Other Sports
-
సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం ఉబెర్ కప్ టోర్నమెంట్తో బిజీగా ఉంది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సింధు తన ఆట తీరుతోనే కాకుండా.. కుడి కణతపై ధరించిన ప్రత్యేక పరికరంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ డివైస్ పేరు ‘టెంపుల్’.ఎందుకీ ‘టెంపుల్’?జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా.. పీవీ సింధు ఓ అంతర్జాతీయ మ్యాచ్లో దీనిని ధరించడం విశేషం. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ స్థాయిలను ‘టెంపుల్’ రియల్ టైమ్లో కొలుస్తుందని సమాచారం. దీని ద్వారా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, మెదడు పనితీరును అంచనా వేయొచ్చని తెలుస్తోంది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి టెక్నాలజీతో ఇది మెదడులో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుందని సమాచారం. కేవలం ఇంచు పొడవు ఉండే ‘టెంపుల్’ను మూడు- నాలుగు గంటల పాటు ధరించవచ్చు. ఇది బ్రెయిన్ ఫిట్నెస్ ట్రాకర్లా ఉపయోగపడుతుందని సమాచారం. ముఖ్యంగా క్రీడాకారులు మ్యాచ్ ఆడే సమయంలో లేదంటే ప్రాక్టీస్ సెషన్లో ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంది? మానసిక ఒత్తిడి, అలసట, రికవరీ తదితర అంశాలకు సంబంధించిన డేటా విశ్లేషణకు ఈ డివైస్ ఉపయోగపడనుంది.స్పందించిన సింధు భర్తఇక సింధు ధరించిన ‘టెంపుల్’ గురించి ఆమె భర్త వెంకటదత్త సాయి (Venkata Datta Sai) స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈ డివైస్ ద్వారా తన మెట్రిక్స్ కొలుస్తున్నాము. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీని ద్వారా వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆరంభ దశలో వస్తున్న ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని వెంకటదత్త సాయి హర్షం వ్యక్తం చేశారు. కాగా క్రీడా ప్రపంచంలో ఇప్పుడు ఈ ‘టెంపుల్’ డివైస్ చర్చనీయాంశంగా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉబర్ కప్ సింగిల్స్ మ్యాచ్లో 30 ఏళ్ల పీవీ సింధు తొలుత లీనీ క్రిస్టోఫర్సెన్ను ఎదుర్కొంది. ఆతిథ్య డెన్మార్క్ చెందిన 26 ఏళ్ల లినీని సింధు 21-13, 18-21, 21-17 తేడాతో ఓడించి గెలుపుజెండా ఎగురవేసింది. పందొమ్మిదేళ్లు కాదని గుర్తు చేస్తోందిఈ నేపథ్యంలో మ్యాచ్లు ముగించుకున్న తర్వాత పీవీ సింధు చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘‘రెండు గంటల్లో రెండు మ్యాచ్లు.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు నా శరీరం.. ‘ఇంకా నీ వయసు 19 కాదు అని మర్యాదగా గుర్తు చేసింది. రెండు మ్యాచ్లు గెలవడం సంతోషంగా ఉంది’’ అని సింధు క్యాప్షన్ జతచేసింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి! -
భారత్కు మిశ్రమ ఫలితాలు
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్ కప్లో భారత పురుషుల జట్టు గెలుపు బోణీ కొట్టగా... ఉబెర్ కప్లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. కెనడాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 4–1తో గెలిచింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్, భారత నంబర్వన్ లక్ష్య సేన్ 21–18, 19–21, 10–21తో ప్రపంచ 13వ ర్యాంకర్ విక్టర్ లాయ్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–10, 21–11తో జొనాథన్ బింగ్–కెవిన్ లీ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత మూడో మ్యాచ్లో ఆసియా చాంపియన్షిప్ రన్నరప్ ఆయుశ్ శెట్టి 21–13, 21–17తో బ్రియాన్ యాంగ్పై గెలిచి భారత్కు 2–1తో ఆధిక్యం అందించాడు.నాలుగో మ్యాచ్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ ద్వయం 21–7, 21–15తో లిండెమన్–నిల్ యకూరా జోడీని ఓడించి భారత్కు 3–1తో విజయాన్ని ఖరారు చేసింది. ఐదో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–12తో జోషువా నుగుయెన్పై నెగ్గడంతో భారత్ 4–1తో ముగించింది. సోమవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. సింధు గెలిచినా.... మరోవైపు భారత మహిళల జట్టు గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో 2–3తో ఆతిథ్య డెన్మార్క్ చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లో పీవీ సింధు 21–13, 18–21, 21–17తో లినె క్రిస్టోఫర్సన్ను ఓడించింది. రెండో మ్యాచ్లో ఉన్నతి హుడా 12–21, 23–25తో లినె జార్స్ఫెల్ట్ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో ప్రియ–శ్రుతి మిశ్రా జోడీ 17–21, 21–11, 21–23తో అమెలియా–మెటీ వెర్జ్ జంట చేతిలో పరాజయం పాలైంది. నాలుగో మ్యాచ్లో తన్వీ శర్మ 21–19, 16–21, 16–21తో అమెలియా షుల్జ్ చేతిలో ఓటమి చెందడంతో భారత్ పరాజయం ఖరారైంది. నామమాత్రమైన చివరి మ్యాచ్లో సింధు–తనీషా క్రాస్టో ద్వయం తొలి గేమ్ను 19–21తో కోల్పోయి రెండో గేమ్లో 17–14తో ఆధిక్యంలో ఉన్న దశలో అలెగ్జాండ్రా బొయె–క్రిస్టీన్ బుష్ జోడీ గాయంతో వైదొలిగింది. నేడు జరిగే రెండో మ్యాచ్లో ఉక్రెయిన్తో భారత్ తలపడుతుంది. -
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం మనదేశంలో తరాలుగా వస్తున్న ఆనవాయితీ! ఐపీఎల్ వచ్చాక వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. అరచేతిలో ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య కోట్లు దాటేసింది. ఇదే బాటలో బ్యాడ్మింటన్ లీగ్, రెజ్లింగ్ లీగ్, టేబుల్ టెన్నిస్ లీగ్, ఖో ఖో లీగ్, ప్రీమియర్ టెన్నిస్ లీగ్, ఆర్చరీ లీగ్ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్లు కాస్తో కూస్తో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... క్రికెట్ తరహాలో దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకుంది. మట్టి ఆటతో మనకున్న అనుబంధాన్ని మ్యాట్పై చూపించడంతో గ్రామీణ ప్రేక్షకులు పీకేఎల్కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎటొచ్చి యావత్ ప్రపంచం వీపరీతంగా ఆదరించే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ పోటీలకు మాత్రం మన దేశంలో ఆదరణ చాలా తక్కువ. మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్కప్ జరగనున్నా... ఇప్పటి వరకు మనదేశంలో ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది అభిమానులు కూడా ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్కప్ ప్రత్యక్ష ప్రసార తీరు తెన్నులపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్బాల్ సమరానికి సమయం దగ్గరపడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్బాల్ మహాసంగ్రామం జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాగనుంది. నాలుగేళ్ల క్రితం ఖతర్లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇప్పుడు మూడు దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ వరల్డ్కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుండగా... మొత్తం 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. గత వరల్డ్కప్లో కేవలం 64 మ్యాచ్లు మాత్రమే జరగ్గా... ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. దీంతో సాధారణంగా ఆసక్తి కూడా మరింత పెరిగింది. ప్రపంచంలో 200కు పైగా దేశాల్లో ఫుట్బాల్ అభిమానులు ఉన్నారు. అందులో దాదాపు అన్నీ దేశాల్లో ఈ వరల్డ్కప్ ప్రసారాలు సాగనున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ ముగిసిన 11 రోజులకే... ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతుండటంతో... ఎక్కడ చూసినా ఫోర్లు, సిక్స్లు, స్కోర్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీతో ఐపీఎల్ ముగియనుండగా... ఆ తర్వాత 11 రోజులకే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. క్రికెట్ను మతంలా భావించే మనదేశంలో మొదటి నుంచి ఫుట్బాల్కు ఆదరణ అంతంతమాత్రమే... ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల తప్ప ఫుట్బాల్పై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువ. మన దేశ ఫుట్బాల్ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేక పోతుండటంతో పాటు... దక్షిణ అమెరికా, యూరప్ దేశాల హవా సాగే ఫుట్బాల్ వరల్డ్కప్పై మనవాళ్లకు ఆసక్తి తక్కువే. ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంటే... ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. 100 నుంచి 35 మిలియన్ డాలర్లలకు... తాజా ప్రపంచకప్తో పాటు 2030లో జరగనున్న వరల్డ్కప్ను కలిపి సంయుక్త ప్రసార హక్కులను భారత మార్కెట్లో 100 మిలియన్ డాలర్లకు నిర్వాహకులు విక్రయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు టోర్నీల ప్రసార హక్కులను 35 మిలియన్ డాలర్లకు తగ్గించినా... ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ‘భారత్లో ఫుట్బాల్ వీక్షణ గత కొంతకాలంగా బాగా క్షీణిస్తోంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ను చూస్తే 2013–14లో దాని విలువ 145 మిలియన్ డాలర్లు ఉండేది... అది ఇప్పుడు 60 మిలియన్ డాలర్లకు పడిపోయింది’ అని స్పోర్ట్స్ గేమింగ్ రంగ నిపుణుడు తెలిపాడు. చేతులు కాల్చుకున్న సోనీ, రిలయన్స్ 2014, 2018 ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీలను భారత్లో సోనీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. వీటితో 2016 యూరో కప్ను కలిపి మొత్తం 90 మిలియన్ డాలర్లకు వాణిజ్య హక్కులు దక్కించుకుంది. ఆ తర్వాత 2022 వరల్డ్కప్ ప్రసార హక్కులను 60 మిలియన్ డాలర్లకు రిలయన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆశించిన లాభాలు గడించలేకపోయాయి. దీంతో ఈసారి ప్రసార హక్కుల విషయంలో తర్జన భర్జన ఇంకా సాగుతోంది.‘భారత్లో కేవలం అభిమానులు లేకపోవడమే కాక... మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుట్బాల్ వీక్షణల విషయంలో జపాన్తో భారత్ను పోల్చడం అవివేకం’ అని స్పోర్ట్స్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ లైవ్ మేనేజింగ్ పార్ట్నర్ రోహిత్ అన్నారు. టైమింగ్తో తలనొప్పి... ఈసారి ఫుట్బాల్ పండగ జరుగుతున్న కెనడా, మెక్సికో, అమెరికా కాలమానంతోనూ మనకు ఇబ్బంది ఎదురవుతోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామునే ఎక్కువ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో వీక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎంత ప్రధానమైన ఈవెంట్ అయినా... ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే సమయంలో కాకుండా... అర్ధరాత్రి, అపరాత్రి ప్రసారం చేస్తే వీక్షణలు తగ్గడం సహజమే. ఈ టోర్నమెంట్లోని 104 మ్యాచ్ల్లో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రికి ముందు ప్రారంభం కానున్నాయి. 2022 ఖతర్ వేదికగా జరిగిన టోర్నమెంట్లోని 64 మ్యాచ్ల్లో 44 మ్యాచ్లు ‘ప్రైమ్ టైమ్’లోనే ప్రసారమయ్యాయి. లాభాలు లేకే... మన దేశంలో 2022 ప్రపంచకప్ స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. జియో సినిమా యాప్లో ఉచితంగా లైవ్ అందించగా... స్పోర్ట్స్–18 ఛానల్ మాత్రం ఈ మెగా టోర్నీ కోసం నెలకు 12 రూపాయలు వసూలు చేసింది. ఫుట్బాల్ దేశాల్లో ఈ ధర ఎంత భారీగా ఉన్నా... వాటి వీక్షణల్లో ఎలాంటి మార్పు రాదని... కానీ మనదేశంలో మాత్రం ఫుట్బాల్ కోసం సభ్యత్వం తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో అయినా లాభాలు రాకపోతే దాన్ని కొనసాగించడం కష్టమే కాబట్టి... ఏ రకంగా చూసుకున్న మన దేశంలో ఫిఫా ప్రపంచకప్నకు ఆదరణ పెద్దగా ఉండదనే ఉద్దేశంతోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాణిజ్య ప్రకటనలకు సమయమేది? భారత ఫుట్బాల్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్న సమయంలో సైతం అభిమానులు లైవ్పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రోజురోజుకూ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. గత ఏడాది కాలంలో ఐఎస్ఎల్ ప్రసార హక్కుల విలువలో 97 శాతం తగ్గుదల నమోదైంది. క్రికెట్లో అయితే ఓవర్కు ఓవర్కు మధ్య వచ్చే వాణిజ్య ప్రకటనలతో ప్రసార కర్తలకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది. కానీ... ఫుట్బాల్కు మన దేశంలో అంతటి ఆదరణ ఉండదని ప్రసార సంస్థల నిపుణులు అంటున్నారు. ‘క్రికెట్లో ఓవర్ మారినా, వికెట్ పడినా... వాణిజ్య ప్రకటనలకు వీలు ఉంటుంది. టెన్నిస్లోనూ సెట్ తర్వాత స్లాట్లు ఉంటాయి. కానీ ఫుట్బాల్లో మ్యాచ్లకు ముందు, తర్వాత, విరామంలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం చాలా తక్కువ’ అని ఆయన అన్నారు. దూరదర్శన్కే చాన్స్... మనదేశంలోని ప్రముఖ ప్రసారకర్తలు జియో హాట్స్టార్, ఫ్యాన్కోడ్, సోనీ స్పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్లతో చర్చలు నిర్వహించాలని ‘ఫిఫా’ భావిస్తోంది. ఒకవేళ ప్రసార కర్తలు ఎవరూ ముందుకు రాకపోతే... ప్రభుత్వ ప్రసారకర్త దూరదర్శన్లో వరల్డ్కప్ ప్రసారమయ్యే అవకాశముంది. 1998, 2002, 2006 ప్రపంచకప్లోని పలు మ్యాచ్లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 1998 ప్రపంచకప్ ప్రసార హక్కుల ద్వారా దూరదర్శన్ రూ. 3.5 కోట్ల లాభం కూడా పొందడం విశేషం. -
దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివ్యాంశు దేవాంగన్–శాంభవి క్షీరసాగర్ జోడీ భారత్కు బంగారు పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య జరిగిన ఫైనల్లో దివ్యాంశు–శాంభవి జంట 499.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. సయ్ చియె యింగ్–చెన్ యు ఆన్ (చైనీస్ తైపీ) జంట 498.3 పాయింట్లో రజతం గెల్చుకోగా... టిఫెన్ పోమెస్–గాస్పర్డ్ లెసియర్ (ఫ్రాన్స్) జోడీ 434.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 17 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో దివ్యాంశు–శాంభవి జంట 632 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలవడంతోపాటు ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో భారత షూటర్ సమీర్ 7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 17 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్లో సమీర్ 573 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందాడు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఫ్రెంచ్ ఓపెన్కు అల్కరాజ్ దూరం
పారిస్: కుడి మణికట్టు గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్తోపాటు రోమ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో ఆడటం లేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రకటించాడు. 2024, 2025లలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గినఅల్కరాజ్ గత ఏడాది రోమ్ ఓపెన్లోనూ విజేతగా నిలిచాడు. ఈ రెండు టోర్నీలకు అల్కరాజ్ దూరం కానుండటంతో 3000 ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోనున్నాడు. గతవారం బార్సిలోనా ఓపెన్ సందర్భంగా అల్కరాజ్ మణికట్టు గాయంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. -
విజయోస్తు!
నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల జట్టు... సెమీఫైనల్ చేరడమే తొలి లక్ష్యంగా భారత మహిళల జట్టు... ప్రతిష్టాత్మక టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ థామస్ కప్, ఉబెర్కప్లలో బరిలోకి దిగనున్నాయి. హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ అసాధారణ ప్రదర్శనతో 2022లో భారత పురుషుల జట్టు తొలిసారి థామస్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప తదితరుల మెరుపులతో 2014, 2016లలో వరుసగా రెండు పర్యాయాలు భారత మహిళల జట్టు ఉబెర్ కప్లో సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఈసారి అటు పురుషుల జట్టుతోపాటు ఇటు మహిళల జట్టుకు గ్రూప్ దశలో కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. తమ గ్రూప్లో టాప్–2లో నిలిచి ముందుగా క్వార్టర్ ఫైనల్ చేరడమే భారత జట్ల లక్ష్యం కానుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ నాకౌట్ పోరులో నెగ్గితే సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకుంటాయి. బలాబలాలను పరిశీలిస్తే భారత మహిళల జట్టుతో పోలిస్తే భారత పురుషుల జట్టుకు ఈసారి పతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రణయ్... కిడాంబి శ్రీకాంత్... లక్ష్య సేన్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఈ ఐదుగురికి ఎలా ఆడితే థామస్ కప్లో టైటిల్ సాధించగలమో తెలుసు. 2022లో టీమిండియాకు థామస్ కప్ దక్కడంలో ఈ ఐదుగురు కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ ఐదుగురికి ఆయుశ్ శెట్టి రూపంలో రైజింగ్ స్టార్ జత కలిశాడు. ఫలితంగా 2022 చాంపియన్ భారత జట్టు ఈసారి థామస్ కప్లో టైటిల్పై గురి పెట్టింది. సింగిల్స్లో రెండు, డబుల్స్లో ఒక విజయం లభిస్తే మ్యాచ్ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి బలగంతో థామస్ కప్లో అడుగు పెట్టిన భారత జట్టు రెండోసారి అద్భుతం చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో ఆయుశ్ శెట్టి రన్నరప్గా నిలిచి తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్ చేరిన క్రమంలో టాప్–10లోని ముగ్గురు క్రీడాకారులను ఆయుశ్ ఓడించాడు. ఈ నేపథ్యంలో ఆయుశ్, లక్ష్య సేన్, ప్రణయ్, శ్రీకాంత్, సాత్విక్–చిరాగ్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం కష్టమేమీ కాదు. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత 27న ఆ్రస్టేలియాతో... 29న చైనాతో టీమిండియా మ్యాచ్లున్నాయి. మరోవైపు భారత మహిళల జట్టు ఆశలన్నీ సింగిల్స్ ప్లేయర్స్పైనే ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ స్టార్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ వైదొలగడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే... మూడు సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్లు గెలవాల్సి ఉంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ను నేడు ఆతిథ్య డెన్మార్క్ జట్టుతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే చైనా, ఉక్రెయిన్ జట్లు కూడా ఉన్నాయి. చైనాపై భారత్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో... క్వార్టర్ ఫైనల్ చేరాలంటే డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లపై భారత్ నెగ్గాల్సి ఉంటుంది. డెన్మార్క్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం నాకౌట్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డెన్మార్క్తో మ్యాచ్ అనంతరం భారత్ రెండో మ్యాచ్ను 25న ఉక్రెయిన్తో, మూడో మ్యాచ్ను 27న చైనాతో ఆడుతుంది. థామస్ కప్ టోర్నీకి భారత జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, హరిహరన్, ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల. ఉబెర్ కప్ టోర్నీకి భారత జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, తనీషా క్రాస్టో, ప్రియ కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా, సెల్వం కవిప్రియ, సిమ్రన్. -
భారత్కు రాలేము.. కీలక టోర్నీ నుంచి పాకిస్తాన్ అవుట్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్ఫ్ టోర్నీలో భారత్కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్గిర్లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లలేదు. తమ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
ఢాకా: దశాబ్దం తర్వాత భారత్ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్) దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్ ‘ఎ’లో నేపాల్ (87వ ర్యాంక్), శ్రీలంక (162), భూటాన్ (164)... గ్రూప్ ‘బి’లో భారత్ (69వ ర్యాంక్), బంగ్లాదేశ్ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి. భారత్ తమ లీగ్ మ్యాచ్లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ జూన్ 3న జరుగుతాయి. ఫైనల్ను జూన్ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్ సాధించింది. -
బెస్ట్ అల్కరాజ్, సబలెంకా
మాడ్రిడ్: క్రీడా ప్రపంచంలో అస్కార్ అవార్డులుగా భావించే లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా బెలారూస్ టెన్నిస్ స్టార్ సబలెంకా పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి లారియస్ అవార్డులు ప్రతియేటా ఇస్తున్నారు. గత ఏడాది అల్కరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్తోపాటు మరో ఆరు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ స్పెయిన్ స్టార్, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ఓవరాల్గా 71 మ్యాచ్ల్లో గెలిచి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 2026 సీజన్ను కూడా అల్కరాజ్ ఘనంగా ప్రారంభించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో తొలిసారి టైటిల్ గెలిచి టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించాడు. గతవారం బార్సిలోనా ఓపెన్ టోర్నీలో మణికట్టు గాయానికి గురైన అల్కరాజ్ మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతానని 22 ఏళ్ల అల్కరాజ్ వ్యాఖ్యానించాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ‘లారియస్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకున్న నాలుగో టెన్నిస్ ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళల టెన్నిస్ నంబర్వన్ సబలెంకా కూడా గతేడాది నిలకడగా రాణించింది. యూఎస్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలోనూ రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ఓవరాల్గా సీజన్లో నాలుగు టైటిల్స్ సొంతం చేసుకున్న ఆమె 63 మ్యాచ్ల్లో గెలిచి, 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఫ్రాన్స్కు చెందిన ఫుట్బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) గెల్చుకుంది. గత ఏడాది పీఎస్జీ జట్టు తొలిసారి ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్ను సాధించింది. ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కూడా నామినేట్ అయింది. గత ఏడాది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్కప్ను సాధించింది. అయితే తుదకు ఈ అవార్డు పీఎస్జీ జట్టుకు లభించింది. రొమేనియా దిగ్గజ జిమ్నాస్ట్ నాడియా కొమనెసికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 64 ఏళ్ల నాడియా ఒలింపిక్స్ క్రీడల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసిన తొలి జిమ్నాస్ట్గా రికార్డు నెలకొల్పింది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్లో ఆల్ అరౌండ్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్లలో నాడియా ‘పర్ఫెక్ట్ 10’ స్కోరుతో స్వర్ణ పతకాలు సాధించింది. అంతర్జాతీయ కెరీర్లో నాడియా మొత్తం తొమ్మిది ఒలింపిక్ పతకాలు, నాలుగు ప్రపంచ చాంపియన్షిప్ పతకాలు, మూడు వరల్డ్కప్ ఫైనల్ పతకాలు గెలుచుకుంది. లారియస్ అవార్డు విజేతల జాబితావరల్డ్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ద ఇయర్: కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్, టెన్నిస్) వరల్డ్ స్పోర్ట్స్ఉమన్ ఆఫ్ ద ఇయర్: సబలెంకా (బెలారూస్, టెన్నిస్) వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: పారిస్ సెయింట్ జెర్మయిన్ (ఫ్రాన్స్, ఫుట్బాల్) వరల్డ్ బ్రేక్థ్రూ ఆఫ్ ద ఇయర్: లాండో నోరిస్ (బ్రిటన్, ఫార్ములావన్) వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్: రోరీ మెకిల్రాయ్ (నార్తర్న్ ఐర్లాండ్, గోల్ఫ్) వరల్డ్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ (దివ్యాంగులు): గాబ్రియెల్ అరుజో సాంతోస్ (బ్రెజిల్, స్విమ్మింగ్) వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్: చోల్ కిమ్ (అమెరికా, స్నో బోర్డ్) వరల్డ్ యంగ్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్: లామినె యామల్ (స్పెయిన్, ఫుట్బాల్) స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డు: టోనీ క్రూస్ (జర్మనీ, ఫుట్బాల్) లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు: నాడియా కొమనెసి (రొమేనియా, జిమ్నాస్టిక్స్) స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డు: ఫుట్బాల్ మాస్ -
శివ నర్వాల్ పసిడి గురి
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో తొలి రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ శివ నర్వాల్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చిరాగ్ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో శివ నర్వాల్ 241.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. 240 పాయింట్లతో సోదిక్జోన్ అబ్దుల్లాయెవ్ రజత పతకం... 218.9 పాయింట్లతో చిరాగ్ శర్మ కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో పోటీపడ్డ భారత మూడో షూటర్ అభినవ్ దేశ్వాల్ 136.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ పనాహ్ బుగ్రా రజత పతకం సంపాదించింది. ఫైనల్లో పనాహ్ 250.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. -
పంజాబ్ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్ పాఠాలు!
చండీగఢ్: నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం ఫ్లోరిస్ జాన్ బోవెలాండర్తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు రాష్ట్రంలో హాకీని మరింత బలోపేతం చేయడానికి బోవెలాండర్ సేవలను వినియోగించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భగవంత్ మాన్... ఇందులో భాగంగా హాకీపై బోవెలాండర్తో సుదీర్ఘంగా చర్చించారు. హాకీకి పునరై్వభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా బోవెలాండర్ అసాధారణ ప్రతిభను మాన్ ప్రశంసించారు. ఆయన క్రీడా ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి పంజాబ్ ఆతిథ్యమివ్వనుంది. ప్లేయర్ల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు పంజాబ్కు రావాల్సిందిగా బోవెలాండర్ను భగవంత్ మాన్ ఆహ్వానించారు. దీనికి డచ్ దిగ్గజం సుముఖత వ్యక్తం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు బోవెలాండర్ భారత్కు రానున్నట్లు మాన్ వెల్లడించారు. ‘క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, హాకీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పంజాబ్ కట్టుబడి ఉంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి పంజాబ్ ఆతిథ్యమివ్వనుంది. భారత హాకీలో ఎప్పటి నుంచో పంజాబ్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 50 మందికి పైగా పంజాబ్ ప్లేయర్లు హాకీలో ఒలింపిక్ పతకాలు సాధించారు. పది మందికిపైగా పంజాబ్ ప్లేయర్లు విశ్వక్రీడల్లో దేశానికి నాయకత్వం వహించారు. పంజాబీ ప్లేయర్ లేకుండా భారత హాకీ జట్టును ఊహించడం కష్టం. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులోనూ పది మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఘనచరిత్ర ఉన్న ప్లేయర్లకు దిశానిర్దేశం చేసేందుకు నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం బోవెలాండర్ అంగీకరించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆయన మన ప్లేయర్లలో స్ఫూర్తినింపనున్నారు’ అని భగవంత్ మాన్ వెల్లడించారు. -
ఆసియా క్రీడల ప్రసార హక్కులు సోనీ నెట్వర్క్కు
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానల్స్తో పాటు సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్వర్క్ ప్రతినిధి రాజేశ్ కౌల్ అన్నారు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్డ్ మార్షల్, సర్ఫింగ్ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు. ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్తక్రా, కురాశ్ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్ వెల్లడించారు. -
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బీఏటీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హైదరాబాద్లో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.చాముండేశ్వరనాథ్, వై.ఉపేందర్ రావు, జి.వెంకట రావు, పి.రమేశ్ రెడ్డి, ఉప్పాల శ్రీనివాస్ గుప్తా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా భారత జట్టు హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్, కోశాధికారిగా కానూరి వంశీధర్ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎల్.రవికుమార్, పి.మనోజ్ కుమార్, ఎం.జితేందర్ రెడ్డి, యు.వి.ఎన్.బాబు వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పి.రాంమోహన్ రావు, తోట రంగారావు, కె.శ్రీనివాస రావు, పుల్లూరి సుధాకర్, కొల్లి నాగవేణి ఎన్నికయ్యారు. సలహాదారుడిగా లక్ష్మణ్ కొసరాజు వ్యవహరిస్తారు. -
కేడీ జాదవ్కు ‘పద్మవిభూషణ్’పై తేల్చండి!
ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత్కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన మహారాష్ట్ర రెజ్లర్ ఖషాబా దాదాసాహెబ్ (కేడీ) జాదవ్కు ‘పద్మవిభూషణ్’ పురస్కారం అందించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి గడువునిస్తూ మే 4లోగా తేల్చాలని స్పష్టం చేసింది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన జాదవ్ 1984లో మృతి చెందారు.మరణాంతరం 2001లో ప్రభుత్వం ఆయనకు ‘అర్జున అవార్డు’ను ప్రకటించింది. అయితే దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ను ఆయనకు ప్రకటించాలని కోరుతూ కుస్తీవీర్ ఖషాబా జాదవ్ ఫౌండేషన్ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసింది. జాదవ్ కుమారుడు రంజిత్ ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు.గతంలో పలుమార్లు అవార్డు విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ అంశంపై విచారించిన బాంబే హైకోర్టు (కొల్హాపూర్ బ్రాంచ్) న్యాయమూర్తులు జస్టిస్ మాధవ్ జామ్దార్, జస్టిస్ ప్రవీణ్ పాటిల్ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచనలు చేస్తూ కేసును మే 5కు వాయిదా వేశారు. -
నా ఫేవరెట్ నేనే...
సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే వాళ్లు... ‘రోల్ మోడల్స్’ను ఆదర్శంగా తీసుకోవడం పరిపాటి! కానీ భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ మాత్రం తన అభిమాన ఆటగాడు తానే అని అంటున్నాడు. ప్రాక్టీస్లో భాగంగా ఇతర సీనియర్ రెజ్లర్ల వీడియోలకు బదులు తన వీడియోలే చూసి స్ఫూర్తి పొందుతానని చెబుతున్నాడు. కాగా 2025 జూన్లో జరిగిన అండర్–23 ఆసియా చాంపియన్షిప్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 65 కేజీల విభాగంలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న సుజీత్... బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.ఇటీవల కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణం నెగ్గిన సుజీత్... తనను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో మాత్రం లేనని వెల్లడించాడు.ఆ వివరాలు అతడి మాటల్లోనే...‘‘నేను ఎవరినీ అభిమానించను. ఇంకా చెప్పాలంటే నా అభిమాన రెజ్లర్ను నేనే. నా వీడియోలే ఎక్కువ చూస్తాను. ఆదివారం మొత్తం అదే పని పెట్టుకుంటా... నా ప్రాక్టీస్ బౌట్ల వీడియోలు చూసి స్వీయ విశ్లేషణ చేసుకుంటా. అప్పుడప్పుడూ యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, అమిత్ ధన్కర్ వంటి సీనియర్ల బౌట్లను పరిశీలిస్తా. వారి వేగం, బలం గమనిస్తా. కానీ ఎక్కువ శాతం మాత్రం నా బౌట్ వీడియోలే చూస్తా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాక్టీస్కే అధిక సమయం పోతుంది. ఆదివారం మాత్రమే వీలు దొరకుతుంది. అప్పుడు నా బౌట్లు చూసి అందులో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటా. నన్ను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో లేను. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ రోజు పోటీలో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబర్చారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నా వరకైతే ఈ జోరు కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నా. గత రెండేళ్లుగా భారత రెజ్లర్ల చేతిలో ఒక్క బౌట్లోనూ ఓడలేదు. కానీ ఆసియా క్రీడల్లో ఇరాన్, జపాన్ రెజ్లర్లతో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి పెట్టా. రెజ్లింగ్లో డిఫెన్స్దే కీలకపాత్ర. నా ప్రధాన బలం కూడా అదే. అటాకింగ్ గేమ్ పెంపొందించుకునేందుకు సాధన చేస్తున్నా. ఓర్పు పెంచుకుంటూ ప్రతిదాడిలో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. భారత ఫ్రీస్టయిల్ హెడ్ కోచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని జాతీయ శిబిరం ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ప్రతి అంశంలో మరింత మెరుగయ్యేందుకు కోచ్లు అనునిత్యం సాధన చేయిస్తున్నారు. దాని ఫలితాలు మున్ముందు మీరంతా చూస్తారు. నా బరువు కేటగిరీ రెజ్లర్లతోనే కాకుండా... నా కంటే ఎక్కువ బరువున్న వారితోనూ సాధన చేస్తున్న. దాని వల్ల శక్తిని పెంపొందించుకోవడంతో పాటు... మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు. ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్షిప్ జరగనున్నాయి. ఆ రెండు నాకు ఎంతో ముఖ్యం. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో వంద శాతం కష్టపడతా. ఇక గత ప్రపంచ చాంపియన్షిప్లో త్రుటిలో పతకం కోల్పోయా. ఈసారి అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పతకంతో తిరిగి వస్తా. అండర్–23 విభాగానికి సీనియర్ స్థాయికి పెద్ద తేడా ఏమీ లేదు. అందులోనూ ఇలాంటి పోటీనే ఉంటుంది. అయితే ప్రపంచ చాంపియన్షిప్ స్థాయి అన్నిటికంటే పెద్దది. అక్కడ పోటీ తీవ్రత అధికం. మామూలుగా ఎవరైనా మట్టిలో రెజ్లింగ్ ప్రారంభిస్తారు. కానీ నేను కెరీర్ ప్రారంభం నుంచే మ్యాట్పై పోటీపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మా నాన్న నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. దాని వల్ల నా డిఫెన్స్ మెరుగైంది. సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో 10–15 సెకన్లు చేసిన చిన్న తప్పిదం వల్ల పతకం దక్కలేదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక మీదట అలాంటి తప్పులు చేయను. అభిమానుల ఆదరణ అమోఘం. వారు నా నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు. తప్పక వారి కోరిక నెరవేరుస్తా. నా వరకైతే నేను పతకాలు సాధించగలనని వంద శాతం నమ్ముతున్నా. కానీ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు కదా!సంగీతంతో సేదతీరుతా...రోజులో ఎక్కువ శాతం మ్యాట్పై కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం సంగీతం వింటాను. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. అయితే అవన్నీ రెజ్లింగ్ తర్వాతే. కొన్ని సార్లు రిఫ్రెష్ అవడానికి పాటలు ఉపయోగపడతాయి. దేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో ఇష్టమైన విషయాలను పక్కన పెట్టా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా తక్కువ. కెరీర్ కోసం నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నా. ఇవన్నీ రెజ్లింగ్ కోసమే. నాన్న దయానంద్ రెజ్లింగ్ కోచ్ కావడంతో ఇంట్లో కూడా ఆటకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ క్రీడలోనైనా నిలకడ ముఖ్యం. అదే ఇతరులతో మనల్ని భిన్నంగా చూపుతుంది’’ అని సుజీత్ కల్కల్ పేర్కొన్నాడు.– సాక్షి క్రీడా విభాగం -
భారత 95వ గ్రాండ్మాస్టర్గా అరోణ్యక్ ఘోష్
రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్కు చెందిన యువ చెస్ ప్లేయర్ అరోణ్యక్ ఘోష్ గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ టోర్నమెంట్లో 22 ఏళ్ల ఈ కోల్కతా ప్లేయర్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో నార్మ్ను సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అరోణ్యక్ ఏడు పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2023లో సాంట్స్ ఓపెన్లో తొలి జీఎం నార్మ్ పొందిన అరోణ్యక్... 2024లో అనెమాస్ మాస్టర్స్ టోర్నీలో రెండో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో జాతీయ చాంపియన్గా ఉన్న అరోణ్యక్ గత ఏడాది ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధించాడు. తొలి రౌండ్లో మటెసుజ్ బార్టెల్ (పోలాండ్)ను ఓడించిన అతను రెండో రౌండ్లో లెవోన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 401వ ర్యాంక్లో ఉన్న అరోణ్యక్ ఖాతాలో 2533 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. -
రెజ్లింగ్ ఫ్యాన్స్కు బిగ్ షాక్!
డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ రెజ్లర్ బ్రాక్ లెస్నర్ (Brock Lesnar) అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రెజ్లిమేనియా 42 ఈవెంట్లో భాగంగా.. యువ రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో లెస్నర్ ఓటమి పాలయ్యాడు. తదనంతరం లెస్నర్ చర్యతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) అనేది ‘స్క్రిప్టెడ్ రెజ్లింగ్’ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫైటింగ్లో పాల్గొనే రెజ్లర్లు నిపుణుల సమక్షంలోనే ప్రాక్టీస్ చేసి స్టేజ్ ప్రదర్శనలు ఇస్తుంటారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ జామున నెవెడా స్టేట్ లాస్ వెగాస్లో అలెజెయింట్ స్టేడియం వేదికగా రెజ్లిమేనియా 42 మెయిన్ ఈవెంట్ జరిగింది. అయితే.. ఆద్యంతం ఆకట్టుకుంటుందని భావించిన లెస్నర్-ఒబా మ్యాచ్.. నిమిషాల వ్యవధిలో ముగియడం రెజ్లింగ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంతకాలం పవర్హౌస్గా పేరున్న లెస్నర్ ఏ దశలోనూ ఒబాకు పోటీ ఇవ్వలేకపోయాడు. తన ఫినిషింగ్ మూవ్ ఎఫ్-5 ఇచ్చినా.. ఒబా ఫెమి లేచి నిల్చోవడంతో అంతా షాక్లో ఉండిపోయారు. ఆ వెంటనే తన పవర్ బాంబ్ మూవ్తో ఒబా మ్యాచ్ను ముగించాడు. 48 ఏళ్ల వయసున్న బ్లాక్ లెస్నర్.. 27 ఏళ్ల నైజీరియా రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో ఓటమితో అభిమానులు షాక్కు గురయ్యారు. ఆ వెంటనే స్టేజ్పైనే కూర్చుండిపోయిన లెస్నర్ తన గ్లౌస్, షూస్ను వదిలి అక్కడి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. తన మేనేజర్ పాల్ హేమన్ను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పరిణామాలు లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ ముగింపు కావచ్చని భావిస్తున్నప్పటికీ.. ఈ ఏడాది సమ్మర్స్లామ్ ఈవెంట్లో లెస్నర్ చివరి మ్యాచ్ అడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. BROCK LESNAR RETIRING? 👀Brock left his gear in the ring and hugged Paul Heyman as the crowd cheered thank you after his match at #WrestleMania pic.twitter.com/8ts2gJWYpR— SportsCenter (@SportsCenter) April 19, 2026ఇక.. డబ్ల్యూడబ్ల్యూఈకే ప్రధాన ఈవెంట్గా చెప్పుకునే రెజ్లిమేనియా ఈసారి చప్పగా సాగింది. ఏప్రిల్ 18–19 తేదీల్లో రెండు రోజులపాటు సాగాయి మ్యాచ్లు. లక్ష మందికి పైగా అభిమానులు హాజరైన ఈ ఈవెంట్కు రెజ్లర్(రిటైర్డ్)-యాక్టర్ జాన్ సీనా హోస్ట్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ ఫలితాలు చాలా వరకు అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరీ ముఖ్యంగా లెస్నర్ను అంత దారుణంగా ఓడిపోయేలా స్క్రిప్ట్ రాయడంపై మండిపడుతున్నారు. అన్డిస్ప్యుటెడ్ చాంపియన్షిప్ కోసం జరిగిన మ్యాచ్లో కోడి రోడ్స్.. రాండీ ఆర్టన్ను ఓడించాడు. తద్వారా కోడి రోడ్స్ తన చాంపియన్షిప్ను విజయవంతంగా కాపాడుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రోమన్ రేన్స్, సీఎం పంక్ను ఓడించి హెవీవెయిట్ టైటిల్ను నెగ్గాడు. ఉమెన్స్ వరల్డ్ చాంపియన్షిప్ పోరులో లివ్ మోర్గాన్ స్టెఫనీ వాక్వర్పై విజయం సాధించింది. బెక్కీ లించ్, ఏజే లీను ఓడించి ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ టైటిల్ను గెలుచుకుంది. జేకబ్ ఫాటూ, డ్రూ మెక్ఇంటైర్పై విజయం సాధించాడు. ఉసోస్ & ఎల్ఏ నైట్లు ది విజన్-ఐషోస్పీడ్(ప్రముఖ య్యూట్యూబర్)ను ఓడించారు. రియా రిప్లీ, జేడ్ కార్గిల్ను ఓడించి మహిళల చాంపియన్షిప్ టైటిల్ను గెలిచింది. ట్రిక్ విలియమ్స్, సామీ జేన్ను ఓడించి యూస్ చాంపియన్షిప్ టైటిల్ను గెలిచాడు. ఫిన్ బాలర్, డొమినిక్ మిస్టీరియోను ఓడించాడు. గుంథర్, సెత్ రోలిన్స్ను ఓడించాడు. అయితే గుంథర్-రోలిన్స్ మ్యాచ్ ఒక్కటే ఈ ఈవెంట్కు హైలైట్గా నిలిచింది. -
బాలాజీ జోడీకి డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ తన కెరీర్లో 18వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. పోర్చుగల్లో జరిగిన ఒయిరాస్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నీలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–నీల్ ఒబెర్లేట్నర్ (ఆ్రస్టియా) ద్వయం విజేతగా నిలిచింది. బారియెంటోస్ (కొలంబియా)–బెహర్ (గ్రీస్) జోడీతో జరిగిన ఫైనల్లో బాలాజీ–ఒబెర్లేట్నర్ జంట 6–7 (7/9), 6–4, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచింది. ఈ ఏడాది బాలాజీ–ఒబెర్లేట్నర్లకు నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఒక గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో బాలాజీ, ఒబెర్లేట్నర్ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు సాధించింది. తొలి సర్వీస్లో 38 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు సంపాదించింది. టైటిల్ గెలిచిన బాలాజీ–ఒబెర్లేట్నర్లకు 9,010 యూరోల (రూ. 9 లక్షల 81 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జు వెన్జున్తో పోరుకు సిద్ధం: వైశాలి
చెన్నై: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్షి ప్ టైటిల్ పోరు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భారత గ్రాండ్మాస్టర్ వైశాలి వ్యాఖ్యానించింది. సైప్రస్లో గతవారం ముగిసిన క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం స్వస్థలం చెన్నైకు చేరుకున్న వైశాలికి ఘనస్వాగతం లభించింది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత హోదాలో వైశాలికి ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్లో తలపడే అవకాశం లభించింది. క్లాసికల్ ఫార్మాట్లో జు వెన్జున్ 2018 నుంచి విశ్వవిజేతగా కొనసాగుతోంది. ‘నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. నేను ఎన్నో ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్లను చూశాను. ఇప్పుడు నేనే ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్ ఆడబోతున్నాను. ఈ పోరు కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని వైశాలి తెలిపింది. ఈ ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో ప్రపంచ చాంపియన్షి ప్ టైటిల్ పోరులో భారత గ్రాండ్మాస్టర్లు, తమిళనాడు ప్లేయర్లు (గుకేశ్, వైశాలి) బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్ల ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేయాలని అఖిల భారత చెస్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. -
రేసింగ్లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!
ఫార్ములావన్ రేసింగ్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్స్రెకెన్ సిరీస్ (ఎన్ఎస్ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెటరన్ రేసింగ్ డ్రైవర్ 66 ఏళ్ల జుహా మియెట్టినెన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జుహా మియెట్టియెన్ బీఎండబ్ల్యూ 325ఐ రేసింగ్ కారుకు డ్రైవర్గా ఉన్నాడు. ఇక ఇదే రేసులో పాల్గొన్న నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ సహా మిగతా డ్రైవర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగు గంటలపాటు జరగాల్సిన ఈవెంట్లో రేస్ ప్రారంభమైన 25 నిమిషాలకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రాక్లోని క్లోస్టర్టాల్ వద్ద ఎత్తులో ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రేసును నిలిపేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పారా మెడికల్ సిబ్బంది జుహా మియెట్టియెన్ను కారులో నుంచి బయటికి తీసినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో వెర్స్టాపెన్ కూడా ఉన్నాడు. కాగా మియెట్టియెన్ మరణంపై ఎన్ఎస్ఎల్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ఇక మోటార్ స్పోర్ట్స్ నియంత్రణ సంస్థ (ఎఫ్ఐఏ) విచారం వ్యక్తం చేసింది. మియెట్టియెన్ మృతికి సంతాపం తెలిపిన ఎఫ్ఐఏ అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఆదివారం రేస్ జరుగుతుందని ఎన్ఎస్ఎల్ తెలిపింది. అయితే రేస్ ప్రారంభానికి ముందు మియెట్టియెన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఈ రేసులో మాక్స్ వెర్స్టాపెన్తో పాటు మెర్సిడెస్ రేసర్ లుకాస్ ఆర్ కూడా పాల్గొననున్నాడు. కాగా జుహా మియెట్టియెన్ మరణంపై మాక్స్ వెర్స్టాపెన్ స్పందించాడు. ‘మియెట్టియెన్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్టు పెట్టాడు. View this post on Instagram A post shared by 24hNürburgring (@24hnbr) -
విభిన్న మస్కట్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కోసం ప్రత్యేక మస్కట్ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్షిప్ జరగనుంది. గత దశాబ్దంలో ఈ చాంపియన్షిప్లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్–చిరాగ్ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్ రూపకల్పన ఉండాలని ‘బాయ్’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్’ అధికారిక వెబ్సైట్ https://www. badmintonindia.org/ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్ మ్యాచ్ వీఐపీ పాస్లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. -
2–2తో సమం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. -
ఉబెర్ కప్నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్కు బయల్దేరే ముందు ప్రాక్టీస్లో తన సహచర ప్లేయర్ పాదంపై ట్రెసా కాలు పడటంతో ఆమెకు గాయమైందని భారత డబుల్స్ కోచ్ బి. సుమీత్ రెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ట్రెసా రీహాబిలిటేషన్ తర్వాత కోలుకునే అవకాశం ఉంది. గాయత్రి – ట్రెసా స్థానంలో ఉబెర్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్బమ్లను ఎంపిక చేశారు. 2023లో జాతీయ చాంపియన్గా నిలిచిన ఈ జోడి 2024లో ఆసియా చాంపియన్షిప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. డెన్మార్క్లోని హార్సెన్స్ వేదికగా ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు థామస్, ఉబెర్ కప్ టోర్నీలు జరుగుతాయి. మరో వైపు ఈ టోర్నీలో సాధన కోసం భారత పురుషుల డబుల్స్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి డెన్మార్క్ బయల్దేరుతున్నారు. -
అమ్మ తోడుగా...ఆనందంగా
పాఫోస్ (సైప్రస్): ‘ఫిడే’ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలవడం తనకు అంతా కలలా అనిపించిందని భారత గ్రాండ్మాస్టర్ ఆర్.వైశాలి తన స్పందనను వెల్లడించింది. బుధవారం ముగిసిన టోర్నీ చివరి రౌండ్లో కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)ను ఓడించి వైశాలి అగ్ర స్థానంతో ముగించింది. ఫలితంగా ఈ ఏడాది చివర్లో చైనా గ్రాండ్మాస్టర్ జు వెన్జున్తో వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో తలపడేందుకు ఆమె అర్హత సాధించింది. ‘చాలా అద్భుతంగా. అంతా ఒక కలలా అనిపించింది. ఒక పాయింట్తో ఆధిక్యంలో ఉన్న సమయంలో జూ జినర్ చేతిలో ఓటమి ఒక్కసారిగా దెబ్బతీసింది. ఆ సమయంలో అందరూ పోటీలోకి వచ్చారు. అయితే చివరి రెండు రౌండ్లు మరింత ఏకాగ్రతతో పట్టుదలగా ఆడాను. నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించి గెలవడంతో ఈ సంతోష క్షణాలు దక్కాయి’ అని వైశాలి పేర్కొంది. ఫామ్లోకి వచ్చి... గత రెండేళ్లుగా వైశాలి ప్రదర్శన గొప్పగా లేదు. ముఖ్యంగా సంవత్సర కాలంలో వరుసగా పరాజయాలు పలకరించాయి. వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్లో పరాజయం సహా దాదాపు అన్ని టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఆమె ఆట ముగిసింది. ఒక్క గ్రాండ్స్విస్ టోర్నీలో మాత్రమే ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చింది. టైబ్రేక్లో టైటిల్ సాధించిన వైశాలి గ్రాండ్స్విస్ను నిలబెట్టుకున్న తొలి ప్లేయర్గా ఘనత సాధించింది. ‘క్యాండిడేట్స్ టోర్నీ కోసం చాలా చాలా కష్టపడ్డాను. గత ఏడాది కాలంలో నా వైఫల్యాలను బట్టి చూస్తే రెట్టింపు సమయం సన్నద్ధం కావాల్సి వచ్చింది. సరైన సమయంలో ఫామ్లోకి రావడంతో గ్రాండ్స్విస్ విజ యం లభించింది. దాని వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ గెలుపుతోనే నా జట్టు సభ్యులతో కలిసి మరింతగా దృష్టి పెట్టాను. గత రెండేళ్లలో ఆశించిన విజయాలు రాకపోయినా... ఆ కష్టమంతా ఇక్కడ ఫలితాన్ని అందించింది’ అని వైశాలి తన ఆనందాన్ని ప్రదర్శించింది. తక్కువ రేటింగ్ ఉన్నా... క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది మందిలో అందరికంటే తక్కువ రేటింగ్ వైశాలిదే. మిగతా ఏడుగురు ఆమెకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారే. ప్రస్తుతం ప్రపంచ క్లాసిక్ ర్యాంకింగ్స్లో 19వ స్థానంలో ఉన్న వైశాలి ఈ రకమైన ప్రతికూలతను కూడా అధిగమించి టైటిల్ సాధించడం ఆమె విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ‘నాకు అందరికంటే తక్కువ సీడింగ్ ఉందనే విషయం బాగా తెలుసు. అయితే నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎవరితోనైనా పోటీ పడి గెలవగలనని నమ్మాను. నా జట్టు సహచరులు నాపై నమ్మకం ఉంచారు. నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూ ఫలితం సాధించేలా చూశారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో రేటింగ్కంటే గేమ్ల కోసం చేసే ప్రత్యేక సన్నద్ధతే కీలకంగా మారుతుంది’ అని వైశాలి అభిప్రాయపడింది. కుటుంబ అండదండలే కారణం... క్యాండిడేట్స్ టోర్నీలో మహిళల విభాగంలో వైశాలి బరిలోకి దిగితే మరో వైపు ఓపెన్ కేటగిరీలో ఆమె తమ్ముడు ప్రజ్ఞానంద కూడా పోటీ పడ్డాడు. ఎప్పటిలాగే వారి తల్లి నాగలక్ష్మి తన పిల్లలకు తోడుగా ఈ టోర్నీకి కూడా వచ్చింది. ‘కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి ఉండే ఇలాంటి ఈవెంట్ల సమయంలో మానసికంగా కూడా అండదండలు అవసరం. అమ్మ, తమ్ముడు కూడా ఇక్కడే ఉండటం నాకు ఎంతో ప్రేరణగా నిలిచింది. వారు ప్రతీ దశలో నాకు మద్దతుగా నిలిచారు’ అని ఆమె భావోద్వేగంతో చెప్పింది. -
అటు రణరంగం... ఇటు జయకేతనం
ఒకవైపు స్వదేశంలో భీకర యుద్ధం... మరోవైపు క్రీడాంగణంలో ఇరాన్ మల్లయోధుల ఆధిపత్యం... అన్ని ప్రతికూలతలను అధిగమించి ఇరాన్ రెజ్లర్లు మరోసారి ఆసియా చాంపియన్షిప్లో పతకాల పంట పండించారు. ఈ మెగా ఈవెంట్కు సన్నద్ధమవుతున్న దశలో ఇరాన్లో యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ దాని ప్రభావం పడకుండా ఇరాన్ రెజ్లర్లు కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో గతవారం ముగిసిన ఆసియా చాంపియన్షిప్లో ఏకంగా 18 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. దాంతో ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ స్టయిల్లో ఇరాన్కే టీమ్ టైటిల్స్ లభించాయి. ప్రాణభయం వెంటాడుతున్నా అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ మల్లయోధులు తమ జెండా రెపరెపలాడించిన తీరుపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం ‘ఈ పతకం నాకు ఎంతో ప్రత్యేకం. నా దేశం ఉన్న పరిస్థితుల్లో దీన్ని సాధించడం అత్యంత సంతృప్తికరం. గతంలో ఎన్నో పతకాలు గెలిచినా దీని స్థానం వాటన్నింటికంటే ఎక్కువ’ ఇది ఇరాన్ స్టార్ రెజ్లర్ అమీర్ హుస్సేన్ జారే చేసిన వ్యాఖ్య. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సహా అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన అమీర్ హుస్సేన్... ఆసియా చాంపియన్షిప్లో సాధించిన పతకానికి అంత ప్రత్యేక స్థానం ఇవ్వడం వెనక... ఇరాన్ ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఉంది. పురుషుల 125 కేజీల ఫ్రీస్టయిల్లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత అమీర్ భావోద్వేగానికి గురవుతూ తన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒకవైపు దేశంలో ఎక్కడ చూసిన బాంబు దాడులు, మిస్సైల్ మోతలతో దద్దరిల్లుతున్నా... ఇరాన్ రెజ్లర్లు మాత్రం ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తమ ఆధిపత్యాన్ని వదులుకోలేదు. స్టేడియంపై బాంబుదాడితో ప్లేయర్లంతా పారిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా... ప్రాక్టీస్ వదలని ఇరాన్ రెజ్లర్లు ఈ పోటీల్లో తమ పోరాట పటిమతో పాటు గుండెధైర్యాన్ని సైతం ప్రపంచానికి చాటారు. సందిగ్ధత మధ్యే... ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనడంపై తీవ్ర సందిగ్ధత మధ్య అరకొర ప్రాక్టీస్తోనే ఇరాన్ రెజ్లర్లు ఈ టోర్నీ బరిలోకి దిగారు. ‘ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం పక్కన పెడితే... కనీసం సురక్షితంగా ఉంటే చాలు అనుకోవాల్సిన స్థితి. బాంబు దాడుల్లో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన మధ్య మా రెజ్లర్లు సాధనపై మనసు లగ్నం చేయలేకపోయారు. ఒకవైపు రెజ్లర్లు సురక్షితంగా ఉండటం... మరోవైపు వారి కుటుంబాల క్షేమంపై ఆందోళన వెరసి ప్రాక్టీస్ అంతంతమాత్రంగానే సాగింది’ అని పెజ్మాన్ చెప్పారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇరాన్ రెజ్లర్లు సత్తా చాటడం వెనక టీమ్ స్పిరిట్ దాగి ఉంది. కష్టకాలంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ... ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగారు. అందుకు తగ్గ ఫలితం సాధించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కంటే... తమ పోరాటం పెద్దది కాదని ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ దేశ ప్రజల కోసం ఏదో సాధించాలనే తపనను పతకాల సాధనలో చూపెట్టారు. రోడ్డు మార్గం ద్వారా... ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనేందుకు రెజ్లర్లు కిర్గిస్తాన్లోని బిష్కెక్కు వెళ్లాల్సి ఉండగా... బాంబుదాడులతో అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసం కావడంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దాదాపు 22 గంటల పాటు బస్సులో ప్రయాణించిన అనంతరం రెజ్లర్లు పోటీలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ‘మా దేశంలో రెజ్లింగ్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. లాంటి దాడులకు భయపడి మా అస్థిత్వాన్ని కోల్పోకూడదని భావించాం. అందుకే ఎంత కష్టమైనా ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం మా కోచ్లు మా కన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. దేశంపై మాకు ఎంతో ప్రేమ ఉంది. అదే మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చింది. మ్యాట్పై అడుగు పెట్టిన ప్రతిసారి దేశ ప్రజలు నా వెంట ఉన్నారనే భావన కలుగుతుంది. అదే నాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఈ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం అని కర్తవ్య బోధ చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా మా దేశాన్ని ప్రేమించడం మాత్రం వదలం. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా అణచివేతను ఖండించాల్సిందే’ అని స్వర్ణం గెలిచిన అనంతరం అమీర్ హుసేన్ వెల్లడించాడు. ‘మైదానంపై దాడి హేయమైన చర్య’ తమ అస్థిత్వంపై జరిగిన ఈ దాడిని ఇరాన్ రెజ్లర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘మీరు ఎంత ధనవంతులైనా, ఎంత బలీయులైనా... మరొకరిపై మీ శక్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. మేము ఇరాన్ వాసులం. మా దేశంలో చిన్న భూభాగాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేము. మా దేశంపై దాడి చేసిన తర్వాత బదులివ్వకుండా ఎలా ఉంటాం. దేశ సరిహద్దులు క్షేమంగా ఉండాలని కోరుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ఈ యుద్ధంలో ఇరాన్ తప్పక విజయం సాధిస్తుంది’ అని అమీర్ అన్నాడు. తమ మనసులోని మాటలను ప్రపంచం ముందు పెట్టడానికి ఈ టోర్నమెంట్ బాగా ఉపయోగపడిందని ఇరాన్ రెజ్లర్లు పేర్కొన్నారు. ‘ఐదు ప్రపంచకప్లు నిర్వహించిన ఆజాది మైదానంపై దాడి చేయడం హేయమైన చర్య. యుద్ధంలో ఇలాంటి స్థలాలపై దాడులు చేయడం సబబు కాదు. అయినా వారు మా గుండెధైర్యాన్ని దెబ్బకొట్టలేరు. ఆ స్టేడియం తిరిగి నిచ్చించుకుంటాం’ అని కోచ్ పెజ్మాన్ అన్నాడు.ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇరాన్ పతక వీరులుఫ్రీస్టయిల్ విభాగం: మిలాద్ జహంగీర్ (స్వర్ణం; 57 కేజీలు), అహ్మద్ మసూద్ (కాంస్యం; 61 కేజీలు), సినామెహదీ ఖలీలి (కాంస్యం; 70 కేజీలు), అమీర్ మొహమ్మద్ (కాంస్యం; 74 కేజీలు), కామ్రాన్ ఘసెమ్పూర్ (స్వర్ణం; 86 కేజీలు), మొహమ్మద్ మోబిన్ (స్వర్ణం; 92 కేజీలు), అమీర్ హమీద్ అజార్పిరా (రజతం; 97 కేజీలు), అమీర్ హుస్సేన్ అబ్బాస్ జారే (స్వర్ణం; 125 కేజీలు). గ్రీకో రోమన్ విభాగం: మొహమ్మద్ హాజీ అలీ (కాంస్యం; 55 కేజీలు), అలీ అబ్దుల్లా అహ్మదీ వఫా (కాంస్యం; 60 కేజీలు), ఇర్ఫాన్ బెహ్నామ్ జర్కానీ (రజతం; 63 కేజీలు), అహ్మద్ రెజా సైఫుల్లా (కాంస్యం; 67 కేజీలు), మొహమ్మద్ జావద్ సాదత్ (రజతం; 72 కేజీలు), అలీ జబీహుల్లా (రజతం; 77 కేజీలు), మొహమ్మద్ ఆమీన్ (రజతం; 82 కేజీలు), గులాం రెజా (రజతం; 87 కేజీలు), మొహమ్మదాదీ అబ్దుల్లా సరావి (స్వర్ణం; 97 కేజీలు), ఆమీన్ మీర్జాజాదే (స్వర్ణం; 130 కేజీలు).స్టేడియంపై బాంబు దాడిఅమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో ఇరాన్ అతలాకుతలం అయ్యింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా... లక్షలాది మంది తమ ఆనందమయ జీవనానికి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ప్రభావం రెజ్లర్లపై కూడా పడింది. ఆసియా చాంపియన్షిప్నకు ముందు ఇరాన్ రెజ్లర్లు పాల్గొనాల్సిన జాతీయ శిబిరంపై బాంబు దాడి జరిగింది. దీంతో క్యాంప్ను టెహ్రాన్ నుంచి మరో నగరమైన మజందరాన్కు మార్చాల్సి వచ్చింది. ఇరాన్ రెజ్లింగ్కు కేంద్ర బిందువైన టెహ్రాన్లోని ఆజాది ఇండోర్ స్టేడియం బాంబుదాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు వేలాది మంది అభిమానులు కూర్చొని మ్యాచ్లు వీక్షించిన మైదానం సిమెంట్ దిబ్బలా మారిపోయింది. ‘ఇది చాలా కఠినమైన పరిస్థితి. మా ప్లేయర్లు ప్రాక్టీస్ చేసే టెహ్రాన్ స్టేడియం బాంబు దాడికి గురైంది. మాపై బలవంతంగా మోపిన ఈ యుద్ధం... శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా దెబ్బతీసింది’ అని ఇరాన్ రెజ్లింగ్ కోచ్ పెజ్మాన్ దొరోస్తాకర్ అన్నారు. -
వారెవ్వా వైశాలి
పాఫోస్ (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి టైటిల్ దక్కించుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 14 రౌండ్ల తర్వాత తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి 8.5 పాయింట్లతో చాంపియన్గా అవతరించింది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత హోదాలో వైశాలి ఈ ఏడాది ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో తలపడుతుంది. ప్రపంచ చాంపియన్షిప్ వేదికను, తేదీను ఇంకా ఖరారు చేయలేదు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో చివరిరోజు వైశాలి అద్భుతం చేసింది. గతంలో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్గా నిలిచిన కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన 14వ రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన వైశాలి 48 ఎత్తుల్లో గెలిచింది. తద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత పొందింది. ఈ టోర్నీలో వైశాలి ఐదు గేముల్లో గెలిచి, ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్; 8 పాయింట్లు) రన్నరప్గా నిలువగా... జు జినెర్ (చైనా; 7.5), అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా; 7.5 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అనా ముజిచుక్ (ఉక్రెయిన్; 7 పాయింట్లు) ఐదో స్థానంలో, కాటరీనా లాగ్నో (6.5 పాయింట్లు) ఆరో స్థానంలో, దివ్య దేశ్ముఖ్ (భారత్; 5.5 పాయింట్లు) ఏడో స్థానంలో, టాన్ జోంగి (చైనా; 5.5 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన వైశాలికి 28,000 యూరోలు (రూ. 30 లక్షల 81 వేలు) ప్రైజ్మనీ దక్కింది. 2011లో కోనేరు హంపి తర్వాత ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్కు అర్హత పొందిన రెండో భారతీయ చెస్ క్రీడాకారిణిగా వైశాలి గుర్తింపు పొందింది. 2011 ప్రపంచ చాంపియన్షిప్లో హు ఇఫాన్ (చైనా) చేతిలో హంపి ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. 2018 మేలో కాటరీనా లాగ్నోపై గెలిచి తొలిసారి ప్రపంచ చాంపియన్గా అవతరించిన జు వెన్జున్ ఆ తర్వాత నాలుగుసార్లు (2018 నవంబర్; 2020, 2023, 2025) ప్రపంచ టైటిల్ను నిలబెట్టుకుంది. మరోవైపు పురుషుల క్యాండిడేట్స్ టోర్నీలో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది చివర్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (భారత్)తో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం సిందరోవ్ తలపడతాడు. వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్!
రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, డెన్మార్క్కు చెందిన స్టార్ షట్లర్ విక్టర్ ఆక్సెల్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్కు గురి చేశాడు. గత రెండేళ్లుగా తన కెరీర్ను తీవ్రంగా ప్రభావితం చేసిన దీర్ఘకాలిక తీవ్రమైన వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సెల్సెన్ తెలిపాడు.తన రిటైర్మెంట్ విషయాన్ని ఆక్సెల్సెన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. నేను చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను. గత సంవత్సరం ఏప్రిల్లో శస్త్రచికిత్స జరిగింది. విస్తృతమైన పునరావాసం పొందాను, కానీ అక్టోబర్లో నాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి, నేను ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నా. వెన్నునొప్పి కారణంగా ఆటపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నా. దీంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చినట్లుగా అనిపించింది. అందుకే ఈ నిర్ణయం. డాక్టర్తో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చాను. డాక్టర్ కూడా దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. దీనిని అంగీకరించడానికి కష్టంగా ఉన్నప్పటికీ పరిస్థితులు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. త్వరలో వెన్నుకు సర్జరీ జరగనుంది. అది విజయవంతం కాకపోతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఆడడం కుదరదని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా.1994లో జన్మించిన ఆక్సెల్సెన్ ఆరేళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ఆటపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. 2010లో అతను బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అలా చేసిన మొదటి యూరోపియన్ ఆటగాడిగా నిలిచాడు. అదే సంవత్సరం, అతను సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసి, సైపర్స్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా తన కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు. 2014లో స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గెలిచాడు. ఇక ఒలింపిక్స్ విషయానికొస్తే 2016లో కాంస్యం, 2020, 2024 ఒలింపిక్స్లో ఏకంగా స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఇక ప్రపంచ చాంపియన్షిప్లో 2014లో కాంస్యం గెలిచిన ఆక్సెల్సెన్ 2017, 2022లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 2020, 2022లో ప్రతిష్ఠాత్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను కైవసం చేసుకొన్నాడు. అంతేకాదు 180 వారాలకు పైగా విక్టర్ ఆక్సెల్సెన్ నంబర్వన్ స్థానంలో కొనసాగాడు. సింగిల్స్లో 572 విజయాలు, 160 ఓటములతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. View this post on Instagram A post shared by Olympic Khel (@olympickhel) View this post on Instagram A post shared by Viktor Axelsen (@viktoraxelsen) -
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు. -
కత్తిదూస్తే రాణిరుద్రమలే!
