Hyderabad
-
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. మెదక్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. -
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్: నగర వాసులకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం కల్గింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభం కూడా ఈరోజే కావడంతో రేపట్నుంచి ఎండలు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా జనాల్లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభంలో సాధారణంగా చినుకులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆపై భానుడు మరింత సెగలు కక్కుతాడు. ఈ వర్షం అందుకే సంకేతమైతే నగరవాసులకు మరింత హీట్వేవ్ను చూడాల్సి ఉంటుంది. -
పోలీసులపైకే దూసుకొచ్చాడు..
హైదరాబాద్: వీకెండ్లో ఐటీ కారిడార్ కార్ రేస్, బైక్ స్టంట్లకు వేదికవుతోంది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో కారు రేస్ రేసింగ్ పాల్పడటం పరిపాటిగా మారింది. శనివారం రాత్రి కార్ రేసింగ్ చేస్తున్నారనే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఘటన స్థలానికి వెళ్లారు. తమపైకే కారు దూసుకురావడంతో వారు కంగుతిన్నారు. రేసింగ్కు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. టీ హబ్, హై హోంభూజ, ఐకియా రోడ్లలో కారు రేసింగ్ చేస్తున్నారని సమాచారం అందడంతో శనివారం రాత్రి 12.30 గంటలకు బ్లూకోల్ట్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎం.రమేష్ హెడ్కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. నాలెడ్జి సిటీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి నిలోఫర్ కేఫ్ వైపు హోండా సిటీ కారు భారీ శబ్దాలు చేస్తూ రోడ్డుపై మితిమీరిన వేగంతో చక్కర్లు కొడుతోంది. బ్లూకోల్ట్ సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారు సైడ్ మిర్రర్ తాకడంతో కానిస్టేబుల్ రమేష్ కుడిచేతికి గాయాలయ్యాయి. ఫిరోజ్గాం«దీనగర్కు చెందిన మహ్మద్ రెహా్మన్ (18) మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కారు రేసింగ్కు వచ్చాడు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన రెహా్మన్ను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులోంచి పారిపోయిన ఒయాసిస్, అయాన్, వాసిమ్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు, బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
ORRపై 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన యువకుడు
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతోపాటు టోల్ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలకాపూర్ టౌన్షిప్కు చెందిన కొత్తపల్లి యశ్వంత్రెడ్డి గత ఏప్రిల్లో వోక్స్ వ్యాగన్ విర్టస్ కారును కొనుగోలు చేశాడు. దాని వేగాన్ని పరీక్షించేందుకు ఈ నెల 10న నార్సింగి టోల్గేట్ వద్ద ఔటర్రింగ్ రోడ్డు ఎక్కి కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడు. దాన్ని తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. దాన్ని గమనించిన పెట్రోలింగ్ అధికారి కె.సాయిరాం ఈ నెల 19న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసి ఆదివారం అతడితోపాటు కారును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర స్టంట్లు చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి చర్యలతో అమాయక ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియురాలి నాలుక కోసిన ప్రియుడు!
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను కోసేశాడు ఓ వ్యక్తి. కుషాయిగూడ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ, శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుజాత దినసరి కూలీ. ఆమె భర్త చనిపోవడంతో అదే కాలనీకి చెందిన నవీన్ అనే వ్యక్తితో కలిసి ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది. కూలీ పనిచేసే ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాట పెరగడంతో ఆమె నాలుకను నవీన్ కోశాడు. ఇరుగుపొరుగు గమనించి అదే కాలనీలో ఉండే ఆమె కొడుకు డేవిడ్కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డేవిడ్ ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రజా పాలనలో ఇంతటి దుస్థితినా?: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: గర్భిణి రైల్వే ప్లాట్ఫామ్పైనే ప్రసవించాల్సిన పరిస్థితి… మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి… అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా ‘ప్రజా పాలన’నా అంటూ రేవంత్ సర్కార్ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన. తాండూర్లో ఓ నిరుపేద గర్భిణికి 108 అంబులెన్స్ సేవలు సమయానికి అందలేదని, ఫలితంగా ఆమె రైల్వే ప్లాట్ఫామ్పైనే ప్రసవించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో భద్రాచలంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు హియర్స్ వాహనం అందుబాటులో లేక కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటన కూడా చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఘటనలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులను పోస్ట్ చేశారు.Is this the “Praja Palana” people were promised?The condition of Telangana’s public healthcare system under the Congress government is becoming deeply disturbing and heartbreaking.In Tandur, a poor pregnant woman was forced to deliver her baby on a railway platform after 108… pic.twitter.com/1O4cQYr54Y— Harish Rao Thanneeru (@BRSHarish) May 25, 2026కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు, హియర్స్ వాహన సదుపాయాలు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారాయన. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాల్సిన వ్యవస్థలు ఇలా కుప్పకూలడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన సేవలు పనిచేయకపోవడం, మరణానంతరం గౌరవం ఇవ్వాల్సిన వ్యవస్థలు కూడా విఫలమవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 108 సేవలను, హియర్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బాధ్యతను నిర్ణయించాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
టీజీకి హీట్వేవ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ కారణంగా మిట్ట మధ్యాహ్నం అయితే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వాతావరణ శాఖ ఈరోజు హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాలు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రిలో తీవ్రమైన వేడిగాలులు 44-47°C లతో మధ్యాహ్నం సమయంలో LOO గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.ఉరుములతో కూడిన వర్షసూచన.. మరోవైపు.. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఇతర జిల్లాల్లో, అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, హైదరాబాద్ సిటీలో సాయంత్రం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.Today's FORECAST - May 25, 2026HEATWAVE WARNING ⚠️🔥SERIOUS HEATWAVE conditions ahead in Khammam, Bhadradri - Kothagudem, Mahabubabad, Suryapet, Nalgonda, Mulugu, Warangal, Hanmakonda, Karimnagar, Peddapalli, Bhupalapally, Mancherial, Jagitial, Asifabad, Adilabad, Nirmal,…— Telangana Weatherman (@balaji25_t) May 25, 2026 -
జూబ్లీహిల్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులపై యువకుల దాడి
బంజారాహిల్స్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అర్ధరాత్రి దారి కాసి అకారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... సనత్నగర్ జెక్ కాలనీలో నివసించే ముజఫర్ ఎండీ ఖాన్ యష్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. శనివారం అర్ధరాత్రి తన భార్యతో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియో రోడ్డులో వెళ్తున్నారు. ఓ కారులో వచ్చిన ముగ్గురు యువకులు తప్పతాగి అకస్మాత్తుగా రోడ్డును బ్లాక్ చేసి వీరిని అడ్డగించారు. ఇదేమిటని ప్రశి్నంచిన ముజఫర్పై దాడికి పాల్పడటంతో ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకున్న ఆయన భార్యపై కూడా దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
‘ఇదే నా చివరి రాత్రి.. నువ్వు సుఖంగా ఉండు’
హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ యువకుడు ‘ఇదే నా చివరి రాత్రి’ అంటూ సెల్ ఫోన్లో తన స్నేహితులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో దేవరకొండ బస్తీలో నివసించే సమీర్ (20) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా సమీర్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్నేహితులకు ‘ఇదే నా చివరి రాత్రి. నువ్వు సుఖంగా ఉండు’ అంటూ చాటింగ్ చేసి ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎలాంటి కారణాలు కూడా లేవని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మొబైల్ ఫోన్ చాటింగ్లను పోలీసులు పరిశీలించారు. -
హైదరాబాద్లో అత్యధిక డిమాండ్ ఈ మందులకే
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర పౌరులు మధుమేహం, రక్తపోటు, ఎసిడిటీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్నారు. నగరంలో అమ్ముడవుతున్న మందుల్లోనూ వీటిదే అగ్రస్థానం. గ్రేటర్ పరిధిలోని 35 శాతం మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. ఐటీ కారిడార్లో రక్తపోటు, స్ట్రెస్ రిలీఫ్ మందుల అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదవుతోందని ప్రి్రస్కిప్సన్స్ ట్రెండ్ స్పష్టం చేసింది. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు మూడు పూటలా కలిపి 6 నుంచి 10 మాత్రలు మింగుతున్నారని నివేదికలో పేర్కొంది. 42 లక్షల మంది మందులతోనే.. గ్రేటర్ పరిధిలో సుమారు 1.35 కోట్లు. వీరిలో దాదాపు 42 లక్షల మంది బీసీ, షుగర్, థైరాయిడ్, అసిడిటీ, గుండె, ఊపిరితిత్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులున్న వారు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు మాత్రలు తీసుకుంటుండగా, వృద్ధుల్లో ఈ సంఖ్య 6 నుంచి 10 మాత్రలుగా ఉందని అంచనా. మధుమేహంలో మనమే.. దేశంలో అత్యధికంగా మధుమేహం బాధితులున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. మధుమేహం నియంత్రణకు వినియోగించే మందుల అమ్మకాలు అంతే పరిమాణంలో ఉంటున్నాయి. టైప్–1, టైప్–2 బాధితులు రోజుకు ఒక దఫా నుంచి మూడు దఫాలు ఇన్సులిన్ తీసుకుంటున్నారు. బాధితుల్లో సుమారు 10 నుంచి 15 శాతం మంది ఇన్సులిన్ ఇంజక్షన్లపైనే ఆధారపడుతున్నారు. ఐటీ కారిడార్లో టెకీలతో పాటు ఇతర రంగాల్లోని నిపుణుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్ట్రస్ రిలీఫ్, బీపీ మందుల వినియోగం గణనీయంగా పెరిగింది. థైరాయిడ్లో మహిళలతో సమానంగా పురుషులు అధిక మసాలాలు ఉండే బిర్యానీ, ఇతర వంటకాలు, సమయానికి ఆహారం తినకపోవడంతో అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. థైరాయిడ్ మహిళలతో పాటు పురుషుల్లోనూ సమానంగా కనిపిస్తోంది. వివిధ రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి మాత్రలు అధికంగా వినియోగిస్తున్నారు. జర్నల్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నివేదిక ప్రకారం యాంటీబయాటిక్స్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ప్రతి వెయ్యి మందిలో రోజు సగటున 15 మంది యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. -
వడదెబ్బతో 61 మంది మృతి
సాక్షి, నెట్వర్క్ : అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో 61 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 26 మంది ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా పాతపోచారంలో లింగాల రాజయ్య(75), బడితండాలో అజ్మీరా లచ్యా (80), నెల్లికుదురులో వీరగాని వీరమ్మ (84), కొత్త రామయ్య (86), తొర్రూరులో పైండ్ల నర్సయ్య(45), అమ్మాపురంలో అత్తిలి రాము(60), నాంచారిమడూరులో సోమ నారాయణ (65), గూడూరులో పాపని ఎల్లమ్మ (68) వడదెబ్బతో మృతి చెందారు. ములుగు జిల్లా రామన్నగూడెంలో దొడ్డ వెంకటయ్య(85), కన్నెపల్లిలో పాయం సుశీంద్ర (65), జనగామ నాగిరెడ్డిపల్లిలో తేలు మల్లమ్మ (70), జఫర్గఢ్లో తాటికాయల బాబు (49), రంగరాయగూడెంలో తల్లీకూతుళ్లు మంద చంద్రమ్మ(80), కవిత (35), జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లిలో ఎర్రబోయిన జయలక్ష్మి (65), వరంగల్ కరీమాబాద్లో బేతి అశోక్ (55), కరీమాబాద్లో మైదం శ్రీను (55), వెంకటాపురంలో గోర్కటి లింగమ్మ (70), గొర్రెకుంటలో గడ్డం పద్మ (55), వర్ధన్నపేటలో చందు ఐలయ్య (88), ఇల్లందలో వనం వజ్రమ్మ (70), రొడ్డ సుశీల (65) వడదెబ్బతో మృతిచెందారు. హనుమకొండ జిల్లా గాంధీనగర్లో తూముల రాజయ్య (68), కొత్తూరు మార్కెట్ ప్రాంతంలో నివసించే ఎండీ.బియాబానీ (65), కొండపర్తిలో నీరటి అనసూర్య(58), వెల్లంపల్లిలో నూక సాంబయ్య (65) వడదెబ్బతో మృతి చెందారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెద్దపల్లి జిల్లా నాగారానికి చెందిన మల్యాల సత్తమ్మ (78), రొంపికుంటకు చెందిన కొండి లక్ష్మి (75), చిప్ప శ్రీనివాస్ (35), ధూళికట్టకు చెందిన గండ్ర సత్తెమ్మ (65), కొత్తపల్లికి చెందిన పిన్రెడ్డి అశ్విని (33), రాయికల్కు చెందిన గద్దె భూమక్క (75), పోచమ్మవాడకు చెందిన ఎద్దండి రాజవ్వ (85), కాల్వశ్రీరాంపూర్కు చెందిన కనుకయ్య(60), రామగుండం యైటింక్లయిన్కాలనీలో ఆటో డ్రైవర్ ముత్యం అశోక్ (39), గోదావరిఖనిలో కూరెళ్ల సంపత్(50), అశోక్నగర్లో బొజ్జ శంకరయ్య(70) వడదెబ్బతో చనిపోయారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... ఇల్లూరులో కొరివి అచ్చయ్య (90), పైనంపల్లిలో బీమాల వెంకటేశ్వర్లు (43), ఖమ్మం పాత బస్టాండ్లో గురుజాల కొండలు (50), బూర్గంపాడులో నోముల వంశీకృష్ణ (33), సారపాక ప్రధానకూడలి సమీపాన గుర్తు తెలియని వ్యక్తి, పాల్వంచలో కాగితాలు ఏరుకొని జీవించే గుర్తు తెలియని వ్యక్తి (50), అశ్వారావుపేటలో ఎస్.కే.షాహిదా (65), మామిడిగుండాలలో ముక్తి పూర్ణ (35), రుద్రంపూర్లో ఎన్.రజినీకాంత్(36) వడదెబ్బతో కన్నుమూశారు. ⇒ సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో చల్లగొండ లక్ష్మణ్రావు (59), హుస్నాబాద్లో పోశవేని సహదేవ్(64), – నిజామాబాద్ జిల్లా చౌడ్తండాలో ధరావత్ బుజ్జి (42), యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెంకటేశ్ అలియాస్ చిన్న (47),వానరాశి రత్నమ్మ(52), ధర్మోజిగూడెంలో కృష్ణవేణి(60) , సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పుల శివ(40), ఇస్తాళపురంలో ఐలయ్య (66) వడదెబ్బతో మృతి చెందారు, ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. బాదంపల్లిలో దాది నరేశ్ (39), జెండావెంకటాపూర్లో లాటుకూరి కిరణ్(30), కుమురంభీం జిల్లా పారిగాంలో ఎల్కరి అశోక్, జక్కాపూర్లో పిప్రె సాయినాథ్(45), మంచిర్యాల జిల్లా ముత్యంపల్లిలో మందరాజు (49), నిర్మల్ జిల్లా కడెంలో గుర్తుతెలియని వ్యక్తి, జన్నారం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. -
'ఏఐ'.. నా సీటెక్కడోయ్?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్ మారుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థుల ఆలోచన విధానం పరుగులు పెడుతోంది. ర్యాంకు తెలిసిన ప్రతీ విద్యార్థి సీటు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఏఐ టూల్స్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షన్లపై మాక్ కౌన్సెలింగ్కు ఏఐ ఆధారిత నెట్ సైట్లకే లాగిన్ అవుతున్నారు. కన్సల్టెన్సీలు, ఏజెంట్లను ఆశ్రయించడం తగ్గిపోయింది. పైగా కన్సల్టెన్సీలు కూడా ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఏఐ వాడకం పెరిగిన తర్వాత కన్సల్టెన్సీలకు వచ్చే విద్యార్థులు 40 శాతం తగ్గారని ప్రైవేటు కన్సల్టెంట్ సంజయ్ మిత్ర చెప్పారు. ర్యాంకును బట్టి ఏఐ ద్వారా సీటును అంచనా వేయడంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులూ ముందు వరుసలోనే ఉన్నారని తెలిపారు. తాము కూడా ఏఐ ఆధారిత అప్లికేషన్స్ను సమకూర్చుకోవాల్సి వచ్చిందని మరో కన్సల్టెంట్ శైలేష్ పల్లవ్ తెలిపారు. అంచనాల దూకుడులో ఏఐప్రతీ కాలేజీకి సంబంధించి గత కొన్నేళ్ల కటాఫ్ వివరాలు ఇప్పటికే క్లౌడ్ డేటాకు చేరాయి. ఏఐ ఆధారిత కసరత్తు రెండేళ్లుగా జరిగినట్టు ఎడ్యు డేటా సెంటర్కు చెందిన దిలీప్ మల్హోత్రా తెలిపారు. కౌన్సెలింగ్ ప్రిడిక్టర్స్, ర్యాంకు ఆధారిత కాలేజీ అవకాశాలు, బ్రాంచ్ వారీగా విశ్లేషణలు, ఏఐ ఆధారిత రికమండేషన్స్, కొన్నేళ్లుగా కటాఫ్ ఆధార అంచనాలతో కూడిన డేటా.. క్లౌడ్ సెంటర్ల నుంచి వేగంగా తెస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఆధునిక అప్లికేషన్స్ నెట్లో హల్చల్ చేస్తున్నాయని హైదరాబాద్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ వినీత్ వస్లా తెలిపారు. ప్రారంభ, ముగింపు కటాఫ్ వివరాలను అన్ని కాలేజీల స్థాయిల్లో అందించేలా అప్లికేషన్స్ రూపొందించినట్టు చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ర్యాంకు అంచనా కోసం వెతికే సమయం తగ్గిపోయిందన్నారు. ఐదు నుంచి పదేళ్ల కటాఫ్ వివరాలను కొన్ని అప్లికేషన్లు గ్రాఫిక్స్ రూపంలో అందిస్తున్నాయి. కాలేజీల ప్లేస్మెంట్ ట్రెండ్, ఫీజులు తదితర సమాచారం డేటా కేంద్రాల్లో నిక్షిప్తం చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్ల బ్రాంచీల వారీగా డిమాండ్ వివరాలనూ ఏఐ మాడ్యూల్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు పెరిగినట్టు కేరీర్ కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్ పొలంపల్లి తెలిపారు.నెట్లో హల్చల్..కన్వెన్షనల్ ఏఐ కౌన్సెలర్లు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తున్నాయి. ‘నా ర్యాంకు ఇంత... నాకు సీఎస్ఈ సీటు కావాలి.. హైదరాబాద్లో ఏ కాలేజీలో వస్తుంది’ అని ఫీడ్ చేస్తే క్షణాల్లో సమాధానం వస్తుంది. కాలేజీల జాబితా, గత కటాఫ్, ఫీజులు, ప్లేస్మెంట్, ప్రత్యామ్నాయ బ్రాంచీలను ఏఐ సూచిస్తోంది. ఈ తరహా ప్లాట్ఫామ్కు ఏఐ ట్యూటర్, కటాఫ్ ప్రిడిక్షన్, కెరీర్ గైడెన్స్ వంటి ఫీచర్లను కొత్తగా జోడించడం వల్ల ఫలితం వేగంగా వస్తోంది. అంతేకాదు... ఎంచుకునే కోర్సు డిమాండ్ను కూడా ఏఐ విశ్లేషిస్తోంది. కోర్... నాన్ కోర్... ఎమర్జింగ్ కోర్సుల్లో డిమాండ్... ఉద్యోగ అవకాశాలు.. ఐదేళ్లుగా బ్రాంచీకి ఉన్న డిమాండ్, ఉపాధి అవకాశాల వివరాలు అందుతున్నాయి. పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ డ్యాష్ బోర్డులూ చురుకుగా పనిచేస్తున్నాయి. విద్యార్థి ప్రొఫైల్, మాక్టెస్ట్ పనితీరు, ఇష్టమైన నగరాలు, ఫ్యామిలీ బడ్జెట్ వివరాలను ఈ డ్యాష్బోర్డ్ ద్వారా రూపొందిస్తున్నారని, భవిష్యత్లో ఇవి మరింత కీలకం అవుతాయని ఐటీ రంగ నిపుణుడు చరణ్ సంగుపాటి తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, కాలేజీలు కూడా వీటి ఆధారంగానే విద్యార్థులను యాజమాన్య కోటా వైపు మళ్లించే వీలుందని తెలిపారు.ఈసారి సూపర్ ర్యాంక్ 5 వేలే..ఏఐ అంచనాలన్నీ ఈ ఏడాది కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంటుందనే చెబుతున్నాయి. ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల ట్రెండ్ను సూచిస్తున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో సీఎస్ఈ కోర్సులకు ప్రధాన పది కాలేజీల్లో 5 వేల ర్యాంకు కటాఫ్గా ఉండే వీలుందని చెబుతున్నాయి. ఓయూ, జేఎన్టీయూహెచ్ వంటి క్యాంపస్లలో 3 వేల వరకూ కటాఫ్ ఉండే వీలుందని చెబుతున్నాయి. టాప్ కాలేజీలు, యూనివర్సిటీలకు ఇతర జిల్లాల్లో ఉండే కాలేజీల్లో ఎస్సీ కేటగిరీకి 10 నుంచి 16 వేల ర్యాంకు వరకూ సీఎస్ఈ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. కంప్యూటర్ కోర్సుల తర్వాత ఈసీఈ కోర్సుకు రెండో ప్రాధాన్యత కన్పిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. టాప్ కాలేజీల్లో 8 వేల వరకూ, క్యాంపస్ కాలేజీల్లో 5 వేల వరకూ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. -
'ఐటీఐ'నా.. జాబ్ రెడీ
‘నమస్తే సార్..అర్జెంట్గా ఫిట్టర్ కావాలి. నెలకు రూ.20 వేలు ఇస్తాం. సార్ ఎలక్ట్రీషియన్ ఉంటే కాస్త పంపండి..ఐటీఐ పూర్తి చేస్తే చాలు. మెకానిక్ కోసం చూస్తున్నాం సర్.. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం.’ ఇవీ ప్రతిరోజూ ఐటీఐల ప్రిన్సిపాల్స్కు కంపెనీల విన్నపాలు. ఒకప్పుడు చదువు మధ్య లో మానేసినవారు, ఇంటర్ ఫెయిలైన వారు ఐటీఐ చేసేవారు. ఇప్పుడు సీన్ తారుమారైంది. ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) నుంచి సర్టిఫికెట్ అందుకోగానే అభ్యర్థులకు జాబ్ రెడీగా ఉంటోంది. సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారితో పోలిస్తే ఐటీఐ స్టూడెంట్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల అభివృద్ధికి పూనుకోవడం, సామాజిక మాధ్యమాలు, మెరుగైన వేతనంతో ఆఫర్లు వెల్లువెత్తుతుండడం.. వెరసి సాంకేతిక శిక్షణ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడూ ఖాళీలే.. ఐటీఐ అభ్యర్థుల కోసం ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. వైజాగ్, వరంగల్, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఢిల్లీలోనూ ఉద్యోగ అవకాశాలు రెడీగా ఉంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2,000 మంది ఐటీఐ అభ్యర్థుల కోసం జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. 2026 ఆగస్టులో 18,000 మంది తమ కోర్సు పూర్తి చేసుకోనున్నారు. వీరిలో ఇప్పటికే సుమారు 5,000 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా పలు కంపెనీలకు ఎంపిక కావడం విశేషం. అంతర్జాతీయంగా రూ.లక్షల్లో వేతనాలు.. ఐటీఐ అభ్యర్థులకు అంతర్జాతీయంగా అధిక వేతనంతో ఉద్యోగ ఆఫర్లు పెరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు తెలంగాణ ఓవరీŠస్స్ మ్యాన్పవర్ కంపెనీ (టామ్కామ్) పూర్తి సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్, యూరప్, జీసీసీ దేశాలు, ఆస్ట్రేలియాలో కనీస ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే చాలు. ట్రేడ్ను బట్టి నెల వేతనం జర్మనీలో రూ.2.7 లక్షలు, యూరప్ దేశాల్లో రూ.1.7 లక్షలు, జీసీసీ దేశాల్లో రూ.1.30 లక్షలు ఉంది. నిర్మాణ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ఇజ్రాయెల్ నెలకు రూ.2.5 లక్షల వేతనం ఆఫర్ చేస్తోంది. తెలంగాణ కార్మిక శాఖ ఈ ఏడాది నుంచే ఎంపిక చేసిన ఐటీఐలలో జర్మన్ భాషను ప్రవేశపెడుతోంది. క్రమంగా ఫ్రెంచ్, జపనీస్తోపాటు ఇతర భాషలను పరిచయం చేయనున్నారు. అమ్మాయిలు అతి తక్కువ ఐటీఐ వైపు చూస్తున్న అమ్మాయిల సంఖ్య 1–2 శాతం మించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఫాక్స్కాన్ కేవలం మహిళలనే నియమించుకుంటోంది. ఏటా ఈ కంపెనీ 1,000 మందికి జాబ్స్ ఇస్తోంది. కొత్త ఉత్పత్తుల తయారీ తోడైతే ఈ సంఖ్య 5,000 దాటుతుందని అంచనా. ఏటా ఐటీసీ 1,000 మంది, ష్నైడర్ ఎలక్ట్రిక్ 500 మంది మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఐటీఐ పూర్తి చేస్తే మెరుగైన వేతనం ఉంటుందన్నది అధికారుల మాట. – టాటా సహకారంతో 65 ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. మరో 54 కేంద్రాలు ఒకట్రెండేళ్లలో ఏటీసీలుగా మారనున్నాయి. – ప్రస్తుతం 32 రకాల ట్రేడ్స్ ఉన్నాయి. ఏఐ, సోలార్, రోబోటిక్స్, ఏరో నాటికల్, సెమీ కండక్టర్ వంటి 10 ట్రేడ్స్ కొత్తగా రానున్నాయి. ఉపకార వేతనంతో.. మరింత మందిని ఐటీఐల వైపు ఆకర్శించేందుకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం ఇవ్వనున్నాం. తద్వారా అయినా అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. జపాన్లో కేర్ గివర్స్ జాబ్స్కు మంచి డిమాండ్ ఉంది. ఇక పారిశ్రామికవర్గాలతో చర్చించి మార్కెట్ డిమాండ్ను బట్టి కొత్త కోర్సులను డిజైన్ చేస్తున్నాం. నైపుణ్యం ఉంటే లక్షల రూపాయల వేతనంతో విదేశీ అవకాశాలనూ విద్యార్థులు చేజిక్కించుకోవచ్చు. – ఏ.కాంతి వెస్లీ, డైరెక్టర్, ఉపాధి, శిక్షణ శాఖ. సరఫరా చేయలేం మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా మానవ వనరులను సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అభ్యర్థుల కోసం ఈ కంపెనీలన్నీ ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శిక్షణలో ఉన్న 18,000 మందికి ప్లేస్మెంట్ ఖాయం. బహుశా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఇన్ని అవకాశాలు లేవు. వయో పరిమితి లేకపోవడం, జాతీయ స్థాయి సర్టిఫికెట్ కావడంతో డిగ్రీలున్నవారూ ఐటీఐల్లో చేరుతున్నారు. – కె.శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్, ఐటీఐ, హకీంపేట. -
జీరో కమిషన్, స్థిరమైన చార్జీలు.. భాగ్యనగరంలోకి ‘భారత్ ట్యాక్సీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో యాప్ ఆధారిత క్యాబ్/ఆటో సర్వీసు రంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొట్టమొదటి సహకార రవాణా వ్యవస్థ ‘భారత్ ట్యాక్సీ’త్వరలో హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలు ఈ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా వీటిల్లో లక్షలాది మంది డ్రైవర్లు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మారిన ఆయా సంస్థల విధానాలతో విసిగిపోయిన డ్రైవర్లు, భారత్ ట్యాక్సీ సేవలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని తాజాగా సంస్థ నిర్వాహకులను కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదారు నెలల్లో హైదరాబాద్లో సేవలు ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగుతున్నాయి. భారత్ ట్యాక్సీకి అధికారికంగా స్వాగతం పలికేందుకు డ్రైవర్ల సంఘం వేదికను సిద్ధం చేస్తోంది. డ్రైవర్లలో అసంతృప్తి హైదరాబాద్లో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. యాప్ ద్వారా బుకింగ్ సులభంగా ఉండటం, బుక్ చేసిన కొద్ది నిమిషాలకే ట్యాక్సీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.40 లక్షల క్యాబులుండగా, లక్ష వరకు ఈ యాప్ ఆధారిత అగ్రిగేటర్లతో భాగస్వామ్యమయ్యాయి. దాదాపు లక్షన్నర ఆటోల్లో 90 వేలు వీటితో అనుసంధానమయ్యాయి. దీన్ని ఆసరా చేసుకుని నిర్వాహక సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవటంతో చార్జీల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పీక్ అవర్ అని, వర్షం కురుస్తుండటంతో క్యాబ్ల కొరత ఉందని, ట్రాఫిక్ జామ్ ఉందని, డ్రైవర్ రావటానికి నిరాకరిస్తున్నాడని... రకరకాల సాకులుతో అప్పటికప్పుడు చార్జీ పెంచేస్తున్నాయి. డ్రైవర్ల నుంచి కమీషన్ కింద ఏకంగా 40 శాతం వరకు తీసేసుకుంటున్నాయి. నగర ట్రాఫిక్లో, అననుకూల వాతావరణంలో కష్టపడుతూ వాహనం నడిపే డ్రైవర్లకు 60 శాతమే దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలపై క్యాబ్ డ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ సమయంలో భారత్ ట్యాక్సీ రానుండటం డ్రైవర్లతో పాటు నగర ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. కేంద్ర గృహ నిర్మాణ, సహకార శాఖల ఆధ్వర్యంలో భారత్ ట్యాక్సీ వ్యవస్థ రూపుదిద్దుకుంది. సహకార స్పూర్తితో ‘సారథి హీ మాలిక్ (నడిపేవాడే యజమాని)‘నినాదంతో ఇది ఏర్పాటైంది. ’సహకార్ సే సమృద్ధి’(సహకారం ద్వారా సంపద) అన్న ట్యాగ్లైన్తో ఆరునెలల క్రితం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఈ వ్యవస్థ రిజిస్టర్ అయింది. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ , క్రిబ్కో తదితర సహకార సంస్థల భాగస్వామ్యంతో ’సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’దీనిని రూపొందించింది. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించి గత ఫిబ్రవరిలో ఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. తొలుత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్లతో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్, సోమనాథ్, ద్వారకలలో ప్రారంభించారు. ప్రస్తుతం రెండున్నర లక్షల మందికి పైగా డ్రైవర్లు సభ్యులుగా చేరారు. త్వరలో హైదరాబాద్తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్కతాలలో ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత ముంబైలో ప్రారంభం కానుండగా..హైదరాబాద్కు చెందిన డ్రైవర్లు ఇక్కడ కూడా త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తెస్తుండటం విశేషం. ఎదురుచూపులు ఎందుకంటే.. – భారత్ టాక్సీ ’జీరో కమీషన్’విధానంలో నడుస్తుంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్ బ్యాంక్ ఖాతాకే వెళ్తుంది. సంస్థ నిర్వహణ కోసం కేవలం రోజువారీ లేదా నెలవారీ స్వల్ప సభ్యత్వ రుసుము మాత్రమే డ్రైవర్లు చెల్లించాల్సి ఉంటుంది. – ట్రాఫిక్ రద్దీ, పండగలు, క్యాబ్ల కొరత, వర్షం, పీక్ అవర్స్... ఇలా కారణాలు చెప్తూ అధిక మొత్తం చార్జీ వసూలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన, పారదర్శక చార్జీలు మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ సంస్థల చార్జీలతో పోలిస్తే 30 – 50 శాతం తక్కువగా ఉండనున్నాయి. – ప్రతి డ్రైవర్కు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా ఉంటుంది. రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. – మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లతో కూడిన ట్యాక్సీ, బైక్ సర్వీసులను ప్రవేశపెట్టారు. మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయటంతో... రాష్ట్రంలో సొంతంగా టాక్సీ/ఆటో యాప్ను అభివృద్ధి చేయనున్నట్టు రెండున్నరేళ్ల క్రితం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసింది. ప్రైవేటు అగ్రిగేటర్ల ఒత్తిడికి తలొగ్గి సొంత యాప్ హామీని గాలికొదిలేసిందని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సొంత యాప్ సంగతి పక్కనపెడితే, కనీసం క్యాబ్ ధరల నియంత్రించలేని దుస్థితి ఉంది. ఇలావుండగా..గత వారం రోజుల్లో రెండు పర్యాయాలు డీజిల్, పెట్రోలు ధరలు పెంచటంతో తమ చార్జీలు కూడా పెంచాలని క్యాబ్/ఆడో డ్రైవర్లు అగ్రిగేటర్లను కోరుతున్నారు. అయితే మూడు అగ్రిగేట్ సంస్థలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నందున చార్జీల పెంపునకు అంగీకరించడం లేదు. దేని చార్జీ తక్కువుంటే ప్రయాణికులు అటువైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
నారాయణఖేడ్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ హత్య ఉదంతం తొమ్మిది రోజుల అనంతరం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మనూరు మండల కేంద్రానికి చెందిన కల్పనకు నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చంబనోళ్ల ముత్యంరెడ్డి (36)తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్లలోపు కూతురు, కుమారు డు ఉన్నాడు.మృతుడు ముత్యంరెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో మోటారు వైండింగ్ మెకానిక్గా పనిచేస్తున్నా డు. కల్పన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసి ఈ మధ్య కాలంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా చేరింది. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి ముత్యంరెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని కుటుంబీకులతో కలిసి కల్పన నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో ఈ నెల 18న ఫిర్యాదు చేసింది.పోలీసులు ముత్యంరెడ్డి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కేసును సవాల్గా తీసుకున్నారు. భార్య కల్పన ఫోన్ కాల్స్పై నిఘాపెట్టగా 16న తన ప్రియుడైన మనూరు మండలం ఎల్గోయికి చెందిన గైని పండరి అలియాస్ చింటుతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా ముత్యంరెడ్డిని హత్యచేసి ఎల్గోయిలోని పండరి చేనులో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు నేరం అంగీకరించారు. పోలీసులు ఆదివారం గోతిలోంచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏంటి 'సర్'.. ఇంత 'స్లో'..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)కు ముందు చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్ (ప్రీ సర్) ప్రక్రియ నగర ప్రాంతాల్లో ఆశించిన వేగంతో సాగడం లేదు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో తక్కువ శాతం మ్యాపింగ్ ఎన్నికల యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 42.82 శాతం మ్యాపింగ్ మాత్రమే జరగడం గమనార్హం. అయితే జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ గణనీయంగా ముందంజలో ఉంది. ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్రంలోని 3.39 కోట్ల మంది ఓటర్లలో 2.23 కోట్ల మందిని (65.95 శాతం) మాత్రమే 2002 ‘సర్’జాబితాలతో మ్యాపింగ్ చేయగలిగారు. ఇంకా 1.15 కోట్లకు పైగా ఓటర్లు మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఇందులో అర్బన్ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ముషీరాబాద్లో అత్యల్పం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.10 లక్షల మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు సుమారు 20.17 లక్షల మందిని మాత్రమే మ్యాప్ చేయగలిగారు. ఇంకా దాదాపు 26.92 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సి ఉంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో.. ముషీరాబాద్ (34.33 శాతం), నాంపల్లి (37.59 శాతం), జూబ్లీహిల్స్ (38.09 శాతం), సనత్నగర్ (39.80 శాతం), సికింద్రాబాద్ (40.12 శాతం)లో అత్యల్పంగా మ్యాపింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లో వలస జనాభా ఎక్కువగా ఉండటం, తరచూ చిరునామాలు మారడం, అద్దె ఇళ్లలో నివసించే వారు ఎక్కువగా ఉండటం, పాత కుటుంబ వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు మ్యాపింగ్కు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల విషయానికొస్తే..మలక్పేటలో 41.92 శాతం, అంబర్పేట్లో 41.40, ఖైరతాబాద్లో 46.30, కార్వాన్లో 50.64, గోషామహల్లో 42.45, చార్మినార్లో 47.68, చాంద్రాయణగుట్టలో 42.39, యాకుత్పురాలో 45.22, బహదూర్పురాలో 51.65, కంటోన్మెంట్లో 42.38 శాతం మ్యాపింగ్ జరిగింది. పాతబస్తీ పరిధిలోని బహదూర్పురా, కార్వాన్లలో అత్యధికంగా జరగడం విశేషం. మేడ్చల్లో మరీ దారుణం క్యూర్ పరిధిలో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ మ్యాపింగ్ కేవలం 35.85 శాతం మాత్రమే నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 51.59 శాతం మ్యాపింగ్ నమోదైనా, రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది కూడా చాలా తక్కువే. ఐటీ ఉద్యోగులు, వలస జనాభా, కొత్తగా ఏర్పడిన కాలనీలు, అపార్ట్మెంట్ సంస్కృతి పెరగడం వల్ల కుటుంబ వారసత్వ ఓటరు వివరాలను గుర్తించడం కష్టమవుతోందని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. గ్రామీణ జిల్లాలు ముందంజలో.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉండగా, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలున్న జిల్లాల్లో మాత్రం మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ జిల్లా 91.07 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. మహబూబాబాద్ లో 90.83%, యాదాద్రి–భువనగిరిలో 86.32% మ్యాపింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల స్థిర నివాసం, తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసించడం, కుటుంబ సభ్యుల వివరాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల మ్యాపింగ్ సులభతరమయ్యింది. కుమురంభీమ్ ఆసిఫాబాద్లో దాదాపు 78 శాతం, మంచిర్యాల 71, ఆదిలాబాద్ 70, నిర్మల్ 78, నిజామాబాద్ 80, కామారెడ్డి 78, జగిత్యాల 76, పెద్దపల్లి 76, కరీంనగర్ 75, రాజన్న సిరిసిల్ల 77, సంగారెడ్డి 61, మెదక్ 82, సిద్దిపేట 85, రంగారెడ్డి 51, వికారాబాద్ 74, మేడ్చల్ మల్కాజిగిరి దాదాపు 36, హైదరాబాద్ 42, మహబూబ్నగర్ 74, నాగర్కర్నూల్ 75, వనపర్తి 80, జోగుళాంబ గద్వాల 77, నల్లగొండ 80, సూర్యాపేట 76, వరంగల్ 71, హనుమకొండ 69, జయశంకర్ భూపాలపల్లి 72, భద్రాద్రి 77, ఖమ్మం 70, ములుగు 81, నారాయణపేటలో 83 శాతం మ్యాపింగ్ జరిగింది. జూన్ 25 నుంచి ఇంటింటి ధ్రువీకరణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ¯25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియకు కీలకమైన ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అంటే బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి ముందుగానే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు సంప్రదించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఓటర్లు స్వయంగా కూడా ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫామ్స్ సమర్పించవచ్చు. నగరాల్లో సవాలే.. ఈ ప్రీ సర్ లేదా మ్యాపింగ్ ప్రక్రియ నగర ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండటం ఎన్నికల సంఘానికి సవాల్గా మారుతోంది. జూన్ 25 నుంచి కేవలం నెలరోజుల వ్యవధిలో జరిగే ఈ ప్రక్రియలో ఇంకా భారీ స్థాయిలో ధ్రువీకరణ జరగాల్సి ఉండటంతో, నగరాల్లో అదనపు సిబ్బంది, సాంకేతిక సహకారం అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్లో మ్యాపింగ్ ఐదారు నెలలుగా కొనసాగుతోంది. అయినా అంతంత మాత్రంగానే మ్యాపింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నెల రోజుల్లో కీలక సర్వే ఎలా చేయగలుగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాపింగ్ అంటే ఏమిటి? ప్రతి ఓటరును 2002 ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాతో అనుసంధానం (లింకింగ్) చేయాల్సి ఉంది. ఓటరు సొంత నమోదు లేదా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతల వివరాల ఆధారంగా ఈ లింకింగ్ జరుగుతుంది. ఈ కుటుంబ లింకింగ్ విజయవంతంగా పూర్తైతే అదనంగా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. లింక్ కాని ఓటర్లకు తర్వాతి దశలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట పత్రాలు సమర్పించాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. -
క్యూర్లో వాటర్ పూర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా పరిగణించే కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో భూగర్భ జలాలు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాలు భారీ భవనాలు, సీసీ రోడ్లతో పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా తయారు కావడం.. చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో చుక్క వర్షపు నీరు సైతం ఇంకడానికి జానెడు నేల మిగలలేదు. దీనికితోడు రాతి పొరలతో నిండిన దక్కన్ పీఠభూమి కావడంతో వర్షపు నీరు ఇంకడానికి అవకాశమూ లేదు. దీంతో హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాల రీచార్జ్ పరిమాణంతో పోల్చితే వాటి వినియోగం మించిపోయింది. ⇒ హైదరాబాద్ జిల్లాలోనే అత్యంత దుర్భర పరిస్థితిలో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 16 మండలాలుండగా, 8 మండలాల్లో (50 శాతం) విచ్చలవిడి (ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్)గా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. అంటే, ఒక ఏడాది రీచార్జ్ అయిన భూగర్భ జలాలతో పోల్చితే ఎక్కువ భూగర్భ జలాలను హైదరాబాద్ జిల్లాలో తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్పేట్, గోల్కొండ, ఆసిఫ్నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట్, హిమాయత్నగర్ మండలాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. మరో 7 మండలాల్లో (43.75%) క్రిటికల్ స్థాయిలో భూగర్భ జలాలు వాడుతుండగా, వీటిలో మారేడ్పల్లి, బండ్లగూడ, బహదూర్çపుర, ముషీరాబాద్, నాంపల్లి, షేక్పేట్, సికింద్రాబాద్ మండలాలున్నాయి. ఒక్క తిరుమలగిరి మండలం (6.25 శాతం)లో సెమీ క్రిటికల్ స్థాయిల్లో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని ఒక్క మండల పరిధిలో కూడా భూగర్భ జలాలు సురక్షితంగా లేవు. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలమండలి రూపొందించిన భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025లో ఈ అంశాలను వెల్లడించింది. ⇒ మేడ్చల్–మల్కాజ్గిరిలోని 15 మండలాల్లో 4 మండలాలు (26.67 శాతం) భూగర్భ జలాలను ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ చేస్తున్నాయి. వీటిలో బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాలున్నాయి. జిల్లాలోని మరో 3 మండలాల్లో (20 శాతం) క్రిటికల్ స్థాయిలో భూగర్భ జలాల వాడకం ఉంది. వీటిలో మూడుచింతలపల్లి, కీసర, బాచుపల్లి ఉన్నాయి. అల్వాల్, మేడ్చల్, ఘట్కేసర్ మండలాల్లో (20 శాతం) సెమీ క్రిటికల్ స్థాయిలో వాడకం ఉంది. జిల్లాలోని మిగిలిన 5 మండలాల్లో (33.33 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాల వాడకం ఉంది. ⇒ రంగారెడ్డిలో 27 మండలాలుండగా, 4 మండలాలైన చౌదరిగూడ, హయాత్నగర్, శేరిలింగంపల్లి, సరూర్నగర్(14.81 శాతం)లో భూగర్భ జలాలను ఓవర్ ఎక్స్ప్లయిటెడ్ చేస్తున్నారు. మరో 9 మండలాలైన ఆమనగల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొందుర్గు, తలకొండపల్లి, కొత్తూరు, మొయినాబాద్, కందుకూరు, రాజేంద్రనగర్ (33.33 శాతం)లో సెమీ క్రిటికల్ స్థాయిలో వినియోగం ఉంది. ఈ జిల్లాల్లోని మిగిలిన 14 మండలాల్లో (51.85 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాలను వాడుతున్నారు. ⇒ ప్యూర్, రేర్ రీజియన్ల పరిధిలోని ఇక ఇతర జిల్లాలు పరిశీలిస్తే ఆదిలాబాద్ అర్బన్, ఖమ్మంలోని రఘునాథపాలెం, నల్లగొండలోని మునుగోడు, నిజామాబాద్ దక్షిణ, సంగారెడ్డిలోని పటాన్చెరు, యాదాద్రి భువనగిరిలోని ఆత్మకూరు–ఎం, నారాయణపూర్ మండలాల్లో భూగర్భ జలాల ఓవర్ ఎక్సప్లయిటేషన్ జరుగుతోంది. 774 టీఎంసీల జలాలు రీచార్జ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలతో 259.2 టీఎంసీలు, ఇతర వనరులతో 382.81 టీఎంసీలు, వర్షాకాలం తర్వాత వర్షాలతో 32.48 టీఎంసీలు, ఇతర వనరులతో 233.07 టీఎంసీలు కలిపి మొత్తం 774.45 టీఎంసీల భూగర్భ జలాలు వృద్ధి అయ్యాయి. అందులో సహజ కారణాలతో 73.8 టీఎంసీలు వృథాగా ప్రవహించగా, మిగిలిన 700.64 టీఎంసీలు వాడుకోవడానికి లభ్యతలోకి ఉన్నాయి. ఇక సాగునీటికి 292.4 టీఎంసీలు, పరిశ్రమలు 14.12 టీఎంసీలు, గృహాలు 20.83 టీఎంసీలు కలిపి మొత్తం 327.01 టీఎంసీల (46.69 శాతం)ను 2025లో రాష్ట్రం వాడుకుంది. భవిష్యత్ అవసరాలకు 376.8 టీఎంసీల భూగర్భజలాల నిల్వలు మిగిలాయి. 2024తో పోలి్చతే 2025లో భూగర్భ జలాల రిచార్జ్ 720.41 టీఎంసీల నుంచి 774.45 టీఎంసీలకు పెరిగింది. 76 మండలాల్లో సురక్షితమే.. రాష్ట్రంలోని 620 మండలాల్లో భూగర్భ జలాల రీచార్జ్ వినియోగంపై మదింపు జరపగా, 23 మండలాల్లో (3.71 శాతం) ఓవర్ ఎక్స్ప్లయిటేషన్, 19 మండలాల్లో(3.06%) క్రిటికల్, 105 మండలాల్లో (16.94శాతం) సెమీ క్రిటికల్, 473 మండలాల్లో (76.29 శాతం) సురక్షితంగా భూగర్భ జలాలున్నట్టు నిర్థారించారు. స్థానికంగా భూగర్భ జలాల రీచార్జ్తో పోల్చితే వినియోగ స్థాయి ఆధారంగా ఓవర్ ఎక్స్ప్లయిటేషన్, క్రిటికల్, సెమీ క్రిటికల్, సేఫ్ అనే నాలుగు కేటగిరీలుగా ప్రాంతాలను కేంద్ర భూగర్భ జలమండలి విభజించింది. ఆ వివరాలను పట్టికలో చూడొచ్చు.. -
