Other Sports
-
ఈసారి ఇంట్లోనే చూసేద్దాం!
న్యూయార్క్: సాధారణంగా ‘ఫిఫా’ ప్రపంచకప్ అంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు... మెగా టోర్నీ ఆరంభం నుంచే దేశవిదేశాల నుంచి అభిమానులు ఆతిథ్య దేశంలో వాలిపోవడం పరిపాటి. మైదానాలు, బార్లు, ఫ్యాన్ జోన్లు ఇలా ఎక్కడ చూసినా... సాకర్ ఫీవర్ కనిపిస్తుంటుంది. తమ అభిమాన ఆటగాళ్లను వరల్డ్కప్లో ప్రత్యక్షంగా వీక్షించాలనే ఉద్దేశంతో అభిమానులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మ్యాచ్లు చూసేందుకు మైదానాలకు వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్కప్–2026 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 12న తొలి మ్యాచ్ జరగనుంది. అంటే మరో వారం రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వీక్షించే క్రీడా సంబరానికి తెరలేవనుందన్నమాట. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఫ్యాన్స్ సందడి అంతగా కనిపించడం లేదు. దీని వెనక పలు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. టికెట్ ధరలు విపరీతంగా పెంచడంతో పాటు మ్యాచ్లను మూడు దేశాల్లోని వివిధ వేదికల్లో నిర్వహిస్తుండటంతో ప్రయాణ ఖర్చులు భారీగా పెరగడంతో... బయట నుంచి వచ్చే అభిమానులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అమెరికాలో పర్యటించడానికి కూడా చాలా మంది అభిమానులు వెనుకాడుతున్నారు. లండన్కు చెందిన ఐటీ ఉద్యోగి మైక్ విల్సన్ గత 20 ఏళ్లలో నాలుగు ప్రపంచకప్లను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఫుట్బాల్కు వీరాభిమాని అయిన విల్సన్ ఈసారి మాత్రం ఇంట్లో కూర్చొనే మ్యాచ్లు చూడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అర్జెంటీనాకు చెందిన డాక్టర్ ఎమిలియానో గతంలో తమ దేశం ప్రపంచకప్లో ఆడుతుందంటే ఆ మ్యాచ్లకు తప్పక హాజరయ్యేవాడు. కానీ ఈసారి మాత్రం ఒకటీ రెండు మ్యాచ్లను తప్ప అన్నీంటిని ప్రత్యక్షంగా చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. నెదర్లాండ్స్కు చెందిన ఫైనాన్స్ మేనేజర్ పీటర్ బెర్గాకర్ 2010 ‘ఫిఫా’ ప్రపంచకప్ నుంచి నెదర్లాండ్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూశాడు. కానీ ఈసారి మాత్రం తమ జట్టు నాకౌట్కు చేరినా... అమెరికాలో మాత్రం అడుగుపెట్టబోనని అంటున్నాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినా... వీరాభిమానుల నుంచి ఇలాంటి స్పందన వస్తుండటం మాత్రం ఆశ్చర్యకరమే! చుక్కలనంటుతున్న టికెట్ ధరలు... 2022లో ఖతార్లో జరిగిన వరల్డ్కప్తో పోల్చుకుంటే ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మెక్సికో, కెనడా, అమెరికాలో హోటళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. మెగా టోర్నీ కోసం చేస్తున్న కొలువుకు సెలవు పెట్టడంతో పాటు... దాదాపు రెండు మూడేళ్ల నుంచి దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టినా అన్నీ మ్యాచ్లు చూడలేని స్థితి ఉందని అభిమానులు వాపోతున్నారు. గత వరల్డ్కప్లో గ్రూప్ దశ మ్యాచ్లకు మూడు టికెట్లకు కలిపి 69 డాలర్లు (రూ. 6,570) ఖర్చు అయితే... ఇప్పుడు అది ఏకంగా 265 డాలర్ల (రూ. 25, 234)కు పెరిగింది. అలాగే రష్యా, ఖతార్లో మెగా టోర్నీ జరిగినప్పుడు ఒక నగరం నుంచి మరో నగరానికి మధ్య నిర్వాహకులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం మూడు దేశాల్లో కలిపి 16 మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఖతార్లోని గ్రౌండ్స్తో పోల్చుకుంటే వీటి మధ్య దూరం చాలా ఎక్కువ. అలాగే టికెట్ల అమ్మకాల విధానం, రీసేల్ టికెట్స్ పరిస్థితి అంతా సమీక్షించుకుంటే... అమెరికా దాకా వెళ్లి అగచాట్లు పడటం కంటే ఇంట్లో కూర్చొని హాయిగా మ్యాచ్లు చూడటం మిన్న అని జపాన్కు చెందిన టోమోనోరి అకుట్సు తెలిపాడు. గత ఐదు ప్రపంచకప్లను ప్రత్యక్షంగా వీక్షించిన అకుట్సు... ఈ టోర్నమెంట్కు ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే వరుసగా ఆరో ప్రపంచకప్ చూసే ప్రయత్నం మానుకునేవాడినని అంటున్నాడు. డైహార్డ్ ఫ్యాన్స్ కూడా దూరం... ఫుట్బాల్ అంటే పడిచచ్చే ఇంగ్లండ్ ఐటీ ఉద్యోగి విల్సన్... ఈసారి వరల్డ్కప్ మ్యాచ్లు ప్రత్యక్షంగా చూడకూడదని నిర్ణయించుకున్నాడు. టికెట్ ధరలు తమ పరిధిలో లేకపోవడంతో... స్నేహితులతో కలిసి ‘ఫిఫా’ మెగా టోర్నీ చూడాలనే ఆలోచనను మానుకున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్లు వీక్షించిన విల్సన్ ఏ వరల్డ్కప్ పోరు కోసం కూడా 200 డాలర్ల (రూ. 19,045)కు మించి ఖర్చు చేసింది లేదు. కానీ ఈ సారి ఆ డబ్బుతో ఓ నామమాత్ర మ్యాచ్కు చివరి వరుసలోనూ టికెట్ లభించే అవకాశం లేదని చెబుతున్నాడు. దీంతో ఈ వేసవిలో సాకర్ వినోదాన్ని ఆస్వాదించేందుకు బదులు దానికంటే చాలా తక్కువ డబ్బుతో పోర్చుగల్లో విహరించేందుకు వెళ్తున్నట్లు తెలిపాడు. సంపన్న వర్గాలకే పరిమితం... విశేష జనాదరణ ఉన్న ‘ఫిఫా’ ప్రపంచకప్ ఈసారి సంపన్న వర్గాలకే పరిమితమయ్యేలా కనిపిస్తుంది. టోర్నీ ఆరంభానికి చాలా ముందే ప్రణాళిక ప్రకారం టికెట్లు కొనుగోలు చేసుకున్న వారికి కాస్త కలిసిరానుంది. ఏడాది క్రితం స్కాట్లాండ్ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించగా... తక్షణమే ఆ దేశానికి చెందిన క్యాంప్బెల్ లూయిస్ అతడి మిత్ర బృందం సాకర్ సమరం కోసం సమాయత్తమైంది. 28 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్ జట్టు ప్రపంచకప్ ఆడుతుండటంతో భారీ డిమాండ్ ఉంటుందని ముందే ఊహించిన లూయిస్... అందుకు తగ్గట్లే జాగ్రత్త పడి ధరలు పెరగకముందే టికెట్లు కొనుగోలు చేసుకున్నాడు. ‘చివరిసారి మా జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించినప్పుడు మేమంతా చిన్న పిల్లలం. ఇన్నాళ్లకు ఆ సుందర దృశ్యాలు చూసే అవకాశం దక్కింది. మాతరంలో మరోసారి స్కాట్లాండ్ వరల్డ్కప్ ఆడుతుందో లేదో తెలియదు. అందుకే ఖర్చు కాస్త ఎక్కువైనా మ్యాచ్లను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాం’ అని లూయిస్ అన్నాడు.అమెరికా వీసాతిప్పలు‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా... ఇప్పటికే టికెట్ ధరలు, ప్రయాణ ఖర్చు, వసతి భారం ఎక్కువై సాకర్ అభిమానులు ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు అమెరికా వీసా నిబంధనలు ప్రేక్షకులను మరింత భయపెడుతున్నాయి. 2018లో రష్యా, 2022లో ఖతార్ తమ దేశాల్లో జరిగిన వరల్డ్కప్లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం వీసా అనుమతులను సులభతరం చేయగా... అమెరికా మాత్రం కఠినమైన వీసా నిబంధనలను పాటిస్తోంది. అల్జీరియా, కేప్ వెర్డే, ఐవరీకోస్ట్, సెనెగల్, ట్యూనీషియా వంటి దేశాల అభిమానులు అమెరికాలో అడుగుపెట్టాలంటే 15 వేల డాలర్లు (రూ. 14.28 లక్షలు) బాండ్ల రూపంలో చెల్లించాలని నిబంధన విధించింది. వరల్డ్కప్ దగ్గర పడుతున్నా కొద్ది దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో గత నెలలో అమెరికా ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. కానీ అప్పటికీ ఆలస్యమైంది. అమెరికా వీసా నిబంధనల కారణంగానే తమ దేశం నుంచి ఎక్కువ మంది ‘ఫిఫా’ సమరం వీక్షించేందుకు వెళ్లడం లేదని ఉరుగ్వే ట్రావెల్ ఏజెన్సీ సంఘం అధ్యక్షుడు కార్లోస్ పెరా చెప్పాడు. జర్మనీకి చెందిన ఓ అభిమాని డొనాల్డ్ ట్రంప్ విద్వేశ పూరిత విధానాల వల్లే తాను అమెరికాలో వరల్డ్కప్ మ్యాచ్లు చూసేందుకు వెళ్లడం లేదని అన్నాడు. -
రొనాల్డో కల నెరవేరేనా!
యూరో టైటిల్... నేషన్స్ కప్ టైటిల్... చాంపియన్స్ లీగ్ టైటిల్... ఇంకా వివిధ దేశాల్లోని అంతర్జాతీయ ప్రొఫెషనల్ లీగ్లలో ముఖ్యమైన టైటిల్స్ అన్నింటిని పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. అయితే ప్రపంచకప్ టైటిల్ మాత్రం ఈ స్టార్ ప్లేయర్కు అందని ద్రాక్షగానే ఉంది. ఆఖరి ప్రయత్నంగా 41 ఏళ్ల రొనాల్డో మరోసారి తన ప్రపంచకప్ కలను సాకారం చేసుకునేందుకు బరిలోకి దిగనున్నాడు. మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ టాప్–5 ఫేవరెట్స్లో పోర్చుగల్ జట్టు కూడా ఉంది. 1966లో తొలిసారి ప్రపంచకప్లో ఆడిన పోర్చుగల్ జట్టు మూడో స్థానాన్ని సంపాదించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆ తర్వాత ఏడుసార్లు ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగిన పోర్చుగల్ జట్టు 2006లో నాలుగో స్థానాన్ని సాధించింది. మూడుసార్లు (1986, 2002, 2014) లీగ్ దశలో నిష్క్రమించింది. రెండుసార్లు ప్రిక్వార్టర్స్లో (2010), ఒకసారి క్వార్టర్ ఫైనల్లో (2022) వెనుదిరిగింది. వరుసగా ఆరో ప్రపంచకప్లో ఆడనున్న రొనాల్డో గత ఐదు ప్రపంచకప్లలో కనీసం ఒక గోల్ అయినా చేశాడు. ఈసారి కూడా రొనాల్డో ఖాతాలో గోల్ చేరితే ఆరు ప్రపంచకప్లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీల్లో 15 గోల్స్ చేసిన రొనాల్డో... మరో రెండు గోల్స్ సాధిస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా మరో రికార్డు సృష్టిస్తాడు. ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ; 16 గోల్స్) పేరిట ఉంది. తాజా ప్రపంచకప్లో గ్రూప్ ‘కె’లో ఉన్న పోర్చుగల్ తమ తొలి లీగ్ మ్యాచ్ను జూన్ 17న డీఆర్ కాంగో జట్టుతో... రెండో మ్యాచ్ను జూన్ 23న ఉజ్బెకిస్తాన్తో... మూడో మ్యాచ్ను జూన్ 27న కొలంబియాతో ఆడుతుంది. కొలంబియాను మినహాయిస్తే కాంగో, ఉజ్బెకిస్తాన్ జట్టుపై పోర్చుగల్ గెలుపు లాంఛనమే అనుకోవాలి. లీగ్ దశ దాటాక నాకౌట్ దశ నుంచి రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమవుతుంది. రొనాల్డోతో సహా సీనియర్లు బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, విటిన్హా తదితరులు సమష్టిగా రాణించడంపైనే పోర్చుగల్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. నాకౌట్ దశలోని రెండు మ్యాచ్ల్లో పోర్చుగల్ గెలిస్తే ఆ జట్టుకు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం -
ఎవరో కొత్త విజేత?
పారిస్: మహిళల టెన్నిస్లో ఈరోజు కొత్త గ్రాండ్స్లామ్ చాంపియన్ అవతరించనుంది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో శనివారం మహిళల సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది. క్వాలిఫయర్ మాయ చావలిన్స్కా (పోలాండ్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. చావలిన్స్కా గెలిస్తే... ఎమ్మా రాడుకాను (బ్రిటన్; 2021 యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేత) తర్వాత గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన రెండో క్వాలిఫయర్గా ఘనత వహిస్తుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), పదో సీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ 7–5, 6–2, 3–6, 6–3తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు. రెండో సెమీఫైనల్లో గాయం కారణంగా అర్నాల్డి (ఇటలీ) బరిలోకి దిగలేదు. దాంతో అర్నాల్డి ప్రత్యర్థి కొబోలి (ఇటలీ) ఫైనల్ చేరుకున్నాడు. -
పాక్పై గెలిచి ఫైనల్లోకి భారత్
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత జట్టు టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత జట్టు 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్ 8–1 గోల్స్ తేడాతో మలేసియా జట్టును ఓడించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున పుర్తి ఆశిష్ తాని (12వ, 49వ, 53వ, 56వ, నిమిషాల్లో) నాలుగు గోల్స్ చేయగా... షారుఖ్ అలీ (35వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. పాక్ జట్టు తరఫున ఆదిల్ (27వ నిమిషంలో), అస్లమ్ మొహమ్మద్ ఫర్హాన్ (37వ నిమిషంలో), ఉజేర్ అహ్మద్ ఖురేషి (42వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత్కు లభించిన ఆరు పెనాల్టీ కార్నర్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్ను కూడా గోల్గా మలిచింది. పాక్ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక దాంట్లో సఫలమైంది. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. చైనా జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–3 తేడాతో ఓటమి పాలైంది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత మహిళల జట్టు ఆడుతుంది. -
నార్వే ఓపెన్ చెస్ విజేత ప్రజ్ఞానంద
ఓస్లో: భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా అవతరించాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద 18 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో రౌండ్లో ప్రజ్ఞానంద రెగ్యులర్ గేమ్లో 45 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలిచాడు. టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ గేమ్లో గెలిచినందుకు ప్రజ్ఞానందకు మూడు పాయింట్లు లభించాయి. మరోవైపు వెస్లీ సో (అమెరికా)–అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) రెగ్యులర్ గేమ్ ‘డ్రా’ అయింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్ గేమ్లో వెస్లీ సో 37 ఎత్తుల్లో అలీరెజాను ఓడించాడు. 17 పాయింట్లతో వెస్లీ సో రన్నరప్ గా నిలువగా... 15.5 పాయింట్లతో అలీరెజా మూడో స్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్వన్ 13 పాయింట్లతో కార్ల్సన్ నాలుగో స్థానం పొందాడు. 11 పాయింట్లతో కీమెర్ ఐదో స్థానంలో, ప్రపంచ చాంపియన్ గుకేశ్ 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. -
గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో!
రెండు వారాల క్రితం.. మాయ చావ్లిన్స్కా ఒక క్వాలిఫయర్గా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఆడేందుకు పారిస్కు చేరుకుంది. స్పాన్సర్స్ ఎవరూ లేకపోవడంతో సొంత డబ్బులతోనే ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా క్వాలిఫయర్ రౌండ్లో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగో రౌండ్ వరకు చేరుకున్న ఆమె తన జీవితంలో ఇదే పెద్ద విజయం అని భావించింది. కానీ కట్చేస్తే ఇవాళ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది ఈ 24 ఏళ్ల పోలండ్ సంచలనం. శనివారం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మిరా ఆండ్రీవాతో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మాయ చావ్లిన్స్కా తన అనుభవాలను పంచుకుంది.ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో పోలండ్కు చెందిన క్వాలిఫయర్ 24 ఏళ్ల మాయ చావ్లిన్స్కా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో శనివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చావ్లిన్స్కా రష్యాకు చెందిన మిరా ఆండ్రీవాను ఎదుర్కోనుంది. ఫైనల్లో గెలిచి టైటిల్ సాధిస్తే మాత్రం బ్రిటన్ స్టార్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను తర్వాత క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకోనున్న క్రీడాకారిణిగా చావ్లిన్స్కా నిలవనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన చావ్లిన్స్కా టోర్నీ మధ్యలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. 'ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు స్పాన్సర్లు ఎవరు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హోటల్ రూంలో దిగాను. తన దగ్గర చాలినన్ని డబ్బులు లేకపోవడంతో టోర్నీ మధ్యలోనే హోటల్ వాళ్లు బయటకు గెంటేస్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ ఇవాళ అన్ని రౌండ్లను దాటుకొని ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. టైటిల్ గెలుస్తానో లేదో తెలియదు కానీ జీవితాన్ని మాత్రం గెలిచేశాను. టైటిల్ గెలిస్తే నా దేశానికి గొప్ప విజయమవుతుంది. ఈ టోర్నీ ద్వారా నాకు వచ్చే ప్రైజ్మనీతో కష్టాలు తీరిపోనున్నాయి' అని మాయ చావ్లిన్స్కా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు తన ప్రొఫెషనల్ కెరీర్ మొత్తం కలిపి చావ్లిన్స్కా సుమారు 864,000 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8.22 కోట్లు) సంపాదించింది. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిస్తే చావ్లిన్స్కా సుమారు మూడు రెట్లు అంటే రూ. 30 కోట్లకు పైగా అందుకోనుంది. అదే రన్నరప్గా నిలిస్తే రూ. 15 కోట్ల 41 లక్షలు తీసుకోనుంది.చేతిపై పచ్చబొట్టుఇక మాయ చావ్లిన్స్కా ఎడమచేతిపై 'ఫ్రీ' అనే అక్షరం పచ్చబొట్టుగా పొడిపించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ పచ్చబొట్టు వెనుక ఉన్న కారణాన్ని చెప్పడానికి చావ్లిన్స్కా ఇష్టపడలేదు. కానీ ఆమె చేతిపై ఉన్న ఫ్రీ అనే టాటూ పదం ఇవాళ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేర్చిందని అభిమానులు విశ్వసిస్తున్నారు.Jazda Maja 🇵🇱#RolandGarros pic.twitter.com/9daStziM7E— Roland-Garros (@rolandgarros) June 4, 2026What a way to qualify for your first Grand Slam final 🤩 #RolandGarros pic.twitter.com/QsZMwVWOGL— Roland-Garros (@rolandgarros) June 4, 2026చదవండి: అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్! -
ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా?
ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచకప్-2026 మరో వారం రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. భారత్లో క్రికెట్కు ఎంత ఆదరణ ఉంటుందో.. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోప్, అమెరికా, లాటిన్ దేశాల్లో ఫుట్బాల్ను విపరీతంగా ఆదరిస్తుంటారు.అందుకే ఫిఫా ప్రపంచకప్కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుండగా.. గతంలో ఫిఫా విజేతలుగా నిలిచిన ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, ఇంగ్లండ్, స్పెయిన్లు మరోసారి ఫిఫా కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, ప్రతీసారి ఫెవరెట్గా బరిలోకి దిగినప్పటికీ అంచనాలు అందుకోవడంలో విఫలమవుతూ వస్తోన్న పోర్చుగల్ ఈసారి కూడా టాప్ కంటెండర్గా పోటీలో ఉంది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్లో 48 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 108 మ్యాచ్లు జరగనున్న టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. విజేతగా నిలిచే జట్టుకు అందించే ట్రోఫీ విలువను సరిగ్గా అంచనా వేయలేము. అయితే ఇందులో ఉపయోగించే మెటల్స్ ఆధారంగా లెక్కిస్తే ప్రస్తుతం దీని విలువ సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 2,380 కోట్ల పైమాటే.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, ట్రోఫీ తయారీలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్యం కారణంగా దీని విలువ మరింత పెరిగింది. అయితే వాస్తవానికి ఈ ట్రోఫీ విలువ దాని తయారీ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవేళ ఈ ట్రోఫీని నేడు వేలానికి ఉంచితే దీని ధర 20 మిలియన్ డాలర్లకు పైగా పలికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత కరెన్సీలో ఇది రూ.170 కోట్లతో సమానం. అయితే గెలిచిన జట్టుకు అందించే ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ దేనితో తయారు చేస్తారు, ఎన్ని క్యారెట్ల బంగారాన్ని వాడుతారు? జట్టుకు అందించే ట్రోఫీ నిజమైనదా లేదా రెప్లికా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.18 క్యారెట్ల బంగారం..ఫిఫా ట్రోపీ 37 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసే ట్రోపీ ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది. ట్రోఫీ డిజైన్ లో ఇద్దరు వ్యక్తులు భూమిని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే క్రీడ అనే సందేశాన్ని ఈ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. అయితే చాలామంది అనుకునేలా ఈ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారై ఉండదు. ట్రోఫీ లోపలి భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా బంగారంతో తయారు చేస్తే అది చాలా బరువుగా మారి ఆటగాళ్లు ఎత్తడం కష్టమవుతుంది. ట్రోఫీ అడుగు భాగంలో రెండు పొరల మలకైట్ అనే ఆకుపచ్చ రంగు ఖనిజాన్ని ఉపయోగించారు.బ్రెజిల్ ఖాతాలో పాతట్రోఫీ..ఈ ట్రోఫీని ఇటలీకి చెందిన శిల్పి సిల్వియో గజ్జనిగా రూపొందించారు. 1970లో ఫిఫా నిర్వహించిన అంతర్జాతీయ డిజైన్ పోటీలో ఆయన రూపకల్పన ఎంపికైంది. అంతకుముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంతో శాశ్వతంగా ఆ దేశానికి అప్పగించారు. దీంతో కొత్త ట్రోఫీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా 1974లో పశ్చిమ జర్మనీ గెలుచుకుంది.విజేతలకు ఇచ్చేది నకిలీదేఫిఫా ప్రపంచకప్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫైనల్ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. ఫైనల్ ముగిసిన వెంటనే అసలు ట్రోఫీని ఫిఫా స్విట్జర్లాండ్లోని తమ ప్రధాన కార్యాలయం జ్యూరిచ్కు తిరిగి తీసుకెళ్తుంది. దాని బదులుగా విజేత దేశానికి బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసిన ప్రత్యేక రిప్లికా ట్రోఫీని అందజేస్తారు. దీంతో అసలు ట్రోఫీ ఎప్పటికీ ఫిఫా ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత విలువైన గుర్తింపుగా నిలిచిన ఈ ట్రోఫీపై ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచ దేశాలు కన్నేస్తుంటాయి.చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్లీడర్స్తో క్రికెటర్ల బంధం! -
భారత్ వర్సెస్ పాకిస్తాన్
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు శుక్రవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ‘ఢీ’కొంటుంది. సెమీఫైనల్లో స్థానం కోసం ఈ రెండు జట్లు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాయి. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత జట్టు తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు జట్లున్న పూల్ ‘బి’లో పాకిస్తాన్ ఆరు పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. జపాన్ వేదికగా తొలుత కజకిస్తాన్పై 13-0తో ఏక పక్ష విజయం సాధించిన భారత్.. ఆతిథ్య జట్టు చేతిలో 4-2 తేడాతో ఓడిపోయింది. అనంతరం కొరియాతో మ్యాచ్లో తిరిగి పుంజుకున్న భారత జట్టు.. 4-1 తేడాతో గెలిచింది. ఆ తర్వాత చైనీస్ తైపీపై 13-1 తేడాతో గెలుపొందింది.మరోవైపు.. భారత మహిళా హాకీ యువ జట్టు సైతం సెమీస్కు చేరుకుంది. తొలుత మలేషియాపై 2-1తో గెలిచిన భారత్.. కొరియాపై 3-1, సింగపూర్పై 25-0తో జయభేరి మోగించింది. సెమీ ఫైనల్లో భాగంగా భారత మహిళల జట్టు శుక్రవారం చైనాతో తలపడనుంది. -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్లో పెద్ది రాంచరణ్లా.. రియల్ లైఫ్లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్తో క్రీడారంగంలో హాట్ టాపిక్గా మారాడు. తాజాగా.. రోమ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్మన్గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్లోనూ అతను అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్లో కొత్త స్టార్గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మెస్సీ మాయ చేసేనా!
చివరిసారి అమెరికా ఆతిథ్యమిచ్చిన 1994 ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీ అర్జెంటీనా జట్టుకు చేదు అనుభవాలే మిగిల్చింది. దిగ్గజ ప్లేయర్ డీగో మారడోనా డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో అతనిపై అనర్హత వేటు పడింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లో అర్జెంటీనా 4–0తో గ్రీస్పై, 2–1తో నైజీరియాపై గెలిచింది. ఆ తర్వాత మారడోనా డోపింగ్లో దొరికిపోవడంతో నిర్వాహకులు అతనిపై వేటు వేశారు. మారడోనా లేకుండానే బల్గేరియాతో మూడో లీగ్ మ్యాచ్ ఆడిన అర్జెంటీనా 0–2తో ఓడిపోయింది. మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లలో ఒకటిగా అర్జెంటీనా ముందంజ వేయగలిగింది. అయితే మారడోనా లేని అర్జెంటీనా ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయింది. రొమేనియా జట్టుతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ తర్వాత మారడోనా కెరీర్ కూడా ముగిసింది. 32 ఏళ్ల అనంతరం మరోసారి ప్రపంచకప్ టోర్నీకి అమెరికా ఆతిథ్యమివ్వనుంది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టును టైటిల్ ఫేవరెట్స్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 39 ఏళ్ల మెస్సీ ఈ ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పడం లాంఛనమే. తన చివరి ప్రపంచకప్ను చిరస్మరణీయం చేసుకోవాలని మెస్సీ కూడా భావిస్తున్నాడు. సహచరులు కూడా మెస్సీకి ప్రపంచకప్ టైటిల్ను బహుమతిగా ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్జెంటీనా మరోసారి తమ అత్యుత్తమ ఆటతీరు కనబరిచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమెరికాలోని మేజర్ లీగ్లో మెస్సీ ఇంటర్ మయామి జట్టు తరఫున ప్రొఫెషనల్ లీగ్ ఆడుతున్నాడు. కన్సాస్ సిటీలో ఏర్పాటు చేసిన మయామి జట్టు శిబిరంలో మెస్సీ సాధన చేస్తున్నాడు. అగ్రస్థానంతో... డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వాలిఫయింగ్లో నిలకడగా రాణించి ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్లో అర్జెంటీనా 18 మ్యాచ్లు ఆడి 12 విజయాలు అందుకుంది. నాలుగు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయి 38 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడబోతున్న మెస్సీ ఈసారి కూడా అర్జెంటీనాను విజేతగా నిలబెడితే చరిత్ర పుటల్లో చోటు సంపాదిస్తాడు. వరుసగా రెండు ప్రపంచకప్లు అందించిన ఏకైక కెపె్టన్గా మెస్సీ గుర్తింపు పొందుతాడు. అంతేకాకుండా ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్లు గెలిచిన మూడో జట్టుగా అర్జెంటీనా నిలుస్తుంది. మరో నాలుగు గోల్స్ చేస్తే... 2022 ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 26 మంది ప్లేయర్లలో 17 మంది 2026 ప్రపంచకప్లోనూ ఆడుతున్నారు. ఇప్పటికే అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్లు (26) ఆడిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పిన మెస్సీ మరో నాలుగు గోల్స్ చేస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ; 16 గోల్స్) పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొడతాడు. – సాక్షి క్రీడా విభాగంలీగ్ దశ తర్వాత పరీక్ష తాజా ప్రపంచకప్లో అర్జెంటీనాకు లీగ్ దశలో అనుకూలమైన ‘డ్రా’ పడింది. అయితే నాకౌట్ దశ నుంచి అర్జెంటీనాకు ప్రతి మ్యాచ్ పరీక్షలా నిలువనుంది. గ్రూప్ ‘జె’లో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను జూన్ 16న అల్జీరియాతో, 22న రెండో మ్యాచ్ను ఆ్రస్టియాతో, 27న మూడో మ్యాచ్ను జోర్డాన్తో ఆడుతుంది. అర్జెంటీనా ఫామ్ దృష్ట్యా ఆ జట్టు మూడు మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్ ‘టాపర్’గా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమేమీకాదు. ఇక నాకౌట్ దశలో గ్రూప్ ‘హెచ్’ రన్నరప్ జట్టుతో అర్జెంటీనా ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘హెచ్’ నుంచి స్పెయిన్, ఉరుగ్వే జట్లు నాకౌట్ దశకు చేరుకోవచ్చు. అర్జెంటీనా ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా అమెరికా లేదా ఈజిప్ట్ ఉండవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే.. క్వార్టర్ ఫైనల్లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు అర్జెంటీనాకు ఎదురవుతుంది. -
టైటిల్ పోరుకు ఆండ్రీవా, చావ్లిన్స్కా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), క్వాలిఫయర్ మాయ చావ్లిన్స్కా (పోలాండ్) టైటిల్ పోరుకు దూసుకొచ్చారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో ఆండ్రీవా 76 నిమిషాల్లో 6–1, 6–3తో 15వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)ను ఓడించగా... ప్రపంచ 114వ ర్యాంకర్ చావ్లిన్స్కా 2 గంటల 10 నిమిషాల్లో 7–6 (7/4), 6–4తో ప్రపంచ 23వ ర్యాంకర్ డియానా ష్నైడర్ (రష్యా)పై గెలుపొందింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆండ్రీవా, చావ్లిన్స్కాలకిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ష్నైడర్ను ఓడించిన క్రమంలో చావ్లిన్స్కా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ చరిత్రలో ఫైనల్కు చేరిన తొలి క్వాలిఫయర్గా గుర్తింపు పొందింది. గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో ఓవరాల్గా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా చావ్లిన్స్కా నిలిచింది. 2021 యూఎస్ ఓపెన్లో బ్రిటన్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించి సంచలనం సృష్టించింది. శనివారం జరిగే ఫైనల్లో చావ్లిన్స్కా విజేతగా నిలిస్తే రాడుకాను సరసన చేరుతుంది. క్లే కోర్టు సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోని కొస్టుక్తో జరిగిన సెమీఫైనల్లో ఆండ్రీవా పూర్తి ఆధిపత్యం చలాయించింది. ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఆండ్రీవా 14 విన్నర్స్ కొట్టింది. మరోవైపు కొస్టుక్ 34 అనవసర తప్పిదాలు చేసింది. ష్నైడర్తో జరిగిన మ్యాచ్లో చావ్లిన్స్కా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేయడంతోపాటు 32 విన్నర్స్ కొట్టింది. ష్నైడర్ 33 అనవసర తప్పిదాలు చేసింది. -
సింధు పదో‘సారీ’
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ పదో ర్యాంకర్, భారత స్టార్ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 44 నిమిషాల్లో 17–21, 15–21తో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆన్ సె యంగ్ చేతిలో సింధుకిది వరుసగా 10వ పరాజయం కావడం గమనార్హం. 2019 డెన్మార్క్ ఓపెన్లో తొలిసారి ఆన్ సె యంగ్తో ఆడిన సింధు ఇప్పటి వరకు ఈ కొరియా క్రీడాకారిణిని ఒక్కసారి కూడా ఓడించలేదు. అంతేకాకుండా ఆన్ సె యంగ్పై సింధు 10 మ్యాచ్ల్లో ఒక్క గేమ్ మాత్రమే గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆయుశ్ శెట్టి (భారత్) 21–16, 13–21, 14–21తో లీ చెయుక్ వైయువి (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 12–21తో థోమ్ గికెల్–డెల్ఫైన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ విభాగంలో హరిహరన్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ జంట 16–21, 21–15, 21–19తో ఆరోన్ టాయ్–కాంగ్ ఖాయ్ జింగ్ (మలేసియా) జోడీపై గెలిచింది. -
ఒకవైపు యుద్ధం... మరోవైపు సాకర్ సమరం
అంటాల్యా (టర్కీ): ఒకవైపు దేశంలో యుద్ధంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నా... ఇరాన్ జట్టు మాత్రం ‘ఫిఫా’ ప్రపంచకప్ బరిలోకి దిగి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్కప్లో ఇరాన్ జట్టు గ్రూప్ ‘జి’ నుంచి పోటీ పడనుంది. ఈ నెల 16న తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనున్న ఇరాన్... ఆ తర్వాత 22న బెల్జియం, 27న ఈజిప్్టతో మ్యాచ్లు ఆడనుంది. ప్రస్తుతం మెగాటోర్నీ కోసం టర్కీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఇరాన్ ప్లేయర్లు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై ప్లేయర్లు స్పందిస్తూ... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచకప్ ఆడటం అంత సులువైన విషయం కాదని అన్నారు. 2018, 2022 ప్రపంచకప్లలో ఇరాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిడ్ఫీల్డర్ సయీద్ ఎజటొలాహి మాట్లాడుతూ... ‘ఇది నాకు మూడో ప్రపంచకప్. అంతర్జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ ఇది చాలా కష్టంగా ఉంది.ఒకవైపు ప్రాక్టీస్పై దృష్టి పెడుతూనే... మరోవైపు దేశ పరిస్థితులు తెలుసుకుంటున్నాం. అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. సహజంగానే ఇలాంటి అంశాలు ప్లేయర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి’ అని అన్నాడు. వరల్డ్కప్లో ఇరాన్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే... వారు ఇక్కడి వరకు రావడానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది వాస్తవం. గత రెండు వారాలుగు పలువురు ఇరాన్ ప్లేయర్లు టర్కీలోని అంటల్యాలో సాధన చేయగా... మరికొందరు వీసా దరఖాస్తుల పనిలో నిమగ్నమయ్యారు. ఇరాన్ జట్టు ప్రపంచకప్ సన్నాహాలకు సంబంధించి మీడియా ప్రవేశంపై కూడా పరిమితులు విధించారు. దీంతో వారికి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. అంకారాలోని మెక్సికన్ రాయబార కార్యాలయం నుంచి వీసాలు లభించిన అనంతరం... ఇరాన్ జట్టు ఈ వారాంతంలో మెక్సికోకు బయలుదేరనుంది. ప్లేయర్లందరికీ ప్రవేశ అనుమతులు లభించినట్లు ఇరాన్ జట్టు గురువారం వెల్లడించింది. వీసా సమస్యల కారణంగా ఇరాన్ వరల్డ్కప్ శిక్షణ శిబిరాన్ని అరిజోనాలోని టక్సన్ నుంచి కాలిఫోర్నియా మెక్సికో సరిహద్దులో ఉన్న టిజువానాకు మార్చారు. ఇరాన్ తొలి రెండు మ్యాచ్లను లాస్ ఏంజెలిస్లో ఆడనుంది. ఆ ప్రాంతంలో ఇరానీయుల జనాభా అధికం. ‘మా ఆట చూసేందుకు పెద్ద ఎత్తను మా దేశ ప్రజలు వస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి తరుణంలో మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు మా శాయశక్తులు కృషి చేస్తాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికైనా మేం సిద్ధంగా ఉన్నామని నిరూపిస్తాం’ అని ఇరాన్ ప్లేయర్ మహమ్మద్ గుర్బానీ తెలిపాడు. ‘పరిస్థితులు అనుకూలంగా లేవు అని అందరికీ తెలుసు. అయినా ఓ ఆటగాడిగా ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో సత్తాచాటడం ముఖ్యం అందుకే సాధనపై దృష్టి పెట్టా. మా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లకు మా ఆటతో, మా ప్రదర్శనతో మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. వారి మొఖాలపై చిరునవ్వులు చూడాలి’ అని మరో ప్లేయర్ పేర్కొన్నాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్పది ఏముంటుంది. ప్రస్తుతం మా కర్తవ్యం అదే. మెగాటోర్నీలో మంచి ప్రదర్శన చేసి ప్రజలకు ఆనందాన్ని పంచుతాం’ అని ప్లేయర్లంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. -
వరల్డ్ నంబర్వన్ జైస్మీన్
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో భారత మహిళా బాక్సర్ జైస్మీన్ లంబోరియా అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 57 కేజీల విభాగంలో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని జైస్మీన్ నంబర్వన్గా నిలిచింది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కూడా అయిన ఆమె ఇటీవల ఆసియా చాంపియన్షి ప్లో రజతం గెలుచుకుంది. మహిళల విభాగంలో 9 వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో టాప్–10లో భారత బాక్సర్లు ఉండటం విశేషం. 48 కేజీల విభాగంలో మీనాక్షి తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకోగా, 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్కు చేరింది. ఆసియా చాంపియన్షి ప్ స్వర్ణం సాధించిన ప్రియ ఘంఘాస్ (60 కేజీలు) మూడో స్థానంలో నిలిచింది. వరల్డ్ కప్లో పతకాలు గెలిచిన అరుంధతి (70 కేజీలు), పూజ రాణి (80 కేజీలు), నుపుర్ (80+ కేజీలు) తమ కేటగిరీల్లో రెండో ర్యాంకుల్లో నిలిచారు. నాలుగో స్థానంలో నిఖత్ రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) నాలుగో స్థానానికి పడిపోగా, ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) తన 7వ స్థానాన్ని నిలబెట్టుకుంది. పురుషుల విభాగంలో ఆసియా చాంపియన్షి ప్ స్వర్ణపతక విజేత విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు) మూడో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ సివాచ్ (60 కేజీలు), నరేందర్ బెర్వాల్ (90+ కేజీలు) టాప్–5లోకి చేరుకున్నారు. హితేశ్ గులియా (70 కేజీలు) 6వ ర్యాంక్లో, అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) 8వ ర్యాంక్లో ఉన్నారు. ఆకాశ్ (75 కేజీలు), లోకేశ్ (85 కేజీలు) కూడా తొలిసారి టాప్–10లోకి అడుగు పెట్టి 8వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా టీమ్ ర్యాంకింగ్స్లో భారత మహిళలల జట్టు 2వ ర్యాంక్లో, పురుషుల జట్టు 4వ ర్యాంక్లో ఉన్నాయి. -
తొలి ప్రపంచ ‘యోగాసన’ చాంపియన్షిప్ షురూ
అహ్మదాబాద్: సమీప భవిష్యత్తులో ‘యోగాసన’ ప్రపంచ పోటీ క్రీడగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు దేశంలో తొలి ప్రపంచ ‘యోగాసన’ చాంపియన్షిప్ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం ఈ చాంపియన్షిప్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ‘సుదీర్ఘ కాలంగా వస్తున్న ప్రతీ సంప్రదాయం కాలంతో పాటు కొత్త దశలోకి మారుతుంది. ఈ ‘యోగాసన’ క్రీడల ప్రపంచ చాంపియన్షిప్ అటువంటి దశకు నాంది. దీని ద్వారా ‘యోగాసన’ ఒక పోటీ క్రీడగా గుర్తింపు పొందుతుంది. భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో ‘యోగాసన’ చేరుతుందనే నమ్మకముంది’ అని అన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్లో ఈ చాంపియన్షిప్ను నిర్వహించడం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. ఈ నెల 21 జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ప్రధాని వెల్లడించారు. యోగాతో వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని మోదీ పునరుద్ఘాటించారు. పదేళ్ల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన భారత ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ‘ఆ సమయంలో ప్రపంచంలోని 190 దేశాలు భారత ప్రతిపాదననకు మద్దతు ఇచ్చాయి. నేడు కోట్లాది మంది ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకున్నారు. ధ్యానం, ప్రాణయామం వారి జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు అహ్లాదం సొంతం అవుతుంది. యోగాసన క్రీడలు విస్తరిస్తున్న కొద్ది ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. క్రీడాకారులతో పాటు యోగా శిక్షకులు, పరిశోధకులు, ఈవెంట్ నిర్వాహకులు ఇలా చాలా మందికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి’ అని మోదీ గుర్తుచేశారు. ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. -
‘ఫిఫా’ వరల్డ్కప్ సరి‘కొత్త’గా...