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనవరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది.పది పోటీల్లో ప్రతిభహనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. -
అమన్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు భారత్కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (61 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్స్లో అమన్ 10–13తో క్వాంగ్ మ్యోంగ్ కిమ్ (ఉత్తర కొరియా) చేతిలో, ముకుల్ 0–7తో కామ్రాన్ ఘాసెమ్పూర్ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ 12–1తో తుర్దుబెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. ఓవరాల్గా పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 162 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 178 పాయింట్లతో ఇరాన్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. ఓవరాల్గా సురేఖ కెరీర్లో ఇది 12వ ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్ నుంచే భారత్, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్లో భారత్ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.చదవండి: అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు! -
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ కల్కాల్ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్ సింగ్ మాన్ (79 కేజీలు) రజతం... అంకుశ్ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్ 2019లో బజరంగ్ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్గా అవతరించిన భారత రెండో రెజ్లర్గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్ ఒచిర్ (మంగోలియా)పై గెలుపొందాడు. 79 కేజీల ఫైనల్లో సందీప్ సింగ్ 1–2తో కీవన్ ఘరెదాగి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్లో అంకుశ్ 8–2తో ఫుగా ససాకి (జపాన్)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్లో విక్కీ 5–7తో షెర్జాద్ పొయోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది. 61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్లో అమన్ 11–9తో అహ్మద్ (ఇరాన్)పై, ముకుల్ 12–6తో బొలాత్ సకాయెవ్ (కజకిస్తాన్)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్ 0–2తో షరిపోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు. -
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్ అయుష్ శెట్టి ప్రపంచ నంబర్ 1 షట్లర్ కున్లావుట్ విటిడ్సార్న్ (థాయ్లాండ్)ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుష్.. ఈ టోర్నీ సెమీస్లో కున్లావుట్పై 10-21, 21-19, 21-17 తేడాతో గెలిచి పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా భారత తరఫున ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్కు (సింగిల్స్) చేరిన రెండో పురుష షట్లర్గా (దినేశ్ ఖన్నా (1965), ఓవరాల్గా మూడో భారత షట్లర్గా రికార్డుల్లోకెక్కాడు.75 నిమిషాల పాటు సాగిన సెమీస్లో ఆయుష్ మొదటి గేమ్ కోల్పోయినా, ఆతర్వాత అద్భుత పోరాటపటిమతో వరుసగా రెండు సెట్లు గెలిచి గేమ్ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆయుష్.. షి యు కీ (చైనా), చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడతాడు. అయుష్ 2023 వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన తర్వాత వార్తల్లోకెక్కాడు. -
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో టోర్నీకి సంబంధించి పాల్గొనబోయే జట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఇప్పటికే ఫిఫా సమాఖ్య విడుదల చేసింది. అయితే ఫుట్బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వచ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుం టారు. సాకర్ ఫీవర్ ఉన్నన్నాళ్లు స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్రపంచకప్కు సంబంధించి టికెట్ల ధరల విషయం మాత్రం ఒక ఆందోళన కలిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సాధారణ అభిమానులకు మ్యాచ్ వీక్షించడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్వుడ్లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాలర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’ -
విజేత నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ గనగామ నైశిక్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నైశిక్ 7–6 (7/4), 6–4తో టాప్ సీడ్ ప్రసాద్ ఇంగాలె (మహారాష్ట్ర)ను బోల్తా కొట్టించాడు. సెమీఫైనల్లో నైశిక్ 7–6 (7/5), 6–2తో మహదేవ్ బంగార్గి (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ముకేశ్ చావ్డా (గుజరాత్)పై గెలుపొందాడు. విజేత నైశిక్కు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ విన్నర్స్ ట్రోఫీ అందజేశారు. హైదరాబాద్లో జాతీయ గ్రాస్కోర్టు మాజీ చాంపియన్ సురేశ్ కృష్ణ, కాజా వినాయక్ శర్మ, ఒలింపియన్ విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నైశిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్ వైట్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. 2023 నుంచి మన అమ్మాయిల జట్టుకు తుషార్ ఖండేకర్ కోచ్గా వ్యవహరిస్తుండగా... అతడి స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన వైట్ను హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్గా నియమించింది. కోచ్ మార్పునకు కారణం వెల్లడించని హాకీ ఇండియా... వైట్ ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటాడనే అంశంలోనూ స్పష్టతనివ్వలేదు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వైట్ తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బెల్జియం, ఆ్రస్టేలియా జూనియర్ జట్లకు కూడా వైట్ కోచ్గా పనిచేశాడు. వైట్ శిక్షణలో బెల్జియం అండర్ –21 మహిళల జట్టు జూనియర్ ప్రపంచకప్ కప్లో కాంస్య పతకం నెగ్గింది. 2021 నుంచి 2024 వరకు బెల్జియం సీనియర్ జట్టుతోనూ వైట్ కలిసి పనిచేశాడు. ఆ సమయంలో విశేషంగా రాణించిన బెల్జియం జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లో 12వ స్థానం నుంచి మూడో ‘ప్లేస్’కు చేరింది. ఆస్ట్రేలియాకు కోచ్గా వ్యవహరించిన సయమంలో జూనియర్ ప్రపంచకప్లో ఆ జట్టు కాంస్యం గెలిచింది. ‘తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు కోచ్గా భారత్లో చాలా సమయం గడిపా. అక్కడి హాకీ ఘన సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్ వరల్డ్కప్లో భాగంగా... భారత్తో జరిగిన మ్యాచ్ల సమయంలో యువ నైపుణ్యం నన్ను కట్టిపడేసింది. అలాంటి అత్యుత్తమ అథ్లెట్లతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. సీనియర్ జట్టులో స్థానం కోసం పోటీపడగల సామర్థ్యం ఉన్న పటిష్టమైన ప్లేయర్లను తయారు చేయడమే నా లక్ష్యం. అటాకింగ్ గేమ్కు పదును పెడుతూనే... డిఫెన్స్లోనూ మరింత క్రమశిక్షణ పెంచాలని భావిస్తున్నా. మైదానంలో అడుగు పెట్టిన తర్వాత 60 నిమిషాల పాటు అత్యున్నత స్థాయిలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. ఒత్తిడిలోనూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. సీనియర్ స్థాయి ప్లేయర్లను సైతం ఓడించగల ఆత్మస్థైర్యం ఉన్న ప్లేయర్లను తీర్చిదిద్దుతా’ అని వైట్ అన్నాడు. కొత్త కోచ్ రాకతో మన హాకీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. ‘ఆస్ట్రేలియా, బెల్జియం జూనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న వైట్... భారత జట్టుతో చేరడంతో మన ప్లేయర్ల నైపుణ్యాలు కూడా మరింత పెరుగుతాయి. అతడి అనుభవం మనజట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని టిర్కీ పేర్కొన్నాడు. చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
ఆయుశ్ సంచలనం
నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీపడుతున్న ఈ కర్ణాటక షట్లర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2024 ఆసియా చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ 23–21, 21–17తో సంచలన విజయం సాధించాడు. 54 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఆయుశ్ నిలకడగా ఆడుతూ క్రిస్టీని కట్టిపడేశాడు. తొలి గేమ్లో 18–20తో వెనుకబడ్డ ఆయుశ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 21–20తో ముందంజ వేశాడు. ఆ తర్వాత క్రిస్టీ 21–21తో స్కోరును సమం చేయగా... ఆయుశ్ ఈసారి వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకున్నాడు. తొలి గేమ్ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆయుశ్ రెండో గేమ్లో మరింత జోరు పెంచాడు. తొలుత 5–2తో, ఆ తర్వాత 8–6తో, 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్రిస్టీ కోలుకునే ప్రయత్నం చేసినా ఆయుశ్ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు రెండో గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, 2023 విశ్వవిజేత కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో ఆయుశ్ తలపడతాడు. 7 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పతకం గెలిచిన ఏడో భారతీయ ప్లేయర్ ఆయుశ్ శెట్టి. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ (2018లో కాంస్యం), అనూప్ శ్రీధర్ (2007లో కాంస్యం), పుల్లెల గోపీచంద్ (2000లో కాంస్యం), ప్రకాశ్ పదుకొనే (1976లో కాంస్యం), దినేశ్ ఖన్నా (1965లో స్వర్ణం, 1969లో కాంస్యం), సురేశ్ గోయల్ (1965లో కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
క్రికెట్తో పోలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఆదరణ తక్కువే. బైచుంగ్ భుటియా, సునీల్ ఛెత్రీ.. ఈ ఇద్దరే భారత్ ఫుట్బాల్లో కాస్త తెలిసిన ముఖాలు. అసలు మనకంటూ ఒక ఫుట్బాల్ టీం ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్లో వరల్డ్కప్ ఎలాగూ ఫుట్బాల్లో ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఐసీసీ వరల్డ్కప్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఫిఫా వరల్డ్కప్లో ఒక్కసారైనా ఆడాలని చాలా దేశాలు కలలు కూడా కంటాయి.ఈ నేపథ్యంలోనే దేశవాలీలో ఫుట్బాల్ ఆటకు మళ్లీ తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఓనర్, కోచ్ రంజిత్ బజాజ్ వెల్లడించారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టును ఫిఫా ప్రపంచకప్లో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా భారత్ను ఫుట్బాల్లోనూ ఉన్నతస్థాయికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇటీవలే అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ)లో భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ప్రిక్వార్టర్స్లో మినర్వా జట్టు 6-0 తేడాతో లివర్పూల్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. ఎంఐసీ కప్లో తొలిసారి ఆడుతున్నప్పటికీ ఏ బెరుకు లేకుండా ఆడిన మినర్వా జట్టు క్వార్టర్స్లో ఓడినప్పటికీ టోర్నీని ఐదో స్థానంతో ముగించి బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది.అయితే మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఏర్పడడం వెనుక ఆ జట్టు కోచ్ రంజిత్ బజాజ్ చాలా ఏళ్ల శ్రమ దాగుంది. తాజాగా చందాలు పోగు చేసి మరీ తన జట్టును స్పెయిన్లో జరిగిన ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించడం గమనార్హం. అయితే మార్చి 16న మినర్వా క్లబ్ జట్టును పంపించడానికి ముందు రంజిత్ బజాజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన ఇచ్చిన సందేశం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంది. మొత్తం జట్టును స్పెయిన్కు పంపేందుకు తన ఆస్తులను అమ్మినప్పటికీ మరో కోటి రూపాయలు తక్కువ పడింది. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా డబ్బు సహాయం అందజేయాలని తన ఫాలోవర్లను కోరారు. ఆయన ఫాలోవర్లంతా ఈ విషయాన్ని షేర్ చేసి 27 లక్షల రూపాయలు ఆయనకు అందజేశారు. మొత్తంగా ఎలాగోలా తన జట్టును ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించారు. View this post on Instagram A post shared by Ranjit Bajaj (@ranjitbajaj)మినర్వా ఫుట్బాల్ క్లబ్ జట్టు 2022లో మెనా కప్, 2023లో బ్రెజిల్ను ఓడించి గోథియా కప్ను కైవసం చేసుకుంది. కానీ సరైన ఫండ్స్ లేకపోవడంతో 2024లో ఒక్క టోర్నీ కూడా ఆడలేకపోయింది. ఇది భారత్లోని ప్రతిభావంతమైన ఫుట్బాల్ ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని రంజిత్ బజాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరీ రంజిత్ బజాజ్?రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) భారత ఫుట్బాల్ రంగంలో, ముఖ్యంగా గ్రాస్రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని ఆటగాళ్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చండీగఢ్లో మినర్వా అకాడమీ నెలకొల్పి యువ ఫుట్బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ భారత ఫుట్బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. సందేశ్ జింగాన్, కమల్జిత్ సింగ్, జీక్సన్ సింగ్ (ఫిఫా వరల్డ్కప్లో భారత్ తరఫున మొదటి గోల్ చేసిన ఆటగాడు) వంటి ప్రముఖ ఆటగాళ్లంతా ఈయన అకాడమీ నుంచే వచ్చారు. భారత ఫుట్బాల్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన ఆస్తులను (భార్య బంగారు ఆభరణాలు) సైతం తాకట్టు పెట్టి అకాడమీని నడిపారు. తనకు ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రానప్పటికీ 2020 నుంచి మినర్వా అకాడమీ తరఫున 250 మందికి పైగా ఆటగాళ్లకు వంద శాతం స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనేలా చూడడమే తన కల అని రంజిత్ బజాజ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం.ఫుట్బాల్లోనూ స్వర్ణయుగం..ఒకప్పుడు ఆసియాలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడిన మన ఫుట్బాల్ టీం 1950 నుంచి 1960 మధ్య స్వర్ణయుగాన్ని చూసింది. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం పర్యవేక్షణలో భారతదేశం 1951, 1962 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను గెలుచుకోవడంతో పాటు 1956 ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయితే భారత జట్టు ఎప్పుడు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనలేదు.కానీ 1950 ఫిఫా వరల్డ్కప్లో మాత్రం క్వాలిఫికేషన్ గ్రూప్లోని ఇతర దేశాలన్నీ వైదొలగడంతో 1950 ప్రపంచ కప్కు డిఫాల్ట్గా అర్హత సాధించింది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. భారత జట్టు ఆసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయిన ఏఎఫ్సీ ఆసియా కప్లో ఐదుసార్లు పాల్గొని , 1964 లో రన్నరప్గా నిలిచింది .దక్షిణాసియాలో పాపులర్ టోర్నీగా పిలవబడే దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ (శాప్-SAFF) కప్లో అజేయమైన టీమ్గా రికార్డు ఉంది. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నమెంట్ను భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుచుకుంది.🚨 India’s Minerva Football Club thrashed Liverpool FC 6–0. 🗿Man, Indian football has serious potential.Completely outplayed and knocked out Liverpool and reached the QF in the MIC Cup 2026 U-15 — pure attitude.Proud moment for India 🇮🇳 pic.twitter.com/DEibSGT7YR— Sonu (@Cricket_live247) April 3, 2026చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది! -
భారత మహిళల పంచ్ అదుర్స్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్స్లో నలుగురు భారత బాక్సర్లు మీనాక్షి హుడా (48 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), ప్రియ ఘన్ఘస్ (60 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 80 కేజీలు) మాత్రం రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.ఫైనల్స్లో మీనాక్షి 5–0తో నొముందరి (మంగోలియా)పై, ప్రీతి 5–0తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. అరుంధతి 4–1తో బకిత్ సెడిష్ (కజకిస్తాన్)పై, ప్రియ 3–0తో వన్ ఉన్ గ్యోంగ్ (ఉత్తర కొరియా)పై నెగ్గారు. జైస్మీన్ 0–5తో పున్రావి ర్యునర్స్ (థాయ్లాండ్) చేతిలో, అల్ఫియా 0–5తో దినా ఇస్లామ్బెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీలు)... టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన 10 వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు పతకాలు నెగ్గడం విశేషం. -
సింధు పరాజయం... క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి ఆయుశ్ శెట్టి మినహా మిగతా భారత షట్లర్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో రెండో సీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఉన్నతి హుడా 17–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–16, 21–12తో ప్రపంచ 20వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 19–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 14–21తో నాలుగో సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) జోడీ 10–21, 13–21తో యూకీ ఫకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
భారత్కు రెండో ఓటమి
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఓడింది. తొలి మ్యాచ్లో వైష్ణవి అడ్కర్ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా నుగ్రోహో చేతిలో... రెండో మ్యాచ్లో సహజ యామలపల్లి 2–6, 1–6తో జనైస్ టిజెన్ చేతిలో... మూడో మ్యాచ్లో అంకిత రైనా–రుతుజా 3–6, 6–7 (4/7)తో అల్దిలా సుత్జియాది–జనైస్ టిజెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. నేడు జరిగే నాలుగో మ్యాచ్లో మంగోలియాతో భారత్ ఆడుతుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కొరియా, ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్లలో హన్సిక 6–1తో అరుకె కదిర్బెక్ (కిర్గిస్తాన్)పై, నేహా 10–4తో బొలోర్తుయా (మంగోలియా)పై గెలిచారు. మీనాక్షి క్వార్టర్ ఫైనల్లో 15–4తో ఎస్బోసినోవా (ఉజ్బెకిస్తాన్)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్ జిన్ జాంగ్తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
రాకెట్ నేలకేసి కొట్టి...
మోంటెకార్లో: ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా టెన్నిస్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ సంయమనం కోల్పోయాడు. మోంటెకార్లో మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా... ఘోర పరాజయం మూటగట్టుకున్న మెద్వెదెవ్ తన రాకెట్ను విరగ్గొట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో ర్యాంకర్ మెద్వెదెవ్ 0–6, 0–6తో బెరెటిని (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెద్వెదెవ్ తన రాకెట్ను వరుసగా ఏడుసార్లు నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన మెద్వెదెవ్... క్రీడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. తొలి సెట్ కోల్పోయి అసహనంలో ఉన్న మెద్వెదెవ్... రెండో సెట్లో తన తొలి సర్వీస్ కోల్పోయిన సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. 2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన మెద్వెదెవ్ ఈ మ్యాచ్ను 49 నిమిషాల్లోనే కోల్పోయాడు. గతంలో బెరెటినితో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఈ రష్యా ఆటగాడు... ఈసారి మాత్రం అదే జోరు కనబర్చలేకపోయాడు. ఇటీవల ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్పై విజయం సాధించిన మెద్వెదెవ్... మట్టి కోర్టులో జరిగిన ఈ పోరులో స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి వరల్డ్ టాప్–10 ఆటగాడిని 6–0, 6–0తో ఓడించిన ఐదో ప్లేయర్గా బెరెటిని నిలిచాడు. దీన్ని ‘డబుల్ బేగల్’ అంటారు. చివరిసారిగా దశాబ్దం క్రితం ఇటాలియన్ ఓపెన్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–0, 6–0తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేశాడు. -
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో స్వర్ణ, రజతాలు భారత్కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆర్చర్ శీతల్పై భారత్కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్పై గెలవడం పాయల్కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్షిప్లోనూ శీతల్పై పాయల్ పైచేయి సాధించింది. -
పాకిస్తాన్కు కొత్త హెడ్కోచ్.. ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి
కరాచీ: పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) తమ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీమ్కు కోచ్గా ఉన్న ఆస్ట్రేలియన్ కొలిన్ బ్యాచ్ స్థానంలో స్వదేశీ కోచ్ను ప్రకటించింది. మాజీ ఒలింపియన్ మన్జూర్ ఉల్ హసన్ పాక్ టీమ్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. రాబోయే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్, ప్రపంచ కప్లలో పాల్గొనే టీమ్ మన్జూర్ శిక్షణలోనే సన్నద్ధమవుతుంది. మాజీ ఆటగాళ్లు హసన్ సర్దార్, ఇస్లాహుద్దీన్ సిద్దిఖీలతో కూడిన పీహెచ్ఎఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కమిటీ సిఫారసుపై కొత్త కోచ్ ఎంపిక జరిగింది. తీవ్ర అసంతృప్తిఅయితే మన్జూర్ను కోచ్గా నియమించడంపై పాక్ జట్టులో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తాజా నిర్ణయం పట్ల వారు నిర్ఘాంతపోయారు. 70వ, 80వ దశకాల్లో డిఫెండర్గా మన్జూర్ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనూహ్య ప్రకటన‘ఆటగాడిగా మన్జూర్కు మంచి గుర్తింపు ఉన్న మాట వాస్తవమే. అయితే కోచ్గా ఆయనను ఎంపిక చేయడం అంటే తీవ్ర నిరాశాజనక ఫలితాలను కొనితెచ్చుకోవడమే. కొలిన్ బ్యాచ్ అన్ని రకాలుగా అర్హుడైన కోచ్. మేమంతా ఆయన శిక్షణతో సంతోషంగా ఉన్నాం. ఆధునిక హాకీకి సంబంధించి అన్ని అంశాలపై అవగాహన ఉంది. ప్రొ లీగ్, వరల్డ్ కప్లాంటి పెద్ద ఈవెంట్లలో మమ్మల్ని కొలిన్ సమర్థంగా నడిపిస్తాడని భావించిన తరుణంలో ఈ అనూహ్య ప్రకటన వచ్చింది’ అని పాక్ జాతీయ జట్టులోని ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్నకు అర్హత సాధించింది. చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలు -
ఆయుశ్ అద్భుతం
నింగ్బో (చైనా): ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి సంచలనంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ 21–13, 21–16తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లిన్ షి ఫెంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ ఆయుశ్ తొలుత వెనుకబడ్డా... సంయమనం కోల్పోకుండా ఆడి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో గేమ్లను సొంతం చేసుకున్నాడు. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ కూడా ముందంజ వేశాడు. ప్రణయ్ 24–22, 21–12తో నుగుయెన్ హాయ్ డాంగ్ (వియత్నాం)పై గెలుపొందాడు. అయితే పతకం సాధిస్తాడనుకున్న భారత నంబర్వన్ లక్ష్య సేన్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించి నిరాశపరిచారు. ప్రపంచ 22వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్లో లక్ష్య సేన్ 12–21, 19–21తో ఓడిపోయాడు. లీ చెయుక్ చేతిలో లక్ష్య సేన్కిది నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ ఏడాది మలేసియా ఓపెన్లోనూ లీ చెయుక్ చేతిలో లక్ష్య సేన్ వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 21–18, 9–21, 11–21తో ఓటమి చవిచూశాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించడంలో విఫలమై ఓటమి మూటగట్టుకున్నాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిమ్రన్–కవిప్రియ సెల్వం (భారత్) జోడీ 9–21, 8–21తో లీ యి జింగ్–లువో జు మిన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) ద్వయం 21–15, 17–21, 21–13తో ఫామ్ థి డియు లె–ఫామ్ థి కాన్ (వియత్నాం) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
22 ఏళ్ల తర్వాత...
పాథుమ్ థాని (థాయ్లాండ్): ఆసియా కప్ మహిళల అండర్–20 ఫుట్బాల్ టోర్నమెంట్ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3–1 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తరఫున శిబాని దేవి నోంగ్మెకాపమ్ (32వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... భూమిక దేవి ఖుముక్చామ్ (26వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. చైనీస్ తైపీ తరఫున సబ్స్టిట్యూట్ కావో సిన్ (90+3వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేసింది. 2004 తర్వాత ఆసియా కప్ అండర్–20 మహిళల టోర్నీలో భారత జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. నాలుగు జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత జట్టు తమ మూడు మ్యాచ్లను పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్ ఒక మ్యాచ్లో గెలిచి మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మూడు గ్రూప్ల నుంచి టాప్–2లో నిలిచిన ఆరు జట్లతోపాటు మూడు గ్రూప్ల్లో మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. గ్రూప్ ‘బి’లో ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే భారత జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించేది. అయితే జోర్డాన్పై ఉజ్బెకిస్తాన్ భారీ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంతోపాటు భారత జట్టు నాకౌట్ దశకు చేరే అవకాశాలకు తెరదించింది. -
నితేశ్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బుధవారం భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్లో భారత రెజ్లర్లు నితేశ్ (97 కేజీలు) రజత పతకం దక్కించుకోగా... ప్రిన్స్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మొహమ్మధాది సరావి (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో నితేశ్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. దిదార్ అమన్జరోవ్ (తుర్క్మెనిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో ప్రిన్స్ 10–1తో విజయం సాధించాడు. అబ్దుమలిక్ అమినోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సచిన్ 6–5 పాయింట్ల తేడాతో గెలిచాడు. ఓవరాల్గా గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 195 పాయింట్లతో ఇరాన్ గ్రీకో రోమన్ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. 154 పాయింట్లతో కిర్గిస్తాన్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. బుధవారమే మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత రెజ్లర్లు హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) నేడు కాంస్య పతకాల కోసం పోటీపడతారు. సెమీఫైనల్లో హన్సిక 1–11తో యుజువాన్ లీ (చైనా) చేతిలో, నేహా 5–12తో మెంగ్యు జి (చైనా) చేతిలో ఓడిపోయారు. భారత్కే చెందిన కాజల్ (76 కేజీలు), నీలమ్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. -
తెలంగాణ జిమ్నాస్ట్లకు 27 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా లెవెల్ వైజ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు అదరగొట్టారు. న్యూఢిల్లీలోని ద జిమ్నాస్టిక్ అకాడమీలో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ చిన్నారులు 25 రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో మెరిశారు. మొత్తం 27 పతకాలు సొంతం చేసుకొని ఓవరాల్గా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. టేబుల్ వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్స్లో పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీలో పతకాలు సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్లను బుధవారం హైదరాబాద్లోని వందన బద్రుక ఇన్స్టిట్యూట్ కల్పతరులో అంతర్జాతీయ ప్లేయర్, జాతీయ చాంపియన్, జాతీయ జడ్జి ప్రియాంక అభినందించింది. ఈ టోర్నీలో పతకాలు గెలిచిన తెలంగాణ జిమ్నాస్ట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బాలికలు (లెవెల్–1): హియా యాదవ్, ప్రణవి షా, జెకా నవాజ్, అయేషా సిద్దిఖి, ఆద్య కపూర్, మెహర్ అగర్వాల్. బాలురు (లెవెల్–1): అన్షుల్ యాదవ్, ఆకుల అద్వైత్, చందూరి అద్వైత్, గొల్ల విదిత్, ఎన్.సిద్విక్ రెడ్డి, రేయాంశ్ రావు. బాలికలు (లెవెల్–2): మాన్వీ రెడ్డి, మండవ మైరా, అనన్య రెడ్డి, కృషా జైన్, కృత్యా కొయిరాలా, వర్ణిక రెడ్డి, రియానా రెడ్డి, ఆర్ణవి చందూరి, ఆముక్త. బాలురు (లెవెల్–2): చొక్కారపు లౌక్య విరాట్. బాలికలు (లెవెల్–3): ఇనారా రుక్మిణి. బాలికలు (లెవెల్–4): సిమోన్ పెస్తోంజి. బాలికలు (లెవెల్–6): ఖుషీ రాయ్. -
భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
ఏప్రిల్ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్ల సిరీస్ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు సవితా పూనియా (గోల్ కీపర్), దీపిక (ఫార్వర్డ్) ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు. సలీమా టేటే కెప్టెన్గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్ కీపర్గా బిచు దేవి ఎంపికయ్యారు.డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్, రుతుజా దాదాసో పిసాల్, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్దుంగ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్ వ్యవహరించనున్నారు.ఈ సిరీస్ భారత జట్టుకు హాకీ వరల్డ్ కప్ 2026, ఆసియా గేమ్స్కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది. -
పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో!
ప్రస్తుతం టెన్నిస్లో జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్లు ఒకరితో ఒకరు పోటీ పడడం మస్తు మజాను అందిస్తుంది. ఈ ఇద్దరు టెన్నిస్ ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు నాదల్, ఫెదరర్, జొకోవిచ్ మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉండేదో అదే తరహాలో ఇప్పుడు సిన్నర్, అల్కరాజ్లు ఎక్కడ తలపడినా ఆ మ్యాచ్కు యమా క్రేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నారు. ప్రస్తుతం జానిక్ సిన్నర్ డెన్మార్క్కు చెందిన మోడల్ లైలా హసనోవిక్తో లవ్లో ఉన్న సంగతి తెలిసిందే. సిన్నర్ ఏ టోర్నీ ఆడినా అక్కడ హసనోవిక్ ప్రత్యక్షమయ్యేది. అయితే తాజాగా మాంటే కార్లో టెన్నిస్ టోర్నీలో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.హసనోవిక్ తన ప్రియుడి మ్యాచ్కు కాకుండా సిన్నర్ చిరకాల ప్రత్యర్థి అల్కరాజ్ మ్యాచ్కు హాజరవ్వడమే ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్. టోర్నీలో భాగంగా అల్కరాజ్ తన తొలి మ్యాచ్లో సెబాస్టియన్ బేజ్ను 6-1, 6-3తో ఓడించాడు. కేవలం 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో హసనోవిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే అల్కరాజ్ ఆడుతున్నంత సేపు హసనోవిక్ అతడిని కళ్లార్పకుండా చూసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకముందు రోజు తన బాయ్ఫ్రెండ్ సిన్నర్ మ్యాచ్కు కూడా హసనోవిక్ హాజరయ్యింది. కాగా తొలి రౌండ్ మ్యాచ్లో సిన్నర్ 6-3, 6-0తో హ్యూగో హంబర్ట్ను సులువుగా ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మరి ఈ ఇద్దరు ఈ టోర్నీలో తలపడినప్పుడు హసపనోవిక్ ఎవరి ఆట చూస్తుందో తెలియడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.Laila Hasanovic watching alcaraz today pic.twitter.com/6J7vuRdATj— Kieza (@Czekoladka32904) April 7, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా! -
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
గ్రనాడా (స్పెయిన్): రైఫిల్, పిస్టల్ ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత బృందం పసిడి పతకంతో, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. మంగళవారం మొదలైన సీజన్ తొలి ప్రపంచకప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి, హరియాణా అమ్మాయి పలక్ గులియా అద్భుతం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ముకేశ్–పలక్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. 42 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో ముకేశ్ (294)–పలక్ (287) ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో... కియాన్జున్ యావో–హు కాయ్ (చైనా) జోడీ 586 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాయి. వెరోనికా–అకోస్ కరోలీ (హంగేరి; 580 పాయింట్లు), నటాలియా ప్రాడో–నికోలస్ మౌరెర్ (అమెరికా; 578 పాయింట్లు) జోడీలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్కు అర్హత పొందాయి. ఫైనల్లో ముకేశ్ (244.7 పాయింట్లు)–పలక్ (243 పాయింట్లు) జోడీ 487.7 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్షిప్లో నిగీనా సైదుకులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్; 481.3 పాయింట్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ముకేశ్–పలక్ బద్దలు కొట్టారు. కియాన్జున్ యావో –హు కాయ్ (484.8 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని గెల్చుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు నిరాశే మిగిలింది. క్వాలిఫయింగ్లో సోనమ్–గజానన్ (భారత్; 631.4 పాయింట్లు) జోడీ ఆరో స్థానంలో ... శ్రుతి–అర్ష్ దీప్ సింగ్ (భారత్; 628 పాయింట్లు) జంట 19వ స్థానంలో నిలిచింది.గురి పెడితే పతకమే...గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల ముకేశ్ కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. బరిలో దిగిన ప్రతి టోర్నీలో ఏదో ఒక పతకంతో తిరిగొస్తున్నాడు. రెండేళ్ల క్రితం పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ముకేశ్ స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. అదే ఈవెంట్లో మరో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్లో ముకేశ్ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచాడు. ఈ సంవత్సరమే న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో ముకేశ్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నాడు. సీనియర్స్థాయిలో తొలిసారి ప్రపంచకప్లో పసిడి పతకంతో ముకేశ్ శుభారంభం చేసి తనకెంతో ఉజ్వల భవిష్యత్ ఉందని చాటి చెప్పాడు. -
భారత రెజ్లర్ లలిత్కు రజత పతకం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు లలిత్ (55 కేజీలు) రజత పతకం... సునీల్ (87 కేజీలు) కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో లలిత్ 0–9తో బొటిరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో సునీల్ 5–4తో రసులోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. 77 కేజీల కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ అమన్ 14–15తో యోంగన్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
ఫైనల్లో జైస్మీన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో జైస్మీన్ 3–2తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్)పై, మీనాక్షి 4–1తో థిప్సాచా (థాయ్లాండ్)పై, విశ్వనాథ్ 5–0తో సాన్జార్ (కజకిస్తాన్)పై, సచిన్ 4–1తో రువామ్థామ్ (థాయ్లాండ్)పై గెలిచారు. ఆకాశ్ (75 కేజీలు), లోకేశ్ (85 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు), హర్‡్ష (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ టోరీ్నలో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. -
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు
అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు. -
భారత జట్టులో హైదరాబాద్ కుర్రాడు
సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా జూనియర్ డేవిస్కప్ ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన 15 ఏళ్ల హృతిక్ కటకం చోటు సంపాదించాడు. న్యూఢిల్లీలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీలో హృతిక్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలుపొంది అగ్రస్థానంలో నిలిచాడు. జాతీయ బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న హృతిక్ ట్రినిటీస్ చాలెంజర్స్ టెన్నిస్ అకాడమీలో కోచ్ హెన్రీ ప్రవీణ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా ఆసియా ఓసియానియా టోర్నీ మే 18 నుంచి 23వ తేదీ వరకు కజకిస్తాన్లో జరుగుతుంది. హృతిక్తోపాటు రిభవ్ సరోహా (చండీగఢ్), తవిష్ పహ్వా (హరియాణా) కూడా భారత జట్టులో ఎంపికయ్యారు. -
వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ) టోర్నీలో తొలిసారి ఆడుతున్నప్పటికీ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. క్వార్టర్స్లో ఓటమి పాలైనప్పటికీ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ఆటతో ఫుట్బాల్ అభిమానుల మనసులను దోచేసింది. గ్రూప్ దశలో మినర్వా క్లబ్ తొలి మ్యాచ్లో 3-0తో కెనెడా బ్రేవ్స్ను, ఆ తర్వాత బొకా ఎఫ్సీపై 4-1తో, ఈఎఫ్ సాంటాపై 1-0తో విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్లో బలమైన లివర్పూల్ ఎఫ్సీ జూనియర్స్ జట్టును 0-6తో ఓడించి మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచలన విజయాన్ని అందుకొని క్వార్టర్స్లో అడుగుపెట్టింది. అయితే క్వార్టర్స్లో స్పానిష్ క్లబ్ యూఈ ఫిగర్స్ చేతిలో 2-1 తేడాతో ఓడిన మినర్వా క్లబ్ ఇంటిబాట పట్టింది. అయితే ప్రిక్వార్టర్స్లో లివర్పూల్ను 6-0తో చిత్తు చేయడం ద్వారా మినర్వా ఫుట్బాల్ క్లబ్ అరుదైన ఘనత సాధించింది. మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్లో ఇంగ్లీష్ జెయింట్స్ను చిత్తు చేసిన తొలి భారత ఫుట్బాల్ క్లబ్గా మినర్వా జట్టు చరిత్రకెక్కింది. లివర్పూల్తో మ్యాచ్లో మినర్వా ఫుట్బాల్ క్లబ్ తరఫున మొహమ్మద్ ఆజమ్ ఖాన్ (ఆట రెండో నిమిషం, 36 వ నిమిషం), అమర్సన్ సింగ్ (11వ నిమిషం), సింగ్ (25, 28వ, 47వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో మినర్వా ఫుట్బాల్ క్లబ్ ప్రదర్శనపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘భారత ఫుట్బాల్లో ఇది కొత్త ఆరంభం. అంతర్జాతీయంగా భారత ఫుట్బాల్ మరింత దేదీప్యమానంగా వెలుగొందాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.ఇక గతేడాది మినర్వా ఫుట్బాల్ క్లబ్ మూడో ట్రోఫీలను సొంతం చేసుకుంది. స్వీడన్లో జరిగిన గోతియా కప్, డెన్మార్క్లో జరిగిన డానా కప్, నార్వేలో జరిగిన నార్వే కప్లను గెలుచుకుంది.pic.twitter.com/MYMO4G8A83— Follow @barcanation6 (@barcanationvid1) April 3, 2026చదవండి: ‘త్యాగాలు చేశా.. ఐపీఎల్ వల్ల కెరీర్ నాశనమైంది’ -
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ (51 కేజీలు), టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు), పూజా రాణి (85 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. భారత్కే చెందిన ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), అరుంధతి (70 కేజీలు) సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో నిఖత్ 0–5తో వు యు (చైనా) చేతిలో ఓడిపోయింది. పారిస్ ఒలింపిక్స్లోనూ వు యు చేతిలోనే నిఖత్ ఓటమి పాలైంది.లవ్లీనా 0–5తో అజీజా జొకిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, అంకుశిత 0–3తో నియెన్ చిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, పూజా రాణి 0–5తో నాదెజ్దా రియాబెట్స్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. ఇతర సెమీఫైనల్స్లో ప్రీతి 5–0తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎజి ఇమ్ (దక్షిణ కొరియా)పై, అరుంధతి 4–1తో ఒయ్షా తొయ్రోవా (ఉజ్బెకిస్తాన్)పై, ప్రియ 5–0తో నమున్ మోన్ఖోర్ (మంగోలియా)పై గెలుపొందారు. -
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు. జోగిందర్, సన్నీ కుమార్లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ నుంచి భారత రెండు డబుల్స్ స్టార్స్ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపాడు. డబుల్స్లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్ స్టార్స్ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్కు సింగిల్స్లో మరో స్వర్ణ పతకం లభించలేదు. -
భారత్కు ఐదు పతకాలు ఖాయం
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు మరో ఐదు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్స్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు)... పురుషుల విభాగంలో లోకేశ్ (85 కేజీలు), ఆకాశ్ (75 కేజీలు), హర్ష్చౌధరీ (90 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. జియి చెన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జైస్మీన్ 5–0తో... యుకా సదమత్సు (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5–0తో ఏకపక్ష విజయాలు అందుకున్నారు. లోకేశ్ 5–0తో గిచాయి కిమ్ (దక్షిణ కొరియా)పై, ఆకాశ్ 5–0తో యాలాస్ బగ్తియరోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, హర్ష్5–0తో తినిస్తాన్ అలీబయెవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. ఓవరాల్గా ఈ టోర్నీలో మహిళల విభాగంలో బరిలోకి దిగిన 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్ చేరుకోగా... పురుషుల విభాగంలో ఆరుగురు ఈ ఘనత సాధించారు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో మరో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్)లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుతో సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. 29వ నిమిషంలో కెపె్టన్ డేవిడ్ కాస్టనెడా మునోజ్ చేసిన గోల్తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 87వ నిమిషంలో శ్రీనిధి జట్టు డిఫెండర్ జగ్దీప్ సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఐజ్వాల్ జట్టు స్కోరును సమం చేసింది. మొత్తం పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి జట్టు ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్ల్లో గెలిచి, మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 12న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్లో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో శ్రీనిధి డెక్కన్ జట్టు పోటీపడుతుంది. -
వైశాలికి రెండో గెలుపు
పెయియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. టాన్ జోంగి (చైనా)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్లో వైశాలి 51 ఎత్తుల్లో గెలుపొందింది. ఏడో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అనా ముజిచుక్ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. -
కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్కు అవమానం!