తాలు, తరుగు పేరుతో కోతలు వేస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: తాలు, తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తే మిల్లర్లు, కొనుగోలు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఆదివారం హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్విప్ ఆది శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.వివిధ ప్రాంతాల నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రూ.8,749 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.రబీ సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేస్తోందని, మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. -
మక్కల కొనుగోళ్లకు మాది ‘గ్యారంటీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కెట్కు తరలివస్తున్న మక్కల కొనుగోళ్లకు అవసరమైన రుణాలు సమకూర్చుకునేందుకు మార్క్ఫెడ్కు రూ.1867.77 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ మక్కల కొనుగోళ్లకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మార్క్ఫెడ్కు ఇప్పటికే ప్రభుత్వం రూ.4,172.94 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. దీంతో మక్కల కొనుగోళ్ల కోసం మార్క్ఫెడ్కు రూ.6,040.71 కోట్ల రుణాలు పొందేందుకు ప్రభుత్వం సహకారం అందించినట్టయ్యింది.మక్కలకు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,400 ఉండగా, మార్కెట్లో రూ.1,700 నుంచి రూ.1,850 గిట్టుబాటు ధర పలుకుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర కింద రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు 354 కొనుగోలు కేంద్రాల (పీఏసీఎస్లు) ద్వారా 2.33 లక్షల రైతుల నుంచి 12.85 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మక్కల విలువ రూ. 3,100 కోట్ల వరకు ఉంటుంది. అయితే మార్కెట్కు భారీ ఎత్తున మక్కలు వస్తుండడంతో సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మార్క్ఫెడ్కు అదనపు రుణం పొందేందుకు అవసరమైన బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం సమకూర్చింది. కేంద్రం సహకరించకపోయినా రైతులకు అండగా : మంత్రి తుమ్మలరాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లపై ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో మొక్కజొన్న కొనుగోళ్లకు మొత్తం రూ.5,063 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.6,000 కోట్ల మేర వ్యయం చేస్తోందని తుమ్మల స్పష్టం చేశారు.జొన్నల కొనుగోళ్లకు రూ.1,100 కోట్లుజొన్న (హైబ్రిడ్) కొనుగోళ్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో జొన్న ధర క్వింటాల్కు సుమారు రూ.2,000 మాత్రమే ఉండగా, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.3,699గా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లకు పైగా వ్యయంతో జొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఆదిలాబాద్ జిల్లాలో 26 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 10 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 43 కేంద్రాలు, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జోగుళాంబ గద్వాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.పొద్దు తిరుగుడు 25 % కొనుగోళ్ల పరిమితి తొలగింపు పొద్దుతిరుగుడు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోలు పరిమితి మాత్రమే అనుమతించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాల్కు రూ.7,721 ఉండగా, మార్కెట్ ధర రూ.5,376 మాత్రమే ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతోపాటు రాష్ట్ర పూల్ ద్వారా అదనంగా 10,175 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. -
లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్తో సహా నలుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా, శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అడ్వకేట్ హత్యలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోకాపేటలో కళ్లు చెదిరే భవనం.. సౌత్ఇండియాకే ‘టాప్’
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్హౌస్లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది. -
కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్ఎస్లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్ఎస్లో పని చేసేవారికే గుర్తింపు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు. -
మరో మూడు రోజులు తీవ్ర వడగాలులు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణంక కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... దీనికితోడు పడగాలులతో ప్రజలు అక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల 26 వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచి ర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, అయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల్లో త్రీవ వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెరిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజె అలర్ట్ జారీ చేసింది.రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల మేర ఉంటాయని వివరించింది. శని వారం రాష్ట్రంలో అత్యవరంగా ధర్మపురి మండలం బుద్ధిశిపల్లిలో 48.3 డిగ్రీల సెల్సియస్ ఇష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రం. లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు చురుకుగా నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు శీలిస్తే గరిష్ఠ ఉష్ణోగ్రత అమ్మంలో 44.8 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలోకి విస్తరించమన్నాయి. ఈనెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్ర వాహత ఆవర్తనం శనివారం జార్ఖండ్ ఉత్తర రత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అది, సోమవారాల్లో రాష్ట్రంలోని తూర్పు ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్గాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కొన్ని కులాల పేర్లు ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కులాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.బీసీ కులాల్లో గ్రూప్–ఏ లోని వరుస సంఖ్య 4లో ఉన్న బుడబుక్కల కులాన్ని శివ క్షత్రియగా మార్పు చేశారు. ఇదే కేటగిరీలోని వన్నార్ను తొలగించి ధోబీగా మార్పు చేసి రజక, చాకలి, ధోబీగా.. ఏదైనా ఒక పేరును వాడుకలోకి తీసుకోవచ్చన్నారు. వరుస సంఖ్య 7లోని దొమ్మర అనే పదాన్ని తొలగించి గడ వంశీయగా మార్పు చేశారు.వరుస సంఖ్య 18లో ఉన్న పిచ్చకుంట్ల పేరును వంశరాజ్గా మార్పు చేశారు. వరుస సంఖ్య 23లో ఉన్న వీరభద్రియను వీరముష్టి, నెట్టి కోటల, వీరభద్రియగా మార్చారు. గ్రూప్ డీ, వరుస సంఖ్య 5లో ఉన్న మేర కులం పేరును మేరుగా మార్పు చేశారు. వరుస సంఖ్య 29లో ఉన్న శూద్ర కులం పేరును తొలగించి తమ్మలిగా మార్చారు. -
శంషాబాద్.. విమానానికి బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వస్తున్న ఓ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్టు ఆదివారం ఉదయం అధికారులకు మొయిల్ వచ్చింది. విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలోపే ఏ క్షణమైనా పేలుడు సంభవించే అవకాశం ఉందంటూ ఆ ఆగంతకుడు మెయిల్లో పేర్కొన్నాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అందులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.అనంతరం బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ బాంబు బెదిరింపు మెయిల్పై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొ.నాగేశ్వర్
ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల మీద కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నాగేశ్వర్పై జనసేన నేతల ప్రోద్బలంతో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి1985–89 కాలంలో బడ్జెట్కు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకు పొక్కాయి. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ మొత్తం కేబినెట్ను రద్దు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్ను జనసేన నేతలు ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన గుర్తించి చర్య తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం కేబినెట్నే రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వ సమర్ధకుడు అయిన ఒక మీడియా సంస్థ అధినేత వారం వారం తాను రాసే కాలమ్లో ప్రగతి భవన్లో జరిగినట్టుగా కొన్ని వార్తా కథనాలు ప్రచురిస్తే.. అసత్యాలు రాస్తున్నారంటూ ఆ పత్రికాధినేతను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ‘సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి. ఆ సోర్సెస్ ద్వారా సమాచారం సేకరించి వార్తలు రాయాలని మా గురువులు చెప్పారు. సోర్స్ చెప్పింది ఆక్షేపించడానికి వీల్లేదు’అంటూ ఆ పత్రికాధినేత సమాధానం ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వం మరిచిపోకూడదు. –దేవులపల్లి అమర్, సభ్యుడు, స్టీరింగ్ కమిటీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ఇతరులకు ఏం పని?విశ్లేషకుడిగా నాగేశ్వర్కు మంచి గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ కూడా. ఆయన వ్యాఖ్యలు నచ్చకపోతే పవన్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఖండించాలి. స్పందించడానికి ఇతరులకు ఏం పని. ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు. నాగేశ్వర్ కుటుంబం లేదా ఆయన అభిమానులు కోర్టును ఆశ్రయించాలని నా సూచన. –కె.రామచంద్ర మూర్తి, సీనియర్ పాత్రికేయులుఆ 35 వేల మంది సంగతేంటి?దశాబ్దాలుగా మంచి విశ్లేషకుడిగా ప్రొ.నాగేశ్వర్కు పేరుంది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించినా కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో దుర్భాషలాడటం దుర్మార్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. జగన్ హయాంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు పవన్ ఇప్పటివరకు ఆధారాలను చూపలేదు. కానీ నాగేశ్వర్ చేసిన ఒక కామెంట్ మీద పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే కేసుల పేరుతో ఆయనను ఇబ్బంది పెట్టడానికే అని అర్థం అవుతోంది. –వర్దెళ్లి మురళి, సీనియర్ సంపాదకులుఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. తన దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచారు. జర్నలిస్టులు వారికున్న సోర్స్ ఆధారంగా వచ్చిన సమాచారాన్ని ప్రస్తావిస్తారు. దీనిపట్ల అభ్యంతరం ఉంటే ఖండించాలి. అంతేగానీ వ్యక్తిగత దాడి తగదు. ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారు. వారికి నచ్చినట్లుగానే వార్తలు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరుల వ్యాఖ్యలు ప్రచురించినా కూడా జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనజాలదు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలి. –ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షి నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలినాగేశ్వర్ మంచి విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్. ఏ అంశమైనా విశ్లేíÙంచి మాట్లాడతారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఆయనపై కేసులు పెట్టడం తగదు. పలుచోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయంటే ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టినట్టు అర్థం అవుతోంది. ఇది సరైనది కాదు. మా అసోసియేషన్ ఇటువంటి చర్యలను సహించదు. ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలి. కేసు పెట్టి నోరు మూయించాలని అనుకోవడం సరికాదు. –విరాహత్ అలీ, ప్రెసిడెంట్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్కేసులు ఎత్తి వేయాలితాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొ.నాగేశ్వర్ ప్రకటించారు. అందువల్ల ఆయనపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. ప్రభుత్వాలు, పారీ్టలు ఏవైనా మీడియాలో వచ్చిన ఆరోపణలు, భిన్నాభిప్రాయాలపై ఖండనలు, సమాధానాలు చేయొచ్చు. కానీ కేసులు, అరెస్టులు సరికాదు. ఏపీ ప్రభుత్వం నాగేశ్వర్పై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలే గానీ అరెస్టుల వంటి కఠిన చర్యలు అవాంఛనీయం. –తెలకపల్లి రవి, ప్రముఖ విశ్లేషకులుపోలీస్ స్టేషన్లు చాలవునాగేశ్వర్ వ్యాఖ్యలు తప్పు అని అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. నాగేశ్వర్ అంటే గౌరవం అంటూనే కేసులు పెట్టారు. ఖండించడం, సరిదిద్దుకోవాలని చెప్పడం ప్రజాస్వామ్యం. కేసులు పెట్టడం కొత్త సంప్రదాయం. భావప్రకటనకు భిన్నమైంది. కొమ్మినేని శ్రీనివాస్ మీద మరోసారి కేసు పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం కేసులు పెడుతున్నారు. డిజిటల్ మీడియా యుగంలో కేసులు పెట్టుకుంటూపోతే పోలీస్ స్టేషన్లు చాలవు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే కేసులు విత్డ్రా చేసుకోవాలి. –అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు -
ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికెలో ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు ఫిర్యాదుల నమోదులో తలెత్తే భాషా సమస్యలను దూరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ–కాప్రైటర్ పేరుతో ఉన్న ఈ యాప్ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఆవిష్కరించారు. తక్షణమే రికార్డు చేసి అనువదిస్తూ... బాధితులు మాతృభాషలో చెప్పే ఫిర్యాదుల్లోని అంశాలను ఏఐ–కాప్రైటర్ తక్షణమే రికార్డు చేసి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులకు ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే భాషా సమస్యలను ఈ యాప్ తొలగిస్తుంది. బాధితుల భాష అర్థం కాకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదు కావడానికి ఈ యాప్ స్వస్తి పలకనుంది. తొలిదశలో 10కిపైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించేలా ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతోపాటు పాగ్రో చందు అనే ఇంటర్న్ సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించారు. యాప్లోని ప్రధాన అంశాలు బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో ఫిర్యాదు చేస్తే ఈ యాప్ వెంటనే పోలీసులకు అర్థమయ్యే భాషలోకి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. వేగం–కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు నమోదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. మల్టీ–పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది. శిక్షలు కూడా పెరుగుతాయి హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావడంతో తెలుగు, ఆంగ్లం, హిందీ రాని వాళ్లూ కూడా వలస వచ్చి స్థిరపడుతున్నారు. భాష తెలియకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఈ యాప్ చెక్ పెడుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మీకులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
ఎండలకు 40 మంది మృత్యువాత
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 40 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే శుక్రవారం రాత్రి, శనివారం వడదెబ్బతో 22 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది మృతిచెందారు. మహబూబాబాద్లోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలోని చింతచెట్టుపై ఉన్న వందలాది గబ్బిలాలు ఎండ త్రీవ్రతతో మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యలపెద్దరాములు(75), బంగారుగూడెం తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్ తండాకు చెందిన బానోత్ కమ్లి(65), డోర్నకల్ యాదవనగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ జానీమియా(43), గూడూరు మండల కేంద్రానికి చెందిన పెసరి వీరమల్లు (70) చనిపోయారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బండ చిన్నమల్లయ్య(90), కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), ఇదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శాంతమ్మ(90), ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పొడేటి లచ్చమ్మ (82), పరకాల శ్రీనివాసకాలనీకి చెందిన టైలర్ వెల్దండి వెంకటేశ్వర్లు(48) చనిపోయారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన రోజువారీ కూలీ పెద్దమ్మ కుమారస్వామి (60), వరంగల్ 41వ డివిజన్ విశ్వనాథ కాలనీకి చెందిన నాయీబ్రహ్మణుడు సింగారపు కుమారస్వామి (45), రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్యలక్ష్మి(60), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చిన్నపాక యాకయ్య(50) మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దుర్గం అంకయ్య(65), కాటారం రేగులగూడెం జీపీ పరిధిలో భూయాన్ వినోద్(35), కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చిన గుర్తు తెలియని భక్తుడు(50) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని ఇప్పగూడేనికి చెందిన హమాలీ కార్మికుడు గొడిశాల పరశురాములు(55), జనగామ అంబేడ్కర్ నగర్కు చెందిన యాచకురాలు జ్యోతి(58), ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రునిపేటకు చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి(78) వడదెబ్బతో మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), సుల్తానాబాద్ పట్టణం సుభాష్నగర్కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్ నగర్కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మీకురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన మంచాల నరసయ్య(75), మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన రామగిరి పుల్లమ్మ(78), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గోపాల్నగర్కు చెందిన సట్వే శంకర్(50), గణేశ్నగర్కు చెందిన ఎనుపోతుల బాబు(65) వడదెబ్బతో చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో... నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంకు చెందిన కార్పెంటర్ దేవరకొండ శంకరయ్యచారి(65), మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65), ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్కు చెందిన చెన్న హరికిషన్ (50) వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
ఈవెనింగ్ కల్చర్ సిటీగా భాగ్యనగరం
వేసవి సంధ్య.. సల్లాపాల సరాగాలకు చిరునామాగా మారింది. హైదరాబాదీలు సరికొత్త రుచుల ఆస్వాదనకు ఆలవాలమైంది. రాత్రి పొద్దుపోయేదాకా ఆనంద విహారంలో మునిగితేలుతున్నారు. నగరంలో సమ్మర్ అంటే పగలు ఓ పరీక్ష. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు.. వేడి, ఉబ్బరం, ట్రాఫిక్... అన్నీ కలిసి నగరవాసులను ఇండోర్లోనే ఉండేలా చేస్తున్నాయి. ఆఫీసులు, వర్క్ఫ్రం హోమ్, షాపులు, చిన్న వ్యాపారాలు.. ఇలా ప్రతి ఒక్కరూ.. సూరీడు పడమటికి వాలగానే ఆనందాలను ఆస్వాదిస్తున్నారు. చల్లనిగాలి, మైండ్ ఫ్రెష్– పిల్లల ఆహ్లాదం.. సెలీ్ఫలు, వాక్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ కలిసి సాయంత్రపు షిఫ్ట్ను సమ్మర్ ఫీస్ట్లా ఫీలవుతున్నారు ప్రస్తుత వేసవిలో సాయంత్రం 6 గంటల నుంచి నగరం రంగులు మార్చుకోగానే.. సిటీజనులు బయటికి వస్తున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్ ఈట్ స్ట్రీట్ వ్యాపారం గణనీయంగా పెరిగిందనేది వ్యాపారుల మాట. ముఖ్యంగా ట్యాంట్బండ్ పరిసరాలు, మాదాపూర్–హైటెక్ సిటీ జోన్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు స్ట్రీట్ ఫుడ్స్టాళ్లు ఫుల్ బిజీ. వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం, సమ్మర్ నెలల్లో ఈవెనింగ్–నైట్ టైమ్ ఫుడ్ సేల్స్ సగటున 25–30 శాతం పెరుగుదల చూపిస్తున్నాయి. పగలు తగ్గిన కస్టమర్ ఫుడ్ఫాల్ను రాత్రి పూర్తిగా కవర్ చేస్తోంది. సామాన్య జనాలకు ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, శిల్పారామం వంటి ప్రాంతాలు బెస్ట్ స్పాట్స్గా నిలుస్తున్నాయి. సిటీలో సమ్మర్ అంటే పగలు నిశ్శబ్దం, సాయంత్రం సంబరాలు. ఇది ఉపశమనం మాత్రమే కాదు, నగర ఆర్థిక వ్యవస్థకూ ఊపిరి పోస్తోంది. ఆల్ఇన్ వన్..@: ఎగ్జిబిషన్స్ పిల్లలకు వేసవి సెలవులు కావడంతో.. సికింద్రాబాద్, పీపుల్స్ ప్లాజా, కూకట్పల్లి, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో సమ్మర్ ఎగ్జిబిషన్లు ప్రధాన ఆకర్షణగా మారాయి. గేమ్స్, షాపింగ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఆల్ ఇన్ వన్ కాన్సెప్్టతో ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సందర్శకులు 20 శాతం వరకు పెరిగారు. దీనివల్ల ట్రాఫిక్ ‘‘ఈవెనింగ్ హెవీ’’గా మారింది. ఇంకో వైపు పెరుగుతున్న వర్కింగ్ కం కేఫ్ కల్చర్లో భాగంగా నైట్ షిఫ్ట్ ఐటీ ఉద్యోగులు ల్యాప్టాప్లతో కేఫ్ల్లో పని చేస్తూ కనిపిస్తున్నారు. ఫ్రీ వైఫై, చిల్ ఎని్వరాన్మెంట్తో.. కేఫ్ బిజినెస్కు ప్లస్ అవుతున్నాయి. సమ్మర్లో రాత్రి 7 తర్వాత కేఫ్ ఫుట్ఫాల్ 15–18 శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. ఫుడ్, షాపింగ్, ఎగ్జిబిషన్స్, కేఫ్ వర్క్ అన్నీ కలిసి హైదరాబాద్ను ‘‘రాత్రిలోనూ బతికే నగరం’’గా మరోసారి నిరూపిస్తున్నాయి! -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి
హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. -
పైసామే చమురాత్మ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ సెగతో చమురు సంస్థలు మళ్లీ రోజువారీ ధరల సవరణకు తెరలేపాయి. పైసా.. పైసా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు.. సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో కదలిక వచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత రోజువారీ ధరల సవరణ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. చమురు సంస్థలు గత పది రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్పై రూ.5.35, డీజిల్పై రూ. 5.24 చొప్పున పెంచాయి. అయితే, సవరణ ప్రక్రియ ప్రారంభమైన మొదటిసారి పెట్రోల్, డీజిల్పై ఏకంగా రూ. 3.39, రూ. 3.26 చొప్పున వడ్డించాయి. ఆ తర్వాత నుంచి పైసా–పైసా రూపంలో రోజువారీగా ధరలను సవరిస్తుండటంతో నిరంతరాయంగా పెరుగుతున్నాయి. మధ్యలో రెండుసార్లు నాలుగు పైసల చొప్పున పెంచిన కంపెనీలు మరో రెండుసార్లు నాలుగు పైసల చొప్పున తగ్గించాయి. ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. డీజిల్ ధర పెరగడం వల్ల లారీ రవాణా చార్జీలు భారమై కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. చమురు సంస్థలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మరిన్ని విడతలుగా ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.రోజువారీ సవరణ బాధ్యతకేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే బాధ్యతను 2017 జూన్ 16 నుంచి చమురు సంస్థలకే అప్పగిస్తూ ‘రోజువారీ ధరల సవరణ’ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అంతకుముందు 2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ సగటు ఆధారంగా ధరలను సవరించేవారు. అయితే, 15 రోజులపాటు వేచి చూడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఆకస్మిక హెచ్చుతగ్గుల భారమంతా ఒకేసారి చమురు సంస్థలపై పడటం, లేదా అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ తక్షణ ప్రయోజనం వినియోగదారులకు అందకపోవడం జరిగేది. ఈ లోపాన్ని నివారించి, అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్ ధరలో డాలర్తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రతిబింబించేందుకు ఈ రోజువారీ సవరణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, ఈ విధానానికి 2022లో బ్రేక్ పడింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండిపోయినప్పటికీ, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ చమురు సంస్థలు రోజువారీ సవరణలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా కొన్నేళ్లుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి.నష్టాల నుంచి గట్టెక్కేందుకు ..కొన్నేళ్లుగా ఇంధన ధరల రోజువారీ సవరణను నిలిపివేసి, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలే నష్టాలను భరిస్తూ వచ్చాయి. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్ల మార్కును తాకడంతో నష్టాల భారం తమవల్ల కాదంటూ చమురు సంస్థలు చేతులెత్తేశాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ నెల 15 నుంచి మళ్లీ రోజువారీ ధరల సవరణ ప్రక్రియను ప్రారంభించి, వినియోగదారులకు విడతల వారీగా షాక్ ఇస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు (వ్యాట్), రవాణా చార్జీల వ్యత్యాసాలు తోడవడంతో సామాన్యుడికి చమురు వాత గట్టిగానే తగులుతోంది. -
గాంధీలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ కోర్సు చదువుతున్న పల్లవిగౌడ్ (19) అనే విద్యార్థిని శస్త్రచికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన పల్లవి గౌడ్ కుడిఛాతీపై వాపు (గడ్డ) రావడంతో ఈనెల 16న గాంధీ ఆస్పత్రికి వచి్చంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో 18న అడ్మిట్ కాగా..19న సర్జరీ చేశారు. మరుసటి రోజు వైద్యులు పరీక్షించి మరోసారి సర్జరీ (రీఎక్స్ప్లొరేషన్) చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.ఇదిలా ఉండగా.. సీనియర్ వైద్యులతో కాకుండా జూనియర్లతో సర్జరీ చేయించి తమ కుమార్తె ప్రాణాలపై ప్రయోగాలు చేశారని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి వెంకటే‹Ùగౌడ్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క బాధితులను పరామర్శించి, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ పల్లవి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. పల్లవికి సర్జరీ అనంతరం రక్తపుగడ్డలను తొలగించామని తెలిపారు. ఆ తర్వాత బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా వెంటిలేటర్పై ఉంచి అత్యుత్తమ వైద్యం అందించామని.. అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. -
దోసెలు ఎక్కువగా తింటున్నావని తల్లి మందలింపు
ఫిలింనగర్: దోసెలు ఎక్కువగా తింటున్నావని, దీని వల్ల అన్నం సరిగ్గా తినడం లేదని తల్లి మందలించినందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్ నగర్ బస్తీలో నివసించే కార్తీక్ (15) స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ అతిగా స్పందించడం కార్తీక్ నైజంగా మారింది. ఈ నేపథ్యంలోనే దోసెలు ఎక్కువగా తింటున్నావంటూ అన్నం తినడం లేదని తల్లి చెప్పింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కార్తీక్.. తండ్రి చెన్నప్ప మేస్త్రీ పనికి, తల్లి ఇళ్లలో పనికి వెళ్లిన సమయంలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2.5 లక్షల గృహాలు నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించింది. 2 వేల ఇళ్లలో 1,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన తరహాలోనే ఇళ్ల నిర్మాణం లెవల్నుబట్టి దశలవారీగా మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కేటాయించనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి గృహనిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. అసంపూర్తి ఇళ్లకు ఇందిరమ్మ అండ... ఉమ్మడి ఏపీలో దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, గత ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతోపాటు ఇంకా ఎవరైనా లబ్ధిదారుల ఇళ్లు అసంపూర్తిగా మిగిలి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. పునాదులు పూర్తై గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ. 3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ. 2 లక్షల చొప్పున సహాయం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మూడో, నాలుగో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సైతం అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అనర్హులని తొలి విడతలో ప్రభుత్వం చెప్పింది. నాడు సిమెంట్, స్టీల్, నగదు రూపంలో రూ. 25 వేలు తీసుకున్న వారిని రెండోవిడత ఇందిరమ్మ పథకం కింద అర్హులుగా పరిగణించాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయించింది. ఆ రూ. 25 వేలను మినహాయించుకొని రూ. 5 లక్షల్లో మిగిలిన మొత్తాన్ని వారికి అందజేయనుంది. గుడిసె లేని రాష్ట్రంగా... రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 14,800 పూరి గూడిసెలున్నట్లు వివిధ దఫాలుగా చేసిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఆయా కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. క్యూర్లో లక్ష ఇళ్ల నిర్మాణం.. ఇందిరమ్మ పథకం కింద కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో 6–7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 18,500 మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలను నెలాఖరులోగా ప్రభుత్వం మంజూరు చేయనుంది. మిగిలిన దరఖాస్తుదారుల్లో సొంత స్థలాలు లేని 3–3.5 లక్షల మంది అర్హలుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. క్యూర్ ఏరియాలోని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్గా పరిగణించి అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ)కు లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎల్ఐజీ ఇళ్ల పథకం కింద 400–420 చదరపు గజాల విస్తీర్ణంతో ఫ్లాట్ల నిర్మాణానికి రూ. 5 లక్షలతోపాటు అన్డివైడ్ ల్యాండ్ షేర్ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల అదనపు వ్యయాన్ని లబ్ధిదారులు భరించాల్సి రానుంది. నిరుపేదలు జీవనోపాధి కోసం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఎల్ఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. మురికివాడల్లో నివసిస్తే అక్కడే కట్టిస్తామని పొంగులేటి తెలిపారు. వారు ఉండే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం లేకుంటే హౌసింగ్ బోర్డు, ఇతర ప్రభుత్వ శాఖల నివాసయోగ్యమైన భూముల్లో వారి కోసం ఇళ్లను నిర్మించనున్నారు. నియోజకవర్గం యూనిట్గా ఇప్పటికే కొన్ని స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక క్యూర్ ఏరియాలో నిర్మించనున్న లక్ష ఇళ్లలో 30 శాతం ఇళ్లను ఎంఐజీ లబ్ధిదారులకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్తోపాటు ఫ్రీహోల్డ్ నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని నామమాత్ర లాభంతో ఎంఐజీ వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేసి ఆ నిధులను ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించింది. ఎల్ఐజీ, ఎంఐజీ పథకాల విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ తదితర వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లతో ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్ల పథకాలకు తేడా ఉందన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులు జీవనోపాధి పొందుతున్న ప్రాంతానికి 30–40 కి.మీ.ల దూరంలో ఇళ్లను కట్టడంతో ఆ ఇళ్లను లబ్ధిదారులు నిరుపయోగంగా వదిలేశారని తెలిపారు. జూన్ 1న లక్ష గృహ ప్రవేశాలు... తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తైన లక్ష ఇళ్లలో గృహప్రవేశాలను జూన్ 1న నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు రూ. 1,000 కోట్లు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి విడతగా రూ. 300 కోట్లు మంజూరు చేసింది. ఆర్డీఎస్ఎస్లో చేరేందుకు సై.. విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం 2021లో ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సామర్థ్యం పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) పథకం కింద చేరాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో చేరడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జనవరి 2న కేంద్రంతో త్రెపాక్షిక ఒప్పందం చేసుకున్నా అమలు చేయలేదని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుదల కోసం ఈ పథకంలో చేరాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో మీటర్లు (వ్యవసాయ కనెక్షన్లకు) అమర్చేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిందని ఆరోపించారు. తమ నిర్ణయంలో మీటర్లు బిగించే ప్రసక్తే లేదన్నారు. లైఫ్ సైన్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రాన్ని 2030 నాటికి ప్రపంచంలోని టాప్–5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టడానికి నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని మంత్రివర్గం ఆమోదించింది. దావోస్ సదస్సులో ఈ పాలసీని సీఎం ఆవిష్కరించగా కొన్ని మార్పులతో తాజాగా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతోపాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఫార్మా ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టగా ఇకపై ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఆర్ అండ్ డీ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించేలా ఈ పాలసీలో మార్పులు చేసింది. ఇంటర్ విద్యార్థులకూ భోజనం, అల్పాహారం.. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అందించనుంది. ‘పాలమూరు’భూసేకరణకు రూ. 587 కోట్లు పాలమూరు–రంగారెడ్డి పథకం మిగులు పనులతోపాటు చివర్లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన భూసేకరణ కోసం తొలి విడతగా రూ. 587 కోట్లు కేటలాయించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి చేపట్టిన గత ప్రభుత్వం 18 ప్యాకేజీల పనులనే కొంత మేర చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాగా, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీలను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ‘హాకా’లో విలీనం చేయాలని కేబినెట్ తీర్మానించింది. -
10% ఫీజు చెల్లిస్తే పాత రేట్లే
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు లోపల దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంతాలను పర్యావరణహితంగా, నివాసయోగ్యంగా (మల్టీ–యూజ్ జోన్స్) మార్చేందుకు తీసుకొచి్చన హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్–పీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 30లోగా 10% అడ్వాన్స్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్ఆర్ఓ (సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) రేట్లే వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హిల్ట్–పీ మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేశారు.ఇందులో భాగంగా భూమార్పిడి రుసుముల వివరాలను ప్రకటించారు. జీవో 18 ప్రకారం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మొత్తం 21 పారిశ్రామిక పార్కులతోపాటు స్టాండ్ ఎలోన్ యూనిట్ల దరఖాస్తులను పరిశీలించడానికి రెండు వేర్వేరు టీమ్లను ఏర్పాటు చేశారు. హిల్ట్–పీ పోర్టల్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మే 28 నుంచి భూముల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నూతన పాలసీతో ప్రయోజనాలు.. ⇒ ఎస్ఆర్ఓ రేట్ల రాయితీ: 2026 జూన్ 30లోగా 10% అడ్వాన్స్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్ఆర్ఓ రేట్లే వర్తిస్తాయి. ⇒ తరలింపునకు ప్రోత్సాహకాలు: ఓఆర్ఆర్ వెలుపలికి మారాలనుకునే పరిశ్రమలకు పాత ప్రదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు కొత్త చోటుకూ బదిలీ అవుతాయి. ⇒ చార్జీల సర్దుబాటు: విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం గతంలో చెల్లించిన చట్టబద్ధమైన ఫీజులను కొత్త లొకేషన్లో సర్దుబాటు చేస్తారు. ⇒ ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం: నగరం వెలుపల టీజీఐఐసీ నిర్మించే కొత్త పారిశ్రామిక పార్కుల్లో వారికి ప్లాట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ⇒ ఏడాది గడువు: మల్టీ–యూజ్ జోన్ అనుమతి పొందిన తర్వాత కూడా పరిశ్రమను ప్రస్తుత ప్రాంతంలో ఏడాదిపాటు నిర్వహించుకోవడానికి గడువు ఇస్తారు.పారిశ్రామిక భూమి విస్తీర్ణం - ప్రాసెసింగ్ ఫీజు (రూ. లలో) ఒక ఎకరం వరకు - 20,000 1 ఎకరంపైగా–5 ఎకరాల వరకు - 50,000 5 ఎకరాలకుపైగా–10 ఎకరాల వరకు - 1,00,000 10 ఎకరాలకుపైగా–25 ఎకరాల వరకు - 2,00,000 25 ఎకరాలకుపైగా–50 ఎకరాల వరకు - 5,00,000 50 ఎకరాలకు మించి - 10,00,000 సేల్ డీడ్ ఉంటేనే.. అర్హతలు: రిజిస్టర్డ్ సేల్డీడ్ కలిగి ఉండి పూర్తయిన పారిశ్రామిక ప్లాట్లు మాత్రమే అర్హత ఉంటాయి. దరఖాస్తుకు ముందే పాత బకాయిలు (ఈఓటీ, మ్యుటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, సబ్–డివిజన్ చార్జీలు) క్లియర్ చేయాలి. తప్పనిసరి పత్రాలు: సేల్డీడ్, ఈసీ, తాజా ఆస్తిపన్ను రశీదు, స్థలం కలర్ ఫొటోలు, సంస్థ రిజిస్ట్రేషన్ (ఉద్యమ్ ఆధార్/ఆర్ఓసీ మొదలైనవి), ఐడీ ప్రూఫ్, ఫీజు చెల్లింపు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైతే భూమిని అప్పగించేందుకు రూ. 100 స్టాంప్ పేపర్పై నోటరీ అండర్టేకింగ్ సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు: దరఖాస్తుదారులు టీజీఐఐసీ పోర్టల్ ద్వారా 10 శాతం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్: జోనల్ మేనేజర్, ఐఏఎల్ఏ కమిషనర్ 4 రోజుల్లోగా పరిశీలించి హెడ్ ఆఫీస్ స్రూ్కటినీ కమిటీకి పంపుతారు. ఆమోదం: స్రూ్కటినీ కమిటీ 3 రోజుల్లో అప్రూవల్ కమిటీకి పంపితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ 7 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుంది. బ్యాలెన్స్ ఫీజు: అనుమతి వచ్చిన వెంటనే మిగిలిన 90 శాతం ఫీజు కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న 45 రోజుల్లో 45% ఫీజు, తొలి వాయిదా చెల్లించిన 45 రోజుల్లో మిగిలిన మొత్తం చెల్లించాలి. ఆలస్యమైతే నెలకు 1 శాతం జరిమానా ఉంటుంది. నెల దాటితే మొత్తం రద్దవుతుంది. చెల్లించిన ఫీజు వెనక్కి ఇవ్వరు. మాస్టర్ ప్లాన్ మార్పు: ఫీజు అందిన 3 రోజుల్లో పురపాలక శాఖ/హెచ్ఎండీఏ రికార్డుల్లో భూ వినియోగ మార్పులు చేస్తారు. ఏమిటీ హిల్ట్–పీ పాలసీ? దాదాపు 50–60 ఏళ్ల క్రితం నాచారం, మల్లాపూర్, జీడిమెట్ల, సనత్నగర్, బాలానగర్, కూకట్పల్లి వంటి ప్రాంతాలు నగరం వెలుపల పారిశ్రామిక జోన్లుగా ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఇవన్నీ నగర నడి»ొడ్డుకు చేరాయి. ఫలితంగా నివాసాల మధ్య కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న దాదాపు 9,300 ఎకరాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు పరిశ్రమల శాఖ జీవో 27 విడుదల చేసింది. నగరంలో ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి హైదరాబాద్ను కాలుష్య ముప్పు నుంచి కాపాడటం, ఖాళీ అయిన పారిశ్రామిక భూముల్లో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం ఈ పాలసీ లక్ష్యం. -
స్టేట్ టాపర్లుగా 11 మంది..
