Andhra Pradesh
-
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్స్ట్రాగామ్ హ్యాండిల్ను తొలగించింది. ఇప్పుడు దేశంలో వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారు. ⇒ ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ప్రజా సమస్యలపై జనం గొంతుకను వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను.. తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ⇒ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని సరైన ఆధారాలతో బట్టబయలు చేస్తున్న వారిపై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి.. ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్లైన్లో ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. ⇒ ఈ అన్యాయమైన చర్యలపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దుశ్చర్యలను చట్టపరంగా.. రాజ్యాంగ పరమైన మార్గాల ద్వారా సవాల్ చేస్తాం. బెదిరింపులు, సెన్సార్íÙప్, సంస్థల దురి్వనియోగం వంటివేవీ ప్రజల గొంతును అణచి వేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ⇒ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
సాక్షి, అమరావతి: ‘‘ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియచేయబడును’’ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశమిది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తుండడంతో ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సైతం నిలిచిపోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్ నుంచి కొత్త వారికి– కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సహా కొందరు మంత్రులు ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఇవి చూసి రెండేళ్లగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అర్హులైన అవ్వాతాతలు, వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి రోజూ సచివాలయాలకు వచ్చి పోతున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల సందేశాలను బట్టి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం మభ్యపుచ్చే పథకాలలో ఇది కూడా భాగమేనని స్పష్టమయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌఖిక సూచనలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొత్త పింఛన్ల పేరిట ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పీఏల ద్వారా వాళ్ల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి కొత్త పింఛన్ల కోసమంటూ ఎవరు వచ్చినా వాళ్లకు ‘ప్రభుత్వం ఇప్పుడు కొత్తవి ఇవ్వడం లేద’ని చెప్పకుండా వాళ్లిచ్చే కాగితాలు తీసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి సహా పలు జిల్లాల్లో పింఛన్ల కోసమని సచివాలయాలకు వచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకొని సిబ్బంది వాటన్నింటినీ పక్కన పడేశారు. ‘ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందంట..’ అన్న ఉత్తుత్తి ప్రచారాన్నే నమ్మి మే నెలలో ఏలూరు జిల్లా ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భీమడోలు మండలం పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం సచివాలయంలో 44 మంది పింఛను ఫారాలు ఇచ్చి వెళ్లారు. అందులో 16 మంది అవ్వాతాతల పింఛన్ కోసమైతే, మరో 28 మంది వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం. మరోవైపు.. అదే పూళ్ల గ్రామ పంచాయతీలోనే పూళ్ల – 1 సచివాలయంలో మరో 30 మంది ఇలాంటి పింఛన్ ఫారాలు ఇచ్చి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం దువ్వ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇదే పరిస్థితి. దువ్వ –1 సచివాలయంలో కూడా 29 మంది కొత్త పింఛన్ల కోసం ఫారాలు ఇవ్వగా, దువ్వ రెండో సచివాలయంలో మరో 20 మంది కొత్త పింఛన్ల ఫారాలు ఇచ్చి వెళ్లారు. ఆరు నెలలకొకసారి ఇలాంటి మభ్య పెట్టే ప్రకటనలతోనే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ ప్రచారం చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, కేన్సర్ రోగులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు రెండు వందల చొప్పున ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నటు ప్రకటించింది. కానీ, దానికి సంబంధించి ఇప్పటిదాక అధికారిక ఉత్తర్వులైతే వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయస్సు 60 ఏళ్లు కాగా గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కొత్తగా 50 ఏళ్లకే మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరే ఆగిపోయింది. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో అర్హులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం పూర్తిగా మూతపెట్టేసింది. రెండేళ్లలో పింఛన్ల సంఖ్య ఆరు లక్షలపైనే తగ్గుదల.. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఇచ్చే పింఛన్ల సంఖ్య కూడ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోల్చితే ఆరు లక్షలకు పైబడి తగ్గిపోయాయి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్దిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ నెల 1, 2 తేదీల్లో పూర్తయిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసిన లబ్దిదారుల సంఖ్య 60,19,920 మాత్రమే. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 6.14 లక్షల వరకు తగ్గిపోయాయి. అదే వైఎస్జగన్ ప్రభుత్వ హయాంలో (2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో) అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది. దివ్యాంగుల మెడపై కత్తి... పింఛన్లలో మరిన్ని కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ ప్రచారం చేస్తుండడంతో ఎవరి పింఛన్ ఆపేస్తారోనని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. పింఛన్లు పొందుతున్న దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు ఇప్పుడు కొత్తగా అర్హత నిర్ధారణ కోసమంటూ డాక్టర్ల ద్వారా రీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు తీసుకునే 8 లక్షల మందికీ రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులు అనుకునే వారికి ఇప్పటి దాక పరీక్షల నోటీసులు ఇవ్వలేదు. అలా రెండు లక్షల మందిని ఈ పరీక్షల నుంచి మినహాయించి మిగిలిన ఆరు లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఈ రీ వెరిఫికేషన్ పరీక్షలు చేపట్టడం గమనార్హం. -
సెలవు రోజూ యోగాంధ్రే!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టి పని చేయిస్తోంది. ఈ ఆదివారం కూడా వారికి సెలవు లేకుండా పోయింది. యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల టార్గెట్లు పూర్తి చేయనిపక్షంలో చర్యలు ఉంటాయని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఆదేశించడంతో సెలవు రోజూ సాయంత్రం దాకా విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటి మందిని రిజిస్ట్రేషన్లు చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టగా.. శుక్రవారం నాటికి కేవలం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాకపోవడంతో శనివారం కూడా ప్రతి ఉద్యోగి కనీసం 25 మంది చొప్పున రిజిస్ట్రేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి పని చేయించారని ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు.శనివారం రాత్రే పలు జిల్లాల్లో ఆదివారం ఎవరికీ సెలవు లేదంటూ ఉద్యోగులకు మెసేజ్లు పంపించారు. ఆదివారం ఉదయం యోగాంధ్ర శిక్షణ తరగతుల నిర్వహణ, ఆ తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు ఇచి్చనట్టు పలువురు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆదివారం కూడా మండల, జిల్లా అధికారులు విడతల వారీగా సచివాలయ ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించడంతో సాయంత్రం వరకు పనిచేసినట్లు పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పేరుకే పాలనా సౌలభ్యం.. అంతా వసూళ్ల పర్వం!
సాక్షి, అమరావతి: బాబు పాలనలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఉద్యోగులు, అధికారుల బదిలీల్లోనూ అవినీతి కంపు కొడుతోంది. ఈ పరంపరలో వైద్య, ఆరోగ్య శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంలో బదిలీల పేరిట భారీ దందాకు తెరలేపారు. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో కూడా పరిపాలన సౌలభ్యం ముసుగు తొడిగి ఏకంగా 30 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు(డీఐ), ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లకు స్థాన చలనం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి రేటు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయడానికి రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ గత వారమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఐల్లో 70 శాతం మందిని, ఏడీల్లో సగం మంది బదిలీ చేసేలా రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఫార్మా కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు అదే విధంగా హోల్సేల్, రిటైల్ షాపులు అధికంగా ఉండే ప్రాంతాలను పలు కేటగిరీలుగా విభజించి వసూళ్ల దందా నడిచిందని ఆ విభాగంలో చర్చనడుస్తోంది.స్థానాన్ని బట్టి ఒక్కో డీఐ నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, ఏడీ నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర చేతులు మారేలా డీల్స్ నడిచాయని ఔషధ నియంత్రణ విభాగం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా కీలక ఉన్నతాధికారి ఆకస్మిక బదిలీతో కోరుకున్న చోట పోస్టింగ్ దక్కుతుందా లేదోనని ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్న డీఐలు, ఏడీలు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అడ్డగోలు నిర్ణయాలు మరోవైపు కొద్ది నెలలుగా ఈ విభాగంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఏసీబీకి పట్టుబడిన ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా వర్క్ ఆర్డర్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటే విజిలెన్స్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ ఏమీ లేకుండానే నేరుగా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై ఏసీబీ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన డీఐను అనతికాలంలోనే కీలక స్థానంలో వర్క్ ఆర్డర్పై నియమించారు. ఇలా వర్క్ఆర్డర్ల రూపంలోనూ పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. -
‘కనెక్టివిటీ’ బాదుడు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తిదారులపై అదనపు భారం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో) లిమిటెడ్ సిద్ధమైపోయింది. రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం కావాలనుకునే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమలు, భారీ విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం వేయడానికి రంగం సిద్ధం చేసింది. గ్రిడ్లోకి విద్యుత్ను పంపినా, తీసుకున్నా అదనపు చార్జీలు మోపుతూ ‘కనెక్టివిటీ ఒప్పందం’ పేరుతో ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతి కోసం పంపిన ముసాయిదాలో అనేక సాంకేతిక, ఆర్థిక భారాలను పూర్తిగా వినియోగదారులపైనే మోపడం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ ఉత్పత్తిదారులు 132 కేవీ పైబడి ఉన్న కనెక్షన్లకు ఏపీ ట్రాన్స్కోతో, 33 కేవీ స్థాయిలో ఉన్న వాటికి ఏపీ ట్రాన్స్కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కొత్తగా గ్రిడ్కు అనుసంధానమయ్యే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సింక్రనైజేషన్కు ముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. అలాగే కొత్త వినియోగదారులకు విద్యుత్ సరఫరా ప్రారంభించే ముందు ఈ ఒప్పందం అమలులో ఉండాలి. ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలు, వినియోగదారులు మూడు నెలల్లోగా ఒప్పందాలను పూర్తి చేయాలి. ఒప్పందం వరకే అయితే పర్లేదు కానీ ఆ తర్వాత మోపే భారాలను చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయంటున్నారు పారిశ్రామికవేత్తలు. ఒప్పందం చేసుకోకుంటే జరిమానాలు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ వినియోగం లేదా విక్రయం జరిగితే ట్రాన్స్మిషన్, వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రిడ్కు అనుసంధానం కోసం అవసరమైన ఇంటర్ కనెక్షన్ సదుపాయాల నిర్మాణ వ్యయం మొత్తాన్ని అభివృద్ధిదారులు లేదా వినియోగదారులే భరించాలి. అంతేకాకుండా నిర్వహణ, మరమ్మతులు, పరికరాల మార్పిడి ఖర్చులు కూడా వారిపైనే ఉంటాయి. దీంతో కొత్తగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలపై అదనపు భారం పడనుంది. ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ విక్రయాలు లేదా వినియోగం చేపట్టే సంస్థలు ట్రాన్స్మిషన్, వీలింగ్, ఆంధ్రప్రదేశ్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్ఎల్డీసీ) ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెరుగుతున్న నిర్వహణ వ్యయాలకు ఇవి అదనంగా చేరనున్నాయి. వాణిజ్య ఒప్పందం లేకుండా గ్రిడ్లోకి విద్యుత్ను పంపినా, గ్రిడ్ నుంచి తీసుకున్నా జరిమానాలు, అదనపు చార్జీలు విధిస్తామని ముసాయిదా హెచ్చరిస్తోంది. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న చిన్న సంస్థలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సౌర, పవన ప్రాజెక్టులపై కఠిన నిబంధనలు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు లో ఓల్టేజ్ రైడ్ త్రూ(ఎల్వీఆర్టీ), హై ఓల్టేజ్ రైడ్ త్రూ(హెచ్వీఆర్టీ), రియాక్టివ్ పవర్ సపోర్ట్ వంటి ప్రత్యేక సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదనంగా పవర్ కంట్రోల్ వ్యవస్థలు కూడా తప్పనిసరి చేశారు. దీంతో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ప్రాజెక్టు ఏపీఎస్ఎల్డీసీతో అనుసంధానమయ్యేలా స్కాడా, కమ్యూనికేషన్, డేటా టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు కూడా పూర్తిగా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే మీటరింగ్, రక్షణ వ్యవస్థలు, పరికరాల పరీక్షలు, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు వంటి ఖర్చులన్నీ వినియోగదారులపైనే వేశారు. వీటిలో ఏవైనా లోపాలు తలెత్తినా సంబంధిత సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాల్లో ఆందోళన ఇప్పటికే విద్యుత్ రంగంలో పెట్టుబడుల వ్యయం పెరుగుతున్న నేపధ్యంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలు వెనుకడుగు వేసే అవకాశముందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో కొత్త పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఇంధనరంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిబంధనలన్నీ గ్రిడ్ భద్రత, విద్యుత్ నాణ్యత, వ్యవస్థ విశ్వసనీయత కోసం అవసరమని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను వెల్లడించాల్సిందిగా (ఏపీఈఆర్సీ) ఆహ్వానించింది. ఈ – మెయిల్ లేదా పోస్టు ద్వారా జూన్ 19 లోపు కమిషన్ కార్యదర్శికి పంపవచ్చని తెలిపింది. -
పాలకూట విషం!
చీరాల టౌన్: చాలామంది యజమానులు ఎక్కువ పాలు సేకరించేందుకు పాడి గేదెలకు చెందిన దూడలకు సరిపడా పాలు తాగకుండా తల్లి నుంచి దూరం చేస్తున్నారు. అవి పాలు సరిపడక అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మవచ్చనే దూరాలోచనతో దూడ బదులు నిషేధిత డ్రగ్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు వేసి మొత్తం పాలు పిండుతున్నారు.ఈ ఇంజెక్షన్ హర్మోన్లను ప్రభావితం చేస్తుంది. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాలపాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ అదే రెండు రూపాయలు విలువైన ఆక్సోటోసిన్ ఒక్క ఇంజెక్షన్ వేస్తే చాలు క్షణాల్లో గేదె సేపి పొదుగు నుంచి పాలు కారిపోతాయి. గేదెలకు ఉదయం 2 ఎంఎల్, సాయంత్రం 2 ఎంఎల్ చొప్పున ఒక్కో గేదెకు వేస్తున్నారు. అంత ప్రమాదకర ఈ ఇంజెక్షన్ను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో 2024లో నిర్వహించిన 21వ పశుగణన ప్రకారం ఆవులు 21,930, గేదెలు 3,81,764, గొర్రెలు 2,49,394, మేకలు 30,691 ఉన్నాయి. వీటిలో పశువుల నుంచి పాలు తాగే దూడలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ప్రమాదకర హర్మోన్లు ఉన్న ఇంజెక్షన్లను పాడి గేదెలకు వేయడం వలన గేదెలు ఎదకు రాకపోవడం, గర్భసంచి వంటి భాగాలకు జబ్బులు సోకడంతోపాటు తక్కువ కాలానికే ఆ గేదెలు చనిపోతున్నాయి. నిషేధించిన ప్రభుత్వం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకంతో ఆ పాలు తాగిన వారితోపాటు పశువులు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ ఇంజెక్షన్లను ప్రభుత్వం నిషేధించింది. కానీ చాటుమాటున చెన్నై వంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చీరాల పట్టణంలోని పశువు మందులు అమ్మే దుకాణాల్లో చాలా వాటిల్లో వీటి అమ్మకాలు చేస్తున్నారు. రూరల్ గ్రామాల్లోని పశుపోషకులకు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయినా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మూమూళ్ల మత్తులో పడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పరంగా కూడా కనీస చర్యలు కొరవడ్డాయి. ఆ పాలు తాగితే అనర్థాలు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడిన గేదెల పాలు తాగితే అనేక అనర్థాలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాదకర హర్మోన్లు కలిసిన పాలు తాగితే క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని చెబుతున్నారు. కళ్ల జబ్బులతోపాటు ఆడ పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం, రొమ్ములు పెరగడంతోపాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. తనిఖీలు శూన్యం చీరాలతోపాటుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సేపు ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నా కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కనీసం మూడు నెలలకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదు. చీరాల్లో ప్రాంతీయ డ్రగ్ ఇన్స్పెక్టర్ (ఔషధ నియంత్రణ అధికారి) కార్యాలయం ఉన్నా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు రవాణా అవుతున్నా కూడా కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారు. -
జెన్ ఆల్ఫా.. జెట్ స్పీడ్
సాక్షి, అమరావతి: ఒరే కన్నా దుకాణానికి వెళ్లి అది తెచ్చు. తల్లీ టిఫిన్ షాపునకు వెళ్లి ఇడ్లీ తెచ్చు. కరోనా ముందు వరకూ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పినమాటలు. ప్రస్తుతం ఆ రోజులు మారాయి. టెక్నాలజీ పుణ్యమా అని జెన్ ఆల్ఫా( పిల్లలు) తల్లిదండ్రులకే కొనుగోలు పాఠాలు చెబుతున్నారు. ఫుడ్ నుంచి పానీయాలు, ఇతర వస్తువులు సైతం ఏమి కొనుగోలు చేయాలో.. ఏ వస్తువు ఎక్కడ కొనాలో పిల్లలే డిసైడ్ చేస్తున్నారు. 2010–2024 మధ్య జన్మించిన పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నట్లు ప్రైస్ వాటర్హౌస్ కూపర్ (పీడబ్ల్యూసీ) విడుదల చేసిన జెనరేషన్ ఆల్ఫా 2026లో పేర్కొంది. కరోనా సమయంలో క్లాసులు ఆన్లైన్లో జరగడంతో జెన్ ఆల్ఫా పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల వినియోగంలో ఆరితేరినట్టు ఆ నివేదిక వెల్లడించింది. 70 శాతం చిన్నారులకు సొంత ఫోన్లు, ట్యాబ్లు ఏడు నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 70 శాతం మంది సొంత ఫోన్ లేదా ట్యాబ్ కలిగి ఉన్నారని వెల్లడించింది. వీరిలో 97 శాతం మంది కొనుగోళ్ల విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. రోజులో 3.6 గంటలు ఫోన్లతోనే.. జనరేషన్ ఆల్ఫా పిల్లలు బయట ప్రపంచంతో కంటే ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వే వెల్లడించింది. సగటున కనీసం 3.6 గంటలు వినోదం కోసం ఫోన్లు చూస్తున్నట్లు పేర్కొంది. బయట ఆడుకోవడానికి లేదా చదువుకోవడానికి వెచ్చించే సమయం కంటే రెట్టింపు సమయం ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 68 శాతం మంది యూట్యూబ్ చూస్తుంటే, 54 శాతం మంది గేమింగ్ ప్లాట్ఫామ్స్, 49 శాతం స్ట్రీమింగ్ సర్వీసెస్, 29 శాతం మంది టిక్టిక్తో కాలక్షేపం చేస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లలో అగ్రస్థానం ఆహారం, పానీయాలదే ఆన్లైన్ వ్యయాల్లో చూస్తే ఆహారం, పానీయాలదే తొలిస్థానం. జెన్ ఆల్ఫా ఆన్లైన్షాపింగ్లో 72 శాతం ఫుడ్ అండ్ డ్రింక్స్ ఉండగా, 57 శాతంతో బొమ్మలు కొనుగోళ్లు రెండోస్థానంలో ఉంది. దుస్తులు 55 శాతం, 53 శాతం డిజిటల్ యాప్స్ ఉన్నాయి. పిల్లలు ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నా నగదు చెల్లింపులు పెద్దలే చేస్తుండడం గమనార్హం. జెన్ఆల్ఫా పిల్లలు కేవలం కంటెంట్ను వినియోగించుకోవడమే కాకుండా ఆన్లైన్లో నేర్చుకున్న వాటిని ఉపయోగించి తమ కుటుంబాలు డబ్బు ఖర్చు చేసే విధానాన్ని కూడా మారుస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. -
22 జిల్లాల్లో పూర్తిస్థాయి డీఈవోలు లేకుండానే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో పాలన గాడితప్పింది. జిల్లా వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా విద్యాశాఖాధికారులు(డీఈవోలు) లేకుండానే 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమైపోయింది. స్కూళ్ల పర్యవేక్షణ, ఉచిత పుస్తకాల పంపిణీ, విద్యార్థుల బాగోగులతో పాటు విద్యాసంబంధమైన అన్ని వ్యవహారాలు చక్కబెట్టే కీలక అధికారులు లేకుండానే ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 22 జిల్లాలకు పూర్తిస్థాయి డీఈవోలు లేరు. వీరిస్థానంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, డైట్ లెక్చరర్లు డీఈవో కేడర్లో కొనసాగుతున్నారు.అర్హతలున్న సీనియర్ అధికారులను పక్కనబెట్టి జూనియర్లను ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించారు. పూర్తిస్థాయి డీఈవోలు ఉంటే తమ పనులకు అడ్డు తగులుతారనుకున్నారో లేక సొంత పనులు చేసేవారు ఉండరనుకున్నారోగానీ డీఈవోలను నియమించేందుకు మాత్రం ప్రభుత్వం సుముఖత చూపడం లేదన్న విమర్శలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరుకు డీఈవోను నియమించలేని దయనీయస్థితిలో విద్యాశాఖ ఉంది. గత డిసెంబర్లో సర్వీస్ రూల్స్ను పక్కనబెట్టి అనర్హులకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి స్థానిక కూటమి నాయకులు సొంత వ్యవహరాలు చక్కబెట్టుకుంటున్నట్టు విమర్శలున్నాయి. సీనియారిటీకి, అర్హతలకు తిలోదకాలు విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలు తప్ప మిగిలిన 22 జిల్లాల్లో డీఈవోలుగా జూనియర్ అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగుల సర్వీస్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ డీఈవో పోస్టుకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇవ్వాలన్నా అవే అర్హతలు తప్పనిసరి. కానీ ప్రభుత్వం కరెన్సీకి ప్రాధాన్యమిచ్చి నిబంధనలకు తిలోదకాలిచ్చిందన్న ఆరోపణలున్నాయి. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 13 జిల్లాల డీఈవోలను బదిలీ చేసింది. అంతకుముందు మరికొందరిని సర్దుబాటు చేసింది.ఈ ప్రక్రియలో ఎక్కడా సీనియారిటీని పట్టించుకోలేదు. డీఈవోల నియామకంలో తొలుత డిప్యూటీ డైరెక్టర్లకు అవకాశం కల్పించాలి. కానీ వారిని ప్రాధాన్యం లేని శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సుమారు 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్ల సీనియారిటీ లిస్టును విడుదల చేసింది. ఇందులో అత్యంత జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లకు 22 జిల్లాల డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే 78 డీవైఈవో పోస్టుల్లో అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించాల్సి ఉన్నా, పలుచోట్ల టీచర్లకు అదనపు బాధ్యతలు, మరికొన్నిచోట్ల ఫిజికల్ డైరెక్టర్లను నియమించడంపై విమర్శలొస్తున్నాయి. ఉపాధ్యాయులకు ‘పేమెంట్’ బదిలీలు!ఏటా ఉపాధ్యాయ బదిలీలుంటాయని, ఇందులో ఎవరి సిఫారసులు ఉండవని, అంతా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపడతామని గతేడాది చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025 తీసుకొచ్చింది. దీని ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బదిలీలు ఉంటాయన్నారు. కానీ చట్టంలోని ఓ నిబంధనను అడ్డుపెట్టుకుని రెండేళ్లుగా ‘పేమెంట్ బదిలీలు’ చేపడుతున్నారు. చట్టంలో అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్ రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్న క్లాజ్తో అంతా చక్కబెట్టుకుంటున్నారు.స్థానిక నాయకుల సిఫారసు లేఖలతో ఇన్చార్జి డీఈవోలతో అక్రమ బదిలీలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది బదిలీల నిషేధ సమయంలో 150 మందికి పైగా సిఫారసు లేఖలు తెచ్చుకున్న ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూడా భారీగా సిఫారసు బదిలీలు చేపట్టారు. ఒక్కో బదిలీకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. తాజాగా విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో మరిన్ని బదిలీలకు రంగం సిద్ధం చేశారంటే పాఠశాల విద్యాశాఖలో అక్రమాలు ఎంత యథేచ్ఛగా జరుగుతున్నాయో తెలుస్తోంది. -
పీహెచ్డీ చేసిన వారికన్నా... ఎంఫిల్ వారికి రూ. 5వేలు ఎక్కువ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిపాలనా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. ఒక్కో వర్సిటీ.. ఒక్కోదారి చందాన వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ జీవోలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన ఆర్థికపరమైన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల సిఫారసులు, మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ కార్యకలాపాలు సాగిస్తూ వర్సిటీ ప్రతిష్టను మసకబారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో నంబర్ 110కు పూర్తి విరుద్ధంగా అంబేడ్కర్ వర్సిటీలో పని చేస్తున్న 15 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు ఏకంగా రూ.5వేలు జీతం పెంచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పీహెచ్డీ చేసిన వారికన్నా ఎంఫిల్ డిగ్రీ ఉన్నవారికి రూ.5వేలు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. అదేవిధంగా ఏపీలోని 19 యూనివర్సిటీల్లో కేవలం అంబేడ్కర్ వర్సిటీలో మాత్రమే కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు పెంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు చేస్తూ జీవో 110 జారీ దశాబ్దాలుగా యూనివర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై అరకొర జీతాలతో సేవలందిస్తూ మగ్గిపోతున్న అధ్యాపకులకు మేలు చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో 110 జారీ చేసింది. నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్), స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్(సెట్), స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్(స్లెట్)లో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన వారికి రూ.35వేల ఏకరూప జీతాలను తీసుకొచ్చింది. దీనికి అదనంగా పీహెచ్డీ ఉన్నవారికి మరో రూ.5వేలు పెంచింది. దీనితోపాటు కాంట్రాక్టు ఉద్యోగి సర్వీసును బట్టి ఏడాదికి మరో వెయ్యి చొప్పున అదనంగా పెంచుతూ రూ.50 వేల నుంచి రూ.60వేలకు పైగా జీతాలను పెంచారు. ఆ తర్వాత కూడా ఏడాదిలో రెండు పరిశోధన పత్రాలు సమర్పించిన కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని దిగ్విజయంగా అన్ని వర్సిటీల్లో అమలు చేసి కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ యూనివర్సిటీలో జీవో 110ను తుంగలో తొక్కి ఎంఫిల్ ఉంటే అదనంగా మరో రూ.5వేలు పెంచుతూ ఈ ఏడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నంబర్ 110లో ఎంఫిల్ ప్రస్తావన లేకపోయినా వర్సిటీ అధికారులు మాత్రం నెట్, సెట్, స్లెట్తోపాటు పీహెచ్డీ అర్హతలు గలవారికి గతంలో పెంచిన జీతానికి అదనంగా ఎంఫిల్ ఉంటే మరో రూ.5వేలు పెంచడంతో మిగిలిన వర్సిటీ అధ్యాపకులు కూడా తమకు అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 15 మందికి ఎంఫిల్ పేరుతో జీతాలు పెంచగా, ఇందులో నలుగురైదుగురికి ఎంఫిల్ పట్టా లేకపోవడం గమనార్హం. దీనిపై వర్సిటీల వర్గాలు చాన్సలర్, గవర్నర్కు ఫిర్యాదు చేయడం గమనార్హం. రాజకీయ పీఠానికి వీసీ దాసోహం.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 వర్సిటీల్లోని 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. అంబేడ్కర్ వర్సిటీ వీసీ మాత్రం యథావిధిగా పదవిలో కొనసాగుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుల సిఫారసుతో వీసీ కుర్చీని కాపాడుకున్న కారణంగా, వారు చెప్పింది చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఫలితంగా వర్సిటీలో పరిపాలనా వ్యవస్థ గాడితప్పింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఇద్దరు ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించి వార్తల్లో నిలిచారు. 11 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్పు చేశారు. రాజకీయ నాయకుల సిఫారసు లేఖల ఆధారంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందారనే కారణంతో ఏకంగా 34 మంది చిరుద్యోగులను అర్ధాంతరంగా తొలగించి నడిరోడ్డుపై పడేశారు. ఆ వెంటనేమరో 65 మందికి ఎటువంటి నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కొలువుల్లో కూర్చోబెట్టడం గమనార్హం. వర్సిటీలో అర్హతలు, నిబంధనలను కాలరాస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్సీ చిరంజీవి, ఎమ్మెల్యే కూన రవికుమార్ లేఖల ఆధారంగా ఉద్యోగాలు కట్టబెట్టేయడమే వీసీ పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం కూడా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కండి
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. జూలై 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడలో ఆదివారం యూనియన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి అధ్యక్షతన అంగన్వాడీల రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం సుబ్బరావమ్మ మీడియాతో మాట్లాడుతూ..అంగన్వాడీలకు కనీస వేతనమివ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గించి లబ్ధిదారులకు ఫీడింగ్ సక్రమంగా అందకుండా చేస్తోందన్నారు. అనేక రకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీలపై పనిభారం పెంచి ప్రీసూ్కల్ జరగనివ్వకుండా చేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు ఏడాదికి 10 శాతానికి పైగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. బాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తోందని, పారిశ్రామికవేత్తలకు 99పైసలకే భూములను ధారాదత్తం చేస్తోందని, అంగన్వాడీల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. -
ఆర్యవైశ్యుల పాలిట ద్రోహి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆర్యవైశ్యుల పాలిట ద్రోహిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో వెలంపల్లి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, చంద్రబాబు పాలనలో తమ సామాజికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు వైఎస్ జగన్ ఊతమిచ్చారని చెప్పారు. ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. తద్వారా వ్యాపారాలు బాగా జరిగాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ నిలిచిపోయాయని, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంతో పాటు తల్లికి వందనం వంటి పథకాలూ నిర్వీర్యమయ్యాయన్నారు. దీంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ పరిధిలోని ఆర్యౖవెశ్య సత్రాలు, ట్రస్టులను వారే నిర్వహించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. విజయవాడలో ఆర్యవైశ్య భవనం నిర్మాణం, కర్నూలులో పేద ఆర్యవైశ్య విద్యార్థుల హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు, పెనుగొండలో వాసవీ మాత ఆలయాభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించడం వంటి అనేక చర్యల ద్వారా ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేసినంతగా మరే నాయకుడు చేయలేదని వివరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు మాట్లాడితే.. ఆయన్ను చంద్రబాబు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ని చేశారు. ఆర్యవైశ్యులకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని చెప్పారు.వైఎస్సార్సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ జెండా అండగా నిలిచింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంఅన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్యవైశ్య విభాగం నాయకులు గుబ్బా చంద్రశేఖర్, రేబాల శ్రీను, మిట్టా కరుణాకర్, మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విహారంలో విషాదం
అచ్చంపేట/సాక్షి, అమరావతి: కృష్ణానదిపై పడవలో సరదాగా తిరిగేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని కోనూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులుకాగా వీరిలో ఇద్దరు బాలికలు. ఈ దుర్ఘటన నుంచి ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం కోనూరుకు చెందిన గంధం గంగయ్య వ్యవసాయం చేస్తుంటారు. వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న గంగయ్య రక్తసంబందీకులు, బంధువులు ప్రార్థనల కోసం శనివారం రాత్రి ఆయన ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనాల అనంతరం వీరిలో 14 మంది సమీపంలోని కృష్ణానది విహారానికి వెళ్లారు. వీరిలో పది మంది చేపలు పట్టే చిన్న పడవెక్కి కృష్ణానదిలో సరదాగా తిరిగేందుకు వెళ్లారు. నదిలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత పడవ అటు ఇటు ఊగడం ప్రారంభమైంది. చూస్తుండగానే పడవ బోల్తా కొట్టింది. వీరిలో ఈత వచ్చిన వేముల ముత్యాలు కూడా ఉండటంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగాడు. అంతలోనే నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి పడవల్లో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి నలుగురి మృతదేహాలు నదిలో లభ్యమయ్యాయి. పడవలో మృతదేహాలను ఒడ్డుకు తీసుకు రాగలిగారు. మృతుల్లో పిడుగురాళ్లలో ఉంటున్న గంగయ్య కుమారుడు సత్యానందం రాజ్యలక్ష్మి కుమార్తెలు గంధం సంధ్య (11), గంధం షైని (9), మర్రిచెట్టువారిపాలెంలో నివసిస్తున్న గంగయ్య దగ్గరి బంధువు లక్ష్మణరావు, పూర్ణకుమారి కుమారుడు బత్తుల కార్తిక్ (14), చిలకలకూరిపేటలో ఉంటున్న గంగయ్య కుమార్తె అరుణ, శ్రీనివాసరావు కుమారుడు కొణతల చైతన్య (20) ఉన్నారు. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇసుక గుంతలే కారణం! స్థానికుల కథనం ప్రకారం, గత ఏడాది కృష్ణానదిలో ఇసుక తవ్వకాల కోసం ఇష్టారీతిన తీసిన లోతైన గోతులు ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గుంతలు ప్రమాదకరంగా మారాయని, నలుగురి మరణానికి కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా కోనూరు వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. పడవ బోల్తా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆరి్థక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. -
ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి కనికరమే లేదు
సాక్షి, అమరావతి: ‘వారం కిందట కర్నూల్లో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య.. మొన్న గుంటూరులో ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్.., రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య... పని ఒత్తిడి భరించలేక ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం కలగడం లేదు’ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మకమైన సచివాలయ వ్యవస్థ, ప్రస్తుత ప్రభుత్వ మితిమీరిన ఒత్తిడి, వేధింపులతో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోందని తప్పుపట్టారు. వారం రోజుల్లో జరిగిన ఈ మూడు సంఘటనలు ఇందుకు నిదర్శనమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ ఉద్యోగులకు ఒక టైమింగ్ లేదు, ఒక సెలవు లేదు, ఒక పండగ లేదని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా.. సచివాలయం ఉద్యోగులకు పని లేదంటూ వేల మందిని డిప్యుటేషన్ పేరుతో బదిలీ చేసి మిగిలిన ఉద్యోగులకు ఇన్చార్జి పేరుతో పనిభారం వేసిందని పేర్కొన్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ పనే కాకుండా అదనపు పనితో పాటు వలంటీర్ల పని కూడా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘ఇంకా ఎంత మంది చనిపోతే సీఎం స్పందిస్తారు. వంద మంది ప్రాణాలు పోయినా మీకు కనికరం కలగడం లేదా? సచివాలయ ఉద్యోగుల మీద ఎందుకు ఇంత కక్ష? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారే, ఇదేనా అనుకూల వాతావరణం? ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పనివాతావరణం? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించడమేనా అనుకూల పని వాతావరణం?’అని ప్రశ్నించారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వండినిరంతరం ఇంటింటి సర్వేలతో పాటు యోగాంధ్ర, అక్షరాంధ్ర కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసే కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తున్న ప్రభుత్వం.. అన్ని పనులు ఒకే సారి చెప్పి ఒత్తిడి చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వారి జాబ్ చార్ట్ ప్రకారం పనులు అప్పగించాలని, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వాలని కోరారు. ‘సచివాలయ ఉద్యోగ మిత్రులారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా నిలబడండి. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తోడుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
మీ ఇంటికే వస్తున్నాం ‘సర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)లో భాగంగా సోమవారం నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అవుతోంది. బీఎల్వో (బూత్ లెవెల్ ఆఫీసర్), రాజకీయ పార్టీలు నియమించుకున్న బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్)లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాల్లో పేర్లను సరిచూస్తారు. రాష్ట్రంలో 2002లో చివరిసారిగా ఎస్ఐఆర్ (సర్) జరిగింది. తిరిగి 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మూడో దశలో 16 రాష్ట్రాల్లో జరగనుంది. ఏపీ,తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ విడతలోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే జరుగుతోంది. ఏపీకి చెందిన ఓటర్లలో కొందరు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లడంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జూన్ 15 నుంచి ఏపీలో జరిగే ఎస్ఐఆర్లో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఆయా ఓటర్లపైనే ఉంది. 3.75 కోట్ల ఓట్లు సేఫ్ ఎస్ఐఆర్లో అత్యంత కీలకమైనది ఓటర్ మ్యాపింగ్. 2002 ఎస్ఐఆర్ తర్వాత ప్రకటించిన తుది ఓటరు జాబితాతో 2024 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేస్తున్నారు. 2024 ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్నవారు 2002 ఓటర్ల జాబితాలో ఓటుహక్కు కలిగి ఉండటం లేదా వారి తల్లిదండ్రులు, సమీç³ బంధువుల ఓటు ఉంటే వాటితో మ్యాపింగ్ చేస్తారు. ఇలా మ్యాపింగ్ జరిగిన ఓట్లు కొనసాగుతాయి. జూన్ 14న మధ్యాహ్నంతో మ్యాపింగ్ను ముగించారు. జూన్ 13 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 76% ఓటర్ల మ్యాపింగ్ జరిగిందని, ఇది 80% దాటుతుందని అంచనా వేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే.. అందులో ఇప్పటివరకు 3.75 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. 42 లక్షల ఓట్లు మాత్రం మ్యాపింగ్ కాలేదు. జూన్ 15 నుంచి ఇంటింటా జరిగే సర్వేలో ఈ 42 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే తమ ఓటుహక్కును కాపాడుకోగలుగుతారు. మ్యాపింగ్ పూర్తయిన వారు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికి రాష్ట్రంలో ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యుమరేషన్ ఫారం పూర్తిచేసి ఇవ్వాల్సిందే. ఆ ఫారాలు సకాలంలో ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే కొనసాగుతాయి. ఎన్యుమరేషన్ ఫారం, ఫొటో తప్పనిసరి సర్ ప్రక్రియలో బీఎల్వో కీలకపాత్ర పోషించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక బీఎల్వోను నియమించారు. ఏపీలో 46,397 మంది బీఎల్వోలున్నారు. మీ బీఎల్వో ఎవరన్నది సులభంగా తెలుసుకోవచ్చు. voters.eci.gov.in లేదా ఈసీఐనెట్ యాప్లో ‘నో యువర్ బీఎల్వో’ లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ ఆప్షన్ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్వో పేరు, ఫోన్ నంబర్ తెలుసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు బీఎల్వోను సంప్రదించి ముందస్తుగా మీ ఇంటికి వచ్చే తేదీని తెలుసుకుంటే ఆ సమయానికి ఓటర్లు అక్కడ ఉండి ఓటును కాపాడుకోవచ్చు.ఇంటింటా సర్వే సమయంలో బీఎల్వో ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ వివరాలను ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. దానిపై ఈ మధ్యనే తీయించుకున్న ఒక కలర్ ఫొటో అతికించి ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్ పూర్తికాని వారికి ఖాళీ ఎన్యుమరేషన్ ఫారం ఇస్తారు. ఆధార్, మొబైల్ నంబర్తో పాటు తల్లి/తండ్రి లేదా సమీప బంధువుల ఓటరు ఐడీ నంబర్లను అందులో పేర్కొనాలి. మ్యాపింగ్ కానివారు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన సమాచారంతో బీఎల్వో సంతృప్తి చెందితేనే మీ ఓటు కొనసాగుతుంది. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది https:// voters. eci. gov. in/ అనే వెబ్సైట్లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్’ అనే ఆప్షన్ను క్లిక్ చేసి చూసుకోవచ్చు. ముసాయిదా ఓటర్ల జాబితాయే కీలకం ఇంటింటా సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్వో దగ్గర ఉంటుంది. http:// www. ceoandhra. ap. gov. in/ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఈ జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాలి. ఈ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయండి. ఈ అభ్యంతరాలను ఆగస్టు 20లోపే స్వీకరిస్తారు. ఇలా వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి 3 రకాల ఫారాలు ఉంటాయి. జూలై 1లోగా మీకు 18 ఏళ్లు నిండినా.. కొత్తగా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే చనిపోయిన లేదా వలస వెళ్లిన వారిని ఓట్లు ఉంటే వాటిని తొలగించడానికి ఫారం–7, జాబితాలో ఓటు లేకపోయినా.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని ఉపయోగించాలి. ఈ తేదీలను గుర్తుంచుకోండి» జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు సర్వే కోసం ఇంటింటికీ వస్తారు » జూలై 21న ముసాయిదా జాబితా విడుదల » ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ » సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాల పరిష్కారం » సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల » జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు.మ్యాపింగ్ కానివారు వీటిలో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఉద్యోగి లేదా పెన్షన్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు 2. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్టు 5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు 6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం 7. అటవీ హక్కులకు చెందిన పత్రం 8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు 9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 10. రాష్ట్ర, స్థానిక అథారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్ -
‘సర్’తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర
నెల్లూరు(అర్బన్): దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఎన్నికల కమిషన్, మిలిటరీ దళాలను గుప్పెట్లో పెట్టుకుని కొన్ని వర్గాల ప్రజలకు ఓట్లు లేకుండా చేస్తున్నారని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించిన 20 మంది సుప్రీంకోర్టుకు వెళ్లి తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నెల్లూరులో ఆదివారం డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి 18వ స్మారక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్– భ్రమలు, వాస్తవాలు’ అనే అంశంపై పరకాల మాట్లాడారు. ఇప్పటి వరకు సర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికల ముందు సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని తెలిపారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రశ్నించకుండా ఉండేందుకు వికసిత్ భారత్ పేరుతో డ్రామాలాడుతూ కుల, మత, భాషాపరంగా ప్రజలను విభజన చేస్తున్నారని వివరించారు. ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాలంటే ప్రజలు రోడ్ల మీదకు రావాలని, పోరాటాలు చేయాలని పరకాల పిలుపునిచ్చారు. స్కిల్ ఇండియా ఒక స్కామ్దేశంలో గడిచిన వందేళ్లలో లేనంతగా ప్రస్తుతం ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరకాల ప్రభాకర్ చెప్పారు. విద్య, వైద్యం, అక్షరాస్యత... ఇలా పలు రంగాల్లో అనేక చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. ఉత్పాదక రంగంలో 133వ స్థానానికి, ఆకలి సూచీలో 102 స్థానానికి మన దేశం దిగజారిపోయిందని తెలిపారు. అయినా భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో 5వ స్థానంలో ఉందని పాలకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ప్రధాన మంత్రి కౌసల్ యోజన (స్కిల్ ఇండియా) పెద్ద స్కామ్గా మారిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినట్లు చెబుతున్న వారిలో 61 లక్షల మంది పేర్లు, ఊçర్లు లేవన్నారు. 12 వేల మంది మళ్లీ మళ్లీ శిక్షణలో పాల్గొంటున్నట్లు తేలిందన్నారు. శిక్షణ పొందిన 34 లక్షల మంది ఇళ్లకు వెళ్లి పరిశీలించగా, వారికి స్టైఫండ్ అందలేదన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 95 శాతం బోగస్ అకౌంట్లు ఉన్నాయని, స్కిల్ ఇండియా పేరుతో డబ్బును దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
108 కుయ్యో మొర్రో!