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన తోటి ప్లేయర్ను అవమానించి మరోసారి వార్తల్లో నిలిచాడు. జర్మనీలోని కార్ల్స్రూహే వేదికగా గ్రెంకె చెస్ ఫ్రీస్టైల్ ఓపెన్ టోర్నీలో ఈ ఘటన చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా రెండో రౌండ్లో కార్ల్సన్ కజకిస్తాన్కు చెందిన రెండో ర్యాంకర్ (మహిళల విభాగంలో) అలువా నూర్మన్తో తలపడాల్సి ఉంది. కార్ల్సన్ వచ్చి తన కుర్చీలో కూర్చోగానే అలువా ‘మీతో ఒక సెల్ఫీ దిగొచ్చా’ అని కార్ల్సన్ను అడిగింది. కార్ల్సన్ ఒప్పుకోవడంతో అలువా తన బ్యాగులో నుంచి ఫోన్ తీసి కార్ల్సన్తో సెల్ఫీ దిగింది. ఆ సమయంలో కార్ల్సన్ కూడా నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చాడు. కాసేపటికే అపరిచితుడిలా మారిన కార్ల్సన్ ఉన్నట్టుండి తన సీటు నుంచి లేచి మ్యాచ్ల నిర్వహణ చూస్తున్న ఆర్బిటర్ను పిలిచి విషయం చెప్పాడు. దీంతో ఆర్బిటర్ అలువా నూర్మన్ వద్దకు వచ్చి ‘మీ ఫోను ఇచ్చేయండి’ అని అడిగాడు. దీంతో నూర్మన్ తన బ్యాగులో నుంచి ఫోన్ తీసి ఆర్బిటర్కు ఇచ్చేసింది. ఫోన్ను కార్ల్సన్కు చూపించిన ఆర్బిటర్ ‘ఓకే నా’ అన్నట్లుగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను చెస్ బేజ్ ఇండియా షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. కానీ ఆర్బిటర్ చర్యను మాత్రం ఎవరు తప్పుబట్టడం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం చెస్ గేమ్లో ఫోన్ వాడడం లేదా ఉపయోగించడం నిషేధం. గేమ్ ఆడేటప్పుడు ఆటగాళ్లు కూడా మొబైల్ను తమ వద్ద పెట్టుకోకూడదు. కార్ల్సన్ అందుకే అలువా నూర్మన్ వద్ద ఫోన్ ఉందని, అది రూల్స్కు విరుద్ధం కావడంతో ఆర్బిటర్కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్లో కార్ల్సన్ ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి చేతిలో ఓటమిని తట్టుకోలేక విచిత్రంగా ప్రవర్తించాడు. మ్యాచ్ ఓటమిని తట్టుకోలేని కార్ల్సన్.. అర్జున్ షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయగా, కార్ల్సన్ మాత్రం కోపంతో టేబుల్ను బలంగా కొడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.Kazakhstan no.2 Woman Alua Nurman takes a selfie with her opponent Magnus Carlsen before the start of Round 2 at the @GRENKEChess Freestyle Open! Before the start of the round, an Arbiter comes and takes Alua's phone with him.Video: @ram_abhyudaya/ ChessBase India pic.twitter.com/3KZ8lc17sh— ChessBase India (@ChessbaseIndia) April 3, 2026చదవండి: రోహిత్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్కు మైండ్ బ్లాక్! -
సత్తా చాటిన పంకజ్ అద్వానీ
లూథియానా: దిగ్గజ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పూల్ నేషనల్స్లో కూడా సత్తా చాటాడు. తొలిసారి ఈ టోర్నీలో పాల్గొన్న పంకజ్ 10 బాల్ పూల్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ (పీఎస్పీబీ) 11–9 స్కోరుతో పుష్పేందర్ సింగ్ (ఆర్ఎస్పీబీ)ని ఓడించాడు. ఒక దశలో 0–3తో వెనుకబడి పంకజ్ కోలుకొని స్కోరును 3–3తో సమం చేయడంతో పాటు ఆ తర్వాత వేగంగా దూసుకుపోయాడు. మహిళల విభాగంలో చిత్ర మగిమైరాజ్ టైటిల్ సొంతం చేసుకుంది. -
శీతల్కు పాయల్ షాక్!
బ్యాంకాక్: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత జట్టు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు సాధించి అగ్రస్థానంతో ముగించింది. అయితే టోర్నీలో సంచలన ప్రదర్శన చివరి రోజు శనివారం వచ్చింది. కాంపౌండ్ మహిళల ఫైనల్ విభాగంలో వరల్డ్ నంబర్వన్, స్టార్ పారా ఆర్చర్ శీతల్దేవికి అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ పోరులో భారత్కే చెందిన పాయల్ నాగ్ 139–136 స్కోరుతో శీతల్పై విజయం సాధించింది. గత ఏడాది దుబాయ్లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్లో పాల్గొన్న పాయల్కు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. ఓపెనింగ్ ఎండ్లో పాయల్ 27–25తో ముందంజ వేయగా, సెకండ్ ఎండ్ ముగిసే సరికి శీతల్ రాణించడంతో స్కోరు 54–54తో సమమైంది. అయితే చివరి ఎండ్లో మళ్లీ సత్తా చాటిన పాయల్ పైచేయి సాధించింది. ఒడిషాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ కరెంట్ షాక్ కారణంగా రెండు చేతులు, రెండు కాళ్ల మోకాలి కింది భాగాలు కోల్పోయింది. ఏడాదిన్నర క్రితం జైపూర్లో జరిగిన జాతీయ పారా నేషనల్స్లో కూడా శీతల్పై పాయల్ గెలుపొందింది. -
భారత మహిళల జోరు
పాఫోస్ (సైప్రస్): వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు వైశాలి రమేశ్బాబు, దివ్య దేశ్ముఖ్ సత్తా చాటారు. వీరిద్దరు శనివారం జరిగిన తమ ఆరో రౌండ్ గేమ్లలో విజయాలు అందుకున్నారు. వైశాలి 47 ఎత్తుల్లో కేటరినా లాగ్నో (రష్యా)ను ఓడించగా...దివ్య 46 ఎత్తుల్లో బిబిసర అసుబయెవా (కజకిస్తాన్)పై గెలుపొందింది. వీరిద్దరికి టోర్నీలో ఇదే తొలి విజయం కావడం విశేషం. మరో వైపు పురుషుల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరో గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. శనివారం జరిగిన ప్రజ్ఞానంద, నకమురా మధ్య జరిగిన ఆరో రౌండ్ పోరు 23 ఎత్తులో సమంగా ముగిసింది. -
పతకాలకు అడుగుదూరంలో భారత బాక్సర్లు
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. శుక్రవారం జరిగిన మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు)తోపాటు హరియాణాకు చెందిన ప్రియ ఘన్ఘస్ (60 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్ చేరిన ఈ ముగ్గురికీ కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. జియాన్ బాగుహిన్ (ఫిలిప్పీన్స్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ తొలి రౌండ్లోనే విజయాన్ని అందుకుంది. నిఖత్ పంచ్లకు జియాన్ ఎదురు నిలువలేదు. దాంతో రిఫరీ బౌట్ను నిలిపివేసి నిఖత్ను విజేతగా ప్రకటించారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో ప్రియ 4:1తో చెంగ్యు యాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రీతి 5:0తో మున్గున్ సెట్సెగ్ (మంగోలయా)ను ఓడించింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్ దీపక్ (70 కేజీలు) నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో దీపక్ 1:4తో జాయెద్ ఇసాహష్ (జోర్డాన్) చేతిలో ఓడిపోయాడు. -
చెస్లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన చెస్ చిచ్చరపిడుగు బోధన శివనందన్ ఇంగ్లండ్ మహిళల చెస్ టాప్ ర్యాంకర్గా అవతరించింది. శుక్రవారం విడుదల చేసిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) రేటింగ్స్లో ఇంగ్లండ్కు చెందిన 11 ఏళ్ల బోధన 2366 పాయింట్లు సాధించి 72వ ర్యాంక్లో నిలిచింది. తొలిసారి టాప్–100లోకి వచ్చిన బోధన ఈ క్రమంలో 2306 పాయింట్లతో ఇంగ్లండ్ టాప్ ప్లేయర్గా ఉన్న 25 ఏళ్ల లాన్ యావోను అధిగమించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన బోధన తల్లిదండ్రులు 2007లో ఇంగ్లండ్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గత ఏడాది ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా పొందిన బోధన ఇటీవల జరిగిన యూరోపియన్ క్లబ్ కప్లో ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)పై సంచలన విజయం నమోదు చేసింది. 10వ ర్యాంక్లో అర్జున్ మరోవైపు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ భారత నంబర్వన్గా కొనసాగుతున్నాడు. తాజా రేటింగ్స్లో అర్జున్ 2751 పాయింట్లతో 10వ ర్యాంక్లో నిలిచాడు. 2741 పాయింట్లతో ప్రజ్ఞానంద 12వ ర్యాంక్లో, 2732 పాయింట్లతో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 15వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి 2535 పాయింట్లతో ఐదో ర్యాంక్లో ఉంది. 2510 పాయింట్లతో దివ్య దేశ్ముఖ్ పదో ర్యాంక్లో, 2470 పాయింట్లతో ద్రోణవల్లి హారిక 18వ ర్యాంక్లో, 2470 పాయింట్లతోనే వైశాలి 19వ ర్యాంక్లో ఉన్నారు. -
ప్లేఆఫ్ బెర్త్ లక్ష్యంగా...
న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే జరిగే బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు భారత మహిళల టెన్నిస్ జట్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జట్టు సభ్యులంతా తుది కసరత్తుల్లో చెమటోడ్చుతున్నారు. పురుషుల టీమ్ టెన్నిస్లో జరిగే డేవిస్ కప్లాగే మహిళల విభాగంలో యేటా ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్లో ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీని నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో ఆతిథ్య భారత్ సహా ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్లాండ్లు మిగతా జట్లు కాగా... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్లో జరిగే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. చిట్టచివరి రెండు జట్లు మాత్రం వచ్చే ఏడాది జరిగే ఆసియా–ఓసియానియా గ్రూప్–2కు దిగజారుతాయి. కీలకమైన ఈ టోర్నీకి ముందు జట్టు సన్నద్ధతపై కెప్టెన్ విశాల్ ఉప్పల్ మాట్లాడుతూ భారత అమ్మాయిల జట్టు మరోసారి ప్లే–ఆఫ్స్ బెర్తు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్డ్కోర్టుల్ని ఆకళింపు చేసుకునేందుకే కాస్త ముందుగా వచ్చామని... రాగానే కసరత్తు మొదలుపెట్టామని చెప్పాడు. జట్టు అనుభవజు్ఞలు, యువ క్రీడాకారిణిలతో సమతుల్యంగా ఉందన్నాడు. వరుసగా ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్ బెర్తు సాధించే సత్తా ఈ జట్టుకు ఉందన్నాడు. భారత జట్టులో ఇద్దరు తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ఉన్నారు. వీరితో పాటు రుతుజా బోసలే, అంకిత రైనా, వైదేహి, కొత్త ప్లేయర్ వైష్ణవి ఆడ్కర్ మిగతా సభ్యులు. భారత మూడో ర్యాంకర్ వైదేహి మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో పటిష్టమైన జట్టే బరిలోకి దిగుతోందని చెప్పింది. ప్రతీ జట్టుపై విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపింది. గత 2025–26 సీజన్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సహజ మాట్లాడుతూ ‘ఎదురయ్యే ప్రతీ ప్రత్యరి్థని దీటుగా ఎదుర్కొంటాం. గతేడాది ప్లేఆఫ్స్ అనుభవం కూడా గడించాం. ఇప్పడు కూడా స్ఫూర్తిదాయక పోరాటం కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. టెన్నిస్ వ్యక్తిగత ఈవెంట్ అయినా... ఇక్కడ మాత్రం జట్టుగా ఆడుతున్నాం. మా అందరిలోనూ ఇప్పుడు నా అనే కంటే మా మ్యాచ్లనే సమష్టి భావనే ఉంది’ అని పేర్కొంది. ఆశించిన ఫలితాలు సాధిస్తామనే ధీమాను శ్రీవల్లి రషి్మక వ్యక్తం చేసింది. -
డోపింగ్ అనర్హుల జాబితాలో భారత్ ‘టాప్’
న్యూఢిల్లీ: డోపింగ్ ఉల్లంఘనల్లో భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్స్ (ఏఐయూ) అనర్హులైన అథ్లెట్ల జాబితాలో కెన్యా అగ్రస్థానంలో ఉండగా... తాజా నివేదికలో కెన్యాను అధిగమించి భారత్ తొలి స్థానానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు డోపింగ్ ఉల్లంఘనలకు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్నారు. కెన్యా (146 మంది అథ్లెట్లు), రష్యా (66 మంది అథ్లెట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్ ద్యుతీ చంద్, మిడిల్ డిస్టాన్స్ రన్నర్ పర్వేజ్ ఖాన్, తమిళనాడు స్పింటర్ శేఖర్ ధనలక్ష్మి ఉన్నారు. ద్యుతీ చంద్పై 2022 డిసెంబర్లో నాలుగు సంవత్సరాల నిషేధం పడగా... పర్వేజ్పై విధించిన నిషేధం జూలై 2030 వరకు కొనసాగనుంది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే ఏఐయూ అన్నీ దేశాల డోపింగ్ వివరాలు సేకరిస్తుంది. డోపింగ్ను రూపుమాపాలని కంకణం కట్టుకున్న భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) దీనితో సంబంధం ఉన్న కేంద్రాలను గుర్తించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటోంది. అథ్లెట్లు డోపింగ్కు పాల్పడటం వెనక శిక్షకుల హస్తం కూడా ఉంటుందని భావిస్తున్న ఏఎఫ్ఐ... కోచ్లందరూ తమ వద్ద పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఏఎఫ్ఐలో నమోదు చేసుకోని కోచ్లను బ్లాక్లిస్ట్లో పెట్టడంతో పాటు... వారి వద్ద శిక్షణ తీసుకున్న వారిని జాతీయ అవార్డులకు అనర్హులుగా ప్రకటించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఏఎఫ్ఐ జాతీయ శిబిరాలను వికేంద్రీకరించింది. ప్రస్తుతం రిలే జట్లకు మాత్రమే నేషనల్ క్యాంప్లు నిర్వహిస్తోంది. మిగిలిన అగ్రశ్రేణి అథ్లెట్లందరూ రిలయన్స్, జేఎస్డబ్ల్యూ, టాటా వంటి ప్రైవేటు సంస్థలు... ఆర్మీ, నేవీ వంటి ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. -
ఆ రెండింటి కలయిక నేను: సానియా మీర్జా భావోద్వేగం
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హైదరాబాదీ స్టార్ ఎన్నో సవాళ్లు అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ స్టార్గా గుర్తింపు పొందింది. తన 20 ఏళ్ల కెరీర్లో సానియా మీర్జా మొత్తంగా 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. కెరీర్లో అత్యున్నత స్థాయికిఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు, మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు ఉండటం విశేషం. కెరీర్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన సానియా మీర్జా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చేదు అనుభవాలు చవిచూసింది. తొలుత సొహ్రాబ్ అనే వ్యక్తితో సానియా నిశ్చితార్థం చేసుకోగా.. ఆ బంధం పెళ్లి వరకు రాలేదు.షోయబ్తో వివాహం, విడాకులుఆ తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించిన సానియా మీర్జా.. అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సానియాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అయినా సరే ఆమె ఏనాడూ ధైర్యం కోల్పోకుండా ట్రోలర్స్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక షోయబ్- సానియాలకు కుమారుడు ఇజహాన్ సంతానం.కాగా కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సానియా- షోయబ్ల విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది. షోయబ్ ప్రవర్తనతో విసిగిపోయిన సానియా.. తానే అతడికి విడాకులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి సానియా దుబాయ్లో నివసిస్తోంది. టెన్నిస్ అకాడమీ వ్యవహారాలతో బిజీగా గడుపుతోంది.ఆ రెండింటి కలయిక నేనుఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టా వేదికగా సానియా మీర్జా భావోద్వేగ పోస్టు పెట్టగా వైరల్గా మారింది. "కొన్ని రోజులు ఆమె యోధురాలిగా ఉంటుంది. మరికొన్నిసార్లు కుప్పకూలిపోతుంది. చాలాసార్లు ఈ రెండింటి కలయికగా ఆమె ఉంటుంది. అయితే, ప్రతి రోజు ఆమె ఉనికి మాత్రం అలాగే ఉంటుంది.ధైర్యంగా నిలబడటం.. పరిస్థితులతో పోరాడటం.. నిరంతరం కొత్తగా ఏదైనా ప్రయత్నించడం.. ఆమెకు అలవాటు. ఆ ఆమెను నేనే’’ అని సానియా స్ఫూర్తిదాయక వాక్యాలు పంచుకుంది. చదవండి: Sheetal Devi: పోరాటానికి పరిమితులెందుకు? -
‘మెస్సీ బృందం మమ్మల్ని మోసం చేసింది’
అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్ ఆరోపించారు. కేరళలో పర్యటించి మ్యాచ్ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్కు స్పాన్సర్ల ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు. మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్ డిమాండ్ చేశాడు. గత డిసెంబర్లో మెస్సీ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. కోల్కతా, హైదరాబాద్లో మెస్సీ బృందం ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడింది.కాగా ఈ ఏడాది జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిఫా 48 జట్లతో కూడిన వివరాలను, మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా రెండురోజుల క్రితం ఫిఫా ప్రపంచకప్ కోసం అర్జెంటీనా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతు న్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జాంబియాతో ఆడిన మ్యాచ్ మెస్సీకి చివరిదనే ప్రచారం జరిగిన వేళ.. మైదానంలోనే మెస్సీ కంటతడి పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఫిఫా ప్రపంచకప్కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్లు ఆడనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.చదవండి: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’ -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో రెండో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్)లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో రెండో ‘డ్రా’ చేరింది. షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్తో జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. శ్రీనిధి జట్టు గోల్కీపర్ కమల్జీత్ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో హెడ్ కోచ్ కార్లోస్ వాజ్ పింటో శ్రీనిధి తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. నానాటో లూయిస్, వాన్లాన్రెమ్డికా జట్టులోకి వచ్చారు. ఆట 11వ నిమిషంలో శ్రీనిధి కెపె్టన్ డేవిడ్ కాస్టనెడా కొట్టిన షాట్ను షిల్లాంగ్ గోల్కీపర్ రింబాయ్ అడ్డుకున్నాడు. చివర్లో 86వ నిమిషంలో పౌలో సెజార్ హెడర్ను మరోసారి రింబాయ్ నిలువరించాడు. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు ఆరు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డైమండ్ హార్బర్ ఫుట్బాల్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్ను హైదరాబాద్లో ఈనెల ఐదో తేదీన ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది. -
‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’
పెయియా (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఆటగాళ్లు ‘మోసాలకు’ పాల్పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తీసుకుంటున్న అతి జాగ్రత్తలపై అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకమురా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు చెందిన వ్యక్తుల్లా చూస్తున్నారని అతను ధ్వజమెత్తాడు. క్యాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో పాల్గొంటున్న ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లలో నకమురా ఒకడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచే ఆటగాడు ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్ పోరులో ప్రస్తుత విజేత గుకేశ్ దొమ్మరాజుతో తలపడతాడు. సైప్రస్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆటగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ‘ఫిడే’ పలు జాగ్రత్తలు తీసుకుంది. మెటల్ డిటెక్టర్లతో పాటు ఈసారి మరిన్ని కొత్త తరహా స్కానర్లను టోర్నీ జరిగే వేదికపై ఏర్పాటు చేసింది. ఈ తరహా అతి జాగ్రత్త నకమురాకు ఆగ్రహం తెప్పించింది. ‘అసలు ఆటగాళ్లు గేమ్ ఆడుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారనే ఆలోచనే పనికిమాలినదని అని నా నమ్మకం. కొందరు ఆటగాళ్లే ఇలాంటి ఏర్పాటు కావాలని అడిగారని విన్నాను. ఇది పూర్తిగా అర్థరహితం. గేమ్కు ముందు గేమ్ తర్వాత కూడా వారు మమ్మల్ని స్కాన్ చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్లే కాకుండా వేరుగా ప్రత్యేక స్కానర్లూ ఉన్నాయి. మేమేమైనా ఇరాన్లో పని చేస్తున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్లమా? ఫిడే వాస్తవంలోకి రావాలి. మేం చెస్ ప్లేయర్లం మాత్రమే’ అని నకమురా వ్యాఖ్యానించాడు. అసలు ఈ తరహా ఏర్పాటు చేయడానికి సరైన కారణం కూడా లేదని ఈ అమెరికా గ్రాండ్మాస్టర్ అభిప్రాయపడ్డాడు. ‘ఆటగాళ్ల మోసం గురించి అతి చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఏదో ఒక చిన్న ఓపెన్ టోర్నీ అంటే ఏమైనా అనుకోవచ్చు. అక్కడంటే స్కానర్లవంటివి ఉండవు. కానీ ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లంతా ఒకే చోట ఉన్నారు. కెమెరాలు ఉన్నాయి. ఆర్బిటర్స్ ప్రతీ ఒక్కరినీ చూస్తున్నారు. ఎవరో ఒకరు లోపలి నుంచే సహాయం అందిస్తే తప్ప తప్పుడు పనులు చేయడానికి చాన్స్ ఉండదు’ అని నకమురా వివరించాడు. యుద్ధ వాతావరణం మధ్య సైప్రస్లో జరుగుతున్న ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో భారత క్రీడాకారిణి కోనేరు హంపి తప్పుకోగా... టోర్నీ ఆరంభానికి ముందు నకమురా కూడా బహిరంగంగా తన ఆందోళనను వ్యక్తం చేశాడు. -
రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్
జ్యూరిక్: గతంలో తల తాకట్టు పెట్టి అయినా ఫుట్బాల్ వీరాభిమానులు ప్రపంచకప్ టికెట్లు కొని మ్యాచ్ల్ని ప్రత్యక్షంగా తిలకించేవారు. ఇప్పుడైతే ఏకంగా ఇల్లే తాకట్టు పెట్టాలేమో! ఎందుకంటే యావత్ ప్రపంచాన్నే ఫుట్బాల్ ఫీవర్తో ఊపేసే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర అక్షరాలా రూ. 10,23,212. అమెరికా కరెన్సీలో 10,990 డాలర్లు. ఈ మొత్తంతో కేవలం 90 నిమిషాల టైటిల్ పోరును చూస్తారు. మన దేశంలో ఈ మొత్తంతో ఏడున్నర (75 గ్రాముల) తులాల బంగారు ఆభరణాల్ని కొనేయొచ్చు. ఫుట్బాలా... మజాకా! త్వరలో అమెరికా, మెక్సికో, కెనడా వేదికలపై ప్రపంచకప్ ఫుట్బాల్ సంగ్రామం జరుగనుంది. ఇందులో భాగంగా రెండో కేటగిరీ, మూడో కేటగిరీ టికెట్ల ధరల్ని ‘ఫిఫా’ ఖరారు చేసింది. మొదట గతేడాది డిసెంబర్లో ‘డ్రా’ విడుదల చేసిన సందర్భంలో తొలి దశలో 8680 డాలర్ల (రూ.8 లక్షలు) ధరతో కొన్ని టికెట్లను విక్రయించారు. టోర్నీ దగ్గర పడుతుండటంతో ఫుట్బాల్ క్రేజీ ప్రపంచకప్ను క్యాష్ చేసుకునే పనిలో ‘ఫిఫా’ పడింది. ఇందులో భాగంగా కేటగిరీ–2 టికెట్లను తొలి దశలో 5575 డాలర్ల (రూ.5.20 లక్షలు)కు విక్రయించగా... ఇప్పుడు 7380 డాలర్ల (రూ.6.87 లక్షలు)కు పెంచేసింది. కేటగిరీ–3 టికెట్ల ధరలు అప్పుడు 4185 డాలర్లు (రూ.3.90 లక్షలు) ఉంటే... ఇప్పుడు 5785 డాలర్ల (రూ.5.38 లక్షలు)కు హెచ్చింపు చేసింది. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు ‘ఫిఫా’ వెబ్సైట్ను గమనిస్తూ ఉండాలని, సేల్ విండో తెరవగానే నిమిషాల్లోనే అమ్ముడయ్యే అవకాశముందని ‘ఫిఫా’ తెలిపింది. మెగా ఈవెంట్లో గ్రూప్ దశలో 72 మ్యాచ్లు ఉండగా... బుధవారం 17 మ్యాచ్లకు సంబంధించిన టికెట్లనే అందుబాటులో ఉంచింది. నాకౌట్ దశ పోటీల టికెట్లు పై జాబితాలో లేవు. జూన్ 12న పరాగ్వే–అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రీమియం ధర టికెట్లన్నీ అమ్ముడుపోగా... కేవలం 2735 డాలర్ల (రూ.2.54 లక్షల) టికెట్లు కొన్ని మిగిలున్నాయి. అయితే జూన్ 19న ఆ్రస్టేలియా, అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం ఒక్క టికెట్ కూడా లేదు. అన్ని కేటగిరీల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్మడయ్యాయి. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3, కెనడాలో 2 వేదికల్లో సాకర్ సంగ్రామం జరుగుతుంది. -
గోల్ఫ్తో ఎంతో ప్రయోజనం: యువీ
న్యూఢిల్లీ: గోల్ఫ్ ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీమిండియా తరఫున టి20, వన్డే ప్రపంచకప్లు నెగ్గిన ఈ ఆల్రౌండర్... క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గోల్ఫ్పై దృష్టి పెట్టాడు. క్రికెట్ కెరీర్కు ముందే గోల్ఫ్ ఆడి ఉంటే ఇంకా ఎంతో ప్రయోజనం చేకూరేదని... ఇప్పటికైనా యువ ఆటగాళ్లు క్రికెట్తో పాటు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తే సేద తీరడంతో పాటు ఒత్తిడి దూరమవుతుందని యువీ హితవు పలికాడు. ప్రస్తుతం యువరాజ్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్)కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. గురువారం ఐజీపీఎల్ 10 ఫ్రాంచైజీల జెర్సీ ఆవిష్కరణలో యువరాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... ‘క్రికెటర్లు క్రికెట్తో పాటు గోల్ఫ్ కూడా ఆడాలి. నేను ముందే ఈ పని చేయాల్సింది. అది నాకు క్రికెట్లో చాలా సహాయపడి ఉండేది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్ ఆడుతారు. కానీ మనదేశంలో గోల్ఫ్ను కేవలం ఉన్నత వర్గాల క్రీడగా పరిగణిస్తారు. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గోల్ఫ్ను పాఠశాల స్థాయికి తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతీ క్రీడను ప్రయత్నించాలని భావిస్తున్నాం.మనదేశంలో క్రికెట్ అతిపెద్ద ఆట అని నాకు తెలుసు. కానీ గోల్ఫ్ కూడా ఉత్తేజకరమైన క్రీడే. అందరూ దీన్ని ప్రయత్నించాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్గా ఇతర క్రీడలకు కూడా నా వంతు సాయం చేయాలనుకుంటున్నా. ఐజీపీఎల్ లీగ్ గోల్ఫ్కు మరింత ప్రచారం కల్పిస్తోంది. దీని ద్వారా ఈ ఆట ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇప్పుడు టీవీల్లో చూసే పిల్లలు... భవిష్యత్తులో గోల్ఫ్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారు’ అని పేర్కొన్నాడు. -
విజేతలు శ్రీచరణ్ తేజ్, చిద్విలాసిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ అండర్–15 బాలుర విభాగంలో కొండ్లాపు శ్రీచరణ్ తేజ్, అండర్–15 బాలికల విభాగంలో కుమ్మరికుంట్ల చిద్విలాసిని విజేతలుగా నిలిచారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వివిధ వయో విభాగంలో తెలంగాణ జిల్లాల నుంచి 300 మందికిపైగా పోటీపడ్డారు. నిర్ణీత ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శ్రీచరణ్ తేజ్ 4.5 పాయింట్లు సాధించగా... చిది్వలాసిని 3.5 పాయింట్లు స్కోరు చేసింది. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్ర విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆర్.చంద్రమౌళి చీఫ్ ఆర్బిటర్గా, ఆర్.శ్రీరామ్ డిప్యూటీ ఆర్బిటర్గా వ్యవహరించారు. వివిధ వయో విభాగాల్లో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు వివరాలు ఇలా ఉన్నాయి. అండర్–15 విభాగం: బాలురు: 1. శ్రీచరణ్ తేజ్ (4.5 పాయింట్లు), 2. బొబ్బిలి సుజయ్ (4 పాయింట్లు), 3. జక్కరాజు జై శ్రేయాన్స్ (4 పాయింట్లు). బాలికలు: 1. చిది్వలాసిని (3.5 పాయింట్లు), 2. లేఖ్యశ్రీ సాన్వి (3 పాయింట్లు), 3. ఎ.ప్రణతి (2.5 పాయింట్లు). అండర్–13 విభాగం: బాలురు: 1. ధ్రువ్ శ్రీవాస్తవ (5 పాయింట్లు), 2. ఎస్.శశాంక్ (5 పాయింట్లు), 3. జి.రుషికేశ్ ( 4 పాయింట్లు). బాలికలు: 1. కె.లాస్య (4 పాయింట్లు), 2. చేట్ల వేదశ్రుతి (3 పాయింట్లు), 3. గౌలీకర్ సుహాసిక (3 పాయింట్లు). అండర్–11 విభాగం: బాలురు: 1. కేఎస్ విశిష్ట్ శ్రీరామ్ (5 పాయింట్లు), 2. పి.చార్వీక్ సాయి (4.5 పాయింట్లు), 3. కొత్తపల్లి దేవాంశ్ (4.5 పాయింట్లు). బాలికల విభాగం: 1. పొలిశెట్టి ధృతి (4 పాయింట్లు), 2. కె.తేజస్వి (4 పాయింట్లు), 3. మునిపల్లి ఆశ్రిత (4 పాయింట్లు). అండర్–9 విభాగం: బాలురు: 1. అంబటి ప్రసిధ్ (5 పాయింట్లు), 2. బి.యజత్ రెడ్డి (5 పాయింట్లు), 3. పట్లోళ్ల ధ్రువిన్ రెడ్డి (4 పాయింట్లు). బాలికలు: 1. జి.శాన్విత (3 పాయింట్లు), 2. సాన్విక (3 పాయింట్లు), 3. ముద్దాల కుముద (3 పాయింట్లు). అండర్–7 విభాగం: బాలురు: 1. రంగనాధ వేద ఆర్క (5 పాయింట్లు), 2. ఎస్. తనవ్ ఇషాన్ (5 పాయింట్లు), 3. గూడురు విహాన్ (4 పాయింట్లు). బాలికలు: 1. మెహరీన్ షేక్ సుహీరా (4 పాయింట్లు), 2. ఆవుల శ్రేయాంశి (3 పాయింట్లు), 3. రంగనాధ ఐరా అర్ణి (3 పాయింట్లు). -
Italy World Cup: అయ్యో ఇటలీ!
