Hyderabad
-
సింగరేణిపై రాజకీయాలెందుకు?
శ్రీరాంపూర్: సింగరేణిని రాజకీయాల కోసం వాడుకోవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి దుద్దిళ్ల« శ్రీధర్బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావుతో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఆదివారం ఆయన సందర్శించారు. సంస్థపై వస్తున్న ఆరోపణలు ఖండించేందుకు సంస్థ అధికారులతో అక్కడే మీడియా సమక్షంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణిపై జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు. కార్మికుల శ్రమ, వారి ఆత్మగౌరవాన్ని చులకన చేసేలా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బొగ్గు పెళ్ల కూడా పోలేదు..... బొగ్గు పెళ్ల కూడా దొంగతనంగా బయటకు పోలేదని సింగరేణి అధికారులు తెలిపారు. ఓపెన్హౌస్లో భాగంగా సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, ఏరియా జీఎం శ్రీనివాస్ డిప్యూటీ సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. బొగ్గు లోడిండ్ మొదలు, రవాణా వరకు అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, దీని కోసం వీటీఎస్, జీపీఎస్ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. శాప్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. దీన్ని కాదని బొగ్గు పెళ్ల కూడా బయటకు పోదన్నారు.ఇటీవల వచ్చిన ఆరోపణలను వారు మీడియా సమక్షంలో ఖండించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్జ్యోతి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి.జనక్ప్రసాద్, డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, ఎల్వీ సూర్యనారాయణ , కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమల్రావు, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, సేఫ్టీ జీఎం రవికుమార్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి సీహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల మోడల్మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణ ప్రగతి అద్భుతంగా ఉందని, 50 ఏళ్లకు సరిపడేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇదే మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు నివాసంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబుతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే పట్టుబట్టి నిధులు తీసుకొచ్చి రోడ్ల విస్తరణ, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులతోపాటు, ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ హబ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. ఇవి అద్భుతంగా ఉన్నాయని, ఇక్కడ జరిగే అభివృద్ధిని ఒక మోడల్గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
లోకో భిన్నరుచి.. ఏఐతో గుదిగుచ్చి...
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ఇడ్లీ–సాంబార్, ఫిల్టర్ కాఫీకి ఫేమస్.. హైదరాబాద్ పేరు చెప్పగానే నోరూరించే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రత్యేక రుచులు, వంటకాలు, విభిన్న తయారీ పద్ధతులకు డిజిటల్ రూపం ఇచ్చేందుకు భాగ్యనగరం వేదికగా కసరత్తు జరుగుతోంది. ఆయా వంటకాల్లోని పదార్థాల కల యిక, వంట విధానం సహా ప్రాంతానికో రుచి కలిగిన భారతీయ రుచులను సాంకేతికంగా గుర్తించేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిశోధన సాగుతోంది. ఇండియన్ ఫుడ్ మ్యాప్ తయారీ లక్ష్యంగా ప్రొఫెసర్ సీవీ జవహర్ సారథ్యంలో జరుగుతున్న ఈ అధ్యయనంలో కంప్యూటర్ విజన్, ఏఐ సాంకేతికతలను ఉపయోగించి భారతీయ ఆహార ప్రత్యేకతలను పరిశోధక బృందం విశ్లేషిస్తోంది.థాళీ... భళీ...ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు తొలుత భారతీయ థాళీ’పై అధ్యయనం ప్రారంభించారు. సాధారణంగా భారతీయ భోజనంలో అన్నం, పప్పు, కూరలు, రొట్టెలు, పెరుగు, పచ్చళ్లు వంటి అనేక పదార్థాలు కలిసిపోవడం వల్ల వాటి పోషక విలువలను గుర్తించడం ప్రస్తుత యాప్లకు కష్టమవుతోంది. పాశ్చాత్య దేశాల ఆహారాన్ని గుర్తించేందుకు తయారైన చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్లు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా జీరో–షాట్ ఏఐ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత కొత్త వంటకాలను ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే గుర్తించి, విశ్లేషిస్తుంది.బిర్యానీపై స్పెషల్ స్టడీహైదరాబాదీ, అవధీ, అంబూర్, కోల్కతా వంటి బిర్యానీ రకాల్లో ఉపయోగించే మసాలాలు, వంట దశలు, పదార్థాల మార్పులను ఏఐ ప్రత్యేకంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు కేలరీలు లెక్కించే సాధనంగా మాత్రమే కాకుండా భారతీయ ఆహార సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నంగా కూడా మారనుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఓవర్హెడ్ కెమెరా సహాయంతో పనిచేస్తుండగా భవిష్యత్తులో మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ కెమెరాతో భోజనం ఫొటో తీస్తే అందులోని పదార్థాలు, వాటి పరిమాణం, పోషక విలువలను కూడా ఏఐ అంచనా వేస్తుందని బృందం చెబుతోంది.లాభాలివీ..⇒ ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు దేశ ఇంటరాక్టివ్ మ్యాప్ను అన్వేషిస్తూ వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలను తెలుసుకోగలరు. ⇒ ప్రతి వంటకం మూలాలు, పదార్థాలు, సాంస్కృతిక ప్రాధాన్యం, తయారీ విధానంతోపాటు వాటిని అందించే రెస్టారెంట్ల గురించి కూడా సమాచారం పొందగలరు. ⇒ కొత్త వంటకాలను తెలుసుకోవాలనుకునే ఆహార ప్రియులకు ఇది దోహదపడటంతోపాటు పర్యాటకులకు అసలైన స్థానిక ఆహార అనుభవాలను కనుగొనడంలో సహాయపడుతుంది. ⇒ భారతీయ ఆహార వారసత్వంపై ఆసక్తి ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, సాంస్కృతిక సంస్థలకు ఇది ఉపయుక్తమైన వనరుగా ఉంటుంది.ఏఐ ఆధారిత పరిష్కారాలకు దోహదంసమాచార సేకరణ, వర్గీకరణ కోసం ఏఐ సాధనాలను వినియోగించి అనంతరం ధ్రువీకరణ, భౌగోళిక మ్యాపింగ్ కోసం ప్రత్యేక విధానాలను అభివృద్ధి చేశాం. దీంతో వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే ఇంటరాక్టివ్ వేదికను రూపొందించగలిగాం. ఈ డేటా వల్ల రుచులు, పోషకాలు, వినూత్న పద్ధతులపై సాంకేతిక విశ్లేషణ సాధ్యమవుతుంది. దీని ద్వారా భారతీయ ఆహార రంగంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయి. వంటకాల్లోని వైవిధ్యాలను, వంటకాల పరిణామ క్రమాన్ని కూడా చేర్చాలని భావిస్తున్నాం.– ప్రొఫెసర్ సీవీ జవహర్ -
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు
బంజారాహిల్స్(హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీనాక్షీ నటరాజన్కు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణభవన్లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్న కొంతమందిలో మీనాక్షి నటరాజన్ నిజాయతీ గల మనిషి అని, రాహుల్గాందీకి నమ్మిన బంటు కావడంతోనే రేవంత్రెడ్డి ఆమె పైనే కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్గాందీకి చెప్పినందుకే రేవంత్రెడ్డి ఆమెపై పగపట్టారని చెప్పారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్రెడ్డి దొంగ కేసు పెట్టించారన్నారు. ఆ కేసు వివరాలు కూడా బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంతపార్టీ వారికే గుండుకొట్టి శఠగోపం పెట్టిన దొంగ రేవంత్రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రేవంత్రెడ్డి పాలనను అట్టర్ఫ్లాఫ్గా అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్కే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని హామీఇచ్చిన రేవంత్రెడ్డి అది నెరవేరితే నిరూపించాలన్నారు. అదే జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. జీఓ నంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. నగరంలో ఇటుక కూడా వేయని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. నగరంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఖైరతాబాద్లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్రెడ్డి పక్కన కూర్చున్నారన్నారు. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ‘సర్’విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే ‘సర్’నమోదులో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నామని, టికెట్ ఆశించేవారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్దన్రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు జేజోళ్ల రాజుముదిరాజ్, మహేశ్యాదవ్, హేమలతాయాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
నేను చెప్పినా.. నిర్లక్ష్యమేనా?
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో జూన్ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపై మండిపడ్డారు. వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు చేశానని..అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన వర్షం సమయంలో, ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్, అవసరమైతే నేనూ.. ‘అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇకపై వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందే. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా. ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే భర్తీ చేయాలి. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలి. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలి. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలి. ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దే ఉండాలి వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే మంజూరు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. విత్తనాలు, యూరియాపై దృష్టి పెట్టండి ‘వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలలి. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ, పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలి. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన 8 రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. తాగునీరు కలుషితం కావొద్దు.. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. గతంలో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలి. నీటి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ, సీఎస్లతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
కొత్త సీఎస్గా జయేశ్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో కొత్త సీఎస్గా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియారిటీ, అనుభవం, విధేయతతోపాటు భయం లేకుండా ధైర్యంతో సత్వర నిర్ణయాలు తీసుకోగల అధికారిని కొత్త సీఎస్గా నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ నెల 11తో రెండున్నరేళ్ల సమయం గడిచిపోయింది. మిగిలిన రెండున్నరేళ్ల టర్మ్లో చివరి ఏడాది.. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలుపొందడంపైనే ప్రభుత్వం పూర్తిగా దృష్టిసారించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థూలంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా పరుగులు పెట్టించి సర్కారును మళ్లీ గెలిపించుకోవడానికి దూకుడుగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గల అధికారినే తదుపరి సీఎస్గా నియమించే అవకాశముంది. ఏ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయాందోళనలతో చాలామంది ఐఏఎస్లు సత్వర నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో సర్కారుకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే పురపాలక శాఖ (క్యూర్ ఏరియా) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్కు పట్టం కట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనతోపాటు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది.నిర్ణయాల్లో చురుకుదనమే గీటురాయిజయేశ్, వికాస్రాజ్లలో ఒకరిని సీఎస్గా నియమించే అవకాశం మెండుగా ఉండగా, సీనియారిటీ ప్రకారం రేసులో శశాంక్ గోయల్ (1990 బ్యాచ్) అందరికంటే ముందున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన వచ్చే సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండడంతో మరో మూడు నెలల సర్వీసు కాలం మాత్రమే మిగిలింది. సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న అరవింద్కుమార్ (1991 బ్యాచ్) ఫార్ములా ఈ–కారు రేసు కేసులో చిక్కుకుని కొంత కాలంగా సస్పెన్షన్లో ఉండటంతో ఆయన రేసులో లేరు. సీనియారిటీలో ఆ తర్వాతి స్థానంలో జయేశ్ రంజన్ (1992) ఉండగా, ఆయన 2027 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేస్తారు. ఏదైనా పని అప్పగిస్తే అత్యంత వేగంగా ఫలితాన్ని తెచ్చి చూపించే అధికారుల్లో జయేశ్ ముందు వరుసలో ఉంటారని పేరుంది. సీఎస్ ఎంపికలో ఇదే ఆయనకు కలిసి రానుండగా, ఆయన సామాన్యులకు అందుబాటులో ఉండరనే విమర్శ సైతం ఉంది. సీనియారిటీలో జయేశ్ తర్వాత ఉన్న సంజయ్జాజు (1992) డిప్యూటేషన్పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన 2029 ఫిబ్రవరి 28న రిటైర్ కానుండగా, రాష్ట్రానికి తిరిగి వచ్చే ఆలోచనలో లేరని తెలిసింది. ఆతర్వాతి స్థానంలో ఉన్న వికాస్రాజ్(1992)కు వివాదరహితుడిగా పేరుండగా, 2028 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. జయేశ్ను కాదని భావిస్తే వికాస్రాజ్ను సీఎస్గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, ఆయన చురుగ్గా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుతారని, ‘హామ్’రోడ్ల టెండర్లలో తీవ్ర జాప్యానికి సైతం ఇదే కారణమనే భావనలో ప్రభుత్వం ఉంది. -
వడి వడిగా... బడికి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం తిరిగి తెరుచుకుంటున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేయగా, ఇప్పటికే అకడమిక్ కేడర్ను కూడా విడుదల చేసింది. బోధనతోపాటు ఈసారి ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలతో కథలు లేదా పత్రికలు, మ్యాగజైన్లు లాంటి వాటిని అరగంట చదివించాలని చెప్పింది. ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయిన తర్వాత తరగతి గదిలో ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం తప్పనిసరి చేసింది. ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తారు. ఈసారి మొత్తం 227 రోజులపాటు పాఠశాలలు పనిచేస్తాయి. – సాక్షి, హైదరాబాద్విద్యార్థుల సంఖ్య పెరిగేనా?రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో ఉన్న 30 వేల స్కూళ్లలో 24 లక్షల మంది పిల్లలున్నారు. 10 వేల వరకూ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో 36 లక్షల మంది చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని రెండేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చే బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా సీరియస్గా తీసుకోవాలని విద్యాశాఖ టీచర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రాథమిక బడులు మొత్తం 18,254 ఉంటే వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులున్నారు. అంటే ఒక్కో బడిలో సగటున 38 మంది ఉన్నారు. 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. 2023–24లో ప్రభుత్వ స్కూళ్లలో యూడైస్ లెక్కల ప్రకారం 18.13 లక్షలుంటే (డ్రాపౌట్స్ జరిగాక), 2024–25లో 16.84 లక్షల మంది ఉన్నారు. అంటే ఏడాదిలోనే 1.29 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈ పరిస్థితి ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రశ్నించేలా ఉంది. బడిబాటకు వెళ్లిన టీచర్లకు పేద, మధ్య తరగతి నుంచి వచ్చే స్పందన భిన్నంగానే ఉంది. విద్యపై తమకు భరోసా లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. సరిగా బోధన జరగదని, నాణ్యత లోపించిందని అంటున్నారు. అల్పాహారంపై ఆశలుప్రభుత్వ బడులతోపాటు కాలేజీల్లోనూ ఈసారి అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే ఈ కార్యక్ర మాన్ని అమలు చేస్తారు. కాలేజీల్లో దశలవారీగా ఉంటుంది. మొత్తం 1.44 లక్షల మందికి బ్రేక్ఫాస్ట్ అందిస్తారు. ఇది విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతుందని విద్యాశాఖ ఆశలుపెట్టు కుంది. ఈ ఏడాది నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పైనా పాఠాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తకాలు, నోట్పుస్తకాల పంపిణీకి మరికొంత సమయం పట్టవచ్చు. ఇవి వస్తేగానీ సాంకేతిక విద్యపై పాఠాలు ఎలా ఉంటాయో చెప్పలేమని టీచర్లు అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది విద్యార్థుల చేరికలు పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. -
హక్కుల కోసం కాక్రోచ్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఆదివారం హక్కుల కోసం నగరంలోని ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్తోపాటు పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాంగ్చుక్ మాట్లాడుతూ., నీట్ పరీక్షల లీకేజీ వంటి ఘటనలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... కోట్లాది యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో జవాబుదారీతనం అవసరమన్నారు. ఈ నిరసనను ఇప్పటికీ ఒక విజ్ఞప్తిగా చూస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ యువత చూపిన శాంతియుత, శక్తివంతమైన నిరసన దేశానికి ఆదర్శమన్నారు. ‘నేను అనేక నగరాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ హైదరాబాద్లో నేను చూసిన శాంతి నిరసన మరెక్కడా చూడలేదు’ అని చెప్పారు. భారత్ గొప్ప దేశంగా మారాలంటే విద్య, పర్యావరణ పరిరక్షణే ప్రధాన అంశాలుగా మారాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. ‘విద్య ద్వారా రాబోయే తరాలకు పునాదులు వేయాలి. మీరు చెట్లను, అడవులను, నదులను రక్షిస్తున్నారు. ఇది దేశానికే గర్వకారణం’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ పిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారన్నారని, ఇలా అయితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ఎలా సాకారమవుతుందని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలో పాల్గొంటే తమ పిల్లల స్కూల్ అడ్మిషన్కు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే పరిస్థితి దేశంలో ఉండటం సిగ్గుచేటన్నారు.యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు: ప్రొ.నాగేశ్వర్ నీట్, సీబీఎస్ఈ సహా అనేక పరీక్షల్లో జరిగిన లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు వేలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా బాధ్యత తీసుకునే రాజకీయ నాయకులు కనిపించడం లేదు. ఇదే మన రాజకీయ పతనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘’పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే బంగారం కొనొద్దంటారు. కానీ యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరు’ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ, ఉద్యోగాలను తొలగించడం అన్యాయమన్నారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులనే ప్రశ్నించే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, చైనా ఏజెంట్, దేశద్రోహి అంటారు. కానీ మేము భారతమాత బిడ్డలం, భగత్ సింగ్ వారసులం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇది సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఆగిపోవద్దు, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది.? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఇలా నెలకొందని ప్రశ్నించారు. ‘యువతను కాక్రోచ్లుగా పేర్కొనడం సమంజసం కాదు. దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ను జైలుకు పంపాలి’ అని అన్నారు. -
మూత్ర'గండం'!
మూత్ర పిండాల వ్యాధి సమస్యలు ఇప్పుడు తెలంగాణలో ప్రజారోగ్యానికి సవాలుగా మారుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఐసీఎంఆర్–ఇండియాబ్’అధ్యయనం రాష్ట్రానికి ఆందోళన కలిగించే సంకేతాలను వెలుగులోకి తెచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం తెలంగాణలో కిడ్నీ పనితీరు లోపం ప్రాబల్యత 7.4 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 3.2 శాతంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా ఉండటం గమనార్హం. అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యల ముప్పులో ఉన్నట్టు అంచనా. – సాక్షి, హైదరాబాద్హెచ్చరికగా ఐసీఎంఆర్ అధ్యయనం‘ఐసీఎంఆర్–ఇండియాబ్’ అధ్యయనం దేశవ్యాప్తంగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు ప్రబలడాన్ని గల కారణాలను అంచనా వేయడానికి చేపట్టిన అతిపెద్ద పరిశోధన. 2015 నుంచి 2023 మధ్యకాలంలో వివిధ దశల్లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేల మందికిపైగా వయసు పైబడిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా చేసిన విశ్లేషణ ఫలితాలు ఇటీవలి కాలంలో శాస్త్రీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఇందులో తెలంగాణ దేశంలోని కిడ్నీ వ్యాధుల హాట్స్పాట్ రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో జీవనశైలి మార్పుల ప్రభావం కిడ్నీలపై తీవ్రంగా పడుతున్నట్టు అధ్యయనం పేర్కొంది.మధుమేహం–బీపీతో కిడ్నీలకు ముప్పుమూత్రపిండాల వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మ«దుమేహం, రక్తపోటును వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. అధిక రక్తపోటు కిడ్నీలపై నిరంతర ఒత్తిడిని పెంచి వాటి పనితీరును క్రమంగా బలహీనపరుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే మధుమేహం, రక్తపోటు కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కిడ్నీ సమస్యల సంఖ్య కూడా అధికమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఉప్పు వినియోగం, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, నొప్పి నివారణ మందుల విచ్చలవిడి వాడకం, ధూమపానం, మద్యపానం వంటి అంశాలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యత, వేడి వాతావరణంలో తగినంత నీరు తీసుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.స్క్రీనింగ్–చికిత్సపై ప్రభుత్వం దృష్టిపెరుగుతున్న అసంక్రమణ వ్యాధుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా 30 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహం, రక్తపోటు, ఇతర అసంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. వీటి ద్వారా కిడ్నీ సమస్యలకు దారితీసే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలను విస్తరించడంతోపాటు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తోంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్రం అందుబాటులో ఉండేలా చూడాలని ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల రోగులకు రవాణా ఇబ్బందులు లేకుండా హబ్ అండ్ స్పోక్ మోడల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 67 కేంద్రాలలో రద్దీని తగ్గించడానికి, అదనంగా మరో 155 డయాలసిస్ యంత్రాలను (పడకలను) అందుబాటులోకి తెస్తున్నారు.యువతలో పెరుగుతున్న కిడ్నీ కేసులుగతంలో మూత్రపిండాల వ్యాధులు ప్రధానంగా వృద్ధుల్లో కనిపించేవి. ప్రస్తుతం 30–45 ఏళ్ల వయసు వారిలో కూడా ఈ సమస్యలు పెరుగుతున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఉద్యోగ ఒత్తిడి, అనియంత్రిత ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న యువతలో కిడ్నీ పనితీరు క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకర అంశం ఏమిటంటే.. ప్రారంభ దశల్లో కిడ్నీ వ్యాధులకు పెద్దగా లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే వరకు చాలామందికి తమకు సమస్య ఉందనే విషయం తెలియదు. అందుకే దీనిని సైలెంట్ డిసీజ్గా వైద్యులు పేర్కొంటున్నారు. -
ఎల్నినో ప్రభావం.. ఖరీఫ్ సన్నద్ధతపై ప్రత్యేక ప్రణాళిక
ఖరీఫ్ సన్నద్ధతపై ఈ రోజు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నెలలోనే వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులతో సమీక్ష నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా, తక్కువగా నమోదైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు.వరి పంటలపై అధికంగా ఆధారపడకుండా రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విత్తనాల కొరత తలెత్తకుండా ఈ ఖరీఫ్ సీజన్కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని, ముఖ్యంగా కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు మంత్రి వివరించారు.రాష్ట్రంలోని రైతులకు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేయడం, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా వ్యవసాయశాఖ పలు కీలక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రబీ సీజన్లో రైతుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో పలు మెరుగుదలలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్వహణ, మండల మ్యాపింగ్ సదుపాయాలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువుల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. యాప్ వినియోగంతో ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున వ్యవసాయశాఖ ముందస్తుగా పంటల ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. వర్షపాతంలో అనిశ్చిత పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతులకు సాంకేతిక సూచనలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయశాఖ సూచనలను పాటించాలని కోరారు.రైతులకు ఖచ్చితమైన, సమయానుకూలమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు వ్యవసాయ శాఖ “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం”ను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం తదితర వాతావరణ వివరాలు రైతులకు నేరుగా వాట్సాప్ సందేశాల ద్వారా చేరుతున్నాయని చెప్పారు. రైతులు విత్తనాలు వేయడం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ వంటి అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార సందేశాలు పంపించినట్లు చెప్పారు. 71 శాతం డెలివరీ రేటుతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి
హైదరాబాద్ , జూన్ 14 : హైదరాబాద్లోని బాగలింగంపల్లి లొ గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈసమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్ లో వాటా,రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా “హిస్సా – ఇజ్జత్ – హుకూమత్” నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక , సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమైనా తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోలేదని అన్నారు.ఈ సమావేశానికి కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, ఎర్రమాడ వెంకన్న, లింగేష్ యాదవ్లకు నియామక పత్రాలు ప్రదానం చేశారు. అదేవిధంగా prof బెనర్జీ ని రాష్ట్ర వైస్ చైర్మన్ గా ,prof విజయ్ బాబు ను పొలిటికల్ అడ్వైజర్ గా నియామక పత్రాలు అందజేశారు.సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు మరియు రాబోయే కాలంలో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.– విడుదలకర్తబీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI)తెలంగాణ రాష్ట్ర కమిటీ -
తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి(ఆది,సోమ, మంగళ) పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. -
‘మీనాక్షికి సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారు’
సాక్షి, హైదరాబాద్: మీనాక్షి నటరాజన్కు రేవంత్ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్పై రేవంత్ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.‘‘రేవంత్ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో బీఆర్ఎస్దే విజయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
హైడ్రాలో బైక్ టీమ్లు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా... ఏక్కడ ఏ ప్రమాదం జరిగినా... ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఈ బృందాలకు సంబంధించిన భారీ వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 27 బైక్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో మెరుగైన సేవలు అందించాయి. ప్రతి బైక్పై ఇద్దరు సిబ్బంది.. ఇప్పటి వరకు హైడ్రా అధీనంలోని డీఆర్ఎఫ్కు 122 వాహనాలు ఉన్నాయి. వీటిలో డీఆర్ఎఫ్ తేలికపాటి వాహనాలతో పాటు 21 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ ట్రక్కుల్నే ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకు వాడుతున్నారు. వీటిలో ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఘనాస్థలికి చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు ఇవి చేరేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ బైక్ టీమ్లను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి ఖరీదు చేసిన 37 ద్విచక్ర వాహనాల్లో 27 వాహనాలకు మార్పులు చేర్పులు చేసి బైక్ టీమ్లకు అందించారు. ప్రతి బైక్పైనా ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఉంచడానికి వెనుక భాగంలో ప్రత్యేక పెట్టి ఏర్పాటు చేశారు. తొలిదశలో రంగంలోకి దింపిన 27 టీమ్ల్లో అత్యధికం ఐటీ కారిడార్తో పాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో మోహరించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. -
గగనంలో వైమానిక అబ్బురం..!
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.పరేడ్ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీసింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ఎంఎక్–2, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్ గంగ’ స్కైడైవింగ్ బృందం, ‘శక్తి’ ఉమెన్ ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
యుద్ధతంత్రాన్ని సాంకేతికత మార్చింది
సాక్షి, హైదరాబాద్: ‘ఒకప్పుడు యుద్ధం అంటే సైనికుడు, ఆయుధం కనిపించేవి. ప్రస్తుతం యుద్ధస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి యుద్ధాల్లో ప్రత్యర్థి ఎవరో, ఆయుధం ఎక్కడి నుంచి వస్తుందో కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ట్రాఫిక్ నెట్వర్క్లు, సీసీటీవీ వ్యవస్థలను కూడా హ్యాక్ చేసి నియంత్రించే స్థాయికి సైబర్ యుద్ధం చేరుకుంది. ఇప్పుడు రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, సెన్సార్లు, రోబోటిక్స్ వంటి వ్యవస్థలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’అని భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన యువ అధికారులకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ యుద్ధ వ్యూహాలు, సాంకేతికతలను వినియోగించే సామర్థ్యం అధికారుల్లో ఉండాలన్నారు.అత్యాధునిక, తక్కువ పరిమాణంలో ఉన్న ఆయుధాలతో చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలకు నష్టం కలిగిస్తున్న ఉదాహరణలు (పరోక్షంగా ఇరాన్–అమెరికా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ) ప్రపంచంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.వారిలో తొలిసారిగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ కూడా ఉండటం విశేషం. వారితోపాటు నౌకాదళానికి చెందిన 9 మంది, కోస్ట్గార్డ్కు చెందిన ముగ్గురు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వాయుసేనకు సంబంధించిన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లకు ప్రెసిడెంట్ కమిషన్ (వైమానిక దళంలో అధికారులుగా గుర్తింపు) ప్రదానం చేశారు. దేశానికి రక్షణ కవచం వైమానిక దళం.. అనంతరం రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ భారత వైమానిక దళం దేశానికి కేవలం రక్షణ కవచమే కాకుండా అవసరమైనప్పుడు శత్రువుపై విరుచుకుపడే ఖడ్గంగా కూడా వ్యవహరించిందన్నారు. 1947–48 కశ్మీర్ యుద్ధంలో శ్రీనగర్ ఎయిర్లిఫ్ట్, 1971 యుద్ధంలో వైమానిక దాడులు, 2025లో ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాద స్థావరాలపై అత్యంత కచి్చతత్వంతో చేపట్టిన దాడులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక వేదికలతోపాటు ఐఏఎఫ్ అధికారుల ధైర్యం, క్రమశిక్షణ వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని రాజ్నాథ్ కొనియాడారు. నారీ శక్తితో ఐఏఎఫ్ మరింత శక్తివంతం.. వైమానిక దళంలో మహిళల సంఖ్య పెరగడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పందిస్తూ నారీ శక్తి భాగస్వామ్యం ఐఏఎఫ్ను మరింత సమతుల్యంగా, శక్తివంతంగా మారుస్తుందన్నారు. ఇది భారత సాయుధ దళాల సమగ్రతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘ఆకాశమే హద్దు కాదు... ఆకాశమే మన ఇల్లు అనే దృక్పథంతో ముందుకు సాగాలి. అదే వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు దోహదపడుతుంది’అని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఉత్తమ అధికారులకు పురస్కారాల ప్రదానం.. శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ యాదవ్ ప్రెసిడెంట్ ప్లాక్, నవానగర్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ (పైలట్ కోర్సులో అగ్రస్థానం), ఫ్లయింగ్ ఆఫీసర్ ఏక్తా గుప్తా నావిగేషన్ విభాగంలో ప్రెసిడెంట్ ప్లాక్, ఫ్లయింగ్ ఆఫీసర్ దివ్యాంశి సింగ్ గ్రౌండ్ డ్యూటీ విభాగంలో ప్రెసిడెంట్ ప్లాక్ అందుకున్నారు. ఆశిష్ కుమార్ యాదవ్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు.పరేడ్ ప్రారంభానికి ముందు త్రివిధ దళాలకు చెందిన తొలి మహిళా డ్రిల్ టీం 303 రైఫిల్స్తో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఎయిర్ మార్షల్ సీతపల్లి శ్రీనివాస్, దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ రాహుల్ బసీ, డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ రమేశ్రెడ్డి, యువ అధికారుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కేటీఆర్కే స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయనకే స్థానం లేదని, ఇక మా స్థానం గురించి కేటీఆర్ ఏం మాట్లా డతారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ ఎద్దేవా చేశారు. వాళ్లు మూడో స్థానంలో ఉన్నారని, అందుకే మేం మూడో స్థానంలోకి వెళ్తామని అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. శనివారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర చేస్తామంటున్నారు. యాత్రలు చేయడంలో తప్పులేదు.వైఎస్సార్ పాదయాత్ర, రాహుల్గాంధీ భార త్ జోడో యాత్రలు దేశ చరిత్రను మలుపు తిప్పా యి. కానీ వీళ్లు ఏమని యాత్రలు చేస్తారు? యాత్ర లో ప్రజలకు ఏం చెప్తారు? అయినా వీళ్లు యాత్రలు చేస్తే ఆదరించేవారు ఎవరు? అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీ, అస్తవ్యస్త పాలన, రైతుల ఆత్మహత్యలపై ప్రజలకు వివరణ ఇచ్చి వీళ్లు యాత్రలు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, బీజేపీ ఫాసిస్టు విధా నాలపై కేటీఆర్ స్పందించాలి’అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు 8 మందీ ఓడిపోతారు.. రూ.వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్రెడ్డి అంటున్నారు. ఆయనే కేంద్ర బొగ్గు మంత్రి కదా? ఏం కుంభకోణం జరిగిందో విచారణ చేసి దోషులెవరో తేల్చవచ్చు కదా. ఈసారి బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు ఓడిపోతారు. అసలు వీళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మళ్లీ గెలుస్తారు? బీజేపీ అనే దుష్టసంహారం కోసమే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు జాతీయ స్థాయిలో పార్టీలు ముందుకొస్తున్నాయి. దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం ఏం చేయాలన్నదానిపై ఇటీవల ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. ఆ మేరకు ఈ నెల 24 నుంచి దేశవ్యాప్త కార్యాచరణ ఉంటుంది.’అని మహేశ్గౌడ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సరైంది కాదు. అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కదా? రాష్ట్రం ఇవ్వాలని అడిగింది, ఇచ్చింది మేమే. అయినా ఏ రోజూ ప్రాంతీయ తత్వాలను ఉసిగొల్పి అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదు. లీకు వీరులెవరో సీఎం తేలుస్తారు పీసీసీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో నాకు తెలుసు. 40 ఏళ్లలో నేను నేర్చుకుంది అదే. తప్పు చేయనంతవరకు నేను భయపడేది లేదు. మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీ దిగజారి ప్రవర్తించింది. రిటర్నింగ్ అధికారి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరించి ఇలా చేశారు. ఆయన్ను ఉరితీసినా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ వారే సమాచారం ఇచ్చారని అనడంలో వాస్తవం లేదు. అయినా లీకు వీరులు, గ్రీకు వీరులెవరైనా ఉంటే సీఎం విచారణ జరిపి తేలుస్తారు. మీనాక్షి విషయంలో కోర్టుకు వెళతాం..’అని పీసీసీ చీఫ్ తెలిపారు. -
కృష్ణా ట్రిబ్యునల్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ కాగా.. ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నిర్దేశిత కేటాయింపులు జరిపే బాధ్యతను తొలుత కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం(ఐఎస్డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్రం మళ్లీ ట్రిబ్యునల్కు అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా కేటాయించిన జలాలను కలిపి మొత్తం 1005 టీఎంసీలను తిరిగి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో.. తమ రాష్ట్ర ప్రయోజనాలను హరించే ఈ గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, దీనిపై నిర్ణయం తీసుకునే వరకు ట్రిబ్యునల్ విచారణను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సెక్షన్ 89 కింద అప్పటివరకు జరిపిన విచారణను ట్రిబ్యునల్ పక్కనబెట్టి సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన రెఫరెన్స్ ఆధారంగా కొత్తగా విచారణను చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ వాదనలు ముగిశాయి. మరో రెండు మూడు నెలల్లో ఏపీ వాదనలూ ముగియనుండగా, ఆ తర్వాత ఆ వాదనలను ఖండిస్తూ తెలంగాణ తుది వాదన వినిపించనుంది. అనంతరం ట్రిబ్యునల్ సెక్షన్ 3 కింద తీర్పును రిజర్వ్ చేసి ఆ వెంటనే ప్రకటించడం కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూస్తూ వాయిదా వేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద మళ్లీ రెండు రాష్ట్రాల వాదనలను పునః ప్రారంభించనుంది. ఆలోగా సుప్రీంకోర్టు సెక్షన్–3 కింద నీటి పంపకాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సెక్షన్ 89 కింద విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు సెక్షన్ 3 కింద కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ను కొట్టివేస్తే మాత్రం సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్లో విచారణ మరి కొన్నేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు సెక్షన్ 3 కింద ఇప్పటివరకు ట్రిబ్యునల్ జరిపిన విచారణ వృథా ప్రయాస కానుంది. పొడిగింపులే పొడిగింపులుఅంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్ 4 కింద 2004 ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తన తొలి నివేదిక, తీర్పును 2010 డిసెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత భాగస్వామ్య రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు 2011 మార్చి 29న ట్రిబ్యునల్కు తమ సూచనలు (రెఫరెన్స్) పంపాయి. అనంతరం ట్రిబ్యునల్ తన తదుపరి నివేదికను 2013 నవంబర్ 29న కేంద్రానికి సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం–2014 లోని సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్ గడువును పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆ చట్టంలోని క్లాజ్ (ఎ), క్లాజ్ (బి) లోని అంశాల పరిష్కారం నిమిత్తం 2014 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు గడువును పొడిగిస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చారు.ఆ తర్వాత ట్రిబ్యునల్ అభ్యర్థనల మేరకు కాలానుగుణంగా ప్రతి ఏటా కేంద్రం గడువును పొడిగిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెగడం లేదు. నీటి కేటాయింపులు లేక కృష్ణా పరీవాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. -
ఈదురు గాలులతో బీభత్సం..
