ్యాచ్లు ఆడిన అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్కు రూ. 1 లక్ష చొప్పున అందజేశారు. » మహిళల హాకీలో 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నవ్నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్కు రూ. 2 లక్షల చొప్పున ఇచ్చారు. -
ప్రపంచకప్ ఆడే జట్టే ఆసియా క్రీడలకు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత హాకీ జట్టు మెగా ఈవెంట్లతో బిజీ షెడ్యూల్తో గడపనుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచకప్, ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ రెండు మేజర్ టోర్నీలకు కలిపి ఒకే జట్టు బరిలోకి దిగుతుందని పురుషుల హాకీ హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పష్టం చేశారు. తద్వారా రెండు వేర్వేరు జట్లను తయారు చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. ప్రపంచకప్, ఆసియా క్రీడలకు మధ్య కేవలం మూడు వారాల విరామమే ఉండటంతో ఆటగాళ్ల ఫిట్నెస్, పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు రెండు జట్లను సిద్ధం చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేసే మెరుగైన, ధీటైన జట్టునే ఆసియా క్రీడల్లోనూ ఆడిస్తామని ఆయన చెప్పారు. నిజానికి 15 నెల క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా జట్టు నిర్మాణ ప్రక్రియ చేపట్టామని, ఇందులో భాగంగానే భారత ‘ఎ’ జట్టుపై దృష్టి సారించామని, భవిష్యత్ అవసరాల కోసం సత్తాగల యువ రక్తాన్ని సీనియర్ జట్టుకు ఎక్కించేందుకే ఇలా చేశామని కోచ్ వివరించారు. అప్పుడు జట్టు సీనియర్లు, యువకుల మేళవింపుతో సమతూకంగా ఉంటుందని దక్షిణాఫ్రికాకు చెందిన కోచ్ క్రెయిగ్ చెప్పారు. ‘భారత జట్టుకు వరుస టోర్నీలు ఆడిన అనుభవం ఇదివరకు ఉంది. అజ్లాన్ షా, దక్షిణాసియా క్రీడలు, ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఇలా గతంలో పెద్ద పెద్ద టోర్నీలెన్నో ఆడింది. కాబట్టి పని ఒత్తిడి భారం అనే సమస్యయితే ఉండదు. జూన్లో హాకీ ప్రొ లీగ్ జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే ప్రపంచకప్లో బరిలోకి దించే జట్టుపై తుది కూర్పు పూర్తవుతుంది. అలా ఎంపికైన జట్టే బెల్జియం–నెదర్లాండ్స్కు వెళుతుంది. ఆ తర్వాత జపాన్కు బయల్దేరుతుంది’ అని క్రెయిగ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. బెల్జియం, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించబోయే ప్రపంచకప్ హాకీ ఈవెంట్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇది ముగిసిన మూడు వారాల్లోపే సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. జపాన్ ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్కు క్వాలిఫయర్స్గా జరుగబోతుంది. -
సబలెంకాతో పోరుకు సిద్ధమైన గాఫ్
మియామి ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకా ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 6-4, 6-3తో మూడో సీడ్ రిబాకినా (కజకిస్థాన్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం రెండు సెట్లలోనే ముగిసిన మ్యాచ్లో సబలెంకా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. గంటా 19 నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంకా 30 విన్నర్లు, 9 ఏస్లు సంధించగా.. రిబాకినా 2 ఏస్లు మాత్రమే సంధించి 15 విన్నర్లకే పరిమితమైంది. తొలుత మ్యాచ్లో రిబాకినా 3-1తో సబలెంకాపై ఆధిపత్యం కనబరించింది. కానీ వరుసగా రెండుసార్లు రిబాకినా సర్వీస్ను బ్రేక్ సఫలమైన సబలెంకా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరో సెమీఫైనల్లో అమెరికా నల్లకలువ కోకో గాఫ్ 6-1, 6-1తో చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ముచోవాను చిత్తుగా ఓడించి తుది పోరులో అడుగుపెట్టింది. రేపు జరగనున్న ఫైనల్లో సబలెంకాతో కోకో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక సబలెంకా మియామి ఓపెన్ ఫైనల్స్కు చేరడం ఇది వరుసగా రెండోసారి. గతంలో రిబాకినా 2023, 2024లో వరుసగా ఫైనల్ చేరింది. అంతకముందు సెరెనా విలియమ్స్ 2013 నుంచి 2015 మధ్య వరుసగా మియామి ఓపన్లో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. సబలెంకా, గాఫ్లు 2020లో తొలిసారి ఫైనల్లో ఎదురుపడ్డారు. ఆ తర్వాత జరిగిన పోరులో ఇద్దరు చెరో 6 విజయాలతో సమానంగా ఉన్నారు. గాఫ్ రెండుసార్లు గ్రాండ్స్లామ్ ఫైనల్లో సబలెంకాను ఓడించి చాంపియన్గా నిలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ గాఫ్ మూడు సెట్లలోనే సబలెంకాను ఓడించడం విశేషం.చదవండి: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
భారత ఫుట్బాల్ జట్టుకు అవమానం!
భారత ఫుట్బాల్ జట్టుకు అవమానం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించని కారణంగా ఆటగాళ్లతో పాటు కోచ్ను స్టేడియంలోకి అనుమతించలేదు. ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా మార్చి 31న కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్తో భారత జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశానికి కోచ్ ఖలీద్ జమీల్, ఆటగాళ్లు అషిక్ కురియన్, సహల్ అబ్దుల్, బిజోయ్ వర్గీస్ స్టేడియానికి వచ్చారు. కానీ గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ అథారిటీకి కేరళ ఫుట్బాల్ సంఘం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకపోవడంతో ఆటగాళ్లను, కోచ్ను లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అయితే మీడియా సమావేశానికి ముందు ఇలాంటి ఘటన జరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కోచ్ ఖలీద్ జమీల్ తెలిపాడు. అయితే దశాబ్ద కాలంలో కొచ్చిలో భారత ఫుట్బాల్ జట్టు మ్యాచ్ ఆడనుండడం ఇదే తొలిసారి. అయితే కోచ్, ఆటగాళ్లను అడ్డుకోవడంపై కేరళ ఫుట్బాల్ అసోసియేషన్ (కేఏఎఫ్) అధ్యక్షుడు నవాస్ మీరన్ స్పందించాడు. ‘ఆసియా కప్ క్వాలిఫయర్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సమాచార లోపం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీనిని త్వరలోనే పరిష్కరిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే నివేదికల ప్రకారం స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు గ్రేటర్ కొచ్చి డెవలప్మెంట్ అథారిటీ తమకు రూ. 20 నుంచి 25 లక్షలు చెల్లించడంతో పాటు రూ. 3 లక్షలు అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే చెల్లింపులకు కేఎఫ్ఏ సమయం కోరినప్పటికీ, విషయం తెలియని జీసీడీఏ సిబ్బంది కోచ్, ఆటగాళ్లను అడ్డుకున్నట్లు తెలిసింది. గతేడాది ఫిబ్రవరిలో చెల్లింపు వివాదం కారణంగా ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్)లోనూ కేరళ బ్లాస్టర్స్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! -
మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రజత్ జోడీ
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత రెండో పతకాన్ని ఖరారు చేసుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో చికిత–రజత్ చౌహాన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో చికిత–రజత్ ద్వయం 157–153 పాయింట్ల తేడాతో విక్టోరియా లియాన్–బున్యోద్ మిర్జామెతోవ్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ఫాతిన్ నూర్ఫతే–జువైదీ మజుకీ (మలేసియా) జంటతో చికిత–రజత్ ద్వయం తలపడుతుంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జోడీ క్వార్టర్ ఫైనల్లో 159–155 పాయింట్ల తేడాతో వె ఆన్ కీ–జున్వెగువో (చైనీస్ తైపీ) జంటపై గెలుపొందింది. ఇప్పటికే కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన భారత బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
కరోలినా మారిన్ వీడ్కోలు
మాడ్రిడ్: బ్యాడ్మింటన్కు అంతగా ఆదరణ లేని దేశం నుంచి వచ్చి... ప్రపంచ బ్యాడ్మింటన్నే శాసించి... ఈ ఆటలో మేటి అయిన ఆసియా దేశాల షట్లర్లనే హడలెత్తించి... అసాధారణ విజయాలతో అందర్నీ అబ్బురపరిచి... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ ‘రాకెట్’ వదిలేసింది. మోకాలి గాయాలతో సతమతమవుతున్న తాను మరింత రిస్క్ తీసుకోలేనని చెబుతూ గురువారం బ్యాడ్మింటన్ నుంచి మారిన్ వీడ్కోలు తీసుకుంది. ‘నా ప్రయాణం ఇక్కడితో ముగిసింది. వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే యూరోపియన్ చాంపియన్ షిప్లో నేను బరిలోకి దిగడంలేదు. చివరిసారి అందరినీ బ్యాడ్మింటన్ కోర్టులో కలవాలనుకున్నా. అయితే దీనికోసం నా శరీరాన్ని ప్రమాదంలో పడేయదల్చుకోలేదు. గతంలోనూ చాలాసార్లు చెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నా కెరీర్ను విభిన్నంగా ముగించాలని భావించా. కానీ కొన్నిసార్లు జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవు. దీనిని అంగీకరించాల్సిందే. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆడిన కాంస్య పతక మ్యాచే నా కెరీర్లో చివరి మ్యాచ్గా నిలిచింది. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచి, నా పట్ల అపరిమిత అభిమానాన్ని చూపిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఆటలో నేను సాధించిన విజయాలకు గర్వపడుతున్నా. కేవలం టైటిల్స్తోనే కాకుండా ఇంటాబయటా గౌరవాన్ని పొందాను’ అని గురువారం సోషల్ మీడియాలో మారిన్ వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. 2009లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అడుగు పెట్టిన మారిన్ 2015 ఏప్రిల్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్గా అవతరించింది. ఓవరాల్గా తన కెరీర్లో ఆమె 100 వారాలపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో కొనసాగింది. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకం నెగ్గిన మారిన్... 2015 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్పై గెలిచింది. అంతేకాకుండా 2015 ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్పై... 2018 ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో పీవీ సింధుపై గెలిచి మారిన్ విశ్వవిజేతగా నిలిచింది. ముఖ్యంగా సింధు, సైనాలకు మారిన్ కొరకరాని ప్రత్యర్థి అంటే అతిశయోక్తి కాదు. సింధుతో 18 సార్లు ఆడిన మారిన్ 12 సార్లు గెలిచి, 6 సార్లు ఓడింది. సైనాతో 13 సార్లు ఆడి 7 సార్లు గెలిచి, 6 సార్లు ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో హి బింగ్జియావోతో జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్ను 21–14తో గెలిచి, రెండో గేమ్లో 10–8తో ఆధిక్యంలో ఉన్న దశలో మారిన్ మోకాలి గాయంతో కోర్టులో కుప్పకూలింది. ఆ తర్వాత ఆమె కోలుకోకపోవడంతో హి బింగ్జియావోను విజేతగా ప్రకటించారు. గాయం కారణంగా మారిన్ కాంస్య పతక మ్యాచ్లో బరిలోకి దిగకపోవడంతో ఆమె ప్రత్యర్థి గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)కు కాంస్య పతకం లభించింది. -
పాక్పై భారత్దే పైచేయి
మాలే (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 పురుషుల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున విశాల్ యాదవ్ (3వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (64వ, 88వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. వరుసగా రెండో పరాజయంతో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, బంగ్లాదేశ్ చెరో విజయం సాధించి సెమీఫైనల్కు అర్హత సాధించాయి. శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘బి’ టాపర్గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ‘శాఫ్’ అండర్–20 చాంపియన్షిప్ జరగ్గా... భారత జట్టు నాలుగుసార్లు టైటిల్ సాధించింది. నేపాల్ రెండుసార్లు, బంగ్లాదేశ్ ఒకసారి టైటిల్ సొంతం చేసుకున్నాయి. -
‘ఆసియా’ పతకమే బాకీ ఉంది
రాయ్పూర్: ఒలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో రజత పతకం నెగ్గిన భారత స్టార్ మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు ఆసియా క్రీడల పతకమే లోటుగా ఉంది. ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ఎన్నో పతకాలు గెలిచినప్పటికీ ఈ ఆసియా పతకంతోనే తన కెరీర్ పరిపూర్ణమవుతుందని ఆమె భావిస్తోంది. దశాబ్దకాలంగా ఇంటాబయట స్వర్ణ, రజత పతకాలు సాధిస్తోన్న ఈ స్టార్ వెయిట్లిఫ్టర్ ఈ ఏడాది ఎలాగైనా అందని ద్రాక్షగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ‘ఖేలో ఇండియా’ గిరిజనుల క్రీడల ప్రారం¿ోత్సవంలో పాల్గొనేందుకు వచి్చన ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మణిపూర్ లిఫ్టర్ మాట్లాడూతూ ‘వ్యక్తిగతంగా నాకు ఆసియా క్రీడలు చాలా కీలకమైన ఈవెంట్. నా సుదీర్ఘ కెరీర్లో ఇక్కడ పతకం సాధించలేకపోయాను. ఏషియాడ్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈవెంట్ ఏదైనా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. దీనికి తగ్గట్లే అథ్లెట్లు సిద్ధమై వస్తారు. ఈ ఏడాది జరిగే ఆసియా ఈవెంట్ కూడా అలాగే జరుగుతుంది’ అని తెలిపింది. రెగ్యులర్గా 48 కేజీల విభాగంలో తలపడే మీరా ఆసియా క్రీడల్లో మాత్రం 49 కేజీల కేటగిరీలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ‘కామన్వెల్త్ గేమ్స్ వరకు 48 కేజీల ఈవెంట్కు తగిన కసరత్తు చేసే నేను రెండు నెలల వ్యవధిలో జరిగే ఆసియా క్రీడల కోసం 49 కేజీల కేటగిరీ మారాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైనా నాకెలాంటి ఇబ్బంది లేదు. పతకమే నా లక్ష్యం అయినప్పుడు ఇలాంటివన్నీ భారం కావు’ అని ఆమె వివరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ క్రీడలు యువ అథ్లెట్లకు వరమని, తమ కలల్ని సాకారం చేసుకునే ప్రక్రియకు ఇది తొలి అడుగని మీరాబాయి చెప్పుకొచ్చింది. ఖేలో ఇండియాలో గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయమని చెప్పింది. ‘ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు, రిమోట్ ఏరియాలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు తమ ప్రతిభ చాటేందుకు ‘ఖేలో ఇండియా’ చక్కని వేదిక. ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంత ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో వెలిగేందుకు ఈ తరహా ఈవెంట్ దోహదం చేస్తుంది’ అని మీరాబాయి వివరించింది. ఎక్సలెన్సీ కేంద్రాలు (ఎన్సీఓఈ) ప్రతిభ గల అథ్లెట్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొంది. మన ‘మీరా’ ఘనతలివి... 31 ఏళ్ల మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించింది. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకం నెగ్గిన ఆమె తదుపరి 2022, 2025 ఈవెంట్లలో రెండు రజతాలు సాధించింది. 2014 కామన్వెల్స్ క్రీడల్లో రజతం గెలిచాక... తర్వాత గోల్డ్కోస్ట్ (2018), బర్మింగ్హామ్ (2022) క్రీడల్లో పసిడి పతకాలతో సత్తాచాటుకుంది. కామన్వెల్త్ చాంపియన్షిప్లో నాలుగుసార్లు (2013, 2017, 2019, 2025) చాంపియన్గా నిలిచింది. 2015లో మాత్రం రజతంతో సరిపెట్టుకుంది. తాషె్కంట్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్ (2020)లో కాంస్యం, గువాహటి వేదికగా జరిగిన దక్షిణాసియా క్రీడల్లో (2016) స్వర్ణం నెగ్గింది. -
బెంగళూరు ఎఫ్సీ హెడ్ కోచ్గా మునోజ్
బెంగళూరు: స్పెయిన్ చెందిన పెప్ మునోజ్ను బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ 2026–27 సీజన్ కోసం అతన్ని తీసుకున్నట్లు బెంగళూరు ఫ్రాంచైజీ తెలిపింది. గత ఏడాది ఐఎస్ఎల్లో బెంగళూరు జట్టు రన్నరనప్గా నిలిచింది. మునోజ్ ఐఎస్ఎల్ జట్టుకు హెడ్ కోచ్ కావడం ఇదే తొలిసారి. గతంలో అతను ఎఫ్సీ బార్సిలోనా యూత్ జట్టుకు సేవలించాడు. బార్కా అండర్–19, బార్సిలోనా ‘బి’, చైనాకు చెందిన దేశవాళీ జట్లకు కోచింగ్ ఇచ్చిన మునోజ్ తదనంతరం చైనా జాతీయ జట్టు సహాయక బృందంలో కోచ్గా పనిచేశాడు. కంబోడియాకు చెందిన క్లబ్ జట్టుకు తొలిసారి హెడ్కోచ్గా వ్యవహరించాడు. అతని కోచింగ్లో కంబోడియాకు చెందిన క్లబ్ లీగ్లో రెండు విజేతగా నిలిచింది. ఏఎఫ్సీ చాలెంజ్ లీగ్లో ఒకసారి ఫైనల్ కూడా చేరింది. ‘బెంగళూరు ఎఫ్సీ ద్వారా భారత ఫుట్బాల్లో భాగమవడం ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఐఎస్ఎల్లో బెంగళూరు ఒక మోడల్ క్లబ్. అభిమానులు అలరించే విధంగా బెంగళూరు ప్రదర్శన ఉంటుంది’ అని మునోజ్ అన్నాడు. బెంగళూరు ఎఫ్సీ యజమాని పార్థ్ జిందాల్ పెప్ మునోజ్ మార్గదర్శనంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. -
‘ఆఫ్రికా కప్’ కోసం సెనెగల్ అప్పీల్
జెనివా: ఆఫ్రికా కప్ గెలిచిన మమ్మల్నే తిరిగి విజేతగా ప్రకటించాలని సెనెగల్ ఫుట్బాల్ జట్టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ (సీఏఎఫ్) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై సెనెగల్ సీఏఎస్లో సవాల్ చేసింది. ఈ అప్పీల్ను విచారణకు స్వీకరించిన సీఏఎస్ విచారణ, తుది తీర్పు వెలువరించేందుకు కాలపరిమితి లేదని సెనెగల్కు తేల్చిచెప్పింది. దీంతో సెనెగల్ కోరుతున్న న్యాయం ఎప్పుడు దక్కుతుందో ఎవరికీ తెలియదన్న మాట! ఏం జరిగిందంటే? మొరాకో వేదికగా జనవరిలో ఆతిథ్య మొరాకో, సెనెగల్ మధ్య ఆఫ్రికా కప్ ఫైనల్స్ మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం 0–0తో ముగియగా...‘ఎక్స్ట్రా’ టైమ్లో మొరాకోకు ఇచ్చిన ‘పెనాల్టీ’ని వ్యతిరేకిస్తూ సెనెగల్ నిష్క్రమించింది. తర్జనభర్జన అనంతరం మైదానంలోకి దిగగా... సెనెగల్ గోల్కీపర్ పెనాల్టీని అడ్డుకున్నాడు. తర్వాత సెనెగల్ గోల్ చేసి విజేతగా నిలిచింది. అయితే సెనెగల్ మైదానం నిష్క్రమించడంతోనే ఆడే అర్హతను కోల్పోయిందని కాబట్టి తమనే విజేతగా ప్రకటించాలని మొరాకో సీఏఎఫ్లో కేసు వేయగా... సీఏఎఫ్ మొరాకోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. -
వ్యక్తిగత కోచ్ల కోసం అథ్లెట్ల డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత అథ్లెట్లందరూ మాకంటే... మాకు వ్యక్తిగత కోచ్లు కావాలని కేంద్ర క్రీడా శాఖను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు స్పష్టమైన సమాధానమిచ్చారు. అందరికీ వ్యక్తిగత కోచ్లను సర్దుబాటు చేయడం అసాధ్యమని కొట్టిపారేశారు. ఈ సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగొయాలో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు భారత్ 700 మంది పైచిలుకు అథ్లెట్ల బృందంతో అక్కడికి వెళ్లనుంది. ఈ క్రీడాకారులతో పాటు 33 శాతానికి మించకుండా సహాయక సిబ్బందిని ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) అనుమతిస్తుంది. కానీ భారత క్రీడకారులేమో వ్యక్తిగత కోచ్ల కోసం పట్టుబడుతుండటంతో ఈ సంఖ్య ఏకంగా అథ్లెట్ల బృందాన్ని మించనుంది. ఈ నేపథ్యంలోనే క్రీడాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా వ్యక్తిగత కోచ్ల అంశంపైనే చర్చించారు. అందరు డిమాండ్ చేస్తున్నట్లుగా వ్యక్తిగత కోచ్లను అనుమతించలేమని క్రీడాశాఖ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. గతంలో ఒకరి వద్ద ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్నప్పటికీ మెగా ఈవెంట్ల కోసం వేరే కోచ్ల మార్గదర్శనంలో పోటీలకు వెళ్లడం పరిపాటి. అంటే ఒకరొకరికి కాకుండా కొంత మందికి కలిపి ఫలానా కోచ్ అని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), క్రీడాశాఖ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సారి మాత్రం వ్యక్తిగత కోచ్లే కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో మిషన్ ఒలింపిక్ సెల్ దృష్టిసారించింది. ఈ సందర్భంగా క్రీడాశాఖ వర్గాలు కచ్చితంగా పతకాలు తెస్తారనే అథ్లెట్లకు మాత్రమే వ్యక్తిగత కోచ్లను సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశాయి. మిగతా వారికి కావాలంటే సరైన కారణాలు వివరించాలని, దీనిపై మిషన్ ఒలింపిక్ సెల్ ఏకీభవిస్తేనే కోచ్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఒలింపిక్స్లో లింగమార్పిడి మహిళలపై నిషేధం
లుసానే: లింగమార్పిడి మహిళా అథ్లెట్లపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై విశ్వక్రీడల్లో అమ్మాయిగా మారిన అథ్లెట్లను అనుమతించరు. లింగమార్పిడి మహిళలపై నిషేధం విధిస్తున్నట్లు ఐఓసీ తెలిపింది. మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. పుట్టుకతో మహిళ లేదంటే పురుషుడైన అథ్లెట్లను మాత్రమే పోటీ పడేందుకు అర్హత కల్పించాలని ఆయన ఆదేశించారు. అగ్రదేశాధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు లోబడి ఐఓసీ... అథ్లెట్ల అర్హత విషయమై కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎవరైనా అమ్మాయిగా మారినా... వారిని మహిళల విభాగంలో అనుమతించరు. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లకు ఈ కొత్త నిర్ణయం అమలవుతుందని ఐఓసీ స్పష్టం చేసింది. ఇకపై ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో పాల్గొనాలంటే జన్మతః పురుషుడు, మహిళా అథ్లెట్లకు మాత్రమే అవకాశముంటుంది. -
భారత్ X పాకిస్తాన్
మాలె (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్షిప్లో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటుండగా... పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతోంది. శనివారం బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ రెండిట్లో ఒక్క మ్యాచ్లో విజయం సాధించినా... మన జట్టు నేరుగా సెమీఫైనల్కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు భారత్పై ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. -
కైనన్, రాజేశ్వరి జోడీగా...
టాంజియర్ (మొరాకో): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) కొత్త సీజన్కు నేటి నుంచి తెర లేవనుంది. నాలుగు షాట్గన్ ప్రపంచకప్లలో భాగంగా తొలి టోర్నీ నేడు మొదలుకానుంది. తొలి రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. శుక్రవారం స్కీట్ ఈవెంట్లో పోటీలు ఆరంభమవుతాయి. భారత్ నుంచి 12 మంది షూటర్లు పతకాల వేటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ షూటర్, రియో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన కైనన్ చెనాయ్, అతని భార్య రాజేశ్వరి కుమారి వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కలిసి ఆడనున్నారు. ఇటీవల కైనన్, రాజేశ్వరి వివాహం జరిగింది. 35 ఏళ్ల కైనన్ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. 34 ఏళ్ల రాజేశ్వరి 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్ ట్రాప్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. మరోవైపు ట్రాప్ ఈవెంట్లో వెటరన్ షూటర్ జొరావర్ సింగ్ సంధూ ‘వర్క్లోడ్ మేనేజ్మెంట్’లో భాగంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. 48 ఏళ్ల జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో జొరావర్ ట్రాప్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. తద్వారా కర్ణీ సింగ్ (1962లో), మానవ్జీత్ సింగ్ సంధూ (2006లో) తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన మూడో భారతీయ ట్రాప్ షూటర్గా జొరావర్ గుర్తింపు పొందాడు. భారత షూటింగ్ జట్టు: పృథ్వీరాజ్ తొండైమన్, కైనన్ చెనాయ్, భౌనీశ్ మెందిరత్తా, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి, ఆషిమా అహ్లావత్ (ట్రాప్). మాన్ సింగ్, జ్యోతిరాదిత్య సింగ్ సిసోడియా, పరంపాల్ సింగ్, యశస్వి రాథోడ్, దర్శన రాథోడ్, మహేశ్వరి చౌహాన్ (స్కీట్). కైనన్ చెనాయ్–రాజేశ్వరి కుమారి, పృథ్వీరాజ్ తొండైమన్–కీర్తి గుప్తా (మిక్స్డ్ టీమ్). -
లాక్రాస్లో భారత్ లాజవాబ్!.. అసలు ఈ ఆట ఏంటి?