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న ఏడు నెలల గర్భిణి. మే 15న చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 800 గ్రాముల శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించాలని వైద్యులు సూచించారు. అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో 108 అంబులెన్స్లో పసికందును వెంటిలేటర్పై ఉంచి తిరుపతికి బయలుదేరారు. మురకంబట్టు దగ్గర అంబులెన్స్ ఉన్నట్టుండి ఆగిపోయింది. వెంటిలేటర్పై ఉన్న శిశువుతో రెండు గంటల పాటు నడిరోడ్డుపై కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించారు. 60 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నుంచి మరో అంబులెన్స్ రప్పించి తిరుపతికి తరలించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దుస్థితి ఇది.మే 2వ తేదీన ప్రకాశం జిల్లా రాయివారిపాలెంకు చెందిన కట్టా శంకరమ్మ ఇంటి వద్ద స్పహ కోల్పోయి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్స్ సాయం కోరారు. 10.. 20.. 30.. నిమిషాలు గడిచినా అంబులెన్స్ రాలేదు. మళ్లీ 108కు ఫోన్ చేయగా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోందంటూ ఏకంగా గంటన్నర ఆలస్యం చేశారు. చివరకు అంబులెన్స్ గ్రామానికి చేరుకునే సరికే శంకరమ్మ తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే శంకరమ్మ బతికేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.సాక్షి, అమరావతి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్వీర్యమైన 108 అంబులెన్స్ సేవలను ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయి. ఇక్కడ ఉదహరించిన ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక 108, 104 సేవలను అవకతవకలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. టీడీపీ నేతకు చెందిన ‘భవ్య’ అనే సంస్థకు అడ్డదారుల్లో 104, 108 నిర్వహణ కాంట్రాక్ట్ను కట్టబెట్టేశారు. అస్మదీయులకు నిర్వహణ కాంట్రాక్ట్ను కట్టబెట్టడంపై చూపిన శ్రద్ధ.. పకడ్బందీగా సేవలు అమలు చేయడంపై పెట్టలేదు. దీంతో రోడ్డు.. ఇతర ప్రమాదాలు, అనారోగ్య బాధితులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన అంబులెన్స్లు సకాలంలో స్పందించడం లేదు. నిర్వహణ సరిగా లేక అంబులెన్స్లు మొరాయించడం, ఆపద సమయంలో ఫోన్ చేస్తే సకాలంలో ఘటనా స్థలికి చేరుకోకపోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్లు ఉండగా, అందులో 731 ఆన్ రోడ్ సేవలు అందించాలి. మిగిలినవి బ్యాకప్ కింద ఉంటాయి. కాగా, రాష్ట్రంలో ఏ ఒక్క రోజు 731 వాహనాలు ఆన్ రోడ్ సేవల్లో ఉండటం లేదని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో 108 అంబులెన్స్లు రోజుకు సగటున మూడు వేల కేసులకు అటెండ్ అయ్యేవి. చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల మేర సేవలను అంబులెన్స్లు అందిస్తున్నాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే రోజువారీ వెయ్యికి పైగా సేవలు తగ్గిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో డయాలసిస్ చేయించుకోవాల్సిన కిడ్నీ వ్యాధి రోగులకు ఉచితంగా 108 అంబులెన్స్ సేవలు అందేవి. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ సర్వీస్ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కిడ్నీ బాధితులు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మరో వైపు ఒక ప్రభుత్వాస్పత్రి నుంచి మరో ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం రోగులను తరలించే సేవలు సైతం పడిపోయాయి. రోగులను తరలించాలని వైద్యులు రెఫర్ చేసినప్పటికీ, ఎమర్జెన్సీ కేసు కాదని నిర్వహణ సంస్థ తిరస్కరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆపద సమయంలో నిర్ధేశిత సమయం కంటే ఆలస్యంగా అంబులెన్స్లు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి. ఫలితంగా అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సమయానికి వచ్చి ఉంటే ఒట్టు!మార్చి 29న శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. బైక్పై ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్ చేశారు. క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించిన కాసేపటికి అది మొరాయించింది. పోలీసులు, స్థానికులు తలా ఓ చేయి వేసి ఎంత నెట్టినా ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. 20 నిమిషాల పాటు అష్టకష్టాలు పడ్డాక ఇంజిన్ స్టార్ట్ అయింది. చికిత్స ఆలస్యం అవ్వడంతో క్షతగాత్రులు విలవిల్లాడిపోయారు. » మూడు నెలల కిందట కాకినాడ జిల్లా సర్పవరం సమీపంలో రాత్రి సమయంలో ఓ టిప్పర్ కారును ఢీ కొట్టింది. కారులో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళను ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అంబులెన్స్లు అందుబాటులో లేవని కాల్ సెంటర్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహిళ విలవిల్లాడుతూ కొద్దిసేపటికే మరణించింది. కాకినాడ నగరానికి కూత వేటు దూరానికి అంబులెన్స్ను పంపక పోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. » మార్చి 26 తెల్లవారుజామున మార్కాపురం వద్ద ప్రైవేట్ బస్సు నడిరోడ్డుపై దగ్ధం అయింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేశారు. 20 సార్లు ఫోన్ చేసినా కనీస స్పందన లేదని ప్రమాదానికి గురైన బస్సులోని యువతి కన్నీరుమున్నీరైంది.» గతేడాది మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం 108కు డయల్ చేసినా కాల్స్ కలవలేదు. ఏకంగా ఐదు గంటలకు పైగా సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైన వారికి సత్వరమే వైద్య సేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. పలువురు ఏకంగా మత్యువాత పడ్డారు.నాడు ఏడాదిలో బలోపేతంగతంలో చంద్రబాబు 108 వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చగా, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో ఈ వ్యవస్థను బలోపేతం చేశారు. 2019కి ముందు 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. కనీసం మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి. అత్యవసర వైద్య సేవల సంస్కరణల్లో భాగంగా మండలానికి రెండు అంబులెన్స్లు సమకూరుస్తూ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఏడాది తిరక్కుండానే 412 అంబులెన్స్లు కొనుగోలు చేశారు. వీటిని 2020 జూలై1న వైఎస్ జగన్ ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందు కోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 కొత్త 108 అంబులెన్స్లను గిరిజన ప్రాంతాలకు సమకూర్చారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అత్యవసర వేళ అండగా నిలిచారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళ్ళుమరి సమీపంలోని త్రిమూర్తి ఆగ్రో ఫార్మ్ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ఘటనలో క్యాంపురం గ్రామానికి చెందిన ఆది (30), మహేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు టిల్లు (24) తీవ్ర గాయాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు.ఈ ప్రమాదంతో మడకశిర ప్రాంతంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ, గాయపడిన యువకుడి ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారత్లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము వాస్తవాలను మాత్రమే బయటపెడతాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి పద్ధతులను బహిర్గతం చేస్తాం. ప్రజలను ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం. నిజం మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను, తద్వారా ప్రతిపక్ష స్వరాలను అణచివేయడం ప్రమాదకర ధోరణికి నాంది. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధ చర్య.అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అధిక వ్యయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు, ప్రజా ప్రాధాన్య అంశాల్లో భారీ అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలను వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇటువంటి వంటి విషయాల నుంచి.. విమర్శనాత్మక సమాచారాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది.ఈ అన్యాయపూరిత చర్యలను ప్రతి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ మార్గంలో సవాలు చేస్తాం. బెదిరింపులు, సెన్సార్ చర్యలు, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గళాన్ని అణచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడంలో, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే మౌలిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.This is not just an attack on YSRCP; it is an… pic.twitter.com/rJHq8BZ2pm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2026 -
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్సీపీ మాత్రమే. వైఎస్సార్సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్కు దక్కింది. స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్దిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్లపై వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్లపై ఆర్య వైశ్యులకే వైఎస్ జగన్ హక్కులు కల్పించారు...గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు. -
కుక్కకు పోస్టుమార్టం పూర్తి.. ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ
కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం, జూన్ 14వ తేదీ) పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్.సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కకు పోస్టుమార్టం నిర్ర్వహించిన అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. దాంతో ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా..? విష ప్రయోగమా? అనేది ల్యాబ్ రిపోర్ట్ అనంతరం తేలనుంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో క్లూ అనుకున్న కుక్క మృతిచెందడంతో ఇప్పుడు టాపిక్ అంతా కుక్కపైకి డైవర్ట్ అయ్యింది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది. అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు -
కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరు వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఓ కుటుంబ వేడుకకు హాజరైన బంధువులు పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. సహాయక బృందాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: రాగల మూడు గంటల్లో ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది.కర్నూలు రూరల్లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది. -
పల్నాడు జిల్లాలో విషాదం
సాక్షి,పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కుంకలగుంట నుంచి కోనూరులోని ఒక ఫంక్షన్కు వచ్చిన 10 మంది నది దాటేందుకు పడవ ఎక్కారు. మధ్యలో పడవ ఒక్కసారిగా బోల్తా పడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి మృత దేహం కోసం ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పడవ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇసుక కోసం తవ్విన గుంతలు పడవకు అడ్డంకిగా మారి ప్రమాదానికి కారణమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసం తవ్వకాలు జరగకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఇలాంటి తవ్వకాలను అధికారులు నియంత్రించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీ (SCERT)లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. -
అమరావతిలో దేవుడి భూములకు ఎసరు.. పల్నాటి వీరులను వదల్లేదు?
సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల కేటాయింపుపై మరోసారి వివాదం చెలరేగింది. తుళ్లూరు మండలంలోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన భూములను దేవాలయానికి తిరిగి కేటాయించాల్సి ఉండగా, వాటిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు కట్టబెట్టారు.వివరాల ప్రకారం.. తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 161లో సుమారు 6 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమరావతి భూసమీకరణ (Land Pooling)లో భాగంగా తీసుకున్న అధికారులు, అనంతరం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను దేవాలయానికి కాకుండా ఇతరులకు కేటాయించారు. దేవాలయ భూములకు సంబంధించి ఫామ్-8 రికార్డుల్లో "నో ట్రాన్స్ఫర్" అనే స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయి. ఈ భూములకు బదులుగా రావాల్సిన 21 రిటర్నబుల్ ప్లాట్లు దేవాలయానికి అందకుండా, టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లపై నమోదు చేశారు.ప్రస్తుతం ఈ ప్లాట్ల విలువ రూ.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పల్నాటి వీరుల దేవాలయ నిర్వహణ, నిత్యకైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం దాదాపు ఆరు దశాబ్దాల క్రితం దాతలు ఈ భూములను దానం చేసినట్లు సమాచారం. అలాంటి భూములకు సంబంధించిన హక్కులను విస్మరించి కేటాయింపులు చేయడం దేవాదాయ ఆస్తుల రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల వెలగపూడి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు పల్నాటి వీరుల దేవాలయ భూముల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. -
‘స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు’
సాక్షి,తిరుపతి: మహానేత వైఎస్సార్ఆర్పై శివానంద స్వామి తదితరులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.కొంతమంది స్వాములు టీడీపీ నేతలు కంటే దిగజారారు. కాషాయ స్వాములు పచ్చ జెండా ఎత్తుకుని మహానేత వైఎస్ఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బూతు సినిమాల నిర్మాత అట్లూరి నారాయణ కొండ మీద బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. శ్రీను బాలికను అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఆదేశాలతో ఆధ్యాత్మిక సభ జరిగింది. స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు. అలాంటి బీఆర్ నాయుడికి కొంత మంది స్వాములు తొత్తులుగా మారారు. శ్రీను నీవు కాషాయం వేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?.కొంత మంది స్వాములను టీడీపీ జెండాలు మార్చే కూలీలుగా బీఆర్ నాయుడు మార్చాడు. కొంత మంది సాధువులు కాషా వస్త్రాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకోవాలి. దేవుడిని రాజకీయ వనరుగా వాడుకుంది చంద్రబాబే. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబుపై సాధువులు ఎందుకు మాట్లాడరు?.చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే మూటలు బాగానే అంది ఉంటాయి. రెండు కొండలను ఏడు కొండలుగా మార్చి జీవో ఇచ్చింది వైఎస్ఆరే. వేద విశ్వవిద్యాలయం స్థాపించింది వైఎస్ఆర్. పేదలకు పెళ్లిళ్లు చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ఆర్.ఊరువాడా భజన మండళ్లు నిర్మించిన గొప్ప నాయకుడుకు వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ తీసుకొచ్చింది వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ వద్దన్నది చంద్రబాబు. గోమాతను పరిరక్షించాలని కంకణం కట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్. నవనీత సేవ తీసుకొచ్చింది వైఎస్ జగన్’ అని భూమన గుర్తు చేశారు. -
కేసులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?
సాక్షి,విజయవాడ: ఉర్సా భూముల వ్యవహారంలో కేశినేని సోదరుల మధ్య మాటలు మంటలు కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం వైజాగ్ ఉర్సా భూముల కుంభకోణంపై కేశినేని చిన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నాటి ఫిర్యాదుపై ఇప్పుడు కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుపై కేశినేని నాని సోసల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫ్రస్టేషన్తోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. దొంగ కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారు. ప్రశ్నించినందుకు నాపై 14 నెలల తర్వాత కేసు పెట్టారు. తాను లేఖ రాసినందుకే దొంగ కంపెనీకి భూములు కేటాయించలేదని అన్నారు. డీల్ అడ్డం తిరగడంతో కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని కేశినేని నాని స్పష్టం చేశారు. ఉర్సా భూముల కుంభకోణంవైజాగ్లో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని కేశినేని నాని గతేడాది ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అందులో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కేశినేని చిన్ని, తన స్నేహితులు, బినామీలతో కలిసి కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరే. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. -
అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. బాలిక అదృశ్యమై తొమ్మిది రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న పామాయిల్ తోట, నల్లకొండ మీద గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. తమ కుమార్తె ఇంటికి చాలా దగ్గరలోనే ఆడుకునేదని, ఇంటి నుంచి 20 మీటర్ల దూరం కూడా ఒంటరిగా వెళ్లే అలవాటు లేదని తెలిపారు. మా పాప అంత దూరం వెళ్లే పిల్ల కాదు. ఆమెను ఎవరో అపహరించి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్లినా ఆమె పెంపుడు కుక్క ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఇంటి సమీపంలోని తోటలో, పరిసర ప్రాంతాల్లో ఆ కుక్కతో కలిసి ఆడుకోవడం ఆమెకు అలవాటని తెలిపారు. అందుకే బాలిక అదృశ్యమైన తర్వాత ఆ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారంగా మారుతాయని భావించారు.ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్వరి ఇంటి నుండి పోస్టుమార్టం కోసం పెంపుడు కుక్క మృతదేహాన్ని తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఎన్.సూరవరం పశువుల ఆసుపత్రిలో కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే, కుక్క మృతదేహన్ని తరలిస్తుండగా పాప తల్లి భవాని కన్నీరుపెట్టుకుంది. గత ఆరు నెలలుగా కుక్కను పెంచుకుంటున్నామని.. జ్ఞానేశ్వరి ఆ కుక్కతోనే ఆడుకునేదని రోదించింది. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉన్న ఒక్క ఆధారం పోయిందని కంటతడి పెట్టుకుంది. అయితే ఇటీవల ఆ పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. కుక్క మృతిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన సహజమా? లేక బాలిక అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. కుక్క మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్క ఎలా చనిపోయిందనే విషయంపై స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు.అదంతా అబద్దం..ఇదిలా ఉండగా.. "పాపను తోట బయట చూశాను" అని పాపారావు అనే వ్యక్తి చెప్పిన వాదనను జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. తమ కుమార్తె ఒంటరిగా తోట దాటి బయటకు వెళ్లే అవకాశం లేదని, ఆ వాదనను తాము నమ్మడం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బాలిక అదృశ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అపహరణ కోణంతో పాటు ఇతర అన్ని అవకాశాలపైనా దర్యాప్తు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడం, కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క కూడా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
-
చార్జింగ్ స్టేషన్లకు ‘టెండర్’!
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో కొందరు పెద్దలు మరోసారి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. విద్యుత్ శాఖలో తమకు నచ్చినవారికి రూ.62.94 కోట్ల విలువైన పనులను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను రూపొందించేలా చక్రం తిప్పారు. నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ–నెడ్క్యాప్) విద్యుత్ వాహనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 131 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20,832 కిలోవాట్ల సామర్థ్యంతో ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని టెండర్ పిలిచింది. అయితే, టెండర్లోని అర్హత నిబంధనలు మాత్రం అతి కొద్దిమందికే అవకాశం కల్పించేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ ఒక్కటే టెండర్... రూ.62.94 కోట్ల ఈ భారీ ప్రాజెక్టును పోటీ లేకుండా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారికి కట్టబెట్టేలా నిబంధనలు తయారు చేశారు. నెడ్క్యాప్ అధికారులు చెప్పినదాని ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 131 ప్రాంతాలకు ఒకే బిడ్ సమరి్పంచాల్సి ఉంటుంది. అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం ప్రాజెక్టును ఒకే సంస్థ లేదా ఒకే కన్సార్షియం నిర్వహించాలి. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులను జోన్లుగా లేదా జిల్లాల వారీగా విభజించి టెండర్లు పిలవడం ద్వారా ఎక్కువ కంపెనీలకు అవకాశం కల్పిస్తారు. కానీ ఈ టెండర్లో అలాంటి అవకాశం లేదు. ఇది పోటీని పరిమితం చేసేలా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, మధ్య తరహా కంపెనీలు, కొత్తగా ఈవీ రంగంలోకి వచ్చిన స్టార్టప్లకు కనీసం టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా చేశారు. సాధారణంగా విద్యుత్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టుల్లో పనులను ప్యాకేజీలుగా విభజించడం ద్వారా ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాజెక్టులో అలాంటి విధానం ఎందుకు అనుసరించలేదన్నది చర్చనీయాంశంగా మారింది. బడా సంస్థల కోసమే ఈ నిబంధనలు? టెండర్ నిబంధనల ప్రకారం బిడ్డర్ గత ఐదేళ్లలో కనీసం 8 వేల కిలోవాట్ల ఈవీ చార్జింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉండాలి. 65 వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండాలి. కనీసం 170 చార్జర్ల నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. రూ.31 కోట్ల సగటు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి. రూ.12 కోట్ల నికర ఆస్తులు ఉండాలి. ఈ నిబంధనలను చూస్తే ప్రభుత్వ పెద్దలు ఎవరికి టెండర్ ఇవ్వదలిచారో వారికి మాత్రమే ఉంటాయని, మిగతా సంస్థలు పోటీకి అర్హత సాధించలేవని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నికల్ మూల్యాంకనంలో ఆంధ్రప్రదేశ్లో ఈవీ చార్జర్ తయారీ యూనిట్ ఉన్న కంపెనీలకు 15 మార్కులు కేటాయించారు.స్థానిక తయారీని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని పైకి చెబుతున్నప్పటికీ, అసలు ఉద్దేశం వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రంలో తయారీ యూనిట్లు ఉండకపోవచ్చు. వారు ఒక రాష్ట్రంలో తయారీ యూనిట్లు పెట్టి తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండవచ్చు. అలాంటి సంస్థలు పోటీలో లేకుండా ఈ నిబంధన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలతోపాటు పలు భారీ సంస్థలు కూడా టెండర్లు వేయలేవు. అంతిమంగా తాము ముందుగా నిర్ణయించుకున్న సంస్థకే ఈ భారీ టెండర్ను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. -
భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది
సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్: మానవ జీవిత సార్థకత అనేది విజ్ఞాన సముపార్జనలోనే కాక వ్యక్తిత్వ పరిపూర్ణతలోనూ నిక్షిప్తమై ఉందని హైదరాబాద్లోని చైతన్య భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీవీ నరసింహులు చెప్పారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ జీవన పరమార్థం, మానవ అస్తిత్వం, సమాజం పట్ల బాధ్యత వంటివాటిపై నిరంతర జిజ్ఞాస కలిగిన యువతే భావి భారత నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందన్నారు. అలాంటి యువశక్తిని తీర్చిదిద్దగల పవిత్ర వేదికలు విద్యాసంస్థలని చెప్పారు. ఆధునిక విద్యా వ్యవస్థలో పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే విద్యకు ప్రమాణాలు కావని, మేధో వికాసంతో పాటు భావోద్వేగ పరిపక్వత, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, బాధ్యతాయుత పౌరసత్వం వంటి గుణాలను పెంపొందించడమే నిజమైన విద్య లక్ష్యంగా చెప్పారు. ఈ సమగ్ర వికాసానికి సహ పాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు కీలక సాధనాలుగా నిలుస్తున్నాయన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సృజనాత్మకతను పెంపొందిస్తాయి.. చర్చా వేదికలు, క్విజ్ పోటీలు, ఇన్నోవేషన్ ఫోరంలు, రోబోటిక్స్, కోడింగ్ క్లబ్బులు, పరిశోధనా వేదికలు, మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనతో పాటు, సమస్యల పరిష్కార నైపుణ్యం, విశ్లేషణాత్మక దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. సాంకేతికత ఆధారిత సమకాలీన ప్రపంచంలో ఇవి అత్యంత అవసరమైన లక్షణాలు.సాంస్కృతిక చైతన్యంతో ఆత్మవిశ్వాసం సంగీతం, నృత్యం, నాటకం, లలిత కళలు, ఫొటోగ్రఫీ, చిత్ర నిర్మాణం, సాంస్కృతిక సంఘాలు వంటివి విద్యార్థులకు తమ ప్రతిభను వ్యక్తీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, భావోద్వేగ మేథస్సు, సాంస్కృతిక అవగాహన వంటివి అలవడతాయి. క్రీడలతో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం క్రికెట్, ఫుట్బాల్ బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడా కార్యక్రమాలు శారీరక దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, ఓర్పు, పట్టుదలను మనలో నింపుతాయి. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాయి. జీవితంలో విజయాన్ని సాధించడానికి అవసరమైన అనేక గుణాలు క్రీడా రంగంలోనే అలవడతాయి.మనలో దక్షత పెంపుదలకు ఆ అనుభవాలే మూలం విద్యార్థి వేదికలు, సాంకేతిక ఉత్సవాలు, వార్షికోత్సవాలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహ విద్యార్థుల మార్గదర్శకత్వం వంటివి యువతకు బాధ్యతలను స్వీకరించే అవకాశాన్నిస్తాయి. ఈ అనుభవాలు నాయకత్వం, సంభాషణా నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం, నిర్వహణా దక్షతలను పెంపొందిస్తాయి.సమాజ సేవ ద్వారా సామాజిక స్పృహఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవా భావం, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తాయి. సమాజ నిర్మాణంలో తమ పాత్రను వారు గుర్తించేందుకు ఇవి దోహదపడతాయి.‘పరిశ్రమల’తో వ్యాపార నైపుణ్యాలు స్టార్టప్ కార్యక్రమాలు, పారిశ్రామిక వేత్తల క్లబ్బులు, ఇంటర్న్షిప్లు, ఇన్నోవేషన్ సెంటర్లు, పరిశ్రమలతో అనుసంధాన కార్యక్రమాలు విద్యార్థులకు వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిచయం చేస్తాయి. సమస్య పరిష్కారం, ఉమ్మడిగా పనిచేయడం, వృత్తిపరమైన సంభాషణ, వ్యాపార దృక్పథం వంటి నైపుణ్యాలను పెంపొందిస్తాయి. అభ్యసనం అనేది తరగతి గోడలను దాటి రావాలి ప్రపంచవ్యాప్తంగా యాజమాన్యాలు ఆవిష్కరణ సామర్థ్యం, సంభాషణా నైపుణ్యం, సహకార భావన, మార్పులకు అనుగుణంగా ఎదగగల సామర్థ్యాన్ని కలిగిన యువతను కోరుకుంటున్నాయి. అందువల్ల విద్యాసంస్థలు తరగతి గది గోడలను దాటి విద్యార్థుల్లో సమగ్ర అభ్యాసనాన్ని ప్రోత్సహించాలి.ప్రేరణలే ప్రతిభకు ప్రాణవాయువుయువతలోని అంతర్గత సామర్థ్యాలు వెలుగులోకి రావాలంటే వారిని స్ఫూర్తిదాయకమైన అనుభవాలకు, ఆలోచనలకు, సవాళ్లకు పరిచయం చేయాలి. జిజ్ఞాసను, నైతిక విలువలను, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలే మానవ ప్రతిభ, వికాసానికి నిజమైన ఉత్ప్రేరకాలు.అలాంటి విద్యా సంస్థలే భావి ప్రపంచానికి నాయకులను తయారుచేస్తాయి సంప్రదాయ పరిమితులను అధిగమించి సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ.. బాధ్యతాయుతమైన ప్రయోగాలను ప్రోత్సహించే విద్యాసంస్థలే భావి ప్రపంచానికి నాయకులను అందించగలవు. మార్పును అవకాశంగా స్వీకరించే దృక్పథం విద్యార్థుల్లో స్థిరపడాలి.చదువంటే మార్కుల సమాహారం కాదు.. విలువల నిర్మాణం‘ముందడుగు వేయనిదే ఏదీ స్వయంగా సంభవించదు’.. అనే సత్యం విద్యార్థి జీవితానికీ వర్తిస్తుంది. ప్రశ్నించడం, అన్వేషించడం, నాయకత్వం వహించడం, బాధ్యత స్వీకరించడం వంటి లక్షణాలను విద్యాసంస్థలు పెంపొందించినప్పుడే యువత సమాజ మార్పునకు కారకులవుతారు. విద్య అనేది మార్కుల సమాహారం కాదు.. విలువల నిర్మాణం. మనం సాధించిన పట్టాలు అవకాశాల ద్వారాలను తెరవగలవు. కానీ వ్యక్తిత్వం, నాయకత్వం, సేవా భావం, లక్ష్య సాధన సంకల్పమే మనిషిని శిఖరాలకు చేర్చగలవు. రేపటి నాయకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక మార్పునకు దారితీసే మహనీయులు కేవలం తరగతి గదుల్లోనే కాదు, క్రీడా మైదానాల్లో, సాంస్కృతిక వేదికలపై, ఆవిష్కరణ ప్రయోగశాలల్లో, సేవా కార్యక్రమాల్లో రూపుదిద్దుకుంటారు. ప్రపంచానికి మరింత మంది పట్టభద్రులు అవసరం లేదు.. సమాజాన్ని మార్చగల సృజనాత్మక నాయకులు అవసరం. -
గుండెల్లో బెంబేళ్లు
సాక్షి, అమరావతి: పొగాకు సగటు అమ్మకం ధర రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ వైపు వేలం కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోవట్లేదు. మరొక వైపు పెద్ద ఎత్తున బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంకొక వైపు సగటు ధరలు పతనమవుతున్నాయి. ఈ పరిణామాలు పొగాకు రైతులపాలిట అశనిపాతంగా మారాయి. కానీ ప్రభుత్వం మాత్రం మార్కెట్ స్థిరంగా కొనసాగుతుందని, కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయంటూ చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోతే, ఈసారి ప్రభుత్వ నిర్వాకంతో ఆశించిన ధరలు రాక నష్టపోతున్నారు.ఉత్పత్తి 2.65 లక్షల టన్నులు..వేలం జరిగింది 17,290 టన్నులు..2025–26 సీజన్లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్కు 2,276 కిలోల చొప్పున ఈ ఏడాది కనీసం 2.65 లక్షల టన్నులు(265 మిలియన్ కిలోలు) దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 63 రోజులు పూర్తికావస్తోంది. కానీ ఇప్పటి వరకు 17,290 టన్నులు(17.29 మిలియన్ కిలోలు)కు మించలేదు. గతేడాది ఇదే సమయానికి 48,840 టన్నులు (48.84 మిలియన్ కేజీలు) కొనుగోళ్లు జరిగాయి. కొనుగోళ్ల తీరు చూస్తుంటే, మొత్తం ఉత్పత్తిలో కనీసం 5 శాతం పంటకు వేలం జరగలేదని స్పష్టమవు తోంది. ఈ స్థాయిలో కొనుగోళ్లు కొనసాగితే ఏడాదైనా సరే రైతుల వద్ద ఉన్న పంట పూర్తి స్థాయిలో అమ్ముడుపోయే అవకాశం లేదు.రూ.211కు దిగజారిన సగటు ధరమరొక వైపు 2023–24 సీజన్లో సగటుఅమ్మకం ధర కిలోకు రూ.288.65 పలుకగా, 2024–25లో కిలోకు రూ.248.86కి పడిపోయింది. కాగా 2025–26లో సగటు అమ్మకం ధర ప్రస్తుతం కిలో రూ.211కి దిగజారిపోయింది. మే 25న సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.237.21 పలికింది. జూన్ 1వ తేదీ నాటికి రూ.235.63కు పడిపోగా,12వ తేదీ నాటికి రూ.211కు దిగజారిపోయింది. దక్షిణాది తేలిక నేలల్లో పండిన పొగాకు జూన్ 1న కిలోకు రూ.231.02 పలకగా, ప్రస్తుతం రూ.211.04 మాత్రమే పలుకుతోంది. ఉత్తరాదితేలిక నేలల్లో పండిన పొగాకు జూన్ 1న కిలోకు రూ.260.29 పలకగా, ప్రస్తుతం రూ.255.98కు దిగజారింది. ఒంగోలు దక్షిణాది నల్ల నేలల్లో పండిన పొగాకు జూన్ 1న సగటు ధర కిలోకు రూ.224.45 పలకగా, ప్రస్తుతం రూ.200.41కి పడిపోయింది. అంటే 2023–24 సగటు ధరతో పోలిస్తే గరిష్టంగా కిలోకు రూ.77.65 మేర రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ప్రకటనల పట్ల తీవ్ర అసంతృప్తిఓ వైపు ఆశించిన స్థాయిలో వేలం జరగడం లేదు. మరొక వైపు సగటు ధరలు దిగజారిపోతున్నాయి. అయినా సరే పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయంటూ మంత్రి అచ్చెన్నాయుడు రోజు విడిచి రోజు జారీ చేస్తున్న ప్రకటనలు విస్మయానికి గురిచేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తిరస్కరణలు, నో బిడ్ల స్థాయి 20 శాతం కంటే తగ్గిపోయిందంటూ చెబుతుండడం పట్ల రైతులు మండిపడుతున్నారు. సగటు ధరలు కిలోకు కనీసం రూ.350 తక్కువ కాకుండా పలికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కొనసాగుతున్న బేళ్ల తిరస్కరణ..మరోవైపు బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. తొలుత 43శాతం నుంచి 55 శాతం తిరస్కరణకు గురికాగా, ప్రస్తుతం సగటున 21.81 శాతం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి ఒక్కో బేలుకు రూ.2వేలు అదనంగా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి మంచి దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధించినా అమ్మకం ధరలు కుప్పకూలుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పొగాకు రైతుల్లో మెజార్టీ రైతులు కౌలు దారులే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కంపెనీలిచి్చన బాండ్లకనుగుణంగానే నాణ్యమైన పంటను పండించినప్పటికీ ధర లేక నష్టపోవాల్సి వస్తోందని సన్న, చిన్నకారు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు. -
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు'!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో రాజధాని అమరావతిలో భవనాలు, రోడ్ల నిర్మాణ వ్యయం భారీగా పెంచేసి, అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన చంద్రబాబు సర్కారు.. నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్న తీరును సాక్ష్యాధారాలతోసహా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు. రాజధాని సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బండారం బట్టబయలైంది. దీంతో ఆ అక్రమాల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ యథాప్రకారం తప్పుడు లెక్కలు వల్లె వేశారు. శనివారం రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగులపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ నివాస సముదాయాలకు రూ.984 కోట్లతో టెండర్ ఖరారైందని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు కేవలం రూ.3,393 మాత్రమే అవుతోందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణానికి రూ.1,003 కోట్లతో టెండర్ ఖరారైందని, చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే వ్యయం అవుతోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,234 కోట్లతో టెండర్ ఖరారైందని, దాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945గా ఉందని మంత్రి వెల్లడించారు. దీనితో పోల్చి చూస్తే రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కంటే తక్కువగా ఉందని వివరించారు. అవినీతి బట్టబయలవడంతో బెంబేలుసచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే.. గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడంతో చంద్రబాబు సర్కార్ అవినీతి బట్టబయలైంది. ఇక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కారు అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అవినీతి బట్టబయలవడంతో బెంబెలెత్తిపోయిన చంద్రబాబు సర్కారు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు లెక్కలు వల్లె వేస్తూ యథావిధిగా అబద్ధాలు చెబుతోంది. తప్పు లెక్కలు చెబితే అక్రమం సక్రమమవుతుందా?రాజధానిలో నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ప్లాట్లను హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తోంది. మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను రూ.856.31 కోట్లకు ఎన్సీసీ దక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్ వంటి సీనరేజీ పన్నుల రూపంలో రూ.153.05 కోట్లు సీఆర్డీఏ రీయింబర్స్ చేస్తుంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.1,009.36 కోట్లు. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి కాంట్రాక్టు విలువ రూ.4,689.48. హ్యాపీనెస్ట్ పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో! దీన్ని బట్టి చూస్తే హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయంపై మంత్రి నారాయణ చెప్పిన లెక్కలన్నీ తప్పేనన్నది స్పష్టమవుతోంది. తప్పుడు లెక్కలు చెబితే అక్రమం సక్రమం అవుతుందా? కాదు కదా. ఈ చిన్న లాజిక్ను మరచిపోతే ఎలా అంటూ మంత్రి నారాయణను ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక రాజధానిలో గెజిటెడ్ అధికారులకు నివాసాల కోసం ఎస్+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ప్లాట్లను 27,24,080 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో సీఆర్డీఏ చేపట్టింది. ఈ పనులను 2018లో రూ.707.40 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగించింది. 2019 నాటికి రూ.389.11 కోట్ల విలువైన పనిని పూర్తి చేసింది. అంటే.. మిగిలిన పనుల విలువ రూ.318.29 కోట్లు. ఆ మేరకు బిల్లులు చెల్లించింది. కానీ.. 2024లో ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. మిగిలిన పనులను రూ.514.40 కోట్లకు అదే సంస్థకు గతేడాది అప్పగించింది. మరో రూ.89.27 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఇక ఆ భవనాలకు ప్రహరి, ఎస్టీపీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.67.69 కోట్లతో ఇటీవల టెండర్లు పిలిచింది. పన్నుల రూపంలో మరో రూ.12.42 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. కాంట్రాక్టర్కు చెల్లించిన బిల్లులు, మిగిలిన పనులను కాంట్రాక్టర్కు అప్పగించిన విలువతో కలిపి నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.1,072.89 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.3,938.54కు చేరింది. పనులు పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో? -
మా ఏఐ మాకే సొంతం..