అల్వాల్: నగరంలో అర్ధరాత్రి కురిసిన వర్షం, ఈదురు గాలులు ఓ కుటుంబంలో తీరని విషాదం నింపాయి. విద్యుత్ తీగలు తెగిపడి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పనిచేసే సందీప్ (44) తన భార్య శ్వేత (39), కుమార్తె రితిక (16)తో కలిసి కానాజీగూడ టెలికం కాలనీలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో కాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఇంటి బయట భారీ శబ్దం వినిపించడంతో సందీప్ నిద్రలేచి బయటకు వచ్చి చూడగా ఓ చెట్టు కొమ్మలు తన కారుకు అతిసమీపంగా విరిగిపడ్డాయి. దీంతో కారు దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందిన ఆయన.. కారును పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా భార్య చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నం చేసింది. అయితే కొమ్మల మధ్య తెగిపడిన విద్యుత్ తీగను గుర్తించకపోవడంతో కరెంట్ షాక్కు గురై కుప్పకూలింది. తల్లి పడిపోవడం గమనించిన కుమార్తె రితిక.. ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్కు గురైంది. వారిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో సందీప్ సైతం షాక్కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత సందీప్, శ్వేత స్పృహలోకి వచ్చినా రితిక మాత్రం కదలలేదు. కూతురిని రక్షించాలనే ఆరాటంలో సందీప్ మరోసారి ఆమె వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న విద్యుత్ తీగ తగిలి మళ్లీ కరెంట్ షాక్కు గురయ్యారు. శ్వేత ఆర్తనాదాలు విని ఉలిక్కిపడిన కాలనీవాసులు హుటాహుటిన అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది సందీప్, రితిక మృతిచెందినట్లు నిర్ధారించారు. అయితే తీగలు తెగిపడ్డాయని విద్యుత్ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపించారు. ఒకవేళ వారు వెంటనే స్పందించి ఉంటే కనీసం సందీప్ అయినా బ్రతికేవారని చెప్పారు. తాము వద్దని వారిస్తున్నా కుమార్తె వద్దకు వెళ్లి చెట్టు కొమ్మగా భావించి విద్యుత్ తీగను పట్టుకోవడంతో మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. -
కృష్ణమ్మ ఎడారి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ తడారిపోయింది. పరీవాహక ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో నీళ్లు లేని ఎడారిని తలపిస్తోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ జలాశయం వరకు ప్రాజెక్టులన్నింటికీ సగటున 10 వేల క్యూసెక్కుల వరద ప్రారంభం కాగా, ఎల్నినో ప్రభావంతో.. ఈ ఏడాది అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటి పరిస్థితే లేకుండా పోయింది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 12,134 క్యూసెక్కుల వరద నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ 13 ఉదయం 9 గంటల సమయానికి కూడా చుక్క నీరు రాకపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఆల్మట్టి వెలవెల: ఆల్మట్టి గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. గతేడాది ఈ సమయానికే నిల్వలు 64.12 టీఎంసీలకు చేరాయి. అయితే ప్రస్తుతం 22.8 టీఎంసీలే ఉండటం గమనార్హం. కృష్ణమ్మ జన్మస్థానమైన మహారాష్ట్రలోని మహాబళేశ్వర్లో ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు ఉన్న 518 కి.మీ.ల నిడివిలోని పరీవాహక ప్రాంతం నుంచి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు జలాశయానికి చుక్క నీరు రాకపోవడం ఎగువ పరీవాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 10,661 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 1,287 క్యూసెక్కులే వస్తున్నాయి. కృష్ణా ఉప నది భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 5,884 క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క రాలేదు. కృష్ణా మరో ఉప నది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 8,269 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 365 క్యూసెక్కులే వచ్చిచేరుతున్నాయి. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 13,967 క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం 2,596 క్యూసెక్కులే వస్తుండటం గమనార్హం. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా గతేడాది 8.77 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 3.1 టీఎంసీల వరద వచ్చి చేరగా, 1,500 క్యూసెక్కులు కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్లో కరువు ఛాయలు తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. పశ్చిమ కనుమలకు 985 కి.మీ.ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 12,104 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,352 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, గతేడాది ఈ సమయానికి 56.59 టీఎంసీలకు నిల్వలు చేరితే ప్రస్తుతం 40.87 టీఎంసీలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత సీజన్లో శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరిన వరద కేవలం 2.29 టీఎంసీలే కావడం గమనార్హం. ఇక నాగార్జునసాగర్కు గతేడాది ఈ సమయానికి 10,890 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,987 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా గతేడాది ఈ సమయానికి 136.47 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 144.58 టీఎంసీలున్నాయి. ఇందులో ప్రస్తుత సీజన్లో వచ్చి చేరింది 6.04 టీఎంసీలే కాగా మిగతా నిల్వలు గతేడాది వాడుకోగా మిగిలిన జలాలే కావడం గమనార్హం. దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 4,734 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 32.8 టీఎంసీలకు చేరాయి. పశ్చిమ కనుమల నుంచి 1,107 కి.మీ.ల దిగువన ఉన్న సాగర్ వరకు నదీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయినీ జలాశయాలు నిండిన తర్వాతే దిగువన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్కు వరదలు ప్రారంభం కానుండగా, తాజా పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి. నీళ్లు లేకున్నా విద్యుదుత్పత్తి! ఎల్నినో ప్రభావంతో వానాకాలం అంతటా వర్షాలు కురవకపోవచ్చని, కొన్ని విడతల వారీగా వర్షాలు కురిసినా ఆ తర్వాత వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్లో మిగిలి ఉన్న కొద్ది నిల్వలను విద్యుదుత్పత్తి అవసరాలకు తోడిపారేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాగర్ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా శనివారం తెలంగాణ జెన్కో 3,601 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ 3,378 క్యూసెక్కులు తరలించుకుంటోంది. రోజూ సగటున 2 ఎంయూల చొప్పున.. జూన్ 1 నుంచి 12 మధ్యకాలంలో 25.99 ఎంయూల విద్యుత్ను ఉత్పత్తి చేసి కిందికు నీళ్లను విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకు సంరక్షించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లోని నిల్వలు ఆగస్టు వరకు సరిపోతాయని, ఆ తర్వాతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటే మాత్రం తాగునీటికీ ఇబ్బందిపడక తప్పదని అధికారులు అంటున్నారు. -
కాంగ్రెస్లో ‘ఆడియో’ కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో పార్టీలోని కోవర్టుల వ్యవహారం ఇంకా ముగియక ముందే..పార్టీని, పీసీసీ అధ్యక్షుడిని ఉద్దేశించి షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న ఆ ఆడియో గాందీభవన్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన టీపీసీసీ షబ్బీర్ అలీని వివరణ కోరింది. ఢిల్లీ పెద్దలు సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏముందా ఆడియోలో.. ఆవేదన, పరామర్శ కోణంలోనే ఆ ఆడియోలోని మాటలు ఉన్నప్పటికీ పార్టీలో చర్చనీయాంశమయ్యింది. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. తనకు కాకుండా ఎవరో చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తాను ఉరి పెట్టుకుంటానంటూ ఓ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేయగా, సదరు నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడుతున్నారని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారనే కోణంలో వ్యాఖ్యలు ఉండటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ పేరు కూడా ఉచ్ఛరించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియో ఎప్పటిదో అయినా..అది కాస్తా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది. నేనేంటో అందరికీ తెలుసు: మహేశ్గౌడ్ ఈ ఆడియో వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ స్పందించారు. శనివారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో దీనిపై ప్రశ్నించగా.. ఎలాంటి ఆరోపణల విషయంలోనైనా తొందరపడేది లేదని స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, నా పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజామాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. 40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి్పంచారు. ఎందుకు చేరి్పంచారో ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి సిఫారసు చేసినందుకే చంద్రశేఖర్రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనిపై ఆయన్ను వివరణ కోరాం. ఈ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది..’ అని చెప్పారు. పీసీపీ చీఫ్ను టార్గెట్ చేశారా? పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్కుమార్గౌడ్ను పార్టీలోని కొందరు టార్గెట్ చేశారా? అనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ చర్చకు ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఓ చానెల్లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడే ఇలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా సీఎం రేవంత్కు సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ బలహీనపడ్డారా? లేదంటే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా..అన్నది అర్థం కావడం లేదని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్టకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ కార్యకర్తతో మాట్లాడిన సంభాషణపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్చైర్మన్ అనంతుల శ్యాంమోహన్, సభ్యుడు జాఫర్ జావేద్లు శనివారం షబ్బీర్ అలీకి లేఖ రాశారు. వివరణపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని సూచించారు. -
హైదరాబాద్లో సీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధం
హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హైదరాబాద్లో భారీ నిరసన ప్రదర్శనకు సమాయత్తమవుతోంది. రేపు( ఆదివారం, జూన్ 14వ తేదీ) ఇందిరా పార్క్ దర్నా చౌక్ వద్ద ఆందోళనకు ప్లాన్ చేసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపట్టనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దీనిలోభాగంగా ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్ చుక్ పాల్గొంటుండగా, దీనికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. -
హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్: హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఏఐ ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికి విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా... రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు. అలాగే... ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారిందన్నారు. ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో... క్యాన్సర్, గుండెజబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అందుకు... హైదరాబాద్ ను ఒక ల్యాంచ్ ప్యాడ్ తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అకాడెమియా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా... కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఆవిష్కరణలు కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా, సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించామన్నారు. లైఫ్ సైన్సెస్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్ కు అండగా నిలిచేందుకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్ ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటే ఇదే కాబోలు.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ల్యాప్టాప్లో పని చేసుకుంటూ బైక్ నడుపుతూ వెళ్తున్న ఓ యువకుడి వీడియో.. వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా స్పందించారు.రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలంటూ హితవు పలికిన సజ్జనార్.. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా… pic.twitter.com/qSTFaFvf3w— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 13, 2026 -
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్కు ఆరెంజ్ అలర్ట్.. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. సిద్ధిపేట్, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది.శంషాబాద్ అతలాకుతలం..హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్ అతలాకుతలమైంది. శంషాబాద్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాప్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. శంషాబాద్లో భారీవర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలుభారీ వర్షాలపై అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. హైదరాబాద్లో ఉన్నతాధికారులు హై అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను అలర్ట్గా ఉంచాలని సీఎం ఆదేశించారు.సంగారెడ్డిలో ఈదురుగాలుల బీభత్సంసంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొండాపూర్ మండలంలో గంటన్నర వ్యవధిలోనే 8.1 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది. సదాశివపేట వద్ద రహదారిపై భారీ వృక్షం గాలికి విరిగిపడింది. సదాశివపేట చౌరస్తాలో బలమైన ఈదురుగాలులకు పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ షెడ్డు నేలకూలింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.చౌటుప్పల్లో భారీ వర్షం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. వలిగొండ రోడ్డులో రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 16 తేదీ నుంచి అధిక వర్షాపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్లో 17,18 తేదీలలో భారీ వర్ష సూచన ఉందని.. ఎల్నీలో ఎఫెక్ట్ ఆగస్ట్, సెప్టెంబర్లో ఉంటుందన్నారు. ఎల్నీలో ప్రభావంతో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయని.. ఎండాకాలం ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ నమోదు అవుతుందని తెలిపారు. -
హైదరాబాద్లో బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి..
హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్కు తరలించారు. విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా... గాజులరామారం–జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ బంగ్లాదేశీయులు పట్టుబడుతుండడం గమనార్హం.భారత్లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని వందలాది బంగ్లాదేశీయులు ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని బితారి-హకింపూర్ సరిహద్దు కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అక్రమ వలసదారులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న "గుర్తించు-తొలగించు-బహిష్కరించు" వ్యూహం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని వారు ప్రయత్నించారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుమానిత చొరబాటుదారులందరికీ వెళ్లిపోవాలని, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "జల్దీ జల్దీ భాగో నహీ తో జో కర్నా హై సర్కార్ కరేగా (వెంటనే పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది)" అని ఆయన అన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా, ఇతర వలసదారుల కోసం 23 జిల్లాల్లో "నిర్బంధ కేంద్రాలు" ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల్ని కూడా సిట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత సిట్కు బదిలీ అయింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగిన తర్వాత.. అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో పనిచేసిన కొందరు అధికారులు కీలక డేటాను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసానికి వెళ్లిన అధికారులు.. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. -
ఎంఆర్సీఓజీ అర్హత సాధించిన డా. సైకం శ్రీలత నాయుడు
నల్గొండ: ప్రసూతి, స్త్రీరోగ వైద్య నిపుణురాలు డాక్టర్ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టిట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందిన అర్హతను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.డాక్టర్ శ్రీలత నాయుడు గత పదేళ్లుగా నల్గొండలో ప్రసూతి, స్త్రీరోగ వైద్య సేవలతో పాటు వంధ్యత్వ చికిత్సలు, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఘనతను సాధించినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.ఎంఆర్సీఓజీ అర్హత సాధించడం ద్వారా శ్రీలత నాయుడు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని సహచర వైద్యులు అభినందించారు. ఈ విజయం ఆమె వ్యక్తిగత ప్రగతికే కాకుండా నల్గొండ జిల్లా వైద్య రంగానికి, తెలుగు రాష్ట్రాల మహిళా ఆరోగ్య సేవలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైకం శ్రీలత నాయుడుకు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. -
జనాల ప్రాణాలతో చెలగాటమా?.. నిలదీసిన బైకర్
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు జనాల్ని భయపెట్టింది. రాంగ్ రూట్లో ఆ డ్రైవర్ వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఓ బైకర్ ఆ బస్సును అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. కాసేపు ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. చేసేది లేక బస్సు డ్రైవర్ వెనక్కి తగ్గినట్లే కనిపించాడు. అయితే ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఓ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్అవుతోంది.నగరంలోని 195W రూట్కు సంబంధించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో ఓ బైకర్ ధైర్యంగా బస్సును అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బైకర్, అక్కడే ఉన్న ట్రాఫిక్ వాలంటీర్ గట్టిగా నిలదీయగా, డ్రైవర్ తీవ్ర ఆగ్రహంతో వాళ్లపై అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బైకర్ను తప్పించి ముందుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ బైకర్ మాత్రం అస్సలు తగ్గలేదు. రైట్ రూట్లోనే వెళ్లాలంటూ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆ బైకర్ను, ముందు ఉన్న ఓ కారును, ఆ రూట్లో వచ్చిపోయే వాహనాలను బస్సు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్తో భయపెట్టే ప్రయత్నం చేశాఉడ. ఆ తర్వాత బస్సు ముందుకు కదులుతూ ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై కొంతసేపు గందరగోళం నెలకొంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ డ్రైవర్ల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. కొందరు డ్రైవర్లు నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఆ బస్సు నెంబర్ TG 10 T 1469 మీద చలాన్లు ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడం, ట్యాగులు చేయడంతో ఈ ఘటనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. తక్షణ విచారణ చేపట్టామని చెబుతూ రీ ట్వీట్లు చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. నగరంలో ఇలా ప్రవర్తించే ఆర్టీసీ డ్రైవర్లు చాలామంది ఉన్నారని.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వైఖరిని ప్రదర్శించరని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ బైకర్ను వెల్డన్ బ్రో అని అభినందిస్తున్నారు. హైదరాబాద్లో RTC డ్రైవర్ బరితెగింపు: రాంగ్ రూట్లో వచ్చి హల్చల్**195W రూట్కు చెందిన **TG 10 T 1469** నంబర్ గల బస్సు డ్రైవర్, రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకర్, కారు డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. తన తప్పును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీస్… pic.twitter.com/4KVWSidsop— AVM (@AvmNews7) June 13, 2026 -
హైడ్రా రంగనాథ్కు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఒక వివాదాస్పద స్థలంపై కోర్టు ఉత్తర్వులున్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో స్థలం విషయమై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా.. జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50వేల జరిమానా విధించింది.వివరాల మేరకు.. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో సర్వే నెంబర్-45లో 2 ఎకరాల వివాదాస్పద భూమిపై ఉంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థలం విషయంలో హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో, విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.అలాగే, తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. దీంతో, కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు తీసుకోవడం, కాలయాపన చేయడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతరం, కమిషనర్ రంగనాథ్పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించింది. దీంతో, జరిమానా విషయం చర్చనీయాంశంగా మారింది. -
లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు: శంషాబాద్లో కలకలం
హైదరాబాద్: ఫ్రాంక్ఫర్ట్ నుండి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎయిర్పోర్ట్లో కలకలం రేగింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో విమానాశ్రయ అధికారులకు ఒక అనామక ఈమెయిల్ అందింది. ఆ ఈమెయిల్లో విమానంలో బాంబు ఉందని, అది ల్యాండింగ్ కావడానికి ముందే ఏ క్షణమైనా పేలిపోయే అవకాశం ఉందని దుండగులు పేర్కొన్నారు. ఈ సమాచారంతో విమానాశ్రయ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.సమాచారం అందుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది రంగంలోకి దిగి విమానంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా దించి, వారి లగేజీతో పాటు విమానంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.చివరకు విమానంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాంబు బెదిరింపు కేవలం ఒక నకిలీ (ఫేక్) ఈమెయిల్ గా అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసిన శంషాబాద్ విమానాశ్రయ అధికారులు, ఈ నకిలీ ఈమెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. A bomb threat email was received for a Lufthansa flight arriving at Shamshabad from Frankfurt. At midnight yesterday, after an email was received stating that there was an unmanned bomb on board that could explode at any moment before landing, security personnel at Shamshabad… pic.twitter.com/BqG5fGVA6W— IANS (@ians_india) June 13, 2026 -
ఎనిమిది నెలల క్రితమే హత్యకు కుట్ర..
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. -
ఫ్యాన్సీ క్రేజ్! అంకెల్లోనే అదృష్టముందని..
సాక్షి, సిటీబ్యూరో: ‘టీజీ 09 జీ 9999’ రూ.25.50 లక్షలు.. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన ఆర్టీఏ ప్రత్యేక నంబర్ల బిడ్డింగ్లో ఆల్ నైన్స్ కోసం ఓ ప్రైవేట్ సంస్థ చెల్లించిన మొత్తం ఇది. నవంబర్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ‘టీజీ 09హెచ్ 9999’ కోసం ఓ వాహన యజమాని రూ.22.72 లక్షలు చెల్లించారు. అదే ఆల్నైన్స్ కోసం గత జనవరి 6న ఆన్లైన్ బిడ్డింగ్లో మరో సంస్థ రూ.18 లక్షలతో నంబర్ను సొంతం చేసుకుంది. ఒక్క ఆల్నైన్స్ మాత్రమే కాదు. అన్ని రకాల ప్రత్యేక నంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. ‘టీజీ 09 హెచ్ 0234’ నంబర్ కోసం ఓ వాహన యజమాని రూ.1.01 లక్షలు చెల్లించారు. అదృష్ట సంఖ్యలుగా భావించే నచ్చిన నంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రవాణా శాఖ మూడు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక నంబర్ల బిడ్డింగ్ కోసం ఏటా భారీ డిమాండ్ నెలకొంటోంది. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలకూ ప్రత్యేక నంబర్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫీజుల రూపంలో, బిడ్డింగ్ ద్వారా రవాణా శాఖకు ఏటా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా. వాహనదారుల క్రేజ్ను, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తాజాగా ప్రత్యేక నంబర్ల బిడ్డింగ్ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. సాధారణంగా కొత్త వాహనాల తాత్కాలిక రిజి్రస్టేషన్ గడువు 30 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ గడువు లోపల మాత్రమే నచ్చిన నబర్ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది. తాజాగా చేసిన సవరణ మేరకు వాహనదారులు 60 రోజుల వరకు పోటీలో పాల్గొనే వెసులుబాటు లభించింది.అంకెల్లోనే అదృష్టముందని.. సాధారణంగా కొన్ని రకాల నంబర్లను వాహనదారులు అదృష్ట సంఖ్యలుగా భావిస్తారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ‘9’ నంబర్ను అదృష్టంగా భావించి దానికే ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో అప్పటి వరకు ఎలాంటి డిమాండ్ లేని ‘9’ నంబర్కు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. అలా సింగిల్ నైన్, ట్రిపుల్ నైన్, ఆల్నైన్ నంబర్లు క్రేజ్గా మారాయి. రైజింగ్ నంబర్లను కూడా చాలా మంది అదృష్టంగా పరిగణిస్తారు. ‘1234’, ‘5678’ వంటి వాటికి డిమాండ్ ఉంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘6’ను అదృష్టసంఖ్యగా భావించారు. దీంతో ఆయన వాహనాలకు ఆ నంబర్లనే ఏర్పాటు చేశారు. క్రమంగా వాహనదారుల్లో ‘6’ తో మొదలై ‘ఆల్ సిక్స్’ వరకు క్రేజ్ పెరిగింది. సినీనటులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తమ వాహనాలకు నచ్చిన నంబర్లను ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయంగా మారింది.బహుమతులుగానూ.. ప్రత్యేక నంబర్లను బహుమతులుగా అందజేసే ఆనవాయితీ కూడా పెరిగింది. పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటిప్రత్యేక సందర్భాల్లో కొత్త వాహనాలతో పాటు, ప్రత్యేక నంబర్లు సైతం కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు బహుమతులుగా అందజేయడం విశేషం. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ ఈ నంబర్ల ఫీజును సైతం గతేడాది భారీగా పెంచింది. ‘ఆల్ నైన్స్’ కోసం రూ.50,000 ఉన్న ఫీజును ఏకంగా రూ.1.5 లక్షల కు, ‘1, 9, 6666’ నంబర్లకు రూ.లక్ష వరకు ఫీజు పెంచింది. ‘99, 999, 3333, 5555’ వంటి నంబర్లకు రూ..50 వేలకు ఫీజు పెంచడం గమనార్హం. -
మధ్యలోనే ఆగిపోయిన లిఫ్ట్.. 2 గంటలు నరకయాతన!
ఉప్పల్: స్కైవాక్ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువకుడు దాదాపు బతుకుజీవుడా సుమారు 2 గంటల పాటు అందులో చిక్కుకుని విలవిలలాడాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకుంటాయా.. లేదా? అని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు టెక్నీషియన్ వచ్చి చర్యలు చేపట్టడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ఉప్పల్ స్కైవాక్పై గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాహుల్ (22) అనే యువకుడు ఉప్పల్లో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.గురువారం రాత్రి విధులు ముగించుకుని హాస్టల్కు బయలుదేరాడు. ఉప్పల్ రోడ్డు దాటడానికి ౖస్కైవాక్ వంతెన ఎక్కి కిందకు దిగడానికి లిఫ్ట్–6లో వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో ఆందోళనకు గురైన రాహుల్ 100, 108 అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.లిఫ్ట్ల మె యింటెనెన్స్ చూస్తున్న హెచ్ఎండీఏ సిబ్బంది స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. లిఫ్ట్లోని రాహుల్ అరుపులు, కేకలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. దాదాపు 2 గంటల తర్వాత ఎట్టకేలకు టెక్నీíÙయన్ రావడంతో కథ సుఖాంతం అయ్యింది. రాత్రి 11.30 నుంచి 1.15 నిమిషాల వరకు రాహుల్ యువకుడు బిక్కుబిక్కుమంటూ లిఫ్ట్లోనే గడపాల్సి వచ్చింది. తాను హార్ట్ పేషెంట్నని, లిఫ్ట్లో ఇరుక్కోవడంతో భయాందోళన చెందినట్లు రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.జడుసుకుంటున్న జనం ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ఎక్కడానికి ప్రయాణికులు జంకుతున్నారు. అందులోనూ లిఫ్ట్లు ప్రమాదకరంగా మారాయంటున్నారు. మొదట్నుంచీ లిఫ్ట్లు మొరాయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ వంతెనకు ఎనిమిది లిఫ్ట్లు, నాలుగు ఎస్కలేటర్లు 24 గంటల పాటు పని చేస్తుంటాయి. రోజూ వేలాది మంది స్కైవాక్ ఎక్కి దిగుతుంటారు.లిఫ్ట్లు, ఎస్కలేటర్ల పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. లిఫ్ట్లోఉన్న వారు తలుపులను బలవంతంగా తెరవడం, అటూ ఇటూ లాగడం వల్ల సెన్సా ర్లు పని చేయవని, గురువారం రాత్రి అదే జరిగిందని హెచ్ఎండీఏ అధికారులు వివరణ ఇచ్చారు. టెక్నీíÙయన్ వచి్చన తర్వాతే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయని స్పష్టం చేశారు. -
మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?
బంజారాహిల్స్: రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని లూసిడ్ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 శానిటేషన్ ఇన్స్పెక్టర్ అమిత్కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఇలా వెళ్లడానికి వీల్లేదని మర్యాదగా చెప్పాడు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ శ్రీశైలంపై దాడికి దిగాడు. మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్కుమార్ సదరు కానిస్టేబుల్ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు అమిత్కుమార్, ఆనంద్లపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు. -
బిర్యానీ తినిపించి.. తెప్పలో తీసుకెళ్లి
నిజాంసాగర్(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గొడవల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనచోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు ఇద్దరు పిల్లలు అనన్య (5), రక్షిత్ (9) ఉన్నారు. వీరిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. సరైన ఉపాధి లేక కృష్ణ, సవిత దంపతులు ఇద్దరు పిల్లలతో నాలుగు నెలల కిందట రామచంద్రపురం వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్లో లేబర్ పని చేస్తోంది.కృష్ణ మద్యం సేవిస్తూ సరిగ్గా పనిచేయకపోవడంతో భార్య మందలించేది. ఇదేవిషయమై ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో పిక్నిక్ వెళ్దామని చెప్పి గురువారం పిల్లలను బైక్పై పటాన్ చెరు నుంచి నిజాంసాగర్ప్రాజెక్టు వద్దకు తీసుకు వచ్చాడు. ప్రాజెక్టువద్ద పర్యాటక ప్రదేశాలను పిల్లలకు చూపించి, హోటల్ నుంచి తీసుకు వచ్చిన బిర్యానీ తినిపించాడు. ప్రాజెక్టు పరిసరాల్లో విహరించిన ఫొటోలు తన అల్లుడు నవీన్కు వాట్సాప్లో పంపించాడు. అలాగే ప్రాజెక్టు నీటిలోకి తెప్పపైన పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశం పంపాడు.మత్య్సకార్మికులు చేపల వేటకు ఉపయోగించే తెప్పపైన ప్రాజెక్టు మధ్య భాగంలోకి వెళ్లిన తర్వాత పిల్లలను నీటిలోకి తోసేశాడు. ఆ తర్వాత కృష్ణకూడా తెప్పపై నుంచి నీటిలోకి దూకి తనువు చాలించాడు. సాయంత్రం వరకు పిల్లలతో పాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. కుటుంబీకులు, బంధువులు నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై శివకుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి చూడగా బైక్తో పాటు పిల్లల చెప్పులున్నాయి. జాలర్లు, రెస్క్యూ టీం బృందాలు ప్రాజెక్టు నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కత్తితో పొడిచి.. డంబెల్తో మోది
గోల్కొండ: సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో.. సొంత బావమరుదులే బంధువులతో కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్కొండ కుమ్మర్వాడీకి చెందిన షేక్ మసూద్ అలియాస్ చాందిని మసూద్ (25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మూడేళ్లుగా షేక్ మసూద్ యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం షేక్ మసూద్ తన బస్తీ కుమ్మర్వాడీకి చెందిన బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి మృతుడి బావమరుదులు, అత్త, ఇతర బంధువులు షేక్ మసూద్ను సూటిపోటి మాటలతో వేధించేవారు.దీంతో మసూద్ వారి ఇంటికి రాకపోకలు మానేశాడు. దారిలో ఎక్కడైనా ఎదురైనప్పుడు మసూద్ బావమరుదులు మసూద్ను బెదిరించే వారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఫతేదర్వాజా నూరాని మసీదులో మసూద్ మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతడి బావమరుదులు అప్పు, జావేద్, వీరి బంధువు షేక్ సోహెల్తోపాటు మరో ఇద్దరు మహిళలతో మసూద్ ఇంటి ముందు కాపుకాసి ఉన్నారు. మసూద్ అక్కడికి రాగానే అతడిపై కత్తి, రాడ్తో దాడి చేశారు. ప్రాణభయంతో మసూద్ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు.అక్కడితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి కత్తితో పాటు వ్యాయామం చేసే డంబుల్స్తో కొట్టడం ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు కత్తితో షేక్ మసూద్ తలపై కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మసూద్ తండ్రి నిందితులను అడ్డుకోగా నిందితుల్లో ఒకరైన అప్పు అతడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రక్తం మడుగులో కిందపడిపోయిన మసూద్ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ఆర్నెల్ల కూతురితో కలిసి.. ఆరో అంతస్తు నుంచి దూకి
హైదరాబాద్: ఆరు నెలల చిన్నారితో కలిసి ఓ సాఫ్ట్వేర్ మహిళ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఆరవ అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా ప్రహరీ గోడపై ఉన్న ఇనుప కంచెకు డ్రెస్ చిక్కుకొని గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన భూపేంద్ర సాహు, మధ్యప్రదేశ్లోని భూత్గావ్కు చెందిన ఈషా సాహు (37)లకు 2015లో వివాహం జరిగింది.గత ఎనిమిదేళ్లుగా వీరు మియాపూర్ మయూరీనగర్లోని ఓ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఎనిమిదేళ్లు, మరో చిన్నారికి ఆరు నెలలు. ప్రస్తుతం ఈషా సాహు ప్రసూతి సెలవులో ఉంది. కొన్ని నెలలుగా ఈషా సాహు తల్లిదండ్రుల ఊళ్లోనే ఉంది. నెల రోజుల క్రితం నాగపూర్లోని అత్తారింటికి వెళ్లింది. పెద్ద కూతురుకు స్కూళ్లు ప్రారంభం కావడంతో గత నెల 30న ఆమె తన భర్త, పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది.సరుకులు తీసుకురమ్మని.. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఈషా సాహు తన భర్త భూపేంద్ర సాహు, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని చెప్పి డీమార్ట్కు పంపించింది. సాయంత్రం సమయంలో ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆమె ఓ బకెట్ తీసుకొని ఆరవ ఫ్లోర్కు వెళ్లింది. బకెట్ పైకి ఎక్కి గోడ మీద నుంచి చిన్నారితో కలిసి ఆమె కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఈషా సాహు అక్కడికక్కడే మృతి చెందగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై ఉన్న ఇనుప కంచెకు చిన్నారి డ్రెస్ చిక్కుకొని స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి భర్త భూపేంద్ర సాహు, మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఈషా సాహు మృతి చెందగా, పక్కనే ఉన్న ప్రహరీగోడ ఇనుప కంచెకు గౌను చిక్కుకొని చిన్నారి వేలాడుతూ కనిపించింది. పోలీసులు చిన్నారిని కంచె నుంచి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ‘ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా.. మీరందరూ సంతోషంగా ఉండండి.. నన్ను క్షమించండి’అంటూ ఈషా సాహు ఓ నోట్లో రాసిందని పోలీసులు తెలిపారు. కాగా ఆరు నెలలుగా ఆమె డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మన మక్కలెన్ని?