న్యూఢిల్లీ: ఆసియా మీట్లో పసిడి పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల లాక్రాస్ జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం అభినందించారు. సుదీర్ఘ విరామం అనంతరం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పునరాగమనం చేయనున్న ఈ క్రీడలో భారత జట్లు సత్తా చాటాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా... అసియా లాక్రాస్ గేమ్స్లో భారత జట్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాయి. పురుషుల ఫైనల్లో భారత జట్టు ఇరాక్పై గెలుపొందగా... మహిళల తుదిపోరులో పాకిస్తాన్ను భారత్ చిత్తుచేసి విజేతగా నిలిచింది. 2024లో భారత మహిళల జట్టు ఈ క్రీడలో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... గతేడాది పరుషుల జట్టు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అనతి కాలంలోనే నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న మన జట్లు... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడా మంత్రి ఆకాంక్షించారు. ‘భారత్లో లాక్రాస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రీడకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్రీడలో ఆసియా స్థాయిలో భారత్కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఇది మన జట్ల కృషి, పట్టుదలకు నిదర్శనం. ఇక 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేయాలి’ అని మాండవీయా అన్నారు. 1904 ఒలింపిక్స్లో ఈ ఆటను తొలిసారి విశ్వక్రీడల్లో ప్రవేశ పెట్టారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఒలింపిక్స్లోనూ ఇది పతక క్రీడగా కొనసాగింది. ఆ తర్వాత విశ్వక్రీడల జాబితా నుంచి లాక్రాస్ను తొలగించారు. 1928, 1932, 1948లో జరిగిన ఒలింపిక్స్లో లాక్రాస్ను ప్రదర్శన క్రీడగా నిర్వహించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అమెరికా వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో ఈ ఆట దర్శనమివ్వనుంది. 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత పురుషుల, మహిళల జట్లు... త్వరలో చైనా వేదికగా జరగనున్న ఆసియన్ లాక్రాస్ గేమ్స్లో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా వేదికగా జరగనున్న ఆసియా–పసిఫిక్ చాంపియన్షిప్లోనూ పోటీపడతాయి. భారత పురుషుల లాక్రస్ జట్టుకు తెలంగాణ ప్లేయర్ అనుదీప్ రెడ్డి సారథిగా వ్యవహరిస్తుండగా... ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, జమ్మూకశ్మీర్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. అసలు ఏంటీ లాక్రాస్... ఈ ఆటకు అమెరికాలో ఆదరణ ఎక్కువ. హాకీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్ కలగలిపినట్లు ఉండే ఈ ఆటలో... ఒక్కో జట్టు తరఫున 10 మంది పోటీ పడతారు. కాకపోతే ఒలింపిక్స్లో ఆడే జట్టులో మాత్రం ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. హాకీ స్టిక్ లాంటి పొడవైన కర్ర పై భాగంలో ప్రత్యేక నెట్ ఉంటుంది. రబ్బర్ బంతిని పట్టుకోవడానికి సహచరులకు పాస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యర్థి గోల్ పోస్ట్లో ఎక్కువసార్లు ఎవరు బంతిని పంపగలిగితే వారు విజేతగా నిలుస్తారు. అచ్చం ఫుట్బాల్ మాదిరిగానే అటాకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్, గోలీ (గోల్ కీపర్) స్థానాలు ఉంటాయి. ప్లేయర్లు గాయపడే అవకాశముండటంతో... మైదానంలో ఉన్నవాళ్లంతా హెల్మెట్లు, గ్లౌవ్స్, ప్యాడ్స్ ధరించి బరిలోకి దిగుతారు. -
’తొమ్మిదేళ్లు భరించినందుకు ధన్యవాదాలు’
ఫుట్బాల్లో ఈతరం మేటి ఆటగాళ్లుగా ముద్రపడ్డవారు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరిలా అంత పాపులారిటీ సంపాదించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈజిప్ట్ ఫుట్బాల్ స్టార్ ఆటగాడు మహ్మద్ సాలా. ఫార్వర్డ్ ప్లేయర్గా స్టార్ హోదా పొందిన సాలా తొమ్మిదేళ్లుగా లివర్పూల్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే లివర్పూల్తో ఉన్న తొమ్మిదేళ్ల బంధానికి ముగింపు పడనున్నట్లు సాలా ప్రకటించాడు. త్వరలోనే లివర్పూల్ క్లబ్తో ఒప్పందం ముగియనున్న వేళ దానితో ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీడియో రూపంలో భావోద్వేగంతో పంచుకున్నాడు. ‘అందరికీ నమస్కారం. ఈ సీజన్తో లివర్పూల్తో బంధం ముగియనుంది. ఏదో ఒకరోజు లివర్పూల్ క్లబ్ నుంచి వైదొలగాల్సిందే. కానీ ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. ఇది నా వీడ్కోలులో మొదటి భాగం. లివర్పూల్ క్లబ్తో తొమ్మిదేళ్లుగా సాగిన బంధంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లివర్పూల్ అనేది కేవలం నాకు ఫుట్బాల్ క్లబ్ మాత్రమే కాదు అంతకుమించి. ఇంతకాలం నన్ను భరించడంతో పాటు నాకు సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 2017లో లివర్పూల్ క్లబ్లో చేరిన 33 ఏళ్ల మహ్మద్ సాలా ఆ క్లబ్ తరఫున 435 మ్యాచ్లాడి 255 గోల్స్ సాధించాడు. తద్వారా లివర్పూల్ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన జాబితాలో ఇయాన్ రష్, రోజర్ హంట్ల తర్వాత సాలా మూడో స్థానంలో ఉన్నాడు. 2019, 2024 సీజన్లలో టైటిల్ గెలిచిన లివర్పూల్లో సాలా సభ్యుడిగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా 115 మ్యాచ్ల్లో 67 గోల్స్ సాధించాడు.pic.twitter.com/mSP9S4pfpu— Mohamed Salah (@MoSalah) March 24, 2026చదవండి: డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన! -
విదేశీ వద్దు.. స్వదేశీ కోచ్ ముద్దు!
భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ను నియమించాలని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం జాతీయ జట్టు కోచ్గా పనిచేస్తున్న కోస్టారికాకు చెందిన అమేలియా వాల్వర్డె కాంట్రాక్టును పునరుద్ధరించబోవడం లేదని ప్రకటించింది. ఇటీవల ఆ్రస్టేలియా వేదికగా జరిగిన ఆసియా కప్లో అమేలియా కోచింగ్లో బరిలోకి దిగిన భారత జట్టు ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. కేవలం ఈ టోర్నీ కోసమే అమేలియాను జనవరిలో మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక చేశారు. అమ్మాయిల జట్టుకు స్వదేశీ కోచ్ ఉండటమే ఉత్తమమని ఐఎం విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో... ఏఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పురుషుల, మహిళల జాతీయ జట్ల భవిష్యత్తుపై చర్చించేందుకు మంగళవారం ఏఐఎఫ్ఎఫ్ సాంకేతిక కమిటీ ఆన్లైన్లో సమావేశమైంది. విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... హర్జిందర్ సింగ్, షబ్బీర్ అలీ, విక్టర్ అమల్రాజ్, లారెన్స్, సంతోష్ సింగ్ పాల్గొన్నారు. అమేలియా కోచింగ్లో జట్టు ప్రదర్శనపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు నెలల పాటు జట్టుకు కోచ్గా వ్యవహరించిన అమేలియాకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ... ఈ ఏడాది జూన్లో జరిగే దక్షిణాసియా చాంపియన్షిప్ ప్రారంభానికి ముందే స్వదేశీ కోచ్ను నియమించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ మహిళల జట్టుకు కోచ్గా పని చేయడానికి ఆంథోని ఆండ్రూస్, క్రిస్పిన్ ఛెత్రీలు ఆసక్తిగా ఉన్నట్లు ఏఐఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం! -
పోల్వాల్ట్లో జాతీయ రికార్డు
భువనేశ్వర్: తమిళనాడు మహిళా అథ్లెట్ బరానిక ఎలంగోవన్ పోల్వాల్ట్లో కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. భారత్లో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన పోల్వాల్ట్లో ఆమె 4.22 మీటర్లతో ఓవరాల్గా (ఇండోర్ అవుట్ డోర్ కలిపి) జాతీయ రికార్డు లిఖించింది. గతంలో పోల్వాల్ట్లో రోజీ మీనా పాల్రాజ్ 2022లో నెలల్పిన 4.21 మీటర్ల రికార్డును 29 ఏళ్ల బరానిక అధిగమించింది. ఇది రెగ్యులర్ అవుట్డోర్ ఈవెంట్ కాగా, భారత్లో ఇంతకుముందెన్నడూ ఇండోర్ పోటీలే జరగలేదు. ఈ నేపథ్యంలో తొలి ఇండోర్ ఈవెంట్లోనే ఆమె ఓవరాల్ రికార్డును నెలకొల్పినట్లయింది. ఈ పోటీల్లో కేరళకు చెందిన బ్లెస్సీ కుంజుమోన్ (3.95 మీ.), మరియా జైసన్ (3.38 మీ.) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ‘ముఖ్యంగా పోల్వాల్ట్ను గాలి వేగం శాసిస్తుంది. అవుట్డోర్లో వీచే గాలి వేగంతో పోల్వాల్ట్ ప్రదర్శన మారుతుంది. అయితే ఇండోర్ ఈవెంట్లో అలాంటి సమస్యలే లేవు’ అని బరానిక తెలిపింది. మిగతా పోటీల్లో పురుషుల లాంగ్జంప్లో సారున్ పాయసింగ్ (7.80 మీ.; ఒరిస్సా) వ్యక్తిగత మెరుగైన్ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. దీంతో ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ (7.78మీ.; తమిళనాడు) రజతం లభించింది. ప్రవీణ్ సాధారణంగా ట్రిపుల్ జంప్లో పోటీపడతాడు. అయితే ఇండోర్లో ఆ ఈవెంట్ లేకపోవడంతో లాంగ్జంప్లోకి మారాడు. డేవిడ్ (7.69 మీ.; రైల్వేస్)కు కాంస్యం దక్కింది. పరీక్షలు సిద్ధమైన ‘నాడా’ ఓ వైపు తొలిరోజు భారత అథ్లెట్లు తొలిసారి ఇండోర్ పోటీల్లో పాల్గొంటుండగా... మరోవైపు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షలు మొదలుపెట్టింది. ‘నాడా’కు చెందిన బృందం ఈవెంట్కు వేదికైన కళింగ స్టేడియంలోకి దిగింది. మైదానంలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ గదిలో అథ్లెట్ల నుంచి రక్త మూత్ర నమూనాల్ని తీసుకుంది. ఇతర పోటీల ఫలితాలు పురుషుల ఈవెంట్స్: 800 మీ పరుగు: 1. మొహమ్మద్ అఫ్సల్ (ఎయిర్ఫోర్స్), 2. కళ్యాణ్ (కర్ణాటక), 3. సాయన్ కర్మాకర్ (బెంగాల్); 3000 మీ. పరుగు: 1. శివాజీ (రిలయన్స్), 2. వినోద్ (మధ్యప్రదేశ్), 3.రాహుల్ కుమార్ (ఛత్తీస్గఢ్); 60 మీ. హర్డిల్స్: 1.క్రిషిక్ (కర్ణాటక), 2.రాతీశ్ (రిలయన్స్), 3. ముహమ్మద్ లజాన్ (జేఎస్డబ్ల్యూ); షాట్పుట్: 1.రవికుమార్ (బీఎస్ఎఫ్), 2.ఆధిశ్ గిల్దియాల్ (ఉత్తరాఖండ్); 3.బాలాజీ (తమిళనాడు). మహిళల ఈవెంట్స్: 3000 మీ. పరుగు: 1.ప్రియాంక (కర్ణాటక), 2.కాజల్ (గుజరాత్), 3.అక్షయ (తమిళనాడు); షాట్పుట్: 1.రేఖ (ఎన్సీఓఈ, పాటియాలా), 2.మయూరి (కర్ణాటక); లాంగ్జంప్: 1. అనామిక (జేఎస్డబ్ల్యూ), 2.మనీశా మెరెల్ (ఒరిస్సా), 3.శెరిన్ (జేఎస్డబ్ల్యూ). -
‘హంపి తప్పు చేసింది’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్ చెస్ సమాఖ్య (సీసీఎఫ్) అధ్యక్షుడు క్రిటాన్ టొర్నారిటిస్ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్ చెస్ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్లలో మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్ అన్నాడు. అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్కు దూరం కాగా... భారత్ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్ముఖ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. -
భారత జట్టులో తెలంగాణ అమ్మాయిలు
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో పోటీపడే భారత మహిళల టెన్నిస్ జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన భారత నంబర్వన్ సహజ యామలపల్లి, భారత ఐదో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వైష్ణవి అడ్కర్కు తొలిసారి పిలుపుఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్–100 టోర్నీలో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచిన మహారాష్ట్ర ప్లేయర్ వైష్ణవి అడ్కర్కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 391వ ర్యాంక్తో సహజ భారత నంబర్వన్ ప్లేయర్గా కొనసాగుతుండగా... వైష్ణవి 397వ ర్యాంక్తో రెండో ర్యాంకర్గా నిలిచింది. ఏప్రిల్ 7 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. సహజ, రష్మిక, వైష్ణవిలతోపాటు రుతుజా భోస్లే, అంకిత రైనా కూడా భారత జట్టులో ఉన్నారు. వైదేహి చౌధరీని రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. కెప్టెన్గా విశాల్ ఉప్పల్, కోచ్గా రాధిక కనిట్కర్ కొనసాగుతారు. ఐదు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్తోపాటు ఇండోనేసియా, కొరియా, న్యూజిలాండ్, మంగోలియా, థాయ్లాండ్ పోటీపడతాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లే ఆఫ్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
బ్రెజిల్ మోడల్తో రొనాల్డో జూనియర్ డేటింగ్!
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్బాల్ ఆట తెలిసిన ప్రతీ ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. సమకాలీన ఫుట్బాల్ క్రీడలో మెస్సీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ ప్లేయర్గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న రొనాల్డో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ 15 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఆ సంచలనాలు ఆటలో అనుకుంటే పొరబడినట్లే.తాజాగా 15 ఏళ్ల రొనాల్డో జూనియర్ 27 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? అబద్ధమా? అనేది తేలకముందే, ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మరుక్షణమే వైరల్గా మారాయి. ప్రస్తుతం రొనాల్డో జూనియర్ దుబాయ్లో ఉంటున్నాడని, అక్కడే ఒక హోటల్లో బ్రెజిల్ మోడల్తో పరిచయం డేటింగ్కు దారి తీసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. అయితే రొనాల్డో అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. రొనాల్డో జూనియర్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అన్న విషయం గమనించాలని, అతనిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కామెంట్ చేశారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో జూనియర్ తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. తన తండ్రి క్రిస్టియానో రొనాల్డో భాగస్వామి అయిన జార్జినా రోడ్రిగ్జ్ గురించి సరదాగా క్రిస్టియానో జూనియర్ ఆమె తన 'క్రష్' అని ఒక సందర్భంలో పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత ఆమెను కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే చూశానని, గర్ల్ఫ్రెండ్గా చూడలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆమెతో మాటలు లేవని బదులిచ్చాడు. గతంలోనూ బార్సిలోనా స్టార్ లూయిస్ సువారెజ్ కుమార్తె డెల్ఫినా సువారెజ్ తో రొనాల్డో జూనియర్ ప్రేమలో ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.చదవండి: గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్లో అథ్లెటిక్స్ పోటీలు Cristiano Ronaldo Jr. is reportedly dating a 27-year-old Brazilian model. According to rumors, they met at a restaurant in Dubai, where Ronaldo Jr. made a bold move shooting his shot confidently, leaving her unable to resist and she claimed she’s a big supporter of Cristiano Jr.… pic.twitter.com/UhQhpN3p14— SAMSON👑🐐 (@Samsonthegoat25) March 23, 2026 -
గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్లో అథ్లెటిక్స్ పోటీలు
భువనేశ్వర్: సంప్రదాయ అథ్లెటిక్స్కు భిన్నంగా భారత్ కూడా ఇప్పుడు ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమైంది. తొలిసారిగా నేటి నుంచి జరిగే జాతీయ ఇండోర్ చాంపియన్షిప్ పోటీలకు కళింగ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ అథ్లెట్లందరూ సొంతగడ్డపై తొలి ఇండోర్ అనుభవానికి సిద్ధమయ్యారు. ఇండోర్ అథ్లెటిక్స్ ట్రాక్, పోటీలు భిన్నంగా ఉంటాయి. 400 మీటర్ల ట్రాక్ స్థానంలో 200 మీటర్ల ట్రాక్ ఉంటుంది. ఇటీవలే భారత్కు 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆతిథ్య హక్కులు లభించాయి. దీంతో వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇండోర్ ఈవెంట్ల నిర్వహణ ఊపందుకోనుంది. అయితే తొలి ఇండోర్ ఈవెంట్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పాల్గొనడం లేదు. అతని ఈవెంట్ (జావెలిన్ త్రో) ఈ చాంపియన్షిప్లో లేకపోవడంతో చోప్రా అభిమానులకు ఇది నిరాశపరిచే అంశం. 3000 మీటర్ల స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబ్లే కూడా ఇదే కారణంతో పోటీలకు దూరమయ్యాడు. స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ మొట్టమొదటి జాతీయ ఇండోర్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 100 మీటర్లు, 200 మీటర్లు అవుట్డోర్ ఈవెంట్స్లో జాతీయ రికార్డు సాధించిన కుజుర్ ఇప్పుడు ఇండోర్ పోటీల్లోనూ రికార్డు నెలకొల్పేందుకు శ్రమిస్తున్నాడు. స్వరాష్ట్రం ఒడిశా తరఫున ఇండోర్ పోటీల్లో అతను 60 మీటర్ల రేసులో పోటీపడనున్నాడు. ‘నాకు ఇది తొలి ఇండోర్ ఈవెంట్. ఇక్కడ రెగ్యులర్ స్ప్రింట్ (100, 200 మీటర్లు) కాకుండా 60 మీటర్ల పోటీకి సిద్ధమయ్యాను. నిజానికి నా ప్రధాన లక్ష్యం కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు. అయితే ఇండోర్ ఈవెంట్లో నా సత్తా ఎంటో తెలుసుకునేందుకే పోటీల్లోకి దిగుతు న్నాను’ అని కుజుర్ తెలిపాడు. తమిళనాడుకు చెందిన ప్రవీణ్కు ట్రిపుల్ జంప్లో జాతీయ రికార్డు ఉంది. అయితే అతను ఈ చాంపియన్షిప్లో మాత్రం లాంగ్జంప్లో పోటీపడతాడు. హైజంప్, పోల్వాల్ట్, లాంగ్జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్లు ఈ ఇండోర్ క్రీడల్లో ఉన్నప్పటికీ జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, హ్యామర్ త్రోలను కొన్ని కారణాల వల్ల తప్పించారు. సాధారణంగా రెగ్యులర్ అవుట్డోర్ ఈవెంట్లో ప్రత్యర్థులతో పాటు వాతావరణ సమస్యల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ ఇండోర్ అథ్లెటిక్స్లో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. చదవండి: రాజస్థాన్లోకి షనక.. కీలక సూత్రధారి అతడే! -
‘ప్లేయర్ ఆఫ్ ఇయర్’ రేసులో హార్దిక్, నవ్నీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత హాకీ స్టార్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్, ఫార్వర్డ్ ప్లేయర్లు సుఖ్జీత్ సింగ్, సంజయ్లతో పాటు డిఫెండర్ అభిషేక్ హాకీ ఇండియా (హెచ్ఐ) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉన్నారు. హెచ్ఐ వార్షిక అవార్డుల్లో ఈ నలుగురు హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ పేరిట ప్రదానం చేసే ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు.మహిళల కేటగిరీలో ఈ అవార్డు కోసం సలీమా టెటె, నవ్నీత్ కౌర్, లాల్రెమ్సియామి, సవిత పోటీపడుతున్నారు. న్యూఢిల్లీలో ఈ శుక్రవారంఅట్టహాసంగా అవార్డుల వేడుక నిర్వహించేందుకు హాకీ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు, పురుషుల సీనియర్ కేటగిరీలతో పాటు వర్ధమాన క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టేలా అండర్–21 విభాగంలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు ప్రదానం చేయనుంది. మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు.దీని కోసం 32 మంది నామినీలతో తుది జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో విజేతను శుక్రవారం వేడుకలో ప్రకటిస్తారు. జీవిత సాఫల్య పురస్కారంగా ప్రెసిడెంట్ అవార్డు, ఆటగాళ్లతో పాటు అంపైర్, మేనేజర్, టెక్నికల్ అఫీషియల్ అవార్డులు కూడా ఉంటాయి. ఈ అవార్డుల వేడుకలోనే ఆసియా కప్లో విజేతగా నిలిచిన సీనియర్ పురుషులు జట్టును, జూనియర్ ప్రపంచకప్లో కాంస్యం గెలిచిన జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ చెప్పారు. అవార్డులకు ఎంపికైన నామినీలు గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్: ప్రిన్స్దీప్ సింగ్, కిషన్ బహదూర్, బిచూ దేవి కరిబం, సూరజ్ కర్కేరా. డిఫెండర్ ఆఫ్ ద ఇయర్: సంజయ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్. మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్: హార్దిక్ సింగ్, సుమిత్, రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ. ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్: సుఖ్జీత్, అభిషేక్, నవ్నీత్ కౌర్, శిలానంద్ లాక్రా. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (అండర్–21 అమ్మాయిలు): సాక్షి రాణా, జ్యోతి సింగ్, సునెలితా టొప్పో, కనిక సివచ్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (అండర్–21 పురుషులు): ప్రిన్స్ దీప్, మన్మీత్, అన్మోల్ ఎక్కా, అర్‡్షదీప్ సింగ్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (మహిళలు): నవ్నీత్ కౌర్, సలీమా టెటె, లాల్రెమ్సియామి, సవిత. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (పురుషులు): హార్దిక్ సింగ్, సుఖ్జీత్, సంజయ్, అభిషేక్. -
‘యుద్ధం మధ్యలో ఆడగలమా’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోలేదని భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొంది. ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వ్యాఖ్యానించింది. ఈనెల 29 నుంచి సైప్రస్లో జరిగే ఈ పోటీల్లో తమకు అందించే భద్రతపై సందేహం ఉండటం వల్లే దూరమైనట్లు హంపి స్పష్టం చేసింది. మధ్యధరా సముద్రంలోని సైప్రస్... ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధ క్షేత్రాలకు అతి సమీపంలో ఉంది. ఒకవైపు తమకు సమీపంలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఆటలు ఎలా ఆడగలమని హంపి సూటిగా ప్రశి్నంచింది. ‘మన చుట్టూ యుద్ధం సాగుతుంటే, యుద్ధ నౌకలు మీకు సమీపంలోనే కనిపిస్తుంటే ఒక విదేశీయురాలైన నేను, పైగా మహిళను అంత దూరం ప్రయాణించి ప్రశాంతంగా ఎలా ఆడగలను. సైప్రస్కు చాలా దగ్గరలో ఉన్న లెబనాన్లో బాంబులు పడుతున్నాయి. స్వయంగా సైప్రస్ అధ్యక్షుడే ఇటీవల తమ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటిది ఒక ప్లేయర్గా నేను జాగ్రత్తపడితే తప్పేంటి. అయినా వారు సైప్రస్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా టోర్నీని నిర్వహించగలిగేవారు. లేదా అక్కడే జరపాలంటే ఒక నెల రోజుల పాటు పరిస్థితులు చక్కబడే వరకు ఆగాల్సింది. నేను హడావిడిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా ప్రొఫెషన్, వ్యక్తిగత భద్రత, ఇలాంటి స్థితిలో నా ఆట ఎలా ఉంటుందో ఎన్నో రాత్రులు ఆలోచించిన తర్వాత ఇక్కడి దాకా వచ్చాను’ అని హంపి వ్యాఖ్యానించింది. జమ్ము కశ్మీర్లో నిర్వహిస్తారా! టోర్నీలో పాల్గొనాల్సిన 16 మందిలో 15 మందికి సమస్య లేదని, తాను మాత్రమే తప్పుకున్నానని కొందరు విమర్శలు చేస్తుండటంపై కూడా హంపి స్పందించింది. ‘మిగతా వారంతా ఆడుతున్నారంటే నిర్వాహకులు సరైన నిర్ణయం తీసుకున్నారని అర్థం కాదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా టోర్నీ జరగవచ్చు కూడా. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నిర్వహించడం అవసరమా అనేదే నా ప్రశ్న. భద్రతకు సంబంధించి అమెరికా, ఇంగ్లండ్లు ఇప్పటికే లెవల్ 3 స్థాయి హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే స్థాయిలో భద్రతా వ్యవస్థ ఉన్న జమ్ము కశ్మీర్లో వారు టోర్నీ నిర్వహిస్తారా? చాలా అందమైన రిసార్ట్లో టోర్నీ నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. అలాంటివి భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఒక టోర్నీ ఆడేందుకు ఇలాంటి ఏర్పాట్లు మాత్రమే సరిపోవు. అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. నేను ఇప్పుడు వెళ్లి ఆడటం అంటే నిర్వాహకుల నిర్ణయానికి మద్దతిచ్చినట్లే. నిజానికి యుద్ధం మొదలు కాగానే ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను నిర్వాహకులు అడగాల్సింది’ అని హంపి పేర్కొంది. డబ్బు కోసం ఆడటం లేదు... క్యాండిడేట్స్ టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడంతో హంపిపై ‘ఫిడే’ భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే తాను దీనిని పట్టించుకోనని ఆమె స్పష్టం చేసింది. ‘ఆటగాళ్లు నిజాలు మాట్లాడకూడదనే ‘ఫిడే’ జరిమానాలతో భయపెడుతుంది. నాకు ఎలాంటి భయం లేదు. డబ్బు కోసం, ఇతర వాణిజ్య లాభాల కోసం నేను ఆడటం లేదు. చెస్ అంటే ఇష్టంతో ఆడుతున్నాను. ఫిడే ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్తో కూడా ఈ టోర్నీ విషయంలో మాట్లాడాను. అయితే ఆ విషయాలు నేను బయటకు చెప్పను. టోరీ్నలో ఆడుతున్న భారత సహచరులు దివ్య, వైశాలి, ప్రజ్ఞానందలతో నేను మాట్లాడలేదు. ఆ అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. నేను కూడా నా కోసం మాట్లాడతాను తప్ప వేరేవాళ్ల గురించి కాదు’ అని హంపి పదునైన వ్యాఖ్యలు చేసింది. సైప్రస్లో తాజా పరిస్థితులపై అమెరికా గ్రాండ్మాస్టర్ నకమురా కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు హంపి స్థానంలో ఉక్రెయిన్కు చెందిన అనా ముజీచుక్ను టోరీ్నలో ఆడేందుకు ఎంపిక చేసినట్లు ‘ఫిడే’ ప్రకటించింది. -
కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్వన్కు షాక్!