ఒకప్పుడు ఫుట్బాల్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోరీ్నకి అర్హత సాధించలేక చతికిలబడింది. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు ప్రపంచకప్ను ముద్దాడిన ఇటలీ... తాజా క్వాలిఫయర్స్ చివరి రౌండ్లో బోస్నియా అండ్ హెర్గెగోవినా జట్టు చేతిలో ఓడిపోయింది. మరో మూడు నెలల్లో జరిగే 2026 వరల్డ్కప్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది. 2006లో చివరిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న ఇటలీ... ఆ తర్వాత నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతూ వస్తోంది. ‘కర్ణుడి చావుకు లక్ష కారణాలు’ అన్న చందంగా... ఇటలీ జట్టు పేలవ ఆటతీరుకు కారణాలెన్నో. క్రికెట్లో వెస్టిండీస్ మాదిరిగా ఒకప్పుడు అరవీర భయంకర ప్లేయర్లతో ప్రత్యర్థులను గడగడలాడించి నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ... ఇప్పుడు అస్థిత్వం కోసం పోరాడుతోంది. క్లబ్ గేమ్స్, మ్యాచ్ రెవెన్యూ, టికెట్ ఆదాయం, ప్రకటనల రాబడి, మౌలిక వసతులను పట్టించుకోకోకపోవడం, యువతకు ప్రోత్సాహం కరువవడం ఇలా ప్రతి అంశంలో నానాటికి తీసికట్టులా మారుతున్న ఇటలీ ఫుట్బాల్ తీరును ఓసారి పరిశీలిస్తే... సాక్షి క్రీడావిభాగం : ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఇప్పటి వరకు 22 సార్లు వరల్డ్ కప్ జరగ్గా... అందులో ఆరుసార్లు ఇటలీ ఫైనల్ చేరింది. నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006లో) ట్రోఫీ చేజిక్కించుకున్న ఇటలీ... 1970, 1994లో రన్నరప్గా నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) ప్రపంచ విజేతగా నిలవగా... ఆ తర్వాత జర్మనీ (1954, 1974, 1990, 2014)తో కలిసి ఇటలీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది జూన్–జూలైలో కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా ఇటలీ లేకుండానే ప్రపంచకప్ జరగనుంది. గత రెండు (2018, 2022లో) పర్యాయాలు కూడా వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన ఇటలీ జట్టు... అంతకుముందు 2010, 2014లో గ్రూప్ దశను దాటలేకపోయింది. 2006లో చివరిసారిగా చాంపియన్గా నిలిచిన ఇటలీ... ఆ తర్వాత ప్రధాన ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలకడం... యువతరం ఆ స్థాయిలో రాణించలేకపోవడంతో గత రెండు దశాబ్దాల్లో ప్రభావం కోల్పోతూ వచి్చంది. క్రికెట్లో ‘మెన్ ఇన్ బ్లూ’గా టీమిండియాకు ఎంత ఆదరణ ఉందో... ఫుట్బాల్లో ‘ద బ్లూస్’ (అజూరి)గా ఇటలీకి అంతకంటే ఎక్కువ స్టార్డమ్ ఉంది. అలాంటి ఇటలీ ఇప్పుడు వరుసగా మూడోసారి (2018, 2022, 2026), ఓవరాల్గా నాలుగోసారి (1958లో తొలిసారి) వరల్డ్కప్నకు దూరమైంది. జట్ల సంఖ్య పెరిగినా... 2022లో ఖతర్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో 32 జట్లు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్యను 48కి పెంచారు. ఇలాంటి సమయంలోనూ ఇటలీ క్వాలిఫై కాకపోవడం ఆ జట్టు పడిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం. వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో బోస్నియా అండ్ హెర్జెగోవినా చేతిలో ఓడింది. తొలుత నిరీ్ణత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్ సాధించడంతో మ్యాచ్ ‘డ్రా’కాగా... విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో బోస్నియా 4–1 గోల్స్ తేడాతో ఇటలీని బోల్తా కొట్టించింది. దీంతో ఇటలీ ఆటగాళ్లకు వరుసగా మూడోసారి నిరాశ తప్పలేదు. మరో వెస్టిండీస్ మాదిరిగా... 2006లో వరల్డ్కప్ గెలిచిన అనంతరం ఇటలీ జట్టు 2020లో యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఏ టోర్నమెంట్లోనూ ఆకట్టుకోలేకపోయింది. 2006లో ఇటలీ జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన మిడ్ఫీల్డర్ గటుసో... ప్రస్తుతం జట్టు కోచ్గా వ్యవహరిస్తున్నప్పటికీ అతడు ఇటలీ రాత మార్చలేకపోయాడు. ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు ఉండవని ఇటలీ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు గాబ్రియల్ గ్రావినా ప్రకటించినా... ఇలాగే కొనసాగితే క్రికెట్లో వెస్టిండీస్ మాదిరిగా ఫుట్బాల్లో ఇటలీ ప్రభ కూడా మసకబారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్లు లేకపోయినా... గొప్ప క్రమశిక్షణ, అంతకుమించిన అంకితభావంతో ఒకప్పుడు ఇటలీ జట్టు మైదానంలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేది. అర్జెంటీనాకు లియోనల్ మెస్సీ, పోర్చుగల్కు క్రిస్టియానో రొనాల్డో లాగా... ఇటలీ జట్టుకు స్టార్ ప్లేయర్ల అండ లేకపోయినా... ఆ జట్టు సమష్టితత్వానికి పెట్టింది పేరు. చక్కటి సమన్వయం అంతకుమించిన నైపుణ్యంతో గ్రౌండ్లో మ్యాజిక్ చేసే ఇటలీ జట్టులో ప్రస్తుతం బృంద స్ఫూర్తి లోపించిందనేది సుస్పష్టం. 1992 నుంచి 1996 వరకు వరుసగా మూడుసార్లు యూరోపియన్ చాంపియన్గా నిలిచిన ఇటలీ... 2006లో తమ దేశ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత పటిష్ట జట్టుతో బరిలోకి దిగి వరల్డ్ చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాతి నుంచి దేశంలో ఆటకు ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు క్లబ్ ఫుట్బాల్లో సైతం ఇటలీ జట్ల హవా సాగేది. కానీ గత దశాబ్దకాలాన్ని పరిశీలిస్తే ఆ వైభవం మచ్చుకైనా కనిపించడం లేదు. నానాటికి ఇటలీ ఆట తీసికట్టుగా మారుతుండటంతో... ప్రేక్షకుల్లో ఆటపై ఆదరణ సైతం తగ్గుతోందని ఇటీవలి ఆదాయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ జట్టు మైదానంలో అడుగు పెడుతోందంటే... స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయేది. టికెట్ ఆదాయం, మైదానంలో ప్రకటనల రాబడితో పాటు... టీవీ రైట్స్ రూపంలో పెద్ద ఎత్తున డబ్బు వచ్చేది. కానీ గత రెండు దశాబ్దాల్లో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. టీవీ రైట్స్ విషయంలోనూ ఇటలీ చాలా వెనుకబడిపోయింది. ఇది పరోక్షంగా ఆటపై పెట్టుబడి పెట్టడంలో వెనకడుగు వేసేలా చేసింది. మరి వీటన్నింటినీ అధిగమించి 2030లో మొరాకో, పోర్చుగల్, స్పెయిన్లో జరిగే ప్రపంచకప్ వరకైనా ఇటలీ జట్టు గాడిన పడుతుందా చూడాలి! కింకర్తవ్యం గతంలో అర్జెంటీనా (1970), ఇంగ్లండ్ (1974) వంటి జట్లు సైతం ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన సందర్భాలున్నాయి. అయితే అవి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి లోపాలను సరిచేసుకొని సత్తా చాటాయి. ఇటలీ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు సాకర్ ప్రపంచాన్ని ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రపంచకప్నకు క్వాలిఫై కాలేదంటే... వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. గత దశాబ్ద కాలంగా పేలవ ఆటతీరు రోజు రోజుకు ప్రమాణాలు దిగజార్చుకున్న ఇటలీ... ఈ పరాజయంతోనైనా కళ్లు తెరుస్తుందా చూడాలి. ఇటలీ ఫుట్బాల్ తిరిగి గాడిన పడాలంటే... సమస్య మూలాలను గుర్తించాల్సిన అవసరముంది. సమాఖ్యను ప్రక్షాళన చేయడం... మౌలిక వసతులు పెంపొందించడం... యువతకు సరైన మార్గనిర్దేశం చేయడం... ఆటగాళ్లకు అండగా నిలవడం వీటన్నింటీపై దృష్టి సారించడం ముఖ్యం.గ్రూప్ దశలో తడబడి... యూరోపియన్ జోన్లో భాగంగా అన్ని జట్లను 12 గ్రూప్లుగా విభజించారు. గ్రూప్లో ‘టాపర్’గా నిలిచిన 12 జట్లు ముందుగా ప్రపంచకప్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఇటలీ ఉన్న గ్రూప్ ‘ఐ’ నుంచి నార్వే 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ముందంజ వేసింది. ఇటలీ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఆరింట విజయం సాధించి 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఇటలీ గ్రూప్ దశలోనే మొదటి స్థానంలో నిలిస్తే ప్రపంచకప్కు అర్హత పొందేది. కానీ రెండో స్థానంలో నిలవడంతో ప్రపంచకప్ బెర్త్ కోసం తదుపరి దశ ఆడాల్సి వచ్చింది. 12 గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచిన 12 జట్లు... నేషన్స్ లీగ్లో నాలుగు గ్రూప్ల విజేతలతో కలిపి 16 జట్లు తదుపరి దశలో పోటీపడ్డాయి. 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో ఇటలీ తొలి మ్యాచ్లో 2–0తో నార్తర్న్ ఐర్లాండ్ను... బోస్నియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో వేల్స్పై గెలిచి ప్రపంచకప్ బెర్త్ కోసం పోటీపడ్డాయి. బెర్త్ను ఖరారు చేసే మ్యాచ్లో 15వ నిమిషంలో కీన్ చేసిన గోల్తో ఇటలీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో తబాకోవిచ్ గోల్తో బోస్నియా 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో బోస్నియా ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్లను గోల్స్గా మలిచారు. ఇటలీ తరఫున తొలి షాట్లో ఎస్పెసిటో, మూడో షాట్లో క్రిస్టాంటీ గురి తప్పగా... రెండో షాట్ను టొనాలి సఫలమయ్యాడు. నాలుగో షాట్ను బోస్నియా ప్లేయర్ బజ్రాక్తారెవిచ్ లక్ష్యానికి చేర్చడంతో ఇటలీ ఓటమి ఖరారుకాగా... బోస్నియా రెండోసారి ప్రపంచకప్కు అర్హత సాధించింది. 40 ఏళ్ల తర్వాత... ప్రపంచకప్ టోర్నీకి ఇరాక్ అర్హత మోంటెరే (మెక్సికో): నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఇరాక్ జట్టు పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇరాక్ 2–1 గోల్స్ తేడాతో బొలీవియా జట్టును ఓడించింది. తద్వారా 1986 తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోరీ్నలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఇరాక్ తరఫున అలీ అల్మహది (18వ నిమిషంలో), ఐమెన్ హుస్సేన్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బొలీవియా జట్టుకు మోజెస్ పనియగువా (38వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. నెల రోజుల క్రితం వరకు ఇరాక్ జట్టు ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుందా లేదా అనే అనుమానం ఉంది. పశి్చమాసియాలో యుద్ధం కారణంగా ఇరాక్ గగనతలం మూసేశారు. మెక్సికోలో ఇరాక్ రాయబార కార్యాలయం లేకపోవడంతో ఇరాక్ ఆటగాళ్లకు వీసా ఇబ్బందులు తలెత్తాయి. మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి చొరవతో ఇరాక్ ఆటగాళ్లకు వీసాలు లభించాయి. వివిధ మార్గాల్లో 25 గంటలపాటు ప్రయాణించి మార్చి 21వ తేదీన మెక్సికోకు ఇరాక్ జట్టు చేరుకోగలిగింది. డీఆర్ కాంగో పేరుతో తొలిసారి... బుధవారంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు ముగిశాయి. మెక్సికోలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆఫ్రికా ఖండానికి చెందిన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1–0తో జమైకాను ఓడించింది. ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. డీఆర్ కాంగో ఇంతకుముందు జైర్ పేరుతో 1974 ప్రపంచకప్లో ఆడింది. 1998 నుంచి డీఆర్ కాంగో పేరుతో బరిలోకి దిగి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్లో అడుగు పెట్టనుంది. ఇతర క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ల్లో స్వీడన్ 3–2తో పోలాండ్పై, చెక్ రిపబ్లిక్ ‘షూటౌట్’లో 3–1తో డెన్మార్క్పై, టర్కీ 1–0తో కొసోవోపై గెలిచి ప్రపంచకప్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. -
ఫ్యాన్స్కు షాక్.. ఒక్కో టిక్కెట్ ధర రూ. 10 లక్షలు!
అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఫుట్బాల్ ప్రపంచకప్లో మొత్తం 48 జట్లు పాల్గొనున్నాయి. కాగా ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన టికెట్ ధరలు టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.లాస్ట్-మినిట్ సేల్స్ ఫేజ్ పేరిట టికెట్ల విక్రయాలు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా 10,990 డాలర్లకు (సుమారురూ.9.16 లక్షలు) పెంచింది. గత డిసెంబర్లో టోర్నమెంట్ డ్రా సమయంలో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లుగా ఉండేది. మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్ టికెట్ ధర 2,355 డాలర్ల నుండి 2,985 డాలర్లకు పెరిగింది. కాగా ఫిఫా ఈసారి 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేస్తోంది. అంటే డిమాండ్ను బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఇదే విధానం విమానం టికెట్ల బుకింగ్లో కూడా ఉంటుంది. అయితే ఫిఫా అనుసరిస్తున్న ఈ ధరల విధానంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు."ఫిఫా ప్రపంచకప్-2026 కోసం 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయడం సరికాదు. ఇది సామాన్య సాకర్ అభిమానులను క్రీడకు దూరం చేస్తుంది" అని 69 మంది డెమొక్రాటిక్ సభ్యులు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోకు లేఖ రాశారు. ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించిన జట్లు ఇవే?గ్రూప్ ఎ – మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, చెకియాగ్రూప్ బి – కెనడా, బోస్నియా మరియు హెర్జెగోవినా, ఖతార్, స్విట్జర్లాండ్గ్రూప్ సి – బ్రెజిల్, మొరాకో, హైతీ, స్కాట్లాండ్గ్రూప్ డి – యుఎస్ఎ, పరాగ్వే, ఆస్ట్రేలియా, టర్కీగ్రూప్ ఇ – జర్మనీ, కురసావో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్గ్రూప్ ఎఫ్ – నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, ట్యునీషియాగ్రూప్ జి – బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్గ్రూప్ హెచ్ – స్పెయిన్, కేప్ వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వేగ్రూప్ ఐ – ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్/బొలీవియాగ్రూప్ జె – అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్గ్రూప్ కె – పోర్చుగల్, డిఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాగ్రూప్ ఎల్ – ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘానా, పనామాచదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
క్వార్టర్ ఫైనల్లో విశ్వనాథ్, సచిన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడో రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. పురుషుల 50 కేజీల విభాగంలో విశ్వనాథ్ సురేశ్... 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ తొలి రౌండ్లో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.విశ్వనాథ్ 5:0తో బెక్జాత్ ఎర్గెషోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందగా... సచిన్ 4:1తో బుయన్దలై బయార్ఖు (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో చెంగ్ వె లీ (చైనీస్ తైపీ)తో సచిన్... సన్జార్ తష్కెన్బే (కజకిస్తాన్)తో విశ్వనాథ్ తలపడతారు. -
30 ఏళ్ల తర్వాత తొలి విజయం..
కొచ్చి: నామమాత్రమైన మ్యాచ్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు మెరిసింది. హాంకాంగ్ జట్టుతో మంగళవారం జరిగిన ఆసియా కప్ 2027 క్వాలిఫయింగ్ టోర్నీ చివరి మ్యాచ్లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ గ్రూప్ ‘సి’లో భారత్ ఐదు పాయింట్లతో చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్, బంగ్లాదేశ్ ఐదు పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన గోల్స్ సగటుతో బంగ్లాదేశ్కు మూడో స్థానం, భారత్కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. హాంకాంగ్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... సింగపూర్ 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది.గతేడాది భారత పౌరసత్వాన్ని తీసుకున్న ఆస్ట్రేలియా ఫుట్బాలర్ రియాన్ విలియమ్స్ తొలిసారి టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగాడు. 32 ఏళ్ల విలియమ్స్ నాలుగో నిమిషంలోనే భారత్కు తొలి గోల్ అందించాడు. 50వ నిమిషంలో ఆకాశ్ మిశ్రా గోల్తో భారత్ 2–0తో ముందంజ వేసింది. 65వ నిమిషంలో ఎవర్టన్ కమార్గో గోల్తో హాంకాంగ్ ఖాతా తెరిచింది. అయితే తదుపరి 35 నిమిషాలు హాంకాంగ్ ఆటగాళ్లను భారత్ నిలువరించి ఈ టోర్నీని గెలుపుతో ముగించడంలో విజయవంతమైంది. కాగా కొచ్చి మైదానంలో భారత ఫుట్బాల్ టీం 30 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకోవడం విశేషం. -
కంటతడి పెట్టిన లియోనల్ మెస్సీ!
లియోనల్ మెస్సీ.. పరిచయం అక్కర్లేని పేరు. ఈతరం ఫుట్బాల్ ఆటగాళ్లలో ఆల్ టైమ్ గ్రేట్గా ఈ అర్జెంటీనా స్టార్ను అభివర్ణిస్తుంటారు. ఆయన అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం మెస్సీ వయస్సు 38 ఏళ్లు కావడంతో అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెస్సీ ఆఖరి టోర్నీ అని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడడంతో మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. విషయంలోకి వెళితే మంగళవారం రాత్రి బ్యూనస్ఎయిర్స్ వేదికగా అర్జెంటీనా, జాంబియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అర్జెంటీనా ఒక గోల్ కొట్టడంతో పాటు మరొక గోల్ కొట్టడంలో అసిస్ట్ చేశాడు. మ్యాచ్లో అర్జెంటీనా 5-0తో జాంబియాను చిత్తుగా ఓడించింది. తొలి హాఫ్ ముగియడానికి ముందు కెరీర్లో 116వ గోల్ సాధించిన మెస్సీ అంతకముందు మ్యాచ్ ఆరంభంలో జులియన్ అల్వారెజ్కు పాస్ అందించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన సహచరులతో కలిసి మైదానంలో నిలబడిన సమయంలో స్టాండ్స్లోని ప్రేక్షకులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ అరవడం మొదలెట్టారు. ఇది చూసిన మెస్సీ కళ్లలో దుఃఖం ఆగలేదు. వెంటనే తలను కిందకు దించి కంటి నుంచి వచ్చిన నీరును తుడుచుకోవడం కెమెరాలకు చిక్కింది. అర్జెంటీనా తరఫున తన హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడడాన్ని జీర్ణించుకోలేకే మెస్సీ కంటతడి పెట్టినట్లు అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా ప్రపంచకప్కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనాకు గ్రూప్ దశలో సులువైన డ్రానే లభించింది. ప్రపంచకప్కు సన్నాహకంగా అర్జెంటీనా వరుస ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడుతూ వస్తోంది. ఇప్పటికే మారిటానియా, జాంబియాలతో మ్యాచ్లు ముగించుకున్న అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్ను సెర్బియాతో ఆడనుంది.2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్కప్ సాధించడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్లో నాయకుడిగా, ఆటగాడిగా జట్టును నడిపించిన మెస్సీ ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో రెండు గోల్స్ కొట్టడమే గాక, టోర్నీ మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బాల్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ ఆ జట్టు దిగ్గజ కెప్టెన్లు డానియెల్ పసరెల్లా, డీగో మారడోనా సరసన చోటు దక్కించుకున్నాడు. LIONEL MESSI GOAL FOR ARGENTINA 🐐🇦🇷 pic.twitter.com/9jxqpLWeSc— Ayuba | Football News (@ayubafootball) April 1, 20262005లో అర్జెంటీనా జాతీయ జట్టులోకి వచ్చిన మెస్సీ ఇప్పటివరకు 198 మ్యాచ్ల్లో 116 గోల్స్ సాధించాడు. చివరగా మెస్సీ సారథ్యంలో 2024లో మినీ ప్రపంచకప్గా పిలుచుకునే కోపా అమెరికా కప్ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. తాజాగా మరోసారి కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. ఇక ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా వరల్డ్కప్ జరగనుంది.🚨💣 Deeply emotional scenes unfolding in Argentina 🇦🇷🥹Lionel Messi is currently playing what is expected to be his LAST match with the national team on Argentine soil.The final chapter at home for the greatest of all time before the 2026 World Cup. This one really hurts.… pic.twitter.com/yW8WaYYxyi— Topskills Sports UK (@topskillsportuk) April 1, 2026చదవండి: ‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’ -
మరో 4 నెలల్లో వరల్డ్కప్.. ప్రాక్టీస్ మొదలు పెట్టనున్న భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లకు భారత మహిళల హాకీ జట్టు సన్నాహాలు మొదలుపెట్టనుంది. ఆగస్టులో నెదర్లాండ్స్–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి... సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు టీమిండియా సమాయత్తం కానుంది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకోవాలని... మైదానంలో అమలు చేసే వ్యూహాలకు పదును పెట్టుకోవాలని భారత బృందం నిర్ణయించుకుంది. రేపటి నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్లెన్స్ సెంటర్లో జరిగే ఈ శిబిరంలో 31 మంది ప్రాబబుల్స్ పాల్గొంటారు. ఈ నెలారంభంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు రన్నరప్గా నిలిచి వరల్డ్కప్ బెర్త్ను దక్కించుకుంది. ‘రాబోయే సీజన్ అత్యంత పోటీతత్వంతో కూడింది. దీని కోసం మేము చేస్తున్న సన్నద్ధతలో భాగమే ఈ శిబిరం. ఆటలో నిలకడను పెంపొందించడం, మా వ్యూహాలను మరింత మెరుగుపరుచుకోవడం ఈ శిబిరం ఉద్దేశం. రాబోయే రెండు ప్రతిష్టాత్మక టోరీ్నల్లో ఒత్తిడిని అధిగమించి, కీలక సమయాల్లో రాణించగలిగే జట్టును రూపొందించాలని భావిస్తున్నాం’ అని భారత మహిళల జట్టు హెడ్ కోచ్ జోర్డ్ మరీన్ తెలిపారు. భారత మహిళల హాకీ ప్రాబబుల్స్సవిత పూనియా, మాధురి కిండో, బిచ్చూ దేవి ఖరీబం, బన్సారి సోలంకి (గోల్కీపర్లు), నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ, జ్యోతి సింగ్, లాల్థట్లాంగి, జ్యోతి, ఉదిత, శిల్పి దబాస్ (డిఫెండర్లు), సుశీలా చాను, మనీషా చౌహాన్, వైష్ణవి ఫాల్కే, సాక్షి రాణా, సునెలితా టొప్పో, సలీమా టెటె, నేహా, ఇషిక (మిడ్ ఫీల్డర్లు), దీపిక సోరెంగ్, రుతుజా పిసాల్, బల్జీత్ కౌర్, నవ్నీత్ కౌర్, దీపిక, అన్ను, బ్యూటీ డుంగ్డుంగ్, హీనా బానో, సోనమ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత కుమారి (ఫార్వర్డ్స్). -
పోరాటానికి పరిమితులెందుకు?
ఎవరైనా, ఎక్కడైనా పతకాల వేటలో పడి... గెలిస్తే సరి ఇలా కష్టపడ్డాను. జీవితాన్నే ధారపోశాను అన్నట్లు చెబుతారు. అదే ఓడిపోతే మాత్రం వెంటనే వచ్చే నోటి మాట సరైన మౌలిక వసతులు లేవని, సమాఖ్యలోని రాజకీయాలే ఆటగాళ్ల భవిష్యత్తును కాలరాస్తున్నాయని! అన్నీ ఉండి అనే వాళ్ల తూటా మాటలివి. కానీ శీతల్ దేవి అలా కాదు. గురిపెట్టేందుకు కళ్లున్నా... విల్లును పట్టుకునేందుకు, బాణం లాగడానికి చేతి వేళ్లు కాదు కదా... అసలు చేతులే లేవు. అయినా సరే గురిపెట్టింది లక్ష్యంపై! ఉన్న రెండు కాళ్లతో విల్లును సరిచేసుకుంటుంది. కాలి వేళ్లతో బాణాన్ని సంధిస్తుంది. 2022 నుంచి అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలు గెలిచింది. తాజాగా ప్రపంచ అత్యుత్తమ ఆర్చర్ (2025) అవార్డే ఆమెను వరించేలా ఎదిగింది.అందరూ పతకం కోసం ఆశపడతారు. కానీ ‘పతకమే’ ఆమె ప్రతిభకు దాసోహమంటుంది. ఈ పోటీల్లో కొందరు గెలుస్తారు. కానీ ఆమె బరిలోకి దిగితే ఆ‘పోటీ’నే మురుస్తుంది. మరికొందరేమో పోరాడి ఓడినా తమ ప్రదర్శనతో తృప్తి చెందుతారు. కానీ ఆమె పోరు... ఆడే తీరు...చూసి ఆ ప్రదర్శనకే వన్నెతెస్తుంది. ఆమెనే కశ్మీరీ పారా ఆర్చర్ శీతల్ దేవి. చేతులు ముడుచుకొని తీరిగ్గా కాలక్షేపం చేసే దేశంలో చేతుల్లేని శీతల్ ఏ దేశమేగినా... ఏ ఈవెంట్లో కాలిడినా భారతావని పొగిడే పతకం తెస్తోంది. కొన్నేళ్లుగా పతకాల పనిపట్టిన 19 ఏళ్ల టీనేజర్ను తాజాగా ‘వరల్డ్ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డే పట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె విజయవంతమైన పయనంపై చెప్పిన సంగతులివి... చాలా ప్రత్యేకం... చిరస్మరణీయం.. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరిగా నామినేట్ అవడమే సాఫల్యమనుకుంటే... ఏకంగా పురస్కారాన్నే గెలుపొందడం చిరస్మరణీయంగా మార్చింది. అందుకే ఇది చాలా చాలా ప్రత్యేకమైందంటాను. ఎదురైన ప్రతీ ఎదురుదెబ్బకు నిలిచి నేను పడిన కఠోర శ్రమకు, త్యాగానికి ఈ అవార్డు ప్రతిబింబం. పతకాల కోసం పాటుపడితే అవార్డే వచ్చింది. ఈ ప్రదర్శనలో నా తల్లిదండ్రులు, కోచ్ నా వెన్నంటే నిలిచారు. వారి అండదండలే ఈ పురస్కారానికి కారణం. మీకు పరిమితులు పెట్టెదెవరు?పరిధి, పరిమితులు ఉండాలి. కానీ ప్రతి దానికి ఉండనక్కర్లేదు. ముఖ్యంగా మనకు, మన ఎదుగుదలకు, సాఫల్యానికి పరిమితులెందుకు? అందుకే అంటాను... మీ పరిమితులను నిర్ణయించే అధికారం ఇంకెవరికీ ఇవ్వకండి. మీరేంటో మీకు బాగా తెలుసు. మీరేం చేయగలరో కూడా మీకే తెలుసు. ఇన్ని తెలిసిన మీకు పరిమితులు ఎవరో విధించే అవకాశం ఎప్పటికీ ఇవ్వకూడదు. అలాంటప్పుడే మనం విజయవంతమవుతాం గుర్తుంచుకోండి. ఉదయం మొదలుపెడితే... నా శిక్షణ ప్రతీ రోజు ఉదయం 8 గంటలకే మొదలవుతుంది. సాయంత్రం 6 అయితేగానీ ముగిసిపోదు. మధ్యలో రెండు గంటలు మాత్రం తినడానికి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బ్రేక్ ఇస్తాను. నాకిది రొటీన్. సుదీర్ఘ సమయం నేను ఎంచుకున్న ‘రేంజ్’పైనే దృష్టి పెడతాను. అస్తమానం బాణాలే సంధిస్తూ కూర్చోను. శారీరక ఫిట్నెస్, మానసిక స్థైర్యం పెరిగేందుకు కూడా కసరత్తు చేస్తాను. సాంకేతికంగా మెరుగయ్యేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద చూపిస్తాను. గతేడాది అలా చేయడం వల్లే నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోగలిగాను.శీతల్ పతకాలివి...శీతల్ పతకాల వేట 15 ఏళ్లకే ప్రారంభమైంది. అది కూడా ప్రతిష్టాత్మక ఆసియా పారా క్రీడల్లో..! హాంగ్జౌ (చైనా)లో జరిగిన 2022 మెగా ఈవెంట్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు నెగ్గిన శీతల్ డబుల్స్లో రజతాన్ని గెలుచుకుంది. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రజతంతో మెరిసింది. ఆసియా చాంపియన్షిప్ (బ్యాంకాక్)లో స్వర్ణం, రజతం సాధించింది. 2024 పారిస్లో జరిగిన పారలింపిక్స్లో మిక్స్డ్ టీమ్లో కాంస్యం చేజిక్కించుకుంది. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్ (కొరియా) లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచింది. -
ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్కు అనర్హత
ఫుట్బాల్లో ఇటలీ జట్టుది చెరగని ప్రస్థానం. నాలుగుసార్లు (1934,1938,1982,2006 ) ఫిఫా చాంపియన్గా నిలిచిన ఇటలీ మరో రెండుసార్లు యూరోపియన్ చాంపియన్గా (1968,2020) అవతరించింది. గియాన్లుగీ బఫన్, పాలో మల్దిని, రాబర్టో బగ్గియో, ఫాఇయో కన్నావరో, ఫ్రానెస్కో టొట్టి, ఆండ్రియా పిర్లో, లుగీ రివా, గిసెప్పీ మియాజ్జా వంటి స్టార్ దిగ్గజ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం ఇటలీ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. మంగళవారం ఫిఫా క్వాలియర్స్ ప్లేఆఫ్స్ ఫైనల్లో బోస్నియాతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అయితే పెనాల్టీ షూటౌట్లో ఇటలీ 1-4 తేడాతో బోస్నియా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్ అయిన ఇటలీ వరుసగా మూడోసారి (2018, 2022, 2026) ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించని తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతేకాదు 2006లో చివరిసారి ఫిఫా చాంపియన్గా నిలిచిన ఇటలీ అప్పటి నుంచి ఒక్క నాకౌట్ మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు బోస్నియా జట్టు ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించడం ఇది రెండోసారి.అయితే క్రికెట్లో ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఇటలీ తొలిసారి పాల్గొంది. ఆడుతుంది తొలి ప్రపంచకప్ అయినప్పటికీ తమ కంటే ఎన్నోరేట్లు మెరుగైన నేపాల్ను ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఇటలీ ఫుట్బాల్ ఆటలో మాత్రం తిరోగమనం దిశగా పయనిస్తోంది. నిరసనలు..ఇటలీ ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించకపోవడంతో ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. నాలుగుసార్లు ఫిఫా విజేత అయిన ఇటలీ వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటలీ ఓటమిని తట్టుకోలేక కొంతమంది కన్నీటి పర్యంతమవ్వగా, మరికొందరు మాత్రం ఇటలీ ఫుట్బాల్ క్లబ్ అసోసియేషన్ వద్దకు చేరుకొని నిరసనలు చేపట్టారు.🇧🇦: ✅✅✅✅🇮🇹: ❌✅❌BOSNIA BEAT ITALY ON PENALTIES AND WILL PLAY AT THE 2026 @FIFAWorldCup 🎉#WCQ | #EuropeanQualifiers pic.twitter.com/pgfeHWkENU— beIN SPORTS (@beINSPORTS_EN) March 31, 2026చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్! -
వైశాలి, దివ్య ‘హ్యాట్రిక్’ డ్రా
పెయియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు వైశాలి, దివ్య దేశ్ముఖ్ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేశారు. అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను వైశాలి 41 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్ను దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఓపెన్ విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద తొలి ఓటమి చవిచూశాడు.జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన మూడో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో, మహిళల విభాగంలో ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 14 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నిర్ణిత 14 రౌండ్ల తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతలుగా నిలుస్తారు. మహిళల విభాగం చాంపియన్ ప్రస్తుత విశ్వవిజేత జు వెన్జున్తో... ఓపెన్ విభాగం విన్నర్ ప్రస్తుత జగజ్జేత గుకేశ్తో ప్రపంచ చాంపియన్షీప్ టైటిల్ కోసం తలపడతారు. -
నికిత్ శ్రీ చక్రికి రజత పతకం
జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో నికిత్ శ్రీ చక్రి ఆకుల సత్తా చాటాడు. రికర్వ్ అండర్-10 బాలుర విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నికిత్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.2025-26లో నికిత్ శ్రీ చక్రి సాధించిన విజయాలుజాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ చాంపియన్షిప్స్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్రంగారెడ్డి జిల్లా ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్తమిళనాడు స్టేట్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్సౌత్ ఇండియన్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్షిప్ (రికర్వ్ అండర్-10)-గోల్డ్ మెడల్ -
బెంగాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్ దిగ్గజం
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పేస్ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్కతాలో లియాండర్ పేస్ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్ నిలిచారు.ప్రొఫెషనల్ టెన్నిస్లో సింగిల్స్ కంటే డబుల్స్పై దృష్టి సారించిన పేస్ పురుషుల గ్రాండ్స్లామ్ టోర్నీల్లో డబుల్స్లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026 -
స్పోర్ట్స్ హ్యాకథాన్లో 2,132 వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి బండా ప్రకాశ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.ఈ హ్యాకథాన్లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, చెస్, క్యారమ్ వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు.హ్యాకథాన్లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను సావనీర్ రూపంలో ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు.హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ... 'క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు. అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం' అని తెలిపారు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
ప్రతిభకు పురస్కారం
లుసానే: భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రతిభకు ప్రపంచ పురస్కారం దక్కింది. భుజాల నుంచే రెండు చేతులు లేని ఈ కశీ్మరి ఆర్చర్ అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తాచాటుతోంది. దీంతో 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్చరీ ప్రకటించిన ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు శీతల్ దేవికి దక్కింది. గతేడాది గ్వాంగ్జూ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో ఆమె అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఇందులో బరిలోకి దిగిన ఆమె అసలు చేతులే లేని ఏకైక మహిళా ఆర్చర్... వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో చేతులుండి వైకల్యమున్న ప్రపంచ స్థాయి పారా ఆర్చర్లను ఢీకొట్టి మరీ విజేతగా నిలిచింది. తన కాలి వేళ్లు, భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ప్రతిభ చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఆమె పోటీ మొదలైతే ప్రేక్షకులెవరూ కనులు తిప్పుకోనివ్వని నైపుణ్యం ఆమె సొంతం. ఈ నైపుణ్యంతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల్ని సాధిస్తున్న శీతల్కు వార్షిక అవార్డుల రేసులో ప్రపంచ ఆర్చరీ పట్టం కట్టింది. ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. కొరియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఆమె కేవలం ఒక స్వర్ణంతోనే సరిపెట్టుకోలేదు... మహిళల టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ టీమ్లో కాంస్యం సాధించింది. ప్రపంచ ఆర్చరీ అవార్డులకు నామినేట్ కావడం ఇప్పుడు పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషాన్నిచి్చందని, వ్యక్తిగతంగా ఈ అవార్డు తన గుండెను తాకిందని శీతల్ దేవి భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పారిస్లో జరిగిన పారాలింపిక్స్లోనూ ఈ కశ్మీరీ ఆర్చర్ సత్తా చాటుకుంది. ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గింది. 2022 పారా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లో రజతం, 2023 ఆసియా చాంపియన్íÙప్లో రజతం గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీలో ఈ తరహా అవార్డుల్ని 2011లో ప్రారంభించారు. అసాధారణ నైపుణ్యం కనబరిచిన ఆర్చర్లు, పారా ఆర్చర్ల ఘనతను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
సినెర్దే మయామి మాస్టర్స్
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ చేజార్చుకున్నా... మరోసారి ‘టాప్’ క్లాస్ ఆటతీరును ప్రదర్శించి ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ కెరీర్లో ఏడో మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ రెండోసారి చాంపియన్గా నిలిచాడు. ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో ప్రపంచ 14వ ర్యాంకర్ జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. సినెర్కు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 89 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లెహెస్కాకు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 79 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా సినెర్ కెరీర్లో ఇది 26వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ పది ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్లో 33 పాయింట్లు, రెండో సర్వీస్లో తొమ్మిది పాయింట్లు సాధించాడు. మూడుసార్లు తన సర్వీస్ బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. 2024లో తొలిసారి మయామి ఓపెన్లో టైటిల్ నెగ్గిన సినెర్ గత ఏడాది తనపై విధించిన మూడు నెలల నిషేధం కారణంగా బరిలోకి దిగలేదు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన సినెర్ మయామి ఓపెన్లోనూ విజేతగా నిలవడం ద్వారా ‘సన్షైన్ డబుల్’ సాధించిన ఎనిమిదో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్ను వరుసగా గెలిస్తే ‘సన్షైన్ డబుల్’గా పరిగణిస్తారు. ఈ రెండు టోర్నీల్లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సినెర్ చాంపియన్గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. చదవండి: IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ! -
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేపై మహిళల కమిటీ హెడ్ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్బాల్ హౌస్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు. వలంకా అలేమావో ఎవరు..? AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్బాల్ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా. వివాదం నేపథ్యం మహిళల ఆసియా కప్ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది. -
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్తో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఇటీవలే టైగర్వుడ్స్ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ (డీయూఐ) కింద ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైగర్వుడ్స్ను మార్టిన్ కౌంటీ జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయిన టైగర్వుడ్స్పై అతడి భాగస్వామి వెనెస్సా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టైగర్వుడ్స్ తన ప్రవర్తన, పద్దతులను మార్చుకోకపోతే విడిచిపెట్టి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీమెయిల్ కథనం ప్రకారం.. వెనెస్సా ట్రంప్ టైగర్వుడ్స్కు ఇదే అతడికి చివరి అవకాశమని, ఒకవేళ మళ్లీ ఎలాంటి తప్పు చేసి జైలుకెళితే మాత్రం తమ రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అర్థం చేసుకోవాలని తెలిపింది. ‘ఇది కచ్చితంగా టైగర్వుడ్స్కు రెడ్ ఫ్లాగ్ వంటిది. సమస్యలన్నింటిని పరిష్కరించుకొని సక్రమంగా ఉంటే మంచిది. లేదంటే రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ వేసి నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుంది. ’ అని వెనెస్సా ఘాటుగానే హెచ్చరించినట్లు డైలీమెయిల్ పేర్కొంది.కాగా అమెరికన్ మోడల్ అయిన వెనెస్సా ట్రంప్ 2005 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ను పెళ్లాడింది. 2018లో విడాకులు తీసుకున్న ఈ జంటకు కాయ్ ట్రంప్ సంతానం. ఆ తర్వాత గోల్ప్ దిగ్గజం టైగర్వుడ్స్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు 2024లో తొలిసారి వార్తలు బయటకొచ్చాయి. టైగర్వుడ్స్ మార్చి 2025లో వెనెస్సాను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా పోస్టు పెట్టాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా టైగర్వుడ్స్ ప్రవర్తనతో విసిగిపోయిన వెనెస్సా మరోసారి ఇలా చేస్తే మాత్రం రిలేషన్ బ్రేకప్ చేసుకుంటానని బెదిరింపులకు దిగడం ఆసక్తిగా మారింది.చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్! -
సూపర్ సబలెంకా
ఫ్లోరిడా: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్, బెలారూస్ స్టార్ సబలెంకా మూడో టైటిల్ను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆదివారం జరిగిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సబలెంకా చాంపియన్గా నిలిచి టైటిల్ను నిలబెట్టుకుంది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–2, 4–6, 6–3తో విజయం సాధించి కెరీర్లో 24వ టైటిల్ను దక్కించుకుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈ క్రమంలో ‘సన్షైన్ డబుల్’ ఘనత నమోదు చేసింది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్ను వరుసగా గెలిస్తే ‘సన్షైన్ డబుల్’గా పరిగణిస్తారు. కోకోగాఫ్తో 2 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా మూడు ఏస్లు సంధించింది. తొలి సర్వీస్లో 35 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ సబలెంకాకు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 92 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కోకోగాఫ్కు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఆంటోనెల్లి మళ్లీ...
