Andhra Pradesh
-
అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల నిరసన
అనకాపల్లి: జిల్లాలో మత్య్సకారులు నిరసన చేపట్టారు. ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో చేపట్టారు మత్య్సకారులు. తమకు భరోసా కింద ఇస్తానన్న రూ. 20 వేలు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. బోటులపై లైసెన్స్లు, పాస్బుక్లతో బొట్లపైనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సముద్రoలో చేపల వేట నిషేధం సమయంలో 20వేల రూపాయలు మత్స్యకారుల భరోసా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అయితే పాయకరావుపేట నియోజకవర్గంలో 1380 మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా పడలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల భరోసా 20వేల రూపాయలు వెయ్యాలంటూ డిమాండ్ చేశారు. కాని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
నిప్పుల కుంపటిలా మారిన ఏపీ
సాక్షి,విజయవాడ: ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. ఫలితంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత మరో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. నేడు అత్యధికంగా కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 45.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు 45.4, కోనసీమ జిల్లా శివల, కాకినాడ జిల్లా కాజులూరులో 45.2,గుంటూరు జిల్లా మంగళగిరిలో 44.9, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7, విశాఖ జిల్లా ములగాడ 44.4, తూర్పుగోదావరి జిల్లా పోతవరం 44.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మంగళవారం వాతావరణ సూచనఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
మా స్థలాన్ని ఆక్రమించారు.. అనంత శ్రీరామ్ ఫిర్యాదు
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తన ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్. ఈ మేరకు భీమవరం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. స్థలం వివాదం కోర్టులో ఉన్నప్పటికీ పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారని అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అనంత్ శ్రీరామ్ వినతి పత్రం అందజేశామన్నారు. -
ఇది రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటా..?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ను పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు?.కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు?దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్ చేశారు. .@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2026 -
ఢిల్లీలో 102.. విజయవాడలో 118
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇటు రాజకీయ యుద్ధంగా మారింది. ఎన్నికల ముందు ప్రజలపై భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “జగన్ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగాయంటూ ప్రచారం చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు?” అనే గొంతుక సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.తాజాగా పెంచిన ఇంధన ధరలతో.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102 వద్ద ఉండగా.. విజయవాడలో అది రూ.118కి చేరడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో పెట్రోల్ రూ.115.69గా ఉంది. అంటే పొరుగు రాష్ట్రంతో పోల్చినా కూడా ఏపీలోనే ఇంధన భారం ఎక్కువగా పడుతోంది. కానీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం హైదరాబాద్ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ.. ఏపీలో రేట్లను ఏ మూలన ప్రస్తావించడం లేదు.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయన్నది తెలిసిందే. సామాన్యుల జేబుకు చిల్లుపడే విషయంలో.. ఆయిల్ కంపెనీలు, కేంద్రం చేతులెత్తాశాయి. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు మరింత ఎక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్, అదనపు సెస్సులేనని విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ఏపీలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్, మరో రూ.1 రోడ్ డెవలప్మెంట్ సెస్సు వసూలు చేస్తున్నారు. ఇందులో అదనపు వ్యాట్, ఇతర భారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిందని మొన్నటి ప్రెస్మీట్లో వైఎస్ జగన్ గుర్తు చేశారు.( 2015లో అప్పటి బాబు సర్కార్ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన జీవోలో.. పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డించారు). అయితే.. కరోనా వంటి కష్టకాలంలో కూడా తమ ప్రభుత్వం కేవలం రోడ్ సెస్సు కింద ఒక్క రూపాయి మాత్రమే పెంచిందని ఆయన వివరించారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగాయని ప్రచారం చేశారని.. అధికారంలోకి వస్తే తగ్గిస్తామని మాటిచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. దేశవ్యాప్తంగా.. గత 10 రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 15 నుంచి ఇప్పటివరకు దేశ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.8 పెరిగింది. ఈ ప్రభావంతోనే విజయవాడలో ధరలు మరింత ఎగబాకాయి. దీంతో “ఏపీలో సామాన్యుడికి భారం” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..జగన్ తాజా వ్యాఖ్యల్లో మరో కీలక ప్రశ్న కూడా లేవనెత్తారు. “ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడిగారు. జగన్ హయాంలో పెరిగిందని విమర్శించారు. అప్పుడు అంత విమర్శించారు కాబట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించాలి కదా? మరి ఎందుకు పెరుగుతున్నాయ్” అని చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రెస్మీట్ నాటికి పెట్రో ధరలు రూ.4 పెరిగాయి. ఈ మధ్యలోనే మరో నాలుగు రూపాయలు పెరిగింది. ఈ లెక్కన జగన్ కోరినట్లు ఆ రూ. 8 చంద్రబాబు తగ్గింపు చేసి ఉంటే.. ఏపీలో వాహనదారులపై భారం చాలా వరకు తగ్గేదే అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక.. ఇంధన ధరల వ్యవహారంలో ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన విమర్శలు, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కనిపిస్తున్న వైఖరి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందనే అభిప్రాయం ఆరోపిస్తోంది. “జగన్ హయాంలో పెట్రోల్ భారం” అంటూ ప్రచారం చేసిన నేతలు.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ అడిగిన దానికి సమాధానం ఏదని నిలదీస్తున్నారు. మరోవైపు హామీల్లో తగ్గింపు మాటలు చెప్పి.. చేతల్లో మాత్రం అదనపు భారం కొనసాగిస్తుండటంతో ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు “మాటల బాబు.. చేతల్లో ఎక్కడ?” అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. -
బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్ రెడ్డి హెచ్చరిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.పులివెందులలో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే జవాబు లేదు.మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.నోరు జాగ్రత్తగా పెట్టుకో..ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్ రవి.. వాడు వీడు అనే లెవల్లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్ అలాంటి పనులు చేయనని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం. -
ఎద్దు కంటే ఈ పొట్టేలు ధర ఎక్కువ..!
కర్నూలు: బక్రీద్ పండుగ సమీపిస్తుండటంతో ముస్లింలు ఖుర్బానీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొట్టేళ్ల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎమ్మిగనూరు పొట్టేళ్ల సంత కిటకిటలాడింది. ఎమ్మిగనూరుతో పాటు కర్నూలు, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలు దారులు తరలివచ్చారు. వ్యాపారులు, పొట్టేళ్ల పోషకులు పొట్టేళ్ల ధరను పెంచి విక్రయించారు. ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా ధర నిర్ణయించి విక్రయానికి ఉంచారు. పండుగకు ముందు వచ్చే చివరి ఆదివారం సంతలో పొటేళ్ల క్రయ,విక్రయాలు జోరందుకున్నాయి. -
వేరు శనక్కాయల మూట నుంచి సీఎం కుర్చీ వరకూ..
సాక్షి, తిరుపతి: చంద్రబాబు గత చరిత్ర చాలా హీనాతిహీమని.. దానిని ప్రసారం చేసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి. చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్ కుటుంబంపై టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ మండిపడ్డారు. ‘‘వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక 670 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. వైఎస్సార్ అభిమానులు ఊరూరా విగ్రహాలు కూడా పెట్టుకున్నారు. అలాంటిది వైఎస్ఆర్ కుటుంబంపై ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తోంది. అదే పని చంద్రబాబు విషయంలో చేయగలదా? అని భూమన ప్రశ్నించారు. చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు కపట నైజంతో ఉండేవారు. నాటకంలో పాత్ర కోసం వేరు శనక్కాయల మూట దొంగలించిన ఘనుడు చంద్రబాబు. మరి ఎల్లో మీడియాకు ఆ వేరు శనక్కాయల మూట గురించి మొదలు.. సీఎంగా ఎదిగే క్రమంలో ఆయన చేసిన పనులన్నీ ప్రసారం చేసే దమ్ముందా?. వైఎస్ఆర్ భిక్షతోనే చంద్రబాబు మంత్రి అయ్యాడని గుర్తిస్తే మంచిది’’ అని భూమన అన్నారు. -
పయ్యావుల.. నీ కుటుంబ చరిత్ర తెలుసుకో: విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, అనంతపురం: మంత్రి పయ్యావుల కేశవ్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి, సోదరుడి దారుణహత్య వెనుక మంత్రి పయ్యావుల కేశవ్ హస్తం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా తన కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది మంత్రి పయ్యావుల కేశవ్. దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబానిదే. పయ్యావుల కేశవ్ తాత, తండ్రి దుర్మార్గాలపై కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. పయ్యావుల ఆగడాలపై ఆందోళన చేపట్టిన నా తండ్రి రాకెట్ల నారాయణ రెడ్డి, సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలను దారుణంగా హత్య చేశారు.వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్కు తన కుటుంబ చరిత్ర తెలుసా?. వైఎస్ జగన్ను విమర్శించే అర్హత మంత్రి పయ్యావుల కేశవ్కు లేదు. ఫ్యాక్షనిజానికి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పారదర్శకంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి’ అని ఘాటు విమర్శలు చేశారు. -
ఎముకల డాక్టర్కు కుర్చీలంటే మహా ఇష్టం..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ అధికారి తీరు వివాదస్పదంగా మారింది. ఆయన మాట వినని కిందిస్థాయి వైద్యులతో పాటు, రోగులు, వారి బంధువులను సైతం దూషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రోగులకు చికిత్స చేయాలంటే సదరు అధికారికి కుర్చీలు, బెంచీలను, లేదంటే నగదును గిఫ్ట్రూపంలో ఇవ్వాల్సిందేనట. ఆస్పత్రిలోని ఎముకల విభాగానికి చెందిన వైద్యాధికారి తీరుతో రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.గతంలో కూడా ఆ అధికారి జామి గ్రామానికి చెందిన ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసిన తర్వాత రెండు కుర్చీలు ఇస్తేగాని డిశ్చార్చ్ చేయనని చెప్పడంతో యువకుడి తల్లి రెండు కుర్చలు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఆస్పత్రి అధికారులు కుర్చీలు తిరిగి ఇప్పించేశారు. కొద్దిరోజుల తర్వాత సదరు అధికారి మళ్లీ పాతపద్ధతినే కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వాస్పత్రి అయితే మాత్రం ఉచితంగా ఎందుకు చికిత్స చేయాలనే భావనతో ఆపరేషన్ చేయించుకున్న ప్రతీరోగి వద్ద గిఫ్ట్, నగదు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరానికి చెందిన ఓ న్యాయవాది తన తండ్రికి శస్త్రచికిత్స చేసినందుకు నాలుగు కుర్చీలు గిఫ్ట్ రూపంలో ఇచ్చినట్టు సమాచారం. కొద్ది రోజుల కిందట ఓ రోగితో తాను చెప్పిన మెడికల్ షాపులో రూ.30 వేలు పెట్టి ఇంప్లాంట్స్ కొనుగోలు చేయించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద “సాక్షి’ ప్రస్తావించగా ఎముకల విభాగానికి చెందిన అధికారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించి, చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు
సాక్షి, విజయవాడ: విజయవాడ టీడీపీ ఎంసీ కేశినేని చిన్ని సతీమణి జానకీ లక్ష్మీకి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP కంపెనీలో అవకతవకలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, గతంలోనూ జానకీ లక్ష్మీకి ఈడీ సమన్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. -
27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎల్లుండి(బుధవారం) పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. -
కొత్త అల్లుడికి పసందైన విందు
గోదావరి జిల్లాల అంటే ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఆదివారం కడియం మండలం వేమగిరి తోటలో ఓ కొత్త అల్లుడికి పసందైన విందును ఏర్పాటు చేశారు. వేమగిరి తోటకు చెందిన నరాల గణపతి తన మనవరాలు (కొడుకు కుమార్తె) గీతికను, తన మనవడు (కూతురి కుమారుడు) మణికంఠకు ఇచ్చి వివాహం చేశారు. ఆ జంటకు 101 రకాల వంటకాలతో మణికంఠకు విందు భోజనం పెట్టారు.-తూర్పుగోదావరి చోటుమాటు కాదండోయ్.. నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా, తలకెక్కించుకోవడం లేదు. నిడదవోలు– నరసాపురం ఆర్అండ్బీ రహదారిపై 14 మంది మహిళలతో పెరవలి నుంచి తీపర్రు వైపునకు ఆటో ఇలా వెళ్లగా, వెనుక మహిళలు ప్రమాదకరంగా కూర్చున్నారు. ఉసులుమర్రు వద్ద అధిక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్పై, తీపర్రు వద్ద అరటి లోడు వ్యాన్పైన కూలీలు కూర్చుని వెళ్లడం కనిపించింది. ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చిన కొందరు భక్తులు ఆటోల వెనుక కూర్చుని ప్రమాదపు అంచున ప్రయాణం సాగించారు. –పెరవలి , ద్వారకాతిరుమల -
నెల్లూరు నాదే.. ఫిక్స్ అయిపోండి!
రాజకీయాల్లో పదవీ కాంక్ష ఎంతటి వారలనైనా.. ఎంతటికైనా దిగజార్చుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి బ్రదర్స్ శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి రామలక్ష్మణులుగా కలిసి రాజకీయాలను చేస్తున్నారు. తాజాగా శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయ అరంగ్రేటం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ఈ దఫా ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నెల్లూరు రూరల్ టికెట్ తన రాజకీయ వారసుడిగా సోదరుడిని రంగంలోకి దింపుతానంటూ గతంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గిరిధర్రెడ్డి సైతం తానే అభ్యర్థినినంటూ రెండేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తల వద్ద ప్రకటించుకున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలిస్తూ షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న విషయం విదితమే. కుమార్తె పొలిటికల్ ఎంట్రీతో ప్రకంపనలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి తాను ఇక నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం నెల్లూరు రూరల్ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తనకు నియోజకవర్గంలోని ప్రతి ఊరుతోనూ, ప్రతి నేతతో ముఖ పరిచయాలే ఉన్నాయంటూనే వారి పేర్లను గుక్క తిప్పకుండా చెప్పుకుంటూ వచ్చారు. పరిస్థితులను బట్టి తన తండ్రి, అధిష్టానం ఆదేశిస్తే తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించడంతో ఒక్కసారిగా రూరల్లోని నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. వైష్ణవి విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కార్యాలయంలోనే ఉండడం, గిరిధర్రెడ్డి లేకపోవడంతో పార్టీ క్యాడర్లో కూడా చర్చకు దారితీసింది. ప్రస్తుతం పార్లమెంట్లో డీలిమిటేషన్, మహిళా బిల్లులు నిలిచిపోగా, 2029 నాటికి అయినా మహిళా బిల్లు అమల్లోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తనయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై పార్టీలో వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. మరో మూడేళ్లు ఎన్నికలకు సమయం ఉండగా ఆమె ఈ సమయంలో పొలిటికల్ ఎంట్రీలోనే తాను పోటీలో ఉన్నట్లు చెప్పడం నెల్లూరు టీడీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. కుటుంబంలో విబేధాల కారణంగానే.. కోటంరెడ్డి సోదరుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నుంచి సోదరుడికి టికెట్ వెళ్లడాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఎమ్మెల్యే తన కుమార్తెతో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. ఇదే సమయంలో తనను రాజకీయంగా వెన్నుపోటు పొడిచారనే బాధతో గిరిధర్రెడ్డి తన వర్గం వద్ద వాపోయినట్లు సమాచారం. గిరిధర్రెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ఉవాచ.గిరిధర్రెడ్డి పరిస్థితి ఏంటి? సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి నెల్లూరు రూరల్లో రాజకీయంగా ఎదిగి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి సైతం అన్న బాటలోనే నడిచారు. ఎమ్మెల్యేకు ఇటీవల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వచ్చే దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఆయన స్థానంలో సోదరుడు గిరిధర్రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలోని క్యాడర్ మొత్తం అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా, పాలనా పరంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గిరిధర్రెడ్డి సైతం షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. అధికారుల సమావేశాల్లో కూడా కొలువు తీరేవారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఎమ్మెల్యేగా భావించి రెడ్కార్పెట్ పరిచిన సందర్భాలు ఉన్నాయి. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేయడంతో రాజకీయంగా కలకలం రేపింది. రామలక్ష్మణుల్లా మసులుకునే అన్నదమ్ముల మధ్య విభేదాలు, అంతరాలు పెరిగాయా? లేదా తండ్రి రాజకీయ వారసత్వ రాజకీయాల్లోకి తనకు అవకాశం కల్పించాలని కుమార్తె నుంచి ఒత్తిడి పెరిగిందా? ఇలా.. అనేక రకాలుగా చర్చలు జరుగుతుండగా, అనేకనేక ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోదరుల మధ్య విభేదాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కొమ్మాది (విశాఖ): గ్రేటర్ విశాఖలోని 4వ వార్డు కాపులుప్పాడలో ఉన్నఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా హౌసింగ్ బోర్డ్ (వుడా) కాలనీకి చెందిన నడుమూరు జ్యోత్స్న (17) ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఆమె 450కి పైగా మార్కులు సాధించి, ప్రస్తుతం బెటర్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతోంది.శనివారం తోటి విద్యార్థినులతో సరదాగానే గడిపిన జ్యోత్స్న, రాత్రి వేరే గదిలోకి వెళ్లి బెడ్షిట్తో ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఆదివారం ఉదయం తోటి విద్యార్థినులు గమనించి యాజమాన్యానికి తెలపడంతో, ఆమెను మారికవలసలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని తండ్రి జగన్మోహన్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది
పులివెందుల: టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వేముల మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ బయపురెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల భాకరాపురంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర కలిగిన పార్థసారధిరెడ్డి తనకు దారుణమైన అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతూ వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తాతను చంపిన వారిని తాను, తన తండ్రి పట్టించుకోలేదని ఇటీవల చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారని, వారిద్దరూ తలచుకుంటే నువ్వు పులివెందుల ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగేవాడివా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత రాయలసీమలో ఎక్కడా ఫ్యాక్షన్ ఉండకూడదని నిశ్చయించుకుని పూర్తిగా రూపుమాపారని చెప్పారు. కర్నూలు జిల్లాలో కాటసాని కుటుంబానికి, బిజ్జల పార్థసారథి కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా వైఎస్ రాజీ కుదిర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ ద్వారా పార్థసారథిరెడ్డి, టీడీపీ నాయకులు రూ.కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. గనుల కోసమే తమ పార్టీ నాయకుడు వేల్పుల రాముపై పార్థసారథిరెడ్డి హత్యాయత్నం చేశాడన్నారు. టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైఎస్ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ వివేకాను చంపాల్సిన అవసరం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయే ముందురోజు వరకు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ గెలుపు కోసం పనిచేశారన్నారు. అసలైన వెన్నుపోటు పార్టీ టీడీపీయేనన్నారు. ఇప్పటికైనా పార్థసారథిరెడ్డి నిరాధారణమైన ఆరోపణలు, ప్రేలాపనలు మానుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వేముల చెరువు నీరు లేకుండా కనపడిందా, ప్రస్తుతం ఆ చెరువు పరిస్థితి ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఎవరేమిటో ప్రజలు గమనిస్తున్నారని, తమతో పోటీ పడాలంటే అభివృద్ధిలో పోటీపడాలన్నారు. పార్థసారథిరెడ్డి ఇకపై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కార్యక్రమంలో వేముల మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి, ఎంపీపీ గంగాదేవి వెంకటనారాయణ, ఎంపీటీసీలు మల్రెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు మదర్సావలీ, రాధాకృష్ణయ్య, డీసీసీ మాజీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, కో–ఆప్షన్ సభ్యుడు మహబూబ్పీరా, వైఎస్సార్సీపీ నాయకులు చలమారెడ్డి, రాజారెడ్డి, చలపతి, నాగభూషణం, గంగాధర్, మల్లారెడ్డి, శ్రీనివాసులు, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
బంగారం రికవరీ పేరిట దంపతులకు పోలీసుల వేధింపులు!
తెనాలి రూరల్: బంగారు ఆభరణాల రికవరీకి తనను, తన భర్తను పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కొట్టి వేధించారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. బాపట్ల జిల్లా కూచిపూడికి చెందిన కటారి తిరుపతమ్మ, సాయిబాబు దంపతులు తెనాలిలో ఉంటున్నారు. కొత్తపేటలోని సువర్ణ అపార్ట్మెంట్లో సాయిబాబు వాచ్మన్. తిరుపతమ్మ అదే అపార్ట్మెంటులోని ఇళ్లలో పనులు చేసుకుంటోంది. అపార్ట్మెంట్లో ఉండే స్వర్ణలత అప్పుడప్పుడూ తిరుపతమ్మ దంపతులకు బంగారు వస్తువులను ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తెప్పించుకుంటూ ఉండేది.ఈ క్రమంలో తిరుపతమ్మ దంపతులు బంగారాన్ని విడిపించి ఇవ్వకుండా తనను మోసం చేశారని స్వర్ణలత వారం క్రితం పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీనిపై తిరుపతమ్మ దంపతులను స్టేషన్కు పిలిపించి పోలీసులు ఇటీవల విచారించారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని పంపేశారు. ఆ తర్వాత తిరుపతమ్మ మారీసుపేటలో తన అత్తయ్య వాచ్మన్గా ఉంటున్న ఓ అపార్ట్మెంటుకు శనివారం వెళ్లింది. నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు తనను కొట్టి వేధించారని సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగింది. ఈ విషయం తెలిసిన సాయిబాబు ఆమెను తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు.మెరుగైన చికిత్స కోసం ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కాగా, పోలీసులు శనివారం రాత్రి పొద్దుపోయాక సాయిబాబు నుంచి తీసుకున్న స్టేట్మెంట్లో..స్వర్ణలతకు బంగారం ఇవ్వాల్సింది నిజమేనని అంగీకరించారు. తమను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని సాయిబాబు చెప్పారు. కాగా, తిరుపతమ్మ దంపతులను పిలిపించి మాట్లాడామని వారిని వేధించడం, కొట్టడం చేయలేదని వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు ’సాక్షి’కి తెలిపారు. -
స్టాక్ మార్కెట్ పేరిట వైద్యుడికి టోకరా
చిత్తూరు అర్బన్: స్టాక్ మార్కెట్ పేరిట పలువురిని బురిడీ కొట్టించిన కేసులో ఓ మహిళను కర్ణాటక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నారు. చిత్తూరు నగరం కొంగారెడ్డి పల్లెలోని శ్రీనివాస నగర్కు చెందిన చైతన్య, అతని భార్య హైమావతి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు తీసుకొస్తామంటూ దుర్గాప్రసాద్ను నమ్మించారు. గతేడాది నుంచి పలు దఫాలుగా దుర్గాప్రసాద్ నుంచి రూ.15 కోట్లు తీసుకున్నారు. భారీగా వడ్డీ చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరు పోలీసులు చిత్తూరు వచ్చారు. ప్రధాన నిందితుడు చైతన్య పారిపోగా అతని భార్య హైమావతిని అదుపులోకి తీసుకొని బెంగళూరు తరలించారు. -
ఖేల్ ఖతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘డీఎస్సీ’ క్రీడా కోటా పోస్టుల భర్తీలో అవకతవకలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి మరీ అమ్మేసుకోవడం నిరుద్యోగ యువతలో అలజడి రేకెత్తిస్తోంది. ఏకంగా 421 పోస్టుల్లో 97 శాతం పోస్టులు భర్తీ చేయగా ఇందులో వంద పోస్టులూ నిజమైన అర్హులకు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షాత్తూ ముఖ్యనేత బంధువు, శాప్ పాలకవర్గంలోని ఓ కీలక వ్యక్తిని మాస్టర్మైండ్గా ముందు పెట్టి సాగించిన దందా సాక్ష్యాలతో సహా బయటకొచ్చే సరికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నిజమైన అర్హత కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ముడుపులు తీసుకుని క్రీడలంటే తెలియని వ్యక్తులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయడం దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది. దీనికితోడు డీఎస్సీ ముగిసిన తరువాత తాజాగా క్రీడా పాలసీని సవరించడం అనుమానాలకు తావిస్తోంది. సర్టీఫికెట్ చాలదు.. పరీక్ష రాయాల్సిందే! ప్రభుత్వ క్రీడా విధానం 2024–29 ప్రకారం.. 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు వారి సర్టీఫికెట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్ ఇవ్వాలని సర్కారు నిర్దేశించింది. దీని ప్రకారమే డీఎస్సీలో 421 పోస్టుల్లో 97శాతం పోస్టులను భర్తీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఇతర స్థాయిల్లో సాధించిన పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు పూర్తిచేసింది. దీనిని అనువుగా చేసుకునే ముఖ్యనేత బంధువు, మాస్టర్మైండ్ పోస్టుకో రేటు పెట్టి ముడుపులు దండుకున్నారు.అర్హులకు పోస్టులు దక్కకుండా చేశారు. ఇంత జరిగాక.. డీఎస్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీడాపాలసీ 2024–29ను చంద్రబాబు సర్కారు సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు, 3శాతం హారిజంటల్ రిజర్వేషన్లో అభ్యర్థి కచ్చితంగా ఆయా శాఖల్లో పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే క్రీడా కోటాలో సర్టీఫికెట్లు పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టనున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంటే, ఇక్కడ ఒక పథకం ప్రకారం మెగా డీఎస్సీలో పోస్టులను విచ్చలవిడిగా అమ్మేసుకుని, ఆ తంతు ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా క్రీడా పాలసీని సవరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికిచ్చిన అభయం కోసం!! ఇదిలా ఉంటే రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ క్రీడా కోటా పాలసీని సవరించిన సర్కారు శాప్లో గ్రేడ్–3 కోచ్ల నియామకానికి మాత్రం దీనిని వర్తింపజేయకపోవడం, ఇక్కడ పాత పద్ధతిలోనే సర్టీఫికెట్ల మెరిట్ ఆధారంగానే చేస్తుండటం గమనార్హం. డీఎస్సీ క్రీడా కోటాలో తనకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటానికి సిద్ధమైన అనంతపురానికి చెందిన ఓ ఫెన్సింగ్ క్రీడాకారిణిని బెదిరించి నిలువరించిన శాప్,, శాశ్వత కోచ్ల నియామకంలో కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనిని బట్టి డీఎస్సీలో మాస్టర్మైండ్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శాప్ కోచ్ల నియామకానికి రాతపరీక్ష అర్హతలు పెట్టలేదని స్పష్టమవుతోంది.ఇలా వందల మంది పోస్టుల రాని క్రీడాకారులను మభ్యపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే డీఎస్సీలో రెండేళ్లకోసారి, అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని నేషనల్ గేమ్స్ను ముందు వరుసలో పెట్టి సీనియర్ నేషనల్స్ ప్రాధాన్యాన్ని వెనక్కి నెట్టేసింది. నేషనల్స్లో పాల్గొన్నట్లు సర్టీఫికెట్లు తెచ్చుకున్న వారికి రూ.15 లక్షల చొప్పున పోస్టులు అమ్మేశారు. వాస్తవానికి నేషనల్ గేమ్స్ అనేవి ఒక్కోసారి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో ఒక్కో క్రీడాంశంలో కేవలం టాప్–8 ఉండే రాష్ట్రాల జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఏటా జరిగే సీనియర్ నేషనల్స్లో దేశం మొత్తం నుంచి ఆయా రాష్ట్రాల్లో వడపోసిన క్రీడాకారులు ప్రదర్శనకు వస్తారు. సీనియర్ నేషనల్స్లో నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సీనియర్ నేషనల్స్ను పక్కన పడేసి నేషనల్ గేమ్స్కు డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వడం సర్కారు దుర్నితికి అద్దం పడుతోంది. క్రీడల విభజనతో మొత్తం గోల్మాల్దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో క్రీడలను కూటమి ప్రభుత్వం రెండు రకాలుగా వర్గీకరించింది. ఇందులో ఏపీలో ప్రాధాన్యంలో ఉన్న క్రీడలను తక్కువ కేటగిరీలోకి నెట్టేసింది. జీవోలో 65 క్రీడలను చేరిస్తే ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 క్రీడలను పెట్టింది. ఇది క్రీడా ప్రమాణాలకు విరుద్ధమని క్రీడా సంఘాల ప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ క్రీడల విభజన లేదు. శాప్ గుర్తింపు లేని సంఘాలను ఏ– కేటగిరిలో ఉంచి, శాప్ గుర్తింపు ఉన్న కొన్ని సంఘాలను బీ కేటగిరిలోకి తేవడం కొసమెరుపు. ఉద్యోగాల భర్తీలో ఏ–కేటగిరి పూర్తయిన తరువాత బీ–కేటగిరి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారం డీఎస్సీలో పోస్టులు ఇష్టారీతిన భర్తీ చేసేశారు.ఉదాహరణకు.. బీ–కేటగిరీలో ఉన్న క్రీడలో సదరు క్రీడాకారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినా.. ఏ–కేటగిరిలో ఉన్న క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి ఆటల్లో పాల్గొన్న సర్టీఫికెట్తో వస్తే చాలు అతనికే ప్రాధాన్యం ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. దీనిపైనా హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టులు ఎక్కడా లేవు, గోల్ఫ్ ఆడే క్రీడాకారులూ లేరు, ఈ క్రీడను ఏ–కేటగిరిలో చేర్చి రాష్ట్రంలో యువత రాణించే సెపక్తక్రా, నెట్బాల్, క్యారమ్స్, ఆత్యా పాత్యా, బాడీ బిల్డింగ్, కరాటే, టెన్నిస్బాల్ క్రికెట్, సాఫ్ట్ టెన్నిస్, యోగాసన క్రీడలను బీ–కేటగిరిలో పెట్టి డీఎస్సీని అడ్డుపెట్టుకుని దోచేశారు. క్రీడా సర్టీఫికెట్లకు గతంలో ఉన్న 10 ఏళ్ల కాలపరిమితిని ఎత్తివేశారు. -
సర్కారు ‘మాస్టర్’ప్లాన్
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 పేరుతో భారీ స్కామ్కు చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసిందా? ప్రణాళిక ప్రకారమే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా ముంచేసిందా? అంటే డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. వాస్తవానికి డీఎస్సీ పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయమే మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అంతా సక్రమమేనంటూ బుకాయించింది.దరఖాస్తు ప్రక్రియ మొదలు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వరకు అంతా తన చేతిలోనే పెట్టుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి డీఎస్సీ పేపర్ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చూస్తుంది. ప్రశ్నల తయారీ, జవాబుపత్రాల వ్యాలిడేషన్ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టడం గమనార్హం. అంతకు ముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించడం కూడా సర్కారు పాత్రపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. టెట్ కన్వీనర్ను తొలగించి.. వాస్తవానికి ఏపీ టెట్ కన్వీనర్గా ఉండే అధికారే డీఎస్సీకి కూడా కన్వీనర్. టెట్ సెల్కు విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం టెట్ కన్వీనర్గా నియమించింది. అయితే, టెట్ పరీక్షలు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఆయనను ఆ బాధ్యతల నుంచి ఉన్నఫళంగా తొలగించి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ను కన్వీనర్గా నియమించింది. దీంతో టెట్ నిర్వహణ, డీఎస్సీ పేపర్ తయారీలో ఒకే అధికారి కొనసాగారు. అనంతరం ఎస్సీఈరీ్టలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి నవీన్కు కేవలం డీఎస్సీ ప్రశ్నలు తయారీతో పాటు వాటిని ఆన్లైన్ చేయడం చేసే బాధ్యతలు అప్పగించారు. అతను కూడా డీఎస్సీకి హాజరవుతున్నాడని తెలిసినా అధికారులు అదే విధుల్లో కొనసాగించడం కొసమెరుపు.అసలు రహస్యంగా జరగాల్సిన కీలక విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగిని ఎలా నియమించారన్నది పెద్ద ప్రశ్న. ఫలితాలు విడుదల కాగానే కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గానూ, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతడిని బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకు రాకుండా అతనిని తమదైన శైలిలో సముదాయించినట్టు విశ్వసనీయ సమాచారం.ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారాయన్న విమర్శలూ విద్యాభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. లీకేజీ వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. జిల్లా స్థాయిలో జరగాల్సిన ఎంపికల ప్రక్రియనూ తమ చేతుల్లోకి తీసుకున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీలను కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టీఫికెట్ల పరిశీలనకే పరిమితం చేశారు. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ డీఎస్సీ నియామకాల్లో తొలి నుంచీ అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో మరో కోణమిది. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ల (ఎస్ఎంఎస్) పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు, వెనుక ఉన్నవారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతోపాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులూ రోజుకో విధంగా మార్చేసింది, ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, ‘నాట్ క్వాలిఫైడ్’ అని ప్రకటించింది.ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకూ ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించి అందుకు అనుగుణంగా హాల్టికెట్లు ఇచ్చి పరీక్ష నిర్వహించింది. తర్వాత ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేసింది. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలే’దంటూ వేలమంది అభ్యర్థులు జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేసింది. ప్రతిభకు అడుగడుగునా అన్యాయండీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల (ఎస్ఎంఎస్) జారీ, సర్టీఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. 16,347 ఉపాధ్యాయు పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను సర్కారు వేర్వేరుగా నిర్వహించింది. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు.మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదట ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచి్చన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కోల్పోయారు. డీఎస్సీ నిర్వహణలో తమదే పేటెంట్గా చెప్పుకుంటున్న టీడీపీ సర్కారు అడుగడుగునా అడ్డగోలుగా తప్పులు చేసి అభాసుపాలైంది. ప్రతిభావంతుల భవిష్యత్తును నాశనం చేసింది. హైకోర్టు ఆక్షేపించినా..!చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాము రెండు, మూడు పోస్టులకు ఎంపికైతే ఒక పోస్టుకే కాల్ లెటర్ పంపి.. తమ ఉన్నత ఉద్యోగ హక్కుకు భంగంకలిగించారని వందలాది మంది పిటిషన్లు వేయడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందినవారికి పోస్టు ప్రిపరెన్సీ క్రమంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని అక్టోబర్ 12నే మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.అయినా వాటిని పట్టించుకోకుండా అక్టోబర్ 15న ఎంపిక ప్రక్రియను సర్కారు పూర్తిచేసేసింది. దీంతో మరో సారి అభ్యర్థులు కోర్టుకెళ్లగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశి్నంచింది. ఇది దారుణమైన, దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచింది. 2 నెలల్లోగా వారికి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులిచ్చి ఏడునెలలైనా అభ్యర్థులకు న్యాయం జరగలేదు. -
విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాపించడంతో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఎబోలా నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. వైరస్ లక్షణాలున్న వ్యక్తులను క్వారంటైన్ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామన్నారు. అలాగే విశాఖ ఓడరేవు అధికారులతో వైద్య శాఖ సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాల్లోని బోధనాస్పత్రుల్లో 15 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని ఇప్పటికే కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఎబోలా లక్షణాలు ఇలా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం వైరస్ సోకిన వారికి కొన్ని వారాలపాటు లక్షణాలు బయటపడవు. దీంతో తక్కువ కాలంలో ఎక్కువ మందికి వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణ జ్వరం మొదలై అకస్మాత్తుగా జ్వరం పెరిగి, శరీరమంతా బలహీనపడుతుంది. తల, గొంతు, కండరాల నొప్పులు తీవ్రంగా తలెత్తుతాయి. రోజు రోజుకూ నొప్పులు మరింత తీవ్రం అవ్వడంతో పాటు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబారడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ బారినపడ్డ వారిలో కనిపిస్తాయి. -
అగ్నికి ఆజ్యం.. ఎల్నినోకు ‘లూ’ గాలుల తోడు
సాక్షి, అమరావతి: ఎల్నినో పరిస్థితులకు తోడు ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోకి వాయవ్య దిశ నుంచి తీవ్రమైన పొడి వేడి గాలులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఈ గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయానికి తీవ్రమైన వడగాలులుగా మారుతున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే ఈ గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. ఇవి సముద్రం నుంచి కాకుండా పూర్తిగా భూమి మీదుగా ప్రయాణిస్తూ దారిలో ఉన్న తేమను పూర్తిగా లాగేసుకుంటున్నాయి. మన వద్దకు వచ్చేటప్పుడు తూర్పు కనుమలను దాటే సమయంలో ఈ గాలులు కిందకు దిగడంతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. సైన్స్ పరిభాషలో దీన్ని కంప్రెషనల్ హీటింగ్గా పిలుస్తారు. చల్లని గాలుల్ని అడ్డుకుంటున్న వాయువ్య గాలులు పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే ఈ తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలులు భూమి మీదకు రావడంలేదు. దీంతో తీరప్రాంతాల్లో గాలిలో తేమ 80 శాతానికిపైగా తగ్గిపోతోంది. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటివల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివేమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు వెళుతూ సముద్రంలోని చల్లని గాలుల్ని తీసుకుపోయింది. దీంతో మన ప్రాంతం మరింత వేడెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్న రోజులు వేడిసెగలే ఉండనున్నాయి. ఎల్నినోతో తలకిందులైన వాతావరణ చక్రం ప్రస్తుత ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్నినో అని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇంకా సూపర్ ఎల్నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోకపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్లు చెబుతున్నారు. ఎల్నినో కారణంగా మన వాతావరణ చక్రం తలకిందులైంది. నైరుతి ఆలస్యమే ఈ ప్రభావం నైరుతి రుతుపవనాలపైనా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి బలహీనంగా మారతాయని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల కిందటే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలడంలేదు. అవి అక్కడే నిలిచిపోవడంతో ఈ నెలాఖరుకు అవి కేరళను తాకడం అనుమానమే. దీంతో ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా అవి విస్తరించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండదని ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. లూ గాలులు అంటే.. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. -
రాజధానిలో మరో స్కామ్.. దేవుడికే శఠగోపం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తోంది. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తూ.. నిపుణులు విస్తుపోయేలా చేస్తుండటమే కాకుండా ప్లాట్ల కేటాయింపులో జరిగిన మాయాజాలం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో దేవుడి భూములను అస్మదీయులకు కట్టబెట్టి దేవాలయ వ్యవస్థను కూడా చంద్రబాబు సర్కార్ వదలకుండా భ్రష్టు పట్టిస్తోందని స్పష్టమవుతోంది. రాజధాని ప్రధాన ప్రాంతం(సీడ్ కేపిటల్ ఏరియా)లోని వెలగపూడి వేణుగోపాలస్వామి మాన్యం సర్వే నెంబరు 271–ఏలోని 10.6 ఎకరాల భూమిని టీడీపీ నేత మోతుకూరి సుబ్బారావు, మోతుకూరి రాజ్యలక్ష్మి ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. సుబ్బారావు.. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖపట్నంకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. సదరు నేత ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తీసుకుంటూ.. దానికిగానూ మోతుకూరి సుబ్బారావుకు సీఎం చంద్రబాబు నిర్మించుకుంటున్న ప్యాలెస్కు కూతవేటు దూరంలో 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన 6 నివాస ప్లాట్లు కేటాయించారు. ఈ ప్రాంతంలోనే ఈ–6 రోడ్డుకు సమీపంలో 2,650 గజాల విస్తీర్ణంతో కూడిన రెండు వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. తొలి ఏడాది ఎకరానికి రూ.30 వేలు.. ఆ తర్వాత ప్రతి ఏటా రూ.3 వేలు పెంచుకుంటూ 10.6 ఎకరాలకు పదేళ్లకు సంబంధించిన కౌలును కూడా ప్రభుత్వం ఆయనకు చెల్లించేసింది. దేవుడికి మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 10.6 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని దేవదాయ శాఖకు చెల్లించాలని నిర్ణయించింది. అంటే.. దేవుడికి భూమికిగాను పరిహారంతో సరిపెట్టేసిన చంద్రబాబు సర్కార్.. ఆ భూమిని ఆక్రమించిన టీడీపీ నేతకు మాత్రం అత్యంత విలువైన ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలును కూడా చెల్లించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50 వేలు, వాణిజ్య ప్లాటు(250 గజాలు) రూ.2.70 కోట్లు పలుకుతోందని చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకుకు నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన మోతుకూరి సుబ్బారావుకు ఇచ్చిన ప్లాట్ల విలువ రూ.81.62 కోట్లు కావడం గమనార్హం. ఇదొక్కటే కాదు నెక్కళ్లులో శ్రీమళ్లేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయాలకు చెందిన భూములతోపాటు రాజధాని గ్రామాల్లో 173.22 ఎకరాలను ఇదే రీతిలో వాటిని ఆక్రమించి, సాగుచేసుకుంటున్న వారికి లబ్ధి చేకూర్చింది. వాటిని భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న సీఆర్డీఏ.. దేవాదాయ శాఖకు పరిహారంతో సరిపెట్టి.. ఆక్రమించుకున్న వారికి నివాస, వాణిజ్య ప్లాట్లు, ఏటా కౌలు చెల్లిస్తోంది. వెలగపూడిలో సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న ప్యాలెస్కు కూతవేటు దూరంలో మోతుకూరి సుబ్బారావుకు కేటాయించిన 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన ఆరు నివాస ప్లాట్లు సీఆర్డీఏ అథారిటీ తీర్మానం.. కబ్జాదారులకు ప్రయోజనం గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని 2015లో ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. అటవీ, ప్రభుత్వ భూమిపోనూ, మిగతా భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం) కింద సమీకరించాలని నిర్ణయించింది. 29 గ్రామాల్లో 1,017.09 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉంది. ఇందులో 843.87 ఎకరాలను భూ సమీకరణ పథకం కింద తీసుకున్న సీఆర్డీఏ.. సంబంధిత ఆలయాలకు రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించి, ఏటా కౌలు చెల్లిస్తూ వస్తోంది. మిగతా 173.22 ఎకరాల భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారిలో అధిక శాతం టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కావడంతో అప్పటి చంద్రబాబు సర్కార్ వారికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఆక్రమించుకున్న వారి నుంచి ఆ భూమిని దేవాదాయ శాఖ స్వా«దీనం చేసుకోవడం కష్టంగా మారిందని, బలవంతంగా తీసుకుంటే వాటిని ఆక్రమించుకున్న వారి జీవనోపాధి దెబ్బ తింటుందని సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్ 20న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 6వ సమావేశంలో.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికిగాను సంబంధిత ఆలయానికి పరిహారం చెల్లించి, ఆ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న వారికి నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలును కూడా చెల్లించాలని తీర్మానం చేసింది. దాన్ని అమలు చేస్తూ 2018 అక్టోబర్ 11న ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 330) జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి.. దేవాలయ భూములపై దేవుడికి సేవ చేసేవారు, ఇనాముదార్లకు కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుందని, వాటిపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని, విక్రయించడానికి ఏమాత్రం వీల్లేదని.. దేవుడి భూములు దేవుడికే చెందుతాయని 1998లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వింజమూరు రాజగోపాలాచారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నడిచిన దేవాలయ భూమి వ్యాజ్యంలో.. దేవుడి భూమి దేవుడికే చెందుతుందని.. సేవ చేసే వారికి వాటిపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేస్తూ 2015లో హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో వైకుంఠపురం శ్రీవెంకటేశ్వరస్వామికి భజంత్రిగా సేవ చేసే వ్యక్తి.. సేవ చేసినందుకుగాను తాను సాగు చేసుకుంటున్న దేవాలయ భూమిని విక్రయించడంపై వ్యాజ్యం (డబ్ల్యూపీ 1718/2019) దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఉటంకిస్తూ.. దేవుడి భూమిపై దేవుడికే సర్వాధికారాలు ఉంటాయని, సేవ చేసే వారికి, ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. కానీ.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తుంగలో తొక్కుతూ సీఆర్డీఏ అథారిటీ 6వ సమావేశంలో దేవుడి భూములను ఆక్రమించుకున్న వారికి ప్రయోజనం చేకూర్చుతూ నిర్ణయం తీసుకున్నారని భక్తులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నెక్కళ్లులోనూ ఇదే తరహా దందా ⇒ నెక్కళ్లులో శ్రీమళ్లేశ్వరస్వామి ఆలయానికి సర్వే నంబరు 59లో 11.45 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రూ.1,87,58,864.38 పరిహారం ఇవ్వాలని, అదే గ్రామంలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబరు 158లో ఉన్న 14.07 ఎకరాల భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.2,30,51,285.75 పరిహారంగా ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు లెక్కగట్టారు. ⇒ ఈ రెండు ఆలయాలకు సంబంధించిన 25.52 ఎకరాల భూమికిగానూ మొత్తంగా రూ.4,18,10,150.14 పరిహారంగా సీఆర్డీఏ దేవదాయ శాఖకు చెల్లించింది. ఆ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న వారికి మాత్రం రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లు, ఏటా కౌలును చెల్లిస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ⇒ శ్రీమల్లేశ్వరస్వామి ఆలయ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న అబ్బూర రజిని, రామినేని రామారావు, పూజల పద్మ చౌడేశ్వరి, రామినేని మళ్లీశ్వరి, రామినేని బాబు, రామినేని పూర్ణచంద్రరావు, రావెల శ్రీనివాసరావు, రావెల రామచంద్రరావు, రావెల రాంబాబులకు సీఆర్డీఏ నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది. ⇒ శ్రీవేణుగోపాలస్వామి ఆలయ భూమిని ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్న మాడపాటి సింహాద్రి, భట్టిప్రోలు షేక్ జమీల్, గుమ్మా శివలీల, చదలవాడ చలపతిరావు, గుర్రపూసల చిట్టెమ్మ, మేడూరి వీరరాజేశ్వేరమ్మ, గుమ్మా శ్రీనివాసరావు, గుమ్మా లక్ష్మినారాయణ, పొదిలి బోడయ్య, షేక్ ఏసోబు, చదలవాడ లక్ష్మీబాయమ్మ, చదలవాడ సుబ్బారావు, గుమ్మా వెంకటరావు, కూరుకూటి వెంకటనరసమ్మలకు నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ.. వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది. నిషేధం తొలగించి లబ్ధి చేకూర్చేలా అడుగులు! ⇒ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని అస్మదీయులకు, టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య, ఈ 23 నెలల కాలంలో ఇలాంటి పలు నిర్ణయాలు తీసుకుందని భక్తులు, ధార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ⇒ వాస్తవానికి ప్రభుత్వం దేవదాయ శాఖ భూముల క్రయవిక్రయాలు జరగకుండా.. వేరొకరు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో పెట్టింది. అయితే ప్రైవేట్ వ్యక్తుల భూముల సర్వే నంబర్లు మారి, దేవాలయాల భూముల్లో కలిపారంటూ లక్షన్నర ఎకరాల దేవాలయాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 139) జారీ చేసింది. ⇒ కృష్ణా జిల్లా గొడుగుపేట దేవాలయానికి చెందిన భూమి విజయవాడలోని గొల్లపూడిలో ఉంటే.. ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, గోల్ఫ్ కోర్టు కోసం కేటాయించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఇందులో రాత్రికి రాత్రి మట్టిని తోలారు. దీనిపై భక్తులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. ⇒ కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియం కోసం కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న సాకుతో వైఎస్సార్ కడప జిల్లాలోని పుష్పగిరి మఠం పేరిట అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలోని 259 సర్వే నంబరులో ఉన్న 6.89 ఎకరాల భూమిని అమ్మేయడానికి అనుమతి ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ కళ్లారా చూస్తున్న భక్తులు.. దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే అస్మదీయులకు వాటిని కట్టబెడుతోందని మండిపడుతున్నారు. ఇలాగైతే ఆయా ఆలయాల నిర్వహణ, నిత్య కైంకర్యాలు, ఉత్సవాలకు ఇక్కట్లు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందంలో సాక్షి సంతకం చేసిన వట్టిగుంట వేణుగోపాలరెడ్డికి తనకు కేటాయించిన 600 గజాల వాణిజ్య ప్లాటును ఇచ్చిన మోతుకూరి సుబ్బారావు(ఆ ప్లాటును వేణుగోపాలరెడ్డికి విక్రయించారా లేదా ఇందులో మర్మమేమిటన్నది వారిద్దరికే ఎరుక) పేకాటలో చేయితిరిగిన మంత్రి ఒత్తిడితో..⇒ వెలగపూడిలో శ్రీవేణుగోపాలస్వామికి సర్వే నెంబరు 271–ఏలో 10.6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోతుకూరి రాజ్యలక్ష్మి, మోతుకూరి సుబ్బారావు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజధాని భూ సమీకరణ కింద నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 9.1 ఫారమ్లో ఆ భూమి పట్టా భూమిగా.. మోతుకూరి రాజ్యలక్ష్మి, సుబ్బారావుకు చెందినదిగా సీఆర్డీఏ చూపింది. దీనిపై దేవదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ భూమి దేవుడిదని రికార్డులు చూపడంతో సీఆర్డీఏ అధికారులు 9.5 ఫారమ్లో దాన్ని దేవాదాయ శాఖ భూమిగా మార్చారు. ⇒ కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ఆ భూమిని తీసుకుంటూ జారీ చేసిన 9.22 ఫామ్లో మాత్రం.. ఆ భూమి దేవాదాయ శాఖతోపాటు మోతుకూరి రాజ్యలక్ష్మికి చెందినట్లుగా చూపడం గమనార్హం. దీనిపై కూడా దేవదాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అçప్పట్లో ఆ భూమికి సంబంధించి.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద దాన్ని తీసుకుంటూ అటు మోతుకూరి సుబ్బారావుతోగానీ, ఇటు దేవదాయ శాఖతోగానీ సీఆర్డీఏ అభివృద్ధి ఒప్పందం చేసుకోలేదు.మోతుకూరి సుబ్బారావుతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందంలో సాక్షిగా సంతకం చేసిన వట్టిగుంట వేణుగోపాలరెడ్డి ⇒ 2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక.. వంగవీటి మోహన రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విశాఖపట్నంకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుచరుడైన మోతుకూరి సుబ్బారావుకు నివాస, వాణిజ్య ప్లాట్లు, కౌలు దక్కేలా చేయడానికి పావులు కదిపారు. ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మోతుకూరి సుబ్బారావుకు ఉన్నత స్థాయిలో ఆశీస్సులు అందడంతో పేకాటలో చేయి తిరిగిన మంత్రి రంగంలోకి దిగారు. వేణుగోపాలస్వామి భూమికి సంబంధించి మోతుకూరి సుబ్బారావుతో ల్యాండ్ పూలింగ్ స్కీం ఒప్పందం చేసుకోవాలని సీఆర్డీఏ అధికారులపై ఆ మంత్రి ఒత్తిడి తెచ్చారు.⇒ దాంతో 2025 జూన్ 18న ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తీసుకుంటూ మోతుకూరి సుబ్బారావుతో సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అనంతరం నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. కౌలును కూడా చెల్లించింది. ఇందుకుగాను పేకాటలో చేయి తిరిగిన మంత్రి వెయ్యి గజాల నివాస ప్లాటును నజరానాగా అందుకున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
సీఐలు, ఎస్ఐలపై ఫిర్యాదు చేస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పించాలని అడుగుతుంటే తట్టుకోలేక తమ పార్టీ నేతలు, రైతులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, పోలీసులు వారికి వంతపాడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చెలరేగిపోతున్న పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ), మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పొన్నూరు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్బాబు, పీట నాగమోహన్కృష్ణ మాట్లాడారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేక, ప్రశ్నిస్తున్న తమను దాడులతో అడ్డుకునేందుకు ప్రయతి్నస్తోందని విమర్శించారు. పాలకుల సూచనలతో రెచ్చింపోతున్న పోలీసు సీఐలు, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో ఆయా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు ధైర్యంగా ఉండాలి వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్తగా సామాన్య ప్రజల తరఫున పవన్కళ్యాణ్ను వేడుకుంటున్నా. దయచేసి రూ.2,400కు మొక్కజొన్నను కొనుగోలు చేయించండి. అక్రమంగా సీజ్ చేసిన గోడౌన్ ఉన్న గ్రామంలో శాంతిభద్రతల సమస్య లేదు కాబట్టి దాన్ని తెరిపించాలి. ఐదుగురు చిన్న, సన్నకారు రైతులకు వారి మొక్కజొన్నలు తిరిగి ఇచ్చేయండి. వారిపై అట్రాసిటీ కేసులు తొలగించాలి. పొన్నూరు రూరల్, అర్బన్ సీఐలు కృష్ణయ్య, నాయక్, పొన్నూరు రూరల్, చేబ్రోలు ఎస్ఐలు, తెనాలి సీఐలపై రెండుమూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి మా ఎంపీల సమక్షంలో జాతీయ మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లలో ఫిర్యాదు చేస్తాం. వీరిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కోరతాం. నిర్ణిత సమయంలో న్యాయం లభించకపో తే ఆ వీడియోల ఆధారంగా.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారిని డిస్మిస్ చేయిస్తాం. మొక్కజొన్న రైతులు, మహిళలు ధైర్యంగా ఉండాలి. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్సీ, బీసీ, కాపు నేతలపై దౌర్జన్యాలు మొక్కజొన్న రైతుల కోసం అంబటి మురళీకృష్ణ చేసిన ఉద్యమం ఎక్కడ సక్సెస్ అవుతుందో అన్న భయంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ఎత్తులు పారడం లేదు. జగన్ పిలుపు మేరకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేస్తున్నాం. మామిళ్లపల్లిలో సెక్షన్ 144, సెక్షన్ 30 ఎందుకు పెట్టారో డీజీపీ చెప్పాలి.మీ రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం ఇద్దరు, ముగ్గురు గుమికూడకపోయినా, సభలు, సమావేశాలు పెట్టకపోయినా మురళి ఇంటికి వెళ్తుంటే ఎలా అరెస్టు చేస్తారు? అంబటి మురళి ఇంట్లో ఉన్న జూపూడి ప్రభాకర్ని లాక్కెళ్లడం 144 సెక్షన్ కిందకు వస్తుందా? రేపల్లె సమన్వయకర్త పీట మోహన్ని కూడా లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. పొన్నూరు సీఐ కృష్ణయ్య పీట మోహన్ మెడమీద కొట్టారు. సీఐ పోలీసు యూనిఫాం వేసుకున్నారా? లేక పచ్చచొక్కా వేసుకున్నారా? దురుసుగా వ్యవహరించిన పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లిస్తారు. – వరికూటి అశోక్బాబు, వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేరు? మామిళ్లపల్లిలో మొక్కజొ న్న రైతులకు తీవ్ర అన్యా యం జరిగింది. మొక్కజొన్న రైతులకు పక్క రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇంతమంది రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఎంతో అనుభవజు్ఞడినని చెప్పుకొనే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రైతుల్ని ఇబ్బంది పెట్టడంలో చూపిస్తున్నారు. మొక్కజొన్న రైతులే కాదు ఆక్వా రైతుల్ని కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ఇబ్బంది పెడుతున్నారు.మామిళ్లపల్లిలో 14 మంది రైతులపై కేసులు పెట్టారు. నేను సంఘీభావం తెలపడానికి వెళ్తే ఎలా ఈడ్చుకెళ్లారో అందరూ చూశారు. మీ ప్రభుత్వంలో ఉన్న కులాలనే పట్టించుకుని, ఇతర కులాల్ని ఇబ్బందులు పెడతారా? మొక్కజొన్న రైతుల్ని ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ తరఫున పోరాటాలు తప్పవు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన నాతో పాటు మాజీమంత్రి జోగి రమేశ్ మీద కూడా ఇలాగే దాడులు చేస్తున్నారు. బీసీ కులాల మీద మీకున్న గౌరవం ఇదేనా? – పీట నాగమోహన్కృష్ణ, వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త -
వావిలాల లీలామహేశ్వరి కన్నుమూత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ‘ఆంధ్రా గాందీ’, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పెంచుకున్న కుమార్తె వావిలాల లీలామహేశ్వరి (87) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించారు. వావిలాల గోపాలకృష్ణయ్య నీడలో పెరిగిన లీలామహేశ్వరి ఆయన విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. జీవిత చరమాంకంలో గోపాలకృష్ణయ్యను ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. గుంటూరు అరండల్పేట 9/2వ అడ్డరోడ్డులోని వావిలాల గోపాలకృష్ణయ్య నివాసం ప్రస్తుతం అపార్ట్మెంట్గా మారగా.. లీలామహేశ్వరి అక్కడే నివసిస్తూ తండ్రి వారసత్వాన్ని, జ్ఞాపకాలను కాపాడుకుంటూ వచ్చారు.కుమారి వావిలాల లీలామహేశ్వరి 1939 జూన్ 4న వావిలాల బ్రహ్మసోమయాజులు, అఖిలాండేశ్వరి అన్నపూర్ణమ్మ దంపతులకు గుంటూరులో జన్మించారు. గోపాలకృష్ణయ్యకు బ్రహ్మసోమయాజులు పెద్ద అన్న. లీలామహేశ్వరిని గోపాలకృష్ణ పెంచుకుని తమ కుమార్తెగా చెప్పేవారు. లీలామహేశ్వరికి ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. అతి పెద్ద కుటుంబం కావడంతో ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా లీలామహేశ్వరి పీయూసీ వరకు చదివారు. ఆమె వివాహం చేసుకోలేదు.ఉపాధ్యాయురాలిగా ఉద్యో గ జీవితాన్ని ప్రారంభించి, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఉన్నత చదువులు చదివించారు. వారికి వివాహాలు జరిపించారు. ఆ తర్వాత ఆమె కూడా ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. మొదట గుంటూరు లోని సెయింట్ ఇగ్నిషియస్ బాలికల పాఠశాలలో, ఆ తర్వాత బ్రాడీపేటలోని శ్రీ బండ్లమూడి హనుమాయమ్మ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందారు. సారా నిషేధం, సంపూర్ణ అక్షరాస్యత, పలు సామాజిక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. వావిలాల సంస్థ తరఫున అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం గుంటూరులోని బొంగరాలబీడు శ్మశానవాటికలో నిర్వహించారు.వావిలాల లీలామహేశ్వరి మృతి సమాజానికి తీరని లోటుమాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబానికి చెందిన వావిలాల లీలామహేశ్వరి మృతిపట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె జీవితమంతా సేవాభావంతో జీవించారని కొనియాడారు. మహనీయుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించడంతోపాటు ఉపాధ్యాయినిగా అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. లీలా మహేశ్వరి మరణం సమాజానికి తీరని లోటని అన్నారు. -
భానుడు భగభగ
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఆదివారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీలు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 13 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది. మరో 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి. ఉదయం 7 నుంచి సాయంత్ర 6 గంటల వరకూ ఎండ తీవ్రత ఉండడంతో రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. మరో మూడు రోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. నేడు ఎండ తీవ్రత ఉండే ప్రాంతాలు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్️కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు మరోవైపు ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. సోమవారం మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
రైతులకు సంఘీభావంగా వెళ్తే అరెస్టులు చేయిస్తారా?
