Andhra Pradesh
-
‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారికి చెంపపెట్టు లాంటిది’
తాడేపల్లి : మార్గదర్శి బాధితులకు న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈనాడు కిరణ్కు చెంపపెట్టులాంటిదన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. మార్గదర్శి బాదితులకు న్యాయం జరగాలని సుప్రీం ఇచ్చిన తీర్పు అద్భుతమైనదన్నారు. రామోజీరావు చనిపోయినందున కేసు కొట్టేయాలంటూ కిరణ్ కోర్టును అడగటం సిగ్గుచేటన్నారు. ‘రూ.600 కోట్లు ప్రజల నుండి అక్రమంగా డిపాజిట్టు తీసుకున్నారు. ఆ డబ్బంతా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ లాంటి వాడినే మానసికంగా చంపేశారు. మద్యపాన నిషేధాన్ని తనకు అవసరమైనట్టుగా వాడుకున్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలనే బెదిరించారు. మార్గదర్శి ద్వారా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో ఇష్టానుసారం చేశారు. తనకు నచ్చని నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. అలాంటి కిరణ్కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలకు బలం చేకూరింది. ఆర్బిఐతో సహా రెండు తెలుగు రాష్ట్రాల వివరణ కోరటం అభినందనీయం. మార్గదర్శి బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్టైం రికార్డు
సాక్షి,విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. మంగళవారం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. ఫలితంగా అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. స్వల్ప కాలంలో చంద్రబాబు పాలన అప్పు రూ.3,62,855 కోట్లకు చేరింది. తద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక అప్పులు చేసిన సీఎంగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3,62,855 కోట్లు అప్పు చేసింది. అంటే సగటున రోజుకి రూ.15,766 కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ.2,02,964 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు రూ.1,12,504 కోట్లు, రాజధాని అప్పులు 47,387 కోట్లుగా ఉన్నాయి. -
అంతులేని దోపిడీ జరుగుతోంది: మేరుగు నాగార్జున
తాడేపల్లి: ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.ఇవాళ మేరుగు నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా పడకన పడ్డాయి. రాజధానిలో ఎకరం రూ.50 కోట్లు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. వారు మాత్రం ఐదు ఎకరాలను కూడా రూ.3.5 కోట్లకే ఎలా కొన్నారు? అంటే జనాన్ని మోసం చేస్తున్నారా? లేక సీఆర్డీఏకి ట్యాక్సులు ఎగ్గొట్టారా? వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు మాత్రం భారీ బంగ్లాలు కట్టుకోవచ్చుగానీ పేదలు మాత్రం ఇళ్లు కట్టుకో కూడదా? ఇదేనా చంద్రబాబు రాజనీతి? చివరికి చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండకుండా గ్రీన్ జోన్ ప్రకటించటం అన్యాయం. రెండు లక్షల కోట్ల ప్రజాధనంతో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు ఎవరి కోసం?’’ అని మేరుగు నాగార్జున నిలదీశారు. -
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
వైఎస్సార్సీపీ చలో దుప్పుతూరు.. గ్రామస్తులకు మద్దతుగా నిరసన
సాక్షి, అనకాపల్లి: చలో దుప్పుతూరు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొడ్డేడ ప్రసాద్, ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి, కంబాల జోగులు.. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పరిశ్రమలు రావాలనేది వైఎస్ జగన్ విధానమని.. ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ జగన్ ఉపేక్షించరన్నారు. 750 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. గ్రామాన్ని తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలు మీద లాఠీఛార్జ్ చేశారు. గతంలో ఎన్నడు ఈ ప్రాంతంలో మహిళలు మీద లాఠీఛార్జ్ జరగలేదు.. ప్రజల డిమాండ్స్ న్యాయ పరమైనవి. పరిహారం ఇచ్చిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకు తట్ట మట్టి ఎత్తడానికి వీల్లేదు. మీ మీద పెట్టిన తప్పుడు కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తారు. మీకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు దుప్పుతూరు గ్రామంలో పర్యటించాము. మంచి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న గ్రామం కంటే మంచి గ్రామాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 22 ఏళ్లు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోడ నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. వారి సమస్య పరిష్కారం అయిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దాడి చేశారు. అనేక పోలీసులు స్టేషన్లు తిప్పారు’’ అని ఆయన మండిపడ్డారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఈడ్చుకుంటూ మహిళలను వ్యాన్లు ఎక్కించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు?. మహిళలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా’’ అంటూ ఆమె నిలదీశారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. పరిహారం చెల్లించే వరకు గోడ నిర్మాణాన్ని ఆపాలి. ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. న్యాయం కోసం పోరాటం చేసే ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గోడ కట్టలేక పోయారు?. దొర స్వామి దగ్గర కూటమి నాయకులు డబ్బులు తీసుకుని దగ్గరుండి గోడ కట్టిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. -
అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు. రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్బ్యాక్లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అలాంటప్పుడు ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా? ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి, మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్లో ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు తీర్చవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు. ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న విమర్శ ఉంది.ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది? టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది. చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
తల్లి కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు జలసమాధి
సీతారామపురం: ఆ ఇల్లు నిన్నటి దాకా ఇద్దరు అన్నదమ్ముల అల్లరితో సందడిగా ఉండేది. అమ్మ పిలుపులు.. అన్నదమ్ముల నవ్వుల కేరింతలతో కళకళలాడింది. కానీ ఇప్పుడు గుండెలు పగిలే రోదనలు మిగిలాయి. విధి ఆటలో మృత్యువు ఆ పసి మొగ్గలను చెరువు రూపంలో కన్నతల్లి కళ్ల ముందే కబళించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం బెస్త కాలనీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టా సుబ్బారావు, స్వర్ణలత దంపతుల కుమారులైన కిష్ణా రేవంత్ (14), కిష్ణా ఆది (13) నెల్లూరులో ఉంటూ 9వ, 8వ తరగతి చదువుకుంటున్నారు.వేసవి సెలవులకు తల్లితో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటికి సమీపంలో ఉన్న ఊర చెరువులో దుస్తులు ఉతుక్కునేందుకు తల్లి స్వర్ణలత, పిన్ని సుమలతతో కలిసి వెళ్లారు. ఒక వైపు తల్లి, పిన్ని దుస్తులు ఉతుక్కుంటుండగా మరో వైపు రేవంత్, ఆది సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి గిలగిలా కొట్టుకోవడాన్ని గమనించిన పిన్ని సుమలత కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా మునిగిపోయింది. ఇదంతా చూస్తున్న తల్లి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సుమలతను ఒడ్డుకు చేర్చారు.అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెరువులో నీటి లోతు ఎక్కువగా ఉండడంతో కొన్ని గంటల వరకు ఆ అన్నదమ్ముల జాడ తెలియలేదు. బెస్త కాలనీకి చెందిన యువకులు చెరువులోకి దిగి రేవంత్, ఆదిలను బయటకు తీయగా అప్పటికే వారు చనిపోయారు. మృత్యువులోనూ అన్నదమ్ముల బంధం విడిపోలేదు. ఒకరినొకరు గట్టిగా పట్టుకున్న స్థితిలోనే వారి నిర్జీవ దేహాలు బయటపడ్డాయి. కళ్లముందే ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లి రోదనలు మిన్నంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి మృత్యువాత పడడంతో బెస్త కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్’
సాక్షి, అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తాజాగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి మార్క్ఫెడ్ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్ఫెడ్ తీసుకునే రూ.1,800 కోట్ల అప్పునకు అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ ద్వారా రూ.12,053 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ప్రస్తుత రూ.1,800 కోట్ల అప్పు కూడా కలిపితే మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి తీసుకున్న అప్పు రూ.13,853 కోట్లకు చేరనుంది.చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే బడ్జెట్ పరిధిలో, బడ్జెట్ వెలుపల కలిపి సోమవారం వరకు మొత్తం రూ.3,56,455 కోట్లు అప్పు చేసింది. అయితే, బడ్జెట్ పరిధిలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (మే 5, మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.4,600 కోట్లు రుణం సమీకరించి ఇవ్వనుంది. సోమవారం ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీతో అనుమతిచ్చింది.దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు చేసిన అప్పు మొత్తం రూ.3,62,855 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,776 కోట్లు, రోజుకు సగటున రూ.526 కోట్లు అప్పు చేస్తోంది. కాగా, గ్రామీణ విద్యుద్ధికరణ సంస్థ (ఆర్ఈసీ) నుంచి డిస్కమ్స్ తీసుకున్న రూ.7,000 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీని పొడిగిస్తూ సోమవారం ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
శ్రీకాళహస్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాళహస్తి రూరల్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోల్కతాకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆస్తమా చికిత్స చేయించుకునేందుకు కోల్కతా నుంచి బెంగళూరుకు అంబులెన్స్లో బయలుదేరిన వారు తిరుపతి–పూతలపట్టు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు శ్రీకాళహస్తి పోలీసులు వెల్లడించారు. కోల్కతాకు చెందిన బ్రజ డోలాయ్ (48) ఆస్తమాతో బాధపడుతున్నాడు.వైద్యుల సూచన మేరకు బెంగళూరులో చికిత్స కోసం ఈనెల 2న బ్రజ డోలాయ్తోపాటు భార్య టగారి డోలాయ్ (35), అంబులెన్స్ డ్రైవర్ రితేష్ (24), అతని సోదరుడు జతిన్ డోలాయ్ (63), మరో మహిళ ధగోడిస్ (45), మరో డ్రైవర్ రాకేష్ పండిట్ (29) బయలుదేరారు. సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న వీరి అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బ్రజ డోలాయ్, భార్య టగారి డోలాయ్, జతిన్ డోలాయ్, రితేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ధగోడిస్ (45), అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ పండిట్ (29) శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్కతాలోని బంధువులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
భద్రంగుండేనా..!
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు మరింత తీవ్రతరం అవుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో సంభవించే గుండె జబ్బులు ఇప్పుడు పాఠశాల విద్యార్థులు, యువకుల్లోనూ అధికం అవుతున్నాయి. 2022–23లో దేశంలోని ప్రతి వెయ్యి మందిలో 131 మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా 2025 నాటికి ఆ సంఖ్య 152కు పెరిగింది. మొత్తం రోగాల్లో గుండె జబ్బుల వాటానే అధికం. ఈ అంశం ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్)–80వ నివేదికలో వెల్లడైంది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం నమోదవుతున్న మొత్తం వ్యాధుల్లో 25.6 శాతం వాటాతో గుండె జబ్బులే ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏడేళ్లలో మూడు రెట్లు పెరుగుదల దేశంలోని 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో గుండె జబ్బులు ముప్పే అధికంగా ఉంది. వృద్ధుల్లో నమోదవుతున్న మొత్తం జబ్బుల్లో హృద్రోగ సమస్యల వాటా 37.8 శాతం ఉంది. ఇక 15 నుంచి 44 ఏళ్ల యువత, మధ్యవయసు్కల్లో మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం వంటి మెటబాలిక్, ఇన్ఫెక్షన్ల అనంతరం గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టమైంది. 30 నుంచి 44 ఏళ్ల వారిలో 15.3 శాతం వాటాతో గుండె సమస్యలు మూడో స్థానంలో ఉన్నాయి. 45–59 ఏళ్ల వారిలో 30.1 శాతంతో రెండో ప్రధాన అనారోగ్య సమస్యగా కనిపిస్తోంది.2017–18లో చేపట్టిన ఎన్ఎస్ఎస్ సమయంలో ప్రతి లక్ష మందిలో 1333 మంది గుండె సమస్యలతో బాధపడుతున్నట్టుగా వెల్లడించగా, 2025 నాటికి వారి సంఖ్య 3,891కు పెరిగింది. ఈ లెక్కన పరిశీలిస్తే గుండె జబ్బుల సమస్యలు ఏడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు తేటతెల్లమవుతోంది. ఇంత వేగంగా సమస్య పెరగడమంటే ఇది సైలెంట్ ఎపిడెమిక్ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంటు వ్యాధుల కంటే వేగంగా జీవనశైలి వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ఇది దేశానికి పెద్ద ఆరోగ్య సవాలని స్పష్టం చేస్తున్నారు. గుండె జబ్బుల బారినపడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. -
ఆకివీడు రామాలయ అనుమతులపై పిటిషన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగా జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వివరించారు.ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ సోమవారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముందు ప్రస్తావించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. -
చంద్రబాబు పాపం.. సీమకు శాపం
మార్కాపురం: చంద్రబాబు పాపం.. సీమకు శాపంగా పరిణమించిందని, రానున్న రోజుల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటి కోసం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా శైలజానాథ్, కారుమూరి, ఇతర వక్తలు మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లనుందని, దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి తానే చంద్రబాబుతో మాట్లాడి సీమ ప్రాజెక్టును ఆపించానని చెప్పారని, దీనిని బట్టి చంద్రబాబు రేవంత్తో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయం స్పష్టమైందని ధ్వజమెత్తారు. సీమకు అడుగడుగునా ద్రోహం చంద్రబాబు సీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారని, మెడికల్ కాలేజీలనూ పూర్తి చేయకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. నాడు శ్రీకృష్ణ కమిటీ దొనకొండను రాజధాని చేయాలని సిఫార్సు చేస్తే.. దానిని పక్కన పెట్టి తన బినామీలు, అనుచరుల కోసం అమరావతిని బాబు రాజధాని చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరితే పోలవరం నుంచి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు అందిస్తానని చెప్పడం ఎంత వరకు సబబని నిలదీశారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ సీమ హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. వెలుగొండ ప్రాజెక్టుపై బాబు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి, ఒంగోలు ఇన్చార్జిలు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, చుండూరి రవిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు మాట్లాడారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
జగనే నయం.. రైతులను ఆదుకున్నారు
కడప (సెవెన్ రోడ్స్): ‘గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే నయం. అన్నమయ్య డ్యామ్ తెగిపోయి తీవ్రంగా నష్టపోతే మా పక్క గ్రామమైన పులపత్తూరు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. మేట వేసిన ఇసుకను తోలుకోవడానికి పర్మీషన్ ఇచ్చారు. టీడీపీ కూటమి ఏదో ఒరగబెడుతుందని నమ్మి ఓట్లువేస్తే.. రెండున్నర సంవత్సరాలైనా మా పొలంలో ఇసుక మేటలు తొలగించలేదు.కలెక్టరేట్కు తిరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం చింతలకోన గ్రామ రైతు, జనసేన కార్యకర్త కూటాలగారి వెంకటయ్య అధికారుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరును ఎండగడుతూ బైఠాయించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి కలెక్టర్ వచ్చాక తామే ఆయన వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వెంకటయ్య వినలేదు. దీంతో పోలీసులు అతడిని బయటకు పంపించివేశారు. -
మార్గదర్శి కేసు ముగించాలంటే.. ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం
ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన.. కొనసాగుతున్న ఆర్థిక సంస్థపై నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజా ధనానికి సంబంధించి చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..! – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంకోర్టులో తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన నిందితుడు రామోజీరావు మరణించినందున ఈ కేసును కొట్టివేయాలన్న మార్గదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. రామోజీరావు మరణించినా.. సంస్థ కార్యకలాపాలు ఇంకా కొనసాగిస్తున్నందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని తేల్చి చెప్పింది. ‘ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి, ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. మార్గదర్శిపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్, మార్గదర్శి ఫైనాన్షియర్స్కు నోటీసులు జారీ చేసింది. బాధితులందరికీ చెల్లింపులపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏకంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు సేకరించడంపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసు మెయింటెనబుల్ కాదన్న మార్గదర్శి వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించటాన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్, న్యాయవాదులు అల్లంకి రమేష్, మమత వాదనలు వినిపించారు. వ్యక్తి మరణిస్తే.. సంస్థపై కేసు ఆగిపోదు విచారణ ప్రారంభం కాగానే మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన నిందితుడు మరణించిన నేపథ్యంలో ఈ కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనాన్ని కోరారు. దీన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన కేసు ముగియదని, జరిమానా చెల్లించే బాధ్యత హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్)పై ఉంటుందని నివేదించారు. దర్యాప్తు పెండింగ్లో ఉండగానే.. రామోజీ మరణించారన్న కారణంతో ఆయనతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై గతంలో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసిందన్నారు. భారీ ఆర్థిక అవకతవకలను, ప్రజా ప్రయోజనాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన విషయం స్పష్టంగా రుజువవుతున్నా హైకోర్టు సాంకేతిక కారణాలతో కేసును కొట్టేసిందన్నారు. అటు ఐటీ శాఖ, ఇటు ఆర్బీఐ వద్ద మార్గదర్శి అక్రమాల వివరాలు ఉన్నాయని నివేదించారు. మార్గదర్శిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించాలని ధర్మాసనాన్ని కోరారు. ఎఫ్ఐఆర్ అనేది ’ఎన్సైక్లోపీడియా’ కాదు దర్యాప్తు ఇంకా పూర్తికాని దశలో హైకోర్టు కేసును కొట్టివేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎఫ్ఐఆర్ అనేది నేరాలకు సంబంధించిన ‘పూర్తి ఎన్సైక్లోపీడియా’ కాదని ఉదహరించారు. డిపాజిట్ల సేకరణపై దశాబ్దాలుగా నియంత్రణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. మార్గదర్శి రూ.వేల కోట్లు వసూలు చేస్తూ కార్యకలాపాలు సాగించిందని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, రెగ్యులేటరీ సంస్థ ఆర్బీఐ వాదనలను సైతం హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని నివేదించారు. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన కేసులో దర్యాప్తును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందన్న రంగాచారి... ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజున జీవో 800 జారీ చేసింది. రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. రంగాచారి విచారణను పూర్తి చేసి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల వద్ద నుంచి రూ.వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాక మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన నివేదికలో పేర్కొన్నారు. అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు అధీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ 2008 జనవరి 23న హైదరాబాద్ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58 కింద శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. అందరి వాదనలు వినాలన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉండవల్లి అరుణ్కుమార్తో పాటు అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి, అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టిన తెలంగాణ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆయనతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై కేసును కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా సోమవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ జరిపింది. రూ.వేల కోట్లు కొల్లగొట్టిన రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యాలయాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ఇలా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిన వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని కూడా చెప్పడంతో డిపాజిటర్ల ప్రయోజనాల కోసం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
అయ్యో ‘బాబు’!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ గెలుపొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు మద్దతుగా చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి అశి్వన్కుమార్కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు. -
మన పవన్లో ఆ ఫైరేదీ?!
సాక్షి, అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య విజయం తర్వాత జనసేన పార్టీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. ఆ రాష్ట్రంలో విజయ్కు ఉన్నంత సినిమా గ్లామర్ మన రాష్ట్రంలో పవన్కళ్యాణ్కూ ఉన్నా.. ఆ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయారనే చర్చ సాగుతోంది. సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఒంటరిగా పోటీ చేసి సత్తాచాటి సీఎం కాగలుగుతున్నప్పుడు పార్టీ పెట్టి 12 ఏళ్లయినా పవన్ ఇంకా పొత్తుల జపం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ కి ఊడిగం చేయాల్సిన దుస్థితి తమకేంటని మథనపడుతున్నాయి. ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్నా.. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం తమకు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల పంపకంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధ పడుతున్నారు. పదవుల సంగతి దేవుడెరుగు కనీస గౌరవమూ దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మిమ్మల్ని టీవీకే జెండా తప్ప మరే జెండా మోయనివ్వను’ అని తన కార్యకర్తలకు టీవీకే అధినేత విజయ్ భరోసా ఇచ్చినట్టు తమ అధినేత పవన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైగా ఇంకో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతోందని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పటి నుంచి జనసేనలోని పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఇదే విధంగా విస్తృతంగా చర్చసాగుతోంది. విజయ్తో పవన్ను పోల్చి చూసుకుని సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా విజయ్ అభ్యర్థులను పెట్టి పోటీ చేసి సత్తాచాటిన నేపథ్యంలో ఏపీలో ఉన్న 175 స్థానాల్లో్ల తమ పార్టీ కి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని గతంలో పవన్ అన్న మాటలను గుర్తుచేసుకుని జనసేన నేతలు రగిలిపోతున్నారు. తొలి నుంచీ పవన్ భయం భయంగానే.. పవన్ తొలి నుంచీ భయం భయంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారన్న చర్చ నడుస్తోంది. విజయ్ మాదిరి ధైర్యంగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2014లో జనసేన పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీ కూటమికి మద్దతు తెలిపి పలాయనవాదం అందుకోవడంతోనే ప్రజల్లో పవన్ పలుచనైపోయారనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినా.. పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన పవన్ ఏమాత్రం ఎందుకు ప్రభావం చూపలేకపోయారన్న చర్చ నడుస్తోంది.2024 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పడేసిన 21 సీట్లతో సర్దుకుని పోటీ చేసిన పవన్ తనకు బలం లేదని, అన్ని చోట్లా పోటీ చేయడానికి తమకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని ఎన్నికల ప్రచారసభల్లో బేల వచనాలు పలకడాన్ని బట్టి ఎన్నడూ పవన్ రాజకీయంగా ధైర్యం కనబరచలేదని జనసేన శ్రేణులు మథనపడుతున్నాయి. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడూ మరో 15ఏళ్లు పొత్తులే అంటూ చేస్తున్న ప్రకటనలపైనా విస్మయం వ్యక్తమవుతోంది.తెగువే ‘విజయ్’బావుటా.. తమిళనాడులో విజయ్ చూపిన తెగువే ఆ రాష్ట్రంలో 60 ఏళ్లుగా అధికారం దక్కించుకుంటున్న ద్రవిడ పార్టీ ల పీచమణిచింది. అక్కడ ఉండే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన విజయ్ తొలినుంచి ధైర్యంగా ముందడుగేశారు. ఎవరితోనూ ‘పొత్తులు పెట్టుకోనని కరాఖండీగా తేల్చిచెప్పారు. ‘‘ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించను, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయను.’ అంటూ తన అభిమానులు, పార్టీ శ్రేణుల్లోనూ ధైర్యం నింపి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన సినిమాను ఆపినా, లీక్ చేసినా, 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేసినా ధీరుడిగా పోరాడారు. చివరకు అంచనాలను తలకిందులు చేసి అనూహ్యంగా జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికైనా సొంతంగా ఎదిగే ధైర్యముందా? పవన్ ఇప్పటికైనా ఏపీలో సొంతంగా ఎదిగే ధైర్యం చేస్తారా? విజయ్ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతారా? తెలుగుదేశం కబంధహస్తాల నుంచి బయటకొచ్చి సొంతంగా సత్తాచాటే స్థాయికి ఎదుగుతారా? అనే చర్చ జనసేనలో విస్తృతంగా సాగుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందే ఓట్లు చీలనివ్వను అంటూ పొత్తుల బాట పట్టిన పవన్.. అప్పటికే అవసాన దశలో ఉన్న టీడీపీకి ఊపి రి పోసి.. తాను మాత్రం ఎదగలేకపోయారనే భావన జనసేనలో ఇప్పటికీ వ్యక్తమవుతోంది. ఎన్నికల్లోనూ టీడీపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని తన ఎదుగుదలకు తానే గండికొట్టుకున్నారనే ఆవేదన వినిపిస్తోంది. ఇప్పటికైనా పవన్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు రాబట్టవచ్చని జనసేన శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఇంకో 15ఏళ్లు పొత్తు అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై తలలు పట్టుకుంటున్నాయి. పవన్ తీరే వేరు.. ఏపీలో సినీ గ్లామర్తోనే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తీరు వేరేగా ఉందని జనసేన శ్రేణులే వాపోతున్నాయి. తొలి నుంచి పొత్తుల పేరుతో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారని, జనసేన కార్యకర్తల చేత తెలుగుదేశం జెండాలు మోయిస్తూనే ఉన్నారని వాపోతున్నారు. ఈ విషయంపై జనసేనలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతూనే ఉంది. దీనిపై చాలామంది నేతలు బహిరంగంగానే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. -
10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ సంస్థ శ్రేయాస్ గ్రూప్ తాజాగా మీడియా, స్పోర్ట్స్ తదితర రంగాల్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10,000 మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్రావు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారు శ్రేయాస్ ప్రతినిధిగా చేరి, ఈవెంట్స్, రిటైల్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్లాంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విధానంలో యువత తమ సొంత ప్రాంతాల్లోనే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని శ్రీనివాస్రావు చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా గ్రూప్ హిందీ, పంజాబీలాంటి ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోకి విస్తరిస్తోంది. అలాగే కార్పొరేట్ క్లబ్, ఉత్సవ్ పేరిట ఈవెంట్స్ రంగంలో, ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ద్వారా రియల్టీలోనూ అడుగుపెట్టింది. ఏఐ ఫ్రేమ్స్ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత వీడియో ప్రొడక్షన్ స్టూడియో, ఎనీటైమ్ థియేటర్ అనే వినూత్న వినోద ప్లాట్ఫాంను ప్రారంభిస్తోంది. -
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్ను అందరూ విజయ్తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్కు ఉన్న ధైర్యం పవన్కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అలాగైతే రామోజీ ఆస్తులు అటాచ్ చేసి, బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో తాము ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చారు. అనంతరం, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది.కాగా, మార్గదర్శి కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించింది. ఈ నేపథ్యంలో రామోజీరావు చనిపోవడంతో కేసు మెయింటైనబుల్ కాదని హైకోర్టులో మార్గదర్శి వాదనలు వినిపించింది. దాంతో ఎఫ్ఐఆర్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఉండవల్లి సవాల్ చేశారు.దీంతో, సుప్రీంకోర్టు.. ఆర్బీఐ, ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు, కిరణ్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. ఉండవల్లి తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్, న్యాయవాదులు అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈరోజు వాదనల తర్వాత తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఉపరాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా విషెస్ తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.‘‘భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశానికి దీర్ఘకాలం మీరు సేవలు అందించాలని.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ కోరారు. అయితే..Heartiest birthday greetings to the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Garu. May God bless you with a long and healthy life in the continued service of our nation.@CPR_VP @VPIndia— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026వైఎస్ జగన్ చేసిన ట్వీట్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన.చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి. తమిళనాడుకు చెందిన ఈయన.. బీజేపీలో సుదీర్ఘకాలం పని చేశారు. లోక్సభ సభ్యుడిగా, తమిళనాడు బీజేపీ చీఫ్గా, ఆపై పలు రాష్ట్రాలకు గవర్నర్గానూ పని చేశారు. -
దళిత యువకుడిని బలిగొన్న టీడీపీ
కర్నూలు/కర్నూలు (టౌన్): ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరుడి వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు శ్రీరామ్నగర్లో ఆదివారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన బీసీ సతీష్ (27) ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తనపై అక్రమంగా కేసు పెట్టించి వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు ఆ యువకుడు సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపింది. ‘నా ప్రేమ వ్యవహారంలో మెయిన్ విలన్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరుడు గట్టు తిలక్. మంత్రి టీజీ భరత్ నన్ను వేధించాడు. టీడీపీ పవర్ను ఉపయోగించి నీ జీవితం నాశనం చేస్తా.. నీ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేస్తా.. ఎస్సీవైన నీకే అంత ఉంటే.. నాకెంత ఉండాలి’ అని వేధించి బెదిరించాడు. ‘నువ్వు, నీ కుటుంబం ఊరొదిలి వెళ్లాలని పోలీసులతో ఒత్తిడి చేయించాడు. చివరకు అమ్మాయి తండ్రితో నాపై అక్రమంగా కేసు పెట్టించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తుండటాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని మృతుడు సతీష్ సూసైడ్ నోట్ వివరించాడు. ప్రేమ వ్యవహారంలో వేధింపులే కారణం కర్నూలు శ్రీరామ్నగర్లో ఉంటున్న బీసీ బాలన్న, శోభారాణి దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన సతీష్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. కాగా.. అదే కాలనీకి చెందిన ఓ యువతి, సతీష్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీష్ కుటుంబం చాలాకాలంగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటోంది. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు సతీష్ ప్రేమ వ్యవహారాన్ని బజారుకీడ్చి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ వ్యవహారాలు చక్కబెడుతున్న ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ను వారంతా సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రేమ జంటను విడదీసేందుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఐదు రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా మంత్రి టీజీ భరత్కు చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్లో డాక్టర్లను కలవడానికి సతీష్ వెళ్లగా.. ఆ ఆస్పత్రి పాలనా వ్యవహారాలు చూస్తున్న గట్టు తిలక్ ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి అతడిని బెదిరించాలని ఆదేశించాడు. దీంతో అతడి సెల్ఫోన్ లాక్కున్న కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రాత్రి 10 గంటల వరకు కూర్చొబెట్టి వదిలేశారు. ఇంటికి చేరుకున్న సతీష్ జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు తన సెల్ఫోన్ను ఇవ్వకపోవడంతో సతీష్ తీవ్ర మనస్తాపం చెందాడు.ఆదివారం రెండు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. తన చావుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కారణమంటూ కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నిటినీ ఆ లేఖలో వివరించాడు. అనంతరం ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. ఫ్యాన్కు వేలాడుతున్న సతీష్ను చూసిన తల్లి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి మార్చురీ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని తండ్రి బీసీ బాలన్న ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గట్టు తిలక్పై కేసు నమోదు చేయాలి: ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ ప్రేమ వ్యవహరంలో తలదూర్చి కర్నూలులోని శ్రీరామనగర్కు చెందిన సతీష్ ఆత్మహత్యకు కారకులైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్పై వెంటనే కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద మృతుడి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సతీష్ మరణానికి కారణమైన గట్టు తిలక్పై చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
రూ.5 వేల కోట్ల కొండను కొట్టేస్తున్నారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాటలకు, చేతలకు సంబంధం ఏమాత్రం లేదని మరోమారు స్పష్టమైంది. ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచుకో.. పంచుకో.. అంటూ బరితెగిస్తోంది. నట్టనడి అడవిలో విలువైన ఖనిజాలను కొల్లగొట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తోంది. ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగోలేని, కనీసం ఫైన్ చెల్లించని సంస్థకు పెద్దపీట వేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ అటవీ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మైనింగ్ కుంభకోణాలకు అడ్డాగా మారింది.తాజాగా చాగానం, మొలకలపొండ్ల గ్రామాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన మైకా, క్వార్ట్జ్ ఖనిజాలను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు రంగం సిద్ధం చేశారు. పర్యావరణ అనుమతులు (ఈసీ) రాకముందే, అధికారికంగా లీజు ఒప్పందం కుదరకముందే అక్కడ ఖనిజాలను యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేలం నిర్వహించకుండా ఈ అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అక్రమాలను సక్రమం చేసుకునేందుకు పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తును ఇప్పుడు హడావుడిగా బయటకు తీసి, ఆగమేఘాల మీద క్లియర్ చేయించారు. అటవీ భూములను కాపాడాల్సిన వారే వాటిని అక్రమార్కులకు అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. పదేళ్ల నిద్ర.. పది రోజుల్లో మేల్కొలుపు పదేళ్లు పెండింగ్లో ఉన్న ఈ లీజు ఫైలుకు ఉన్నట్టుండి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక కీలక నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సైదాపురం మండలం చాగానంలో సర్వే నంబర్ 505, మొలకొలపొండ్లలో సర్వే నంబర్ 528లో 10.02 హెక్టార్లలో (25 ఎకరాలు) క్వార్ట్జ్, మైకా లీజు కోసం ది కృష్ణా మైనింగ్ కంపెనీ (మేనేజింగ్ పార్టనర్ భరత్) 2014 అక్టోబర్ 9న దరఖాస్తు చేసుకుంది. ఇది అటవీ భూమి కావడం, పర్యావరణ నిబంధనల ప్రకారం అక్కడ ఖనిజ తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో ఈ దరఖాస్తు అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది.కానీ 2024 అక్టోబర్ తర్వాత దీనికి అకస్మాత్తుగా రెక్కలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మైకా, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను మేజర్ మినరల్స్ జాబితాలోకి చేర్చి వాటికి బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజులు ఇవ్వాలని గెజిట్ ఇచ్చిన సమయంలోనే కూటమి ప్రభుత్వం తన పరిధిని వాడుకుంటూ పాత దరఖాస్తును క్లియర్ చేయడం గమనార్హం. 2025 నవంబర్ 3న జీఓ ఎంఎస్ నెంబర్ 64 జారీ చేసి అటవీ భూమి మళ్లింపునకు తుది అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా దరఖాస్తులు లెక్కనేనన్ని పెండింగ్లో ఉన్నప్పటికీ, ఈ ఒక్క దరఖాస్తుకు మాత్రమే క్లియరెన్స్ లభించడం ఇందుకు తార్కాణం. గతంలో పట్టుబడ్డ అక్రమార్కుడికే మళ్లీ పట్టం సాధారణంగా ప్రభుత్వానికి బకాయిలు ఉన్న కంపెనీలకు కొత్త లీజులు ఇవ్వకూడదు. కానీ కృష్ణా మైనింగ్ కంపెనీ గతంలోనే అక్రమ తవ్వకాలు జరపడంతో ప్రభుత్వం రూ.11.66 కోట్ల జరిమానా విధించింది. ఆ డబ్బు ఇప్పటికీ కట్టలేదు. అలాంటి బ్లాక్ లిస్టు కంపెనీకి మళ్లీ 10.02 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని అప్పగించడం వెనుక నెల్లూరు జిల్లా అధికార పార్టీ పెద్దలతో పాటు ఉండవల్లి, మంగళగిరి పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం. 2025 డిసెంబర్ 16న జీఓ ఆర్టీ నెంబర్ 229 ద్వారా ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి కొత్తగా మారిన కేంద్ర చట్టాలను పక్కన పెట్టి పాత మైనర్ మినరల్ నిబంధనల కిందే వెసులుబాటు కలి్పంచారు. లీజు రాకుండానే లూటీ నిబంధనల ప్రకారం లీజు ఖరారైన తర్వాతే తవ్వకాలు జరగాలి. కానీ ఈ కంపెనీ ఇప్పటికే 20 వేల టన్నుల నుంచి 30 వేల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ ప్రాంతంలో ఉన్న లోతైన గుంతలే ఇందుకు నిదర్శనం. ఎన్జీటీ నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. అటవీ భూముల మళ్లింపునకు అనుమతి ఇచ్చినా ఇంకా పర్యావరణ అనుమతులు (ఈసీ) రాలేదు. త్వరలో ఈసీ అనుమతి కోసం పబ్లిక్ హియరింగ్ జరగనుంది. కానీ ఈలోపే అక్రమార్కుల యంత్రాలు అడవిని తవ్వేస్తున్నాయి. వందల దరఖాస్తులు పెండింగ్.. ఈ ఒక్కటి మాత్రమే క్లియర్ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల్లో మైనింగ్ కోసం దాదాపు 200 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే, అందులో ఒక్క నెల్లూరు జిల్లావే 80 దరఖాస్తులున్నాయి. ఇవి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఒక్క సంస్థ దరఖాస్తును మాత్రమే అత్యవసరంగా క్లియర్ చేశారు. అసలు అడవిని తవ్వడానికి తాను ఏమాత్రం ఒప్పుకోనని, పర్యావరణం అంటే తనకు ప్రాణమని లెక్చర్లిచ్చే నేత ఈ దందాకు ఎలా అంగీకరించారని సదరు శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. భారీగా ముడుపులు అందడం తప్ప మరేమీ కాదని ప్రచారం జరుగుతోంది.వేల కోట్ల సంపద.. నామమాత్రపు లీజులు సైదాపురం ప్రాంతంలో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఖనిజ సంపదకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం చాగానం, మొలకొలపొండ్లలో ఉన్న ఖనిజం విలువ రూ.వేల కోట్లలోనే ఉంటుంది. కానీ గనుల శాఖ కేవలం రూ.9 లక్షల ప్రీమియం మాత్రమే కట్టాలని ఆ సంస్థకు డిమాండ్ నోటీసు ఇచి్చంది. ఈసీ రాక ముందే అటవీ భూమిని మళ్లించడం, వ్యవస్థలన్నీ ఆ కంపెనీ కోసం ఏకమై పని చేయడం చూస్తుంటే ఈ అక్రమాల వెనుక ఎంత పెద్ద లాబీయింగ్ ఉందో అర్థం చేసువకోవచ్చు. అటవీ భూమిని ఈ సంస్థకు దారాదత్తం చేయడం వెనుక రూ.100 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థ నుంచి ఈ లీజును చేజిక్కించుకున్న నెల్లూరు ఎంపీ ప్రధాన అనుచరుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘ఉప’ నేతకు కూడా డబ్బు కొట్టి ఒప్పించినట్లు తెలిసింది. -
నా చావుకు కారణం మీ అనుచరులే..
