Other Sports
-
అంతర్జాతీయ స్కేటింగ్లో జెస్సీరాజ్ ప్రతిభ
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలేనికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాత్రపు జెస్సీరాజ్ ఇంటర్నేషనల్ స్కేటింగ్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మార్చి 26 నుంచి 31 వరకు తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ఆల్రౌండ్ సత్తా చాటింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు, పెయిర్ స్కేటింగ్లో వెండి, ఇన్లైన్ ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారతీయ జెండాను రెపరెపలాడించింది.సోమవారం తైవాన్లో జెస్సీరాజ్కు ఏషియన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ చేతులమీదుగా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా జెస్సీరాజ్ను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నరేశ్ వర్మ, ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇండియా చైర్మన్ ఎం.ప్రదీప్ అభినందించారు. -
Miami Open 2025: జొకోవిచ్కు చుక్కెదురు
ఫ్లోరిడా: కెరీర్లో 100వ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. 2019 తర్వాత పాల్గొన్న మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టెన్నిస్ టోర్నీలో జొకోవిచ్ రన్నరప్గా నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల జాకుబ్ మెన్సిక్ అసాధారణ ఆటతీరు కనబరిచి జొకోవిచ్కు షాక్ ఇచ్చాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మెన్సిక్ 7–6 (7/4), 7–6 (7/4)తో గతంలో ఆరుసార్లు మయామి ఓపెన్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ను బోల్తా కొట్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెన్సిక్ 14 ఏస్లతో అదరగొట్టాడు. ఇద్దరూ తమ సర్వీస్లను ఒక్కోసారి కోల్పోగా... టైబ్రేక్లలో మెన్సిక్ పైచేయి సాధించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలిచిన మెన్సిక్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ జొకోవిచ్కు 5,97,80 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో మెన్సిక్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్లో ఏకంగా 30 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
‘మయామి’ క్వీన్ సబలెంకా
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్లో 17 టైటిల్స్ హార్డ్కోర్టులపై రావడం విశేషం. -
Asian Wrestling 2025: భారత రెజ్లర్లకు మూడు పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు ఆదివారం భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్స్లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ తుర్క్మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్ను ఓడించాడు. ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు. -
శరత్ కమల్ శకం ముగిసె...
చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ తన ఆట ముగించాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీ పురుషుల సింగిల్స్లో పరాజయంతో అతను రిటైర్ అయ్యాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో సూరావజ్జుల స్నేహిత్ (తెలంగాణ) చేతిలో శరత్ కమల్ 0–3తో ఓటమిపాలయ్యాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్నేహిత్ 11–9, 11–8, 11–9తో విజయం సాధించాడు. శరత్ కమల్ చివరి మ్యాచ్ చూడటం కోసం నెహ్రూ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారందరికీ అభివాదం చేస్తూ అతను కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు ముందే పురుషుల డబుల్స్ విభాగంలో స్నేహిత్తోనే కలిసి శరత్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ పోరులో కొరియా జోడి లిమ్ జాంగూన్ – ఆన్ జీహున్ చేతిలో 11–9, 8–11, 9–11, 6–11 స్కోరుతో శరత్ – స్నేహిత్ ఓడిపోయారు. 17 ఏళ్ల వయసులో చెన్నైలోనే జరిగిన ఆసియా జూనియర్స్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ బరిలోకి దిగిన శరత్ కమల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. అసాధారణ రీతిలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన శరత్ అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన అతను ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో కూడా అతని ఖాతాలో 4 కాంస్యాలు ఉన్నాయి. 2004 నుంచి 2024 మధ్య ఐదు ఒలింపిక్స్లలో పాల్గొన్న శరత్ కమల్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, ఖేల్రత్న పురస్కారాలతో గౌరవించింది. -
గురీందర్వీర్ సింగ్ జాతీయ రికార్డు
బెంగళూరు: భారత యువ అథ్లెట్ గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్కు చెందిన 24 ఏళ్ల గురీందర్వీర్ సింగ్.. ఇండియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో అతను10.20 సెకన్ల్లలో లక్ష్యాన్ని చేరాడు. గతంలో ఈ రికార్డు మణికంఠ హోబ్లిధార్ (10.23 సెకన్లు) పేరిట ఉండగా... తాజాగా గురీందర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.2021లో 10.27 సెకన్లలో వంద మీటర్లు పరిగెత్తిన ఈ పంజాబ్ స్ప్రింటర్... ఇప్పుడు దాన్ని సరిచేశాడు. ఇదే పోటీల్లో మణికంఠ 10.21 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. అమ్లన్ బొర్గోహై (10.43 సెకన్లు) మూడో స్థానంతో రేసును ముగించాడు. గురీందర్వీర్ సింగ్ 2021, 2024లో ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లలో పసిడి పతకాలు సాధించాడు.చెన్నై, మధురైలో జూనియర్ హాకీ వరల్డ్కప్ చెన్నై: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్నకు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీని చెన్నై, మధురై నగరాల్లో నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) శుక్రవారం వెల్లడించింది. 24 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుండటం ఇది మూడోసారి. 2016లో లక్నో వేదికగా, 2021లో భువనేశ్వర్లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.‘చెన్నై, మధురై నగరాల్లో పోటీలు నిర్వహిస్తాం. వరల్డ్కప్లో మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. మధురైలో అంతర్జాతీయ మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. భిన్నమైన నగరాలకు ఆటను విస్తరించాలనే ఉద్దేశంతోనే మధురైను వేదికగా ఎంపిక చేశాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. భారత్లో చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచకప్లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలవగా... 2023లో కౌలాలంపూర్లో జరిగిన వరల్డ్కప్లో జర్మనీ చాంపియన్గా నిలిచింది. సెమీఫైనల్లో ఓడిన భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి స్వదేశంలో జరగనున్న టోర్నీలో అయినా యువభారత్ విజేతగా నిలుస్తుందా చూడాలి. అనాహత్కు టైటిల్ ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో యువ క్రీడాకారణి అనాహత్ సింగ్ చాంపియన్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత నంబర్వన్ ర్యాంకర్ అనాహత్ సింగ్ 3–0 (11–9, 11–5, 11–8)తో హలెన్ టాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ విజయంతో అనాహత్ 300 ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల అనాహత్కు ఇది వరుసగా ఆరో టైటిల్ కాగా... ఓవరాల్గా 11వది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ రన్నరప్గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో అభయ్ సింగ్ 1–3 (10–12, 4–11, 11–7, 10–12)తో కరీమ్ (ఈజిప్ట్) చేతిలో ఓటమి పాలయ్యాడు.పుణేలో మహిళల చెస్ గ్రాండ్ ప్రి పుణే: ఫిడే మహిళల గ్రాండ్ ప్రి ఐదో అంచె పోటీలకు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 13 నుంచి 24 వరకు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేతలు ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్ తదితరులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర చెస్ సంఘం నిర్వహించనున్న ఈ టోర్నీలో చైనా గ్రాండ్మాస్టర్ జూ జినెర్, పొలినా షువలోవా (రష్యా), అలీనా కష్లిన్స్క్యా (పోలాండ్), సలిమోవా నుర్గుల్ (బల్గేరియా), బక్తుయాగ్ (మంగోలియా), మెలియా సలోమె (జార్జియా) పాల్గొననున్నారు. ఫిడే గ్రాండ్ ప్రి సిరీస్లో 14 మంది టాప్ ప్లేయర్లతో పాటు... ఆరుగురు ప్లేయర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాల్గొంటారు. గత సిరీస్ల ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుంది. భారత్ యువ ప్లేయర్ ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోరీ్నలో పోటీపడనుంది. శరత్ కమల్ జోరు చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్... తన చివరి టోర్నీలో చక్కటి విజయాలతో దూసుకెళ్తున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్లో శరత్ కమల్ ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శరత్ 3–0 (11–8, 11–8, 11–9)తో పదో సీడ్ నికోలస్ లుమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. 42 ఏళ్ల శరత్... తనకంటే 23 సంవత్సరాలు చిన్నవాడైన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.దేశం తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న శరత్ కమల్ బ్యాక్హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో ఆకట్టుకొని వరుస గేమ్ల్లో విజయం సాధించాడు. శరత్తో పాటు పురుషుల విభాగంలో భారత్ నుంచి తెలంగాణ ప్యాడ్లర్ స్నేహిత్ సురావజ్జుల, మానవ్ ఠక్కర్ ప్రిక్వార్టర్స్కు చేరగా... మహిళల విభాగంలో కృతి్వక రాయ్ ముందంజ వేసింది. స్నేహిత్ 3–2 (8–11, 11–13, 11–9, 11–7, 12–10)తో యుకియా ఉడా (జపాన్)పై, మానవ్ 3–1 (11–4, 7–11, 11–5, 11–8)తో పిన్ లూ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. మహిళల విభాగంలో పదో సీడ్ తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 2–3 (6–11, 9–11, 11–6, 11–4, 7–11)తేడాతో కృత్వికరాయ్ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్–స్నేహిత్ జంట 1–3 (11–9, 8–11, 9–11, 6–11)తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. -
జొకోవిచ్ అరుదైన రికార్డు
ఫ్లోరిడా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మయామి ఓపెన్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్కు చేరాడు. తద్వారా ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీ సెమీఫైనల్కు చేరిన పెద్ద వయసు్కడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) పేరిట ఉంది. 37 ఏళ్ల జొకోవిచ్ శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–6 (7/4)తో సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై విజయం సాధించాడు. 1 గంట 24 నిమిషాల పాటు సాగిన పోరులో నాలుగో సీడ్ జొకోవిచ్ 11 ఏస్లు కొట్టగా... కోర్డా ఏడు ఏస్లకు పరిమితమయ్యాడు. సెర్బియా వీరుడు రెండు బ్రేక్ పాయింట్లు కాచుకోవడంతో పాటు ఒక దశలో వరుసగా 12 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చాడు. ఇప్పటికే ఆరుసార్లు మయామి ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్న జొకోవిచ్ ఏడోసారి చాంపియన్గా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియా ఓపెన్ మధ్యలో గాయం కారణంగా తప్పుకున్న జొకోవిచ్... ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ తొలి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. గ్రాండ్స్లామ్ చాంపియన్ పీటర్ కొర్డా కుమారుడైన సెబాస్టియన్ కొర్డా... రెండో సెట్ ఆరంభంలో 4–1తో ఆధిక్యంలో నిలిచినా... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ సబలెంక (బెలారస్) 6–2, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలుపొందింది. తద్వారా తొలిసారి మయామి ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. -
మనీషాకు స్వర్ణం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ మనీషా భన్వాల్ పసిడి పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో శుక్రవారం మనీషా 8–7 పాయింట్ల తేడాతో ఓక్ జే కిమ్ (కొరియా)పై విజయం సాధించింది. ఒక దశలో 2–7తో వెనుకంజలో నిలిచిన మనీషా... ఆఖరి నిమిషంలో అసమాన పోరాటంతో వరుసగా 6 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు గెలిచిన మనీషాకు ఇదే తొలి స్వర్ణం కాగా... సెమీఫైనల్లో మనీషా 5–1తో బిలిమ్బెక్ కైజీపై విజయం సాధించింది. అంతకుముందు టైనిస్ డుబెక్ (కజకిస్తాన్), హన్బిట్ లీ (కొరియా)పై ఏకపక్ష విజయాలతో మనీషా సెమీస్కు చేరింది. 2021 ఆసియా చాంపియన్షిప్ తర్వాత ఈ పోటీల్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకం. ఆ పోటీల్లో భారత్ తరఫున వినేశ్ ఫొగాట్, సరితా మోర్ భారత్ తరఫున స్వర్ణాలు గెలిచారు. మరోవైపు యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో జపాన్కు చెందిన మోయో కియోకా చేతిలో ఓడిన అంతిమ్... కాస్య పతక పోరులో సత్తాచాటింది. నేహ శర్మ (57 కేజీలు), మోనిక (65 కేజీలు), జ్యోతి బెరివాల్ (72 కేజీలు) మెడల్ రౌండ్స్కు అర్హత సాధించలేకపోయారు. ఈ టోర్నీలో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 6 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
వారెవ్వా ఇయాలా
క్రీడాభిమానులకు ఫిలిప్పీన్స్ దేశం గుర్తుకు రాగానే ముందుగా వారి మదిలో మెదిలేది దిగ్గజ బాక్సర్ మ్యానీ పకియావ్ పేరు. రానున్న రోజుల్లో ఈ స్టార్ బాక్సర్ సరసన అభిమానులు మరో పేరు కూడా ప్రస్తావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఖరీదైన టెన్నిస్ క్రీడలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన ఆ యువతార ఎవరో కాదు 19 ఏళ్ల అలెగ్జాండ్రా ఇయాలా... స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఫిలిప్పీన్స్ టీనేజర్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఇయాలా సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను ఓడించడం విశేషం. జెస్సికా పెగూలాతో జరిగే సెమీఫైనల్లో ఇయాలా విజయం సాధిస్తే... నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన మయామి ఓపెన్లో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ఫ్లోరిడా: అనామకురాలిగా బరిలోకి దిగి రౌండ్ రౌండ్కూ సంచలన విజయాలు సాధిస్తున్న ఫిలిప్పీన్స్ టీనేజర్ అలెగ్జాండ్రా ఇయాలా...మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 140వ ర్యాంకర్ ఇయాలా 6–2, 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ను బోల్తా కొట్టించింది. 1 గంట 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇయాలా ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. 19 ఏళ్ల ఇయాలా గత ఏడేళ్లుగా స్పెయిన్లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టిన ఇయాలా రెండో రౌండ్లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై 7–6 (7/2), 7–5తో గెలుపొందగా... మూడో రౌండ్లో 6–4, 6–2తో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను కంగుతినిపించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇయాలాకు పదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) నుంచి ‘వాకోవర్’ లభించింది. ‘నమ్మశక్యంగా లేదు. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా జీవితంలోనే ఇది గొప్ప విజయం’ అని ఇయాలా వ్యాఖ్యానించింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)తో ఆడనున్న ఇయాలా విజయం సాధిస్తే... మయామి ఓపెన్లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్)తో పావోలిని (ఇటలీ) తలపడుతుంది. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
ఫ్లోరిడా: కెరీర్లో ఆడిన రెండో ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలోనూ భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ ఆకట్టుకున్నాడు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన యూకీ... అదే జోరును కొనసాగిస్తూ మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాడు. అయితే క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అతను అధిగమించలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–నూనో బోర్జెస్ (పోర్చుగల్) ద్వయం 6–7 (1/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ లాయిడ్ గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. 90 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–బోర్జెస్ నాలుగు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా రెండో సెట్లో ప్రత్యర్థి జంట సర్వీస్ను ఒక్కసారి బ్రేక్ చేశారు. మరోవైపు గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో కీలకదశలో పాయింట్లు నెగ్గి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–బోర్జెస్ జోడీకి 65,000 డాలర్ల (రూ. 55 లక్షల 73 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో 33 ఏళ్ల యూకీ బాంబ్రీ వచ్చే సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 26వ ర్యాంక్కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా 2019 నుంచి భారత నంబర్వన్గా కొనసాగుతున్న రోహన్ బోపన్నను దాటేసి యూకీ అధికారికంగా భారత డబుల్స్ కొత్త నంబర్వన్గా అవతరించనున్నాడు. -
గ్రూప్ ‘బి’లో భారత్కు చోటు
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదలైంది. భారత జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో గురువారం ‘డ్రా’ కార్యక్రమం జరిగింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ మ్యాచ్లకు జూన్ 23 నుంచి జూలై 5 వరకు థాయ్లాండ్ ఆతిథ్యమిస్తుంది. భారత్తోపాటు థాయ్లాండ్, మంగోలియా, తిమోర్లెస్తె, ఇరాక్ జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. గ్రూప్ విజేత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్కు అర్హత సాధిస్తుంది. మొత్తం 34 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’... గ్రూప్ ‘బి’లలో ఐదు జట్ల చొప్పున ఉన్నాయి. మిగతా ఆరు గ్రూపుల్లో నాలుగు జట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఎనిమిది గ్రూప్ల విజేత జట్లు ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాతోపాటు 2022 ఆసియాకప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన చైనా, కొరియా, జపాన్ జట్లు ఇప్పటికే ఆసియా కప్–2026 టోర్నీకి నేరుగా అర్హత పొందాయి. -
రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. స్థలమా?.. ఏది కావాలి?
ప్యారిస్ ఒలింపిక్స్-2024 (Paris Olympics)లో సత్తా చాటిన భారత రెజ్లర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)కు.. హర్యానా ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘‘రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. లేదంటే ప్లాట్’’.. వీటిలో ఆమెకు ఏదీ కావాలో చెప్పాలని కోరింది. కాగా వినేశ్ ఫొగట్ తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.మహిళల యాభై కిలోల కుస్తీ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో ఫైనల్కు చేరిన వినేశ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించారు. అయితే, అనూహ్య రీతిలో టైటిల్ పోరుకు ముందు.. పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలుఆ తర్వాత స్పోర్ట్స్ కోర్టులో కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీకి, పతకానికి అనర్హులే అంటూ కోర్టు వినేశ్ ఫొగట్ పిటిషన్ను కొట్టి వేయడంతో ఆమెతో పాటు యావత్ భారతావనికి నిరాశే మిగిలింది.అయితే, ఫైనల్ వరకు వినేశ్ చేరిన తీరును ప్రశంసిస్తూ అభినందలు వెల్లువెత్తాయి. ఓడినా మనసులు గెలిచిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. నాడు.. ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సైతం.. ‘‘హర్యానాకు గర్వకారణమైన ఫొగట్ గౌరవాన్ని మేము మరింత పెంచుతాం’’ అని ట్వీట్ చేశారు.కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశంఅంతేకాదు.. రాష్ట్ర క్రీడా విధానాన్ని అనుసరించి ఒలింపిక్స్లో రజతం గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను వినేశ్కు అందిస్తామనే హామీ అందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య రీతిలో పతకం చేజారిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక వినేశ్ ఫొగట్ కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం చేశారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఝులానా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోటాలో తనకు అందాల్సిన నజరానా గురించి ఇటీవల విధాన సభలో ప్రస్తావించారు.హామీ మరిచారా?‘‘వినేశ్ ఫొగట్ మా కూతురు. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్కు ఇచ్చే రివార్డును ఆమెకు అందజేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత వరకు ఆ హామీని పూర్తి చేయలేకపోయారు.ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులకు ఇప్పటికే రివార్డులు అందజేశారు’’ అని వినేశ్ ఫొగట్ బీజేపీ ప్రభుత్వ తీరును విమర్శించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో వినేశ్ ఫొగట్ రివార్డుకు సంబంధించి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వినేశ్ ఫొగట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన క్యాష్ రివార్డుకు సంబంధించిన అంశాన్ని ఆమె విధాన సభలో లేవనెత్తారు.ఈ మూడింటిలో ఏది కావాలి?అందుకే కేబినెట్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆమెకు ప్రయోజనాలు చేకూర్చాలని నిశ్చయించింది’’ అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్.. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం.. లేదా హర్యానా షహరీ వికాస్ ప్రాధికారణ్ పథకం కింద ప్లాట్.. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవాలని కేబినెట్ వినేశ్ ఫొగట్కు ఆఫర్ ఇచ్చింది. అయితే, ఆమె ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే వినేశ్ ఫొగట్.. తన భర్త, రెజ్లర్ సోమ్వీర్ రాఠీతో కలిసి శుభవార్త పంచకున్న విషయం తెలిసిందే.చదవండి: ‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’ -
తొలిసారి పసిడి మెరుపులు
పాట్నా: సెపక్తక్రా ప్రపంచకప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్కప్లో పురుషుల రెగూ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్తక్రా ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకంకాగా... స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. తొలి సెట్లో ఓడి వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు సెట్లు నెగ్గి విజేతగా నిలిచింది. దేశంలో పెద్దగా ఆదరణ లేని ఈ క్రీడలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా... ఈ వరల్డ్కప్లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రజతం... పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది. ‘స్వదేశంలో జరిగిన సెపక్తక్రా ప్రపంచకప్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బృందానికి అభినందనలు. రెగూ జట్టు స్వర్ణంతో పాటు మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తుపై భరోసా పెంచింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
బ్యూనస్ ఎయిర్స్: తమ కెప్టెన్... దిగ్గజ ప్లేయర్ లయోనల్ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్ టోర్నమెంట్కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్ జట్టుతో మ్యాచ్కు ముందే అర్జెంటీనాకు వరల్డ్కప్ బెర్త్ ఖరారైంది. ఉరుగ్వే జట్టుతో మ్యాచ్ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్కప్ బెర్త్ దక్కడంతో... బ్రెజిల్తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్ తేడాతో బ్రెజిల్ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్ (12వ నిమిషంలో), అలెక్సిస్ మాక్ అలిస్టర్ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్ (71వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బ్రెజిల్ జట్టుకు మాథ్యూస్ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. దక్షిణ అమెరికా జోన్ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది.ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ద్వారా ప్రపంచకప్కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. ఇరాన్ వరుసగా నాలుగోసారి... మరోవైపు ఆసియా జోన్ నుంచి ఇరాన్ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ను ఇరాన్ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్లో ఆడిన ఇరాన్ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్లో ఆడిన ఇరాన్ 2010లో జరిగిన ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. 2014లో నాలుగోసారి వరల్డ్కప్లో బరిలోకి దిగిన ఇరాన్ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఓవరాల్గా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్లో ఆడనున్నాయి. ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్కప్కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.19 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
భారత గడ్డపై మళ్లీ మెస్సీ... ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం
న్యూఢిల్లీ: ఫుట్బాల్ ‘ఆల్టైమ్ గ్రేట్’లలో ఒకడైన లయోనల్ మెస్సీ ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం భారత అభిమానులకు కలగనుంది. 14 సంవత్సరాల తర్వాత అతను మళ్లీ భారత్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది అక్టోబరులో కేరళలోని కొచి్చలో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. దీనిపై చాలా కాలం క్రితమే కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్రహమాన్ ప్రకటన చేసినా... ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ప్రముఖ బ్యాంక్ ‘హెచ్ఎస్బీసీ’ ఈ పర్యటనలో అర్జెంటీనా టీమ్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. భారత్లో పుట్బాల్ను ప్రమోట్ చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిస్తూ అర్జెంటీనా రాకను హెచ్ఎస్బీసీ హెడ్ సందీప్ బత్రా ఖరారు చేశారు. 2025లో భారత్తో పాటు సింగపూర్లో కూడా మ్యాచ్లు ఆడేందుకు అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం ‘హెచ్ఎస్బీసీ’తో ఒప్పందం చేసుకుంది. 2011లో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు మెస్సీ మొదటిసారి భారత్కు వచ్చాడు. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచ్లో వెనిజులాతో తలపడిన అర్జెంటీనా 1–0తో విజయం సాధించింది. -
బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
షిల్లాంగ్: ఆసియా కప్–2027 క్వాలిఫయింగ్ టోర్నమెంట్ మూడో రౌండ్ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బంగ్లాదేశ్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్ను భారత్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించగా... రెండో అర్ధభాగంలో భారత్ జోరు కనబరిచింది. రెండు జట్లు గోల్స్ అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. 68వ నిమిషంలో శుభాశీష్ బోస్, 81వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి బంగ్లాదేశ్ గోల్పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లు బయటకు వెళ్లాయి. గ్రూప్ ‘సి’లో భారత్తోపాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ జట్లున్నాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న సింగపూర్తో ఆడుతుంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 2027 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
‘‘నాకు విడాకులు మాత్రమే కావాలి.. అతడి నుంచి ఒక్క పైసా కూడా అవసరం లేదు’’ అంటూ భారత బాక్సర్, ప్రపంచ చాంపియన్ స్వీటీ బూరా (Saweety Boora) తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్త దీపక్ హుడా (Deepak Hooda)తో వీలైనంత త్వరగా వైవాహిక బంధం తెంచుకోవాలని మాత్రమే భావిస్తున్నట్లు తెలిపింది. కాగా స్వీటీతో పాటు దీపక్ కూడా దేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు.అంతేకాదు.. 2019- 2022 వరకు భారత కబడ్డీ జట్టు కెప్టెన్గానూ ఉన్నాడు. ప్రొ కబడ్డీ లీగ్లోనూ తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. స్వీటీ బూరా 81 కిలోల విభాగంలో 2023లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించింది.అదనపు కట్నం కోసం ఇక దీపక్తో పాటు స్వీటీ కూడా అర్జున అవార్డు గ్రహీత కావడం విశేషం. హర్యానాకు చెందిన ఈ క్రీడా జంట 2022లో వివాహం చేసుకున్నారు. అయితే, భర్తతో పాటు అత్తింటి వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వీటీ బూరా ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కోరినట్లుగా గతంలోనే విలాసవంతమైన కారు ఇచ్చినా.. ఇంకా డబ్బు కావాలంటూ తనను హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో ఫిబ్రవరి 25న దీపక్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చినా దీపక్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని హిస్సార్ పోలీసులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో తన భర్తలో మార్పు రావడం కష్టమని భావించిన స్వీటీ బూరా విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల పోలీస్ స్టేషన్లో స్వీటీ- దీపక్లు తమ మద్దతుదారులతో కలిసి సెటిల్మెంట్ కోసం రాగా.. కోపోద్రిక్తురాలైన స్వీటీ భర్తపై దాడి చేసింది. పోలీస్ స్టేషన్లోనే అతడిపై పిడిగుద్దులు కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్వీటీ సహనం నశించినందు వల్లే ఇలా చేసిందని కొంతమంది మద్దతునివ్వగా.. భరణం కోసం డిమాండ్ చేస్తోందంటూ మరికొంత మంది ఆరోపించారు. అయితే, స్వీటీ మాత్రం వీటిని కొట్టిపారేసింది. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు విడాకులు కావాలి. అతడి నుంచి ఎలాంటి భరణం అక్కర్లేదు.నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దునా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారం లభించాలని మాత్రమే కోరుకుంటున్నా. హింసకు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తడమే నేను చేసిన తప్పు అనుకుంటా.విడాకుల కోసం నేను కోర్టులో పిటిషన్ వేశాను. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించా. ఆ వ్యక్తి విడాకులు వద్దంటూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. అయినా ఆ దెయ్యం డబ్బులు నాకెందుకు? నేనేమీ బికారిని కాదు. నాకు న్యాయం మాత్రమే కావాలి. ఇంకేమీ వద్దు’’ అంటూ స్వీటీ బూరా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. చదవండి: చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..? -
న్యూజిలాండ్ మళ్లీ సాధించింది.. ఇది మూడోసారి
ఆక్లాండ్: మరో అవకాశం కోసం వేచి చూడకుండా... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... న్యూజిలాండ్ పురుషుల ఫుట్బాల్ జట్టు దర్జాగా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్కుఅర్హత సాధించింది. పది దేశాలు పోటీపడ్డ ఓసియానియా జోన్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీ (FIFA 2026 World Cup)కి అర్హత పొందిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సోమవారం జరిగిన ఓసియానియా జోన్ ఫైనల్లో న్యూజిలాండ్ 3–0 గోల్స్ తేడాతో న్యూ కాలడోనియా జట్టుపై గెలిచింది.న్యూజిలాండ్ తరఫున మైకేల్ జోసెఫ్ బాక్సల్ (61వ నిమిషంలో), బార్సరూసెస్ (66వ నిమిషంలో), హెన్రీ జస్ట్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఫైనల్లో ఓడిపోయిన న్యూ కాలడోనియా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకునే మరో అవకాశం మిగిలి ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణా అమెరికా జోన్లకు చెందిన ఆరు జట్లు పోటీపడే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీలో విజేతగా నిలిస్తే న్యూ కాలడోనియా జట్టు కూడా ప్రపంచకప్కు అర్హత పొందుతుంది. 2026లో ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో ఇప్పటికే ప్రపంచకప్కు అర్హత పొందగా... జపాన్, న్యూజిలాండ్ ఈ మూడు జట్లతో చేరాయి. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ పోటీపడనుండటం ఇది మూడోసారి. తొలిసారి 1982లో వరల్డ్కప్లో ఆడిన న్యూజిలాండ్ రెండోసారి 2010 ప్రపంచకప్లో పోటీపడింది. ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు న్యూజిలాండ్ అర్హత సాధించడంలో విఫలమైంది. సెమీస్లో పోర్చుగల్ లిస్బన్: నేషన్స్ లీగ్ టోర్నమెంట్లో పోర్చుగల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్తో జరిగిన రెండో అంచె క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 5–2 గోల్స్ తేడాతో గెలిచింది. తొలి అంచె క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో ఒక గోల్ తేడాతో ఓడిన పోర్చుగల్ ఈ మ్యాచ్లో స్పష్టమైన విజయాన్ని అందుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి పోర్చుగల్ 3–2తో గెలిచింది. అయితే గోల్స్ సగటు 3–3తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు అదనపు సమయం ఆడించారు. అదనపు సమయంలో పోర్చుగల్ మరో రెండు గోల్స్ సాధించింది. -
సరైన సమయంలో రిటైర్మెంట్.. గర్వంగా ఉంది!