విశ్వవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న ఫుట్బాల్ ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్కప్ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పలు విప్లవాత్మక మార్పులు చేసేందుకు ‘ఫిఫా’ సిద్ధమైంది. అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు (ఐఎప్ఏబీ)తో కలిసి మెరుగైన నిబంధనలను రూపొందించింది. గతంలో మాదిరిగా ప్లేయర్లు సమయాన్ని వృథా చేయడానికి వీలు లేకుండా... ఆటలో మరింత పోటీతత్వం పెంచేందుకు ఈ నిబంధనలు ఉపకరించనున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం... – సాక్షి, క్రీడావిభాగం » బంతి మైదానం వెలుపలికి వెళ్తే... దాన్ని తిరిగి 5 సెకన్ల లోపు గ్రౌండ్లోకి తేవాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే... దానికి బదులుగా ప్రత్యర్థి జట్టుకు ‘త్రో ఇన్’ అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఆటగాళ్లు తమ ప్లేయర్లు ఎక్కడ ఉన్నారో చూసుకొని బంతిని త్రో చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. » ‘గోల్ కిక్’ల సమయాన్ని కూడా 5 సెకన్లకు పరిమితం చేశారు. కావాలని సమయాన్ని వృథా చేస్తే ప్రత్యర్థి జట్టుకు కార్నర్ కిక్ లభిస్తుంది. » ఎవరైనా ఆటగాడు సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాలంటే డిజిటల్ డిస్ప్లేపై ప్రదర్శించిన 10 సెకన్లలోపు ఒక ప్లేయర్ మైదానాన్ని వీడి అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడు రావాలి. సమయాన్ని పాటించని జట్టు ఒక నిమిషం పాటు 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి ఉంటుంది. » ప్లేయర్లు చికిత్స నిమిత్తం మైదానాన్ని వీడితే... తిరిగి గ్రౌండ్లోకి రావడానికి ముందు ఒక నిమిషం పాటు బయటే ఉండాలి. తీవ్రమైన గాయాల విషయంలో ఇందులో సడలింపులు ఇవ్వనున్నారు. » మైదానంలో ప్లేయర్లు తమ నోటిని చేత్తో మూయడం గానీ అడ్డంగా ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం గానీ చేయరాదు. ఇది కేవలం వరల్డ్కప్లో మాత్రమే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యాచ్లలో అమలు చేయనున్నారు. జాత్యహంకారాన్ని అరికట్టేందుకు ‘ఫిఫా’ ఈ నిబంధన తీసుకొచ్చింది. దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా ‘రెడ్ కార్డ్’ చూపిస్తారు. » మ్యాచ్కు రెండు చొప్పున ‘హైడ్రేషన్’ విరామాలు లభించనున్నాయి. 3 నిమిషాల ఈ బ్రేక్స్ను ఆట ఆరంభమైన 20 నిమిషాల తర్వాత తీసుకోవచ్చు. -
ప్రిక్వార్టర్స్లో ఆయుశ్
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి శుభారంభం చేయగా... గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ టోర్నీ నుంచి తప్పుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుశ్ 8–21, 22–20, 21–15తో ప్రపంచ 15వ ర్యాంకర్ హాంగ్ యాంగ్ వెంగ్ (చైనా)పై గెలుపొందాడు. మలేసియా జంటతో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ జోడీ 6–11తో ఉన్న దశలో... ఆంధ్ర షట్లర్ సాత్విక్ గాయపడ్డాడు. దీంతో ఈ ద్వయం పోటీ నుంచి తప్పుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 17–21, 21–16, 19–21తో ఎన్గ్యూయెన్ (ఐర్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా 15–21, 14–21తో ప్రపంచ మాజీ నంబర్వన్ నవోమి ఒకుహరా (జపాన్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జోడీ ప్రిక్వార్టర్స్కు చేరింది. తొలి రౌండ్లో రుత్విక–రోహన్ జంట 21–14, 21–14తో హు లింగ్ ఫాంగ్–యాంగ్ పో సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది. -
వరల్డ్ నంబర్వన్ సబలెంకా నిష్క్రమణ
పారిస్: తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలని ఆశించిన వరల్డ్ నంబర్వన్ అరైనా సబలెంకా (బెలారస్)కు షాక్ తగిలింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గత ఏడాది రన్నరప్, టాప్ సీడ్ సబలెంకాపై 25వ సీడ్ డియానా ష్నైడర్ సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2 గంటల 12 నిమిషాల పాటు సాగిన పోరులో 22 ఏళ్ల ష్నైడర్ 3–6, 7–5, 6–0తో గత ఏడాది రన్నరప్ను చిత్తు చేసి తన కెరీర్లో అత్యుత్తమ విజయాన్ని అందుకుంది. ఒక గ్రాండ్స్లామ్ టోర్నీలో ష్నైడర్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్లు గెలిచిన సబలెంకా ఈ పోరులో కూడా ఒక దశలో గెలుపు దిశగా సాగింది. తొలి సెట్ గెలిచిన తర్వాత రెండో సెట్లో 4–1తో ఆధిక్యంలో నిలిచి, ఆపై 5–4 (30–15)తో విజయానికి చేరువైన ఆమె ఒక్కసారిగా ఆటపై పట్టు కోల్పోయింది. చివరి 13 గేమ్లలో 12 గెలిచిన ష్నైడర్ విజయనాదం చేసింది. ఏకంగా 57 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో సబలెంకా చేజేతులా మ్యాచ్ను కోల్పోయింది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మాజా ష్వాలిస్కా (పోలండ్) 7–6 (7/3), 6–3 స్కోరుతో అనా కలిస్కయా (రష్యా)పై నెగ్గి సెమీస్లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. బాలాజీ–డిమోలైనర్ (బ్రెజిల్) జంట 3–6, 4–6 స్కోరుతో రెండో సీడ్ ద్వయం హ్యారీ హీలియోవరా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) చేతిలో పరాజయంపాలైంది. -
అబ్బాయిలు 13–1తో... అమ్మాయిలు 25–0తో...
కాకమిగహర (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగంలో భారత జట్లు సత్తా చాటి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల మ్యాచ్లో భారత్ 13–1 తేడాతో చైనీస్ తైపీపై ఘన విజయం సాధించింది. భారత్ తరఫున ఆశిష్ పుర్తి (27వ నిమిషం, 35, 42) మూడు గోల్స్ సాధించగా... రాహుల్ యాదవ్ (20, 54), సిద్ధార్త్ బెన్ (30, 52), గాజీ ఖాన్ (40, 44) తలా 2 గోల్స్ నమోదు చేశారు. కరణ్ గౌతమ్ (7), ప్రేమ్చంద్ (11), కేతన్ కుశ్వాహ (13), వరీందర్ సింగ్ (50) ఒక్కో గోల్ కొట్టారు. తైపీ తరఫున యోంగ్ యున్ జాంగ్ (30) ఏకైక గోల్ సాధించాడు. మహిళల పోరులో భారత్ 25–0తో సింగపూర్ను చిత్తు చేసింది. భారత ప్లేయర్లలో నౌషీన్ నాజ్ (8వ నిమిషం, 13, 17, 18, 40, 52, 58) ఏకంగా 7 గోల్స్ కొట్టగా...గీతశ్రీ (13, 28, 47, 48, 60) 5 గోల్స్ సాధించింది. -
వరల్డ్ నంబర్వన్ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!
భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ 2026లో మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను క్లాసికల్ చెస్లో వరుసగా రెండోసారి ఓడించి చావుదెబ్బ కొట్టాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజ్ఞానందకు కార్ల్సన్పై తాజా విజయం ఆ ప్రయత్నాలకు ఊతమిచ్చినట్లయింది. అంతేకాదు నార్వే చెస్ టోర్నీలో కార్ల్సన్ను అతడి సొంతగడ్డపైనే రెండుసార్లు మట్టికరిపించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది క్లాసికల్ చెస్ గేమ్స్లో ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్ను రెండుసార్లు ఓడించిన తొలి ఆటగాడు కూడా ప్రజ్ఞానందనే కావడం విశేషం. మంగళవారం రాత్రి జరిగిన ఎనిమిదో రౌండ్లో ప్రజ్ఞానంద నల్లపావులతో బరిలోకి దిగాడు. కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్ను సొంతం చేసుకోవాలనుకున్న కార్ల్సన్ ఆశలకు ప్రజ్ఞానంద గండికొట్టినట్లయింది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తి కావడం, మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలిఉండడంతో కార్ల్సన్ టైటిల్ను నిలబెట్టుకోవడం కష్టమే. గేమ్లో ప్రజ్ఞానంద విజయం ఖాయమైన తర్వాత కార్ల్సన్ మొహం మాడిపోయింది. ఓటమి బాధలో కనీసం ప్రజ్ఞానందకు అభినందనలు కూడా తెలియజేయకుండా అక్కడి నుంచి నిరాశతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టాండింగ్స్ విషయానికొస్తే.. అమెరికా గ్రాండ్మాస్టర్ వెస్లీ సో తన రన్ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కైమర్ను టై-బ్రేక్లో ఓడించి 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఓటమితో 8 పాయింట్లు మాత్రమే కలిగిన అతడు క్లాసికల్ చెస్ టోర్నీ టైటిల్ సాధించే అవకాశం కోల్పోయాడు. మిగిలిన రెండు గేములు గెలిచినా గుకేశ్ 14 పాయింట్ల వద్దే ఆగిపోనున్నాడు.Check out the incredible final moments of Praggnanandhaa taking down World no.1 Magnus Carlsen with the Black pieces in Round 8 of Norway Chess 2026!With this win, Pragg becomes the first Indian (and possibly in the world) player who defeated Magnus Carlsen in Classical Chess… pic.twitter.com/MFvJPdBHel— ChessBase India (@ChessbaseIndia) June 2, 2026చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్లీడర్స్తో క్రికెటర్ల బంధం! -
‘కిక్’ఎక్కించే సమరం
వేసవిలో వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఇక వర్షాకాలంలో ‘కిక్’ ఎక్కించేందుకు మరో క్రీడా సమరం ముస్తాబైంది. విశ్వవ్యాప్త క్రీడాభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీ వచ్చేస్తోంది. మరో ఎనిమిది రోజుల్లో ఈ మెగా ఈవెంట్కు తెర లేవనుంది. క్వాలిఫయింగ్లో 200కు పైగా దేశాలు పోటీపడితే... చివరకు 45 దేశాలు తమ అత్యుత్తమ ఆటతీరుతో ప్రపంచకప్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు నేరుగా అర్హత పొందాయి. ఓవరాల్గా 48 దేశాలు 39 రోజులపాటు విశ్వకిరీటం కోసం పోరాడనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్తో ప్రపంచకప్ మొదలవుతుంది. జూలై 19న న్యూయార్క్ స్టేడియంలో జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. – సాక్షి క్రీడా విభాగంసూపర్ స్టార్ మెస్సీ సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందా? క్రిస్టియానో రొనాల్డోకు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ను పోర్చుగల్ అందిస్తుందా? నెమార్ తన మ్యాజిక్తో బ్రెజిల్కు పూర్వ వైభవం లభిస్తుందా? ఐదోసారి ప్రపంచకప్ను ముద్దాడి బ్రెజిల్ సరసన జర్మనీ నిలుస్తుందా? బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లండ్, స్పెయిన్ కాకుండా కొత్త చాంపియన్ను ఈసారైనా చూస్తామా? వీటన్నింటికీ సమాధానం జూలై 19వ తేదీన లభిస్తుంది. తొలిసారి మూడు దేశాల్లో... ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగింది. 1930లో ఉరుగ్వే తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లలో ప్రపంచకప్ను నిర్వహించలేదు. 1998 వరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలకు ఒక దేశం వేదికగా జరిగాయి. 2002లో తొలిసారి దక్షిణ కొరియా–జపాన్ దేశాలు సంయుక్తంగా ప్రపంచకప్ను నిర్వహించాయి. 2026 ప్రపంచకప్ టోర్నీకి మొదటిసారి (అమెరికా, మెక్సికో, కెనడా) మూడు దేశాలు కలిసి ఆతిథ్యమిస్తున్నాయి. 2030 ప్రపంచకప్ కూడా మూడు దేశాల్లో (మొరాకో, పోర్చుగల్, స్పెయిన్) జరగనుంది. ఇక 2034 ప్రపంచకప్ టోర్నీ ఆతిథ్య హక్కులు సౌదీ అరేబియాకు లభించాయి. మెక్సికో మూడోసారి... ప్రపంచకప్ను అత్యధికంగా మూడుసార్లు నిర్వహించిన దేశంగా మెక్సికో రికార్డు నెలకొల్పనుంది. గతంలో మెక్సికోలో 1970, 1986 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. బ్రెజిల్ (1950, 2014), ఫ్రాన్స్ (1938, 1998), జర్మనీ (1974, 2006), ఇటలీ (1934, 1990) రెండుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్ను నిర్వహించగా... తాజాగా ఈ జాబితాలో అమెరికా (1996, 2026) కూడా చేరనుంది. బ్రెజిల్ మాత్రమే... ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రపంచకప్లోనూ ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. 2026 ప్రపంచకప్తో కలిపి బ్రెజిల్ వరుసగా 23వసారి ఈ మెగా ఈవెంట్లో ఆడనుంది. రెండో స్థానంలో జర్మనీ (21 సార్లు), మూడో స్థానంలో అర్జెంటీనా (19 సార్లు), నాలుగో స్థానంలో ఇటలీ, మెక్సికో (18 సార్లు చొప్పున), ఐదో స్థానంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ (17 సార్లు చొప్పున), ఆరో స్థానంలో బెల్జియం, ఉరుగ్వే (15 సార్లు చొప్పున) ఉన్నాయి. 48 జట్లతో... మొదటి ప్రపంచకప్లో 13 దేశాలు పాల్గొన్నాయి. 1978 వరకు 16 జట్లతో నిర్వహించారు. 1982 నుంచి 1994 ప్రపంచకప్లను 24 జట్లకు అవకాశం ఇచ్చారు. 1998 నుంచి 2022 వరకు 32 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడ్డాయి. తాజా ప్రపంచకప్లో ఏకంగా 48 జట్లు బరిలో ఉండనున్నాయి. 39 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్లు జరుగుతాయి. అమెరికా అత్యధికంగా 78 మ్యాచ్లకు ఆతిథ్యమిస్తుంది. మెక్సికో, కెనడా దేశాల్లో 13 మ్యాచ్ల చొప్పున జరుగుతాయి. మ్యాచ్లు అమెరికాలోని 11 నగరాల్లో, మెక్సికోలోని 3 నగరాల్లో, కెనడాలోని 2 నగరాల్లో జరుగుతాయి. నాకౌట్ దశకు 32 జట్లు జట్ల సంఖ్య పెరగడంతో ఈసారి ఫార్మాట్ కూడా మారింది. మొత్తం 48 జట్లను 12 గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ ముగిశాక 12 గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది ఉత్తమ జట్లు నాకౌట్ దశకు (32 జట్లు) అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ప్రిక్వార్టర్ ఫైనల్స్ (16 జట్లు), క్వార్టర్ ఫైనల్స్ (8 జట్లు), సెమీఫైనల్స్ (4 జట్లు), ఫైనల్ (2 జట్లు) జరుగుతాయి. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్కు అర్హత పొందడంలో విఫలం కాగా... కెప్ వెర్డె, కురసావ్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్లో అరంగేట్రం చేయనున్నాయి. నిద్ర మానేసి... ప్రపంచకప్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9:30, 10:30 నుంచి; అర్ధరాత్రి గం. 12:30 నుంచి, గం. 1:30 నుంచి; తెల్లవారుజాము గం. 3:30 నుంచి, 4:30 నుంచి; ఉదయం గం. 6:30 నుంచి, గం. 7:30 నుంచి, గం. 9:30 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత్లో అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్లు తిలకించాలంటే రాత్రంతా నిద్ర మానేయాల్సి ఉంటుంది. భారత్లో మ్యాచ్లను ‘జీ’ స్పోర్ట్స్ చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయున్నాయి. -
ఈసారి 7 నెలల ఐఎస్ఎల్ సీజన్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2026–27 సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 11 వరకు సాగనుంది. పరిపాలన సహా పలు కారణాల వల్ల ఈ సీజన్లో మ్యాచ్ల సంఖ్యను తగ్గించారు. డబుల్ రౌండ్ రాబిన్ తరహాకు బదులు లీగ్లోని 14 జట్లు ఇతర జట్లతో ఒక్కోసారి మాత్రమే ఆడటంతో ఈ సీజన్లో 91 మ్యాచ్లే జరిగాయి. అయితే వచ్చే సీజన్లో ఎప్పట్లాగే ఇంటా, బయట పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. దీంతో ఐఎస్ఎల్ సీజన్ 7 నెలలకు పైగా సాగనుంది. ఈ మేరకు అఖిల భాతర ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) మంగళవారం తాత్కాలిక షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఫెడరేషన్ కప్ జరగనుంది. ఐఎస్ఎల్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్... ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్) ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి వచ్చే ఏడాది మార్చి 14 వరకు సాగనుంది. ఇండియన్ వుమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) సెప్టెంబర్ 3 నుంచి జనవరి 24 వరకు నిర్వహించనున్నారు. డ్యురాండ్ కప్ జూలై 11 నుంచి ఆగస్టు 20 వరకు సాగనుండగా... ఇండియన్ వుమెన్స్ లీగ్ 2 (ఐడబ్ల్యూఎల్) జూలై 9 నుంచి ఆగస్టు 22 వరకు జరుగుతుంది. ఇక జాతీయ ఫుట్బాల్ చాంపియన్íÙప్ సంతోష్ ట్రోఫీ నవంబర్ 19 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు నిర్వహించనున్నారు. -
‘పారిస్ పరాజయం పాఠాలు నేర్పింది’
న్యూఢిల్లీ: భారత పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఇటీవల అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. మ్యూనిక్లో జరిగిన ప్రపంచ కప్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం సాధించడంతో పాటు మరో ఈవెంట్లో రజతం కూడా గెలుచుకుంది. అయితే తెలంగాణకు చెందిన 21 ఏళ్ల ఇషా రెండేళ్ల క్రితం జరిగిన పారిస్ ఒలింపిక్స్లో పూర్తిగా విఫలమైంది. ఆ మెగా ఈవెంట్లో ఓటమితో తాను పాఠాలు నేర్చుకున్నానని, అదే కసితో సాధన చేసి మళ్లీ విజయాల బాట పట్టానని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఉదాసీనత వల్లనో లేక అతి విశ్వాసం వల్లనో నేను పారిస్ ఒలింపిక్స్లో ఓడిపోలేదు. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాను. దాని గురించే ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడిని పెంచుకున్నాను. ఆఖరి షాట్ వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒలింపిక్స్ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాను. నాటి పరాజయం నన్ను మానసికంగా దృఢంగా మార్చింది’ అని ఇషా గుర్తు చేసుకుంది. మ్యూనిక్లో 25 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచిన ఇషా, 10 మీటర్ల ఈవెంట్లో రజతం అందుకుంది. ‘ఈసారి ఒత్తిడిని అధిగమించి విజయం సాధించగలిగాను. పదేళ్లుగా ఆడుతున్న అనుభవం నాకు ఉపయోగపడింది. ప్రతీసారి గెలుస్తామని బరిలోకి దిగరాదు. టోర్నీ పేరు, వేదికలు మారవచ్చేమో కానీ మనం ఒకే తరహాలో కష్టపడతాం. అందులో ఎలాంటి మార్పు ఉండదని అర్థం చేసుకోవాలి. మానవమాత్రులం కాబట్టి తప్పులు సహజం. కొన్ని సార్లు మనం అనుకున్న విధంగా జరగదు’ అని ఆమె పేర్కొంది. -
సలీమా సారథ్యంలోనే...
న్యూఢిల్లీ: ఎనిమిది దేశాలు పాల్గొనే నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును మంగళవారం ప్రకటించారు. సలీమా టెటె నాయకత్వంలో పోటీ పడనున్న ఈ జట్టులో కొత్త ప్లేయర్లు లాల్తంత్లువాంగి, శిల్పి దబాస్లకు మరో అవకాశం దక్కింది. ఇటీవల ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో కూడా లాల్తంగ్, శిల్పి జట్టులో భాగంగా ఉన్నా... ఒక్క మ్యాచ్లో కూడా బరిలోకి దిగలేదు. ఆ్రస్టేలియాతో సిరీస్ను 2–2తో సమం చేసుకున్న జట్టును నడిపించిన సలీమా కెప్టెన్గా కొనసాగనుండగా... సీనియర్లు సవిత, బిచ్చు దేవి గోల్కీపర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ‘అనుభవజు్ఞలు, జూనియర్ల ప్లేయర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేశాం. ఇటీవల అర్జెంటీనా, ఆస్ట్రేలియా పర్యటనలతో మన జట్టు ప్రదర్శన మరింత మెరుగైంది. నిలకడగా రాణిస్తున్న టీమ్ నేషన్స్ కప్ సవాల్కు సిద్ధంగా ఉంది’ అని హెడ్ కోచ్ జోయెర్డ్ మరీన్ వ్యాఖ్యానించాడు. నేషన్స్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్తో పాటు జపాన్, అమెరికా, ఉరుగ్వే ఉండగా...గ్రూప్ ‘బి’లో న్యూజిలాండ్, కొరియా, ఫ్రాన్స్, చిలీ బరిలోకి దిగనున్నాయి. జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఈ టోర్నీ జరుగుతుంది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి సీజన్ ప్రొ లీగ్కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు వివరాలు: సవిత, బిచ్చుదేవి (గోల్కీపర్లు); సుశీలా చాను, ఇషిక చౌధరీ, లాల్తంగ్లువాంగి, శిల్పి దబాస్, జ్యోతి, నిక్కీ ప్రధాన్ (డిఫెండర్లు); సలీమా టెటె, నేహ, సునేలిత టొప్పో, సాక్షి రాణా, దీపిక సొరెంగ్, సోనమ్, లాల్రెమ్సియామ్ (మిడ్ఫీల్డర్లు); నవనీత్ కౌర్, దీపిక, రుతుజా పిసాల్, ఇషిక, అన్ను (ఫార్వర్డ్స్). -
ఎదురులేని అతీఖా మీర్
థెసలొనికి (గ్రీస్): కార్ రేసింగ్లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న 11 ఏళ్ల భారత రేసర్ అతీఖా మీర్ మరోసారి సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్ ఆఫ్ ద ఫ్యూచర్’ అకాడమీ ప్రోగ్రామ్ రేసింగ్ రౌండ్ 2లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 12–14 మధ్య వయో విభాగం ఉండే (ఓకే–ఎన్జే) కేటగిరీలో ఆమె అనుభవజ్ఞులైన డ్రైవర్లను దాటి విజేతగా నిలిచింది. ఈ రేసు క్వాలిఫయింగ్, హీట్స్, ఫైనల్స్లో కూడా అతీఖా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ సిరీస్లో మూడు ఈవెంట్లలోనూ గతంలో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలిచారు. ఇప్పుడు అతీఖా అరుదైన జాబితాలో చోటు దక్కించుకుంది. తాజా విజయానంతరం పోడియంపై భారత జాతీయ గీతం వినిపించినప్పుడు ఈ ముంబై అమ్మాయి భావోద్వాగానికి గురైంది. 56.77 సెకన్ల రికార్డు టైమింగ్తో పోల్ పొజిషన్ సాధించిన మీర్...హీట్ 1, 2లలో మొదటినుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించింది. 15 ల్యాప్లో ఫైనల్లో ఎనిమిది ల్యాప్ల తర్వాత 3.9 సెకన్ల తేడాతో ముందంజలో నిలిచిన ఆమె చివరకు 2.6 సెకన్ల తేడాతో నెగ్గింది. 25 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో ఇది 2.6 సెకన్లను చాలా పెద్ద విజయంగా గుర్తించవచ్చు. ఫార్ములా 1 అకాడమీ నుంచి సహకారం పొందుతున్న తొలి భారత రేసర్ అయిన అతీఖా మీర్... మాజీ రేసర్ అయిన ఆసిఫ్ మీర్ వద్దే శిక్షణ పొందుతోంది. -
టెకె టెకెమా నేతృత్వంలో ‘డ్రాగ్ ఫ్లికింగ్’ శిక్షణ
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టును మరింత పటిష్టంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో హెడ్ కోచ్ జోయెర్డ్ మరీన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఇందు కోసం భారత జట్టుతో కలిసి పని చేసేందుకు నెదర్లాండ్స్కు చెందిన దిగ్గజ ఆటగాడు, డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ టెకె టెకెమాను హెడ్ కోచ్ తన బృందంలోకి తీసుకున్నాడు. 242 మ్యాచ్లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన టెకెమా 221 గోల్స్ సాధించాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో రజతం గెలిచిన జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్తో పాటు జూన్ 15 నుంచి జరిగే నేషన్స్ కప్ టోర్నీ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో టెకెమా పాల్గొంటున్నాడు. ఈ క్యాంప్లో భారత డ్రాగ్ఫ్లికర్లు దీపిక, లాల్తంత్లువాంగి, అన్నులకు టెకెమా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు. ‘ఆధునిక హాకీలో పెనాల్టీ కార్నర్ల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెనాల్టీ అవకాశాలను ఎట్టి పరిస్థితిల్లో ఆటగాళ్లు కోల్పోరాదు. ఈ విషయంలో టెకెమా అపార అనుభవం, అతను ఇచ్చే శిక్షణ మన జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. టెకెమాకు నేను కూడా కోచ్గా వ్యవహరించాను కాబట్టి అతని గురించి నాకు బాగా తెలుసు. అందుకే అతడిని ఎంచుకున్నా’ అని మరీన్ వెల్లడించాడు. -
సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది!
ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధూ 25-23, 21-16తో థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ను మట్టికరిపించిది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో సింధూ తన ప్రత్యర్థిపై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. అయితే తొలి గేమ్ హోరాహోరీగా సాగినప్పటికీ, రెండో గేమ్లో మాత్రం సింధూ తనలోని ఆటను బయటికి తీసి సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే రెండో రౌండ్లో సింధూ.. ప్రపంచ నంబర్వన్ యాన్ సే యంగ్ను ఎదుర్కోనుంది. గతవారం సింగపూర్ ఓపెన్లో యాన్ సే చేతిలో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. మరి ఈసారైనా ఆమె గండం దాటి ప్రిక్వార్టర్స్కు చేరుకుంటుందేమో చూడాలి. మిగిలిన మ్యాచ్ల విషయానికొస్తే మాళవిక బన్సోద్ తొలి రౌండ్కే పరిమితమైంది. మాళవిక బన్సోద్ 12-21, 10-21తో ఏడో సీడ్ పోర్న్పావీ చోచువాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 19-21, 15-21తో జపాన్కు చెందిన యుషి తనాకా చేతిలో చిత్తయ్యాడు. డబుల్స్ మ్యాచ్ల విషయానికొస్తే హరిహరన్-ఎంఆర్ అర్జున్ ద్వయం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. -
షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట!
ప్రపంచవ్యాప్తంగా మరో రెండు వారాల్లో ఫిఫా ప్రపంచకప్ సందడి మొదలుకానుంది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా వరల్డ్కప్కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్ను ప్రమోట్ చేస్తూ ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ఐషోస్పీడ్ తన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాడు. అయితే ఐషోస్పీడ్ పాడిన పాట 24 గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 40 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. ఇక యూట్యూబ్లోనూ మూడు మిలియన్లు, ఇతర ప్లాట్ఫామ్స్ కలిపి మరో ఏడు మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ లెక్కన ఒక్కరోజులోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించడం మరో రికార్డుగా నిలిచింది. అయితే మే నెలలో కొలంబియన్ పాప్స్టార్ షకీరా, నైజీరియన్ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బర్నాబాయ్లతో ఫిఫా నిర్వాహకులు ప్రపంచకప్ అధికారిక గీతాన్ని విడుదల చేశారు. టోర్నమెంట్ బహుళ సాంస్కృతిక స్ఫూర్తిని చాటిచెప్పేలా, విలక్షణమైన పశ్చిమ ఆఫ్రికా లయలను ఉత్సాహభ రితమైన లాటిన్ బీట్స్తో మేళవించేలా "డై డై" అనే ఈ ట్రాక్ను రూపొందించారు. కానీ ఫిఫా నిర్వాహకులు విడుదల చేసిన గీతం జనాలకు అంతగా ఎక్కలేదు. చారిత్రాత్మక ఫుట్బాల్ గీతాల్లో సాధారణంగా ఉండే సహజమైన, ఉత్సాహభరితమైన ట్యూన్స్ మిస్సయ్యాయని చాలా మంది అభిమానులు విమర్శించారు. కానీ ఇదే సమయంలో ఐషో స్పీడ్ విడుదల చేసిన గీతం మాత్రం అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఐషో స్పీడ్ పాడిన పాట అన్ని దేశాల సంప్రదాయాలను మేళవిస్తూ పాడడంతో 24 గంటల్లోనే వైరలయ్యి కూర్చొంది. 'ఫిఫా విడుదల చేసిన దానికంటే ఐషో స్పీడ్ పాడిన పాట మంచి కిక్ ఇస్తుందని.. ఇది కదా అసలైన ఫిఫా పాట" అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లు భారత్లో కూడా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ మంచి ధరకు కొనుగోలు చేసింది. 2010 ఫిఫా ప్రపంచకప్ సమయంలో షకీరా పాడిన వాకా వాకా పాట ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఐషో స్పీడ్ పాడిన పాట షకీరా పాటను కూడా క్రాస్ చేసేలా కనిపిస్తోంది.🚨| BREAKING: Speed has OFFICIALLY RELEASED his World Cup song “Champions” 🤯🤯🔥 pic.twitter.com/Y7OuAweBNP— Speedy HQ (@IShowSpeedHQ) June 1, 2026చదవండి: వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే! -
మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!
శనివారం ఉదయం (మే 29).. త్యాగి కుటుంబమంతా చిరాగ్ కోసం ఎదురుచూస్తోంది. జపాన్ నుంచి తిరిగి వస్తున్న అతడికి ఘన స్వాగతం పలికేందుకు ఇంటిని అందంగా అలంకరించారు. పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించిన అతడికి అభినందనలు తెలపాలని ఊరంతా ఎదురుచూస్తోంది.కానీ చిరాగ్ మాత్రం ఇంటికి రానేలేదు. బదులుగా ఘజియాబాద్ పోలీసుల నుంచి అతడి కుటుంబానికి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఎంఎంజీ ఆస్పత్రికి రావాలని.. చిరాగ్ గాయపడ్డాడని వారికి చెప్పారు. కానీ అక్కడికి వెళ్లే సరికి అంతా అయిపోయింది.భారత పారా అథ్లెట్ 24 ఏళ్ల చిరాగ్ త్యాగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. పారా ఒలింపిక్స్లో పాల్గొనాలన్న కల నెరవేరకుండానే అతడు కన్నుమూశాడు. ఇందుకు అతడి స్నేహితుడు, తోటి పారా అథ్లెట్ యశ్ ఖటిక్ కారణమని త్యాగి కుటుంబం ఆరోపించింది.వాళ్లే కారణంఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం నాటి ప్రెస్ మీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘విచారణలో భాగంగా చిరాగ్ త్యాగి మరణానికి యశ్ ఖటిక్తో పాటు గగన్ త్యాగి కూడా కారణమని తేలింది. వీరితో పాటు అభయ్ అలియాస్ అభినవ్కు కూడా ఇందులో హస్తం ఉంది’’ అని పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా నిందితుడు యశ్ ఖటిక్ తమకు చెప్పిన విషయాలను కూడా పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ‘‘నేనూ.. చిరాగ్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 400 మీటర్ల రేసు కోసం ప్రాక్టీస్ చేసేవాళ్లము. చిరాగ్ మాత్రమే ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు.నాలో అభద్రతా భావం నిజానికి చిరాగ్ మాదిరే నాకూ కంటి సమస్య ఉంది. అయితే, నా మెడికల్ రిపోర్టును జర్మనీకి పంపించాల్సి ఉంది. కానీ చిరాగ్ దానిని నాశనం చేశాడు. దీంతో నేను ఆసియా క్రీడలకు సెలక్ట్ కాలేకపోయాను.అంతేకాదు.. పరుగు పందెంలో ఎప్పుడూ చిరాగే గెలిచేవాడు. అతడు వరుసగా రెండు పతకాలు కూడా సాధించాడు. అతడి ఎదుగుదల నాలో అభద్రతా భావాన్ని పెంచింది. అతడి వల్ల నా కెరీర్ ప్రమాదంలో పడుతుందనే భయం వెంటాడింది.అందుకే నా అసోసియేట్ గగన్ త్యాగితో కలిసి చిరాగ్ హత్యకు పథకం రచించాను. మాకు భికన్పూర్కు చెందిన అభయ్ పిస్టల్ తెచ్చి ఇచ్చాడు. మే 29న బెంగళూరు నుంచి చిరాగ్ తిరిగి వచ్చాడు. మే 30న ఘజియాబాద్కు టాక్సీలో పయనమయ్యాడు.అక్కడిక్కడే కుప్పకూలిపోయాడుఅప్పుడే మా ప్లాన్ ప్రకారం.. సాయి ఉప్వన్ దగ్గర చిరాగ్ త్యాగిని నేను తుపాకీతో చాలా దగ్గరి నుంచి కాల్చాను. అది అతడి తలకు తగిలింది. ఆ తర్వాత వెన్నులోనూ కాల్చాను. అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.మేము చిరాగ్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాము. అతడి సిమ్ కార్డు తీసి మురికికాలువలో పడేశాము. అతడి బ్యాంకు అకౌంట్ నుంచి 62 వేల రూపాయలు డ్రా చేసి.. మాకు పిస్టల్ అమ్మిన వ్యక్తికి ఇచ్చేశాము’’ అని నిందితుడు యశ్ ఖటిక్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.కాగా చిరాగ్, యశ్ ‘బ్లైండ్’ కేటగిరీలో పోటీల్లో పాల్గొంటున్నారని.. అయితే, చిరాగ్ పట్ల అసూయతోనే యశ్ ఈ పని చేసినట్లు వెల్లడించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా చిరాగ్ అంకుల్ ప్రవీణ్ రాజ్ త్యాగి ఈ ఘటన గురించి మాట్లాడుతూ..‘‘చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ లక్ష్యంగా చిరాగ్ ముందుకు సాగాడు. జూడోలో కూడా అతడికి ప్రవేశం ఉంది. అయితే, స్ప్రింటర్గా రాణించడంపైనే దృష్టి పెట్టాడు.మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాడు. అయితే, రోజురోజుకీ అతడి కంటిచూపు మందగించింది. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడే పారా క్రీడల రూపంలో మాకు మరో మార్గం దొరికింది. అక్కడైనా తనను తాను నిరూపించుకోవాలని చిరాగ్ పట్టుదలగా పనిచేశాడు.అసలు యశ్ ఈ పని చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. చిరాగ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 20 వేలు వస్తే అందులో 10 వేలు యశ్కే ఇచ్చేవాడు. అతడికి శిక్షణ కూడా ఇచ్చేవాడు. యశ్ను మేమెంతగానో నమ్మాము. మా కొడుకులాగే చూసుకున్నాము. మాతో పాటు మా ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు అసూయతో మా బిడ్డనే చంపేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
గెలిచి నిలిచిన యువ భారత్
కాకమిగహారా (జపాన్): సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత పురుషుల యువ హాకీ జట్టు సత్తా చాటింది. ఆసియా కప్ అండర్–18 టోర్నమెంట్లో భాగంగా భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది.దక్షిణ కొరియా జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘ఎ’ మ్యాచ్లో కేతన్ కుశ్వహా సారథ్యంలోని భారత బృందం 4–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున వరీందర్ సింగ్ (5వ నిమిషంలో), షారుఖ్ అలీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కెపె్టన్ కేతన్ (3వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. కొరియా జట్టుకు యున్ జేహైక్ (21వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించింది.ఇందులో రెండింటిని భారత్ సది్వనియోగం చేసుకొని, మూడింటిని వృథా చేసుకుంది. కొరియా జట్టు తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని గోల్గా మలిచి, మరో దానిని వృథా చేసింది.ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్లో ఓడి ఆరు పాయింట్లతో కొరియా, జపాన్ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది. లీగ్ మ్యాచ్లు ముగిశాక పూల్ ‘ఎ’... పూల్ ‘బి’లలో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
ఆసియా క్రీడలకు రెజ్లర్లు సుజీత్, అమన్ అర్హత
లక్నో: ఆసియా చాంపియన్ సుజీత్ కల్కాల్... పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో వీరిద్దరూ తమ వెయిట్ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు.సుజీత్ ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో... అమన్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల సుజీత్ నాలుగేళ్లు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సుజీత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. జాగ్రెబ్ (క్రొయేషియా), టిరానా (అల్బేనియా)లలో జరిగిన వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో... బిష్కెక్ (కిర్గిస్తాన్)లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో సుజీత్ స్వర్ణ పతకాలు సాధించాడు. గత ఏడాది ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్లోనూ సుజీత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.మరోవైపు అమన్కు ఈ సీజన్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆసియా చాంపియన్షిప్లో 61 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. జాగ్రెబ్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నలోనూ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి–నగోయా నగరాల్లో జరగనున్నాయి.ఆసియా క్రీడలకు భారత రెజ్లింగ్ జట్లు..ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), సాగర్ జగ్లాన్ (74 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (97 కేజీలు), రజత్ రాహుల్ (125 కేజీలు).గ్రీకో రోమన్ జట్టు: సుమిత్ దలాల్ (60 కేజీలు), దీపక్ (67 కేజీలు), అమన్ (77 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు), నితేశ్ కుమార్ (97 కేజీలు), దీపాన్షు (130 కేజీలు).మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: దీపాన్షి (50 కేజీలు), అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), మనీషా భన్వాలా (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), ప్రియా మలిక్ (72 కేజీలు). -
ఫైనల్కు విజయం దూరంలో...