నిడదవోలు రూరల్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనుచరుల టార్చర్ వల్లే నేను చనిపోతున్నాను.. అకారణంగా ఓ కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్టా మణికంఠ సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో మణికంఠ ఆచూకీ తెలపాలని టీడీపీ నాయకులు నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మరో వైపు మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సెల్ఫీ వీడియో సారాంశం ఇదీ.. ‘నా పేరు కట్టా మణికంఠ. మాది నిడదవోలు మండలం సింగవరం. నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నాను. మంత్రి కందుల దుర్గేష్ గారూ.. నేను తెలుగుదేశం కార్యకర్తను. మా నాన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 1989 నుంచి అదే టీడీపీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజ్, స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దానిపై మా నాన్న 14 నెలలుగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ బూత్ ఇన్చార్జినైన నా మీద కేసులు పెడితే ఇంకా ఎందుకు సార్ పార్టీ. మీ నియోజకవర్గంలో బీసీలంటే అంత చులకనా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నా ఫోన్ సీజ్ చేశారు. ఎస్సై, సీఐ పట్టించుకోవడం లేదు. నేను పనిచేసిన చోటుకు వచ్చి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నాకు గుండె దడగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి, పెన్మత్స చందు వర్మ, అచ్యుత్ పవన్, సాయిలక్ష్మణ్ అడ్డాల, ఎస్సై జగన్మోహన్రావు, సీఐ తిలక్లే. నేను చనిపోతున్నాను.. నా వల్ల కావడం లేదు.’ అని పోస్టు చేశాడు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవు
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సర్వీసు కాలం ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసింది. సర్వీసు కాలాన్ని పొడిగించకుండా ఆర్థిక శాఖ తాత్సారం చేస్తుండడంతో వేతనాలు నిలిచిపోయాయి.సర్వీసు కాలం పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీఓ జారీ చేస్తేగానీ వీరికి వేతనాలు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిధి పోర్టల్లో వీరి వివరాలు నమోదు కాలేదనే సాకుతో ఆర్థికశాఖ మార్చి నెల వేతనాలు కూడా చెల్లించలేదు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన గడువు మార్చితో ముగిసింది. దీంతో ఏప్రిల్ వేతనాలనూ చెల్లించలేదు.సాధారణంగా ఏటా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్థికశాఖ జీఓలు జారీ చేస్తుంది. గతంలో జారీచేసిన జీఓ గడువు మార్చి నెలాఖరుతో ముగిసినప్పటికీ మే వచ్చినా వారి సర్వీసు పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయలేదు. రెండు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. -
మనోడైతే ఇచ్చేద్దాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగులైనా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థ ఉద్యోగులైనా పదోన్నతి కల్పించడానికి, వేతనాలు పెంచడానికి వారి అర్హత, పనితీరే కొలమానం. కానీ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్)లో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది. అధికార పార్టీకి సానుభూతిపరులైతే చాలు.. అర్హత లేకున్నా పనితీరు తీసికట్టుగా ఉన్నా.. ప్రతిభ లేకపోయినాసరే పదోన్నతి ఇచ్చేస్తున్నారు. వేతనాలు భారీగా పెంచేస్తున్నారు.అర్హత ఉండి.. మెరుగైన పనితీరు కనబరుస్తూ.. లక్ష్యాల సాధనలో ప్రతిభ చాటుతున్న ఉద్యోగులకు పదోన్నతి, వేతనాలు పెంచడానికి ముడుపులు వసూలు చేస్తున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై సీఈవో, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి సస్పెండ్ చేయిస్తున్నారు. పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధింపులకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టిల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షించడం.. వాటిని నిర్వహించడమే లక్ష్యంగా 2016లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏపీయూఐఏఎంఎల్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 49 శాతం కాగా.. ఐఎల్అండ్ ఎఫ్ఎస్ వాటా 51 శాతం. నష్టాలు వచ్చిన విభాగాల్లో పదోన్నతులు, వేతనాల పెంపు రాష్ట్రంలో 8 విభాగాల్లో ఏపీయూఐఏఎంఎల్ సేవలందిస్తోంది. 243 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సంస్థలో కొత్త పదవి సృష్టించి.. అందులో టీడీపీ సానుభూతిపరుడిని నియమించారు. నెలకు వేతనం రూ.3,94,240 చెల్లిస్తున్నారు. ఐఏఎస్ అధికారికి కూడా ఈ స్థాయి వేతనం ఉండదు. దీంతోపాటు టీడీపీ సానుభూతిపరులైన ముగ్గురు ఉద్యోగులకు సీఈవో కార్యాలయం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. వారికి వరుసగా నెలకు రూ.2,46,400, రూ.1.90 లక్షలు, రూ.1.75 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు.ఈ నలుగురు కలిసి ఉద్యోగులు టీడీపీ సానుభూతిపరులైతే అర్హత లేకున్నా.. పనితీరు సక్రమంగా లేకున్నా పదోన్నతి కల్పించి, వేతనాలు పెంచేలా చక్రం తిప్పుతున్నారు. ఎకనమిక్ డెవలప్మెంట్ (ఈడీ), అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ (యూఐడీ), పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విభాగాల్లో మాత్రమే ఈ సంస్థలకు లాభాలు వస్తున్నాయి. మిగతా 5 విభాగాల్లోనూ నష్టాలే. 2025–26లో ఈ సంస్థకు రూ.19.99 కోట్ల ఆదా యం వస్తే.. ఖర్చులు రూ.12.48 కోట్లు పోగా రూ.7.51 కోట్లు లాభాలు వచ్చాయి.ఈడీ విభాగంలో రూ.7.81 కోట్ల లాభం రాగా.. యూఐడీలో రూ.1.29 కోట్లు, పీపీపీ విభాగంలో రూ.61.65 లక్షల లాభాలు వచ్చాయి. ఇందులో తక్కువ లాభం వచ్చిన పీపీపీ విభాగంలో ఓ ఉద్యోగికి వేతనాలు పెంచి నెలకు రూ.4,63,050 చొప్పున ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుడనే ఏకైక కారణంతో ఇటీవల బీడీడీ విభాగంలో ఓ ఉద్యోగిని తీసుకుని నెలకు రూ.3,85,714 చొప్పున వేతనం ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులైన ఉద్యోగులకు లేదా ముడుపులు ఇచ్చిన వారికి నెలకు గరిష్టంగా రూ.4.63 లక్షల నుంచి కనిష్టంగా రూ.1.42 లక్షల చొప్పున వేతనాలు ఇస్తున్నారు.అన్యాయాన్ని ప్రశ్నిస్తే సస్పెన్షన్ నజరానా తమకు అప్పగించిన విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. తమ ప్రతిభ ఆధారంగా లాభాలు తెచ్చిన ఉద్యోగులకు పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే... సీఈవోకు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి వారిపై సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. లేదంటే మెమోలు ఇప్పించి వేధిస్తున్నారు. కన్సల్టెంట్గా పనిచేస్తున్న షేక్ అజీమ్ అహ్మద్పై ఇదే రీతిలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి సస్పెన్షన్ వేటు వేయించారని ఉద్యోగులు తెలిపారు.తమ మాట వినకుండా ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వకుండా, వేతనాలు పెంచకుండా ఆ నలుగురూ మోకాలడ్డుతున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ సంస్థ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కానీ.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ అయిన ఏపీయూఐఏఎంఎల్ సిబ్బందికి మాత్రం ప్రభుత్వ నిధులతో ప్రతినెలా ఠంఛనుగా జీతాలు ఇస్తుండటం గమనార్హం. -
అది ఏకపక్ష కమిషన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన దినేష్కుమార్ ఏకసభ్య కమిషన్.. ఏకపక్ష కమిషన్గా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే దినేష్కుమార్ తన నివేదికను తయారు చేశారని చెప్పారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దాదాపు ఏడాదిన్నర పైగా విచారణ జరిపింది. లడ్డూ కల్తీ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టంగా తెలిపింది. అయినా చంద్రబాబు,పవన్లు వైఎస్సార్సీపీ పాలనలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్కుమార్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏకపక్షంగా మారి చంద్రబాబు పక్షాన నివేదిక ఇచ్చింది. అది అధికారికంగా విడుదల కాక ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల చేతుల్లోకి వెళ్లి విభిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక పత్రికలో అనిల్ సింఘాల్, మరొక దాంట్లో ధర్మారెడ్డి పేర్లు, తర్వాత మా పేర్లను కూడా చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. దినేష్కుమార్ నివేదిక ప్రకారం నేను, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పర్చేజ్ కమిటీలో కేవలం ప్రత్యేక ఆహ్వానితులమే. పూర్తి స్థాయి సభ్యులం కాదు. అసలు సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని సీబీఐ గంటల తరబడి విచారించగా, నన్ను మాత్రం 15 నిమిషాల్లోనే బయటకు పంపించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పంపింది’ అని భూమన తెలిపారు. ఈ సమావేశంలో భూమన ఇంకా ఏమన్నారంటే.. దినేష్ కుమార్కు టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్ దినేష్కుమార్ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్గా నియమించి, చంద్రబాబు చెప్పినట్టుగా నివేదిక ఇప్పించారు. ఆయన విచారణలో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి వారిని పిలిచారా? నిందితులుగా పేర్కొంటున్న జగదీశ్వర్రెడ్డి, బాలాజీ, విజయభాస్కర్, సురేంద్రనాథ్లను విచారించారా? మమ్మల్ని ఎప్పుడైనా విచారణకు పిలిచారా? పిలవకుండానే మీ ఇష్టం వచి్చనట్లు నివేదిక ఎలా ఇస్తారు? ఏడాదిన్నర పాటు సీబీఐ సిట్ అధికారులు ఎనిమిది రాష్ట్రాలు తిరిగి వందల మందిని విచారించి ఇచ్చిన నివేదిక కంటే మీ విచారణ గొప్పదా? సీబీఐ మమ్మల్ని ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి, మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఏకసభ్య కమిష¯Œన్ను ఏర్పాటు చేశారు. దమ్ముంటే కేసులు పెట్టండి? ⇒ దినేష్కుమార్ నివేదికపై ఈనాడులో కథనం వచ్చిన వెంటనే టీటీడీ బోర్డు సభ్యులు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఈ నెల 6న బోర్డు మీటింగ్లో తీర్మానం చేసి మాపై క్రిమినల్ కేసులు పెడతామని చెబుతున్నారు. చాలెంజ్ చేస్తున్నాం.. దమ్ముంటే కేసులు పెట్టండి. అదే పత్రికలో నేను, భాస్కర్రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులమేనని, చర్యలు బోర్డు నిర్ణయానికే వదిలేశారని రాశారు. అనిల్కుమార్ సింఘాల్పై ఎలాంటి చర్యలకు కమిషన్ ఆదేశించకపోయినా, ఆయన కింద ఉన్న సీఈవో బాలాజీ, ధర్మారెడ్డి, జగదీశ్వర్రెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు సూచించడం ఆశ్చర్యకరం. బీఆర్ నాయుడు వ్యవహారాలపై, కొండపై రెండేళ్లుగా జరుగుతున్న అపచారాలపై కూడా దినేష్ కుమార్ విచారణ చేయాల్సింది. ⇒ చంద్రబాబు హయాంలో కిలో నెయ్యి రూ.321తో సరఫరా చేసిన హెరిటేజ్తో సంబంధం ఉన్న ఇందాపూర్ ఇప్పుడు కిలో నెయ్యి రూ.658తో ఎలా సరఫరా చేస్తోంది? అసలు ఇందాపూర్–హెరిటేజ్ సంబంధం ఏమిటి? దీనిపై కూడా దినేష్కుమార్ విచారణ చేయాలి. 2018లో చంద్రబాబు పాలనలోనే బోలేబాబాకు సంబంధించిన హర్‡్షప్రెష్ డెయిరీకి తలుపులు తెరిచి, ఆ సంస్థ నుంచి సుమారు 82 వేల కేజీల నెయ్యి సరఫరా జరిగిన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? 2019లో మా ప్రభుత్వం వచ్చాక ఒక్క డెయిరీ అయినా వచ్చిందా? ⇒ 2023లో నేను టీటీడీ చైర్మన్ అయ్యాక మళ్లీ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వైష్ణవి, ప్రీమియం, మావిగంగ డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయి కదా.. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ విధానం ప్రకారం స్థానిక డెయిరీలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము నిబంధనలు మార్చాము. నాణ్యత ప్రమాణాలు తగ్గించామని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ⇒ ఇప్పుడు మీరు చెబుతున్న ఆల్ఫా, ప్రీమియం డెయిరీలు 2014–2019 మధ్య 80 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేశాయి. అలాగే ఇందాపూర్, ఆల్ఫా, బోలేబాబా డెయిరీలు టెండర్లలో పాల్గొన్నది నిజం కాదా? ఈ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లతో కలిసి త్రిసభ్య కమిషన్ వేయండి. మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యిని పట్టుకుని, అదే నెయ్యిని తిరిగి లడ్డూ తయారీలో వాడారని సీబీఐ చెప్పింది. మీరు వెనక్కి పంపిన అదే నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా తిరుమలకు పంపించి లడ్డూలు తయారు చేయించింది మీరు కాదా? జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన నెయ్యినే మీరు ఉపయోగించారు. మా హయాంలో బీటా సైటోస్టెరాల్ పరీక్షల్లో లోపాలు తేలితే 18 సార్లు నెయ్యిని వెనక్కి పంపించాం. మీ హయాంలో కూడా 14 సార్లు తిరస్కరించారనే విషయం వాస్తవం కాదా? మేం ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుని ల్యాబ్లను ఆధునీకరించాం, ఎఫ్ఎస్ఎస్ఏఐతో కలిసి రూ.30 కోట్ల ల్యాబ్కు పునాదులు వేసింది కూడా మేమే. ఆ తర్వాత మీరు దేవాన్‡్ష పుట్టిన రోజున ఓపెన్ చేశారంతే. 2018లోనే మీరు రూ.4.5 కోట్లకు ఫ్లేవర్ ఝీ కొనుగోలు చేశారు. మీ లడ్డూ నాణ్యమైనదైతే అది ఎందుకు? ఈ ఏకపక్ష కమిషన్ అసలు ఉద్దేశం డైవర్షన్ రాజకీయాలే. ఇందాపూర్–హెరిటేజ్ బంధాన్ని దాచడానికే ఇదంతా. ఈ సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్నారు. -
చరిత్రలో శాశ్వత వెన్నుపోటుదారు ఏబీఎన్ రాధాకృష్ణ
సాక్షి, అమరాతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. రాధాకృష్ణను ఉద్దేశించి ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ‘రాధాకృష్ణా నీ బాస్కి, నీకు, రామోజీకి వెన్నుపోటుదారులనే బిరుదు చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు హీరోలంటూ ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా లాభం లేదు. ఎందుకురా బతుకంతా అబద్ధాలతో బతుకుతారు. ఛీకొట్టినా మీ బతుకులంతే. ఒక్క ప్రశ్న అడుగుతాను. నేను చేసిన తప్పేమిటి? ఒక్క రుజువు చూపించారా.పోనీ.. ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు వ్యతిరేకం అయితే టీడీఎల్పీ మీటింగ్ పెట్టి అందులో తమ నాయకుడిని ఎన్నుకోవచ్చు కదా? కనీసం అసెంబ్లీలో ఎన్టీఆర్ గారు ఏం చెప్పేవారో ఆయనను మాట్లాడనివ్వొచ్చు కదా? ఎన్నికల ముందే మీ సీబీఎన్ ఎమ్మెల్యే కాండిడేట్స్కు డబ్బులెందుకు పంచారు. వైశ్రాయ్ హోటల్లో లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కయి ఎమ్మెల్యేలతో బేరాలు చేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు హోటల్ దగ్గరకు వస్తే చెప్పులేసింది ఎందుకు? జర్నలిస్టులందరికీ నువ్వు(రాధాకృష్ణ) డబ్బు పంపిణీ చేసి తప్పుడు రాతలు రాయించలేదా? పార్టీ నుండి ఎన్టీఆర్ను సస్పెండ్ చేసింది మీ చంద్రబాబే కదా?. ఎన్నికల్లో రాష్ట్రమంతా నేను, ఎన్టీఆర్ ఇద్దరమే కదా తిరిగాము. ప్రజలు 256 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు.ఎనిమిది నెలలు తిరగకముందే నన్ను బూచిగా చూపించి ఆయన పదవి లాగేసిన నీచులు మీరు కదా? కష్టపడిన మా ఇద్దరి జీవితాలు నాశనం చేసిన దుర్మార్గులు మీరే కదా? నా తప్పేమిటో ఆ రోజే మీటింగ్లో పెట్టి ఉంటే తెలిసేది. అప్పుడు ఎన్టీఆర్ మీద, ఇప్పుడు జగన్ మీద మీ అబద్ధాల చెత్త పలుకులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముందు నీ చెత్తపలుకులో ఎన్టీఆర్ జామాత దశమ గ్రహం క్యాసెట్ మీద, ధర్మపీఠంలో స్వయంగా చెప్పిన వీడియో మీద ఒక పలుకు పలికితే జర్నలిస్ట్గా కొంచెమైనా న్యాయం పాటించిన వాడివి అవుతావు. ధైర్యం ఉంటే నా ఈ లెటర్ నీ పేపర్లో వెయ్యి. అయినా మీలాంటి వెన్నుపోటుదారులకు నిజాయితీ ఎక్కడుంటుంది. మీ పాపాలు పండే సమయం దగ్గర్లోనే ఉంది. అప్పుడు రాద్దువుగాని సరికొత్త పలుకు’ అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. -
రిటర్నబుల్ ప్లాట్లలో అక్రమ తవ్వకాలు
మంగళగిరి టౌన్ : అమరావతి రాజధాని ప్రాంతంలోని రిటర్నబుల్ ప్లాట్లతో సహా వివిధ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతో మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. అధికారిక అనుమతులు లేకుండానే జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో మట్టిని భారీగా తరలిస్తూ అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని తెలుసుకున్న రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయిన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో భారీ యంత్రాలతో మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మట్టి తవి్వతే మా గతేమిటంటూ రైతులు ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోక పోవడంపై రైతులు మండిపడ్డారు.తవ్వకాల వల్ల తమ ప్లాట్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వర్షం వస్తే చెరువుల్లా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి గుంతల భూములను ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే తమకు కేటాయించిన ప్లాట్లలో అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, గుంతలను పూడ్చి వేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియా ఇంత భారీగా తవ్వకాలు సాగిస్తోందంటే తప్పకుండా ప్రభుత్వ పెద్దల అండ ఉంటుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సరళంగా నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం
సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష నీట్ యూజీ–2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం సరళంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. గత ఏడాది పేపర్ కఠినంగా ఉందని, దానితో పోలిస్తే ఈ దఫా సులభంగా ఉందని పేర్కొన్నారు. దీంతో 2025తో పోలిస్తే ఈసారి కటాఫ్ పెరగనున్నట్టు తెలుస్తోంది. నీట్ యూజీ రాయడానికి దేశ వ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి దేశ వ్యాప్తంగా 5432 కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహించింది. ఊరటనిచ్చిన ఫిజిక్స్ గత రెండేళ్లుగాఫిజిక్స్ విద్యార్థులను భయపెడుతుండగా, ఈసారి మాత్రం కొంత ఊరటనిచ్చింది. ఫిజిక్స్ విభాగంలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్టు సబ్జెక్టు నిపుణులు తెలిపారు. గతేడాది అన్ని ప్రశ్నలూ కఠినంగా రాగా, ఈ సారి పది ప్రశ్నలు మాత్రమే కఠినంగా ఉన్నట్టు చెబుతున్నారు. జువాలజీ కూడా ఈ సారి తేలికగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. బయాలజీలో ప్రశ్నలను సులభం నుంచి మధ్యస్థంగా వర్గీకరించారు. ప్రశ్నలన్నీ పూర్తిగా ఎన్సీఈఆర్టీ పరిధి నుంచే వచ్చాయి. అయితే, గతంలోలా నేరుగా అడిగే ప్రశ్నల కంటే మ్యాచింగ్, అసెర్షన్–రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఆప్షన్ను నిశితంగా పరిశీలించాల్సి వచ్చిందని విద్యార్థులు వెల్లడించారు. ఇది తమ సమయాన్ని కొంత హరించిందని అభిప్రాయ పడ్డారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్–ఆర్గానిక్ ప్రశ్నలు నేరుగా వచ్చాయి. కానీ, ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని లెక్కలు సంక్లిష్టంగా ఉండటంతో సగటు విద్యార్థికి సమయం సరిపోలేదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద మలి్టపుల్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్పంగా కటాఫ్లు పెరుగుతాయి గత ఏడాదితో పోలిస్తే పేపర్ తేలికగా ఉంది. ఈ క్రమంలో కటాఫ్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. పేపర్ మధ్యస్థంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే రకమైన మార్కులు సాధిస్తారు. దీంతో కటాఫ్లు పెరిగే అవకాశం ఉంది. – కె.రవీంద్ర కుమార్, నీట్ కో–ఆర్డినేటర్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఆలస్యం.. విషం ‘నీట్’ రాయకుండానే వెనుదిరిగిన విద్యార్థిని ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకే విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష 2 గంటలకు అని సిబ్బంది చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థిని 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకుంది. అప్పటికే ప్రధాన ద్వారం మూసేశారు. లోపలికి పంపాలని సిబ్బందిని ఆ విద్యార్థిని, ఆమె తండ్రి ప్రాథేయపడ్డారు. అయినప్పటికీ పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
వెలగపూడి ప్యాలెస్లో ‘భూ’మాయాజాలం!