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం నమోదయ్యింది. పురుషుల ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ పరాజయం చవిచూశాడు. మియామి ఓపెన్లో భాగంగా ప్రపంచ 36వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా చేతిలో అల్కరాజ్ ఓటమి పాలయ్యాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో అల్కరాజ్ 3-6, 7-5, 4-6తో సెబాస్టియన్ చేతిలో ఓటమి చవిచూశాడు. రెండు గంటలకు పైగా స ఆగిన మ్యాచ్లో కోర్డా తొలి సెట్ నుంచే తన ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి సెట్ను 6-3తో సునాయాసంగా నెగ్గిన కోర్డా రెండో సెట్ను అల్కరాజ్కు కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో ఫుంజుకున్న సెబాస్టియన్ కోర్డా పదునైన సర్వీస్లతో అల్కరాజ్ను మట్టికరిపించి తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన అల్కరాజ్ తన కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసుకున్నాడు. మియామి ఓపెన్ కంటే ముందు జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీలో మంచి ఆరంభంతోనే మొదలుపెట్టిన అల్కరాజ్ సెమీస్లో వెనుదిరిగాడు. డానిల్ మెద్వెదెవ్ చేతిలో అల్కరాజ్ ఓటమిపాలయ్యాడు. ఈ ఓటమితో అల్కరాజ్ వరుస 17 విజయాలకు బ్రేక్ పడినట్లయింది. తాజాగా మియామి ఓపెన్లో ఓటమితో అల్కరాజ్ ఆధిక్యం 17-2కు తగ్గినట్లయింది. 2022లో మియామి ఓపెన్ నెగ్గిన అల్కరాజ్ మరోసారి టైటిల్ నెగ్గాలని ఆశించినప్పటికీ మూడో రౌండ్కు పరిమితమయ్యాడు. ఇక సెబాస్టియన్ కోర్డా ప్రిక్వార్టర్స్లో కచనోవ్ లేదా మార్టిన్ ల్యాండ్లూస్ల్లో ఒకరితో పోటీ పడనున్నాడు.చదవండి: పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!Sebi SPECIAL 🙌The moment @SebiKorda defeated Carlos Alcaraz for his first ever win over a reigning No. 1!#MiamiOpen pic.twitter.com/iTBpMLBRw6— Tennis TV (@TennisTV) March 22, 2026 -
అనాహత్, అభయ్లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు. -
రన్నరప్ రిత్విక్–అర్జున్ జోడీ
న్యూఢిల్లీ: మొరెలాస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రన్నరప్గా నిలిచాడు. మెక్సికోలో ఆదివారం జరిగిన ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) జోడీ 3–6, 6–7 (4/7)తో ఆండ్రెస్ అండ్రాడె (ఈక్వెడార్)–అగస్టిన్ గోమెజ్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది. ఫైనల్లో ఓడిన రిత్విక్ జోడీకి 2.70 లక్షల నగదు (2,880 డాలర్లు)తో పాటు 50 పాయింట్లు లబించాయి. -
లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు
ఒర్లాండో (ఫ్లోరిడా): అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా లెబ్రాన్ ఘనత సాధించాడు. ఆదివారం ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆడటం ద్వారా లెబ్రాన్ జేమ్స్ కెరీర్లో 1612 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. 30 ఏళ్లుగా ఈ రికార్డు రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్లు) పేరిట ఉండగా... దాన్ని లెబ్రాన్ జేమ్స్ బద్దలు కొట్టాడు. ఇప్పటికే ఎన్బీఏలో వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన జేమ్స్... ఒర్లాండో మ్యాచ్లో 12 పాయింట్లతో సత్తాచాటాడు. ఫలితంగా హోరాహోరీగా సాగిన పోరులో లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు 105–104 పాయింట్ల తేడాతో ఒర్లాండో మ్యాజిక్పై విజయం సాధించింది. -
బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది!
ఫార్ములా వన్ రేసులో రారాజులే ఎక్కువగా కనిపిస్తారు. మైకెల్ షుమాకర్, లూయిస్ హామిల్టన్, వెర్స్టాపెన్ వంటి ఎందరో దిగ్గజాలను ఫార్ములా వన్ రేస్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారత్లో కూడా ఫార్ములా వన్ రేసుపై మక్కువ ఇటీవలే కాలంలో పెరిగిపోయింది. ఫార్ములా వన్ అబ్బాయిలే ఎక్కువగా ఇష్టపడతారనేది ఎక్కువగా వినిపిస్తుంది. కానీ భారత్లో మాత్రం 11 ఏళ్ల అతికా మిర్ మాత్రం అబ్బాయిలకు ధీటుగా ఫార్ముల్ వన్లో దూసుకెళ్తోంది. యూరోపియన్ సర్క్యూట్లో అతికా మిర్ తన తొలి ప్రయత్నంలో (12 నుంచి 14 ఏళ్ల మధ్య) నిర్వహించే రేస్ కార్టింగ్లో అంచనాలకు మించి రాణించింది. అయితే రేసింగ్ ఇప్పటికీ పురుషాధిక్య క్రీడగానే ఉండడంతో తరచూ అబ్బాయిల చేతిలో బెదిరింపులకు గురయ్యేదానినని అతికా మిర్ చెప్పు కొచ్చింది. అతికా మిర్ కేవలం తన ప్రతిభ ఆధారంగానే మినీ (8 నుంచి 12 ఏళ్లు) విభాగం నుంచి జూనియర్ (12 నుంచి 14 ఏళ్లు) వేగంగా పదోన్నతి పొందడమే గాక తన అద్భుతమైన రేసింగ్ నైపుణ్యంతో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం భారత్ తరఫున అతికా మిర్ ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న భారతీయ కార్టర్గా మాత్రమే గాక, 40 వరకు ఉండే కార్ట్లు ఉండే రద్దీగా ఉండే గ్రిడ్లపై కూడా అతికా చాలా మంది పురుష రేసర్లను వెనక్కి నెట్టేయడం విశేషం. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన అతికా మిర్ ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మాక్స్ వెర్స్టాపెన్ను అతికా తన ఆరాధ్య దైవంగా భావిస్తోంది. అతికా మిర్ రేసింగ్ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ఆసిర్ మిర్ భారత మొట్టమొదటి జాతీయ కార్టింగ్ చాంపియన్. 2021లో అబుదాబిలో జరిగిన ఫార్ములా వన్ సీజన్ ఫైనల్లో లూయిస్ హామిల్టన్, వెర్స్టాపెన్ల మధ్య జరిగిన అద్భుతమైన టైటిల్ పోరును చూసినత తర్వాత అతికా మిర్ రేసింగ్పై ఇష్టాన్ని పెంచుకుంది. మోటార్ రేసింగ్లో పురుషాధిక్యం మామూలే. అందుకే ఫార్ములా వన్లో మహిళలు కనిపించరు. కానీ నమ్మకం, ఆత్మవిశ్వాసం ఇవాళ నన్ను రేసింగ్ను కెరీర్గా ఎంచుకునేలా చేశాయి. ట్రాక్పై అబ్బాయిలు వేధింపులకు గురైనప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతూ పోయింది. 2021లో ఫార్ములా వన్ రేసు ఫైనల్ వీక్షించే వరకు నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టీవీలో అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ద్వారా రేసింగ్పై మక్కువ పెంచుకున్నా అని అతికా చెప్పుకొచ్చింది. చదవండి: పంజాబ్ కింగ్స్లో లుకలుకలు! -
సెమీస్లో తన్వీ, ఇషారాణి ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఫ్రాన్స్లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా ఓటమి పాలయ్యారు. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన తొలి సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 9–21, 16–21తో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో ఇషారాణి 12–21, 21–23తో పిచామన్ ఒపాట్నిపుత్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ఓడిన తనీ్వ, ఇషారాణిలకు 3,625 డాలర్ల (రూ. 3 లక్షల 39 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్ పోరుకు అనాహత్ సింగ్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్కే టైటిల్ లభించనుంది. ఎందుకంటే భారత్కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ హనా మొతాజ్ (ఈజిప్్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో వీర్ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్ జీవా (మలేసియా)పై, అభయ్ సింగ్ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్రాజ్ చందారన్ (మలేసియా)పై విజయం సాధించారు. -
జపాన్ స్టార్కు షాకిచ్చిన తాన్వి శర్మ
ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్లో శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–14, 21–14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా (జపాన్)పై సంచలన విజయం సాధించింది.43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ తన్వీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఇషారాణి 21–9, 15–7తో భారత్కే చెందిన మాళవిక బన్సోద్పై గెలిచింది. రెండో గేమ్ మధ్యలో గాయం కారణంగా మాళవిక వైదొలిగింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 12–21, 20–22తో లియో కార్నాండో–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి...
మయామి: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాడు. విఖ్యాత నేషనల్ బాస్కెల్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఈ ఆదివారం 41 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించనున్నాడు. 79 ఏళ్ల ఎన్బీఏ చరిత్రలో వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్గా గుర్తింపు పొందిన లెబ్రాన్ మయామి హీట్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఎన్బీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా 1997 నుంచి రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును లెబ్రాన్ సమం చేశాడు. మయామి హీట్తో జరిగిన మ్యాచ్లో లెబ్రాన్ 19 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ మ్యాచ్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు 134–126తో గెలిచి ఈ సీజన్లో వరుసగా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు తదుపరి మ్యాచ్ను రేపు ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో లెబ్రాన్ బరిలోకి దిగితే ఎన్బీఏ చరిత్రలోనే అత్యధికంగా 1612 మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఘనత వహిస్తాడు. -
‘మానసిక వేదన అనుభవిస్తున్నా’
పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ఓడిపోవడం తనను మానసిక వేదనకు గురి చేస్తోందని, ఓటములతో కోర్టులో ఆటపై పట్టు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. గురువారం ప్రారంభమైన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్వియాటెక్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 50వ ర్యాంకర్ మగ్డా లినెట్టె 6-1, 5-7, 6-3తో ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన స్వియాటెక్ను మూడు సెట్లలో చిత్తు చేసింది. ఒక డబ్ల్యూటీఏ టూర్లో భాగంగా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో 73 మ్యాచ్ల్లో వరుస విజయాల తర్వాత తొలి రౌండ్లో ఓడిపోవడం స్వియాటెక్కు ఇదే తొలిసారి. మ్యాచ్ ఓటమి అనంతరం స్వియాటెక్ మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే నమ్మబుద్ది కావడం లేదు. రాను రాను టెన్నిస్ ఆట కష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మానసికంగా మనం ఎలా ఉంటామనేది చాలా కీలకం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మళ్లీ నా పనిలో మునిగిపోతా. ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్గా ఆలోచిస్తూ.. నా ఆటను మెరుగుపరచుకుంటా’ అని స్వియాటెక్ పేర్కొంది. కాగా స్వియాటెక్ తన టెన్నిస్ కెరీర్లో ఇప్పటివరకు ఆరు గ్రాండ్స్లామ్లు సాధించగా ఇందులో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఒక్కోసారి నెగ్గడం విశేషం. ఒక దశలో స్వియాటెక్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో 125 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.చదవండి: ‘సంజూకు మామయ్యలాంటి వాడిని’‼️UPSET ALERT IN HARD ROCK STADIUM ‼️@MagdaLinette | #MiamiOpen pic.twitter.com/lUJtcc5jbW— wta (@WTA) March 20, 2026 -
ఇరాన్కు షాకిచ్చిన ఫిఫా!
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్ వేదికలను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫిఫా (అంతర్జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ సమాఖ్య) తోసి పుచ్చింది. ఇప్పటికే మ్యాచ్ వేదికలను సిద్ధం చేశామని, ముందు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో తెలిపారు. ఇరాన్ అభ్యర్థన సహా పలు అంశాలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిఫా పాలకమండలి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గియాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా సభ్య సమాఖ్య చేసిన ఫిర్యాదులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘గత డిసెంబర్లోనే ఫిఫా మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేశాము. దీంతో మ్యాచ్ వేదికలను మెక్సికోకు మార్చాలన్న ఇరాన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇరాన్ మ్యాచ్ వేదికలను మార్చలేము. అందుకే షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లను నిర్వహించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ఫుట్బాల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పాలస్తీనా ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తున్నాం. భౌగోళిక రాజకీయాలను పరిష్కరించేందుకు ఫిఫా పనిచేయదు. కాకపోతే యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలనే విషయానికి ఫిఫా కట్టుబడి ఉంటుంది.’ అని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య మొదలైన యుద్ధం మూడు వారాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. అయితే సాకర్ ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ యుద్ధానికి రెండు నెలల ముందే విడుదలయ్యింది. అమెరికా, కెనెడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ జూన్ 11న ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం,న్యూజిలాండ్, ఈజిప్ట్లతో తమ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఇరాన్ తన మూడు మ్యాచ్లను అమెరికాలోనే ఆడాల్సి ఉండగా.. లాస్ఏంజిల్స్ వేదికగా రెండు, మరో మ్యాచ్ను సియాటెల్లో ఆడాల్సి ఉంది. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమ లీగ్ మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఫిఫాను విజ్ఞప్తి చేసింది. తాజాగా ఫిఫా నిర్ణయం ఇరాన్ను చిక్కుల్లో పడేసినట్లయింది. ఇప్పుడు ఇరాన్ ముందు రెండే ఆప్షన్లు.. ఆడడం లేదా టోర్నీ నుంచి వైదొలగడం. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ను బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం -
మెస్సీ @ 900 గోల్స్
ఫోర్ట్ లాడెర్డేల్ (అమెరికా): అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లయోనల్ మెస్సీ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఫుట్బాల్ కెరీర్లో 900 గోల్స్ సాధించిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా ఇప్పటిదాకా మరో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకే పరిమితమైన ‘900 గోల్స్’ జాబితాలో తానూ భాగమయ్యాడు. కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా అండ్ కరీబియన్ అసోసియేషన్ ఫుట్బాల్ (కాన్కకాఫ్) చాంపియన్స్ కప్లో ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ... నష్ విల్లేతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గోల్ చేయడం ద్వారా ‘900’ క్లబ్లో చేరాడు. బ్రెజిలియన్ దివంగత దిగ్గజం పీలే 1000 గోల్స్ చేసినట్లుగా ఉన్నప్పటికీ అధికారిక గోల్స్ స్కోరు మాత్రం సుమారు 800 మాత్రమే! ఎందుకంటే పీలే చేసిన వెయ్యి గోల్స్లో దిగువ స్థాయి మ్యాచ్ల్లో చేసినవి కూడా కలిపారు. దీంతో ఫుట్బాల్ విశ్లేషకుల లెక్కల ప్రకారం 900 క్లబ్లో ప్రస్తుతం రొనాల్డో, మెస్సీలు మాత్రమే ఉన్నారు. -
క్వార్టర్స్లో తాన్వి, మాళవిక
ఓర్లియాన్స్ (ఫ్రాన్స్): ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ తాన్వి శర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో తాన్వి 21–14, 21–17తో భారత్కే చెందిన అన్మోల్ ఖర్బ్ను ఓడించింది. ఇతర మ్యాచ్లలో ఇషారాణి బారువా 21–11, 14–21, 21–17తో వెన్ యు జాంగ్ (కెనడా)పై, మాళవిక బన్సోద్ 24–22, 21–13తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, నెగ్గి ముందంజ వేశారు. పురుషుల డబుల్స్లో భారత జోడి హరిహరన్ – ఎంఆర్ అర్జున్ 26–24, 21–14తో అలెగ్డాండర్ డున్ – ఆడమ్ ప్రింగిల్ (స్కాట్లాండ్)ని ఓడించి క్వార్టర్స్కు చేరింది. పురుషుల సింగిల్స్లో 21–9, 18–21, 9–21 స్కోరుతో యుడై ఒకొమొటో (జపాన్) చేతిలో ఓటమితో ఆయుశ్ శెట్టి (భారత్), మిక్స్డ్ డబుల్స్లో భారత జంట గద్దె రుత్విక శివాని – రోహన్ కపూర్ 21–19, 9–21, 14–21తో టాప్ సీడ్ థామ్ గిక్వెల్ – డెల్ఫైన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) చేతిలో ఓడి నిష్క్రమించారు. -
2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్ వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్కు దక్కినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. భువనేశ్వర్లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్తో పాటు భారత్ బిడ్ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్ భువనేశ్వర్ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్ (1999), ఖతర్ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్షిప్నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలవనుంది. -
అమెరికాపై వెనిజులా చరిత్రాత్మక విజయం
వెనిజులా బేస్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. రాజకీయ ఉద్రికత్తల వేల అమెరికాను వారి సొంతగడ్డపై (మియామీ) 3–2 తేడాతో ఓడించి, తమ మొదటి వరల్డ్ బేస్బాల్ క్లాసిక్ (WBC) టైటిల్ను సాధించింది. తొమ్మిదో ఇన్నింగ్స్లో యూజెనియో సుయారెజ్ కీలక హిట్తో వెనిజులాకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయాన్ని వెనిజులా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. వెనిజులా తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగెస్ ఈ విజయాన్ని జాతీయ ఉత్సవ దినంగా ప్రకటించారు. ఈ విజయం వెనిజులా ప్రజల అభిరుచి, ప్రతిభ, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.కాగా, ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను సైనిక దాడితో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్కు అనుకూలమైన డెల్సీ రోడ్రిగెస్ వెనిజులా తాత్కాలిక నాయకురాలిగా బాధ్యతలు చేపట్టారు. -
ఆగస్టు 20న భారత్, పాక్ పోరు
న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల ప్రపంచకప్ ట్రోఫీ నిరీక్షణకు తెర దించాలంటే ఈసారి భారత పురుషుల హాకీ జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్ టోర్నీలో వేల్స్ జట్టుతో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఆగస్టు 16న నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత బృందం ఆ తర్వాత ఆగస్టు 18న ఇంగ్లండ్తో... ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ‘ఢీ’కొంటుంది. తదుపరి దశకు అర్హత సాధించాలంటే భారత్ పూల్ ‘డి’లోని తొలి రెండు స్థానాల్లో కచి్చతంగా ఉండాలి. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 16న చైనాతో తలపడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్లో ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో... చివరిదైన మూడో మ్యాచ్లో ఆగస్టు 20న ఇంగ్లండ్తో ఆడుతుంది. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక నాలుగు పూల్స్ నుంచి రెండు జట్ల చొప్పున ఎనిమిది జట్లు రెండో రౌండ్కు చేరుకుంటాయి. రెండో రౌండ్లో ఎనిమిది జట్లను రెండు పూల్స్గా (ఒక్కో పూల్లో నాలుగు జట్లు) విభజిస్తారు. రెండో రౌండ్ ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు 1975లో ఏకైకసారి ప్రపంచకప్ టైటిల్ నెగ్గగా... భారత మహిళల జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. -
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
ఓర్లియాన్స్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని జోడీ శుభారంభం చేసింది. ఫ్రాన్స్లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ ద్వయం 21–15, 21–9తో త్సాయ్ ఫు చెంగ్–సుంగ్ యు సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 10–21తో మాగ్నస్ జొనాసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి 17–21, 21–10, 21–17తో సహచరుడు కిరణ్ జార్జ్పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక బన్సోద్ 21–18, 21–14తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై, ఇషారాణి బారువా 21–19, 21–19తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై, అన్మోల్ 21–12, 21–16తో నెష్లిహాన్ అరిన్ (టర్కీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్, దేవిక సిహాగ్, రక్షితశ్రీ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
‘కెరీర్ ముగింపు మన చేతుల్లో ఉండదు’
క్రీడల్లో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కేవలం ఒకే ఒక్క గాయంతో ఏకంగా కెరీర్నే ముగించాల్సి వస్తుందని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. గురుగ్రామ్లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధూ క్రీడలు, చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు కేవలం క్రీడలమీదే కాకుండా, చదువుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క గాయం కెరీర్నే ముగించే పరిస్థితికి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేను కొన్నేళ్లుగా ఆడుతూనే ఉన్నా. అయితే, ఏదొక సమయంలో రిటైర్మెంట్ అవ్వాల్సిందే కదా.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మనం 45 లేదా 50 ఏళ్లు వచ్చాక క్రీడలు ఆడటం కష్టం. కానీ, చదువు మాత్రం మన జీవితాంతం తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్తో జన్మించలేరు. ఎందులోనైనా సరే కష్టపడాల్సిందే. అది చదువైనా.. క్రీడలైనా సరే అకుంఠిత దీక్షతో శ్రమించాలి. రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. అయితే, ఓ వైపు క్రీడలో ఉంటూ చదువు కొనసాగించడం తేలికైన విషయం కాదని తెలుసు. ఉదయాన్నే ప్రాక్టీస్కు వెళ్లడం.. వచ్చాక చదువుకోవడం.. మళ్లీ సాయంత్రం సాధనకు వెళ్లడం కష్టమే. ఇక్కడే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం.. చదువు ఉంటే మాత్రం నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ, చదువును పూర్తిగా పక్కన పెట్టేసి ప్రయత్నించకూడదు. పైగా, క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిరంతరం రిస్క్తో కూడుకున్నదే. ఆటలను కెరీర్గా ఎంచుకున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఆడేటప్పుడు ఒక్క పెద్ద గాయమైతే.. కోలుకుని రావడం కష్టం. ఒక్కోసారి కెరీర్ ముగిసే అవకాశమూ లేకపోలేదు. ప్రమాదాలు చెప్పి రావు కదా. నేను 2016 ఒలింపిక్స్కు ముందు తీవ్రంగా గాయపడ్డా. కొన్నిరోజులపాటు నొప్పితోనే ఆడా. వైద్యుల వద్దకు వెళ్తే వారు ఏం చెబుతారనే భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానా? లేదా? అనే అనుమానాలు వచ్చాయి. వైద్య చికిత్స తీసుకున్నా.మళ్లీ కోలుకుని ఒలింపిక్స్ బరిలోకి దిగా' అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.చదవండి: బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం! -
ఒలింపిక్ పతకమే లక్ష్యం
ముంబై: లాస్ ఏంజెలిస్ మెగా ఈవెంటే మా అందరి లక్ష్యమని భారత టాప్ ర్యాంక్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ తెలిపింది. 2028 ఒలింపిక్స్లో తొలిసారి స్క్వాష్ క్రీడకు చోటు లభించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా వచ్చే రెండేళ్ల పాటు ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకే శ్రమిస్తారని చెప్పింది. ప్రతి అథ్లెట్ కలఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘స్క్వాష్ తొలిసారి ఒలింపిక్స్లో భాగమవడం... ముమ్మాటికి ఉత్సాహాన్ని పెంచే విషయం. క్రీడాకారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు మాకు (స్క్వాష్ ప్లేయర్లకు) కామన్వెల్త్ క్రీడలే మేజర్ ఈవెంట్గా ఉంది. ఇప్పుడు విశ్వక్రీడల్లో ఆడే అవకాశం లాస్ ఏంజెలిస్ ద్వారా దక్కనుంది. ఒలింపిక్ పతకమనేది ప్రతి అథ్లెట్ కల. దీన్ని సాకారం చేసుకునేందుకే ఏళ్ల తరబడి శ్రమిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యంతో దేశానికి పతకం తేచ్చేందుకు నేను చెమటోడ్చుతాను’ అని వివరించింది. కాగా 2023 ఏషియాడ్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందిన అనాహత్ ఈ ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతం జరిగే టోర్నీలపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం రంగు మారుస్తానని తెలిపింది. సన్నాహక టోర్నీగాఇండియా ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) కాపర్ ఈవెంట్గా జరుగుతోంది. ఇందులో రాణించిన ప్లేయర్లకు ర్యాంకింగ్ పాయింట్లు మెరుగవడమే కాకుండా ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు ముందు మేటి సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది. పురుషుల కేటగిరీలో భారత రెండో ర్యాంకింగ్ ప్లేయర్ రమిత్ టాండన్ మాట్లాడుతూ స్క్వాష్ తాజాగా ఒలింపిక్ క్రీడ కావడంతో కార్పోరెట్ సంస్థలు సైతం ఆకట్టుకుంటోందని, తద్వారా ఆటగాళ్లకు స్పాన్సర్షిప్ అండదండలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
LA Olympics 2028: 4 రోజుల ముందే పోటీలు షురూ
లాస్ ఏంజెలిస్: మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్లో జరగబోయే 2028 ఒలింపిక్స్లో ఆరంభోత్సవానికి ముందే ఫుట్బాల్ పోటీలు మొదలు కానున్నాయి. అమెరికాలోని ఏడు నగరాల్లోని మైదానాల్లో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వక్రీడల వేడుకలకు ముందే పోటీలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.ఈ ముందస్తు నిర్వహణతో లీగ్ దశ, నాకౌట్ దశ ఇలా మ్యాచ్ మ్యాచ్కు మధ్య కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని ఫుట్బాల్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2028, జూలై 10న లీగ్ దశ మ్యాచ్లు మొదలవుతాయి. అనంతరం న్యూయార్క్ సహా కొలంబస్, ఒహాయో, నష్విల్లే, టెన్నెస్సీ, సెయింట్ లూసియాల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి.మిగతా నాకౌట్ పోటీలు కాలిఫోర్నియాలో, ఫైనల్ పోరు చారిత్రక రోజ్ బౌల్ స్టేడియంలో జరుగనుంది. ఈ రోజ్బౌల్ వేదికపైనే 1984 ఒలింపిక్ స్వర్ణ పతక పోరు జరిగింది. అనంతరం 1994 పురుషుల ప్రపంచకప్ ఫైనల్, 1999 మహిళల ప్రపంచకప్ టైటిల్ పోరు కూడా జరిగాయి. మెక్సికోలో ఇరాన్ మ్యాచ్లు? మెక్సికో సిటీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధకాండతో అమెరికాలో ఇరాన్ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో అమెరికాలో నిర్వహించాల్సిన ఇరాన్ మ్యాచ్ల్ని మెక్సికోకు తరలించాల్సిందిగా ‘ఫిఫా’తో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఫిఫా’ మాత్రం ఈ సంప్రదింపులపై తక్షణం స్పందించేందుకు నిరాకరించింది. -
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూప్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్లను నిర్వహిస్తుండటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్లను కూడా ఎఫ్ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్లో భారత్తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్ల పూర్తిస్థాయి షెడ్యూల్ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. పూల్ల వివరాలు పురుషుల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్. మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా. -
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూన్లో జరగనున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్కప్ ఆడేందుకు ఇరాన్ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్ ప్రపంచకప్ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ కంటే ముందే అమెరికాలో వరల్డ్కప్ ఆడబోయేది లేదని ఇరాన్ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్కప్లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్లను మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్ వేదికలను మార్చాలా లేక ఇరాన్ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్ ప్రతిపాదనను క్రికెట్ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్కు భారత్తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఈ కారణంగా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడలేమని, తమ మ్యాచ్ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు ప్రతిపాదనలు చేసింది. కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్ ప్రపంచకప్లో వారి ఆటను చూడలేమనుకుంటా!చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ -
క్యాండిడేట్స్ టోర్నీకి హంపి దూరం!