సుజుకా: ఇటలీ టీనేజర్ కిమీ ఆంటోనెల్లి తాజా ఫార్ములావన్ సీజన్లో వరుసగా రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రోజు జపాన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకు చెందిన 19 ఏళ్ల కిమీ ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఆంటోనెల్లి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రాక్పై దూసుకుపోయాడు. అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా 1 గంట 28 నిమిషాల 03.403 సెకన్లలో 53 ల్యాప్లను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈనెల 15న చైనాలో జరిగిన షాంఘై గ్రాండ్ప్రిలోనూ ఆంటోనెల్లి చాంపియన్గా నిలిచాడు. తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన జార్జ్ రసెల్ టైటిల్ గెలిచాడు. దాంతో ఈ సీజన్లోని తొలి మూడు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లే గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. జపాన్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి (మెక్లారెన్) రెండో స్థానంలో, లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో, జార్జ్ రసెల్ నాలుగో స్థానంలో నిలిచారు. డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్, మెక్లారెన్ డ్రైవర్ నోరిస్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏప్రిల్ 12న జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్ప్రి, ఏప్రిల్ 19న జరగాల్సిన సౌదీ అరేబియా గ్రాండ్ప్రిని ఫార్ములావన్ నిర్వాహకులు రద్దు చేశారు. తదుపరి రేసు మయామి గ్రాండ్ప్రి మే 3వ తేదీన జరుగుతుంది. -
ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’
హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ సంయుక్త ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది. ఈ రన్లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.రన్తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర ఐటీ మంత్రి దుదెల శ్రీధర్ బాబు , సినీ నటుడు శర్వానంద్ హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ,వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్ను ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించి, యువతకు దిశానిర్దేశం చేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు, పాల్గొన్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపైనే ఆధారపడి ఉందన్నారు. కేవలం పరుగుగానే కాకుండా, ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి కుటుంబం క్రియాశీల జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అవసరమని పేర్కొన్నారు.యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని, అందరూ తమ మాతృభాషలో మాట్లాడాలని కోరారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. -
సవాల్కు ప్రజ్ఞానంద సిద్ధం
పఫోస్ (సైప్రస్): ప్రపంచ చాంపియన్ను ఢీకొట్టే అర్హత కోసం భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘ఫిడే’ క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాడు. ఎనిమిది మంది ఎలైట్ గ్రాండ్మాస్టర్లు తలపడే ఓపెన్ కేటగిరీలో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తరఫున తమిళనాడు గ్రాండ్మాస్టర్ మాత్రమే బరిలో ఉండగా... 8 మంది డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సై అంటున్నారు. ప్రతి ఆటగాడు మిగతా ఏడు మంది ప్రత్యర్థులను రెండేసి సార్లు ఢీకొంటాడు. ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన ఆటగాడే చివరకు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్తో టైటిల్ కోసం పోటీపడతాడు. ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్షిప్ సమరం జరుగుతుంది. ప్రస్తుత క్యాండిడేట్స్ టోర్నమెంట్లో అమెరికన్ స్టార్లు ఫేబియానో కరువాన, హికరు నకముర, డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరి, వే యి (చైనా), జావొఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అండ్రీ ఎసిపెంకో (రష్యా), మథియస్ బ్లూబామ్ (జర్మనీ)లు చాంపియన్ గుకేశ్ను ఢీకొట్టే వేటలో ఉన్నారు. ఇటీవలి టోర్నీల ఫలితాలు, ఫామ్ దృష్ట్యా అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫేబియానో కరువాన క్యాండిడేట్స్లో ఫేవరెట్గా కనిపిస్తున్నాడు. దీంతో భారత ఆటగాడు ప్రజ్ఞానందకు కఠిన సవాళ్లు తప్పవు. బరిలోకి ప్రపంచ శ్రేణి గ్రాండ్మాస్టర్లు ఉండటంతో దీనికి తగినట్లుగానే తమిళ గ్రాండ్మాస్టర్ సన్నద్ధమయ్యాడు. ప్రత్యేకించి క్యాండిడేట్స్ ఈవెంట్ కోసం మరే ఇతర టోర్నీలవైపు కన్నెత్తి చూడలేదు. తన కోచింగ్ బృందం, సాంకేతిక నిపుణులతో కలిసి క్యాండిడేట్స్లో ఎదురయ్యే ప్రత్యర్థుల ఎత్తుగడ్డలపైనే దృష్టిసారించాడు. కరువాన ఫేవరెట్ అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ సిందరోవ్ డార్క్హార్స్గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది గోవాలో జరిగే చెస్ వరల్డ్ కప్లో విజేతగా నిలిచి అందరి కంటా పడిన ఈ యువ సంచలనం ఇదే జోరును ఇక్కడా కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మహిళల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ అయిన తెలుగుతేజం, వెటరన్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ఫేవరెట్గా దిగాల్సివున్నా... చివరి నిమిషంలో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. పశ్చిమాసియా పరిస్థితులే తను వైదొలగడానికి కారణమని, భయంతో ఆడలేనని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె స్థానాన్ని నార్వే చెస్ టోర్నీ విజేత అన్న ముజిచుక్ (ఉక్రెయిన్)కు కేటాయించారు. హంపి లేకపోయినా భారత ఆశల పల్లకిని మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్, ఆర్. వైశాలి మోస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి టోర్నీ ఆరం¿ోత్సవ వేడుక జరిగింది. ఇందులో ప్లేయర్ల పరిచయ కార్యక్రమం, ర్యాంకింగ్ (ఎలో రేటింగ్), క్యాండిడేట్స్కు అర్హత సాధించిన వైనం వివరించారు. ఆదివారం నుంచి తొలిరౌండ్ పోటీలు జరుగుతాయి.‘క్యాండిడేట్స్’ కహానీ... టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 1 మిలియన్ డాలర్లు (రూ. 9.49 కోట్లు) ఓపెన్ కేటగిరీ: 7,00,000 డాలర్లు (రూ. 6.65 కోట్లు) మహిళల విభాగం: 3,00,000 డాలర్లు (రూ. 2.85 కోట్లు) -
ఆంటోనెల్లికి ‘పోల్ పొజిషన్’
సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) జపాన్ గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి ‘పోల్ పొజిషన్’సాధించాడు. గత రేసు చైనా గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన 19 ఏళ్ల ఈ డ్రైవర్... వాయు వేగంతో దూసుకెళ్లి అందరికంటే ముందు నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో ఆంటోనెల్లి 1 నిమిషం 28.778 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 5.8 కిలోమీటర్ల కష్టతరమైన సర్క్యూట్ను ఆంటోనెల్లి అవలీలగా పూర్తిచేశాడు. మెర్సిడెస్కే చెందిన జార్జ్ రసెల్ (1 నిమిషం 29.076 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మూడు రేసుల్లోనూ ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది మెక్లారెన్ డ్రైవర్లు ఆస్కార్ పియాస్ట్రి, నోరిస్ సత్తాచాటగా... ఆ ఈసారి మెర్సిడెస్ డ్రైవర్లు జోరు కనబరుస్తున్నారు. తాజా క్వాలిఫయింగ్ రేసులో పియాస్ట్రి (1 నిమిషం 29.132 సెకన్లు; మెక్లారెన్), చార్లెస్ లెక్లెర్క్(1 నిమిషం 29.405 సెకన్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు. లాండో నోరిస్ (1 నిమిషం 29.409 సెకన్లు) ఐదో స్థానానికి పరిమితం కాగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 29.567 సెకన్లు) ఆరో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమషం 30.262 సెకన్లు) పదకొండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
’అదంతా మీడియా, సోషల్ మీడియా సృష్టే’
న్యూఢిల్లీ: హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీతో ఎలాంటి విబేధాలు లేవని... వెటరన్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ వెల్లడించాడు. భారత్ తరఫున టిర్కీ అత్యధికంగా 412 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడగా... ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు మన్ప్రీత్ సింగ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు మన్ప్రీత్ కెరీర్లో 411 మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ప్రాబబుల్స్ నుంచి మన్ప్రీత్ పేరును తొలగించడంతో... ఇద్దరి మధ్య అనుబంధం సరిగ్గా లేదనే పుకార్లు వినిపించగా... మన్ప్రీత్ వాటిని కొట్టేశాడు. ‘ఆసియా క్రీడల వరకు ఆడాలనుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా దానిపైనే ఉంది. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ తర్వాత ఫిట్నెస్ను బట్టి కెరీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటా. దిలీప్ టిర్కీతో వ్యక్తిగతంగా మాట్లాడా. ఆయన పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడితే సంతోషిస్తా అని ప్రోత్సహించారు. మా మధ్య చక్కటి అనుబంధం ఉంది. 500 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలవాలని ఆకాంక్షించారు’ అని మన్ప్రీత్ వెల్లడించాడు. మరోవైపు టిర్కీ స్పందిస్తూ... ‘అదంతా మీడియా, సోషల్ మీడియా సృష్టే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు’ అని అన్నాడు.కాగా 2020, 2024 ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడైన మన్ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో మూడేసి పతకాలు సొంతం చేసుకున్నాడు. శుక్రవారం నిర్వహించిన హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమంలో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్నందుకుగాను మన్ప్రీత్ ప్రత్యేక బహుమతిని తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నాడు. -
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ అరెస్ట్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ను ఫ్లోరిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేయడం ఆసక్తి కలిగించింది. వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించడమేగాక, ప్రమాదానికి కారణమైన టైగర్వుడ్స్ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లూయెన్స్ (డీయూఐ) కింద అదుపు లోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం జూపిటర్ ఐలాండ్లోని తన నివాసం సమీపంలో టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు, మరొక ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దానికి తగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వుడ్స్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ప్రమాదం తర్వాత మార్టిన్ కౌంటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజ్పరీక్ష నిర్వహించారు. టెస్టులో టైగర్ వుడ్స్ మద్యం సేవించినట్లుగా తేలలేదు. కానీ, ఆయన ఏదైనా మందులు, డ్రగ్స్ ప్రభావంతో కారు నడిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూత్ర పరీక్షకు ఆయన నిరాకరించడంతో, నిబంధనల ప్రకారం డీయూఐ కేసు నమోదు చేసి టైగర్వుడ్స్ను జైలుకు తరలించారు. 2017లో కూడా టైగర్ వుడ్స్ ఇదే తరహాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంతో నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రమాదం నేపథ్యంలో త్వరలో జరగనున్న మాస్టర్స్ టోర్నమెంట్లో టైగర్వుడ్స్ పాల్గొనడం అనుమానంగా మారింది.చదవండి: IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు! -
గాయాలతో సతమతం.. ఆటకు గుడ్బై
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న భారత హాకీ ఆటగాడు గుర్జంత్ సింగ్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్... కెరీర్లో 130 మ్యాచ్లు ఆడాడు. పంజాబ్కు చెందిన 31 ఏళ్ల గుర్జంత్ 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు పసిడి నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2017లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అతను కెరీర్ మొత్తంలో 33 గోల్స్ చేశాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన గోల్ చేసిన ప్లేయర్గానూ రికార్డు సృష్టించాడు. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో గుర్జంత్ 13 సెకన్లలోనే గోల్ నమోదు చేశాడు. హాకీ ఇండియా వార్షిక అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గుర్జంత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘ఇదే సరైన సమయం అనుకుంటున్నా. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నా. కోలుకొని తిరిగి వచ్చినా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయా. కెరీర్లో సాధించిన దానితో సంతృప్తిగా వీడ్కోలు పలుకుతున్నా. ఇక మీద దేశవాళీలు, హాకీ ఇండియా లీగ్లో ఆడుతా’ అని గుర్జంత్ వెల్లడించాడు. A player for the big moments 🫡Thank you, Gurjant Singh, for the passion, grit, and unforgettable memories you’ve given Indian hockey.From Punjab to the biggest stages in world hockey, your journey has been defined by resilience and impact. Time and again, you rose to the… pic.twitter.com/4e8sAT6YGU— Hockey India (@TheHockeyIndia) March 27, 2026Flashback to January 18, 2020, at the iconic Kalinga Stadium 🏟️, where Gurjant Singh set the turf on fire with a rapid goal scored 13 seconds into the match against the Netherlands! 🔥 This electrifying opener laid the foundation for Team India’s remarkable 5-2 victory in their… pic.twitter.com/6Jf6eMNFCN— Hockey India (@TheHockeyIndia) January 18, 2025చదవండి: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
చికిత ఖాతాలో స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్తో కలిసి పసిడి పతకం సొంతం చేసుకుంది. చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత–రజత్ చౌహాన్ (భారత్) ద్వయం 158–156తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా) జంటపై గెలిచింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికిత, రాజ్ కౌర్, తేజల్ బృందం 227–229తో విక్టోరియా, డయానా, రొక్సానాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడి రజత పతకాన్ని గెల్చుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో దేవాంగ్ గుప్తా, సుఖ్చెయిన్ సింగ్, జుయెల్ సర్కార్ (భారత్) బృందం 4–5తో కరిమోవ్, ఇల్ఫాత్, దౌలత్కెల్దీ (కజకిస్తాన్) జట్టు చేతిలో ఓడి రజతం నెగ్గింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్లో తేజల్ సాల్వే 144–138తో మరియాపై గెలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఉదయ్ కంబోజ్ (స్వర్ణం), ప్రథమేశ్ (రజతం), రజత్ (కాంస్యం) క్లీన్స్వీప్ చేశారు. ఫైనల్లో ఉదయ్ కంబోజ్ 145–144తో ప్రథమేశ్పై, కాంస్య పతక మ్యాచ్లో రజత్ చౌహాన్ 145–144తో పీరావత్ (థాయ్లాండ్)పై నెగ్గారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి (భారత్) 2–6 సెట్లతో ఒయున్ బసాన్దోర్జ్ (మంగోలియా) చేతిలో ఓడి రజతం సొంతం చేసుకుంది. బుధవారం భారత పురుషుల కాంపౌండ్ జట్టు, భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. -
‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్నీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవ్నీత్ కౌర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. గతేడాది ప్రదర్శనకు గాను హాకీ ఇండియా శుక్రవారం ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. భారత మాజీ కెప్టెన్ 1980 మాస్కో ఒలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన జట్టులో సభ్యుడైన జాఫర్ ఇక్బాల్కు మేజర్ ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1978, 1982 ఆసియా క్రీడల్లో రజత పతకాలు గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ సభ్యుడు. 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ ఉన్నాడు. హాకీకి చేసిన సేవకుగానూ జాఫర్ ఇక్బాల్కు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందించారు. హార్దిక్, నవ్నీత్లకు అవార్డులతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. మహిళల జట్టు ప్లేయర్ బిచ్చూ దేవికి ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించగా... ఉత్తమ డిఫెండర్గా సంజయ్కు పురస్కారం దక్కింది. ‘మిడ్ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుమిత్కు దక్కగా... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుఖ్జీత్ సింగ్కు దక్కింది. వీరందరికీ అవార్డుతో పాటు రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. శుక్రవారం న్యుఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్–21 ఏజ్ గ్రూప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాక్షి రాణా, ప్రిన్స్ దీప్ సింగ్కు ‘అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు అందించారు. ఈ ఇద్దరికీ చెరో రూ. 10 లక్షల నగదు బహుమతి అందించారు. ప్లేయర్లతో పాటు అంపైర్లు, స్కోరర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆసియాకప్లో విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి తలా రూ. 1.5 లక్షలు అందజేశారు. జూనియర్ వరల్డ్కప్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.15 లక్షల చొప్పున అందజేశారు. » హైదరాబాద్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో సత్తా చాటిన నవ్నీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. » గతేడాది జరిగిన జాతీయ చాంపియన్షిప్లో సత్తాచాటిన ఏడు (జార్ఖండ్, హరియాణా, మిజోరం, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్) జట్లకు రూ. 10 లక్షల చొప్పున అందజేశారు. » అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లకు ఇన్సెంటివ్లను సైతం శుక్రవారం అందజేశారు. పురుషుల జట్టుకు రూ. 1.38 కోట్లు, మహిళల జట్టుకు రూ. 69 లక్షలు లభించాయి. » జాతీయ జట్టు తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మన్ప్రీత్ సింగ్కు రూ. 4 లక్షలు, 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్కు రూ. 2.5 లక్షలు అందించారు. » 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హార్దిక్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్, నిలకంఠ శర్మ, జర్మన్ప్రీత్ సింగ్, సలీమా టెటెకు రూ.1.50 లక్షలు... 100 మ్యాచ్లు ఆడిన అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్కు రూ. 1 లక్ష చొప్పున అందజేశారు. » మహిళల హాకీలో 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నవ్నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్కు రూ. 2 లక్షల చొప్పున ఇచ్చారు. -
ప్రపంచకప్ ఆడే జట్టే ఆసియా క్రీడలకు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత హాకీ జట్టు మెగా ఈవెంట్లతో బిజీ షెడ్యూల్తో గడపనుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచకప్, ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ రెండు మేజర్ టోర్నీలకు కలిపి ఒకే జట్టు బరిలోకి దిగుతుందని పురుషుల హాకీ హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పష్టం చేశారు. తద్వారా రెండు వేర్వేరు జట్లను తయారు చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. ప్రపంచకప్, ఆసియా క్రీడలకు మధ్య కేవలం మూడు వారాల విరామమే ఉండటంతో ఆటగాళ్ల ఫిట్నెస్, పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు రెండు జట్లను సిద్ధం చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేసే మెరుగైన, ధీటైన జట్టునే ఆసియా క్రీడల్లోనూ ఆడిస్తామని ఆయన చెప్పారు. నిజానికి 15 నెల క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా జట్టు నిర్మాణ ప్రక్రియ చేపట్టామని, ఇందులో భాగంగానే భారత ‘ఎ’ జట్టుపై దృష్టి సారించామని, భవిష్యత్ అవసరాల కోసం సత్తాగల యువ రక్తాన్ని సీనియర్ జట్టుకు ఎక్కించేందుకే ఇలా చేశామని కోచ్ వివరించారు. అప్పుడు జట్టు సీనియర్లు, యువకుల మేళవింపుతో సమతూకంగా ఉంటుందని దక్షిణాఫ్రికాకు చెందిన కోచ్ క్రెయిగ్ చెప్పారు. ‘భారత జట్టుకు వరుస టోర్నీలు ఆడిన అనుభవం ఇదివరకు ఉంది. అజ్లాన్ షా, దక్షిణాసియా క్రీడలు, ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఇలా గతంలో పెద్ద పెద్ద టోర్నీలెన్నో ఆడింది. కాబట్టి పని ఒత్తిడి భారం అనే సమస్యయితే ఉండదు. జూన్లో హాకీ ప్రొ లీగ్ జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే ప్రపంచకప్లో బరిలోకి దించే జట్టుపై తుది కూర్పు పూర్తవుతుంది. అలా ఎంపికైన జట్టే బెల్జియం–నెదర్లాండ్స్కు వెళుతుంది. ఆ తర్వాత జపాన్కు బయల్దేరుతుంది’ అని క్రెయిగ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. బెల్జియం, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించబోయే ప్రపంచకప్ హాకీ ఈవెంట్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇది ముగిసిన మూడు వారాల్లోపే సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. జపాన్ ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్కు క్వాలిఫయర్స్గా జరుగబోతుంది. -
సబలెంకాతో పోరుకు సిద్ధమైన గాఫ్
మియామి ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకా ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 6-4, 6-3తో మూడో సీడ్ రిబాకినా (కజకిస్థాన్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం రెండు సెట్లలోనే ముగిసిన మ్యాచ్లో సబలెంకా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. గంటా 19 నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంకా 30 విన్నర్లు, 9 ఏస్లు సంధించగా.. రిబాకినా 2 ఏస్లు మాత్రమే సంధించి 15 విన్నర్లకే పరిమితమైంది. తొలుత మ్యాచ్లో రిబాకినా 3-1తో సబలెంకాపై ఆధిపత్యం కనబరించింది. కానీ వరుసగా రెండుసార్లు రిబాకినా సర్వీస్ను బ్రేక్ సఫలమైన సబలెంకా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరో సెమీఫైనల్లో అమెరికా నల్లకలువ కోకో గాఫ్ 6-1, 6-1తో చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ముచోవాను చిత్తుగా ఓడించి తుది పోరులో అడుగుపెట్టింది. రేపు జరగనున్న ఫైనల్లో సబలెంకాతో కోకో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక సబలెంకా మియామి ఓపెన్ ఫైనల్స్కు చేరడం ఇది వరుసగా రెండోసారి. గతంలో రిబాకినా 2023, 2024లో వరుసగా ఫైనల్ చేరింది. అంతకముందు సెరెనా విలియమ్స్ 2013 నుంచి 2015 మధ్య వరుసగా మియామి ఓపన్లో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. సబలెంకా, గాఫ్లు 2020లో తొలిసారి ఫైనల్లో ఎదురుపడ్డారు. ఆ తర్వాత జరిగిన పోరులో ఇద్దరు చెరో 6 విజయాలతో సమానంగా ఉన్నారు. గాఫ్ రెండుసార్లు గ్రాండ్స్లామ్ ఫైనల్లో సబలెంకాను ఓడించి చాంపియన్గా నిలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ గాఫ్ మూడు సెట్లలోనే సబలెంకాను ఓడించడం విశేషం.చదవండి: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
భారత ఫుట్బాల్ జట్టుకు అవమానం!
