Hyderabad
-
'ఉత్త'రాదే.. కరువు ముప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి సీజన్ వానలు సాధారణ స్థితిలోనే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ స్థితిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. కొన్నిచోట్ల మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వివరించింది. గతేడాది సీజన్తో పోలిస్తే తక్కువ వర్షాలు కురుస్తాయని, కానీ ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయని, ఆయా జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. మరింత స్పష్టమైన అంచనాలను వచ్చే నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నైరుతి సీజన్కు సంబంధించిన ముందస్తు అంచనాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాల్లో స్పష్టం చేసింది. ఉత్తరాది జిల్లాలకు కరువు ముప్పు!రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాలు కరువు బారిన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదు కావొచ్చని పేర్కొంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రైతులు పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన భగ భగలు..రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మెజార్టీ జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు మరో మూడురోజుల పాటు నమోదైతే వడగాడ్పుల ప్రభావం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో 43.3 డిగ్రీ సెల్సీయస్ అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, నల్లగొండలో 23.6 డిగ్రీ సెల్సీయస్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’ అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.తమిళనాడు సీఎంకు లేఖ: తమిళనాడు సీఎంకు కూడా రేవంత్రెడ్డి లేఖ రాశారు. లోక్సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్కు లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.లోక్సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. -
హైదరాబాద్లో ఘనంగా ఖాల్సా సాజ్నా దివస్
హైదరాబాద్: ఖాల్సా పంథ్ స్థాపనకు గుర్తుగా జరుపుకునే “వైశాఖి” పండుగను తెలంగాణ సిక్కు సమాజం మంగళవారం భక్తి, శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించింది. అమీర్పేట్లోని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య కార్యక్రమాలను అమీర్పేట్లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది సిక్కు భక్తులు, ఇతర మతాల ప్రజలు “విశాల్ దీవాన్” (మహా సభ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు, కథాకారులు గురుబాణీ కీర్తనలు, ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారు.వారు గురు గ్రంథ్ సాహిబ్ బోధనలు, ఖాల్సా పంథ్ స్థాపన విశిష్టత, జీవన విలువల ప్రాముఖ్యతపై వివరించారు. జాతీయ ఐక్యత, సౌభ్రాతృత్వం, సామరస్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాయ్ ఎస్.గురుదేవ్ సింగ్ (ఆస్ట్రేలియా), జ్ఞాని గగన్దీప్ సింగ్ జీ (పట్నా సాహిబ్), భాయ్ ఎస్. మన్ప్రీత్ సింగ్ జీ (ఢిల్లీ), భాయ్ వీర్ సింగ్ (హైదరాబాద్) తదితర ప్రముఖులు గురుబాణీ కీర్తనలు, కథలు వినిపించారు.గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎస్.దర్శన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. సురేందర్ సింగ్ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులను ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ సంప్రదాయ “గురు కా లంగర్” (ఉచిత భోజనం) వడ్డించారు.రంగురంగుల నగర్ కీర్తన్ నిర్వహణసాయంత్రం గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ నుంచి భారీగా నగర్ కీర్తన్ (పవిత్ర ఊరేగింపు) ఉంటుంది. ఈ ఊరేగింపు గ్రీన్లాండ్స్, బేగంపేట్, పంజాగుట్ట ప్రధాన మార్గాల మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ను అలంకరించిన వాహనంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకెళ్తారు. నిశాన్ సాహిబ్ పతాకదారులు ముందుండగా, యువత గట్కా (సిక్కు యోధ కళ) ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. కీర్తన బృందాలు శబ్ద కీర్తనలు ఆలపిస్తారు. బుధవారం (ఏప్రిల్ 15) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 1.30 గంటల వరకు అమీర్పేట్లోని గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో “వైశాఖి రేన్ సబాయ్ కీర్తన్ దర్బార్” నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు శబ్ద కీర్తనలు ఆలపించనున్నారు. -
పోలీస్ అధికారినంటూ.. ఏకంగా 67 పెళ్లిళ్లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకొని తాను సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానంటూ శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన బాలకృష్ణ.. మ్యాట్రిమొనీ డాట్కామ్లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసి మోసం చేస్తున్నాడు.కొన్ని రోజులుగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి ఎయిర్పోర్ట్లో హల్చల్ చేస్తోన్న శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.కాగా, డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేస్తోన్న నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత ఏడాది(2025) నవంబర్లో కూడా ఓ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు.అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత దాకా ఆపరేషన్ నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా అంటోంది. ఐలాపూర్లో ఓ భారీ భవనంపై కూల్చివేతపై కోర్టు సోమవారం స్టే ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భవనం పూర్తిగా కూల్చకుండా వదిలేసింది హైడ్రా. కూల్చకుండా వదిలేస్తే పక్కన ఉన్న భవనంపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిగా కూల్చాల్సిందేనని అంటున్నారు. కానీ.. హైడ్రా చర్య కోర్టు ధిక్కరణ(కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కిందకే వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఒకవేళ మొండిగా కూల్చివేతలు మొదలుపెడితే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఏం జరిగిందంటే.. శనివారం అమీన్పూర్ మండల పరిధిలో పలు చోట్ల అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. ఆ సమయంలోనూ విపరీతమైన గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలతో కూల్చివేత ఆగిందని కాసేపు.. హైడ్రానే కావాలని కాసేపు కూల్చివేతలు ఆపిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఈలోపు ఐలాపూర్ కూల్చివేతలపై ఓ వృద్ధుడు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కూల్చివేతకు దిగారని పేర్కొన్నారు. అయితే.. హైడ్రా తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదిస్తూ.. కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందేనని.. పైగా ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదంటే తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. -
సింగర్ మంగ్లీ కేసులో హైడ్రామా
హైదరాబాద్: సింగర్ మంగ్లీ కేసులో పంజగుట్ట పోలీస్స్టేషన్లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయవాది సుబ్బారావు అలియాస్ సుబ్బు సోమవారం పంజగుట్ట పోలీస్స్టేషన్కు భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు రాగా అతని నుంచి ఆల్కహాల్ వాసన వస్తుందని పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్ రావడంతో డ్రైవింగ్ చేసేందుకు అనుకూలమే కాని మద్యం తాగి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదికి మధ్యలో వాగ్వాదం చేటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలపై తనకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పంజగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. గత వారం మధు అనే వ్యక్తి, సింగర్ మంగ్లీ తమ్ముడు తనను బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారని అయితే ఆధారాలు సమరి్పంచాలని కోరినా ఆయన స్పందించలేదన్నారు. అయితే సత్యవతి అలియాస్ మంగ్లీ తనను బెదిరిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేశారని ఆదివారం ఫిర్యాదు చేశారని.. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
గ్యాస్ కొరత తీవ్రం.. కొత్త కనెక్షన్ల జారీ నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పరిణామాలు సామాన్యుల వంటగదిలో అగ్గి రాజేస్తున్నాయి. ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు గ్యాస్ కొరత, రీఫిల్ బుకింగ్ గడువు పెంపు ప్రభావం కొత్త కనెక్షన్ల డిమాండ్ను ఒక్కసారిగా పెంచేసింది. అయితే చమురు సంస్థలు డొమెస్టిక్ కనెక్షన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త కనెక్షన్ల జారీపై అప్రకటిత నిషేధాన్ని విధించాయి. ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు 90 శాతం హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే రావాలి. కానీ, ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఆ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,611 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని కేవలం పాత వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చి సర్దుబాటు చేయాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వడం వల్ల డిమాండ్ మరింత పెరిగి నిల్వలు సరిపోక సిస్టమ్ ‘కొలాప్స్’అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. కొత్త కనెక్షన్ల అప్లికేషన్ల ప్రక్రియను ఏజెన్సీలస్థాయిలో నిలిపేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబాల్లో ‘గ్యాస్’గుబులు గతంలో సిలిండర్ బుక్ చేసిన 15 రోజులకు మరో బుకింగ్కు వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం అర్బన్లో 25 రోజులకు, రూరల్ ప్రాంతాల్లో 45 రోజులకు పెరిగింది. బుక్ చేసిన తర్వాత డెలివరీకి మరో 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఉమ్మడి కుటుంబాల్లో ఒక్క కనెక్షన్ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లోని ఇతర సభ్యుల పేర్ల మీద కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. కొత్తగా విడిపోయిన చిన్న కుటుంబాలు, విద్యార్థులు, వలస కారి్మకుల నుంచి కూడా దరఖాస్తుల తాకిడి సాధారణం కంటే మూడు రెట్లు పెరగడం కొత్త కనెక్షన్ల నిలుపుదలకు ప్రధాన కారణమైంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకు 40 వేల దరఖాస్తులు వస్తుండగా, ప్రస్తుతం కేవలం పది రోజుల్లోనే ఆ సంఖ్య దాటిపోయినట్లు తెలుస్తోంది.డబుల్ సిలిండర్ కోసం క్యూ సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిలిండర్ ఖాళీ అయితే నెలరోజుల వరకు కొత్తది వచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండో సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి సాధారణంగా వచ్చే దరఖాస్తులు కంటే ఐదింతలు దాటాయి. అయితే, నిల్వల కొరత సాకుతో వీటిని కూడా ఏజెన్సీలు పెండింగ్లో పెడుతున్నాయి. -
‘దమ్ముంటే పట్టుకోరా’.. ఓఆర్ఆర్పై జంటల బైక్ స్టంట్స్
మణికొండ: ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై రెండు జంటలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశాయి. ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థ నిర్వాహకులకు, ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులకు సవాల్ విసిరాయి. వాస్తవానికి ఓఆర్ఆర్పై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. కానీ, నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వైపు నుంచి పుప్పాలగూడ(నానక్రాంగూడ) టోల్గేట్ వైపు రెండు ద్విచక్ర వాహనాలపై రెండు జంటలు సోమవారం రాత్రి ప్రయాణిస్తుండగా అటుగా వెళుతున్న వారు వీడియో తీసి ‘ఎక్స్’లో పోస్ట్ చేయటంతో అది వైరల్ అయింది. దానికి అనేకమంది అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’అనే కామెంట్కు అత్యధిక లైక్లు వచ్చాయి. దాంతో ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థతోపాటు నార్సింగి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియో ఆధారంగా రెండు వాహనాల నెంబర్లను గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. అక్కడున్న టోల్గేట్ సిబ్బంది ఎందుకు ఆపలేదనే విషయాన్ని వ్యవస్థలు పరిశీలిస్తున్నాయి. వాహదారులతోపాటు టోల్ గేట్ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. View this post on Instagram A post shared by SuryaChandraTimes (@suryachandratimes) -
రేపట్నుంచి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్విసెస్–తెలంగాణ (దోస్త్–2026) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సోమవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 969 కాలేజీలు దోస్త్ పరిధిలోకి వస్తాయి.వీటిల్లో 4,40,107 సీట్లున్నాయి. గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల డిగ్రీలో అడ్మిషన్లు పెరుగుతాయని బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొ.ఎస్కే మహమూద్, ప్రొ.ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు. దోస్త్ మూడు దఫాలుగా..: ఈ ఏడాది కూడా డిగ్రీ కోర్సుల్లో సీట్లను మూడు విడతల్లో భర్తీ చేస్తారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెల 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30న కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ను నిర్వహిస్తారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి. -
మేడిగడ్డకు డయాఫ్రమ్ వాల్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణలో భాగంగా బరాజ్కు ఎగువ, దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తేనే బరాజ్ నాలుగు కాలాలపాటు మన్నికగా ఉంటుందని నిపుణులు నిర్ధారించారు. కాళేశ్వరం బరాజ్లకు షీట్పైల్స్తో ఫౌండేషన్ వేసేలా తొలుత డిజైన్లు తయారు చేయగా, సత్వరంగా నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో సికెంట్ పైల్స్కి మార్చారు. పునాదుల కింద రక్షణగా ఉండే సికెంట్ పైల్స్ ఏర్పాటులో లోపాలతో బరాజ్ల కింది నుంచి ఇసుక జారిపోయి మూడు బరాజ్లలోనూ కట్టిన తొలినాళ్లలోనే బుంగలు ఏర్పడ్డాయి. ప్రధానంగా మేడిగడ్డలోని ఏడో బ్లాక్ కుంగిపోవడానికి ఇదే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తేల్చింది. మేడిగడ్డ బరాజ్కు శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్ కడితే పునాదుల కింద ఒత్తిడి తగ్గి ఇసుక జారడం ఆగిపోతుందని నిపుణులు అభిప్రాయానికి వచ్చారు. నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిపిన సమీక్షలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జియోఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు అందిన తర్వాత దీని నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీనితోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో స్టిల్లింగ్ బేసిన్ (స్పిల్వే గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని నిరీ్వర్యం చేసే కాంక్రీట్ రక్షణ వ్యవస్థ)ను విస్తరించాలని నిర్ణయించారు. స్పిల్ వే నుంచి కిందికి దూకే వరద ఉధృతిని తట్టుకోవడంలో స్టిల్లింగ్ బేసిన్ విఫలం కావడంతో బరాజ్లు విఫలమైనట్టు ఇప్పటికే నిర్ధారించారు. దాంతో మూడు బరాజ్లలోనూ స్టిల్లింగ్ బేసిన్ను పెంచే పనులను వచ్చే అక్టోబరు నుంచి చేపట్టనున్నారు. డయాఫ్రం వాల్ పనులకు రూ.1500 కోట్లు మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకే దాదాపు రూ.2500 కోట్ల దాకా వ్యయం కానుందని ప్రాథమిక అంచనా. బరాజ్ ఎగువ, దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్ పనులకే రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల దాకా ఆయ్యే అవకాశాలున్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేయాలంటే ఎగువ, దిగువ భాగంలో కాఫర్ డ్యామ్ కట్టాలి. దీనికి మరో రూ.400 కోట్లు, కుంగిపోయిన ఏడో బ్లాక్ పునరుద్ధరణకు రూ.500 కోట్ల దాకా అయ్యే అవకాశాలున్నాయి. మేడిగడ్డలోని మూడు బ్లాకులు (6, 7, 8) దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూడు బ్లాకులను శాశ్వతంగా తొలగించి, వాటి స్థానంలో కొత్త బ్లాకులు కట్టాలా..? లేక ఏడో బ్లాకు మాత్రమే తొలగించాలా? అనేది పరీక్షల ద్వారా తేలనుంది. బరాజ్ల పునరుద్ధరణ, మరమ్మతులకు ఖర్చు తొలుత ప్రభుత్వం భరించి తర్వాత కాంట్రాక్టర్ల నుంచి రాబట్టుకోవాలని భావిస్తున్నారు. -
హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాకు ఉన్నత న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదా తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధనలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను సమర్పించాలని స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్లు అభిప్రాయపడింది. పెత్తందారీ విధానం, చట్టవిరుద్ధ చర్యల కారణంగా వందలాది పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పింది. చాలా పిటిషన్లలో స్పష్టమైన కౌంటర్లు దాఖలు చేయలేదని, సంస్థ తీరు సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఐలాపూర్ కూల్చివేతలపై స్టేటస్కో ఆదేశాలు పాటించాలని చెబుతూ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. వెయ్యి ఎకరాల కబ్జాకు యత్నం: ఏఏజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘సంగారెడ్డిలోని కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి పిటిషనర్ ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందే. ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవు’అని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘కూల్చివేసిన భవనం కోర్టు విచారణలో ఉన్న ఆస్తిలోని ఓ భాగం. ఆ కేసులోనే వివాదాస్పద డిక్రీ జారీ అయ్యింది. 2006లో నాటి ఉమ్మడి ప్రభుత్వంపై పిటిషనర్ ఈ దావా వేశారు. అలాగే, 2024లో ప్రతివాద అధికారులు జోక్యం చేసుకున్నప్పుడు పిటిషనర్ రిట్ పిటిషన్ కూడా వేశారు. రిట్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సంబంధిత స్థలంలో ప్రస్తుతమున్న నిర్మాణాలను తొలగించడానికి, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది పట్టించుకోకుండా హైడ్రా అధికారులు ఈ నెల 11న తెల్లవారుజామున 4 గంటలకు పిటిషనర్ స్థలానికి వచ్చి భవనాన్ని కూల్చివేశారు. 2005లో అధికారులు ఇచ్చిన అనుమతి మేరకే భవనాన్ని నిర్మించారు. (భవన కూల్చివేత వీడియో దృశ్యాలను కూడా న్యాయస్థానం ముందు ప్రదర్శించారు). వాదనలు విన్న న్యాయమూర్తి సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. నోటీసులు జారీ చేయకుండా.. ‘పిటిషనర్ న్యాయవాది సమర్పించిన వీడియోను పరిశీలిస్తే.. హైడ్రాకు చెందిన వందలాది మంది సిబ్బంది ఆ స్థలంలో గుమిగూడినట్లు స్పష్టమవుతోంది. పిటిషనర్కు చెందిన భారీ భవనం కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించారని భావించినా, ఇంత భారీ నిర్మాణం చేపట్టే వరకు అధికారులు ఏం చేస్తున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అనధికార నిర్మాణాన్ని గమనించి ప్రారంభంలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి చక్కబడి ఉండేది. దానికి బదులుగా.. అధికారులు కళ్లు మూసుకుని, ఓ భారీ నిర్మాణం జరగడానికి అనుమతించి.. ఇప్పుడు నిర్మాణం అక్రమమంటూ న్యాయస్థానం ముందు ఫిర్యాదు చేస్తున్నారు’అని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ప్రామాణిక విధానమేదీ... ‘ఏదేమైనా అనుమతి లేకున్నా ఓ భవనాన్ని కూల్చివేసే సమయంలో సహజ న్యాయ సూత్రాలు పాటించాల్సిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు.. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా హైడ్రా సిబ్బందిని మోహరించింది. ఇది సహించరానిది. ఫొటోలు, వీడియో క్లిప్పింగ్లను పరిశీలించిన తర్వాత హైడ్రా ఎలాంటి ప్రామాణిక పద్ధతులను పాటించడం లేదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. యాజమాన్య హక్కుకు సంబంధించి వివాదమున్న సందర్భాల్లో అవతలి పక్షానికి నోటీసు జారీ చేసిన తర్వాతే చర్యలు చేపట్టాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కూల్చివేతలు చేపట్టామని హైడ్రా వాదిస్తూ తన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో అనేక జలాశయాలను పునరుద్ధరించినట్లు హైడ్రా గర్వంగా ప్రచారం చేసుకుంటోంది. హైడ్రా.. పెత్తందారీ చర్యలకు వ్యతిరేకంగా వందలాది కేసులు దాఖలయ్యాయన్నది వాస్తవం. అలాంటి పిటిషన్లలో హైడ్రా ఎలాంటి ప్రామాణిక విధానాన్ని అనుసరించలేదు. హైడ్రా ఏర్పడి ఏడాదైనా జీహెచ్ఎంసీ లేదా పురపాలక సంఘాల చట్టంలోని నిబంధనలను అనుసరిస్తోందా? లేదా? అనేది తెలియడం లేదు. ఆ సంస్థ చర్యలు చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు సదరు ఆస్తి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలి. జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర వర్తించే నిబంధనలు, నియమాలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను హైడ్రా ఈ కోర్టు ముందుంచాలి. అప్పటివరకు అనధికార నిర్మాణం, అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు లాంటి చర్యలను హైడ్రా చేపట్టవద్దు’అని న్యాయమూర్తి ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. నకిలీ నోటీసులపై ఫిర్యాదుతెలంగాణ హైకోర్టు పేరిట హైడ్రాకు నకిలీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ రంగనాథ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. రిస్క్ చేయాల్సిందే!ఫాతిమా కాలేజీ విషయంలో దాఖలైన ఓ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సల్కం చెరువులో కాలేజీ నిర్మించారని.. ఇంతదాకా హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫాతిమా కాలేజీలో జాయిన్ అయ్యేవాళ్లు రిస్క్ చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాలేజీ నోటీసు బోర్డులో ఈ విషయాన్ని పేర్కొనాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
సమ్మెకు సై
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో ఆర్టీసీలోని ఓ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 22న తెల్లవారుజామున తొలి షిఫ్ట్ నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఆర్టీసీలోని మరో జేఏసీ, కొన్ని ఇతర సంఘాలు తటస్థంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, గత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టీసీ కార్మీక సంఘాల పునరుద్ధరణ, బకాయి ఉన్న రెండు వేతన సవరణల అమలు, అంతకుముందు వేతన సవరణ బకాయిల చెల్లింపు, ఆర్టీసీ వాడేసుకున్న ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ నిధుల తిరిగి చెల్లింపు, ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందివ్వటం, కార్మికులపై తీవ్ర పనిఒత్తిడి ఉన్నందున వెంటనే ఖాళీలను భర్తీ చేయటం.. ఇలా మొత్తం 32 డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది. గత ఏడాది కాలంగా ఈ డిమాండ్ల సాధనకు ఒత్తిడి తెస్తున్నా ఫలితం లేదు. దీంతో సమ్మెకు సిద్ధమన్న సంకేతాలిచ్చింది. అయినా స్పందన లేకపోవటంతో, గత నెల 13న సమ్మె నోటీసు ఇచ్చింంది. దీంతో గత నెలాఖరులో చర్చలకు రావాల్సిందిగా కార్మీక శాఖ కమిషనర్ కార్యాలయం ఆహ్వానించింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాల కారణంగా చర్చలను అర్ధంతరంగా రద్దు చేసింది. తిరిగి ఈనెల 8న మరోసారి చర్చలకు ఆహ్వానించింది. జేఏసీ నేతలు వచ్చింనా, ఆర్టీసీ అధికారులు గైర్హాజరు కావటంతో 13న మరోసారి చర్చలకు పిలిచింది. ఈసారి ఆర్టీసీ అధికారులు గైర్హాజరైతే, తాము మాత్రం సమ్మె తేదీ ప్రకటించి సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు అప్పుడే ప్రకటించారు. అనుకున్నట్టు గానే సోమవారం చర్చలకు ఆర్టీసీ అధికారులు రాలేదు. డిమాండ్లకు సంబంధించి ఐదు అంశాలు తమ పరిధిలో లేవని, అవి ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వాటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంటూ అధికారులు కార్మీక శాఖ ఉప కమిషనర్ కార్యాలయానికి ఓ లేఖ పంపారు. దీంతో చర్చలు విఫలమైనట్టుగానే జేఏసీ నేతలు పేర్కొంటూ, సంప్రదింపులకు స్వస్తి పలికామని, ఈనెల 22 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, చర్చల అనంతరం ప్రకటించారు. కార్మీక సంఘాలే లేనప్పుడు చర్చలెవరితో... సోమవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం వాటితో చర్చిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా, అసలు ఆర్టీసీలో కార్మీక సంఘాలే లేనప్పుడు కార్మీక నేతలతో చర్చల అంశానికి తావెక్కడిదని సమాధానమిచ్చారు. ప్రజా ఉద్యమంగా మారుస్తాం: జేఏసీ ఈనెల 22న తెల్లవారుజాము నుంచి సమ్మె మొదలు పెట్టాలని నిర్ణయించినందున, మంగళవారం నుంచి తాము ప్రజల్లోకి వెళ్తామని జేఏసీ నేతలు థామస్రెడ్డి, వెంకన్న తెలిపారు. ఈ సమ్మెను కార్మీకుల సమ్మెగా కాకుండా ప్రజాఉద్యమంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తాము ప్రభుత్వం ముందుంచిన 32 డిమాండ్లు సహేతుకమైనవేనని, వాటిని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
హైబ్రిడ్గా సీట్లు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోందని.. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన రెండు వేర్వేరనే విషయాన్ని మరుగున పెట్టి, రెండింటినీ జనాభా లెక్కల తర్వాత ఆమోదింప చేసుకోవాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని.. ప్రపంచంలోనే భారత్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక నిర్మాణం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్ల పెంపు జరగాలని డిమాండ్ చేశారు. అందుకోసం ‘హైబ్రిడ్ మోడల్’ అవసరమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పెంచబోయే 272 లోక్సభ స్థానాల్లో 136 సీట్లను జనాభా ప్రాతిపదికన మరో 136 సీట్లను జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలతో కలిసి సచివాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...హైబ్రిడ్ విధానంతో సమన్యాయానికి అవకాశం‘దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించడం తగదు. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే దానికి మేం వ్యతిరేకం. అందుకే హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నాం. లోక్సభలో ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం మేర పెంచితే సీట్లు 816కు చేరుతాయి. పెరిగే 272 సీట్లలో 136 దామాషా (ప్రొరాటా) ప్రకారం పెంచుకొని మరో 136 సీట్లను ఆర్థికంగా దేశానికి అందిస్తున్న సేవల ఆధారంగా పెంచాలి. ఈ సీట్ల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2027 మార్చి 31లోగా జనగణన, 2028 మార్చిలోగా పునర్విభజన పూర్తి చేసి 2029లో పెరిగిన సీట్లతో ఎన్నికలకు వెళ్లవచ్చు’అని రేవంత్ సూచించారు.మహిళా బిల్లు, పునర్విభజన బిల్లును కలపడం రాజకీయ కుట్ర‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకటిగా చూపిస్తూ కేంద్రం హడావుడి చేస్తోంది. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. వేర్వేరుగా చర్చించి అమలు చేయాలి. మహిళల రిజర్వేషన్ బిల్లు విషయంలో ఆలస్యం చేయడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు–2013లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ బీజేపీ సహకరించకపోవడంతో లోక్సభలో నిలిచిపోయింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మహిళలు లోక్సభలో ఉండేవారు. 2026 జనాభా లెక్కల తర్వాత అంటే మహిళల హక్కులను వాయిదా వేయడమే. నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలి’అని సీఎం సూచించారు.జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో దక్షిణానికి అన్యాయం‘దేశంలో 1970 ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాయి. అందుకే జనాభా తగ్గింది. ఉత్తరాదిలో నియంత్రణ లేకపోవడంతో జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితేం మంచి పనిచేసిన రాష్ట్రాలను శిక్షించినట్లే అవుతుంది. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గమనించి లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు. 2001లో వాజ్పేయి పునర్విభజన బిల్లుపై చట్ట సవరణ చేశారు. చట్టపరంగా సీట్ల పెంపుపై నిషేధం విధించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమని దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతోపాటు ప్రధానికి లేఖ రాశాయి. దాంతో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామంటున్నారు. 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ 50 శాతం పెంచితే 90 సీట్లకు అంతరం పెరుగుతుంది. తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి. 50 శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లున్న ఉత్తరాదిలో 621 సీట్లు అవుతాయి. దక్షణాది, ఉత్తరాద మధ్య అంతరం 412 సీట్ల నుంచి 620 సీట్లకు పెరుగుతుంది. దీనివల్ల ఒక్క తెలంగాణకే కాదు... దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోపాటు గోవా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా అన్యాయమే జరుగుతుంది. తద్వారా దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది. ఇది దేశ సమతౌల్యానికి ప్రమాదకరం’అని సీఎం రేవంత్ హెచ్చరించారు.బండి సంజయ్, కిషన్రెడ్డి మోదీ ఇంటి ముందు బంట్రోత్తులుగానే..‘50 శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచే ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మోదీ గుజరాత్ వదిలి యూపీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి కాబట్టి. అందుకే హైబ్రిడ్ విధానంలో దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్న రాష్ట్రాలకు 50 శాతం కేటాయించాలి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. 50 శాతం మెరిట్, 50 శాతం రిజర్వేషన్ అని. దానినే కేంద్రం ఉపయోగించాలి’అని సీఎం సూచించారు.మహిళలకు బీజేపీ అన్యాయం చేసింది‘బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పాటైంది. ఇప్పటివరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియమించలేదు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టే బీజేపీకి మహిళలపై గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమవుతుంది. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం. మా ఎంపీలు తెలంగాణను సాధించారు. ఇప్పుడు పునర్విభజనపైనా పోరాడుతారు. దక్షణాది రాష్ట్రాలతోపాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంటులో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం. అన్ని దక్షణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపై లేఖ రాస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. -
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మేనిఫెస్టోలో ఇచ్చినట్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేయనున్నాం. మేనిఫెస్టోలో ఉన్నవే మేం అడుగుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
SRH vs RR: మ్యాచ్కు వెళ్తున్నారా?.. వీటిపై నిషేధం
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ను సోమవారం ఢీకొట్టనుంది. కాగా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో సన్రైజర్స్ ఒకటి మాత్రమే గెలిచింది.ఆసక్తికర పోరుమరోవైపు.. రాజస్తాన్ నాలుగు విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అయితే, సొంతమైదానంలో సత్తా చాటాలని సన్రైజర్స్ పట్టుదలగా ఉండగా.. రాజస్తాన్ ఫామ్ను కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుండగా.. మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అటు రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. ఇటు సన్రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్ ప్రేక్షకులు స్టేడియానికి తీసుకురాకూడని వస్తువుల గురించి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఫొటో విడుదల చేసింది. నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదని హెచ్చరించింది. స్టేడియంలో వస్తువులు భద్రపరిచేందుకు ఎలాంటి క్లాక్రూమ్ అందుబాటులో ఉండదని తెలిపింది.స్టేడియానికి తీసుకువెళ్లకూడని నిషిద్ధ వస్తువులు ఇవే👉కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలు👉బ్లూటూత్ హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, ఎయిర్పాడ్స్👉సిగరెట్లు, లైటర్, అగ్గిపెట్టె👉తుపాకులు, కత్తులు, ఇతరత్రా ఆయుధాలు👉నీళ్ల బాటిళ్లు, ఆల్కహాల్, కూల్డ్రింక్స్👉పెంపుడు జంతువులు👉తినుబండారాలు👉బ్యాక్పాక్స్, హ్యాండ్బ్యాగ్స్👉ల్యాప్టాప్స్, సెల్ఫీ స్టిక్కులు👉హెల్మెట్స్, బైనాక్యులర్స్👉పేలుడు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్👉డ్రగ్స్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీపై నిషేధం? -
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె. ‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
ఈ నెల 20 నుంచి ఆర్టీసీ సమ్మె?