మడ్గావ్: సొంతగడ్డపై జరుగుతున్న దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు వరుసగా రెండో విజయంతో అదరగొట్టింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. తద్వారా గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి టాపర్గా నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.రేపు జరిగే సెమీఫైనల్లో భూటాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా తరఫున ప్యారీ జక్సా (36వ నిమిషంలో), లిండా కోమ్ సెర్టో (78వ నిమిషంలో), మాళవిక (90+1వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 11–0 గోల్స్ తేడాతో మాల్దీవులు జట్టును చిత్తు చేసింది.తెలంగాణ క్రీడాకారిణి సౌమ్య గుగులోత్ ఈ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్రూప్ ‘ఎ’ నుంచి నేపాల్, భూటాన్ జట్లు... గ్రూప్ ‘బి’ నుంచి బంగ్లాదేశ్ కూడా సెమీఫైనల్కు అర్హత సాధించాయి. ఎనిమిదోసారి దక్షిణాసియా చాంపియన్షిప్లో ఆడుతున్న భారత జట్టు ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది. -
దివ్యాంశి ధమాకా
ప్రిస్టినా (కొసోవో): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ప్రిస్టినా ఫీడర్ లెవెల్ టోర్నమెంట్లో భారత టీనేజర్ దివ్యాంశి భౌమిక్ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్తోపాటు డబుల్స్ విభాగంలో టైటిల్స్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో డబ్ల్యూటీటీ ఫీడర్ లెవెల్ టోరీ్నలో భారత్ తరఫున మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన అతిపిన్న వయసు్కరాలిగా 15 ఏళ్ల దివ్యాంశి రికార్డు నెలకొలి్పంది. ఓవరాల్గా మివా హరిమోటో (జపాన్) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా ఆమె గుర్తింపు పొందింది. సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 211వ ర్యాంకర్ దివ్యాంశి 8–11, 11–8, 11–5, 7–11, 11–7తో ప్రపంచ 38వ ర్యాంకర్ యె యి టియాన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.డబుల్స్ ఫైనల్లో దివ్యాంశి–సిండ్రెల్లా దాస్ (భారత్) ద్వయం 7–11, 14–12, 12–14, 11–8, 11–7తో సాచి అవోకి–కొకోనా మురమత్సు (జపాన్) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ టైటిల్ నెగ్గినందుకు దివ్యాంశి ఖాతాలో 1,450 డాలర్ల (రూ. 1 లక్ష 37 వేలు) ప్రైజ్మనీ, 125 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. డబుల్స్ టైటిల్ సాధించినందుకు దివ్యాంశి–సిండ్రెల్లాలకు 500 డాలర్లు (రూ. 47 వేలు), 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫొన్సెకా మరో సంచలనం!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో బ్రెజిల్ టీనేజర్ జోవో ఫొన్సెకా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. మూడో రౌండ్లో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను బోల్తా కొట్టించిన 19 ఏళ్ల ఫొన్సెకా... ప్రిక్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్, ఫ్రెంచ్ ఓపెన్లో రెండుసార్లు రన్నరప్గా నిలిచిన కాస్పర్ రూడ్ను ఓడించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.3 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఫొన్సెకా 7–5, 7–6 (10/8), 5–7, 6–2తో రూడ్పై గెలిచాడు. 11వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. రుబ్లెవ్ 3–6, 6–7 (6/8), 6–4, 6–2, 3–6తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. పదో సీడ్ కొ»ొల్లి (ఇటలీ), నాలుగో సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా), అన్సీడెడ్ బెరెటెని (ఇటలీ) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కొ»ొల్లి 6–2, 6–3, 6–7 (3/7), 7–6 (7/5)తో జచెరీ వజ్దా (అమెరికా)పై, ఫెలిక్స్ 6–3, 7–5, 6–1తో అలెజాంద్రో టబిలో (చిలీ)పై, బెరెటిని 6–3, 7–6 (7/2), 7–6 (8/6)తో యువాన్ మాన్యుయెల్ సెరున్డొలో (అర్జెంటీనా)పై గెలిచారు.మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మాజా చావ్లిన్స్కా (పోలాండ్) 6–3, 6–2తో డయానా ప్యారీ (ఫ్రాన్స్)పై, డయానా ష్నయిడర్ (రష్యా) 6–3, 3–6, 6–0తో మాడిసన్ కీస్ (అమెరికా)పై, కలిన్స్కాయా (రష్యా) 6–4, 2–6, 7–6 (10/7)తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 7–5, 6–4తో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యుట్జ్ (జర్మనీ) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
నలుగురూ ఓడిపోయారు..
ఓస్లో: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆరో రౌండ్ భారత గ్రాండ్మాస్టర్లకు కలిసి రాలేదు. పురుషుల విభాగంలో పోటీపడుతున్న క్లాసికల్ ఫార్మాట్ ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద... మహిళల విభాగంలో బరిలో ఉన్న ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ కోనేరు హంపి పరాజయం చవిచూశారు.క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో దివ్య 69 ఎత్తుల్లో ఓటమి పాలైంది. బిబిసారా అసబయేవా (కజకిస్తాన్)తో జరిగిన రెగ్యులర్ గేమ్ను హంపి 15 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య అర్మగెడాన్ గేమ్ను నిర్వహించారు. అర్మగెడాన్ గేమ్లో బిబిసారా 24 ఎత్తుల్లో హంపిని ఓడించింది. ఆరో రౌండ్ తర్వాత దివ్య 8.5 పాయింట్లతో రెండో స్థానంలో... హంపి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.పురుషుల విభాగంలో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో నల్ల పావులతో ఆడిన గుకేశ్ 52 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ఓడిపోయాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 55 ఎత్తుల్లో గెలుపొందాడు.ఈ టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ గేమ్లో గెలిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. రెగ్యులర్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో విజయం సాధిస్తే 1.5 పాయింట్లు దక్కుతాయి. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో, ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
మరో టైటిల్ లక్ష్యంగా...
ఇండోనేసియా ఓపెన్లో భారత షట్లర్లు ఐదుసార్లు విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ అత్యధికంగా మూడుసార్లు (2009, 2010, 2012) చాంపియన్గా నిలిచింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (2017లో), పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (2023లో) ఒక్కోసారి టైటిల్ సాధించారు.జకార్తా: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. అదే జోరును జకార్తాలోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత జోడీ బరిలోకి దిగుతోంది.బుధవారం జరిగే తొలి రౌండ్లో కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ తాయ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తొలి రోజు మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్, భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్... పురుషుల డబుల్స్లో హరిహరన్–అర్జున్ ద్వయం... మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీ... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట పోటీపడనున్నారు.ఈ టోర్నీలో సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ (థాయ్లాండ్)తో సింధు తలపడుతుంది. బుసానన్తో 22వ సారి ఆడనున్న సింధు 20 సార్లు గెలిచి, ఒకసారి ఓడిపోయింది. బుసానన్పై గెలిస్తే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) ఎదురయ్యే అవకాశముంది. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిదిసార్లూ సింధు ఓడిపోయింది.ఈ నేపథ్యంలో సింధు ప్రస్థానం ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసే అవకాశముంది. ఇతర మ్యాచ్ల్లో యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్; అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో లక్ష్య సేన్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్లో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా)లతో తనీషా–ధ్రువ్... మహిళల డబుల్స్లో కుసుమ ఫెబ్రియానా–మెలీసా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా...అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో హరిహరన్–అర్జున్ తలపడతారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో సబలెంక మూన్వాక్
ఫ్రెంచ్ ఓపెన్లో ప్రపంచ నంబర్ వన్, బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక జోరు కొనసాగుతోంది. సబలెంక సోమవారం రాత్రి జరిగిన 4వ రౌండ్లో నవోమి ఒసాకా (జపాన్)ను 7-5, 6-3 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.సబలెంకకు వరుసగా ఇది 14వ గ్రాండ్స్లామ్ క్వార్టర్ ఫైనల్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో సబలెంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు సెట్లల్లోనూ ఆమె ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. ఏకంగా 39 విన్నర్లు, 12 ఏస్లతో ముప్పు తిప్పలు పెట్టింది.కాగా ఈ గేమ్ ముగిసిన అనంతరం..మీకు డ్యాన్స్ చేయాలననుందా? అని ఓ వ్యాఖ్యత సబలెంకను అడిగాడు. అందుకు ఆమె అవును అంటూ.. మైఖేల్ జాక్సన్ తరహాలో మూన్వాక్ చేసి అలరించింది. అదేవిధంగా ఈ విజయంపై సబలెంక మాట్లడుతూ.. ఈ ఏడాది రోలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్)లో ఫలితాలతో సంబంధం లేకుండా కేవలం నా ఆటపైనే నేను దృష్టి పెట్టాను. టెన్నిస్లో ఏదైనా జరగొచ్చు" అని పేర్కొంది. కాగా యాసెస్ ఓపెన్లో నవోమి ఒసాకా చేతిలో సబలెంక ఘోర ఓటమి చవిచూసింది. అయితే ఈ ఏడాది మాత్రం ఒసాకాపై వరుసగా మూడో విజయాన్ని సబలెంక నమోదు చేసింది.From dancing in front of the admin's phone to dancing on Philippe-Chatrier 💃#RolandGarros pic.twitter.com/XqxPmCjt35— Roland-Garros (@rolandgarros) June 1, 2026 -
ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది. అయితే సెరెనా ఈ టోర్నీలో సింగిల్స్లో కాకుండా డబుల్స్లో బరిలోకి దిగుతోంది. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్లో ఓటమి తర్వాత సెరెనా మళ్లీ టెన్నిస్ ఆడలేదు. తాను టెన్నిస్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అమెరికా నల్లకలువ స్వయంగా పంచుకుంది. ‘ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని క్యాప్షన్ జత చేసింది. దీనితో పాటు సెరెనా తెలుపు రంగు నైక్ టెన్నిస్ డ్రెస్తో పాటు మొబైల్ ఫోన్ను ఫొటోలో పంచుకుంది. అయితే ఫ్రొఫెషనల్ టెన్నిస్లోకి మాత్రం రావడం లేదని, కేవలం వైల్డ్కార్డ్గా క్వీన్స్క్లబ్ టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా బోకోతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడబోతున్నా అంటూ అసలు విషయాన్ని మెళ్లిగా చెప్పింది. దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్లోకి సెరెనా రీఎంట్రీ ఇస్తుందంటూ తెగ సంబరపడిపోయిన అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. 2022లో యూఎస్ ఓపెన్ లో ఓటమి అనంతరం ఆటకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్’ అనే పదం వాడలేనని, దానికి బదులుగా టెన్నిస్ నుంచి ‘అదృశ్యం’ అవుతున్నానంటూ పరోక్షంగా వీడ్కోలు పలికింది. ఓపెన్ శకంలో మహిళల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్) నిలిచింది. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్స్లామ్) టైటిల్స్తో కొనసాగుతుంది. సెరెనా సాధించిన 23 గ్రాండ్స్లామ్ టైటిల్స్లో ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఏడు వింబుల్డన్, ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. View this post on Instagram A post shared by ESPN (@espn)చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
స్వియాటెక్కు కొస్టుక్ షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈసారి సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖరారు కాగా... మహిళల సింగిల్స్ విభాగంలోనూ వరుసగా రెండో ఏడాది కొత్త విజేత రావడం ఖాయమైంది. మహిళల సింగిల్స్ బరిలో మిగిలిన నాలుగుసార్లు చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు ఆదివారం అనూహ్య పరాజయం ఎదురైంది. దాంతో ఈసారీ మహిళల సింగిల్స్లో కొత్త క్వీన్ అవతరించనుంది. 15వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్) అద్భుత ఆటతీరుతో మెరిపించి 7–5, 6–1తో ‘బర్త్డే గర్ల్’ స్వియాటెక్ను బోల్తా కొట్టించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 2019 తర్వాత స్వియాటెక్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. 2020లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన స్వియాటెక్ 2021లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2022, 2023, 2024లలో టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఈ పోలాండ్ స్టార్...గత ఏడాది సెమీఫైనల్లో ఓడిపోయింది. 99 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కొస్టుక్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వీస్లో 33 పాయింట్లు, రెండో సరీ్వస్లో 12 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 25 విన్నర్స్ కొట్టిన ఈ ఉక్రెయిన్ భామ, 27 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ ఒక్క ఏస్ కూడా కొట్టకుండానే, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. 13 విన్నర్స్ కొట్టిన ఆమె, 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నేనింకా షాక్లోనే ఉన్నా. నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ప్లేయర్ను ఓడించానంటే నమ్మశక్యంగా లేదు’ అని ఈ ఏడాది క్లే కోర్టు సీజన్లో ఓటమి రుచి చూడని కొస్టుక్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), 18వ సీడ్ సొరానా కిర్స్టీ (రొమేనియా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో స్వితోలినా 4–6, 6–4, 6–0తో 11వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)పై, ఆండ్రీవా 6–3, 6–2తో జిల్ టెక్మన్ (స్విట్జర్లాండ్)పై, కిర్స్టీ 6–3, 7–6 (7/4)తో జియు వాంగ్ (చైనా)పై గెలిచారు. శనివారం జరిగిన మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–4, 6–7 (1/7), 4–6తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా) చేతిలో ఓటమి చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) వరుసగా ఆరో ఏడాది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 7–6 (7/3), 6–4, 6–1తో గెలుపొందాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరంగా ఉండటం... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లో... మాజీ విజేత, సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో రౌండ్లో వెనుదిరగడంతో... జ్వెరెవ్ టైటిల్ ఫేవరెట్గా అవతరించాడు. జ్వెరెవ్ తన స్థాయికి తగ్గట్టు ఆడితే పారిస్లో ‘గ్రాండ్స్లామ్ టైటిల్’ కలను నిజం చేసుకుంటాడు. 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్లో.. 2024 ఫ్రెంచ్ ఓపెన్లో... 2020 యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరిన జ్వెరెవ్ మూడుసార్లూ ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. మరోవైపు స్పెయిన్ రైజింగ్ స్టార్ రాఫెల్ జొడార్ ఆడుతున్న రెండో గ్రాండ్స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల జొడార్ 4–6, 4–6, 6–1, 6–2, 6–2తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెగ్జాండ్రా పనోవా (రష్యా) ద్వయం 1–6, 3–6తో డెసిరె క్రాసిక్ (అమెరికా)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
‘నా చావు కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్ని’
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తన చావును కోరుకుంటోందని ఆరోపించింది. కాగా 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించిన అనంతరం వినేశ్కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా విజయంకేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె పతకానికి దూరమైంది. ఆ తర్వాత రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్... రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. తల్లిగా మారిన అనంతరంఇటీవల తల్లిగా మారిన అనంతరం తిరిగి మ్యాట్పై అడుగు పెట్టాలనుకున్న ఈ హర్యానా అథ్లెట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్ ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొంది. అయితే, ఇక్కడా ఆమెకు చుక్కెదురైంది.మీనాక్షి గోయత్ చేతిలో ఓటమిఎన్నో ఆరోపణలు, మరెన్నో పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొన్న వినేశ్ అనూహ్య రీతిలో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల 53 కేజీల సెమీఫైనల్ బౌట్లో వినేశ్ 4–6 పాయింట్ల తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో ఓడిపోయింది. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టానుఈ నేపథ్యంలో..‘నేను విఫలమయ్యానని భావించడం లేదు. నేను మ్యాట్పై కేవలం ప్రత్యర్థితో మాత్రమే పోరాడటం లేదు... మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టాను. నాకు సరైన అవకాశం లభించలేదు. నాతో పోటీపడి గెలిచిన రెజ్లర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. వాళ్లు నాతో బౌట్లో పాల్గొనాలని కలలు కన్నారు. నేను తప్పక తిరిగి వస్తా’ అని వినేశ్ భావోద్వేగానికి గురైంది. అదే సమయంలో.. ‘నేను ఓడిపోయానని తెలిసి డబ్ల్యూఎఫ్ఐ అధికారులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.నా చావును కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్నిపర్లేదు.. ఇప్పుడు వాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వండి. నేను చాలా మొండిదాన్ని. నాకు పట్టుదల ఎక్కువ. ఇలాంటి చేదు అనుభవాలే నన్ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఇవే నా ప్రయాణానికి ఇంధనాలు. నేను కచ్చితంగా తిరిగి వస్తా.నా ప్రతిభపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రదర్శనతోనే సమాధానం చెప్తా. నేను వీలైనంత త్వరగా చావాలని ఈ రెజ్లింగ్ సమాఖ్య కోరుకుంటోంది. ప్రస్తుతానికైతే వారి ఆలోచన ఇదే’ అని వినేశ్ సంచలన ఆరోపణలు చేసింది. IANSతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.తీవ్ర గందరగోళంకాగా ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ తొలి రౌండ్లో వినేశ్ 7–1తో జ్యోతిపై అలవోక విజయం సాధించింది. దీంతో వినేశ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఇక క్వార్టర్ ఫైనల్లో వినేశ్ 7–6 పాయింట్ల తేడాతో నిషు కుమారిని ఓడించింది. ఈ బౌట్ జరుగుతున్న సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.భారత బృందంలో వీరికి చోటువినేశ్ పదే పదే రిఫరీ నిర్ణయాన్ని సవాలు చేయడం... ఆమె అభిమానులు నినాదాలతో హోరెత్తించడం... టెక్నికల్ ఇబ్బందులు ఇలా విజేతను నిర్ణయించేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. సెమీస్లో వినేశ్పై గెలిచిన మీనాక్షి... తుది పోరులో అంతిమ్ చేతిలో ఓడిపోయింది. అంతిమ్తో పాటు నిషా దహియా (68 కేజీలు), మనీషా (57 కేజీలు), దీపాన్షి (50 కేజీలు) ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ టెండుల్కర్ -
శృతి మించిన పీఎస్జీ టైటిల్ సంబరాలు
ఫ్రాన్స్ లీగ్ ఫుట్బాల్ దిగ్గజం పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్జీ) జట్టు వరుసగా రెండో సారి యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. హంగేరీ రాజధాని బూడాపెస్ట్లో నిన్న జరిగిన ఫైనల్లో ఆర్సెనల్ ఎఫ్సీను పెనాల్టీ షూటౌట్లో 4-3తో ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది. అక్కడ పీఎస్జీ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించారు.అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే పారిస్ నగరంలో వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రసిద్ధ ఛాంప్స్-ఎలిసిస్ ప్రాంతంలో భారీగా అభిమానులు గుమికూడారు. బాణాసంచా పేల్చడం, ఫ్లేర్లు వెలిగించడం, రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించడం కనిపించింది. ప్రారంభంలో శాంతియుతంగా సాగిన వేడుకలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి.కొన్ని ప్రాంతాల్లో అభిమానులు మంటలు పెట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, దుకాణాలపై దాడులకు పాల్పడినట్లు ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ముఖ్యంగా పీఎస్జీ స్వస్థల మైదానం పార్క్ డెస్ ప్రిన్సెస్ పరిసరాల్లో, అలాగే నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు–పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.గత రాత్రి 11 గంటలకల్లా 130 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గత ఏడాది పీఎస్జీ తొలి ఛాంపియన్స్ లీగ్ విజయానంతరం కూడా ఇలాంటి అల్లర్లు చోటుచేసుకోవడంతో ఈసారి ముందస్తుగా దేశవ్యాప్తంగా సుమారు 22 వేల మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హింసను పూర్తిగా అరికట్టలేకపోయారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఆరంభంలో ఆర్సెనల్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరో నిమిషంలో జర్మన్ స్టార్ కాయ్ హావెర్ట్జ్ గోల్ చేసి ఆర్సెనల్కు ఆధిక్యం అందించాడు. అయితే రెండో అర్ధభాగంలో పీఎస్జీ తరఫున ఔస్మేన్ డెంబెలె పెనాల్టీని గోల్గా మలిచి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది.పెనాల్టీ షూటౌట్లో ఆర్సెనల్ డిఫెండర్ గాబ్రియల్ మగల్హేస్ కీలక షాట్ను మిస్ చేయగా, పీఎస్జీ మిగిలిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చరిత్ర సృష్టించింది. కోచ్ లూయిస్ ఎన్రిక్ నాయకత్వంలో పీఎస్జీ యూరప్ ఫుట్బాల్లో కొత్త శక్తిగా ఎదుగుతుండగా, పారిస్ వీధుల్లో జరిగిన హింసాత్మక ఘటనలు ఆ విజయోత్సాహాన్ని నీరు గార్చాయి. -
ప్రిక్వార్టర్స్లో సబలెంక
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంక (బెలారస్) ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మూడో రౌండ్లో సబలెంక 6–0, 7–5తో డారియా కసాట్కినా (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. 76 నిమిషాల్లో ముగిసిన పోరులో టాప్ సీడ్ సబలెంక పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఈ పోరులో ఒక ఏస్ సంధించిన బెలారస్ ప్లేయర్... రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. 27 అనవసర తప్పిదాలు చేసిన సబలెంక... 37 విన్నర్స్తో ముందంజ వేసింది. మరో మ్యాచ్లో నవోమీ ఒసాకా (జపాన్) 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో ఇవా జోవిక్ (అమెరికా)పై గెలిచింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో... ఇరువురు ప్లేయర్లు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. ఇది ఒసాకాకు వందో గ్రాండ్స్లామ్ మ్యాచ్ కావడం విశేషం. ఉత్కంఠ పోరులో ఒసాకా 12 ఏస్లు సంధించగా... జోవిక్ 4 ఏస్లకే పరిమితమైంది. ఒసాకా 46 విన్నర్స్ బాదితే... అమెరికా ప్లేయర్ 34 కొట్టింది. ప్రిక్వార్టర్స్లో సబలెంకతో ఒసాకా అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర మ్యాచ్ల్లో ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–3తో టమార కొరపాష్ (జర్మనీ)పై, 11వ సీడ్ బెన్కిక్ (స్విట్జర్లాండ్) 6–3, 6–3తో పైటన్ మెకంజీ స్టీర్న్స్ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టారు. జ్వెరెవ్ జోరు... పురుషుల సింగిల్స్లో జ్వెరెవ్ (జర్మనీ) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో రెండో సీడ్ జ్వెరెవ్ 6–4, 6–3, 5–7, 6–2తో క్వెంటిన్ హాలిస్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 3 గంటల 7 నిమిషాల పాటు సాగిన పోరులో 6 ఏస్లు కొట్టిన జ్వెరెవ్... 53 విన్నర్స్తో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయంతో ఫ్రెంచ్ ఓపెన్కు దూరం కాగా... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లో వెనుదిరగడంతో రెండో సీడ్ జ్వెరెవ్కు చక్కటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మూడు గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో ఫైనల్ వరకు చేరినా... ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ప్రిక్వార్టర్స్లో జెస్పెర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)తో జ్వెరెవ్ పోటీపడనున్నాడు. -
52 నిమిషాల్లోనే ఖతం.. ఫైనల్లో సాత్విక్ జోడీ
సింగపూర్ ఓపెన్లో భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ జోడీ 21-19, 21-18తో ప్రపంచ నంబర్వన్ జోడీ, కొరియాకు చెందిన కిమ్ వోన్-సియో సుంగ్ జె జంటను ఓడించింది. సాత్విక్-చిరాగ్ జోడీ 52 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. సాత్విక్ జంట ఫైనల్ చేరడంతో కనీసం రజతం ఖరారు చేసుకున్నట్లయింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్లో ఆడింది. ఆరంభం నుంచి కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం రెండు గేమ్స్ల్లోనే జయభేరి మోగించింది. రేపు జరగనున్న ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ.. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఢీ కొట్టనుంది.SatChi Into The Finals ✅️Massive Victory For Satwik/Chirag . They Defeated Korean WR 1 Pair Kim Won Ho / Seo Seung Jae In Straight Games 21-19 , 21-18 . The Last Time The Korean Pair Lost A Match Was At The 2025 Denmark Open .Final vs Alfian/Fikri 🇮🇩 (OR) Liang/Wang 🇨🇳 https://t.co/VcZBKAHLy0 pic.twitter.com/zp2ryhVL2T— Badminton Media (@BadmintonMedia1) May 30, 2026చదవండి: అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్ -
వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్!
ఆసియా గేమ్స్లో పాల్గొనాలన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్కు సంబంధించి నిర్వహిస్తున్న పోటీల్లో వినేశ్ సెమీస్లో ఓటమిపాలయ్యింది. శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్లో వినేశ్ ఫొగాట్ 4-6 తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించడంతో పాటు క్రీడలకు దూరమైంది. ట్రయల్స్లో బాగా రాణించి.. అంతర్జా తీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు బ్రేక్ పడినట్లయింది. గత మ్యాచ్లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కిన వినేశ్ అక్కడి పోరాటంలో విజయం సాధించినప్పటికీ, తాజాగా సెమీస్లో ఓటమి పాలవ్వడంతో రెజ్లింగ్లో మాత్రం పరాజయం తప్పలేదు. ట్రయల్స్లో ఓటమి అనంతరం వినేశ్ ఫొగాట్ స్పందించింది. నేను ఓడిపోలేదు. ఈ వ్యవస్థతో ఒంటరిపోరాటం చేస్తున్నా. ప్రతిదాని కోసం పోరాడాల్సి వస్తోంది. నాకు న్యాయం జరగలేదు. మళ్లీ తిరిగి వస్తాను. రెజ్లర్ వినేశ్కు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అయితే 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్! -
అభిమానులకు గుడ్న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక!
భారత్లో ఫుటబాల్కు ఆదరణ తక్కువే అయినప్పటికీ.. బెంగాల్, కేరళ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫుట్బాల్ ఆటకు యమ క్రేజ్ ఉంటుంది. భారత్లో కూడా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట ఫుట్బాల్ టోర్నీలు నిర్వహిస్తుండడంతో ఆదరణ పెరుగుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్కప్కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మ్యాచ్లు లైవ్లో వీక్షించాలని ప్రతీ దేశం భావిస్తోంది. అయితే భారత్లో మాత్రం మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్లో వీక్షించే అవకాశం లేకుండేది. అయితే తాజాగా భారత ఫుట్బాల్ అభిమానులకు ఒక గుడ్న్యూస్. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు జీ నెట్వర్క్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దాదాపు పూర్తయింది. మరో 24-48 గంటల్లో ఒక ప్రకటన కూడా విడుదల కానుంది. అయితే ఫిఫా మ్యాచ్ల ప్రసార హక్కుల్ని జీ నెట్వర్క్ పొందాలనుకుంటే సదరు ఫిఫా బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తం కావడంతో జీ నెట్వర్క్ వెనుకడుగు వేసినప్పటికీ చర్చలు నడుస్తున్నాయి. అయితే జీతో పాటు సోని పిక్చర్స్ నెట్వర్క్ కూడా ప్రసార హక్కులను దక్కించుకునేందుకు పోటీలో ఉంది. అయితే సోనీ నెట్వర్క్ మాత్రం బిడ్ దాఖలు చేయలేదు. దీంతో ఫిఫా వరల్డ్కప్ మ్యాచ్ల ప్రసార హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకోవడం లాంఛనమే అని చెప్పొచ్చు. ఇక జీ నెట్వర్క్ కొత్తగా నాలుగు స్పోర్ట్స్ చానెల్లను లాంచ్ చేసింది. యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (హిందీ), యునైట్ 8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (ఇంగ్లీష్) లాంచ్ చేసింది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఒప్పందం ఖరారైతే మాత్రం ఈ మ్యాచ్లన్నింటి నాలుగు చానెల్స్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మొత్తంగా మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.చదవండి: ‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ! -
జొకోవిచ్కు షాక్!
పారిస్: కెరీర్లో రికార్డు 25వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సెర్బియా దిగ్గజం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో మూడో సీడ్ జొకోవిచ్కు మూడో రౌండ్లోనే అనూహ్య ఓటమి ఎదురైంది.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–4, 3–6, 5–7, 5–7తో ప్రపంచ 30వ ర్యాంకర్ జోవో ఫొన్సెకా (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. 4 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తొలి రెండు సెట్లు గెలిచి విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ పట్టువదలని ఫొన్సెకా అద్భుత ఆటతీరుతో వరుసగా మూడు సెట్లు గెలిచి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.కెరీర్లో 21వసారి ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగిన జొకోవిచ్ 3వ రౌండ్లోపు ని్రష్కమించడం ఇది మూడోసారి మాత్రమే. 2009లో మూడో రౌండ్లో ఓడిన ఈ సెర్బియా దిగ్గజం... 2005లో 2వ రౌండ్లో నిష్క్రమించాడు. ఫొన్సెకాతో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 8 ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్లో 78 పాయింట్లు, రెండో సరీ్వస్లో 25 పాయింట్లు స్కోరు చేశాడు. తన సరీ్వస్ను ఆరుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.70 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 39 అనవసర తప్పిదాలు చేశాడు. తాజా ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ గాయంతో దూరం కావడం... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే నిష్క్రమించడంతో... మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్కు నాలుగోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని జొకోవిచ్ సది్వనియోగం చేసుకోలేకపోయాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 2–6, 2–6, 3–6తో జేకబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు.స్వియాటెక్ ముందంజమహిళల సింగిల్స్ విభాగంలో నాలుగుసార్లు చాంపియన్, మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.మూడో రౌండ్లో స్వియాటెక్ 6–4, 6–4తో మగ్దా లినెట్టి (పోలాండ్)పై, స్వితోలినా 6–2, 6–3తో తమరా కొర్పాత్చ్ (జర్మనీ)పై, ఆండ్రీవా 6–4, 6–2తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ 3–6, 4–6తో సిమోన్ బొలెలీ–వవాసోరి (ఇటలీ) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) జంట 7–5, 6–2తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నెర్ (జర్మనీ) జోడీపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
హైజంప్లో పూజా సింగ్ జాతీయ రికార్డు
హాంకాంగ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల హైజంప్లో భారత టీనేజర్ పూజా సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా సహన కుమారి పేరిట ఉన్న జాతీయ సీనియర్ రికార్డును పూజా సింగ్ బద్దలు కొట్టింది. శుక్రవారం జరిగిన హైజంప్ ఫైనల్లో పూజా సింగ్ 1.93 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని సంపాదించింది.2012లో సహన కుమారి 1.92 మీటర్లతో నెలకొల్పిన జాతీయ సీనియర్ రికార్డును పూజ తిరగరాసింది. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని (1.92 మీటర్లు) కూడా ఈ హరియాణా అమ్మాయి అధిగమించింది. గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్షిప్లోనూ పూజ బంగారు పతకాన్ని సాధించడం విశేషం. మరోవైపు పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో నితిన్ గుప్తా (19ని:47.49 సెకన్లు) భారత్కు పసిడి పతకాన్ని అందించాడు.మహిళల డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ బంగారు పతకాన్ని నెగ్గింది. అమానత్ డిస్్కను 52.24 మీటర్ల దూరం విసిరింది. పురుషుల డెకాథ్లాన్లో రాహుల్ జాఖడ్ 7185 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల ట్రిపుల్ జంప్లో సాధన దేవి... పురుషుల డెకాథ్లాన్లో ఉప్కార్ రజత పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల విభాగంలో నీరూ పాఠక్ కాంస్య పతకాన్ని సాధించింది. -
ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం
ఓస్లో: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మూడో విజయం నమోదు చేశాడు. విన్సెంట్ కీమెర్తో జరిగిన నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద ‘అర్మగెడాన్’ గేమ్లో గెలుపొందాడు. ఇద్దరి మధ్య జరిగిన క్లాసికల్ రెగ్యులర్ గేమ్ 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించారు. ప్రజ్ఞానంద 17 ఎత్తుల్లో కీమెర్ను ఓడించాడు. మరోవైపు క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరో ఓటమిని చవిచూశాడు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ నల్ల పావులతో ఆడుతూ 42 ఎత్తుల్లో గుకేశ్ను ఓడించాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది.ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు దివ్య దేశ్ముఖ్, కోనేరు హంపి నాలుగో రౌండ్లో పరాజయం పాలయ్యారు. దివ్య–అనా ముజీచుక్ (ఉక్రెయిన్) మధ్య రెగ్యులర్ గేమ్ 63 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ‘అర్మగెడాన్’ గేమ్లో అనా ముజీచుక్ 39 ఎత్తుల్లో దివ్యను ఓడించింది. హంపి–జు జినెర్ (చైనా) రెగ్యులర్ గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ‘అర్మగెడాన్’ గేమ్లో జు జినెర్ 28 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. -
వినేశ్కు క్లియరెన్స్..
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆమెకు సుప్రీం అనుమతి ఇచ్చింది. నేడు, రేపు జరిగే ట్రయల్స్లో ఆమెను అనుమతించాలంటూ జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను ఆదేశించింది. వినేశ్ను సెలక్షన్స్కు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఇటీవలి తీర్పును డబ్ల్యూఎఫ్ఐ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. సెలక్షన్స్లో పాల్గొనే అర్హత వినేశ్కు లేదంటూ వాదించింది.అయితే వాదనను సుప్రీం కోర్టు బెంచ్ సమర్థించలేదు. ‘వినేశ్ సెలక్షన్స్లో పాల్గొనవచ్చంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో అందరికీ ఆశలు, అంచనాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో ఆమెను ఇంటికి వెళ్లిపోమని మేం చెప్పడం సరైంది కాదు. అందుకే ఇలాంటి స్పష్టత ఇస్తున్నాం. ఆమె సెలక్షన్ ట్రయల్స్లో కచ్చితంగా పాల్గొనవచ్చు’ అని పేర్కొంది. మరోవైపు హైకోర్టు తీర్పు ప్రకారం వినేశ్ సెలక్షన్ ట్రయల్స్ ఇద్దరు ప్రభుత్వ పరిశీలకుల సమక్షంలో జరగడంతో పాటు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వం తరఫున భారత మాజీ ఫుట్బాలర్ అదితి చౌహాన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ దీనికి హాజరవుతారు. గోల్కీపర్గా అదితి 57 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించగా, 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో సోమయ సభ్యుడిగా ఉన్నారు. వినేశ్ 50 కేజీల విభాగం సెలక్షన్ ట్రయల్స్లో మాత్రమే పాల్గొనేందుకు డబ్ల్యూఎఫ్ఐ అనుమతి ఇచ్చింది. చివరిసారి ఆమె 2024 పారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల విభాగంలోనే పోటీపడిందని, అందుకే ఈసారి కూడా ఆమెకు అదే వెయిట్ కేటగిరీలో అనుమతి ఇస్తామని డబ్ల్యూఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. -
సాత్విక్–చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్లో విజయం
సింగపూర్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆ దిశగా మరో అడుగు వేసింది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో సాత్విక్–చిరాగ్ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్ (మలేసియా) ద్వయంతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 19–21, 21–17, 21–13తో గెలుపొందింది.ఈ విజయంతో ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్లపై సాత్విక్–చిరాగ్ ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్íÙప్ తొలి రౌండ్లో ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్ల చేతిలో ఎదురైన ఓటమికి లెక్క సరిచేశారు. 65 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత జంట తొలి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లో 3–8తో వెనుకబడి ఓటమి దిశగా పయనించింది. అయితే తమ తప్పిదాలను సరిచేసుకొని వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన భారత ద్వయం 9–8తో ఆధిక్యంలోకి వచ్చింది.ఆ తర్వాత స్కోరు 16–16 వద్ద సాత్విక్–చిరాగ్ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ముందంజ వేశారు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయినా, వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్ను సొంతం చేసుకున్నారు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో భారత జంట 8–4తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో స్కోరు 8–8తో సమమైంది.స్కోరు 10–9 వద్ద ఉన్నపుడు భారత జోడీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–9తో మ్యాచ్పై పట్టు బిగించింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం చివరకు గేమ్ను, మ్యాచ్ను 21–13తో దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ జోడీ కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది.సింధు తొమ్మిదో‘సారీ’ సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ల కథ ముగిసింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 17–21, 14–21తో ఓడిపోయింది. ఆన్ సె యంగ్ చేతిలో సింధుకిది వరుసగా తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఈ తొమ్మిది మ్యాచ్ల్లో ఆన్ సె యంగ్పై సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలిచింది.2023 ఆసియా చాంపియన్íÙప్లో ఆన్ సె యంగ్ చేతిలో మూడు గేముల్లో ఓడిన సింధు... మిగతా ఎనిమిది మ్యాచ్ల్లో వరుసగా రెండు గేముల్లో పరాజయం రుచి చూసింది. కొకి వతనాబె (జపాన్)తో జరిగిన మ్యాచ్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ 19–21, 21–15, 15–21తో ఓడిపోయాడు. 2016 తర్వాత లక్ష్య సేన్పై వతనాబె రెండోసారి గెలిచాడు. ఈ పదేళ్ల కాలంలో వీరిద్దరి మధ్య నాలుగు మ్యాచ్లు జరగ్గా... నాలుగింటిలోనూ లక్ష్య సేన్ విజయం సాధించాడు.సెమీస్లో తనీషా–ధ్రువ్ ద్వయం మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట చెన్ టాంగ్ జియె–టో ఈ వె (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ తొలి గేమ్లో 16–18తో వెనుకబడ్డారు. ఈ దశలో మలేసియా ద్వయం గాయం కారణంగా వైదొలగడంతో భారత జోడీకి విజయం ఖరారైంది. నేడు జరిగే సెమీఫైనల్లో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్)లతో తనీషా–ధ్రువ్ తలపడతారు. -
సురుచికి స్వర్ణం... ఇషా సింగ్కు రజతం
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం భారత మహిళా పిస్టల్ షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హరియాణా షూటర్ సురుచి సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించగా... తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రజత పతకాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే టోరీ్నలో సురుచి బంగారు పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో ఏడాది కూడా నిలకడైన ప్రదర్శనతో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి సింగ్ 242.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఇషా సింగ్ 241.2 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి రజత పతకాన్ని గెలిచింది. గెయున్ చూ (దక్షిణ కొరియా) 220.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 121 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో సురుచి సింగ్, ఇషా సింగ్ 578 పాయింట్లు స్కోరు చేసి వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే అతను వాడిన రైఫిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అతనిపై అనర్హత వేటు వేశారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు అనీశ్ 27వ స్థానంలో, ఉదయ్వీర్ సిద్ధూ 37వ స్థానంలో, సూరజ్ శర్మ 39వ స్థానంలో నిలిచారు. -
సింగపూర్ ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1, అన్ సే యాంగ్(దక్షిణ కొరియా) చేతిలో సింధు ఓటమి పాలైంది. దాదాపు 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో యాంగ్ దూకుడు ముందు సింధు నిలవలేకపోయింది. దీంతో ఈ సౌత్ కొరియా సూపర్ స్టార్ 21-17, 21-14 తేడాతో వరుస సెట్లలో సింధుపై విజయం సాధించింది. అన్ సే యంగ్ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా 9వ సారి కావడం గమనార్హం.ఇక సింధు ఇంటిముఖం పట్టిన స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి మాత్రం సెమీస్లో అడగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్లో ఈ భారత ద్వయం మలేషియా జోడీ కాంగ్ ఖాయ్ గ్జింగ్ – అరోన్ తాయ్పై 19-21, 21-17, 21-13తో అద్భుత విజయం సాధించారు. -
తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే!