సాక్షి, అమరావతి: మొక్కజొన్న రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లెకు ఎవరు వెళ్తున్నా పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? అని నిలదీశారు. మీరే దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరని అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలంటూ హెచ్చరించారు. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు చంద్రబాబూ..! ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పటికీ గళం విప్పుతూనే ఉంటుంది.. నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగమోహన్కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. ⇒ జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? ⇒ మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400– రూ.1,600 కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? ⇒ మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ.నాగేశ్వర్పై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పారీ్టల మీదా విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ! ⇒ చంద్రబాబు గారూ.. మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలిం.. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది -
ఎమ్మెల్యే పులవర్తికి ‘చెప్పు’ చూపించిన మరో కూటమి నేత
తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతలు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి జనసేన పార్టీ నేత మురళి రెడ్డి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడంతో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి వచ్చారు ఎమ్మెల్యే పులవర్తి నాని. ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇందుమూలిరెడ్డిని కలిసేందుకు వచ్చిన తొండవాడ గ్రామానికి వచ్చారు పులవర్తి నాని. అయితే అంతకుముందు తొండవాడ గ్రామాన్ని శత్రుదేశం పాకిస్థాన్ తో పోల్చడం పై ఎమ్మెల్యే ముందుగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన నేత మురళి రెడ్డి చెప్పు చూపించారు. తమ ఊరిని పాక్తో పోలుస్తావా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. గడచిన ఎన్నికల్లో 566 ఓట్లు మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్ తో ఎలా పోల్చుతావు అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే కాలుకున్న చెప్పు తీసి.. సమాధానం చెప్పు అంటూ హెచ్చరించారు. అయితే జనసేన నేత మురళీరెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. -
ఉండవల్లి రైతుల కీలక తీర్మానం
గుంటూరు: రాజధాని అంశానికి సంబంధించి ఉండవల్లి రైతులు కీలక తీర్మానం చేశారు. రాజధానికి భూములిచ్చే ప్రసక్తే లేదని తీర్మానంలో పేర్కొన్నారు. ఉండవల్లిని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని తీర్మానం చేశారు. రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ప్రభుత్వం తీసుకుంటుందని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని కానీ దానికి విరుద్ధంగా రైతులు దగ్గర నుంచి బలవంతంగా భూములు ప్రభుత్వం సేకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ భూములిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆదివారం(మే 24వ తేదీ) ఉండవల్లి రైతులు సమావేశమయ్యారు. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం భూసేకరణ, భూసమీకరణ అమలు చేస్తే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లికి ఏమి అభివృద్ధి చేసిందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు రాజధానిలో లంక భూములు కొట్టేసి లాభపడితే... మేము మా సొంత భూములు త్యాగం చేయాలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అన్ని పార్టీలు కలిసి భారీ స్థాయిలో ఉద్యమం చేయాలని ఉండవల్లి రైతులు తీర్మానం చేశారు. -
డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
తాడేపల్లి: ప్రముఖ అభ్యుదయ రచయిత, సాహితీ విమర్శకుడు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని జగన్ పేర్కొన్నారు. రచయితగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అనేక రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. ప్రముఖ సామాజిక సంస్కర్త తాపి ధర్మారావు జీవితంపై ఆయన చేసిన పరిశోధనలు, వెలువరించిన గ్రంథాలు తెలుగు సాహిత్యానికి విలువైన ఆస్తిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.విశాలాంధ్ర పత్రిక సంపాదకుడిగా ఆయన జర్నలిజం రంగానికి అందించిన సేవలు కూడా విశేషమని వైఎస్ జగన్ గుర్తుచేశారు. డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం తెలుగు సాహిత్య రంగానికి, అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో వృద్దాప్య సమస్యలతో డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. -
చంద్రబాబూ.. అంత ఫ్రస్టేషన్ ఎందుకు?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు మామిళ్లపల్లె ఘటనలపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ ’ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ.చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో… pic.twitter.com/t1FH8uUsDv— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2026 మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది’ అని స్సష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
సాక్షి గుంటూరు: వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన గోడౌన్ను అధికారులు తెరిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. దీంతో దానిని తెరవాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎన్ని దాడులు చేసినా, అట్రాసిటీ కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి గోడౌన్ తెరిచింది. గోడౌన్ మెుక్కజోన్న రైతులదేనని అధికారులు తేల్చారు. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన రైతులకు అండగా ఉండేందుకు చలో చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది కూటమి ప్రభుత్వం. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మరీ దౌర్జన్య కాండకు దిగింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గకపోవడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి సీజ్ చేసిన గోడౌన్ను తెరిచింది. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)
-
వావిలాల లీలా మహేశ్వరి మరణం బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: కుమారి వావిలాల లీలా మహేశ్వరి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య గారి కుటుంబానికి చెందిన లీలా మహేశ్వరి జీవితాంతం సేవా భావంతో జీవించారు. వావిలాల గోపాలకృష్ణయ్య చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయునిగా ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో పనిచేశారు.విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి సమాజానికి ఆదర్శనీయం. కుమారి వావిలాల లీలా మహేశ్వరి గారి మరణం సమాజానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పేర్కొన్నారు. -
ఓటర్ లిస్ట్పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: పార్టీ కమిటీలను సమర్థవంతంగా నియమించాలని, వైఎస్సార్సీపీని సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఓటరు పేరు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పక్క రాష్ట్రాల్లో SIR వలన పార్టీలు ఓడిపోయాయి. అందువలన ఓటర్ లిస్ట్లపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.‘‘కొందామంటే ఎరువులు లేవు. అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం పేదల కోసం ఆలోచించడం లేదు. మాయ, మోసం, దగాతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క స్కూల్ కట్టారా? స్కూల్స్ ఓపెన్ అయితే పుస్తకాలు, యూనిఫామ్లు లేవు అంటున్నారు. ప్రభుత్వ సంస్థను మూసేసి ప్రైవేట్కి ఇచ్చేయాలనే తాపత్రయం తప్ప పాలన పై ధ్యాస లేదు.ఉత్తరాంద్ర ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఏం ఉపయోగం. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. యూరియా ఇవ్వలేని దిక్కుమాలిన దుస్థితి లో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలు పడుకున్నాయి. హోమ్ శాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పని చేస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత అని అన్నారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా అని భూమన చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మం ముసుగులో కొందరు నా ఇంటి ముట్టడికి వచ్చారు. ఒబెరాయ్ హోటల్కు స్థలం ఇస్తే సాధవులు ఎందుకు ఖండించలేదు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత. బీఆర్ నాయుడు నీ బెదిరింపులకు నేను భయపడను. దాడులకు భయపడే వాడిని కాదు.. భయపెట్టేవాడిని. తిరుమలతో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా’ అని తెలిపారు.బీఆర్ నాయుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు. బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు.సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే నా ఇంటి ముట్టడికి కొంత మంది వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు అయినంత మాత్రాన సాధువులు అయిపోరు. బీఆర్ నాయుడు అక్రమాలను నేను ప్రశ్నిస్తున్నానే కారణంగా నాపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువులు, జగత్ కిలాడీలు, టీడీపీ కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటి ముట్టడికి వచ్చారు. టీడీపీ నాయకుడు నారాయణ రావు సన్యాసులు ముసుగులో ఇంటి ముట్టడికి యత్నించారు. 20 టికెట్లను బ్లాక్లో అమ్ముకునే వ్యక్తి అట్లూరి నారాయణ రావు. సన్యాసి ముసుగులో నా ఇంటి ముట్టడికి సిద్ధపడ్డారు. బీఆర్ నాయుడు తొత్తులుగా వాళ్లంతా నా ఇంటిని ముట్టడికి విఫలయత్నం చేశారు. బీఆర్ నాయుడు.. కాషాయం ముసుగులో ఇలాంటి సన్యాసులను నాపైకి పంపిస్తున్నాడు. బీఆర్ నాయుడు కాదు బీఆర్ కాముడు. ఈ దొంగ స్వామీజీలు కాదు నాకు చెప్పాల్సింది. జగద్గురు కంచి స్వామీజీ, కుర్తాళం పీఠాధిపతి, అహోబిలం పీఠాధిపతిలు చెబితే నేను వింటాను’ అని అన్నారు. -
అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు..!
నంద్యాల జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. నా కూతురు మృతిపై అనుమానాలుపుల్లయ్య నా కుమార్తెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా కూతురుపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ మధ్య మరో మహిళతో కాపురం చేస్తూ నా కూతురును కట్నం తేలదని వేధిస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానని గొడవ చేశాడు. అనుకోకుండా మందు తాగిందని, ఆసుపత్రికి తీసుకు పోతున్నామని చెప్పారు. అంతలోనే మృతి చెందిందని చెబుతున్నారు. ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించి నా కుమార్తె మృతికి కారణమైన ప్రతి ఒక్కరినీ శిక్షించాలి.– బేరింగుల హరిస్వామి, మృతురాలి తండ్రి -
‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్ను వేధిస్తారా?’
సాక్షి, అమరావతి: రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన నాయకులు కేసులు పెట్టడాన్ని సినీ నటుడు ప్రకాష్రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో విడుదల చేశారు. ‘ఆయన మాట్లాడిన మొత్తం అంశాలను పక్కన పెట్టి, అందులో ఒక లైను మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, కేసులు, బెదిరింపులు... ఏమిటివన్నీ. ఇది ప్రజాస్వామ్యమా. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?..మీకు నిజంగా ఒక్క మాట తప్పు అనిపిస్తే దానికి ఆధారం అడగండి. రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి’ అంటూ తూర్పారపట్టారు. ‘ఓ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వాళ్లను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించారు, పవన్కళ్యాణ్ను ప్రశ్నించారు. కేసీఆర్ను ప్రశ్నించారు, జగన్ను ప్రశ్నించారు. రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పటి ఆయన నిజాయితీ కూడా మీకు గుర్తుకు రాలేదు...ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా ? ప్రశ్నించే గొంతులను కేసులతో మూసేయాలని చూడడం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్, రేపు ఇంకెవరో...’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో... ఎవరి పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలు దయచేసి వెంటనే ఆపండి’ అంటూ జనసేన నేతలకు సూచించారు. ‘నాగేశ్వర్.. మీకు అండగా మేం ఉన్నాం. కీప్ అప్ ది గుడ్ వర్క్’ అంటూ మద్దతు తెలిపారు. -
అర్హతల్లో అయోమయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నియామక నోటిఫికేషన్లు మూడు తప్పులు, ఆరు సవరణల చందంగా మారిపోయింది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించకుండా తయారు చేసిన నోటిఫికేషన్లను దరఖాస్తులు ప్రారంభమయ్యే సమయం వరకు సవరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయాలైన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక వర్సిటీ(ఆర్జీయూకేటీ)ల్లో సరైన ప్రక్రియ లేకుండా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ తర్వాత అర్హతలను సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా వర్సిటీల్లో ఒక్కో విభాగానికి ఒక్కో నిష్పత్తి ప్రకారం ఇష్టారీతిన పోస్టులు కేటాయించడంతో రిజర్వేషన్ రోస్టర్ సైతం మారిపోతుండటం గమనార్హం. గంపగుత్తగా ఒక్కటే అర్హతా? వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ చిత్రవిచిత్రంగా కనిపిస్తోంది. ఇక్కడ సబ్జెక్టుల వారీగా కాకుండా విభాగాల వారీగా గంపగుత్తగా పోస్టులు ప్రదర్శించడం కొసమెరుపు. ఉదాహరణకు గత 2023లో నోటిఫికేషన్లో వర్సిటీలోని బిల్డింగ్ టెక్నాలజీ విభాగంలో సివిల్, ఈఈఈ, ఫెసిలిటీస్ అండ్ సర్వీసు ప్లానింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ కింద ఏడు పోస్టులకు విడివిడి అర్హతలతో నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో బిల్డింగ్ టెక్నాలజీలో 5 పోస్టులను కుదించి, వాటిని ఏ విభాగానికి చెందినవో స్పష్టం చేయలేదు.పైగా బిల్డింగ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ అర్హతలను మాత్రమే సూచించడం గమనార్హం. అంటే, కేవలం ఆ విభాగాన్ని సివిల్ ఇంజినీరింగ్ అర్హత కలిగిన వారితో భర్తీ చేసేందుకు వీసీ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, డిజైన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ప్లానింగ్, స్కల్ప్చర్లోనూ ఇదే తంతు. వాస్తవానికి విడివిడి అర్హతలతో పోస్టులకు దరఖాస్తులను పిలిస్తే పరిశీలన కష్టం అవడంతో పాటు పోస్టుల భర్తీ కాకుండా ఉండిపోతే ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఆగిపోతాయనే ఉద్దేశంతోనే ఒకే అర్హతతో గంపగుత్తగా పోస్టులు భర్తీ చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పరిశ్రమ అనుభవం పీహెచ్డీతో సమానమా? ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతలను సైతం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సవరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పీహెచ్డీ లేకున్నా 8ఏళ్లు పరిశ్రమ అనుభవం, ప్రథమ శ్రేణిలో మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలని, దీనిని ప్రత్యేక కమిటీ ధ్రువీకరిస్తే పీహెచ్డీతో సమానంగా పరిగణిస్తామని పేర్కొనడం గమనార్హం. పైగా గతంలో ఎక్కువ స్పెషలైజేషన్లకు అవకాశం కలి్పస్తే ఇప్పుడు కేవలం ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మాత్రమే పేర్కొన్నారు.ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ప్రథమ శ్రేణిలో బీ–ఫార్మసీ, మాస్టర్స్ అర్హతను కాస్త.. కేవలం బేసిక్ బీ–ఫార్మా డిగ్రీకి పరిమితం చేసింది. మాస్టర్ డిగ్రీలో ప్రథమ శ్రేణి ఉండాలని పెట్టింది. ప్రైవేటు సంస్థల్లో బోధన, పరిశోధన, వృత్తిపర అనుభవాన్ని, జర్నల్స్లో పరిశోధన పత్రాలను అదనపు అనుభవంగా కోరుతోంది. అంటే, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న తమ అనుకూల వ్యక్తులకు మేలు చేకూర్చేందుకు ఇలాంటి ఎత్తుగడ వేసినట్టు భోగట్టా. ఆర్జీయూకేటీలో అరకొర పోస్టులేల! ఆర్జీయూకేటీలో గతంలో 611 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు 311 పోస్టులకు పరిమితం చేసింది. 2017, 2018 నోటిఫికేషన్లపై సుప్రీం కోర్టులో కేసులు ఉండటంతో ఆ పోస్టులను మినహాయించి కొత్తగా వర్సిటీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తోంది. కానీ, ఆ రెండు నోటిఫికేషన్లలో ఆర్జీయూకేటీ ఎప్పుడూ పాల్గొనలేదు. కేవలం 2023లో అన్ని వర్సిటీలతో పాటు నోటిఫికేషన్లోకి వచ్చింది. 2013లో పాక్షికంగా చేపట్టిన 53 శాశ్వత పోస్టుల తర్వాత ఇప్పటి వరకు కొత్త నియామకాలు చేయలేదు.అలాంటిది ఈసారి పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కేవలం 104 అసిస్టెంట్, 104 లెక్చరర్ పోస్టులకు రెగ్యులర్, 103 పోస్టులను బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. ఆర్జీయూకేటీలో రెగ్యులర్ పోస్టులకు విభాగాల వారీగా నోటిఫికేషన్ ఇస్తే బ్యాక్లాగ్లో మాత్రం రెండు, మూడు సబ్జెక్టులను కలిపి గ్రూప్గా విభజించడంతో రోస్టర్ గాడితప్పినట్టేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్లోనూ 104 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉంటే వాటిల్లో కంప్యూటర్ సైన్స్లో 31, ఈఈఈలో 23 పోస్టుల మినహా మిగిలిన 11 విభాగాల్లో వేళ్లపై లెక్కపెట్టే పోస్టులున్నాయి. ఆర్జీయూకేటీ వంటి రెసిడెన్షియల్ వర్సిటీలో విద్యార్థుల బలవన్మరణాలను అరికట్టేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సైకాలజీ విభాగాన్ని తీసుకొస్తే అందులో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయట్లేదు.అప్పుడే బేరసారాలు!ఆర్జీయూకేటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయింది. ఇక్కడ, సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆర్జీయూకేటీ బోధకులు కుట్ర పన్ని రెగ్యులర్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ లేకుండా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నోటిఫికేషన్లో ఏకంగా 103 అసోసియేట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు కేవలం బ్యాక్లాగ్లో 37 పోస్టులు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ రెండింటిలోనూ ఒక్క ప్రొఫెసర్ పోస్టు లేకపోవడం గమనార్హం.ఇక్కడ రిజిస్ట్రార్, సీనియర్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో జరగాల్సిన పోస్టుల కేటాయింపు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలోని ఓ వ్యక్తి పరిపాలన విభాగంలో ఇన్చార్జి హోదాలో కొనసాగుతూ ఇష్టారీతిన పోస్టు కేటాయించినట్టు వినికిడి. పైగా ఇప్పటికే తమ అనుకూల వ్యక్తులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించేందుకు అభయం ఇస్తూ పోస్టులు ఎలాగైనా కట్టబెట్టేందుకు బేరసారాలు సాగిస్తున్నారు. పైగా ఇప్పుడే అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తే తమకు చాన్స్ ఉండదనే భయంతో వాటిని తొక్కిపెట్టి వర్సిటీలో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం(సీఏఎస్) కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ పదోన్నతులు పొందేందుకు మార్గం సుగమం చేసుకోవడం గమనార్హం. -
జనసేన కార్యకర్తపై... టీడీపీ మూకల దాడి
కొల్లూరు: పచ్చమూకల దాష్టీకానికి బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. టీడీపీ శ్రేణుల అరాచకపర్వంతో పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చమూకల విధ్వంసం కారణంగా పోలీసు స్టేషన్లో భీతావహ వాతావరణం నెలకొని స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేసి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడిని విమర్శించాడన్న సాకుతో దాడి.. కొల్లూరులో నూడిల్స్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన్ ప్రసాద్ను విమర్శించి, చులకనగా మాట్లాడాడన్న సాకుతో ఆ పార్టీ శ్రేణులు దాడి చేసినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్ మూసేసి ఇంటికి వెళ్తున్న జానకిరామయ్యకు, టీడీపీ నాయకుడి అనుచరులైన కొల్లూరులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తులు సమీపంలోని మద్యం దుకాణం వద్ద తారసపడ్డారు. ఈ క్రమంలో తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ఆ కాలనీకి చెందిన కొండూరు సురేష్ ప్రశ్నించడంతో ఇరువురి నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.ఈ క్రమంంలో జానకిరామయ్య తలపై మద్యం సీసాతో సురేష్ దాడి చేయడంతో గాయమైంది. వెంటనే బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు జానకిరామయ్య కొల్లూరు పోలీసు స్టేషన్కు వెళ్లాడు. తీవ్ర రక్త స్రావమవుతున్న జానకిరామయ్యను వైద్యశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అతడిని తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో కాలనీ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపైనా దాడి చేశారు. జానకిరామయ్య మేనల్లుడు రాము బాలశివగంగాధర్ ఆ కాలనీకి వెళ్లి తన మేనమామను కొడతారా... చూసుకుందాం రండి అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాలనీకి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్కు దూసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది.పోలీసుల జీపు దహనానికి యత్నంవేమూరు సీఐ పీవీ.ఆంజనేయులుతోపాటు, పోలీసు సిబ్బంది కూడా టీడీపీ శ్రేణుల దాడికి గురయ్యారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీసు జీపును రోడ్డుపైకి నెట్టుకెళ్లిన పచ్చ మూకలు ధ్వంసం చేసి దహనం చేసేందుకు ప్రయతి్నంచారు. దాన్ని తిరిగి ఆవరణలోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన హోంగార్డు నాగరాజుపై ఇష్టానుసారంగా దాడికి తెగబడి దుస్తులు చింపేశారు. ఇదే క్రమంలో వేమూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రసాద్పైనా దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాల వారూ గాయపడడంతో గుంటూరు, తెనాలి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉప్పు జానకిరామయ్యతోపాటు, అతని సోదరి రాము వెంకటలక్ష్మి, అతని బావ, రాము శివనారాయణ, మేనల్లుడు రాము బాల శివగంగాధర్ గాయాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన గొడవర్తి తేజ, దున్నా చింతయ్య, చొప్పర చింతయ్య గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కొల్లూరులో పోలీసుల పహారాకొల్లూరు పోలీస్ స్టేషన్లో దాడి సమాచారంతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావుతోపాటు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు కొల్లూరు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇరు సామాజికవర్గాల నడుమ జరిగిన వివాదం కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొల్లూరులోని పలు ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.వేమూరు, చుండూరు, రేపల్లె టౌన్, రేపల్లె రూరల్ సీఐలు పీవీ.ఆంజనేయులు, ఎం.ఆనందరావు, బి.అశోక్కుమార్, సురేష్బాబు, పలు స్టేషన్ల ఎస్ఐలు కొల్లూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు పోలీసు స్టేషన్పై చేసిన దాడి ఘటనలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అందరిపైనా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ నాయకుల పాత్రపైనా విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు వెంటనే చర్యలు తీసుకున్న పవన్
సాక్షి, అమరావతి/రైల్వేకోడూరు: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళలను వేధించినా, ఒక వర్గం మహిళలను కించపరిచినా ఇప్పటివరకు చర్యలు తీసుకోని పవన్ కళ్యాణ్..అరవ శ్రీధర్ చంద్రబాబును ఒకమాట అన్నట్లు వీడియో బయటకు రాగానే వెంటనే చర్యలు తీసుకున్నారు. దాదాపు ఐదారు నెలలుగా ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని.. అరవ శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించి మోసం చేశాడని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా తెలిసిందే. అయినా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కనీస స్పందన లేదు. రెండురోజుల కిందట ఒక వర్గం మహిళలను అత్యంత దారుణంగా కించపరుస్తూ శ్రీధర్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా పవన్ చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం చంద్రబాబు.. వాడు వేస్ట్.. అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో సైతం వైరల్ అవుతుండడంతో హడావుడిగా విప్ పదవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో రాజీనామా చేయించారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ను కలిసి అరవ తన రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. మహిళల విషయంలో స్పందించకుండా.. చంద్రబాబును అనగానే ఆగమేఘాలపై చర్యలుజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్తో సమావేశం తర్వాత అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా చేసినట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ లేఖను మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వంలో కీలక పదవిలోనే ఉన్న అరవ శ్రీధర్ రాసలీలల వీడియోల వ్యవహారం గత ఐదారు నెలలుగా అటు జనసేన పార్టీలో, ఇటు కూటమిలోనూ రాజకీయ దుమారం రేపుతున్నా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. తాజాగా ఒక వర్గం మహిళలను దారుణంగా కించపరుస్తూ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.ఈ విషయంలో సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నా కూడా పవన్ కనీసం ఖండించలేదు.. అయితే సీఎం చంద్రబాబును వేస్ట్ అంటూ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ఆగమేఘాలపై ఆయన్ని పిలిపించి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వ మహిళా ఉద్యోగిని మోసం చేశాడనే ఆరోపణలు రావడంతో నేపథ్యంలో ముగ్గురు నేతలతో జనసేన నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అయితే దాదాపు నాలుగు నెలలుగా పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ప్రభుత్వ విప్ హోదాలో అరవ శ్రీధర్ మాత్రం పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రెండు నెలల క్రితం అతని అనుచరులు నడిరోడ్డుపై బాధిత మహిళా ఉద్యోగి మీద పోలీసుల సమక్షంలోనే దాడికి కూడా పాల్పడ్డారు. మరోవైపు.. అరవ శ్రీధర్ రెండురోజుల కిందట ఓ సామాజిక వర్గం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పవన్కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యే మహిళలను మోసం చేసినా.. ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడితే స్పందించకపోగా.. చంద్రబాబు విషయానికి వచ్చేసరికి తక్షణ చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తీవ్ర అవినీతి ఆరోపణలున్న మరో ఎమ్మెల్యేతో భేటీఇటీవల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైతం శనివారం పార్టీ అధినేత పవన్కళ్యాణ్తో భేటీ అయ్యారు. పార్టీ దృష్టికి వచ్చిన విషయాలు, ఆరోపణలపై ఎమ్మెల్యే బాలరాజును అధినేత పవన్కళ్యాణ్ వివరణ అడిగారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో నాలుగు వారాల్లోగా చక్కదిద్దుకోవాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి గడువు ఇచ్చారని పార్టీ తెలిపింది. -
భానుడి భగభగలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం రాష్ట్రంలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్లో 45 డిగ్రీలు, ఎనీ్టఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, నేడు (ఆదివారం) 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 214 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45, 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ⇒ మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని విపత్తుల శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ⇒ కాగా వడగాడ్పులకు శనివారం 8 మంది మృత్యువాతపడ్డారు. ఎనీ్టఆర్ జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. -
విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొ.నాగేశ్వర్
ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల మీద కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నాగేశ్వర్పై జనసేన నేతల ప్రోద్బలంతో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి1985–89 కాలంలో బడ్జెట్కు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకు పొక్కాయి. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ మొత్తం కేబినెట్ను రద్దు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్ను జనసేన నేతలు ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన గుర్తించి చర్య తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం కేబినెట్నే రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వ సమర్ధకుడు అయిన ఒక మీడియా సంస్థ అధినేత వారం వారం తాను రాసే కాలమ్లో ప్రగతి భవన్లో జరిగినట్టుగా కొన్ని వార్తా కథనాలు ప్రచురిస్తే.. అసత్యాలు రాస్తున్నారంటూ ఆ పత్రికాధినేతను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ‘సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి. ఆ సోర్సెస్ ద్వారా సమాచారం సేకరించి వార్తలు రాయాలని మా గురువులు చెప్పారు. సోర్స్ చెప్పింది ఆక్షేపించడానికి వీల్లేదు’అంటూ ఆ పత్రికాధినేత సమాధానం ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వం మరిచిపోకూడదు. –దేవులపల్లి అమర్, సభ్యుడు, స్టీరింగ్ కమిటీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ఇతరులకు ఏం పని?విశ్లేషకుడిగా నాగేశ్వర్కు మంచి గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ కూడా. ఆయన వ్యాఖ్యలు నచ్చకపోతే పవన్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఖండించాలి. స్పందించడానికి ఇతరులకు ఏం పని. ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు. నాగేశ్వర్ కుటుంబం లేదా ఆయన అభిమానులు కోర్టును ఆశ్రయించాలని నా సూచన. –కె.రామచంద్ర మూర్తి, సీనియర్ పాత్రికేయులుఆ 35 వేల మంది సంగతేంటి?దశాబ్దాలుగా మంచి విశ్లేషకుడిగా ప్రొ.నాగేశ్వర్కు పేరుంది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించినా కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో దుర్భాషలాడటం దుర్మార్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. జగన్ హయాంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు పవన్ ఇప్పటివరకు ఆధారాలను చూపలేదు. కానీ నాగేశ్వర్ చేసిన ఒక కామెంట్ మీద పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే కేసుల పేరుతో ఆయనను ఇబ్బంది పెట్టడానికే అని అర్థం అవుతోంది. –వర్దెళ్లి మురళి, సీనియర్ సంపాదకులుఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. తన దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచారు. జర్నలిస్టులు వారికున్న సోర్స్ ఆధారంగా వచ్చిన సమాచారాన్ని ప్రస్తావిస్తారు. దీనిపట్ల అభ్యంతరం ఉంటే ఖండించాలి. అంతేగానీ వ్యక్తిగత దాడి తగదు. ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారు. వారికి నచ్చినట్లుగానే వార్తలు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరుల వ్యాఖ్యలు ప్రచురించినా కూడా జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనజాలదు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలి. –ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షి నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలినాగేశ్వర్ మంచి విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్. ఏ అంశమైనా విశ్లేíÙంచి మాట్లాడతారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఆయనపై కేసులు పెట్టడం తగదు. పలుచోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయంటే ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టినట్టు అర్థం అవుతోంది. ఇది సరైనది కాదు. మా అసోసియేషన్ ఇటువంటి చర్యలను సహించదు. ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలి. కేసు పెట్టి నోరు మూయించాలని అనుకోవడం సరికాదు. –విరాహత్ అలీ, ప్రెసిడెంట్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్కేసులు ఎత్తి వేయాలితాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొ.నాగేశ్వర్ ప్రకటించారు. అందువల్ల ఆయనపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. ప్రభుత్వాలు, పారీ్టలు ఏవైనా మీడియాలో వచ్చిన ఆరోపణలు, భిన్నాభిప్రాయాలపై ఖండనలు, సమాధానాలు చేయొచ్చు. కానీ కేసులు, అరెస్టులు సరికాదు. ఏపీ ప్రభుత్వం నాగేశ్వర్పై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలే గానీ అరెస్టుల వంటి కఠిన చర్యలు అవాంఛనీయం. –తెలకపల్లి రవి, ప్రముఖ విశ్లేషకులుపోలీస్ స్టేషన్లు చాలవునాగేశ్వర్ వ్యాఖ్యలు తప్పు అని అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. నాగేశ్వర్ అంటే గౌరవం అంటూనే కేసులు పెట్టారు. ఖండించడం, సరిదిద్దుకోవాలని చెప్పడం ప్రజాస్వామ్యం. కేసులు పెట్టడం కొత్త సంప్రదాయం. భావప్రకటనకు భిన్నమైంది. కొమ్మినేని శ్రీనివాస్ మీద మరోసారి కేసు పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం కేసులు పెడుతున్నారు. డిజిటల్ మీడియా యుగంలో కేసులు పెట్టుకుంటూపోతే పోలీస్ స్టేషన్లు చాలవు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే కేసులు విత్డ్రా చేసుకోవాలి. –అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు -
విద్యార్థి'కి' మిత్ర ద్రోహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇందుకు ఇరాన్–అమెరికా యుద్ధాన్ని సాకుగా చూపింది. జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే వీటిని అందిస్తామని ప్రారంభంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకునేందుకు సాకులు వెదుకుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకు ధరలు పెరిగాయని, ముఖ్యంగా గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉండడంతో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయని చెప్పింది. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని చెబుతోంది. ఇలా కుంటి సాకులతో కేవలం రెండేళ్లకే విద్యార్థి మిత్ర అమల్లో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేతులెత్తేశారు.జగన్ ప్రభుత్వం పుణ్యమాని ‘2024 జూన్’ హ్యాపీ2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక కిట్ పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందుగానే ఆర్డర్ పెట్టిన జగనన్న విద్యాకానుక కిట్లను కూటమి ప్రభుత్వం 2024 జూన్ నెలలోనే సకాలంలో పంపిణీ చేయగలిగింది. ఇది జగన్ ప్రభుత్వం క్రెడిట్ తప్ప, చంద్రబాబు ప్రభుత్వం గొప్పేమీ కాదు. 2025కు వచ్చేసరికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లకు కిట్లు సరఫరా చేయలేమని భీష్మించారు. దాంతో అధికారులు చొరవ తీసుకుని, సరఫరాదారులకు భరోసా ఇచ్చి కిట్లు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో జూన్ నెలలో ఇవ్వాల్సిన కిట్లు ఆగస్టు దాటినా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారు. కమీషన్ల కహానీనే..అసలు కారణం 2026–27 విద్యా సంవత్సరానికి 1–10 తరగతుల వరకు 35 లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇంటర్మీడియట్ వరకు వస్తువులు కొనుగోలు, నాణ్యత పరిశీలన, మండల స్టాక్పాయింట్లకు చేరవేత వరకూ రూ.910 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, రెండేళ్లకు తమకు రావాల్సిన రూ.1,372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో ప్రభుత్వం చేసేది లేక గత నెలలో బకాయిలు చెల్లించింది. అయితే, ఇందులో విద్యాశాఖలోని ఓ అత్యున్నతాధికారి 5.5 శాతం కమీషన్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఈ ఏడాది కిట్లు, వాటిలోని వస్తువులు ఇవ్వలేమని కరాఖండీగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ వాస్తవాలను దాచిపెట్టిన ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో కిట్ల పంపిణీని ఎగ్గొట్టే యత్నం చేస్తోంది. తూచా తప్పకుండా జూన్ 12నే జగనన్న విద్యా కానుక పుస్తకాలు, యూనిఫారం కొనలేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాను సీఎం కాగానే బడి తెరిచిన మొదటిరోజే జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, టైతో సహా ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏటా జూన్ 12న బడులు తెరిచిన తొలిరోజే వీటిని అందించేలా కార్యాచరణ రూపొందించారు. జగనన్న విద్యా కానుక కిట్లో నాణ్యమైన పుస్తకాల బ్యాగ్, స్టిచింగ్ చార్జ్లీతో 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగిŠల్ష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(ఆరోతరగతి), ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వంలో సగటున ఏటా 43 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యా కానుక అందుకున్నారు. కిట్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం: సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావుకిట్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా పాఠశాల పున: ప్రారంభం నాటికే అందజేయాలనే లక్ష్యంతో అన్ని రకాల ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టామని, అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో కిట్ల సరఫరా మరో నెల ఆలస్యం అవుతుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఏర్పడటంతో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయన్నారు. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని, దీంతో సరఫరాదారులు కొంత గడువు కోరినట్లు వివరించారు. అయితే, చదువుకు ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో జూన్ 12న బడులు తెరిచే నాటికే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. ‘మెగా పీటీఎం’ నాటికి మిగిలిన వస్తువుల పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
నిండా అప్పులు.. ఆర్భాటపు తిప్పలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన దొరికిన చోటల్లా అప్పులు చేయడం.. ఆ మొత్తాలను హంగూ ఆర్భాటాలకు వెచ్చించడం తప్ప ఆస్తుల కల్పనకు ఖర్చు చేయడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్థిక ఏడాది (2026–27) తొలి నెల ఏప్రిల్ బడ్జెట్ కీలక సూచికలే వెల్లడించాయి. ఏ కుటుంబమైనా ఇల్లు కట్టుకోవడానికో.. ఏదైనా ఆస్తి సమకూర్చుకోవడానికో అప్పు చేస్తుంది. ఏదైనా ప్రభుత్వం అప్పుచేస్తే.. ప్రజలకు ఉపయోపడే ఆస్తి కోసం ఉపయోగిస్తుంది. అంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికో లేదా తాగునీటి అవసరాలు తీర్చడానికో అప్పులు చేసి.. తద్వారా వాటిని ప్రజలకు సమకూరుస్తుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెలలో బడ్జెట్ లోపల ఏకంగా రూ.10,901 కోట్లను అప్పు చేసింది. ఆ మొత్తంలో కేవలం రూ.533 కోట్లను మాత్రమే ఆస్తుల కల్పన (మూలధన వ్యయం) కోసం ఖర్చు చేసింది. అంటే మూలధన వ్యయం కోసం వెచ్చించింది ఏప్రిల్ నెలలో కేవలం 1.10 శాతమే. ఈ విషయాన్ని ఏప్రిల్ నెల బడ్జెట్ కీలక సూచికల్లో కాగ్ నివేదిక వెల్లడించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులో ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 14.37 శాతం మేర అప్పు చేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. చేసిన అప్పులను ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీకి సున్నా గ్రాంట్లే ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లను రాబట్టింది ఏమీ లేదని (సున్నా) కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో పైసా కూడా గ్రాంట్ రాబట్టలేకపోయింది. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను రాబడుల్లో ఏప్రిల్లో కేవలం 6.35 శాతమే వచ్చాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మరోపక్క ఆర్థిక ఏడాది తొలి నెల ఏప్రిల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయినట్టు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ లోటును రూ.22,002 కోట్లకు పరిమితం చేస్తామని గొప్పగా పేర్కొనగా.. ఏప్రిల్ నెలలోనే రెవెన్యూ లోటు బడ్జెట్ ప్రతిపాదనల్లో 46.17 శాతం అంటే రూ.10,277 కోట్లకు చేరినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రతిపాదనల ద్రవ్యలోటు ఏప్రిల్లోనే 14.37 శాతం చేరుకుంది. -
22ఏ భూములపై బాబు దొంగాట
సాక్షి, అమరావతి: చంపేయాలనే కసితో ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి తానే బతికించానని చెప్పుకోవడాన్ని ఏమంటారు? రాష్ట్రంలో 22ఏ జాబితా భూముల విషయంలో ఇప్పుడు చంద్రబాబు సర్కారుది అచ్చు ఇదే తంతు. ఇన్నాళ్లూ ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి.. ఇప్పుడు తానే విముక్తి కల్పిస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ మరోమారు క్రెడిట్ చోరీకి బరితెగించారు. ఈ క్రమంలో భూముల వ్యవహారంలో చంద్రబాబుది అత్యంత నీచమైన రాజకీయ క్రీడ అని ఆ రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పేద, మధ్యతరగతి రైతుల ఉసురు పోసుకున్నారు. జగన్ హయాంలో అక్రమాలు జరిగాయనే నెపం వేసి రెండేళ్లు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరక్కుండా వివాదంలో పెట్టారు. అనేక విచారణల తర్వాత అక్రమాలు లేవని తేలడంతో ఇప్పుడు ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా తానే ఆ భూములకు విముక్తి కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విస్తుగొలుపుతోంది. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 6 లక్షల ఎకరాలకుపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే తప్ప ఆయన హయాంలో భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా, ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారాన్ని అత్యంత క్లిష్టమైన సమస్యగా మార్చింది చంద్రబాబే. చుక్కల భూములు, షరతులుగల పట్టా భూములు, ఈనాం భూములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి పేద రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హక్కులు కల్పించిన ఫ్రీహోల్డ్ భూములపైనా ఆయనది అదే తీరు. చుక్కల భూములను చిక్కుల్లో పెట్టింది బాబే 2016లో 4.10 లక్షల ఎకరాల చుక్కల భూములను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టింది. అంతకు ముందు ఆ భూముల రికార్డులు పక్కాగా లేకపోయినా, అవి రైతుల అనుభవంలోనే ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటిని సక్రమం చేసే పేరుతో ఏకంగా లక్షల మంది రైతులను నట్టేట ముంచి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యపై ఫోకస్ పెట్టి.. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించారు. ఇందుకోసం 1.81 లక్షల సర్వే నంబర్లను పలుమార్లు రీ వెరిఫికేషన్ చేయించారు. దీంతో ఆ రైతులకు హక్కులు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే వాటిని 22ఏ(నిషేధిత) జాబితాలో పెట్టించారు.షరతుల పట్టా భూములకూ అన్యాయమేషరతులు గల పట్టా భూముల విషయంలోనూ చంద్రబాబుది అదే తీరు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాలుండగా, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 33 వేల ఎకరాలను 2016లో ఆయన ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న భూముల్ని ఒక్క ఆదేశంతో వివాదాస్పదం చేసేశారు. 2023లో వైఎస్ జగన్ వాటిని 22ఎ జాబితా నుంచి తొలగిస్తే, 2024 జూన్లో మళ్లీ వాటిని చంద్రబాబు 22ఏ జాబితాలో పెట్టించడంతో ఆ రైతులు నెత్తీనోరూ బాదుకున్నారు. ఇంతా చేసి ఇటీవలే తన హయాంలోనే ఆ రైతులకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈనాం భూముల విషయంలో సైతం అదే తీరు. గత జగన్ ప్రభుత్వం 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం రైతులకు కల్పించిన ఫ్రీ హోల్డ్ హక్కులను కేవలం రాజకీయ కక్షతో 22 నెలల పాటు 22ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు అవే భూములకు తమ ప్రభుత్వం విముక్తి కల్పిస్తున్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 2024 ఆగస్టులో ఆ భూముల్ని నిర్దాక్షిణ్యంగా 22ఏ జాబితాలో పెట్టింది చంద్రబాబే.ఫ్రీ హోల్డ్ భూములపైనా అదే తంతురాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో గత ప్రభుత్వం 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించింది. 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసి రైతులను యజమానులను చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ భూములన్నింటినీ 22ఏ జాబితాలో పెట్టేశారు. అనేక వెరిఫికేషన్లు, విచారణలు చేసి అక్రమాలేవీ లేవని తేలడంతో వాటిని ఇప్పుడు తీరిగ్గా 22ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. అయితే చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈ భూములకు హక్కులిచ్చింది తానేనని ప్రచారం చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. పేదలకు వారి భూములపై హక్కులు ఇవ్వకూడదనే రీతిలో రెండేళ్లపాటు ఆ భూములపై ఆంక్షలు విధించి, దాన్ని అక్రమంగా అభివర్ణించి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అసైన్డ్ ఇళ్ల స్థలాల పైనా అదే తీరు రాష్ట్రంలో అసైన్డ్ ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తయి పదేళ్లు దాటితే వాటిపై లబ్ధిదారులకు హక్కులు కల్పించాలని 2023లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలను పొందిన పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2023లో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారమే 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు లభించగా.. వాటిలో 13.59 లక్షల ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఫ్రీ హోల్డ్ చేశారు. అదే సమయంలో పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలనూ ఫ్రీ హోల్డ్ చేసేందుకు ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ల శాఖకు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీని ప్రకారం అనేక చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. మొత్తం ఫ్రీ హోల్డ్ భూములను అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. ఇన్నాళ్లు నానా ఇబ్బందులు పెట్టి.. చివరికి అక్రమాలేవీ జరగలేదని తేలడంతో చేసేదేమీ లేక ఇప్పుడు తాజాగా ఆ చట్టాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫ్రీ హోల్డ్ అయిన వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకుని ఇప్పుడు ఆ ఘనత తనదేనని నిస్సిగ్గుగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. -