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మరో సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు ( సోమవారం) సాయంత్రం లేబర్ కమిషనర్తో ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చలు జరపనున్నట్లు యూనియన్ ప్రకటించింది. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2026 సంవత్సరానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి తొలివిడత పరీక్షకు పచ్చజెండా ఊపింది. విద్యాశాఖ అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపగా, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అనుమతి ఇచ్చారు. దాంతో నోటిఫికేషన్ విడుదలైంది.పరీక్ష విధానం: టెట్లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ప్రాథమిక పాఠశాల (క్లాస్ 1–5) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. పేపర్–2లో ఉన్నత ప్రాథమిక పాఠశాల (క్లాస్ 6–8) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఒకే పేపర్ లేదంటే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.అర్హతలు: పేపర్–1కు దరఖాస్తు చేసుకోవాలంటే D.El.Ed లేదా B.Ed (ప్రాథమిక) అర్హత ఉండాలి. పేపర్–2కు B.Ed లేదా సంబంధిత విద్యా అర్హత అవసరం. కనీసం 50% మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.ఫీజు: ఆన్లైన్ ద్వారా టీజీ టెట్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే చెల్లింపులు స్వీకరించబడతాయి. హాల్టికెట్లు: జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు: జూలైలో ప్రకటించే అవకాశం ఉంది. -
విజయశాంతి రెడ్డి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి తన ప్రాణాలకు హాని ఉందని పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. విజయా రెడ్డి తల్లి, సోదరులు.. ఆస్తిక కోసం ఎంతకైనా తెగిస్తారని తన ఫిర్యాదులో పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది.వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయా రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, విజయారెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయా రెడ్డి తల్లి సహా ఆమె సోదరుడిపై సురేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి.. సొంత వాళ్లే నా కుటుంబాన్ని నాశనం చేశారు. నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్ల కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేసింది. వాళ్లు చనిపోయిన 25 రోజులకే నన్ను కూడా ఆస్తి కోసం బెదిరించారు. నా అత్త అంటే విజయా రెడ్డి తల్లి, నా బామ్మర్ది చిరంజీవి, అతని భార్య వేధింపులు, ఆస్తి కోసం వాళ్లు ఒత్తిడి చేయటం వల్లే విజయా రెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది.ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారు. నా భార్య, పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. ఆస్తి కోసం నన్ను బెదిరించారు. ఆస్తి కోసం వాళ్లు ఎంతకు అయినా తెగిస్తారు. నేను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్లకు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్లు ఉన్నారు. నేను చనిపోతే నా ఆస్తులు నా తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు రాస్తాను. వారితో నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి’ అంటూ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. విజయా రెడ్డి భర్త గతంలో దుబాయ్లో ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. బోడుప్పల్లోని చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్న పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38), ఆమె కూతురు చైతన్య రెడ్డి (18), కొడుకు విశాల్ రెడ్డి (17) జనవరి 31న ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి తమ కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లిన ముగ్గురు.. అనంతరం సనత్నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. విజయ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేశారు. -
ఓయూ విద్యార్థి నాయకుని వివాహానికి సీఎం
ఉస్మానియా యూనివర్సిటీ: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్లో జరిగిన ఓయూ విద్యార్థి నాయకుడు రెడ్డి శ్రీనివాస్, మమత వివాహానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ సీఎం రేవంత్రెడ్డికి 15 సంవత్సరాలుగా అనుచరుడిగా కొనసాగుతున్నారు. వివాహానికి రేవంత్రెడ్డి విచ్చేసి ఆశీర్వదించినందుకు నూతన దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో సమగ్ర కులగణన జరిగితేనే దేశంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే చేపట్టే జనగణనలో అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన ప్రజాభవన్లో ‘క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
మీర్పేట ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలు
హైదరాబాద్: ఓ కేసు విషయమై ఫిర్యాదుదారును మద్యం బాటిళ్లు అడిగిన మీర్పేట సబ్ ఇన్స్పెక్టర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నగర సీపీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఎస్ఐని ఆదివారం హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ఇన్స్పెక్టర్ శంకర్నాయక్, ఫిర్యాదుదారు కథనం ప్రకారం వివరాలు.. మీర్పేట పోలీస్స్టేషన్ పరిధి లెనిన్నగర్కు చెందిన తిరుపతయ్య గతంలో వెంకటేశ్ అనే వ్యక్తి వద్ద 11.05 గజాల స్థలంలోని షెటర్ను కొనుగోలు చేశారు. ఇటీవల అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యులు షెటర్పై నిర్మాణం చేపట్టడంతో 2 గజాల స్థలాన్ని ఆక్రమించారంటూ తిరుపతయ్య ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 10న ఎస్ఐ నాగభూషణం.. తిరుపతయ్యకు ఫో న్ చేసి రెండు మద్యం బాటిళ్లు కావాలని అడిగా రు. న్యాయం చేయకపోగా మద్యం బాటిళ్లు అడగటంతో తిరుపతయ్య.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఆదేశాల మేర కు ఎస్ఐ నాగభూషణాన్ని హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపారు. -
ఇటు సూర్యవంశీ.. అటు సూర్యరశ్మి..
హైదరాబాద్: ఐపీఎల్– 19లో సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ క్రీడాకారులుప్రాక్టీస్ చేశారు. ఇటీవల బ్యాటింగ్తో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ స్టేడియమంతా కలియతిరుగుతూ జట్టు సభ్యుల్ని ఉత్సాహపరిచారు.‘సన్’డే.. సూరీడు చెలరేగిపోయాడు. నగరంలో ప్ర‘తాపం’ చూపించాడు. ఎండ తీవ్రతతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం సెలవురోజు అయినా బయటికి రాలేకపోయారు. సాయంత్రం కూడా వేడి సెగలతో ఉక్కపోతకు గురయ్యారు. షాపుల్లోంచి పలువురు ఏసీలు, కూలర్లు కొనుక్కువెళ్లారు. వాహనాల సంచారం లేక రహదారులు బోసిపోయాయి. -
గ్రామీణం.. గురుకులం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి అత్యంత గ్రామీణ నేపథ్యమున్న జిల్లాలు సత్తా చాటాయి. మరోవైపు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్ఆర్ఈఐఎస్) సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. ఆదివారం ఇంటర్మిడియెట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంయుక్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.ఫస్టియర్, సెకెండియర్ నుంచి మొత్తం 9,43,055 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా..వీరిలో 6,65,791 మంది (70.60%) ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,84,537 మంది బాలికలకు గాను 3,78,554 మంది (78.13%) ఉత్తీర్ణులవగా.. మొత్తం 4,58,518 మంది బాలురకు గాను 2,87,236 మంది (62.64%) ఉత్తీర్ణులయ్యారు. అంటే బాలికలు 15.49% అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నమాట. గతే డాది మొత్తం ఉత్తీర్ణత 65.81% నమోదు కాగా... ఈసారి 4.79% పెరిగి 70.60% నమోదైంది. ఫస్ట్, సెకెండియర్లో ఇలా.. ఫస్టియర్లో 2,49,110 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,85,331 మంది (74.40) ఉత్తీర్ణులయ్యారు. 2,40,013 మంది బాలురకు గాను 1,38,475 మంది పాసై 57.69% ఉత్తీర్ణత నమోదు చేశారు. సెకెండియర్లో 2,35,427 మంది బాలికలు హాజరు కాగా 1,93,223 (82.07%) మంది పాసయ్యారు. 2,18,505 మంది బాలురకు గాను 1,48,761 (68.08%) మంది పాసయ్యారు. అట్టడుగున మహబూబాబాద్, సిరిసిల్ల జిల్లాలుఇంటర్ ఫలితాల్లో మేడ్చల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా..సెకెండియర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఫస్టియర్ టాప్ మూడు జిల్లాలుగా మేడ్చల్, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాలు నిలవగా..విద్యార్థులు డిగ్రీలో ప్రవేశించేందుకు కీలకమైన సెకెండియర్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు విజయభేరి మోగించి ముందువరుసలో నిలవడం గమనార్హం. కాగా ఫస్టియర్లో 48.10% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉండగా, సెకెండియర్లో 55.68% ఉత్తీర్ణతతో రాజన్న సిరిసిల్ల జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్జేసీ టాప్ ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్ఆర్ఈఐఎస్) పరిధిలోని జూనియర్ కాలేజీలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. సొసైటీ పరిధిలో మొత్తం 35 జూనియర్ కాలేజీలున్నాయి. ఫస్టియర్లో 2,560 మంది పరీక్షలు రాయగా 2,374 (92.73%) మంది పాసయ్యారు. సెకెండియర్లో 2,413 మంది పరీక్షలు రాయగా 2,269 (94.03%) మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ఈ సొసైటీ కాలేజీలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనార్హం. ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు ఇలా.. విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూల్స్లో ఇంటర్మిడియెట్ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి ఫస్టియర్లో 68,100 మంది పరీక్షలు రాయగా సగానికంటే తక్కువగా 28,937 (42.49%) మంది మాత్రమే పాసయ్యారు. సెకెండియర్లో ఉత్తీర్ణత కాస్త మెరుగ్గా ఉంది. 58,743 మందికి గాను 35,165 (59.86) మంది పాసయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల నుంచి ఫస్టియర్లో 3,30,811 మంది పరీక్షలకు హాజరు కాగా 2,31,535 మంది పాసై 69.99% ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్లో 2,97,951 మంది రాయగా.. 2,13,250 (71.57%) మంది ఉత్తీర్ణులయ్యారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు నేటి నుంచి చాన్స్ ప్రస్తుత ఫలితాలకు సంబంధించి విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్్ట్స కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపర్కు రూ.100 చొప్పున చెల్లించాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్కు సిద్ధం కండి: కేకే ఫలితాలు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు చింతించకుండా అడ్వాన్స్డ్ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇంటర్మీడియెట్ అనేది భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని అన్నారు. ఫలితాల విడుదలలో అధికారుల కృషిని అభినందించారు. కాగా ఇంటర్ ఫలితాలను అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టి ప్రకటించామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో మూల్యాంకనం నిర్వహించామన్నారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు వెల్లడించింది. మే 13వ తేదీ నుంచి వీటిని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రాక్టికల్ పరీక్షలను ఇదే నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షల ఫీజును ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య సంబంధిత కాలేజీలో చెల్లించాలని సూచించింది. గత ఏడాది గణాంకాలు పునరావృతం! ఇంటర్మీడియెట్ ఫలితాల విడుదలలో బోర్డు ఉదాసీనత వెల్లడైంది. యాజమాన్యాల (మేనేజ్మెంట్) వారీగా ఫలితాల పట్టికలో చాలావరకు గతేడాది ఇచ్చిన గణాంకాలే పునరావృతమయ్యాయి. ఇందులో ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత, పాస్ పర్సంటేజీ అంతా య«థాతథంగా వెల్లడించారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)లు, టీజీఎస్ఆరీ్టసీ, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ కాలేజీలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్కు సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు, పాసైన వారి సంఖ్య, ఉత్తీర్ణత శాతం గణాంకాలు ఒకే విధంగా ఉండడం గమనార్హం. 41 కాలేజీల్లో 100% ఫలితాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 41 కాలేజీల్లో సెకెండియర్లో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్లో 12 కాలేజీలు 100% ఉత్తీర్ణత సాధిస్తే..సెకెండియర్లో 41 కాలేజీలు 100% ఫలితాలు సాధించాయని తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు 468 మార్కులు ఏడుగురు విద్యార్థులు సాధించారని, అలాగే బైపీసీలో 440 మార్కులకు 438 మార్కులు ఐదుగురు విద్యార్థులు సాధించారని వెల్లడించారు. ఆర్ట్స్ గ్రూప్లో ఒక విద్యార్థి 500 మార్కులకు 494 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇక ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఇద్దరు విద్యార్థులు 995 మార్కులు సాధించగా, బైపీసీలో ఒక విద్యార్థి 994 మార్కులు సాధించారని మంత్రి పేర్కొన్నారు. ఆర్ట్స్ గ్రూప్లో ఒక విద్యార్థి 985 మార్కులు సాధించాడన్నారు. -
హార్మూజ్.. ఆనాటి హురుమాంజియే..
సాక్షి, హైదరాబాద్: హార్మూజ్ జలసంధి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిన ఈ జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల రవాణాకు కేంద్రబిందువుగా నిలిచింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు, రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. వందల ఏళ్ల క్రితమే ఈ జలసంధికి తెలుగుసాహిత్యంలో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవిసార్వభౌముడు తమ సాహిత్యంలో ఈ జలసంధిని ‘హురుమాంజి’గా అభివర్ణించారు. హురుమాంజి జలసంధి నుంచే అనేక రకాల వ్యాపారాలు కొనసాగినట్లు శ్రీనాథుడు ‘హరవిలాసం’లో ప్రస్తావించారు.తిప్పయ్యశెట్టి అనే వ్యాపారి హురుమాంజి నుంచి అనేక రకాల విలువైన వస్తువులను తెచ్చి విక్రయించేవాడని ప్రస్తావించాడు. ఖర్జూర, బాదం, వాల్నట్స్ వంటి ఎండుఫలాలు అక్కడినుంచి దిగుమతి అయ్యేవని ఆ గ్రంధంలో పేర్కొన్నారు. మరోవైపు మేలైన గుర్రాలు ‘హురుమాంజి’ నుంచి తెప్పించినట్లు శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పారు. ‘విజయనగర సామ్రాజ్యానికి సైనిక శక్తి చాలా ముఖ్యం, అందులోనూ గుర్రపు దళం ఎంతో కీలకం. అరేబియా, పర్షియా దేశాల్లోని ‘హురుమాజి’ రేవు నుంచి వచ్చే ఉత్తమ జాతి గుర్రాలను వెనుకాడకుండా ఎక్కువ ధర ఇచ్చి అయినా సరే కొనుగోలు చేయాలి’ అని ఆముక్తమాల్యదలో ప్రస్తావించారు. ఆ హురుమాంజియే ఇప్పటి హార్మూజ్ జలసంధి అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలో, ఆ తరువాత రాయలకాలంలో హురుమాంజి నుంచి మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకు సరుకులు రవాణా అయ్యేవి. తెలుగు సాహిత్యంలో ‘పర్షియా’.. ఈ ఒక్క జలసంధి మాత్రమే కాదు. పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే అనేక పదాలు 15వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయని ప్రముఖ రచయిత వసుధేంద్ర తెలిపారు .‘గ్రీస్, పర్షియన్ రెండూ అత్యంత ప్రాచీనమైన నాగరికతలే అయినా పర్షియన్ సంస్కృతి మాత్రమే అనేక దేశాలకు విస్తరించింది’ అని చెప్పారు. బిర్యానీలు, రకరకాల మాంసాహార వంటకాలు, డబల్కామీటా, బాదుషా, జిలేబీ వంటి మిఠాయిలు కూడా అక్కడి నుంచి దిగమతి అయి మన ఆహారపు అలవాట్లలో భాగమయ్యాయి.కుంకుమపువ్వు, రోజ్వాటర్ దిగుమతి ‘ఇరాన్ సంస్కృతి అప్పటి రాజులను బాగా ప్రభావితం చేసింది. ఆ నాటి రాచరిక వ్యవస్థను రాయలకాలంలో అనుకరించారు. అందుకే పర్షియాకు చెందిన అనేక పదాలకు సమానమైన అర్ధాన్నిచ్చే పదాలను సంస్కృతంలో ప్రస్తుతించారు’ అని వసుధేంద్ర వివరించారు. ఈ క్రమంలో ‘అమీర్’ను ఇక్కడ ‘అమరనాయకుడు’ అని, ‘సుల్తాన్’ అనే పదానికి సమానమైన అర్ధాన్నిచ్చేవిధంగా ‘సురత్రానా’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండు వైపులా రాకపోకలు విస్తృతంగా కొనసాగాయి. చాలామంది వ్యాపారులు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి సుగంధద్రవ్యాలు వంటివి అక్కడికి ఎగుమతి చేశారు. ఆనాటి పర్షియన్ సంస్కృతి రాజులనే కాకుండా సమాజంలోని ఉన్నతవర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. బాదం, పిస్తా, కుంకుమపువ్వు, రోజ్వాటర్ వంటివి అక్కడి నుంచి దిగుమతి చేసుకొనేవారు. -
ఎక్కువ తక్కువ... గ్రాంట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రాంట్ ఇన్ ఎయిడ్... కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకా లు, సంక్షేమం, లోటు పూడ్చుకోవడం, విపత్తుల నిర్వహణ, స్థానిక సంస్థలు, గిరిజన సంక్షేమం తదితర రంగాల కింద కేంద్రం నుంచి ఈ నిధులు రాష్ట్రాలకు వస్తాయి. ఈ నిధులు ఎంత ఎక్కువ వస్తే ఆ మేరకు రాష్ట్రానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో రాష్ట్రాలు కూడా వీలైనన్ని ఎక్కువ ఈ పద్దు కింద నిధులు కేంద్రం ఇవ్వాలని ఆశిస్తాయి. కానీ, ఈ ఆశలు తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు అడియాశలే అవుతున్నట్లు కం్రప్టోల ర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు చెపుతున్నాయి. ఆ రెండింటితో సమానం గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల మంజూరులో కేంద్రం విచిత్ర వైఖరి అవలంబిస్తోందని అర్థమవుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని 11 నెలల కాలంలో (2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు) తెలంగాణకు ఈ పద్దు కింద వచ్చింది రూ. 6వేల కోట్లు మాత్రమే. అదే తరహాలో తమిళనాడుకు రూ.15వేల కోట్లు, కేరళకు రూ.4వేల కోట్లు, కర్ణాటకకు రూ.9వేల కోట్లు వచ్చాయి. ఇక, దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిపినా రూ.50వేల కోట్లు దాటలేదు.కానీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఆ మేరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులివ్వడం గమనార్హం. అంటే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలతో సమానమైన నిధులు కేంద్రం కేవలం రెండు ఇతర రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చిందన్నమాట. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర సాయం అందుతోంది. తెలంగాణకు రూ.6వేల కోట్లు ఇచ్చిన కేంద్రం అదే స్థాయిలో జనాభా ఉన్న అస్సాం రాష్ట్రానికి పదిహేడు వేల కోట్లు ఇచ్చింది. అంటే తెలంగాణ కంటే ఏకంగా రూ.11 వేల కోట్లు ఎక్కువ సాయం చేసిందన్నమాట. ప్రతిపాదనలు కొండంత... ఇచ్చేది గోరంత కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. ఏటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత ఆశిస్తున్నామనే లెక్కలు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరుస్తాయి. అలా పొందుపరిచిన వాటిలో కనీసం సగం మేరకు కూడా చాలా రాష్ట్రాలకు దక్కడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి రూ. 22,782.50 కోట్లు వస్తాయని తెలంగాణ ఆశించింది. కానీ, 11 నెలల కాలంలో ఢిల్లీ నుంచి వచ్చింది కేవలం రూ. 6,140.65 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్రం ఆశించిన దాంట్లో కేంద్రం ఇచ్చింది కేవలం 27 శాతమే. దాదాపు పన్నెండేళ్లుగా ఇదే పరిస్థితి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు కూడా ఏళ్ల తరబడి ఇదే వివక్ష కొనసాగుతోంది. -
రాష్ట్రంపై సైబర్ వల
సాక్షి, హైదరాబాద్: అత్యాశ కొందరిది..అమాయకత్వం మరికొందరిది. కారణం ఏమైనా..అందనంత దూరంగా ఉంటూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రాష్ట్ర పరిధిలో నమోదైన సైబర్ నేరాల్లో కేవలం నాలుగేళ్ల రెండు నెలల్లోనే రూ.4724.63 కోట్లు చోరీ చేశారు. నెలకు దాదాపు రూ.94 కోట్లకు పైనే కొల్లగొడుతున్నారు. కేవలం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సైబర్ కేటుగాళ్లు రూ.257.35 కోట్లు దోచేశారు.తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల వివరాలు ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి వేసిన ఆర్టీఐ దరఖాస్తునకు సమాధానంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో( టీజీ సీఎస్బీ) ఈ వివరాలు వెల్లడించింది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.బాధితులు పోగొట్టుకున్న సొత్తును దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేయడంతోపాటు తిరిగి ఇప్పిస్తున్నట్టు తెలిపారు. అయితే అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పోగొట్టుకున్న సొత్తు రూ.4724.63 కోట్లు కాగా, బాధితులకు ఇప్పటి వరకు రీఫండ్ చేయించిన మొత్తం రూ.382.8 కోట్లుగా అధికారులు తెలిపారు. -
కాళేశ్వరం పనులకు ‘స్టీరింగ్ కమిటీ’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు నీటిపారుదల రంగ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుందన్నారు. అవసరమైతే తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షిస్తానని ఉత్తమ్ వెల్లడించారు. ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామన్నారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో ఆదివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమీక్షించారు.నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, నీటిపారుదల శాఖా సలహాదారుడు ఆదిత్యదాస్నాథ్, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, టన్నెల్ నిపుణుడు పరీక్షిత్ మెహ్రా, ఈఎన్సీలు రమేశ్బాబు, శ్రీనివాస్, సీడబ్ల్యూపీఆర్ఎస్ అదనపు సంచాలకులు సెల్వబాలన్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బరాజ్ల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్టు మంత్రి తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. కేఎల్ఐఎస్ మరమ్మతుల పూర్తి ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డలో కొంత భాగాన్నీ పూర్తి చేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్గా ఏఎఫ్ఆర్వై ఇండియాను ఎంపిక చేసి, ఐఐటీ ముంబైతో సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించిందన్నారు. డిజైన్ బృందం రాత్రింబవళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.పరీక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు సూచించారు. డిజైన్ ప్రక్రియకు సంబంధించిన భూబౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహిస్తారన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్కు అత్యధిక ప్రాధాన్యం పుణెలోని కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) పరీక్షలు, అధ్యయనాల బాధ్యత చూస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం బరాజ్ల పునరుద్ధరణ పనులను అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ సిబ్బంది 45 రోజుల పరీక్షల కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు. శిబిరాలను తక్షణమే పునరుద్ధరించాలి ఎల్అండ్టీ సహా అన్ని సంస్థలు తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్ను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇసుక తొలగింపు, జీపీఆర్ (భూబౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం పనులన్నీ ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించబడతాయన్నారు. డిజైనర్లు, సీడబ్ల్యూపీఆర్ఎస్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
బడి పిల్లలకు ఎమ్మెల్యే బాసట
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తన నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి సరైన బెంచీలు లేకపోవడంతో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కేవీఆర్) సొంత డబ్బులతో డ్యూయల్ డెస్క్ లు తయారు చేయించి ఇస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు కలిపి 6 వేల డ్యూయల్ డెస్క్ లు అవసరం అవుతాయని గుర్తించిన ఎమ్మెల్యే, తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ‘కేపీ రాజారెడ్డి జనసేవా ట్రస్ట్’ఆధ్వర్యంలో రూ.4 కోట్ల సొంత డబ్బులతో డ్యూయల్ డెస్క్లు తయారు చేయిస్తున్నారు.తొలి విడతలో పదిరోజుల్లో 76 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2,800 డ్యూయల్ డెస్క్లు అందించారు. చాలా చోట్ల విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేకపోవడం బాధ కలిగించిందని, అందుకే సొంత డబ్బులతో సౌకర్యాలు కల్పిస్తున్నానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. -
విస్తరిస్తున్న ప్రచండ వేసవి
సాక్షి, స్పెషల్ డెస్క్: వేసవి వేడి తీవ్రత పెరగటమే కాదు.. వేసవికాలం కూడా ఏటేటా పెరుగుతోంది. మాడు పగిలే ఎండల రోజులు ఏటేటా ముందుగానే ప్రారంభమై, ఆలస్యంగా ముగుస్తూ, మరింత తీవ్రంగా మారుతున్నాయి. వేసవి రోజుల సంఖ్య 1960 నాటి కంటే 2023 మధ్యలో సుమారు 30 రోజులు పెరి గిందని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా పరిశోధనలో వెల్లడైంది. భూమధ్య రేఖ కు దగ్గరి దేశాల్లో 6 దశాబ్దాల క్రితంతో పోలిస్తే వేసవి కాలాలు ముందుగానే కాక మరింత ఆకస్మికంగా వస్తున్నాయని, ఎక్కు వ కాలం కొనసాగుతున్నాయని, వేడితీవ్రత ఏటేటా మరింత పెరుగుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాతావరణంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకోవటం వల్ల ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మారే శారీరక సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తోంది. 1990 తర్వాత ఎక్కువ ఈ తాజా అధ్యయనం వివరాలు ‘ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. వేసవి రోజుల సంఖ్య తొలుత భూమిపై పెరిగాయి. ఆ తర్వాత సముద్రంలోనూ పెరిగాయి. 1961–2023 మధ్యకాలంలో, మధ్య అక్షాంశాలలోని భూభాగాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో ప్రతి సంవత్సరం వేసవికాల వ్యవధి పెరిగింది. తొలి 3 దశాబ్దాల కంటే ఆ తర్వాత మరింత పెరిగింది. 1990–2023 మధ్యలో వేసవి కాలం నిడివి పెరుగుదల సగటు రేటు సుమారుగా దశాబ్దానికి ఆరు రోజులు. అంటే.. 1990తో పోలిస్తే 2023లో వేసవి సుమారు 20 రోజులు ఎక్కువ. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ వేసవికాలం కొన్ని నగరాల్లో సంవత్సరానికి ఒక రోజు కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఉదాహరణకు సిడ్నీ (ఆ్రస్టేలియా)లో ప్రతి దశాబ్దానికి వేసవికాలం 14.8 రోజుల చొప్పున పెరుగుతోంది. అంటే 1990లో 80 రోజులుగా ఉన్న వేసవికాలం ఇప్పుడు సుమారు 130 రోజులకు చేరుకుంది. మిన్నియాపాలిస్ (అమెరికా)లో ప్రతి దశాబ్దానికి 9.3 రోజులు, టొరంటో (కెనడా)లో 8 రోజులు పెరుగుతోంది. వేసవిలో వేడి అంతకంతకూ పెరగడం వల్ల మధ్య అక్షాంశ దేశాల్లోని మనుషుల్లో వేడికి తట్టుకునే శారీరక సామర్థ్యం క్షీణించొచ్చు.పగలు, రాత్రి వేళల్లో శరీరాన్ని చల్లబరచుకోవడానికి మరింత శక్తి అవసరం కావొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ పెరిగే వేసవి తీవ్రత ప్రతికూల ప్రభావం పంటలపై కూడా ఉంటుంది. వసంతకాలం నుంచి వేసవికి, వేసవి నుంచి శరదృతువుకు వాతావరణం మారే దశల్లో వేగం పెరిగింది. దీంతో, వేసవి వేడి తీవ్రత కూడా పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మార్పులపై ఆధారపడిన వ్యవస్థలకు సర్దుబాటు చేసుకోవడానికి సమయం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతలకు ఇంకా అలవాటు పడని సీజన్ ప్రారంభ రోజుల్లోనే ప్రాణాంతకమైన వడగాలులకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. -
తెలంగాణలో ‘దోచుకో దాచుకో’ స్కీం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే స్కీం దోచుకో దాచుకో నడుస్తోంది.. ముఖ్యమంత్రి సకుటుంబ సపరివార సమేతంగా దోచుకుంటున్నారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మంచిర్యాల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్టుల్లో దేశంలో ఎక్కడా లేని వి«ధంగా సైట్ విజిట్ నిబంధన తెచ్చి, వారికి అనుకూలంగా కాంట్రాక్టర్లు లొంగకపోతే సర్టీఫికెట్ ఇవ్వమని బెదిరిస్తూ సీఎం రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 30 నెలలైనా ఆరు గ్యారంటీలను అమలు చేయని ఈ సీఎంను ఏమనాలన్నారు. రైతుబంధుకు రాం రాం, దళితబంధుకు జై భీం చేశారని దుయ్యబట్టారు. మంచిర్యాలలో ప్రభుత్వ భూమిలో ఇల్లు ఉందని బీఆర్ఎస్ మద్దతుదారుడి ఇల్లు కూలగొట్టారన్నారు. బొగ్గు బాయిల్లో అగ్గి పుట్టిస్తాం దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డి, ఆయన బావమరిదిపై ఓ సిట్ వేసి విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారన్నారని, ఏర్పాటు చేయకపోతే సింగరేణి భవన్ను ముట్టడించి, బొగ్గు బాయిల్లో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. కోల్బెల్ట్లో మా ఎమ్మెల్యేలను ఓడించి ఇప్పుడు సేవ్ సింగరేణిని అని మమ్మల్ని అడిగితే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. కత్తి వారి చేతిలో పెట్టి, యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా అన్నారు. అందరం కలిసి పోరాటం చేద్దామని, స్థానిక ఎమ్మెల్యేల్ని నిలదీద్దామని చెప్పారు. సింగరేణి, జిల్లా పరిషత్, సహకార ఇతరత్రా ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని.. 2028లో మళ్లీ ఆయన సీఎం కావాలన్నారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెబుతున్న సీఎంకు కోటి కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అని ప్రశ్నించారు. కుంభకోణాలపై కేంద్రం స్పందించదు బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో ఎంత అవినీతి జరుగుతున్నా, కేంద్రం గమ్మున ఉంటుందని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు, ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘అమృత్’లో రూ.వందల కోట్ల కాంట్రాక్టులు వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాలు, బోనస్, వాటాలు, వారసత్వ ఉద్యోగాలు, పదేళ్లు తెలంగాణను నడిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ప్రలోభాలకు లొంగకుండా...రాష్ట్రంలో నీచ, నికృష్ట రాజకీయాలు నడుస్తున్నాయని, క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ అహం దెబ్బతిన్నదని, వెయ్యి మంది పోలీసు బందోబస్తు చేసి, గెలవాలని చూశారని కేటీఆర్ విమర్శించారు. 51 రోజులు కౌన్సిలర్లు క్యాంపులో ప్రలోభాలకు లొంగకుండా, కేసులతో, భయపెట్టి, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా చెక్కు చెదరలేదన్నారు. బాల్క సుమన్ను ఆదిలాబాద్ జైలుకు పంపారని చెప్పారు. సీపీఐ పొత్తు ధర్మం పాటించిందని చెప్పారు.ఈ సమావేశంలో బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్జాదవ్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్రావు, కోరుకంటి చందర్, నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, విజిత్రావు పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాతనపల్లి, ఆసిఫాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులను కేటీఆర్ సత్కరించారు. అంతకు ముందు మంచిర్యాల మెడికల్ కాలేజీని సందర్శించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు. -
ప్రభుత్వానికి భేషజాలు లేవు
సాక్షి, సిద్దిపేట: ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఎక్కడ అనువైన ప్రాంతాలుంటే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యం’అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో రూ.700 కోట్లతో జూనో జౌల్ బయో ఫ్యూయల్స్కు చెందిన బయో గ్యాస్ ప్లాంట్లకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలంటే పరిశ్రమలు రావాలన్నారు. 65 శాతం ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో యుద్ధ సమయాల్లో కొరతతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. జూనో జౌల్ బయో గ్యాస్ ప్లాంట్ కాలుష్యంలేని ఫ్యాక్టరీ అని అన్నారు.లోక్సభ సభ్యుడు ప్రేమ్చంద్రన్ మాట్లాడుతూ.. 2018 నుంచి కేంద్రం చాలా పథకాలను అమలు చేస్తోందని, ఇతర దేశాల నుంచి గ్యాస్ను దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రైతులకు ధాన్యంతోపాటు, వరి గడ్డి నుంచి సైతం ఇక అదనపు ఆదాయం రానుందన్నారు.మాజీ ఎంపీ వి.హన్మంతరావు మాట్లాడుతూ ఆంధ్ర వారికి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లే ఆంధ్రలో సైతం పరిశ్రమలు పెట్టే తెలంగాణ వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భువనేశ్వర్ కలిత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, కంపెనీ సీఈఓ రాయపాలి నాగశరత్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్.. కేటుగాడి మాయ వైరల్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో కారు నంబర్ ప్లేట్ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
అటకెక్కిన ‘రింగు’.. ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఛేంజర్ అంటూ ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగురోడ్డు) విషయంలో అదిగో ఇదిగో అంటూ ఊరించి ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును కేంద్రం అటకెక్కించింది. దాదాపు ఏడాది క్రితమే ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో దానికి ఆమోదం తెలపలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో ఏకంగా ఆ టెండర్లనే రద్దు చేసుకునే దిశగా యోచిస్తోంది.కొత్త ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మొదలైనందున, ఈ ఏడాది కాలం సమయం ఉంది. దీంతో ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతానికి టెండర్లు తెరిచే గడువును మరో రెండు నెలలకు పొడిగించింది. ఆ తర్వాత రద్దు చేసి నవంబరు నాటికి కొత్త టెండర్లు పిలుస్తారన్న మాట వినిపిస్తోంది. వెరసి, రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలు కావు. ప్రయారిటీ జాబితాలో లేకపోవటమే... ట్రిపుల్ ఆర్ రెండు భాగాలు పూర్తి చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని మాత్రమే కొలిక్కి తెస్తున్నందున, దానికి రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారుల విస్తరణపై ఫోకస్ చేస్తున్న కేంద్రం వాటిని ప్రయారిటీ లిస్టులో చేర్చుకొని పనులు మొదలుపెడుతోంది. ట్రిపుల్ ఆర్ ప్రయారిటీ జాబితాలో లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, రాజకీయంగా లాబీయింగ్ చేస్తున్న రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వీలు చిక్కుతోంది. గతంలో భారత్మాల పరియోజనలో ట్రిపుల్ ఆర్ను చేర్చి వేగంగా టెండర్ల ప్రక్రియ వరకు తెచ్చినా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి–కేంద్రానికి మధ్య ఆ ప్రాజెక్టు భూసేకరణ డబ్బు డిపాజిట్ చేసే విషయంలో పేచీ నెలకొని మాటల యుద్ధానికి దారి తీసింది.దీంతో ట్రిపుల్ ఆర్ను అప్పట్లో ప్రయారిటీ జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. టెండర్లు పిలిచినా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్íÙప్ అప్రైజల్ కమిటీ ఆమోద ముద్ర వేయలేదు.కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో ఉండే ఈ కమిటీ ఆమోద ముద్ర వేస్తేనే ఆ ప్రాజెక్టుకు బడ్జెట్ విడుదలవుతుంది. ఆ ఆమోదం లేకుంటే టెండర్లను ఖరారు చేయటం కుదరదు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి ఇప్పుడు ఆ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది. బడ్జెట్ విడుదల కాకపోయేసరికి టెండర్లను ఖరారు చేయలేక అరడజను మార్లు గడువు పొడిగిస్తూ ఎన్హెచ్ఏఐ కాలయాపన చేయాల్సి వస్తోంది. ఖర్చు తగ్గించాలని.... రింగురోడ్డుకు భారీగా ఖర్చు చేయాల్సి రావటాన్ని కూడా ఇటీవల సమీక్షించిన కేంద్ర ఆర్థిక శాఖ, ఖర్చును తగ్గించాల్సిందిగా కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆమేరకు ఆ శాఖ కార్యదర్శి పలు దఫాలు సమావేశమై, చాలా ప్రత్యేకతల్లో కోత విధించారు. ఏకంగా ఎనిమిది వరుసల రోడ్డును ఆరు వరుసలకే కుదించారు. సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. రోడ్డు ఎత్తు, అండర్పాస్ల సంఖ్య తగ్గించారు. చివరకు దానిమీద సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా తొలగించారు. చివరకు దాన్ని ఎక్స్ప్రెస్ వేగా కాకుండా సాధారణ జాతీయ రహదారిగానే నిర్మించాలని తేల్చారు.దాదాపు రూ.4 వేల కోట్ల ఖర్చును తగ్గించటంతో ఇక అనుమతి వస్తుందని అంతా భావించారు. కానీ, ఉత్తర ప్రదేశ్లోని ఓ కీలక రోడ్డుకు అనుమతి ఇచ్చి కమిటీ చేతులు దులుపుకొంది. ఇంతలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో బడ్జెట్ ఖరారుకు వీలుచిక్కదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో, మళ్లీ రోడ్ల ప్రయారిటీ జాబితా రూపొందించాల్సి ఉంది. అందులో ప్రాధాన్య రహదారిగా ట్రిపుల్ ఆర్ గుర్తింపు దక్కించుకుంటే జూన్ నాటికి దానికి అనుమతి వచ్చే అవకాశముంది. కాదంటే, ఏడాది చివరి వరకు ఎదురు చూడాల్సిందేనని తెలుస్తోంది. -
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేశారు. https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in వెబ్సైట్లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఫలితాలను https://education.sakshi.com/ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఇంటర్ పరీక్షలకు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.20 శాతం ఉత్తీర్ణత రాగా, బాలికల-74.4 శాతం, బాలురు-57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. వాట్సాప్లో కూడా.. ఇంటర్మిడియట్ ఫలితాలను మీ సేవ వాట్సాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సర్వీసును శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్, టెన్త్ హాల్టికెట్లను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఏప్రిల్ 12, 2026 నుంచి పరీక్షా ఫలితాలను కూడా నేరుగా వాట్సాప్లో అందించనుంది. విద్యార్థులు 8096958096 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపి మీ సేవ చాట్బోట్ ద్వారా తమ రోల్ నంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందవచ్చు. -
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేస్తారు. https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in వెబ్సైట్లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ వాట్సాప్లో కూడా.. ఇంటర్మిడియట్ ఫలితాలను మీ సేవ వాట్సాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సర్వీసును శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్, టెన్త్ హాల్టికెట్లను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఏప్రిల్ 12, 2026 నుంచి పరీక్షా ఫలితాలను కూడా నేరుగా వాట్సాప్లో అందించనుంది. విద్యార్థులు 8096958096 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపి మీ సేవ చాట్బోట్ ద్వారా తమ రోల్ నంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందవచ్చు. -
రూ.3,500 ఒప్పందం… చివరికి రూ.1.5 లక్షల దోపిడి!