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలకు మాత్రం వారు ఎలా కావాలంటే అలా ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించడం.. అందులో మార్పులు చేయడం చేసేస్తోంది. దీనికి తార్కాణం రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో శాశ్వత సచివాలయం టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవంతులు నిర్మిస్తున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో, వెలగపూడికి సమీపంలో అత్యాధునిక వసతులతో రూ.వందల కోట్ల వ్యయంతో సీఎం చంద్రబాబు కుటుంబం 25 వేల గజాల్లో (5.17 ఎకరాలు) నిర్మిస్తున్న ప్యాలెస్సే అందుకు తార్కాణం. రాజధానిలోని వెలగపూడిలో కంచెర్ల సాంబశివరావుకు చెందిన సర్వే నంబరు 142–బీ, 142–సీ, 89లోని 4.41 ఎకరాలు, కంచెర్ల శాంతికిరణ్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 160, 163–బీ, 184–బీలోని 11.10 ఎకరాలు, కంచెర్ల ఓంకార్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 85, 89లోని 14.01 ఎకరాలు.. మొత్తం 29.52 ఎకరాలను భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఇందుకుగానూ రాజధాని ప్రధాన ప్రాంతం వెలగపూడిలో సర్వే నంబరు 111, 112, 113, 122, 150, 152, 239లోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతికిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ల కింద ఇచ్చింది. ఆ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు 2025 ఏప్రిల్ 2న కొనుగోలు చేశారు. ఆ మేరకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన భూమికి ఉత్తరం వైపున పాసివ్ జోన్ (హరిత ప్రాంతం), దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలం, తూర్పు వైపున 17 మీటర్ల రోడ్డు, పశ్చిమ వైపున 25 మీటర్ల రోడ్డును హద్దులుగా పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతాన్ని హరిత ప్రాంతంగా ఎవరి కోసం మార్చారు? నారా బ్రాహ్మణి 25 వేల గజాలను కొనుగోలు చేశాక ఆ ప్లాటు హద్దులు మారిపోయాయి. దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా సీఆర్డీఏ మార్చేసింది. 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలం హరిత ప్రాంతంగా మారిపోయింది. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. ఆ భూమి రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతంగా ఉండి ఉంటే.. ఎకరం చొప్పున రాజధానికి భూములు ఇచ్చిన ముగ్గురు రైతులకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించే అవకాశం ఉండేదంటున్నారు. చెరువుల్లో, ముంపు ప్రాంతంలో రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను.. ఆ ఖాళీ స్థలంలోకి మార్చే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రైతులు మండి పడుతున్నారు. ఇక భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన నివాస స్థలాలు (రెసిడెన్షియల్ ప్లాట్) గజం రూ.50 వేలు పలుకుతుందని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో సీఆర్డీఏ లెక్కగట్టింది. వాణిజ్య (కమర్షియల్) ప్లాట్ ధర రూ.2.70 కోట్లుగా చూపింది. ఎకరం భూమిని సమీకరణ కింద ఇచ్చిన రైతులకు.. పదేళ్లపాటు కౌలు కింద రూ.7,25,000, నివాస స్థలం (వెయ్యి గజాలు.. గజం రూ.50 వేల చొప్పున) రూ.5 కోట్లు, వాణిజ్య స్థలం రూ.2.70 కోట్లు వెరసి రూ.7,77,25,000 ప్రయోజనం చేకూరుతుందని సీఆర్డీఏ లెక్కలు వేసింది. ఈ లెక్కన 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేయడం వల్ల సీఆర్డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవ ధర గజం రూ.7,500 లేనా? లేక మోసం చేశారా?వెలగపూడిలో సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి 25 వేల గజాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారంటే గజం ధర రూ.7,500. అక్కడ రెసిడెన్షియల్ స్థలం ధర వాస్తవంగా గజం రూ.7,500లేనా అని మేధావులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే.. రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదాయపు పన్ను కూడా ఎగ్గొట్టినట్లేనని తేల్చి చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కోడలు కొనుగోలు చేసిన భూమి ధరను బట్టి చూస్తే.. ప్రధాన రాజధాని ప్రాంతంలో ఎకరం ధర రూ.3.63 కోట్లే. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.47,387 కోట్లను చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. ఈ లెక్కన ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాలంటే కనీసం 15 వేల ఎకరాలు అమ్మాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు లెక్కలు వేస్తున్నారు. కానీ.. రాజధాని ప్రాంతంలో అంత భూమి అందుబాటులో లేదు. ఈ లెక్కన అప్పు తీర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి.. అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నిధులు కేటాయించాల్సిందే. అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ సిటీ ఎలా అవుతుందని మేధావులు, ఆర్థిక వేత్తలు నిలదీస్తున్నారు. ఆ ఎకరం శ్మశానమే.. వెలగపూడిలో సర్వే నంబరు 163–బీలో ఎకరం శ్మశానం భూమి. ఇప్పటికీ ఆ భూమిలో సమాధులు ఉన్నాయి. రాజధాని భూ సమీకరణ కోసం వెలగపూడిలో 2015 జనవరి 3న సీఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్లోనూ 163–బీలో ఎకరం శ్మశానంగా స్పష్టం చేసింది. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమిని సమీకరిస్తూ జారీ చేసిన 9.22 ఫార్మ్లో మాత్రం ఆ భూమి కంచెర్ల శాంతి కిరణ్దిగా పేర్కొనడం గమనార్హం. ఎవరి ఒత్తిళ్లతో శ్మశానం భూమిని శాంతి కిరణ్కు చెందినదిగా మార్చారని వెలగపూడి రైతులు నిలదీస్తున్నారు. 163–బీలో శ్మశానం ఉన్న ఎకరం భూమి కంచెర్ల శాంతికిరణ్దిగా చూపుతూ.. దానికిగాను కేటాయించిన వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలంతోపాటు 25 వేల గజాలను కంచెర్ల శాంతికిరణ్ కుటుంబ సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కొనుగోలు చేయడం గమనార్హం. -
గత ప్రభుత్వ సంస్కరణల వల్లే ‘పది’లో ప్రభంజనం
సాక్షి, నెట్వర్క్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిశారు. వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు మంచి ఫలితాలనిస్తున్నాయి. నాడు–నేడు కార్యక్రమం వల్ల సమకూరిన మౌలిక వసతుల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. పేదింటి బిడ్డలు వెలుగులు విరజిమ్మారు. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చిన్నచూపే. చిన్నపాటి వర్షానికే కారే భవనాలు.. కుక్కలు, పందులతో పాఠశాల ప్రాంగణాలు.. తెల్లగా మారిపోయిన బ్లాక్ బోర్డులు.. చివరకు చాక్పీస్లకూ కొరతే.. పిల్లలకు బెంచీలుండవు.. అయ్యవార్లకు కుర్చీలుండవు.. పిల్లలకు కనీసం తాగడానికి మంచినీరు దొరికేది కాదు.అలాంటి దుస్థితిలో ఉన్న పాఠశాలలను 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ఇదివరకెన్నడూ లేనివిధంగా వేల కోట్ల రూపాయలతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సీబీఎస్ఈ స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఐబీ సిలబస్, విద్యార్థులకు ట్యాబ్లు, పిల్లలకు మధ్యాహ్నం గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం, జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్ తదితరాలన్నీ సమకూర్చింది.వీటిన్నింటితో పాటు సకల సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దింది. అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీ, ఫర్నిచర్, డెస్్కలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్, వాటర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఓ దశలో పలు పాఠశాలల్లో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు. వీటన్నింటికీ తోడు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దశ తిరిగింది.. దిశ మారింది వైఎస్ జగన్ ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 2022 నుంచి ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు పదో తరగతి ఫలితాల్లో గుత్తాధిపత్యం గల కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు రావడం మొదలైంది. దిగువ మధ్యతరగతి, పేదింటి పిల్లలు సైతం అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ప్రతి పాఠశాలలోనూ పిల్లలు మంచి మార్కులు సాధించారు. పలువురు విద్యార్థులు 596 మార్కులు సాధించారంటే ఇందుకు కారణం గత ప్రభుత్వ సంస్కరణలే అని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ట్యాబుల వల్లే మంచి మార్కులు సాధించా.. నాన్న శ్రీనివాసరావు గ్యాస్ డెలివరీ చేస్తారు. అమ్మ వెంకట అనంతలక్ష్మి గృహిణి. అమ్మ బీకామ్ చదివింది. క్లాస్లో టాప్లో ఉండాలని చెబుతుంటారు. జగన్ ప్రభుత్వంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ)లు వచ్చిన తరువాత మాకు ల్యాబ్ లేదన్న కొరత తీరింది. పాఠాలు చెప్పడం, వెంటనే వీడియోలో ప్లే చేయడం, ట్యాబ్లలో స్లిప్ టెస్టులు, స్పెషల్ టెస్టులు పెట్టేవారు. ఐఎఫ్పీలు, ట్యాబ్ల వల్ల మాకు క్విక్ రివిజన్ అయ్యేది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు–నేడు, నూతన విద్యావిధానం మాకెంతో ఉపయోగపడింది. మంచి బోధనా వసతులే కారణంనాన్న కోలా కులశేఖర్. అమ్మ సరోజమ్మ. మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు భారం కాకూడదని నాగలగుట్టపల్లె జెడ్పీ హైసూ్కల్లో చదివా. పదో తరగతిలో 595 మార్కులు సాధించా. ఉన్నత చదువులకు పేదరికం, ఆరి్థక సమçస్య అడ్డు గోడగా ఉంటోంది. కష్టపడి చదివి తొలుత డాక్టర్ వృత్తి చేపడతా. సివిల్స్కు ప్రిపేర్ అయి కలెక్టర్ అవుతా. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలో కల్పించిన మంచి బోధనా వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం బాగా చదవడానికి దోహదపడింది. నాడు–నేడు పథకంలో ప్రతి తరగతి గదికి ఇచ్చిన ఐఎఫ్పీ ప్యానల్ బోర్డు ద్వారా కల్పించిన విద్యాబోదన కూడా విజయానికి దోహదపడింది. గత ప్రభుత్వం వల్లే అధిక మార్కులుటెన్త్లో 600 మార్కులకు 595 మార్కులతో టాపర్గా నిలిచాను. మా పాఠశాలను గత ప్రభుత్వం ‘నాడు–నేడు’లో అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది. మా స్కూల్లో ప్రశాంత వాతావరణం కల్పించడంతో చదువుపై దృష్టి పెట్టాను. డిజిటల్ తరగతి గదులు, అత్యంత ఆధునికత ఉట్టిపడేలా టేబుళ్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఖర్చు చేస్తే కానీ చదవలేం. కానీ ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ వసతులు కల్పించారు. మా వంటి పేద విద్యార్థులకు ఇంతకంటే ఏం కావాలి. నాన్న రవికిశోర్ అకౌంటెంట్. అమ్మ ఉషారాణి గృహిణి. టీచర్ కావాలన్నదే నా ఆశయం. ‘సాక్షి’ మెటీరియల్ అద్భుతం మాది వ్యవసాయ ఆధారిత మధ్య తరగతి కుటుంబం. నాన్న కొర్రకూటి వెంకటేశ్వర్లు. అమ్మ లక్ష్మి గృహిణి. ఆరి్థక స్తోమత లేని కారణంగా ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో తెచ్చిన పటిష్టమైన విద్యా ప్రమాణాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. టెన్త్లో 600 మార్కులకు గాను 595 మార్కులొచ్చాయి. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ నా చదువుకు ఎంతో దోహదపడింది. ఉపాధ్యాయుల బోధనతో పాటు ‘సాక్షి’ మీడియా అందించిన స్టడీ మెటీరియల్ కూడా మంచి మార్కులు సాధించేందుకు సహకరించింది. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్నాను. వైఎస్ జగన్ ఉజ్వల భవితకు బాట వేశారునాన్న హరిప్రసాద్కు వ్యవసాయమే ప్రపంచం. సాధారణ గృహిణి అయిన అమ్మ రాజ్యలక్షి్మకి ఇల్లే ప్రపంచం. ఆకలి బాధతో చదువుకునే విద్యార్థులు మెరుగైన లక్ష్యాలను అందుకోలేరన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎంతోమంది విద్యార్థుల ఆకలి బాధను పౌష్టికాహారంతో తీర్చి మంచి మార్కులతో ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్దుకునేలా బాటలు వేసింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ర్యాంక్ సాధించడానికి గత ప్రభుత్వ విధానాలే బాటలు వేశాయి. 4వ తరగతి వరకు కొల్లూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఐఐఐటీ పూర్తి చేసి సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నా. జగన్ ప్రభుత్వం ముందు చూపు వల్లే..నాన్న దూళ్ల శ్రీనివాస్ వ్యవసాయ పనులకు వెళ్తారు. అమ్మ వీరవేణి గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. నేను టెన్త్ ఫలితాల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాఠశాలలను ‘నాడు–నేడు’లో అభివృద్ధి చేయడమే. చక్కటి అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ట్యాబ్లు, ఫుట్పాత్, చక్కటి మొక్కలు, సమావేశపు ప్రాంగణం, టేబుల్స్ వంటి మౌలిక వసతులతో సంపర జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. పాఠశాలను అత్యంత ఆధునిక వసతులతో తీర్చిదిద్దడంతో బాగా చదవుకోగలిగాను. పాఠశాలలో కల్పించిన ఆధునిక వసతులు ఎంతో ప్రేరణగా నిలిచాయి. మా చెల్లి కూడా ఇదే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. భవిష్యత్లో సీఏ చదవాలనుకుంటున్నాను. నాడు–నేడు నా జీవితాన్నే మార్చింది నాన్న చక్రపాణి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. అమ్మ పద్మావతి గృహిణి. నేను పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నా. టెన్త్లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం. ఇది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. ఐదో తరగతిలో చేరినప్పుడు పాఠశాలలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కిందనే కూర్చుని పాఠాలు వినేవాళ్లం. విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మంచి టేబుల్స్, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసింది. డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఐఎఫ్బీ ప్యానెల్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. 8వ తరగతిలో ట్యాబులు ఇచ్చారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు సబ్జెక్టులలో వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకునే దాన్ని. భవిష్యత్లో గైనకాలజిస్ట్ కావాలనుకుంటున్నాను. నాడు– నేడుతో బడి బాగుగత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అనుసరించిన విధానాలతో మా ఊరితోపాటు పాఠశాల బాగు పడింది. విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడంతోపాటు నాడు–నేడు పథకంలో మా పాఠశాలని కూడా బాగుచేయడం ఎంతో నచ్చింది. ఐఎఫ్పీలు, ట్యాబ్ల వల్ల మాకు క్విక్ రివిజన్ అయ్యేది. దీనివల్ల ఒత్తిడి ఉండేది కాదు. దీనివల్ల మేం ముందుకు సాగాం. చదివింది, విన్నది, చూసినది అన్నీ చక్కగా గుర్తుపెట్టుకోగలిగాను. 10వ తరగతి పరీక్షల్లో కంగారు లేకుండా బాగా రాయటానికి ఇవన్నీ దోహదపడ్డాయి. మొత్తంగా టెన్త్లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలబడటానికి గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విధానాలే కారణం. నాన్న వెంకట దుర్గారావు పెయింటింగ్ వర్కర్. తల్లి నాగలక్ష్మి బీఏ, బీఈడీ చేసి గృహిణిగా స్థిరపడ్డారు. యూపీఎస్సీలో మంచి ర్యాంకు సాధించడమే నా గోల్. వైఎస్ జగన్ హయాంలోనే కొత్త భవనాలు మాది పీలేరు. నాన్న ఆర్డీ మునిరాజ్ కడపలోని జగదీశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్. అమ్మ శైలజ గృహిణి. నేను 5వ తరగతి వరకు మదనపల్లె విజయభారతి ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదివా. తరువాత జెడ్పీ హైసూ్కల్లో చేరా. టెన్త్లో 595 మార్కులు సాధించా. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త భవనాలు వచ్చాయి. డిజిటల్ బోర్డులపై విద్యాబోధన కూడా చాలా బాగా అర్థమైంది.అప్పటి ప్రభుత్వం అందించిన ట్యాబ్లు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి. పాఠశాల రూపురేఖలు కూడా మార్చేశారు. చూస్తే బిల్డింగ్లతోపాటు వివిధ రంగులలో ఉన్న బెంచీలు, ఇతర పరిసరాలు బాగా ఉన్నాయి. అప్పట్లో మాకు ఇచ్చిన అన్ని వస్తువులు బాగా ఉపయోగపడ్డాయి. మాకున్న లాంగ్వేజ్లతోపాటు మిగతా సబ్జెక్టులు ఏవీ కష్టంగా భావించలేదు. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఐఐటీ సాధన దిశగా ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నా. డిజిటల్ విద్యతో ఉత్తమ ఫలితాలు గత ప్రభుత్వం ‘నాడు–నేడు’ పథకంలో భాగంగా కాకినాడ శ్రీనగర్లో ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన డిజిటల్ విద్య పదో తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించేందుకు ఎంతగానో దోహదపడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా 2023లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు కూడా ఇచ్చారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాను. సుద్ద ముక్కలు, బ్లాక్ బోర్డులు అవసరం లేకుండా మా పాఠశాలలో జరిగిన డిజిటల్ బోధన, కార్పొరేట్ పాఠశాలల్లో లేనివిధంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలను ‘నాడు–నేడు’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం కలిసొచ్చింది. మా నాన్న రామలింగరాజు ప్రైవేట్ ఉద్యోగి. తల్లి శ్వేత గృహిణి. వారిద్దరూ నాకెంతో స్ఫూర్తిని కలిగించారు. ఇంటర్లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చార్టర్డ్ అకౌంటెంట్గా స్థిరపడాలనేది నా ఆశయం. ప్యానల్స్ బాగా ఉపయోగపడ్డాయి టెన్త్లో 595 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న బ్రహా్మనందం చిన్న షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమ్మ సౌజన్య గృహిణి. వైఎస్ జగన్ హయాంలో నాడు–నేడు పథకాన్ని మా పాఠశాలలో బాగా అమలు చేశారు. తరగతి గదులలో టైల్స్ వేశారు. ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ)ల ద్వారా విద్యాబోధన మరింత మేలు చేసింది. పాఠాలు వినడంతో పాటు వీడియోలు కూడా చూడటం వల్ల మాకు మరింతగా అర్థమయ్యాయి. ట్యాబ్లు అందుబాటులో ఉండటం వల్ల మాకు తరచూ స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ కారణంగానే మాకు మంచి మార్కులు వచ్చాయి. భవిష్యత్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తాను. -
విశాఖ: జాకీతో లిఫ్ట్.. కుప్పకూలిన బిల్డింగ్
విశాఖ, సాక్షి: గాజువాక వికాస్నగర్లో ప్రమాదం జరిగింది. జాకీతో బిల్డింగ్ లిఫ్ట్ చేస్తుండగా భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ముగ్గురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షం
ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాలను వరుణుడు కాస్త చల్లబరిచారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు ( ఆదివారం) భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయి. కోనసామ జిల్లాల్లోనూ భారీ జల్లులు పడ్డాయి. అకాల వర్షాలతో పంట నష్టం ఉండే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. నల్లగొండ, పెద్దవూర, తిప్పర్తిలో భారీ జల్లులు కురిశాయి. గుర్రంపూడి, సూర్యాపేట, కోదాడలో కుండపోతగా జల్లులు పడుతున్నాయి. భారీగా కురిసిన వర్షం దాటికి హుూజుర్నగర్లో వృక్షాలు నేలకొరిగాయి. మిర్యాలగూడ, నకిరికేల్లో భారీ జల్లులు పడ్డాయి. సిద్ధిపేటలో భారీగా వర్షం కురవడంతో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. ఇన్నిరోజులు భానుడు భగభగలతో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వరుణుడు కరుణించడంతో కాస్త సేద తీరారు. -
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు’
రాయచోటి: పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి జరిగిందని, ఇది ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి నిదర్శమన్నారు ఎంపీ మిథున్రెడ్డి. నిన్న దశరధరామిరెడ్డికి తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారని, నిన్నే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు దాడి జరిగేది కాదన్నారు. కూటమి నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని, ఇప్పటివరకూ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి 40 స్టేషన్లలో తిప్పుతున్నారని, మరి ఇప్పుడు కళ్ల ముందే టీడీపీ మూకలు రెచ్చిపోయి ఒక వైఎస్సార్సీపీ నేతపై దాడి చేస్తే పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. -
టీటీడీ ఛైర్మన్ ఆఫర్.. అందుకే నకిలీ రిపోర్టు .. భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ తేల్చిందని వైఎస్సార్సీపిీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారిపోయిందని చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. చంద్రబాబు కంటే ముందే ఈ నివేదిక ఎల్లో మీడియాకు చేరిందన్నారు. దినేష్ కుమార్ అనే వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా దినేశ్ కుమార్ నివేదిక ఇచ్చారని తెలిపారు. రిపోర్టులో కక్ష పూరితంగానే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కారకులని చెప్పారన్నారు. దినేష్ కుమార్ అనే అధికారి పచ్చి అవినీతి అధికారిగా ముద్రపడిన వ్యక్తి అటువంటి వారికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే ఇలా రిపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు.సీబీఐ సిట్లో తమని దోషులుగా నిర్ధారించలేదని అందుకే చంద్రబాబు నాయుడు పన్నాగం పన్ని ఎలాగైనా తమను దోషులుగా నిలబెట్టాలనే ఈ కమిషన్ని నియమించారని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో సరైన విచారణ లేకుండా ఏకపక్ష నివేదిక ఇచ్చారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు అని చెప్పిన మిగతా వారిని మాత్రం ఎటువంటి విచారణకు పిలవలేదన్నారు. -
తెలుగురాష్ట్రాలపై భానుడి పంజా..!
తెలుగు రాష్ట్రాల్లో భానుడు దగదగలు మండిపోతున్నాయి. రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రెంటచింతల, కర్నూలు, చిత్తూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్, నల్లగొండ, నిజమాబాద్, కరీంనగర్లలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు మండిపోతుండడంతో ప్రజలెవ్వరూ ఏదైనా అత్యవరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బయిటకి రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ బయిటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. -
పచ్చమూకల పాశవికం
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అనుచర మూకలు కత్తులు, రాడ్లతో రెచి్చపోయాయి. వైఎస్సార్సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి పై హత్యాయత్నానికి తెగబడ్డాయి. కోర్టు స్టేటస్ కో విధించిన స్థలం వివాదం విషయంలో మంత్రి అనుచరులు జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో దశరథ రామిరెడ్డి తమ మాట వినడంలేదన్న అక్కసుతో సుమారు 100 మందికిపైగా యువకుల సాయంతో స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. స్టేటస్ కో ఉన్నా దౌర్జన్యంగా మంత్రి అనుచరులు ఆదినారాయణరెడ్డి, అతని భార్య సుమన భూమిలో నిర్మాణాలను చేపట్టడానికి యత్నిస్తున్నారని అన్నమయ్య జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీ, సీఐలకు శనివారం దశరథరామిరెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుపై పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని దశరథరామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డి ఆదివారం ఉదయం తన కళ్యాణమండపం ఎదురుగా ఉన్న నిర్మాణ ప్రాంతానికి వెళ్లి ప్రశ్నించడంతో అక్కడే ఉన్న పచ్చ మూకలు ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో దశరథరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతోపాటు కల్యాణ మండపం మేనేజర్ జాకీర్, అనుచరుడు దేరంగుల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మంది దశరథరామిరెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పచ్చమూకల దాడిలో గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న దశరథరామిరెడ్డి, ఆంజనేయులు, జాకీర్ను రక్షించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా యత్నించారు. పచ్చమూకల బరితెగింపుతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కళ్యాణ మండపంలో విధ్వంసం.. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడడంతోపాటు ఆయన కల్యాణ మండపంలోనూ పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మండపం తలుపులను ధ్వంసం చేసి అద్దాలను బద్దలు కొట్టారు. లోపల ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను పగలగొట్టారు. సమీపంలోనే ఉన్న దశరథరామిరెడ్డి వాహనాన్ని కూడా పగలగొట్టారు. 108 వాహనాన్నీ అడ్డుకున్నారు తీవ్రంగా గాయపడిన దశరథరామిరెడ్డితోపాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు వచి్చన 108 వాహనాన్నీ పచ్చమూకలు అడ్డుకున్నాయి. దీంతో దశరథరామిరెడ్డి భార్య విజయమ్మ కొంతమంది అనుచరులతో ఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న భర్తను, మరో ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై దశరథరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నుంచి ఎస్ఐ జహీర్బాషా వివరాలు సేకరించారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఆదినారాయణ రెడ్డి, అతని భార్య దౌర్జన్యంగా కల్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్మాణాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించడానికి వెళ్లిన తనపై ఆదినారాయణ రెడ్డి మంత్రి అనుచరులతో దాడి చేయించారని పోలీసులకు రాయించిన వాంగ్మూలంలో తెలిపారు. భూమన పరామర్శ తిరుపతి తుడా: టీడీపీ గూండాల హత్యాయత్నంతో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు. దాడి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, హత్యాయత్నాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని భూమని పేర్కొన్నారు. -
‘కట్టుకథలతో నాపై అట్రాసిటీ కేసు పెట్టారు’
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్లను కూడా రెడ్బుక్ వదల్లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు...ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదు’
సాక్షి, నెల్లూరు: ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ.. గుణపం పోటు పార్టీ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన వారిని మీ వెనుక వేసుకొని.. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడం కాదన్నారు. చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదని కాకాణి ఎద్దేవా చేశారు.గుణపం చంద్రబాబు చేతిలో పెడితే సింబాలిక్గా వుంటుంది. అమరావతిని గుణపంతో తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. దోపిడీ విజనరీతో అవినీతితో రాజ్యం ఏలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాలు పేరిట కాంట్రాక్టుల మాటున కొల్లగొడుతున్నారు’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి ధ్వజమెత్తారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)
-
మచిలీపట్నం: బాలుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో 9వ తరగతి విద్యార్ధి కిడ్నాప్ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. విద్యార్ధి కిడ్నాప్ వ్యవహారమంతా డ్రామాగా పోలీసులు తేల్చేశారు. చదువుపై ఆసక్తి లేక... ఇంట్లో చెప్పలేక.. భయంతో ఇంటి నుంచి విద్యార్థి వచ్చేశాడు. సైకిల్పై ట్యూషన్కు బయలుదేరి సైకిల్ను మచిలీపట్నం బస్టాండ్లో పెట్టిన ఆ బాలుడు.. బస్ ఎక్కి పెడన వెళ్లాడు. అక్కడ నుంచి రైలులో విజయవాడకు వచ్చాడు.విజయవాడ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురైన బాలుడు.. నిజం చెబితే ఏం తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో బాలుడు కిడ్నాప్ కథ అల్లాడు. ట్యూషన్కు వెళ్తుంటే తనను బైక్పై ఇద్దరు కిడ్నాప్ చేశారంటూ ఆ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఆ బాలుడు ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు.బంధువుల సాయంతో తల్లిదండ్రులు.. బాలుడిని మచిలీపట్నం తీసుకొచ్చారు. ఏం జరిగిందో ప్రశ్నించడంతో పోలీసుల ఎదుట బాలుడు నిజం ఒప్పుకున్నాడు. బాలుడు, తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. పిల్లలను నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని పోలీసులు సూచించారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026ని ఆదివారం దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతించరు. ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 22.80 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తారని అధికారుల అంచనా. గతేడాది ఏపీ నుంచి 57,934 మంది విద్యార్థులు నీట్ రాయగా, 36,776 మంది అర్హత సాధించారు. ఈసారి కూడా 55వేల మందికి పైగా విద్యార్థులు నీట్ రాసే అవకాశం ఉందని తెలుస్తోంది.డ్రెస్ కోడ్⇒ విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించాలి.⇒ పూర్తి చేతుల చొక్కా (ఫుల్ స్లీవ్స్), ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి.⇒ సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా పరీక్ష కేంద్రంలో ముందుగానే రిపోర్ట్ చేయాలి.⇒ స్లిప్పర్స్ లేదా ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి.నిబంధనలు ఇవే...పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి⇒ అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణ పత్రాలు).⇒ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్.నిషేధిత వస్తువులు⇒ మొబైల్ ఫోన్లు⇒ స్మార్ట్ వాచీలు⇒ ఎలక్ట్రానిక్ పరికరాలు⇒ క్యాలిక్యులేటర్లు⇒ ఇతర కాగితాలుబయోమెట్రిక్పై ఆందోళన వద్దుఏ కారణంతో అయినా బయోమెట్రిక్ నమోదుకాకపోతే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ నమోదు కాని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించి, లిఖితపూర్వకంగా అండర్టేకింగ్ తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన నమూనాను ప్రతి పరీక్ష కేంద్రానికి పంపినట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
‘పది’ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 7 వరకు గడువు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఈ నెల ఏడో తేదీలోగా తమ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్కు రూ .500, రీ–వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ కోసం పాఠశాల లాగిన్తో పాటు వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించినట్టు తెలిపారు. -
ప్రజలెన్నుకున్నవి కావు.. పాలకులెంచుకున్న ప్రభుత్వాలివి
అనంతపురం/అనంతపురం కల్చరల్: దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పాలకులు అపహాస్యం చేసి.. ప్రజల అభీష్టానికి విలువ లేకుండా చేశారని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, రానున్న రోజుల్లో స్వేచ్ఛగా మాట్లాడే రోజులు ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలక చర్చలు’ అనే అంశంపై వేర్వేరు సదస్సులు జరిగాయి. జీఆర్ ఫంక్షన్ హాలులో సలీం మాలిక్ నిర్వహణలో జరిగిన మొదటి సదస్సుకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్.. ‘రాజ్యాంగం–ఎన్నికలు–ప్రజాస్వామ్యం’, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ అనే అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించే వారని.. కానీ, ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు ఆలోచిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో నిమిషానికి మూడుకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని.. ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారమే 132 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇదెలా సాధ్యమో పాలకులుగానీ, ఈసీ కానీ చెప్పడంలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు తాము వేద్దామనుకున్న వారికి వారి ఓట్లు పడ్డాయో లేదో తెలియడంలేదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నిలదీయాలని పరకాల కోరారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ప్రకటించారని.. 2024 మే 13 రాత్రి 2.15 గంటల్లో 4.16 శాతం (17,19,482) ఓట్లు పోలయ్యాయన్నారు. ఇక తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మొత్తం మీద అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయనిపరకాల చెప్పారు. 90 శాతం నమోదైతేనే రీపోలింగ్ జరుపుతారని, కానీ ఏకంగా 130 శాతానికి పైగా నమోదైనా ఎలాంటి రీపోలింగ్ జరపలేదన్నారు. హిందూయేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతున్నారని తెలిపారు. పౌరుడిని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ అని విమర్శించారు.అమరావతిలో రూ.లక్షల కోట్ల వృథా..ఇక అమరావతిని బలవంతంగా రుద్దుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నా మే«ధావులు స్పందించకపోవడం బాధాకరమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ. రామచంద్రయ్య అన్నారు. అమరావతికి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలోని 15 నగరాలను అద్భుతంగా అభివృద్ధి చెయొచ్చన్నారు. అమరావతికి జనం వచ్చే అవకాశమేలేదని కుండబద్దలు కొట్టారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలపైనే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నారని, ఎక్కడా పారదర్శకతలేదని ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే ధరలు పెంచడం, పన్నులు రెట్టింపు చేయడమేనని విమర్శించారు. ఇక రెండో సదస్సు ‘ప్రజలకు దూరమవుతున్న వైద్యం’ అనే అంశంపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ఎం బాషా అధ్యక్షతన జరిగింది. -
108 ఆలస్యం... పోయిన నిండు ప్రాణం
టంగుటూరు: 108 వాహనం గంటన్నర ఆలస్యంగా రావడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు పంచాయతీ పరిధిలోని రాయివారిపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కట్టా శంకరమ్మ శనివారం సాయంత్రం ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక సాకు చెబుతూ వచ్చారు. చివరకు గంటన్నర ఆలస్యంగా 108 గ్రామానికి చేరుకోగా అప్పటికే ఆమె మృతి చెందింది.108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే తన తల్లి బతికేదని మృతురాలి కుమారుడు బాబూరావు కన్నీరు మున్నీరుగా విలపించాడు. కాగా రెండు రోజుల క్రితం కందుకూరుకు ఒక రోగిని దింపడానికి వెళ్తుండగా 108 వాహనం మార్గమధ్యంలోనే ఆగిపోయింది. వాస్తవానికి ఒంగోలు నుంచి వెళ్తూ సూరారెడ్డిపాలెంలోని ఐఓసీ పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకోవాల్సి ఉండగా 108 సిబ్బంది నిర్లక్ష్యంతో సింగరాయకొండలో నింపుకుందామని బయలుదేరారు. తీరా కందుకూరు కొంత దూరం ఉందనగా డీజిల్ ఆయిపోయి ఆగిపోవడంతో మరో వాహనంలో రోగిని తరలించాల్సి వచ్చింది. -
సొంత ఇలాకాలో ఆ ఫలితాలేంటి బాబూ..?
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటూ గొప్పలుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సొంత జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పది, ఇంటర్ ఫలితాలు షాకిచ్చాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం చిత్తూరు జిల్లా పరిధిలో ఉండగా.. ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు పది, ఇంటర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర సగటుతో పోల్చితే ఈ రెండు జిల్లాల్లో ఫలితాలు అట్టడుగు స్థాయిలో నిలవడం దీనికి కారణం. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను గాలికి వదిలేయడం వల్ల పేద విద్యార్థులు బలి అవుతున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. వంద రోజుల డ్రామా...ఫలితం జీరో! విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అంటూ హడావిడి చేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం గాలిలో మేడలు కట్టిన ఫలితం. పది, ఇంటర్ ఫలితాల్లో కనబడిందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించామని, అధికారులతో సమీక్షలు చేశామని చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అని ఫలితాలు నిరూపించాయి. టీచర్లపై రాజకీయ ఒత్తిళ్లు, విద్యా వ్యతిరేక విధానాల వల్ల క్షేత్రస్థాయిలో బోధన కుంటుపడుతోంది. ప్రపంచ స్థాయి రాజధాని, హైటెక్ విద్య అంటూ ప్రగల్భాలు పలికే సీఎంకు తన సొంత జిల్లాల విద్యార్థుల భవిష్యత్ పట్టడం లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలడం వెనుక అధికారుల పర్యవేక్షణ లోపం కంటే, ప్రభుత్వ విధానపరమైన వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోందని, ఇది భవిష్యత్ తరాలను దెబ్బతీసే అంశమని విమర్శలు వినిపిస్తున్నారు. ఫలితాలు విడుదలైన ప్రతిసారి ఫలితాలు తగ్గాయని పేర్కొనడమే తప్ప.. ఆ పతనానికి బాధ్యులెవరన్న ప్రశ్నను పాలకులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అట్టడుగు ఫలితాల తీరిది10వ తరగతి ⇒ చిత్తూరు జిల్లా ఫలితాల్లో గత ఏడాదిలో సాధించిన 24వ స్థానమే మళ్లీ దక్కింది. కేవలం 76.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగున 24 వ స్థానంలో నిలిచింది. 4,872 మంది ఫెయిల్ అయ్యారు. ⇒ తిరుపతి జిల్లా ఫలితాల్లో గత ఏడాది 19 వ స్థానంలో ఉండగా, ఈసారి ఏకంగా 20వ స్థానానికి దిగజారింది. 4,257 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.ఇంటర్మిడియట్ ⇒ చిత్తూరు జిల్లా ఇంటర్మిడియట్ ఫస్ట్ ఇయర్లో 22వ స్థానంలో నిలబడగా, సెకండ్ ఇయర్లో 24వ స్థానంలో ఉంది. రెండు సంవత్సరాలు కలిపి 7,247 మంది ఫెయిల్ అయ్యారు. ⇒ తిరుపతి జిల్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 8, సెకండ్ ఇయర్లో 11 వ స్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాలు కలిపి 11,813 మంది ఫెయిల్ అయ్యారు. ⇒ కుప్పం నియోజకవర్గంలోని చాలా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 25 శాతం నుంచి 40 శాతంగా ఉంది. -
విద్యుత్ కోతలకు ‘సాంకేతిక’ సాకులు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిసినా అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దీంతో విద్యుత్ను సక్రమంగా అందించలేకపోతోంది. సాంకేతిక సాకులు చూపించి జనానికి కోతలు తప్పవని సంకేతాలిస్తోంది. విద్యుత్ కోతలపై శనివారం మంత్రి రవికుమార్ చేపట్టిన సమీక్షలో అధికారులు చెప్పిన సాంకేతిక కారణాలే దీనికి తార్కాణం. ‘‘అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి..అకాల వర్షాల కారణంగా సమస్యలు తలెత్తి ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. అందుకే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.’’ అని విద్యుత్ పంపిణీ సంస్థలు సమాధానం చెప్పడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు అమలు చేయడంపై ‘సాక్షి’ కథనాలకు స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం డిస్కంల సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విద్యుత్ కోతలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది లేదే 2023 మే నెలలో భానుడి భగభగలు, వర్షాలు, ఈదురుగాలులు వంటి విపత్తుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎండల వల్ల అవుట్డోర్ వర్క్స్ ఆపేశారు. ఇళ్లల్లో ఏసీలు, ఎయిర్ కండిషనర్ల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడింది. రోజుకి విద్యుత్ వినియోగం 255 మిలియన్ యూనిట్లకు చేరింది. అయినా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. కరెంట్ వాడకం రోజురోజుకూ పెరిగినా గ్రిడ్ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండేలా చూసింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచింది. దీంతో వేసవిలో కూడా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించింది. -
కొండపై సొరంగాలు..