కార్పొరేట్లకు బాబు మరో గిఫ్ట్
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కంపెనీలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు అప్పుల్లో కూరుకుపోయిన తరుణంలో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోయే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారీ పరిశ్రమలు, బడా కంపెనీలకు లాభం చేకూరేలా పారీ పస్సు చార్జీల డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్ ఫీజుకు భారీ మినహాయింపులు ఇస్తూ శనివారం జీవో 304 జారీ చేసింది. ఇప్పటి వరకు బడా కంపెనీలు తాము తీసుకున్న రుణ మొత్తంపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. రుణం ఎంత ఎక్కువైతే.. ఫీజు కూడా అంత పెరిగేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై గరిష్టంగా రూ.6 లక్షలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ రాయితీ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని జీవోలో స్పష్టం చేసింది. దీంతో రూ.వందల కోట్లు, రూ.వేల కోట్ల రుణాలు తీసుకునే పెద్ద కంపెనీలు భారీగా లాభపడనున్నాయి. ఉదాహరణకు రూ.500 కోట్ల రుణంపై సాధారణంగా రూ.2.5 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటే.. ఇప్పుడు కేవలం రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఒక్కో భారీ రుణ ఒప్పందంపైనే ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది.రాష్ట్రంలో స్థిరాస్తుల మార్కెట్ విలువలను తరుచూ పెంచుతూ రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో ప్రజలపై అదనపు భారం మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. చిన్న ఇల్లో, స్థలమో కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబం రూ.లక్షల్లో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తుండగా.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకునే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం సీలింగ్ పేరుతో ప్రత్యేక రాయితీలు ఇవ్వడం చంద్రబాబు సర్కారు తీరును స్పష్టం చేస్తోంది. -
‘ప్రాన్’ సంకటం ఆక్వా ఆక్రందన
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆక్వా రైతు పేరు సహదేవరాజు. బీఎస్సీ చదువుకున్నప్పటికీ తండ్రి బాటలోనే ఆక్వాసాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. విద్యావంతురాలైన అతని భార్య అండగా నిలవడంతో ఎకరం చెరువులో రొయ్యలను పెంచుతున్నాడు. కానీ లాభాలు మాత్రం చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘ఆక్వా సాగుకు విద్యుత్ అనేది చాలా ముఖ్యం. కానీ రాత్రి వేళ కరెంటు తీసేస్తున్నారు. వర్షం వచ్చినా, గాలి వీచినా గంటల తరబడి పోతుంది. 3 రోజులుగా కొట్టిన చెట్లనే మళ్లీ కొడుతున్నామంటూ విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు. కాసేపు కరెంటు ఆగితే ఆక్సిజన్ అందక రొయ్య చనిపోతుంది. అందుకే ఖర్చయినా తప్పదనుకుని నెలకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ అద్దె చెల్లించి జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. జగన్ హయాంలో యూనిట్ రూ.1.50కే ఇచ్చేవారు. ఇప్పుడు యూనిట్కు రూ.3 చొప్పున భారం పడుతోంది.’ అంటూ తన కష్టాలను ‘సాక్షి’తో చెప్పుకున్నాడు. ఇది రైతు సహదేవరాజు ఒక్కరి దుస్థితి మాత్రమే కాదు.. ఆక్వా రైతులందరి ఆవేదన.. ఆక్రందన..బోణం గణష్, కొల్లేరు నుంచి సాక్షి ప్రతినిధిఎంతో కష్టపడితేగానీ ఆక్వా సాగులో లాభాలు చూడలేం..ఏళ్ల తరబడి సాగు చేస్తుంటే ఒకటో, రెండో పంటలే కాస్త ఆదుకుంటాయి..అలాంటి మమ్మల్ని విద్యుత్ కోతలు, అత్యధిక బిల్లులు ఆర్ధికంగా దెబ్బకొడుతున్నాయి. గత ప్రభుత్వంలో రాయితీపై విద్యుత్ అందించేవారు. కానీ ఇప్పుడు రాయితీ లేదు. ఎవరికైనా ఇస్తున్నా అంతకు మించి బిల్లులు బాదేస్తున్నారు. ఇక విద్యుత్ కోతలైతే దారుణంగా ఉన్నాయి. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియక జనరేటర్లు అద్దెకు తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నామంటూ కొల్లేరు పరీవాహక ఆక్వా రైతులు ఆవేదనతో చెబుతున్నారు.కొల్లేరు పరిధిలో 2.90 వేల ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు జరుగుతోంది. కాగా రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. అయితే ఆక్వా సాగులో కరెంటు కోతలు చేపలు, రొయ్యల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి జిల్లాల పరిధిలో ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకోవడానికి ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆక్వా రైతుల ఆవేదన వారి మాటల్లోనే...వైఎస్ జగన్ పాలనలో విద్యుత్ సబ్సిడీదేశంలో జరుగుతున్న మొత్తం ఆక్వా సాగులో 70 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతోంది. దాదాపు 4.66 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా వీటికి మొత్తం 63,754 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. అయితే రొయ్యల సాగులో పెట్టుబడులు తిరిగిరాక, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వచ్చిన ఆదాయం సరిపోక అప్పులపాలైన రైతులంతా ఆక్వాను వదిలేయాలనుకున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఇక ఆత్మహత్యలే శరణ్యమనుకున్నప్పుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ సరఫరా చేశారు.ప్రతి యూనిట్పై రూ.2.36 చొప్పున విద్యుత్ సబ్సిడీ భారం మోస్తూ ఆక్వా రైతులను అదుకున్నారు. అంతేకాకుండా ఆక్వా రైతులు తమ రొయ్య ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఆ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలను నిర్ణయించింది. రైతు భరోసా (ఆర్బీకే) కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టిక, కాల్ సెంటర్ నంబర్ను అందుబాటులో ఉంచింది.రొయ్య మేత ధరలను కూడా మేత ఉత్పత్తిదారులు ఇష్టానుసారం పెంచకుండా, సంప్రదింపుల ద్వారా మాత్రమే పెంచడానికి అనుమతి తీసుకునేలా కట్టుబాటు విధించింది. విద్యుత్ సబ్సిడీ ఇవ్వడంతోపాటు ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకువచ్చి, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో ఆక్వా రైతులు దేశ, విదేశాలకు మన రాష్ట్రం నుంచే రొయ్యలను ఎగుమతి చేస్తూ, వందలాది మందికి ఉపాధి కల్పించేవారు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యుత్ కోతలు, అత్యధిక బిల్లులతో ఆక్వా రైతుల జీవితాలను మళ్లీ చీకటిలోకి నెట్టేస్తోంది.విద్యుత్ బిల్లు రెట్టింపు పదిహేనేళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నాం. కానీ ఇప్పుడు అస్సలు బాగోలేదు. సీడ్(రొయ్యపిల్ల)లో నాణ్యత లేదు. ఫీడ్ (రొయ్యలకు ఇచ్చే ఆహారం)లో నాణ్యత లేదు. ధరలూ ఇటీవల చాలా దారుణంగా పెంచేస్తున్నారు. విద్యుత్కు రాయితీ ఇవ్వడం లేదు. గతంలో నాలుగెకరాలు సాగు చేస్తే రూ.10 వేలు బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.18 వేల వరకూ వస్తోంది. విద్యుత్ను రాత్రి వేళ ఆపేస్తున్నారు. రూ.15 వేల అద్దె కడుతూ జనరేటర్ వాడుతున్నాం. గంటకు ఆరు లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నాం. ఈ లెక్కన విద్యుత్ కోతల వల్ల నెలకు 200 లీటర్ల వరకూ ఖర్చవుతోంది. ఇకముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కరెంటు సక్రమంగా ఇస్తే మాకు ఈ బాధ ఉండదు. – సమయం రామాంజనేయులు, ఆక్వా రైతు, కైకలూరుమా బతుకులు దుర్భరంకొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగుపైనే మా జీవనం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ధ్రువీకరించిన (ఎంపెడా) హ్యాచరీస్(రొయ్య పిల్లల పెంపకం కేంద్రం) లేక నాణ్యమైన సీడ్ దొరకడం లేదు. దీని వల్ల దిగుబడి పడిపోతోంది. దీంతో మా బతుకులు దుర్భరంగా మారాయి. ఫీడ్ బస్తాకు రూ.200 వరకూ పెరిగింది. ఫీడ్ మీద ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. రొయ్య పిల్లలు ఇచ్చేది, వాటికి ఆహారం అమ్మేది, వాటిని కొనేది మొత్తం ఒక్కరే కావడంతో ధరలు వాళ్లిష్టమొచ్చినట్లు పెడుతున్నారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్కు రూ.1.50కి రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది రావడం లేదు. నేను మూడెకరాల చిన్న రైతుని నెలకు రూ.30 వేల విద్యుత్ బిల్లు వస్తోంది. అంటే యూనిట్కు రూ.3 నుంచి రూ.4.50 వరకూ బిల్లు పడుతోంది. ఏవేవో చార్జీలు వేస్తున్నారు. మరోవైపు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దానివల్ల జనరేటర్లు, డీజిల్కి ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. – రఫి, ఆక్వా రైతు, చావలిపాడుఅల్లాడిపోతున్నాం విద్యుత్ కోతలు ఆక్వా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ మధ్య ఎక్కవగా సరఫరా ఆపేస్తున్నారు. కరెంటు లేకపోవడం వల్ల జనరేటర్లు వాడాల్సి వస్తోంది. ఒక రైతుకు ఎకరాకు రూ.25 వేల వరకూ అదనంగా ఖర్చవుతోంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. విద్యుత్ సబ్సిడీ కూడా అందరికీ రావడం లేదు. కొందరికి ఇచ్చినా కూడా మరో విధంగా లాగేస్తున్నారు. గతంతో రూ.2 వేలు వచ్చే బిల్లు ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఫీడ్, సీడ్ ధరలు పెంచేశారు. గత రెండు నెలలుగా ఈ పెంపు చాలా ఎక్కువగా ఉంది. రొయ్య, చేపల రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు. రొయ్యలు, చేపలను కొనేటప్పుడు ధరలు తగ్గించేస్తున్నారు. మేత రేటు పచ్చితవుడు దొరకడం లేదంటూ పెంచేస్తున్నారు. ఇవేవీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – జయమంగళ కాసులు, ఆక్వా రైతు, పెంచికలమర్రు -
మంటలు రేపుతున్న మనువాద కూటమి
దేశవ్యాప్తంగా విద్వేషపు నెగళ్లను ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గి రాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి! ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. మనుధర్మశాస్త్రం ప్రతులను దాదాపు వందేళ్ల కిందనే అంబేడ్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాము. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్లూ, అల్పులూ అనే తేడాలుంటాయనే వర్ణ విభజన అది చేసింది కనుక అంబేడ్కర్ ఆ అధర్మ ‘ధర్మాన్ని’ దహనం చేశారు.పుట్టుక ఆధారంగా హెచ్చు తగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టుపైనున్న వారికి అల్పకార్యాలనూ అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైనా అవమానకరమైన ఆంక్షలను విధించింది. స్త్రీలకు స్వతంత్రంగా ఆలోచించే అర్హత లేదని శాసించింది. ఇటువంటి అమానవీయ భావనలతో కూడిన మనుస్మృతిని రాజ్యాంగ రచనలో ఉపయోగించుకోవా లని అప్పట్లోనే డిమాండ్ చేసినవారూ లేకపోలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను ముఖ్యంగా మను స్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రకమైన అభ్యంతరాలను లెక్కచేయకుండా ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, సర్వమానవ సమానత్వాలు పునాదు లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా సరే మారువేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడది మతం ముసుగేసుకొని ముందుకొస్తున్నది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యన ముగ్గురు పిల్లల్ని కంటే ముప్ఫై వేలిస్తా, నలుగుర్ని కంటే నలభై వేలిస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు పదిహేనేళ్ల కాలాన్ని నలుగురు పిల్లల్ని కనడం వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనడం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక పదేళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’’ అని ఆయన మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగ పిల్లాడిని కోరుకోవడమే సహజమన్న భావన ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించడమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి, గెలిచిన తర్వాత తూచ్ అనడం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపునకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడా సంస్థనే ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు.మహిళల విషయం మాత్రమే కాదు. దళితుల విషయంలోనూ, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుదీ, ఆయన పార్టీదీ, కూటమిదీ అదే ధోరణి. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెనమెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టుమీద దళితులు ఉంటారనీ అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయనావిధంగా మాట్లాడగలిగారు. ఆయన పార్టీ నేత లదీ, కూటమిలోని ఇతర నేతలదీ అదే అభిప్రాయం. దెందు లూరు ఎమ్మెల్యే అప్పట్లో ఒక బహిరంగ సభ వేదికపై నుంచే ‘మీరంతా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, అవన్నీ మేం చూసుకుంటాం’’ అన్న మాటల్ని కూడా మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయ’రంటూ ఈసడించుకోవడాన్ని కూడా చూశాము.ఇప్పుడీ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటున్నది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధ మవుతున్నది. దళితులపై క్రైస్తవులనే ముద్రవేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు నిమగ్న మయ్యారు. టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలనుద్దేశించి ఆయన మాట్లా డిన ఆడియోలు బయటకొచ్చాయి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటున్న దళితులను ఓ కంట కనిపెట్టండి. వాళ్లు చర్చికి వెళ్తు న్నారా, దేవాలయాలకు వెళ్తున్నారా తెలుసుకునేందుకు నిఘా పెట్టండి. వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరిగాయో శ్మశానాల దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. వారి వివాహాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలుసుకోండి...’’ ఇలా సాగుతున్నాయి ఆయన ప్రబోధాలు.ఈ రకమైన నిఘా, వారి జీవితాల్లోకి తొంగిచూడటం, వారు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కోటిమందికి పైగా ఉన్న దళితులను రెండో తరగతి పౌరులకింద జమకట్టే ధోరణిగా దీన్ని భావించవలసి ఉంటుంది. మొత్తం దళిత సమాజమే తీవ్రమైన అశాంతికి లోనయ్యే పరిస్థితిని కూటమి కల్పిస్తున్నది. రఘరామ కృష్ణంరాజు తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ధోరణికి మాట మాత్రంగానైనా అడ్డు చెప్పే ప్రయత్నం ఏ కూటమినేతా ఇంతవరకూ చేయలేదు. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ లుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణంరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. చింతాడ ఆనంద్ కులపరంగా దళిత వర్గానికి చెందినవాడు. క్రైస్తవం స్వీకరించి పాస్టర్గా మారాడు. అగ్రకులానికి చెందిన వారు ఆయన్ను కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా టెక్నికల్ తీర్పు. తన నివాస ప్రాంతంలో ఆనంద్ కులపరంగానే గుర్తింపు పొందుతున్నప్పటికీ, కులపరంగానే దూషణకు, దౌర్జ న్యానికి గురైనప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన మతాన్నే సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకున్నది. ఆయన సామాజిక గుర్తింపును నిరాకరించింది.ఈ తీర్పును ఆధారం చేసుకొనే దళితల వేట కోసం రఘు రామ టాస్క్ఫోర్స్ ప్రారంభమైంది. చర్చిలో ప్రార్థనలు చేసే వారందరినీ ఈ టాస్క్ఫోర్స్ క్రైస్తవుల జాబితాలో వేస్తుందన్న మాట! దళితులు అత్యధిక సంఖ్యలో చర్చికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇందులో దాపరికం ఏమీలేదు. అందుకు కారణాన్ని కూడా వారు చెబుతున్నారు. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మ గౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నది. అయినా హిందూ సమాజ స్రవంతిలో ఉన్నవాళ్లు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చర్చికి లేని అభ్యంతరం హిందూత్వ టాస్క్ ఫోర్స్లకు ఎందుకు? హిందూ సమాజాంలో కొన్ని లక్షలమంది షిర్డీ సాయి మందిరాలకు వెళ్తారు. వాళ్ల మీద కూడా ఆంక్షలు పెట్టే ఆలోచన వుందా? సాయిబాబా హిందువు కాదు మరి!పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే! హిందూ పద్ధతిలో నిర్వహించడానికి ఆనాడు అయ్యవార్లు మా వాడలకు రాలేదు, ఆత్మగౌరవం కోసం ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాము, అదే ఇప్పుడొక సంప్రదాయంగా స్థిరపడిందని దళితులు చెబుతున్నారు. హిందువుల్లో మంగళసూత్రధారణ జరిగితేనే, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్లి. లేకుంటే కాదా? ఐదారు దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్నివేల స్టేజీ పెళ్లిళ్లు జరి గాయి. వాటిలో మంగళసూత్రధారణ లేదు, బ్రాహ్మణ పండి తుడూ లేడు. ఇప్పుడా పెళ్లిళ్లన్నింటినీ రద్దు చేద్దామా? మరణా నంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్లలోనే అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చి పెట్టినవాళ్లంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు?చర్చికి వెళ్లే వాళ్లందరి మీదా క్రైస్తవ ముద్ర వేయడం ఒక అంశం. అంతకంటే ముఖ్యమైన విషయం క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదాను ఎందుకు కోల్పోవాలి అన్నది. రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ, క్రైస్తవంలోకీ, ఇస్లామ్లోకీ మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉన్నది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు కనుక, అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు.మతం మారినా షెడ్యూల్డ్ తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది. అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే, వారికి ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లకు అర్హత వుంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగుతుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితోపాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తు న్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ/ ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్టు ఆమోదానికి నోచు కోలేదు. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది.మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతున్నది తప్ప, దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ, అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాము. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగినందుకు ‘దళితులకు ఇంత ధైర్యమా’ అనే కావరంతో అగ్రకులం వాళ్లు దాడి చేశారు. తరిమి తరిమి వేటాడారు. ఎనిమిదిమంది చనిపోయారు.చనిపోయిన వారిలో అబ్రహం, మోషా, యేషువా, వందనం వంటి క్రైస్తవ పేర్లున్నాయి. పశువులు కడగడాన్ని ప్రశ్నించిన మహిళ పేరు సువార్త. వీరికి క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయ లేమని కులోన్మాదులు వెనక్కు పోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుదితీర్పు రావలసే ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసే ఉన్నది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని కోటిమందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది. ఈ అంశమే కాదు, తిరుమల లడ్డూ వివాదం దగ్గర్నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. ఈరోజు (శనివారం) సైతం చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు... రుజువులేమిటి అన్న దానితో పనిలేదు. ఒకటికి వందసార్లు చెప్పాలి. జనం పుర్రెల్లోకి కిర్రెక్కించాలి. విభజించి పాలించాలి... ఇదే ఎజెండా!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బిగ్ అలర్ట్.. ఏపీలో రేపు ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ(శనివారం, మే 23) రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ లో 45, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి జిల్లా రామరాజుపాలెం, కాకినాడ జిల్లా కోటనందూరులో 42.6, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 42.5, ప్రకాశం జిల్లా కొండపిలో 42.4, గుంటూరు జిల్లా రాయపూడిలో 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.రేపు(మే 24, ఆదివారం) 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
‘చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాయొచ్చు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వ్యవస్థల మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్ హిట్ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?కోవిడ్ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్:కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్ టాపర్ వచ్చాడని తెలిసి ఆన్ లైన్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్ డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్ మావిగన్ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్ జరిగి మెరిట్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. -
‘వేల ఎకరాల్లో నష్టం.. రైతుల్ని వెంటనే ఆదుకోవాలి’
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. లింగాల మండలంలోని గురువారం రాత్రి కురిసిన గాలి వానకు దెబ్బతిన్న అరటి పంటలను ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) ఎంపీ అవినాష్ పరిశీలించారు. దీనిలో భాగంగా ఎంపీ అవినాష్ మాట్లాడుతూ.. ‘పులివెందుల నియోజకవర్గంలో ఈనెల 21న వీచిన గాలివానకు భారీ ఎత్తున అరటిపంట నష్టం వాటిల్లింది. లింగాల, పులివెందుల, వేముల మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నేల కూలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2వేల ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయి. ఇప్పటికే రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఓ వైపు సాగునీటి సమస్య...మరో వైపు గిట్టుబాటు ధరలు దొరకడం లేదుఅన్నిటినీ అదిగమించి మంచి దిగుబడి సాధించిన పకృతి ప్రకోపంతో వేల ఎకరాలు నేలకూలాయి. ఫలితంగా రైతుల కష్టం మొత్తం వృథా అయిన పరిస్థితి నెలకొంది. ఈ రోజున్న అరటి రేటుతో లెక్క కడితే ఎకరాకు 5లక్షల నుంచి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.ఇలా 2వేల ఎకరాల్లో పంట నష్టం అంటే ఎంత భారీ నష్టం జరిగిందో అందరూ గమనించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇటువైపు చూసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ పంటల బీమాను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.గత ఏడాది మార్చిలోనూ ఇలానే గాలివానకు భారీగా అరటి పంటకు నష్టం చేకూరింది. అరటికి బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ స్టేషన్లలో గాలివేగం నమోదును బట్టి ఉంటుంది. ఆ గాలి వేగం ఎంత ఉందో లెక్కిద్దామంటే ఆ వెదర్ స్టేషన్లు అసలు పనే చేయడం లేదు. అప్పట్లో నష్టపోయిన గ్రామాల్లో గాలివేగం రికార్డులు తీస్తే నాట్ అప్లికబుల్ అని వస్తోంది. ప్రస్తుతం ఈనెల 21న వచ్చిన గాలివేగం కూడా సక్రమంగా రికార్డ్ కాలేదుగతంలోనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు ఒకవైపు నీరు లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే ప్రకృతి కోపంతో మరింత రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం
సాక్షి, గుంటూరు: పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. గత పదిరోజులుగా ఇదే పంథాను సీఐ కృష్ణయ్య అనుసరిస్తున్నారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబుపై సీఐ రెచ్చిపోయారు. వరికూటి అశోక్ బాబును సీఐ కృష్ణయ్య, పోలీసులు ఈడ్చేశారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబును కిందపడేసిన పోలీసులు.. ఆయన పట్ల హేయంగా ప్రవర్తించారు.మధ్యాహ్నం రేపల్లె ఇన్ఛార్జ్ పేట మోహన కృష్ణపై దాడిచేసిన సీఐ కృష్ణయ్య.. జీపులోకి ఈడ్చేసి కొట్టారు. గతంలో బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ పట్ల ఇలానే సీఐ కృష్ణయ్య రెచ్చిపోయారు. జోగి రమేష్ను మామిళ్లపల్లి వెళ్లకుండా సీఐ అడ్డుకున్నారు. ప్రశ్నించిన జోగి రమేష్ను ఈడ్చికెళ్లారు. అంబటి మురళీకృష్ణ తోనూ దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంబటి మురళీకృష్ణ, జూపూడి ప్రభాకర్లను ఇంట్లోనుండి పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రాపకం కోసం సీఐ కృష్ణయ్య రెచ్చిపోతున్నారు. -
విద్యార్థులకు ప్రభుత్వం షాక్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పిడుగులాంటి వార్త చెప్పింది. విద్యా కానుక కింద విద్యార్థులకందించే యూనిఫాం, షూ, బ్యాగ్ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ మేరకు జూన్ 12 వ తేదీన అందించే విద్యాకానుక కిట్ను అందించలేమని సమగ్రశిక్ష డైరెక్టర్ ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలోనూ గ్యారంటీ లేదని ప్రకటించారు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక భారంతో యూనిఫాం, బ్యాగు, బట్టలు ఇవ్వలేమని తెలిపింది. ఈ పిడుగులాంటి వార్తతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాయాంలో పాఠశాలలు తెరిచే రోజే విద్యా కానుక కిట్ను అందజేసేవారని ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేసి తమ చదువులకు ఆటంకం కలగజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతుంది. గత రెండేళ్లుగా నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన విద్యార్థుల చదువు విషయంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు పెడుతుండడంతో సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల దౌర్జన్యం
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో అపచారం జరిగింది. అహోబిలం టోల్ గేట్ దగ్గర స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సరుకుల వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు అడ్డుకున్నారు. ఆలయ నిర్వాహకులు లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన సరుకులను తరలిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడ్డారు.ప్రసాదం తయారీకి సంబంధించిన ముడి సరుకులను తమవద్దే తీసుకోవాలని టీడీపీ నాయకులు హుక్కుం జారీ చేశారు. తాము తప్ప ఎవ్వరు కూడా సరుకులను ఇవ్వకూడదంటూ అఖిలప్రియ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకులపై నంద్యాల ఎస్పీకి అహోబిలం మఠం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. -
AP: మరి కొద్ది సేపట్లో వర్షం?.. వాాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం జిల్లాలో సైతం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని తెలిపింది. 50 నుంచి 60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద ఎట్టిపరిస్థితుల్లో నిలబడకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ హెచ్చరికలను జారీ చేశారు. -
దళిత రైతుల భూములపై టీడీపీ నేతల కన్ను
తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్ర కాలువలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత రైతుల భూములపై టీడీపీ నేతలు కన్నేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుర్ర కాలువ గ్రామంలో దళిత రైతులు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల భూమిపై టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. సొంత భూమిలో నీటి బోరు వేసుకుంటుంటే టిడిపి నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. దౌర్జన్యంగా బోర్వెల్ లారీని వెనక్కు పంపించేశారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని బాధిత సుబ్రహ్మణ్యం ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు సూత్రాలు తెచ్చి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయితీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు.బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయితీకి 4 వారాల గడువు ఇచ్చిన పవన్.. చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్ చేసుకోవాలని బాలరాజును ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు ఉన్నాయి. పవన్ ఫ్యామిలీ సెటిల్మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా సంచలనంగా మారింది. -
‘వెన్నుపోటు పార్టీ.. ప్రజలపై పన్నుపోటు’
సాక్షి, తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంధన ధరలను భారీగా పెంచి చంద్రబాబు జనం నడ్డి విరిచారని.. ప్రజాపాలనలో ఘోర వైఫల్యం చెందారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ చేపట్టిన నిరసనలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందన్న అప్పిరెడ్డి.. ఇంధన ధరల పెంపుపై తమ నాయకులు అడిగిన ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పలేక పోయారన్నారు.‘‘ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు దూషణలకు దిగుతున్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించటం కూడా చేతగాని వారు కూటమి నేతలు. పెట్రోలుపై రూ.31లు ట్యాక్స్ వేసింది చంద్రబాబు కాదా?. డీజిల్ మీద 22 రూపాయలు ట్యాక్స్ వేసిందీ చంద్రబాబే. చివరికి అమరావతి పేరుతో మరో రూ.4 ట్యాక్స్ వేయలేదా?. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తే జగన్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే జగన్ ప్రభుత్వం ప్రజల మీద వేయకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేశారు..మరి చంద్రబాబు ఇప్పుడు ఆ పనులు ఎందుకు చేయటం లేదు?. అమరావతి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉండదా?. రూ.3,400 కోట్ల భారం ప్రజల మీద వేయటం సిగ్గుచేటు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. ఇదేనా అనుభవజ్ఞుడి పాలన చంద్రబాబూ?. అమరావతి అద్దాలకు పెట్టే ఖర్చు ప్రజల బాగు కోసం పెట్టలేరా?. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంధన ధరలను తగ్గించాలి...టీడీపీ డీఎన్ఏనే వెన్నుపోటు. రైతుల నుండి అన్ని వర్గాలనూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్సీపీ ప్రజల పార్టీ. వివేకా హత్య జరిగింది చంద్రబాబు పాలనలోనే. చంద్రబాబుదే గొడ్డలి పార్టీ. పొరుగు రాష్ట్రాలను చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
ఆన్లైన్లో రూమ్ను బుక్ చేసుకుని..!
శ్రీకాకుళం క్రైమ్: ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది. స్నేహితురాలి ఊరికని చెప్పి.. ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్లైన్లో శ్రీకాకుళం విజేత హోటల్లోని రూమ్ను బుక్ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్ సారాంశం. అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్ చేసి చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్ చేయడంతో హోటల్లో ఫ్యాన్కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు. హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. -
నిప్పుల కుంపటిలా భానుడు.. నీటి చుక్క కోసం పక్షుల విలవిల! (ఫొటోలు)
-
అన్నామలైకు నో.. వాళ్లకూ హ్యాండే!
రాజ్యసభ ఎన్నికల వేడి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే నెల 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 26 రాజ్యసభ(24+2) స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఏపీ నుంచి ఖాళీ కాబోతున్న నాలుగు సీట్లు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.ముఖ్యంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలైకి ఏపీ కోటాలో అవకాశం కల్పించే అంశంపై జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆసక్తితో లేరని.. పైగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ ఇప్పుడు కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.వచ్చే నెల 18న ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. మరో స్థానాలకు ఉప ఎన్నికలు( మహారాష్ట్రలో సునేత్ర పవార్, తమిళనాడులో సీవే షణ్ముగం అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో) జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఉన్నాయి.అయితే అసలు చర్చ మాత్రం అభ్యర్థుల ఎంపిక చుట్టూనే తిరుగుతోంది. తమిళనాడులో బీజేపీకి ముఖచిత్రంగా మారిన అన్నామలైకి.. అక్కడ గెలిచే పరిస్థితి లేకపోవడంతో మిత్రపక్షాల సహాయంతో రాజ్యసభకు పంపాలని ఆలోచన కమలనాథుల్లో ఉందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అందులో భాగంగానే ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ సీటును బయటివారికి ఇవ్వడంపై సానుకూలంగా లేరని సమాచారం.అసెంబ్లీలో మెజారిటీ ఉన్నందున.. టీడీపీ, జనసేన, బీజేపీ (2+2+1) పద్ధతిలో ఆ పంపకం జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం మరోలా చర్చించుకుంటున్నాయి. ఈసారి రాజ్యసభ సీట్ల విషయంలో చంద్రబాబు పూర్తిగా తన రాజకీయ, సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు లేదంటే ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచిన కీలక వ్యక్తికి అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా కాలంగా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు ఈసారి కూడా నిరాశ తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవుల కోసం ఎదురుచూస్తున్న మిత్రపక్షాల నేతలు.. కనీసం రాజ్యసభలోనైనా అవకాశం వస్తుందని భావించారట. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. బాబు మార్క్ అనే ఫార్ములా తప్పదనే చర్చ సాగుతోంది. మరోవైపు అన్నామలై విషయంలో టీడీపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీకి దూకుడు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఏపీ నుంచి రాజ్యసభ అవకాశం ఇస్తే.. భవిష్యత్తులో దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే బీజేపీ నుంచి ఒత్తిళ్ల ప్రస్తావన లేకుండా ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న తన మనుషులతో రాజకీయం నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ ఎంపీకి మళ్లీ చాన్స్ దక్కేనా?ఏపీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానీ టర్మ్ కూడా ఈ జూన్ 21తో ముగియనుంది. 2020లో వైఎస్సార్సీపీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో నత్వానీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయనకు మళ్లీ అవకాశం రావడం ఫిఫ్టీ-ఫిఫ్టీ చాన్స్గా కనిపిస్తోంది. కూటమి మధ్య సీట్ల పంపకం చాలా కీలకంగా మారడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ, చంద్రబాబు అది జరగనివ్వడం డౌటే. అయితే.. ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు, రిలయన్స్ వర్గాలతో ఉన్న అనుబంధం, వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను మేనేజ్ చేయగల సామర్థ్యం వంటి అంశాలు ఆయనకు ప్లస్గా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం వల్ల చివరి నిమిషంలో సమీకరణాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నత్వానీ పేరు బీజేపీ కోటాలో పరిశీలనలో ఉందన్న టాక్ ఉన్నప్పటికీ.. కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కమలనాథుల్లో కూడా ఉందని చెబుతున్నారు. దీంతో నత్వానీకి ఎక్స్టెన్షన్ ఉంటుందా? ఉండదా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. -
రీ–వెరిఫికేషన్లో టెన్త్ విద్యార్థినికి జీరో మార్కులు..!
నంద్యాల జిల్లా: టెన్త్ పరీక్షల్లో తమ పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించి రీ–వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోతోంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన సాహెబ్హుసేన్ కుమార్తె సుహానకు కెమిస్ట్రీ పరీక్షలో 50/50 మార్కులు, ఫిజిక్స్లో 31/50 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ రావటంతో రీ–వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంది. ఎస్ఎస్సీ బోర్డు అధికారులు సుహాన రాసిన ఫిజిక్స్ పేపర్ను రీ–వెరిఫికేషన్ చేయకుండా జవాబు పత్రాన్ని స్కాన్ చేసి పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా సున్నా మార్కులు వేశారు. చాలా ప్రశ్నలకు జవాబు రాసినా సున్నా మార్కులు వేశారని విద్యార్థిని వాపోయింది. -
నాన్నా.. మీ కోడల్ని చంపేశా..!
ఏలూరు జిల్లా: సీమంతం చేసుకోడానికి సిద్ధమైన బాలింత రాత్రికి రాత్రి గుండెపోటుతో మరణించిందని దృశ్యం సినిమా రేంజ్లో భర్త, మామ అల్లిన కట్టుకథను పోలీసులు ఛేదించారు. కైకలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, సీఐ వి.రవికుమార్, ఎస్సై రామచంద్రరావు కేసు వివరాలు శుక్రవారం వెల్లడించారు. మండవల్లి మండలం నాగభూషణపురం గ్రామానికి చెందిన నగుళ్ల ప్రదీప్కు విజయవాడ సమీపంలో ఎనికేపాడుకు చెందిన మేఘన(25)తో 2025, మే 8న వివాహమైంది. మేఘన ఇంజనీరింగ్ చేసి హెచ్ఆర్ క్లౌడ్ సెంటర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. ప్రదీప్ డిగ్రీ పూర్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను క్రైస్తవమతంలోకి మారాడు. వివాహానంతరం భార్య పూర్తిగా తన ఆధీనంలో ఉండాలని, సంపాదన తనకే ఇవ్వాలని, పుట్టింటి వారితో మాట్లాడవద్దని, మతపరమైన విషయాలపై తరుచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో అట్లతద్ది వాయినాలు భార్య తీసుకుందని నాలుగు నెలలు పుట్టింటికి పంపించేశాడు. విడాకులు ఇస్తానని బెదిరించాడు. దీంతో పెద్దలు సర్దిచెప్పి లోకుమూడి గ్రామంలో ఉంటున్న భర్త వద్దకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న మేఘనను పంపారు. కొద్దిరోజుల్లో సీమంతం చేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఫిబ్రవరి 9న గుండెపోటుతో మేఘన మరణించిందని 108 వాహనం తీసుకొచ్చి భర్త హడావుడి చేశాడు.దొరికారు ఇలా.. 2026, ఫిబ్రవరి 9న రాత్రి మేఘన ఉద్యోగానికి సంబంధించిన పని ముగించుకుని ఆలస్యంగా పడుకుంది. అర్ధరాత్రి నీరు తాగడానికి లేచింది. ఆ సమయంలో భర్త ప్రదీప్తో గొడవ జరిగింది. ముందస్తు ప్లాన్లో భాగంగా ప్రదీప్ ఆమె పీక గట్టిగా నొక్కి, తర్వాత తలదిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ విషయాన్ని పక్క గదిలో తండ్రి నరసింహారావుకు చెప్పాడు. ఇద్దరు ప్లాన్ ప్రకారం గుండెపోటు వచ్చిందని 108 వాహనం పిలిచి హాస్పటల్కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు. మృతిరాలి తల్లి రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య చేశారని నిర్ధారణైంది. భర్త కూడా చేసిన నేరం అంగికరించడంతో తండ్రితో సహా ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. -
క్రూర జంతువులకే సవాల్ విసిరే హనీ బ్యాడ్జర్!
ఏలూరు జిల్లా: పాపికొండల అభయారణ్యంలో ఉన్న అరుదైన వన్యప్రాణుల్లో హనీ బ్యాడ్జర్ ఒకటి. ఈ జంతువు ఎత్తు కేవలం 12 అంగుళాలు. హనీ బ్యాడ్జర్ పంజాకు గోళ్లు మూడు అంగుళాల పొడవు ఉంటాయి. తల నుంచి వరకు తెలుపు, తెలుపు గీతలతో మందపాటి, దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉంటాయి. చూసేందుకు ఎలుగుబంటిలా పొట్టిగా ఉంటుంది. పౌరుషంలో ఈ హనీ బ్యాడ్జర్కి మరో వన్యప్రాణి సాటిరాదు. పులినైనా ఎదురించ గల ధైర్యశాలి హనీ బ్యాడ్జర్లు చాలా ధైర్యం కలిగిన వన్యప్రాణులు. హనీ బ్యాడ్జర్ చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు. పులి, చిరుత, కొండ చిలువతో పాటు ఏ జంతువుతోనైనా ఎదురించి పోరాడే ధైర్య శాలి. పాము విషం కూడా ఈ హనీ బ్యాడ్జర్లను ఏమి చేయలేదు. వాసన పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నీపర్ డాగ్ను మించిన నైపుణ్యాన్ని హనీ బ్యాడ్జర్స్ కనబరుస్తుంటాయి. ప్రపంచంలోనే భయం లేని జంతువు ఉందంటే అది హనీ బ్యాడ్జర్ ఒక్కటే అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ హనీ బ్యాడ్జర్ జీవిత కాలం కేవలం ఏడేళ్లు మాత్రమే అని అధికారులు వివరిస్తున్నారు. తేనె తుట్టెల్లోని లార్వా అంటే ఇష్టం హనీ బ్యాడ్జర్కు అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనె టీగ లార్వా అంటే ఎంతో ఇష్టం. తేనెటీగ లార్వా వాసనను పసిగట్టి ఎంతో ఇష్టంగా తింటాయి. అందువల్లే ఈ జంతువును హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు. తేనెటీగ లార్వాతో పాటు కీటకాలు, కుందేళ్లును ఆహారంగా తింటాయి. ఈ హనీ బ్యాడ్జర్లు మాంసాహారులు. వీటి ఆహారంలో 25 శాతం పాములే ఉంటాయి. పాములు ఈ జంతువుల కంట పడితే వేటాడి వెంటాడి చంపి మరి తినేంత వరకు వెనక్కి వెళ్లవు. పాపికొండల్లో సంచారం అరుదైన హనీ బ్యాడ్జర్ల సంచారం పాపికొండల్లో ఎక్కువగానే ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు వివరిస్తున్నారు. అభయారణ్యంలో సుమారు 1200 పైగా హనీ బ్యాడ్జర్లు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమేరాలకు హనీ బ్యాడ్జర్లు జాడ చిక్కినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. వీటి సంతతి కూడా అధికంగా పెరుగుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. -
సయ్యంటే సై అన్న ఎద్దులు.. జనాల్లో భయం..!
కాకినాడ: ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో.. సయ్యంటే సైయ్యంటూ ఢీకొన్నాయీ వృషభరాజాలు. సహజంగానే బలిష్టంగా ఉండే ఆ ఎద్దులు నడిరోడ్డుపై అలా వీరంగం సృష్టింస్తుంటే చుట్టుపక్కల వారు.. వాహన చోదకులు.. పాదచారులు ఒకింత భీతిల్లారు. ఏ మాత్రంఅదుపుతప్పి అవి తమ మీద పడినా అంతే సంగతులు. ఓ అరగంట తరవాత అవే అలసిపోయి తలోదారీ వెళ్లాక కానీ వారి ఆందోళన తీరలేదు. అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్లో శుక్రవారం ఉదయం ఈ వీరంగం స్థానికులకు గగుర్పొడిచేలా సాగింది. -
గే యాప్ పరిచయం.. యువకుడి దారుణ హత్య..!