హైదరాబాద్: లైంగిక సేవల కోసం ట్రాన్స్జెండర్ను ఇంటికి తీసుకువెళ్తే బెదిరింపులకు పాల్పడి రూ.1.50 లక్షలు వసూలు చేసిన సంఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో నివసించే ఒక వ్యక్తి (44) మార్చి 28న టాస్ పబ్ సమీపంలో గాయత్రీ అనే ట్రాన్స్జెండర్ను కలిశాడు. లైంగిక సేవలు అందించేందుకు రూ.3,500కు ఒప్పందం చేసుకుని అతని ఇంటికి తీసుకువెళ్లాడు. డబ్బు తీసుకుని తిరిగి వచ్చే సమయంలో ట్రాన్స్జెండర్ బెదిరింపులకు దిగింది. తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంటి వద్ద గొడవ వద్దనే ఉద్దేశ్యంతో అతను రూ.1.40 లక్షలతో పాటు బంగారు గాజులు ఇచ్చాడు. ట్రాన్స్జెండర్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడడటంతో విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భయపడ్డాడు. ఈ క్రమంలోశనివారం ట్రాన్స్జెండర్ మరోసారి అపార్ట్మెంట్ వద్దకు రావడంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్జెండర్ కోసం గాలిస్తున్నారు. -
ప్రాణాలు నుజ్జునుజ్జు
రంగారెడ్డి జిల్లా: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనచైతన్య వెంచర్కు చెందిన సోహెల్ (18) ఎలక్ట్రీషియన్. ఇదే ప్రాంతానికి చెందిన షేక్ సాహిల్ (19) ఇంటర్ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శనివారం ఉదయం మొయినాబాద్లో ఎలక్ట్రికల్ పని ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. హిమాయత్ సాగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. సోహెల్, షేక్ సాహిల్ ఎగిరి పక్కనే ఉన్న కల్వర్టు వద్ద పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్లపై ఫోరెన్సిక్ ఆడిట్
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు..అక్రమార్కులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం చేయించిన పైలట్ సర్వేలో తేలింది. ఈ జాబితాలో పీజీ టీచర్లు, ఎస్జీటీ, టీజీటీలు, పబ్లిక్హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లు, ఇద్దరు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్లతోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇంకా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఇలా దాదాపు 50 వేల మంది ఉద్యోగులు(రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు) ఉన్నట్లు గుర్తించారు. వీరే కాకుండా చివరకు రెండుమూడేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోనూ చేయూత పింఛన్ల మొత్తం ఇప్పటికీ జమ అవుతున్నట్టుగా తాజాగా ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. సంక్షేమ పథకాల నుంచి అక్రమంగా లబ్ధి పొందుతున్న వారిలో సీనియర్ అధికారుల నుంచి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టుగా గుర్తించారు. చేయూత పింఛన్లు మొదలు కల్యాణలక్ష్మి, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల వరకు అక్రమంగా ప్రభుత్వ సొమ్ముకు గండికొడుతున్నారు. దీంతో వివిధ పేద వర్గాల కోసం ఉదేశించిన పలు ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని స్పష్టమవుతోంది. వివిధ వర్గాల పేదలు, నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు చెందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేబుల్లోకి చేరుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా.. వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా చేయూత పింఛన్లు చనిపోయిన వారికి, అనర్హులకు అందుతున్నాయనే ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం చేయూత కింద దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, గీతకార్మీకులు, నేతకార్మీకులు, ఎయిడ్స్ రోగులు, బోదకాల బాధితులు, డయాలిసిస్ పేషెంట్లు, బీడీ టెకేదార్లు రూ.2 వేలు పింఛన్ పొందుతున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టాలని గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్)ను సర్కార్ ఆదేశించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో సామాజిక తనిఖీ ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ‘ఫిజికల్ వెరిఫికేషన్’లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆసరా పింఛన్ల పథకం అమలు మొదలుపెట్టాక పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా, వారి బ్యాంక్ ఖాతాల్లోకి పింఛన్ మొత్తాన్ని నెలనెలా బదిలీ చేస్తున్నారు. దీంతో ఈ పింఛన్లు ఎవరికి వెళుతున్నాయి? వారెలా ఉంటారు? జీవించి ఉన్నారా లేదా? తదితర విషయాలను ఫిజికల్గా వెరిఫై చేసే అవకాశం అధికారులకు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా పింఛన్ పంపిణీ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఇతర రూపాల్లో గుర్తింపు చేయడం ఇబ్బందిగా మారింది. ⇒ హైదరాబాద్కు దగ్గరలోని ఓ మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో 600 మంది లబ్ధిదారులుంటే..350 మందిని ఖాతాలు పరిశీలిస్తే..అందులో 40 మంది చనిపోయినట్టుగా వెలుగులోకి వచి్చంది. వీరు మరణించి రెండేళ్లు అవుతున్నా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ⇒ చేయూత పింఛన్లు పొందుతున్న వారిలో ఇద్దరు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు ఇతరులను అనర్హులని గుర్తించారు. అనర్హులను అరికట్టేందుకు పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ఆడిట్లో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాతో లింక్ చేసి ఆధార్ సమాచారాన్ని ‘క్రాస్ వెరిఫై’చేసినప్పుడు అక్రమాలు, అనర్హుల వివరాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు, అలవెన్స్లు పొందుతున్న 478 రెగ్యులర్, 338 గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతన ఉద్యోగులు, పీజీ టీచర్లు 47 మంది, ఎస్జీటీ, టీజీటీలు 71 మంది, పబ్లిక్హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లతోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్సర్జన్లు ఇంకా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నట్టు తేలింది.అధికారులు, ఉద్యోగులతోపాటు లగ్జరీ కార్లు, మూడంతస్తుల భవనాలు, పెట్రోల్ బంక్ల యాజమానులు కూడా ఉండడం ఆశ్చర్యం గొలుపుతోంది. అదికూడా కరీంనగర్ కార్పొరేషన్, సూర్యాపేట మున్సిపాలిటీ, ఆదిలాబాద్ జిల్లాలోని మావల గ్రామం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వపరంగా గతంలో నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’లోనే ఇంత మంది అనర్హులు సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నట్టు తేలింది. ఉల్లంఘనలు ఇలా.. ⇒ నెలకు రూ.లక్షకుపైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నారు ⇒ కార్లు, ట్రాక్టర్లు, సొంతంగా పెద్ద భవనాలు ఉన్నవారు కూడా ప్రయోజనం పొందారు ⇒ దివ్యాంగులకు మాత్రమే ఇవ్వాల్సిన డిజెబిలిటీ పింఛన్లు, వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి ⇒ 50 ఏళ్లు కూడా దాటని వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. చర్యలేమిటి ? 2026 ఏప్రిల్ నాటికి ముఖ గుర్తింపు, ఇతర తనిఖీల ద్వారా వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు ఆధారంగా మొత్తం 3,01,724 పింఛన్లు తొలగించినట్టు సమాచారం. 2026–27లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. ⇒ రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ పొందుతున్న వారి సంక్షేమ పథకాల లబ్ధిని వెంటనే నిలిపేయాలని ఈ నివేదికలో ప్రభుత్వానికి అధికారులు సిఫార్సు చేశారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, దినసరి, గౌరవ వేతనం పొందే వారి పట్ల ఎలా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.. -
బడ్జెట్ లెక్క... ఏంటీ తికమక?
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరానికి (2025–26)గాను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలకు పొంతన కుదరలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడులతోపాటు ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాల్లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం చూపిన అంకెలు, కాగ్ నివేదికలో పేర్కొన్న మొత్తాలను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే అంతర్గత సర్దుబా ట్లు, లెక్కలు తయారు చేసినప్పుడు సమయాభావం తదితర కారణాల వల్ల ఈ వ్యత్యాసం సహజమేనని అంటున్న ఆర్థిక నిపుణులు.. అసహజ వ్య త్యాసం ఉండటం మాత్రం అరుదైన విషయమని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ అధికారులే సమాధానం చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఆదాయం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వరకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికలకు మధ్య అనేక అంశాల్లో వ్యత్యాసం కనిపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి పన్ను రాబడుల కింద రూ. 1.34 లక్షల కోట్లుకుపైగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే ఫిబ్రవరి మాసాంతానికే పన్ను రాబడులు రూ. 1.39 లక్షల కోట్ల మేరకు వచ్చినట్లు ‘కాగ్’నివేదికలో పేర్కొంది. అంటే ఒక నెల మిగిలి ఉండగానే రూ. 5 వేల కోట్లు ఎక్కువగా పన్ను రాబడులు వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఇక మార్చిలో పన్ను ఆదాయం మరో రూ. 12 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేస్తే ప్రభుత్వ లెక్కలకు, కాగ్ అంకెలకు మధ్య పన్ను రాబడుల విషయంలో సుమారు రూ. 17 వేల కోట్ల మేర వ్యత్యాసం వస్తోంది. అప్పుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2025–26 సవరించిన అంచనాల ప్రకారం ఏడాది మొత్తం మీద రూ. 77,545.92 కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు ప్రభుత్వం చూపింది. కానీ ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికే రూ. 77,111 కోట్ల మేర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు వెల్లడించింది. అయితే మార్చిలో తీసుకొనే అప్పుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ మేరకు అప్పులు తగ్గే అవకాశముంది కానీ.. ఏ మేరకు చెల్లింపులు జరిగి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘కాగ్’లెక్కల్లో వచ్చిన తేడా మేరకు కనీసం రూ. 6 వేల కోట్లయినా అప్పుల కంటే చెల్లింపులు ఒక్క నెలలోనే చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏడాది మొత్తం మీద రూ. 29,471 కోట్లు వచ్చాయని ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొంటే ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికి రూ. 18,788 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అంటే మార్చి నెలలోనే సుమారు రూ. 9 వేల కోట్లు కేంద్రం నుంచి ఉంటాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక గ్రాంట్–ఇన్–ఎయిడ్ విషయానికి వస్తే ఏడాది మొత్తంలో రూ. 11,161 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే ఫిబ్రవరి నాటికి రూ. 6,140 కోట్లు మాత్రమే వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఈ లెక్కన మార్చి నెలలో కేంద్రం నుంచి మరో రూ. 5 వేల కోట్లు రావాలన్నమాట. అయితే ప్రభుత్వ అంచనాలు, ‘కాగ్’లెక్కల్లో తేడాలు సహజమేనని.. లెక్కలు తీసుకొనే నాటికి అందుబాటులో కొన్ని వివరాలు లేకపోవచ్చని.. చెల్లింపులు, సర్దుబాట్ల కారణంగా కూడా కొంత తేడా వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ మేరకు తేడా రావడం మాత్రం పరిశీలించాల్సిన అంశమని అంటున్నారు. అంకెల గారడీ కోసం అంచనాలను రూపొందించకుండా వాస్తవిక దృక్పథంతో వెళ్తేనే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు. ఏమిటీ నివేదికలు? వాస్తవానికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలతోపాటు ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక రూపొందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ పంపే వివరాల ప్రకారమే ఈ నివేదికలు తయారవుతాయి. అలాగే ఏటా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అంతకుముందు ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఈ సవరించిన అంచనాలను ఏడాది మొత్తానికి (బడ్జెట్ పెట్టే మార్చి నెల రాబడులు, వ్యయాల అంచనాలను లెక్కగట్టి) ప్రతిపాదిస్తుంది. ఇదే తరహాలో గత నెల 20న 2025–26 సవరించిన అంచనాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ శనివారం ‘కాగ్’వెబ్సైట్లో ఓ నివేదిక పెట్టింది. ఈ రెండింటి మధ్య రాబడులు, ఖర్చులు, కేంద్ర నిధుల విషయంలో తేడాలు ఉండటం గమనార్హం. -
‘మహిళలు నాయకులుగా ఎదగాలి’
హైదరాబాద్: మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. మహిళలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగానే కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ‘హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’.. మేనేజ్మెంట్ గురించి నగరంలోని అన్ని రంగాల వ్యక్తులకు, విద్యార్థులకు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సామర్థ్యాన్ని పెంచేందుకు రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. 2025-26 సంవత్సరానికి ‘మేనేజ్మెంట్ ఇన్ ఏఐ ఎరా’ అనే థీమ్తో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) అనుసంధానంతో నారీ శక్తి గురించి ‘ఎమర్జ్’ పేరిట హైదరాబాద్ బేగంపేట్లోని హోటల్ టూరిజం ప్లాజాలో శనివారం భారీ సదస్సు నిర్వహించారు. ‘వుమెన్ డెవలప్మెంట్ నుంచి వుమెన్- లీడ్ డెవలప్మెంట్’ అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. ‘వుమెన్ డెవలప్మెంట్’ అంటే మహిళల భాగస్వామ్యం మాత్రమే కాదు.. మహిళలు కార్యక్రమాల్లో పాల్గొనేవారుగానే కాకుండా, లీడర్షిప్ పొజీషన్లలోకి వచ్చి కార్పొరేట్ వ్యవస్థలో గానీ, వ్యాపార రంగంలో గానీ ముందుకు రావాలని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.అసోసియేషన్ అధ్యక్షుడు ఆల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో పెరుగుతుండగా, కొత్త తరం మరింత ఉత్సాహంతో ముందుకు వస్తోంది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, స్టార్టప్లలో మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. దేశంలో ఈ దిశగా తెలంగాణ ముందంజలో ఉంది. ఇలాంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి ’ అని పేర్కొన్నారు. గత తరంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత తరం చూస్తే మహిళలు నాయకత్వం లేదా కార్పొరేట్ రంగంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు వారి తదుపరి తరం కూడా ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో రాణించడం, పోటీ పరీక్షలు ఎదుర్కోవడం, అన్ని రంగాల్లో ముందుకు సాగడం జరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్లలో కూడా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ‘కుర్చీయే కాదు.. కుర్చీని షేక్ చేసేలా మహిళలు ముందుకొస్తున్నారు.. దేశంలో ఈ విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి’ అని చెప్పారు.అనంతరం కామినేని ఆస్పత్రుల సీవోవో గాయత్రి కామినేని మాట్లాడుతూ.. నాయకత్వం అంటే కేవలం పదవిలో ఉండటం కాదని, మార్పును తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్యూచరిస్టిక్ సిటీ డైరెక్టర్ కరుణ గోపాల్ మాట్లాడుతూ.. ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలోనూ వ్యాపార రంగంలోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను గుర్తించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. -
ఏపీపై బట్టబయలైన చంద్రబాబు కపట ప్రేమ
సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో హెరిటేజ్ సంస్థ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసింది. శామీర్పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్ ఐస్క్రీమ్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.అయితే, కొత్త ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. -
సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి,హైదరాబాద్: సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై ఆరోపణులు చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు.. నాపై లాయర్ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారు. గతనెల 21న తానే పరిచయం చేసుకుని అమర్యాదగా మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు.. నేను నిరాకరించా. నోట్ల కట్టల వీడియో చూపించి నన్ను బెదిరించారు. సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరా’నని తెలిపారు. మంగ్లీ ఫిర్యాదుతో న్యాయవాది సుబ్బారావుపై బీఎన్ఎస్ సెక్షన్లు 79,351(3)కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు.. మంగ్లీపై ఆరోపణలు చేస్తూ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మంగ్లీ పేరుతో మోసం చేశారని రెండు నెలల క్రితం బాధితులు నన్ను కలిశారు. విచారణ చేపట్టగా ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమో సోదరుడు శివ,మధు ఉన్నట్లు తేలింది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం మంగ్లీని కలిసే ప్రయత్నం చేశా. మంగ్లీతో మాట్లాడిన సమయంలో చాలా యారగెంట్గా మాట్లాడారు. ప్రధాన నిందితుడు మధు రూ.200కోట్ల పెట్టుబడి రూపంలో సేకరించారు. భారీ లాభాలు ఇస్తాయని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు మమ్మల్ని కలిశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి నన్ను బెదిరించారు. ఇప్పటికే బెదిరింపుల మీద కేసు నమోదైంది. సివిల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ బాధితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సింగర్ మంగ్లీపై కేసుసింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇలాంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దు: సజ్జనార్
హైదరాబాద్: నగరంలో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో తెలిపారు. “మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే డబ్బులు చెల్లించకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ఆపై HMWSSB WATER BILL UPDATE.apk పేరుతో ఒక ప్రమాదకరమైన లింక్ను పంపి, దాన్ని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. మీ కాల్స్ను డైవర్ట్ చేయడమే కాకుండా, మీ స్క్రీన్ను నిరంతరం గమనిస్తూ బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.నగరవాసులు ఇలాంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి ఏపీకే ఫైళ్లను పొరపాటున కూడా ఇన్స్టాల్ చేయకండి. కేవలం అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ల ద్వారానే మీ నీటి బిల్లులు చెల్లించండి. ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు’’ అని సూచించారు. -
వాట్సాప్లోనే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. రేపు(ఏప్రిల్ 12, ఆదివారం) విడుదల కాబోతున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు నేరుగా తమ మొబైల్లోనే పొందే వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితాల కోసం విద్యార్థులు ఎటువంటి పోర్టల్ లాగిన్ అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా అవకాశం కల్పించింది. జస్ట్.. 8096958096 నెంబర్కు వాట్సాప్ (WhatsApp)కు మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను పొందవచ్చని ప్రకటించింది. ఇప్పటికే ఈ నెంబర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పలురకాల సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ధృవీకరించారు.మొదట మీ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ నంబర్ 8096 95 8096 నంబర్ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపాలి. సర్వీస్ ఎంపికలో మెనూలో BIE Exam Result అని టైప్ చేసి, 'Open Service' ఆప్షన్ నొక్కాలి. అక్కడ మీ హాల్ టికెట్ (రోల్) నంబర్ నమోదు చేసి, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) ఎంచుకోవాలి. వివరాలు సమర్పించిన వెంటనే మీ ఫలితం మెసేజ్ రూపంలో తక్షణమే స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది. స్టెప్ బై స్టెప్ ఇలా..8096 95 8096ని మీ కాంటాక్ట్లలో "MeeSeva Telangana"గా సేవ్ చేయండిWhatsApp తెరిచి "Hi" పంపండి.. మీసేవ చాట్బాట్ మొదలవుతుంది."BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కండిమీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ/2వ) మరియు స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకోండిసబ్మిట్ చేయండి.. మీ ఫలితం WhatsAppలో తక్షణమే వస్తుంది.రేపు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యా ర్థులు 4,89,126 మందికి, రెండో సంవత్సరం విద్యార్థులు 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలైంది. దీంతో ఆ నెలాఖరుకే ఫలితాలు సిద్ధమయ్యాయి. -
అమీన్పూర్లో ఆగిన హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాకు బిగ్ ఝలక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో చేపట్టిన భారీ ఆపరేషన్ను ఆపేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కూల్చివేతలను నిలిపి వేసి హైడ్రా అధికారులు వెనుదిరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో శనివారం ఉదయం నుంచి భారీ ఎత్తున ఆపరేషన్ను చేపట్టింది హైడ్రా. హైకోర్టుకు చెందిన ఓ లాయర్కు చెందిన ఫామ్హౌజ్తో పాటు ఓ ఆరంతస్తుల భవనం, పలు నిర్మాణాలను కూల్చేసింది కూడా. అయితే కూల్చివేతల నేపథ్యంలో బాధితులు కొందరు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించగా.. స్టే ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఐలాపూర్ పరిధిలో 1,260 ఎకరాల నిజాం, ప్రభుత్వ భూములు ఉన్నాయని.. వీటిలో చాలా వరకు అక్రమ కట్టడాలు వెలిశాయని, మరికొంత భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ కూల్చివేతలకు దిగింది హైడ్రా. ఈ క్రమంలో ఘర్షణలు తలెత్తకుండా సుమారు 2,000 మంది హైడ్రా, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కూల్చివేతలను మొదలుపెట్టింది కూడా.జస్ట్ బ్రేక్ ఇచ్చాంఅయితే హైడ్రా మాత్రం కూల్చివేతలు కొనసాగుతాయని అంటోంది. మేం పేదల ఇళ్ల జోలికి పోవడం లేదు. అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నవాళ్లకు 2 గంటల సమయం ఇచ్చాం. ఆ తర్వాత కూల్చివేతలు కొనసాగుతాయి అని అంటోంది. అమీన్పూర్ పరిణామాలపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.సేవ్ ఐలాపూర్ ఫ్లకార్డులతో..ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు అనూహ్యంగా స్థానికుల్లో కొందరి నుంచి మద్దతు లభించింది. ఈ ఉదయం నుంచి పలువురు సేవ్ ఐలాపూర్ అంటూ హైడ్రా ఆపరేషన్కు మద్దతుగా ఫ్లకార్డులతో ర్యాలీలు నిర్వహించడం గమనార్హం. -
హైస్పీడ్ రైల్తో హైదరాబాద్ కనెక్టివిటీకి బూస్ట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే హై–స్పీడ్ రైల్ హబ్కు ముందడుగు పడింది. భారతీయ రైల్వేను అత్యాధునికంగా రూపొందించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఫ్రిబవరిలో బడ్జెట్లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణె కారిడార్లలో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు శంషాబాద్ మండలం బహదూర్గూడలోని సర్వే నంబర్లు 28, 62లలో 650 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ప్రయాణ, రవాణా, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధి.. భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్తో ఇకముందు దేశానికే ఏరో ట్రోపోలిస్ హబ్గా నిలవనుంది. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. హై– స్పీడ్ రైల్ కారిడార్లతో ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణం వీలుండటంతో పాటు ప్రాంతీయ రవాణా, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాల వృద్ధి విస్తరణకు వీలవుతుంది. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారుతుందని నిపుణుల అంచనా. దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను హైస్పీడ్ రైల్ కారిడార్ను అనుసంధానిస్తుండటంతో ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరో నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. దీంతో విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. తొలుత ఇవి.. బెంగళూరు, చెన్నై, పుణె మూడు నగరాలతో అనుసంధానం కానున్న హైదరాబాద్ రైల్ కారిడార్లో.. తొలుత హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ రెండు కారిడార్ల డీపీఆర్లు పూర్తవుతాయని, ఆ తర్వాత 2027–28 ఆర్దిక సంవత్సరంలో హైదరాబాద్–పుణె కారిడార్ డీపీఆర్ ఉంటుందని సమాచారం. హైస్పీడ్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్–చెన్నై మార్గంలో ప్రయాణానికి 8– 10 గంటలు, హైదరాబాద్– పుణె మార్గంలో 10– 11 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైల్తో ప్రతి కారిడార్లో సుమారు ఏడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. -
మెట్రో టేకోవర్పై వీడని అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: గత మార్చిలోనే టేకోవర్ ప్రక్రియను ముగించి ఏప్రిల్ మొదటి వారం నుంచే హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చేతికొస్తుందనుకున్న మెట్రో మొదటి దశ టేకోవర్ ఇప్పటికీ అతీగతీ లేకుండాపోయింది. ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, తదితర అంశాలతో పాటు, వ్యాపార సంస్థల నిర్వహణపై స్పష్టత రావాల్సి ఉంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రుణాలను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎల్అండ్టీ సంస్థతో తేల్చుకోవాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయి. మెట్రో కోచ్లు, ట్రాక్లు, ఇతర వ్యవస్థలకు ఎల్అండ్టీ అవసరమైన మరమ్మతులు చేసి అందజేస్తుందా? లేక.. ఉన్నది ఉన్నట్లుగా బదిలీ చేస్తారా? అనే అంశం తేల్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎల్అండ్టీ సంస్థ కార్మికశాఖకు చెల్లించాల్సిన సెస్ పెండింగ్లోనే ఉంది. వ్యాపార ప్రకటనలపై జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన పన్నులు కూడా పెండింగ్ జాబితాలోనే ఉన్నాయి. బదిలీలు, చెల్లింపులు, బదలాయింపులకు మరికొంత సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పోక్సో కేసులో 76 ఏళ్ల డాక్టర్కు ఏడేళ్ల జైలు
కేపీహెచ్బీకాలనీ: బాలికతో అనుచితంగా ప్రవర్తించిన ఓ డాక్టర్కు కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు.. 2023లో ఓ బాలికతో ఆదిత్యనగర్కు చెందిన డాక్టర్ కందుల సుబ్బారావు (76) అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సుబ్బారావుకు ఏడేళ్ల ఏళ్ల జైలు శిక్ష, 30 వేల రూపాయల జరిమానా విధిస్తూ కూకట్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం డాక్టర్ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. -
సునీల్ నారంగ్ సంస్థకు రూ. కోటి టోకరా
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో పనిచేస్తూ దాదాపు కోటికిపైగా డబ్బు కాజేసిన ఉద్యోగిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్లోని సునీల్ నారంగ్ కార్యాలయంలో వనస్థలిపురానికి చెందిన విశ్వనాథ్ అకౌంటెంటుగా పనిచేసేవాడు. వివిధ సంస్థలకు వారం వారం చెల్లించాల్సిన మొత్తానికి చెక్కులను అందించేవాడు. ఈ క్రమంలోనే బోగన్ ఖాతాలు సృష్టించి యజమానికి తెలియకుండా సరఫరాదారుకు ఇవ్వాల్సిన చెక్కుల మధ్యలో పెట్టి సంతకాలు చేయించాడు. దాదాపు మూడేళ్లపాటు యజమానికి తెలియకుండా ఇలా దాదాపు కోటి రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని 2024లో జరిగిన ఆడిటింగ్లో గుర్తించారు. దీంతో సునీల్ నారంగ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విశ్వనాథ్పై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న విశ్వనాథ్ను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. మాదాపూర్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కొందరు లక్షల రూపాయలు వసూలు చేశారు. శుక్రవారం మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు... జనగామాకు చెందిన మహేశ్ కేపీహెచ్బీ వద్ద ఓ సంస్థను ప్రారంభించాడు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 452 మంది నిరుద్యోగుల నుంచి రూ.80వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. కొద్ది రోజులు వారికి జీతాలు చెల్లించి సంస్థను మూసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు మహేశ్తోపాటు సహకరించిన షేక్ నజీర్ భాషా, ఉదయలక్షి్మలను అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలోఉన్నారు. -
హెల్మెట్ పట్టీ పెట్టుకోకపోయినా చలానా!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్, హెల్మెట్ స్ట్రాప్ (పట్టీ) పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండ్రోజుల్లో కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న 3,072 మంది వాహనదారులపైన ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు. అలాగే హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న 173 మంది వాహనదారులపైన కూడా చలానాలు విధించారు. ఆయా ఉల్లంఘనదారు లకు పోలీసులు హెల్మెట్, హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోకుండా వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలను వివరించారు. ద్విచక్ర వాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్, హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకొని వాహనాలు నడుపుతూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోగలరని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, అదనపు డీసీపీ హనుమంతరావు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదు
సాక్షి, హైదరాబాద్: మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి నడుపుతున్న వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. రిజిస్ట్రేషన్ పత్రాలు, గుర్తింపు రుజువు, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించిన వెంటనే వాహ నాన్ని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పలు సూచనలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. తన మహేంద్ర ఎక్స్యూవీ 500 వాహనాన్ని అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్.. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారంటూ కూకట్పల్లికి చెందిన జె.విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ వాహనాన్ని నడుపుతుండగా వాహనంలోని మరో వ్యక్తి మద్యం సేవించి ఉన్నారనే కారణంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటన సమ యంలో ఏం చేయాలో ఇదే హైకోర్టులో 2021లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే సందర్బాల్లో వాహనం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంది’అని చెప్పారు. హోం శాఖ తరఫు ఏజీపీ వాదనలు వినిపిస్తూ.. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడపడంలో పాల్గొన్నారన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి పిటిషనర్ పత్రాలతో పోలీసులను సంప్రదించలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ⇒ డ్రైవర్ లేదా రైడర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలితే వాహనాన్ని నడపడానికి అనుమతించరాదు. అయితే, అతనితో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో లేకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆ వ్యక్తిని వాహనం నడపడానికి అనుమతించాలి.⇒ వాహనాన్ని తన అదుపులో ఉంచుకున్న పోలీసులు, మరే ఇతర అధికారి అయినా, సదరు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, గుర్తింపు రుజువు, డ్రైవింగ్ లైసెన్స్ను సమర్పించిన మీదట దానిని యజమానికి, ఏదైనా అధీకృత వ్యక్తికి అప్పగించాలి. ⇒ డ్రైవర్, వాహన యజమాని.. వీరిపై న్యాయపరమైన చర్యలు అవసరమని పోలీసులు ఒక నిర్ణయానికి వస్తే, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు వారిపై చార్జిషీట్ దాఖలు చేయాలి. ⇒ చార్జిషీట్లు ఇతరత్రా సక్రమంగా ఉంటే మోటారు వాహనాల చట్టంలోని నిబంధన 448–ఏ(4)కు అనుగుణంగా, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు ఆ చార్జిషీట్లను స్వీకరించాలని మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.⇒ ఈ ఆదేశాలతోపాటు 2021లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే ‘కోర్టు ధిక్కరణ’గా పరిగణిస్తాం. సంబంధిత పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటాం అంటూ పిటిషన్ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘హెచ్ఐవీ’ ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య
పోచారం: హెచ్ఐవీ సోకిన తనను పెళ్లి చేసుకోవడా నికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలికి గత నెల లో ప్రియుడు తన రక్తంతో ఇంజెక్షన్ చేసిన ఘట నలో బాధితురాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోచా రం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 11న చోటుచేసుకున్న ఘటనలో పోలీసులు గత నెలలోనే నిందితుడు మనోహర్ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు రమణి ఆ తర్వాత అన్నోజి గూడలోని సొంతింటికి తిరిగి వచ్చింది.అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధి తురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. తల్లిదండ్రులు గతంలో వేరే వ్యక్తితో ఆమెకు వివాహం కుదర్చగా ఈ ఘటన గురించి తెలుసుకున్న వరుడు వివాహానికి నిరా కరించాడు. దీంతో మరింత మనస్తాపానికి గురైన రమణి శుక్రవారం తన ఇంటి సమీపంలోని నానమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ నోట్ రాసింది. ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నాకు బతకాలని లేదు.మరో జన్మంటూ ఉంటే మీ కడుపులో పుడతా. అమ్మ, నాన్నలను చెల్లి, తమ్ముడు మంచిగా చూసు కోవాలి’ అని కోరింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమా చారం అందించడంతో యువతిని ఘట్కేసర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలికి హెచ్ఐవీ వైరస్ సోకినట్లు తెలిసింది. -
తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
హయత్నగర్: సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుంట్లూర్లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