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద పరీక్షలాంటిదే. క్రీడాకారుడిగా కెరీర్ బాగా సాగుతున్న దశలోనే ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలంటే తెగువ అవసరం. ఆశించిన విజయాలు లభించకపోయినా... ఆటగాడిగా కొనసాగుతూ... ఇతరుల అవకాశాలను ప్రభావితం చేసే బదులు... వర్ధమాన క్రీడాకారులు తమ కెరీర్లో మరింత ఎదిగేందుకు మార్గదర్శిగా మారడం విజ్ఞుల లక్షణం. ఆ కోవలోకే తాను వస్తానని తెలంగాణకు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బసి సుమీత్ రెడ్డి చాటుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మిక్స్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్లో 25వ ర్యాంక్లో ఉన్న సుమీత్ రెడ్డి క్రీడాకారుడిగా తన ఇన్నింగ్స్ ముగిసిందని సోమవారం ప్రకటించాడు. కోచ్ రూపంలో ఇప్పటికే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టానని... భవిష్యత్లో భారత్కు మెరికల్లాంటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా కోచ్గా స్థిరపడతానని సుమీత్ స్పష్టం చేశాడు. సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్లో ఉన్న అన్ని ప్రముఖ టోర్నమెంట్లలో... నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. తెలంగాణకు చెందిన 33 ఏళ్ల బుసి సుమీత్ రెడ్డి తన కెరీర్లో ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. ఇక తన కెరీర్లో మళ్లీ ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం లేదని భావించిన సుమీత్ ఆటకు వీడ్కోలు పలకడమే ఉత్తమం అని ఆలోచించాడు. తన ఆలోచనను నిజం చేస్తూ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా రిటైర్ అవుతున్నట్లు సోమవారం ఇన్స్ట్రాగామ్ వేదికగా ప్రకటించాడు.ఇక మీదట తన దృష్టంతా కోచింగ్పైనే ఉంటుందని ఈ సందర్భంగా సుమీత్ రెడ్డి స్పష్టం చేశాడు. ‘రిటైరయ్యాను. గర్వంగా ఉన్నాను. కెరీర్లోని తర్వాతి అధ్యాయం కోసం ఉత్సుకతతో ఉన్నాను. నేనీ స్థాయికి చేరుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సుమీత్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ‘నా పరిమితికి మించి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించాను. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉన్నప్పటికీ నా కెరీర్లో ఉన్నత దశ దాటిపోయానని భావిస్తున్నాను. ఇతరత్రా కారణాలతోనూ నా ప్రొఫెషనల్ కెరీర్ నుంచి వైదొలుగుతున్నాను. ఇక ఆటను ఆపేయాలనే సంకేతాలు మన మదిలో మెదిలినపుడు ఎలాంటి సంకోచం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. వెన్నునొప్పి కారణంగా ఒకదశలో వైద్యులు బ్యాడ్మింటన్ను వదిలేయాలని సూచించారు. కానీ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇచి్చన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన సలహాలతో డబుల్స్ వైపు అడుగులు వేసి కెరీర్ను తీర్చిదిద్దుకున్నాను’ అని సుమీత్ వ్యాఖ్యానించాడు. నాన్న ప్రోద్భలంతో... అథ్లెటిక్స్ నేపథ్యమున్న తన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో 2001లో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన సుమీత్ 2007లో ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో భారత జూనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐదేళ్ల తర్వాత 2012లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగాడు. అప్పటి నుంచి పుష్కరకాలం పాటు జాతీయ జట్టులో సభ్యుడిగా కొనసాగాడు.భార్య సిక్కి రెడ్డికి జోడీగామనూ అత్రితో కలిసి సుమీత్ రెడ్డి 2015లో పురుషుల డబుల్స్లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్ను అందుకోగా... భార్య సిక్కి రెడ్డితో కలిసి సుమీత్ 2025 మార్చిలో మిక్స్డ్ డబుల్స్లో కెరీర్ బెస్ట్ 25వ ర్యాంక్లో నిలిచాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో, 2018 జకార్తా ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సుమీత్ రెడ్డి 2016 రియో ఒలింపిక్స్లో మనూ అత్రికి కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో పోటీపడ్డాడు. ఒక విజయం, రెండు పరాజయాలు నమోదు చేసుకొని సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం రియో ఒలింపిక్స్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 12 అంతర్జాతీయ టైటిల్స్... 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం నెగ్గిన భారత జట్టులో సుమీత్ సభ్యుడిగా ఉన్నాడు. 2016లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన టీమిండియాలోనూ సుమీత్ సభ్యుడిగా నిలిచాడు. 2016లో గువాహటిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో, 2019లో కఠ్మాండూలో జరిగిన దక్షిణాసియా ఆసియా క్రీడల్లో సుమీత్ రెడ్డి పురుషుల డబుల్స్, పురుషుల టీమ్ ఈవెంట్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు.ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో సుమీత్ రెడ్డి ఓవరాల్గా 12 టైటిల్స్ సాధించాడు. ఇందులో గ్రాండ్ప్రి స్థాయికి చెందిన రెండు పురుషుల డబుల్స్ టైటిల్స్ (2015లో మనూ అత్రితో కలిసి మెక్సికో సిటీ గ్రాండ్ప్రి; 2016లో మనూ అత్రితో కలిసి కెనడా ఓపెన్) ఉన్నాయి. అంతర్జాతీయ చాలెంజ్, అంతర్జాతీయ సిరీస్ కేటగిరీల్లో కలిపి సుమీత్ 10 టైటిల్స్ గెలిచాడు. 2021లో భార్య సిక్కి రెడ్డితో కలిసి హైదరాబాద్లో సిక్కీ సుమీత్ బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించి ఒకవైపు కెరీర్ను కొనసాగిస్తూనే చిన్నారులకు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం జాతీయ డబుల్స్ కోచ్ల ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న సుమీత్ భవిష్యత్లో భారత జట్టు బ్యాడ్మింటన్ పవర్హౌస్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ ప్రేమాయణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వనెస్సా ట్రంప్తో దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వనెస్సాతో రిలేషిప్ విషయాన్ని వుడ్స్ సోషల్మీడియా వేదికగా ప్రకటించాడు. వనెస్సాతో బంధాన్ని వెల్లడిస్తూ వుడ్స్ తన సోషల్మీడియా ఖాతాల్లో ఇలా రాసుకొచ్చాడు. నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది. నువ్వు నా పక్కన ఉంటే జీవితం అద్భుతంగా ఉంది. కలిసి జీవితంలో ముందుకు సాగేందుకు ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు ధన్యవాదాలు. మా హృదయాలకు దగ్గరిగా ఉన్న వారి గోప్యత కొరకు కూడా అభ్యర్దిస్తున్నామంటూ వెనెస్సాతో సన్నిహితంగా ఉన్న దృష్యాలను షేర్ చేశాడు. Love is in the air and life is better with you by my side! We look forward to our journey through life together. At this time we would appreciate privacy for all those close to our hearts. pic.twitter.com/ETONf1pUmI— Tiger Woods (@TigerWoods) March 23, 2025వుడ్స్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుకునే వుడ్స్ పబ్లిక్గా వెనెస్సాతో బంధాన్ని అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. వెనెస్సా ట్రంప్ ఎవరు..?వెనెస్సా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య. వీరిద్దరు 12 ఏళ్లు వివాహ బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత విడిపోయారు. వీరికి ఐదుగురు సంతానం.వెనెస్సా కూమార్తెలలో ఒకరైన కాయ్, వుడ్స్ ఇద్దరు సంతానం సామ్, ఛార్లీ ఒకే స్కూల్లో (ద బెంజమిన్ స్కూల్) చదువుకుంటున్నారు. కాయ్, ఛార్లీ ఇటీవల ఓ జూనియర్ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు.సామ్, ఛార్లీ.. వుడ్స్ అతని మాజీ భార్య ఎలిన్ నార్డెగ్రెన్కు కలిగిన సంతానం. వుడ్ ఎలిన్తో 2010లో విడిపోయాడు. వెనెస్సాకు ముందు వుడ్స్ ఎరికా హెర్మన్తో కొద్దికాలం సహజీవనం చేశాడు. వీరిద్దరి బంధం 2022లో ముగిసింది. 49 ఏళ్ల వుడ్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ మాస్టర్స్ టోర్నీతో పాటు మిగిలిన గోల్ఫ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 1996లో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన వుడ్స్ తన కెరీర్లో 15 మేజర్ ఛాంపియన్షిప్స్ను సొంతం చేసుకున్నాడు. 1997 నుంచి వరుసగా 683 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్గా చలామణి అయిన ఈ అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం 82 సార్లు పీజీఏ టూర్ విజయాలు, 41 సార్లు యూరోపియన్ టూర్లో విజయాలు సాధించాడు. 2021లో వుడ్స్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. -
సూపర్ పియాస్ట్రి
షాంఘై: గత ఏడాది ఫార్ములావన్ సీజన్ ఆరంభంలో రెడ్బుల్ జట్టు అదరగొట్టగా... ఈసారి మెక్లారెన్ జట్టు మెరిపిస్తోంది. ఈ సీజన్లోని తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ విజేతగా నిలువగా... రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో మెక్లారెన్కే చెందిన రెండో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన 23 ఏళ్ల పియాస్ట్రి రేసు ముగిసే వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. నిర్ణీత 56 ల్యాప్ల రేసును ఆ్రస్టేలియా జాతీయుడైన పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 30 నిమిషాల 55.026 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించాడు. 2023లో మెక్లారెన్ జట్టు తరఫునే ఫార్ములావన్లో అరంగేట్రం చేసిన పియాస్ట్రి వరుసగా మూడో ఏడాది అదే జట్టుతో ఉన్నాడు. గత ఏడాది హంగేరి గ్రాండ్ప్రి, అజర్బైజాన్ గ్రాండ్ప్రిలలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న పియాస్ట్రి తాజా గెలుపుతో తన కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు.మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు. నోరిస్ 1 గంట 31 నిమిషాల 04.774 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఫార్ములావన్ రేసులో ఓవరాల్గా 1–2 స్థానాలు మెక్లారెన్ డ్రైవర్లే సొంతం చేసుకోవడం ఇది 50వ సారి కావడం విశేషం. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానంలో నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ ముగ్గురిపై వేటు ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్, లూయిస్ హామిల్టన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా... పియరీ గ్యాస్లీ (ఆలై్పన్) 11వ స్థానంలో నిలిచారు. అయితే సాంకేతిక కారణాలరీత్యా రేసు ముగిశాక ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. లెక్లెర్క్ 10 పాయింట్లను, హామిల్టన్ 8 పాయింట్లను చేజార్చుకున్నారు. 11వ స్థానంలో నిలిచినందుకు గ్యాస్లీకి ఎలాంటి పాయింట్లు లభించలేదు. ఫార్ములావన్ నిబంధనల ప్రకారం రేసు ముగిసిన తర్వాత డ్రైవర్ల కారు కనిష్ట బరువు 800 కేజీలు ఉండాలి. అయితే లెక్లెర్క్, హామిల్టన్, గ్యాస్లీల కార్ల బరువు 799 కేజీలు చూపించింది. దాంతో ఈ ముగ్గురిపై రేసు నిర్వాహకులు వేటు వేసి వారి ఫలితాలను రద్దు చేశారు. సీజన్లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 6న సుజుకా సర్క్యూట్లో జరుగుతుంది. సీజన్లోని తొలి రెండు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్షిప్లో లాండో నోరిస్ 44 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో, 35 పాయింట్లతో జార్జి రసెల్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెక్లారెన్ 78 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టును గట్టెక్కించిన కాస్టనెడా
పనాజీ: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. చర్చిల్ బ్రదర్స్ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. ఇంటర్ కాశీ జట్టుతో జరిగిన గత మ్యాచ్లో స్టాపేజ్ టైమ్లో గోల్ సమరి్పంచుకొని గెలవాల్సిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోగా... చర్చిల్ బ్రదర్స్ జట్టుతో స్టాపేజ్ టైమ్లో (90+11వ నిమిషంలో) గోల్ సాధించి ఓడిపోవాల్సిన మ్యాచ్లో ‘డ్రా’తో గట్టెక్కింది. స్టాపేజ్ టైమ్లో లభించిన పెనాల్టీ కిక్ను శ్రీనిధి డెక్కన్ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ కాస్టనెడా గోల్గా మలిచాడు. ఈ లీగ్లో ‘టాప్ గోల్స్కోరర్’గా కొనసాగుతున్న కాస్టనెడాకిది 15వ గోల్ కావడం విశేషం. అంతకుముందు 29వ నిమిషంలో పాపె గసామా చేసిన గోల్తో చర్చిల్ బ్రదర్స్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 13 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 20 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో 7 మ్యాచ్ల్లో గెలిచి, 7 మ్యాచ్ల్లో ఓడి, 6 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించి 27 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 30 గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది. -
పియాస్ట్రికి పోల్ పొజిషన్
షాంఘై: ఫార్ములావన్ సీజన్ రెండో రేసు చైనీస్ గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) పోల్ పోజిషన్ సాధించాడు. ఫార్ములావన్ కెరీర్లో అతడికి ఇదే తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం. 23 ఏళ్ల ఆసీస్ రేసర్ శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా... 1 నిమిషం 30.641 సెకన్లలో ల్యాప్ పూర్తిచేశాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును పియాస్ట్రి తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. మెర్సెడెస్ డ్రైవర్ రసెల్ (1 నిమిషం 30.723 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. గత వారం ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) చైనీస్ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఐదో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్లతో కూడిన రేసులో మెక్లారెన్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 30. 793 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన నోరిస్ ఈ రోజు జరగనున్న రేసును మూడో స్థానంతో ప్రారంభించనున్నాడు. మాజీ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 30.817 సెకన్లు) నాలుగో ‘ప్లేస్’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. -
మరో విజయం సాధిస్తే...
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, న్యూ కాలడోనియా జట్లు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఓసియానియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. ఈనెల 24న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు 2026 ప్రపంచకప్ టోర్నీ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ 7–0 గోల్స్ తేడాతో ఫిజీ జట్టుపై గెలుపొందగా... న్యూ కాలడోనియా జట్టు 3–0తో తాహితి జట్టును ఓడించింది. ఫిజీ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ తరఫున క్రిస్టోఫర్ వుడ్ (6వ, 56వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సర్ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), టైలర్ గ్రాంట్ బిండన్ (23వ నిమిషంలో), టిమోతీ జాన్ పేన్ (32వ నిమిషంలో), బార్బరూసెస్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తాహితి జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూ కాలడోనియా తరఫున జార్జెస్ గోప్ ఫెనెపెజ్ (50వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... లూయిస్ వాయా (90+1వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికి రెండుసార్లు (1982లో, 2010లో) ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది. మరోవైపు న్యూ కాలడోనియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు. -
‘నా ఆలోచనలను త్వరలోనే పంచుకుంటా’
కోస్టా నవారినో (గ్రీస్): అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా ఎంపికైన కిర్స్టీ కొవెంట్రీ భవిష్యత్తు ఒలింపిక్ ఆతిథ్య దేశాల అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. 2036లో భారత్లో విశ్వక్రీడలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొవెంట్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్లో ఒలింపిక్స్ ఆతిథ్య దేశాల అంశంలో తన ఆలోచనలను త్వరలోనే వెల్లడిస్తానని కొవెంట్రీ పేర్కొంది. ‘ఈ ప్రక్రియ సుదీర్ఘ కాలం సాగుతుంది. భవిష్యత్తు ఆతిథ్య దేశం ఎంపికలో సభ్యులందరి పాత్ర ఉంటుంది. దీనిపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని త్వరలోనే ఐఓసీ సభ్యులతో పంచుకుంటాను’ అని కొవెంట్రీ పేర్కంది. గురవారం జరిగిన ఐఓసీ ఎన్నికల్లో కొవెంట్రీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. జూన్ 23తో ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ పదవీ కాలం ముగిసిన అనంతరం కొవెంట్రీ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుంది. జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ ప్రస్తుతం ఆ దేశ క్రీడా శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తోంది. 2033 వరకు కొవెంట్రీ ఐఓసీ అధ్యక్షురాలిగా కొనసాగనుంది. ఆమె అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖాయం కానుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పదికి పైగా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో భారత్తో పాటు ఖతర్, సౌదీ అరేబియా కూడా ఉన్నాయి. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ సమర్పించడంతో... భారత్ తమ ఆసక్తిని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై ఐఓసీ పూర్తి అధ్యయనం చేయనుంది. 2036 ఒలింపిక్స్కు సంబంధించిన ఆతిథ్య హక్కుల అంశంలో 2026లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సన్నాహాలపై త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతానని... ఆయన అధ్యక్షుడిగా ఉన్నపుడే 2017లో లాస్ ఏంజెలిస్కు ఆతిథ్య హక్కులు దక్కాయని కొవెంట్రీ తెలిపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ టి20 ఫార్మాట్ రూపంలో మళ్లీ విశ్వ క్రీడల్లో భాగం కానుంది. ఈ నేపథ్యంలో గ్రీస్లో జరిగిన ఐఓసీ సెషన్లో కిర్స్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. -
శంకర్ సంచలనం
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువతార శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై శంకర్ అద్భుత విజయం సాధించాడు. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల శంకర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 21–12, 21–5తో ఆంటోన్సెన్ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2022 ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన శంకర్ 66 నిమిషాల పోరులో ఆంటోన్సెన్ ఆట కట్టించాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో రెండుసార్లు రజతం, ఒకసారి కాంస్య పతకం నెగ్గిన ఆంటోన్సెన్ తొలి గేమ్ గెలిచినప్పటికీ... ఆ తర్వాత ప్రపంచ 68వ ర్యాంకర్ శంకర్ ధాటికి చేతులెత్తేశాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో శంకర్ తలపడతాడు. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–18, 21–14తో పుయ్ లామ్ యెంగ్–ఎన్గా టింగ్ యెయుంగ్ (హాంకాంగ్) జంటపై విజయం సాధించింది. -
BFI: హైకోర్టు అనుమతి.. అనురాగ్ ఠాకూర్కు లైన్ క్లియర్
సిమ్లా: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ పడేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఠాకూర్ నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా నామినేషన్ల గడువును పొడిగించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.బీఎఫ్ఐ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాక్సింగ్ సంఘం ప్రతినిధిగా పోటీ పడేందుకు ఠాకూర్ సిద్ధం కాగా... బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.ఆయా రాష్ట్ర సంఘాల్లో ఎన్నికల ద్వారా గెలిచి ఆఫీస్ బేరర్లుగా కొనసాగుతున్న వారికే ఇక్కడా పోటీ పడే అవకాశం ఉంటుందని... ఈ కారణంగా ఠాకూర్ అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారి ఈ నెల 7న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ కోర్టుకెక్కారు. 2008 నుంచి వేర్వేరు హోదాల్లో తాను రాష్ట్ర సంఘంలో పని చేశానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాల అనంతరం... బీఎఫ్ఐ ఉత్తర్వులకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదని, ఠాకూర్ను ఎన్నికలకు అనుమతించాలంటూ హిమాచల్ హైకోర్టు స్పష్టం చేసింది.భారత్ ఖాతాలోనే ‘ఇండియన్ టూర్’ స్క్వాష్ టైటిల్ ఫైనల్లో అనాహత్తో ఆకాంక్ష ‘ఢీ’ చెన్నై: స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్ఎఫ్ఐ) ఇండియన్ టూర్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ భారత్కు ఖరారైంది. భారత్కే చెందిన అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే ఫైనల్కు చేరుకోవడంతో ఇది సాధ్యం కానుంది. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో అనాహత్ 11–6, 11–3, 11–4తో హీలీ వార్డ్ (దక్షిణాఫ్రికా)పై, టాప్ సీడ్ ఆకాంక్ష 11–5, 11–7, 11–7తో భారత్కే చెందిన స్టార్ జోష్నా చినప్పపై విజయం సాధించారు. ఫైనల్ శుక్రవారం జరుగుతుంది.క్వార్టర్ ఫైనల్స్లో ఆకాంక్ష 11–8, 10–12, 4–11, 11–8, 11–9తో నాదియా ఎల్హమి (ఈజిప్ట్)పై, అనాహత్ 11–3, 11–3, 7–11, 11–1తో క్రిస్టినా గోమెజ్ (స్పెయిన్)పై, జోష్నా చినప్ప 11–7, 11–5, 11–4తో సోఫియా మటియోస్ (స్పెయిన్)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కే చెందిన వీర్ చోత్రాని, మెల్విల్ సియానిమనికో (ఫ్రాన్స్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్లో వీర్ 11–5, 11–7, 12–10తో రవిందు లక్సిరి (శ్రీలంక)పై, మెల్విల్11–7, 11–2, 11–7తో డీగో గొబ్బి (బ్రెజిల్)పై విజయం సాధించారు. -
CWG 2030: భారత్ సిద్ధం! నిర్వహణ కోసం బిడ్ దాఖలు
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తర్వాత భారత్లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల (Commonwealth Games 2030) నిర్వహణ కోసం భారత్ అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్లో నగరం పేరును కూడా పేర్కొన్నారు. భారత్కు ఈ క్రీడలు నిర్వహించే అవకాశం దక్కితే వాటికి అహ్మదాబాద్ వేదిక అవుతుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ ప్రక్రియను పూర్తి చేసిందని కేంద్ర క్రీడా శాఖలోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.‘అవును, మనం 2023 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం పోటీ పడుతున్నాం. భారత్ తరఫున ఐఓఏ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బిడ్ను సమర్పించాయి’ అని ఆయన చెప్పారు. నిర్వహణా కమిటీ ‘కామన్వెల్త్ స్పోర్ట్’ ఈ బిడ్ను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ కోసం పరిగణలోకి తీసుకుంటుంది. 2010లో భారత్లో కామన్వెల్త్ క్రీడలకు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ప్రకారం 2036 ఒలింపిక్స్ను కూడా మన దేశంలో నిర్వహించాలనే యోచన ఉంది. ఇందు కోసం కూడా ప్రాధమికంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దానికి ముందు సన్నాహకంగా ఈ కామన్వెల్త్ క్రీడల నిర్వహణతో తమ స్థాయిని ప్రదర్శించాలని భారత్ భావిస్తోంది. ఆసియా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యంఆరేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఆసియా స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు అహ్మదాబాద్లోని నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక కానుంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల నుంచి మేటి స్విమ్మర్లు ఈ మెగా ఈవెంట్కు వచ్చే అవకాశముంది.‘గుజరాత్ ప్రభుత్వం, ఆసియా అక్వాటిక్స్ నుంచి ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు ఆమోదం లభించింది. వచ్చే నెలలో ఎంఓయూ కూడా జరుగుతుంది’ అని భారత స్విమ్మింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ మోనల్ చోక్సి తెలిపారు. చివరిసారి భారత్ 2019లో ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో స్విమ్మింగ్, డైవింగ్, ఆరి్టస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో ఈవెంట్స్ను నిర్వహిస్తారు. -
గాయత్రి–ట్రెసా జోడీ జోరు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–12, 21–8తో అమెలీ లెహ్మన్–సెలీన్ హుబ్‡్ష (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత ద్వయం ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్లోనైతే ఒకదశలో గాయత్రి–ట్రెసా వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించారు. పురుషుల సింగిల్స్లో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 15–21, 11–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో... ప్రియాన్షు 15–21, 17–21తో టోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఇషారాణి బారువా 19–21, 21–18, 18–21తో జియాన్ జి హాన్ (చైనా) చేతిలో, అనుపమ 17–21, 19–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు
కోస్టా నవారినో (గ్రీస్): విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళను వరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న కిర్స్టీ కొవెంట్రీ ఎన్నికయింది. ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీపడగా... బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఐఓసీలోని 97 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా... విజయానికి అవసరమైన 49 ఓట్లు కొవెంట్రీకి తొలి రౌండ్లోనే లభించాయి. ఒలింపిక్ దినోత్సవమైన జూన్ 23న ఐఓసీ అధ్యక్ష పదవిని అలంకరించనున్న కొవెంట్రీ ఎనిమిదేళ్లపాటు (2033 వరకు) ఈ పదవిలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. కొవెంట్రీ అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖరారవుతుంది. ఏడు ఒలింపిక్ పతకాలు... ఐఓసీ అత్యున్నత పదవి దక్కించుకున్న తొలి ఆఫ్రికన్గా గుర్తింపు పొందిన కొవెంట్రీకి విశ్వ క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పోటీపడిన ఆమె మొత్తం 7 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం) సాధించింది. ఏథెన్స్ ఒలింపిక్స్లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో స్వర్ణం, 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో కాంస్యం దక్కించుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో పసిడి పతకం సాధించగా... 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో రజతం, 400 మీటర్ల మెడ్లీలో రజతం కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు ఆమె సంపాదించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్లో 200 మీటర్ల మెడ్లీలో స్వర్ణం నెగ్గిన కొవెంట్రీ... ఆల్ ఆఫ్రికా గేమ్స్లో 14 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం సాధించింది. -
లవ్లీనా సహా అసోం బాక్సర్లను ఆడన్విట్లేదు: బీఎఫ్ఐ అధ్యక్షుడు
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రత్యర్థుల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్... సస్పెన్షన్కు గురైన మాజీ కార్యదర్శి హేమంత కలితాపై కొత్త ఆరోపణలు చేశారు. అసోంకు చెందిన హేమంత తమ రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బాక్సర్లను జాతీయ మహిళా చాంపియన్షిప్లో ఆడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత అయిన లవ్లీనా బొర్గొహైన్తో పాటు ఇతర బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆయన ఆదేశించారంటూ అజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దాదాపు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్ గురువారం ప్రారంభం కానుంది. ‘ఇందులో ఆడేందుకు లవ్లీనా సిద్ధమైంది. అయితే వారు పాల్గొనకుండా చూడాలని హేమంత అధికారులకు ఫోన్లు చేశారు.ఎన్నో ట్రైన్, ఫ్లయిట్ టికెట్లు రద్దు చేశారు. సహజంగానే తమ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి స్థితిలో లవ్లీనాలాంటి బాక్సర్లు పునరాలోచనలో పడ్డారు’ అని ఆయన వెల్లడించారు. దీనిని హేమంత కలితా కొట్టిపారేశారు. తాను ఏ ప్లేయర్ను ఆపలేదని, దానికి తనకు సంబంధం లేదన్న హేమంత...టోర్నీ కోసం ప్రకటించిన తేదీల పట్ల అసంతృప్తితో వివిధ రాష్ట్ర సంఘాలు తప్పుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దు: కోర్టు ఆదేశాలు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు ఇచ్చింది. వివిధ రాష్ట్ర సంఘాల నుంచి ఎన్నికైన వారికి మాత్రమే ప్రతినిధులుగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉందంటూ బీఎఫ్ఐ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఆదేశించింది.ఫలితాల ప్రకటన తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 28 బీఎఫ్ఐ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 7న జారీ చేసిన నియమావళిలో తాజా నిబంధనలు ఉన్నాయి. అయితే దీనిని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ను తమ ప్రతినిధిగా ఓటు వేసేందుకు హిమాచల్ప్రదేశ్ బాక్సింగ్ సంఘం ప్రతిపాదించగా... ఆయన ఎంపికైన వ్యక్తి కాదంటూ రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించారు. తాజా అంశంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బీఎఫ్ఐని కోర్టు ఆదేశించింది. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 23–21తో భారత్కే చెందిన ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ గెలుపుతో శ్రీకాంత్ ముఖాముఖి రికార్డులో 7–3తో ప్రణయ్పై ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రణయ్తో 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ గేమ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గడం విశేషం. మరో తొలి రౌండ్ మ్యాచ్లో భారత్కే చెందిన క్వాలిఫయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 21–5, 21–16తో మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత ప్లేయర్లు ఆయుశ్ శెట్టి 15–21, 19–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–18, 17–21, 10–21తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. ఇషారాణి ముందంజ మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు 17–21, 19–21తో 39 నిమిషాల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. భారత్కే చెందిన ఇషారాణి బారువా, అనుపమ తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వాలిఫయర్ ఇషారాణి 18–21, 21–17, 22–20తో భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్పై, అనుపమ 21–14, 21–13తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక బన్సోద్ (భారత్) 22–20, 14–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, రక్షితశ్రీ (భారత్) 11–21, 17–21తో లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–16, 21–17తో అలైన్ ముల్లర్–కెల్లీ బుటెన్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
‘గోల్’తో ఛెత్రి పునరాగమనం
షిల్లాంగ్: అంతర్జాతీయ ఫుట్బాల్ పునరాగమనంలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్తో మెరిశాడు. ఫలితంగా 12 మ్యాచ్ల నుంచి విజయం లేకుండా సాగుతున్న భారత ఫుట్బాల్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్ తేడాతో మాల్దీవులుపై నెగ్గింది. భారత్ తరఫున రాహుల్ (35వ నిమిషంలో), లిస్టన్ కొలాకో (66వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన 40 ఏళ్ల ఛెత్రి 77వ నిమిషంలో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఛెత్రి కెరీర్లో ఇది 95వ అంతర్జాతీయ గోల్. తన రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఛెత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 286 రోజుల అనంతరం ‘బ్లూ జెర్సీ’లో మైదానంలో అడుగు పెట్టాడు. సునీల్కు ఇది 152వ మ్యాచ్ కాగా... 16 నెలల తర్వాత భారత జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. మొనొలో భారత ఫుట్బాల్ జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జట్టుకు ఇదే మొదటి గెలుపు. భారత జట్టు చివరిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లో భాగంగా 2023 నవంబర్ 16న కువైట్పై విజయం సాధించింది. -
‘పెళ్లి కార్నర్’లో భారత హాకీ స్టార్లు