రాజస్థాన్కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్, భారత అథ్లెట్ సుఫియా సూఫీ సాహసయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 88 రోజుల పాటు 5వేల కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఫియా సూఫీ వెయ్యి కిలోమీటర్ల మార్క్ను చేరుకున్న క్రమంలో ఆ విశేషాలను తన ‘ఎక్స్’ వేదికగా ఫొటో రూపంలో పంచుకుంది. షూస్తో వెయ్యి సంఖ్య ఆకారాన్ని తయారు చేసిన సుఫియా .. ‘వెయ్యి కిలోమీటర్లు పూర్తైంది’ అని కామెంట్ చేసింది. 5 వేల కిలోమీటర్ల టార్గెట్లో మొదటి మెట్టును విజయవంతంగా పూర్తి చేయడం తనకు సంతోషంగా ఉందని సుఫియా తెలిపింది. కాగా సుఫియా సాహసయాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది నిజంగా అద్భుతం. దేశ భద్రతకు గస్తీ కాస్తున్న సాయుధ దళాలకు మీరు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది’.. ‘రన్నింగ్కు షూకు సరైన నిర్వచనం చెప్పారు.. సలాం సూఫీ’..‘కంగ్రాట్స్ సుఫియా.. మీరు ఇలాగే ముందుకు సాగండి’ అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.ఎందుకీ మారథాన్ రన్?దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని సుఫియా సూఫీ ప్రారంభించింది. దేశ భద్రత కోసం ప్రాణాలొదిలిన భారత సాయుధ దళాలకు నివాళిగా మారథాన్ రన్ ప్రారంభించింది. కాగా సూఫీ తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. తన సాహసయాత్రను లడఖ్లోని కార్గిల్ దివస్ వద్ద ముగించనున్నట్లు ఆమె పేర్కొంది. సుఫియా సూఫీ చేస్తున్న ఈ మారథాన్ ఫీట్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు ఆమె అకుంఠిత స్ఫూర్తికి, దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిలవనుంది. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సుఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కాగా జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ.. సుఫియా సూఫీ మారథాన్ను మే 12న అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.1000 Km done.… #RunAcrossIndia #RunforDreams #TributetoBravehearts #worldrecordattempt pic.twitter.com/Ryr1NNuea0— Sufiya Sufi Runner (@sufirunner) May 29, 2026చదవండి: మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన View this post on Instagram A post shared by Sufiya Sufi Runner (@sufiyasufirunner) -
మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన
జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ ఫుట్బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. 2022లో ఫిఫా చాంపియన్గా నిలిచిన అర్జెంటీనాను మళ్లీ మెస్సీనే నడిపించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని అర్జెంటీనా జట్టు కోచ్ లియోనిల్ స్కలోని ప్రకటించారు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అతడు ఫిఫా వరల్డ్కప్కు దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తెరదించుతూ మెస్సీ ఫిఫా వరల్డ్కప్లో ఆడనున్నట్లు, జట్టుకు సారథిగా అతనే వ్యవహరించనున్నట్లు స్కలోని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడనున్నాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు గెలిచిన మెస్సీకే సారధ్య బాధ్యతలను అప్పగించారు. ఖతార్లో నాలుగేళ్ల క్రితం జరిగిన వరల్డ్కప్లో అర్జెంటీనా టైటిల్ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే అర్జెంటీనా జట్టులో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ఫ్రాంకో మస్తానటునో పేరు మాత్రం జట్టులో కనిపించలేదు. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను కన్సాస్ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. అర్జెంటీనా జట్టు:గోల్కీపర్స్: ఎమిలియానో మార్టినేజ్, జిరోనిమా రుల్లి, జువాన్ ముసోడిఫెండర్స్: గొంజాలో మాంటిల్, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్, నికోలస్ ఒటమెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫకుండా మెదీనా, నికోలస్ తగ్లియాఫికోమిడ్ఫీల్డర్లు: లియాండ్రో పరేడ్స్, రోడ్రిగో డీ పాల్, ఎక్స్కుయల్ పాలేసియస్, ఎంజో ఫెర్నాండేజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కోస్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్) , నికోలస్ పాజ్, థియాగో అల్మడా, నికోలస్ గొంజాలెజ్, జులియన్ అల్వరేజ్, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్, జోస్ మాన్యువెల్ లోపేజ్చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’ -
పోరాడి ఓడిన అనిరుధ్ జోడీ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో చివరి నిమిషంలో ఆడే అవకాశం లభించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. గురువారం పారిస్లో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–టకెరు యుజుకి (జపాన్) ద్వయం 3–6, 7–6 (7/4), 6–7 (3/10)తో జేకబ్ పాల్ (స్విట్జర్లాండ్)–మార్కస్ విలిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనిరుధ్–టకెరు జోడీకి 19,000 యూరోలు (రూ. 21 లక్షల 19 వేలు) ప్రైజ్మనీగా లభించాయి.2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–జపాన్ జంట తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 27 ఏళ్ల అనిరుధ్ ప్రస్తుతం ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో 93వ స్థానంలో ఉన్నాడు. కెరీర్లో అతను నాలుగోసారి గ్రాండ్స్లామ్ టోర్నిలో బరిలోకి దిగాడు. 2024, 2025లలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ని్రష్కమించిన అనిరుద్... 2025 యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి పాల్గొన్నాడు. -
సినెర్ అవుట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో గురువారం పెను సంచలనం చోటు చేసుకుంది. పురుషుల సింగిల్స్లో టైటిల్ ఫేవరెట్, ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండోరౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 56వ ర్యాంకర్ సెరున్డోలో (అర్జెంటీనా) 3–6, 2–6, 7–5, 6–1, 6–1తో సినెర్ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తొలి రెండు సెట్లు గెలిచి సినెర్ మూడో సెట్లో 5–1తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచుల్లో నిలిచాడు. ఆ తర్వాత సినెర్ ఒక్కసారిగా గాడితప్పాడు. వరుసగా ఆరు గేమ్లు కోల్పోయి సెట్ను చేజార్చుకున్నాడు. తీవ్రమైన ఎండ కారణంగా పూర్తిగా అలసిపోయిన సినెర్ చివరి రెండు సెట్లలో పూర్తిగా చేతులెత్తేశాడు. 3 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ ఐదు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సరీ్వస్ను ఎనిమిదిసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 51 విన్నర్స్ కొట్టిన సినెర్ 64 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు సెరున్డోలో 14 ఏస్లుసంధించడంతోపాటు 52 విన్నర్స్ కొట్టాడు. జొకోవిచ్కు సువర్ణావకాశం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గైర్హాజరీ... ఈ సీజన్లో సినెర్ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో... అతనికి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఖాయమనిపించింది. ఇప్పటికే ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సినెర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలిచిఉంటే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనతను పూర్తి చేసేవాడు. సినెర్ నిష్క్రమణ నేపథ్యంలో సెర్బియా దిగ్గజం జొకోవిచ్కు 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించే సువర్ణావకాశం లభించింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
సింగపూర్: ఏడాదిన్నర కాలంగా టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు కేవలం 37 నిమిషాల్లో 21–9, 21–12తో రికో గుంజీ (జపాన్)పై అలవోకగా గెలిచింది. అయితే నేడు సింధు సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడనుంది. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఆడిన 8 సార్లూ సింధు ఓడిపోవడం గమనార్హం. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సాతి్వక్–చిరాగ్ 21–15, 11–21, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ)లపై... తనీషా–ధ్రువ్ 8–21, 21–17, 21–16తో యుటా వతనాబె–మాయా టగుచి (జపాన్)లపై నెగ్గారు. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తొలి గేమ్లో లక్ష్య సేన్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో కున్లావుత్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 21–16, 15–21తో ఓడిపోయాడు. -
రణ్దీర్ సింగ్ ఇక లేరు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన షూటర్గా గుర్తింపు పొందిన రణ్దీర్ సింగ్ (79) మృతిచెందారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న రణ్ధీర్ బుధవారం కన్నుమూశారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన... అనారోగ్యం కారణంగా ఇటీవలే తన పదవి నుంచి తప్పుకున్నారు. షూటింగ్లో ఎన్నో ఘనతలు సాధించిన రణ్దీర్... ఆ తర్వాత పరిపాలకుడిగానూ దేశ క్రీడా రంగంపై తనదైన ముద్ర వేశారు. 2024లో నాలుగేళ్ల పదవీ కాలానికి గానూ ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన పటియాలా రాజ కుటుంబానికి చెందిన రణ్దీర్ సింగ్... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. అంతకుముందు 1991 నుంచి 2015 వరకు ఆయన ఓసీఏ కార్యదర్శిగా కొనసాగారు. ‘ఇది దేశ షూటింగ్కు బాధాకరమైన రోజు. దేశ ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన దిగ్గజ షూటర్ రాజా రణ్ధీర్ సింగ్ ఈ లోకం విడిచి వెళ్లారు. వరుసగా ఐదు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన... ఆ తర్వాత క్రీడా పరిపాలకుడిగా ఎన్నో ఘనతలు సాధించారు. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాం. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) కార్యదర్శి రాజీవ్ భాటియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రణ్దీర్ సింగ్కు భార్య వినిత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నేడు హరిద్వార్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రణ్దీర్ కుమార్తె రాజేశ్వరి కుమారి కూడా అంతర్జాతీయ షూటర్ కావడం విశేషం. → 1964 టోక్యో ఒలింపిక్స్లో రిజర్వ్ షూటర్గా పాల్గొన్న రణ్దీర్ సింగ్... ఆ తర్వాత వరుసగా 1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 1976 మాంట్రియాల్, 1980 మాస్కో, 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. → 1978 బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో పురుషుల ట్రాప్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన రణ్దీర్... ఏషియన్ గేమ్స్ షూటింగ్లో దేశానికి తొలి స్వర్ణం అందించారు. → 1979వ సంవత్సరంలో ఆయనకు ‘అర్జున అవార్డు’ దక్కింది. → కెరీర్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించక ముందే పరిపాలన రంగంలోకి అడుగుపెట్టిన రణ్ధీర్ సింగ్ దేశ క్రీడా రంగంపై తనదైన ముద్ర వేశారు. → 1987 నుంచి 2010 వరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు కార్యదర్శిగా వ్యవహరించిన రణ్దీర్ సింగ్... 2001 నుంచి 2014 వరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో వివిధ పదవుల్లో పనిచేశారు. → 2003లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా)లో ఐఓసీ రిప్రెజెంటేటివ్గానూ విధులు నిర్వర్తించారు. → పటియాలా రాజ కుటుంబానికి చెందిన రణ్ధీర్ సింగ్కు షూటింగ్తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రవేశం ఉంది. చిన్నతనంలో క్రికెట్, పోలోను ఇష్టపడిన ఆయన... ఆ తర్వాత ట్రాప్ షూటింగ్కు కెరీర్గా ఎంచుకున్నారు. → రాజ కుటుంబ వారసత్వం ఉన్నా... అందరితో సులువుగా కలిసిపోయే రణ్దీర్ సింగ్... అథ్లెట్లకు ఏం కావాలో వాటిని సమకూర్చడంలో ధిట్ట అని పేరు తెచ్చుకున్నారు. → రణ్దీర్ సింగ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కుమార్తె రాజేశ్వరి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. 2022 ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ విభాగంలో రాజేశ్వరి రజత పతకం గెలుచుకుంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు కూడా క్రీడా అనుబంధ రంగాల్లో మంచి పేరు సాధించారు. → కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర సమయంలో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన రణ్దీర్కు మచ్చలేని పరిపాలకుడిగా గుర్తింపు ఉంది. → ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గౌరవ సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. → 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ సమయంలో అందరిపై అవినీతి ఆరోపణలు వచి్చనా... ఆ సమయంలో భారత ఒలింపిక్ సంఘం కార్యదర్శిగా పనిచేసిన రణ్దీర్పై మాత్రం కనీసం ఒక పుకారు కూడా రాలేదంటే ఆయన నిజాయతీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజా రణ్దీర్ సింగ్ మరణవార్త విని చాలా బాధ కలిగింది. ఆయన జీవితాంతం క్రీడారంగానికి సేవ చేశారు. షూటర్గా, క్రీడా పరిపాలకుడిగా తోటి అథ్లెట్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలు కృషిచేశారు. ఆయన వారసత్వం మన క్రీడా చరిత్రలో ఒక ప్రధాన భాగంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి. –అభినవ్ బింద్రా, బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత. -
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం గెలిచిన షూటర్ ఇషా సింగ్
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇషా సింగ్ కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ఇషా సింగ్ 43 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో 42 పాయింట్లతో 2024లో కిమ్ యెజీ (దక్షిణ కొరియా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కూడా ఇషా సింగ్ బద్దలు కొట్టింది. డొరీన్ (జర్మనీ; 38 పాయింట్లు) రజత పతకం... మిరోస్లావా (బల్గేరియా; 31 పాయింట్లు) కాంస్య పతకం గెల్చుకున్నారు. అంతకుముందు 98 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో ఇషా సింగ్ 587 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత్కే చెందిన మనూ భాకర్ 582 పాయింట్లతో 12వ స్థానంలో, రాహీ సర్నోబత్ 581 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. టాప్–8 వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. -
విజేత దివ్యారెడ్డి
సీనియర్ అథ్లెట్ దివ్యారెడ్డి బొల్లారెడ్డి తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకున్నారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన హైదారాబాద్ సిటీ స్లామ్ 10కె సమ్మర్ రన్-2026లో 40-49 మహిళల విభాగంలో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఇతర వయో విభాగాల్లో సునిమా, వెంకట్, విపిన్ గెలుపొందారు. పతకాల పంట పండిస్తున్న దివ్యారెడ్డిఇటీవల ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్-2025లో దివ్యారెడ్డి నాలుగు పతకాలు సాధించారు. నలభై ఐదేళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 1500 మీటర్ల పరుగులో రజతం, 400 మీటర్ల రేసులో కాంస్యం గెలిచిన దివ్యారెడ్డి.. 4*400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. -
సెప్టెంబర్లో ఆసియా క్రీడలు.. తెలుగు ఆర్చర్లకు చోటు
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్... ఆర్చరీ ప్రపంచకప్ను ఆసియా క్రీడల సన్నాహకంగా భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... దాని కోసం ప్రకటించిన 12 మంది భారత జట్టులో ఈ ఇద్దరు తెలుగు ఆర్చర్లు చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా ఫలితాలు సాధిస్తున్న ఈ ఇద్దరూ... ఆసియా క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. ‘ఆసియా క్రీడలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలనుకుంటున్నా. దానికి ముందు జరగనున్న ప్రపంచకప్లో గురిని పరిశీలించుకుంటా. చాన్నాళ్లుగా నేను వాడుతున్న బాణాల ఉత్పత్తి ఆగిపోయింది. ఇప్పుడు కొత్తవాటితో ప్రాక్టీస్ చేస్తున్నా. వాటినే ప్రపంచకప్లో వినియోగిస్తా. తద్వారా ఆసియా క్రీడలకు ముందు వాటిపై నాకొక అవగాహన వస్తుంది. ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కొత్త పరికరాలను పరీక్షించుకునేందుకు వరల్డ్కప్ సరైన వేదిక’ అని మంగళవారం కేంద్ర క్రీడా శాఖ నిర్వహించిన ఆన్లైన్ మీడియా సమావేశంలో జ్యోతి సురేఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మూడుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్న జ్యోతి సురేఖ మూడు స్వర్ణాలు సహా ఐదు పతకాలు గెలిచింది. వచ్చే నెల 9 నుంచి 14 వరకు అంటాల్యా వేదికగా... జూలై 7 నుంచి 12 వరకు మాడ్రిడ్ వేదికగా రెండు ప్రపంచకప్ టోర్నీలు జరగనున్నాయి. ప్రయోగాలు చేయాలనుంది.. మరోవైపు ధీరజ్ కూడా తన విల్లు సెట్టింగ్లు సర్దుబాటు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘మెరుగైన ఫలితాల కోసం ప్రతి మూడు నెలలకోసారి విల్లు సెట్టింగ్లు మారుస్తుంటా. గత డిసెంబర్ నుంచి కొత్త విల్లును వినియోగిస్తున్నా. దాన్ని పరీక్షించేందుకు తగినంత సమయం దొరకలేదు. ప్రపంచకప్లలో ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’ అని ధీరజ్ చెప్పుకొచ్చాడు. మెక్సికోలో ప్రత్యేక శిబిరం..ఈ ఏడాది జరిగిన తొలి ఆర్చరీ ప్రపంచకప్నకు ముందు మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు మెక్సికోలో క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జ్యోతి, ధీరజ్తో పాటు అతాను దాస్ వంటి పలువురు భారత అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొన్నారు. దాని కోసం స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా (సాయ్) రూ. 57.42 లక్షలు వెచి్చంచింది. ఈ క్యాంప్లో భారత ఆర్చర్లకు తొలిసారి అధునాతన సాంకేతిక పరికరాలను పరీక్షించే వీలు చిక్కింది. ‘సీజన్ తొలి వరల్డ్కప్నకు ముందు అక్కడ ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ఆర్చర్లు ఉపయోగిస్తున్న బాణాలను పరిశీలించాం. వాటిని ఉపయోగించే అవకాశం మాకు తొలిసారి లభించింది. మా ప్రదర్శననను విశ్లేíÙంచుకోవడానికి అక్కడ ఒక బంకర్ కూడా అందుబాటులో ఉంది. ప్రపంచకప్నకు ముందు ఇది మంచి అనుభవం’ అని జ్యోతి చెప్పింది. దీపిక, అతాను లేకుండానే..సీనియర్ ఆర్చర్ల జోడీ దీపిక కుమారి, అతాను దాస్ ఆసియా క్రీడలకు సెలక్షన్ ట్రయల్స్లో విఫలమయ్యారు. దీంతో వారిని ఆసియా గేమ్స్కు ఎంపిక చేయలేదు. ‘ఆ ఇద్దరూ ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత జట్టులో లేరు. కానీ వారు చాలా కాలంగా జట్టులో భాగంగా ఉన్నారు. శిక్షణ సందర్భంగా వారి అనుభవం మాకు ఎంతో ఉపయోగపడింది. మాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు. ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనే వాటిని కూడా వివరించారు. ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టి వారిచ్చిన సలహాలను ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు రాబ్టటేందుకు ప్రయతి్నస్తాం’ అని ధీరజ్ అన్నాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్లో భాగంగా ఉన్న జ్యోతి, ధీరజ్లపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా రూ. 24.56 లక్షలు, రూ. 66.28 లక్షలు ఖర్చుపెట్టింది. చదవండి: 'పనికొచ్చే ప్రశ్నలు వేయండి'.. గుజరాత్ బ్యాటర్ ఆగ్రహం! -
‘పట్టు’ పడితే తిరుగులేదంతే!
డా నాంగ్ (వియత్నాం): కుస్తీ క్రీడలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత మల్లయోధులు ఆసియా అండర్–23 చాంపియన్షిప్ ఫ్రీస్టయిల్ విభాగంలో ఓవరాల్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో భారత్ 180 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చివరిరోజు భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. మోహిత్ కుమార్ (65 కేజీలు), చందర్మోహన్ (79 కేజీలు) స్వర్ణ పతకాలు నెగ్గారు. పునీత్ కుమార్ (92 కేజీలు), దీపక్ (61 కేజీలు), లక్కీ (125 కేజీలు) రజత పతకాలు కైవసం చేసుకున్నారు. దీపక్ (74 కేజీలు), సచిన్ మోర్ (86 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్స్లో మోహిత్ 12–4తో అబ్దిసమతోవ్ (కిర్గిస్తాన్)పై, చందర్మోహన్ 7–6తో అబిల్ యెర్ఖాన్ (కజకిస్తాన్)పై గెలుపొందారు. మిగతా టైటిల్ బౌట్లలో పునీత్ కుమార్ 1–12తో ఉలుక్బెక్ సురోమ్బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో, దీపక్ 1–3తో నుర్దానత్ ఐతనోవ్ (కజకిస్తాన్) చేతిలో, లక్కీ 0–10తో రిజాబెక్ ఐత్ముఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. కాంస్య పతక బౌట్లలో దీపక్ 10–0తో వతన్ అన్నావోరజోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, సచిన్ మోర్ 4–1తో రుజుమ్బొయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. -
సబలెంకా, గాఫ్ జోరు.. మెద్వెదెవ్కు షాక్
పారిస్: మండే ఎండల్లో సాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా తన ఆటతీరుతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా (బెలారూస్) 6–4, 6–2తో జెస్సికా బుజాస్ మనీరో (స్పెయిన్)పై గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. రెండు డైమండ్ నెక్లెస్లు ధరించి ఈ మ్యాచ్లో అడుగు పెట్టిన సబలెంకా 75 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయిన సబలెంకా ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 29 విన్నర్స్ కొట్టిన గత ఏడాది రన్నరప్, నెట్ వద్ద 13 పాయింట్లు సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా రెండో రౌండ్కు చేరుకుంది.తొలి రౌండ్లో కోకో గాఫ్ 6–4, 6–0తో తన దేశానికే చెందిన టేలర్ టౌన్సెండ్ను ఓడించింది. ప్రపంచ మాజీ నంబర్వన్, నాలుగు గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్) కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఒసాకా 6–3, 7–6 (7/3)తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై గెలిచింది. మెద్వెదెవ్ అవుట్ పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఆడమ్ వాల్టన్ (ఆ్రస్టేలియా) 3 గంటల 22 నిమిషాల్లో 6–2, 1–6, 6–1, 1–6, 6–4తో మెద్వెదెవ్ను బోల్తా కొట్టించాడు. మరోవైపు ఫ్రాన్స్కు చెందిన 17 ఏళ్ల మోయిస్ కువామె తొలి రౌండ్లో 7–6 (7/4), 6–2, 6–1తో 37 ఏళ్ల మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 1991 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో మ్యాచ్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా మోయిస్ గుర్తింపు పొందాడు.రెండో రౌండ్లో యూకీ–వీనస్ జోడీఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ వేర్వేరు భాగస్వాములతో శుభారంభం చేశారు. తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ 7–5, 6–2తో ఫ్రాన్సిస్కో సెరన్డోలో–మరియానో కెస్టెల్బోయిమ్ (అర్జెంటీనా) జంటపై గెలిచింది. శ్రీరామ్ బాలాజీ–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 6–3, 4–6, 6–3తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–కాన్స్టన్టీన్ ఫ్రాంట్జెన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. Aryna Sabalenka's first round highlights ✨#RolandGarros pic.twitter.com/759EC2OskP— Roland-Garros (@rolandgarros) May 26, 2026చదవండి: గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే! -
సింధు ముందంజ
సింగపూర్: ఏడాదిన్నర కాలంగా టైటిల్కు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధు సంచలన విజయంతో బోణీ కొట్టింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–17, 21–18తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో సింధు ముఖాముఖి రికార్డును 3–3తో సమం చేసింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడింది. కానీ ఆందోళన చెందకుండా తన అనుభవాన్నంతా రంగరించి సంయమనంతో పోరాడింది. తొలి గేమ్లో 8–13తో, 11–15తో వెనుకంజలో ఉన్నదశలో సింధు నెమ్మదిగా తేరుకొని 15–15తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత స్కోరు 16–16తో ఉన్న తరుణంలో సింధు వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఒక పాయింట్ను ప్రత్యర్థికి కోల్పోయి, ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్లు జరిగింది. పలుమార్లు ఆధిక్యం దోబూచులాడినా చివరకు సింధునే పైచేయి సాధించింది. మహిళల సింగిల్స్ మరో మ్యాచ్లో ఉన్నతి హుడా 14–21, 10–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓడిపోయింది.శ్రమించి గెలిచిన సాత్విక్–చిరాగ్ జోడీపురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. చెన్ జి యి–ప్రెస్లీ స్మిత్ (మలేసియా) జంటతో 75 నిమిషాలపాటు జరిగిన పోరులో సాత్విక్–చిరాగ్ ద్వయం 26–28, 21–15, 21–13తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. భారత్కే చెందిన హరిహరన్–ఎంఆర్ అర్జున్ 15–21, 13–21తో టకురో హొకి–యుగో కొబయాషి (జపాన్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 18–21, 20–22తో యాంగ్ పో సువాన్–హు లింగ్ ఫాంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి 21–11, 14–21, 12–21తో విక్టర్ లాయ్ (కెనడా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ 21–18, 13–21, 5–21తో పౌలా లోపెజ్–లూసియా (స్పెయిన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
‘లావు.. మొరటు’!.. కండబలం, గుండెబలంతో ముందడుగు!
తల్లిదండ్రులు ఇద్దరూ క్రీడాకారులే. తండ్రి జయశంకర్ భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు కెప్టెన్ అయితే.. తల్లి ప్రసన్న భారత మహిళల బాస్కెట్బాల్ జట్టుకు సారథి. ఆ తర్వాత ఇద్దరూ కోచ్లుగా మారి ఆటతో ప్రయాణం కొనసాగించారు.అలా ఆ అమ్మాయికి చిన్ననాటి నుంచే క్రీడా వాతావరణం అలవాటైపోయింది. అయితే, తల్లిదండ్రుల్లా ఆమె బాస్కెట్బాల్ను ఎంచుకోలేదు. అందుకు బదులు ‘షాట్పుట్’ ఆమెను ఎంచుకుంది. ఆ అమ్మాయి పేరు క్రిష్ణా జయశంకర్ మీనన్. ఇండోర్ షాట్పుట్లో 17 మీటర్ల మార్కు దాటిన తొలి భారత మహిళా అథ్లెట్గా ఆమె ఇటీవలే చరిత్ర సృష్టించింది.ఒలింపిక్స్ లక్ష్యంగా..అంతేకాదు.. అమెరికాలో NCAA డివిజన్ 1 స్కాలర్షిప్ పొందిన ఏకైక భారత మహిళా షాట్పుటర్గానూ క్రిష్ణ రికార్డు సాధించింది. తదుపరి అవుట్డోర్ సీజన్పై దృష్టి పెట్టిన ఈ తమిళనాడు అథ్లెట్.. కామన్వెల్త్, ఆసియా క్రీడలు.. ఆపై లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్క్రీడా కుటుంబంలో జన్మించినప్పటికీ క్రిష్ణ ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. తన ‘కండబలం’ చూసి అందరూ హేళన చేస్తుంటే.. తాను మహిళా అథ్లెట్కు నిజమైన ప్రతినిధిని కాదేమోనంటూ కుంగిపోయేది క్రిష్ణ. అలా ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె.. ఎనిమిది సార్లు జాతీయ సెలక్షన్స్లో విఫలమైంది.నిజానికి షాట్పుట్ శిక్షణ కారణంగానే ఆమె దేహం కండలు తిరిగింది. త్రోయింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్ను ఎదుర్కొంది. తనలో ఆడతనం కనిపించడం లేదంటూ కొంతమంది హద్దుదాటి మరీ కామెంట్ చేసేవారు.ఈ ప్రభావం క్రిష్ణ ఆట తీరుపై పడింది. అయితే, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడింది. తనను గేలి చేసిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెట్టిన క్రిష్ణ.. ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పింది.జమైకాలో ఇలాగే ఉంటారుకోవిడ్ సమయంలో క్రిష్ణ శిక్షణ కోసం ఇండియాను వీడి జమైకాకు వెళ్లింది. అక్కడ తనలాగా ఉండే కండలు తిరిగిన ఆడ అథ్లెట్ల విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అక్కడ అచ్చంగా తన లాంటి శరీరాకృతితో ఉన్న అథ్లెట్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఫలితంగానే ఇప్పుడు ఈ రికార్డు విజయం ఆమె సొంతమైంది.త్యాగాల ఫలితంక్రిష్ణ తల్లిదండ్రులది కేరళ. అయితే, బాస్కెట్బాల్ కోసం వాళ్లు తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కెప్టెన్ స్థాయికి ఎదిగారు. క్రిష్ణ కూడా చిన్ననాటి నుంచే షాట్పుట్పై దృష్టి సారించింది.కఠినమైన శిక్షణ, ఆటను మరింత మెరుగుపరచుకోవడం కోసం విదేశాలకు వెళ్లింది. చాలాకాలం పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నగానే కనబడ్డాయి. తన సోదరి నిశ్చితార్థ సమయంలోనూ క్రిష్ణ ప్రాక్టీస్ కోసం విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా.. కెరీర్ కోసం ఇలాంటి త్యాగాలు తప్పవని మొండిగా ముందుకు సాగింది. 23 ఏళ్ల వయసులోనే సరికొత్త చరిత్ర సృష్టించి.. ఒలింపిక్స్ పతకం గెలవడమే లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగిస్తున్న క్రిష్ణ యువతకు ఆదర్శం. View this post on Instagram A post shared by RF Youth Sports (@rfyouthsports) -
‘దయచేసి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి’
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన ఆటగాళ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం అర్థించాల్సి వస్తోంది. పతకాలు గెలిచినప్పుడు వారి ప్రదర్శనను గుర్తిస్తున్నట్లుగా చెబుతూ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఏళ్లు దాటినా... దానిని రెగ్యులరైజ్ చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం. ఇదే విషయంపై రెజ్లర్ రవి దహియా, పారా హైజంపర్ శరద్ కుమార్ పోరాడుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో రవి దహియా (57 కేజీలు) రజత పతకం సాధించి సత్తా చాటగా... శరద్ కుమార్ 2020 టోక్యో పారాలింపిక్స్లో కాంస్యం, 2024 పారిస్ పారాలింపిక్స్లో రజతం సాధించాడు. తమ వేదనను తెలియజేస్తూ వీరిద్దరు వేర్వేరుగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఢిల్లీ ప్రభుత్వం పదే పదే తమ ‘తాత్కాలిక’ ఉద్యోగాన్ని పొడిగిస్తూనే ఉంది తప్ప రెగ్యులరైజ్ చేయడం లేదంటూ వీరిద్దరు ఫిర్యాదు చేశారు. తమ ఒలింపిక్ ఘనతలకుగాను ఢిల్లీ ప్రభుత్వం గ్రూప్ ‘ఎ’ ఉద్యోగాన్ని ఇచ్చిందని.. నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు తాత్కాలిక ఉద్యోగం ఇచ్చినా, ఆపై రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తర్వాత కూడా తమను రెగ్యులరైజ్ చేయడం లేదని రవి, శరద్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు అప్పగించిన అన్ని రకాల బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నామని రవి వెల్లడించగా... దివ్యాంగుడినైన తాను కనీస సౌకర్యాలు లేకపోయినా, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా డ్యూటీ చేస్తున్నానని శరద్ చెప్పాడు. ఇతర శాఖలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న తాము ఢిల్లీ ప్రభుత్వ ఆహ్వానంతో వాటిని వదిలి ఇక్కడకు వచ్చామని ప్లేయర్లు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలు అందేలా చూడాలని రవి, శరద్ ‘క్యాట్’ను కోరారు.చదవండి: ‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన! -
హెచ్డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (హెచ్డీబీఏ) అధ్యక్షుడిగా మరోసారి వంకిన చాముండేశ్వరనాథ్ ఎంపికయ్యారు. కానూరి వంశీధర్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. ఆరుగురు ఉపాధ్యక్షులలో మాజీ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, జాస్తి శారదా గోవర్ధిని ఉన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు (2026–30) ఈ కార్యవర్గం కొనసాగుతుంది. హెచ్డీబీఏ కొత్త కార్యవర్గం వివరాలు: అధ్యక్షుడు:వి.చాముండేశ్వరనాథ్; ఉపాధ్యక్షులు: దగ్గుబాటి సురేశ్బాబు, ఒంటెద్దు శ్రీనివాస రెడ్డి, ఇందుకూరి వెంకటసోమరాజు, ఆదినారాయణ కమ్మ, జాస్తి శారదా గోవరి్ధని, పారుపల్లి కశ్యప్; ప్రధాన కార్యదర్శి: కానూరి వంశీధర్;నిర్వాహక కార్యదర్శి: గున్ను విజయ్ రాఘవన్కోశాధికారి: కొల్లి నాగవేణి; సంయుక్త కార్యదర్శులు: చిట్టబోయిన రమేశ్ యాదవ్, గంటా శారదా రెడ్డి; సభ్యులు: జయేశ్ రంజన్, మున్నంగి బంగారుబాబు, బొంబోజి రాజ్గోపాల్ చారి, సిద్ధార్థ్ రెడ్డి ఆరంరెడ్డి, మొహమ్మద్ మఖ్దూమ్ అహ్మద్ ఖాద్రీ, సీబీ తారాప్రశాంత్ చంద్ర, పల్లె చంద్రశేఖర్ రావు, వంకిన రమ్య, నామాల పురుషోత్తం రావు. -
మెరిసిన సుహాస్, వర్షిత్, శ్రీనిత్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా స్విమ్మర్లు పతకాల పంట పండించారు. పురుషుల విభాగంలో మైలారి సుహాస్ ప్రీతమ్, ధూళిపుడి వర్షిత్... జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్... మహిళల విభాగంలో వ్రిత్తి అగర్వాల్, శ్రీనిత్య సాగి పతకాల మోత మోగించారు. హైదరాబాద్లోని అంబర్పేట జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో జరిగిన ఈ పోటీల్లో సుహాస్ ప్రీతమ్, ధూళిపుడి వర్షిత్ నాలుగు స్వర్ణ పతకాల చొప్పున నెగ్గగా... జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ మూడు బంగారు పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్, శ్రీనిత్య మూడు బంగారు పతకాల చొప్పున సొంతం చేసుకున్నారు. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి. మహిళల విభాగం (ఫ్రీస్టయిల్): 50 మీటర్లు: 1. సు«దీక్ష కృష్ణ (మేడ్చల్–మల్కాజిగిరి; 27.36 సెకన్లు), 2. జొహన్నా షిజు (రంగారెడ్డి), 3. హేమ వర్షిణి జంబులూరి (మేడ్చల్–మల్కాజిగిరి). 100 మీటర్లు: 1. మండూరి ప్రీతిక (రంగారెడ్డి; 1ని:06.95 సెకన్లు), 2. హేమ వర్షిణి జంబులూరి, 3. అవిశా రాచెల్ (హైదరాబాద్). 200 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (మేడ్చల్–మల్కాజిగిరి; 2ని:12.76 సెకన్లు), 2. కర్రా శివాని (రంగారెడ్డి), 3. జొహన్నా షిజు. 400 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (4ని:40.32 సెకన్లు), 2. కర్రా శివాని, 3. జొహన్నా షిజు. 800 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (9ని:47.14 సెకన్లు), 2. జొహన్నా షిజు, 3. మండూరి ప్రీతిక. 1500 మీటర్లు: 1. మెరుపుల లిఖిత గౌడ్ (మేడ్చల్–మల్కాజిగిరి; 21ని:10.42 సెకన్లు), 2. నుహా ఫాతిమా (హైదరాబాద్). బ్యాక్స్ట్రోక్: 50 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (మేడ్చల్–మల్కాజిగిరి; 32.36 సెకన్లు), 2. నాదెళ్ల అదితి (హైదరాబాద్), 3. కర్రా శివాని. 100 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (1ని:09.31 సెకన్లు), 2. కర్రా శివాని, 3. ఇషి అగర్వాల్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (2ని:27.42 సెకన్లు), 2. అనిక దెబోరా (మేడ్చల్–మల్కాజిగిరి), 3. కర్రా శివాని. బ్రెస్ట్స్ట్రోక్: 100 మీటర్లు: 1. జొహన్నా షిజు (1ని:24.83 సెకన్లు), 2. గిడిజల దాక్షిణ్య హరిణి (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఫాతిమా మెహ్రీన్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. గిడిజల దాక్షిణ్య హరిణి (3ని:03.48 సెకన్లు), 2. ఫాతిమా మెహ్రీన్, 3. పుట్టా సుష్మ (వరంగల్). బటర్ఫ్లయ్: 50 మీటర్లు: 1. సుదీక్ష కృష్ణ (29.57 సెకన్లు), 2. అద్దంకి మోక్షిత (హైదరాబాద్), 3. నాదెళ్ల అదితి. 100 మీటర్లు: 1. అద్దంకి మోక్షిత (1ని:19.96 సెకన్లు), 2. మేఘన అబినేశ్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. మెరుపుల లిఖిత గౌడ్ (2ని:49.89 సెకన్లు), 2. అద్దంకి మోక్షిత. వ్యక్తిగత మెడ్లీ: 200 మీటర్లు: 1. జొహన్నా షిజు (రంగారెడ్డి; 2ని:46.07 సెకన్లు), 2. భూపతిరాజు హర్షిత వర్మ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. జంబులూరి హేమ వర్షిణి. 400 మీటర్లు: 1. జంబులూరి హేమ వర్షిణి (మేడ్చల్–మల్కాజిగిరి; 6ని:03.31 సెకన్లు), 2. మేఘన అబినేశ్. పురుషుల విభాగం (ఫ్రీస్టయిల్): 50 మీటర్లు: 1. కాసుల తన్మయ్ రిత్విక్ (రంగారెడ్డి; 25.21 సెకన్లు), 2. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (హైదరాబాద్), 3. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు (మేడ్చల్–మల్కాజిగిరి). 100 మీటర్లు: 1. కాసుల తన్మయ్ రిత్విక్ (రంగారెడ్డి; 55.90 సెకన్లు), 2. మైలారి సుహాస్ ప్రీతమ్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఎడక్కొలాతుర్ స్టాష్ జోసెఫ్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (మేడ్చల్–మల్కాజిగిరి; 2ని:07.86 సెకన్లు), 2. స్టాష్ జోసెఫ్, 3. అరుంబక రిత్విక్ కమల్ (రంగారెడ్డి). 400 మీటర్లు: 1. రేవెళ్లి అమోఘ్ (హైదరాబాద్; 4ని:38.55 సెకన్లు), 2. స్టాష్ జోసెఫ్, 3. భట్టిప్రోలు ప్రభాత్ ముత్తుస్వామి (రంగారెడ్డి). 1500 మీటర్లు: 1. బండారి సాయిశ్రీ ప్రణీత్ (హైదరాబాద్; 19ని:54.58 సెకన్లు), 2. జితేశ్ అవిరినేని (రంగారెడ్డి), 3. పెన్మత్స బాల సిద్ధార్థ వర్మ (మేడ్చల్–మల్కాజిగిరి). బ్యాక్స్ట్రోక్: 50 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (27.31 సెకన్లు), 2. సచిన్ సాత్విక్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. సింకా అనీశ్ రెడ్డి (రంగారెడ్డి). 100 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (1ని:01.33 సెకన్లు), 2. లక్కోజు అభయ్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఆరుష్ దాస్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (2ని:09.60 సెకన్లు), 2. ధూళిపుడి వర్షిత్. బ్రెస్ట్స్ట్రోక్: 50 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (30.95 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. నూనె యశస్వి. 100 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (1ని:07.99 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. దారా యక్షిత్ (హైదరాబాద్). 200 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (2ని:36.41 సెకన్లు), 2. దారా యక్షిత్, 3. యెర్రం అనుదీప్ రాజ్ (ఆదిలాబాద్). బటర్ఫ్లయ్: 50 మీటర్లు: 1. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు (26.08 సెకన్లు), 2. ఇషాన్ దాస్ (రంగారెడ్డి), 3. లక్కోజు అభయ్. 100 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (57.96 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. టీఎస్ తేజస్ కుమార్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (2ని:15.94 సెకన్లు), 2. టీఎస్ తేజస్ కుమార్. వ్యక్తిగత మెడ్లీ: 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (2ని:19. 32 సెకన్లు), 2. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్, 3. టీఎస్ తేజస్ కుమార్. 400 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (5ని:16.99 సెకన్లు), 2. బండారి సాయిశ్రీ ప్రణీత్, 3. ఆరుష్ దాస్. -
ఆంటోనెల్లి అదరహో
మాంట్రియల్: టీనేజ్ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి నిరూపించాడు. ఫార్ములావన్–2026 సీజన్లో వరుసగా నాలుగో విజయంతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ ఐదో రేసు కెనడియన్ గ్రాండ్ప్రిలో 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణీత 68 ల్యాప్లను ఈ ఇటలీ డ్రైవర్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 15.758 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా 76 ఏళ్ల ఫార్ములావన్ చరిత్రలో తమ కెరీర్ ప్రారంభంలో నాలుగు వరుస రేసుల్లో టైటిల్ సాధించిన తొలి డ్రైవర్గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. ఈ సీజన్లోని తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన జార్జి రసెల్ టైటిల్ నెగ్గగా... చైనా, జపాన్, మయామి, కెనడియన్ గ్రాండ్ప్రిలలో ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. 1983లో డామన్ హిల్ (హంగేరి, బెల్జియం, ఇటలీ గ్రాండ్ప్రి)... 1998లో మికా హాకినెన్ (చైనా, జపాన్, మయామి గ్రాండ్ప్రి) మాత్రమే తమ కెరీర్లో బరిలోకి దిగిన మూడు వరుస రేసుల్లో గెలుపొందారు. ఇక ఫార్ములావన్లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన 16వ డ్రైవర్గా ఆంటోనెల్లి ఘనత వహించాడు. గతంలో వెర్స్టాపెన్ (వరుసగా 10; 2023లో), సెబాస్టియన్ వెటెల్ (వరుసగా 9; 2013లో), అల్బోర్టో అస్కారి (వరుసగా 7; 1953లో), మైకేల్ షుమాకర్ (వరుసగా 7; 2004లో), నికో రోస్బర్గ్ (వరుసగా 7; 2016లో), జాక్ బ్రాబమ్ (వరుసగా 5; 1960లో), జిమ్ క్లార్క్ (వరుసగా 5; 1965లో), నైజెల్ మాన్సెల్ (వరుసగా 5; 1992లో), లూయిస్ హామిల్టన్ (వరుసగా 5; 2014లో), జోచెన్ రింట్ (వరుసగా 4; 1966లో), అయిర్టన్ సెనా (వరుసగా 4; 1991లో), అలైన్ ప్రాస్ట్ (వరుసగా 4; 1993లో), డామన్ హిల్ (వరుసగా 4; 1995లో), ఫెర్నాండో అలోన్సో (వరుసగా 4; 2006లో), జెన్సన్ బటన్ (వరుసగా 4; 2009లో) ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోనే వరుసగా నాలుగు రేసుల్లో ఒకటికంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు. స్ప్రింట్ రేసులో సహచరుడు జార్జి రసెల్ను ఢీకొట్టిన ఆంటోనెల్లి ప్రధాన రేసులో మాత్రం దూసుకుపోయాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన ఆంటోనెల్లికి ‘పోల్ పొజిషన్’ సాధించిన సహచరుడు రసెల్తో గట్టిపోటీనే ఎదురైంది. తొలి 30 ల్యాపుల్లో వీరిద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు 38వ ల్యాప్లో ఇంజిన్లో సమస్య కారణంగా రసెల్ రేసు నుంచి వైదొలగగా>... అటునుంచి ఆంటోనెల్లి వెనుదిరిగి చూడలేదు. ఏకంగా పది సెకన్ల ఆధిక్యంతో ఆంటోనెల్లి టైటిల్ సాధించాడు. కేవలం నలుగురు డ్రైవర్లే నిర్ణీత 68 ల్యాప్లను పూర్తి చేయగా... 12 మంది డ్రైవర్లు ఒక ల్యాప్ తక్కువ చేశారు. మిగతా ఆరుగురు డ్రైవర్లు రేసు మధ్యలో నుంచి తప్పుకున్నారు. 22 రేసుల ఈ సీజన్లో ఐదు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 88 పాయింట్లతో రసెల్ రెండో స్థానంలో, 75 పాయింట్లతో లెక్లెర్క్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్ప్రి జూన్ 7వ తేదీన జరుగుతుంది. -
ఫ్రెంచ్ ఓపెన్లో తెలుగు సంతతి కుర్రాడి సంచలనం!