బెంగళూరు: రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, భారత స్టార్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలనే యోచనలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం... క్యాండిడేట్స్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న సైప్రస్ దేశం ‘వార్ జోన్’కు సమీపంలోనే ఉండటం... మార్చి ఒకటో తేదీన సైప్రస్లోని బ్రిటిష్ ఎయిర్బేస్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేయడం... కొన్ని రోజులపాటు విమాన సర్వీసులు నిలిచిపోవడం... ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) టోర్నీ వేదిక మార్చేందుకు అనాసక్తి చూపించడం... వెరసి హంపి ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావిస్తోంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు సైప్రస్లోని పెయియా నగరంలో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ జరగనుంది. గత ఏడాది నవంబర్లో క్యాండిడేట్స్ టోర్నీ ఆతిథ్య హక్కులు సైప్రస్కు లభించాయి. ఏకకాలంలో పురుషుల, మహిళల విభాగంలో క్యాండిడేట్స్ టోర్నీని నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, వైశాలి (భారత్), జు జినెర్, టాన్ జోంగి (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్చినా, కాటరీనా లాగ్నో (రష్యా), బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్) అర్హత సాధించారు. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద (భారత్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ), హికారు నకముర, కరువానా (అమెరికా), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా), ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) బరిలో ఉన్నారు. పురుషుల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (భారత్)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ వెన్ జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతారు.ప్రస్తుతం పశ్చిమాసియాకు సమీపంలోని ఏ దేశాలకైనా వెళ్లడం సురక్షితం కాదు. రెండు వారాల క్రితం మొదలైన యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికే ఒకసారి సైప్రస్లోని బ్రిటిష్ ఎయిర్బేస్పై ఇరాన్ డ్రోన్తో దాడిచేసింది. లెబనాన్ నుంచి సైప్రస్కు విమానాలు కూడా రద్దయ్యాయి. క్రీడాకారుల భద్రత గురించి ‘ఫిడే’ ఆలోచించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ‘ఫిడే’ చెబుతోంది. కానీ ఈ టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం చెస్ సమాఖ్యకు లేదనిపిస్తోంది. చెస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడకపోతే అర్థం లేదు. మౌనంగా ఉంటే ఈ ఆట నుంచి ఏమీ నేర్చుకోలేదని భావించాలి. నాకైతే క్యాండిడేట్స్ టోర్నీ ఎంతో కీలకం. ఇప్పటికే నాకు 39 ఏళ్లు. మళ్లీ నేను ఈ టోర్నీకి అర్హత సాధిస్తానో లేదో గ్యారంటీ లేదు. రెండేళ్లుగా ఈ టోర్నీ కోసం శ్రమిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని వేరే చోట, వేరే తేదీల్లో నిర్వహించడం శ్రేయస్కరం. ఆట కంటే జీవితం గొప్పది. ఇప్పటికే నేను సైప్రస్కు టికెట్లు బుక్ చేసుకున్నాను. యుద్ధం ఆగిపోతే చివరి క్షణంలోనైనా ఈ టోర్నీలో ఆడతాను. దోహ మీదుగా కాకుండా ఫ్రాంక్ఫర్ట్ మీదుగా సైప్రస్ చేరుకుంటాను. అయితే ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. –కోనేరు హంపివార్ జోన్ నుంచి సైప్రస్ దూరంలో లేదని మాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి బ్రిటిష్ ఎయిర్బేస్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం సైప్రస్లో ప్రమాదకర పరిస్థితులు కనిపించడం లేదు. టోర్నీ ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం లేదు. సైప్రస్ దేశాధ్యక్షుడు స్వయంగా ఈ టోర్నీని ప్రారంభిస్తారు. –‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుతోవ్స్కీ -
విజేతలు సబలెంకా, సినెర్
కాలిఫోర్నియా: మ్యాచ్ పాయింట్ కాపాడుకొని బెలారస్ స్టార్ సబలెంకా... ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఇటలీ స్టార్ యానిక్ సినెర్... ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో తొలిసారి విజేతలుగా అవతరించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, 2023, 2025 రన్నరప్ సబలెంకా 3–6, 6–3, 7–6 (8/6)తో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. ఈ విజయంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో రిబాకినా చేతిలో ఎదురైన ఓటమికి సబలెంకా బదులు తీర్చుకుంది. నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్లో సబలెంకా 5–6తో వెనుకబడి ఓటమికి పాయింట్ దూరంలో నిలిచింది. ఈ దశలో సంయమనం కోల్పోకుండా ఆడిన ఈ బెలారస్ స్టార్ స్కోరును సమం చేయడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 8–6తో సెట్తోపాటు, మ్యాచ్ను హస్తగతం చేసుకుంది. విజేత సబలెంకాకు 15,11,380 డాలర్ల (రూ. 13 కోట్ల 94 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రన్నరప్ రిబాకినా ఖాతాలో 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. జొకోవిచ్, ఫెడరర్ సరసన సినెర్... మూడో ప్రయత్నంలోనైనా ఇండియన్ వెల్స్ టోర్నీ టైటిల్ సాధించాలని ఆశించిన రష్యా స్టార్ మెద్వెదెవ్కు నిరాశ ఎదురైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ 7–6 (8/6), 7–6 (7/4)తో 11వ ర్యాంకర్ మెద్వెదెవ్ను ఓడించి తొలిసారి ఇండియన్ వెల్స్ టోర్నీ టైటిల్ గెలిచాడు. ఓవరాల్గా సినెర్ కెరీర్లో ఇది ఆరో మాస్టర్స్ టైటిల్. 2023, 2024లలో ఈ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిమెద్వెదెవ్ రన్నరప్గా నిలిచాడు. 1990లో మాస్టర్స్ సిరీస్ మొదలయ్యాక ఒక్క సెట్ కూడా కోల్పోకుండా రెండు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ (ఏటీపీ ఫైనల్స్ టోర్నీ, ఇండియన్ వెల్స్ టోర్నీ) నెగ్గిన తొలి ప్లేయర్గా సినెర్ రికార్డు నెలకొల్పాడు. దిగ్గజాలు జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్) తర్వాత హార్డ్కోర్టులపై జరిగే ఆరు మాస్టర్స్ టైటిల్స్ను గెలిచిన మూడో ప్లేయర్గా ఈ ఇటలీ స్టార్ గుర్తింపు పొందాడు. చాంపియన్ సినెర్కు 15,11,380 డాలర్ల (రూ. 13 కోట్ల 94 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ మెద్వెదెవ్కు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మెద్వదెవ్ను దెబ్బకొట్టిన సిన్నర్
‘తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు’ అనే సామెత ఇప్పుడు చెప్పుకునే విషయానికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ 16 వరుస విజయాలకు మెద్వదెవ్ చెక్ పెడితే, మెద్వదెవ్ 9 వరుస విజయాలకు తాజాగా సిన్నర్ అడ్డుకట్ట వేశాడు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ఏటీపీ 1000 టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విజేతగా ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ నిలిచాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇటలీకి చెందిన సిన్నర్ 7-6(8/6), 7-6(7/4)తో రష్యాకు చెందిన డానిల్ మెద్వదెవ్పై విజయాన్ని అందుకున్నాడు. సిన్నర్ కెరీర్లో ఇదే తొలి ఇండియా వెల్స్ మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. కాగా నాలుగుసార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్ అయిన సిన్నర్కు 2026 ఏడాదిలో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని సిన్నర్ ఫైనల్లోనూ దానిని కొనసాగించినప్పటికీ, మ్యాచ్లో రెండు సెట్లు టైబ్రేక్కు దారి తీశాయి. గంటా 55 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్లో మెద్వదెవ్, సిన్నర్లు హోరాహోరీగా తలపడడంతో సెట్ టైబ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్లో ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్ 8 పాయింట్లతో సెట్ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్ కూడా టైబ్రేక్కు దారితీయడం, ఆ సెట్లోనూ సిన్నర్దే పైచేయి సాధించడంతో పాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు.సబలెంకా జోరు..మరోవైపు మహిళల సింగిల్స్లో బెలారస్ బ్యూటీ ఎరీనా సబలెంకా విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో సబలెంకా 3-6, 6-3, 7-6(8/6)తో ఎలీనా రిబాకినాపై విజయాన్ని అందుకొని కెరీర్లో తొలి ఇండియన్ వెల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది.చదవండి: ‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’ -
ఆంటోనెల్లి అదరహో
షాంఘై: ఈ ఏడాది ఫార్మాలావన్ (ఎఫ్1)లో మెర్సిడెస్ డ్రైవర్ల జోరు సాగుతోంది. సీజన్ ఆరంభ రేసు ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ విజేతగా నిలవగా... తాజాగా రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో అదే జట్టుకు చెందిన కిమీ ఆంటోనెల్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రేసులో మెరుపు వేగంతో దూసుకెళ్లి... గ్రాండ్ప్రి రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన అతిపిన్న వయసు్కడిగా రికార్డు సృష్టించిన ఈ 19 ఏళ్ల డ్రైవర్... ఆదివారం ప్రధాన రేసులో సైతం అదే దూకుడు కొనసాగించాడు. 56 ల్యాప్ల ఈ రేసును ఆంటోనెల్లి అందరికంటే వేగంగా అందరికంటే ముందుగా 1 గంటా 33 నిమిషాల 15.607 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కెరీర్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఇటలీ డ్రైవర్... ఫార్ములావన్ చరిత్రలో ఒక రేసులో విజయం సాధించిన రెండో అతిపిన్న వయసు్కడిగా నిలిచాడు. 2016లో మ్యాక్స్ వెర్స్టాపెన్ 18 ఏళ్ల వయసులోనే రేసు నెగ్గాడు. జార్జ్ రసెల్ 1 గంట 33 నిమిషాల 21.122 సెకన్లతో రెండో స్థానం దక్కించుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 గంట 33 నిమిషాల 40.874 సెకన్లు) మూడో స్థానంతో పోడియంపై చోటు దక్కించుకున్నాడు. 2024 తర్వాత ఫెరారీ డ్రైవర్ పోడియంపై నిలవడం ఇదే తొలిసారి. పదకొండేళ్ల ప్రాయం నుంచి రేసింగ్ చేస్తున్న ఆంటోనెల్లి... గతేడాదే మెర్సిడెస్ జట్టుతో చేరాడు. 2025 సీజన్లో దిగ్గజ డ్రైవర్ హామిల్టన్ మెర్సిడెస్ను వీడి ఫెరారీతో జట్టు కట్టడంతో అతడి స్థానాన్ని ఆంటోనెల్లి భర్తీ చేశాడు. ఇప్పుడు అతడినే వెనక్కి నెడుతూ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 33 నిమిషాల 44.501 సెకన్లు; ఫెరారీ), ఒలీవర్ బియర్మన్ (1 గంట 34 నిమిషాల 12.875 సెకన్లు; హాస్) వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లోనిలిచారు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రేసును పూర్తి చేయలేకపోగా... గతేడాది వరుస విజయాలతో హోరెత్తించిన మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి సాంకేతిక కారణాలతో అసలు రేసులోనే పాల్గొనలేదు. మొత్తం 22 మంది డ్రైవర్లలో ఏడుగురు రేసును పూర్తి చేయలేకపోయారు.బహ్రెయిన్, సౌదీ అరేబియా రేసులు రద్దు పశి్చమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో... ఈ సీజన్లో నాలుగో రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రి (ఏప్రిల్ 12న), ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్ప్రి (ఏప్రిల్ 19న)లను రద్దు చేస్తున్నట్లు ఫార్ములావన్ పాలక మండలి ఆదివారం ప్రకటించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుతానికి ఆ రెండు రేసులను నిలిపివేస్తున్నాం. భద్రతే అన్నిటికన్నా ముఖ్యం. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఏప్రిల్ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది. -
అల్కరాజ్కు మెద్వెదెవ్ షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మూడోసారి టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/3)తో టాప్ సీడ్ అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఏడాది అల్కరాజ్కిదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఆ్రస్టేలియన్ ఓపెన్, ఖతర్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్ ఈ ఏడాది 16 వరుస విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూశాడు. 2023, 2024లలో ఈ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న మెద్వెదెవ్ ఈసారి టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో తలపడతాడు. -
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఇండియానా వెల్స్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన పురుషుల సెమీఫైనల్లో రష్యా స్టార్ డానిల్ మెద్వదెవ్ చేతిలో 6-3, 7-6(7/3)తో అల్కరాజ్ ఓటమి చవిచూశాడు. కేవలం రెండు సెట్ల పాటు జరిగిన మ్యాచ్లో మెద్వదెవ్ను అల్కరాజ్ ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ను మెద్వదెవ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో అల్కరాజ్, మెద్వదెవ్ మధ్య రసవత్తరపోరు సాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైబ్రేక్కు దారి తీసింది. అయితే టైబ్రేక్లో మెద్వదెవ్ మరోసారి తన స్ట్రోక్ పవర్ చూపించి అల్కరాజ్ దెబ్బకొట్టడంతో పాటు టోర్నీ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే అల్కరాజ్ ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీఫైనల్ వరకు వరుసగా 16 మ్యాచ్ల్లో విజయం సాధించి ఒక టైటిల్ ఫెవరెట్గా నిలిచాడు. ఈ ఏడాది వరుస విజయాలతో దుమ్మురేపిన అల్కరాజ్ కాలిఫోర్నియన్ డెసెర్ట్లో వరుసగా మూడో టైటిల్ సాధిస్తాడని అనుకన్నప్పటికీ అతని ఆశలకు మెద్వదెవ్ గండి కొట్టాడు. మరోవైపు మెద్వదెవ్కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మెద్వదెవ్ విజయం సాధించాడు. ఇక ఇండియన్ వెల్స్ టోర్నీలో మెద్వదెవ్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో 2023, 2024లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమయ్యాడు. తాజాగా మూడో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధించాలనే కసితో మెద్వదెవ్ ఉన్నాడు. మరో సెమీస్లో ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్తో మెద్వదెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.చదవండి: ‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’ -
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
భారత చెస్ ఆటగాడు మయాంక్ చక్రవర్తి కొత్త రికార్డు సృష్టించాడు. అస్సాంలోని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్... తాజాగా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్మాస్టర్గా నిలిచిన తొలి ప్లేయర్గా మయాంక్ కొత్త చరిత్ర లిఖించాడు.2024లోనే ఇంటర్నేషనల్ మాస్టర్ గుర్తింపు సాధించిన మయాంక్ తాజాగా యూరప్లో జరుగుతున్న టోర్నమెంట్లో... స్వీడన్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఫిలిప్ లిండ్గ్రెన్పై విజయం సాధించి గ్రాండ్మాస్టర్ హోదాకు కావాల్సిన మూడో జీఎమ్ నార్మ్ సొంతం చేసుకున్నాడు. భారత్ నుంచి మయాంక్ 94వ గ్రాండ్మాస్టర్. -
రన్నరప్గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తరఫున 13వ నిమిషంలో గ్రేస్ బాల్స్డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ గోల్స్ సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంనుంచి భారత్ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ సఫలమైంది. తొలి క్వార్టర్ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్లో భారత్ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్ నుంచి ఇంగ్లండ్కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్కు బాల్స్డన్ గోల్ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్ వాడుకోలేకపోయింది.అయితే మూడో క్వార్టర్ చివర్లో భారత డిఫెన్స్ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్ గోల్ కీపర్ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్ సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్కు చెందిన నవనీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. -
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028కు హాజరవ్వకుండా ట్రంప్పై నిషేధం పడే అవకాశముంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది. కాబట్టి.. ఫిఫా వరల్డ్కప్తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్! -
గాయంతో వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం బరిలోకి దిగకుండానే ప్రత్యర్థి జంట క్రిస్టియన్ జార్–రస్ముస్ జార్కు వాకోవర్ ఇచ్చింది. సాత్విక్ సాయిరాజ్కు భుజం గాయం తిరగబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సాత్విక్ది పాత గాయమే.ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి కనీసం వారం రోజులు పడుతుంది’ అని భారత జోడీకి కోచ్గా ఉన్న టాన్ కిమ్ హెర్ (మలేసియా) తెలిపాడు. సాత్విక్–చిరాగ్ నిష్క్రమణతో ఈ టోర్నీలో భారత్ నుంచి తరుణ్ మన్నేపల్లి మాత్రమే బరిలో ఉన్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 51వ ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)తో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ తలపడతాడు. -
‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’
జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనకుండా ఎవరూ ఆపలేరని ఇరాన్ జట్టు ప్రకటించింది. ఇరాన్ ఆటగాళ్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేం అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. నిజంగా వరల్డ్ కప్ నుంచి ఎవరినైనా తప్పించాలంటే అది ఆతిథ్య అమెరికానేనని ఇరాన్ బృందం అభిప్రాయ పడింది. గల్ఫ్లో అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్–జూలైలో అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్లో ఇరాన్ పాల్గొనడం సందేహంగా మారింది.లీగ్ దశలో ఇరాన్ తమ మూడు మ్యాచ్లు కూడా అమెరికా వేదికగానే ఆడాల్సి ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ వరుసగా నాలుగోసారి వరల్డ్ కప్కు క్వాలిఫై అయింది. అయితే ఇరాన్ టీమ్ గురించి మాట్లాడుతూ... ‘ఆ జట్టు ఇక్కడికి వచ్చి ఆడుతుందని నేను అనుకోవడం లేదు. వారి భద్రత, జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా’ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. దీనిపై ఇరాన్ టీమ్ స్పందిస్తూ... ‘వరల్డ్ కప్ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్.ఇది ‘ఫిఫా’ ఆధ్వర్యంలో జరుగుతుందే తప్ప ఏదో ఒక దేశం నిర్వహించడం లేదు. కాబట్టి వరల్డ్ కప్ ఆడకుండా ఇరాన్ను ఎవరూ తప్పించలేరు. ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం చేతకాదని చెబుతున్న అమెరికానే నిజానికి తప్పించాలి’ అని ట్వీట్ చేసింది. -
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్కప్కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా! -
భారత ఫుట్బాల్లో తీవ్ర విషాదం!