షట్లర్లు సైనా నెహ్వాల్–పారుపల్లి కశ్యప్, ఆర్చర్లు దీపిక కుమారి–అతాను దాస్, హాకీ క్రీడాకారులు మౌనిక–ఆకాశ్దీప్... ఇలా పెళ్లాడిన ప్లేయర్ల జాబితాలో కొత్తగా మహిళా డిఫెండర్ ఉదిత దుహాన్, పురుషుల ఫార్వర్డ్ మన్దీప్ సింగ్లు కూడా చేరనున్నారు. భారత ప్లేయర్ల పెళ్లి బాజా ఇప్పటికే మోగుతోంది. శుక్రవారం (21న) జరిగే వేడుకలో మన్దీప్–ఉదితలు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జలంధర్: మైదానంలో గోల్స్ కోసం ప్రత్యర్థులతో పోరాడే భారత హాకీ ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదిత దుహాన్లు కాసేపు పెనాల్టీ కార్నర్లు, పెనాల్టీ స్ట్రోక్లు పక్కనబెట్టి, చేతుల్లోని హాకీ స్టిక్లకు సెలవిచ్చి కళ్యాణ మాలలు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. జలంధర్ (పంజాబ్)కు చెందిన మన్దీప్... హిస్సార్ (హరియాణా) అమ్మాయి ఉదితతో కలిసి ఏడడుగులు నడువనున్నాడు. భారత హాకీకి రెండు కన్నుల్లాంటి పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్లేయర్ల మధ్య ఈ నెల 21న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగనుంది. ఈ మేరకు ఇద్దరి ఇళ్లు, కళ్యాణశోభను సంతరించుకున్నాయి. వీళ్లిదరి పెళ్లికి సంబంధించిన ప్రి–వెడ్డింగ్ షూట్ ఫొటోల్ని సామాజిక సైట్లలో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల ఉదిత 2017లో జాతీయ జట్టుకు ఎంపికైంది. డిఫెండర్గా 127 మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి స్ట్రయికర్లను గోల్స్ చేయకుండా నిరోధించే ఆమె 14 గోల్స్ కూడా చేసింది. 30 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ మన్దీప్ 2013లో భారత్ తరఫున అంతర్జాతీయ హాకీలో ఆరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా 260 మ్యాచ్లాడిన మన్దీప్ 120 గోల్స్తో సత్తాచాటుకున్నాడు. పంజాబ్ పోలీస్ శాఖలో అతను డీఎస్పీగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో మన్దీప్ సభ్యుడు కాగా... త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో తృప్తి పడిన మహిళల జట్టులో ఉదిత ఉంది. పెళ్లికి ముందరి సంగీత్ కార్యక్రమం నేడు జరుగనుంది. భారత పురుషులు, మహిళా జట్ల ప్లేయర్లు ఈ వేడుకలో గానబజానాతో హడావుడి చేయనున్నారు. 21న ఉదయం 9 గంటలకు సిక్కు మత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనుంది. అనంతరం మరుసటి రోజు ఘనంగా రిసెప్షన్ (విందు)కు హాకీ, ఇతర క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. -
మెయిన్ ‘డ్రా’కు ఆయుశ్ శెట్టి అర్హత
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు ఆయుశ్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, సతీశ్ కుమార్ కరుణాకరన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఆయుశ్, శంకర్, సతీశ్ తాము ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి మెయిన్ ‘డ్రా’ బెర్త్లను దక్కించుకున్నారు. ఆయుశ్ తొలి రౌండ్లో 21–12, 21–15తో చోలన్ కయాన్ (ఇంగ్లండ్)పై, రెండో రౌండ్లో 21–6, 21–8తో రాఫెల్ గావోఇస్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. శంకర్ తొలి రౌండ్లో 21–13, 21–4తో యువెహాంగ్ వాంగ్ (ఇంగ్లండ్)పై, రెండో రౌండ్లో 21–7, 21–10తో తరుణ్ మన్నేపల్లి (భారత్)పై నెగ్గాడు. సతీశ్ తొలి రౌండ్లో 21–13, 21–9తో బ్రూనో కర్వాలో (పోర్చుగల్)పై, రెండో రౌండ్లో 19–21, 21–19, 21–16తో జస్టిన్ హో (మలేసియా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో భారత్కే చెందిన ఇషారాణి బారువా మెయిన్ ‘డ్రా’కు చేరుకోగా... శ్రియాన్షి వలిశెట్టి విఫలమైంది. క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఇషారాణి 21–16, 21–11తో రోసీ పాన్కసారి (ఫ్రాన్స్)పై గెలుపొందింది. -
2028 ఒలింపిక్స్లో బాక్సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఓసీ
కోస్టా నవరినో (గ్రీస్): లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలు నిర్వహించే అంశంపై సందిగ్ధత వీడింది. ఆటలో సమగ్రత, నిర్ణయాల్లో స్పష్టత లేదనే కారణంగా 2022లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ను చేర్చలేదు. కాగా... మంగళవారం నుంచి ఐఓసీ 144వ సెషన్ ప్రారంభం కానుండగా... దీనికి ముందు సోమవారం కార్యనిర్వాహక బోర్డు ఒలింపిక్స్లో బాక్సింగ్ క్రీడను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)ను పక్కన పెట్టి... ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు నిచ్చిన తర్వాత ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.నేటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఐఓసీ సెషన్లో థామస్ బాచ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇదే సెషన్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ను చేర్చే అంశానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలపనుంది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదానికి పంపుతాం. ప్రపంచ బాక్సింగ్ సంఘం గుర్తించిన జాతీయ సమాఖ్యలకు చెందిన బాక్సర్లు నిరభ్యంతరంగా ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు.పాలనా సమస్యలపై సుదీర్ఘ వివాదంతో పాటు బౌట్ల సమగ్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఐబీఏ గుర్తింపును రద్దు చేశాం. అనంతరం గత రెండు ఒలింపిక్స్ (2020 టోక్యో, 2024 పారిస్) క్రీడల్లో బాక్సింగ్ పోటీలను తిరిగి పర్యవేక్షించాం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బాక్సింగ్కు ఒలింపిక్స్లో అవకాశం కల్పించాం’ అని థామస్ బాచ్ వెల్లడించారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం అధ్యక్షడు బోరిస్ ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో క్రీడకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. -
వరల్డ్ నంబర్ వన్కు షాకిచ్చిన టీనేజీ సంచలనం
మహిళల టెన్నిస్లో మరో స్టార్ అవతరించింది. టీనేజ్ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటం కాదని రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆంద్రెయెవా నిరూపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో ఆంద్రెయెవా విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్)తో జరిగిన తుది పోరులో ఆంద్రెయెవా మూడు సెట్లలో విజయాన్ని అందుకొని కెరీర్లో రెండో డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. కాలిఫోర్నియా: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ రష్యా టీనేజ్ టెన్నిస్ స్టార్ మిరా ఆంద్రెయెవా రెండో టైటిల్ను హస్తగతం చేసుకుంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్లో గ్రాండ్స్లామ్ టోర్నీ తర్వాత ఉన్నతశ్రేణి టోర్నీ అయిన 1000 సిరీస్లలో ఆమె వరుసగా రెండో టైటిల్ను దక్కించుకుంది. గత నెలలో దుబాయ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించిన ఆంద్రెయెవా తాజాగా ఇండియన్ వెల్స్ ఓపెన్–1000 టోర్నీలో చాంపియన్గా అవతరించింది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏళ్ల ఆంద్రెయెవా 2–6, 6–4, 6–3తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది బ్రిస్బేన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలలో సబలెంకా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు ఈ గెలుపుతో ఆంద్రెయెవా బదులు తీర్చుకుంది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్ను సొంతం చేసుకుంది. అయితే తన లోపాలను సరిదిద్దుకొని రెండో సెట్ నుంచి ఆంద్రెయెవా విజృంభించింది. మూడో గేమ్లో సబలెంకా సర్వీస్ను బ్రేక్ చేసిన ఆంద్రెయెవా నాలుగో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆంద్రెయెవా తన సర్వీస్లను కాపాడుకొని సెట్ను 6–4తో దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో ఆంద్రెయెవా మూడో గేమ్లో, తొమ్మిదో గేమ్లో సబలెంకా సర్వీస్లను బ్రేక్ చేసి 6–3తో సెట్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన ఆంద్రెయెవాకు 11,27,500 డాలర్ల (రూ. 9 కోట్ల 77 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సబలెంకాకు 5,99,625 డాలర్ల (రూ. 5 కోట్ల 19 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇండియన్ వెల్స్ టైటిల్తో ఆంద్రెయెవా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్కు చేరుకుంది. ఐదు స్థానాలు ఎగబాకిన ఆంద్రెయెవా ఆరో ర్యాంక్ను అందుకుంది. కంప్యూటర్ ర్యాంకింగ్స్ను 1975లో ప్రవేశ పెట్టాక ఒకే టోర్నీ ఫైనల్లో, సెమీఫైనల్లో వరల్డ్ నంబర్వన్, ప్రపంచ రెండో ర్యాంకర్లను ఓడించి విజేతగా నిలిచిన రెండో అతి పిన్న వయస్కురాలిగా ఆంద్రెయెవా గుర్తింపు పొందింది. ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్)పై ఆంద్రెయెవా గెలిచింది. 1979 యూఎస్ ఓపెన్లో ట్రేసీ ఆస్టిన్ (16 ఏళ్లు) ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మార్టినా హింగిస్ (1999లో) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్గా ఆంద్రెయెవా నిలిచింది. డ్రేపర్ ధమాకాఇండియన్ వెల్స్ ఓపెన్ పురుషుల విభాగంలో బ్రిటన్ ప్లేయర్ జాక్ డ్రేపర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో డ్రేపర్ 70 నిమిషాల్లో 6–2, 6–2తో హోల్గర్ రూనే (డెన్మార్క్)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 సింగిల్స్ టైటిల్ సాధించాడు. డ్రేపర్ 10 ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.23 ఏళ్ల డ్రేపర్ టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తాజా గెలుపుతో డ్రేపర్ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 7వ ర్యాంక్ను అందుకున్నాడు.ఆండీ ముర్రే, టిమ్ హెన్మన్, గ్రెగ్ రుసెద్స్కీ, కామెరాన్ నోరి తర్వాత ఏటీపీ మాస్టర్స్–1000 టైటిల్ నెగ్గిన ఐదో బ్రిటన్ ప్లేయర్గా డ్రేపర్ గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన డ్రేపర్కు 12,01,125 డాలర్ల (రూ. 10 కోట్ల 41 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ రూనేకు 6,38,750 డాలర్ల (రూ. 5 కోట్ల 53 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత జట్టులో పట్లోళ్ల ఇంద్రా రెడ్డి
ప్రతిష్టాత్మక ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత బృందాన్ని ప్రకటించారు. అండర్–11 ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తనయుడైన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి గత జనవరిలో జరిగిన జాతీయ స్కూల్ చెస్ చాంపియషిప్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.అండర్–11 ఓపెన్ విభాగంలోనే భారత్ నుంచి రేయాంశ్ వెంకట్ మరో ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సెర్బియాలోని వ్రాన్జాస్కా బాంజా పట్టణంలో జరుగుతాయి. బాలికల విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17)... ఓపెన్ విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17) తొమ్మిది రౌండ్లపాటు పోటీలను నిర్వహిస్తారు. భారత్ నుంచి మొత్తం 22 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇండియన్ టూర్ స్క్వాష్ టోర్నీ షురూచెన్నై: భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నేటి నుంచి జరగనున్న ఇండియన్ టూర్ స్క్వాష్ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాళ్లు సౌరవ్ ఘోషల్, జోష్నా చినప్ప ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చెన్నై వేదికగా జరగనున్న ఈ టోర్నీలో వీరితో పాటు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న టీనేజ్ సంచలనం 16 ఏళ్ల అనాహత్ సింగ్ కూడా బరిలోకి దిగనుంది.తక్కువ కాలంలోనే 9 ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిళ్లు ఖాతాలో వేసుకున్న అనాహత్ మహిళల విభాగంలో మూడో సీడ్ దక్కించుకుంది. గతేడాది కెరీర్కు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల సౌరవ్ ఇటీవల రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ వెంటనే బరిలోకి దిగిన సిడ్నీ క్లాసిక్ ఈవెంట్లో అతడు విజేతగా నిలిచాడు. 19 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన 38 ఏళ్ల జోష్నా గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి బాక్స్లో అడుగు పెట్టనుంది.పురుషుల విభాగంలో ఈజిప్ట్ ప్లేయర్ కరీమ్ అల్ హమామీ టాప్ సీడ్గా బరిలోకి దిగనుండగా... ఈజిప్ట్కే చెందిన అలీ హుసేన్ రెండో సీడ్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి సౌరవ్తో పాటు వీర్, సూరజ్, అరిహాంత్, హరిందర్ పాల్ సింగ్, పీఆర్ సంధేశ్ పాల్గొంటున్నారు. మహిళల విభాగంలో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే టాప్ సీడ్ దక్కించుకుంది. మన దేశం నుంచి షమీనా రియాజ్, పూజ ఆర్తి, రితిక సీలన్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రియా, బ్రెజిల్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, కువైట్, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, వేల్స్ నుంచి ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
వారెవ్వా నోరిస్...
మెల్బోర్న్: గత సీజన్ను విజయంతో ముగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ కొత్త సీజన్ను కూడా విజయంతో ప్రారంభించాడు. 2025 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో బ్రిటన్కు చెందిన 25 ఏళ్ల లాండో నోరిస్ చాంపియన్గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నోరిస్ నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 42 నిమిషాల 06.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ టైటిల్ సాధిస్తున్న వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ రేసును 1 గంట 42 నిమిషాల 07.199 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందాడు. 1987లో ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రి మొదలుకాగా ఈ రేసుకంటే ముందు వరకు ఫెరారీ జట్టు డ్రైవర్లు అత్యధికంగా 11 సార్లు విజేతగా నిలిచారు. అయితే ఈసారి ఫెరారీ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. తొలిసారి ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన మాజీ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 10వ స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానాన్ని సంపాదించాడు. 2010 తర్వాత తొలిసారి ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రికి వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఈ రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. మూడుసార్లు ట్రాక్పై సేఫ్టీ కార్లు వచ్చాయి. తొలి ల్యాప్ పూర్తికాకముందే ముగ్గురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (విలియమ్స్), జాక్ దూహాన్ (ఆలై్పన్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్) రేసు నుంచి వైదొలిగారు. ఫార్మేషన్ ల్యాప్లో హద్జార్ తప్పుకోగా... తొలి ల్యాప్లో పరస్పరం ఢీకొట్టుకోవడంతో గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన సెయింజ్తోపాటు దూహాన్ నిష్క్రమించారు. ఆ తర్వాత అలోన్సో (ఆస్టన్ మార్టిన్) 32వ ల్యాప్లో, గాబ్రియేల్ బొర్టోలెటో (కిక్ సాబెర్) 45వ ల్యాప్లో, లియామ్ లాసన్ (రెడ్బుల్) 46వ ల్యాప్లో తప్పుకున్నారు. ఓవరాల్గా 20 మంది డ్రైవర్లలో 14 మంది రేసును పూర్తి చేశారు. 24 రేసులతో కూడిన 2025 సీజన్లో తదుపరి రెండో రేసు చైనా గ్రాండ్ప్రి ఈనెల 23న జరుగుతుంది. -
అల్కరాజ్కు చుక్కెదురు
కాలిఫోర్నియా: ‘హ్యాట్రిక్’ సాధించాలనే లక్ష్యంతో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్కు నిరాశ ఎదురైంది. గత రెండేళ్లు చాంపియన్గా నిలిచిన అల్కరాజ్ ఈసారి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 14వ ర్యాంకర్, బ్రిటన్ ప్లేయర్ జేక్ డ్రేపర్ అద్భుత ఆటతీరుతో అల్కరాజ్ ఆట కట్టించి తన కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో 13వ సీడ్ డ్రేపర్ 6–1, 0–6, 6–4తో రెండో సీడ్ అల్కరాజ్ను బోల్తా కొట్టించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో డ్రేపర్ తొలిసారి టాప్–10లోకి దూసుకురానున్నాడు. 23 ఏళ్ల డ్రేపర్ గత ఏడాది వియన్నా ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో 12వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో డ్రేపర్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ రూనే 7–5, 6–4తో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. అల్కరాజ్తో ఐదోసారి తలపడ్డ డ్రేపర్ ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో డ్రేపర్ నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు అల్కరాజ్ 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. -
సవిత, హర్మన్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మహిళల జట్టు గోల్కీపర్ సవితా పూనియాకు... ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ పేరిట ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ పురస్కారాలు అందజేస్తోంది.2024 పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండో సారి విశ్వ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ హర్మన్ప్రీత్ సభ్యుడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో సవిత ప్రధాన పాత్ర పోషించింది. 2024 సంవత్సరానికి గానూ సవిత హాకీ ఇండియా బల్జీత్ సింగ్ ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా దక్కించుకుంది.‘ఈ పురస్కారాలకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు సభ్యుల సహకారం లేనిదే ఇది సాధ్యం కాదు. ఈ అవార్డులు ఆటపై ఏకాగ్రతను మరింత పెంచుతాయి’ అని సవిత పేర్కొంది. ‘ఈ అవార్డు నాకు ప్రేరణ వంటిది. యువ ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా ఇవి తోడ్పాటునిస్తాయి’ అని హర్మన్ప్రీత్ సింగ్ అన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు 1975లో ప్రపంచకప్ నెగ్గి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. -
నోరిస్కు పోల్ పొజిషన్
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్ ఆరంభ రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) పోల్ పొజిషన్ సాధించాడు. 24 రేసులతో కూడిన ఈ సీజన్కు ఆదివారం తెర లేవనుండగా... శనివారం క్వాలిఫయింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో లాండో నోరిస్ 1 నిమిషం 15.096 సెకన్లలో ల్యాప్ను పూర్తి చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. మెల్బోర్న్లో నోరిస్కు ఇదే తొలి ‘పోల్’ కాగా... ఓవరాల్గా కెరీర్లో 10వది. ఎఫ్1 సీజన్ ప్రారం¿ోత్సవ క్వాలిఫయింగ్ టోర్నీకి శనివారం 1,36,347 మంది అభిమానులు హాజరవడం విశేషం. ‘కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ట్రాక్పై కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ముందు వరుసలో నిలవగలం’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) 0.084 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్లో పియాస్ట్రి 1 నిమిషం 15. 180 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. ట్రాక్పై గత నాలుగేళ్లుగా ఎదురులేకుండా దూసుకెళ్తున్న రెడ్బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్)... క్వాలిఫయింగ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచాడు.వెర్స్టాపెన్ 1 నిమిషం 15.481 సెకన్లలో వేగవంతమైన ల్యాప్ పూర్తి చేశాడు. ఈ సీజన్ నుంచి ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) 1 నిమిషం 15.973 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ‘ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. కానీ ఓవరాల్గా సంతృప్తిగా ఉన్నా... గత రెండు రోజులుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ప్రధాన రేసులో మరింత వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని హామిల్టన్ అన్నాడు. ఫెరారీ మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిసం 15.755 సెకన్లు; మొనాకో) ఏడో ప్లేస్లో, మెర్సెడెస్ డ్రైవర్ జార్జి రసెల్ (1 నిమిషం 15. 546 సెకన్లు; బ్రిటన్) నాలుగో స్థానంలో నిలిచారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. -
రష్మికకు ఐటీఎఫ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్లో ఆరో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ ఖాతాలో వేసుకుంది. భారత్కే చెందిన వైదేహి చౌదరీతో కలిసి రష్మిక డబ్ల్యూ 35 డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్లో భాగంగా... థాయ్లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూ 35 టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్టెడ్ (థాయ్లాండ్)–యుకీ నైటో (జపాన్) ద్వయంపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన భారత జోడీ... వరుస సెట్లలో విజృంభించి టైటిల్ చేజిక్కించుకుంది. 1 గంట 18 నిమిషాల పాటు సాగిన పోరులో రష్మిక–వైదేహి 2 ఏస్లు సంధించి ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. 9 బ్రేక్ పాయింట్లు కాచుకున్న భారత ప్లేయర్లు... ఓవరాల్గా 61 పాయింట్లు సాధించి సునాయాసంగా గెలుపొందారు. హైదరాబాద్కు చెందిన రష్మికకు ఇది రెండో డబ్ల్యూ 35 టైటిల్ కాగా... ఓవరాల్గా ఆరోది. 2024లో డబ్ల్యూ 35 ఇండోర్, 2023లో డబ్ల్యూ 15 అహ్మదాబాద్, డబ్ల్యూ 15 థాయ్లాండ్, డబ్ల్యూ 25 థాయ్లాండ్, 2022లో డబ్ల్యూ 15 గురుగ్రామ్ టోర్నమెంట్లలో రష్మిక డబుల్స్ చాంపియన్గా నిలిచింది. ఈ ఆరింట్లో నాలుగుసార్లు వైదేహి చౌదరీతో కలిసే రష్మిక విజయాలు సాధించింది. -
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల గతంలో ఓ సినిమాలో తళుక్కుమని మెరిసింది. నితిన్ కోరిక మేరకు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో డింగ్ డింగ్ డింగ్ డింగ్ అనే ఐటం సాంగ్లో ఆడిపాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.గుత్తా జ్వాల (Jwala Gutta) మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ (Tollywood)లో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్లో రాణిస్తున్న నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ నో చెప్పాను. సినిమాల్లోకి రావాలని కలలో కూడా అనుకోలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో నాకెందరో స్నేహితులున్నారు. చిత్రపరిశ్రమలో ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిలా నేనుండలేను. అక్కడ ఉండాలంటే మనకు సిగ్గు ఉండకూడదు. చాలా విషయాల్లో సర్దుకుపోతుండాలి.24 గంటలు పనిలోనే..నా భర్త.. హీరో, నిర్మాత విష్ణు విశాల్ (Vishnu Vishal) మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాడుగా.. 24 గంటలు ఆయనకు ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చూస్తేనే నాకు తల నొప్పి వచ్చేస్తుంది. మేము 10 గంటలు ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. కానీ వాళ్లకేమో డబ్బుల టెన్షన్, ఆ షాట్స్ సరిగా వచ్చిందా? లేదా? ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. నా భర్త రెడీ అవడానికి 2 గంటలు తీసుకుంటాడు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఎంతో శ్రమిస్తారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్.. ప్రతిఒక్కరికీ ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే!అలా ఐటం సాంగ్ చేశా..ఐటం సాంగ్ విషయానికి వస్తే.. అది తల్చుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. నితిన్ (Nithiin) నాకు ఫ్రెండ్. ఒక పార్టీలో అతడు.. జ్వాల నువ్వు నా సినిమాలో ఓ పాట చేస్తున్నావ్ అన్నాడు. సరేనని తలూపాను. కానీ, సీరియస్గా తీసుకోలేదు. మూడు నెలల తర్వాత పాట రెడీ అని నా దగ్గరకు వచ్చాడు. నేను నోరెళ్లబెట్టాను. ఇప్పుడెలా నో చెప్పాలా? అని ఆలోచనలో పడ్డాను. అతడేమో కచ్చితంగా నేను చేయాల్సిందే అని పట్టుబట్టాడు. అలా సెట్లో అడుగుపెట్టాను.ఫ్రీ పబ్లిసిటీమొదటి రోజు నా మోకాలివరకు ఉన్న డ్రెస్ ఇచ్చారు. రోజురోజుకీ ఆ డ్రెస్ చిన్నదైపోతూ వచ్చింది. ఏంటిదంతా? అనుకున్నాను. నాలుగురోజుల్లో సరదాగా షూట్ పూర్తి చేశాం. అప్పటికే అతడి సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నేను సాంగ్ చేయడం వల్ల ఆ మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. తెలుగు సినిమా జాతీయ మీడియాలో కూడా వస్తుందని నితిన్ సంతోషపడిపోయాడు. నా పాట వల్ల సినిమా ఫ్లాప్ అవకుండా హిట్టయింది. అదొక్కటి నాకు సంతోషంగా అనిపించింది అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చింది.చదవండి: తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా! -
రయ్... రయ్... రయ్...
మెల్బోర్న్: వరుసగా ఐదో ఏడాది వరల్డ్ చాంపియన్గా నిలిచి దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును వెర్స్టాపెన్ సమం చేస్తాడా? జట్టు మారడంతో తన గెలుపు రాతను కూడా హామిల్టన్ మార్చుకుంటాడా? మూడో జట్టు తరఫున హామిల్టన్ మళ్లీ ప్రపంచ చాంపియన్గా అవతరిస్తాడా? ఈ ఇద్దరిని కాదని మూడో రేసర్ రూపంలో కొత్త విశ్వవిజేత ఆవిర్భవిస్తాడా? వీటన్నింటికీ సమాధానం నేటి నుంచి మొదలయ్యే ఫార్ములావన్ 75వ సీజన్లో లభిస్తుంది. 24 రేసులతో కూడిన ఈ సీజన్కు ఆదివారం ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రితో తెర లేస్తుంది. 2019 తర్వాత మళ్లీ ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రితో ఫార్ములావన్ సీజన్ మొదలుకానుండటం విశేషం. 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. క్వాలిఫయింగ్ సెషన్లో నమోదు చేసిన అత్యుత్తమ సమయం ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును 20 మంది డ్రైవర్లు ఏ స్థానం నుంచి ప్రారంభిస్తారో నిర్ణయిస్తారు. గత నాలుగేళ్లుగా రెడ్బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఎదురులేని విజేతగా నిలుస్తున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నుంచి వెర్స్టాపెన్కు పోటీ లభిస్తున్నా... విజయాల పరంగా వెర్స్టాపెన్ ముందుకు దూసుకెళ్తున్నాడు. మెర్సిడెస్ జట్టు తరఫున 2013 నుంచి 2024 వరకు బరిలోకి దిగిన హామిల్టన్ ఈసారి తన కెరీర్లో తొలిసారి ఫెరారీ జట్టు తరఫున డ్రైవ్ చేయనున్నాడు. 2007 నుంచి 2012 వరకు మెక్లారెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ 2008లో తొలిసారి వరల్డ్ చాంపియన్ అయ్యాడు. ఆ తర్వాత 2013 నుంచి 2024 మధ్య కాలంలో ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచాడు. ఈ ఏడాది వెర్స్టాపెన్కు హామిల్టన్, లెక్లెర్క్, లాండోనోరిస్, కార్లోస్ సెయింజ్ జూనియర్, జార్జి రసెల్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశం ఉంది. పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఫార్ములావన్లో ప్రతి గ్రాండ్ప్రి మూడు రోజులు కొనసాగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్... శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. కొన్ని గ్రాండ్ప్రిలలో శనివారం స్ప్రింట్ రేసులను నిర్వహిస్తారు. ఈ రేసు 100 కిలోమీటర్లు జరుగుతుంది. అయితే స్ప్రింట్ రేసు ఫలితాలకు ప్రధాన రేసు ఫలితాలకు సంబంధం ఉండదు. ఇక ప్రధాన రేసులో టాప్–10లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. తొలి స్థానం నుంచి పదో స్థానం వరకు నిలిచిన డ్రైవర్లకు వరుసగా 25, 18, 15, 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్ లభిస్తుంది. రేసు మొత్తంలో ఫాస్టెస్ట్ ల్యాప్ నమోదు చేసిన డ్రైవర్కు బోనస్గా ఒక పాయింట్ ఇస్తారు. సీజన్లోని 24 రేసులు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన డ్రైవర్కు వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ లభిస్తుంది. అత్యధిక పాయింట్లు సంపాదించిన జట్టుకు కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్ టైటిల్ దక్కుతుంది. ఏ జట్టులో ఎవరున్నారంటే... ఈ ఏడాది కూడా ఫార్ములావన్ టైటిల్ కోసం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు బరిలో ఉన్నారు. ఒక్కో జట్టు తరఫున ఇద్దరు డ్రైవర్లు ప్రధాన రేసులో పోటీపడతారు. ఇద్దరు డ్రైవర్లలో ఎవరైనా పాల్గొనకపోతే అదే జట్టులో ఉన్న రిజర్వ్ డ్రైవర్కు అవకాశం లభిస్తుంది. ఈ సీజన్లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డ్రైవర్ల వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్బుల్: మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్), లియామ్ లాసన్ (న్యూజిలాండ్). ఫెరారీ: లూయిస్ హామిల్టన్ (బ్రిటన్), చార్లెస్ లెక్లెర్క్ (మొనాకో). మెర్సిడెస్: జార్జి రసెల్ (బ్రిటన్), ఆంటోనెలి (ఇటలీ). మెక్లారెన్: లాండో నోరిస్ (బ్రిటన్), ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) ఆలై్పన్: పియరీ గ్యాస్లీ (ఫ్రాన్స్), జాక్ దూహన్ (ఆ్రస్టేలియా). ఆస్టన్ మార్టిన్: లాన్స్ స్ట్రోల్ (కెనడా), ఫెర్నాండో అలోన్సో (స్పెయిన్). హాస్: ఎస్తెబన్ ఒకాన్ (ఫ్రాన్స్), ఒలివెర్ బేర్మన్ (బ్రిటన్). కిక్ సాబెర్: నికో హుల్కెన్బర్గ్ (జర్మనీ), బొర్టెలెటో (బ్రెజిల్). రేసింగ్ బుల్స్: హాద్జర్ (ఫ్రాన్స్), యూకీ సునోడా (జపాన్) విలియమ్స్: ఆల్బన్ (థాయ్లాండ్), కార్లోస్ సెయింజ్ (స్పెయిన్)34 ఇప్పటి వరకు ఫార్ములావన్లో 34 వేర్వేరు డ్రైవర్లు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను సాధించారు. అత్యధికంగా 7 సార్లు చొప్పున మైకేల్ షుమాకర్ (జర్మనీ), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) టైటిల్స్ గెలిచారు. షుమాకర్ వరుసగా ఐదేళ్లు వరల్డ్ చాంపియన్గా నిలిచాడు. షుమాకర్ రికార్డును సమం చేసేందుకు వెర్స్టాపెన్కు ఈసారి అవకాశం లభించనుంది. గతంలో హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్కు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. 17 ఫార్ములావన్లో 17 మంది డ్రైవర్లు ఒక్కసారి మాత్రమే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను గెలిచారు.105 ఫార్ములావన్ చరిత్రలో హామిల్టన్ గెలిచిన రేసులు. అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్ రికార్డు హామిల్టన్ పేరిట ఉంది. షుమాకర్ (91), వెర్స్టాపెన్ (63), వెటెల్ (53), అలైన్ ప్రాస్ట్ (51) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 3 ఈ సీజన్లో బరిలో దిగుతున్న 20 మంది డ్రైవర్లలో ముగ్గురు ప్రపంచ చాంపియన్స్ ఉన్నారు. రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (2021, 2022, 2023, 2024), తొలిసారి ఫెరారీ తరఫున పోటీపడుతున్న లూయిస్ హామిల్టన్ (2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020), ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో (2005, 2006) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
కరీ...‘3’చీర్స్
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా బాస్కెట్బాల్ స్టార్ స్టీఫెన్ కరీ అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ‘త్రీ’ పాయింటర్లు స్కోరు చేయడంలో సిద్ధహస్తుడైన కరీ.. ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ)లో 4 వేల త్రీ పాయింటర్లు సాధించిన తొలి ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. లీగ్లో భాగంగా ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 ఏళ్ల కరీ... శుక్రవారం సాక్రమెంటో కింగ్స్ జట్టుతో జరిగిన పోరులో ఈ మైలురాయి దాటాడు. ఆట మూడో క్వార్టర్ 8వ నిమిషంలో నాలుగో ప్రయత్నంలో కరీ... త్రీ పాయింటర్ సాధించాడం ద్వారా 4000 త్రీ పాయింటర్లు ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా గోల్డెన్ స్టేట్ వారియర్స్ జట్టు 130–104 పాయింట్ల తేడాతో సాక్రమెంటో కింగ్స్పై విజయం సాధించింది. సుదీర్ఘ కాలంగా ‘పాయింట్ గార్డ్’ పొజిషన్లో ఆడుతున్న కర్రీ... తన జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2009 అక్టోబర్ 30న కరీ తన తొలి ‘త్రీ’ పాయింటర్ సాధించాడు. ఎన్బీఏ చరిత్రలో అత్యధిక త్రీ పాయింటర్లు సాధించిన ఆటగాడిగా రే అలెన్ (2,973) పేరిట ఉన్న రికార్డును 2021లో అధిగమించిన కరీ... అదే జోరు కొనసాగిస్తూ పుట్టినరోజున మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్గా ఈ జాబితాలో ప్రస్తుతం కరీ తర్వాత జేమ్స్ హర్డెన్ (3,127), డామియన్ లిలార్డ్ (2,794) ఉన్నారు. బాస్కెట్కు 23.9 ఫీట్ల (7.24 మీటర్లు) దూరంలోని గీత నుంచి నేరుగా బంతిని లక్ష్యాన్ని చేర్చగలిగితే 3 పాయింట్లు లభిస్తాయి. అంతర్జాతీయ పోటీల్లో 22.2 ఫీట్లు ఉన్న ఈ దూరం... ఎన్బీఏలో మాత్రం 23.9 ఫీట్లుగా ఉంది. ప్రత్యర్థి కళ్లు గప్పగల నైపుణ్యంతో పాటు... దూరం నుంచే లక్ష్యాన్ని గురిపెట్టగల సామర్థ్యం కలగలిసినప్పుడే త్రీ పాయింటర్లు సాధ్యమవుతాయి. ఈ విషయంలో కెరీర్ ఆరంభం నుంచి తన ప్రత్యేకత చాటుకుంటున్న కరీ... ‘త్రీ’ పాయింటర్ స్పెషలిస్ట్గా ఎదిగాడు. ఇప్పటి వరకు ఎన్బీఏలో రెండుసార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన కరీ... ఈ క్రమంలో ఎన్బీఏ చరిత్రలో 25,000 పాయింట్లు సాధించిన 26వ ప్లేయర్గా నిలిచాడు. ‘అతడు జట్టుకు ఎంతో ముఖ్యం. కీలక సమయాల్లో అతడు సాధించే పాయింట్లు టీమ్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. ఆటను ఎలా మలుపుతిప్పాలో అతడికి బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన ఏకాగ్రత కోల్పోడు. చిన్నప్పటి నుంచి అతడి నిశిత పరిశీలన నన్ను ఆకట్టుకుంటోంది’ అని కోచ్ స్టీవ్ కెర్ అన్నాడు. ‘నేనెప్పుడూ త్రీ పాయింటర్ల గురించి ఆలోచించలేదు. ఆటలో భాగంగా అవి వాటంతటవే వచ్చి చేరుతున్నాయి.నా వరకు మ్యాచ్ విజయమే ముఖ్యం. ఈ క్రమంలో 4 వేల త్రీ పాయింటర్లు సాధించడం ఆనందంగా ఉంది. అయితే అది ఒక నంబర్ మాత్రమే’ అని 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్న కరీ అన్నాడు. -
వరుసగా 24వ ఏడాది టైటిల్ లేకుండానే...