సాక్షి, టాస్క్ఫోర్స్: అటవీ భూముల్లో లభించే సహజ సంపదను కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు దోచేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో రంగురాళ్లు (క్రిస్టల్, క్వార్ట్జ్) కోసం కొండను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి రంగురాళ్లు తీసి హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్, పుణే, ముంబయి తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల సహాయ సహకారాలు, టీడీపీ ముఖ్య నేతల అండదండలతో ఆ పార్టీ స్థానిక నాయకులు రంగురాళ్ల అక్రమ వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తారన్నది జగమెరిగిన సత్యం. పచ్చని కొండను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. కొండపై సొరంగాలు తవ్వి రంగురాళ్ల సేకరణ దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో శంకరపురం అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా సుగాలీలు నివసిస్తుంటారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో రంగురాళ్లు నిక్షిప్తమైన కొండ ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండకు కన్నం వేయాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు రచించారు. ముఖ్యనేతలు రంగంలోకి దిగి కొండపై అక్రమంగా తవ్వకాలు జరిపేలా స్కేచ్ వేశారు. శంకరపురంతోపాటుగా భట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు, దాచేపల్లి గ్రామాల్లో ఎంపిక చేసుకున్న కూలీలను కొండపైకి తరలిస్తున్నారు.కొండ లోపలికి దిగి తవ్వకాలు జరిపేందుకు వీలుగా జనరేటర్లు, టార్చిలైట్లు కూడా ఏర్పాటు చేశారు. రోజూ కొండపై రంగురాళ్ల కోసం కూలీలతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండకు కన్నం వేసి వందల కిలోల రంగురాళ్లను బయటకు తీస్తున్నారు. కొండపై సుమారుగా 100 అడుగుల లోతులో కూడా సొరంగాలు తవ్వారంటే ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. సొరంగాల్లోకి వెళ్లిన కూలీలకు బ్లోయర్స్ ద్వారా కొండపై నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. లోపలి భాగంలో దాగి ఉన్న రంగురాళ్లు కనిపించేలా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదభరితంగా సొరంగాలు శంకరపురం కొండపై ఉన్న సొరంగాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ కూలీలు తీసిన సొరంగాల్లోకి వెళ్లిన పలువురు గాయాలపాలయ్యారు కూడా. కొందరు కూలీలు ఊపిరాడక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇవేవీ బయటకు రాకుండా చేస్తున్నారు. సొరంగాల్లో తవ్వకాలు జరిపే కూలీల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కూలీలను బెదిరించి... దోచుకుంటున్న టీడీపీ నేతలు శంకరపురం కొండను కొల్లగొట్టి రంగురాళ్లు తవ్వుకుని టీడీపీ నాయకులు భారీగా సంపాదిస్తున్నారు. కొండలో లభించే రంగురాళ్లలో నాణ్యతను బట్టి కేజీ రూ.1,000 నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. రూ.10 వేలు విలువ చేసే రాయి దొరికితే... టీడీపీ నాయకులు కూలీలను భయపెట్టి నామమాత్రపు డబ్బులు ఇచ్చి వారి శ్రమను దోచుకుంటున్నారు. వచ్చిందంతా మాదే అంటూ భయపెడుతున్నారు. మాకు తెలియకుండా రంగురాళ్లను అమ్మితే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక పొట్టకూటి కోసం కూలీలు టీడీపీ నాయకులు ఇచ్చింది తీసుకుంటున్నారు. ఆ నాయకులేమో హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, పుణే, గుజరాత్ తదితర ప్రాంతాలకు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులపాటు రంగురాళ్ల అమ్మకాలు జోరుగా జరుగుతుంటాయని కూలీలు చెబుతున్నారు. దాచేపల్లిలోని ఓ గొడౌన్లో టీడీపీ నేతలు భద్రపరచిన రంగురాళ్లను శుక్రవారం రాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన రంగురాళ్ల విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు కొండకు కన్నం వేసి కోట్లకు పడగలెత్తుతున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనమని పలువురు అంటున్నారు.అక్రమార్కులతో అటవీశాఖ సిబ్బంది చెట్టాపట్టాల్ శంకరపురం కొండపై టీడీపీ నాయకుల పర్యవేక్షణలో రేయింబవళ్లు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండపై తవ్వకాలు జరుపుతుంటే ఆ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. కొండ కింద తనిఖీల కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ బాక్స్ ఎప్పుడూ తాళం వేసినట్లుగానే కనిపిస్తుంది.కొండపైన తవ్వకాలు జరుగుతున్నా ఇక్కడి సిబ్బంది తనిఖీలు కూడా చేయకుండా వదిలేశారు. టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని అటవీశాఖ సిబ్బంది తిరుగుతుండటం వల్లే కొండపై తవ్వకాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. తనిఖీలు చేసినా... నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. రంగురాళ్ల తవ్వకాల్లో అటవీశాఖ సిబ్బందికీ వాటాలున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొండపై అక్రమ తవ్వకాలను అటవీశాఖ అధికారులు అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మక్కై ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండోఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోట్చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) కింద 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్షమందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్సీ గ్రూపులకు వెయ్యి కిసాన్ డ్రోన్లు, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి రూ.129 కోట్లతో 25 వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లు పంపిణీ చేశారు. కమీషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా, టెండర్ నిబంధనలను తారుమారుచేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్ డ్రోన్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ అర్హతగల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15–20 శాతం కమీషన్ (రూ.25 కోట్లకుపైగా) అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి.కమీషన్ల కోసం చైనా ఉత్పత్తులకు పచ్చజెండా 2025–26 సీజన్లో రూ.240 కోట్లతో ఎఫ్పీవోలు, ఎస్హెచ్జీ గ్రూపులకు వెయ్యి, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్లు, సీహెచ్సీలకు 164 హైకాస్ట్ మిషనరీ, 1,050 ట్రాక్టర్లతో పాటు 40 వేలకు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్ను బదిలీచేసి విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్ ఏజెన్సీగా ఏపీ ఆగ్రోస్ను తప్పించి వ్యవసాయశాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమీషన్లు దండుకోగా, రెండో ఏడాది ఎంపానల్మెంట్కు ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతోపాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20–25 శాతం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్ ద్వారా కంపెనీల నుంచి కమీషన్ దండుకుంటున్నారని సమాచారం. ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా.. భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్చేసిన కంపెనీలతో ఎంపానల్మెంట్ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హైప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ వీడర్/రీపర్, బ్రష్ కట్టర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్ వీడర్ ఎమ్మార్పీ రూ.36 వేలు కాగా, స్మామ్లో రూ.57,500గా, రూ.18 వేలున్న బ్రష్కట్టర్ ధరను రూ.25 వేలుగా నిర్దేశించారు.పనితీరుతో పనిలేదురైతులకు పంపిణీ చేసే పరికరాల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగడం లేదు. మన హార్వెస్టర్ల ద్వారా వరికోతలు చేస్తే ధాన్యం నష్టం 1.5 శాతం నుంచి 2 శాతం ఉంటే.. చైనా హార్వెస్టర్ ఉపయోగిస్తే ఈ నష్టం 7.5 శాతం ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా చైనా పరికరాలకే మొగ్గుచూపుతున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నారనే సాకుతో సామర్థ్యం లేని పరికరాలను నేరుగా చైనా నుంచి డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ మేరకు కంపెనీలు కోట్చేసే ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు ఏపీ ఆగ్రోస్ ద్వారా ఇటీవల పిలిచిన టెండర్లో స్ప్రేయర్లకు 12 శాతం జీఎస్టీతో ఎల్1 కోట్చేసిన ధర రూ.23 వేలు. ఇదే స్ప్రేయర్లను నేడు 5 శాతం జీఎస్టీతో కలిపి కమిటీ ఆమోదించిన ధర రూ.26 వేలు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. ఈసారి రూ.80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాయి. కాగా, ఆన్లైన్లో పిలవాల్సిన టెండర్లను పూర్తిగా ఆఫ్లైన్లో పిలిచారు. ఇక్కడ పరీక్ష నివేదికలు, ధరల కొటేషన్లు, స్పెసిఫికేషన్లు వంటి పత్రాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వీలు కల్పించారు. అదే ఆన్లైన్లో పిలిస్తే ఒకసారి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. తమకు పర్సంటేజ్లు భారీగా ఇచ్చే కంపెనీలకు మేలు చేసేందుకే ఈ విధంగా ఆఫ్లైన్లో టెండర్లు పిలిచారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
సింగిల్ బిడ్కే సై..
సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనోడైతే.. అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపుల తీరు. ఎన్ని నిబంధనలున్నా మనోళ్లయితే ప్రభుత్వ పెద్దలు ముందూవెనుకా ఆలోచించకుండా అస్మదీయ కంపెనీలకు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో ప్రజా సంపదను దోచిపెడుతున్నారు. వైద్య వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాంట్రాక్టు కథాకమామిషు ఏమిటంటే.. 2014–19 మధ్య పదేళ్ల కాలపరిమితితో వైద్యశాఖలో కాంట్రాక్టులు కట్టబెట్టిన సంస్థలకు, ఇప్పుడు మరో పదేళ్లకు కట్టబెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సుతో ఇప్పటికే పలు జీజీహెచ్ల్లో పీపీపీ క్యాథ్ల్యాబ్ సేవలు అందిస్తున్న ఓ సంస్థకు మరిన్ని జీజీహెచ్ల్లోనూ క్యాథ్ల్యాబ్ కాంట్రాక్టును కట్టబెట్టబోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జీజీహెచ్ల్లో పీపీపీ క్యాథ్ల్యాబ్లకు ఇటీవల వైద్యశాఖ టెండరు పిలిచింది. కాకినాడ జీజీహెచ్కు గత ప్రభుత్వంలోనే దాదాపు రూ.7 కోట్లతో క్యాథ్ల్యాబ్ను సమకూర్చారు. అంటే కాకినాడలో ప్రైవేట్ సంస్థ దీన్ని ఆపరేషన్, మెయింటెనెన్స్ చేస్తే చాలు.. మిగిలిన చోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థే క్యాథ్ల్యాబ్ సమకూర్చి సేవలు అందించాలి. జనవరిలో తొలిసారి టెండరు పిలిచి రద్దుచేశారు. రెండోసారి పిలిచిన టెండరులో ఇప్పటికే పలు జీజీహెచ్ల్లో క్యాథ్ల్యాబ్ సేవలు అందిస్తున్న సంస్థ మాత్రమే బిడ్ వేసింది. బిడ్ను వైద్యశాఖ ఆమోదించింది. ఇక కాంట్రాక్టు అవార్డ్ చేయడమే తరువాయి.అస్మదీయుడికి మేలు చేసేందుకు..కాకినాడ జీజీహెచ్లో రూ.కోట్ల విలువైన పరికరాన్ని గత ప్రభుత్వమే సమకూర్చింది. ఇలా అప్పట్లో అనంతపురం, కర్నూలు జీజీహెచ్లకు సమకూర్చిన క్యాథ్ల్యాబ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వీటిలో రోగులకు అందించే సేవలకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. గుండె సమస్యల బాధితులకు యాంజియో, స్టెంట్లు వేయడం, వివిధ రకాల చికిత్సలకు రూ.1.50 లక్షల వరకూ బిల్లులు వస్తున్నాయి. ఇలా కర్నూలులో మూడునెలలకు రూ.కోటి వరకూ నిధులు సమకూరుతున్నాయి. అనంతపురంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కోచోట నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ ఆదాయమే ఉంటోంది. అయితే, కాకినాడ క్యాథ్ల్యాబ్ను ప్రభుత్వమే నిర్వహించడానికి ఎంతో మెరుగైన అవకాశాలున్నప్పటికీ దీనితో పాటు, మిగిలిన చోట్ల పీపీపీలో అస్మదీయ సంస్థకు కట్టబెట్టాలని ప్రభుత్వం పెద్దలు నిర్ణయించారు. దీంతో ‘ముఖ్య’నేత కార్యాలయం డైరెక్షన్ మేరకు వైద్యశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు తెలిసింది. డీఎంఈలో తొలుత రూపొందించిన ప్రతిపాదనల్లో కాకినాడ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఫెసిలిటీ చార్జ్ కింద నెలకు రూ.6 లక్షల మేర ఆస్పత్రికి చెల్లించాలని, ఇతర నిబంధనలు కఠినంగా రూపొందించారు. అయితే, ఆ నిబంధనలు కాంట్రాక్టర్కు మేలు చేసేలా లేవని, నిబంధనల్లో పెద్దఎత్తున మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్, మెయింటెనెన్స్ చేస్తూ ఆస్పత్రికి కాంట్రాక్టు సంస్థ నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తే చాలని మార్చడంతో, అస్మదీయ సంస్థ రూ.వెయ్యి మేర అదనంగా కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఏఎస్ఆర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉండే కాకినాడ జీజీహెచ్లో నెలకు రూ.30 లక్షలకు పైగానే విలువైన క్యాథ్ల్యాబ్ సేవలు అందించే వీలుంటుందని వైద్యలు అభిప్రాయపడుతున్నారు. ఇలా పదేళ్లకు రూ.40 కోట్ల మేర కాంట్రాక్టు సంస్థకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటే, కేవలం 10 శాతంలోపే ఆస్పత్రికి ఫెసిలిటీ చార్జ్ చెల్లించనుంది.సింగిల్ బిడ్ వచ్చినా ఆమోదం..ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ పెద్దలు వైద్యారోగ్య శాఖను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అస్మదీయ, కమీషన్ల డీల్ కుదుర్చుకున్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. సాధారణంగా సింగిల్ బిడ్ వస్తే టెండరును రద్దుచేసి, మళ్లీ టెండరుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత క్యాథ్ల్యాబ్ టెండరులో అస్మదీయ సంస్థ దాఖలు చేసిన ఒక్క బిడ్నే ఆమోదించి కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ఇప్పుడు వైద్య వర్గాల్లో ఈ బాగోతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. -
‘చేనేత’లో అవినీతి మేత!
సాక్షి, అమరావతి: రాష్ట్ర చేనేత, జౌళి శాఖలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల నుంచి బదిలీలు, డిప్యుటేషన్ల వరకు అంతా అధికారులు, అధికార నాయకుల ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఈ తతంగంపై పలువురు ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టీడీపీ నేత గుజ్జుల శ్రీనివాసులు ఆప్కో చైర్మన్గా పనిచేసిన సమయంలో అక్రమంగా పవర్లూమ్ క్లాత్ను హ్యాండ్లూమ్ పేరుతో సరఫరా చేయడంపై సీఐడీ విచారణ జరిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా కోట్లాది రూపాయలు చెల్లింపులు జరపడం వెనుక కీలక అధికారుల నుంచి పలువురు నాయకుల వరకు వాటాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీలకు వసూళ్లు.. ఇవ్వలేదంటే వేధింపులు! అలాగే, ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు, డిప్యుటేషన్లకు కూడా చేనేత, జౌళి శాఖలోని ఓ కీలక అధికారి యథేచ్ఛగా వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సమాచారం. అలా వసూలు చేసిన మొత్తాలను అవుట్సోర్సింగ్లో నియమించిన వ్యక్తిగత సహాయకులు, బంధువుల ఖాతాల్లో జమ చేయించినట్లు తెలిసింది. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే వేధింపులు తప్పవని సిబ్బంది వాపోతున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ముగ్గురు అధికారులకు రావాల్సిన న్యాయమైన పదోన్నతులు ఇచ్చేందుకు కూడా రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం.బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఒక జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం, మరో జిల్లా అధికారిని కలెక్టర్ సిఫారసులకు కూడా వక్రభాష్యం చెప్పి బదిలీతో పాటు సస్పెండ్ చేయించడం వంటి చర్యలు ఆ శాఖలో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు ఏకంగా ఐదుగురు జనరల్ మేనేజర్లను మార్చడం, 23 మంది సిబ్బందిని సస్పెండ్ చేయడం వంటి దారుణాలకు పాల్పడ్డారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. నిధులూ పక్కదారి..? ఇక, ఆప్కో ప్రధాన కార్యాలయం ఆధునీకరణ పేరుతో భారీగా నిధులు మింగేసినట్లు ఆరోపణలున్నాయి. జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచి్చన నిధులను సైతం జిల్లా స్థాయిలో కార్యక్రమాలకు సరిగ్గా విడుదల చేయకుండా ‘వెనకేసినట్లు’ తెలిసింది. రూ.8 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను హైదరాబాద్లోని వ్యాపారికి బిల్లు, ఇన్వాయిస్ లేకుండా అప్పగించడంతో.. ఆ సొమ్ము ఇప్పటికీ ఆప్కోకు జమకాలేదని సిబ్బంది చెబుతున్నారు. చేనేత, జౌళి శాఖ, ఆప్కోలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పలువురు 37 కీలక ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
అర్హులపై వేటు.. అనర్హులకు చోటు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు గంగపుత్రుల నోట్లో మట్టికొడుతోంది. సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలను టీడీపీ కార్యకర్తలకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోంది. అధికారంలోకి రాగానే చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి వేట విరామం వేళ ఏటా రూ.20 వేల చొప్పున నిషేధ భృతి చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది తుంగలో తొక్కింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. ఈ ఏడాది మాత్రం అడ్డగోలుగా పార్టీ కార్యకర్తలను వేటకు వెళ్లే మత్స్యకారులుగా నమోదు చేసి వేట నిషేధ భృతిని కాజేసేలా కుట్రలకు తెరతీశారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతోనే టీడీపీ నేతలు దోపిడీకి తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అర్హుల సంఖ్యను భారీగా పెంచి రాష్ట్రంలోని 555 సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలుండగా.. 1.60 లక్షల కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడ్డాయి. 2023–24లో వేటకు వెళ్లే మత్స్యకార బోట్లు 23,209 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 29,252కు చేరింది. వాస్తవంగా మెకనైజ్డ్ బోట్లకు 18 మీటర్లకు పైబడి పొడవు ఉంటే 10 మంది, 18 మీటర్ల కంటే తక్కువ ఉంటే 8 మంది, మోటార్ బోట్లపై ఆరుగురు, ఇంజిన్లేని సంప్రదాయ బోట్లపై ముగ్గురు చొప్పున సిబ్బందికి వేట నిషేధ భృతి ఇవ్వాల్సిఉంది. ఈ పథకం మెకనైజ్డ్ బోటు యజమానులకు వర్తించదు.రిజిస్ట్రేషన్ కలిగిన బోట్లపై మార్చి 31 నాటికి 18–60 ఏళ్ల మధ్య వయసున్న వారికి వర్తిస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేట నిషేధ భృతిని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 1.29 లక్షల మంది అర్హత పొందగా.. వారి ఖాతాల్లో అరకొరగా జమ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అర్హుల జాబితాలో భారీగా అనర్హులను చేర్చి 29,252 బోట్లపై 1.57 లక్షల మంది ఆధారపడినట్టుగా లెక్కేశారు.క్షేత్రస్థాయి పరిశీలనలో 28,677 బోట్లపై 1.52 లక్షల మంది అర్హులున్నట్టుగా లెక్కతేల్చారు. అయితే, సోషల్ ఆడిట్ సందర్భంగా అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో జాబితాల్లోని పేర్లపై పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. నిజమైన లబ్ధిదారులను కాదని మైదాన ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కాని టీడీపీ అభిమానులు, కార్యకర్తలను జాలర్లుగా చిత్రీకరిస్తూ జాబితాల్లో నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.లేని బోట్లను ఉన్నట్టుగా చిత్రీకరించి..ఫిషింగ్ బోటు రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి, మరమ్మతుల అనుమతులు వంటి ప్రక్రియల్లో బ్రోకర్ల దందా సాగింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల సిఫార్సుల మేరకు ఇసుక బోట్లను సైతం చేపల బోట్లుగా నమోదు చేయడమే కాకుండా మూలన పడిన, వినియోగంలో లేని బోట్లను మనుగడలో ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారని చెబుతున్నారు. లేని బోట్లను సైతం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ వాటిపై మత్స్యకారులు ఆధారపడినట్టుగా నమోదు చేయించారని చెబుతున్నారు.ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వేట బోట్ల రిజిస్ట్రేషన్లలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 3 వేలకు పైగా బోట్లను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ బోట్లపై నిబంధనల మేరకు 6నుంచి 20 మంది వరకు నమోదు చేయాల్సి ఉండగా.. మైదాన ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తల పేర్లను ఈ జాబితాల్లో చేర్చి అర్హులుగా చిత్రీకరిస్తున్నారు.రూ.60 వేల బోటుపై.. రూ.1.20 లక్షలు కొట్టేసేలా..సంప్రదాయ బోట్ల పేరిట కూడా నిధులు కొట్టేసేందుకు సైతం టీడీపీ నేతలు కుట్ర పన్నినట్టు చెబుతున్నారు. వాస్తవానికి సంప్రదాయ బోటు తయారీకి రూ.60 వేలు ఖర్చవుతుందని అంచనా. ఆ బోటును ఇంజిన్ బోటుగా చిత్రీకరించి.. ఒక్కో బోటుపై ఆరుగురు చొప్పున చేపల వేటకు వెళ్తున్నట్టు లెక్కలు చూపి ఏకంగా ఒక్కో బోటుపై రూ.1.20 లక్షల నిషేధ భృతిని దోచేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు.‘మీకింత.. మాకింత’ అనే ఒప్పందాలతో స్థానిక మత్స్యశాఖ అధికారులతో టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తూ అనర్హులతో జాబితాలు తయారు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అర్హత పొందిన వారికి రూ.300 కోట్లకు పైగా జమ చేయనుండగా.. కనీసం రూ.50 నుంచి రూ.60 కోట్లు అనధికారిక బోట్లు, మత్స్యకారేతరుల పేరిట దారి మళ్లించేందుకు పథక రచన చేసినట్టు చెబుతున్నారు. ఈ భారీ కుంభకోణంపై ఇటీవల విశాఖలోని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని మత్స్యకారులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.విజిలెన్స్ విచారణ జరపాలిఅర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయి. బోట్ల రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలోనే అనర్హులను పెద్దఎత్తున అర్హుల జాబితాల్లో చేర్చారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపి.. వాస్తవంగా వేటకు వెళ్లే వారికి మాత్రమే నిషేధ భృతిని చెల్లించాలి.– వంకా గురుమూర్తి, అధ్యక్షుడు, రాష్ట్ర మత్స్యకార కార్మిక సంఘం -
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
సాక్షి, అమరావతి: భక్తులు గుళ్లలో కానుకలుగా సమర్పించే కోట్ల రూపాయలను తమకు కావాల్సిన వారికి దోచి పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే దేవదాయ శాఖలో టెండరు నిబంధనలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలో ఏటా అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్ పనుల నిర్వహణ, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్టుకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించింది. ప్రభుత్వ ముఖ్య నేతకు బంధువుగా ప్రచారంలో ఉన్న భాస్కరనాయుడికి సంబం«ధించిన పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ఆ పనులు కట్టబెట్టింది. ఇప్పుడు మరో 15 పెద్ద ఆలయాల్లో క్లీనింగ్ పనులను కూడా అదే తరహాలో ఆ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆ 15 ఆలయాలకు కూడా ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ఏడు గుళ్లలో క్లీనింగ్ పనుల కోసం ఉమ్మడిగా టెండర్లు నిర్వహించడం ద్వారా రెండేళ్ల కాలానికి దాదాపు రూ.100 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న ఆ సంస్థకు సగానికి సగం మిగులుతుందని అధికార వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా 15 గుళ్లకు కూడా ఉమ్మడి టెండర్లు ద్వారా మరో రూ.వంద కోట్లకు పైబడి పనులను ఆ సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నాడు నిబంధనలు మార్చి కట్టబెట్టేశారు – గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ గుడిలో క్లీనింగ్ పనుల టెండర్లు ఆ గుడి స్థాయిలో వేర్వేరుగా జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ విధానాన్ని మార్చి.. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. – ఈ ఏడు ప్రధాన ఆలయాలు రూ.60 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వార్షికాదాయం కలిగి, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్న 15 ఆలయాలకు ఏటా రూ.10 కోట్లకు పైబడి ఆదాయం ఉంటోంది. ఇవి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఒకే సంస్థకు ఇలా ముఖ్యమైన ఆలయాల క్లీనింగ్ పనులు అప్పగించడం చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పనే అని స్పష్టమవుతోంది. – తొలుత ఏడు ఆలయాలను అప్పగించేందుకు గత ఏడాది మే నెలలో దేవదాయ శాఖ టెండర్లు నిర్వహించింది. ఆ టెండర్లలో పేర్కొన్న నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన ఆ సంస్థకు అనుకూలంగా లేవని తేలడంతో ఏకంగా ఆ టెండరునే రద్దు చేశారు. తిరిగి నిబంధనలు సవరించి, జూన్లో మళ్లీ టెండర్లు పిలిచారు. అందులో పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థనే ఎల్–1గా నిలిచింది. – మరోవైపు.. అప్పుడు ఏడు గుళ్లకు కలిపి ఉమ్మడిగా టెండర్లు నిర్వహించే ప్రక్రియలో కేవలం పెద్ద సంస్థలు మాత్రమే టెండరులో పాల్గొనే అవకాశం ఉండేలా నిబంధనలు మార్చడంతో అంతకు ముందు ఆయా గుళ్లలో వేర్వేరుగా క్లీనింగ్ పనులు నిర్వహించిన సంస్థలు పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. ఉమ్మడి టెండర్ల విధానంలో పోటీ తగ్గడం వల్ల పెద్ద సంస్థలు అధిక ధరకు పనులు పొందేలా ప్రభుత్వమే మార్గ నిర్దేశం చేస్తోంది. – గుళ్లలో పారిశుద్ధ్య పనుల్లో నాణ్యత పెంచేందుకే ఉమ్మడి టెండర్లు నిర్వహించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుండగా.. వాస్తవానికి పనుల నాణ్యత తగ్గిపోయిందని దేవదాయ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడి పరిధిలోని వాష్రూంలో ఒక వ్యక్తి చనిపోతే నాలుగు రోజుల తర్వాత ఆ విషయం గుర్తించడం గమనార్హం. అంటే నాలుగు రోజుల పాటు అక్కడ పారిశుధ్య పనులే చేపట్టలేదని స్పష్టమవుతోంది. సరైన పర్యవేక్షణ ఉండి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉంటే వెంటనే ఆ ఘటన వెలుగు చూసేదని భక్తులు చెబుతున్నారు. – ఇప్పటికే కట్టబెట్టిన ఏడు ఆలయాలతో పాటు కొత్తగా మరో 15 ఆలయాల్లో పారిశుద్ధ్య పనులను ఒకే సంస్థకు అప్పగిస్తే పనుల పర్యవేక్షణ తగ్గిపోతుందని అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలను కాదనలేక ఈ విషయంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాలికల ఎన్రోల్మెంటే ఎక్కువ
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో అన్ని స్థాయిల్లో బాలికల స్థూల నమోదు (ఎన్రోల్మెంట్) నిష్పత్తి ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మహిళలు–పురుషులు–2025 నివేదిక వెల్లడించింది.జాతీయ స్థాయిలో మూడేళ్లుగా పునాది స్థాయిలో బాలురు, బాలికల స్థూల నమోదు నిష్పత్తి తక్కువగా ఉండగా ప్రాథమిక, మధ్య, ద్వితీయ స్థాయిల్లో బాలురు కన్నా బాలికల స్థూల నమోదు అత్యధికంగా నమోదు అవుతోందని నివేదిక స్పష్టం చేసింది. పునాది స్థాయి మినహా మిగతా స్థాయిల్లో ప్రాథమిక విద్యలో బాలురు కన్నా బాలికల స్థూల నమోదు మూడేళ్లుగా ఎక్కువగా ఉండటం విశేషం. -
సూరీడు సలసల
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎండల తీవ్రత కొనసాగింది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 45, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.4, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.3, చిత్తూరు జిల్లా తవణంపల్లె, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 44.1, వైఎస్సార్ కడప జిల్లా కలసపాడులో 43.9, బాపట్ల జిల్లా కారంచేడులో 43.7, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42.8, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వైఎస్సార్ కడప జిల్లాలో 34 మండలాలు, నెల్లూరులో 32, తిరుపతిలో 29, పల్నాడులో 26, ప్రకాశంలో 25, మార్కాపురంలో 21, నంద్యాలలో 20, కర్నూలులో 17, చిత్తూరు జిల్లాలోని 10 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. ఆదివారం గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాలకు తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
రఘురామ కృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ ఫైర్
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. దళితులను రఘురామకృష్ణ రాజు అవమానపరుస్తున్నారని,. అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. దీని పై తాను చంద్రబాబు నాయుడుని కలుస్తానని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తామన్నారు. రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి నష్టంగా నేను భావిస్తున్నానన్నారు. ‘రఘురామకృష్ణం రాజు దళితులను, క్రైస్తవులను అవమానిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక తెలుగు నేలపైనే కాదు దేశం చుట్టూ తిరుగుతున్నాయి. ఆకివీడులో మాల మాదిగల మీద అక్రమ కేసులు పెట్టారు. దళిత వర్గాలకు సంబంధించిన వాళ్లను ఏరకంగా ఇబ్బంది పెట్టినా వారు ఏ స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదు. 67 మందిని జైలుకు పంపడం దళిత వర్గాలను రెచ్చగొట్టడమే. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ అంశాలను ఉమ్మడిగా ఎదుర్కొంటాం’ అని హెచ్చరించారు. -
‘రాజధాని అమరావతి ఓ భ్రమ’
అనంతపురం: రాజధాని అమరావతి ఓ భ్రమ అని ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషకులు సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసమే అమరావతి పేరుతో రాజధాని ఎపిసోడ్ను తీసుకొచ్చారన్నారు. అనంతపురంలో జరిగిన ఓ సదస్సులో ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య ప్రసంగిస్తూ.. రాజధాని అమరావతి అనేది భ్రమ తప్పితే ఏమీ లేదన్నారు. ‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వందల కోట్లు వృథా చేశారు. 2014-19 మధ్య 33 వేల ఎకరాలతోనే సింగపూర్ తరహా రాజధాని చేస్తానన్నారు. ఇప్పుడు 33 ఎకరాలు ఉంటే మున్సిపాలిటీ అంటున్నారు. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారు. అమరావతి నిర్ణయాలు రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు. -
చంద్రబాబు ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారు: విడదల రజిని
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు. -
తాత్కాలికంగా ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన నిలిపివేత
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ-చెంచు డ్రైవర్ల మధ్య వివాదం చెలరేగింది. ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తిని ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లడానికి ఈడీసీ అధికారులు అనుమతించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలా అనుమతిస్తారంటూ చెంచు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం మొదలైంది.వివాదం ముదరడంతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును అటవీశాఖ సిబ్బంది వెనక్కి ఇచ్చేశారు. వివాదం సద్దుమణిగిన తర్వాతనే యాత్ర పున:ప్రారంభిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆలయం తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?
విశాఖపట్నం: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య గాయాలతో బయటపడింది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. కొమ్మాది శివశక్తినగర్కు చెందిన ఎస్.బలరామ్ (58) గాయత్రీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన తన భార్య తులసమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి ఆనందపురం వైపు బయలుదేరారు. పరదేశిపాలెం కూడలి వద్దకు చేరుకోగానే, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలరామ్కు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. వెనుక కూర్చున్న భార్య తులసమ్మకు గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆమె, తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మృతదేహంపై పడి బోరున విలపించడం సంఘటన స్థలంలో ఉన్న వారిని కంటనీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలు తులసమ్మను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రిలో చేర్పించారు. బలరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకోండయ్యా..!