భారత్ ఫుట్బాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్బాల్ ఆటలో మంచి భవిష్యత్తు ఉన్న యంగ్ డిఫెండర్ రవీందర్ సింగ్ 25 ఏళ్ల వయసులోనే మృత్యువాత పడడం కలచివేసింది. పంజాబ్లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామానికి చెందిన రవీందర్ సింగ్ లోకల్ లీగ్లో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. రవీందర్ సింగ్ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం రవీందర్ సింగ్ నమ్దారీ ఫుట్బాల్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత ఫుట్బాల్ జట్టులోకి ప్రవేశం పొందేందుకు ఈ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.చిన్నతనం నుంచే ఫుట్బాల్పై మక్కువ పెంచుకున్న రవీందర్ సింగ్ 2000వ సంవత్సరంలో జన్మించాడు. ఫుట్బాల్పై ఇష్టం పెంచుకున్న రవీందర్ ప్రస్తుతం ఘర్షంకర్లోని బబ్బర్ అకాలీ మొమోరియల్ ఖల్సా కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.కాగా రవీందర్ సింగ్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు సహా స్నేహితులు, ఇండియన్ ఫుట్బాల్ లీగ్కు చెందిన పలు క్లబ్లకు చెందిన ఆటగాళ్లు భారీగా హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లోనూ రవీందర్సింగ్ మృతి పట్ల నివాళులు వెల్లువెత్తాయి. రవీందర్సింగ్ మృతిపై నమ్దారీ ఫుట్బాల్ క్లబ్ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘మా ఫుట్బాల్ క్లబ్లో భాగమైన ఆటగాడు మరణించడం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న రవీందర్ సింగ్ 25 ఏళ్లకే మృతి చెందడం కలచివేస్తోంది. అతని అకాల మరణం ఫుట్బాల్ ఫ్యామీలీకి తీరని లోటు. రవీందర్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’ అని తెలిపాడు. ఈ సందర్భంగా నమ్దారీ స్పోర్ట్స్ తరఫున ఆటగాళ్లు,కోచ్, సిబ్బంది నివాళి అర్పిస్తున్న వీడియోను షేర్ చేసుకుంది. ఇండియన్ ఫుట్బాల్ లీగ్ సహా ఇతర ఫుట్బాల్ క్లబ్లు కూడా రవీందర్ మృతి పట్ల సంతాపం ప్రకటించాయి.చదవండి: పాక్ ఆటగాడి కొనుగోలు.. కావ్యా మారన్కు భారీ ఝలక్ View this post on Instagram A post shared by Namdharisports (@namdharisports) -
క్వార్టర్స్కు సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో టాప్ సీడ్ భారత జంట 21–15, 15–21, 28–26తో హిరోకి ఒకముర–క్యొహే యామషిత (జపాన్) ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో తరుణ్ మన్నెపల్లి ప్రిక్వార్టర్స్ చేరగా, మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ తరుణ్ 16–21, 21–16, 7–2తో తనకన్నా మెరుగైన ప్రత్యర్థి, ఐదో సీడ్ కెంట నిషిమొటో (జపాన్)పై ఆధిక్యంలో ఉండగా భుజం గాయంతో జపాన్ ఆటగాడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ప్రిక్వార్టర్స్లో కిరణ్ జార్జ్ 18–21, 21–16, 16–21తో జాసన్ గునవన్ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో మాళవిక బన్సోద్ 11–21, 15–21తో థాయ్లాండ్కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ పొర్న్పవీ చొచువాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో ఎమ్.ఆర్.అర్జున్–హరిహరన్ జోడీ 17–21, 11–21తో చెన్ చెంగ్ కున్–లిన్ బింగ్ వీ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. -
ఫైనల్పై అమ్మాయిల గురి
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచకప్–2026కు ఇప్పటికే అర్హత సాధించిన భారత మహిళల జట్టు క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ చేరడంపై దృష్టి పెట్టింది. టోర్నీ లో భాగంగా నేడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీఫైనల్ పోరులో ఇటలీతో భారత్ తలపడుతుంది. చీఫ్ కోచ్గా జోయెర్డ్ మరీన్ పునరాగమనంతోనే మన అమ్మాయిల జట్టు ఘన విజయాలు సాధిస్తోంది. పూల్ ‘బి’లో ఉన్న భారత్ లీగ్ దశను అగ్ర స్థానంతో ముగించింది. మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి, ఒక డ్రా ఫలితంతో 7 పాయింట్లు సాధించింది. అయితే స్కాట్లాండ్ కూడా 7 పాయింట్లతో ఉన్నప్పటికీ గోల్స్ తేడాతో రెండో స్థానంలో ఉంది. తాజా సెమీస్లో ఎదురుపడుతున్న ఇటలీ ఈ టోర్నీ లో మనలాగే అత్యంత నిలకడను ప్రదర్శించింది. అటాకింగ్లో ఫెడెరికా కార్టా అసాధారణ నైపుణ్యం కనబరిచింది. ఆమె మూడు గోల్స్ సాధించింది. 2012 నుంచి ఇప్పటివరకు భారత్, ఇటలీ జట్లు ఏడుసార్లు ముఖాముఖీగా తలపడితే... భారత్ ఐదింట గెలుపొందింది. ఇటలీ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ విజయంతో సరిపెట్టుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్ హాకీ ఈవెంట్ పురుషుల ప్రపంచకప్తో పాటే జరుగనుంది. ఈ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ఈ రెండు మెగా ఈవెంట్లకు నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అర్హత సాధించిందిలా... హైదరాబాద్తో పాటు చిలీలోని సాంటియాగోలో కూడా మరో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జరుగుతోంది. ఈ రెండు టోర్నమెంట్ల ద్వారా మొత్తం 7 జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. టాప్–3 స్థానాల్లో నిలిచిన ఆరు టీమ్లు క్వాలిఫై అవుతాయి. దీంతో పాటు రెండు టోర్నీ ల్లో నాలుగో స్థానాల్లో నిలిచిన రెండు జట్ల మధ్య వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎవరు మెరుగైన స్థానంలో ఉంటే వారికి అవకాశం దక్కుతుంది. భారత్ ఒక వేళ ఫైనల్ చేరకపోయినా మూడో స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్లోనూ ఓడితే నాలుగో స్థానం దక్కుతుంది. మరో వైపు చిలీలో టోర్నీ లో జపాన్ నాలుగో స్థానంతో ముగించింది. ప్రస్తుతం భారత్ 9వ ర్యాంక్లో, జపాన్ 15వ ర్యాంక్లో ఉన్నాయి. కాబట్టి బుధవారం చివరి లీగ్ మ్యాచ్ తర్వాతే భారత్ వరల్డ్ కప్కు అర్హత సాధించింది. -
యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సెమీస్లోకి...
ఇండియన్వెల్స్ (అమెరికా): భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. స్వీడెన్ ప్లేయర్ గొరన్సన్తో జోడీ కట్టిన భారత ఆటగాడు క్వార్టర్ ఫైనల్స్లో ప్రత్యర్థి జంటపై గెలుపొందింది. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్–స్వీడెన్ ద్వయం 6–3, 7–6తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆ్రస్టేలియా)–అండ్రియా వవసొరి (ఇటలీ) జంటపై విజయం సాధించింది. సరిగ్గా గంటన్నర పాటు జరిగిన ఈ పోరులో యూకీ జోడీ అద్భుతంగా రాణించింది. రెండో సెట్లో ఆసీస్–ఇటాలీయన్ జంట పుంజుకోవడంతో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. కీలకమైన సమయంలో వరుసగా పాయింట్లు సాధించడంతో టైబ్రేక్కు దారితీయకుండా మ్యాచ్లో విజయం సాధించారు. గతంలో ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో క్వార్టర్స్ దశలోనే యూకీ వెనుదిరిగాడు. రెండు సార్లు క్వార్టర్స్తోనే సరిపెట్టుకున్న యూకీ ఇప్పుడు స్వీడెన్ ఆటగాడితో కలిసి సెమీస్ చేరాడు. -
గుకేశ్కు ఈసారి ఓటమి తప్పదు!
భారత చెస్ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తన చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకోవడం కష్టమేనని చెస్ దిగ్గజం జుడిత్ పోల్గర్ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. 2024 డిసెంబర్లో వరల్డ్ చాంపియన్గా అవతరించిన గుకేశ్తో త్వరలో చెస్ క్యాండిడేట్ టోర్నీ విజేతతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.ఈ నేపథ్యంలో జుడిత్ పోల్గర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈసారి గుకేశ్ టైటిల్ నిలబెట్టుకోవడ కష్టమని, ఎందుకంటే క్యాండిడేట్ చెస్ టోర్నీ విజేత అతడిని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘గుకేశ్ ఈసారి విఫలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి చాంపియన్షిప్ తర్వాత మరోసారి గుకేశ్ చాంపియన్గా నిలుస్తాడా అనేది చెప్పడం సందేహమే. 2024లో చైనా దిగ్గజం డింగ్ లిరెన్ను ఓడించిన గుకేశ్ అత్యంత పిన్న వయస్సులో చాంపియన్గా నిలిచాడు. కానీ ఈసారి గుకేశ్ ఆటతీరులో మార్పు కనిపిస్తుంది. 2024 నుంచి గుకేశ్ ఆడిన గేముల్లో డ్రాలతో పాటు ఓటములు కూడా ఉన్నాయి. దీంతో గుకేశ్పై సహజంగానే ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే అతడు జాగ్రత్తగా ఆడితే తప్ప చాంపియన్షిప్ టైటిల్ నిలబెట్టుకోలేకపోవచ్చు.’ అని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల కాలంలో జరిగిన టోర్నీల్లో గుకేశ్ కేవలం ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో మాత్రమే విజయాన్ని అందుకున్నాడు.2025లో విజ్ ఆన్ వేదికగా జరిగిన టాటా మాస్టర్స్ చెస్ టోర్నీలో పాల్గొన్నగుకేశ్ భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందతో తలపడ్డాడు. చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో టైటిల్ను డిసైడ్ చేసేందుకు టైబ్రేకర్ వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ టైబ్రేక్ ప్రజ్ఞానంద విజయం సాధించడంతో గుకేశ్కు నిరాశే మిగిలింది.చదవండి: AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు! -
దూసుకెళ్తోన్న యూకీ బాంబ్రీ జోడి
ఇండియన్ వెల్స్ టోర్నీలో భారత టాప్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ అదరగొడుతున్నాడు. తన పార్టనర్ ఆండ్రీ గొరాన్సన్తో కలిసి టోర్నీలో బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ సెమీస్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో యూకీ బాంబ్రీ-ఆండ్రీ గొరాన్సన్ ద్వయం 6-3, 7-6తో అలెగ్జాండర్ (ఆస్ట్రియా)-వవస్సోరీ (ఇటలీ) జోడీని రెండు సెట్లలోనే కంగుతినిపించి సెమీస్లో అడుగుపెట్టింది. గంటా 30 నిమిషాల పాటు సాగిన పోరులో ఇండో-స్వీడిష్ ద్వయం తొలి సర్వ్ నుంచే స్పష్టమైన ఆధిపత్యం చూపెడుతూ వచ్చింది. మ్యాచ్లో 29 విన్నింగ్ పాయింట్లు సాధించింది. ఇక సెమీస్లో ఆర్థర్ రిండర్నెక్( ఫ్రాన్స్)-వలెంటిన్ వచెరొట్ (మొనాకో) జోడీని ఎదుర్కోనుంది. అంతకముందు బుధవారం జరిగిన ప్రీక్వార్టర్స్లో బాంబ్రీ జోడీ 6-4, 6-4తో ఆరెండ్స్-లెహెక్కా జోడీపై విజయం సాధించింది. మ్యాచ్లో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా నమోదు చేయని బాంబ్రీ జోడీ ప్రత్యర్థి బ్రేక్ పాయింట్లను మాత్రం రెండుసార్లు బ్రేక్ చేయడం జరిగింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జోడీపై దూకుడు ప్రదర్శించిన యూకీ బాంబ్రీ జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని కంగుతినిపించింది. -
ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనం: ఇరాన్
దుబాయ్: ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఈ జూన్, జూలైల్లో మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రస్తుతం తమ దేశం మీదపడి దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే మా జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది. "అత్యంత క్రూరంగా అమెరికా ప్రవర్తిస్తోంది. గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్ధం చేస్తోంది. వేల సంఖ్యలో మా ప్రజల ఉసురు తీస్తోంది. ఇలాంటి దేశానికి వెళ్లి మేం ఫుట్బాల్ మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుందా? ఆ దేశంలో ఆడే ప్రసక్తే లేదు" అని ఇరాన్ క్రీడల మంత్రి అహ్మద్ దొన్యమలి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీంతో అధికారికంగా అమెరికా ఆతిథ్యమిచ్చే ఫుట్బాల్ ప్రపంచకప్ను ఇరాన్ బహిష్కరించనుందని తేటతెల్లమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ బహిష్కరణ వాఖ్యల్ని బేఖాతరు చేస్తూ తేలిగ్గా కొట్టిపారేశారు.చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు -
సెమీస్లో భారత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ హాకీ టోర్నీ బెర్త్ను ఖరారు చేసుకునేందుకు భారత మహిళల జట్టు గెలుపు దూరంలో నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో బుధవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో సలీమా టెటె బృందం 4–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది. మరో గోల్ను సాక్షి రాణా (7వ నిమిషంలో) అందించింది. వేల్స్ జట్టు తరఫున బెట్సాన్ థామస్ (39వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. నవ్నీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో రెండింటిని, పెనాల్టీ స్ట్రోక్ను నవ్నీత్ కౌర్ గోల్స్గా మలిచింది. ఈ గెలుపుతో భారత జట్టు ఏడు పాయింట్లతో పూల్ ‘బి’ టాపర్గా నిలిచింది. భారత్తోపాటు స్కాట్లాండ్ కూడా ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్కు చేరుకుంది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్కు టాప్ ర్యాంక్ దక్కగా... స్కాట్లాండ్కు రెండో స్థానం లభించింది. స్కాట్లాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్లో 3–1తో ఉరుగ్వేపై గెలిచింది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 2–0తో ఆస్ట్రియా జట్టుపై గెలుపొందగా... కొరియాతో మ్యాచ్ను ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఇంగ్లండ్ 9 పాయింట్లతో పూల్ ‘ఎ’లో టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. ఇటలీ, కొరియా 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన గోల్స్ సగటుతో ఇటలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో ఇంగ్లండ్తో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఇటలీతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. ఫైనల్ చేరుకునే రెండు జట్లకు శుక్రవారమే ప్రపంచకప్ బెర్త్లు ఖరారవుతాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య శనివారం మూడో స్థానం కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్రపంచకప్ బెర్త్ లభిస్తుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–19తో ఎంగ్ కీల్ వెస్లీ–జున్సుకె కుబో (సింగపూర్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ జంట 19–21, 14–21తో రుతానపక్–జెనిచా (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–15, 12–21, 4–21తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జ్ 23–21, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)పై సంచలన విజయం సాధించాడు. ఆయుశ్ శెట్టి 18–21, 19–21తో బ్రియాన్ యాంగ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. -
‘డ్రా’ చేసుకుంటే సెమీస్ బెర్త్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ మహిళల హాకీ క్వాలిఫయింగ్ టోర్నీలో నేటితో లీగ్ దశ ముగియనుంది. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. పూల్ ‘బి’లో ఆతిథ్య భారత జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో వేల్స్ జట్టుతో తలపడనుంది. గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. పూల్ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన వేల్స్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్ర మించింది. నేడు జరిగే పూల్ ‘బి’ మరో మ్యాచ్లో స్కాట్లాండ్తో ఉరుగ్వే (సాయంత్రం గం. 5:15 నుంచి) ఆడుతుంది. స్కాట్లాండ్ కూడా ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంటుంది. ఉరుగ్వే నెగ్గితే ఆ జట్టు సెమీఫైనల్ చేరుకుంటుంది. ఈ రెండు మ్యాచ్లకంటే ముందు పూల్ ‘ఎ’లో ఆస్ట్రియాతో ఇంగ్లండ్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం గం. 3 నుంచి) పోటీపడతాయి. రెండు మ్యాచ్ల్లో నెగ్గిన ఇంగ్లండ్ ఇప్పటికే సెమీఫైనల్ చేరుకోగా... ఇటలీ, కొరియా మధ్య మ్యాచ్లో గెలిచిన జట్టుకు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. ఒకవేళ ఇటలీ, కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే మెరుగైన గోల్స్ సగటుతో ఇటలీ ముందంజ వేస్తుంది. -
ఫిట్నెస్ కీలకం
న్యూఢిల్లీ: ఆధునిక బ్యాడ్మింటన్ ప్రమాణలకు తగినట్లు ఫిట్నెస్తో మార్పు చెందాల్సిన అవసరం ఎంతగానో ఉందని భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అంగీకరించాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో రెండోసారి ఫైనల్లో ఓడిపోవడం నిరాశపరిచిందని అన్నాడు. స్వదేశం చేరాక మీడియాతో మాట్లాడుతూ తన ఆటతీరు, తీసుకునే ఆహారం, చేయాల్సిన కసరత్తు, ఉండాల్సిన ఫిట్నెస్ అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. నిరాశ నిజమే కానీ... టైటిల్ పోరులో ఓడిపోవడం నిరుత్సాహపరిచింది. అయినప్పటికీ ఓవరాల్గా టోర్నీ సానుకూలంగానే ముగిసింది. మేటి ప్రత్యర్థుల్ని ఓడించడం. నిలకడగా విజయాలు సాధించడం... ముఖ్యంగా నా ఆటతీరు నన్ను తృప్తి పరిచింది. వయసు పెరిగేకొద్దీ అలసట సహజమని, ఉన్నపళంగా కోలుకోవడానికి నేనేమీ టీనేజ్ కుర్రాడిని కాదు. అలాగని ఈ 24 ఏళ్ల వయసుకే నా పనైపోయిందని చెప్పడం లేదు. టోర్నీకి టోర్నీకి మధ్య విరామం, కచ్చితమైన ప్రాక్టీస్, బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ ఎప్పుడు కూడా ఒకేలా లేదంటే ఒకప్పటిలాగే ఉండవని చెబుతున్నా. ఉదాహరణకి చిన్న వయసులో ఏం తిన్నా జీర్ణమవుతుంది. కానీ వయసు పెరిగేకొద్దీ ఆ సామర్థ్యంలో తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ముఖ్యంగా తినే ఆహారం, చేసే కసరత్తు, ఆట కోసం కలిగి ఉండాల్సిన ఫిట్నెస్పై ఫోకస్ ఎప్పటికప్పుడు మారుతుంది. ఆటను అనుసరించే శిక్షణ కొన్నిసార్లు ఆటను బట్టి శిక్షణ... కొన్ని సందర్భాల్లో శిక్షణను బట్టే ఆటతీరు మార్చుకోవాల్సి వస్తుంది. కాలక్రమంలో మనం ఎలా ముందజ వేయాలనేది పరిస్థితిని మార్పు చెందుతుంది. దీన్ని బట్టి నాకు సరిపోయే నిర్దిష్టమైన శైలితో ఆడాల్సి వస్తుంది. నాకు తరచూ అయిన భుజం గాయాలు కూడా నా ఆటతీరును ప్రభావితం చేశాయి. అటాకింగ్ షాట్లు బాగా ఆడే నేను కొన్ని సార్లు (మ్యాచ్ల్లో) వెనుకబడిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటప్పుడే విశ్రాంతి తీసుకొని పుంజుకోవాలి. ముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాను. ఈ ఏడాదంతా కీలకం ఈ సీజన్ చాలా కీలకం. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల రూపంలో రెండు మెగా ఈవెంట్లు ఉన్నాయి. దీంతో ఆల్ ఇంగ్లండ్ వైఫల్యంపై నా బృందంతో కలిసి విశ్లేషించుకొని ముందంజ వేస్తాను. ఇదొక్కటే సరిపోదని కూడా తెలుసు. ఎందుకంటేప్రతిష్టాత్మక టోర్నీలకు ముందు మరింత లోతైన విశ్లేషణ–పర్యవేక్షణ కూడా అవసరం కోర్టులో నా ఆటతీరు పదును పెట్టేందుకు... దీంతోపాటే ఈ సీజన్ మొత్తం ఫిట్గా ఉండేందుకు శ్రమిస్తాను. అంతర్జాతీయ సర్క్యూట్ ఒత్తిళ్లను తట్టుకునేలా మెంటల్ కండిషనింగ్ సెషన్ కూడా అవసరమవుతుంది. ఇందుకోసం మోన్ బ్రాక్మన్ నాకు తోడుగా ఉన్నాడు. అతనికి నా థ్యాంక్స్. అంచనాలు పెట్టుకోను నేను అంచనాలు లేకుండా ఆడేందుకే ఇష్టపడతాను. కానీ ఈసారి నేను తరువాతి దశలకు, క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీఫైనల్స్కు చేరుకున్నప్పుడు, ఈ ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతాను. నా కోచింగ్ బృందం ప్రోత్సాహం, వెన్ను తట్టే నాన్న అండదండలు నన్ను ఎప్పటికప్పుడు బాగా సిద్ధం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫామ్ బాగుంది. శారీరకంగా మెరుగైన స్థితిలో ఉన్నాను. నైపుణ్యం పరంగా ఇంకా మెరుగవ్వాలి. -
ట్రయల్స్కు అంతిమ్, అమన్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్, అంతిమ్ పంఘాల్ ఆసియా చాంపియన్షిప్ కోసం నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్లో పోటీపడనున్నారు. అయితే పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులతో భారత బృందం అల్బేనియాలోనే చిక్కుకుపోవడంతో ట్రయల్స్ను వాయిదా వేశారు. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9, 10 తేదీల్లో ట్రయల్స్ జరగాల్సి ఉండగా... ఇప్పుడు దీన్ని మార్చి 17కు వాయిదా వేసినట్లు రెజ్లింగ్ సమాఖ్య వర్గాలు వెల్లడించాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ పురుషుల 57 కేజీల కేటగిరీలో, ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల కేటగిరీలో పోటీపడతారు. నిజానికి అమన్ 61 కేజీల విభాగంలో, అంతిమ్ 55 కేజీల విభాగంలో పోటీపడేందుకు నమోదు చేసుకున్నారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో విమాన సర్వీసుల రద్దు, గల్ఫ్ గగన తలం మూసివేత కారణంగా అల్బేనియాలో రెండో ర్యాంకింగ్ సిరీస్లో పోటీపడేందుకు వెళ్లిన భారత జట్టు అక్కడే చిక్కుకుంది. జట్టు సభ్యుల రాక ఆలస్యం కావడంతో సెలక్షన్ ట్రయల్స్ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ నెల 17న న్యూఢిల్లీ, లక్నోల్లో ట్రయల్స్ నిర్వహిస్తారు. -
టైటిల్ నిరీక్షణ ముగించేందుకు... స్విస్ ఓపెన్ బరిలో శ్రీకాంత్
గత ఏడాది రెండు టైటిల్స్కు విజయం దూరంలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ మరోసారి టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు. నేడు మొదలయ్యే స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోరీ్నలో శ్రీకాంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ జేసన్ గుణవాన్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలవుతాయి. గత సంవత్సరం మలేసియా మాస్టర్స్, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న శ్రీకాంత్ ఈ సీజన్లో టైటిల్ నిరీక్షణకు తెర దించాలని పట్టుదలతో ఉన్నాడు.శ్రీకాంత్ చివరిసారి 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతను మరో అంతర్జాతీయ టోరీ్నలో టైటిల్ సాధించలేదు. శ్రీకాంత్తోపాటు స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ తరఫున హెచ్ఎస్ ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిరణ్ జార్జి, తరుణ్ మన్నేపల్లి పోటీపడుతున్నారు. క్వాలిఫయింగ్లో శంకర్ ముత్తుస్వామి బరిలో ఉన్నాడు.మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ పీవీ సింధు ఈ టోరీ్నకి దూరంగా ఉంది. వాస్తవానికి సింధు ఎంట్రీ ఖరారు చేసినా... ఇటీవల ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు దుబాయ్ మీదుగా బర్మింగ్హామ్ చేరుకోవల్సింది. కానీ ఇరాన్తో అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం మొదలుకావడం... దుబాయ్ విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సంఘటన తర్వాత దుబాయ్ గగనతలం మూసివేయడంతో సింధు మూడు రోజులపాటు దుబాయ్లోనే చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. విమానాల రాకపోకలు పునరుద్ధరణ తర్వాత స్వదేశానికి చేరుకున్న సింధు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆమె స్విస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. సింధు గైర్హాజరీలో భారత్ నుంచి మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్, తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు పాల్గొంటున్నాయి. -
భారత్కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం స్కాట్లాండ్తో జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. తమకంటే బలహీన జట్టయిన స్కాట్లాండ్పై భారత్ పలు అవకాశాలు చేజార్చుకొని విజయాన్ని కోల్పోయింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (18వ నిమిషంలో), సునెలితా టొప్పో (29వ నిమిషంలో)... స్కాట్లాండ్ తరఫున మెక్ఇవాన్ హీతర్ (6వ నిమిషంలో), ఫియోనా బర్నెట్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.భారత్కు మొత్తం 9 పెనాల్టీ అవకాశాలు రాగా, రెండింటిలో మాత్రమే జట్టు సఫలమైంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఉరుగ్వే 3–2తో వేల్స్పై, ఇంగ్లండ్ 3–0తో కొరియాపై, ఇటలీ 3–0తో ఆస్ట్రియాపై గెలిచాయి. పూల్ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వేల్స్ ఖాతా తెరువలేదు. నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్ల్లో ఇంగ్లండ్తో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం 3 గంటల నుంచి), ఉరుగ్వేతో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), వేల్స్తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. వేల్స్తో మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్కు చేరుకుంటుంది. -
భారత్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మహిళల ప్రపంచకప్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు శుభారంభం చేసింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్లో సలీమా టెటె బృందం 4–0 గోల్స్ తేడాతో ఉరుగ్వేను ఓడించింది. భారత్ తరఫున సునెలితా టొప్పో (21వ నిమిషంలో), ఇషిక (40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (49వ నిమిషంలో), రుతుజా ఫాల్కే (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా... ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మిగతా ఐదింటిని వృథా చేసింది. ఉరుగ్వే తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన ఇతర మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 5–2 గోల్స్ తేడాతో ఇటలీ జట్టుపై, దక్షిణ కొరియా 1–0తో ఆ్రస్టియాపై, స్కాట్లాండ్ 1–0తో వేల్స్ జట్టుపై విజయం సాధించాయి. భారత్, ఉరుగ్వే మ్యాచ్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనా రెడ్డి, ‘శాట్స్’ ఎండీ సోనీబాలా దేవి, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి, కార్యదర్శి భోళానాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగే మ్యాచ్ల్లో ఇటలీతో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), కొరియాతో ఇంగ్లండ్ (మధ్యాహ్నం గం. 3 నుంచి), ఉరుగ్వేతో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి), స్కాట్లాండ్తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
లక్ష్య సేన్ రెండో‘సారీ’
బర్మింగ్హామ్: బ్రిటిష్ గడ్డపై విజయగర్జన చేయాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ రెండోసారి రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 15–21, 20–22తో ప్రపంచ 11వ ర్యాంకర్ లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 57 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో చైనీస్ తైపీ ప్లేయర్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. తద్వారా 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి చైనీస్ తైపీ క్రీడాకారుడిగా లిన్ చున్ యి ఘనత వహించాడు. విజేతగా నిలిచిన లిన్ చున్ యికి 1,01,500 డాలర్ల (రూ. 93 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లక్ష్య సేన్కు 49,300 డాలర్ల (రూ. 45 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్ ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో భారత సింగిల్స్ టైటిల్ నిరీక్షణ కొనసాగనుంది. 2022లో తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరిన లక్ష్య సేన్ డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. భారత్ తరఫున ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ గెలవగా... ప్రకాశ్ నాథ్ (1947లో), ప్రకాశ్ పదుకొనే (1981లో), సైనా నెహ్వల్ (2015లో) రన్నరప్గా నిలిచారు. -