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. శనివారం మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి 82.94 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం క్వాలిఫై అయ్యారు. బాలురతో పోల్చితే బాలికలు 6.46 శాతం అధికంగా ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఎంపీసీ విభాగంలో 11 మంది స్టేట్ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఒకే మార్కు మీద ఉండటంతో వీరికి మొదటి ర్యాంకును కేటాయించారు. గతంలో ఒకరిద్దరు..లేదా ముగ్గురు ఒకే మార్కును సాధించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ఏకంగా 11 మంది ఒకే ర్యాంకుపై ఉండటం గమనార్హం. అయితే వీరికి స్టేట్–1 ర్యాంకు కేటాయించినా తర్వాత సబ్జెక్టుల వారీగా వచి్చన మార్కులు, పుట్టిన తేదీ ఆధారంగా ఒకటి, రెండు, మూడు, ర్యాంకులను ఖరారు చేస్తారు. ఇక ఎంబైపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. నాలుగో ర్యాంకుపై ఇద్దరు, ఆరో ర్యాంకుపై ముగ్గురు విద్యార్థులున్నారు.ఈ ఏడాది 1,06,439 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,029 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81,307 విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్ బాపూజీ హారి్టకల్చర్, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీ షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ నెల 27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.నాన్న కష్టాన్ని చూసే లక్ష్యాన్ని ఎంచుకున్నా.. స్టేట్ ఫస్ట్ సాధించిన ఆటో డ్రైవర్ కుమారుడు ఖిలా వరంగల్: వరంగల్ రుద్రమదేవి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నామాల రాజు, రజిత దంపతుల కుమారుడు నామాల లోకేశ్ పాలిసెట్ ఫలితాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎంపీసీ విభాగంలో 120/120 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాక్ సాధించాడు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లోనూ 568 మార్కులతో సత్తా చాటాడు. పాలిసెట్ ఎంబైపీసీలోనూ 120 మార్కులకుగాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ను కైవసం చేసుకున్నారు. కాగా, నాన్న ఆటోడ్రైవర్గా పడే కష్టాన్ని చూసి లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదువుకున్నానని, భవిష్యత్తులో ఎల్రక్టానిక్ ఇంజనీర్గా స్థిరపడాలనుకుంటున్నానని లోకేశ్ చెప్పాడు. -
‘రాజకీయాలు తాత్కాలికం.. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం’
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్దిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు మంత్రి శ్రీధర్బాబు. రాజకీయాలు అనేవి తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు అనేవి శాశ్వతమన్నారు. ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రెస్మీట్లో మాట్లాడారు. దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకే... హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా పగటి కలలు కంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పగటి కలలు కంటూ... ‘చీప్ పాలిట్రిక్స్’... ‘డైవర్షన్ పాలిట్రిక్స్’... ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారు.మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు... ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదు... ఇది తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు మేం వేసే ఒక ముందడుగు.రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.‘ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం’ అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్ రావు... అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా...?’ అని ప్రశ్నించారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2027) గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1000 కోట్లు కేటాయింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. అల్పాహారం, పాలు కూడా అందించాలని నిర్ణయించింది.కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం చెప్పింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
హీట్ వేవ్.. తెలంగాణకు హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బతో మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వడగాల్పులతో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై ఆయన ఇవాళ(శనివారం,మే 23) అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.రానున్న మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనుందని.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి అన్నారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని.. ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు ఇవ్వాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ, నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. హీట్ వేవ్పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వడదెబ్బ కేసులకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలి’’ అని మంత్రి పొంగులేటి సూచించారు. -
పీసీసీ మార్పు హైకమాండ్ నిర్ణయం.. వార్తలపై మహేష్ గౌడ్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక చానెల్ వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చానెల్ తనపై రాస్తున్న వార్తలను నమ్మే పరిస్థితి లేదన్నారు. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు.తనపై వస్తున్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ..‘గాంధీ భవన్ను ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఒక చానెల్ నాపై వార్తలు రాస్తే నమ్మే పరిస్థితి లేదు. నా పనితీరును కేడర్ అంచనా వేస్తుంది. నేను ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నాను. 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా నేతలకు తెలుసు. నాపై వచ్చిన వార్తలపై నేను స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పాను. కొన్ని మీడియా సంస్థలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.. దానికి నేనేం చేయలేను. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. ఏఐసీసీ దృష్టిలో తెలంగాణ పీసీసీది బెస్ట్ అని ఉంది. నాపై వ్యతిరేక వార్తలు రాసిన చానెల్.. గతంలో చాలా పాజిటివ్ వార్తలు కూడా ఇచ్చింది. దీనిపై సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారుతుంది. బీఆర్ఎస్కు దూరదృష్టి లేదు.. హైదరాబాద్ పరిధి పెంచలేదు. సిటీ విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీష్ రావు అంటున్నారా?. తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది. స్టాలిన్లా మేము గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్గా నేమ్స్ ఏఐసీసీకి పంపించాం.. త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారు. నా ప్రమేయం ఏమీ ఉండదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. -
మాసబ్ట్యాంక్లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి
హైదరాబాద్: మాసబ్ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యూచర్ సిటీ కాదు.. నీ ఫ్యూచరేంటి హరీష్: పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫ్యూచర్ సిటీ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటరిచ్చారు. హరీష్ రావుకు తన ఫ్యూచరే తెలియదు.. ఫ్యూచర్ సిటీని ఆపుతారా? అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..‘ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఒప్పందాలున్నాయా?. పదేళ్లలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందంటే అసూయ కలగక మానదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్లు కట్టుకున్నారు. కాంగ్రెస్.. రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారు. మూసీ ప్రాజెక్ట్కు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోంది. మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్ర చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న హరీష్ రావు.. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. హరీష్.. మీ పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా కుట్రలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శనివారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. 82.94 శాతం ఫలితం సాధించినట్లు వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు.. హాల్టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ర్యాంక్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఒక్క క్లిక్తోనే అందిస్తోంది. ఫలితాలను చెక్చేసుకోవడానికి 👉 క్లిక్ చేయండిఈ ఏడాది మే 13న నిర్వహించిన తెలంగాణ పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి అనంతరం ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తదితర ప్రక్రియలను దశలవారీగా నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారంలో సీట్ల కేటాయింపు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈసారి కూడా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కోసం గట్టి పోటీ ఉండే అవకాశముందని విద్యా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ వంటి కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం!
సాక్షి, హైదరాబాద్: టెస్లా.. ఎలక్ట్రిక్ కారు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు. ఇప్పటికే భారత్లో ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్పీరియెన్స్ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్లోనూ అడుగు పెడుతోంది. కొండాపూర్లో రెండు నెలల్లో సేల్స్, సర్వీస్ సెంటర్ సిద్ధం అవుతోందని సమాచారం.యూఎస్కు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడల్–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఆటోపైలెట్, ఫుల్ సెల్ఫ్–డ్రైవింగ్ వంటి అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత. టెస్లా అంటే కేవలం కార్లు మాత్రమే కాదని, ఈ సంస్థ రాకతో హైదరాబాద్ రియల్టీకి పెద్ద బూస్ట్నిస్తుందని రియల్టీ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు ‘సాక్షి’కి తెలిపారు.టెస్లా కార్లకు ఇక్కడి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విషయంలో బెంగళూరును బీట్ చేశామని, హైనకెన్, లాంజా వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరడానికి ఇక్కడి మౌలిక వసతులు కారణమన్నారు. టాప్–20 ఎన్బీఎఫ్సీలు అన్నీ హైదరాబాద్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఒక్క భాగ్యనగరికే ఈ ఘనత సాధ్యమైందన్నారు.మంత్రి శ్రీధర్బాబుతో టెస్లా డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ (ఎడమ నుంచి కుడికి) విస్తరణ చేపట్టండి.. మంత్రి శ్రీధర్బాబును టెస్లా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ శుక్రవారం కలిశారు. హైదరాబాద్లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ పాల్గొన్నారు. -
నీకు పెళ్లి చేయాల్సిన చేతులతో తలకొరివి పెడుతున్నా బిడ్డా..
నల్లగొండ: అమెరికాలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి–శోభ దంపతుల పెద్ద కుమార్తె నవ్య(24) మృతదేహం ఆరు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంది. నవ్య బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చేసేందుకు రెండున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగో రాష్ట్రంలోని రోజ్వెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. ఈ నెల 16న రాత్రి కారులో వెళ్తుండగా.. వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతిచెందింది. కాగా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నవ్య మృతదేహానికి ఆమె తల్లి శోభ బొట్టు పెట్టి సొమ్మసిల్లి పడిపోయింది. ‘నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపియ్యాలనుకున్న బిడ్డా.. కానీ నీకు తలకొరివి పెట్టే కర్మ పట్టింది.. ఏ తండ్రికి నాలాంటి బాధ రావొద్దు బిడ్డా..’ అంటూ నవ్య తండ్రి గడుసు శ్రీనివాస్రెడ్డి రోదించిన తీరు గ్రామస్తులు, బంధువులను కంటతడి పెట్టించింది. అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తిచేశారు. నవ్య భౌతికకాయానికి ఆమె తండ్రి తలకొరివి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, చెరువుగట్టు ఆలయ చైర్మన్ వరాల రమేష్, మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, నవీన్రెడ్డి, పున్నం రాజు యాదగిరి అంతిమయాత్రలో పాల్గొని నివాళులరి్పంచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో ఆరు రోజుల్లోనే నవ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో ఆయనకు నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పలకరింపు కరువై.. స్మార్ట్ఫోన్లకు బందీలై!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం ఎన్నడూ లేనంతగా సాంకేతికతతో అనుసంధానమైంది. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్ల మోత మోగుతోంది. కానీ విచిత్రంగా పొరుగువారితో, సమాజంతో దూరం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఎంతలా అంటే.. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలి యని పరిస్థితి నెలకొంటోంది. సోషల్ మీడియాలో వేలాది మంది ‘ఫ్రెండ్స్’ఉంటున్నా అర్ధరాత్రి ఏదైనా ఆపద వస్తే కాపాడేందుకు పక్క ఇంట్లో ఉండే నిజమైన మనిషి దూరమవుతుండటం నేడు ప్రపంచాన్ని సంక్షోభంలా చుట్టుముడుతోంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్లో ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడానికి ఏకంగా జాతీయ సంభాషణ ప్రాజెక్ట్ ప్రారంభించాల్సి వచ్చింది.పాశ్చాత్య దేశాల్లో బంధాలకు బీటలు...బ్రిటన్లో సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మాజీ కన్జర్వేటివ్ చాన్స్లర్ సాజిద్ జావిద్, లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ నేత జాన్ క్రుడాస్ నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. ‘భవిష్యత్తు బ్రిటన్ ఎలా ఉండాలి? ఏ బంధాలు ప్రజల్ని కలుపుతున్నాయి? పొరుగువారితో అనుబంధం ఎలా పెరగాలి?’అని ప్రజలనే అడుగుతూ ఒక దరఖాస్తు లేదా నిమిషం నిడివిగల వాయిస్ నోట్ ద్వారా ఆగస్టుకల్లా అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు.ఆందోళన పరుస్తున్న అధ్యయనాలుబ్రిటిష్ రెడ్ క్రాస్ జరిపిన తాజా అధ్యయనంలో 75% మంది బ్రిటన్ విభజిత దేశంగా మారిందని.. గత ఐదేళ్లలో ఈ దూరం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఏఈఐ అనే అమెరికన్ థింక్ ట్యాంక్ అధ్యయనం ప్రకారం 2012లో 59% మంది అమెరికన్లు వారంలో పలుమార్లు పొరుగువారితో మాట్లాడేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల మధ్యలోని యువతలో పొరుగు వారితో క్రమం తప్పకుండా మాట్లాడే వారి శాతం 51% నుంచి ఏకంగా 25 శాతానికి తగ్గింది.ఆరోగ్యానికి ముప్పుగా ‘ఒంటరితనం’...ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని ఒక ప్రజారోగ్య సంక్షోభంగా గుర్తించింది. నిపుణుల అభిప్రా యం ప్రకారం సామాజిక దూరం మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా గుండె జబ్బులు, డిప్రెషన్, అకాల మరణాల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. ప్రపంచంలో ప్రతి ఐదో వ్యక్తి తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నాడని.. దీన్ని ఒక నిశ్శబ్ద సామాజిక సంక్షోభంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం, పొరుగిల్లు, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కలిపేవి. కానీ ఇప్పుడు అల్గారిథమ్స్ మనుషుల పరిచయాలను, సంభాషణలను శాసిస్తున్నాయి.హైదరాబాద్ టు వైజాగ్ అంతా కాంక్రీట్ అరణ్యం.. దేశంలో కుటుంబ వ్యవస్థ పశ్చిమ దేశాల కంటే బలంగా ఉందనేది నిజమే అయినా నగరాల వేగం ఈ బంధాలను తుడిచేస్తోంది. హెల్ప్ ఏజ్ ఇండి యా నివేదిక ప్రకారం భారత్లో 69% మంది యువకులు, 68% మంది వృద్ధులు వృద్ధాప్యంలో ఒంటరివాళ్లమైపోతామనే భయంతో బతుకుతున్నా రు.ౖహైదరాబాద్, వైజాగ్ వంటినగరాల్లో ఈ సామా జిక దూరం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కారణాలు, ప్రస్తుత పరిస్థితుల అంచనా... అపార్ట్మెంట్ సంస్కృతి: గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లలో పక్క ఫ్లాట్లో ఎవరుంటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని ఉదాసీనత పెరిగిపోయింది. లిఫ్ట్లో ఎదురైనా బాగున్నారా అనే పలకరింపు కూడా కరువైంది. ఉద్యోగ ఒత్తిళ్లు: ఐటీ, కార్పొరేట్ ఉద్యోగ వేళలు, వర్క్ ఫ్రం హోం సంస్కృతి కారణంగా యువత గదులకే పరిమితమవుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం, సలహాలన్నీ మొబైల్ స్క్రీన్పైనే లభి స్తుండటంతో పొరుగువారే కాదు.. ఎవరి ఇంటి తలుపులూ తట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. మనస్తత్వంతోనే! సాంకేతికత మనిషిని స్వయంసమృద్ధుడిగా మార్చింది. కానీ సామాజికంగా ఒంటరిని చేసింది. ఆధునిక సమాజంలో సాంకేతికతను వాడుకుంటూనే మనుషులను మళ్లీ ఎలా అనుసంధానించాలనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్. పొరుగువారితో మాట్లాడటం సమయం వృథా కాదు.. అదొక సామాజిక భద్రత అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. – డేనియల్ కాక్స్, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సర్వే సెంటర్ డైరెక్టర్ -
Telangana: వడదెబ్బతో 30 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన గిరిజనుడు కిరణ్కుమార్ (27), తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఆత్రం రాము (44), నల్లగొండ జిల్లా నకిరేకల్లోని బొడ్రాయి వీధికి చెందిన గంగాధర శాంతమ్మ (86), నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కుకుట్ల కృష్ణయ్య (46), సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ముక్కుడుదేవులపల్లికి చెందిన దాసరి బిక్షం (60) మృతి చెందారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడేనికి చెందిన జనగం రాంబాబు (43), ఖమ్మంలో గుర్తుతెలియని యాచకుడు (65), కొణిజర్లకు చెందిన ఉపాధి కూలీ పాముల శ్రీను (53), భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ఆజాద్నగర్కు చెందిన పురోహితుడు ముక్కవరపు వెంకటేశ్వర్లు (65), ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన శానిటరీ పనులతో జీవనం సాగించే యార్లగడ్డ గోవర్దన్రావు(70), చర్ల మండలం ఆర్.కొత్తగూడెం జీపీ పరిధి దానవాయిపేటకు చెందిన దాగం సీతమ్మ(60), ఖమ్మం ముస్తఫానగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ సలీం(42), చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన చింతచిగురు అమ్ముకునే పుట్టపర్తి భద్రమ్మ(60), ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన పూల దుకాణంలో పనిచేసే నాగయ్య(55), పరిగిముక్కల కాలనీకి చెందిన అచ్యుత్రావు(70) వడదెబ్బతో మృతి చెందారు. మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కోట నిరంజన్(60) బంధువుల అంత్యక్రియలకు వెళ్లివచ్చాక వడదెబ్బతో అస్వస్థతకు గురై కన్నుమూశాడు. ⇒ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్పల్లి గ్రామానికి చెందిన గైని కవిత–సంజీవ్ దంపతులు కొన్నేళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరి కూతురు కూతురు కీర్తిక (8) వేసవి సెలవుల్లో నానమ్మతో గడిపేందుకు సొంతూరికి వచ్చింది. నాలుగు రోజులుగా తోటి పిల్లలతో కలిసి ఆరు బయట ఆడుకుంటోంది. నీరసం, జ్వరం రాగా, ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ⇒ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (68), డోర్నకల్ మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన నన్నెబోయిన సత్యం(75), వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ పడమర కోట ప్రాంతానికి చెందిన బండి హరిశంకర్ (58), రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్ విండ్ల సంతోష్కుమార్ (49), పర్వతగిరికి చెందిన చిర్రబోయిన అరుణ (45), నల్లబెల్లి మండలం ఆసరవెల్లికి చెందిన గుగులోతు నరసింహ (55), జనగామ జిల్లా కొడకండ్ల మండలం గుమ్ములబండ తండాకు చెందిన గుగులోత్ రామ్సింగ్ (75) వడదెబ్బతో మృతిచెందారు. ⇒ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన ఆరెల్లి పరశురాములు (62), జగిత్యాల రూరల్ మండలం మోరపల్లికి చెందిన కర్నె లచ్చయ్య (85), పెద్దపల్లి మండలం రంగాపూర్కు చెందిన కల్వకోట రామస్వామి (70), గోదావరి ఖనికి చెందిన అబ్బాస్ఖాన్(53) వీణవంక మండలం ఇప్పలపల్లికి చెందిన వేల్పుల ఐలయ్య (62), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్కోత్తూర్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మేస్త్రీ అండ్ర శ్రీనివాస్ (40) వడదెబ్బతో చనిపోయాడు. ⇒ మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్న మెట్పల్లి గ్రామానికి చెందిన వీఓఏ దుగుట సంతోశ్ శుక్రవారం వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. రహదారిపై స్కూటీ దగ్ధం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపాన సీతారామ కెనాల్ బ్రిడ్జి ఎండ తీవ్రతతో ఓ స్కూటీ కాలిపోయింది. పాల్వంచకు చెందిన దంపతులు స్కూటీపై శుక్రవారం ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా వినోభానగర్ సమీపాన స్కూటీలో మంటలు మొదలయ్యాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించిన దంపతులు స్కూటీని వదిలేసి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు ఉధృత రూపం దాల్చి వాహనం కాలిబూడిదైంది. మరో రెండ్రోజులు అధిక ఉష్ణోగ్రతలే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇది పెద్ద కల అని, రాష్ట్ర ప్రస్తుత వృద్ధి రేటు చూస్తుంటే ఇది కచ్చితంగా సాధ్యమేనని స్పష్టమౌతోందన్నారు. ప్రస్తుతం దేశ సగటు ఊవృద్ధి రేటు 8.2% గా ఉంటే, తెలంగాణ వృద్ధి రేటు 10.7% తో దూసుకుపోతోందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్రకటించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగడం గొప్పవిషయమన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ.1,65,297 కోట్ల లక్ష్యానికిగాను రూ.1,68,401 కోట్లు పంపిణీ చేసి 101.88 శాతం సాధించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. శుక్రవారం ప్రజాభవన్లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు మరింత సానుకూల దృక్ఫథంతో ముందుకు రావాలన్నారు.సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని సూచించారు. సామాజిక భద్రత, బీమా పథకాల పరిధిలోకి రాష్ట్ర ప్రజలను తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే అనేక ఇండస్ట్రియల్ హబ్లు, క్లస్టర్లను తీసుకువస్తున్నట్టు భట్టి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్టైల్ వంటి వివిధ రంగాలను డిజైన్ చేస్తున్నట్టు చెప్పారు. స్వల్పకాలిక రుణాలకే బ్యాంకులు పరిమితం : మంత్రి తుమ్మల ఇప్పటికీ వ్యవసాయ రుణాల్లోఅధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే బ్యాంకులు పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయం ఇప్పుడు ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షిత సాగు, పాడి, మత్స్య, యాంత్రీకరణ వంటి రంగాల వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇందుకు అనుగుణంగా స్పందించాలని కోరారు. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని సూచించారు. 2025–26 లో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించిందన్నారు.మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తోందన్నారు. శుక్రవారం 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) త్రైమాసిక సమావేశంలో మంత్రి బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమన్నారు. పీఆర్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ మోహన్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు.. అందుబాటులోనిల్లు
భాగ్యనగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. చిన్న ఫ్లాట్ల నిర్మాణం క్రమంగా తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. సొంత స్థలంలో ఇల్లు అనేది దశాబ్దాలుగా నగరంలో ఉంటున్న వారికి మినహా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చింది. తొలినాళ్లలో ఎక్కువగా సింగిల్ బెడ్ రూమ్ (1 బీహెచ్కే), డబుల్ బెడ్ రూమ్ (2 బీహెచ్కే) ఇళ్లే ఎక్కువగా నిర్మించేవారు. దీంతో సొంతంగా స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకోలేని వారు అపార్ట్మెంట్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపేవారు. 600–700 చ.అడుగుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉండేవి. సొంతిల్లు కావాలనుకునే వారు ఈ సింగిల్ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొనుగోలు చేసి కల నెరవేర్చుకునేవారు. దాదాపు ఐదేళ్ల క్రితం వరకు కూడా డెవలపర్లు ఈ 1, 2 బీహెచ్కే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.1, 2 బీహెచ్కే ఇళ్ల నిర్మాణాలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 1 బీహెచ్కే ఇళ్లయితే అసలు కనిపించడమే లేదు. మిగతా నగరాలతో పోల్చుకుంటే అత్యధికంగా హైదరాబాద్లోనే ఈ తరహా ఇళ్లు (అఫర్డబుల్ హౌసింగ్/సామాన్యులకు అందుబాటులో ఉండేవి) 70 శాతం తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక పేర్కొనడం గమనార్హం. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం, లేబర్ల జీత భత్యాలు పెరగడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో బిల్డర్లు అఫర్డబుల్ హౌసింగ్ను దాదాపుగా మానుకుంటున్నారు. మరోవైపు కొనుగోలుదారులు చాలావరకు అవసరమైతే మరింత అప్పు చేసైనా సరే కాస్త విశాలమైన ఇళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో 3 బీహెచ్కే ఫ్లాట్లు, విల్లాల వంటివి గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. కరోనా తర్వాత.. కరోనా కాలంలో చిన్న, ఇరుకైన ఇళ్లలో నివసించడం ఎంత రిస్కో తెలిసొచ్చింది. ఎక్కువ గదుల భావన బలపడింది. దీంతో అప్పటినుంచి అత్యధిక శాతం కొనుగోలుదారులు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్లో మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 25–40 శాతం భూమి ధరలదే ఉంటోంది. దీంతో లాభదాయకం కాదనే భావనతో బిల్డర్లు కూడా 1, 2 బీహెచ్కే ఫ్లాట్ల నిర్మాణాన్ని తగ్గించారు. 2018లో గృహ విక్రయాలలో మధ్య తరగతి ఇళ్ల వాటా 54 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 26 శాతానికి పడిపోవడం గమనార్హం. మధ్య తరగతి గృహాలపై తీవ్ర ప్రభావం.. దేశంలోని ఇతర మెట్రో నగరాలలో కూడా అఫర్డబుల్ గృహాల నిర్మాణం వేగంగా తగ్గుతోంది. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం మన తర్వాత (70 శాతం) ముంబైలో 60 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 50 శాతం మేర క్షీణించాయి. ప్రత్యేకించి హైదరాబాద్లో 2022 నుంచి రూ.కోటి కంటే బాగా తక్కువగానే ధర ఉండే మధ్య తరగతి గృహ నిర్మాణాల అమ్మకాలు భారీగా తగ్గాయి. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు, కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో వారి అభిరుచులకు మేరకు డెవలపర్లు కూడా లగ్జరీ గృహ నిర్మాణాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు భూముల ధరలు ఆకాశాన్నంటడం, నిర్మాణ సామగ్రి, నైపుణ్య కారి్మకుల వేతనాలు పెరగడం వంటి కారణంగా మధ్య తరగతి ఇళ్ల నిర్మాణం బిల్డర్లకు లాభసాటిగా ఉండటం లేదు. దీంతో ఎక్కువ లాభదాయకంగా ఉండే ప్రీమియం ప్రాజెక్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధరలు పెరిగే అవకాశం టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు.కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు తుదిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పదు. ఫలితంగా అపార్ట్మెంట్ల ధరలను చ.అ.కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గుతున్న అమ్మకాలు భూములు, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, నైపుణ్య కారి్మకుల కొరత, గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల సూచనలు.. వెరసి హైదరాబాద్ స్థిరాస్తి రంగం కుప్పకూలుతోంది. 2024తో పోల్చుకుంటే 2025లో ప్రాజెక్టులు, అదే విధంగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇక హైదరాబాద్లో 2025 చివరి త్రైమాసికంలో 60 లక్షల చదరపు అడుగులు (చ.అ.) మేర గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి కేవలం 6 లక్షల చ.అ.లకే పరిమితయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో క్షీణించడం నగరలో నిర్మాణ రంగ పతనాన్ని సూచిస్తోంది. ఇంకోవైపు కనెక్టివిటీ, మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో శివారుప్రాంతాల్లోని 40 శాతం మధ్య తరగతి గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపాలి భూ యజమానులు అత్యాశతో భూముల ధరలను రాత్రికి రాత్రే పెంచేస్తున్నారు. దీంతో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లు చేపట్టాలంటే బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ భూముల లభ్యత విపరీతంగా ఉంది. అయితే సరైన మౌలిక వసతుల్లేవు. ఆ మేరకు ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తే మధ్య తరగతి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుంటుంది. – నరేంద్రకుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ (ఫొటో కామన్లో నరేంద్ర కుమార్ పేరుతో ఉంది) -
అనాధ గిరిజన చిన్నారులకు అండగా నిలిచిన సీఎం ప్రజావాణి
సాక్షి,ఆదిలాబాద్ : తల్లిదండ్రులు చనిపోయి అనాధలుగా మారిన గిరిజన ‘తోటి’ కులానికి చెందిన ఇద్దరు చిన్నారులకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్లో జరిగిన సీఎం ప్రజావాణికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అనాధ పిల్లలను వారి బంధువులు తీసుకువచ్చారు.రెండేళ్లు, మూడు నెలల చిన్నారుల పోషణ కష్టంగా ఉందని వారి సంరక్షణ చూస్తున్న పెదనాన్న పెద్దమ్మ ఆత్రం సునీత, వెంకటిలు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకొని చలించిపోయిన చిన్నారెడ్డి ఇద్దరు చిన్నారులకు స్పాన్సర్షిప్ అందించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టర్ కు లేఖ రాశారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాంజీ గోండు నగర్ గ్రామానికి చెందిన ఆత్రం విఠల్, గంగుబాయి ఆరు నెలల కాలంలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. దీంతో ఆ చిన్నారుల బాధ్యతలు వారి పెదనాన్న పెద్దమ్మ చూస్తున్నారు. కనీసం డబ్బా పాలు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నామని వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతినెల ఆర్థిక సాయంతో పాటు డబ్బా పాలను చిన్నారులకు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్కు చిన్నారెడ్డి సూచించారు. -
పెరిగిన ఇంధన ధరలతో వర్కర్లు విలవిల
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): దిల్సుఖ్నగర్కు చెందిన ఓ యువకుడు క్యాబ్ డ్రైవర్. ఓలా, ఉబెర్ అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమై క్యాబ్ నడుపుతున్నాడు. రోజుకు సగటున 150 కి,మీ చొప్పున అతని క్యాబ్ తిరుగుతుంది. రూ.1800 నుంచి రూ.2000 వరకు ఆదాయం వస్తుంది. రోజుకు రూ.1000 డీజిల్ ఖర్చు పోను మరో రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుబాటయ్యేది. ఆ డబ్బులతోనే బండి ఈఎంఐ, ఇంటి కిరాయి, నిత్యావసరాలు, ఫోన్ రీచార్జ్, తదితర అన్ని అవసరాలు తీర్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు డీజిల్ ధర పెరగడంతో రోజుకు రూ.1,275 వరకు ఖర్చవుతోంది. ఇంధన ధరల పెంపు కారణంగా 25 శాతం ఆదాయం తగ్గింది. ‘రోజు రోజుకు అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ.. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఇచ్చే పేమెంట్స్ మాత్రం పెరగడం లేదు. ఈఎంఐ కట్టడం కష్టంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశాడు. భారం రూ.30 కోట్లు అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వస్తున్న మార్పుల ప్రభావం భాగ్యనగర వీధుల్లో ఆటోలు, క్యాబ్లు, బైక్లు నడుపుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న సామాన్యుల కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. మే నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ. 4 పైనే పెరగడంతో నగరంలోని సుమారు 1.25 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు, 4 లక్షల మంది గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, బైక్ టాక్సీ రైడర్స్) ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హైదరాబాద్ నగర రవాణా, డెలివరీ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ రెండు వర్గాలపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.ధరలు పెరిగిన ప్రతిసారి ఓలా, ఉబెర్, స్విగ్ని, జొమాటో తదితర సంస్థలు రైడ్ ఛార్జీలు, డెలివరీ ఫీజులు పెంచుతున్నప్పటికీ, పెరిగిన లాభాలను డ్రైవర్లకు, డెలివరీ బాయ్స్కు ఆశించిన స్థాయిలో బదిలీ చేయడం లేదు. సుమారు 1.25 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు రోజుకు సుమారు 12.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు అంచనా. పెరిగిన ధరల కారణంగా ఈ ఒక్క క్యాబ్ కమ్యూనిటీపైనే నెలకు ఏకంగా రూ.15.94 కోట్ల అదనపు భారం పడుతోంది. నగరంలోని సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లను పరిగణనలోకి తీసుకుంటే, వీరంతా రోజుకు 10.68 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు.చదవండి: ఒంటి చక్రం సైకిల్పై సాహసయాత్ర!గ్రేటర్లోని సుమారు 1.25 లక్షల మంది డ్రైవర్ల దయనీయ పరిస్థితి ఇది. కేవలం పెట్రోల్, డీజిల్ కాకుండా సీఎన్జీ, ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. చాయ్, టిఫిన్ సహా అన్నింటిపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్ మళ్లీ మొదలైంది. క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఇది పిడుగుపాటుగా మారింది. మరోవైపు సుమారు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ (డెలివరీబాయ్స్) కూడా పెరిగిన పెట్రోల్ ధరలతో విలవిలలాడుతున్నారు.చెల్లింపులు పెంచాలిపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా బండి బయటికి తీయాలంటేనే భయంగా ఉంది. ధరలకు అనుగుణంగా క్యాబ్ సంస్థలు చెల్లింపులను పెంచాలి. – సంతోష్ఆర్డర్లు తగ్గాయి డెలివరీబాయ్స్ బాగా పెరగడంతో ఆర్డర్లు తగ్గాయి. ఆదాయం కూడా తగ్గింది. గతంలో ఒక బుకింగ్పైన రూ.30 నుంచి రూ..40 లభించేది.ఇప్పుడు రూ.10, రూ.20 చొప్పున వస్తున్నాయి. – ఖలీల్ -
IPL 2026: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ఉప్పల్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజిత్ పాటిదార్(56) టాప్ స్కోరర్గా నిలవగా.. కృనాల్ పాండ్యా(41), వెంకటేశ్ అయ్యర్(44) రాణించారు. విరాట్ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు, షకీబ్, ట్రావిస్ హెడ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్పాటిదార్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన పాటిదార్.. హెడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 185/4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/28 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీఎస్ఆర్హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులుహైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 250 పరుగుల మార్క్ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ఎస్ఆర్హెచ్.. 15 ఓవర్లలో 189-2ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్లో జోర్డాన్ కాక్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.6 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 63-16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్సలామ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో తలపడింది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ను మళ్లీ ఎస్ఆర్హెచ్తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets Rajat Patidar returns to lead #RCB Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా: ఆకునూరి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్కు పంపించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మేము విద్యపై సిఫార్స్లతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాము. నాకు అప్పగించిన పనిని పూర్తిచేసినందున తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ విద్యా రంగంలో కీలక పాత్ర పోషించిన ఆకునూరి మురళి 2024లో టీఈసీ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం రెండు సంవత్సరాలు కాగా ఇవాళ (మే22)సమగ్ర నివేదిక సమర్పించి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.ఆకునూరి మురళి రాష్ట్రంలోని ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టారు. ఆయన కరికులం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధన పద్ధతులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. దీర్ఘకాలిక విద్యా విధాన రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల పనితీరును పర్యవేక్షించారు.ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో 100 మోడల్ స్కూల్స్ ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ప్రయత్నం చేశారు. ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యా రంగంలో సేవ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపారు. -
ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరతాం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు సంచలన ప్రకటన చేశారు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారాయన. అలాగే.. ఫార్మాసిటీని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. హై కోర్టు లో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందిఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధం గా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండాలని చేస్తున్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందిమేము ప్రభుత్వం లోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు వంద శాతం చేస్తాం. ఫార్మా సిటీ నీ రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు. పార్లమెంట్ చట్టం ఇది. ఫార్మా సిటీ వస్తె లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్కు పేరు వస్తుంది అని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు... నిలబడదు.. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీష్రావు అన్నారు. “ఫ్యూచర్ సిటీ”, “ఫార్మాసిటీ” రెండూ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులే. కానీ ప్రభుత్వాలు మారడంతో వాటి దిశ కూడా మారిపోయింది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో “ఫార్మాసిటీ” పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయని.. తెలంగాణ ఔషధ రంగంలో అగ్రస్థానానికి చేరుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది.అయితే ఆ ప్రాజెక్ట్కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోతామన్న భయం ఒకవైపు.. కాలుష్యం పెరిగి నీరు, గాలి దెబ్బతింటాయన్న ఆందోళన మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా యాచారం, కందుకూరు ప్రాంతాల్లో రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం “ఫార్మాసిటీ” ఆలోచనను పక్కనబెట్టింది. అయితే.. అదే ప్రాంతంలో “ఫ్యూచర్ సిటీ” అనే కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం పరిశ్రమల నగరం కాదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పరిశోధనలు, హరిత వాతావరణం, నివాసాలు, ఉద్యోగ కేంద్రాలు అన్నీ కలిసిన ఆధునిక నగరంగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. -
ఎండల బీభత్సం.. వడదెబ్బతో 22 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతిచెందారు. ఎండదెబ్బ దాటికి ఒక్క వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది మరణించారు. అయితే మరో నాలుగు రోజుల పాటు ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.కాగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. నిన్న( గురువారం) ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ముత్తారం, మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండలు మండుతుండడంతో ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప బయిటకీ రాకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతు మరణించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారని మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా మరణించలేదన్నారు. రాజకీయ లాభాల కోసం బురదచల్లే ప్రయత్నమే తప్ప.. కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగాన్ని కుంభకోణాల కూపంగా మార్చిన నాయకులు ఇప్పుడు రైతు సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయని చెప్పారు. 2025–26 రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకు 54.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరిందన్నారు. అందులో 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్ల చెల్లింపులు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 18.3 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని, రవాణా కోసం 13 వేల వాహనాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. -
కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్లోనైనా పంట కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడి పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతీ రోజూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామనే కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతులు గుండె పగిలి కుప్ప కూలుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో దైర్యంతో బతికిన అన్నదాత కాంగ్రెస్ పాలనలో ఆత్మ విశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. రైతులకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ ఒక్కొక్కటిగా పాతరేసి రైతుల వెన్ను విరించారు. రైతుభరోసా ఎగవేసినా, యూరియా కష్టాలు అధిగమించి రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు’అని కేటీఆర్ మండిపడ్డారు. పంటలు తగులబెట్టుకుంటున్నారు ‘పంట కొనుగోలు చేసే నాథుడు లేక రైతులు తమ పంటలను తగుల పెట్టుకుంటున్నారు. రెండు నెలలుగా నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోరో జరగని రహదారి లేదు. పగలూరాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై సీఎంకు పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్లో షికార్లు కొడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ రైతులు రోడెక్కి నిరసన తెలపడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభానికి అద్దం పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, క్వింటాల్కు పది కిలోల తరుగు, గన్నీ బ్యాగులకు రూ.50 డిపాజిట్ వంటి సమస్యలను తీర్చేవారే లేరు. పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు సీఎం క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి రైతుల పంటను కాపాడుకునేందుకు చివరకు టార్పాలిన్లు కూడా సమకూర్చలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కాంగ్రెస్కు మరణ శాసనం రాసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని ఆ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
సోలార్ విద్యుత్ నిల్వతో సింగరేణికి లాభాల వెలుగు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఆశించిన ఫలితాలను ఇస్తోంది. వినియోగం కాకుండా ఉచితంగా గ్రిడ్కు వెళ్లిపోయే సోలార్ విద్యుత్ను ఇప్పుడు బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించుకోవడంతో సంస్థకు ఆర్థిక లాభాలు చేకూరుతున్నాయి. నాలుగు నెలల్లోనే రూ.25.66 లక్షల మేర ఆదా కావడం విశేషం. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్టును సింగరేణి మందమర్రి ఏరియాలో ప్రయోగాత్మకంగా ఏర్పా టు చేసింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.2.5 కోట్లను యాజమాన్యం వెచ్చించింది.సింగరేణి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటిలో 147 మెగావాట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, 98.5 మెగావాట్లను ఇన్హౌస్ ప్లాంట్లుగా వినియోగిస్తోంది. ఇన్హౌస్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను స్థానిక అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలే విద్యుత్ను గ్రిడ్కు పంపాల్సి వస్తోంది. అయితే విద్యుత్ ఒప్పందాల ప్రకారం ఆ మిగులు విద్యుత్కు ఎటువంటి చెల్లింపులు ఉండవు. దీంతో ప్రతిరోజూ వేల యూనిట్ల విద్యుత్ ఆర్థిక ప్రయోజనం లేకుండానే గ్రిడ్లో కలిసిపోతోంది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో సింగరేణి మందమర్రి 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్కు అనుబంధంగా బీఈఎస్ఎస్ను ఏర్పాటు చేసింది.3.35 లక్షల యూనిట్ల నిల్వ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని గనులు, కాలనీలకు అవసరమైన విద్యుత్ను ఈ సోలార్ ప్లాంట్ సరఫరా చేస్తోంది. మిగిలిన విద్యుత్ను ఇప్పుడు బీఈఎస్ఎస్ ద్వారా నిల్వ చేస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 3,35,485 యూనిట్ల విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించారు. దీని ద్వారా సంస్థకు రూ.25,66,460 మేర లబ్ధి చేకూరింది. -
ఆ ఉద్యోగ ప్రకటన నకిలీది స్పష్టం చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దేవాదాయ శాఖ ఉద్యోగ ప్రకటన నకిలీదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సోషల్ మీడియా, వివిధ వెబ్సైట్లలో వస్తున్న వార్తలను ప్రభు త్వం ఖండించింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.కృష్ణప్రసాద్ గురువారం ప్రకటన విడుదల చేశారు.నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ ముద్ర, దేవాదాయ శాఖ పేరుతో నకిలీ నోటిఫికేషన్ను సృష్టించారన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ మే 30 వరకు గడువు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోందని, అయితే తమ శాఖ నుంచి ఎలాంటి ఉద్యోగ ప్రకటన విడుదల కాలేదని స్పష్టం చేశారు. -
ఐటీ @ 11 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. వందలాది అంతర్జాతీ య దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2025 మార్చి నాటికి ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 9.39 లక్షల మంది పనిచేస్తున్నారు.గత ఏడాది చివరినాటికి ఈ సంఖ్య 10.2 లక్షలకు చేరినట్టు అంచనా. కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) రాష్ట్రంలో కొత్తగా అడుగుపెట్టడం, అలాగే ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల విస్తరణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబరుకల్లా ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 11 లక్షల మార్కును చేరుకుంటుందని తెలంగాణ ఐటీ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీసీసీల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 3 లక్షల స్థాయికి చేరిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 16.6 శాతం వార్షిక వృద్ధితో.. రాష్ట్రం నుంచి 2024–25లో రూ.3.13 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయి. కాగా 16.6 శాతం వార్షిక వృద్ధితో 2025–26లో ఇది రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘వేగం, పారదర్శకత’అనే నినాదంతో సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తీసుకొచ్చిన సరికొత్త పరిపాలనా సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, ఐటీ వ్య యాల ఒడిదుడుకులను తట్టుకుని ఎగుమతుల వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఈ యూ, ఏషియా పసిఫిక్ మార్కెట్లలోకి వ్యూహాత్మ కంగా ఎగుమతులు విస్తరించాయని వివరించారు. మూడేళ్లలో కొత్తగా 160 కేంద్రాలు..రాష్ట్రంలో 2023 నాటికి 360 జీసీసీలు కొలువుదీరాయి. దేశంలోని మొత్తం జీసీసీల్లో రాష్ట్ర వాటా 20 శాతంగా ఉందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. జీసీసీల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, ఇక్కడి మానవ వనరులు, మెరుగైన మౌలిక వసతులతో ఈ ఏడాది మరో 80 సెంటర్లు తోడవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్లో అద్దెలు 25–30 శాతం తక్కువ కావడం కంపెనీలకు కలిసి వచ్చే అంశమని చెబుతోంది. -
ఈ శాడిజం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ చేసి పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇప్పించాం. మా చర్యలను ప్రజలు గానీ, కోర్టులు గానీ తప్పుబట్టలేదు. పోక్సో కేసు వివరాలు చెప్పకూడదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దర్యాప్తు అధికారి (ఐఓ) లాగా విచారణ చేసిండు. కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు. వారిలాగా రోడ్లపై పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది? ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టారు (సోషల్ మీడియాలో). రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు? ఒక మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఏదో సాధించినట్టు ఈ శాడిజం ఏమిటి? ఇది శాడిస్టిక్ ఆనందం కాదా?..’అని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ‘అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో కేసు పెట్టడానికి ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మేజర్ అనే వివాదానికి తెరలేపారు. అమ్మాయి మైనరా? మేజరా? అనే ప్రభుత్వ రికార్డులు సేకరించాం. అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ప్రవీణ్కుమార్ ఐఓనా? ఐఓ వెళ్లి స్కూల్లో ఆమె బర్త్ సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్, హాస్పిటల్లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకుని మైనర్ అని తక్షణమే నిర్ధారించారు. ప్రవీణ్కుమార్కు ఉద్యోగం లేదు.. ప్రధాని పర్యటన ఉన్నప్పుడు వారి (బండి సంజయ్) ఇంటిపైకి వెయ్యి మంది పోలీసులను పంపితే తమ పార్టీ (బీజేపీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిందని, తెలంగాణలో గెలుస్తుందని, దీనితో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన చెçప్పుకుంటాడు. సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించాం. ఎక్కడైనా సెక్షన్లలో, అరెస్టులో, రిమాండ్లో, కోర్టులో వాదనల్లో లోపం ఉందా? కేటీఆర్, బండి సంజయ్కి ఏదో పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటున్నడు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచారణాధికారి అనే భ్రమల్లో ఉన్నడు.’అని సీఎం ధ్వజమెత్తారు. కేటీఆర్ బావమరిదికి ఇంకో న్యాయమా? ‘కేటీఆర్ బావమరిదికి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు నోటీసులు ఇచ్చాం. పోక్సో కేసులో బండి భగీరథ్కి నోటీసులు ఇచ్చాం. ఫామ్హౌస్లో డ్రగ్స్ తీసుకుని తన బావమరిది దొరికితే అతడిని వంగబెట్టి గొట్టండి..కోదండం ఎక్కించండి అని కేటీఆర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఎందుకు చెప్పలేదు. మా బామ్మర్ది దీపావళి పండుగ చేసుకుంటున్నడు. చిచ్చుబుడ్లకు బదులు సారాయి బూత్ పెట్టుకున్నడు. బంతిపూలకి బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నడు. మీరు ఎట్ల అరెస్ట్ చేస్తరు అని బయటకి వచ్చి మాట్లాడిండు కదా. బామ్మర్ది డ్రగ్స్తో ఫామ్హౌస్లో పట్టుబడితే కేసు కాదట. ఇంకో ఎమ్మెల్సీ కోడిపందాల్లో దొరికితే కేసు లేదట. దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు..ఆర్థిక లావాదేవీలు, వాళ్ల ఎక్స్ ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్తున్న. వాళ్ల ఫామ్హౌస్లో పోలీసులపై కాల్పులు జరిపి (ఓ వ్యాపారి) డ్రగ్స్తో దొరికిండు. మరి ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ యాడ పండుకుండు? ఎందుకు పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయలేదు ? వాడికి నోటీసు ఇవ్వలేదు. నీతులు చెప్పడానికే ఉన్నయా?. కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ‘కేటీఆర్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేత యాడ నిద్రపోతుండు? బయటకి వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకుంటే ప్రెస్నోట్ అయినా ఇవ్వొచ్చు కదా? పక్క పార్టీ వాడు పార్టీలోకి వస్తే జగిత్యాల పోయివస్తడు. ఇంత మేజర్ ఘటన రాష్ట్రంలో జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయిండు? ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలి కదా. అధికారం ఉంటనే బయటకి వస్తావా?..’అని రేవంత్ ప్రశ్నించారు. మా పోలీసులు చెప్పిందే నమ్ముతా.. ‘బండి భగీరథ్ను అరెస్టు చేశామని మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతా. పిల్లవాడిని వారి ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి సరెండర్ చేయాలి. రోడ్డుపై నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు బండి భగీరథ్ చిక్కిండు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలో తీసుకుంటే సరెండర్ చేశామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? పోలీసుల మాటలా? బండి సంజయ్ దగ్గరుండే పంపించవచ్చు. ఐదు రోజులు పరారీలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా? లేరా?..’అని సీఎం నిలదీశారు. రైతు ఆత్మహత్యపై విచారణకు ఆదేశం మెదక్లో రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబానికి గతంలో కొల్లగొట్టిన ధనం నుంచి రూ.2 లక్షలో రూ.5 లక్షలో ఇస్తారనుకుంటే శవం చూసి పళ్లు ఇకిలిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.కొంతమంది బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు ఉన్నారని, వారి మిల్లులకు లారీల్లో ధాన్యం పంపితే దించనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరడం ఏమిటి? అని ప్రశ్నించారు. కులగణనను సుప్రీంకోర్టు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో మోదీ సర్కార్ కుయుక్తులు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మళ్లీ ఆ బిల్లు పెట్టాలి: సీఎం రేవంత్రెడ్డి లక్డీకాపూల్(హైదరాబాద్): మహిళా రిజర్వేషన్ల బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు మహిళా బిల్లుకు డీలిమిటేషన్తో లింక్ పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వద్ద ఉన్న విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాజీవ్గాంధీ సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణ యంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీ అనిల్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ పాల్గొన్నారు. -
సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీఆర్ఎస్ చేస్తున్న సన్నాహాల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు సమన్వయ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా నియమితులైన ఇన్చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. ఈ మేరకు 119 నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్ గురువారం విడుదల చేశారు. సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణుడికి తెలంగాణ భవన్లో డిజిటల్ పద్ధతిలో నమోదుపై శిక్షణ ఇస్తారు. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న డిజిటల్ యాప్కు తుది మెరుగులు పూర్తయిన తర్వాత త్వరలో ఇది అందుబాటులోకి రానున్నది.ఇదిలా ఉంటే తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కోసం నియోజకవర్గాల్లోని బూత్ల సంఖ్య ఆధారంగా ఒక్కో పోలింగ్ బూత్కు ఇద్దరు చొప్పున స్మార్ట్ ఫోన్ కలిగిన కార్యకర్తలను ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిజిటల్ సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. తొలి రోజున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో పాటు ముఖ్య నేతలు పాల్గొని తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత కమిటీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నారు. -
ఉడుకుతున్న ఊళ్లు
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తీవ్ర స్థాయికి చేరి..నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా మండిపోతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చుంచుపల్లి, కమలాపూర్, ధర్మపురి, మహదేవ్పూర్, గంగధార, కల్లూరు, ఆసిఫాబాద్, మందమర్రి, వెంకటాపూర్, కట్టంగూరు, వేములవాడ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరో 10 ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చురుగ్గా నైరుతి... నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులు తున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు–మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల 26న కేరళను తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. భగ్గుమన్న ఉమ్మడి ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సూర్యుడు పంజా విసిరాడు. రికార్డుస్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఖమ్మం జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 45 డిగ్రీలకుపైగా రెడ్ అలర్ట్ స్థాయిలో నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. – ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, వైరా, భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్, పాల్వంచ మండలం యానంబైల్లో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. – ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, మధిర, కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, బోనకల్ మండలం రావినూతల, మధిర మండలం సిరిపురం గ్రామాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. – సత్తుపల్లి, ముదిగొండ, ఖమ్మం అర్బన్ ప్రకాశ్నగర్, ఎర్రుపాలెం, ఖమ్మం అర్బన్ ఎన్నెస్పీ గెస్ట్హౌస్ ప్రాంతాల్లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. కంటెయినర్లో మంటలు....8 కొత్త కార్లు దహనం తూప్రాన్: కంటెయినర్లో మంటలు చెలరేగి అందులో ఉన్న 8 కొత్త కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. నాగపూర్ నుంచి కాకినాడకు మారుతి సుజుకి కంపెనీకీ చెందిన ఎనిమిది కొత్త కార్లతో కంటెయిన్ వెళుతోంది. తూప్రాన్ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోకి కంటెయినర్ చేరుకోగా, ఇంజిన్లో నుంచి పొగలు రావడం డ్రైవర్ నజీం గమనించాడు. వెంటనే అప్రమత్తమై కంటెయినర్ను రహదారి పక్కకకు ఆగి కిందకు దిగాడు. ఈ క్రమంలోనే లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో ప్రమాద రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా, వాహనాలను దారి మళ్లించారు. అయితే ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రతే కారణమని భావిస్తున్నారు. హార్వెస్టర్ దగ్ధం ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా సమీపాన రోడ్డుపై హార్వెస్టర్ కాలిపోయింది. ఎండవేడికి బ్యాటరీలోని వైరింగ్ ఒక్కసారిగా కాలి మంటలు హార్వెస్టర్ మొత్తం వ్యాపించాయి. దీంతో హార్వెస్టర్ పూర్తిగా కాలి బూడిదయింది. రోడ్డుపై అమ్లెట్ నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై స్థానికుడు ఎస్కె.రఫీసాఫ్ ఆమ్లెట్ వేశాడు. వడదెబ్బతో 8 మంది మృతి – మృతుల్లో ఇంటర్ విద్యార్థి సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8మంది మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన కౌలురైతు పొన్నాల భరత్ (34), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గాదె కొమురమ్మ(90), బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కేస లచ్చమ్మ(90), నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్తండాకు గుగులోత్ అమృత (54), కురవి మండలం రాజోలుకు చెందిన నల్ల లింగయ్య(70), ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మాదరి లక్షి్మ(85), జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ(58) చనిపోయారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బొమ్మిడి వెంకటేశ్(17) నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని టెంట్ హౌస్లో పనికెళ్తున్నాడు. వడదెబ్బకు గురై చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. -
కోటి ఆశలు నెరవేర్చాం!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, వివేక్తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక సంఘాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వారు పనిచేసే గ్రామీణ/పట్టణ ప్రాంతాల ఆధారంగా వారి వేతనాలను సవరించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమ ల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ అనే రెండు జోన్లు ఉండగా, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్–1), మున్సిపాలిటీలు (జోన్–2), గ్రామీణ ప్రాంతాలు (జోన్–3) అనే మూడు జోన్ల ఆధారంగా వేతనాలను ఖరారు చేసింది. స్థానికంగా ఉండే ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలను పెంచింది. జోన్–1లో అన్స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్తో కలిసి గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక వర్గానికి సీఎం ఈ తీపి కబురు వినిపించారు. వారికి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ‘కార్పొరేషన్లలో ఇళ్ల అద్దెలు, ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువ కాబ ట్టి అక్కడ ఎక్కువ వేతనాలను, మున్సిపాలిటీల్లో కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం తక్కువగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనాల పెంపును మే డే రోజే ప్రకటిద్దామనుకున్నా కొందరి సూచనల కోసం ఆలస్యమైంది. కనీస వేతనాల పెంపు అమలు చేయని పరిశ్రమలపై కార్మీక శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. కార్మీకశాఖ ను ఇంకా బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్న పరిశ్రమల్లో 80% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా నిబంధన పెట్టేందుకు అవకాశం ఉంది..’ అని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ భద్రత ‘ఏఐ వచ్చాక వైట్ కాలర్ జాబ్ ఉద్యోగాలొచ్చే పరిస్థితీ, ఉద్యోగ భద్రతా లేదు. చాలా దేశాల్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కోట్లాది మంది ఐటీ రంగ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ చదివితే రూ.లక్ష ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ సాంకేతిక నైపుణ్యంతో కూడిన చదువులతో రూ.2 లక్షల ఉద్యో గం వచ్చే అవకాశం ఉంది. బ్లూకాలర్ జాబ్స్కు ప్రపంచంలో విస్తృత డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయ లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే జర్మనీ, జపా న్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీ దగ్గర నైపుణ్యం కలిగిన వారుంటే పంపాల ని ఈ దేశాలు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఎంత మందిని పంపిస్తారని అడుగుతున్నాయి. ఆ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్కిల్స్ వర్సిటీ, ఐటీసీల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల అప్గ్రేడేషన్తో ప్రభుత్వం పూర్తిగా బ్లూకాలర్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో చేరితే నెలకు రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్లో చేరేవారి కోసం కూడా మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను నేర్పడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. జర్మనీ, చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్లో 80 శాతం మందికి ఆంగ్లం రాదు. సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ నాలుగైదు దేశాలే తీరుస్తున్నాయి. ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. ఏఐ తుపాన్లో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. బ్లూ కాలర్ స్కిల్ నేర్చుకుంటే 100 శాతం జీవిత భద్రత ఉంటుంది..’అని రేవంత్ అన్నారు. గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ ‘ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వ మే శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. స్కిల్స్ వర్సిటీలో ఆరు నెలల శిక్షణ నుంచి నుంచి పాస్పోర్ట్ వెరిఫికేషన్ వరకు వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. గతంలో గల్ప్ కార్మీకులు చనిపోతే శవాలను సైతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాలను తీసుకొస్తున్నాం. గల్ఫ్ ఏజెంట్లు పడగలెత్తి పెద్దపెద్ద పదవుల్లోకి వచ్చారు. కానీ కార్మికులు మోసపోతున్నారు. గల్ఫ్ కార్మీకులకు సంబంధించి త్వరలో మంచి పాలసీతో వస్తాం..’అని సీఎం చెప్పారు. ప్రధాని ప్రతిదీ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కార్మీకుల కోణం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సింగరేణిలో స్థానికులకే 80% ఉద్యోగాలు: మంత్రి వివేక్ సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు కార్మీక శాఖ మంత్రి జి.వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చెబుతున్నామని, హైస్కిల్డ్ ఉద్యోగాల విషయంలో వారిష్టమని అంటున్నామని చెప్పారు. కొత్తగా 56 ఏటీసీలను మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 118కి పెరగనుందన్నారు. -
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో’కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది దాఖలు చేసిన ఉపసంహరణ లేఖను అనుమతించింది. తనపై పేట్బషిరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఉపసంహరణకు అనుమతించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది లేఖను పరిశీలించిన న్యాయమూర్తి అంగీకరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు అనుమతించారు. -
ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన రైతుల సంక్షేమంపై లేఖలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పది మంది రైతులు మృతి చెందారని చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా చనిపోలేదు’ అని స్పష్టం చేశారు.రికార్డు స్థాయి కొనుగోళ్లుఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 5429 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరగా, ప్రభుత్వం 46.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు 7,841 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. మొత్తం 6.3 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో లాభం పొందారు. ధాన్యం తరలింపుకు 13,000 వాహనాలు, నిల్వకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు.బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలుఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, మిల్లర్లతో లాలూచీ, చెల్లింపుల ఆలస్యం జరిగిందని ఆరోపించారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పరిస్థితి వారి అవినీతి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతూ, నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరా పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. -
‘బండి భగీరథ్ లొంగిపోలేదు..పోలీసులే అరెస్ట్ చేశారు’
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.బండి భగీరథ్ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు. -
తెలంగాణలో కార్మికులకు గుడ్న్యూస్.. వేతనాలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కార్మికులను నాలుగు విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. కార్మికులకు ఇది తెలంగాణ ఆవిర్భావ కానుక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పెంచిన వేతనాలు జూన్ రెండో తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యువతకు నా విజ్ఞప్తి. సాంకేతిక నైపుణ్యం పెంచుకోండి. నైపుణ్యం ఉన్న వాళ్లను పంపాలని.. మన ప్రభుత్వాన్ని ఎన్నో దేశాలు సంప్రదిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులకు కనీస వేతనం ఎక్కువగా ఉండాలి. కార్మికుల హక్కులను కాపాడటమే మా లక్ష్యం. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచిన 15 ఏళ్లలో కార్మికులకు వేతన సవరణ చేయలేదు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వచ్చాక కార్మికుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశాం.గతంలో అర్బన్, రూరల్.. రెండే జోన్లు ఉండేవి. ఇప్పుడు మూడు జోన్లు చేశాం. నాలుగు కేటగిరిలుగా కార్మికులను విభజించాం. కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల కోటీ 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారు’ అని చెప్పుకొచ్చారు.వేతనాల పెంపు ఇలా..అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12వేల నుంచి రూ.16వేలకు పెంపు.హైస్కిల్డ్ కార్మికులకు రూ.14,600వేల నుంచి 20వేలకు పెంపు.సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.13590 నుంచి రూ.15వేలకు పెంపు.స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.17వేల నుంచి రూ.18వేలకు పెంపు. -
రాజస్థాన్లోని కోటా తరహాలో ట్రాఫిక్ ఫ్రీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్ రహత నగరంగా మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో..ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని కోటా నగరంలో ప్రస్తుతం సిగ్నల్ ఫ్రీ రహదారులు ఉన్నాయి. ఆ తరహాలోనే మన నగరంలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ‘కేబీఆర్’తో మొదలు.. 800 కిలో మీటర్ల రహదారి నెట్వర్క్ ఉన్న గ్రేటర్లో తొలుత జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఫిల్మ్నగర్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత కారిడార్ను నిర్మించనున్నారు. రోడ్ నంబరు– 45, ఫిల్మ్నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధ జంక్షన్తో సహా కీలక కూడళ్ల వద్ద గ్రేడ్ సెపరేటర్లను ప్రతిపాదించారు. రెండు వేర్వేరు ప్యాకేజీల కింద జీహెచ్ఎంసీ కేబీఆర్ పార్క్ జంక్షన్, బంజారాహిల్స్ చుట్టూ రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లను నిర్మిస్తోంది. కేబీఆర్ పార్క్ భూమిని ఆక్రమించకుండా ప్రతిపాదిత ఫ్లై ఓవర్లు, అండర్పాస్లన్నింటినీ ఇప్పటికే ఉన్న రోడ్డు మధ్యభాగాల్లోనే నిర్మించనున్నారు. అలాగే కాంక్రీట్ నిర్మాణాల కంటే స్టీల్ ఫ్లై ఓవర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో 13.6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల విడుదల నివారణతో వాయు కాలుష్య స్థాయిలను 72 శాతం తగ్గించొచ్చు. ఏటా 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా. సాధ్యమేనా? రాజస్థాన్లోని కోటా నగరం తరహాలో గ్రేటర్లో ఈ విధానాన్ని అమలు చేయడం అంత సులువు కాదని, ఈ ప్రతిపాదన ఆచరణలో అనేక సవాళ్లున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాపడుతున్నారు. 2014లో నగరంలో 42.2 లక్షల వాహనాలు ఉండగా.. తాజాగా వీటి సంఖ్య 94.16 లక్షలు దాటింది. నగరంలో సగటున ప్రతిరోజూ 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈమేరకు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇలా చేస్తే బెటర్.. నగరం మొత్తాన్ని సిగ్నల్ రహితంగా మార్చడం కాకుండా కీలక కూడళ్ల వద్ద దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తొలగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి ఆరి్టఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగిస్తే కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని బట్టి వాహనాల వెయిటింగ్ సమయం ఆటోమేటిక్గా మారుతుంది.లాభమేంటంటే? సిగ్నల్ ఫ్రీలతో ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతీ లైన్కూ ప్రత్యేకంగా రహదారి ఉంటుంది. దీంతో జంక్షన్లో ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్ గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అవసరం ఉండదు. దీంతో ప్రధాన నగరంలో రహదారి భద్రత మెరుగవడంతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వినియోగం ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ‘కోటా’ కథ ఇదీ..15 లక్షల జనాభా ఉన్న కోటా నగరం 2022లో దేశంలోనే తొలి సిగ్నల్ రహిత నగరంగా అవతరించింది. సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో వందకు పైగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, రౌండ్ అ»ౌట్లు, రోటరీలు, రింగ్రోడ్లను పునరి్నరి్మంచారు. కోటాలోని సుమారు 12 ప్రధాన కూడళ్లలో రోజుకు 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. -
HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మదీనాలోని ఎస్వైజే వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చెలరేగిన కాంప్లెక్స్లో వందకు పైగా దుకాణాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. -
తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై లైంగిక దాడి
మేడ్చల్ జిల్లా: తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై అల్వాల్ పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మచ్చ»ొల్లారంలో నివసించే ఓ మహిళ (33) మహిళ భర్తకు దూరంగా ఉంటూ 15 సంవత్సరాల కూతురితో కలిసి నివాసముంటోంది. స్థానికంగా ఉండే దుర్గాప్రసాద్ (34) తో సహజీవనం చేస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయలో దుర్గాప్రసాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