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన మక్కల పరిమాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉత్పత్తి అయిన దానికంటే ఎక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరిగినట్టు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మక్కలు తెలంగాణ మార్కెట్లకు తరలివచ్చాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ⇒ ఖమ్మంలో అటు ఇటుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేస్తే..భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం 48 వేల మెట్రక్ టన్నులే సేకరించడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోనే ఇంత తేడా ఎలా వచ్చిందనే అనుమానాలు ఉన్నాయి. ⇒ నాగర్కర్నూల్లో 1.66 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించగా, ఏపీలోని కర్నూలును ఆనుకొని ఉన్న గద్వాల జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కానీ పక్కనే ఉన్న వనపర్తిలో 16 వేల మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్లో 14 వేలు, నారాయణపేటలో 1,122 మెట్రిక్ టన్నుల మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ⇒ నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ జిల్లాలోనే అత్యధికంగా 1.71 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ మూడు జిల్లాలలో కలిపి కూడా 40 వేల టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. ⇒ దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన మక్కలన్నీ నిజంగా తెలంగాణ రైతుల నుంచే వచ్చాయా, లేక ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, దళారులు తీసుకొచ్చిన మక్కలు కూడా కొనుగోళ్లలో చేరాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మద్దతు లేక తెలంగాణకు మక్కలు వ్యవసాయ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. పక్క రాష్ట్రాల్లో మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కనీస మద్దతు ధర రూ.2,400 ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో బహిరంగ మార్కెట్లో రైతులు రూ.1,500 నుంచి రూ.1,600కు విక్రయించారు. ఆ రాష్ట్రంలో మార్క్ఫెడ్ ఎంఎస్పీకి కొనుగోలు చేయలేదు. దీంతో రైతుల నుంచి రూ.1,500కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు, దళారులు అవే మక్కలను అక్రమ మార్గాల ద్వారా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించినట్టు తెలుస్తోంది. ఇందుకు ఆయా జిల్లాల్లోని మార్క్ఫెడ్ మేనేజర్లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం, నాగర్కర్నూలు జిల్లాలతోపాటు ఏపీ మక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మల్తోపాటు కామారెడ్డి, నిజామాబాద్లకు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండొచ్చని మార్క్ఫెడ్లోనే చర్చ జరుగుతోంది.మక్కల విక్రయానికి టెండర్లు... 15న మొదటి వేలంరైతుల నుంచి సేకరించినట్టు చెబుతున్న మక్కల విక్రయానికి తెలంగాణ మార్క్ఫెడ్ ఈ నెల 7న ఈ–టెండర్లను ఆహా్వనించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిల్వలో ఉన్న మక్కలను మూడు విడతల్లో వేలం వేయనున్నారు. తొలి విడతలో ఈ నెల 15న 16 లాట్లను విక్రయించనుండగా, 16, 17 తేదీల్లో మరో రెండు విడతల్లో బిడ్లను తెరవనున్నారు. ఒక్కో విడతలో సగటున 4.60 లక్షల మెట్రిక్ టన్నుల మేర మక్కలను వేలం వేయనున్నట్టు సమాచారం. -
భాగ్య ‘నరకం’
సాక్షి, హైదరాబాద్: వానాకాలం వచ్చేసింది.. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగింది..కానీ, హైదరాబాద్ నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. చినుకు రాలితే వణికిపోతోంది. గతేడాది భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కానీ, అదేస్థాయి వానలు ఈసారి కురిస్తే అంతకంటే ఎక్కువ ఆగమాగమయ్యే పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. నగరంలో ఏదైనా సమస్య నెలకొంటే ముందుగా అటువైపు వాహనాలను నియంత్రిస్తారు, లేకుంటే ఆ రూట్ ట్రాఫిక్లో చిక్కుకుంటుంది.గత ఏడాది భారీ వర్షాలు, భయంకర ట్రాఫిక్ జామ్లను సృష్టించిన ప్రాంతాల్లో కొత్తగా వేల సంఖ్యలో వాహనాలు వచ్చి చేరుతున్నాయి. అందుకే నగరం ఇప్పుడు వణికిపోతోంది. పైగా నగరం మరింత విస్తరించింది..కొత్త జనావాసాలు వెలిశాయి. ఇతర జిల్లాలు, ఏపీ నుంచి నగరానికి వచ్చే వాహనాల సంఖ్యా పెరిగింది. రోడ్లు మరింత కుంచించుకుపోయాయి.. అదనంగా ప్రత్యామ్నాయ దారులేవీ అందుబాటులోకి రాలేదు. అందుకే ఇప్పుడు నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. వాహన వరద.. నాలుగో స్థానంలో హైదరాబాద్ దేశంలో ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. గత వానాకాలం ముగిసిన తర్వాత నగరంలో ఏకంగా 5,35 లక్షల వాహనాలు రోడ్డెకెక్కాయి. దీంతో నగరంలో మొత్తం వాహనాల సంఖ్య 90 లక్షలకు చేరువైంది. ఇప్పుడు ఇదే భాగ్యనగర గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గతేడాది నాటికి ఉన్న వాహనాలకు తగ్గ రోడ్డు నెట్వర్క్ హైదరాబాద్కు లేదు. వాణిజ్య ప్రాంతాల విస్తరణ మీద నగరంలో ఎక్కడా నియంత్రణ లేదు. వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చే విషయంలో ప్రణాళిక అంటూ లేని దుస్థితి.ఆయా ప్రాంతాలో పార్కింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. ఈ తరుణంలో కొత్తగా లక్షల వాహనాలు రోడ్డెక్కితే పరిస్థితి భయంకరంగా మారబోతోంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే చాలా ప్రాంతాల్లో గంటలతరబడి ట్రాఫిక్లో బంధీ కావాల్సిందే. ఈనెల 9న భారీ వర్షంతో ఈసారి తొలకరి పలకరించింది. నాలెడ్జి సిటీ, కొండాపూర్, ఐకియా జంక్షన్, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రాయదుర్గం, మెహిదీపట్నం, సచివాలయం, ముషీరాబాద్, పాతనగరం... ఇలా ప్రధాన ప్రాంతాలు సాయంత్రం మూడు గంటలపాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. కేవలం 4–5 సెంటీమీటర్ల మేర కురిసిన ఈ వాన 30 శాతం నగరాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహంలోకి నెట్టేసింది. మరి వరుస పెట్టి 10 సెం.మీ. మేర వాన కురిస్తే నగరం రోజు మొత్తం స్తంభించాల్సిందే. గతేడాది అనుభవాలేంటి..? గత సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. కేవలం గంట సమయంలోనే 10 సెం.మీ. వాన కురిసిన దాఖలాలు ఉండటంతో మెరుపు వరదలు సంభవించాయి. గత సీజన్లో మొత్తం 18 మార్లు నగరం ట్రాఫిక్లో బంధీ కాగా, అరడజను పర్యాయాలు గ్రిడ్లాక్ పరిస్థితి నెలకొంది. యావత్ నగరం గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో నరకం అనుభవించాల్సి వచ్చింది. ⇒ ఏప్రిల్ 3–4,(ప్రీ–మాన్సూన్): జడివాన బీభత్సం సృష్టించింది. గంటపాటు కురిసి భారీ వృక్షాలను కూడా కూకటి వేళ్లతో పెకిలించేసింది. ఫలితం నగరం మొత్తం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ⇒ ఆగస్టు మొదటి రెండు వారాల్లో ఆరు భారీ వర్షాలు కురిశాయి. వానలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రధాన రోడ్లు చెరువుల్లా మారి గంటలపాటు వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చింది. ⇒ సెప్టెంబర్ 17 రాత్రి కురిసిన వాన రోడ్లను ముంచెత్తింది. ప్రాణనష్టం కూడా నెలకొంది. సెప్టెంబర్ 22న గంట పాటు ఏకబిగిన కురిసిన వానలు నగరం మొత్తాన్ని స్తంభింపజేశాయి. ⇒ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 29న కురిసిన కుండపోత పీక్ గ్రిడ్లాక్గా నిలిచింది. ఐటీ కారిడార్లో మితిమీరిన కేంద్రీకరణ మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, మైండ్స్పేస్ జంక్షన్, కోకాపేట లాంటి ఆధునిక హైదరాబాద్ ప్రాంతాల్లో అతి భారీ భవన సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సగటున ఇంటికి రెండు కార్లున్నాయని తేలింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అలాంటి సమయంలో వర్షం కురిస్తే పరిస్థితి బీభత్సంగా మారుతోంది. ఈ ఏడాది తొలి వాన ఈ ప్రాంతాలను ఆగమాగం చేసింది. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ ఫ్లైఓవర్లను నిర్మించే దిశగా జరిగిన ఆలోచనలో పదో వంతు కూడా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విషయంలో లేకపోవటమే అతి పెద్ద సమస్య. నగరంలో రెండుమూడు సెం.మీ. వానను తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అంతకుమించి ఒక్క చినుకు రాలినా అతలాకుతలమే. భారీ నిర్మాణాలకు అనుమతిచ్చే ముందే ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే వ్యూహం ప్రభుత్వం వద్ద లేదు. ఇలా చేస్తే కొంత మెరుగు ⇒ ఆఫీస్ వేళల్లో మార్పులు : ఐటీ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు అన్నీ ఒకే సమయానికి కాకుండా, గంట, రెండు గంటల వ్యవధితో విడతల వారీగా లీవ్/లాగిన్ టైమింగ్స్ పెట్టాలి. ⇒ కార్ పూలింగ్ –ప్రజా రవాణా: ఒక్కరే కారులో వెళ్లకుండా నలుగురు కలిసి ‘కార్ పూలింగ్’చేయడం ఇలాంటి సందర్భంలో చాలా ఉపయోగం, ఇక సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయించే అలవాటు పెంచుకోవాల్సిందే. ⇒ నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు: నగరంలో నీరు నిలిచే 350కి పైగా ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక మోటార్లు ఉంచి, çవరద నీటిని నాలాల్లోకి పంప్ చేయాలి. ⇒ హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ ఉమ్మడి కార్యాచరణ: వర్షం పడగానే రంగంలోకి దిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని జంక్షన్లలో మోహరించాలి. ⇒ వర్క్ఫ్రమ్ హోమ్: భారీ వర్ష సూచనలు అందిన సమయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులుండే ఐటీ కంపెనీలకు ముందే సమాచారం ఇచ్చి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ప్రకటించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ⇒ రోడ్లపై గుంతల పూడ్చివేత: వీలైనంత తొందరగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలి. అక్రమ పార్కింగులను నియంత్రించాలి. రోడ్డు ఆక్రమణలు తొలగించాలి. ⇒ రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు విసరొద్దు.. అవి డ్రైనేజీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వరద నీళ్లు వేగంగా పారకుండా అడ్డుకుంటున్నాయి. -
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో భారీ వర్షం కురవగా, మళ్లీ ఈరోజు(శుక్రవారం, జూన్ 12వ తేదీ) భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ విమానం వెనక్కి మళ్లింపుహైదరాబాద్లో భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి విమానం తిరిగి వెనక్కి మళ్లించారు. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు. -
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి మెడికల్ బోర్డును పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు ( శుక్రవారం) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును ప్రారంభించాలని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కాగా రేపు 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ విషయమై ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ "మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అనారోగ్యంతో ఉండి, అర్హత కలిగిన కార్మిక ఉద్యోగులకు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరాలి. తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి," అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ఈ కీలక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం లేదా మోసాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని యాజమాన్యానికి సూచించారు. కాగా సింగరేణి మెడికల్ బోర్డు వివిధ కారణాలతో గత కొంతకాలంగా నిలిచిపోయింది. -
కేసీఆర్ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వాళ్లే ఓడ గొట్టారు. కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ విషయం బయట పెట్టిన బ్లాక్ షిఫ్ ఎవరో తేల్చండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్కి పరిమితమవుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యర్థి బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయడం మాకు కలిసొచ్చింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నాకు పంచాయితీలు లేవు. విధానపరమైన నిర్ణయాలపై మాత్రమే పంచాయతీ. రేవంత్రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా చేస్తుంది. రేవంత్ నిర్ణయాలు బీఆర్ఎస్కు మంచిది...అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు మెట్రో రద్దు చేశారు. మెట్రో పూర్తయి ఉంటే ట్రాఫిక్ చిక్కులు తగ్గేవి. హైడ్రాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్నారు. మేము నగరంలో వంద చెరువులు బాగుచేశాం.. కానీ చెప్పుకోలేదు. రెండు చెరువులు బాగు చేసి ఉదరగుడుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది సమయం కేసీఆర్ డిసైడ్ చేస్తారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సర్ సభ్యత్వ నమోదుపై సమావేశాలు నిర్వహించాము. మిగతా 59 నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘రేవంత్రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడు.. ఫ్యూచర్ సిటీ అంతకంటే లేదు. జులై లో డీలిమిటెషన్ బిల్లు చేస్తారని సమాచారం ఉంది. దేశంలో డీలిమిటేషన్ చేయక పోయినా రాష్ట్ర విభజన అంశంలోనే పొందుపరిచారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని ఉంది. డీలిమిటేషన్ తర్వాతనే సీట్లు ఎవరికి అనేది ఆలోచిస్తాం. అమ్మిన భూముల డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు కొత్త పథకాలు అమలు చేయడం లేదు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
సాఫీగా.. సాగేలా..! కారిడార్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రణాళికలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారిడార్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా ప్రణాళికలను రూపొందించింది. కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లానింగ్లో భాగంగా రెండు మార్గాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ నుంచి తార్నాక వరకు, కూకట్పల్లి హౌసింగ్బోర్డు నుంచి గండిమైసమ్మ వరకు ప్రతిపాదించారు. ఒవైసీ నుంచి తార్నాక వరకు సుమారు 20 కి.మీ, కేపీహెచ్బీ వై జంక్షన్ నుంచి గండిమైసమ్మ వరకు 20 కి.మీ. వరకు ఉంటుంది. కామన్ డక్ట్ల నిర్మాణం వల్ల ఈ రూట్లో వాహనాలు నిరాటంకంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది..రోడ్లు 100 శాతం వినియోగం వివిధ కారణాలతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో రోడ్లను వినియోగించుకోలేకపోతున్నట్లు హుమ్టా గుర్తించింది. ఫైబర్ కేబుళ్లు, డ్రైనేజీపైపులైన్లు, విద్యుత్ వైర్లు వంటి వివిధ అవసరాల కోసం వేర్వేరుగా లైన్ల నిర్మాణం చేపట్టడంతో రోడ్ల కోసం కేటాయించిన స్థలంఆక్రమణకు గురవుతోంది. మరోవైపు ఫుట్పాత్లు, పేవెమెంట్లపైన కూడా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దీంతో 60 ఫీట్ల వెడల్పు రోడ్లు ఉన్నప్పటికీ పూర్తిగా వినియోగించుకోవడం సాధ్యం కావడం లేదు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. ఈ క్రమంలో అన్ని మార్గాల్లో కారిడార్ల అభివృద్ధి చేపడితే రహదారులను 100 శాతం వినియోగించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కామన్డక్ట్లతో ఫుట్పాత్లు, పేవ్మెంట్లను సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు రోడ్ల వినియోగం కూడా పూర్తిస్థాయిలో ఉంటుంది. రోడ్లపై వరదనీరు నిలువకుండా చేస్తుంది. ప్రయోజనాలు ఇలా..కారిడార్ల అభివృద్ధితో ప్రత్యేకంగా బస్ బేలు, బస్ లైన్ల ఏర్పాటు.ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్లు, నాన్ మోటరైజ్డ్ వాహనాల మార్గాలు.ట్రాఫిక్ నిరాటంకంగా కొనసాగే అవకాశం.అక్కడక్కడ బఫర్జోన్ల ఏర్పాటు. గ్రీనరీ అభివృద్ధి.ఫుట్పాత్లు, పేవ్మెంట్లు వంద శాతం వినియోగం.యూనిఫామ్ క్రాస్ సెక్షన్స్తో ఎక్కడా బాటిల్నెక్స్ ఉండవు.రోడ్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. -
మీనాక్షి నటరాజన్.. నాంపల్లి కోర్టు ఏం చెప్పనుంది?
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతివాదిగా ఉన్న కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విషయమై ఈరోజు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, మీనాక్షితోపాటు మిగిలిన ప్రతివాదుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం పిటిషన్ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.కాగా, తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీలత తనపై వేధింపుల కారణంగా నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటుగా 2023 బెంగళూరులో చేసిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనంతరం, ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలంటూ పీసీసీకి శ్రీలత ఫిర్యాదు చేశారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గతేడాది ఆగస్టు 20న నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.ఫిర్యాదులో తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు, నేరపూరిత కుట్ర, బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు 16 పేజీలతో కూడిన ఫిర్యాదును కోర్టుకు అందించారు. ఆ కేసులో ప్రతివాదులుగా కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎంఎల్ఏ చిట్టెం పర్నికారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డితో పాటు పార్టీ తెలంగాణ మీనాక్షి నటరాజన్ పేరు కూడా చేర్చారు. అలాగే, బాధ్యులైన వారి నుంచి తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కాగా, శ్రీలత పిటీషన్కు కోర్టులో ఎస్ఆర్ నంబర్ కేటాయించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు వాదనల అనంతరం పిటిషన్పై విచారణ చేపట్టాలా? వద్దా? అనే విషయమై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. -
ఎనిమిది వారాల్లో కాలేయ మార్పిడి రోగులు కోలుకుంటున్నారు..
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ప్రపంచ అవయవ ట్రాన్స్ప్లాంట్ డే వేడుకలను ఆయన బంజారాహిల్స్లోని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా ఆయన 1995లో అయవవ దానంతో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ చట్టం తీసుకొచ్చిన నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ ఏఐఎస్ ఏపీవీఎన్ శర్మతో పాటు లివర్ దాతలను, కాలేయ గ్రహితలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయని 30 శాతం ఫ్యాటీ లివర్ కేసుల్లో మాత్రమే ఆల్కహాల్ వల్ల సంభవిస్తాయని 70 శాతం కేసుల్లో జన్యుపరంగా, డయాబెటిస్, ఒబేసిటి కారణాలు ఉంటాయని అన్నారు. ఫ్యాటీ లివర్ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని లివర్ సిరోసిస్గా మారి వ్యాధి ముదిరితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అవయవ దానంపై ఎంతో అవగాహన పెరుగుతుందని ప్రతియేటా దేశంలో 2లక్షల మందికిపైగా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారని అయవవ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సల్లో మన దేశంలో ప్రపంచంలోనే అయిదో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. -
అప్పుల కోసం వందల కోట్ల కమీషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్పుల కోసం ముంబైలోని బ్రోకర్కు వందల కోట్ల కమీషన్లు ముట్టచెప్పిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు హరీశ్రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమీషన్లతోనే ఆ బ్రోకర్ ఏకంగా విమానం కొన్నా రని ఆయన స్పష్టం చేశారు. తాము కేంద్ర కార్పొరేషన్ల నుంచి రుణాలు తెస్తే రేవంత్ సర్కార్ మాత్రం రుణాలు తెచ్చుకోవడానికి కొత్తగా కమీషన్లు ఇచ్చే సంస్కృతి మొదలెట్టిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ నిర్మించి అక్కడ ప్రజలను కలిసేవారని, దానిని కూడా రాజకీయం చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరిట రూ. 7 కోట్లకు జీవో ఇస్తే ఇప్పటికే దానికి రూ.70 కోట్ల వ్యయం అయిందన్నారు.దాని చుట్టూ రక్షణ కోసం 17 కోట్లతో ఇనుప కంచె వేశారని, మరో 10 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం నిర్మించుకుని బోధి పెవిలియన్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయం, ఫ్యూచర్సిటీ, సచివాలయం, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంపు కార్యాల యాలు ఉన్నా మరొకటి ఎందుకని విమ ర్శించారు. సీఎం ప్రతీనెలా హెలికాప్టర్కు రూ. 2 కోట్లు వ్యయం చేస్తున్నారని, అదీ చాలదని ఇప్పుడు రూ.5 కోట్లకు మరింత అధునాతన హెలికాప్టర్ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారన్నారు. రూ. 2,000 కోట్ల కుంభకోణం.. పాఠశాల, గురుకుల విద్యార్థులకు అవసర మైన దుస్తులు, బూట్లు, బెల్ట్ వంటివి చేనేత సహకార సంస్థ, లిడ్క్యాప్ నుంచి తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చేవారని, సీఎం రేవంత్రెడ్డి మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి దాదాపు రూ. 2,000 కోట్ల కాంట్రాక్టును గుజరాత్కు చెందిన మార్వాడీకి కట్టబెట్టారని ఆరోపించారు. విద్యార్థుల కు పాఠశాల తెరిచే నాటికి దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు కనీసం వస్త్రం రానేలేదని, అందుకే సాధారణంగా జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు వాయి దా వేశారని ఆరోపించారు. కాంట్రాక్టు పొందిన సంస్థతో కమీషన్లకు సంబంధించి తుది నిర్ణయం కాకపోవడంతో ఆలస్యమవుతోందని ఆరోపించారు. గురుకులాల విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, దుస్తులు కూడా రాలేదని దుయ్యబట్టారు. మీనాక్షి కేసు లీక్పై విచారణ జరపండి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడే బీజేపీ నేతలకు కేసు వివరాలను అందించారని హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతీ దానికి సిట్, న్యాయ విచారణ, సీబీఐ, సీఐడీ విచారణ అనే సీఎం రేవంత్రెడ్డి మీనాక్షి కేసు సమాచారం లీక్ చేసిన ఘటనపై విచారణ జరిపించి నిగ్గుదేల్చాలన్నారు.ఫార్మాసిటీ రద్దుతో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలా లు ఇస్తే తాము వ్యతిరేకించమని, అయితే వివాదాలు లేని స్థలాలు ఇవ్వాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల జీవో 111ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ గురించి పదేపదే సీఎం మాట్లాడుతున్నారంటేనే.. తమ పార్టీ బలంగా ఉన్నట్లు లెక్క అని అన్నారు. ప్రతీరోజు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేరెత్తకుండా సీఎం ఉండలేరని వ్యాఖ్యానించారు. -
బదిలీలతో ఎట్టకేలకు పట్టణాలకు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్యశాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. 157 కేడర్లలో మొత్తం 4,869 మంది ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో అత్యధికంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలోనే 2,258 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. వైద్య,ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాలతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పునర్వ్యవస్థీకరించారు. దీర్ఘకాలం హైదరాబాద్ వంటి ఒకే స్టేషన్లో పనిచేసిన వారిని జిల్లాలకు పంపడం వల్ల, జిల్లాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు వైద్యులు, సిబ్బందికి హైదరాబాద్ పోస్టింగ్ల అవకాశాలు లభించాయి. ఈసారి బదిలీల్లో నాన్ ఫోకల్ ఏరియాల్లో పనిచేస్తున్న వైద్యులకు ఫోకల్ ఏరియాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలతో పాటు పాత ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్లలో పోస్టింగులు దక్కడం గమనార్హం. ఎన్ఎంసీ తనిఖీల దృష్ట్యా జాగ్రత్తలు త్వరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి మెడికల్ కాలేజీలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పోస్టింగ్లను సర్దుబాటు చేసింది. ఎవరికి అవకాశం? ఎవరు మినహాయింపు? ఆయా విభాగాల్లోని కేడర్ను బట్టి 40 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల విషయంలో దానిని 10 శాతానికి పరిమితం చేశారు. అది కూడా ప్రభుత్వం ఒకే స్టేషన్లో నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే బదిలీకి అవకాశం కల్పించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు పెద్ద ఎత్తున బదిలీలు ఇస్తే జిల్లాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. అయినా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మూడేళ్లు పైబడి సర్వీస్ ఉండి రిక్వెస్ట్ బదిలీలు, అనారోగ్య సమస్యలు, వితంతు ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఫైనాన్స్ విభాగ అనుమతితో ఈనెల 16 వరకు ఈ ప్రక్రియ కొనసాగించనున్నట్లు తెలిసింది. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడంలో మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కార్యదర్శి క్రిస్టినా, సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రధానపాత్ర పోషించారని వైద్యులు చెబుతున్నారు. -
కోల్ గ్యాసిఫికేషన్తో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్ : కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులకు ఫార్మా రాజధాని హైదరాబాద్ అద్భుతమైన మార్కెట్ అని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ‘ఇటీవల ఆమోదం పొందిన రూ.37,500 కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ స్కీం, కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు మరింత వేగంగా ముందుకు సాగుతాయి. దేశవ్యాప్తంగా మెగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల స్థాపనలో ఈ స్కీం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి’అని వెల్లడించారు. ‘ప్రతి ఏడాది రూ.3 లక్షల కోట్లు విదేశీ మారకద్రవ్యాన్ని దిగుమతుల కోసం వినియోగిస్తున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫెర్టిలైజర్, స్టీల్, ఎనర్జీ వంటి రంగాల్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్రముఖపాత్ర పోషిస్తుంది’అని చెప్పారు. హైదరాబాద్లోని మన శాస్త్రవేత్తలు ఇక్కడ లభ్యమయ్యే బొగ్గును గ్యాసిఫికేషన్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడి బీహెచ్ఈఎల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతోపాటు అనేక పరిశోధన సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. తెలంగాణలో సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. గురువారం హెచ్ఐసీసీలో చేపట్టిన ‘రోడ్షో టు ప్రమోట్ సర్ఫేస్ కోల్/ లిగ్నేట్ గ్యాసిఫికేషన్’లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్లో రెండో కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షో నిర్వహించడం ఆనందంగా ఉంది. గత నెల 28న ఢిల్లీలో నిర్వహించిన తొలి రోడ్షోకు పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, ఆర్థిక సంస్థలు, పరిశోధకులు, ప్రాజెక్టు అభివృద్ధి సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ రోడ్ షో కోల్ గ్యాసిఫికేషన్ ప్రయాణానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రయాణానికి హైదరాబాద్ ఒక మూలాధారం అని చెప్పొచ్చు. ఒకప్పుడు మన దేశంలోని బూడిద శాతం ఎక్కువగా ఉన్న బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయం ఉండేది. అయితే మన సైంటిస్ట్లు ఈ బొగ్గును గ్యాసిఫికేషన్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనులు శాఖ సహాయ మంత్రి సతీశ్చంద్ర దూబే, సింగరేణి కాలరీస్ సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, పరిశ్రమ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఇతర స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు. -
మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎండలు ఇంకా తగ్గలేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి ఇంకా సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గురువారం ఆదిలాబాద్, మహబూబ్నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు అధికంగా నమోదవగా నిజామాబాద్, హనుమకొండ, హైదరాబాద్లలో 4 డిగ్రీల మేర అధికంగా రికార్డయ్యాయి. కేవలం ఖమ్మం, భద్రాచలంలలో మాత్రమే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా విపరీతంగా ఉండటంతో నడివేసవి పరిస్థితి గుర్తుచేస్తోంది. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నమోదైంది.నైరుతి విస్తరణ బాట..నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2–3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికితోడు తెలంగాణ, దక్షిణ కోస్తా ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఎన్ఎస్పీ ఎడమ కాల్వకి గోదావరి: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి గోదావరి జలాలను సాగర్ ఎడమ కాల్వ వ్యవస్థకు తరలించి అక్కడి నుంచి పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు మళ్లించడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గురువారం జలసౌధలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతుల కోసం తీవ్ర కృషి చేయాలని, ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) క్లియరెన్స్ ఇప్పటికే లభించిందని, విధానపర జాప్యాలతో రైతులకు సాగునీటి ప్రయోజనాలు దూరం కాకూడదని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి : ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని, సుప్రీం కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ను న్యూఢిల్లీకి పంపాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు భూసేకరణ చాలా వరకు పూర్తైందని, కొన్ని అటవీ అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. జూలై నాటికి అటవీ అనుమతులను సాధించాలని, భూసేకరణను సాకుగా చూపి పనులు ఆలస్యం చేయకుండా కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచాలని ఉత్తమ్ ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, వనరులను సమీకరించి సాధ్యమైనన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో నిధుల విడుదల : జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకి రూ.200 కోట్లు అవసరమని, త్వరలో విడుదల చేస్తామన్నారు. అలాగే, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ భూసేకరణను కూడా వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ–1 ద్వారా ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలోని బయ్యారం ఎగువ గిరిజన ప్రాంతాలకు నీటిని ఎత్తిపోయాలనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదనకు మంత్రి ఉత్తమ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం అథారిటీతో సమావేశం : పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్స్తో భద్రాచలం డివిజన్లో ముంపు సమస్యపై మంత్రి స్పందిస్తూ.. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. పక్షం రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షిస్తానని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. మరోవైపు సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన ఎన్జీటీ కేసులు, ఇతర న్యాయపర అడ్డంకులను తొలగించడానికి అడ్వకేట్ జనరల్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. -
వ్యవసాయ రంగంలో మార్పులకు సహకార సంఘాలే కీలకం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సహకార సంఘాల ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమైంది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడంలో సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు) కీలక పాత్ర పోషిస్తాయని జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (ఎన్ఏఏఎస్–నాస్) వెలువరించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ ఇన్ ది గ్లోబల్ అరేనా’పేరుతో విడుదలైన నివేదికలో ప్రపంచంలోని విజయవంతమైన సహకార నమూనాలను విశ్లేషించి భారత పరిస్థితులకు అన్వయిస్తూ పలు కీలక సూచనలు చేసింది. రైతులను మార్కెట్తో అనుసంధానించడం, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలు కల్పించడం ద్వారా సహకార వ్యవస్థ వ్యవసాయంలో గణనీయమైన మార్పు తీసుకురాగలదని పేర్కొంది. భారత్లో దాదాపు 90 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న, సన్నకారు రైతులవే. విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, రుణాలు, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి సేవలను ఒకే వేదికపై అందించే సామర్థ్యం సహకార సంఘాలకు ఉందని వివరించింది.భారత్లో 8 లక్షలకుపైగా సహకార సంఘాలుప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షలకుపైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 30 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. వ్యవసాయం, పాల ఉత్పత్తి, ఎరువులు, గ్రామీణ రుణాలు, మార్కెటింగ్, నిల్వ తదితర రంగాల్లో ఇవి సేవలందిస్తున్నాయి. పాల రంగంలో అమూల్, ఎరువుల రంగంలో ఇఫ్కో వంటి సంస్థలు సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచస్థాయి విజయాలు సాధించిన ఉదాహరణలుగా అధ్యయనం పేర్కొంది. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ప్రధానంగా రుణాల పంపిణీకే పరిమితమవుతున్నాయి. భవిష్యత్లో వీటిని బహుళ సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది. రైతులకు రుణాలతో పాటు విత్తనాలు, ఎరువులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్, డిజిటల్ సేవలు, విలువ వృద్ధి కార్యక్రమాలు అందించే కేంద్రాలుగా పీఏసీఎస్లను తీర్చిదిద్దాలని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎఫ్పీఓలుగా మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వెల్లడించారు. రైతులకు విత్తనాల సరఫరా, నేల పరీక్షలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి సేవలను ఒకేచోట అందించే కేంద్రాలుగా పీఏసీఎస్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ‘నాస్’అధ్యయనం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది.ముల్కనూరు మోడల్కు గుర్తింపుఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు సహకార సంఘం దేశంలోనే విజయవంతమైన సహకార నమూనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రైతులకు రుణాలు, ఎరువులు, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు ఒకే వేదికపై అందించడం ద్వారా సహకార వ్యవస్థ ఎలా విజయవంతమవుతుందో ఈ నమూనా చూపించిందని ‘నాస్’వర్క్షాప్లో నిపుణులు ప్రస్తావించారు. -
విటుడిపై ‘ట్రాఫికింగ్’ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: సెక్స్ వర్కర్ సేవలు పొందిన వ్యక్తిని కేవలం విటుడు అన్న కారణంతో ఐపీసీ సెక్షన్ 370 (ట్రాఫికింగ్/మానవ అక్రమ రవాణా) కింద నేరస్తుడిగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐపీసీ సెక్షన్ 370ఏ(2) కింద అతనిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. సదరు సెక్స్ వర్కర్.. అక్రమ రవాణాకు గురైన మహిళ అనే విషయం అతనికి తెలిసినా లేదా తెలిసేందుకు అవకాశమున్నా సెక్షన్ 370(ఏ)(2) వర్తిస్తుందని చెప్పింది. అలాగే ఇతరులకు సెక్స్ వర్కర్లను సమకూర్చడం లేదా మధ్యవర్తిత్వం వహించడం వంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫికింగ్ కేసులు నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు దాఖలైన దాదాపు 120కి పైగా క్రిమినల్ పిటిషన్లలో ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వెలువరించింది. తాము ట్రాఫికింగ్కు పాల్పడకున్నా ఆ చట్టం కింద కేసులు పెట్టడాన్ని సవాల్ చేస్తూ హేమంత్కుమార్ సహా 120 మంది పలు పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో చదువుకుంటున్న యువకులు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా నమోదైన వ్యభిచారం కేసుల్లో వీరంతా నిందితులు. మూడేళ్లుగా నమోదైన ఇలాంటి కేసుల్లో హైకోర్టులోని సింగిల్ జడ్జిల ధర్మాసనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుల విచారణను డివిజన్ బెంచ్కు అప్పగించారు. దీంతో జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు కేవలం విటులం మాత్రమేనని, ట్రాఫికింగ్కు లేదా లైంగిక దోపిడీకి పాల్పడలేదని తెలిపారు. ట్రాఫికింగ్కు పాల్పడేవారి కోసమే ‘370’ వాదనలు విన్న ధర్మాసనం.. ఐపీసీ సెక్షన్ 370 ట్రాఫికింగ్కు పాల్పడే వ్యక్తులను శిక్షించేందుకు ఉద్దేశించిందని స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా వృత్తిలో ఉండే సెక్స్ వర్కర్లు, వారి విటులను పోలీసులు, దర్యాప్తు సంస్థలు వేధించరాదని హెచ్చరించింది. స్వచ్ఛంద సెక్స్ వర్క్ భారత చట్టాల ప్రకారం నేరం కాదంటూ ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ప్రస్తావించింది. అలాగే వేశ్యాగృహం లేదా వ్యభిచారం జరుగుతున్న ప్రాంగణ సమీపంలో ఉన్న వ్యక్తిపై సెక్షన్ 370ఏ(2) కింద కేసు నమోదు చేయలేమని పేర్కొంది. కేసు నమోదు చేయాలంటే..ట్రాఫికింగ్కు గురైన మహిళపై లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడని, ఆమె ట్రాఫికింగ్ బాధితురాలని అతనికి తెలుసు అనేందుకుఆధారాలు ఉండాలని వెల్లడించింది. కేవలం అక్కడ ఉండటం నేరంగా పరిగణించలేమనితేల్చిచెప్పింది. -
ఫ్యూచర్ సిటీకి సింగపూర్ మాస్టర్ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ (బీఎఫ్సీ) అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల (చ.కి.మీ) మేర విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)కి సంబంధించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపకల్పన బాధ్యతను సింగపూర్కు చెందిన బహుళ జాతి ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ కంపెనీ డీపీ ఆర్కిటెక్ట్స్ దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ టెండర్ల ప్రక్రియలో మొత్తం ఆరు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడగా.. తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించేందుకు (లోయెస్ట్ బిడ్డర్) ముందుకు రావడంతో ’డీపీ ఆర్కిటెక్ట్స్’ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఎఫ్సీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధులకు అధికారులు ఒప్పంద పత్రాలను అందజేశారు. 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సింగపూర్ సంస్థకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని విధించింది. తొలుత 13 వేల ఎకరాలకే.. ఏ నగరాభివృద్ధికైనా సమగ్ర ప్రణాళిక అవసరం. లేకుంటే అస్తవ్యస్తమైన వృద్ధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు అధికార పరిధి సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో మొత్తం 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎఫ్సీడీఏ పరిధిలో భూవినియోగం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అయితే తొలి దశలో సుమారు 13 వేల ఎకరాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన జోన్గా గుర్తించి ముందస్తుగా మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నారు. రాబోయే కాలంలో ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ శివార్లలో ఇంండ్రస్టియల్, ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ హబ్లతో కూడిన సరికొత్త నాల్గవ నగరం రూపుదిద్దుకోనుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం లైఫ్ సైన్సెస్ హబ్కు 4 వేల ఎకరాలు, రెసిడెన్షియల్ జోన్కు 2,477 ఎకరాలు, ఎల్రక్టానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్కు 2,177 ఎకరాలు, ఈవీ అండ్ ఎనర్జీ పార్క్కు 1,976 ఎకరాలు, హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఏఐ సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్కు 255 ఎకరాలు కేటాయించారు. 3 విభిన్న ప్రాంతాలతో.. మూడు విభిన్న ప్రాంతాల కలయికతో కూడిన ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సమగ్ర సమత్యులతో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర ప్రాంతం: హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 పరిధితో ఇది కలిసి ఉంటుంది. ఇక్కడ రవాణా నెట్వర్క్లు, కారిడార్లు ఇప్పటికే ఉన్నాయి. మధ్య ప్రాంతం: హైదరాబాద్ ఫార్మా సిటీ భూమి దీని పరిధిలో ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్, ఎల్రక్టానిక్స్ రంగాలు అభివృద్ధి చేయనున్నారు. దక్షిణ ప్రాంతం: ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీనికి ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధమైన భూవినియోగ ప్రణాళిక లేదు. ఈ మూడు భిన్నమైన జోన్లను కలుపుతూ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ ఫ్రేమ్వర్క్కు సరిపోయేలా ఒకే చట్టబద్ధమైన మాస్టర్ ప్లాన్ అత్యవసరమని సింగపూర్ సంస్థకు అధికారులు స్పష్టం చేశారు. -
రూ.5 వేల కోట్ల స్కామ్కు స్కెచ్!