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని జీరుపాలేం గ్రామానికి చెందిన దుమ్ము దుర్గారావు, సుమలత దంపతుల కుమార్తె లోయిస్కు అనుకోని ఆపద వచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల లోయిస్ బుధవారం ఇంటి డాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే పాప పరిస్థితి విషమంగా మారడంతో శ్రీకాకుళంలోని పలు ఆస్పత్రులకు తిప్పారు. చివరగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప తల లోపల రక్తస్రావమై నరం కట్ కావడంతో ఆపరేషన్ చేయాల్సి ఉందని, సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.తల భాగంలో ఈ చికిత్సకు ఆరోగ్య శ్రీ లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తండ్రి దుర్గారావుకు చేపల వేటే ఆధారం. ఖాళీ సమయంలో ఆటో డ్రైవర్గా వెళ్తుంటాడు. ఆర్థికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న వీరు దాతల సాయం కోరుతున్నారు. దాతలు 96523 66174 నంబర్కు ఫోన్చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్్కఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్ రెన్యూ రిజువంట్ స్పా సెంటర్లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్పరిధిలోని ఇన్నర్రింగ్రోడ్డు ఫేజ్–2 చిల్లీస్ సెంటర్ ఎదురు గల స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్్కఫోర్స్ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్లోని ఏ9 బ్యూటీఫుల్ సెలూన్ అండ్ స్పా –2 మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ, 11సెల్ఫోన్లు, స్పా నిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.. పాత పింఛన్లు సైతం తొలగించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.నమ్మించి చంద్రబాబు మోసం చేశారు: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం తొలగించింది. దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందచేశాం. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదు. మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. చంద్రబాబు వారిని మోసం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ఈనాడు పేపర్లోనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది?.పింఛన్లు తీసివేస్తే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏమి చేస్తున్నాడు? వైఎస్సార్సీపీ హయాంలో ఏమి జరగక పోయిన గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు కళ్ళు కనపడటం లేదా?. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. షో చేయటానికి చంద్రబాబు.. పింఛన్లు లబ్ధిదారులకు స్వయంగా ఇస్తున్నారుప్రచార ఆర్భాటాలు తప్ప.. అమలు లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్కూటమి హయాంలో అన్ని రకాల పింఛన్లు తొలగించారు. వైఎస్ జగన్ హయాంలో పింఛన్ల సంఖ్య పెంచారు. పింఛన్లు పెంచి ఇస్తున్నామని ప్రచార ఆర్భాటాలు తప్ప అమలు లేదు. దివ్యాంగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తాం అని మాట ఇచ్చి తప్పారు. కొత్తగా ఎవరికీ శాంక్షన్ చేయటం లేదు. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అనేది అబద్ధం. మహిళలను నమ్మించి చంద్రబాబు మోసం చేశారు. ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు.అయినా చంద్రబాబుకి చలనం లేదు: మల్లాది విష్ణు విజయవాడలో తొలగించిన పింఛన్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తుంది. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేసే వాస్తవాలు చెప్పేవారు. 33 లక్షల నూతన పింఛన్లు వైఎస్ జగన్ నాలుగేళ్లలో ఇచ్చారు. అర్హత ఉన్న వారు అందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి. మీ పత్రికలే వాస్తవాలు చెబుతున్నాయి అయినా చంద్రబాబుకి చలనం లేదు. విజయవాడలో ఉన్న అన్ని శాఖలు ప్రజల ఆదరణ కోల్పోయాయి. ఇసుక, బూడిద, మట్టి ప్రసాదం లాగా కూటమి నేతలు తినేస్తున్నారు. -
తిరుపతి భక్తులకు గుడ్న్యూస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది. నాందేడ్– తిరుచానూరు (తిరుపతి) 0715/16 ఎక్స్ప్రెస్ను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేవారు. దీంతో ఈ రైలు సంఖ్య 17633/34తో మే 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో ప్రస్తుతం గురు, ఆదివారాల్లో మాత్రమే రైలు ద్వారా తిరుపతి వెళ్లే భక్తులకు అదనంగా మరో సర్వీసు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ ప్రకటనపై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పెద్దపల్లి– కరీంనగర్– నిజా మాబాద్ సెక్షన్ నిర్వహణను సికింద్రాబాద్ డివిజన్ చూసుకుంది. ఇటీవల పలు డివిజన్ల పునర్వీవస్థీకరణలో భాగంగా పెద్దపల్లి– కరీంనగర్– నిజామాబాద్ సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి హైదరాబాద్ డివిజన్కు మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2017లో పూర్తయిన ఈ సెక్షన్ ఇకపై పూర్తిగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి రానుంది.రైలు రాకపోకలిలా17633 నాందేడ్ నుంచి తిరుపతి(తిరుచానూరు) వీక్లీ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి జంక్షన్కు ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు చేరుకుని, 10:15 నిమిషాలకు బయలుదేరుతుంది.17634 తిరుచానూరు (తిరుపతి)– నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుచానూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 7:45 నిమిషాలకు బయల్దేరి పెద్దపల్లి జంక్షన్కు మరుసటి రోజు(సోమవారం) ఉదయం 8:50 నిమిషాలకు చేరుకుంటుంది. 9:15 నిమిషాలకు నాందేడ్ వైపు వెళ్తుంది. దీంతో బాసర వెళ్లే భక్తులకు కూడా ఉపయోగంగా ఉంటుంది.ఈ వీక్లీ ఎక్స్ప్రెస్లో ఏసీ–1టైర్(1బోగి), ఏసీ–2టైర్(1 బోగి), ఏసీ–3టైర్(4 బోగీలు), ఆరు స్లీపర్ బోగీలు, నాలుగు సాధారణ బోగీలు, మొత్తానికి 16 బోగీలు ఉంటాయి.తిరుపతి నుంచి వచ్చిన రామగుండం, మంచిర్యాల, మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు (రెబ్బెన), రేచినీ రోడ్డు (తాండూరు), సిర్పూర్ కాగజ్నగర్ భక్తులు పెద్దపల్లి జంక్షన్లో ప్రతి సోమవారం 17634 తిరుచానూరు– నాందేడ్ ఎక్స్ప్రెస్ దిగిన వెంటనే 17011 హైదరాబాద్– సిర్పూర్ కాగజ్నగర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి అవకాశముంటుంది. ప్రతి సోమవారం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి రామగుండం మధ్య గల స్టేషన్లలోని ప్రయాణికులు బాసర వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది.శనివారం రాత్రి 17634 నాందేడ్ నుంచి తిరుచానూ రు ఎక్స్ప్రెస్ ద్వారా బాసర నుంచి వచ్చే భక్తులు రా మగుండం, మంచిర్యాల, మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు, రేచిని రోడ్డు, సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ టౌన్ వెళ్లే వారికి పెద్దపల్లి జంక్షన్లో దిగిన తరువాత ఒక గంటన్నర తరువాత 17035 కాజీపేట– బల్లార్షా ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది, ఇది కనెక్టింగ్ రైలుగా ఉంటుంది. -
హిజ్రాతో సహజీవనం.. ఆపై హత్య
ప్రకాశం జిల్లా: హిజ్రాతో రెండేళ్లపాటు సహజీవనం చేసిన వ్యక్తి అనుమానంతో కడతేర్చిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపిన ప్రకారం... ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పెదలాటరపికి చెందిన పొట్లూరి అంకయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతనికి కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డికాలనీకి చెందిన రాపూరి పేరయ్య అలియాస్ పేరమ్మ అలియాస్ ప్రియ (26)తో పరిచయమై, ఇద్దరూ సహజీవనం చేశారు. ఇటీవల ప్రియ మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందంటూ అంకయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మాట్లాడాలంటూ ప్రియని గతనెల 27న కందుకూరుకు రప్పించాడు. పట్టణంలోని పోతురాజుమిట్ట వద్ద నివాసం ఉంటున్న అంకయ్య పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుందాం అంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రియ గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లాడు. డాక్టర్లు చనిపోయిందని చెప్పడంతో మరో అంబులెన్స్ మాట్లాడుకుని ప్రియ తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించి ఉడాయించాడు. అయితే ప్రియ మెడపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆమె తండ్రి అంజయ్య కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు అంకయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. -
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)
-
క్రెడిట్ చోరీ, డీజిల్ చోరీ, కొత్త అప్పులు, కేసులు, వేధింపులు.. ఇవేనా సార్ మన లక్ష్యాలు, కొత్త లక్ష్యాలు!
క్రెడిట్ చోరీ, డీజిల్ చోరీ, కొత్త అప్పులు, కేసులు, వేధింపులు.. ఇవేనా సార్ మన లక్ష్యాలు, కొత్త లక్ష్యాలు! -
కుట్ర ‘పన్ను’.. కొల్లగొట్టు!.. రవాణాలో ‘ట్యాక్స్’ డీల్
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ ఖజానా నిండితే నాకేంటీ... నా సొంత ఖజానా కళ కళలాడాలి గానీ’ అని ప్రభుత్వంలో ఓ కీలక నేత భావించారు. రాయలసీమకు చెందిన ఆయన అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్తో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ ట్రావెల్స్పై పన్నులు తగ్గించేందుకు పచ్చ జెండా ఊపారు. ప్రతిగా రూ.18కోట్ల డీల్ సెటిల్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ బస్సుల రిజిస్ట్రేషన్ను రాష్ట్రానికి మార్చాల్సిన అనివార్యతను ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా అమలు చేసి, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చే సదవకాశాన్ని కాలరాశారు. రవాణా శాఖలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇదిగో ఇలా ఉంది...ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్... ఏపీలో సర్వీసులురాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవనే విషయం బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్తోపాటు ప్రధాన రాష్ట్రాల్లో పన్నుల కంటే ఈశాన్య రాష్ట్రాల్లో పన్నులు తక్కువగా ఉండటమే అందుకు కారణం. ప్రైవేట్ బస్సుల్లో ఒక్కో సీటుకు త్రైమాసికానికి రూ.4వేలు చొప్పున పన్ను చెల్లించాలి. ఆ లెక్కన ఒక్కో బస్సుకు మూడు నెలలకు రూ.1.50 లక్షల చొప్పున ఏడాదికి రూ.6 లక్షలు చెల్లించాలి. కాగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్లో బస్సుకు రూ.56 వేలు, అరుణాచల్ ప్రదేశ్లో రూ.50 వేలు మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు.అందుకే రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన విధాన నిర్ణయాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వన్ నేషన్.. వన్ పర్మిట్ కింద కేంద్ర ప్రభుత్వానికి రూ.90 వేలు చెల్లిస్తే చాలు ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసినా దేశవ్యాప్తంగా సర్వీసులు నిర్వహించుకోవచ్చు. రాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న 2,200 ప్రైవేటు బస్సుల్లో 1,800 బస్సులకు పైగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవే కావడం గమనార్హం. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా ఏటా రూ.100కోట్ల మేర నష్టపోతోంది.కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ట్రావెల్స్ దందాకు చెక్రాష్ట్ర అధికారులు కచ్చితంగా వ్యవహరిస్తే చాలుకాగా అఖిల భారత పర్మిట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన విధాన నిర్ణయాన్ని సవరించింది. ఏ రాష్ట్రంలో బస్సులను రిజిస్ట్రేషన్ చేస్తారో... ఆ రాష్ట్రంలో నెలలో కనీసం అయిదు రోజులపాటు సర్వీసులు నిర్వహించాలని పేర్కొంది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ దందాకు చెక్ పడింది. ఎందుకంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను నెలలో అయిదు రోజులపాటు ఆ రాష్ట్రాల్లో తిప్పాలి. ఆ రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు కనీసం మరో అయిదు రోజులు పడుతుంది. అంటే నెలలో పది రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్కు వెలుపల బస్సులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రాలకు ప్రయాణికులు దాదాపు ఉండరు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది.పది రోజుల సర్వీసుల రాబడి కోల్పోవడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చుతో తడిసిమోపెడవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ పన్నులతో వచ్చే మిగులు కంటే ఈ ఆర్థిక భారం అధికం. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సుల రిజిస్ట్రేషన్ను ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు చేయాల్సింది... కేంద్రం తాజాగా జారీ చేసిన నిబంధనలను ట్రావెల్స్ యజమానులు కచ్చితంగా పాటిస్తున్నారా లేదా అంటే.. నెలలో అయిదు రోజులపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహిస్తున్నారా లేదా అని విస్తృతంగా తనిఖీలు చేయడమే. నిబంధనలను పాటించని బస్సులపై జరిమానాలు విధించడమే. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సుల రిజిస్ట్రేషన్ను ఆంధ్రప్రదేశ్కు మారుస్తారు.కీలక నేత రూ.18 కోట్ల డీల్ ... ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.100 కోట్ల గండిఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులపై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కుగానీ ఇతర దక్షిణ భారత రాష్ట్రాలకు ఏమాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం కొనసాగిస్తే చాలు.. ఖజానాకు ఆదాయం వస్తుంది. ఇదే విషయాన్ని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. కానీ ‘ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తే నాకేంటీ అని ప్రభుత్వంలో ఓ కీలక నేత భావించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన సొంత ఖజానా నింపుకునే పనిలో పడ్డారు. అదే విషయాన్ని తనతో సంప్రదింపులు జరిపిన ట్రావెల్స్ సిండికేట్కు స్పష్టం చేశారు. తనకు భారీగా ముడుపులు ముట్టజెప్పితే ట్రావెల్స్ బస్సులపై పన్నులు తగ్గిస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒక్కో బస్సుకు రూ.లక్ష చొప్పు¯]∙ఇస్తే.. ఒక్కో సీటుపై పన్నును రూ.4వేల నుంచి రూ.2,500కు తగ్గిస్తామని ఆయన తన రేటు స్పష్టం చేశారు.అందుకు ట్రావెల్స్ సిండికేట్ సమ్మతించింది. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్తో రాష్ట్రంలో దాదాపు రూ.1,800 ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. బస్సుకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18కోట్లకు డీల్ను సూత్రప్రాయంగా ఆమోదించారు. దీంతో పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కీలక నేత రవాణా శాఖ అధికారులను మౌఖికంగా ఆదేశించారు. ఇక పన్ను రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడటం.. కీలక నేతకు రూ.18కోట్లు ముడుపులు ముట్టడమే మిగిలింది. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఏటా రూ.100 కోట్ల గండి పడనుంది. -
ఈ షాడో మంత్రి ఓ కంత్రి!
సాక్షి, అమరావతి : అతనో కంత్రి.. కానీ, తానే మంత్రినన్నట్లుగా పెత్తనం. ప్రభుత్వోద్యోగాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి అంతా ఇంతా కాదు. గ్రూప్–1 అధికారిగా తోటి ఉద్యోగులనే వేధించి డబ్బుల కోసం పీడించిన ఘన చరిత్ర ఆయనది. అందుకే మంత్రి ఓఎస్డీగా నియమిస్తున్నప్పుడు రాష్ట్ర నిఘా వ్యవస్థ అతనిపై నెగిటివ్ రిపోర్టు ఇచి్చంది. అయితే, విద్యాశాఖ మంత్రి ఇష్టపడి మరీ ఓఎస్డీగా పెట్టుకోవడంతో ఉన్నత విద్యకు ఆయన రాక పెనుశాపంగా మారింది.ప్రస్తుతం విద్యాశాఖలో షాడో మంత్రిగా చక్రం తిప్పుతున్న సదరు ఓఎస్డీ తన హోదాను మరిచి ప్రవర్తిస్తుండటం, నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆదేశాలిస్తుండడంతో ఉద్యోగులు, విద్యావేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తనకు సంబంధంలేని అంశాల్లో పదేపదే తలదూరుస్తూ నోటికొచి్చనట్లు తూలనాడడం ఉద్యోగులను కలవరపరుస్తోంది. ఉన్నత విద్యా వ్యవస్థల్లో సర్వసాధారణంగా చేపట్టే పనులను సైతం తన అనుమతిలేకుండా చేస్తే ‘సార్ ఊరుకోవట్లేదు’.. ‘రూల్స్ మాట్లాడొద్దు.. నా మాటే రూల్’ అంటూ శాసించే స్థాయికి ఆయన వచ్చేశారు.అంతు చూస్తానని బెదిరింపులు..వాస్తవానికి.. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హోదా కార్యదర్శి కంటే పెద్దది. అలాంటి చోట గౌరవ మర్యాదలతో వ్యవహరించాల్సిన గ్రూప్–1 కేడర్కు చెందిన ఈ ఓఎస్డీ.. తాను ఫోన్చేస్తే మంత్రితో ఎలా వ్యవహరిస్తారో అలాగే నడుచుకోవాలని హుకుం జారీచేస్తున్నారు. అర్ధరాత్రి.. అపరాత్రి తేడా లేకుండా ఫోన్లుచేసి మరీ నోటికొచి్చనట్లు మాట్లాడుతున్నారని వర్సిటీల అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులు గగ్గోలు పెడుతున్నారు. నోట్ఫైల్ ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ నోటిమాట ద్వారా తాను చెప్పింది చేసేయాలని లేకుంటే ఉద్యోగాలు ఊడగొడతానంటూ బెదిరింపులకు తెగబడుతున్నారు.ఇది తప్పని ఎవరైనా చెబితే అంతుచూస్తానంటూ హెచ్చరించడం సర్వసాధారణమైపోయింది. ఒక వ్యవస్థ దగ్గర లేని అధికారానికి బాధ్యతను అంటగట్టి బలిపశువును చేస్తూ ఫోన్లో ఇష్టమొచ్చినట్లు చిందులేయడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఉన్నత విద్యాశాఖలో జీఓ నెం–3 ద్వారా వర్సిటీల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా ఉన్నత విద్యా కమిషనరేట్కు బదిలీ అయ్యింది. అయితే, సదరు ఓఎస్డీ ఉన్నత విద్యామండలికి ఫోన్చేసి వర్సిటీ సమగ్ర డేటాను తీసుకురావాలని మౌఖికంగా ఆదేశించారు. ఇది తమ పరిధిలో లేదని, చైర్మన్ అనుమతిలేకుండా ఎలాంటి డేటా ఇవ్వలేమని చెప్పడంతో సదరు ఓఎస్డీ ఫోన్లోనే వీరంగం వేసేశారు.మంత్రి అపాయింట్మెంటూ దొరకట్లేదుఇదిలా ఉంటే.. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి అపాయింట్మెంట్ కూడా ఈయనవల్ల దొరకట్లేదు. ఎంతటివారైనా ఓఎస్డీని కలవాల్సిందే. వినతిపత్రాలు ఆయనకే ఇవ్వాలి. అందుకే ఓఎస్డీ అడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. పాఠశాలలు, కళాశాలల అనుమతులను కావాలనే అడ్డుకోవడం ద్వారా భారీగా ముడుపులు దండుకోవడం రివాజైపోయింది. అలాంటి ఓఎస్డీ ఉన్నత విద్యాశాఖను శాసిస్తుండడం విద్యా వ్యవస్థకు ఎనలేని చేటుచేస్తోంది.ఓఎస్డీ ఆడింది ఆట.. పాడింది పాట..గతేడాది ఓఏఎండీసీ (డిగ్రీ) ప్రవేశాల సమయంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అనుమతులు ఇవ్వడంలో జాప్యంచేస్తే సదరు ఓఎస్డీ ఉన్నత విద్యామండలి అధికారులను నోటికొచి్చనట్లు తిట్టిపోశారు. ఇలా 20–30 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన, విద్యా రంగంలో అనుభవం కలిగిన వ్యక్తులను సైతం అత్యంత హేయమైన పదజాలంతో మాట్లాడడం తమను మానసిక క్షోభకు గురిచేస్తోందని వారు వాపోతున్నారు. కొందరైతే.. ఓఎస్డీ నుంచి ఫోన్ వస్తే చాలు భయంతో వణికిపోయి అనారోగ్యం పాలవుతున్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల నుంచి రూ.1,500 కోట్ల మేర నిధులు లాక్కోవడంలో సదరు ఓఎస్డీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. డబ్బులిచ్చే వరకు ఉన్నత విద్యామండలి, వర్సిటీల అధికారులను మాటలతో చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్లో నిధులు డిపాజిట్ చేస్తే 7.75 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికి ఆ తర్వాత 7.55 శాతానికే పరిమితం చేసేశారు. ఇప్పుడది మార్చమని వర్సిటీలు, అధికారులు కోరుకుంటే సదరు ఓఎస్డీ ‘నన్నే ప్రశ్నిస్తారా? మీ సంగతి తేలుస్తా’నని హెచ్చరించడం కొసమెరుపు. -
‘బండ’ బాదుడు
సాక్షి, అమరావతి : వాణిజ్య సిలిండర్ ధర అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా రూ.993 పెరిగింది. గడిచిన 22 నెలల్లో ఈ గ్యాస్ ధర మూడుసార్లు పెరిగినట్లయింది. తాజా పెరుగుదలతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ రూ.3,315 పలుకుతోంది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెంపుతో హోటల్ రంగం కుదేలయ్యిందని స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితులతో హోటళ్ల యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.హోటల్ వ్యవస్థను కాపాడుకోవడానికి మెనూ ధరల్లో 10 శాతం పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పన్ను రాయితీలు, సబ్సిడీలిచ్చి హోటల్ రంగాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడటానికి, హోటళ్లను ఆర్థిక నష్టాల నుంచి బయటపడేయటానికి గత్యంతరంలేని పరిస్థితుల్లో రేట్లు పెంచుతున్నామన్నారు. వంట నూనెలు, నిత్యావసరాలు, ప్యాకింగ్ మెటీరియల్ ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. -
రోడ్డుపై లారీలను పరిశీలించే విధులూ సచివాలయ ఉద్యోగులకే..
సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థ లక్ష్యానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లుపొడుస్తోంది. ఉద్యోగులకు సంబంధం లేని బాధ్యతలు అప్పగిస్తూ చిన్నచూపుచూస్తోంది. మొన్నటికి మొన్న పల్నాడు జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల వద్ద విధులు వేసిన ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో వింత విధులు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీపీసీ యార్డు నుంచి ఫ్లైయాష్ నింపుకొని వచ్చి పోయే లారీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారమిచ్చేందుకు కాపలా కాసే బాధ్యత కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల నెత్తినే పడింది.అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్ వద్ద గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు ఈ పనిచేసేందుకు 18 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరొకరు చొప్పున రోజుకు ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగించారు.సచివాలయ ఉద్యోగులకు లారీలను పరిశీలించే విధులు అప్పగిస్తూ పరవాడ ఎంపీడీవో జారీ చేసిన ఉత్తర్వులు ఫ్లై యాష్ లోడుతో వెళ్లే లారీలపై టార్పాలిన్ లేకపోతే ఆ లారీ వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని పరవాడ ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై యాష్ రవాణాతో ప్రజలు, జంతువులకు ఇబ్బంది కలుగకుండా, ప్రమాదాలను నివారించేందుకే సచివాలయాల ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించామనిఎంపీడీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు, విలేజీ సర్వేయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు లేని లోటును భర్తీ చేయడానికి 1.32 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను అడ్డంగా వాడుకుంటున్నారే తప్ప, కనీస హక్కులను పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, కనీసం బేసిక్ పే సవరణ కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.మరోవైపు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలో చేరిన తమకు మరుగుదొడ్లు, పెట్రోల్ బంకుల వద్ద డ్యూటీలు వేయడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అవకాశమే ఇవ్వడం లేదని పేర్కొన్నారు.పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, పదోన్నతులు కల్పించాలని.. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా, శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగులు ‘చలో విజయవాడ’, నిరాహార దీక్షలకు పూనుకుంటామని పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు
గంపలగూడెం: చంద్రబాబు, కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో పర్యటించి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆరా తీశారు. స్థానిక మార్కెట్యార్డులో వారాల తరబడి మొక్కజొన్న, ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడి చలించిపోయారు.అమ్మిరెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలంగాణలో మొక్కజొన్న క్వింటా రూ. 2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ రైతులకు రూ.1500 కూడా దక్కడం లేదన్నారు. ధాన్యం ఎక్కడపడితే అక్కడ రాశులు పోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను పట్టించుకునే నాధుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.రైతుల ఇబ్బందులు పట్టవా?సాగు ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర లేక.. చివరికి పండిన పంటలు సైతం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మలేసియా, సింగపూర్ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం తరలించడానికి వాహనాలు లేవు, సంచులు లేవు, రైతే ఖర్చు భరించి తరలించాలని అధికారులు సూచనలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆ మాటను నేడు నిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రి లోకేశ్ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అవినాష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరాటాలు చేస్తామన్నారు. ఆయన వెంట తిరువూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, ఉపాధ్యక్షుడు అత్తనూరి వెంకట శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్కుమార్, జెడ్పీటీసీ కోట శామ్యూల్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. -
కమీషన్ల ‘వైద్యం’!
సాక్షి, అమరావతి: ఆరోగ్య శాఖలో రూ.40 కోట్ల విలువైన ‘వైద్యం’ ప్రాజెక్టును దొడ్డిదారిలో అస్మదీయ కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఇతర కంపెనీలు బిడ్లు వేయకుండా పోటీని నియంత్రించడమే కాకుండా అర్హత లేని కంపెనీకి బిడ్ను అడ్డదారిలో ఆమోదించడం గమనార్హం. వైద్యశాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ను ఒకే గొడుగు కిందకు తేవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలులో ప్రత్యక్ష అనుభవం తప్పనిసరి అని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లో నిబంధన విధించారు.అయితే ఈ నిబంధనకు బదులుగా ప్రభుత్వ రంగంలో ఈ–గవర్నెన్స్/ఆరోగ్య శాఖ ప్రాజెక్ట్లలో అనుభవాన్ని అర్హతగా పరిగణించాలని పలు కంపెనీలు ప్రీ బిడ్ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ/ఆరోగ్య శాఖలో అనుభవానికి టెక్నికల్ ఇవాల్యుయేషన్లో 5 మార్కులు కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ప్రభుత్వం పేర్కొనడంతో పలు కంపెనీలు బిడ్లు వేయకుండా టెండర్కు దూరంగా ఉండిపోయాయి.దొడ్డిదారిన ఆమోదం..ఏబీడీఎం నిబంధనను సవరించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ఉద్యోగుల ముఖ హాజరు(ఎఫ్ఆర్ఎస్) సేవలు అందిస్తున్న ఓ కంపెనీ ప్రభుత్వ పెద్దలకు పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లించేలా డీల్ కుదుర్చుకుని బిడ్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కంపెనీకి ఏబీడీఎం అమలులో కనీస అనుభవం కూడా లేకున్నా అక్రమంగా బిడ్ను ఆమోదించేశారు. ఏబీడీఎం నిబంధనను మినహాయించాలని ప్రీ–బిడ్ మీటింగ్లో పలు సంస్థలు కోరితే ఒప్పుకోకుండా అర్హత లేని కంపెనీ బిడ్ను ప్రభుత్వం ఆమోదించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇక స్కోర్లు మేనేజ్..!‘వైద్యం’ ప్రాజెక్టు కింద తమకు నచ్చిన కంపెనీకి నిధులు దోచిపెట్టేందుకు ఎల్–1 విధానంలో కాకుండా ‘క్యూసీబీఎస్’ విధానంలో టెండర్ పిలిచారు. ఇప్పటికే అస్మదీయ కంపెనీ బిడ్ను ప్రభుత్వ పెద్దలు ఆమోదించారు. టెక్నికల్ ప్రజంటేషన్లో అస్మదీయ కంపెనీకి ఎక్కువ స్కోర్ వేసి కాంట్రాక్ట్ కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్కు పరిపాలన అనుమతులు కూడా లేవని వైద్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏబీడీఎంలో కనీస అనుభవం లేని కంపెనీకి ప్రాజెక్టు దక్కేలా డీల్ కుదిర్చిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు టెండర్ ప్రక్రియలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
అసెంబ్లీ అద్దాలకు రూ.2,540 కోట్లా!?
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ప్రజల కష్టార్జితాన్ని చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ.2,540 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తంచేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.18,500 వరకు ఖర్చుచేయడం ఏ రకమైన పాలనని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు తన అస్మదీయులకు సంపద సృష్టించేందుకు వేసిన నిరంతర దోపిడీ ప్లాన్ అని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్కు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని సజ్జల హెచ్చరించారు. ఆయనింకా ఏమన్నారంటే..చ.అడుగుకి రూ.18,500అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2,540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 వేల నుంచి రూ.14 వేలు అనుకుంటే.. మున్ముందు ఇది ఎంతకు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రాజధానిలో నిర్మాణం చేపడుతున్న 52 లక్షల చదరపు అడుగులకి ఈ నిర్మాణ ఖర్చు కూడా కలుపుతుంటే.. చదరపు అడుగుకి రూ.18,500 వరకు ఖర్చవుతుంది. అలాగే, పాలవాగును టవర్స్ మధ్యలో తిప్పుతూ కృష్ణానదిలో కలిపేలా డిజైనింగ్ చేస్తారట. ఆ డిజైనింగ్కు మరో రూ.వందో, రెండు వందల కోట్లో ఇస్తారు.రైతుల సందేహాలకు సమాధానంలేదుఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చుపెడితే నాలుగైదేళ్లలో పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బుల్లేవని చెబుతూ మరోవైపు.. అమరావతి కోసం ఇష్టారాజ్యంగా బరితెగిస్తున్నారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు మద్దతు ధరల కోసం నిధుల్లేవని చెబుతూ అమరావతి దోపిడీకి మాత్రం భారీగా నిధులు విడుదల చేయడం విడ్డూరం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. రెండో దశ భూములు తీసుకునే ప్రక్రియలో కూడా దోపిడీకి తెరలేపారు. కానీ, రైతులు తమ సందేహాలను అడిగితే వాటికి సమాధానంలేదు. పైగా.. తమకు కావాల్సిన వాళ్లకు, దగ్గరి వాళ్ల లేఅవుట్లకు మాత్రం ఎడాపెడా అనుమతులిచ్చేస్తున్నారు.అరెస్టులతో అణచివేయలేరుపూడి శ్రీహరిని సంబంధంలేని వ్యవహారంలో అరెస్టుచేశారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరు. మిమ్మల్ని రాజకీయంగా సమాధిచేసే శక్తి వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ఇక పేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడం చంద్రబాబుకు పేదలపై ఉన్న కక్షను తెలియజేస్తోంది. కాగా, మెంబర్షిప్, ఎస్ఐఆర్పై వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఫోకస్ పెంచాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ కీలక నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. -
అడ్వాన్సుగా రూ.7,862.32 కోట్లు ఇచ్చినా పోలవరం పడకేనా?
సాక్షి, అమరావతి: జాతీయ ప్రాజెక్టు పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 2024–25, 25–26లో నాలుగు విడతలుగా రూ.7,862.32 కోట్లు అడ్వాన్సుగా నిధులు ఇచ్చినా సరే.. ప్రాజెక్టు పనులతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ పనులు నత్తనడకేనా..? అంటూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే 2026–27లో పోలవరానికి కేటాయించిన రూ.3,320.39 కోట్లను వినియోగించుకుని, నిర్దేశించిన లక్ష్యంలోగా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిపై రోజు వారీ.. వారం వారం నివేదిక ఇవ్వాలంటూ వ్యాప్కోస్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్లో డీజిల్ కొరత తలెత్తిందని.. దీని వల్ల నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయలేకపోయామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పనులను నెల రోజుల క్రితం క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా నిర్వాసితులకు పునరావాసం కల్పన.. భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు.ఈ నేపథ్యంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకూ పనుల ప్రగతిపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి కేఎల్ కాంతారావు శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో సీఎస్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె.నరసింహమూర్తి, ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రశాంతి, పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా, సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియదా?ఏప్రిల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయకపోవడంపై అధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నిలదీశారు. పనులు చేయడానికి సరిపడా యంత్రాలు సమకూర్చుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై ఈఎన్సీ కె.నరసింహమూర్తి స్పందిస్తూ పోలవరంలో సరిపడా యంత్రాలు ఉన్నాయని.. ఏప్రిల్లో డీజిల్ కొరత తలెత్తిందని.. దీని వల్ల నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయలేకపోయామని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డీజిల్ను.. పనులు లక్ష్యం మేరకు చేయడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలి కదా! అంటూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. నాలుగు విడతలుగా అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదు..! ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులను ఎప్పుడు విడుదల చేయాలని అడుగుతారు? అని ప్రశ్నించారు. పోలవరం పనుల్లో నాణ్యతపై నెలలో కనీసం మూడు సార్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్ఎంఆర్ఎస్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్కు సూచించారు. -
అవినీతిలో అ‘ధర’హో!
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త దారులు వెతుకుతోంది.. పూటకో నిర్ణయంతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చిన పనిని మళ్లీ ముక్కలు ముక్కలుగా చేసి అదనంగా దోచి పెడుతోంది.. ప్రజల సొమ్మును అందినకాడికి దండుకోడానికి ఇంతగా బరితెగించడం నిర్మాణ రంగ నిపుణులను విస్మయ పరుస్తోంది.. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ మళ్లీ పెంచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులు చేపట్టేందుకు రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలవడానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏజీఐసీఎల్)కు అనుమతి ఇచ్చింది.దాంతో.. డిజైన్లతో కలిపి శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.18,413.68కు చేరిందని స్పష్టమవుతోంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకుంది.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇంతింతై.. అన్నట్లుగా నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.అప్పులు తెచ్చి.. నీకింత–నాకింతరాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని లెక్కలు వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అప్పుడు, ఇప్పుడు అదే కాంట్రాక్టర్శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాలి్సనంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ నాడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది.దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది.గూడుపుఠాణీ కాక మరేంటి?⇒ సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను కూడా బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది.⇒ 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.⇒ 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.⇒ జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.⇒ నాడు, నేడు టెండర్లలో ఒకే కాంట్రాక్టర్కు పనులు దక్కాయి. టెండర్లలో గూడుపుఠాణీ జరిగిందనడానికి ఇదే తార్కాణమని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.17,356.54అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్ రింగ్, రింగ్ రూఫ్ వంటి సివిల్ స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లతో అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54కు చేరుకుంది. -
విజయవాడ దుర్గగుడిలో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు
విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ కాలేదు. భక్తులకు ఎదురైన ఇబ్బందులపై అధికారులు పట్టించుకోలేదు. 45 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో భక్తులకు ఉపశమనం కలిగింది. -
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల నత్త నడకపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కేంద్రం ప్రశ్నించింది. నిర్మాణ పనులకు డీజిల్ దొరకడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జవాబు ఇవ్వడంతో అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పోలవరం పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగ్గా ఏపీ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు..
విశాఖ : ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమిలి, తగరపువలస, అనకాపల్లి, మాడుగులలో కుండపోత వాన పడింది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పద్మనాభంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఫలితంగా వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు.ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. -
‘అద్భుతం అంటూ నమ్మించి.. ఇలా దోచుకుంటున్నారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు. తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు. సజ్జల ఏమన్నారంటే.. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చిందిఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక జగన్, ఆయన కుటుంబ సభ్యులను దూషించారుమావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుందిఅది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయిందిఅందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారుఅమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపటమా?ఇది చూసి జనం బిత్తరపోతున్నారుబిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయిందిఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనంఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోందిఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదుపాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారటబిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంటదానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదుట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చునగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారుఅమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారుదీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదుగతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదుప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదుఅమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారురెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారుదానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదుకానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదుఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారుమెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదురైతులకు మద్దతు ధర లేదుఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవుకానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారుఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారుఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారురాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందిపేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారుచంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారువారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారుమేము అలాంటి వాటిపై స్పందించంప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాంఅసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారుపూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగిందిఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పిందిఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమేఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారుఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరుచంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాంఆ శక్తి వైఎస్సార్సీపీకి ఉందితిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధదేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇదిదినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదునెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారుఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారుధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్రఅందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారుఅంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు. -
వైఎస్ జగన్ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ``మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది``. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు.#BuddhaPurnima pic.twitter.com/3IOxAULn6O— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2026 -
మన్యం ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘సీతంపేట ఘాట్ రోడ్లో ఆటో లోయలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరం. మరి కొందరు గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అని ఓ సందేశం విడుదల చేశారు.పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఓ ఆటో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా.. పాలకొండ-సీతంపేట రూట్లోని ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను సీతంపేట ఏజెన్సీకి చెందిన రమణ(ఆటో డ్రైవర్), ప్రయాణికులు లక్ష్మి, శాంతి, శ్రావణిలుగా గుర్తించారు. ఐదుగురు చిన్నారులు సహా తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. -
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. ఈ లోపు వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరో మూడు రోజులపాటు..ఏపీలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రంను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. గత రెండు రోజులుగా వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున సమద్రుపు అలలు ఎగసిపడుతున్నాయి. ఇన్నేళ్లలో.. ఈ సీజన్లో ఎప్పుడూ సముద్రాన్ని ఇలా చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. చల్లటి కబురువాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది. -
లోకేశ్ తీరు... ఏపీకి చేటే!