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి వరుసగా 24వ ఏడాది భారత క్రీడాకారులు టైటిల్ లేకుండానే తిరిగి రానున్నారు. భారత్ నుంచి ఐదు విభాగాల్లో కలిపి మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగగా... ఒక్కరు కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 10–21, 16–21తో ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను ఓడించిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. మహిళల డబుల్స్లో 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ఈసారి క్వార్టర్ ఫైనల్లో 14–21, 10–21తో రెండో సీడ్ లియు షెంగ్షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 15–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంటను ఓడించిది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన లక్ష్య సేన్కు 7,975 డాలర్లు (రూ. 6 లక్షల 93 వేలు)... గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు (రూ. 7 లక్షల 87 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 2 గతంలో భారత్ నుంచి ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో టైటిల్స్ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. -
నిజమైన వయస్సును వెల్లడించాల్సిందే.. లేదంటే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: క్రీడా పోటీల్లో తరచూ వివాదాస్పదమవుతున్న తప్పుడు వయో ధ్రువీకరణ అంశంపై నిర్దిష్టమైన పాలసీని రూపొందిస్తున్న కేంద్ర క్రీడా శాఖ ఇందులో సాధారణ ప్రజల్ని భాగం చేయాలని నిర్ణయించింది.క్రీడల్లో నకిలీ వయో ధ్రువీకరణ నిరోధక జాతీయ పాలసీ (ఎన్సీఏఏఎఫ్ఎస్) ముసాయిదా బిల్లును రూపొందించిన క్రీడా శాఖ తుది సవరణలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలాఖరు (31) వరకు సాధారణ ప్రజానీకం అభిప్రాయాలు, ఫిర్యాదులను సేకరించనుంది.‘నూతన క్రీడల్లో వయో ధ్రువీకరణ పాలసీపై క్రీడలు–యువజన సర్వీసుల శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సలహాలు సంప్రదింపులు జరుపుతుంది. ప్రజలు కూడా భాగం కావొచ్చు. ఆయా వయో విభాగాల క్రీడల్లో నిజమైన వయస్సు కలిగిన క్రీడాకారులకు నష్టం కలుగకుండా చూడటమే ఈ బిల్లు లక్ష్యం’ అని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చట్టాలకు లోబడి శిక్షలుభారత క్రీడల్లో మరింత జవాబుదారీతనం పెంచడం కోసం నిర్దిష్టమైన సవరణలతో 15 ఏళ్ల తర్వాత ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు క్రీడాశాఖాధికారులు తెలిపారు. తప్పుడు, నకిలీ ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొంటే తొలిసారి రెండేళ్ల నిషేధం విధిస్తారు. పతకాల్ని వెనక్కి తీసుకుంటారు. రెండోసారి పునరావృతం జీవితకాల నిషేధం విధించడంతో పాటు, చట్టాలకు లోబడి శిక్షలు తప్పవు. అయితే సస్పెన్షన్కు గురైన అథ్లెట్లు తమ తప్పుని అంగీకరించి, నిజమైన వయస్సును వెల్లడిస్తే క్షమాభిక్షకు అవకాశమిచ్చారు. ఇదీ చదవండిచండీగఢ్లో గురువారం జరిగిన పంజాబ్ యూనివర్సిటీ (పీయూ) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. మేటి షూటర్ మనూ భాకర్ ‘పీయూ ఖేల్రత్న’ పురస్కారం అందుకుంంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ ఈ ఏడాది చండీగఢ్లోని డీఏవీ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ సాధించింది. -
జయహో జార్ఖండ్
పంచ్కులా (హరియాణా): ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించింది. తొలిసారి జాతీయ సీనియర్ మహిళల చాంపియన్షిప్లో విజేతగా అవతరించింది. ‘షూటౌట్’ వరకు కొనసాగిన టైటిల్ సమరంలో అల్బెలా రాణి టొప్పో నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు 4–3 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా జట్టును ఓడించింది. 2011లో హాకీ ఇండియా (హెచ్ఐ) ఆవిర్భవించాక 15 సార్లు జాతీయ చాంపియన్షిప్ జరిగింది. జార్ఖండ్ జట్టు ఆరుసార్లు (2012, 2013, 2014, 2022, 2023, 2024) మూడో స్థానాన్ని దక్కించుకోగా... ఒకసారి (2015) రన్నరప్గా నిలిచింది. ఎనిమిదో ప్రయత్నంలో జార్ఖండ్ విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున కెప్టెన్ రాణి (42వ నిమిషంలో), జార్ఖండ్ తరఫున ప్రమోదిని లాక్రా (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జార్ఖండ్ తరఫున రజని కెర్కెట్టా, నిరాలి కుజుర్, బినిమా ధన్, అల్బెలా రాణి టొప్పో సఫలంకాగా... ష్యామీ బారా విఫలమైంది. హరియాణ తరఫున సోనమ్, కెపె్టన్ రాణి గురి తప్పగా... పింకీ, అన్ను, మనీషా సఫలమయ్యారు. జార్ఖండ్ గోల్కీపర్ అంజలి బింజియా హరియాణా ప్లేయర్ల రెండు షాట్లను నిలువరించి తమ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిజోరం జట్టు తొలిసారి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మిజోరం జట్టు 2–1 గోల్స్ తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు అత్యధికంగా 8 సార్లు టైటిల్ దక్కించుకోగా... హరియాణా (3 సార్లు) రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రెండుసార్లు టైటిల్ను గెలవగా.. ఒడిశా, జార్ఖండ్ ఒక్కోసారి జాతీయ టైటిల్ను సొంతం చేసుకున్నాయి. -
లండన్ మారథాన్లో ప్రపంచ రికార్డు!
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ పరుగు ప్రపంచ రికార్డు కొల్లగొట్టనుంది. రికార్డు స్థాయిలో అథ్లెట్లు లండన్ మారథాన్ రేసును పూర్తి చేస్తారనే అంచనాలు అమాంతం పెరిగాయి. వచ్చే నెల 27న లండన్ నగరంలో జరిగే ఈ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పరుగులో పోటీపడేందుకు ఇప్పటికే 8 లక్షల 40 వేల మందికిపైగా ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ ఈవెంట్లో 5,78,304 రన్నర్లకంటే ఇది చాలా అధికం. పురుషులతో దీటుగా మహిళా రన్నర్లు ఆసక్తి చూపడం విశేషం. 8 లక్షల 40 వేల ఔత్సాహికుల్లో 49 శాతం మహిళలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సున్న యువతులు ఏకంగా 105 శాతం పెరగడం విశేషం! ఇప్పటివరకు పూర్తి మారథాన్ పరుగు దూరాన్ని 55,646 మంది పూర్తి చేశారు. గత నవంబర్లో న్యూయార్క్ మారథాన్లో ఈ రికార్డు నమోదైంది. అయితే ఈసారి సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది బరిలో దిగడానికి ఆసక్తి చూపడంతో పూర్తి చేసేవారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే పెరుగుతుందని నిర్వాహకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఏప్రిల్ 27న జరిగే 45వ లండన్ మారథాన్ కొత్త మైలురాయికి చేరుకోబోతోంది. అత్యధిక సంఖ్యలో పరుగును పూర్తిచేసే రికార్డు సాకారం కానుంది. ఇదే జరిగితే ముమ్మాటికి మా మారథాన్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది’ అని లండన్ మారథాన్ ఈవెంట్స్ సీఈఓ హ్యూజ్ బ్రాషెర్ తెలిపారు. నగరంలోని గ్రీన్విచ్ నుంచి ద మాల్ వరకు సాగే 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఈసారి 56 వేల పైచిలుకు మంది పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. 1981లో లండన్ మారథాన్ మొదలైంది. ఆ ఏడాది తొలి మారథాన్లో ఏకంగా 13 లక్షల మంది బరిలోకి దిగారు. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–7 (5/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫెర్నాండో రాంబోలి (బ్రెజిల్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గొరాన్సన్ ఏడు ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశారు. యూకీ–గొరాన్సన్లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఆడిన యూకీ తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 37వ ర్యాంక్కు చేరుకుంటాడు. -
లక్ష్య సేన్ సంచలనం
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్, ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–13, 21–10తో ఇండోనేసియా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. లక్ష్య సేన్ ధాటికి తట్టుకోలేక జొనాథన్ క్రిస్టీ 36 నిమిషాల్లో చేతులెత్తేశాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీలో సెమీఫైనల్లో క్రిస్టీ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. గతంలో క్రిస్టీ చేతిలో నాలుగుసార్లు ఓడిపోయిన లక్ష్య సేన్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చలాయించాడు. లక్ష్య ఆటకు జవాబివ్వలేక క్రిస్టీ అనవసర తప్పిదాలు చేశాడు. దాంతో తొలి గేమ్లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. రెండో గేమ్లోనూ లక్ష్య తన దూకుడు కొనసాగించాడు. స్కోరు 11–6 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో రెండో గేమ్తోపాటు మ్యాచ్ను దక్కించుకున్నాడు. నేడు క్వార్టర్ ఫైనల్లో 6వ ర్యాంకర్ లీషి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్ ఆడతాడు. వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. హావో నాన్ జియె–హాన్ జెంగ్ వె (చైనా)తో గురువారం జరిగిన మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్ను 16–21తో కోల్పోయారు. రెండో గేమ్లో స్కోరు 2–2 వద్ద ఉన్నపుడు చిరాగ్ వెన్ను నొప్పితో ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో సాత్విక్–చిరాగ్ ద్వయం మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్ (భారత్) 16–21, 13–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 10–21, 12–21తో జె ఫెంగ్ యాన్–జిన్ వె యా (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఐఓసీ పీఠం ఎవరిదో?
లుసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ (జర్మనీ) పదవీకాలం ముగియనుండటంతో... చైర్మన్ పదవి కోసం ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వివిధ క్రీడా సమాఖ్యల్లో కీలక పదవులు నిర్వర్తిస్తున్న విశేష అనుభవం ఉన్నవారు పోటీలో ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.ఐఓసీలోని మొత్తం 109 మంది సభ్యులు ‘రహస్య బ్యాలెట్’ పద్ధతిలో ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం 8 సంవత్సరాలు కాగా... నాలుగేళ్లకోసారి పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ ఎన్నికను ఎగ్జిక్యూటివ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ నెల 18 నుంచి 21 మధ్య గ్రీస్లో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుత చైర్మన్ థామస్ బాచ్ పదవీకాలం అధికారికంగా జూన్ 23తో ముగియనుంది. » ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఐఓసీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బ్రిటన్కు చెందిన సెబాస్టియన్కు క్రీడా పరిపాలన రంగంలో విశేష అనుభవం ఉంది. » ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు క్రిస్టీ కొవెంట్రీ కూడా అధ్యక్ష పీఠంపై కన్నేసింది. జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల ఈ ప్రఖ్యాత స్విమ్మర్ ప్రస్తుతం జింబాబ్వే కేబినెట్లో క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తోంది. ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించిన క్రిస్టీ కొవెంట్రీ విజయంపై ధీమాగా ఉంది. » అంతర్జాతీయ స్కీయింగ్, స్నోబోర్డ్ సమాఖ్య అధ్యక్షుడు జోహన్ ఎలియాష్ కూడా పోటీలో ముందున్నారు. బ్రిటన్, స్వీటన్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎలియాస్... ప్రకృతి ప్రేమికుడిగా, పర్యవారణ పరిరక్షకుడిగా కూడా సుపరిచితుడే. » ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్న జోర్డాన్ యువరాజు ఫైజల్ అల్ హుసేన్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. యుద్ధ విద్యల్లో మంచి అనుభవం ఉన్న ఫైజల్ ఇప్పుడు క్రీడా పరిపాలనలోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. » అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపరి్టయెంట్, అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య అధ్యక్షుడు మెరినరి వతనబె కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండగా... ప్రస్తుతం ఐఓసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న యువాన్ ఆంటోనీ సమరాంచ్ జూనియర్ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నాడు. పరిపాలనలో విశేష అనుభవం ఉన్న స్పెయిన్కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ... చైర్మన్గా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. » కొత్తగా ఎన్నిక కానున్న ఐఓసీ అధ్యక్షుడి ముందు క్రీడల్లో కృత్రిమ మేధ వినియోగం... డిజిటల్ మాధ్యమాల ద్వారా యువతను భాగం చేయడం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు రచించడం... క్రీడారంగంలో మహిళలకు పెద్దపీట వేయడం వంటి పలు సవాళ్లు ఉన్నాయి. » జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కొవెంట్రీని చైర్మన్గా ఎంపిక చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ భావిస్తున్నాడు. అయితే ఐఓసీ సీనియర్ ఉపాధ్యక్షుడు యువాన్ సమరాంచ్, ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో కూడా పీఠం అధిరోహించాలని పట్టుదలతో ఉన్నారు. » ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడు... విశ్వక్రీడల భవిష్యత్తును నిర్మించనున్నారు. ఆటల ఎంపిక, నిర్వహణ పద్ధతి, అథ్లెట్ల సంక్షేమం, వేదికల ఏర్పాటు ఇలా లెక్కకు మిక్కిలి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. » 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఐఓసీ అధ్యక్ష ఎన్నికపై మన దగ్గర కూడా ఆసక్తి నెలకొంది. -
రెండో సీడ్ జోడీకి యూకీ బాంబ్రీ ద్వయం షాక్
కాలిఫోర్నియా: తన కెరీర్లో ఆడుతున్న తొలి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గొరాన్సన్ జంట 6–2, 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్, ప్రపంచ మూడో, నాలుగో ర్యాంకుల్లో ఉన్న హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్)లను బోల్తా కొట్టించింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గొరాన్సన్ ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో తమ ర్యాంకింగ్ ప్రకారం యూకీ–గొరాన్సన్లకు క్వాలిఫయింగ్తోపాటు మెయిన్ ‘డ్రా’లోనూ చోటు దక్కలేదు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న మార్కోస్ గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా) చివరి నిమిషంలో వైదొలగడంతో ‘రిజర్వ్’ పూల్లో ఉన్న యూకీ–గొరాన్సన్లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరడంతో యూకీ బాంబ్రీ –గొరాన్సన్లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు ఖరారయ్యాయి. -
ప్రణామ్ ప్రణవ్
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్మాస్టర్ శ్యామ్సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్కు వరుణ్ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్ కష్టమైనా... బ్లిట్జ్ గేమ్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్లైన్ మ్యాచ్ల్లో మాగ్నస్ కార్ల్సన్ వంటి ప్రపంచ చాంపియన్లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్షిప్, షార్జా మాస్టర్స్లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్ మూతలతో క్రికెట్... మ్యాచ్కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్కు అలవాటు. దీంతో హోటల్ రూమ్లో బాటిల్ మూతలను బాల్గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్లైన్ సెషన్లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్గా ప్రణవ్ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు. క్రికెట్కు వీరాభిమాని... క్రికెట్ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్లో ప్రణవ్ వేగం శ్యామ్సుందర్ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్మాస్టర్ అయిన ప్రణవ్ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు. -
భారత రెజ్లర్లకు ఊరట
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు. -
లక్ష్యసేన్ శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్కు చేరాడు. ఈ మ్యాచ్లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్గార్డ్–మాడ్స్ వెస్టర్గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది. -
భారత మహిళల కబడ్డీ జట్టుకు రూ. 67.50 లక్షల నగదు బహుమతి
ఆసియా కబడ్డీ చాంపియన్షిప్లో ఐదోసారి విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 67.50 లక్షల నగదు బహుమతి అందించింది. ఇటీవల ఇరాన్ వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు... ఫైనల్లో 32–25 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు ఐదో సారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత మహిళల కబడ్డీ జట్టును కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘మహిళా అథ్లెట్లను మరింత ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మహిళా కబడ్డీ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కబడ్డీ లీగ్ను కూడా ప్రారంభించాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
ఈసారైనా ‘ఆల్ ఇంగ్లండ్’ అందేనా!
ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకునే టోర్నీ, గెలవాలనుకునే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ మాత్రమే. బ్యాడ్మింటన్ క్రీడలో అతి పురాతన టోర్నీలలో ఒకటిగా, ప్రపంచ చాంపియన్షిప్ స్థాయి ఉన్న టోర్నీగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్నకు పేరుంది. 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ టోర్నమెంట్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాక... అత్యున్నత శ్రేణి సూపర్–1000 నాలుగు టోర్నీలలో (మలేసియా, ఆల్ ఇంగ్లండ్, ఇండోనేసియా, చైనా ఓపెన్) ఒకటిగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఆదివారం జరిగే ఈ టోర్నీకి బరి్మంగ్హమ్ ఆతిథ్యమివ్వనుంది. బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్ సీజన్లోని మరో మెగా టోర్నీకి భారత క్రీడాకారులు సమాయత్తమయ్యారు. నేటి నుంచి ఆదివారం వరకు జరిగే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత్ నుంచి మొత్తం 17 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్, ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో ఆసియా క్రీడల చాంపియన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్లో గత రెండేళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. శ్రుతి మిశ్రా–ప్రియా కొంజెంగ్బమ్... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... ఆద్యా–సతీశ్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్లో మాత్రమే ఇద్దరు చాంపియన్స్గా నిలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొనే... 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయారు. 2015లో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్... 2022లో పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఫైనల్కు చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. ఈసారి స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018, 2021లలో సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్ గా యున్ కిమ్తో సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హాన్ యువెతో సింధు తలపడే అవకాశముంది. భారత్కే చెందిన మాళవిక నేడు జరిగే తొలి రౌండ్లో జియా మిన్ యో (సింగపూర్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో లి యాంగ్ సు (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్...టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్గార్డ్–మాడ్స్ వెస్టర్గాడ్ (డెన్మార్క్)లను సాత్విక్–చిరాగ్ ఢీకొంటారు. -
రూ. 12 కోట్లు ఇస్తున్నారు
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డుల విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్మనీ దక్కనుంది. 2024 సీజన్కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మంది నామినేట్ అయ్యారు. వీరందరికి కలిపి ఏకంగా రూ. 12 కోట్ల ప్రైజ్మనీ అందజేయనున్నట్లు హెచ్ఐ తెలిపింది. శనివారం న్యూఢిల్లీలో అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. » మహిళలు, పురుషుల కేటగిరీలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్బీర్సింగ్ సీనియర్ అవార్డు... వర్ధమాన ప్లేయర్లకు పురుషుల విభాగంలో జుగ్రాజ్ సింగ్ పేరిట... మహిళల్లో అసుంత లాక్రా పేరిట ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను అందజేస్తారు. » ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్జీత్ సింగ్ అవార్డును... ‘డిఫెండర్ ఆఫ్ ద ఇయర్’కు పర్గత్ సింగ్ అవార్డు, ‘మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’కు అజిత్పాల్ సింగ్ అవార్డును... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’కు ధన్రాజ్ పిళ్లై అవార్డును బహూకరిస్తారు. » భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ (1975) టైటిల్ గెలిచి 50 ఏళ్లు పూర్తికావడం, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తింపు పొంది 100 ఏళ్లు (1925) పూర్తికావడంతో స్వర్ణోత్సవ వేడుకలు ఈ అవార్డుల కార్యక్రమంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టును, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పురుషులు, మహిళల జట్లను ఘనంగా సన్మానించనున్నారు. సీనియర్ జట్లతో పాటు జూనియర్ ఆసియాకప్ సాధించిన పురుషులు, మహిళల జట్లను సత్కరిస్తారు. » బల్బీర్సింగ్ సీనియర్ అవార్డు రేసులో రిటైరైన పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బహదూర్ పాఠక్లతో పాటు మహిళా ప్లేయర్లు సవిత, బిచూ దేవి ఖరిబం కూడా ఉన్నారు. » డిఫెండర్ అవార్డు కోసం సంజయ్, అమిత్ రోహిదాస్, హర్మన్ప్రీత్ సింగ్, ఉదిత పోటీపడుతున్నారు. » మిడ్ఫీల్డర్ అవార్డు కోసం జర్మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమిత్ నామినేట్ అయ్యారు. » ఫార్వర్డ్ అవార్డు కోసం లాల్రెమ్సియామి, అభిషేక్, సుఖ్జీత్, నవ్నీత్ కౌర్ బరిలో ఉన్నారు. æ అండర్–21 మహిళలకు ఇచ్చే వర్థమాన ప్లేయర్ అవార్డు రేసులో బ్యూటీ డుంగ్డుంగ్, దీపిక, వైష్ణవి ఫాల్కే, సునెలితా టొప్పొ ఉన్నారు. »అండర్–21 పురుషులకు ప్రదానం చేసే వర్ధమాన ప్లేయర్ పురస్కారం కోసం అర్‡్షదీప్ సింగ్, అమిర్ అలీ, శర్దానంద్ తివారి, అరిజీత్ సింగ్ బరిలో ఉన్నారు. -
IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
అజేయంగా... ఆసియా చాంపియన్గా!
టెహ్రాన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇరాన్లో జరిగిన మహిళల ఆసియా కబడ్డీ ఆరో చాంపియన్షిప్లో టీమిండియా టైటిల్ను నిలబెట్టుకుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి సెమీఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో, ఆ తర్వాత ఫైనల్లోనూ జైత్రయాత్ర కొనసాగించి ఐదోసారి ఆసియా చాంపియన్గా నిలిచింది. టైటిల్ పోరులో భారత జట్టు 32–25 పాయింట్లతో తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 56–18 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై ఘనవిజయం అందుకుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్లో టీమిండియా 64–23 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్పై, రెండో మ్యాచ్లో 76–21 పాయింట్లతో థాయ్లాండ్ జట్టుపై, మూడో మ్యాచ్లో 73–19 పాయింట్లతో మలేసియా జట్టుపై గెలుపొందాయి. మొత్తం ఏడు జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ జట్లు... గ్రూప్ ‘బి’లో ఇరాన్, ఇరాక్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లోని నాలుగో జట్టు చైనీస్ తైపీ జట్టు చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆసియా చాంపియన్షిప్లో రాణించిన భారత జట్టు ఈ ఏడాది చివర్లో భారత్లోనే జరిగే వరల్డ్కప్ టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఆసియా చాంపియన్షిప్ నెగ్గిన భారత జట్టుకు సోనాలి విష్ణు షింగేట్ కెపె్టన్గా, పుష్ప రాణా వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. జాతీయ చాంపియన్షిప్లో ఇండియన్ రైల్వేస్ తరఫున ఆడిన సోనాలి గోల్డెన్ రెయిడ్తో తన జట్టును విజేతగా నిలిపింది. పూజా కజిలా, నిధి శర్మ, పూజా నర్వాల్, ఆమ్రపాలి గలాండె, నేహా దక్ష్ , సంజూ దేవి, జ్యోతి ఠాకూర్, సాక్షి శర్మ, భావన దేవి, రీతూ మిగతా సభ్యులుగా ఉన్నారు. 2005లో హైదరాబాద్లో తొలిసారి ఆసియా చాంపియన్షిప్ను నిర్వహించగా... భారత జట్టు విజేతగా అవతరించింది. అనంతరం 2007లో టహ్రాన్ (ఇరాన్)లో జరిగిన రెండో ఆసియా చాంపియన్షిప్లో, 2008లో మదురై (భారత్)లో జరిగిన మూడో ఆసియా చాంపియన్షిప్లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 2008 తర్వాత ఎనిమిదేళ్లకు మళ్లీ ఆసియా చాంపియన్షిప్ జరిగింది. 2016లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన నాలుగో ఆసియా చాంపియన్షిప్లో దక్షిణ కొరియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. 2017లో గొర్గాన్ (ఇరాన్)లో జరిగిన ఐదో ఆసియా చాంపియన్షిప్లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించి నాలుగోసారి చాంపియన్గా> నిలిచింది. 2017 తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో మరోసారి భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. -
జొకోవిచ్కు చుక్కెదురు
కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్కు ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. 24 గ్రాండ్స్లామ్లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్వన్ జొకోవిచ్... ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ జొకోవిచ్ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్’ బొటిక్ వాన్ డి జాండ్షుల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్షుల్ప్ క్వాలిఫయింగ్ దశలోనే ఓడిపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఒక ప్లేయర్ వైదొలడగంతో క్వాలిఫయింగ్లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్ జాండ్షుల్ప్కు ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్గా నిలిచిన జొకోవిచ్... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.జాండ్షుల్ఫ్ బేస్లైన్తో పాటు నెట్ గేమ్తో అదరగొడితే... జొకో మ్యాచ్ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్గా జాండ్షుల్ఫ్ 4 ఏస్లు సంధించగా... జొకో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా... జొకోవిచ్ 3 డబుల్ ఫాల్ట్లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్ సెమీఫైనల్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్లోనే జొకో పరాజయం పాలయ్యాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్షుల్ఫ్ గతంలో... డేవిస్ కప్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, యూఎస్ ఓపెన్లో అల్కరాజ్ (స్పెయిన్)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్పై గెలుపొందాడు. ఓవరాల్గా టాప్–10 ప్రత్యర్థులపై జాండ్షుల్ఫ్కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
క్లాసికల్ అంటేనే ఇష్టం
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి. ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్క్లేవ్లో అన్నాడు. వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టూర్లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు 12 మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు. ‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు. -
అరవింద్... కొత్త చాంపియన్
న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్. ఇప్పటికే టీనేజ్లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ఎలో రేటింగ్స్లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు. ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్ చాంపియన్గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు. విజేతగా మలచిన తల్లి మధురైలో పుట్టిన అరవింద్ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్ఐసీ) ఏజెంట్గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్ స్కూల్లో విద్యనభ్యసించిన అరవింద్ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్ గుకేశ్కు సీనియర్. గుకేశ్ కూడా వేలమ్మాళ్ విద్యార్థే! ప్రాగ్ మాస్టర్స్లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్–20 ర్యాంకింగ్ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్కార్డ్లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 2013లో తొలి జీఎమ్ నార్మ్ భారత విఖ్యాత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2013లో మాగ్నస్ కార్ల్సన్కు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్ తొలి గ్రాండ్మాస్టర్ (జీఎమ్) నార్మ్ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్మాస్టర్ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్ను మలుపుతిప్పింది. భారత ఓపెన్లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్ టైటిల్తో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో అరవింద్ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున నాలుగో ర్యాంకర్గా ఎదిగాడు. -
కిక్స్లో.. నైషా నైపుణ్యం..