భారత ఫుట్బాల్ జట్టుకు అవమానం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించని కారణంగా ఆటగాళ్లతో పాటు కోచ్ను స్టేడియంలోకి అనుమతించలేదు. ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా మార్చి 31న కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్తో భారత జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశానికి కోచ్ ఖలీద్ జమీల్, ఆటగాళ్లు అషిక్ కురియన్, సహల్ అబ్దుల్, బిజోయ్ వర్గీస్ స్టేడియానికి వచ్చారు. కానీ గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ అథారిటీకి కేరళ ఫుట్బాల్ సంఘం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకపోవడంతో ఆటగాళ్లను, కోచ్ను లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అయితే మీడియా సమావేశానికి ముందు ఇలాంటి ఘటన జరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కోచ్ ఖలీద్ జమీల్ తెలిపాడు. అయితే దశాబ్ద కాలంలో కొచ్చిలో భారత ఫుట్బాల్ జట్టు మ్యాచ్ ఆడనుండడం ఇదే తొలిసారి. అయితే కోచ్, ఆటగాళ్లను అడ్డుకోవడంపై కేరళ ఫుట్బాల్ అసోసియేషన్ (కేఏఎఫ్) అధ్యక్షుడు నవాస్ మీరన్ స్పందించాడు. ‘ఆసియా కప్ క్వాలిఫయర్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సమాచార లోపం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీనిని త్వరలోనే పరిష్కరిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే నివేదికల ప్రకారం స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు గ్రేటర్ కొచ్చి డెవలప్మెంట్ అథారిటీ తమకు రూ. 20 నుంచి 25 లక్షలు చెల్లించడంతో పాటు రూ. 3 లక్షలు అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే చెల్లింపులకు కేఎఫ్ఏ సమయం కోరినప్పటికీ, విషయం తెలియని జీసీడీఏ సిబ్బంది కోచ్, ఆటగాళ్లను అడ్డుకున్నట్లు తెలిసింది. గతేడాది ఫిబ్రవరిలో చెల్లింపు వివాదం కారణంగా ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్)లోనూ కేరళ బ్లాస్టర్స్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! -
మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రజత్ జోడీ
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత రెండో పతకాన్ని ఖరారు చేసుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో చికిత–రజత్ చౌహాన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో చికిత–రజత్ ద్వయం 157–153 పాయింట్ల తేడాతో విక్టోరియా లియాన్–బున్యోద్ మిర్జామెతోవ్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ఫాతిన్ నూర్ఫతే–జువైదీ మజుకీ (మలేసియా) జంటతో చికిత–రజత్ ద్వయం తలపడుతుంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జోడీ క్వార్టర్ ఫైనల్లో 159–155 పాయింట్ల తేడాతో వె ఆన్ కీ–జున్వెగువో (చైనీస్ తైపీ) జంటపై గెలుపొందింది. ఇప్పటికే కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన భారత బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
కరోలినా మారిన్ వీడ్కోలు
మాడ్రిడ్: బ్యాడ్మింటన్కు అంతగా ఆదరణ లేని దేశం నుంచి వచ్చి... ప్రపంచ బ్యాడ్మింటన్నే శాసించి... ఈ ఆటలో మేటి అయిన ఆసియా దేశాల షట్లర్లనే హడలెత్తించి... అసాధారణ విజయాలతో అందర్నీ అబ్బురపరిచి... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ ‘రాకెట్’ వదిలేసింది. మోకాలి గాయాలతో సతమతమవుతున్న తాను మరింత రిస్క్ తీసుకోలేనని చెబుతూ గురువారం బ్యాడ్మింటన్ నుంచి మారిన్ వీడ్కోలు తీసుకుంది. ‘నా ప్రయాణం ఇక్కడితో ముగిసింది. వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే యూరోపియన్ చాంపియన్ షిప్లో నేను బరిలోకి దిగడంలేదు. చివరిసారి అందరినీ బ్యాడ్మింటన్ కోర్టులో కలవాలనుకున్నా. అయితే దీనికోసం నా శరీరాన్ని ప్రమాదంలో పడేయదల్చుకోలేదు. గతంలోనూ చాలాసార్లు చెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నా కెరీర్ను విభిన్నంగా ముగించాలని భావించా. కానీ కొన్నిసార్లు జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవు. దీనిని అంగీకరించాల్సిందే. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆడిన కాంస్య పతక మ్యాచే నా కెరీర్లో చివరి మ్యాచ్గా నిలిచింది. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచి, నా పట్ల అపరిమిత అభిమానాన్ని చూపిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఆటలో నేను సాధించిన విజయాలకు గర్వపడుతున్నా. కేవలం టైటిల్స్తోనే కాకుండా ఇంటాబయటా గౌరవాన్ని పొందాను’ అని గురువారం సోషల్ మీడియాలో మారిన్ వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. 2009లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అడుగు పెట్టిన మారిన్ 2015 ఏప్రిల్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్గా అవతరించింది. ఓవరాల్గా తన కెరీర్లో ఆమె 100 వారాలపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో కొనసాగింది. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకం నెగ్గిన మారిన్... 2015 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్పై గెలిచింది. అంతేకాకుండా 2015 ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్పై... 2018 ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో పీవీ సింధుపై గెలిచి మారిన్ విశ్వవిజేతగా నిలిచింది. ముఖ్యంగా సింధు, సైనాలకు మారిన్ కొరకరాని ప్రత్యర్థి అంటే అతిశయోక్తి కాదు. సింధుతో 18 సార్లు ఆడిన మారిన్ 12 సార్లు గెలిచి, 6 సార్లు ఓడింది. సైనాతో 13 సార్లు ఆడి 7 సార్లు గెలిచి, 6 సార్లు ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో హి బింగ్జియావోతో జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్ను 21–14తో గెలిచి, రెండో గేమ్లో 10–8తో ఆధిక్యంలో ఉన్న దశలో మారిన్ మోకాలి గాయంతో కోర్టులో కుప్పకూలింది. ఆ తర్వాత ఆమె కోలుకోకపోవడంతో హి బింగ్జియావోను విజేతగా ప్రకటించారు. గాయం కారణంగా మారిన్ కాంస్య పతక మ్యాచ్లో బరిలోకి దిగకపోవడంతో ఆమె ప్రత్యర్థి గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)కు కాంస్య పతకం లభించింది. -
పాక్పై భారత్దే పైచేయి
మాలే (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 పురుషుల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున విశాల్ యాదవ్ (3వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (64వ, 88వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. వరుసగా రెండో పరాజయంతో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, బంగ్లాదేశ్ చెరో విజయం సాధించి సెమీఫైనల్కు అర్హత సాధించాయి. శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘బి’ టాపర్గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ‘శాఫ్’ అండర్–20 చాంపియన్షిప్ జరగ్గా... భారత జట్టు నాలుగుసార్లు టైటిల్ సాధించింది. నేపాల్ రెండుసార్లు, బంగ్లాదేశ్ ఒకసారి టైటిల్ సొంతం చేసుకున్నాయి. -
‘ఆసియా’ పతకమే బాకీ ఉంది
రాయ్పూర్: ఒలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో రజత పతకం నెగ్గిన భారత స్టార్ మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు ఆసియా క్రీడల పతకమే లోటుగా ఉంది. ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ఎన్నో పతకాలు గెలిచినప్పటికీ ఈ ఆసియా పతకంతోనే తన కెరీర్ పరిపూర్ణమవుతుందని ఆమె భావిస్తోంది. దశాబ్దకాలంగా ఇంటాబయట స్వర్ణ, రజత పతకాలు సాధిస్తోన్న ఈ స్టార్ వెయిట్లిఫ్టర్ ఈ ఏడాది ఎలాగైనా అందని ద్రాక్షగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ‘ఖేలో ఇండియా’ గిరిజనుల క్రీడల ప్రారం¿ోత్సవంలో పాల్గొనేందుకు వచి్చన ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మణిపూర్ లిఫ్టర్ మాట్లాడూతూ ‘వ్యక్తిగతంగా నాకు ఆసియా క్రీడలు చాలా కీలకమైన ఈవెంట్. నా సుదీర్ఘ కెరీర్లో ఇక్కడ పతకం సాధించలేకపోయాను. ఏషియాడ్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈవెంట్ ఏదైనా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. దీనికి తగ్గట్లే అథ్లెట్లు సిద్ధమై వస్తారు. ఈ ఏడాది జరిగే ఆసియా ఈవెంట్ కూడా అలాగే జరుగుతుంది’ అని తెలిపింది. రెగ్యులర్గా 48 కేజీల విభాగంలో తలపడే మీరా ఆసియా క్రీడల్లో మాత్రం 49 కేజీల కేటగిరీలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ‘కామన్వెల్త్ గేమ్స్ వరకు 48 కేజీల ఈవెంట్కు తగిన కసరత్తు చేసే నేను రెండు నెలల వ్యవధిలో జరిగే ఆసియా క్రీడల కోసం 49 కేజీల కేటగిరీ మారాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైనా నాకెలాంటి ఇబ్బంది లేదు. పతకమే నా లక్ష్యం అయినప్పుడు ఇలాంటివన్నీ భారం కావు’ అని ఆమె వివరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ క్రీడలు యువ అథ్లెట్లకు వరమని, తమ కలల్ని సాకారం చేసుకునే ప్రక్రియకు ఇది తొలి అడుగని మీరాబాయి చెప్పుకొచ్చింది. ఖేలో ఇండియాలో గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయమని చెప్పింది. ‘ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు, రిమోట్ ఏరియాలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు తమ ప్రతిభ చాటేందుకు ‘ఖేలో ఇండియా’ చక్కని వేదిక. ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంత ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో వెలిగేందుకు ఈ తరహా ఈవెంట్ దోహదం చేస్తుంది’ అని మీరాబాయి వివరించింది. ఎక్సలెన్సీ కేంద్రాలు (ఎన్సీఓఈ) ప్రతిభ గల అథ్లెట్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొంది. మన ‘మీరా’ ఘనతలివి... 31 ఏళ్ల మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించింది. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకం నెగ్గిన ఆమె తదుపరి 2022, 2025 ఈవెంట్లలో రెండు రజతాలు సాధించింది. 2014 కామన్వెల్స్ క్రీడల్లో రజతం గెలిచాక... తర్వాత గోల్డ్కోస్ట్ (2018), బర్మింగ్హామ్ (2022) క్రీడల్లో పసిడి పతకాలతో సత్తాచాటుకుంది. కామన్వెల్త్ చాంపియన్షిప్లో నాలుగుసార్లు (2013, 2017, 2019, 2025) చాంపియన్గా నిలిచింది. 2015లో మాత్రం రజతంతో సరిపెట్టుకుంది. తాషె్కంట్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్ (2020)లో కాంస్యం, గువాహటి వేదికగా జరిగిన దక్షిణాసియా క్రీడల్లో (2016) స్వర్ణం నెగ్గింది. -
బెంగళూరు ఎఫ్సీ హెడ్ కోచ్గా మునోజ్
బెంగళూరు: స్పెయిన్ చెందిన పెప్ మునోజ్ను బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ 2026–27 సీజన్ కోసం అతన్ని తీసుకున్నట్లు బెంగళూరు ఫ్రాంచైజీ తెలిపింది. గత ఏడాది ఐఎస్ఎల్లో బెంగళూరు జట్టు రన్నరనప్గా నిలిచింది. మునోజ్ ఐఎస్ఎల్ జట్టుకు హెడ్ కోచ్ కావడం ఇదే తొలిసారి. గతంలో అతను ఎఫ్సీ బార్సిలోనా యూత్ జట్టుకు సేవలించాడు. బార్కా అండర్–19, బార్సిలోనా ‘బి’, చైనాకు చెందిన దేశవాళీ జట్లకు కోచింగ్ ఇచ్చిన మునోజ్ తదనంతరం చైనా జాతీయ జట్టు సహాయక బృందంలో కోచ్గా పనిచేశాడు. కంబోడియాకు చెందిన క్లబ్ జట్టుకు తొలిసారి హెడ్కోచ్గా వ్యవహరించాడు. అతని కోచింగ్లో కంబోడియాకు చెందిన క్లబ్ లీగ్లో రెండు విజేతగా నిలిచింది. ఏఎఫ్సీ చాలెంజ్ లీగ్లో ఒకసారి ఫైనల్ కూడా చేరింది. ‘బెంగళూరు ఎఫ్సీ ద్వారా భారత ఫుట్బాల్లో భాగమవడం ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఐఎస్ఎల్లో బెంగళూరు ఒక మోడల్ క్లబ్. అభిమానులు అలరించే విధంగా బెంగళూరు ప్రదర్శన ఉంటుంది’ అని మునోజ్ అన్నాడు. బెంగళూరు ఎఫ్సీ యజమాని పార్థ్ జిందాల్ పెప్ మునోజ్ మార్గదర్శనంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. -
‘ఆఫ్రికా కప్’ కోసం సెనెగల్ అప్పీల్
జెనివా: ఆఫ్రికా కప్ గెలిచిన మమ్మల్నే తిరిగి విజేతగా ప్రకటించాలని సెనెగల్ ఫుట్బాల్ జట్టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ (సీఏఎఫ్) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై సెనెగల్ సీఏఎస్లో సవాల్ చేసింది. ఈ అప్పీల్ను విచారణకు స్వీకరించిన సీఏఎస్ విచారణ, తుది తీర్పు వెలువరించేందుకు కాలపరిమితి లేదని సెనెగల్కు తేల్చిచెప్పింది. దీంతో సెనెగల్ కోరుతున్న న్యాయం ఎప్పుడు దక్కుతుందో ఎవరికీ తెలియదన్న మాట! ఏం జరిగిందంటే? మొరాకో వేదికగా జనవరిలో ఆతిథ్య మొరాకో, సెనెగల్ మధ్య ఆఫ్రికా కప్ ఫైనల్స్ మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం 0–0తో ముగియగా...‘ఎక్స్ట్రా’ టైమ్లో మొరాకోకు ఇచ్చిన ‘పెనాల్టీ’ని వ్యతిరేకిస్తూ సెనెగల్ నిష్క్రమించింది. తర్జనభర్జన అనంతరం మైదానంలోకి దిగగా... సెనెగల్ గోల్కీపర్ పెనాల్టీని అడ్డుకున్నాడు. తర్వాత సెనెగల్ గోల్ చేసి విజేతగా నిలిచింది. అయితే సెనెగల్ మైదానం నిష్క్రమించడంతోనే ఆడే అర్హతను కోల్పోయిందని కాబట్టి తమనే విజేతగా ప్రకటించాలని మొరాకో సీఏఎఫ్లో కేసు వేయగా... సీఏఎఫ్ మొరాకోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. -
వ్యక్తిగత కోచ్ల కోసం అథ్లెట్ల డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత అథ్లెట్లందరూ మాకంటే... మాకు వ్యక్తిగత కోచ్లు కావాలని కేంద్ర క్రీడా శాఖను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు స్పష్టమైన సమాధానమిచ్చారు. అందరికీ వ్యక్తిగత కోచ్లను సర్దుబాటు చేయడం అసాధ్యమని కొట్టిపారేశారు. ఈ సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగొయాలో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు భారత్ 700 మంది పైచిలుకు అథ్లెట్ల బృందంతో అక్కడికి వెళ్లనుంది. ఈ క్రీడాకారులతో పాటు 33 శాతానికి మించకుండా సహాయక సిబ్బందిని ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) అనుమతిస్తుంది. కానీ భారత క్రీడకారులేమో వ్యక్తిగత కోచ్ల కోసం పట్టుబడుతుండటంతో ఈ సంఖ్య ఏకంగా అథ్లెట్ల బృందాన్ని మించనుంది. ఈ నేపథ్యంలోనే క్రీడాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా వ్యక్తిగత కోచ్ల అంశంపైనే చర్చించారు. అందరు డిమాండ్ చేస్తున్నట్లుగా వ్యక్తిగత కోచ్లను అనుమతించలేమని క్రీడాశాఖ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. గతంలో ఒకరి వద్ద ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్నప్పటికీ మెగా ఈవెంట్ల కోసం వేరే కోచ్ల మార్గదర్శనంలో పోటీలకు వెళ్లడం పరిపాటి. అంటే ఒకరొకరికి కాకుండా కొంత మందికి కలిపి ఫలానా కోచ్ అని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), క్రీడాశాఖ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సారి మాత్రం వ్యక్తిగత కోచ్లే కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో మిషన్ ఒలింపిక్ సెల్ దృష్టిసారించింది. ఈ సందర్భంగా క్రీడాశాఖ వర్గాలు కచ్చితంగా పతకాలు తెస్తారనే అథ్లెట్లకు మాత్రమే వ్యక్తిగత కోచ్లను సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశాయి. మిగతా వారికి కావాలంటే సరైన కారణాలు వివరించాలని, దీనిపై మిషన్ ఒలింపిక్ సెల్ ఏకీభవిస్తేనే కోచ్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఒలింపిక్స్లో లింగమార్పిడి మహిళలపై నిషేధం
లుసానే: లింగమార్పిడి మహిళా అథ్లెట్లపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై విశ్వక్రీడల్లో అమ్మాయిగా మారిన అథ్లెట్లను అనుమతించరు. లింగమార్పిడి మహిళలపై నిషేధం విధిస్తున్నట్లు ఐఓసీ తెలిపింది. మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. పుట్టుకతో మహిళ లేదంటే పురుషుడైన అథ్లెట్లను మాత్రమే పోటీ పడేందుకు అర్హత కల్పించాలని ఆయన ఆదేశించారు. అగ్రదేశాధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు లోబడి ఐఓసీ... అథ్లెట్ల అర్హత విషయమై కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎవరైనా అమ్మాయిగా మారినా... వారిని మహిళల విభాగంలో అనుమతించరు. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లకు ఈ కొత్త నిర్ణయం అమలవుతుందని ఐఓసీ స్పష్టం చేసింది. ఇకపై ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో పాల్గొనాలంటే జన్మతః పురుషుడు, మహిళా అథ్లెట్లకు మాత్రమే అవకాశముంటుంది. -
భారత్ X పాకిస్తాన్
మాలె (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్షిప్లో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటుండగా... పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతోంది. శనివారం బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ రెండిట్లో ఒక్క మ్యాచ్లో విజయం సాధించినా... మన జట్టు నేరుగా సెమీఫైనల్కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు భారత్పై ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. -
కైనన్, రాజేశ్వరి జోడీగా...
టాంజియర్ (మొరాకో): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) కొత్త సీజన్కు నేటి నుంచి తెర లేవనుంది. నాలుగు షాట్గన్ ప్రపంచకప్లలో భాగంగా తొలి టోర్నీ నేడు మొదలుకానుంది. తొలి రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. శుక్రవారం స్కీట్ ఈవెంట్లో పోటీలు ఆరంభమవుతాయి. భారత్ నుంచి 12 మంది షూటర్లు పతకాల వేటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ షూటర్, రియో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన కైనన్ చెనాయ్, అతని భార్య రాజేశ్వరి కుమారి వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కలిసి ఆడనున్నారు. ఇటీవల కైనన్, రాజేశ్వరి వివాహం జరిగింది. 35 ఏళ్ల కైనన్ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. 34 ఏళ్ల రాజేశ్వరి 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్ ట్రాప్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. మరోవైపు ట్రాప్ ఈవెంట్లో వెటరన్ షూటర్ జొరావర్ సింగ్ సంధూ ‘వర్క్లోడ్ మేనేజ్మెంట్’లో భాగంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. 48 ఏళ్ల జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో జొరావర్ ట్రాప్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. తద్వారా కర్ణీ సింగ్ (1962లో), మానవ్జీత్ సింగ్ సంధూ (2006లో) తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన మూడో భారతీయ ట్రాప్ షూటర్గా జొరావర్ గుర్తింపు పొందాడు. భారత షూటింగ్ జట్టు: పృథ్వీరాజ్ తొండైమన్, కైనన్ చెనాయ్, భౌనీశ్ మెందిరత్తా, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి, ఆషిమా అహ్లావత్ (ట్రాప్). మాన్ సింగ్, జ్యోతిరాదిత్య సింగ్ సిసోడియా, పరంపాల్ సింగ్, యశస్వి రాథోడ్, దర్శన రాథోడ్, మహేశ్వరి చౌహాన్ (స్కీట్). కైనన్ చెనాయ్–రాజేశ్వరి కుమారి, పృథ్వీరాజ్ తొండైమన్–కీర్తి గుప్తా (మిక్స్డ్ టీమ్). -
లాక్రాస్లో భారత్ లాజవాబ్!.. అసలు ఈ ఆట ఏంటి?
న్యూఢిల్లీ: ఆసియా మీట్లో పసిడి పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల లాక్రాస్ జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం అభినందించారు. సుదీర్ఘ విరామం అనంతరం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పునరాగమనం చేయనున్న ఈ క్రీడలో భారత జట్లు సత్తా చాటాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా... అసియా లాక్రాస్ గేమ్స్లో భారత జట్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాయి. పురుషుల ఫైనల్లో భారత జట్టు ఇరాక్పై గెలుపొందగా... మహిళల తుదిపోరులో పాకిస్తాన్ను భారత్ చిత్తుచేసి విజేతగా నిలిచింది. 2024లో భారత మహిళల జట్టు ఈ క్రీడలో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... గతేడాది పరుషుల జట్టు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అనతి కాలంలోనే నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న మన జట్లు... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడా మంత్రి ఆకాంక్షించారు. ‘భారత్లో లాక్రాస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రీడకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్రీడలో ఆసియా స్థాయిలో భారత్కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఇది మన జట్ల కృషి, పట్టుదలకు నిదర్శనం. ఇక 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేయాలి’ అని మాండవీయా అన్నారు. 1904 ఒలింపిక్స్లో ఈ ఆటను తొలిసారి విశ్వక్రీడల్లో ప్రవేశ పెట్టారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఒలింపిక్స్లోనూ ఇది పతక క్రీడగా కొనసాగింది. ఆ తర్వాత విశ్వక్రీడల జాబితా నుంచి లాక్రాస్ను తొలగించారు. 1928, 1932, 1948లో జరిగిన ఒలింపిక్స్లో లాక్రాస్ను ప్రదర్శన క్రీడగా నిర్వహించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అమెరికా వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో ఈ ఆట దర్శనమివ్వనుంది. 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత పురుషుల, మహిళల జట్లు... త్వరలో చైనా వేదికగా జరగనున్న ఆసియన్ లాక్రాస్ గేమ్స్లో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా వేదికగా జరగనున్న ఆసియా–పసిఫిక్ చాంపియన్షిప్లోనూ పోటీపడతాయి. భారత పురుషుల లాక్రస్ జట్టుకు తెలంగాణ ప్లేయర్ అనుదీప్ రెడ్డి సారథిగా వ్యవహరిస్తుండగా... ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, జమ్మూకశ్మీర్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. అసలు ఏంటీ లాక్రాస్... ఈ ఆటకు అమెరికాలో ఆదరణ ఎక్కువ. హాకీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్ కలగలిపినట్లు ఉండే ఈ ఆటలో... ఒక్కో జట్టు తరఫున 10 మంది పోటీ పడతారు. కాకపోతే ఒలింపిక్స్లో ఆడే జట్టులో మాత్రం ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. హాకీ స్టిక్ లాంటి పొడవైన కర్ర పై భాగంలో ప్రత్యేక నెట్ ఉంటుంది. రబ్బర్ బంతిని పట్టుకోవడానికి సహచరులకు పాస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యర్థి గోల్ పోస్ట్లో ఎక్కువసార్లు ఎవరు బంతిని పంపగలిగితే వారు విజేతగా నిలుస్తారు. అచ్చం ఫుట్బాల్ మాదిరిగానే అటాకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్, గోలీ (గోల్ కీపర్) స్థానాలు ఉంటాయి. ప్లేయర్లు గాయపడే అవకాశముండటంతో... మైదానంలో ఉన్నవాళ్లంతా హెల్మెట్లు, గ్లౌవ్స్, ప్యాడ్స్ ధరించి బరిలోకి దిగుతారు. -
’తొమ్మిదేళ్లు భరించినందుకు ధన్యవాదాలు’
ఫుట్బాల్లో ఈతరం మేటి ఆటగాళ్లుగా ముద్రపడ్డవారు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరిలా అంత పాపులారిటీ సంపాదించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈజిప్ట్ ఫుట్బాల్ స్టార్ ఆటగాడు మహ్మద్ సాలా. ఫార్వర్డ్ ప్లేయర్గా స్టార్ హోదా పొందిన సాలా తొమ్మిదేళ్లుగా లివర్పూల్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే లివర్పూల్తో ఉన్న తొమ్మిదేళ్ల బంధానికి ముగింపు పడనున్నట్లు సాలా ప్రకటించాడు. త్వరలోనే లివర్పూల్ క్లబ్తో ఒప్పందం ముగియనున్న వేళ దానితో ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీడియో రూపంలో భావోద్వేగంతో పంచుకున్నాడు. ‘అందరికీ నమస్కారం. ఈ సీజన్తో లివర్పూల్తో బంధం ముగియనుంది. ఏదో ఒకరోజు లివర్పూల్ క్లబ్ నుంచి వైదొలగాల్సిందే. కానీ ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. ఇది నా వీడ్కోలులో మొదటి భాగం. లివర్పూల్ క్లబ్తో తొమ్మిదేళ్లుగా సాగిన బంధంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లివర్పూల్ అనేది కేవలం నాకు ఫుట్బాల్ క్లబ్ మాత్రమే కాదు అంతకుమించి. ఇంతకాలం నన్ను భరించడంతో పాటు నాకు సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 2017లో లివర్పూల్ క్లబ్లో చేరిన 33 ఏళ్ల మహ్మద్ సాలా ఆ క్లబ్ తరఫున 435 మ్యాచ్లాడి 255 గోల్స్ సాధించాడు. తద్వారా లివర్పూల్ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన జాబితాలో ఇయాన్ రష్, రోజర్ హంట్ల తర్వాత సాలా మూడో స్థానంలో ఉన్నాడు. 2019, 2024 సీజన్లలో టైటిల్ గెలిచిన లివర్పూల్లో సాలా సభ్యుడిగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా 115 మ్యాచ్ల్లో 67 గోల్స్ సాధించాడు.pic.twitter.com/mSP9S4pfpu— Mohamed Salah (@MoSalah) March 24, 2026చదవండి: డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన! -
విదేశీ వద్దు.. స్వదేశీ కోచ్ ముద్దు!
భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ను నియమించాలని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం జాతీయ జట్టు కోచ్గా పనిచేస్తున్న కోస్టారికాకు చెందిన అమేలియా వాల్వర్డె కాంట్రాక్టును పునరుద్ధరించబోవడం లేదని ప్రకటించింది. ఇటీవల ఆ్రస్టేలియా వేదికగా జరిగిన ఆసియా కప్లో అమేలియా కోచింగ్లో బరిలోకి దిగిన భారత జట్టు ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. కేవలం ఈ టోర్నీ కోసమే అమేలియాను జనవరిలో మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక చేశారు. అమ్మాయిల జట్టుకు స్వదేశీ కోచ్ ఉండటమే ఉత్తమమని ఐఎం విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో... ఏఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పురుషుల, మహిళల జాతీయ జట్ల భవిష్యత్తుపై చర్చించేందుకు మంగళవారం ఏఐఎఫ్ఎఫ్ సాంకేతిక కమిటీ ఆన్లైన్లో సమావేశమైంది. విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... హర్జిందర్ సింగ్, షబ్బీర్ అలీ, విక్టర్ అమల్రాజ్, లారెన్స్, సంతోష్ సింగ్ పాల్గొన్నారు. అమేలియా కోచింగ్లో జట్టు ప్రదర్శనపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు నెలల పాటు జట్టుకు కోచ్గా వ్యవహరించిన అమేలియాకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ... ఈ ఏడాది జూన్లో జరిగే దక్షిణాసియా చాంపియన్షిప్ ప్రారంభానికి ముందే స్వదేశీ కోచ్ను నియమించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ మహిళల జట్టుకు కోచ్గా పని చేయడానికి ఆంథోని ఆండ్రూస్, క్రిస్పిన్ ఛెత్రీలు ఆసక్తిగా ఉన్నట్లు ఏఐఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం! -
పోల్వాల్ట్లో జాతీయ రికార్డు
భువనేశ్వర్: తమిళనాడు మహిళా అథ్లెట్ బరానిక ఎలంగోవన్ పోల్వాల్ట్లో కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. భారత్లో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన పోల్వాల్ట్లో ఆమె 4.22 మీటర్లతో ఓవరాల్గా (ఇండోర్ అవుట్ డోర్ కలిపి) జాతీయ రికార్డు లిఖించింది. గతంలో పోల్వాల్ట్లో రోజీ మీనా పాల్రాజ్ 2022లో నెలల్పిన 4.21 మీటర్ల రికార్డును 29 ఏళ్ల బరానిక అధిగమించింది. ఇది రెగ్యులర్ అవుట్డోర్ ఈవెంట్ కాగా, భారత్లో ఇంతకుముందెన్నడూ ఇండోర్ పోటీలే జరగలేదు. ఈ నేపథ్యంలో తొలి ఇండోర్ ఈవెంట్లోనే ఆమె ఓవరాల్ రికార్డును నెలకొల్పినట్లయింది. ఈ పోటీల్లో కేరళకు చెందిన బ్లెస్సీ కుంజుమోన్ (3.95 మీ.), మరియా జైసన్ (3.38 మీ.) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ‘ముఖ్యంగా పోల్వాల్ట్ను గాలి వేగం శాసిస్తుంది. అవుట్డోర్లో వీచే గాలి వేగంతో పోల్వాల్ట్ ప్రదర్శన మారుతుంది. అయితే ఇండోర్ ఈవెంట్లో అలాంటి సమస్యలే లేవు’ అని బరానిక తెలిపింది. మిగతా పోటీల్లో పురుషుల లాంగ్జంప్లో సారున్ పాయసింగ్ (7.80 మీ.; ఒరిస్సా) వ్యక్తిగత మెరుగైన్ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. దీంతో ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ (7.78మీ.; తమిళనాడు) రజతం లభించింది. ప్రవీణ్ సాధారణంగా ట్రిపుల్ జంప్లో పోటీపడతాడు. అయితే ఇండోర్లో ఆ ఈవెంట్ లేకపోవడంతో లాంగ్జంప్లోకి మారాడు. డేవిడ్ (7.69 మీ.; రైల్వేస్)కు కాంస్యం దక్కింది. పరీక్షలు సిద్ధమైన ‘నాడా’ ఓ వైపు తొలిరోజు భారత అథ్లెట్లు తొలిసారి ఇండోర్ పోటీల్లో పాల్గొంటుండగా... మరోవైపు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షలు మొదలుపెట్టింది. ‘నాడా’కు చెందిన బృందం ఈవెంట్కు వేదికైన కళింగ స్టేడియంలోకి దిగింది. మైదానంలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ గదిలో అథ్లెట్ల నుంచి రక్త మూత్ర నమూనాల్ని తీసుకుంది. ఇతర పోటీల ఫలితాలు పురుషుల ఈవెంట్స్: 800 మీ పరుగు: 1. మొహమ్మద్ అఫ్సల్ (ఎయిర్ఫోర్స్), 2. కళ్యాణ్ (కర్ణాటక), 3. సాయన్ కర్మాకర్ (బెంగాల్); 3000 మీ. పరుగు: 1. శివాజీ (రిలయన్స్), 2. వినోద్ (మధ్యప్రదేశ్), 3.రాహుల్ కుమార్ (ఛత్తీస్గఢ్); 60 మీ. హర్డిల్స్: 1.క్రిషిక్ (కర్ణాటక), 2.రాతీశ్ (రిలయన్స్), 3. ముహమ్మద్ లజాన్ (జేఎస్డబ్ల్యూ); షాట్పుట్: 1.రవికుమార్ (బీఎస్ఎఫ్), 2.ఆధిశ్ గిల్దియాల్ (ఉత్తరాఖండ్); 3.బాలాజీ (తమిళనాడు). మహిళల ఈవెంట్స్: 3000 మీ. పరుగు: 1.ప్రియాంక (కర్ణాటక), 2.కాజల్ (గుజరాత్), 3.అక్షయ (తమిళనాడు); షాట్పుట్: 1.రేఖ (ఎన్సీఓఈ, పాటియాలా), 2.మయూరి (కర్ణాటక); లాంగ్జంప్: 1. అనామిక (జేఎస్డబ్ల్యూ), 2.మనీశా మెరెల్ (ఒరిస్సా), 3.శెరిన్ (జేఎస్డబ్ల్యూ). -
‘హంపి తప్పు చేసింది’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్ చెస్ సమాఖ్య (సీసీఎఫ్) అధ్యక్షుడు క్రిటాన్ టొర్నారిటిస్ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్ చెస్ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్లలో మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్ అన్నాడు. అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్కు దూరం కాగా... భారత్ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్ముఖ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. -
భారత జట్టులో తెలంగాణ అమ్మాయిలు
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో పోటీపడే భారత మహిళల టెన్నిస్ జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన భారత నంబర్వన్ సహజ యామలపల్లి, భారత ఐదో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వైష్ణవి అడ్కర్కు తొలిసారి పిలుపుఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్–100 టోర్నీలో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచిన మహారాష్ట్ర ప్లేయర్ వైష్ణవి అడ్కర్కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 391వ ర్యాంక్తో సహజ భారత నంబర్వన్ ప్లేయర్గా కొనసాగుతుండగా... వైష్ణవి 397వ ర్యాంక్తో రెండో ర్యాంకర్గా నిలిచింది. ఏప్రిల్ 7 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. సహజ, రష్మిక, వైష్ణవిలతోపాటు రుతుజా భోస్లే, అంకిత రైనా కూడా భారత జట్టులో ఉన్నారు. వైదేహి చౌధరీని రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. కెప్టెన్గా విశాల్ ఉప్పల్, కోచ్గా రాధిక కనిట్కర్ కొనసాగుతారు. ఐదు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్తోపాటు ఇండోనేసియా, కొరియా, న్యూజిలాండ్, మంగోలియా, థాయ్లాండ్ పోటీపడతాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లే ఆఫ్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
బ్రెజిల్ మోడల్తో రొనాల్డో జూనియర్ డేటింగ్!