సాక్షి, హైదరాబాద్: గోల్డ్క్వెస్ట్, క్వెస్ట్నెస్ట్, క్యూనెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో దేశ వ్యాప్తంగా 25 ఏళ్లు మల్టీ లెవల్ మార్కెటింగ్ దందా చేసి, లక్షల మంది నుంచి రూ.వేల కోట్లు కాజేసిన సంస్థ ఈసారి ఇగ్నైట్ పేరుతో వచ్చింది. చండీగఢ్లోని ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)లో ‘ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గత నెల 18న రిజిస్టర్ చేసుకుని, డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో రూ.5 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కుట్ర పన్నింది.ఇది రిజిస్టరైన 18 రోజులకే మూలాలు కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో దాడులు చేసి ఆరుగురు కీలక నిందితు లను అరెస్టు చేసినట్లు కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ తెలిపారు. అదనపు, సంయుక్త సీపీలు ఎం.శ్రీనివాసులు, ఎస్.చైతన్యకుమార్, ఎస్ఎం విజయ్కుమార్లతో కలిసి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. హాంగ్కాంగ్ కేంద్రంగా..ఇగ్నైట్ హాంగ్కాంగ్ కేంద్రంగా నడుస్తోంది. దీని వ్యవస్థాపకుడు తమిళనాడు గోల్డ్క్వెస్ట్ కేసులో ప్రధాన నిందితుడు, ఇగ్నైట్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్లీ హసన్ గతంలో క్యూనెట్ సంస్థ తరఫున పని చేశాడు. ఇందులో పని చేస్తున్న వాళ్లూ క్యూనెట్కు సంబంధించిన వాళ్లే. కంపెనీ అధికారికంగా రిజిస్టర్ కావడానికి తొమ్మిది రోజుల ముందే దాని వెబ్సైట్ డొమైన్లో రిజిస్టరైంది. ఈ సంస్థ చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పే ‘సిమెట్రా’ అనే అయస్కాంత పెన్, శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే ‘యాక్టివా’ అనే చతురస్రాకార గాజు ముక్క, భారతీయ రిటైల్ మార్కెట్లో రూ.600 కంటే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ టూత్బ్రష్ ’బ్రష్–ఓ’లను విక్రయిస్తోంది. గరిష్టంగా రూ.వెయ్యి ఉండే వీటిని 680 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.60 వేలు) విక్రయిస్తున్నారు. తమ సంస్థలో చేరాలంటూ ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న ఇగ్నైట్ జూమ్ మీటింగ్ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. నగరవాసుల ఫిర్యాదుతో..ఇగ్నైట్ మాటలు నమ్మి రూ.1.87 లక్షలు మోసపోయిన ముగ్గురు పంజగుట్ట, ఎస్సార్నగర్, కాచిగూడల్లో ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఆఫ్రికాకు చెందిన వాట్సాప్ నంబర్ ద్వారా, మరొకరిని జూమ్ ప్రెజెంటేషన్, ఇంకొకరిని హైదరాబాద్ సెంట్రల్ మాల్లో ముఖాముఖిగా కలిసి నమ్మించారు. ముగ్గురు చెల్లించిన డబ్బు మాత్రం ఒకే బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. కోల్కతాలోని భవానీపూర్ శాఖకు చెందిన ‘పారస్నాథ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్’కు చేరింది. అలా వచ్చిన సొమ్ము అట్నుంచి బెంగళూరుకు చెందిన జ్ఞానేష్ పీఎన్ అనే వ్యక్తికి, ఆపై ఢిల్లీ, చండీగఢ్లకు బదిలీ అవుతోందని గుర్తించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో మలేసియాకు తరలించి, ఆపై ఆఫ్రికా ద్వారా ఈ నిధులను యూఎస్డీటీ క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారుస్తున్నారు. చివరగా ఏడో దశలో ఈ సొమ్ము హాంగ్కాంగ్లోని ఇగ్నైట్ ప్రధాన నిర్వాహకుల ఈ–వాలెట్కు చేరుకుంటోంది.ఇది వ్యవస్థీకృత నేరమని నిర్థారించిన పోలీసులు ఈ మూడు కేసుల్నీ సీసీఎస్కు బదిలీ చేశారు. ఏసీపీలు నర్సింహారెడ్డి, హరీశ్ లోతుగా దర్యాప్తు చేసి కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సిబ్బందితో దాడులు చేశారు. ఒనియల్ గుప్తా (ఇగ్నైట్ టీమ్ లీడర్ / రిక్రూటర్), దినేశ్ కుమార్ సాహిల్ (డైరెక్టర్), ప్రియాన్షు సక్సేనా (డైరెక్టర్), ప్రవీణ్ కుమార్ దకాలియా (డైరెక్టర్), పరితోష్ కుమార్ దకాలియా (డైరెక్టర్), రియాజ్ (ఫీల్డ్ రిక్రూటర్)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 2,48,681 మంది పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో జన రల్, ఒకేషనల్లో రెండు సంవత్సరాలకు కలిపి 2,48,681 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 68.84 శాతం, రెండో సంవత్సరంలో 49.29 శాతం పాస య్యారు. మే 13 నుంచి 21 వరకు పరీక్షలు జరిగాయి. 889 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు రెండేళ్లకు సంబంధించి న 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలి తాలను ఇంటర్ బోర్డు గురువారం ఆన్లైన్లో విడుదల చే సింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు ఈ నెల 12 నుంచి 18 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. -
‘హీటె’క్ సిటీ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 30 నగరాలు తీవ్ర మైన వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని ఎదుర్కొంటుండగా అందులో హైదరాబాద్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘మూవింగ్ బియాండ్ ఎక్స్పోజర్: ఎ గ్లోబల్లీ కంపేరబుల్ ఫ్రేమ్వర్క్ ఫర్ హీట్ రిస్క్ అసెస్మెంట్ ఇన్ సిటీస్’ పేరిట మొత్తం 205 నగరాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వేగవంతమైన పట్ట ణ విస్తరణ, తగ్గిపోతున్న పచ్చదనం, ఎయిర్ కండిషనర్లపై ఆధారపడటం పెరుగుతుండడం వంటివి వేడి సంబంధిత అనారోగ్య సంక్షోభానికి కీలక కారణాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మన నగరానికీ ‘వేడి’మన దేశంలో అహ్మదాబాద్, నాగ్పూర్ మదురై అధిక వేడి ప్రమాదాన్ని కలిగి ఉండగా, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక దాదాపు 80 లక్షల మంది నివసించే హైదరాబాద్ ఈ నగరాల తర్వాతే ఉండగా.. హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్లో మొత్తం 0.68 వేడి ప్రమాద స్కోరును నమోదు చేసింది. ఇది కైరో, మనీలా, హో చి మిన్ సిటీ వంటి ప్రమాదం ఉన్న నగరాల కంటే కేవలం 0.05 నుంచి 0.10 పాయింట్లతో స్వల్పంగా మాత్రమే మెరుగ్గా ఉండగా, బ్యాంకాక్, హనోయ్ వంటి నగరాల కంటే అధ్వాన్నంగా ఉంది. ఈ ఇండెక్స్ అనేది ఒక నిర్దిష్ట జనాభాకు తీవ్రమైన వేడి కలిగించే ప్రమాదాన్ని అంచనా వేసే ఒక కొలమానం. ఈ సూచిక కేవలం ఉష్ణోగ్రత ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉన్న శీతలీకరణ మౌలిక సదుపాయాలు, పచ్చదనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. నగరవాసుల్లో అధిక శాతం మందికి ఈ రెండూ పరిమితంగానే అందుబాటులో ఉండడం వల్ల వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతోంది. క్షేత్రస్థాయిలోని గణాంకాలు కూడా అధ్యయన ఫలితాల్ని బలోపేతం చేస్తూ పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను మించిన రోజులు 47 నమోదు కాగా.. గత 10 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. -
'ధర'ఖాస్తు దడ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) షాకిచ్చింది. ఇప్పటివరకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము రూ.200 ఉండగా.. తాజాగా దీన్ని ఐదు రెట్లు పెంచింది. అంటే ఇకపై ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే రూ.1,000 ఫీజు చెల్లించాలన్నమాట. గత వారం టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రహదారులు, భవనాల శాఖ పరిధిలో 222 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 49, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిధిలోని 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు రుసుమును రూ.1,000గా ఖరారు చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్లో వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే వీరి దరఖాస్తు ఫీజు గతంలో రూ.100 మాత్రమే కావడం గమనార్హం. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడంతో టీజీపీఎస్సీకి నిర్వహణ ఖర్చు చాలావరకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దరఖాస్తు రుసుమును ఏకంగా 5 రెట్లు పెంచడంపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే వేలల్లో ఫీజు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.యూపీఎస్సీ, ఎస్ఎస్సీల కంటే చాలా ఎక్కువటీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన రాష్ట్ర ప్రభుత్వం..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ కూడా తమకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీలు రోల్ మోడల్ అని ప్రకటించింది. అయితే యూపీఎస్సీ పరీక్షలకు ఫీజు రూ.100 నుంచి రూ.200 మధ్యనే ఉండటం గమనార్హం. ఇక ఎస్ఎస్సీ నిర్వహించే ప్రధాన పరీక్షలకు ఫీజు రూ.100 మాత్రమే ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులపై పెను భారం!గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియంతా టీజీపీఎస్సీ ద్వారానే జరుగుతుంది. నోటిఫికేషన్లు వెలువడినప్పుడు అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో నోటిఫికేషన్కు 4 లక్షల నుంచి 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సందర్భాలున్నాయి. 2024 గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడినప్పుడు ఏకంగా 4 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. చివరగా భర్తీ చేసిన గ్రూప్–4 ఉద్యోగాల కోసం 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో దరఖాస్తు రుసుము 5 రెట్లు పెంచుతూ తాజాగా కమిషన్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ అభ్యర్థులపై, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులపై పెనుభారం మోపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హైదరాబాద్కు రూ.లక్ష కోట్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా నిలుస్తున్న ఆరు మెట్రో నగరాల సమగ్ర అభివృద్ధికి ఎం–6 టాస్క్ఫోర్స్ పేరుతో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నగరాలను ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ఒక్కో మెట్రో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరాభివృధ్ధికి రూ. లక్ష కోట్లివ్వాలని కోరింది.ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. దేశ జనాభాలో దాదాపు 10 శాతం మంది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో నివసిస్తుండగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు పావు వంతు (25 శాతం) వాటాను ఇవే సమకూరుస్తున్నాయని.. అందువల్ల ఈ నగరాల అభివృద్ధిని సాధారణ వ్యయంగా కాకుండా, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి అవసరమైన వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలని రేవంత్రెడ్డి సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక, పరిపాలనా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని రేవంత్రెడ్డి వివరించారు. ‘2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎస్జీడీపీ సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణ, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి విప్లవం... విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య, భోజనం, రవాణా, డిజిటల్ లెర్నింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం సుమా రు రూ. 24,000 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామ ని వివరించారు.65 ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కోర్సులు అందిస్తున్నామన్నారు. 26 వేలకుపైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించామని.. ఉపాధ్యాయుల కొరత తీ ర్చేందుకు 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు సీఎం వివరించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. సీఎంలు వస్తే యంగ్ ఇండియా స్కూళ్లు చూపిస్తాం.. ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి లేదా అధికారులైనా తెలంగాణలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చూడాలనుకుంటే సంతోషంగా చూపిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు.నీతి ఆయోగ్కు సీఎం చేసిన వినతులు ఇవీ..⇒ తెలంగాణ విద్యార్థుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఐఐఎంను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి. ⇒ హైదరాబాద్ విస్తరణకు వెన్నెముకగా భావిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు ప్రాజెక్టు వేగవంతానికి సహకరించాలి. ⇒ భారత్ ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించే 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలి. ⇒ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 విస్తరణకు సహకారం అందించాలి. ⇒ హైదరాబాద్ చారిత్రక జీవనాడి అయిన మూసీ నదిని ప్రపంచస్థాయి రివర్ఫ్రంట్గా అభివృద్ధి చేసేందుకు నిధులివ్వాలి. ⇒ 30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్, నెట్ జీరో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక మద్దతు ఇవ్వాలి. ⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు, పీఎంకేఎస్వై సాయం మంజూరు చేయాలి. ళీ సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణకు ప్రాధాన్యమిచ్చి ఎల్రక్టానిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీఎంపీ, ఓసాట్ క్లస్టర్లు, మైక్రో ఎల్ఈడీ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. -
ఫీజులు ఎగిరిపోయాయ్
ఖైరతాబాద్కు చెందిన మానస తన కూతురును ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తోంది. ఏఐ పాఠాలు తప్పనిసరి అని యాజమాన్యం చెప్పింది. దీని కోసం రూ.10 వేలు వెచ్చించి గ్యాడ్జెట్ కొనాలన్నారు. మార్కెట్లో దీని ఖరీదు రూ.6 వేలు. బయట తీసుకొస్తే కుదరదని చెప్పారు. స్కూల్ ల్యాన్కు కనెక్ట్ అవుతుందని, బయటవి వాడితే వైరస్ వస్తుందని చెప్పారని మానస తెలిపింది. ఖమ్మంలోని ఓ కార్పొరేట్ తరహా స్కూల్లో ఎల్కేజీ చదివే విద్యార్థికి పది వర్క్బుక్స్, 18 నోట్ బుక్స్ను అంటగట్టారు. దీనికి అక్షరాలా రూ.8 వేలు వసూలు చేశారు. ఇలా ప్రతీ స్కూల్లోనూ రకరకాల ఖర్చులతో విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు పిండుతున్నాయి.సాక్షి, హైదరాబాద్: జూన్ నెల పేరు చెప్పగానే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. స్కూళ్ల ఫీజులు, యూనిఫారాలు, రవాణా ఖర్చులు తలుచుకొని వారు భయపడిపోతున్నారు. ఈ నెల 15 నుంచి స్కూళ్లు తెరవనున్న నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికే అడ్మిషన్ల వేగం పెంచాయి. జేఈఈ, నీట్ ఫౌండేషన్ అంటూ హడావుడి చేస్తున్నాయి. కొత్తగా ప్రాజెక్టు వర్క్లంటూ సరికొత్త కార్యక్రమాలను తెరమీదకు తెస్తున్నాయి. వీటికి వాడే మెటీరియల్కు కూడా స్కూల్ యాజమాన్యాలే డిజైన్ చేస్తున్నాయి. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కావాల్సినంత పిండుతున్నాయి. అమ్మో అంత ఫీజా! గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులు ఏకంగా 40 శాతం వరకూ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల ప్రైవేట్ పాఠశాలలున్నాయి. టెన్త్ వరకూ చదివే విద్యార్థులు రాష్ట్రంలో 24 లక్షల మంది ఉన్నారు. వీరిలో 74 శాతం ప్రైవేట్ స్కూళ్లల్లోనే చదువుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 60 శాతం మంది విద్యార్థులున్నారు. వీరిలో సగానికిపైగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారే. నెలకు రూ.30 నుంచి రూ.50 వేల మధ్య వేతనం పొందేవారే ఎక్కువ. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు చుక్కలు చూపిస్తున్నాయని దిల్సుఖ్నగర్కు చెందిన స్వప్న తెలిపారు. సాధారణ స్కూల్లో ఐదోతరగతి చదివే తన కూతురుకు గత ఏడాది రూ.70 వేల వార్షిక ఫీజు చెల్లించింది. ఈ ఏడాది నుంచి రూ.1.10 లక్షలని చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లల్లో ఏకంగా రూ.2.75 లక్షలున్న ఫీజును రూ.3.50 లక్షలకు పెంచారు. ఒక మోస్తరు స్కూల్లో కూడా రూ.లక్ష వరకూ ఫీజు వసూలు చేస్తున్నారు. వేతనాలు పెరిగాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య అందిస్తున్నామని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల లేబొరేటరీ, మౌలిక వసతుల ఖర్చు పెరిగిందని బుకాయిస్తున్నారు. చాలా స్కూళ్లల్లో ఇవేవీ ఉన్నట్టు చూపించేందుకు యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. రవాణాకు ఆయిల్ దెబ్బ స్కూల్ బస్సు, ఆటో, ఇతర వాహనాల రేట్లు భారీగా పెంచారు. పశ్చిమాసియా సంక్షోభంతో డీజిల్ రేట్ల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. కిలోమీటరు దూరానికి కూడా కనీస చార్జీగా నెలకు రూ.15 వేలు అంటున్నారు. గత ఏడాది ఈ ఫీజు రూ.10 వేల వరకూ ఉంది. స్కూల్ బస్సుల రేట్లు 30 నుంచి 60 శాతం వరకూ పెంచారు. ఏసీ ఉంటే మరీ ఎక్కువ. రవాణా చార్జీలు ఫీజులను మించి పోతున్నాయని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఆటోకు పది మంది వరకూ రవాణా చేసేలా బేరం కుదుర్చుకుంటున్నారు. కొన్ని స్కూళ్లు సంవత్సరానికి సరిపడా రవాణా చార్జీలు ముందే వసూలు చేస్తున్నాయి. అవసరం లేని నోటు పుస్తకాలు, స్థాయికి మించిన వర్క్బుక్స్ తమ దగ్గరే కొనాలని ప్రైవేట్ పాఠశాలలు ఒత్తిడి తెస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని స్కూళ్లల్లో ఏఐ సంబంధిత పాఠాల కోసం కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లూ అంటగడుతున్నారు. కొత్త టెక్నాలజీ పేరుతో ఫీజుల మోత ఏఐ లేకుంటే భవిష్యత్ లేదని చెప్పారు స్కూల్వారు. రెండో తరగతి అమ్మాయికీ అవసరమే అన్నారు. గత ఏడాది రూ.90 వేలు ఫీజు ఉంటే, ఈ ఏడాది ఏకంగా రూ.1.30 లక్షలు కట్టమన్నారు. ఈ విద్య కోసం కొన్ని సాఫ్ట్వేర్ గ్యాడ్జెట్లు కొనిపించారు. దీనికి రూ.12 వేలు వసూలు చేశారు. – రాయభారపు సంధ్య (విద్యార్థి తల్లి, హైదరాబాద్) స్కూల్ బస్సుకు మరీ అంతా గత సంవత్సరం స్కూల్ బస్సుకు నెలకు రూ.6 వేలు ఇచ్చాను. ఈ ఏడాది నుంచి రూ.10 వేలు అంటున్నాడు. ఆటోలో పది మందిని కుక్కేస్తున్నాడు. పొద్దున్నే పొలం పనికి వెళతాం. పిల్లలను తీసుకెళ్లే అవకాశం లేదు. మరీ అంతా అంటే.. ట్రంప్ దెబ్బతో డీజిల్ రేటు పెరిగిందంటున్నారు. – ఉత్తర సోమేశ్కుమార్ (కేసముద్రం, విద్యార్థి తండ్రి) -
రిటైర్డ్ ఉద్యోగికి రూ.3.29 కోట్ల టోకరా
సాక్షి, హైదరాబాద్: రామ్నగర్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగిని పెట్టుబడుల పేరుతో రూ.3.29 కోట్లకు ముంచిన హేమంత్ కుమార్పై నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) కేసు నమోదైంది. దొర్నాల రవీందర్ వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్టీ) కంపెనీ లిమిటెడ్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో నివసించే రామకాంత్ అనే వ్యక్తితో ఈయనకు పరిచయమేర్పడింది. అతని ద్వారా రవీందర్ చిట్ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారు. రామకాంత్ ద్వారా ఆయనకు రాజు, మధుసూదన్లతో పరిచయం కాగా వీళ్లు హేమంత్ కుమార్ను పరిచయం చేశారు.హేమంత్ టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తాడని, అలాగే సమృద్ధి మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు కార్లు తీసుకుని ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తాడని చెప్పారు. తాము ఇప్పటికే అతని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందుతున్నామని, మీరు కూడా పెడితే కనీసం ఐదు నుంచి పది శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. హేమంత్ కుమార్ కూడా స్వయంగా పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన లాభాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. వారి మాటలు నమ్మి రవీందర్ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు.గత ఏడాది ఆగస్టు 8న హేమంత్ కుమార్ స్వయంగా రవీందర్ ఇంటికి వెళ్లి ప్రామిసరీ నోటు రాసి, తన కారును ఉంచి రూ.12.5 లక్షలు తీసుకున్నాడు. ఆపై మరికొన్ని దఫాల్లో కలిపి రూ.3,29,48,620 తీసుకున్నారు. తనకు డబ్బు తిరిగి రాకపోవడంతో రవీందర్ ఈ విషయాన్ని రామకాంత్కు తెలిపారు. ఆయన హేమంత్ కుమార్ తనను రూ.43,86,584 మేర మోసం చేశారని, రాజు వద్ద రూ.20,18,000, మధుసూదన్ వద్ద రూ.15,00,000, అలాగే, సతీష్ వద్ద నుంచి రూ.41,98,537, శివ వద్ద నుంచి రూ.13,01,499 తీసుకుని, పెట్టుబడులపై లాభాలు ఇస్తానని చెప్పి వారినీ మోసం చేశాడని తెలిపాడు. దీంతో రవీందర్ సీసీఎస్లో ఫిర్యాదు చేయగా హేమంత్పై కేసు నమోదైంది. -
ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్ప్రెస్వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు 200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. -
జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 54.55 కిలోమీటర్ల మేర మిస్సింగ్ లింక్ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతిపాదిత రోడ్లలో ఎక్కువ భాగం జీహెచ్ఎంసీలో విలీనమైన, శివారు అభివృద్ధి బెల్ట్గా మారిన ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. బడంగ్పేట్, నాదర్గుల్, కుర్మల్గూడ, తుర్కయాంజాల్, మల్లాపూర్, జల్పల్లి పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్ పరిసరాల్లో గొల్లపల్లి, రాళ్లగూడ, ధర్మగిరి ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి తుర్కయాంజాల్ వరకు, మల్లాపూర్ క్రాస్ రోడ్ నుంచి కుర్మల్గూడ వరకు, కుర్మల్గూడ నుంచి నాదర్గుల్ వరకు, ఆర్సీఐ క్రాస్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు ప్రతిపాదించిన రహదారులు దక్షిణ హైదరాబాద్లో కీలక అనుసంధాన మార్గాలుగా మారనున్నాయి.ఎయిర్పోర్ట్ కారిడార్కు ఊతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గణనీయంగా రోడ్ల విస్తరణ ప్రతిపాదించారు. గొల్లపల్లి ఎన్హెచ్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు, శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్ వరకు, శంషాబాద్ బస్టాప్ నుంచి రాళ్లగూడలోని ఓయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు పనులు వీటిలో ఉన్నాయి. నార్సింగి– కిస్మత్పూర్ కారిడార్పై ఫోకస్ పశ్చిమ హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్న నార్సింగి, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలకూ ఈ లింక్ రోడ్ల ద్వారా ఊరట లభించే అవకాశం ఉంది. బైరాగిగూడ నుంచి నార్సింగి వరకు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చేవెళ్ల రోడ్ వరకు కిస్మత్పూర్ మీదుగా, వివేకానంద విగ్రహం నుంచి ప్రతిష్ఠ విల్లాస్ వరకు రహదారి విస్తరణ ప్రతిపాదించారు. దర్గా నుంచి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వరకు, ఫర్మాయిష్ హోటల్ నుంచి తారామతి బారాదరి వరకు (వయా కేంద్రీయ విహార్ అపార్టమెంట్స్) రోడ్డు కూడా వీటిలో ఉంది.కోర్ సిటీలో.. ఖైరతాబాద్ జోన్లో గ్రీన్ల్యాండ్స్ జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి పాటిగడ్డ వరకు, బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గరి రోడ్డు కూడా వీటిలో ఉంది. ఈ రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం 1,976 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తెలిపారు. భూసేకరణ సవాల్గా మారనుందన్నారు. చదవండి: హెచ్ఎండీఏ భూ వేలంపై నీలినీడలు -
హెచ్ఎండీఏ భూ వేలంపై నీలినీడలు
హైదరాబాద్: సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థలాన్ని వేలం వేయాలంటూ ఇద్దరు క్లెయిమ్దారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాల 24 గుంటల స్థలం వేలం ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఈ స్థలానికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రెండు సొసైటీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ నెల 19న హెచ్ఎండీఏ నిర్వహించతలపెట్టిన బంజారాహిల్స్లోని రూ.1000 కోట్లు విలువ చేసే భూమి వేలంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.షేక్పేట్ మండలం హకీంపేట సర్వేనెంబర్ 102/1లో ఉన్న 8.24 ఎకరాల భూమికి సంబంధించి కొంతభాగం తమ సొంత భూములతో కలిసిపోతుందంటూ యమునానగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఈ నెల 19న వేలం వేయాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలోనే అత్యంత ఖరీదైన స్థలాల్లో ఒకటిగా ఉన్న ఈ భూమి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.ఈ భూమికి ఆనుకుని ఉన్న యమునానగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు డీమార్కేషన్ చేయాలని కోరుతున్నాయి. తమ పక్కనే ఉన్న ఈ భూములను సుమారు నాలుగు ఎకరాలు హెచ్ఎండీఏ వేలం వేయాలనుకుంటున్న భూమితో కలిసిపోతున్నట్లు ఈ ఇద్దరు క్లెయిమ్దారులు ఆరోపిస్తున్నారు.జాయింట్ సర్వే నిర్వహించే వరకు వేలాన్ని నిలిపివేయాలని యమునానగర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వారు హెచ్ఎండీఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ అభ్యంతరాల నడుమ హెచ్ఎండీఏ ఈ స్థలాన్ని వేలం వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే. చదవండి: కాంట్రాక్టులపై తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు -
SIR ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: SIR ప్రక్రియపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సర్’ మ్యాపింగ్లో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఒవైసీ. ఈసీ కోరుతున్న 12 డాక్యుమెంట్స్లో తెలంగాణలో మూడు డాక్యుమెంట్స్ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ‘సర్’ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఒవైసీ. కాగా, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చు. -
కవిత ‘తెలంగాణ రక్షణ సేన’పై బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’(TRS)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కవిత పార్టీ టీఆర్ఎస్పై ఈసీఐకి దాదాపు 700 ఫిర్యాదులు అందడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.ఈ నేపథ్యంలో కవిత రాజకీయ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘టీఆర్ఎస్’ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఎంఎంసీ, సీఎంసీలో రూ.10 కోట్లకు పైబడిన ఈపీసీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు కొత్త కమిటీలను నియమించింది. టెక్నికల్ బిడ్ల పరిశీలనకు కమిటీ-2కి అధికారాలు ఇచ్చింది. టెండర్ల ఆమోద ప్రక్రియకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రూ.10 కోట్లకు మించిన పనులపై పర్యవేక్షణ చేయనుంది.పనుల స్కోప్, డెలివరబుల్స్, బెంచ్మార్క్ల పరిశీలనకు కమిటీ-1, ధర బిడ్ల ఓపెనింగ్, టెండర్ ఆమోదాలకు కమిటీ-2, అదనపు పనులు, గడువు పొడిగింపుల ఆమోదానికి కమిటీ-3 ఏర్పాటు చేసింది. ఇంజినీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్)కు కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండబ్ల్యూఎస్,ఎస్బీ, హెచ్ఎండీఏ, ఆర్థిక శాఖ ప్రతినిధులను కమిటీల్లో ప్రభుత్వం స్థానం కల్పించింది. ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. -
సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల పెంపుపై తాము ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు ధరలు పెంచుతూ మెమో జారీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దాదాపు ఆరేడు మెమోలు జారీ చేశారని, సదరు అధికారి ఆంతర్యం ఏంటని అడిగారు. ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా తదుపరి చిత్రాలకు అదే చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. పెద్ది సినిమాకు టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ డి.చంద్రబాబు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులున్నా ధిక్కరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారన్నారు. పదేపదే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నందున సదరు అధికారికి రూ.10 లక్షల జరిమానా విధించి లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. విచారణ వాయిదా వేశారు. -
అంబర్పేట శంకర్కు నోటీసులు
హైదరాబాద్: తనను గదిలో బంధించి కొట్టి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ బిల్డర్ఇచ్చిన పిర్యాదుమేరకు చిన్నబోయిన శంకర్ అలియాస్ అంబర్పేట శంకర్ను బుధవారం బంజారాహిల్స్ పోలీసులు విచారించి నోటీసులు జారీ చేశారు. అంబర్పేట శంకర్తో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాకర్ల సాంబశివరావు, రవి, సుధాకర్, వినోద్, రాజా రమేష్ మదన్ సతీష్ లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరైన అంబర్పేట శంకర్ను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. ఆ రోజు ఏం జరిగిందన్న విషయాలపై ఆరా తీశారు. కమాలాపురి కాలనీలో కార్యాలయం ఎందుకు పెట్టారు..దాని వెనుకగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాజులరామారం ప్రాగా టూల్స్ కాలనీకి చెందిన ఆంజనేయులు అనే బిల్డర్ తనకు రావాల్సిన ప్లాట్లను తెలియకుండా అమ్మేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అంబర్పేట శంకర్తో పాటు మిగతా ఆరుగురుపై బెదిరింపుల కేసు నమోదు చేశారు. -
సాగు లక్ష్యం సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం (ఖరీఫ్) సీజన్ పంటలకు వ్యవసాయ శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తూ...పంటల వారీగా విస్తీర్ణ లక్ష్యాలను ఖరారు చేసింది. ఇందులో వరి 69 లక్షల ఎకరాలు, పత్తి 48 లక్షల ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, నూనెగింజల పంటలన్నీ కలిపి కేవలం 17.66 లక్షల ఎకరాల్లో సాగు కావొచ్చని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలతోపాటు యూరియా, ఇతర ఎరువులను కూడా సిద్ధం చేస్తోంది. అయితే వ్యవసాయశాఖ లెక్కలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్య మేరుకు సాగు సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గు రైతులు ఇప్పటికీ వరి, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వరి, పత్తి పంటలకే రైతులు మొగ్గు చూపుతారని వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మొదటి ప్రభావం కూడా వరి, పత్తిపైనే పడుతుంది. గత ఏడాది 132 లక్షల ఎకరాల్లో.. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో వరి 67.04 లక్షల ఎకరాలు, పత్తి 45.85 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కందులు 4.92 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100 శాతానికి పైగా సాగు నమోదైంది. గత ఏడాది మంచి వర్షాలు, చెరువులు–ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేపట్టగలిగారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే నీటి లభ్యతపై ఆందోళన నెలకొంది. ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం వంటి ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం పరిధిలోనూ నీటి లభ్యతపై రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వానలు ఆలస్యమైతే దుక్కులు దున్నడం నుంచి నాట్ల వరకు మొత్తం వ్యవసాయ కార్యాచరణ ప్రభావితమయ్యే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించి, సాధారణ వర్షాలు కురిస్తేనే వ్యవసాయశాఖ నిర్దేశించిన 134 లక్షల ఎకరాల సాగు లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకే ఈసారి ఖరీఫ్ భవితవ్యం పూర్తిగా వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రైతాంగం ఇప్పుడు వానల రాక కోసం ఎదురు చూస్తోంది. -
‘బెనిఫిట్’ లేని బతుకులు!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ టీచర్గా పనిచేసిన డి. అహల్య ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందారు. అప్పట్లో పదవీ విరమణ ప్రయోజనాలపై నెలకొన్న సందిగ్ధంతో వాటిని లబి్ధదారులకు ఇవ్వలేదు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్లపై ప్రభుత్వం గతేడాది జూలైలో స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బెనిఫిట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి ఏమాత్రం స్పందనలేదు. ఏళ్లు గడవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్ తమకు అందుతుందా? లేదా? అని అధికారులను నిత్యం ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి టౌన్లోని 3వ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసిన రసూలాబీ అనే హెల్పర్ అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం మరణించింది. అంత్యక్రియల ఖర్చు కింద రూ.20వేల సాయం ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది. కానీ రసూలాబీ కుటుంబానికి ఇప్పటికీ ఆ సాయం అందలేదు. చందపల్లి అంగన్వాడీ కేంద్రం టీచర్గా పనిచేసిన వేల్పుల స్వప్న ఏడాదిన్నర క్రితం మరణించారు. అంత్యక్రియల ఖర్చు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్వప్న కుటుంబానికి ఇప్పటికీ ఈ సాయం అందలేదు. సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన టీచర్లు, హెల్పర్లు ప్రయోజనాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇతరత్రా కారణాలతో టీచర్ లేదా హెల్పర్ మరణిస్తే ఆ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు కింద ఇచ్చే రూ.20వేల సాయం కూడా అందడంలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు కరుణించడం లేదు. అంగన్వాడీల్లో విధులు నిర్వర్తించినంత కాలం చాలీచాలని వేతనాలతో సర్దుకున్న టీచర్లు, హెల్పర్లకు ఇప్పుడు పదవీ విరమణ ప్రయోజనాల కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్ల వయసు 65 ఏళ్లు పూర్తయిన వారిని విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తప్పిస్తోంది. 2024 సంవత్సరం జూన్ నెల నుంచి పదవీ విరమణ ప్రక్రియను పక్కాగా అమలు చేస్తున్నారు. వయసును బట్టి విధుల నుంచి తొలగిస్తున్న అధికారులు వారి ప్రయోజనాల అంశాన్ని పట్టించుకోవడం లేదు. రెండేళ్లలో 6,550 మంది... రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,781 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 24,942 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 6,655 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో, 4,184 కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 60వేల మంది టీచర్లు, హెల్ప ర్లు పనిచేస్తున్నారు. 2024 జూన్ నుంచి 2026 మే నెలవరకు దాదాపు 6,550 మంది టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ పొందారు.వీరిలో కేవలం 287 మంది అంగన్వాడీ టీచర్లు, 1,023 మంది అంగన్వాడీ హెల్పర్లకు రూ.7.98 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాల నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 5వేల మందికి సంబంధించిన పదవీ విరమణ ప్రయోజనాల జాడలేదు. రిటైర్మెంట్ పొందిన టీచర్లు, హెల్పర్లకు సంబంధించి రూ.30కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. భారీ మొత్తంలో చెల్లించాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లకు సమానంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల బిల్లులు కూడా నిలిపివేస్తున్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో... అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి కొంత కాలం సందిగ్ధం నెలకొంది. గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి టీచర్కు రూ.లక్ష, హెల్పర్కు రూ.50వేల చొప్పున చెల్లిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్లు, హెల్పర్లు సాయాన్ని పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లు కొనసాగుతుండగా 2025 జూలైలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రివైజ్డ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున సాయం అందించాలి. టీచర్/హెల్పర్ మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేలు ఇవ్వాలి. ఈమేరకు ఉత్తర్వుల్లో స్పష్టం చేసినప్పటికీ అమలు పెండింగ్లోనే ఉంది. ఈ అంశంపై అంగన్వాడీ సంఘాల నాయకులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రితో పాటు కార్యదర్శి, కమిషనర్లకు పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేదు. కాగా ఈ విషయమై సంబంధిత శాఖకు చెందిన ఓ అధికారిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా త్వరలోనే చెల్లింపులు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు ధనవంతులు కాదు. నిరుపేదలే చాలామంది ఉన్నారు. నెలవారీగా అత్యంత పరిమితమైన జీతంతో కుటుంబాన్ని పోషిస్తారు. వారి సేవలకు గుర్తింపుగా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు రెండేళ్లుగా నిలిచిపోయాయి. గతంలో ఉత్తర్వుల్లో గందరగోళంతో ఏడాదిపాటు నిలిచిపోగా...ఉత్తర్వులు విడుదలై ఏడాది గడిచినా చెల్లింపులు జరగడం లేదు. ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ ప్రయోజనాలను ఒకేసారి విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతాం. – నల్లా భారతి, రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్అధికారుల స్పందన కరువైంది పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. వీటిని విడుదల చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి నుంచి జిల్లా సంక్షేమాధికారి, సంయుక్త సంచాలకులు, డైరెక్టర్, కార్యదర్శితో పాటు మంత్రి వరకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. కలిసినప్పుడు తప్పకుండా విడుదల చేస్తామని చెబుతున్నా ఆ తర్వాత వీటి ఊసెత్తడం లేదు. వచ్చే అరకొర ప్రయోజనాలతో కొంతైనా సాంత్వన వస్తుందనుకుంటే అధికారులు స్పందించకపోవడం బాధాకరం. – మందాల విమల, అంగన్వాడీ టీచర్, అప్పన్నపేట -
దేవికా నం.1.. మోహన్ నం.2
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జరుప్ల మోహన్ నాయక్ స్థిరచరాస్తుల డాక్యుమెంట్ విలువ రూ.17.94 కోట్లుగా తేలింది. దీంతో ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ‘అవినీతి అనకొండ’గా మోహన్ నాయక్ రికార్డులకెక్కారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. థర్డ్ శివబాలకృష్ణ..ఫోర్త్ కిషన్ ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టు అయిన దేవికారాణి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.25,70,84,461గా తేలగా.. మోహన్ నాయక్ రూ.17,94,62,617తో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ పది నుంచి ఇరవై రెట్లు అధికంగా ఉంటుంది. 2024 జనవరిలో చిక్కిన హెచ్ఎండీఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.13.3 కోట్లతో మూడో స్థానంలో, మహబూబ్నగర్ మాజీ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ కిషన్ రూ.12.72 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ‘లంచాల’కోసం ఏడాదికి 30 లక్షలు ఎవరైనా బాధితులు ఓ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే..రహస్య కెమెరాలు, వీడియో రికార్డింగ్ పరికరాలను బాధితుడికి అమర్చి అధికారి వద్దకు పంపి రికార్డు చేయిస్తారు. డిమాండ్ చేసిన మొత్తంలో కొంత ఇన్స్టాల్మెంట్గా ఇస్తానంటూ చెప్పిస్తారు. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తం అందుకుంటున్న అధికారిని అప్పటికే మాటు వేసి ఉండే ఏసీబీ బృందాలు పట్టుకుంటాయి. డబ్బును సీజ్ చేసి కోర్టుకు సమరి్పస్తారు. ఆ మొత్తం కేసు తేలేవరకు కోర్టు అ«దీనంలోనే ఉంటుంది. అయితే ఈలోగానే నిర్ణీత సమయంలో డబ్బును ఫిర్యాదుదారుడికి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.30 లక్షల చొప్పున ఏసీబీకి కేటాయిస్తుంది. వాస్తవానికి ‘రెడ్’కాదు ‘పింక్’ లంచగొండుల్ని ఏసీబీ ట్రాప్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని అంటారు. అయితే వాస్తవానికి ఇది ‘పింక్’హ్యాండెడ్గా పట్టుకోవడం. ఫిర్యాదుదారుడు తీసుకువచ్చిన మొత్తానికి ఏసీబీ అధికారులు ఫినాఫ్తలీన్ అనే రసాయన పొడిని పూస్తారు. లంచం తీసుకునే అధికారి లేదా ఆయన సూచించిన వ్యక్తి ఆ నోట్ల కట్టలు కచ్చితంగా చేత్తో పట్టుకుని ఉండాలి. అలా ముట్టుకున్నప్పుడు ఈ రసాయనం అంటుకుంటుంది. తర్వాత దాడి చేసి పట్టుకునే ఏసీబీ అధికారులు సదరు మొత్తాన్ని స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆ అధికారి చేతుల్ని సోడియం బైకార్పొనేట్ ద్రావణంలో ముంచేలా చేస్తారు. అప్పుడు ఆ ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది. (ఈ ప్రక్రియ రెడ్హ్యాండెడ్గా వాడుకలోకి వచ్చింది) తద్వారా లంచం తీసుకున్నట్టుగా నిర్ధారిస్తారు. దీన్ని వీడియో రికార్డింగ్ చేశాక అధికారులు న్యాయస్థానానికి సమర్పిస్తారు. గణనీయంగా పెరిగిన కేసులు.. ఏసీబీ అధికారులు మొత్తం 4 రకాలైన ఆపరేషన్లు చేపడతారు. లంచం తీసుకునే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం (ట్రాప్), ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటం (అసెట్స్) వ్యవహారాలే మనకు ఎక్కువగా తెలుసు. వీటిని రిజిస్టర్డ్ కేస్ ట్రాప్ (ఆర్సీటీ), రిజిస్టర్డ్ కేస్ అసెట్స్ (ఆర్సీఏ) అంటారు. అలాగే చెక్పోస్టులు, కార్యాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు (ఎస్సీగా పిలిచే సర్ప్రైజ్ చెక్స్) ద్వారా గుర్తించే అవినీతిపై రిజిస్టర్డ్ కేస్ అదర్స్ (ఆర్సీఓ) నమోదు చేస్తారు. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది (మంగళవారం వరకు) ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇలావుండగా మోహన్ నాయక్ను అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు. అయితే తదుపరి విచారణ కోసం మోహన్ నాయక్ కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
దోస్త్లో కొత్త కోర్సులు..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో కొత్త కోర్సులను దోస్త్లోకి తేవడంలో ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి విజయం సాధించింది. మూడోదశ కౌన్సెలింగ్లోకి వీటిని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సులకు ఆప్షన్లు ఇస్తున్నారు. ఇప్పటికే 67 కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని, కొత్త కోర్సుల నిర్వహణకు ఆమోదం తెలిపాయి. చదువుతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఉండేలా ఉన్న కాలేజీలకు అనుమతించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు కావడంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఒక బృందాన్ని కూడా రూపొందించే ప్రక్రియలో ఉన్నారు. మండలిదే పైచేయి... ఏడాది పాటు కసరత్తు చేసిన పలు కొత్త కోర్సులను విద్యాశాఖ ఉన్నతాధికారులు, సాంకేతిక విద్యామండలి అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి నిపుణుల చేత సిలబస్ కూడా రూపొందించారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు అన్ని యూనివర్సిటీలూ తొలుత ఆమోదం తెలిపాయి. ఇంజనీరింగ్కు సమాంతరంగా ఉన్న కోర్సులు కావడంతో ప్రైవేట్ కాలేజీలు విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్ద లాబీయింగ్ చేశాయి. దీంతో వర్సిటీలు బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) ఇవ్వకుండా నిలిపివేశాయి. ఈ కారణంతో సాంకేతిక విద్యామండలి దోస్త్లోకి కొత్త కోర్సులను రానివ్వకుండా అడ్డుకుంది. దోస్త్ రెండు దశల కౌన్సెలింగ్లోనూ ఆప్షన్లలో ఇవి రాకుండా చేశారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగలిగారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మూడోదశ కౌన్సెలింగ్లోకి కొత్త కోర్సులను చేర్చాలని సీఎంఓ ఆదేశించడంతో సమస్య పరిష్కారమైంది. భారీగా ఆప్షన్లు ప్రస్తుతం దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్ నడుస్తోంది. ఈ నెల 16వ తేదీ వరకూ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువు ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొత్త కోర్సుల వైపు విద్యార్థులు భారీగా దృష్టి పెట్టారు. ఇప్పటికే సీట్లు వచ్చిన విద్యార్థులు కూడా ఆప్షన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.అవసరమైతే కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్ ద్వారా కొత్త కోర్సులను ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కంప్యూటర్ సంబంధిత కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్లోకి వీటిని చేర్చడంతో ఆప్షన్ల గడువు పెంచాలని విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్ను స్వయంగా కలిసి, కొంతమంది ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.ఇవీ కొత్త కోర్సులు.. ఉస్మానియా వర్సిటీలో బీకామ్–ఫైనాన్స్ టెక్నాలజీ బీకామ్– ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బీకామ్– ఈ కామర్స్ ఎంకామర్స్అండ్ డిజిటల్ మార్కెటింగ్ కాకతీయ వర్సిటీలో బీఏ–సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్ బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పాలమూరు వర్సిటీలో బీఏ–డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ బీకామ్– ఈకామర్స్, ఎంకామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బీకామ్– ఫైనాన్స్ టెక్నాలజీ శాతవాహన వర్సిటీలో బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ బీకామ్– ఈ కామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బీఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్స్ సైన్స్అండ్ సైబర్ సెక్యూరిటీ తెలంగాణ వర్సిటీలో బీఏ– డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ బీకామ్ – ఈ కామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బీఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్స్ సైన్స్అండ్ సైబర్ సెక్యూరిటీ -
పాప బతకాలంటేరూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి
సాక్షి, హైదరాబాద్ : కూతురు పుట్టిందని సంతోషం ఆ కుటుంబానికి ఎక్కువ కాలం నిలవలేదు. పసికందుకు పట్టుమని నాలుగు నెలలు నిండకుండానే భయంకరమైన వ్యాధి సోకింది. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించగా పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లైంది. బతుకుదెరువుకోసం ఆటో నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తమకు రూ.కోట్లు చెల్లించి వైద్యం చేయించడం సాధ్యం కాదని, దాతల సాయం కోరుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడికి చెందిన బేరి రమేష్ స్థానికంగా ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొదటి కుమార్తె చైత్రికకు స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1 అనే జన్యుపరమైన నరాల జబ్బు సోకిందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా కండరాలు పూర్తిగా బలహీనపడి, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. పాపను ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే రెండేళ్ల వయసు లోపు ఒనాసెమ్మోజీన్ అబెపార్వోవెక్ అనే ఇంజక్షన్ తీసుకోవాలని నిమ్స్ వైద్యులు సైతం సూచించారు. అయితే దీని ఖరీదు సుమారు రూ.16 కోట్లు ఉండటంతో రమేష్ కుటుంబం పాపను బతికించుకోవడం కోసం తల్లడిల్లుతోంది. పెద్దమనసుతో ముందుకొచ్చి పాపను ఆదుకోవడానికి సాయం చేయాలని రమేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు 8985801524, 9553267573 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