ఏఐని నియంత్రిస్తున్న దేశాలు రూటు మారుస్తున్నాయి. ఇప్పటిదాకా చిప్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటంపై దృష్టి పెట్టినా... ఇపుడు ఏఐ మోడల్స్నూ నియంత్రించే చర్యలు మొదలెట్టాయి. అమెరికా ప్రభుత్వం ఆదేశించిన మీదట... ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో ఎవరూ వాడకుండా నిషేధించటం... ఒక ఆరంభం మాత్రమే. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలో తప్ప ఇంకెక్కడా వాడకుండా చేయటం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది అమెరికా వ్యూహం కావచ్చనేది నిపుణుల మాట.ఇలాంటి చర్యలతో ఏఐ వాడకంలో అంతరాలు తారస్థాయికి చేరుతాయి కాబట్టి భారతదేశం ఏఐ మిషన్ను ఆరంభించి, రూ.50వేల కోట్లు కేటాయించాలని టెక్నోక్రాట్ మోహన్దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యరి్థంచటం గమనించాల్సిన విషయం. అమెరికా నిషేధం నేపథ్యంలో అసలు ఈ మైథోస్–5, ఫేబుల్–5 ఏం చేస్తాయి? నిషేధంతో నష్టాలేంటి? అమెరికా చెబుతున్న భద్రత కారణాలు నిజమేనా?ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి’ప్రత్యేక కథనం... అమెరికాలో మినహా విదేశాల్లో యాక్సెస్ లేకుండా నిషేధించిన మైథోస్, ఫేబుల్ మోడళ్లు అత్యా«ధునికమే కాదు. శక్తిమంతమైనవి కూడా. ప్రత్యేకించి మైథోస్–5 ఉపయోగించి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించవచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. అందుకే గ్లాస్వింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా దీని వాడకాన్ని కొన్ని సంస్థలకే అందించింది ఆంథ్రోపిక్. మైథోస్లోని ఫీచర్లన్నీ ఉండి... కొన్ని నియంత్రణలతో అందరికీ అందించిన మోడల్ ఫేబుల్. ఒక్కమాటలో చెప్పాలంటే మైతోస్–5 రేసింగ్ కార్ అయితే... సాధారణ రోడ్లపై తిరగటానికి ఆవిష్కరించిన దాని లీగల్ వెర్షనే ఫేబుల్–5. మైథోస్–5 ఎందుకు స్పెషల్ అంటే? అటానమస్ కోడింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, దీర్ఘ కాలిక రీజనింగ్, శాస్త్రీయ పరిశోధనల్లో సాయం విషయంలో మైథోస్కు అసాధారణమైన సామర్థ్యాలున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇక ఫేబుల్ మోడళ్ల విషయానికొస్తే... ⇒ అత్యంత భారీ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను మైగ్రేట్ చేయడానికి ⇒ కొన్నేసి గంటల పాటు రెగ్యులర్గా అటానమస్ పనులు చేయటానికి... ⇒ అడ్వాన్స్డ్ కోడింగ్, ఇంజినీరింగ్ టాస్క్లు చేయటానికి వాడొచ్చు. నిషేధం వల్ల నష్టాలేంటి? ⇒ ఆంథ్రోపిక్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అమెరికా వెలుపల ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ⇒ మెరుగైన కోడ్ను జనరేట్ చేయటం... బగ్స్ను కనిపెట్టడం... భారీస్థాయి సాఫ్ట్వేర్ మైగ్రేషన్లను ఈజీగా చేసే సామర్థ్యాన్ని డెవలపర్లు కోల్పోతారు. ⇒ సైబర్ సెక్యూరిటీలోని లోపాలను కనిపెట్టడానికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టూల్స్ను పరిశోధకులు వాడలేరు. ⇒ అన్నిటికన్నా ప్రధానం... అమెరికా వెలుపల ఉండేవారికి అమెరికాలో ఉండేవారితో పలు అంశాల్లో పోటీపడే సామర్థ్యం తగ్గిపోతుంది. అమెరికన్ కంపెనీలకు ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ పెరిగి... విదేశాల్లోని స్టార్టప్ల ఇన్నోవేషన్ సామర్థ్యం స్లో అవుతుంది. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ల మాదిరి ఏఐ సామర్థ్యాలపై కూడా కొన్ని దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. భారత్కు ఇబ్బందులేంటి? భారత్కు ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ అమెరికన్ ఏఐ మోడళ్ల యాక్సెస్ మన స్టార్టప్లకు ఉండదు. మన సైబర్సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టూల్స్ను కోల్పోతాయి. పైపెచ్చు నిషేధం ఎక్కువకాలం కొనసాగితే మన సాఫ్ట్వేర్ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గొచ్చు. నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏఐ చిప్లను, సెమీకండక్టర్ పరికరాలను, సూపర్ కంప్యూటర్ల హార్డ్వేర్ను మాత్రమే నియంత్రించాయి. ఇపుడు ఏఐ మోడల్ను సైతం అమెరికా ఓ సాఫ్ట్వేర్లా కాకుండా కీలకమైన మిలిటరీ టెక్నాలజీలా చూడటం ఆరంభించింది. ఈ కారణాల వల్లే అమెరికా మోడళ్లపై పూర్తిగా ఆధారపడకుండా భారత్కు సొంత ఏఐ మోడళ్లు ఉండాలని మోహన్దాస్ పాయ్ వంటి టెక్నోక్రాట్లు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏఐ నియంత్రణ మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది కాదనలేని నిజం.ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్లు వెనక్కి వాషింగ్టన్: ట్రంప్ విధానాలతో దేశాలు మాత్రమేకాదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుచేసి పరిశోధన పూర్తిచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచి్చన అధునాతన కృత్రిమమేధ (ఏఐ) టూల్స్ను కంపెనీలు వెనక్కి(రీకాల్) చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అందుబాటులోకి తెచి్చన క్లాడ్ ఫేబుల్5, మైథోస్5 ఏఐ మోడళ్లను వెనక్కితీసుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ శనివారం ప్రకటించింది.భద్రతా కారణాలు చూపి వీటిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షల విధించడంతో తప్పనిపరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భద్రత లేని, క్షేమదాయకంకాని మోడళ్లపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అత్యంత భద్రమైన మా మోడళ్లకు ఏ సాంకేతిక లోపాల మాటున అడ్డుచెబుతున్నారో ప్రభుత్వం వివరిస్తే బాగుండేది. అప్పుడే ఈ ఆంక్షల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని అంతా భావిస్తారు’అని ఆంథ్రోపిక్ తన అసహనం వ్యక్తంచేసింది. (రమణమూర్తి మంథా) -
కూటమిది నమ్మకద్రోహ సభ
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్(గుంటూరు)/సాక్షి,విశాఖపట్నం/నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ ‘నమ్మకద్రోహ సభ’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచి, ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. నేడు ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 2 కోట్ల మంది మహిళలను వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ మహిళా నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించారు. కూటమి పాలకుల తీరుపై ధ్వజమెత్తారు.పీ–4తో వంచన : విడదల రజిని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పీ–4 అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను బాబు వంచిస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి హామీ ప్రకారం.. ఒక్కో మహిళకు రెండేళ్లకు రూ. 36 వేల చొప్పున, రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం రూ. 72 వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. ఎన్నికల ముందు రజినీకాంత్లా హామీలు గుప్పించిన బాబు ఇప్పుడు గజినీలా నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నారా వారికి ‘నారీ శక్తి’ తడాఖా చూపించి గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.చంద్రబాబు చీటింగ్, బోగస్ నాయుడు: వరుదు కళ్యాణి విశాఖపట్నం మద్దిలపాలెంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు ‘చీటింగ్ బోగస్ నాయుడు’ అని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆడబిడ్డ నిధి హామీకి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల్హాసన్లా అమాయకంగా నటించిన బాబు.. నేడు ‘నాయకుడు’ సినిమాలోని కన్నింగ్ పాత్రలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళల ఉసురు తగులుతుంది : కాకాణి పూజిత బాబు సర్కారు తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత శనివారం ఓ వీడియో విడుదల చేశారు. సర్కారుకు మహిళల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. టీడీపీ అంటే తప్పుడు దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. ఆడబిడ్డ నిధి హామీని బాబు అటకెక్కించారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ సర్కారు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు భారీ లబ్ధి చేకూర్చారని గుర్తుచేశారు. చీటింగ్ కేసు పెట్టాలి : బండి పుణ్యశీలవైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మాట్లాడుతూ హామీలు గుప్పించి మోసం చేసిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలను మోసగించిన చంద్రబాబు సర్కారుకు పతనం తప్పదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు ఘోర వైఫల్యం: నూరి ఫాతిమా గుంటూరులోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. రెండేళ్లలో బాబు సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో బాబు చతికిల పడ్డారని, ఆడబిడ్డ నిధి పథకానికి ఒక్కరూపాయి కేటాయించలేదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు తీరు వల్ల పనిఒత్తిడితో సచివాలయ సిబ్బంది ప్రాణాలొదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో మాకు ప్రాణహాని
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన వెనిగంట్ల వరమ్మ, ఆమె కుమార్తె రజిత మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను రజిత వెల్లడించారు. ‘నా తల్లి వరమ్మ పేరు మీద కమ్మపాలెంలో ఐదెకరాల భూమి ఉంది. ఇందులో నా అన్న రమేష్ కు 3 ఎకరాలు, పసుపు కుంకుమ కింద నాకు 2 ఎకరాలు వచ్చాయి. పెళ్లి తర్వాత నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను. నాకు మా అమ్మ ఇచ్చిన భూమికి పక్కనే మరో రెండెకరాల భూమిని కొనుగోలు చేశా. కమ్మపాలెంకు దగ్గరగా జాతీయ రహదారి రావడంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో కమ్మపాలెంలో ఉన్న మా అమ్మ ఇంటిపైనా, అలాగే నా భూమిపైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు దివి శ్రీను, ఘంటా అశోక్, ఘంటా సుబ్బనాయుడు కన్నుపడింది. అప్పటి నుంచి వారు నా నాలుగు ఎకరాల భూమిలోకి వెళ్లనీయకుండా బెదిరిస్తున్నారు. పైగా భూమిని వారి కబ్జాలోకి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా తల్లిని ఇంట్లోకి రానీయకుండా సైతం ఇబ్బందులకు గురి చేశారు. ఇంటిని కబ్జా చేయడంతో భయపడి విజయవాడలో నా వద్దనే ఉంటోంది. మాకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు చెప్పుకునేందుకు వెళితే ఎమ్మెల్యే తన అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. జేసీ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయగా వారు జలదంకి పోలీసుల వద్దకు పంపించారు. పోలీస్ స్టేషన్కు వెళితే.. అప్పుడే అక్కడకు దివి శ్రీను, ఘంటా అశోక్; సుబ్బనాయుడు వచ్చారు. మాపై పోలీసుల ఎదుటే దౌర్జన్యం చేశారు. నా తల్లిని తలపై కొట్టారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని మా భూమిని, ఇంటిని మాకు దక్కేలా చూడాలి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
మహిళా రైతులు, రైతు కూలీలపై ఆ దౌర్జన్యం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఎస్సీ మహిళలు, రైతులపై ఇటీవల జరిగిన పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసుల నమోదు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించాయి. బాధిత మహిళలు, రైతులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, గుంటూరు ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. రెండు వారాల్లో నివేదికకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశంవైఎస్సార్సీపీ నేత, ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి, మాజీ మంత్రి జోగి రమేష్, అంబటి మురళీకృష్ణ, బాధితురాలు సుడా త్రివేణి ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసింది. ఘటనపై దాఖలైన నాలుగు వేర్వేరు ఫిర్యాదుల సారాంశం ఒకటే కావడంతో వాటన్నింటినీ కలిపి ఒకే కేసుగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ.. మహిళలపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియో రికారి్డంగ్ను పెన్ డ్రైవ్ రూపంలో సాక్ష్యంగా స్వీకరించింది. మహిళల పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరు చట్ట నియమాలకు విరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ ఆరోపణలపై ఏపీ డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ రెండు వారాల్లోగా తమ స్పందనను, సమగ్ర నివేదికను సమర్పించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. చర్యలకు మహిళా కమిషన్ ఆదేశాలుఇదే వ్యవహారంలో ఎస్సీ మహిళలపై పోలీసుల దాడి, అనుచిత ప్రవర్తనను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సైతం తీవ్రంగా పరిగణించింది. మే 27న అందిన ఫిర్యాదుల మేరకు అదే రోజు విచారణ చేపట్టింది. ఈ విషయాన్ని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఈ నెల 5న ఎంపీ తనూజ రాణికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన కమిషన్, చట్టప్రకారం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశిస్తూ లేఖ రాసినట్లు అందులో తెలియజేసింది.పోలీసుల దౌర్జన్యకాండ తీరిది..మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గత నెల 5న రైతులు శాంతియుతంగా ధర్నా చేశారు. ఈ క్రమంలో పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి.. ఎస్సీ రైతులు, మహిళలపైనే ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తప్పుడు కేసులు బనాయించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో, తహసీల్దార్ ద్వారా సుడా త్రివేణికి చెందిన గోదామును, అందులో రైతులు నిల్వ ఉంచిన 2,200 బస్తాల మొక్కజొన్నను అక్రమంగా సీజ్ చేశారు. మే 20న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, అంబటి మురళీకృష్ణలను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నారు. నాయకులను చేబ్రోలు పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమంగా నిర్బంధించారు. అక్కడున్న ఎస్సీ మహిళలను మగ పోలీసులు అసభ్యంగా నెట్టివేస్తూ, తీవ్ర దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీ నేత ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, రూరల్ సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్సై శ్రీహరి, అర్బన్ సీఐ వీరా నాయక్, తెనాలి టూ టౌన్ సీఐ రాములు నాయక్, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ తదితరులు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ఇళ్లు కూల్చివేశారు.. కన్నీళ్లు మిగిల్చారు
యలమంచిలి రూరల్: ‘మా తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇంకా పూర్తిగా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వారం రోజులు గడువిస్తే మేమే స్వచ్చందంగా ఇళ్లు ఖాళీ చేస్తాం’ అని మొరపెట్టుకున్నా అధికారులు కరుణించలేదు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో నిర్దాక్షిణ్యంగా 10 ఇళ్లను కూల్చివేశారు. పేదలకు మండు వేసవిలో నిలువ నీడలేకుండా రోడ్డుపాలు చేశారు. నిర్వాసితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వీఆర్ అగ్రహారంలోని సెజ్లో పరిశ్రమల ఏర్పాటు కోసం రెండో విడత భూసేకరణకు ఏపీఐఐసీ అధికారులు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే సేకరించిన భూముల్లో ఇళ్లు కూల్చివేస్తున్నారు. నెలరోజుల క్రితం ఇక్కడ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు వచ్చారు. ఆ సమయంలో భూనిర్వాసితుల నుంచి నిరసన ఎదురుకాకుండా ముందు జాగ్రత్తగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా 44 మందికి దిబ్బపాలెం సెజ్ నిర్వాసితుల కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అక్కడ ఇళ్లు నిర్మించుకోవడానికి నిర్వాసితులు వెళితే స్థానిక జనసేన నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో ఉండగా, కలెక్టర్ ఆదేశాలంటూ శనివారం రాంబిల్లి తహసీల్దార్ సత్యనారాయణ వారి ఇళ్లను కూల్చేందుకు నాలుగు పొక్లెయిన్లతో వీఆర్ అగ్రహారం చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండానే... నోటీసులు ఇవ్వకుండా ఆకస్మాత్తుగా ఇళ్లు కూల్చివేస్తే పిల్లలు, వృద్ధులతో సహా అందరం రోడ్డునపడాల్సి వస్తుందని అధికారులకు నిర్వాసితులు తెలియజేశారు. తమకు వారం గడువు ఇస్తే ఖాళీ చేసి వెళతామని చెప్పారు. అయినా అధికారులు అంగీకరించలేదు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి మేరకే అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేసి తమను రోడ్డుపాలు చేశారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.పేదల ఇళ్లు కూల్చివేతరాజమహేంద్రవరంలోని పుంతరోడ్డులో 20 నిర్మాణాల తొలగింపు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేశారని బాధితుల ఆవేదన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 44వ డివిజన్ నుంచి 47వ డివిజన్ వరకు గల పుంత రోడ్డులో 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను అధికారులు శనివారం కూల్చివేశారు. శనివారం ఉదయం 6 గంటలకే వందల మంది పోలీసులు, జేసీబీలతో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. హఠాత్తుగా జేసీబీలతో ఇళ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటిలోని సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇళ్లు ఖాళీ చేయించి, ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయకుండా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడంపై మండిపడ్డారు. టీడీపీ నేతలకు వత్తాసు పుంతలోనే టీడీపీకి చెందిన నాయకుల భవనాలు ఉన్నాయి. వీటికి కనీసం నోటీసులు కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఒక నేత ఏకంగా ‘సైట్ ఫర్ సేల్’ అని బోర్డు పెట్టి దానిపై ఫోన్ నంబర్ కూడా రాసినా అక్కడ మాత్రం నగర పాలక సంస్థ అధికారులు కనీసం బోర్డు కూడా పెట్టలేదు. అధికారం, అంగ బలం ఉన్నవారికి ఒక న్యాయం. సామాన్యులకు మరో న్యాయమా అని పలువురు విమర్శిస్తున్నారు. ప్రత్యేక ఆక్రమణల తొలగింపు కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూములు, ప్రజా రహదారులు, రోడ్డు మార్జిన్లు, కాలువలు, డ్రైన్లు, పార్కులు, ఇతర ప్రజా ఆస్తులపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇందిరా సత్యనగర్ పుంత ప్రాంతంలో ఉన్న 28 ఆక్రమణలు తొలగించగా, ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించామన్నారు. -
రేపు సింగపూర్కు చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులపాటు సింగపూర్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశం అవుతారు. పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరవుతారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్తో విందు సమావేశంలో పాల్గొంటారు.సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ సింగ్తో సీఎం సమావేశమవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్తోనూ భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చంద్రబాబు చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో భేటీ అవుతారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో కూడా సమావేశమవుతారు. సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగ, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్తో చివరిగా భేటీ అవుతారు. మంగళవారం ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్–361ను సీఎం ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్–అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. తర్వాత ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. సీట్రియమ్ సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్– 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా సింగపూర్ వెళ్లనుంది. -
భూ వ్యవస్థ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: భూమి అంటే సామాన్యుడికి కేవలం ఆస్తి మాత్రమే కాదు.. తరాల కష్టం, బతుకునకు భరోసా. ఆ భరోసాను ప్రభుత్వమే కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? రీ సర్వేకు తూట్లు.. 22ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు.. పేదల ఫ్రీహోల్డ్ హక్కులు రెండేళ్లుగా ఫ్రీజ్.. కలెక్టరేట్ల వద్ద ప్రతి సోమవారం పెరుగుతున్న బాధితుల క్యూలు.. పాస్బుక్ల దందా.. అధికార పార్టీ అండతో సాగుతున్న భూ బాగోతాలు.. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో భూముల వ్యవస్థ సాధించిన ప్రగతి ఇదే. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర భూ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక భూ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే నిలిపివేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు, సామాన్య భూ యజమానులు వారి సొంత భూమిపై హక్కులు కోల్పోయారు. ఫలితంగా బ్యాంకు రుణాలు అందక, విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు తమ భూములు వివాదాల్లో కూరుకుపోవడంతో పరిష్కారం కోసం వేలాది మంది ప్రతి సోమవారం కలెక్టరేట్ల ముందు పడిగాపులు పడుతున్నారు. విజయవాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వినతులు అందజేయటానికి వచ్చిన రైతులు, ప్రజలు(ఫైల్) 22ఏ జాబితాలో ఏకంగా 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ప్రజాప్రతినిధులు 22ఏ జాబితాలో పెట్టించారు. అసలు వివాదమే లేని ప్రైవేట్ పట్టా భూములు, తరతరాలుగా అనుభవంలో ఉన్న పూర్వీకుల ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. తనఖా పెట్టుకునే అవకాశం లేదు, బ్యాంకు రుణం రాదు. ఒక సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్నే నిషేధిత జాబితాలో పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఫ్రీహోల్డ్ భూములపై పగబట్టిన చంద్రబాబు 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు 2023లో జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. 27 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పరిధిలోకి రాగా, ఎన్నికలు పూర్తయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందాయి. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పేదలు పట్టాదారులయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే అక్రమాల పేరుతో ఫ్రీ హోల్డ్ భూములను మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. కానీ ఆ భూములపై రైతులకు హక్కులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పైకి మాత్రం 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు డబ్బా కొట్టుకుంటుండటం విస్తుగొలుపుతోంది. జగన్ సంస్కరణలతో రూ.500 కోట్లు ప్రోత్సాహకాలు వైఎస్ జగన్ హయాంలో అమలైన భూ సంస్కరణలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభమై విజయవంతంగా జరుగుతున్న రీసర్వేపై విష ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కొద్ది నెలలు దాన్ని నిలిపివేసి.. తప్పు తెలుసుకుని మళ్లీ తూతూ మంత్రంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు తానే రీ సర్వేను మొదలు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూ రీసర్వేను చేపట్టింది. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్ సాంకేతికతతో గ్రామ గ్రామాన సర్వే జరిగింది. రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ డాక్యుమెంట్లు, భూ కబ్జాలకు తావులేని వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. భూ రికార్డుల డిజిటలీకరణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ధృవీకరించింది. ఈ పనితీరుకు ప్లాటినం గ్రేడింగ్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రోత్సాహకాలు రూ.500 కోట్లు కూడా దక్కాయి. జగన్ అమలు చేసిన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు అందుకుంది. పీజీఆర్ఎస్కు బాధితుల క్యూ ప్రతి సోమవారం రాష్ట్రంలోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద జరిగే పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూ సమస్యలే ఉంటున్నాయి. పట్టా ఉన్నా రిజిస్ట్రేషన్ కాని భూములు, 22ఏ జాబితాలో ఇరుక్కుపోయిన ఆస్తులు, పాస్బుక్లు రాని రైతులు, ఇచ్చిన పాస్బుక్కుల్లో తప్పులు, రికార్డుల్లో పేర్లు మాయమైన బాధితులు దరఖాస్తులు పట్టుకుని క్యూ కడుతున్నారు. అర్జీలు తీసుకుని రశీదులు ఇవ్వడమే తప్ప ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు పది సోమవారాలు తిరిగినా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. దీనికితోడు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆర్భాటంగా వినతులు తీసుకుని పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా తీసుకున్న అర్జీలకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. ఆయన కొడుకు, ఇతర మంత్రులు పీజీఆర్ఎస్ను ప్రచారానికి వాడుకోవడమే తప్ప.. సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిపోయినట్లు బాధితులకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కలెక్టరేట్ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటం తెలిసిందే.మా భూమి లోంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు పది ఎకరాల భూమిని మా తాతలు, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు కొందరు రాజకీయ పలుకుబడితో మా భూములు ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరు. ఆదివాసీలమైన మేం ఎక్కడికి పోవాలి? – చీడిపల్లి దేముడమ్మ, జెడ్ జోగుంపేట, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా దొంగ రికార్డులతో బెదిరిస్తున్నారు సర్వే నంబర్ 49లో ఉన్న నా విలువైన భూమిని కాజేయడానికి ఊళ్లో కేటుగాళ్లు నా పేరుతో ఉన్న పత్రాలను మార్ఫింగ్ చేసి దొంగ రికార్డులు సృష్టించారు. వాటి ద్వారా నా భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకుంటే రెవెన్యూ వాళ్లు నా ఫైలును పక్కనపెట్టి కాలయాపన చేస్తున్నారు. కళ్ల ముందే నా భూమి చేజారిపోతోంది. – టి.గిరిజమ్మ, ఒడ్డుపల్లి, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా ఆన్లైన్లో నా పేరు మారిపోయింది నా భర్త ఆర్మీలో దేశ సరిహద్దుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్మీ కోటా కింద 2022లో బురుజుపల్లిలో ఆయనకు ఐదు ఎకరాల భూమి కేటాయించారు. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరుపైకి మార్పించుకున్నా. ఎవరో ఏదో చేయడంతో ఇప్పుడు మళ్లీ నా భర్త పేరే ఆన్లైన్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ వయసులో తిరగలేక చచ్చిపోతున్నా. – కె.సరస్వతి, జవాన్ చిన్న రామయ్య భార్య, బురుజుపల్లి, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లాకూటమి నేతల బెదిరింపులు..గుండెపోటుతో దళిత రైతు మృతి బుచ్చెయ్యపేట: కూటమి నేతలు భూమిని లాక్కుంటారన్న భయంతో తీవ్రవేదనకు గురైన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం గ్రామానికి చెందిన దళిత రైతు నందికొళ్ల నూకరాజు(36) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... నూకరాజు తండ్రి సాంబయ్య 40 ఏళ్లుగా తైపురంలో ఐదు ఎకరాల డి–పట్టా భూమిని సాగు చేసేవాడు. ఆయన మరణం తరువాత నూకరాజు సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని 22ఎలో పెట్టి హోల్డ్లో ఉంచింది. ఇటీవల తైపురానికి చెందిన కూటమి నేతలు నూకరాజు భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్, టీడీపీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు పలుసార్లు ఆ భూమిని సర్వే చేశారు. నూకరాజు అడ్డుకుని తన తండ్రి పేరుపై ఉన్న డి–పట్టా రికార్డులను చూపించాడు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే రాజు చోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కూటమి నేతలు మళ్లీ నూకరాజు భూమిపై ఫిర్యాదు చేశారు. దీంతో నూకరాజు తన భూమిని కూటమి నేతలు లాక్కుంటారని ఆందోళన చెందాడు. తమ గతేంటని భార్య భవానీతో శుక్రవారం రాత్రి చెబుతూ బాధపడ్డాడు. అనంతరం గుండెపోటుకు గురై మృతిచెందాడు. కూటమి నేతల ఫిర్యాదుల వల్లే నూకరాజు మృతిచెందాడని ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరిసా శ్రావణ్ తదితరులు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నూకరాజు కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నూకరాజు మృతదేహానికి శనివారం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాటలు కబ్జాలపై.. చేతలు కబ్జాలతోకబ్జాలు అరికట్టడానికి గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణులే ఆచరణలో కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ.. ఆ గుట్టు బయట పడడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. విశాఖ, తిరుపతి, అన్నమయ్య సహా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ఖాళీ భూములను కబ్జా చేసినట్లు రోజుకో ఘటన వెలుగు చూస్తోంది.కళ్లెదుటే భూ ఆక్రమణవైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపులకు చెందిన ఈమె పేరు వెంకట లక్ష్మమ్మ. సర్వే నంబర్లు 1,470, 1,471లో ఈమెకు 3.32 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో ఎకరంన్నర భూమిని ఊళ్లో పెత్తందార్లు ఆక్రమించారు. తిరిగి ఈ భూమిని దక్కించుకోవడానికి ఆమె ఎన్నో ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ద్వారా సాధించుకున్నారు. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ, రెవెన్యూ వాళ్లు ఈ భూమిని 1బీ రికార్డుల్లో చేర్చి, ఆన్లైన్ చేయడం లేదు. ఫలితంగా తన భూమి దక్కడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.78 ఏళ్ల నాటి భూమిని నకిలీ పత్రాలతో అమ్మేశారు ఇతని పేరు చంద్రాయుడు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు. ఇతని తాత బాలయ్య.. సర్వే నంబర్ 676/2లో 0.68 సెంట్ల స్థలాన్ని 1948లోనే కొన్నారు. 78 ఏళ్లుగా ఈ భూమి వీరి స్వాధీనంలోనే ఉంది. అందులో మూడు సెంట్లు జాతీయ రహదారి విస్తరణలోకి వెళ్తే ప్రభుత్వం వీరికి రూ.23,287 పరిహారం కూడా ఇచ్చింది. అంత పక్కా రికార్డు ఉన్న ఈ భూమిని కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి వేరే వాళ్లకు అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. రికార్డులన్నీ పట్టుకుని పీజీఆర్ఎస్ మెట్లు ఎక్కినా తనకు సమాధానం చెప్పేవారే లేరని చంద్రాయుడు వాపోతున్నారు. -
మెగా డీఎస్సీ పేరుతో 'మెగా స్కామ్'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్కు తొలి అడుగు వేశారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్సీఈఆర్టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకతడీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.సీబీఐ దర్యాప్తే శరణ్యంలక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది. -
ఆర్టీసీపై పీపీపీ పిడుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో ఒక్కో అంకాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆర్టీసీని దివాలా తీయించేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి, సొంత ఆస్తులను అన్యాక్రాంతం చేసి.. అనంతరం ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. ఆ ఆయువుపట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఇ–బస్సుల విధానం ముసుగులో రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ కుతంత్రంలో రెండో అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పబ్లిక్ –ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో, బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లను గుర్తించింది.రూ.వేల కోట్ల భూములను కారు చౌకగా కట్టబెట్టే కుట్ర ⇒ అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో కారు చౌకగా తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అత్యంత విలువైన ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరం రూ.200 కోట్ల పైమాటే. ఆ ప్రకారం ఆ 12 ఎకరాల మార్కెట్ విలువ రూ.2,400 కోట్లు పలుకుతుంది. కానీ ఆ బస్ స్టేషన్ను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుందని డీపీఆర్ను ప్రతిపాదించడం గమనార్హం. అంటే రూ.500 కోట్ల పెట్టుబడి పెడతామనే ఓ ప్రైవేటు సంస్థకు రూ.2,400 కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం తెగబడుతోందన్నది స్పష్టమవుతోంది. ⇒ అదే రీతిలో ఇతర బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో కట్టబెట్టేందుకు ప్రైవేటు సంస్థల పెట్టుబడి కోసం డీపీఆర్ను అడ్డగోలుగా రూపొందించడం గమనార్హం. తిరుపతి బస్ స్టేషన్కు రూ.300 కోట్లు, విజయవాడ ఆటోనగర్ బస్ స్టేషన్కు రూ.150 కోట్లు, గుంటూరు బస్ స్టేషన్కు రూ.60 కోట్లు పెట్టుబడి పెడతారనే పేరుతో తమ అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని ఆటోనగర్ బస్టాండ్ ⇒ కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం బస్ స్టేషన్ల భూములను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేవలం నామమాత్రపు లీజుతో ఈ భూములను ధారదత్తం చేసేందుకు ప్రతిపాదనలు ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తోంది. ⇒ మొత్తం మీద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం బరితెగిస్తోందని మండిపడుతున్నాయి. -