అత్తాపూర్ లో యువతి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్
అత్తాపూర్: రోడ్డుపై అందరూ చూస్తుంగానే అత్తాపూర్లో మంగళవారం రాత్రి ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. నలుగురు యువకులు నెంబర్ లేని థార్ కారులో జాయ్ హాస్పిటల్ వద్ద యువతిని బలవంతంగా తీసుకొని వెళ్లారని స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కారును అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వెంబడించే ప్రయత్నం చేయగా పరారయ్యారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యువతి కిడ్నాప్ అయిందా? లేక వేరే కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అమ్మాయి ఇంట్లోనే ఉందిదర్యాప్తులో యువతి ఎవరనేది తెలిసిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు యువతి మలక్పేట్లోని ఇంట్లోనే ఉందని తెలుసుకున్నారన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సందర్భంగా గొడవ పడ్డారన్నారని... ఆ తరువాత క్యాబ్లో బయలుదేరగా అత్తాపూర్లోని జాయ్ అస్పత్రి వద్ద దిగిందన్నారు. అక్కడినుంచి స్నేహితులే కారులో తీసుకెళ్లారని వివరించారు. స్నేహితుల స్టేట్మెంటును నమోదు చేశామని తెలిపారు. -
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్రెడ్డినగర్లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దురి్వనియోగంపై గృహనిర్మాణ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించకున్నా..ఏళ్లతరబడి తాళాలు వేసి ఉంచినా..ఇతరులకు అద్దెకిచి్చనా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఇప్పటికే రెండుసార్లు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించని వారిపై తుది నోటీసుల అస్త్రం సిద్ధమైంది. చివరి గడువు ముగిసేలోపు వివరణ ఇచ్చి సదరు లబి్ధదారులు ఇళ్లలోకి చేరని పక్షంలో వారి కేటాయింపులను తక్షణమే రద్దు చేసి ఆ నివాసాలను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ గృహాల తాళాలు తెరుచుకుని అసలైన నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా గృహనిర్మాణ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియ సరికొత్త మలుపు తిరుగుతోంది గతంలో ఇదీ పరిస్థితి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టులో భాగంగా..సుమారు 111 ప్రాంతాలలో 68,176 వేల పైచిలుకు గృహాల నిర్మాణాలు పూర్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 63,982 ఇళ్లను అధికారికంగా పంపిణీ చేసింది. ఇక గతంలో ఇతర శాఖల పరిధిలో ఉన్న డబుల్ ఇళ్ల ప్రాజెక్టులను ఇప్పుడు గృహనిర్మాణ శాఖ పరిధిలోకి మార్చారు. 19 వేల కుటుంబాలకు పైనే... గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఇటీవల గృహనిర్మాణ శాఖ దృష్టిసారించింది. నగర శివారులోని కొల్లూరులో సుమారు 15,660 ఇళ్లు ఉండగా..ఇక్కడ చాలా ఇళ్లకు తాళం వేసి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల కేటాయింపులు జరిగి రెండేళ్లవుతున్నా లబి్ధదారులెవరూ ఇళ్లల్లో చేరలేదు. వీటిని అన్ ఆక్యుపైడ్గా గుర్తించారు. రాంపల్లి, దుండిగల్, అహ్మద్గూడ, మాన్సాన్పల్లి, శంకర్పల్లి, నల్లగండ్ల, నార్సింగ్, అబ్దుల్లాపూర్మెట్ తదితర నివాస సముదాయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హౌసింగ్ శాఖ క్షేత్రస్థాయి భౌతిక సర్వే చేపట్టగా..సుమారు 19 వేల మంది లబి్ధదారులు కేటాయించిన ఇళ్లలో నివసించకుండా వాటికి తాళాలు వేసి ఉంచడం, ఇతరులకు అద్దెకు ఇచి్చనట్లు బహిర్గతమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సదరు లబి్ధదారులకు కఠిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వారికి రెండు నోటీసులు జారీ చేయగా, కొందరు స్పందించారు. మూడో నోటీసుకు స్పందించి ఇళ్లలో చేరని పక్షంలో ఆ కేటాయింపులు రద్దు చేసి ఇళ్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించారు. -
Hyderabad: రూ.8 లక్షలిస్తేనే ఎస్ఐ పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లోని ఓ ఖరీదైన పోలీసు కమిషనరేట్ పరిధి ఠాణాలో ఎస్ఐ పోస్టింగ్ కావాలంటే రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే. ఓ జోన్ ఉన్నతాధికారి ఈ రేటు నిర్ణయించి పలువురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ), సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ)లతో కలిసి డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కమిషనరేట్ నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ఇన్స్పెక్టర్ల బదిలీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కమిషనరేట్లో ప్రతి ఠాణా నుంచి ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఇతర జోన్కు బదిలీ అయ్యారు. ఈ బదిలీల వెనుక ముడుపుల వ్యవహారం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం అంతర్గత విచారణ చేపట్టి ముడుపుల వ్యవహారం నిజమేనని తేల్చింది. ఆయా పోలీసు అధికారుల లావాదేవీలు, ఇతరత్రా అంశాలను నిర్ధారించేందుకు ముడుపుల నివేదికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫుల్ డిమాండ్.. ఈ ఖరీదైన జోన్లోని ఠాణా పోస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ పోస్టింగ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందనే భావన పలువురు పోలీసుల్లో ఏర్పడింది. దీంతో ఈ జోన్ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ల కోసం నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈక్రమంలో ఓ డివిజన్లోని రెండు ఠాణాల ఎస్హెచ్ఓలు, మరో డివిజన్లోని ఒక ఎస్ఐ ఖరీదైన జోన్ ఉన్నతాధికారితో జట్టు కట్టారు. బదిలీ అయిన వారి స్థానంలో పోస్టుల కావాలనుకునే వారితో డీల్ కుదుర్చుకున్నారు. అయితే సదరు ఎస్ఐలు బదిలీ అయ్యారు గానీ వీరి స్థానంలో కొత్త వారికి పోస్టింగ్లు ఆగిపోయాయి. దీంతో ఈ కమిషనరేట్లోని అన్ని ఠాణాలలో ఎస్ఐల కొరత ఏర్పడింది. సెక్టార్ ఎస్ఐలు లేకపోవడంతో నేరస్తుల కదలికలపై నిఘా కొరవడడంతో పాటు కేసుల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
‘కుర్చీతాత’ కాలా బాషా కన్నుమూత
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా వైరలైన.. హీరో మహేష్బాబు సినిమా ‘గుంటూరు కారం’లోని ‘ఆ కుర్చీని మడతపెట్టి’పాటకు పరోక్షంగా కారణమైన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) బుధవారం మృతి చెందాడు. దీంతో సోషల్ మీడియా పలువురు నివాళులర్పిస్తున్నారు.ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తమ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ కుర్చీని మడత పెట్టి అనే పదం వాడాడు కాలా బాషా. అది అలా సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్లింది. అనంతరం ‘గుంటూరు కారం’సినిమాలో ఆ పదంతో పాట వచ్చి సంచలనం సృష్టించింది. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్స్ వేసేవరకు వెళ్లింది. బోరబండ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటూ.. రోజూ యూసుఫ్గూడ, కృష్ణకాంత్పార్క్ పరిసరాల్లో తిరుగుతుండేవాడు. బస్సులు ఎక్కి ఇంగ్లీష్లో డబ్బులు అడుక్కునేవాడు. అలా ఓ ఇంటర్వ్యూలో కుర్చీని మడతబెట్టి ... డైలాగ్తో కాలా బాషా కుర్చీతాతగా ప్రాచుర్యం పొందాడు. సోషల్ మీడియాలో మీమ్గా వైరల్ కావడంతో పలువురు ఇంటర్వ్యూలు చేసేవారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయాడు. బాషాకు మద్యం అలవాటు ఉంది. పలుసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఇంతకు ముందు కూడా కాలా బాషా చనిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే వైజాగ్ సత్యలాంటి వాళ్లు అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక బుధవారం సాయంత్రం కృష్టకాంత్ పార్క్ వద్ద స్పృ హ తప్పి పడిపోయాడు. అక్కడివారు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేయగా ఇంటికి తీసుకెళ్లాక మృతి చెందాడు. -
తెలంగాణపై భానుడి ప్రతాపం.. ఒక్కరోజే 9 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రం అగ్ని గుండమైంది. ఎండ తీవ్రతకు జిల్లాలన్నీ అల్లాడిపోయాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బతో 9మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లికి చెందిన మహిళా రైతు నెర్రగడ్డం లచ్చవ్వ (55), వేములవాడ మండలం ఆరెపల్లికి చెందిన ఎంగె రాజిరెడ్డి (60) భీమన్న, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్కు చెందిన కందుకూరి రాజమ్మ (83), ధర్మారం మండలం నర్సింగాపూర్కు చెందిన రైతు సామ లచ్చిరెడ్డి (60), పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కనుకుంట్ల కనకయ్య (75), హుజూరాబాద్లోని 21వ వార్డుకు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీశ్ (45) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలం అర్పనపల్లికి చెందిన వృద్ధుడు నేరెళ్ల సోమయ్య(72), ములుగు మున్సిపాలిటీ పరిధి ప్రేమ్నగర్కు చెందిన పారిశుధ్య కార్మికుడు బోడ సాంబయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెల్బీడ్ గ్రామానికి చెందిన దాసరి హన్మంతు (50) వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం నుంచే వడగాలుల తీవ్రత తెలంగాణ అంతటా హీట్వేవ్ విస్తరించింది. ఉదయం నుంచే వడగాలుల తీవ్రతతో బుధవారం ఉత్తర, సెంటల్ర్ తెలంగాణ జిల్లాలు హడలిపోయాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 18 జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రాష్ట్రమంతటా సాధారణం కంటే 5–6 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండటంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో కూడా ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వృద్ధులు,పిల్లలు, గర్భిణులతో పాటు అనారోగ్యంతో ఉన్న వారు బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరించారు. కాలిన మోటార్ సైకిల్.. ఆర్టీసీ బస్సు టైరు నుంచి పొలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్ అటవీ ప్రాంతం గుండా మోటారుసైకిల్పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మోటార్సైకిల్పై ఉన్న మరో మహిళ, ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్నారు. మోటార్ సైకిల్ కాలిపోయింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు టైరు నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది. -
పని 'పాడ్' అవకుండా..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం కొత్తగా ప్రైవేట్ వర్క్స్పేస్ పాడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేసేవారు, వృత్తి నిపుణులు, సుదీర్ఘ ప్రయాణాల్లో భాగంగా మధ్య మధ్య విమానా శ్రయంలో గంటల సమయం గడిపే ట్రాన్సిట్ ట్రావెలర్స్, ప్రశాంతంగా పని చేసుకునేందుకు ఈ ప్రత్యేక పాడ్స్ను ఏర్పాటు చేశారు. మియో పాడ్స్ డాట్ స్పేస్ అనే స్టార్టప్ ఈ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి తొలిదశలో బోర్డింగ్ గేట్ 9, గేట్ 10 సమీపంలో నాలుగు ప్రైవేట్ పాడ్స్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకొని వెంటనే వినియోగించుకోవచ్చు. అంతేకాదు ముందస్తుగా 7 రోజుల వరకూ రిజర్వేషన్ చేసుకొని వినియోగించుకునే సౌకర్యం కూడా కల్పించారు సౌండ్ ప్రూఫ్... సరైన వెంటిలేషన్ఈ పాడ్స్ను పూర్తి సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. శబ్ద నిరోధక వ్యవస్థ, సౌకర్యవంతమైన సీటింగ్, చార్జింగ్ పోర్టులు, వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. విమానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో సమావేశాలు, వీడియో కాల్స్, వ్యక్తిగత చర్చలు లేదా కార్యాలయ పనులకు ఎటువంటి అంతరాయాలు, ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ఈ సందర్భంగా మియో పాడ్స్ వ్యవస్థాపకుడు వికాస్ సెఠియా మాట్లాడుతూ ప్రయాణ సమయాన్ని కూడా ఉత్పాదకంగా మార్చాలనే ఆలోచనతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రారంభ ట్రయల్స్ సమయంలోనే 2,000 మందికి పైగా ప్రయాణి కులు స్కాన్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 30 నిమిషాల వినియోగానికి రూ.299 (జీఎస్టీ కలిపి) చార్జ్ చేస్తున్నారు. ఈ సేవలను తర్వాత ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో కూడా విస్తరించే ప్రణాళికలో సంస్థ ఉన్నట్టు సమాచారం.విశ్రాంతితో నిద్రపోవచ్చు ఇటీవలే ట్రాన్సిట్ ప్రయాణికులకు విశ్రాంతి సౌకర్యాన్ని అందించేందుకు రెస్టింగ్ పాడ్లను ప్రారంభించారు. విమానాల మధ్య విరామం కోరుకునే వారికి, జేపాడ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ పాడ్లు అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయం లోపల ఏర్పాటు చేసిన ఈ రెస్టింగ్ పాడ్లు, టెర్మినల్లోనే ఉండడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి విమానాశ్రయం బయటకు వెళ్లడం లేదా హోటల్ గదిని బుక్ చేసుకోవడం ఇష్టం లేని, సుదీర్ఘ లేఓవర్లు ఉన్న ప్రయాణికులకు ఉపయుక్తంగా మారాయి. ఇందులో ఇద్దరు చొప్పున ఉండేందుకు ఆరు ప్రైవేట్ పాడ్లు, ప్రత్యేకంగా మహిళల కోసం ఎనిమిది పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాడ్ ఉంది. విమాన టికెట్లు లేని సందర్శకులు కూడా పాడ్ను బుక్ చేసుకునే అవకాశం అందిస్తుండడం విశేషం. గంటకు రూ.500 ఆపైన ధరలో ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ర్యాంకుల్లో కనపడని 'మార్కు'!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఎప్సెట్ ర్యాంకుల్లో వెనుకబడ్డారు. సాధారణ మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇది ఏ కొద్దిమందికో పరిమితం కాలేదు. దాదాపు 70 వేల మంది ఈ కోవలో ఉన్నారు. ఇటీవల వెల్లడైన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) ఫలితాల్లో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ పరిస్థితిపై ఇంటర్ విద్య వర్గాలు దృష్టి పెట్టాయి. ప్రైవేటు కాలేజీల్లో క్షణం విరామం లేకుండా చదివి, ఇంటర్ మార్కుల్లో 90 శాతంపైగా స్కోర్ చేసినా, పోటీ పరీక్షలో వెనుకబడటంపై అన్ని వర్గాలు ఆలోచనలో పడ్డాయి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచించాలని రాష్ట్ర విద్యా కమిషన్ భావిస్తోంది. అనేక కాలేజీలు ఇంటర్ ఫలితాల ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, బోర్డు పరీక్షలకు అవసరమైన ప్రశ్నలపైనే శిక్షణ ఇస్తూ, సబ్జెక్టులపై లోతైన అవగాహన కల్పించడంపై తగిన శ్రద్ధ చూపడం లేదని కమిషన్ అభిప్రాయపడుతోంది. కాన్సెప్ట్ ప్రశ్నల్లో కంగారు ఎప్సెట్లో ఇచ్చే ప్రశ్నలను సాధారణ, మధ్యస్థ, కఠిన అనే మూడు కేటగిరీలుగా విభజించారు. సాధారణ ప్రశ్నలన్నింటికీ 30 సెకన్లలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యస్థ ప్రశ్నలకు 40 సెకన్లు, కఠిన ప్రశ్నలకు నిమిషం వరకూ సమయం తీసుకునేలా ప్రశ్నపత్రం సెట్ చేస్తారు. మధ్యస్థం, కఠిన ప్రశ్నలన్నీ బేసిక్ కాన్సెప్ట్ (సబ్జెక్టు ప్రాథమిక అంశం) నుంచే ఉంటాయి. మెరిట్ విద్యార్థులు ఇక్కడే వెనకబడుతున్నారు. 990 మార్కులు వచ్చినా, బేసిక్ కాన్సెప్ట్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని జాతీయ పోటీ పరీక్షల సీనియర్ అధ్యాపకుడు శంకర్ రాంబొట్ల తెలిపారు. గణితంలో జరిగే ఈ పొరపాటు ఫిజిక్స్లోనూ కొనసాగుతోంది. ఇంటర్లో 900కు పైన మార్కులు వచ్చిన దాదాపు 40 వేల మంది విద్యార్థులు ఎప్సెట్లో 40 నుంచి 60 వేల ర్యాంకులకు పరిమితం అవ్వడం ఇంటర్ విద్య నాణ్యతను ప్రశ్నిస్తోందని మేథ్స్ అధ్యాపకుడు వీరేంద్ర పాటిల్ అన్నారు. బేసిక్స్ నేర్పకుండా ఇంటర్లో వివరణాత్మక సమాధానాలివ్వడంపైనే కాలేజీలు దృష్టి పెడుతున్నాయని, దీనివల్ల ఇంటర్లో మంచి మార్కులు వస్తున్నా, కాన్సెప్్టతో కూడిన ఎప్సెట్లో వెనుకబడుతున్నారని పాటిల్ తెలిపారు. గెస్ వర్క్తో గోవిందా! ఇంటర్లో 970కి పైగా మార్కులు వచ్చిన దాదాపు 4,800 మంది విద్యార్థుల ర్యాంకులు 25 నుంచి 35 వేల మంది వరకు ఉన్నాయి. వీళ్ళంతా ప్రశ్నలకు సమాధానాలు ఊహించి రాయడం ద్వారా బోల్తా కొట్టినట్టు ఓ కార్పొరేట్ కాలేజీ అధ్యాపకులు రాంప్రసాద్ సువర్చల తెలిపారు. కాలేజీ స్థాయిలో ఎక్కువ మార్కుల కోసం వివరణాత్మక సమాధానాలపైనే వీళ్ళు ఎక్కువగా ఆధారపడ్డారు. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఇదే విధానం సరైందని భావిస్తుంటారు. దీంతో ఎప్సెట్లో ముందుగా కఠిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపై దృష్టి పెడుతున్నారు. సబ్జెక్టుపై లోతైన అవగాహన లేకపోవడంతో సమాధానాలు రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇచ్చే ఐచ్ఛికాల్లోనూ తప్పులు దొర్లడం పరిపాటిగా మారింది. ఇక మిగిలిన సమయంలో సాధారణ, మధ్యస్థ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. సమయం సరిపోని కారణంగా ఊహించి ఐచ్ఛికాలు ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నారు. గెస్ సరైంది కాకపోవడం, కఠిన ప్రశ్నల్లో స్కోర్ తగ్గడంతో ర్యాంకులు పడిపోతున్నాయని సీనియర్ ఇంటర్ అధ్యాపకుడు రాపర్తి వర్మ విశ్లేషించారు.ఇంటర్లో సాధారణ ప్రతిభ కనబరిచే విద్యార్థి కొన్ని చాప్టర్లైనా కాన్సెప్ట్ స్థాయిలో నేర్చుకుంటు న్నాడు. ఎప్సెట్లో సాధారణ ప్రశ్నలకు ఆత్మస్థైర్యంతో సమాధానాలు ఇస్తున్నాడు. ఇలా ఇంటర్లో 700కు పైగా మార్కులు వచ్చిన 28 వేల మంది వరకూ ఎప్సెట్లో 15 నుంచి 20 వేల ర్యాంకులు పొందగలిగినట్టు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. -
ఫ్యూచర్ సిటీలో వెంటనే నిర్మాణాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూ కేటాయింపులు జరిపిన వెంటనే ఆయా పరిశ్రమలు నిర్మాణాలు ప్రారంభించాలనే నిబంధన తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక వాడలో వివిధ కంపెనీలు తమ ప్రాంగణాల్లో జూన్లో భూమి పూజలు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు వీలైన అన్ని చర్యలు చేపట్టాలి. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్ రూపొందించాలి. ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలి. గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్గా నియమించే అంశాన్ని పరిశీలించాలి. హైదరాబాద్ బయట కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలి.నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..’అని సీఎం ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో పరిశ్రమల శాఖ, ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో విధానాలు ‘భారత్ ఫ్యూచర్ సిటీ (బీఎఫ్సీ)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్ జీరో విధానాలు అమలు చేయాలి. ఎక్కడా రాజీ పడొద్దు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకుని రావాలి. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలి. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలి. ‘‘బియాండ్ క్యూర్‘ (కోర్ అర్బన్ రీజియన్కు ఆవలి) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేనిచోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని కూడా అధ్యయనం చేయాలి. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలి. కేంద్రం ప్రకటించిన ఐదు హెల్త్ క్లస్టర్లలో ఒకటి ఫ్యూచర్ సిటీ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐ సిటీలో పనులు వెంటనే ప్రారంభించాలి ‘ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీలో పనులను వెంటనే ప్రారంభించాలి. ప్రపంచంలోనే గొప్ప ఏఐ సదుపాయాలుండేలా చూడాలి. ఇక్కడ స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలి. 1,500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి. డేటా సిటీ నీటి అవసరాల కోసం మురుగునీటి నిర్వహణ ప్లాంట్లను (ఎస్టీపీలను) వినియోగించాలి. జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలి. ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలి. బుల్లెట్ రైల్ కోసం భూ సేకరణ వెంటనే ప్రారంభించాలి. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్కు కనెక్ట్ కావాలి..’అని సీఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే టీ ఫైబర్కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమీక్షలో ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, టీజీఐఐసీ వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కమలం.. కొత్త టీమ్!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఈ ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు జాతీయ పార్టీ వర్గాల సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసి తెలంగాణ గడ్డ మీద కచ్చితంగా కాషాయజెండా ఎగురవేసే దిశగా బీజేపీ హైకమాండ్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూడునాలుగు నెలలకు ఒకసారి జరిగే పూర్తిస్థాయి కేంద్ర కేబినెట్ భేటీ–కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులతో సహా) గురువారం జరగనుంది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులుచేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం 72 మందితో కేబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కు సంబంధించి ఇదే చివరి సమావేశం కావొచ్చునని కూడా రాజకీయంగా ఊహాగానాలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పుచేర్పులలో తెలంగాణకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. పైగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా జాతీయ నాయకత్వం తన చేతుల్లోకి తీసుకోనుంది. ఢిల్లీ నుంచే వ్యవహారాలు నడిచేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ నాయకుల సమాచారం. 2029 ఎన్నికల నేపథ్యంలో... తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి లక్ష్యసాధనకు ఇప్పటి నుంచే సిద్ధం అయ్యేందుకు కొత్త టీమ్ను సిద్ధం చేసుకోవాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలకు రెండు గవర్నర్ పదవులతోపాటు కేంద్ర కేబినెట్ మార్పుచేర్పులలో రెండు కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయని తెలిసింది. మంత్రి పదవులు దక్కని వారికి జాతీయ కార్యవర్గం, కమిటీల్లో అవకాశం, పలువురికి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల డైరెక్టర్ పోస్టులు, ఆయా కేంద్ర బోర్డులలో సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కొచ్చొనని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోశ్కు ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల్లో యువతను ప్రాధాన్యం కల్పించి చురుకుగా, ప్రభావవంతంగా కార్యక్రమాలు చేపట్టే దిశలో ముందుకు సాగాలని భావిస్తున్నట్టు తెలిసింది. బండి భగీరథ్పై పోక్సోకేసు నమోదుతో బండి సంజయ్ను కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ రకమైన ప్రచారం పార్టీపై, నేతలపై ఏ మేరకు ప్రతికూల ప్రభావం చూపుతుందనే దానిపై పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. రాంచందర్రావుకు ఢిల్లీ పిలుపు జాతీయస్థాయిలో చోటుచేసుకోనున్న పరిణామాలకు సూచనగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు ఢిల్లీ నుంచి పిలుపురాగా, బుధవారం అత్యవసరంగా ఆయన హస్తినకు వెళ్లారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, భగీరథ్పై వచ్చిన ఆరోపణలు, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అనంతరం రాష్ట్రంలో, పార్టీలో చోటుచేసుకున్న మార్పుచేర్పులు, దాని ప్రభావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకంగా, పార్టీపరంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై రాంచందర్రావు నివేదికలు సమరి్పంచినట్టుగా తెలిసింది. దీనికి అనుగుణంగా జాతీయ నాయకత్వం కూడా తగిన చర్యలు చేపట్టొచ్చని తెలుస్తోంది. -
ప్రీ యాక్టివేషన్పై యాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను ఛేదించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైౖమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డుల నెట్వర్క్పై ఉక్కుపాదం మోపింది. వివిధ నేరాల్లో వినియోగించిన 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా ముందుకెళ్లిన 18 ప్రత్యేక బృందాలు 13 రాష్ట్రాల్లో ఏడు రోజులు దాడులు నిర్వహించి 66 మంది నిందితులను అరెస్టు చేశాయి. వీరి నుంచి 544 సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నాయి. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం ఆ వివరాలు ప్రకటించారు. అరెస్టు అయిన వారిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారని ఆయన వివరించారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్టు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన బాధితులు మోసపోయిన మొత్తం రూ.101.87 కోట్లుగా ఉంది. ఈ సైబర్ నెట్వర్క్ను ఛేదించడంలో సైబర్ క్రైౖమ్ డీసీపీ వి.అరవింద్బాబు, ఏసీపీ ఆర్జీ శివమారుతి కృషి చేశారు. వివిధ టెలికం నెట్వర్క్ పీఓఎస్ ఏజెంట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న 20 మంది పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్–ఐడియాకు చెందినవారు 10 మంది, ఎయిర్టెల్కు చెందినవారు ఏడుగురు, జియోకు చెందినవారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో ‘నెట్వర్క్ సరిగా లేదు’, ‘సర్వర్ డౌన్ అయ్యింది’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’అంటూ చెబుతున్న ఏజెంట్లు రెండు, మూడు బయోమెట్రిక్లను తీసుకుంటున్నారు. క్యాంపులు ఏర్పాటు చేసి మరీ దందా... మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి మరీ తమ పని కానిచ్చుకుంటున్నారు. తమకు కమిషన్తోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో దళారులు ఈ దందా చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ–సిమ్లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. ఈ ఇండియన్ నంబర్లతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతోపాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ‘సెక్స్టార్షన్’ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే ‘డిజిటల్ అరెస్ట్’ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. ఇదంతా పక్కా వ్యూహంతో జరుగుతోంది. ఈ ‘ఘోస్ట్ సిమ్’నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. త్వరలో ఎయిర్టెల్, జియో, వోడాఫోన్–ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇలా సరిచూసుకోండి మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వ పోర్టల్ (https://tafcop.sancharsaathi.gov.in) ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ ’సంచార్ సాథీ’పోర్టల్ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి. సైబర్ బాధితులుగా మారితే వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి లేదా (www.cybercrime.gov.in))లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీసులు అందిస్తున్న ‘సి–మిత్ర’సేవలను కూడా సది్వనియోగం చేసుకోండి. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ సీపీ -
ఏటేటా భూముల విలువల సవరణ
సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల విలువలను ఏటా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అమల్లో ఉన్నందున, మన దగ్గరా ఏటేటా విలువలను సవరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ చేసిన సిఫారసులు కూడా దీన్ని బలపరుస్తుండడంతో త్వరలోనే సవరించనున్న విలువలను భారీ స్థాయిలో పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఏటా సవరించే విధానాన్ని అమల్లోకి తేవాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రాష్ట్రంలో విలువలను సవరించి నాలుగేళ్లు దాటడంతో పెద్దఎత్తున కసరత్తు చేసి ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోందని, తద్వారా ప్రజలపై భారం పడుతుందనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని, అదే ఏటా సవరిస్తే ప్రజలపై భారం పడినట్టు కూడా ఉండదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న విలువలను మరో రెండుసార్లు సవరిస్తే బహిరంగ మార్కెట్ విలువలకు దాదాపు సరితూగే విధంగా రిజిస్టర్ విలువలు కూడా చేరుతాయని, ఆ తర్వాత పెంపు చాలా స్వల్పంగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ, తక్కువ కాకుండా ఈనెల 26 లేదా 28వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్న భూములు, ఆస్తుల కొత్త విలువల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,200–1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా, ప్రస్తుతం భూభారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల అప్లోడింగ్ ప్రక్రియ జరుగుతోంది. గ్రామాల వారీగా నిర్ధారించిన విలువలను ఇప్పుడు సర్వే నంబర్ల వారీగా విభజించే పనిలో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఈనెల 23 లేదా 25 తేదీల్లో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త విలువలకు కమిటీల ఆమోదం తీసుకోనున్నారు. ఈ సమావేశాలు జరిగిన దాన్ని బట్టి ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి కొత్త విలువలను అమల్లోకి తేనున్నారు. ఆ రెండు విలువలు.. పెద్దగా మార్పు లేనట్టే ప్రస్తుతం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న కొత్త విలువలను పరిశీలిస్తే..వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్ల విలువలను పెద్దగా సవరించడం లేదని తెలుస్తోంది. ఈ రెండు కేటగిరీల్లో గరిష్ట విలువలు గతంలో మాదిరిగానే ఉంటాయని సమాచారం. వ్యవసాయ భూముల కనిష్ట విలువను కూడా 100 శాతం పెంచడం లేదని సమాచారం. ఇక, అపార్ట్మెంట్లకు ఇప్పుడు కనీస ధర చదరపు అడుగుకు రూ.1,300 ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచుతున్నారు. ఇక, గరిష్టంగా ఉన్న రూ.7,500 విలువను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇక, ఓపెన్ప్లాట్ల విషయంలో గరిష్ట విలువ ప్రస్తుతం రూ.93 వేలు ఉండగా, దాన్ని రూ.1.20 లక్షలకు లోపుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జరిగే మార్పుల ద్వారా అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లలో పెద్దగా ఆదాయంలో మార్పు ఉండదని, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల మధ్యస్త విలువల పెంపు ద్వారానే అదనపు ఆదాయం సమకూరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
శాంతి భద్రతలపై అలసత్వం సహించను
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పావిలియన్లో పోలీసుశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్తోపాటు పోలీసు కమిషనర్లు, ఐజీ ర్యాంక్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలీసు శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని అన్నారు. ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీకి సూచించారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మెరుగుపడాలని, జిల్లా హెడ్క్వార్టర్ దాటితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తేల్చి చెప్పారు. అన్ని స్టేషన్లలో క్యూఆర్ కోడ్ అన్ని పోలీసు స్టేషన్లలో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇక నుంచి క్రైమ్ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఎస్పీలు జిల్లా పర్యటనలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని చెప్పారు. నైట్ పెట్రోలింగ్ను బలోపేతం చేయాలని, రౌడీషీట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలం చెల్లిన ఆయుధాలను పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని, డ్రోన్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్లు డ్రగ్స్, గంజాయిపై కఠినచర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్పై పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, అగి్నప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకొని ఫైర్ డిపార్ట్మెంట్పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. మ్యాన్హోల్స్ నిర్వహణపై పోలీసు, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని, పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
బడ్జెట్ బాబు.. ఖాళీ జేబు
హైదరాబాద్లోని రామాంతాపూర్లో అద్దె ఇంట్లో నివసించే మన ‘బడ్జెట్ పద్మనాభం’ నవీన్కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య గృహిణి కాగా, ఇద్దరు పిల్లలు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఆయన నెలవారీ జీతం సుమారు రూ.50 వేలు. ఇంటి అద్దె, ఈఎంఐలు, టూవీలర్కు పెట్రోల్, ఇతర నెలవారీ ఖర్చులు పోగా రూ.3 వేలు చిట్టీ (పొదుపు) కడుతున్నాడు. అయితే అటు గ్యాస్ ఇటు పెట్రో ధరల పెంపుతో ఆయన నెలవారీ బడ్జెట్ ఛిన్నాభిన్నం అయ్యింది. పాలు, పెరుగు, కిరాణా, కూరగాయలు తదితర నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతుండటంతో నవీన్కుమార్ లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న చమురు ధరలు, తదనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటి ఖర్చులు ఎలా నెట్టుకు రావాలో తెలియక సతమతమవుతున్నారు. చాలీచాలని జీతం, అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులతో సగటు జీవి అతలాకుతలం అవుతు న్నాడు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెంపు ప్రభావం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిపైనా పడుతోంది. క్రూడాయిల్ ధర పెంపుతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కాగా క్రూడాయిల్ ఆధారంగా తయారయ్యే ప్లాస్టిక్, ఇతర పారిశ్రామిక సామగ్రి ధరలు పెరిగాయి. ఇదే సమయంలో డీజిల్ ధర పెంపు కూరగాయలు, కిరాణా, పాలు, పెరుగు తదితర నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపించింది. ఆయా వస్తువుల ధరలన్నీ పెరిగిపోవడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ లెక్క తప్పుతోంది. కూలీ నుంచి కార్మికుడి వరకు, ఆటో డ్రైవర్ ఉంచి సాధారణ వేతన జీవి వరకు.. పెరిగిన ముడి చమురు ధరల చట్రంలో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితి ఉంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమ బెంగాల్తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన కంపెనీలు వారం వ్యవధిలో రెండుసార్లు లీటర్కు దాదాపు రూ.4 మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. త్వరలో మరింత పెరుగుతాయనే అంచనాలూ ఉన్నాయి. ఇది వాహనదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుండగా.. పరోక్షంగా అన్ని వర్గాల ప్రజలపై పడింది. పాలిథిన్ కవర్ నుంచి ప్లాస్టిక్ కుర్చీల వరకు, ఎలక్ట్రికల్ వైర్లు నుంచి ఎరువుల తయారీ వరకు అనేక ఉత్పత్తుల తయారీలో క్రూడాయిల్ కీలక ముడి పదార్థంగా ఉండటంతో ధరల పెరుగుదల అన్ని వస్తువులపై ప్రభావం చూపుతోంది. ఇక రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కూరగాయలు, కిరాణా, పాలు లాంటి నిత్యావసరాలతో పాటు ప్యాకేజింగ్ వస్తువులు, నిర్మాణ సామగ్రి, డిటర్జెంట్లు, పెయింట్లు.. ఇలా ప్రతి రంగంలో వస్తువులు, సామాగ్రి ధరలు పెరుగుతున్నాయి.ప్రతి వంటింటిపై భారంఇంధన ధరల పెంపు ప్రభావం సామాన్యుడి వంటింటి ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తోంది. కూరగాయలు, పాలు, నూనెలు, కిరాణా సరుకుల ధరలు పెరుగుతుండటంతో గృహిణులు తల పట్టుకుంటున్నారు. గత నెల వరకు రూ.500లో సరిపోయే వారాంతపు కూరగాయల కొనుగోలు ఇప్పుడు రూ.700–800 దాటుతోందని చెబుతున్నారు. తమ బడ్జెట్ పెంచమని భర్తల్ని అడుగుతున్నారు. ఆ అదనపు మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో పాలుపోక ఇంటి యజమానులు బిక్కముఖం వేస్తున్నారు. ముఖ్యంగా వారం రోజుల్లోనే కూరగాయల ధరలు రూ.5–20 వరకు పెరిగాయి. బోయినపల్లి హోల్సేల్ మార్కెట్, మోండా మార్కెట్, గుడిమల్కాపూర్ మార్కెట్లలోనూ కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. డీజిల్ ఖర్చులు అధికమై రవాణా వ్యయం పెరగడం, జిల్లాల నుంచి సరుకు రాక తగ్గడంతో హోల్సేల్ వ్యాపారులు రేట్లు పెంచినట్లు చిల్లర వర్తకులు చెబుతున్నారు. ఈ ప్రభావం నేరుగా రిటైల్ మార్కెట్పై పడుతోందని అంటున్నారు. డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో స్కూల్ బస్సు, ఆటో చార్జీలు సైతం పెరగడం, ఎల్పీజీ గ్యాస్ ధర మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలతో సామాన్య కుటుంబాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. చిన్న చిన్న ఖర్చులకు జేబులు తడుముకోవాల్సి వస్తోందని అంటున్నారు.గ్రామీణ రైతు కుటుంబాలపై..ఖరీఫ్ సీజన్కు ముందు డీజిల్ ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రాక్టర్లు, నీటి మోటార్లు, వ్యవసాయ యంత్రాల వినియోగ వ్యయం పెరుగుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఎరువులు, పురుగు మందులు కూడా ప్రియం కానున్నాయి. యాంత్రీకరణతో పంటలు సాగు చేసే రైతులు వినియోగించే వివిధ రకాల యంత్రాలకు డీజిల్ ఇంధనంగా ఉండడంతో గతంలో కన్నా అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. పంటల రవాణా ఖర్చులు కూడా అధికమవుతుండటంతో సాగు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వీటి ధరలూ పెరిగే చాన్స్క్రూడాయిల్ ఆధారంగా తయారయ్యే అనేక ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరగగా, మరిన్ని వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బకెట్లు, బాటిళ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, గృహోపకరణాలు, డిటర్జెంట్లు, కాస్మెటిక్స్, పెయింట్లు, టైర్లు, లూబ్రికెంట్లు, ఎలక్ట్రికల్ వైర్లు, ఎరువులు, పురుగుమందులు, ప్యాకేజింగ్ మెటీరియల్ మొదలైన ఉత్పత్తులన్నీ క్రూడాయిల్తో ముడిపడి ఉన్నవే కావడంతో వాటి ధరలు పెరిగి, అంతిమంగా సామాన్యుడి బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి. మొత్తానికి ముడి చమురు ధరల మంటలు ఇప్పుడు పెట్రోల్ బంక్లను దాటి ప్రతి ఇంటి వంటగదిలోకి చేరాయి. -