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సంచలనం నమోదయ్యింది. తెలుగు మూలాలున్న భారత సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ను ఓడించాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అమెరికాకు చెందిన 148వ ర్యాంకర్ బసవరెడ్డి 7-6, 7-6, 6-7, 6-1తో తన దేశానికే చెందిన టేలర్ ఫ్రిట్జ్ను మట్టికరిపించాడు. దీంతో నిశేష్ బసవరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.ఎవరీ నిశేష్ బసవరెడ్డి?నిశేష్ రెడ్డి 2005 మే 5న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్లో జన్మించాడు. సాయి ప్రసన్న, మురళీకృష్ణ అతడి తల్లిదండ్రులు. అయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు వారి స్వస్థలం. కాగా 1999లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిశేష్ చిన్న వయసులోనే తన తండ్రి టెన్నిస్ పరిచయం చేశాడు. కోచ్ బ్రయాన్ స్మిత్ వద్ద శిక్షణ పొందాడు. మాజీ ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ప్లేయర్ రాజీవ్ రామ్ మార్గదర్శకత్వం కూడా నిశేష్కు లభించింది. 2022లో జరిగిన యూఎస్ ఓపెన్లో నిశేష్.. ఓజాన్ బారిస్తో కలిసి.. బాయ్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇలా.. జూనియర్ సర్క్యూట్లో తొలిసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2023లో ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్-3 స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఏటీపీ ఛాలెంజర్ టూర్ 2024 సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రెండు ఏటీపీ ఛాలెంజర్ టైటిళ్లు గెలిచి టెన్నిస్ ప్రపంచంలో తన ముద్ర వేశాడు. 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్ స్లామ్ అరంగేట్రం చేసిన నిషేశ్.. తొలి మ్యాచ్లోనే దిగ్గజ ఆటగాడు జకోవిచ్పై తొలి సెట్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్లో టేలర్ ఫ్రిట్జ్ను ఓడించడం ద్వారా మరోసారి తన సత్తా చాటాడు.HUGE win for Nishesh Basavareddy against Taylor Fritz 🇺🇸#RolandGarros pic.twitter.com/Ze36UzxubO— Roland-Garros (@rolandgarros) May 24, 2026చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్కు దూరం!
మరో పదిహేను రోజుల్లో సాకర్ సంగ్రామం (ఫిఫా వరల్డ్కప్-2026) మొదలవనున్న నేపథ్యంలో అర్జెంటీనాకు షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ గాయం బారీన పడ్డాడు. ప్రస్తుతం ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ మేజర్ సాకర్ లీగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం రాత్రి ఫిలడెల్ఫియా యూనియన్తో ఇంటర్ మియామి తలపడింది. మ్యాచ్లో 73వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన మెస్సీ బంతిని కొట్టే క్రమంలో ఎడమ కాలికి గాయమైంది. అయితే మైదానం వీడే సమయంలో నార్మల్గానే కనిపించినప్పటికీ, డగౌట్లో కూర్చున్న సమయంలో తీవ్ర ఇబ్బందిగా మెస్సీ కనిపించాడు. మెస్సీ గాయంతో బాధపడుతున్నాడని, గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉందని ఇంటర్ మియామి కోచ్ గులెరెమో హొయెస్ పేర్కొన్నాడు. మరో 15 రోజుల్లో ఫిఫా ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో మెస్సీ సాకర్ సంగ్రామంలో ఆడుతాడా లేదా అనేది అనుమానంగా మారింది. మెస్సీ గాయంపై అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు స్పందించనప్పటికీ, అతడి గాయంపై ఆందోళనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. ఇక ఫిలడెల్ఫియాతో జరిగిన మ్యాచ్లో ఇంటర్ మియామి 0-6తో విజయాన్ని అందుకుంది.చదవండి: కెప్టెన్సీ విమర్శలపై రహానే ఘాటు వ్యాఖ్యలు -
భారత అండర్–18 మహిళల జట్టు కెప్టెన్గా విహా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 బాస్కెట్ బాల్ టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి జొన్నలగడ్డ విహా రెడ్డి నాయకత్వం వహిస్తుంది. ఈ టోర్నీ సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో మొదలవుతుంది. తెలంగాణకే చెందిన నేత్ర బిరుదవోలు, అదితి సుబ్రమణియన్, ఏంజెలినా జార్జ్, మహెక్ శర్మ, వైష్ణవి పరదేశి జట్టులోని ఇతర సభ్యులుగా ఉన్నారు. పుదుచ్చేరిలో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ సందర్భంగా టీమిండియాకు భారత బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, తమిళనాడు ప్రభుత్వ క్రీడల మంత్రి ఆధవ్ అర్జున కిట్లు అందజేశారు. ఆసియా కప్ అండర్–18 బాస్కెట్ బాల్ టోర్నీకి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు జరుగుతుంది. -
జ్వెరెవ్ శుభారంభం
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ శుభారంభం చేశాడు. మట్టికోర్టులో జరిగే ఈ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్లో రెండో సీడ్ జ్వెరెవ్ 6–3, 6–4, 6–2తో బెంజమిన్ బోన్జీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో జ్వెరెవ్ ఐదు ఏస్లు సంధించాడు. తొలి సర్వీస్లో 37 పాయింట్లు, రెండో సర్వీస్లో 23 పాయింట్లు స్కోరు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి... ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 31 అనవసర తప్పిదాలు చేశాడు. కెరీర్లో 41 గ్రాండ్ స్లామ్ టోర్నీలు ఆడిన జ్వెరెవ్ కు ఇంకా గ్రాండ్ స్లామ్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. మూడుసార్లు (2025 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్) గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే అవకాశం వచ్చినా జ్వెరెవ్ వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాడు.మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), బెలిండా బెన్ చిచ్ (స్విట్జర్లాండ్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. బెన్ చిచ్ 6–2, 6–3 తో క్వాలిఫయర్ సింజా క్రాస్ (ఆస్ట్రియా)పై, ఆండ్రీవా 6–3, 6–3తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై విజయాలు సాధించారు. -
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్కు నేటితో తెర లేవనుంది. సీజన్లో రెండో మేజర్ టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్ల చెల్లింపులకు సంబంధించి తీవ్ర వివాదానికి కారణమైంది. సినెర్, సబలెంకా, గాఫ్వంటి అగ్రశ్రేణి ప్లేయర్లు ఇప్పటికే తమ వాటా కోరుతూ అసంతృప్తిని ప్రదర్శించారు. ఒక దశలో బాయ్కాట్ పిలుపు వినిపించినా అది సద్దుమణిగింది. వివాదాన్ని పక్కన పెట్టి చూస్తే... పురుషుల, మహిళల విభాగాల్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మణికట్టు గాయంతో టోర్నీనుంచి తప్పుకోగా, వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ)పై అందరి దృష్టీ నిలిచింది. వరుసగా మాస్టర్స్ 1000 టోర్నీలు గెలిచి రికార్డులతో దూసుకుపోతున్న సినెర్ను నిలువరించడం అంత సులువు కాదు. ఇతర మూడు గ్రాండ్స్లామ్లను గెలిచిన సినెర్... ఫ్రెంచ్ ఓపెన్ ను కూడా సాధించి కెరీర్ గ్రాండ్స్లామ్ను పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘ కాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న జొకోవిచ్ (సెర్బియా) మరోసారి పోరాటానికి సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో కూడా పోటీ తీవ్రంగా ఉంది. వరల్డ్ నంబర్వన్ సబలెంకా తన తొలి ఫ్రెంచ్ టైటిల్ను సాధించాలని పట్టుదలగా ఉండగా...నాలుగు సార్లు రోలండ్ గారోస్లో విజేతగా నిలిచిన స్వియాటెక్ ఐదో టైటిల్ వేటలో నిలిచింది. గాఫ్, ఒసాకా, కీస్, పెగులా సత్తా చాటేందుకు సై అంటున్నారు. -
గురీందర్వీర్ కొత్త జాతీయ రికార్డు
రాంచీ: గురీందర్వీర్ సింగ్ భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్గా గుర్తింపు పొందాడు. జాతీయ సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ టోరీ్నలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 100 మీటర్ల పరుగును 10.09 సెకన్లలో గురీందర్వీర్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా 100 మీటర్ల రేస్ను 10.10 సెకన్లకంటే తక్కువ టైమింగ్తో పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్గా అతను నిలిచాడు. ఆసియాలో ఫుకుటో కొమురో (జపాన్ – 10.08 సె.) తర్వాత ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అనిమేశ్ కుజుర్ (10.20 సె.)కు రెండో స్థానం దక్కగా, ప్రణవ్ ప్రమోద్ (10.29 సె.)కు మూడో స్థానం దక్కింది. గత ఏడాది 10.18 సెకన్లలో పరుగు పూర్తి చేసి అనిమేశ్ జాతీయ రికార్డును నెలకొల్పగా... ఇదే ఈవెంట్లో తొలి సెమీఫైనల్లో గురీందర్ 10.17తో దానిని అధిగమించాడు. అయితే రెండో సెమీఫైనల్లో 10.15 సెకన్లలో అనిమేశ్ మళ్లీ తన పేరిటే రికార్డు లిఖించుకోగా... ఫైనల్లో దానిని గురీందర్ తిరగరాసి సత్తా చాటాడు. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల సెలక్షన్స్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 10.16 సెకన్లను క్వాలిఫయింగ్ మార్క్గా నిర్ధారింంచారు. తాజా ఫలితం గురీందర్ పోటీలకు అర్హత సాధించాడు. శనివారం మరో రెండు ఈవెంట్లలో కూడా కొత్త జాతీయ రికార్డులు నమోదయ్యాయి. 400 మీటర్ల పరుగులో టీకే విశాల్ 44.98 సెకన్లతో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు తన పేరిటే ఉన్న 45.12 సెకన్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో రాజేశ్ రమేశ్ (45.31 సె.), జై కుమార్ (45.47 సె.) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ 8057 పాయింట్లు సాధించి కొత్త రికార్డు నమోదు చేశాడు. పది వేర్వేరు ఈవెంట్లలో కలిపి మొత్తం 8000కు పైగా పాయింట్లు నమోదు చేసిన తొలి భారత అథ్లెట్గా నిలిచాడు. -
ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు వినేశ్కు అనుమతి
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్ పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్లో వినేశ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నియమించే స్వతంత్ర పరిశీలకుడి పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ జరుగుతాయి. వీటిని వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నారు. ఇటీవల యూపీలోని గోండాలో జరిగిన జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తనను అనుమతించకుండా డబ్ల్యూఎఫ్ఐ పలు అడ్డంకులు సృష్టించడంతో వినేశ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై జరిగిన చర్చలో భాగంగా డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారశైలిని కోర్టు తప్పు పట్టింది. డబ్ల్యూఎఫ్ఐ ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, వినేశ్లాంటి దిగ్గజ ప్లేయర్ పట్ల వివక్ష చూపించడంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయ పడింది. బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా మహిళా క్రీడాకారిణులకు సహజంగా వచ్చే విరామాన్ని పట్టించుకోకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. -
మెక్సికోలో పీలే విగ్రహావిష్కరణ
గ్వాడలహారా (మెక్సికో): ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు... మెక్సికోలో బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే విగ్రహం ఏర్పాటు చేశారు. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ‘ఫిఫా’ ప్రపంచకప్ జరగనుండగా... మెగా టోరీ్నకి కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ మ్యాచ్లు జరిగే మెక్సికోలోని గ్వాడలహారాలో బ్రెజిల్ దివంగత దిగ్గజం పీలే భారీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. సుదీర్ఘ కెరీర్లో బ్రెజిల్కు మూడు ‘ఫిఫా’ ప్రపంచకప్లు అందించిన పీలే... 1970లో మెక్సికోలో జరిగిన మెగా టోర్నీలో తమ జట్టుకు టైటిల్ అందించాడు. తమ దేశంతో పీలేకు ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో... ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. 82 ఏళ్ల వయసులో పీలే 2022లో మృతి చెందారు. ‘ఇక్కడ మ్యాచ్లు ఆడి, ఒక గొప్ప గోల్ చేసిన స్టార్ ఆటగాడి స్మారక విగ్రహం స్థానిక ప్రజలు, అభిమానులకు గొప్ప బహుమతి. పీలే గ్వాడలహారాను ప్రేమించారు. 1970లో మెక్సికన్ ప్రజలు అతడికి బ్రహ్మరథం పట్టారు. వరల్డ్కప్ మ్యాచ్లు చూసేందుకు వస్తున్న అభిమానులందరూ పీలే ఘనతలను తలచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని గవర్నర్ పాబ్లో లెమస్ తెలిపారు. 1970, 1986 ‘ఫిఫా’ ప్రపంచకప్లకు ఆతిథ్యమిచ్చిన జలిస్కో స్టేడియం వెలుపల 9.5 మీటర్ల ఎత్తు గల పీలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1970లో బ్రెజిల్ జట్టు టైటిల్ గెలవడానికి ముందు లీగ్ దశ మ్యాచ్లతో పాటు, క్వార్టర్ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లను ఇదే స్టేడియంలో ఆడింది. అనంతరం మెక్సికో అజ్టెకా స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇటలీని ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి ప్రపంచకప్లో తొలిసారి 48 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. -
రొనాల్డో ట్రోఫీ నంబర్ 36
రియాద్: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఆసియా గడ్డపై తొలి ప్రొఫెషనల్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ క్లబ్ జట్టుకు 41 ఏళ్ల రొనాల్డో సౌదీ ప్రొ లీగ్ టైటిల్ను అందించాడు. ఓవరాల్గా రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్లో ఇది 36వ టైటిల్ కాగా.. సౌదీ ప్రొ లీగ్లో అల్ నాసర్ జట్టు 11వసారి చాంపియన్గా నిలిచింది. డామక్ క్లబ్తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అల్ నాసర్ జట్టు 4–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అల్ నాసర్ జట్టు తరఫున రొనాల్డో (62వ, 80వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సాడియో మానె (33వ నిమిషంలో), కింగ్స్లే కామన్ (51వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. డామక్ జట్టుకు మొర్లాయె సిలా (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 18 జట్ల మధ్య ఇంటాబయటా పద్ధతిలో ఈ లీగ్ను నిర్వహించారు. నిరీ్ణత 34 మ్యాచ్ల తర్వాత అల్ నాసర్ జట్టు 86 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ను ఖరారు చేసుకుంది. అల్ నాసర్ జట్టు 28 మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. 91 గోల్స్ సాధించి, 28 గోల్స్ను ప్రత్యర్థి జట్లకు సమరి్పంచుకుంది. అల్ హిలాల్ జట్టు 84 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. రొనాల్డో గెలిచిన ట్రోఫీలు స్పోరి్టంగ్ సీపీ (పోర్చుగల్): పోర్చుగల్ సూపర్ కప్ (1) మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ (ఇంగ్లండ్): ప్రీమియర్ లీగ్ (3), యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ (1), ఎఫ్ఏ కప్ (1), కరాబావో కప్ (2), కమ్యూనిటీ షీల్డ్ (1), ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ (1). రియల్ మాడ్రిడ్ క్లబ్ (స్పెయిన్): లా లిగా (2), యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ (4), కోపా డెల్ రే కప్ (2), స్పానిష్ సూపర్ కప్ (2), యూఈఎఫ్ఏ సూపర్ కప్ (3), ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ (3). యువెంటాస్ క్లబ్ (ఇటలీ): సెరియా ‘ఎ’ (2), కోపా ఇటాలియా (1), ఇటాలియన్ సూపర్ కప్ (2). అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా): సౌదీ ప్రొ లీగ్ (1), అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్ (1) పోర్చుగల్ జాతీయ జట్టు: యూఈఎఫ్ఏ యూరో కప్ (1), యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ (2). -
డబ్ల్యూఎఫ్ఐ తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను దేశీయ టోర్నమెంట్లలో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన స్టార్ రెజ్లర్తో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని సూచించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్ పోటీపడొచ్చా లేదా అనే అంశంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించి 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్... ఆ తర్వాత రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో తల్లి అయిన వినేశ్... ఇప్పుడు తాజాగా తిరిగి మ్యాట్పై అడుగు పెట్టేందుకు ప్రయత్నించగా... డబ్ల్యూఎఫ్ఐ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వినేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రసూతి విరామం నుంచి తిరిగి బరిలోకి దిగాలనుకుంటున్న రెజ్లర్ను... తల్లి అయినందుకు నిందించకూడదని ధర్మాసనం వెల్లడించింది. దేశంలో మాతృత్వానికి ఎంతో గొప్పదనం ఉందని... వినేశ్ పట్ల రెజ్లింగ్ సమాఖ్య ప్రతీకార ధోరణితో వ్యవహరించకూడదని ధర్మాసనం నొక్కిచెప్పింది. అంతర్జాతీయ సమాఖ్యలు అనుమతిచ్చాక కూడా దేశం నుంచి మద్దతు లేకపోవడాన్ని తప్పుపట్టింది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేశ్ అనర్హతకు గురైన అంశాన్ని దేశం క్రీడాస్ఫూర్తితో స్వాగతించిన విషయాన్ని మరవకూడదని న్యాయస్థానం సూచించింది. అంతకుముందు 2023లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై పలువురు యువ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేయగా... వారికి మద్దతుగా బజరంగ్, సాక్షి మలిక్తో కలిసి వినేశ్ ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. -
ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం!
పాకిస్తాన్ హాకీ జట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు రాకపోగా తాజాగా మరో బాంబు పేల్చింది. రోజువారీ శిక్షణా శిబిర భత్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు శిక్షణా భత్యం కింద ఇస్తున్న 11 డాలర్లను(రూ. 3 వేలు) 3.5 డాలర్లకు (రూ. 335) తగ్గించడం గమనార్హం. దీంతో పాక్ ఆటగాళ్లు శిక్షణా శిబిరం భత్యం కింద ఇకపై కేవలం 335 రూపాయలు మాత్రమే అందుకోనున్నారు. ఇదే విషయమై పాక్ ఆటగాళ్లు తమకు న్యాయం చేయాలంటూ పీహెచ్ఎఫ్కు ఫిర్యాదు చేశారు. ‘ఈజిప్టులో మేము ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడుతున్న సమయంలోనే విదేశీ పర్యటనలకు మాకు రోజువారీ భత్యం 110 డాలర్లు ఇస్తామని వారు ప్రకటించారు. కానీ ఆ మొత్తం ఇప్పటివరకు మాకు అందలేదు. ఇప్పుడు శిక్షణా శిబిరం భత్యానికి సంబంధించి ఇచ్చే మొత్తాన్ని రూ.335కు కుదించడం దారుణం. దీనివల్ల మాకు ఒరిగేదేమిలేదు. ఆర్థిక నష్టాల పేరుతో మాకు వచ్చే అరకొర డబ్బులను కూడా ఇలా కుదింపు పేరుతో లాగేసుకోవడం దుశ్చర్య కిందకు వస్తుంది. తక్షణమే మాకు న్యాయం చేయాలి’ అని ఆటగాళ్లు పాకిస్తాన్ హాకీ సమాఖ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా హాకీ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ, కెప్టెన్ ఎవరన్న దానిపై మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. గతేడాది నుంచి పాకిస్తాన్ హాకీ జట్టును షకీల్ అమ్మాద్ బట్ నడిపిస్తున్నాడు. ఎఫ్ఐహెచ్ ప్రొ మూడో దశ జూన్ 13 నుంచి 27 వరకు జరగనుంది. ఇందులో పాకిస్తాన్ బెల్జియం, స్పెయిన్, ఇంగ్లండ్తో పాటు చిరకాల ప్రత్యర్థి భారత్తోనూ తలపడనుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే పాకిస్తాన్ హాకీ ప్రపంచకప్ ఆడనుంది.చదవండి: ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్కు ప్రమోషన్! -
డోపింగ్ నిరోధానికి కేంద్రం కసరత్తులు
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం నుంచి డోపింగ్ మహమ్మారిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇటీవల జాతీయ డోపింగ్ నిరోధక చట్టాన్ని సవరించగా... తాజాగా దాంట్లో మరిన్ని మార్పులు చేశారు. అథ్లెట్లకు నిషేధిత ఉ్రత్పేరకాలు అందించే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోనున్నారు. పంపీణీ దారులకు ఐదేళ్ల వరకు జైలు శిక్షలు విధించడంతో పాటు తెలిసి నిషేధిత ఉ్రత్పేరకాలను సూచించిన వైద్యులను సైతం కఠినంగా శిక్షించనున్నారు. ప్రతిపాదిత సవరణలను ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. వచ్చేనెల 18 వరకు ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు తెలవపచ్చని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సవరించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ‘క్రీడాకారులకు నిషేధిత ఉ్రత్పేరకాలు సరఫరా చేసిన వారికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా పడుతుంది. డోపింగ్ ముప్పును అరికట్టేందుకు విస్తృత అవగాహన అవసరం. నిషేధిత ఉ్రత్పేరకాల వ్యవస్థీకృత సరఫరాను కఠిన నేరంగా పరిగణిస్తున్నాం. ఆటల నుంచి డోపింగ్ను రూపుమాపేందుకు అవసమైన అన్నీ చర్యలు తీసుకుంటాం. ఇక మీదట భారత క్రీడారంగంలో డోపింగ్ అనే పదం వినబడకూడదు. దానికి సరఫరాదారులు, సూచించేవారు అందరిపైనా చర్యలు తీసుకుంటాం. అథ్లెట్లను తప్పుదోవ పట్టించి నిషేధిత మందులు వాడేవిధంగా పురిగొల్పే వారు ఎవరైనా వదిలిపెట్టం’ అని మాండవీయ పేర్కొన్నారు. ఇటీవల అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) వెల్లడించిన జాబితాలో... భారత్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా దేశంలో నిషేధిత మందులు వాడుతున్న అథ్లెట్ల సంఖ్య భారీగా పెరుగుతుండగా... 2030లో అహ్మదాబాద్ వేదికగా మన దేశంలో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తి ప్రక్షాళన చేయాలని క్రీడా శాఖ నిర్ణయించింది. -
ఆర్చరీ కోచ్ కుల్దీప్కు ఐదేళ్ల జైలుశిక్ష
చండీగఢ్: జాతీయ స్థాయి ఆర్చరీ కోచ్ కుల్దీప్ వేద్వాన్కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్ ఆర్చర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. జాతీయ శిబిరంలో శిక్షణ పొందుతున్న యువ ఆర్చర్ను బలవంతం చేసే ప్రయత్నం చేసిన కుల్దీప్ వేద్వాన్కు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (పోక్సో) చట్టం కింద శిక్ష విధించినట్లు హరియాణాలోని సోనీపత్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది. జైలు శిక్షతో పాటు రూ. 15 వేలు జరిమానాగా విధించింది. కుల్దీప్ నేరాన్ని అంగీకరించగా... జస్టిస్ నరేంద్ర సింగ్ తీర్పు వెల్లడించారు. దీంతో అతడిని తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ‘పోక్సో’ చట్టంలోని 10వ సెక్షన్ కింద అతడికి శిక్ష విధించినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అసలేం జరిగిందంటే... 2023 ఆగస్టులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో యూత్ చాంపియన్ షిప్ శిక్షణ శిబిరం నిర్వహించారు. సోనీపత్లో నిర్వహించిన ఆ శిబిరంలో పాల్గొనేందుకు వచి్చన ఓ జాతీయ స్థాయి మైనర్ ఆర్చర్తో కుల్దీప్ అసభ్యంగా ప్రవర్తించాడు. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్చర్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన కోచ్ కుల్దీప్... ఆమెను లైంగికంగా వేధించాడు. అతడిని ప్రతిఘటించేందుకు విఫలయత్నం చేసిన మైనర్ ఆర్చర్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పక్కనే ఉన్న ఇతర ఆర్చర్ల గదిలోకి పరుగు తీసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని బయట పెడితే కెరీర్ నాశనం చేస్తానని కోచ్ భయపెట్టడంతో యువ ఆర్చర్ తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. తనకు సహకరిస్తే... జాతీయ స్థాయిలో స్టార్ ఆర్చర్గా తీర్చిదిద్దుతానని పలుమార్లు ఆమెను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడు. ట్రయల్స్ ముగిసిన అనంతరం సింగపూర్లో జరిగిన ఆసియా కప్నకు యువ ఆర్చర్ ఎంపిక కాగా... ఆ సమయంలో శిబిరం సందర్భంగా జరిగిన చేదు అనుభవాన్ని ఆమె తన కుటుంబ సభ్యులతో పంచుకుంది. దీంతో వారు సోనీపత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణ చేపట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్దీప్ గతంలో భారత సైన్యంలో సైతం పని చేశాడు. -
కేతన్ సారథ్యంలో...
భోపాల్: ఈనెలాఖరులో మొదలయ్యే ఆసియా కప్ అండర్–18 పురుషుల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ఫార్వర్డ్ కేతన్ కుశ్వాహా సారథ్యం వహిస్తాడు. ఆసియా కప్ టోర్నీ మే 29 నుంచి జూన్ 6 వరకు జపాన్లోని కాకామిగాహారా పట్టణంలో జరుగుతుంది. భోపాల్లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ శిబిరం అనంతరం ఈ జట్టును ఎంపిక చేశారు.ఆసియా కప్ సన్నాహాల్లో భాగంగా ఆ్రస్టేలియా అండర్–18 జట్టుతోనూ భారత్ నాలుగు మ్యాచ్లు ఆడింది. ఇందులో రెండింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో గెలిచి, మరో మ్యాచ్లో ఓడిపోయింది. పూల్ ‘ఎ’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, కజకిస్తాన్ జట్లతోపాటు భారత్కు చోటు కల్పించారు. భారత్ తమ తొలి మ్యాచ్ను కజకిస్తాన్తో మే 29న ఆడుతుంది. అనంతరం మే 31న జపాన్తో, జూన్ 1న దక్షిణ కొరియాతో, జూన్ 3న చైనీస్ తైపీతో టీమిండియా తలపడుతుంది. పూల్ ‘ఎ’... పూల్ ‘బి’లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత అండర్–18 హాకీ జట్టు: సావన్ కుమార్, ఆయుశ్ రజక్ (గోల్కీపర్లు), అన్ష్ బహుత్రా, అర్మాన్ సోరెంగ్, ఆశిష్ తానిపుర్తి, అర్ష్ దీప్ సింగ్, అవి మాణిక్పురి, రోమిత్ పాల్ (డిఫెండర్లు), రాహుల్ యాదవ్, ప్రేమ్చంద్ సోయ్, వరీందర్ సింగ్, కరణ్ గౌతమ్, సిద్ధార్థ్ బెన్ (మిడ్ఫీల్డర్లు), కేతన్ కుశ్వాహా, ఆకాశ్దీప్, గాజీ ఖాన్, షారుఖ్ అలీ, ప్రహ్లాద్ రాజ్భర్ (ఫార్వర్డ్స్). -
భారత కాంపౌండ్ ఆర్చరీ చీఫ్ కోచ్గా డేవ్ కజిన్స్
కోల్కతా: ఆసియా క్రీడలు, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యంగా... భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ను నియమించారు. అమెరికాకు చెందిన 49 ఏళ్ల డేవ్ కజిన్స్ భారత కాంపౌండ్ ఆర్చర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. డేవ్ కజిన్స్ ప్రపంచ చాంపియన్షిప్లో ఐదుసార్లు స్వర్ణ పతకాలు సాధించారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో తొలిసారి కాంపౌండ్ విభాగాన్ని (మిక్స్డ్ మాత్రమే) మెడల్ ఈవెంట్గా చేర్చారు. మరో రెండు వారాల్లో భారత జట్టుతో చేరనున్న కజిన్స్కు నెల వేతనంగా 12,000 డాలర్లు (రూ. 11 లక్షల 53 వేలు) ఇస్తారని సమాచారం. -
క్వార్టర్ ఫైనల్లో అష్మిత
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 71వ ర్యాంకర్ అష్మిత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ 51వ ర్యాంకర్ మాళవికæ, 38వ ర్యాంకర్ దేవిక సిహాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అష్మిత 21–13, 21–16తోగో జిన్ వె (మలేసియా)పై గెలిచింది. మాళవిక 21–16, 8–21, 15–21తో లినె హొమార్క్ జార్స్ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో, దేవిక 16–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ ప్లేయర్ కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 25–27తో ప్రెస్లీ స్మిత్–జెనీ గాయ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) 14–21, 15–21తో హు కె యువాన్–లిన్ జియాంగ్ యి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
లక్ష్యసేన్, ప్రణయ్ నిష్క్రమణ
కౌలాలంపూర్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే వీరిద్దరు నిష్క్రమించారు. బుధవారం జరిగిన మ్యాచ్లో ఎనిమిదో సీడ్ లక్ష్య సేన్ 17–21, 11–21 స్కోరుతో ప్రపంచ 38వ ర్యాంకర్ ఉబేదుల్లా (ఇండోనేసియా) చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మరో పోరులో ప్రణయ్ 17–21, 22–20, 22–24 తేడాతో ఆరో సీడ్ కొడై నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 80 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో రెండో గేమ్ గెలిచిన ప్రణయ్... చివరి గేమ్లో కూడా తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. పురుషుల సింగిల్స్లోనే ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లేనియర్తో జరిగిన మ్యాచ్లో మరో భారత ఆటగాడు కిరణ్ జార్జ్ 15–21, 1–6తో వెనుకబడి ఉన్న దశలో గాయంతో రిటైర్డ్గా తప్పుకున్నాడు. తెలంగాణ ఆటగాడు తరుణ్ మన్నేపల్లి కూడా 21–17, 14–21, 8–21తో వాంగ్ వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. అస్మిత, మాళవిక ముందంజ... మహిళల సింగిల్స్లో భారత షట్లర్ అస్మిత చాలిహా 21–16, 21–13తో తలిత రమదాని (ఇండోనేసియా)ని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మాళవిక బన్సోద్ కూడా 21–17, 16–21, 21–9తో వోన్ లీ (జర్మనీ)పై, దేవిక సిహాగ్ 19–21, 21–18, 21–19తో పార్క్ యున్ (కొరియా)పై గెలుపొంది ముందంజ వేశారు. అయితే తాన్య హేమంత్ 19–21, 7–21తో హువాంగ్ చింగ్ పింగ్ (చైనీస్ తైపీ) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 21–13, 16–21, 19–21తో ఎనిమిదో సీడ్ లైన్ హోమార్క్ (డెన్మార్క్) చేతిలో, ఇషారాణి బారువా 17–21, 21–14, 18–21తో ఐదోసీడ్ లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో, తాన్వి శర్మ 10–21, 19–21తో పికమన్ ఒపటినిపుట్ చేతిలో పరాజయంపాలై నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ జోడి 16–21, 21–14, 21–18తో అలెగ్జాండర్ డున్ –జూలీ మ్యాక్సన్ (స్కాట్లాండ్)ను ఓడించి ముందంజ వేయగా... గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట 15–21, 22–20, 10–21 స్కోరుతో అమ్రి స్యానవి–నీతా మార్వా (ఇండోనేసియా) చేతిలో పరాజయంపాలైంది. -
ఇస్మాయిల్ బేగ్ లేకుండా...