ఇదే 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి ఓ దిక్సూచిగా మారబోతోంది. గ్రీన్ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లు, ఏఐ, ఫార్చ్యూన్– 500 కంపెనీలతో విరాజిల్లబోతోంది. టోక్యో, సింగపూర్, న్యూయార్క్ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వేదికగా నిలవబోతోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేలా ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వేదికగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఎఫ్సీడీఏ విజన్ ఇన్ యాక్షన్ ప్లాన్ పోర్టల్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. ‘150 రోజుల్లో ఎఫ్సీడీఏ భవనాన్ని పూర్తి చేసుకున్నాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. అభివృద్ధి పథం వైపు నడవాలి. స్థానికుల అభ్యర్థన మేరకు కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపాం. భవిష్యత్తులో ఈ నగరం మరింత రాణిస్తుంది. అడ్డుపడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహితనగరంగా రాణిస్తుంది చిన్న వర్షానికే వరదలు నగరంలోని వీధులను తరచూ ముంచెత్తుతున్న వరదలకు, ట్రాఫిక్ అంతరాయానికి నాటి పాలకుల పాపమే కారణం. నగరంలో పెద్ద వర్షం పడలేదు. చిన్నపాటి వర్షానికే వరద ఏరులై పారింది. ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటలు పట్టింది. పదేళ్లలో అభివృద్ధి చేశాం. వంద కోట్లకు ఎకరం అమ్మామని చెప్పడం కాదు. నిన్నటి ట్రాపిక్ సమస్యకు కారణం ఎవరో చెప్పాలి. కబ్జాలపై మరింత కఠినంగా.. గత ప్రభుత్వంలోని దుర్మార్గులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. చెరువులను చెరబట్టి, అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే చెరువులు, కుంటలోŠల్ ఉండాల్సిన వరద నీరు రోడ్లపైకి వస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్కు కారణమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఆక్రమణలు తొలగించి, చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నాం. వాటి చుట్టూ పార్కులు, మార్కెట్లు తీసుకొచ్చి లేక్ ఎకానామీ సృష్టించబోతున్నాం. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై మరింత కఠినంగా వ్యవహరించబోతున్నాం. కబ్జాలకు పాల్పడిన వాళ్లను వదలం. వారి వెనుక ఉన్నవాళ్ల తోకలు కట్ చేయడానికి కూడా వెనకాడం. అదేమైనా మీ తాత జాగీరా? బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి 15 ఎకరాలు కబ్జా చేశాడు. దీన్ని కేసీఆర్ ఆయనకు రాసిచ్చాడు. అదేమైనా మీ తాతా జాగీరా? ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించాం. కుంటకు మళ్లీ జీవం పోశాం. గండిపేట, హిమాయత్సాగర్ ఆక్రమణలను తొలగించే పని చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే..’ అని సీఎం చెప్పారు. తెలంగాణ ముఖ చిత్రమే మారింది ‘హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది. ఆనాటి కులీకుతుబ్షాలు, నిజాం నవాబులు హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక మంచి గుర్తింపు వచ్చింది. చార్మినార్ నుంచి గుల్జార్హౌస్ వరకు, మొజాంజాహీ మార్కెట్ నుంచి ఖబూతర్ఖానా వరకు విస్తరించకపోతే చరిత్రలో గుర్తింపు వచ్చేదా? 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ విస్తరణతో జంటనగరాలుగా వెలుగొందుతున్నాయి. సైబరాబాద్ సాంకేతిక విప్లవం. 60 శాతం ఆదాయం అందిస్తుంది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లు పలుకుతోంది. తెలంగాణ ముఖ చిత్రమే మారింది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ అధికం. కుట్రలు, కుతంత్రాలు చేసినవాళ్లూ ఉన్నారు.. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తి వేలాది మంది చనిపోతే నిజాం చలించారు. మూసీ, ఈసీలు ఉప్పెనై కమ్మేయకుండా జంట జలాశయాలు నిర్మించారు. ఆనాడు సైబరాబాద్, హైటెక్సిటీ అంటే నవ్వినోళ్లు ఉన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని అడ్డుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దు అన్నోళ్లూ ఉన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ ఆనాటి ముఖ్యÐమంత్రులు హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, జీనోమ్ వ్యాలీ, ఐటీ సంస్థలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలను తీసుకురాకపోతే.. పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవా?..’ అని రేవంత్ ప్రశ్నించారు. వచ్చేసారి ప్రతిపక్ష హోదాకూడా రాదు.. ‘ఆనాడు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు.. నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహుడు, శుక్రాచార్యుడు ఉన్నారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్లో పండిండు. మారీచుడు, సుబాహులను మనపై వదిలాడు. పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు కలిసి ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామంటున్నారు. అమెరికా వెళ్లి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. కానీ మీకు గతమే ఉంది. భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు..’ అని సీఎం ఎద్దేవా చేశారు. విషం చిమ్ముతున్న బీఆర్ఎస్: భట్టి ఆనాటి ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ఈ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి, గ్రీన్ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చిందని అన్నారు. కానీ ఓటమితో నిరాశా నిస్పృహలతో ఉన్న బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని విమర్శించారు. కొన్ని గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.హైటెక్ సిటీకి దీటుగా..: శ్రీధర్బాబు హైటెక్ సిటీకి దీటుగా కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో రెండున్నరేళ్లుగా అహరి్నశలు శ్రమిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ ప్రాంతవాసుల జీవనశైలిలో మార్పులు రాబోతున్నాయని, కాలుష్యం లేని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక తదితరులు మాట్లాడారు. కొత్త శక్తిని నింపుకోవడానికి కలిసి రండి – ‘ఎక్స్’లో సీఎం రేవంత్రెడ్డి ‘భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఒక నిజం. మనం విదేశాలకు వెళ్లి గొప్ప నగరాలను చూసినప్పుడల్లా.. ఇంతటి ఆధునిక, ప్రణాళికాబద్ధమైన, అద్భుతంగా నిర్వహించే నగరం మన దేశంలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాం. భారతీయులందరి సామూహిక కోరికకు సమాధానమే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ. దీని కార్యాలయ భవనాన్ని ఆరు నెలల్లోనే ప్రారంభించుకున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో దీని ప్రాముఖ్యత కారణంగా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని భూగోళంపైనే అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే వరకు శ్రమించేలా కొత్త శక్తిని నింపుకోవడానికి నాతో కలిసి రండి..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
మదీనా బస్సు విషాదం.. బాధిత కుటుంబాలకు పెండింగ్ ఎక్స్గ్రేషియా పంపిణీ
సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా చెక్కులను తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి, టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి బి. షఫీయుల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఉన్నతాధికారుల బృందం సౌదీ అరేబియాకు వెళ్లి బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు.బాధితుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భారత కాన్సులేట్, సౌదీ అధికారులతో సమన్వయం చేసి అంత్యక్రియలతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ విషాదం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ( FCDA) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్ది ప్రారంభించారు. ఎఫ్సీడీఏ లోగో, వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ‘‘నిన్న 2 గంటల వానకే హైదరాబాద్లో నీరు నిలిచిపోయింది. అంతర్జాతీయ నగరం అన్ని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి?. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత?. ఈ వరద పరిస్థితి మీ కబ్జాల పుణ్యమే కదా’’ అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.‘‘పదేళ్లు అభివృద్ధి చేశామన్న వాళ్లు వరదపై మాట్లాడాలి. ఫ్యూచర్ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంకల్పాన్ని అడ్డుకోవాలని రాక్షసులు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు’’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. -
లేడీ డాన్ నీతూభాయ్.. కిరాణా షాపు మాటున..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. కిరాణా షాపు మాటున నీతూ భాయ్ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె ఇంటికి ఐటీ ఉద్యోగులు క్యూకట్టారు. 27 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలోనే నీతూ భాయ్ను అరెస్ట్ చేసిన అధికారులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూభాయ్ మళ్లి అదే గంజాయి దందా కొనసాగిస్తోంది.రోజుకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతూ భాయ్ కోసం నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్.. గంట వ్యవధిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో నీతూ భాయ్ పరారైంది. -
తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, జంగావు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక ఉత్తర–తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 41–43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో 37–40 డిగ్రీల సెల్సియస్తో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, నీటి నిల్వలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, నదులు, వాగుల వద్దకు చేరకూడదని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. వర్షాల తీవ్రత గంటల వ్యవధిలోనే పెరిగే అవకాశం ఉండటంతో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.INTENSE THUNDERSTORM ALERT for South, Central, East TG - June 10⚠️🌩️⛈️Today, HOT and HUMID conditions (like summer) expected in entire Telangana. North East TG - 41-43°C, Hyderabad 37-40°C, dry till afternoon ⚠️Thereafter, POWERFUL THUNDERSTORMS and HEAVY RAINS expected in…— Telangana Weatherman (@balaji25_t) June 10, 2026 -
హైడ్రా నిర్లక్ష్యం?!
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాల తొలగింపుతో పాటు వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థల పర్యవేక్షణ లాంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది హైడ్రా (HYDRA). అయితే తాజాగా ఈ సంస్థపై నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న(మంగళవారం సాయంత్రం) కురిసిన వానకు నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కోటి ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరి, మురుగు నీటితో కలిసి పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రోగులు, వారి సహాయకులు ఆ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే..ఈ సమస్యపై హైడ్రా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని బాధితులు వాపోతున్నారు. తక్షణమే నీటిని తొలగించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఇంత కీలకమైన నగర నిర్వహణ బాధ్యతలు ఉన్నప్పటికీ సమస్యపై వెంటనే స్పందన లేకపోవడంతో హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పుడు. దీంతో ఈ విమర్శలపై హైడ్రా ఎలా స్పందిస్తుందో చూడాలి. హైడ్రా విధులు ఏంటంటే.. 1. వరద నియంత్రణ & డ్రైనేజీ నిర్వహణభారీ వర్షాల సమయంలో నీరు నిల్వ కాకుండా చూడటం, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించడం, వరద నీటిని తొలగించడం.2. అక్రమ ఆక్రమణల తొలగింపుచెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములపై ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించడం.3. విపత్తుల నిర్వహణ (Disaster Response)వరదలు, భవన కూల్చివేతలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి సహాయం చేయడం.4. నగర ఆస్తుల రక్షణచెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు వంటి ఆస్తులను పరిరక్షించడం.5. సమన్వయం & రెస్క్యూ చర్యలుజీహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి రక్షణ చర్యలు చేపట్టడం. -
రెండో భార్యపై అనుమానం.. మల్కాజ్గిరిలో దారుణం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గిరి మారుతీనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్కుమార్కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. విడాకులిచ్చి ఆమె సోదరిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో.. ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.ఆయుధ చట్టం కేసుతో కటకటాల పాలైన అరుణ్.. బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని భార్యను బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లతో కాల్పులు జరపడంతో.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
‘కోటి’ సంపద సృష్టి
సాక్షి, హైదరాబాద్: మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలుగా ఎదిగేవిధంగా సముచితమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. వారిని రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకెళ్లే ఆర్థిక విప్లవానికి ఈ బస్సులు చిహ్నలుగా నిలుస్తాయని అన్నారు. ఆర్టీసీకి లీజుకు.. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర రాష్ట్రంలో ఒకేరకమైన పంటలు పండించే విధానానికి స్వస్తి పలకాలని, అన్ని రకాల పంటలను పండించేవిధంగా పంట మార్పిడి విధానంపై మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యవస్థలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళా సంఘాలు మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, ఇతర ఆస్తులపై మహిళలకు యాజమాన్యం కల్పింస్తున్నట్లు చెప్పారు. మహిళలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు.మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక మార్కెటింగ్, వాణిజ్య మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత విస్తృత మహిళా సాధికారత కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మక కార్యక్రమంగా ఈ బస్సుల పంపిణీ నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, గణేష్, మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్షి్మ, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కలువ సుజాత గుప్తా, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల్లో కౌలు రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్నది కౌలు రైతులే అయినా, ప్రభుత్వ పథకాలు, మద్దతు వ్యవస్థలు కేవలం పట్టాదారులకే పరిమితం కావడం వల్ల వీరు దారుణమైన ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. తెలంగాణలో వ్యవ సాయాన్ని ప్రధానంగా కౌలు రైతులే నడిపిస్తున్నా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంట కొనుగోళ్లు, ప్రకృతి విపత్తు పరిహారం వంటి కీలక మద్దతు వ్యవస్థలకు వారు దూరమవుతున్నారు.కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే–2026’లో 22 జిల్లాల్లోని 57 గ్రామాలకు చెందిన 1,816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేశారు. సర్వే ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి నేతృత్వంలో సాగింది. మంగళవారం అధ్యయన నివేదికను జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ తదితరుల సమక్షంలో హైదరాబాద్లో విడుదల చేశారు. పెరిగిన కౌలు ధరలు.. తగ్గిన నికర ఆదాయం తెలంగాణలో కౌలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. గరిష్టంగా ఎకరాకు రూ.53,000 వరకు వసూలు చేస్తున్నారని సర్వేలో తేలింది. 2022లో సగటున 5 ఎకరాలుగా ఉన్న కౌలు భూమి, ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగింది. చిన్న కౌలు రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఎక్కువ భూమిని కౌలుకు తీసుకోవాల్సి వస్తుండగా, ఉన్న తక్కువ నికర ఆదాయం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. వ్యవసాయంలో లాభాలు తగ్గుతున్నా కౌలు రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఎక్కువ భూమి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వే పేర్కొంది. ఓటీపీలతో యూరియా కొనుగోలు, పంట అమ్మకాల అవస్థలు యాసంగి సీజన్లో ప్రవేశపెట్టిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినట్టు అధ్యయనం తేల్చింది. ⇒ భూ యజమాని ఓటీపీ తప్పనిసరి కావడంతో సర్వేలో పాల్గొన్న 1,816 మందిలో కేవలం 412 మంది (22.8 శాతం) మాత్రమే సబ్సిడీ యూరియాను పొందగలిగారు. వారిలో కూడా కేవలం 40 మంది మాత్రమే తమ పేర్లపై యూరియా తీసుకున్నారు. మిగతావారు భూ యజమానుల వివరాలపై ఆధారపడాల్సి వచి్చంది. సబ్సిడీ అందని రైతులు బహిరంగ మార్కెట్లో ఒక్కో సంచికి రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్టు సర్వే తెలిపింది. ⇒ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింకేజీ, ఓటీపీ వంటి నిబంధనలు ఉండటంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే తమ పేర్లతో సీసీఐకి విక్రయించగలిగారు. ⇒ వరి విషయంలో ఖరీఫ్లో 20 శాతం, యాసంగిలో 17.2 శాతం మంది మాత్రమే తమ పేరుతో విక్రయించినట్టు సర్వే వెల్లడించింది. మిగతా వారు ఇతరుల పేర్లతో విక్రయించి కమీషన్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. ప్రకృతి విపత్తు పరిహారం కూడా అందని ద్రాక్షే గత మూడు సంవత్సరాల్లో వరదలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టాన్ని చవిచూశారు. అయితే బాధితుల్లో కేవలం 11 మందికి మాత్రమే, అంటే 0.7 శాతం మందికి మాత్రమే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమైంది. కొన్ని సందర్భాల్లో భూ యజమానులు పరిహారం తీసుకొని కౌలు రైతులకు ఇవ్వలేదని సర్వే గుర్తించింది. పంట రుణాలు భూయజమానులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో కౌలు రైతులు పూర్తిగా ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారు. 24 నుంచి 36 శాతం వరకు వడ్డీతో అప్పులు తీసుకుంటున్నట్టు రైతులు తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రైవేట్ అప్పుల భారం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. రుణమాఫీ పథకాల ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదని పేర్కొంది. ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు అమ్మకాలు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు లేకపోవడంతో కౌలు రైతులు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పంటలు అమ్ముకోవాల్సి వస్తోందని సర్వే తెలిపింది. దీంతో 5 ఎకరాల కౌలు రైతుకు పత్తిలో రూ.64,400, వరిలో రూ.40,350, మొక్కజొన్నలో రూ.87,800, సోయాబీన్లో రూ.53,120 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా వేసింది. ఎరువుల సబ్సిడీ, పంట కొనుగోలు, విపత్తు పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా కౌలు రైతుల ఖాతాల్లోకి చేరేలా వ్యవస్థను రూపొందించాలని కోరింది. ‘కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలి’ హిమాయత్నగర్ : కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివేదిక విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా అందించాలన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కల్పించాలని చెప్పారు. సీఎం, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిని కోరారు. దీనికి స్పందించిన కోదండరెడ్డి కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
రాగానే దంచికొట్టింది
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం‘నైరుతి’ వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అడిక్మెట్, విద్యానగర్, అంబర్పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. పలు జంక్షన్లు చెరువులను తలపించాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే వేళ వర్షం పడటంతో ఐటీ కారిడార్ సహా పలు మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.దీంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవించారు. మల్కాజ్గిరిలో 12.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్పేటలో 8.7 సెం.మీ., విఠల్వాడీలో 7.8 సెం.మీ. వాన పడింది. మొత్తం 14 ప్రాంతాల్లో 5 సెం.మీ.కుపైగా వర్షం నమోదైంది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. భారీ సైన్బోర్డులు, ఫ్లెక్సీలు ఊడి పడటంతో కార్లు, బైక్లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వందల కాలనీలు గంటల తరబడి చీకట్లో మగ్గాయి. టీ తాగుదామని వచ్చి.. బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జహంగీరాబాద్కు చెందిన అఫ్రోజ్(30), జాఫర్(15) పరిచయస్థులు. వీరు మంగళవారం సాయంత్రం టీ తాగేందుకు బండ్లగూడ చౌరస్తా సమీపంలోని రాయల్ సి హోటల్కు ఆటోలో వచ్చారు. అప్పటికే అక్కడ ఓ స్ట్రీట్లైట్కు సంబంధించిన విద్యుత్ వైరు తెగిపడి ఉంది. నీరు నిలిచి ఉండటంతో గమనించలేకపోయారు. ఈ క్రమంలో మొదట ఆటో దిగిన జాఫర్.. షాక్ తగిలి కింద పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో అఫ్రోజ్ నేరుగా వైర్కు తగలడంతో విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాఫర్ను స్థానికులు చికిత్స నిమిత్తం ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాల్లో తడిసిన ధాన్యం నిర్మల్ జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కుంటాల మండలంలోని జామున ఓల, లింబా(కె), కల్లూరు, కుంటాల, పెంచికల్పాడ్లో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో జొన్న, వరి ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సొనాల మండలం పెద్దగూడ సరిహద్దులో వాగు ఉధృతికి వంతెన సమీపంలోని రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రేవంత్వి బెదిరింపు రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసత్యపు వార్తలతో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అకారణంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేద్దామని, తనపై ఆరోపణలకు ఉన్న ఆధారాలను వారికి ఇవ్వాలని అన్నారు.వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇచ్చిన హామీల అమలుపై ప్రెస్క్లబ్లో గానీ, అమరవీరుల స్తూపం వద్ద గానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు భయపడను.. ‘పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అంటూ రేవంత్రెడ్డి చేస్తున్న తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా. వారి ఇళ్ల ముందే ఘెరావ్లు చేసి, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీకి వచ్చా. అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా. రేవంత్రెడ్డి సరి్టఫికెట్ నాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని.ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్లు పీకి గోలీలు ఆడటం, పేగులు మెడలో వేసుకోవడం వంటి నీచమైన, చిల్లర రాజకీయాలు నాకు రావు. నేను మాటకారిని కాకపోయినా మాట మీద నిలబడే వ్యక్తిని. పదవుల కోసం పార్టీలు మారే రకం కాదు. పదేళ్లు తానే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, అభద్రతాభావం, అహంకారంతో సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారు..’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. మంత్రులు దోచుకుంటున్నారు.. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వంచనలో, దోపిడీలో ఇరు పార్టీలది ఒకే వ్యవహారశైలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి..’అని కేంద్రమంత్రి విమర్శించారు. ఆఖరి గింజ వరకు కొంటామన్నారుగా.. ‘రాష్ట్రం అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం ఇప్పించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతోంది. తెలంగాణలో దొడ్డు బియ్యం వాడకపోయినా, గోడౌన్లు ఖాళీ లేకపోయినా 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి, ఇప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలి. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణలో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం..’అని కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్లో రాష్ట్రం నుంచి మరొకరికి చాన్స్! ఈ నెలలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, బీజేపీ పార్టీ కమిటీలను కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తారని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్లో అవకాశం ఉంటుందన్నారు. -
రూ. 200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో భారీ అవినీతి అనకొండ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జరుప్ల మోహన్ నాయక్పై అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టబద్ధ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.మియాపూర్లోని ఆయన నివాసం, ఎర్రమంజిల్లోని కార్యాలయం, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17,94,62,617 అని ఏసీబీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. భూములు, ఫ్లాట్లు, విల్లాలు.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అధికారిక విలువ ప్రకారం దీని ధర రూ.82.89 లక్షలు. కొంపల్లిలో 3, గచ్చి»ౌలిలో 4 కలిపి మొత్తం 7 ఫ్లాట్లు గుర్తించారు. వీటి అంచనా విలువ రూ.7.34 కోట్లు. మియాపూర్లో ట్రిప్లెక్స్ విల్లా విలువ రూ.2.50 కోట్లు, కూకట్పల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటి విలువ రూ.62.14 లక్షలుగా పేర్కొన్నారు. నిజామాబాద్లో నిర్మిత విల్లా కొనుగోలుకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సోదాల్లో రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల నిల్వలు గుర్తించారు.సుమారు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు. అలాగే 6 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.26 కోట్ల గృహోపకరణాలు, 9 మొబైళ్లు, 4 ల్యాప్టాప్లు సహా రూ.11.25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.25 లక్షల విలువైన రెండు వాహనాలు గుర్తించారు. రూ.4.44 లక్షల విలువైన 22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను కూడా సీజ్ చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు కూడా సోదాలు? సోదాల అనంతరం మోహన్ నాయక్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. సోదాలు బుధవారం కూడా కొనసాగే అవకాశముందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆర్అండ్బీలో కలకలం భారీ ప్రాజెక్టులు, టెండర్లు, నిర్మాణ పనులకు సంబంధించిన నిర్ణయాధికార స్థానంలో ఉన్న ఆర్అండ్బీ ఉన్నతాధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం శాఖలో కలకలం రేపింది. బినామీ ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.వందల కోట్ల అవినీతిలో అక్రమార్కులు రాష్ట్రంలో ఉన్నతాధికారుల అవినీతి వ్యవహారాలు వరుసగా బయటపడుతున్నాయి. ఏకంగా వందల కోట్లలో అవినీతి కార్యకలాపాలు ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు లాకర్లు, భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల పత్రాలు పెద్ద ఎత్తున బయటపడటం రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చాటుతోంది. ఈఎన్సీలు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, అదనపు ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ స్థాయి అధికారులు సైతం భారీ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుతున్నారు.హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ వద్ద బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. నీటిపారుదల శాఖలో కాలేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పేర్లు కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అదనపు కలెక్టర్గా పనిచేసిన అధికారి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన నాయిని భుజంగరావు, జలమండలిలో ఇటీవల పట్టుబడిన ఉన్నతాధికారి, మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ ఆస్తులు పదుల కోట్లలో ఉంటే.. కొందరి ఆస్తులు ఏకంగా వందల కోట్లు దాటుతున్నాయి. -
ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి టాస్క్ లు పూర్తి కావడంతో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ప్రస్తుత కేబినెట్ నుంచి వీలును బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం, ఇద్దరు లేదా ముగ్గురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలని హస్తిన పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేరకు అధిష్టానం కసరత్తు చేయగా, మంత్రుల పనితీరుపై తమ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి కబురు వస్తుందని, ఈ నెలాఖరులోపే మార్పులు జరగవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంకేతాలిస్తున్న ఇటీవలి పరిణామాలు.. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దలను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతుండడం, మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాహుల్గాం«దీని ఇటీవల కలవడం లాంటి ఘటనలు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదంటే ప్రక్షాళన జరుగుతుందనే దానికి ఊతమిస్తున్నాయి. పలు కోణాలు.. పలువురు ఆశావహులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం పలు కోణాలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు ఈసారికి పీసీసీ అధ్యక్ష పదవి తోనే సరిపెట్టే అవకాశాలున్నాయి. నల్లగొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్రెడ్డి, ఎస్టీ లంబాడా కోటాలో బాలూనాయక్లో కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ కూర్పు ప్రకారం ఈ రెండు సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.కానీ రాజగోపాల్రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎస్టీ కోటాలో బాలూనాయక్ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా లంబాడా వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులవుతారనే సమీకరణం బాలూనాయక్కు ఆటంకంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.ఒకవేళ లంబాడా వర్గానికి కేబినెట్లో అవకాశం ఇస్తే బాలూనాయక్కే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. లేదంటే అసెంబ్లీ స్పీకర్గా ఆయన్ను నియమించే అవకాశముందని కూడా సమాచారం. ఇక బీసీ సామాజికవర్గాల్లో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కు కేబినెట్లో చోటు కల్పించే అంశం కూడా ఇటు సీఎం, అటు అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్లో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కేబినెట్లోకి స్పీకర్! అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఈసారి కేబినెట్లో తీసుకుంటారని, ఈ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం కల్పిస్తారని, గడ్డం ప్రసాద్కు మంత్రిగా అవకాశమివ్వడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఆ జిల్లా రెడ్డి సామాజికవర్గం నుంచి తీవ్రంగా ఉన్న పోటీకి చెక్ పెట్టవచ్చనే ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఆయన ఇటీవల పార్టీ పెద్దలను కలవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. పని భారం తగ్గించుకునే యోచనలో సీఎం ఎన్నికల కేబినెట్ రానున్న నేపథ్యంలో తన పనిభారాన్ని తగ్గించుకోవాలనే యోచనలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారు. తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఆయన వదులుకుంటారని, ఈ శాఖలను కూర్చే పనిలో భాగంగా ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న కీలక శాఖలు కూడా మారతాయని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లుగా గుర్తింపు ఉన్న కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖలు మార్చాలని అధిష్టానాన్ని, సీఎంను కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎవరి శాఖలు మారుతాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎప్పుడన్నది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఒకరిపై వేటు తప్పదా?ప్రస్తుత మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలున్నాయని, ఈ నివేదికల ఆధారంగా ఒక కేబినెట్ మంత్రిని తప్పిస్తారనేది కూడా గాం«దీభవన్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. రాజకీయంగా మంత్రుల వ్యవహారశైలితో పాటు ఆయా శాఖల్లో వారి పనితీరును అధిష్టానంతో సత్సంబంధాలున్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా అంచనా వేస్తున్నారని, ఈ నివేదికల ఆధారంగానే ఎవరిని తప్పించాలన్నది నిర్ణయిస్తారని సమాచారం. అయితే సామాజిక సమీకరణలు కూడా ఈ తొలగింపునకు ప్రాతిపదికగా మారతాయని, అన్నీ కుదిరితేనే ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన ఉంటుందని సమాచారం. -
హైదరాబాద్లో భారీ వర్షంపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్: భారీ వర్షం కారణంగా నగరంలో ఏర్పడిన పరిస్థితులపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.తక్కువ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.నగరంలోని ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలుసుకున్న సమాచారంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.కూలిన చెట్లు ,తెగిన విద్యుత్ తీగలు తొలగించడానికి సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
గచ్చిబౌలి చోరీ కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హిల్ రిడ్జ్ విల్లాలో చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించారు. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా భావించిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయగా ఆ గ్యాంగ్ చోరీకి పాల్పడి విషయం బయటపడింది. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు కనిపించలేదు. నెల రోజుల క్రితమే పనిలో చేరిన వారు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. అయితే పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు వ్యాపారవేత్త. దీనిపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితులు గాలించి ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. -
ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్. ‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం -
TG: మహిళా సంఘాలకు 553 బస్సులు కేటాయింపు
హైదరాబాద్: మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ప్రత్యేకంగా 553 బస్సులను ప్రారంభించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ఆడబిడ్డలను లక్ష్మీ దేవితో కొలిచే సంస్కృతి మనది. భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారుమహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలి. ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. వెయ్యి కాదు… 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంచితే, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభకు బస్సులో రాగా అదే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. CM Revanth Reddy flagged off 553 buses operated by Mandal Mahila Samakhyas (MMS) మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పరేడ్ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్,… pic.twitter.com/IPhuWbxu9X— Congress for Telangana (@Congress4TS) June 9, 2026 -
హైదరాబాద్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల కుండపోతగా వాన కురిసింది. నగర పరిధిలోని అడిక్మెట్, విద్యానగర్, అంబర్ పేట్, ఉస్మానియా యూనివర్శిటీ, హఫీజ్పేట్, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే యత్నం చేస్తున్నారు. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించిన దక్షిణ–పశ్చిమ రుతుపవనాలు రాకతో, మంగళవారం(జూన్ 9వ తేదీ) సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. తద్వారా రహదారులు నీట మునగడంతో పాటు విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో భారీ ట్రాఫిక్ జామ్..నగర ఐటీ కారిడార్లో కురిసిన కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాయదుర్గం, ఐకియా, మైండ్స్పేస్ పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకునే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరుఅంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది. హైడ్రా చేసిన ఏర్పాట్లతో పరిసర బస్తీలకు వరద ముప్పు తప్పింది. చెరువు నిండటంతో స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు యువకుల మృతిహైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షపాతం రికార్డు వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి..అడిక్మెట్-36.3 mmవిద్యానగర్- 31.5 mmఅంబర్ పేట్-31.3 mmఉస్మానియా యూనివర్శిటీ-హఫీజ్పేట్-27.5 mmనెహ్రూ నగర్-21 mmమలక్పేట్-మియాపూర్-18 mmఉప్పల్-సరూర్నగర్- 12 mm RTC X Roads after HEAVY DOWNPOUR at 5pm Around 60-70mm was recorded ⚠️ pic.twitter.com/XrTaW8x4Rq— Telangana Weatherman (@balaji25_t) June 9, 2026 -
చీఫ్ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగళం బయిటపడింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జే. బాలు నివాసంలో ఈ రోజు ( మంగళవారం) తెల్లవారుజామున ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ లోని నివాసంతో సహా ఏకకాలంలో పదకొండు చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా అధికారుల తనిఖీల్లో ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలు.. బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, విదేశీ మద్యం సీసాలు దొరికాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇంకా ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయా అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. కాగా మోహన్ నాయక్ పై గతం నుంచే పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ వసూల్ చేస్తున్నట్లు పలు మార్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టగా పెద్ద మెుత్తంలో ఆస్తులు బయిటపడ్డాయి. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు.చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. -
మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి
హైదరాబాద్: మామిడిపండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందింది. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ తెలిపిన మేరకు.. బీదర్ చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు విఠల్ వాడిలో ఉంటున్నారు. నివారం వారి బంధువు రేణుక నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని వీరి ఇంటికి వచ్చింది. ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు ఆదివారం తిన్నారు. అయితే అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మూడో కుమార్తె భువనే శ్వరి(17) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్మెట్ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్మెట్లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్కుమార్ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇదిలా తండ్రి వెంకట్రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. -
హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి
మల్కాజిగిరి: ఏడేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో కొడుకు, కూతురుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హతుడి భార్య గంగాబాయి(65)కి వయసురీత్యా జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కొడుకు కిషన్ (47) కూతురు ప్రపుల్ల (36)కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జి వి.బాలభాస్కర్ రావు తీర్పు వెలువరించారు. సోమవారం మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టకు చెందిన కిషన్ మారుతీ సుతార దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్ ట్రైన్ డ్రైవర్గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని మల్కాజిగిరిలో ఎన్ఏ కృష్ణానగర్లో ఇల్లు కొనుగోలు చేశాడు. అక్కడ భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లతో నివాసముంటున్నాడు. మరో కూతురు అనుపమ వివాహం కావడంతో వేరుగా ఉంటున్నది. కిషన్ ఖాళీగా ఇంటి వద్దనే ఉంటూ తన జల్సాలకు డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. అతనికి సోదరి ప్రపుల్ల, తల్లి గంగాబాయి వత్తాసు పలికేవారు. ప్రపుల్ల కూడా పీజీ చేసినా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో తండ్రి మందలించేవాడు. ఇది వారికి నచ్చలేదు. పింఛను మొత్తాన్ని కూడా ప్రపుల్ల పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడంతో మారుతీ ఒప్పుకోక పోవడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని చంపడానికి ప్రపుల్ల యూట్యూబ్లో చూసి ఒక పథకం రచించి విషయాన్ని తల్లి, సోదరుడుతో పంచుకొంది. ఉమ్మెత్త చెట్టు గింజలను నూరి ఆ పొడిని ఆహారంలో కలిపి విషప్రభావంతో చనిపోయేలా చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి బయట నాలాలో పడేద్దామని చెప్పింది. ఆవిధంగా పలుమార్లు ఆహారంలో ఉమ్మెత్త చెట్టు గింజల పొడిని ఆహారంలో కలిపి మారుతీకి ఇవ్వగా 2019 ఆగష్టు 16న మృతి చెందాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో ఉంచి పూజగదిలో దాచివుంచారు. జన సంచారం ఉండటంతో రెండు రోజులు అలాగే ఉంచారు. దుర్వాసన రాకుండా అగరబత్తీలు వెలిగించి, సెంట్ చల్లి జాగ్రత్తపడ్డారు. జనసంచారం తగ్గడంతో 18వ తేదీన బయటకు తీసుకొని రావడంతో ఒక్కసారిగా దుర్వాసన వచి్చంది. దీంతో స్థానికులు గుమిగూడటంతో విషయం బయటపడ్డది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోమవారం తీర్పు వచి్చంది. -
చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే బత్తిని కుటుంబం ఆనవాయితీగా నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీకి ఈసారి కూడా భారీ స్పందన లభిస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు జనం పోటెత్తారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆస్తమా రోగులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. చేప ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.నిన్న (సోమవారం) రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా చేప ప్రసాదం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. చివరి గంటల్లోనూ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఉచితంగా ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. వీఐపీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.3 లక్షల చేప పిల్లలకు మించి..చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ (ఫిషరీస్ డిపార్ట్మెంట్) ఇప్పటికే సుమారు 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేప పిల్లలను సమకూర్చేందుకు కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ పూర్తైంది.చేప ప్రసాదం ప్రత్యేకత ఇదేమృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం ప్రత్యేకంగా తయారు చేసే ఔషధ మిశ్రమాన్ని చిన్న చేప నోట్లో ఉంచి రోగులకు అందిస్తారు. దీనిని ప్రజల్లో "చేప ప్రసాదం"గా పిలుస్తారు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కారణంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కు వస్తుంటారు.చేప ప్రసాదం ప్రభావంపై శాస్త్రీయంగా స్పష్టమైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతుంటే.. మరోవైపు దీనివల్ల తమ ఆరోగ్యం మెరుగుపడిందని వేలాది మంది రోగులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
నైరుతి వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా భూభాగంలోకి సోమవా రం ఉదయం రుతుపవనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయి. గతేడాది రెండు వారాల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించగా... ఈసారి సాధారణ సగటు సమయానికి రెండ్రోజుల ముందు చేరుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది.గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఉక్కపోత కూడా కాస్త తగ్గింది. రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. అదేవిధంగా రానున్న 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఎల్నినో పరిస్థితులు ఉన్నాయని, ఇవి క్రమంగా బలపడి నైరుతి సీజన్ సమీపించిన తర్వాత ఎల్నినో పరిస్థితులు పూర్తిగా కేంద్రీకృతమవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా లోటు వర్షపాతం ఉంటుందని శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల తేలికపాటి వానలు సోమవారం రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కొనసాగిన ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా?