రోజుకు 18, ఏడాదికి 6 వేల రైళ్లు రద్దు
హైదరాబాద్: ఊరేళ్లడానికి లగేజీ సర్దుకుని.. క్యాబో, ఆటోనో పట్టుకుని హడావుడిగా రైల్వే స్టేషన్కు వెళ్లగానే ట్రైన్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే ఉస్సూరుమంటాం. చేసేదీ లేక ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం. ఆర్టీసీ బస్సో, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రయాణాన్ని పూర్తి చేస్తాం. రద్దవుతున్న రైళ్ల కారణంగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్లు తరచుగా రద్దవుతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఒక్క దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోలోనే రోజుకు 18 సర్వీసులుపైగా రద్దవుతున్నాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) స్వయంగా ఈ విషయం వెల్లడించింది.గతేడాది అంటే 2025లో దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో 6 వేలకు పైగా రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో 27 సర్వీసులను సిబ్బంది కొరత కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. కోచ్ల కొరత వల్ల 297 సర్వీసులను నిలిపివేశామని ఎస్సీఆర్ వెల్లడించింది. గత నాలుగేళ్లలో 46 వేలకు పైగా సర్వీసులు రద్దయ్యాయి. వీటిల్లో ఎక్స్ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ (MMTS), డెమూ సర్వీసులు ఉన్నాయని తెలిపింది. ఎస్సీఆర్ నుంచి ఆర్టీఐ (RTI) ద్వారా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఈ వివరాలు రాబట్టింది.2023, 24 సంవత్సరాలతో పోలిస్తే 2025లో పరిస్థితి కాస్త మెరుగైంది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో 2023లో 17,476, 2024లో16,610 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. గతేడాది 6,369 రైళ్లు పట్టాలు ఎక్కలకుండానే నిలిచిపోయాయి. బ్లాక్స్ నిర్వహణ, ట్రాక్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల కారణంగా ఎక్కువగా సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోచ్లు, సిబ్బంది కొరత వల్ల కూడా సర్వీసులను నిలిపివేస్తున్నారు.లోకోపైలట్ల కొరతదక్షిణమధ్య రైల్వేలో లోకోపైలట్ల కొరత సమస్యగా మారింది. ఉండాల్సిన దానికంటే 25 శాతం తక్కువగా లోకోపైలట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 1000 మంది వరకు లోకోపైలట్ల అవసరం ఉందన్నారు. సిబ్బంది కొరత కారణంగా లోకోపైలట్లపై పనిభారం అధికమవుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు కోరుతున్నారు.చదవండి: రేయ్.. నాశనం అయిపోతారు -
సిమ్ కార్డ్ కోసం బయోమెట్రిక్ ఇస్తున్నారా? రూ.101.87 కోట్ల మోసం
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’తో ఉక్కుపాదం మోపింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా.. 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన మొత్తం మోసం విలువ రూ.101.87 కోట్లు.టెలికాం నెట్వర్క్ వారీగా పరిశీలిస్తే.. అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో.. 'నెట్వర్క్ సరిగా లేదు', 'సర్వర్ డౌన్ అయ్యింది', 'వేలిముద్ర సరిగా పడలేదు' అంటూ ఏజెంట్లు నమ్మబలికి.. రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకుంటున్నారు.మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్ (e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే 'సెక్స్టార్షన్' ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే 'డిజిటల్ అరెస్ట్' ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు. ఈ సైబర్ నెట్వర్క్ను ఛేధించడంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయి. కాగా,'ఘోస్ట్ సిమ్' నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది.అలాగే, డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి.. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది. 'మ్యూల్ అకౌంట్స్' సమస్యను అరికట్టడానికి బ్యాంకుల నుంచి ఎలాగైతే పరిష్కారాలను కోరడం జరిగిందో.. ఇప్పుడు టెలికాం సంస్థల నుంచి కూడా 'ఘోస్ట్ సిమ్' సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి చెప్పనుంది.ముఖ్యంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లపై నిఘాను పెంచడం, వారి బాధ్యతను నిర్ణయించే ఫ్రేమ్వర్క్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియలో తప్పనిసరిగా రియల్-టైమ్ వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయాలి. నిబంధనలు పాటించని PoS ఏజెంట్లను, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్వర్క్ల నుంచి బ్లాక్లిస్ట్ చేయాలి.ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు జారీ అవుతున్న తీరును గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. కేవైసీ చేసే సమయంలో 'మ్యూల్ హంటర్ డేటా', I4C అనుమానితుల డేటాబేస్తో అనుసంధానం చేసి తనిఖీలు చేయాలి. టెలికాం సంస్థలు, పోలీసుల మధ్య డేటా షేరింగ్ కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. సిమ్ కార్డులు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ, కేవలం అధీకృత డీలర్ల వద్దే వాటిని కొనుగోలు చేయాలి.మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ https://tafcop.sancharsaathi.gov.in ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ 'సంచార్ సాథీ' పోర్టల్ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే.. ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా.. వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న 'సి-మిత్ర' సేవలను కూడా సద్వినియోగం చేసుకోండి. -
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. మలక్పేటలోని ఓ ఇంట్లో ఆ యువతి సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా నిన్న అత్తాపూర్లో అర్ధరాత్రి యువతిని కిడ్నాప్ చేశారు. మహేంద్రా థార్లో వచ్చిన నలుగురు యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి ఆస్పత్రిలోకి పరిగెత్తినప్పటీకీ యువకులు ఆమెను బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
బండి భగీరథ్ కేసుపై స్పందించిన బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బండి భగీరథ్ కేసు వివాదం తర్వాత తొలిసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. నేనేంటో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు నాకు లేవు. ఎవరెవరో ఏదో రాస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఏదైనా సందర్భంగా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా?. విచారణ నిమిత్తం నేనే స్వయంగా భగీరథ్ను పోలీసులకు అప్పగించా’నని వ్యాఖ్యానించారు. -
బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై కేసు
హుజూర్నగర్ : బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాయిని అనిల్ కుమార్ అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని వారి తల్లిదండ్రులు అనుమతితో ఈ నెల 9న పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు వచ్చింది. ఐసీడీఎస్ హుజూర్ నగర్ సెక్టార్ ఇన్చార్జి సారెడ్డి సోమమ్మ విచారణ చేయగా నిజమని తేలింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్ చేసిన మహిళ
హైదరాబాద్: ఓ ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్ చేసిన మహిళ బ్లాక్మెయిల్ చేసి రూ.5.5 లక్షలు వసూలు చేసింది. దీంతో ఆమెను పంజగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్ గాం«దీనగర్కు చెందిన సాయికిరణ్ (29) ఖైరతాబాద్లో పౌరసరఫరాల ఏఎస్ఓ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. 2022 జూన్లో సైదాబాద్కు చెందిన లక్ష్మి (40) అనే మహిళ సాయి కిరణ్ వద్దకు వచ్చి రేషన్కార్డులో కుమారుడి పేరును చేర్చాలని వచ్చింది. ఆ తరువాత సాయి కిరణ్తో మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు పార్క్లు, రెస్టారెంట్లకు వెళ్లారు. ఓయో హోటళ్లకు తీసుకువెళ్లి ఏకాతంగా ఉన్నప్పుడు అతని ఫోటోలు తీసుకుంది. అంతేకాక ఓయో హోటల్ రసీదులు తనవద్దే ఉంచుకుంది. అనంతరం ఫోటోలు, హోటల్ రసీదులు చూపించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు పలుమార్లు డబ్బులు ఫోన్పేలో బదిలీచేశాడు. ఆ తరువాత కూడా వేధింపులు ఆపకపోవడంతో 2023లో ఆత్మహత్యకు యత్నంచాడు. తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పాడు. అయితే.. సాయి తల్లికి ఫోన్ చేసిన నిందితురాలు రూ.50 వేలు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో అదే రోజు 50వేలు ఆన్లైన్ ద్వారా పంపించారు.సైదాబాద్లోని లక్ష్మి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా దుర్భాషలాడింది. సైదాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లి స్టేషన్ బయటే రూ. 2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయంతో ఆమొత్తం కూడా ఇచ్చారు. తిరిగి ఈ నెల 13న పంజగుట్ట సర్కిల్ వద్ద మరోమారు డబ్బు డిమాండ్ చేసింది. తీవ్ర మనస్థాపానికి గురైన సాయి కిరణ్ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా బాధితుడు మహిళకు ఎప్పుడెప్పుడు డబ్బు బదిలీ చేశాడు? ఎక్కడెక్కడ వీరు తిరిగారు అనే విషయాలపై విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించనున్నారు. -
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్బాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
అమీర్పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్హిల్స్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు. -
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్పురా కిషన్బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్ను పైకెత్తి
హైదరాబాద్: ఇటీవల నార్సింగి సైకిల్ ట్రాక్లో జాగింగ్ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్ డివిజన్ అలకాపూర్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, నార్సింగి ఎస్ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు 💦ఏం బ్రతుకులు రా మీవి ముండల్లారThis incident happened in Manikonda on 14 may afternoon pic.twitter.com/kcvlzogBme— Prudvi Kumar (@Prudvikumar_54) May 19, 2026 -
నియోజకవర్గాల పునర్విభజనకు మిశ్రమ ప్రాతినిధ్య విధానమే మేలు
సాక్షి, హైదరాబాద్: సమర్థ పరిపాలనతోపాటు జనాభాకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మిశ్రమ ప్రాతినిధ్య విధానం ద్వారా దేశంలో నియోజకవర్గాల పునర్వీభజన చేపట్టడం ద్వారా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విద్వేష రహిత సామరస్యాన్ని సాధించొచ్చని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి డాక్టర్ ఎస్.వై. ఖురేషీ అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ ఖురేషీ ‘ప్రతిపాదిత పునర్వ్యవస్థీరణ–దక్షిణాది రాష్ట్రాల స్థితి’అనే అంశంపై సుందరయ్య 41వ స్మారక ఉపన్యాసం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలను జనాభా లెక్కన వేరు చేయలేం భారత పార్లమెంటరీ వ్యవస్థ నేటికీ 1971 నాటి జనగణన ఆధారంగానే కొనసాగుతుంది. 1976 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలలో పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో మార్పు లేదు. పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని జనసంఖ్యతో ముడిపెడితే జనాభా నియంత్రణ లక్ష్యాలను పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుందని దేశం గుర్తించింది. అందుకే 1976లో ఇందిరాగాంధీ పునర్వీభజనను 2001 వరకు నిలిపివేయాలని నిర్ణయిస్తే, వాజ్పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే జనగణన వరకు కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది పూర్తయ్యే జనగణన తర్వాత చేపట్టే పునర్విభజనపై దక్షిణ, ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు చాలా ఉన్నాయి.1976లో జనాభా 54 కోట్ల 80 లక్షలు ఉంటే, ప్రస్తుత జనాభా 150 కోట్లు అని, అయితే ఇప్పటికీ 1976 నాటి ప్రాతిపదికనే పార్లమెంట్లో ఎంపీల సంఖ్య ఉంది. సమస్య సీట్ల పెంపు విషయంలో కాదని, ఏ ప్రాతిపదికన పెంచాలన్నదే ఇక్కడ సమస్య. 1971 నుంచి జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాదిలోని తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.8 శాతంతో జాతీయ సగటు 2.1 శాతం కన్నా తక్కువగా ఉంటే ఉత్తరప్రదేశ్లో నేటికీ సంతానోత్పత్తి రేటు 2.7 శాతంగా ఉంది. సీట్ల పరంగా జనాభా లెక్కన ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా, తమిళనాడులో తక్కువగా కేటాయింపులు జరపడాన్ని ఆక్షేపించడాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. మిశ్రమ విధానం లేదా మరో 15 ఏళ్లు గడువు ఈ పరిస్థితుల్లో పునర్వీభజనకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. ⇒ వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి సామర్థ్యం ఒకే స్థాయికి చేరేంత వరకు పునర్వ్యవస్థీకరణ వాయిదా వేయడం ఒక మార్గం. ఈ మేరకు పునర్వ్యవస్థీకరణను మరో పది, పదిహేనేళ్లు వాయిదా వేయగలిగితే జనాభా వ్యత్యాసాలు తగ్గుతాయి. 50 ఏళ్లనాటి జనగణన ఆధారంగా ఇప్పటి ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం సమంజసం కాదు. ⇒ మరో విధానం దశల వారీగా పునర్వ్యవస్థీకరణ చేయడం. అంటే ఒకేసారిగా దేశమంతా పునర్వ్యవస్థీకరణ కాకుండా రెండు మూడు ఎన్నికల వరకు అంటే 15 ఏళ్లలో దశల వారీగా అమలు జరిగేలా వ్యూహం రూపొందించుకోవడం. మొండిగా గణాంకాలపై ఆధారపడకుండా ఓపికగా సున్నితంగా వ్యవహరించడం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా పూర్తి చేసినట్టు అన్నమాట. ⇒ఈ రెండింటి కన్నా ఆమోదయోగ్యమైనదే మిశ్రమ విధానమే మెరుగైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాను. ఈ విధానం నిష్పాక్షికమైన సమాఖ్య స్వభావాన్ని గౌరవిస్తూనే ప్రజాతంత్ర ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తుంది. జనాభా నియంత్రణతోపాటు మెరుగైన ఆర్థిక వ్యవస్థ, ఇతర సుపరిపాలన ద్వారా సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకుంటూనే రాజ్యాంగపరమైన శస్త్రచికిత్స అవసరం లేకుండా సమస్య పరిష్కరించేందుకు వీలుంటుంది. ఆర్థిక సంఘం నమూనా రూపంలో ఇప్పటికే జయప్రదమైన నమూనా అందుబాటులో ఉంది. ఆర్థిక సంఘం రూపొందించిన ఈ మిశ్రమ ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి.అమెరికా, జర్మనీ, ఆ్రస్టేలియా పార్లమెంటరీ వ్యవస్థల్లో దొంతర్ల వ్యవస్థ ఉన్న జర్మనీ విధానాన్ని ఎగువ సభ అయిన రాజ్యసభకు వర్తింపజేయాలి. అక్కడ రాష్ట్రాలను బట్టి సీట్లు 3 నుంచి గరిష్టంగా 6 ఉంటాయి. అమెరికా సెనేట్లో జనసంఖ్యతో సంబంధం లేకుండా 4 కోట్లు ఉన్న కాలిఫోరి్నయాకు, 6 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్ రాష్ట్రానికి 2 సీట్లే ఉంటాయి. ఇక ఆ్రస్టేలియాలో జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి 12 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన జర్మనీ విధానాన్నే మనం ఫాలో కావాలి.మోదీ కన్నా ఎన్నికల కమిషన్ గురించే ఇప్పుడు చర్చ : బీవీ రాఘవులు దేశంలో మోదీ కన్నా ఎన్నికల కమిషన్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ అధ్యక్షుడు బీవీ రాఘవులు అన్నారు. నాటి ఈసీకి, ఇప్పటి ఈసీకి తేడా చాలా ఉందన్నారు. కొన్ని తప్పులున్నా, వ్యవస్థలోని లోపాలను నాటి ఈసీ సవరిస్తే, నేటి ఈసీ బానిస సంస్థగా మారిందన్నారు. -
ఎకరం రూ. 200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ భూముల వేలం మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించనుంది. గతంలో రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు పలికితేనే వామ్మో అనుకొని ఆశ్చర్యపోయాం. కానీ, ఈసారి ప్రభుత్వం నిర్వహించనున్న ఇదే ప్రాంత భూముల వేలంలో పాత రికార్డులు చెరిగిపోనున్నాయి. సర్వే నంబరు 83/1లో అభివృద్ధి చేసిన 11.38 ఎకరాల లేఅవుట్లో ఎకరం రూ.200 కోట్లు ధర పలుకుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రీ–బిడ్ సమావేశంలో దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా పాల్గొనడమే ఇందుకు కారణమని అధికార వర్గాలు అంటున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ప్రాంతంలో విస్తరించాయి. దీంతో ఇక్కడి భూములను దక్కించుకోవడానికి బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపుతుండడమే డిమాండ్కు కారణం. రూ.139 కోట్ల రిజర్వ్ ప్రైస్.. ప్రభుత్వం ఈ విడతలో రెండు పార్సిళ్లుగా మొత్తం 11.38 ఎకరాలను వేలానికి ఉంచింది. టీ–హబ్ సమీపంలో 6.29 ఎకరాలు, ఐటీసీ కొహినూర్ సమీపంలో 5.09 ఎకరాల స్థలం ఉంది. ఈ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.139 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.177 కోట్ల రికార్డు ధర పలికింది. దీంతో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, జీసీసీ, ఐటీ రంగం విస్తరణ నేపథ్యంలో ఈసారి ఎకరం ధర రూ.200 కోట్ల మార్కుతో రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిమాండ్ ఎందుకు? దేశంలోనే అత్యుత్తమ ఐటీ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంగా రాయదుర్గం పేరుగాంచింది. మైండ్ స్పేస్ ఐటీ పార్క్, నాలెడ్జ్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ ఐటీ కంపెనీల క్యాంపస్లు దీనికి సమీపంలోనే ఉండటంతో కొత్తగా వచ్చే కంపెనీలు సైతం రాయదుర్గంలోనే స్థిరపడాలని చూస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రధాన ఐటీ జోన్లకు రాయదుర్గం కేంద్ర బిందువుగా ఉంది. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దీనికి అద్భుతమైన కనెక్టివిటీని ఇస్తున్నాయి. రాయదుర్గం మెట్రో టెర్మినల్ స్టేషన్ ఇక్కడే ఉండటం వల్ల ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. మెట్రో రెండో దశ విస్తరణ కూడా ఈ ప్రాంతానికి మరింత ఊపు ఇవ్వనుంది. ఐటీ పార్కులతోపాటు విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, హైరైజ్ అపార్ట్మెంట్లు, అంతర్జాతీయ పాఠశాలలు, మాల్స్, స్టార్ హోటళ్లు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. -
‘పాలమూరు’కు యుద్ధప్రాతిపదికన భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణలో జాప్యం జరగకుండా తక్షణమే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కీలక సూచనలు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సంబంధిత జిల్లాధికారులతో జిల్లా మంత్రులు సమీక్షించి పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేశ్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు. 1226 గ్రామాలకు తాగునీరు : మంత్రి ఉత్తమ్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 1226 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అనుబంధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని కరువు పీడిత జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరా అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం జిల్లా ప్రాజెక్టులపై సచివాలయంలోఉత్తమ్ సమీక్షించారు. ప్రాధాన్యతలను పున:సమీక్షించడానికి, పనులను వేగవంతం చేయడానికి పక్షం రోజుల్లోగా మరోసారి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని జిల్లా ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. జూరాల పూడిక తొలగింపు గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పూడికతో జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 8 టీఎంసీల కంటే తగ్గిపోయిందన్నారు. జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం అమలు చేస్తున్న ‘డ్రిప్’పథకం కింద జూరాల ప్రాజెక్టును చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. డ్రిప్ కింద పూడికతీతతోపాటు ప్రాజెక్టు భద్రత, నిల్వ సామర్థ్యం, నిర్వహణ మెరుగు అవుతుందని తెలిపారు. -
నిమ్స్లాగే టిమ్స్!
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ తరహాలో తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలకు డబ్బులు వసూలు చేయబోతున్నారు. సనత్నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సమీపిస్తున్న క్రమంలో పరిపాలనాపరమైన అంశాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. టిమ్స్ ఆస్పత్రులు స్వయంప్రతిపత్తి గలిగినవి అని, వాటికి నిర్వహణ ఖర్చులు ఉంటాయని, దాన్ని రాబట్టుకోవడం ఎలా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. నగరంలో సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆస్పత్రుల్లో 70 శాతం పడకలు ఉచిత వైద్య సేవలకు, 30 శాతం బెడ్స్ చెల్లింపుల కేటగిరీలో కేటాయించనున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 3 నుంచి 5 అంతస్తుల్లో పెయిడ్ సర్వీసెస్సనత్నగర్ టిమ్స్ను ఐదు అంతస్తుల్లో నిర్మించారు. వెయ్యి పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 700 పడకలు ఉచిత సేవలకు కేటాయించగా, మరో 300 బెడ్స్కు పేషెంట్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వచ్చే సాధారణ ఓపీ, ప్రాథమిక వైద్య సేవలు, స్క్రీనింగ్ టెస్టులు, కొన్ని రకాల స్కానింగ్లు ఉచితంగానే లభించనున్నాయి. రెండో అంతస్తు వరకు ఉచిత సేవలు పొందే వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. మూడు, నాలుగు, ఐదు అంతస్తుల్లో 300 పడకల ఉంటాయి. అత్యాధునిక శస్త్ర చికిత్సలు, స్పెషల్ గదులు, షేరింగ్ రూం, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉండాలనుకునే రోగులు బెడ్స్కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పెయిడ్ పేషెంట్లకు అందించే సేవలు కార్పొరేట్తో సమానంగా ఉండబోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.అంతర్జాతీయ పేషెంట్లకు 300 పడకలుసనత్నగర్ టిమ్స్లో గుండె, ఎల్బీనగర్లో గ్యాస్ట్రో, అల్వాల్లో న్యూరో, ట్రామా విభాగాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా పనిచేయనున్నాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో స్థానిక రోగులతోపాటు అంతర్జాతీయ రోగులకు చికిత్సలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు ఆస్పత్రుల్లో 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో పేమెంట్ కోటాలో ఉన్న 30 శాతం పడకల్లో 5 నుంచి 10 శాతం బెడ్స్ అంతర్జాతీయ రోగులకు కేటాయించనున్నారు. మిగతా బెడ్స్ స్థానిక రోగులకు కేటాయిస్తారు.నామమాత్రపు రుసుము ఉంటుంది టిమ్స్ ఆస్పత్రులు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. ప్రాథమిక వైద్య సేవలు ఉచితంగానే అందిస్తాం. అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. ఆస్పత్రి నిర్వహణ ఖర్చులు ఉంటాయి. దానికోసం కొన్ని రకాల అత్యాధునిక శస్త్ర చికిత్సలు, ప్రైమ్ సర్వీసెస్ కోసం కొంత నామమాత్రపు రుసుము వసూలు చేస్తాం. నిమ్స్ తరహాలోనే ఉంటాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు. – మహబూబ్ఖాన్, సనత్నగర్ టిమ్స్ నోడల్ అధికారి -
సెల్ఫ్ ఎన్యుమరేషన్ @ 5.14 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ విభాగం సంచాలకులు భారతి హోలికేరీ స్పష్టం చేశారు. తొలిరోజు సాంకేతిక కారణాలతో కాస్త ఇబ్బందులు ఎదురైనా, ఆ తర్వాత ఈ ప్రక్రియ సులభతరంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.14 లక్షల మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ జరిగిందని, మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ) ప్రక్రియ ప్రారంభమైందన్నారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) మ్యాపింగ్ ప్రక్రియపై చార్జ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో హెచ్ఎల్ఓ ఆపరేషన్ ప్రక్రియ జీహెచ్ఎంసీ, ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలోని కొన్నిచోట్ల ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో 79,200 హెచ్ఎల్బీలున్నాయని... తొలుత 75 వేల హెచ్ఎల్బీలుంటాయని అంచనా వేశామని, కానీ జనాభా పెరుగుదలతో ఈ సంఖ్య పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హెచ్ఎల్ఓ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ‘సాక్షి’కి వివరించారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే... రెండు రోజుల్లో మ్యాపింగ్ పూర్తి... .సెన్సెస్ తొలివిడతలో భాగంగా హెచ్ఎల్ఓ ప్రక్రియలో హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్ కీలకం. ముందుగా మ్యాపింగ్ చేస్తేనే... ఆ తర్వాత డోర్ టు డోర్ సర్వే సులభతరమవుతుంది. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మ్యాపింగ్ కాగా, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బ్లాక్ల ఎంపిక కాస్త ఆలస్యమైంది. దాదాపు 6 వేల బ్లాక్లు మినహాయిస్తే, ఇతర ప్రాంతమంతా దాదాపు పూర్తయింది. అక్కడ నంబరింగ్తోపాటు ఆన్లైన్ ఎంట్రీ కూడా ప్రారంభమైంది. అవగాహనే కీలకం... ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన వివరాలే కీలకం. ఇంటింటికి వెళ్లినప్పుడు ఎన్యుమరేటర్లు కూడా అవగాహన కల్పించి వారి నుంచి సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అంతటా ఈ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. ఈ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. వ్యక్తిగత వివరాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందవు. సరైన వివరాలు ఇవ్వాలి. జనగణనకు వివరాలు సమర్పిస్తే సంక్షేమ పథకాల్లో ఇబ్బందులు కలుగుతాయనేది అపోహ మాత్రమే. బదిలీల నుంచి మినహాయింపు... రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ సెన్సెస్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించాం. ఈ అంశంపై కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువు ముగియడంతో తప్పనిసరి బదిలీల కేటగిరీల్లోని ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వొద్దని వినతులు అందుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్యుమరేటర్లకు భద్రత... కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వెళ్లేందుకు ఎన్యుమరేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫామ్హౌస్లు కూడా జనగణనలో భాగమే. వాటిల్లోకి వెళ్లేటప్పుడు ఎన్యుమరేటర్తోపాటు స్థానిక పంచాయతీ లేదా మున్సిపల్ సిబ్బందిని తోడుగా పంపిస్తున్నాం. ఇందుకు సంబంధించి ముందస్తుగా స్థానిక సంస్థల అధికారులకు సమాచారం ఇవ్వాలి. కొందరు సిబ్బంది సెన్సెస్ విధుల్లో రిపోర్టు చేయలేదనే సమాచారం ఉంది. రిజర్వ్లో ఉన్నా, తప్పకుండా విధుల్లో చేరాలి. లేకుంటే వారిపై సెన్సెస్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. -
దొంగ అంటూ ముద్ర వేశారని...
గచ్చిబౌలి (హైదరాబాద్): తమ గదిలోని రెండు ల్యాప్టాప్లు దొంగిలించాడని హెచ్సీయూ ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థిపై సహ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పశ్చిమ బెంగాల్కు చెందిన మయాంక్ కుందు (23) సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎఫ్ హాస్టల్లోని రూమ్ నంబర్ 242లో సెకండ్ ఇయర్ విద్యార్థి సుప్రతి లోహతో కలిసి ఉంటున్నాడు. రీడింగ్ రూమ్ లో రెండు ల్యాప్టాప్లు మయాంక్ చోరీ చేశాడని ఇద్దరు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఈ నెల 17న వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ల్యాప్టాప్లు తీసి ఉంటే తిరిగివ్వాలని విద్యార్థులు కోరారు. ఆ ల్యాప్టాప్ల విషయం తనకు తెలియదని మయాంక్ చెప్పాడు. ల్యాప్టాప్ ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో రూమ్మేట్కు చెప్పకుండా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ తిరిగి రాలేదు. ల్యాప్టాప్లు పోయాయని లైఫ్ సైన్స్ విద్యార్థులు సోమవారం ఉదయం గచ్చి బౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ వర్సిటీ క్యాంపస్లోని బఫెల్లో లేక్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చెరువులో మయాంక్ మృతదేహాన్ని గుర్తించారు. హెచ్సీయూ రిజి్రస్టార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా రు. కాగా, డ్రగ్స్కు బానిస కావడంతోనే కొన్నిసార్లు ల్యాప్టాప్లు తస్కరించానని, తాజా ల్యాప్టాప్ల విషయం మాత్రం తనకు తెలియదని మయాంక్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ వివాదమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) ఫలితాలు విడుదలవ్వగానే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తారు. కరోనా కాలంలో మినహా గత పదేళ్లలో జూన్, జూలైలో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల ప్రక్రియ మొత్తం ముగించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దాదాపు నెల రోజుల ముందే కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది ఈఏపీసెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆన్లైన్ పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు కంప్యూటర్ తెరపై కనిపించే ఏర్పాట్లూ ఈ ఏడాది నుంచే మొదలు పెట్టారు. దీంతో ఎవరి ర్యాంకు ఏమిటో తెలుసుకోగలిగారు. దీని ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందనే అంచనాకు విద్యార్థులు వచ్చారు. ఈ దశలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్న తీరు పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై మల్లగుల్లాలు ఫీజు రీయింబర్స్పై గత ఏడాది నుంచి న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. బకా యిలతోపాటు ప్రతీ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించాలని ప్రైవేట్ కాలేజీలు కోరుతున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించాయి. ఇక నుంచి తప్పకుండా చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే ఏ గడువులోగా చెల్లిస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదు. ఈ అంశం ఇప్పటికీ న్యాయస్థానం ముందు ఉంది. దీనికితోడు ఫీజు రీయింబర్స్మెంట్ను విద్యార్థులకు నేరుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ప్రైవేటు కాలేజీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే వరకూ నిరీక్షిస్తే కాలేజీల నిర్వహణ కష్టమవుతుందని వాదిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థి ఖాతాలో ఫీజులు వేసినా, కాలేజీలకు సకాలంలో చెల్లించకుండా, ఇతర అవసరాలకు వాడుకుంటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్ ఇవ్వడంలో ఆలస్యమైతే, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజు లు కట్టమని ఒత్తిడి తెస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ సెట్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించడం సరికాదని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలతో చర్చించిన తర్వాతే తేదీ ల షెడ్యూల్ ఇస్తామని చెబుతున్నారు. షెడ్యూ ల్ విడుదల చేయని పక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే వీలుంది. -
'బుల్లెట్ స్పీడ్' పనులతోనే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి బుల్లెట్ రైలు మరో రెండేళ్లలో ముంబై–అహ్మదాబాద్ కారిడార్పై పరుగులు తీయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మరో ఏడు కారిడార్లలో మూడు కారిడార్లు హైదరాబాద్తో అనుసంధానం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిలో ముంబై (పుణే తొలిదశ) కారిడార్ డీపీఆర్ తాజాగా సిద్ధమవగా మిగతా రెండు కారిడార్ల డీపీఆర్లు కూడా ఈ ఏడాదే పూర్తి కానున్నాయి. దీంతో ఈ నాలుగు నగరాల మధ్య విమానయానానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుందన్న సంబురం అందరిలో కనిపిస్తోంది. కానీ బుల్లెట్ రైలు ఎక్కి ఆ సంబరాన్ని అనుభవించాలంటే మాత్రం కనీసం 2038 వరకు ఎదురుచూడాల్సి రానుంది! అహ్మదాబాద్–ముంబై ప్రాజెక్టు అనుభవాలు ఇవే... దేశానికి తొలి బుల్లెట్ రైలును పరిచయం చేయబోతున్న అహ్మదాబాద్–ముంబై (508 కి.మీ) కారిడార్ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. బుల్లెట్ వేగంతో పనులు పూర్తి చేసి ఆరేడేళ్లలో రైలును పట్టాలెక్కించాలని భావించారు. కానీ భూసేకరణకే ఆరేళ్ల కాలం కరిగిపోయింది. మధ్యలో కోవిడ్ కష్టకాలం కూడా జాప్యాన్ని పెంచింది. అయితే ఎట్టకేలకు వచ్చే ఏడాది సూరత్ సెక్షన్లో 100 కి.మీ. నిడివిలో బుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. కానీ మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి 2029 వరకు సమయం పట్టనుంది. ఈ కారిడార్తో పోలిస్తే హైదరాబాద్తో అనుసంధానమయ్యే మూడు రూట్ల నిడివి ఎక్కువే. దీంతో పనులు పూర్తయ్యేందుకు 15 ఏళ్ల సమయం పట్టొచ్చని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. అయితే కనీసం ఒక ప్రాజెక్టునైనా వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. ఎక్కువ సమయం దేనికంటే? బుల్లెట్ రైలు కారిడార్ స్టాండర్డ్ గేజ్లో ఉంటుంది. ఎలివేటెడ్ వయాడక్ట్తో కలుపుకొని దీని వెడల్పు 17.5 మీటర్ల వెడల్పు. అంటే ఒక కి.మీ. కారిడార్ నిర్మాణానికి 1.75 హెక్టార్ల భూమి అవసరం. స్టేషన్ భవనాలు, డిపోలు, సొరంగాల నిర్మాణం లాంటివి కలుపుకొంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్–పుణే–ముంబై కారిడార్ కోసం 2 వేల హెక్టార్లు అవసరమవుతుందని అంచనా. ఇందులో తెలంగాణ పరిధిలో 280 హెక్టార్లు అవసరమవుతుంది. బెంగళూరు కారిడార్ కోసం 1,850 హెక్టార్లు, చెన్నై కారిడార్ కోసం 2,330 హెక్టార్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇందులో 80 శాతం భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉండటంతో పరిహారంపై నిర్వాసితుల అభ్యంతరాలు, కోర్టు కేసులు పరిష్కారమై కార్పొరేషన్ చేతికి భూమి లభించేందుకు కనీసం 4–5 ఏళ్ల సమయం పడుతుందని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ భావిస్తోంది. ఎలివేటెడ్ నిర్మాణాలు కావడంతో.. బుల్లెట్ రైలు కారిడార్లు ఎలివేటెడ్ పద్ధతిలో రూపొందుతాయి. ఎలివేటెడ్ వయాడక్డ్ ఎత్తు 10 మీటర్ల నుంచి 15 మీటర్ల మేర ఉంటుంది. అహ్మదాబాద్ ప్రాజెక్టులో సబర్మతి నదిని క్రాస్ చేసే చోట దాని ఎత్తు గరిష్టంగా 35 మీటర్లుగా ఉంది. అంటే ఫ్లైఓవర్ నిర్మించిన తరహాలో ఉంటుంది. అందుకే వాటి నిర్మాణానికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బుల్లెట్ రైళ్ల గరిష్ట వేగం 400 కి.మీ.. ఆపరేషనల్ వేగం గంటకు 320–350 కి.మీ.గా ఉండనుంది. అంత వేగంతో సాఫీగా రైళ్లు ప్రయాణించాలంటే కారిడార్లో మలుపులు తక్కువగా ఉండాలి. ఎదురుగా నది, గుట్ట అడ్డొస్తే తప్పించే వీలుండదు. అందుకే కారిడార్ మార్గంలో సొరంగాల నిర్మాణం నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్–ముంబై కారిడార్లో వికారాబాద్ సమీపంలో ఏకబిగిన 4.5 కి.మీ. సొరంగ మార్గం ఉండనుంది. అలాగే పుణే దాటాక వచ్చే పశ్చిమ కనుమల ఖండాలా ఘాట్ ప్రాంతంలో అత్యంత సంక్లిష్టమైన 13 సొరంగాలు (మొత్తం 24 కి.మీ. నిడివి) నిర్మించాల్సి రానుంది. ముంబై పరిసరాల్లో సుమారు 35 కి.మీ. మేర భూగర్భ ట్రాక్ ఉండనుంది. బెంగళూరు శివార్లలోనూ వాటి అసవరం ఏర్పడనుంది. తమిళనాడు సరిహద్దుల్లో (మింజూర్ పరిసరాల్లో) సుమారు 11.6 కి.మీ పొడవైన సొరంగం, ఏపీలోని కొన్ని కొండ ప్రాంతాల్లో సొరంగాలు నిర్మించాల్సి రానుంది. నిడివి–అంచనా వ్యయం హైస్పీడ్ రైలు మార్గాల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్ ట్రాక్కు దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు ఖర్చవుతుందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంటోంది. ఈ లెక్కన మూడు కారిడార్ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1) హైదరాబాద్–పుణె–ముంబై కారిడార్ మొత్తం నిడివి: సుమారు 671 కి.మీ. నిర్మాణ వ్యయం (అంచనా): సుమారు రూ. 1.60 లక్షల కోట్ల నుంచి రూ. 1.80 లక్షల కోట్ల వరకు. ఈ మార్గంలో పశి్చమ కనుమల (ఘాట్ రోడ్లు) గుండా సొరంగాలు నిర్మించాల్సి రావడం వల్ల మిగిలిన రూట్లతో పోలిస్తే కిలోమీటర్కు అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2) హైదరాబాద్–బెంగళూరు కారిడార్ మొత్తం నిడివి: దాదాపు 618 కి.మీ. నిర్మాణ వ్యయం (అంచనా): రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లు వరకు 3) హైదరాబాద్–విజయవాడ–చెన్నై కారిడార్ మొత్తం నిడివి: దాదాపు 744 కి.మీ. నిర్మాణ వ్యయం (అంచనా): దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల నుంచి రూ. 2.10 లక్షల కోట్ల వరకు ముంబై–అహ్మదాబాద్ ప్రాజెక్టుకు 2016లో అంచనా వ్యయం రూ. 1.09 లక్షల కోట్లుకాగా ప్రస్తుతం దాన్ని రూ. 1.85 లక్షల కోట్లకు సవరించారు. ఈ లెక్కన మన మూడు ప్రాజెక్టులు మరో 10–15 ఏళ్లతో కూడుకున్నవి కావడంతో ఖర్చు భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
పంట పీకి పందిరి!
శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో గడిచిన పుష్కరకాలంగా పంటల సాగులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. కూరగాయలు సహా సంప్రదాయ పంటలు తగ్గిపోతుంటే వాటి స్థానాన్ని వరి, పత్తి ఆక్రమించాయి. గతంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీరకాయ, బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కాయగూరలను రైతులు విరివిగా సాగు చేసేవారు. వీటితో పాటు సంప్రదాయ పంటలైన సజ్జ, జొన్న, ఉలువలతో పాటు నూనెగింజల సాగు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే రానురానూ ఆయా పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ, వరి, పత్తి సాగు బాగా పెరుగుతోంది. ఒకింత విస్మయం కలిగించినా..ఇందుకు ప్రధాన కారణం.. కోతులు కావడం గమనార్హం. వానరాల బెడదతో రైతులు ఆయా పంటలు సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఆహార కొరత కారణంగా అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. పొలాలపై దాడులు చేస్తూ ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. అక్కడక్కడా రైతులపై దాడులు చేస్తున్న ఘటనలూ నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కూరగాయలు, సజ్జ, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. వేసిన పంటలు చేతికి రాక నష్టపోతున్న రైతులు కూరగాయల సాగు నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కూడా వానర గుంపులు ఆగమాగం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో వానరాల సమస్య ఎక్కువగా ఉంది. పంటంతా ఆగమాగం కోతుల గుంపులు కాయగూరలు, పండ్ల తోటలపై దాడులు చేస్తూ తిన్నంత తిని, మిగిలిన పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఎక్కువగా వరి, పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 2014–15లో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం 2.53 లక్షల ఎకరాలు ఉండగా, 2023–24 నాటికి అది సగానికి పైగా తగ్గి 1.12 లక్షల ఎకరాలకు పడిపోయింది. గత దశాబ్దంలో కూరగాయల సాగు వృద్ధిరేటు మైనస్ 8.4 శాతంగా నమోదు కావడం గమనార్హం. ఎన్ఐఎన్¯Œ, ఐసీఎంఆర్ సిఫారసుల మేరకు రాష్ట్రానికి సంవత్సరానికి 81.49 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయని అంచనా వేయగా, ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 11.17 లక్షల మెట్రిక్ టన్నులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే రాష్ట్ర అవసరాల్లో సుమారు 16 శాతం మాత్రమే సొంతంగా సమకూరుతున్నాయన్న మాట. ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయ, బెండ, పచ్చిమిర్చి, వంకాయ సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అన్ని రకాల కూరగాయలతో పాటు ఆలుగడ్డ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర వంటి పంటలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒక జత.. పదేళ్లలో వంద! అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, సరిపడా ఆహారం దొరకకపోవడం వల్ల కోతుల గుంపులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి, ఆపై ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. 25 ఏళ్ల వరకు జీవించే కోతులకు కాయగూరలు, పండ్లు, ఊళ్లలో ఆహార వ్యర్థాల రూపంలో మెరుగైన ఆహారం దొరుకుతుండటంతో పునరుత్పత్తి పెరగడంతో పాటు మరణాల రేటు తగ్గిపోయింది. సహజంగా ఒక వానరం మూడేళ్ల వయసు నుండి పునరుత్పత్తి ప్రారంభిస్తే.. ఒక జంట పిల్లలు, తిరిగి వాటి పిల్లలు, వాటి పిల్లలు ఇలా కలుపుతూ పోతే పదేళ్లలో 70 నుండి 100 కోతుల వరకు పెరిగే అవకాశం ఉందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యధికంగా బానెట్ మకాక్ (జటి) రకం కోతులు పంటపొలాలు, ఊళ్లపై దాడి చేస్తున్నాయి. ఈ రకం కోతులు కొత్త పరిసరాలకు సులభంగా అలవాటు పడుతున్నాయి. నిర్మల్ ప్రయోగం ఫెయిల్..! పంటలతో పాటు జనావాసాలకు నష్టం చేస్తున్న కోతుల నియంత్రణ కోసం హిమాచల్ప్రదేశ్లో చేసిన ప్రయోగాన్ని తెలంగాణలో అమలు చేసినా సరైన ఫలితం కనిపించలేదని నిపుణులు చెబుతున్నారు. హిమాచల్ తరహాలో నిర్మల్–గండిరామన్న హరితవనంలో 2020లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ప్రారంభించి, రోజూ 10–15 కోతులకు వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ కోతులను పట్టుకోవడం, నిర్మల్కు తరలించడం పంచాయతీలకు ఆర్థిక భారంగా మారడంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగు పెరగాలంటే ఏం చేయాలి.. ⇒ కోతుల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మల్ తరహా కుటుంబ నియంత్రణ కేంద్రం ప్రారంభించాలి. కోతులను పట్టేందుకు పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన పంటలకు పూర్తి సబ్సిడీతో సోలార్ ఫెన్సింగ్ పంపిణీ చేయాలి. ⇒ క్లస్టర్ వారీగా ఏ ప్రాంతానికి ఏ కూరగాయలు అనుకూలమో గుర్తించి, వాటినే సాగు చేసేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలి. పెట్టుబడి వ్యయం, కూలీల కొరత నివారణకు అవసరమైన యంత్ర సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు సబ్సిడీపై అందించాలి. ⇒ పంజాబ్ తరహాలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. హిమాచల్ తరహాలో 75 శాతం సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో మార్కెట్ యార్డుల్లో కూరగాయలకు ప్రత్యేక స్థల కేటాయింపులు చేయాలి. సమగ్ర కార్యాచరణ అవసరం రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళనకరం. రాష్ట్రాన్ని కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర కార్యాచరణ అవసరం. ముఖ్యంగా కోతుల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. – డాక్టర్ రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కూరగాయల కనగర్తి.. ఇప్పుడొక చరిత్రే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి ఒకప్పుడు కూరగాయలకు ఎంతో ప్రసిద్ధి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘కూరగాయల కనగర్తి’గా పేరొందింది. ఇరవైకి పైగా తీగజాతి కూరగాయలు, ఊరందరికీ పనులు, రైతులకు జేబునిండా డబ్బులు, కడుపునిండా పౌష్టికాహారం.. ఇలా కళకళలాడిన గ్రామంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 50 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తే ఇప్పుడు కేవలం 10 మందే సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా అంతటికీ అన్ని రకాల కూరగాయలు అమ్మిన స్థితి నుండి ఇప్పుడు ఇదే ఊరిలో సిరిసిల్ల నుంచి వచ్చే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం.. కనగర్తి పంట పొలాలతో పాటు ఊరంతా వానరాలతో నిండిపోవడమే. కనగర్తి అంతా కోతుల గుంపులే కోతులతో ఊరంతా నిండిపోయింది. పంటలు, ఇళ్లు నాశనం అవుతున్నాయి. మా ఒక్క కనగర్తే కాదు.. అన్ని ఊళ్లలో ఇదే పరిస్థితి. అందుకే కోతుల నియంత్రణకు తక్షణ కార్యాచరణ ప్రారంభించాలి. మళ్లీ కూరగాయల సాగు పెరగాలంటే సోలార్ ఫెన్సింగ్తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలి. – స్వామిదాస్, కనగర్తి సర్పంచ్ -
పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు : జ్ఞానేశ్వర్ ముదిరాజ్
హైదరాబాద్ : నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లకు అతిగా అలవాటు పడుతున్నారని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సన్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన “గ్యాలివెంట్ సన్ సిటీ గేమింగ్ జోన్” ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలలో బిజీగా ఉండటం వల్ల పిల్లలతో సమయం గడపలేకపోతున్నారని తెలిపారు. దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లకు బానిసలవుతూ పలు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.పిల్లలలో మానసిక వికాసం, శారీరక దృఢత్వం పెంపొందించేందుకు ఎడ్యుకేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ కలగలిపిన గేమింగ్ జోన్లు ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి ఆధునిక గేమింగ్ కేంద్రాలు నగరంలో మరిన్ని ఏర్పడాలని ఆకాంక్షించారు. శారీరక క్రీడలు పిల్లలను ఉల్లాసంగా ఉంచడమే కాకుండా చదువుల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు.గ్యాలివెంట్ సన్ సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ కేంద్రంలో ఆర్కేడ్ గేమ్స్, బౌలింగ్, సిమ్యులేటర్ క్రికెట్, వర్చువల్ గేమ్స్తో పాటు 40కి పైగా వినోదాత్మక గేమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల గరిష్ట వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ వయోపరిమితి సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉండనుందని.. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మినహాయింపు ఉండనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు అర్హత లభించే అవకాశం ఉంది. -
మరో నాలుగు రోజులు భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉంటుందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోకెల్లా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.మరోవైపు నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా కొనసాగుతున్నాయని.. సోమవారం ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోకి పూర్తిగా, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. అదేవిధంగా సోమవారం దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. -
60 శాతం మహిళలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి అనూహ్యరీతిలో పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధి బారిన పడుతుండటం, అందులోనూ పొగతాగే అలవాటు లేని మహిళల్లో సైతం ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాయు కాలుష్యం, గృహాల్లో బయో మాస్ పొగ, మారిన జీవన శైలి, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ డేటా ఆధారంగా, ప్రముఖ ఆంకాలజిస్టు, ప్రభుత్వ కేన్సర్ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నేతృత్వంలో రూపొందించిన రాష్ట్ర తొలి ‘కేన్సర్ ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ మ్యాపింగ్ అక్రాస్ తెలంగాణ’నివేదికను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సమర్పించారు. ఈ ‘కేన్సర్ అట్లాస్’నివేదిక రాష్ట్రంలో కేన్సర్ విస్తృతిపై విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ముప్పు ఆరోగ్యశ్రీ పథకం కింద గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,00,294 కేన్సర్ రోగులు చికిత్స పొందారు. వీరిలో 59,994 మంది మహిళలు కాగా, 40,300 మంది పురుషులు. అంటే మొత్తం రోగుల్లో 60 శాతం మహిళలే. అన్ని వయసుల వారితో పోలిస్తే 39 నుంచి 48 ఏళ్ల వయసు గల మధ్య వయసు్కలైన మహిళల్లో కేన్సర్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వయసు విభాగంలో 15,198 మంది మహిళలు చికిత్స పొందగా, పురుషులు 8,318 మంది మాత్రమే ఉన్నారు. అయితే, చిన్నారులు, 19–32 ఏళ్ల యువతలో మాత్రం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. మహిళలను వేధిస్తున్న ప్రధాన కేన్సర్లు ఏంటి? మహిళల్లో ప్రధానంగా రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పురుషుల్లో తల, మెడ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారత మహిళల్లో పొగతాగే అలవాటు పది శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ, వారిలో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లోని వాహనాల ఉద్గారాలు, నిర్మాణ రంగ ధూళి, పరిశ్రమల పొగ ఒకవైపు అయితే, గ్రామీణ ప్రాంతాల్లో గృహాల్లో వాడే కట్టెల పొయ్యిల బయోమాస్ పొగ మహిళల ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. ఈ సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరి కణాల జన్యు నిర్మాణాన్ని మారుస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధన సంస్థల అధ్యయనాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని ప్రత్యేక జన్యు మార్పులున్నాయి. ఇవి పర్యావరణ కాలుష్య ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేసి, శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపే సహజ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తున్నాయి. దీనికితోడు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, మితిమీరిన మానసిక ఒత్తిడి కూడా కేన్సర్ కణాల వృద్ధికి దోహదం చేస్తున్నాయి. జిల్లాల వారీగా ఎలా ఉందంటే? రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల్లో ప్రతి లక్ష మందికి 45 కంటే ఎక్కువ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే ఈ సంఖ్య 40 కంటే తక్కువగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే హనుమకొండలో ప్రతి లక్ష జనాభాకు 79 కేసులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో కేన్సర్ చికిత్స కోసం 81 గుర్తింపు పొందిన ఆస్పత్రులు ఉన్నప్పటికీ, అందులో 54 ప్రభుత్వ, 27 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే మొత్తం కేసుల్లో 53.4 శాతం కేసులను ప్రైవేట్ ఆస్పత్రులే నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోనే 26 చికిత్స కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ చికిత్స పరిమితిని కుటుంబానికి రూ. 10 లక్షల వరకు పెంచింది. 2020లో రూ. 89.03 కోట్లుగా ఉన్న ఆరోగ్యశ్రీ కేన్సర్ చికిత్స వ్యయం, 2025 నాటికి రూ. 260.98 కోట్లకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే.... ⇒ ముందస్తు జాగ్రత్తలతోనే కేన్సర్ ముప్పు నుంచి బయటపడొచ్చు. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏటా రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ⇒ కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో లంగ్ కేన్సర్పై ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ, స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, 100 శాతం గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని ప్రోత్సహించాలి. ⇒ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ⇒ కాలుష్యానికి దూరంగా ఉండటం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. -
కనిష్టం 5% గరిష్టం 100%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించే కసరత్తు దాదాపు పూర్తయింది. ప్రస్తుత బేసిక్ రిజిస్టర్ విలువలు, బహిరంగ మార్కెట్లో ఉన్న విలువలకు అనుగుణంగా ఎక్కడా 100 శాతం మించకుండా, కనీసం 5 శాతం పెంచుతూ సవరణ చేపట్టనున్నారు. ఈ మేరకు నిర్ణయించిన ఫార్ములాకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల వారీగా విలువలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఉండే వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను గ్రామాలు, వార్డులు, డోర్ నంబర్ల వారీగా అప్లోడ్ చేసే ప్రక్రియ దాదాపు పూర్తి కాగా, తహసీల్దార్ కార్యాలయాలు చేయాల్సిన వ్యవసాయ భూముల విలువలకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ ఒకటీ రెండురోజుల్లో పూర్తి కానుంది. ఈ విలువలను గ్రామాల వారీగా అథెంటిఫై చేసే (ప్రామాణీకరించే) బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించారు. అదనపు కలెక్టర్ బయో మెట్రిక్తో ప్రతి గ్రామానికి సంబంధించిన విలువలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి సవరించిన కొత్త విలువలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం సచివాలయంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) డీఎస్ లోకేశ్కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతులతో భేటీ అయి విలువల సవరణ కసరత్తు పురోగతిని సమీక్షించారు. వీలున్నంత త్వరగా సవరించిన విలువల అప్లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి వివరాలు అందజేసి పెంచిన విలువలను అమల్లోకి తేవాలని ఆదేశించారు. పలుమార్లు పరిశీలన తర్వాతే ఖరారు భూముల విలువల సవరణను ఒకటికి నాలుగు సార్లు పరిశీలించిన తర్వాత ఖరారు చేశారు. తొలుత నాలుగు ప్రొఫార్మాల్లో సబ్ రిజి్రస్టార్, తహసీల్దార్ కార్యాలయాల నుంచి బహిరంగ మార్కెట్ విలువను తెప్పించారు. ఈ విలువలను పరిశీలించి ప్రస్తుత బేసిక్ రిజిస్టర్ విలువతో సరిపోలి్చన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్లు ఈ విలువలు మదింపు చేశారు. ఈ మదింపు చేసిన విలువలను మళ్లీ క్షేత్రస్థాయికి పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల రిజి్రస్టేషన్ విలువలు 20–35 శాతం వరకు పెరగనున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 33 శాతం పెరుగుతోంది. కొన్నిచోట్ల కనీసం 5 శాతం, మరికొన్ని చోట్ల అత్యధికంగా 100 శాతం పెంచనున్నారు. వ్యత్యాసం తక్కువుంటే పాత విలువలే.. మొత్తం మీద సగటున 50 శాతం మేర విలువలు పెరుగుతాయని అంచనా. కాగా బహిరంగ మార్కెట్ విలువకు, బేసిక్ రిజిస్టర్ విలువకు తక్కువ వ్యత్యాసం ఉన్న చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రం విలువలు పాతవే కొనసాగించనున్నారు. ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని గాం«దీచౌక్లో ప్రస్తుత చదరపు గజం భూమి బహిరంగమార్కెట్ విలువ రూ.50–60 వేలుగా ఉంది. రిజిస్ట్రేషన్ల శాఖ బేసిక్ రిజిస్టర్ విలువ ఇప్పటికే రూ.49 వేలు ఉంది. రెండు విలువలకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండడంతో ఈసారి అక్కడి విలువలను సవరించడం లేదు. వనస్థలిపురం పరిధిలో.. ఇక వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఓల్డ్ చెక్పోస్టు నుంచి విజయవాడ హైవే వైపునకు వెళ్లే మార్గంలో ప్రస్తుత రిజిస్టర్ విలువ రూ.44,900 ఉంది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో రూ.లక్ష ఉంది. ఇక్కడ చదరపు గజం విలువను రూ.60 వేలకు పెంచుతున్నారు. అదే అపార్ట్మెంట్ల విషయానికి వస్తే వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో చదరపు అడుగు విలువ రూ.3 వేలు, 5 వేలుగా సవరించనున్నారు. అంతస్తులతో సంబంధం లేకుండా ప్రతి అంతస్తుకు ఒకే విధంగా విలువలు అమలు చేయనున్నారు. గ్రామాల్లో..పట్టణాల్లో.. గ్రామాల్లో ప్రస్తుతం చదరపు గజానికి రూ.1,300 కనీస విలువ ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచనున్నారు. పట్టణ ప్రాంతాల్లో కనీస విలువ రూ.2 వేలు ఉండగా దాన్ని రూ.2,500కు పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కనీస ధర ఎకరానికి రూ.2.25 లక్షలుండగా, దాన్ని రూ.4.5 లక్షలకు పెంచుతున్నట్టు సమాచారం. -
అడిగింది 11.50 ఎల్ఎంటీ.. ఆమోదం 10 ఎల్ఎంటీ..
సాక్షి, హైదరాబాద్: వానాకాలం (ఖరీఫ్–2026) సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్ర రైతాంగాన్ని యూరియా భయం వెంటాడుతోంది. ఒకవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ ఎరువుల మార్కెట్పై అనిశ్చితి నెలకొనగా, మరోవైపు ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని వ్యాఖ్యలు, కేంద్రం కేటాయింపుల్లో కోతలు రాష్ట్రంలో ఆందోళన పెంచుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని నివేదిస్తే, కేంద్రం కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసింది.అంతేకాదు.. కేటాయించిన షెడ్యూల్ ప్రకారం కూడా సరఫరా చేయకపోవడంతో జూన్, జూలై నెలల్లో తీవ్ర కొరత తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరాలో కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రైతులకు ఇబ్బందులు తలెత్తితే సహించబోమని హెచ్చరించారు.ప్రారంభంలోనే కోత..రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ఖరీఫ్ మొత్తం అవసరానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని వ్యవసాయ శాఖ కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసింది. దీంతో ప్రారంభ దశలోనే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల కోత పడింది. ఈ 10 లక్షల టన్నులను కూడా విడతల వారీగా ప్రతి నెలా సరఫరా చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల టన్నులు, జూలై, ఆగస్టులో నెలకు 1.50 లక్షల టన్నులు, సెప్టెంబర్లో లక్ష టన్ను ఇవ్వాల్సి ఉంది. కానీ తొలి నెల నుంచే కోతలు మొదలయ్యాయి. తొలి రెండు నెలల్లోనే భారీ కోతఏప్రిల్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 1.53 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందింది. మే నెలలో ఇప్పటివరకు 2 లక్షల టన్నుల కోటాకు గాను కేవలం 48,985 టన్నులే రాష్ట్రానికి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ మాత్రమే ఉంది. నైరుతి రుతుపవనాల రాకతో జూన్ మొదటి వారం నుంచే సాగు వేగం పుంజుకునే పరిస్థితిలో, అప్పటికి కనీసం 3.50 లక్షల టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత సరఫరా వేగం చూస్తుంటే ఆ లక్ష్యం చేరుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.దేశానికి దిక్సూచిగా తెలంగాణ ‘ఫెర్టిలైజర్ యాప్’యూరియా కొరత సమయంలో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గత సీజన్లో అమలు చేసిన ‘ఫెర్టిలైజర్ యాప్’ఆశించిన ఫలితాన్నే ఇచ్చింది. ఈ యాప్ విజయాన్ని గుర్తించిన కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త యూరియా యాప్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 21 నుంచి అన్ని రాష్ట్రాల్లో రెండు జిల్లాల చొప్పున పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనుండగా, తెలంగాణలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను ఎంపిక చేసింది.రామగుండం యూరియా ఎటు?రాష్ట్ర పరిధిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో తయారయ్యే యూరియా కూడా తెలంగాణ రైతులకు పూర్తిస్థాయిలో అందకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కర్మాగార వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 12.7 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ లెక్కన ప్రతి ఏటా సుమారు 6.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రైతులకు అందుతోంది. తెలంగాణ గ్యాస్, వనరులను వినియోగించి ఉత్పత్తి చేస్తున్న యూరియాలో కనీసం 90 శాతం రాష్ట్ర అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా, ఏమాత్రం స్పందన లేదు. ఈ మేరకు ఆర్ఎఫ్సీఎల్ ఎండీకి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రూపురేఖలు మార్చడం తమ తదుపరి లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యం 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను నిర్మూలించడంలో కృషి చేసిన పోలీసులు, భద్రతా బలగాలను సోమవారం జగదల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. దీంతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవా కేంద్రాలను నేతనార్ గ్రామంలో అమిత్ షా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ దగ్గర అభివృద్ధి జరగకపోవడం వల్లే ఆయుధాలు చేపట్టామనే తప్పుడు ప్రచారం చేస్తూ మావోయిస్టులు బస్తర్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇటీవల మూడు వేల మంది మావోయిస్టులు లొంగిపోతే, అందులో రెండు వేల మందికి కనీసం రాయడం, చదవడం రాదని, ఈ ప్రాంతానికి మావోయిస్టులు చేసిన అన్యాయాలకు ఇదో ఉదాహరణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన కృషితో ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను నిర్మూలించామని పేర్కొన్నారు.15 శాతం బస్తర్ ఆదివాసీల కోసం...నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సూచనలతో బస్తర్లో గుజరాత్ తరహాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని అమిత్ షా చెప్పారు. ఇకపై వచ్చే ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 15 శాతం ఉద్యోగాలను బస్తర్ ఆదివాసీల కోసం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులను నిర్మూలించేందుకు 2018 నుంచి విస్త్రృత ప్రయత్నాలు జరిగాయని అమిత్షా అన్నారు.ఢిల్లీలో పెద్ద పెద్ద భవనాల్లో కూర్చుని కాగితాలు, కంప్యూటర్ల మీద ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31వ తేదీని గడువుగా పెట్టుకున్నామని అమిత్ షా గుర్తుచేశారు. పై స్థాయిలో ఎన్ని ప్లాన్లు వేసినా వాటి క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారనేది కీలకమని, ఆ విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, పారా మిలిటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశాయని కితాబునిచ్చారు. ఆ ఆపరేషన్లో పాల్గొన్న బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.తెలంగాణకు అభినందనలుబస్తర్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నేతల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారున్నారు. దీంతో నిర్దేశిత గడువులోగా మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ పోలీస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జగదల్పూర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ భద్రతా సలహాదారు శివధర్రెడ్డి (మాజీ డీజీపీ), తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మల్కాజ్గిరి సీపీ బి.సుమతి (ఎస్ఐబీ మాజీ చీఫ్), డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్, గ్రేహౌండ్స్) అనిల్ కుమార్ను అమిత్షా సత్కరించారు. మావోయిస్టు కార్యకలాపాల నిరోధానికి శివధర్రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్, హోంమంత్రి విజయ్శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.నేరగాళ్ల నెట్వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర తలు నమోదు కావొచ్చని హెచ్చరిం చింది.ఆదివారం రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణో గ్రత 44.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది.ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వడగాడ్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్య వసరమైతే తప్ప మండే ఎండల్లో (మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు) అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా తీవ్ర తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, స్పృహ కోల్పోయే అవకాశమూ ఉందని.. కండరాలు బలహీనపడి తిమ్మిర్లు రావచ్చని వివరించింది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించింది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తగిన వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టంచేసింది. -
TG : హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే? పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.బండి సాయి భగీరధ్ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కేబీఆర్ పార్క్ వ్యవహారం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మనందరెడ్డి పార్క్ వ్యవహారంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఉద్యానవనం ఆవరణలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణ చేపట్టేంతదాకా పార్క్కు 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి కోర్టు స్పష్టం చేసింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అండర్పాస్ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లూ విధించారు. అయితే చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది. ఎస్ఆర్డీపీ (SRDP - Strategic Road Development Plan) పేరిట.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ వద్ద నిర్మాణలకు దిగింది. అయితే.. సుప్రీం కోర్టు స్టేతో కేబీఆర్ పార్క్ వద్ద ఆ పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి. -
అయినా కావాలి..నేపాలీ !
బంజారాహిల్స్: తక్కువ జీతం ఎక్కువ పని.. ఏడాది ఒక్కసారైనా సెలవు తీసుకోకపోవడం.. 24 గంటలూ ఇంటిపట్టునే ఉండడం..ఏ పని చెప్పినా కాదనకపోవడం.. పని ఎగ్గొట్టకపోవడం..ఇదీ నేపాలీ పనిమనుషులు చేస్తున్న పనులు. దీంతో వీరిని తొలగించాలంటే యజమానులు ససేమిరా అంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో చోటుచేసుకున్న నేపాలీ గ్యాంగ్ల దొంగతనాల దృష్ట్యా వారిని పనిలో నుంచి తొలగించాలంటూ నగరంలో అన్ని ఠాణాల పోలీసులు వారి వివరాలను సేకరించి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా తమ ఇళ్లల్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనుషులను దూరం పెట్టడానికి యజమానులు అంగీకరించడం లేదు. ● ఈ నెల 8వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రశాసన్నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజరంజన్ను ఆ ఇంటి పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నేపాలీలు కలిసి దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించారు. నేపాలీ పనిమనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు ఈ కాలనీలో నేపాలీ పనిమనుషులను ఎవరెవరు పెట్టుకున్నారో ఆ యజమానులను కలిశారు. మొత్తం 37 ఇళ్లల్లో నేపాలీ పనిమనుషులు ఉన్నారు. ● తమ ఇంట్లో గత 15 సంవత్సరాలుగా నేపాలీ జంట పనిచేస్తుందని, నమ్మకంగా ఉంటున్నారని, ఇప్పుడు వారిని తొలగిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, వీరి లాగా మరెవరూ పనిచేయలేరని ఓ అధికారి పోలీసుల మొహం మీదనే చెప్పేశాడు. వీరి పనితనం ఏమిటో ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగారు. ● బంజారాహిల్స్ పోలీస్స్టేషన్తో పాటు వెస్ట్జోన్ పరిధిలోని సుమారు 1360 మంది నేపాలీలు ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చి కనీసం వారి వివరాలైనా తీసుకోవాలని చెప్పినా ఒక్కరూ స్పందించిన పాపానపోలేదు. ప్రశాసన్నగర్లో ఇంత పెద్ద ఘటన జరిగినా నేపాలీ పనిమనుషుల విషయంలో అక్కడి బ్యూరోక్రాట్లు ఏమాత్రం భయపడకపోగా ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్నారని, వారిని తొలగించడం కష్టమంటూ చెప్పేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. తక్కువ జీతం..ఎక్కువ పని.. ఏడాదికోసారి సెలవు అందుకే వారివైపు మొగ్గు దశాబ్దాల తరబడి సేవలందిస్తూ.. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు నేపాలీల పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేసినా దశాబ్దాల తరబడి నగరంతో వీరి అనుబంధం విడదీయలేనిది. సెక్యూరిటీగార్డులుగా, ఇంటి కాపలాదారులుగా, డ్రైవర్లుగా, పనిమనుషులుగా, వంటవాళ్లుగా చాలా ఇళ్లల్లో దశాబ్దాలుగా వీరి సేవలు కొనసాగుతున్నాయి. వీరు తక్కువ జీతానికి ఎక్కువ పనిచేయడం బాగా కలిసివస్తుంది. ఇళ్లల్లోనే చిన్న గది ఇచ్చినా కుటుంబం అంతా సర్దుకుపోతుంది. వీళ్లు ఏడాది, రెండేళ్లకు ఒక్కసారే వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామమైన నేపాల్కు వెళ్తుంటారు. మిగతా ఏడాదంతా ఇంటిపట్టునే ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులకు వీరి అవసరం ఎంతో ఉంటుంది. అందులోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే వీరి చేసే వంటలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏరకంగా చూసినా వీరి వల్ల ఎక్కువ లాభాలే తప్పితే అతి తక్కువ నష్టాలు కనబడుతుండడంతో యజమానులెవరూ వీరిని తొలగించడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఇప్పటివరకు ఒక్క యజమాని కూడా తమ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీలను వెళ్లిపోమ్మని చెప్పలేదంటే ప్రతి ఇంటికీ వీరి అవసరం ఎంత ఉందో అర్ధంచేసుకోవచ్చు. -
అమ్మవార్లకు కోటి దండాలు
● రాష్ట్రంలోనే 7, 8 స్థానాల్లో బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాలు ● ఏడాదిలో రూ.24 కోట్లకు పైగా ఆదాయం బంజారాహిల్స్: దేవాదాయ శాఖ రూపొందించిన 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా నివేదిక ప్రకారం నగరంలోని బల్కపేట శ్రీ ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. దర్శనం టికెట్లు, హుండీ కానుకలు, ప్రసాద విక్రయాలు, వివిధ సేవల ద్వారా బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.12.56 కోట్లు, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ.12.21 కోట్లు సమకూరాయి. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రాష్ట్రంలోని టాప్– 10 ఆదాయం వచ్చే దేవాలయాల్లో 7వ స్థానంలో బల్కంపేట ఎల్ల్మమ్మ, 8వ స్థానంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలు చోటు సంపాదించుకున్నాయి. -
టాప్–10లో మనోళ్లే
● ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పరీక్షల్లో విజయ కేతనం ● ఎప్సెట్లో హైదరాబాద్కు ర్యాంకుల పంట సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఎంసెట్ (టీజీ ఎప్సెట్)–2026 ఫలితాల్లో మహా హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులను కొల్లగొట్టి ‘మహా నగరం’ విద్యా హబ్గా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. పట్టుదల, ప్రణాళికాబద్ధమైన కృషితో విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ● ఇంజనీరింగ్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర స్థాయి మొదటి (ఫస్ట్) ర్యాంక్తో పాటు టాప్–10లో వరుసగా 2, 6, 7, 8, 9, 10 ర్యాంకులను కై వసం చేసుకుని జైత్రయాత్ర సాగించారు. ● అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లోనూ అదే జోరును కొనసాగించారు. రాష్ట్ర స్థాయి రెండో (సెకండ్) ర్యాంక్ను సొంతం చేసుకోవడంతో పాటు, వరుసగా 3, 4, 5, 10 స్థానాలను దక్కించుకుని టాప్గా నిలిచారు. ఫలితాల్లో టాప్–10లో మెజారిటీ ర్యాంకులు గ్రేటర్కే దక్కడం విశేషం. మురిపించిన ఫలితాలు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఈ ఏడాది భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరై, అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో మూడు జిల్లాల నుంచి దాదాపు 1.15 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో సుమారు 98వేల మందికిపైగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో గ్రేటర్ పరిధి నుంచి సుమారు 48వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41వేల మందికిపైగా అర్హత సాధించి ఉన్నత చదువుల రేసులో నిలిచారు. -
మహాలక్ష్మిపై చిన్నచూపు
సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ మీదుగా చర్లపల్లి వెళ్లే (49ఎం/250) బస్సు. బంజారాహిల్స్ ఒకటో నంబర్ రోడ్ బస్టాపులో ఇద్దరు మహిళలు ఎదురుచూస్తున్నారు. సుమారు 45 నిమిషాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఆ బస్సును చూసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది అక్కడ ఆగకుండానే ముందుకు కదిలింది. దాంతో ఆ మహిళలు నిస్సహాయంగా మరో బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలా.. ఈ ఒక్క రూట్లోనే కాదు. నగరంలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి. ఒకరిద్దరు మహిళా ప్రయాణికులు కనిపిస్తే చాలు బస్సులు నిలపకుండానే డ్రైవర్లు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా అప్పటికే బస్సులు పూర్తిగా నిండిపోయి అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఇలా నిలపకుండా వెళ్లిపోవడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా బస్సుల్లో ప్రయాణికులు లేకపోయినా సరే మహిళలు కనిపిస్తే చాలు ఆపడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంపై చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు చులకన భావాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందితో ఘర్షణ.. ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థినులకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా కనీసం రూ.3000 నుంచి రూ.5000 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిన డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో అన్ని బస్సుల్లో 70 శాతం మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. మరోవైపు సిటీ బస్సులు సైతం 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనే చులన భావంతోనే కండక్టర్లులు, డ్రైవర్లు బస్టాపుల్లో బస్సులను ఆపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొందరు మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. జనరల్ సీట్లలో కూర్చోవద్దా..? మహిళా ప్రయాణికులు జనరల్ సీట్లలో కూర్చుంటే లేపేస్తున్నారు. బస్సుల్లో రద్దీ కారణంగా ఒక్కోసారి వెనుక ద్వారం నుంచి కూడా బస్సు ఎక్కాల్సి వస్తోంది. అలా ప్రవేశించేవారిని దింపేస్తున్నారు. ముందు నుంచి రావాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాళ్లు వెనుక నుంచి ముందుకు వచ్చే లోపు బస్సు కదిలిపోతుంది’ అని బంజారాహిల్స్ నుంచి హబ్సిగూడకు చెందిన ఓ మహిళ విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కండక్టర్లతో గొడవలు తప్పడం లేదని చెప్పారు. గతంలో ప్రతిరోజు 8 లక్షల నుంచి 12 లక్షల మంది మహిళలు ప్రయాణించగా ప్రస్తుతం సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రయాణం చేసినట్లు అంచనా. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్నా.. ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని పలువురు మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్న డ్రైవర్లు కసురుకుంటున్న కొందరు కండక్టర్లు జనరల్ సీట్లలో కూర్చోవద్దంటూ ఇబ్బందులు ఆవేదన వ్యక్తంచేస్తున్న మహిళా ప్రయాణికులు -
మనవడు ఇక లేడని తెలిసి కూడా..
2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్ ఇంపాక్ట్ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్ఫోన్ మోగింది. ఆ కాల్ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్పుర పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్కు (ఎస్ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్ 28న మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్చంద్ర, సందీప్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలను 2010 ఏప్రిల్ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్ వెళ్లారు. సీబీఐ అధికారులు 2010 జూన్ 11న దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్ పొందారు. వీరిని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్చంద్ర, సందీప్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు 2011 ఏప్రిల్ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్చంద్ర, సందీప్లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
గురుకులాలకు ప్రతి నెలా నిధులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలతో పాటు ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటి అద్దెను ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేయనుంది. సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఇబ్బందులకు క్రమంగా స్వస్తి పలికేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచే నెలవారీగా నిధులు విడుదల చేయనున్నారు. తాజాగా ఆదివారం రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వసతి, విద్యా సౌకర్యాల వాతావరణం మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు, అద్దె చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల వరకు కూడా నిధులు విడుదల కాని పరిస్థితి ఉండేది. దీనివల్ల గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విద్యార్థుల ఆహారం, వసతి, ఇతర మౌలిక అవసరాలపై ప్రభావం పడేది. ఈ సమస్యలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించిన విధంగా, తొలుత త్రైమాసిక (క్వార్టర్లీ) ప్రాతిపదికన నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం దానిని మరింత మెరుగుపరిచి నెలవారీ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. నిధులు సకాలంలో విడుదల కావడం వల్ల విద్యార్థులకు పోషకాహారం నిరంతరాయంగా అందుతుంది. హాస్టళ్ల నిర్వహణ, భవనాల అద్దెల చెల్లింపులు, అవసరమైన సౌకర్యాల కల్పన సులభతరమవుతాయి. ఆదివారం విడుదల చేసిన రూ.221.24 కోట్లలో.. డైట్ చార్జీల కింద రూ.164.37 కోట్లు, కాస్మోటిక్ చార్జీల కింద రూ.22.43 కోట్లు, భవనాల అద్దె కింద రూ.34.44 కోట్లు కేటాయించారు. -
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్లో మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్ఎస్ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్ బాలిక విషయమై బీఆర్ఎస్ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నాం. బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్ చెప్పారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్బీనగర్లో ఉన్న 18 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
‘సర్’కు.. 'ఆధారం' కాదు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువు చేసుకోవాలని నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుందా?.. ఏమాత్రం కాదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. అందులో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును చేర్చినా దానిని కేవలం ఓటరు గుర్తింపు నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కోసమే ఆధార్ కార్డును స్వీకరించి వాడాలి, పౌరసత్వ ధ్రువీకరణ కోసం కాదు’... అని పేర్కొంటూ ఈసీ 2025 సెప్టెంబర్ 9న మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంపై అనుమానాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు అందుకు రుజువుగా ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈసీ నిర్దేశించిన తొలి 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. ఇబ్బందులు తప్పవా..?: నిరుపేదలు, నిరక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల వద్ద ఈ పత్రాలు ఉండే అవకాశాలు చాలా తక్కువే. విచారణ సమయంలో ఇలాంటి పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడకతప్పదని తెలుస్తోంది. ‘సర్’తొలి విడత నిర్వహించిన బిహార్లో 47 లక్షలు, రెండో విడత జరిగిన మరో 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.2 కోట్ల ఓటర్లను ఈసీ తొలగించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ(అడ్జుడికేషన్) దశలో ఈసీ నిర్దేశించిన పత్రాలను అందజేయకపోవడంతో తొలగించిన ఓటర్ల పేర్లే ఇందులో అధికంగా ఉన్నాయి. వీరికి నోటీసులు.. ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. అప్పుడు ఈసీ నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతానికి రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు విషయంలో అనుమానాలున్న పక్షంలోనే ఆధార్ కార్డును రుజువుగా స్వీకరిస్తారు. సర్–2002 జాబితాలోని ఓటర్ల పేర్లు, ఇతర వివరాలతో పోల్చితే ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లు, వివరాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలున్నా సాఫ్ట్వేర్ గుర్తించనుంది. దీంతో ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఒక ఓటుకు ఇద్దరు, ముగ్గురి ధ్రువీకరణ పత్రాలు జెన్జీతో పాటు 1987 తర్వాత పుట్టిన మిలినియల్స్ ఓటర్లు తమ ఒక్కరి ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇద్దరు లేదా ముగ్గు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించక తప్పదు. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే వీరు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వీరు మొత్తం మగ్గురు వ్యక్తుల పుట్టిన తేదీ/ప్రాంతం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు అందితే ఈ కింది పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సిందే... 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 2. 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్ట్ 5. గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు 6. శాశ్వత నివాస సర్టిఫికెట్ 7. అడవి హక్కుల సర్టిఫికెట్ 8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం 9. జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం 12. ఆధార్ కార్డు (కేవలం గుర్తింపు నిర్ధారణ కోసమే) -
EAPCET Results: బాలికలదే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)కు హాజరైన విద్యార్థుల్లో అత్యధిక మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం.రుషి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మూసాపేటకు చెందిన అన్షుల్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పులివెందులకు చెందిన ఎం.వంశీధర్ రెడ్డి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇంజనీరింగ్లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27% మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. ఈఏపీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ సీబీటీ విధానంలో జరిగాయి. ఆదివారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,97,242 మంది పరీక్ష రాశారు. 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా సెట్కు 90,977 మంది దరఖాస్తు చేస్తే, 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో బాలురు 84.70 శాతం మంది అర్హత సాధిస్తే, బాలికలు 86.76 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ ప్రొ. టీకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.వెంకటేశ్వరరావు, మండలి వైస్ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్ పాల్గొన్నారు. వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్సెట్ ఫలితాలు వెల్లడవ్వడంతో కాలేజీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. ఏపీ విద్యార్థులు టాపర్లుగా నిలిచినప్పటికీ కౌన్సెలింగ్లో వారికి అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కన్వీనర్ అసలు హీరో కేవలం వారం రోజుల్లోనే ఎప్సెట్ ఫలితాలు విడుదల చేయడం మామూలు విషయం కాదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. అదీ ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఫలితాలు వెల్లడించడం అభినందనీయమన్నారు. పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే కాదు... సెట్ కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి కూడా హీరోనే అని కొనియాడారు. -
అమ్మకానికి అర్చక పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ‘అది ఉమ్మడి కరీంనగర్లోని ప్రధాన దేవాలయం. నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఐదారు నెలల క్రితం ఆ ఆలయంలో పరిచారకుల (సహాయ అర్చకులు) నియామకాలు జరిగినప్పుడు, అప్పటికే ఆ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారి కుమారులు నియమితులయ్యారు. ఇతర అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఆలయంలో నాలుగు అర్చకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జరగబోతోంది. అర్చకుల పిల్లలు నలుగురు దరఖాస్తు చేశారు. వారికే పోస్టులు దక్కేలా తెరవెనక రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.’ అర్చకుల పోస్టులను బేరానికి అంగట్లో పెట్టేశారు. అర్చకులు, సహాయ అర్చకుల (పరిచారక) పోస్టులకు కొందరు అధికారులు ధర ఖరారు చేసి అమ్మకానికి తెరదీశారు. కొన్ని ఆలయాల్లో పద్ధతిగానే సాగుతున్నా, కొన్నింట్లో అక్రమాలకు గేట్లు ఎత్తారు. పే స్కేల్ పోస్టులు కావటంతో... గతంలో ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, డోలు సన్నాయి వాయించే వారి పోస్టులంటే పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. వారికి జీతాలను ఆ దేవాలయ ఆదాయం నుంచే అత్తెసరుగా చెల్లించేవారు. కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో పనిచేసేవారికి ప్రభుత్వ పేస్కేల్ ప్రకారం జీతాలు అందుతున్నాయి. దీంతో ఆయా పోస్టులకు మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలోని 55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. అయితే, భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సీ లాంటి నియామక సంస్థల ద్వారా కాకుండా, ఆలయాల స్థాయిలోనే జరిగేలా ఏర్పాటు చేశారు. నియామక నోటిఫికేషన్లను కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్ ద్వారా కాకుండా ఆయా దేవాలయాల స్థాయిలోనే జారీ అయ్యాయి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. దేవాలయ ఈఓలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తుల ప్రక్రియ యావత్తు లోపభూయిష్టంగా సాగింది. చాలాచోట్ల అభ్యర్థులకు రశీదు కూడా ఇవ్వలేదు. ఒక్కో దేవాలయానికి ఒక్కో తేదీన నియామక తేదీలను ప్రకటించారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు.. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కొన్నింటికి దేవాదాయశాఖ ప్రధాన సెంటర్లలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లోని ఓ ప్రధాన దేవాలయంలో ప్రక్రియ ఒక్కటి ప్రస్తుతానికి పూర్తయింది. అక్కడ దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు కనీసం పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ కూడా వెల్లడించలేదు. తీరా ఇంటర్వ్యూల విషయం తెలిసి అభ్యర్థులు వెళ్లేసరికి ప్రక్రియ పూర్తయిందని, వారి దరఖాస్తులను తిరస్కరించామని చెప్పటంతో కంగు తిన్నారు. దీనిపై వారు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, దేవాలయం స్థాయిలోనే ప్రక్రియ జరిగినందున, అక్కడే తేల్చుకోవాలని చెప్పి పంపించేశారు. అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని, అందుకే చెప్పాపెట్టకుండా ప్రక్రియను పూర్తి చేశారని ఇతర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మిగతా ఆలయాల ప్రక్రియ మొదలవుతోంది. చాలాచోట్ల ఇప్పటికే ఇదే తరహా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు ఖరారు చేసి బేరమాడుకుని పోస్టులను రిజర్వ్ చేశారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ ప్రక్రియను రద్దు చేసి, నియామక బోర్డు ద్వారా పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించి అర్హులకే పోస్టులు దక్కేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డోలు సన్నాయి వాద్యకారుల పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొందరు అర్హతలేని వారికి బాధ్యత అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ⇒ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ అంతర్గతంగానే జరిగే సంప్రదాయం ఉండేది. కానీ, ఇది అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీకి కేటాయించింది. త్వరలో జరగబోయే నియామక ప్రక్రియ పూర్తిగా నియామక బోర్డుల ఆధ్వర్యంలో జరగనుంది. డ్రైవర్, కండక్టర్ పోస్టులను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, డీఎం, అసిస్టెంట్ డీఎం అయితే టీజీపీఎస్సీ, ఆర్టీసీ ఆసుపత్రి సిబ్బంది నియామకాలు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతోంది. -
పర్సంటేజీ ఫిక్స్!