కోదాడ: సోషల్ మీడియాలో ఓ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన బల్గూరి గణేష్(20) ఈ నెల 15న హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సామాజిక మాధ్యమంలో ఉన్న ‘పోలో’ గే యాప్ కారణమని, హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గణపవరానికి చెందిన బల్గూరి గణేష్కు, హుజూర్నగర్కు చెందిన బర్రెంకుల సోమేష్కు పోలో అనే గే యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఏకాంతంలో తీసుకున్న ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గణేష్ను చంపాలని సోమేష్ నిర్ణయించుకున్నాడు. దీనికి గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు పగిల్ల ఉదయ్కిరణ్ సాయం తీసుకున్నాడు. గణేష్ హత్యకు సోమేష్ పథకం వేస్తున్న విషయం తెలిసినప్పటికీ సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతి మిన్నకుండిపోయారు. ఈ నెల 15న రాత్రి పథకం ప్రకారం సోమేష్.. గణేష్ను గణపవరానికి సమీపంలో ఉన్న మామిడి తోట వద్దకు పిలిచాడు. ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అక్కడే ఉన్న సోమేష్ స్నేహితుడు ఉదయ్కిరణ్ సాయంతో గణేష్పై రాయితో దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. సంఘటన స్థలం నుంచి కత్తి, మొబైల్ ఫోన్లు ఇతర ఆధారాలను సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, మొబైల్ లొకేషన్లు పరిశీలించి నిందితులైన పగిళ్ల ఉదయ్కిరణ్, ప్రధాన నిందితుడైన సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతిలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్క పంపినట్లు ఆయన వెల్లడించారు. సోమేష్ పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్ ఇన్చార్జీ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్, చింతలపాలెం ఎస్ఐ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
చెబుతాం... ఆచరించం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేతల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. పబ్లిసిటీ పీక్.. ఇంప్లిమెంటేషన్ వీక్ అన్నట్టుగా ఉంటుంది. సాక్షాత్తూ ప్రకటన చేసే చంద్రబాబు, ఆయన కుమారుడే దానిని పాటించరు. వారి బాటలోనే మిగతా నాయకులు వెళ్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇంధనం పొదుపు ప్రకటన మేరకు చంద్రబాబు కూడా ఇంధనం పొదుపునకు పిలుపునిచ్చారు. శుక్రవారమైతే నో వెహికల్ డేగా ప్రకటించారు. ఆ పిలుపు, ప్రకటన గొప్పగా చెప్పుకున్నారు. సరిగ్గా ఇదే రోజున (శుక్రవారం) ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో జరిగిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో పాటు ఎమ్మెల్యే కూన రవికుమార్ భారీ కాన్వాయ్తో ర్యాలీ నిర్వహించా రు. మదనాపురం కూడలి నుంచి అల్లెన వరకు రోడ్ షో చేశారు. అంతకుముందు జరిగిన పలు కార్యక్రమాలకు కూడా భారీగా వాహనాలతో వెళ్లి పాల్గొన్నారు. చంద్ర బాబు, లోకేష్ ఎలాగైతే హెలికాప్టర్లు, భారీ కాన్వాయ్ లతో పర్యటనలు చేసి వారి మాటను వారే తప్పుతున్నారో కేంద్రమంత్రి, ఎమ్మెల్యే తదితరులు అదే బాటలో పయనిస్తున్నారు. తాము చెబుతాం తప్ప ఆచరించం అనే ధోరణిలో వెళ్తున్నారు. టీడీపీ నాయకులు తీరు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఒకరు ఏమో రాష్ట్ర మంత్రి ఒకరు ఏమో కేంద్ర మంత్రి ఇంధన పొదుపు అని సైకిల్ మీద షో ఒకరు ఇంధన పొదుపు లేదు బొక్క లేదు అని ర్యాలీ చేస్తూ షో మరొకరు అదిరిందయ్యా చంద్రం! pic.twitter.com/I5u4ThdIE0— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) May 22, 2026 -
లోకేష్ సమక్షంలోనే ఎమ్మెల్యే వరదకు అవమానం
సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అటు కడప, ఇటు కొండాపురంలో జరిగిన సమావేశాల సరళి చూస్తే, కేవలం తన చుట్టూ భజన చేసే ‘అనుకూల’ వర్గానికే లోకేష్ పెద్దపీట వేశారని, జెండా మోసిన కార్యకర్తలను రోడ్డుపై నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్వాన్ వద్దే వరదరాజులరెడ్డికి అవమానం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి లోకేష్ పర్యటనలో తీవ్ర అవమానం ఎదురైంది. శుక్రవారం ఉదయం లోకేష్ను కలిసేందుకు మైనార్టీ నేత ముక్తియార్తో కలిసి వరదరాజులరెడ్డి ఆయన కార్వాన్ వద్దకు వచ్చారు. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మె ల్యే, సీనియర్ నేత అని కూడా చూడకుండా.. ‘ముందస్తు అనుమతి లేదు, అపాయింట్మెంట్ కష్టమే‘ అంటూ లోకేష్ పర్సనల్ సెక్రెటరీ ముఖం మీదే చెప్పేయడం గమనార్హం. దాదాపు గంటసేపు పడిగాపులు కాసినా లోకేష్ నుంచి పిలుపు రాకపోవడంతో, వరదరాజులరెడ్డి తీవ్ర అవమానంతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే ఇక తమ గతేంటని ‘తెలుగు తమ్ముళ్లు’ చెవులు కొరుక్కుంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడికే స్టేజీ కింద స్థానం దీనికి ముందు గురువారం సాయంత్రం జరిగిన కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ అవమానాల పర్వం కొనసాగింది. పార్టీ జెండానే సర్వస్వంగా భావించే ఎంతోమంది కిందిస్థాయి నాయకులకు ఈ సమావేశంలో అసలు అనుమతే దక్కలేదు. ఒకవేళ లోపలికి వెళ్లగలిగినా, సీనియర్లకు దక్కిన మర్యాద శూన్యం. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి లాంటి కీలక నేతలను సైతం స్టేజీపైకి రానివ్వలేదు. వీరంతా స్టేజీ కిందనే కూర్చోవాల్సి రావడంపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కోటరీతోనే ఏకాంత చర్చలు ప్రజాప్రతినిధి అయిన వరదరాజులరెడ్డిని గంటల తరబడి బయట నిలబెట్టిన లోకేష్.. అదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఇన్ఛార్జీ గండ్లూరు ప్రవీణ్కుమార్రెడ్డిని కార్వాన్ లోపలికి పిలిపించుకుని ఏకాంత చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. కేవలం తనకు అనుకూలంగా ఉండే వారికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కష్టజీవులకు మొండిచేయి ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. లోకేష్ రెండు రోజుల పర్యటన జిల్లా టీడీపీలో తీవ్ర నైరాశ్యాన్ని, అసంతృప్తిని మిగిలి్చంది. -
ప్రజల గుండెల్లో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలుస్తూ..కరువు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆదుకున్న నాయకుడు దివంగత వైఎస్ రాజారెడ్డి. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బిజీగా ఉన్నా పులివెందులలో అంతా తానై నడిపించేవారు. వైఎస్ రాజారెడ్డి 1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరిని ఏకతాటిపై నడిపించిన దివంగత వైఎస్ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. అంతేకాకుండా పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్గా ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది. పులివెందుల గ్రామ సర్పంచ్గా.. రాజకీయాల్లోకి రాకముందు నుంచి పులివెందుల్లో వై.ఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం.ఈ నాటికి ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్గా 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవి్వంచారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు అన్నింటా తానే ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. రైతులను అన్నివిదాలా ఆదుకున్న దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కృషికి తోడుగా అక్కడక్కడ పెద్దాయన పేరుతో కూడా సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో రూపుదిద్దుకున్నాయి. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు కూడా వెలిశాయి. పులివెందుల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు పులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవాడు. ప్రజలు కూడా తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలువబడే వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. ప్రజల కోసం వైఎస్ రాజారెడ్డి ఇంటి వాకిళ్లు ఎప్పుడు తెరిచి ఉండేవి. అంతేకాకుండా దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్ రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవాడు. దీంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రశాంతంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవాడు. విద్యా ప్రదాతగా.. : దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాల్టెక్నికల్ కళాశాలలు నెలకొల్పాడు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్లు చూపిన బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినా‹Ùరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికి పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు. నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సు«దీకర్రెడ్డి, ఇతర కుటుంబీకులు నివాళులరి్పంచనున్నారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి పార్కులోని వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులరి్పంచనున్నారు. -
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో పగిలిన అక్రమాల పుట్ట... ఎస్సీఆర్టీ నుంచే కుంభకోణం..
-
బాలికపై బాబాయి లైంగిక దాడి
తిరుపతి క్రైం: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని పిన్ని, బాబాయి ఇంటికి వచ్చిన బాలిక (16)కు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. తండ్రి వరుసయ్యే బాబాయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడికి అతని భార్యే సహకరించడంతో బాలిక నిస్సహాయురాలిగా మారింది. ఆ దంపతులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి గురువారం తిరుపతి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.తెలంగాణ రాష్ట్రం జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో వేసవి సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బాలిక బాబాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలితో ఫోన్, చాట్ యాప్స్ ద్వారా జరిపిన సంభాషణలు, కలిసి దిగిన ఫొటోలను తన వద్ద ఉంచుకుని, తాను పిలిచినప్పుడు రాకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.కొద్దిరోజుల తరువాత జగద్గిరిగుట్టకు వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు బదిలీచేశారు. నిందితుడిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.దర్యాప్తులో ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఆమె తిరుపతి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ, కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరినీ 21వ తేదీ సాయంత్రం అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.దళిత బాలికపై లైంగిక దాడికి యత్నంపోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదుపాయకరావుపేట: హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయతి్నంచారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి బాధితురాలి తల్లి తెలిపిన వివరాలు... పాయకరావుపేటలోని తల్లితో కలసి 11 ఏళ్ల దళిత బాలిక నివాసం ఉంటోంది. తన కుమార్తె సెల్ఫోన్ దొంగిలించిందని ఆరోపిస్తూ ఈ నెల 17న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని కొబ్బరితోటలోకి తీసుకెళ్లి ప్రైవేటు పార్ట్లను తాకుతూ గోర్లతో రక్కి అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలి తల్లి తెలిపింది.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారని పేర్కొంది. ఇంటికి వచ్చిన తన కుమార్తె శరీరంపై గాయాలు చూసి అడిగితే జరిగిన దారుణాన్ని తెలియజేసిందని చెప్పింది. తన కుమార్తెపై లైంగిక దాడికి ప్రయతి్నంచినవారిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించింది. కాగా, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొంతనలేని పోలీసుల ప్రకటనలు ఈ విషయంలో పోలీసు అధికారుల ప్రకటనలకు పొంతనలేకపోవడం పలు అనుమానాలకు దారిస్తోంది. ‘బాలికపై లైంగిక దాడికి ప్రయత్నం జరగలేదు. బాలికకు ఇచ్చిన సెల్ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో బలవంతంగా తీసుకున్నందున లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఆమె కుటుంబ సభ్యులు తప్పుడు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది’ అని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేశారు.అయితే, సెల్ఫోన్ దొంగిలించిందన్న నెపంతో కంటోన్మెంటుకు చెందిన 11 ఏళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు ఈ నెల17వ తేదీన కొబ్బరితోటలోకి తీసుకెళ్లి కొట్టడంతోపాటు ప్రైవేటు పార్ట్లను తాకినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిందని సీఐ శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై క్రైమ్ నంబరు137/26/ సెక్షన్ 74, 79, 351 ఆర్/డబ్ల్యూ 3, 7 ఆర్/డబ్ల్యూ8ఆర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. -
డల్లాస్ టెక్నాలజీస్ అంటే ఎంత ప్రేమో!
సాక్షి, అమరావతి: 2016లో ఆ సంస్థకు భూమి కేటాయించారు.. కార్యకలాపాలు ప్రారంభించడానికి నాలుగుసార్లు అదనపు సమయం ఇచ్చారు.. అయినా ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదు. కానీ, ఈ సంస్థకు ఇప్పుడు కారుచౌకగా, సెట్బ్యాక్ నిబంధనలను సడలిస్తూ మరీ అదనపు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘వడ్డించే వాడు మనోడైతే..’ అన్నట్లుగా ప్రభుత్వంలో కీలక వ్యక్తికి చెందిన అనుచరుడి సంస్థ కావడంతో ఈ సంస్థకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఆ సంస్థే డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్.ఇందులో డైరెక్టర్గా ఉన్న కిలారు సునీల్ రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వ్యక్తికి అత్యంత సన్నిహితుడు కావడంతో నిబంధనలను సడలిస్తూ విశాఖ మధురవాడ హిల్నెంబర్–2లో కేటాయింపులు మీద కేటాయింపులు చకచకా జరిగిపోతున్నాయి. తొలిసారిగా 2016లో 7,774.90 చ.మీ. స్థలాన్ని పొందిన డల్లాస్ టెక్నాలజీస్.. ఇంతవరకు ఐటీ క్యాంపస్ నిర్మాణం పూర్తిచేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. ఇలాంటి కంపెనీకి ఇప్పుడు అదనంగా చ.మీ. రూ.10,000 చొప్పున మరో 2,270.88 చ.మీ. భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో అధికారులు విస్తుపోతున్నారు. పైగా.. సెట్బ్యాక్ నిబంధనలు కూడా సడలిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఐఐసీ కాకుండా టీసీఎస్కు ‘కిలారు’ సెంటర్.. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుచేయడానికి ముందుకు రాగానే డల్లాస్ టెక్నాలజీ సెంటర్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 30, 2024లో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే ఏపీఐఐసీ మిలీనియం టవర్ పూర్తయి ఖాళీగా ఉన్నా దాన్ని కాదని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన కార్యాలయాన్ని టీసీఎస్కు కేటాయించడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీసీఎస్ వెనక్కి తగ్గడంతో ఏపీఐఐసీ మిలినీయం టవర్ను కేటాయించారు. అమెరికాలో ‘కిలారు’ అకృత్యాలు.. నిజానికి.. కిలారు సునీల్ అమెరికాలో 17 ఏళ్లలోపు చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో టెక్సాస్ కోర్టు అతనికి నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.2.50 లక్షల (3,000 డాలర్లు) జరిమానా విధించింది. అక్కడి నుంచి స్వదేశానికి పారిపోయి వచ్చి న సునీల్ ప్రైమ్అజ్ పేరుతో ఐటీ సర్వీసుల రంగంలోకి ప్రవేశించారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాకుండా నేరుగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాల్లో అనేకసార్లు పాల్గొన్నారు.అయితే, 2015లో కిలారు సునీల్, జనార్థనరావు బొంపాడ, శ్రవణ్య నన్నపనేని, ప్రవీణ్ అట్లూరి, సునీత రుద్రరాజు, వీర్రాజు కాటంరెడ్డి భాగస్వాములుగా ఏర్పాటైన డల్లాస్ టెక్నాలజీ సెంటర్.. ఇలా ఏర్పాటైందో లేదో అలా 2016, సెపె్టంబరు 8న విశాఖపట్నం మధురవాడలోని హిల్ నెంబర్–2లో రూ.కోట్ల విలువైన భూమిని కేటాయించారు. ఇప్పుడు తాజాగా మరో0.56 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. -
ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి: ఉక్కపోతలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గడచిన రెండురోజులతో పోల్చితే శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినా వడగాడ్పులు మాత్రం అనూహ్యంగా పెరగడంతో 15 మంది ప్రాణాలు విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 14 మంది, గుంటూరు జిల్లా తుళ్లూరులో ఒకరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అత్యధికంగా 44.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. నేడు వడగాడ్పుల ప్రభావం చూపే జిల్లాలివేశనివారం పోలవరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
గాలివాన బీభత్సం
కడప అగ్రికల్చర్/కోవెలకుంట్ల(నంద్యాలజిల్లా/బోబ్బిలి/అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షానికి ఉద్యాన రైతులు నిండా మునిగారు. అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తోటల్లో పక్వానికి వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లి, ఎర్రగుంట్ల మండలాల్లో గాలివానకు 665.60 హెక్టార్లలో అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలు దెబ్బతిన్నాయి.రూ.2.31 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్టు జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో మామిడి, నిమ్మ, మిరప పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. తమలపాకుల తోటలు నేలమట్టమయ్యాయి. ⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలో దాదాపు 80 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. ముదిగేడు గ్రామంలో రైస్మిల్లు గోడ కూలి 40 జీవాలు మృతిచెందాయి. ⇒ విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ⇒ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. 25 మండలాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.8కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అలాగే విద్యుత్ సంస్థకు రూ.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. -
ఆధార్ ‘పరీక్ష’ పాస్ కాకుంటే జీతాలు కట్
సాక్షి, అమరావతి: ఆధార్ సెంటర్ నిర్వహణకు అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే నెపంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన వ్యక్తులే ఆధార్ సేవలు అందించే ఉద్దేశంతో ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం(ఎల్ఎంఎస్) అర్హత పరీక్ష పాస్ కావాలనే నిబంధన తీసుకొచ్చింది.ఆధార్ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులతో పాటు డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు సంబంధిత అర్హత పరీక్షకు నమోదు చేసుకుని పాస్ కావాలంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో ఆదేశాలు జారీ చేసింది.అయితే, పరీక్ష పాస్ కాని వారికి మే నెల జీతాలను నిలిపివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. మరే ప్రభుత్వ శాఖలో లేని విధంగా కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలోనే చంద్రబాబు ప్రభుత్వం రకరకాల నిబంధనలు అమలు చేస్తుందంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు మండిపడుతున్నారు. -
దశరథన్నా.. ధైర్యంగా ఉండండి
తిరుపతి తుడా : టీడీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాయచోటి మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన వైఎస్ జగన్కు ఫోన్చేసి దశరథరామిరెడ్డితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘దశరథన్నా.. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గడికోట మీడియాతో మాట్లాడుతూ.. దశరథరామిరెడ్డిపై అతి కిరాతకంగా కత్తులు, రాడ్లతో దాడిచేయించారని మండిపడ్డారు. దీని వెనుక స్థానిక మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ మూకలు అరాచక శక్తులుగా మారిపోయారన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదరదని హెచ్చరించారు. ప్రశాంతమైన రాయచోటి కోసం తాము ప్రయతి్నస్తుంటే, టీడీపీ నేతలు అల్లర్లకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని గడికోట తేల్చిచెప్పారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దశరథరామిరెడ్డికి ఫోన్లో ధైర్యం చెబుతున్న వైఎస్ జగన్ -
ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, మరోవైపు కీలక రంగాలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలేవీ అమలు చేయకుండానే, చేసేశామని.. రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో డప్పు కొట్టుకుంటోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రంగాల వారీగా ఆధారాలు చూపిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ నిలదీశారు.ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు చంద్రబాబు కానీ, ఆయన మంత్రులు కానీ స్పష్టంగా సమాధానం ఇచ్చిన పాపాన పోలేదు. అడ్డగోలు వాదనతో దూషిస్తూ, దుర్భాషలాడుతూ ఎదురు దాడికి దిగారు. మొదటి నుంచీ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు ఆద్యులెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారికి హైదరాబాద్లో ఇదే టీడీపీ కార్యాలయంలో షెల్టర్ ఇచ్చిందెవరన్న ప్రశ్నపై నోరు విప్పితే ఒట్టు. రాజధానిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఎందుకు వెచ్చిస్తున్నారో సమాధానం చెప్పలేదు. ఇంటీరియర్, తదితర సౌకర్యాలను కలిపితే చదరపు అడుగు రూ.30 వేలు దాటిపోవచ్చు. అయినా కమీషన్ల కోసం సమర్థింపే కనిపిస్తోంది తప్ప.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నామనే భీతి ఇసుమంతైనా లేదు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. పీఆర్సీ లేదు.. నాలుగు డీఏలు లేవు. దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలున్నాయి. వీటన్నింటిపై చంద్రబాబు కూటమి నుంచి సమాధానమేలేదు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాలు చూపి ప్రశ్నించినా స్పందనే ఉండదు. పైగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ డైవర్షన్ రాజకీయం చేయడం మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో తీవ్ర చర్చే లేవనెత్తాయి. ఈ సందర్భంగా వాటిలో కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. బాబూ.. సమాధానం చెప్పండి⇒ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తుండటం నిజం కాదా? ⇒ మీ స్కామ్ల కోసం చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తుండటం నిజం కాదా?⇒ స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తుండటం వాస్తవం కాదా? ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటక పోవడం నిజం కాదా?⇒ దేశంలో హైవేల నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతుంటే.. అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు? ⇒ ఈ లెక్కన అమరావతి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అవుతుంది? అలా అంటూనే రాజధాని కోసం రూ.47,387 కోట్ల అప్పులు చేయడం, బడ్జెట్ నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపించడం నిజం కాదా? ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లు ఖర్చు చేస్తుండటం నిజం కాదా?⇒ రాజధానిలో మీ (చంద్రబాబు) మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణ, అశ్వినీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకు రోడ్ల పక్కన, సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు ఇవ్వడం నిజం కాదా?⇒ ఈ విషయాలపై నిలదీస్తే, ఇందుకు ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ను సూచిస్తే మీకు (చంద్రబాబు) బీపీ పెరిగి మీ మంత్రులతో బూతులు తిట్టిస్తుండటం వాస్తవం కాదా?⇒ కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లుతోందెవరు?⇒ మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా?⇒ మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేనూ చూస్తా’ అని మీరు (చంద్రబాబు) బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా? ⇒ మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?⇒ మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతుండటం నిజం కాదా? మీ (చంద్రబాబు) లాయర్ సిద్దార్థ లూథ్రానే దస్తగిరి తరఫున కూడా లాయర్గా వాదిస్తుండటం వాస్తవం కాదా? ⇒ చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ⇒ ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మెన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా?⇒ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? ⇒ సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొన్నదెవరు?⇒ వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతుండటం నిజం కాదా?⇒ మల్లెల బాబ్జి ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? ⇒ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ⇒ 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించింది మీరు కాదా?⇒ మీ కాంట్రాక్టర్లకు రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసిందెవరు?⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసిందెవరు?⇒ అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నది మీరు కాదా?⇒ మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా చూస్తూ, ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నదెవరు?⇒ 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఎంత మందికి ఇచ్చారు?⇒ రైతులకు ఉచిత పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఎగ్గొట్టిందెవరు? ఆర్బీకేలు నిర్వీర్యం చేసిందెవరు? ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా పట్టించుకోనిదెవరు? ⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.9,728 కోట్లు ఇవ్వాలనడం నిజం కాదా? ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదెవరు?⇒ రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్షిప్ కొనసాగుతుండటం నిజం కాదా? ⇒ మీకు (చంద్రబాబుకు) వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తుండటం వాస్తవం కాదా? ⇒ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగుతుండటం నిజం కాదా? ⇒ ఓ వైపు పొదుపు చర్యలు అంటూ చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడులు వేర్వేరుగా ప్రైవేట్ చాపర్లో తిరుగుతుండటం నిజం కాదా? -
అక్రమాలు దిట్ట.. పగిలిన పుట్ట
డీఎస్సీలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఈఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్ మార్కులు రావడంతో పాటు సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2 టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే నిదర్శనమని అభ్యర్థులు వాపోతున్నారు. స్కామ్ వెలుగు చూశాక వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకతవకలు బయట పడటంతో వారి మార్కులు, ఇతర వివరాలను సైతం డేటా బేస్ నుంచి తొలగించారు.⇒ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన పి.నవీన్ మెగా డీఎస్సీృ2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో 89.7465 స్కోరుతో జిల్లా టాపర్గా మొదటి ర్యాంకు సాధించాడు. అలాగే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగులో 78.73 స్కోరుతో జోన్ృ2లో ఆరో ర్యాంకు సాధించాడు. రెండు ఉద్యోగాల్లోనూ టాప్ స్కోరు సాధించిన నవీన్కు తప్పనిసరిగా ఉద్యోగం రావాలి. కానీ ప్రభుత్వం అతడికి టీచర్ పోస్టు ఇవ్వలేదు. ప్రభుత్వం మొదట విడుదల చేసిన కృష్టా జిల్లా సోషల్ స్టడీస్ మెరిట్ లిస్టులో సైతం మొదటి ర్యాంక్ వివరాలు తొలగించారు. అలాగే, టీజీటీ మెరిట్ లిస్టులో సైతం ఈ అభ్యర్థి వివరాలు లేకుండా చేశారు.⇒ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించాడు. మెరిట్ లిస్టులో 7వ ర్యాంకు సాధించాడు. ఒక పోస్టు జనరల్, మరో పోస్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీలో ఇతనికి పోస్టు రావాలి. కానీ, ముస్లిం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. జరిగిన తప్పును ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.సాక్షి, అమరావతి: సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ–2025లో కుంభకోణం చోటుచేసుకుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. సాక్షాత్తు సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటమే ఇందుకు నిదర్శనమని నొక్కి వక్కాణిస్తున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను అమ్ముకున్న వైనం ఇప్పటికే బయటపడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జనరల్ డీఎస్సీలోనూ భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.డిజిటల్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు బయటకు లీకైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్ మార్కులు రావడంతో పాటు, సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2లో టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు వచ్చాక ఈ విషయం గుర్తించిన అధికారులు.. వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతేగాక టాప్ మార్కులు సాధించిన సదరు కాంట్రాక్టు ఉద్యోగికి టీచర్ పోస్టును రద్దు చేయడంతో పాటు అతను సాధించిన మార్కులు, ఇతర వివరాలను డేటా బేస్ నుంచి తొలగించినట్టు సమాచారం. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను చంద్రబాబు సర్కార్ సంతలో సరుకు మాదిరిగా అమ్మేసింది. అభ్యర్థులను ఇళ్లకు పిలిపించుకుని మరీ బేరసారాలు సాగించింది. క్రీడా శాఖలో నామినేటెడ్ పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్ మైండ్’ డైరెక్షన్లో ఈ కుంభకోణం దిగి్వజయంగా సాగింది. ర్యాంకర్ వివరాలు ఎందుకు తొలగించారు? డీఎస్సీ ఫలితాల విడుదలలో తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా డీఎస్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నిలిచాడు. అయితే, తొలుత అతడి వివరాలు లేకుండా రెండో ర్యాంకు నుంచి మెరిట్ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని మెరిట్ లిస్టులను రద్దు చేసి, ఏకంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్లు పంపారు.కానీ, అప్పటికే జిల్లాల్లో కొందరు మెరిట్ లిస్టులను డౌన్లోడ్ చేసుకున్నారు. మరోపక్క కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో టాపర్గా వచ్చిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి పి.నవీన్కు మాత్రం ఎంపిక జాబితాలో పోస్టు లేకపోవడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ ప్రశ్నలు అప్లోడ్ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించారు. ఫలితాల్లో అతడు టాపర్గా నిలిచినా పోస్టు ఇవ్వలేదు. స్పోర్ట్స్ పోస్టులను అమ్మేసిన మాస్టర్మైండ్ క్రీడా శాఖలో రాజకీయ నామినేటెడ్ పోస్టును అడ్డుపెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్ మైండ్’ డైరెక్షన్లో స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను భారీగా అమ్మేశారు. ఒక్కో పోస్టుకు డిమాండ్ను బట్టి రూ.15 లక్షలు రేటు ఫిక్స్ చేసి అమ్మకానికి పెట్టారు. ఇక్కడ పొరుగు శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులను క్రీడా శాఖలోకి డెప్యూటేషన్పై తీసుకొచ్చి వారి ద్వారా తన దోపిడీ దందాను నడిపించడం విస్తుగొలుపుతోంది. సదరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేసి డీఎస్సీ పోస్టుల కేటాయింపులపై బేరసారాలు సాగించిన ‘వాయిస్ రికార్డులు’ కలకలం రేపుతున్నాయి. ఇలా మొత్తం స్పోర్ట్స్ డీఎస్సీలో నాలుగింట మూడొంతులు పోస్టులు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా రూ.40–50 కోట్లు దండుకున్నట్టు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బేరసారాలు ఇలా...మాస్టర్ మైండ్ ఏజెంట్ : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో మేము చెప్పినట్టు పోస్టింగ్ చేయిస్తాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: అలా కాదు సార్, ఎంత అవుద్ది. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఒకసారి వస్తే మాట్లాడదాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: కలిసి మాట్లాడమంటారా? మాస్టర్ మైండ్ ఏజెంట్ : అవును. అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు బయలుదేరి రమ్మంటారా? ఎన్నింటికి రమ్మంటారు సార్. మాస్టర్ మైండ్ ఏజెంట్ : మీ ఇష్టం. మీరు ఏ టైంకి అయినా రండి. అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరేసార్. ఇప్పుడు అభ్యర్థి కూడా కావాలా? నేను, మా బావ వస్తే సరిపోతుందా? మాస్టర్ మైండ్ ఏజెంట్ : మీ ఇద్దరైనా రండి. మీ ఒక్కరైనా రండి. అభ్యర్థితో ఏం పనిలేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకోండి. అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు పది గంటలకల్లా వస్తాం సార్. వచ్చాక కాల్ చేస్తాం ఈ నంబర్ (944..558..)కు కాల్ చేస్తాం. మాస్టర్ మైండ్ ఏజెంట్ : మాగ్జిమమ్ ఒక్కరు వస్తేనే బెటర్. ఇద్దరు వస్తే కూడా ఒక్కరితోనే మాట్లాడేది. కొంచెం ఇది సీక్రెట్గా చేసుకునే పని కదా. అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా సార్. మాకు అర్థమయ్యింది సార్. ఇంతని అంటే.. ఫిగర్ చెబితే నేను రెడీ చేసుకుంటా. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇది డీఎస్సీలో పోస్టింగ్. మీకు ఐడియా ఉంటుంది. ఒకేనా? అభ్యర్థి కుటుంబ సభ్యులు: అవును సార్ మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇప్పుడొచ్చేసి మార్కెట్ రూ.15 లక్షలు అలా నడుస్తుంది. అభ్యర్థి కుటుంబ సభ్యులు: బాబోయ్ అంతంటే పెట్టలేము సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇదేంటంటే డైరెక్టుగా పోస్టింగ్ ఇవ్వడం. సరే ఏదైనా మీరు వచ్చి మాట్లాడండి. ఏమైనా నెగోõÙషన్స్ చేద్దాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరే సార్ అయితే, ఓకే.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : వీలైనంత చేస్తాను. యాక్చువల్లీ టైమ్ తక్కువగా ఉందని ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇక్కడే మాట్లాడుకుందాం. పర్సనల్గా వస్తే మాట్లాడి చేద్దాం అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా.. ఓకే సార్.. థ్యాంక్యూ సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : కొంచెం పర్సనల్గా రండి. ఎవరితో దీని గురించి డిస్కస్ చేయొద్దు. అభ్యర్థి కుటుంబ సభ్యులు: లేదండి.. నాకు చెప్పారు.. పోస్టు ఇంపార్టెంట్ కదండి.. వస్తాం.. చూసుకుంటాం సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : సరేండి జాగ్రత్తగా రండి. చేద్దాం.బెదిరించి కేసులు విత్డ్రా చేయించి.. అనంతపురం జిల్లాకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి తనకు డీఎస్సీ ఎంపికల్లో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించింది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ ప్రాధాన్యత క్రమంలో సదరు క్రీడ అగ్రస్థానంలో ఉంటుంది. ఆమెకు కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్టు కచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలో సదరు క్రీడాకారిణి కేసు విత్డ్రా చేసుకునేందుకు మాస్టర్ మైండ్ తీవ్రంగా బెదిరించారు. శాప్లోని సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగితో ఫోన్ చేయించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పటికే మాస్టర్ మైండ్ ఆ పోస్టును బేరంపెట్టి అమ్మేసుకోవడంతో సదరు క్రీడాకారిణి కేసు గెలిస్తే తనకు ఇబ్బందులొస్తాయని బెదిరింపులకు ఒడిగట్టడం గమనార్హం. అనర్హులు స్పోర్ట్స్ కోటా, సర్టీఫికెట్లతో ఉద్యోగాలు పొందారంటూ వచ్చిన ఫిర్యాదులను శాప్ ఉద్దేశ పూర్వకంగానే తొక్కిపెట్టింది. కనీసం సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్టివిస్టులను సైతం ఇబ్బంది పెడుతోంది. ‘డీఎస్సీ డీల్స్’ అంటూ సాక్షి ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురిస్తే శాప్ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. విచారణ పేరుతో వారాల పాటు కాలం గడిపేసి దొంగలకు వత్తాసు పలుకుతోందనే విమర్శలొస్తున్నాయి. కాగా, డీఎస్సీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.లీకేజీ బయటపడకుండా జాగ్రత్తలు రాష్ట్రంలో 1990 నుంచి 2019లో జరిగిన స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులంతా ఆ మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు కలి్పంచారు. దాంతో మెరిట్లో తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని తమకు పోస్టు వస్తుందా లేదా అని అంచనా వేసుకునేవారు. దీని ప్రకారం పరీక్ష జరిగిన తర్వాత అభ్యర్థుల మార్కులు విడుదల చేయాలి. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.కానీ తాజా డీఎస్సీలో మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సర్టీఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం. ఇందులోనూ అనేక తప్పులు జరిగాయి. అభ్యర్థుల మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించారు. ఇదంతా లీకేజీని దాచిపెట్టడం కోసమే చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆటే రాకున్నా.. పోస్టు ఇచ్చేశారు ⇒ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టీఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలే జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టీఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు దక్కింది. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది లేకున్నా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టీఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ⇒ రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్–లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశయ్రించారు. అయితే, 20 శాతం నాన్లోకల్/ఓపెన్ కేటగిరీలో.. 80 శాతం లోకల్ కోటాలో పోస్టులు భర్తీ చేయాలి. సదరు జిల్లాలో ఐదు పోస్టుల్లో టాపర్ను ఓపెన్ కేటగిరీల మొదటి పోస్టుగా భర్తీ చేశారు. ఆ తర్వాత మూడో పోస్టు నాన్లోకల్లో భర్తీ చేసి స్థానికులకు అన్యాయం చేశారు.ఒకసారి ఓపెన్ క్యాటగిరీలో పోస్టు భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్లో ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్న? దీనిపై క్రీడాకారిణి కోర్టుకు వెళ్లగా శాప్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయ వ్యవస్థను సైతం మోసం చేసే ప్రయత్నం చేసింది. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులను చూపించి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఆరుసార్లకుపైగా రాష్ట్రపతి ఆర్డర్లు సవరించిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా కోర్టుకు తెలుపక పోవడం గమనార్హం. -
10న జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూన్ 10వ తేదీన జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈవోఎస్–05 (జీఐశాట్–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహా న్ని నింగిలోకి పంపనున్నారు.అయితే ఈ ప్రయోగం మార్చి నెల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. వరుసగా రెండు పీఎస్ ఎల్వీ ప్రయోగాలు విఫలమైన తర్వాత చేపట్టనున్న జీఎస్ఎల్వీ ఎఫ్–17 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాలని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పలకరింపు కరువై.. స్మార్ట్ఫోన్లకు బందీలై!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం ఎన్నడూ లేనంతగా సాంకేతికతతో అనుసంధానమైంది. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్ల మోత మోగుతోంది. కానీ విచిత్రంగా పొరుగువారితో, సమాజంతో దూరం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఎంతలా అంటే.. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలి యని పరిస్థితి నెలకొంటోంది. సోషల్ మీడియాలో వేలాది మంది ‘ఫ్రెండ్స్’ఉంటున్నా అర్ధరాత్రి ఏదైనా ఆపద వస్తే కాపాడేందుకు పక్క ఇంట్లో ఉండే నిజమైన మనిషి దూరమవుతుండటం నేడు ప్రపంచాన్ని సంక్షోభంలా చుట్టుముడుతోంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్లో ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడానికి ఏకంగా జాతీయ సంభాషణ ప్రాజెక్ట్ ప్రారంభించాల్సి వచ్చింది.పాశ్చాత్య దేశాల్లో బంధాలకు బీటలు...బ్రిటన్లో సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మాజీ కన్జర్వేటివ్ చాన్స్లర్ సాజిద్ జావిద్, లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ నేత జాన్ క్రుడాస్ నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. ‘భవిష్యత్తు బ్రిటన్ ఎలా ఉండాలి? ఏ బంధాలు ప్రజల్ని కలుపుతున్నాయి? పొరుగువారితో అనుబంధం ఎలా పెరగాలి?’అని ప్రజలనే అడుగుతూ ఒక దరఖాస్తు లేదా నిమిషం నిడివిగల వాయిస్ నోట్ ద్వారా ఆగస్టుకల్లా అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు.ఆందోళన పరుస్తున్న అధ్యయనాలుబ్రిటిష్ రెడ్ క్రాస్ జరిపిన తాజా అధ్యయనంలో 75% మంది బ్రిటన్ విభజిత దేశంగా మారిందని.. గత ఐదేళ్లలో ఈ దూరం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఏఈఐ అనే అమెరికన్ థింక్ ట్యాంక్ అధ్యయనం ప్రకారం 2012లో 59% మంది అమెరికన్లు వారంలో పలుమార్లు పొరుగువారితో మాట్లాడేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల మధ్యలోని యువతలో పొరుగు వారితో క్రమం తప్పకుండా మాట్లాడే వారి శాతం 51% నుంచి ఏకంగా 25 శాతానికి తగ్గింది.ఆరోగ్యానికి ముప్పుగా ‘ఒంటరితనం’...ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని ఒక ప్రజారోగ్య సంక్షోభంగా గుర్తించింది. నిపుణుల అభిప్రా యం ప్రకారం సామాజిక దూరం మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా గుండె జబ్బులు, డిప్రెషన్, అకాల మరణాల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. ప్రపంచంలో ప్రతి ఐదో వ్యక్తి తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నాడని.. దీన్ని ఒక నిశ్శబ్ద సామాజిక సంక్షోభంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం, పొరుగిల్లు, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కలిపేవి. కానీ ఇప్పుడు అల్గారిథమ్స్ మనుషుల పరిచయాలను, సంభాషణలను శాసిస్తున్నాయి.హైదరాబాద్ టు వైజాగ్ అంతా కాంక్రీట్ అరణ్యం.. దేశంలో కుటుంబ వ్యవస్థ పశ్చిమ దేశాల కంటే బలంగా ఉందనేది నిజమే అయినా నగరాల వేగం ఈ బంధాలను తుడిచేస్తోంది. హెల్ప్ ఏజ్ ఇండి యా నివేదిక ప్రకారం భారత్లో 69% మంది యువకులు, 68% మంది వృద్ధులు వృద్ధాప్యంలో ఒంటరివాళ్లమైపోతామనే భయంతో బతుకుతున్నా రు.ౖహైదరాబాద్, వైజాగ్ వంటినగరాల్లో ఈ సామా జిక దూరం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కారణాలు, ప్రస్తుత పరిస్థితుల అంచనా... అపార్ట్మెంట్ సంస్కృతి: గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లలో పక్క ఫ్లాట్లో ఎవరుంటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని ఉదాసీనత పెరిగిపోయింది. లిఫ్ట్లో ఎదురైనా బాగున్నారా అనే పలకరింపు కూడా కరువైంది. ఉద్యోగ ఒత్తిళ్లు: ఐటీ, కార్పొరేట్ ఉద్యోగ వేళలు, వర్క్ ఫ్రం హోం సంస్కృతి కారణంగా యువత గదులకే పరిమితమవుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం, సలహాలన్నీ మొబైల్ స్క్రీన్పైనే లభి స్తుండటంతో పొరుగువారే కాదు.. ఎవరి ఇంటి తలుపులూ తట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. మనస్తత్వంతోనే! సాంకేతికత మనిషిని స్వయంసమృద్ధుడిగా మార్చింది. కానీ సామాజికంగా ఒంటరిని చేసింది. ఆధునిక సమాజంలో సాంకేతికతను వాడుకుంటూనే మనుషులను మళ్లీ ఎలా అనుసంధానించాలనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్. పొరుగువారితో మాట్లాడటం సమయం వృథా కాదు.. అదొక సామాజిక భద్రత అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. – డేనియల్ కాక్స్, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సర్వే సెంటర్ డైరెక్టర్ -
‘చంద్రబాబు వేస్ట్’ అన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్!
తిరుపతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వేస్ట్ అని, ఆయన చెప్పింది.. ఏనాడు చేయలేదని శ్రీధర్ వ్యాఖ్యానించిన వీడియోను బయటపెట్టింది. ఆ వీడియోలో చంద్రబాబును అరవ శ్రీధర్ ఏకవచనంతో సంబోధించినట్లు తెలుస్తోంది. -
స్వామివారి బంగారు కిరీటం తాకట్టు ఎపిసోడ్లో కొత్త డ్రామా
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం మాయం వ్యవహారంలో కొత్త డ్రామాకు తెరలేపింది ఆలయ ట్రస్టు. తాకట్టు పెట్టిన బంగారు కిరీటాన్ని రాత్రికి రాత్రే రాజస్థాన్ నుంచి తెప్పించిన ట్రస్టు.. మీడియా ముందు ప్రదర్శించింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టలేదంటూ ట్రస్టు సభ్యులు కొత్త డ్రామాకు తెరలేపారు. కిరీటం గురించి ప్రశ్నించిన మీడియాపై ట్రస్టు సభ్యులు దౌర్జన్యం చేశారు. అయితే మీడియా ప్రతినిధులకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సర్ధిచెప్పి పంపించారు. కాగా, కిరీటం తాకట్టు వ్యవహారంలోదాత మాటూరి సుబ్బారావు పోరాటం ఫలించింది. గుడివాడలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కావడంపై దాత సుబ్బారావు ట్రస్టును ప్రశ్నించారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ కిరీటం తాకట్టు పెట్టినట్లు తేలింది. దీనిపై ఇప్పుడు బుకాయిస్తున్నారు ట్రస్టు సభ్యులు. తాము కిరీటం తాకట్టుపెట్టలేదంటూ.. హుటాహుటీనా రాజస్థాన్ నుంచి తెప్పించి మరీ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. రూ. 75 లక్షలకు పైగా ఉండే ఆ బంగారు కిరీటాన్ని మాటూరి సుబ్బారావు దంపతులు గతేడాది స్వామి వారికి సమర్పించారు. అయితే స్వామి వారి దర్శనానికి వచ్చిన దాత సుబ్బారావు.. ఆ కిరీటం కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ట్రస్టు సభ్యుల్ని సైతం నిలదీశారు. తమ పరిధిలో లేకపోయినా దేవాదాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సుబ్బారావు దీనిలో భాగంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ,ఇతర సభ్యుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. దాంతో ట్రస్టు సభ్యులు కంగారుపడ్డారు. తాకట్టు వ్యవహారం పై తీవ్ర దుమారం రేగడంతో టీడీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. తాకట్టు పెట్టుకున్న వ్యాపారి ఆ కిరీటంతో రాజస్థాన్కు వెళ్లిపోవడంతో ఆ బంగారు కిరీటాన్నిఅక్కడ నుంచి పరుగ పరుగు పరుగున తెప్పించి మీడియా ముందు ప్రదర్శించారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలపై చిందులు వేశారు ట్రస్టు సభ్యులు. -
ఆగని బాబు దుబారా ఖర్చులు
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి దుబారా ఖర్చులకు తెరతీశారు. తన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను తానే అమలు చేయడం లేదు. వచ్చే నెల జూన్ 13 నుండి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా సింగపూర్కి వెళ్లనున్నారు.ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై చంద్రబాబు స్పందించారు. కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించాలని, నేతలు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు వద్దని అన్నారు.కానీ చంద్రబాబు మోదీ సూచనలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు ఇతర నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను వినియోగిస్తూ దుబారా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్లు సింగపూర్ పర్యటనతో మేమింతే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పాటించని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటన నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓవైపు చంద్రబాబు,నారా లోకేష్ ఇలా ఉంటే.. కూటమి ఎమ్మెల్యేలు సైతం సోకుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ‘నో వెహికల్ డే’పై విమర్శల మోతఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చంద్రబాబు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటించాలని ఆదేశించినా, ఆ నిర్ణయం అమలులోనే అభాసుపాలు అవుతున్నాయి.కర్నూలు జిల్లాకర్నూలు జిల్లాలో భూగర్భ ఘనంగా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్తో ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పత్తికొండ నుండి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు ఆయన కాన్వాయ్ వెళ్ళగా, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇదేనా పొదుపు?అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లారంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే శిరీషా రాణి అధికారిక పర్యటన సందర్భంగా కాన్వాయిలో ఒక్క వాహనం కూడా తగ్గకుండా ప్రయాణించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. తిమ్మాపురం గ్రామంలో పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె వాహనాల కాన్వాయ్తోనే హాజరయ్యారు. సీఎం ఆదేశాలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాన్వాయ్తో రావడం చూసి ప్రజలు ఇదేనా పొదుపు?అని ప్రశ్నిస్తున్నారు.నంద్యాల జిల్లాడోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ‘నో వెహికల్ డే’ ఆదేశాలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రయాణం చేస్తానంటూ పోస్టర్లు వేయించి, వాస్తవానికి కార్లలోనే తిరుగుతున్న ఆయన ప్రవర్తన ప్రజల్లో అసంతృప్తిని రేపింది. ఇంధన పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అమలులో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. -
పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండానే..!