కృష్ణా ట్రిబ్యునల్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ కాగా.. ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నిర్దేశిత కేటాయింపులు జరిపే బాధ్యతను తొలుత కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం(ఐఎస్డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్రం మళ్లీ ట్రిబ్యునల్కు అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా కేటాయించిన జలాలను కలిపి మొత్తం 1005 టీఎంసీలను తిరిగి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో.. తమ రాష్ట్ర ప్రయోజనాలను హరించే ఈ గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, దీనిపై నిర్ణయం తీసుకునే వరకు ట్రిబ్యునల్ విచారణను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సెక్షన్ 89 కింద అప్పటివరకు జరిపిన విచారణను ట్రిబ్యునల్ పక్కనబెట్టి సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన రెఫరెన్స్ ఆధారంగా కొత్తగా విచారణను చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ వాదనలు ముగిశాయి. మరో రెండు మూడు నెలల్లో ఏపీ వాదనలూ ముగియనుండగా, ఆ తర్వాత ఆ వాదనలను ఖండిస్తూ తెలంగాణ తుది వాదన వినిపించనుంది. అనంతరం ట్రిబ్యునల్ సెక్షన్ 3 కింద తీర్పును రిజర్వ్ చేసి ఆ వెంటనే ప్రకటించడం కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూస్తూ వాయిదా వేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద మళ్లీ రెండు రాష్ట్రాల వాదనలను పునః ప్రారంభించనుంది. ఆలోగా సుప్రీంకోర్టు సెక్షన్–3 కింద నీటి పంపకాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సెక్షన్ 89 కింద విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు సెక్షన్ 3 కింద కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ను కొట్టివేస్తే మాత్రం సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్లో విచారణ మరి కొన్నేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు సెక్షన్ 3 కింద ఇప్పటివరకు ట్రిబ్యునల్ జరిపిన విచారణ వృథా ప్రయాస కానుంది. పొడిగింపులే పొడిగింపులుఅంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్ 4 కింద 2004 ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తన తొలి నివేదిక, తీర్పును 2010 డిసెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత భాగస్వామ్య రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు 2011 మార్చి 29న ట్రిబ్యునల్కు తమ సూచనలు (రెఫరెన్స్) పంపాయి. అనంతరం ట్రిబ్యునల్ తన తదుపరి నివేదికను 2013 నవంబర్ 29న కేంద్రానికి సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం–2014 లోని సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్ గడువును పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆ చట్టంలోని క్లాజ్ (ఎ), క్లాజ్ (బి) లోని అంశాల పరిష్కారం నిమిత్తం 2014 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు గడువును పొడిగిస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చారు.ఆ తర్వాత ట్రిబ్యునల్ అభ్యర్థనల మేరకు కాలానుగుణంగా ప్రతి ఏటా కేంద్రం గడువును పొడిగిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెగడం లేదు. నీటి కేటాయింపులు లేక కృష్ణా పరీవాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. -
వైఎస్సార్సీపీ శ్రేణులకు సజ్జల కీలక సూచనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొంటూ.. పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. పార్టీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక వార్రూమ్లను ఏర్పాటు చేసి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వార్రూమ్లలో సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు అవసరమైన సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, కేంద్ర కార్యాలయ స్థాయిలో మూడు దశల్లో వార్రూమ్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఓటర్ల జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు అమలు చేసిన వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. -
పాపికొండలు: గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు
సాక్షి, పోలవరం: పాపికొండల పర్యటనలో గోదావరి మధ్యలో శ్రీలక్ష్మి బోటు నిలిచిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పాపికొండల బోట్లు నిర్వహణలో డొల్లతనం బయటపడింది. గండి పోచమ్మ దేవస్థానం ప్రాంగణం నుండి పాపికొండలు విహారయాత్రకు 89 మంది పర్యాటకులతో బోటు బయలుదేరింది. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్ళే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు నిలిపివేశారు.మరో బోటులో పర్యాటకులను బోటు యజమానులు తీసుకెళ్లారు. శ్రీలక్ష్మి బోటు ఆగిపోవడంతో జలశ్రీ బోటులో పర్యాటకులను వెళ్లారని నిర్వాహకులు చెబుతున్నారు. బోట్ నిలిచిపోవడంతో పాపికొండల బోట్లు ఫిట్నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోట్లో వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తాత్కాలికంగా పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేశారు. -
తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జన సైనికులు ఓవరాక్షన్ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేసి హంగామా సృష్టించారు. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకాన్ని వీడియోలు తీశారు జనసేన నేతలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నా ఉల్లంఘనలకు తెరలేపారు జనసేన నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విదంగా చేసిన జనసేన వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ఉన్నా ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఉల్లంఘన ఎపిసోడ్తో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ నడుస్తోంది. -
‘తిరుపతి సభ విజయోత్సవం కాదు.. వెన్నుపోటు ఉత్సవం’
సాక్షి, తాడేపల్లి: తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రస్తుతం "క్యాష్–రాజేష్–లోకేష్" ఫార్ములాతో పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన, డీఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో తాటిపర్తి చంద్రశేఖర్ ఏమన్నారంటే..అది వెన్నుపోటు పొడిచిన సభతిరుపతిలో ఈ నెల 12న జరిగినది కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్లో వెతికినా కనిపించవు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం పరీక్ష రాయకుండానే పాస్ అయినట్లు ఉంది. ఆ రోజు సూపర్ సిక్స్ అన్న చంద్రబాబు, ఈ రోజు సూపర్ సైలెంట్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను మూసేసి ఎర్రబుక్ పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పని జరగాలన్నా 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే కొత్త ఫార్ములానే అమలవుతోంది. రాజేష్ స్కెచ్ వేస్తే, లోకేష్ దాన్ని అమలు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్ర వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.డీఎస్సీపై సమాధానం చెప్పలేని మంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తారా?డీఎస్సీ -2025 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ప్రెస్మీట్ పెట్టి సమాధానం చెప్పలేని వ్యక్తి మంత్రి ఎలా అవుతారు? డీఎస్సీ అక్రమాలపై వివరణ ఇవ్వలేని సకల విఫల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా? అలాంటి వ్యక్తి విజయోత్సవ సభ వేదికపై నిలబడి వైఎస్ జగన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం పాత్రను ఎలా ఉపయోగించారో, అలాగే చంద్రబాబు–లోకేష్లు పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకుంటున్నారు.ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా పవన్ను రంగంలోకి దింపుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రత్యర్థులను దూషించడానికే పరిమితమయ్యారు. పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. తిరుపతిలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వారి ప్రసంగాలే నిరూపించాయి.సింగిల్ విండో పాలనరాష్ట్రంలో ప్రస్తుతం 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే సింగిల్ విండో పాలన నడుస్తోంది. ఈ కొత్త ఫార్ములాతో పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్లలోనే చంద్రబాబు రెండు చేతులు ఎత్తేశారు. రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలో అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడే రాష్ట్ర తిరోగమనం మొదలైంది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు అప్పగించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి, ఫలితాలు పడిపోయాయి, పేపర్ లీకులు పెరిగాయి. ఉద్యోగాలు సూట్కేసులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. డీఎస్సీలో విద్యాశాఖ ఉద్యోగులకే మొదటి ర్యాంకులు రావడం, గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగాలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మంగళం పాడారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులను అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఒకవైపు తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని సినిమా డైలాగులు చెబుతుంటే, మరోవైపు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. సొంత పార్టీ నేతల తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపించగలరా?తిరుపతి విజయోత్సవ సభలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? పని కంటే ప్రచారానికే ఈ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం, పారదర్శకత, గ్రామ స్వరాజ్యం కనిపించాయి. కానీ రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేసింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి.ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అప్పులు–అవినీతితో పాలన సాగిస్తున్నారు. తిరుపతి విజయోత్సవ సభతోనే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను తానే అంగీకరించుకుందని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలపై సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించి తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. -
‘ ఆ సభకు వెన్నుపోటు సభ అని పెట్టాల్సింది’
విశాఖ: ఏపీలోని రెండు కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడిచారన్నారు. తిరుపతి సభకు వెన్నుపోటు సభ అని పేరు పెడితే బాగుండేదని వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ‘తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. సీబీఎన్ అంటే చీటింగ్ బోగస్ నాయుడు. దైర్యం ఉంటే ప్రజలు ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పాలి. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లోకేష్ నీ గల్లా పట్టుకొని నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాపు మహిళలను పవన్ మోసం చేశారు.సూపర్ సిక్స్ అమలు చేసే వరకు పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. -
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి. -
లోకేశ్కు అందుకే ఆ శాఖ అప్పగించారా?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.‘‘విద్యాశాఖను చెడగొట్టాలని లోకేశ్కు ఆ శాఖ అప్పగించారా? ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉందా? కూటమి ప్రభుత్వ వెన్నుపోట్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. రెండేళ్లలో ఏదో సాధించినట్లు వెన్ను పోటీ పార్టీ చెప్పుకుంటోంది. ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో ఒక్కటైనా నెరవేర్చారా? సూపర్-6, సూపర్-7 పథకాలు అన్నారు.. ఏమయ్యాయి?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘ఏపీలో ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు చాలా బేల మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడపమంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు మా నాయకులు, ప్రజలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోరాటంలో పాల్గొన్నారు.. పార్టీ నాయకులు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఆడబిడ్డ నిధి పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. బంగారు కుటుంబం అన్నారు.. ఇత్తడి కుటుంబం కూడా లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలకు ఇంతటి ప్రజాధరణ వచ్చింది. అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న దళారులు బాగుపడుతున్నారు.సామాన్యులు కొనే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకేశ్ ఛాలెంజ్ లు దేనికి విద్యా శాఖను బాగు చెయ్యడానికా? నాశనం చెయ్యడానికా..? పాఠశాలల ప్రారంభం నాటికే పేద పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బట్టలు, బ్యాగ్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ రంగానికీ మంచి జరగడం లేదు. రైతుకు మద్దతుగా ధర లేదు. జొన్న, మామిడి వంటి వాటికి కూడా ధర లేదు. మా హయాంలో ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా చేశాం. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా కుదేలు అయ్యింది.. ఆక్వా రంగంలో ఉన్న వారు కూడా రోడ్డెకుతున్నారు. ఇది వెన్నుపోటు పార్టీ విధానం’’ అన్నారు.మాధవ్వి తప్పుడు వ్యాఖ్యలు.. ఇక పవన్వి..ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘‘మీ కేంద్ర మంత్రే మా వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి మాటలు అబద్దమా..? లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రధానిని స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగారు.. పవన్ కల్యాణ్.. ఒకరోజు తెలంగాణ.. మరో రోజు ఏపీ అంటారు.పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు రెండేళ్లలో చేశారు. మా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు. మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేదు. డీఎస్సీని నిర్వహించలేని ప్రభుత్వం ఇది. గ్రామ సచివాలయ ఉద్యోగాలు పాదర్శకంగా ఇచ్చాం.. నేనే మానిటరింగ్ మినిస్టర్ గా ఉన్నాను గర్వంగా చెబుతున్నా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా యూరియా దొరకడం లేదు. ఒడిశా నుంచి యూరియా తెచ్చుకొని దాచుకుంటున్నారు. అది కూడా అధిక ధర రూ. 600 కు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రైతులు చెప్పిన వాస్తవాలు ఇవి. భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగిపోతుందని రైతులు భయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ వెన్నుపోటు ప్రభుత్వం.. టీడీపీది వెన్నుపోటు పార్టీ’’ అని తెలిపారు. -
చిన్నారి మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్లు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి,. చిన్నారి అన్వేషణలో కీలకంగా మారిన కుక్క ఎపిసోడ్ విషాదాంతమైంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది.గాలింపు ఇలా..!సుమారు వారం రోజుల నుంచి పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగించారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతున్న సమయంలో కుక్క చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.కుక్కలో వింత ప్రవర్తన..!ఈనెల 6 వ తేదిన జ్ఞానేశ్వరి వెంట వెళ్ళి అదృశ్యమైన పెంపుడు కుక్క... *మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ కుక్కలో వింత ప్రవర్తన మొదలైంది. జ్ఞానేశ్వరి తల్లితో పాటుగా పలువురిని మొరుగుతూ కరిచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రెండోసారి కూడా అదృశ్యమై, మళ్లీ ఇంటికి వచ్చింది. ఈసారి కుక్కకు జీపీఎస్ అమర్చి.. చిన్నారి ఆచూకీ కోసం కుక్కను కీలకంగా చేసుకున్నారు అధికారులు. అయితే ఇది కూడా ఉపయోగం లేకుండానే పోయింది. తిరిగి, తిరిగి ఇంటికి చేరిన కుక్క.. అనూహ్యంగా మృత్యువాత పడింది. చిన్నారి ఆచూకీ మాత్రం కుక్కకు తెలిసే ఉండవచ్చని, కుక్క వింతగా ప్రవర్తించడం వెనుకు ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు గ్రామస్థులు, బంధువులు కూడా కుక్క వింత ప్రవర్తన వెనుక ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించకపోగా, ఇప్పుడు కీలకం అనుకున్న కుక్క మృతి చెందడంతో చిన్నారి మిస్సింగ్ కేసులో ఏం జరుగుతుంది? అనే చర్చ మొదలైంది. -
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో.. పదికి చేరిన మృతుల సంఖ్య
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డి.సూరిబాబు అనే స్టీల్ ప్టాంట్ ఉద్యోగి మృతిచెందారు. కాగా ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉక్కు ద్రవం కార్మికులపై పడి తొమ్మిది మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజాగా మరొకరు మరణించడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది.కాగా (సోమవారం) సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో ఎనిమిది మంది కార్మికులు ఘటనా స్థలంలో మృతిచెందారు, చికిత్స పొందుతు మరోకరు, తాజాగా సూరిబాబు అనే కార్మికుడు మృతిచెందారు. ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేశారు. ప్రమాదానికి కారణం మెటల్ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్ లిక్విడ్ పేలడం వల్ల ప్రమాదం జరిగింది. గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పదిమంది కార్మికులు మృతిచెందారు. -
కేసుపై కేశినేని నాని స్ట్రాంగ్ రియాక్షన్
విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై నాని ఘాటుగా స్పందిస్తూ.. ఈ చర్యను “రాజకీయ పిరికితనం” అని మండిపడ్డారు.సాక్షి, విజయవాడ: తనపై కేసు నమోదు కావడం, ఎల్లో మీడియా దానిని హైలైట్ చేస్తుండడంపై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని స్పందించారు. ఉర్సా భూ కేటాయింపుల వ్యవహారంపై తాను ఇప్పటికే ఏడాది క్రితమే ముఖ్యమంత్రికి లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ భూ కేటాయింపుల్లో ఎంపీ చిన్ని ప్రమేయం ఉందని పేర్కొంటూ, 2025 ఏప్రిల్ 22న చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా ఇచ్చినట్లు తెలిపారు.దాదాపు 14 నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అకస్మాత్తుగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని నాని విమర్శించారు. ఈ చర్యను ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు, కార్పొరేట్ వ్యవహారాలపై ప్రశ్నించడం తన ప్రాథమిక హక్కు అని, ప్రజల పక్షాన మాట్లాడటం మాజీ ఎంపీగా తన బాధ్యత అని నాని స్పష్టం చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కాలయాపన చేసి, ఇప్పుడు అధికార బలంతో కేసులు పెట్టడం సరైంది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.When questioned about his involvement in the 'Ursa Clusters Pvt Ltd' land issue in my open letter to the Hon'ble @AndhraPradeshCM on April 22, 2025, the Vijayawada MP chose silence for 14 months. Now, out of political panic, he has filed a malicious FIR (https://t.co/ubI0U2i0qB:… pic.twitter.com/HtBs8cTAGf— Kesineni Nani (@kesineni_nani) June 13, 2026ఇక మరోవైపు పోలీసుల సమాచారం ప్రకారం.. ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సోషల్ మీడియాలో తనపై అసత్య, పరువు నష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని చిన్ని ఆరోపించారు. తాజా పరిణామాలతో కేశినేని బ్రదర్స్ మధ్య రాజకీయ విభేదాలు మరో దశకు చేరినట్లు స్పష్టమవుతోంది. చిన్ని అధికార కూటమి ఎంపీగా ఉండగా, నాని గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయాలపై అలాగే చిన్ని అవినీతి బాగోతంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. -
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్లు కలిసి ఓ మెగా స్కామ్కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
మహిళలకు మరో షాకిచ్చిన చంద్రబాబు.. ఆడబిడ్డ నిధికి మంగళం!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హామీ అంటేనే మోసమని మరోసారి రుజువైంది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన "ఆడబిడ్డ నిధి" పథకంపై చంద్రబాబు చేతులెత్తేశారు. ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ బుకాయిస్తున్నారు. దీంతో, మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్-6" హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. జూన్ 2024 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని కూడా హామీ ఇచ్చారు. అయితే తాజాగా తిరుపతిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంత అనుకూలంగా లేదని, భారీ సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందని బుకాయించారు. దీంతో ఆడబిడ్డ నిధి అమలుపై అనుమానాలు మరింత పెరిగాయి.కాగా, రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది మహిళలకు ఈ పథకం వర్తించనుంది. గత రెండేళ్లుగా అమలు కాలేకపోవడంతో ఒక్కో మహిళకు రూ.36 వేల మేర ప్రయోజనం దక్కకుండా పోయింది. ఇక, ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డ నిధి హామీతో టీడీపీ నాయకులు బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ హామీ అమలుపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ బాండ్లను నమ్మి ఎదురుచూసిన మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు ఆ బాండ్లు ఏం చేయాలో మహిళలకు పాలుపోవడం లేదని అంటున్నారు. ఇక, కూటమి అధికారంలోకి వచ్చాక.. మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఇచ్చిన అన్నీ పథకాలను చంద్రబాబు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం చంద్రబాబు అమలు చేయడం లేదు. దీంతో, కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
కేశినేని బ్రదర్స్ వార్లో కీలక పరిణామం
బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) సోషల్మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది తెలిసిందే. తాజాగా ఈడీకి సైతం ఆయన ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆయనపైనే కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరుడి వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య, అనుచిత ప్రచారం జరుగుతోందని, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిన్ని అధికార కూటమికి చెందిన ఎంపీ కాగా, నాని ఇటీవల కాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల్లోనే నానిపై కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.నాని అనుచరులు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా జరిగిన చర్య అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు. మరోవైపు ఎంపీ చిన్ని వర్గం మాత్రం సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాన్ని సహించబోమని చెబుతోంది. -
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
సాక్షి, ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బందిపై తాను దాడి యత్నం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను.. ఎమ్మెల్యేపై దాడి చేయగలనా అని ప్రశ్నించారు. తన బైక్ను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకే ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని చెప్పారు.అయితే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఎమ్మెల్యే, ఆయన అనుచరులే తనపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం "నేను చేసిన తప్పేంటి?" అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి తనను జైలుకు పంపించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన ఆరోపణలకు సంబంధించిన మూడు అంశాలను నిరూపించాలని వంశీ డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష ఇచ్చారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని వంశీ తెలిపారు. తన తరఫున కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఇతర కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై నియోజకవర్గంలోని జనసేన నాయకులు స్పందించాలని కోరారు. వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పోలవరం జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. -
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. -
'కోర్'కోక పోతే ఎలా..?
ఇంజినీరింగ్లో కోర్ బ్రాంచులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. ఐదేళ్ల క్రితం ఈ బ్రాంచ్ల్లోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు.. గత విద్యా సంవత్సరంలోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తప్ప తక్కిన ఇంజినీర్లు ఉండరనే భయం విద్యావేత్తలలో నెలకొంది. అనంతపురం: కంప్యూటర్ సైన్సెస్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన వారు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ‘సాఫ్ట్వేర్’ కొలువులు దక్కక చతికిలపడుతున్నారు. ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారిలో 80 శాతం మంది సీఎస్ఈ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర కోర్ బ్రాంచుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈసీఈ మినహా మిగిలిన కోర్ బ్రాంచ్ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. 8 శాతమే స్కిల్డ్ ఉద్యోగాలు ఇంజినీరింగ్లో ప్రతి 100 సీట్లలో 80 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్సెస్ వాటి అనుబంధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు తగ్గుముఖం పట్టడంతో 8 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన వారు కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే కొలువులు దక్కుతున్నా.. గణనీయమైన ప్యాకేజీ కావాలన్న ఆశతో అవకాశాలను వదులుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోడింగ్ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై సాధికారిత లేకపోవడంతో ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయి. » బీటెక్ అనంతరం మూడు, నాలుగు సంవత్సరాల సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అనంతరం ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే.. ఈమధ్య కాలానికి ఉద్యోగం చేసినట్లు సర్వీస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉందని చెబితే.. అందుకు తగ్గట్టు నైపుణ్యాలు లేనందున రెండు, మూడు నెలలకే ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్ కోర్సుల్లో బీటెక్ పూర్తి చేసినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నైపుణ్యం కలిగిన అధ్యాపకులేరీ? బీటెక్ 2, 3, 4 సంవత్సరాల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరి. కంప్యూటర్ సైన్సెస్, ఐటీ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం గల అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెరి్నంగ్ వంటి ఐటీ ఆధారిత కోర్సులకు ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ మాత్రం ‘స్వయం’ (ఆన్లైన్) 20 కోర్సులు పూర్తి చేసిన వారు సీఎస్ఈ, వాటి ఆధారిత కోర్సుల్లో అధ్యాపకులుగా ఉండొచ్చని నిర్దేశించింది. ఈ కోర్సులు చేసి అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారు. ఫలితంగా ఈ కోర్సులవిద్యార్థులకు తగిన శిక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికంగా కంప్యూటర్ సైన్సెస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నా.. అందుకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో నైపుణ్యాల కొరత వేధిస్తోంది. సాఫ్ట్వేర్ కొలువులకు వెళ్లే అభ్యర్థులను నిమిషాల వ్యవధిలోనే కొత్త కోడ్ రాయాలని బహుళ జాతి కంపెనీలు నిర్దేశించి.. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు అభ్యర్థులు నైపుణ్యాల లేమికారణంగా ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు. కోర్ కోర్సులతో భవిత పదిలం సాఫ్ట్వేర్ రంగం ట్రెండ్ మారొచ్చు. ఎంత టెక్నాలజీ మారినా భౌతిక నిర్మాణాలు, యంత్రాలు, విద్యుత్ వ్యవస్థలు ఎప్పటికీ అవసరమే. బుల్లెట్ రైళ్లు, స్మార్ట్ నగరాలు, మెగా ప్రాజెక్ట్ల నిర్మాణం కోర్ ఇంజినీర్ల ద్వారానే సాధ్యమవుతాయి. పవర్ గ్రిడ్ నిర్వహణ, ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. కోర్ బ్రాంచ్ కోర్సులు పూర్తి చేస్తే తొలుత తక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వేతనాలు అందుకుంటారు. –ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్, జేఎన్టీయూ అనంతపురంసీఎస్ఈ వైపు వెళ్లడం మంచిది కాదు కోర్ బ్రాంచ్ల వైపు వెళ్తే రెండు విధాలుగా అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ వైపు వెళ్లొచ్చు. లేదా మౌలిక సదుపాయాల రంగాల్లో ఉద్యోగాలు దక్కుతాయి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. 100కు 80 మంది కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నారు. ఏఐ రావడంతో ఉపాధిపై దెబ్బ పడుతోంది. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) వైపు వెళ్లడం లేదు. అంకితభావంతో కృషి చేస్తే సర్వీసెస్లో కొలువు సాధించవచ్చు. – డాక్టర్ బి.రమేష్ బాబు,ప్రిన్సిపాల్, పీవీకేకే కళాశాల -
ఏం బాబూ.. ఇదేనా పొదుపు?
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. పబ్లిసిటీ కోసం పొదుపు పాటిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఆచరణలో మాత్రం అమలు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే నేతలు నాలుగు విమానాలు, ఓ హెలికాప్టర్ వినియోగించినట్లు రేణిగుంట విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్లో రేణిగుంటకు చేరుకున్నారు. మంత్రి లోకేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మరి కొందరు మంత్రులు మరో మూడు ప్రత్యేక విమానాల్లో రేణిగుంటకు చేరుకున్నట్లు తెలిపారు. పొదుపు మంత్రంలో భాగంగా వారంలో ప్రతి శుక్రవారం నో వెహికల్స్ డే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విజయోత్సవ సభకు భారీఎత్తున వాహనాలు వినియోగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దామినేడు సభాస్థలి వరకు కాన్వాయ్లో చేరుకున్నారు. విజయోత్సవ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ప్రత్యేక వాహనాలను పంపి స్థానికులను రప్పించుకున్నారు. ఈ వాహనాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ నెల 7 నుంచి 12 వరకు ఉండేలా సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లకు మొత్తంగా రూ.3 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. -
ఏపీలో బా‘ధర’బందీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మేలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంలో పాటు ఆహార ధరలు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది. మే నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మే నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 4.90 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉంది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణం 4.20 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 5.64 శాతం ఉంది. అంటే ఏప్రిల్ కన్నా మే నెలలో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు స్పష్టమైంది. మే నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనేద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 5.09 శాతం ద్రవ్యోల్బణం ఉండగా పట్టణాల్లో 4.61 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ సగటు కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉంది. జాతీయ స్థాయిలో సాధారణ ద్రవ్యోల్బణం 3.93 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతమే ఉంది. గత నెలతో పోల్చితే మేలో వంట నూనెలతో పాటు పప్పులు, కూరగాయలు ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. -
వివాహేతర బంధం విషాదాంతం
హాలహర్వి: వివాహేతర బంధం విషాదాంతమైంది. ఓ మహిళ, ఆమె మూడునెలల పసికందును బలితీసుకుంది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలివీ.. గూళ్యం గ్రామానికి చెందిన మహేష్(39) కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన దివ్యాంగురాలిని రెండో పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అదే గ్రామంలో వివాహిత లీలావతి(36)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో లీలావతిని ఆమె భర్త పలుమార్లు దండించాడు. ఈ విషయాన్ని లీలావతి తన ప్రియుడు మహేష్ తో చెప్పింది. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని లీలావతి, మహేష్, మూడు నెలల చిన్నారితో నాలుగు రోజుల క్రితం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. వీరిని గ్రామంలో ఎవరూ చేరదీయకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామశివారులోని వంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఘటనలో లీలావతి, మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మహేష్ కొన ఊపిరితో ఉన్నాడు. పొలం పనులకు వెళ్లిన రైతులు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. లీలావతి, మూడు నెలల చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి బళ్లారికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. -
స్కాములు.. లీకులు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో కూటమి వైఫల్యాలను ఎత్తి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది. సూపర్ సిక్స్.. సూపర్ ప్లాప్, స్కాములు.. లీకులు, డీఎస్సీ అక్రమాలు, రైతులకు వెన్నుపోటు వంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. కూటమి పరిపాలనను వైఎస్సార్సీపీ పాలనతో పోల్చుతూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఇంతలా అప్పుల పాలు చేసి, ఇన్ని స్కాములకు పాల్పడ్డ చంద్రబాబు అండ్కో నేతలపై సామాజిక మాధ్యమాల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ప్రభుత్వాల విధి
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల విధి అని హైకోర్టు పేర్కొంది. ఈ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు తమను తాము సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకోలేవని స్పష్టంచేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనమన్నది జీవించే హక్కులో భాగమని తేల్చి చెప్పింది. రోడ్ల పక్కన తగినన్ని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం వల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ఉండే భయాలను తొలగించినట్లవుతుందని పేర్కొంది.అయితే పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదని, ఏడాది పొడవునా వాటిని సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని ఉద్ఘాటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక వ్యాజ్యంలో తీర్పు వెలువరించారు.విశాఖపట్నం, పిఠాపురం కాలనీలో, మద్దిలపాలెం బస్డిపో సమీపంలో తమ ఇళ్ల ఎదురుగా ఉన్న జీవీఎంసీ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కె.చిన్నస్వామి శెట్టి మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపితే ఆ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చునని పిటిషనర్లకు సూచించారు. -
స్కీములు రద్దు.. స్కామ్లే ముద్దు!