సాక్షి, హైదరాబాద్: కిక్ బాక్సింగ్ క్రీడలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ పుస్తకంలో తన కంటూ ఒక పేజీ లిఖించింది నైషా బజాజ్. ‘ఫిట్నెస్ రంగంలో ఉన్న మా అమ్మకి మార్షల్ ఆర్ట్స్ హాబీ. ఆమెతో ఏడేళ్ల వయసులో సరదాగా కలిసి ప్రాక్టీస్ చేశా. అదే ఇప్పుడు నా లైఫ్గా మారింది’ అంటూ చెప్పింది పంజాగుట్టలో నివసించే టీనేజర్ నైషా.విజయాలెన్నో.. నగరం నుంచి వేళ్ల మీద లెక్కబెట్టగలిగే సంఖ్యలో కూడా కనబడని మహిళల కిక్బాక్సింగ్లో 2014లో నైషా పూర్తి స్థాయిలో ప్రవేశించిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అగ్రశ్రేణి మహిళా యోధుల్లో ఒకరిగా రాణిస్తోంది. ఆమె సాధించిన విజయాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ (2022, 2024, 2025), నేషనల్ కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్ (2024, గోవా), ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్ (2024, హైదరాబాద్) తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్లలో బంగారు పతకాలు.. సాధించింది. గత అక్టోబర్లో ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయించుకుని వెనువెంటనే 2025 ప్రారంభంలోనే తిరిగి బంగారు పతకాలను సాధించడం ఆమె పోరాట పటిమకు నిదర్శనం. కఠినమే కానీ.. అమ్మాయిలు క్రీడల్లో రాణించడం ఇప్పుడు సాధారణమే కావచ్చు కానీ.. కిక్ బాక్సింగ్ క్రీడలో మాత్రం ఇప్పటికీ విశేషమే. ‘చిన్న వయసులోనే నాలో ఉన్న ఆసక్తిని అమ్మ గమనించి మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించింది’ అంటూ గుర్తు చేసుకుంది నైషా. తొలుత తైక్వాండోతో తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత కిక్ బాక్సింగ్లోకి మారానని వివరించింది. ఇది కఠినమైన క్రీడే అయినప్పటికీ.. ఇలాంటి యుద్ధకళల్లో మహిళలు రాణించాల్సిన సమయం వచి్చందంటోంది నైషా. బయటకు వెళ్లి ఎన్నో రంగాల్లో తమని తాము నిరూపించుకోవాలని తపిస్తున్న మహిళలు.. మార్షల్ ఆర్ట్స్ ద్వారా తమని తాము రక్షించుకోగలుగుతారని అంటోంది. -
Sunil Chhetri: రీఎంట్రీ అవసరమా?: ఫుట్బాల్ దిగ్గజం
భారత ఫుట్బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు సునీల్ ఛెత్రి(Sunil Chhetri) అనడంలో సందేహమే లేదు. జాతీయ జట్టు తరఫున 151 మ్యాచ్లు ఆడి 94 గోల్స్ సాధించాడు. గత ఏడాది జూన్లో అతను అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా ఛెత్రి పునరాగమనం చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అతను మళ్లీ భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం కావడం ఫుట్బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.కోచ్ మనోలో మార్క్వెజ్ విజ్ఞప్తి మేరకు తిరిగి వచ్చాడని చెబుతున్నా... భారత్ ఫుట్బాల్ జట్టు తాజా పరిస్థితిని ఇది సూచిస్తోంది. అతను తిరిగి రావడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘జట్టు కోణంలో చూస్తే ఇది సరైన నిర్ణయమే. 40 ఏళ్లు దాటిన వ్యక్తిని మళ్లీ ఆడిస్తున్నారేంటి అని అడగవచ్చు. అయితే గతంలోనూ ఇలాంటివి జరిగాయి.మంచి స్ట్రయికర్ను సిద్ధం చేసేందుకు భారత్ ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. ఐఎస్ఎల్లో బాగా ఆడుతున్న వారంతా విదేశీయులే. పైగా ఛెత్రి సూపర్ ఫిట్గా ఉన్నాడు’ అని మాజీ ఆటగాడు ఎం.విజయన్ అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ 2027 కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల జట్టులో ఛెత్రికి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చోటు కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐఎస్ఎల్లో మంచి ఫామ్లో ఉన్న ఛెత్రి 12 గోల్స్తో టాప్స్కోరర్గా ఉన్నాడు. వయసుకంటే అతని ఆటను చూడాలని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే అన్నారు.‘ఛెత్రి నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని స్థాయి ప్లేయర్ మొత్తం జట్టులో స్ఫూర్తిని నింపగలడు. అలాంటి స్ట్రయికర్ ఉంటే భారత జట్టుకు మేలు జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. ఛెత్రి రిటైర్మెంట్ తర్వాత నాలుగు మ్యాచ్లు ఆడిన భారత్ 3 మ్యాచ్లు ‘డ్రా’ చేసుకొని మరో దాంట్లో చిత్తుగా ఓడింది తప్ప ఒక్క విజయమూ దక్కలేదు. రీఎంట్రీ అవసరమా?అయితే ఛెత్రి పునరాగమనం భారత ఫుట్బాల్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తోంది. అతడు తప్పుకున్న తర్వాత కూడా కనీసం ఒక నాణ్యమైన స్ట్రయికర్ను జట్టు తయారు చేసుకోలేకపోతోంది.‘ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా సరే ఛెత్రి తప్పుకోవాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు. ఎప్పటి వరకు అతనిపై ఆధారపడతారు. ఏ ఆటలోనైనా, ఎంత గొప్పవారైనా ఆటను ముగించాల్సిందే. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడం, ప్రతిభను ప్రోత్సహించి ఫలితాలు రాబట్టడం ఫెడరేషన్ చేయాల్సిన పని. కానీ మళ్లీ వచ్చి ఆడమని అడగటం ఏ రకంగాను సరైంది కాదు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా... యువ ఆటగాళ్లను భవిష్యత్తు కోసం సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అని ఫుట్బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ భాయ్చంగ్ భుటియా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. హెడ్కోచ్ మనోలో మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని తనకు తెలుసునని.. అయితే, ఛెత్రిని తిరిగి తీసుకురావడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలేమీ కలగవని పేర్కొన్నాడు. ఛెత్రి పునరాగమనం అద్భుతంగా అనిపిస్తున్నా.. భారత ఫుట్బాల్ అభివృద్ధికి ఇది ఏమాత్రం దోహదం చేయదని అభిప్రాయపడ్డాడు. నలభై ఏళ్ల ఆటగాడిపై ఆధారపడి జట్టును నడుపుతామని చెప్పడం సరైన సంకేతం కాదని భుటియా పేర్కొన్నాడు. -
‘బంగారం’లాంటి ఆటను వదిలి...
లండన్: జేడ్ జోన్స్... బ్రిటన్ ప్రొఫెషనల్ తైక్వాండో ప్లేయర్. అంతేకాదు! స్వదేశంలో జరిగిన 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో... 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో... మహిళల తైక్వాండో ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తదనంతరం 2020 టోక్యో, 2024 పారిస్ విశ్వక్రీడల్లోనూ జేడ్ పాల్గొంది. 2010లో యూత్ ఒలింపిక్స్ స్వర్ణం మొదలు, ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్, ప్రపంచ చాంపియన్షిప్, యూరోపియన్ గేమ్స్, యూరోపియన్ చాంపియన్షిప్, గ్రాండ్ప్రి ఈవెంట్లలో 36 (19 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలు గెలుచుకుంది. జేడ్ జోన్స్ పతకాల సంఖ్య ఆమె వయసు (31 ఏళ్లు)ను ఎప్పుడో మించిపోయింది. బహుశా ‘కిక్’ కొడితే పతకాలు రాలుతున్న తైక్వాండో క్రీడాంశం బోర్ కొట్టించిదేమో తెలియదు కానీ ఈ బ్రిటన్ క్రీడాకారిణి ఇప్పుడు కొత్త ‘పంచ్’కు సిద్ధమైంది. బాక్సింగ్ను తెగ ఇష్టపడటం వల్లే 20 ఏళ్ల తర్వాత కొత్త కెరీర్లోకి అడుగుపెడుతున్నట్లు జోన్స్ చెప్పింది. రింగ్లో ఆమె అపుడే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. ‘ఇప్పటికే తైక్వాండోలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. త్వరలో బాక్సింగ్లోనూ ప్రపంచ చాంపియన్ కావాలని ఆశిస్తున్నాను. రెండు వేర్వేరు క్రీడల్లో ఈ ఘనత సాధిస్తే గొప్పగా ఉంటుంది కదూ’ అని చెప్పింది. బ్రిటిష్, కామన్వెల్త్ ఫెదర్వెయిట్ మాజీ చాంపియన్ స్టీఫెన్ స్మిత్ కోచింగ్లో తీవ్రస్థాయిలో కసరత్తులు కూడా చేస్తోంది.అయితే మూడు పదుల వయసు దాటిన తర్వాత పూర్తిగా కొత్త క్రీడలో పతకాలు సాధించడం పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. 19 ఏళ్ల టీనేజ్లోనే జోన్స్ లండన్ విశ్వక్రీడల్లో బంగారు పతకం గెలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ‘రియో’లో నిలబెట్టుకుంది. -
మన ఆటలో వేగం పెరగాలి
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్లోనే అనూహ్య గోల్తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.తొలి మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్తో మ్యాచ్లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్గా మలిచింది. ‘తొలి మ్యాచ్లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది. ‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్కు స్టాండ్బై ప్లేయర్గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
‘క్రీడాకారులకు ప్రత్యేక ఐడీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఇందు కోసం భిన్నమైన పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. మాండవియా అధ్యక్షతన భారత క్రీడా రంగం మెరుగుదల, భవిష్యత్తుకు సంబంధించి శుక్రవారం ప్రత్యేక ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. నగర శివార్లలో కన్హా శాంతి వనంలో జరుగుతున్న రెండు రోజుల ఈ శిబిరం శనివారం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులు, క్రీడా పరిపాలకులు, సీనియర్ ప్రభుత్వాధికారులతో పాటు కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే కూడా దీనికి హాజరయ్యారు. ప్రపంచ క్రీడల్లో భారత్ స్థాయిని మరింత పెంచే దిశగా పలు ఆలోచనలను పంచుకున్న వీరంతా అందుకు తగిన విధంగా రూట్ మ్యాప్ కోసం తమ వంతు సూచనలు అందించారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించే లక్ష్యంతోపాటు 2036 ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఒలింపిక్స్ను మన దేశం నిర్వహించాలనే కలకు ఈ చింతన్ శిబిర్ నుంచి తొలి అడుగు పడాలని మాండవియా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న క్రీడా ప్రతిభ వృథా కాకుండా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.‘ప్రతిభాన్వేషణలో ఖేలో ఇండియా వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 937 ఖేలో ఇండియా కేంద్రాలు సమర్థంగా పని చేస్తున్నాయి. 9–14 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దితే ఒలింపిక్స్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సాంకేతికతను వాడుకోవడం కూడా కీలకాంశం. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆటగాళ్ల వివరాలను ఒకే చోట నమోదు చేసి ప్రత్యేక ఐడీలు ఇవ్వబోతున్నాం. అలా చేస్తే వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తూ పురోగతిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది’ అని మాండవియా వెల్లడించారు. ఒలింపిక్ మిషన్ కోసం జాతీయ క్రీడా సమాఖ్యలు మరింత సమర్థంగా పని చేయాల్సి ఉంటుందన్న కేంద్ర మంత్రి... ఆటగాళ్ల సెలక్షన్స్లో పారదర్శకత పాటిస్తే తల్లిదండ్రులు మరింత పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రీడల వైపు తీసుకొస్తారని విశ్లేషించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారంతా క్రీడాభివృద్ధి కోసం తమ సలహాలు అందించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న స్టేడియంలు తదితర మౌలిక సౌకర్యాలను సమర్థంగా వాడుకునేలా చూడాలని వారు సూచించారు. -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్
భారత ఫుట్బాల్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మళ్లీ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 40 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. ఛెత్రీ త్వరలో జరుగనున్న ఫిఫా ఇంటర్నేషనల్ విండోలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల భారత జట్టులో ఛెత్రీకి చోటు దక్కింది. ఏడాది గడుస్తున్నా భారత జట్టులో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో రిటైర్మెంట్ విషయంలో ఛెత్రీ మనసు మార్చుకున్నాడు. పదేళ్లకు పైగా భారత జట్టుకు నాయకత్వం వహించిన ఛెత్రీ.. గతేడాది జూన్ 6న రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలో కువైట్తో జరిగిన ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఛెత్రీకి చివరిది.2005లో భారత్ తరఫున అరంగ్రేటం చేసిన ఛెత్రీ.. భారత ఆల్టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా కెరీర్ ముగించాడు. ఛెత్రీ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. ఛెత్రీ తన కెరీర్లో 94 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో నాలుగో అత్యధిక గోల్ స్కోరర్గా ఛెత్రీ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, అలీ డై మాత్రమే ఛెత్రీ కంటే ఎక్కువ గోల్స్ చేశారు.ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇండియన్ సూపర్ లీగ్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఛెత్రీ 12 మ్యాచ్ల్లో 23 గోల్స్ చేసి ఐఎస్ఎల్లో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.కాగా, భారత ఫుట్బాల్ జట్టు ఏఎఫ్సీ ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ సన్నాహకాల్లో భాగంగా మార్చి 19న మాల్దీవ్స్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఏఎఫ్సీ ఆసియా కప్-2027 క్వాలిఫయర్స్లో (మార్చి 25) బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్.. బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, సింగపూర్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీలో భారత్ మ్యాచ్లు షిల్లాంగ్లోని జవహర్ లాల్ స్టేడియంలో జరుగనున్నాయి.ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం భారత జట్టు..గోల్ కీపర్స్- అమరిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, విశాల్ కైత్డిఫెండర్స్- ఆషికి కురునియన్, ఆయుశ్ దేవ్ ఛెత్రీ, బ్రాండన్ ఫెర్నాండెస్, బ్రైసన్ ఫెర్నాండెస్, జీక్సన్ సింగ్ థౌనౌజమ్, లాలెంగ్మావియా, లిస్టన్ కొలాకో, మహేశ్ సింగ్ నోరెమ్, సురేశ్ సింగ్ వాంగ్జమ్ఫార్వర్డ్స్- సునీల్ ఛెత్రీ, ఫరూక్ ఛౌదరీ, ఇర్ఫాన్ యద్వాద్, లల్లియన్జువాలా ఛంగ్టే, మన్వీర్ సింగ్ -
‘మా ప్రేమ కథకు కొనసాగింపు’.. తల్లిదండ్రులు కాబోతున్న క్రీడా జంట
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. భర్త సోమ్వీర్ రాఠీ(Somvir Rathee)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘మా ప్రేమ కథకు కొనసాగింపు.. సరికొత్త అధ్యాయంతో మొదలు’’ అంటూ చిన్నారి పాదం, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ క్రీడాకారుల జంట తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.కాగా భారత స్టార్ రెజ్లర్గా పేరొందిన వినేశ్ ఫొగట్ గతేడాది పతాక శీర్షికల్లో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఫైనల్కు చేరుకున్న ఈ హర్యానా అథ్లెట్పై అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అదనంగా ఉన్నందు వల్ల ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో.. రెజ్లింగ్లో భారత్కు తొలి స్వర్ణం వస్తుందన్న ఆశలు ఆవిరి కాగా.. దేశవ్యాప్తంగా యూడబ్ల్యూడబ్ల్యూ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనన్న స్పోర్ట్స్ కోర్టుభారత ఒలింపిక్ సంఘం(IOA), అధికారుల తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేయగా నిరాశే ఎదురైంది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి’’ అంటూ వినేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది.‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిర్ణీత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే’’ అని సీఏఎస్ స్పష్టం చేసింది.ఈ క్రమంలో తొలి రోజు పోటీల్లో నిర్ణీత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... గుజ్మన్ లోపెజ్తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సంచలన విజయాలు సాధించినా వినేశ్ పతకం లేకుండానే దేశానికి తిరిగి వచ్చింది. రాజకీయాల్లోకికాగా ప్యారిస్ ఒలింపిక్స్లో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై వినేశ్ సాధించిన విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర పుటల్లో ఆమె పేరు అజరామరంగా ఉంటుంది.అతడే ఆమెకు సర్వస్వంఇక ఈ తీవ్ర నిరాశ అనంతరం.. కుస్తీకి స్వస్తి చెప్పిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఝులన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా వినేశ్ భర్త సోమ్వీర్ కూడా రెజ్లరే. హర్యానాకు చెందిన అతడు.. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. వినేశ్, సోమ్వీర్ రాఠీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.అయితే, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో వినేశ్కు సోమ్వీర్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ క్రీడా జంట 2018లో వివాహం చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేసి పెళ్లినాడు ఎనిమిది అడుగులు వేశారు.సంబంధిత వార్త : తను లేకుంటే నేను లేను.. వినేశ్కు అతడే కొండంత అండ -
అవకతవకలకు తావులేకుండా...
న్యూఢిల్లీ: క్రీడాకారుల ఎంపిక విషయంలో పారదర్శకత పెంపొందించాలనుకుంటున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ... జాతీయ క్రీడా సమాఖ్యలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలెక్షన్ ప్రక్రియను వీడియో రూపంలో పొందుపరచాలని ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ... ఎంపిక ప్రక్రియకు ముందు పాటించాల్సిన నింబధనలను తాజాగా వెల్లడించింది. సెలెక్షన్లో అవకతవకలకు తావివ్వకుండా జావాబుదారీతనం పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. క్రీడాకారులను ఎంపిక చేయడానికి 15 రోజుల ముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు వెల్లడించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. దీనివల్ల ట్రయల్స్లో అన్యాయం జరిగిందనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఇటీవలి కాలంలో రెజ్లింగ్, షూటింగ్తో పాటు సెలెక్షన్స్ అవకతవకలపై పలు ఫిర్యాదులు అందడంతో... కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రత్యేక సూచనలు చేశారు.ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపింది. » ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం తప్పనిసరి. సెలెక్షన్కు మూడు నెలల సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో మార్పు చేర్పులు చేయాలి. » సెలెక్షన్ ప్రక్రియనంతా వీడియోలో నిక్షిప్తం చేయాలి. వీటి రికార్డులను సెలెక్షన్ కమిటీ సంతకం చేసిన అనంతరం విధిగా ‘సాయ్’కు అందజేయాలి. ప్రతి ట్రయల్కు ముందు అవసరమైన ఆర్థిక సహాయానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. » ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా గేమ్స్, పారా ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడల వంటి పెద్ద టోర్నీల ఎంపిక ప్రమాణాలను కనీసం రెండు సంవత్సరాల ముందుగానే పొందుపరచాలి. ఈ అంశంలో అథ్లెట్లకు అవగాహన కల్పించాలి. » విదేశీ టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో పాటిస్తున్న నిబంధనల విషయంలో పునరాలోచించాలని ప్రముఖ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా గతంలోనే కోరగా... తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అంశంలోనూ కీలక సవరణలు చేసింది. » సెలెక్షన్ కమిటీలోని సభ్యులెవరూ... ఫిర్యాదుల పరిష్కార కమిటీలో భాగం కాకూడదు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. జాతీయ క్రీడా సమాఖ్య వివాద పరిష్కార కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలి. » జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను దగ్గరుండి పరిశీలించాలి. హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్, మాజీ క్రీడాకారులు, ఖేల్రత్న, అర్జున అవార్డు గ్రహీతలు ఇలా అందుబాటులో ఉన్న వారిని సెలెక్షన్ కమిటీకి ఎంపిక చేసే అధికారం జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులదే. -
రుత్విక–రోహన్ జోడీ శుభారంభం
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 20–22, 24–22, 21–16తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెజ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్ కోల్పోయిన రుత్విక–రోహన్ రెండో గేమ్లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని గట్టెక్కారు. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన రుత్విక–రోహన్ చివరివరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ఆయుశ్ షెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్, సతీశ్ కుమార్ కరుణాకరన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 21–19, 21–14తో కూ తకహాషి (జపాన్)పై, ప్రణయ్ 21–11, 20–22, 21–9తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై, ఆయుశ్ 21–17, 21–9తో ప్రపంచ మాజీ చాంపియన్ కీ యె లో (సింగపూర్)పై గెలిచారు. కిరణ్ జార్జి 21–15, 16–21, 10–21తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో, ప్రియాన్షు 17–21, 7–21తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత ప్లేయర్లు ఉన్నతి హుడా 9–21, 15–21తో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో... ఇషారాణి బారువా 13–21, 13–21తో అసుక తకహాషి (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
ట్రాన్స్జెండర్లపై ఐఓసీ ఓ నిర్ణయానికి రావాలి
బెర్లిన్: లింగమార్పిడి చేసుకున్న క్రీడాకారుల్ని విశ్వక్రీడల్లో అనుమతించే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఐఓసీ ఉపాధ్యక్షుడు యువాన్ ఆంటోని సమరాంచ్ సూచించారు. ‘ఈ విషయంలో యావత్ ప్రపంచం ఐఓసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మహిళా అథ్లెట్లు నష్టపోకుండా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు దిక్సూచిలా వ్యవహరించే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకోవాలి. దీనిపై తాత్సారం చేయకుండా శాస్త్రీయమైన కారణాలను పరిశీలించి వెంటనే ఓ నిర్ణయానికి రావాలి’ అని 65 ఏళ్ల సమరాంచ్ పేర్కొన్నారు. లింగమార్పిడితో అమ్మాయిలుగా మారిన ట్రాన్స్జెండర్లతో నిజమైన మహిళా అథ్లెట్ల ప్రయోజనాలకు నష్టం కలుగకుండా ఐఓసీ నిర్ణయం ఉండాలన్నారు. గతేడాది రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ట్రాన్స్జెండర్లను అనుమతించబోమనే ప్రెసిడెన్షియల్ రూల్ కూడా ఉంది. ఇప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ క్రీడల్లో ట్రాన్స్జెండర్లను మహిళల కేటగిరీలో పోటీపడకుండా నిక్కచ్చిగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఎందుకంటే 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమరాంచ్ కూడా ఐఓసీ ఉన్నతస్థాయి మండలి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవీకాలం ముగిసిన ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ వారసుడి ఎన్నిక కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 20న ఐఓసీ ఎన్నికలు జరుగనున్నాయి. సమరాంచ్తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో, పలు ఒలింపిక్స్లలో స్విమ్మింగ్ చాంపియన్ క్రిస్టీ కొవెంట్రీ, అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపర్టియెంట్, జోర్డాన్ చక్రవర్తి ఫైజల్ అల్ హుస్సేన్, ప్రపంచ జిమ్నాస్టిక్స్ హెడ్ మోరినరి వతనబె, కొత్తగా ఐఓసీలోకి వచ్చిన మల్టీ మిలియనీర్ జోహన్ ఎలియస్చ్ (ప్రపంచ స్కీయింగ్ చీఫ్)లు ఐఓసీ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో లింగమార్పిడి చేసుకున్న న్యూజిలాండ్ వెయిట్లిఫ్టర్ లారెల్ హబర్డ్ మహిళల ప్లస్ 87 కేజీ విభాగంలో పోటీపడింది. అయితే ఆమె చివరిదైన 14వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్లో పోటీపడ్డ తొలి ట్రాన్స్జెండర్ అథ్లెట్గా ఆమె గుర్తింపు పొందింది. -
TT Legend: పతకాల వీరుడు.. శరత్ శకం ముగిసే!
కామన్వెల్త్ గేమ్స్లో 7 పసిడి పతకాలు... మరో 3 రజతాలు, 3 కాంస్యాలు...ఆసియా క్రీడల్లో 2 కాంస్య పతకాలు..ఆసియా చాంపియన్షిప్లో 4 కాంస్యాలు...ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 30వ స్థానం...10 సార్లు జాతీయ సీనియర్ చాంపియన్గా ఘనత... ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం...అర్జున, ఖేల్రత్నతో పాటు పద్మశ్రీ పురస్కారం కైవసం...2024 పారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందానికి నాయకత్వం వహించడం...ఒక క్రీడాకారుడి కెరీర్లో ఇంతకుమించి ఏం కావాలి! భారత టేబుల్ టెన్నిస్ (టీటీ)కు వన్నెతెచి్చన ఆచంట శరత్ కమల్ ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. రెండు దశాబ్దాలుగా భారత టీటీ ముఖచిత్రంగా ఉన్న శరత్ కమల్ ఆట ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. స్వస్థలం చెన్నైలో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో చివరిసారి బరిలోకి దిగుతానని శరత్ బుధవారం ప్రకటించాడు. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన శరత్ ఘనతలను ఒకసారి గుర్తుచేసుకుంటే... సాక్షి క్రీడావిభాగం : భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మార్చి 25 నుంచి 30 వరకు చెన్నై వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీ అనంతరం ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలకు పైగా దేశ అత్యుత్తమ ప్యాడ్లర్గా కొనసాగిన 42 ఏళ్ల శరత్ కమల్... కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లోనూ అదరగొట్టిన శరత్ కమల్... 2018 జకార్తా గేమ్స్లో పురుషుల టీమ్ విభాగంతో పాటు... మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్షిప్లో 4 కాంస్య పతకాలు సాధించిన శరత్ కమల్... ఐదుసార్లు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. విశ్వక్రీడల్లో శరత్ పతకం సాధించనప్పటికీ అతడి ఘనతలను పతకాలతో కొలవలేం. సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... కెరీర్లో అత్యుత్తమంగా ప్రపంచ 30వ ర్యాంక్కు చేరుకున్న శరత్ కమల్... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్రత్న’తో పాటు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ కూడా దక్కించుకున్నాడు. శరత్ స్ఫూర్తితోనే టేబుల్ టెన్నిస్ వైపు అడుగులు వేసిన మనిక బత్రా, ఆకుల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. ‘ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పడం లేదు కానీ, ఇకపై పెద్ద టోర్నీలు, జనసమూహాల ముందు జరిగే మ్యాచ్ల్లో ఆడను. నా రాకెట్కు కొంత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నా. టేబుల్ టెన్నిస్ నాకు ఇచ్చిన ఆనందం, అభిమానం వెలకట్టలేనిది. దాన్ని మాటల్లో వర్ణించలేను’ అని శరత్ పేర్కొన్నాడు. ‘1998లో చెన్నై వేదికగానే ఆసియా జూనియర్ చాంపియన్షిప్తో నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది. 2025లో చెన్నై వేదికగానే డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ ద్వారా నా కెరీర్ను ముగించాలని నిర్ణయం తీసుకున్నాను. నా ఆఖరి ఆట తిలకించేందుకు నా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు వస్తారు. అత్యుత్తమ ఆటతీరుతో సగర్వంగా కెరీర్కు ముగింపు పలకాలని భావిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. » సీనియర్ నేషనల్ చాంపియన్షిప్లో 10 సార్లు విజేతగా నిలిచిన శరత్ కమల్... అంతకుముందు కమలేశ్ మెహతా నెలకొల్పిన రికార్డును (8 సార్లు) బద్దలు కొట్టాడు. ‘గత 20 ఏళ్లలో ఆటలో ఎన్నో మార్పులు సంభవించాయి. అప్పట్లో ఇలాంటి కొత్త తరహా షాట్లు ఏమీ లేవు. కానీ ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టించుకుంటూ వెళ్లడంతోనే శరత్ ఇంత సుదీర్ఘ కాలం రాణించగలిగాడు’ అని కమలేశ్ పేర్కొన్నాడు. » 2015 ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో గాయపడిన శరత్ తిరిగి కోలుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. కండరాల సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న శరత్... ఆ తర్వాత కెరీర్లో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించాడు. » టేబుల్ టెన్నిస్లో చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆదిపత్యం కొనసాగుతున్న సమయంలో చైనీయులను ఓడించగలమని నిరూపించిన తొలి భారత ప్లేయర్గా శరత్ నిలిచాడు. » 2018 ఆసియా క్రీడల్లో చెన్నైకే చెందిన సత్యన్తో కలిసి శరత్... జపాన్ ద్వయంపై విజయం సాధించి కాంస్యం గెలుచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనిది. » జకార్తా వేదికగా జరిగిన ఆ క్రీడల్లో మనిక బత్రాతో కలిసి శరత్ మిక్స్డ్ డబుల్స్లోనూ కాంస్యం నెగ్గాడు. అప్పటి వరకు ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన శరత్ జంట... ఆ తర్వాత విజృంభించింది. » 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు పదులు వయసు దాటిన తర్వాత కూడా శరత్ చెలరేగిపోయాడు. ఫిట్నెస్ రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయతి్నంచి పోటీల్లో దిగిన శరత్ కమల్... మూడు స్వర్ణాలతో అదరగొట్టాడు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజతో కలిసి శరత్ కమల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. » పెద్ద టోర్నమెంట్లో బరిలోకి దిగే ముందు బాగా ప్రాక్టీస్ చేసి కొత్త షాట్లను తన అమ్ములపొదిలో చేర్చుకోవడం శరత్కు అలవాటు. ఈ వయసులో ఇవన్నీ ఎలా సాధ్యం అనే ప్రశ్నకు చిరునవ్వే కమల్ సమాధానం. » అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అథ్లెట్స్ కమిషన్కు ఎంపికైన తొలి భారత అథ్లెట్గా శరత్ ఘనత సాధించాడు. » ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యుడిగా ఉన్న శరత్ కమల్... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోనూ చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. » ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్డీఏటీ) సహకారంతో మెలకొట్టాయుర్లోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శరత్ సొంతంగా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ను నెలకొల్పనున్నాడు. -
టాప్ సీడ్పై సహజ సంచలన విజయం
గుర్గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 301వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో టాప్ సీడ్, ప్రపంచ 229వ ర్యాంకర్ కార్లోటా మార్టినెజ్ సిరెజ్ (స్పెయిన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ తన సర్వీను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో హైదరాబాద్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక 3–6, 6–1, 3–6తో దరియా కుదషోవా (రష్యా) చేతిలో, స్మృతి భాసిన్ 1–6, 3–6తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీకాంత్ అర్హత
పారిస్ (ఫ్రాన్స్): ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్లో శ్రీకాంత్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలుపొందాడు. తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–8, 21–14తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. అనంతరం రెండో రౌండ్లో శ్రీకాంత్ 21–11, 14–21, 21–12తో అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ మూడో గేమ్లో ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. భారత్కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శంకర్ 21–19, 19–21, 21–19తో మాగ్నుస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై, రెండో రౌండ్లో 21–18, 21–12తో భారత్కే చెందిన రితి్వక్ సంజీవ్ సతీశ్ కుమార్పై గెలుపొందాడు. హైదరాబాద్కే చెందిన తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 21–17, 9–21, 16–21తో జువో ఫు లియావో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ఉన్నతి, ఇషారాణి కూడా మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్స్ ఉన్నతి హుడా, ఇషారాణి బారువా కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఉన్నతి 21–12, 21–16తో సియు టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై, రెండో రౌండ్లో 21–13, 21–15తో కిసోనా (మలేసియా)పై గెలిచింది. ఇషారాణి క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 12–21, 21–10, 21–12తో జుయ్ఫె కి (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 25–27, 21–16, 23–21తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. -
మెస్సీ సారథ్యంలో...
బ్యూనస్ఎయిర్స్: దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో 13వ రౌండ్ మ్యాచ్ల కోసం 33 మంది ఆటగాళ్లతో అర్జెంటీనా ప్రాథమిక జాబితాను ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లయనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా బరిలోకి దిగుతుంది. ఈనెల 21న మాంటెవీడియోలో ఉరుగ్వే జట్టుతో... ఈనెల 25న బ్యూనస్ ఎయిర్స్లో బ్రెజిల్ జట్టుతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తలపడుతుంది. 2026 ప్రపంచకప్ టోర్నికి కెనడా, మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ మెగా టోర్నిలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దక్షిణ అమెరికా జోన్లో 10 దేశాలు క్వాలిఫయింగ్లో బరిలో ఉన్నాయి. ఇప్పటికే 12 రౌండ్లు ముగిశాయి. నిర్ణిత 18 రౌండ్ల తర్వాత టాప్–6లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం అర్జెంటీనా, ఉరుగ్వే, ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, పరాగ్వే జట్లు టాప్–6లో ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ఆడుతుంది. ఖతర్ ఆతిథ్యమిచ్చిన 2022 ప్రపంచకప్లో మెస్సీ కెపె్టన్సీలో అర్జెంటీనా జట్టు 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్లో నిలిచాడు. రామ్కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్లో నిలిచారు. -
నమస్తే దివ్య..!