విశాఖ: విశాఖ వెస్ట్లో ఉన్న గోపాలపట్నం కాపు భవన్ ప్రారంభోత్సవానికి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆహ్వానం అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తైన కాపు భవన్ను.. రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గణబాబు. అయితే ఈ కార్యక్రమానికి కాపు నాయకులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ ఆహ్వానం అందలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవం సందర్భం కనీసం కాపు నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్లే చేసేశారు. దీనిపై కాపు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గ భవన్ ప్రారంభోత్సవానికి కాపు నేతలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. -
‘వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు’
తాడేపల్లి : తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానమే లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలే చేశారని, చంద్రబాబు మాదిరి ఎప్పుడూ హత్యా రాజకీయాలు జగన్ చేయలేదన్నారు జూపూడి. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పేరు వింటే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేమో పిల్లల్ని కని సంపద సృష్టించండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఈ రెండేళ్లలో జగన్ అనేక ప్రజా సమస్యలను ఎత్తిచూపారు. చంద్రబాబు మాత్రం ప్రజలను వదిలేసి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలను పట్టించుకోవటం మానేశారు. జగన్ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. వాళ్ళు ఎలా గెలిచారో పరకాల ప్రభాకర్ను అడిగితే చెప్తారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అన్నారు. ఇప్పుడు పిల్లల్ని కని సంపద సృష్టించండి అంటున్నారు..కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో అచ్చెన్నాయుడు ఆయన సొంత పార్టీ గురించి ఎలా మాట్లాడారో అందరూ చూసారు. ప్రజలకి ఇచ్చిన మానిఫెస్టో అమలు చేయమని చెప్పటం తప్పా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు జగన్ అబద్ధాల కోరు అవుతారా ?, జగన్ క్యారెక్టర్ను దెబ్బతీయటం కోసం అనేక కథలు అల్లటం మీకు అలవాటు. జగన్ సూచించిన మావిగన్ పేరు వింటేనే కూటమి ప్రభుత్వ పెద్దల గుండెలు జారిపోతున్నాయి’ అని పేర్కొన్నారు. -
ఎందుకూ పనికిరాని ప్లాట్లు మాకెందుకిచ్చారు..?
కూరగల్లు: పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత భూములిచ్చిన తమకు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ది చేయకుండానే ఇచ్చారని, లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి ఎందుకు పనికిరావని వారు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం(మే 22వ తేదీ) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. -
ప్రొఫెసర్ నాగేశ్వర్, కొమ్మినేనిపై అక్రమ కేసు
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గురువారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. తప్పుడు, రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేసి.. వ్యాప్తికి కారణమైన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని కాకినాడ అర్బన్ జయేంద్ర నగర్కు చెందిన నల్లం శ్రీరాములు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న ఒక చానల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన ప్రత్యక్ష చర్చలో హోం మంత్రి అమిత్ షా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై ఆధా రాలు లేకుండా మాట్లాడారని, అవి ఇతర మీడియా వేదికలపై ప్రముఖంగా వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 'సాక్షి' మీడియా నిర్వహించిన చర్చల్లో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని కూటమి రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలను ప్రసారం చేసి ప్రజల్లో గందరగోళం ఏర్పడేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐఐ కె.ఏసుబాబు తెలిపారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లపై అవాస్తవాలు, అబద్దాలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసిన 99 టీవీ యాజమాన్యం, చర్చ నడిపిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు. జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన, పార్టీ నాయకులపైన అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీసు కేసులు పెట్టడంతోపాటు న్యాయ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
అంబటి మురళీకి మళ్లీ నోటీసులు
గుంటూరు: పొన్నూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళీకి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. మొక్కజొన్న రైతుల పరామర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులిచ్చారు పోలీసులు. ఇదిలా ఉంచితే, రెండు రోజుల క్రితం మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ చేశారు. బుధవారం(మే 20వ తేదీ) ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి బుధవారం ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. -
ఏపీలో మండుతున్న ఎండలు
సాక్షి,అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరు జిల్లాలకు ఆరెంజ్, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దక్షిణ కోస్తా జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రమైంది. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బాపట్లలో సాధారణం కంటే ఏడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధికారులు మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించారు. -
రూల్స్ పెట్టేది బాబు.. రూట్లు మార్చేది లోకేష్, పవన్!
“ఖర్చులు తగ్గించాలి.. విదేశీ పర్యటనలు తగ్గించాలి..” అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ‘పొదుపు’ మంత్రం వినిపించింది. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందని, మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ మాటలు కేబినెట్ హాల్లోనే ఆగిపోయాయా?.. బయటకు రాగానే గాల్లో కలిసిపోయాయా? అనే చర్చ మొదలైంది.మోదీ చెప్పిన పొదుపు సూత్రాలు ఇంకా ప్రజల చెవుల్లో మోగుతుండగానే.. మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు రెడీ అయ్యారు. జూన్ 2 నుంచి 6 వరకు ఆయన విదేశీ టూర్కు జీవో కూడా వెలువడింది. ఏపీ కేబినెట్లో ఏడాది పాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నా.. కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని తుంచేసినట్టయ్యింది. నో కాన్వాయ్ డే అంటూ చంద్రబాబు హడావిడి చేస్తే.. అదే రోజు లోకేష్ తన కాన్వాయ్తో హల్ చల్ చేశారు. ఇక కడప పర్యటనకు కూడా లోకేష్ ప్రత్యేక విమానంలో వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమాన ప్రయాణాలపై ఇప్పటికే ఉన్న విమర్శలతో కలిసిపోవడంతో “పొదుపు” అనే మాట ప్రజలకు మాత్రమేనా?.. మంత్రులకు మినహాయింపులా? అనే ఎద్దేవా పెరిగింది.సోషల్ మీడియాలో అయితే సెటైర్లు మామూలుగా లేవు. “ప్రజలకు పొదుపు క్లాసులు.. నేతలకు స్పెషల్ ఫ్లైట్ పాసులు” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. మోదీ ఇచ్చిన పిలుపుతో చంద్రబాబు చెప్పిన మాటలు.. అంతా స్టంటేనా? అనే ప్రశ్న హాట్టాపిక్ అయ్యింది. ఇదంతా “మోదీ చెప్పినా వినం” అనే వాళ్ల తీరును ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే: వైఎస్ జగన్ -
కామర్స్ లెక్చరర్ కామ క్రీడ.. భార్యకు రెడ్హ్యాండెడ్గా దొరికి..
సాక్షి, కృష్ణా: కామర్స్ పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్.. కామ వాంఛతో మితిమీరి ప్రవర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని ప్లాన్ చేశాడు. అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్హ్యాండెడ్గా భార్యకు దొరికిపోయాడు. దీంతో, అందరి ముందే భర్తను భార్య చితకబాదింది. యువతిని బ్లాక్మొయిల్ చేసిందుకు పోలీసులు కామర్స్ లెక్చరర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామర్స్ లెక్చరర్ జాషువా గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో విధుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఓ యువతి.. కామర్స్ లెక్చరర్ జాషువాను ఆశ్రయించింది. దీంతో, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని జాషువా ప్లాన్ చేశాడు. యువతిని మచిలీపట్నంలోని తమ రూమ్కు రావాలని కోరాడు.జాషువా వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ను ఆశ్రయించింది. అనంతరం, జాషువా నిజస్వరూపాన్ని లెక్చరర్ భార్యకు సమాచారమిచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన జాషువా భార్య.. లెక్చరర్ బాగోతాన్ని బట్ట బయలు చేసింది. ప్లాన్ ప్రకారం.. బాధితురాలితో రూమ్లో జాషువా ఉండగా.. అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది. అందరి ముందే తిక్క కుదిర్చింది. ఇక, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు. -
కార్డు మిష.. కోతలే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల అర్థాలు వేరు అంటూ ఉంటారు చాలామంది. చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నది ఆయనగారి నైజమన్న విమర్శలూ లేకపోలేదు. ‘‘అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలి’’ అని ఆయన ఈ మధ్య తరచూ చెబుతూ వస్తున్నారు. దీంట్లో తప్పేముంది? అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ.. ఆయనను ఫాలో అయ్యేవారికి, సీనియర్ అధికారులకు మాత్రం అందులోని మతలబు ఏమిటో స్పష్టంగా తెలుసు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేందుకు ఫ్యామిలీ కార్డులు మంజూరు చేయాలని చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఫ్యామిలీ కార్డే ప్రామాణికంగా స్కీములు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇది పైపైకి బాగానే అనిపిస్తున్నా మీడియా కథనాలను పరిశీలిస్తే మాత్రం... లబ్ధిదారులకు కోతపెట్టే ప్రమాదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అర్హత అన్న పదంలోనూ రాజకీయం చేస్తున్నారన్నమాట. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వైసీపీకి ఓటు వేస్తారు అనుకున్నవారికి స్కీములలో కోత పెట్టే ఆలోచన చేస్తున్నారని జనసామాన్యం అనుకుంటోంది. ప్రభుత్వం పనితీరుపై అభిప్రాయ సేకరణ అంటూ చేస్తున్న సర్వేల ద్వారా ఈ ప్రయోగం జరుగుతోందని కొందరు అంటున్నారు.ప్రభుత్వ సరళి బాగోలేదన్న వారిని, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారిని బెదిరించడమో, లేక వారికి అందుతున్న స్కీములను కట్ చేయడమో చేసే పన్నాగం జరుగుతోందని కొంతమంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రాజకీయ కోణం కాకుండా, బాగా సంపన్నులై ఉండి, ప్రభుత్వ స్కీమ్లను అన్యాయంగా తీసుకుంటుంటే వారిని తొలగించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాని చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండే చంద్రబాబు ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలలో అలజడి ఏర్పడుతోంది.చంద్రబాబు మాటల ప్రకారం... వ్యవసాయ భూమి ఉన్నా, మున్సిపాల్టీలో ఆస్తి కలిగి ఉన్నా, గ్రామాలలో రూ.200 కన్నా ఎక్కువ ఆస్తి పన్ను కడుతున్నా, ఏభై యూనిట్లకన్నా ఎక్కువ కరెంట్ వాడుతున్నా, పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నా, ప్రైవేటు ఉద్యోగిగా ఈపీఎఫ్ చెల్లిస్తున్నా..ఇలా పలు కండిషన్లు పెట్టి ఇవేవి ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులే అని తేలుస్తారట. వాస్తవానికి ఈ షరతులు పేదల పొట్టకొట్టే అవకాశాలే ఎక్కువ.ఎన్టీఆర్ భరోసా కింద రూ.నాలుగు వేలు తీసుకుంటూ ఏ కుటుంబానికైనా మరో పథకం ఇవ్వరన్నమాట. ఇప్పటికే దీనికి సంబంధించి సర్వే చేశారట. దాని ప్రకారం ఆయా స్కీములకు ఏకంగా 94 శాతం మంది అనర్హులు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే, ఈ సర్వే ప్రకారం కేవలం 10.2 లక్షల కుటుంబాలే పేదవి. వీరికి మాత్రమే స్కీములు వస్తాయని చెప్పకపోయినా, అనర్హత పేరుతో ఎక్కువ మందికి పథకాలను రద్దు చేయవచ్చని భయపడుతున్నారు. ఏ కుటుంబానికి అయినా రూ. 48 వేలకు మించి ప్రయోజనం రాకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం అని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో అర్థం అవుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా బడా కాంట్రాక్టర్లకు పందేరం చేస్తున్న ప్రభుత్వం పేదల స్కీములపై ఇన్ని రకాల ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా కుటుంబాలకు వివిద స్కీముల కింద అర్హత ఉంటే,అవన్ని ఇచ్చేవారు. తద్వారా కొన్ని కుటుంబాలకు ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర వరకు లబ్ది పొందాయని అప్పట్లో వారే స్వయంగా చెప్పేవారు. పోనీ తన విధానం వేరని ఒక కుటుంబానికి ఒక పథకమే ఇస్తానని కాని, అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తామని కాని ఎన్నికల సమయంలో చెప్పారా అంటే అదేమీ లేదు. ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేశారు. ప్రజాగళం పేరుతో ఇచ్చిన మానిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి ఏమి రాశారా అని పరిశీలిస్తే ఎక్కడా కండిషన్లు పెట్టలేదు. అర్హులకే ఈ స్కీములు ఇస్తామన్న మాట కూడా చెప్పలేదు. ఎన్నికల ప్రచార సభలలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికి స్కీముల ప్రయోజనాలు దక్కుతాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు పదే, పదే చెప్పేవారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే మూడువేలు, ముగ్గురు ఉంటే 4500, నలుగురు ఉంటే ఆరు వేలు అంటూ వేలంపాట మాదిరి చంద్రబాబు పాడేవారు. ఇప్పుడేమో ఆ పథకాన్నే ఎగవేస్తున్నారు.అది ఇవ్వకపోగా ఇస్తున్న అరకొర స్కీములలో కోత పెట్టాలని ప్రయత్నాలు ఆరంభించారు. జగన్ ప్రభుత్వం కుటుంబంలోని ఒక విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తుంటే, తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్దికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఎక్కడా అర్హత ప్రస్తావనే తేలేదు. ఇప్పుడు వీటిని ఫ్యామిలీ కార్డు ఆధారంగా ఏమైనా తగ్గిస్తారేమో చూడాల్సి ఉంటుంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని అన్నా, మూడువేల నిరుద్యోగ భృతి అని ప్రచారం చేసినా ఎక్కడా కండిషన్లు ఉంటాయని పేర్కొనలేదు. బహుశా ఎలాగూ వాటిని ఇచ్చేది లేదులే అని ముందుగానే అనుకుని మానిఫెస్టోలో పెట్టి ఉండాలి. వలంటీర్లకు జగన్ రూ.ఐదు వేలే ఇస్తున్నారని, తాము రూ.పది వేలు ఇస్తామని చెప్పి అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తుంటారు. 1996 ఎన్నికలకు ముందు, తాను ఎన్టీఆర్ కన్నా గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తానని, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కొనసాగిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక మాట మార్చి మద్య నిషేధం ఎత్తివేశారు. సబ్సిడీ బియ్యం రేటు పెంచారు. 2014 టర్మ్లో రైతుల రుణాలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తామని ఊరించారు. తీరా అధికారం వచ్చాక అరొకర చేసి ఆశకు కూడా హద్దు ఉండాలని ఎద్దేవా చేశారు. అదే విపక్షంలో ఉంటే మాత్రం తెలుగుదేశం ధోరణి మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనర్హుల రేషన్ కార్డులు తొలగించే కార్యక్రమం చేపడితే నానా రచ్చ చేసిన టీడీపీ, జగన్ ప్రభుత్వంపై కూడా పలు అబద్దాలు సృష్టించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కార్డు పేరుతో సంక్షేమ స్కీముల లబ్దిదారుల కోత పెట్టడం ఆరంబిస్తే చంద్రబాబు ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందేమో! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆమె కోసం.. బెజవాడలో అర్థరాత్రి హంగామా
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తడంతో విజయవాడలో హైటెన్షన్ రోడ్డులో హంగామా జరిగింది. అర్ధరాత్రి ఇద్దరు యువకులు రోహిత్, ఓం.. థార్ జీపులతో రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ ఘటన జరిగిన సమయంలో సదరు యువతి కారులోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజినీరింగ్ విద్యార్థి. విజయవాడకు చెందిన బోల్లా ఓం.. తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.దీంతో, వారిద్దరూ తమ థార్ వాహనాలతో గురువారం రాత్రి హైటెన్షన్ రోడ్డుకు వెళ్లారు. ఆగ్రహంతో ఇద్దరూ పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. రోడ్డుపై సినిమా యాక్షన్ సీన్స్ తలపించేలా చేసిన హడావుడితో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీప్లు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలకొట్టుకున్నారు.అనంతరం, పరిస్థితి మరింత దారుణానికి దారి తీయడంతో స్థానికులు సమీపంలోని పటమట పోలీసుస్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి జీప్ను వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. అయితే, గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో సదరు యువతి ఉన్నట్లు తెలిసింది. -
అహో సోదరా!
కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ-జనసేన మధ్య పూర్తి సమన్వయం ఉన్నట్టే కనిపిస్తున్నా.. ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం జనసేనకు రెండో ప్రాధాన్యతే దక్కుతోందన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. కీలక నిర్ణయాల్లో జనసేన అభిప్రాయానికి పెద్దగా విలువ లేదన్న అసంతృప్తి, పదవుల పంపకాల్లో తమ వారిని పక్కన పెడుతున్నారన్న గుసగుసలు, అధికార వ్యవస్థలో టీడీపీ నేతలే తుది మాట చెబుతున్నారన్న విమర్శలు.. ఇవన్నీ అప్పుడప్పుడూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ నియామకం ఆ చర్చకు మరో కొత్త ఉదాహరణగా మారింది.ఎన్నికల సమయంలో భుజం భుజాన వేసుకుని తిరిగిన మిత్రపక్షాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం “ఎవరి లెక్క వాళ్లది” అనే సూత్రాన్ని మళ్లీ బయటపెడుతున్నాయి. టీడీపీ వ్యవహారశైలితో “సలహాలు మనవి.. నిర్ణయాలు వారివి” అన్న భావన జనసేన వర్గాల్లో మరింత బలపడేలా చేస్తోంది. అందుకు మరో ఊదాహరణగా మారింది ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామక వ్యవహారం. మరీముఖ్యంగా పవన్ కళ్యాణ్ సూచించిన పేరును పక్కనపెట్టి, చివరికి భరత్ భూషణ్కు పదవి ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏఎం రత్నం.. తెలుగు గడ్డపై పుట్టి తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో హిట్లు, కొన్ని ఫట్లు అందిపుచ్చుకున్న నిర్మాత. తెలుగు చిత్రపరిశ్రమకు ఎంతో సేవ చేశారని, పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన ఎఫ్డీసీ చైర్మన్ పదవికి సరైన వ్యక్తి అని.. కాబట్టి ఈ పదవి కోసం ఆయన పేరును తానే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడికి సిఫార్సు చేస్తున్నట్లు హరిహర వీరమల్లు చిత్ర ప్రెస్మీట్ టైంలో పవన్ ప్రకటించారు.సినీ పరిశ్రమకు దగ్గరగా ఉండే వ్యక్తిగా, అనుభవం ఉన్నవాడిగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అభిప్రాయం. అలాగే తమ మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా మరో కారణం అన్నట్లు మాట్లాడారాయన. “ఖుషి” నుంచి “హరి హర వీరమల్లు” దాకా సాగింది వీళ్ల ప్రయాణం. దీంతో FDC చైర్మన్ పోస్టు ఆయనకే ఖాయమన్న భావన జనసేన శ్రేణుల్లో కనిపించింది. కానీ రాజకీయాల్లో “ఖాయం” అనే పదానికి గడువు చాలా చిన్నది. చివరకు ఆ పదవిని భరత్ భూషణ్ చేతికి అప్పజెప్పారు చంద్రబాబు. వాస్తవానికి భరత్ భూషణ్ పేరు రెండు వారాల కిందటే బయటకు వచ్చింది. ఆ సమయంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నియామకం సినీ పరిశ్రమలోని ప్రతిభ ఆధారంగా కాకుండా, రాజకీయ అనుబంధం ఆధారంగా జరిగాయని విమర్శలు వెలువత్తాయి. పవన్ చెప్పినట్లు ఏఎం రత్నం ఒకవిధంగా ఈ పదవికి అన్నివిధాల అర్హుడే. అయినా కూడా భరత్కే ఆ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. అదే సమయంలో ‘గరుడపురాణం’ శివాజీ, బుర్రా సాయిమాధవ్లాంటి వాళ్లకూ డైరెక్టర్లుగా నియమించారు.సోదరుడైన పవన్ కళ్యాణ్ సూచనను గౌరవిస్తామని చెప్పడం .. చివరికి ఫైల్పై మరోలా సంతకం చేయడం చంద్రబాబు చేస్తోంది. బయటకు “అన్నదమ్ముల బంధం”లా కనిపించినా.. లోపల మాత్రం “సామాజిక సమీకరణాలు” ముఖ్యమని చంద్రబాబు నిర్ణయాలతో స్పష్టమవుతోంది. ఈ ఘటన తర్వాత జనసేన సోషల్ మీడియా వర్గాల్లో “సిఫార్సులు మనవి.. నిర్ణయాలు వారివి” అనే సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి.అయితే ఇదేం కొత్తది కాదు. కూటమిలో ఇలాంటివి గత రెండేళ్లుగా జరుగుతూనే వస్తున్నాయి. “రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి” అనే మాట నిరూపిస్తోంది చంద్రబాబు తీరు. ఇప్పుడీ ఎఫ్డీసీ వ్యవహారంలోనూ అదే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజల్లో భారీ మద్దతు తెచ్చిన నాయకుడు కావచ్చు. కానీ అధికార యంత్రాంగంలో ప్రతి నిర్ణయం కాకపోయినా.. ఒకటో రెండో కూడా ఆయన మాట ప్రకారమే జరుగుతుందనే గ్యారంటీ లేదని ఈ ఎపిసోడ్ గుర్తు చేసింది. మరోవైపు చంద్రబాబు మాత్రం కూటమిలో తుది నిర్ణయాధికారం తన చేతిలోనే ఉందని సైలెంట్గా సంకేతం ఇచ్చినట్టయింది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్క మాటే వైరల్ అవుతోంది.. “అహో సోదరా… రాజకీయ స్నేహం అంటే సినిమా ఫ్రెండ్షిప్ కాదురా!”.. అయితేఇంత హడావిడిలోనూ.. అటు పవన్ కళ్యాణ్తో ఎంతో నమ్మకంగా తీసిన సినిమా రిలీజ్కు ఇబ్బంది పడి, ఆపై అట్టర్ ఫ్లాప్ కావడంతో నిండా మునిగిపోయి ఉండి.. ఇప్పుడు ఇటు ఎఫ్డీసీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవడంతో “అయ్యో పాపం రత్నంగారూ” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by GRADUATE ADDA (@graduate_adda) -
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
-
ప్రమాద ఘం‘టీకా’
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ప్రభుత్వాస్పత్రుల్లో కుక్క కాటు బాధితులకు వేసే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) వ్యాక్సిన్ కనీస నిల్వలు లేని దుస్థితి నెలకొంది. ప్రకాశం, అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూల్ సహా వివిధ జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), సెకండరీ హెల్త్, డీఎంఈ ఆస్పత్రులను ఏఆర్వీ కొరత వేధిస్తోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ అందుబాటులో లేదని, బాధితులే బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. దీంతో పేద రోగులపై రూ.1,500 నుంచి రూ.2 వేల మేర భారం పడుతోంది. ఆస్పత్రులకు వ్యాక్సిన్ను సరఫరా చేయాల్సిన ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్స్(సీడీఎస్)లలోనే ఏఆర్వీ కనీస నిల్వలు లేకపోవడం బాబు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.ఏటా రెండు లక్షలకుపైగా డోసులు అవసరంరాష్ట్రంలో ఏటా రెండు లక్షలకు పైగా డోసుల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అవసరం. సాధారణంగా వ్యాక్సిన్ తయారీ సుదీర్ఘ ప్రక్రియ. కంపెనీలో తయారీ అనంతరం ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్ను హిమాచల్ప్రదేశ్లోని కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లే»ొరేటరీలో పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేస్తారు. దీనికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో తగ్గుతున్న నిల్వలను అంచనా వేసుకుంటూ ముందస్తుగా పర్చేజ్ ఆర్డర్(పీవో)లు ఇచ్చి వైద్య శాఖ వ్యాక్సిన్లు సమకూర్చుకోవాలి. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన మందులు, సర్జికల్స్కు 2025–26లో ప్రభుత్వం అరకొర బడ్జెట్ కేటాయించింది.దీంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని, లేనిపక్షంలో మందులు కొనలేమని వైద్య శాఖ ప్రభుత్వాన్ని గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కోరింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ కాలయాపన చేసిన సర్కారు అదనంగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో వైద్య శాఖలోనే వివిధ విభాగాల్లోని బడ్జెట్ను సర్దుబాటు చేసుకుని మూడు నెలల ఆలస్యంగా మందులు, సర్జికల్స్కు పీవోలు ఇచ్చారు.నిధుల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం మందులు, సర్జికల్స్, వ్యాక్సిన్ సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపింది. వెరసి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను ఏఆర్వీ, ఐవీ ఫ్లూయిడ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, ఫ్యాక్టర్స్ వంటి ఖరీదైన మందులతో పాటు, దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, షుగర్ వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అవసరమయ్యే మాత్రలకు తీవ్ర కటకట నెలకొంది.కొనుగోళ్లలోనూ భారీగా కోతప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరాలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతునే ఉంది. 2026–27 సంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టర్ పీవోలు ఏప్రిల్ మొదటి, రెండో వారం లోపే ఇవ్వాల్సి ఉండగా మే నెల ముగుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. మరోవైపు 2026–27కు సంబంధించిన మొదటి క్వార్టర్, బఫర్ స్టాక్స్కు సంబంధించిన మందుల కొనుగోళ్లలోనూ రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మేర కోత పెట్టినట్టు తెలుస్తోంది.సాధారణంగా ఆస్పత్రుల నుంచి వచ్చే మందుల డిమాండ్స్, బఫర్ స్టాక్స్ కలిపి మొదటి క్వార్టర్లో కొనుగోళ్లు చేస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ. ఈ లెక్కన ప్రస్తుతం రూ.130 కోట్లకుపైగానే మందుల కొనుగోళ్లకు పీవోలు ఇవ్వాల్సి ఉంటుందని ఎంఎస్ఐడీసీ డ్రగ్స్ విభాగం తేలి్చనట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఆస్పత్రుల నుంచి వచి్చన డిమాండ్స్తో పనిలేకుండా కేవలం రూ.80 కోట్ల లోపు కొనుగోళ్లకే ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు సమాచారం. -
కారుతో ఢీకొట్టి.. ప్రమాదాన్ని దాచేసి!
సాక్షి, అమరావతి: పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)లో ఇన్చార్జి బాస్గా రాజ్యమేలుతున్న ఓ అధికారి నిర్లక్ష్యానికి ఓ ఉద్యోగి కోమాలోకి వెళ్లిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరిశ్రమల శాఖకు చెందిన అ అధికారి రెండేళ్లుగా ఏపీటీడీసీలో ఎటువంటి పొడిగింపు ఆర్డర్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధికారిక హోదాలో కొనసాగడమే కాకుండా జీతం సైతం తీసుకుంటూ ఏపీటీడీసీపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటీవల ఎండీ సైతం సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వం ముందూవెనుక చూడకుండా సదరు అధికారికి ఏపీటీడీసీకి ఇన్చార్జి బాస్ని చేసేసింది.శుక్రవారం సాయంత్రం సదరు ఇన్చార్జి బాస్ ఏఎన్యూ వర్సిటీకి ఎదురుగా ఉన్న హైటెక్ భవంతుల్లోని తన నివాసానికి డ్రైవర్తో పాటు విజయవాడ నుంచి కారులో వెళ్తుండగా కాజా టోల్ గేట్కు సమీపంలో ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి కోమాలో వెళ్లిపోయాడు. బాధిత వ్యక్తి ఏపీసీఆర్డీఏలో అవుట్ సోర్సింగ్ విభాగంలో చిరుద్యోగిగా కొద్ది నెలల కిందటే చేరారు. గుంటూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏపీటీడీసీ ఇన్చార్జి బాస్ కారు బలంగా ఢీకొట్టినట్టు సమాచారం. దీనిపై పోలీసు కేసు నమోదు చేయకుండా సదరు ఇన్చార్జి బాస్ బాధిత కుటుంబాన్ని బెదిరించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసినప్పటికీ మంగళగిరి పోలీసులు సైతం ఫిర్యాదు రాలేదనే కారణంతో ఘటనను పట్టించుకోలేదు.అంతా గుట్టుగానే..ఆ ఇన్చార్జి బాస్ ఇప్పుడు కొత్త కారుకు మారిపోయారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారును బయట తిప్పకుండా దాచేశారు. బాధితుడికి గుంటూరులోని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. బాధితులు గొడవ చేయకుండా చూసే బాధ్యతను ఏపీటీడీసీలోని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు అప్పగించినట్టు భోగట్టా. ప్రభుత్వ వాహనం ఢీకొని ఎవరైనా గాయపడితే తొలుత సదరు డ్రైవర్, వాహనంలో ఉన్న అధికారి స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. సంబంధిత ప్రభుత్వ విభాగానికి వెంటనే నివేదించాలి.ఇది 24 గంటల్లోగా చేయాల్సిన ప్రాథమిక ప్రొటోకాల్. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వాహనాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవర్ నిర్లక్ష్యమా? ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశాలపై దర్యాప్తు చేస్తారు. దీనికి సమాంతరంగా ప్రమాదానికి కారణంపై పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి నివేదించాలి. అధికారిక వాహన వినియోగానికి సంబంధించి అంతర్గతంగా శాఖాపరమైన విచారణ చేసి వాస్తవాలు నిగ్గుతేల్చి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే బాధిత వ్యక్తికి ఏదైనా జరిగితే చట్టపరమైన బీమా లభిస్తుంది.అంతేగానీ, రహస్యంగా వైద్యం చేయిస్తే తాత్కాలిక ఉపశమనం లభించినా తర్వాత ఎదైనా సమస్య తలెత్తితే బాధిత కుటుంబానికి ఆసరా కరువవుతుంది. ఇక్కడ, ప్రమాద ఘటనను దాచి పెట్టేందుకు ఏపీటీడీసీ ఇన్చార్జి బాస్ ఎందుకు ప్రయతి్నస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఒకవేళ వాహనం ఫిట్నెస్ లేకుండానే వాడేస్తున్నారా? మితిమీరిన వేగంతో కారు నడిపారా? రోడ్డు నిబంధనలు బేఖాతరు చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఓ ఉద్యోగి సంస్థ వాహనాన్ని తీసుకెళ్లి భారీ యాక్సిడెంట్ చేసి కనీసం ఏపీటీడీసీ కార్యాలయంలో నివేదించకుండా గుట్టుగా వర్క్షాప్లో మరమ్మతు చేసి ఆఫీసులో పెట్టేయడం గమనార్హం. -
ఖాతార్నాక్ సమస్యలు
నరసరావుపేటలోని ఓ బిర్యానీ సెంటర్కు పది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ తిన్నాడు. రూ.220 బిల్లు చెల్లించాడు. నాలుగు రోజుల తరువాత ఆ హోటల్ నిర్వాహకుడి బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. స్థానిక అరండల్పేటలోని బ్యాంక్కు వెళ్లి దీనిపై ఆరా తీయగా ఆన్లైన్ క్రికెట్ యాప్ వినియోగించే బుకీ ఖాతా నుంచి ఈ లావాదేవీ జరిగిందని అధికారులు తెలిపారు. నిత్యం వందల మంది హోటల్కు వచ్చి తిని ఫోన్ పే చేస్తుంటారని, వారేం చేస్తారో ఎలా తెలుస్తుందని యజమాని వాపోయారు. తనకు రూ.220 బిర్యానీ నిమిత్తం జమ అయ్యిందని, బుకీతో సంబంధలేదంటూ లెటర్లు మీద లెటర్లు ఇస్తే రెండు నెలల తరువాత ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎందరో అమాయకులకు సైబర్ నేరాలు, క్రికెట్ బుకీలతో సంబంధం లేకపోయినా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి.సాక్షి, నరసరావుపేట: క్రికెట్ బెట్టింగ్, సైబర్ క్రైం, మనీలాండరింగ్ వంటి వాటితో ఏమాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేకపోయినా కొందరి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నోయో తెలియక బ్యాంకులకు వెళ్లిన వారు పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది. మీ ఖాతాకు క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వినియోగించే వారి నుంచి నగదు లావాదేవీలు జరిపిన వ్యక్తి నగదు జమ చేశాడని చెబుతున్నారు. మీ ఖాతాలు తిరిగి వినియోగించాలంటే సదరు క్రికెట్ బుకీపై కేసు నమోదైన పోలీసుస్టేషన్కు వెళ్లి ఎన్ఓసీ తీసుకురావాలని పేర్కొంటున్నారు.కొన్నిసార్లు కేసులు ఉత్తర భారతదేశంలో నమోదు కావడంతో అక్కడికి వెళ్లలేక ఖాతాలను అలానే వదిలేసిన సందర్భాలు లేకపోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బ్యాంక్ సిబ్బంది మామూళ్లు తీసుకొని ఫ్రీజ్ అయిన ఖాతాలను తెరిపించే దందాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న సమస్యలు ముఖ్యంగా వ్యాపారాలు, అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేసే వారే ఉంటున్నారు. దీంతో చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న వారి ఖాతాలు నెలల కొద్దీ ప్రీజ్ అయ్యి కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఏటీఎం కేంద్రాల వద్ద...బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వినియోగదారులలో ఆన్లైన్ లావాదేవీల తరువాత ఎక్కువ మంది ఏటీఎం కేంద్రాల వద్ద మోసపోతున్నారు. నగదు జమ కోసం వచ్చిన వారితో కొందరు క్రికెట్ బుకింగ్ ఏజెంట్లు మాట కలుపుతున్నారు. బంగారం కొంటున్నామని, దుకాణదారుడు నగదు రూపంలో అడుగుతున్నారని, క్యాష్ ఇస్తే చెప్పిన ఖాతాలో తమ మిత్రుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు జమ చేస్తారని చెబుతున్నారు. సులభంగా పని అవుతుండటంతో కొందరు సరేనని చెప్పి తమ వద్ద తెచ్చుకున్న నగదును క్రికెట్ బుకీలకు ఇస్తున్నారు.నగదు ఆన్లైన్లో జమ చేయించుకుంటున్నారు. అయితే సదరు క్రికెట్ బుకీలు ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే వారి ఖాతాలను పరిశీలించినప్పుడు వారితో ఏమాత్రం సంబంధం లేని నగదు అందజేసిన వ్యక్తి ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. అదే విధంగా కొందరు నగదు ఉపసంహరణ సమయంలో సైతం తాము క్యాష్ ఇస్తామని.. తమ మిత్రుడి ఖాతాకు ఫోన్ పే చేయాలని చెబుతున్నారు.వెయిటింగ్ లేకుండా వెంటనే నగదు మార్పిడి అవుతుందన్న ఉద్దేశంతో కొందరు అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయడం ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరు నగదు ఇస్తున్నారు, ఎవరికి పంపుతున్నామో తెలియని వాటికి దూరంగా ఉండాలన్నారు. క్రికెట్ బుకీలు, సైబర్ క్రైం, ఇతర ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తుల ఖాతాలైతే సామాన్యులకు కూడా ఇబ్బందులు తప్పవు.ఎఫ్ఐఆర్ నమోదైన చోటకు వెళ్లాల్సిందే...అపరిచిత వ్యక్తులతో నగదు మార్పిడి వల్ల ఖాతాలు ఫ్రీజ్ అవ్వడంతోపాటు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయించుకోవడానికి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని ఖాతాలు ఉత్తరభారత దేశంలో ఉండటంతో అక్కడికి వెళ్లలేక కొత్త ఖాతాలు తెరిచిన సందర్భాలు లేకపోలేదు. సైబర్ మోసాల్లో నగదు కోల్పోయిన వారి కంటే ఖాతాలు స్తంభించిన వారి బాధలు వర్ణనాతీతం. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తామేమీ చేయలేమని బ్యాంక్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కేసు నమోదైన చోటుకు వెళ్లి నో అబ్జక్షన్ సర్టీఫికెట్ (ఎన్ఓసీ) తెస్తేనే ఖాతాను పునరుద్ధరించగలమని చెబుతున్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి జాగ్రత్త పడటమే సులువైన మార్గమని అంటున్నారు. -
విద్యే శక్తివంతమైన ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో ప్రతీ విజేత ఎన్నో కష్టాలు, అపజయాలు ఎదుర్కొంటాడని, అవే మనిíÙని మరింత బలంగా తీర్చిదిద్దుతాయని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విద్యే జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం గురువారం ఢిల్లీలో ఆయన్ను కలిశారు. టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 41 మంది విద్యార్థులు ఉపరాష్ట్రపతి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, అధికారులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారని గుర్తుచేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిపెట్టాలని సూచించారు. మహిళ శక్తి పెరుగుదలకు నిదర్శనం.. 41 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల్లో 27 మంది బాలికలు ఉండటం దేశంలో మహిళా శక్తి పెరుగుదలకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి తెలిపారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను అతి తక్కువగా వినియోగించాలని చెప్పారు. క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మకతపై దృష్టిపెట్టాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ‘నిబద్ధతతో కష్టపడండి.. విజయంతో వినయంగా ఉండండి.. సమాజ శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని వినియోగించండి’ అనే మూడు సూత్రాలను జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు. -
నిప్పుల కుంపటిలా రాష్ట్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అసాధారణ స్థాయికి చేరింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాష్ట్రం అగ్ని గుండంగా మారింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురువారం గరిష్టంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.పల్నాడు, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో 46 డిగ్రీలు, విజయవాడలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే నమోదైన ఉష్ణోగ్రతల కంటే 3–4 డిగ్రీలు ఎక్కువగా ఎండ ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడంతో విపరీతమైన ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొంది.ఎండకు వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే 4 రోజులూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండే జిల్లాలు.. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాకినాడ, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, పోలవరం, నెల్లూరు, రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
అమరావతిలో బాబు లూటీ
సాక్షి, అమరావతి: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలన్నీ దొంగ మాటలని తేలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘ఇప్పటికే అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అమరావతిలో స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ (రక్తపోటు) పెరుగుతోంది’ అంటూ మండిపడ్డారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా, చంద్రబాబు తన స్కాముల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్) మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ‘అమరావతి అయితే సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలి. అదే మావిగన్ అయితే మొదటి రోజు నుంచే ఫలితాలు వస్తాయని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి.. ప్రజలందరూ ఇదే కరెక్టని, చంద్రబాబు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేయడం ధర్మం కాదంటుంటే.. సమాధానం చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో బీపీ పెరిగి నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులతో సహా అబద్ధాలాడుతూ, బూతులు తిట్టిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా చంద్రబాబును మావిగన్పై స్పందన కోరండి.. గుండె ఆగిపోకపోతే అదృష్టం. వెంటనే మిమ్మల్ని తిట్టకపోతే.. మీపై బ్లాస్ట్ కాకపోతే చూడండి’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని కొత్త సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, అంచనా వ్యయం పెంపు, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం.. తద్వారా చోటుచేసుకున్న భారీ స్కామ్లను సాక్ష్యాధారాలతో సహా వివరించారు. స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న సీఎం చంద్రబాబు తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ‘ప్రజలు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైన అవినీతి, దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతును పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతు వినిపించడానికి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు. ఈ కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. రెండేళ్లుగా బాబు పరిపాలనలో తీరు ఇదే. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుసూ్తనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. పొరపాటున చంద్రబాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగిపోవచ్చు. మావిగన్ అంటే చాలు బాబుకు అంతగా బీపీ పెరుగుతోంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అనేది దొంగ మాటేచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా ఉండేలా వ్యవహరిస్తున్నారు. లక్షల ఎకరాల్లో అమరావతి నిర్మాణం పేరిట కేవలం రోడ్లు, డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమ కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలు దొంగ మాటలుగా తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, తెస్తున్న (కమిట్) అప్పులు రూ.47,387 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ప్రశ్నిస్తే బాబుకు రక్తపోటు (బీపీ) వస్తోంది.మావిగన్ అంటే ఉలికిపాటు.. రక్తపోటురాష్ట్రానికి ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్), ఏపీ పరిస్థితులను పూర్తిగా మనస్సులో పెట్టుకుని మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించాం. మచిలీపట్నం–విజయవాడ 70 కిలో మీటర్లు, విజయవాడ–గుంటూరు మరో 40 కిలో మీటర్లు హైవే వెంట అద్భుత రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ హయంలో నిర్మాణం తలపెట్టిన పోర్టు శరవేగంగా నడుస్తోంది. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం కనిపిస్తోంది. 3 రైల్వే స్టేషన్లు, 4 జాతీయ రహదారులు కలుస్తున్నాయి. 9 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 35–40 లక్షల జనాభా ఉంది. అదే అమరావతి అయితే.. అంతా సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లుసెక్రటేరియట్ బిల్డింగ్లకు మాత్రమే రూ.10,665 కోట్లు అవుతుందా? ఏమిటీ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఇవి కాకుండా కొత్త అసెంబ్లీ కోసం 11.21 లక్షల ఎస్ఎఫ్టీలో నిర్మాణానికి రూ.1,947 కోట్ల ఖర్చు తేల్చారు. అంటే ఎస్ఎఫ్టీ రూ.17,356 పడింది. కొత్త హైకోర్టుకు 20.32 లక్షల ఎస్ఎఫ్టీలో పాక్షికంగా రూ.1,480 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇది పూర్తయ్యే సరికి ఏ స్థాయికి రేట్లు పెరుగుతాయో తెలీదు. ఇలా 5 సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కలిపి.. ఏడు బిల్డింగుల కోసం ఏకంగా రూ.14,092 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లా?అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంట్కు ఈ ఏడాది ఫిబ్రవరి 5న లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ, అమరావతిలో కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కిలోమీటరుకు రూ.69 కోట్లు ఖర్చయితే.. చంద్రబాబు అమరావతిలోని సీడ్ యాక్సెస్ నుంచి వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్కు కిలోమీటర్కు రూ.189 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు.⇒ చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు. ⇒ ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి.⇒ ప్రజలంతా మావిగన్కు మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు.. తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు⇒ గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, అదే కాంట్రాక్టర్లకు టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతుల్లో తిరిగి టెండర్లు కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర రకరకాల పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు.⇒ అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతోంది. కానీ, అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. ⇒ రాజధానిలో చంద్రబాబు తన మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినామీలకు రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? -వైఎస్ జగన్ అమరావతిలో ప్లాట్ల స్కామ్చంద్రబాబు తన మనుషులకు, ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినావీులకు అమరావతిలోని రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? తొలి దశలో తీసుకున్న 50 వేల ఎకరాలకు దిక్కులేదని రైతులు అంటుంటే.. ఇవి సరిపోవని మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, రైతులు ధర్నాలు చేస్తున్నా లెక్క చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. మేం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూ, ఆధారాలతో సహా స్కాములను బయట పెడుతుంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే బిల్డప్ ఇచ్చి.. ఒక కథ అల్లుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఒక పెద్ద మాఫియా ముఠా. వీళ్లు ఏమనుకుంటే దానిపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దొంగ సాక్ష్యాలతో వీళ్ల అధికారులతోనే కేసులు పెట్టిస్తున్నారు.ఆ అవినీతిని చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందేవెలగపూడి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అందుబాటులో ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మళ్లీ కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులకు బిల్డింగులు నిర్మిస్తున్నారు. దీనికి శాశ్వత సెక్రటేరియట్ అని కొత్తగా నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీ చూస్తే ప్రజలంతా నివ్వెరపోతారు. 2018లో ఇవే ఐదు టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ (చదరపు అడుగు) బిల్డప్ ఏరియాతో నిర్మాణాలకు రూ.2,271 కోట్లతో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించారు. ఈ లెక్కన ఒక ఎస్ఎఫ్టీకి సుమారుగా రూ.4,350 అవుతుంది. ఇది 2018 రేట్ల ప్రకారం చాలా ఎక్కువ. కానీ, ఇవే బిల్డింగులకు గతంలో ఇచ్చిన పనుల టెండర్లను రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఇక్కడా గతంలో ఉన్న కాంట్రాక్టర్లే వచ్చారు. అవే కంపెనీలకు, అవే పనులు దక్కాయి. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశారు. దీనిపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది.⇒ ఐదు బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఖరారు చేశారు. ఈ భవనాల ఆవరణలోనే డ్రెయినేజీ, నీళ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1,053 కోట్లు.. లిఫ్టులు, ఏసీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా బిల్డింగ్లకు అదనంగా అద్దాలు వేసేందుకు (గ్లాస్ ఫిట్టింగ్) రూ.2,540 కోట్లకు జీవోలు ఇచ్చారు. ఇవన్నీ పాత కాంట్రాక్టర్లకే దక్కాయి. ఒక్కోపనికి ఒక్కో కాంట్రాక్టర్ కాదు. అన్నీ వాళ్లకే ఇచ్చారు. ⇒ ఈ ఐదు బిల్డింగులకు డిజైన్ కోసం మరో రూ.401 కోట్లతో కలిపి మొత్తం రూ.10,665 కోట్లు ఖర్చు అవుతుంది. 52,20,496 ఎస్ఎఫ్టీ నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్టీకి రూ.20,427 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఫర్నీచర్, ఇంటీరియర్ సమకూర్చే సరికి ఎస్ఎఫ్టీకి రూ.30–40 వేలు అవుతుందేమో. ఇక్కడ భవనాల నిర్మాణానికి ఇసుక ఫ్రీ. పైగా ప్రభుత్వం జీఎస్టీ, ఎంఈఆర్ఐటీ, డీఎంఎఫ్, ఎన్ఏసీ చార్జీలు రీయింబర్స్ చేస్తోంది. వీటి మినహాయింపుల విలువ రూ.681 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతోంది.⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు. తెలంగాణలో కేసీఆర్ 28 ఎకరాల్లో సచివాలయం నిర్మించారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో కట్టారు. అలా చూసినా ఎస్ఎఫ్టీకి రూ.6 వేలు పడింది. ఇక్కడ ఎస్ఎఫ్టీ రూ.20,420.. హంగులతో కలిపితే రూ.30–40 వేలు అవుతుందంటే ఎవరికైనా కళ్లు చెదురుతాయి.అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్!చంద్రబాబు, లోకేశ్కు వైఎస్ జగన్ గట్టి కౌంటర్రాష్ట్రంలో ఓ వైపు పాలన అత్యంత దారుణంగా ఉంటే చంద్రబాబు మరోవైపు తన కొడుకుతో ‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’ అంటూ బహిరంగ సభల్లో బాలకృష్ణ డైలాగ్లు కొట్టిస్తున్నాడు’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వీటికి బదులుగా ఆయన ‘అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్’ అంటూ మీడియా సమావేశంలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ప్రజలకు ద్రోహం చేయడం.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం.. ప్రజలను వాడుకుని వదిలేయడం మీ క్యారెక్టర్.. ఆరు నూరైనా ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ పనులు చేసి చూపించడం మా స్టయిల్.. పబ్లిసిటీ, క్రెడిట్ చోరీ చేయడం మీ స్టయిల్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర.. వీటన్నింటిని నాశనం చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. ⇒ ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు రూ.2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర.. రెండేళ్లయ్యేసరికి మేం చేసిన అప్పులకంటే ఎక్కువగా రూ.3.40 లక్షల కోట్ల అప్పులు చేయడం, మా హయాంలో చేసిన పథకాలన్నీ రద్దుచేయడం, సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు బుట్టదాఖలు చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. తెలుసుకో. -
పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే
సాక్షి, అమరావతి: పొదుపు చర్యల పేరుతో చంద్రబాబు చెప్పేవన్నీ సోది కబుర్లేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు చెప్పే మాటలు ఆయన కొడుకు, దత్తపుత్రుడు వినరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రైవేటు చాపర్.. ఒక్కో ప్రైవేటు విమానం ఉన్నాయి. గన్నవరం, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి చూస్తే 3 విమానాలు, 3 చాపర్లు కన్పిస్తాయి. ఇంధన పొదుపు పేరిట వాళ్లు చెప్పేవన్నీ సోది కబుర్లే. ఇవేమీ వాళ్లకు వర్తించవు. ఆ సోది వినమని ప్రజల చెవిలో పువ్వులు పెడతారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా వ్యవహారాలు) పూడి శ్రీహరి అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ఏదైతే విత్తుతామో అవే పండుతాయి. మీరు ఈ పొద్దున ఏం చేస్తున్నారో రేప్పొద్దున ఇవన్నీ వాళ్లకు చుట్టుకుంటాయి. ఈ రాష్ట్రంలో ప్రతి పోలీస్ సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి, చంద్రబాబుపై భయంతోనో ఆయన చెప్పినట్టు చేయకండి. వీటన్నిటిపై విచారణలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేశారో ఆ తప్పులపై విచారణ జరుగుతుంది. ఆ తప్పులు చేసిన అధికారులందర్ని చట్టం ముందు నిలబెడతాం. రిటైరైనా, సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చి తీసుకొస్తాం. గవర్నెన్స్లో ఉన్నవాళ్లు కచ్చి తంగా వేసే ప్రతి అడుగు రేప్పొద్దున అదే తమకు చుట్టుకుంటే ఎలా అనేది ఆలోచన చేయాలి. అడుగులు వేయాలి. ఇప్పుడు దేవుడిచ్చి న అవకాశం ప్రజలకు మంచి చేయమని చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ స్థానాన్ని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించాలే తప్ప కక్ష తీర్చుకునేందుకు, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూడటం దుర్మార్గం. అందుకే పోలీసులకు కూడా చెబుతున్నా రేప్పొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు’ అని స్పష్టం చేశారు. ఎవరి నోటినుంచైనా అవే మాటలు వస్తాయిపవన్కళ్యాణ్ హోం మంత్రి అమిత్షా వద్దకు వెళ్లారని, జగన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘అది ఆయన(అమిత్షా) చూసిన, తెలిసిన అనుభవంతో చెబుతున్నారు. ఆయన చంద్రబాబును చూశారు. జగన్ను చూశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను చూస్తున్నారు. జగన్ చేసిన పాలన చూశారు. ఆయనే కాదు ప్రజలంతా చూశారు. అందుకే ఎవరి నోటినుంచి అయినా ఇవే మాటలు వస్తాయి’ అని స్పష్టం చేశారు. ‘తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ప్రచారం చేయడంతో అధికారంలోకి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా’ అని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘ఆయన రాష్ట్రంలో ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉంటుందిగానీ జగన్కు ఎలా ఉంటుంది’ అని అన్నారు. -
హామీలకు వెన్నుపోటు
చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. సున్నా వడ్డీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నాపట్టించుకునే నాథుడు లేడు. విద్యా దీవెన, వసతి దీవెన రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంది. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారు. యువత, మహిళలు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతున్నారు. అన్ని రంగాలు తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ఫలాన మంచి చేశానని ప్రజలకు చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల పనితీరు (ప్రోగ్రెస్ రిపోర్టు) చూస్తే.. ఒకే ఒక్కటి కని్పస్తుంది. అదే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. ఈ రెండేళ్ల చంద్రబాబు పరిపాలనను గమనిస్తే కనిపించే నిజమిది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారని దెప్పిపొడిచారు. ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటూ చంద్రబాబు మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూస్తున్నారని.. ఇలాంటి దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంతా అస్తవ్యస్తం.. కష్టాల్లో ప్రజలు ఓ వైపు మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయి పోయాయి. ప్రజల చేతిలో చిల్లిగవ్వలేదు. మరోపక్క ఈయన ఇస్తానన్నవన్నీ మోసాలుగా మిగిలాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అతలాకుతలం అవుతున్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రద్దు. రుణాల పరపతి మా హయాంలో మేం స్టార్ట్ చేసినప్పుడు రూ.25 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.49 వేల కోట్లకు రుణాలు పెంచుకుంటూ పోయాం. సున్నా వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ ముందుకెళ్లాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. సున్నా వడ్డీ సైతం రాని పరిస్థితి నెలకొంది. ఆసరా, చేయూత కథ దేవుడెరుగు.. అన్ని పథకాలు రద్దయి పోయాయి. ఈయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు మోసాలుగా తేలాయి. అక్కచెల్లెమ్మల పరపతి మొన్న డిసెంబర్ నాటికి రూ.31 వేల కోట్లకు పడిపోయింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. ఈ పరిస్థితిలో ఈ పెద్దమనిషి చెంపలేసుకుని కనీసం ఇప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధర కనీసం రూ.8 అయినా తగ్గించాలా? లేదా?పెట్రోల్, డీజిల్ ధరలు బాదింది బాబే ‘అయ్యా చంద్రబాబూ.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు. మేనిఫెస్టోలో 143 హామీలిచ్చావు. వీటి సంగతేమిటయ్యా అని చంద్రబాబును గట్టిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేం కూడా చంద్రబాబును గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఇప్పుడు హాట్ టాపిక్. వీటి ధర తగ్గిస్తామని వీళ్లు ఇచ్చిన హామీ ఈ రోజు వెన్నుపోటు కాదా? 2014–19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగాయో చూడండి. (పీపీటీలో పెట్రోల్, డీజిల్ రేట్లు చూపించారు) చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. (చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాల వీడియో చూపారు) మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. నిజంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైంది? » ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. సంవత్సరానికి రూ.18 వేలు. రెండేళ్లకు రూ.36 వేలు ప్రతి మహిళకూ బాకీ. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నావు. రెండేళ్లయి పోయింది. ఏటా రూ.36 వేలు చొప్పున రూ.72 వేలు బాకీ. అప్పుడు ఇంటింటికీ పోయి బాండ్లు ఇచ్చారు. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారు? 50 ఏళ్లకే పెన్షన్ లేదు » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తానన్నావు. అదీ జూన్ 2024 నుంచి. నెలకు రూ.4 వేలు అంటే సంవత్సరానికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చంద్రబాబును.రైతుల నడ్డి విరిచారు రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఏడాదికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. రెండేళ్లయి పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.14 వేలు. రూ.26 వేలు ఎగ్గొట్టాడు. అంతే కాకుండా 50 లక్షల మంది రైతులకు మా హయాంలో రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు అందులో 7 లక్షల మందికి కోత కోశాడు. కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత, నా పాదయాత్ర జరిగి చివరికి వచ్చిన తర్వాత చివర్లో మోదీ∙వాళ్లు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఈ–క్రాప్, ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఉచిత బస్సు.. తుస్సు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీల బస్సులకే పరిమితం చేస్తున్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానికి కూడా ఇప్పుడు మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లీ పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండోది మేము ప్రభుత్వంలో విలీనం చేసిన 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల బతుకులు ప్రశ్నార్థకం చేశారు. ఏకంగా 12 డిపోలను ప్రైవేటుపరం చేశాడు.. భూములతో సహా. భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు ఉండదు. ఆర్టీసీ ఉండదు. అతీగతిలేని విద్యాదీవెన.. వసతిదీవెన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఇవ్వాలి. 2024 జనవరి–ఏప్రిల్ త్రైమాసికానికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి సొమ్ము పంపిణీ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు 9 త్రైమాసికాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ మార్చి నాటికే బకాయిలు రూ.5,820 కోట్లు. విద్యా దీవెన కింద 9 త్రైమాసికాలకు క్వార్టర్కు రూ.700 కోట్లు చొప్పున రూ.6,300 కోట్లు. ఇప్పటికి ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి రూ.1,770 కోట్లు, ఇప్పుడు రూ.900 కోట్లు ఇచ్చాడు. అంటే రూ.2,670 కోట్లు. రూ.3,628 కోట్లు ఇప్పటికే విద్యాదీవెన కింద బకాయిలున్నాయి. వసతి దీవెన ప్రతి జనవరిలో రూ.1,100 కోట్లు క్రమం తప్పకుండా మా హయాంలో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద జనవరి 2025 రూ.1,100 కోట్లు, జనవరి 2026 మరో రూ.1,100 కోట్లు.. ఇప్పటికే రూ.2,200 కోట్లు బాకీ. రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. పట్టించుకునే నాథుడే లేడు. అమ్మ ఒడి మరో మోసం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లల్ని తగ్గించేశారు. రూ.15 వేల కథ దేవుడెరుగు. కొందరికి రూ.9 వేలు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు. కొందరికి మాత్రమే రూ.13 వేలు. ఇదీ అమ్మ ఒడి పరిస్థితి. గ్యాస్ కూడా లేదు గ్యాస్ సిలెండర్ల పరిస్థితీ అంతే. ఇప్పటికి 9 ఉచిత సిలెండర్లు ఇవ్వాలి మూడో సంవత్సరం కలుపుకుంటే. ఇంత వరకు ఇచ్చింది ఒకటి రెండు. అది కూడా అందరికీ ఇవ్వలేదు. నంబర్ డ్రాస్టిక్గా తగ్గించారు. కోటీ 50 లక్షల నుంచి 90 లక్షలకు తగ్గించారు. ఇచ్చే అర కొరలో కూడా అన్యాయం. కొత్త పెన్షన్లు లేవు.. ప్రతి నెలా 25 వేలు కట్ మా హయాంలో ఎన్నికల షెడ్యూలు వచ్చే నాటికి 66,34,372 పెన్షన్లు పంపిణీ చేశాం. ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయించాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ రూ.1000, మా హయాంలో రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. వాటిని చంద్రబాబు తగ్గించేస్తున్నారు. ఈ మే నెలలో 60,11,293 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేశారు. ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా 6,23,079 మంది పెన్షన్లు కట్ చేశారు.సంక్షోభంలోనూ స్కామ్పెట్రో ధరలు తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? ఇక్కడా స్కామే చేశాడు. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెట్రోలు బంకుల దగ్గర జనం బారులు తీరారు. ఆ పరిస్థితుల్లో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంచి మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ప్రజలను ఇక్కట్లపాలు చేశాడు. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో తక్కువ ధరకు డీజిల్, పెట్రోల్ ఇవ్వండంటూ బీపీసీఎల్, ఐవోసీ తదితర ఆయిల్ కంపెనీలకు లెటర్ (లేఖను చూపుతూ) రాశాడు. మీ ఎన్డీయే కూటమిలో సభ్యుడు చంద్రబాబు ఇలా అడుగుతున్నాడు.. మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదని ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వాళ్లు కేంద్ర మంత్రికి చెప్పారు. అక్కడి నుంచి మోదీ షంటుకున్నారు. దానిపై కేంద్రం చంద్రబాబుకు చీవాట్లు పెడుతూ తిరిగి లేఖ రాసింది. నీకు బుద్దీ జ్ఞానం ఉందా లేదా చంద్రబాబూ? దేశంలో పెట్రోలు, డీజిల్ దొరక్క ప్రజలందరూ అవస్థలు పడుతుంటే, బల్క్ డీజిల్ కొంటే రేటెక్కువ అని చెప్పి.. కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో డీజిల్ పోయమని ఎలా అడుగుతున్నావు అని కేంద్రం లేఖ రాసింది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? తద్వారా ఆ కాంట్రాక్టు పనుల్లో ఈయనకొచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రమే ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా.. ఈ ముఖ్యమంత్రి తప్ప! నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి, బల్క్ లో వాళ్లు డీజిల్ కొంటే లీటర్ రూ.155 అవుతుందని, రీటెయిల్ పెట్రోలు బంకుల్లో కొంటే రూ.101కే దొరుకుతుందని, వాళ్లకు రూ.101కే రీటెయిల్ బంకుల్లో పోయమని నువ్వు లేఖ ఎలా రాశావు? పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీనే కాదు.. సూపర్ సిక్స్ అయినా అంతే, సూపర్ సెవెన్ అయినా అంతే. ఇదే పరిస్థితే. (పీపీటీలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు చూపించారు)ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లుచంద్రబాబు ఉద్యోగులను మరీ దారుణంగా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ప్రతి ఆరు నెలలకు డీఏ ఇవ్వాలి. మా హయాంలో ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. 11 డీఏలు ఇచ్చాం. ఒకటి ఎక్కువ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాలయాపన లేకుండా పీఆర్సీ వేశాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడపిస్తూ.. వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో.. వీళ్లు సీపీఎస్తో ఇబ్బంది పడుతుంటే.. జీపీఎస్ అనే విధానం కూడా తీసుకువచ్చాం. ఈ రోజు మేము తీసుకువచ్చిన జీపీఎస్ను దేశం అంతా కాపీ కొడుతోంది. ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి చూస్తే.. ఈ జూన్ వస్తే 5వ డీఏ కూడా పెండింగ్. అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు. ఇంత వరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా హయాంలో వేసిన పీఆర్సీ చైర్మన్ను కూడా తీసేశారు. కొత్త వారిని కావాలని వేయడం లేదు. ఎందుకంటే కొత్త వారిని వేస్తే రికమండేషన్స్ వస్తే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి. అందుకే పీఆర్సీ వేయడం లేదు. పోలీసు సోదరులకు సరెండర్ లీవ్స్ 5 పెండింగ్. మొట్టమొదటిసారిగా చంద్రబాబు సరెండర్ లీవ్ను స్ప్లిట్ చేస్తున్నాడు. వాయిదా పద్ధతి పెడుతున్నాడు. మరోవైపు ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్. 15 నెలలు టీఏలు పెండింగ్. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు... ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైనా అడిగితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు.అప్పుడు సంపద సృష్టిస్తానని.. ఇప్పుడు పిల్లలే సంపద అంటావా?» సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అంటున్నాడు. ఇంకా మోటివేట్ చేస్తూ.. ముగ్గురిని కంటే రూ.30 వేలు ఇస్తానంటున్నాడు. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తా అంటున్నాడు. వీటి కథ దేవుడెరుగు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలు ఏమైనాయి స్వామీ? ముందు వీటి గురించి ఆలోచించు. ఆ తర్వాత మూడో సంతానం.. నాలుగో సంతానం గురించి చెబితే.. అంతో ఇంతో వినడానికి అవకాశం ఉంటుందని ప్రజలు మొత్తుకుంటున్నారు.» ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదైతే చెబుతాడో.. దాన్ని ఆయన పాటించాలి కదా.. కనీసం ఆయన కొడుకైనా పాటించాలి కదా.. ఆయన కొడుక్కి ఒకడే. ఆయనకొకడే. కానీ బీదోళ్లకు మాత్రం నలుగురు సంతానం కావాలా! వారు చదువుకోకూడదు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. వాళ్లు ఇంగ్లిష్ మీడియం చదవకూడదు. వాళ్ల బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరు.» ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే.. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతుంటే.. యువత, మహిళలకు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతుంటే.. అన్నీ తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. » మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తున్న అతి దిగజారుడు రాజకీయం. నిజానికి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. చంద్రబాబు మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా చూడటం అంటే ఇంతకంటే దారుణమైనపరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ లేవు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దైన్యంఅసలు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ పూర్తిగా మూలన పడిన పరిస్థితులు. ఈరోజు స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితి. మా హయాంలో మూడో తరగతి నుంచి టోఫెల్ ఒక పిరియడ్గా పెడితే, దాన్ని తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకువస్తే.. అసలు ఇంగ్లిష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకువస్తే.. అది గాలికొదిలేసిన పరిస్థితి. నాడు–నేడుతో మేము బడులను బాగు పరిస్తే.. ఇప్పుడు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేసి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా మేము చేస్తే.. ఈ రోజు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో 8వ తరగతికొచ్చే సరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మేనమామలా మేము చదివిస్తే.. ఈ రోజు పిల్లలకు ట్యాబుల కథ దేవుడెరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితి ఈరోజు బడుల్లో నడుస్తోంది. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యా దీవెన లేదు. వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తున్న పరిస్థితి. స్కూళ్లు, అంగన్ వాడీలు, హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందక పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి. ఆస్పత్రులు నాశనం చేశారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి.. పీహెచ్సీల దగ్గర నుంచి.. హాస్పిటల్స్ను రిఫార్మ్ ద్వారా సంస్కరించి.. జీరో వేకెన్సీ పాలసీ తీసుకువచ్చి, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరతలేని పరిస్థితి మా హయాంలో తీసుకువచ్చాం. ఈ రోజు పూర్తిగా అన్నీ నాశనమైన పరిస్థితి. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుట్టి, వాటిలో ఐదు పూర్తి చేశాం. మిగిలినవి వివిధ రకాల స్టేజ్లలో ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే అవి కూడా పూర్తవుతాయి. పిల్లలందరికీ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది. దానిని పక్కన పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్లకు గ్లాసుల కోసం.. కేవలం భవనం అద్దాలకు రూ.2,500 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వస్తాడు కానీ, మెడికల్ కాలేజీలకు డబ్బులివ్వడానికి మనసు రాదు. నాడు–నేడు కింద స్కూళ్లను బాగు చేయడానికి మనసు రాదు. పూర్తిగా సున్నా వడ్డీ అనే పథకం తీసేసి, ఆసరా, చేయూత అనేపథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి.ఆరోగ్యశ్రీ నిర్వీర్యంఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.3,746 కోట్లు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కావాలి. అలాంటిది రెండేళ్లలోనే రూ.3,746 కోట్లు బకాయి. మళ్లీ ఈ సంవత్సరం మరో రూ.4 వేల కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. చంద్రబాబు చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే.. వారికి వాళ్ల పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. లోన్ కోసం 8 శాతం వడ్డీ కూడా కట్ చేస్తా అంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోగా, మాకు లోన్ ఇప్పించడమేంటి స్వామీ.. పైగా దానికి 8 శాతం వడ్డీ కట్ట్టడమేంటీ.. అని నెట్వర్క్ ఆస్పత్రులు లబోదిబోమంటూ బోర్డు తిప్పేస్తున్నాయి. -
ప్రశ్నించే వారికి సంకెళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సోషల్ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్షిప్ విధిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఎవరైనా అమరావతిలో జరుగుతున్న స్కామ్లు చూపిస్తే, జీవోలు చూపిస్తే.. చదరపు అడుగుకు రూ.20,427లా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినా, తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించినా, మహిళలపై అఘాయిత్యాల మీద, టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కంటెంట్ కన్పించకుండా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై వారి పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఏకంగా కుప్పంలో కేసులు పెట్టిస్తాడు. ఎఫ్ఆర్ఐ నమోదు చేస్తారు. సోషల్ మీడియా పోస్టులను ఆ సీఐ ఎక్స్ (ట్విటర్)కు, ఫేస్బుక్, యూ ట్యూబ్ హెడ్క్వార్టర్కు పంపిస్తాడు. ఆ వీడియోలు డిలీట్ చేయమని చెబుతారు. ఎక్కడో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఎక్స్ యాజమాన్యానికి కుప్పం ఇన్స్పెక్టర్ రాసిన లేఖను చూస్తే ఎవరికైనా పోలీసులు ఎలా తయారయ్యారో అర్థమవుతుంది’ అని తెలిపారు.పోలీసులు ఎక్కడ?రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ డ్యూటీ కన్పించడం లేదని, ఏ కాలేజ్లో చూసినా గంజాయి కన్పిస్తుందని.. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కన్పించరు. ప్రతి ఐదు లిక్కర్ బాటిల్స్లో ఒక బాటిల్æ కల్తీ అయినా పోలీసులు పట్టించుకోరు. ఏ బెల్టు షాపు దగ్గరా పోలీసులు కన్పించరు. పోలీసులు చేసేది ఏమిటో తెలుసా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే తప్పుడు కేసులు పెట్టడం, ఆ కేసుల కోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఆ కేసుల్లో అమాయకుల్ని ఇరికించి జైలుకు పంపేందుకు తాపత్రయ పడడం. రాష్ట్రంలో పరిపాలన (గవర్నెన్స్) అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. పోలీసుల ప్రాథమిక బాధ్యతలన్నీ (బేసిక్ రెస్పాన్స్బిలిటీస్) మరిచిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో దిశ అనే యాప్ను తీసుకొచ్చి, ఏ ఆడపిల్లకైనా, ఎలాంటి వేధింపులు జరిగినా సరే.. ఫోన్ చేసిన 10 నిముషాల్లో పోలీసులు పోయేవాళ్లన్నారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసులు.. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో స్పందించే వారని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరూ పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. -
ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?
రెండేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీపై, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. బాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగి పోయేంతగా బీపీ పెరుగుతోంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడం మామూలైపోయింది. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. తప్పుడు కేసులు.. దొంగ సాక్ష్యాలు కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మా పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానందరెడ్డి, మా మామ రవీంద్రనాథ్రెడ్డిపై బురద జల్లుతున్నారు. జాతరలో గొడవ వల్ల ఈ హత్య జరిగిందని దస్తగిరి భార్య మీడియా ఎదుట చెప్పింది. తామెవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పని చేస్తున్న నిత్యానందరెడ్డితో తమకు ఎలాంటి విబేధాలు లేవని కూడా చెప్పింది. ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉన్నారు.చనిపోతే బాధ పడాల్సింది మా వాళ్లే. అయినా సరే చంద్రబాబు తన రాజకీయాల కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు కుట్రలతో దిగజారుతున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 అందరూ కలిసి ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెబుతారు. పెద్దపెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వీళ్ల చేతుల్లో ఉన్నాయి. గతంలో వేరే రకంగా ఇచ్చి న స్టేట్మెంట్లను తీసుకుని, ఇప్పుడు చంద్రబాబు బృందం చెప్పిన కల్పిత కథల చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దొంగ సాక్ష్యాలను సృష్టిస్తారు. కొంత మందిని కేసులో ఇరికిస్తారు. అరెస్ట్ చేస్తారు. ఓ వైపు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతుంటే, మా వాళ్ల మీదే కేసులు బనాయించి, ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికించి జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఇవే. తప్పుడు కేసులు వీళ్లే పెడతారు. తప్పుడు సాక్ష్యాలు వీళ్లే క్రియేట్ చేస్తారు. ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అయినా సరే, కళాశాలలు, యూనివర్సిటీల్లో యాక్టివిస్ట్లుగా ఉన్న పిల్లలైనా సరే, వైఎస్సార్సీపీకి మద్దతుదారులైనా సరే, వైఎస్సార్సీపీ నాయకులైనా సరే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఇదే స్క్రిప్ట్. చంద్రబాబు లాయర్.. దస్తగిరి లాయర్ సిద్ధార్థ లూథ్రాయే మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? వైఎస్సార్సీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం జమ్మలమడుగులో ప్రచారం చేసి వచ్చిన రోజే హత్యకు గురయ్యారు. పైగా తానే వివేకానంద రెడ్డిని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనే విచ్చలవిడిగా మాట్లాడిన దస్తగిరి అనే ఈ వ్యక్తి, మా చిన్నాన్నను చంపిన వ్యక్తి. ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా. ఎవరిదయ్యా చంద్రబాబూ క్రిమినల్ బ్రెయిన్? రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఇదే కదా.. ఈ కేసులో జరుగుతోంది. చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతున్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా? ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. పరామర్శ కోసం పోయి చంద్రబాబు ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడ లేదా? ఎవరివయ్యా శవ రాజకీయాలు అని అడుగుతున్నా. సొంత కూతురిని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సొంత మామను, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొని, ఆయన చనిపోయేలా చేసింది ఎవరయ్యా? చంద్రబాబు కాదా? ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతున్నా. వంగవీటి హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే వంగవీటి మోహనరంగారావు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయవాడలో «నిరాహార దీక్ష చేస్తుంటే.. అర్ధరాత్రి అత్యంత పాశవికంగా నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాదా? ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య అప్పట్లో మంత్రి, చంద్రబాబుకు సహచరుడు. ఆయన రాసిన పుస్తకంలో ఈ ఘటన ఎలా జరిగింది.. చంద్రబాబు పాత్ర ఎంత బలంగా ఉందో రాశారు. మోహన రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే. హత్యా రాజకీయాలు ఎవరివో.. కుట్ర రాజకీయాలు ఎవరివో.. శవ రాజకీయాలు ఎవరివో ప్రజలకు తేటతెల్లమవుతున్నాయి. ఎన్టీఆర్పై దాడి కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన లాడ్జిలో శవంగా మారాడు. అతని జేబులో దొరికిన లెటర్లో తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి రూ.30 వేలు ఇచ్చారని రాసి ఉంది. ఎన్టీఆర్పై దాడి కోసమే ఈ డబ్బులు ఇచ్చారా? అదే నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. మరొక ఉదాహరణ..పింగళి దశరథరామ్. ఈయన ఒక ప్రముఖ జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఎవరివి హత్యా రాజకీయాలు.. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు.. ఎవరివయ్యా శవ రాజకీయాలు? అబద్ధాలు.. దొంగ కేసులు.. తప్పుడు సాక్ష్యాలుఎప్పుడు ఏ ఘటన జరిగినా, వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు డైవర్షన్ చేసేందుకు కొత్త టాపిక్ను, కొత్త అబద్ధాన్ని తెరపైకి తీసుకొస్తారు. దానికి రెక్కలు కడతారు. ఇష్టమొచ్చి నట్టుగా మాట్లాడతారు. ఇంకొక విస్తుగొలిపే విషయం.. రెండ్రోజుల క్రితం ఈనాడులో చూశాను. నకిలీ మద్యం కేసులో 89 మంది సాక్షులట.. జోగి రమేష్ పేరు చెప్పారట! ఈ కల్తీ మద్యం ఘటన జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో. కల్తీ మద్యం తయారు చేసిన వాళ్లకు, పోలీసుల మధ్య లావాదేవీల్లో తేడా వచ్చి ఈ విషయం బయటకొచ్చింది. చంద్రబాబు హయాంలో కొనసాగుతున్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు.. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేళ్ల తర్వాత బయట పడిన విషయాలివి. తంబళ్లపల్లిలో చంద్రబాబు పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన సన్నిహితుల పీఏల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తే.. పోలీసులు రైడ్ చేస్తే అడ్డంగా దొరికి పోయారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. చేసింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అభ్యరి్థ. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పైనే బనాయించారు. నిజంగా మనుషుల్లో మానవత్వం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఒక అబద్ధానికి రెక్కలు గట్టి ఇష్టమొచ్చి నట్టుగా ఇరికించేస్తున్నారు. జోగి రమేష్ను బీసీ నాయకుడు అని కూడా చూడకుండా ఓ తప్పుడు కేసులో 83 రోజులు జైలులో పెట్టారు. బెయిల్పై బయటకొస్తే ఇంటిపై యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించారు. ఆ దాడి చేసిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ రోజు చార్జిషీట్ ఫైల్ చేసారట.. 89 మంది సాక్షులట. జోగిరమేష్ పేరు చెప్పారట. నిజంగా ఎంత దారుణంగా కేసులు బిల్డప్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఐదు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్ అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడం లేదు. ఈ కల్తీ మద్యం తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే. అమ్మేది చంద్రబాబు మాఫియా ముఠా బెల్టు షాపులు. ఇవన్నీ పోలీసులకు తెలుసు. బెల్టుషాపులు నడుపుతున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, ప్రతీ ఐదు బాటి ల్స్కు ఒక బాటిల్ కల్తీ అని అందరికీ తెలుసు. అయినా అటువైపు పోలీసులు, అధికారులు కన్నెత్తి చూడరు. అంబటి మురళీపైనే తప్పుడు కేసులు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన ఘటన. భావి సమాజం ఖండించాల్సిన అంశం. మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు చిన్న రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటకు రేటు లేదని ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చూస్తే రూ.2,400. కానీ రూ.1,400, రూ.1,600కు మించి ధర రావడం లేదు. అందుకే ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. ఆ గోదాము ఉన్నది మా పార్టీకి చెందిన అంబటి మురళి ఇంటి పక్కన. ఆయనది అదే ఊరు. ఆయన కూడా కాపు నాయకుడే. కానీ స్థానిక ఎమ్మెల్యే, చంద్రబాబు పోలీసులను పంపుతారు. గోడౌన్పై రైడ్ చేయిస్తారు. ఆ గోడౌన్కు వైఎస్సార్సీపీ జెండాలు కట్టిస్తారు. అభాండాలు వేసి, అబద్ధాలు చెప్పించి మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ను సీజ్ చేశారు. నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. రేటు లేక దాచుకుంటే సీజ్ చేస్తున్నారు. నువ్వు ఎమ్మెస్పీ ఇచ్చి కొంటామంటే ఎందుకు దాచుకుంటారు? ఏం తప్పు చేశారని గోడౌన్ సీజ్ చేశారు? ఆ రైతులకు ఈ రోజు పంట లేదు. చేతిలో డబ్బుల్లేవు. వైఎస్సార్సీపీ నాయకులు, ఇతరులు ఆ గోడౌన్ను చూడడానికి వెళ్తే అడ్డగిస్తున్నారు. జంగిల్ రాజ్ కాకపోతే ఏమిటిది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాంచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? మా కుటుంబంలో మేము ముగ్గురిని కోల్పోయాం. మా తాత, మా నాన్న, మా చిన్నాన్న బలైపోయారు. మేము బాధితులం. కానీ మా పైనే చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా తాత రాజారెడ్డిని దారుణంగా చంపారు. కేవలం మా నాన్న రాజశేఖరరెడ్డిని పులివెందులలో కట్టడి చేయాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యాలయంలో దాచిపెట్టి జైలుకు పంపకుండా రక్షించింది వీళ్లు కాదా? అధికార దుర్వినియోగం చేసింది వీళ్లు కాదా? ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా. మా నాన్న విషయంలోనూ అంతే. నాన్న చనిపోక ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి. ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ మాటలన్న 2–3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ ఈ ఘటనలో నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా.వీటినేమంటారు?» కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మృతుడు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతున్నా, మా వాళ్ల మీదే కేసులు బనాయించారు. » మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన 1999 ఎన్న్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా? » మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా?» మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?» మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా.» చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా?» ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో కొట్టి చంపలేదా? » ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? » సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరు? » వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే.» మల్లెల బాబ్జీ ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? » జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ఈ ఘటనలోనూ వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. » నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడింది మీ పార్టీ లీడర్. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పై ఎలా పెట్టారు?» రెండేళ్లుగా కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు.. ఊరూరా గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపులుబాబు నైజాన్ని దగ్గుబాటి, హరిరామజోగయ్య ఏనాడో చెప్పారుఇదే పెద్దమనిషి చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని అనేక టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బస్సులు తగలపెట్టకపోతే ధర్నాలు కావట! నేను కాదు అన్నది ఈ మాటలు.. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి చెప్పిన మాటలు. తాను రాసిన పుస్తకంలో చంద్రబాబు కుట్రలు, రాక్షస రాజకీయాల గురించి వివరించారు. హరిరామజోగయ్య కూడా చంద్రబాబు ఏ రకంగా కుట్రలు చేస్తాడు.. ఎలాంటి రాక్షస రాజకీయాలు చేస్తాడో సవివరంగా తన పుస్తకంలో రాశాడు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో, కుట్రలతో రాజకీయాలు చేసింది.. చేస్తోంది చంద్రబాబు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేము. గర్వంగా చెబుతున్నాను నేను ఈ మాటలు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చెడ్డోడు అయి ఉంటే వాళ్లు బతికి ఉండేవాళ్లా? మా తాతని దారుణంగా నరికి చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది.. జగన్ మనస్తత్వం ఎలాంటిది.. అని చెప్పేందుకు ఇదొక నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే మాకు రాజకీయాలు ఎలా చేయాలో మా నాన్న నేర్పించారు. చంద్రబాబు మాదిరి హత్యలు చేయమని కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది చంద్రబాబుకు, మాకు మ«ధ్య ఉన్న వ్యత్యాసం. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో? ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో.. ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబుకు 77 ఏళ్ల వయస్సు. బహుశా ఇవి చివరి ఎన్నికలనుకుంటున్నా. ఎన్నికలొచ్చేసరికి మీకు (చంద్రబాబు) 80 ఏళ్లు. ఈ వయసులో కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. ఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో గమనించండి. వినుకొండలో 2024 జూలై 24న వైఎస్సార్సీపీ నేత రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపించే కార్యక్రమాన్ని ఎలా ప్రోత్సహించారో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. (రెండేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు హత్య చేసిన ఉదంతాలను ఆధారాలతో సహా వివరించారు) చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏ రకంగా హత్యలు చేయిస్తున్నాడో? కుట్రలు చేస్తున్నాడో? శవ రాజకీయాలు చేస్తున్నాడో? అందరికీ తెలుసు. ఎవరిది గొడ్డలి పార్టీయో? గొడ్డలి పట్టుకొని ఎంత దారుణంగా హత్యలు చేయిస్తా ఉన్నాడో చెప్పేందుకు ఇవి నిదర్శనాలు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ సాగుతోంది. హత్యా రాజకీయాల మధ్య దారుణమైన పాలన సాగుతోంది. చంద్రబాబు హత్యా రాజకీయాలకు సాక్ష్యాలు ఇవిగో... -
గురువులపై బాబు సర్కారు కత్తి!
ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు కత్తికట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. చిన్నచిన్న విషయాలకు టీచర్లను బలిచేస్తోంది. ఇలా దాదాపు 22 మంది ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయ లోకంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ లోపాలను సరిచేయకుండా వేధింపులకు దిగడం చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని మండిపడుతున్నారు. సాక్షి, అమరావతి: విద్యార్థులను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తే దానికి టీచర్లను బాధ్యులుగా చేసి వేధింపులకు గురిచేయడంతోపాటు సస్పెన్షన్ బహుమతిగా ఇస్తోంది. మీరే రెచ్చగొడుతున్నారంటూ నోటీసులు ఇస్తోంది. బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరినా నేరమే అంటోంది. మీరే రెచ్చగొడుతున్నారంటూ నోటీలిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులను టార్గెట్ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వంలో నాణ్యంగా మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించింది. స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులతో కూడిన ఏజెన్సీల ద్వారా వారానికి 16 రకాల పదార్థాలతో పౌష్టికాహారం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతకు తిలోదకాలిచ్చింది. దీంతో పలుచోట్ల విద్యార్థులే రోడ్డెక్కి నినాదాలు చేయడం, కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో ఇందుకు కారణం ఉపాధ్యాయులేనని ప్రభుత్వం కక్షగట్టింది. మంచి భోజనం పెట్టమంటే సస్పెన్షన్ అస్త్రం » విశాఖ జిల్లా చిన్నగదిలి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని పాఠశాల విద్యార్థులు కంచాలతో రోడ్డెక్కారు. పురుగులు పట్టిన అన్నం, నాణ్యతలేని కూరలు అందిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్ 8న కలెక్టర్ కార్యాలయం తలుపుతట్టారు. దీనికి ఇక్కడి ఉపాధ్యాయులే కారణమని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. » డిసెంబర్ 13న వైఎస్సార్ కడప జిల్లా తాండూరు మండలం ఎదులవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడా ఉపాధ్యాయులను నిందితులుగా చేశారు. భోజనం బాగోలేదని ఉపాధ్యాయులు హెచ్చరించినా వంట ఏజెన్సీకి స్థానిక టీడీపీ నాయకులు అండగా నిలిచి ఉపాధ్యాయులనే బెదిరించారు. తీరా నష్టం జరిగాక టీచర్లనే బాధ్యులను చేసి సస్పెండ్ చేశారు. » ఈ ఏడాది మార్చి 10న ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల(ఎంపీఎస్)లో భోజనం సరిగా పెట్టడం లేదని, వంట దారుణంగా ఉందని విద్యార్థులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు మంచి భోజనం పెట్టాలని వంట ఏజెన్సీని అడిగిన పాపానికి హెచ్ఎంను సస్పెండ్ చేశారు. » మార్చి 17న విజయవాడ సమీపంలోని గొల్లపూడి ఎంపీపీ స్కూల్లో పెట్టే భోజనం బాగోలేదని, చిక్కీల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలను మీరే రెచ్చగొడుతున్నారంటూ హెచ్ఎంకు నోటీసులిచ్చారు. » నెల్లూరు జిల్లా కోడూరు ఎంపీపీఎస్కు చెందిన ఉపాధ్యాయుడు.. విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీ చేసిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని డీఈవోకు మెమోరాండం ఇచ్చారు. ఇదే నేరమన్నట్టు ఆయన్ను సస్పెండ్ చేశారు. » గుంటూరు నగరంలోని మున్సిపల్ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. ఆ సమయంలో ఇన్చార్జి హెచ్ఎం విధుల్లో లేరన్న కారణం చూపి విధుల నుంచి తప్పించారు. వాస్తవానికి ఆమె కొన్ని రోజులుగా మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇది అధికారులకు తెలిసినా ఎమ్మెల్యే మెప్పు కోసం ఆమెపై చర్యలు తీసుకోవడం కొసమెరుపు.» సీఎం చంద్రబాబు జనాభా పెంపునకు నడుం బిగించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని మార్కాపురం మండలం తాళ్లూరు ఎంపీపీఎస్కు చెందిన ఓ టీచర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వెంటనే అధికారులకు ఆగ్రహం కట్టలు తెంచుకుని ‘సీఎంనే ప్రశ్నిస్తావా’.. అంటూ సస్పెండ్ చేశారు. ఈ ఘటనల్లో బాధిత ఉపాధ్యాయులంతా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే. కళ్లముందు జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకు ముగిసిన విద్యా సంవత్సరంలో 22 మంది ఉపాధ్యాయులపై వేటు వేయడం గమనార్హం. -
28న బక్రీద్ సెలవు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా ఈ నెల 28వ తేదీ గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం గతంలో ఈ నెల 27వ తేదీ బక్రీద్ సెలవు దినంగా ప్రకటించింది. అయితే నెల వంక ఆధారంగా ముస్లిం సమాజం బక్రీద్ వేడుకను ఈ నెల 27కు బదులుగా 28 గురువారం నిర్వహించుకోనున్నట్లు విజయవాడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి మార్పు చేసింది. ఈ నెల 27న ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పని చేస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ –1881కు అనుగుణంగా బక్రీద్ సాధారణ సెలవును ఈ నెల 27వ తేదీ బదులుగా 28వ తేదీకి మార్పు చేస్తూ సీఎస్ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
మీరు వైఎస్సార్సీపీ వాళ్లు.. ఉపాధి పని ఇవ్వం!
పిఠాపురం: రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఉపాధి పనుల కల్పనలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ పలువురికి పని కల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా జనసేన నేతలు అడ్డుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మీరు వైఎస్సార్సీపీకి చెందినవారు. కాబట్టి మీకు ఉపాధి పనులు కల్పించేది లేదు’ అంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి వీరబాబు గురువారం ఐదుగురు మేట్లకు (గ్రూప్ లీడర్లు) పని కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నాడు. తనకు జనసేన నేతల నుంచి ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వాకంపై ఐదుగురు మేట్ల కింద పనిచేసే దాదాపు 250 మంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకంలో రాజకీయాలు ఏంటంటూ వందలాది మంది కార్మికులు పనిప్రదేశం వద్దే తీవ్ర ఆందోళన చేపట్టారు. దుర్గాడ గ్రామంలో గత 15 సంవత్సరాల కాలంలో ఉపాధి పథకంలో ఎన్నడూ ఇటువంటి దారుణమైన రాజకీయం చూడలేదని, ఉపాధి హామీలో రాజకీయం చేసిన వ్యక్తులు ఎవరో బయటపెట్టాలని కూలీలు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఉదయం ఐదున్నర గంటలకు పని ప్రదేశానికి చేరుకున్న ఉపాధి కూలీలు 11 గంటల వరకు ఎండలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు అధికారులతో మాట్లాడారు. దీంతో గొల్లప్రోలు ఎంపీడీవో సెలెట్ రాజు కార్మికులు ఆందోళన చేస్తున్న చోటుకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఎంపీడీవో.. ఎట్టకేలకు లాగిన్ నిలిపివేసిన మేట్లకు లాగిన్ పునరుద్ధరించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ వీరబాబు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 15 రోజులు పనికి వస్తే కేవలం వారం రోజులకే నమోదు చేస్తున్నాడు. తనకు నచ్చినవారికి, తాను మెచ్చిన వారికి మాత్రం పనికి రాకపోయినా హాజరు నమోదు చేస్తున్నాడు. రాజకీయ దురుద్దేశంతోనే తమ ఉపాధి మేట్ల లాగిన్లు నిలిపివేశాడు. జనసేన నాయకులతో చేతులు కలిపి ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడుతున్నాడు. – ఉపాధి కూలీల ఆవేదన ఉపాధి కూలీలతో రాజకీయం చేస్తే ఊరుకోం పొట్టకూటి కోసం మండుటెండలో కష్టపడుతున్న నిరుపేదలపై రాజకీయం చేయడం పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడే చూస్తున్నాం. పేదల పొట్ట కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడంతోపాటు దుర్గాడలో రాజకీయం చేస్తున్న ఉపాధి సిబ్బందిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇటువంటి ఘటన జరిగితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. – వంగా గీతావిశ్వనాథ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ -
విద్యుత్ లెక్కల్లో దాగుడు మూతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. దానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి మాత్రం రాష్ట్రంలో జరగడం లేదు. జల విద్యుత్ నామమాత్రంగానే ఉండగా.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధర చెల్లించి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది. మరోవైపు అనధికార విద్యుత్ కోతలతో వినియోగానికి సరిపడా సరఫరా చేస్తున్నట్టు లెక్కల్లో చూపిస్తోంది. 42.95 శాతం అధికం రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ విద్యుత్ వినియోగం 278.911 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే ఇది 42.95 శాతం అధికం కావడం గమనార్హం. మధ్యాహ్నం వేళ గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,358 మెగావాట్లకు చేరుతుండగా.. సాయంత్రం పీక్ డిమాండ్ 12,377 మెగావాట్లు ఉంటోంది. రోజంతా సగటు డిమాండ్ 11,621 మెగావాట్లుగా నమోదైనట్లు ‘స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్’ డైలీ బులెటిన్లో అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది ఇదే రోజున గరిష్ట డిమాండ్ 9,071 మెగావాట్లు మాత్రమే ఉండగా.. ఈసారి 58.28 శాతం పెరుగుదల నమోదైనట్టు స్పష్టం చేసింది. ఈ డిమాండ్ను అందుకోవడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 112.642 మిలియన్ యూనిట్లు, జలవిద్యుత్ నుంచి 6.133 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 31.710 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది. పవన విద్యుత్ ద్వారా 34.418 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ ద్వారా 31.748 మిలియన్ యూనిట్లు, స్వతంత్ర ఉత్పత్తిదారు(ఐపీపీ)ల నుంచి 48.209 మిలియన్ యూనిట్లు వస్తోంది. ఇతర వనరుల నుంచి 14.051 మిలియన్ యూనిట్లు సమకూరాయి. సమాచారం మాయం రాష్ట్రంలో డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం బయటి నుంచి భారీఎత్తున విద్యుత్ కొనుగోలు చేస్తోంది. అయితే.. ఆ కొనుగోళ్ల ఖర్చుల వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టడం లేదు. డైలీ బులెటిన్లో కూడా షార్ట్ టర్మ్ పవర్ పర్చేజ్ వివరాల వద్ద ‘సమాచారం అందుబాటులో లేదు (నో రికార్డ్ ఫౌండ్)’ అని మాత్రమే పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. నిజానికి పవర్ ఎక్చ్సేంజీల నుంచి కొంటున్న విద్యుత్నే ఇతర వనరుల నుంచి సమకూరుతున్నట్టుగా లెక్కల్లో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆందోళన కలిగిస్తున్న బొగ్గు నిల్వలు మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో 7.85 రోజులకు సరిపడే నిల్వలు, రాయలసీమ థర్మల్ ప్లాంట్లో 6.58 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఎండల తీవ్రత కొనసాగితే విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రోజువారీ విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ముందుగానే గుర్తించారు. కానీ ఆ మేరకు విద్యుత్ను సమకూర్చుకోవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది. విద్యుత్ కోతలతో డిమాండ్ను సమతుల్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ విషయం బయటపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రాల్లో విద్యుత్ కోతలపై నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) ఇచ్చే నివేదికను సైతం దాచిపెడుతోంది. విద్యుత్ కొనుగోళ్ల సమాచారం లేదంటూ ఎస్ఎల్డీసీ నివేదికలో పేర్కొన్న భాగం ‘ఎన్ఎల్డీసీ’ విద్యుత్ కోతల సమాచారం లేదంటూ ఎస్ఎల్డీసీ నివేదికలో పేర్కొన్న భాగం -
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై సేవలందించిన నాయకుడిగా మునిశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
AP: బంగారు కిరీటం మాయం కేసు.. రూ. 30లక్షలకు తాకట్టు!
గుడివాడ: గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కేసుకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోహన్రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు,.. ఆ బంగారు కిరీటాన్ని రూ. 30 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఎఫ్ఐర్లో నమోదు చేశారు. దాత సుబ్బారావు ఫిర్యాదుతో చివరకు చర్యలకు సన్నద్ధమయ్యారు పోలీసులు.కాగా, గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు గుడివాడ వెంకటేశ్వర స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్ లాకర్లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు. దాంతో సుబ్బారావు కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించిన పోలీసులు.. ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
AP: భానుడి భగభగలు.. అల్లాడిపోతున్న జనం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అంతకంతకూ ఎండ తీవ్రత పెరిగిపోయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయో ఎండ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈరోజు(గురువారం, మే 21వ తేదీ) రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 48.3 డిగ్రీలు నమోదు కాగా, కృష్ణా జిల్లా కంకిపాడులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా చింతలపూడిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.బయటకు వెళ్లాలంటే భయం..భానుడి భగభగలతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి భయపడుతున్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎండలకు హడలిపోతున్నారు. గత వారం నుంచి ఉదయం మొదలు కొని సాయంత్రం వరకూ తీవ్రమైన ఉక్కపోతతో పాటు సెగలు కక్కే ఎండే కనిపిస్తూ ఉండటంతో సాధారణమైన పనులు చేసుకోవడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఎండలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఉన్న వారు ఏసీ చాటను, ఫ్యాన్లు ఉన్నవారు ఫ్యాన్ల మాటునే సేద తీరుతూ ఊపిరి పీల్చుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటితే గానీ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ఈ ఎండల నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతామా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు. -
టెక్కలి గర్భంలో అరుదైన ఖజానా!