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, సంచుల మూటలు మోయడం, పార్టీలు మారడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమర్థుడే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. ఏమీ చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సోమవా రం తన మంత్రిత్వ శాఖ రెండేళ్లలో సాధించిన ప్రగతిపై మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి పైవిధంగా స్పందించారు. కేంద్రం దొడ్డు బియ్యం సేకరించి ఏం చేయాలి? ‘ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు వ్యయం చేస్తోంది. రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు. వారికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం దొడ్డు బియ్యాన్ని సేకరించి ఏం చేయాలి? దొడ్డు బియ్యం రాష్ట్ర ప్రజలే తిననప్పుడు మిగిలిన రాష్ట్రాల ప్రజలు తినాలని ఎలా చెప్తాం? దేశంలోని గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడం, రబీ సీజన్లో భారీగా ధాన్యం వస్తుందన్న ఉద్దేశంతోనే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఏకంగా 70 లక్షలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. రాష్ట్రంలో పండించే సన్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు క్వింటాల్కు రూ.4,500కు విక్రయిస్తూ.. ఇక్కడకు మాత్రం రూ.3,500 క్వింటాల్కు కొనుగోలు చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. పది రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామని అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సన్న ధాన్యానికి ప్రకటించి.. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు..’ అని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. మెట్రో టేకోవర్కు కేంద్రమే రుణం సమకూర్చింది ‘ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వా«దీనానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. రైల్వేనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 13,500 కోట్లు రుణాన్ని ఇచ్చింది. అంతేకాక మెట్రో రెండో దశకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 50 శాతం నిధులను రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడానికి కూడా అంగీకారం తెలిపింది. మెట్రో టేకోవర్ పూర్తయ్యాక తిరిగి డీపీఆర్ పంపించాలి. అలా పంపించిన డీపీఆర్ను కేంద్రంలోని మెట్రోబోర్డు, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతాయి. అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారుల కోసం దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలిపింది. ఒక్క నెలలోనే దాదాపు రూ. 28 వేల కోట్లు కేంద్రం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసింది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? ‘సింగరేణిలో ఏదో బొగ్గు కుంభకోణం జరిగిందని కేటీఆర్ మాకు లేఖ రాసిన విషయం వాస్తవమే. సింగరేణిలో ఇప్పుడే అవినీతి జరిగిందా? గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక్క విషయంలోనూ హరీశ్రావు, కేటీఆర్లకు నేను కేంద్ర మంత్రినని గుర్తుకు రాలేదు కానీ.. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ.. అందులో కిషన్రెడ్డికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించడం ఏమిటి. వారి హయంలో సింగరేణిలో అవినీతి జరగలేదా? ఒక్క సింగరేణిలోనే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విభాగంలో అవినీతి జరగడం లేదో చెప్పాలి?..’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిస్తేనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సబర్మతీ రివర్ఫ్రంట్ కడితే ఆహా.. ఓహో.. అబ్బా అని పొగుడుతారు. కానీ మనకు అవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం అడ్డుకుంటారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్రావు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మన అభివృద్ధికి, మన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఎంతకాలం గుజరాత్కు గులాంలుగా ఉంటారు? ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపీలకు లేదా? నగర తాగునీటి అవసరాలకు గోదావరి, సింగూరు జలాలు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్, మూసీ ప్రక్షాళనలకు అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు.‘మున్సిపల్ వార్డు ఎన్నికలకు సైతం మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇక్కడి మన మోరీలో మురికి తీయాలంటే మోదీ వస్తారా? అందుబాటులో ఉండి పనులు చేసేవారిని, ఇక్కడి సమస్యలు తెలిపిన వారిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని అన్నారు. ‘పదేపదే నేనేం చేశాననిఅడుగుతున్న వాళ్లు.. ప్రస్తుతం ఫామ్హౌస్లో ఉన్న కేసీఆర్ పదేళ్లలో, ప్రధాని మోదీ పన్నెండేళ్లలో ఏం చేశారో చెబితే.. గత రెండేళ్లలో నేనేం చేశానో చెబుతా. ఈ అంశంపై అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ పెడతాం. నేనేం చేశానో, ఏం ప్రణాళికలున్నాయో పీఏసీ చైర్మన్ గాంధీతోనే చెప్పిస్తా..’ అని చెప్పారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మియాపూర్లో దాదాపు రూ.1,675 కోట్ల విలువైన..సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవనం సహా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వివక్ష, వితండవాదం వద్దు ‘రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వివక్ష, వితండవాదం లేకుండా ప్రతిపక్ష పారీ్టలు ముందుకు రావాలి. 2009 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయం చేద్దాం.. అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలి. చేతనైతే కేసీఆర్, కిషన్రెడ్డి విలువైన సూచనలివ్వాలే కానీ, అబద్ధాలు, అవినీతి, అహంకారంతో అడ్డుపడొద్దు. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.నేను ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన ప్రతిసారీ మూడు రోజుల తర్వాత వారిని కలిసి.. పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదని కిషన్రెడ్డి చెడగొడతారు. ఇలాగే అభివృద్ధికి అడ్డం పడితే రాబోయే రోజుల్లో ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పు ఇస్తారు. మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లకుండా చేస్తారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే.. ‘ప్ర«దాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివసించే ఢిల్లీలో కాలుష్యం సమస్య. ముంబైలో వరదనీరు, ట్రాఫిక్, మురికివాడల సమస్యలు. ఐటీకి పేరెన్నికగన్న బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. ఇంటినుంచి వెళ్తే ఎయిర్పోర్టుకు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. చెన్నైలో అపార్ట్మెంట్లు, కాలనీలు వర్షమొస్తే నీళ్లలోనే. కోల్కతాలో బయటకు వెళ్లినవారు ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని శాంతిభద్రతల సమస్య. వాటి తీవ్రతను అర్థం చేసుకునే హైదరాబాద్కు ఆ దుస్థితి రాకుండా నిపుణుల సూచన మేరకు మూడు కార్పొరేషన్లు చేశాం. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సరిహద్దులు నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు. పేదల కోసం లక్ష ఇళ్లు ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆడబిడ్డలు.. ఆదానీ, అంబానీలతో, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. అమెజాన్లో ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆడబిడ్డలకు ప్రథమ ప్రాధాన్యం, నిరుద్యోగ యువతకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్పోర్ట్స్ స్కూళ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మహానగరంలో పేదల కోసం లక్ష ఎల్ఐజీ, ఎంఐఈ ఇళ్లు కడతాం. గాజుల రామారంలో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజుల రామారంలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెరి్మనల్ పనులు త్వరలో ప్రారంభించనున్నాం. సీఎంసీ కార్యాలయాన్ని సైతం ఐటీ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలను తలపించేలా నెట్జీరోగా నిర్మిస్తాం..’ అని సీఎం చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..రాబోయే కాలంలో విశ్వనగరంగా ఎదిగేందుకు పనులు చేపడతామని చెప్పారు. శేరిలింగంపల్లిలో 1,500 ఐటీ సంస్థలు ఉండగా, 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి రవాణా, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుదని అన్నారు. ఒకేచోట 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన గచ్చిబౌలి: సీఎంసీ, విద్యాశాఖ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ శాఖల నిధులతో ఒకేచోట 11 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మియాపూర్లోని లక్ష్మీనగర్లో వేదిక వద్ద ఈ మేరకు 11 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సీఎంసీ ప్రధాన కార్యాలయం, మియాపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్, శేరిలింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణం, ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన, పలు రోడ్లు, ఆర్వోబీలు, యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమానంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.కాగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేసిన శాలువ, బొకెతో సీఎం రేవంత్రెడ్డిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సన్మానించారు. వాటర్ పెట్ బాటిల్స్ వ్యర్థాలతో శాలువ తయారు చేయగా, బొకెను షాంపు బాటిల్స్ వ్యర్థాలతో రూపొందించారు. ప్లాస్టక్ వ్యర్థాలతో తయారు చేసిన కుర్చిలలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు కూర్చున్నారు. దుండిగల్లో ఏర్పాటు చేయనున్న చెత్త ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. -
Hyd: చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే అంతర్-రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కింద పనిచేసే 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ వైద్యుల బృందం ఉమ్మడిగా దాడి చేసి రట్టు చేశాయి.నమ్మకమైన సమాచారం మేరకు సోమవారం(జూన్ 8వ తేదీ) తెల్లవారుజామున ఉమ్మడి బృందాలు అంబర్పేట్, కుల్సుంపురా, అత్తాపూర్ మరియు రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 7 నాలుగు చక్రాల రవాణా వాహనాలను పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న సుమారు 90 టన్నుల పచ్చి చికెన్ వ్యర్థాలను (Poultry Waste) గుర్తించి సీజ్ చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్వాహకులు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వివిధ చికెన్ షాపుల నుండి ఈ వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్కు తరలించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా, వాణిజ్య చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించడం కోసం వీటిని ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలకు, అలాగే నల్గొండలోని మాల్ టౌన్కు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నిర్దేశిత నిబంధనల ప్రకారం సురక్షితంగా పారదోలారు (హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సుదీర్ఘ ఆపరేషన్ జరిగింది. హెచ్-ఫాస్ట్ ఇన్స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్, ఎమ్. అంజయ్యలతో పాటు సబ్-ఇన్స్పెక్టర్లు, హెచ్-ఫాస్ట్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యులు ఈ దాడులలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.ప్రజలకు,వ్యాపారులకు ముఖ్య హెచ్చరికపచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం మరియు వాణిజ్య చేపల చెరువుల్లో వాటిని ఆహారంగా వేయడం పూర్తిగా నిషేధించబడింది. ఇటువంటి అత్యంత అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల ఆహార గొలుసు (Food Chain) లోకి ప్రమాదకరమైన బయోలాజికల్ బ్యాక్టీరియా/విషపదార్థాలు ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను తినడం వల్ల మనుషులకు క్యాన్సర్ (Carcinogenic) వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం.అందుచేత చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరుతున్నారు. -
‘‘అందుకే హైడ్రా గురించి ‘హిట్లర్’ అంటూ రేవంత్ మాట్లాడారు’’
హైదరాబాద్: బీఆర్ఎస్పై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కబ్జాదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోందని, దీన్ని ఓర్వలేకే కొంతమంది దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని చెప్పారు.‘‘సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన ‘The Hindu Conclave’లో ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక పదాన్ని పట్టుకుని కొందరు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం అత్యంత సిగ్గుచేటు. అక్కడ సీఎం మాట్లాడిన పరిపాలనా తత్వశాస్త్రం, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ ను అర్థం చేసుకునే ప్రాథమిక మేధో పరిపక్వత వారికి లేదు. సీఎం ప్రస్తావించింది కేవలం Execution Speed, Decisiveness గురించి మాత్రమే తప్ప... హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదు.హైదరాబాద్లోని చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఆ మాత్రం ఉక్కు సంకల్పం ఉండాలనే ఉద్దేశంతోనే ‘హిట్లర్’ గురించి సీఎం చెప్పారు. తెలంగాణలో ఓ సామెత ఉంది... ‘తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే... గోడ కూల్చినట్టుంది’ అని. అచ్చం కేటీఆర్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. అక్కడ చర్చ జరిగిన సందర్భం ఏంటో తెలియదు, ఆ సదస్సు సారాంశం ఏంటో తెలియదు. కానీ.. ‘హిట్లర్’ ఒక పదాన్ని పట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.హైడ్రా స్పీడ్ కు కబ్జాదారుల గుండెల్లో పుడుతున్న వణుకు చూసి... తట్టుకోలేక... ఓర్వలేక... ఎక్కడ ఏడ్వాలో తెలియక... ఈ ‘హిట్లర్’ ముసుగు వేసుకుని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. కేటీఆర్ నోట ప్రజాస్వామ్య విలువలు అనే మాట వింటే... ‘గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదు’ అన్న సామెత గుర్తొస్తుంది.హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోంది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇస్తోంది. కాకపోతే, గతంలో లాగా కబ్జాదారులకు కొమ్ము కాయకుండా, వారితో కుమ్మక్కు అవ్వకుండా... ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ మార్పు తెలంగాణకు అవసరం. దీన్ని ప్రతి మేధావీ, ప్రతి సామాన్యుడూ స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హిట్లర్ క్రూరత్వాన్ని, ఆ హింసాత్మక ఫాసిజాన్ని ఎప్పటికీ సమర్థించదు. అది మా డీఎన్ఏలోనే లేదు’’ అని తెలిపారు.‘వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అనడమేంటి? హరీశ్ రావుపై కూడా శ్రీధర్ బాబు మండిపడ్డారు. ‘‘మీ గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో మీరిచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది, కాంగ్రెస్ ఇప్పుడు చేస్తోందదని హరీశ్ రావు ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ భూముల ధరలు కృత్రిమంగా పెంచింది. బీఆర్ఎస్ హాయాంలో ప్రగతి భవన్లో ఉన్నవారికే ఫ్రెండ్లీ పోలిసింగ్. వచ్చేది మేమే మీ అంతుచూస్తామని కేటీఆర్, హరీశ్ రావు బెదిరిస్తున్నారు... మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విషం చిమ్ముతుంది. మీ తాటాకు చప్పుళ్ల కు భయపడేది లేదు. కొత్త డిస్కం వల్ల రైతులకు లాభమే. ధాన్యం కొనుగోలులో మా ప్రభుత్వం రాజీపడదు. బీఆర్ఎస్ హాయాంలో పెంచని ఛార్జీలు ఉన్నాయా? అయినా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సింగరేణిని బీఆర్ఎస్ నేతలు సర్వం దోచుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి రూ.40 వేల కోట్ల అప్పు పెట్టింది. ప్రైవేటు బొగ్గు డిపోలకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్సే. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో భయంతో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సింగరేణి విషయంలో హరీశ్ రావు ఆరోపణలు తప్పు’’ అని తెలిపారు. -
ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్
హైదరాబాద్: ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది దీనిలో భాగంగా ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై 21 రోజుల పర్యవేక్షణ ఉంచనున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్కు తరలిస్తారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్న ఇద్దరు విదేశీయులకు ఎబోలా వైరస్ నెగిటివ్ వచ్చింది. అయినా రెండోసారి పరీక్షల కోసం శాంపిల్స్ను పుణె పంపారు. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరొకవైపు విదేశీ ప్రయాణికులు తప్పుడు చిరునామాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద చర్యలకు ఆదేశించారు. ఎయిర్పోర్ట్లోనే చట్టపరమైన హెచ్చరికలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషా సిబ్బంది నియామకానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. EFLU సహకారంతో 24 గంటల భాషా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్కు శాఖల మధ్య సమన్వయం పెంచాలని, ఆరోగ్యశాఖ-జీహెచ్ఎంసీ-పోలీసుల సమన్వయంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఎబోలా నివారణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎబోలా టెస్టింగ్ కిట్లు అందాయని, పరీక్షలు ప్రారంభించామని జాతీయ పరిశోధన సంస్థ సీసీఎంబీ తెలిపింది. శాంపిల్ వచ్చిన వెంటనే ఫలితాలు అందిస్తామని పేర్కొంది. -
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: తెలంగాణకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకాయి. గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. ఇప్పటికే ఇవి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి. ఏపీ, మహారాష్ట్రలో 30 శాతం విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వరకు విస్తరించాయని, ప్రస్తుతం తెలంగాణ దక్షిణ సరిహద్దులోకి ప్రవేశించే స్థితిలో ఉన్నాయని తెలిపింది. చెప్పినట్లే ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి.“పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి కేవలం 2 నుంచి 3 రోజులు చాలు” అని అధికారులు తెలిపారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్
చేపల మార్కెట్లపై మృగశిర కార్తె ప్రభావం కనిపించింది. నగరంలోనే ప్రసిద్ధి గాంచిన ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. సోమవారం మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కూడా తోడవ్వడంతో చేపల ప్రియులు మార్కెట్కు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. రాంనగర్ చౌరస్తా నుంచి దాయారా మార్కెట్ రోడ్డుపై చేపల విక్రయాలు కొనసాగాయి. కిలో రవ్వ, బొచ్చె మామూలు రోజుల్లో రూ.120– 130 ఉండగా.. రూ.230– 250 వరకు విక్రయించారు. కిలో కొరమీను రూ.450 వరకు ఉండగా.. ఆదివారం రూ.650కు విక్రయించారు. – ముషీరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం -
రాజకీయ నేత ఇంట్లో రూ.కోటిన్నర చోరీ?
సనత్నగర్: ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారం సనత్నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఏకంగా కోటిన్నర రూపాయలు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెక్కాలనీలో ప్రాంతంలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం లేదంటూ సదరు నాయకుడు సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి ఆ రాజకీయ నేత కుమార్తె డబ్బులు తీసినట్లు తెలిసింది. ఇంట్లో త్వరలో జరిగే వివాహం నిమిత్తం నగదు జమ చేసి కోటిన్నర రూపాయల వరకు అల్మారాలో దాచి ఉంచారు. శుక్రవారం కొంత నగదు వేరే వారికి ఇవ్వాల్సి ఉండగా అల్మరాలో నుంచి డబ్బును తీసుకునేందుకు చూడగా అందులో నగదు కనిపించలే దు. దీంతో కంగారు పడి ఆ రాజకీయ నేత పోలీసులకు విషయం తెలపగా వారు వచ్చి విచారణ జరిపారు. చివరకు తమ కుమార్తెనే నగదు తీసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. -
ర్యాపిడో రైడర్ను బెదిరించి రూ. 20 వేలు వసూలు
హైదరాబాద్: ర్యాపిడో బైక్ రైడర్ను ప్రమాదం పేరుతో బురిడీ కొట్టించి, రూ. 20 వేలు వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహార్ నగర్కు చెందిన సురేష్ (29) మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తూ పార్ట్ టైమ్గా రాపిడో రైడర్గా జీవనం సాగిస్తున్నాడు.జూన్ 4వ తేదీ రాత్రి భవాని నగర్ నుండి బోడుప్పల్కు ప్రయాణికుడిని తీసుకెళ్తుండగా, బంగారు మైసమ్మ వైన్ షాప్ సమీపంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సురేష్ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోగా, మిగిలిన ఒక వ్యక్తి తన కాలు విరిగిందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సురేష్ ను కోరాడు. అతని మాటలు నమ్మిన సురేష్ తన బైక్పై అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యంలో ఆ వ్యక్తి తన సహచరులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికే మిగతా ఇద్దరూ సురేష్ను అడ్డగించి, బలవంతంగా తమ వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి, ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో సురేష్ తన స్నేహితుడు రాజశేఖర్కు ఫోన్ చేసి, నిందితులు చెప్పిన ’బద్దం శ్రీకాంత్’ అనే మొబైల్ నెంబర్కు ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేయించాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
నేడు చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని, పలువురు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఒక రోజు ముందుగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వీరి కోసం పలువురు ఆహారం పంపిణీ చేశారు. -
భార్య గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కింగ్స్ అండ్ క్వీన్’ ఓ మచ్చుతునక మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ డెకాయ్ ఆపరేషన్ చేయడంతో మంజీరా మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. స్థానిక పోలీసులతో కుమ్మక్కై తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి దందాలకు వ్యవస్థీకృతంగా నడపటంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడితో పాటు అతడు నడిపిన పబ్స్పై గతంలోనూ అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. యువతులను రప్పించి.. ఈ పబ్స్ దందాలో ఏళ్లుగా ఉన్న ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువస్తున్నాడని తెలిసింది. అలా వచ్చే వారికి బస, భోజనం తదితరాలన్నీ అతడే సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ వారు వినియోగించడానికి తాత్కాలిక ఫోన్లు, నెంబర్లు వారిని తీసుకువచి్చన వాళ్లే కేటాయిస్తున్నారు. ఓసారి పబ్కు వచి్చన యువకుల ఫోన్ నెంబర్లు ఈ యువతులు తీసుకుంటారు. తమ వద్ద ఉన్న తాత్కాలిక నెంబర్లకు వారికి ఇస్తారు. ఇలా నిత్యం వారితో చాటింగ్ చేస్తూ పదేపదే అదే పబ్కు వచ్చేలా ఆకర్షిస్తుంటారు. ఇలా చేసిందుకు నిర్వాహకులు వీరికి అదనంగా చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ చేసిన బిల్లు నుంచి కమీషన్ కూడా ఇస్తారు. దీనికి అదనంగా ఆయా యువకుల నుంచి ఈ యువతులు కంపెనీ ఇచి్చనందుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. కొన్ని చోట్ల శ్రుతి మించి..ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్లకు ఆకర్షించడం, మద్యం తాగడం.. తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదనుగా ద్వితీయ, తృతీయ శ్రేణులకు చెందిన కొన్ని పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు శ్రుతి మించుతున్నాయి. దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ యువతుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఈ దందాలతో పాటు ఓ డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అతడి వ్యవహారాలు ఆయా ఠాణాలకు చెందిన అధికారులకు తెలిసినా ‘అనివార్య కారణాల’ నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇకపైనా టాస్్కఫోర్స్, ఎస్ఓటీలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పబ్స్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. -
డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సాక్షి,ఖమ్మం: పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు మితిమీరిన వేగంతో బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36మంది ప్రయాణికుల్లో 26మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన తోటి వాహనదారులు, సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకోగా.. ప్రమాదానికి గురైన బస్సు కేవీఆర్ ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పని భారం.. ఏఐతో దూరం!
2025 నవంబర్–2026 జనవరి మధ్య కాలంలో యూఎస్ఏ, యూకే, జర్మనీ ఆస్ట్రేలియాల్లో ఎన్బీఈఆర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ‘ఫర్మ్ డేటా ఆన్ ఏఐ’ నివేదికను విడుదల చేసింది. ఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 6 వేల మంది సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, జర్మన్ బుందెస్ బ్యాంక్, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీ ³రిశోధక బృందాలు సంయుక్తంగా ఈ డేటాను సేకరించాయి.సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఓ సాధారణ ఉద్యోగి రోజువారీ పనిభారాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు. పునరావృతమయ్యే పనులను స్వయంచాలకం చేయడం, సమాచారాన్ని సంగ్రహించడం, భావ ప్రసారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఆధునిక ఏఐ సాధనాలు ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్బీఈఆర్) వంటి సంస్థల వాస్తవ–ప్రపంచ ప్రభావ అధ్యయనాలను బట్టి చూస్తే.. పని సంక్లిష్టతను బట్టి 14% జనరేటివ్, 30% ఏఐ సహాయకాలు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచగలవని నిరూపితమవుతోంది. ఏమిటీ అధ్యయనం ?ఏయే రంగాలు ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఏ రంగాలపై దీని ప్రభావం ఎక్కువ పడనుందో వంటి వివరాలు పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, వినియోగ విధానం ఎలా ఉందంటే...సమాచార, కమ్యూనికేషన్ల రంగం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఏఐని అత్యధికంగా వాడుతున్నాయిఅడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ : ఆఫీస్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులలో ఏఐ వాడకం చాలా ఎక్కువగా ఉంది⇒ హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ఫుడ్ సర్వీసెస్, హోటళ్లు, క్యాటరింగ్ రంగాలు⇒ చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏఐ టూల్స్ను వేగంగా స్వీకరిస్తున్నాయిఅధిక జీతాలు ఇచ్చే కంపెనీలు : ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థలలో ఏఐ ప్రయోగాలు, దాని ద్వారా వచ్చే ఉత్పాదకత లాభాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చిందిమొత్తంగా చూస్తే, శారీరక శ్రమ లేదా సాధారణ క్లరికల్ పనులు ఎక్కువగా ఉండే రంగాల కంటే, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లోనే ప్రస్తుతం ఏఐ విప్లవం వేగంగా విస్తరిస్తోంది.భారత్లో ఏఏ రంగాల్లో ఏఐ ప్రభావం అధికం ?ఐటీ మరియు టెక్నాలజీ సర్వీసెస్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ ఆటోమేషన్ వల్ల 10% నుంచి 20% వరకు ఉత్పాదకత పెరిగిందిబ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) : లోన్ ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, కస్టమర్ సపోర్ట్ (ఏఐ చాట్బాట్స్) విభాగాల్లో పనిభారం భారీగా తగ్గిందిరిటైల్, ఈ–కామర్స్ (రిటైల్,కన్జూమర్ గూడ్స్) : కస్టమర్ల అవసరాలను అంచనా వేయడానికి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం ఏఐని ఎక్కువగా వాడుతున్నారుఉద్యోగాల మార్కెట్–భవిష్యత్ (2026 – 2031): ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్. నాస్కామ్ నివేదికల ప్రకారం ఇండియాలో ఏఐ సంబంధిత ఉద్యోగాల డిమాండ్ 10 లక్షలు దాటింది⇒ ప్రపంచంలోనే ఏఐ టాలెంట్ను ఆకర్షించడంలో భారత్ (33% హైరింగ్ రేటుతో) ముందుందినీతి ఆయోగ్ అంచనా : భారత్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తే, టెక్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో కోటి దాటే అవకాశముంది. ⇒ ఒకవేళ కంపెనీలు అప్గ్రేడ్ అవ్వకపోతే ఉద్యోగాల కోత తప్పదని ఈ నివేదిక హెచ్చరించిందిభారత్ మెరుగైన స్థితిలోనే...ఇండియాలో ఏఐ వినియోగం..దాని వల్ల పెరుగుతున్న ఉత్పాదకత, ఉద్యోగాలపై ప్రభావం గురించి నాస్కామ్, ఈవై, నీతి ఆయోగ్ వంటి సంస్థల నివేదికలు కీలక వివరాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని వేగంగా స్వీకరిస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో ఏఐ కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకతను పెంచే ఒక కీలక శక్తిగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఏఐ అడ్వాంటేజ్, ఉత్పాదకత సమయం ఆదాలో టాప్‘ఈవై 2025 వర్క్ రీఇమేజిన్డ్’ సర్వే ప్రకారం పనిలో ఏఐ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంలో ప్రపంచంలోనే అత్యధికంగా 53 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది (ప్రపంచ సగటు కేవలం 34 పాయింట్లు మాత్రమే)⇒ దాదాపు 75% మంది భారతీయ ఉద్యోగులు 72% మంది యజమానులు జనరేటివ్ ఏఐతో కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిందని అభిప్రాయపడ్డారుళీ భారత్లో కూడా కొత్తగా చేరిన లేదా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత ఏఐ టూల్స్ వల్ల ఏకంగా 34% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి -
గోదావరి–కావేరి లింక్పై రేవంత్ సర్కార్ జలద్రోహం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–నల్లమల సాగర్ ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో ముడిపెట్టడం తెలంగాణ జలహక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు అన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ హక్కుల కోసం ముందుండి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణభవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘968 టీఎంసీల హక్కులే ముందుగా’... గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడిందని హరీశ్రావు గుర్తు చేశారు. జీడబ్ల్యూడీటీ (గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే తెలంగాణకు 45 టీఎంసీల అదనపు హక్కు ఉంటుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. నదుల అనుసంధానంపై జరిగిన ఎన్డబ్ల్యూడీఏ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు వచి్చన తర్వాతే తదుపరి చర్చలు జరగాలని పట్టుబట్టామని వెల్లడించారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని, ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్కు లింక్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే...పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను ఎన్ఓసీతో ముడిపెట్టడం ప్రమాదకరమని హరీశ్రావు అన్నారు. తెలంగాణకు ట్రిబ్యునల్ ద్వారా రావాల్సిన 1,005 టీఎంసీలతోపాటు మరో 45 టీఎంసీల అంశం పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం వదులుకుంటోందని ఆరోపించారు. సమ్మక్కసాగర్, వార్ధా, ఎల్లంపల్లి, లోయర్ పెన్గంగా వంటి ప్రాజెక్టులకు సంబంధించిన 139 టీఎంసీల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి–కావేరి లింక్ అమలైతే తెలంగాణకు కనీసం 211 టీఎంసీల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఢిల్లీ వరకు పోరాటం చేస్తాంపోలవరం–బనకచర్ల మార్గం ద్వారా నీటిని తరలించాలంటే సుమారు రూ.82 వేల కోట్ల వ్యయం అవుతుందని, తెలంగాణ మీదుగా నదుల అనుసంధానం జరిగితే రూ.48 వేల కోట్లకే సాధ్యమని వివరించారు, దీనిపై కేంద్ర మంత్రులు.కిషన్రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సంజయ్, చింత ప్రభాకర్తో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిహారం ఇస్తేనే..పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు సాగనిస్తాం
సాక్షి, హైదరాబాద్: భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకు కోహెడలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు జరగనివ్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోహెడలో 239 ఎకరాల్లో ప్రతిపాదించిన ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు భూములు రైతులవని, వారి నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు.ఇప్పటికే అక్కడ ఫ్రూట్ మార్కెట్ అందుబాటులో ఉందని, అయినా, రైతుల భూములను సేకరించి, వాటిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నం జరుగుతోందని, ఈ భూసేకరణను రైతులు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆయా రైతులను అరెస్టు చేశారని, సాయంత్రం వారిని విడుదల చేశారని తెలిపారు. పాలమూరు జిల్లాలో కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగినవి కాదన్నారు.సీఎంతోపాటు కాంగ్రెస్ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, ప్రాజెక్టులు, జాతీయ సంస్థలపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉంటే తేదీ, సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ గేట్ వద్ద అయినా చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేస్తే, తాము కూడా వివరాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ’ది హిందూ’ సదస్సులో (ది హిందూ కాన్క్లేవ్) సీఎం రేవంత్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆదివారం స్పందించారు. రేవంత్రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘మీకు స్ఫూర్తి హిట్లర్ ముమ్మాటికి నిజమేం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక అస్సాసినేషన్ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిది! మీరు నియంతలను పూజిస్తారు, పేదల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతారు.తెలంగాణ ప్రజలకు మీ నియంత నైజం ముందే తెలుసు.. ఇప్పుడు మీ నోటితోనే మీ ఫాసిస్ట్ ఆలోచనలను దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు రేవంత్రెడ్డి’అని కేటీఆర్ తన ట్వీట్లో విమర్శించారు. ‘రేవంత్రెడ్డి.. మీలాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత మేధావులం మేము కాదు. అందుకే, మా పదేళ్ల పరిపాలనను మేము డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
వాటర్ రీసైక్లింగ్కు వేళయింది..