Telangana: రేపు ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12న ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యా ర్థులు 4,89,126 మందికి, రెండో సంవత్సరం విద్యార్థులు 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలైంది. దీంతో ఆ నెలాఖరుకే ఫలితాలు సిద్ధమ య్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల మొదటి వారంలోనే ఫలితాలు వెల్లడిస్తామని అధికా రులు మొదట్లో ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. -
వాట్సాప్లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ సేవలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ విభాగానికి సంబంధించిన సేవలను తాజాగా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఈ వాట్సాప్ సేవ’ల ద్వారా భూమి సంబంధ పత్రాలు, సర్టిఫికెట్లు, ఇతర సేవలను ఎక్కడ నుంచైనా మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఈ వాట్సాప్ సేవల ద్వారా రిజిస్ట్రేషన్ పత్రాల సర్టిఫైడ్ కాపీలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), స్టాంప్ల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, సొసైటీలు, ఫర్మ్లు, సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తులు, అపరాధ రుసుం చెల్లింపుల వంటి సేవలను పొందవచ్చు. వాట్సాప్లో ‘ఈ సేవ’లను పొందాలంటే ముందుగా 8096958096 నంబర్ను సేవ్ చేసుకుని ‘‘ ఏజీ’’అని మెస్సేజ్ పంపాలి.అనంతరం కావలసిన సేవను ఎంచుకుని దరఖాస్తును నింపి ఆన్లైన్లో చెల్లింపు పూర్తి చేయాలి. చెల్లింపులు పూర్తయ్యాక కొన్ని సేవలకు సంబంధించిన పత్రాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పొందవచ్చు. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) మీసేవ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. సర్టిఫైడ్ కాపీలు మాత్రం ఆమోదం అనంతరం నేరుగా వాట్సాప్లోనే వినియోగదారులకు చేరతాయి. ఇప్పటికే అమలవుతున్న జనన, ఆదాయ ధ్రువపత్రాలు, పోలీస్ చలాన్లు, విద్యుత్ బిల్లుల వంటి సేవలతో పాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల సేవలు కూడా అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతోందని చెపుతున్నారు.ఎక్కడా క్యూలలో బారులు తీరకుండా, కాగితాల అవసరం లేకుండా.. ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా ప్రభుత్వ సేవలను పొందే విధంగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నవంబర్ 18, 2025న ప్రారంభమైన మీసేవ వాట్సాప్/చాట్బాట్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తున్నట్లు మీ సేవ కమిషనర్ టి. రవికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
52.8 శాతానికి చేరిన ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం 52.8 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 50.7 శాతం ఉండగా, శుక్రవారం మరో 2.1 శాతం డీఏను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి సంబంధించి జనవరిలో ప్రకటించాల్సిన తొలివిడత డీఏ పెండింగ్లో ఉండటంతో, దాన్ని చెల్లించాల్సిందిగా ఉద్యోగులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. కానీ, ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకుండా దాటవేస్తూ వచ్చింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయి దీనిపై చర్చించారు.అనంతరం 2.1 శాతం కరువు భత్యాన్ని ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ కరువు భత్యం మొత్తం చెల్లించినట్టయింది. గతంలో ఆరేడు విడతల డీఏ పేరుకుపోగా, గత ప్రభుత్వం చివరలో కొన్ని విడతలు, ప్రస్తుతం ప్రభుత్వం మరికొన్ని విడతల డీఏను ప్రకటిస్తూ వచ్చాయి. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న తాజా విడత డీఏ కూడా ఇప్పుడు ఉద్యోగుల జీతంలో కలిసిపోనుంది. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతినెలా రూ.2.82 కోట్ల మేర ఆర్థిక భారం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ⇒ ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ఆమేరకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి చాలా పెండింగ్ అంశాలను పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న డీఏ ప్రకటించటం పట్ల ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఈడీలు వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫ్ఏ విజయపుష్ప, సీటీఎం– సి శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీసీఈ కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ శాఖలో 1,912 మంది బదిలీలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు బదిలీలు జరిగాయి. రాష్ట్రంలోని కంటీజియస్ జిల్లాలు, జోన్ల వారీగా 1,586 మంది కానిస్టేబుళ్లు, 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 1,912 మంది సిబ్బందికి శుక్రవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేయాలని ఆ శాఖ కమిషనర్ సి. హరికిరణ్ ఆదేశించారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న వారికి...: వాస్తవా నికి, ఎక్సైజ్ శాఖలో 2018 జూన్లో సాధారణ బదిలీలు జరిగాయి. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత రెండేళ్ల సర్వీసును ఒకేచోట పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్లకు బదిలీల ప్రక్రియ ఈనెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సాగింది. అయితే, బదిలీలు చేసేంతవరకూ బాగానే ఉన్నా, బదిలీల కోసం రూపొందించిన మార్గదర్శకాలు కొన్ని జిల్లాల నుంచి అసమ్మతికి కారణమయ్యాయి. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే నిబంధన ఇందుకు కారణమైంది.ముఖ్యంగా సంగారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల్లో కొందరు సుదూర ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో తాము పనిచేస్తున్న జిల్లాల్లో నాన్ఫోకల్ స్థానాలకు పంపినా సరే, జిల్లా వదిలిపెట్టేది లేదని కొందరు భీష్మించుకున్నారు. ఈ ప్రక్రియ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కానీ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఎక్సైజ్ మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జోక్యం చేసుకుందని, అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కమిషనర్ హరికిరణ్ ఈ ప్రక్రియను పూర్తి చేశారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ⇒ త్వరలోనే ఎక్సైజ్ ఎస్సైలు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల (ఏఈఎస్) బదిలీలు కూడా జరగనున్నాయి. వీటిలో కూడా ఎక్కడా రాజకీయ సిఫారసులను ఆమోదించొద్దని, నిబంధనల ప్రకారం జోన్ల వారీగా స్థాన చలనం చేయాలని, అప్పుడే శాఖలో పారదర్శకత అమలవుతున్నట్టు భావిస్తామని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
భూముల విలువల పెంపు నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ప్రభుత్వ విలువల పెంపు కోణంలో జరిగిన అధ్యయన నివేదికను వెంటనే సమర్పించాలని, రానున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టి చర్చించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. భూముల విలువల పెంపు ద్వారా ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడకుండా ఈ నివేదికలను తయారు చేయాలని ఆయన సూచించారు.శుక్రవారం సచివాయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఆదాయ సృష్టి, వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ కె.రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాలతోపాటు ఆదాయార్జన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు చర్చించారు. ఎక్సైజ్, రెవెన్యూ, పరిశ్రమల శాఖల్లో ఆదాయ పెంపునకు గల అవకాశాలు, ఫలితాలపై సమీక్షించారు. వనరుల సమీకరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోండిఈ సమీక్షలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కృత్రిమ మేధ∙(ఏఐ) లాంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఆదాయార్జన శాఖల రాబడులు, పన్నులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. విజన్–2047 లక్ష్యంగా ఆదాయ పెంపునకు అవసరమైన వనరుల సమీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్లను నియంత్రించడం ద్వారా ఆదాయం పెంచాలని కోరారు.వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా ఆదాయం పెరుగుతోందని, ఈ శాఖల్లోనూ ఆదాయ వనరుల పెంపునకు గల అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రపంచ స్థాయిలో నిర్వహించాలని, అందరికీ ముందస్తు సమాచారం అందించడం ద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశముంటుందన్నారు. -
జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఒ.రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లక్డీకాపూల్లోని ఓ హోటల్లో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరి ష్కారమే లక్ష్యంగా కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వి.లచ్చిరెడ్డి, రాజశేఖర్ మాట్లాడారు. జూన్ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలన్నారు.పీఆర్సీ కమిటీ గడువును పొడిగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల 17న ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. మే 5వ తేదీన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడంతోపాటు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ శాఖలో 630మంది సిబ్బంది తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించారు. -
పునర్విభజనతో ప్రజా ఉద్యమం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ నియోజకవర్గాల పెంపు (పునర్విభజన)తో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయని, ఫలితంగా ప్రజా ఉద్యమాలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. రైతు చట్టాల్లాగే డీలిమిటేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకోకతప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర ద్రోహం చేస్తోందని అన్నారు. ఈ రాష్ట్రాలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని చెప్పారు. ‘ఇప్పటికే మేము తీవ్రమైన బాధతో ఉన్నాం.. గాయపడి ఉన్నాం.. మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు’ అని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన అనంతరం.. రాత్రి తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అప్పుడు బండి, కిషన్రెడ్డిలకు చప్రాసీ పదవి కూడా దొరకదు‘నియోజకవర్గాలను ఏ ప్రాతిపదికన, ఎలా పెంచాలి అనే దానిపై కనీస చర్చ లేకుండా ఎందుకింత అర్జెంటుగా? దేశంలో 50 శాతం నియోజకవర్గాల పెంపు జరిగితే ఉత్తరాదికే పూర్తి అడ్వాంటేజ్గా మారుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి వస్తుంది. చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా ప్రాముఖ్యత కోల్పోతాయి. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన, మెరిట్ డిజబిలిటీ విధానంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు ఉండాలి.చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ అలాగే కొనసాగాలి. ప్రస్తుతం కేరళ, యూపీ మధ్య 60 సీట్ల తేడా ఉంది. పునర్విభజన జరిగితే అది ఏకంగా 99కి పెరుగుతుంది. ఇది ముమ్మాటికీ చిన్న రాష్ట్రాలకు ఉరితాడు లాంటిదే. భవిష్యత్తులో ఉత్తరాది సీట్లు పెరిగితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్, కిషన్రెడ్డి లాంటి దక్షిణాది బీజేపీ నేతలకు కనీసం చప్రాసీ పదవి కూడా దొరకదు..’ అని సీఎం అన్నారు.అందమైన ముసుగులో మోసం‘నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో చేస్తున్న మోసం. బీజేపీ పెడుతున్న ఈ మెలికల్లో వారి రాజకీయ స్వార్థం దాగుంది. గతంలో ఇలాగే హడావుడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లుపై సౌత్లో రియాక్షన్ వస్తే, బీజేపీ పాలిత చిన్న రాష్ట్రాలు సహా.. ఇతర చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం ఏం చేస్తుంది? ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు.మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు..మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను దివంగత ప్రధాని రాజీవ్గాంధీ అమలు చేశారు. సోనియాగాంధీ గతంలోనే మహిళా రిజర్వే షన్ బిల్లును పెట్టారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల కోసం సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న 543 లోక్సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? కేంద్రం లీకులు ఇస్తున్న ఇతర సవరణలపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు.కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని రేవంత్రెడ్డి విమర్శించారు. ‘గతంలో బీఆర్ఎస్లో సీనియర్లుగా ఉన్న ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్, విజయశాంతి లాంటి ఎంతోమందికి ఏం జరిగిందో, వారిని ఎలా గెంటేశారో అందరికీ తెలుసు..’ అని వ్యాఖ్యానించారు. -
మావోయిస్టు రహిత తెలంగాణ: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ నేతల లొంగుబాటు తర్వాత మిగిలిన 11 మంది జనజీవన స్రవంతిలోకి రావడంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ బి.శివధర్రెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి సహా ఐదుగురు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన 11 మంది సహా మొత్తం 42 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో శుక్రవారం జనజీవన స్రవంతిలోకి వచ్చారు.వీరు ఐదు ఏకే 47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు సహా మొత్తం 36 ఆయుధాలతోపాటు రాష్ట్ర కమిటీకి చెందిన 800 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్కుమార్, గ్రేహౌండ్స్ ఏడీజీ అనిల్కుమార్, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న ములుగు జిల్లా తడపాల గ్రామానికి చెందిన కుంజం ఇడుమాల్ అలియాస్ మహేందర్తోపాటు పీఎల్జీఏ బెటాలియన్ ఇన్చార్జ్, దండకారణ్యం స్పెషల్జోనల్ కమిటీ సభ్యుడు సోడిమల్లు సహా మొత్తం 42 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచి్చనట్టు తెలిపారు.42 మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పునరావాసం కింద మొత్తం రూ.కోటి 93 లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన కుంజం ఇడుమాల్కు రూ.4 లక్షల చెక్, ఛత్తీస్గఢ్కు చెందిన వారికి రూ.25 వేలు చొప్పున తక్షణ సాయం కింద అందజేశామన్నారు. మాజీ మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం రేవంత్రెడ్డి ఇచి్చన హామీ మేరకు హెల్త్కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరిందని, రెండు రోజుల్లో జీఓ వస్తుందని తెలిపారు. హెల్త్కార్డులకు ఎలాంటి పరిమితి లేదని, నిమ్స్ సహా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైద్యసాయం పొందొచ్చని తెలిపారు. మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టిన బాంబుల వెలికితీతలో మాజీల సాయం తీసుకుంటున్నట్టు డీజీపీ తెలిపారు.కొందరు మావోయిస్టు అగ్ర నేతలు తాము అరెస్టయినట్టు ప్రకటించుకున్న అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ స్పందిస్తూ..40 ఏళ్లపాటు ఉద్యమంలో పనిచేసిన తర్వాత లొంగిపోయారంటే వారికి కొంత అగౌరవంగా ఉండొచ్చని, గౌరవం కోసం వారు తాము అరెస్టయ్యామని చెప్పినా, పోలీసులకు ఎలాంటి నష్టం లేదన్నారు. అరెస్టయిన వారు జైలులో ఉంటారు కానీ, బయట ఉండరు కదా అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను పోలీసుల నిర్బంధంలో ఉంచుతున్నారన్న విమర్శలు సరికాదని డీజీపీ స్పష్టం చేశారు.మావోయిస్టు అగ్రనేత గణపతి బతికే ఉన్నారని, అయితే అటవీ ప్రాంతంలో లేరని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా పనిచేసిన ఎస్ఐబీ చీఫ్ సుమతి బృందాన్ని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ⇒ 2024 నుంచి ఇప్పటి వరకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 761 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. 302 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులు అప్పగించినట్టు తెలిపారు. -
అన్నా.. దేవుడే పంపిండు!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. అన్నా.. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది..’ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి టి.జీవన్రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావుతో అన్నారు. బీఆర్ఎస్లో చేరుతున్నట్టు గురువారం ప్రకటించిన జీవన్రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో భేటీ అయ్యారు.తొలుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి జీవన్రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డా.కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జీవన్రెడ్డి వెంట ఆయన కుమారులు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డితో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేశ్ కూడా ఎర్రవల్లికి వచ్చారు.కాగా జీవన్రెడ్డిని ఆత్మియ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి తన నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సమయంలోనే జీవన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతల సమక్షంలో ఇష్టాగోష్టి అనంతరం జీవన్రెడ్డి బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కేసీఆర్, జీవన్రెడ్డి నడుమ సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరికకు తేదీ ఖరారైంది. రాజకీయ పరిస్థితులపై చర్చ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జీవన్రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవడంతో పాటు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం, పదేళ్ల బీఆర్ఎస్ పాలన వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలనా తీరు తదితరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం తిరోగమన దిశలో ఉందనే కోణంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జగిత్యాలలో 2 లక్షల మందితో సభ జీవన్రెడ్డి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో జరిగే బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు ఆదేశాలు అందాయి. సభ నిర్వహణ బాధ్యతను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డితో పాటు స్థానిక నేతలకు అప్పగించినట్లు సమాచారం. సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని శనివారం బీఆర్ఎస్ నేతలు సందర్శించి ఖరారు చేయనున్నారు. సుమారు 2 లక్షల మందితో సభ నిర్వహించేలా మైదానం ఎంపిక చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జీవన్రెడ్డికి సెక్రటరీ జనరల్ హోదా జీవన్రెడ్డికి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు ఈ పదవిలో కొనసాగారు. కాగా జీవన్రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ముఖాముఖి సమావేశం సందర్భంగా పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జీవన్రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది ⇒ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ⇒ మీడియాతో జీవన్రెడ్డి సాక్షి, సిద్దిపేట: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం పట్టు కోల్పోయిందని మాజీమంత్రి టి.జీవన్రెడ్డి విమర్శించారు. అయితే తన విషయంలో పీసీసీ తప్పు చేసింది కానీ ఏఐసీసీని నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు. శుక్రవారం కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సీఎం రేవంత్రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా, రూలర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం సీఎం అదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయింది.మరోవైపు రేవంత్రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నా..’ అని జీవన్రెడ్డి తెలిపారు. తనకు 14 సార్లు బీ ఫామ్ ఇచ్చారంటే కంటెంట్ ఉన్న నాయకుడినే కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన అన్నారు. కాగా జీవన్రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణలు మీడియాకు తెలిపారు. -
నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు.. మార్గాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం రైతుబజార్, బస్స్టాప్ జరుగుతున్న స్కైవాక్ నిర్మాణ పనుల దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఈ రోజు (శుక్రవారం) రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ క్రింది విధంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని అధికారులు ట్రఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు..ట్రాఫిక్ మళ్లింపులు జరిగే ప్రాంతంమాసబ్ ట్యాంక్, NMDC, ఎస్.డి.ఐ హాస్పిటల్ వైపు నుండి రేతిబౌలి-నానల్ నగర్ వైపు వెళ్లే వాహనాలను పి.వి.ఎన్.ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 2 & 3 (అజీజియా మసీదు) వద్ద మళ్లిస్తారు.ఈ వాహనాలు మెరాజ్ కేఫ్ వద్ద కుడి వైపుకు తిరిగి, మెహిదీపట్నం పిల్లర్ నెం. 15 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా నగర ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అప్డేట్ల కోసం మా సోషల్ మీడియా వేదికలైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్ పేజీ (facebook.com/ HYDTP) ఎక్స్ట్విట్టర్ హ్యాండిల్ @HYDTP ను అనుసరించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిల్లో ట్రాఫిక్ హెల్ప్లైన్ నెంబర్: 9010203626 కాల్చేయాలని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రకటన విడుదల చేశారు -
త్వరలో తెలంగాణ లిక్కర్ చార్జీలు పెంపు..!
హైదరాబాద్: తెలంగాణలో లిక్కర్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో రాష్ట్రంలో లిక్కర్ చార్జీలు పెరుగనున్నాయి. ఈ నెలాఖరుకల్లా చార్జీల పెంపుపై నిర్ణయం కమిటీ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ చార్జీల పెంపును 12 నుంచి 15 శాతం వరకూ పెంచాలని కంపెనీల ప్రతిపాదనలు పంపగా, దానిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే బీర్ల ధరలను ప్రభుత్వం పెంచగా, మళ్లీ లిక్కర్ ధరలను పెంచాలని భావిస్తోంది. రెండేళ్లకొకసారి లిక్కర్ ధరలను పెంచే నిబంధన ఉందని అధికారులు అంటుండగా, లిక్కర్ ధరలు పెరిగి దాదాపు మూడేళ్లు అవుతుందని ప్రభుత్వం అంటోంది. దాంతో లిక్కర్ ధరల పెంపునకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందనే విషయం అర్ధమవుతోంది. -
హైదరాబాద్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగుల నుంచి రూ. 5 కోట్లు మేర వసూలు చేసింది ఓ గ్యాంగ్, అయితే ఎంతకీ ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వారిని నిలదీశారు బాధితులు. ఈ విషయాన్ని నాన్చడంతో అనుమానం వచ్చిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 452 మంది బాధితులు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. -
‘మీరు చేస్తే తప్పుకాదు.. మేము చేస్తే తప్పా?’
హైదరాబాద్: డీలిమిటేషన్ పై సీఎం రేవంత్రెడ్డి అభ్యంతరాలేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి. యూపీఏ హయాంలో పునర్విభజన చేస్తే తప్పు కాదు,, తాము చేస్తే తప్పా?, SIR ప్రక్రియ గతంలో వాళ్ళు చేస్తే తప్పు కాదు.. తాము చేస్తే తప్పా? అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ‘మూసీ ప్రక్షాళన కోసం రంలో ట్రీట్ మెంట్ ప్లాంట్లకి కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్రం అడిగిన రుణాలను ఇతర సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. మూసీ ప్రక్షాళన చేయండి. మూసీ డెవలప్మెంట్ చేయండి. కానీ పేదల ఇళ్లను కూల్చొద్దు. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి అభ్యంతరాలు ఎంటి..?, వాళ్ళకి ఎం కావాలో పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలను మాట్లాడమనండి. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్లను అమలు చేయబోతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేం. ఏది పెట్టిన కావాలని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ కోడి గుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తుంది. ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్పై మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదు’ అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. -
Hyd: హయత్నగర్లో హైడ్రా కూల్చివేతలు
హైదరబాద్: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో శుక్రవారం(ఏప్రిల్ 10వ తేదీ) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంజనాద్రి నగర్లోని 204 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కాగా, ఈనెల ఆరంభంలో మైలార్దేవుపల్లి సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టి సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని కాపాడింది. మైలార్దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా సీరియస్గా దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీతో కలిసి నగరంలో వందలాది అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. -
ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
పోచారం ఐటీ కారిడార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిడ్స్ ఉందన్న కారణంతో ఓ వ్యక్తితో యువతి పెళ్లికి నిరాకరించగా.. సదరు ఉన్మాది కోపంతో ఆమెకు సిరంజీతో రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో.. బాధితురాలు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శివారు పోచారంలో గత నెల అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ ఉదంతం తర్వాత కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చేరిన సదరు యువతి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కఠోర నిజాన్ని దాచి.. పోచారానికి చెందిన మనోహర్కు ఆ మధ్య బాధిత యువతితో పెళ్లి ఖాయమైంది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. పెళ్లికి టైం దగ్గర పడుతున్న టైంలో.. మనోహర్కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కోపంలో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. మార్చి11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్ను పట్టుకున్నారు.అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్ను అరెస్టు చేశారు. యువతి బలవన్మరణంతో ఈ ఉదంతం విషాదాంతంగా మారింది. నిందితుడు మనోహర్కు కఠిన శిక్ష పడాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో కచ్చితత్వం ఉంటుంది
హైదరాబాద్ : రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో కచ్చితత్వం ఉంటుందని మంచి ఫలితాలు కనిపిస్తాయని అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ నాగేష్ అయ్యల సోమయాజులు తెలిపారు. అపోలో ఆసుపత్రిలో 155 రోజుల్లో 100 రోబోటిక్ కార్డు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆయన ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ లతో పోలిస్తే రోబోటిక్స్ శస్త్ర చికిత్సల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని శరీరం ఎక్కువ కోతకు గురి కాదని రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుందని దీనివల్ల రోగులు తొందరగా కోలుకుంటారని అన్నారు.జే ఎం డి సంగీత రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ కార్డియక్ సర్జరీ ల వల్ల చికిత్సలు స్థిరత్వం పెరగడంతో పాటు రోగుల భద్రత సౌకర్యం మెరుగుపడతాయని అన్నారు. భవిష్యత్తు వైద్యరంగంలో ఈ రోబోటిక్ సర్జరీలు మరింత కీలకంగా మారనున్నాయని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సీఈవో తేజస్వి రావు వీరపల్లి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(Dearness Allowance)ను 2.1 శాతం పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి నుంచే వర్తించనున్నట్లు తెలిపింది.ఇంతకు ముందు 50.7% డీఏ ఉండగా.. తాజా పెంపుతో అది 52.8 శాతానికి చేరింది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. కిందటి ఏడాది జూలైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే.డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అప్గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోషమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారాయన. -
ప్రాణాలతో బయటపడిన 45 మంది..
బహదూర్పల్లిలోని డెకరేషన్ ఈవెంట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయగిరి కాలనీలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్వీఎన్ పేరిట డెకరేషన్ ఈవెంట్ గోదాం నడుపుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం పక్కనే ఉన్న విద్యుత్ వైర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగాయి. డెకరేషన్ సామగ్రితో పాటు, కారు, టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా.. గోదాముకు ఆనుకొని ఉన్న గోకులం రెసిడెన్సీ భవనం రెండంతస్తుల వరకు మంటలు వ్యాపించి డోర్లు, కిటికీలు కాలి బూడిద అయ్యాయి. భవనంలోని 45 మంది వెనక నుంచి గ్రిల్స్ తొలగించుకొని బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాముకు ఎవరో కావాలనే నిప్పు పెట్టారని యజమాని వెంకటేష్ ఆరోపించారు. మంటల్లో డెకరేషన్ ఈవెంట్స్ గోదాం -
ట్రాఫికర్కు చెక్
మాసబ్ట్యాంక్– షేక్పేట్ మధ్య మోడల్ కారిడార్ సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: మాసబ్ట్యాంక్– మెహిదీపట్నం– షేక్పేట్ ప్రధాన రహదారిని మోడల్ కారిడార్గా తీర్చిదిద్దేందుకు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర సీపీ సజ్జనర్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీరి వెంట ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఉన్నారు. అధికారులంతా బస్సులో ప్రయాణిస్తూ మార్గంమధ్యలోని బాటిల్ నెక్స్, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఈ మార్గంలో రోడ్డు దాటే పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ఓబీ) నిర్మించాలని, షేక్పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్ఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, షేక్పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు అధికారులను ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేయనున్నారు. మెహిదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ప్రతి జోన్కూ రూ.20 కోట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్ పనుల నిమిత్తం ప్రతి జోన్కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జోనల్ కమిషనర్లు జి.ముకుందరెడ్డి, ప్రియాంక ఆలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్, చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, అదనపు డీసీపీ వేణుగోపాల్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి పాల్గొన్నారు. షేక్పేట్ బృందావన్ కాలనీ వద్ద మ్యాన్హోల్ను పరిశీలిస్తున్న సజ్జనర్, కర్ణన్ రోడ్డుతో పాటు అవసరమైన ఐల్యాండ్స్ సైతం విస్తరణ రెండో చోట్ల ఎఫ్ఓబీలు, ఒక ప్రాంతంలో పెలికాన్ సిగ్నల్ పోచమ్మబస్తీ నుంచి రోడ్ నెం.12కు స్లిప్ రోడ్డు నిర్మాణం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పోలీసు, బల్దియా కమిషనర్లు -
గోదాముల్లో అగ్ని కీలలు
జీడిమెట్ల, బహదూర్పల్లిలో భారీ ప్రమాదాలు జీడిమెట్ల/జగద్గిరిగుట్ట: నగరంలో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జీడిమెట్లలోని రసాయన గోదాములో ఫ్యాబ్రికేషన్ పరిశ్రమతో పాటు మరో మూడు గోదాముల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జగద్గిరిగుట్ట పరిధిలోని బహదూర్పల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రితో పాటు రెండు వాహనాలు బుగ్గి పాలయ్యాయి. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని ఏస్వీకో ఆపరేటివ్ సొసైటీలో రాజేష్ అనే వ్యక్తి రసాయన గోదామును నడుపుతున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు గోదాములో రసాయనాలు, సాల్వెంట్లను కలుపుతుండగా మంటలు అంటుకున్నాయి. డ్రమ్ముల్లో రసాయనాలు ఉండటం, దానికి ఆనుకుని ఉన్న మరో రసాయన గోదాములో రసాయనాల నిల్వలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల తాకిడికి రెండు రసాయన గోదాములతో పాటు ఠాగూర్ కెమికల్స్కు చెందిన ఆర్ అండ్ డీ ల్యాబ్, ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన మెడికల్ వేస్ట్ గోదాము, హనుమాన్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న జీడిమెట్ల, సనత్నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిని కుత్బుల్లాపూర్ ఏసీపి బాలగంగిరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నితిన్లు పర్యవేక్షించారు. ప్రమాదం చోటు చేసుకున్న గోదాముల వ్యూ రసాయనాల గోడౌన్లో ఎగిసిపడిన మంటలు కాలిపోయిన డెకరేషన్ ఈవెంట్స్ సామగ్రి దగ్ధమైన ఐదు వాహనాలు బహదూర్పల్లిలో రూ.కోటి, జీడిమెట్లలో రూ 30 లక్షల ఆస్తి నష్టం -
మీటరుకే ముచ్చెమటలు!
గ్రేటర్లో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కొరత తలెత్తి ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరిగింది. మరోవైపు బయట ఎండలు భగ్గుమంటున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గిరగిరా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ పరిధి జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే... రోజుకు సగటున 250 మెగావాట్ల పైగా అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా పగటి వేళ ఉండే ఈ పరిస్థితి.. ఉదయం 8 గంటలకే కనిపిస్తుండడం గమనార్హం. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలతో అందరూ ఎలక్ట్రిక్ కుక్కర్లను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి 1,86,369కు చేరుకుంది. రికార్డు స్థాయి డిమాండ్కు ఇది మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక్కసారిగా జరగడంతో సబ్స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, వీధుల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. డీటీఆర్లు పేలుతున్న ఘటనలూ లేకపోలేదు. తేదీ 2025 2026 01 3563 3919 02 3574 3867 03 3523 3866 04 3469 3826 05 3202 3517 06 3753 3944 07 3768 3933 08 3768 3989 -
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం..
మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. హెచ్ఐవీ నివారణకు ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా టెస్టులు, స్క్రీనింగ్ నిర్వహిస్తోందన్నారు. ఎయిడ్స్ అంటే ఏమిటి? హెచ్ఐవీ అంటే ఏమిటి? విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. – మాదాపూర్ -
చోరీ బండి.. ఇదిగోనండి
30 జంక్షన్లలో ఏఎన్పీఆర్ కెమెరాలు సాక్షి, సిటీబ్యూరో సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మూడు నెలల క్రితం చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదైంది. చోరీ చేసిన వ్యక్తి ఈ వాహనంపై గోల్కొండలో సంచరించాడు. విషయం పోలీసులకు తెలియకపోవడంతో వాహనం, చోరుడు చిక్కడం అరుదు.. నగరంలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. చోరీ వాహనాలకు, చోరులకు చెక్ చెప్పడం కోసం నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఐటీ సెల్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాజధానిలోని 30 జంక్షన్లలో ఉన్న ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) పరిజ్ఞానంతో పని చేసే సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో 12 చోరీ వాహనాలు దొరికాయి. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నేరగాళ్లకు చెక్ చెప్పడానికే డీసీపీ సీహెచ్ రూపేష్ నేతృత్వంలోని ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంను సిద్ధం చేసింది. దీనికోసం కంట్రోల్ రూమ్లో సర్వర్ ఏర్పాటు చేసింది. సీసీటీఎన్ఎస్ డేటాతో అనుసంధానం.. ● సిటీలోని ఠాణాల్లో నమోదైన ఇతర కేసుల మాదిరిగానే వాహన చోరీల వివరాలూ ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అప్డేట్ అవుతాయి. ● ఈ వివరాలను సేకరిస్తున్న ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంతో పని చేసే కెమెరాలు అనుసంధానించి ఉన్న సర్వర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఆ చోరీ వాహనంలో సదరు 30 జంక్షన్లలోని ఏ కెమెరా నుంచి ముందుకు వెళ్లినా సర్వర్లోని సాఫ్ట్వేర్ తక్షణం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని పాప్అప్ రూపంలో కంట్రోల్ రూమ్లోని సిబ్బందికి అందిస్తుంది. ఆ రెండు ఠాణాలకు సమాచారం... ఇలా పాప్అప్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ వివరాలను వాహనం చోరీపై కేసు నమోదైన, అది సంచరిస్తున్న పరిధిలోని ఠాణాలకు అందిస్తున్నారు. ఈ పోలీసుస్టేషన్లకు చెందిన బృందాలు ఆ వాహనం పదేపదే సంచరిస్తున్న ప్రాంతాల్లో మాటు వేసి పట్టుకుంటున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లో 12 వాహనాలు పట్టుకున్నారు. ఇక్కడ ఓ సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో చోరీ వాహనంలో ఓ ప్రాంతంలో సంచరించిన చోరుడు మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటికి నిఘా తగ్గి వాహనం దొరికే అవకాశాలు తగ్గుతాయని వివరిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో.. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తీర్చవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న వాహనం ఓ జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్లి మరో జంక్షన్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఠాణాలతో పాటు వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ఉన్న జంక్షన్లలోని ట్రాఫిక్ సిబ్బందికీ సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో తక్షణం వాహనాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. చోరీ వాహనాలను చోరులు అమాయకులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు దొరికినా అత్యధిక కేసుల్లో చోరులు మాత్రం చిక్కట్లేదు. ఏఐ ద్వారా జనరేట్ చేసిన వాహనం 2 నెలల్లో దొరికిన 12 తస్కరణ వాహనాలు వీటి సర్వర్తో సీసీటీఎన్ఎస్ డేటా అనుసంధానం ‘అపహరణ వాహనాన్ని’ గుర్తించిన వెంటనే పాప్అప్ స్థానిక పోలీసులకు సమాచారమిస్తున్న ఐటీ సెల్ -
వజ్రాభరణాలు దోచాడు.. చెత్తకుప్పలో దాచాడు
● వాటి ఆచూకీ దొరకవద్దని ఇంటి పని మనిషి పన్నాగం ● రూ.14 లక్షల విలువైన డైమండ్ రింగ్, మరో నగ స్వాధీనం బంజారాహిల్స్: తాను పని చేస్తున్న ఇంట్లో రూ.14 లక్షల విలువైన వజ్రాభరణాలను అపహరించి.. వాటి ఆచూకీ దొరకవద్దనే ఉద్దేశంతో చెత్తకుప్పలో దాచిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డునెంబర్–25లో నివసించే అమీదుల్లాఖాన్, బేగం దంపతుల ఇంట్లో బోరబండ సైట్–3లో ఉంటున్న బిహార్కు చెందిన ఆనంద్కుమార్ ముక్యా (32) ఆరు నెలల క్రితం పనిలో చేరాడు. గత నెల 23న యజమాని ఇంట్లోని డైమండ్ రింగ్తో పాటు వజ్రాభరణాలు తస్కరించి పరారయ్యాడు. ఆనంద్కుమార్తో పాటు గుడ్డు అనే ఇద్దరు పని మనుషులపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించి.. బోరబండలోని ఆనంద్కుమార్ గదిలో సోదాలు చేయగా.. ఓ మూలకున్న చెత్త కుప్పలో రూ.14 లక్ష విలువైన డైమండ్ రింగ్తో పాటు మరో ఆభరణం పోలీసులకు లభించాయి. వజ్రాభరణాలను తానే చోరీ చేశానని.. తనపై అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తే ఆభరణాలు దొరకవద్దనే ఉపాయంతో చెత్త కుప్పలో దాచినట్లు నిందితుడు వెల్లడించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆనంద్కుమార్ను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల విజేత అమూల్య
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. అల్వాల్కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్ను గెలుచుకున్నారు. ప్రముఖ నటి లయ చేతులమీదుగా టైటిల్ అందుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు. కిమ్స్ సన్షైన్లో స్పైన్ సూట్ టెక్నాలజీ సనత్నగర్: స్సైన్ సర్జరీలో అధునాత స్పైన్ నావిగేషన్, హైస్పీడ్ డ్రిల్స్, ఖచ్చితత్వంతో కూడిన సర్జరీ టెక్నాలజీని కిమ్స్ సైన్షైన్ హాస్పటల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఏవీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పటల్లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడుం నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ చేస్తారనే అపోహ వద్దని..అవసరమైన వారికి మాత్రమే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆపరేషన్ చేస్తామన్నారు. వచ్చే వారం నుంచి బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పటల్లో ఉచిత స్కోలియోసిస్ క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పైన్ సర్జన్ డాక్టర్ ఆంజనేయులురెడ్డి, డాక్టర్ అనాగ్ చక్రవర్తి, డాక్టర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం సుల్తాన్బజార్: హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీవీరులను తయారుచేసి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపిందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్లో అండర్–17 డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలను తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంతోష్ పహిల్వాన్లు మాట్లాడుతూ... ఈ పోటీల్లో దాదాపు 200 మంది పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 13న జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రెజ్లింగ్ డిస్ట్రిక్ట్ సభ్యులు అస్లాం పహిల్వాన్, ఖాలీద్ పహిల్వాన్ పాల్గొన్నారు. వినూత్న మార్పులకు సదస్సులు దోహదం అంతర్జాతీయ కాంక్రీట్ పేవ్మెంట్ సదస్సు ప్రారంభం సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న మార్పులకు అంతర్జాతీయ సదస్సులు దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో 13వ అంతర్జాతీయ కాంక్రీట్ బ్లాక్ పేవ్మెంట్ సదస్సు నరెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంక్రీట్ బ్లాక్ టెక్నాలజీ కేవలం సౌందర్యం కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.. నిర్మాణ వ్యర్థాల నుంచి సేకరించిన కాంక్రీట్ అగ్రిగేట్లను 50 శాతం వరకు వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను 30 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు వెల్లడించారు. జర్మనీ, ఆస్ట్రియా, బ్రిటన్, కెనడా, అమెరికా వంటి దేశాల ఇంజనీర్లు, పరిశోధకులు, నిపుణులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్గా మారిన మాజీ సైనికుడు
సికింద్రాబాద్: మాజీ సైనికుడు చైన్ స్నాచింగ్లకు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా గుడిమెట్టకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్రెడ్డి (51) మాజీ సైనికుడు. శ్రీనివాస్రెడ్డి నాగారంలో నివాసం ఉంటూ ఘట్కేసర్లోని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. షేర్మార్కెట్లో పెట్టుబడుల ఫలితంగా నష్టపోయాడు. బెట్టింగ్లను ఆశ్రయించినా ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు రైలు ప్రయాణాల్లో మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈనెల 2, 3 తేదీల్లో ఉదయం వేళల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే కాకతీయ ఎక్స్ప్రెస్రైలులో రెండు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలోంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులను లాక్కొని లాలాగూడ, చర్లపల్లి ప్రాంతాల్లో రైలునుంచి దూకి పరారయ్యాడు. ఈనెల 9న మళ్లీ రైలు ఎక్కేందుకు వచ్చిన శ్రీనివాస్రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు -
‘నారాయణ అంటేనేచంద్రబాబు బినామీ’
● ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు పంజగుట్ట: తెలంగాణ ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్టులను కొందరు తమ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఆంధ్రా కార్పొరేట్లకు బలికావొద్దు అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, సినీ దర్శకుడు సయ్యద్ రఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ .. తెలంగాణ వచ్చినా ఇంకా ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. కురుమ ఆత్మగౌవర భవనాన్ని నారాయణ కాలేజీ యాజమాన్యం లీజుకు తీసుకోవడం దారుణమైన చర్య అన్నారు. నారాయణ అంటేనే చంద్రబాబు బినామీ.. నారాయణ కాలేజీ చేసే అక్రమాలు అన్నీ..ఇన్నీ కాదని, ఈ కాలేజీలను తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో లేకుండా చెయ్యాలని పిలుపునిచ్చారు. నారాయణ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ నుండి తరిమి కొట్టాలని కోరారు. వివిధ కుల సంఘాల నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, గురునాధ్ కురుమ, శారదగౌడ్, పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్లు మాట్లాడారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, సిటీబ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, కలెక్టర్ హరి చందన దాసరితో కలిసి కలెక్టరేట్లో సమత కిచెన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా అయన ఆభివర్ణించారు.సమాజంలోని వృద్ధులు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆర్థిక చేయూత తో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ● రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో అంతర్భాగమని, వారి గౌరవప్రద జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమత కిచెన్ కు ఎంపీ ల్యాడ్స్ నిధులను తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ● ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో 10 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఈబీసీ, దివ్యాంగుల కోటాను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నిరంతర సహాయక చర్యలతో పాటు, సమతా కిచెన్ వంటి ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం
గచ్చిబౌలి: కొండాపూర్ ఆస్పత్రిని వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ పేర్కొన్నారు. కొండాపూర్లోని జిల్లా స్థాయి ఆస్పత్రిలో గురువారం కూ.40.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణానికి, డయాగ్నస్టిక్స్హబ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుతో నగరానికి వెళ్ళాల్సిన పనిలేకుండా ఇక్కడే అందుబాటులో వైద్య సేవలు వస్తాయన్నారు. ఈ ఆస్పత్రిలోని 16 విభాగాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే నాణ్యమైన వైద్యం అందించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిని పరిశీలించి వైద్యసౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ కొండాపూర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన -
ఆమె.. అలా మోసపోయింది
సోషల్ మీడియా స్నేహాలు ఎంత ప్రమాదకరమైనవో తెలియజేసే మరో ఘటన ఇది. పథకం ప్రకారం ఫేస్బుక్లో పరిచయమైన వివాహిత (36)ను హనీట్రాప్ చేసి తాను పెద్ద వ్యాపారినని నమ్మబలికి, మాయమాటలతో లోబర్చుకుని ఆమె వద్ద రూ. కోటి విలువైన బంగారు వజ్రాభరణాలు తీసుకుని ఉడాయించాడో ఓ వ్యక్తి. పోలీసుల కళ్లుగప్పి సుమారు నాలుగేళ్లుగా తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. మూసారాంబాగ్కు చెందిన సూరజ్శర్మ అలియాస్ నితిన్ డైమా (30) కింగ్కోఠిలోని ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తుంటాడు. 2022లో ఫేస్బుక్లో జూబ్లీహిల్స్కు చెందిన ఓ వివాహిత పరిచయమైంది. దీంతో తరచూ ఇద్దరూ కలుసుకోసాగారు. ఈ క్రమంలో సూరజ్శర్మ.. తాను పెద్ద వ్యాపారినని..అంతేకాక తనకు అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మించాడు. పలుమార్లు ఆమె వద్ద నుంచి రూ.50 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే వజ్రాభరణాలు, రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. కొద్ది రోజుల దాకా ఆమెతో సన్నిహితంగా ఉండడంతో నామె భర్త, పిల్లలను వదిలి సూరజ్తోనే సహజీవనం చేసింది. అయితే.. పథకం ప్రకారం నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు. ఫేస్బుక్ ఖాతాను మూసేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదేళ్లుగా సూరజ్ కదలికలపై నిఘా పెట్టారు. ఐదేళ్లుగా ఫోన్ వాడకుండా ఫేస్బుక్ను ఉపయోగించకుండా ఉన్న నిందితుడు.. ఇక తనను అందరూ మరిచిపోయారని భావించి పాత ఫోన్ నెంబరును యాక్టివేట్ చేయించాడు. అనంతరం ఫేస్బుక్లో కూడా యాక్టివ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు.. నిందితుడు మూసారాంబాగ్లో ఓ ఇంట్లో ఉన్నాడని గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఆరా తీయగా నిందితుడి అసలు పేరు నితిన్ డైమా అని తేలింది. అతనికి వివాహం జరిగినట్లు కూడా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. :::సాక్షి, బంజారాహిల్స్ -
వజ్రాభరణాలు దోచాడు.. చెత్తకుప్పలో దాచాడు
బంజారాహిల్స్: తాను పని చేస్తున్న ఇంట్లో రూ.14 లక్షల విలువైన వజ్రాభరణాలను అపహరించి.. వాటి ఆచూకీ దొరకవద్దనే ఉద్దేశంతో చెత్తకుప్పలో దాచిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డునెంబర్–25లో నివసించే అమీదుల్లాఖాన్, బేగం దంపతుల ఇంట్లో బోరబండ సైట్–3లో ఉంటున్న బిహార్కు చెందిన ఆనంద్కుమార్ ముక్యా (32) ఆరు నెలల క్రితం పనిలో చేరాడు. గత నెల 23న యజమాని ఇంట్లోని డైమండ్ రింగ్తో పాటు వజ్రాభరణాలు తస్కరించి పరారయ్యాడు.ఆనంద్కుమార్తో పాటు గుడ్డు అనే ఇద్దరు పని మనుషులపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించి.. బోరబండలోని ఆనంద్కుమార్ గదిలో సోదాలు చేయగా.. ఓ మూలకున్న చెత్త కుప్పలో రూ.14 లక్ష విలువైన డైమండ్ రింగ్తో పాటు మరో ఆభరణం పోలీసులకు లభించాయి. వజ్రాభరణాలను తానే చోరీ చేశానని.. తనపై అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తే ఆభరణాలు దొరకవద్దనే ఉపాయంతో చెత్త కుప్పలో దాచినట్లు నిందితుడు వెల్లడించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆనంద్కుమార్ను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాఫికర్కు చెక్
సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: మాసబ్ట్యాంక్– మెహిదీపట్నం– షేక్పేట్ ప్రధాన రహదారిని మోడల్ కారిడార్గా తీర్చిదిద్దేందుకు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర సీపీ సజ్జనర్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీరి వెంట ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఉన్నారు. అధికారులంతా బస్సులో ప్రయాణిస్తూ మార్గంమధ్యలోని బాటిల్ నెక్స్, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఈ మార్గంలో రోడ్డు దాటే పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ఓబీ) నిర్మించాలని, షేక్పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతి»ౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్ఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, షేక్పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు అధికారులను ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేయనున్నారు. మెహిదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ప్రతి జోన్కూ రూ.20 కోట్లుజీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్ పనుల నిమిత్తం ప్రతి జోన్కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జోనల్ కమిషనర్లు జి.ముకుందరెడ్డి, ప్రియాంక ఆలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్, చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, అదనపు డీసీపీ వేణుగోపాల్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి పాల్గొన్నారు. -
చోరీ బండి.. ఇదిగోనండి
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మూడు నెలల క్రితం చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదైంది. చోరీ చేసిన వ్యక్తి ఈ వాహనంపై గోల్కొండలో సంచరించాడు. విషయం పోలీసులకు తెలియకపోవడంతో వాహనం, చోరుడు చిక్కడం అరుదు.. నగరంలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. చోరీ వాహనాలకు, చోరులకు చెక్ చెప్పడం కోసం నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఐటీ సెల్ ప్రత్యేక చర్యలు తీసుకుంది.రాజధానిలోని 30 జంక్షన్లలో ఉన్న ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) పరిజ్ఞానంతో పని చేసే సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో 12 చోరీ వాహనాలు దొరికాయి. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నేరగాళ్లకు చెక్ చెప్పడానికే డీసీపీ సీహెచ్ రూపేష్ నేతృత్వంలోని ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంను సిద్ధం చేసింది. దీనికోసం కంట్రోల్ రూమ్లో సర్వర్ ఏర్పాటు చేసింది. సీసీటీఎన్ఎస్ డేటాతో అనుసం«ధానం.. ⇒ సిటీలోని ఠాణాల్లో నమోదైన ఇతర కేసుల మాదిరిగానే వాహన చోరీల వివరాలూ ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అప్డేట్ అవుతాయి. ⇒ ఈ వివరాలను సేకరిస్తున్న ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంతో పని చేసే కెమెరాలు అనుసంధానించి ఉన్న సర్వర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఆ చోరీ వాహనంలో సదరు 30 జంక్షన్లలోని ఏ కెమెరా నుంచి ముందుకు వెళ్లినా సర్వర్లోని సాఫ్ట్వేర్ తక్షణం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని పాప్అప్ రూపంలో కంట్రోల్ రూమ్లోని సిబ్బందికి అందిస్తుంది. ఆ రెండు ఠాణాలకు సమాచారం... ఇలా పాప్అప్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ వివరాలను వాహనం చోరీపై కేసు నమోదైన, అది సంచరిస్తున్న పరిధిలోని ఠాణాలకు అందిస్తున్నారు. ఈ పోలీసుస్టేషన్లకు చెందిన బృందాలు ఆ వాహనం పదేపదే సంచరిస్తున్న ప్రాంతాల్లో మాటు వేసి పట్టుకుంటున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లో 12 వాహనాలు పట్టుకున్నారు. ఇక్కడ ఓ సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో చోరీ వాహనంలో ఓ ప్రాంతంలో సంచరించిన చోరుడు మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటికి నిఘా తగ్గి వాహనం దొరికే అవకాశాలు తగ్గుతాయని వివరిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో.. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తీర్చవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న వాహనం ఓ జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్లి మరో జంక్షన్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఠాణాలతో పాటు వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ఉన్న జంక్షన్లలోని ట్రాఫిక్ సిబ్బందికీ సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో తక్షణం వాహనాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. చోరీ వాహనాలను చోరులు అమాయకులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు దొరికినా అత్యధిక కేసుల్లో చోరులు మాత్రం చిక్కట్లేదు. -
సెమీకండక్టర్లలో స్వావలంబన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేలా కొత్త విధానం రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 (ఐఎస్ఎం రెండో దశ)తో అనుసంధానం చేస్తూ కొత్త పాలసీ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. సెమీకండక్టర్ల రంగంలో తెలంగాణ స్వావలంబన సాధించడం లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని సమాచారం.ఇన్నాళ్లూ చిప్లు, సెమీకండక్టర్ల రంగంలో ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్)కు పరిమితమైన స్థానిక తయారీ పరిశ్రమలను అధునాతన చిప్ డిజైన్ దిశగా మళ్లించేందుకు ఈ కొత్త పాలసీ దోహదపడుతుందని, కేంద్రం అమలు చేస్తున్న ఈఎంసీ, ఐఎస్ఎం పథకాల ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ పాలసీ రూపకల్పనకు సంబంధిత రంగాలకు చెందిన ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పాలసీ విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో కొత్త ఈఎంసీ పాలసీలో భాగంగా ప్రధానంగా కొత్త ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు (ఈఎంసీ), నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. హైదరాబాద్లో ‘సెమీకండక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ద్వారా ప్రతీ ఏటా ఐదు వేల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తారు. చిప్ డిజైన్, కృత్రిమ మేథస్సు (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో ఈ శిక్షణ ఉంటుంది.కొత్త పాలసీలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త ఈఎంసీ ఏర్పాటుకు అనువైన 623 ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ అమలు చేస్తున్న ఎల్రక్టానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2.0 పథకం కింద ఏర్పాటయ్యే ఈఎంసీ ద్వారా తెలంగాణలో కొత్త తరం ఎల్రక్టానిక్స్ తయారీకి అవసరమైన పునాది ఏర్పడుతుందని పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) వర్గాలు చెప్తున్నాయి. ఈఎంసీల అభివృద్ధిపై దృష్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మొదటి దశ (ఈఎంసీ 1.0)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇప్పటికే రెండు ఈఎంసీల అభివృద్ధిని ప్రతిపాదించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 310 ఎకరాల్లో రూ.437 కోట్ల వ్యయంతో ఒక ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందుకు కేంద్రం రూ.138.60 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.298 కోట్లు వెచ్చించనుంది.మహేశ్వరం మండలం రావిర్యాలలోనూ 603 ఎకరాల్లో రాష్ట్రం ఈఎంసీని అభివృద్ధి చేస్తోంది. మొత్తం రూ.667 కోట్ల వ్యయం అంచనా వేయగా కేంద్రం రూ.252.41 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.415 కోట్లు వెచ్చించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత బడ్జెట్లో రాష్ట్ర వాటాగా రూ.19.70 కోట్లు మంజూరు చేశారు. ఇదిలా ఉంటే మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి (తాడిపర్తి) వద్ద ఈఎంసీ 2.0లో భాగంగా రూ.878 కోట్లవ్యయంతో కొత్త ఎలక్టానిక్ తయారీ క్లస్టర్ ఏర్పాటుకు టీజీఐఐసీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. -
హరీశ్రావు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత హరీశ్రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నా రని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్లో వీరు మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హరీశ్రావు నిరాధార ఆరోప ణలు చేస్తున్నారని విమర్శించారు. పొంగులేటి లేదా ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను ఆయనకు అంటగడుతున్నారని తెలి పారు. శిల్పా ఇన్ఫోటెక్, ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్, క్రిస్టల్ మాన్షన్ వంటి సంస్థలతో ఆయ నకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.దీనికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు ఉంచుతున్నా మని చెప్పారు. నాదర్గుల్ భూముల వ్యవహా రం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, 2021లో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. భూముల కేటాయింపులు, బది లీలపై విచార ణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హరీశ్ రావుకు గతంలో పారిశ్రామిక వేత్తలను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర ఉందని, తన రాజకీయ అస్తిత్వం కోసం ఇప్పుడు ప్రభుత్వంపై విమ ర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్య లను పక్కనపెట్టి భూముల చుట్టూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. -
కోర్టుకు హామీ ఇచ్చి పాటించరా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు, ఇతర ప్రయోజనాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలంటూ గత నెలలో తామిచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 758 మంది పిటిషనర్లకు చెల్లించామని ప్రభుత్వం చెబుతున్నా.. 221 మందికి మాత్రమే పూర్తిస్థాయిలో నగదు అందినట్లు తెలుస్తోందని చెప్పింది. ఇంకో చివరి అవకాశం ఇస్తున్నామని, అందరికీ పూర్తిస్థాయి చెల్లింపులు చేయాల్సిందేనని తెల్చిచెప్పింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరై ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుంటే ఎలా ప్రశ్నించింది. కోర్టులతో ఆటలాడుకోవద్దని, అలుసుగా తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా వేస్తూ.. ఆలోగా ఒక్కటి పెండింగ్లో ఉన్నా ఆర్థిక ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్నది కాదు.. అది జీవితకాలమంతా ఆ ఉద్యోగులు దాచుకుందని మరోసారి నొక్కి చెప్పింది. పదవీ విరమణ బకాయిలు, ఇతర ప్రయోజనాలు చెల్లించడం లేదంటూ రెండేళ్లలో వందలాది పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లలో చెల్లింపులకు కొంత గడువిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు దాటినా నిధులు విడుదల చేయకపోవడంతో 758కి పైగా ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ధిక్కరణ పిటిషన్లలో విచారణ కూడా నెలలుగా సాగుతోంది. గత నెల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి స్పష్టమైన హామీ తీసుకుంది. ఆ మేరకు ఏప్రిల్ 9 వరకు చెల్లింపులకు డెడ్లైన్ విధించింది. ఒకరికి కూడా పెండింగ్ ఉండొద్దు..ఈ ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. చాలామంది తమకు పూర్తిస్థాయి చెల్లింపులు చేయలేదని చెప్పడంతో న్యాయమూర్తి ఒక్కో పిటిషన్ వారీగా పరిశీలించారు. మొత్తం పిటిషన్లలో 221 మందికి మాత్రమే పూర్తి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఏప్పిల్ 9లోగా చెల్లిస్తామని చెప్పి.. అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 758 మందిలో 737 మందికి పూర్తి చెల్లింపులు జరిపామన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులందరూ ఇక్కడ లేకపోవడంతో కొంత అస్పష్టత ఉందని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒక్కో వ్యక్తికి 2 నుంచి 10 టోకెన్లు జారీ అయ్యాయని, వాటిలో కొన్ని చెల్లించి మరికొన్ని బకాయి ఉంచారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరి అవకాశంగా జూన్ 10 వరకు సమయం ఇస్తున్నామని, బకాయిలు చెల్లించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. -
జూన్ 2 నుంచి ‘రైతు డిస్కం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) కార్యకలాపాలు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం రెండుగా ఉన్న డిస్కంలు మూడుగా మారడంతో కొత్త డిస్కం నిర్మాణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత సమగ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు గురువారం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు డిస్కం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఏఎస్సీఐ విద్యుత్ విభాగానికి చెందిన నిపుణులు, పాలసీ, నిర్వహణ రంగాల్లో అనుభవజ్ఞులు పాల్గొన్నారు. సంస్థ నిర్మాణానికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై లోతైన చర్చలు జరిపారు. ప్రధానంగా ఆస్తుల విభజనపై చర్చ జరిగింది. ప్రస్తుత విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రైతు డిస్కంకు బదిలీ చేయాల్సిన ఆస్తుల గుర్తింపు, విలువ నిర్ణయం, పారదర్శకంగా విభజన చేపట్టే విధానాలపై చర్చించారు. సాంకేతిక, ఆర్థిక పరమైన ప్రభావాలను కూడా సమీక్షించారు. మానవ వనరుల సమకూర్పులో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, నైపుణ్యాల ఆధారంగా విభజన, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు, సేవా నిబంధనల రూపకల్పనపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఫార్మాట్ తయారు చేశారు. వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి వ్యవసాయ, నీటి పారుదల, వాటర్ వర్క్స్ ఇతర వినియోగదారులను వేరు చేసి రైతు డిస్కంకు అనుసంధానం చేసే ప్రక్రియ, డేటా సమీకరణ, కచ్చితమైన వినియోగదారుల డేటాబేస్ తయారీ, సేవల సరళీకరణపై చర్చించారు. ఆస్తుల విభజన, మానవ వనరుల కేటాయింపు ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించినట్టు ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఏఎస్సీఐ సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజకిరణ్ వి బిలోలికర్, రైతు డిస్కం చీఫ్ ఇంజినీర్లు పి.ఆనంద్, ఏ.కామేశ్, శ్రవణ్కుమార్, సీజీఎం సుధా మాధురి, ఏఎస్ఐసీ అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది: మహేశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. జీవన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ–ఫామ్ ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయంగా మారుతున్న పరిస్థితులను బట్టి నాయకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని చెప్పడం సరికాదని, ఆయన్ను సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు.కాంగ్రెస్పై విమర్శలు చేసే ముందు గతంలో బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని జీవన్రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, భవిష్యత్లో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, ఆధారాలు ఉంటే గాంధీభవన్కు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని, నిరాధార ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. నాదర్గుల్ భూముల వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ చేసిన దోపిడీపై ప్రజలకు ఇప్పటికే అవగాహన వచ్చిందన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, సమీప కాలంలో విస్తరణ ఉండదనే అనుకుంటున్నట్టు తెలిపారు. తనతోపాటు పలువురు నాయకులు ఎన్ఎస్యూఐ నుంచే ఎదిగినవారేనని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీచంద్రెడ్డి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, శంకర్నాయక్ తదితరులు కూడా ఎన్ఎస్యూఐ నుంచి వచ్చినవారేనని చెప్పారు. -
విద్యతోనే అంతరాలు లేని సమాజం
బోనకల్/ఎర్రుపాలెం: ప్రతీ తెలంగాణ బిడ్డ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఎదగాలని.. తద్వారా అంతరాలు లేని ఆదర్శ సమాజం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్, ఎర్రు పాలెంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలు వురు విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువా రం ఆయన ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ద్వారా తేలిందన్నారు. ఈ మేరకు ప్రతీ బిడ్డ చదువుకునేలా ఏర్పాట్లు చేస్తుండగా..అర్ధాకలితో ఉంటే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివే 20 లక్షల మంది విద్యార్థులకు రానున్న జూన్ 2 నుంచి అల్పాహార పథకం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తా మని వెల్లడించారు. విద్య కోసం బడ్జెట్లో 13.5 శాతం నిధులు కేటాయించగా, ఆ నిధులు వృథా కావొద్దని అందరూ చదువుకునేలా సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధనకు రాష్ట్రంలో ఒకేసారి 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలి పారు. ఇవికాక రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించి సెమీ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తామని భట్టి వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు పనిచేసి వచ్చే సంపాదనతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బస్సుల్లో పంపిస్తున్నారని, తద్వారా వారి భారం పడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టు తెలి పారు. కాగా, జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా పథకం అమలు కానుందని భట్టి ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీసు కమిషనర్ సునీల్దత్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి, గిడ్డంగుల కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యం, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం బరాజ్లకు వెంటనే మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్లకు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్ఎస్, బరాజ్ల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలన్నారు.మేడిగడ్డ పనులపై పూర్తి షెడ్యూల్ రూపొందించండిమేడిగడ్డ బరాజ్ దగ్గర 500 బోరు హోల్స్ తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నిధుల సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. బరాజ్ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా 1.6 కిలోమీటర్ల మేడి గడ్డ బరాజ్ పటిష్టతపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువ చ్చారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్ పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్ర యం నుంచి బయలుదేరు తారు.సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్, మంత్రులు దామో దర రాజ నర్సింహ, ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉంది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం.. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డి చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసింది.మొత్తం 11 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్కు సభ్యత్వం లభించింది. జేఎన్టీయూ, ఓయూ, ఎంజీయూ, కేఎన్ఆర్యూహెచ్ఎస్ వైస్ చాన్స్లర్లకు కమిటీలో చోటు కల్పించింది. -
భార్య కాల్డేటా ఇవ్వలేదని… డెట్టాల్ తాగిన భర్త..!