ప్రపంచకప్ బెర్త్ లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్ బెర్తే లక్ష్యంగా క్వాలిఫయర్స్ బరిలోకి దిగుతోంది. నేడు తొలి పోరులో భారత జట్టు ఉరుగ్వేతో తలపడుతుంది. గచ్చిబౌలి హాకీ టర్ఫ్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు బెర్త్ల కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య భారత్తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలు క్వాలిఫయర్స్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 8 జట్లను రెండు పూల్స్గా విభజించారు. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ మార్చి 13న... మూడో స్థానం కోసం మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మార్చి 14న జరుగుతాయి. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. తొలి రోజు ఆదివారం ఇంగ్లండ్తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి); కొరియాతో ఆస్ట్రియా(మధ్యాహ్నం గం. 3 నుంచి); స్కాట్లాండ్స్తో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి) కూడా తలపడతాయి. -
లక్ష్య సేన్ అదరహో
బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఫైనల్కు చేరాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 18–21, 21–15తో కెనడాకు చెందిన విక్టర్ లాయ్పై తుదికంటా పోరాడి గెలిచాడు. తాజా ప్రపంచ చాంపియన్íÙప్ (పారిస్–2025) కాంస్య పతక విజేత అయిన విక్టర్ను ఓడించేందుకు లక్ష్యసేన్ ఏకంగా 97 నిమిషాల పాటు శ్రమించాడు. కాలి పాదాలు మంటపెడుతున్నా... కోర్టులో తన కదలికలతో నొప్పి మరింత పెరిగినా అన్నీ భరించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. నేడు జరిగే టైటిల్ పోరులో చైనీస్ తైపీ షట్లర్ లిన్ చున్ యితో లక్ష్యసేన్ తలపడతాడు. కాలి పాదం గాయాన్ని పంటిబిగువన భరించి సెమీస్లో చెమటోడ్చిన భారత షట్లర్ 25 ఏళ్ల తర్వాత చరిత్రలో నిలిచేందుకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచాడు. సుప్రసిద్ధ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఖాతాలో రెండే టైటిల్స్ ఉన్నాయి. ప్రకాశ్ పదుకొనె (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే గెలిచారు. కానీ 24 ఏళ్ల లక్ష్యసేన్ పుట్టాక మరో టైటిల్ రానేలేదు. తనే నాలుగేళ్ల క్రితం 2022లో గెలిచే ప్రయత్నం చేసినా... ఫైనల్ తడబాటు వల్ల చివరకు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ లక్ష్యసేన్ ఎంతో మారాడు. అనుభవం సంపాదించాడు. నైపుణ్యం పెంచుకున్నాడు. ఇక చరిత్రకెక్కడమే తరువాయి! -
సెమీస్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ లక్ష్య సేన్ విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 21–16తో ప్రపంచ 6వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఆద్యంతం లక్ష్య సేన్ ఆధిపత్యం చలాయించాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో లీ షి ఫెంగ్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్గా లీ షి ఫెంగ్తో 15 సార్లు తలపడ్డ లక్ష్య సేన్ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడిపోయాడు. కొకి వతనాబె (జపాన్), విక్టర్ లాయ్ (కెనడా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. గతంలో లాంగ్ అంగుస్తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ఆడతాడు. టాంగ్ చున్ మన్–సె యింగ్ సుయెట్ (హాంకాంగ్)లతో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది. -
మళ్లీ ఓడిన గుకేశ్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ప్రాగ్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్కు మూడో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్, భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ అరవింద్ చిదంబరంతో జరిగిన ఆరో రౌండ్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ 1.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉండటం గమనార్హం. అరవింద్ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్ గ్రాండ్మాస్టర్ జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ 4.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇదే టోర్నీ చాలెంజర్స్ విభాగంలో పోటీపడుతున్న ప్రపంచకప్ చాంపియన్, భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. థామస్ బీర్డ్సన్ (నెదర్లాండ్స్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను దివ్య 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ప్రస్తుతం దివ్య మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోరెండో రోజు భారత షట్లర్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్గా బరిలోకి దిగిన నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 33వ స్థానంలో ఉన్న కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ తాయ్ (మలేసియా) జంట 23–21, 21–12తో ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీని బోల్తా కొట్టించింది. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జంట తొలి గేమ్లో గట్టిపోటీనిచి్చనా... రెండో గేమ్లో తేలిపోయింది. ఏడోసారి ఈ టోర్నీలో పోటీపడ్డ సాత్విక్–చిరాగ్ తొలి రౌండ్లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. 2022లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత జంట 2018, 2021, 2023, 2024, 2025లలో ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 42 నిమిషాల్లో 12–21, 15–21తో ఐదో సీడ్ థోమ్ గికెల్–డెల్పైన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 22వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి (భారత్) 75 నిమిషాల్లో 21–19, 9–21, 17–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
లక్ష్యసేన్ సంచలనం
బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను పెను సంచలనంతో మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే కొరకరాని ప్రత్యర్థి, చైనా గోడను తొలి రౌండ్లోనే బద్దలు కొట్టాడు. చైనాకు చెందిన టాప్ స్టార్, ప్రపంచ నంబర్వన్ షి యూకిపై భారత షట్లర్ చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్షిప్, ప్రపంచ చాంపియన్షిప్, సుదిర్మన్ కప్, థామస్ కప్లాంటి ఎన్నో టోర్నీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన షి యూకిని ఆల్ ఇంగ్లండ్ టోర్నీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్లో లక్ష్యసేన్ 23–21, 19–21, 21–17తో టాప్ సీడ్, తాజా ప్రపంచ చాంపియన్ షి యూకిని కంగుతినిపించాడు. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమె 11–21, 6–21తో వరుస గేముల్లో మూడో సీడ్ చెన్ యూ ఫె (చైనా) చేతిలో ఓడింది. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ పొర్న్పవీ చోచువాంగ్ (థాయిలాండ్) 21–12, 21–18తో ఉన్నతి హుడా (భారత్)ను ఓడించి ముందంజ వేసింది. డబుల్స్ జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ 21–17, 21–19తో హూ పాంగ్ రాన్–చెంగ్ సు యిన్ (మలేసియా) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 15–21, 21–15, 18–21తో జపాన్కు చెందిన సయాక హిరోత–అయాకొ సకురమొతొ జంట చేతిలో పరాజయం చవిచూసింది. సింధు స్వదేశానికి... భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ కోసం బయల్దేరిన సింధు తాజా యుద్ధ పరిణామాల కారణంగా ఫ్లయిట్లు ఆగిపోవడంతో దుబాయ్లో చిక్కుకుంది. ఇంగ్లండ్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. అయితే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ నిబంధనల ప్రకారం ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంటే 5 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. అయితే సింధు ఇచి్చన వివరణ, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆల్ ఇంగ్లండ్ ఆర్గనైజర్లు జరిమానాను రద్దు చేశారు. -
భారత్ X వియత్నాం
పెర్త్: మైదానం లోపలా బయటా సమస్యలతో సతమతమవుతున్న భారత మహిళల ఫుట్బాల్ జట్టు... ఆసియాకప్ టోర్నమెంట్లో తొలిపోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం మొదటి మ్యాచ్లో మనకంటే మెరుగైన ర్యాంక్ గల వియత్నాంతో టీమిండియా తలపడనుంది. చైనీస్ తైపీ, జపాన్, వియత్నాంతో కలిసి గ్రూప్ ‘సి’నుంచి భారత్ పోటీ పడుతోంది. గతేడాది అక్టోబర్ తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. చివరగా ఇరాన్, నేపాల్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ మన అమ్మాయిలు పరాజయం పాలయ్యారు. మరి ఆ వైఫల్యాలను అధిగమించి బుధవారం మనవాళ్లు మైదానంలో ఆకట్టుకుంటారా చూడాలి. ఈ టోర్నమెంట్ కోసం గత నెల 11నే పెర్త్ చేరుకున్న భారత జట్టు... అక్కడ స్థానిక క్లబ్లతో మ్యాచ్లు ఆడి అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్లో వియత్నాం 36వ ర్యాంక్లో ఉండగా... భారత్ 67వ స్థానంలో కొనసాగుతోంది. ఫామ్ పరంగా చూసుకున్నా... వియత్నాం ఇటీవలే బలమైన ప్రత్యర్థులపై విజయాలతో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి అలాంటి జట్టుపై ఆధిక్యం కనబర్చాలంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పదు. 2003లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ వియత్నాం విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ మూడు గ్రూప్ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన రెండు మేటి జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరనున్నాయి. అందులో విజయం సాధించిన జట్లకు 2027లో బ్రెజిల్ వేదికగా జరగనున్న మహిళల ఫిఫా వరల్డ్కప్ బెర్త్ దక్కనుంది. ‘2023 ఆసియాకప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ ఈ సారి మంచి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాం. ఈ టోర్నీకి ముందు టర్కీలో ప్లేయర్ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఆసియాకప్లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారత మహిళల ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ అమేలియా వాల్వెర్డ్ పేర్కొంది. సరైన్ కిట్లు లేక... ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం చాలా ముందుగానే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టుకు అనూహ్య ఇబ్బంది వచ్చి పడింది. జట్టు స్పాన్సర్ సరైన సమయానికి సరైన్ కిట్లు అందించకపోవడంతో ప్లేయర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన ప్లేయర్లు తమ సమస్యను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) దృష్టికి తీసుకొచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రొఫెషనల్ ప్రమాణాలు అవసరం. కనీసం కిట్లను కూడా సరిగ్గా సమకూర్చలేకపోతే కష్టం. ప్రాక్టీస్ సమయంలోనే సరైన దుస్తులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి కీలక టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో కిట్లు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతో బాధిస్తోంది. మ్యాచ్కు ముందు ఇలాంటి సమస్యలు మా ఏకాగ్రతను దెబ్బతీశాయి’ అని ప్లేయర్లు ఏఐఎఫ్ఎఫ్కు లేఖ రాశారు. కెపె్టన్ స్వీటి దేవి నాంగ్బమ్తో పాటు ఎనిమిది మంది ప్రధాన ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సమాఖ్య మంగళవారం ప్లేయర్లకు కొత్త కిట్లు అందించినట్లు తెలిపింది. -
WC 2026: యుద్ధం ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
యుద్ధం వేళ ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి ఇరాన్ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూన్–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్ స్పష్టం చేశాడు.వైమానిక దాడులుకాగా మిత్రదేశం ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్ అన్నాడు.ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్–జూలైలలో జరిగే ప్రపంచకప్లో ఇరాన్ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్, ఈజిప్ట్లతో కలసి ఉంది ఇరాన్.గత ఆరు పర్యాయాల్లోనూషెడ్యూల్ ప్రకారం జూన్ 15న న్యూజిలాండ్తో (కాలిఫోర్నియాలో), జూన్ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్ 26న ఈజిప్ట్తో (సియాటెల్లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్ అభిమానుల ప్రవేశంపై ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ జట్టు ఏడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.ఇరాన్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?ఒకవేళ ఇరాన్ ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్లో ఉన్న ఇరాన్.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, యూఏఈ ఉన్నాయి. భారీ జరిమానాఅయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.చదవండి: FIFA World Cup 2026: అర్హత సాధించిన దేశాలు ఇవే -
సురక్షితంగా భారత్కు చేరుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్లో పాల్గొనేందుకు బర్మింగ్హామ్కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.భయానక అనుభవం సింధు బర్మింగ్హామ్కు ప్రయాణం చేస్తూ దుబాయ్లో ట్రాన్సిట్లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.ఇంటికి చేరాను మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది. కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది. -
గుకేశ్కు రెండో పరాజయం... దివ్య ఖాతాలో తొలి విజయం
ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ రెండో ఓటమి చవిచూశాడు. మాస్టర్స్ కేటగిరీలో భాగంగా నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన గుకేశ్ 69 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ 1.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ అరవింద్ చిదంబరం ఖాతాలో మూడో ఓటమి చేరింది. డేవిడ్ ఆంటోన్ (స్పెయిన్)తో జరిగిన ఐదో రౌండ్లో అరవింద్ 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఇదే టోరీ్నలో చాలెంజర్స్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ తొలి విజయం నమోదు చేసింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ సూర్యశేఖర గంగూలీతో జరిగిన ఐదో రౌండ్లో దివ్య 35 ఎత్తుల్లో గెలిచింది. -
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టికెట్ల అమ్మకాలు షురూ
సాక్షి, హైదరాబాద్: మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టికెట్ల అమ్మకాలు సోమవారం మొదలయ్యాయి. టికెట్ల ధరలను రూ. 25 (సౌత్ స్టాండ్), రూ. 50 (నార్త్ స్టాండ్), రూ. 100 (ఈస్ట్ స్టాండ్)గా నిర్ణయించారు. ఈనెల 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ టోరీ్నలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియా) పోటీపడుతున్నాయి. టికెట్లను https://ticketgenie.in/ticket/FIH-Hockey-World-Cup-2026-Qualifiers వెబ్సైట్లో లాగిన్ అయి కొనుగోలు చేయాలి. ఈ టోర్నీ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఖేల్ చానెల్లో, జియో హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తొలి రోజు 8న ఇంగ్లండ్తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), కొరియాతో ఆ్రస్టియా (మధ్యాహ్నం గం. 3 నుంచి), స్కాట్లాండ్తో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఉరుగ్వేతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
కొరియా చేతిలో ఇరాన్ మహిళల జట్టు ఓటమి
గోల్డ్కోస్ట్: ఇరాన్ లక్ష్యంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో బాంబుల మోత మోగుతోంది. ఇరాన్ కూడా గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాల్ని లక్ష్యం చేసుకుంది. ఇలా అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరాన్ మహిళల జట్టు ఆసియా కప్ ఫుట్బాల్ టోరీ్నలో బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఇరాన్ 0–3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. 2022 చాంపియన్ అయిన కొరియా జట్టు ఆట మొదలైనప్పటి నుంచి ప్రత్యర్థి గోల్ పోస్ట్పై అదేపనిగా దాడులు చేసింది. తొలి అర్ధభాగంలోనే ఏకంగా 20 సార్లు లక్ష్యంపై గురిపెట్టిన కొరియన్లు కేవలం ఒక గోల్ చేయగలిగారు. 37వ నిమిషంలో చో యు రి గోల్ సాధించింది. రెండో అర్ధభాగంలో కిమ్ హే రి (59వ నిమిషంలో) గోల్ చేయగా... కొ యూ జిన్ (75వ నిమిషంలో) హెడర్తో కొరియాకు 3–0తో తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఇరాన్కు ఒక్క గోల్ అవకాశాన్ని ఇవ్వకుండా కొరియా డిఫెండర్లు చక్కని సమన్వయం చూపారు. మ్యాచ్ ముందుగానీ, తర్వాత గానీ ఇరాన్ కోచ్ మర్జియె జఫారి తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులపై మాట్లాడేందుకు తిరస్కరించారు. -
నిరీక్షణ ముగిసేనా?
బర్మింగ్హామ్: శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్కు నేడు తెర లేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలోని ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి... డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల సింగిల్స్లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా... డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్; ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో బరిలో ఉన్నారు. అయితే స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ స్పేస్, ఎయిర్పోర్టు మూసివేయడంతో సింధు అక్కడే చిక్కుకుపోయింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సింధు తన తొలి రౌండ్ మ్యాచ్ను బుధవారం థాయ్లాండ్ ప్లేయర్ సుపనిద కటెథోంగ్తో ఆడాల్సి ఉంది. సింధు మినహా భారత ఇతర ప్లేయర్లు సింగపూర్, ఆఫ్రికా దేశాల మీదుగా బర్మింగ్హామ్కు చేరుకున్నారు. క్లిష్టమైన ‘డ్రా’ 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ నుంచి పురుషుల సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే టైటిల్స్ సాధించారు. 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరినా తుదకు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ కూడా రన్నరప్గానే నిలిచింది. ఈ ఏడాదైనా భారత ప్లేయర్లు టైటిల్ నిరీక్షణకు తెరదించుతారో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టిలకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ షి యుకి (చైనా)తో లక్ష్య సేన్, అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ శెట్టి ఆడతారు. 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన గాయత్రి–ట్రెసా ద్వయం తొలి రౌండ్లో సయాకా హిరోటా–అయాకో సకురామోటో (జపాన్) జోడీతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ టాయ్ (మలేసియా)లతో సాతి్వక్–చిరాగ్ పోటీపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ చెన్ యుఫె (చైనా)తో మాళవిక; ఆరో సీడ్ చోచువోంగ్ (థాయ్లాండ్)తో ఉన్నతి ఆడతారు. -
సలీమా టెటె సారథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో జరిగే మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు మిడ్ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సీనియర్ స్టార్ గోల్కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా కుటుంబ కారణాలరీత్యా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నీలో పోటీపడతాయి. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్ను 8న ఉరుగ్వేతో, తర్వాత 9న స్కాట్లాండ్తో, 11న వేల్స్తో తలపడుతుంది. ఈ టోర్నీ ద్వారా మూడు జట్లు ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల హాకీ జట్టు: బన్సారి, బిచ్చూ దేవి (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మనీషా, ఉదిత, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, సలీమా టెటె, సునెలితా టొప్పో, సాక్షి రాణా, వైష్ణవి, రుతుజా, దీపిక (మిడ్ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, ఇషిక, లాల్రెమ్సియామి, బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్, అన్ను (ఫార్వర్డ్స్). -
ఇరాన్ దాడులు.. దుబాయ్లో చిక్కుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకుపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ప్రయాణానికి అంతరాయం కలిగింది. సింధు బర్మింగ్హామ్లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ కోసం దుబాయ్ మీదుగా లండన్కు బయల్దేరింది.దుబాయ్ ట్రాన్సిట్లో ఉన్న సమయంలో గల్ఫ్ ఎయిర్స్పేస్లో మిసైల్ దాడుల కారణంగా అన్ని విమాన సర్వీసులు నిలిపి వేయబడ్డాయి. దీంతో సింధు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులపై సింధు తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాము. ఇక్కడి పరిస్థితులు క్రమేపీ భయానకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నాము. ఎయిర్పోర్ట్ సిబ్బంది తమను సురక్షిత ప్రాంతానికి తరలించారు అని ఎక్స్లో పేర్కొంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ప్రయాణికులు అనిశ్చితిలో వేచి ఉన్న దృశ్యాలను చూపించింది.కాగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ మృతి చెందగా, పలువురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు.ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ మరియు డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పామ్ జుమైరా ప్రాంతాలు ఇరాన్ మిసైల్ దాడులకు గురయ్యాయి. బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ఎయిర్స్పేస్ మూసివేయబడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
పురుష సామర్థ్యమున్న స్త్రీలకు చెక్!
న్యూఢిల్లీ: పురుష సామర్థ్యమున్న స్త్రీలు మహిళల విభాగంలో పోటీపడకుండా ఎస్ఆర్వై జన్యు పరీక్షతో అడ్డుకట్ట వేయాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్ణయించింది. ఇందులో జీవసంబంధమైన లింగనిర్ధారణలో అమ్మాయి అని తేలితేనే పోటీకి అనుమతిస్తారు. ఇందులో పురుషులకు వుండే వై క్రొమోజోముల ప్రభావం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల విభాగంలో అనుమతించరు.ఇటీవల ఏఎఫ్ఐ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ (EC) సమావేశంలో ఎస్ఆర్వై జన్యు పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీల్లో ఈ పరీక్ష చేయాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. ముందుగా ఈ జూలై 24 నుంచి 28 వరకు జరిగే జాతీయ ఇంటర్–స్టేట్ సీనియర్ చాంపియన్షిప్లో ఎస్ఆర్వై జన్యుపరీక్షను అమలు చేయనున్నట్లు ఏఎఫ్ఐ తెలిపింది. ఎందుకీ పరీక్ష... ఏమిటీ ‘ఎస్ఆర్వై’ ?జన్మతః అమ్మాయిగా పుట్టినప్పటికీ చాలా అరుదుగా కొందరు స్త్రీలలో పురుష సామర్థ్యం అసహజంగా ఉంటుంది. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఇలా జరుగుతుంది. దీనివల్ల సదరు స్త్రీ సాటి స్త్రీలకంటే పురుషుడి సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో పోటీల్లో పైచేయి సాధిస్తుంది. ఎస్ఆర్వై అంటే పురుషుల్లో ఉండే వై క్రొమోజోముల్ని బట్టి నిర్ధారించే లింగ పరీక్ష (SRY gene test). ఈ టెస్టు మహిళలకు చేస్తే జన్మతః కాకుండా జీవసంబంధమైన లింగ నిర్ధారణ బయటపడుతుంది. -
లక్నో జట్టు కొత్త జెర్సీతో...
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇటీవలే టీమ్ కొత్త లోగోను ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఎరుపు ప్రధాన రంగుగా ఉంటూ దానిపై నీలి రంగు నిలువు గీతలు హైలైట్ చేస్తూ జెర్సీని ముస్తాబు చేశారు. ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా ఎఫ్సీ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్తో తమ టీమ్కు ‘జేకే సూపర్ సిమెంట్’ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్నట్లు కూడా ఫ్రాంచైజీ ప్రకటించింది. గత మంగళవారం టీమ్ కొత్త లోగోను కూడా ప్రదర్శించారు. మరింత బలంగా, మరింత ఎత్తుకు అంటూ తమ టీమ్ ఆలోచనను వివరిస్తూ ఏనుగు, గరుడ చిత్రాలతో ఈ లోగోను సిద్ధం చేశారు. -
మానవ్–మనుశ్ జోడీకి కాంస్య పతకం
సింగపూర్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ గ్రాండ్ స్మాష్ లెవెల్ టోర్నీలో మానవ్ ఠక్కర్–మనుశ్ షా (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆరో సీడ్ మానవ్–మనుశ్ ద్వయం 6–11, 11–7, 10–12, 11–9, 8–11తో నాలుగో సీడ్ ఫెలిక్స్ లెబ్రున్–అలెక్సిస్ లెబ్రున్ (ఫ్రాన్స్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జంట సొంత సర్వీస్లో 22 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 24 పాయింట్లు గెలిచింది. మూడో గేమ్లో 10–9తో ఆధిక్యంలో నిలిచిన భారత జోడీ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్ను చేజార్చుకుంది. సెమీస్లో ఓడిన మానవ్–మనుశ్లకు 3,600 డాలర్ల (రూ. 3 లక్షల 27 వేలు) ప్రైజ్మనీతోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జంట రెండో రౌండ్లో 11–7, 11–5, 11–9తో గిలెర్మి టియోడోరో–లియోనార్డో ఇజుక (బ్రెజిల్)లపై, క్వార్టర్ ఫైనల్లో 11–8, 11–9, 11–9తో మారి్టన్ అలెగ్రో–ఆడ్రియన్ రసెన్ఫోస్ (బెల్జియం)లపై గెలుపొందింది. -
శ్రీకాంత్ పరాజయం
ముల్హీమ్ అన్ డెర్ రుర్: జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబిశ్రీకాంత్ 14–21, 9–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్లో 9–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో గేమ్లో మాత్రం ఆరంభం నుంచే చైనీస్ తైపీ ప్లేయర్ ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–12, 21–11తో జిమానవ్స్కీ (పోలాండ్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్లో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, తస్నిమ్ మీర్, రక్షిత శ్రీ, తన్వీ శర్మ, ఇషారాణి బారువా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
77 సెకన్లలోనే...