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నొదిర్బెక్ యకుబొయెవ్(Nodirbek Yakubboev) తీరు మార్చుకున్నాడు. ప్రత్యర్థిని గౌరవించి సంస్కారం చూపాడు. ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భాగంగా చాలెంజర్ టోర్నమెంట్లో పాల్గొంటున్న నొదిర్బెక్ తనకు ఎదురైన భారత ప్రత్యర్థి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్(Divya Deshmukh)కి రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నాడు. దీనికి దివ్య కూడా ప్రతి నమస్కారం చేసింది.కాగా 23 ఏళ్ల యకుబొయెవ్ మూడో రౌండ్కు ముందు దివ్యకు నమస్కరించాడు. ఈ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... భారత అమ్మాయిపై విజయం సాధించాడు. మూడు రౌండ్లలో ఒక గేమ్ నెగ్గిన దివ్య రెండు గేముల్లో ఓడింది. ఉజ్బెక్ ప్లేయర్ తాజా వ్యవహారశైలి గతంలో భారత మహిళా గ్రాండ్మాస్టర్ వైశాలి ఉదంతాన్ని మరిచిపోయేలా చేసింది. That moment when Nodirbek Yakubboev greeted Divya Deshmukh with a traditional "Namaste" before the start of their 3rd round game at @PragueChess Festival Challengers 2025! #praguechessfestival pic.twitter.com/07zSR0ymh6— ChessBase India (@ChessbaseIndia) March 1, 2025 అప్పుడేం జరిగిందంటే... జనవరిలో టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో (విక్ఆన్జీ, నెదర్లాండ్స్) నొదిర్బెక్... వైశాలి మధ్య మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆనవాయితీ ప్రకారం భారత అమ్మాయి కరచాలనం కోసం చేయి చాచగా... అదేం అక్కర్లేదన్నట్లుగా ఉజ్బెక్ ఆటగాడు షేక్హ్యాండ్కు నిరాకరించాడు. ఈ ‘నో షేక్హ్యాండ్’ ఉదంతం సోషల్ మీడియాలో వివాదం రేపింది. నెటిజన్లంతా నొదిర్బెక్ సంస్కారహీనుడంటూ కామెంట్లు పెట్టారు.ఇది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... కావాలని నిరాకరించలేదని, మతపరమైన కట్టుబాట్లతోనే పరాయి అమ్మాయి చేతిని తాకలేదని... ప్రతిభావంతురాలైన వైశాలీ అన్నా... భారతీయులన్నా తనకెంతో గౌరవమని ‘ఎక్స్’లో వివరణ ఇచ్చాడు. కేవలం ట్వీట్తో ఆగకుండా టోర్నీ ఆడేందుకు వచ్చిన అక్కాతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందలతో పాటు తోడుగా వచ్చిన వారి తల్లి నాగలక్ష్మిని వ్యక్తిగతంగా కలిసి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. ఇదీ చదవండి:తెలంగాణ శుభారంభం పంచ్కుల: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ‘బి’ డివిజన్ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో తెలంగాణ 3–1 గోల్స్ తేడాతో అస్సాంపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో అస్సాం జట్టే ముందుగా బోణీ కొట్టింది. తొలి క్వార్టర్లోనే అస్సాం కెప్టెన్ మున్మునీ దాస్ 14వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్తో జట్టు 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అస్సాం జోరు ఆ క్వార్టర్కే పరిమితమైంది.రెండో క్వార్టర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ అమ్మాయిలు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో అస్సాం క్రీడాకారిణులు చేష్టలుడిగారు. 23 నిమిషంలో ప్రతివ కిండో, 26వ నిమిషంలో సుమి ముందరి, 28వ నిమిషంలో పూజ రాథోడ్ తలా ఒక గోల్ చేశారు. తర్వాతి క్వార్టర్లలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలంగాణ 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఇదే డివిజన్లో జరిగిన పూల్ ‘బి’ పోటీల్లో ఢిల్లీ 1–0తో హిమాచల్ ప్రదేశ్పై గెలుపొందగా... చత్తీస్గఢ్, చండీగఢ్ల మధ్య జరిగిన పోరు 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
రిత్విక్... మళ్లీ సాధించాడు
సాక్షి, హైదరాబాద్: అన్సీడెడ్గా బరిలోకి దిగి... అంచనాలకు మించి రాణించి... హైదరాబాద్ టెన్నిస్ యువతార బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ అద్భుతం చేశాడు. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. లాటిన్ అమెరికాలో క్లే కోర్టులపై ఏటీపీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్గా రిత్విక్ గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బరియెంతోస్ (కొలంబియా) ద్వయం 6–3, 6–2తో టాప్ సీడ్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్తాని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకుంది. విజేతగా నిలిచిన రిత్విక్–బరియెంతోస్లకు 35,980 డాలర్ల (రూ. 31 లక్షల 47 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 24 ఏళ్ల రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ –250 డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్లో కజకిస్తాన్లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో భారత్కే చెందిన అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలి డబుల్స్ టైటిల్ గెలిచాడు. తాజా టైటిల్తో రిత్విక్ సోమవారం విడదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 66వ ర్యాంక్ను అందుకోనున్నాడు. 11 ఏస్లతో మెరిసి... 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రిత్విక్–బరియెంతోస్ ద్వయం పూర్తి ఆధిపత్యం చలాయించింది. 11 ఏస్లు సంధించిన ఈ జోడీ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ఫస్ట్ సర్వ్లోని 30 పాయింట్లకుగాను 26 పాయింట్లు... సెకండ్ సర్వ్లో 13 పాయింట్లకుగాను 10 పాయింట్లు ఈ జంట గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని ఈ ఇండో–కొలంబియన్ జంట ప్రత్యర్థి ద్వయం సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఈ టోర్నిలో అన్సీడెడ్ గా పోటీపడ్డ రిత్విక్–బరియెంతోస్ తొలి రౌండ్లో 7–6 (7/5), 7–6 (9/7)తో ద్రెజెవ్స్కీ–పీటర్ మత్సుజెవ్స్కీ (పోలాండ్)లపై, క్వార్టర్ ఫైనల్లో 3–6, 7–6 (7/2), 10–8తో మార్సెలో డెమోలైనర్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్)లపై, సెమీఫైనల్లో 4–6, 7–6 (9/7), 10–5తో మూడో సీడ్ గిడో ఆంద్రెజీ (అర్జెంటీనా)–థియో అరిబెజ్ (ఫ్రాన్స్)లపై గెలుపొందారు. -
అనిరుధ్ జోడీకి టైటిల్
బెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) జంట 6–2, 6–4తో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు భారతీయ ప్లేయర్లు డబుల్స్ చాంపియన్స్గా నిలిచారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అనిరుద్–రే హో జంట నెట్ గేమ్తో చెలరేగింది. తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న అనిరుధ్ జంట... రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గకుండా విజయం ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో రూ.8.65 లక్షల నగదు బహుమతితో పాటు... 125 ర్యాంకింగ్ పాయింట్లు అనిరుధ్ జోడీ ఖాతాలో చేరాయి. -
భారత జట్టులో సహజ, శ్రీవల్లి
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ టీమ్ ఈవెంట్ బిల్లీ జీన్ కింగ్ కప్లో పాల్గొనే భారత జట్టులో తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఎంపికయ్యారు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఈ టోర్నీ కోసం ఐదుగురు సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. ఇందులో సహజ, శ్రీవల్లిలతో పాటు భారత నంబర్వన్ ర్యాంకర్ అంకిత రైనా, వైదేహి చౌదరి, ప్రార్థన తొంబరే ఉన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీలో సంచలన ప్రదర్శన కనబరిచిన మాయ రాజేశ్వరన్ను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. ఈ టీమ్కు విశాల్ ఉప్పల్ నాన్ప్లేయింగ్ కెపె్టన్గా వ్యవహరిస్తారు. పురుషుల విభాగంలో జరిగే ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నమెంట్లాగే మహిళల ఈవెంట్లో జరిగే టోర్నీయే ఈ ‘బిల్లీ జీన్ కింగ్ కప్’. ఈ సారి ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. పుణేలోని దక్కన్ జింఖానా కాంప్లెక్స్లో ఏప్రిల్ 8 నుంచి బిల్లీ జీన్ కింగ్ కప్ పోటీలు జరుగుతాయి. -
సినెర్ నామినేషన్ ఉపసంహరణ.. కారణం ఇదే
లండన్: ప్రపంచ నంబర్వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘లారెస్’ అవార్డుకు దూరమయ్యాడు. ఇటీవల అతనిపై మూడు నెలల నిషేధం విధించడంతో ‘స్పోర్ట్స్ ఆస్కార్’గా ప్రఖ్యాతిగాంచిన ఈ అవార్డు బరిలో లేకుండా పోయాడు. లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీ (ఎల్డబ్ల్యూఎస్ఏ) అతని నామినేషన్ను ఉపసంహరించింది. దీంతో సినెర్ రేసులో లేడు. ఈ విషయాన్ని ఎల్డబ్ల్యూఎస్ఏ చైర్మన్ సీన్ ఫిట్జ్ప్యాట్రిక్ ధ్రువీకరించారు.ఇటలీ సూపర్స్టార్ సినెర్పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విధించిన నిషేధం అమలవుతుండటంతో అవార్డు బరి నుంచి అతని పేరును తప్పించినట్లు తెలిపారు. ‘డోపింగ్ ఉదంతం దరిమిలా నిషేధంపై ‘వాడా’తో పాటు టెన్నిస్ వర్గాలతో చర్చించాం. నిషేధంలో ఉన్న ఆటగాడు విశ్వఖ్యాతిగాంచిన అవార్డు బరిలో ఉండటం సమంజసం కాదనే నిర్ణయానికి వచ్చాం. దీంతో సినెర్ నామినేషన్ను ఉపసంహరించాలని నిర్ణయించాం. దీనిపై సినెర్, అతని బృందానికి సమాచారమిచ్చాం’ అని ఫిట్జ్ప్యాట్రిక్ వెల్లడించారు. 23 ఏళ్ల సినెర్ గతేడాది మార్చిలోనే నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించింది.‘కావాలని తీసుకోలేదు. మర్ధన తైలం, లేదంటే ఇతరత్రా మందుల ద్వారా అది తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే’ యానిక్ స్వీయ వాంగ్మూలాన్ని ఐటీఐఏ పరిగణించి తదుపరి చర్యలు తీసుకోలేదు. దీన్ని యావత్ క్రీడావర్గాలు తప్పుబట్టాయి. ఐటీఐఏ పక్షపాత వైఖరిని గర్హించాయి. సెర్బియా దిగ్గజం జొకోవిచ్ సహా పలువురు టెన్నిస్ స్టార్లు... ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ని‘బంధనాలు’ అంటూ బాహాటంగానే దుమ్మెత్తి పోశారు. ‘వాడా’ సైతం అతని రెండు శాంపిల్స్ (నమూనాలు) పాజిటివ్ అని తేలాయి కాబట్టి కనీసం ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టుకు అప్పీల్ చేసింది. చివరకు సినెర్–ఐటీఐఏ–వాడాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15న మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిషేధం విధించినప్పటికీ ఈ సీజన్లో అతని గ్రాండ్స్లామ్ టైటిళ్ల వేటకి ఏ ఇబ్బంది లేకపోయింది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో టైటిల్ నిలబెట్టుకున్న సినెర్... నిషేధం ముగిశాక తదుపరి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ (మే 25 నుంచి)లో పోటీపడతాడు. ఇవీ చదవండిచెస్ ప్రపంచం సంతాపంఅంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (Boris Spassky-88) కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్(Former World Champion) మరణించిన విషయాన్ని ‘ఫిడే’ గురువారం ప్రకటించింది. స్పాస్కీ మరణం పట్ల చెస్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. గ్యారీ కాస్పరోవ్, లెవాన్ ఆరోనియాన్, సుసాన్ పోల్గర్, విశ్వనాథన్ ఆనంద్ తదితరులు స్పాస్కీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఫైనల్లో అనిరుద్ జోడీబెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోరీ్నలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) ద్వయం 6–4, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జంటపై గెలుపొందింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు చెరో సెట్ సొంతం చేసుకున్నాయి.నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో అనిరుధ్–రే హో ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీతో అనిరుద్–రే హో జంట తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ 6–3, 7–6 (8/6)తో సిద్ధాంత్–పరీక్షిత్ (భారత్)లపై నెగ్గారు. -
చెస్ దిగ్గజం బోరిస్ స్పాస్కీ కన్నుమూత
అంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (88) మంగళవారం కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్ మరణించిన విషయాన్ని ‘ఫిడే’ ప్రకటించింది. ప్రపంచ చెస్ను సోవియట్ యూనియన్ శాసిస్తున్న కాలంలో వరల్డ్ చాంపియన్గా నిలిచిన వారిలో స్పాస్కీ కూడా ఒకడు.1969–1972 మధ్య అతను పదో వరల్డ్ చాంపియన్గా శిఖరాన నిలిచాడు. అయితే డిఫెండింగ్ చాంపియన్గా స్పాస్కీ బరిలోకి దిగిన 1972 వరల్డ్ చాంపియన్ పోరాటానికి ప్రపంచ చెస్లో ప్రత్యేక స్థానం ఉంది. సోవియట్ యూనియన్, అమెరికా మధ్య తీవ్ర వైరంతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న ఆ కాలంలో స్పాస్కీతో అమెరికాకు చెందిన బాబీ ఫిషర్ చాలెంజర్గా తలపడ్డాడు. దాంతో ఈ సమరం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలో దీనికి ‘మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ’గా గుర్తింపు వచి్చంది. సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికాగా మారిపోయిన ఈ 21 గేమ్ల పోరులో చివరకు 8.5–12.5 పాయింట్ల తేడాతో ఫిషర్ చేతిలో ఓడి స్పాస్కీ వరల్డ్ టైటిల్ను కోల్పోయాడు. నాలుగేళ్ల తర్వాత ఫ్రాన్స్కు వెళ్లి స్థిరపడిన స్పాస్కీ ఆ తర్వాత 21 ఏళ్ల పాటు ఆ దేశం తరఫున పోటీల్లో పాల్గొన్నా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 2013లో అతను తిరిగి స్వదేశానికి వచ్చేసి చివరి వరకు మాస్కోలోనే ఉండిపోయాడు. స్పాస్కీతో సమరంతో 1972లో జగజ్జేతగా నిలిచిన బాబీ ఫిషర్ 2008లోనే మరణించాడు.చదవండి: Champions Trophy: సెమీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. -
నేటి నుంచి జాతీయ మహిళల హాకీ టోర్నీ
పంచ్కులా: సీనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్షిప్ను కొత్త ఫార్మాట్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హరియాణాలోని పంచ్కులాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో ఈ 28 జట్లు ఎ, బి, సి గ్రూపుల్లో తలపడతాయి. ఈ తాజా ప్రదర్శనే ప్రామాణీకంగా తదుపరి సీజన్ గ్రూపుల్లో జట్లు మారతాయి. అంటే రంజీ క్రికెట్ తరహాలో రాష్ట్ర హాకీ జట్లు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. తద్వారా ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి జట్ల మధ్య పోటీలు జరుగుతాయి. సిలో చిన్న జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే మధ్యమ స్థాయి ‘బి’కి... తర్వాత ఉత్తమ స్థాయి ‘ఎ’కి ఆయా జట్లకు ప్రమోషన్ లభిస్తుంది. తద్వారా బలమైన జట్టుతో బలహీనమైన జట్టు పోటీపడదు. సమఉజ్జీల మధ్యే సమరం జరగడం వల్ల పోటీ వాతావరణం క్రమంగా పెరిగి ఆయా జట్లు పురోగతి సాధిస్తాయని ‘హాకీ ఇండియా’ భావిస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల జట్లకు ‘ఎ’ డివిజన్లో పోటీపడే అవకాశం లభించలేదు. తెలంగాణ ‘బి’ డివిజన్లోని పూల్ ‘ఎ’లో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్లతో తలపడుతుంది. ‘సి’ డివిజన్లోని పూల్ ‘బి’లో ఉన్న ఆంధ్రప్రదేశ్... పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్లతో పోటీ పడుతుంది. ‘ఎ’ డివిజన్లో... పూల్ ‘ఎ’: హరియాణా, ఒడిశా, కర్ణాటక; పూల్ ‘బి’: మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్; పూల్ ‘సి’: జార్ఖండ్, మిజోరం, తమిళనాడు; పూల్ ‘డి’: మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్. ‘బి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్; పూల్ ‘బి’: ఢిల్లీ, ఛత్తీస్గఢ్, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్. ‘సి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: కేరళ, దాద్రా నాగర్ హవేలి, డామన్ అండ్ డియూ, గుజరాత్; పూల్ ‘బి’: ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్. -
ఆటలకు ఆస్తులతో పనేంటి?
న్యూఢిల్లీ: క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే ముందు మధ్య తరగతి వర్గాల వారు తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... ఆర్థికపరంగా మంచి స్థాయిలో ఉన్నవారి పిల్లలే ఆటల వైపు రావాలంటూ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గోపీచంద్ మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు వాటిని తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, స్టార్ షట్లర్ పీవీ సింధు తండ్రి పీవీ రమణ దీనిపై స్పందించారు. ఆటగాడిగా ఎదిగేందుకు ధనవంతులు కావడం ముఖ్యం కాదని... ప్రతిభ ఉంటే దూసుకుపోవచ్చని అభిప్రాయపడ్డారు. తానూ దిగువ స్థాయి నుంచే వచ్చి ఆటగాడిగా ఎదిగానని... సింధును క్రీడల వైపు మళ్లించినప్పుడు కూడా తన వద్ద పెద్దగా డబ్బేమీ లేదని ఆయన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. ‘నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 10 మంది సంతానంలో నేను అందరికంటే చిన్నవాడిని. కానీ అన్నలు, అక్కలు నాకు ఎంతో అండగా నిలిచి జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడేందుకు సహకరించారు. ఆట కారణంగానే నాకు రైల్వేస్లో ఉద్యోగం వచ్చింది. మీరు దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతికి చెందినా... ఆటల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. చిన్నారులు అన్ని రకాలుగా ఎదిగేందుకు కూడా క్రీడలు ఉపయోగపడతాయి’ అని రమణ వివరించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో రమణ సభ్యుడిగా ఉన్నారు. తన పెద్ద కూతురు చదువులో చురుగ్గా ఉందని ఆమెను డాక్టర్ అయ్యేలా ప్రోత్సహించానని, సింధుకు బ్యాడ్మింటన్లో ఎంతో ప్రతిభ ఉందనే విషయం ఆరంభంలో గుర్తించామని ఆయన అన్నారు. ‘ప్రతిభ ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తుంది. దానిని ఎవరూ దాచి ఉంచలేరు. తల్లిదండ్రులు తగిన రీతిలో మార్గనిర్దేశనం చేయాలి. ఒక క్రీడాకారుడు మరొకరిని క్రీడల్లోకి రావద్దంటూ హెచ్చరించడం సరైంది కాదని నా అభిప్రాయం’ అని గోపీచంద్ వ్యాఖ్యలను రమణ వ్యతిరేకించారు. తనకు రైల్వేలో ఉద్యోగం ఉండటం వల్లే సింధు కెరీర్ను ముందుకు తీసుకెళ్లగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘క్రీడల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవడం మధ్యతరగతి వారి దృష్టిలో పెద్ద ఘనత. అలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రైల్వేలోనే వేలాది మంది క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద చదువులు చదివే అవకాశం కూడా లభిస్తుంది. కోచ్లు ఈ విషయంలో వారికి సరైన దారి చూపిస్తే చాలు’ అని రమణ పేర్కొన్నారు. ఇటీవల ఒక యువ షట్లర్కు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం లభించే విధంగా తాను తగిన విధంగా మార్గనిర్దేశనం చేసినట్లు రమణ వెల్లడించారు. డబ్బున్న వారే ఆటల్లోకి రావాలంటూ సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. సింధు కెరీర్ ఆరంభంలో తాము రైలు ప్రయాణాలు చేస్తే కొందరు విమానాల్లో వచ్చేవారని... ఇప్పుడు సింధు ఏ స్థాయికి చేరుకుందో చూడాలని రమణ వ్యాఖ్యానించారు. -
ఫైనల్లో యూకీ జోడీ
దుబాయ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. దుబాయ్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టో ర్నీలో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి యూకీ బాంబ్రీ పురుషుల డబుల్స్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ–పాపిరిన్ ద్వయం 6–2, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ రెండు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో 32 ఏళ్ల యూకీ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–500 స్థాయి టో ర్నీలో ఫైనల్కు చేరాడు. అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో యూకీ మూడు డబుల్స్ టైటిల్స్ సాధించి, మరో మూడు టోర్నీలలో రన్నరప్గా నిలిచాడు. -
‘గృహ హింస’ వివాదంలో భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్
చండీగఢ్: దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారుల దాంపత్యంలో పెను వివాదం రేగింది. కుటుంబ కలహాలతో పరిస్థితి పోలీసు కేసు వరకు వెళ్లింది. హరియాణాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా, భారత బాక్సర్ స్వీటీ బూరాకు 2022లో పెళ్లి జరిగింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హుడా 2019 నుంచి 2022 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. మరోవైపు స్వీటీ బూరా 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఇప్పుడు హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. గతంలోనే డిమాండ్ ప్రకారం లగ్జరీ కారును ఇచ్చినా... మరింత డబ్బు కావాలంటూ తనను కొడుతున్నాడని స్వీటీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 ప్రకారం హుడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి 2–3 సార్లు నోటీసులు జారీ చేసినా... అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ హుడా ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే తాను పోలీసుల ముందుకు వస్తానని, అయితే స్వీటీపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు కేసుపై మరింత సమాచారం ఇచ్చేందుకు స్వీటీ నిరాకరించింది. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి హుడా ఓటమి పాలయ్యాడు. -
భారత బాక్సింగ్ను ముందుకు తీసుకెళ్తా!
న్యూఢిల్లీ: దేశంలో బాక్సింగ్కు మరింత వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. అందుకోసం అవసరమైతే భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడనని వెల్లడించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్లో పతకం నెగ్గిన ఏకైక పురుష బాక్సర్ అయిన విజేందర్ సింగ్... బీఎఫ్ఐ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన విజేందర్ సింగ్... 2015లో ప్రొఫెషనల్ బాక్సర్గా అవతారమెత్తాడు.గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ సర్క్యూట్లోనూ యాక్టివ్గా లేని 39 ఏళ్ల విజేందర్ తాజాగా బీఎఫ్ఐ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. ఇది కొత్త తరహాది అనుకుంటా. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు. ఆటకు నా వల్ల ప్రయోజనం చేకూరుతుందనుకుంటే తప్పకుండా పోటీలో ఉంటా. మార్పు తెచ్చే అవకాశం ఉంటే దాని కోసం నా వంతు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బాక్సర్గా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కాదు. నేనెప్పటికీ అలా చేయను’ అని అన్నాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన విజేందర్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. విదేశీ శిక్షణ ముఖ్యం భారత యువ బాక్సర్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని విజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బాక్సింగ్ సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం క్రీడల్లో వేగంగా వృద్ధి చెందుతోంది. మరో మూడేళ్లలో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలంటే భారత బాక్సర్లు విదేశీ బాక్సర్లతో తరచూ తలపడాలి’ అని విజేందర్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. ప్రపంచ బాక్సంగ్ చాంపియన్షిప్ (2009)లో పతకం నెగ్గిన తొలి భారత పురుష బాక్సర్గా రికార్డుల్లోకి ఎక్కిన విజేందర్... గతంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్గానూ కొనసాగాడు. బాక్సింగ్ సమాఖ్య పరిపాలన సంబంధించిన విధులను ఇటీవల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హాక్ కమిటీకి అప్పగించిన నేపథ్యంలో... విజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 3తోనే బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగియగా... ఎన్నికల నిర్వహణలో సమాఖ్య జాప్యం చేస్తుండటంతోనే ఐఓఏ ఈ చర్యకు పూనుకుంది. దీనిపై బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓఏ ఆదేశాలు చట్టవిరుద్ధమని... దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా... బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలోనే ఐఓఏ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మాజీ కోశాధికారి మధుకాంత్ పాఠక్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సమాఖ్యలో గందరగోళం కారణంగా బాక్సర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పారిస్ ఒలింపిక్స్లో రిక్తహస్తాలతో వెనుదిరిగిన మన బాక్సర్లు... ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గగనమైంది. ఇక మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ మన బాక్సర్లు పాల్గొనలేదు. -
సెమీస్లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జోడీ... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్ జంట 6–3, 6–3తో హైనెక్ బార్టన్ (చెక్ రిపబ్లిక్)–ఎరిక్ వాన్షెల్బోయిమ్ (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ తమ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 7–6 (7/5), 7–5తో ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 7–5, 6–0తో బెర్నాడ్ టామిక్ (ఆ్రస్టేలియా)–నికోలస్ మెజియా (కొలంబియా)లపై, బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆ్రస్టేలియా) 6–2, 6–4తో ఆదిల్ కల్యాణ్పూర్–కరణ్ సింగ్ (భారత్)లపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో (మొనాకో): మహిళల గ్రాండ్ప్రి సిరీస్ మూడో టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ స్టార్ కోనేరు హంపి రన్నరప్గా నిలిచింది. గురువారం మొనాకాలో ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హంపి, అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా), బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను నిర్ధారించగా... గొర్యాక్చినాకు టైటిల్ ఖరారైంది. హంపి రన్నరప్గా నిలిచింది. మున్గున్తుల్కు మూడో స్థానం లభించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హంపి 55 ఎత్తుల్లో బీబీసారా అసాబయెవా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడిన హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. దుబాయ్లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) ద్వయం 5–7, 7–6 (7/5), 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 17వ, 18వ స్థానాల్లో ఉన్న లాయిడ్ గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించిన యూకీ జోడీ క్వార్టర్ ఫైనల్లోనూ కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. -
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటి బూరా (Saweety Boora) వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త, భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా (Deepak Hooda), అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటి కేసు పెట్టింది. సవీటి ఫిర్యాదు మేరకు హిస్సార్లోని (హర్యానా) ఓ పోలీస్ స్టేషన్లో దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీపక్ హుడా అదనపు కట్నంతో పాటు ఓ ఫార్చూనర్ కార్ డిమాండ్ చేస్తున్నాడని సవీటి తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీపక్ హుడాకు రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన పోలీసులు వెల్లడించారు. దీపక్ హుడాపై అదనపు కట్నం వేధింపులు, హింసించడం మరియు దాడి చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పోలీసులు వివరించారు. పోలీసుల వాదనపై హుడాను జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ కారణంగానే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయానని అన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. త్వరలో పోలీస్ స్టేషన్కు వెళ్తానని అన్నాడు. ఈ సందర్భంగా హుడా తన భార్య సవీటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆమెను కలవడానికి నాకు అనుమతి లేదని అన్నాడు.కాగా, సవీటి బూరా-దీపక్ హుడాల వివాహం 2022లో జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రోహ్తక్ జిల్లాలోని మెహమ్ నియోజకవర్గం నుంచి హుడా పోటీ చేశారు. హుడా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రో కబడ్డీ లీగ్లో కూడా పాల్గొన్నాడు. 32 ఏళ్ల సవీటి 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో ఆమె భర్తతో కలిసి భాజపాలో చేరింది. గత నెలలోనే సవీటి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది. -
క్రీడా సమాఖ్యలకు సాయంపై సమీక్ష!
న్యూఢిల్లీ: వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించిన జాతీయ సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయంపై సమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో... రాబోయే కొన్నేళ్లలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమాఖ్య నిబంధనలు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ‘మూడేళ్ల క్రితం రూపొందించిన విధానం ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో ఉన్న నిబంధనలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేశాం. వేర్వేరు అంశాలను సమీక్షించి ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ పరీక్ పేర్కొన్నారు. కొత్తగా ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా క్రీడల్లో టోర్నీల నిర్వహణ, విదేశాల్లో జరిగే టోర్నీల్లో ఆటగాళ్లు పాల్గొనడం, క్రీడా సామగ్రి కొనుగోలు, కోచింగ్ క్యాంప్ల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం ఎన్ఎస్ఎఫ్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కోచ్లు, ఇతర సహాయక సిబ్బంది జీతాలు, గుర్తింపు పొందిన ఆటగాళ్ల కోసం ఇతర అదనపు సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటికి తోడు సమాఖ్యలు తమ స్థాయిని బట్టి బయట స్పాన్సర్ల ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతాయి. గత ఏడాది బడ్జెట్లో ఎన్ఎస్ఎఫ్ల కోసం రూ. 340 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సారి దానిని కొంత పెంచి రూ.400 కోట్లు చేసింది. సమాఖ్యల పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలు మార్పు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముసాయిదా క్రీడా బిల్లును కూడా త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్ఎస్ఎఫ్లకు గ్రాంట్లు అందజేసే విషయంలో ఒక రెగ్యులేటరీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. 2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం భారత్ ఇప్పటికే తమ ఆసక్తిని చూపిస్తూ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను ఐఓసీకి పంపించింది. -
క్వార్టర్స్లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: వరుస సెట్లలో గెలిచిన భారత జోడీ సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–రామ్ ద్వయం 6–3, 7–6 (7/4)తో జాకోపో బెరెటిని–ఎన్రికో డల్లా వాలె (ఇటలీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ జోడీ తొమ్మిది ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 6–4, 6–4తో గంటా సాయికార్తీక్ రెడ్డి (భారత్)–సుల్తానోవ్ (ఉజ్బెకిస్తాన్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 6–4, 6–3తో నికీ కలియంద పునాచా (భారత్)–జాన్ లాక్ (జింబాబ్వే)లపై, ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్) 4–6, 6–3, 10–6తో ఎంజో కుకాడో (ఫ్రాన్స్)–మైకేల్ గీర్ట్స్ (బెల్జియం)లపై, ఆదిల్ కల్యాణ్పూర్–కరణ్ సింగ్ (భారత్) 1–6, 6–2, 10–4తో నితిన్ కుమార్ సిన్హా–మనీశ్ సురేశ్కుమార్ (భారత్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
పోరాడి ఓడిన మానస్, కరణ్..