ఇన్నాళ్లూ అక్కడ భూ ఉపరితలంపై ఉన్న గ్రానైట్ కొండలనే చూసి మురిసిపోయాం. దాని ద్వారా కొద్దో గొప్పో ఆదాయం, ఉపాధి లభిస్తున్నందుకు సంతోషపడిపోతున్నాం. కానీ ఆ ప్రాంతం తన గర్భంలో దాచుకున్న అతి అరుదైన, విలువైన ఇరీడియం నిక్షేపాలు వెలికి తీస్తే టెక్కలి ప్రాంతాన్ని, తద్వారా జిల్లాను సంపన్నం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా: ఏపీలో అరుదైన నిక్షేపాలు ఉన్నాయని, వాటి ప్రాసెసింగ్ నిర్వహణతో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం అందజేయవచ్చునని, దీని కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ కింద సుమారు రూ.16,300 కోట్లను కేటాయిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. దీంతో టెక్కలి పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీల్లో అరుదైన నిక్షేపాల కోసం కొన్ని రకాల అంతర్జాతీయ బృందాలు శాటిలైట్ ద్వారా సర్వేలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల కిందట ఇండో జర్మన్ బృందాలు ఇదే మాదిరిగా రహస్యంగా సర్వేలు చేయడం, ఇప్పుడు ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రకటన చేయడంతో అప్పట్లో చేసిన శాటిలైట్ రహస్య సర్వేలు నిజమని తెలుస్తోంది. ఇప్పుడు ఐబీఎం, ఎన్ఎంసీ ఆధ్వర్యంలోనే విదేశీ బృందాలు శాటిలైట్ ద్వారా అరుదైన నిక్షేపాల కోసం టెక్కలి పరిసర ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. గ్రానైట్కు అరుదైన గుర్తింపు టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు గ్రానైట్ను ఎగుమతి చేస్తుంటా రు. అయితే ఇదే ప్రాంతంలో లభించే గ్రానైట్ ముడి సరుకును ప్రాసెసింగ్ చేసిన తర్వాత అద్భుతమైన విధంగా వివిధ రకాల ఆకృతులు రూపుదిద్దుకోవ డంపై విదేశీయులు మక్కువ చూపుతుంటారు. ఇదే టెక్కలి పరిసర ప్రాంతాల్లో రంగు రాళ్లు ఉన్నాయంటూ కొంత మంది రహస్యంగా క్వారీల్లో అన్వేషణ చేశారు. అంతే కాకుండా అరుదైన నిక్షేపాలు ఉన్నా యంటూ గత కొన్నేళ్ల క్రితం ఇండో జర్మన్ కంపెనీలు చేసిన సర్వేల్లో భాగంగా క్వారీల అంతర్భాగంలో అరుదైన ఇరీడియం నిక్షేపాలు ఉన్నట్లు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మాంగనీస్, థోరియం వంటి నిక్షేపాలను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. జర్మనీ బృందం ఆధ్వర్యంలో.. టెక్కలి పరిసరాల్లో కొద్దిరోజులుగా జర్మనీకి చెందిన ప్రత్యేక మైనింగ్ బృందాలు ఈ సర్వే నిర్వహించి నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సంస్థకు చెందిన డైటర్ సవాజ్, క్లాస్ మైకేల్ కూనేలు ఆధునిక క్రాఫ్ట్లు, అత్యాధునిక డ్రోన్ల సాయంతో ఈ సర్వేను రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైనింగ్(ఐబీఎం), నేషనల్ మైనింగ్ కార్పొరేషన్ల సహకారంతోనే ఈ సర్వే జరిగినట్టు అనధికారిక సమాచారం. అయితే సర్వేల్లో భాగంగా ఇరీడియం, మాంగనీస్, థోరి యం వంటి నిక్షేపాలు ఉండవచ్చునని ఆశాభావం నిజమైతే గ్రానైట్ క్వారీ నిర్వాహకుల పంట పండుతుంది. ఖనిజాల వెలికితీత కేంద్రం ప్రకటించిన మేరకు ఏపీలో రేర్ ఎర్త్ మినరల్ హబ్ను ఏర్పాటు చేస్తే మరిన్ని అరుదైన నిక్షేపాల వెలికితీత జరుగుతుంది. ప్రధానంగా టెక్కలి పరిసర ప్రాంతాల్లో లభించే ఖనిజాలు, బీచ్ శాండ్ పరిశోధనలతో విలువైన ఖనిజ సంపద బయట పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రాజెక్టు ఏర్పాటులో కేంద్రం ప్రకటించిన జాబితాలో శ్రీకాకుళం పేరు కూడా ఉండడంతో గ్రానైట్ వర్గాల్లో విస్తృ తమైన చర్చ కొనసాగుతోంది. -
బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్ మీటింగ్స్లో డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మిస్టర్ లోకేష్.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be sameప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్. both can never be sameవిద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be sameఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను గాలికి వదిలేసి దోచేయడం మీ గవర్నెన్స్. both can never be sameబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్? నీ కొడుకు లోకేష్ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు.మెడికల్ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు. -
బాబు.. కేంద్రం గడ్డి పెట్టలేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు.పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు.ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు. -
సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్న చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్ను డైవర్ట్ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు.సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టా లాంటి హెడ్ క్వార్టర్స్కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి.ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్మెన్ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.వేళ్లన్నీ చంద్రబాబు వైపే..వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.పింగళి దశరథ్రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు. -
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్స్టార్ హోటల్స్కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు!
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు సోషల్ మీడియా భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలివ్వలేక ప్రశ్నించే వారిని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పోలీసు వ్యవస్థ కూడా రెడ్బుక్ అరాచకాలకు అలవాటు పడిపోయి అదే పనిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్ల ప్రకటనల్లోని డొల్లతనాన్ని, గతంలో చేసినదాని కంటే భిన్నంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ఎత్తి చూపుతోంది. దీంతో కూటమి సర్కారు గంగవెర్రులెత్తుతోంది. ఎల్లోమీడియా సాయంతో కొద్దోగొప్పో సానుకూల ప్రచారం చేసుకుంటున్నా.. సోషల్ మీడియా ధాటిని మాత్రం తట్టుకోలేకపోతోంది. మామూలుగానైతే సోషల్ మీడియాలో ఏదైనా అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు వస్తే చర్యలు తీసుకుంటూంటారు కానీ... ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను తొలగించేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి పోస్టుల తొలగింపు కోసం పోలీసులు స్వయంగా గూగుల్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలకు లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టుల వల్ల ఇబ్బంది పడ్డవారు లేదా సంస్థలు కోర్టు ఆదేశాల ద్వారా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూంటాయి కానీ.. అంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నారేమో తెలియదు కాని, పోలీసులు తమ అధికార బలం ప్రయోగిస్తున్నారట. పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫేస్బుక్ తదితర వేదికలు స్పందిస్తున్నాయట. ఒకవైపు కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను భయపెట్టాలని చూడడం, మరో వైపు పోలీసులు సాయంతో పోస్టులు తొలగించేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పోలీసుల దుశ్చర్యలపై పోరాటాలు చేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు రీసర్వే, 30 వేల మంది మహిళల మిస్సింగ్ వంటి అనేక అంశాలపై అసత్యాలు ప్రచారం చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా అబద్ధాలు సృష్టించింది. వదంతులు ప్రచారం చేసింది. అయినా అప్పట్లో వారిపై ఈ తరహా కేసులు రాలేదు. కాని కూటమి అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై తమ పెత్తనం చెలాయించే పని మొదలుపెట్టారు. సోషల్ మీడియా విమర్శలకు కూటమి సర్కారు ఎందుకు జంకుతోందో తెలుసుకోవడం ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను హైదరాబాద్లోని వారి స్వగృహాల్లో కలిశారు. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందే మంత్రి లోకేశ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తరిమేశారని, అప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చి ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడపడాన్ని ఆరంభించారని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర మొదలైంది. ‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి కదా విజయవాడ వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ప్రధాని ఏపీ పాలకులను అమరావతిలో కదా.. కలవాల్సింది? హైదరాబాద్లో ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు మంత్రుల కుటుంబాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వీరు చుట్టపుచూపుగా వారం వారం అమరావతి వచ్చిపోతున్నారని వెళుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇదే పాయింట్ ఎత్తిచూపి ఎద్దేవ చేశారు. అంతేకాక 2018లో బీజేపీతో విడిపోయాక చంద్రబాబు, మోడీలు పరస్పరం ఎంత తీవ్రమైన విమర్శలు చేసుకుందీ.. చివరికి వ్యక్తిగతంగా కుటుంబ ప్రస్తావనలు తెచ్చింది కూడా సోషల్ మీడియా గుర్తు చేసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈవిఎమ్ల ట్యాంపరింగ్ జరిగిందని, దమ్ముంటే ఎవరైనా చర్చకు రావచ్చని గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ సవాల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈ వార్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరకాల చేసిన వ్యాఖ్యలను ఖండించ లేకపోతోంది. దీనిని ప్రస్తావిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఒక ప్రశ్న సంధించారు. పరకాల ఇన్ని ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసు కూడా పెట్టలేకపోయిందని, దీనిని బట్టి ఆ ఆరోపణలలో వాస్తవం ఉందని అనుకోవల్సి వస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాల్ దుర్గ అని కోల్కతాలోనే అభివర్ణించారు. మోడీని ఢిల్లీ మహిషాసురుడిగా పోల్చుతూ ఆమె చేతిలో చిత్తు అవుతారని చంద్రబాబు ప్రసంగించారు. అదే చంద్రబాబు ఈసారి బీజేపీ గెలిచిన సందర్భంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీకి నమస్కరిస్తున్న తీరుపై వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.మంత్రి లోకేశ్కు మద్దతుగా 99 పైసలకే పరిశ్రమలకు భూములు కేటాయించడం గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అనగానే ఇతర రాష్ట్రాలలో అవే పరిశ్రమలు వందల కోట్లు ఖర్చు చేసి భూములు ఎలా కొనుగోలు చేస్తున్నది వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ తదితరులు ఆంగ్ల మీడియంపై ఎలాంటి విమర్శలు చేసింది వివరించే పేపర్ క్లిపింగ్గులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపించాయి. ఇవే కాదు..చంద్రబాబు ఆయా సందర్భాలలో చేసిన చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. సహజంగానే ఇలాంటివి చంద్రబాబు టీమ్కు ఇబ్బంది కలిగిస్తూంటాయి. తమ పరువుకు భంగం కలుగుతోందని, ప్రభుత్వ పరపతి దెబ్బతింటోందని భావిస్తాయి. ఇదీ నేపథ్యం.. ఎలాగైనా సోషల్ మీడియాను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన చేస్తూ టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే పోలీసులు శరవేగంగా స్పందించడం పరిపాటై పోయిందన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్ ) తొలగించాలని, వారి అక్కౌంట్లను బ్లాక్, లేదా సస్పెండ్ చేయాలని పోలీసులే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు నోటీసులు పంపుతున్నారని జగన్ అన్నారు. ఇది సోషల్ మీడియాపై వ్యవస్థీకృతంగా సెన్సార్ షిప్ విధించడమేనని విమర్శించారు. జగన్ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసుల నుంచి కాని ఎలాంటి సమాధానం రాలేదు. కొద్ది రోజుల క్రితం మాజీ ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి, మాజీ మంత్రి కన్నబాబులు కూడా పలు ఉదాహరణలు ఇస్తూ పోలీసులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో మాట్లాడిన విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తొలగించాలని పోలీసులు లేఖలు రాశారట.ఇ దంతా కొత్త ట్రెండ్. గతంలో రాజకీయ విమర్శలపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించలేదు.మహా అయితే వారి వాదన చెబుతారు. ఖండనలు ఇస్తారు. అవేమీ ఇవ్వకుండా వీడియోలు తొలగించే పనిలో పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం అవుతోంది. ఇవన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే మీరేమన్నా చేసుకోండి..మా మొండి వైఖరి మాదే..మా రెడ్బుక్ రాజ్యాంగం మాదే.. ఏమైనా మా తప్పులను ప్రశ్నిస్తే ఊరుకోం..అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారేనో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్లు చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబుకి బీపీ పెరుగుతోందిఇచ్చిన హామీలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజల బాగోగులను గాలికి వదిలేశారుఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారురాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారురెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలిఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందిచంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుతప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోందిమావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టంఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారుచంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందిఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారుస్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారుఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారుఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారుస్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారుప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందిరాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాంరాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాంఅమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలిమావిగన్లో అన్నీ ఉన్నాయిప్రజలు కూడా మావిగన్కు మద్దతు పలికారుఅది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారుతాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారుఅమరావతిలో విచ్చలవిడి దోపిడీనేరూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. పర్మినెంట్ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారుమళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారుకొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారుభవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారుఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20, 427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉందివాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాటఫైవ్స్టార్ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందితెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారుమన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు??కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారుఅమరావతిలో రోడ్ల వ్యయం చూస్తే కళ్లు తిరుగుతాయికిలోమీటర్ ఖర్చు రూ.24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పిందిఅమరావతిలో కిలో మీటర్ ఖర్చు రూ.53 కోట్లు అవుతోందిఅమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతోందిచంద్రబాబు తన మనుషులకు రోడ్ల పక్క భూములు ఇప్పించారుసామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారు50 వేల ఎకరాలు సరిపోవని మళ్లీ లాక్కుంటున్నారుఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనేవీటన్నింటిని ఆధారాలతో సహా బయటపెడితే చంద్రబాబుకి బీపీ వస్తోందిచంద్రబాబూ.. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారుజాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పిందిటాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారువైఎస్సార్సీపీపై బుదర జల్లాలని చూస్తున్నారుకల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారుచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు.. మేం బాధితులంమా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారుమా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా?అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారుమా నాన్న రాజశేఖర్రెడ్డి విషయంలోనూ అదే జరిగిందిఅసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారుతర్వాత 4 రోజులకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారుఅవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండిమా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉందిమా చిన్నాన్న వివేకాను అవినాష్ చంపించాడంటూ ప్రచారం చేశారుఅవినాష్ కోసం వివేకా కృషి చేశారుఅలాంటి వివేకాను అవినాష్ చంపించారని బురద చల్లారుచంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడుఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్.. చంద్రబాబు లాయర్ అయిన లూథ్రానేక్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలినందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్చేయలేదా?ఎవరిది గన్ కల్చరో చెప్పాలిఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్మన్ను బండరాయితో కొట్టి చంపారుహరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడారుఎవరివి శవ రాజకీయాలో చంద్రబాబు చెప్పాలిరాజకీయ జీవితం ఇచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచారుపేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాను నరికి చంపారుఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేఎన్డీఆర్పై దాడి చేసి మల్లెల బాబ్జీ లాడ్జిలో శవమై తేలాడుతనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్ దొరికిందిమల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణే జరగలేదుచంద్రబాబుది రాక్షస రాజకీయంవిజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి ధశరథ్రామ్ దారుణ హత్యకు గురయ్యారుఈ హత్య కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయిబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారుచంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటి అప్పుడే చెప్పారుమాది విలువలతో కూడిన రాజకీయంచంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే.. మేం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నాంమా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు.. మేం చెడ్డోళ్లమైతే వాళ్లు ఉండేవాళ్లా?జగన్ నైజానికి ఇదే నిదర్శనంచంద్రబాబులా మాకు హత్య రాజకీయాలు నేర్పించలేదుచంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎన్నికలుఈ వయసులోనూ ఇలాంటి దౌర్భగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా?స్కామ్ వాళ్లది.. కేసు మా నేతపైనజంగిల్రాజ్లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయిఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ వాళ్లను దారుణంగా చంపారువినుకొండలో రషీధ్ను నడిరోడ్డుపై నరికి చంపారుచంద్రబాబుకు ఎప్పు ఇబ్బంది వచ్చినా అబద్ధం సృష్టిస్తారుబాబు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారుఆయన హయాంలోనే కల్తీ మద్యం ఘటన జరిగిందికానీ, మా పార్టీ నేత పేరును కేసులో చేర్చారుటీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరులు కల్తీ మద్యం చేస్తూ దొరికారుచేసింది చంద్రబాబు అనుచరులతే కేసు మాత్రం ఈ దందాను బయటపెట్టిన జోగి రమేశ్ పై పెట్టారుతప్పుడు కేసుతో 83 రోజులు జైల్లో పెట్టారుబెయిల్పై బయటకు వస్తే యాసిడ్ బాటిల్స్ దాడి చేశారుదాడికి పాల్పడిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారుకల్తీ మద్యం కేసును ఎంత దారుణంగా మార్చారో అంతా చూశారుమామిళ్లపల్లిలో తప్పు వాళ్లదేమామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారుకాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు రైతులు గోడౌన్లో పంట నిలవ చేసుకున్నారుమామిళ్లపల్లిలో ఎక్కడా తప్పు జరగలేదని వాళ్లకూ తెలుసుఅయినా గోడౌన్ అంబటి మురళిదని ప్రచారం చేశారుగోడౌన్లోనూ వైఎస్సార్సీపీ జెండాలను టీడీపీవాళ్లే పెట్టారుఅక్రమంగా నిల్వచేశారని తప్పుడు కేసులు పెట్టారుగోడౌన్ను కూడా సీజ్ చేశారుగిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్లో ఎందుకు పెట్టుకుంటారు?పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై దౌర్జన్యం చేశారుమహిళలపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారుఏపీలో సోషల్ మీడియా సెన్సార్ఏపీలో సోషల్ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారుప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదుప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ను కనపడకుండా చేస్తున్నారుసోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారుకార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారుఎఫ్ఐఆర్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు పంపిస్తున్నారుచంద్రబాబు పెట్రో మాయఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అన్నారుపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు, అలాగే డీజిల్పై 22.5 శాతం వ్యాట్తో అదనంగా 4 రూపాయిలు పెంచారుకోవిడ్లాంటి మహమ్మరి టైంలోనూ రోడ్ సెస్ కింద మేం పెంచింది రూపాయి మాత్రమేకానీ, వైఎస్సార్సీపీ హయాంలో పెట్రోల్ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయంటూ నానాయాగీ చేశారుఅప్పట్లో బాబు, లోకేష్, పవన్లు పొలిటికల్ డ్రామా చేశారుఎన్నికల టైంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లు ప్రకటించారుటీడీపీ మేనిఫెస్టోలోనూ ఇంధన ధరల తగ్గింపు ఉందిరెండేళ్లైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదుగత నెలలో బంకుల వద్ద బారులు తీరారుఇంధన సంక్షోభంలోనూ చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారుఆ టైంలో అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్ల్లో ఇప్పించాలని కోరారుచంద్రబాబుకి చీవాట్లు పెడుతూ కేంద్రం లేఖ పంపిందిరిటైల్ బంకుల్లో ఎలా డీజిల్ అడుగుతారని చెప్పిందిఆ టైంలోనూ ప్రజల గురించి కాకుండా కాంట్రాక్టర్ల గురించి ఆయన ఆలోచించారుహామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారుఇప్పటికైనా క్షమాపణలు చెప్పి ధరలు తగ్గించాలిపెట్రోల్ లీటర్కు రూ.8 తగ్గించాల్సిందే మినిమమ్ డ్యూటీ మరిచిన పోలీసులుపొదుపు చర్యల పేరుతో చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారువాళ్లు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారుఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారుఏ కాలేజీలో చూసినా గంజాయి కనిపిస్తోందిరాష్ట్రంలో మాత్రం పోలీసులకు కనిపించడం లేదువ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారుపోలీసులు కనీస విధులు కూడా మరిచిపోయారుమా హయాంలో దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహంచంద్రబాబు నోరు తెరిస్తే అబద్దం.. మోసంఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారుసూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా తేలాయిమా హయాంలోనీ పథకాలన్నీ నిలిపివేశారుపొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉందిపంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఇన్ఫుట్ సబ్సీడీ లేదు.. ఈ క్రాప్ లేదుమొక్కజోన్న, పొగాకు, శనగ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారుకేంద్రం ఇచ్చేది కాకుండా.. అన్నదాన సుఖీభవకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. అంటే ప్రతీ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాలిఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్నారునిరుద్యోగికి రూ.3 వేల భృతి అన్నారు.. అంటే ఈ రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డారుఏపీలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు16 కేటగిరీల్లో ఐదింటికి మాత్రమే అనుమతించారుఇప్పుడు దానికి కూడా కోత పెడుతున్నారు12 డిపోలను ప్రైవేట్పరం చేశారుఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తెస్తారంటఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి.. దానికి ఫ్రీ పథకం వర్తించదని చెబుతున్నారుభవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు.. ఆర్టీసీ ఉండదుమా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాంబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారుఅమ్మ ఒడి పథకంలో 20 లక్షల మందికి కోత పెట్టారుహామీలు అమలు చేస్తామని స్వయంగా బాండ్లు పంపిణీ చేశారుగ్రామాల్లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఆ హామీల సంగతి ఏమైందని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారుఉద్యోగులను దారుణంగా మోసం చేశారుమా హయాంలో ఉద్యోగులకు ఏనాడూ ఇబ్బందులు కలగలేదుసంతానమే సంపదట.. మరి లోకేష్ సంగతేంటి?ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారురూ. 30 వేలు, రూ.40 వేలు నగదు ప్రొత్సాహకం ఇస్తామని మభ్యపెడుతున్నారుసూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారుచంద్రబాబుకు ఒక్కడే కొడుకు.. లోకేష్కు ఒక్కడే కొడుకుబాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదాప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలటవాళ్లు మంచి చదువుకోకూడదటఇదేం దిక్కుమాలిన ఆలోచన?విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ మా హయాంలో మూలన పడలేదుపిల్లలకు మేనమామలా మంచి చదవులు చదివించాఇవాళ.. కనీసం గోరుమద్దలు కూడా అందని పరిస్థితిసరైన ఆహారం అందక ఆస్పత్రి పాలవుతున్నారువ్యవస్థలన్నీ ఇంత దారుణంగా, అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి?మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గంకుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలియస్ లోకేస్.. బోత్ ఆర్ నాట్ సేమ్బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ సినిమా డైలాగులు కొడుతున్నాడుఅవును.. బోత్ ఆర్ నాట్ సేమ్వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీదిప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాదిప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్పనులు చేసి చూపించడం మా స్టైల్.. పబ్లిసిటీ చేసుకోవడం మీ స్టైల్బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాదిరెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీదివిద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం.. ప్రజల చెంతకు పాలన, మహిళా సాధికారికత, మహిళా రక్షణ.. వీటిని ఆచరణలో చూపించడం మేం చేశాంఅందుకే బోత్ ఆర్ నాట్ సేమ్వైఎస్సార్సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్పై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..ప్రజాస్వామ్యంలో ఏది ఇస్తావో అల్టిమేట్గా అదే తిరిగి వస్తుందిప్రతీ పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నాచంద్రబాబు ప్రలోభాలు, భయంతోనూ పోలీసులు పని చేయొద్దురేపు ప్రభుత్వం మారాక ఎంక్వైయిరీ ఉంటుందితప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతాంసప్తసముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. తీసుకొస్తాం ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా.. టీవీకే అధినేత విజయ్ వైఎస్ జగన్ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ సాధించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందన -
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
-
ఉపాధ్యాయ విద్యకు గ్రహణం
సాక్షి, అమరావతి: బీఈడీ కళాశాలల్లో కనీస ప్రమాణాలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. అత్యంత పారదర్శకంగా, విలువలతో సాగాల్సిన బీఈడీ బోధనను అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువుగా మార్చేసింది. ఫలితంగా ఏపీలోని ప్రైవేటు బీఈడీ కళాశాలల తరగతి బోధనలో అధ్యాపకులు ఎక్కడా కనిపించట్లేదు. అసలు విద్యార్థులకు క్లాసులే జరగట్లేదు. దొంగ హాజరుతో విద్యార్థులు లేకుండానే ప్రాక్టికల్స్ నిర్వహించి కేవలం థియరీ పరీక్షలకు హాజరైతే చాలు పాస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న దౌర్భాగ్య విద్యా విధానం అమలు జరుగుతోంది.ముఖ్యంగా ఆచార్య నాగార్జున, ఆంధ్రకేసరి, ఆంధ్రవర్సిటీ, రాయలసీమ, యోగివేమన, అంబేద్కర్ వర్సిటీ పరిధిలోని ప్రైవేటు బీఈడీ కళాశాలలు పొరుగు రాష్ట్రాల విద్యార్థులకు సీట్ల వలవేసి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం యథావిధిగా మామూళ్ల మత్తులో జోగుతూ ప్రైవేటు కళాశాలలపై నిఘాను గాలికొదిలేయడం.. విద్యాహక్కు చట్టాన్ని అభాసుపాలు చేస్తోంది. బీఈడీ పెద్ద వ్యాపారం!రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో 450 బీఈడీ కళాశాలలు ఉంటే వీటిలో 98 శాతంపైగా ప్రైవేటు కళాశాలలే. ఏటా 40 వేలకుపైగా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. కానీ, కన్వీనర్ కోటాలో కేవలం 4–5 వేలు మాత్రమే భర్తీ అవుతున్నాయి. మిగిలిన సీట్లను ప్రైవేటు యాజమాన్యాలు స్పాట్, కేటగిరీ–బీ కోటాలో రూ.లక్షలు వసూలు చేసుకుని భర్తీ చేసుకుంటున్నాయి. 2024లో 37 వేలు, 2025లో 39 వేల సీట్లు భర్తీ అయితే వీరిలో అత్యధికంగా నాన్ కన్వీనర్ కోటాలో పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రైవేటు బీఈడీ యాజమాన్యాలు ఒడిశా, బీహార్, బెంగాల్, అసోం, మిజోరాం వంటి రాష్ట్రాల్లోని విద్యార్థులకు వలవేసి ఇక్కడ బీఈడీ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థులు కళాశాలలకు హాజరవ్వాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు ఇచ్చి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు. ప్రాక్టికల్స్, రికార్డ్స్ వంటి విద్యా కార్యక్రమాలకు ప్రత్యేక రేట్లు పెట్టి విద్యార్థులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి బీఈడీ విద్యను దిగజారుస్తున్నారు. రోడ్డునపడిన 10 వేల మంది అధ్యాపకులుపాఠాలు చెప్పే అవసరం లేకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు అధ్యాపకుల ఉద్యోగాలను సైతం ఊడగొట్టి రోడ్డున పడేశాయి. ఇప్పుడు ఏ ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో పాఠాలు చెప్పే వాళ్లు లేరు. వినేవారు లేరు. వీరందరినీ కాగితాలపైనే చూపిస్తూ కనికట్టు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ముడుపులు దండుకుని గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తూ వ్యవస్థలను నాశనం చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 10వేల మందికిపైగా బీఈడీ అధ్యాపకులు రోడ్డున పడ్డారు. వీరిలో అట్టడుగు వర్గాలకు చెందిన వారే అధికం. అధ్యాపకుల విషయంలో ఎన్సీఈటీ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా పీజీలు, పీహెచ్డీలు చేసిన వేలాది మంది అధ్యాపకులు నిరుద్యోగులు మిగిలిపోయారు. రాష్ట్రంలోని 90 శాతానికిపైగా బీఈడీ కళాశాలలు అసలు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు లేకుండానే నడుస్తుండడం గమనార్హం. కేవలం ఒక కంప్యూటర్ ఆపరేటర్ను పెట్టుకుని కళాశాలలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం వేడుక చూస్తోంది. రాజధాని సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు సీటు నుంచి కదలకుండానే లక్షల్లో ముడుపులు తీసుకుంటూ బీఈడీ కళాశాలల్లో అంతా పారదర్శకంగా ఉందని కాగితాలపై సంతకాలు పెట్టేస్తున్నారు.జగన్ ప్రభుత్వ సంస్కరణలు నిర్వీర్యంవైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బీఈడీ విద్యను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. జ్ఞానభూమి వెబ్సైట్లో కచ్చితంగా అధ్యాపకుల వివరాలు, సర్టిఫికెట్లతో సహా నమోదు చేయాలని నిబంధన విధించింది. ఫలితంగా అధ్యాపకుల ఆధార్ వివరాల ప్రకారం ఎక్కడ పని చేస్తున్నారో స్పష్టంగా తెలిసేది. ఒక అధ్యాపకుడు ఒకచోటనే పని చేసేవారు. కానీ, ఇప్పుడు జ్ఞానభూమికి తిలోదకాలు ఇవ్వడంతో ప్రైవేటు యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి.ఏపీలో డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్టిఫికెట్లు తీసుకొచ్చి రెండుమూడు బీఈడీ కళాశాలల్లో తప్పుడు ఆధార్ నంబర్లు ఎంటర్ చేసి జ్ఞానభూమి వెబ్సైట్లో నమోదుచేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు తెలంగాణలో పనిచేస్తున్నవారి జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి జ్ఞానభూమి వెబ్సైట్లో అప్లోడ్ చేసి అనుమతులు తెచ్చుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి అఫిలియేషన్ ఇవ్వాల్సిన యూనివర్సిటీల అధికారులు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుని గుర్తింపులు జారీచేస్తున్నారు. విచిత్రంగా వయో పరిమితి దాటిన వారిని సైతం అధ్యాపకులుగా చూపిస్తుండటం గమనార్హం. ఇటీవల ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేయాలని వాటిని బట్టే అఫ్లియేషన్లు ఇవ్వాలని సర్కులర్ జారీ చేయగా వాటిపై టీడీపీ అనుకూల బీఈడీ కళాశాలలు కోర్టుకు వెళ్లిమరీ తాత్కాలిక ఉపశమనం పొందాయి. ఈలోగా అఫ్లియేషన్లు తంతు ముగించుకోవచ్చని భావిస్తున్నాయి. -
స్వా‘భీమా’నం కర్ణాటకకు తాకట్టు
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్భద్రతో జల దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక.. ఇప్పుడు కృష్ణానదికి మరో ప్రధాన ఉపనది భీమాపై కల్బుర్గి జిల్లా సొంతి వద్ద బ్యారేజ్తోపాటు ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేస్తోంది. భీమా నదిలో 15 టీఎంసీలకు మించి వినియోగించుకోకూడదని కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) నిర్దేశించినా అంతకంటే ఎక్కువ నీటినే ఆ రాష్ట్రం ఇప్పటికే వినియోగించుకుంటోంది. సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల ద్వారా భీమా జలాలను మరింతగా తరలించుకోవడానికి ఇప్పుడు యత్నిస్తోంది. దీనికి సీడబ్ల్యూసీ వంతపాడింది. సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలకు అనుమతిస్తూ మార్చి 25న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), సాంకేతిక సలహా మండలి(టీఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను హరిస్తూ కర్ణాటక చేపట్టిన సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు మౌనం దాల్చింది. సీడబ్ల్యూసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ రైతులు మండిపడుతున్నారు. కృష్ణా జలాలపై ఎగువ రాష్ట్రాలకు రాష్ట్ర హక్కులను చంద్రబాబు సర్కారు తాకట్టు పెడుతుందనడానికి సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల మరో తార్కాణం అని సాగునీటిరంగ నిపుణులు, రైతు సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు టీఎంసీల ఎత్తిపోత.. 40 వేల ఎకరాలకు నీళ్లు కృష్ణా బేసిన్(పరీవాహక ప్రాంతం)లో భీమా సబ్ బేసిన్లో 15 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోకుండా కేడబ్ల్యూడీటీ–1 పరిమితిని నిర్దేశించింది. కానీ భీమా జలాలను భారీ ఎత్తున ఇప్పటికే కర్ణాటక సర్కారు మళ్లిస్తోంది. మరింతగా మళ్లించేందుకు 2015లో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టింది. ఆ రాష్ట్రంలో కల్బుర్గి జిల్లాలో చిట్టాపూర్ తాలుకాలోని తర్వార్పేట్ వద్ద భీమాపై బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 4 టీఎంసీలను ఎత్తిపోసి కల్బుర్గి, యాద్గిర్‡ జిల్లాలలో 40 వేల ఎకరాలకు నీళ్లందించేలా సొంతి ఎత్తిపోతలను కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఈ బ్యారేజ్, ఎత్తిపోతలకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ను సమర్పించింది.. దీనిపై 2015, మే 25న సీడబ్ల్యూసీ టీఏసీ 125వ సమావేశంలో అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హక్కులను హరించే ఈ నిర్ణయంపై చంద్రబాబు సర్కార్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనుమతిచ్చేసిన సీడబ్ల్యూసీ.. అటవీ అనుమతుల్లో జాప్యం వల్ల సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల పనులు గడువులోగా కాంట్రాక్టర్ పూర్తి చేయలేకపోయారు. తాజాగా అటవీ అనుమతులు తెచ్చిన కర్ణాటక సర్కార్.. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.942.39 కోట్లకు సవరిస్తూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ను సమర్పించింది. ఈ ఏడాది మార్చి 25న సీడబ్ల్యూసీ టీఏసీ 160వ సమావేశంలో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలను అజెండాలో చేర్చి, చర్చించింది.. తాజా సమావేశంలోనూ సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసింది. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ఈ బ్యారేజీ, ఎత్తిపోతలపై రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఎలా అనుమతిస్తారని సీడబ్ల్యూసీని నిలదీయాల్సిన చంద్రబాబు సర్కార్ తద్భిన్నంగా మౌనవ్రతం పాటిస్తోండటంపై రైతులు మండిపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల పనులు.. ఆయకట్టును చూస్తే భీమా ప్రవాహాన్ని భారీ ఎత్తున మళ్లించే లక్ష్యంతోనే ఈ ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుంచి ప్రవాహం వచ్చేదెన్నడు?ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడం ద్వారా మరో 100 టీఎంసీలను డ్యాంలో నిల్వ చేయడంతోపాటు 130 టీఎంసీలను వినియోగించుకునేలా కర్ణాటక సర్కార్ అప్పర్ కృష్ణ ప్రాజెక్టు మూడో దశ పనులను వేగవంతం చేసింది. ఇక తుంగభద్ర సబ్ బేసిన్లో తుంగభద్ర డ్యామ్కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది. ఇక 29.9 టీఎంసీలను తరలించేలా అప్పర్ భద్రను చేపట్టిన కర్ణాటక పనులు వేగవంతం చేసింది. ఇప్పుడు భీమాలోనూ అదే తీరు. కృష్ణా ప్రధాన పాయ, ప్రధాన ఉప నదులు తుంగభద్ర, భీమా ప్రవాహాలను కర్ణాటక ఎక్కడికక్కడ కట్టడి చేస్తే శ్రీశైలానికి ఎగువ నుంచి వరద చేరేదెన్నడని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైతే ఎగువ నుంచి నీటి చుక్క కూడా శ్రీశైలానికి చేరే అవకాశం ఉండదు. శ్రీశైలం, సాగర్పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టులో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా దొరకవని తేల్చిచెబుతున్నారు. -
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్గా కూడా చాలాకాలం సేవలు అందించారు. -
మాఫియా రాజ్యం.. రాజ భోజ్యం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పాపాఘ్ని నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ.. అక్రమంగా రవాణా చేస్తూ.. యథేచ్ఛగా దోచేస్తుండటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ–చెన్నై) కన్నెర్ర చేసింది. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగించే ఈ అక్రమ తవ్వకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదులు, వాగులు, వంకల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల దన్నుతో ఇసుకాసురులు భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ.. అక్రమంగా రవాణా చేస్తూ.. అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తుండటంపై పర్యావరణ వేత్తలు, రైతులు ఎన్జీటీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా చక్రాయిపేట మండలం కుమ్మరకాలవ వద్ద పాపాఘ్ని నదిలో భారీ పొక్లెయిన్లతో ఇసుకను తవ్వేస్తూ వందలాది భారీ టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలుగుతోందని కొవ్వూరు శ్రీధర్రెడ్డి అనే రైతు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, వాయు కాలుష్య నియంత్రణ చట్టం–1981, జల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చట్టం–1974, ఈఐఏ9 (పర్యావరణ ప్రభావ అంచనా) నోటిఫికేషన్–2006, ఇసుక మైనింగ్మార్గదర్శకాలు–2016, ఇసుక తవ్వకంపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2020లో జారీ చేసిన మార్గదర్శకాలు.. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ, సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన తీర్పులను తుంగలో తొక్కుతూ.. పాపాఘ్ని నదీ గర్భంలో ఇసుకను దోచేస్తున్నారంటూ రైతు శ్రీధర్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన వాదనతో ఎన్జీటీ ఏకీభవించింది. ఇసుక అక్రమ తవ్వకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్ నియమించే ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నియమించే మరో ప్రతినిధితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించి, నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాయింట్ కమిటీకి నిర్దేశించింది. జాయింట్ కమిటీకి ఇసుక అక్రమ తవ్వకాల వివరాలు, ఆధారాలు ఇవ్వాలని రైతు శ్రీధర్రెడ్డికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నదులను చెరబట్టిన ‘పచ్చ’ ముఠా రాష్ట్రంలో ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడానికి జిల్లా స్థాయిలో జిల్లా ఇసుక కమిటీల(డీఎల్ఎస్ఈ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. గనులు, భూగర్భ జలాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతంలో ఇసుక తవ్వుకోవచ్చో సర్వే చేసి, పర్యావరణ అనుమతులు ఇచ్చేది ఈ కమిటీనే. ఈ కమిటీ అనుమతి ఇచ్చిన ప్రదేశాలతోపాటు అనుమతి ఇవ్వని ప్రాంతాల్లోనూ గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు చిన్న చిన్న వాగులు, వంకల్లో కూడా పచ్చ ముఠా యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తోంది. నిబంధనల ప్రకారం నదులు, వాగులు, వంకల్లో అనుమతి ఇచ్చిన క్వారీలలో కేవలం కూలీలతో మాత్రమే ఇసుకను తవ్వించాలి. కానీ.. టీడీపీ నేతలతో కూడిన ఇసుక మాఫియా భారీ హిటాచీలు, పొక్లెయిన్లతో నదీ గర్భాన్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దాంతో నదుల స్వరూపం మారిపోతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రీచ్లలో కూడా కేవలం ఒక మీటరు లోతు వరకు మాత్రమే ఇసుక తీయాలి. కానీ.. భారీ పొక్లెయిన్లు, హిటాచీలతో 10 అడుగుల కంటే ఎక్కువ లోతు తవ్వేయడం వల్ల నదీ గర్భం విధ్వంసానికి గురైంది. నదులను విధ్వంసం చేస్తూ, ఇసుకను అక్రమంగా రాష్ట్రంతోపాటు సరిహద్దు రాష్ట్రాలకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ భారీ ఎత్తున దోచేస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో సమీప ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. నదిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరక్క జంతువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. తాగునీటి కోసం జనం తల్లడిల్లుతున్నారు. ఎన్జీటీకి భారీ ఎత్తున ఫిర్యాదులు దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రాయలసీమ ప్రాంతంలో పెన్నా బేసిన్ విస్తరించింది. పెన్నాకు పాపాఘ్ని ఉప నది. పాపాఘ్ని పరీవాహక ప్రాంతంలో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఆ నదిలోనే ఇసుకాసురులు అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తుండటం వల్ల నదీ గర్భం ఒట్టిపోయింది. ఇక కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా తీవ్ర స్థాయిలో పేట్రేగిపోతోంది. సీఎం చంద్రబాబు కృష్ణా నదీ గర్భంలో నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇసుకను అడ్డగోలుగా భారీ యంత్రాలతో తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో కృష్ణా బేసిన్తోపాటు గోదావరి బేసిన్లోనూ ఇసుక మాఫియా అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తూ తెలంగాణకు తరలిస్తూ భారీ ఎత్తున దోచేస్తోంది. వంశధార, నాగావళి, పంపా, ఏలేరు వంటి నదుల్లోనూ ఇసుక మాఫియా తడాఖా చూపిస్తోంది. నదీ గర్భాలను ఇసుక మాఫియా తవ్వేస్తుండటం వల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలగడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం వల్ల బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. ఇది లక్షలాది మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ ఇసుక మాఫియా అక్రమాలపై ఎంతో మంది రైతులు ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వందలాది మంది రైతులు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బెదిరించి నిత్యం 50 టన్నుల ఖనిజం దోపిడీ వేంపల్లె మండలం తాళ్లపల్లె సమీపంలో ఉన్న నియామతుల్లా మైన్లో దౌర్జన్యంగా బెరైటీస్ను దోపిడీ చేస్తున్నారు. గని యజమాని అనుమతి లేకుండా అక్రమంగా మైనింగ్ కొనసాగుతోంది. అదే ప్రాంతంలోని వేంపల్లె, వేముల మండలాలకు చెందిన టీడీపీ నేతలు మూడు చోట్ల యజమానితో సంబంధం లేకుండానే మైనింగ్ చేస్తున్నారు. నిత్యం కనీసం 50 టన్నుల ఖనిజాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా రౌడీల పహారాలో గనుల్లో చొరబడి అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. టన్నుకు రూ.3,200 రాయల్టీ చెల్లించాల్సి ఉండగా.. ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఒక్క నియామతుల్లా మైన్ ద్వారానే రోజుకు రూ.1.6 లక్షల రాయల్టీ ఫీజు రావాల్సి ఉండగా.. ప్రభుత్వానికి దక్కడం లేదు. ఇదే పరిస్థితి టిఫెన్ బెరైటీస్లోనూ నెలకొంది. రాత్రి వేళల్లో మైనింగ్ చేస్తూ బెరైటీస్ ఖనిజాన్ని తరలించుకుపోతున్నారు. అక్రమ మైనింగ్పై నియామతుల్లా గత ఏడాది జూలై 31 నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. జిల్లా మైనింగ్ ఏడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ (మైన్స్), డీజీపీ, కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. పైగా టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి పేరిట మైనింగ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ద్వారా సీజ్ అయిన బెరైటీస్ ఖనిజాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) నుంచి ఎంబసీ గ్రూపు (టిఫిన్ కంపెనీ) వేలంలో కొనుగోలు చేసింది. వేముల వద్ద ఆ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఖనిజం లోంచి సంక్రాంతి పండుగ రోజున రాత్రికి రాత్రి రూ.10 కోట్లు విలువైన 3,500 టన్నుల ఖనిజాన్ని పదుల సంఖ్యలో లారీల ద్వారా ఎత్తుకెళ్లడం నివ్వెర పరుస్తోంది. మొత్తంగా రూ.100 కోట్లు విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి జిల్లాలో ఇసుక, మైనింగ్ మాఫియా ఏ స్థాయిలో పాతుకుపోయిందో స్పష్టమవుతోంది. అక్రమ మైనింగ్పై గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు పులివెందుల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వానికి రాయల్టీ ఫీజు దక్కడం లేదు. మైన్ ఓనర్కు ఆదాయం కొల్లగొట్టుతున్నారనిఫిర్యాదు చేస్తే, అధికారులు టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవితో మైనింగ్ ఒప్పందం చేసుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. సేఫ్టీ రూల్స్ పాటించకుండా అక్రమంగా బ్లాస్టింగ్, మైనింగ్ కొనసాగిస్తున్నారు. ప్రమాదాలు సంభవిస్తే నాపైనే కేసులు నమోదు చేస్తున్నారు. భవిష్యత్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి పెనాల్టీ వేస్తే ఎవరు చెల్లించాలి? ఇవన్నీ నేను పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఎలాంటి స్పందన లేదు. – ఎండీ నియామతుల్లా, మైన్ యజమాని నదులను చెరబట్టిన పచ్చ తోడేళ్లుసాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చెయ్యేరు, పెన్నా, పాపాఘ్ని, చిత్రావతి నదులను టీడీపీ నేతలు చెరబట్టారు. మరోవైపు బెరైటీస్ ఖనిజం దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమార్కులు అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాజంపేట–రాయచోటి మార్గంలోని బాలరాచపల్లె వద్ద చెయ్యేరులో నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్థితిలో గత నెలలో రాజంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 12 ఇసుక అక్రమ లారీలను సీజ్ చేశారు. బాలరాచపల్లె హైలెవల్ వంతెన సమీపంలోనే అడ్డగోలుగా హిటాచీలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుండటం విస్తుగొలుపుతోంది. తవ్వకాల కారణంగా సమీప గ్రామ ప్రజలకు తాగునీరు కూడా కరువైంది. కొండాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, వీరపునాయునిపల్లె ప్రాంతాల్లో ఏడాదిన్నరగా యథేచ్ఛగా నదుల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.ఏకంగా నదుల్లోకి రహదారులు ఏర్పాటు చేసి మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. పాపాఘ్ని నదిలో కోగటం వద్ద ఇసుక అక్రమ రవాణా వ్యవహారంపై ఆ గ్రామానికి చెందిన జి.వీరారెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. తక్షణమే తవ్వకాలను ఆపాలని ఎన్జీటీ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. అయినా ఆ ఆదేశాలు అమలు కాలేదు. ఇసుక మారీచులుసాక్షి ప్రతినిధి, తిరుపతి : చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూటమి నేతలు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. యంత్రాల సాయంతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నదీ పరీవాహక గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకు 100–120 ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాలు, సత్యవేడు నియోజకవర్గంలో ఇదే రీతిలో దందా సాగుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల పరిధిలోని స్వర్ణముఖి నదిలో కలవకూరు, భీమవరం వద్ద యంత్రాలు పెట్టి మరీ ఇసుక తవ్వుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో రెండు రోజులు ఆపినట్టే ఆపి మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టారు. పైగా అక్రమ తవ్వకాలను వ్యతిరేకించిన కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు మరో 11 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వావిల్తోట వంకలో జేసీబీల ద్వారా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి.. టిప్పర్ ఇసుక రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు సాగుతున్నాయి. తవ్వుకో.. తమ్ముడూ! పులివెందులలో గనులను చెరబట్టిన టీడీపీ నేతలు సాక్షి టాస్క్ ఫోర్స్: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బెరైటీస్ నిక్షేపాల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. లీజు అనుమతులు పొందిన వారైనా.. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే మైనింగ్ చేయాలనే నిబంధన పెట్టారు. వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిన్నరగా అక్రమ మైనింగ్కు తెరతీశారు. అనధికారిక మైనింగ్ బ్లాస్టింగ్ల వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు వ్యక్తులకు తీవ్రగాయాలవుతుండగా.. అక్కడక్కడా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడల్లా స్థానిక అధికారులు పంచాయితీలు చేసి కేసులు లేకుండా చక్కబెడుతున్నారు. మైన్ యజమానులను పోలీసు స్టేషన్కు పిలిపించి మైనింగ్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లతో ఒప్పందం చేసుకోవాలని బెదిరింపులకు సైతం దిగుతున్నారు. లేదంటే వేధింపులకు గురిచేస్తున్నారు. టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అంగీకారం ఉంటేనే మైనింగ్ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో కాల్ట్యాక్స్ కుటుంబం 1970 దశకం నుంచి మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎస్ఎండీ రహంతుల్లా కుటుంబానికి చెందిన ఎండీ కరంతుల్లాకు వేంపల్లె మండలం తాళ్లపల్లెలో 6.48 హెక్టార్లలో బెరైటీస్ మైన్కు 1971లో మైనింగ్ లీజు దక్కింది. రహంతుల్లా మరణించాక అతడి కుమారుడు నియామతుల్లా పేరిట మైన్ బదిలీ అయ్యింది. 2024లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు తమ్ముళ్లు అతడిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. మైనింగ్ చేసేందుకు తాము చెప్పిన వాళ్లతో ఒప్పందం చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అంగీకారం లేకుండా మైనింగ్ చేయొద్దని హూంకరిస్తున్నారు. -
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అటవీ సంపదను భక్షించిన ఇంటి దొంగలు
మార్కాపురం: అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అడవిలో అభించిన గుప్త సంపదను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నవరత్నాలతో కూడిన రెండు కుండలు తవ్వకాల్లో బయటపడగా వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా వాటాలు వేసుకుని పంచుకున్నట్టు తెలిసింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల అభయారణ్యం పరిధిలో ఫిబ్రవరి మొదటి వారంలో జరగ్గా రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఇందులో అటవీశాఖ అధికారులే పాత్రధారులుగా వ్యవహరించడం గమనార్హం. గుప్త నిధులు తవ్వే ముఠాతో చేతులు కలిపి అటవీశాఖ ఉద్యోగులే గడ్డపార పట్టి గుంతలు తీసి గుప్తనిధులను వెలికితీసి ప్రభుత్వానికి అప్పగించకుండా వారే వాటాలు వేసుకుని పంచుకోవడం సంచలనంగా మారింది. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని తురిమెళ్ల రేంజ్, ఆర్వీటికోట సెక్షన్ ఎర్రగుంట్ల లొకేషన్లో గుప్తనిధులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు ఫిబ్రవరిలో సమాచారం అందింది. ఈ సమాచారం అక్కడ పనిచేసే నలుగురు ప్రొటెక్షన్ వాచర్స్, ఒక రేంజ్ అధికారికి తెలియడంతో గుప్తనిధులను కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. అటవీ ప్రాంతంలో పనులు జరుగుతుండడంతో, వాటిని ఆసరాగా చేసుకుని అర్ధవీడుకు చెందిన ఒక వ్యక్తితో జేసీబీ తెప్పించుకుని తవ్వకాలు చేపట్టారు. రెండు పెద్ద కుండలు బయటకు తీశారు. అందులో బంగారం, వజ్రాలు, నవరత్నాలతో కూడిన విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి అప్పగించకుండా.. వాటాలేసుకుని..నిజానికి ఈ వస్తువులను, బంగారాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన అటవీశాఖ బీట్ అధికారులు, వాచర్లు, రేంజ్ ఆఫీసర్లు ఒక్కటై అవి నిజమైనవా ? నకిలీవా అని తెలుసుకునేందుకు హైదరాబాదుకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించి స్వచ్ఛమైన బంగారం, తరువాత విలువైన వజ్రాలు, నవరత్నాలుగా నిర్ధారించుకున్నారు. దీంతో వాటిని అక్కడ అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో బెంగళూరుకు వెళ్లి విక్రయించినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన తరువాత ఒక బీట్ ఆఫీసరు గిద్దలూరులో ఇంటిని కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే అటవీ సిబ్బందే గుంతలు తవ్వుతున్న ఫొటోలు, దొరికిన కుండల ఫొటోలు సోషల్మీడియాలో రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా బుధవారం ఈ సమాచారం తెలుసుకున్న గిద్దలూరు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి, సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘కోత’ పెడితే ‘వాతే’
సాక్షి, అమరావతి: వినియోగదారులకు రోజుకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆదేశించింది. రాష్ట్రంలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరా తీరును మెరుగుపరిచేందుకు బుధవారం కొత్త మార్గదర్శకాలను కమిషన్ జారీ చేసింది. ‘వినియోగదారుల హక్కుల చట్టం 2020’ నిబంధనల ప్రకారం. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారం విద్యుత్ అందించాలని, మిగిలిన సర్వీసులకు ఎలాంటి కోతలు విధించడానికి వీల్లేదని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. అంటే ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుడివాడ, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, విజయవాడ, మంగళగిరి, చిలకలూరిపేట, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని అనంతపురం, కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, తిరుపతిలో 24 గంటలూ విద్యుత్ అందించాలి. కరెంటు ఇవ్వకపోతే పరిహారం కట్టాలి కరెంట్ ఎంత సమయం పోయింది, ఎన్ని సార్లు పోయింది అనే అంశాలపై డిస్కంలకు ఏపీఈఆర్సీ రానున్న ఐదేళ్లకు (2026 నుంచి 2031 వరకు) కఠినమైన వార్షిక లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఒకవేళ విద్యుత్ సంస్థలు ఈ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే, వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. ప్రతి మూడు నెలలకోసారి దీనికి సంబంధించిన నివేదికను కమిషన్కు సమర్పించాలని ఆదేశించింది. ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది. -
దేవుడి భూములు 'ఫర్ సేల్ '!