టిరానా (అల్బేనియా): ముహమెత్ మాలో స్మారక వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ పసిడి పతకం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో సుజీత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అజర్బైజాన్ రెజ్లర్ రషీద్ బాబాజాదెను చిత్తుగా ఓడించాడు. బౌట్ మొదలైన 77 సెకన్లకే సుజీత్ 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి పై 10 అంతకన్నా పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ఆ రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. ఫైనల్ చేరే క్రమంలో సుజీత్ మూడు బౌట్లలోనూ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే గెలుపొందడం విశేషం. సెమీఫైనల్లో సుజీత్ 11–0తో (5 నిమిషాల 17 సెకన్లు) జోసెఫ్ క్రిస్టోఫర్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో (4 నిమిషాల 6 సెకన్లు) నికా జకాష్విలి (జార్జియా)పై, తొలి రౌండ్లో 16–4తో (3 నిమిషాల 33 సెకన్లు) ఎండ్రియో అవిదిలి (అల్బేనియా)పై విజయం సాధించాడు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో సుజీత్కిది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2022లో జుహైర్ ఎస్గెయిర్ టోర్నీలో, 2025లో పొల్యాక్ ఇమ్రె–వర్గా యోనస్ స్మారక టోర్నీలో, 2026 జాగ్రెబ్ ఓపెన్ టోర్నీలో సుజీత్ పసిడి పతకాలు గెలిచాడు. -
‘షూటౌట్’లో గెలిచాం
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్లను జూన్లో నెదర్లాండ్స్లో ఆడనుంది. హోబర్ట్: మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించి రెండో అంచె లీగ్ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్ ఎనిమిదో మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్ లభించాయి. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున గోల్కీపర్ శశికుమార్ మోహిత్ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్లను మోహిత్ అడ్డుకొని భారత్ను గెలిపించాడు. భారత్ తరఫున ‘షూటౌట్’లో శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ సఫలంకాగా... అభిషేక్ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్లు తీసుకున్న టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, కూపర్ బర్న్స్ విఫలమవ్వగా... నాలుగో షాట్లో జెరెమీ హేవార్డ్ సఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ సమయంలోని మూడు క్వార్టర్స్లో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్ శిలానంద్ లాక్రా గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది. ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్ 14 నుంచి 21 వరకు రోటర్డామ్లో మూడో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 14న నెదర్లాండ్స్తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్లో నాలుగో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 23న పాకిస్తాన్తో... 25న ఇంగ్లండ్తో... 26న మళ్లీ పాకిస్తాన్తో... 28న మళ్లీ ఇంగ్లండ్తో తలపడుతుంది. -
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో ఓటమి పాలైన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓడిపోయింది. రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. స్పెయిన్కు రెండు పాయింట్లు, భారత్కు ఒక పాయింట్ లభించింది. నిర్ణీత సమయంలో 59 నిమిషాల వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... 59వ నిమిషంలో గోల్ సమర్పించుకుంది. దాంతో స్పెయిన్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆట 19వ నిమిషంలో మణీందర్ సింగ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి విజయం దిశగా సాగింది. మరో రెండు నిమిషాలు పూర్తయితే భారత్కు తొలి గెలుపు ఖాయమయ్యే స్థితిలో స్పెయిన్ ప్లేయర్ బ్రూనో ఫాంట్ గోల్ చేశాడు. చివరి 13 సెకన్లలో స్పెయిన్కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్లను సమర్పించుకున్న భారత్ వాటిని నిలువరించింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు తొలి నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా... భారత్ తరఫున అభిషేక్, కెప్టెన్ హార్దిక్ సింగ్ గురి తప్పడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్లో స్పెయిన్కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు, భారత్కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు అన్నింటిని వృథా చేశాయి. నేడు జరిగే రెండో అంచె చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
ఈసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: వేదిక మారినా... ప్రత్యర్థులు మారినా... కెప్టెన్సీ మారినా... తాజా సీజన్లో భారత పురుషుల హాకీ జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ప్రొ లీగ్ రెండో అంచె పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన భారత హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. భారత్ వేదికగా జరిగిన తొలి అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన టీమిండియా... ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన సీజన్ ఆరో మ్యాచ్లో హార్దిక్ సింగ్ సారథ్యంలోని టీమిండియా ‘షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో ఆ్రస్టేలియా తరఫున టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, టిమ్ హోవర్డ్, జాక్ వెల్్చ, టామ్ క్రెయిగ్ గోల్స్ చేశారు. భారత్ తరఫున శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, జుగ్రాజ్ సింగ్ గోల్స్ సాధించగా... ఆదిత్య అర్జున్ తీసుకున్న చివరిదైన ఐదో షాట్ను ఆస్ట్రేలియా గోల్కీపర్ జేడ్ స్నోడెన్ అడ్డుకోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. అంతకుముందు నిర్ణీత సమయంలో భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (15వ నిమిషంలో), జుగ్రాజ్ సింగ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఆ్రస్టేలియా జట్టుకు జోయెల్ రింటాలా (47వ, 56వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. స్పెయిన్తో శనివారం జరిగిన మ్యాచ్లో 0–2తో ఓడిన భారత్ ఈ మ్యాచ్లో మెరుగైన ఆటతీరు కనబరిచింది. ఒకదశలో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లి తొలి విజయం దిశగా సాగిపోయింది. అయితే చివర్లో తప్పిదాలు చేసి తొమ్మిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. మ్యాచ్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత్ సది్వనియోగం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా 14 పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... రెండింటిని మాత్రమే లక్ష్యానికి చేర్చింది. ‘షూటౌట్’లో ఓడినందుకు భారత జట్టుకు ఒక్క పాయింట్... ఆ్రస్టేలియాకు రెండు పాయింట్లు లభించాయి. నిర్ణీత సమయంలో విజయం సాధిస్తే మూడు పాయింట్లు దక్కుతాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్లో స్పెయిన్ జట్టుతో భారత్ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆరు మ్యాచ్లు ఆడి ఒక్క పాయింట్తో ఎనిమిదో స్థానంలో ఉంది. -
సింగిల్స్ రన్నరప్ వైష్ణవి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–100 బెంగళూరు ఓపెన్లో భారత క్రీడాకారిణి వైష్ణవి అడ్కర్ రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన వైష్ణవి 0–6, 1–6తో ప్రపంచ 124వ ర్యాంకర్ హనీ వాండెవింకెల్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో వైష్ణవి ఒక్క గేమ్ మాత్రమే గెలిచింది. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయింది. విజేత వాండెవింకెల్కు 15,239 డాలర్ల (రూ. 13 లక్షల 82 వేలు) ప్రైజ్మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వైష్ణవికి 8,147 డాలర్ల (రూ. 7 లక్షల 39 వేలు) ప్రైజ్మనీతోపాటు 65 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో 690వ ర్యాంక్లో ఉన్న వైష్ణవి ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగింది. ఫైనల్ చేరే క్రమంలో ఈ పుణే అమ్మాయి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ముగ్గురు క్రీడాకారిణులను ఓడించింది. వైష్ణవి ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 220వ ర్యాంకర్ మాయ్ హొంటామా (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 148వ ర్యాంకర్ టేలా ప్రెస్టన్ (ఆ్రస్టేలియా)పై, సెమీఫైనల్లో ప్రపంచ 126వ ర్యాంకర్ లాన్లానా (థాయ్లాండ్)లపై సంచలన విజయాలు సాధించింది. తద్వారా 2009లో పట్టాయా ఓపెన్లో సానియా మీర్జా ఫైనల్ చేరిన తర్వాత... డబ్ల్యూ–100 లెవెల్ టోర్నీలో సింగిల్స్ టైటిల్ పోరుకు చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా వైష్ణవి గుర్తింపు పొందింది. -
మెయిన్ ‘డ్రా’కు రామ్–జీవన్ జోడీ
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో రామ్కుమార్ రామనాథన్–జీవన్ నెడుంజెళియన్ (భారత్) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం దుబాయ్లో జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో రామ్కుమార్–జీవన్ ద్వయం 6–4, 7–6 (7/4)తో కారోల్ ద్రెజెవ్స్కీ–పీటర్ మతుజెవ్స్కీ (పోలాండ్) జంటను ఓడించింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వీస్లో 42 పాయింట్లు, రెండో సర్వీస్లో ఎనిమిది పాయింట్లు సాధించింది. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో రామ్–జీవన్ 6–5, 7–6 (7/4) స్కోరుతోనే భారత్కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్లపై గెలుపొందడం విశేషం. డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో యూకీ బాంబ్రీ (భారత్)–గొరాన్సన్ (స్వీడన్); శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఒబెర్లీట్నెర్ (ఆ్రస్టియా) జోడీలు కూడా ఉన్నాయి. -
భారత జట్టులో తెలంగాణ అమ్మాయి
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.గ్రూప్ ‘సి’లో ఉన్న భారత్ మార్చి 4న పెర్త్లో వియత్నాంతో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మార్చి 7న జపాన్తో, మార్చి 10న చైనీస్ తైపీతో టీమిండియా పోటీపడుతుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకునే నాలుగు జట్లు 2027 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ‘స్వర్ణ’ సరిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన బానోత్ సరిత మూడు స్వర్ణ పతకాలతో మెరిపించింది. సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ పోటీల్లో సరిత పవర్లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్మ్ రెజ్లింగ్ క్రీడాంశాల్లో బరిలోకి దిగి విజేతగా నిలిచింది.పవర్లిఫ్టింగ్లో 63 కేజీల విభాగంలో పోటీపడ్డ సరిత డెడ్లిఫ్ట్లో 105 కేజీలు, బెంచ్ప్రెస్లో 40 కేజీలు, స్క్వాట్లో 55 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న సరిత... గత ఏడాది కరీంనగర్లో జరిగిన రాష్ట్ర పోలీసు క్రీడల్లోనూ రాణించి రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. -
షకీల్పై నిషేధం ఎత్తివేత
లాహోర్: పాకిస్తాన్ హాకీలో సంక్షోభం ముదురుతున్న వేళ ఆ దేశ సర్కారు జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ అమద్ షకీల్ భట్పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) విధించిన రెండేళ్ల నిషేధాన్ని పాక్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిషేధం నియమావళికి విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ్రస్టేలియా పర్యటనలో పీహెచ్ఎఫ్ నిర్వహణ లోపంతో పాకిస్తాన్ హాకీ ఆటగాళ్లు వీధిన పడ్డారు. బసచేస్తున్న హోటల్కు నిధులు విడుదల చేయకపోవడంతో ఆటగాళ్లంతా రోడ్లపై పడిగాపులు కాశారు. దీంతో పీహెచ్ఎఫ్ నిర్వాకంపై కెప్టెన్ షకీల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీన్ని సహించలేకపోయిన పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు తారిఖ్ బగ్తీ క్రమశిక్షణ చర్యల కింద కెప్టెన్పై నిషేధం విధించారు. తర్వాత తన ఆధ్యక్ష పదవికి బగ్తీ రాజీనామా చేశారు. ఆసీస్లో పాక్ అప్రతిష్టపాలుపై గుర్రుగా ఉన్న పీహెచ్ఎఫ్ ప్యాట్రన్ ఇన్ చీఫ్, దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్... బగ్తీ రాజీనామాను వెంటనే ఆమోదిస్తూ అహ్మద్ అధ్యక్షతన అడ్హక్ కమిటీని నియమించారు. అలాగే కెపె్టన్ షకీల్పై నిషేధం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని బగ్తీ విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. -
తొలి గెలుపు కోసం...
హోబర్ట్: సొంతగడ్డపై జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొలి అంచెలో భారత హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. అర్జెంటీనా, బెల్జియం జట్లతో రెండుసార్లు చొప్పున ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్లోనూ గెలుపు రుచి చూడలేదు. ఇప్పుడు రెండో అంచె మ్యాచ్లకు భారత బృందం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్లో స్పెయిన్తో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత ఆదివారం జరిగే రెండో మ్యాచ్లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో టీమిండియా ఆడుతుంది. భారత అంచె పోటీల్లో సారథ్యం వహించిన హర్మన్ప్రీత్ సింగ్ వ్యక్తిగత కారణాలరీత్యా రెండో అంచె మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ స్థానంలో హార్దిక్ సింగ్ భారత జట్టుకు నేతృత్వం వహిస్తాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో హార్దిక్ సింగ్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ‘స్వదేశంలో జరిగిన తొలి అంచె మ్యాచ్ల్లో పొరపాట్లు ఎక్కడ జరిగాయో సమీక్షించాం. గెలుపు బోణీ కొట్టాలనే లక్ష్యంతోనే ఆ్రస్టేలియాకు వచ్చాం’ అని మిడ్ఫీల్డ్లో ఆడే హార్దిక్ సింగ్ వ్యాఖ్యానించాడు. -
ఢిల్లీ మారథాన్ దిగ్గజాలతో షురూ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్లీ మారథాన్’కు రంగం సిద్ధమైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగే ఈ సుదీర్ఘ పరుగును భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్, టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల పైచిలుకు మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), అంతర్జాతీయ మారథాన్, డిస్టెన్స్ రేస్ (ఏఐఎంఎస్), ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) గుర్తింపు పొందిన ఈ సుదీర్ఘ పరుగులో కేవలం భారతీయులే కాదు విదేశీ మారథాన్ రన్నర్లు, పలువురు క్రీడాకారులు కూడా పాల్గొనేందుకు నగరానికి విచ్చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్ నాలుగు విభాగాల్లో జరుగుతోంది. ఇందులో మొదటిది పూర్తి మారథాన్. 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తడం. దీంతో పాటు హాఫ్ మారథాన్ (21.09 కి.మీ.), 10కే (10 కిలో మీటర్లు), 5కే (5 కిలో మీటర్లు) పరుగు పందెంలు కూడా నిర్వహిస్తారు. అంటే సుదీర్ఘ పరుగు (42.21 కి.మీ) చేయలేని వారుసైతం నిరాశచెందకుండా 10కే, 5కే ఈవెంట్లో పరుగు పూర్తిచేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని 490 నగరాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. భారత్లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మారథాన్ ప్రియులు పరుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. దేశీ క్రీడాకారులు అనిశ్ థాపా, బెలియప్ప, మన్ సింగ్, అక్షయ్ సైని, గోపీ, భాగిరథి బిస్త్, నిర్మాబెన్ ఠాకూర్, అశ్విని మదన్ జాదవ్, దిస్కెట్ డోల్మా, స్టాన్జిన్ డోల్కర్ తదితరులు కూడా పోటీపడుతున్నారు. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్ టైమింగ్ను నమోదు చేసిన రన్నర్లకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు అర్హత కూడా లభిస్తుంది. ఈ మారథాన్ పరుగు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. సమగ్ర వ్యర్థాల విభజన, ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ను నిషేధించి... రీ సైక్లింగ్కు ఉపయోగపడే ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం... ఇందుకోసం పర్యావరణ సంస్థలు, కలిసి వచ్చే స్థానికులు, అధికారులతో మారథాన్ ఆర్గనైజర్లు చేతులు కలుపుతారు. -
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.రికార్డు స్థాయిలో దరఖాస్తులు - ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. - మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్కు అర్హత సాధించారు. - ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. చీఫ్ మినిస్టర్ కప్ ప్రధాన ఉద్దేశం.. - గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం. - రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం. - క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.- భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం. -
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బట్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడి పట్ల పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు అక్రమమని.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒకప్పుడు తోపుకాగా పాక్ హాకీ పురుషుల జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. నాలుగుసార్లు ప్రపంచ కప్ విజేత, మూడు ఒలింపిక్ స్వర్ణాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది ఆ జట్టు. అయితే, గత కొన్నేళ్లుగా రోజురోజుకీ దిగజారి పోతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భాగంగా పాక్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుస ఓటములతో చతికిలపడింది. దీంతో తాజా ఎడిషన్లో ఆడిన మ్యాచ్లన్నీ ఓడి పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచింది.ప్లేట్లు కడిగి మ్యాచ్కు వెళ్లాంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల ఫలితమే వరుస ఓటములకు కారణమంటూ కెప్టెన్ అమ్మాద్ బట్ సంచలన ఆరోపణలు చేశాడు. హోటల్లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపాడు. కిచెన్ను తామే శుభ్రపర్చుకున్న తర్వాతే మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.స్వదేశానికి తిరిగి రాగానే పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్)పై అమ్మాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ప్రస్తుత పీహెచ్ఎఫ్ మేనేజ్మెంట్ ఇంకా కొనసాగితే మేం ఆడటం కష్టం. ప్లేట్లు కడిగి కిచెన్ను శుభ్రం చేసుకున్న తర్వాతే మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా మా వైపు నుంచి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారు.బహిరంగంగా చెప్పాల్సి వస్తోందిదాదాపు 13–14 గంటల పాటు రోడ్డుపై వేచి చూసిన తర్వాత మాకు హోటల్లో బస ఏర్పాటు చేశారు. మేం టోర్నీ కోసం అక్కడ 13 రోజులు ఉండాల్సి ఉంటే 10 రోజుల కోసమే హోటల్ను బుక్ చేశారు. దాంతో తర్వాతి మూడు రోజుల కోసం చవకైన మరో హోటల్కు మారాల్సి వచింది. ఎంతో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టే ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది’ అని షకీబ్ బట్ ఆవేదన వ్యక్తం చేశాడు.రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయంఈ పరిణామాలపై దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో PHF అధ్యక్షుడు తారిఖ్ బుగ్టీ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అంతకంటే ముందు అమ్మాద్పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి పాక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వంఈ క్రమంలో పాక్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. PHF తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ బ్యూరోక్రాట్ ముహుయుదీన్ వనీని నియమించింది. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టగానే ముహుయుదీన్ తొలుత అమ్మాద్ గురించే ప్రకటన చేశారు. అమ్మాద్పై నిషేధం విధిస్తూ బుగ్టీ తీసుకున్న నిర్ణయం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ హాకీకి జరిగిన నష్టాన్ని పూడ్చి.. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుతామని తెలిపారు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’ -
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ రుతుజా భోస్లే దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతుజా (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) ద్వయం 3–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి రౌండ్లో రుతుజా–ప్లిపుయెచ్ 7–5, 6–2తో ఇరి హొజుమి (జపాన్)–ఫాంగ్ సియెన్ వు (చైనీస్ తైపీ)లపై గెలిచారు. ఈ విజయంతో సానియా మీర్జా (2022లో సిన్సినాటి ఓపెన్) తర్వాత డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోర్నీలో మ్యాచ్ గెలిచిన రెండో భారత ప్లేయర్గా రుతుజా గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన రుతుజా–ప్లిపుయెచ్లకు 17,200 డాలర్ల (రూ. 15 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 120 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అంట్లు తోముకోవాల్సి వచ్చింది: మండిపడ్డ పాక్ కెప్టెన్
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్లు ఆడేందుకు పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్బెర్రా వెళ్లేందుకు పాక్ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.అనంతరం హోటల్కు వెళ్లిన తర్వాత పాక్ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆసీస్ చేతిలో పాక్ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చిందిఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్ ఎయిర్పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.మ్యాచ్ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?మాకు విదేశీ కోచ్ కావాలిమేము పది రోజుల పాటు చీప్ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.మాకు విదేశీ కోచ్ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ హాకీ ఫెడరేషన్కు ప్రాటన్-ఇన్-చీఫ్గా ప్రధాని షెబాజ్ షరీఫ్ ఉంటారు.ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాముఈ నేపథ్యంలో పీఎస్బీ డైరెక్టర్- జరనల్ నూర్ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొలి అంచెలో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. తదుపరి ఈనెల 20 నుంచి 25 వరకు ఆ్రస్టేలియాలోని హోబర్ట్ నగరంలో భారత్ రెండో అంచె మ్యాచ్లు ఆడనుంది. అయితే ఈ అంచె మ్యాచ్లకు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలరీత్యా తాను హోబర్ట్ అంచె మ్యాచ్ల్లో పోటీపడే భారత జట్టుకు అందుబాటులో ఉండటం లేదని హర్మన్ప్రీత్ తెలిపాడు. హర్మన్ప్రీత్ భార్య అమన్దీప్ కౌర్ ప్రసవ తేదీ దగ్గర్లో ఉండటంతో హర్మన్ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా హోబర్ట్ అంచె మ్యాచ్లకు భారత జట్టు సారథ్య బాధ్యతలు మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్కు అప్పగించారు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టులో హార్దిక్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా తదుపరి మ్యాచ్ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్ వేదికగా ఈనెల 21న స్పెయిన్తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: సూరజ్ కర్కేరా, మోహిత్ హొనెన్నహళ్లి శశికుమార్ (గోల్కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, అమన్దీప్ లాక్రా, యశ్దీప్ సివాచ్, పూవణ్ణ చందురబాబీ(డిఫెండర్లు), రాజిందర్ సింగ్, మన్మీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, హార్దిక్ సింగ్, మొయిరంగ్తెమ్ రబీచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, రాజ్కుమార్ పాల్ (మిడ్ఫీల్డర్లు), అభిషేక్, శిలానంద్ లాక్రా, మన్దీప్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఆదిత్య అర్జున్ లలాగే, అంగద్బీర్ సింగ్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్). -
పోరాడి ఓడిన కరణ్ సింగ్
ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నమెంట్లో తొలి రోజు భారత క్రీడాకారుడు కరణ్ సింగ్కు నిరాశ ఎదురైంది. ‘వైల్డ్ కార్డు’తో నేరుగా సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన కరణ్ ఈ అడ్డంకిని దాటలేకపోయాడు. ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) కాంప్లెక్స్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 436వ ర్యాంకర్ కరణ్ సింగ్ 6–4, 6–7 (5/7), 3–6తో ప్రపంచ 260వ ర్యాంకర్ డేనియల్ మైకెల్స్కీ (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కరణ్ ఏడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సరీ్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రామ్కుమార్ రామనాథన్ 2–6, 2–6తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోగా... మనీశ్ సురేశ్ కుమార్ 6–3, 7–5తో యుసుంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సుమిత్ నగాల్, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్, మానస్ ధామ్నె బరిలో ఉన్నారు. -
హాకీలో మళ్లీ ఓడిన భారత్
రూర్కెలా: సొంతగడ్డపై భారత పురుషుల హాకీ జట్టు తమ నిరాశాజనక ప్రదర్శన కొనసాగించి వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. భారత అంచె పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్లో టీమిండియా 2–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున ఆదిత్య లలాగే (50వ నిమిషంలో), సంజయ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. అర్జెంటీనా జట్టుకు టడియో మారుకి (28వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... టొమాస్ డొమెనె (18వ నిమిషంలో), లూసియో మెండెజ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా తదుపరి మ్యాచ్ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్ వేదికగా ఈనెల 21న స్పెయిన్తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. -
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్ (11వ నిమిషం), అలెగ్జాండర్ హెన్డ్రిక్ (14వ ని., 17వ ని.), ఆర్థర్ స్లూవర్ (15వ ని.) గోల్స్ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్ (24వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (37వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్లో 3 గోల్స్ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, మూడో క్వార్టర్లో భారత్ ఖాతాలో మరో గోల్ చేరింది. అయితే చివరి క్వార్టర్లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్లో జర్మనీ 6–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. -
భారత పోలో జట్టు పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 15–5 గోల్స్ తేడాతో నెగ్గింది. తొలి చక్కర్ ముగిశాక భారత్ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ తరఫున యూసుఫ్ అజ్మీ 2 గోల్స్, కున్వల్ విశాల్ సింగ్ 3 గోల్స్, మొహమ్మద్ నయీముద్దీన్ ఒక గోల్ చేశారు. రెండో చక్కర్లో భారత్ ఐదు గోల్స్ చేసి, రెండు గోల్స్ సమరి్పంచుకుంది. ఈ చక్కర్లో భారత్కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్ అజ్మీ 2 గోల్స్ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్లో భారత్ నాలుగు గోల్స్ సాధించింది. చెతానియా, యూసుఫ్ అజ్మీ రెండు గోల్స్ చొప్పున చేశారు. -
సూపర్ స్నేహిత్...