సాక్షి, అమరావతి: గతంలో ఉన్న పథకాలన్నీ రద్దు.. సూపర్ సిక్స్లు, సెవెన్లు పేరుతో మోసాలు! కొత్తగా సంపద సృష్టించకపోగా ఉన్న సంపదే ఆవిరి! విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం..! విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవస్థలకు మంగళం! పిల్లల నుంచి మహిళలు వరకు ప్రతి ఒక్కరికీ ఎడాపెడా ఎన్నికల హామీలిచ్చి నిస్సిగ్గుగా నయవంచన! ఇదీ రెండేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు సాధించిన ఘనత!! రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉచిత పంటల బీమా ఎగిరిపోయి వ్యవసాయం కుదేలు కాగా విద్యాదీవెన, వసతి దీవెన అందక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా తొక్కిపెట్టడంతో పిల్లల చదువులు ఆగిపోతున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు పనులను నిలిపివేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడమే ఆలస్యం.. ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి పిల్లల చదువులను గాలికి వదిలేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ఆరోగ్యశ్రీని నీరుగార్చి బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందక పేదలు అల్లాడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. సచివాలయాల వ్యవస్థను ఛిద్రం చేస్తూ ఇంటి వద్దకే పౌరసేవలు, పాలన వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. రెండేళ్లలో అంతా స్కామ్ల మయంగా మార్చేశారు! హామీలు ఎగ్గొట్టి.. విచ్చలవిడిగా అప్పులు.. ప్రకృతి వనరుల దోపిడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. సంపద సృష్టించి సంక్షేమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికి ఇప్పుడు ఉన్న సంపదనే ఊడ్చేస్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో చంద్రబాబు పాలనలో ఆర్థిక ప్రతిష్ట దిగజారినట్లు ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక సాక్షిగా వెల్లడైంది. 365 రోజుల్లో 357 రోజులు అప్పులపైనే చంద్రబాబు సర్కారు మనుగడ సాగించినట్లు ‘కాగ్’ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్ధల ఆస్తులను తాకట్టు పెట్టి బడ్జెట్ లోపల, బడ్టెట్ బయట చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.3.47 లక్షల కోట్లు మేర అప్పులు చేసింది. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టేయడంతో పాటు ఎడాపెడా అప్పులతో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రజల తలసరి ఆదాయం, ప్రభుత్వ రాబడిని పెంచకుండా ఇసుక నుంచి మద్యం దాకా సిలికా నుంచి లేటరైట్ వరకు ప్రకృతి వనరుల దోపిడీకి తెర తీసి పచ్చ ముఠాలకు పంచి పెట్టారు. విలువైన ప్రభుత్వ భూములను బంధు గణానికి అప్పనంగా దోచి పెట్టారు. సొంత కుటుంబ సంస్థకు రాయితీల పేరుతో ప్రజా ధనాన్ని మళ్లించారు. విచ్చలవిడిగా అప్పులు చేసినా సూపర్ సిక్స్, సెవెన్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అమలు చేయకుండా యువతకు.. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు రెండేళ్ల పాలన నమ్మక ద్రోహం, మోసం, వెన్నుపోట్లు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే లక్ష్యంగా సాగింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన సభలో దొంగే.. దొంగ దొంగ..! అని అరిచినట్లుగా చంద్రబాబు సూక్తులను విని రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు. రెండేళ్ల పాలనలో తన నిర్వాకాలను వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ నిస్సిగ్గుగా నిందలు మోపారు. రెండేళ్ల నమ్మకం అంటూ కూటమి ప్రభుత్వం సభ నిర్వహించడంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్లతో సహా ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా.. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం రద్దు చేసిన సీఎం చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ‘నమ్మకం’ పేరుతో సభ నిర్వహిస్తారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేసి నిజాయతీ నిరూపించుకున్నామంటూ చంద్రబాబు చెప్పడంపై నివ్వెరపోతున్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ లాంటి అనేక హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా వంచించారని సర్వత్రా చర్చ జరుగుతోంది. మద్యం ఆదాయాన్నీ వదలకుండా.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్బీసీఎల్ నుంచి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్లు జారీ ద్వారా భారీ అప్పులు చేసింది. 2025 డిసెంబర్లో ఏపీఎస్బీసీఎల్ ద్వారా బాండ్లు జారీ చేసి రూ.5,750 కోట్లు అప్పు చేయగా ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ మొత్తాన్ని రూ.11,850 కోట్లకు పెంచారు. ఇలాంటి అప్పులు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం, కాగ్ వారించినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. రాజధాని ముసుగులో.. రాజధాని నిర్మాణం పేరుతో భూములను తాకట్టు పెట్టడం ద్వారా భారీగా అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టించేవారే సంక్షేమం గురించి మాట్లాడాలని.. ఆదాయం పెంచేవాళ్లకే సంక్షేమం పంచే అధికారం ఉంటుందంటూ ఎన్నికల ముందు గంభీరంగా చెప్పిన చంద్రబాబు ఇప్పటికే ఉన్న ఆస్తులను సైతం కరిగించేస్తున్నారు. మరోవైపు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వైఎస్సార్ సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం నిలిపివేశారు. సంపద సృష్టించకుండా, హామీలు అమలు చేయకుండానే నెరవేర్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతుండటం పట్ల అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రైవేట్ చేతికి ఖజానా తాళాలు! రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా అప్పులను రికవరీ చేసుకునే వెసులుబాటు ప్రైవేట్ వ్యక్తులకు కల్పించింది. ఏపీఎండీసీకి రూ. 1,91,000 కోట్ల విలువైన 436 మైనింగ్ లీజులను బదిలీ చేసి వాటిని సెక్యురిటీగా బాండ్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేసింది. ఆ అప్పులకు గ్యారెంటీ ఇవ్వడమే కాకుండా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా అప్పులను రికవరీ చేసుకునే వెసులుబాటును కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వసూలు చేసుకునేలా అనుమతించింది. ఇంత దారుణంగా ఆర్ధిక విధ్వంసానికి తెగబడి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందంటూ రెండేళ్ల సభలో చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలాడటాన్ని చూసి అధికార యంత్రాంగం సైతం విస్తుపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎమ్మార్వో ఆఫీసులను, ఆస్పత్రులను తాకట్టు పెట్టినట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లించారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టగా వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే. అలాగే పౌర సేవలను ప్రైవేట్ పరం చేయాలని, మున్సిపల్ ఆస్తులను ప్రైవేట్ సంçస్థలు, వ్యక్తులకు దీర్ఘకాలిక లీజుకు లేదా విక్రయించేందుకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో 3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా నిమ్మనపల్లెలో 2.9, చిత్తూరు జిల్లా పలమనేరులో 2.4, కార్వేటినగరంలో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆవర్తనం ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారమున్నట్లు పేర్కొంది. గంటకు 40– 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండ విజృంభించింది. ప్రకాశం జిల్లా కారేడులో 43.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా గూడూరులో 43, మన్యం జిల్లా భామినిలో 41.7, అనకాపల్లి జిల్లా చీడికాడలో 41.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో కుండపోత వర్షం.. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉకిరిబిక్కిరికి గురైన తిరుపతి జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పెద్ద ఎత్తున చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. -
టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’వన్నె పులులు తెగపడ్డాయి. ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు బరితెగించాయి. ఏకపక్షంగా మేత ధరలను పెంచేశాయి. ఆక్వా రంగ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా టన్నుకు వెనామీ ఫీడ్పై రూ.10వేలు, టైగర్ ఫీడ్పై రూ.12 వేలు చొప్పున పెంచాయి. ఈ పెంపు శనివారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించాయి. తొలుత టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు చెందిన బీఏంఆర్ కంపెనీతోపాటు టీడీపీ నేతలకే చెందిన అవంతి ఫీడ్స్ కంపెనీలు ధరలను పెంచుతూ ప్రకటనలు విడుదల చేయడంతో ఇదే బాటలో మిగిలిన కంపెనీలూ ఒకదాని తర్వాత మరొకటి ప్రకటనలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆది నుంచి మేత తయారీదారులతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఫీడ్ ధరల పెంపునకు పచ్చజెండా ఊపడంతో ఆక్వా రైతులు మండిపడుతున్నారు.అప్సడా చట్టానికి తూట్లు నిబంధనల ప్రకారం.. ధరల పెంపు అనివార్యమైతే అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై నిర్ణయించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టానికి రెండేళ్లుగా తూట్లు పొడుస్తోంది. రొయ్య రైతుల అంగీకారం లేకుండానే కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే రీతిలో టన్నుకు రూ.4వేల చొప్పున ధరలు పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వెనామీ ఫీడ్పై రూ.12వేలు, టైగర్ ఫీడ్పై రూ.14వేలు పెంచేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏప్రిల్ 30న మత్స్యశాఖ కమిషనర్కు రొయ్య మేత తయారీదారుల సంఘం లేఖ రాసింది. రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకుందామని కమిషనర్ చెప్పారు.కానీ పట్టించుకోకుండా మే 11న వెనామీ ఫీడ్పై రూ.8,420, టైగర్ ఫీడ్పై రూ.10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. దీంతో ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ఆ వెంటనే «మత్స్యశాఖ మంత్రి అచ్చెన్ననాయుడు స్పందించి ఆక్వా రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోరడంతో తాత్కాలికంగా కంపెనీలు పెంపును వాయిదా వేశాయి. రైతులు వ్యతిరేకిస్తున్నా..మే 15న సచివాలయంలో అప్సడా ఆధ్వర్యంలో రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి మంత్రి అచ్చెన్న కావాలనే డుమ్మా కొట్టారు. రైతులు మేత ధరల పెంపును వ్యతిరేకించారు. సరిగ్గా ఇదేసమయంలో ధరల పెంపునకు వత్తాసు పలుకుతూ సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య మంత్రికి లేఖ రాయడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మంత్రి అచ్చెన్న సమక్షంలో మరోసారి టీడీపీ అనుకూల రైతులతో కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. టీడీపీ అనుకూల రైతులు నెల పాటు రూ.6వేలు పెంపునకు అంగీకరించారు. దీన్ని ఆక్వా రైతులు వ్యతిరేకించారు. అయినా శుక్రవారం రాత్రి బీఎంఆర్, అవంతి, ఫెడోరో, నెక్స్జెన్ కంపెనీలు భారీగా మేత ధరలు పెంచేస్తూ ప్రకటనలు చేశాయి. మిగిలిన కంపెనీలు ఇదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. భారీగా పెరగనున్న ఉత్పత్తి వ్యయం 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, శుక్రవారం మేత ధరలు పన్నులతో కలిపి టన్నుకు వెనామీ ఫీడ్ 1,01,720 కాగా, టైగర్ ఫీడ్ రూ.1,12,520గా ఉంది. శనివారం నుంచి పెరిగిన ధరలతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.3 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.4 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. -
వామ్మో.. ఇదేమి ఘోరం!
తిరుపతి తుడా: తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం చూసి జనం వామ్మో... ఇదేమి ఘోరం.. అంటూ నివ్వెరపోయారు. నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నగరంలోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. ఫ్రిజ్లు, వెలుపల పెద్ద ఎత్తున నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. పలుచోట్ల కుళ్లిపోయి, పాచిపట్టి, పురుగులు ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. పీర్ల చావిడి స్లాటర్ హౌస్పై మెరుపు దాడి నగరంలో కుళ్లిన మాంసం నిల్వ చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణాపురం పోలీస్స్టేషన్ సమీపంలోని పీర్ల చావడి స్లాటర్ హౌస్పై దాడులు నిర్వహించారు. ఐదారు షాపుల్లో పొట్టేలు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర అవయవాలు నిల్వలను గుర్తించారు. ఇవన్నీ రోజుల తరబడి అపరిశుభ్రమైన ప్రదేశంలో డంప్ చేయడంతోపాటు ప్రీజర్లలో నిల్వ ఉంచడాన్ని గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. కుళ్లిపోయి, పురుగులు పట్టి దుర్వాసన వస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి తిరుపతిలోని కొందరు మాంసం విక్రయించే వ్యాపారులకు చెన్నై, హైదరాబాద్తో లింకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెట్రో నగరాల్లో నిల్వ ఉంచిన, గడువు ముగిసిన మాంసాన్ని రసాయనాలు చల్లి తిరుపతి మార్కెట్కు దిగుమతి చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. లేబుళ్లు, తయారీ తేదీలు లేకుండా కుళ్లిపోయి, రంగు మారిన స్థితిలో ఉన్న తలలు, కాళ్లను పలు హోటళ్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తేల్చారు.నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తే చర్యలు: హెల్త్ ఆఫీసర్ కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడంతోపాటు వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ చెప్పారు. పలు షాపుల్లో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా, అర టన్ను మేర నిల్వ ఉంచిన పొట్టేళ్లు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర భాగాల మాంసం గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఫ్రీజర్లో కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఇనుప చువ్వలతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పరిసరాలు కూడా అపరిశుభ్రతతో దారుణంగా ఉందని వివరించారు. కాగా, అధికారులు చెప్పిన దానికన్నా మరింత ఎక్కువగానే కుళ్లిన మాంసం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.. సైబర్ ఉచ్చులో పడ్డాడు..
సాక్షి, విశాఖపట్నం: ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్యపై పెట్టిన ఫేస్బుక్ పోస్టు అతడిని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత రేసపువానిపాలెంకు చెందిన మాజీ సైనికోద్యోగి బి. శ్రీనివాసరెడ్డి సీతంపేట, రాజేంద్రనగర్లోని రూ.20 కోట్ల విలువైన 1,843 గజాల జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 3న మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు.. శ్రీనివాసరెడ్డి సమస్యను ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 7న శ్రీనివాసరెడ్డికి ఓ వాట్సప్ కాల్ వచి్చంది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫొటో డీపీగా ఉంది. ఫోన్ చేసిన అగంతకుడు తాను దేవినేని ఉమను మాట్లాడుతున్నానని, పార్కు స్థలం సమస్యను రష్యా పర్యటనలో ఉన్న లోకేశ్ తన దృష్టికి తెచ్చారని, దాన్ని పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని చెప్పాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నటించాడు. అంతేకాకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తదితరులతో తాను వాట్సాప్లో చాట్ చేసినట్లుగా ఫేక్ స్క్రీన్ షాట్లని సృష్టించి బాధితుడికి పంపాడు. నేరుగా జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి పార్కు సమస్యతో పాటు, బాధితుడికి ఉన్న ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) సమస్యను కూడా పరిష్కరిస్తానని మభ్యపెట్టాడు. అనుకున్న పనులు పూర్తి కావాలంటే జీవీఎంసీ కమిషనర్కు ముందుగా కొంత ‘ఫార్మాలిటీ అమౌంట్’ ఇవ్వాలని షరతు పెట్టాడు. దీన్ని నమ్మిన బాధితుడు 7న సైబర్ నేరగాడు పంపిన ‘రాథోడ్ సంతోష్’ అనే పేరుతో ఉన్న యూపీఐ క్యూ ఆర్ కోడ్కు ఫోన్ పే ద్వారా రూ.80 వేలు పంపించాడు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, వాట్సాప్ డీపీ కూడా తొలగించడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. -
అన్యాయంగా తీసేశారు.. న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించి పద్మావతి ఏజెన్సీ తమ పొట్టకొట్టిందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి సమావేశమై గోడును వెళ్లబోసుకున్నారు. తమ ఆవేదనను మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. బాధిత కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని సజ్జల వారికి హామీ ఇచ్చారు. బాధితులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిసహా ఎన్నో క్లిష్ట సమయాల్లో దశాబ్దాలుగా ప్రజాసేవలు అందించిన తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆవేదన ఇది.. ‘కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులం ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఒక్క కర్నూల్ జీజీహెచ్లో ఈ సంఖ్య దాదాపు 50గా ఉంది. ‘50 ఏళ్ల వయసు’ పేరుతో ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా అర్ధంతరంగా మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. సీఎం సమీప బంధువు ఒకరు ‘పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ ఏజెన్సీ’ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్ను చేజిక్కించుకున్న నేపథ్యం మాకు శాపంగా మారింది.అయితే ఏజెన్సీ కొత్త వారిని చేర్చుకుంటూ వారి దగ్గర నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తోంది. 54 ఏళ్లు ఉన్న వారిని కూడా కొత్తగా పనిలోకి చేర్చుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతు ఇచ్చిన వారినికూడా పనిలోంచి తీసేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. రాయలసీమ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.13,640 జీతం పొందుతున్నారు. వీరిలో చాలా మంది 25 ఏళ్లకు పైగా, రూ.400 ప్రారంభ జీతం ఉన్నప్పటి నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది’ అని కార్మికులు తెలిపారు. 50 ఏళ్ల వయో పరిమితి దారుణం.. ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉండగా, పారిశుద్ధ్య కార్మికులకు 50 ఏళ్లకే పరిమితి విధించడం ఏ మేరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చట్టవిరుద్ధంగా ఈ నిబంధనను చేర్చారని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జోన్లలో లేని ఈ 50 ఏళ్ల నిబంధన కేవలం రాయసీమ జోన్లో మాత్రమే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ యాజమాన్యం తమకు రాజకీయ పెద్దల అండ ఉందంటూ అక్రమాలకు పాల్పడుతోందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ మూక దాడులు
మంత్రాలయం: వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం కావడాన్ని జీరి్ణంచుకోలేక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ మూకలు వీరంగం వేశాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెలగబడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను గాయపరిచారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి ఇంటి సమీపంలో పోలీసుల ఎదుటే తుఫాను వాహనాన్ని, మోటారు సైకిల్ను తగులబెట్టారు. మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన చేపట్టారు. కోసిగి మండల కేంద్రంలో జరిగిన నిరసనకు మంత్రాలయం మండలం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివెళ్లారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి ఇంటిముందు రహదారి మీదుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా వెళ్లారు. కోసిగిలో జరిగిన ఈ నిరసనకు అనూహ్య స్పందన లభించింది. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక రాఘవేంద్రరెడ్డి వర్గీయులు అక్కసు వెళ్లగక్కారు. నిరసన ముగించుకుని తిరిగి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాఘవేంద్రరెడ్డి ఇంటి ముంగిట పోలీసుల కళ్లెదుటే దాడికి పాల్పడ్డారు. ముందుగా సూగూరు గ్రామానికి చెందిన దేవదాసు, లక్ష్మీరెడ్డి బైకును అడ్డగించి దాడిచేశారు. పోలీసులు కలుగజేసుకుని టీడీపీ మూకల నుంచి తప్పించి వారిని గ్రామంలోని స్టేషన్కు తరలించారు. తరువాత టీడీపీ గూండాలు అదేదారిలో వస్తున్న వైఎస్సార్సీపీ తుఫాన్ వాహనంపై విరుచుకుపడ్డారు. అందులోని కార్యకర్తల మీద, ఆ వెనుక బైక్పై వస్తున్న మరో ఇద్దరిపైన దాడిచేశారు. ఈ దాడుల్లో బూదూరుకు చెందిన పూజారి ఈరన్న, సూగూరు వాసి గొల్ల అంజినప్ప, 52–బసాపురం గ్రామస్తుడు గొల్ల రాముడు గాయపడ్డారు. వీరు ముగ్గురు ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బసాపురం గ్రామానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్ బైక్లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్ సైకిల్ను, నారాయణపురానికి చెందిన చిన్నబాబు తుఫాన్ వాహనాన్ని తగులబెట్టారు. ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అడ్డగించిన పోలీసులు నిరసన ముగించుకుని స్వగ్రామం రాంపురానికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, అనుచరుల వాహనాలను పోలీసులు కోసిగిలో అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి వెళ్లకుండా ఆయన వాహనాన్ని రాంపురం అడ్డరోడ్డులో నిలిపేశారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయుల దాడిమాచర్ల ర్యాలీకి వెళ్లినందుకే దాడి చేశారని బాధితుడి ఆవేదన బాధితుడిని పరామర్శించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పీఆర్కే రెంటచింతల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( పీఆర్కే) ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న మంచికల్లు వైఎస్సార్సీపీ నాయకుడు పాశం వెంకటరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. వెంకటరెడ్డిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు. కాగా దాడి విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి గౌతమ్రెడ్డి మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వెంకటరెడ్డిని పరామర్శించారు. బాధితుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ ర్యాలీకి వెళ్లి వచ్చి సెంటర్లో కూర్చున్న తనపై ర్యాలీకి ఎందుకు వెళ్లావు...నీవు గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గోగుల వెంకటరామిరెడ్డి, గోగుల లక్ష్మారెడ్డి, గోగుల పున్నారెడ్డి, గోగుల మహేష్ రెడ్డి కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. -
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ 143 హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఈ రెండేళ్లలో వాటిని అమలు చేయకుండా అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఇంటింటికీ బాండ్లు రాసిచ్చి మరీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన మాటలకు, ఈ రెండేళ్లలో చేసిన పనులకు ఏమాత్రం పొంతన లేదని చెప్పారు. నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు, చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మోసపోయిన, దగా పడిన యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాలపై వైఎస్ జగన్ శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజాగ్రహానికి అద్దం పట్టిన వైఎస్సార్సీపీ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీల ఫొటోలను ట్యాగ్ చేశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెండేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలో.. బాండ్ల రూపేనా పెట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు ఇచ్చారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ అని అడుగుతున్నారు.రైతులను మోసం చేశారు. మహిళలను మోసం చేశారు. యువతను మోసం చేశారు. విద్యార్థులను మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్ల మయమే. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు. పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రజలు చూసింది మోసం. ప్రజా పాలన కాదు.. రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పాలన.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బ తీశారు. జంగిల్ రాజ్లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడిని ఏమంటాం?అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక, మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నింటిలోనూ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు చార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది. విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశ చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు. ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయ పూర్వక అభినందనలు.చంద్రబాబుకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. అబద్ధాలతో కొంత కాలం ప్రజలను మోసం చేయొచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకంగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం. ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్ని వర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు. -
వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ దగా చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహ జ్వాల నింగికెగిసింది. చంద్రబాబు మోసాల పాలనపై ప్రజలతో కలసి ఎక్కడికక్కడ వైఎస్సార్ సీపీ క్యాడర్, నాయకులు తిరగబడ్డారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు.. బైక్ ర్యాలీలు నిర్వహించారు.. కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ అడుగడుగునా బారికేడ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా సర్కారు బెదిరింపులకు దిగినా ప్రజలు ఖాతరు చేయలేదు. మా పేర్లు రాసుకోండి..! ఏమేం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..! వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల్లో పాల్గొని తీరుతామంటూ నియోజకవర్గాల కేంద్రాలకు శుక్రవారం జనం స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. యువత, మహిళలు, రైతులు పోటెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ–జనసేన కూటమి సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి సమరశంఖం పూరించారు. పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు నెల్లూరులో బైక్ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో టీడీపీ–జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారం చేసింది. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల దగా పాలనపై ఈనెల 4 నుంచి 12వతేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆమేరకు నిరసన కార్యాచరణ షెడ్యూలును ప్రకటించారు.చంద్రబాబు చేసిన మోసం, దగా, వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్లెట్ను విడుదల చేసి.. అది గ్రామ గ్రామానా, ఇంటింటికీ చేర్చాలని దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో జనం స్వచ్ఛందంగా కదలివచ్చి కదం తొక్కుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈనెల 8, 9న నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు సర్కార్ దగా పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన సదస్సులకు ప్రజలు కదలివచ్చి.. కూటమి సర్కార్ మోసాలను వివరిస్తూ గళం విప్పారు. రెండేళ్లలో ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారిదే.. నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం కదలివస్తారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పసిగట్టిన చంద్రబాబ సర్కార్ యధావిధిగా పోలీసులను ప్రయోగించింది. నియోజకవర్గాల కేంద్రాలకు ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయకుండా ఉప్పెనలా కదిలి రావడంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్ చేశారు.‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్రాజ్లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది...విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు...ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు...చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన… pic.twitter.com/07PTqq4ojb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2026 -
శరత్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
పార్వతీపురం : పార్వతీపురం మండలం వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ గుండెపోటుతో అకాల మరణం చెందడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. ఈ మేరకు శరత్ భార్య, తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శరత్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంచితే.. రాజ్యలక్ష్మిపురంలో శరత్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పరామర్శించారు. -
చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం: భూమన
సాక్షి, తిరుపతి: రెండేళ్ల కూటమి పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తానని తిరుపతి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు దీటుగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి బదులిచ్చారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సభకు అపనమ్మకపు సభ, సంక్షోభ సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ సభ ద్వారా మరోసారి చంద్రబాబు ప్రజలకు మాయా బజార్ సినిమా చూపించాడని ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా విజన్ 2047 పేరుతో ప్రజలను మరోసారి భ్రమల ప్రిజన్లో బంధించాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చెంత మరోసారి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని, "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో కూటమి నిర్వహించిన సభను నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్ల చెక్క భజన సభ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేక కేవలం జగన్ ని తిట్టడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారని భూమన ధ్వజమెత్తారు.చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటు, అంతులేని అవినీతికి రెండేళ్లు పూర్తయ్యానని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, చెప్పుకున్న చంద్రబాబు.. తన తప్పు లేకుంటే సీఐడీతో కేసులు ఎందుకు కొట్టేయించుకున్నాడని ప్రశ్నించారు. శ్రీవాణి టికెట్ల అమ్మకాలు, పరకామణి వ్యవహారం, డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...అందుకే జగన్పై అక్కసు వెళ్లగక్కారుచంద్రబాబు పరిపాలనా దక్షుడు కాదు.. వెన్నుపోటు వీరుడు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ఈనే తేడా లేకుండా తప్పించుకోలేని విధంగా తన రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో కూటమి నాయకులు వైయస్ జగన్ గారిని తిట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు గురించి మాత్రం స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు.మరోసారి పచ్చి అబద్ధాలు..ఆఖరుకి తిరుమల శ్రీవారి పాదాల చెంత మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన వైఫల్యాలకు జగనే కారణమని ఊదరగొడుతున్నాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో నిర్వహించిన ఈ సభకి అపనమ్మకపు సభ, అబద్ధపు సభ, సంక్షోభ సభ, అనాగకరిక సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేది. 10 వేల మంది కూడా పట్టని ఆ ప్రాంతంలో 50 వేల మందితో సభ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేసుకుని పదుల కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేశారు.మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారువైఎస్ జగన్ పట్ల ఉన్న అక్కసు తీర్చుకోవడానికే ఈ సభను నిర్వహించారు. చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటుకి, అన్యాయానికి, అంతులేని అవినీతి, దోపిడీ దౌర్జన్యాలకు మాత్రమే రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల పాలనలో ఆద్యంతం జగన్ పట్ల ద్వేషమే చూపించారు. ఈ సభ ద్వారా మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారు. ఎర్ర బుక్కు పేరుతో చేసిన వెర్రి చేష్టలు తప్ప చేసిందేమీ లేదు. నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్లు.. చరకుడి వారసులమని చెప్పుకున్న చెక్క భజన సభ ఇది. వైఎస్ జగన్ గురించి అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు కొడుకు పేరు లోకేష్ కాదు.. పాపేష్, ఎర్ర బుక్కు ఎల్లేష్. తాను పప్పు అనే సంగతి లోకేష్ మరిచిపోయినా రెండు దశాబ్దాలుగా చూస్తున్న గూగుల్ మరిచిపోదు. రాబోయే రోజుల్లో తన తల్లిదండ్రులనే మర్చిపోతాడేమో.ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశారుతెలుగుదేశం అంటేనే వెన్నుపోటు పార్టీ. హంతకుల పార్టీ అని ఆనాడు గద్దర్ అన్నదే నిజమైంది. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేకపోయినా అన్ని చేసేశామని సిగ్గులేకుండా చెప్పుకున్నాడు. ఇద్దర్ని పిలిపించి భజన చేయించుకున్నాడు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల గురించి రాష్ట్రమంతా గగ్గోలు పెడుతోంది. 23 లక్షల పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని ఉత్తమాటలే. రెండేళ్లలో చేసిన రూ.3.60 లక్షల కోట్ల అప్పులే నిజం. వైఎస్ జగన్ డీబీటీ ద్వారానే నేరుగా రూ.2.73 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేశాడు. కానీ చంద్రబాబు జగన్ ఇచ్చిన హామీలతో పాటు సూపర్ సిక్స్ అమలు చేస్తానని నమ్మించి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశాడు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాడు. విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. మహిళలకు ఉచిత బస్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూడా 20 శాతం కూడా అమలు చేయలేదు. అయినా 2047 పేరుతో ప్రజలను భ్రమల ప్రిజన్లో ఉంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎవరికీ అర్థం కాలేదు. ఏదో మీటింగ్ కోసం రాసుకున్న ప్రసంగాన్ని ఇక్కడ చదివినట్టుంది. పవన్ కళ్యాన్ తన స్వార్థం చూసుకుంటున్నాడని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఆయనకు దూరంగా జరిగింది. వారిప్పుడు ఆయన మాటలను నమ్మడం లేదు.సీబీఐ విచారణ కోరే దమ్ముందా?చంద్రబాబు నియమించిన సిట్ నివేదికే తిరుమల లడ్డూ విషయంలో మా తప్పేమీ లేదని తేల్చింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చంద్రబాబుకి మొట్టికాయలు వేసింది. అయినా ఇంకా లడ్డూని అపవిత్రం చేశామని మాపై నిందలు వేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తప్పతాగి కొంతమంది రౌడీలు గూండాల మాదరిగా తన్నుకున్నారు. స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించిన చంద్రబాబే ఆలయ ప్రతిష్టను దిగజార్చేస్తున్నాడు.గతంలో ప్రతి సభలో కనిపించిన బీఆర్ నాయుడు ఇప్పుడెందుకు చంద్రబాబు పక్కన కనిపించడం లేదు? కొండ మీద మందు బాటిళ్లు కూడా కూటమి పాలనలో దొరికాయి. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చడమే కాకుండా గంజాయి, ఎర్రచందనం స్మగ్మర్లను తిరుపతిలో పెంచి పోషిస్తున్నది చంద్రబాబే. తిరుపతిలో అరాచకం రాజ్యమేలుతోంది.కేసులను ఎదుర్కోకుండా ఎందుకు కొట్టేయించుకున్నారు? డీఎస్సీ 2025కింద టీచర్ ఉద్యోగాల భర్తీ పేరుతో ఒక్కో ఉద్యోగం రూ. 15 నుంచి రూ. 20 లక్షలకు అమ్మేసుకున్నాడు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వైయస్ జగన్ గారు వెలికితీస్తే ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. శాప్ చైర్మన్ స్పోర్ట్స్ కోటా సీట్లను అమ్మేసుకుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్టు చేశారని చెప్పుకున్న చంద్రబాబు.. ఆ కేసులను ఎత్తివేయించడానికి సీఐడీని ప్రలోభ పెట్టకుండా ఉండాల్సింది. అవి తప్పుడు కేసులైతే న్యాయస్థానాల్లో ఎందుకు పోరాడలేదు? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కోరే దమ్ముందా? పరాకామణి విషయంలో, కొండ మీద జరిగే అక్రమాలపై, శ్రీవాణి టికెట్ల గోల్మాల్పై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? చంద్రబాబు కోరినట్టు బహిరంగ చర్చకు నేను సిద్దమే. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తా.కూటమి దుష్ట పాలనపై పోరాటం ఆపే ప్రసక్తే లేదుచంద్రబాబు దుర్మార్గ, దుష్ట, పాపపు పాలన అంతం చేయడానికి వైయస్సార్సీపీ నిర్వహించిన నిరసనలకు మహిళలు సహా ప్రజలు పోటెత్తారు. పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు మోసపు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. కనీసం 5 వేల మందికిపైగా వైయస్సార్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిన్నపోస్టు పెడితే చాలు పోలీస్ స్టేషన్లు తిప్పిస్తున్నారు. ఇలాంటి వారు వైయస్సార్సీపీ విధ్వంస పాలన అని మాట్లాడటం హేయం. ఎన్ని అణచివేతలకైనా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదు. వెన్నుపోటు పాలనకు చరమ గీతం పాడే వరకు పోరాటం ఆపేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
తాడిపత్రి పీఎస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పీఎస్ వద్ద స్నానం చేస్తూ హైడ్రామా నెలకొల్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛ గా పర్యటించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ,.. ఆ ఆదేశాలు అమలు కాకుండా జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరలేపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని.. కేసులు నమోదు చేయాలని తాను అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారు ప్రభాకర్రెడ్డి. ఆ ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదు చేయాలని తాడిపత్రి పీఎస్ వద్ద ఓవకాక్షన్ చేశారు.. నడిరోడ్డుపై స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. -
పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ
తిరుపతి, జూన్ 12: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ సముద్ర కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర నౌకాశ్రయాలు మంత్రి సర్బానంద సోనోవాల్లకు ఈ అంశమై ఈ రోజు (శుక్రవారం) లేఖలు రాశారు.ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన క్షిపణి/డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం జిల్లాకు చెందిన భారతీయ నావికుడు సురేష్ పట్నాల మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయన కుటుంబానికి అందాల్సిన బీమా, పరిహారం, సంక్షేమ ప్రయోజనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు త్వరగా అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుని భార్య, ఇద్దరు చిన్నారులకు విద్యా సహాయం, ఉపాధి, దీర్ఘకాలిక సంక్షేమ మద్దతు కల్పించాలని సూచించారు.అదే విధంగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఎంవీ పాస్కల్ నౌకలో 13 మంది భారతీయ సిబ్బంది చిక్కుకుపోయారని, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు నావికులు ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కొరతతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికోసం భారత రాయబార కార్యాలయం తక్షణం సంప్రదింపులు జరపాలని, అవసరమైన ఆహారం,నీరు, మందులు ఇతర మానవతా సహాయాన్ని అందించాలని తెలిపారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు పరిస్థితులపై నిరంతర సమాచారం అందించాలనివిదేశాల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. -
‘రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు’
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్. చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ను గద్దెదించి చంద్రబాబు సీఎం పీఠమొక్కారు. వైఎస్సార్ ఆదర్శవంతమైన పాలన అందించారు. వైఎస్ జగన్ ఆచరణలో మంచి పాలన తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు.సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయి.. వైఎస్ జగన్ వైపు చూస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా ఇవాళ నిరసనలు బ్రహ్మాండంగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు వస్తున్నారు. కూటమి సర్కార్ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో నిరసనలను అణచివేయాలని చూశారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
-
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్గా నిరసనలు నిర్వహించారామె. -
రెండేళ్ల బాబు పాలన.. ప్రసంగాలకే పరిమితం!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాఫ్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్రపట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది.స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా, లేకపోయినా హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలలో పర్యటిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లమాదిరి వ్యయం చేస్తుంటారు. పోనీ ప్రసంగాలలో ఏమైనా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయా అంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్సార్ కాంగ్రెస్ను, మాజీ సీఎం జగన్ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తుంటారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్ధులపై బురద జల్లడానికే సరిపోతుంది. అందువల్లే ఆయన ప్రజలలో గౌరవం పెంచుకోలేకపోతున్నారు.మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలలో వైసీపీవారు లేవనెత్తుతున్న అంశాలకు చంద్రబాబు కాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ లెట్ కూడా విడుదల చేశారు. వీటిని వైసీపీ నేతలు చదివి వినిపిస్తున్నారు. గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టారు.12వ తేదీన నియోజకవర్గ కేంద్రాలలో భారీ ర్యాలీలు తీసి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన బాండ్లను దహనం చేయ సంకల్పించారు. ఇది సహజంగానే చంద్రబాబుకు చికాకుగా ఉంటుంది. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది? ఇంకెన్ని నెరవేర్చాలి? అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు? మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్లు చెప్పలేకపోతున్నారు. తాము ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశాం అని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలాకాకుండా సూపర్ సిక్స్ చేసేశాం అని దబాయించితే సరిపోతుందా! వృద్దాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు.వృద్దాప్య పెన్షన్లలో కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది.. ఇది జరిగిపోతుంది అని ప్రజలలో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఆ మద్య పీ-4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కాని జనం దానిని అసలు స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో పీ-4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు మూడువేలు ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలలో ఆగ్రహానికి కారణం అవుతోంది.బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. కాని దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైమ్లో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ రెండేళ్ల కరోనా సంక్షోభ ఉన్నప్పటికీ, ఐదేళ్లలో చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అయితే, రెండేళ్లలోనే అంత చంద్రబాబు సర్కార్ ఎలా చేసిందని ఎవరు అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా?జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీమ్లు అమలు చేస్తామని చెప్పారా? లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేశారట. రెండున్నర లక్షలమంది వలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటువారికి స్థానికంగా ఉపాది కల్పించిన జగనేమో ఏమీ చేయలేదట. వలంటీర్లకు ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తానని హామీ ఇచ్చి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి, ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసి, పవర్ చేతికి వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబు ఏది?వైసీపీవారిపై ఏది పడితే మాట్లాడతారు. గంజాయి బాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తారు. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కాని అన్నదాత సుఖీభవ కింద ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇచ్చారు. అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్లలి పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా?జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో తీసుకువస్తే, వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దానిని కదా విధ్వంసం అనాల్సింది. నాలుగు పోర్టులను జగన్ టైమ్లో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేటురంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దానిని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేడం అనేది. ఆర్టీసీని నీరుకార్చి ప్రైవేటురంగానికి ఆస్తిగా మార్చుతున్నారన్న అభిప్రాయం కార్మికులలో ఏర్పడింది. దానిని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నిటిని ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది.మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించలేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండం అని జనానికి చెబితే ఎలా నమ్మాలి. అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులపై ఆయనే భయపడిపోయి, తాను ఇన్చార్జీగా పెట్టిన వ్యక్తినే మార్చేసుకున్నారే! ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ రెండేళ్లలో కూటమి పాలన గాడితప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజలలోకి వెళతారని, స్వర్ణాంధ్ర కాదు.. విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు.ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం, పర్ధం లేని వాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీల మేరకు ఏమి పూర్తి చేసింది చెబితే ఉపయోగం తప్ప, గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ఈ ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. దగాపడ్డ రైతులు, మహిళలు, పిల్లలు ఇలా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత..
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నేడు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుగుతుండగా.. పెద్దారెడ్డికి పోటీగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ప్రదర్శనకు హాజరయ్యేందుకు బయలుదేరగా ఆయనను తాడిపత్రి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.అయితే, తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ నేతలు, స్థానికులు.. పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. టీడీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
తిరుపతిలో పొలిటికల్ హీట్
సాక్షి, తిరుపతి: నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు" అంటూ వైఎస్సార్సీపీ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అదే సమయంలో.. ఎన్డీయే విజయోత్సవ సభను నిర్వహిస్తుండడం.. దానికి కూటమి పెద్దలు హాజరు అవుతుండడం చర్చకు దారి తీసింది.తిరుపతిలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార ఎన్డీయే కూటమి నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. అదే సమయంలో ఇటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ఏర్పాట్లు చేసింది.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రెస్మీట్లో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ కేడర్కు, ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. అయితే..వైఎస్సార్సీపీ కార్యక్రమాలు జరగనున్న రోజునే తిరుపతి సమీపంలోని దామినీడులో ఎన్డీయే విజయోత్సవ సభ ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు పక్షాలు ఒకేసారి భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. కీలక కూడళ్లు, సభా ప్రాంగణాలు, ర్యాలీ మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
ఓ మై ఘాట్..