కరీంనగర్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని రెండేళ్లయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు 4 నెలల క్రితం ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ను మంజూరు చేసింది. ఈ బిల్లును ట్రెజరీ కార్యాలయం ఆమోదించి ఆయన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంది. ఆ రిటైర్డ్ ఉద్యోగి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. బిల్లు వచ్చిన మాట వాస్తవమే కానీ అన్ని వివరాలు పరిశీలించాలని, పింఛనుకు సంబంధించి కొన్ని వివరాలు లోపించాయంటూ ట్రెజరీ సిబ్బంది లేని కొర్రీలు వేసి పదిరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు అసలు విషయం గ్రహించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి.. ఓ ఉద్యోగ సంఘం నేత సహకారంతో ట్రెజరీ సిబ్బందిని సంప్రదించాడు. వారికి కావాల్సిన (తన మొత్తం బిల్లులో 4%) పర్సంటేజీని ముట్టజెప్పడంతో కొర్రీలు ఎటు వెళ్లాయో..! వారం వ్యవధిలోనే డబ్బులు విడుదల కావడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీలు నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా డీటీవో (జిల్లా ట్రెజరీ కార్యాలయాలు), ఎస్టీవోలు (సబ్ ట్రెజరీ కార్యాలయాలు) అవినీతికి అడ్డాలుగా మారాయని, ఫిక్స్డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల బిల్లును బట్టి ఆమ్యామ్యాలు ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు చెబుతున్నారు. పర్సంటేజీల వారీగా ముట్టజెపితే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని, లేదంటే కొర్రీలు పెడుతున్నారని, సర్వర్లు పనిచేయడం లేదు.. దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ ఫైల్స్ కదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ తప్పించుకోవడానికీ ముడుపులు! ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్రెజరీల ద్వారానే చెల్లిస్తుంటారు. కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల వేతనాలు, వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు, గురుకులాలకు ఇచ్చే డైట్ చార్జీలు, అద్దె వాహనాలు, వివిధ కార్యాలయాలు, గ్రామపంచాయతీల బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు.. ఇలా అన్ని రకాల బిల్లులను చెక్కుల రూపంలో బ్యాంకులకు పంపడం లేదంటే ఆయా బ్యాంకు అకౌంట్లలో వేయడం ట్రెజరీల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ బిల్లుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయాల్లో పర్సంటేజీలు ముట్టజెప్పడం మామూలేనని, అయితే ఇటీవల కాలంలో ఈ అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లులకు పది శాతం టోకుగా లేదంటే బిల్లును బట్టి ముట్టజెప్పాల్సి వస్తోందని, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలన్నా ట్రెజరీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బిల్లుల విడుదలకు తోడు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదాయ పన్నుకు సంబంధించిన ‘సహకారానికి’ గాను క్రమం తప్పకుండా ముడుపులివ్వాలని, అలా ఇస్తే వారు పన్ను కట్టే పని లేకుండా ఆడిట్ చేస్తారని చెబుతున్నారు. కొర్రీలు నమోదు చేయకుండానే.. వాస్తవానికి ఏదైనా బిల్లును తిరస్కరించే సమయంలో ట్రెజరీ సిబ్బంది ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బులు ముట్టకపోతే కారణాలేవీ నమోదు చేయకుండానే బిల్లులు తిరస్కరిస్తారని, లేదంటే కొర్రీలు వేసి ఫైల్ కదలకుండా చేస్తారని, విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ఈ బిల్లుల చెల్లింపుల కోసం పర్సంటేజీలు ఇచ్చేలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులే మధ్యవర్తిత్వం వహిస్తారని, కొన్ని చోట్ల ఉద్యోగ సంఘాల నేతలు సమన్వయం చేస్తుంటారని, డీటీవోలు, ఎస్టీవోలు ముందు జాగ్రత్తగా ఉద్యోగ సంఘాల నేతలు, పలు శాఖల ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారనే ఆరోపణలున్నా.. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ దృష్టి ఈ ట్రెజరీల మీద పడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిజామాబాద్ డీటీవోలో.. నిజామాబాద్ జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ప్రతి పనికి సంబంధిత సెక్షన్లోనే డబ్బుల వసూలు జరుగుతోంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాలు సమర్పించడం కోసం ప్రతి ఉద్యోగి నుంచి రూ.500 ఎస్టీవోల ఆధ్వర్యంలోనే వసూలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు ఉన్న మెడికల్ బిల్లులకు రూ.10 వేలు, దానికి లోపు ఉంటే రూ.5 వేలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. టీఎన్జీవో సంఘంలో నేతలుగా ఉన్న కొందరు ఉద్యోగులు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. డీటీవో కార్యాలయానికి ఈ నేతల ద్వారానే వెళ్లి డబ్బులు సమర్పించి పనులు చేయించుకుంటున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్లులు సమర్పించే పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఇలా సమన్వయం చేస్తుంటారు. సకాలంలో బిల్లులు చేయించుకోకపోతే నిధులు వెనక్కు వెళ్లిపోతాయని చెప్పి మరీ రూ.10 వేలు, రూ.20 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో.. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వసూళ్ల దందా యధేచ్చగా సాగుతోంది. ఉద్యోగుల మెడికల్ బిల్లులకు పది శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి మెడికల్ బిల్లు రూ.80 వేలు ప్రాసెస్ చేయాలంటే రూ.8 వేలు ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో బిల్లుల్లో ఆ వివరాలు లేవని, ఆన్లైన్లో సర్వర్ తీసుకోవడం లేదంటూ రోజుల తరబడి తిప్పడం పరిపాటి అయిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్ల దందా సాగిస్తున్నారని తెలుస్తోంది. వచ్చిన ముడుపుల్లో సెక్షన్ల వారీగా పనిచేసే సిబ్బందితో పాటు అధికారులకు వాటాలు అందుతున్నాయని సమాచారం. బిల్లు స్థాయిని బట్టి.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్టీవో పరిధిలో బిల్లు, ఆ బిల్లు తెచ్చిన వ్యక్తి, ఆ బిల్లుకు సంబంధించిన స్థాయిని బట్టి పర్సంటేజీలు నిర్ణయిస్తున్నారు. ఓ ఉద్యోగి వేతన బిల్లు చేయడంలో లంచం తీసుకోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కార్యాలయంలో బిల్లుల కోసం ఉపాధ్యాయులు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఎరియర్స్ బిల్లులు మాత్రం బిల్లును బట్టి పర్సంటేజీలు ఉంటున్నాయి. సూర్యాపేట జిల్లా సూర్యాపేట ట్రెజరీ ఆఫీసులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 25–30 వేలు, మెడికల్ బిల్లుల కోసం రూ.10 వేల దాకా తీసుకుంటున్నారని, గ్రామ పంచాయతీ బిల్లులకు కనీసం 2 శా>తం ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి. పెన్షన్ ఫైలు చెక్ చేసినందుకూ.. నల్లగొండ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో రిటైర్ అయిన ఉద్యోగులు పెన్ష¯న్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ ఫైల్ చెక్ చేసి పెట్టేందుకు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తుందో తెలియని పరిస్థితులున్నా.. సదరు రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ముందుగానే ట్రెజరీ సిబ్బందికి ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్టు సమాచారం. -
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు -
‘మక్కా’ పేలుళ్లు.. ఇంట్లో పోలీసులు.. మనవడి మృతి అంటూ ఫోన్.. పెద్దాయన ఏం చేశాడు..
‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్క్లూజివ్ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం.. -
నకిలీ యాప్స్.. బీ అలర్ట్!
ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో టోకరా సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కొత్వాల్ వీసీ సజ్జనర్ శనివారం పేర్కొన్నారు. ఆ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయని, అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ’డిస్ట్రిక్ట్’ యాప్ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని సజ్జనర్ తెలిపారు. అచ్చం అసలు యాప్ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇలాంటి ఫేక్ యాప్లు, వెబ్ సైట్స్పై నిఘా ఉంచామని, ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు
బైక్ అదుపుతప్పి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి గచ్చిబౌలి: స్నేహితుడిని బస్స్టాప్లో దించి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరు.. జార్ఖండ్కు చెందిన దిబ్యం కుమార్ (26) కొండాపూర్లోని సాయి అర్బన్ విల్లాలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడు సంకల్ప్ సృజన్ను కొండాపూర్లోని రత్నదీప్ సూపర్మార్కెట్ సమీపంలో బస్స్టాప్లో దించి తిరిగి వస్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ప్రధానం ద్వారం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో దిబ్య కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెనుక బైక్పై వచ్చిన స్నేహితులు దిబ్య కుమార్ను హైటెక్సిటీలోని యశోద హస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దిబ్య కుమార్ హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం..అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య
గచ్చిబౌలి: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు మహిళ భర్తను దారుణంగా హత్యచేశాడు. శనివారం శేరిలింగంపల్లిలో డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ● పటాన్చెరులో హోటల్ నిర్వహిస్తున్న బైండ్ల నవీన్(27), ఇస్నాపూర్కు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్ రాయిగల్ల శేఖర్(36) స్నేహితులు. తరచూ శేఖర్ ఇంటికి నవీన్ వచ్చేవాడు. ఈ క్రమంలో శేఖర్ భార్య ప్రమీలతో నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తన భార్య ఓ మహిళ వద్ద ఫోన్ ఉంచి తరచుగా నవీన్తో మాట్లాడుతోందని శేఖర్ తెలుసుకున్నాడు. ఇటీవల భార్య గర్భం దాల్చడంతో నవీన్ మూలంగానే గర్భవతి అయిందని అనుమానించి వేధించసాగాడు. ఈ విషయం నవీన్తో చెప్పి ప్రమీల వాపోయింది. దీంతో శేఖర్ను అంతమొందించాలని నవీన్ ప్లాన్ వేశాడు. మద్యం తాగించి... ఈ నెల 12న రాత్రి శేఖర్కు నవీన్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. ఇద్దరూ ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. శేఖర్కు మద్యం తాగించి గొడవపడ్డ నవీన్ బండ రాయితో తలపై మోది హత్య చేశారు. మృతదేహంపై అట్టముక్కలు కప్పి రాయిని మరోచోట పడేశాడు. ప్రమీలకు ఫోన్చేసి నీ భర్తను చంపేశానని చెప్పాడు. మృతుడి ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఔటర్ వద్ద మృతదేహం... మరుసటి రోజు ప్రమీల..తన భర్త ఇంటికి రాలేదని అతను పనిచేసే కంపెనీకి వెళ్లి అడిగింది. ఈ నెల 14న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పటాన్చెరు పోలీసులకు సమాచారం అందింది. ఆ మృతదేహం తన అన్నదే అని శేఖర్ తమ్ముడు గుర్తించాడు. భార్య మాత్రం ఎవరు చంపారో తనకు తెలియదని పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమీల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తమదైన శైలిలో విచారించగా నవీన్ హత్య చేశాడని తెలిపింది. నవీన్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బైండ్ల నవీన్తోపాటు ప్రమీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బండరాయితో కొట్టి అంతమొందించిన ప్రియుడు మృతుడి భార్య, నిందితుడు అరెస్ట్ -
‘సిమ్ స్వాప్’ ముఠా ఆటకట్టు
● టెలికం వెరిఫికేషన్ పేరుతో సైబర్ మోసాలు ● ఆరుగురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: సిమ్ స్వాపింగ్తో మోసాలకు పాల్పడతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. విషింగ్, సిమ్ మానిప్యులేషన్, ఓటీపీ డైవర్షన్, మోసపూరిత ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతో వందలాది బాధితుల నుంచి రూ.77.75 లక్షల సొమ్మును ఈ ముఠా కాజేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ శనివారం మీడియాకు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన సలీం, సయ్యద్ హషీమ్ రెజా అలియాస్ టిప్పు, బన్సీధర్, అబ్దుల్ అలీం అలియాస్ మిట్టు, మిజానుర్ రెహమాన్ షేక్, మెహబూబ్ ఆలం అన్సారీ అలియాస్ సూరజ్లు ముఠాగా ఏర్పడి ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. థర్డ్ పార్టీ నుంచి కస్టమర్ల ఫోన్ నంబర్లు సేకరించి సిటీ బ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డ్ డివిజన్ అధికారులమంటూ వారికి ఫోన్ చేసి నమ్మిస్తారు. టెలికాం శాఖ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ఈ–సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ కార్డ్లుగా మార్చుకునేలా ప్రేరేపిస్తారు. ఆ తర్వాత మాల్వేర్ ఇన్స్టాల్ చేసిన మొబైల్ ఫోన్లను కొరియర్ సర్వీసుల ద్వారా బాధితులకు ఇంటికే పంపిస్తారు. బాధితులు ఆ ఫోన్లలో ఫిజికల్ సిమ్ కార్డ్లను వేయగానే.. వెంటనే, వారికి రావలసిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ)లు, బ్యాంకింగ్ అలర్ట్లు నిందితులకు డైవర్ట్ అవుతాయి. వీటి ఆధారంగా నిందితులు బాధితుల బ్యాంక్ ఖాతాలకు అనధికారిక యాక్సెస్ పొంది, మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను నిర్వహిస్తారు. ఈక్రమంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ ముఠా సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అక్కడి వెళ్లి ఆరుగురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్లోని నిందితుల నివాసాల నుండి రూ.15 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. -
రెడ్డి కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి
రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: రెడ్డి సామాజిక వర్గ్గ కార్పొరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర రెడ్డి సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు జైపాల్రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గ పేదల సంక్షేమానికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని.. అయితే నేటికీ పాలక మండలి ఏర్పాటు చేయలేదని.. నిధులు కేటాయించలేదని వివరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు రెడ్డి కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించి, రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. -
బర్త్డే పేరిట దోపిడీకి స్కెచ్
● రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నలుగురి అరెస్ట్ ● పరారీలో అసలు సూత్రధారులు పక్కా ప్లాన్తో వ్యవహరించిన నేపాలీ గ్యాంగ్ అల్వాల్: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్లోని కార్యాలయంలో మల్యాజిగిరి కమిషనర్ సుమతి శనివారం వివరాలు వెల్లడించారు. నేపాల్కు చెందిన మీనా అలియాస్ మమత, రాజేష్లు కొన్ని నెలల ముందు కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మిల ఇంట్లో పని మనుషులుగా చేరారు. వారిద్దరు ఒంటరిగా ఉంటున్నారని, ఇంట్లో నగదు, బంగారం, వెండి ఉందని పసిగట్టారు. ఎలాగైనా సొత్తు దోచుకోవాలని భావించిన మమత నగరంలో మరోచోట పనిచేస్తున్న నేపాల్కు చెందిన రాజేష్, సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్లతో కలిసి పథకం వేశారు. ఈ నెల 11వ తేదీన తన పుట్టిన రోజని అబద్ధం చెప్పి మమత తన గ్యాంగ్తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్లో వేడుకలను జరుపుకున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి మురళీమోహన్, విజయలక్ష్మిలను బంధించి వారికి మత్తు పదార్థాలు ఇచ్చారు. అనంతరం ఇంట్లోని బీరువాలు పగులగొట్టి దాదాపు 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, మూడు వేల డాలర్లను దోపిడీ చేశారు. తర్వాత ఆటోలో కొంతమంది, స్కూటర్పై మరికొంత మంది పరారై యాప్రాల్కు చేరుకున్నారు. అక్కడ స్కూటర్ విడిచిపెట్టి.. రెండు ట్యాక్సీలు మాట్లాడుకుని నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుని దేశం వదిలి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో గతంలో మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో మీనా, రాజేష్లకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఘటన స్థలంలో జరిపిన వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోలాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారని సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. గ్యాంగ్ లీడర్ మమత, రాజేష్లతో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆమె తెలిపారు. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. వందలకొద్దీ సీసీ కెమెరాల జల్లెడ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సమాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. -
కే–పాప్ కేక
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కం ఆర్టిస్ట్ సంజీతా భట్టాచార్య సిటీలో సందడి చేశారు. శనివారం మాదాపూర్లోని ఇనార్బిట్మాల్లో ‘ఫస్ట్ గ్లోబల్ గర్ల్ గ్రూప్’ ఆడిషన్స్కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కే–పాప్ సాంగ్ ‘స్మూత్ లైక్ బెటర్’ బీటీఎస్ పాటతో అభిమానులను ఉర్రూతలూగించారు. తన కొత్త ఆల్బమ్ లైవ్ కాపీలకు ఆటోగ్రాఫ్ ఇస్తూ, ఫ్యాన్స్కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ అలరించారు. కాగా ఈ ఈవెంట్ లైఫ్స్టైల్, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫొటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. – సాక్షి, సిటీబ్యూరో -
నృత్య రూపిక
తెలంగాణ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతి వేదికగా శనివారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నృత్యరూపకాలు మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాయి. కాగా కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అంటే గొప్ప చరిత్ర అని, ఇక్కడి ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సలహాదారు ఆర్.గోవింద్ హరి, దేవాదాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. – గన్ఫౌండ్రి -
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీహాల్లో ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగ్గా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.👉టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ రిజల్ట్ డైరెక్ట్ లింక్👉 టీజీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ రిజల్ట్ డైరెక్ట్ లింక్ -
చాయ్ గరం.. బిర్యానీ పిరం..
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి. 30 శాతం జనానికి హోటలే దిక్కు! నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది. కడుపు నింపని భోజనం! నగరంలోని అమీర్పేట్, అశోక్నగర్, దిల్సుఖ్నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. కర్రీ..వర్రీ నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.వసతి భారం హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు. -
ఉప్పల్ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..
ఉప్పల్: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నా మని సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్ ఫ్లవర్ వెనక దారి నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ ఎదుటి హెచ్ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్ చేసుకుని తిరిగి ఉప్పల్ వైపు రావాలి. వరంగల్ వైపు వెళ్లేవారు హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి వరంగల్ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్కు వచ్చే వరంగల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్ఆర్ మీదుగా హయత్నగర్ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
‘ఎన్యూమరేషన్’ ఇస్తేనే ఓటు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ)కు ఇవ్వని ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి చెప్పారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకు 2 ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు కనీస పర్యాయాలు ఆ ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారని స్పష్టం చేశారు. ఓటర్లకు సంబంధించిన పాక్షిక సమాచారంతో ఈ ఫారాలను ముందే ముద్రిస్తారన్నారు. మిగిలిన సమాచారాన్ని ఓటర్లు పూరించి ఒక ఫారం ప్రతిని తిరిగి బీఎల్ఓలకు జూలై 24లోగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov. in) ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని భర్తీ చేసి సమర్పించవచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్న ‘సర్–2026’ కార్యక్రమంపై శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముసాయిదాలో ఈ ఓటర్ల తొలగింపు ‘అందుబాటులో లేని/ వలసవెళ్లిన/చనిపోయిన(అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారు. ఆయా కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన ఓటర్ల జాబితాలను స్థానిక పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,18,902 పురుష, 1,71,02,883 మహిళా, 2,879 ట్రాన్స్జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,39,24,664 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,18,39,741 మంది (64.38శాతం) ఓటర్లను సర్–2002 జాబితా మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం. ముసాయిదాలో ఉన్నా మ్యాపింగ్ కాకపోతే కష్టమే ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాలేకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. ఇలా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాలను ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లు ప్రచురిస్తారు. ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువుగా విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్కార్డును ఓటరు గుర్తింపు నిర్థారణకు అనుమతిస్తారు..’అని సీఈఓ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలుంటే ఎదురయ్యే పరిస్థితులపై సీఈఓ ఒక ఉదాహరణ తెలిపారు. సర్–2002 ఓటర్ల జాబితాలో తన తండ్రి పేరు ‘నారాయణ’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘సి.నారాయణ’గా ఉండడంతో తాను సైతం విచారణకు హాజరై ‘మా నాన్న నారాయణే’అని రుజువులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/దరఖాస్తులను జూలై 31–ఆగస్టు 30 మధ్య స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. జూలై 31–సెప్టెంబర్ 28 మధ్య నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే.. నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. – 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. – 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. – 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ – 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు – జనన ధ్రువీకరణ పత్రం – పాస్పోర్ట్ – గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు – శాశ్వత నివాస సరి్టఫికెట్ – అడవి హక్కుల సర్టిఫికెట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం – జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) – రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ – ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం – ఆధార్ కార్డు (09.09.2025 నాటి ఈసీ సూచనలు వర్తిస్తాయి) -
ఆధిపత్య పోరుకు ‘చెక్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉండగా, ఉప సర్పంచ్లకున్న చెక్ పవర్ రద్దుకు చర్యలు మొదలైనట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న చెక్ పవర్ సమస్యకు ఓ పరిష్కారం చూపే దిశలో ప్రయత్నాలు ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి చెక్ పవర్ వినియోగం విషయంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని తెలిపాయి. అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలి ఉప సర్పంచ్లకున్న చెక్ పవర్ రద్దు కావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 కి సవరణలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు లేని పక్షంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ మార్పును అమలు చేసేందుకు వీలుంటుంది. అయితే ఆ తర్వాత ఆరు నెలల్లోగా అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వడం వల్ల పంచాయతీరాజ్ శాఖ ప్రతినిధిగా జవాబుదారీతనంతో పాటు నిధుల దుర్వీనియోగం వాటిల్లితే అతడినే బాధ్యుడిని చేసి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలతో అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే ఇదే సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలతోనే నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా 2018కి ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండగా, గత ప్రభుత్వం ఉప సర్పంచ్లకు ఈ అధికారాన్ని కల్పించింది. అభివృద్ధికి ఆటంకం ఫిర్యాదులతో.. సర్పంచ్లు, ఉప సర్పంచ్ల మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అడ్డంకిగా మారినట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడం, సకాలంలో నిధులు, బిల్లులు విడుదల కాకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జాయింట్ చెక్ పవర్ విధానం వల్ల సర్పంచ్లు–ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు/అధికారుల మధ్య కోల్డ్వార్ సాగుతున్నట్టుగా వస్తున్న వార్తలపై పీఆర్ఆర్డీ శాఖ అప్రమత్తమైంది. మళ్లీ పాత పద్ధతిలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఉమ్మడి సంతక అధికారాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. నిధుల విడుదల, చెల్లింపులో ప్రతిష్టంభన ప్రస్తుతం అమల్లో ఉన్న నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం..గ్రామాల్లో ఏ ఖర్చు చేయాలన్నా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. అయితే అత్యధిక శాతం గ్రామాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడడం, ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైతే ఈ సమస్య మరింత జఠిలంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ వర్గ పోరు కారణంగా నిధుల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచులు సంతకం పెట్టాలంటే కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే బిల్లులు ఆపేస్తున్నారనే ఆరోపణలుండగా, సర్పంచులతో పాటు డీపీవోలు, ఇతర అధికారుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందినట్టుగా తెలిసింది.ఏకాభిప్రాయం కొరవడటంతో నిధుల విడుదల, బిల్లులు చెల్లింపు వంటి వాటిలో ఎడతెగని జాప్యం చేసుకుంటోందనే ఫిర్యాదులు అందినట్టు సమాచారం. చివరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సకాలంలో యుటిలైజేషన్ సర్టీఫికెట్లు సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి నిధుల విడుదల కూడా ఆలస్యమవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తాజా ప్రతిపాదనలు చేసిందని, అయితే దీనిపై ప్రభుత్వం కచి్చతమైన నిర్ణయం తీసుకుంటేనే చట్ట సవరణ ఇతర విషయాల్లో ముందడుగు పడుతుందని అధికారులంటున్నారు. -
నమ్మకంగా నయవంచన
సాక్షి, హైదరాబాద్: ఒంటరి వృద్ధ జంటల్ని, ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నా..వారు ఇంట్లో లేని సమయంలో వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వృద్ధులకు అవసరమైన సపర్యలు చేసేందుకు ఇళ్లల్లో పని మనుషులుగా, కేర్ గివర్స్గా, కేర్ టేకర్స్గా చేరుతున్న ఇతర రాష్ట్రాలవారు, నేపాల్ వంటి దేశాలకు చెందినవారిలో కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఆభరణాలు దొంగిలించి పరారవుతున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇలాంటి వారి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు వయో వృద్ధులకు వైద్య సహాయకులను, వ్యక్తిగత సేవకులను అందజేసే నెపంతో ఊరూ పేరు లేని కేర్ గివర్స్ ఏజెన్సీలు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ విధమైన చట్టబద్ధత, గుర్తింపు లేని ఇలాంటి సంస్థల ద్వారా అటెండెంట్లు, పని మనుషులుగా చేరుతున్న వారు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్లో అన్ని విధాలుగా చట్టబద్ధమైన గుర్తింపు కలిగిన కేర్ గివింగ్ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. కానీ ఏ గుర్తింపు లేని సంస్థలు మాత్రం వందల సంఖ్యలోనే ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వణికించిన ఉదంతాలు పదవీ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారి భార్యను నేపాలి ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడిన ఘటన మరిచిపోకుండానే జవహర్నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఇలాంటిదే మరో ఉదంతం చోటుచేసుకుంది. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా ఉంటున్నట్టు నటించి పక్కా పథకం ప్రకారం వృద్ధ దంపతులను బంధించి ఇల్లంతా దోచుకెళ్లారు.ఈ సంఘటనలో ఆ నేపాలీ గ్యాంగ్ను వృద్ధ దంపతులు ఏవిధంగానూ ప్రతిఘటించక పోవడంతో వారు బతికి బట్టకట్టారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనలే కాకుండా నగరంలో తరచుగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారి ద్వారా లేదా రకరకాల ఏజెన్సీల ద్వారా పని మనుషులు, కేర్ టేకర్లు, అటెండెంట్లుగా చేరుతున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో రెండు, మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా పని చేసి ఆ తర్వాత దురాగతాలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీల ద్వారా చేరి.. వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన వృద్ధులకు డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, వేళకు మందులు ఇవ్వడంతో పాటు నర్సింగ్ విధులు నిర్వహించేందుకు కేర్ గివర్స్ను నియమించుకుంటారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేవారు, 12 గంటల పాటు పని చేసేవారు, లేదా ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సపర్యలు చేసేవారు ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటూ అవసరమైన వారివద్ద విధుల్లో చేరుతున్నారు.ఇందుకోసం రూ.15000, రూ.25000, రూ.30,000 చొప్పున ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. హెల్పేజ్ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 10 లక్షల మంది ఒంటరి వయోధికులు లేదా వృద్ధులైన భార్యాభర్తలు ఈ రకమైన సేవలను వినియోగించుకుంటున్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్న కొందరు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతుండగా, మరి కొందరు ఇళ్లల్లోనే పని మనుషులను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరిలో కొందరు నమ్మక ద్రోహులుగా మారుతున్న వారి బారిన పడుతున్నారు. పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి సపర్యల విషయం అలా ఉంచితే నిస్సహాయులైన వయో వృద్ధులను ఈ ‘పని మనుషులు’అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు, ఫిర్యాదులు అనేకం ఉన్నాయని హెల్పేజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ వెల్లడించారు. ఒంటరి వయోధికులు ఉండే ఇళ్లపై పోలీసులు ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని, వృద్ధుల వద్ద తమ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచిస్తున్నారు. అమలుకు నోచని సంక్షేమ చట్టం ⇒ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (2007) ప్రకారం వృద్ధుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ చట్టంలోని సెక్షన్ 21 (2) ప్రకారం వృద్ధులకు సేవలు అందించే గృహ సేవకులు, కేర్ గివర్లు, అటెండెంట్లు, ఏజెన్సీలు, ఇతర సంస్థలు స్థానిక పోలీస్స్టేషన్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ⇒ నగరంలో ప్రస్తుతం వృద్ధుల సంరక్షణ, హోమ్ నర్సింగ్, హోమ్ కేర్ సేవలు అందించేందుకు అనేక ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. వీరికి సంబంధించి ఎలాంటి గణాంకాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ⇒ చాలావరకు హోమ్ కేర్, హోమ్ హెల్త్ కేర్ సంస్థలుగా పనిచేస్తున్నాయి. అయితే ఇలాంటి ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా నియంత్రణ చట్టం లేదా లైసెన్సింగ్ వ్యవస్థ వంటివి లేకపోవడం గమనార్హం. అలాంటి వారికి ఇవి తప్పనిసరి.. ⇒ ఇళ్లల్లో పనిచేసే గృహ కారి్మకులు మొదలుకొని కేర్ గివర్స్ వరకు ఎవరైనా సరే వయోధికుల కోసం విధుల్లో చేరాలంటే తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ⇒ చట్టం ప్రకారం ప్రతి కేర్ గివర్కు ఆధార్ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, వైద్యులు అందించే ఫిట్నెస్ ధ్రువీకరణ వంటి అర్హతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. ⇒ కొన్ని పేరొందిన సంస్థలు మాత్రమే కఠినమైన ధ్రువీకరణలు కలిగి ఉంటుండగా.. చిన్న స్థాయి ఏజెన్సీలు లేదా వ్యక్తిగతంగా కేర్ గివర్లను పంపించే వారు ఈ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. ⇒ కుటుంబసభ్యులు కేర్గివర్ల పూర్తి ఆధారాలతో పాటు ఫొటోలు కూడా తీసుకుని పెట్టుకోవాలి. అలాగే సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం మంచిది. ⇒ కేర్గివర్లు లేదా వ్యక్తిగత సేవకులకు డెబిట్, క్రెడిట్ కార్డులు, పిన్ నంబర్లు, చెక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మెడికల్ రిపోర్ట్లు, ఆస్తి పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.తస్మాత్ జాగ్రత్త ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోకూడదు. సాధారణంగా దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా పనిలో చేరేవారు 6 నెలల పాటు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటి పరిసరాలను, ఇంటికి వచ్చి వెళ్లేవారిని గమనిస్తారు. ఏ సమయం అనుకూలమైందో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఏ మాత్రం అనుమానం రాకుండా అవసరమైతే తమ ముఠా సభ్యులతో కలిసి పంజా విసురుతారు. దోపిడీలు, హత్యలకు పాల్పడుతారు. గత పదేళ్లుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. – గురజాడ శోభ, తెలంగాణ స్త్రీ సేవా సంస్థ -
బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్
లొంగుబాటా.. అరెస్టా?భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారా? లేక అతనే పోలీసులకు లొంగిపోయాడా? అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 20 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న క్రమంలో పోలీసు అకాడమీ వద్ద నిందితుడు భగీరథ్ను పట్టుకున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ తెలిపారు. కాగా.. ‘భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయలేదని, తానే స్వయంగా ఇద్దరు లాయర్లతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారని’ పేర్కొంటూ బండి సంజయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి అప్పా జంక్షన్లోని పోలీసు అకాడమీ వద్ద సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ పి.శోభన్ కుమార్, అతని బృందం నిందితుడు భగీరథ్ను శనివారం రాత్రి 8:15 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించిన మర్నాడే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అరెస్టు తర్వాత భగీరథ్ను భారీ బందోబస్తు నడుమ రాత్రి 9:05 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఠాణాలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సుమారు రెండున్నర గంటల పాటు భగీరథ్ను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 11:35 గంటలకు భగీరథ్ను మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత నిందితుడిని మేడ్చల్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. ఆయన సమక్షంలోనే భగీరథ్ వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. అలాగే బాధితురాలు మైనర్ బాలిక, ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రెండుసార్లు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఉదయం నుంచే హడావుడి శనివారం ఉదయం పేట్ బషీరాబాద్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నం.3లోని ఆరోరా కాలనీలోని బండి సంజయ్, భగీరథ్ మేనమామ కరీంనగర్లోని కార్తికేయ ఆసుపత్రిలో డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రెండు గంటల పాటు దాడులు చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. శనివారం ఉదయం నుంచే భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతాడనే ప్రచారం జరిగిన నేపథ్యంలో పేట్ బషీరాబాద్ ఠాణా, చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా కార్యకర్తలు, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అపస్మారక స్థితిలో ఉండగా... కుత్బుల్లాపూర్లోని సుచిత్ర ప్రాంతంలో నివసించే ఓ మైనర్ బాలికతో భగీరథ్కు గతేడాది పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెను కలవడం, ఫోన్లో మాట్లాడుతూ ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. శారీరకంగా ఆమెను లొంగదీసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్లోని తన ఫామ్హౌస్కు బాలికను తీసుకెళ్లిన భగీరథ్.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర మానసిక, శారీరక కుంగుబాటుకు గురైన బాలిక ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో ఆమె ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సున్నితమైన కేసు కావడంతో కేసు విచారణ నిమిత్తం ప్రభుత్వం కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా ‘సిట్’ను నియమించిన సంగతి తెలిసిందే. పేట్ బహీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోక్సోలోని సెక్షన్ 11 రెడ్విత్ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లను పరిశీలించిన పర్యవేక్షణాధికారి రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భగీరథ్పై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో–2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ) జోడించారు. కేసు నమోదైన నాటి నుంచి 8 రోజులుగా నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు. దీంతో 20 బృందాలు నిందితుడి కోసం ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్లో తీవ్రంగా గాలించారు. మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని, రాష్ట్రపతికి లేఖ కేంద్ర మంత్రి బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ అందింది. సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తరుఫు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు ఈ లేఖను రాశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే అధికార బలంతో కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బాధితులకు ఇటీవల బహిరంగంగా బెదిరింపులు కూడా వచ్చాయని, అందువల్ల తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆ లేఖలో డిమాండ్ చేశారు. చట్టంపై గౌరవం ఉంది: బండి సంజయ్ ‘మా అబ్బాయి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం పైఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించా’నని బండి సంజయ్ మీడియాతో అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. కానీ, లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్ అన్నారు. -
ఈవీదే ఠీవీ!
ప్రోత్సాహంగా పన్ను మినహాయింపు.. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్ వాహనాలు సాక్షి, సిటీబ్యూరో కొద్ది రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని వల్లెవేసిన కేంద్రం ఊహించినట్లుగానే పెట్రో బాంబు పేల్చింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని అందరిపైనా పెట్రోల్, డీజిల్ భారం మోపింది. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా ఇంధనం ధరలకు రెక్కలొచ్చేస్తాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ధరలు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు ఈ ధరాఘాతం నుంచి సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. ఈ వాహనాల వినియోగంతో రోజుకు సుమారు 1.82 లక్షల లీటర్ల చొప్పున ప్రతి నెలా సుమారు 54.86 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నట్లు అంచనా. తద్వారా సుమారు రూ. 56.53 కోట్లు ఆదాయం మిగులుతుంది. అస్థిరమైన పెట్రోల్, డీజిల్,సీఎన్జీ, ఎల్పీజీ, తదితర ఇంధన ధరలను దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాలు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రవాణాశాఖ జీవితకాల పన్నును మినహాయించింది.ఇది విద్యుత్ వాహనాలకు ఎంతో ప్రోత్సాహంగా మారింది. 2024 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యుత్ వాహనాలపైన రూ.810 కోట్ల వరకు ఈ మినహాయింపు లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు.ఆర్టీఏలో నమోదైన 81812 వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 56,465 ఉన్నాయి. వీటిపైన రూ.67.14 కోట్లు, సుమారు 22049 కార్లపైన రూ.741.19 కోట్ల చొప్పున పన్ను మినహాయింపు లభించింది. అలాగే 2608 ఆటోరిక్షాలు, 372 సరుకు రవాణా వాహనాలు, మరో 318 బస్సులకు కూడా జీవిత కాల పన్ను నుంచి ఊరట కల్పించినట్లు జేటీసీ చెప్పారు.హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపును కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ విద్యుత్ వాహనాల వినియోగం వల్ల ప్రతి నెలా 1.31 లక్షల టన్నులకు పైగా కాలుష్య కారకాలు తగ్గుముఖం పట్టినట్లు అంచనా. ప్రతి నెలా రూ.56 కోట్లకు పైగా ఆదా రోజుకు 1.83 లక్షల లీటర్ల ఇంధనం పొదుపు ప్రజా రవాణా సదుపాయంతో మరింత తగ్గనున్న ఖర్చులువాహన రకం సంఖ్య నెల ఇంధన ఆదా (రూ.కోట్లలో) ద్విచక్ర వాహనాలు 56,465 26.68కార్లు 22,049 22.23 ఆటోలు 2,608 2.88 గూడ్స్ వాహనాలు 372 1.23 బస్సులు 318 3.51 మొత్తం వాహనాలు 81,812 56.53 విద్యుత్ వాహనాలతో ఆదా ఇలా.. -
నిమ్స్ మరో రికార్డు
● రోగులకు అవయవాలువిజయవంతంగా అమర్చిన వైద్యులు24 గంటల్లో 2 లివర్.. 3 కిడ్నీ మార్పిడి సర్జరీలులక్డీకాపూల్: నిమ్స్ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్), 3 మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మార్పిడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మార్పిడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు. ● బ్రెయిన్ డెడ్ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు. ● కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ (డీసీఎల్డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్ డీసీఎల్డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మార్పిడి చేపట్టింది. ● దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్ఆర్డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్సలు జరిగాయి. -
రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ● బండ్లగూడ పరిధిలో విషాదం చాంద్రాయణగుట్ట: రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన ఘటన బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్కు చెందిన వాచింగ్ మిషన్ టెక్నీషియన్ మహ్మద్ ఆమేర్ (26), ఫాతిమా బేగం (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. గురువారం అర్ధరాత్రి ఈ దంపతులు తమ ఆడపడచు పిల్లలు షేక్ సులేమాన్ (9), నౌషిన్ బేగం(11)లతో కలిసి బండ్లగూడలోని బంధువుల శుభకార్యానికి హాజరై జహంగీరాబాద్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. హాషామాబాద్ యూటర్న్ వద్ద ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కు చెందిన జితేందర్ కుమార్ (22) లారీతో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఫాతిమా లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లలు షేక్ సులేమాన్, నౌషిన్ బేగం, ఆమేర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