బెంగళూరు: ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మానస్ ధామ్నె, రామ్కుమార్ రామనాథన్... ‘క్వాలిఫ యర్’ హోదాలో అడుగు పెట్టిన కరణ్ సింగ్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తొలి రౌండ్ను దాటలేకపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మానస్ ధామ్నె 3–6, 6–3, 6–7 (3/7)తో పీటర్ బార్ బిర్యుకోవ్ (రష్యా) చేతిలో... కరణ్ సింగ్ 4–6, 6–4, 6–7 (3/7)తో జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా) చేతిలో... రామ్కుమార్ రామనాథన్ 6–7 (3/7), 5–7తో షింటారో మొచిజుకి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.బిర్యుకోవ్తో 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 17 ఏళ్ల మానస్ తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. అయితే టైబ్రేక్లో మానస్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రొడియోనోవ్తో 1 గంట 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో కరణ్ 11 ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నిర్ణాయక టైబ్రేక్లో కరణ్ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యాడు. షింటారోతో 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రామ్ 14 ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. -
లక్ష్యసేన్కు ఊరట
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలకు చెందిన అంశంలో... భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, కోచ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో లక్ష్యసేన్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు విచారణకు ఆదేశించగా... ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం... లక్ష్యసేన్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన ఎంజీ నాగరాజ్తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లక్ష్యసేన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈ నెల 19న తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ లక్ష్యసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లక్ష్యసేన్ తల్లిదండ్రులు నిర్మల, ధీరేంద్రతో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్, కోచ్ విమల్ కుమార్... కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఉద్యోగితో కలిసి జనన ధ్రువీకరణ రికార్డులను తప్పుగా మార్పించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... » ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఆడేందుకు వీలుగా లక్ష్యసేన్తో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్ వయసును రెండున్నరేళ్లు తక్కువగా నమోదు చేసినట్లు నాగరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. » లక్ష్యసేన్ కుటుంబ సభ్యులతో పాటు కోచ్ విమల్ కుమార్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. » తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ లక్ష్యసేన్ కుటుంబంపై 2022 డిసెంబర్లో నాగరాజ్ కర్ణాటక పోలీసులను ఆశ్రయించగా... వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. » కేసును విచారించిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆధారాలు లేవని కొట్టి వేసింది. జస్టిస్ ఉమ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు. » దీంతో పిటిషన్ వేసిన నాగరాజ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించి వాటిని న్యాయస్థానానికి అందజేశారు. దీంతో పాటు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంక్వైరీ రిపోర్టును కూడా జత చేశారు. అందులో రికార్డుల తారుమారు అంశంలో లక్ష్యసేన తండ్రి ధీరేంద్ర సేన్ తప్పు అంగీకరించిన వివరాలు ఉన్నాయి. » మరోవైపు ఆరోపణలు నిరాధారమని లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.2018లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ఈ అంశాన్ని విచారించి ఎలాంటి అవకతవకలు లేవని ముగించిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే నాగారాజ్ ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. » పిటిషన్ వేసిన నాగరాజ్ 2020లో కుమార్తెను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పించాలని ప్రయత్నించగా... ఆ బాలిక ఎంపిక కాలేదు. దీంతో నిరాశలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. » లక్ష్యసేన్ సోదరుడు చిరాగ్ సేన్... గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 2016లో భారత బ్యాడ్మింటన్ సంఘం అతడిపై నిషేధం కూడా విధించింది. -
నెదర్లాండ్స్కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 2–1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది. నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్ కౌర్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పియెన్ సాండర్స్ (17వ నిమిషంలో), వాన్డెర్ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్కీపర్ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్ క్రీడాకారిణుల షాట్లను నిలువరించింది. నెదర్లాండ్స్ తరఫున మరీన్ వీన్ మాత్రమే సఫలమైంది. భారత్ తరఫున దీపిక, ముంతాజ్ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్ విఫలమయ్యారు. నెదర్లాండ్స్ ఐదో షాట్ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్ను తీసుకోలేదు. ఇంగ్లండ్ తో పోరులో భారత జట్టుకు హర్మన్ప్రీత్ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. -
మళ్లీ ప్రపంచ నంబర్వన్ జోడీపై యూకీ బాంబ్రీ విజయం
వారం రోజుల వ్యవధిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ మరోసారి ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జోడీని బోల్తా కొట్టించాడు. దుబాయ్ ఓపెన్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా) ద్వయం 4–6, 7–6 (7/1), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ ఆరు ఏస్లు సంధించింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. గతవారం దోహా ఓపెన్–500 టోర్నీలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి ఆడిన యూకీ క్వార్టర్ ఫైనల్లో అరెవాలో–పావిక్ జంటపై గెలిచింది. దుబాయ్ ఓపెన్లోనే ఆడుతున్న మరో భారత జోడీ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ తొలి రౌండ్లో 4–6, 6–7 (6/8)తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
FIH Pro League: భారత హాకీ జట్లకు నిరాశ
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో సోమవారం భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. భువనేశ్వర్లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు 2–4 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 2–3 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోయాయి. నెదర్లాండ్స్తో జరిగిన పోరు ద్వారా భారత జట్టు గోల్కీపర్ సవితా పూనియా తన కెరీర్లో 300 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. వందన కటారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్గా సవిత గుర్తింపు పొందింది.నెదర్లాండ్స్తో మ్యాచ్లో భారత్ తరఫున ఉదిత (18వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున ఎమ్మా రెజ్నెన్ (7వ నిమిషంలో), ఫే వాన్డెర్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... ఫెలిస్ అల్బెర్స్ (34వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది.ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టుకు అభిషేక్ (18వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంగ్లండ్ తరఫున జేకబ్ పేటన్ (15వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... సామ్ వార్డ్ (19వ, 29వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. -
హెడ్కోచ్గా భారత జట్టు మాజీ కెప్టెన్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో రెండోసారి చాంపియన్గా అవతరించేందుకు యు ముంబా జట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి మూడు సీజన్లలో ఫైనల్కు చేరుకోవడంతోపాటు ఒకసారి విజేతగా (2015లో), రెండుసార్లు రన్నరప్గా (2014, 2016) నిలిచిన యు ముంబా జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. గత మూడు సీజన్లలో అయితే యు ముంబా జట్టు పూర్తిగా నిరాశపరిచింది. రెండుసార్లు పదో స్థానంలో, ఒకసారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.ఈ నేపథ్యంలో యు ముంబా మళ్లీ టైటిల్ ట్రాక్లో పడాలనే ఉద్దేశంలో ఫ్రాంచైజీ శిక్షణ బృందంలో మార్పులు చేసింది. భారత జట్టు మాజీ కెప్టెన్, మూడు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు రాకేశ్ కుమార్ను కొత్త హెడ్ కోచ్గా నియమించింది. మూడో పీకేఎల్ సీజన్లో యు ముంబా జట్టుతో చేరిన రాకేశ్... అంతకుముందు పట్నా పైరేట్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2017లో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.‘కింగ్ ఆఫ్ కబడ్డీ’గా పేరొందిన రాకేశ్ను తమ జట్టుకు హెడ్ కోచ్గా నియమించినందుకు ఆనందంగా ఉందని యు ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. ‘ఈసారి హెడ్ కోచ్గా యు ముంబా జట్టుతో చేరినందుకు సంతోషంగా ఉంది. వచ్చే సీజన్లో యు ముంబాకు మంచి ఫలితాలు అందించేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని 41 ఏళ్ల రాకేశ్ వ్యాఖ్యానించాడు. గతంలో హరియాణా స్టీలర్స్ జట్టుకు, ఇండియన్ రైల్వేస్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాకేశ్ 2006, 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరిన్ని క్రీడా వార్తలువరల్డ్ కప్ షాట్గన్ టోర్నీకి కైనన్ న్యూఢిల్లీ: హైదరాబాద్ సీనియర్ ట్రాప్ షూటర్ కైనన్ చెనాయ్ ఈ సీజన్ను వరల్డ్ కప్ టోర్నీతో మొదలు పెట్టనున్నాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే సీజన్ మూడో వరల్డ్కప్లో పాల్గొనే 12 మంది సభ్యులతో కూడిన భారత షాట్గన్ జట్టును సోమవారం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. సైప్రస్ రాజధాని నికోసియాలో మే 3 నుంచి 12వ తేదీ వరకు ఈ సీజన్లోని మూడో షాట్గన్ వరల్డ్కప్ టోర్నీ జరుగుతుంది.జాతీయ సెలెక్షన్ పాలసీ ప్రకారం భారత ర్యాంకింగ్స్లో 4 నుంచి 6 స్థానాల మధ్య ఉన్న షూటర్లను మూడో వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేశారు. 34 ఏళ్ల కైనన్ 2016 రియో ఒలింపిక్స్లో ట్రాప్ ఈవెంట్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. గత 15 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కైనన్ తన కెరీర్లో వరల్డ్ కప్ టోర్నీలలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి 3 పతకాలు... ఆసియా చాంపియన్షిప్లో మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 4 పతకాలు సాధించాడు. అర్జెంటీనా, పెరూలలో రైఫిల్, పిస్టల్, షాట్గన్ ఈవెంట్స్తో కూడిన రెండు వరల్డ్కప్లు జరుగుతాయి. అనంతరం సైప్రస్లో కేవలం షాట్గన్ ఈవెంట్లో మాత్రమే వరల్డ్కప్ జరుగుతుంది.భారత షూటింగ్ జట్టు: పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగం: కైనన్ చెనాయ్, శార్దుల్ విహాన్, భౌనీశ్ మెండిరట్టాపురుషుల స్కీట్ విభాగం: మేరాజ్ అహ్మద్ ఖాన్, అభయ్ సింగ్ సెఖోన్, రితురాజ్ సింగ్ బుండేలామహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగం: సబీరా హారిస్, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి. మహిళల స్కీట్ విభాగం: యశస్వి రాథోడ్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్ట్రాప్ మిక్స్డ్ టీమ్: కైనన్ చెనాయ్, సబీరా హారిస్, శార్దుల్ విహాన్, కీర్తి గుప్తా. భారత మహిళల జట్టుకు తొలి ఓటమి షార్జా: పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. రష్యా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రష్యా తరఫున గ్లాఫిరా జుకోవా (25వ నిమిషంలో), వాలెంటీనా స్మిర్నోవా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 27వ స్థానంలో ఉన్న రష్యా జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది.తొలి మూడు నిమిషాల్లోనే రష్యా గోల్ చేసినంత పని చేసింది. కానీ రష్యా ప్లేయర్లు కొట్టిన షాట్లు గురి తప్పాయి. భారత్ తరఫున మనీషా 31వ నిమిషంలో కొట్టిన షాట్ను రష్యా గోల్కీపర్ కీరా పెతుకోవా నిలువరించింది. రెండో అర్ధభాగంలో భారత జట్టు పక్కా ప్రణాళికతో ఆడి రష్యా జోరుకు అడ్డకట్ట వేసింది. అయితే ఇంజ్యూరీ సమయంలో మరో గోల్ను సమర్పించుకుంది.భారత జట్టుకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్లో 68 నిమిషాలు మైదానంలో ఉంది. ఆ తర్వాత సౌమ్య స్థానంలో మౌసుమి ముర్ము సబ్స్టిట్యూట్గా వచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 69వ స్థానంలో ఉన్న భారత జట్టు ఈ టోర్నీలోని తొలి మ్యాచ్లో 2–0తో జోర్డాన్ జట్టుపై గెలిచింది. భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ను బుధవారం దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. -
Singapore International Challenge Tourney: రన్నరప్గా భారత యువ షట్లర్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా సింగపూర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఉన్నతి 17–21, 16–21 పాయింట్ల తేడాతో రుజానా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో ఉన్నతి వరుస గేమ్ల్లో ఓడింది. టోర్నీ ఆసాంతం రాణించిన ఉన్నతి... రెండో రౌండ్లో ఆసియా క్రీడల పతక విజేత సయిన కవాకమి (ఆ్రస్టేలియా)ను ఓడించింది. సెమీఫైనల్కు చేరే క్రమంలో చైనీస్ తైపీకి చెందిన ఇద్దరు షట్లర్లు సైయాంగ్ స్యూన్ లిన్, యీ టింగ్పై కూడా ఉన్నతి విజయాలు సాధించింది. సెమీఫైనల్లో ఉన్నతి 18–21, 21–19, 22–20తో థి ట్రాంగ్ వు (వియత్నాం)ను చిత్తు చేసింది. తొలి గేమ్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి పుంజుకున్న ఉన్నతి... హోరాహోరీ పోరులో చక్కటి విజయంతో ఫైనల్ చేరింది. అయితే తుదిపోరులో యువ షట్లర్ అదే జోరు కనబర్చలేక రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో భారత్కు చెందిన మరో యువ షట్లర్ దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. -
టైటిల్తో పునరాగమనం.. సిడ్నీ క్లాసిక్ ఓపెన్లో విజేతగా నిలిచిన భారత స్క్వాష్ స్టార్ సౌరవ్
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్లో ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న 38 ఏళ్ల సౌరవ్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టాడు. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన ఆక్టేన్ ఓపెన్ సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ చాలెంజర్ టోర్నీలో సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ మాజీ పదో ర్యాంకర్ సౌరవ్ 11–2, 11–6, 11–2తో ఈజిప్ట్ దేశానికి చెందిన అబ్దుల్ రెహమాన్ నాసర్పై గెలుపొందాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించిన సౌరవ్... ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో సౌరవ్ 11–9, 5–11, 11–1, 11–2తో రైస్ డౌలింగ్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 11–6, 11–5తో మిన్వూ లీ (దక్షిణ కొరియా)పై, రెండో రౌండ్లో 11–8, 11–2, 11–8తో కిజాన్ (మాల్టా)పై గెలుపొందాడు. రెండో సీడ్గా బరిలోకి దిగిన సౌరవ్కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. 2003లో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో అరంగేట్రం చేసిన సౌరవ్ ఇప్పటి వరకు 11 పీఎస్ఏ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. 18 టోరీ్నలలో రన్నరప్గా నిలిచాడు. -
ఆంద్రీవా అదుర్స్
దుబాయ్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) చరిత్రలో 1000 సిరీస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన పిన్న వయసు్కరాలిగా రష్యా టీనేజ్ స్టార్ మీరా ఆంద్రీవా రికార్డు నెలకొల్పింది. దుబాయ్ టెన్నిస్ చాంపియన్షిప్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా 17 ఏళ్ల మీరా ఆంద్రీవా ఈ ఘనత సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ ఆంద్రీవా 7–6 (7/1), 6–1తో ప్రపంచ 38వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందింది. 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ఆంద్రీవా ఆరు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను రెండు సార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన క్లారా టౌసన్ తుది పోరులో తొలి సెట్లో గట్టిపోటీనిచ్చి ఆ తర్వాత తడబడింది. విజేతగా నిలిచిన ఆంద్రీవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ క్లారా టౌసన్కు 3,51,801 డాలర్ల (రూ. 3 కోట్ల 4 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. దుబాయ్ ఓపెన్ టైటిల్ విజయంతో సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో మీరా ఆంద్రీవా కెరీర్ బెస్ట్9వ ర్యాంక్కు చేరుకుంటుంది. 2007లో నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత టాప్–10లోకి వచ్చిన పిన్న వయసు్కరాలిగా ఆంద్రీవా గుర్తింపు పొందనుంది. దుబాయ్ ఓపెన్ టోర్నీలో ఆంద్రీవా విశేషంగా రాణించింది.టైటిల్ గెలిచే క్రమంలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ మర్కెటా వొంద్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఎలానీ రిబాకినా (కజకిస్తాన్)లపై గెలుపొందింది. 2004 డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో మరియా షరపోవా (రష్యా) తర్వాత ఒకే టోర్నీలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను ఓడించిన ప్లేయర్గా ఆంద్రీవా గుర్తింపు పొందింది. -
జోరు కొనసాగించాలని...
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్పై భారీ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా... సోమవారం తమకంటే మెరుగైన ర్యాంకర్ ఇంగ్లండ్తో మ్యాచ్ ఆడనుంది. భారత అంచె పోటీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత్... తాజా సీజన్లో 6 మ్యాచ్లాడి 4 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 13 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ మూడో ‘ప్లేస్’లో ఉంది. స్పెయిన్, జర్మనీతో మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన భారత జట్టు... ఐర్లాండ్పై మాత్రం సమష్టిగా సత్తా చాటింది. అదే స్ఫూర్తి ఇంగ్లండ్పై కూడా కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, నీలమ్, అభిషేక్, షంషేర్ సింగ్ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. డిఫెన్స్లో భారత్ బలంగా కనిపిస్తోంది. తాజా సీజన్లో ఆరు మ్యాచ్లాడిన టీమిండియా ఇప్పటి వరకు ప్రత్యర్థులకు కేవలం 8 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. తొమ్మిది జట్లలో ఇదే అతి తక్కువ కావడం మన రక్షణ శ్రేణి పటుత్వాన్ని చాటుతోంది. అయితే పెనాల్టీ కార్నర్లను సది్వనియోగ పరుచుకోవడంపై మరింత దృష్టి సారిస్తేనే ఇంగ్లండ్పై విజయం సాధ్యమవుతుంది. నెదర్లాండ్స్ను నిలువరించేనా.. మహిళల ప్రొ లీగ్లో పడుతూ లేస్తూ సాగుతున్న భారత జట్టు... సోమవారం డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత అంచె పొటీలను ఘనవిజయంతో ప్రారంభించిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఆసాంతం అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్లో 6 మ్యాచ్లాడిన మన అమ్మాయిలు 2 విజయాలు, 3 పరాజయాలు, 1‘డ్రా’తో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు.మరోవైపు 15 పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్ రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. గత మ్యాచ్లో జర్మనీపై సాధించిన స్ఫూర్తితో సమష్టిగా సత్తాచాటాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్పై 5–1, 6–0తో విజయాలు సాధించిన నెదర్లాండ్స్ జట్టు టీమిండియాపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రపంచంలోనే అత్యంత పటిష్ట జట్లలో నెదర్లాండ్స్ ఒకటి. వాళ్లతో మ్యాచ్ కఠినమైందని తెలుసు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. జర్మనీపై విజయం ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని భారత సారథి సలీమ చెప్పింది. 2013 నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య 7 మ్యాచ్లు జరగగా... అందులో ఐదింట నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టీమిండియా నెగ్గగా... మరొకటి ‘డ్రా’ అయింది. -
క్రీడల మంత్రి... సైకిల్ సవారీ...
న్యూఢిల్లీ: దేశం నుంచి ఊబకాయాన్ని పారద్రోలాలంటే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ... ‘ఊబకాయంపై అవగాహన అత్యవసరం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు రోజువారీ జీవితంలో వ్యాయామం ఎంతో ముఖ్యం. సైక్లింగ్ అతి సులువైన ఎక్స్ర్సైజ్. దీని వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు... పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ సైక్లింగ్ చేసే వాళ్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు’ అని అన్నారు. ఈ సందర్భంగా మాండవీయ సైకిల్ తొక్కి ప్రజల్లో ఫిట్నెస్పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐసీసీఐ, సీఐఐ ప్రతినిదులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కో రంగానికి చెందిన ఔత్సాహికులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. గతంలో ఆర్మీ అధికారులు, పోస్ట్మెన్లు, వెల్నెస్ నిపుణులు ఇలా పలు రంగాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఒలింపియన్ అర్జున్లాల్ జాట్ మాట్లాడుతూ... ‘ఒక అథ్లెట్గా ప్రజల్లో ఆరోగ్యంపై వస్తున్న అవగాహన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం ఆహ్వానించదగ్గ విషయం. ఫిట్నెస్పై దృష్టి పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది’ అని అన్నారు. మరోవైపు గువాహటిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో భారత మెడికల్ అసోసియేషన్కు చెందిన వందలాది మంది వైద్యులు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఓవరాల్గా దేశంలోని 4,200 కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజే దేశంలో 1200 ప్రాంతాల్లో ఈ ర్యాలీలు జరిగినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి దేశ ప్రజలతో తన మనసులోని మాటలు పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగాగా ఆదివారం నరేంద్ర మోదీ ఒబేసిటీ గురించి ప్రస్తావించారు. ఊబకాయాన్ని పారదోలేందుకు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు. -
జాతీయ కబడ్డీ విజేత సర్వీసెస్
కటక్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో సర్వీసెస్ జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సర్వీసెస్ జట్టు టైబ్రేక్లో 6–4 పాయింట్ల తేడాతో రైల్వేస్పై విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం అయింది. దాంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా సర్వీసెస్ రెండు పాయింట్లతో పైచేయి సాధించింది.ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ నవీన్ కుమార్ సారథ్యంలో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు టోర్నీ ఆసాంతం కనబర్చిన నిలకడనే ఫైనల్లోనూ కొనసాగించింది. పీకేఎల్ 11వ సీజన్ విజేతలైన జైదీప్ దహియా, రాహుల్ సర్వీసెస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సెమీఫైనల్లో సర్వీసెస్ 43–35 పాయింట్ల తేడాతో పంజాబ్పై విజయం సాధించగా... మరో సెమీస్లో రైల్వేస్ 42–34 పాయింట్ల తేడాతో ఉత్తరప్రదేశ్పై గెలుపొందింది. -
Cappelle International Chess Championship: తెలంగాణ గ్రాండ్మాస్టర్కు కాంస్యం
న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాపెల్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిశాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఈ చాంపియన్షిప్లో 7 పాయింట్లు సాధించిన తెలంగాణ స్టార్ ప్లేయర్ మూడో స్థానంలో నిలిచాడు. ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ బోయెర్ మహెల్ పసిడి పతకం సాధించగా... భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ఇనియాన్ పన్నీర్సెల్వం రజత పతకం దక్కించుకున్నాడు. 26 దేశాలకు చెందిన 533 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించాడు. ఆరో సీడ్గా బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ 6 గేమ్లు గెలిచి రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ఒక గేమ్లో ఓటమి పాలయ్యాడు. కాపెల్ అంతర్జాతీయ చెస్ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన రాజా రిత్విక్ను తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి జయచంద్ర ప్రత్యేకంగా అభినందించారు. -
ఆసియా రికార్డు నమోదు చేసిన గుల్వీర్.. ప్రపంచ అథ్లెటిక్స్కు అర్హత
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఇండోర్ రేసులో ఆసియా రికార్డు నెలకొల్పుతూ... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించాడు. అమెరికా బోస్టన్లో జరిగిన ఇండోర్ ఈవెంట్లో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. తద్వారా 5000 మీటర్ల ఇండోర్ రేసును 13 నిమిషాల లోపు పూర్తిచేసిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అర్హత మార్క్ (13 నిమిషాల 1 సెకన్)ను దాటాడు. ‘నా ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా . ఓవరాల్గా టైమింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడుతున్నా. ఈ క్రమంలో ఇండోర్లో ఆసియా రికార్డు టైమింగ్ నమోదు చేయడం గర్వంగా ఉంది. నేరుగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు అర్హత సాధించడంతో సంతృప్తిగా ఉన్నా’ అని గుల్వీర్ పేర్కొన్నాడు. 5000 మీటర్ల ఔట్డోర్ రేసులోనూ జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సెకన్లు) గుల్వీర్ సింగ్ పేరిటే ఉంది. -
Maha Open 2025: జీవన్–విజయ్ జోడీకి టైటిల్
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జీవన్–విజయ్ జంట 3–6, 6–3, 10–0తో రెండో సీడ్ బ్లేక్ బేల్డన్–మాథ్యూ క్రిస్టోఫర్ (ఆ్రస్టేలియా) ద్వయంపై విజయం సాధించింది. జీవన్–విజయ్ జోడీకి సంయుక్తంగా ఇదే తొలి టైటిల్ కాగా... విజయ్ సుందర్ పుణేలో మూడో సారి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో పరాజయం పాలైన భారత జంట ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2 ఏస్లు సంధించిన జీవన్–విజయ్ జోడీ... 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఈ విజయంతో రూ. 7 లక్షల నగదు బహుమతితో పాటు 100 ర్యాంకింగ్స్ పాయింట్లు భారత ప్లేయర్ల ఖాతాలో చేరాయి. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్లో జీవన్ 94వ స్థానానికి, విజయ్ 104వ ర్యాంక్కు చేరనున్నారు. -
భళా భారత్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్గోల్తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు. మ్యాచ్లో భారత్కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. దీపిక గోల్తో భారత్ గెలుపు మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది. -
గోవా ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 12వ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో గోవా జట్టు 2–0 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. గోవా జట్టు తరఫున ఇకెర్ గుర్రొటెనె (46వ నిమిషంలో), మొహమ్మద్ యాసిర్ (73వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. హోయ్్చలో గోవా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై 6 షాట్లు ఆడగా... కేరళ బ్లాస్టర్స్ ఒక్కటేసారి గోల్ పోస్ట్పైకి గురిచూసినా అది లక్ష్యాన్ని చేరలేదు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడిన గోవా జట్టు 12 విజయాలు, 3 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 42 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్ 21 మ్యాచ్ల్లో 7 విజయాలు, 11 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు సాధించి 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు 3–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ తరఫున దిమిత్రోస్ (15వ నిమిషంలో), మహేశ్ సింగ్ (47వ నిమిషంలో), లాల్చుంగుంగా (54వ నిమిషంలో) తలా ఒక గోల్ కొట్టారు. పంజాబ్ తరఫున ఇజెక్వెల్ విడాల్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ జట్టు 24 పాయింట్లతో పట్టిక తొమ్మిదో స్థానంలో ఉండగా... పంజాబ్ అన్నే పాయింట్లతో 11వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహన్ బగాన్తో ఒడిషా ఫుట్బాల్ క్లబ్ తలపడుతుంది. -
National Kabaddi Championship: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లకు నిరాశ
కటక్: డిఫెండింగ్ చాంపియన్ హరియాణా శుక్రవారం మొదలైన సీనియర్ జాతీయ కబడ్డీ చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. తెలుగు రాష్ట్రాల జట్లకు ఓటమి ఎదురవగా... హరియాణాతో పాటు రైల్వేస్, మధ్యప్రదేశ్ జట్లు కూడా భారీ విజయాలతో టోర్నీని ఆరంభించాయి. పూల్ ‘ఎ’లో హరియాణా 50–20 స్కోరుతో తెలంగాణ జట్టును ఓడించింది.పూల్ ‘డి’లో మధ్యప్రదేశ్ 59–35తో ఆంధ్రప్రదేశ్పై ఘనవిజయం సాధించింది. ఇదే పూల్లో జరిగిన మరో మ్యాచ్లో చండీగఢ్ 40–24తో గుజరాత్పై గెలిచింది. పూల్ ‘బి’లో రైల్వేస్ 59–17తో మణిపూర్పై ఏకపక్ష విజయం సాధించగా... పూల్ ‘ఎఫ్’లో ఒడిశా 57–28తో విదర్భపై జయభేరి మోగించింది. పూల్ ‘సి’లో మహారాష్ట్ర 39–35తో కేరళపై పోరాడి గెలిచింది.బరిలో ఉన్న 30 జట్లను ఎనిమిది పూల్స్గా విభజించి ముందుగా ప్రిలిమినరీ మ్యాచ్ల్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో పూల్ నుంచి రెండేసి జట్ల చొప్పున నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. -
‘టాప్స్’ జాబితా నుంచి వినేశ్, బజరంగ్ అవుట్
న్యూఢిల్లీ: మెగా ఈవెంట్స్లో పతక విజేతల్ని తయారు చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) జాబితాను కేంద్ర క్రీడా శాఖ కుదించింది. గతంలో 179 మందికి ‘టాప్స్’ కింద ఆర్థిక అండదండలు అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 94 మందికే చేయూత ఇవ్వనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందిన క్రీడాకారుల ప్రదర్శనను సమీక్షించిన క్రీడాశాఖ దాదాపు సగం మందికి కోత పెట్టింది. ఈ 94 మంది జాబితాలో 42 మంది రెగ్యులర్ అథ్లెట్లు కాగా... 52 మంది పారా అథ్లెట్లున్నారు. పారిస్ పారాలింపిక్స్లో విశేష ప్రతిభ కనబరిచిన పారా అథ్లెట్లు 7 స్వర్ణాలు సహా 29 పతకాలు సాధించారు. దీంతో క్రీడాశాఖ దివ్యాంగ అథ్లెట్లకు ‘టాప్స్’లో పెద్దపీట వేసింది. గతంలో 78 మందితో ఉన్న రెగ్యులర్ అథ్లెట్లలో చాలా మందిని తప్పించింది.గోల్ఫ్, స్విమ్మింగ్, టెన్నిస్లలో ఏ ఒక్కరికి ‘టాప్స్’లో చోటు దక్కలేదు. మేటి రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలను ‘టాప్స్’ నుంచి తప్పించారు. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్న వినేశ్ రాజకీయాల్లోకి వచ్చి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచింది. డోప్ టెస్టులకు గైర్హాజరు అయ్యాడనే కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బజరంగ్పై నాలుగేళ్లు నిషేధం విధించింది. క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా పారదర్శకంగా ఈ జాబితాను రూపొందించామని, కేవలం ప్రతిభే ప్రామాణికంగా తీసుకున్నామని దీనిపై టాప్స్ సీఈఓ ఎన్.ఎస్. జోహల్ వివరణ ఇచ్చారు.అథ్లెటిక్స్లో నిరాశజనక ప్రదర్శన వల్ల 30 మంది కాగా ఇప్పుడు ముగ్గురితో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. చాంపియన్ జావెలిన్ త్రోయర్, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, స్టీపుల్చేజర్ అవినాశ్ సాబ్లే, లాంగ్ జంపర్ శ్రీశంకర్లకు మాత్రమే ‘టాప్స్’లో చోటు దక్కింది. తెలంగాణ రైజింగ్ స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గొహైన్లు ఇద్దరూ మహిళా బాక్సర్లకే ‘టాప్స్’ లబ్ధి చేకూరనుంది. గతంలో 8 మంది బాక్సర్లుండగా కేవలం ఇద్దరే ఇద్దరికి చోటు దక్కింది. షట్లర్లలో కిడాంబి శ్రీకాంత్కు, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పలను పక్కన బెట్టిన క్రీడాశాఖ... సింధు, ప్రణయ్, లక్ష్యసేన్, డబుల్స్ అగ్రశ్రేణి జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలను జాబితాలో కొనసాగించింది. -
డోపింగ్లో దొరికిన మారథాన్ విజేత
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్పై చర్యలు చేపట్టింది. గతనెల భారత్కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు. -
సెలక్షన్స్పై ‘వీడియో’ కన్ను
న్యూఢిల్లీ: క్రీడాకారులు, జట్ల సెలక్షన్ ట్రయల్స్పై పదేపదే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఇక మీదట జరిగే ఎంపిక ప్రక్రియనంతా వీడియో రూపంలో తీయనుంది. తద్వారా అర్హులైన ప్రతిభావంతులకే బెర్త్లు లభించేలా చూడనుంది. ప్రతి ఒక్కరి సెలక్షన్ ప్రదర్శన వీడియోలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి విమర్శలకు తావుండదు. ‘ఇకపై అన్ని సెలక్షన్ ట్రయల్స్పై వీడియో నిఘా పెడతాం.పారదర్శకత, న్యాయబద్ధమైన ఎంపికలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ప్రదర్శనే ఎంపికకు గీటురాయి అవుతుంది. మెరిట్ కనబరిచిన వారే భారత జట్లకు ఎంపికవుతారు. ఇందులో క్రీడా సమాఖ్యలు ఇష్టారీతిన వ్యహరించేందుకు వీలుండదు. క్రీడా శాఖ అధికారులు, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పర్యవేక్షకులుగా హాజరవుతారు. ఇకపై ప్రతీ క్రీడాంశంలో దీన్ని అమలు చేస్తాం’ అని క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. షూటింగ్, రెజ్లింగ్లలో జరిగే సెలక్షన్ ట్రయల్స్ ప్రతీసారి విమర్శలపాలవుతోంది. రెజ్లింగ్ సమాఖ్య అయితే పతకాల కంటే కూడా ఈ తరహా వివాదాలు, విమర్శలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాల వల్ల అర్హత ఉండి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ సీజన్లో తొలి రెండు ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లకు భారత రెజ్లర్లు దూరమయ్యారు. దీనిపై క్రీడాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ శాఖ గుర్తింపు ఉన్న జాతీయ సమాఖ్యలకు ఢిల్లీలోని స్టేడియాల్లో ఆఫీస్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల ఢిల్లీకి వచ్చిన లేదంటే ఢిల్లీ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు బయలుదేరే ఆటగాళ్లకు ఆయా సమాఖ్యలు సమన్వయంతో సేవలందించేందుకు వీలవుతుంది. గతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సమాఖ్యల కార్యాలయాలు ఉండేవి. కానీ 2010 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కోసం ఆ స్టేడియాన్ని నవీకరించడంతో సమాఖ్యల ఆఫీసుల్ని అక్కడి నుంచి తరలించారు. -
భారత్లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు!