రంపచోడవరం: మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే మారేడుమిల్లి – భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణికులకు భద్రత కరవైంది. ఈ రోడ్డులో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉన్నా కనీస రక్షణ చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారులు విఫలమయ్యారు. అనేక సార్లు భారీ వాహనాలు నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వాహనాల్లోనే ప్రయాణికులు గంటలు తరబడి నరకయాతన పడుతున్నారు. ఇటీవల ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా పడి 17 మంది గాయపడ్డారు. ఘాట్ రోడ్డులో భద్రత వైఫల్యాలతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకర మలుపులు మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు పాములేరు నుంచి ప్రారంభమై సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు సుమారు 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మధ్యలో పది వరకు అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇటువంటి ఘాట్ రోడ్డులో ఆర్అండ్బీ అధికారులు నిర్వహణ పనులు, రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టలేదు. ప్రతిపాదించినా.. ఘాట్ రోడ్డు సేప్టీ పనులు కోసం రూ.2 కోట్ల 60 లక్షలతో ప్రతిపాదనలు పెట్టినా, రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ప్రయాణికుల భద్రత చర్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకర మలుపుల్లో రక్షణ కోసం ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలి.కానీ అనేక చోట్ల రక్షణ చర్యలు లేవు. ఇటీవల రోడ్డు భవనాలు భవనాల శాఖ గోతులమాయంగా ఉన్న ఘాట్లో నాలుగు కిలోమీటర్లు మేర కొత్త రోడ్డును నిర్మించింది. పాములేరు నుంచి సింగిల్ రోడ్డు ఉండడంతో అనేక సార్లు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్అండ్బీ శాఖ కిలోమీటరన్నర రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెడితే కేవలం 700 మీటర్ల మేర నిర్మాణానికే నిధులు మంజూరు చేశారు. ప్రమాదాల్లో కొన్ని.. ఘాట్ రోడ్డులో గత ఏడాది యాత్రికుల బస్సు అదుపు తప్పి లోయలో పడి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019 అక్టోబర్ 15న కర్ణాటకకు చెందిన యాత్రికులు వాహనం మలుపు తిప్పుతుండగా లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.రక్షణ చర్యలు తీసుకుంటున్నాం ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. సింగిల్ రోడ్డును డబుల్ చేసేందుకు పనులు మొదలు పెడతాం. ఇటీవల నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. త్వరలో మిగిలిన సింగిల్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటాం. – ప్రదీప్, జేఈ, ఆర్అండ్ బీ అవగాహన లేక.. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొన్నిసార్లు భారీ వాహనాలు వెళ్లిపోతున్నాయి. అటువంటి సందర్భాల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి కొందరు డ్రైవర్లకు ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. – ఐ.శ్రీనివాసరావు, ఎస్ఐ, మారేడుమిల్లి అధికారులు స్పందించాలి ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సేప్టీ చర్యలు తీసుకోవాలి. – బాలు అక్కిస, హ్యూమన్ రైట్ వాచ్ చైర్మన్, రంపచోడవరం -
దేవుడి భూములు రక్షించే దిక్కు లేదు..!
సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణల కట్టడిని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. దేవాలయాల భూముల ఆక్రమణలు, ఇతర వివాదాలు పరిష్కరించే దేవదాయశాఖ ట్రిబ్యునల్కు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చైర్మన్ను కూడా నియమించలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన ట్రిబ్యునల్ చైర్మన్ పదవీ కాలం ముగియక ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 2024 అక్టోబరులో ఆ పదవికి రాజీనామా చేశారు. రిటైర్డు జిల్లా జడ్జి స్థాయికి తక్కువ కాని వ్యక్తులే దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతారు. అయినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి కారణంగానే ఆయన పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు ఉండగా... ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అందులోని 87 వేలకు పైగా ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలో ఉంది. దేవదాయ శాఖ భూ వివాదాలకు సంబంధించి అధికారులు ఆక్రమణల తొలగింపునకు చిన్న చర్య తీసుకోవాలన్నా ట్రిబ్యునల్ ఆదేశాలతోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏ భూ వివాదానికి సంబంధించైనా ముందు ట్రిబ్యునల్ గడప తొక్కకుండా నేరుగా హైకోర్టులో కేసులు ఫైల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవైపు వేల ఎకరాల దేవుడి భూములను ఆక్రమణదారులు కబ్జా చేస్తుండగా.. ప్రభుత్వం ఆక్రమణల కట్టడికి ఆదేశాలు జారీ చేసే ట్రిబ్యునల్ చైర్మన్ స్థానం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వమే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందన్న ఆరోపణలున్నాయి. నాలుగు వేల కేసులు పెండింగ్లోనే.. దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో సుమారు 4 వేల కేసుల విచారణ పెండింగ్లో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్లో దేవుడి భూముల వివాదాలతోపాటు ఆలయాలకు సంబంధించి వంశపారంపర్య ధర్మకర్తల వివాదాలకు సంబంధించిన కేసులు నమోదవ్వగా.. అందులో 95 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్లో సిబ్బందీ కొరతే.. దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఏపీలోని దేవదాయ శాఖ ట్రిబ్యునల్ను విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా విడదీశారు. తెలంగాణ దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో కేవలం 1000 కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ, ఆ రాష్ట్ర ట్రిబ్యునల్లో మొత్తం 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో నాలుగు రెట్లు ఎక్కువగా నాలుగు వేలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నప్పటికీ కేవలం 12 మంది సిబ్బందే పనిచేస్తున్నారని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.వారిలోనూ ఏడుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కావడం గమనార్హం. రాష్ట్ర పరిస్థితులు నేపథ్యంలో వివిధ ప్రాంత కక్షిదారుల సౌకర్యం కోసం ప్రతీ నెలలో కనీసం ఒక్క రోజు చొప్పునైనా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో ప్రాంతీయ కోర్టులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్లో 14 మంది అదనపు సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో దేవుడి భూముల పరిస్థితి ఇదీ మఠాలు : 135 దేవదాయ శాఖ పరిధిలో గుళ్ల సంఖ్య : 26,970 ఆయా ఆలయాలు, గుళ్లు పేరిట ఉన్న దేవదాయ శాఖ భూములు : 4,67,283.28 ఎకరాలు దేవదాయశాఖ అధికారులు లీజుకిచ్చిన భూములు : 1,60,767 ఎకరాలు వివిధ సర్వీసుదారుల ఆదీనంలో ఉన్న భూములు : 1,21,596.04 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాని కొండలు, బంజరు భూములు : 85,200 ఎకరాలు గుళ్లు, ఆ చుట్ట పక్కల భూములు : 4355.29 ఎకరాలు ఆక్రమణలలో ఉన్న భూములు : 87,167 ఎకరాలు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూ సేకరణ జరిగి, అందుకు నిధులు విడుదల కాని భూములు : 8,196.63 ఎకరాలు -
టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఓవరాక్షన్
కడప కార్పొరేషన్: కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలను ఆమె తరచూ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా గురువారం కడప నగరంలోని 47వ డివిజన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటిముందు ఇంటర్ లాకింగ్ టైల్స్ వేసి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.వెంటనే అడిషనల్ కమిషనర్ రాకేష్చంద్ర, టౌన్ ప్లానింగ్ అ«ధికారులు పాత తేదీతో స్థానికులు ఫిర్యాదు చేసినట్టు ఒక పత్రాన్ని సృష్టించి ఆగమేఘాలపై జేసీబీని రప్పించి మాజీ మేయర్ సురేష్ ఇంటిఎదుట ఉన్న ఇంటర్ లాకింగ్ టైల్స్, ర్యాంపును తొలగించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మాజీ కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని వారి వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేసినందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డికి చెందిన షాపుల ఎదుట ఉన్న ర్యాంపులను జేసీబీతో తొలగింపజేశారు. ఇటీవల ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీ ఎదుట కాలువ ఉందన్న నెపంతో కాలేజీ ముందు వైపు ఉన్న తాపలను జేసీబీతో కూల్చివేయించారు. నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిముందు వేసుకున్న టైల్స్, ర్యాంపును తొలగించడం అన్యాయమని మాజీ మేయర్ పాకా సురేష్ సతీమణి రాధిక అన్నారు. చాలా ఏళ్లుగా ఇవి ఉన్నాయని, స్థానికులకుగానీ, ఈ దారి వెంట వెళ్లే వారికిగానీ ఇబ్బంది కలిగించలేదన్నారు. అయినప్పటికీ గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు వచ్చిందంటూ జేసీబీ తెచ్చి కూల్చివేయడం దారుణమన్నారు. -
ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్ కన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూములను అతి చవగ్గా కార్పొరేట్లకు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు వ్యవసాయ విత్తన క్షేత్రాల భూములపై కన్నుపడింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం మహదేవమంగళం గ్రామంలో సుమారు 436 ఎకరాల్లో బహుళ విత్తనోత్పత్తి క్షేత్రం (సీడ్ మల్టీప్లికేషన్ ఫామ్) ఉంది. ఇక్కడ వరి, వేరుశనగ, జొన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు.ఈ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 46.69 ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఫామ్లో పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎలాంటి అనుమతుల్లేకుండా ఫామ్లోని మట్టిని తవ్వి దొడ్డిదారిన అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. -
తొలిరోజే తడ‘బడి’!
సాక్షి, అమరావతి: కానరాని స్టూడెంట్ కిట్లు.. ఊసేలేని ‘తల్లికి వందనం’ దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభం అవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులను చంద్రబాబు సర్కారు కల్పించింది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62 వేల పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులుండగా అదే అంచనాతో ఈ ఏడాది పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గతేడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫారం క్లాత్ను కొన్ని మండలాల్లో సర్దుబాటు చేశారు. తొలిరోజే ఇస్తామని గొప్పలు చెప్పి... జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు కిట్లను అందిస్తామని గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమవల్ల కాదని ప్రకటించింది. గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ లాంటి ముడి పదార్థాల కొరతను సాకుగా చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జగనన్న విద్యా కానుక’ పేరును మార్చేసి మొదటి ఏడాది (2024 జూన్) వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లను ఇచ్చింది. 2025 వచ్చేసరికి ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేయడంతో ఈ ఏడాది కిట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. తమకు రెండేళ్లకు సంబంధించి రూ.1372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. ఇక 2026–27 విద్యా సంవత్సరంలో 35 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని అంచనాలు రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిల్లిమొగ్గలు వేయడంతో పాటు ఇంటర్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీకేజీ స్కామ్కు కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ వీజీఎస్కు భారీగా కాంట్రాక్టు కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్ పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాలకు పుస్తకాలు చేరలేదు. గతేడాది మిగిలిపోయినవే దిక్కు.. – సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లో 1,40,012 యూనిఫారాలు అవసరమైతే 20,618 మాత్రమే అందించారు. కుప్పం, శాంతిపురం మండలాలకు సరఫరా చేశారు. షూలు, బ్యాగులు లేవు. 80 వేల మందికి నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 70 వేల మందికి మాత్రమే వచ్చాయి. పాఠ్యపుస్తకాలు సైతం 10 శాతం పెండింగ్. వర్క్బుక్స్ ఒక్కటీ రాలేదు. – విజయనగరం జిల్లాలో 27 మండలాలు ఉండగా ఆరు మండలాలకు పాత యూనిఫారం ఇచ్చారు. పుస్తకాలు 11 మండలాలకు పుస్తకాలు రాలేదు. పాత బూట్లు కొన్ని మండలాలకు సర్దుబాటు చేశారు. – ఎన్టీఆర్ జిల్లాలో కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూళ్లకు చేరాయి. – కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. యూనిఫామ్ 4 మండలాలకు, నోట్ బుక్స్ 9 మండలాలకు, పిక్టోరియల్ డిక్షనరీలు 8 మండలాలకు మాత్రమే వచ్చాయి. – పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని టైటిల్స్ కలిపి 4.80 లక్షల పుస్తకాలు అవసరముంటే 4 లక్షలు మాత్రమే అందించారు, వర్కుబుక్స్ మాత్రం అందలేదు. బ్యాగులు, బెల్టులు, బూట్లు లేనేలేవు. – కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాలకు యూనిఫారం లేదు, 1.20 లక్షల మంది విద్యార్థులకు బూట్లు ఆర్డర్ పెట్టగా, 25 వేల మందికి 8 మండలాల్లో పాక్షికంగా సరఫరా చేశారు. బెల్టులు కూడా 10 శాతం సరఫరా చేశారు. జగన్ ప్రభుత్వంలో చదువులకు భరోసా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ఏటా స్కూళ్లు తెరిచిన మొదటి రోజే టంచన్గా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లి‹Ù–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ను మొదటి రోజే విద్యార్థుల చేతికందేది. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమచేసి పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచారు. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం’ అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగరగొట్టారు. -
62 ఏళ్లు.. 517 రకాల వంగడాలు
సాక్షి, అమరావతి: దేశంలో పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శుక్రవారం 62 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో వర్సిటీ ఎన్నో విజయాలు సాధించింది. మొత్తం 517 రకాల వంగడాలను రూపొందించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త రకాల వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాల అభివృద్ధి మాత్రమే కాదు సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి సాగులో ఈ వర్సిటీ రూపొందించిన రకాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆరు కళాశాలలు, 41 పరిశోధన కేంద్రాలతో 1964లో ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తరువాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 కళాశాలలు, 33 పరిశోధన కేంద్రాలు, 27 విస్తరణ విభాగాలతో సేవలందిస్తున్న ఈ వర్సిటీలో 973 మంది అధ్యాపకులున్నారు. ఇప్పటివరకు 36,664 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 11,668 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు కలిపి 48,332 మంది పట్టభద్రులను తయారు చేసింది. ఏటా బ్యాచిలర్ కోర్సుల్లో 2 వేలమంది, పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో 33 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు. వరిలోనే 136 రకాల అభివృద్ధి ఇప్పటివరకు వర్సిటీ 225 ధాన్యాలు, 87 పప్పు ధాన్యాలు, 56 నూనెగింజలు, 92 వాణిజ్య పంటలు, 57 పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాల పంటలకు చెందిన విత్తనాలను అభివృద్ధి చేసింది. ధాన్యాల్లో ఒక్క వరిలోనే 136 రకాలను అభివృద్ధి చేశారు. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబామసూరి), కాటన్ దొర సన్నాలు వంటి వరిరకాలు జాతీయస్థాయిలో విశేష ప్రజాదరణ పొందాయి. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణంలో 88 శాతం ఈ రకాలే సాగవుతున్నాయి. వేరుశనగలో కే–6, నారాయణి, లేపాక్షి వంటి రకాలు ఈ వర్సిటీ అభివృద్ధి చేసినవే. రాష్ట్రంలో వేరుశనగ సాగు విస్తీర్ణంలో 90 శాతం కే–6 రకమే సాగవుతోంది. బయో పోర్టిఫైడ్ సజ్జ రకం ఏబీవీ 04, పోర్టిఫైడ్ రాగి రకాలు వేగావతి (వీఆర్ 929), ఇంద్రావతి (వీఆర్ 1101) రకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే మొట్టమొదటి బూజుతెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య) ఈ వర్సిటీ అభివృద్ధి చేసిందే. ప్రభుత్వరంగంలో మొదటిసారిగా బీటీ పత్తి రకమైన లాం బీజీ టూ–2208 (ఆదిత్య బీజీ–2) రకాన్ని ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి.దేశంలోని 46 మిలియన్ హెక్టార్ల వరి సాగువిస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ఈ వర్సిటీ రూపొందించిన రకాలే సాగవుతున్నాయంటే ఈ వంగడాలు ఏ స్థాయిలో రైతులకు చేరువయ్యాయో అర్థమవుతుంది. జాతీయస్థాయి వరి ఉత్పత్తి 131 మిలియన్ టన్నుల్లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రూపొందించిన రకాలే కావడం గమనార్హం. ఆంధ్రలో వరిసాగు విస్తీర్ణంలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో ఈ వరి రకాలే సాగవుతున్నాయి. ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా దేశం ఏటా సగటున రూ.8 వేలకోట్ల నుంచి రూ.10 వేలకోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఆ ఐదేళ్లూ సువర్ణయుగమే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామస్థాయిలో ఏర్పాటైన రైతు సేవాకేంద్రాలు వ్యవసాయ పరిశోధన ఫలాలను రైతులకు చేరువచేయడంలో వర్సిటీకి, అన్నదాతలకు మధ్య వారధిగా పనిచేశాయి. జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో వర్సిటీ అన్ని రంగాల్లోను అగ్రగామిగా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన భవనాలు సమకూర్చడంతో విస్తృత పరిశోధనలతో దూసుకెళ్లింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదించిన డ్రోన్ శిక్షణ కేంద్రాన్ని గుంటూరు లాంలోని అప్సరా సెంటర్లో ప్రారంభించారు. పురుగు, తెగులుమందుల పిచికారికి ఆంగ్రూ పుష్పక్–1, విత్తనాలు, ఎరువులు చల్లేందుకు పుష్పక్–2 డ్రోన్లను అభివృద్ధి చేశారు. 10 పంటల్లో పిచకారీ చేసి సత్ఫలితాలను సాధించారు. జాతీయస్థాయిలో డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం డీజీసీఏ సర్టిఫికేషన్ పొందిన తొలి వర్సిటీగా ఆంగ్రూ నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు 534 మంది డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చారు. 2021లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పాలసీ రీసెర్చ్ను ఏర్పాటు చేసి డేటా ఆధారిత విశ్లేషణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐసీఏఆర్ ర్యాంకింగ్స్లో 2022–23లో జాతీయస్థాయిలో వర్సిటీ ఏడోస్థానంలో, పీజీ అడ్మిషన్లలో రెండోస్థానంలో నిలిచింది. అన్ని ఇన్స్టిట్యూట్లలో 11వ స్థానం సాధించింది. అగ్రిప్రెన్యూర్షిప్ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్ ప్రోగ్రాం (సంకల్ప–2021)లో 55 ఇంక్యుబేట్లు ఎంపికయ్యాయి. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) అభివృద్ధి చేసిన మల్టీటాస్క్ టూల్బార్, నాప్సాక్ వీడర్ను వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపికచేశారు. ఆ ఐదేళ్లు అవార్డులకు కొదవే లేదు. 2020లో రెండో అత్యధిక సంఖ్యలో ఐసీఏఆర్ పీజీ స్కాలర్íÙప్లు పొందిన వర్సిటీగా జాతీయ అవార్డు లభించింది. గిరిజన వ్యవసాయ వ్యవస్థల్లో అత్యుత్తమ పరిశోధన కోసం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అవార్డు–2020 వరించింది. వర్సిటీకి వ్యవసాయ పరిశోధన, విద్యారంగ కేటగిరిలో 2022లో స్కాచ్ సిల్వర్,, స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్ తదితర అవార్డులెన్నో దక్కాయి. 2023–24లో ఏ కేటగిరిలో లాంలోని ఆర్ఏఆర్ఎస్కు, బీ కేటగీరిలో రాగోలులోని ఏఆర్ఎస్కు ఉత్తమ పరిశోధన కేంద్రం అవార్డు, కేవీకే కొండెంపూడిలోని కేవీకేకి ఉత్తమ కేవీకే అవార్డు, ఏలూరులోని డీఏఏటీటీసీకి ఉత్తమ డాట్ సెంటర్ అవార్డు లభించాయి. డయోబ్లైట్ స్మార్ట్ రైస్కుక్కర్, పాలిమర్ పుల్లీ డ్రివైన్ సెంట్రిప్యూగల్ పంప్ వంటి ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు లభించాయి. అలాంటి యూనివర్సిటీ 2024–25లో వ్యవసాయ వర్సిటీల్లో 26వ స్థానానికి, ఓవరాల్గా 151వ స్థానానికి దిగజారిపోయింది. నేడు 63వ వ్యవస్థాపక దినోత్సవం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం యూనివర్సిటీలోని కృష్ణ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు విశిష్ట అతిధిగా పాల్గొనే ఈ వేడుకలో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, రైతులకు దాతృత్వనిధి పురస్కారాలు అందించనున్నారు. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వర్సిటీ నిరంతరం కృషిచేస్తోందని వీసీ డాక్టర్ పి.వి.సత్యనారాయణ తెలిపారు. విద్య, పరిశోధన, విస్తరణ సేవలను సమన్వయపర్చుకుంటూ, వర్సిటీ ఘన చరిత్రను స్మరించుకుంటూ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
భారత్ – ఎ జట్టులో రషీద్కు చోటు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీ మెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి శ్రీలంకలో జరగనున్న టోరీ్నలో భారత్– ఏ జట్టు తరఫున రషీద్ ఆడనున్నారన్నారు.గతంలో రషీద్ భారత అండర్– 19 వరల్డ్ కప్ పోటీల్లో వైస్ కెపె్టన్గా వ్యవహరించడమే కాకుండా, వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది రంజీ మ్యాచ్ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించాడు. రషీద్కు త్రీమెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్బాబు, టీవీ శివరామకృష్ణ, సీహెచ్ నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
వర్సిటీ కొలువుల భర్తీలో గందరగోళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) భర్తీ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. ఆన్లైన్ దరఖాస్తు విధానంలో నెలకొన్న సాంకేతిక సమస్యలు, అస్పష్టమైన నిబంధనలు దశాబ్దాల అనుభవం ఉన్న బోధనా సిబ్బందిని, పీజీ, పీహెచ్డీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక అప్లికేషన్ను పూర్తి చేయడానికి అభ్యర్థులు గంటల తరబడి కంప్యూటర్ల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కటే దరఖాస్తు.. అంతుచిక్కని ప్రశ్నలు ఒక విశ్వవిద్యాలయంలోని బ్యాక్లాగ్, రెగ్యులర్, రిజర్వేషన్ కేటగిరీ పోస్టులకు విడివిడిగా కాకుండా.. అన్నింటికీ కలిపి ఒకే అప్లికేషన్గా పరిగణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థి దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే ఫారంలో ఎక్కడా ఏ నోటిఫికేషన్ ప్రకారం, ఏ కేటగిరీ పోస్టుకు దరఖాస్తు చేశారనే స్పష్టత లేదు. బ్యాక్లాగ్ అసిస్టెంట్ పోస్టులకు 12 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు) ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తాము అసలు బ్యాక్లాగ్ పోస్టుకే దరఖాస్తు చేశామా లేదా అనేది తెలుసుకునే మార్గం లేకపోవడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. యూజీసీ నిబంధనలకు పాతర? నియామకాల్లో యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కారనే విమర్శలు విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. పరిశోధన పత్రాల వివరాల్లో ‘యూజీసీ అప్రూవ్డ్ జర్నల్స్’ ఆప్షన్ను తొలగించి, కేవలం ’పీర్ రివ్యూడ్’ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. తమకు కావలసిన వారికి అక్రమంగా లబ్ధి చేకూర్చేందుకే ఈ విధమైన కుట్రకు తెరలేపారనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 15ను చివరి తేదీగా నిర్ణయించగా, హార్డ్ కాపీలను వర్సిటీలకు పంపేందుకు ఈ నెల 22 వరకు గడువుపొడిగించారు. ఆర్జీయూకేటీలో వింత పరిస్థితి రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో దరఖాస్తుల పరిశీలన వ్యవహారం మరీ విచిత్రంగా తయారైంది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అభ్యర్థుల డేటా నమోదు ప్రక్రియను తీవ్ర నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పంపిన దరఖాస్తుల ఫిజికల్ కాపీలను కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డిప్లొమో అర్హత గల ల్యాబ్ స్టాఫ్తో కంప్యూటర్లలో నమోదు చేయిస్తున్నారు. పీజీ, పీహెచ్డీ చేసిన ఉన్నత విద్యావంతుల దరఖాస్తులను డిప్లొమా సిబ్బందితో ప్రాసెస్ చేయించడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. నోడల్ ఆఫీసర్ నియామకంలోనూ వివాదాలు ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు వర్సిటీ నియామక నోడల్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. త్వరలో చేపట్టే అసోసియేట్ ప్రొఫెసర్ల ఎంపికలో ఈయనే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు దక్కించుకునేలా లబ్ధి చేకూర్చేందుకు, ఈ నోటిఫికేషన్లో ఒక్క రెగ్యులర్ అసిస్టెంట్, ప్రొఫెసర్ పోస్టు కూడా లేకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
వినుకొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై పెట్రోల్ పోసి ఓ భర్త నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన కొండి ఆంజనేయులు చెడు వ్యసనాలకు బానిసై తరచూ భార్య సుబ్బులును వేధిస్తున్నాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆంజనేయులు గురువారం ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో సుబ్బులు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బులును వినుకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్లే కనిపిస్తాయి...!– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్మాల్తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్లు, అవకతవకలు చూస్తున్నాం. పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.స్కామ్ల కంపు కనిపించడం లేదా? ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్ల కంపు కనిపించడం లేదా? ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్లు పంపారు. ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్లోకి వస్తారా? లేక రిజర్వేషన్లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? -
పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ–2025లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ, క్రీడా శాఖల మంత్రులు అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తప్పుకున్నారు. దగా డీఎస్సీపై గత 20 రోజులుగా ఆధారాలతో సహా వస్తున్న వరుస కథనాలపై నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం సంయుక్తంగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. నిజానికి స్పోర్ట్స్ డీఎస్సీలో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, పోటీల్లో పాల్గొన్న వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం నిర్ణయం మేరకు జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డీఎస్సీ లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నియామక ప్రక్రియ ముగిశాక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని జీవో ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఆ మేరకు తాము పని చేశామని వివరణ ఇచ్చారు. కీలక ఆరోపణలపై సమాధానం దాటవేత కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు సమాధానం దాటవేశారు. నవీన్ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి నవీన్కు కాల్ లెటర్ రాకుండా అతడి లాగిన్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేసింది. కాల్ లెటర్ లేకుండా ఎలా హాజరు కాగలడన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. డీఎస్సీ కన్వీనర్ను తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ను నియమించడం, ప్రశ్నావళిని రూపొందించే వారికే పగ్గాలు అప్పగించడాన్ని కూడా అధికారులు సమర్థించుకున్నారు. ఈ రెండు విభాగాలు విద్యా శాఖలోనే ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వ పాలసీ మేరకు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిందని మరోమారు వెల్లడించారు. పరీక్ష లేకుండా పోస్టు.. ప్రభుత్వ పాలసీ స్పోర్ట్స్ డీఎస్సీలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా, అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు ఐదేళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీగా చెప్పడం గమనార్హం. తమిళనాడులో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తున్నారని, స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇచ్చేందుకు అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. మళ్లీ క్రీడా పాలసీ జీవో మార్చి.. ఇకపై పరీక్షలు ఉంటాయని ఎందుకు పెట్టారన్న అంశంపైనా సరైన సమాధానం రాలేదు. అది ప్రభుత్వ పాలసీ అని, తామేమీ చేయలేమన్నారు. అంతా పారదర్శకంగానే చేశామంటూ.. 1:1 నిష్పత్తి డైనమిక్ థింగ్ అని చెప్పుకొచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లు పరిశీలించిన తర్వాతే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపినప్పుడు.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అధికారులు చెప్పడం చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే అక్రమాలను దాస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. వాస్తవానికి మెరిట్లో ఉండి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో మొదటి విడత సర్టిఫికెట్ పరిశీలనకు తొలిరోజు హాజరైన వారే అధికంగా ఉన్నారు. వారంతా రిజర్వేషన్ పరిధిలో ఉన్నప్పటికీ, లేరని చెప్పడం విస్తుగొల్పుతోంది. -
కుక్క దొరికింది.. చిన్నారి ఏమైందో..?
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఆరు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు భవాని, గణేష్ తోపాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ చిన్నారితోపాటు అదృశ్యమై మూడు రోజుల అనంతరం మంగళవారం ప్రత్యక్షమై, మళ్లీ పరారైన పెంపుడు కుక్క బుధవారం అర్ధరాత్రి ఎట్టకేలకు డాగ్ క్యాచర్ బృందానికి చిక్కింది. దీంతో కీలక ఆధారం లభించిందని పోలీసులు భావించారు.ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి... దానిని వదిలిపెడితే.. అది సంచరించే మార్గంలో పోలీసులు గాలించి చిన్నారి ఆచూకీ కనిపెట్టాలని భావించారు. అయితే, ట్రాకర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం అది సాధ్యం కాలేదు. ఆ కుక్కను రోజంతా గణేష్ ఇంటి ముందర మామిడి చెట్టు వద్ద కట్టి, పోలీసుల సంరక్షణలో ఉంచారు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటున్న ఆ కుక్క అప్పుడప్పుడు సమీపంలోని వ్యక్తులపై దాడికి యత్నిస్తోంది.పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, యాంటీ నక్సల్ స్క్వాడ్స్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచి, డ్రోన్తో జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్లు సేకరించి పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ఇంటింటా ఎన్యూమరేషన్ చేశారు. కొండ ప్రాంతంలో చిన్నారి లేకపోవచ్చని, కిడ్నాప్ లేదా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. జ్ఞానేశ్వరి ఆరు రోజులుగా ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందోనని కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. -
‘అగ్రి డిస్కం’కు కొత్త చిక్కులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్(ఏపీఆర్ఏపీఎల్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సౌర విద్యుత్ను వ్యవసాయ అవసరాలకు అందించడం కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ఏపీఆర్ఏపీఎల్ మే 25న దరఖాస్తు చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు, రైతులు, సంస్థలు అభ్యంతరాలు లేదా సూచనలను జూన్ 11లోపు పంపించాలని ఏపీఈఆర్సీ సూచించింది. అయితే ఈ గడువు సరిపోదని, అగ్రి డిస్కంపై అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని, గడువు పెంచాల్సిందిగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు యూనియన్లు ఏపీఈఆర్సీని అభ్యర్థించాయి. దీంతో ఈ నెల 22 వరకూ గడువు పొడిగించడంతో పాటు ఏపీఆర్ఏపీఎల్ బదులిచ్చేందుకు ఈ నెల 30 వరకూ అవకాశం కల్పిస్తూ ఏపీఈఆర్సీ గురువారం ఆదేశాలు జారీ చేసింది.నిర్ణయానికి ముందు అందరినీ సంప్రదించాలి..ఈ కొత్త డిస్కం ఏర్పాటుతో పాటు దానితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అదే విధంగా వ్యవసాయ ఫీడర్లకు సంబంధించిన 11 కేవీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజ్ లైన్లను దశల వారీగా కొత్త డిస్కంకు బదిలీ చేసేందుకు ఏప్రిల్ 20న ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఆర్ఏపీఎల్ ఏప్రిల్ 27న రాష్ట్రంలోని మూడు డిస్కంలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏపీఆర్ఏపీఎల్కు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీకి లిఖిత పూర్వకంగా ఓ లేఖ కూడా రాశాయి. ఉద్యోగ సంఘాలు చెబుతున్నదాని ప్రకారం.. ఈ ప్రతిపాదన అమలైతే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ వినియోగదారులకు సేవలందిస్తున్న ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్పై ప్రభావం పడుతుంది. వ్యవసాయ విద్యుత్ పంపిణీని వేరే సంస్థకు బదిలీ చేయడం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. అలాగే కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ముందుగా సిబ్బంది పునర్విభజన, బదిలీలు, పదోన్నతులు, వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని, నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగులు, రైతులు, వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. -
30 ఏళ్లకు లీజు.. ఏడాదికి రూ.31 వేల ఫీజు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లాలోని వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకుగానూ కూటమి ప్రభుత్వం గురువారం ఒక్కరోజే నాలుగు జీవోలను జారీ చేసింది. ఈ జిల్లాలో మొత్తం 283.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సంస్థలకు 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. బి.మఠం మండలంలోని పలుగురాళ్లపల్లి, పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో 176.33 ఎకరాలు, పలుగురాళ్లపల్లిలో మరో 9.25 ఎకరాలు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కేటాయించింది. అలాగే, తొండూరు మండలంలోని మల్లెల, తొండూరు, బుచ్చుపల్లి గ్రామాల్లో 70.04 ఎకరాలు అంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు 126 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించింది. ముద్దనూరు మండలం కొలవలి గ్రామంలో మరో 27.77 ఎకరాలు అంప్లస్ ఎవరెస్ట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ నాలుగు చోట్లా ఎకరాకు ఏడాదికి లీజు రుసుంను కేవలం రూ.31 వేలుగా నిర్ణయించింది. ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంపు ఉంటుందని పేర్కొంది. గరిష్టంగా 30 ఏళ్లపాటు ఈ భూములు ఆయా కంపెనీల ఆ«దీనంలో ఉండనున్నాయి. భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉండగా, స్వల్ప లీజు రుసుముతో దీర్ఘకాలికంగా అప్పగించడం గమనార్హం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయి? ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రికార్డు అంటే మాదే..
సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు.ఒకే నోటిఫికేషన్ ద్వారా..2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.మే 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై దుమ్మెత్తి పోశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆందోళనల్లో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నామని, పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ప్లకార్డులతో ఎత్తి చూపుతామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని గుర్తు చేశారు. ‘నిరుద్యోగ యువతకు నెల నెలా రూ.3 వేలు ఇస్తామన్నారు. రూ.3 వేల మాట దేవుడెరుగు.. వాళ్లకు హక్కు(రైట్పుల్)గా రావాల్సిన ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా లాక్కొని స్కామ్లు చేశారు.అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పక్కన పడేశారు. బాబు పాలనలో రైతులు అన్ని విధాలుగా అధోగతి పాలయ్యారు. మహిళలు నాశనమైపోయారు. యువత ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. దగా పడ్డ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో, ఎన్నికల్లో వారిచ్చిన బాండ్లతో పాటు డీఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్లను ప్రదర్శిస్తూ ప్రజలకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో తలపెట్టిన ఈ నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. -
268 టన్నుల ఇనుమును కొట్టేశారు
ప్రొద్దుటూరు: హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన రూ.2 కోట్ల విలువైన 268 టన్నుల ఇనుప కడ్డీల మాయం వెనుకప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి హస్తం ఉందని, ఆయన నిర్మిస్తున్న సన్ రైజ్ కౌంటీ అపార్ట్మెంట్కు ఈ కడ్డీలే వినియోగించారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఇనుప కడ్డీలు మాయమైతే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోయాయంటూ వరదరాజులరెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.2025 సెప్టెంబర్ 4వ తేదీ వరకు మార్కెట్యార్డు గోడౌన్లో కడ్డీలు ఉన్నాయని, ఆ తర్వాత మాయమయ్యాయని స్వయంగా హౌసింగ్ పీడీ రాజారత్నం ప్రకటించిన వీడియోను రాచమల్లు చూపించారు. ‘గత నెల 14వ తేదీన పీడీ గోడౌన్ను సందర్శించిన అనంతరం ఏఈ సుబ్రహ్మణ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, 28న కేసు నమోదు కావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ దొంగతనం జరిగిందని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాల్సిన టన్నుల కడ్డీలు మాయమైతే పోలీసులు ఎందుకు విచారణ జరపడం లేదు? కేవలం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒత్తిడి కారణంగానే కేసు ముందుకు సాగడం లేదు. సస్పెండ్ అయిన ఏఈ సుబ్రహ్మణ్యంను విచారిస్తే ఒక్క రోజులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మార్కెట్ యార్డు గోడౌన్కు ఇన్చార్జ్ ఉన్నారు. లోపల, బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు పెట్టుకుని కేసు విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇప్పటికైనా పోలీసులు విచారించి ఈ దోపిడీ విషయాన్ని తేల్చాలి. దోషులపై చర్యలు తీసుకోకపోతే త్వరలో శివాలయం వద్ద నడిబొడ్డున రిలే నిరాహార దీక్ష చేపడుతా’ అని రాచమల్లు హెచ్చరించారు. ‘తనను గెలిపిస్తే పీఎంఎఫ్ను తెరిపిస్తానని, మెడికల్ కాలేజీని తీసుకొస్తానని, వరద కాలువను నిర్మిస్తానని, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని ఎమ్మెల్యే చెప్పిన మాటలు డొల్ల అని అందరికీ అర్థమైంది. క్రికెట్ బుకీలంతా ఎమ్మెల్యే పంచనే ఉన్నారు. అండర్ డ్రైనేజీ కాలువను నిర్మించలేదు. వర్షాలు వచ్చినప్పుడు కాలువను తలదన్నేలా రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. విచ్చల విడిగా ఇసుకను అమ్ముకుంటున్నారు. బెల్టు షాపులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు’ అని రాచమల్లు ధ్వజమెత్తారు. -
వచ్చే ఐదు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోయే ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కొవ్వూరులో అత్యధిక ఉష్ణోగ్రతఇదిలా ఉండగా గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కోనసీమ జిల్లా శివలలో 43.3, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతంమరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5.7 సెంటీ మీటర్లు, ఏలూరు జిల్లాలో 3.7 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లాలో 3.49 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 3.2, గుంటూరు జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్లోడ్లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి ప్రమాదం!
విశాఖ స్టీల్ ప్లాంట్లోని ఎస్ఎంఎస్-1 విభాగంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రావణం కింద పడటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్లాంట్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గురువారం ఉదయం ఒకసారి, అర్ధరాత్రి మరోసారి ఎస్ఎంఎస్-1లో వేర్వేరు ప్రమాదాలు సంభవించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ తాజా ఘటనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టకుండా పనులు ప్రారంభించడమే ఈ పరిస్థితికి కారణమని కార్మికులు ఆరోపించారు.స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని.. కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, భద్రతా చర్యలను పటిష్టం చేయకుండా ఉత్పత్తిపైనే దృష్టి పెట్టడం సరికాదని వారు విమర్శించారు. కార్మికుల ప్రాణాల కంటే ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.ఎస్ఎంఎస్-1లో పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేసిన తర్వాతే పనులు పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.బిగ్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ SMS- 1లో మరోసారి ప్రమాదంల్యాడీల్ నుంచి మరోసారి కిందపడిన ఉక్కు ద్రావణంSMS- 1లో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకుండానే ప్రారంభించిన పనులుగురువారం ఉదయం, అర్ధరాత్రి SMS- 1లో వేరువేరుగా సంభవించిన ప్రమాదాలు. యాజమాన్యం తీరుపై… pic.twitter.com/98s1Cs5LTT— Telugu Feed (@Telugufeedsite) June 11, 2026 -
భారత షిఫ్పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్కు చెందిన షిప్పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
డీఎస్సీలో ఆరోపణలపై బాబు సర్కార్ పలాయనం
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్మీట్ పెట్టించారు. అయితే, నవీన్కి మొదటి ర్యాంక్పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు. -
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
-
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాని పరిస్థితి ఏర్పడింది. జూన్ 12న పథకం అమలు జరగదని స్పష్టమైంది. రెండో ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేశారు. ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే స్కూల్ తెరిచేనాటికి ప్రతిఏటా తల్లికివందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి రూ.17వేలు ఎగనామం పెట్టింది.రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఏడాది తల్లికి వందనంపై చంద్రబాబు సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు జమచేస్తారో ప్రకటించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఏడాది తల్లికి వందనంలో 20లక్షలమంది విద్యార్థులకు కోత విధించింది. రూ.260 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంతమందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎప్పుడిస్తారో బాబు సర్కార్ చెప్పలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. -
అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం రేపుతోంది. సిద్ధేశ్వరి జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తానని చెప్పిన నగల దుకాణం నిర్వహకుడు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.కష్టపడి కూడబెట్టిన సొమ్మును సంస్థలో పెట్టుబడిగా పెట్టామని.. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేసి, బంగారం ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. పూర్తి స్థాయిలో బంగారం తిరిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని బాధితులు తేల్చి చెప్పారు. -
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖ : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
ఏపీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై ఏపీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సుమోటో కేసుగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. గాయపడినవారి ఆరోగ్య స్థితి, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వివరాలు అందించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతున్న పైడిరాజు నిన్న (బుధవారం) ఉదయం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో గత సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. కాగా, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించలేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
అరెస్ట్ వార్తలు ఎల్లో మీడియా ప్రచారం మాత్రమే: కారుమూరి
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలపై తాజాగా కారుమూరి స్పందిస్తూ.. నేను అరెస్ట్ అంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఇదంతా ఫేక్. నేను ప్రస్తుతం తణుకులో ఉన్నాను’ అని స్పష్టం చేశారు. -
వెన్నుపోటుకు రెండేళ్లు.. రేపు వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతామన్నారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
బాబూ జాగ్రత్త.. కాక్రోచ్లు బయటకొస్తాయి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమేనని.. ఇప్పుడు డీఎస్సీ విషయంలోనూ అదే జరిగిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గతంలో బాబు హయాంలో జరిగిన పేపర్ లీకేజీల చిట్టాను చదివి వినిపించిన వైఎస్ జగన్.. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబుగారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్. 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్. 2019లో టెన్త్ పేపర్ లీక్. 2025లో బీఈడీ పేపర్ లీక్, 2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది. ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది. అందుకే ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుగారూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది జెన్జీ కాలం. ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా నడుస్తోంది. దేన్నీ ఆపలేరు. మీరు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది. దగాపడ్డ యువత మిమ్మల్ని విడిచిపెట్టదు. తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి. జాగ్రత్త..! ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్ర్రబాబు ముందుకు రాడు. సరికదా.. ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘వారంరోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని.. ఒకవేళ అప్పటికీ కాకపోతే.. మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని హామీ ఇచ్చా’’ అని వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు. -
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
మార్కాపురం: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అతికిరాతకంగా నరికి చంపిన సంఘటన మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్విరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గిద్దలూరుకు చెందిన పెయింటర్ పన్నీటి దావీదుకు సర్విరెడ్డిపల్లెకు చెందిన చిన్నప్ప కుమార్తె జ్యోతితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్ల క్రితం జ్యోతి పుట్టింటికి వచ్చింది. డ్వాక్రా వీఓఏగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. దావీదు నెలలో ఒకటి రెండుసార్లు సర్విరెడ్డిపల్లె వచ్చి పిల్లలను చూసుకుని వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే జ్యోతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో చుట్టుపక్కల ప్రాంతంలో దాక్కుని ఉన్న దావీదు సంచిలో తెచ్చుకున్న గొడ్డలి తీసి భార్యను నరికేందుకు ప్రయతి్నంచాడు. జ్యోతి సోదరి గొడ్డలి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పక్కకు నెట్టేసి జ్యోతి తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు సీఐ రామకోటయ్య పరిశీలించారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
హరిణి మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది?
శ్రీకాకుళం: లింగాలవలస పంచాయతీ సోర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి(24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసుల సమాచారం మేరకు.. దుంపల హరిణికి తన మేనమామ వెంకటేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. హరిణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. అక్కడ మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులకు, హరిణికి మధ్య గొడవలు జరిగాయి. అయినప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బంధువులు హరిణిని గ్రామానికి రప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో ఈ నెల 1న రాత్రి హరిణి ఆత్మహత్యకు పాల్పడిందంటూ 2వ తేదీ వేకువజామునే రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, హరిణికి కోచింగ్లో పరిచయమైన వ్యక్తి సమాచారం తెలుసుకుని శక్తి టీమ్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలు సేకరించారు. వీఆర్వో రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
-
ఏమైపోయావ్ చిట్టితల్లీ!
తుని రూరల్: మండలంలోని చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఐదు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. రోజులు గడుస్తున్నా.. డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న తమ ముద్దులపట్టి జాడ చిక్కకపోవడంతో తల్లిదండ్రులు భవాని, గణేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి కోసం అతడు కాపలా ఉన్న మామిడి తోటకు గత శనివారం బయల్దేరిన జాహ్నవి మధ్యలో దారి తప్పిపోయి అదృశ్యమైపోయింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో వెళుతున్న జ్ఞానేశ్వరిని, వారి పెంపుడు కుక్కను అదే గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి చూశాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు అతడు ప్రయత్నించగా.. పెంపుడు కుక్క దాడికి యత్నించింది. దీంతో, అతడు ఆ బాలికను, కుక్కను వదిలేసి గ్రామానికి చేరుకుని, తల్లి భవానీకి విషయం చెప్పాడు. కుమార్తెను తీసుకువచ్చేందుకు తల్లి వెళ్లగా అక్కడ జ్ఞానేశ్వరి కనిపించలేదు. ఈ విషయాన్ని భర్త గణేష్కు ఆమె చెప్పింది. వారి ద్వారా విషయం తెలియడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారి వెళ్లిన దారి వెంబడి, కొండ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకపోవడంతో తుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్తులు కలసి బృందాలుగా కొండ ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి వరకూ.. ఆది, సోమ, మంగళ, బుధవారాలు గాలించినా బాలిక, పెంపుడు కుక్క ఆచూకీ తెలియరాలేదు. డ్రోన్, డాగ్ స్క్వాడ్ సాయంతో కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. సమీప గ్రామాల్లోను తుని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించినా ఎటువంటి ఫలితం లేదు. దీంతో, జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. బాలిక ఆచూకీ లేదా సమాచారం తెలిసిన వారు తుని రూరల్ ఎస్సై 94407 96573, రూరల్ సీఐ 94407 96531, పెద్దాపురం డీఎస్పీ 94407 96508 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. ఇది కూడా ఇప్పటి వరకూ ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఇంటికి చేరింది. జ్ఞానేశ్వరి తల్లి భవానీ వ్రస్తాన్ని నోటితో పట్టుకుంది. దీంతో, బాలిక ఆచూకీ తెలుస్తుందేమోననే ఆశ చిగురించింది. కానీ, అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు సమీపించడంతో భయంతో ఆ కుక్క స్థానికులపై దాడి చేస్తూ మళ్లీ ఆయిల్పామ్ తోటలోకి పరుగు తీసి, తప్పించుకుని కొండ పైకి పారిపోయింది. అణువణువూ జల్లెడ పట్టినా.. ఐదో రోజైన బుధవారం పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యాన తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐల పర్యవేక్షణలో డివిజన్లో పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర బృందాలు గ్రామ సమీపంలోని వివిధ తోటలను, గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని ముమ్మరంగా జల్లెడ పట్టారు. సీసీ ఫుటేజ్లు మరోసారి పరిశీలించారు. డ్రోన్, డాగ్ స్క్వాడ్తో గాలింపును, గ్రామంలో ఎన్యూమరేషన్ సెర్చింగ్ కొనసాగించారు. పంట పొలాల్లోని బావులు, కుంటలు, బోరు బావుల వద్ద జల్లెడ పట్టారు. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా చేతికి జ్ఞానేశ్వరి చిక్కిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ చిన్నారి కొండ పైకి వెళ్తే ఇప్పటి వరకూ నీరు, ఆహారం లేకుండా బతకడం దాదాపు అసాధ్యమని స్థానికులు భావిస్తున్నారు. ఎంత విస్తృతంగా వెతికినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడం గాలింపు బృందాలకు అంతు చిక్కడం లేదు. బాలిక అదృశ్యం మిస్టరీ వీడకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
వైఎస్ జగన్ మీడియా సమావేశం హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: ఏపీ డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబు సర్కార్ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు అని చెప్పుకొచ్చారు. డీఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో బయటపెట్టారు. తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది జెన్జీ కాలం.. దేన్నీ చంద్రబాబు ఆపలేడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.డీఎస్సీ అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. అలాగే, రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరి తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా చాలా షాక్ కలిగిస్తున్నాయి.లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది.స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసింది.ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు.డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ. వారి భవిష్యత్తు.అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డం అత్యంత దారుణం.అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు.చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా,ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.16వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు..మా ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చాం.లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాం.దేశ చరిత్రలోనే లేని విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం.2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చాం.19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదు.నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశాం.ఇప్పుడు మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు. రికార్డు అంటే వైఎస్సార్సీపీదే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఐదు తొలి సంతకాలు అంటూ నానా హంగామా ఆర్భాటం చేశాడు.ఇదికూడా పెద్ద మోసమే.దీంట్లో మెగా డీఎస్సీ అనేది ఒక సంతకం.వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చాం.వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు.పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న 16వేల పోస్టులకే మెగా పేరుపెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారు.ఇదీ చంద్రబాబు మొదటి సంతకం పరిస్థితి. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా?రికార్డు అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలోనే జరిగింది.గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు.మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, జులై 19న జీవో ఇచ్చాం.జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం.జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం.సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం.2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు.ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం.ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు.అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసాం.అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు?మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు?డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి.కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు.డీఎస్సీ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది.పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ పరీక్షల నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించి పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది.అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్.చంద్రబాబు వ్యాఖ్యలు హాస్వాస్పదం.. రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్నం తయారీ, అప్లోడ్ను ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు.ఆ విషయం తెలిసి కూడా వారికే అప్పగించారు.తప్పు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టాలనే ఈ పని చేశారు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి..ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ కాదా?.ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, టీజీటీ జోన్-2లో ఆరో ర్యాంకుఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణల్లో ఉండటం, అదే వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం స్కామ్ కాదా?.ఇదంతా కనిపించింది మాత్రమే.. కనిపించని ఎన్ని లీక్లు ఉన్నాయో.మెరిట్తోనే ర్యాంక్ సాధిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?.అతడి ఐడీ, డేటాను మాయం చేశారు.మెరిట్ లిస్టులో మార్పులు చేసి అతని పేరును మాయం చేశారు.తప్పు జరిగింది కాబట్టే అతని డేటాను మాయం చేశారు కదా?.మెరిట్ సాధిస్తే అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు?.చివరికి ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.మొదటి ర్యాంక్ వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదట. చంద్రబాబే పోలీసు.. లాయరు.. ఆదేశాలు...మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు.పేపర్ లీక్ను దాచిపెట్టడానికే ఈ కబుర్లన్నీ చెప్తున్నారంటూ అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు మీ నుంచి సమాధానం ఏమిటి?మీరు చెప్పేవి నిజాలు అయితే ఆ అభ్యర్థి కోర్టుకు ఎందుకు పోయాడు?పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు?డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది?ఎంతమందికి లీక్ వెళ్లింది?ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు, ఆయనే పర్యవేక్షిస్తారు.అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?పైగా విద్యాశాఖ మంత్రి ఆయన కొడుకే. మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి?రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?పారదర్శకత ఎక్కడ?ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వెల్లడి అయినా అత్యంత పారదర్శకంగా ఉంటుంది.ఇప్పటికీ యూపీఎస్సీ-సివిల్స్ పరీక్ష ఫలితాలు చూస్తే చాలా పారదర్శకంగా మెరిట్లిస్టులు డిస్ప్లే చేస్తారు.కానీ, చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తి విరుద్ధంగా సాగింది.మెరిట్ లిస్టులు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు పబ్లిక్గా డిస్ప్లేలో పెట్టలేదు?సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకువచ్చారు.మరి పారదర్శకత అనేది ఎక్కడ ఉంది. ఇందులో స్కామ్ల కంపు కనిపించడం లేదా?అసలు డీఎస్సీ అంటేనే “డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ’’.. జిల్లాస్థాయిలో, కలెక్టర్ నేతృత్వంలో జరుగుతుంది.అలాంటి కలెక్టర్ కార్యాలయాల్లోనే పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు లిస్టు పెట్టలేదు.మొత్తం ప్రక్రియను దాదాపుగా సెంట్రలైజ్ చేశారు. ఎందుకు ఇలా చేశారు? దీనికి కారణం, మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా?ఉమ్మడి రాష్ట్రంలో కాని, ఈ రాష్ట్రంలో కాని అనేకమార్లు DSC పరీక్షలు జరిగాయి.జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులను డిస్ప్లే చేసేవారు.అక్కడ ఇచ్చిన కటాఫ్ మార్కులు, రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసినవారు, ఆ పోస్టు తనకు వస్తుందా? లేదా? అని దాదాపుగా ఒక అంచనాకు పారదర్శకంగా వచ్చే వాళ్లు.కానీ, ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంతా దాపరికం, గందరగోళం. మెరిట్ లిస్టులు, రోస్టర్స్ను, మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. ఆన్లైన్ అంటూ సెంట్రలైజ్ చేశారు.ఆ ఆన్లైన్లో కూడా అనేక సార్లు, అనేక మార్పులు చేశారు..ఎవ్వరికీ ఏ సందేహం ఉన్నా, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే, వారు పట్టించుకోకుండా, పైన విద్యాభవన్కు వెళ్లాలని అని వారు చెప్తారు.తీరా ఇక్కడకు వస్తే, మీరు అక్కడికి పోండి, మాకు సంబంధం లేదని వీరు చెప్తారు. ఎవరి కోసం సర్దుబాట్లు..చివరకు ఒక పోస్టుకు ఒకరు, అంటే 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి, వారిని పిలిచి,వారి సర్టిఫికెట్లు వెరిఫై చేసిమరీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. 1:1 అంటే అర్థం కాదా?ఒక పోస్టుకు, ఒక అభ్యర్థి అనే కదా అర్థం? ముందుగానే మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్లెటర్లు జారీచేశారు?సెలెక్షన్స్ రూల్స్లో రూల్ నంబర్ 20 ఇదే చెప్తోంది.ఎందుకంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలుసు, వారు ఓపెన్లోకి వస్తారా? లేక రిజర్వేషన్లోకి వస్తారా? అన్నది తెలుసు.వర్టికల్ రిజర్వేషన్ తెలుసు. హారిజాంటల్ రిజర్వేషన్ తెలుసు.ఎన్ని OC పోస్టులు ఉన్నాయో తెలుసు?ఎన్ని SC, ST, BC, EWS పోస్టులు ఉన్నాయి?ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు?స్పోర్ట్స్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ఎన్నిపోస్టులు? ఇవన్నీ ముందుగానే చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు.ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకు వస్తారు?వారి ర్యాంకులు ఏంటి? అన్న విషయాలన్నీ ముందుగానే వారికి తెలుసు.ఇవన్నీ తెలిసిన తర్వాత, 1:1లో పిలిచిన తర్వాత, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడం ఏంటి?వెరిఫికేషన్లో సర్టిఫికెట్లు అన్నీ సరైనవి అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి?రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేకపోవడం ఏంటి?ఇది దగా కాదా? మోసం కాదా? దోపిడీ కాదా? స్కాం కాదా?ఇప్పుడేమో కాల్లెటర్ జారీచేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేంటి?మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు.సర్టిఫికెట్లలో ఏమైనా లోపాలు ఉంటే తప్ప 1:1లో కాల్లెటర్ వచ్చిన వాళ్లకు పోస్టు తప్పకుండా ఇవ్వాలా? వద్దా?1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా?అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూపిన తరువాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్లు, అన్నీ చూసిన తర్వాతే 1:1లో పిలిచి, సర్టిఫికెట్లు అన్నీ బాగున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.మళ్లీ సర్దుబాటు జరిగింది అంటే, ఎవరికోసం జరిగింది ఈ సర్దుబాటు? ఎవరికోసం వీరికి అన్యాయం చేశారు?స్పోర్ట్స్ కోటా పెద్ద స్కామ్..స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కాం. ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్కు కూడా అన్యాయం జరిగింది.జీవో నంబర్-4, జీవో నంబర్-47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన “స్కామ్ల పాలసీ స్కెచ్’’ ఇది.గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని..ఒక బ్యాక్డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు.దీని కోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, మీరు అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు, తెచ్చిన జీవోలను తీసేశారు.గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది.కాని, ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో మిగతా అభ్యర్థులతోపాటు వీరుకూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. అది రూల్.అలాంటి రూల్ను చంద్రబాబు మొత్తం మార్చేశాడు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచాడు.అసలు పరీక్షే రాయల్సిన అవసరం లేదంటూ జీవోలు ఇచ్చాడు.రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా, హిందీ, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, ఇంకా ఇలాంటి సబ్జెక్ట్లకు.. డీఎస్సీ పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా, స్కామ్లు చేస్తూ తన వాళ్ల కోసం చంద్రబాబు ఒక తప్పుడు దారి వేశాడు.దీనికి ముందుగానే, వారి వద్ద నుంచి వసూళ్లు చేసి, వారికి అడ్డగోలుగా గేట్లు ఎత్తడానికి ఈ జీవోలు జారీచేశారు.అందులో కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత, డీఎస్సీ పరీక్ష ఎలాగూ లేదు, నింపాదిగా డిగ్రీ కూడా సాధించడానికి ఐదేళ్ల సమయం కూడా ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది.క్రీడా ప్రతిభను కూడ చూడలేదు. పతకాలు చూడలేదు. బ్యాక్అప్ సర్టిఫికెట్లు కూడా లేవు.కేవలం ఆ ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఉద్యోగాలు ఇచ్చేశారు.ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్, యూనివర్శిటీల తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగాలు ఇచ్చేశారు.ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీరే ఇచ్చారు.సమాధానం చెప్పాల్సిందే..బాల్బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆముదాలవలస టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ కాగా, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్.వీళ్లే పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్లే వాటిని ధృవీకరిస్తారు.ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పోలవరంలోని మారుమూల ప్రాంతంకు చెందిన వ్యక్తి.ఆయనకు 1:1 కాల్ లెటర్ అందుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.కచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం ఇది. క్రీడాకారుల పేరుతో చేసిన స్కాం కాదా ఇది?ముందు తన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా, జీవో నంబర్ 4, జీవో నంబర్ 47తో గేటు తెరిచారు.వాళ్లు లోపలికి వెళ్లాక, జీవో నంబర్ 25, జీవోనంబర్ 56లతో గేటు మూసేశారు.తమ పని అయిపోయిన తర్వాత మళ్లీ ఆ జీవోను ఎత్తేశారు.మీరు ఇచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఈరెండూ సరైనవే అయితే ఎందుకు మళ్లీ వాటిని తొలగించారు?దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలడా?అలాంటి వారికి ఉద్యోగాలా?...ఎంపికైన అభ్యర్ధుల డేటాను చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్శిటీల తరఫున పార్టిసిపేట్ చేసినందుకే 270 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి.వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు.జస్ట్ పాల్గొన్నారు అంతే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.ఇలా సర్టిఫికెట్ల ఇచ్చిన జాబితా చూస్తే ఆంధ్ర యూనివర్శిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 31, నాగార్జున యూనివర్శిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్శిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్శిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి 14, యోగి వేమన 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీ 4, సంస్కృత యూనివర్శిటీ నుంచి 2, మిగతా యూనివర్శిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి.ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీలలో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి.మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పాల్గొన్నందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.ఇక ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.జిల్లా తరఫున ఆడితే చాలు. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.ఈ స్పోర్ట్స్ కోటా కింద టీచర్ ఉద్యోగాలను ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా, బేరసారాలు జరుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీగా పెట్టుకుని, ఒక కేండిడేట్తో బేరాసారాలు చేస్తున్న వీడియో ఇది.ఈ వీడియో బయటకు రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.కేసు పెట్టినా విచారణ శూన్యం. ఈ విషయాలేవీ కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు.ఎఫ్ఐఆర్ కాపీని ఒక్కసారి చూస్తే, వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది.పోలీసులు తలచుకుంటే ఈ నంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లో కనిపెడతారు.కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో, వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి, సస్పెక్ట్ అని రాశారు.పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలమ్లో ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయ్యిందని పెట్టారు.దీని అర్థం. ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తని తేలుతోంది.ఈ స్పోర్ట్స్ కోటా వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.పైగా బలమైన సెక్షన్లు పెట్టి, గట్టిగా విచారణ చేయకపోగా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం వెనుక అసలు ఏ జరిగిందనేది తేల్చాలా? వద్దా?లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది...అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయమే ఉంటుంది.1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్.1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్.1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్.2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్.2019లో టెన్త్ పేపర్ లీక్.2025లో బీఈడీ పేపర్ లీక్,2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్.ఇప్పుడు DSC టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది.ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది.అందుకే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.చంద్రబాబు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.ఇది Gen-Z కాలం. Gen-Alpha కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు చంద్రబాబూ.నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది.దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు, నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచస్ లేస్తాయి.ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం.లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి.విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను.వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని చెప్పాను. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం.తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా.రేపు వైఎస్సార్సీపీ ర్యాలీలు..రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం.దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి.చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం.దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. -
విశాఖ స్టీల్ప్లాంట్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో మరోసారి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్లోని ఎస్ఎంఎస్-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవ ఉక్కు (Molten Steel) ల్యాడిల్ నుంచి నేలపైకి పొర్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేదే.ఘటన అనంతరం ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవల కూడా(సోమవారం) స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2 నుంచి సలసలా మరిగే ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో.. భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి ప్లాంట్లో భద్రతా వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
దటీజ్ జగన్..
సాక్షి, విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించే విషయంలో అధికార కూటమి నేతలకు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య వ్యత్యాసం కార్మిక లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. కారి్మక నాయకులు సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా.. ‘మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?’ అంటూ మంత్రి లోకేష్ అగౌరవంగా మాట్లాడడం కార్మికుల్లో ఆగ్రహం రగిలించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..నాకేం తెలియదు..అవగాహన లేదంటూ వెళ్లిపోయారు. ఇదే సమయంలో విశాఖకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. సెవెన్హిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయి, ప్రమాద కారణాలు తెలుసుకుని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రూ.కోటి పరిహారం కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క నెలలోనే రూ. కోటి పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జగన్ చూపిన మానవత్వం, చొరవ కార్మికుల మనసు గెలిచింది. -
కష్టకాలంలో కదిలొచ్చే మనసు
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాలు మారవచ్చు, అధికారం చేయి మారవచ్చు..కానీ మనసు మారదు. పేద కార్మికుని కన్నీటి ముందు ఆర్థ్రతగా కరిగే మనసుకు అధికారం అక్కరలేదు. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మరోసారి అది నిరూపించారు. స్టీల్ప్లాంట్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. 1600 డిగ్రీల మరుగుతున్న ఉక్కు ప్రవాహంలో తొమ్మిది మంది కార్మికులు దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆ వేదన విన్న మరుక్షణమే జగన్ మనసు అటు పరిగెత్తింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. అంతటితో ఆగిపోలేదు..బుధవారం స్వయంగా విశాఖ వచ్చారు. సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రతిపక్షంలోనూ అదే సంస్కారం అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పరిగెత్తడం అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బాధితుల వద్దకు వెళ్లే నాయకులు చాలా అరుదు. జగన్ ఆ అరుదైన వారిలో ఒకరు. స్టీల్ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువమంది సాధారణ కారి్మకులే. భారతీయ ఉక్కు సంస్థకు కాంట్రాక్ట్ కింద పనిచేసే వారు. వారి కుటుంబాలకు తక్షణ పరిహారం అందాలని, న్యాయం జరిగేంత వరకూ బాధితుల తరఫున పోరాడతామన్నారు. ఆత్మీయంగా మాట్లాడుతూ కొండంత భరోసా కల్పించారు. నేనున్నానంటూ కన్నీళ్లు తుడిచారు. -
విజయవాడలో దంచికొట్టిన వర్షం.. ఐదు రోజులు గట్టి వానలే..
సాక్షి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, పిడుగులతో వాతావరణం దద్దరిల్లింది. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. విజయవాడ నగరంతో పాటు రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అలాగే, ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, కృష్ణాజిల్లాలోని పెడన నియోజకవర్గంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. అనంతరం, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.ఇదిలా ఉండగా.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.HEAVY THUNDERSTORMS AND RAINS AHEAD FOR CENTRAL AP DURING TONIGHT ⚠️⚠️The Monday storms missed #Vijayawada and now this storm looks even more perfect to enter into the city and bang with heavy rains. During next 2-3 hours, rains and thunderstorms will increase along entire… pic.twitter.com/BTOamAUb67— Andhra Pradesh Weatherman (@praneethweather) June 10, 2026మరోవైపు..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అలాగే వాతావరణంలో ఏర్పడిన పలు మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ జిల్లాల్లో వర్షాలు..ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికార్ఆబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఆక్వాకు షాక్!
సాక్షి, అమరావతి: ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ను ఎగ్గొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఎలాంటి షరతలు లేకుండా.. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వాసాగు చేసే రైతులందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లుగా అటకెక్కించిన చంద్రబాబు సర్కార్.. తాజాగా నాణ్యతా శాతం (పవర్ ఫ్యాక్టర్) అంటూ లేని కొత్త నిబంధనను ముందుకు తీసుకువచ్చింది. నాణ్యతా శాతం తక్కువగా ఉంటే విద్యుత్ వృధా జరిగినట్లు భావించి వారికి సబ్సిడీని ఎగ్గొట్టే అడ్డగోలు వ్యవహారానికి నాంది పలికింది. ఈ మేరకు తాజాగా 169వ జీవోను ప్రభుత్వం జారీ చేసింది.ఎగనామానికి కుతంత్రం ఇలా...» ఈ జీవో ప్రకారం.. అప్సడా చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న 1,09,202.46 ఎకరాలను కొత్తగా జోన్ పరిధిలో నోటిఫై చేస్తారు. » వీటి పరిధిలో ఉన్న 6 వేల కనెక్షన్లతో పాటు జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న మరో 6,500 కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 చొప్పున త్వరలో విద్యుత్ సబ్సిడీ వర్తింప జేస్తారు. ఇందుకు రైతాంగం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. » అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సబ్సిడీ వర్తింపు విషయంలో కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది. » ఈ నిబంధన ప్రకారం విద్యుత్ వినియోగ నాణ్యత శాతం 0.90 నుంచి 0.95 శాతం మధ్య విధిగా ఉండాలి. » పవర్ ఫ్యాక్టర్ అనేది విద్యుత్ సమర్థ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఒక శాతం ఉంటే సమర్థవంతంగా వినియోగిస్తున్నట్టు. 0.95 శాతం అంటే మంచి స్థాయిలో ఉన్నట్టు. 90 శాతం అంటే ఆమోద యోగ్యమైన స్థాయిలో ఉన్నట్టుగా గుర్తిస్తారు. » 0.90 శాతం కంటే తక్కువగా ఉంటే విద్యుత్ వృథా ఎక్కువగా జరుగుతున్నట్టుగా భావిస్తారు. వాస్తవానికి ఆక్వా చెరువులన్నీ బహిరంగ ప్రదేశాల్లో ఉండడంతో, విద్యుత్ లైన్లన్నీ కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటాయి. దీనివల్ల వృధా శాతం ఎక్కువగా ఉంటుందని విద్యుత్, ఆక్వా రంగ నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో వాస్తవానికి 0.70 నుంచి 0.80 మధ్య మాత్రమే నాణ్యతా శాతం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. » ఈ తాజా నిబంధన తాజా విద్యుత్ సబ్సిడీకి అర్హత పొందిన 12,500 కనెక్షన్లకే కాదు.. ఇప్పటికే విద్యుత్ సబ్సిడీ పరిధిలో ఉన్న మరో 49,601 కనెక్షన్లకు.. అంటే మొత్తం 62,101 కనెక్షన్లకు ఇబ్బందికరంగా మారింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా.. ఇప్పుడు ఏది? 2024–25 ఆర్థిక సంవత్సరంలో 5.60 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగవుతుండగా, 3.33 లక్షల ఎకరాలకు విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కొత్తగా మరో లక్ష ఎకరాల్లో సాగు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆక్వాకు సంబంధించి 68,134 కనెక్షన్లు ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలోనే జోన్ పరిధిలోని 10 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన ఆక్వా చెరువులకు సంబంధించి 54,072 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింప చేశారు. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో తొలి ఏడాది 50,092 కనెక్షన్లకు వర్తింప చేయగా, 2025–26లో కేవలం 49,601 కనెక్షన్లకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ అమలు చేశారు. తాజాగా మరో 12,500 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఎప్పుడు ఈ పెంపు వర్తింప చేస్తారో జీవోలో స్పష్టత లేకపోవడంపై ఒకవైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు నాణ్యతా శాతం అంశం తాజాగా రైతాంగానికి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా సబ్సిడీ విద్యుత్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆక్వా రైతులకు బాబు సర్కార్ శాపంగా మారింది.రైతులను వంచించడమే..చంద్రబాబు సర్కార్ ఆక్వారైతుల జీవితాలతో చలగాటమాడుతోంది. జీవో 169 ఆక్వా రైతులను వంచించేందుకే తప్ప వారికి ఏమాత్రం మేలు చేయదు. వృధా శాతాన్ని అరికట్టి, నాణ్యతా శాతం పెంచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న కెపాసిటర్ల స్థాయిని రైతులు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఒక్కో రైతుకు కనీసం రూ.2 లక్షల భారం పడనుంది. ఓ వైపు కంపెనీలతో కుమ్మక్కై ఫీడ్ ధరలు పెంచేందుకు కుట్రలు చేస్తూ మరోక వైపు సబ్సిడీ విద్యుత్కు మంగళం పాడేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. –వడ్డి రఘురాం, మాజీ వైస్ చైర్మన్, అప్సడా -
ఆస్తి నాది.. కాపురం బాబుది
సాక్షి, అమరావతి: గడచిన 8–9 ఏళ్లుగా కృష్ణా నది కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. అఫిడవిట్లో నేరుగా ఆ విషయాన్ని చెప్పకపోయినా.. ప్రకటించిన తన ఆస్తుల వివరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 272, 272–1ఏ, 274లో డోర్ నంబర్ 17–3–781–1లో 1.32 ఎకరాల (52,630 చదరపు అడుగుల) భూమి, అందులో 5,994.62 చదరపు అడుగుల భవనం తనదేనని పేర్కొన్నారు. 2004, 2008 సంవత్సరాల్లో ఆ ఆస్తులను తాను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్లానింగ్ కార్యక్రమాలకు ఉపయోగించే సర్వే నంబర్లతో సహా గ్రామాల మ్యాప్లు ‘భువన్ పంచాయతీ’ వెబ్పోర్టల్ ఆయా సర్వే నంబర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం (రెసిడెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఉన్నట్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే ఇంటితోపాటు ఆ చుట్టపక్కల 1.32 ఎకరాల భూమి జనసేన రాజ్యసభ్య అభ్యర్థి లింగమనేని సొంత ఆస్తులుగా తేలిపోయింది.ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట బంగ్లా ఆస్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న లింగమనేని మరోవైపు లింగమనేని తన అఫిడవిట్లో ఆ భూమి ప్రస్తుత పరిస్థితి వివరాలు వంటివి పేర్కొనకపోయినప్పటికీ.. తన అఫిడవిట్లోనే వేరొక చోట 9(బీ) కాలమ్లో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ(10–02–2026)న రాష్ట్ర ప్రభుత్వంతో రెంటల్/లీజ్ అగ్రిమెంట్ ఒప్పందం ఒకటి చేసుకున్నట్టు పేర్కొనడం గమనార్హం. క్విడ్ప్రో కో.. కరకట్ట బంగ్లా కథ రాజధాని అమరావతి నిర్మాణం పేరిట 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన భూసమీకరణ, అమరావతి ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లింగమనేని రమేష్ కు భారీ ప్రయోజనం చేకూర్చడంతో క్విడ్ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పు వెనుక రూ.వందల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు అప్పటి ప్రభుత్వంలో మంత్రి లోకేశ్ను కూడా నిందితుడిగా చేర్చి అప్పట్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2024 ఫిబ్రవరిలోనే న్యాయస్థానంలో చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. క్విడ్ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్టపై ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపైనా కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేష్ మొదట్లో చెప్పారు. కానీ.. ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ప్రో కో కింద ఇచ్చారన్న దానిపై సీఐడీ అప్పట్లో ప్రధానంగా విచారణ జరిపింది. మళ్లీ ఇప్పుడు.. లింగమనేని రమేష్ ను టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి రాజ్యసభ జనసేన అభ్యర్థిగా ఎంపిక చేయడం, చంద్రబాబు కరకట్టపై నివాసం ఉంటున్న బంగ్లాను లింగమనేని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడంతో ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరింది. ప్రభుత్వంతో లీజు(రెంటల్) అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్న లింగమనేని లింగమనేని, భార్య పేరిట రూ.213 కోట్ల ఆస్తులు» లింగమనేని రమేష్ తో పాటు ఆయన భార్య పేరిట రూ. 213.39 కోట్ల స్థిర, చరాస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. లింగమనేని రమేష్ పేరిట బ్యాంకు ఖాతాలో రూ.86,138 నగదు, రూ.18,52,69,885 డిపాజిట్లు, షేర్లు, బాండ్లు రూపంలో రూ.28,41,73,849, మరో రూ.15,06,16,960లను తెలిసిన వారికి, బంధువులకు, సంస్థలకు వ్యక్తిగత రుణాలు లేదా అడ్వాన్సులుగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. రూ.6 లక్షల విలువ చేసే 13.18 గ్రాములు బంగారు ఆభరణాలతో కలిపి తన పేరిట మొత్తం రూ.62.07 కోట్లు చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. » భార్య లింగమనేని సుమన పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2,38,958, డిపాజిట్లుగా రూ.8,27,59,056, షేర్లు, బాండ్ల రూపంలో రూ.11,75,22,500, బంధువులు, సంస్థలకు అడ్వాన్సు రూపంలో ఇచ్చినవి రూ.26,51,01,285లతో పాటు రూ.2.68 కోట్ల విలువ చేసే ఒక కిలో ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలు, 11.433 కేజీల వెండి కలిపి.. సుమన పేరిట మొత్తం రూ.49.24కోట్ల చరాస్తులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.» ఇళ్లు, వ్యవసాయ భూములు వంటి స్థిరాస్తులుగా తన పేరిట రూ.8.46 కోట్లు ఆస్తులు ఉండగా.. భార్య సుమన పేరిట రూ.93.60 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. » తన పేరిట రూ.68.19 కోట్లు, భార్య సుమన పేరిట రూ.17.41 కోట్ల రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. » తనపై వివిధ రకాల కేసులు 11 ఉన్నట్టు పేర్కొన్నారు. -
ఆరోగ్యం ఎలా ఉందన్నా..?