హైదరాబాద్: తన భార్య సెల్ఫోన్ కాల్డేటాను పోలీసులు ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. పెద్దపల్లి జిల్లా గూడెం గ్రామానికి చెందిన ఇటుకల మహేష్ (29) దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. మాట్రిమోనియా యాప్ ద్వారా ఓ యువతిని గత సంవత్సరం వివాహం చేసుకుని జూబ్లీహిల్స్లో నివాసముండేవారు. ఇటీవల ఇద్దరి మధ్యా గొడవ జరగడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి మహేష్ దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహేష్ తన భార్య కాల్డేటా కావాలని ఇన్స్పెక్టర్ సైదులును అడిగాడు. కాల్డేటా ఇవ్వటానికి కుదరదని, భార్యాభర్తల గొడవ కోర్టు ద్వారా కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు పట్టించుకోవటం లేదని వెంట తెచ్చుకున్న డెట్టాల్ తాగబోయాడు. పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించారు. -
ఇంకో మార్గంలేకే ‘ఆత్మహత్య’
(హైదరాబాద్) గచ్చిబౌలి:‘‘పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది’’ అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘‘23 మంది నుంచి తాను తీసుకున్న రూ.7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు, కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్లోని వివరాల వెల్లడించారు. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్కళ్యాణ్ తీర్చాలి. అయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి. నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్దాలు చెప్పాను. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా పెల్సియా నా వైపు నిలబడింది. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అన్ని విధాల ప్రయత్నించినా విఫలమయ్యాను. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. 2023లో మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో పెల్సియా(కాబోయే భార్య) నా వైపు నిలబడింది. ఆమె కారణంగా మూడు సంవత్సరాలు బతికాను. రెండు నెలలుగా పెళ్లిని నిలిపివేయడానికి ప్రయతి్నస్తున్నాను. డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేక పోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. అందరూ నన్ను క్షమించండి’’ అని డెత్ స్టేట్ మెంట్లో పేర్కొన్నారు. ఆ మేసేజ్ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్మెంట్గా పరిగణిస్తున్నారు. మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు. -
HYD: వాహనదారులకు బిగ్ అలర్ట్
హైదరాబాద్: నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ అయ్యింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్లో ఆరు లేన్ల అండర్ పాస్, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల పనులు ప్రారంభమయ్యాయని.. దీంతో ఏడాది పాటు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లేవారు ట్రిపుల్ ఐటీ జంక్షన్లో లెఫ్ట్ టర్న్ తీసుకుని విప్రో జంక్షన్, గౌలిదొడ్డి, గోపన్పల్లి, నల్లగండ్ల మీదుగా వెళ్లాలని కోరారు. అలాగే లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వైపు వచ్చేవారు హెచ్సీయూ డిపో వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని మసీద్బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్కు చేరుకోవాలని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి డీఎల్ఎఫ్ వైపు వచ్చే వాహనదారులు ట్రిపుల్ ఐటీ జంక్షన్న్నుంచి స్టేడియం వద్ద రైట్ టర్న్ తీసుకుని గచి్చబౌలి జంక్షన్ నుంచి ఎడమ వైపు వెళ్లి డీఎల్ఎఫ్కు వెళ్లాలన్నారు. డీఎల్ఎఫ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వెళ్లేవారు లీ మెరీడియన్ వద్ద రైట్ టర్న్ తీసుకుని గచ్చిబౌలి జంక్షన్, విప్రో జంక్షన్ వెళ్లాల్సి ఉంటుందన్నారు. వాహనదారులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. -
HYD: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు ఎగసిపడుతుండగా మంటలు పక్కనున్న యూనిట్లకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
ఇంటి భోజనం తెచ్చుకోండి.. ఇంటి నుంచే పని చేయండి!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో అప్పట్లో ఐటీ సంస్థలలో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధంతో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ మొదలైంది. అయితే ఈసారి కొన్ని బహుళ జాతి సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సూచిస్తే.. మరికొన్ని కంపెనీలేమో ఇంటి నుంచి పని చేయాలని చెప్పాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ వంటి ఇంధన వనరుల కొరత తీవ్రమైన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల వాహన వినియోగం తగ్గింది. టెక్నాలజీ సంస్థలు నిత్యం ఉద్యోగస్తుల పికప్, డ్రాప్ సర్వీస్లనూ తగ్గించాయి. మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల కొరత ఐటీ ఆఫీసు క్యాంటీన్లలో మెనూ తగ్గింది. దీంతో ఐటీ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) తమ ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుంచి పని, హైబ్రిడ్ వర్క్ మోడళ్లను అవలంబిస్తున్నాయి. ఐటీ హబ్లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాల్లో హైబ్రిడ్, వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇంటి నుంచి భోజనం..వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్ ఐటీ కారిడార్లలో వసతి గృహాల్లో వంట గదులకు తాళం వేశాయి. ఆఫీసు క్యాంటీన్లలో వెండర్లు సేవలను నిలిపివేశాయి. దీంతో పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు క్యాంటీన్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. వీలైనంత వరకూ ఉద్యోగులు సొంత ఆహారాన్ని తెచ్చుకోవడం (బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్) విధానాన్ని పాటించాలని చెప్పాయి. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైన నేపథ్యంలో కంపెనీలు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడని ప్రత్యామ్నాయ ఆహార విక్రేతలతో ఒప్పందం చేసుకుంటున్నాయి. తగ్గిన ఆన్సైట్ వర్క్బహుళ జాతి సంస్థలు ఆన్సైట్ వర్క్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రధానంగా బడా ఐటీ సంస్థలు అమెరికా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలలో ఉద్యోగులను ఆన్సైట్కు పంపిస్తుంటాయి. అయితే తాజాగా ఆయా దేశాల్లో యుద్ధ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రయాణ పరిమితులను అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల భద్రత కోసం ఆన్సైట్ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, కేపీఎంజీ, జేపీ మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ప్రధాన టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల భద్రత, వ్యాపార కొనసాగింపు భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. -
కమలంలో లేఖ కలకలం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతానికి సూచనల పేరిట ప్రధాని మోదీకి కొందరు ఎంపీలు, నేతలు లేఖ రాయడం రాష్ట్ర బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఎంపీలుగా గెలిచాక సంస్థాగతంగా పార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గ స్థాయిల్లో కొందరు నాయకులు, ప్రత్యర్థి, వైరివర్గాలుగా వ్యవహ రించడం, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కొందరు జిల్లాల్లో తమ గ్రూపులకు ప్రాధాన్యతమివ్వడం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా జిల్లాలు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిధిలో తమకు ఎదు రవుతున్న ఇబ్బందులు, తాము స్వేచ్ఛగా వ్యవ హరించకుండా రాజకీయంగా అడ్డుపడుతున్న నేతలు లేదా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో అడ్డంకులు సృష్టించడం, గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పర్యటించకుండా, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తమ తమ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు చేసేందుకు వీలుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులను విరివిగా కేటాయించాలని ఎంపీలు ఈ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. అయితే పనిలో పనిగా రాష్ట్రంలో పార్టీపరిస్థితి, పుంజుకోకపోవడానికి కారణాలు, కొందరు నేతల వ్యవహారశైలి, ఆధిపత్యధోరణి, సర్వం తామే అన్నట్లుగా అన్ని విషయాల్లో కలగజేసుకోవడం తదితర అంశాల గురించి ఇందులో ప్రముఖంగా వివరించినట్లు పార్టీనేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ ఎంపీలు (ఇద్దరు కేంద్రమంత్రులు మినహా) ఈ లేఖ రాయడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించుకుంది. వీరిలో కొందరు ఎంపీలు మాత్రం తమ నియోజకవర్గాలకు సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపునకు సంబంధించి ‘రిప్రంజేటేషన్స్’ఇచ్చామని మాత్రం అంగీకరిస్తున్నారు. ఓ ఎంపీ మాత్రం ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ‘లేఖరాశాం.. అందులో తప్పేముంది?’అంటూ నేరుగానే సమాధానం ఇచ్చారు. లేఖల కల్చర్ లేదు.. కాదు ఉంది..ఇదిలాఉంటే...బుధవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడినపుడు ఈ లేఖ విషయం ప్రస్తావనకు వచ్చింది. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని, ఒక వ్యక్తి మీద ఎప్పుడు పార్టీ నడవదని టీమ్ గా బీజేపీ పని చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలు హేట్ స్పీచ్ కిందకే వస్తాయా? రావా? అన్నది సీఎం రేవంత్ చెప్పాలన్నారు. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పందిస్తూ లేఖలు రాసే సంస్కృతి లేదన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని డా.లక్ష్మణ్ అంటున్నారని, ఆయన బీజేపీ సీనియర్ నేతగా స్వయంగా తన మీదనే లేఖ రాశారన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు, బూతులు తిడుతున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని అర్వింద్ పేర్కొన్నారు. -
స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!!
చౌటుప్పల్: ఎంబీఏ చదివాడు... గోల్డ్మెడల్ కూడా సాధించాడు...కానీ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్న దొంగ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ సామ్రిచర్డ్ ఎంబీఏలో గోల్డ్మెడల్ సాధించాడు. కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి మన్సూరాబాద్ ప్రాంతంలో అద్దెకు ఉంటూ పలు వ్యాపారాలు చేశాడు. వాటిని విడిచి దొంగతనాలను వృత్తిగా ఎంచుకొని హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా తిరిగి బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేసేవాడు. ఫిబ్రవరి 22న ఓ చోరీ కేసులో ఖమ్మం కోర్టుకు హాజరైన వంశీకృష్ణ తిరిగి హైదరాబాద్కు వెళ్తూ చౌటుప్పల్లోని వలిగొండ చౌరస్తా కంఠమహేశ్వర కాలనీలో నివాసముంటున్న లింగంపల్లి నర్సింహ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో దాచిన రూ.14.20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వంశీకృష్ణ సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకుని బుధవారం ఉదయం ఖమ్మం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా అతడి కారును ఆపారు. వంశీకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చౌటుప్పల్లోని కంఠమహేశ్వర కాలనీలో లింగంపల్లి నర్సింహ ఇంట్లో చోరీ చేసింది తానేనని వంశీకృష్ణ ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.7 లక్షల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.2.28లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ మన్మథకుమార్, సీసీఎస్ సీఐ ప్రవీణ్బాబు, ఎస్ఐలు యాదగిరి, వనం సైదులు, కుమారస్వామి పాల్గొన్నారు. కాగా, చోరీ చేసిన సొత్తుతో వంశీకృష్ణ వివిధ ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడని, తన చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతుండేవాడని, పేదలకు దాన ధర్మాలు చేయడం, అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం కూడా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. -
సమ్మెలోకి ఆర్టిజన్ కార్మికులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ కార్మికులు, పీస్వర్క్ కార్మికులు సమ్మె సైరన్ మో గించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూని యన్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఈ) ఆధ్వర్యంలో బుధవారం ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సుమారు 20 వేల మంది కార్మికులు బుధవారం విధులను బహిష్కరించారు. ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్లోని విద్యుత్ ప్రధాన కార్యాలయాలు సహా సబ్స్టేషన్లు, ఇతర ఆఫీసుల ముందు నిరవధిక నిరసన దీక్షలకు కూర్చొ న్నారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4వ తేదీకంటే ముందు అన్ని అర్హతలు ఉండి, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికు లుగా కొనసాగుతున్న వాళ్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టినా..ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరికి సమ్మెనోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినా సర్కార్ స్పందించక పోవడంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే డిస్కం పరిధిలోని ఉద్యోగులు, ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొనకూడదని, ఒకవేళ ఎవరైనా పాల్గొంటే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎండీ జితేశ్ పాటిల్ హెచ్చరించినా... కార్మికులు మాత్రం విధులకు హాజరు కాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు వేల మందికిపైగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టిజన్ల సమ్మె నేపథ్యంలో 33/11 కేవీ సబ్స్టేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం రెగ్యులర్ ఉద్యో గులకు బాధ్యతలు అప్పగించినప్పటికీ...సరఫరాలో ఇబ్బందులు తప్పలేదు. శివారు ప్రాంతాల్లో గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో పాటు కొత్త మీటర్ల జారీ, కనెక్షన్లు, లైన్ల పునరుద్ధరణ వంటి పనులు స్తంభించిపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పలేదు. -
ట్రైనీ పైలట్పై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడి
సనత్నగర్(హైదరాబాద్): పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇన్స్ట్రక్టర్ ఓ ట్రైనీ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరువు తీసి కుటుంబ సభ్యులకు, కెరీర్కు నష్టం కలిగిస్తానంటూ బెదిరించాడు. ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువకావడంతో బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి (20) బేగంపేటలోని ఏవియాకాన్స్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 2025లో శిక్షణ నిమిత్తం చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయం వైకోం ప్రాంతానికి చెందిన నసీముద్దీన్ అలియా స్ నసీం (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీ న్ను ఒక సోదరుడిగా ఆ యువతి భావించింది. ఈ చనువు తోనే బేగంపేట బ్రాహ్మణవాడీలో ఉండే నసీముద్దీన్ వద్దకు చదువుకోవడానికి తరచూ వెళ్తుండేది. గత ఏడాది డిసెంబర్ 27న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చదువుకోవడం కోసం ఆమె నసీముద్దీన్ వద్దకు వెళ్లింది. అయితే, 7.30 గంటల సమయంలో నసీముద్దీన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ‘ది లీగ్’లో జరిగే ఫుట్బాల్ మ్యాచ్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అప్పటివరకు ఒంటరిగా చదువుకున్న యువతి.. నసీముద్దీన్ రాగానే తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పగా, ఇక్కడే ఉండాల్సిందిగా పట్టుబట్టాడు. తన కుటుంబసభ్యులు తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తన భార్య మోసం చేసిందని, ఆమె నుంచి తరచూ తాను వేధింపులకు గురవుతున్నానని సదరు యువతిని నమ్మబలికాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతిని బెదిరించాడు. దీంతో కొద్దిసేపు ఆమె అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో నసీముద్దీన్ తన జీవితం గురించి ఏడుస్తూ తలుపు గడియ పెట్టి ఆమెను బలవంతంగా కౌగిలించుకున్నాడు. తాను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, అడ్డుకుని అరవకుండా నోరు మూసి, బలవంతంగా లైంగిక దాడి చేశాడు. జరిగిన సంఘటనను మరిచిపోయి ఏమీ జరగనట్లు ఉండాలని కోరాడు. నసీముద్దీన్ బెదిరింపులతో ఆమె భయపడి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత చదువుల కోసం దమ్మాయిగూడలో ఉండే మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో నసీముద్దీన్ దమ్మాయిగూడకు మకాం మార్చి అక్కడ కూడా ఆమెను బెదిరించడం కొనసాగించాడు. దీంతో మంగళవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీముద్దీన్పై బీఎన్ఎస్ సెక్షన్ 64(2)(ఎఫ్), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందరూ హైదరాబాదే అంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రతి డాక్టర్కు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదని, జిల్లాల్లో కూడా సమానంగా వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. బుధవారం కోఠిలో ప్రభుత్వ వైద్యుల సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తోందని మంత్రి చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న డాక్టర్ల డిమాండ్ను నెరవేర్చుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మార్చామని వెల్లడించారు. గోషామహల్లో 26 ఎకరాల్లో సుమారు రూ.3 వేల కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పారదర్శకంగా బదిలీలు గత రెండు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో 10,327 పోస్టులను భర్తీ చేశామని, మరో 6 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. డాక్టర్ల బదిలీలు పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామని, డాక్టర్లు తమకు నచి్చన పోస్టింగ్ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని రాజనర్సింహ తెలిపారు. అలాగని అందరూ హైదరాబాద్కే రావాలనుకుంటే సాధ్యం కాదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉన్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బదిలీలు, డిప్యుటేషన్ల పేరుతో వైద్య సేవలకు అంతరాయం కలిగించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, సంఘం అధ్యక్షుడు డి.నరహరి, సెక్రెటరీ జనరల్ లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి రౌఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్ఆర్ను ఖర్చులా కాదు.. భాగస్వామ్యంగా చూడండి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సమాజాభివృద్ధికి చేసేది ఖర్చులా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని.. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. అయితే కంపెనీలు సీఎస్ఆర్ కింద చేస్తున్న వ్యయం వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా తయా రు చేయగలమన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నిధులు స్థానికంగానే వినియోగించాలి రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 44 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సీఎం అన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని చెప్పారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకోసం నియమించామని తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సూచించారు. రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాయంటూ ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు. మమ్మల్ని ఇలా ఎవరూ సంప్రదించలేదు.. సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సీఎంకు అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణపై వారు ఆసక్తి చూపారు.. సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధారెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణారెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్రెడ్డి, నాదం ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, కామినేని భాస్కర్రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్రావు, కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు బెదరం
సాక్షి, హైదరాబాద్: ‘హరీశ్రావు, కేటీఆర్...మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మీ స్వలాభం, స్వార్థం కోసం, పదేళ్ల కాలంలో సంపాదించిన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం కారు కూతలు కూస్తే మా ప్రభుత్వం భయపడదు. అడవి పంది బురదను తెచ్చి సింహానికి పూయాలని చూస్తే ఆ సింహం తిరగబడి బురదలోంచి లేవకుండా అడవి పందిని తొక్కి చూపిస్తుంది. పదేళ్లలో మీరు చేసిన అక్రమాల చిట్టా, భూ దందా వ్యవహారాలు, అన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసే సందర్భం త్వరలోనే వస్తుంది...’ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తన తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తానని, ప్రధాన ప్రతిపక్షం దగ్గర ఏమేం ఉన్నాయో అన్నీ చెప్పాలని, వాటన్నింటిపై విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇటీవల తనను ఉద్దేశించి చేస్తున్న ఆరోపణలపై బుధవారం ఆయన స్పందించారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్రెడ్డి, నవీన్యాదవ్, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, శ్రీగణేశ్లతో కలిసి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలతో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తమ ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయన్న ఆందోళనతో.. ‘మేం కేరళ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే కొందరు నాయకులు పచ్చి అబద్ధాలతో పలు ఆరోపణలు చేశారు. అబద్ధాల రావు, డ్రామాల రావు, శకుని మామ టీం కలిసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. పదేళ్ల క్రితం తమ ఆస్తులు, ఇప్పటి ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతో అబద్ధాలే ఎజెండాగా పెట్టుకుని ప్రేలాపనలు చేస్తున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జూపల్లితో పాటు నాపై అసెంబ్లీ సాక్షిగా నిందలు వేస్తున్నారు. పదేళ్లలో వారికి అంటిన బురదను మాకు అంటించాలని చూస్తున్నారు. ఆ భూమి బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్టర్ అయ్యింది.. నాదర్గుల్లోని 613 సర్వే నంబర్లో ఉన్న 373.22 ఎకరాల భూమిని బీఆర్ఎస్ దొరలు అధికారంలో ఉన్నప్పుడే 1–9–2014న యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎస్టేట్స్, ఒమెగా డెవలపర్స్ అనే కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే భూమిని 24–09–2016న మ్యుటేషన్ కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? (10–02–2021, 05–12–2021, 05–01–2022, 17–11–2022 తేదీల్లో గూగుల్ మ్యాప్లు చూపించి ఆ భూమిలో ఏం జరిగిందో వివరించారు.) షీట్లు పెట్టి రోడ్లు వేసింది మీరు కాదా? ఈ భూమిని నాలా కన్వర్షన్ చేయడం లేదని 2022లో ఆ కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై కౌంటర్ వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక 17–03–2025న కౌంటర్ వేశాం. అసలీ భూమిని కాపాడేందుకు కొట్లాడుతోందే మేము. మేం అధికారంలోకి వచ్చాక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేదు. ఈ భూమికి సంబంధించిన ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. అలాంటప్పుడు మాకేం సంబంధం ఉంటుంది? ఈ మూడు కంపెనీల్లో నా భార్య, కొడుకు, కుటుంబ సభ్యుల్లో ఎవరు భాగస్వాములుగా ఉన్నా చాలెంజ్. ఖబడ్దార్... అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. ఓ పత్రికలో దీని గురించి వార్త రాసిన రెండు రోజులకు అబద్ధాలరావు, శకుని కొడుకు, ఆ మేఘా సంస్థ అధినేతతో రహస్యంగా కలిసి సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాతే ఆరోపణలను నావైపు మళ్లించారు. శకుని మామ, కొడుకు ఇద్దరే సెటిల్ చేసుకుంటారేమోనని అబద్ధాలరావు తన వానర సైన్యాన్ని వేసుకుని భూమి మీదకు వెళ్లాడు..’ అని పొంగులేటి చెప్పారు. వట్టినాగులపల్లి భూమిని నాలా కన్వర్షన్ చేసిందెవరు? ‘వట్టి నాగులపల్లి బాగోతం పచ్చి అబద్ధం.111 జీవో పరిధిలో ఉన్న ఆ భూమిని అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల ముందు 14–08–2023న నాలా కన్వర్షన్ చేసిందెవరు? షా కుటుంబంలో చిచ్చు ఎందుకు పెట్టారు? ఓఆర్ఆర్ కింద కోల్పోయిన భూమి మేరకు శకుని మామకు కావాల్సిన వారి కంపెనీ తీసుకున్న భూమిలో వాటా తగ్గుతుందనే పైభాగంలో ఉన్న షా కుటుంబ సభ్యులను రెచ్చగొట్టారు. ఆ భూమి కోసమే ఇదంతా చేస్తున్నారు. ఆ భూమిలోని మరో భాగాన్ని షా కుటుంబం నుంచి డెవలప్మెంట్కు తీసుకున్న కంపెనీలో నా కొడుకు భాగస్వామి. నా కొడుకు ఉన్న కంపెనీ ఆ భూమిని కొనలేదు. షా కుటుంబ సభ్యుల దగ్గర డెవలప్మెంట్ కోసం తీసుకుంది..’ అని మంత్రి చెప్పారు. ‘రాఘవ’ రోడ్డు మెటీరియల్ కొనుక్కుంది ‘కొత్వాల్గూడ క్రషర్ విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారు. తిరుమల పేరుతో 2007 నుంచే క్రషర్ ఉంది. పవర్ బిల్లులు, జీఎస్టీ బిల్లులు అన్నీ ఉన్నాయి. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో క్రషర్లను సీజ్ చేశారు. ఆ తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్ వేసే రేడియల్ రోడ్లకు అవసరమైన మెటీరియల్ను తిరుమల మెటీరియల్ ఇండస్ట్రీస్ నుంచి కొనుక్కుంది. బుద్వేల్లో గత ప్రభుత్వం అమ్మిన భూమిలోని బండరాళ్లను మాత్రమే క్రష్ చేశారు. వాళ్లు కొత్తగా క్రషర్ పెట్టలేదు. ఒక్క బ్లాస్టింగ్ కూడా చేయలేదు. దీనిపై ఆర్టీఐ కింద అబద్ధాలరావు, టీం సమాచారం అడిగి ఇదిగో మైనింగ్ చేస్తున్నారంటూ అసెంబ్లీలో పేపర్లు చూపెట్టారు. అయితే ఆ పేపర్ మెటల్ సీనరేజి కట్టాలని ఇచ్చింది. దాన్ని చూపించి అదిగో క్రషర్కు, రాఘవకు సంబంధం అంటారు. క్రషర్కు, రాఘవకు ఏం సంబంధం? అబద్ధాల రావు అయితే ఉరి వేసుకుంటా అంటాడు. పెట్రోల్ కొంటానికి డబ్బు ఉంటుంది కానీ అగ్గిపెట్టె లేదన్న దాంట్లో నిజం ఎంత ఉందో ఈ ఉరి కూడా అంతే నిజం. మీరెలా దోచుకున్నారో ప్రతిదీ బయటకు వస్తుంది.. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా? దాని మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు. కోటి రూపాయల విరాళం మీ పార్టీకి ఇచ్చింది. శకుని మామ కూతురు అబద్ధాల రావు గురించి కాళేశ్వరం నుంచి డెయిరీ వరకు 10 అభియోగాలు మోపింది. ఒక్కదానికయినా సమాధానం చెప్పాడా? రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..ఆయన పేరు అబద్ధాల రావు అని పెట్టాలా? బ్లాక్మెయిల్రావు అని పిలవాలా? అగ్గిపెట్టెరావు బాగుంటుందా? సూచనలివ్వండి. అబద్ధాల రావు, డ్రామాల రావు, శకుని మామ కుటుంబ సభ్యులకు 2014లో ఉన్న ఆస్తులేంటి? ఇప్పుడున్న ఆస్తులేంటి? ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఆస్తులు వాళ్ల పార్టీకి ఎలా వచ్చాయి? ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ సీబీసీఐడీ ద్వారా ఎంక్వైరీలో బయటకు వస్తుంది..’ అని పొంగులేటి అన్నారు. -
జలవిహార్ ఆర్వో ప్లాంట్లో భారీ పేలుడు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్ జలవిహార్ సమీపంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. నీటి సరఫరా కోసం ఉపయోగించే ఈ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు ధాటికి పరికరాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కంప్రెషర్లో అధిక ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఖైరతాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పేలుడు కారణాలపై విచారణ చేపట్టారు. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు (Natural Death) కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.యూనియన్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఏప్రిల్ 1 నుండి అమలు: ఈ నూతన నిబంధన 2026, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుంది. గతంలో ఉన్న రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతూనే, ఈ సహజ మరణ బీమా అదనంగా చేరింది. దాదాపు 38వేలపైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. -
కాళేశ్వరం కమిషన్పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడింది. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు వాయిదా వేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే.. ఇవాళ విచారణ జరగ్గా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
‘కల్తీ’ కేంద్రాలపై దాడి
మైలార్దేవ్పల్లి: కల్తీ మసాలాలు, ఉత్పత్తులు తయారు చేస్తున్న రెండు పరిశ్రమలపై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, పుడ్ సేఫ్టీ అధికారులు, మైలార్దేవ్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. టాటానగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫైన్ ట్రేడర్స్ పేరుతో స్నాక్స్ను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారు. కెమికల్స్ వాడుతున్నారు. గడువు తేదీ ముగిసిన మిర్చి పౌడర్, కలర్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 వేల విలువ చేసే ముడి సరుకును స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో హెచ్పాస్ట్ ఎస్ఐ అఖిల్, మైలార్దేవ్పల్లి ఎస్ఐ విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. కాటేదాన్లో... కాటేదాన్ పారిశ్రామికవాడలో సిల్వర్ మసాలా ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమపై దాడులు నిర్వహించారు. ఇక్కడ హానికరమైన రసాయన పదార్ధాలు, నాణ్యతలేని, అపరిశుభ్రమైన పదార్థాలతో మసాలాలు తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 40 వేల విలువ చేసే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఎయిర్పోర్టులో 14 కిలోల గంజాయి పట్టివేత
శంషాబాద్: బ్యాంకాక్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 14 కిలోల గంజాయిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... థాయ్ ఎయిర్వేస్ టీజీ–329 విమానంలో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు సొదా మోసిన్ బహదూర్ అనే ప్రయాణికుడు చేరుకున్నాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 14 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్పోర్ట్ ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం – ఇద్దరి అరెస్ట్.. రెస్క్యూహోమ్కు నలుగురు మహిళలు మలక్పేట: స్పా సెంటర్ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై మలక్పేట పోలీసులు సోమవారంరాత్రి దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. మలక్పేట ఏసీపీ సుబ్బారామిరెడ్డి తెలిపిన వివరాలు.. దిల్సుఖ్నగర్ విద్యుత్నగర్లో నివాసముంటున్న నిఖిలేష్(27) మూసారంబాగ్ డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ సర్వీస్ రోడ్లో కొంతకాలంగా డైమాండ్ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ పోలీస్ సిబ్బందితో దాడి చేసి చిలుకలగూడకు చెందిన పవన్(29), నలుగురు మహిళలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిఖిలేష్, పవన్ను అరెస్ట్ చేయగా, మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు ఛేదించి.. రూ.1.59 కోట్లు రిఫండ్ సాక్షి, సిటీబ్యూరో: నగర సైబర్క్రైమ్ పోలీసులు మార్చిలో వివిధ కేసులను ఛేదించి బాధితులకు రూ.1.59 కోట్లు రిఫండ్ చేశారు. దీనికి అదనంగా జోనల్ సైబర్ సెల్స్ మరో రూ.95.99 లక్షలు రిఫండ్ చేశాయి. గత నెలలో సైబర్ ఠాణాలో 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాజస్థాన్ల్లో దాడులు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, గేమింగ్, జాబ్ తదితర ఫ్రాడ్స్లో నిందితులు. గత నెలలో బాధితులు 23 ఆర్థిక సంబంధిత సైబర్ నేరాల్లో రూ.4.40 కోట్లు కోల్పోయారు. సాయిబాబాకు సనాతన ధర్మానికి సంబంధం లేదు – స్వచ్ఛ సనాతన వేదిక పంజగుట్ట: షిరిడీ సాయిబాబాకు సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదని స్వచ్ఛ సనాతన వేదిక పేర్కొంది. శ్రీ షిరిడీ సంస్థాన్ వారు రాసిన సాయిబాబా సత్య చరిత్ర పుస్తకంలోని కొన్ని అంశాలపై ప్రశ్నలు అడిగిన తమపై అక్రమ కేసులు బనాయించి, పరువునష్టం దావా వేయడం ఎంతవరకు సబబని స్వచ్ఛ సనాతన వేదికలోని హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్ కుమార్, శివశక్తి ప్రతినిధి కరుణాకర్ సుగుణ, భరత వర్ష ప్రతినిధి శివ, హైందవీ స్వరాజ్ భాస్కర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చర్చకు తాము సిద్ధమని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఫొటోలతో షిరిడీ, మహారాష్ట్రల్లో పోస్టర్లు వేయించారని, దాడులు చేయిస్తామని హెచ్చరించారని, ఇది భావప్రకటన స్వేచ్చపై దాడి చెయ్యడమేనని అన్నారు. తల్లి మందలించిందని బాలుడి అదృశ్యం శంషాబాద్ రూరల్: పాఠశాలకు వెళ్లని కొడుకును తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పాల్మాకులకు చెందిన వరికుప్పల అరుణ కొడుకు అనిల్కుమార్ స్థానికంగా జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వారం రోజులుగా బడి మానేసి వేరే పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నాడు. విషయం తెలియడంతో తల్లి అతడిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 5న ఉదయం అరుణ పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కొడుకు కనిపించలేదు. అతని కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో ఏజీ వర్సిటీ డీన్
సీడ్స్ కంపెనీ లైసెన్స్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ రాజేంద్రనగర్: సీడ్స్ కంపెనీ లైసెన్స్ పేరిట లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డీన్ గోవర్ధన్ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... సీడ్స్ కంపెనీ అనుమతి కోసం ఓ వ్యక్తి 2025 మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఏప్రిల్లో అనుమతులను అందిస్తానని వర్సిటీ డీన్, అసోసియేట్ ప్రొఫెసర్ జి.గోవర్ధన్ ఆ వ్యక్తితో సంప్రదింపులు జరిపాడు. లక్ష రూపాయలు అందిస్తే అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పగా, ఆ వ్యక్తి 25 వేల రూపాయలను ఆన్ లైన్ పేమెంట్ చేశాడు. అనుమతులు మంజూరైన అనంతరం గోవర్ధన్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం గోవర్ధన్ తన కార్యాలయంలో డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
గ్రంథాలయాలకు పూర్వవైభవం రావాలి
– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ గన్ఫౌండ్రీ: ప్రస్తుత సాంకేతిక యుగంలో గ్రంథాలయాలకు వెళ్లే పాఠకుల సంఖ్య తగ్గుతోందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సమాజసేవలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న ప్రముఖ గ్రంథాలయాల అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం (రాజమహేంద్రవరం) అధ్యక్షుడు డాక్టర్ ఎ. నారాయణరావు, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం కార్యదర్శి పి.ఉడయవర్లు, సారస్వత నికేతనం అధ్యక్షుడు మల్లికార్జున్రావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురాం తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో షాపింగ్మాల్ బుగ్గి
కిస్మత్పూర్ కాళీమందిర్ ప్రాంతంలో ఘటన రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పూర్ కాళీమందిర్ ప్రాంతంలోని సిద్ధి వినాయక షాపింగ్ మాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు అంతస్తులోని షాపింగ్ మాల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్, లంగర్ హౌస్ ఫైర్స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మూడు గంటలపాటు శ్రమించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదంలో మాల్లోని వస్త్రాలన్నీ బుగ్గి అయ్యాయి. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు. సైనికులు, గూఢాచారుల త్యాగాలను ప్రతిబింబించిన దురంధర్: రాంచందర్రావు సాక్షి, సిటీబ్యూరో: దేశ రక్షణకు సరిహద్దుల్లో పోరాడే సైనికులే కాకుండా, గూఢచారులు ఎంతటి త్యాగాలు చేస్తారో ధురంధర్–2 సినిమా స్పష్టంగా ప్రతిబింబించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమాను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ భద్రత కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గూఢచారుల నిజ జీవితాన్ని ఈ సినిమా మన కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో డీమానిటైజేషన్ వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందన్నారు. ఇన్స్టాలో పరిచయం.. బాలిక అదృశ్యం మేడిపల్లి: మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి బాలిక ఉంటోంది. తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన రాత్రి విధులకు వెళ్లారు. తెల్లవారుజామున వారు ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఇన్స్టాగ్రామ్లో మణి అనే ఓ వ్యక్తితో తరచూ చాట్ చేస్తున్నట్లు గుర్తించామని, అదృశ్యం వెనుక అతడు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆటో ఢీ కొని వృద్ధురాలి మృతి టిఫిన్ చేసి చెట్టు కింద కూర్చున్న కాసేపటికే ఘటన అల్వాల్: ఆటో ఢీ కొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్కు చెందిన కందూరి కనకమ్మ(80) అల్వాల్ వెస్ట్ వెంకటాపురం బ్రిడ్జి వద్ద టిఫిన్ చేసి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుంది. కాసేపటికే అటుగా వచ్చిన ఓ ఆటో ఆమెను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 180 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్లో మంగళవారం న్యూ టౌన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 180 మంది ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటాచారి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జ్యోతి, లా ఆఫీసర్ శ్రీధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయలక్ష్మి, డా. చల్లా దేవి పాల్గొన్నారు. కల్తీ నిరోధంపై సీఎం నిర్ణయం హర్షణీయం పంజగుట్ట: ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఆ పని త్వరగా చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి చైర్మన్ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణితో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక విభాగం లేకపోవడం వల్లే ఆహార కల్తీని నియంత్రించలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రతిరోజు ఏదోఒకచోట కుళ్లిన మాంసం, కల్తీ పాలు, సీసంతో ఉన్న పసుపు లాంటివి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయ పాలను రైతుల వద్ద సరైన రేటు ఇచ్చి కొనుగోలు చేసి ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. ఆహార కల్తీ అరికట్టేందుకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మామిడి భీమిరెడ్డి, ఎ.వి.రావ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మంటల్లో సిద్ధి వినాయక షాపింగ్ మాల్ -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే..
పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకొని.. ● కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్య ● ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు గచ్చిబౌలి: ప్రేమించిన యువతితో 16 రోజుల క్రితమే నిశ్చితార్థమైంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మెట్ల వెంకటకృష్ణ శ్రీసాయి (30) నగరంలోని కొండాపూర్లో ఉన్న మై హోం మంగళ ‘బి’ బ్లాక్లోని 301 ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా యానిమేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మై హోం మంగళలోనే మరో బ్లాక్లో ఉండే యువతిని ప్రేమించాడు. మార్చి 22న వైజాగ్లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 12న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో వెంకటకృష్ణ శ్రీసాయి.. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ్ముడు సాయి పవన్కల్యాణ్కు మధ్యాహ్నం 1.30 గంటలకు మెసేజ్ పెట్టాడు. విషయం తెలిసి.. కాబోయే భార్య వచ్చి ఎంత పిలిచినా డోర్ తెరవలేదు. మరో బ్లాక్లో నివాసం ఉంటున్న వెంకటకృష్ణ శ్రీసాయి సోదరుడు పవన్తో రూమ్మేట్ విజయ్ కలిసి గది తలుపు పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న యువతి గుండెలవిసేలా విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఫైనాన్స్లో రుణం తీసుకొని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడినట్లు, పెళ్లి ఖర్చులకు ఇబ్బందులెదురయ్యాయని, ఈ క్రమంలోనే వెంకటకృష్ణ శ్రీసాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
‘బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’ నగరంగా గుర్తింపు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చందానగర్: దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’ నగరంగా గుర్తింపు పొందిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం నానక్రాంగూడలోని షరటాన్ హోటల్లో ఈపీటీఆర్ఐ, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (హెచ్ఎంఎస్డబ్ల్యూ) సంయుక్తాధ్వర్యంలో ‘అర్బన్ సాలిడ్ వేస్ట్ గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ అండర్ ఎస్డబ్ల్యూఎం రూల్స్–2026’ అంశంపై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నగరంలో సేకరించే చెత్తను జవహర్నగర్లో డంపింగ్ చేస్తూ వచ్చామన్నారు. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్తగా చెత్త డంపింగ్ కోసం ప్రభుత్వం కొత్త ప్రాంతాలను పరిశీలిస్తోందన్నారు. కార్యక్రమంలో రాంకీ సంస్థ చైర్మన్ గౌతం రెడ్డి పాల్గొన్నారు. -
రూ.1,200 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
ఖానామెట్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలం గచ్చిబౌలి: ఐటీ కారిడార్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ఐటీ హబ్కి అత్యంత చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలైన మీనాక్షి, వాసవి అధీనంలో ఉన్న 4.20 ఎకరాలతో కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1,200 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. -
మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉచ్చు
ఐపీఎల్ వేళ అప్రమత్తంగా ఉండండి: కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో వల వేస్తున్న కొన్ని సంస్థలు సామాన్యులను ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నాయని నగర సీపీ సజ్జనర్ హెచ్చరించారు. మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఐపీఎల్ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో ఆకర్షిస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బు కోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? అని ముందే చెబుతామంటూ చానెల్స్ను సబ్స్క్రైబ్ చేయించుకుని, బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని, ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ చానెళ్ల మాటలు నమ్మవద్దని సజ్జనర్ హితవు పలికారు. నెల రోజుల్లో 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను హైదరాబాద్ సైబర్ క్రైౖ మ్ విభాగం బ్లాక్ చేయించిందని వివరించారు. నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వృత్తులేవైనా.. ప్రవృత్తి ‘డ్రగ్స్’ విక్రయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్–న్యూ) రెండు రోజులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఐదుగురు డ్రగ్స్ పెడ్లర్లు చిక్కారు. వీరి వృత్తులేమైనా డ్రగ్స్ విక్రయమే ప్రవృత్తిగా మారింది. వీరిని అరెస్టు చేసి రూ.63.65 లక్షల విలువైన ఐదు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ఇన్స్పెక్టర్లు బి.వెంకట్, ఎస్.బాలస్వామిలతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యార్థిపై మూడు కేసులు... బాలానగర్కు చెందిన సాయినిఖిల్ యాదవ్ బ్యాక్లాగ్స్ ఉండటంతో కొన్నాళ్లుగా ఇంటర్లోనే ఉండిపోయాడు. కాలేజీ రోజుల్లో చెడు స్నేహాల వల్ల సరదాగా డ్రగ్స్ వాడటం మొదలెట్టి బానిసగా మారాడు. ఆ ఖర్చుల కోసం తన కాలేజీలో సీనియర్, పెడ్లర్ అయిన ఆదిత్యకు సబ్–పెడ్లర్గా మారాడు. ఆరు నెలలుగా ఈ దందా చేస్తున్న ఇతడిపై ఇప్పటికే సనత్నగర్, జీడిమెట్లలో రెండు కేసులు ఉన్నాయి. సాయిని చిలకలగూడ పోలీసులతో కలిసి హెచ్–న్యూ బృందం అరెస్టు చేసి, 115 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ఆదిత్య కోసం గాలిస్తోంది. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి టెలిగ్రాం యాప్ ద్వారా సంప్రదింపులు జరిపే సాయి.. సరుకు డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు తన ఫోన్ కాకుండా వేరే వారిది తీసుకెళ్లేవాడు. ట్రాన్స్పోర్టర్ టు అంతర్రాష్ట్ర పెడ్లర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలానికి సాయి, సైబు, సిద్ధార్థ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. సూరారంలో ఉంటూ వెల్డర్గా పనిచేస్తున్నాడు. గతంలో గంజాయి, హష్ ఆయిల్ను ఒడిశా నుంచి ఆంధ్రాకు చేర్చే ట్రాన్స్పోర్టర్గా పనిచేశాడు. ఆపై అంతర్రాష్ట్ర పెడ్లర్గా మారి రెండు రాష్ట్రాల్లో సబ్–పెడ్లర్స్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫోన్ వాడకుండా నేరుగా హష్ ఆయిల్ తయారీదారులను సంప్రదించి ఖరీదు చేస్తాడు. సంప్రదింపులకు ఇన్స్ట్రాగామ్, లావాదేవీలకు యూపీఐ వాడతాడు. ఇతడిపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయి. కూకట్పల్లికి చెందిన వాలెట్ పార్కింగ్ డ్రైవర్ వేణు ఇదివరకు ఓ కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ సింహాచలంతో పరిచయమై సబ్–పెడ్లర్గా మారాడు. సింహాచల్, వేణులను పోలీసులు అరెస్టు చేసి 1.05 కేజీల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిదీ అదే తరహా కథ... ఇంజాపూర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అక్షయ్ పటేల్ గ్రాడ్యుయేషన్ తర్వాత శానిటరీ వ్యాపారం చేసి నష్టపోయాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి పలు సోషల్మీడియా యాప్స్ ద్వారా ఎక్స్టసీ, ఓజీ, ఎల్ఎస్డీ వంటి డ్రగ్స్ ఖరీదు చేస్తాడు. కొరియర్ ద్వారా వచ్చే వీటిని స్థానికంగా ఉన్న సబ్–పెడ్లర్స్కు విక్రయిస్తాడు. బైరామల్గూడకు చెందిన వ్యాపారి బి.ఆదిత్య వర్థన్ డ్రగ్స్కు బానిసగా మారి, డబ్బు కోసం అక్షయ్కు సబ్–పెడ్లర్ అవతారమెత్తాడు. ఈ ద్వయాన్ని అరెస్టు చేసిన పోలీసులు 363 ఎక్స్టసీ పిల్స్, 41 గ్రాముల ఓజీ, నాలుగు ఎల్ఎస్డీ బోల్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ముఠాలకు సంబంధించి ఇప్పటి వరకు 15 మంది కస్టమర్లను గుర్తించారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. -
హైదరాబాద్
జేఎన్టీయూకు బాంబు బెదిరింపు – క్షుణ్నంగా తనిఖీ.. ఏమీ లేదని తేల్చిన పోలీసులు బాలానగర్: జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంగళవారం బాంబు బెదిరింపు ఇ–మెయిల్ వచ్చింది. వర్సిటీ అధికారుల సమాచారం మేరకు కేపీహెచ్బీ పోలీసులు, బాంబుస్క్వాడ్ వచ్చి వర్సిటీ పరిపాలన భవనం, హాస్టల్స్, క్యాంపస్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లభించకపోవడంతో ఆచార్యులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు వర్సిటీలో కొంత ఆందోళన వాతావరణం కనిపించింది. అనంతరం కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ డీఐ కేఎస్ రవి సైబర్ భద్రత, సైబర్ ముప్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ బాంబు బెదిరింపు వదంతిని సృష్టించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరవ్యాప్తంగా హెచ్–న్యూ స్పెషల్ డ్రైవ్ మూడు ఠాణాల పరిధిలో మాటేసి దాడులు ఐదుగురు పెడ్లర్, సబ్ పెడ్లర్ల పట్టివేత రూ.63.65 లక్షల సరుకు స్వాధీనం -
వాటర్ ప్లాంట్లపై టాస్క్ఫోర్స్ దాడులు
● అనుమతులు లేకుండా ప్యాకెట్ల తయారీ ● నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని గుర్తింపుఅంబర్పేట: నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న మూడు వాటర్ ప్లాంట్లపై మంగళవారం సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. అంబర్పేట బాపూనగర్లో సయ్యద్ జబ్బార్ జేఎన్ ఎంటర్ప్రైజెస్ పేరిట నిర్వహిస్తున్న ప్లాంట్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్యాకెట్లు తయారు చేస్తునట్లు గుర్తించారు. రూ.3 లక్షల విలువైన యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ నయీముద్దీన్ ఆక్వా ఓమెగా వాటర్ ప్లాంట్ను కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షలు విలువ చేసే యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట ప్రధాన రహదారిలో సయ్యద్ జునైద్ టీఏఐఏ ప్లస్ పేరుతో నీటి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద రూ.3.50 లక్షలు విలువ చేసే ప్యాకింగ్ యంత్రాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్లాంట్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు. -
సీఎం ప్రజావాణికి మొర.. డబుల్ బెడ్రూం మంజూరు
లబ్ధిదారులకు పట్టా అందజేసిన చిన్నారెడ్డి లక్డీకాపూల్: సీఎం ప్రజావాణి చొరవతో జనార్దన్–పద్మజ దంపతులకు డబుల్ బెడ్రూమ్ మంజూరైంది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ వేదికగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ ఇంటి పట్టాను సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్స్ సెల్ అధ్యక్షుడు శ్యాంమోహన్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి జిల్లా మద్దూంపల్లికి చెందిన జనార్దన్ నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్కు వచ్చి ఖైరతాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ కోసం సీఎం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా కూకట్పల్లిలోని కై త్లాపూర్లో కేటాయిస్తూ మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్ మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మంగళవారం జరిగిన 212వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 505 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్యప్రకాష్, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసీ ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టూర్ ఠారెత్తే
పశ్చిమాసియా యుద్ధంతో నిలిచిపోయిన పర్యటనలు గ్రేటర్లో 75 శాతం బుకింగ్లు రద్దు సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధం కారణంగా పర్యాటక రంగం కుదేలైంది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులు, విదేశాల నుంచి నగర సందర్శనకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని అనిశ్చితి దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణాలు భారీగా నిలిచిపోయాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 75 శాతం బుకింగ్లు రద్దయినట్లు గ్రేటర్లోని ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగంలో కోవిడ్ నాటి పరిస్థితులు పునరావృతమైనట్లు చెబుతున్నారు. 3 వేల సంస్థలపై యుద్ధ ప్రభావం.. సాధారణంగా వేసవిలో ఏప్రిల్, మే నెలల్లో నగరం నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సైతం సందర్శిస్తారు. ఈ వేసవి ఆరంభంతోనే యుద్ధం ప్రారంభం కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పర్యాటక రంగంపై ఆధారపడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 3 వేల సంస్థలపై యుద్ధం ప్రభావం చూపినట్లు సికింద్రాబాద్కు చెందిన వాల్మీకి పర్యాటక సంస్థ ప్రతినిధి హరికిషన్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణ రోజుల్లో 20,000 మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా, గత నెల రోజులుగా ఆ సంఖ్య 50 శాతానికి పడిపోయినట్లు అంచనా. ఫ్లైట్స్ రద్దయితేనే రీఫండ్.. ప్రస్తుత పరిణాల దృష్ట్యా పశ్చిమాసియా వైపే కాకుండా ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్లైన్స్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్లు ట్రావెల్స్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎయిర్లైన్స్ స్వయంగా ఫ్లైట్లను రద్దు చేసినప్పుడు మాత్రమే 100 శాతం టికెట్ డబ్బులు రీఫండ్ అవుతున్నాయి. ప్రయాణికులే టూర్ను రద్దు చేసుకుంటే టికెట్ చార్జీల్లో 5 శాతం నుంచి 50 శాతం వరకు పెనాల్టీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు విమానయాన రంగంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఎయిర్లైన్స్ పోటీపడుతున్నాయి. -
టీడీఆర్లు స్వీకరించండి
– జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలతో ఆస్తులు కోల్పోయే వారు నష్టపరిహారంగా నగదుకు బదులు టీడీఆర్లను స్వచ్ఛందంగా స్వీకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. కేబీఆర్ పరిసరాల్లో చేపడుతున్న ప్రాజెక్టులతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్, ముగ్ధ జంక్షన్లు తదితర ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోనున్న వారితో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి సదరు ప్రాజెక్టులు అవసరమని వారికి వివరించారు. రహదారుల విస్తరణ పనుల గురించి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తులు కోల్పోయేవారు టీడీఆర్లను స్వీకరించాల్సిందిగా కోరారు. నగరాభివృద్ధి దృష్ట్యా ప్రజల సహకారం కావాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యమకారుడు సుల్తాన్ ఆత్మహత్య
– డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో కొంతకాలంగా మనస్తాపం బన్సీలాల్పేట్: బన్సీలాల్పేట్ బండమైసమ్మనగర్ నివాసి, తెలంగాణ ఉద్యమకారుడు అబ్దుల్ సుల్తాన్(65) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ కథనం ప్రకారం... సుల్తాన్ భార్య రేష్మా రేషన్ బియ్యం తేవడానికి షాపునకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చి చూసే వరకు ఆయన ఉరేసుకొని ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మంగళవారం రాత్రి బన్సీలాల్పేట్లో సుల్తాన్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించండి – ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశాలు సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణం, టీడీఆర్ దరఖాస్తులకు సంబంధించి జాప్యం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో అనుమతులు జారీ చేయాలని ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశిచారు. మంగళవారం టౌన్ప్లానింగ్ విభాగం అధికారుతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్ఫాత్లు, నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వీటితోపాటు నివాస కాలనీల్లోని అక్రమ నిర్మాణాలు, సెల్లార్లు, రోడ్లను ఆక్రమించిన ర్యాంపులు, మొక్కలు లేని ప్లాంటర్ బాక్స్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. -
17న నల్లబ్యాడ్జీలతో విధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకలేదని, ఇప్పటికే పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తెలిపింది. ఆరోజు భోజన విరామ సమయంలో నిరసనలు తెలియజేస్తామని వెల్లడించింది. మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ కాంప్లెక్స్లు, ధర్నాచౌక్ల వద్ద దీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆలోపు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే మే 14వ తేదీన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం మూసారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాథమిక కార్యాచరణను వారు మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే రెండేళ్ల పీఆర్సీ నష్టపోయాం.. ‘సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పటికే రెండున్నరేళ్లు నష్టపోయాం. తాజాగా పీఆర్సీ గడువును పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ నివేదిక తీసుకోకుండా గడువును పొడిగించడం సరికాదు. చనిపోయినా అందని రిటైర్మెంట్ బెనిఫిట్లు పెండింగ్ బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలవారీగా నిధులిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతినెలా జరిగే రిటైర్మెంట్లతో బకాయిలు తగ్గడం లేదు. పదవీ విరమణ పొందిన వారిలో ఇటీవల 260 మంది చనిపోయారు. అయినప్పటికీ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు. సీపీఎస్ రద్దుపై కమిటీ ఏదీ? కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కనీసం కమిటీ ఏర్పాటు చేయలేదు. ఈ డిమాండ్ల సాధన కోసమే నిరసనలు, దీక్షలకు దిగుతున్నాం..’అని జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పాత పింఛన్ విధానాన్ని ఉద్యోగులందరికీ పునరుద్ధరించాలని ఈ భేటీలో పాల్గొన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ప్రతినిధి నాగులవంచ నరేందర్రావు డిమాండ్ చేశారు. లక్షలాది ఉద్యోగులతో ముడిపడి ఉన్న ఈ అంశం పరిష్కారమయ్యేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ డిమాండ్లు ఇవీ.. ⇒ 2వ పీఆర్సీ కమిషన్ నివేదిక తెప్పించి జూన్ 2 లోగా అమలు చేయాలి. పీఆర్సీ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించకూడదు. ⇒ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ, వాస్తవ అవసరం రూ.1,500 కోట్లకు పైగా ఉంది. రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. మిగిలిన మొత్తం విడుదల చేయడంతో పాటు ప్రతి నెలా విడుదల చేసే మొత్తం రూ.1,500 కోట్లకు పెంచాలి. ⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకం వెంటనే అమలు చేస్తామని సీఎస్ చెప్పినప్పటికీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించడం లేదు. ఈహెచ్ఎస్ లేక ఉద్యోగులు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం విధివిధానాలను వెంటనే ఖరారు చేసి, మే 1వ తేదీ నుంచి వైద్య సేవలు అందించాలి. ⇒ కాంట్రిబ్యూషన్ పెన్షన్ (సీపీఎస్) రద్దుచేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలి. ⇒ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ⇒ ఉపాధ్యాయ సంఘాల కో–ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే టీజీఈజేఏసీ క్షేత్రస్థాయిలో అతనికి తగిన శాస్తి చేస్తుంది. ⇒ కొన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రధానంగా జనగామ జిల్లా కలెక్టర్ అక్కడి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయించాలి. -
రేవంత్ ఆలోచనలన్నీ పేదల భూములపైనే
సాక్షి, హైదరాబాద్: సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలన్నీ పేదల భూములపైనే ఉన్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల భూములపై గద్దల్లా వాలుతూ ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన పట్టాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కాళ్లాపూర్, రాపోల్లో పారిశ్రామిక పార్కు మూలంగా భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కోకాపేటలోని తన నివాసం నుంచి హరీశ్ బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ పచ్చటి పొలాల్లో పరిశ్రమల పేరిట రైతుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రేవంత్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని, ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, దుర్మార్గపు పాలన అని, రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తాము అరెస్టులు చేయమని,, తమది ప్రజాపాలన అని ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం చెప్పి 24 గంటలు కాకముందే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం దౌర్జన్యమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పరిశ్రమల పేరిట 40 వేల ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు చేస్తోందని హరీశ్రావు ఆరోపించారు.ప్రభుత్వానికి ఎందుకంత భయం?భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని హరీశ్ ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి నేడు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, రాష్ట్రంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రెండు మూడు పంటలు పండే పచ్చని భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కాళ్లాపూర్, రాపోలులో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. రేవంత్ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు. రేవంత్ను మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ మళ్లీ గెలవడం పగటి కల అని, వచ్చేది రామరాజ్యం, కేసీఆర్ రాజ్యమేనని హరీశ్రావు వ్యాఖ్యానించారు.హరీశ్రావు తదితరులు అరెస్టు..విడుదలపరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్ రావును నార్సింగి అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంట బయలుదేరిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులను లారీలు అడ్డుపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసిన నేతలను ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచే హరీశ్రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మంగళవారం మధ్యాహ్నం హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులను పోలీసులు విడుదల చేశారు. -
కేరళ, తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేరళ, తెలంగాణల మధ్య కాదని, కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ గ్రహించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయన్ ఎప్పుడైనా వచ్చి పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ‘పినరయి విజయన్తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలను కూడా నేను తెలంగాణకు ఆహా్వనిస్తున్నా. రాష్ట్రంలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు. అతిథులుగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడైనా వచ్చి మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు..’అంటూ సవాల్ విసిరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం..కోవలం, మాలవిక్కర, పతానపురం నియోజకవర్గాల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రేవంత్ రోడ్షోలు నిర్వహించారు. ఈ రోడ్షోల్లో అలాగే అక్కడి మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. విజయన్ హయాం ముగిసింది..: ‘కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్ సీఎంలు కరుణాకరన్, ఉమెన్ చాందీలదే. పినరయి విజయన్ హయాం ముగిసింది. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైంది. మూడింట రెండొంతుల మెజార్టీతో కేరళలో యూడీఎఫ్ పాలన రాబోతోంది. విజయన్ గాడ్ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. ఆయనే విజయన్ను కేసుల నుంచి ర క్షిస్తున్నారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని, కేజ్రీవాల్తో సహా అనేక మంది నేతలను వేధిస్తున్న కేంద్రం.. విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? మోదీ, విజయన్ల మధ్య అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు. వారిద్దరి బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలింగ్ బూత్కు వెళ్లి సరైన నిర్ణయం చెపుతారు..’అని సీఎం రేవంత్ అన్నారు. కొనసాగుతున్న లేఖల యుద్ధం కేరళ సీఎం విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ల మధ్య మాటల యుద్ధం లేఖల రూపంలో సాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ కేరళ వెళ్లి చేసిన వ్యాఖ్యలకు ‘ఎక్స్’వేదికగా విజయన్ కౌంటర్ ఇవ్వగా, విజయన్కు లేఖ రాస్తూ రేవంత్ అంతే ధీటుగా స్పందించారు. దీనికి మరోమారు విజయన్ లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా రేవంత్ మరోసారి ప్రతి లేఖ రాశారు. ‘కేరళ ప్రభుత్వ పనితీరుపై నేను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నా. కానీ మీ ప్రతిస్పందనలో అభ్యంతరకరమైన భాషను వాడారు. నేనెప్పుడూ ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై ఆవేశపూరితంగా స్పందించను. అయితే మీరు నీతి ఆయోగ్ ఇచ్చిన 2023–24 నివేదికను ఉదహరిస్తున్నారు. ఆ సమయంలో మేం అధికారంలో లేము. అది బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల దుష్పరిపాలనలో చివరి దశ. మేం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏం జరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకుని మమ్మల్ని అంచనా వేయండి. తలసరి ఆదాయం, జీఎస్డీపీ తదితర ఆర్థిక సూచీల్లో ఆర్బీఐ హ్యాండ్బుక్ 2024–25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. దేశంలోనే ముందు స్థానంలో నిలిచింది. బంగారం స్మగ్లింగ్ కేసు ఏమైంది? నీతి ఆయోగ్ ఇచ్చిన అవినీతి ర్యాంకులను కూడా నేను గౌరవిస్తాను. కానీ మీ ప్రభుత్వం స్వచ్ఛమైనది అయితే బంగారం స్మగ్లింగ్ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయింది. మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులకు సంబంధాలున్నాయని ఆధారాలతో సహా బయటపడినా చర్యలేవి? శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదు? మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 దార్శనికతతో ముందెకెళుతోంది. అలాగే కేరళలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ’నవ కేరళ’దార్శనికతను అమలు చేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. కేరళ ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. జరగాల్సింది కూడా అదే..’అని రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా కేరళ ఎన్నికల ప్రచారం ముగించిన సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. -
రెండ్రోజుల్లో 2,322 పోస్టులు భర్తీ
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్/గన్ఫౌండ్రి : రెండేళ్లలో ఒక్క వైద్య శాఖలోనే 10,327 ఉద్యోగాలు భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మరో రెండ్రోజుల్లో ఇంకో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు మంత్రి దామోదర నియామక పత్రాలు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమన్న నమ్మకం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో వైద్యుల కొరత లేకుండా, ప్రజలకు సరైన సమయానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 10,327 పోస్టులను భర్తీ చేయగా ఇంకా 6,512 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అందులో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 1,000 స్పెషలిస్ట్ డాక్టర్, 475 అసిస్టెంట్ ప్రొఫెసర్, 732 ఫార్మసిస్ట్, ఇతర పోస్టులు ఉన్నాయన్నారు. ఈ నియామకాలన్నీ సమయానికి పూర్తి చేసి ప్రతి హాస్పిటల్ను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. నియామకాలతోపాటు ఆసుపత్రు ల్లో మౌలిక వసతులు, యంత్ర పరికరాలు, మందులు, డయాగ్నస్టిక్ సేవలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వైద్యులకు కొన్ని సూచనలు చేశారు. ‘సేవా భావంతో పనిచేయండి. ప్రతి రోగిని మానవత్వంతో చూడండి. నైతిక విలువలను పాటించండి. హైదరాబాద్లోనే ఉండాలి.. పట్టణాల్లోనే పోస్టింగ్ కావాలనే ధోరణి మార్చుకోండి. కొంతకాలమైనా జిల్లాల్లో పని చేయండి. మీ జ్ఞానం, మీ సేవ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి’అని చెప్పారు. ప్రజారోగ్యమే సమాజాభివృద్ధికి బలమైన పునాది.. : ప్రజారోగ్యమే సమాజాభివృద్ధికి బలమైన పునాది అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండటమన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. డయాలసిస్ సేవలను విస్తరిస్తూ కొత్తగా 79 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 1,100 కోట్లతో నాలుగు స్థాయిల ట్రామా కేర్ వ్యవస్థను అమలు చేయడంతోపాటు 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలను బలోపేతం చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో 213 నూతన అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 80 శాతం వైద్య అవసరాలు తీర్చే లక్ష్యంతో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవార్డులను అందజేశారు. నిమ్స్లో కేన్సర్ చికిత్స యంత్రం, ఎర్రగడ్డలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభం నిమ్స్లో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అత్యాధునిక హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని మంత్రి దామోదర మంగళవారం ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కేన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వ్యాధుల చికిత్సాలయం ప్రాంగణంలో నిర్మించిన ‘డీ–అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మంత్రి దామోదర ప్రారంభించారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి గుర్తించి చికిత్స పొందడం అవసరమని.. దీనిపై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. -
కంటి ఇన్ఫెక్షన్లలో మందుల నిరోధకత పైపైకి
సాక్షి, హైదరాబాద్: కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ (మందు పనిచేయని లక్షణం) వేగంగా పెరుగుతున్నట్లు సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా 45 శాతం కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఒకటి కంటే ఎక్కువ యాంటీబయోటిక్స్కు స్పందించకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి కారణంగా వైద్యులు ముందుగా వేసుకున్న అంచనాల ఆధారంగా మందులు ఇవ్వడం (ఎంపిరికల్ ట్రీట్మెంట్) సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు హెచ్చరించారు. అందుకే మైక్రోబయాలజీ పరీక్షల ఆధారంగా చికిత్స అందించడం అత్యవసరమని సూచించారు. కంటి ఇన్ఫెక్షన్లు కేవలం కంటికే పరిమితం కాకుండా పరిసరాల్లో ఉన్న సూక్ష్మజీవాల పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. కాబట్టి యాంటీబయోటిక్స్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఆసుపత్రుల్లో ఆధునిక పరీక్షా విధానాలను పెంపొందించడం అవసరమని సూచించారు. ప్రత్యేకంగా తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్లలో సరైన పరీక్షలు చేయకుండా మందులు వాడితే సమస్య మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. -
ఈవీ రాయితీలు రూ.1,450 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల మొత్తం రూ.1,450 కోట్లకు చేరుకుంది. 2024 నవంబర్ 16న ఈవీ పాలసీ సవరించాక కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చిన రాయితీనే రూ.967 కోట్లుగా ఉండటం విశేషం. పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మొత్తం మిగులుతుండటంతో ఈవీల కొనుగోలుపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా కేవలం 15 నెలల కాలంలో ఏకంగా 1.20 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీల సంఖ్య 2.90 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్తో రాయితీ గడువు ముగియనుంది. రాయితీల వల్లనే ఈవీల కొనుగోలు భారీగా పెరిగిన నేపథ్యంలో, మరికొంతకాలం రాయితీలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈవీల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. -
అప్పర్ భద్రకు లైన్క్లియర్ !