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రోయింగ్ జట్టు కోచింగ్ బృందంలో దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఇస్మాయిల్ బేగ్కు అవకాశం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బేగ్ ఏడు ఆసియా క్రీడల్లో భారత్కు కోచ్గా వ్యవహరించడంతో పాటు 23 ఏళ్ల పాటు భారత రోయింగ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రోయింగ్ సమాఖ్య (ఆర్ఎఫ్ఐ) ప్రకటన తనను నిర్ఘాంతపర్చిందని, అధికారికంగా తాను ఇప్పటికీ భారత హెడ్ కోచ్నే అని బేగ్ అన్నారు. అయితే ఆర్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎం.బాలాజీ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బేగ్ గొప్ప కోచ్గా ఎన్నో విజయాలు అందించడం వాస్తవమే అయినా... మార్పు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. 2024 నుంచి భారత రోయింగ్ జట్టు ఆ్రస్టేలియాకు చెందిన ఆంటోనీ ప్యాటర్సన్ శిక్షణలోనే సన్నద్ధమవుతోందని, గత ఆసియా చాంపియన్షిప్లో కూడా ప్యాటర్సన్ కోచింగ్లో భారత్ 10 పతకాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు. -
మెయిన్ 'డ్రా'కు సాత్విక్ - రాధిక జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో జాతీయ చాంపియన్స్ సాత్విక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) జోడీ 21–15, 21–17తో దాతు అనీఫ్ ఇసాక్–క్లారిస్సా సాన్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అలెగ్జాండర్ డున్–జూలీ మెక్పర్సన్ (స్కాట్లాండ్) జంటతో సాత్విక్–రాధిక ద్వయం తలపడుతుంది. మరోవైపు మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్స్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అష్మిత చాలిహా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా... ఆకర్షి కశ్యప్ క్వాలిఫయింగ్లో నిష్క్రమించింది. అష్మిత 21–23, 21–16, 21–16తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆకర్షి 21–15, 20–22, 7–21తో పార్క్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ 21–19, 21–15తో ఏడో సీడ్ క్రిస్టో పొపోవ్–టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శిఖా గౌతమ్–అశ్విని భట్ (భారత్) జంట 15–21, 21–17, 17–21తో జాకీ డెంట్–క్రిస్టల్ లాయ్ (కెనడా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
‘ఏఐటీఏలోకి అడుగు పెడతా’
ముంబై: భారత మాజీ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల వైపు పూర్తి స్థాయిలో రావాలని ఆశిస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా భాగం కావాలని అతను భావిస్తున్నాడు. ఏఐటీఏలో చేరితే టెన్నిస్లో పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని బోపన్న ప్రకటించాడు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలపై చెలరేగిన వివాదం కోర్టు జోక్యంతో ఇటీవలే సమసిపోగా... త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బోపన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోపన్న ఇప్పటికే కర్ణాటక టెన్నిస్ సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఏఐటీఏలో ఎన్నికల సమయం వచ్చింది. నాకూ ఏదైనా అవకాశం దొరికితే ఈ పరిపాలనలో భాగం కావాలని కోరుకుంటున్నా. భారత టెన్నిస్ను అభివృద్ధి చేసే దిశగా కీలక మార్పులు చేయగలననే విశ్వాసం నాకుంది. అలాంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదో ఒక పదవి తీసుకోవడం నా ఉద్దేశం కాదు. నా వంతుగా ఏదైనా చేయగలనని నమ్మితే కచ్చితంగా వస్తా’ అని బోపన్న చెప్పాడు. మరోవైపు భారత టెన్నిస్లో డబుల్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దే క్రమంలో తన సొంత అకాడమీలో సాగుతున్న ‘డబుల్స్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంపై కూడా బోపన్న మాట్లాడాడు. ఇటీవలి కాలంలో డబుల్స్కు కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తాను దానిపై దృష్టి పెట్టానని, పైగా స్పాన్సర్ల సహకారం కూడా లభించిందని అతను వెల్లడించాడు. ‘మా అకాడమీలో డబుల్స్ ఆటగాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. దీనికి స్పాన్సర్లు కూడా లభించడం సానుకూలాంశం. సింగిల్స్తో పోలిస్తే ఇటీవల డబుల్స్కు మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే దీనికి డబుల్స్ డ్రీమ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాం. మా అకాడమీలో మొత్తం 175 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే దక్షిణేశ్వర్ సురేశ్, వైష్ణవి అడ్కర్, దేవ్ జావియా, ప్రార్థన తోంబరే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అసోం, జమ్మూకు చెందిన కొందరు ప్రతిభ గల పేద కుర్రాళ్లకు గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లు రావాలనేదే నా లక్ష్యం’ అని గతంలో డబుల్స్లో ప్రపంచ నంబర్వన్గా నిలిచిన రోహన్ బోపన్న వివరించాడు. -
82 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాతో...
లాస్ ఏంజెలిస్: మహిళల టెన్నిస్లో ఆల్టైమ్ గ్రేట్గా గుర్తింపు... సుదీర్ఘ కెరీర్లో 12 సింగిల్స్ ట్రోఫీలు సహా ఏకంగా 39 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత... ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు... ఆమె పేరుతోనే మహిళల టెన్నిస్లో టీమ్ ఈవెంట్ నిర్వహణ... ఇవన్నీ బిల్లీ జీన్ కింగ్ సొంతం. అయితే ఇంత అసాధారణ కెరీర్ తర్వాత కూడా జీన్ కింగ్ మదిలో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఆటలో పడి తన గ్రాడ్యుయేషన్ను పూర్తి చేయలేకపోయానని అనిపించేది. రెండేళ్ల క్రితమే చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు దానిని సాధించి చూపించింది. 82 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాతో సగర్వంగా నిలిచింది. లాస్ ఏంజెలిస్లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జీన్ కింగ్ 1961లో అడ్మిషన్ తీసుకుంది. అదే ఏడాది వింబుల్డన్లో డబుల్స్ టైటిల్ సాధించడంతో జీన్ కింగ్ చదువుకు దూరమైంది. ఆమె విజయప్రస్థానంలో ఇది మొదటి ట్రోఫీ కాగా... దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఆటను శాసించింది. అడ్మిషన్ తీసుకున్న 65 ఏళ్ల తర్వాత ఆమె చేతుల్లోకి డిగ్రీ రావడం విశేషం. ‘దీని విలువ ఎంతో నేను మాటల్లో చెప్పలేను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, మీపై మీకు నమ్మకం ఉంటే వయసులో సంబంధం లేదు. దేనికైనా ఆలస్యం అనేదే ఉండదు’ అని బిల్లీ జీన్ కింగ్ వ్యాఖ్యానించింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మరో 6 వేల మందితో కలిసి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కరతాళ ధ్వనుల మధ్య ఆమె తన డిగ్రీ పట్టాను అందుకుంది. -
ఐదో ప్రపంచకప్ ఆడనున్న మోడ్రిచ్
జాగ్రెబ్: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రొయేషియా జట్టును ప్రకటించారు. 40 ఏళ్ల లుకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్లో ఆడనున్నాడు. 2006లో అరంగేట్రం చేసిన మోడ్రిచ్ ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోర్నిల్లో క్రొయేషియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక ‘బాలన్ డోర్’ అవార్డు అందుకున్న మోడ్రిచ్ 196 మ్యాచ్ల్లో క్రొయేషియా తరఫున ఆడాడు. వచ్చే నెలలో అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్లో మిడ్ఫీల్డర్ మోడ్రిచ్ 200 మైలురాయిని దాటే అవకాశముంది. అంటోనియో కర్బాజాల్ (మెక్సికో), ఆండ్రెస్ గార్డాడో (మెక్సికో), లోథర్ మథియాస్ (జర్మనీ), రాఫెల్ మార్కెజ్ (మెక్సికో), గియాన్లుగి బఫన్ (ఇటలీ), యుటో నాగటోమో (జపాన్), గిలెర్మో ఒచావా (మెక్సికో), మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ఇప్పటికే ఐదు ప్రపంచకప్ టోర్నీలు ఆడారు. మెస్సీ, రొనాల్డో తాజాగా ఆరోసారి ప్రపంచకప్లో పోటీపడనున్నారు. 2018 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్లో మూడో స్థానాన్ని సంపాదించింది. క్రొయేషియా ఫుట్బాల్ జట్టు: లివాకోవిచ్, కొటార్స్కీ, ఇవోర్ పాండుర్ (గోల్కీపర్లు), గ్వార్డియోల్, కాలెటకార్, సుటాలో, స్టానిసిక్, పొన్గ్రాసిక్, ఎర్లిక్, వుస్కోవిచ్ (డిఫెండర్లు), లుకా మోడ్రిచ్, కొవాసిచ్, పాసాలిచ్, వ్లాసిక్, లుకా సుసిక్, బటురినా, జాకిక్, పీటర్ సుసిక్, నికోలా మోరో, టోనీ ఫ్రుక్ (మిడ్ఫీల్డర్లు), పెరిసిచ్, క్రామారిచ్, బుడిమిర్, పాసాలిచ్, పీటర్ మూసా, మటానోవిచ్ (ఫార్వర్డ్స్). -
ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్... పురుషుల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కే చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్వన్ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్వన్ అతాను దాస్... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్ వర్మ ట్రయల్స్లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్ చాంపియన్ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్తోపాటు సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్ తరఫున పోటీపడ్డ ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచాడు. -
టెన్నిస్ దిగ్గజం పేస్ ఇంట్లో విషాదం
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పేస్ తల్లి, మాజీ బాస్కెట్బాల్ క్రీడాకారిణి జెన్నిఫర్ పేస్ (72) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. జెన్నిఫర్ 1972 మ్యూనిచ్ ఒలింపి క్స్లో భారతదేశానికి బాస్కెట్బాల్లో ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1982లో బాస్కెట్ బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహ రించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.జెన్నిఫర్ పేస్ ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్కు స్వయానా ముని మనుమరాలు. 2025 ఆగస్టులో పేస్ తండ్రి వేస్ పేస్ మృతి చెందిన విషయం తెలిసిందే. వేస్ పేస్ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1971 హాకీ ప్రపంచకప్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో వేస్ పేస్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాతి ఏడాది 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులోనూ మిడ్ఫీల్డర్గా సేవలందించాడు. ఇద్దరు దిగ్గజాల కడుపున పుట్టిన లియాండర్ పేస్ టెన్నిస్లో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లతో భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేస్ రికార్డులకెక్కాడు. ఇక 18 గ్రాండ్స్లామ్ టైటిల్స్లో 10 మిక్స్డ్ టైటిల్స్, 8 డబుల్స్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ కాంస్యం సాధించి తండ్రి తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించిన ఆటగాడిగా పేస్ ఖ్యాతిని గడించాడు.చదవండి: ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ! -
సాత్విక్–చిరాగ్ జోడీకి నిరాశ
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నిలో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్గా నిలిచింది. 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 12–21, 23–25తో లియో రాలీ కర్నాండో–డేనియల్ మార్టీన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 2019, 2024లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్లకు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. గతంలో నాలుగుసార్లు కర్నాండో–మార్టీన్లపై గెలిచిన భారత జోడీ ఈసారి తడబడింది. తొలి గేమ్లో తేలిపోయిన భారత జంట రెండో గేమ్లో నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. రన్నరప్గా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 19,000 డాలర్ల (రూ. 18 లక్షల 23 వేలు) ప్రైజ్మనీ, 7800 పాయింట్లు లభించాయి. Satwiksairaj, Chirag Shetty -
సినెర్ ‘కెరీర్ గోల్డెన్ మాస్టర్స్’ ఘనత
రోమ్: ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ ‘కెరీర్ గోల్డెన్ మాస్టర్స్’ ఘనత పూర్తి చేశాడు. ‘మాస్టర్స్ సిరీస్–1000’లో భాగంగా జరిగే తొమ్మిది వేర్వేరు టోర్నిలన్నింటిలో (మయామి, మాడ్రిడ్, మోంటెకార్లో, ఇండియన్ వెల్స్, రోమ్, పారిస్, షాంఘై, సిన్సినాటి, కెనడా) విజేతగా నిలిచిన రెండో ప్లేయర్గా సినెర్ నిలిచాడు. స్వదేశంలో ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో టాప్ సీడ్ సినెర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కాస్పర్ రూడ్ (నార్వే)తో జరిగిన ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. సినెర్కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 23 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సినెర్ కెరీర్లో ఇది 10వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. మయామి ఓపెన్ను రెండుసార్లు నెగ్గిన సినెర్.. మిగతా ఎనిమిదింటిని ఒక్కోసారి సాధించాడు. 1990లో ‘మాస్టర్స్ సిరీస్’ మొదలుకాగా... ఇప్పటి వరకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మాత్రమే (రెండుసార్లు; 2018లో, 2020లో) ‘కెరీర్ గోల్డెన్ మాస్టర్స్’ ఘనత సాధించాడు. ఓవరాల్గా జొకోవిచ్ తన కెరీర్లో 40 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచాడు. -
ఏపీ డిప్యూటీ కలెక్టర్ ఖాతాలో మరో టైటిల్
బెంగళూరు: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 21వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్–50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో జతకట్టి ఆడిన సాకేత్ విజేతగా నిలిచాడు. పీటర్ బార్ బిరుకోవ్ (రష్యా)–గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్) జోడీతో జరిగిన తుది పోరులో సాకేత్–పునాచా జంట 6–2, 6–3తో విజయం సాధించింది. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–పునాచా మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన సాకేత్–పునాచాలకు 2,980 డాలర్ల (రూ. 2 లక్షల 85 వేలు) ప్రైజ్మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ ఏడాదిన్నర తర్వాత మరో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ను సాధించాడు. సాకేత్ చివరిసారి 2024 నవంబర్లో యోకోహామా ఏటీపీ–75 చాలెంజర్ టోర్నీలో బెంజిమిన్ హసన్ (జర్మనీ)తో జతగా డబుల్స్ టైటిల్ను సాధించాడు. -
‘రోమ్’ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో సినెర్
రోమ్: పురుషుల టెన్నిస్లో నిర్వహించే తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్స్నూ గెలిచిన రెండో ప్లేయర్గా గుర్తింపు పొందేందుకు... ఇటలీ స్టార్ యానిక్ సినెర్ ఒక్క విజయం దూరంలో నిలిచాడు. రోమ్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో ప్రపంచ నంబర్వన్ సినెర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సినెర్ 6–2, 5–7, 6–4తో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తొలి సర్వీస్లో 41 పాయింట్లు, రెండో సర్వీస్లో 22 పాయింట్లు సంపాదించాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 30 అనవసర తప్పిదాలు చేసి, 39 విన్నర్స్ కొట్టాడు. ఈరోజు జరిగే ఫైనల్లో కాస్పర్ రూడ్ (నార్వే)తో సినెర్ తలపడతాడు. సినెర్ విజయం సాధిస్తే ‘కెరీర్ గోల్డెన్ మాస్టర్స్’ ఘనత నమోదు చేస్తాడు. ప్రతి యేటా తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ సిరీస్ టోర్నీలు జరుగుతాయి. సెర్బియా దిగ్గజం జొకోవిచ్ రెండుసార్లు చొప్పున ఈ తొమ్మిది టోర్నీల టైటిల్స్ సాధించాడు. సినెర్ ఇప్పటి వరకు తొమ్మిది మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ (మయామి 2 సార్లు; మాడ్రిడ్, మోంటెకార్లో, ఇండియన్ వెల్స్, పారిస్, షాంఘై, సిన్సినాటి, కెనడా) సొంతం చేసుకున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ టైటిల్ మాత్రమే సినెర్ ఖాతాలో చేరలేదు. -
భారత బాక్సర్లకు 17 పతకాలు
తాష్కెంట్: ఆసియా అండర్-17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు 17 పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత బాలికలు 12 పతకాలు సాధించగా... భారత బాలురు 5 పతకాలు సొంతం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో రాఖీ (46 కేజీలు), నవ్య (57 కేజీలు) స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.ఖుషీచంద్ (48 కేజీలు), దివ్య (63 కేజీలు), హిమాన్షి (70 కేజీలు), జ్యోతి (75 కేజీలు), వన్షిక (80 కేజీలు), గుర్సీరత్ కౌర్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. మమత (52 కేజీలు), లక్ష్మీ మంజునాథ్ (54 కేజీలు), ఇషిక (60 కేజీలు), హర్నూర్ కౌర్ (66 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు పొందారు.బాలుర కేటగిరీ 75 కేజీల ఫైనల్లో లక్షయ్ ఫొగాట్ 0:5తో తొష్పులతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. నేళ్ల నరేంద్ర కుమార్ (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ కుమార్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలను సంపాదించారు. -
ఫైనల్లో సాకేత్ జోడీ
బెంగళూరు: కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్-50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్-నికీ కలియంద పునాచా (భారత్) జోడీ 7-5, 6-1తో టాప్ సీడ్ ప్రజ్వల్ దేవ్-నితిన్ కుమార్ సిన్హా (భారత్) జంటపై విజయం సాధించింది.71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్-పునాచా మూడు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తొలి సర్వీస్లో 27 పాయింట్లు, రెండో సర్వీస్లో 12 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్నా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.పదో టోర్నీలో మాత్రం టైటిల్కు విజయం దూరంలో నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో పీటర్ బార్ బిరుకోవ్ (రష్యా)-గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లతో సాకేత్-పునాచా తలపడతారు. రెండో సెమీఫైనల్లో బిరుకోవ్-లొమాకిన్ 7-6 (7/4), 7-6 (7/4)తో ఆదిల్ కల్యాణ్పూర్-ముకుంద్ శశికుమార్ (భారత్)లపై విజయం సాధించారు. -
సరికొత్త చరిత్ర.. తొలి ప్లేయర్గా ఘనత
రోమ్: ప్రతిష్టాత్మక మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలలో యానిక్ సినెర్ కొత్త రికార్డు నెలకొల్పాడు. మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్గా ఈ ఇటలీ స్టార్ గుర్తింపు పొందాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సినెర్ 6–2, 6–4తో రుబ్లెవ్ (రష్యా)ను ఓడించాడు. తద్వారా మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో వరుసగా 32వ విజయం అందుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ (2011లో 31 వరుస విజయాలు) పేరిట ఉన్న రికార్డును సినెర్ బద్దలు కొట్టాడు. -
నిఖత్కు చుక్కెదురు
పాటియాలా: కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్లో... రెండుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ నిఖత్ జరీన్కు అనూహ్య ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన 51 కేజీల విభాగం సెమీఫైనల్లో తెలంగాణకు చెందిన నిఖత్ 1:4 తేడాతో సరీ్వసెస్ బాక్సర్ సాక్షి చౌధరీ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో నిఖత్ కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా పోయింది. 29 ఏళ్ల నిఖత్ 2022 బరి్మంగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం... 2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్లో కాంస్య పతకం గెలిచింది. -
భారత అండర్–21 హాకీ జట్టు హెడ్ కోచ్గా సోయెజ్
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, టీమిండియా మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ స్థానంలో... భారత అండర్–21 పురుషుల హాకీ జట్టుకు కొత్త హెడ్ కోచ్గా ఫ్రెడరిక్ సోయెజ్ను నియమించారు. ఫ్రాన్స్కు చెందిన సోయెజ్కు అంతర్జాతీయ ప్లేయర్గా 15 ఏళ్లు... హెడ్ కోచ్గా 15 ఏళ్లు అనుభవం ఉందని హాకీ ఇండియా తెలిపింది. ఫ్రాన్స్ తరఫున సోయెజ్ 196 మ్యాచ్లు ఆడి 195 గోల్స్ చేశాడు. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లో స్పెయిన్ జట్టుకు... 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫ్రాన్స్ జట్టుకు సోయెజ్ కోచ్గా వ్యవహరించారు. -
మూణ్ణెళ్ల కింద రాజీనామా.. ఇప్పుడు రికార్డు పుటల్లోకి!
కేవలం 1,56,000 జనాభా ఉన్న కురసావ్ దేశం వచ్చే నెలలో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 96 ఏళ్ల ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఆడనున్న అతిచిన్న దేశంగా (జనాభా, వైశాల్యం పరంగా) కురసావ్ జట్టు గుర్తింపు పొందనుంది. ఈ జట్టుగా హెడ్ కోచ్గా ఉన్న డిక్ అడ్వోకాట్ కూడా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే ఒక జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించనున్న అతిపెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అడ్వోకాట్ (Dick Advocaat) గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఈ రికార్డు ఒట్టో రెహగల్ పేరిట ఉంది. 2010 ప్రపంచకప్లో గ్రీస్ జట్టుకు రెహగల్ హెడ్ కోచ్గా ఉన్నపుడు ఆయన వయస్సు 71 ఏళ్లు. గ్రూప్ ‘ఇ’లో ఉన్న కురసావ్ జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 14న హ్యూస్టన్లో జర్మనీ జట్టుతో ఆడనుంది. నెదర్లాండ్స్కు చెందిన అడ్వోకాట్ శిక్షణలోనే కురసావ్ దేశం మొదటిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. రెండేళ్లపాటు కురసావ్ జట్టుకు కోచ్గా ఉన్న అడ్వోకాట్ మూడు నెలల క్రితం కుటుంబకారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఈ మూడు నెలల కాలంలో కురసావ్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన ఫ్రెడ్ రుటెన్ ఆధ్వర్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. చైనా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ల్లో కురసావ్ ఓడిపోయింది. కురసావ్ జట్టులోని సీనియర్ ప్లేయర్లకు కూడా రుటెన్ శిక్షణ పద్ధతులు నచ్చలేదు. సీనియర్ ప్లేయర్లందరూ మళ్లీ అడ్వోకాట్ను కోచ్గా తేవాలని కురసావ్ ఫుట్బాల్ సమాఖ్యను కోరారు. దాంతో కురసావ్ సమాఖ్య... అడ్వోకాట్ను సంప్రదించగా ఆయన కోచ్గా మళ్లీ వచ్చేందుకు అంగీకరించారు. ఫుట్బాల్ సర్కిల్లో ‘ద లిటిల్ జనరల్’గా పేరున్న అడ్వోకాట్కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. హెడ్ కోచ్గా అడ్వోకాట్కిది మూడో ప్రపంచకప్ కానుంది. 1994లో నెదర్లాండ్స్ జట్టుకు... 2006లో దక్షిణ కొరియా జట్టుకు ఆయన కోచ్గా ఉన్నారు. అంతేకాకుండా బెల్జియం, యూఏఈ, రష్యా, సెర్బియా, ఇరాక్ జట్లకు, 16 ప్రొఫెషనల్ క్లబ్ జట్లకు కోచ్గా వ్యవహరించారు. -
ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళా జట్టు
ప్రొ హాకీ లీగ్లో మరోసారి స్థానం సంపాదించేందుకు భారత మహిళల హాకీ జట్టు సిద్ధమైంది. ప్రొ హాకీ లీగ్ అర్హత టోర్నీ అయిన నేషన్స్ కప్ జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో జరగనుంది. నేషన్స్ కప్ సన్నాహాల కోసం భారత జట్టు ఈనెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. పెర్త్ వేదికగా ఆ్రస్టేలియా జట్టుతో భారత జట్టు నాలుగు మ్యాచ్లు ఆడనుంది. మే 26, 27 తేదీల్లో తొలి రెండు మ్యాచ్లు... మే 29, 30 తేదీల్లో మరో రెండు మ్యాచ్లు భారత్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్లో అడుగు పెడుతుంది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి ఏడాది ప్రొ హాకీ లీగ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రొ హాకీ లీగ్లో చివరి స్థానంలో నిలిచిన జట్టు మళ్లీ లీగ్లో స్థానం కోసం నేషన్స్ కప్లో బరిలోకి దిగుతుంది. 2022లో స్పెయిన్లో జరిగిన నేషన్స్ కప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2024–2025 ప్రొ లీగ్లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించింది. తొమ్మిది జట్లు పాల్గొన్న 2024–2025 ప్రొ లీగ్లో భారత జట్టు చ చివరి స్థానంలో నిలిచి మళ్లీ నేషన్స్ కప్కు పడిపోయింది. ఇటీవల అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల జట్టు నాలుగు మ్యాచ్లు ఆడింది. రెండింటిలో గెలిచింది. ఈ సిరీస్ తర్వాత బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిబిరం ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, ఆ తర్వాత నేషన్స్ కప్లో భారత జట్టులోని డ్రాగ్ ఫ్లికర్లకు నెదర్లాండ్స్ దిగ్గజం టేకె టకేమా శిక్షణ ఇస్తారు. ‘నేషన్స్ కప్ సన్నాహాల కోసం ఆ్రస్టేలియాతో సిరీస్ ఏర్పాటు చేయడం బాగుంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టులోని బలాబలాలు, బలహీనతలు తెలుస్తాయి’ అని భారత జట్టు చీఫ్ కోచ్ జొయెర్డ్ మరీన్ తెలిపారు. చదవండి: ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ‘నంబర్ వన్’కు చోటే లేదు! -
ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన
భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్ ట్రయల్స్కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్లో సత్తా చాటితేనే టీమ్లో చోటు దక్కుతుందని, ర్యాంక్ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. ‘నంబర్ వన్’కు చోటే లేదు!ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్గన్’ టీమ్లను ఎన్ఆర్ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్వన్, ప్రపంచ ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్ షూటర్ జొరావర్ సింగ్ సంధూకు చోటు దక్కలేదు.గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్షిప్, సెలక్షన్ ట్రయల్స్లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్నాడు. గత అక్టోబర్లో వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్ కప్లో కూడా జొరావర్ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. నా ఘనతను గుర్తించాలని కోరుతున్నాఇక 2025 వరల్డ్ చాంపియన్షిప్లో కూడా 122 పాయింట్లతో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్ఆర్ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. ‘ఆసియా నంబర్వన్గా, వరల్డ్ నంబర్ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్లో అత్యుత్తమ స్కోరింగ్లు నమోదు చేశాను’ అని జొరావర్ అన్నాడు. ఎంపిక చేసే ప్రసక్తే లేదుఅయితే ఎన్ఆర్ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్లోకి ఎంపికైన ఇతర ‘షాట్గన్’ షూటర్ల స్కోరింగ్ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో రిజ్వీ (122), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (119), శపథ్ భరద్వాజ్ (118) స్కోరు సాధించారు. 35 ఏళ్ల కైనన్ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్ కాంస్య పతకాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... ఆసియా చాంపియన్షిప్లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు. భారత ‘షాట్గన్’ జట్ల వివరాలు పురుషుల ట్రాప్: కైనన్ చెనాయ్, అహ్వర్ రిజ్వీ, శపథ్ భరద్వాజ్. మహిళల ట్రాప్: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్. పురుషుల స్కీట్: అనంత్జీత్ సింగ్, భవ్తేజ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్. మహిళల స్కీట్: పరీనాజ్ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్. ట్రాప్ ‘మిక్స్డ్’: కైనన్ చెనాయ్, నీరూ. స్కీట్ ‘మిక్స్డ్’: అనంత్జీత్ సింగ్, పరీనాజ్ ధలివాల్. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
శ్రీజేశ్పై అనూహ్య వేటు
న్యూఢిల్లీ: భారత మాజీ గోల్కీపర్, అండర్–21 జూనియర్ పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్ పీఆర్ శ్రీజేశ్పై అనూహ్యంగా వేటు పడింది. అతడిని కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా (హెచ్ఐ) తప్పించింది. 17 నెలల పాటు కోచ్గా వ్యవహరించిన శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో భారత్ ఐదు టోర్నీలు ఆడగా ఐదింటిలోనూ పతకం సాధించింది. జూనియర్ వరల్డ్ కప్లో కూడా కాంస్యం గెలుచుకుంది. అయితే శ్రీజేశ్ కాంట్రాక్ట్ను పొడిగించకుండా హెచ్ఐ కొత్త జూనియర్ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. దీనిపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోచ్గా తన విజయాలను పట్టించుకోకుండా కేవలం విదేశీ కోచ్ను ఎంపిక చేసేందుకే హెచ్ఐ ఈ నిర్ణయం తీసుకుందని అతను ఆరోపించాడు. పురుషుల సీనియర్ జట్టు కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ జూనియర్ టీమ్కు కూడా విదేశీ కోచ్ కావాలని కోరడంతోనే హెచ్ఐ ఈ తరహాలో వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించిందని శ్రీజేశ్ అన్నాడు. ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ... 2036 ఒలింపిక్స్ కోసం శ్రీజేశ్లాంటి కోచ్లు కావాలని తనను ప్రశంసించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘కోచ్గా విఫలమైతే అతడిని తప్పిస్తారనేది ఇంత కాలం చూశాను. కానీ విదేశీ కోచ్ను ఎంపిక చేసేందుకు భారత కోచ్ను తొలగిస్తారనేది ఇప్పుడు చూస్తున్నాను. జూనియర్ జట్టుకు కూడా విదేశీ కోచ్ ఉంటేనే భవిష్యత్తు కోసం సీనియర్ జట్టును సిద్ధం చేసేందుకు అనుకూలంగా ఉంటుందని హాకీ ఇండియా అధ్యక్షుడు నాకు చెప్పారు. విదేశీ కోచ్లకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీని వల్ల అర్థమవుతోంది. భారత కోచ్లు భారత హాకీని అభివృద్ధి చేయలేరా’ అని శ్రీజేశ్ స్పందించాడు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో (2020 టోక్యో, 2024 పారిస్) భారత జట్టు కాంస్య పతకాలు గెలవడంలో గోల్కీపర్ శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ప్లేయర్గా కెరీర్కు వీడ్కోలు పలికిన శ్రీజేశ్ కోచింగ్ వైపు వెళ్లాడు. హాకీ ఇండియా వివరణ... శ్రీజేశ్ అసంతృప్తిపై హెచ్ఐ స్పందించింది. అతడిపై తాము వేటు వేయలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేసింది. ‘శ్రీజేశ్ కాంట్రాక్ట్ గత డిసెంబర్లో ముగిసింది. దాంతో నిబంధనల ప్రకారం ప్రకటన ఇచ్చాం. అర్హులైన వారందరినీ షార్ట్లిస్ట్ చేసి ప్రక్రియ ప్రకారమే కొత్త కోచ్ను ఎంపిక చేశాం. త్వరలోనే కొత్త కోచ్ పేరును ప్రకటిస్తాం. శ్రీజేశ్ను మేం తొలగించలేదు. వచ్చే రెండు ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ టీమ్కు కోచ్గా ఉండమని కోరాం. కోచ్గా కూడా అతను మరింత పరిణతి సాధించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పాం. అయితే మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అతను దానిని తిరస్కరించాడు’ అని హెచ్ స్పష్టం చేసింది. -
Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
రాజస్థాన్కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్ సూఫియా సుఫీ తన సాహసయాత్రను ప్రారంభించింది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 5వేల కిలోమీటర్లు రన్నింగ్ చేయనుంది. అయితే అత్యంత కఠినమైన ఈ యాత్రను పూర్తి చేయడానికి సుఫియా సుఫీకి 88 రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తన యాత్రను ప్రారంభించిన సూఫియా తొలి రోజు 52 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన వీడియోనూ ఎక్స్లో పంచుకుంది. బుధవారం మరో 52 కిలోమీటర్లు పరిగెత్తనున్నట్లు తెలిపింది. తొలిరోజు 12 గంటల 23 నిమిషాల పాటు పరిగెత్తి 52 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన సోఫి తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. లడఖ్లోని కార్గిల్ దివస్ వద్ద తన సాహసయాత్ర ముగించనున్నట్లు ఆమె పేర్కొంది. ఈ ఘనత సూఫియా అకుంఠిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలవనుంది. జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ ఈ మారథాన్ను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సూఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.Day 01 of The Fastest Run Across India (Kanyakumari - Karakoram)Run For Dreams - An Official World Record Run to Tribute to our Armed Forces Bravehearts who sacrifice themselves for us. Run Flaged-off from Sunrise Point, Kanyakumari Beach. Thank you so much everyone for… pic.twitter.com/8GUjbMGVse— Sufiya Sufi Runner (@sufirunner) May 12, 2026చదవండి: సాయి సుదర్శన్ అరుదైన ఫీట్! -
వినేశ్ను అడ్డుకోవడం సబబు కాదు: సాక్షి మలిక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు మరో రెజ్లర్ సాక్షి మలిక్ మద్దతుగా నిలిచింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పాల్గొనాలనుకుంటున్న వినేశ్... జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా తిరిగి మ్యాట్పై అడుగు పెట్టాలని భావించగా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల సాకుతో అడ్డుపడింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయిన వినేశ్... ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో కెరీర్కు వీడ్కోలు పలికింది. అనంతరం రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున హరియాణా ఎమ్మెల్యేగా విజయం సాధించింది.ఇటీవల తల్లి అయిన వినేశ్ తిరిగి పోటీలో దిగేందుకు ప్రయత్నించగా... షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాతే పోటీల్లో పాల్గొనే అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించిన అథ్లెట్లు తిరిగి పోటీల్లో పాల్గొనాలనుకుంటే... ఆరు నెలల నోటీసు నిబంధనను పాటించాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు కొత్తగా తల్లి అయిన అథ్లెట్ తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే వారి కోసం నిబంధనలు మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని సాక్షి వెల్లడించింది. ‘మహిళా అథ్లెట్ తల్లి అయిన తర్వాత కూడా దేశం కోసం ఆడటం, పతకాలు గెలవడం కొనసాగించేలా నిబంధనలు ఉండాలి.గతంలో పలు దేశాల్లో ఇలా నిబంధనల్లో మార్పులు చేశారు. వినేశ్ రెజ్లింగ్కు విరామమిచ్చిన అనంతరం ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు ఆమె తిరిగి రెజ్లింగ్లో అడుగు పెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వినేశ్కు ట్రయల్స్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, డబ్ల్యూఎఫ్ఐని అభ్యరి్థస్తున్నా. దీంతో తల్లి అయిన తర్వాత పతకాలు గెలిచి ఆమె మహిళా సమాజానికి ఆదర్శంగా నిలవగలదు’ అని సాక్షి మలిక్ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన సాక్షి... 2023లో వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాతో కలిసి డబ్ల్యూఎఫ్ఐ అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై జరిగిన నిరసనల్లో పాల్గొంది.75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్తాష్కెంట్: ఆసియా అండర్–17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ లక్షయ్ ఫొగాట్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్ 5:0తో సెయుంగ్మిన్ లీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన నేళ్ల నరేంద్ర (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్లో నరేంద్ర 0:5తో నురాలియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, యశ్ 1:4తో ఉస్కుబాటర్ (మంగోలియా) చేతిలో, నివేశ్ 0:5తో అబ్దుల్బాసిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, నమన్ 2:3తో అబ్దుమజిదోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
శ్రమించి గెలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–23, 21–10తో ఎర్వియాన్సియా–మౌలానా (ఇండోనేసియా) జంటపై శ్రమించి గెలిచింది.64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి రెండు గేముల్లో గట్టిపోటీ ఎదుర్కొన్న భారత జోడీ నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గూన్టింగ్– హైకల్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. -
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్షిప్ సాధించిన అన్సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు. -
నేను పోరాటం కొనసాగిస్తా: వినేశ్
గోండా (ఉత్తరప్రదేశ్): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరింత తీవ్రమైంది. షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చే వరకు టోర్నిలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వరాదని డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయం తీసుకోగా... తాను పారిపోనని, పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది. నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నిలో భాగంగా మంగళవారం మహిళల విభాగంలో బౌట్లు జరగనున్న నేపథ్యంలో వినేశ్ టోర్నీ జరిగే వేదిక వద్దకు వచ్చింది. టోర్నిలో పాల్గొనడంపై ఆమె ఇచ్చిన సంబంధిత డాక్యుమెంట్లను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. సమీపంలో ఆమె ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వామప్ ఏరియా గదికి తాళం కూడా వేశారు. తాను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ రెజ్లింగ్లోకి అడుగుపెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ ప్రయత్నిస్తోందని, రిటైర్ కావాలనే విధంగా కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వినేశ్ ఆరోపించింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని ఆమె స్పష్టం చేసింది. -
వివాన్–నీరూ జోడీకి కాంస్యం
అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్గన్ షూటింగ్ టోర్నమెంట్ను భారత జట్టు ఏకైక కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వివాన్ కపూర్–నీరూ ద్వయం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో వివాన్–నీరూ జంట 24 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. యాంగ్ కున్ పి–లియు వాన్ యు (చైనీస్ తైపీ) జోడీ 36 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెలిచింది. 33 పాయింట్లతో మౌరో డె ఫిలిపిస్–మరియా స్టాంకో సిల్వానా (ఇటలీ) జంట రజత పతకాన్ని కైవసం చేసుకుంది. -
మన బాణం బంగారం
షాంఘై (చైనా): ఐదేళ్ల నిరీక్షణకు భారత మహిళల ఆర్చరీ జట్టు తెరదించింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో మహిళల టీమ్ రికర్వ్ విభాగంలో టీమిండియా భారత జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా నాలుగు ఒలింపిక్స్లో పోటీపడ్డ ప్రపంచ మాజీ నంబర్వన్ దీపిక కుమారి, అంకిత, కుంకుమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–4 (54–53, 52–55, 56–57, 54–53, 28–26) సెట్ పాయింట్లతో జు జింగీ, యు కి, హువాంగ్ యువెలతో కూడిన ఆతిథ్య చైనా జట్టును ఓడించింది. తొలి సెట్ను నెగ్గిన భారత్ 2–0తో ముందంజ వేయగా... రెండో సెట్ను గెలిచి చైనా స్కోరును 2–2తో సమం చేసింది. మూడో సెట్ను కోల్పోయి 2–4తో వెనుకబడ్డ భారత్ నాలుగో సెట్ను సొంతం చేసుకొని స్కోరును 4–4తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించారు. భారత బృందం 28 పాయింట్లు స్కోరు చేయగా... చైనా 26 పాయింట్లకే పరిమితమైంది. దాంతో 2021 తర్వాత భారత మహిళల రికర్వ్ జట్టు ప్రపంచకప్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. చివరిసారి 2021లో దీపిక కుమారి, కోమలిక, అంకితలతో కూడిన భారత జట్టు గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో, పారిస్లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో పసిడి పతకాలు గెలిచింది. మరోవైపు మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ సిమ్రన్జీత్ కౌర్ కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. సెమీఫైనల్లో సిమ్రన్జీత్ 0–6 ( 25–26, 24–29, 26–28)సెట్ పాయింట్లతో కాంగ్ చెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అనంతరం కాంస్య పతక మ్యాచ్లో సిమ్రన్జీత్ 4–6 (29–27, 27–29, 28–28, 28–29, 28–28) సెట్ పాయింట్లతో జాంగ్ మిన్హీ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు, స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ టర్కిలోని అంటాల్యా నగరంలో జూన్ 9 నుంచి 14 వరకు జరుగుతుంది. -