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్బాల్ ఆట తెలిసిన ప్రతీ ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. సమకాలీన ఫుట్బాల్ క్రీడలో మెస్సీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ ప్లేయర్గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న రొనాల్డో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ 15 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఆ సంచలనాలు ఆటలో అనుకుంటే పొరబడినట్లే.తాజాగా 15 ఏళ్ల రొనాల్డో జూనియర్ 27 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? అబద్ధమా? అనేది తేలకముందే, ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మరుక్షణమే వైరల్గా మారాయి. ప్రస్తుతం రొనాల్డో జూనియర్ దుబాయ్లో ఉంటున్నాడని, అక్కడే ఒక హోటల్లో బ్రెజిల్ మోడల్తో పరిచయం డేటింగ్కు దారి తీసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. అయితే రొనాల్డో అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. రొనాల్డో జూనియర్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అన్న విషయం గమనించాలని, అతనిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కామెంట్ చేశారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో జూనియర్ తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. తన తండ్రి క్రిస్టియానో రొనాల్డో భాగస్వామి అయిన జార్జినా రోడ్రిగ్జ్ గురించి సరదాగా క్రిస్టియానో జూనియర్ ఆమె తన 'క్రష్' అని ఒక సందర్భంలో పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత ఆమెను కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే చూశానని, గర్ల్ఫ్రెండ్గా చూడలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆమెతో మాటలు లేవని బదులిచ్చాడు. గతంలోనూ బార్సిలోనా స్టార్ లూయిస్ సువారెజ్ కుమార్తె డెల్ఫినా సువారెజ్ తో రొనాల్డో జూనియర్ ప్రేమలో ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.చదవండి: గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్లో అథ్లెటిక్స్ పోటీలు Cristiano Ronaldo Jr. is reportedly dating a 27-year-old Brazilian model. According to rumors, they met at a restaurant in Dubai, where Ronaldo Jr. made a bold move shooting his shot confidently, leaving her unable to resist and she claimed she’s a big supporter of Cristiano Jr.… pic.twitter.com/UhQhpN3p14— SAMSON👑🐐 (@Samsonthegoat25) March 23, 2026 -
గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్లో అథ్లెటిక్స్ పోటీలు
భువనేశ్వర్: సంప్రదాయ అథ్లెటిక్స్కు భిన్నంగా భారత్ కూడా ఇప్పుడు ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమైంది. తొలిసారిగా నేటి నుంచి జరిగే జాతీయ ఇండోర్ చాంపియన్షిప్ పోటీలకు కళింగ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ అథ్లెట్లందరూ సొంతగడ్డపై తొలి ఇండోర్ అనుభవానికి సిద్ధమయ్యారు. ఇండోర్ అథ్లెటిక్స్ ట్రాక్, పోటీలు భిన్నంగా ఉంటాయి. 400 మీటర్ల ట్రాక్ స్థానంలో 200 మీటర్ల ట్రాక్ ఉంటుంది. ఇటీవలే భారత్కు 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆతిథ్య హక్కులు లభించాయి. దీంతో వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇండోర్ ఈవెంట్ల నిర్వహణ ఊపందుకోనుంది. అయితే తొలి ఇండోర్ ఈవెంట్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పాల్గొనడం లేదు. అతని ఈవెంట్ (జావెలిన్ త్రో) ఈ చాంపియన్షిప్లో లేకపోవడంతో చోప్రా అభిమానులకు ఇది నిరాశపరిచే అంశం. 3000 మీటర్ల స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబ్లే కూడా ఇదే కారణంతో పోటీలకు దూరమయ్యాడు. స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ మొట్టమొదటి జాతీయ ఇండోర్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 100 మీటర్లు, 200 మీటర్లు అవుట్డోర్ ఈవెంట్స్లో జాతీయ రికార్డు సాధించిన కుజుర్ ఇప్పుడు ఇండోర్ పోటీల్లోనూ రికార్డు నెలకొల్పేందుకు శ్రమిస్తున్నాడు. స్వరాష్ట్రం ఒడిశా తరఫున ఇండోర్ పోటీల్లో అతను 60 మీటర్ల రేసులో పోటీపడనున్నాడు. ‘నాకు ఇది తొలి ఇండోర్ ఈవెంట్. ఇక్కడ రెగ్యులర్ స్ప్రింట్ (100, 200 మీటర్లు) కాకుండా 60 మీటర్ల పోటీకి సిద్ధమయ్యాను. నిజానికి నా ప్రధాన లక్ష్యం కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు. అయితే ఇండోర్ ఈవెంట్లో నా సత్తా ఎంటో తెలుసుకునేందుకే పోటీల్లోకి దిగుతు న్నాను’ అని కుజుర్ తెలిపాడు. తమిళనాడుకు చెందిన ప్రవీణ్కు ట్రిపుల్ జంప్లో జాతీయ రికార్డు ఉంది. అయితే అతను ఈ చాంపియన్షిప్లో మాత్రం లాంగ్జంప్లో పోటీపడతాడు. హైజంప్, పోల్వాల్ట్, లాంగ్జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్లు ఈ ఇండోర్ క్రీడల్లో ఉన్నప్పటికీ జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, హ్యామర్ త్రోలను కొన్ని కారణాల వల్ల తప్పించారు. సాధారణంగా రెగ్యులర్ అవుట్డోర్ ఈవెంట్లో ప్రత్యర్థులతో పాటు వాతావరణ సమస్యల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ ఇండోర్ అథ్లెటిక్స్లో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. చదవండి: రాజస్థాన్లోకి షనక.. కీలక సూత్రధారి అతడే! -
‘ప్లేయర్ ఆఫ్ ఇయర్’ రేసులో హార్దిక్, నవ్నీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత హాకీ స్టార్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్, ఫార్వర్డ్ ప్లేయర్లు సుఖ్జీత్ సింగ్, సంజయ్లతో పాటు డిఫెండర్ అభిషేక్ హాకీ ఇండియా (హెచ్ఐ) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉన్నారు. హెచ్ఐ వార్షిక అవార్డుల్లో ఈ నలుగురు హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ పేరిట ప్రదానం చేసే ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు.మహిళల కేటగిరీలో ఈ అవార్డు కోసం సలీమా టెటె, నవ్నీత్ కౌర్, లాల్రెమ్సియామి, సవిత పోటీపడుతున్నారు. న్యూఢిల్లీలో ఈ శుక్రవారంఅట్టహాసంగా అవార్డుల వేడుక నిర్వహించేందుకు హాకీ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు, పురుషుల సీనియర్ కేటగిరీలతో పాటు వర్ధమాన క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టేలా అండర్–21 విభాగంలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు ప్రదానం చేయనుంది. మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు.దీని కోసం 32 మంది నామినీలతో తుది జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో విజేతను శుక్రవారం వేడుకలో ప్రకటిస్తారు. జీవిత సాఫల్య పురస్కారంగా ప్రెసిడెంట్ అవార్డు, ఆటగాళ్లతో పాటు అంపైర్, మేనేజర్, టెక్నికల్ అఫీషియల్ అవార్డులు కూడా ఉంటాయి. ఈ అవార్డుల వేడుకలోనే ఆసియా కప్లో విజేతగా నిలిచిన సీనియర్ పురుషులు జట్టును, జూనియర్ ప్రపంచకప్లో కాంస్యం గెలిచిన జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ చెప్పారు. అవార్డులకు ఎంపికైన నామినీలు గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్: ప్రిన్స్దీప్ సింగ్, కిషన్ బహదూర్, బిచూ దేవి కరిబం, సూరజ్ కర్కేరా. డిఫెండర్ ఆఫ్ ద ఇయర్: సంజయ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్. మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్: హార్దిక్ సింగ్, సుమిత్, రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ. ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్: సుఖ్జీత్, అభిషేక్, నవ్నీత్ కౌర్, శిలానంద్ లాక్రా. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (అండర్–21 అమ్మాయిలు): సాక్షి రాణా, జ్యోతి సింగ్, సునెలితా టొప్పో, కనిక సివచ్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (అండర్–21 పురుషులు): ప్రిన్స్ దీప్, మన్మీత్, అన్మోల్ ఎక్కా, అర్‡్షదీప్ సింగ్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (మహిళలు): నవ్నీత్ కౌర్, సలీమా టెటె, లాల్రెమ్సియామి, సవిత. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (పురుషులు): హార్దిక్ సింగ్, సుఖ్జీత్, సంజయ్, అభిషేక్. -
‘యుద్ధం మధ్యలో ఆడగలమా’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోలేదని భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొంది. ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వ్యాఖ్యానించింది. ఈనెల 29 నుంచి సైప్రస్లో జరిగే ఈ పోటీల్లో తమకు అందించే భద్రతపై సందేహం ఉండటం వల్లే దూరమైనట్లు హంపి స్పష్టం చేసింది. మధ్యధరా సముద్రంలోని సైప్రస్... ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధ క్షేత్రాలకు అతి సమీపంలో ఉంది. ఒకవైపు తమకు సమీపంలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఆటలు ఎలా ఆడగలమని హంపి సూటిగా ప్రశి్నంచింది. ‘మన చుట్టూ యుద్ధం సాగుతుంటే, యుద్ధ నౌకలు మీకు సమీపంలోనే కనిపిస్తుంటే ఒక విదేశీయురాలైన నేను, పైగా మహిళను అంత దూరం ప్రయాణించి ప్రశాంతంగా ఎలా ఆడగలను. సైప్రస్కు చాలా దగ్గరలో ఉన్న లెబనాన్లో బాంబులు పడుతున్నాయి. స్వయంగా సైప్రస్ అధ్యక్షుడే ఇటీవల తమ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటిది ఒక ప్లేయర్గా నేను జాగ్రత్తపడితే తప్పేంటి. అయినా వారు సైప్రస్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా టోర్నీని నిర్వహించగలిగేవారు. లేదా అక్కడే జరపాలంటే ఒక నెల రోజుల పాటు పరిస్థితులు చక్కబడే వరకు ఆగాల్సింది. నేను హడావిడిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా ప్రొఫెషన్, వ్యక్తిగత భద్రత, ఇలాంటి స్థితిలో నా ఆట ఎలా ఉంటుందో ఎన్నో రాత్రులు ఆలోచించిన తర్వాత ఇక్కడి దాకా వచ్చాను’ అని హంపి వ్యాఖ్యానించింది. జమ్ము కశ్మీర్లో నిర్వహిస్తారా! టోర్నీలో పాల్గొనాల్సిన 16 మందిలో 15 మందికి సమస్య లేదని, తాను మాత్రమే తప్పుకున్నానని కొందరు విమర్శలు చేస్తుండటంపై కూడా హంపి స్పందించింది. ‘మిగతా వారంతా ఆడుతున్నారంటే నిర్వాహకులు సరైన నిర్ణయం తీసుకున్నారని అర్థం కాదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా టోర్నీ జరగవచ్చు కూడా. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నిర్వహించడం అవసరమా అనేదే నా ప్రశ్న. భద్రతకు సంబంధించి అమెరికా, ఇంగ్లండ్లు ఇప్పటికే లెవల్ 3 స్థాయి హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే స్థాయిలో భద్రతా వ్యవస్థ ఉన్న జమ్ము కశ్మీర్లో వారు టోర్నీ నిర్వహిస్తారా? చాలా అందమైన రిసార్ట్లో టోర్నీ నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. అలాంటివి భారత దేశంలోనూ చాలా ఉన్నాయి. ఒక టోర్నీ ఆడేందుకు ఇలాంటి ఏర్పాట్లు మాత్రమే సరిపోవు. అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. నేను ఇప్పుడు వెళ్లి ఆడటం అంటే నిర్వాహకుల నిర్ణయానికి మద్దతిచ్చినట్లే. నిజానికి యుద్ధం మొదలు కాగానే ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను నిర్వాహకులు అడగాల్సింది’ అని హంపి పేర్కొంది. డబ్బు కోసం ఆడటం లేదు... క్యాండిడేట్స్ టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడంతో హంపిపై ‘ఫిడే’ భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే తాను దీనిని పట్టించుకోనని ఆమె స్పష్టం చేసింది. ‘ఆటగాళ్లు నిజాలు మాట్లాడకూడదనే ‘ఫిడే’ జరిమానాలతో భయపెడుతుంది. నాకు ఎలాంటి భయం లేదు. డబ్బు కోసం, ఇతర వాణిజ్య లాభాల కోసం నేను ఆడటం లేదు. చెస్ అంటే ఇష్టంతో ఆడుతున్నాను. ఫిడే ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్తో కూడా ఈ టోర్నీ విషయంలో మాట్లాడాను. అయితే ఆ విషయాలు నేను బయటకు చెప్పను. టోరీ్నలో ఆడుతున్న భారత సహచరులు దివ్య, వైశాలి, ప్రజ్ఞానందలతో నేను మాట్లాడలేదు. ఆ అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. నేను కూడా నా కోసం మాట్లాడతాను తప్ప వేరేవాళ్ల గురించి కాదు’ అని హంపి పదునైన వ్యాఖ్యలు చేసింది. సైప్రస్లో తాజా పరిస్థితులపై అమెరికా గ్రాండ్మాస్టర్ నకమురా కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు హంపి స్థానంలో ఉక్రెయిన్కు చెందిన అనా ముజీచుక్ను టోరీ్నలో ఆడేందుకు ఎంపిక చేసినట్లు ‘ఫిడే’ ప్రకటించింది. -
కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్వన్కు షాక్!
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం నమోదయ్యింది. పురుషుల ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ పరాజయం చవిచూశాడు. మియామి ఓపెన్లో భాగంగా ప్రపంచ 36వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా చేతిలో అల్కరాజ్ ఓటమి పాలయ్యాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో అల్కరాజ్ 3-6, 7-5, 4-6తో సెబాస్టియన్ చేతిలో ఓటమి చవిచూశాడు. రెండు గంటలకు పైగా స ఆగిన మ్యాచ్లో కోర్డా తొలి సెట్ నుంచే తన ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి సెట్ను 6-3తో సునాయాసంగా నెగ్గిన కోర్డా రెండో సెట్ను అల్కరాజ్కు కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో ఫుంజుకున్న సెబాస్టియన్ కోర్డా పదునైన సర్వీస్లతో అల్కరాజ్ను మట్టికరిపించి తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన అల్కరాజ్ తన కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసుకున్నాడు. మియామి ఓపెన్ కంటే ముందు జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీలో మంచి ఆరంభంతోనే మొదలుపెట్టిన అల్కరాజ్ సెమీస్లో వెనుదిరిగాడు. డానిల్ మెద్వెదెవ్ చేతిలో అల్కరాజ్ ఓటమిపాలయ్యాడు. ఈ ఓటమితో అల్కరాజ్ వరుస 17 విజయాలకు బ్రేక్ పడినట్లయింది. తాజాగా మియామి ఓపెన్లో ఓటమితో అల్కరాజ్ ఆధిక్యం 17-2కు తగ్గినట్లయింది. 2022లో మియామి ఓపెన్ నెగ్గిన అల్కరాజ్ మరోసారి టైటిల్ నెగ్గాలని ఆశించినప్పటికీ మూడో రౌండ్కు పరిమితమయ్యాడు. ఇక సెబాస్టియన్ కోర్డా ప్రిక్వార్టర్స్లో కచనోవ్ లేదా మార్టిన్ ల్యాండ్లూస్ల్లో ఒకరితో పోటీ పడనున్నాడు.చదవండి: పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!Sebi SPECIAL 🙌The moment @SebiKorda defeated Carlos Alcaraz for his first ever win over a reigning No. 1!#MiamiOpen pic.twitter.com/iTBpMLBRw6— Tennis TV (@TennisTV) March 22, 2026 -
అనాహత్, అభయ్లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు. -
రన్నరప్ రిత్విక్–అర్జున్ జోడీ
న్యూఢిల్లీ: మొరెలాస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రన్నరప్గా నిలిచాడు. మెక్సికోలో ఆదివారం జరిగిన ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) జోడీ 3–6, 6–7 (4/7)తో ఆండ్రెస్ అండ్రాడె (ఈక్వెడార్)–అగస్టిన్ గోమెజ్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది. ఫైనల్లో ఓడిన రిత్విక్ జోడీకి 2.70 లక్షల నగదు (2,880 డాలర్లు)తో పాటు 50 పాయింట్లు లబించాయి. -
లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు
ఒర్లాండో (ఫ్లోరిడా): అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా లెబ్రాన్ ఘనత సాధించాడు. ఆదివారం ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆడటం ద్వారా లెబ్రాన్ జేమ్స్ కెరీర్లో 1612 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. 30 ఏళ్లుగా ఈ రికార్డు రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్లు) పేరిట ఉండగా... దాన్ని లెబ్రాన్ జేమ్స్ బద్దలు కొట్టాడు. ఇప్పటికే ఎన్బీఏలో వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన జేమ్స్... ఒర్లాండో మ్యాచ్లో 12 పాయింట్లతో సత్తాచాటాడు. ఫలితంగా హోరాహోరీగా సాగిన పోరులో లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు 105–104 పాయింట్ల తేడాతో ఒర్లాండో మ్యాజిక్పై విజయం సాధించింది. -
బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది!
ఫార్ములా వన్ రేసులో రారాజులే ఎక్కువగా కనిపిస్తారు. మైకెల్ షుమాకర్, లూయిస్ హామిల్టన్, వెర్స్టాపెన్ వంటి ఎందరో దిగ్గజాలను ఫార్ములా వన్ రేస్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారత్లో కూడా ఫార్ములా వన్ రేసుపై మక్కువ ఇటీవలే కాలంలో పెరిగిపోయింది. ఫార్ములా వన్ అబ్బాయిలే ఎక్కువగా ఇష్టపడతారనేది ఎక్కువగా వినిపిస్తుంది. కానీ భారత్లో మాత్రం 11 ఏళ్ల అతికా మిర్ మాత్రం అబ్బాయిలకు ధీటుగా ఫార్ముల్ వన్లో దూసుకెళ్తోంది. యూరోపియన్ సర్క్యూట్లో అతికా మిర్ తన తొలి ప్రయత్నంలో (12 నుంచి 14 ఏళ్ల మధ్య) నిర్వహించే రేస్ కార్టింగ్లో అంచనాలకు మించి రాణించింది. అయితే రేసింగ్ ఇప్పటికీ పురుషాధిక్య క్రీడగానే ఉండడంతో తరచూ అబ్బాయిల చేతిలో బెదిరింపులకు గురయ్యేదానినని అతికా మిర్ చెప్పు కొచ్చింది. అతికా మిర్ కేవలం తన ప్రతిభ ఆధారంగానే మినీ (8 నుంచి 12 ఏళ్లు) విభాగం నుంచి జూనియర్ (12 నుంచి 14 ఏళ్లు) వేగంగా పదోన్నతి పొందడమే గాక తన అద్భుతమైన రేసింగ్ నైపుణ్యంతో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం భారత్ తరఫున అతికా మిర్ ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న భారతీయ కార్టర్గా మాత్రమే గాక, 40 వరకు ఉండే కార్ట్లు ఉండే రద్దీగా ఉండే గ్రిడ్లపై కూడా అతికా చాలా మంది పురుష రేసర్లను వెనక్కి నెట్టేయడం విశేషం. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన అతికా మిర్ ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మాక్స్ వెర్స్టాపెన్ను అతికా తన ఆరాధ్య దైవంగా భావిస్తోంది. అతికా మిర్ రేసింగ్ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ఆసిర్ మిర్ భారత మొట్టమొదటి జాతీయ కార్టింగ్ చాంపియన్. 2021లో అబుదాబిలో జరిగిన ఫార్ములా వన్ సీజన్ ఫైనల్లో లూయిస్ హామిల్టన్, వెర్స్టాపెన్ల మధ్య జరిగిన అద్భుతమైన టైటిల్ పోరును చూసినత తర్వాత అతికా మిర్ రేసింగ్పై ఇష్టాన్ని పెంచుకుంది. మోటార్ రేసింగ్లో పురుషాధిక్యం మామూలే. అందుకే ఫార్ములా వన్లో మహిళలు కనిపించరు. కానీ నమ్మకం, ఆత్మవిశ్వాసం ఇవాళ నన్ను రేసింగ్ను కెరీర్గా ఎంచుకునేలా చేశాయి. ట్రాక్పై అబ్బాయిలు వేధింపులకు గురైనప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతూ పోయింది. 2021లో ఫార్ములా వన్ రేసు ఫైనల్ వీక్షించే వరకు నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టీవీలో అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ద్వారా రేసింగ్పై మక్కువ పెంచుకున్నా అని అతికా చెప్పుకొచ్చింది. చదవండి: పంజాబ్ కింగ్స్లో లుకలుకలు! -
సెమీస్లో తన్వీ, ఇషారాణి ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఫ్రాన్స్లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా ఓటమి పాలయ్యారు. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన తొలి సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 9–21, 16–21తో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో ఇషారాణి 12–21, 21–23తో పిచామన్ ఒపాట్నిపుత్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ఓడిన తనీ్వ, ఇషారాణిలకు 3,625 డాలర్ల (రూ. 3 లక్షల 39 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్ పోరుకు అనాహత్ సింగ్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్కే టైటిల్ లభించనుంది. ఎందుకంటే భారత్కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ హనా మొతాజ్ (ఈజిప్్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో వీర్ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్ జీవా (మలేసియా)పై, అభయ్ సింగ్ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్రాజ్ చందారన్ (మలేసియా)పై విజయం సాధించారు. -
జపాన్ స్టార్కు షాకిచ్చిన తాన్వి శర్మ
ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ తన్వీ శర్మ, ఇషారాణి బారువా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్లో శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–14, 21–14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా (జపాన్)పై సంచలన విజయం సాధించింది.43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ తన్వీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఇషారాణి 21–9, 15–7తో భారత్కే చెందిన మాళవిక బన్సోద్పై గెలిచింది. రెండో గేమ్ మధ్యలో గాయం కారణంగా మాళవిక వైదొలిగింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 12–21, 20–22తో లియో కార్నాండో–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి...
మయామి: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాడు. విఖ్యాత నేషనల్ బాస్కెల్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఈ ఆదివారం 41 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించనున్నాడు. 79 ఏళ్ల ఎన్బీఏ చరిత్రలో వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్గా గుర్తింపు పొందిన లెబ్రాన్ మయామి హీట్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఎన్బీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా 1997 నుంచి రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును లెబ్రాన్ సమం చేశాడు. మయామి హీట్తో జరిగిన మ్యాచ్లో లెబ్రాన్ 19 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ మ్యాచ్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు 134–126తో గెలిచి ఈ సీజన్లో వరుసగా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టు తదుపరి మ్యాచ్ను రేపు ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో లెబ్రాన్ బరిలోకి దిగితే ఎన్బీఏ చరిత్రలోనే అత్యధికంగా 1612 మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఘనత వహిస్తాడు. -
‘మానసిక వేదన అనుభవిస్తున్నా’
పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ఓడిపోవడం తనను మానసిక వేదనకు గురి చేస్తోందని, ఓటములతో కోర్టులో ఆటపై పట్టు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. గురువారం ప్రారంభమైన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్వియాటెక్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 50వ ర్యాంకర్ మగ్డా లినెట్టె 6-1, 5-7, 6-3తో ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన స్వియాటెక్ను మూడు సెట్లలో చిత్తు చేసింది. ఒక డబ్ల్యూటీఏ టూర్లో భాగంగా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో 73 మ్యాచ్ల్లో వరుస విజయాల తర్వాత తొలి రౌండ్లో ఓడిపోవడం స్వియాటెక్కు ఇదే తొలిసారి. మ్యాచ్ ఓటమి అనంతరం స్వియాటెక్ మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే నమ్మబుద్ది కావడం లేదు. రాను రాను టెన్నిస్ ఆట కష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మానసికంగా మనం ఎలా ఉంటామనేది చాలా కీలకం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మళ్లీ నా పనిలో మునిగిపోతా. ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్గా ఆలోచిస్తూ.. నా ఆటను మెరుగుపరచుకుంటా’ అని స్వియాటెక్ పేర్కొంది. కాగా స్వియాటెక్ తన టెన్నిస్ కెరీర్లో ఇప్పటివరకు ఆరు గ్రాండ్స్లామ్లు సాధించగా ఇందులో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఒక్కోసారి నెగ్గడం విశేషం. ఒక దశలో స్వియాటెక్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో 125 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.చదవండి: ‘సంజూకు మామయ్యలాంటి వాడిని’‼️UPSET ALERT IN HARD ROCK STADIUM ‼️@MagdaLinette | #MiamiOpen pic.twitter.com/lUJtcc5jbW— wta (@WTA) March 20, 2026 -
ఇరాన్కు షాకిచ్చిన ఫిఫా!
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్ వేదికలను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫిఫా (అంతర్జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ సమాఖ్య) తోసి పుచ్చింది. ఇప్పటికే మ్యాచ్ వేదికలను సిద్ధం చేశామని, ముందు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో తెలిపారు. ఇరాన్ అభ్యర్థన సహా పలు అంశాలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిఫా పాలకమండలి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గియాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా సభ్య సమాఖ్య చేసిన ఫిర్యాదులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘గత డిసెంబర్లోనే ఫిఫా మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేశాము. దీంతో మ్యాచ్ వేదికలను మెక్సికోకు మార్చాలన్న ఇరాన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇరాన్ మ్యాచ్ వేదికలను మార్చలేము. అందుకే షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లను నిర్వహించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ఫుట్బాల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పాలస్తీనా ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తున్నాం. భౌగోళిక రాజకీయాలను పరిష్కరించేందుకు ఫిఫా పనిచేయదు. కాకపోతే యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలనే విషయానికి ఫిఫా కట్టుబడి ఉంటుంది.’ అని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య మొదలైన యుద్ధం మూడు వారాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. అయితే సాకర్ ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ యుద్ధానికి రెండు నెలల ముందే విడుదలయ్యింది. అమెరికా, కెనెడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ జూన్ 11న ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం,న్యూజిలాండ్, ఈజిప్ట్లతో తమ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఇరాన్ తన మూడు మ్యాచ్లను అమెరికాలోనే ఆడాల్సి ఉండగా.. లాస్ఏంజిల్స్ వేదికగా రెండు, మరో మ్యాచ్ను సియాటెల్లో ఆడాల్సి ఉంది. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమ లీగ్ మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఫిఫాను విజ్ఞప్తి చేసింది. తాజాగా ఫిఫా నిర్ణయం ఇరాన్ను చిక్కుల్లో పడేసినట్లయింది. ఇప్పుడు ఇరాన్ ముందు రెండే ఆప్షన్లు.. ఆడడం లేదా టోర్నీ నుంచి వైదొలగడం. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ను బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం -
మెస్సీ @ 900 గోల్స్
ఫోర్ట్ లాడెర్డేల్ (అమెరికా): అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లయోనల్ మెస్సీ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఫుట్బాల్ కెరీర్లో 900 గోల్స్ సాధించిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా ఇప్పటిదాకా మరో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకే పరిమితమైన ‘900 గోల్స్’ జాబితాలో తానూ భాగమయ్యాడు. కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా అండ్ కరీబియన్ అసోసియేషన్ ఫుట్బాల్ (కాన్కకాఫ్) చాంపియన్స్ కప్లో ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ... నష్ విల్లేతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గోల్ చేయడం ద్వారా ‘900’ క్లబ్లో చేరాడు. బ్రెజిలియన్ దివంగత దిగ్గజం పీలే 1000 గోల్స్ చేసినట్లుగా ఉన్నప్పటికీ అధికారిక గోల్స్ స్కోరు మాత్రం సుమారు 800 మాత్రమే! ఎందుకంటే పీలే చేసిన వెయ్యి గోల్స్లో దిగువ స్థాయి మ్యాచ్ల్లో చేసినవి కూడా కలిపారు. దీంతో ఫుట్బాల్ విశ్లేషకుల లెక్కల ప్రకారం 900 క్లబ్లో ప్రస్తుతం రొనాల్డో, మెస్సీలు మాత్రమే ఉన్నారు. -
క్వార్టర్స్లో తాన్వి, మాళవిక
ఓర్లియాన్స్ (ఫ్రాన్స్): ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ తాన్వి శర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో తాన్వి 21–14, 21–17తో భారత్కే చెందిన అన్మోల్ ఖర్బ్ను ఓడించింది. ఇతర మ్యాచ్లలో ఇషారాణి బారువా 21–11, 14–21, 21–17తో వెన్ యు జాంగ్ (కెనడా)పై, మాళవిక బన్సోద్ 24–22, 21–13తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, నెగ్గి ముందంజ వేశారు. పురుషుల డబుల్స్లో భారత జోడి హరిహరన్ – ఎంఆర్ అర్జున్ 26–24, 21–14తో అలెగ్డాండర్ డున్ – ఆడమ్ ప్రింగిల్ (స్కాట్లాండ్)ని ఓడించి క్వార్టర్స్కు చేరింది. పురుషుల సింగిల్స్లో 21–9, 18–21, 9–21 స్కోరుతో యుడై ఒకొమొటో (జపాన్) చేతిలో ఓటమితో ఆయుశ్ శెట్టి (భారత్), మిక్స్డ్ డబుల్స్లో భారత జంట గద్దె రుత్విక శివాని – రోహన్ కపూర్ 21–19, 9–21, 14–21తో టాప్ సీడ్ థామ్ గిక్వెల్ – డెల్ఫైన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) చేతిలో ఓడి నిష్క్రమించారు. -
2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్ వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్కు దక్కినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. భువనేశ్వర్లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్తో పాటు భారత్ బిడ్ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్ భువనేశ్వర్ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్ (1999), ఖతర్ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్షిప్నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలవనుంది. -
అమెరికాపై వెనిజులా చరిత్రాత్మక విజయం
వెనిజులా బేస్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. రాజకీయ ఉద్రికత్తల వేల అమెరికాను వారి సొంతగడ్డపై (మియామీ) 3–2 తేడాతో ఓడించి, తమ మొదటి వరల్డ్ బేస్బాల్ క్లాసిక్ (WBC) టైటిల్ను సాధించింది. తొమ్మిదో ఇన్నింగ్స్లో యూజెనియో సుయారెజ్ కీలక హిట్తో వెనిజులాకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయాన్ని వెనిజులా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. వెనిజులా తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగెస్ ఈ విజయాన్ని జాతీయ ఉత్సవ దినంగా ప్రకటించారు. ఈ విజయం వెనిజులా ప్రజల అభిరుచి, ప్రతిభ, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.కాగా, ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను సైనిక దాడితో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్కు అనుకూలమైన డెల్సీ రోడ్రిగెస్ వెనిజులా తాత్కాలిక నాయకురాలిగా బాధ్యతలు చేపట్టారు. -
ఆగస్టు 20న భారత్, పాక్ పోరు
న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల ప్రపంచకప్ ట్రోఫీ నిరీక్షణకు తెర దించాలంటే ఈసారి భారత పురుషుల హాకీ జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్ టోర్నీలో వేల్స్ జట్టుతో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఆగస్టు 16న నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత బృందం ఆ తర్వాత ఆగస్టు 18న ఇంగ్లండ్తో... ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ‘ఢీ’కొంటుంది. తదుపరి దశకు అర్హత సాధించాలంటే భారత్ పూల్ ‘డి’లోని తొలి రెండు స్థానాల్లో కచి్చతంగా ఉండాలి. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 16న చైనాతో తలపడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్లో ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో... చివరిదైన మూడో మ్యాచ్లో ఆగస్టు 20న ఇంగ్లండ్తో ఆడుతుంది. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక నాలుగు పూల్స్ నుంచి రెండు జట్ల చొప్పున ఎనిమిది జట్లు రెండో రౌండ్కు చేరుకుంటాయి. రెండో రౌండ్లో ఎనిమిది జట్లను రెండు పూల్స్గా (ఒక్కో పూల్లో నాలుగు జట్లు) విభజిస్తారు. రెండో రౌండ్ ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు 1975లో ఏకైకసారి ప్రపంచకప్ టైటిల్ నెగ్గగా... భారత మహిళల జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. -
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
ఓర్లియాన్స్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని జోడీ శుభారంభం చేసింది. ఫ్రాన్స్లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ ద్వయం 21–15, 21–9తో త్సాయ్ ఫు చెంగ్–సుంగ్ యు సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 10–21తో మాగ్నస్ జొనాసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి 17–21, 21–10, 21–17తో సహచరుడు కిరణ్ జార్జ్పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక బన్సోద్ 21–18, 21–14తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై, ఇషారాణి బారువా 21–19, 21–19తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై, అన్మోల్ 21–12, 21–16తో నెష్లిహాన్ అరిన్ (టర్కీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్, దేవిక సిహాగ్, రక్షితశ్రీ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
‘కెరీర్ ముగింపు మన చేతుల్లో ఉండదు’
క్రీడల్లో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కేవలం ఒకే ఒక్క గాయంతో ఏకంగా కెరీర్నే ముగించాల్సి వస్తుందని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. గురుగ్రామ్లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధూ క్రీడలు, చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు కేవలం క్రీడలమీదే కాకుండా, చదువుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క గాయం కెరీర్నే ముగించే పరిస్థితికి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేను కొన్నేళ్లుగా ఆడుతూనే ఉన్నా. అయితే, ఏదొక సమయంలో రిటైర్మెంట్ అవ్వాల్సిందే కదా.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మనం 45 లేదా 50 ఏళ్లు వచ్చాక క్రీడలు ఆడటం కష్టం. కానీ, చదువు మాత్రం మన జీవితాంతం తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్తో జన్మించలేరు. ఎందులోనైనా సరే కష్టపడాల్సిందే. అది చదువైనా.. క్రీడలైనా సరే అకుంఠిత దీక్షతో శ్రమించాలి. రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. అయితే, ఓ వైపు క్రీడలో ఉంటూ చదువు కొనసాగించడం తేలికైన విషయం కాదని తెలుసు. ఉదయాన్నే ప్రాక్టీస్కు వెళ్లడం.. వచ్చాక చదువుకోవడం.. మళ్లీ సాయంత్రం సాధనకు వెళ్లడం కష్టమే. ఇక్కడే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం.. చదువు ఉంటే మాత్రం నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ, చదువును పూర్తిగా పక్కన పెట్టేసి ప్రయత్నించకూడదు. పైగా, క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిరంతరం రిస్క్తో కూడుకున్నదే. ఆటలను కెరీర్గా ఎంచుకున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఆడేటప్పుడు ఒక్క పెద్ద గాయమైతే.. కోలుకుని రావడం కష్టం. ఒక్కోసారి కెరీర్ ముగిసే అవకాశమూ లేకపోలేదు. ప్రమాదాలు చెప్పి రావు కదా. నేను 2016 ఒలింపిక్స్కు ముందు తీవ్రంగా గాయపడ్డా. కొన్నిరోజులపాటు నొప్పితోనే ఆడా. వైద్యుల వద్దకు వెళ్తే వారు ఏం చెబుతారనే భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానా? లేదా? అనే అనుమానాలు వచ్చాయి. వైద్య చికిత్స తీసుకున్నా.మళ్లీ కోలుకుని ఒలింపిక్స్ బరిలోకి దిగా' అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.చదవండి: బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం! -
ఒలింపిక్ పతకమే లక్ష్యం
ముంబై: లాస్ ఏంజెలిస్ మెగా ఈవెంటే మా అందరి లక్ష్యమని భారత టాప్ ర్యాంక్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ తెలిపింది. 2028 ఒలింపిక్స్లో తొలిసారి స్క్వాష్ క్రీడకు చోటు లభించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా వచ్చే రెండేళ్ల పాటు ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకే శ్రమిస్తారని చెప్పింది. ప్రతి అథ్లెట్ కలఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘స్క్వాష్ తొలిసారి ఒలింపిక్స్లో భాగమవడం... ముమ్మాటికి ఉత్సాహాన్ని పెంచే విషయం. క్రీడాకారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు మాకు (స్క్వాష్ ప్లేయర్లకు) కామన్వెల్త్ క్రీడలే మేజర్ ఈవెంట్గా ఉంది. ఇప్పుడు విశ్వక్రీడల్లో ఆడే అవకాశం లాస్ ఏంజెలిస్ ద్వారా దక్కనుంది. ఒలింపిక్ పతకమనేది ప్రతి అథ్లెట్ కల. దీన్ని సాకారం చేసుకునేందుకే ఏళ్ల తరబడి శ్రమిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యంతో దేశానికి పతకం తేచ్చేందుకు నేను చెమటోడ్చుతాను’ అని వివరించింది. కాగా 2023 ఏషియాడ్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందిన అనాహత్ ఈ ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతం జరిగే టోర్నీలపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం రంగు మారుస్తానని తెలిపింది. సన్నాహక టోర్నీగాఇండియా ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) కాపర్ ఈవెంట్గా జరుగుతోంది. ఇందులో రాణించిన ప్లేయర్లకు ర్యాంకింగ్ పాయింట్లు మెరుగవడమే కాకుండా ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు ముందు మేటి సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది. పురుషుల కేటగిరీలో భారత రెండో ర్యాంకింగ్ ప్లేయర్ రమిత్ టాండన్ మాట్లాడుతూ స్క్వాష్ తాజాగా ఒలింపిక్ క్రీడ కావడంతో కార్పోరెట్ సంస్థలు సైతం ఆకట్టుకుంటోందని, తద్వారా ఆటగాళ్లకు స్పాన్సర్షిప్ అండదండలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
LA Olympics 2028: 4 రోజుల ముందే పోటీలు షురూ
లాస్ ఏంజెలిస్: మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్లో జరగబోయే 2028 ఒలింపిక్స్లో ఆరంభోత్సవానికి ముందే ఫుట్బాల్ పోటీలు మొదలు కానున్నాయి. అమెరికాలోని ఏడు నగరాల్లోని మైదానాల్లో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వక్రీడల వేడుకలకు ముందే పోటీలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.ఈ ముందస్తు నిర్వహణతో లీగ్ దశ, నాకౌట్ దశ ఇలా మ్యాచ్ మ్యాచ్కు మధ్య కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని ఫుట్బాల్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2028, జూలై 10న లీగ్ దశ మ్యాచ్లు మొదలవుతాయి. అనంతరం న్యూయార్క్ సహా కొలంబస్, ఒహాయో, నష్విల్లే, టెన్నెస్సీ, సెయింట్ లూసియాల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి.మిగతా నాకౌట్ పోటీలు కాలిఫోర్నియాలో, ఫైనల్ పోరు చారిత్రక రోజ్ బౌల్ స్టేడియంలో జరుగనుంది. ఈ రోజ్బౌల్ వేదికపైనే 1984 ఒలింపిక్ స్వర్ణ పతక పోరు జరిగింది. అనంతరం 1994 పురుషుల ప్రపంచకప్ ఫైనల్, 1999 మహిళల ప్రపంచకప్ టైటిల్ పోరు కూడా జరిగాయి. మెక్సికోలో ఇరాన్ మ్యాచ్లు? మెక్సికో సిటీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధకాండతో అమెరికాలో ఇరాన్ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో అమెరికాలో నిర్వహించాల్సిన ఇరాన్ మ్యాచ్ల్ని మెక్సికోకు తరలించాల్సిందిగా ‘ఫిఫా’తో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఫిఫా’ మాత్రం ఈ సంప్రదింపులపై తక్షణం స్పందించేందుకు నిరాకరించింది. -
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూప్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్లను నిర్వహిస్తుండటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్లను కూడా ఎఫ్ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్లో భారత్తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్ల పూర్తిస్థాయి షెడ్యూల్ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. పూల్ల వివరాలు పురుషుల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్. మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా. -
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూన్లో జరగనున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్కప్ ఆడేందుకు ఇరాన్ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్ ప్రపంచకప్ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ కంటే ముందే అమెరికాలో వరల్డ్కప్ ఆడబోయేది లేదని ఇరాన్ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్కప్లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్లను మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్ వేదికలను మార్చాలా లేక ఇరాన్ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్ ప్రతిపాదనను క్రికెట్ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్కు భారత్తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఈ కారణంగా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడలేమని, తమ మ్యాచ్ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు ప్రతిపాదనలు చేసింది. కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్ ప్రపంచకప్లో వారి ఆటను చూడలేమనుకుంటా!చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్