అసందర్భమైన మాటలు ఎప్పుడైనా పరువు తక్కువే. రాజకీయ నేతలైతే మరీ ఎక్కువ. నోరు జారారో అంతే సంగతులు. ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఏపీ కీలక మంత్రి లోకేశ్ ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు వేదికపై ఉండగానే లోకేశ్ అసత్యాలు, అతిశయోక్తులతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసి నగుబాటుకు గురయ్యారు. కొద్దోగొప్పో విషయ పరిజ్ఞానమున్న వీరు సభ నుంచి వెళ్లిపోయాకైనా మంత్రి హోదాలో లోకేశ్ వైఖరిపై చర్చించకుండా ఉంటారా? ‘‘జి అంటే తమకు గూగుల్ అని.. వారికి గొడ్డలి’’ అన్న లోకేశ్ వ్యాఖ్య ఎంత అనుచితమైందో చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. పైగా ఒక ఐటీ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి విమర్శలు చేశారంటే లోకేశ్ ఆ పార్టీకి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని లోకేశ్ అన్నారు. ఎవరేం చేసిందీ ప్రజలకు తెలియదనుకోవాలా? ఈయన చెప్పే ప్రతిమాటనూ అతిథులు నమ్మేస్తారని అనుకోవాలా? గతంలో అదాని డేటా సెంటర్కు జగన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు రాలేదా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య వచ్చిన ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉండి, పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండాల్సిన కమిట్మెంట్. లోకేశ్ మాత్రం అసందర్భ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. అందువల్లే లోకేశ్కు సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు కనుక. సామాజిక మాధ్యమాలు బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాలలోని పొంతన లేని సంగతులు, గతంలో ఏమి మాట్లాడింది, ఇప్పుడు ఏమి చెబుతున్నది వెల్లడించే వీడియోలను ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబును లోకేశ్ ఫాలో అవ్వదలిస్తే ఆయన ఇష్టం. హుందాతనం లేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజలలో పరపతి కోల్పోతారు. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని లోకేశ్ అనగానే టీడీపీ కేడర్ చేసిన పలు అరాచకాలను ఎత్తి చూపుతూ... అసలు గొడ్డలి పార్టీ మీది కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నలు వేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందా అని అడిగారు. ఈ కూటమి ప్రభుత్వంలో లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలపై నిలదీస్తున్నారు.ఈ రెండేళ్లలో హత్యలకు గురైన వారి వివరాలు వెల్లడిస్తున్నారు.ఉదాహరణకు వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడిరరోడ్డుపై నరికి హత్య చేశారు.పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.వైఎస్ ఆర్ కడప జిల్లా వేంపల్లె వద్ద కొందరు టిడిపి వర్గీయులు గొడ్డళ్లతో వైఎస్సార్సీపీ నేత నాగభూషణరెడ్డిని నరికి చంపారు. ఇలా ఒకటి కాదు.ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలలో పలుచోట్ల అరాచకశక్తులుగా మారిన టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. వీటికి సంబంధించిన వార్తలన్నిటిని ఒకచోటకు తెచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే కదా!ఈ అరాచకాలన్నిటికి తెలుగుదేశం పార్టీ జవాబుదారి అవుతుందా? లోకేశ్ వీటిని విస్మరించి తన తండ్రి మాదిరే దబాయించి మాట్లాడితే జనం నమ్ముతారా?చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలానే మాట్లాడతానని నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. అందులోను అదాని,గూగుల్,తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఇలా ప్రసంగిస్తే, ఈ గొడ్డలి గొడవ ఏమిటని వారు అడిగితే ఏమి చెబుతారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేశ్ జవాబు ఇస్తారా?ఎంత ఇతర రాష్ట్రాలలో ఉన్నా,రెడ్ బుక్ గురించి వారికి మాత్రం తెలియకుండా ఉంటుందా?గతంలో జిందాల్ అనే ఊరిశ్రామికవేత్తను ఒక మోసకారి నటి కేసులో ఇరికించడానికి యత్నించిన ఘటన ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియదా?అదే జిందాల్ కు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడే అవార్డు అందించారే.ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న వార్తలకు, జనం చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేక చంద్రబాబు కూడా పలు సభలలో గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీపై మీద అర్థం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఇప్పుడు అదే గాత్రాన్ని లోకేశ్ అందుకున్నట్లుగా ఉంది.విశాఖపట్నంలో అన్న ఆంగ్ల పదం అక్షరాలలో జి ఉందని, జి అంటే గూగుల్ అని ఆయన అనగానే అంతా ఆశ్చర్యపోయారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉంటుంది కాని విశాఖలో ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉన్నట్లే ఎ అనే లెటర్ కూడా ఉందని,అంటే అదాని గా తీసుకోవచ్చని,అదాని డేటా సెంటర్ ను జగన్ తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందోకాని, ఏపీ మాత్రం తీరని అప్రతిష్టే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పది ఫలితాల్లో సత్తా చాటిన తల్లి, కుమారుడు
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ఓ తల్లీ, కుమారుడు పది ఫలితాల్లో సత్తా చాటారు. వివరాలు.. బుగ్గవీధికి చెందిన శిరీష పదో తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి.. సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. 20 ఏళ్ల తర్వాత తిరిగి చదువుకోవాలనే పట్టుదలతో ముందుకు అడుగు వేశారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. తన చిన్న కుమారుడు హర్షతో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. 365 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనిపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.ఒకేసారి ఉత్తీర్ణులైన తల్లీకుమార్తెలు ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లకి చెందిన తల్లీకుమార్తెలు ఇంటరీ్మడియెట్, పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న కుమార్తె సలాది సాతి్వక పదో తరగతిలో 543 మార్కులు సాధించింది. ఆమె తల్లి కుమారి గురువారం విడుదలైన ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్ పరీక్షల్లో 352 మార్కులతో ఉత్తీర్ణత పొందింది. పదో తరగతి పూర్తి కాగానే కుమారికి వివాహం కావడంతో చదువుకు ఫుల్స్టాప్ పడింది. చదువుపై ఆమెకున్న మక్కువను గుర్తించిన భర్త ప్రసాద్ ప్రోత్సహించారు. దీంతో, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి ఆమె విజయం సాధించింది.ఉత్తీర్ణత సాధించిన తండ్రి, కుమార్తె రెంటచింతల: టెన్త్ ఫలితాల్లో తండ్రి, కుమార్తె ఉత్తీర్ణత సాధించిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో జరిగింది. పరాశక్తి సిమెంట్ కంపెనీలో రోజువారి కూలీ అయిన జిల్లా బాబూరావు ఈ ఏడాది ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పరీక్షలు రాసి 257 మార్కులు సాధించాడు. ఆయన కుమార్తె చిట్టి స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాలలో చదువుకుని 448 మార్కులు తెచ్చుకుంది. తన కుమార్తె, తానూ ఒకేసారి టెన్త్ పాస్ కావడం సంతోషంగా ఉందని బాబూరావు తెలిపారు. -
కార్మికులకు వైఎస్ జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు. దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కార్మికులు..సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారుదేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారుఅభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు.కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.#InternationalWorkersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2026 -
అమరావతిలో అలంకరణలకు 3 వేల 338 కోట్ల రూపాయలు... ఏపీలో మరో గోల్మాల్కు రంగం సిద్ధం
-
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
కూర్మం.. కూల్గా..
ప్రపంచంలోని తీర ప్రాంత దేశాల్లో కడలి కాలుష్యం బారిన పడుతోంది. ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం తారస్థాయికి చేరుకుంటోంది. దీన్ని గుర్తించిన పర్యావరణవేత్తలు కాపాడేందుకు తమ వంతుగా యత్నిస్తున్నారు. ఇదే కోవలో చెన్నైకు చెందిన ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తూ సముద్రంలో ఆలీవ్ రిడ్లీ తాబేళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలోని రెండు తీర మండలాల్లో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, తాబేళ్ల గుడ్లను ఏటా సేకరించి వాటిని జాగ్రత్తగా పొదిగించి పిల్లలైన అనంతరం సముద్రంలోకి వదలుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని వేల కూర్మాలను కడలిలోకి వదిలి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు చేపడుతున్నారు.చిల్లకూరు: సముద్ర గర్భంలో ఎన్నో జీవజాతులు దాగున్నాయి. అయితే నేడు మానవుల తప్పిదాలతో కడలి రోజురోజుకూ కాలుష్యం బారిన పడుతోంది. దీంతో సముద్రంలో ఉండే పలు రకాల జీవజాతులు మృత్యువాత పడి కనుమరుగైపోతున్నాయి. కడలి గర్భంలో ఉన్న మొక్కలు, పాచి తిని పర్యావరణ మిత్రులుగా ఉండే ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు ఎప్పుడైనా ఒడ్డుకొస్తే, వాటిని పట్టుకొని ఎంతో మంది విక్రయిస్తున్నారు. అదే విధంగా చేపల వేట సాగించే పడవలకు తగిలి మృత్యువాత సైతం పడుతున్నాయి. దీన్ని గుర్తించిన అటవీ శాఖ.. చెన్నైకు చెందిన ట్రీ ఫౌండేషన్ సంస్థతో చేతులు కలిపి తాబేళ్ల సంరక్షణకు సిద్ధమయ్యారు. పుట్టిన చోటే గుడ్లు పెడుతూ.. ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు భూమ్మీదికి వచ్చిన వారం తర్వాత జీవన ప్రక్రియను కొనసాగించేందుకు సముద్రంలోకి వెళ్తాయి. కొన్ని వేల మైళ్ల దూరం ప్రయాణించడం వీటి ప్రత్యేకత. అలా వెళ్లిన ఇవి 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు వచ్చాక గుడ్లు పెట్టే సమయానికి తామెక్కడ పుట్టి సముద్రంలోకి అడుగుపెట్టాయో అక్కడికే రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆపై గుడ్లు పెట్టిన అనంతరం తిరిగి సముద్రంలోకి వెళ్లిపోవడం వీటి ప్రత్యేకత. జీవనమే వైవిధ్యం.. ఆలీవ్ రిడ్లీ తాబేలు జన్మించిన సమయంలో 50 గ్రాముల బరువే ఉంటుంది. ఇది సుమారు 100 నుంచి 150 ఏళ్ల వరకు జీవిస్తుంది. సముద్రంలోని నాచు, చిన్నపాటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఆపై సుమారు 30 నుంచి 50 కిలోల బరువు వరకు పెరుగుతాయి. కడలిలో సుమారు రెండు వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి ఆహారాన్ని తీసుకుంటాయి. సముద్రంలో ఎక్కడ అడుగుపెడుతుందో 12 ఏళ్ల తర్వాత అక్కడికే వచ్చి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు 20 నుంచి 35 డిగ్రీల వేడిని మాత్రమే తట్టుకోగలవు. సగటున 80 నుంచి 160 గుడ్లను పెట్టడం వీటి ప్రత్యేకత. సంరక్షణే.. పరమావధిగా తాబేళ్ల సంరక్షణే లక్ష్యంగా ట్రీ ఫౌండేషన్ సంస్థ స్థానికంగా ఉండే అటవీ అధికారులతో చేతులు కలిపింది. కొంత కాలంగా ఏటా సముద్రపు ఒడ్డున తాబేళ్లు పెట్టే గుడ్లను సంరక్షించి వాటి నుంచి వచ్చే పిల్లలను సముద్రంలోకి జాగ్రత్తగా పంపుతున్నారు. దీనికి సంబంధించి తీర ప్రాంతంలోని మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణను సైతం ఇచ్చారు. గుడ్లను రాత్రి వేళ వీరు సేకరిస్తారు. వీటిని పెట్టే సమయంలో ఎంత మేర గుంత తవ్వుతుందో అంతే లోతులో తవ్వి సంరక్షణ కేంద్రాల్లో పొదిగేలా చేస్తున్నారు. పుట్టిన తాబేళ్లను వారం వరకు సంరక్షణ కేంద్రంలోనే ఉంచి, ఆ తర్వాత సముద్రంలో వదలడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. -
రైతులకు విత్తన విపత్తు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2026 ప్రారంభం కానుంది. అంతలోపు అంటే మే నెలలోనే రైతులకు రాయితీతో విత్తనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ రెండో వారం నుంచి విత్తన సేకరణ ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ నాలుగో వారం వచ్చినా విత్తనానికి సంబంధించి చడీ చప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ‘అనంత’ రైతులకు విత్తన విపత్తు తప్పేపరిస్థితి కానరావడం లేదు. గత ఏడాది ఇలా.. ఖరీఫ్–2025లో కూడా రైతులకు విత్తన వేరుశనగ సకాలంలో అందలేదు. దాదాపు నెల రోజులు ఆలస్యంగా అంటే జూన్ 5 నుంచి రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టారు. గతేడాది మొదట లక్ష క్వింటాళ్ల వేరుశనగ అన్నారు. తర్వాత 50 వేల క్వింటాళ్లకు కొర్రీ వేశారు. పంపిణీ బాగా ఆలస్యం చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రబీలో కూడా రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ పంట వేసుకున్న తర్వాత మొదలు పెట్టడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది.రాష్ట్ర క్యాబినెట్లో కీలకమంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ స్వంత నియోజకవర్గం ఉరవకొండ ప్రాంతంలోనే పప్పుశనగ సాగు అధికంగా ఉన్నా సకాలంలో విత్తనం ఇవ్వలేని దుస్థితి కల్పించారు. జిల్లాకు 14 వేల క్వింటాళ్లు కేటాయించినా చివరకు 2 వేల క్వింటాళ్లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. అది కూడా 25 శాతం రాయితీ కల్పించడంతో రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీలో రాయితీ విత్తనం కంటితుడుపుగా ఇవ్వడంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విత్తన సేకరణకు ససేమిరా.. ఏపీ సీడ్స్ ద్వారా గత ఖరీఫ్, రబీలో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయలేదు. దీంతో ఈసారి విత్తన సేకరణకు ఏజెన్సీలు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాదికి సంబంధించి రూ.110 కోట్లు బకాయిలు చెల్లిస్తే కానీ తాము విత్తనం సమకూర్చలేమని ఇటీవల జేడీఏ దగ్గర మొరపెట్టుకున్నారు.కనీసం రైతుల నుంచి వసూలు చేసిన నాన్సబ్సిడీ సొమ్ము కూడా తమకు ఇవ్వకుండా వాడేసుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందడం కష్టంగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల జిల్లాలో రబీలో రైతులు పండించిన నాణ్యమైన వేరుశనగ వ్యాపారులు, దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపు చివరకు నాసిరకం, కల్తీ సరుకు అంటగట్టే పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో అవార్డులువైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ద్వారా ఖరీఫ్, రబీ మొదలు కాకమునుపే గ్రామ స్థాయిలో రైతులకు రాయితీ విత్తనాలు విజయవంతంగా అందించారు. ఫలితంగా ఏపీ సీడ్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంది. 2021–22 అలాగే 2022–23 జాతీయ అవార్డులు తీసుకుంది. అలాగే 2022 ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు కూడా అందుకుంది. ఖరీఫ్, రబీలో రైతులకు అవసరమైన నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు సకాలంలో అందించిన ఏపీ సీడ్స్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయితీ తగ్గించడంతో పాటు విత్తన కేటాయింపులకు కూడా సగానికి సగం మేర కొర్రీలు వేసింది. దీంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాన్ని నమ్ముకోలేక బయట ప్రాంతంలో స్వంతంగా సమకూర్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. -
‘ముఖ్య’నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్ రైట్.. ‘పూలింగ్’.. పక్కా ప్లానింగ్!
సాక్షి, అమరావతి: రాజధాని రెండో విడత భూసమీకరణలో చంద్రబాబు సర్కార్ మాయాజాలానికి ఇదో తార్కాణం! 2015లో రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి కారుచౌకగా రైతుల నుంచి భారీ ఎత్తున భూములు కాజేసిన పచ్చ ముఠా.. ఇప్పుడు రెండో విడత భూసమీకరణలోనూ అక్రమాలకు పాల్పడుతోందని రైతులు మండిపడుతున్నారు. సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే..ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల్లో 53,749.49 ఎకరాలను రాజధానిగా 2015లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37,941.58 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తామని పేర్కొంది. అయితే 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ మలి విడతలో మరో 44 వేల ఎకరాలను సమీకరిస్తామని చంద్రబాబు 2024లో లీకులు ఇచ్చారు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో విడతల వారీగా సమీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూసమీకరణ కింద ఎకరం భూమి ఇస్తే.. మెట్ట భూమికైతే అభివృద్ధి చేసిన వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి అయితే వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు సీఆర్డీఏ ఇస్తుంది.పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీగా లబ్ధి..భూసమీకరణతో ప్రయోజనం స్వల్పమే.. అదే మినహాయింపు లభిస్తే భారీగా లబ్ధి పొందవచ్చు. దీంతో భూసమీకరణ పథకం నిబంధనలను అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలు లేఅవుట్లను తెరపైకి తెస్తున్నారు. మలి విడత భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఆ విధి వి«ధానాల ప్రకారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలను సమీకరించడానికి సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ చేశారు.అంటే.. అప్పటి ఆ గ్రామాల పరిధిలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం–2025లో పదో నిబంధనను అడ్డుపెట్టుకుని లేఅవుట్లకు మినహాయింపు పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి ముఖ్యనేత సన్నిహితులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం పెదపరిమిలో 9.798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆ గ్రామంలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి వారం ముందు సీఆర్డీఏ కమిషనర్ ఆమోదించారు. లేఅవుట్కు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల.. ఆ లేవుట్లో ప్లాట్ల విస్తీర్ణం 21,623.12 చదరపు మీటర్లు(25,861.04 చదరపు గజాలు) పుట్టి రామచంద్రరావుకు వస్తుంది.ఒకవేళ అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే.. ఆయనకు 9,798 గజాల ఇంటి స్థలం, 1,959.6 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వస్తుంది. ఇక మల్లవరపు లక్షి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ పొందిన భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు పెదపరిమిలో 3.8301 ఎకరాల్లో లేఅవుట్ అనుమతి కోసం అందచేసిన దరఖాస్తుపై ఏప్రిల్ 6న సీఆర్డీఏ కమిషనర్ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల వారికి 9,408.91 చదరపు మీటర్లు (11,252.97 చదరపు గజాలు) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అదే వారు భూసమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగిస్తే.. 3,830.1 చదరపు గజాల ఇంటి స్థలం, 766 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వచ్చేది.రాజధాని నిర్మాణానికి అదనంగా భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం(భూసమీకరణ పథకం)– 2025 విధి విధానాలను 2025 జూలై 1న ప్రభుత్వం జారీ (జీవో ఎంఎస్ నెంబరు 118) చేసింది.పల్నాడు జిల్లాలో అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి.. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 విధి విధానాల ప్రకారం సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెంబరు 252) జారీ చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో భూసమీకరణ యూనిట్–1 కింద 3,072.23 ఎకరాలు.. భూసమీకరణ యూనిట్–2 కింద 3,056.72 ఎకరాలను సమీకరించేందుకు ఏప్రిల్ 13న సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ..పెదపరిమి భూసమీకరణ నోటిఫికేషన్ జారీకి సరిగ్గా వారం ముందు అంటే ఏప్రిల్ 6న అదే గ్రామంలో సర్వే నెంబరు 447/1బీ(పీ), 447/1సీ(పీ), 447/2లో 9.798 ఎకరాలలో పుట్టి రామచంద్రరావు వేసిన లేఅవుట్కు.. సర్వే నెంబరు 82/బీ(పీ)లో 3.8301లో మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ తీసుకున్న సన్ సిరి ప్రాజెక్ట్స్ గ్రీన్ డిలైట్ కేపిటల్ మేనేజింగ్ పార్టనర్లు భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావుæ వేసిన లేఅవుట్కు సీఆర్డీఏ కమిషనర్ అనుమతి ఇచ్చేశారు.ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 పదో నిబంధన ప్రకారం వీజీటీఎం, ఉడా, సీఆర్డీఏ, డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్లను భూసమీకరణ నుంచి మినహాయించాలి. అంటే.. పుట్టి రామచంద్రరావు, భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావులు వేసిన లేఅవుట్లకు సంబంధించి 13.8301 ఎకరాలకు భూసమీకరణ నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా వారికి భారీ ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాక.. లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం ముందు లేఅవుట్లకు అనుమతి ఇవ్వడంపై రాజధాని రైతులు విస్తుపోతున్నారు. ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే సన్నిహితులకు ఒక న్యాయం.. తమకో న్యాయమా..! అంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. -
టెన్త్ ఉత్తీర్ణత 85.25 శాతం
సాక్షి, అమరావతి: గతనెలలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు గతేడాది కంటే కాస్త మెరుగుపడ్డాయి. ఉత్తీర్ణత గతేడాది కంటే 4.11 శాతం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తీర్ణత 2024లో వచ్చిన 86.69 శాతాన్ని దాటలేకపోయింది. పదోతరగతి పరీక్ష ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,26,954 మంది (85.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 2,67,321 మంది (87.90 శాతం), బాలురు 2,59,633 మంది (82.68 శాతం) ఉన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో 5,83,645 మంది హాజరవగా, 5,03,539 మంది పాసయ్యారు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 30,129 మందిలో 19,834 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు మాధ్యమాలతో పాటు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా భాషల్లోను స్వల్పసంఖ్యలో పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షల్లో పాసైన వారిలో అత్యధికంగా 83.69 శాతం మంది ప్రథమ శ్రేణి సాధించారు. 11.87 శాతం మంది ద్వితీయ శ్రేణి సాధించగా 4.44 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు.పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07 శాతం ఉత్తీర్ణత గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో టాప్లో నిలిచింది. ఈ జిల్లా టాప్లో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 96.07 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండోస్థానంలోను, 91.08 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా మూడోస్థానంలోను నిలిచాయి.మూడోస్థానంలో ప్రైవేటు స్కూళ్లు ఈ ఏడాది మొత్తం 12,089 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 5,044 ప్రైవేటు పాఠశాలలుండగా మిగిలినవి వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం 2,161 స్కూళ్లు 100 శాతం ఫలితాలను సాధించాయి. మరో 16 పాఠశాలలు ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. సున్నా ఫలితాలు వచ్చిన 16 పాఠశాలల్లో 11 ప్రైవేటు స్కూళ్లున్నాయి. రాష్ట్రంలోని 12 యాజమాన్య పాఠశాలల్లో.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచాయి. తర్వాత బీసీ సంక్షేమశాఖ స్కూళ్లు 96.02 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య పరంగా రెండోస్థానంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఉత్తీర్ణతలో 95.29 శాతంతో మూడోస్థానంలో ఉన్నాయి.నేటి నుంచి రీ కౌంటింగ్ దరఖాస్తులకు అవకాశం పదోతరగతి పరీక్ష తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశమిచ్చింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వారి స్కూల్ లాగిన్ ద్వారా శుక్రవారం నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1000 ఫీజు చెల్లించాలి.అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు మే 9 పదోతరగతి తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు త్వరలో టైమ్టేబుల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. విద్యార్థులు శుక్రవారం నుంచి మే 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడుకు పైగా సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలి. వెనుకబడ్డ కీలక జిల్లాలు రాష్ట్రంలో ఆది నుంచి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు విద్యాకేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో ఆ జిల్లాల మెరుపులు కనిపించలేదు. గుంటూరు జిల్లా 8వ స్థానంలో నిలవగా కృష్ణాజిల్లా 10, ఎన్టీఆర్ జిల్లా 11 స్థానాల్లో నిలిచి ప్రగతిపరంగా ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడ్డాయి. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా 24వ స్థానానికే పరిమితమైంది. -
విద్యుత్ కోతలు స్టార్ట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపై వరుసగా ఇంధన కష్టాలు దాడి చేస్తున్నాయి. గ్యాస్ కష్టాలు, పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇప్పుడు విద్యుత్ కోతలు తోడయ్యాయి. ఓ వైపు అనధికార విద్యుత్ కోతలు విధిస్తూ, మరోవైపు నిరంతరం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్దమని సాక్షాత్తూ మంత్రులే బయటపెట్టడం విశేషం. డీజిల్ సరఫరాలో విఫలమైన చంద్రబాబు సర్కారు దాని నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆర్డీఎస్ఎస్’ పనుల పేరుతోనూ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.మంత్రి అచ్చెన్నాయుడు బయటపెట్టిన నిజంకొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రాయల సీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోతోంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో విద్యుత్ కొరత ఏర్పడి కోతలు అనివార్యమవుతున్నాయి. దీనిని ప్రభుత్వంగానీ, ఇంధన శాఖ అధికారులుగానీ ధృవీకరించడం లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అమలు చేయడం లేదని, సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని బుకాయిస్తున్నారు. కానీ ‘‘ఆక్వా కల్చర్ రంగానికి రోజుకి సగటున 2గంటలు విద్యుత్ కోత ఉంది’’ అని సాక్షాత్తూ కూటమి ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నామని స్వయంగా మంత్రులే వెల్లడించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఆక్వాతోపాటు గృహాలకూ పవర్ కట్మంత్రి చెప్పినట్లు ఆక్వా రంగానికి రోజుకు సగటున రెండు గంటలు కాదు అంతకు మించి సరఫరా తగ్గింపు అమలు చేస్తుండగా, గృహ విద్యుత్ వినియోగదారులు రోజులో కనీసం 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పీక్ అవర్స్లో అంటే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో పవర్ గ్రిడ్పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తున్నారు. వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేసి అడిగితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు వంటివి మారుస్తున్నందున ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఈ సమస్య అత్యధికంగా ఉంది.కొరతను దాచేందుకు కాకి లెక్కలు రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 270.578 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గరిష్ట డిమాండ్ 13,793 మెగావాట్లకు చేరింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గతంలో 120 మిలియన్ యూనిట్ల వరకూ ఉండగా, ఇప్పుడు 91.944 మిలియన్ యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జల విద్యుత్ కేవలం 5.516 మెగావాట్లు వస్తోంది. అధికారికంగా లోడ్ రిలీఫ్ లేదంటూనే అనధికార కోతలు విధిస్తూ డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ కొరత ప్రభావంతో బహిరంగ మార్కెట్లో రాష్ట్ర అవసరాలకు రోజూ 38.750 మిలియన్ యూనిట్లు కొంటున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్లో రాత్రిపూట విద్యుత్ ధర యూనిట్కు రూ.10కి చేరింది. దీంతో రాత్రి వేళ మన రాష్ట్రం కొనడం లేదు. పగటి వేళ మాత్రం యూనిట్ రూ.4 చొప్పున కొంటున్నారు. దీని కోసం రోజూ రూ.8.355 కోట్లు వెచ్చిస్తున్నారు. -
స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగులు రోజు కూలీలా?
సాక్షి, అమరావతి: ‘‘స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు శాఖలో పని చేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగులా లేక రోజుకూలీలా?’’ అంటూ స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర శాఖల్లో వేసిన డెప్యుటేషన్లు వెంటనే రద్దు చేసి, అర్హతలను బట్టి ఉద్యోగులను సరైన ప్రాతిపదికన ఆయా శాఖల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరింది. రేషనలైజేషన్ పేరుతో పనిభారం పెంచే ప్రక్రియ వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.ఒకే జీతంతో రెండు పనులు చేయించడం అన్యాయమైన చర్యగా పేర్కొంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులకు స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోని వార్డు సచివాలయాల్లో ఆరు విభాగాల ఉద్యోగుల్లో ఒక్కరికీ పదోన్నతి కల్పించకుండా తాత్సారం చేయడం అన్యాయమని మండిపడింది., ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జాని పాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బాబు సర్కార్ మళ్లీ అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.9,000 కోట్లు అప్పు చేసింది. మే ఐదో తేదీ (మంగళవారం) మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,698 కోట్లు, రోజుకు సగటున రూ.523 కోట్లు అప్పు చేస్తోంది. -
అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు అది చాలదన్నట్లుగా ఆ భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చజెండా ఊపింది! ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా రూ.2,540 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టు ఇచ్చేందుకు కేబినెట్ పరిపాలన ఆమోదం ఇచ్చింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో రూ.798 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టుకు పరిపాలన ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బుల్లేవంటూ పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తి అయ్యేవని, వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా రూ.3,338 కోట్ల వ్యయానికి పరిపాలన ఆమోదం ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు. ⇒ అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. మూడు ప్యాకేజీలుగా లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిడెట్ ఎండీకి అనుమతి. ⇒ శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ అండ్ అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్ పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం. లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి. ⇒ రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు రద్దు. ఆ భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయం. ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు ఆమోదం. ⇒ అమరావతిలో కృష్ణా కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం కోసం రూ.443.26 కోట్లతో కరకట్ట బలోపేతం, విస్తరణకు ఆమోదం. రూ.149.82 కోట్లు, రూ.146.47 కోట్లు, రూ.146.97 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పరిపాలన అనుమతి మంజూరు. గతంలో కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ.1304.89 కోట్లతో ఇచ్చిన పరిపాలన అనుమతి రద్దు. ⇒ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ రెండు టవర్లు నిర్మాణానికి రూ.1,208 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో జోన్––11 పరిధిలో ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ స్కీము కింద మౌలిక సదుపాయాల పనులకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో కొన్ని కూడళ్లలో మిగిలిన పనులకు గతంలో ఇచ్చిన రూ.1082 కోట్ల పరిపాలన అనుమతి వ్యయాన్ని రూ.1180 కోట్లకు పెంచేందుకు ఆమోదం. ⇒ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీములో సవరణలకు ఆమోదం. యాన్యుటీ పెంపు, అప్పు మాఫీ కట్ ఆఫ్ తేదీ సరళీకరణకు సవరణలు. సీఆర్డీఏలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం. ⇒ రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యత్యాస పనులకు ఆమోదం. అదనంగా రూ.354 కోట్ల వ్యయానికి ఆమోదం. ⇒ ఢిల్లీలో 11.536 ఎకరాల భూమిలో కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి ఆమోదం. రూ.124.50 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, నిర్మాణ పనులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీ)కు అప్పగించేందుకు అనుమతి. ⇒ పోలవరం నిర్వాసిత కుటుంబాలకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఇళ్లు నిర్మాణానికి యూనిట్ ధర రూ.2.85 లక్షల నుండి రూ.3.57 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ సహాయ పునరావాస కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ల స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో 525 మీటర్లు పొడవున ఎస్కేప్ చానల్ తవ్వకం అదనపు పనులు నామినేషన్పై అప్పగించేందుకు ఆమోదం. ⇒ శ్రీసత్యసాయి జిల్లా హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్–11 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా రూ.309 కోట్లకు పరిపాలన ఆమోదం. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి తాజాగా రూ.1586.69 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. -
పేదలపై బాబు సర్కారు కక్ష!