ఫైనల్లో 8 మంది బాక్సర్లు
తాష్కెంట్: ఆసియా అండర్–15 బాక్సింగ్ చాంపియన్షిప్ (బాలికల విభాగం)లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. దాంతో వేర్వేరు కేటగిరీల్లో కనీసం 8 రజతాలు భారత్కు ఖాయమయ్యాయి. అక్షిత (33 కేజీలు), అన్జీ (37 కేజీ), సోనియా (40 కేజీలు), తాన్వి (43 కేజీలు), హన్షిక (46 కేజీలు), సునైనా (58 కేజీలు), భూమిక (61 కేజీలు), తాన్వి (64 కేజీల విభాగం) తమ సెమీ ఫైనల్ బౌట్లలో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. ఇతర భారత బాక్సర్లలో జియా (35 కేజీలు), ఖుషీ రాణా (49 కేజీలు), కనిష్క (52 కేజీలు), ఆష్వి (67 కేజీలు), మాన్వి (70+ కేజీలు) సెమీ ఫైనల్ బౌట్లలో పరాజయం పాలయ్యారు. -
గుకేశ్కు ఆరో స్థానం
వార్సా (పోలండ్): సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ను భారత ఆటగాడు గుకేశ్ దొమ్మరాజు ఆరో స్థానంతో ముగించాడు. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ కలిపి అతను మొత్తం 17 పాయింట్లు సాధించాడు. ర్యాపిడ్ విభాగంలో 9 పాయింట్లు సాధించిన గుకేశ్ బ్లిట్జ్లో 8 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగాడు. ఈ టోర్నమెంట్లో అమెరికాకు చెందిన హన్స్ నీమన్ విజేతగా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో కలిపి మొత్తం 22.5 పాయింట్లు సాధించిన నీమన్ 50 వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకున్నాడు. శనివారం 9 బ్లిట్జ్ రౌండ్లలో బరిలోకి దిగిన గుకేశ్... 3 రౌండ్లలో గెలవగా, 4 రౌండ్లలో ఓటమిని ఎదుర్కొన్నాడు. మరో 2 రౌండ్లు డ్రాగా ముగిశాయి. వెస్లీ సో (అమెరికా), నీమన్ (అమెరికా), జాన్ డ్యూడా (పోలండ్)లపై విజయం సాధించిన గుకేశ్...అలీరెజా ఫిరోజ్ (ఫ్రాన్స్), వ్లదీమర్ ఫెడోసీవ్ (రష్యా), ఫాబియో కరువానా (అమెరికా), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతుల్లో పరాజయంపాలయ్యాడు. వొటాజెక్ (పోలండ్), మ్యాగ్జిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)లతో అతని ఆట సమంగా ముగిసింది. 16వ రౌండ్లో గుకేశ్ చేతిలో ఓడినా... కోలుకొని చివరకు నీమన్ చాంపియన్గా నిలవడం విశేషం. -
సాహిల్ జాదవ్కు కాంస్యం
షాంఘై (చైనా): ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆటగాడు సాహిల్ జాదవ్ కాంస్యంతో మెరిశాడు. శనివారం పురుషుల కాంపౌండ్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాదవ్ 147–144 స్కోరుతో మార్టీన్ డామ్సో (డెన్మార్క్)పై విజయం సాధించాడు. కాంపౌండ్లో భారత్కు లభించిన పతకం ఇదొక్కటే కావడం విశేషం. 25 ఏళ్ల సాహిల్ ప్రస్తుత వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ చాంపియన్ కూడా. డామ్సోతో జరిగిన మ్యాచ్లో తొలి ఎండ్లో 29–30తో వెనుకబడిన సాహిల్, రెండో ఎండ్లో 27–30తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత 29–28, 30–29తో భారత ఆర్చర్ ముందంజ వేయగా... అప్పటికే నాలుగు పాయింట్లు వెనుకబడిన డామ్సో చివరి ఎండ్ను 30–29తో ముగించినా లాభం లేకపోయింది. జాదవ్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో జాదవ్ 146–147 స్కోరుతో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ నికోలస్ గిరార్డ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయంపాలయ్యాడు. నేడు జరిగే మహిళల రికర్వ్ ఫైనల్ (టీమ్ ఈవెంట్)లో చైనాతో భారత్ తలపడనుండగా... వ్యక్తిగత విభాగంలో సిమ్రన్జిత్ కౌర్ సెమీఫైనల్ బరిలోకి దిగుతుంది. -
వినేశ్ ఫొగాట్కు డబ్ల్యూఎఫ్ఐ షోకాజ్
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని అంతర్జాతీయ రెజ్లింగ్ బరిలోకి దిగాలని భావిస్తున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాక్ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘనవంటి ఆరోపణలతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పైగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పునరాగమనానికి అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం ఆమె పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 26 వరకు వినేశ్ దేశవాళీ పోటీల్లో కూడా బరిలోకి దిగే అవకాశం లేదు. నేటి నుంచి గోండాలో జరిగే జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొని ఆసియా క్రీడల కోసం సన్నద్ధం కావాలని వినేశ్ భావించింది. పారిస్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా వినేశ్ ప్రవర్తన ‘రెజ్లింగ్కు చెడ్డపేరు తెచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ ఆరోపించింది. గతంలో డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్...ఇటీవల మరోసారి విమర్శలు చేయడంతోనే ఆమెపై చర్యకు డబ్ల్యూఎఫ్ఐ ఉపక్రమించింది. -
స్విమ్మింగ్లో చరిత్ర సృష్టించిన బెంగళూరు టెకీ దంపతులు
బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు దనిష్ అబ్డి, వృశాలీ ప్రసాదే స్విమ్మంగ్లో అరుదైన సాహసం చేసి చరిత్ర సృష్టించారు. వీరు శ్రీలంక నుంచి భారత్ వరకు సముద్ర మార్గంలో ఈదుతూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రామసేతు మార్గం గండా ఈ ఫీట్ సాధించడం విశేషం.దనిష్-వృశాలీ జంట శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ప్రయాణం ప్రారంభించి, తమిళనాడులోని ధనుష్కోడి వద్ద ముగించారు. ఇండియన్ ఓషియన్లో అలలు, బలమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ వారు 10 గంటల 45 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.బెంగళూరు నివాసులైన డానిష్ అబ్ది మరియు వృషాలి ప్రసాద్, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదారు.#SriLanka #Dhanushkodi #UANow pic.twitter.com/NylspcpXNi— UttarandhraNow (@UttarandhraNow) May 8, 2026ఈ ప్రయాణంలో కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది, ఎస్కార్ట్ బోట్లు వారికి సహకరించాయి. సముద్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఫీట్ను సాధించికా దనిష్-వృశాలీ జంట సోషల్మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. శ్రీలంక నుంచి భారత్ వరకు విజయవంతంగా ఈదాం. ఇది చాలా కఠినమైన ప్రయాణం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్గా మారగా, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దనిష్-వృశాలీ దంపతులు గతంలో కూడా సముద్ర ఈత పోటీల్లో పాల్గొన్నారు. అయితే కలిసి చేసిన తొలి భారీ ఓపెన్ వాటర్ స్విమ్ ఇది. భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా కూడా ఈ సాహసాన్ని వారు చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఫైనల్లో చైనాతో ఢీ.. చరిత్రకు అడుగు దూరంలో
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత మహిళల రికర్వ్ జట్టు పెను సంచలనం సృష్టించింది. దీపిక కుమారి, అంకిత, కుంకుమ్లతో కూడిన భారత జట్టు 10 సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత దక్షిణ కొరియా జట్టును బోల్తా కొట్టించింది. షాంఘై వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత బృందం 5–1 సెట్ల (58–55, 56–56, 58–56) స్కోరుతో లీ యున్జీ, ఒ యెజిన్, కాంగ్ చెయంగ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి రౌండ్లో భారత్ 6–2 సెట్ల (53–56, 57–54, 55–54, 55–51) స్కోరుతో ఉజ్బెకిస్తాన్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 5–4 సెట్ల (53–54, 54–49, 58–56, 55–56, 28–25) స్కోరుతో వియత్నాం జట్టుపై విజయం సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్లో మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్ను ప్రవేశ పెట్టారు. 1988 సియోల్ నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు జరిగిన 10 విశ్వ క్రీడల్లో మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియా జట్టే స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.మరోవైపు.. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, యశ్దీప్లతో కూడిన భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 2–6 సెట్ల (52–55, 54–54, 53–53, 53–57) స్కోరుతో అబ్దుర్ రెహమాన్, రామకృష్ణ సాహా, మిషాద్లతో కూడిన బంగ్లాదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్ మూడో రౌండ్ చేరుకున్నారు. -
‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’
బ్యాడ్మింటన్లో థామస్ కప్కు ఉండే ప్రత్యేకత వేరు. చైనా, మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటకు ఉన్న క్రేజ్ కూడా వేరు. భారత్లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ జోడి చిరాగ్-సాత్విక్ జోడి బ్యాడ్మింటన్లో అంచనాలు అందుకుంటూ పతకాలు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా భారత్లో క్రికెట్ను మినహాయించి ఏ క్రీడను అంతగా పట్టించుకోరన్నది చాలాసార్లు రుజువైంది. తాజాగా జర్మనీ వేదికగా జరిగిన థామస్ కప్లో భారత పురుషుల బృందం కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే థామస్ కప్లో పతకం సాధించి భారత్కు తిరిగి వస్తే తమను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ భారత ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ ఎయిర్పోర్టులో భారతీయులు ఉన్నా కూడా తమ దగ్గరకు రాలేదని, ఇక భారత్లో అయితే కనీసం తమ ముఖాలు కూడా చూడలేదని డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ బాధను వ్యక్తం చేశాడు. దేశానికి పతకాలు సాధించినా తమకు తగిన గుర్తింపు లేకపోవడం షట్లర్లుగా తమకు నిరాశ కలిగించిందన్నాడు. ఇలాంటి అవమానాలతో భారత్లో బ్యాడ్మింటన్ వంటి క్రీడను వృత్తి పరంగా కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపాడు. సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. ‘జర్మనీ నుంచి ఏడు గంటల పాటు విమాన ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాం. మేము జర్మనీ ఎయిర్పోర్టులో ఉన్నప్పుడు మా కాంస్య పతకాలు చూసిన కొందరు.. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగలేదు. అందులో భారతీయులతో పాటు చాలా మంది తెలుగువాళ్లు కూడా ఉన్నారు. మేమంతా థామస్ కప్ జెర్సీలు ధరించి ఉన్నప్పటికీ, వాళ్లంతా ఐపీఎల్, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 2022లో ఇదే థామస్ కప్లో స్వర్ణం సాదించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘనతలు సాధించినప్పుడు సంబరాలు చేసుకోవాలి. ఇలాంటి అవకాశాలు తరచూ రావని మన అభిమానులకు తెలియడం లేదు. థామస్ కప్ గెలవడం చాలా కష్టం, పతకాలు సాధించడం కూడా కష్టతరం. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత ప్రణయ్, శ్రీకాంత్, ధ్రువ్ క్యాబ్లు బుక్ చేసుకోవడం చూశాను. అభినందించడానికి ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేదు. నా స్నేహితులు నన్ను పిక్ చేసుకునేందుకు వచ్చారు. కానీ ఎయిర్పోర్ట్లో నా సహచర ఆటగాళ్లు క్యాబ్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించడం బాధగా అనిపించింది. టోర్నీల్లో బరిలోకి దిగి గాయపడితే.. మన బదులు ఆడేందుకు ఎవరూ ఉండరు. టీమ్ ఈవెంట్స్లోనూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. బయట నుంచి పెద్దగా సపోర్ట్ లేకుండా ఆడతాం. పతకాలు గెలిచినా సరిపోవడం లేదు. ఓ సందర్భంలో ప్రణయ్తో.. 'ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపులేదు. నేను నా పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వను' అని చెప్పా. మానసికంగా దృఢంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే మనం ఎంత ప్రదర్శన చేసినా గుర్తించకపోతే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ అకాడమీలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం వరకే ఆశిస్తున్నాం’అని సాత్విక్ బాధాతప్త హృదయంతో వెల్లడించాడు.చదవండి: పాక్తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు! -
పాక్తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు!
పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లకు సంబంధించి భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడేది లేదని క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. అయితే భారత్లో జరిగే మల్టీ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్య, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సంయుక్తంగా సర్క్యులర్ విడుదల చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్తో పాటు 2036 ఒలింపిక్స్ను నిర్వహణకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ క్రీడా మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిపింది. అయితే పాకిస్తాన్తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఐసీసీ, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్తో తలపడుతుందని క్రీడాశాఖ పునరుద్ఘాటించింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్తో పాకిస్తాన్తో ప్రస్తుతం ఉన్న క్రీడా విధానం యథాతథంగా కొనసాగనుంది. దీంతో సమీప భవిష్యత్తులో అటు భారత్లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ సహా ఇతర క్రీడా సిరీస్లు జరగవు. అయితే పాకిస్తాన్ అథ్లెట్లకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందని, ఎందుకంటే వారి వ్యక్తిగత కెరీర్ను దెబ్బతీసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని పేర్కొంది. భారత్లో జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడానకి అవకాశమిస్తామని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. గతేడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్లు తలపడుతున్నాయి. చివరగా 2026 టీ20 ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్ ఆడిన భారత్ ఘన విజయాన్ని సాధించింది.చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు! -
క్వాలిఫయింగ్ టాప్–10లో భారత ఆర్చరీ జట్లు
షాంఘై: ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు రాణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ మాజీ చాంపియన్ అదితి స్వామి, ప్రగతిలతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్లో 2092 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచింది. అదితి 700 పాయింట్లతో 13వ స్థానంలో, ప్రగతి 697 పాయింట్లతో 19వ స్థానంలో, జ్యోతి సురేఖ 695 పాయింట్లతో 21వ స్థానంలో, మధుర 690 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచారు.జట్టు స్థానాన్ని ఖరారు చేసేందుకు ఆయా దేశాల టాప్–3 క్రీడాకారిణుల స్కోర్లను లెక్కలోకి తీసుకుంటారు. మెక్సికోలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నిలో జ్యోతి సురేఖ బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్ ఓజస్ దేవ్తలే, సాహిల్, కుశాల్లతో కూడిన భారత పురుషుల కాంపౌడ్ జట్టు క్వాలిఫయింగ్లో 2130 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో జర్మనీ తో ఆడుతుంది. భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలి రౌండ్లో సింగపూర్ జట్టును ఢీ కొంటుంది. -
బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్!
మహిళల ప్రపంచ నంబర్వన్, స్టార్ క్రీడాకారిణి అరీనా సబలెంకా బెదిరింపులకు దిగింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో తమకు ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వకపోతే ఆ టోర్నీలను ఆటగాళ్లు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ప్రైజ్మనీ విషయంలో ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్.. 'ప్రైజ్మనీ విషయంలో పూర్తి నిరాశతో ఉన్నా' అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిన్నర్కు సబలెంకా మద్దతుగా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఆటగాళ్లకు ఆదాయంలో వాటా పెరగకపోతే మేము గ్రాండ్స్లామ్ టోర్నీలను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆటగాళ్లు అందుకున్న షేర్కు, చూపెడుతున్న లెక్కలకు సంబంధం ఉండడం లేదు. అందుకే ఆటగాళ్లకు పక్కగా ఆదాయంలో ఎక్కువ వాటాను ఇవ్వాలి. ఒకవేళ మేము బహిష్కరిస్తే టోర్నీలు జరగకపోవచ్చు. అదే జరిగితే మా నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు మిస్ అవుతారు. కనీసం మాతో చర్చలు జరిపి ఆటగాళ్లు సంతోషపడే విధంగా ఆదాయంలో వాటా విషయమై ఒక ముగింపు ఇస్తారని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఓపెన్ ప్రైజ్మనీపై అగ్రశ్రేణి ఆటగాళ్లు జానిక్ సిన్నర్, కోకో గాఫ్, స్వియాటెక్, జొకోవిచ్, జ్వెరెవ్, మెద్వెదెవ్ సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్రైజ్మనీ సుమారు పది శాతం మేర పెరిగి 61.7 యూరో మిలియన్లకు చేరుకుందని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఆటగాళ్లు మాత్రం ఫ్రెంచ్ ఓపెన్లో ఆటగాళ్లకు ఆదాయంలో అందించే వాటా 15.5 నుంచి 14.9 శాతానికి తగ్గిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ సీజన్లో తొలి గ్రాండ్స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ మే 18 నుంచి జూన్ 7 వరకు జరగనుంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్! -
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్
వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.మే 1న యూరప్లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కాగా మిలింద్ సోమన్ ఫిట్నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్. సోమన్ తాజాగా తన ఫిట్నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.ఇక సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో తన నటనతో మొప్పించారు.At 60, most people slow down. Milind Soman chose to cross continents.On May 1, he swam 15 km across the Strait of Gibraltar, from Tarifa in Europe to the coast of Morocco in Africa.Calling the experience “beautiful,” he reminded the world that endurance isn’t about age, it’s… pic.twitter.com/Icx6mRgJFr— The Better India (@thebetterindia) May 5, 2026 -
ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్’
ఫ్లోరిడా: ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు టీనేజ్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి ‘హ్యాట్రిక్’ విజయం అందుకున్నాడు. సీజన్లోని నాలుగో రేసు మయామి గ్రాండ్ప్రిలో ఇటలీకి చెందిన 19 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణిత 57 ల్యాప్ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఆంటోనెల్లి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 33 నిమిషాల 19.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానాన్ని పొందాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో నలుగురు రేసును పూర్తి చేయలేకపోయారు. సీజన్ తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్కే చెందిన జార్జి రసెల్ విజేతగా నిలువగా... తర్వాతి మూడు రేసుల్లో (చైనా, జపాన్, మయామి) ఆంటోనెల్లికి టైటిల్ దక్కింది. ఫార్ములావన్ చరిత్రలో తన కెరీర్లోని తొలి మూడు పోల్ పొజిషన్ల నుంచి మూడు రేసుల్లోనూ గెలిచిన తొలి డ్రైవర్గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్ప్రి ఈనెల 24న జరుగుతుంది. 22 రేసుల ఈ సీజన్లో నాలుగు రేసులు ముగిశాక ఆంటోనెల్లి 100 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా జట్టు 12వసారి విజేతగా నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనా 3–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ షి యుకీ 85 నిమిషాల్లో 21–16, 16–21, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ను ఓడించి చైనాకు 1–0 ఆధిక్యం అందించాడు.రెండో మ్యాచ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ షి ఫెంగ్ 43 నిమిషాల్లో 13–21, 10–21తో ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లానియర్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. 96 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మూడో మ్యాచ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ 22–20, 20–22, 21–19తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్లో హీ జి టింగ్–రెన్ జియాంగ్ యు ద్వయం 38 నిమిషాల్లో 21–13, 21–16తో ఎలోయ్ ఆడమ్–లియో రోసీ జోడీని ఓడించి చైనాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన భారత్, డెన్మార్క్ జట్లకు కాంస్య పతకాలు లభించాయి.12: థామస్ కప్ టైటిల్ను చైనా జట్టు ఇప్పటి వరకు 12 సార్లు గెల్చుకుంది. 1982, 1986, 1988, 1990, 2004, 2006, 2008, 2010, 2012, 2018, 2024, 2026లలో చైనా టైటిల్స్ సాధించింది. అత్యధిక సార్లు థామస్ కప్ నెగ్గిన జట్టుగా ఇండోనేసియా (14 సార్లు) అగ్రస్థానంలో ఉంది. మలేసియా (5 సార్లు) మూడో స్థానంలో ఉంది. భారత్, డెన్మార్క్, జపాన్ ఒక్కోసారి థామస్ కప్ టైటిల్ను సాధించాయి. -
చరిత్ర సృష్టించాడు!
మాడ్రిడ్: పురుషుల టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ అద్భుతం చేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించాడు. గ్రాండ్స్లామ్ తర్వాత అగ్రశ్రేణి టోర్నీలుగా పరిగణించే ‘మాస్టర్స్’ సిరీస్లో సినెర్ వరుసగా ఐదో టైటిల్ గెలిచాడు. ఆదివారం ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ విజేతగా నిలిచాడు. ప్రపంచ 3వ ర్యాంకర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో సినెర్ 6–1, 6–2తో అలవోకగా విజయం సాధించాడు.తద్వారా 36 ఏళ్ల చరిత్ర కలిగిన మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా ఐదు టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో మూడుసార్లు జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఒకసారి వరుసగా నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించారు. గత ఏడాది పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన సినెర్... ఈ ఏడాది మోంటెకార్లో, మయామి, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. చాంపియన్ సినెర్కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 21 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చైనాకు కొరియా షాక్
హోర్సెన్స్ (డెన్మార్క్): నాలుగేళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ లో దక్షిణ కొరియా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియా 3–1తో 16 సార్లు చాంపియన్ చైనా జట్టును బోల్తా కొట్టించి మూడోసారి ఉబెర్ కప్ను సొంతం చేసుకుంది. 2010, 2022లలో కూడా చైనా జట్టునే ఓడించి దక్షిణ కొరియా జట్టు ఉబెర్ కప్ను దక్కించుకుంది. పదోసారి చైనా జట్టుతో టైటిల్ పోరులో తలపడ్డ కొరియా ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్, ఒలింపిక్ చాంపియన్ ఆన్ సె యంగ్ 21–10, 21–13తో ప్రపంచ 2వ ర్యాంకర్ వాంగ్ జి యిపై 20వ సారి గెలిచి కొరియాకు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ 21–15, 21–12తో జియోంగ్ నా యున్–లీ సో హీ జంటపై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ కిమ్ గా యున్ 21–19, 21–15తో ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యు ఫెను ఓడించి కొరియాకు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్లో ప్రపంచ 170వ ర్యాంక్ జోడీ 16–21, 21–10, 21–13తో ప్రపంచ 4వ ర్యాంక్ ద్వయం జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్ను కంగుతినిపించి కొరియాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన ఇండోనేసియా, జపాన్ జట్లకు కాంస్య పతకాలు లభించాయి. -
కాంస్యంతో సరి.. సెమీస్లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్తో జరిగిన ఈ పోరులో 0–3తో వరుస సింగిల్స్ మ్యాచ్లలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి సింగిల్స్ మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 11–21, 9–21 స్కోరుతో క్రిస్టో పొపోవ్ చేతిలో ఓడిపోయాడు. 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. 16–21, 18–21తో వరుస గేమ్లలో అలెక్స్ లేనియర్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ కూడా 41 నిమిషాల్లో ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్లో కూడా హెచ్ఎస్ ప్రణయ్ నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్లో టోమా జూనియర్ పొపోవ్ 21–19, 21–16తో ప్రణయ్ను 48 నిమిషాల్లో చిత్తు చేశాడు. సెమీస్లో ఓటమితో భారత్ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఫలితం తేలిపోవడంతో తర్వాతి రెండు డబుల్స్ మ్యాచ్ల అవసరం రాలేదు. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్ ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’ -
చరిత్రకు చేరువలో...
మాడ్రిడ్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇటలీ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ కొత్త చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాడు. వరుసగా ఐదు మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పేందుకు సినెర్ సిద్ధమయ్యాడు. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో టాప్ సీడ్ సినెర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో సినెర్ 6–2, 6–4తో ఆర్థర్ ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. సినెర్ కెరీర్లో ఇది 350వ విజయం కావడం విశేషం. 86 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ నాలుగు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సరీ్వస్లో 21 పాయింట్లు, రెండో సర్వీస్లో 15 పాయింట్లు సాధించాడు. తన సరీ్వస్ను ఒక్కసారి కూడా కోల్పోని సినెర్ ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్ తలపడతాడు. గత ఏడాది పారిస్ ఓపెన్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన సినెర్... ఈ ఏడాది ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్, మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లోనూ విజేతగా నిలిచాడు. మాడ్రిడ్ ఓపెన్లో ఫైనల్కు చేరడం ద్వారా... ఏటీపీ సర్క్యూట్లోని తొమ్మిది మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో ఫైనల్ చేరిన నాలుగో ప్లేయర్గా, అతి పిన్న వయస్కుడిగా 24 ఏళ్ల సినెర్ గుర్తింపు పొందాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
నిషికొరి వీడ్కోలు
టోక్యో: పురుషుల టెన్నిస్లో ఆసియా అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న జపాన్ ప్లేయర్ కి నిషికొరి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్కు గుడ్బై చెప్పనున్నానని తెలిపాడు. 36 ఏళ్ల నిషికొరి 2014లో యూఎస్ ఓపెన్ ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. తద్వారా గ్రాండ్స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన తొలి ఆసియా ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2007లో ప్రొఫెషనల్గా మారిన నిషికొరి 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక మ్యాచ్లో అతను స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ను మూడు సెట్లలో ఓడించాడు. 2017లో కెరీర్ బెస్ట్ 4వ ర్యాంక్ అందుకున్న నిషికొరి ఆ్రస్టేలియన్ ఓపెన్లో నాలుగుసార్లు (2012, 2015, 2016, 2019)... ఫ్రెంచ్ ఓపెన్లో మూడుసార్లు (2015, 2017, 2019)... వింబుల్డన్ టోరీ్నలో రెండుసార్లు (2018, 2019) క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. కెరీర్ మొత్తంలో 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నిషికొరి 451 మ్యాచ్ల్లో గెలిచి, 231 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 2019లో చివరిసారి బ్రిస్బేన్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన నిషికొరి ఆ తర్వాత మరో టోరీ్నలో విజేతగా నిలువలేదు. భుజం గాయంతో బాధపడుతున్న నిషికొరి గత ఏడాది యూఎస్ ఓపెన్లో, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ ఆడలేదు. ప్రస్తుతం 464వ ర్యాంక్లో ఉన్న ఈ జపాన్ ప్లేయర్ చాలెంజర్ టోరీ్నల్లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఐదు చాలెంజర్ టోరీ్నల్లో పోటీపడ్డ నిషికొరి ఒక్క దాంట్లోనూ కనీసం క్వార్టర్ ఫైనల్ చేరలేకపోయాడు. -
అదరగొట్టిన భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): తమదైన రోజున సహజశైలిలో చెలరేగితే... ప్రత్యర్థి జట్టులో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా... అద్భుత ఫలితం సాధించవచ్చని భారత షట్లర్లు నిరూపించారు. ప్రతిష్టాత్మక థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నిలో తమ అసాధారణ ప్రదర్శనతో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్కు చేరుకున్న భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. జపాన్, ఫ్రాన్స్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో భారత జట్టు తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో చైనా 3–0తో మలేసియాపై గెలిచింది. థాయ్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో చైనా ఆడుతుంది. 2022లో తొలిసారి థామస్కప్ చాంపియన్గా అవతరించిన భారత జట్టు 2024లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. 2 మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని... చైనీస్ తైపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో తొలి మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 88 నిమిషాల్లో 18–21, 22–20, 21–17తో ప్రపంచ 6వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ను ఓడించాడు. ఈ పోరులో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని లక్ష్య సేన్ నెగ్గడం విశేషం. తొలి గేమ్ కోల్పోయిన లక్ష్య సేన్ రెండో గేమ్లో 18–20తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. ఈ దశలో సంయమనం కోల్పోకుండా ఆడిన లక్ష్య సేన్ వరుసగా 4 పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్ను గెలిచి మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో లక్ష్య సేన్ 10–6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. రెండో మ్యాచ్లో ప్రపంచ 4వ ర్యాంక్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 19–21, 21–12తో ప్రపంచ 14వ ర్యాంక్ జంట చియు సియాంగ్ చెయి–వాంగ్ చి లిన్పై గెలిచి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్లో ఆసియా చాంపియన్షిప్ రన్నరప్, ప్రపంచ 18వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 48 నిమిషాల్లో 21–16, 21–17తో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 8వ ర్యాంకర్ లిన్ చున్ యిని బోల్తా కొట్టించి భారత్కు సెమీఫైనల్ బెర్త్ను అందించాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్లు నిర్వహించలేదు. -
సెమీఫైనల్లో తొలిసారి ‘లక్కీ లూజర్’
మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–1000 టోర్నీల్లో ఇప్పటి వరకు చోటు చేసుకోని అద్భుతం మాడ్రిడ్ ఓపెన్లో నిజమైంది. ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ఆస్ట్రియా ప్లేయర్ అనస్తాసియా పొటపోవా ఏకంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా 1990 నుంచి జరుగుతోన్న డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీల్లో సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకున్న తొలి ‘లక్కీ లూజర్’గా పొటపోవా గుర్తింపు పొందింది.మాడ్రిడ్లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 56వ ర్యాంకర్ పొటపోవా 6–1, 6–7 (4/7), 6–3తో ప్రపంచ మాజీ నంబర్వన్, 2016 యూఎస్ ఓపెన్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించింది. ‘లక్కీ లూజర్’ ఎవరంటే... ఏదైనా టోర్నీ మెయిన్ ‘డ్రా’ ఖరారయ్యాక అందులోని ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలుగుతారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ఓడిపోయిన అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్లకు ‘లక్కీ లూజర్స్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పిస్తారు.మాడ్రిడ్ ఓపెన్లో పొటపోవాకు ఈ అనుభవమే ఎదురైంది. రష్యాలో జన్మించి ప్రస్తుతం ఆస్ట్రియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొటపోవా ఈ టోర్నీ సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ఓడిపోయింది. ఫలితంగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది.అయితే మెయిన్ ‘డ్రా’లో చోటు పొందిన నలుగురు ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలిగారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లలో ఓడిపోయిన నలుగురు అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్లకు మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. పొటపోవాతోపాటు పన్నా ఉడ్వార్డి (హంగేరి), అన్నా బ్లింకోవా (రష్యా), యులియా (ఉక్రెయిన్)లకు ‘లక్కీ లూజర్స్’గా మెయిన్ ‘డ్రా’లో చోటు కల్పించారు. ఉడ్వార్డి, బ్లింకోవా రెండో రౌండ్లో ఓడిపోగా... యులియా తొలి రౌండ్లో వెనుదిరిగింది. పొటపోవా మాత్రం ఒక్కో రౌండ్ను దాటుకుంటూ సెమీఫైనల్కు దూసుకొచ్చింది. -
పట్టుదలే పెట్టుబడిగా...
విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో జూడో ఒకటి. జపాన్, ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, మంగోలియా దేశాలు ఈ క్రీడలో ఎంతోమంది ప్రపంచ చాంపియన్లను అందించాయి. భారత్ విషయానికొస్తే ప్రాతినిధ్యమే తప్ప పతకాల గురించి ఆలోచిస్తే అత్యాశే అవుతుంది. కానీ ప్రతిభావంతులకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఈ క్రీడలోనూ భారత ప్లేయర్లు మెరిపిస్తారని మణిపూర్ అమ్మాయి ఇనున్గన్బీ తఖెల్లంబం నిరూపించింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా సీనియర్ జూడో చాంపియన్షిప్లో ఇనున్గన్బీ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్కు కాంస్యం రూపంలో పతకాన్ని అందించింది.భారత్ నుంచి చివరిసారి అనితా చాను రూపంలో ఆసియా జూడో చాంపియన్షిప్ మెడలిస్ట్ను చూశాము. 2013లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె కూడా కాంస్య పతకం సాధించింది. 13 ఏళ్ల తర్వాత అనితా చాను కోచ్ హోదాలో హాజరైన ఆసియా చాంపియన్షిప్లో భారత్కు మళ్లీ పతకం లభించింది. మహిళల 70 కేజీల విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇనున్గన్బీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. కాంస్య పతక పోరులో మంగోలియా జూడోకాపై ఇనున్గన్బీ నెగ్గింది. ఇక ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని మణిపూర్కు చెందిన 27 ఏళ్ల ఇనున్గన్బీ వెల్లడించింది. చాన్నాళ్లుగా జాతీయ జట్టు బ్లేజర్ వెంట తీసుకెళ్తున్న అనిత ఎట్టకేలకు ఈ టోర్నీలో తొలిసారి దానిని ధరించింది. ‘కోచ్ అనిత మొదటి టోర్నీ నుంచి బ్లేజర్ వెంట పెట్టుకొని వస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దాన్ని వేసుకునే సందర్భం రాలేదు. ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఆమె నన్ను అడిగారు. ఈ సారైనా బ్లేజర్ వేసుకోనిస్తావా అని. నేను అప్పుడే చెప్పా తప్పకుండా అని. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత నేను కాంస్యం సాధించడం ద్వారా పతక ప్రదానోత్సవం సందర్భంగా ఆమె బ్లేజర్ వేసుకున్నారు’ అని వెల్లడించింది. జూడోలో సాధారణంగా కోచ్లు ట్రాక్ సూట్లే ధరిస్తారు. పతక ప్రదానోత్సవంలో బ్లేజర్ వేసుకుంటారు. ‘భారత్ తరఫున చివరిసారిగా అనిత మేడమ్ ఈ పతకం నెగ్గారని నాకు తెలియదు. ఆమె 2013 కంటే చాలా ముందే మెడల్ గెలిచి ఉంటారని అనుకున్నా. ఆమె తర్వాత పతకం నెగ్గిన తొలి భారతీయురాలిని నేనే అని కోచ్లు చెప్పినప్పుడు నా ఆనందరం రెట్టింపు అయింది. 2021 నుంచి భారత సీనియర్ జట్టులో ఉన్నా. ఇప్పటి వరకు పాల్గొన్న ఏ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటి ముందుకు వెళ్లలేకపోయా. ఇది నా కెరీర్లోనే అతిపెద్ద విజయం. ఈ ఫలితం నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించింది’ అని ఇనున్గన్బీ చెప్పింది. గాయాల నుంచి కోలుకొని... దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, మేటి వెయిట్లిఫ్టర్ కుంజారాణి దేవి వంటి సూపర్స్టార్స్ వచ్చిన నేల మణిపూర్ నుంచే ఇనున్గన్బీ వెలుగులోకి వచి్చంది. ఇతర ప్లేయర్ల లాగే ఆమె కూడా కెరీర్ తొలి నాళ్లలో అనేక ఆటలు ప్రయత్నించి చివరకు జూడోను ఎంచుకుంది. ‘చిన్నప్పటి నుంచి కుంజారాణి దేవి, మేరీకోమ్ వంటి వారు సాధించిన ఘనతల గురించి చాలా విన్నాను. వాళ్లలాగే దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అనుకునేదాన్ని. వారి బాటలోనే క్రీడలను ఎంచుకోవాలని ముందే భావించా. ఫుట్బాల్ సహా చాలా ఆటలు ఆడా... కానీ జూడో నా దృష్టిని ఆకర్షించింది’ అని ఇనున్గన్బీ చెప్పింది. కెరీర్ ఆరంభంలో మణిపూర్లోని జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె... ఆ తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటింది. 2018లో ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా గాయపడిన ఇనున్గన్బీ... శస్త్రచికిత్స అనంతరం ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తిగా చిక్కిపోయింది. ‘నా శరీరం పెన్సిల్ లాగా అయిపోయింది’ అని ఒక సందర్భంలో ఈ మణిపూర్ జూడోకా తెలిపింది. ఆ తర్వాత 2024లో అదే కాలికి మరోసారి గాయం కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైంది. అయితే కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవడం అలవర్చుకున్న ఈ మణిపూర్ ముత్యం... ఆసియా జూడో చాంపియన్షిప్లో అది్వతీయ ప్రదర్శనతో చరిత్ర లిఖించింది. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ షిరిన్జోన్ యుల్డోషోవా చేతిలో ఇనుంగాన్బి పరాజయం పాలైంది. అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఫైనల్కు చేరడంతో... మన బాక్సర్కు రెపిచాజ్ అవకాశం దక్కింది. ‘క్వార్టర్లో ఓడి నిరాశగా ఉన్నప్పుడు మరో అవకాశం వచి్చంది. కాంస్య పతక పోరుకు ముందు ఈ చాన్స్ వదిలి పెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని ఇనున్గన్బీ వెల్లడించింది. ఫుట్బాల్ వద్దనడంతో... నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇనున్గన్బీకి బాక్సింగ్, రెజ్లింగ్లో కూడా ప్రవేశం ఉంది. తండ్రి ఫుట్బాల్ ఆడేందుకు నిరాకరించడంతో ఆమె తన దృష్టిని ఇండోర్ గేమ్స్ వైపు మరల్చుకుంది. రెజ్లింగ్ ప్రాక్టీస్ సమయంలో పక్కనే జూడో శిక్షణ సాగుతుంటే దాన్ని నిశితంగా పరిశీలించేంది. అందులో కొందరు ప్లేయర్లు నల్ల బెల్ట్లు, కొందరు తెల్ల బెల్ట్లు వేసుకునే వారు. అది ఆమెను బాగా ఆకర్షించింది. అందులోనూ తన ప్రత్యేకత చాటుకోవాలని భావించిన ఇనున్గన్బీ చివరకు జూడోలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. ఆరంభంలో నాలుగేళ్ల పాటు ప్రాథమిక దశను దాటలేకపోయిన ఇనున్గన్బీ... ఆ తర్వాత నిలకడ కనబర్చింది. తొలిసారి 2021 ఆసియా జూడో చాంపియన్షిప్లో పాల్గొన్న ఈ మణిపూర్ ప్లేయర్ మొదటి రౌండ్లోనే పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత గాయాలు వేధించినా... పట్టుదలే పెట్టుబడిగా పెట్టి... మొక్కవోని దీక్షతో ముందుకు సాగి... తాజాగా కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. గతేడాది జోర్డాన్లో జరిగిన ఆసియా ఓపెన్ జూడో పోటీల్లో ఇనున్గన్బీ పసిడి పతకం సాధించింది. ఈ జోరు ఇలాగే కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలనుకుంటున్న ఇనున్గన్బీకి మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం! –సాక్షి క్రీడా విభాగం -
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!