సాక్షి, అమరావతి: ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న సాకుతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని దేవదాయశాఖ భూములను అమ్మకానికి పెట్టింది. ఇదే కారణం చూపిస్తూ వైఎస్సార్ కడప జిల్లాలోని పుష్పగిరి మఠం పేరిట అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలోని 259 సర్వే నెంబరులో ఉన్న 6.89 ఎకరాల భూమిని అమ్మేస్తోంది. ఈ భూమి ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని, దానిని విక్రయిస్తే వచ్చిన సొమ్మును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధిక ఆదాయం వస్తుందంటూ దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గతనెల 11న ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో.. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం కూడా ఆ భూమిని అమ్మేందుకు అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి ఆదేశాలు జారీచేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కట్టుదిట్టమైన చట్టాలు ఉండీ, వాటిని అమలుచేసే భారీ యంత్రాంగం ఉండీ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. 23 నెలల్లో ఇలాంటి నిర్ణయాలెన్నో.. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములుండగా.. వాటిని అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ 23 నెలల కాలంలో ఇలాంటి పలు నిర్ణయాలు తీసుకుందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) వంటి సంస్థలతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. » సాధారణంగా దేవదాయ శాఖ భూములను వేరొకరు రిజి్రస్టేషన్లు చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో ఉంచుతారు. ప్రైవేట్ వ్యక్తుల భూముల నంబర్లు మారి దేవాలయాల భూముల్లో కలిపారంటూ లక్షన్నర ఎకరాల దేవాలయాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు ఆరోపణలున్నాయి. » పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ–139 తెచ్చింది. » కృష్ణాజిల్లా గొడుగుపేట దేవాలయానికి చెందిన భూమి విజయవాడలోని గొల్లపూడిలో ఉంటే.. ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, గోల్ఫ్ కోర్టు కోసం కేటాయించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఇందులో రాత్రికి రాత్రి మట్టిని తోలారు. దీనిపై భక్తులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. » అలాగే, కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియం కోసం కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. -
అధికారంలోకి రాగానే.. రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతివనం, విగ్రహం ఏర్పాటుపై వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాష్ట్ర రాజధానిలో ప్రకాశం స్మృతివనం, శాసనసభ ప్రాంగణంలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని తప్పక పరిశీలించి.. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్కు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ.క్రిష్ణమాచారి, సీహెచ్.శ్రీనివాసరావు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. నేటి తరాలకు స్ఫూర్తిదాయకం అలాగే ప్రకాశం పంతులుకు నివాళులర్పిస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. బుధవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
బాదుడే.. బాదుడు.. 'ధరలు కొండెక్కి.. బతుకు బరువెక్కి'!
డీజిల్ ధరల పెంపు నిత్యావసర సరుకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పెరిగిన పెట్రో ధరలు నిత్యావసరాల రూపంలో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. వంట నూనెల నుంచి బియ్యం, పప్పుల వరకు ఏ ధర చూసినా కొండెక్కి కూర్చున్నాయి. ఈ తరుణంలో ‘గుక్కెడు గంజీ కరువైపోయె.. బక్కటి ప్రాణం బరువైపోయె’ అన్నట్టుగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్యుల నెత్తిన నిప్పుల కుంపటిగా మారాయి. వంట నూనెలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు రోజురోజుకు ఎగబాకుతుండటంతో బడుగు జీవుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పత్తా లేకుండాపోయింది. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేసే దిశగా ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. డీజిల్ ధరల పెంపు కారణంగా అన్నిరకాల నిత్యావసరాల ధరలు 15నుంచి 40 శాతం మేర పెరిగాయి. వంట నూనె ధరలైతే లీటర్కు రూ.200 పైగా ఎగబాకాయి. కూరగాయల ధరలు ఏది చూసినా కిలో రూ.50–రూ.60 దాటిపోయాయి. పప్పుల ధరలు సైతం 20–30 శాతం మేర పెరిగాయి. ధరల బాదుడికి సామాన్య ప్రజానీకం కుదేలవుతుంటే.. గ్యాస్, పెట్రోల్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు అధికార పీఠమెక్కిన తర్వాత గ్యాస్ ధరలను దాదాపు మూడుసార్లు పెంచడం పేదలకు పెనుభారంగా మారింది. రోజువారీ పనులు లేకపోవడంతో పేదల చేతిలో చిల్లిగవ్వ లేక, పెరిగిన ధరలకు నిత్యావసర సరుకులు కొనలేని దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నూనె ధరలు సలసలా రాష్ట్రంలో వంట నూనె ధరలు సెగ పుట్టిస్తున్నాయి. పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశనగ నూనె ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నూనె ధరలు పెరగ్గా.. తాజాగా డీజిల్ ధరల పెంపు ప్రభావంతో మరోసారి ఎగబాకాయి. పామాయిల్పై 60 శాతం, సన్ఫ్లవర్ ఆయిల్పై 70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం ధరలు పెరిగాయి. వీటితో పాటు ఆవనూనె, సోయ, వనస్పతి రేట్లు కూడా పెరిగిపోయాయి. 2024 మేలో వేరుశనగ నూనె ధర రూ.168 ఉండగా.. ప్రస్తుతం రూ.210కు చేరింది. లీటరు పామాయిల్ రూ.89 ఉంటే.. ఇప్పుడు రూ.160 పలుకుతోంది. సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ రూ.112 ఉంటే.. ఇప్పుడు రూ.175–185 పలుకుతోంది. పప్పులు.. ధరల నిప్పులు పప్పుల ధరలు సైతం పోటీపడి పెరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా.. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చినా ఏపీలో పప్పుల ధరలు అధికంగా ఉంటున్నాయి. గత నెలతో పోలిస్తే వీటి ధరలు 15–30 శాతం పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.148–155, గోధుమ పిండి రూ.71–90, మినప్పప్పు రూ.164–170కి పైగా ధరలు పలుకుతున్నాయి. పెసలు సైతం రూ.165–175, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగలు రూ.210కి తక్కువగా లేవు. పచి్చశనగపప్పు ఏకంగా కిలో రూ.280–300 పలుకుతోంది. గోధుమలు కిలో రూ.35–40, గోధుమ పిండి కిలో రూ.40–43, కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే ఎండుమిర్చి రూ.390–420, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.220–250, అల్లం రూ.115–150, కారం రూ.520 (ప్రీమియం), సాధారణం రూ.220పైగా ధరలు పలుకుతున్నాయి. టమాటా కిలో రూ.65 పలుకుతోంది. అరటి సైతం రైతుకు కిలోకు రూ.5 దక్కుతుంటే.. బయట మాత్రం డజను రూ.100 పైమాటే. చివరకు కరివేపాకు సైతం కేజీ రూ.200గా ఉంది. పచ్చిమిర్చి రూ.80, క్యాప్సికం రూ.80, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ‘బియ్యం’ ధరదడ మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బియ్యం ధరలు 15 రోజుల్లో పెరిగాయి. హోల్సేల్లో 26 కేజీల బస్తాపై రూ.50 పెరిగితే.. రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.120 మేర పెరిగాయి. కిలో రూ.45 నుంచి రూ.70 పలుకుతున్నాయి. 15 రోజుల క్రితం 26 కిలోల సాధారణ బ్రాండ్లకు చెందిన సన్న బియ్యం బస్తా రూ.1,300–1,400 ఉంటే ఇప్పుడు రూ.1,650 చేరింది. ప్రీమియం రకాలైతే 26 కిలోల బస్తా రూ.1,599 నుంచి రూ.1,810 వరకు పలుకుతున్నాయి. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.150 పైమాటే. దావత్ బియ్యమైతే కిలో రూ.230–250 వరకు పలుకుతున్నాయి. వాస్తవానికి గడచిన నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచేశాయి. క్వింటాకు ఏకంగా రూ.400పైనే వడ్డించాయి. ఇలా ఇష్టానుసారం బియ్యం ధరలు పెంచేస్తుంటే నియంత్రించాల్సిన చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. రూ.10–15కు దొరికే కొత్తిమీర కట్ట ధర సైతం సైజును బట్టి రూ.25–30 పలుకుతోంది. మూడు కట్టలు రూ.10కు దొరికే ఆకు కూర ఏదైనా ఇప్పుడు రూ.25–30 తక్కువకు దొరకడం లేదు. గతంలో 200 పెడితే బ్యాగ్ నిండా వచ్చే కూరగాయలు ప్రస్తుతం రూ.500 పెట్టినా సంచి సగం రావడం లేదు.కొనలేకపోతున్నాం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడుతోంది. సామాన్యులు బయట బజార్లో ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాం. – ఎస్.ఈశ్వరి, గృహిణి, కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లా బతుకు దుర్భరమైంది 20 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. ఉచిత బస్సువల్ల బేరాలు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాం. ఫ్రీ బస్సు లేనప్పుడు రోజుకు రూ.500 వచ్చేది. ఇప్పుడు రెండొందలు కూడా రావడం లేదు. తాజాగా డీజిల్ ధరలు పెంచడం వల్ల నిర్వహణ ఖర్చులతోపాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇలా అయితే ఎలా బతుకుతాం. – బందం రమేష్, ఆటోడ్రైవర్, దేవవరం, నక్కపల్లి మండలం, అనకాపల్లిఎలా బతకాలి! డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు. ఏం కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. ప్రతీ వస్తువుపై రూ.5 పెంచేశారు. ఇదేంటని అడిగితే డీజిల్ ధరలు పెంచారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎలా బతకాలి. సామాన్యులకు దాపురించిన ఆ పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. – జమ్రుత్బాషా, సీటీఎం మదనపల్లెపచ్చడి మెతుకులే దిక్కు సామాన్యులే కాకుండా మధ్యతరగతి జనం కూడా ఈ ధరల కారణంగా పచ్చడి మెతుకులకే పరిమితం కావాల్సి వస్తోంది. కందిపప్పు, వంటనూనె ధరలు కూడా అందుబాటులో లేవు. కూరగాయలతోపాటు అన్నిరకాల సరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనంతటికీ కారణం ప్రభుత్వ వైఫల్యమే. – కుప్పిలి జానకమ్మ, గృహిణి, విద్యానగర్, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా ఇంటిని నడపడం కష్టంగా మారింది ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇంటిని నడపడం కష్టంగా మారింది. కూరగాయలు, పప్పులు, నూనెలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో బతుకు భారంగా మారింది. ఒకప్పుడు నెలకు రూ.5 వేలు ఖర్చు పెడితే సరిపోయేది. ఇప్పుడు రూ.10 వేలయినా చాలడం లేదు. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. – షేక్ హుసేన్బీ, గృహిణి, లింగాపురం ప్రభుత్వం చోద్యం చూస్తోంది ధరలకు కళ్లెం వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర సరుకులైన వంటనూనె, పప్పులు, కూరగాయలు, చికెన్ ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలు కట్టు తెగాయి. ఈ ధరల్ని తట్టుకోవడం మాలాంటి వారికి చాలా కష్టంతో కూడుకున్న పని. – జి.లక్ష్మీనారాయణ, వీధి వ్యాపారి, రేఖవానిపాలెం, విశాఖపట్నం -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
అభినయ్ పాస్టర్ కాదు.. ఆయన ఉద్దేశం ఇదే..: ఎస్పీ అమిత్
అల్లూరి జిల్లా: తనను తాను పాస్టర్ అని చెప్పుకున్న అభినయ్పై దాడి కేసులో ఎస్పీ అమిత్ బర్దర్ కీలక విషయాలు వెల్లడించారు. బుధవారం అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు.‘‘అభినయ్ పాస్టర్ కాదు. అతడిపై ఎవరూ దాడి చేయలేదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలనేది ఆయన ఉద్దేశం. దాడి పేరుతో సానుభూతి పొందాలనేది అభినయ్ ఆలోచన. ఆయన సినిమా యాక్టర్ కావడంతో సినిమా తరహాలో దాడి జరిగినట్లు ప్లాన్ సిద్ధం చేశారు. గతంలో కూడా ఆయనపై అనేక కేసులు నమోదయి ఉన్నాయి. హాస్పిటల్ కు రాకముందే సోషల్ మీడియాలో అభినయ్ వీడియోలు వైరల్ అయ్యాయి. గూడెం కొత్త వీధి పీఎస్లో BNS సెక్షన్లు 189(3), 196(2), 299, 3(5), 302, 353(1) కింద కేసు నమోదు చేశాము. కుట్రలో పాల్గొన్న నిందితుల పేర్లు.. దారా అభినయ దర్శన్, కిరణ్ జార్జ్, కె.బెన్హర్, భాను ప్రసాద్. దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తంగుల వసంత్ కుమార్, కుమాడ ప్రేమ్కుమార్, తంగుల సత్యరాజు, కిండంగి ఇంద్ర కుమార్’’అని తెలిపారు.పాస్టర్ ప్రవీణ్ పగడాలలాగే తనను కూడా చంపాలనుకుంటున్నారని అభినయ్ మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. తనకు పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను అరెస్టు చేశారని చెప్పారు. కాగా, పోలీసుల దర్యాప్తులో ఆయన నాటకాలన్నీ బయటపడ్డాయి. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం (గురువారం) 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ జరగనుంది. ఈ ప్రెస్మీట్లో వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై స్పందించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయం
సాక్షి,కృష్ణా:గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయమైంది. గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్ లాకర్లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు.దాంతో సుబ్బారావు కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించారని సుబ్బారావు వాపోయారు. -
అమరావతికి రాష్ట్ర ఖజానా నిధులు విడుదల చేసిన బాబు సర్కార్
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఖజానా నుంచి అమరావతి కోసం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి రూ.2,100 కోట్లు సీఆర్డీఏకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు అమరావతి కోసం మొత్తం రూ.4,100 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి.ఇప్పటికే రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుదేలైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.47,000 కోట్ల రుణాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి నిధులు విడుదల చేయడం ప్రజల డబ్బు వృథా అవుతోందన్న విమర్శలకు దారితీస్తోంది.గతంలో అమరావతిని ‘సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ’గా అభివర్ణిస్తూ, ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పటివరకు వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల డబ్బు అమరావతికి పెట్టబోమని చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు నిధులు విడుదల చేయడంపై ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్ర ఖజానా నుంచి అమరావతికి నిధులు కేటాయించడం ఆర్థికపరంగా సరైన నిర్ణయం కాదన్న చర్చలు కొనసాగుతున్నాయి. -
‘బాబూ.. మత్స్యకారులకే చేపల కూర నేర్పిస్తున్నావా?’
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు అందరికీ తెలుసని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేతలు కురుసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనే దిక్కులేదు అని ఘాటు విమర్శలు చేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై నియోజకవర్గ కోఆర్డినేటర్లతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీతా, దవులూరి దొరబాబు, గిరిబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..‘రాష్ట్ర పాలన వదిలేసి చంద్రబాబు అమరావతి కాంట్రాక్టర్లే ధ్యేయంగా ఈవెంట్లు చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనండి అని మహిళలను అవమానపరుస్తున్నారు. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా మాట్లాడుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చేపల పులుసు ఎలా వండాలో మత్స్యకారులకే చంద్రబాబు నేర్పించిన ఈవెంట్ చూశాం’ అని ఎద్దేవా చేశారు.కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘మత్స్యకారులకు సేవా? మత్యకారులకు శాపమా?. నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హర్బర్ కథ ఏం చేశారో మొన్ననే చూశాం. చంద్రబాబు మళ్ళీ అక్కడికే వెళ్ళి చేపల పులుసు వండుతారు. తెలుగు వెన్నుపోటు పార్టీ.. మత్య్సకారుల నుండి రైతుల వరకు వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఒక్క పక్క.. కొడుకు ఒక పక్కన పొదుపు మీరు చేయండి. దుబారా మేము చేస్తామని డ్రామాలు చేస్తున్నారు. ఒకాయన సైకిల్ తొక్కుతాడు.. ఐదారు కెమెరాలు వాహనాలపై నడుస్తాయి. చంద్రబాబు డ్రామాలు ఏంటో అందరికీ తెలుసు’ అని మండిపడ్డారు -
సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీతారామశాస్త్రికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. నేడు సిరివెన్నెల… pic.twitter.com/w8E8r9jm4U— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2026 -
అసెంబ్లీలో ఆవరణలో ఆంధ్రకేసరి విగ్రహం ఏర్పాటు చేయించాలి
సాక్షి, తాడేపల్లి: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని బ్రహ్మణ సంఘాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయన్ని కలిశారు. ఆ మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాజధానిలోఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట స్మృతివనం, అలాగే అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయించేలా చూడాలని వైఎస్ జగన్కు బ్రహ్మణ సంఘం వినతిపత్రం అందజేసింది. ఆ విజ్ఞప్తిని తప్పక పరిశీలించి, అధికారంలోకి రాగానే తప్పనిసరిగా ఏర్పాటుచేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రహ్మణ సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ క్రిష్ణమాచారి, సీహెచ్ శ్రీనివాసరావు, కే వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నా భర్త నుంచి నాకు విముక్తి కల్పించండి..!
తిరుపతి జిల్లా: తన భర్త నుంచి తనకు విముక్తి కల్పించి, న్యాయం చేయాలని అధికారపార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భార్య షామీన అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు తన భర్తకు ఐదేళ్ల కిందట వివాదం జరిగి కోర్టులో కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులు హీరింగ్కు రావడంతో తనను ఇబ్బందులకు గురిచేసేందుకు రెండు రోజుల క్రితం తన నివాసం వద్దకు చేరుకుని దాడి యత్నం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు. తామే దాడి చేసినట్లు పోలీసులకు తమపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో ఇదే విధంగా జరిగితే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అంతేగాకుండా తన కుమారుడిని రెండేళ్ల నుంచి తన భర్త వద్దనే పెట్టుకుని ఉన్నాడని, తనని చూడనియకుండా ఆంక్షలు విధించారని తెలిపారు. -
ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని వైఎస్ జగన్ కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు. ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన… pic.twitter.com/4esnkiGBRP— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2026 -
పవన్ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?
ఉమ్మడి జిల్లా కూటమిలో కుంపట్లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పేరుకే జనసేనలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెర వెనక ఆట ఆడిస్తున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలిసిన 24 గంటలు గడవకముందే జనసేన నాయకుడు ఆరోపణలు గుప్పించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణల వెనుక టీడీపీ ముఖ్యనేత హస్తం ఉందని బాలినేని వర్గం ఆరోపణలు చేస్తోంది. సాక్షి ప్రకాశం : జిల్లా కూటమిలో వర్గ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. జనసేన ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోవడం తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆరు జిల్లాల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలు అప్పగించడంతో అటు జనసేనలోనే కాకుండా ఇటు టీడీపీలో కూడా అలజడి రేగుతోంది. ఆ సమావేశానికి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం గైర్హాజరవడం ద్వారా బాలినేని ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది. బాలినేని ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంతో ఆందోళనకు పచ్చనేతలు జడా బాల నాగేంద్రం ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేయించిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలు పోటా పోటీగా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో జిల్లా కూటమి నాయకులు ఎండలకు మించి ఉక్కపోతకు గురవుతున్నారు. అధిష్టానాన్ని లెక్క చేయకుండా.... స్థానిక సంస్థల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలను బాలినేనికి అప్పగించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమావేశం ఒంగోలులో నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అండ్ కో ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. తమకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన డీ లిమిటేషన్ సమావేశాన్ని స్వయంగా జిల్లా అధ్యక్షుడే బాయ్ కాట్ చేసినప్పటికీ జనసేన అధిష్టానం ఏమీ చేయలేక పోయింది. దీంతో పారీ్టపై జనసేన అధిష్టానం పట్టు కోల్పోయిందన్న విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులతో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై రియాజ్ వర్గం రగిలిపోతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబును కలిశాక... ఒకవైపు జిల్లా కూటమిలో టీడీపీ, జనసేనలోని వర్గాలు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే బాలినేని కలవడం పచ్చశిబిరంలో అలజడి రేపింది. దీంతో బాలినేనికి చెక్ పెట్టకపోతే ఇక లాభం లేదని భావించిన ఆ వర్గం వ్యూహాత్మకంగా జడా బాల నాగేంద్రంను రంగంలోకి దింపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల నాగేంద్రం మొదట్నుంచి బాలినేని ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే దామచర్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన డీ లిమిటేషన్ సమావేశంలో కూడా బాలినేని వెంట ఉన్న బాల నాగేంద్రం ఉన్నట్టుండి ఆయనపైనే ఆరోపణలు చేయడంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బాలినేని వర్గం ప్రతి విమర్శలు... ఉదయం బాల నాగేంద్రం బాలినేని మీద విమర్శలు గుప్పించారు. సాయంత్రం అయ్యేసరికల్లా బాలినేని వర్గం ప్రెస్మీట్ పెట్టి ప్రతి విమర్శలు చేసింది. ఇతర పార్టీ నాయకులు తెర వెనక ఉండి బాలినేని మీద విమర్శలు చేయిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఎం చంద్రబాబుతో కలిసి జిల్లా పరిస్థితులు చర్చించిన విషయం బయటకు వచ్చిన వెంటనే కొందరు నాయకులు బాలినేని మీద తప్పుడు ఆరోపణలతో ప్రెస్ మీట్ పెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. నాగేంద్రం వెనక ఉన్న వ్యక్తి ఏమీ పీకలేరని ఆమె విరుచుకుపడ్డారు. ఇతర పారీ్టల నాయకులు జనసేనపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ఇరు పార్టీల అధినేతలు మౌనం... జిల్లాలో కూటమి పారీ్టల్లో ఎత్తులు, పై ఎత్తులతో స్థానిక నాయకులు తరచూ వీధిన పడుతున్నారు. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాలినేనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయినా టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొదట రియాజ్, అరుణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అరుణను వెంటాడి మరీ దాడి చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలినేని కార్యక్రమాలను రియాజ్ అండ్ కో బాయ్ కాట్ చేసింది. అయినా సరే జనసేన అధినేత పట్టించుకోవడం లేదు. ఇరు పారీ్టల అధినేతల మౌనం వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పదవులు అమ్ముకుంటున్న బాలినేని...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని జడా బాల నాగేంద్రం చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ తాల్లూరి, లింగమనేని రమేష్ లతో కుమ్మక్కై పదవులు అమ్ముకుంటున్నారని బాల నాగేంద్రం విమర్శలు చేయడం గమనార్హం. నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రూ.10 లక్షలు, జిల్లా అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తామంటూ ఎన్ఆర్ఐలకు ఫోన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో, ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని, ఆయన కుమారుడ్ని దూరంగా పెట్టాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ వెనక అధికార పార్టీకి చెందిన కీలకనేత వర్గం హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. -
అక్రమ కేసులు పెట్టడమే ఆయన డ్యూటీ
సాక్షి, ప్రకాశం: దర్శి ఎస్సై మురళి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రైవేటు సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులను నిత్యం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారికి సకల మర్యాదలు చేస్తూ వారు చెప్పిందే వేదంలా పని చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపుపై సోమవారం దర్శిపట్టణంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనకు ఆటోలు ఇచ్చారంటూ రెండు ఆటోల అద్దాలను పగులగొట్టడం వివాదాస్పదంగా మారింది. ఆది నుంచీ వివాదాస్పదమే.. టీడీపీ నేతలతో క్రికెట్ బెట్టింగ్లను వేయించి వాటిని ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్న వారిని పిలిపించి కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్రాజు దర్శికి ప్రత్యేక టీంను పంపి క్రికెట్ బెట్టింగ్లు వేసే టీంను పట్టుకున్నారు. అయితే అందులో ప్రధాన నిందితులు టీడీపీకి చెందిన వారే కావడంతో ఈ ఎస్సై, సీఐలు వారిని దేశం దాటించారన్న అనుమానాలు పోలీస్ డిపార్ట్మెంట్లోనే వ్యక్తమయ్యాయి. దీంతో ఎస్సైని కొన్ని రోజులు విధుల నుంచి పక్కన పెట్టి ఇక్కడ ఇన్చార్జ్ ఎస్సైని కూడా నియమించారు. పారిపోయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను ఇప్పటికీ పట్టుకున్న పాపానపోలేదు. బొద్దుకూరపాడు, ఎర్రోబనపల్లి, చలివేంద్ర కొండ శివారుల్లో పెద్ద మొత్తంలో పేకాట శిబిరాలు నిర్వహించి సీఐతో కలిసి భారీ మొత్తంలో నెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి నుంచి వెళ్లే అక్రమ ఇసుక, అక్రమ రేషన్ బియ్యం తరలింపును ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు చెల్లించి తెచ్చుకునే వారి ఇసుక లారీని గొట్టిపాటి లక్ష్మి ప్రధాన అనుచరులు ధ్వంసం చేయగా సంబంధిత యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు కట్టారు. ఆ తరువాత ఆ ఎఫ్ఐఆర్ ను మాయం చేసి యజమానిని బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ స్థానంలో మరో కేసు కట్టినట్లు సమాచారం. ఇది ఒక ఎత్తైయితే వైఎస్సార్ సీపీ నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పుడు దురుసుగా ప్రవర్తించడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెడతామని బెదిరించడం తరుచూ జరుగుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఫ్లెక్సీలు కట్టుకున్నా వివాదాలు సృష్టించి వారిపై కేసులు పెడతామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారని తెలిసింది. గతంలో గణేష్ నిమజ్జనాన్ని కూడా రాజకీయం చేసి చలివేంద్రలో గ్రామస్తుల ఇళ్లపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా వారిని లాఠీతో చావబాదారు. అర్ధరాత్రి వరకు మహిళలను పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆ తరువాత ఇంటికి పంపారు. అయినా ఈ ఎస్సై పై అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం, ఫ్లెక్సీలు కట్టేవాళ్లను బెదిరించడం, ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీలు కడితే టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి చావబాదడం చేస్తున్న ఎస్సై తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల బొట్లపాలెం గ్రామంలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలను కొట్టగా వైఎస్సార్ సీపీ నేత పైనే కేసులు పెట్టి గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించి భయబ్రాంతులకు గురి చేశారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో డీజే సౌడ్తో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలు చేశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. గొట్టిపాటికి దాసోహం: టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీకి దాసోహం చేయడానికే పోలీస్ ఉద్యోగంలో చేరారన్నట్లు వ్యవహరిస్తున్న ఈ ఎస్సై తీరు వివాదాస్పదంగా మారింది. మండలంలో ఆమె ఎక్కడికి వెళితే అక్కడకు కాన్వాయ్ పెట్టుకుని ఈ ఎస్సై ప్రత్యక్షమవుతారు. ఆమె బర్త్డే పారీ్టలకు, ఆమె చేస్తున్న ప్రైవేటు కార్యక్రమాలకు స్టేషన్లో డ్యూటీ కూడా మానుకుని ఆమె వెంటే పోలీస్ జీపుతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా కాన్వాయ్గా తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని టీడీపీ ఇన్చార్జ్ అయిన ఆమె కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ దర్శికి వస్తున్నారంటే పోలీస్ కాన్వాయ్ పెట్టి ఆమె వెంట ఉండి తీసుకొస్తారు. టీడీపీ కార్యక్రమాలను దగ్గరుండి ఆమెకు సెక్యూరిటీ ఇస్తుంటారు. ప్రభుత్వ వాహనాలతో ప్రైవేటు వ్యక్తులకు సెక్యూరిటీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తెలిసి తెలిసి బొంకిన బాబు!
అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నేర్పరి. ఆచరణ సాధ్యం కాని విషయాలను కూడా సులువుగా ప్రచారంలో పెట్టేయగలరు. అధిక సంతానం విషయమే తీసుకోండి. డైవర్షన్ కోసం చేస్తున్నారా? లేక ప్రజలను మభ్యపెట్టేందుకా? అన్నది తెలియదు కానీ తన ప్రతిష్టను సైతం పట్టించుకకుండా ఆయన ముగ్గురు పిలల్ని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు అని ఒక ట్యాగ్లైన్ పెట్టేసుకున్నారు. ఇదేం పిచ్చిగోల అని మనకు అనిపించవచ్చు కానీ ఆయన లక్ష్యం వేరు. బాబుగారు గొప్ప సిద్ధాంతకర్త, విజన్ ఉన్న వాడు అని జనాలు అనుకోవాలన్నది ఆయన ఫీలింగ్ కావచ్చు. అయితే.. ఈ సారి చంద్రబాబు వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆక్షేపణ వ్యక్తమవుతోంది. అంతమంది పిల్లల్ని కనడానికి ఆడవారేమైనా యంత్రాలా?అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇస్తానని చెబుతున్న మొత్తం డైపర్లకు కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా పేరు ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా పుట్టిన పిల్లల ఆహారం, మందులు, చదువు, పెంపకం ఖర్చులు కూడా ప్రభుత్వం చూసుకుంటుందా అని ప్రశ్నించారు. ప్రజలకు కావల్సింది జీవన భధ్రత తప్ప పతాక శీర్షికల్లోకి ఎక్కే స్కీములు కావని ఎద్దేవ చేశారు. సినీనటి పూనమ్ కౌర్ కొంచెం భిన్నంగా స్పందిస్తూ.. ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృస్టిలో పెట్టుకుని ముందు లోకేశ్ ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆశిద్దాం అని వ్యాఖ్యానించారు. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కిరణ్ బేడీ మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవిత కాలాన్ని ముగ్గురు, నలుగురు పిల్లలను కనడం, పెంచడానికే వినియోగించాలన్న భావన సరైనదేనా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుది ఫ్యూడల్ భావజాలంగా ఆమె అభిప్రాయపడ్డార అన్నమాట. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు చెబుతున్న రూ.ముప్పైవేలు బారసాల ఖర్చులకైనా వస్తాయా? అని అడిగారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పేర్నినాని, అంబటి రాంబాబు తదితరులు చంద్రబాబు తన కుటుంబంలో దీనిని ఆచరించి చూపించాలని సూచించారు. ఈ విమర్శల మాటెలా ఉన్నా... చంద్రబాబుకు ఇవన్నీ తెలియని అమాయకుడేమీ కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా ప్రజల దృష్టి.. విపక్షాల చర్చ ఇతర సమస్యలవైపు వెళ్లకుండా ఉంటుందన్నది ఆయన అంచనా. సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా సంతానోత్పత్తి గురించి ఆలోచించాలన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన వాగ్దానం ఏమిటో ప్రజలకు గుర్తుకు రాకూడదన్నమాట. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించి చమురు ధరలు పెరగకుండా చూస్తామని గొప్పలకు పోయారు. అది సాధ్యం కాదని వారికి ఆనాడే తెలుసు. అయినా తన కుమారుడు లోకేశ్తో కలిసి జనాన్ని నమ్మించే యత్నం చేశారు. తాను సంపద సృష్టిస్తానని ప్రతి సభలోను జనం చెవులు దద్దరిల్లేలా ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక సంపద సృష్టించే మార్గాలు ఉంటే తనకు చెవిలో చెప్పాలని జనాన్ని కోరారు. గల్లా పెట్టె ఖాళీగా ఉందని చేతులెత్తేశారు. తాజాగా అసలు సంపద సృష్టి మీ చేతిలోనే ఉందని, అది పిల్లలను కనడమేనని చెప్పి ప్రజలందరిని అమాయక గొర్రెలుగా మార్చారన్నమాట. నిజానికి సంపద సృష్టి తన చేతిలో లేదని ఆయనకు ఎన్నికల ముందు కూడా బాగా తెలుసు. అయినా ఎన్నికలలో జనాన్ని మభ్య పెట్టడానికి అలాంటి డైలాగులు చెప్పాలి. సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో విపరీత ప్రచారం చేయాలి.తద్వారా చంద్రబాబు ఏదో చేసేస్తారన్న భావన కలిగించాలి. ఒట్లు దండుకోవాలి.ఇదే లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారు. ఇలా ఒకటి కాదు.. 2014 ఎన్నికలలో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని తెగ చెప్పారు.అదెలా సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రశ్నించినా, చంద్రబాబు కు ఆ మాజిక్ తెలుసునని టీడీపీ వారు వాదించేవారు. వాస్తవానికి చంద్రబాబుకూ తెలుసు తాను చేస్తున్నది తప్పుడు వాగ్దానం అని. బ్యాంకులలో ఉన్న బంగారు నగలను కూడా విడిపించి ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారంటేనే అది మోసపూరితమైన హామీ అన్న సంగతి ఎంతో విజన్ ఉందని చెప్పుకునే ఆయనకు తెలియదా! రైతుల ఆశను ఆయన క్యాష్ చేసుకున్నార అన్నమాట..ఓట్లు వేశారు. ఆ తర్వాత మరీ ఇంత ఆశపోతులుగా ఉంటారా అని వారినే ఎద్దేవ చేశారు. సూపర్ సిక్స్ లో ఉన్న హామీలు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 చొప్పున ప్రతి మహిళకు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. అయినా వారిని బురిడి కొట్టించాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్నారు. చెప్పేశారు. అధికారం వచ్చాక దాని ఊసే ఎత్తలేదు.మంత్రి అచ్చెన్నాయుడు దానిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని జనానికి చెప్పారు. పేదరికం లేకుండా చేసేస్తాననంటూ ప్రగల్బాలు పోయారు. తదుపరి ధనికులు పేదలను దత్తత తీసుకుంటే సరి అని కొత్త సూత్రం చెప్పేసి చేతులు దులుపుకున్నారు.నిరుద్యోగ భృతి మూడువేలు చొప్పున ఇస్తామని చెప్పారు. గత టరమ్ లో కూడా ఆయన చెప్పినా చేయలేదు. అయినా మళ్లీ అదే వాగ్దానం చేశారు.అధికారంలోకి వచ్చాక 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ కాకి లెక్కలు చెప్పి సరిపెట్టుకోమంటున్నారు.ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అది చాంతాడంత జాబితా అవుతుంది. పిల్లలను కనండని ఎందుకు చెబుతున్నారు. జనాభా తగ్గుతోందన్న కారణంగా ఆయన అంటున్నారని అనుకుంటే పొరపాటే.కేవలం ఇదొక భావజాలంగా మార్చి జనాన్ని ఏమార్చాలి. దక్షిణాదికి నిధులలోనే కాక,లోక్ సభ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాలలో వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడేమో ప్రధాని మోడీని ప్రశ్నించే ధైర్యం ఆయనకులేదు.అందువల్ల దానికి బదులు పిల్లలను కనండి అని సలహా ఇచ్చి ఏపీ జనాన్ని అటువైపు మళ్లిస్తే సరిపోతుందని అనుకున్నారనుకోవాలి. ఆర్ఎస్ఎస్ వారి మెప్పుదల కూడా వస్తుందని భావించి ఉండవచ్చు.అయితే విశ్వహిందూపరిషత్ నాయకుడు ఒకరు మాత్రం ఈ స్కీమ్ కేవలం హిందువులకే అమలు చేయాలని మెలిక పెట్టారు. అది వేరే సంగతి. ఈ మొత్తం ఏపీసోడ్ లో ఇబ్బంది పడుతున్నది ఎవరయ్యా అంటే అది ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ముందుగా ఆయనను పిల్లలను కనమనండి అని మహిళా నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.ఇది లోకేష్ కు ఎంబరాస్ మెంట్ గానే ఉంటుంది. బహుశా దానివల్లనేమో ఇంతవరకు ఈ సంతానోత్సత్తి అంశంలో తండ్రి ప్రతిపాదనపై లోకేష్ స్పందించలేదు.ప్రచారం ఆరంభించలేదు.ఇంకో మాట చెప్పాలి. ముందుగా మొదటి ఇద్దరు పిల్లలకు ఎందుకు ప్రోత్సహాం ఇస్తానని అనడం లేదు?దాంతోనే ఈయన ఏదో ప్రచారం కోసం అంటున్నారులే అన్నభావన కలగదా!పిల్లలు కనడం అన్నది వ్యక్తిగత విషయం.వారి ఆర్ధిక స్తోమతను బట్టి ,వారి ఇతర సమస్యలను బట్టి ఉంటుంది. చంద్రబాబు కనమంటే కనడం,వద్దంటే కనకపోవడం ఉండదు.ఆ సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు.ఒకవేళ చంద్రబాబు చెప్పారు కదా అని ఎవరైనా అమాయకంగా ఎక్కువ మంది పిల్లలను కనడం ఆరంభిస్తే వచ్చే సమస్యలను వివరిస్తూ ఒక పిల్లల డాక్టర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.చంద్రబాబు మాటలను పట్టించుకోవద్దని ఆమె సూచించారు. చంద్రబాబు దృష్టిలో ఏపీ ప్రజలు మరీ అమాయక గొర్రెలుగా కనిపిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ది ఉంటే మూడో బిడ్డను కంటే నెలకు ముప్పైవేలు ఇస్తామని చెప్పగలరా?లేదా 30 లక్షల డిపాజిట్ చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా?పెళ్లి చేసుకుంటే లక్షరూపాయల కానుక ఇస్తామని చెప్పిన పెద్దలు ఎంతమేర దానిని ఆచరించారు?ప్రస్తుతానికి చంద్రబాబు చెబుతున్నవి ఉబుసుపోక కబుర్లుగానే అంతా పరిగణిస్తున్నారు.కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా అప్రతిష్ట తెచ్చుకోవడం అవసరమా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మామిళ్లపల్లిలో మళ్లీ పోలీసుల దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఈ క్రమంలో మరీ దుర్మార్గంగా వ్యవహరించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి ఈ ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకుని కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. న్యాయం చేయాలని కోరిన మొక్కజొన్న రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాడులు చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ అంటోంది. అదే సమయంలో.. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇస్తోంది. చలో మామిళ్లపల్లిని నిర్వహించి రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు వైఎస్సార్సీపీ నేతలు రైతుల్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తూ కుట్రలు చేస్తోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేశ్, ఇవాళ జూపూడి ప్రభాకర్లను రైతుల్ని కలవనీయకుండా అడ్డుకుంది. -
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
-
‘లింకు’ లేకపోయినా రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే పేరుతో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లింకు డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రశీదులు లేకపోయినా కేవలం విక్రయించే వ్యక్తి ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని మంగళవారం రెవెన్యూ శాఖ జీఓ నంబర్ 297 జారీ చేసింది. ఇది భూ మాఫియాకు, కబ్జాదారులకు లైసెన్సులా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాళీ గ్రామకంఠం స్థలాల గత చరిత్రను తెలిపే ఎలాంటి పాత లింకు డాక్యుమెంట్లు, చివరకు రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి సరి్టఫికెట్లు గానీ అడగకూడదని ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లను ఈ జీఓలో ఆదేశించింది.దీనివల్ల గ్రామాల్లో రక్షణ లేని ఖాళీ స్థలాలు, స్థానికంగా నివాసం ఉండని వారి భూములను ఈజీగా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆస్తి తమకు వంశపారంపర్యంగా వచ్చిందని, తమ ఆ«దీనంలోనే ఉందని విక్రయించే వ్యక్తి ఒక తెల్లకాగితంపై రాసిచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేయాలని ఈ జీఓలో స్పష్టం చేశారు. ఎటువంటి అధికారిక పత్రాలు, ఆధారాలూ సరిచూడకుండా కేవలం అమ్మే వ్యక్తి మాటను నమ్మి రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించింది. మరోవైపు రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన సంబంధిత ఆస్తిపై హక్కులు రావని పేర్కొనడం గమనార్హం. యాజమాన్య హక్కుల తప్పుఒప్పులకు డాక్యుమెంట్ రాసుకున్న వారే పూర్తి బాధ్యులని తెలిపింది.ఒకరి స్థలాన్ని మరొకరు దొంగ డిక్లరేషన్తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని ఆ జీఓలో తేల్చి చెప్పింది. గ్రామకంఠం భూముల్లో చాలావరకు సరిహద్దులు స్పష్టంగా ఉండవు. రెవెన్యూ రికార్డుల్లోనూ వీటి వివరాలు పూర్తి స్థాయిలో లేవు. ఇప్పుడు ఎవరికి తోచినట్లు వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటూ పోతే, ఒకే స్థలానికి ఇద్దరు ముగ్గురు యజమానులు తయారవుతారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడానికి, ఓట్ల రాజకీయం కోసమే రక్షణ లేని డొల్ల విధానాన్ని సర్కారు తీసుకువచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సామాన్యుల ఆస్తులకు భద్రత లేకుండా చేయడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
19 వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా.. దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిశారు. మంగవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగ్ వింగ్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలలో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని వైఎస్ జగన్కు తెలిపారు.ఉన్నత విద్యనభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసిన తమలాంటి దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కులు, సాధికారత కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వికలాంగుల హక్కుల చట్టం–2016ను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీరువల్ల దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను వైఎస్ జగన్ సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తుచేసి భవిష్యత్తులోనూ దివ్యాంగులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