సాక్షి, అమరావతి: సామాజిక సమతూకం.. స్థానికులకు ప్రాధాన్యం.. మహిళా సాధికారత.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ రాజధాని అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేసింది. తద్వారా పేదలకు రాజధానిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంటే కొంత మందికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునేందుకు గురువారం కేబినెట్ పచ్చ జెండా ఊపింది. పేదలకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయించింది.ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఓ వైపు పేదల గూటి కలలను కూల్చి వేస్తూ.. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణం కోసం మాత్రం కారుచౌకగా భూ కేటాయింపులు చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం కేవలం బడా బాబులకే సొంతమనే రీతిలో వ్యవహరిస్తూ పేదలను గెంటేసేలా నిర్ణయం తీసుకుంటున్నారనేందుకు సర్కారు తాజా నిర్ణయమే తార్కాణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ప్రత్యామ్నాయంగా కనీసం వారికి ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారో కూడా చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని సర్కారు సరికొత్త భాష్యం చెప్పడం దారుణమంటున్నారు. రాజధాని సహా రాష్ట్రంలో ఎక్కడా పేదలకు ఒక్క గజం కూడా భూమి ఇవ్వని చంద్రబాబు.. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడం గమనార్హం. రాజధానిలో బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 900 ఎకరాలతో ఆర్–5 జోన్ను ఏర్పాటు చేసింది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది. దానిని భారీ లేవుట్గా అభివృద్ధి చేశారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. సంపద సృష్టిస్తూ.. విలువైన ఆస్తిని మహిళల చేతికి అందించింది. పేదల ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 78 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ఏకంగా 17 వేలకుపైగా కాలనీలు రూపుదిద్దుకున్నాయి. 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి వందల ఇళ్ల నిర్మాణంతో ఆయా చోట్ల కొత్త గ్రామాలే ఆవిష్కృతమయ్యాయి. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు సైతం చోటు ఉండాలని, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్ 5 జోన్ను ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏమాత్రం గిట్టని చంద్రబాబు సర్కారు పేదలపై కక్ష కట్టి తన తీరును మరోమారు చాటుకుంది. సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
కోర్టుకెళ్తే మీ బండారం బయట పెడతా
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పేకాట అడిస్తూ పట్టుబడిన సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ప్రదీప్రెడ్డి పోలీసులను బెదిరించారు. కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే మీకు (పోలీసులకు, ఎమ్మెల్యేకు) క్రమం తప్పకుండా ఇస్తున్న మామూళ్ల సంగతి కూడా చెబుతానని హెచ్చరించారు. పాకాల మండలం చెన్నుగారిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం రహస్యంగా పేకాట ఆడుతున్నట్టు డ్రోన్ కెమెరాల ద్వారా బట్టబయలైంది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ఆధీనంలోని కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై స్పెషల్ పార్టీ పోలీసులకు ఆ డ్రోన్ వీడి యోలు, లొకేషన్ పంపించారు.వాటి ఆధారంగా స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రదీప్రెడ్డి అనే వ్యక్తి సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మరో ఇద్దరు ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితులు. వీరి ఆధ్వర్యంలోనే పేకాట సాగుతోంది. ఈ క్రమంలో వీరిని ఎలాగైనా తప్పించాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే విషయం మీడియాకూ తెలియడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ప్రదీప్రెడ్డి పోలీసులను బెదిరించారు. పై నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు నిందితులకు రాచమర్యాదలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. -
పెట్రోల్, డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న వాస్తవం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం దాన్నుంచి తప్పించుకొనేందుకు మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందన్న విషయం కేంద్ర ప్రభుత్వ లేఖలతో బయటపడింది. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్న పెట్రోల్ డీజిల్ కొరత వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఊరూవాడా తెలిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే రాజకీయ అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పెద్ద అంశంగా మారిందని, ఉన్నట్టుండి ఈ సమస్య రావడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. రాజధాని పనులు చేసే కాంట్రాక్టర్లకు రిటైల్ ధరలో బల్్కగా ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీలను ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించిందని ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చను కొంతవరకైనా నివారించాలంటే మంత్రులు మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్ సమస్య ప్రభుత్వం వల్ల రాలేదని చెప్పాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆయిల్ కంపెనీల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇందులో ప్రభుత్వం తప్పు లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది.ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయిల్ కొరత ఉందని బలంగా ప్రచారం చేయాలని, అప్పుడే ప్రజలు కొంత శాంతిస్తారని చెప్పినట్లు సమాచారం. రాజధాని పనులకు అవసరమైన ఆయిల్ సరఫరా చేయాలని కేంద్రానికి రాసిన లేఖలు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం రాసిన లేఖల వివరాలు బయటకు ఎలా వెళ్లాయనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ వివరాలన్నీ బయటకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఇలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.9 మంది మంత్రులు ఒకేసారి సింగపూర్ పర్యటనకు వెళ్లడం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, రాజధాని నిర్మాణాలకు అంచనాలకు మించి భారీ రేట్లతో పనులు చేస్తున్న అంశాలపై మంత్రులు స్పందించాలని చెప్పినట్లు తెలిసింది. ఎంత చెప్పినా కొందరు మంత్రులు ఇలాంటి విషయాలపై మాట్లాడటంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తమ వల్లే వచ్చిందని వైఎస్సార్సీపీ చెబుతోందని, దాని క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలు: సీఎంటీమ్ ఏపీ పనితీరు వల్లే తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు వచ్చిందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు గురువారం మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు. తొలుత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించారు. -
భగ్గుమన్న భానుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డయింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45, తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో 43.6, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.5, నంద్యాల జిల్లా సంజామలలో 43.2, వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురిశాయి. నేడు తీవ్ర వడగాడ్పులు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 49 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. -
AP: బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని..
మైలవరం(వైఎస్సార్ జిల్లా): ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్జిల్లాలోని మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో జరిగింది. చిన్యం లావణ్య(23) అనే యువతి తాను బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని ఆవేదనతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్డు పక్కన పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. రైల్వే మరియు ఇతర జాబులకు దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం దక్కకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈరోజు బంధువులతో కలిసి కొన్ని పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న లావణ్య.. ఆపై ఆత్మహత్య చేసుకుంది. -
‘ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’
తాడేపల్లి : ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ శ్రేణులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీల అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ‘ పార్టీ ఓట్ల అక్రమ తొలగింపును అడ్డుకోవాలి. S.I.R పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలను అడ్డుకోవాలి. మోసం చేయడంలో కూటమి నేతలు సిద్ధహస్తులు. 2019 ఎన్నికలకు ముందు మన పార్టీ వారి ఓట్లు 40 నుంచి 45 లక్షలు తొలగించారు. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్ళీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తమిళనాడులో ఏకంగా 97 లక్షల ఓటర్లను తొలగించారు. మన దగ్గర SIR ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలి. జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్లను సిద్ధం చేయాలి. S.I.R కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు. -
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంఅమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్లో వైఎస్ జగన్ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపుఏపీలో టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి 1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది. -
‘16 ఏళ్లలో ఒక్క కాలనీ అయినా నిర్మించారా?’
తాడేపల్లి : జగనన్న కాలనీలపై ఎల్లీ మీడియా తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఎల్లో మీడియా వాటిపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్.. స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్పై రోత రాతలు ఎందుకని నిలదీశారు. జగన్ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. కోటి మందికి నివాసం కల్పించారన్నారు. చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసినా ఒక్క కాలనీ కూడా కట్టించలేదు. 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం జగన్ది.చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా ఎవరొచ్చినా వాటిని చూపిస్తాం. కొత్తగా ఊర్లనే ఏర్పాటు చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఒక్క సెంటు స్థలం ఇచ్చారా?, ఇళ్ల స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని ఎల్లో మీడియాకు జగన్ విమర్శించే అర్హత ఉందా?, జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్ కట్టించిన ఇళ్లను చంద్రబాబు ఓపెన్ చేసి ఫోటోలు దిగారు. జగన్ క్రెడిట్ని చంద్రబాబు చోరీ చేస్తున్నారు’ అని విమర్శించారు. -
‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.సంచలనం రేపిన ఈ కేసులో సీతారం భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్టెకీ సీతారాం తన లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకుంది. వాటిన ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇది చూసి ఎలా తట్టుకోగలగాలి.. రేణుకకు అసలు ఏం కావాలి?’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలు అవి చూశాకే నా భార్య నిజస్వరూపం తెలిసింది. ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది. తాను ఎంత నచ్చజెప్పినా ఆమెలో మార్పు రాలేదని, పైగా చచ్చిపోతానని బెదిరింపులు’’ అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానంటూ వాపోయాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.కాగా ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో కాపురంలో కలతలు, భార్య వివాహేతర సంబంధాలు,ఇన్స్టాలో వీడియోలు బయటపడటంతో గత ఫిబ్రవరిలో ట్యాంక్బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు. -
కన్నీటి కుండగా మారిన ఉద్దానం.. మరో చిన్నారి బలి
శ్రీకాకుళం జిల్లా: ఈ తల్లి భుజాలపై ఉన్నది కన్నీటి కుండ. ఉద్దానంలో ప్రతి ఇంటికీ వద్దన్నా వస్తున్న శాపమిది. శ్మశానాల్లో ఈ మట్టి కుండలు, ఊరిలో తల్లుల గుండె లు ఉద్దానంలో దశాబ్దాలుగా పగులుతూనే ఉన్నాయి. బూర్జపాడులో 15 ఏళ్ల పిల్లాడు బుంగ యోగి కిడ్నీ వ్యాధితో బుధవారం కన్నుమూశాడు. వ్యాధి ఉందని తెలిసి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, పుస్తె తాకట్టు పెట్టి చికిత్స చేసినా లాభం లేకపోయింది. పిల్లాడి ఆయుష్షు ఆగిపోయింది. తండ్రి కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. కన్న కొడుకు చనిపోయాడని తెలిసినా అంత్యక్రియలకు రాలేని దీనావస్థ ఆయనది. కట్టుకున్న వాడు పక్కన లేక, కడుపున పుట్టిన వాడికి ప్రాణం లేక ఆ తల్లి పడిన వేదన ఊరందరినీ కదిలించింది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన కొడుకు అంత్యక్రియలు తన చేతులమీదుగా చేయాల్సి రావడంతో ఆ అమ్మ గుండె ముక్కలైంది. ఏం చెబితే ఆ తల్లి గుండెలో బాధ తగ్గుతుంది. ఏం చేస్తే ఆ కన్నీటి వరద ఆగుతుంది. ఉద్దానంలో వీధివీధినా వినిపించే కథలివి. ఆ జాబితాలోకి ఇప్పుడు యోగి పేరు కొత్తగా పేరు చేరింది. -
ప్రజాకవి శ్రీశ్రీకి వైఎస్ జగన్ నివాళి
మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళులర్పిస్తూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ.. ..నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ. నిద్రావస్థలో ఉన్న… pic.twitter.com/WkhLrBdxjq— YS Jagan Mohan Reddy (@ysjagan) April 30, 2026 -
ఏంటి రా ఇది.. మీరంతా ఇలా తయారయ్యారు?
గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలో కమర్షియల్ చెత్తను తరలించే ప్రైవేటు ట్రాక్టర్ ముందు అశ్లీలంగా ఉన్న ఫొటో పెట్టుకుని తిరుగుతున్న దృశ్యాన్ని చూసి నగరవాసులు మండిపడుతున్నారు. ఇదేమి చోద్యమంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ మయూర్ అశోక్ సదరు ట్రాక్టర్ను నిలిపివేయడంతోపాటు, డ్రైవర్పై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. -
ఎరువు మొత్తం.. డీజిల్లో కాలిపోయిందిగా!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను పోస్టింగ్లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్ను వారికి ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం. సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్ను బల్క్లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే. తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు -
పూడి శ్రీహరికి ఊరట
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ మీడియా విభాగపు ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఊరట లభించింది. కుప్పం కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారంటూ ఆయన్ని కుప్పం పోలీసులు నిన్న వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి గతంలో సీపీఆర్వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులకు ఈయనే కారణమంటూ అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించి వేధించడం ప్రారంభించారు. ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్ సెల్), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ అయినట్లు కోర్టుకు చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు వ్యాఖ్యానించారు. ఆ వెంటనే న్యాయస్థానం శ్రీహరికి బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. -
రూ.30 లక్షలు పెట్టి కొన్నారు.. ఒక్క చాన్స్ ఇవ్వట్లేదు!
శ్రీకాకుళం: జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పటికీ.. మైదానంలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) తరఫున విజయ్ వరుసగా రెండో ఏడాది ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రిజర్వ్బెంచ్కే పరిమితమవుతున్నాడు. ఒకే ఒక్క ఛాన్స్..! అన్నట్టుగా ఒక్క మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యువ ఆల్రౌండర్.. అవకాశం లభించిన మ్యాచ్లో ఆకట్టుకునేందుకు నిరీక్షిస్తున్నాడు. డీసీ ఆడే తన తదుపరి మ్యాచ్లో అవకాశం లభించవచ్చని భావిస్తున్నాడు. రూ.30 లక్షలకు కొనుగోలు.. పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతునప్పటికీ.. గత మూడేళ్లగా నిలకడైన ఆటతీరుతో ఆల్రౌండర్గా రాణింపుతో అందరి దృష్టిని ఆకర్షించిన త్రిపురాన విజయ్.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలక్షన్స్ ట్రయల్స్లో పాల్గొని రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయడం విజయ్లోని అదనపు క్వాలిటీ. వీటికి ముందు కుచ్బిహార్ ట్రోఫీ, విజయ్హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఇటీవల ముగిసిన టోర్నీల్లో రాణించడంతో డీసీ విజయ్ను అట్టిపెట్టుకుంది. నిరూపించుకుంటాడు: జెడ్సీఎస్ ఒక్క అవకాశం వస్తే.. విజయ్ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని జిల్లా క్రికెట్ సంఘం (జెడ్సీఎస్) ప్రతినిధులు, జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ రవికుమార్, కోచ్లు, సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు. విజయ్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లు ఐపీఎల్ రేసులో నిలిచేందుకు ఉవి్వల్లూరుతున్నారని అంటున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్కు ఎంపికైన మొదటి క్రికెటర్గా త్రిపురాన విజయ్ ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. నిరూపించుకుంటా.. ఐపీఎల్కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కు వరుసగా రెండో ఏడాది ఆడుతుండటం, కేఎల్, అక్షర్, కుల్దీప్, వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కలిసి ట్రావెల్ చేస్తుండటం కొత్తగా ఉంది. ఐపీఎల్కు ఇప్పటి వరకు డీసీ 8 మ్యాచ్లు ఆడింది. ఫైనల్ లెవన్ ఛాన్స్ రాలేదు. డీసీ మ్యాచ్లు ఇంకా చాలా ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది. మున్ముందు మ్యాచ్ల్లో రిజర్వ్బెంచ్లను కూడా పరీక్షించాలనే ఆలోచన మేనేజ్మెంట్, కోచ్లు ఆలోచన చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో కఠోర సాధన చేస్తున్నాను. అవకాశం వచ్చిన మ్యాచ్ల్లో నన్ను నేను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. – త్రిపురాణ విజయ్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆంధ్రా రంజీ ఆటగాడు -
అరాచకం, అస్తవ్యస్త పరిస్థితులే బాబు సుపరిపాలన!
ఆంద్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి? పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి. రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 👉పదో తరగతి పరీక్షా ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో https://education.sakshi.com/en తోపాటుగా https://results.bse.ap.gov.in/ ఈ వైబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 👉పది ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.👉మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.ఒక్క క్లిక్తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
విశాఖ ఎక్స్ప్రెస్ అత్యాచార కేసులో ట్విస్ట్
సాక్షి, పల్నాడు: వివాహితకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే విశాఖ ఎక్స్ప్రెస్లో అదెలా సాధ్యమైందంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. రైల్వే పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. విశాఖ ఎక్స్ప్రెస్ వివాహిత అత్యాచార కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఏసీ బోగీలో పని చేసే కార్మికుడేనని తేలింది. ఒడిశాకు చెందిన శౌరవ్ బగ్దీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. అతన్ని అరెస్ట్ చేశామని విజయవాడ రైల్వే పోలీసులు ప్రకటించారు. తాను స్టాఫ్నని చెప్పి ఆ జంటను వెంట తీసుకెళ్లాడని, వాళ్ల ఆర్థిక స్థితి చెప్పడంతో డబ్బులు కూడా వద్దన్నాడని.. ఆపై ఏమార్చి వివాహితను ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖకు వెళ్లారు. జెట్టిపాలెం(పల్నాడు)లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీ ఎక్కారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. ఏసీ బోగీలో సీట్లు ఉన్నాయని.. తన వెంట రావాలని తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భార్యను పంపించి తాను టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు ఆ భర్త. అయితే ఇదే అదనుగా ఆ మహిళను హెచ్1ఏ బోగీలోకి లాక్కెల్లి.. కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. భార్యభర్తలిద్దరూ రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. -
ఆస్తి కోసం కన్నకూతురి ఘాతుకం
చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లికార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సుకన్య, మల్లికార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు తల్లిదండ్రుల వద్దే ఉంది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం..ఏడాది నుంచి ఆమె పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి మరో ప్రాంతంలో ఉంటుంది. తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. మంగళవారం రాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచకు ఉన్న గ్రిల్స్ నుంచి లోనికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు వంటివి తగలబడి పోయాయి. స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,362 మంది స్వామిని దర్శించుకున్నారు. 29,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.05 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ఫ్రీ బస్సు ఉత్తుత్తిదే..!
అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణమంటూ పథకాన్ని ఘనంగా ప్రారంభించినా..దానిలో చాలా కోతలు, నిబంధనలు పెట్టి దగా చేశారు. ఇప్పుడు ఉన్న బస్సులు కూడా మహిళలను ఎక్కించుకోకుండానే వెళ్లిపోతున్నాయి. మహిళలు ఉన్నచోట బస్సులు సరిగా ఆపడం లేదు. ఇందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనే తార్కాణం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడుకు చెందిన మహిళలు బుధవారం అనంతపురం వెళ్లడానికి గుత్తి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. బస్సులు పాయింట్లో ఆపలేదు. ఎదురు చూసిన మహిళలు ఆరా తీయగా బస్టాండ్ వెనుక వైపు నుంచే వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. మహిళలు ఉన్న చోట బస్సులు ఆపడం లేదని వరలక్ష్మి, లక్ష్మి తదితర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఫ్రీ బస్సు ప్రచారానికే పరిమితం కాకుండా.. మహిళలకు ప్రయోజనకరంఉండే విధంగా నడపాలని కోరారు. లేని పక్షంలో ఫ్రీ బస్సు ఎత్తేయండి అని మహిళలు వాపోయిన విషయాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
‘డీఎస్సీ డీల్స్’లో ప్రలోభాల పర్వం
సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్మైండ్’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్మైండ్’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు. మాస్టర్మైండ్ గేమ్లో చిక్కుకున్నశాప్ ఉన్నతాధికారులు డీఎస్సీ డీల్స్లో కీలకమైన ‘మాస్టర్ మైండ్’ గేమ్లో శాప్ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్మైండ్ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దుచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్ రూమ్ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి. -
పసిపాపను అనాథ చేసి దంపతుల బలవన్మరణం
బాపట్ల జిల్లా: పసిపాప బోసినవ్వులు.. కేరింతలతో అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పాలబుగ్గల పసిపాప గుక్కపట్టి ఏడుస్తుండగా.. సముదాయించాల్సిన తల్లిదండ్రులు ఈ లోకాన్నే వీడిపోయారు. ఆ భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ ఒకరు బెడ్రూమ్లో.. మరొకరు బాత్రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి 13 నెలల పసిపాపను అనాథను చేశారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్యవైశ్య వీధికి చెందిన మాజేటి ప్రభాకర్(33)కు చెరుకుపల్లికి చెందిన పార్వతి(24)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 నెలల మాని్వత అనే పాప ఉంది.ప్రభాకర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఇంటినుంచే పనిచేస్తున్నాడు. ఈ నెల 5న పాప మొదటి పుట్టిన రోజును ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. బుధవారం ప్రభాకర్ తన సోదరుడితో మీసేవ కేంద్రానికి వెళ్లి వచ్చాడు. పార్వతి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పక్కింటి వాళ్లకు పాపను అప్పగించి చూడమని చెప్పింది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ప్రభాకర్ సోదరుడు ఇంటికి రాగా తలుపులు తీయలేదు. కిటికీలోంచి చూసేసరికి వదిన పార్వతి బెడ్రూమ్లో చీరతో ఉరివేసుకోగా.. ప్రభాకర్ బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చీరాల రూరల్ సీఐ సుధాకర్, వేటపాలెం ఎస్ఐ జనార్దన్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం వారి బిడ్డను అనాథను చేసింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో అనాథగా మారిన పాపను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. దంపతుల ఆత్మహత్యకు కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. -
కేంద్రం సంచలన నిర్ణయం.. రైల్వేలో ఉద్యోగాల కోత
సాక్షి, అమరావతి: ప్రైవేటు కంపెనీలకే పరిమితమైన ఉద్యోగాల కోత.. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలకూ పాకింది. తాజాగా రైల్వేశాఖలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30వేల పోస్టులను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026, ఏప్రిల్ 1 నాటికి మంజూరైన పోస్టుల్లో 30వేల పోస్టులను రద్దు చేయాలని రైల్వే శాఖ అన్ని జోన్ల జనరల్ మేనేజర్(జీఎం)లను తాజాగా ఆదేశించింది.రద్దు చేసిన పోస్టుల్లో ప్రస్తుతం ఖాళీగా, ఉద్యోగులు ఉన్న పోస్టులూ ఉన్నాయి. రద్దు చేసిన పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తారు. ఆ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోకి వస్తున్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వేల పోస్టులను తగ్గించొచ్చని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దయ్యే పోస్టుల్లో ఎక్కువ క్లరికల్ విభాగం, మెయింటెనెన్స్ విభాగం పోస్టులు ఉన్నాయి. ఇక నుంచి ఏటా 2%నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే దిశగా పోస్టులు రద్దు చేయాలని గతేడాది రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 2 శాతం చొప్పున పోస్టులు రద్దు చేయాలని ప్రణాళిక రూపొందించింది. రైల్వే శాఖలో మంజూరైన పోస్టుల్లో దేశవ్యాప్తంగా 3.5లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఏటా 2 శాతం పోస్టుల చొప్పున రద్దు చేస్తారు. కొత్త పోస్టులు మంజూరు చేయరు. మొదటి దశలో క్లరికల్, నిర్వహణ విభాగాల పోస్టులనే రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.ఉద్యోగాల కోత ప్రణాళికలో భద్రతా విభాగం పోస్టులను చేర్చలేదు. కాగా రైల్వే శాఖ నిర్ణయాన్ని రైల్వే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నిర్వహణ విభాగంలో పోస్టుల రద్దుతో రైల్వే సేవలు మందగిస్తాయని, ప్రయాణికులకు అసౌకర్యంతోపాటు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం బాగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నాయి. -
నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయనున్నారు. ఫలితాలను sakshieducation.com, మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, results. bse.ap.gov.inలో చూడవచ్చు. -
పూడి శ్రీహరిపై ఆగని వేధింపులు
చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూటమి ప్రభుత్వం వేధించడం ఆపడం లేదు. మళ్లీ ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించింది. అయితే ఉన్నత న్యాయస్థానాల మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏపీ పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి గతంలో సీపీఆర్వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించి వేధించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి.. తిరిగి కుప్పం పీఎస్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుప్పం కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్ సెల్), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. ‘బెంగళూరులో నిన్న ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు అన్నారు. -
ఇంధనానికి బంధనం.. కొరత లేదంటూనే కోత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ బూటకపు ప్రచారం చేయడం తప్ప బంకులకు సరఫరాను మెరుగుపర్చట్లేదు. వారం గడిచినా ఇప్పటికీ బంకుల్లో పెట్రోల్, డీజిల్పై పరిమితి కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలకు కేవలం రూ.200కు మించి పెట్రోల్ నింపడం లేదు. కార్లకు అయితే గరిష్టంగా 10–15 లీటర్లు, లారీలకు 50 లీటర్ల వరకే డీజిల్ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకసారి రెండు లీటర్ల డీజిల్ నింపుకుని వెళ్లొచ్చేలోగా అయిపోతోంది. మళ్లీ హడావుడిగా బంకుల దగ్గర పరుగెత్తాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ప్రయాణికులతో మార్గంమధ్యలో ఆగిపోవాల్సి వస్తోంది. ఆటోలను తోసుకెళ్లలేక ఖాళీ బాటిళ్లలో ఇంధనం నింపుకుని వద్దామంటే ప్రభుత్వ ఆదేశాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఖాళీ టిన్నులు, బాటిళ్లలో ఇంధనం నింపొద్దని చంద్రబాబు సర్కార్ జారీ చేసిన ప్రకటన బడుగుల జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అవసరానికి మించి ఇంధనం తీసుకుంటే ప్రజలను సైతం శిక్షిస్తామని బహిరంగంగా పోస్టర్లు వేయడం అరాచక పాలనకు అద్దం పడుతోంది. తనిఖీల పేరుతో బంకుల సీజ్ రాష్ట్రంలో ఇండెంట్కు, అవసరాలకు తగ్గట్టుగా బంకులకు ఇంధన సరఫరా జరగడం లేదు. దీంతో ప్రభుత్వం తనిఖీల పేరుతో పెట్రోల్ బంకుల యజమానులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. నో స్టాక్ బోర్డులు పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. పైగా తనిఖీల్లో స్టాకు లేనట్టు గుర్తిస్తే అక్కడ అక్రమంగా ఇంధనాన్ని దొడ్డిదారి పట్టించారంటూ బంకులను సీజ్ చేస్తోంది. సంక్షోభం సమయంలో ఇలా బంకులను సీజ్ చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారనే కనీసం విజ్ఞత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోంది. బంకుల యజమానులు తమకు సాధారణ రోజుల్లో మాదిరి ఇంధనం రావడం లేదని ఎంత మెరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంధనం అయిపోతే బంకులదే బాద్యత అంటూ విచిత్ర వాదన తీసుకొచ్చి నిత్యం నరకం చూపిస్తోంది. చాలా బంకులకు రెగ్యులర్ వినియోగదారులుంటారు. వారంతా ఆయా బంకుల్లోనే తమ వాహనాలకు ఇంధనాన్ని నింపుతుంటారు.అలాంటి వారికి చాలా బంకులు క్రెడిట్(అప్పు)పై ఇంధనం విక్రయిస్తుంటాయి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రవాణా రంగం కుదేలైంది. డైలీ క్యాబ్ సర్వీసులు, దూర ప్రాంతాలకు సరుకులు చేరవేసే మినీ వ్యాన్లు అర్థంతరంగా రోడ్లపై ఆగిపోతున్నాయి. పెద్ద వాహనాలకు 100 లీటర్ల డీజిల్ పోస్తారని ప్రకటించినా బంకుల్లో లభ్యత లేకపోవడంతో అరకొరగానే నింపుకోవాల్సి వస్తోంది. క్రెడిట్ ఎత్తేసిన కంపెనీలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా దివాళ తీస్తోంది. అప్పులపై వడ్డీలు.. ఆ వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడంతోనే పరిపాలనను నెట్టుకొస్తోంది. ఫలితంగా సామాన్య పొదుపు సంఘాల క్రెడిట్ పరపతి ఎప్పుడో కుదేలైంది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు రంగంలోని బంకులకూ అది పాకింది. ప్రభుత్వ పనితీరును నిత్యం మదింపు చేసుకుంటున్న ఆయిల్ కంపెనీలు క్లిష్ట సమయంలో బంకులకు క్రెడిట్(అప్పు)ను నిలిపివేశాయి. ముందుగా చెల్లిస్తే తప్ప స్టాకును పంపించట్లేదు. ఒక్కసారిగా రూ.లక్షల్లో నగదు సమకూర్చలేని స్థితిలో బంకుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, దోపిడీ విధానాల కారణంగా డబ్బులు కట్టినా ఏకంగా సరఫరాను కుదించేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యనేత సాధారణ బంకుల నుంచి కమర్షియల్, బల్క్ డీజిల్ను తరలించాలని ఆదేశాలివ్వడంతో పరిస్థితి దిగజారిపోయింది. కమర్షియల్లో డీజిల్ రేటు రూ.153 ఉండటంతో ప్రభుత్వం రిటైల్ రేటుకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను బంకుల నుంచి సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీని ఫలితంగా బల్క్ ఆర్డర్లకు డీజిల్ తరలించుకుపోవడంతో కొరత తీవ్రమైంది. రిటైల్ నుంచి కమర్షియల్కు దారి మళ్లింపు రాష్ట్రంలో సగటున రోజువారీగా 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి నేటివరకు దాదాపు లక్ష కిలో లీటర్ల డీజిల్ బ్యాక్ లాగ్ ఉంది. అంటే, ఇప్పటికిప్పుడు లక్ష కిలో లీటర్ల డీజిల్ అందుబాటులోకి వస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదు. మరుసటి రోజు నుంచి యథావిధిగా రోజుకు 20 వేల కిలో లీటర్ల డీజిల్ సరఫరా ఉండాల్సిందే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఒక్క రాజధాని ప్రాంతంలోనే 10 లక్షల లీటర్లకుపైగా రిటైల్ ఇంధనాన్ని కమర్షియల్లో వాడేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ను కమర్షియల్లోకి దారి మళ్లించేశారు. ఏపీలో 100కు పైగా లారీలు, టిప్పర్లను ఆపరేట్ చేసే కంపెనీలు స్థానికంగానే మార్కెట్ కంటే రూ.10 అదనంగా చెల్లించి భారీస్థాయిలో ఇంధనం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రజలకు చేరాల్సిన డీజిల్, పెట్రోల్ పక్కదారి పడుతోంది. -
‘విజనరీ’ కాదు.. విఫల పాలకుడు!