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి భరోసా కల్పించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ.. ఆరోగ్యం ఎలా ఉంది? వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? ప్రమాదం ఎలా జరిగింది? అని ఆరా తీశారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని హామీనిచ్చారు. విశాఖ రామ్నగర్లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెదగంట్యాడ సీతానగరానికి చెందిన గోకివాడ సూరిబాబు (కాంట్రాక్ట్ వర్కర్), అగనంపూడి లక్కరాజుపాలేనికి చెందిన కార్మికుడు పి.శ్రీనివాసరావు(చార్జిమెన్)ను పరామర్శించారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రావూరి మల్లికార్జునరావు (సీనియర్ టెక్నీషియన్), గుడివాడ అర్జున అప్పారావు(చార్జిమెన్), ఒడిశాకు చెందిన సత్యానంద్ బాలువాను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. ఒక్కొక్కరి బెడ్ వద్దకు వెళ్లి.. బాధితుల చేతులు పట్టుకుని ‘నేనున్నాను... అధైర్యపడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇచ్చారు. వైఎస్ జగన్ను చూడగానే ఆస్పత్రి వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రి పాలు కావడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధను ఆసాంతం విన్న జగన్ ప్రతి ఒక్కరినీ ఓదారుస్తూ అండగా ఉంటానని మాట ఇచ్చారు.సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్ద..వైఎస్ జగన్: గోకివాడ సూరిబాబు అన్నకు వైద్యం సరిగ్గా అందుతుందా..?కార్మికుడు గోకివాడ సూరిబాబు బావమరిది శ్రీనివాస్: ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా భయంగా ఉందన్నా మాకు.. దేవుడి మీదే భారం వేశాం. వైఎస్ జగన్: అధైర్య పడొద్దు శ్రీనివాస్ అన్నా.. దేవుడి దయతో సూరిబాబు అన్నకు నయం అవుతుంది. శ్రీనివాస్: మీ రాకతో మాకు కాసింత ధైర్యం కలిగింది అన్నా..!వైఎస్ జగన్: ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చేలా ఒత్తిడి తెస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోతే మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందిస్తా. (యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఏ రకంగా అందజేస్తామన్నది సమగ్రంగా వారికి తెలియజేయాలని అక్కడే ఉన్న స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్ మేనేజర్ అనిల్ కుమార్కు వైఎస్ జగన్ సూచించారు)కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద...వైఎస్ జగన్: ‘‘ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్యం బాగా అందుతుందా..? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా అన్నా..?’’రావూరి మల్లికార్జునరావు: అందుతున్నాయి అన్నా..!వైఎస్ జగన్: స్టీల్ ప్లాంట్లో ప్రమాదం ఎలా జరిగింది..? మల్లికార్జునరావు: నేను స్టీల్ ప్లాంట్ ఎస్సెమ్మెస్ విభాగంలో సీనియర్ టెక్నీషియన్గా పనిచేసున్నా. ఎస్సెమ్మెస్ విభాగంలో లాడెల్ నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ఉక్కు ద్రవం పడిన చోటకు నేను కాసింత దూరంలో ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాను అన్నా..!వైఎస్ జగన్: మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. ధైర్యంగా ఉండు మల్లికార్జున అన్నా.. నీకేమి భయం లేదు.. నీకు అండగా మీ జగనన్న ఉన్నాడు..! (మల్లికార్జున అన్న పూర్తిగా కోలుకునేంత వరకూ మెరుగైన వైద్యం అందించాలని అక్కడున్న వైద్యులు గోపాల్రాజుకు వైఎస్ జగన్ సూచించారు) వైఎస్ జగన్: ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్య సేవలందుతున్నాయా..? క్షతగాత్రుడు గుడివాడ అర్జున అప్పారావు: అందుతున్నాయి అన్నా..వైఎస్ జగన్: స్టీల్ ప్లాంట్లో ప్రమాదం ఎలా జరిగింది..? అర్జున: నేను చార్జిమెన్గా పనిచేస్తున్నా. ఎస్సెమ్మెస్ విభాగంలో జరిగిన ప్రమాదంతో భయపడ్డాం. లాడెల్ నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయి ద్రవం కింద పడినప్పుడు దూరంగా ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నా. అది టీ తాగే సమయం కావడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. లేదంటే పెరిగేది.వైఎస్ జగన్: ధైర్యంగా ఉండు అన్నా..! నీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడు. పూర్తిగా నయం అయ్యేవరకూ ఆసుపత్రిలో వైద్యం అందుతుంది. ఎటువంటి ఆందోళన వద్దు.. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. -
కేంద్రం లెక్క.. అవినీతి పక్కా!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ అవినీతి మరోసారి బట్టబయలైంది. సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బాగోతం బయటపడింది. సచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే... గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనం.ఐఏఎస్, గ్రూప్–1 నుంచి గ్రూప్–డి, ఎన్జీవో క్వార్టర్స్కు చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 5.53 ఎకరాల్లో జీ+13 అంతస్తులతో 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 8 వేల మంది సిబ్బంది పని చేసేందుకు వీలుగా సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,299.08 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బందికి నివాస సదుపాయం కల్పించడం కోసం 17 ఎకరాల్లో 11 టవర్లలో 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ.1,234.91 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏకీకృత సముదాయం (సీజీజీపీఓఏ), ఉద్యోగుల నివాస గహాల (జీపీఆర్ఏ) నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా మొత్తం రూ.2,533.99 కోట్లు ఖర్చు చేయనుంది. రూ.4,350.42 నుంచి రూ.20,439.58 వరకు.. » రాజధాని అమరావతిలో సచివాలయం శాశ్వత భవనాలను డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో ఒక టవర్ మొత్తం ఐదు టవర్లను చంద్రబాబు సర్కార్ నిర్మిస్తోంది. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను చంద్రబాబు సర్కార్ రద్దు చేసి.. 2025లో మళ్లీ టెండర్లు నిర్వహించింది. మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. » ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ – వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. » దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. » అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు ఇప్పటికే రూ.20,439.57కు చేరుకుంది.హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ అమరావతిలో అధిక ధరలకు కాంట్రాక్టు పనులను సిండికేటు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టి.. నీకింత నాకింత అంటూ ప్రభుత్వ పెద్దలు దోచుకుతింటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరింత పెరగనున్న అంచనా వ్యయం! » రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. » ఈ లెక్కన సచివాలయం శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో వేచి చూడాలని ఇంజినీరింగ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయాన్ని దేశంలో ఎక్కడా లేని రీతిలో పెంచేసి దోచుకుతింటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అనేక చోట్ల ఎండ, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, తణుకులో 43.9, ఇంకొల్లు, కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ, లావేరులో 64.5 మి.మీ. వర్షం కురిసింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలతో పాటు పలు కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
బీచ్లు ఇక బార్లు.. తీరాల్లోనూ ‘సీ’సా చిందులు
సాక్షి, అమరావతి: బీచ్లలో ప్రశాంత వాతావరణన్ని చిదిమేసి, మందుబాబుల చిందులుగా మార్చేలా చంద్రబాబు ప్రభుత్వం బీచ్బార్ల ఏర్పాటుకు సన్నాహాలను వేగవంతం చేసింది. ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ బీచ్లలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను తొందరపెడుతోంది. ఇందుకోసం ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీచ్ బార్ల విధి విధానాలను ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఖరారు చేసింది. ఇందుకోసం ముసాయిదాను సైతం రూపొందించించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని రకాల మద్యంబీచ్ బార్లలో ఏయే కేటగిరీల మద్యం విక్రయిస్తారనే దానిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సాధారణ బార్లలో విక్రయిస్తున్న అన్ని రకాల మద్యం బీచ్ బార్లలో కూడా విక్రయిస్తారని తేల్చిచెప్పింది. బీచ్ బార్లలో కేవలం బీరు మాత్రమే విక్రయిస్తారని కొందరు చెబుతున్నది అవాస్తవమని ఎక్సైజ్ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అంశంపై అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. వైజాగ్, చీరాలలో తొలి దశలో 12 బార్లు వైజాగ్, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద బీచ్ బార్లను ఏర్పాటు చేస్తారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్లలో ఏడు ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు యారాడ బీచ్ వద్ద కూడా ఓ బీచ్ బార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. చీరాలలోనూ నాలుగు ప్రాంతాల్ని గుర్తించారు. మొత్తం విశాఖపట్నం, చీరాలలో 12 చోట్ల బీచ్ బార్ల ఏర్పాటుకు అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వాటిలో ఎన్ని చోట్ల బార్లు ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిర్ణయిస్తారని ముసాయిదాలో పేర్కొంది. విశాఖపట్నం, బాపట్ల జిల్లా ఎక్సైజ్ అధికారులతో చర్చించి ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది.జనవరి నాటికే ఇతర జిల్లాల్లోనూ..పైలట్ ప్రాజెక్టు మొదలు పెట్టిన రెండు మూడు నెలల్లోనే రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లోనూ బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశి్చమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రదేశాలపై నివేదిక రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి నాటికే రాష్ట్రంలో బీచ్ బార్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి వేదికగా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని స్పష్టమవుతోంది. -
పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలంలో గంజాయి స్మగ్లర్లు దాడికి పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చింతపల్లి మండలం ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చి న ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు లోతుగెడ్డ వంతెన సమీపంలో రామారావుపాలెం–మేడూరు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వçహించారు. అదే సమయంలో ఏఓబీ సరిహద్దు ప్రాంతం బలపం కోరుకొండ నుంచి రామారావుపాలెం మీదుగా అటుగా వచ్చి న వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలతో పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో స్మగ్లర్లను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో అన్నవరం ఎస్ఐ రెండు రౌండ్లు తుపాకీని గాల్లోకి పేల్చారు.తప్పించుకుని పారిపోతున్న నలుగురిని పట్టుకోగా, మరో నలుగురు పారిపోయారు. వారి నుంచి రూ.కోటి విలువైన 290 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజస్థాన్కు చెందిన అర్జున్కుమార్, విశాఖపట్నంకు చెందిన ఇమ్రాన్ఖాన్, మల్కన్జిల్లా(ఒడిశా)కు చెందిన కిసాన్కార్, అల్లూరి జిల్లా బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం పోలీసులు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. -
కార్మిక నేతలతో కలివిడిగా!
విశాఖ విద్య: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో అరగంటకుపైగా సమావేశమైన వైఎస్ జగన్.. కార్మిక నేతలను ఒక్కొక్కరినీ ‘‘అన్నా..!’’ అని ఆప్యాయంగా సంబోధిస్తూ పరిచయం చేసుకున్నారు. ప్లాంట్లో నెలకొన్న పరిస్థితులను ప్రధానంగా కార్మిక సంఘాల నేతలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ముడి సరుకు నాణ్యత లోపం, భద్రతపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి వదిలేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ను పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు జగన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులపై వర్క్ లోడ్ పడుతోందని, కార్మికుల సంఖ్య 16 వేలకు తగ్గిపోవడంతో తీవ్ర పని ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. అన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించడం ద్వారా ప్రమాదాలకు ఆస్కారమిచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ప్రాణ భయం పెంచాలన్నది యాజమాన్యం పథకమని పేర్కొన్నారు. ప్లాంట్ పునరుద్ధరణ పేరుతో కేటాయించిన రూ.11,440 కోట్లు కేవలం జీఎస్టీ, బ్యాంకు రుణాల వడ్డీలు, ఫస్ట్ ఫేజ్ వీఆర్ఎస్ అమలుకు వినియోగించారు గానీ విశాఖ ఉక్కు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగ పడలేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వం వైఫల్యం ఉందని.. ఏదో రకంగా ప్లాంట్ని ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించకుండా ప్లాంట్ లాభాల బాటలో పయనిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదనను సావధానంగా విన్న వైఎస్ జగన్.. కార్మికుల పక్షాన ఉంటామని భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కార్మిక సంఘాల నేతలకు గుర్తు చేశారు. నష్టపరిహారం విషయంలో తాము ఎంత మానవత్వంగా ఉంటామో మీకు తెలుసు కదా.. ! అని పేర్కొన్నారు. మీరంతా విజయవాడ రావాలని.. మరోసారి కూలంకషంగా చర్చిద్దామని కార్మిక సంఘాల నేతలను వైఎస్ జగన్ కోరారు. సమావేశంలో శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేతలు బూడి ముత్యాల నాయుడు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గాజువాక సమన్వయ కర్త తిప్పల దేవన్రెడ్డి, స్టీల్ప్లాంట్ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి జె.రామకృష్ణ, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, స్టీల్ వైఎస్సార్ టీయూసీ నేత ఎంవీ రెడ్డి, జేఎంఎస్ నేత వరసాల శ్రీనివాస్, సీఎఫ్టీయూఐ నేత డీ శ్రీనివాస్, డీఐటీయూ నేత బి.డేవిడ్, ఏఐటీయూసీ నేత పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ వద్దకు వెళ్లొద్దు... ఉద్యోగం ఇచ్చేస్తాం..!
విశాఖ: స్టీల్ ప్లాంట్లో ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన జూనియర్ టెక్నీషియన్ బలిరెడ్డి పెంటయ్య కుటుంబానికి ఇంతవరకు నష్ట పరిహారం అందకపోవడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖ కూర్మన్నపాలేనికి చెందిన పెంటయ్య భార్య వెంకటలక్ష్మి, కుమారుడు ప్రసాద్ బుధవారం విశాఖలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ గోడు చెప్పుకున్నారు. యాజమాన్యం తమను మోసం చేస్తోందని వాపోయారు. పెంటయ్య గతేడాది మార్చి 14న ఎస్ఎంఎస్–2 విభాగంలో జరిగిన ద్రవ ఉక్కు లీకేజీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఏప్రిల్ 1న మృతి చెందినట్లు భార్య తెలిపారు. భద్రతా లోపాలపై ప్రమాదానికి ముందే తన తండ్రి ఉన్నతాధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదని ప్రసాద్ చెప్పారు. ఏడాది దాటుతున్నా పరిహారం ఇవ్వకుండా సాకులు చెబుతున్నారన్నారు. తాము వైఎస్ జగన్ను కలవడానికి వస్తున్నట్లు తెలిసి స్టీల్ప్లాంట్ ప్రతినిధులు, కొందరు స్థానిక నేతలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉద్యోగం ఇస్తామంటూ నమ్మబలికారని తెలిపారు. బాధిత కుటుంబం ఆవేదనను విన్న వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే సమయంలో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
నా భర్త డ్యూటీలోనే మృతి చెందినా పైసా ఇవ్వలేదు
సాక్షి, విశాఖపట్నం: ‘‘నా భర్త దుంగ గోపాలకృష్ణ స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. గత ఏడాది నవంబర్ 25న విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన పీఎస్వో విభాగంలో పనిచేస్తుండగా, ఆ రోజు ఎస్ఎల్ ఇంజినీరింగ్ విభాగంలోని కార్మికులు సెలవులో ఉండటంతో అక్కడ విధులు నిర్వహించేందుకు పంపించారు. అండర్ గ్రౌండ్లో పని చేస్తుండగా బాయిలర్ వేడి నీరు పడటంతో ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో ఉండగానే మరణించినప్పటికీ స్టీల్ప్లాంట్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు.కాంట్రాక్టర్ నాగేశ్వరరావు రూ.1 లక్ష ఇస్తానని చెప్పి, కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని చెల్లించలేదు’’ అని దుంగ మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాది వడ్లపూడి వేటపాలెం. నాకు ఆరేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. నా కుమారుడు పూర్తిగా దివ్యాంగుడు కావడంతో అతడిని చూసుకోవాల్సి రావడంతో పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. కుటుంబ పోషణ ఎంతో కష్టంగా మారింది. నా భర్త మృతికి నష్టపరిహారం ఇవ్వాలని పలుమార్లు స్టీల్ప్లాంట్ యాజమాన్యాన్ని కోరినా స్పందన లేదు. నాకు మీరే న్యాయం చేయాలి జగనన్న‘ అంటూ విశాఖలో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద దుంగ మల్లేశ్వరి తన గోడును వినిపించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా స్టీల్ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని, అయినప్పటికీ పరిహారం అందకపోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.జగన్ రాకతో..ఉరుకులు పరుగులు!ఉదయాన్నే బాధితుల ఇళ్ల వద్దకు కూటమి నేతలు నయాపైసా పరిహారం ప్రకటించకుండా డ్రామాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ప్రకటించని చంద్రబాబు సర్కారు మరో డ్రామాకు తెర తీసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖ వస్తున్నారని తెలిసిన వెంటనే కూటమి నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ పెద్దల ఆదేశాలతో కూటమి నేతలు బాధితుల ఇళ్ల వద్ద వాలిపోయారు. బాధితులకు ఏదో మేలు చేసేస్తామన్న బిల్డప్ ఇచ్చారు. కానీ కార్మికులకు హక్కుగా రావాల్సిన పరిహారం మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా నయా పైసా చెల్లిస్తామని చెప్పేందుకు కూటమి నేతలు సాహసించలేదు. మరోవైపు కార్మికులు, కార్మిక సంఘాలతో కేజీహెచ్ వద్ద మంత్రి లోకేశ్ మంగళవారం వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి నేతలను రంగంలోకి దించినట్లు చర్చ జరుగుతోంది. ఆగమేఘాలపై పోస్టుమార్టం..! సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించిన పైడిరాజు మృతదేహాన్ని హడావుడిగా కేజీహెచ్ నుంచి తరలించారు. ఉదయం 8.30 గంటల సమయంలో పైడి రాజు మరణించగా 10 గంటలకే పోస్టుమార్టం ముగించి ఆగమేఘాలపై అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించడం గమనార్హం. కార్మికుల ఘోష పట్టించుకోకుండా.. ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలపై కూటమి సర్కారు కనీసం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. 6 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిన సమయంలో కూటమి నేతల ఇళ్ల వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నా స్పందించలేదు. కార్మికులను తొలగించకుండా చూడాలని సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా వేడుకున్నా ఆలకించలేదు. స్టీలు ప్లాంట్లో సమస్యలపై మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక వీఆర్ఎస్ పేరుతో బలవంతంగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వారికి బెనిఫిట్స్ కూడా చెల్లించకపోవడంపైనా కూటమి నేతలు నోరు విప్పలేదు. ఏకంగా నాలుగున్నర నెలల పాటు వేతనాలు అందడం లేదంటూ కార్మికులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ప్రతి సందర్బంలోనూ వైఎస్సార్సీపీ వారికి అండగా నిలిచి విశాఖ ఉక్కు కార్మికుల గుండె ఘోషను ఎలుగెత్తింది. -
రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : వైఎస్ జగన్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని ఉద్యోగుల వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చి మానవత్వం చూపాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ చంద్రబాబు నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే... దేవుడి దయతో మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో కార్మికుల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని.. ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ తొలుత సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటన జరిగిన వెంటనే నాడు సీఎంగా ఉన్న తాను స్వయంగా వచ్చి దేశ చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందజేయడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు వారి హక్కుగా వచ్చే మొత్తాన్ని.. ఈ ప్రభుత్వం ఏదో అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ధర్మమేనా? అని నిలదీశారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తామంటూ వచ్చిన లోకేశ్ మాట్లాడిన మాటలు వింటుంటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అని అనిపించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతూ వైఎస్సార్ సీపీ హయాంలో రెండుసార్లు లేఖలు రాయడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. తమ పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం ఉంటే మంచి చేయండి...విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ వర్క్షాప్లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. వేర్వేరు ఆస్పత్రుల్లో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఇంకా ఒక అన్న చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో మాట్లాడాల్సి వస్తోంది. ఇవాళ కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా. మానవత్వం ఏ మాత్రం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మంచి చేయండి. స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎలా బతుకుతున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులు ఎలా ఉన్నారు? ఇప్పుడు వారి పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్నది బేరీజు వేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికుల తప్పిదం ఏమాత్రం లేదు. లిక్విడ్ మెటల్ పొంగి బ్లాస్ట్ అయింది. అలా ఎందుకు జరిగిందంటే.. మిక్స్ సరిగ్గా చేయకపోవడం, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం, రా మెటీరియల్లో నాణ్యత లోపించడం కారణం. ఈ ప్రమాదంలో ఎక్కడా ఉద్యోగుల తప్పిదం లేదు. ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మానవీయంగా లేదు. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ రెండేళ్లల్లో 10 వేల మందికి పైగా తొలగింపు..మా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి 28 వేల మంది పని చేయగా... ఈ రెండేళ్లలో ఏకంగా 10,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా 1,800 మందిపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. మరో 2,500 మంది పదవీ విరమణ చేశారు. దీంతో ఈ రోజు సంస్థలో కేవలం 16 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ 16 వేల మంది ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలోనే మొదటిసారి...విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి నాలుగున్నర నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా ఉద్యోగస్తుల జీతాలను ప్రొడక్షన్తో లింక్ పెట్టారు. అంటే ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటేనే జీతాలు... లేకపోతే లేదు అన్న నిబంధన ఈ రెండేళ్లల్లోనే వి«ధించారు. దేశంలో ఎక్కడా, ఏ సంస్థలో ఇలాంటి విధానం లేదు. ఉద్యోగుల క్వార్టర్లకు (నివాస గృహాలు) వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్తుకు కేవలం 50 పైసలు మాత్రమే వసూలు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లల్లో కరెంటు బిల్లు యూనిట్కు ఏకంగా రూ.8.50కి పెంచారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి క్వార్టర్లు ఖాళీ చేయించే కుట్ర చేశారు. ఉద్యోగులకు ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు.. నో బోనస్... నో మెడికల్ ఫెసిలిటీస్... నో హెచ్ఆర్ఏ... నో ఎల్టీసీ... నో లీవ్ ఎన్క్యాష్మెంట్... నో ఇన్సెంటివ్స్...! ఈ మాదిరిగా ఉద్యోగులు దారుణ పరిస్థితుల్లో పని చేస్తున్నారు.ఆ ప్యాకేజీ.. వీఆర్ఎస్, జీఎస్టీ బకాయిల కోసమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని కేవలం ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. అదేవిధంగా జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు. ఏడాదైనా ఉద్యోగం ఇవ్వలేదు..బాధితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మానవీయంగా లేదు. నా పక్కనే.. భాగ్యశ్రీ అనే బాధితురాలు ఉంది. ఆమె తండ్రి పేరు పెంటయ్య. 14 నెలల క్రితం ఇక్కడే, ఇదే సంస్థలో ఈ మాదిరిగానే ప్రమాదం జరిగి పెంటయ్యన్న చనిపోయాడు. పెంటయ్యన్న ఎంప్లాయి నెంబరు 124185. ఆయన పర్మినెంట్ ఉద్యోగి. ఎస్ఎంఎస్–2లో మాస్టర్ టెక్నీషియన్గా (ఐడీ కార్డు చూపించారు) పని చేసేవారు. 2025 ఏప్రిల్ 1న ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయనకు కుమార్తె భాగ్యశ్రీతోపాటు ఇద్దరు కుమారులు నవీన్, ప్రసాద్ ఉన్నారు. వారి తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఇద్దరికి నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా చివరకు పరిహారం కూడా చెల్లించలేదు. ఇంకా దారుణంగా.. ఆ ఫైల్ పోయిందని అంటున్నారు. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా? అని అడుగుతున్నా. విశాఖపట్నంలోని కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మీరిచ్చేదేమిటి... ‘బోడి’!ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్ మాటలు చూస్తుంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ఇది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిందే కదా...! అదనంగా నీవు ఏమిస్తున్నావని అడుగుతున్నా! ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్న్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్... అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. ఇవన్నీ కలిపి రూ.1.72 కోట్లు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సున్నా. మరి నువ్విచ్చేది ఏంది ‘బోడి’ అని అడుగుతున్నా. ఇది ధర్మమేనా? న్యాయమేనా?మా ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే..ఇకనైనా ఈ ప్రభుత్వం మానవత్వం చూపి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ సహాయం చేయకపోతే.. బాధ పడకండి. కొంచెం ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పడగానే నెలలోపు ఆ సహాయం చేస్తాం. కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రతీ బాధిత కుటుంబానికి అందజేస్తాం. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్నాథ్, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, తిప్పల నాగిరెడ్డి, గణేష్, కంబాల జోగులు, అదీప్రాజ్, కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్కుమార్, చింతాడ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే...అప్పట్లో ఇదే ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే మా ప్రభుత్వం గట్టిగా ఆపింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరి 6న ప్రధానికి ఒక లేఖ రాశాం. ఏ రకంగా చేసి ఈ ప్లాంట్ను నిలబెట్టాలో అందులో చాలా వివరంగా ప్రస్తావించాం. అనంతరం నెల రోజుల తర్వాత 2021 మార్చి 9న మరో లేఖ (లేఖ ప్రతులను మీడియాకు చూపించారు) రాశాం. అలా మొత్తం రెండు లేఖలు రాశాం. ఆ తర్వాత 2021 మే నెలలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం (అసెంబ్లీ తీర్మానం మినిట్స్ కాపీని ప్రదర్శించారు) కూడా చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం అన్యాయమని చెప్పాం. ఏ విధంగా మార్పుచేర్పులు చేస్తే స్టీలు ప్లాంట్ను గొప్పగా నిలబెట్టవచ్చో వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని వివరాలతో కేంద్రానికి పంపాం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని, ప్రైవేటు చేతుల్లో మేనేజ్మెంట్ను పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరాం. ఏ చర్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందనే విషయాన్ని కూడా పేర్కొంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాం. అలా సంస్థను, ఉద్యోగులను కాపాడగలిగాం. అంతేకాకుండా 2022 నవంబరు 12న ప్రధాని విశాఖ వచ్చినప్పుడు జరిగిన సభలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఆ సభలోనే ప్రధానిని కోరాం. మా పార్టీ అంత గట్టిగా నిలబడింది కాబట్టి, ఉద్యోగులకు తోడుగా నిలబడింది కాబట్టే సంస్థ ప్రైవేటీకరణ జరగలేదు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదుకున్నాం..గతంలో ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ వల్ల 14 మంది చనిపోతే మా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడమే కాకుండా, నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. గతంలో దేశంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. కార్మికులకు హక్కుగా రావాల్సినవే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి. నాడు మా ప్రభుత్వంలో కార్మికులకు కోటి రూపాయలు ఇచ్చి ఎలా అండగా నిలబడ్డామో... అదే మాదిరిగా ప్రతీ ఉద్యోగికి మేం చేసి చూపించిన తరహాలోనే మీరూ చేయాలని అడుగుతున్నాం. వారికి హక్కుగా వచ్చే రూ.1.72 కోట్లతో పాటు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. నా పక్కనే ఉన్న పెంటయ్యన్న కుటుంబాన్ని కూడా అదే మాదిరిగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి చెబుతున్నాం. సంస్థ ప్రైవేటీకరణ వద్దంటూ మా మాదిరిగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి మీ చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేస్తున్నాం. -
మొద్దు నిద్ర వీడిన ‘ఉక్కు’ యాజమాన్యం
ఉక్కునగరం (విశాఖ): ఘోర ప్రమాదం జరిగి, తొమ్మిది మంది అసువులుబాసిన తర్వాత గానీ విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం మొద్దు నిద్ర వీడలేదని, స్టీల్ప్లాంట్ యాజమాన్యానికి అకస్మాత్తుగా భద్రతా అంశాలు గుర్తొచ్చాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిగా భద్రతా లోపాలపై కార్మిక సంఘాలు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా కోట్ల రూపాయల విలువైన యంత్రాలు దెబ్బతినడంతో పాటు సుమారు రూ.100 కోట్ల మేర ఉత్పత్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. స్టీల్ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్–1 (ఎస్ఎంఎస్–1) విభాగం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం బుధవారం సమావేశం నిర్వహించింది. డైరెక్టర్ (ఆపరేషన్స్) సుభసిస్ సేన్గుప్తా, డైరెక్టర్ (పర్సనల్) ఇన్చార్జి ఎ.కె. బాగ్చి, ఇతర హెచ్ఆర్ అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో కార్మికులు పలు సమస్యలను ప్రస్తావించారు. దిద్దుబాటు చర్యలకు హామీ భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు పేర్కొన్నారు. నాణ్యత లేని ముడి పదార్థాల వినియోగం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్పత్తి లక్ష్యాల ఒత్తిడితో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీలు) పాటించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారం సరిపోదని, దానిని కనీసం రూ.కోటికి పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన యాజమాన్యం, నష్టపరిహారం అంశం తమ పరిధిలో లేదని, కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. భద్రతా ప్రమాణాలు, ఎస్వోపీలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షించి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. భద్రత చర్యలను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయడంతో పాటు, ప్రమాదంపై విచారణ కమిటీ నివేదికను త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా అంగీకరించింది. సమావేశంలో జీఎం (హెచ్ఆర్) బినయ్ ప్రసాద్, ప్లాంట్ పర్సనల్ ఇన్చార్జి ఎన్. భాను, ఎస్ఎంఎస్ విభాగాధిపతి ఆచార్యులు, కార్మిక నాయకులు కె.ఎస్.ఎన్.రావు, జె. అయోధ్యరామ్, రమణమూర్తి, రమణ, సంపత్, మనోజ్, శకునాల చంద్రశేఖర్, ఎల్. సత్యనారాయణ, రంగప్రసాద్, రామకృష్ణ, వాసు, సాగర్, నాగరాజు, రాజేష్ పాల్గొన్నారు.ఎస్ఎంఎస్–1లో ఉత్పత్తి పునఃప్రారంభం యాజమాన్యం భద్రతా చర్యలపై రాతపూర్వక హామీ ఇవ్వడంతో కార్మికులు, కార్మిక సంఘాలు శాంతించాయి. అనంతరం ఉత్పత్తి పునఃప్రారంభానికి అంగీకరించగా, బుధవారం మధ్యాహ్నం ‘బి’ షిఫ్ట్ నుంచి ఎస్ఎంఎస్–1లో ఉత్పత్తి కార్యకలాపాలను పునఃప్రారంభించే చర్యలు చేపట్టారు. -
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చేశాడని పేర్కొంది. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్శేఖర్ దాడి చేశారు.బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయ్శేఖర్కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి....పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
AP: కాసేపట్లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
సాక్షి, విశాఖపట్నం: వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది సేపట్లో విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని పేర్కొంది. ది. వీటితో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందునవ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. -
మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా?
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్హిల్స్ ఆస్పత్రిలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. కూటమి హయాంలో.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్కు లింకు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్లో యూనిట్ విద్యుత్కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత దారుణమా?స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది. లోకేశ్ అసలు మనిషేనా?ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాంగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్ప్లాంట్ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్ జగన్ ప్రకటించారు. -
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది. ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.కత్తితో పొడిచి..మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.