న్యూఢిల్లీ: భారత్లో రెండోసారి కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. 2030లో జరిగే పోటీల కోసం బిడ్ వేయాలని యోచిస్తోందని క్రీడా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. క్రీడలను నిర్వహించడంతో పాటు 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి తొలగించిన క్రీడాంశాలను కూడా మళ్లీ చేర్చే ఆలోచనలో భారత్ ఉంది. 2030 క్రీడల నిర్వహణకు ‘ఆసక్తిని ప్రదర్శించే’ ప్రక్రియకు మార్చి 31 చివరి తేదీ కాగా... ఈ దిశగానే ప్రయత్నం మొదలైనట్లు అధికారి చెప్పారు. ‘కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులతో చర్చలు జరిగాయి. 2030లో మేం నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా చెప్పాం. 2026లో తొలగించిన అన్ని క్రీడాంశాలను 2030లో చేర్చే విధంగా చూడాలని కూడా చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. 2026లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహక కమిటీ కేవలం 10 క్రీడాంశాలకే పోటీలను పరిమితం చేసింది. ఈ క్రమంలో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్, క్రికెట్లను పోటీల నుంచి తొలగించారు. ఇవే క్రీడాంశాల్లో భారత్కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉండేది. కమిటీ నిర్ణయం కారణంగా భారత్కు పెద్ద సంఖ్యలో పతకాలు వచ్చే అవకాశం ఉన్న ఆటలన్నీ క్రీడల్లో లేకుండాపోయాయి. గతంలో ఇదే తరహాలో 2022 బర్మింగ్హామ్ క్రీడల నుంచి కూడా ఆర్చరీ, షూటింగ్లను తొలగించిన తర్వాత వాటిని మళ్లీ చేర్చాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. దీనికి సానుకూల స్పందన వచ్చినా కోవిడ్ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అయితే వన్నె తగ్గిన కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే విషయంలో ఆర్థికభారం కారణంగా పలు పెద్ద దేశాలు కూడా వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో భారత్ ముందుకు వెళ్లడం ఆశ్చర్యకర పరిణామం! 2026కు ముందుగా ఆ్రస్టేలియాలోని విక్టోరియా వేదిక కాగా... 2023 జూలైలో ఆ దేశం అనూహ్యంగా తప్పుకుంది. నిర్వాహక కమిటీ మలేసియా దేశానికి ఆఫర్ ఇచ్చినా అదీ అంగీకరించలేదు. చివరకు తక్కువ బడ్జెట్తో, అదీ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆరి్థక సహకారంతో గ్లాస్గో ముందుకు వచి్చంది. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 23వ కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. మరోవైపు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపిస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి లేఖ పంపించింది. వచ్చే మార్చి తర్వాత దీని పురోగతిపై స్పష్టత రావచ్చు. -
ఐర్లాండ్పై భారత్ విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు మరో విజయం లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (22వ నిమిషంలో), జర్మన్ప్రీత్ సింగ్ (45వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఐర్లాండ్ జట్టుకు జెరెమీ డంకన్ (8వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. మరోవైపు జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 0–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. -
అంగరంగ వైభవంగా...
లండన్: ఫార్ములావన్ 75వ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అలరించే రేసర్లు... ఈ ఈవెంట్లో ‘రెడ్ కార్పెట్’పై అభిమానులకు చేతులుపుతూ దర్శనమిచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 సీజన్లో పోటీపడే 20 మంది డ్రైవర్లు తమ కార్లతో పాటు పాల్గొన్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... స్టేజి మీదకు వచ్చిన సమయంలో ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. సుదీర్ఘ ఎఫ్1 చరిత్రలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి కాగా... ఇందులో భాగంగా బ్రిటన్ సింగర్ కేన్ బ్రౌన్ మ్యూజిక్ షో ఆహుతులను కట్టిపడేసింది. కనీవినీ ఎరగని రీతిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగిన ఈ కార్యక్రమంలో... పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. ఫార్ములావన్ను మరింత విస్తరించడంలో భాగంగానే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ వేడుకు నిర్వహించారు. దీనిపై హామిల్టన్ స్పందిస్తూ... ‘చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త సీజన్లో మరింత వేగంగా దూసుకెళ్లాలని చూస్తున్నా. అందుకు కావాల్సిన శక్తి ఉంది. కొత్త జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్తేజంతో ముందుకు సాగుతా’ అని అన్నాడు. 24 రేసులతో కూడిన 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్బోర్న్లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రితో మొదలవుతుంది. -
యూకీ జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న (భారత్)–నునో బోరెజెస్ (పోర్చుగల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది. ప్రపంచ నంబర్వన్ జంట మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మాట్ పావిక్ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–డోడిగ్ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–డోడిగ్ ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో యూకీ–డోడిగ్ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–బోర్జెస్ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి పాలయ్యారు. -
భారత్ శుభారంభం
షార్జా: ‘పింక్ లేడీస్ కప్–2025’లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి పోరులో స్వీటీ దేవీ సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో జోర్డాన్పై విజయం సాధించింది. భారత్ తరఫున ప్రియాంక దేవి (23వ నిమిషంలో), మనీషా (54వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కనబర్చింది. తొలి అర్ధభాగంలో వచ్చిన అవకాశాన్ని ప్రియాంక దేవి సద్వినియోగ పర్చుకుంటూ... జోర్డాన్ గోల్ కీపర్ను బోల్తా కొట్టించి భారత్ ఖాతా తెరిచింది. కాసేపటికే స్కోరు పెంచే అవకాశం వచ్చినా... దాన్ని మనీషా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ద్వితీయార్థంలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా మనీషా గోల్ కొట్టి జట్టుకు విజయం ఖాయం చేసింది.క్రిస్పిన్ ఛెత్రి భారత మహిళల కోచ్గా ఎంపికైన అనంతరం మన జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. జోర్డాన్ పదే పదే ప్రతి దాడులకు ప్రయత్నించినా... స్వీటీ దేవి, పుర్ణిమ కస్తూరితో కూడిన రక్షణ శ్రేణి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తెలంగాణ అమ్మాయి గుగులోతు సౌమ్య ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత యంగ్ప్లేయర్ లిషమ్ బబీనా దేవి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. తదుపరి పోరులో ఆదివారం రష్యాతో భారత్ తలపడుతుంది. -
పంకజ్... అదే జోరు
దోహా: భారత క్యూస్పోర్ట్స్ దిగ్గజం cమరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గురు వారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్షిప్ లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 4–1 (42–72, 93–17, 93–1, 89–21, 70–41) ఫ్రేమ్ల తేడాతో ఇరాన్కు చెందిన మాజీ ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్ అమిర్ సర్ఖోష్ పై గెలుపొందాడు. అతని ఖాతాలో ఇది 14వ ఆసియా టైటిల్ కావడం విశేషం. ఇదివరకే అతను స్నూకర్లో నాలుగు, cతొమ్మిది టైటిల్స్ గెలిచాడు. వీటితో పాటు 2006, 2020లలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచాడు. తాజా ఆసియా టైటిల్తో ఓ క్యాలెండర్ ఇయర్లో జాతీయ, ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లు గెలిచిన ఆటగాడిగా ఘనత వహించనున్నాడు. బిలియర్డ్స్లో ఇదివరకే ఈ రికార్డు లిఖించిన పంకజ్ స్నూకర్లో లిఖించాల్సి ఉంది. ఇదే జరిగితే క్యూస్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లోనే ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. ‘ఆసియా పతకం నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. చివరకు మరో బంగారు పతకాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. ఇదే నిలకడైన ప్రదర్శనతో భారత్ గర్వించే విజయాలు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నాను’ అని మ్యాచ్ విజయానంతరం పంకజ్ అద్వానీ అన్నాడు. -
సాత్విక్ సాయిరాజ్కు పితృవియోగం
సాక్షి, అమలాపురం: ఇది విధి రాసిన విషాదవార్త! తనయుడి అవార్డుని చూసి మురిసిపోదామనుకుంటే... తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి! ‘ఖేల్రత్న’తో విజయోత్సవ వేడుకలు చేసుకోవాల్సిన ఇంట విషాదం అలుముకున్న దుస్థితి! ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం గురువారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయనకు భార్య రంగమణి, ఇద్దరు కుమారులు రాంచరణ్, సాత్విక్ ఉన్నారు. 65 ఏళ్ల కాశీ విశ్వనాథం గురువారం సాయంత్రం దేశ రాజధానిలో తనయుడు సా త్విక్కు ‘ఖేల్రత్న’ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం సొంతూరు అమలాపురం నుంచి కారులో రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరిన ఆయన పట్టణం దాటిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందారు. ఊహించని విషాద వార్త అక్కడి కుటుంబసభ్యుల్ని, ఢిల్లీలో ఉన్న సా త్విక్ సాయిరాజ్ను కన్నీటి సంద్రంలో ముంచేసింది. అమెరికాలో ఉన్న సాత్విక్ సోదరుడు రాంచరణ్ స్వస్థలం చేరుకున్నాక శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచిన సాత్విక్కు తొలి కోచ్గా ఓనమాలు నేరి్పన తండ్రి తదనంతరం అతని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ షట్లర్గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. డబుల్స్లో అసాధారణ ప్లేయర్గా ఎదిగిన సాత్విక్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంతర్జాతీయ టోర్నీల్లో, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. అనతికాలంలోనే ఎన్నో పతకాలు, ట్రోఫీలు నెగ్గిన సా త్విక్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సా త్విక్తోపాటు అతని డబుల్స్ భాగస్వామి చిరాగ్ శెట్టిని 2023 సంవత్సరానికిగాను ‘ఖేల్రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది.2024 జనవరిలో ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా... సా త్విక్–చిరాగ్ మలేసియా ఓపెన్ టోర్నీ లో ఆడుతుండటంతో హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్ ఇంటర్ యూనిట్ టోర్నీ ఆడేందుకు సాత్విక్, చిరాగ్ ఢిల్లీలో ఉన్నారు. దాంతో కేంద్ర క్రీడా శాఖ ‘ఖేల్రత్న’ అందజేయాలని భావించి కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
దీప్తి జివాంజికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు స్వర్ణ పతకం లభించింది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి, అంతర్జాతీయ పారాథ్లెట్ జివాంజి దీప్తి 400 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. దీప్తి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 57.82 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన పూజా 1:08.21 సెకెన్లలో గమ్యాన్ని చేరుకుని రజతం సొంతం చేసుకోగా.. హర్యానాకే చెందిన భువి అగర్వాల్ కాంస్యం దక్కించుకుంది. ఇటీవల ‘అర్జున అవార్డు’ పొందిన దీప్తి గచ్చిబౌలి స్టేడియంలో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. మూడు పతకాలుతెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన కొర్ర అఖిల, నేనావత్ విజయలక్ష్మి... హైదరాబాద్ అథ్లెట్ ఇస్లావత్ నితిన్ నాయక్ మెరిశారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో బుధవారం జరిగిన ఈ మీట్లో నితిన్ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అఖిల జావెలిన్ త్రోలో పసిడి పతకం, డిస్కస్ త్రోలో రజత పతకం... విజయలక్ష్మి 400 మీటర్ల విభాగంలో స్వర్ణం, జావెలిన్ త్రోలో రజత పతకం గెలిచారు. ఈ ముగ్గురు హయత్నగర్లోని అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్లో కోచ్ నేనావత్ వినోద్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు ఐదో విజయంజైపూర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్సీ జట్టును ఓడించింది. 10 మ్యాచ్ల తర్వాత రాజస్తాన్ జట్టుకిది తొలి ఓటమి కావడం గమనార్హం. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలియన్ (43వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మైకోల్ కబ్రెరా (75వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఈనెల 25న జరిగే తదుపరి మ్యాచ్లో డెంపో స్పోర్ట్స్ క్లబ్తో శ్రీనిధి జట్టు తలపడుతుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో 15 మ్యాచ్లు పూర్తి చేసుకున్న శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్షిప్లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా జిమ్లో ఆమె కోచ్తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్లిఫ్టింగ్లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్నకు పంజాబ్లో గల జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
జగజ్జేత జర్మనీకి భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన రెండో రౌండ్ రెండో మ్యాచ్లో టీమిండియా 1–0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలో గుర్జంత్ సింగ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది.మంగళవారం జర్మనీతో జరిగిన రెండో రౌండ్ తొలి మ్యాచ్లో భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. స్పెయిన్ జట్టుతో జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0–1తో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున సెగూ మార్టా (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. -
జొకోవిచ్కు చుక్కెదురు
దోహా: కెరీర్లో 100వ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో మూడో సీడ్గా పోటీపడ్డ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ మాజీ ఆరో ర్యాంకర్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో 37 ఏళ్ల జొకోవిచ్ 6–7 (4/7), 2–6తో ఓడిపోయాడు.గతంలో జొకోవిచ్తో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన బెరెటిని ఐదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 9 ఏస్లు... బెరెటిని 13 ఏస్లు సంధించారు. బెరెటిని సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసేందుకు వచి్చన అవకాశాలను జోకోవిచ్ చేజార్చుకోగా... బెరెటిని తన ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
బోపన్న జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–నునో బోర్జెస్ (పోర్చుగల్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–బోర్జెస్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో రెండో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జంటను బోల్తా కొట్టించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న ద్వయం ఏడు ఏస్లు సంధించింది. మ్యాచ్ మొత్తంలో రెండు జంటలు తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్లు అనివార్యమయ్యాయి. టైబ్రేక్లో బోపన్న–బోర్జెస్ పైచేయి సాధించి విజయాన్ని అందుకోవడంతోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. -
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్ -
నేను రాజీనామా చేయలేదు
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. పదవీకాలం ముగిసేవరకు బాధ్యతలు కొనసాగిస్తానని చెప్పింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆమె 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. 42 ఏళ్ల ఈ మణిపురి స్టార్ బాక్సర్ ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె అథ్లెట్స్ కమిషన్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. కానీ మేరీ మాత్రం తన వాట్సాప్ గ్రూప్ సంభాషణను తప్పుగా అన్వయిస్తూ మీడియాకు లీక్ చేశారని, రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం చేశారని పేర్కొంది. ‘నేను అథ్లెట్స్ కమిషన్కు రాజీనామా చేయనేలేదు. 2026లో పూర్తయ్యే పదవీకాలం వరకు చైర్పర్సన్గా కొనసాగుతాను. ఆ రోజు నేను కమిషన్ సభ్యులతో అన్నది వేరు... నెట్టింట ప్రచారమైంది వేరు. అథ్లెట్స్ కమిషన్ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించాను. తనతో ప్రవర్తించే తీరు ఇలాగే కొనసాగితే రాజీనామాకు సైతం వెనుకాడనని చెప్పాను. కానీ రాజీనామా చేశానని చెప్పనే లేదు. నేను రాజీనామా చేశానంటున్నారు కదా! మరి రాజీనామా లేఖ ఏది? ఎవరైనా చూశారా? అని ప్రశ్నించింది. ఐఓఏ తన కుటుంబమని... దీంతో ఎప్పుడు విబేధించనని... ఇంతటితో వాట్సాప్ సంభాషణ వివాదానికి ముగింపు పలుకుతున్నానని చెప్పారు. 2022లో ఐఓఏ అథ్లెట్స్ కమిషన్కు మేరీకోమ్ చైర్పర్సన్గా ఎన్నికైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ అచంట శరత్ కమల్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా ఈ కమిషన్లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు, మాజీ షాట్పుటర్ ఓం ప్రకాశ్ కర్హాన, ఒలింపియన్ శివ కేశవన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ (షూటర్), రోయర్ బజరంగ్ లాల్, ఫెన్సింగ్ ప్లేయర్ భవానీ దేవి, భారత మహిళల హాకీ మాజీ కెపె్టన్ రాణి రాంపాల్, టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సభ్యులుగా ఉన్నారు. -
‘నమ్మకం కోల్పోయాం’
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు. నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్ క్రీడ ఇమేజ్ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్ డోపింగ్ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు. వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్ అన్నాడు. ‘సినెర్–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్లాగే రెండు నమూనాల్లో పాజిటివ్గా తేలిన స్పానిష్ మహిళా ఫిగర్ స్కేటర్ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. ‘వాడా’ వివరణ ఇది... మాడ్రిడ్: డోపింగ్లో దొరికిన టెన్నిస్ స్టార్ సినెర్కు, స్పెయిన్ స్కేటర్ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది. ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్ లేదంటే మసాజ్కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
ఒలింపిక్స్కు ముందు ‘కామన్వెల్త్’ నిర్వహించండి.. భారత్కు సీజీఎఫ్ చీఫ్ సూచన
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఇటీవల తరచూ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం తహతహలాడుతోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే భారత్ లక్ష్యం విశ్వక్రీడలైతే ముందుగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తే ఇది మెగా ఈవెంట్కు ముందు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) సీఈఓ కేటీ సాడ్లియెర్ సూచించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏ దేశానికైనా ఒలింపిక్స్ ఆతిథ్యమనేది గొప్ప కీర్తిని తెస్తుంది. అయితే అలాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కామన్వెల్త్ క్రీడలు (2030) నిర్వహిస్తే మేటి అంతర్జాతీయ ఈవెంట్కు సరైన సన్నాహకంగా, చక్కని ముందడుగుగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ టాప్–10లో నిలుస్తుందని ఆమె చెప్పారు. ‘భారత్ దశ, దిశ ఇప్పుడు మారుతోంది. సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పన, ప్రామాణిక శిక్షణతో క్రీడల భవిష్యత్ మారబోతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రదర్శన, పతకాలనేవి ఆ దేశ ప్రతిష్టను కచ్చితంగా పెంచుతాయి. తప్పకుండా భారత్ క్రీడాశక్తిగా ఎదుగుతుంది’ అని కేటీ సాడ్లియెర్ తెలిపారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం భారత్ ఒకే ఒక్కసారి 2010లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
20 ఏళ్ల తర్వాత ఆల్ స్టార్ ఎన్బీఏ మ్యాచ్కు దూరమైన లెబ్రాన్ జేమ్స్
శాన్ఫ్రాన్సిస్కో: విఖ్యాత నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ ఆల్ స్టార్ మ్యాచ్కు అమెరికా దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ తొలిసారి దూరమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత లెబ్రాన్ జేమ్స్ లేకుండా ఆల్ స్టార్ మ్యాచ్ జరగడం గమనార్హం. 2005 నుంచి ప్రతి సీజన్లో ఆల్ స్టార్ మ్యాచ్లలో ఆడిన 40 ఏళ్ల లెబ్రాన్ ఈసారి చీలమండ గాయంతో ఆడలేకపోయాడు. రెగ్యులర్ సీజన్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ఆడే లెబ్రాన్ ఆల్ స్టార్ మ్యాచ్లలో ఈసారి షకిల్లా ఓనీల్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సింది. 2005లో తొలిసారి ఆల్ స్టార్ మ్యాచ్లో ఆడిన లెబ్రాన్ వరుసగా 20 ఏళ్లపాటు ఈ మేటి మ్యాచ్లలో భాగస్వామిగా ఉన్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 113 కేజీల బరువున్న లెబ్రాన్ ఇప్పటి వరకు ఎన్బీఏ లీగ్లో 1,540 మ్యాచ్లు ఆడి అత్యధికంగా 41,641 పాయింట్లు స్కోరు చేశాడు. -
భారత ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ప్లేయర్
న్యూఢిల్లీ: నాలుగు దేశాలు పాల్గొనే పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య చోటు సంపాదించింది. ఈనెల 7 నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న భారత జట్టు నేడు యూఏఈకి బయలుదేరి వెళుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఈనెల 20న జోర్డాన్తో... రెండో మ్యాచ్ను 23న రష్యాతో... మూడో మ్యాచ్ 26న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది మే–జూన్లలో జరిగే ఆసియా కప్–2027 క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా పింక్ లేడీస్ కప్లో భారత జట్టు బరిలోకి దిగుతోంది.‘పింక్ లేడీస్ కప్ టోర్నీ ద్వారా భారత క్రీడాకారిణులకు తమ సామర్థ్యమేంటో తెలుస్తుంది. రష్యాతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు జట్ల వీడియోలు పరిశీలించాను. రష్యా శైలితో పోలిస్తే కొరియా ఆటలో చాలా వేగం ఉంది. ఫలితంగా భారత జట్టు రెండు రకాలుగా వ్యూహాలు రచించి ఆడాల్సి ఉంటుంది’ అని భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి తెలిపాడు. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, పాయల్ బసుదె, శ్రేయా హుడా (గోల్కీపర్లు), అరుణ బాగ్, కిరన్ పిస్దా, మార్టినా థోక్చోమ్, నిర్మలా దేవి ఫాన్జుబమ్, పూరి్ణమ కుమారి, సంజు, సిల్కీ దేవి హెమమ్, స్వీటీ దేవి ఎన్గాంగ్బమ్ (డిఫెండర్లు), బబీనా దేవి లిషామ్, గ్రేస్ డాంగ్మె, మౌసుమి ముర్ము, ప్రియదర్శిని సెల్లాదురై, ప్రియాంక దేవి నోరెమ్, రత్నబాల దేవి నోంగ్మైథెమ్ (మిడ్ ఫీల్డర్లు), కరిష్మా పురుషోత్తమ్, లిండా కోమ్ సెర్టో, మనీషా, రేణు, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
రామ్కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రామ్కుమార్ తొమ్మిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో కిమర్ కాప్జాన్స్ (బెల్జియం)తో రామ్కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్ను ఖరారు చేసింది. -
అనిసిమోవా అదరహో
దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్లో భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్స్లామ్ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్ ఓపెన్లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్గా నిలిచింది. దోహాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్ తర్వాత ఖతర్ ఓపెన్లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్గా అనిసిమోవా గుర్తింపు పొందింది. ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ను అందుకుంటుంది. ఓవరాల్గా అనిసిమోవా కెరీర్లో ఇది మూడో సింగిల్స్ టైటిల్. 2019లో బొగోటా ఓపెన్లో, 2022లో మెల్బోర్న్ ఓపెన్లో ఆమె టైటిల్స్ సాధించింది. -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్కు ఓటమి ఖరారైంది. -
జాతీయ రికార్డు బద్దలు కొట్టిన యువ అథ్లెట్
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) బోస్టన్లో జరిగిన ఇన్విటేషనల్ టోర్నీలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. 3000 మీటర్ల ఇండోర్ రేసులో గుల్వీర్ సింగ్ 7 నిమిషాల 38.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తద్వారా 16 ఏళ్ల క్రితం సురేందర్ సింగ్ (7:49.47) నెలకొల్పిన రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల 10,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... సీజన్ ఆరంభంలోనే రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.‘సీజన్ తొలి ఇండోర్ టోర్నీలోనే మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ స్ఫూర్తితో ఔట్ డోర్ ఈవెంట్లలోనూ సత్తా చాటుతా’ అని 26 ఏళ్ల గుల్వీర్ పేర్కొన్నాడు.ఇదే టోర్నీలో పాల్గొన్న భారత మరో రన్నర్ రాహుల్ 8 నిమిషాల 8.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ప్రస్తుతం గుల్వీర్ పేరిటే 5000 మీటర్లు, 10,000 మీటర్ల జాతీయ రికార్డులు ఉన్నాయి. 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్... 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 14.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో భారత మిడిల్, లాంగ్ డిస్టాన్స్ రన్నర్లు ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. -
జాతీయ కోచ్గా భారత దిగ్గజ షూటర్
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా తిరిగి కోచ్గా జాతీయ షూటింగ్ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ).. జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్’ కోచ్గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేసింది.జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్ కప్ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్ చాంపియన్íÙప్ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ శిక్షణ ఇవ్వనున్నాడు.రైఫిల్ విభాగానికి హెడ్ కోచ్గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్ఆర్ఏఐ 16 మంది కొత్త కోచ్లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.పిస్టల్ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్కు అమరిందర్ చీమ, ట్రాప్కు వర్ష తోమర్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్లుగా మాన్షేర్ సింగ్, రోనక్ పండిట్ను ఎన్ఆర్ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్ చండేల్ (ఎయిర్ రైఫిల్), అన్వర్ సుల్తాన్ (ట్రాప్), మనోజ్ కుమార్ (50 మీటర్ల రైఫిల్) హై పెర్ఫార్మెన్స్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. -
ఎట్టకేలకు సినెర్పై నిషేధం
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చినట్లయ్యింది. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ కేసుకు ఎట్టకేలకు నిషేధంతో తెర పడనుంది. మూడు గ్రాండ్స్లామ్ల విజేత, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్వన్ సినెర్ గత మార్చిలో డోపింగ్లో పట్టుబడ్డాడు.అతని నమూనాల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... ఈ టాప్ ర్యాంకర్పై అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మెతక వైఖరి అవలంభించింది. అతని టెస్టు ఫలితాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత బయటికి పొక్కినా కూడా 23 ఏళ్ల సినెర్ తను ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదని, బహుశా మసాజ్కు వాడిన తైలం వల్లా తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే వివరణతో ఐటీఐఏ సంతృప్తి చెంది పెద్దగా చర్యలేం తీసుకోలేదు. దీంతో టెన్నిస్ ఇంటిగ్రిటీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు దిగ్గజాలు, స్టార్లు, విశ్లేషకులు ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చట్టాలు–చర్యలా’ అంటు దుమ్మెత్తిపోశారు. అయినా ఐటీఐఏ నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. ‘వాడా’ మాత్రం పరీక్షల్లో పట్టుబడ్డాడు కాబట్టి ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. చివరకు తాజాగా ఐటీఐఏ, సినెర్, వాడాల మధ్య ఒప్పందం కుదరడంతో వాడా ఇటీవల అప్పీల్ను ఉపసంహరించుకుంది. ఒప్పందంలో భాగంగా మూడు నెలలు నిషేధం విధించేందుకు ఐటీఐఏ సిద్ధమవగా... సినెర్ కూడా విమర్శలకు చెక్ పెట్టేందుకు సమ్మతించడంతో డోపింగ్ వివాదం ముగిసింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4 వరకు ఈ నిషేధం అమలవుతుంది. ఈ కాలంలో అతను ఏ స్థాయి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు. అయితే మే 25 నుంచి జరిగే సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను బరిలోకి దిగుతాడు. ఇదేం సస్పెన్షన్? సినెర్కు విధించిన మూడు నెలల శిక్ష పట్ల టెన్నిస్లో పలువురు ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో విమర్శించిన తరహాలోనే సినెర్ చాలా తక్కువ శిక్షతో బయటపడ్డాడని... టెన్నిస్లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన నిబంధన ఉందని వారు వ్యాఖ్యానించారు. ‘సినెర్ సన్నిహితులు తమ పరపతిని బాగా ఉపయోగించినట్లుంది. కేవలం మూడు నెలల నిషేధంతో సరిపెట్టేలా చేసుకోగలిగారు. ఒక్క టైటిల్ వెనక్కి తీసుకోలేదు. కనీసం ప్రైజ్మనీలో కూడా కోత విధించలేదు. మరి అతను తప్పు చేసినట్లా, చేయనట్లా. టెన్నిస్కు దురదృష్టకరమైన రోజు. ఇక్కడ నిజాయితీ మిగల్లేదు’ అని కిరియోస్ అన్నాడు. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన స్టాన్ వావ్రింకా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెన్నిస్ ఇక ఏమాత్రం స్వచ్ఛమైన ఆట కానే కాదు’ అని చెప్పాడు. టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ‘ఇక్కడి వ్యవస్థ నిజంగా చెడిపోయింది. ఇది ఒక క్లబ్లా మాత్రమే వ్యవహరిస్తోంది. ఒక్కో కేసుకు ఒక్కో రకంగా స్పందిస్తోంది. అన్నింటా అసమానతలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత, పద్ధతి లేవు. ఇది ఆటగాళ్లను అగౌరవపర్చడమే. ఇకపై మార్పు అవసరం’ అని స్పందించింది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్గోల్తో నవ్నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్తో తొలి క్వార్టర్లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో మరోసారి ఇంగ్లండ్తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
గుకేశ్కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయాడు. -
చెన్నైయిన్ విజయం
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి. అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్తో విజయం సాధించింది. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్పై గెలుపొందింది. జేమీ మెక్లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. -
రన్నరప్ నికీ పునాచా జోడీ
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ 75 టోర్నీ ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాడు నికీ పునాచా రన్నరప్గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్గా బరిలోకి దిగిన నికీ పునాచా–కోర్ట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో అన్సీడెడ్ మసమిచి ఇమామురా–రియో నొగుచి (జపాన్) ద్వయం 6–4, 6–3తో నికీ–జాన్ లాక్ జోడీపై విజయం సాధించింది. తొలి సెట్ ఆరంభం నుంచే విజృంభించిన జపాన్ జోడీ... 4–1తో ముందంజ వేసింది. ఈ దశలో పుంజుకున్న పునాచా జంట 3–4తో ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే తప్ప... చివరి వరకు అదే జోరు కొనసాగించలేక తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్లోనూ రాణించిన జపాన్ ద్వయం సునాయాసంగా సెట్తో పాటు టైటిల్ గెలుచుకుంది.మరో వైపు సింగిల్స్ విభాగంలో కైరియాన్ జాక్వెట్ (ఫ్రాన్స్), బిల్లీ హారిస్ (బ్రిటన్) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్లో జాక్వెట్ 6–3, 6–1తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై...రెండో సెమీస్లో హారిస్ 4–6, 7–6 (7/4), 6–2తో ట్రిస్టన్ స్కూల్కేట్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. -
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.సమాఖ్య నిర్వాకం వల్లే‘డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్షిప్పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
ఇంగ్లండ్తో భారత మహిళల తొలి పోరు
మరోవైపు మహిళల ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా నేడు జరగనున్న తొలి పోరులో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. ఆదివారం రెండో మ్యాచ్లోనూ ఇంగ్లండ్తో ఆడుతుంది. ఫలితాలతో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని భారత మహిళల హాకీ జట్టు సారథి సలీమా టెటె పేర్కొంది. మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందిన సలీమా వెల్లడించింది. ఈ నెల 18, 19న స్పెయిన్తో... 21, 22న జర్మనీతో... 24, 25న నెదర్లాండ్స్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ‘మా ఆటపైనే ప్రధానంగా దృష్టి పెడతాం. పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రొ లీగ్ మ్యాచ్లు ఆడనున్నారు. గెలుపోటములు ఆటలో భా గం. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. హరేంద్ర సింగ్ చీఫ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి గేమ్ప్లాన్ మెరుగైంది. ప్లేయర్ల మధ్య అనుబంధం కూడా పెరిగింది. అదే మైదానంలో ప్రస్ఫుటమవుతోంది’ అని సలీమా వెల్లడించింది.