సాక్షి, అమరావతి: ‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు...! అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి! విజనరీ, పరిపాలనా దక్షుడని టీడీపీ కూటమి, ఎల్లో మీడియా ఊదరగొట్టే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రిటైల్ బంకులలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ను రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చంద్రబాబు సర్కారు అడ్డదారిలో ఉత్తర్వులు జారీ చేయడంతో వారం రోజులు వాహనదారులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంపై రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్లో అవసరమైతే కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కొనుగోలు చేయాలి. అందుకోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. బల్క్లో కొంటే లీటర్ డీజిల్కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్ బంకుల్లో రిటైల్గా అయితే లీటర్ డీజిల్ రూ.98కే దొరుకుతుండటంతో అడ్డదారిలో కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో బాబు సర్కారు బండారం బట్టబయలైంది. పాలన గాలికి వదిలేసి మొద్దునిద్ర..!పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు అల్లాడుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తుండటం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. రాష్ట్రంలోని 4,500 బంకుల్లో ఇంధన కొరత వేధిస్తోంది. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి బారులు తీరుతున్నా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనమే లేకుండాపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చలేక చేతులు ఎత్తేశారు. అత్యవసర సేవలు, సరఫరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం మరోసారి బట్టబయలైంది. కీలక సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజులపాటు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఈనెల 24 నుంచి పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తింది. బంకుల వద్ద వాహనదారులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్ర వీడలేదు. పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తినట్లు అదే రోజు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కావడంతో అధికారులు నిస్సహాయంగా మిగిలారు. దాంతో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చి బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా లారీలు, ఇతర వాహనాల సర్వీసులు నిలిచిపోయాయి. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితి పూర్తిగా దిగజారింది. బంకుల వద్ద ఘర్షణలు చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వాహనదారులు ఆందోళనతో ఒక బంకు నుంచి మరో బంకు చొప్పున నాలుగైదు చోట్లకు తిరిగినా అంతటా అదే పరిస్థితి నెలకొంది. వాహనాల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనం ఖర్చు కావడం మినహా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. చమురు కంపెనీలపై ఆగ్రహం అంటూ లీకులు..ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనదారులు గగ్గోలు పెట్టారు. ఎట్టకేలకు గత ఆదివారం సాయంత్రానికిగానీ చంద్రబాబు కుంభకర్ణ నిద్ర వీడలేదు. అధికారులతో సమీక్ష పేరిట మభ్యపుచ్చేందుకు యత్నించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై సీరియస్ అయినట్లు ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకవైపు వాణిజ్య అవసరాల కోసం వినియోగించాల్సిన డీజిల్ను సిండికేట్ కాంట్రాక్టు సంస్థల కోసం దారి మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు మరోవైపు చమురు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకులిచ్చారు. కొరత ఎందుకు ఏర్పడిందో తనకు స్పష్టంగా తెలిసినా పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నా కనీసం పెట్రోలియం శాఖ మంత్రితో చర్చించకపోవడం గమనార్హం. తుస్సుమన్న రియల్ టైమ్ గవర్నెన్స్..చంద్రబాబు ఘనంగా చెప్పుకునే రియల్ టైమ్ గవర్నెన్స్ గాలి బుడగలా పేలిపోయింది. పెట్రోల్, డీజిల్ కొరత లాంటి సాధారణ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. వెలగపూడిలోని ఆర్టీజీఎస్ ఆఫీసు నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చిటికెలో పరిష్కరిస్తామని చంద్రబాబు గొప్పగా చెబుతూ ఉంటారు. వారం రోజులుగా బంకుల వద్ద బారులు తీరిన వాహనదారుల ఫొటోలు, వీడియోలను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ చూపించలేదా? లేక సమస్యను పరిష్కరించడం కూటమి ప్రభుత్వానికి చేతకాలేదా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పలు ప్రాంతాల్లో తనిఖీల పేరిట బంకు యజమానులను వేధిస్తున్నారు. స్టాక్ లేదనే వంకతో బంకులను సీజ్ చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.చినబాబు మౌనం.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసంపెట్రోల్, డీజిల్ కొరత ఇంత తీవ్రంగా వేధిస్తున్నా మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసే వారిద్దరూ పెదవి విప్పడం లేదు. గుప్త పర్యటన కోసం వెళ్లిన లోకేశ్ సామాన్యుల సమస్యతో తనకేం సంబంధం అన్నట్లుగా మిన్నకుండిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతం వీడలేదు. కనీసం ఫోన్లో కూడా అధికారులను ఆరా తీయలేదు. -
పెట్రో దెబ్బకు కూర‘గాయాలు’!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సిండికేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కారు నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ డీజిల్ను అడ్డదారిలో మళ్లించడంతో రవాణావాహనాలకు డీజిల్ దొరక్క నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. వారం వ్యవధిలోనే భారీగా పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఇప్పటికే సర్కారు నిర్వాకంతో వంట నూనెల ధరలు చుక్కలనంటుతుండగా ఆ జాబితాలో కూరగాయలు కూడా చేరాయి. డీజిల్ కొరత కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఓవైపు డీజిల్ కొరతతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కూరగాయలు కుళ్లిపోతుండగా మరోవైపు సరఫరా ఆగిపోవడంతో ధరలు పెరిగిపోయి వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రమంతా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో పెరిగిన ధరల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు కథనం ఇదీ!వారం రోజులుగా వాహనాల్లోనే వేల టన్నులు..రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలకు కూరగాయలు, నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలకు చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో బ్రేకులు పడ్డాయి. రిటైల్ బంకులలో సాధారణ ప్రజలు వినియోగించే డీజిల్ను రాష్ట్ర ప్రభుత్వం సిండికేట్ కాంట్రాక్టర్ల కోసం మళ్లించడంతో వ్యవస్థ గాడి తప్పింది. డీజిల్ దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల నుంచి నిత్యావసరాలు మోసుకొచ్చే లారీలను హైవేల పక్కన రోజుల తరబడి నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా వేల టన్నుల కూరగాయలు వాహనాల్లోనే మగ్గిపోయి కుళ్లిపోతున్నాయి. మార్కెట్కు సరుకు రాకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లకు మదనపల్లె, కర్నూలు నుంచి టమాటా... బాపట్ల, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పచ్చిమిర్చి.. ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాదుంపలు.. కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లి.. కర్నాటకలోని కోలార్ నుంచి క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బీట్రూట్, కాలిప్లవర్ వస్తుండగా మిగిలిన కూరగాయలు కృష్ణా, గుంటూరు, గోదావరి లంక గ్రామాల నుంచి రవాణా అవుతుంటాయి. ఆకుకూరలు పూర్తిగా లంక గ్రామాలతో పాటు స్థానిక పల్లెల నుంచే వస్తుంటాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాలకు రోజూ 275–300 టన్నుల వరకు కూరగాయలు రవాణా అవుతుంటాయని అంచనా.రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలు..రాష్ట్ర పరిధిలో రోజుకు 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగమవుతుండగా అందులో 30 శాతానికి పైగా సరుకు రవాణా వాహనాలే వినియోగిస్తుంటాయి. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలుండగా 40 శాతం వాహనాలు పూర్తిగా కూరగాయలు, నిత్యావసరాలను చేరవేస్తుంటాయి. డీజిల్ సంక్షోభం మొదలైన తర్వాత ఇవి ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. విశాఖ, విజయవాడ లాంటి ప్రధాన నగరాలకు రోజూ వచ్చే సరుకుల లోడు 30 నుంచి 40 శాతం తగ్గిపోయింది. రూ.కోట్ల విలువైన పంట ఉత్పత్తులు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. మదనపల్లి, కర్నూలు, అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి, టమాటా లోడులతో బయల్దేరిన లారీలు డీజిల్ దొరక్క దారి మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చిందని చిత్తూరుకు చెందిన ఓ లారీ యజమాని ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉండిపోవడంతో ఎండవేడికి కూరగాయలు కుళ్లిపోతున్నాయి. డీజిల్ కొరతతో కిరాయిలు రెట్టింపు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.20–30 శాతం పెరిగిన ధరలువేసవిలో ఉత్పత్తి తగ్గడం..దానికి డీజిల్ సంక్షోభం తోడు కావడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రైతులకు కిలో రూ.3–5కు మించి ధర లభించని టమాటా రిటైల్ మార్కెట్లో మూడు రెట్లు పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో కిలో రూ.15–20 పలికిన టమాటా ప్రస్తుతం రూ.45–55 పలుకుతోంది. మిగిలిన ప్రధాన కూరగాయల ధరలన్నీ 20–30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆకుకూరలు సైతం 10–20 శాతం ధరలు పెరిగాయి. విజయవాడలోని ప్రధాన రైతుబజార్లలో ఈ నెల ప్రారంభంలో కిలో రూ.16 ఉన్న టమాటా ధర ప్రస్తుతం రూ.35కు చేరింది. వంగ రూ.20 నుంచి రూ.35కి ఎగబాకింది.సకాలంలో రాకపోవడంతో..డీజిల్ కొరత కారణంగా రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనాలు మధ్యలోనే నిలిచి పోయాయని చెబుతున్నారు. డిమాండ్కు సరిపడా సరుకు రాకపోవడంతో స్థానికంగా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. – గాదే వెంకటేశ్వరరావు, కూరగాయల వ్యాపారి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాఒక్కసారిగా పెరిగాయి..కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 15 రోజుల క్రితం వరకు నిలకడగా ఉన్న ధరలు ప్రస్తుతం అమాంతం పెరిగిపోయాయి. టమాటా మూడు రెట్లు పెరిగింది. ఇతర కూరగాయల ధరలు కూడా రూ.10–30 వరకు పెరిగాయి. డీజిల్ కొరత కారణంగా వాహనాలు రావడం లేదు. సరుకు లేకపోవడం వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. – వన్నంరెడ్డి సురేష్, శ్రీనగర్ కాలని, విజయవాడజేబులకు చిల్లు పడుతోందిఇప్పటికే వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెరగడం భారంగా ఉంది. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వమే పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. డీజిల్ కొరత కారణంగా సరుకు రవాణా తగ్గి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.– ఆత్మకూరి శ్రీనివాసరావు, పేరవలిపాలెం, బాపట్ల జిల్లా -
పంతం నెగ్గించుకున్న ‘ముఖ్య’నేత!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేందుకు ‘ముఖ్య’నేత మార్గం సుగమం చేసుకున్నారు. అధికారం అండతో మేనేజింగ్ కమిటీలో అందరూ తమకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పావులు కదిపారు. బుధవారం జరిగిన కమిటీ ఎన్నికల్లో అంతా ముఖ్యనేత అనుకున్నట్లే జరిగింది. కాలేజీని ముఖ్యనేత పరం చేసేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడగా దాదాపు అందరూ ముఖ్య నేతకు కాలేజీని బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కమిటీ కోసం ముఖ్య నేత మనుషులు 20 రోజులుగా ‘ప్రత్యేక ఆపరేషన్’ నిర్వహించారు. పాత డైరెక్టర్లలో ఒక వర్గాన్ని గతంలోనే లొంగదీసుకోగా మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. బెదిరింపులతోపాటు అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది. రాజధాని పనులు పర్యవేక్షించే మంత్రి ఈ వ్యవహారంలో అన్నీ తానై వ్యవహరించారు.ముఖ్య నేత ప్రాపకం కోసం.. ముఖ్యనేత బినామీగా పేరు పొందిన ఓ పారిశ్రామికవేత్త, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ మొదట అన్ని విషయాలు పర్యవేక్షించి పాత డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్య నేత అభీష్టాన్ని తెలుసుకున్నాక మంత్రి కూడా రంగంలోకి దిగారు. ముఖ్య నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకున్నారు. కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి నయాన భయాన దారికి తెచ్చుకున్నట్లు తెలిసింది. దీంతో ముఖ్యనేతకు అనుకూలంగా వ్యవహరించే మేనేజింగ్ కమిటీ ఏర్పాటైంది. ఇక ఈ కమిటీ ద్వారా కాలేజీని ముఖ్యనేత తమ కుటుంబం పరం చేసుకోవడమే మిగిలింది. అత్యంత కారుచౌకగా కాలేజీ, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు పాత డైరెక్టర్లు చర్చించుకుంటున్నారు.రూ.2 వేల కోట్ల ఆస్తి.. పప్పు బెల్లాలకు!కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2003లో ఈ ప్రాంతానికి చెందిన 32 మంది ఎన్ఆర్ఐ వైద్యులు ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మంగళగిరిలో 50 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కాలేజీ, దానికి అనుబంధంగా ఆస్పత్రిని నిర్మించారు. అనతి కాలంలోనూ అది ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందగా దాని విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలేజీ విలువ రూ.2 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. మేనేజింగ్ కమిటీలో తలెత్తిన విభేదాలతో దీనిపై ముఖ్య నేత కన్ను పడింది. వీటిని ఆసరాగా తీసుకుని ఏకంగా కాలేజీనే సొంతం చేసుకునే ఎత్తుగడ వేశారు. ఇందుకోసం తన బినామీలను రంగంలోకి దించి డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా కమిటీ ఏర్పాటయ్యేలా కుట్రలు పన్నారు. కాలేజీని కారుచౌకగా ముఖ్యనేత కుటుంబ పరం చేసేలా పావులు కదిపారు. కాలేజీకి చెందిన రూ.240 కోట్ల కార్పస్ ఫండ్తోపాటు ఇతర విలువైన ఆస్తులను దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. -
‘బాబు రాజకీయ జీవితామంతా కుట్ర, వెన్నుపోటు’
సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. -
సాక్షి టీవీ రిపోర్టర్పై దుండగుల దాడి
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడటం తీవ్ర సంచలనం రేపుతోంది. పట్టపగలు, అదీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి మరో రిపోర్టర్తో కలిసి బైక్పై వస్తున్న శ్రీనివాసరావును ముగ్గురు దుండగులు బైక్పై వెంబడించి, పోలీస్ స్టేషన్ సమీపంలో అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు.నిందితులు పిడిగుద్దులతో విరుచుకుపడటంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్ ముందే దాడి జరగడంపై విలేకరుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సాలూరులో దాడికి గురైన శ్రీనివాసరావును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పరామర్శించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ప్రశాంతమైన సాలూరులో ఇలాంటి దారుణ ఘటన జరగడాన్ని రాజన్నదొర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమన్న ఆయన, శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
కూటమి సర్కార్కు వైఎస్సార్సీపీ అల్టిమేటం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.డీజిల్ కొరత కారణంగా మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించిన కేటాయింపుల పట్టిలో రైతులకు, వ్యవసాయ రంగానికి స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రెస్మీట్లో వడ్డీ రఘురాం ఏమన్నారంటే..వ్యవసాయ రంగం అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపురాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాదేళ్ల మనోహర్కు రైతులకు కనిపించలేదా?గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఆక్వా రంగం ఎలా బాగుపడుంది?ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?చేపలను కార్గో విమానాల్లో పంపాలా?గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.కూటమి ప్రభుత్వానికి 24 గంటలే డేట్లైన్రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి తక్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు. -
‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
‘కు’ సంస్కరణలే బాబు మార్కు!
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి. వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు. ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం. 1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు. ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది. చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది? అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు. ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంధన కొరతపై ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం, డీజిల్ కొరత, ఎల్పీజీ సరఫరాలో అంతరాయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. ప్రజల దైనందిన జీవనానికి, వ్యవసాయానికి మూలాధారమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత వల్ల అంబులెన్సులు, అత్యవసర వైద్యసేవలు, ప్రజారవాణా, ఆహార సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంధన కొరత సృష్టించడం ప్రాథమిక హక్కులతో పాటు వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కృత్రిమ కొరతను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జిల్లాల వారీగా ఇంధన నిల్వల వివరాలను పారదర్శకంగా వెల్లడించటంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే బంకులు, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిల్వల పర్యవేక్షణకు ఆటోమేటిక్ ట్యాంక్ గేజింగ్ (ఏటీజీ) వ్యవస్థ, బంకుల వద్ద స్టాక్ తెలిసేలా పబ్లిక్ డ్యాష్బోర్డ్, ఆన్లైన్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షించి ఇంధన సరఫరాను గాడిలో పెట్టాలని ఆయన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. -
స్కెచ్ ప్రకారమే దాడి.. వడ్డీతో చెల్లిస్తాం: ఉమాశంకర్
సాక్షి, విశాఖపట్నం: పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. స్పీకర్గా అయ్యన్న అనర్హుడు.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారని ఆరోపణలు చేశారు.మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘యువ నాయకుడి పేరు చెప్పుకుని అయ్యన్న వందల కోట్లు దోచుకుంటున్నారు. చోడవరం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడికి ఏం పని? అని ప్రశ్నించారు. స్పీకర్గా ఉన్నాననే అయ్యన్న వన్సైడ్గా వెళ్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆర్డర్ను కూడా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాదాయ భూములను కూడా అయ్యన్న వదలడం లేదు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారు. తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి వందల కోట్లు దోచుకుంటున్నారు.నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?. రైతులకు అన్యాయం జరుగుతుంటే కోర్టుకు వెళ్తే నేను హిందూ వ్యతిరేకినా?. కోర్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్తే మా పై దాడి చేశారు. ల్యాటిరైట్ మీద ఇప్పటి వరకు 400 కోట్లు సంపాదించారు. కొడుకుకు రాజ్యసభ సీటుకోసం అమరావతి నాయకుడుకు కోట్లాది రూపాయలు ఇస్తామని చెపుతున్నారు. రోలుగుంటలో క్వారీల దగ్గర అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. 100 ఎకరాల దేవాలయ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు. కొడుకు ప్రమోషన్ కోసం ప్రభుత్వ చెరువులో సృష్టి క్షేత్రం కడుతున్నారు. దానికి నిధులు GMR నుంచి తీసుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా.. సృష్టి క్షేత్రంలో పనులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో అయ్యన్నకు తిరిగి ఇస్తాము. అయ్యన్న, కలెక్టర్, పోలీసుల మీద కోర్టుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.మరోవైపు.. నాయకులు కేకే రాజు మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్న పాత్రుడు విష సంస్కృతిని తీసుకువచ్చారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేశారు. రౌడీలు గుండాలతో భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా పని చేయడం మానుకోవాలి. కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని తెలిపారు. -
భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం!
సాక్షి, పల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటల్ని నమ్మి బాధిత దంపతులు వెంట వెళ్లగా.. ఏసీ బోగీలోకి తీసుకెళ్లి మరీ వివాహితపై అఘాయిత్యం జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జరిగిన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖలో నివాసం ఉంటున్నారు. జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈలోపు జనరల్ బోగీలో ఉన్న ఆ జంట వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడతారని?.. ఏసీ బోసీలో ఖాళీగా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని వాళ్లు వెంట వెళ్లారు. అయితే ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భర్త టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు. మహిళను హెచ్1ఏ బోగీలోకి తీసేకెళ్లి కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే ఓలీసులు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
బాబు సర్కారు పాపం వల్లే ఏపీలో ఇంధన కృత్రిమ కొరత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న ఇంధన కొరత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ స్వయంకృతాపరాధమేనని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కమర్షియల్ డీజిల్ను రిటైల్ బంకుల్లో కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఇచ్చిన అక్రమ ఆదేశాలే ఈ కృత్రిమ కొరతకు కారణమని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్తో ఎంపీ అవినాష్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిమాండ్కు, సప్లైకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై కేంద్ర కార్యదర్శితో చర్చించారు. ఏపీలో నెలకొన్న దయనీయ పరిస్థితులను వివరిస్తూ ఆధారాలతో కూడిన ఒక లేఖను ఆయనకు అందజేశారు. కేంద్ర కార్యదర్శితో భేటీ అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఏపీలో డిమాండ్, సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉందని, దేశంలో కేవలం ఒక్క ఏపీలోనే ఈ కొరత ఎందుకు ఉందని కేంద్ర కార్యదర్శిని అడగగా... దీనికి కేంద్ర కార్యదర్శి ఇచ్చిన సమాధానాలు విస్మయం కలిగించాయని అనంతరం అవినాష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఆయన తన ఆఫీసు నుంచి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అన్ని ఆయిల్ కంపెనీలకు ఒక సర్క్యులర్ రాశారని... కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ను సామాన్య ప్రజలు కొనుగోలు చేసే సాధారణ పెట్రోల్ బంకుల్లో (రిటైల్ అవుట్లెట్లలో) అమ్మాలని ఆ సర్క్యులర్లో ఆదేశించారన్న విషయాన్ని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి తెలిపారన్నారు. ఇది సివిల్ సప్లైస్ కమిషనర్ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో తెలియజేస్తోందని అవినాష్ రెడ్డి విమర్శించారు. బల్క్ బయ్యర్లకు దోచిపెట్టే పన్నాగం బల్క్ డీజిల్ను సాధారణ రిటైల్ బంకుల నుంచి విక్రయించాలంటూ ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాయడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. సాధారణ బంకుల్లో లీటర్ డీజిల్ రూ.98కి లభిస్తుండగా, కమర్షియల్ బల్క్ డీజిల్ ధర రూ.153గా ఉందన్నారు. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని బల్క్ కొనుగోలుదారులకు లాభం చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. ‘ఒక్కో బల్క్ బయ్యరు రిటైల్ బంకులకు వచ్చి ఐదు వేల నుంచి 10 వేల లీటర్లు తీసుకెళ్తే, ఇక సామాన్య ప్రజలకు డీజిల్ ఎలా దొరుకుతుంది? సామాన్యులు ఇంధనం కొనుగోలు చేసే చోట కమర్షియల్ వారికి అవకాశం ఎలా ఇస్తారు? బల్క్ బయ్యర్స్ కొనుగోలుకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమే‘ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చెబుతున్నది ఒకటి.. రాష్ట్రంలో జరుగుతున్నది మరొకటి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 4,510 ఇంధన కేంద్రాల్లో దాదాపు 70 శాతం పనిచేయడం లేదని, ఎక్కడ చూసినా ’నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇంధనాన్ని రేషనింగ్ పద్ధతిలో ఇస్తున్నారని, కార్లకు 10 నుంచి 15 లీటర్ల డీజిల్, ద్విచక్ర వాహనాలకు రూ.200 విలువైన పెట్రోల్ మాత్రమే పరిమితంగా పోస్తున్నారని అవినాష్ రెడ్డి వివరించారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇలాంటి కొరత ఏమాత్రం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు డ్రామాలు.. కేంద్రం మొట్టికాయలు ఈ ఇంధన కొరత సమస్యకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. సమీక్షల పేరుతో ఆయిల్ కంపెనీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అయితే, ఈ ఇంధన సంక్షోభానికి ఏపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని కేంద్రం కుండబద్దలు కొట్టిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన సర్క్యులర్ వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, తక్షణమే ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఇప్పటికే లేఖ రాసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. కేవలం ఏపీలో మాత్రమే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సర్క్యులర్ ద్వారా కమర్షియల్ డీజిల్ను సాధారణ బంకుల్లో కొనుగోలు చేసే అవకాశం కలి్పంచడమే అని అవినాష్ రెడ్డి విమర్శించారు. బ్లాక్ మార్కెట్ మాఫియాతో కుమ్మక్కు.. కళ్లు తెరిచి పరిస్థితిని చక్కదిద్దాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, బ్లాక్ మార్కెట్ మాఫియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఎంపీ అవినాష్రెడ్డి ఆరోపించారు. డీజిల్ కొరత వల్ల అగ్రి, ఆక్వా, రవాణా సహా అన్ని వర్గాల ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, ఎల్పీజీ సిలిండర్ల అనైతిక హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని తెలిపారు. కేంద్రం నుంచి తగినంత చమురు సరఫరా ఉన్నప్పటికీ ఏపీలో ఇంధన కొరత ఎందుకు ఉందో విచారణ జరపాలని, పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఆయన కేంద్ర కార్యదర్శిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి పరిస్థితిని సరిదిద్దాలని, వివాదాస్పద సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుకు స్పందించిన కేంద్రం.. రెండు మూడు రోజుల్లో ఏపీలో పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చినట్లు అవినాష్ రెడ్డి చెప్పారు. -
ఒకేసారి 6,124 మంది సచివాలయ ఉద్యోగులకు డిప్యుటేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 6,124 మందిని వివిధ ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్పై పంపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధ్యక్షతన మార్చి 13న వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ నెల 22న అన్ని శాఖలకు చేరాయి. మొత్తం 19 శాఖలకు 10,465 మంది ఉద్యోగులు అవసర మని ఆయా శాఖలు ప్రభుత్వానికి తెలియ జేయగా.. 6,124 మందిని సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులలో 2వేల మందిని హోంశాఖలో సిటిజన్ సర్వీస్ ఫెసిలిటేటర్లుగా, మరో 783 మందిని మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య విభాగం ఉద్యోగులుగా.. ఇంకో 406 మందిని మెప్మాలో కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లుగా.. 129 మందిని సెర్ప్లో లైవ్లీ హుడ్ (జీవనోపాధుల కల్పన) అసిస్టెంట్లుగా.. 100 మంది మహిళా పోలీసులను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా, 9 మందిని మైనార్టీ శాఖకు డిప్యుటేషన్పై పంపాలని ప్రతిపాదించారు.ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సైతం..గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను సైతం వివిధ శాఖలకు డిప్యుటేషన్పై పంపించాలని నిర్ణయించారు. వారిలో 430 మందిని గృహ నిర్మాణ శాఖ, 367 మందిని ఆర్ అండ్ బీ, 250 మందిని ఆర్డబ్ల్యూఎస్, 70 మందిని వైద్యశాఖ పరిధిలోని సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఇంకో 50 మందిని విద్యా శాఖలో ఇంజినీరింగ్ పనులకు, 20 మందిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 10 మందిని టూరిజం ఇంజనీరింగ్ పనులకు ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు.గిరిజన శాఖ పరిధిలోని ఐటీడీఏలో 28 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, సమగ్రశిక్ష విభాగంలో 113 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డిప్యుటేషన్ విధానంలో నియమించాలని ప్రతిపాదించారు. 562 మంది వార్డు ఎమినిటీస్ సెక్రటరీలను పట్టణాభివృద్ది శాఖలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు, 530 మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలను టౌన్ ప్లానింగ్ విభాగంలో వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. 140 మంది వార్డు రెవెన్యూ సెక్రటరీలను సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్లు, కేర్ టేకర్లుగా, 125 మంది వీఆర్ఏలను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లుగా డిప్యుటేషన్పై పంపాలని ప్రతిపాదించారు.సచివాలయాల ఉద్యోగులు కూలీలా..సచివాలయ ఉద్యోగులను కూలీల మాదిరిగా ఏ శాఖకు కావాలంటే ఆ శాఖకు పంచుతుండటం దుర్మార్గమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ అబ్దుల్రజాక్, ప్రధాన కార్యదర్శి శిష్టు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను బలహీనపరచడానికి, అస్తవ్యస్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. డిప్యుటేషన్పై పంపించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ ఫస్ట్ వస్తోంది.. ముందు నెల జీతాలే ఇవ్వలేదు...
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో మళ్లీ ఒకటో తేదీ వస్తోంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) విభాగంలోని సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికీ ఏప్రిల్ ఒకటో తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు.వీరికితోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పని చేసే 3,600 మంది.. డిగ్రీ కాలేజీల్లో పని చేసే 900 మంది.. పాలిటెక్నికల్ కాలేజీల్లో పనిచేసే 500 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం ఏప్రిల్ ఒకటిన అందాల్సిన వేతనాలు ఇంకా రానే రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికితోడు పాఠశాల విద్య పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్ ఒకటిన జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.50 వేల మందిపై తీవ్ర ప్రభావంమొత్తం వందకు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సెర్ప్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27 వేల మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు (వీవోఏ – యానిమేటర్లు) సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులతోపాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చి నట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. -
చంద్రబాబు రాక... అప్పన్న భక్తులకు అవస్థలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనానికి మంగళవారం సీఎం చంద్రబాబు రావడంతో పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించారు. దాదాపు మూడు గంటలు మండుటెండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సింహగిరికి వచ్చారు. ఆయన రావడానికి గంటన్నర ముందు నుంచే కొండపైకి వెళ్లే రెండు టోల్గేట్ల వద్ద భక్తులు, విధులకు హాజరుకావాల్సిన దేవస్థానం ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు.ఘాట్రోడ్డులో బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో దర్శనం చేసుకున్న భక్తులు సింహగిరిపై బస్టాండ్ ప్రాంగణంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు తిరిగి వెళ్లే వరకు క్యూలైన్లలో ఉన్నవారితోపాటు ఎక్కడ వారిని అక్కడే నిలిపివేశారు. అయితే, చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. మధ్యాహ్నం పవళింపు సేవ కావడంతో దేవస్థానం అధికారులు దర్శనాన్ని నిలిపివేశారు. చివరికి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. -
టీడీపీ నేతలు, సీఐ వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు రూరల్: దాయాదితో ఉన్న స్థల వివాదంలో టీడీపీ నేతల ప్రోద్బలంతో సీఐ తనను వేధిస్తున్నాడంటూ మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన యల్లా మణికంఠ (35) మంగళవారం పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మరణానికి సమీప బంధువులు యల్లా శ్రీనివాసులు, యల్లా రమేష్, గోపీ వారికి మద్దతుగా ఉన్న టీడీపీ నేతలు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, దిలీప్కుమార్తో పాటుగా సీఐ సురేష్ కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.సెల్ఫీ వీడియోలో బాధితుని కథనం మేరకు.. ‘నాకు, నా దాయాది అయిన యల్లా శ్రీనివాసులుకు మధ్య స్థానిక గర్రెవారి వీధిలో ఉన్న 3 సెంట్ల స్థలం విషయంలో ఉన్న వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. నా బంధువులు టీడీపీ నేత చిన్న శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి అతడి ద్వారా దిలీప్కుమార్, మరికొంతమంది ఇటీవల ఆ స్థలంలో రెండుసార్లు కట్టడాలు దౌర్జన్యంగా నిర్మించేందుకు చూశారు. వారిని ఆ స్థలంలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చాను. ఈనెల 23న దిలీప్కుమార్, మరికొందరు నాపై దాడికి పాల్పడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా ఇద్దరిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ విషయమై న్యాయం చేయమని ఎస్పీ హర్షవర్ధన్రాజును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎస్పీని కలిసినా.. తిరిగి నీకు న్యాయం చేయాల్సింది నేనే అంటూ సీఐ సురేష్ నన్ను కించపరిచి మాట్లాడుతున్నాడు.ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగుతున్నాను’ అంటూ వీడియో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు మణికంఠను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ విషయమై సీఐ సురేష్ను వివరణ కోరగా గర్రెవారి వీధిలో స్థలం డాక్యుమెంట్లు మణికంఠ పేరుపై లేవని, కోర్టు ఎలా చెప్తే అలా వెళ్లామే తప్ప అతడిపై దురుసుగా ప్రవర్తించలేదన్నారు. కాగా, మణికంఠ (35)కు ఏడాది క్రితం వివాహమైంది. భార్య ప్రస్తుతం గర్భవతి. -
చరమ‘గీతమే’ లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు ప్రతి మంగళవారం వేలకు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... మరోవైపు విశ్వవిద్యాలయాల నిధులను కూడా దోచేస్తోంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఖజానాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ.300 కోట్ల మేర ఏయూ నిధులను చంద్రబాబు ప్రభుత్వం కాజేసింది. ఏయూ నిధులు రూ.150 కోట్లు చొప్పున రెండు విడతల్లో రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు ప్రభుత్వం జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయాలనైనా పాలకవర్గం (ఈసీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గీతంలో పనిచేసి, గీతం వలన ఏయూ వీసీగా వచ్చిన రాజశేఖర్కు ఇవేవీ లెక్కలోలేవనే విమర్శలున్నాయి. ఈసీతో పనిలేకుండానే నేరుగా ఆయన ఏయూ నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించినట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్ల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఏయూ ఖజానా నుంచే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే రూ.200 కోట్లను వర్సిటీ వేతనాలకు వినియోగించింది. ఇక నూరేళ్ల చరిత్రను పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు సైతం ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఇందుకోసం కూడా సుమారు రూ.63.5 కోట్లను వర్సిటీ ఖజానా నుంచే వెచ్చించినట్లు సమాచారం. ఈ విధంగా వర్సిటీ ఖజానాను ఖాళీ చేయడం ద్వారా ఏయూలో అభివృద్ధి లేకుండా చూడాలనే పన్నాగం ఒకటి అమలవుతోందన్న ఆరోపణలున్నాయి. అంతిమంగా గీతం అనే ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏయూను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.శతాబ్ది ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం1926 నుంచి 2026కు నూరేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఏయూలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఏడాది కాలంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. పైగా శతాబ్ది ఉత్సవాలకు వెచ్చించిన రూ.63.5 కోట్లను ఏయూ ఖజానా నుంచే ఖర్చు చేశారు. అంతేగాకుండా కొద్దిరోజుల కిందట మరో రూ.300 కోట్లను ప్రభుత్వం లాగేసుకుంది. మరోవైపు ఉద్యోగుల జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో రూ.200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లించారు.వెరసి ఇప్పుడు ఏయూ ఖజానా డొల్లగా మారింది. ఒకవైపు ఏయూ ఖజానాను కొల్లగొడుతున్న చంద్రబాబు.. శతాబ్ది ఉత్సవాల్లో మాత్రం రూ.500 కోట్లు కేటాయిస్తానంటూ ప్రకటించారు. వాస్తవానికి 2016లో జరిగిన ఏయూ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో కూడా సీఎం హోదాలో ఏయూకి రూ.13.9 కోట్ల మేర మ్యాచింగ్ గ్రాంటు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలుమ్ని అసోసియేషన్ కార్పస్ఫండ్కు రూ.10 కోట్లు నేరుగా కేటాయిస్తామని చెప్పారు. అయినా ఆయన ఒక్కపైసా కూడా విదల్చలేదు. తాజాగా ఇప్పటికే ఏయూ ఖజానాను గుల్లచేసిన చంద్రబాబు.. ఇప్పుడు రూ. 500 కోట్లు కేటాయిస్తానని చెప్పడాన్ని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.‘గీతా’లాపన కోసమే..!చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏ వ్యవహారం జరిగినా అంతిమంగా గీతంకి లబ్ధి చేకూర్చేందుకేనని తెలుస్తోంది. మొన్నటికి మొన్న గీతం ఆక్రమించుకున్న రూ.5 వేలకోట్ల విలువైన భూములను సక్రమం చేసేందుకుగాను దాడులు చేసి మరీ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం జరిగేలా చూశారు. ఏకంగా దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికైన మొదటి విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించిన ఏయూలోని కేంద్రాన్ని పూర్తిస్థాయి స్కూలుగా మార్చాలని గతంలో నిర్ణయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణ కేంద్రాన్ని మూసేశారు.దీంతో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. ఇక యూనివర్సిటీలో బాగా డిమాండ్ ఉన్న దూరవిద్యలో అందించే రక్షణరంగ కోర్సులను ఎత్తేశారు. తద్వారా ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లించేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణశాఖ ఏయూని భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడాన్ని గమనిస్తే.. ఏయూలో వ్యవహారాలన్నీ గీతం కోసమే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గీతం కోసమే ఏయూను భ్రష్టుపట్టించే కార్యక్రమం జరుగుతోందని స్పష్టమవుతోంది. -
అంగన్వాడీలకు సెలవుల సంగతేంటి?
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఎండలు మండుతాయి. వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన చిన్నారులు, బాలింతలు, గర్భిణుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎండల తీవ్రత దృష్ట్యా రెండునెలల రేషన్ ఒకేసారి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నా... అంగన్వాడీ కేంద్రాలకు సెలవుల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. చర్చల సమయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం చెబుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇచ్చిన హామీకి ఇంత వరకూ అతీగతీ లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో సెలవుల ప్రకటన రెండు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనుంది. అయినా అంగన్వాడీలకు మే 1 నుంచి వేసవి సెలవుల ఇచ్చే విషయమై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అంగన్వాడీలకు మే 1 నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. 20 రోజుల క్రితమే చర్చించినా.. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని 20 రోజుల కిందటే అంగన్వాడీ యూనియన్ నేతలు కలిసి వేసవి సెలవుల విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా చాలా రోజులు సమయం ఉందని, సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఏప్రిల్ ముగిసి మే నెల వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంత వరకు సెలవుల విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సెలవులు ప్రకటించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి వద్దే రేషన్(టీహెచ్ఆర్) అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.