సాక్షి, స్పెషల్డెస్క్: భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ‘నీటి సంక్షోభం’. భూగర్భ జలాలు పడిపోవడం, జనాభా పెరుగుదల వల్ల నీటిఎద్దడి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడగలిగే ఏకైక అస్త్రం ‘వాటర్ రీసైక్లింగ్’(మురుగునీటి శుద్ధి). నీటిని అత్యంత విలువైన వస్తువుగా భావించి బాధ్యతగా వాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం..ఏడాదికి తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తగ్గితే ఆ దేశం నీటి ఒత్తిడి (వాటర్ స్ట్రెస్)లో ఉన్నట్లు లెక్క. 2021 నాటికే భారత్లో ఇది 1,486 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. అంటే మనం ఎప్పుడో ప్రమాద గీతను దాటేశాం. మరోవైపు 2031 నాటికి ఇది 1,367 క్యూబిక్ మీటర్లకు పడిపోనుంది. ఇది కనుక 1,000 క్యూబిక్ మీటర్ల కంటే తగ్గితే దేశం ‘తీవ్ర నీటి కొరత’లోకి వెళ్లిపోతుంది. సరైన లెక్కలు లేక.. సీఈఈడబ్ల్యూ (కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్) అధ్యయనం ప్రకారం పలు ప్రధాన లోపాలను ప్రస్తావించింది. మున్సిపాలిటీల వద్ద ఎంత మురుగునీరు ఉత్పత్తి అవుతోంది? ఎంత శుద్ధి చేస్తున్నారనే సరైన లెక్కలు లేవని, శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, వ్యవసాయానికి వాడటం చాలా తక్కువగా ఉందని, మెజారిటీ నీరు వృథా అవుతోందని తెలిపింది. ‘మురుగునీరు’అనే ముద్ర ఉండడం వల్ల ప్రజలు దీనిని వాడటానికి వెనుకాడుతున్నారని పేర్కొంది. రీసైక్లింగ్ నీటితో ప్రయోజనాలు వర్షాలు పడకపోయినా నగరాల నుంచి ప్రతిరోజూ మిలియన్ల లీటర్ల మురుగునీరు వస్తోంది. దీనిని శుద్ధి చేసి ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాలు, పార్కులకు మంచినీటికి బదులు వాడాలి. దేశంలో 80 శాతానికి పైగా నీరు వ్యవసాయానికే ఖర్చవుతుంది. శుద్ధి చేసిన నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉండటం వల్ల పంటలకు మేలు జరుగుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ఆదర్శ నగరాలు ఇవే సింగపూర్ దేశం తన అవసరాల్లో 40 శాతం పైగా రీసైకిల్ నీటితోనే తీర్చుకుంటోంది. భారత్లోనూ కొన్ని నగరాలు ఈ బాటలో ఉన్నాయి. చెన్నైలో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని చట్టబద్ధం చేసి, 10 శాతం కంటే ఎక్కువ మురుగునీటిని శుద్ధి చేసి భారీ పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ఇక సూరత్లో అయితే శుద్ధి చేసిన నీటిని టెక్స్టైల్ పరిశ్రమలకు విక్రయించడం ద్వారా మున్సిపాలిటీకి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. బెంగళూరులో మురుగునీటిని మూడో దశ వరకు శుద్ధి చేసి, 55 కి.మీ. దూరంలో ఉన్న కరువు ప్రాంతాల చెరువులను నింపుతున్నారు. దీనివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరిగాయి. చేయాల్సింది ఏంటి? భారత్లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిలో కేవలం 30 శాతంలోపే శుద్ధి అవుతోంది. మిగతాదంతా నదులను కలుషితం చేస్తోంది. ఇకపై వర్షాలు, భూగర్భ జలాలపైనే ఆధారపడటం సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్కువ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీలు) నిర్మించి, వ్యర్థ జలాలను వాడుకోవడమే దేశ భవిష్యత్కు ఏకైక మార్గం. -
ప్రాణహిత–చేవెళ్లకు కొత్తరూపు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు కొలిక్కి వస్తున్నాయి. మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రతిపాదించిన బరాజ్ ఎత్తు మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. ప్రాజెక్టు పాత అలైన్మెంట్కు కొన్ని మార్పులతో ప్రీఫీజబిలిటీ నివేదిక (పీఎఫ్ఆర్)కు తుదిరూపు కల్పిస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, దానికి 3 కి.మీ. ఎగువన వార్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతానికి లొకేషన్ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే ఛాప్రాలా వన్యప్రాణుల అభయారణ్యం ప్రభావితం కానుండడం, వరదలు ఉధృతంగా పోటెత్తినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం ఉండడం కూడా లొకేషన్ మార్పునకు మరో కారణమని అధికార వర్గాలు తెలిపాయి. వార్ధా– వెయిన్గంగాపై సమాంతర బరాజ్... కొత్త అలైన్మెంట్ ప్రకారం..వార్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతానికి కొంత ఎగువన రెండు నదులపై లంబకోణంలో సమాంతర బరాజ్ నిర్మించి మధ్యలో కాంక్రీట్ బండ్ (నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్)తో కలిపివేయనున్నారు. రెండు వైపులా ఉండే బరాజ్లకు గేట్లు ఉండనుండగా, మధ్యలో ఉండే కాంక్రీట్ బండ్ చెక్ డ్యామ్ తరహాలో పనిచేయనుంది. బరాజ్లు నిండినప్పుడు గేట్లు ఎత్తకపోయినా మధ్యలోని కాంక్రీట్ బండ్పై నుంచి వరద పొంగిపొర్లనుంది. బరాజ్ ప్రతిపాదిత ప్రదేశంలో తాజాగా జియోఫిజికల్ పరీక్షలను ప్రారంభించారు. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) విభాగ ఇంజనీర్లు శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి బరాజ్ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు. మారిన అలైన్మెంట్ ప్రకారం వార్ధా–వెయిన్ గంగా బరాజ్ నుంచి నీటిని కాల్వ, సొరంగ మార్గంలో తరలించి సుందిళ్ల బరాజ్కు పూర్తిగా గ్రావిటీతో తరలించనున్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోయనున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దాదాపు 71.5 కి.మీ.ల పొడవున కాల్వ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది. రూ.1,700 కోట్లు విలువైన పనులు జరిగిన తర్వాత ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. అర్ధంతరంగా వదిలేసిన కాల్వను సుందిళ్ల బరాజ్తో అనుసంధానం చేయడానికి మంచిర్యాల జిల్లాలో నన్నెల నుంచి జైపూర్ వరకు భూగర్భంలో 110 మీటర్ల లోతుల్లో 26 కి.మీ.ల పొడవున సొరంగంతోపాటు మరో 6 కి.మీ.ల కాల్వను నిర్మించాల్సి ఉంటుంది. సొరంగం అటవీ ప్రాంతం గుండా వెళ్లనుండడంతో భూసేకరణ అవసరం లేదు. కాల్వలకు 160 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. రూ.10 వేల కోట్లతో ప్రాథమిక అంచనాలు ప్రాథమిక అంచనాల ప్రకారం వార్ధా–వెయిన్ గంగా బరాజ్ల నిర్మాణానికి రూ.5వేల కోట్లు, సొరంగం నిర్మాణానికి రూ.3,700 కోట్లు, మిగిలిన కాల్వ నిర్మాణానికి రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.10,000 కోట్ల వ్యయం కానుంది. బరాజ్, కాల్వల భూసేకరణ వ్యయం దీనికి అదనం. పాత అలైన్మెంట్ ప్రకారం ప్యాకేజీ–5 కింద 50 కి.మీ.ల కాల్వతో పాటు పంప్హౌస్ నిర్మించాల్సి ఉండగా, నాటి ధరల ప్రకారమే రూ.16 వేల కోట్ల వ్యయం కానుందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త అలైన్మెంట్తో కాల్వ పొడవు తగ్గడం, పంప్హౌస్ నిర్మాణం అవసరం లేకపోవడంతో వ్యయం తగ్గనుందని పేర్కొన్నాయి. పాత అలైన్మెంట్ ప్రకారం 50 కి.మీ.ల కాల్వను తవ్వాల్సి ఉండగా, మధ్యలో బొగ్గు గనులు ఉండడంతో అలైన్మెంట్ మార్చి సొరంగాన్ని నిర్మించనున్నారు. బరాజ్ ఎత్తుపై చిక్కులు.. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే తమ రాష్ట్రంలో ముంపు ఏర్పడుతుందని గతంలో మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్లకు ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. తాజాగా వార్ధా–వెయిన్గంగా బరాజ్ను సైతం 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే కనీసం 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అప్పుడు ఆశించిన మేర ఆయకట్టుకు సరఫరా చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో మళ్లీ సంప్రదింపులు జరిపి ఒప్పించడానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరుతూ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తొలుత లేఖ రాయగా, అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డి లేఖ రాసినా, మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మహారాష్ట్ర అంగీకరించే అంశంపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లు, 149 మీటర్లు, 150 మీటర్ల, 151 మీటర్లు, 152 మీటర్ల వేర్వేరు ఎత్తులతో బరాజ్ నిర్మాణానికి వేర్వేరు ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుకుంటున్నట్టు 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 1,200 ఎకరాల పట్టాభూములు, ఇతర భూములు కలిపి మొత్తం 3,000 ఎకరాల్లో ముంపు ఏర్పడనుందని అంచనా వేశారు. ఒక వేళ 148–149 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాల్సి వస్తే అక్కడి నుంచి నీటిని తరలించే కాల్వను 69 నుంచి 75 మీటర్లకు వెడల్పు పెంచితేనే ఆశించిన ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బరాజ్ ఎత్తును ఖరారు చేసిన తర్వాతే ప్రాజెక్టు స్వరూపం విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
యువశక్తి క్షీణిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిళ్ల ఆలస్యం.. పిల్లలను కనే విషయంలో ఆసక్తి చూపకపోవడం లేదా ఒకరితోనే సరిపెట్టుకోవాలనే ఆలోచనలు పెరుగుతుండడం వంటి కారణాలు రాష్ట్ర జనాభాపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జపాన్, దక్షిణకొరియా, ఇటలీ, చైనా వంటి దేశాల తరహాలో భవిష్యత్లో యువశక్తి క్షీణించి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశముందని తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–6 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023– 24లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (ఎన్ఎఫ్హెచ్ఎస్–6) ఫ్యాక్ట్ షీట్లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత మే 29న విడుదల చేసింది. దేశంలోని 715 జిల్లాల్లో సుమారు 6.79 లక్షల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.7కు చేరడం, రీప్లేస్మెంట్ స్థాయి 2.1 కంటే గణనీయంగా తగ్గి, జాతీయ సగటు కన్నా క్షీణిస్తుండడం భవిష్యత్లో యువశక్తి తగ్గి, వృద్ధ జనాభా పెరుగుదలకు సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగువకు చేరిన జననాల రేటు ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచికే టీఎఫ్ఆర్. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఈ రేటు 2.1 ఉండాలి. దీనినే రీప్లేస్మెంట్ స్థాయి అంటారు. కానీ తెలంగాణలో ఈ స్థాయి చాలాకాలంగా అందుబాటులో లేదు. ఎన్ఎఫ్హెచ్ఎస్–3 (2005–06)లో 1.8గా ఉన్న టీఎఫ్ఆర్ ఎన్ఎఫ్హెచ్ఎస్ –4, ఎన్ఎఫ్హెచ్ఎస్–5లో కూడా అదే స్థాయిలో కొనసాగగా, తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్–6లో 1.7 స్థాయికి తగ్గింది. అంటే ప్రతితరం తన స్థానంలో వచ్చే తరాన్ని పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితి క్రమంగా ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ సవాళ్లకు నాంది ప్రస్తుతం తెలంగాణలో పనిచేసే వయసు జనాభా అధికంగా ఉండటంతో రాష్ట్రానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ లభిస్తోంది. అయితే జననాల రేటు దీర్ఘకాలంగా తక్కువగానే కొనసాగితే ఉద్యోగ, కార్మిక రంగంలోకి వచ్చే యువత సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది. అదే సమయంలో మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీంతో భవిష్యత్లో పెన్షన్లు, ఆరోగ్య సేవలు, వృద్ధుల సంరక్షణపై ప్రభుత్వ వ్యయం పెరిగే అవకాశం ఉంది. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వృద్ధ జనాభా సమస్యలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. దక్షిణాది ధోరణిలోనే తెలంగాణ దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలోనూ సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ స్థాయి కంటే దిగువనే ఉంది. తెలంగాణ టీఎఫ్ఆర్ 1.7గా ఉండగా, ఏపీలో కూడా ఇదే స్థాయిలో నమోదైంది. కేరళ (1.5), తమిళనాడు (1.6), కర్ణాటక (1.6) రాష్ట్రాల్లో జననాల రేటు మరింత తక్కువగా ఉంది. -
అర్ధరాత్రి.. పబ్.. మఫ్టీలో మహిళా డీసీపీ
సాక్షి, హైదరాబాద్/కేపీహెచ్బీ కాలనీ: నగరంలో అదో పేరుమోసిన పబ్.. నిబంధనలకు పాతరేసి నిత్యం అర్ధరాత్రి దాటినా నడుపుతుండటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగుతూ భారీగా డబ్బు దండుకుంటోంది. దీనిపై సమాచారం అందుకున్న కూకట్పల్లి మహిళా డీసీపీ రుతురాజ్ ఈ పబ్బులో గబ్బు పనులకు తెరదించేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని మంజీరా మాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ (క్లబ్ మస్తీ) పబ్లోకి ఓ సగటు మహిళా టెకీలాగా స్వయంగా వెళ్లారు.సెక్యూరిటీ సిబ్బందిని దూరంగా ఉంచి ఒంటరిగానే పబ్లోకి ప్రవేశించారు. ఆపై అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల తతంగాన్ని రికార్డు చేసి ఆధారాలు సంపాదించారు. అనంతరం అదనపు డీసీపీ షమీర్, కేపీహెచ్బీ ఠాణా అదనపు ఇన్స్పెక్టర్ కె.రవిలతోపాటు సిబ్బందికి సమాచారం ఇచ్చి పబ్పై దాడి చేశారు. ఈ తనిఖీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిగ్గుతేలడంతో నలుగురు మహిళా సిబ్బంది, ఐదుగురు పురుష సిబ్బందిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.అలాగే పబ్తోపాటు నిందితులపై బీఎన్ఎస్లోని 223, 292, 318(4) రీడ్ విత్ 3 (5) సెక్షన్లతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లోని 5, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి ఆదివారం వెల్లడించారు. కస్టమర్లకు మహిళా సిబ్బందితో ప్రలోభాలు.. పబ్ నిర్వాహకులు అక్కడ పనిచేస్తున్న యువతుల ద్వారా పురుష కస్టమర్లను వ్యభిచారం కోసం ప్రలోభపెట్టేలా చేస్తున్నారని.. వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని డెకాయ్ ఆపరేషన్లో వెలుగుచూసిందని ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి వివరించారు. యువతులను ఎర వేయడం ద్వారా అక్రమ లాభం పొందేందుకు నిర్వాహకులు కస్టమర్లు తాగిన మద్యం, తిన్న ఆహార పదార్థాలకు అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు.అలాగే పబ్లోకి మైనర్ల ప్రవేశాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలేవీ యాజమాన్యం తీసుకోకుండా యథేచ్ఛగా దందా సాగిస్తోందని చెప్పారు. అనుమతించిన సమయానికి మించి పబ్ను నిర్వహించడంతోపాటు ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా మద్యం, ఆహారం అందిస్తున్నారని గుర్తించామన్నారు. వాటన్నింటికీ మించి పోలీసు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేకుండానే పబ్ నడుస్తోందని పేర్కాన్నారు. స్థానిక పోలీసుల తీరుపై డీసీపీ ఆగ్రహం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన డీసీపీ రితిరాజ్ ఆ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు నిరోధించలేకపోయారంటూ స్థానిక పోలీసులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
అభివృద్ధికి కలసిరండి
సాక్షి, హైదరాబాద్: ‘మల్కాజిగిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నా. రాజకీయాలకతీతంగా ఎన్ని నిధులైనా, ఎన్ని అనుమతులైనా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, మెట్రో విస్తరణ తదితరమైనవి ఏవి కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచిస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. కావాల్సినవి అడిగి సాధించుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొడంగల్లో ఓడిపోయాక, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. అక్కడి నుంచే సీఎం వరకు రాగలిగానన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. శనివారం ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం, టీకేఆర్ జంక్షన్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారులు, వంద పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపనల శిలాఫలకాలను రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం, ఎన్నికల లబ్ధి కోసం మూడు కార్పొరేషన్లు చేశానని కొందరంటున్నారు కానీ, పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం చేశానని తెలిపారు. క్యూర్ పరిధిలోని 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1.34 కోట్లమంది ప్రజల సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లుగా, అదే మాదిరిగా పోలీసు వ్యవస్థను వికేంద్రీకరించినట్లు చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ను పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిచుకుంటున్నామని, రూ. 1,511 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. కనీస కనికరం ఉండొద్దా? ‘గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునానది, యూపీలో గంగానది రివర్ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. మనం మూసీనది ప్రక్షాళన చేయొద్దా? అని అడ్డంపడుతున్న వారిని అడుగుతున్నా’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు, 55 కి.మీ. ప్రక్షాళన చేసి మూసీని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరతానన్నారు. ‘న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యనున్న రివర్ఫ్రంట్ దగ్గర ఒక్కో అపార్ట్మెంట్ వందల కోట్ల విలువ ఉంది. ఇక్కడ మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. ఇక్కడ ప్రజలు నివసించడం లేదు. నల్లగొండ ప్రజలను కాలుష్యం కాటేస్తుంటే కనికరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి, ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా పెళ్లయిన వారికి గర్భధారణ సమస్యలొస్తాయని, కలుషిత నీరు, ఆహారంతో కడుపుకోతకు గురవుతారని పట్టణానికి పంపిస్తున్నారన్నారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కళేబరాలు కొట్టుకువస్తుంటే, అక్కడి ప్రజలు ప్రక్షాళన చేయాలని కోరారని చెప్పారు. సింగపూర్, న్యూయార్క్తో పోటీ నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు నాగోల్ జంక్షన్– ఎల్బీనగర్ –ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–రాజేంద్రనగర్–ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు, ఎల్బీనగర్ – హయత్నగర్ వరకు కూడా చేయాలన్నారు. మెట్రోను 122 కి.మీ.వరకు పొడిగించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయనగరం చేయాలని తాను ప్రయత్నిస్తుంటే, అన్ని అనుమతులొచ్చాక , ఇక్కడి నుంచి మంత్రిగా చేస్తున్నాయన పోయి పుల్లలు పెట్టి అర్ధంతరంగా ఆపారని ఆరోపించారు. ఓఆర్ఆర్ వచ్చినందుకు అంతర్జాతీయ నగరంగా మారిందని.. రీజినల్ రింగ్రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే, ప్రపంచంలోనే పోటీపడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు. అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోదని, ఆమేరకు అభివృద్ధి జరగాలన్నారు. జెడ్పీటీసీ నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆడబ్డిలే కారణమని, తన ప్రతిసభలో వారికి ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూర్–1 యాప్ను సీఎం ప్రారంభించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారి రాజిరెడ్డిపేరు పెట్టామని, చౌరస్తాలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కిషన్రెడ్డి గారూ ఉపన్యాసాలు ఆపండి... ‘హైదరాబాద్కు రెండో దశ మెట్రో రావాల్సిందే. ట్రిపుల్ ఆర్కు అనుమతులివ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. రాష్ట్రంలో పండించిన పంటలను మొత్తం కొనాల్సిందే. వీటన్నింటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చూస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నీ పార్టీకి నువ్వు ఎప్పుడూ పనిచేయలేదని మీ కార్యకర్తలే అంటున్నారు. మా సార్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ చెప్పింది వింటారని చెబుతున్నారు. ఇక నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఉపన్యాసాలు ఆపండి కిషన్రెడ్డి గారూ..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాను కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీ వెళ్లినా, ఐదుసార్లు మోదీని కలిసినా ఏ అనుమతులూ రాకపోవడానికి కారణం కిషన్రెడ్డే అని తెలిసిందన్నారు. వీటికి అనుమతులు తీసుకురా.. లక్ష మంది సమక్షంలో ఎల్బీ స్టేడియంలో శాలువా కప్పి గండపెండేరం తొడుగుతామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఓసారి అంబర్పేటలో వారేంటో చూపించారన్నారు. ఇప్పటికైనా సహకరించాలని, లేని పక్షంలో 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. -
సీఎంకు ‘హిట్లర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించగా, జాతీయ మీడియా సైతం ‘ఎమర్జెన్సీ మైండ్సెట్’గా అభివర్ణించింది. హిందూ గ్రూప్ శనివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్తో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి సంభాషిస్తూ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.‘హైడ్రా పదం హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా. ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టి ఒక సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి..’ అని హైడ్రాపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్ మహానగరం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్పాత్ల ఆక్రమణల నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సంస్థను స్థాపించడం తెలిసిందే. ఇప్పటివరకు కబ్జాదారుల చెర నుంచి రూ. 80,000 కోట్ల విలువైన 2,182 ఎకరాల భూమిని స్వా«దీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైడ్రా కార్యకలాపాలు ఆది నుంచి వివాదాలు, విమర్శలకు దారితీశాయి. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన జరుగుతోందని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించి వివాదాల్లో ఉన్న స్థలాల్లోని కట్టడాల కూల్చివేతలు చేపట్టడాన్ని యుద్ధ వాతావరణంతో రాష్ట్ర హైకోర్టు పోల్చింది. హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ను విచారణకు పిలిపించి మొట్టికాయలు సైతం వేసింది. హైడ్రా ఎడాపెడా కూల్చివేతలు జరుపుతుండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విపక్షాలు ఆరోపణలూ చేశాయి. ఇప్పటికే హైడ్రా పనితీరుపై విమర్శలు, లెక్కలేనన్ని కోర్టు కేసులుండగా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థకు నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం మరింత దూమారం రేపింది. హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసాలతో పోల్చడాన్ని విపక్షాలు విమర్శించాయి. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. ‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మళ్లీ బహిర్గతమైంది. హిట్లర్ స్ఫూర్తి కలిగించాడని రేవంత్రెడ్డి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్ వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రజలను అణచివేసింది. రేవంత్రెడ్డి సిగ్గుతో తలవంచి క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంతికిరణ్ రిజిజు సైతం ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘వాహ్.. కాంగ్రెస్ సీఎం హిట్లర్తో పూర్తిగా స్ఫూర్తి పొందారు. ఒకవేళ బీజేపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మా వ్యతిరేకులందరూ నాజీయిజం, ఫాసిజం అంటూ విమర్శలు చేసేవారు’ అని ఆయన విమర్శించారు. ‘ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మొదలు రేవంత్రెడ్డి జర్నలిస్టులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు.. ఇది కాంగ్రెస్ తానాషాహీ మనస్తత్వం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజలకు ఇది ముందే తెలుసు. యావత్ దేశానికి స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను రద్దు చేస్తూ తొలి ఫైల్పై సంతకం చేస్తామని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా పేరు లేదు హిట్లర్ కోర్ టీమ్కు హైడ్రా అనే పేరు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు లేవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ట్లు సౌత్ ఫస్ట్, మరికొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి 1943 ఆగస్టు 17–18 రాత్రి బ్రిటన్ ఆపరేషన్ హైడ్రా పేరుతో నాజీల వీ–ఆయుధ కార్యక్రమంపై బాంబు దాడి చేసిందని గుర్తుచేశాయి. మార్వెల్ కామిక్ పుస్తకం, సినిమాల్లోని ఊహాజనిత నియో–ఫాసిస్ట్ సంస్థ ‘హైడ్రా’తో సీఎం పొరబడినట్లు పేర్కొన్నాయి. -
దేవుడి శాఖలో బదిలీ.. గోడకు కొట్టిన బంతి!
సాక్షి, హైదరాబాద్: ఆ అధికారులు యాదగిరిగుట్ట దేవాలయంలో పనిచేస్తున్నారు... సాధారణ బదిలీల్లో భాగంగా వారు వేరే ఆలయాలకు బదిలీ అయ్యారు... కానీ, రెండుమూడు నెలల్లోనే తిరిగి యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చేశారు. డిప్యూటేషన్ అనో, పరిపాలనపరమైన సర్దుబాటు అనో వారిని తిరిగి మార్చారు. ఇది ఒక్క యాదగిరిగుట్ట ఆలయానికే పరిమితం కాలేదు. ఇది జరిగి ఏడాదికిపైగా గడుస్తోంది. ఇప్పుడు మళ్లీ సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతించటంతో, రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల్లో మళ్లీ బదిలీల కసరత్తు మొదలైంది. కానీ, గతేడాది జరిగిన బదిలీల్లో పైరవీలు చేసుకుని పాత దేవాలయాలకే వచ్చిన వారిని కదిలించకుండా ఇప్పుడు కొత్త బదిలీలకు కసరత్తు చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. దేవాదాయ శాఖ వ్యవహారాలపై ప్రభుత్వానికి పట్టులేకపోవటంతో స్థానిక నేతలు, కొందరు అధికారులు చెప్పిందే వేదంగా మారింది.ఆరు ప్రధాన ఆలయాల్లో...ప్రభుత్వ శాఖల్లో నెలరోజులపాటు సాగిన సాధారణ బదిలీల ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం వారం క్రితం బదిలీలపై నిషేధం విధించింది. కానీ, సరస్వతీ నది అంత్య పుష్కరాల నేపథ్యంలో దేవాదాయ శాఖలో బదిలీలు జరగలేదు. ఇప్పుడు పుష్కరాలు ముగియటంతో సాధారణ బదిలీలు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఆనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఆరు ప్రధాన దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు, కొమురవెల్లిలోని ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఏడాది క్రితం ఈ ఆరు ఆలయాల్లో 40 శాతం మందిని బదిలీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులోని నిబంధనల మేరకు బదిలీలు చేయబోతున్నారు. కానీ, గత బదిలీల్లో చోటు చేసుకున్న ఇష్టారాజ్యాన్ని సరిదిద్దకుండానే కొత్త బదిలీలు చేయనుండటం పట్ల ఆయా ఆలయాల్లోని మిగతా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడేం జరిగింది... ఈ ఆరు దేవాలయాలల్లోని 40 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేశారు. కానీ, వారిలో కొందరికి పాత దేవాలయాలపై ‘మమకారం’ అలాగే ఉంది. దీంతో ఆ ఉద్యోగులు పలుకుబడి ఉన్న నేతలు, కొందరు అధికారులను ‘కలిశారు’. ఇంకేముంది, ఆయా దేవాలయాల్లో ‘అవసరం’ ఉందంటూ డిప్యూటేషన్/సర్దుబాటు పేరుతో ఆర్డర్లు జారీ అయ్యాయి. వెంటనే ఆ పైరవీ ఉద్యోగులు పాత దేవాలయాల్లో వాలారు. బదిలీ అయినా, గోడకు కొట్టిన బంతి మాదిరి వచ్చిన వారిని అలాగే ఉంచి, ఇతర ఉద్యోగులను బదిలీ చేయబోతున్నారు. భారీ ఆదాయమార్గంగా ఉన్న యాదగిరి గుట్ట ఆలయాన్ని వదిలి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. బదిలీ అయి వెళ్లిన వారిలో కొందరు తిరిగి ఇక్కడికి వచ్చి చేరుతుండటంతో ఇక్కడ ఖాళీలు లేక గందరగోళం నెలకొంది. ఇక వేములవాడలో దాదాపు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది సరిపోక ఇబ్బంది నెలకొంది. ఇక్కడ ఓ నేత జోక్యం దీనికి కారణంగా మారింది. గతంలో ఈ ఆలయానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఆయనకు ఇటీవల సూపరింటెండెంట్గా పదోన్నతి వచ్చింది. మాతృ దేవాలయంలోనే పదోన్నతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ ఉద్యోగిని అక్కడ చేర్చుకోకుండా ఆ నేత అడ్డుకున్నారు. దీంతో కొండగట్టు దేవాలయానికి మార్చారు. కానీ అక్కడ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీ లేకపోవటంతో ఆ ఉద్యోగి పదోన్నతి గందరోగళంగా మారింది. ఇప్పటికీ సీనియర్ అసిస్టెంట్గానే పనిచేయాల్సి వచ్చింది. అతని జూనియర్లు కొందరు పదోన్నతి పొందటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖలో ఇంత గందరగోళం ఉన్నా ప్రభుత్వం దృష్టి సారించలేకపోతోంది. -
విద్యతో పాటు స్కిల్కూ పీరియడ్స్
సాక్షి, హైదరాబాద్: పాఠాలతో పాటు నైపుణ్యం, సృజనాత్మకత పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు విధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిజిటల్ లెర్నింగ్తోపాటు వ్యాయా మ, ఆరోగ్య సంబంధమైన విద్యను తప్పనిసరి చేసింది. ఆర్ట్స్, కల్చర్, వ్యాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్తోపాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ను తప్పనిసరి చేసింది. పాఠశాల నిర్వహణకు సంబంధించిన 2026–27 విద్యా కేలండర్ను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం విడుదల చేశారు. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలను జూన్ 13 నుంచి తెరవాలి. కానీ, 14వ తేదీ రెండో శనివారం, ఆ మర్నాడు ఆదివారం కావడంతో జూన్ 15 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తంగా ఈ ఏడాది 227 పని దినాలు పాఠశాలలు పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెన్త్ సిలబస్ను 2027 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని, ఆ తర్వాత రివిజన్ ప్రారంభించి, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని కేలండర్లో పేర్కొన్నారు. ప్రతీ రోజు ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ చేపడతారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు జూన్ 19 వరకూ బడిబాట నిర్వహించనున్నారు. టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 2027లో నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో 13 రోజులపాటు దసరా, 5 రోజులు క్రిస్మస్, 5 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి. -
రేవంత్.. ఆ మొనగాడు ఇంకా పుట్టలేదు: కిషన్రెడ్డి
హైదరాబాద్: తనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటరిచ్చారు. తనను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదంటూ రేవంత్కు రిప్లై ఇచ్చారు. ‘రేవంత్ రాజకీయపరమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడు. కాంగ్రెస్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, నిన్న(శనివారం, జూన్ 6వ తేదీ) కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా’ అని పేర్కొన్నారు. -
కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ స్పై ఆపరేషన్
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సెక్యూరిటీని తప్పించుకుని పబ్లోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించారు.డీసీపీ స్వయంగా పబ్ యాక్టివిటీని చిత్రీకరించి, వెంటనే లోకల్ పోలీసులను పిలిపించారు. అనంతరం సోదాలు నిర్వహించి, పబ్లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో మొత్తం 9 నుంచి 10 మంది సిబ్బంది అరెస్టు అయ్యారు. యాజమాన్యం యువతుల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కూకట్పల్లి ప్రాంతంలో పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ వరకు సెలవులను విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 15న పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది.తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేసవి ఎండల బారిన పడకూడదని అధికారులు ఈ నిర్ణయం తీసకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవడానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. -
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్నగర్లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. -
..ఇచ్చేద్దాం దేవుడి పటం!