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 15–17, 11–4, 11–6, 18–16తో ప్రపంచ 61వ ర్యాంకర్ మిజుకి ఒయ్కావా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేమ్లు కోల్పోయినప్పటికీ స్నేహిత్ పట్టువదలకుండా పోరాడాడు. వరుసగా మూడు గేమ్లు నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నిర్ణాయక ఐదో గేమ్లో స్నేహిత్ 8–10తో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన స్నేహిత్ 10–10తో స్కోరును సమం చేశాక 11–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆరుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 16–16 వద్ద స్నేహిత్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
మన ముకేశ్ గురి బంగారం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ జూనియర్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన పిస్టల్ షూటర్ ముకేశ్ నేలవల్లి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. చివరిరోజు శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ రెండు పతకాలు సాధించాడు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం నెగ్గిన ముకేశ్... టీమ్ విభాగంలో సూరజ్ శర్మ (మధ్యప్రదేశ్), అభినవ్ దేశ్వాల్ (ఉత్తరాఖండ్)లతో కలిసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో ముకేశ్ ఎనిమిది పతకాలు సాధించిన ముకేశ్ జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ క్లీన్స్వీప్ చేసింది. సూరజ్ శర్మ 585 పాయింట్లతో స్వర్ణం, ముకేశ్ 582 పాయింట్లతో రజతం, అభినవ్ దేశ్వాల్ 573 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. సూరజ్, ముకేశ్, అభినవ్లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో 1740 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ధవళిక ఖాతాలో 2 పతకాలు ఇదే టోర్నీ జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ధవళిక దేవి రెండు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ధవళిక 614.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలిచింది. టీమ్ విభాగంలో ధవళిక, ప్రాచి, అనుష్కలతో కూడిన భారత జట్టు 1835.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గచి్చ»ౌలిలోని గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో గత మూడేళ్లుగా కోచ్ వినోద్ కనోజియా వద్ద ధవళిక శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి భారత షూటర్లు 39 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యాలతో 76 పతకాలు నెగ్గి ‘టాప్’లో నిలిచారు. -
నేటి నుంచి ఐఎస్ఎల్
కోల్కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు కొనసాగిన సందిగ్ధత వీడింది. నేటి నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 12వ సీజన్ ఫుట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మొత్తం 14 (బెంగళూరు, చెన్నైయిన్, ఈస్ట్ బెంగాల్, గోవా, ఇంటర్ కాశీ, జంషెడ్పూర్, కేరళ బ్లాస్టర్స్, మొహమ్మదాన్ స్పోరి్టంగ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, పంజాబ్, స్పోరి్టంగ్ క్లబ్ ఢిల్లీ) జట్లు టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఒక్కో జట్టు 13 మ్యాచ్లు ఆడుతుంది. నాకౌట్ దశ లేకుండా మూడు నెలలపాటు సాగే ఈ లీగ్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా అవతరిస్తుంది. సాల్ట్లేక్ స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ మోహన్బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. రెండో మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టుతో ఎఫ్సీ గోవా జట్టు పోటీపడుతుంది. -
ఫైనల్లో రష్మిక జోడీ
పుణే: భారత మహిళల టెన్నిస్ రెండో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తన కెరీర్లో ఏడో డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–5, 6–3తో పొలీనా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జంటపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత తమ తొలి సర్వీస్లో 27 పాయింట్లు, రెండో సర్వీస్లో 9 పాయింట్లు సంపాదించారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో మిసాకి మత్సుదా–ఇరి షిమిజు (జపాన్)లతో రష్మిక–అంకిత తలపడతారు. -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
సెమీస్లో రష్మిక జోడీ
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశారు. హైదరాబాద్కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ (భారత్)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో పొలీనా బఖ్ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. -
స్నేహిత్ శుభారంభం
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్కే చెందిన దివ్యాంశ్ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. భారత్కే చెందిన ఆకాశ్ పాల్, అంకుర్, హర్మీత్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. -
సహజ, రష్మిక ఓటమి
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్వన్ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో తెలంగాణ అమ్మాయి సహజ 3–6, 2–6తో టాప్ సీడ్ లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్) చేతిలో, హైదరాబాద్ ప్లేయర్ రష్మిక 2–6, 1–6తో మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 6–1, 6–4తో జీల్ దేశాయ్–మాయా రాజేశ్వరన్ (భారత్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
ముకేశ్కు స్వర్ణం, కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి రెండు పతకాలతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ముకేశ్ కాంస్య పతకం సాధించాడు. ఏడుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ముకేశ్ 19 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన సూరజ్ శర్మ 23 పాయింట్లతో రజతం నెగ్గగా... ఇండోనేసియా షూటర్ ఫవాజ్ 29 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముకేశ్, సూరజ్, సాహిల్లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ముకేశ్ బృందం 1729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో అనీశ్, ఆదర్శ్ సింగ్, నీరజ్ కుమార్లతో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత షూటర్లు 35 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 64 పతకాలు గెలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
చెన్నై: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని... చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సాకేత్–సిద్ధాంత్ (భారత్) ద్వయం 2–6, 6–1, 10–2తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎరిక్ వాన్షెల్బోయిమ్ (ఉక్రెయిన్)–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) జంటను ఓడించింది. మరో మ్యాచ్లో గంటా సాయికార్తీక్ రెడ్డి–దిగ్విజయ్ సింగ్ (భారత్) జోడీ 4–6, 2–6తో నిక్కీ పునాచా (భారత్)–ప్రుచాయో ఇసారో (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. -
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్ కొత్త సీజన్ను భారత పురుషుల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టును బెల్జియం జట్టు కట్టడి చేసింది. కేవలం రెండు పెనాల్టీ కార్నర్లు పొందిన భారత జట్టు అందులో ఒకదానిని సది్వనియోగం చేసుకుంది. ఆట 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను శిలానంద్ లాక్రా గోల్గా మలిచాడు. బెల్జియం తరఫున నెల్సన్ ఒనానా (23వ నిమిషంలో), థామస్ క్రాల్స్ (53వ నిమిషంలో), అర్నో వాన్ డెసెల్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తమకు లభించిన ఏడు పెనాల్టీ కార్నర్లను బెల్జియం వృథా చేసుకోవడం గమనార్హం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో తాజా గెలుపుతో బెల్జియం 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. -
ఆకృతికి రజతం... అంజుమ్కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు తమ జోరు ప్రదర్శిస్తున్నారు. పోటీల ఏడో రోజు సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ఆకృతి దహియా రజత పతకం నెగ్గగా... అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆకృతి 354.2 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. అంజుమ్ 340.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. కజకిస్తాన్ షూటర్ సోఫియా షుల్జెంకో 358.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొంది స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. టీమ్ విభాగంలో ఆకృతి, అంజుమ్, అషిలతో కూడిన భారత జట్టు 1756 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనూ భారత్కు రెండు పతకాలు లభించాయి. ప్రాచి గైక్వాడ్ (353.3 పాయింట్లు) బంగారు పతకాన్ని సాధించగా... అనుష్క ఠాకూర్ (341.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ విభాగంలో ప్రాచి, అను‡్ష్క, హేజెల్లతో కూడిన భారత జట్టు 1748 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. -
నయా రాకెట్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... గతేడాదే డేవిస్కప్లో అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే బోణీ కూడా కొట్టాడు. అయినా మనకెవరికీ తెలియదు. తాజాగా తెలిసింది. తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. గూగుల్లో ఎవరీ దక్షిణేశ్వర్ అని సెర్చ్ చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల కంటపడుతున్న అతను ఏం చేశాడో చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే అతనొక సంచలనం. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్–1లో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడితే... తలపడింది... ఎదురుపడింది... ఎదుర్కొని గెలిపించింది మాత్రం దక్షిణేశ్వరే! ఇందులో ఏ మాత్రం అతిశయోక్తే లేదు. పోటీ... నైపుణ్యం నిండిన ప్రస్తుత కాలంలో దక్షిణేశ్వర్ ముమ్మాటికి ఓ నిశ్శబ్ద చాంపియన్. జూనియర్ సర్క్యూట్, ఏటీపీ చాలెంజర్... ఐటీఎఫ్ ... ఇలా ఎన్నో పేర్లతో టోర్నీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అన్నింటా ఆడుతూనే ఉన్నా... ఏ టోర్నీలోనూ కంటబడని తమిళనాడు యువతార ఏకంగా చాంపియన్గా బయటపడటమే పెద్ద విశేషం. ఒకప్పుడు ఆట కోసం కిట్ బ్యాగులు మోసిన భుజాలే ఇప్పుడు డేవిస్ కప్లో భారత బాధ్యతల్ని మోస్తున్నాయి. ఎంతో క్రమశిక్షణతో కూడిన అతని శిక్షణ, పోటీలు, విజయాలు ఇవన్నీ కూడా గమనించిన వారికి ముచ్చటేయకుండా ఉండదు. పొద్దెక్కముందే ట్రెయినింగ్... మధ్యలో పోటీలు... పిడికిలి బిగిస్తే విజయాలు అన్నీ కూడా ఓ క్రమపద్దతిలో కష్టపడితేనే వచ్చాయి. ఓపికగా, ఒద్దికగా అన్నింటిని భరించిన దక్షిణేశ్వర్ ఈ క్రమంలో క్రీడా జర్నలిస్టుల ప్రాధాన్యంలోనూ లేడు. కానీ ఒక్కసారిగా సంచలన విజయాలతోనే అందరి కళ్లముందుకు వచ్చాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రకారమైతే డేవిస్కప్లో భారత జట్టు తరఫున నంబర్వన్ సుమిత్ నగాల్ తర్వాత ఆర్యన్ షా, కరణ్ సింగ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి. అయితే భారత నాలుగో ర్యాంకర్గా ఉన్న దక్షిణేశ్వర్ ఆటతీరుపై నమ్మకంతో భారత జట్టు నాన్ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ ఈ తమిళనాడు పొడగరికి ఏకంగా మూడు మ్యాచ్లు (సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్) ఆడే అవకాశం ఇచ్చాడు. రోహిత్ రాజ్పాల్తోపాటు భారత టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంచనాలకు మించి రాణించిన దక్షిణేశ్వర్కు భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. తొలినాళ్ల ప్రయాణమిది తమిళనాడులోని దిండిగుల్ పట్టణానికి చెందిన దక్షిణేశ్వర్ తండ్రి సురేశ్ ఎక్కా కూడా టెన్నిస్ ప్లేయరే! రాష్ట్రానికి, దేశానికి ఆడలేదు కానీ క్లబ్ లెవెల్ ఆటగాడు సురేశ్. బహుశా ఈ మూలాలే దక్షిణేశ్వర్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయేమో! చెన్నైలోని కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి శిక్షణలో ఓనమాలు, తర్వాత మెలకువలు నేర్చుకొని రాటుదేలాడు. 2010 నుంచి 2016 వరకు తన ఉండే ఊరి నుంచి 16 కిలోమీటర్లు కిట్ బ్యాగులు మోసుకొని చెన్నై వెళ్లి చక్రవర్తి ఇచ్చే రోజువారీ శిక్షణ ముగించుకొని తిరిగి బస్సులో ఇంటికి చేరేవాడు. నిండా పదేళ్లు (9) లేకపోయినా సురపేట్ నుంచి మొగప్పాయిర్, అక్కడి నుంచి అన్నా నగర్, అటుపై లయోలా కాలేజ్ అతని టెన్నిస్ శిక్షణ సాగేదని కోచ్ చక్రవర్తి వివరించారు. ‘అదేంటో ఏమో దక్షిణేశ్వర్ బాల్యం నుంచే ఎవరితోనైనా సరే ఆడేందుకు ఇష్టపడేవాడు. కష్టపడేందుకు, నేర్చుకునే క్రమంలో ఆడిగేందుకు సిగ్గుపడడు. కానీ తన పనిమాత్రం నింపాదిగా, నిశ్శబ్దంగానే చేసుకునేవాడు. అతనిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పెప్సీ, కోక్లాంటి కూల్డ్రింక్స్ తాగేవాడే కాదు. కఠినమైన క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అవకాశాలేమో పరిమితంగా వస్తే, ఆర్థిక సమస్యలు అపరిమితంగా చుట్టిముట్టినా కూడా క్రమశిక్షణతోనే అధిగమించాడు. 2016లో ఫ్రాన్స్లో శిక్షణకు వెళ్లాడు. ఆ తర్వాతే అండర్–16 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచాడు’ అని 65 ఏళ్ల కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి తన శిష్యుడి ప్రయాణం చెబుతూ మురిసిపోయారు. ప్రస్తుతం అమెరికాలో... దక్షిణేశ్వర్ ఆటలో క్రమంగా రాటుదేలుతున్నా... చదువెందుకని ఏనాడు అనుకోలేదు. ఆటలో కష్టపడ్డట్లే ఉన్నత విద్య కోసం కూడా అంతే క్రమశిక్షణతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ‘వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ’లో కమ్యూనికేషన్స్ విద్యను అభ్యసిస్తున్న అతని చదువు ఈ ఏడాది మే నెలలో పూర్తవనుంది. ఆ తర్వాత పూర్తిగా టెన్నిస్పైనే దృష్టి సారించనున్నాడు. దీంతో మరిన్ని విజయాలతో 470వ ర్యాంకులో ఉన్న ఈ తమిళనాడు ప్లేయర్ నిలకడైన విజయాలు సాధిస్తే మరో ఏడాది తిరిగేసరికి టాప్–100 ర్యాంకింగ్స్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏడాది గడిచే సరికి...గతేడాది డేవిస్ కప్లో భారత్... స్విట్జర్లాండ్తో ఆడింది. 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆడిన భారత డేవిస్ బృందంలో దక్షిణేశ్వర్ ఉన్నాడు. బరిలోకి దిగి సింగిల్స్లో గెలిచాడు. అలా భారత్ విజయంలో దక్షిణేశ్వర్ పాత్ర ఉంది. ఏడాది తిరిగేసరికి 22 ఏళ్ల క్రితం లియాండర్ పేస్ రికార్డునే సమం చేసిన ఘనత దక్షిణేశ్వర్ది! 2004లో జపాన్పై పేస్ 3 మ్యాచ్లాడి పేస్ గెలిపించాడు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత దక్షిణేశ్వర్ నెదర్లాండ్స్తో తొలి సింగిల్స్ ఆడి గెలిచాడు. రెండో రోజు డబుల్స్, రివర్స్ సింగిల్స్ వరుసగా ఆడి కూడా గెలిపించాడు. పేస్ తర్వాత... దక్షిణేశ్వర్ కంటే ముందు... సోమ్దేవ్, విష్ణువర్ధన్, సాకేత్ మైనేని, సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ, గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ ఇలా ఎంతోమంది వచ్చారు. మెరుగైన ర్యాంకింగ్స్లో నిలిచారు. డేవిస్ కప్ ఆడారు. కానీ దక్షిణేశ్వర్ ర్యాంకింగ్స్లో వెనుకబడినా... భారత్ను ముందుండి గెలిపించే ప్రదర్శనైతే చేయలేదు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్లో భారత నంబర్వన్ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేశారు. పుణేలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి సహజ 6–4, 7–6 (8/6)తో ఎకతెరీనా మక్లాకోవా (రష్యా)పై, హైదరాబాద్ ప్లేయర్ రష్మిక 6–3, 6–2తో విక్టోరియా మిలోవనోవా (రష్యా)పై విజయం సాధించారు. మక్లాకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సహజ నాలుగు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన తొలి సర్వీస్లో 31 పాయింట్లు, రెండో సర్వీస్లో 14 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మిలోవనోవాతో 86 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రష్మిక తొమ్మిది ఏస్లు సంధించింది. తొలి సర్వీస్లో 32 పాయింట్లు, రెండో సర్వీస్లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. టాప్ సీడ్ జోడీని ఓడించి... డబుల్స్ విభాగంలో సహజ (భారత్)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్) జోడీ సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో సహజ–జుజానా ద్వయం 4–6, 7–6 (7/4), 11–9తో టాప్ సీడ్ ప్రార్థన తొంబారే (భారత్)–నికోల్ ఫోసా హ్యుర్గో (అర్జెంటీనా) జంటను బోల్తా కొట్టించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని–ఆకాంక్ష (భారత్) జోడీ 4–6, 3–6తో డేయోన్ బ్యాక్–సోహున్ పార్క్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. -
శుభారంభం లక్ష్యంగా...
రూర్కెలా: గత ప్రొ లీగ్ సీజన్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భాగంగా నేటి నుంచి భారత అంచె మ్యాచ్లు జరుగుతాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జట్టుతో రెండు మ్యాచ్ల చొప్పున ఆడేందుకు ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం, నాలుగో ర్యాంకర్ అర్జెంటీనా జట్లు సిద్ధమయ్యాయి.బుధవారం జరిగే తొలి మ్యాచ్లో బెల్జియంతో ఆడనున్న టీమిండియా... గురువారం ఒలింపిక్ మాజీ చాంపియన్ అర్జెంటీనాతో తలపడుతుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం బెల్జియం జట్టుతో, ఆదివారం అర్జెంటీనాతో భారత్ మళ్లీ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్ తాజా సీజన్లో భారత్ మాత్రమే చివరి జట్టుగా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్ ఎనిమిదేసి మ్యాచ్లు... అర్జెంటీనా, బెల్జియం, జర్మనీ నాలుగేసి మ్యాచ్లు... పాకిస్తాన్ ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. గత సీజన్లో మాదిరిగా ఈసారి కూడా హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది. సీనియర్ స్టార్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్పై వేటు వేయడంతో అతని లేని లోటు తెలియకుండా తమ సత్తా చాటుకోవాలని అమన్దీప్ లాక్రా, మన్మీత్ సింగ్, రోషన్ కుజుర్ సిద్ధంగా ఉన్నారు. ముఖాముఖి పోరులో భారత్పై బెల్జియందే పైచేయిగా ఉంది. గత 13 ఏళ్లలో రెండు జట్లు 35 సార్లు తలపడ్డాయి. 22 మ్యాచ్ల్లో బెల్జియం గెలుపొందగా... 11 మ్యాచ్ల్లో భారత్ నెగ్గింది. మరో రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. -
పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో టోర్నీల నిర్వహణకు సంబంధించి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం పలు టోర్నమెంట్లో స్థాయిని తగ్గించడంతో పాటు మరికొన్ని టోర్నీలను అదనంగా చేర్చారు.వరల్డ్ టూర్ టోర్నమెంట్ల నిర్వహణ కోసం గత ఏడాది 32 దేశాలు దరఖాస్తు చేయగా, ఈసారి డిమాండ్ మరింతగా పెరిగి 56 దేశాలు మ్యాచ్ల నిర్వహణకు ఆసక్తి చూపించాయి. అస్తవ్యస్త నిర్వహణ పట్ల విమర్శలు.. అయినా ఓ శుభవార్తదాంతో భిన్న దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం భారత్ ఎప్పటిలాగే కచ్చితంగా నిర్వహించే ఏడాదికి నాలుగు టోర్నీల సంఖ్య తగ్గి రెండుకు పరిమితం అయింది.ఇక 2023లో సూపర్–750 టోర్నీగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియా ఓపెన్ (India Open Retains)అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇటీవల ఈ టోర్నీ అస్తవ్యస్త నిర్వహణ పట్ల పలు విమర్శలు వచ్చిన... అదృష్టవశాత్తూ బీడబ్ల్యూఎఫ్ నుంచి ఎలాంటి చర్యలూ ఎదురు కాలేదు. సయ్యద్ మోడీనే స్థాయి తగ్గించిఅయితే మరో టోర్నీ సయ్యద్ మోడీ సూపర్–300 స్థాయి మాత్రం మారింది. లక్నోలో ప్రతీ ఏటా భారత మాజీ షట్లర్ సయ్యద్ మోడీ సంస్మరణార్ధం నిర్వహించే ఈ టోర్నీని ఇప్పుడు సూపర్–100కు పరిమితం చేశారు.ఇండియా ఓపెన్ కాకుండా తమకు సూపర్–100 మాత్రమే దక్కే అవకాశం ఉండటంతో దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతున్న టోర్నీ కాబట్టి పేరు మార్చకుండా సయ్యద్ మోడీనే స్థాయి తగ్గించి కొనసాగించాలని నిర్ణయించుకున్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భారత్లో కొనసాగుతున్న మరో రెండు సూపర్–100 టోర్నీలు (గువహటి, ఒడిషా)లను సర్క్యూట్నుంచి బీడబ్ల్యూఎఫ్ పూర్తిగా తొలగించింది. మొత్తం 36 టోర్నీలు... బీడబ్లూఎఫ్ కొత్త క్యాలెండర్ ప్రకారం ఒక ఏడాదిలో టోర్నీలను ఆరు స్థాయిల్లో విభజించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ అన్నింటికంటే అగ్రభాగాన ఉంటుంది. ఆ తర్వాత 5 సూపర్–1000, 5 సూపర్–750, 9 సూపర్–500, 8 సూపర్–300 టోర్నీలు జరుగుతాయి. తొలి సారి సూపర్–100 టోర్నీలను కూడా ప్రధాన టూర్ సర్క్యూట్లో చేర్చారు. ఏడాదికి 8 సూపర్–100 టోర్నమెంట్లు నిర్వహిస్తారు.గతంలో సూపర్–1000 టోర్నీలు నాలుగు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటిని ఐదుకు పెంచారు. అన్ని టోర్నీలు కలిపి మొత్తం ప్రైజ్మనీని 26.9 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 245 కోట్లు) పెంచుతున్నట్లు కూడా బీడబ్ల్యూఎఫ్ ప్రటించింది. ఫార్మాట్లో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది.లీగ్ కం నాకౌట్ పద్ధతిలోఇప్పటి వరకు తొలి మ్యాచ్నుంచి ‘నాకౌట్’ కాగా...ఇప్పుడు దీనిని మార్చి లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఒక్కో ప్లేయర్ ఒక టోర్నీలో కనీసం రెండు మ్యాచ్లైనా ఆడే అవకాశం కల్పించాలనేదే అందుకు కారణం. టీమ్ ఈవెంట్లు సుదిర్మన్ కప్, థామస్ కప్, ఉబెర్ కప్లలో కూడా జట్ల సంఖ్యను పెంచనున్నారు. మరింత ఎక్కువ మందికి బ్యాడ్మింటన్కు చేరువ చేసే క్రమంలో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లను టీవీల్లో ప్రసారం చేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ఏడాదికి కనీసం 3 వేల మ్యాచ్లు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. పావురాల రెట్టలున్యూఢిల్లీలో ఇండియా ఓపెన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని.. ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.బ్లిచ్ఫీల్డ్ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగి.. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించింది. -
ఇలవేనిల్–అర్జున్ జోడీకి స్వర్ణ పతకం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలారివన్–అర్జున్ బబూతా ద్వయం భారత్కు పసిడి పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్–అర్జున్ జోడీ 505 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 10 మీటర్ల జూనియర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో హిమాన్షు–శాంభవి ద్వయం 502.4 పాయింట్లు స్కోరు చేసి భారత్ ఖాతాలో పసిడి పతకాన్ని చేర్చింది. ముకేశ్కు రజతం, తనిష్క్ కు కాంస్యం 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్ పురుషుల ఈవెంట్లో భారత షూటర్లు గుర్ప్రీత్ (575 పాయింట్లు), హర్‡్ష (571), అమన్ ప్రీత్ (569) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ పురుషుల ఈవెంట్లోనూ భారత షూటర్లు క్లీన్స్వీప్తో అదరగొట్టారు. సూరజ్ శర్మ (576 పాయింట్లు)స్వర్ణం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి (559) రజతం... తెలంగాణకు చెందిన కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు (557) కాంస్య పతకం సాధించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు భారత షూటర్లు 30 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 50 పతకాలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. -
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగాళ్ల ర్యాంక్లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్ సురేశ్... ప్రపంచ సింగిల్స్లో 465వ ర్యాంక్... భారత్లో నాలుగో ర్యాంక్... ప్రపంచ డబుల్స్లో 457వ ర్యాంక్... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్ భారత్కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో టీమిండియా వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్కు అర్హత సాధించింది. 2004లో జపాన్ జట్టుపై లియాండర్ పేస్ తర్వాత భారత్ నుంచి ఒక ప్లేయర్ రెండు సింగిల్స్లో, ఒక డబుల్స్లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్ ఆదివారం ముందుగా డబుల్స్ మ్యాచ్లో భారత డబుల్స్ నంబర్వన్, ప్రపంచ 20వ ర్యాంకర్ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీని ఓడించింది. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్గా జరిగిన రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్లో దక్షిణేశ్వర్ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్ను ఓడించి భారత్కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
సర్వీసెస్ సూపర్...
గువాహటి: జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్వీసెస్ 1–0 గోల్స్ తేడాతో కేరళపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. సర్వీసెస్ స్ట్రయికర్ అభిõÙక్ పవార్ (109వ నిమిషంలో) మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ చేశాడు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లగా... అందులో సర్వీసెస్ సత్తా చాటింది. 2012–13లోనూ ఈ రెండు జట్ల మధ్యే సంతోష్ ట్రోఫీ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా సర్వీసెస్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లోనూ నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాకపోగా... పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో అలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణి అవలంభించాయి. కేరళ జట్టు కొన్ని ప్రయత్నాలు చేసినా... సర్వీసెస్ గోల్కీపర్ గగన్దీప్ సింగ్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. అదనపు సమయంలో అభిõÙక్ గోల్తో సర్వీసెస్ ఖాతా తెరవగా... ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు కేరళ ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. గ్రూప్ దశలోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అభిõÙక్ ఏకైక గోల్ చేసి సర్వీసెస్ను గెలిపించగా... ఇప్పుడూ అదే సీన్ రిపీట్ చేశాడు.