వాషింగ్టన్: రాబోయే ఫుట్బాల్ ప్రపంచ కప్లో అగ్రశ్రేణి ఆటగాళ్లు అనూహ్యంగా కీలక మ్యాచ్లకు దూరం కాకూడదని భావిస్తున్న అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) క్రమశిక్షణకు సంబంధించి పలు కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. ఆటగాళ్లకు ‘ఎల్లో’ కార్డులు జారీ చేయడం, దానికి సంబంధించి శిక్షను అమలు చేసే విషయంలో సడలింపు ఇచ్చింది. సాధారణంగా వరుసగా రెండు ఎల్లో కార్డులు జారీ అయితే ఆ ఆటగాడు తర్వాతి మ్యాచ్లో ఆడకుండా సస్పెన్షన్ విధిస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనన ప్రకారం టోరీ్నలో ఎల్లో కార్డుకు గురైనా సరే... నాకౌట్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. రెండుసార్లు ఎల్లో కార్డు రికార్డును అధికారులు తొలగిస్తారు. అంటే గ్రూప్ మ్యాచ్లలో ఎల్లో కార్డు అందుకున్నా... నాకౌట్కు ముందు దానిని పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా అతనిపై నిషేధం ఉండదు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా ఇదే తరహాలో గత రికార్డును పక్కన పెట్టి కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే ఒకవేళ క్వార్టర్ ఫైనల్లో రెండో ఎల్లో కార్డులను ఎదుర్కొన్నా అతను సెమీస్ ఆడటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కీలక మ్యాచ్లకు టాప్ ప్లేయర్లు దూరం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ‘ఫిఫా’ అభిప్రాయ పడింది. మరోవైపు కొందరు ఆటగాళ్లు తమ నోటిపై చేతిని అడ్డుగా పెట్టుకొని ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తున్నారు. దీనిని నివారించేందుకు కూడా ‘ఫిఫా’ కొత్త నిబంధన తెచి్చంది. ఇకపై ఇలా నోటికి చేతిని అడ్డుగా పెట్టి గొడవకు దిగితే అతనికి రిఫరీ ఏకంగా ‘రెడ్ కార్డు’ జారీ చేయవచ్చు. -
రికార్డు ‘బ్రేక్’
ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడానికే. అసాధ్యం అనుకున్న రికార్డులు సైతం అద్భుత ప్రదర్శన ముందు తలవంచాల్సిందే. ఇటీవల పురుషుల మారథాన్లో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావీ కూడా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతిష్టాత్మక లండన్ మారథాన్లో ఈ కెన్యా అథ్లెట్... 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటి వరకు మారథాన్ను రెండు గంటల లోపు ఎవరూ పూర్తి చేయలేకపోగా... ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్గా సెబాస్టియన్ సావీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వేర్వేరు క్రీడాంశాల్లో ఇలాంటి మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే... సాహో... సెబాస్టియన్ మారథాన్లో కెన్యా రన్నర్లకు తిరుగులేదని సెబాస్టియన్ సావీ మరోసారి నిరూపించాడు. ఈ నెల 26న లండన్ మారరథాన్లో అతడు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకొని రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన కెలి్వన్ కిప్టుమ్ 2 గంటల 35 సెకన్లలో మారథాన్ రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించగా... తాజాగా సెబాస్టియన్ దీన్ని సవరించాడు. భారత్ విషయానికి వస్తే... సావన్ భర్వాల్ ఇటీవల 48 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నెల 12 రోటెర్డామ్ మారథాన్ను సావన్ 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో దిగ్గజ అథ్లెట్ శివనాథ్ సింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. 1978లో శివనాథ్ సింగ్ 2 గంటల 12 నిమిషాల్లో గమ్యాన్ని చేరగా... ఇప్పుడు రెండు సెకన్ల తేడాతో సావన్ నేషనల్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 15సార్లు రికార్డు బద్దలు... పురుషుల పోల్వాల్ట్లో స్వీడన్కు చెందిన అర్మాండ్ డుప్లాంటిస్ రికార్డు స్థాయిలో ఏకంగా 15 సార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో ప్రస్తుతం 6.31 మీటర్ల ఎత్తు దూకి డుప్లాంటిస్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. 2020 నుంచి డుప్లాంటిస్ ఈ రికార్డును తిరగరాస్తూ వస్తున్నాడు. అయితే అంతకుముందు ఉక్రెయిన్కు చెందిన సెర్గీ బుబ్కా 1993లో నమోదు చేసిన రికార్డు (6.15 మీటర్లు) 21 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2014లో దాన్ని ఫ్రాన్స్కు చెందిన రెనాడ్ లావిలెనీ (6.16 మీటర్లు) బ్రేక్ చేయగా... ఆ తర్వాత నుంచి డుప్లాంటిస్ జోరు కొనసాగిస్తున్నాడు.41 ఏళ్ల తర్వాత... మహిళల 400 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్కు చెందిన ఫెమ్కే బోల్ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2023, ఫిబ్రవరి 19న జరిగిన పోటీల్లో బోల్ 400 మీటర్ల దూరాన్ని 49.26 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1982లో చెకోస్లోవేకియాకు చెందిన జర్మిలా క్రాటోచ్విలోవా 49.59 సెకన్లతో రికార్డు సృష్టించగా... నాలుగు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ అథ్లెట్ దీన్ని బద్దలు కొట్టింది.35 ఏళ్లుగా పదిలంగా... పురుషుల లాంగ్జంప్లో 23 ఏళ్లుగా నిలిచి ఉన్న ప్రపంచ రికార్డును అమెరికా అథ్లెట్ 1991లో బద్దలు కొట్టగా... అప్పటి నుంచి ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. అమెరికాకు చెందిన మైక్ పావెల్ 1991 ఆగస్టు 30న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 8.95 మీటర్ల దూరం దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముదు ఈ ఘనత అమెరికాకే చెందిన బాబ్ బీమన్ పేరిట ఉంది. బాబ్ 1968లో 8.90 మీటర్ల దూరం లంఘించాడు.కెన్యా అథ్లెట్లదే హవా...మహిళల మారథాన్లో బ్రిటన్ రన్నర్ పౌలా రాడ్క్లిఫ్ నెలకొల్పిన రికార్డు 16 ఏళ్ల పాటు పదిలంగా కొనసాగింది. 2003లో రాడ్క్లిఫ్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేయగా... 2019లో కెన్యా అథ్లెట్ బ్రిగిడ్ కొస్గెయ్ 2 గంటల 14 నిమిషాల 4 సెకన్లలో గమ్యాన్ని చేరి రికార్డు బ్రేక్ చేసింది. ఈ విభాగంలో ప్రస్తుతం కెన్యాకే చెందిన రుత్ చెప్గెటిచ్ (2 గంటల 9 నిమిషాల 56 సెకన్లు) పేరిట ఈ రికార్డు ఉంది. గ్యారీ సోబర్స్ పేరిట 36 ఏళ్లు... టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుదీర్ఘ కాలం వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ పేరిటే ఉంది. 1958లో పాకిస్తాన్తో మ్యాచ్లో సోబర్స్ 365 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత 1994లో ఈ రికార్డును విండీస్కే చెందిన బ్రియాన్ లారా ఇంగ్లండ్తో మ్యాచ్లో 375 పరుగులతో సవరించాడు. ఆ తర్వాత 2003లో ఆ్రస్టేలియా ప్లేయర్ మాథ్యూ హెడెన్ జింబాబ్వేపై 380 పరుగులతో లారా రికార్డును బ్రేక్ చేయగా... 2004లో లారా మరోసారి ఇంగ్లండ్పై 400 పరుగులు చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఘనత లారా పేరిటే కొనసాగుతోంది. → నాలుగేళ్ల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలుచుకుంది. 73 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత జట్టు థామస్ కప్ గెలవడం అదే మొదటిసారి. → ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఫైనల్కు చేరడం ద్వారా భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. చివరిసారిగా భారత్ నుంచి 1965లో దినేశ్ ఖన్నా ఈ టోర్నమెంట్లో ఫైనల్ ఆడారు. → భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 2023లో ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ విభాగంలో భారత్కు ఇదే తొలి పసిడి పతకం కాగా... ఓవరాల్గా 1965లో దినేశ్ ఖన్నా తర్వాత 58 ఏళ్లకు మరోసారి భారత్కు ఈ టోర్నమెంట్లో బంగారు పతకం లభించింది. → ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 2018 ఏప్రిల్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ అందుకున్నాడు. 1980లో మన దేశం నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ ఘనత సాధించగా... 38 ఏళ్ల తర్వాత శ్రీకాంత్ దానిని పునరావృతం చేశాడు. → 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా సాయిప్రణీత్ 36 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. 1983లో భారత్ నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ టోర్నమెంట్లో పతకం గెలిచాడు. సాయిప్రణీత్ తర్వాత భారత్ నుంచి 2021లో కిడాంబి శ్రీకాంత్ రజతం... లక్ష్య సేన్ కాంస్యం... 2023లో ప్రణయ్ కాంస్యం సాధించారు. → బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన తొలి భారత ప్లేయర్గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2019లో సింధు ఈ ఘనత అందుకుంది. వరుస ఒలింపిక్స్లో (2016లో రజతం; 2020లో కాంస్యం) పతకాలు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్గానూ సింధు చరిత్రకెక్కింది.మరికొన్ని... బ్యాడ్మింటన్లో ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. భారత్ తరఫున తొలిసారి ప్రకాశ్ పదుకోన్ 1980లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించగా... 21 ఏళ్ల తర్వాత పుల్లెల గోపీచంద్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత మరే భారత షట్లర్ ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో విజేతగా నిలవలేకపోయాడు. –సాక్షి క్రీడావిభాగం -
శభాష్ సౌరవ్
కార్లో (ఐర్లాండ్): భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి సంచలనం సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ (టైమ్ ఫార్మాట్)లో టైటిల్ సాధించాడు. బుధవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ కొఠారి 1133–477 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన 19 సార్లు ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీపై గెలుపొందాడు. నిరీ్ణత మూడు గంటలపాటు జరిగిన ఫైనల్లో సౌరవ్ ఏ దశలోనూ పంకజ్కు అవకాశం ఇవ్వలేదు. విజేతగా నిలిచిన సౌరవ్ కొఠారికి 5,000 డాలర్లు (రూ. 4 లక్షల 74 వేలు), రన్నరప్ పంకజ్కు 2,500 డాలర్లు (రూ. 2 లక్షల 37 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గత ఏడాది ఇదే వేదికపై జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో సౌరవ్ 725–480 పాయింట్ల తేడాతో పంకజ్ అద్వానీనే ఓడించడం గమనార్హం. ‘మా నాన్న కోసం ఈ టైటిల్ సాధించాలని అనుకున్నాను. ఈ ఏడాది ఆరంభంలో మా నాన్న కన్నుమూశారు. ఈ విజయం మా నాన్నకే అంకితం’ అని విజయానంతరం 41 ఏళ్ల సౌరవ్ వ్యాఖ్యానించాడు. -
ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్కు చోటు.. జట్ల వివరాలివే!
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) 7వ సీజన్ వేలం మంగళవారం ఘనంగా ముగిసింది. వేలంలో తెలంగాణ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ను పుణే జాగ్వార్స్ జట్టు సొంతం చేసుకుంది. మహిళా ప్యాడ్లర్ దియా చిటాలే వేలంలో అత్యధిక విలువ పలికిన భారత ప్లేయర్గా నిలిచింది. దియాను కూడా పుణే జట్టు తీసుకుంది. ఇతర భారత స్టార్ ఆటగాళ్లలో మనుశ్ షాను ముంబై, మానవ్ ఠక్కర్ను యూపీ, మనిక బత్రాను అహ్మదాబాద్ టీమ్లు ఎంపిక చేసుకున్నాయి. యూటీటీ టోర్నీలో మొత్తం 7 జట్లు పాల్గొంటుండగా... సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ప్రతీ జట్టు మరో జట్టులో ఒక్కో సారి తలపడుతుంది. టాప్–4 టీమ్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. జూలై 9 నుంచి 26 వరకు గోవాలో టోర్నమెంట్ నిర్వహిస్తారు. గత సీజన్లో జైపూర్ పేట్రియాట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత నంబర్వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఈసారి బరిలోకి దిగడం లేదు. వెన్ను నొప్పి గాయంతో ఆమె బాధపడుతోంది.జట్ల వివరాలు: అహ్మదాబాద్ పైపర్స్: మనిక బత్రా, కావ్య భట్, సానిల్ శెట్టి, పాయస్ జైన్, సోఫియా పల్కనొవా, ఏడ్రియన్ రసెన్ఫోస్. దబంగ్ ఢిల్లీ: సత్యన్ జ్ఞానశేఖరన్, దివ్యాంశి భౌమిక్, సుతీర్ఖ ముఖర్జీ, మారియా గ్జియో, యూసుఫ్ అబ్దుల్ అజీజ్, రీగన్ ఆల్బర్క్యూ. గోవా చాలెంజర్స్: దివ్యాంశ్ శ్రీవాత్సవ, అనన్య చండే, పీబీ అభినంద్, బెర్నడ్ జాక్స్, సిండ్రెలాడాస్, అల్వరో రాబుల్స్. కోల్కతా థండర్ బ్లేడ్స్: అంకుర్, ఐహిక ముఖర్జీ, జీత్ చంద్ర, తనీషా కొటెచా, ఎడ్వర్డ్ లోనెస్కూ, జెంగ్ జియాన్. పుణే జాగ్వార్స్: దియా చిటాలే, స్నేహిత్, ముదిత్ దాని, సయానిక మాజీ, ప్రీతిక పావడే, ఉమర్ అస్సార్. యు ముంబా: మనుశ్ షా, ఆకాశ్ పాల్, నిత్యశ్రీ మణి, అనూష కుటుంబలే, అనా హర్సీ, బార్డెట్ యూపీ ప్రొమిథెయన్స్: మానవ్ ఠక్కర్, సయాలీ వానీ, సుధాంశు, స్వస్తిక ఘోష్, యాంగ్జీ ల్యూ, రికార్డో వాల్తర్. -
గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ శ్రీనివాస్పై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) తీవ్ర చర్యలు తీసుకుంది. శ్రీనివాస్పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. నిబంధనల ప్రకారం డోపింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన ఏపీ అథ్లెట్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో నిషేధానికి గురయ్యాడు. ‘పరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవడం, తిరస్కరించడం, విఫలం కావడం’ శ్రీనివాస్ను నిషేధించడానికి కారణమని డోపింగ్ వ్యతిరేక క్రమశిక్షణా సంఘం (ఏడీడీపీ) స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన 24 ఏళ్ల శ్రీనివాస్ 100 మీటర్ల, 200 మీటర్ల స్ప్రింట్ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు.భారత జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శ్రీనివాస్ శిక్షణ పొందాడు. పరీక్షకు హాజరు కాకుండా సహకరించాడంటూ కోచ్ రమేశ్పై కూడా ‘నాడా’ గతంలోనే తాత్కాలిక సస్పెన్షన్ విధించగా... అప్పీల్ ప్యానెల్ ఇటీవలే ఆ నిషేధాన్ని తొలగించింది. గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడానుమరోవైపు.. మహిళా అథ్లెట్ వీసీ విస్మయపై కూడా రెండేళ్ల నిషేధం పడింది. కేరళకు చెందిన విస్మయ 2018 జకార్తా ఆసియా క్రీడల 4*400 రిలే పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. దాదాపు రెండేళ్ల క్రితం ఆమె నుంచి తీసుకున్న శాంపిల్స్లో డోపింగ్కు పాల్పడినట్లుగా తేలింది. నిషేధిక ఉత్ప్రేరకం క్లోమీఫీన్ తీసుకున్నట్లుగా బయపడింది. దీనిని సవాల్ చేస్తూ విస్మయ తన గర్భధారణ చికిత్సలో భాగంగా క్లోమీఫీన్ను వాడినట్లు, ఇది ఉత్ప్రేరకం కాదని వివరణ ఇచ్చింది. ‘నాడా’ మాత్రం ఆమె సమాధానంతో సంతృప్తి చెందకుండా రెండేళ్ల నిషేధం విధించింది. అయితే అక్టోబర్, 2024 నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దాంతో మరో ఆరు నెలల్లో విస్మయ నిషేధం పూర్తవుతుంది. -
లీగ్ దశలోనే భారత్ అవుట్
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ మహిళల బ్యాడ్మింట్ టీమ్ టోర్నీలో ఈసారి భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గత మూడు పర్యాయాల్లో నాకౌట్ దశకు అర్హత పొందిన టీమిండియా ఈసారి మాత్రం లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే 16 సార్లు చాంపియన్ చైనా జట్టుపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు 0–5తో పరాజయం పాలైంది.గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్ల్లో నెగ్గిన చైనా... భారత్, ఉక్రెయిన్ జట్లపై గెలిచిన డెన్మార్క్ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో పీవీ సింధు 78 నిమిషాల్లో 16–21, 21–19, 19–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో పోరాడి ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్లో సింధు ఒకదశలో 18–12తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సింధు ఒక పాయింటే నెగ్గగా... వాంగ్ జి యి తొమ్మిది పాయింట్లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో ప్రియ–శ్రుతి మిశ్రా 11–21, 8–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ చేతిలో ఓడిపోయారు.మూడో మ్యాచ్లో ఇషారాణి బారువా 20–22, 13–21తో చెన్ యుఫె చేతిలో... నాలుగో మ్యాచ్లో తనీషా క్రాస్టో–సెల్వం కవిప్రియ 21–10, 12–21, 19–21తో లువో జు మిన్–జాంగ్ షు జియాన్ చేతిలో... ఐదో మ్యాచ్లో దేవిక సిహాగ్ 21–19, 17–21, 10–21తో జు వెన్ జింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014, 2016 ఉబెర్ కప్ టోరీ్నల్లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టు... 2018లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత 2020, 2022, 2024లలో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. -
బేసి సంవత్సరాల్లో ఆసియా క్రీడలు!
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడల నిర్వహణలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... ఇక తదుపరి క్రీడలను ఐదేళ్ల తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 2014, 2018, 2022, 2026 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తుండగా... 2026 ఏషియన్ గేమ్స్ ముగిసిన అనంతరం బేసి సంఖ్య సంవత్సరంలో ఈ పోటీలు జరిపే దిశగా నిర్వాహకులు చర్యలు జరుపుతున్నారు. దీంతో ఒలింపిక్ క్రీడలకు ముందు ఇవి అర్హత పోటీలుగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆసియా బీచ్ గేమ్స్ జరుగుతుండగా... ఈ సందర్భంగా ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ (ఓసీఏ) కార్యవర్గం ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుతం 2020, 2024, 2028, 2032 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఒలింపిక్స్ జరుగుతుండగా... ఆసియా క్రీడలను బేసి సంఖ్యకు మార్చితే విశ్వక్రీడలకు ఒక్క ఏడాది ముందు వాటిని నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ ముగిసిన అనంతరం 2030లో ఖతర్లోని దోహాలో ఈ క్రీడలు జరగాల్సి ఉంది. కానీ వాటిని ఒక ఏడాది వాయిదా వేసి 2031లో నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఈ అంశంపై చర్చిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసియా క్రీడల నిర్వహణ చేపడుతూనే ప్రేక్షకాదరణ, స్పాన్సర్షిప్ విలువ పెంచే దిశగా చర్చిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఖతర్లోని దోహాలో జరగాల్సిన 2030 ఆసియా క్రీడలు 2031కి వాయిదా పడతాయి. ఇదే జరిగితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు ఇవి అర్హత క్రీడలుగానూ ఉపయోగపడతాయి. దీంతో అన్నీ దేశాల అథ్లెట్లు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుంది’ అని అంతర్జాతీయ క్రీడా నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఫెలిక్స్ మళ్లీ వస్తోంది
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించిన అలీసన్ ఫెలిక్స్ విశ్వక్రీడల్లో పునరాగమనం చేయనుంది. నాలుగేళ్ల క్రితమే ట్రాక్కు టాటా చెప్పి తల్లి అయిన ఫెలిక్స్... మరో రెండేళ్లలో అమెరికా వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో పాల్గొనాలని భావిస్తోంది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ నుంచి మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు తన హవా కొనసాగించిన ఈ అమెరికా స్టార్... 2022లో కెరీర్కు వీడ్కోలు పలికింది. అయితే 40 ఏళ్ల వయసులో మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత తిరిగి ట్రాక్పై పరుగు తీయాలని నిర్ణయించుకుంది.ఇప్పటి వరకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో 11 పతకాలు (7 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించిన ఫెలిక్స్... ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా రన్నర్గా రికార్డు సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి గెలిచిన ఫెలిక్స్... మిగిలిన ఆరు స్వర్ణాలను రిలేలో సాధించింది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడంతో ప్రారంభమైన ఆమె జోరు... 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు సాగింది. ట్రాక్పై అడుగు పెడితే తిరుగు లేకుండా దూసుకెళ్లే ఫెలిక్స్ వరల్డ్ చాంపియన్షిప్స్లో 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) చేజిక్కించుకుంది.ఇప్పటి వరకు ఐదు ఒలింపిక్స్లో పాల్గొన్న ఈ అమెరికా అథ్లెట్... 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలో సభ్యురాలిగానూ కొనసాగుతోంది. సొంతగడ్డపై విశ్వక్రీడలు జరుగుతుండటంతో చివరి ప్రయత్నం చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. ‘సాహసోపేతమైన పనులు చేయొద్దని మనం చాలా మందికి చెబుతుంటాం.ఈ వయసులో నేను ఇంట్లోనే ఉండి పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. కానీ అలాగే ఎందుకు చేయాలి. దీన్ని ఎందుకు మార్చకూడదు. లక్ష్యాన్ని చేరేందుకు మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు. ఫలితం ఎలా వచ్చినా నేను నా పిల్లలతోనే ఉంటాను. వాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాను. కానీ స్వదేశంలో జరిగిన ప్రధాన పోటీల్లో పాల్గొనలేకపోయాను అనే భావన మాత్రం ఉండదు కదా’ అని ఫెలిక్స్ వివరించింది. -
భారత్కు తప్పని చైనా గండం!
ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో భారత్ ఆట ముగిసింది. భారత మహిళల నంబర్వన్ షట్లర్ పీవీ సింధు చైనా గండాన్ని దాటి ముందుకెళ్లలేక చతికిలపడింది. విషయంలోకి వెళితే ఉబెర్ కప్లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో చైనాతో తలపడింది. అయితే చైనా చేతిలో 5-0తో పరాజయం చవిచూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్లో సింధు 16-21, 21-19, 19-21తో వాంగ్ జియి చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో డబుల్స్లో తప్పక గెలవాల్సిన స్థితిలో ప్రియా కొన్జెంగమ్-శ్రుతి మిశ్రా జంట చైనా జంట చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత మరో డబుల్స్లో ట్రిసా జాలీ-కవిప్రియ సెల్వమ్ జోడి కూడా ఓటమి పాలవ్వడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో రివర్స్ సింగిల్స్లో ఇషారాణి బరుహా తొలి గేమ్ను గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓటమిపాలైంది. ఇక థామస్ కప్లో భాగంగా పరుషుల విభాగంలో భారత జట్టు బుధవారం చైనాతో తలపడనుంది.చదవండి: పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు! -
ఆసియా టోర్నీ నుంచి వైదొలిగిన భారత స్టార్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న ఆసియా సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను (48 కేజీలు) బరిలోకి దిగడం లేదు. భుజం గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మే 10 నుంచి 17వ తేదీ జరిగే ఈ మెగా ఈవెంట్కు గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి ఆసియా చాంపియన్షిప్ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు జరగాల్సింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఈ ఈవెంట్ తేదీల్లో మార్పులు చేశారు. మీరాబాయి స్థానాన్ని కోమల్ కొహర్ భర్తీ చేసే అవకాశముంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన మీరాబాయి...గత ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్షిప్ సందర్భంగా గాయపడింది. జాతీయ చాంపియన్షిప్లో మీరాబాయి 48 కేజీల విభాగంలో 205 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకం సాధించింది. ‘జాతీయ చాంపియన్షిప్లో మీరాబాయి భుజానికి గాయమైంది. ఈ గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి ఫిట్గా లేకుండానే ఆసియా చాంపియన్షిప్లో బరిలోకి దిగి రిస్క్ తీసుకోవద్దని ఆమె భావిస్తోంది’ అని మీరాబాయి శిక్షణ బృందం వివరించింది. 👉2014 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. ఈసారీ పసిడి పతకం గెలిస్తే ఆమె ‘హ్యాట్రిక్’ సాధిస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయి 48 కేజీల విభాగంలో పోటీపడుతుంది. 👉ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి–నగోయాలలో జరుగుతాయి. 2022 ఆసియా క్రీడల్లో మీరాబాయి నాలుగో స్థానంలో నిలిచింది. మీరాబాయి కెరీర్లో ఆసియా క్రీడల పతకమే లోటుగా ఉంది. ఆసియా క్రీడల్లో మీరాబాయి 53 కేజీల విభాగంలో బరిలోకి దిగుతుంది. 👉కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల తర్వాత అక్టోబర్ 27 నుంచి నవంబర్ 8 వరకు చైనాలోని నింగ్బోలో ప్రపంచ చాంపియన్షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మీరాబాయి మూడు పతకాలు గెలిచింది. 👉2017లో స్వర్ణం గెలిచిన ఆమె... 2022లో రజతం, 2025లో రజతం సాధించింది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో ప్రపంచ చాంపియన్షిప్ కూడా ఉంది. అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య ఇటీవల వెయిట్ కేటగిరీల్లో మార్పులు చేసింది. మీరాబాయి 48 కేజీల విభాగాన్ని తొలగించి ఆ స్థానంలో 53 కేజీల విభాగాన్ని చేర్చారు. -
‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రెజ్లింగ్లోకి రీఎంట్రీ ఇవ్వకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని పేర్కొంది. మీడియా ప్రతినిధులతో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ.. ‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 30 వరకు ఉంది. అయితే నేను రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, గడువు ముగిసినట్లు పోర్టల్లో చూపిస్తోంది. ఈ విషయాన్ని డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ వారు నా ఫోన్కాల్కు రెస్పాండ్ అవ్వడం లేదు. నేను టోర్నీలో పాల్గొనాలని చూస్తుంటే ఫెడరేషన్ మాత్రం నన్ను ఉద్దేశపూర్వకంగానే రెజ్లింగ్లో రీఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఫెడరేషన్ కప్లో పాల్గొందామంటే అక్కడ నిబంధనలు పూర్తిగా మార్చేశారు. ఇలా ప్రతి అంశంలోనూ డబ్ల్యూఎఫ్ఐ అడ్డుపడుతూనే వస్తోంది. ఏషియన్ గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్ వంటి సెలెక్షన్ ట్రయల్స్లో పోటీలో ఉండాలంటే ఈ టోర్నమెంట్ నాకు ఎంతో కీలకం.’ అని వినేశ్ ఆరోపించారు. వినేశ్ రిజిస్ట్రేషన్ చేసుకుంది: సంజయ్అయితే వినేశ్ ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫొటో స్క్రీన్షాట్ను సంజయ్ సింగ్ పంచుకున్నారు. ‘వినేశ్ లాగే చాలా మంది రెజ్లర్లు మొదట ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అయితే వారు మా స్టాఫ్తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య రాలేదు. అయినా టోర్నీలో పాల్గొనకుండా తాము ఎవరిని అడ్డుకోవడం లేదు. వినేశ్ ఇప్పటికే తన రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకున్నారు. కానీ దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీడియాతో మాట్లాడే బదులు ఆమె రెజ్లింగ్పై దృష్టి సారిస్తే బాగుంటుంది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్లో, ఆ తర్వాత అక్టోబర్లో వరల్డ్ చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి.2024 పారిస్ ఒలింపిక్స్లో బరువు ఎక్కువ ఉన్న కారణంగా వినేశ్ ఫొగాట్ పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. ఈ ఘటన తర్వాత వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే గతేడాది డిసెంబర్లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో పాల్గొంటానని ప్రకటించింది.చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు! -
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది.36 బంతుల్లోనే శతక్కొట్టి.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు.వయసు అసలు లెక్కలోకే రాదుఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత, భారత షూటర్ మనూ భాకర్కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్ స్టార్ అతడే’’ అని పేర్కొంది.VIDEO | India's double Olympic medallist shooter Manu Bhaker says, “With the right mentorship, Vaibhav (Sooryavanshi) can be the next big star of Indian cricket.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UZwA8iZwSk— Press Trust of India (@PTI_News) April 27, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మనూ భాకర్ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.ఆమె ఒలింపిక్ పతకాల విజేత‘‘ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా?సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్లైన్ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిగ్గుపడండిమరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్లో మనూ భాకర్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది.చదవండి: సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త -
పీవీ సింధు కొత్త ప్రయాణం.. ఇకపై
హోర్సెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా ఆమె కొత్త పాత్రలో కనిపించనుంది. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్లోకి ఎంపిక కావడంతోనే సింధు అడుగులు ఈ వైపు పడ్డాయి. అయితే ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఆమెకు అధికారికంగా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ప్రస్తుతం చురుగ్గా ఆడుతూనే ఈ తరహాలో ఓటు హక్కుతో సహా పరిపాలన బృందంలో భాగం కావడం సింధు ఎంపికను ప్రత్యేకంగా మార్చింది. ఇక శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సింధు తన కొత్త హోదాలో పాల్గొనడం విశేషం. ప్లేయర్ల తరఫున ఆమె ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఇకపై జరిగే బీడబ్ల్యూఎఫ్ అధికారిక సమావేశాలు, చర్చల్లో పాల్గొని సింధు షట్లర్ల తరఫున తగు సూచనలిస్తూ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. ‘బీడబ్ల్యూఎఫ్లో ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ఆటగాళ్లను ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. బ్యాడ్మింటన్ నాకు ఎంతో ఇచ్చింది. నా వైపునుంచి ఆటకు ఉపయోగపడే అవకాశం రావడం అదృష్టం’ అని సింధు వ్యాఖ్యానించింది. -
లక్ష్యం నాకౌట్ బెర్త్
లండన్: రెండేళ్ల క్రితం సాధించిన ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లున్నాయి. నేటి నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్ష్ప్లో భారత జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించడమే తొలి లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మహిళల విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకుల శ్రీజ ఈ మెగా ఈవెంట్కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఆశలన్నీ మరో స్టార్ ప్లేయర్ మనిక బత్రా (ప్రపంచ 49వ ర్యాంకర్)తోపాటు యశస్విని ఘోర్పడే (ప్రపంచ 88వ ర్యాంకర్), దియా చిటాలె (ప్రపంచ 92వ ర్యాంకర్), సుతీర్థ ముఖర్జీ (ప్రపంచ 120వ ర్యాంకర్), సిండ్రెల్లా దాస్ (ప్రపంచ 175వ ర్యాంకర్)లపై ఆధారపడి ఉన్నాయి. బెంగాల్కు చెందిన 16 ఏళ్ల సిండ్రెల్లా దాస్ ఈ మెగా ఈవెంట్కు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపిన్న వయసు్కరాలిగా గుర్తింపు పొందనుంది. గ్రూప్–6లో ఉక్రెయిన్, ఉగాండా, రువాండా జట్లతో భారత్ ఆడనుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ఉగాండా జట్టుతో భారత్ తలపడుతుంది. అనంతరం బుధవారం ఉక్రెయిన్ జట్టుతో, గురువారం రువాండా జట్టుతో టీమిండియా పోటీపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు అర్హత పొందాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టుకు అంత కష్టమేమీ కాదు. మరోవైపు దిగ్గజం ఆచంట శరత్ కమల్ రిటైర్ కావడంతో... ఈసారి భారత పురుషుల జట్టు ఆశలన్నీ మానవ్ ఠక్కర్ (ప్రపంచ 38వ ర్యాంకర్), సత్యన్ జ్ఞానశేఖరన్ (ప్రపంచ 42వ ర్యాంకర్), మనుశ్ షా (ప్రపంచ 51వ ర్యాంకర్), హరీ్మత్ దేశాయ్ (ప్రపంచ 80వ ర్యాంకర్), పాయస్ జైన్ (ప్రపంచ 127వ ర్యాంకర్) ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. గ్రూప్–7లో స్లొవేకియా, ట్యూనిషియా, గ్వాటెమాలా జట్లతో భారత్ పోటీపడుతుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ట్యూనిష్యాతో టీమిండియా ఆడుతుంది. అనంతరం బుధవారం స్లొవేకియా జట్టుతో, గురువారం గ్వాటెమాలా జట్టుతో భారత్ తలపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు చేరాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. 2024 ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్ష్ప్లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత పొంది తొలి రౌండ్లో వెనుదిరిగాయి. ఒకవేళ భారత జట్లు గ్రూప్ విజేతలుగా నిలవకపోతే... రెండో స్థానంలో నిలిచిన టాప్–6లో ఉండాలి. లేదంటే ఆఖరి అవకాశంగా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో విజేతగా ఉండాలి. -
తొలిసారి మహిళల రగ్బీ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది మొదటిసారి పురుషుల కోసం భారత్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) జరగ్గా... రెండో ఏడాది ఏకకాలంలో పురుషులతోపాటు మహిళల రగ్బీ లీగ్ను నిర్వహించనున్నారు. జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం రగ్బీ ప్రీమియర్ లీగ్కు ఆతిథ్యమిస్తుంది. క్రితంసారి పురుషుల విభాగంలో ఆరు జట్లు పోటీపడ్డాయి. ఆ ఆరు పురుషుల జట్లలో నుంచి నాలుగు జట్లతో (చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్) మహిళల విభాగం పోటీలు నిర్వహిస్తారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సహకారంతో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈనెల 30న హైదరాబాద్లో వేలం కార్యక్రమం జరగనుంది. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్తోపాటు హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ ఆర్పీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. గత ఏడాది ముంబైలో జరిగిన తొలి సీజన్లో చెన్నై బుల్స్ టైటిల్ సాధించింది. ‘మహిళల విభాగంలోనూ రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని కల కన్నాం. రెండో ఏడాదే మా కల నిజమవుతోంది. ఈ విషయంలో జీఎంఆర్ స్పోర్ట్స్ను, మా ఫ్రాంచైజీలను అభినందించాలి’ అని రగ్బీ ఇండియా అధ్యక్షుడు, సినీ నటుడు రాహుల్ బోస్ తెలిపాడు. -
క్వార్టర్స్లో భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): మాజీ చాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి లక్ష్యాన్ని అందుకుంది. వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఆ్రస్టేలియాను క్లీన్స్వీప్ చేసింది. గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్లో చైనా 4–1తో కెనడాను ఓడించింది. రెండు విజయాలతో భారత్, చైనా జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకోగా... రెండు ఓటములతో ఆ్రస్టేలియా, కెనడా జట్లు క్వార్టర్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. భారత్, చైనా జట్ల మధ్య బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ విజేతగా నిలుస్తుంది. ఆ్రస్టేలియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 21–14, 21–16తో స్టీఫెన్ సామ్ను ఓడించాడు. రెండో మ్యాచ్లో ఆసియా చాంపియన్షిప్ రన్నరప్ ఆయుశ్ శెట్టి 21–8, 21–6తో షెరీ ధండ్పై గెలిచాడు. మూడో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–14, 21–16తో రిజ్కీ హిదాయత్–జాక్ యులపై గెలిచి భారత్కు 3–0తో విజయాన్ని ఖరారు చేశారు. నాలుగో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ 21–11, 21–17తో రిషి హోండా భూపతిపై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. ఐదో మ్యాచ్లో హరిహరన్–ఎంఆర్ అరుŠజ్న్ 21–12, 21–10తో స్టీఫెన్ సామ్–అందికలపై గెలిచి టీమిండియాకు 5–0తో సంపూర్ణ విజయాన్ని కట్టబెట్టారు. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత జట్టు 2024లోనూ క్వార్టర్ ఫైనల్ చేరింది. అయితే చైనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 1–3తో ఓడిపోయింది.