సాక్షి, హైదరాబాద్: పూజలు పూర్తయ్యాక దేవతా చిత్రాలు, విగ్రహాలు, పూజా సామగ్రి వంటి పవిత్ర వస్తువుల నిర్వహణకు శాస్త్రీయ, పర్యావరణహిత విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్లోని ఇస్కాన్ ఆలయంలో శనివారం ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ పేరుతో చేపట్టిన ఈ పైలట్ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా వాలంటీర్ల ఆధ్వర్యంలో పవిత్ర వస్తువుల సేకరణ డ్రైవ్ను నిర్వహించింది. జీహెచ్ఎంసీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ (ఇస్కాన్) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా భక్తులు ఉపయోగించిన దేవతా చిత్రాలు, పాడైన ఫోటో ఫ్రేములు, విగ్రహాలు తదితర పవిత్ర వస్తువులను గౌరవప్రదంగా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా రీ సైక్లింగ్ చేస్తారు. నగరంలోని అనేక కుటుంబాలు పాత దేవతా చిత్రాలు, దెబ్బతిన్న విగ్రహాలు, పూజా సామగ్రిని సరైన పారవేత విధానం లేక సంవత్సరాల పాటు ఇళ్లలోనే ఉంచుకుంటుంటాయి. కొందరు వాటిని చెట్ల కింద, చెరువుల వద్ద లేదా దేవాలయాల సమీపంలో వదిలివేయడం వల్ల అవి చివరకు చెత్తలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భక్తి భావనకు భంగం కలగకుండా, పర్యావరణ బాధ్యతతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 68 కిలోల పవిత్ర వస్తువుల సేకరణ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది భక్తులు ఈ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 68 కిలోల మేర దేవతా చిత్రాలు, ఫ్రేములు, విగ్రహాలు, ఇతర పవిత్ర వస్తువులు సేకరించారు. సేకరించిన పవిత్ర వస్తువులను వాటి స్వభావం ఆధారంగా వర్గీకరించారు. అనంతరం సంప్రదాయ ‘ఉద్వాసన పూజ’ నిర్వహించి, దైవిక ఉనికిని శా్రస్తోక్తంగా ఉపసంహరించిన తర్వాత వాటిని పునరి్వనియోగం లేదా రీసైక్లింగ్కు అనుగుణంగా శాస్త్రీయంగా వేరు చేశారు. సాధారణ మున్సిపల్ చెత్తతో కలపకుండా మొత్తం ప్రక్రియను ప్రత్యేక కేంద్రంలోనే నిర్వహించారు.పైలట్ దశ విజయవంతమైతే, భవిష్యత్తులో నగరవ్యాప్తంగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత సేవల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతిపాదనను జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది. ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’లో భాగంగా తదుపరి పవిత్ర వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని జూన్ 13న యూసుఫ్గూడలోని శ్రీ హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. -
వారికి ఎబోలా నెగెటివ్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు సూడాన్ దేశస్తులకు ఎబోలా నెగెటివ్ వచ్చినట్లు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. సూడాన్ నుంచి మోకాలి చికిత్స కోసం నగరంలోని అపోలో ఆస్పత్రికి వచ్చిన అబ్దుల్ రజీమహ్మద్ (23) ఎబోలా లక్షణాలతో ఈనెల 4వ తేదీ రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డులో చేరాడు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపించగా ఎబోలా నెగెటివ్ వచ్చింది.ఈమేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని పుణే వైరాలజీ ల్యాబ్ తమకు అందిన శాంపిల్స్లో ఎబోలా వైరస్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేస్తూ శనివారం సాయంత్రం ధ్రువీకరించిందని గాంధీ సూపరింటెండెంట్ వాణి, గాంధీ నోడల్ ఆఫీసర్ వంశీకృష్ణ తెలిపారు. గాంధీ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న సూడాన్కే చెందిన మరోవ్యక్తి మహ్మద్ యాహ్యాయాగోబ్ అహ్మద్ (35)కు కూడా ఎబోలా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అబ్దుల్రజీ మహ్మద్కు సహాయకుడిగా సూడాన్ నుంచి వచ్చిన 22 ఏళ్ల యువకుడిలో ఎలాంటి ఎబోలా లక్షణాలు లేనప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్కు తరలించారు.ఐసోలేషన్లో ఉన్న ఇరువురికి ఎబోలా నెగెటివ్ రావడంతో తెలంగాణ ప్రజలతోపాటు వైద్యవర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎబోలా నెగిటివ్ వచ్చినప్పటికీ 48 గంటల తర్వాత మరోమారు శాంపిల్స్ సేకరించి నిర్ధారణకు పంపిస్తారు. రెండవ నివేదికలో కూడా ఎబోలా నెగెటివ్ వస్తే ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి చేసి 21 రోజులు హోం క్వారంటైన్కు తరలిస్తారని వంశీకృష్ణ వెల్లడించారు. -
స్త్రీల కోసం రైడ్
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతతోపాటు వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర మహిళా భద్రత విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒంటరి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైక్, ఆటోలతో కూడిన క్యాబ్ సర్విసులను స్త్రీ రైడ్ పేరిట అందుబాటులోకి తెచి్చంది. మహిళా డ్రైవర్ల వాహనాలను డీజీపీ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో కలిసి శనివారం హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు.ఈ సేవలను పొందేందుకు మహిళా ప్రయాణికులు మోవో ఫ్లీట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే వచ్చి పికప్ చేసుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇందులో భాగంగా తొలివిడతలో మొత్తం 55 మంది మహిళా డ్రైవర్లకు బైక్, ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించడంతోపాటు వారంతా రవాణా, డెలివరీ రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా మొబిలిటీ సర్విస్ ప్రొవైడర్లు, అగ్రిగేటర్స్తో మహిళా భద్రత విభాగం అనుసంధానం చేసింది. మహిళలు కూడా గిగ్ వర్కర్లుగా రావడం శుభపరిణామం: డీజీపీ అంతకుముందు డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ స్విగ్గీ, జొమోటో వంటి గిగ్వర్కర్లలో ఇప్పటివరకు పురుషులే ఉండేవారని.. ఇకపై అందులోకి మహిళలు కూడా రావడం శుభపరిణామం అన్నారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న మహిళలకు ఏ ఇబ్బందులున్నా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ చారుసిన్హా అన్నారు. కార్యక్రమంలో శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, డీజీ ఆర్గనైజేషన్స్ స్వాతిలక్రా పాల్గొన్నారు. ధైర్యం పెరిగింది భర్త చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లల కోసం కష్టపడుతున్నాను. నాలుగు నెలలుగా బైక్ నేర్చుకుంటున్నాను. ఈ శిక్షణతో నాలో ధైర్యం పెరిగింది. – అర్చన, శ్రీరామ్కాలనీ, శంషాబాద్ నెలకు రూ. 30 వేలకు సంపాదిస్తున్నా ‘మోవో ఫ్లీట్’లో రెండేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నాను. ఇప్పుడు స్త్రీ రైడ్లోకి వచ్చాక మరింత ధైర్యం పెరిగింది. ఉమెన్ టు ఉమెన్ పికప్, డ్రాప్లు చేసేందుకు మహిళా భద్రత విభాగం అవకాశం కల్పిస్తోంది. -
‘పంట’ మారితేనే సాగు.. బాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి, పత్తి పంటల ఉచ్చు నుంచి బయటపడకపోతేభవిష్యత్తులో వ్యవసాయం ప్రమాదకరంగా మారనుందా..? అవుననే అంటోంది రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్. వరి, పత్తి పంటలనే నమ్ముకుంటే దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్థికంగా, పర్యావరణపరంగా తీవ్ర నష్టమని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యవసాయాన్ని వరి, పత్తి ఆధారిత వ్యవస్థ నుంచి అధిక ఆదాయం, తక్కువ నీటి వినియోగం, మెరుగైన పర్యావరణ సమతుల్యత కలిగిన వైవిధ్యభరిత వ్యవసాయ విధానంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది.సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత, సహజ వనరుల పరిరక్షణ కోసం పంటల మార్పిడి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వరి, పత్తికి విని యోగిస్తున్న ఎరువులు నేలతల్లిని నిస్సారంగా మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరికొన్నాళ్లు అదే పరిస్థితి కొనసాగితే ఆ భూముల్లో గడ్డి మొలవడం కూడా కష్టమేనని వెల్లడించింది. 2013–14లో ఉన్న పంటల సాగు 2024–25 నాటికి పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ముఖ్యంగా వరి, పత్తి సాగును క్రమంగా తగ్గించి ఉద్యానవన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ‘పంటల మార్పిడి’నివేదికను శనివారం విడుదల చేశారు. వరి, పత్తిని సర్కారే సేకరిస్తుండటంతో... వరి, పత్తికి మాత్రమే కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్ల భరోసా ఉండటంతో రైతులు ఏకపంట సాగు వైపు మొగ్గుచూపుతున్నారని కమిషన్ పేర్కొంది. దీనివల్ల భూసారం క్షీణించడం, నీటి వినియోగం పెరగడం, ఎరువులు, పురుగుమందుల వినియోగం అధికమవడం, పంటల వైవిధ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం వరి, పత్తి కొనుగోళ్లను పరిమితం చేసే అవకాశం కూడా ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కమిషన్ సూచించింది. వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి ఏటా 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. పత్తికి కూలీల సమస్య ఉన్నప్పటికీ, పురుగు మందులను వినియోగిస్తే అధిక పంటతో గిట్టుబాటు కలుగుతుందనే భావనతో రైతులు వరి తరువాత పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యాన పంటలకు అడ్డంకులు ఉద్యాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నప్పటికీ రైతులకు అధిక ఆదాయం అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ మార్కెటింగ్ సదుపాయాల కొరత, ధరల అనిశ్చితి, కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం, ప్రాసెసింగ్ యూనిట్ల కొరత రైతులను ఉద్యాన పంటల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. వీటికి తోడు ఇటీవలి కాలంలో అధికమైన కోతులు, అడవి పందులు, జింకల బెడద రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలపై వన్యప్రాణుల దాడులు పెరగడంతో రైతులు ఉద్యాన పంటల నుంచి దూరమవుతున్నారని కమిషన్ గుర్తించింది.ఈ సమస్యకు పరిష్కారంగా నాబార్డు సహకారంతో సోలార్ ఫెన్సింగ్కు సబ్సిడీ ఇవ్వాలని సూచించింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలను ‘వెజిటబుల్ జోన్’లుగా ప్రకటించి హైదరాబాద్ మార్కెట్ అవసరాలను స్థానికంగా తీర్చాలని ప్రతిపాదించింది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’విధానాన్ని అమలు చేసి, ఆయా జిల్లాల్లో ప్రత్యేక పంటలకు ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు, ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కమిషన్ సూచించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), పంట కాలనీలు, ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమలు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తేనే పంటల మార్పిడి విజయవంతమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం తీరు ఇలా (విస్తీర్ణం ఎకరాల్లో)... పంట 2013–14 2024–25 వరి 49,28,000 1,27,03,000 పత్తి 15,00,000 45,00,000 పండ్ల తోటలు 9,11,200 4,48,960 కూరగాయలు 5,52,352 1,02,698 పూల తోటలు 17,220 6,248 ఆయిల్పామ్ 33,742 2,43,498 పసుపు 1,52,445 42,246 పప్పుధాన్యాలు 10,20,418 8,83,710 నూనెగింజలు 12,41,845 7,13,572 చిరుధాన్యాలు 19,58,378 18,84,528 మొత్తం ఉద్యాన పంటలు 19,82,270 12,46,032 -
ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమే..
సాక్షి, హైదరాబాద్: ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమేనని, సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలంపై మార్క్స్ రాసిన ‘దాస్ కాపిటల్’గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. అమెరికా వంటి దేశాల్లో కూడా వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతుండటం అందుకు నిదర్శనమన్నారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో జాన్ వెస్లీ మాట్లాడారు. మత, ప్రాంత, కుల, డబ్బు, ప్రలోభాలతో చట్టసభల్లో తమకు సీట్లు తగ్గిన మాట వాస్తవమేననీ, అయితే, వాటి పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. తాము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నెలలు విస్తృత పర్యటనలు గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని, వచ్చే మూడు నెలలపాటు గ్రామాలు, బస్తీల్లో విస్తృత పర్యటనలు నిర్వహించి ప్రజలను కలుస్తామని జాన్ వెస్లీ తెలిపారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదన్నారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దేశంలో అసమానతలు పెరిగేకొద్దీ ప్రతిఘటన, తిరుగుబాట్లు అనివార్యమవుతాయన్నారు. మత విద్వేషాలు, భ్రమల ఆధారంగా చేసే రాజకీయాలు శాశ్వతంగా నిలవవని వ్యాఖ్యానించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం ఆధారంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలనే దురాలోచనతో ఉందని ఆరోపించారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ప్రయోగం చేసిన బీజేపీ తెలంగాణవైపు దృష్టి సారించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత మాట మార్చిందనీ, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ సర్కారు విస్మరించిందని విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలని జాన్ వెస్లీ కోరారు. ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేపడతామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు గృహాలు లేవని, వారికి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన జాన్ వెస్లీ, కమ్యూనిజంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న అజ్ఞాని అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు హష్మీ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి వి.రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
బంజారాహిల్స్లో 8 ఎకరాలు వేలానికి సిద్ధం
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాజధాని నగరంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యేకాలనీలో ఏసీబీ కార్యాలయం ఎదురుగా షేక్పేట మండల రెవెన్యూ అధికారులు 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏడాది క్రితం స్వాధీనం చేసుకున్నారు. సర్వేనంబర్ 102/1లోని ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తోపాటు అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో అందమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతామని, స్థానికులకు అనుకూలంగా వారి ప్రయోజనాల కోసమే స్థలాన్ని వినియోగిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత నెల రోజులకే ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించారు. పంచనామా అనంతరం స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హెచ్ఎండీఏ ఇందులో 8 ఎకరాల 24 గుంటల స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వేలం వివరాలను తెలియజేస్తూ భారీ బోర్డు అక్కడ ఏర్పాటుచేసింది. మంత్రి ఇచ్చిన హామీలు, తాము చేసిన డిమాండ్లు ఫలించకపోగా, స్థలాన్ని వేలం వేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేలానికి సిద్ధమైన హెచ్ఎండీఏ.. ఈ నెల 12న ప్రీబిడ్ మీటింగ్ నిర్వహిస్తామని, రిజిస్ట్రేషన్లకు, బిడ్ డాక్యుమెంట్ ఫీజుకు ఈ నెల 17వ తేదీ గడువు అని పేర్కొంది. వేలాన్ని ఈ నెల 19న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా నోటీసులో తెలిపింది. బహి రంగ మార్కెట్లో ఈ స్థలం విలువ రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటుంది. ఈ స్థలాన్ని వేలం వేయడం ద్వారా సర్కార్ ఖజానాకు కోట్లాది రూపాయలు సమకూరనున్నాయి. -
2028లో మళ్లీ కేసీఆరే సీఎం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధ్వజమెత్తారు. అలాంటి విషనాగులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు నమ్మబోరని పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మలేసియా తెలుగు అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ ఎన్నారై మలేసియా శాఖ కౌలాలంపూర్లో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని, వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పోరాటాల వారసత్వాన్ని మోస్తున్న జాతి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణవాసులమని గర్వపడే స్థాయికి రాష్ట్రం ‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’అని ప్రతి తెలంగాణవాసి గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరిందని కేటీఆర్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకునే ప్రత్యేక జాతి తెలంగాణ జాతి మాత్రమేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితమని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలను ఏకం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు కరువులు, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వంటి రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడు కూడా కేసీఆరేనని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ వంటి రంగాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 25 ఏళ్ల తెలంగాణ కోసం బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. 24 గంటల నాణ్యమైన తాగునీటి సరఫరా, బలోపేతమైన ప్రజారవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన తమ లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని.. అనుభవం, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. -
మేం పన్నులు కట్టి.. ఢిల్లీకి సలాం కొట్టాలా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. వాళ్లు చెప్పినట్లు పార్లమెంట్ సీట్లు పెంచితే కేరళలో లోక్సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120కి పెరుగుతాయి. మేం దీనినే వ్యతిరేకిస్తున్నాం. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ. తీసుకునేది తక్కువ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా?..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని సవాలు విసిరారు. ‘వాళ్లు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు’అని కేంద్రానికి హితవు పలికారు. ‘ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత: తెలంగాణకు సుపరిపాలన’అనే అంశంపై శనివారం బెంగళూరులో ‘ది హిందూ’గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్ నిర్వహించిన ముఖాముఖిలో రేవంత్ పాల్గొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రేవంత్ ఏమన్నారంటే.. రాష్ట్ర పెట్టుబడులు గుజరాత్కు మళ్లింపు కేంద్రంపై ప్రతిపక్షంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతాం. మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకుండా గుజరాత్ వెళ్లి పెట్టాలని వాళ్లు (మోదీ ప్రభుత్వం) ఒత్తిడి చేస్తున్నారు. బలవంతంగా గుజరాత్లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పని చేస్తున్నారు. 18 గంటలు పని.. ఫ్రెండ్స్ లేరు.. రోజుకు 16–18 గంటలు పనిచేస్తా. వేరే ఇతర వ్యాపకాలు లేవు. అదే నాకు పెద్ద సమస్య. సమయం గడపాలంటే రాజకీయ స్నేహితులు తప్ప వేరే ఎవరూ లేరు. రాత్రి 10 గంటల తరా>్వత ఫుట్బాల్ ఆడతా. ఇప్పుడు సమయం చిక్కడం లేదు. నేను మెస్సీకి అభిమానిని. అందుకే మెస్సీని ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఆర్ఎంపీ డాక్టర్ టీజీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. టీజీపీఎస్సీ పునరావాస కేంద్రం కాకూడదు. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను కలిసి ఎలా పని చేస్తుందో తెలుసుకుని టీజీపీఎస్సీలో అమలు చేశా. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. కేసీఆర్ మీడియాకూ అనుమతిస్తా.. పది రోజులకో ప్రెస్మీట్ నిర్వహించి ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా. కేసీఆర్ మీడియా సంస్థ ప్రతినిధినీ అనుమతిస్తా. ఎంత లేటైనా జర్నలిస్టులతో మాట్లాడతా. వ్యతిరేక వార్తలు రాస్తే దూషించను. వ్యంగ్యంగా మాట్లాడతా. చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం. పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతుంటేనే హైడ్రాను ఏర్పాటు చేశా. ‘హైడ్రా’.. ఇది హిట్లర్కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా... ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టాను. మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లో ఆక్రమణలు, పర్యావరణం, నీటి కొరతపై సొంత మోడళ్లను అనుసరించాలి. జీఎస్టీ ఆదాయం పెంచాం.. వడ్డీలను 11–11.50 శాతం నుంచి 7–8 శాతానికి తగ్గించుకోవడానికి రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం. గత 7–8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్లకు మించి జీఎస్టీ రాబడి లేదు. గత ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం. ఆరు నెలల్లోనే రూ.5 వేల కోట్లు అదనంగా వచ్చింది. రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి. రూ.20,616 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశా. 2024–25లో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఏఐ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యామ్నా యం సృష్టించలేదు. ఏఐ అన్నీ సృష్టించ వచ్చు. రాజకీయ నాయకున్ని సృష్టించలేదు.నాకు ఏఐ భయం లేదు. యువతరం స్కిల్స్ పెంచుకోవాలి. అధికారులు ఏం అడిగినా ‘యెస్..’అంటారు. నేను ముందుగా ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని రాసుకుంటా. చివరకు నా అభిప్రాయం చెబుతా. ముందే నా అభిప్రాయం చెబితే దానికి అనుగుణంగా వారు చెబుతారు. 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎంతో తెలుసుకున్నా. నన్ను తప్పుదోవ పట్టించలేరు. నేను ప్రతి బ్యూరోక్రాట్ మైండ్సెట్ను అర్ధం చేసుకోగలను. -
రైతును రాజును చేస్తా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే.. పండుగ అని నిరూపిస్తా.. ‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి. అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్ఆర్కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం. ఎవరి మెడలైనా వంచుతా... ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్లో ఎలా కట్టాలో? మాకు హరీశ్రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మార్కెట్ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది. అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా.. అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. -
జల్లంత.. తుళ్లింత.. మరింత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ విస్తరించి సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి పశ్చిమ–మధ్య, తూర్పు–మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా అంతటా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరించాయి.శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగానే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 23.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు శనివారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో కురవడంతో ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు పడ్డారు. -
ఆర్టీసీ థౌజండ్వాలా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ అరుదైన మైలురాయిని అధిగమించింది. వెయ్యికిపైగా విద్యుత్ బస్సులున్న సంస్థగా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు దేశంలో ఢిల్లీ 4,286 విద్యుత్ బస్సులు, మహారాష్ట్ర 4,001, కర్ణాటక 1,989, గుజరాత్ 1,041 తర్వాత వెయ్యికిపైగా విద్యుత్ బస్సులున్న ఐదో రాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 1,040 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. ఇటీవలే 60 విద్యుత్ బస్సులు రోడ్డెక్కడంతో ఈ ఘనత సాధించింది.దశలవారీగా సమకూరిన ఈ–బస్సులుదేశంలో విద్యుత్ బస్సుల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్–1 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద తొలిసారి హైదరాబాద్కు 40 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. ఒక్కో బస్సుపై రూ. కోటి వరకు సబ్సిడీ ఇచ్చింది. టెండర్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ సంస్థ ఈ ఏసీ బస్సులను నడుపుతోంది. ప్రస్తుతం అవి పుష్పక్ పేరుతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చారు. కిలోమీటర్కు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ ఆ సంస్థకు అద్దె చెల్లిస్తుంది.అలాగే ఫేమ్–2 పథకం కింద మరో కంపెనీ టెండర్ దక్కించుకున్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఆ బస్సులను సరఫరా చేయలేదు. ఆ తర్వాత జీసీసీ పద్ధతిలో ఆర్టీసీ టెండర్లు పిలిస్తే పుష్పక్ బస్సులు తిప్పుతున్న కంపెనీ దక్కించుకుంది. ఆ టెండర్ కింద 500 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉండగా దశలవారీగా 440 సరఫరా చేసింది. చివరి విడత 60 బస్సులు ఇటీవలే అందజేసింది.ఇక హైదరాబాద్ వెలుపల కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ఉద్దేశంతో నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్ఈబీపీ) పథకం కింద ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేసింది. దీనికింద ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ జీసీసీ పద్ధతిలో సరఫరా చేసేందుకు 500 బస్సుల కాంట్రాక్టు పొందింది. ఆ బస్సులన్నీ రోడ్డెక్కాయి.త్వరలో 2,200 బస్సులు...హైదరాబాద్లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే ఆర్టీసీ ద్వారా తిప్పాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు బస్సులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకోగా కేంద్రం 2,200 బస్సులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి మూడు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని నెలల్లో ఈ బస్సుల రాక మొదలవుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం బస్సులు ఆర్టీసీకి అందనున్నాయి.మరోవైపు డీజిల్ బస్సులను రెట్రోఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే కార్యక్రమాన్ని కూడా ఆర్టీసీ ప్రారంభించింది. ఇటీవలే ఓ బస్సును ప్రయోగాత్మకంగా తయారు చేయగా అది సత్ఫలితాలనిచ్చిందని ఆర్టీసీ పేర్కొంటోంది. దీంతో 200 బస్సులను రెట్రోఫిట్మెంట్ చేసేందుకు టెండర్లు పిలవగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. వచ్చే ఏడాదిలో ఆ బస్సులు కూడా మొదలవుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య సుమారు 3,500కు చేరుతుంది. -
సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం
సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని... ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. మలేషియా – పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్ మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్కు ఉన్న అనుభవం... గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం" అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు. -
హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారు. అయితే తాజాగా హైడ్రాపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్. హైడ్రా అనే పేరు హిట్లర్కు చాలా ఇష్టమని, హిట్లర్కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. -
562 హోటళ్లు, లాడ్జీలలో 5 వేల మంది పోలీసులతో తనిఖీలు
హైదరాబాద్: నగర అంతర్గత భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో గత రాత్రి సిటీ పోలీసులు 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను నిర్వహించారు. శాంతి భద్రతల పరిరరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి.ఈ ఆపరేషన్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనార్ వీసీ సజ్జనార్స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే... అత్యధికంగా ఖైరతాబాద్లో 119, శంషాబాద్లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్లో 82, రాజేంద్రనగర్లో 53, చార్మినార్ జోన్లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు.మైనర్లకు గదులు ఇవ్వద్దు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఫిల్మ్నగర్తో పాటు పలు ప్రాంతాలలో భారీగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురువడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలుచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అప్పటి దాకా ఎండ వేడిమికి తల్లడిల్లిపోయిన పట్టణవాసులకు అకాల వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించాయి. -
ఆ తల్లిని ఓదార్చడం.. 'ఈత'రం కాదు !
వైఎస్ఆర్ కడప జిల్లా: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఆ తల్లి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. నీటిలో దూకి ఇద్దరిని కాపాడింది. మరో ఇద్దరు తన కళ్లముందే నీటిలో మునిగిపోతుంటే వారిని కాపాడలేక గుండెలవిసేలా విలపించిన హృదయవిదారక ఘటన ఖాజీపేటలోని మండలం దుంపలగట్టు గ్రామంలోని గుట్టులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం సమీపంలోని గుట్టుపై 10 ఏళ్లుగా పందులను మేపుతూ శివకృష్ణ, శ్రీవాణి దంపతులు జీవనం సాగిస్తున్నాయి. పందులను నీటి గుంటలో శుభ్రం చేసేందుకు ప్రతి రోజు శివకృష్ణ వెళ్లి వచ్చేవారు. శుక్రవారం శివకృష్ణ ఇతర పనులపై కడపకు వెళ్లారు. దీంతో శ్రీవాణి నీటిలో ఉన్న పందుల కంచె వద్దకు వెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు గౌతమ్, కార్తీక్తో పాటు వనం సంజన (18) వనం అర్చన (14) వెళ్లారు. శ్రీవాణి పందుల కంచె వద్ద ఉండగా నీటిలో ఈత కొడదాం అని పిల్లలు తల్లిని ఒత్తిడి చేశారు. దీంతో శ్రీవాణి అంగీకరించారు. నలుగురు పిల్లలు నీటిలోకి దిగారు. నీటిలోని కుంట లోతుగా ఉండటంతో నలుగురు నీటిలో మునిగిపోతుండగా శ్రీవాణి గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గౌతమ్, కార్తీక్లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సంజన, అర్చన అప్పటికే నీటిలో మునిగిపోవడంతో వారిని కాçపాడే ప్రయత్నం చేసేలోగానే ఇద్దరూ గల్లంతయ్యారు. గట్టిగా కేకలు వేడయంతో స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం నీటిలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఖాజీపేట సీఐ వంశీధర్కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే చెన్నూరు నుంచి గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు కలిసి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు రోప్ సహాయంతో పిల్లల మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్కు తరలించారు. శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే మృత్యుఒడిలోకి.. శ్రీవాణి కళ్ల ఎదుటే తన ఇద్దరు కుమార్తెలు మృత్యు ఒడిలోకి వెళ్లడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కాపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఆమె రోదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరామర్శ దుంపలగట్టు గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
చేప ప్రసాదం.. ఏర్పాట్లు ముమ్మరం
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8న ఉదయం చేప ప్రసాదాన్ని తయారు చేసిన అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభమవుతుంది. 179 ఏళ్లుగా పంపిణీ చేప ప్రసాదానికి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్బౌలిలోని స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్బౌలిలో పంపిణీ జరిగిన చేప ప్రసాదం వివిధ కారణాలతో 2013 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే కొనసాగుతూ వస్తోంది. ప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 50 కిలోల నుంచి 5 క్వింటాళ్ల వరకు.. మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాళ్లకు చేరిందని అనిరుధ్ గౌడ్ తెలిపారు. మొదట్లో చేప మందుగా ప్రాచుర్యం పొంది అనంతరం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం తమ వద్దకు వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడు రకాల చేప ప్రసాదం... చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజలలో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే ఫలితాలిస్తుందని చెబుతున్నారు. ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించకూడదు. ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా స్వీకరించకూడదు. -
బంగారంతో పోలిస్తే డైమండ్ ధరల్లో స్థిరత్వం ఉంటుంది : అనంత నారాయణ
హైదరాబాద్ : బంగారం ధరలతో పోలిస్తే డైమండ్ ధరల్లో ఎక్కువగా స్థిరత్వం ఉంటుందని దమాస్ జ్యువెలరీ సీఈవోఓ అనంత నారాయణ హరిహరన్ అన్నారు. ఇర్రంమంజిల్లోని ప్రణవ వన్లో ఏర్పాటు చేసిన ఎస్జీఎల్ డైమండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన శుక్రవారం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అయిన ఎమరాల్డ్ అధినేత శ్రీనివాసన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రాల అమ్మకాల్లో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉందని అన్నారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ల వల్ల వజ్రాల నాణ్యత, గ్రేడింగ్ పరిశీలించుకునేందుకు వినియోగదారులకు ఎంతో సులభంగా ఉంటుందని ఇది మరింత పారదర్శకతకు ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్జీఎల్ సంస్థ డైరెక్టర్ చిరాగ్ సోని మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే ఇది అతి పెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఈ సెంటర్లో డైమండ్ యొక్క క్వాలిటీతో పాటు గ్రేడింగ్ను పరీక్షించుకోవచ్చుని తెలిపారు.సామాన్యులు ఎవరైనా కూడా ఈ సెంటర్ను అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చి డైమండ్ను ఏ విధంగా పరీక్షిస్తారు. ఎలా గ్రేడింగ్ చేస్తారు అనే విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు. ఇది డైమండ్ గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే ఆటోమెటిక్ గ్రేడింగ్ సిస్టమ్తో డైమండ్ నాణ్యతను కొలుస్తున్నప్పటికీ ఏఐ వల్ల మరింత లోతుగా విశ్లేషించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీల్ సహ వ్యవస్థాపకురాలు షిరిన్ బందుకాల్వ, నేషనల్ హెడ్ వరుణ్ శెట్టి, వసుంధర డైమండ్ గ్రూప్ ఫౌండర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
రహస్య గదులు.. స్పా ముసుగులో వ్యభిచారం..!
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. #Hyderabad:Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.Cases have… pic.twitter.com/yz44plNGKq— NewsMeter (@NewsMeter_In) June 5, 2026 -
మీనాకుమారి పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో నమోదైన ‘బాలికలకు వల’ కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా.. ఇక్కడి పిటిషన్లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. రిమాండ్ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె.. అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇన్స్ట్రాగామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పిటిషనర్ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ వివరాలను భద్రపరచాలని కోరారు. హోం జీపీ మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. మే 5న రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బదిలీ అయినట్టా.. కానట్టా?
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో నిబంధనలు ఉల్లంఘించి, నియమాలను పట్టించుకోకుండా ఇంజినీర్ల బదిలీలు జరిగినా వారికి కొత్త పోస్టులు, బాధ్యతలు అప్పగించలేదు. పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా ఆగమాగంగా జరగడం.. నాలుగేళ్లు మించి ఒకేచోట ఉన్నవారు సైతం బదిలీ కాకపోవడం, ఇంజినీర్ల బదిలీ వివరాలు కేవలం వారికి తప్ప పైఅధికారులైన సీఈ, ఎస్ఈలకు సైతం తెలియకపోవడం, అసలు బదిలీ ప్రక్రియే షెడ్యూలు కనుగుణంగా జరగకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయినప్పటికీ, రిలీవింగ్ ఆర్డర్ లేకుండానే సీఎంసీలో చేరేందుకు వెళ్లిన ఇంజినీర్ను అక్కడ చేర్చుకోలేదు. ఎంఎంసీ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయి వచి్చన పదిమందికి పైగా ఇంజినీర్లు జాయినింగ్ రిపోర్టులు ఇచ్చినప్పటికీ, వారికి ఎలాంటి పోస్టింగులు, బాధ్యతలు అప్పగించలేదని తెలిసింది. ఇందుకు కారణం ఏమిటంటే.. బదిలీలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి ఎవరికీ రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దని, ఇతర కార్పొరేషన్ల నుంచి వచి్చన వారిని చేర్చుకోవద్దనీ కమిషనర్ కర్ణన్ తెలిపినట్లు సమాచారం. బదిలీల రగడ ఏ మలుపు తిరగనుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఎండలకు బ్రేక్.. తెలంగాణపై వర్షాల మోత
మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న కీలక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరానికి సమీపంలో మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయిలో భారీ వాయుగుండం (మిడ్ ట్రోపోస్ఫెరిక్ వోర్టెక్స్) ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కేరళ తీరం నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఏర్పడ్డాయి.ఈ ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అదే సమయంలో హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక కేరళ, తీర కర్ణాటక ప్రాంతాల్లో జూన్ 10-11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అక్కడ ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా కనిపించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. -
నేడే ‘కొహెడ’ మార్కెట్కు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి సహా నల్లగొండ, మహబూబ్నగర్ వంటి సరిహద్దు జిల్లాల నుంచి 50 వేల మందిని తరలించనున్నారు. మార్కెట్ ప్రత్యేకతలివే.... ⇒ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3,367.35 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వం రూ.2,284.32 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, మిగతాది ప్రైవేట్ భాగస్వామ్యం.ఈ మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ⇒ ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న విక్రయాలు.. 2047 నాటికి 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశముంది. తద్వారా మార్కెట్ వార్షిక ఆదాయం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరగనుంది. ⇒ వ్యాపారుల సంఖ్య 341 నుంచి 967కు, వినియోగదారుల సంఖ్య 16,450 నుంచి 53 వేల మందికి పెరుగుతుంది. ⇒ వాహనాల రాకపోకలకు 10 వరుసల ఎంట్రీ టోల్ప్లాజా, తిరిగి వెళ్లేందుకు ఆరు వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా సహా క చ్చితమైన తూకానికి అత్యాధునిక డిజిటల్ వెయింగ్ బ్రిడ్జి. ⇒ పూల వ్యాపారానికి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్. దీని ద్వారా 3,600 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ⇒ వంద మందికి సరిపడా రైతు మార్కెట్. రిటైల్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం. ⇒ రైతులు, హమాలీలు, వ్యాపారులు, సందర్శకులకు విశ్రాంతి భవనాలు, సమావేశ మందిరాలు. క్యాంటీన్, హెల్త్సెంటర్, పోలీసు ఔట్లెట్, ఫైర్ స్టేషన్ ఉంటుంది. ⇒ మార్కెట్ మొత్తానికి కమాండ్ కంట్రోల్ సెంటర్గా నిలిచే టవర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నిర్మించనున్నారు. ⇒ ఇందులో బహుళజాతి వ్యాపారులు, సీసీ టీవీ వ్యవస్థ, హెలికాప్టర్ ల్యాండింగ్కు హెలిపాడ్ ఏర్పాటు చేయనున్నారు. ⇒ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు సహా ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం 210 షాపులతో రిటైల్ వ్యాపార ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు 30 షాపులతో ప్రత్యేక వేదిక అందుబాటులోకి ఉంటుంది. ⇒ మామిడి, బత్తాయి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్స్ వంటి పండ్ల వేలానికి ఆరు ప్రత్యేక ఆక్షన్ హాళ్లు సహా 250 మేజనైన్ షాపులను వ్యాపారులకు కేటాయించనున్నారు. ⇒ పండ్లు పాడవకుండా కాపాడేందుకు 335 షాపులతో కూడి న విశాలమైన నాలుగు శీతలీకరణ షెడ్లు నిర్మించనున్నారు. ⇒ పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, పైనాపిల్ మార్కెటింగ్కు దేశంలోనే తొలి ‘డ్రైవ్–త్రూ మెలన్ మార్కెట్’ను నిర్మించబోతున్నారు. ⇒ వ్యాపారస్తుల కోసం 52 ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తారు. ⇒ డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, డ్రైఫ్రూట్స్ కోసం 40 ఏసీ షాపులు సహా నానో క్లోరినేషన్, ఇన్–హౌస్ ఐస్ ఫ్లేక్ ఉత్పత్తి వ్యవస్థలతో కూడిన ఫిష్ అండ్ సీ ఫుడ్స్ మార్కెట్ ⇒ ఫౌల్ట్రీ, మాంస ఉత్పత్తుల విక్రయాలకు 24 ఏసీ షాపులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే ఇది అత్యాధునిక మార్కెట్: తుమ్మలతుర్కయాంజల్: సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశంలోనే అత్యాధునిక వ్యవసాయ మార్కెట్గా రూపుదిద్దుకోనుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొన్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వీటి ద్వారా ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ అభివృద్ధి, ధరల సమాచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.