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఒక్క నీటి చుక్కను కేటాయించకపోయినా.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా 29.9 టీఎంసీల నీటిని తరలించి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో కర్ణాటక సర్కార్ అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రకు కేంద్రం లైన్క్లియర్ చేసింది. గత నెల 20న కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన సమావేశమైన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక సలహామండలి (టీఏసీ) సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఆ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.21,167.93 కోట్లుగా ఆమోదించింది. దీనికి సంబంధించిన సమావేశ మినిట్స్ వివరాలను సీడబ్ల్యూసీ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 2023, ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో నాటి ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే కేంద్రం అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేసి 130 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించడానికి కర్ణాటక సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఆధారపడిన రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించనుంది. ప్రధానంగా తుంగభద్ర జలాలపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్లోని రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) రైతాంగానికి పెద్దదెబ్బ అని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునళ్ల తీర్పులకు విరుద్ధంగా... తుంగభద్ర డ్యామ్కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్టు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్భద్ర ప్రాజెక్టును 2015లో కర్ణాటక చేపట్టింది. 2019, మార్చి నాటికే రూ.4,830 కోట్లను ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసి అప్పర్తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్భద్ర ద్వారా 2019–26 వరకు 3.80 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్కు తరలించింది. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు జాతీయ హోదా అప్పర్భద్రకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను సీడబ్ల్యూసీ తీసుకోవాలి. కానీ..రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్24న సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని.. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని పేర్కొంటూ వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న లేఖ రాసింది. ఈ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021, నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని.. దానికి జాతీయ హోదా ఇవ్వకూడదని నాటి కేసీఆర్ సర్కార్తోపాటు వైఎస్.జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ.. వాటిని బుట్టదాఖలు చేసి 2022, ఫిబ్రవరి 15న అప్పర్భద్రకు జాతీయ హోదా కల్పించింది. వర్షాభావంలో రాష్ట్రానికి కష్టమే.. : అప్పర్ భద్ర ప్రాజెకు పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. -
మీ మినట్స్తో మాకు తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గత జనవరి 30న ఢిల్లీలో తొలిసారిగా సమావేశమై చర్చించిన అంశాలతో సీడబ్ల్యూసీ రూపొందించిన మినట్స్లో అవాస్తవాలు, సత్యదూరమైన అంశాలున్నాయని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యకార్యదర్శి, కృష్ణాబోర్డు సభ్యులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో వెల్లడించిన పలు అభిప్రాయాలు అవాస్తవమని..న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు వాటిని పరిగణనలోకి తీసుకుంటే తమ రాష్ట్ర వాదనలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పెదవి విరిచింది. కేంద్రం/ ఏ రాష్ట్రం/ఇతర ఏ సంస్థ కూడా మినట్స్లో పేర్కొన్న అసంపూర్ణ చర్చలను ఏ న్యాయస్థానంలో చర్చ, ఉత్తర ప్రత్యుత్తరాల కోసం వాడకూడదని తేల్చి చెప్పింది. మినట్స్లోని పేరా 8 (1), (2)తో మినహా ఇతర అంశాలతో అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ తాజాగా సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ అథారిటీ (పీఏఓ)కి లేఖ రాశారు. ఈ లేఖపై ఏపీ అభిప్రాయాన్ని సీడబ్ల్యూసీ కోరింది. తెలంగాణ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. గోదావరి జలాల కేటాయింపులు జరగలేదనడం తప్పు గోదావరి జలాలను రాష్ట్రాలకు నిర్దిష్ట పరిమాణంలో కేటాయింపులు జరపలేదని మినట్స్లో సీడబ్ల్యూసీ పేర్కొనడం అసంపూర్ణ వ్యాఖ్య. ఇది తెలంగాణ వాదనలకు నష్టం కలిగిస్తుంది. రాష్ట్రాల మధ్య జరిగిన వివిధ అంతర్రాష్ట్ర ఒప్పందాల ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు నిర్దేశిత ప్రాంతాల వద్ద నీటి లభ్యత ఆధారంగా సరైన నాణ్యత, పరిమాణంతో కూడిన నిబంధనల రూపంలో కేటాయింపులు జరిపింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు జత చేసిన అనుబంధం–బీలో వివిధ సబ్ బేసిన్లలోని నీటి వినియోగాన్ని స్పష్టీకరించింది. » తెలంగాణలోని కాళేశ్వరం, సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల వంటి ఎన్నో ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు..75 శాతం లభ్యత ఆధారంగా ట్రిబ్యునల్ నిర్దేశించిన నీటి పరిమాణాల ఆధారంగా సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. మినట్స్లో నమోదు చేసిన అంశాల్లో వాస్తవికత లోపించిందని ఈ అంశాలు పేర్కొంటున్నాయి. వాటిని సరిచేయాలి. కృష్ణా బోర్డు ప్రాథమిక బాధ్యతను మరిచింది... మిగులు జలాలపై హక్కులను కోరకుండా వాటిని వాడుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయించింది. దీని ఆధారంగా ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుత ఏపీలో అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. లేదా చివరి దశలో ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం వంటి బేసిన్ లోపలి ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోగా, వాటిని ప్రస్తుత ఏపీ అడ్డుకుంటోంది. కృష్ణా ట్రిబ్యునల్–1 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నుంచి ఎస్ఆర్బీసీ, భీమా తదితర ప్రాజెక్టులకు పునఃకేటాయింపులు చేస్తూ సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. ఈ ప్రాతిపదికనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పిం చాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతుల జారీకి విరుద్ధంగా కృష్ణా బోర్డు చేసిన వ్యాఖ్య ఏమాత్రం సరికాదు. మినట్స్ నుంచి తొలగించాలి టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణను చేపట్టేందుకు నిరాకరిస్తూ కృష్ణాబోర్డు మినట్స్లో పేర్కొన్న కారణాలు ఏమాత్రం సరికాదు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు, రాష్ట్ర పునర్విభజన చట్టం–2014తో పాటు అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డుల నిర్ణయాలకు విరుద్ధమని కృష్ణాబోర్డు పేర్కొంది. నీటి వినియోగాన్ని నియంత్రించడమే ప్రాథమిక బాధ్యత కలిగిన చట్టబద్ధ సంస్థ అయిన కృష్ణాబోర్డు ఇలాంటివి చెప్పకూడదు. తెలంగాణ వాదనలకు మినట్స్లో చోటు ఇవ్వలేదు గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించి అక్కడి నుంచి పెన్నా బేసిన్కు తరలించుకోవడానికి ఏపీ చేసిన ప్రతిపాదనలు జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలతో పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సమావేశంలో తెలంగాణ నొక్కి చెప్పింది. ఏపీ ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తరహా వరద జలాల ఆధారిత ప్రాజెక్టులను మధించి అనుమతులు జారీ చేసేందుకు ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. ఈ విషయాన్ని మినట్స్లో సీడబ్ల్యూసీ నమోదు చేయలేదు. -
దేశంలోనే మా ఆడిటింగ్ నెంబర్వన్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ఆడిటింగ్లో అ త్యుత్తమ ప్రమాణాల తో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే నెంబర్ వ న్గా నిలిచిందని, వరు సగా మూడు సార్లు మొదటి ర్యాంకు సాధించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రభు త్వ వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నా యని చెప్పారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆన్లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు రెండు రోజుల కిందట వచ్చిన గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలో భట్టితో భేటీ అయింది. ఈ సందర్భంగా వారికి సాదర స్వాగతం పలికిన భట్టి.. ఆన్లైన్ ఆడిటింగ్ అధ్యయనానికి అవస రమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తామని తెలిపారు. గుజరాత్ అధికా రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ఆన్లైన్ ఆడిటింగ్ను అధ్యయనం చేస్తున్నామని, రాష్ట్రంలో ఆడిటింగ్ విధానం పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతోందని కితాబి చ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆడిట్ శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కరెంట్ కార్మికులు
సాక్షి, హైదరాబాద్/హనుమకొండ: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఆర్టీజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టీజన్లుగా కన్వర్షన్ చేయాలనే డిమాండ్తో తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పిడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, ఇతర కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎనీ్పడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రధాన రహదారి మొత్తం విద్యుత్ ఉద్యోగులతో నిండిపోయింది. ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి తాము సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రతి ఆర్టీజన్, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని, డివిజన్, సర్కిల్ కార్యాలయాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేసి దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. సమ్మెకు రెగ్యులర్ ఉద్యోగుల సంఘాల నాయకులు సైతం మద్దతు ప్రకటించారు. అవసరమైతే తాము కూడా సమ్మెలోకి వస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పవర్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, టీఎస్ఈఈయూ–1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జాన్సన్, తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్, టీఎస్ఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎస్.సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వం పరిస్థితులు క ల్పించిందన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ సమ్మెను అడ్డుకోవడానికి సమ్మెను నిషేధిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలో ప్రశాంతవాతావరణం క ల్పించడానికి ‘ఎస్మా’ను అమలులోకి తీసుకుని వస్తున్నామని, ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. ఆర్టిజన్స్ సమ్మె నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. -
‘రేవంత్.. మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిటే మీకు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ సీఎం రేవంత్ చేసే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు హరీష్రావు. కాంగ్రెస్ మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిట్కే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 7వ తేదీ) పరిగి పర్యటనకు వెళ్తున్న హరీష్రావును పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పీఎస్కు తరలించారు. దీనిలో భాగంగా ఆయన్ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్. ‘మీరు మళ్లీ గెలవడం కాదు కదా.. ఈసారి సింగిల్ డిజిటే మీకు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?, పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన... బేడీల పాలన గుడ్డి పాలన. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండి. ఎస్సీ ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. మీ పాలన అంతా బోగస్ మాటలు బోగస్ పాలన. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా?, పరిగిలో భూముల లాక్కొని తన అన్య కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదు?, వచ్చే ఎన్నికల్లో రాబోయే కేసీఆర్ రాజ్యమే’ అని హరీష్ స్పష్టం చేశారు. -
ఏబీఎన్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసును వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముట్టడించారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ వద్దకు చేరుకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓవరాక్షన్కు దిగారు.ఏబీఎస్ ఆఫీసు బయట శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ పోలీసు.. చంద్రశేఖర్ గొంతు పట్టుకుని ఆయనను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే, పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసేసే విధంగా ప్రవర్తించారు. దీంతో, పోలీసుల తీరు పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ. విలువలు దిగజార్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజం. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా?. ఏబీఎన్ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్ రాధాకృష్ణ ఒక చీటర్’ అంటూ మండిపడ్డారు. బూతులు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణను వదిలేసి.. వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గొంతు పట్టుకున్న పోలీస్🚨హైదరాబాద్లో ఏబీఎన్ ఆఫీస్ను ముట్టడించిన వైయస్ఆర్సీపీ నేతలు.. నియంత్రించే క్రమంలో హద్దులు దాటిన పోలీసులు#BanABNSaveAP#SadistChandraBabu pic.twitter.com/4jc2705E2g— YSR Congress Party (@YSRCParty) April 7, 2026 -
తమ్ముడికి రూ.26 లక్షల అప్పు ఇచ్చిన అక్క..!
హైదరాబాద్: తమ్ముడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వివాహిత అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్కు చెందిన లావ్యణ్య(35) తన తమ్ముడు స్వామికి ఇతరుల వద్ద అప్పుచేసి రూ.26 లక్షలు ఇచ్చింది. అయితే ఆ డబ్బు స్వామి తిరిగి ఇవ్వక పోవడంతొ లావణ్య తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఈనెల 4న పుట్టింటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగినా వారు స్పందించలేదు. దీంతో లావణ్య మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి భర్త ప్రపాద్ డ్యూటీ నుంచి ఇంటికి తాళంవేసి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఓ లేఖ లభించింది. తమ్ముడికి ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందుతున్నా.. అని రాసిఉంది. దీంతో భర్త ప్రసాద్ సోమవారం మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం శ్రీనగర్కాలనీ: యువతి అదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.రమ్య(20) మధురానగర్ లక్కీ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఈనెల 3న ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నానని సోదరుడు నవీన్కు ఫోన్ చేసింది. యువతి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో పాటు హాస్టల్కు కూడా తిరిగి రాకపోవడంతో నవీన్ మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో గ్యాస్ డెలివరీ బాయ్.. వ్యక్తిఅదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్రహ్మశంకర్నగర్కు చెందిన మహేశ్(38) గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. మార్చి 28న మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్రహ్మణితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులతో పాటు పలు ప్రదేశాల్లో వెతికనా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
Hyderabad: బిర్యానీ ఆర్డర్ చేసుకుంటున్న వారికి షాక్
హైదరాబాద్: మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ఫ్రిడ్జ్లో భద్రపరిచి ఆర్డర్ రాగానే ఓవెన్లో వేడి చేసి డెలివరీ చేస్తున్న హోటల్ యజమానిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని వెంకటరమణకాలనీలో నివసించే కొండారెడ్డి ఆదివారం ఉదయం జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. రోడ్ నెంబర్–2లోనే ఉన్న లక్కీ బిర్యానీ షవర్మ రెస్టారెంట్ నుంచి డెలివరీబాయ్ చికెన్ బిర్యానీ తీసుకుని కొండారెడ్డికి అందించాడు. పొట్లం విప్పి చూడగా బిర్యానీ నుంచి దుర్వాసన వచి్చంది. పరిశీలించగా కొంత కుళ్లిపోయి కనిపించింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్కీ బిర్యానీ సెంటర్కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఫ్రిడ్జ్లో 80 బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. జీడిమెట్లలో సదరు హోటల్ యజమాని ఇర్ఫాన్ ఈ బిర్యానీని తయారుచేసి ఇక్కడి అవుట్లెట్లో భద్రపరుస్తూ ఆర్డర్ రాగానే ఓవెన్లో వేడి చేసి ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా ఒక ఫ్రిడ్జ్ను తెరిచి చూడగా అందులో ఎలుకలు తిరగడం కూడా పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ఇర్ఫాన్ ప్యాకెట్లుగా తయారుచేసి బంజారాహిల్స్లోని తనకు చెందిన లక్కీ బిర్యానీ సెంటర్లో భద్రపరుస్తున్నట్లుగా తేలింది. దుర్వాసనలతో కూడిన బిర్యానీని సరఫరా చేసిన ఇర్ఫాన్పై పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేశారు. ఈ హోటల్ మొత్తం ఎలుకలు, బొద్దింకలు, దుర్వాసనలు, దుర్గంధంతో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రెస్గా ఉన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్థారించారు. ఫుడ్సేప్టీ అధికారులు కూడా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత.. హరీష్ రావు అరెస్ట్
హరీష్ రావు పరిగి పర్యటన అప్డేట్స్.. హరీష్ రావు అరెస్ట్.. పరిగి పర్యటనకు బయల్దేరిన హరీష్ రావును అప్ప జంక్షన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు..హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు..అరెస్ట్ చేసిన నేతలను స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతల తరలింపు.పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ నేతల ఆందోళన.. రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అదుపులో తీసుకుంటున్న పోలీసులుపోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదంహరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు👉అంతకుముందు.. మంగళవారం ఉదయం మాజీ మంత్రి హరీష్రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు. హరీష్ను పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు.👉కాగా, ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు హరీష్ పరిగి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శుభప్రద్ పటేల్ను ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు.👉అయితే, పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో పర్యటించి హరీష్రావు సంఘీభావం తెలపనున్నారు.మాజీ మంత్రి @BRSHarish గారు హౌస్ అరెస్ట్.. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగింత.ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు.హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, పలువురు ఉమ్మడి… pic.twitter.com/sMXVrP1nvU— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026 -
రోజుకు 1 జీబీ
సాక్షి, స్పెషల్ డెస్క్: భారత్లో రెండేళ్లుగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఏటా 15 కోట్ల యూనిట్లు దాటుతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోంది. ఇంకేముంది ఇంటర్నెట్ వాడకం జోరు మీద ఉంది. ఒక్కో మొబైల్ యూజర్ సగటున రోజుకు 1.02 గిగాబైట్స్ (జీబీ) డేటా వినియోగిస్తు న్నాడు. నాలుగేళ్లలో ఇది దాదాపు రెండింతలైందంటే మనవాళ్ల వాడకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మెట్రోలే కాదు పల్లెల్లోనూ జనం ఎంచక్కా ఇంటర్నెట్లో విహరిస్తూ మొబైల్కు గంటల తరబడి అతుక్కుపోతున్నారు.ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్ ⇒ 5జీ చందాదారుల సంఖ్యలో (40కోట్లు)⇒ 5జీ డేటా వినియోగంలో (నెలకు 12.9 ఎక్సాబైట్స్)⇒ 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ చందాదారుల సంఖ్యలో (2026 ఫిబ్రవరికి 1.19 కోట్లు) నివేదిక హైలైట్స్..⇒ దేశవ్యాప్తంగా గత ఏడాది 13.7 కోట్ల 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.⇒ వినియోగంలో ఉన్న 89.2 కోట్ల యూనిట్ల 4జీ ఫోన్లలో 38.3 కోట్ల యూనిట్లు 5జీ సపోర్ట్ చేస్తాయి.⇒ మెట్రో నగరాల్లో మొత్తం ఇంటర్నెట్ వాడకంలో 5జీ వాటా 58%.ఆధారం: నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్–2026 నివేదిక -
కల్తీరాయుళ్లపై పీడీ యాక్టు
ఖైరతాబాద్/అమీర్పేట: ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ ‘ఈట్ రైట్..స్టే హెల్తీ’అనే నినాదంతో సోమవారం నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన వాకథాన్ను వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. జలవిహార్ నుంచి ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండిఏ మైదానం వరకు ఈ వాకథాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయన్నారు.వీటిలో 80శాతం పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని కొంత మంది దుర్వినియోగం చేస్తూ ప్రతీ ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత రెండేళ్లలో 11వేలకుపైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఫుడ్ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని, శాస్త్రీయ అధ్యయనం అనంతరం త్వరలోనే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి ఆహార కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ వాకథాన్లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, సీపీ సజ్జనార్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కల్తీ ఆహారంతో ఆరోగ్యం దెబ్బతింటుంది మనం తీసుకునే ఆహారంలో కల్తీ జరగకుండా చూసుకోవాలని, కల్తీ ఆహారం తీసుకుంటూ వెళ్తే ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర అన్నారు. ప్రజా పాలన ప్రగతి పణాళికలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఆహార భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమీర్పేట నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ’ఈట్ రైట్’మేళాను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కల్తీని నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. -
చావడమో.. చంపడమూ
మార్చి 31వరంగల్ జిల్లాకు చెందిన స్రవంతి తన భర్త వేధింపులు తాళ లేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇదే రోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన బాణావత్ రాందాస్ నాయక్ తాగిన మైకంలో గొడవకు దిగి భార్య, కొడుకు, కూతురుపై రోకలి, చాకుతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు మృతి చెందారు. ఏప్రిల్ 3కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం కవల ఆడపిల్లలు పుట్టారని తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు పిల్లలకు గడ్డిమందు తాగించి బావిలో పడేశాడు. దీంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 4పటాన్చెరుకు చెందిన పరమేశ్వరరావు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీన కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి చంపాడు. సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కుటుంబ ఆత్మహత్యలు, హత్య–ఆత్మహత్యల సంఘటనలు ఒక తీవ్రమైన ప్రజారోగ్య, సామాజిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఒంటరితనం, కుంగుబాటు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, చదువు, ఒత్తిడి వంటి కారణాలతో మరణం తప్ప మరోమార్గం లేదని... హింసాత్మక ప్రవృత్తితో ఇతరులను చంపడమో, తాము ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలి పోకడలను గమనిస్తే ఇవి కేవలం విడివిడి సంఘటనలే కాకుండా... తీవ్రమైన ఆర్థిక, సామాజిక, మానసిక క్షోభకు దారితీసే లక్షణాలుగా కనిపిస్తున్నాయి.కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా దంపతులు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడమో లేదా పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకోవడమో, భార్యాపిల్లలను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 2022–2026 మధ్యకాలంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా అప్పులు, పేదరికం, నిరుద్యోగం, వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రోజువారీ కూలీలు, ఆ తర్వాత గృహిణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉండడం వారి ఆర్థిక దుర్బలత్వాన్ని సూచిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో (తెలంగాణతో సహా) అప్పులు లేదా గృహ సమస్యల కారణంగా పిల్లలతో సహా మొత్తం కుటుంబం విషం తాగడం లేదా ఉరి వేసుకోవడం వంటి సంఘటనలు, సామూహిక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.కుటుంబ కలహాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా మానసిక అనారోగ్యం వంటి కారణాల వల్ల, ఒక కుటుంబ సభ్యుడు ఇతరులను (భార్య/భర్త పిల్లలను) చంపి ఆత్మహత్య చేసుకునే కేసులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బాధితుల్లో గణనీయమైన సంఖ్యలో ‘గృహిణులు’ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలు తరచుగా వ్యక్తిగత సమస్యలు, గృహ హింస లేదా తీవ్రమైన ఆర్థిక సమస్యలు, గృహ ఒత్తిడితో ముడిపడి ఉన్నట్టుగా వెల్లడైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం 2023లో ఆత్మహత్య బాధితులలో 66% మంది అత్యల్ప ఆదాయ వర్గానికి (సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ సంపాదించేవారు) చెందినవారు ఉన్నారు. చావులు పరిష్కారం కాదనే అవగాహన, మ్యారేజీ కౌన్సెలింగ్ పెంచాలి నేటి సమాజంలో యువత, దంపతులకు తాహతుకు మించి ఆశలు పెరుగుతున్నాయి. తమ జీవితం, ఆర్థిక పరిస్థితులు, సమాజం తదితరాల పట్ల స్పష్టమైన అవగాహన లేక ప్రతిష్టకు పోయి సమస్యల్లో కూరుకుపోతున్నారు. నేటితరం ఆడంబరంగా పెళ్లిళ్లు, ఆ తర్వాత ఖర్చుతో కూడుకున్న ట్రిప్లు, పెద్దపెద్ద ఇళ్లు, ఖరీదైన ఫోన్లు, వాహనాలు...ఇలా లెక్కకుమిక్కిలి ఖర్చులతో ఆర్థికపరంగా చిక్కుల్లో కూరుకుపోతున్నారు. దీంతో అక్రమ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంపై దృష్టితో తాగుడు, డ్రగ్స్, చెడు వ్యసనాలు, బెట్టింగ్లకు బానిసలై హింసా ప్రవృత్తితో హత్యలకు, కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పరంగా హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారం కాదనే అవగాహనతోపాటు మ్యారేజీ కౌన్సెలింగ్ విస్తృతం చేయాలి. కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లు పెరుగుదల వంటి వాటిని ముందుగానే గుర్తించి కౌన్సెలర్లను సంప్రదిస్తే సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. డిజిటల్ యుగంలో సెల్ఫోన్తో ఎవరితోనైనా ఎక్కడి నుంచైనా సులభంగా కనెక్ట్ అవుతున్నారు. ‘పోర్న్’కూడా యువత, ఇతర వర్గాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. - సి.వీరేందర్, సైకాలజిస్ట్ కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఏది ? ఇప్పుడు కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ కనుమరుగవుతోంది. సమస్యలు, కుంగుబాటు వంటివి తలెత్తితే ఇంట్లోని పెద్దవారు సరిదిద్దేవారు. కుటు ంబ సంబంధాలు, ఆర్థిక సమస్యలు, ఇతర రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చాలామందికి తెలియడం లేదు. చదువు పూర్తి కాగానే ఏడ ంకెల జీతాలు, విలాసాలతో కూడుకున్న జీవనం, సౌకర్యాలు కోరుకుంటున్నారు.దానికి తగ్గట్టుగా విద్యార్హతలు, తాహతు లేకపోతే కుంగుబాటుకు గురికావడం, వ్యక్తిగత సంబంధాల్లో భేదాభిప్రాయాలు, భాగస్వాముల మధ్య స్పర్థలు, కోపా లు, ఆవేశాలు పెరిగిపోయి హత్యలు, ఆత్మహత్యలే శరణ్యమనే స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మనుషులను కనెక్ట్ చేయడానికి బదులు ఏకాకులను చేయడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. రోజులో ఎక్కువ సమయం సెల్ఫోన్లు, టీవీల్లో మునిగి మనుషుల్లో ఏకాకితనం పెరుగుతోంది. - డా. నిశాంత్ సైకియాట్రిస్ట్ -
సీపీఎస్ ఉద్యోగులకు ‘ప్రాన్’ భయం
మార్చి 14వ తేదీన లాంగ్వేజ్ పండిట్ ధరమ్సింగ్ ప్రాన్ ఖాతాలో రూ.18,88,500 ఉండగా, మార్చి 31వ తేదీ నాటికి రూ.18,17,933కు పడిపోయింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఆయన ఖాతాలో రూ.70,567 తగ్గింది.కల్వల్ శ్రీకాంత్ ఖాతాలో మార్చి 18వ తేదీన రూ.20,93,640 ఉండగా, మార్చి 31వతేదీ నాటికి రూ. 20,51,936 ఉంది. కేవలం 12రోజుల వ్యవధిలో రూ.41,704 కోత పడింది.సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో సొమ్ము ఆవిరవుతోంది. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకుల ఫలితంగా వారి పెన్షన్ ఖాతా సొమ్ము క్రమంగా పతనమవుతోంది. ఒక్కో ఉద్యోగి ప్రాన్ (పీఆర్ఏఎన్–పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) ఖాతా నుంచి సగటున 4 నుంచి 7 శాతం మేర పతనం కావడం ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ప్రభుత్వం నేరుగా ఇవ్వకుండా, ప్రత్యేక సంస్థ పరిధిలో నిర్వహిస్తుంది.ఉద్యోగి, ప్రభుత్వం ఇచ్చే వాటాను సదరు సంస్థలు మార్కెట్లో పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో దాదాపు నెలరోజులుగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా మార్కెట్ పతనం అవుతున్నా..తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రాన్ ఖాతాల్లో ఉండే సొమ్మును ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో విత్డ్రా చేసుకుంటారు. అయితే తాము జమ చేసుకుంటున్న సొమ్ము రిటైర్మెంట్కు ముందే భారీగా కరిగిపోతుండడంతో అయోమయానికి గురవుతుండగా..ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగి భవిష్యత్ను స్టాక్ మార్కెట్లో పెడతారా?సీపీఎస్ విధానంలో ఉద్యోగి భవిష్యత్ అత్యంత ప్రమాదకరంగా మారింది. తాజా పరిస్థితులు మరింత స్పష్టం చేస్తున్నాయి. ఎక్క డో యుద్దం జరుగుతుంటే..ఇక్కడ సీపీఎస్ ఉద్యోగి ప్రాన్ ఖాతా లో నిధులు ఆవిరవుతున్నాయి. ఉద్యోగి సొంతంగా అందులో పెట్టుబడి పెడితే నష్టాన్ని భరిస్తాడు. కానీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది.. పెట్టుబడి ఎవరు పెడుతున్నారు.. ఎవరు నష్టపోతున్నారు ? ప్రభుత్వం ఆలోచించాలి. సీపీఎస్ కింద ఉద్యోగి వాటా 10%తో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న 10% వాటా కూడా ప్రజలు చెల్లించిన పన్నుల రూపంలో వచి్చన ప్రజా ధనమే. ఇంతటి భారీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల లాభనష్టాల మీద ఆధారపడేలా చేయడం ప్రజలను, ఉద్యోగులను వంచించడమే. ప్రభుత్వోద్యోగుల పెన్షన్పై కార్పొరేట్ పెత్తనం సాగనివ్వొద్దు. తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తేనే ఉద్యోగి ప్రశాంతంగా జీవిస్తాడు. – స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు (టీఎస్సీపీఎస్ఈయూ)ఉద్యోగుల బతుకులు నిత్యం టెన్షన్లోనేపెన్షన్ అనేది ఉద్యోగికి అవసరాల కోసమే కాదు... ఉద్యోగి కుటుంబ సభ్యుల భవిష్యత్కు సంబంధించినది కూడా. దానిని స్టాక్ మార్కెట్తో ముడిపెట్టడంతో ఉద్యోగి బతుకులు నిత్యం టెన్షన్తోనే గడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మా పిల్లల భవిష్యత్, మా వృద్ధాప్య భద్రతను బలి చేయొద్దు. – కల్వల్ శ్రీకాంత్, టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మీ డేటా పాతది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి, కేరళ సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా విజయన్ ఘాటుగా స్పందించగా, ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ రేవంత్ మరింత ఘాటైన లేఖ రాశారు. అను భవజ్ఞులైన రాజకీయ నాయకుడనే గౌరవంతో ఎక్స్ వేదికగా మీ స్పందనను చదివానని, అందులో తప్పుదారి పట్టించే అంశాలతోపాటు ముఖ్యాంశాల్లో లోపాలు కనిపించాయని, రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిజాలను తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తూ ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ఈనెల 7న త్రివేండ్రంకు వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని విజయన్ను ఆహ్వానించారు. లేఖలో ఏముందంటే...⇒ నేను కేరళ వ్యవస్థలను ఎక్కడా తప్పుపట్టలేదు. మీ ఎల్డీఎఫ్ పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపాను. ⇒ మీరు నీతిఆయోగ్ ఇచ్చిన ఎస్డీజీ 2023–24 గురించి మాట్లాడారు. కానీ ఆ డేటా పాతది. తెలంగాణను వినాశనం చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాలన చరమాంకంలో ఇచ్చిన గణాంకాలను పట్టుకుని మా ప్రభుత్వం గురించి చెబుతున్నారు. 2023, డిసెంబర్లో ఆ పాలన అయిపోయింది. ⇒ 2025 తర్వాతి కాలంలో దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని మీ పోస్ట్లో చెప్పారు. మరి ఇప్పుడు 2026, ఏప్రిల్ నడుస్తోంది. మీ రాష్ట్రం 100 శాతం అక్షరాస్యత సాధించిందా? ⇒ కేరళలో పేదరికం తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో ఉందన్నది వాస్తవమే. కానీ అది 60 కంటే ఎక్కువ సంవత్సరాల ప్రగతిశీల పాలన ద్వారా సాధ్యమైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన గణనీయ సంపద ద్వారా జరిగింది. 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ–బీఆర్ఎస్ ద్వారా వారసత్వంగా పేదరికం వచ్చింది. అయితే, 60 ఏళ్ల తర్వాత మీరెక్కడున్నారు... అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో మేమేం సాధించామన్నది ప్రశ్న.⇒ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీ–టీం అని అసంబద్ధ ఆరోపణ చేశారు. 2020లో జరిగిన కేరళ బంగారం కుంభకోణంలో స్వయంగా మీ ముఖ్య కార్యదర్శిని ఈడీ అరెస్టు చేసింది. కీలక నిందితుడు నేరుగా మీ కార్యాలయ ప్రమేయం గురించి దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఈ విషయంలో ఈడీ జరిపిన సోదాలు, సీబీఐ విచారణలో ఎక్కడా కేరళ సీఎం కార్యాలయానికి ఉన్న లింకుల గురించి ప్రస్తావనకు రాలేదు. కానీ గాంధీ కుటుంబాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలు నిత్యం వేధిస్తున్నారు. ఎవరు ఎవరికి బీ–టీం అనేది కేరళ ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా. ⇒ మా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం. బీజేపీ–బీఆర్ఎస్ల వాట్సాప్ అభిప్రాయాలను వల్లించకుండా మేం జీతాలు ఇస్తున్నామో లేదో తెలుసుకునేందుకు ఓ బృందాన్ని పంపి స్వతంత్రంగా విచారించుకోండి. ⇒ తలసరి ఆదాయంలో మాది దేశంలోనే రెండో స్థానం. దక్షిణాదిలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లోనూ మేమే నంబర్వన్. దేశంలో భౌగోళికంగా 3.5 శాతం, జనాభా పరంగా 3 శాతం కూడా లేని తెలంగాణ జీడీపీలో 5 శాతం పాలుపంచుకుంటోంది. ⇒ మీ రాష్ట్రంలో చురుకైన యువత ఉండటం మీకు అదనపు వనరు. సుమారు 35 లక్షల మంది కేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఏటా 1.5 లక్షల కోట్లు వారి ద్వారా వస్తున్నాయని అంచనా. పశ్చిమాసియా భగ్గుమంటున్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న మలయాళీల్లో ఒక్కరూ తిరిగి రాష్ట్రానికి రాలేదంటే కారణం మీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడమే.⇒ మీరు ఆరోపించినట్టు బుల్డోజర్లు ఏ పేద కుటుంబాన్నీ నష్టపర్చలేదు. బుల్డోజర్ బాధితులంటూ మీరు ఆరోపణలు చేసిన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు, ఆర్థిక సాయం, మార్కెట్విలువ కంటే ఎక్కువ పరిహారం చెల్లించాం. ⇒ చివరగా మీ పాలన వద్దని,∙కాంగ్రెస్ మోడల్ను కేరళ ప్రజలు కోరుకుంటున్నారు. -
బెంగాల్ ఎన్నికలు దేశద్రోహులు, బీజేపీకి మధ్య యుద్ధం
దూద్బౌలి (హైదరాబాద్): బెంగాల్లో జరగబోయే ఎన్నికలు దేశద్రోహులకు, బీజేపీకి మధ్య యుద్ధమని... ఈ యుద్ధంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం హైకోర్టు సమీపంలోని శ్రీ మురళీధర్ దేవాలయంలో ఘాన్సీబజార్ బెంగాలీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదారులకు సహకరిస్తూ వారికి ఓటర్ గుర్తింపు కార్డులను కల్పించి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.బెంగాల్ ఎన్నికల్లో తమ కుటుంబీకులు, బంధువులు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ స్థానిక బెంగాలీలను కోరారు. శనివారం పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వచ్చిన జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులపై ఎంఐఎం దాడులకు దిగితే వారిపై ఎలాంటి చర్యలు లేవని.. దీనిపై సీఎం వెంటనే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో హిందూ సమాజం ప్రమాదంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ను నిరోధిస్తున్నామని చెబుతున్నారని.. కానీ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు. -
కేరళకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కేరళ వెళ్లారు. ఆయన మంగళవారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షో, 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు పతానపురం రోడ్ షోలో రేవంత్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.


